breaking news
Sakshi Special
-
కొలంబియా భూకంపం: ఒక్క కుదుపు.. సెకన్లలో శవాల దిబ్బలు!
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది..భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Powerful 7.4-magnitude earthquake hits Manizales, Colombia 🇨🇴 (10.08.2026)@AmirSaeedAbbasi @HussainAhmedCh8 @KulAalam #Colombia pic.twitter.com/FI2lrySjd8— Media Talk (@mediatalk922) August 11, 2026హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదంలాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది.నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్లో సుమారు 40 వేల మంది, కొలంబియాలో మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. చారిత్రక రికార్డుల ప్రకారం.. ఇబారా నగరం కొన్ని క్షణాల్లోనే విధ్వంసానికి గురైందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.పెరూలో భూకంపం.. కదిలిన పర్వతం1970లో పెరూలో సంభవించిన భూకంపం ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు అండీస్ పర్వతాల్లో భారీ మంచు, రాళ్ల కొండచరియలు విరిగిపడేలా చేశాయి. మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం వేగంగా దూసుకొచ్చి యుంగే, రన్రాహిర్కా ప్రాంతాలను కప్పేసింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి జనజీవనం పూర్తిగా తారుమారైంది. ఈ ఘటనలో సుమారు 66,794 మంది మరణించారు. ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు ఎంతటి ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటన చాటిచెప్పింది.ఈక్వెడార్లో ప్రకృతి ప్రకోపం.. 40 వేల మంది బలి1797లో ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటి. 8.3 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు భారీగా కొండచరియలు విరిగిపడేలా చేశాయి. రియోబాంబా, లతకుంగా, అంబాటో వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విషాదంలో సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.చిలీ.. భూకంపాల దేశంలో విషాద జ్ఞాపకంప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో చిలీలో 9.5 తీవ్రతతో నమోదైంది. అయితే అత్యధిక మరణాలు మాత్రం 1939లో వచ్చిన చిల్లాన్ భూకంపంలో చోటుచేసుకున్నాయి. 8.3 తీవ్రతతో వచ్చిన ఆ ప్రకంపనలు చిల్లాన్, కాన్సెప్సియన్ నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. బలహీన నిర్మాణాల కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం తర్వాత చిలీ భూకంప నిరోధక నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.వెనిజులా నుంచి అర్జెంటీనా వరకు.. విషాదాల ఆనవాళ్లులాటిన్ అమెరికాలో మరెన్నో భూకంపాలు వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. 1812 వెనిజులా భూకంపం సుమారు 26 వేల మందిని, 1868 అరికా భూకంపం దాదాపు 25 వేల మందిని, 1976 గ్వాటెమాలా భూకంపం 23 వేల మందిని బలిగొన్నాయి. 1797 వెనిజులా భూకంపం, 1861 అర్జెంటీనా భూకంపం కూడా వేలాది ప్రాణాలను హరించాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం తర్వాత వచ్చిన సునామీలు, అగ్ని ప్రమాదాలు మరణాల సంఖ్యను మరింత పెంచాయి.ఎందుకింత ప్రాణ నష్టం?లాటిన్ అమెరికా భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారడానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంతం భారీ టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉండటమే. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాలు తరచూ భౌగోళిక కదలికలను ఎదుర్కొంటుంటాయి.సముద్రపు అడుగున ఉన్న నాజ్కా టెక్టానిక్ ప్లేట్.. దక్షిణ అమెరికా ప్లేట్ కిందికి జారిపోవడం వల్ల భూమి లోపల భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ ప్రకంపనలు సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకుంటుంటాయి.ప్రకృతి హెచ్చరిక.. మనిషికి గుణపాఠంభూకంపాలను ఆపడం మనిషి చేతుల్లో లేదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. లాటిన్ అమెరికా భూకంప చరిత్ర ఒక చేదు నిజాన్ని చెబుతోంది. భూమి కదిలేది కొన్ని సెకన్లే.. కానీ ఆ ప్రకంపనలు మిగిల్చే విషాదం తరతరాల పాటు నిలిచిపోతుంది అని. -
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
హైదరాబాద్లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది.ప్రియాంక.. పక్కన యాక్సిడెంట్ దృశ్యంప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది.బ్రిటన్లోనూ డ్రంక్ డ్రైవింగ్పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి.ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి.లెక్కలు చెబుతున్న భయానక నిజంమద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. కేవలం ట్రాఫిక్ తప్పిదం కాదు ప్రాణాలను బలిగొనే ప్రమాదకర నిర్ణయం. భారత్లో 2022లో డ్రంక్ డ్రైవింగ్తో 4,201 మరణాలు.. 2023లో 9,143 కేసులు.. 2024లో 8,270 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతూ పోతోంది. ఇవే కాకుండా.. ఇతరుల ప్రాణాలు తీయడమే కాకుండా, తాగి తమ ప్రాణాలు తీసుకుంటున్నవాళ్ల లెక్కలు ఇంకా బోలెడు ఉన్నాయి.భారత్లో చట్టాలు ఉన్నా.. భారత్లోనూ డ్రంక్ డ్రైవింగ్పై చట్టాలు ఉన్నాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే భారత న్యాయ సంహిత (BNS) కింద నిర్లక్ష్యపు చర్యలకు సంబంధించి మరింత తీవ్రమైన కేసులు నమోదు చేయవచ్చు. అయితే సమస్య చట్టాల కొరతలో కాదు.. వాటి అమలులో ఉందనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.శిక్ష భయం ఎందుకు రావడం లేదు?డ్రంక్ డ్రైవింగ్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోవచ్చు.. ఎన్నో కుటుంబాలు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయినప్పటికీ కొందరిలో ఈ నేరం పట్ల సరైన భయం కనిపించడం లేదు.ఇతర దేశాల్లో డ్రంక్ డ్రైవింగ్పై చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం, లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు వంటి పరిణామాలు ఉంటాయనే భయం వాహనదారుల్లో ఉంటుంది. ప్రమాదంలో మరణం సంభవిస్తే కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధిస్తారు.హైదర్షా కోట్ హిట్ అండ్ రన్ దృశ్యం ఇదిభారత్లోనూ చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు, శిక్షలు పడే వేగమే ప్రధాన సవాల్గా మారుతోంది. కేసులు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఎక్కువ కాలం కొనసాగడం.. శిక్షలు ఆలస్యంగా పడటం వల్ల కొందరిలో నేరం పట్ల భయం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కఠిన చట్టాలతో పాటు.. వాటిని వేగంగా, సమర్థంగా అమలు చేయడం కూడా అంతే కీలకం. ఎందుకంటే మద్యం మత్తులో స్టీరింగ్ పట్టే ప్రతి వ్యక్తి తన ప్రాణాన్నే కాదు.. రోడ్డుపై ఉన్న ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు. శిక్ష భయం పెరిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.మారాల్సింది మనస్తత్వం కూడా..ప్రపంచ దేశాలు చెబుతున్న పాఠం ఒక్కటే.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం సరదా కాదు, అది ప్రాణాలతో చెలగాటం. కఠిన చట్టాలతో పాటు.. వాటి అమలు, ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరగాల్సిన అవసరం ఉంది. హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్న వేళ.. ‘‘తాగాను.. డ్రైవ్ చేస్తాను’’ అనే నిర్లక్ష్య ఆలోచనకు అడ్డుకట్ట పడాల్సిన సమయం వచ్చింది. -
అంతరిక్షంలో వరి సాగు
రోదసీ పరిశోధనల్లో మానవాళి మరొక చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా ‘తియాంగాంగ్’ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు వరి పంటను తొలిసారి విజయవంతంగా పండించారు. విత్తనం వేసి ధాన్యాన్ని నూర్చే వరకు జీవిత చక్రాన్ని పూర్తి చేసి ప్రతిష్టాత్మక మైలురాయిని దాటారు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం నివసించే రోదసీ యాత్రికులకు స్వయంసమృద్ధిగల ఆహార భద్రతను అందించే ప్రయత్నాల్లో ఈ ప్రయోగం విప్లవాత్మక మలుపుగా నిలిచింది.అంతరిక్ష కాలనీలకు మార్గంఈ సంచలన ప్రయోగం ద్వారా రోదసీలోనే ఆహారాన్ని పండించటం మాత్రమే కాకుండా, వ్యోమగాములు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయటానికి కూడా అవకాశం దొరికింది. నీటి వ్యవస్థను సహజ సిద్ధంగా శుద్ధి చేయటం కూడా సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ‘క్లోజ్డ్–లూప్ ఎకోసిస్టమ్’ రూపుదిద్దుకో వడానికి ఇది ప్రాథమిక అడుగు.భవిష్యత్తులో మార్స్ లేదా చంద్రుడిపై కాలనీలు నిర్మించే క్రమంలో భూమి నుంచి ప్రతీసారీ ఆహారాన్ని మోసుకెళ్లే అవసరం లేకుండా, అక్కడే స్వయంగా పంటలు పండించుకునేందుకు ఇక మీదట 100 శాతం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ అంతరిక్ష వరి విత్తనాల్లోని జన్యుపరమైన మార్పులను అధ్యయనం చేయటం ద్వారా భూమిపై తీవ్ర ప్రతికూల వాతావరణ మార్పులను ఎదుర్కొనే నూతన వరి రకాలను అభివృద్ధి చేయటానికి కూడా ఈ పరిశోధన దోహదపడుతుందని చెబుతున్నారు.ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాలు..భూమిపై గురుత్వాకర్షణ ప్రభావంతో మొక్కల వేళ్లు కిందికి, కాండం పైకి పెరుగుతాయి. అయితే, రోదసీలోని మైక్రోగ్రావిటీ (శూన్య గురుత్వాకర్షణ శక్తి)లో వాతావరణంలో మొక్కల పెరుగుదల శైలి మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష ఇంక్యుబేటర్లలో ప్రత్యేక ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాల ద్వారా నీరు, ఎరువుల వరి పంట పండించారు. ఈ ప్రయోగంలో పొడవు రకం వరి మొక్కలు అనుకున్న దానికంటే ఆలస్యంగా ధాన్యాన్ని పండించగా, పొట్టి రకం మొక్కలు సరైన సమయంలోనే పండాయి.అంతరిక్ష వరి సాగు ముఖ్యాంశాలుఅంతరిక్ష కేంద్రం: చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్సాగు చేసిన పంట: వరి (పొడవు, పొట్టి రకాలు)ప్రయోగ కాలం: 120 రోజులు మైలురాయి: శూన్య గురుత్వా కర్షణలో ‘నారు నుంచి నూర్పిడి వరకు’ ప్రయోగం విజయవంతంముఖ్య ప్రయోజనాలు: రోదసీలో ఆహారోత్పత్తి, ఆక్సిజన్ పునరుత్పత్తి, నీటి శుద్ధి వ్యవస్థల అనుసంధానం -
బ్యాంకు కాటుకు రైతు దెబ్బ!
టిట్ ఫర్ ట్యాట్ అనండి.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనండి.. ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. హాసన్ జిల్లా సకలేశ్పుర కెనెరాబ్యాంకులో జరిగిన ఈ ఘటన మాత్రమిప్పుడు సోషల్ మీడియాలో పిచ్చవైరల్ అవుతోంది. ‘‘రైతన్నా.. పొగరుబోతు బ్యాంకుకు భలే బుద్ధి చెప్పావు’’అన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే... చొక్కన గౌడ అనే రైతు కెనెరాబ్యాంకు నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఠంచనుగా తిరిగి కట్టేశాడు కూడా. హమ్మయ్య అప్పు బాధ తీరిందిలే అనుకుని ఇంటికెళితే.. కొంత కాలానికే బ్యాంకు నుంచి ఒక నోటీసొచ్చింది. ఇదేమిటబ్బా అని చూస్తే అతడికి షాక్.. ‘‘ఇంకో 9.34’’రూపాయలు బాకీ ఉన్నావు. కట్టూ అంటూ బ్యాంకు తాఖీదు. బ్యాంకు అధికారుల అతికాకపోతే.. రూ.యాభై వేలు కట్టినోడికి తొమ్మిది రూపాయల ముప్ఫై నాలుగు పైసలు ఎక్కువవుతుందా? చొక్కన గౌడ కూడా ఇలాగే ఫీలయ్యాడు. సరే అనుకుని బ్యాంకుకు వెళ్లాడు. మిగిలిన బాకీ వివరాలతో పే ఇన్ స్లిప్ నింపాడు. పది రూపాయల నోటు జత చేసి బ్యాంకు అధికారికి ఇచ్చాడు. వాళ్లేమో భలే నిక్కచ్చిగా పనిచేశాము మేము అనుకుని భుజాలు చరుచుకుని సీలు వేసిన స్లిప్ను చొక్కనగౌడకు రిటర్న్ ఇచ్చాడు. అక్కడ మొదలైంది తకరారు. ‘‘పది రూపాలిచ్చా. మీకివ్వాల్సింది రూ.9.34. ఆ విషయమే స్లిప్లో రాశా. మీరు సీల్ కూడా వేశారు. మరి... బాకీ 66 పైసల మాటేమిటి?’’అన్నాడు చొక్కనగౌడ. నోట మాట రాలేదు బ్యాంకు అధికారులకు. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యింది. కొసమెరుపు ఏమిటంటే.. చొక్కనగౌడ డిమాండ్కు తలొగ్గిన బ్యాంకు 66 పైసల మొత్తాన్ని అతడి ఖాతాలోకి జమ చేయడం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరెస్ట్ ఒడిలో విషాద గాథ.. ‘గ్రీన్ బూట్స్’ ఎవరివంటే?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం.. ఎవరెస్ట్. అక్కడ అడుగు పెట్టడం ప్రతి పర్వతారోహకుడి జీవిత కల. కానీ ఆ మంచు పర్వతం ఎన్నో విషాదాలకు కూడా సాక్షిగా నిలిచింది. ఇటీవల హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న పర్వత ప్రమాదాలు మరోసారి ఎత్తైన శిఖరాలపై దాగి ఉన్న ముప్పును గుర్తుచేశాయి. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలుగా ఎవరెస్ట్ డెత్ జోన్లో ఓ రాతి చాటున మిగిలిపోయిన ఓ భారత సైనికుడి కథ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచానికి ‘గ్రీన్ బూట్స్’గా పరిచయమైన ఆ మృతదేహం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది.ఎవరెస్ట్ ఉత్తర మార్గంలో శిఖరానికి వెళ్లే సమయంలో ఓ రాతి గుహలాంటి ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ మంచులో కూరుకుపోయిన ఓ పర్వతారోహకుడి మృతదేహం ఎన్నో ఏళ్లుగా కనిపించేది. అతడి కాళ్లకు ఉన్న ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు పర్వత బూట్ల కారణంగా ఆ మృతదేహానికి ‘గ్రీన్ బూట్స్’ అనే పేరు వచ్చింది.ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లే ప్రతి పర్వతారోహకుడికి అది ఓ భయానక గుర్తుగా మారింది. విజయం కోసం చివరి దశలో ఉన్న వారికి.. ప్రకృతి శక్తుల ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేసే విషాద చిహ్నంగా నిలిచింది.మూడు దశాబ్దాల మిస్టరీకి తెరఏళ్ల పాటు ‘గ్రీన్ బూట్స్’ ఎవరిది అనే దానిపై అనేక ఊహాగానాలు కొనసాగాయి. చాలామంది అది భారత ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కు చెందిన పర్వతారోహకుడు త్సెవాంగ్ పాల్జోర్ మృతదేహమని భావించారు. కారణం.. 1996లో ఎవరెస్ట్ యాత్రకు వెళ్లిన ఆరుగురు సభ్యుల ITBP బృందంలో పాల్జోర్ కూడా ఉండటం, ఆయన కూడా ఆకుపచ్చ రంగు బూట్లు ధరించడం.అయితే తాజా ఆధారాలు, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ‘గ్రీన్ బూట్స్’గా గుర్తించిన మృతదేహం నిజానికి మరో ITBP సభ్యుడు లాన్స్ నాయక్ డోర్జీ మోరప్దిగా నిర్ధారణ అయింది.1996.. విషాద యాత్రడోర్జీ మోరప్ కథ 1996 ఎవరెస్ట్ విషాదంతో ముడిపడి ఉంది. ఆ ఏడాది ITBP బృందం ఎవరెస్ట్ను ఉత్తర మార్గం నుంచి అధిరోహించేందుకు బయలుదేరింది. చైనా వైపు నుంచి ఉన్న ఈ మార్గం అత్యంత కఠినమైనదిగా పరిగణిస్తారు. ఆరుగురు సభ్యుల బృందంలో ముగ్గురు ప్రతికూల వాతావరణం కారణంగా వెనుదిరిగారు. కానీ సుబేదార్ త్సెవాంగ్ స్మాన్లా, లాన్స్ నాయక్ డోర్జీ మోరప్, హెడ్ కానిస్టేబుల్ త్సెవాంగ్ పాల్జోర్ మాత్రం ముందుకు సాగారు.ఎట్టకేలకు వాళ్లు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. సుమారు 8,849 మీటర్ల ఎత్తులో భారత జెండాను రెపరెపలాడించారు. కానీ విజయంతో తిరిగి వస్తున్న సమయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మంచు తుఫాను వారిని చుట్టుముట్టింది. ఆ తర్వాత ముగ్గురూ తిరిగి రాలేదు.విజయం కంటే కష్టమైన తిరుగు ప్రయాణంఎవరెస్ట్పై శిఖరాన్ని చేరుకోవడం మాత్రమే కాదు.. అక్కడి నుంచి సురక్షితంగా కిందకు రావడమే అసలు సవాల్. డోర్జీ మోరప్ తిరుగు ప్రయాణంలో తీవ్ర చలికి గురయ్యారు. మంచుతో గడ్డకట్టిన చేతులతో పరికరాలను సరిగ్గా ఉపయోగించలేకపోయారని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. చివరకు ఆయన 8,500 మీటర్ల ఎత్తులో ఓ రాతి చాటు ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రదేశం తర్వాత ‘గ్రీన్ బూట్స్ గుహ’గా మారింది.భర్త కోసం మూడు దశాబ్దాల నిరీక్షణడోర్జీ మోరప్ ఎవరెస్ట్కు బయలుదేరే ముందు తన భార్యతో చివరిసారి మాట్లాడారు. విజయం సాధించి తిరిగి వస్తానని చెప్పారు. కానీ ఆ మాటలు జ్ఞాపకంగానే మిగిలిపోయాయి. మృతదేహాన్ని చూడకపోవడంతో ఆయన భార్యకు భర్త మరణాన్ని పూర్తిగా అంగీకరించడం కూడా కష్టమైంది. మూడు దశాబ్దాలుగా ఓ చివరి వీడ్కోలు కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తూనే ఉంది.ఎందుకంత కష్టం?ఎవరెస్ట్పై 8,000 మీటర్లకు పైగా ఉన్న ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అంటారు. అక్కడ ఆక్సిజన్ స్థాయి సముద్ర మట్టంతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి ప్రాంతంలో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్. మంచు చరియలు, తీవ్రమైన గాలులు, తక్కువ ఆక్సిజన్ కారణంగా అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కూడా ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది.ఎవరెస్ట్పై ఉన్న దాదాపు 200కు పైగా మృతదేహాల్లో చాలా వరకు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. వాటిని తరలించడం కంటే.. కొత్తగా ఎవరెస్ట్ను అధిరోహించడమే కొన్నిసార్లు సులభమని నిపుణులు చెబుతారు.‘గ్రీన్ బూట్స్’ మరో విషాదానికి సాక్షి2006లో బ్రిటిష్ పర్వతారోహకుడు డేవిడ్ షార్ప్ ఇదే ప్రాంతంలో తీవ్ర చలికి గురై మరణించారు. కొందరు పర్వతారోహకులు మొదట ఆయనను ‘గ్రీన్ బూట్స్’ మృతదేహంగా భావించారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ ఘటన ఎవరెస్ట్పై రక్షణ బాధ్యతలు, మానవత్వంపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఇప్పుడు మొదలైన చివరి ప్రయాణండీఎన్ఏ పరీక్షలతో డోర్జీ మోరప్ గుర్తింపు ఖరారైన తర్వాత.. ఆయన అవశేషాలను స్వదేశానికి తీసుకురావాలని ITBP నిర్ణయించింది. దీనికి ప్రత్యేకంగా అత్యంత అనుభవజ్ఞులైన పర్వతారోహకుల బృందం అవసరం. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఈ ఆపరేషన్ పూర్తి కానుంది.30 ఏళ్లుగా ఎవరెస్ట్ మంచులో నిశ్శబ్దంగా ఉన్న ఓ భారత వీరుడి కథకు ఇప్పుడు ముగింపు పలికే సమయం వచ్చింది. ప్రపంచానికి ‘గ్రీన్ బూట్స్’గా కనిపించిన ఆ గుర్తు వెనుక.. ఓ సైనికుడి త్యాగం, ఓ కుటుంబం ఎదురుచూపు, ఓ అసంపూర్తి వీడ్కోలు దాగి ఉంది. -
దెబ్బ మీద దెబ్బ.. పుండు మీద కారం.. జుకర్బర్గ్ ఉక్కిరిబిక్కిరి
