“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్‌ | Nadda Defends NEET Protest Arrests: Whats Wrong | Sakshi
Sakshi News home page

“అరెస్టుల్లో తప్పేముంది?”.. విద్యార్థి నిరసనలపై నడ్డా కౌంటర్‌

Jul 29 2026 12:27 PM | Updated on Jul 29 2026 12:36 PM

Nadda Defends NEET Protest Arrests: Whats Wrong

నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై పార్లమెంట్‌లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలను సమర్థించారు. నిరసనలు చేపట్టినప్పుడు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేశారని, ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. నిరసనకారులపై చర్యలు తీసుకున్న వారిపై ఎందుకు చర్యలు లేవని.. వాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన నడ్డా.. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవడం వారి బాధ్యత అని అన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొనే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

నిరసనలు చేస్తే చర్యలు సహజమే
విద్యార్థి ఉద్యమాలపై మాట్లాడిన నడ్డా.. యాక్టివిజంలో పాల్గొనేవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. నిరసన హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ.. చట్ట పరిమితులను దాటితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్న నడ్డా.. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా విద్యార్థి కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. ఆ సమయంలో తరగతి గది నుంచి రెండుసార్లు పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.

‘నేనూ అరెస్టయ్యా..’
‘‘నేను కూడా విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను. ఎమర్జెన్సీ సమయంలో క్లాస్‌రూమ్‌ నుంచి రెండుసార్లు నన్ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని నడ్డా పేర్కొన్నారు. అయితే అప్పటి పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ఉద్యమాల్లో పాల్గొంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇటీవల విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందిస్తోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడం సరికాదని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని డిమాండ్‌ చేశారు. అయితే నడ్డా మాత్రం పోలీసుల చర్యలను సమర్థించారు. చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల బాధ్యత అని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement