'ఉయ్యాలా జంపాలా' సినిమాతో నటిగా మారి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పునర్నవి.. ఆపై పలు మూవీస్ చేసింది. కానీ బిగ్బాస్ తెలుగు షోతో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో ఈమె కెమిస్ట్రీకి అప్పట్లో చాలా ఫ్యాన్ బేస్. ఈ షో తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈ భామ.. చదువు, కెరీర్, పెళ్లితో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈమె.. తన శారీరక మార్పులపై ఇప్పుడు ఆసక్తికర పోస్ట్ పెట్టింది. కాలక్రమేణా మనిషి శరీరంలో మార్పులు రావడం సహజమే. ఆలోచనలు, వ్యక్తిత్వం కూడా మారుతుందని చెప్పుకొచ్చింది.
"నా శరీరం మారింది. నా జీవితం కూడా మారింది. బహుశా జీవితంలో ఎప్పటికీ మారని ఒక్క విషయం 'మార్పు' మాత్రమే. వయసుతో పాటు నా మెటాబాలిజం(జీవక్రియ), హార్మోన్లలో మార్పులు వచ్చాయి. మొటిమలు రావడం, బరువు తరచూ మారడం వంటి శారీరక మార్పులను ఎదుర్కొన్నాను. అయితే ఇవన్నీ నన్ను మరింత మెచ్యూరిటీ ఉన్న మహిళగా తీర్చిదిద్దాయి. నాలోని స్త్రీత్వాన్ని మరింత దగ్గరగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. మనుషులని మరింతగా ప్రేమించడం నేర్చుకున్నాను. అవసరమైనప్పుడు దేనికైనా సరే లేదు అని చెప్పగలుగుతున్నాను. ఇతరులని సంతోషపెట్టడం కోసం జీవించే స్వభావాన్ని వదులుకున్నాను' అని పునర్నవి పేర్కొంది.