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సామ్రాజ్యం అది. ప్రపంచాన్ని కలిపిన వేదికగా ఎదిగిన ఆ సంస్థ.. అదే సమయంలో టెక్ రంగంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీగా నిలిచింది. పేరు మార్చుకుని ఫేస్బుక్ నుంచి మెటాగా మారినా.. ఫేట్ మాత్రం మారడం లేదు. విమర్శలు, కోర్టు కేసులు, బిలియన్ల డాలర్ల జరిమానాలు, చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు.. ఆ ప్రయాణంలో భాగంగా కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందనే ఆరోపణలతో అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాపై భారీ జరిమానా విధించింది. మైనర్ల భద్రత విషయంలో సంస్థ విఫలమైందని, వినియోగదారులను ఎక్కువ సమయం ప్లాట్ఫామ్లలోనే గడిపేలా చేసే ఫీచర్లను రూపొందించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మెటాకు మొత్తం 567 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,700 కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఇదే కాదు..ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటన కూడా మెటాకు ఇబ్బందులు తెచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే వీడియో తొలగించామని వివరణ ఇచ్చిన సంస్థ.. అనంతరం భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. అయితే ఇవి మెటాకు ఎదురైన తొలి వివాదాలు కావు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల చుట్టూ గతంలోనూ డేటా లీకులు, ప్రైవసీ ఉల్లంఘనలు, ఫేక్ న్యూస్, పిల్లల భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరిగాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపిన వేదికగా పేరు తెచ్చుకున్న మెటా.. ఇప్పుడు బాధ్యత, భద్రత, పారదర్శకత వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.కేంబ్రిడ్జ్ అనలిటికా షాక్ఫేస్బుక్(మెటా) చరిత్రలో అత్యంత పెద్ద కుదుపు తెచ్చిన ఘటనల్లో ఇది ఒకటి. కోట్లాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం వారి అనుమతి లేకుండా సేకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో మార్క్ జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో ఫేస్బుక్ డేటా భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.పిల్లల భద్రతపై ప్రశ్నలుఇన్స్టాగ్రామ్ యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందం, ఫాలోవర్లు, లైక్ల సంస్కృతి యువతలో ఒత్తిడిని పెంచుతోందని విమర్శలు వచ్చాయి. అంతర్గత పరిశోధనల్లో కొన్ని సమస్యలు బయటపడినా సంస్థ తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలతో మెటా ఇప్పుడు కోర్టు కేసులను ఎదుర్కొంటోంది.జుకర్బర్గ్ క్షమాపణలు.. సెనేట్లో భావోద్వేగ క్షణాలుపిల్లల ఆన్లైన్ భద్రతపై అమెరికా సెనేట్ విచారణ సందర్భంగా మార్క్ జుకర్బర్గ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఉద్దేశించి ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారనే ప్రచారం జరిగినప్పటికీ, అధికారిక రికార్డుల్లో ఆయన ఏడ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ పిల్లల భద్రత అంశంపై ఆయన భావోద్వేగానికి గురైన విషయం మాత్రం చర్చనీయాంశమైంది.ఫేక్ న్యూస్ తుఫాను.. ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావంఫేస్బుక్, వాట్సాప్లలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించడం అనేక దేశాల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రచారం జరుగుతోందనే ఆరోపణలు రావడంతో మెటా కంటెంట్ నియంత్రణ విధానాలపై ప్రశ్నలు తలెత్తాయి.వాట్సాప్ పాలసీ వివాదం.. యూజర్లలో పెరిగిన అనుమానాలు2021లో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించడంతో పెద్ద వివాదం మొదలైంది. యూజర్ల డేటా ఫేస్బుక్తో పంచుకుంటారనే భయంతో చాలామంది ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్స్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మెటా వివరణలు ఇచ్చినా.. ప్రైవసీపై ప్రజల్లో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.మయన్మార్ ఘటనలు.. ద్వేష ప్రచారంపై ఫేస్బుక్ విమర్శలుమయన్మార్లో రోహింగ్యాలపై జరిగిన హింస సమయంలో ద్వేష ప్రచారం వ్యాప్తికి ఫేస్బుక్ వేదికగా మారిందనే విమర్శలు వచ్చాయి. కంటెంట్ పర్యవేక్షణలో తమ వైఫల్యాలు ఉన్నాయని ఫేస్బుక్ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా బాధ్యతపై కొత్త చర్చకు ఇది కారణమైంది.లైక్ల మాయాజాలం.. ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్పై ఆరోపణలుయువత ఎక్కువ సమయం యాప్లో గడిపేలా ఇన్స్టాగ్రామ్ డిజైన్ చేశారనే విమర్శలు వచ్చాయి. లైక్లు, కామెంట్లు, ఫాలోవర్ల కోసం పరుగులు పెట్టేలా చేసే అల్గారిథమ్ యువతలో ఆందోళన, అసంతృప్తిని పెంచుతోందని నిపుణులు హెచ్చరించారు.మెటావర్స్ కల.. భారీ పెట్టుబడులు, భారీ నష్టాలుఫేస్బుక్ పేరును మెటాగా మార్చిన జుకర్బర్గ్.. వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు. భారీ ఖర్చులు, షేర్ విలువ పతనం, ఉద్యోగుల తొలగింపులతో మెటాకు కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి.డేటా గోప్యతపై యూరప్ కఠిన చర్యలుయూరోపియన్ యూనియన్ డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మెటాపై పలు సందర్భాల్లో భారీ జరిమానాలు విధించాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహించాలన్న విషయంలో టెక్ కంపెనీలకు యూరప్ గట్టి హెచ్చరికలు ఇచ్చింది.ఏఐ యుగం.. డీప్ఫేక్లతో కొత్త తలనొప్పులుకృత్రిమ మేధస్సు పెరుగుతున్న కొద్దీ మెటాకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డీప్ఫేక్ వీడియోలు, నకిలీ కంటెంట్, పిల్లలకు సంబంధించిన ప్రమాదకరమైన కంటెంట్ విషయంలో సంస్థపై ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తులో సోషల్ మీడియా కంపెనీలకు కేవలం టెక్నాలజీ సరిపోదని.. బాధ్యత కూడా అవసరమని ఈ వివాదాలు గుర్తుచేస్తున్నాయి.జరిమానాల చరిత్ర కూడా మెటాకు ఓ పెద్ద మచ్చగానే మిగిలింది. ఫేస్బుక్ పేరుతో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు డేటా ప్రైవసీ, యూజర్ల సమాచారం దుర్వినియోగం, పిల్లల భద్రత వంటి అంశాల్లో మెటాపై బిలియన్ల డాలర్ల జరిమానాలు పడ్డాయి. ఇందులో అత్యంత భారీ దెబ్బ 2019లో కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా వివాదం కేసులో అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) విధించిన 5 బిలియన్ డాలర్ల జరిమానా. ఆ తర్వాత యూరప్లో యూజర్ల డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2023లో ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ 1.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది. ఫేస్ రికగ్నిషన్ డేటా సేకరణ వ్యవహారంలో అమెరికాలోని టెక్సాస్తో 1.4 బిలియన్ డాలర్ల సెటిల్మెంట్, వాట్సాప్ ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై 225 మిలియన్ యూరోలు, ఇన్స్టాగ్రామ్లో పిల్లల డేటా రక్షణ లోపాలపై 405 మిలియన్ యూరోలు వంటి భారీ జరిమానాలు ఎదురయ్యాయి. తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యం, మైనర్ల భద్రత విషయంలో అమెరికా న్యూ మెక్సికో కోర్టు విధించిన భారీ ఆర్థిక శిక్ష కూడా మెటా సంక్షోభాల జాబితాలో చేరింది. మొత్తంగా చూస్తే.. మెటా చెల్లించిన, చెల్లించాల్సి వచ్చిన జరిమానాల విలువ బిలియన్ల డాలర్లలోనే ఉంది.ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపే వేదికగా మొదలైన ఫేస్బుక్ ప్రయాణం.. ఇప్పుడు యూజర్ భద్రత, గోప్యత, బాధ్యత అనే మూడు కీలక ప్రశ్నల మధ్య సాగుతోంది. ప్రతి వివాదం మార్క్ జుకర్బర్గ్కు మరో పరీక్షగా మారుతోంది. -
సీతాకోక చిలుకలు ఎగిరిపోతున్నాయి!
మునుపెన్నడూ చూడని సీతాకోక చిలుక మీకు దర్శనమిచ్చిందా? స్మార్ట్ఫోన్తో ఫొటో తీసి.. ఇన్స్టాలో షేర్ చేసి మురిసిపోయారా? ఓకే కానీ... ఆ సీతాకోక చిలుక అక్కడకు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించారా? అప్పటివరకూ ఉన్న ప్రాంతంలో వేడి ఎక్కువ కావడంతో... చల్లబడదామని ఎగిరొచ్చింది. భూమ్మీద అన్నిచోట్లా ఇప్పుడు ఇదే తంతు.. పర్యావరణ విధ్వంసానికి, భూతాపోన్నతి పాపం!పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం వంటి రకరకాల కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ పెరుగుదలను 2100 నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేయగలిగితే భూమ్మీద మనిషన్నవాడు ఉండగలడని, లేదంటే మహా విపత్తు తప్పదన్న హెచ్చరికలూ చాలానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటివాళ్లు కొందరు భూతాపోన్నతి, వాతావరణ మార్పులు చైనా సృష్టి అని కొట్టివేయవచ్చు కానీ.. సీతాకోక చిలుక జాతులు కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూండటం మాత్రం వాటికి ప్రత్యక్ష సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపోన్నతి పరిణామాల్లో ఇదీ ఒకటి. మోనాష్ యూనివర్సిటీ (ఆ్రస్టేలియా), ఫ్రీడ్రిచ్ షిల్లర్ యూనివర్సిటీ (జర్మనీ), యూనివర్సిటీ ఆఫ్ పికార్డీ జూల్స్ వర్నె (ఫ్రాన్స్) పరిశోధకులు నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ఇప్పటికే పది సీతాకోక చిలుక జాతుల్లో కనీసం ఒకటి తమ ఆవాస ప్రాంతాన్ని మార్చేసుకుంది. వీటి కదలికలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు సీతాకోక చిలుకల నివాస పరిధిపై జరిపిన 565 అధ్యయనాలను పరిశీలించారు. దాదాపు 6180 నివేదికలు, నిపుణులు సిద్ధం చేసిన 68 అంచనాలను కూడా కలుపుకుని విశ్లేషించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. దాదాపు 80 శాతం సీతాకోక చిలుక జాతులు తమ పరిధిని విస్తరించాయి. కొన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి ఇంకొన్ని తూర్పు నుంచి పశ్చిమం వైపు. ఇంకొన్ని జాతుల నివాస పరిధి కుంచించుకుపోయింది. గతంలో ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరుగుతూంటే ఇప్పుడు అంతకంటే తక్కువ స్థలంలో బతికేస్తున్నాయన్నది ఒక ఉదాహ రణ. కొన్ని సీతాకోక చిలుక జాతులైతే కొండ ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువకు.. ఎగువ నుంచి దిగువకు మారిపోయాయి. ఎందుకిలా అంటే... సీతాకోక చిలుకలు తమ నివాస పరిధిని మార్చుకోవడంలో వాతావరణ మార్పులు, వడగాడ్పు, వరదల్లాంటి తీవ్ర వాతావరణ ఘటనల భాగస్వామ్యం 70 శాతం! ఈ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ కనిపిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావన్ చౌదరి (మోనాష్ యూనివర్సిటీ) తెలిపారు. వ్యవసాయం, అటవీ ప్రాంతాలు తగ్గిపోతూండటం, నగరీకరణ, సీతాకోక చిలుకల ఆవాస ప్రాంతాల విధ్వంసం ఇతర కారణాలుగా తెలుస్తోంది. పర్యావరణ వ్యవస్థలో సీతాకోక చిలుకలది చాలా ముఖ్యపాత్ర. పర పరాగ సంపర్కానికి సాయపడతాయి. గొంగళి పురుగులు పక్షులు, సాలెపురుగులు, ఇతర కీటకాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. సీతాకోక చిలుకలు కనిపించకుండా పోతే ఆయా ప్రాంతాల్లో మొక్కలు, నేలల్లోనూ మార్పులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతిని పరిరక్షించుకోవడం.. అందులో చిన్న భాగమైనప్పటికీ సీతాకోక చిలుకలను కాపాడుకోవడం అవసరమవుతుంది. అధ్యయనం వివరాలు నేచర్ ఎకాలజీ అండ ఎవల్యూషన్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలా కూర్చుంటున్నారు? 'ప్లీజ్ చెక్'!
కార్యాలయాల్లో ఒక వ్యక్తి కూర్చునే లేదా నిలబడే భంగిమ వారి భావోద్వేగాలను, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని కెనడాలోని మెక్గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిటారుగా కూర్చున్న వారు రిస్క్ తీసుకునే పనుల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని.. ముందుకు వంగి కూర్చున్న వారి కంటే ఎక్కువ సానుకూల భావాలను వ్యక్తపరుస్తారని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు మన మానసిక స్థితిపై శరీరం చూపే ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయని మెక్గిల్ విశ్వవిద్యాలయ సైకియాట్రీ విభాగ ప్రొఫెసర్ జార్జ్ ఆర్మోనీ తెలిపారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అధ్యయనం ఇలా..అధ్యయనంలో భాగంగా కొందరు ఉద్యోగు లను మొదట ఒక ట్యాబ్లో కొత్త టాస్క్ చేయాలని పరిశోధకులు కోరారు. ఆయా ఉద్యోగులు నిటారుగా కూర్చోవడానికి వీలు గా ట్యాబ్ను సర్దుబాటు చేయగల ఒక టేబుల్పై ఉంచారు. అలాగే మరికొందరు ఉద్యోగుల కోసం టేబుల్ ఎత్తును తగ్గించి వారు ముందుకు వంగి కూర్చునేలా ట్యాబ్ను ఉంచారు. ఇక రెండవ దశలో ఉద్యోగులకు ఒక రిస్క్ తీసుకునే పరీక్షను ఇచ్చారు. అందులో వర్చువల్ బెలూన్ను ఊదడం ద్వారా బహుమతులు గెలుచుకోవ చ్చని చెప్పారు. ఈ టాస్క్లో నిటారుగా కూర్చున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ బహుమతులు గెలుచుకున్నారని, వారు సరైన వ్యూహంతో రిస్క్ తీసుకున్నారని ఆర్మోనీ వివరించారు. నిటారుగా కూర్చున్న ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు.వర్క్ప్లేస్ ఎర్గోనామిక్స్ అంటే?ఉద్యోగుల శారీరక సామర్థ్యాలు, పరిమితులకు తగినట్లుగా పని వాతావరణాన్ని, పరికరాలు, ఫర్నిచర్ను అమర్చే శాస్త్రం. సులభంగా చెప్పాలంటే మనిషికి పనిని మార్చడం కాకుండా మనిషికి సౌకర్యంగా ఉండేలా పనిచేసే విధానాన్ని లేదా వాతావరణాన్ని కల్పించడమే ఎర్గోనామిక్స్. -
సత్వరమే ‘పారాక్వాట్’ నిషేధం!
దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు/గడ్డి మందు ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ తయారీ, అమ్మకం, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ‘క్రిమిసంహారక మందుల చట్టం–1968’లోని సెక్షన్ 27 కింద ఈ మేరకు గత నెల 13న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే గడువు ఈ నెల 13తో ముగియనుంది. దీంతో, ఈ ప్రతిపాదిత నిషేధాజ్ఞలపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదిత నిషేధాన్ని ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని ‘ఆశా–కిసాన్ స్వరాజ్’ జాతీయ సహ సమన్వయకర్త కవిత కురుగంటి నేతృత్వంలో 270 మందికి పైగా వైద్య నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి గురువారం సంయుక్త వినతిపత్రం సమర్పించారు. వీరిలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల వారున్నారు. పారాక్వాట్ అత్యంత తీవ్రమైన విషపూరిత గడ్డిమందు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళ్లినా ఇది ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఈ రసాయన విషప్రభావానికి గురైన వారిలో మరణాల రేటు ఏకంగా 70% వరకు ఉంటోంది. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేదు. రసాయన పరిశ్రమల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం పారాక్వాట్పై నిషేధ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రిమిసంహారకాల నియంత్రణకు బలమైన ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ యాక్ట్’ తీసుకురావాలని కూడా నిపుణులు డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో నిషేధించిన ప్రమాదకర రసాయనాలను భారత్లోనూ స్వయంచాలకంగా నిషేధించాలన్నారు. 70కి పైగా దేశాలలో కొన్ని దేశాలు పారాక్వాట్ వినియోగాన్ని నిషేధించాయి, కొన్ని దేశాలు తీవ్రంగా నియంత్రించటం తెలిసిందే. అయితే, వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి కేంద్రానికి విడిగా లేఖ రాశారు. పారాక్వాట్పై నిషేధాన్ని అమలు చేసే క్రమంలో ఇప్పటికే దిగుమతి చేసుకున్న నిల్వలను విక్రయించుకోవడానికి ఒక 6 నెలల గడువు మాత్రమే ఇవ్వాలని, ఎగుమతుల పేరుతో ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
మసాయ్ మారాకు పర్యాటక ముప్పు
అభివృద్ధి రెండువైపులా పదునైక కత్తిలాంటిది. అది మంచి చేస్తామని చెబుతూనే తరతరాలుగా బతుకున్న నేలను నెమ్మదిగా ఆక్రమిస్తుంది. చివరకు మనుషులనే కాదు, జంతువులను తన నేలను తనకే పరాయిని చేస్తుంది. పర్యాటకం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందంటారు. కానీ కొన్నిసార్లు ఆ అవకాశం కనబడకుండానే కబళించేస్తుంది. దాన్ని అందుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మసాయి మారాలో ఈ రెండు ప్రక్రియలు.. మొత్తంగా పర్యావరణాకి, స్థానిక సమాజాలకు ముప్పు తెచ్చిపెట్టాయి.మసాయి మారా. కెన్యాలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం. అద్భుతమైన, వైవిధ్యభరితమైన అనేక జాతులకు అందమైన నిలయం. ఆఫ్రికాలోని సుప్రసిద్ధ సఫారీ గమ్యస్థానాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది సందర్శకులు ఈ అభయారణ్యానికి వస్తారు. 1960వ దశకంలో ఈ రిజర్వ్ను స్థాపించినప్పటి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో కెన్యా ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల డాలర్లు సమకూరుతున్నాయి. స్థానికులకు ఉద్యోగాలతోపాటు, స్థానిక వ్యాపారాలు లబి్ధపొందుతున్నాయి. ఈ లాభాలపై బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ కన్ను పడింది. అభయారణ్యం అంతటా విస్తరిస్తున్న విలాసవంతమైన శిబిరాలు, లాడ్జీలు పర్యావరణ వ్యవస్థపై ఆందోళనలు పెంచుతున్నాయి. అనియంత్రిత అభివృద్ధి వన్యప్రాణుల ఆవాసాలను దెబ్బతీస్తోందని, టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్, కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్ మధ్య జరిగే వన్యప్రాణుల వలసకు ముప్పు కలిగిస్తోందని పర్యావరణ పరిరక్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా, మసాయి మారా కెన్యా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటకం నిస్సందేహంగా కెన్యా ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం. ఇది ఏటా బిలియన్ల షిల్లింగ్లను ఆర్జిస్తూ, సఫారీ గైడ్లు, హోటల్ కారి్మకులు, రవాణా నిర్వాహకులు, హస్తకళల విక్రేతలు, మసాయి వర్గాల వంటి వేలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తోంది. అయితే, ఈ పర్యాటకం, అభివృద్ధి వల్ల నష్టాలు కలుగుతున్నాయి. వలస మార్గాల సమీపంలో జరుగుతున్న నిర్మాణాలు, వాహనాల రద్దీ, మానవ కార్యకలాపాలు జంతువుల కదలికలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన వన్యప్రాణులపై ఇవి అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. జంతువులను వేటాడేందుకు సఫారీ వ్యాన్లు వాటి చుట్టూ గుమిగూడటం తరచుగా వాటిని భయపెడుతోంది. వాహనాల మార్గాలు జంతువుల దారులను వెంబడించడంతో సహజ ప్రక్రియలకు అంతరాయం కలుగుతోంది. మౌలిక సదుపాయాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అభయారణ్యంలో కాలుష్యం పెరుగుతోంది. కీలకమైన వలస మార్గాల్లో విలాసవంతమైన హోటళ్లను నిర్మిస్తున్నారు. ఇవి నీటి వనరులను అడ్డుకుంటున్నాయి. కొత్తగా నిర్మించిన విలాసవంతమైన శిబిరాల్లో ఒకటి ‘గ్రేట్ మైగ్రేషన్’ మార్గానికి అడ్డుగా మారింది. సింహాలు, దున్నలు, హిరోలా జింకలు, వైల్డ్బీస్ట్లతో సహా అనేక జాతుల జనాభా తీవ్రంగా పడిపోయింది. ప్రతి సీజన్లో ఆ ప్రాంతం గుండా ప్రయాణించే లక్షలాది వైల్డ్బీస్ట్లకు ఇది ఒక కీలకమైన ప్రదేశం. ఇటీవలి సంవత్సరాల్లో వాటి సంఖ్య 150,000 నుంచి కేవలం 15,000కి పడిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రిజర్వ్లోని సున్నితమైన ప్రాంతాలలో కొత్త పర్యాటక వసతులపై 2023లో నిషేధం విధించినప్పటికీ, కొత్త శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సౌకర్యాలు విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. న్యాయ పోరాటం అభయారణ్యం లోపల, చుట్టుపక్కల పర్యాటక శిబిరాల నిర్మాణం, విస్తరణను సవాలు చేస్తూ పరిరక్షణ బృందాలు కోర్టుకెక్కాయి. ఈస్ట్ ఆఫ్రికా లా సొసైటీ, నేచురల్ జస్టిస్, జస్ట్యాక్ట్, ఆఫ్రికా సెంటర్ ఫర్ పీస్ అండ్ హ్యూమన్ రైట్స్ తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు మసాయి మారా నేషనల్ రిజర్వ్లో నిర్మాణాలు, విస్తరణను నిలిపివేయాలని కోరుతున్నాయి. పలు బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ నిర్మాణం, నిర్వహణను సవాలు చేశాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసం కొనసాగితే మారా పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం వాటిల్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?
