బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ నటించిన అద్భుత చలనచిత్రం ‘ఉమ్రావ్ జాన్’. 1981లో విడుదలైన ఈ చిత్రం నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇందులో అద్భుత అభినయం ప్రదర్శించిన రేఖ 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రేఖ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘ఉమ్రావ్ జాన్’ చిత్రం త్వరలో మరో అరుదైన గౌరవాన్ని అందుకోనుంది.
వచ్చే నెలలో జరుగనున్న ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎం) వేదికపై ఈ క్లాసిక్ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలో ఉమ్రావ్ జాన్ పాత్ర దశాబ్దాలుగా తనతోపాటే సజీవంగా ఉందంటూ రేఖ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ.. ‘ఉమ్రావ్ జాన్ నా జ్ఞాపకాల్లో, నా నిశ్శబ్దంలో, దశాబ్దాలుగా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉంది. ప్రపంచ వేదికపై ఈ చిత్రానికి దక్కుతున్న గౌరవం చూసి నా మనస్సు ఆనందంతో నిండిపోతోంది’ అని పేర్కొన్నారు.
ఆగస్టు 13 నుండి 23 వరకు జరుగనున్న ఈ చలనచిత్రోత్సవంలో రేఖ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ వేదికపై ప్రతిష్టాత్మక ‘ఎక్స్లెన్స్ ఇన్ సినిమా అవార్డు’తో ఆమెను సత్కరించనున్నారు. ఈ పురస్కారాన్ని కృతజ్ఞతా భావంతో స్వీకరించనున్నట్లు రేఖ తెలిపారు. ఇది కేవలం తన నటనకు దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, తన జీవితాన్ని, నటనను తీర్చిదిద్దిన చిత్రనిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, కళాకారులందరికీ అంకితమని ఆమె పేర్కొన్నారు.