పంట పొలాల్లో కనిపించే పాములు మనకు ప్రాణాంతక శత్రువుల్లాగే కనిపిస్తాయి. కానీ, అవగాహనతో చూస్తే.. నిజానికి అవి ఉచితంగా పంటలను కాపాడేందుకు ప్రకృతి ప్రసాదించిన రైతు మిత్రులేనని అర్థమవుతుంది. దేశంలో ఏటా 15–20 శాతం ధాన్యం ఉత్పత్తి ఎలుకలు, పందికొక్కుల వల్ల నాశనమవుతోందని అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఒక జత ఎలుకలు ఒక ఏడాది వ్యవధిలో 800 నుంచి 1,000 వరకు సంతతిని పెంచగలవు. వీటిని అరికట్టటానికి విష రసాయనాలను రైతులు వాడుతుంటారు. అవి నేల సారాన్ని పాడుచేయటమే కాకుండా, ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నా యని నిపుణులు చెబుతున్నారు. 80% పాములతో ప్రమాదం లేదుమన దేశంలోని పొలాల్లో కనిపించే పాముల్లో 80 శాతానికి పైగా (జెర్రిపోతు వంటివి) అసలు విషం లేనివే. ఒక నాగు పాము లేదా జెర్రిపోతు తన జీవితకాలంలో వేలాది ఎలుకలను వేటాడి తింటుంది. అయితే, ఈ విషయంపై అవగాహన లోపి స్తోంది. 20% విషపూ రిత పాముల భయంతో.. కనిపించిన పామునల్లా చంపటం వల్ల పొలాల్లో ఎలుకల జనాభా విపరీతంగా పెరిగి రైతులకు రెట్టింపు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.పాముల నుంచి రక్షణ ఎలా?పాము కాట్ల వల్ల గత పాతికేళ్లలో మన దేశంలో లక్షా ఇరవై వేల మంది చనిపోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది ఈ కారణంతో చనిపోవటం లేదు. పొలాల్లో రాత్రివేళల్లో టార్చ్లైట్ ఉపయోగించటం, లాంగ్ గమ్ బూట్లు ధరించటం వంటి చర్యల ద్వారా 90% వరకు పాము కాటు ప్రమాదా లను అడ్డుకోవచ్చని అధ్యయనాలు చెబుతు న్నాయి. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన పాములను పారదోలే ఎలక్ట్రానిక్ చేతి కర్రలు వంటి ఆధునిక పరికరాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని రైతులకు అందుబాటు లోకి తేవటానికి ప్రభుత్వం చర్యలు తీసుకో వాలి. అంతేకాదు, పాము కాటు బాధితుల ప్రాణరక్షణ కోసం గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవెనమ్ను అందుబాటులో ఉంచాలి. పాముల సమస్యపై గ్రామీణులు, రైతులకు అవగాహన కల్పించటంపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
కలర్ఫుల్ పక్షులకే కష్టాలు!
ప్రకృతి ఒడిలో తిరిగే రంగురంగుల పక్షుల అందమే ఇప్పుడు వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రంగుల పక్షులతో పోలిస్తే.. ప్రకాశవంతమైన, ఆకర్షణీ యమైన రంగుల్లో కనిపించే పక్షులకే అంతరించి పోయే ముప్పు ఎక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు మాంటెగ్యూ నీట్ క్లెగ్, నటాలియా ఒకాంపొ–పెన్యులా వియత్నాంలో పక్షులను పరిశీలించే యాత్ర ద్వారా కొన్ని రంగు రంగుల పక్షులు తీవ్ర ప్రమా దంలో ఉన్నాయని, వ్యాపార వర్గాల్లో వాటికే అధిక గిరాకీ ఉందని గ్రహించారు. అనంతరం అంతర్జాతీయంగా పరిస్థితే మిటో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దగ్గర ఉన్న రెడ్ లిస్ట్లోని సుమారు 4,334 పాసరీన్ (పాటలు పాడే) కోవకు చెందిన పక్షి జాతుల స్థితిగతులను విశ్లేషించారు. పిచ్చుకలు, బుల్బుల్ వంటి పక్షులు కూడా వాటిలో ఉన్నాయి. వారి సందేహం నిజమేనని అధ్యయనంలో తేలింది. అక్రమ రవాణా దెబ్బరంగురంగుల ఈకలున్న పక్షులకు ముప్పు పెరగ డానికి ప్రధాన కారణం మానవ ప్రలోభాలు, పెంపుడు పక్షుల అక్రమ రవాణా వ్యాపారమేనని పరిశో ధకులు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన రంగురంగుల పక్షులను ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ పక్షులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని.. దీంతో వేటగాళ్లు అడవుల నుంచి ఆకర్షణీయమైన పక్షులను పట్టుకొని అక్రమ రవాణా చేయడం వల్ల అడవుల్లో వాటి సంఖ్య వేగంగా పడిపోతోందని పరిశోధకులు పేర్కొన్నారు.ప్రత్యేకతలే శాపం..అడవుల నరికివేతతో పక్షుల సహజ నివాస ప్రాంతాలు వేగంగా దెబ్బతింటున్నాయి. సాధా రణ పక్షులు విభిన్న వాతావ రణాలకు సులువుగా అల వాటుపడగలవు. కానీ విభిన్న రంగులు, ప్రత్యేక ఆహార అలవాట్లుగల రంగురంగుల పక్షులు నిర్దిష్ట మైన పర్యావరణ వ్యవస్థలపైనే ఆధారపడి జీవి స్తాయి. అటువంటి నివాస ప్రాంతాలు ధ్వంసం కావడం వాటి ఉనికికే ప్రమాదకరంగా మారిందని పరిశోధకులు గుర్తించారు. చెట్ల జాతుల విత్తనాల వ్యాప్తికి, పూల పుప్పొడి రేణువుల చేరవేతకు, పర్యా వరణ సమతుల్యతకు పక్షులు దోహదపడతాయి. ఇవి అంతరించిపోతే పర్యావరణం దెబ్బతింటుంది. పక్షుల అక్రమ రవాణాను కఠిన చట్టాలతో అరి కట్టాలి. అరుదైన రంగుల పక్షులు నివసించే అటవీ ప్రాంతాలను పరిరక్షించే ప్రత్యేక ప్రణాళికలను ప్రపంచ దేశాలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
నిజాయితీకో పరీక్ష..
రోడ్డుపై వంద రూపాయల కాగితం కనిపిస్తే ఏం చేస్తారు? నోటు మీదా అని అడుగుతారు కొందరు... జేబులో పెట్టేసుకునేవారు ఇంకొందరు.. దేవుడి హుండీలో వేసేవాళ్లు మరికొందరు.. కొందరిది నిజాయితీ, ఇంకొందరిది ఆశ, మరికొందరిది.. పాపభీతి! రూ.వంద స్థానంలో బంగారు గొలుసు ఉంటే...? నార్వేలోనైతే యజమానికి తిరిగి అప్పగించే ప్రయత్నం చేస్తారట. మెక్సికో, పెరూల్లోనైతే పది రూపాయల కాగితమున్నా.. నొక్కేస్తారట. ఈ ఏడాది మొదట్లో... జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి కొంతమంది పరిశోధకులు ఖాళీ పర్సులు, కొంత నగదు, తాళం చెవులతో బయలుదేరాడు. ఎందుకు ఇవన్నీ అని అధికారులు అడిగితే సైన్స్ ప్రయోగం అని వివరించారు. వీరంతా... 40 దేశాల్లోని 355 నగరాలకు వెళ్లి... ఎవరూ చూడకుండా అక్కడక్కడ ఒక్కో పర్సు పడేశారు. ప్రతిదాంట్లో షాపింగ్ లిస్ట్, కొంత నగదు, తాళం చెవి, బిజినెస్ కార్డులు ఉన్నాయి. ఎన్ని తిరిగి యజమానుల (బిజినెస్ కార్డు)కు తిరిగి వస్తాయో చూద్దామని, వాటిద్వారా ఏ దేశం ఎంత నిజాయితీ కలదో అంచనా వేద్దామన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం. రోడ్డుపై పడ్డ పర్సులను ప్రజలు తిరిగి ఇస్తారా? పర్సులో డబ్బు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? వంటివన్నీ పరిశీలించాలని అనుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా తెలిసిందేమిటీ అంటే... ప్రపంచం మొత్తమ్మీద అత్యంత నిజాయితీగల దేశం స్విట్జర్లాండ్ అని!. పడేసిన ప్రతి నాలుగు పర్సుల్లో కనీసం మూడు సొంతదారులకు చేరాయి. కచ్చితంగా చెప్పాలంటే 76 శాతం పర్సులు రిటర్న్ అయ్యాయి. నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, పోలండ్, చెక్ రిపబ్లిక్, న్యూజీల్యాండ్, జర్మనీ, ఫ్రాన్స్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాల్లో బ్యాంకులు, పోలీస్ స్టేషన్లలో పడేసుకున్న పర్సులు కూడా ఎంచక్కా యజమానులకు చేరాయి. ‘‘మొరాకో, పెరూ, చైనాల్లో చాలా తక్కువ మంది రిటర్న్ చేశారు’’అని ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ సి.రఫ్ (జ్యూరిచ్ యూనివర్శిటీ) తెలిపారు. నగదు ఎక్కువైతే... ఈ ప్రయోగంలో ఆశ్చర్యకరమైన ఫలితం ఏమిటంటే... పర్సుల్లో నగదు ఎంత ఎక్కువైతే.. తిరిగి ఇచ్చేసే వారి శాతం కూడా అంతేస్థాయిలో పెరగడం. దాదాపు 38 దేశాల్లో వంద డాలర్ల వరకూ నగదు ఉన్న పర్సులు ఎక్కువగా (72 శాతం) తిరిగి వస్తే తక్కువ పదిహేను డాలర్ల వరకూ డబ్బున్నవి సగమే వెనక్కు వచ్చాయి. మెక్సికో, పెరూ దేశాలు మాత్రం ఈ ట్రెండ్కు భిన్నంగా నడుచుకున్నట్లు తేలింది. అగ్రరాజ్యం అమెరికా, యూకేల్లో పర్సుల్లోని డబ్బుతో సంబంధం లేకుండా కొంచెం అటు ఇటుగా సగం మాత్రమే రిటర్న్ వచ్చినట్లు గుర్తించారు. ఫలితంగా ఈ రెండు దేశాలు 21, 22 స్థానాల్లో నిలిచాయి. బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, పడేసిన పర్సుల్లో కూడా అత్యధికం యజమానుల చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ముజ్యియంలలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి అప్పగించడంపై వీటిల్లో ఏర్పాట్లు ఏమీ లేకపోవడం కారణం కావచ్చునని అంచనా. ఇన్ని చెప్పుకున్న తరువాత.. అతితక్కువ నిజాయితీగల దేశాల గురించి కూడా తెలుసుకోవాలి కదా... ఈ ప్రయోగంలో చిట్టచివర నిలిచిన దేశం పెరు. దానికి ఎగువన చైనా, మొరాకోలు ఉన్నాయి. పెరులూ ఐదింటిలో ఒక పర్సు మాత్రమే రిటర్న్ అయితే మొరాకో, చైనాలో పరిస్థితి మరి కాస్త నాలుగింటిలో ఒకటిగా గుర్తించారు. ఈ ప్రవర్తనకు కారణాలు? ఈ రకమైన ఫలితాలు శాస్త్రవేత్తలు ఊహించకపోయినా రెండు ప్రధాన కారణాలనైతే గుర్తించారు. మొదటిది ఇతరులకు సహాయం చేయాలనే కోరిక. రెండోది... నగదు ఎక్కువగా ఉన్న పర్సులను వెనక్కు ఇవ్వకపోతే తమను దొంగలు అనుకుంటారనే భయం. స్వార్థం, నిజాయితీల మధ్య సంఘర్షణను ఎదుర్కొంటున్నప్పుడు, మనిషి తమను తాము దొంగలుగా చూసుకోవడానికి ఇష్టపడరు,‘ అని పరిశోధన బృందం వివరించింది. మొత్తమ్మీద చూస్తే మనిషి మరీ అంత నిజాయితీ లేని వాడేమీ కాదని ఈ ప్రయోగం చెబుతోందన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక్రిశాట్కు క్రిస్పర్ కాస్9 సాంకేతికత!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చిన్న, సన్నకారు రైతుల ఆహార భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త జన్యు సవరణ వంగడాల రూపకల్పన దిశగా హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) పరిజ్ఞానమైన ‘క్రిస్పర్ కాస్9’ను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించుకునేందుకు అమెరికా కంపెనీల నుంచి ఇక్రిశాట్ తాజాగా హక్కులు పొందింది. క్రిస్పర్ కాస్9 సాంకేతికతపై ప్రధాన పేటెంట్లు అమెరికా సంస్థలకు ఉన్నాయి.మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనల స్థాయిలో ప్రయోగశాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దాని ఆధారంగా రూపొందించిన జన్యుమార్పిడి విత్తనాలను వాణిజ్యపరంగా రైతుల వద్దకు తీసుకెళ్లటానికి అత్యధిక లైసెన్సింగ్ రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో క్రిస్పర్ కాస్9 జన్యుసవరణ సాంకేతికత సొంతదారులైన అమెరికా సంస్థలు కోర్టేవా అగ్రిసై¯Œన్స్, బ్రాడ్ ఇ¯న్స్టిట్యూట్లు మానవతా దృక్పథంతో ఇక్రిశాట్కు ఉచితంగా దీర్ఘకాలిక లైసెన్స్ ఇవ్వటం విశేషం. తద్వారా ఎలాంటి పేటెంట్ వివాదాలు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో ఇక్రిశాట్ పరిశోధనలు పూర్తి చేసేందుకు, లైసెన్సింగ్ రుసుము నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఇదో మైలురాయి: ఇక్రిశాట్ డీజీ: ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చేసే పంటల విత్తనాలపై పేటెంట్ భారం ఉండదు కా బట్టి, ఆసియా, ఆఫ్రికాలోని పేద రైతులకు వాతావరణ మార్పు ల వల్ల సంభవించే అనావృష్టి, తీవ్రమైన కరువు, కొత్త రకం తెగుళ్లను తట్టుకునే కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాలకు సంబంధించి సరికొత్త జన్యుసవరణ విత్తనాలు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి.‘ఈ ఒప్పందం ఇక్రిశాట్కు, మెట్ట వ్యవసాయంపై ఆధారపడిన లక్షలాది మంది చిన్న రైతులకు, వారి కుటుంబాలకు ఒక పరివర్తనాత్మక మానవతా మైలురాయి’ అని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. కాగా సాధారణ సాంప్రదాయ పద్ధతిలో వాతావరణ మార్పుల ను తట్టుకునే కొత్త పంట రకాన్ని తయారు చేయటానికి 10–15 ఏళ్లు పడుతుందని, ఈ ఒప్పందం ద్వారా క్రిస్పర్ కాస్9ను నేరుగా వాడటం వల్ల 3–5 సంవత్సరాల్లోనే కొత్త వంగడాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
పర్సులో ప్లాస్టిక్ పవర్
స్మార్ట్ఫోన్ కొనాలన్నా, విమానం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, అభిమాన హీరో సినిమా మొదటి ఆట టికెట్ కొనాలన్నా, ఇష్టమైన గాయకుడి కచేరీకి వెళ్లాలనుకున్నా.. ఒకప్పుడు ధర చూసి నిర్ణయం తీసుకునే వినియోగదారుడు ఇప్పుడు ఏ కార్డు వాడితే ఎక్కువ క్యాష్బ్యాక్ వస్తుంది?, ఏ కార్డుతో కొంటే ముందుగా టికెట్ దొరుకుతుంది? ఏ బ్యాంక్ ఆఫర్ బెస్ట్? అని లెక్కవేస్తున్నాడు. క్రెడిట్ కార్డులు ఒకప్పటిలా కేవలం బిల్లు చెల్లింపు సాధనాలుగా కాకుండా కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన మార్కెటింగ్ ఆయుధాలుగా మారాయి. డిజిటల్ చెల్లింపుల ప్రపంచాన్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు బిల్లులు చెల్లించే సాధనంగా చివర్లో బయటకు వచ్చే క్రెడిట్ కార్డు... ఇప్పుడు వినియోగదారుడి కొనుగోలు నిర్ణయాలను శాసించే ‘ప్లేయింగ్ కార్డ్’గా మారి కొనడానికి ముందే ప్రభావితం చేస్తోంది. ధర కంటే ఆఫర్, అవసరం కంటే రివార్డు ముఖ్యమవుతున్న ఈ కొత్త వినియోగ సంస్కృతి, ప్లాస్టిక్ కార్డు పవర్ రిటైల్ మార్కెట్ను కొత్త దిశలో నడిపిస్తున్న ట్రెండ్పై వెల్త్ స్టోరీ దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణతో పాటు క్రెడిట్ కార్డుల పాత్ర కూడా వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కొనుగోలు పూర్తయ్యాక ఉపయోగించే క్రెడిట్ కార్డు కొనుగోలు ప్రక్రియ ప్రారంభంలోనే కస్టమర్ను ప్రభావితం చేస్తోంది. ఈకామర్స్, ట్రావెల్, ఎల్రక్టానిక్స్, వినోద రంగాల్లో ప్రత్యేక క్రెడిట్ కార్డుల ఆఫర్లు కొనుగోలు నిర్ణయాలను మలుపు తిప్పుతున్నాయి. ఏ వస్తువు కొనాలి అన్న ప్రశ్నతో పాటు ఏ కార్డుతో కొనాలి అనే ప్రశ్న కూడా ఇప్పుడు కస్టమర్ ముందుంటోంది. రూపే కార్డు యూపీఐ అనుసంధానంతో కిరాణా దుకాణం నుంచి ఫుడ్ డెలివరీ వరకు చిన్న చిన్న మొత్తాలకు కూడా క్రెడిట్ కార్డులు వినియోగంలోకి వస్తున్నాయి. యువతరం ఆసక్తితో క్రెడిట్ కార్డుల ఆదరణ మరింత పెరుగుతోంది. ఉద్యోగం వచ్చిన వెంటనే తొలి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారిసంఖ్య గణనీయంగా పెరిగింది. ఖర్చుల నిర్వహణ, క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ముఖ్యంగా రివార్డు పాయింట్లు కోసం యువత కార్డులను ఎక్కువగా ఎంచుకుంటోంది. దీంతో క్రెడిట్ కార్డు వ్యాపారంలో పోటీకూడా తీవ్రమవుతోంది. వినియోగదారులు ఇప్పుడు ఒకే కార్డుకు పరిమితం కావడం లేదు. ప్రయాణాలకు ఒకటి, షాపింగ్కు మరొకటి, రోజువారీ ఖర్చులకు ఇంకొకటి అంటూ దాదాపు మూడు నుంచి ఐదు కార్డులను వాడుతున్నారు. దీంతో బ్యాంకులు కస్టమర్ లాయల్టీ (విధేయత) నిలబెట్టుకునేందుకు రకరకాల ఆఫర్లతో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో కో బ్రాండెడ్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్ పరిశోధన సంస్థల అంచనా ప్రకారం భారత క్రెడిట్ కార్డు మార్కెట్ విలువ 2025లో 20.1 బిలియన్ డాలర్లు కాగా 2034 నాటికి 38.3 బిలియన్ డాలర్లకు పెరగనుంది. కొనుగోలుకు ముందే కార్డుల ప్రభావం గతంలో క్రెడిట్ కార్డుల ప్రధాన అవసరం, ఆకర్షణ షాపింగ్ బిల్లులు చెల్లించడం, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ ఇంకా కొన్ని డిస్కౌంట్ ఆఫర్లకే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. షాపింగ్కు ముందే వస్తువును ఏ కార్డుతో కొనాలి అనేది వినియోగదారుల నిర్ణయంలో కీలకంగా మారింది. ఫలితంగా ప్రతి కొనుగోలు ఒక చిన్న ఆర్థిక లెక్కగా మారుతోంది. సినిమాలు, లైవ్ ఈవెంట్లు, కచేరీలు, నాటికలు, నృత్య ప్రదర్శనలు, కొత్త గాడ్జెట్ల విడుదల, ఈకామర్స్ పండగ సేల్స్ సమయంలో క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన కార్డు ఉంటే ముందుగానే టికెట్ దొరుకుతుంది. అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్బ్యాక్ లభిస్తుంది. దీంతో కార్డునుబట్టి అది అందించే ప్రయోజనాలను బట్టి వినియోగదారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికోసం ఒకటికి మించి కార్డులను వాడుతున్నారు. ఆఫర్లే అసలు ఆయుధం క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు, ఈఎంఐ సదుపాయాలు, ప్రత్యేక సేల్స్ యాక్సెస్లు ఇప్పుడు బ్యాంకుల ప్రధాన పోటీ ఆయుధాలుగా మారాయి. పండుగ సీజన్లలో ఈకామర్స్ లావాదేవీల్లో ప్రత్యేక కోబ్రాండెడ్ కార్డుల ఆఫర్లతో బిజినెస్ బాగా జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో కో బ్రాండెడ్ కార్డులు కేవలం చెల్లింపు సాధనాలుగా కాకుండా వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనను నిర్దేశిస్తున్నాయి. క్రెడిట్ కార్డుల ప్రయాణంలో యూపీఐ అనుసంధానం కీలక మలుపుగా మారింది. రూపే క్రెడిట్ కార్డులతో చిన్న చిన్న మొత్తాలకు కూడా కార్డు వాడే అలవాటు పెరిగింది. కిరాణా, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సేవలు ఇలా రోజువారీ ప్రతి ఖర్చులోనూ క్రెడిట్ కార్డులు ప్రవేశించాయి. ఇది వినియోగ ఫ్రీక్వెన్సీని పెంచడమే కాకుండా క్రెడిట్ కార్డు వాడకాన్ని అప్పు చేయడం అనే భావన నుంచి ఖర్చు చేసే సాధనంగా భావించేలా చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.ఎక్కువ కార్డులు.. ఎక్కువ ప్రమాదం ఒకప్పుడు ఒక కుటుంబానికి ఒకటి, లేదా రెండు కార్డులు ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు మూడు నుంచి ఐదు కార్డులు వాడుతున్నారు. ప్రయాణాలకు ఒకటి, షాపింగ్కు ఒకటి, రివార్డులకు మరొకటి ఉపయోగిస్తున్నారు.దీంతో వినియోగదారుల లాయల్టీ ఒక బ్యాంకు, ఒక కార్డు కాకుండా కొనుగోలు సమయంలో అత్యుత్తమ ప్రయోజనం ఇచ్చే కార్డు వైపు మారిపోతోంది. ఈ సౌలభ్యం వెనక కొన్ని కనబడని ప్రమాదాలు దాగున్నాయి. ఎక్కువ క్యాష్బ్యాక్లు, ప్రత్యేక ఆఫర్లు, సులభతరమైన క్రెడిట్ కారణంగా అవసరం లేని కొనుగోళ్లు పెరుగుతాయి. చిన్న చిన్న బకాయిలైనా ఎక్కువ కార్డుల వాడకం వల్ల నెలవారీ బిల్లు కట్టే సమయంలో పెద్ద భారంగా మారతాయి. రుణం సులభంగా లభించినా క్రెడిట్ కార్డులపై బ్యాంకులు 30 శాతానికి పైగా వడ్డీ గుంజుతాయి.ఆదాయానికి, చేసే ఖర్చుకి పొంతనలేక యువతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న విషయాన్ని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రుణ వినియోగం అమెరికాలో 2008 నాటి లేమాన్ బ్రదర్స్ సంక్షోభాన్ని ఎలా సృష్టించిందో తెలుసుకోవాలని చెబుతున్నారు. జెన్ జెడ్ చేతిలో కార్డు శక్తి→ అమెజాన్–పేకెర్నీ ఇండియా నివేదిక ప్రకారం యువతలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. → 65% మంది యువ తరం ఉద్యోగంలో చేరిన వెంటనే తొలి క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు → 32% మంది ఖర్చుల నిర్వహణ కోసం కార్డులు వాడుతున్నారు → 30% మంది క్యాష్బ్యాక్లు, రివార్డుల కోసం ఎంచుకుంటున్నారు → 23% మంది క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు కార్డులు ఉపయోగిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా క్రెడిట్ కార్డుల వినియోగం పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. – సాక్షి, వెల్త్ డెస్క్ -
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్ఫామ్స్లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై పీబీ ఫిన్టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్ఫామ్పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్కు పీబీ ఫిన్టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్లో కేవలం జాబ్ పోర్టల్గా మిగిలిపోకుండా రెజ్యుమ్లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్ఫామ్గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్లో కూడా ప్రాపర్టీ సెర్చ్లో ఏఐ హోమ్ అడ్వయిజర్ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్కు అడ్రస్గా నిలిచిన జస్ట్ డయల్కు అర్బన్కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్ఫామ్గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్ట్రేడ్కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్ఫామ్గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్పీరియన్స్లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్ప్లేస్లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు. పాలసీ బజార్ ఫిన్టెక్, ఆరమ్ ప్రాప్టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
మీ స్టీల్ బాటిల్ మంచిదేనా?
మన ఆరోగ్యం మనం తాగే నీటిపైనే కాకుండా, ఆ నీటిని నిల్వ ఉంచే పాత్రలపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్ సీసాల వల్ల శరీరంలోకి చేరే బిస్ఫెనాల్–ఎ (బీపీఏ), సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు (మైక్రోప్లాస్టిక్స్), అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాల (నానోప్లాస్టిక్స్) ముప్పు నుంచి తప్పించుకోవటానికి చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, మార్కెట్లో లభించే అన్ని స్టీల్ బాటిళ్లూ ఆరోగ్యానికి సురక్షితమైనవి కావు. ఏది ఉత్తమమైన స్టీల్? తాగునీటిని నిల్వ చేయడానికి దేశ విదేశాల్లో ‘304’, ‘316’స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్లను అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. 304 లేదా 18/8 గ్రేడ్ స్టీల్లో 18% క్రోమియం, 8% నికెల్ ఉంటాయి. ఇది తుప్పు పట్టదు. సహజమైన రుచి, వాసనను మార్చదు. 316 లేదా 18/10 గ్రేడ్ స్టీల్లో అదనంగా 2% నుంచి 3% ‘మాలిబ్డినం’అనే లోహం ఉంటుంది. దీనివల్ల బాటిల్కు తుప్పు నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ/బత్తాయి రసం, మజ్జిగ, డిటాక్స్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ వంటి ఆమ్ల గుణం ఉన్న పానీయాలను పోసుకోవటానికీ ఇది అత్యంత సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ స్టీల్తో ముప్పు నాసిరకం సాధారణ స్టీల్ బాటిళ్లు తాగు నీటిని పోసుకోవటానికి గానీ, పండ్ల రసాలకు గానీ పనికిరావు. తక్కువ ధరకు లభించే బాటిళ్ల తయారీలో 201/202 గ్రేడ్ స్టీల్ వాడతారు. తయారీ వ్యయం తగ్గించడానికి వీటిలో ఖరీదైన నికెల్ వాడకాన్ని తగ్గించి, 5.5%–7.5% వరకు ‘మాంగనీస్’ను కలుపుతారు. ఈ బాటిళ్లలో నీరు లేదా పండ్ల రసాలు పోసినప్పుడు మాంగనీస్ నీటిలో కరుగుతుంది. ఇది రోజూ శరీరంలోకి చేరితే కాలక్రమేణా కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బాటిళ్లకు తుప్పును తట్టుకునే శక్తి తక్కువ. కొద్దిరోజులకే లోపల ఎర్రటి తుప్పు మచ్చలు ఏర్పడి, నీటిలోకి లోహపు రుచి/వాసన వస్తుంది. నాణ్యతను గుర్తించేదెలా? » భారతీయ ప్రమాణాల ప్రకారం.. స్టీల్ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్ 17803:2022’, థర్మోస్/వ్యాక్యూమ్ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్ 17526:2021’నిబంధనలు పాటించాలి. ఐఎస్ఐ ముద్రనూ తప్పనిసరిగా బాటిల్పై ముద్రించాలి. » అమెరికా ఎఫ్డీఏ, యూరోపియన్ ఈఎఫ్ఎస్ఏ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. 304/316 గ్రేడ్ స్టీల్ బాటిల్స్ మాత్రమే సురక్షితమైనవి. మన దేశంలో కొత్త స్టీల్ బాటిల్ కొనేముందు దాని అడుగు భాగంలో లేదా ప్యాకింగ్ బాక్స్పై 304 లేదా 316తోపాటు ఐఎస్ఐ మార్కు ఉందో లేదో చూసుకోవాలి. » సాధారణ 201 లేదా 202 గ్రేడ్ స్టీల్ బాటిళ్ల అడుగున లేదా బాక్స్పై ఈ అంకెలను రాయొచ్చు లేక రాయకపోవచ్చు. మనమే గమనించుకోవాలి. – (సాక్షి, స్పెషల్ డెస్క్) -
బీజేపీకి గుడ్బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్జీ నిరసనల ఎఫెక్ట్తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
జనరిక్స్కు గుడ్బై.. స్పెషాలిటీ డ్రగ్స్కు వెల్కమ్
భారత ఔషధ పరిశ్రమలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు తక్కువ ధరల జనరిక్ మందులతో ప్రపంచమార్కెట్లో ఆధిపత్యం చాటిన భారత ఫార్మా కంపెనీలు ఇప్పుడు అధిక విలువ కలిగిన స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మందులు, ఇతర బ్రాండెడ్ వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరల పోటీ, మార్జిన్ల తగ్గుదలతో కంపెనీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఫార్మా సంస్థలైన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, సిప్లా, లుపిన్ కంపెనీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఫార్మా రంగంలో వస్తున్న ఈ మార్పును తెలియజేస్తున్నాయి. సంప్రదాయ జనరిక్స్ బదులుగా లాభాలు అందించే ప్రత్యేక ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, వినూత్న చికిత్సలపై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఈ మార్పులో సన్ ఫార్మా ఇతర కంపెనీలకన్నా ముందంజలో ఉంది. కంపెనీ గ్లోబల్ ఇన్నొవేటివ్ మెడిసిన్స్ వ్యాపారం 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో 22 శాతానికిపైగా స్పెషాలిటీ మందుల నుంచి వస్తోంది. రుమేనియా, బ్రెజిల్, చైనా మార్కెట్లలో ఇలుమ్యా వంటి వినూత్న ఔషధాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ కూడా బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్, ఇంకా అనేక విభిన్న ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక వార్షిక ఆదాయాన్ని రెడ్డీస్ నమోదు చేసింది. ప్రాథమిక వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఎఫ్ఓ ఎం.వి. నరసింహం తెలిపారు. మరోవైపు సిప్లా తన ఆఫ్రికా వ్యాపారం, శ్వాసకోశ చికిత్సలు, బ్రాండెడ్ ప్రి్రస్కిప్షన్ ఔషధాల ద్వారా బలమైన వృద్ధిని సాధిస్తోంది. కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ వ్యాపారం 400 మిలియన్ డాలర్లకు పైగా నమోదు చేసింది. బయోసిమిలర్స్ను భవిష్యత్తులో భారీ అవకాశాలున్న విభాగంగా కంపెనీ భావిస్తోంది. లుపిన్ కూడా అమెరికా వెలుపల మార్కెట్లు, బ్రెజిల్ వంటి దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ బ్రెజిల్ వ్యాపారం స్థానిక కరెన్సీలో 113 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 60కి పైగా ఇంజెక్టబుల్స్, శ్వాసకోశ ఉత్పత్తుల అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వచ్చే ఏడాదిలోగా అమెరికా మార్కెట్లో తొలి బయో సిమిలర్ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాలో మార్పులు ఇలా కొనసాగుతుండగా దేశీయ ఔషధ మార్కెట్ కూడా బలపడుతోంది. ఈక్విరస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం 2026 మే నాటికి భారత ఫార్మా మార్కెట్ 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 3.2 శాతం నేరుగా జరిగిన అమ్మకాల నుంచే రావడం గమనార్హం. ఇది నిజమైన వినియోగ డిమాండ్ను సూచిస్తోందని ఈక్విరస్ తెలిపింది. భారత ఫార్మారంగం జనరిక్స్ తయారీ కేంద్రం అనే గుర్తింపును దాటి పరిశోధన ఆధారిత అధిక విలువ కలిగిన ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదిగే దిశగా ప్రయాణంప్రారంభించింది. వచ్చే రోజుల్లో స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, కొత్త మార్కెట్లే భారత ఫార్మా వృద్ధికి ప్రధాన ఇంధనంగా మారనున్నాయి. స్పెషాలిటీ మందులు అంటే? సాధారణ జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు మందులు అన్ని మెడికల్ షాపుల్లో సులభంగా లభిస్తాయి. వీటి తయారీ కూడా సులభం, అలా కాకుండా క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మలి్టపుల్ స్లెరోసిస్, సోరియాసిస్, హెపటైటిస్, హెచ్ఐవీ వంటి క్లిష్టమైన దీర్ఘకాలిక వ్యాధుల కోసం తయారుచేసే అత్యాధునిక అధిక ధర ఔషధాలు. వీటి తయారీ, పరిశోధనకి చాలా ఖర్చు అవుతుంది. ఇవి ప్రత్యేక ఆసుపత్రులు, ఫార్మసీల ద్వారానే లభిస్తాయి. సాధారణ మందులతో పోలిస్తే ధరలు ఎక్కువ. చాలావరకు ఇంజెక్షన్, ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తారు. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఈ మందుల అమ్మకాలపై లాభాల మార్జిన్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. జనరిక్స్ మార్కెట్లో పోటీ పెరగడంతో ఫార్మా కంపెనీలకు స్పెషాలిటీ డ్రగ్స్ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా మారుతున్నాయి. పేటెంట్ ఆధారిత ఉత్పత్తులు కావడంతో పోటీ కూడా తక్కువగా ఉంటుంది.– సాక్షి, బిజినెస్డెస్క్ -
ప్రాణాలు కాపాడిన వాచ్
అవును! మీరు చదివింది నిజమే. ఆపిల్ వాచ్ అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అతని వాచ్లోని ‘ఫాల్ డిటెక్షన్’ఫీచర్ ఆటోమేటిక్గా పనిచేసి ఎమర్జెన్సీకి కాల్ చేసి అతనికి సరైన సమయంలో వైద్యం అందేలా చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.. ఒహాయోకు చెందిన మహమ్మద్ ఇస్లాం అనారోగ్యంగా అనిపించడంతో ఆఫీసులో సెలవు తీసుకుని ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెవి దగ్గర నొప్పి, నడవడం కూడా కష్టంగా అనిపించింది. అయినా, ఇంట్లో చెత్తను పడేయడానికి బయటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు.. స్పృహ వచ్చేసరికి విపరీతమైన చెమటలు. అతికష్టం మీద లేచి పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో అంబులెన్స్ సైరన్ శబ్దం. తాను కింద పడటాన్ని గుర్తించిన ఆపిల్ వాచ్ అత్యవసర సేవలకు కాల్ చేసిందని గ్రహించాడు. వెంటనే సిన్సినాటి విశ్వవిద్యాలయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిందని వైద్యులు గుర్తించారు. తాను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటున్నాడు. తన చేతి ఆపిల్ వాచ్లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేసిందో చెబుతున్నాడు. వాచ్ ఏం చేసింది? అతను గట్టిగా కింద పడటాన్ని వాచ్ గ్రహించింది. మణికట్టును తట్టి, అలారం మోగించి, ‘ఆర్ యూ ఓకే’అని అడుగుతూ ఒక హెచ్చరికను ప్రదర్శిస్తుంది. వాచ్ ధరించిన వ్యక్తి కదులుతూ ఉంటే, స్పందించే వరకు వేచి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి సుమారు ఒక నిమిషం పాటు కదలకుండా ఉన్నారని గుర్తిస్తే, 30–సెకన్ల కౌంట్డౌన్తో మణికట్టును తడుతూ క్రమంగా, బిగ్గరగా హెచ్చరికను మోగిస్తుంది. కౌంట్డౌన్ ముగిసినా ఎలాంటి స్పందన రాకపోతే, వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. ఖచ్చితమైన లొకేషన్ను కూడా షేర్ చేస్తుంది. వ్యక్తి కింద పడిపోయాడని గుర్తించినట్లు అత్యవసర కాంటాక్ట్లకు సందేశం పంపుతుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. 18 నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సున్నవారైతే మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు. మహమ్మద్ ఇస్లాం విషయంలోనూ ఇదే జరిగింది. ఫోన్ ఎమర్జెన్సీకి కాల్ చేసింది. ఈ లోపు అతనికి స్పృహ రావడం ఇంకా మంచిదైంది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
టీనేజ్ పిల్లల్లో పాప్కార్న్ బ్రెయిన్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్లో చాట్ చేస్తూ, గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయిపోయింది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఎం.లెవీ దీనినే ’పాప్కార్న్ బ్రెయిన్’ అన్నారు. డిజిటల్ మల్టీటాస్కింగ్కు అలవాటు పడి, పాప్కార్న్లాగా ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా దూకడం, నిజ జీవితంలోని నెమ్మదైన పనులపై ఏకాగ్రత కోల్పోవడాన్ని ఇది సూచిస్తుంది. దీనిని మానసిక సమస్య అని నిర్ధారించలేదు. కానీ ఆందోళన పడాల్సిన మానసిక స్థితి అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.పాప్కార్న్ బ్రెయిన్ లక్షణాలు⇒ ఒకే పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేకపోవడం, ఒక విషయం మీద ఆసక్తి, శ్రద్ధ వెంట వెంటనే మారిపోవడం ళీ నిమిష నిమిషానికి నోటిఫికేషన్లు, కొత్త డిజిటల్ కంటెంట్ కోసం పరితపించడం ⇒ సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వైఫల్యం. పెద్దల సూచనలను పాటించడంలో మైండ్ను వెంటనే కనెక్ట్ చేసుకోలేక ఇబ్బంది పడటం. ఒక్కమాటలో చెప్పాలంటే పరధ్యానం. ళీ నిద్ర లేమి, ఆందోళన చెందడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడంతల్లిదండ్రులు ఏం చేయాలి?⇒ రోజూ కొంత సమయం స్క్రీన్లు లేకుండా ప్రశాంతంగా, వర్తమానంలో గడపడం వల్ల మెదడు తిరిగి ఏకాగ్రతను పుంజుకుంటుంది. ⇒ స్క్రీన్ వినోదానికి కేటాయించినంత సమయాన్ని శారీరక శ్రమకు, ఇతర హాబీలకూ కేటాయించాలి. పిల్లల చదువు పూర్తయిన తర్వాత మిగిలిన సమయానికి తగినట్లు టైంటేబుల్ ఇవ్వాలి. ⇒ పిల్లలకు నిరంతరం ఏదో ఒక డిజిటల్ స్టిమ్యులేషన్ అవసరం లేదు. ఖాళీగా ఉండటం వల్ల వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనల రెక్కలు విచ్చుకుంటాయి. సహనం పెరుగుతుంది.⇒ వర్చువల్ ప్రపంచం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా ముఖాముఖి గడిపేలా ప్రోత్సహించాలి. ⇒ ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటి హాబీలను ప్రోత్సహించాలి. చదివిన విషయాన్ని ఇంట్లో వాళ్లతో చర్చించే వాతావరణం కల్పించాలి. తల్లిదండ్రులతో కలిసి వాకింగ్ చేయడం అలవర్చాలి. పజిల్ పూరించడం, డ్రాయింగ్ లేదా క్రాఫ్ట్ వంటి హాబీలతో చిన్న చిన్న ప్రాజెక్టు చేసేవిధంగా ప్రోత్సహించాలి. పిల్లలపై ప్రభావం మెదడు అభివృద్ధి చెందే కీలక దశలో డిజిటల్ పరధ్యానం వారిలో కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అధ్యయనాల ప్రకారం, మితిమీరిన ఇంటర్నెట్ వాడకం పిల్లల్లో వాచిక మేధస్సు తగ్గడానికి కారణమవుతోంది. అలాగే, నిజ జీవిత సామాజిక నైపుణ్యాలు లోపించి, చిన్న సమస్యలకే వారు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. -
బాస్కే బాస్ ఎవరు?
అడవిలో పులి అడుగుపెడితేనే చాలా జంతువులు అప్రమత్తమవుతాయి. నిశ్శబ్దంగా కదులుతూ.. క్షణాల్లో వేటను ముగించే సామర్థ్యం దాని సొంతం. బలమైన పంజా, పదునైన గోర్లు, శక్తివంతమైన దవడలతో పులి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ అడవిలో అసలు నిజం వేరే ఉంది.. ఎంతటి శక్తివంతమైన జీవికైనా ప్రకృతిలో ఒక సవాల్ తప్పదు. అడవికి బాస్గా పేరున్న పులి కూడా కొన్ని జంతువుల ముందు ఆచితూచి అడుగు వేయాల్సిందే.భారీ శరీరం, అపారమైన బలం, సమూహంగా కదిలే శక్తి, ఊహించని దూకుడు.. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న జీవులు పులికి కూడా ఎదురుదెబ్బ ఇవ్వగలవు. అవసరం లేని పోరాటాలకు పులి కూడా దూరంగా ఉంటుంది.. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం ప్రాణాలకే ముప్పు కావచ్చు. తన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ‘పెద్ద పిల్లి’కి సైతం కొన్ని జంతువులు గట్టి సవాల్గా నిలుస్తాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day, Global Tiger Day) సందర్భంగా.. పులిని కూడా వెనక్కి తగ్గించే ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం.అడవిలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఏనుగు ఒకటి. భారీ శరీరం, అపారమైన బలం, తెలివి కారణంగా ఏనుగులు చాలా జంతువులకు సవాల్ విసురుతాయి. సాధారణంగా పులులు పెద్ద ఏనుగులపై దాడి చేయవు. ముఖ్యంగా ఏనుగుల మందలోకి వెళ్లడం పులికి ప్రమాదకరం. చిన్న ఏనుగు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగినా.. తల్లి ఏనుగు, మొత్తం మంద కలిసి పులిని తరిమికొట్టగలవు. ఒక్కసారి ఏనుగు దాడి చేస్తే.. పులికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏనుగుల సమూహాన్ని చూసినప్పుడు పులి కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.పులికి అసలైన పరీక్ష ఇదే..పులికి ఇష్టమైన ఆహారాల్లో అడవి దున్న (గౌర్) ఒకటి. అయితే దాన్ని వేటాడటం అంత సులభమైన విషయం కాదు. భారీ శరీరం, బలమైన కాళ్లు, పదునైన కొమ్ములు అడవి దున్నకు ప్రధాన ఆయుధాలు. ఒక పెద్ద అడవి దున్న ఎదురుదాడికి దిగితే పులికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులులు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద అడవి దున్నలపై కాకుండా.. బలహీనంగా ఉన్నవి, ఒంటరిగా ఉన్నవాటిపై దృష్టి పెడతాయి.మొసలితో మామూలుగా ఉండదుభూమిపై పులి ఎంత శక్తివంతమైనదైనా.. నీటిలో పరిస్థితులు మారిపోతాయి. పెద్ద మొసళ్లు తమ పరిధిలో అత్యంత ప్రమాదకరమైనవి. నదులు, చెరువుల్లోకి దిగినప్పుడు పులి కూడా మొసలి దాడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో మొసలి బలం, దాని ఆకస్మిక దాడి పులికి ముప్పుగా మారుతుంది. అయితే పులులు కూడా మంచి ఈతగాళ్లే. అవసరమైతే నదులను దాటి వేట కొనసాగించగల సామర్థ్యం వాటికి ఉంటుంది.ఊహించని ప్రత్యర్థికొన్ని అడవి ప్రాంతాల్లో పులులు, ఎలుగుబంట్లు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ముఖ్యంగా స్లోత్ బేర్ (ఎలుగుబంటి) చాలా దూకుడుగా స్పందించే జంతువు. ఆహారం లేదంటే ప్రాంతం విషయంలో ఎదురుపడినప్పుడు ఎలుగుబంటి వెనక్కి తగ్గకపోవచ్చు. దాని బలమైన గోర్లు, దూకుడు స్వభావం కారణంగా పులి కూడా ఇలాంటి ఘర్షణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.మరి సింహం పులిని ఓడించగలదా?పులి, సింహం మధ్య ఎవరు బలమైనవారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. శారీరక బలం, ఒంటరి వేట విషయంలో పులికి కొంత ఆధిక్యత ఉంటుందని చెబుతారు. అయితే సింహం బలం వేరే. అది గుంపుగా జీవిస్తుంది. ఒక సింహం కంటే.. మొత్తం గుంపుగా ఉన్న సింహాలు చాలా ప్రమాదకరం. పులి, సింహం ఎదురుపడితే ఎవరు గెలుస్తారనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. వాటి పరిమాణం, వయసు, ఆరోగ్యం, పరిస్థితులపై ఫలితం ఆధారపడి ఉంటుంది.పులి అసలు బలం ఏంటి?పులి గొప్పతనం కేవలం దాని బలంలో లేదు.. దాని వ్యూహంలో ఉంది. ఒంటరిగా జీవించే ఈ జంతువు సహనం, తెలివి, సమయస్ఫూర్తితో వేటాడుతుంది. తనకంటే పెద్ద జంతువులను కూడా సరైన సమయం చూసి ఎదుర్కోగలదు. కానీ అవసరం లేని పోరాటాలకు వెళ్లదు. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం దాని ప్రాణాలకు ముప్పే. అడవిలో శాశ్వతంగా బాస్ ఎవరూ ఉండరు. ప్రతి జీవికి ఒక బలం ఉంటుంది.. అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంటుంది. -
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
రాష్ట్రంలో రాయల్ గర్జన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద పులులు సందడి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వాటి కదలికలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్కు 60 కి.మీ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 50 ఏళ్ల తర్వాత పెద్దపులి కనిపించి స్థానికులను ఆశ్చర్యంతో పాటు భయాందోళనలకు గురిచేసింది. రాష్ట్ర రాజధానికి దాదాపు వంద కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాల్లో.. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పులి ప్రవేశించింది. వీటితో పాటు.. కొన్నిరోజులుగా వివిధ జిల్లాల్లో పెద్దపులుల పాదముద్రలు, వాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. పులులు ఆహార అన్వేషణకు, తమ ఆవాస స్థిరీకరణ కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నాయనే వాదన దీనినే బలపరుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో (టైగర్ రిజర్వ్ల వెలుపలి ప్రదేశాల్లో) దాదాపు ఆరేడు కొత్త పులుల (మొత్తం కలిపి) సంచారంపై తమకు సమాచారం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రస్తుతం 19 జిల్లాల్లో వాటి పాదముద్రలు, విసర్జనలు (పెంటికలు), ఆవులు, దూడలు, ఇతర జంతువులపై దాడుల వంటి ఘటనల ద్వారా గుర్తించినట్టు సాక్షికి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశించిన ఈ ఆరేడు పులుల కదలికలే ఆయా జిల్లాల్లోనూ కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక పులి మణుగూరులో స్థిర నివాసం ఏర్పరుచుకోగా, ఆంధ్రా–ఖమ్మం సరిహద్దులలో మరొకటి, లక్సెట్టిపేటలో ఇంకొకటి, తిర్యాణీ–ఆసిఫాబాద్లలో మరోటి సంచరిస్తోంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో పెద్దపులుల సంఖ్య 48 నుంచి 50 దాకా ఉండొచ్చునని అటవీ అదికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా ఫొటోలు, తదితర ఆధారంగా చూస్తే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో 36 (అదనంగా పులి పిల్లలు 6 దాకా), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) చుట్టుపక్కల అయిదు.. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఇంకా ఇతర జిల్లాల్లో మూడు, నాలుగు ఉంటాయని చెబుతున్నారు. అక్కడి నుంచే వలసలు..ఆదిలాబాద్ జిల్లాలోకి పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని తాడోబ–అంధారీ టైగర్ రిజర్వ్, తిప్పేశ్వర్ వైల్డ్లైఫ్ సఫారీపార్క్ ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి పులుల అభయారణ్యాల నుంచి పెద్దపులుల వలసల పెరుగుదల ప్రధాన కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి పులులు గోదావరి, ఇంద్రావతి, పెన్గంగా నదులు దాటి తెలంగాణ అడవుల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్లలో పులుల సంతతి బాగా పెరగడంతో, ఆహారం–ఆవాసం వెతుకులాటలో ఈ వలసలు పెరుగుతున్నాయి. ఈ విధంగా పొరుగు రాష్ట్రాల నుంచి.. టైగర్ కారిడార్గా ఉన్న రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మీదుగా పెద్దపులులు వివిధ జిల్లాల్లో సంచరించడం అధికమైంది. జగిత్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో పులుల కదలికలు పెరిగాయి. అయితే మహారాష్ట్ర నుంచి కవ్వాల్ రిజర్వ్కు పులులు వస్తున్నప్పటికీ.. అవి అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. తరచూ వలస పులులు వస్తూ పోతుండడంతో అనిశ్చితి ఏర్పడింది.ఏటీఆర్లోనే 42.. కేటీఆర్లో పులుల పునరుద్ధరణ ప్రాజెక్టురాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో అటవీ రక్షణ చర్యలు విజయవంతం కావడంతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా 2026 ముందస్తు అంచనాల ప్రకారం.. ఏటీఆర్లో గతంలో ఉన్న 36 నుంచి పెద్దపులుల సంఖ్య 42కి పెరిగింది. ఇక్కడ విజయవంతంగా సంతానోత్పత్తి జరుగుతోంది. అమ్రాబాద్ పులుల వర్గీకరణ ఇలా ఉంది.. ఆడ పులులు –18, మగ పులులు –14, అర్ధ–వయోజన పులులు–2, పులి పిల్లలు (కబ్స్)–8 ఉన్నాయి. తాజా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ 2026) నివేదికల ప్రకారం.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ (ప్రధాన) ఏరియాలో ప్రస్తుతం ఎటువంటి శాశ్వత లేదా సంతానోత్పత్తి చేసే పులులు లేవు.మహారాష్ట్రలోని తడోబా–అంధారి, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి రిజర్వ్ల నుండి సుమారు 5 పులులు అప్పుడప్పుడు కవ్వాల్ సరిహద్దులు, బఫర్ జోన్, కారిడార్ల (కాగజ్నగర్ డివిజన్) గుండా ఇక్కడికి వస్తూ వెళ్తుంటాయి. అయితే, అవి ఇక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు. అడవుల నరికివేత, మానవ జోక్యం, శాశ్వత ఆడ పులులు లేకపోవడం, వేటాడే జంతువుల కొరత కారణంగా పులులు ఇక్కడ స్థిరపడలేక పోతున్నాయి. కవ్వాల్లో పులుల సంఖ్యను పెంచేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఇటీవల మొదటి దశ పులుల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్ నుండి ఐదు పులులను (కనీసం ఒక ఆడపులితో కలిపి) కవ్వాల్కు తరలించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పులుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం (కోర్ ఏరియా) నుంచి గ్రామాల తరలింపు ఒకవైపు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్థానిక గిరిజన తెగల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్తో కలిపే కారిడార్ను సురక్షితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,500 చ.కి.మీ పరిధిని ’కుమురం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్’గా నోటిఫై చేయాలని భావించింది. అయితే తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, దీని ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని స్థానిక గిరిజనులు భారీ బంద్ నిర్వహించడంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది. -
జాబిల్లిని ఢీకొట్టనున్న రాకెట్ శకలం!
సరిగ్గా ఇంకో ఎనిమిది రోజులు! అంటే ఆగస్టు 5వ తేదీ... చందమామపై ఓ రాకెట్ శరవేగంతో కుప్పకూలిపోనుంది! రాక్షసబల్లులు అంతరించిపోయేందుకు ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనడం కారణమని అంటారు. ఆగస్టు ఐదున జాబిల్లిని ఢీకొట్టబోతున్న రాకెట్ శకలం అంత పెద్దదీ కాదు.. అక్కడ రాక్షసబల్లి కాదు కదా.. చిన్న చీమ లాంటి జీవి కూడా లేదు. కాబట్టి మనిషికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ... ఈ ఘటన మనకు ఒక అవకాశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఇదే చందమామపై బోలెడన్ని స్థావరాలు కట్టేçసుకోవాలనుకుంటున్న మనిషి... కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది. ఇప్పుడు వివరాల్లోకి వద్దాం... స్పేస్ ఎక్స్ గురించి మీకు తెలుసు కదా.. ఈ కంపెనీ గత ఏడాది చంద్రుడిపైకి ఒక రాకెట్ను ప్రయోగించింది. రెండు ల్యాండర్లను జాబిల్లిపైకి పంపాలన్న ఈ ప్రాజెక్టు విజయవంతమైంది కానీ... వాడేసిన ఒక భాగం మాత్రం కొంచెం దూరంలో తిరుగుతూ ఉంది. అస్థిర కక్ష్యలో వదిలేసిన కారణంగా అది నెమ్మదిగా జాబిల్లివైపు వెళుతోంది. భూమికి తిరిగి వచ్చేందుకు లేదా అంతరిక్షంలోకి వెళ్లిపోయేందుకు ఇంధనం లేదు దీంట్లో. ఫలితంగా చంద్రుడి ఆకర్షణ శక్తి ప్రభావంతో ఆగస్టు ఐదవ తేదీ గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో పడిపోనుంది. ఈ ధాటికి సుమారు 60 నుంచి 70 అడుగుల భారీ గుంత పడనుంది. చంద్రుడిపైని మట్టి (రెగోలిథ్) కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకూ చిమ్మనుంది. అంతే. భూమికి కానీ... మన వ్యోమగాములకు గానీ.. కక్ష్యలో తిరుగుతున్న ఇతర ఉపగ్రహాలకు కానీ ఎలాంటి నష్టమూ లేదు. కానీ... జాబిల్లి ఎవరిది? తెలిసికానీ.. తెలియకుండా కానీ దాని రూపురేఖలను మార్చే హక్కు మనిషికి ఉందా? అన్నది కీలకం కానుందని అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులు అంటున్నారు. జాబిల్లిపై రాకెట్ శకలం కూలిపోవడం ఒక అరుదైన ఘట్టమే. రాకెట్ సైజు, వేగం, ఎక్కడ పడుతోంది? అన్న సమాచారం మనకు ఎలాగూ తెలుసు కాబట్టి... భారీ శకలాలు ఢీకొన్నప్పుడు ఎలా కంతలు పడతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడవచ్చు. అయితే మన భూమి మాదిరి జాబిల్లిపై వాతావరణం లేదు. గాలి కూడా ఉండదు. అందుకే అప్పుడెప్పుడో 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆ్రల్డిన్లు వేసిన అడుగుల జాడలు ఇప్పటికీ చెదరకుండా ఉన్నాయి. స్పేస్–ఎక్స్ రాకెట్ శకలం మాదిరి ఏవేవో వచ్చి జాబిల్లిపై కూలిపోతూంటే.. ఇలాంటి వారసత్వ చిహ్నాలు కనుమరుగవుతాయని.. లేదంటే ఇప్పటికే జాబిల్లిపై ఉన్న సైంటిఫిక్ పరికరాలను ధ్వంసం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతరిక్షం మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఏ దేశం కూడా దీన్ని తమదిగా చెప్పుకునే అవకాశం లేకుండా 1967లో అంతర్జాతీయ ఒప్పందం ఒకటి కుదిరింది. అయితే ఇందులో జాబిల్లిసహా అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలన్న అంశంపై మార్గదర్శకాలు కానీ.. నియంత్రణలు కానీ లేవు. ఆయా దేశాలు, కంపెనీలదే బాధ్యత. అంటే... ఇప్పుడు స్పేస్–ఎక్స్ రాకెట్తో జరిగే నష్టానికి ఆ కంపెనీ, అమెరికాది బాధ్యతన్నమాట. ఇక్కడే వివాదం మొదలవుతుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు జాబిల్లిపైకి జరిపే ప్రయోగాలపై ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీ సిద్ధం చేయాలని, ఎవరైనా తప్పు చేస్తే నోటీసులు జారీ చేయాలని, పర్యవేక్షణకు ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాలని నిపుణులు కోరుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్వాచ్లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్వాచ్లు, స్పోర్ట్స్వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్పూల్స్, పూర్తిస్థాయి జిమ్లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్కో, వాకింగ్కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్వేర్, బాటా, రిలాక్సో ఫుట్వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్లు. రెండు యాక్టివ్ లైఫ్స్టయిల్ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్ఫిట్ జిమ్లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
జంతర్ మంతర్ నిరసనల కాలక్రమం
జూన్ 6, 2026: జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు షురూ! ⇒ ప్రధాన డిమాండ్: నీట్ యూజీ–2026 పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్‑ స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. జూన్ 28, 2026: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు. దేశవ్యాప్తంగా అందరి, ముఖ్యంగా జెన్–జీ దృష్టిని ఆకర్షించిన ఘట్టమిది. ⇒ భారతదేశం నలుమూలల నుంచి సీజేపీ ఉద్యమానికి సంఘీభావం. వెల్లువలా జంతర్మంతర్కు జెన్–జీ. జూలై 18, 2026: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను హైకోర్టు ఆదేశాల మేరకు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్ భార్య అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు జూలై 21న మెదాంత ఆసుపత్రికి తీసుకెళ్లేందకు అనుమతిచి్చంది. జూలై 20, 2026: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు. మహిళలు సహా పలువురు విద్యార్థులకు గాయాలు. కొంతమందిపై పెల్లెట్ గన్ ప్రయోగం. జంతర్ మంతర్ చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల మోహరింపు. జూలై 23, 2026 (రాత్రంతా జాగరణ): గాయాలు, అలసట ఉన్నప్పటికీ విద్యార్థులు నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ఆటలు, పాటలతో సందడిగా రాత్రంతా సందడిగా మారింది జంతర్ మంతర్. ⇒ దేశం నలుమూలల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎందరో ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆహార పానీయాలు పంపించడం, కుర్రాళ్ల విన్యాసాలతో ఆ రాత్రి నిరసన కార్యక్రమాల్లో కొంగొత్త వైఖరిని ఆవిష్కరించింది. గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న కొందరికి స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారం, నీరు, మందులు పంపిణీ చేశారు; ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగించేందుకు విసనకర్రలతో వారికి సపర్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ⇒ నిరసనకారులు రాక్స్టార్ సినిమాలోని ‘‘సడ్డా హక్’’తోపాటు చాలా సినిమా పాటలను ఉత్సాహంగా పాడి, ఆడారు. నినాదాలు రాత్రంతా మారుమోగాయి. జూలై 24, 2026: కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ నేత జితేంద్ర సింగ్ మెదాంత ఆసుపత్రిలో సోనమ్ వాంగ్చుక్తో చర్చలు జరిపారు. ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన షరతులకు రాతపూర్వక అంగీకారం తెలపడంతో ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నట్లు సోనమ్ వాంగ్చుక్ ప్రకటించారు. జూలై 25, 2026: పేపర్ లీక్పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ⇒ నిరసనకారులు దీనిని పాక్షిక విజయంగా ప్రకటించారు, కానీ పరీక్షల నిర్వహణ. పారదర్శకతపై మరిన్ని సంస్కరణలు అవసరమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. -
కాక్రోచే అనుకుంటే.. కదం తొక్కింది!
ఒక్క మాట.. మహోద్యమంగా మారింది. ‘కాక్రోచ్’ పుట్టుకకు కారణమైంది.. ఈ ఏడాది మే 16న దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్య ఒకటి వైరల్ అయిపోయింది. దేశంలోని నిరుద్యోగ యువత బొద్దింకల్లా (కాక్రోచ్) మారారని సీజేఐ వ్యాఖ్యానించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. తన ఉద్దేశం అది కాదని సీజేఐ తరువాత చెప్పుకున్నారు అది వేరే విషయం. కానీ...యువతను బొద్దింకలతో పోల్చారన్న విషయం.... మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదువు చదివి.. అమెరికాలోని బస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్పై పీజీ చేస్తున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కేకు అంతగా రుచించలేదు.అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అనుభవం ఉండటమో ఇంకో కారణమో తెలియదు కానీ... సీజేఐ వ్యాఖ్యపై వ్యాఖ్యానిస్తూ.... ‘‘బొద్దింకలన్ని ఒక్కటైతే ఏమవుతుంది?’’అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది కాస్తా జెన్–జీ గుండెలను నేరుగా తాకింది. ఇంకేముంది... రికార్డు సమయంలో లక్షల మంది ఫాలోవర్లు సిద్ధమైపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతగానంటే... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటూ వచి్చన భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్యను కూడా మించిపోయేంత! యువతలోని ఈ జోష్ అభిజిత్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ... అప్పటికే నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో తలపట్టుకుని ఉన్న కేంద్రం మే 21న మారు పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ హ్యాండిల్ను స్తంభింపజేసింది. ఇంకేముంది అగ్గి రాజుకుంది! మద్దతుదారులు ‘Cockroach is Back’’, పేరుతో కొత్త హ్యాండిల్ను సృష్టించడం, గంటల్లోనే 280,000 కంటే ఎక్కువమంది ఫాలోవర్లు చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎక్స్ హ్యాండిల్ పునరుద్ధరణకు ఢిల్లీ హైకోర్టును నిరాకరించడం (మే 29వ తేదీ)తో ఇరుపక్షాల్లోనూ పంతం పెరిగినట్టు అయ్యింది. ఈ లోపుగానే ఒక పక్షం కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులపై రకరకాల ముద్రలు వేయడం మొదలుపెట్టారు.ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉద్యమాలు నడపడం ఏమిటని అభిజిత్ను ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానంగా జూన్ మొదటి వారంలో అభిజిత్ దేశానికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే జూన్ ఆరవ తేదీన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో నిరసనకు దిగారు. కొన్ని రోజుల తరువాత లడాఖ్ విద్యావేత్త, ఇంజినీర్ సోనమ్ వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతివ్వడం, ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగిపోయాయి. వాంగ్చుక్ సుమారు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఆసుపత్రికి తరలించడం, ఆ తరువాత రెండు రోజులకు అంటే జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీలో పోలీసుల లాఠీచార్జితో జెన్–జీ మొత్తం ఏకమైంది. ఈ దశలో కేంద్రం కూడా ఒక మెట్టు దిగి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశమిస్తూ... ప్రశ్న పత్రాల లీకేజీలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులకు మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల వరకూ జరిమానా విధిస్తామని ప్రకటించారు. అయినా సరే.. అభిజిత్ దిప్కే వర్గం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఉద్యమం ఆగుతుందని కుండబద్దలు కొట్టారు. దీంతోపాటు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, ఛలో సంసద్లో విద్యార్థులపై లాఠీలు ఝళిపించిన పోలీసులపై చర్యలు, విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకూడదన్న షరతులు పెట్టాయి. రెండు దఫాల చర్చల తరువాత ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన షరతులకు ఓకే చెప్పింది. అయినప్పటికీ ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ పట్టు వీడలేదు. దీంతో ఎట్టకేలకు జూలై 25న ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచి్చంది. దీంతో ఉద్యమమైతే సమసింది కానీ... ముందేం జరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహరాలో ఏనుగులు.. దట్టమైన అడవులు! గతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి.. సహారా. పేరు వినగానే మన కళ్ల ముందు అంతులేని ఇసుక తిన్నెలు, మండే ఎండలు, చుక్క నీరు కూడా దొరకని నిర్మానుష్య భూభాగమే కనిపిస్తుంది. దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఎడారి.. ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికాలోని పలు దేశాలను కప్పేసి ఉంది. కానీ వేల సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతం పూర్తిగా భిన్నంగా ఉండేదంటే నమ్మగలమా?ఇప్పుడు ఇసుక తుఫానులతో కనిపించే సహారా.. ఒకప్పుడు పచ్చని గడ్డి మైదానాలు, దట్టమైన అడవులు, ప్రవహించే నదులు, భారీ సరస్సులతో కళకళలాడిన ప్రాంతం. అక్కడ ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగాలు వంటి భారీ జంతువులు సంచరించేవి. మనుషులు కూడా అక్కడ నివసిస్తూ వేటాడుతూ, చేపలు పట్టుతూ, వ్యవసాయం చేస్తూ జీవించేవారట.‘గ్రీన్ సహారా’గా మారిన ఎడారిశాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. సుమారు 11 వేల నుంచి 5 వేల సంవత్సరాల క్రితం మధ్య కాలంలో సహారా ప్రాంతం ‘ఆఫ్రికన్ వెట్ పీరియడ్’ (African Humid Period)గా పిలిచే తేమతో కూడిన దశను ఎదుర్కొంది. ఆ సమయంలో భూమి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎడారి ప్రాంతం పచ్చని భూభాగంగా మారింది. అప్పట్లో సహారాలో అనేక సరస్సులు ఏర్పడ్డాయి. కొన్ని సరస్సులు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేవని ఆధారాలు చెబుతున్నాయి. నదులు ప్రవహించడంతో జీవ వైవిధ్యం పెరిగింది. ఇప్పటి ఇసుక దిబ్బల కింద కూడా పురాతన నదీ మార్గాలు, సరస్సుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలకు కనిపించాయి.గోడలపై కనిపించిన గతంసహారా ప్రాంతంలోని పురాతన రాతి చిత్రాలు కూడా అక్కడి చరిత్రను చెబుతున్నాయి. వేల సంవత్సరాల నాటి గుహలు, రాళ్లపై చెక్కిన చిత్రాల్లో ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, పశువులు వంటి జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. ఇవి ఒకప్పుడు అక్కడ విస్తారమైన జీవజాలం ఉండేదనడానికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఆ కాలంలో మనుషులు కూడా అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వేటతో పాటు పశుపోషణ, వ్యవసాయం చేసినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.ఎలా ఎడారిగా మారింది?సహారా మార్పుకు ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి అక్షం స్వల్పంగా మారడం వల్ల సూర్యకిరణాల ప్రభావం, వర్షపాతం నమూనాలు మారాయి. క్రమంగా వర్షాలు తగ్గిపోయాయి. సరస్సులు ఎండిపోయాయి. నదులు కనుమరుగయ్యాయి. పచ్చని మైదానాలు క్రమంగా ఇసుక ప్రాంతాలుగా మారిపోయాయి. వేల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో సహారా ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటిగా మారింది.భవిష్యత్తులో మళ్లీ మారుతుందా?ప్రకృతి చరిత్రలో ఎడారులు శాశ్వతంగా ఒకే రూపంలో ఉండవని సహారా కథ చెబుతోంది. వాతావరణ పరిస్థితులు మారితే భూభాగాలు కూడా మారిపోతాయని ఇది నిరూపిస్తోంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావంతో సహారా మళ్లీ పచ్చగా మారే అవకాశం తక్షణ భవిష్యత్తులో లేదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి సహారా మనకు ఓ అంతులేని ఎడారిలా కనిపించినా.. దాని ఇసుక పొరల కింద ఓ పచ్చని చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు నదులు ప్రవహించిన, జంతువులు సంచరించిన, మనుషులు జీవించిన ఈ భూమి.. ప్రకృతి శక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. -
గల్ఫ్లో డ్రోన్ వార్.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.ముఖ్యంగా ఇరాన్ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.CIA స్థావరాలే లక్ష్యంగా?రాయిటర్స్ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్కు చెందిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.టెక్నాలజీ ఆ దేశానిదేనా?అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఇరాన్ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దాడుల వెనుక నిఘా సమాచారమా?ఇరాన్కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.రష్యా–ఇరాన్ బంధంపై కొత్త చర్చఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఇరాన్ డ్రోన్ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది. -
ప్రతి సెకను ఇక పక్కా..
ఆధునిక డిజిటల్ యుగంలో ప్రతి సెకను కూడా ఎంతో విలువైనది. మనం మొబైల్ ఫోన్ ద్వారా చేసే నగదు బదిలీలు, ఫోన్ కాల్స్, విద్యుత్ సరఫరా వ్యవస్థల పర్యవేక్షణ, ఉపగ్రహ సమాచార మార్పిడి వంటి రంగాలన్నింటికీ కచ్చితమైన సమయం అత్యంత ముఖ్యం. అయితే మన దేశంలో ఇలాంటి కీలక వ్యవస్థలన్నీ ఇప్పటివరకు అమెరికాకు చెందిన అంతరిక్ష ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించి భారతదేశానికి డిజిటల్ సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తిని చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ’ఒకే దేశం, ఒకే కాలం’ అనే అద్భుతమైన సంకల్పంతో సరికొత్త ’వైట్ రాబిట్’ సాంకేతిక ఆధారిత నెట్వర్క్ను బెంగళూరులోని ప్రాంతీయ ప్రమాణాల ప్రయోగశాలలో ప్రారంభించింది. ఏమిటీ వైట్ రాబిట్ సాంకేతికత..?గతంలో కంప్యూటర్లు, సర్వర్లలో సమయాన్ని సరి చేయడానికి సాధారణ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వాడేవారు. కానీ ఆయా ప్రోటోకాల్స్ను ఎంత పకడ్బందీగా పాటించినా వాటిలో మిల్లీసెకన్ల (సెకనులో వెయ్యో వంతు) తేడా వచ్చేది. వైట్ రాబిట్ సాంకేతికత ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుంది. యూరప్ అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు మొదటగా ఈ సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇది ఆప్టికల్ ఫైబర్ సహాయంతో నడిచే ఒక అత్యంత కచ్చితమైన నెట్వర్క్ ప్రోటోకాల్. దీని ద్వారా అనుసంధానించిన గడియారాలు ఒక నానో సెకను (సెకనులో వంద కోట్ల వంతు) కంటే తక్కువ తేడాతో కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. సాధారణంగా సమాచార ప్రసారంలో నెట్వర్క్ ఆలస్యం కావడం వల్ల సమయం మారే అవకాశం ఉంటుంది. కానీ వైట్ రాబిట్ సాంకేతికత ఆ ఆలస్యాన్ని ఎప్పటికప్పుడు స్వయంచాలకంగా సరిచేస్తూ అన్ని ప్రాంతాల్లోని పరికరాలు ఒకే అత్యున్నత కచ్చితమైన సమయంతో నడిచేలా చూస్తుంది. సమష్టి కృషితో సాధించిన విజయం.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నేషనల్ ఫిజికల్ ల్యా»ొరేటరీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వంటి అగ్రగామి సంస్థలు సమష్టిగా కృషి చేసి ఈ స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. బెంగళూరు ప్రయోగశాల నుండి చెన్నైలోని జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ కేంద్రానికి ఈ సురక్షిత కాల ప్రసారాన్ని విజయవంతంగా పరీక్షించారు. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నమ్మకమైన ఇంటర్నెట్ ఎంత ముఖ్యమో సురక్షితమైన కాలపాలన అంతకంటే ముఖ్యం. అభివృద్ధి చెందిన భారతదేశ విజన్ దిశగా, డిజిటల్ మౌలిక సదుపాయాలలో స్వయం సమృద్ధిని సాధించడంలో ఈ ’వైట్ రాబిట్’ సాంకేతికత ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశంలోని అన్ని వ్యవస్థలు, కంప్యూటర్లు, ప్రభుత్వ రంగాలు ఒకే రకమైన కచ్చితమైన సమయాన్ని పాటించేలా చూసే అధికారిక విధానాన్నే కాలపాలన అంటారు. దేశీయ కాలమానానికి భద్రతా కవచం.. ప్రస్తుతం బ్యాంకింగ్, రక్షణ రంగాలు విదేశీ ఉపగ్రహ సంకేతాల ద్వారా సమయాన్ని పొందుతున్నాయి. వీటికి సైబర్ దాడులు జరగడం, సంకేతాలను తారుమారు చేయడం లేదా జామింగ్ వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. ఒకవేళ ఈ విదేశీ వ్యవస్థలు నిలిచిపోతే మన దేశ డిజిటల్ వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ వైట్ రాబిట్ ఆధారిత భూతల నెట్వర్క్ రూపుదిద్దుకుంది. ఇది భారతదేశ అధికారిక కాల పరిశోధన ప్రయోగశాలల నుండి నేరుగా భారతీయ ప్రమాణ కాలాన్ని సురక్షితంగా సరఫరా చేస్తుంది. దీనివల్ల బాహ్య శక్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.కచ్చితమైన కాలముద్రలు..సాధారణంగా ఒక డిజిటల్ నెట్వర్క్లో ఏదైనాఒక సంఘటన లేదా లావాదేవీ జరిగినప్పుడు అది జరిగిన రోజు, గంట, నిమిషం, సెకను, సెకనులో వంద కోటో వంతు (నానో సెకను) సమయాన్ని కూడా డిజిటల్గా రికార్డు చేయడాన్ని ’కచ్చితమైన కాలముద్ర’ అంటారు. లావాదేవీలకు ఆధారం: ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు, ఆ డబ్బు ఏ కచ్చితమైన సమయానికి ఖాతా నుండి కట్ అయింది, అవతలి వారికి చేరిందీ లేనిదీ ఈ కాలముద్ర ద్వారానే తెలుస్తుంది. ఒకవేళ లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి ఇది ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. సైబర్ మోసాల నిరోధం: ఒకే బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒకే నిమిషంలో రెండు వేర్వేరు నగరాల్లో లావాదేవీలు జరిగితే, కాలముద్రల సహాయంతో భద్రతా వ్యవస్థలు ఆ మోసాన్ని వెంటనే గుర్తించి ఖాతాను నిలిపివేస్తాయి. స్టాక్ మార్కెట్ వ్యాపారం: స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు వేగంతో మారిపోతుంటాయి. ఒక షేరును ఎవరు ముందు కొన్నారనేది మైక్రోసెకన్లు, నానోసెకన్ల కాలముద్రల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇది ట్రేడింగ్లో పారదర్శకతను పెంచుతుంది. డిజిటల్ రికార్డుల భద్రత: కంపెనీలు, ప్రభుత్వాలు, బ్యాంకులు తమ డిజిటల్ ఫైళ్లలో ఎవరు, ఎప్పుడు, ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి ఈ కాలముద్రలు ఉపయోగపడతాయి. ఇది వ్యవస్థలో అవకతవకలు జరగకుండా చూస్తుంది. రక్షణ, కమ్యూనికేషన్ రంగాలు: ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలు, మొబైల్ నెట్వర్క్లు (5జీ వంటివి) సరిగ్గా పనిచేయడానికి అన్ని పరికరాలు ఒకే కచ్చితమైన సమయాన్ని కలిగి ఉండాలి. చిన్న సమయ తేడా ఉన్నా సమాచార ప్రసారం నిలిచిపోయే ప్రమాదం ఉంది. – సాక్షి, హైదరాబాద్ -
ఇక ఫేస్ను కూడా అమ్ముకోవచ్చు!
ఇప్పటివరకు మనం ఇళ్లు, భూములు, బంగారం, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల గురించి విన్నాం, చూశాం. కానీ ‘ఫేస్వాల్యూ’అనే మాటను నిజం చేస్తూ... మనుషులు తమ ముఖాలను కూడా అమ్ముకునే రోజులు వచ్చేశాయని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, చైనా వినోద రంగంలో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్! చైనాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించే షార్ట్ డ్రామాల పరిశ్రమ ఊహించని వేగంగా విస్తరిస్తోంది. రోజుకు వందలాది కొత్త వీడియోలు విడుదలవుతున్నాయి. అయితే, పరిమిత బడ్జెట్ కారణంగా ఒకే నటుడి ముఖం వేర్వేరు పాత్రల్లో, భిన్నమైన రూపాల్లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఒక వీడియోలో ప్రేమకథలో హీరోగా కనిపించిన వ్యక్తి... మరో వీడియోలో హంతకుడిగా, ఇంకో దాంట్లో డాక్టర్గా దర్శనమిస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్లు చేయడం నిర్మాతలకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొందరు నిర్మాతలు ఫేస్ బయ్యింగ్ అనే క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చారు. అందంగా ఉండి, ఎలాగైనా స్క్రీన్పై కనిపించాలనే కోరిక ఉన్న సామాన్యులను ఆహ్వానించి వారి ముఖాలను త్రీడీ స్కాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వారి డిజిటల్ రూపాన్ని భద్రపరుచుకుంటారు. ఈ డిజిటల్ ఫేస్లను ఏఐ సాయంతో తమ డ్రామాలు, సిరీస్లలో వాడుకుంటారు. దీనివల్ల సదరు వ్యక్తులు ప్రత్యక్షంగా షూటింగ్కు రావాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఒక్కసారి ఆ ఒప్పందంపై సంతకం చేస్తే... తమ ముఖాలపై ఆ అమ్మకందారులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయినా ఫర్వాలేదంటూ కేవలం 500 యువాన్లు (సుమారు రూ. 6 వేలు) ఆశపడి చాలామంది తమ ముఖ హక్కులను నిర్మాతలకు రాసిచ్చేస్తున్నారట. డిజిటల్ అస్తిత్వానికే ప్రమాదమా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ ట్రెండ్పై సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మన డిజిటల్ ఫేస్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే, దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారనే దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. భవిష్యత్తులో ఈ డేటాను సైబర్ నేరాలు, డీప్ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం మన డిజిటల్ గుర్తింపునే శాశ్వతంగా అమ్మేసుకోవడం... నిజంగా లాభమా? లేక కొరివితో తలగోక్కున్నట్టా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.-సాక్షి, సెంట్రల్ డెస్క్ -
హమాస్కు కొత్త బాస్.. గాజా కన్నీళ్లు తుడుస్తాడా?
యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితంతో అల్లాడుతున్న గాజాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ కొత్త అత్యున్నత నాయకుడిగా ఖలీల్ అల్-హయ్యా ఎన్నికయ్యారు. యాహ్యా సిన్వార్ తర్వాత సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయనకు హమాస్ అంతర్గత ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నాయకత్వ మార్పుతో గాజా ప్రజల ముఖచిత్రంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు!..యుద్ధం తమ ఇళ్లను, కుటుంబాలను, భవిష్యత్ను దెబ్బతీసిన వేళ.. హమాస్ నాయకత్వ మార్పుపై గాజా ప్రజల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొత్త నాయకుడు కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తుండగా.. మరికొందరు నాయకులు మారినా పరిస్థితులు మారకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరీ ఖలీల్ అల్-హయ్యా?ఖలీల్ అల్-హయ్యా హమాస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత. గాజాలో జన్మించిన ఆయన.. 1987లో హమాస్ ఏర్పాటైన నాటి నుంచి సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్లామిక్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. అనంతరం జోర్డాన్, సూడాన్లలో ఉన్నత విద్యను అభ్యసించారు.రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన అల్-హయ్యా.. ఆ తర్వాత హమాస్లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుంచి విజయం సాధించారు. అనంతరం హమాస్ పొలిట్బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్ మాజీ నేతలు ఇస్మాయిల్ హనియె, యాహ్యా సిన్వార్లకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన.. సంస్థ రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు.చర్చల బల్లపై కీలకంగా.. ఖలీల్ అల్-హయ్యాకు మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్ తరఫున ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలపై ఖతార్, ఈజిప్ట్ వంటి మధ్యవర్తి దేశాలతో చర్చలు జరిపిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికతో భవిష్యత్లో హమాస్ చర్చల వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. యుద్ధాన్ని కొనసాగించే వైఖరినే అనుసరిస్తారా? లేక చర్చలకు మరింత ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.యుద్ధం మిగిల్చిన వ్యక్తిగత విషాదంఖలీల్ అల్-హయ్యా జీవితంలోనూ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. 2007లో ఆయన ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భార్య, పిల్లలు, సోదరులు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లోనూ ఆయన కుటుంబానికి చెందిన మరికొందరు మరణించారు. ఈ వ్యక్తిగత విషాదాలు ఆయన రాజకీయ వైఖరిపై ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని కొనసాగించే నేతల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు.గాజా ప్రజలకు బతుకే ముఖ్యంహమాస్లో కొత్త నాయకుడు ఎన్నికైనప్పటికీ.. గాజాలో సామాన్య ప్రజల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇళ్లు కోల్పోయి, శిబిరాల్లో జీవిస్తున్న వేలాది కుటుంబాలకు రాజకీయ పరిణామాల కంటే రోజువారీ అవసరాలే ప్రధానంగా మారాయి. “మాకు నాయకులు మారడం ముఖ్యం కాదు.. మా పిల్లలకు ఆహారం కావాలి. తాగునీరు కావాలి. మందులు కావాలి. భయం లేకుండా జీవించే పరిస్థితి కావాలి” అని పలువురు గాజా ప్రజలు చెబుతున్నారు. మరికొందరు.. “ఏ నాయకుడు వచ్చినా మా జీవితాల్లో మార్పు కనిపించకపోతే ప్రయోజనం ఏమిటి? మాకు శాంతి కావాలి” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆశలు.. అనుమానాలు రెండూఖలీల్ అల్-హయ్యాకు చర్చల అనుభవం ఉండటంతో కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతా సహాయం వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం నాయకుడు మారినా హమాస్ ప్రాథమిక విధానాల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయన ఎన్నిక హమాస్ పోరాట వైఖరిని కొనసాగించే సంకేతమని విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు.ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేప్రస్తుతం ఖలీల్ అల్-హయ్యా ముందున్న సవాల్ హమాస్ను నడిపించడం మాత్రమే కాదు. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? కాల్పుల విరమణను స్థిరంగా కొనసాగించగలరా? అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య సంస్థ భవిష్యత్ వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారు? అన్నది కీలకంగా మారింది.గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారగా.. ఆహారం, వైద్యం, విద్యుత్, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖలీల్ అల్-హయ్యా నాయకత్వంపై ప్రపంచం దృష్టి పెట్టినా.. గాజా ప్రజల ఆకాంక్ష మాత్రం ఒక్కటే. “మాకు రాజకీయ విజయాలు వద్దు.. మా పిల్లలు భయపడకుండా బతికే రోజు రావాలి.” -
నీట్ లీక్.. రాజీనామా కచ్చితంగా చేయాలా??
ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.గతం ఏం నేర్పింది మరి?నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!. లాల్ బహదూర్ శాస్త్రి..స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.టీటీ కృష్ణమాచారి..1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.మాధవరావ్ సింధియా.. 1992లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం1999లో పశ్చిమ బెంగాల్లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.జార్జ్ ఫెర్నాండెజ్..2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ::వెబ్ ప్రత్యేకం -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్కు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్గా వెల్లడించారు. -
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల సెగకు తోడు కాలుష్య నిబంధనల్లో నెలకొన్న అనిశ్చితితో కారు ప్రియులు ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే కార్లకు సై అంటున్నారు. అధిక మైలేజీ.. తక్కువ మెయింటెనెన్స్.. పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటంతో సీఎన్జీ కార్లు మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. గతంలో అరకొరగా ఉన్న బంకులు ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. మొత్తంమీద డీజిల్ను ఓవర్టేక్ చేసి సీఎన్జీ కార్లు అమ్మకాల్లో టాప్–2 ప్లేస్లో దూసుకెళ్తున్నాయి.మన రోడ్లపై ఇప్పటికీ పెట్రోల్ కార్లదే హవా. అయితే, గత రెండు మూడేళ్లుగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మరింత ఫోకస్ చేస్తున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో సీఎన్జీ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో రెండో అత్యంత ప్రాధాన్య ఇంధనంగా నిలిచింది. 2025–26లో అమ్ముడైన మొత్తం కార్లలో సీఎన్జీ వాటా దాదాపు 22 శాతానికి ఎగబాకింది. అంటే 10 లక్షలకు పైగా సీఎన్జీ కార్లు రోడ్డెక్కాయన్నమాట! 2024–25లో సీఎన్జీ కార్ల వాటా 19.6 శాతంగా ఉంది. మూడేళ్ల క్రితం 12–13 శాతం వాటా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపైంది. మరోపక్క, గతేడాదే డీజిల్ కార్లను దాటేసిన సీఎన్జీ కార్ల జోరు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. 2025–26లో డీజిల్ కార్ల వాటా 18.23 శాతం నుంచి 2026–27లో 18.08 శాతానికి తగ్గింది. పెట్రోల్ కార్లదీ ఇదే బాట. తొలిసారిగా 2025–26లో వాటి వాటా 50 శాతం దిగువకు పడిపోవడం గమనార్హం. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), హైబ్రిడ్ కార్ల విక్రయాలు కూడా రయ్ అంటున్నాయి. గతేడాది ఈవీల వాటా 2.61% నుంచి 4.25 శాతానికి ఎగబాకడం దీనికి నిదర్శనం. జూన్లోనూ జూమ్... ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు ఈ ఏడాది జూన్లో కూడా దుమ్మురేపాయి. రిటైల్ సేల్స్లో తొలిసారి వీటి వాటా 40 శాతాన్ని అధిగమించింది. 2025 జూన్లో ఇది 33.3 శాతమే. అలాగే ఈ ఏడాది మేలో 38 శాతంగా ఉంది. మరోపక్క, పెట్రోల్, డీజిల్ కార్ల వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఇక సీఎన్జీ కార్లు తగ్గేదేలే అంటూ టాప్గేర్లో అమ్ముడయ్యాయి. జూన్ అమ్మకాల్లో సీఎన్జీ వాటా 24.3 శాతానికి ఎగసింది. హైబ్రిడ్ 8.3%, ఈవీలు 7.8% వాటా (31,823 కార్లతో ఆల్టైమ్ గరిష్టం) దక్కించుకున్నాయి.ఎందుకీ డిమాండ్..→ కారు కొనుగోలుదారులు సీఎన్జీకి జై కొట్టడానికి అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ వ్యయమే ప్రధాన కారణం. పెట్రోల్తో పోలిస్తే సీఎన్జీ కార్లకు ఒక్కో కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు 40–50 శాతం తక్కువ. → నేరుగా కంపెనీలు విడుదల చేస్తున్న సీఎస్జీ వేరియంట్ల రేటు పెట్రోల్ కంటే రూ.80,000–1,00,000 ఎక్కువగా ఉంటోంది. అంటే, ఏటా సుమారు 15,000–20,000 కిలోమీటర్లు తిరిగేవారికి ఈ అదనపు వ్యయం 18 నెలల్లోనే రికవరీ అయిపోతుంది. అవసరమైతే పెట్రోలు ఆప్షన్ ఉండనే ఉంటుంది. ఈ వెసులుబాటు, ఇంధన ఆదానే ఇప్పుడు మాస్ మార్కెట్లో సీఎస్జీ కార్లకు కిర్రాక్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. → సీఎన్జీ బంకులు శరవేగంగా విస్తరిస్తుండం కూడా ఈ కార్ల వైపు కస్టమర్లు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏడాది క్రితం సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ 300 నగరాలు, పట్టణాల్లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 600కు చేరింది. → ఇదంతా ఒకెత్తయితే.. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం కూడా ఎక్కువ మంది సీఎన్జీని నమ్ముకుంటున్నారు. ఆటోమొబైల్ డీలర్ల సంఘాల ఫెడరేషన్ (ఫాడా) సర్వే ప్రకారం ఇంధన ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో సీఎన్జీ, ఈవీలే బెటర్ అని 56.9% మంది కస్టమర్లు భావిస్తున్నారట! → కాలుష్య నిబంధనలను కఠినతరం చేస్తుండటం వల్ల కూడా డీజిల్ కార్ల నుంచి సీఎన్జీ, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో డీజిల్ వాహనాల కాలపరిమితిని పదేళ్లకు తగ్గించడం, మరిన్ని నగరాలూ ఇదే బాటలో నడుస్తాయన్న ఆందోళనలు, పాలసీ అనిశ్చితి డీజిల్ కార్ల డిమాండ్కు కోత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ వల్ల కాలుష్యం చాలా తక్కువ. → గతంలో ఎంట్రీ స్థాయి మోడళ్లలోనే అందుబాటులో ఉన్న సీఎన్జీ వేరియంట్లను ఆటోమొబైల్ దిగ్గజాలు ఇప్పుడు అన్ని మోడళ్లకూ విస్తరించాయి. మారుతీ సుజుకీ దాదాపు తన మొత్తం కార్ల రేంజ్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ ఆప్షన్లను అందిస్తోంది. ఇక టాటా మోటార్స్ సైతం జోరు పెంచింది. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్తో పాటు టాప్ ఎండ్ మోడళ్లలో సైతం సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. జూన్లో 2–3 శాతం మేర ధరలు పెరిగినా, సీఎన్జీ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది డీలర్ల మాట.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! -మంథా రమణమూర్తి -
వేడి ఒత్తిడితో చదువు చిత్తు!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యాసం, ఆరోగ్యం, శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఓ తాజా సర్వే చెబుతోంది. గత ఏడాది వేసవి కన్నా ఈ ఏడాది వేసవి ఎక్కువ వేడి ఒత్తిడిని కలిగించిందని స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్వై (క్రైౖ ) నిర్వహించిన ‘ఫీలింగ్ ద హీట్’అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,096 మంది 10–17 ఏళ్ల బడి పిల్లలు ఎదుర్కొన్న వేడి ఒత్తిడి బాధలపై ‘క్రై’సర్వే చేసింది. ఎల్నినో పరిస్థితులు ప్రపంచ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీలో అత్యధికంగా 88 శాతందేశంలో గత వేసవిలో వేడి సంబంధిత ఇబ్బందుల కారణంగా దాదాపు పది మందిలో ఏడుగురు పిల్లలు పాఠశాలలకు లేదా పాఠాలకు దూరమయ్యారు. అధిక వేడి తమ ఏకాగ్రతను దెబ్బతీసిందని 76 శాతం మంది చెప్పారు. డీహైడ్రేషన్, తలనొప్పి, తీవ్రమైన అలసట, కళ్లు తిరగటం, నిద్ర పట్టటంలో ఇబ్బంది వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజువారీ కూలి పనులు లేదా శారీరక శ్రమ చేసే పేద కుటుంబాల్లో బడి పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా అధిక వేడి బాధల బారిన పడుతున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 68 శాతం మంది పాఠశాలకు లేదా సాధారణ కార్యకలాపాలకు హాజరు కాలేకపోయారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 88 శాతం మంది హాజరు కాలేదు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ కాగా పశ్చిమ బెంగాల్లో వీరి సంఖ్య దాదాపు 72 శాతంగా ఉంది.76% మందిలో ఏకాగ్రత తగ్గింది తెలంగాణలో 65–70% మంది పాఠశాల విద్యార్థులు ఎండ తీవ్రత భరించలేక స్కూళ్లకు సెలవు పెట్టారు లేదా క్లాసులకు వెళ్లలేదు. విపరీతమైన ఉక్కపోత వల్ల పాఠాలపై 76% మంది విద్యార్థులు ఏకాగ్రతతో దృష్టి పెట్టలేకపోయారు. తగినంత నీరు అందక శారీరకంగా నీరసించటం, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల ఇళ్లలో రాత్రి పూట విద్యుత్ కోతలు, ఉక్కపోత వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోలేకపోయారు. దీనివల్ల మరుసటి రోజు బడిలో వారు చురుగ్గా ఉండలేకపోయారు. సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి ఉష్ణోగ్రత రికార్డులు వేడి ఎంత పెరుగుతోందో మనకు స్పష్టం చేస్తుండగా, ఆ వేడి స్కూలు పిల్లల జీవితాలను దెబ్బతీస్తోందో వారే మనకు చెబుతున్నారని ‘క్రై’ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా మర్వాహా అన్నారు. వేడి నివారణ కార్యాచరణ ప్రణాళికలు, వాతావరణ మార్పును ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించేటప్పుడు విధాన రూపకర్తలు ఈ అధ్యయన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. -
భారత రైల్వే చరిత్రలో గ్రీన్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. హరియాణా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే.. ఆ తర్వాత డీజిల్, విద్యుత్ శకాలను దాటుకుని, ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం ’హైడ్రోజన్’వైపు అడుగులు వేసింది. బ్రాడ్గేజ్ మార్గాల్లో ఇప్పటికే 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రమాదాలకు తావులేదు.. భద్రత అమోఘం! హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికులలో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీకైనా, అది ఒకచోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఉంది. జింద్ వద్ద అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్! హరియాణాలోని జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుది్వశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్) ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేస్తారు. దీనిని 500 బార్ ప్రెజర్ వద్ద నిల్వ చేసి, రైళ్లకు 350 బార్ ప్రెజర్ వద్ద నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో రెండు పవర్ కార్లలో గ్యాస్ నింపే సదుపాయం ఉంది. ఈ రైలును ‘మేక్ ఇన్ ఇండియా’కింద భారత్లోనే రూపొందించారు. రైలు ప్రత్యేకతలు.. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లతో మాత్రమే నడుస్తుండగా, భారత్లో ఏకంగా 10 కోచ్ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డ్నెలకొల్పే ఆస్కారముంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హరియాణాలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపునున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 75 కి.మీ వేగంతో నడపనున్నారు. రైలుకు ఇరువైపులా రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు (డీపీసీ)లు ఉంటాయి. ఇవి చెరో 1,200 కిలోవాట్ల (1600 హెచ్పీ) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్యాకప్ కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీలను జతచేశారు.నిప్పులు చిమ్మని హరిత రథంమారనున్న భారతీయ రైల్వే ముఖచిత్రం బొగ్గుతో నడిచే రైళ్లు మొదలు విద్యుత్తో నడిచే రైళ్లదాకా కొనసాగిన భారత రైల్వే ప్రస్థానంలో సరికొత్త హరిత అతిథి నేడు వచ్చిచేరుతోంది. వాతావరణంలోని కర్భన ఉద్గారాలను అస్సలు వెదజల్లని వాతావరణహిత హరిత రైలు రాకతో భారత రైల్వే ముఖచిత్రం మారబోతోందని రైల్వే రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలా పనిచేస్తుంది? సంప్రదాయక రైలు మాదిరి ఈ రైలు నుంచి కాలుష్యకారక ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలువడవు. హరిత శకటం నుంచి కేవలం నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ రైలు ముందుభాగంలో లేదా పైభాగంలో లేదా ప్రత్యేక కంపార్ట్మెంట్లో భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువును నిల్వచేసే ట్యాంకర్ ఉంటుంది. దీనికి సమీపంలో ఫ్యూయల్సెల్ వ్యవస్థ ఉంటుంది. ట్యాంక్లోని హైడ్రోజన్ను ప్రత్యేక పైపుల ద్వారా ఫ్యూయల్సెల్లోకి పంపిస్తారు. అయితే అది ఫ్యూయల్ సెల్లోకి వచ్చే క్రమంలోనే ప్రోట్రాన్లు, ఎల్రక్టాన్లుగా విడిపోతుంది. ఎల్రక్టాన్లు ఫ్యూయల్ సెల్లోకి వెళ్లవు. ప్రత్యేక సర్క్యూ ద్వారా ప్రవహిస్తాయి. ఇదే రైలు ముందుకు కదలడానికి సాయపడుతుంది. ఫ్యూయల్సెల్లోకి వచ్చే ప్రోటాన్లు అనేవి బయటి గాలి నుంచి వచ్చే ఆక్సీజన్తో ఎల్రక్టానిక్ రసాయన చర్య జరిపి విద్యుత్ను, నీటి ఆవిరిని ఉత్పత్తిచేస్తాయి. ఈ నీటి ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. విద్యుత్ మాత్రం అక్కడే ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను ముందుకు కదిలేలా చేస్తాయి. రైలు ఒకవేళ నెమ్మదిగా వెళితే ఆ సమయంలో ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ద్వారా జనించిన విద్యుత్ అనేది రైలులో అమర్చిన భారీ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుంది. ఇది అవసరమైన వేళల్లో హఠాత్తుగా రైలు వేగం పెరిగేందుకు సాయపడుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో ఈ రైలు పనిచేస్తుందని శివనాడార్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ హర్ప్రీత్ సింగ్ అరోరా చెప్పారు. ఓవర్హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగల నుంచి వచ్చే విద్యుత్తో విద్యుత్ ఆధారిత రైలు పనిచేస్తాయి. కానీ హైడ్రోజన్ రైళ్లలో అత్యధిక పీడనంతో నింపిన హైడ్రోజన్ ఈ ప్రోటాన్ ఎక్సే్ఛంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ విధానంలో ఆక్సీజన్తో చర్య జరిపి అటు విద్యుత్ను, ఇటు నీటి ఆవిరిని, పరిమిత స్థాయిలో వేడిమిని అందిస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ మేథోసంస్థలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మౌష్మీ మొహంతీ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోటా తన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు మరో ప్రశ్నపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతిక విప్లవం నడిపించబోతోంది?..ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులనే సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి.👉ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా, శాస్త్రవేత్తలా పరిశోధనలు చేయడం, ఇంజినీర్లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.👉ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI). ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.👉భవిష్యత్తులో మరో కీలక మార్పు ‘ఎంబాడీడ్ ఏఐ’ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా, మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పని చేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు-కంప్యూటర్ అనుసంధానం (Brain-Computer Interface), జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతిక విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే, మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే.. భవిష్యత్తులో ఏజీఐ, ఎంబాడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.:::వెబ్ ప్రత్యేకం -
మళ్లీ గోల్డెన్ డేస్!
రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు కొంతకాలంగా వినియోగదారులను కొనుగోళ్లకు దూరం ఉంచాయి. అయితే ఇటీవల ధరల మంట కొంతమేర చల్లబడడంతో దేశీయ జ్యువెలరీ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. డాలర్ల వినియోగం కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కస్టమ్స్ డ్యూటీ కారణంగా కొన్నినెలలు మందగించిన జ్యువెలరీ డిమాండ్ ఇప్పుడు వేగంగా పుంజుకుంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ధరల తగ్గుదలతో పాటు, భారతీయ కుటుంబాల్లో ప్రతి శుభకార్యానికి బంగారానికి ఉన్న సాంస్కృతిక బంధం జ్యువెలరీ మార్కెట్ను మళ్లీ పరుగులు తీయిస్తోంది. బంగారం దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 6–15 శాతానికి పెంచిన తర్వాత కొనుగోలుదారులు నగల షాపింగ్కు బ్రేక్నిచ్చారు. వేచిచూసేధోరణి అవలంబించారు. ఇటీవల బంగారం భారీగానే తగ్గడంతో ప్రస్తుత ధరల వద్ద తిరిగి కొనుగోలు చేసేందుకు మార్కెట్లో అడుగుపెడుతున్నారని ప్రముఖ ఆభరణాల సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రా. బంగారం ధర చారిత్రక గరిష్టస్థాయి రూ.1,85,000 తాకిన తర్వాత తిరిగి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఒక్క జూన్ నెలలోనే బంగారం ధర 8% కన్నా తగ్గడం నగల ప్రియులకు ఊరటనిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జువెలరీ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్పై ఆశలు బంగారం డిమాండ్ 70%కి పైగా పడిపోయినప్పటికీ ధరలు కొంత తగ్గిన తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, మార్కెట్లో ఫుట్ఫాల్స్ పెరగడం, నగల విక్రయాలు పుంజుకోవడం జ్యూవెలరీ రంగానికి మళ్లీ మంచిరోజులొచ్చాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు.కొన్ని నెలలుగా అమ్మకాలు తగ్గి వెలవెలబోయిన జ్యువెలరీ పరిశ్రమ ఇప్పుడు వచ్చే శ్రావణం, దసరా, దీపావళి, వివాహాల సీజన్పై భారీ ఆశలు పెట్టుకుంది. అధిక ధరల కారణంగా తక్కువ వెయిటేజ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వైపు మళ్లిన వినియోగదారులు మళ్లీ మేలిమి బంగారు నగలు, సంప్రదాయ ఆభరణాల కొనుగోలుకు ఉత్సాహం చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. భారతదేశంలో బంగారం కొనడం కేవలం పెట్టుబడే కాదు, సంప్రదాయం కూడా. మార్కెట్ బలంగా కోలుకుంటోందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొంటున్నారు. రానున్న పండుగ సీజన్ ఆభరణాల మార్కెట్కు మళ్లీ బంగారు కాంతులు తెస్తుందని ఆశిస్తున్న రిటైలర్లు షాపుల విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నారు. టైటన్ కొత్తగా 77 స్టోర్లను, కల్యాణ్ జ్యూవెలర్స్ 524 స్టోర్లకు నెట్వర్క్ను విస్తరించింది. దూసుకెళుతున్న జ్యువెలరీ షేర్లు క్యూ1 ఫలితాలపై అంచనాలు, పెరుగుతున్న అమ్మకాలు, కొత్త స్టోర్ల విస్తరణతో ఆభరణాల కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. బ్రోకరేజ్ సంస్థల బయ్ రేటింగ్స్ కూడా ర్యాలీకి కారణం.→ కల్యాణ్ జ్యువెలర్స్: షేరు ధర 10 రోజుల్లో 68 శాతం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం 38 శాతం పెరిగింది. బుధవారం షేరు రూ.548 వద్ద ముగిసింది. → టైటాన్: కంపెనీ షేరు ధర ఆల్టైం గరిష్ట స్థాయిని తాకింది. తని‹Ù్క జ్యువెలరీ విభాగంలో 39 శాతం వృద్ధి నమోదు కావడంతో షేరు పరుగులు పెడుతోంది. బుధవారం రూ.4,579 వద్ద ముగసింది. → సెన్కో గోల్డ్: కొత్తగా 8 స్టోర్లను ప్రారంభించడంతో స్టాక్ బలంగా పుంజుకుంది. షేరు రూ.373 వద్ద ముగిసింది. → తంగమయిల్ జ్యువెలరీ: షేరు జీవితకాల గరిష్టాన్ని చేరింది. నెలరోజుల్లో స్టాక్ 30% పైగా లాభపడింది. రూ.6,618 వద్ద ముగిసింది. → స్కైగోల్డ్ అండ్ డైమండ్స్: షేరు ధర కొత్త రికార్డు స్థాయిని తాకింది. బుధవారం రూ.630 వద్ద ముగిసింది. కొత్త డిజైన్లకు ఆదరణ కొత్తతరం కస్టమర్లు కేవలం బంగారం బరువు కన్నా డిజైన్, ఫ్యాషన్, రోజువారీ వినియోగానికి అనువైన నగలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతరం కస్టమైజ్డ్ ఆధారిత కలెక్షన్లు, డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ, లైట్ వెయిట్ నగలను ఇష్టపడుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విపత్తులు వచ్చి.. 'లైఫ్ పాడ్' అవకుండా..
సునామీలు ముంచెత్తినా.. భూకంపాలు భయపెట్టినా బిందాస్గా ఉండొచ్చు.. బుల్లెట్లు కాల్చినా.. బాంబులు పేల్చినా.. బాల్టీ తన్నేయకుండా బేఫికర్గా జీవించొచ్చు..అది అవదమ్మ అంటారా.. అలా అవ్వాలంటే మీరా డబ్బులు ఖర్చు పెట్టి.. ముందు ఓ లైఫ్ పాడ్ను కొనాలి.. ఇంతకీ ఏంటిది? యుద్ధ పరిస్థితులు, ఉగ్రదాడులు, వరదలు, సునామీలు, భూకంపాలు.. ఇలా ప్రకృతి లేదా మానవుడు సృష్టించిన ఉత్పాతాల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఫ్రాన్స్కు చెందిన మొమెంటం టెక్నాలజీస్ సంస్థ ‘లైఫ్ పాడ్’లను అభివృద్ధి చేసింది. వీటిని అత్యంత బలమైన లోహాలతో తయారుచేశారు. తరలించడం కూడా తేలిక. పైగా.. వివిధ రకాల విపత్తులకు అనుగుణంగా మూడు రకాల పాడ్లను రూపొందించారు. డబ్ల్యూ–1 ఆకస్మిక వరదలు, ఆనకట్టలు తెగిపోవడం, సునామీలు వంటి వాటి కోసం తయారుచేశారు. ఇది తేలియాడే క్యాప్సూల్లాంటిది. ఇద్దరు నుంచి నలుగురు ఉండొచ్చు. నీళ్లలో వినియోగానికి అనుగుణంగా దీన్ని అత్యంత మన్నికైన అల్యూమినియంతో చేశారు. పెద్ద పెద్ద శిథిలాల్ని ఢీకొట్టినా తట్టుకుంటుంది. ప్రస్తుతం ఇది తుది దశలో ఉందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.38 నుంచి 45 లక్షల దాకా ఉండే అవకాశముంది. బీ–1 ఉగ్రదాడులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించారు. ఇద్దరు ఉండొచ్చు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే దీని లోపలికి వెళ్లి లాక్ చేసుకునేలా తయారుచేశారు. పరిశ్రమలు, భద్రత దళాలు ఉండే ప్రాంతాల్లో వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రొటోటైపు రెడీగా ఉంది. దీని ధర రూ.32 లక్షలు. క్యూ–1 భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాల్లో ప్రాణాలకు కాపాడేందుకు దీన్ని తయారుచేశారు. ఇల్లు లేదా అపార్టుమెంటు నుంచి బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఇది రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చు. దీని ధర ఇంకా ప్రకటించలేదు. ఇటీవల పారిస్లో జరిగిన వివాటెక్ ప్రదర్శనలో ఈ మూడు లైఫ్ పాడ్లను కంపెనీ అధినేత సెడ్రిక్ ఆవిష్కరించారు. అయితే ఇవన్నీ ఉన్నా.. ప్రాణాలు పోతేనో అని మూల‘శంక’ మాస్టారు ఒకరు డౌట్ రైజ్ చేశాడు.. అంతే.. సెడ్రిక్.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ....... – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
‘ఆ నలుగురు’రానిది జీవితమా?
చనిపోయాక పాడె మోసే ‘ఆ నలుగురు’రాకపోతే జీవితానికి అర్థమే లేదు. ఇతిహాసాలు, పురాణాలు, పెద్దలు..ఏనాడో విడమరచి చెప్పిన జీవిత పరమార్థం ఇది.. దానిని విస్మరిస్తే జరిగేదేమిటో చెప్పడానికి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన నరరూప రాక్షసుడు రాజ్కుమార్ ఉదంతమే నిఖార్సయిన నిదర్శనం. రాక్షసుడు అనాథ శవంగా చితి మంటల్లో కాలిపోయినా.. పుట్టినిల్లు, మెట్టినిల్లు, పక్కింట్లో కూడా విషాద జ్వాలలు రగిల్చిపోయాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మలను కిరాతకంగా రాజ్కుమార్ హతమార్చాడు. బాధితులకు ఏ వ్యవస్థా న్యాయం చేయలేదు. పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేదు. ఆన్లైన్ బెట్టింగ్ గేములు, అప్పుల ఊబి, విచ్చలవిడి వ్యసనాలు, అక్రమ సంబంధాలతో కొందరు దారి తప్పి ఉన్మాదులుగా మారుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం నేరం జరిగిన తర్వాత స్పందించడం కాదు. క్షేత్రస్థాయిలో వ్యసనాల అదుపు, కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నేరగాళ్లపై తక్షణ కఠిన చర్యలు తీసుకునే నిరంతర నిఘా వ్యవస్థలు సమాజంలో అత్యవసరంగా పెరగాలి. అనాథగా కాలిపోయిన ఉన్మాదం రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాక, అతని మరణవార్త విన్నాక..సమాజంలో ఎక్కడా ’అయ్యో పాపం’అనే మాట వినిపించలేదు. పుట్టిన ఊరికి అతని శవాన్ని తేవద్దని గ్రామస్తులు నినదించగా, కన్న తల్లిదండ్రులు సైతం కడచూపు చూసేందుకు నిరాకరించారు. చివరకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి అనాథ శవంలా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. పాపం పండిన రోజున ఉన్మాదికి దక్కిన శాస్తి ఇది. వ్యవస్థ వైఫల్యం.. పోక్సో చట్టంలో లొసుగులు ఈ రక్తపాతానికి పోలీసుల నిర్లక్ష్యం, నిఘా లోపమే ప్రధాన కారణం. పోక్సో కేసు నమోదై, నిందితుడు బెయిల్పై బయట తిరుగుతున్నప్పుడు అతని కదలికలపై నిరంతర నిఘా ఉంచడంలో స్థానిక పోలీసులు, ఇంటెలిజె¯న్స్ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. బాధితులకు తగిన రక్షణ కల్పించలేకపోయారు. ఈ తీవ్ర నిర్లక్ష్యానికి కారణమైన సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, జరగాల్సిన ఘోరం జరిగిపోయాకే ఈ చర్యలు చేపట్టడం వ్యవస్థలోని అసమర్థతను ఎత్తిచూపుతోంది. బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి తెచ్చిన కఠినమైన పోక్సో చట్టంలో పోలీసులు ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే బలహీనమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఇక్కడ అతిపెద్ద లోపం. చట్టపరమైన లొసుగులు, అవినీతి వల్లే నేరగాళ్లకు చట్టం పట్ల భయం పోతోంది. డబ్బు వెదజల్లి సెక్షన్లు మార్చుకుని, బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చి బాధితులపై పగ తీర్చుకునే అవకాశం లభిస్తోంది. కామాంధులకు, ఉన్మాదులకు ఇలాంటి చట్టపరమైన లొసుగులు వరంగా మారకూడదు. మరోవైపు నిందితుడు అప్పులు చేస్తూ, జులాయిగా తిరుగుతూ భార్యాపిల్లలను, కన్నవారిని వేధిస్తున్నాడని తెలిసినా చుట్టుపక్కల సమాజం, పంచాయతీలు, బంధుమిత్రులు ఎందుకు నిలదీయలేకపోయారు? సమాజంలో పెరుగుతున్న ఈ ’మనకెందుకులే’అన్న ఉదాసీన ధోరణే ఇలాంటి ఉన్మాదులకు పరోక్షంగా ఊతమిస్తోంది. సైకోలపై నిఘా, సోషల్ ప్రొఫైలింగ్ ఎప్పుడు? మానసిక అనారోగ్యాన్ని ఒక జబ్బుగా గుర్తించే భావన మన దేశంలో లేదు. ఒక వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తున్నా అది సాధారణ గొడవగానే కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వపరంగా సైకోథెరపీ క్లినిక్లు, మానసిక విశ్లేషణ కేంద్రాలు కిందిస్థాయి వరకు అందుబాటులో లేవు. తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో సైతం మానసిక వైద్య సేవలు నామమాత్రంగానే ఉన్నాయి. నేర ప్రవత్తి ఉన్నవారిని గుర్తించి, వారికి బలవంతంగానైనా మానసిక చికిత్స అందించే క్లినిక్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో మన దగ్గర కూడా నేర చరిత్ర, హింసాత్మక ప్రవృత్తి ఉన్న వారిపై ’సైకో–సోషల్ ప్రొఫైలింగ్’, ఎల్రక్టానిక్ ట్యాగింగ్ వంటి నిరంతర నిఘా వ్యవస్థలు రావాలి. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మానసిక చికిత్సా కేంద్రాలు (సైకోథెరపీ క్లినిక్లు) ఏర్పాటు చేసి, నేర ప్రవృత్తి గలవారికి కౌన్సెలింగ్ అందించాలి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్పై ఎలాంటి ప్రభావం?భారత్కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
ఏ'మీ మాంస'కృత్తులు?
సాక్షి స్పెషల్ డెస్క్ : ప్రొటీన్ అనే పదం ఇటీవల బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం కాపాడుకోవడంపై పెరుగుతున్న ఆసక్తి, వివిధ మాధ్యమాల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం. ఫిట్నెస్ ప్రియులు మొదలుకుని అంతోఇంతో ఆరోగ్య స్పృహ ఉన్నవారు సైతం ప్రొటీన్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. కొందరు వైద్యులు కూడా ఈ ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. మధుమేహానికి మూల కారణమైన కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించాలని, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. ప్రొటీన్ కండరాల పెరుగుదలకు, బలమైన ఎముకలకు దోహద పడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పుధాన్యాల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధను సొమ్ము చేసుకోవడానికి మార్కెట్ శక్తులు పావులు కదుపుతున్నాయి. ప్రొటీన్ కోసం ఏం తినాలి అనే విషయంలో కొంత తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. ప్రొటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాల మీదకు దృష్టిని పోనివ్వకుండా తక్కువ ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ‘సూపర్ ఫుడ్’పేరిట ప్రాచుర్యంలోకి తేవడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్ విషయంలో కొన్ని అపోహలు, అసలు వాస్తవాలను ఒకసారి తెలుసుకుందాం. అపోహలు, వాస్తవాలుఅపోహ: శాకాహారం అంత ప్రభావవంతంగా ఉండదు వాస్తవం: శాకాహారం నుంచి అందే ప్రొటీన్లతో కండరాలను పెంచుకోవడం సాధ్యం కాదని, ఆరోగ్య పరిరక్షణకు అంతగా దోహదపడదనే అభిప్రాయంలో ఏ మాత్రం నిజం లేదు. మొక్కల ప్రోటీన్లు అసంపూర్ణంగా (అన్ని రకాల అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లను తయారు చేయడానికి సహాయపడే ప్రాథమిక అణువులు) లేకపోవడం) ఉంటాయనేది నిజమే. కానీ అన్ని రకాల అమైనో ఆమ్లాలను ఒకే ఆహార పదార్థం నుండి పొందవలసిన అవసరం లేదు. ధాన్యాలు, పప్పుధాన్యాలు, నట్స్ (గింజలు), విత్తనాలను కలిపి లేదా మార్చి మార్చి వినియోగించడం ద్వారా సంపూర్ణమైన అమైనో యాసిడ్లను పొందవచ్చు. అపోహ: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే కండరాలు వాటంతట అవే పెరుగుతాయి వాస్తవం: ప్రొటీన్ కండరాల నిర్మాణం, మరమ్మతు, జీవక్రియలకు మూలమే. కానీ అది ఒక్కటే సరిపోదు. ప్రొటీన్తో పాలు అవసరమైన మేరకు కేలరీలు, వ్యాయామం కూడా అవసరం. అపోహ: శరీరం ఒక భోజనంలో కేవలం 30 గ్రాముల ప్రొటీన్ మాత్రమే తీసుకోగలుగుతుంది వాస్తవం: మనిషి తీసుకునే ప్రొటీన్ అంతటినీ శరీరం గ్రహిస్తుంది. అయితే కండరాల ప్రొటీన్ సంశ్లేషణ విషయంలో మాత్రమే 30 నుంచి 40 గ్రాముల పరిమితి ఉంది. కానీ కండరాల ఉత్తేజితానికి పోగా మిగతా ప్రొటీన్ శరీర క్రియల నిర్వహణ, కణజాలం పరిరక్షణతో పాటు పని చేయడానికి అవసరమైన శక్తిగా ఉపయోగపడుతుంది. అపోహ: ప్రొటీన్ తీసుకుంటే సరిపోతుంది.. వాస్తవం: ప్రొటీన్ తీసుకోవడం మంచిదే అయినా అది ఒక్కటే సరిపోదు. పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే ఆహారం కూడా అవసరం. అపోహ: బాదం గింజలు తీసుకుంటే చాలు. రోజూ ఉదయం గుప్పెడు బాదం పప్పులు తింటే శరీరానికి తగినంత ప్రొటీన్ అందుతుంది. వాస్తవం: గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్), సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కానీ వీటిలో ప్రొటీన్ ఒక మోతాదులోనే ఉంటుంది. సమృద్ధిగా ఉండదు. వందగ్రాముల బాదం పప్పుల్లో 21 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే 570 మైక్రోగ్రాములకు పైగా కేలరీలు, 50 గ్రాముల కొవ్వులు కూడా ఉంటాయి. శరీరానికి అవసరమైన 30 గ్రాముల ప్రొటీన్ బాదం గింజల ద్వారా అందాలంటే ఆ బాదంతో పాటు అందిన 800 కేలరీలను వ్యాయామం లేదా ఇతర దైనందిన కార్యకలాపాల ద్వారా ఖర్చు చేయాలి. అపోహ: వ్యాయామం తర్వాత టేబుల్ స్పూన్ పీనట్ బటర్ తింటే ప్రొటీన్ సమృద్ధిగా అందుతుంది. వాస్తవం: పొట్టుతీయని గింజలతో పోలిస్తే పీనట్ బటర్ కొవ్వు నిండిన ఆహారం అనే చెప్పాలి. టేబుల్ స్పూన్ పీనట్ బటర్లో 3.5 లేదా 4 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అదే సమయంలో దాదాపు 100 కేలరీలు, 8 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఇది మంచి శక్తినిచ్చే ఆహారమే, కానీ ప్రొటీన్ పుష్కలంగా లభించే ఆహారం కాదు. అపోహ: స్మూతీల్లో ఒక స్పూన్ చియా విత్తనాలు కలిపితే శరీరానికి తగినంత ప్రొటీన్ అందినట్లే. వాస్తవం: చియా సీడ్స్ పోషకాల పరంగా ఒక అద్బుతం. అయితే ఇందులో బాగా ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జీర్ణమయ్యే పీచు, క్యాల్షియం. టేబుల్ స్పూన్ (సుమారు 12 గ్రాములు) చియా సీడ్స్లో కేవలం 2 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి కానీ ప్రొటీన్ కోసం కాదు. అపోహ: మాంసం కంటే బ్రోకలీలో ప్రొటీన్ ఎక్కువ. వాస్తవం: ఇది అందమైన పదాలతో తప్పుదోవ పట్టిస్తున్న సమాచారం. బ్రోకలీలో కేలరీలు, ప్రొటీన్ల నిష్పత్తిని బేరీజు వేస్తూ చెబుతుంటారు. కానీ నిజా నికి బ్రోకలీలో కేలరీలు దాదాపుగా లేనట్లే. అలాగని 30 గ్రాముల ప్రొటీన్ల కోసం బ్రోకలీ తినాలంటే రోజుకు కిలోకు పైగా పచ్చి బ్రోకలీ తినాలి. బ్రోకలీని విటమిన్లు, పీచు కోసం తినాల్సిందే. ప్రొటీన్ కోసం బ్రోకలీ అనేది హాస్యాస్పదం. అపోహ: వరి అన్నం బదులు క్వినోవా అన్నం తినడం వల్ల ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అందుతుంది. వాస్తవం: క్వినోవా 9 రకాలైన అమైనో యాసిడ్లు అందే ప్లాంట్ ప్రొటీన్ ఉన్న అద్భుతమైన ఆహారం. గింజల్లో ఇలా సమగ్రమైన ప్రొటీన్ అరుదు. కానీ ఇది ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆహారం. వంద గ్రాముల క్వినోవా అన్నంలో 4.4 గ్రాముల ప్రొటీన్ ఉంటే 21 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. దేనిలో ఎంత ప్రొటీన్ ఉంది? 1. చికెన్ ఛాతీ: వంద గ్రాముల చికెన్ (ఛాతీ) బ్రెస్ట్లో 31 గ్రాములు ప్రొటీన్ ఉంటుంది. 2. పనీర్: వంద గ్రాముల పనీర్లో 18 నుంచి 23 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 3. పెద్ద కోడిగుడ్డు: ఇందులో ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. తెల్లసొనలో ప్రొటీన్, పసుపు సొనలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. 4. సోయా ముక్కలు: వందగ్రాముల ఎండిన సోయా ముక్కల్లో (చంక్స్/మీల్మేకర్) 52 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులో అమైనో యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. 5. పప్పుధాన్యాలు: ఉడికించిన వందగ్రాముల పప్పులో పీచుతో కూడిన ప్రొటీన్ 9 గ్రాములు ఉంటుంది. ఏం తింటే మంచిది? మార్కెట్ మాయాజాలంలో పడకుండా ఆహారంలో ఏమేమి ఉండేలా చూసుకోవాలనేది.. ఎవరికి వారు తమ దైనందిన కార్యకలాపాలు, వ్యాయామం, వయసు, శరీరం తీరు, జీవక్రియల తీరు ఆధారంగా నిర్ణయించుకోవాలి » కొవ్వు లేని మాంసం, చేపలు, గుడ్లు, పనీర్, టోఫు (సోయా పనీర్), సోయా తగిన పాళ్లలో ఉండాలి. » గింజలు, కాయధాన్యాలు, క్వినోవా, ఆకు కూరలు, కూరగాయలతో సమతుల ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, సమగ్రమైన కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
ట్రెంపరితనం తెచ్చిన తంటా!
అగ్రరాజ్యం అమెరికా ఏకాకి అవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగా గుదిబండలవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అంటున్నారు జాన్ ఫైనర్. న్యూయార్క్టైమ్స్ పత్రికలో ఈయన రాసిన కథనం ప్రకారం అధ్యక్షుడి తెంపరితనం కాస్తా పౌరులకు వందల కోట్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. మిత్రదేశాలనూ వదలకుండా చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యేందుకు కారణమవుతోందని విశ్లేషిస్తున్నారు.అధ్యక్షుడిగానే కాదు.. అంతకుముందు కూడా డొనాల్డ్ జే ట్రంప్ వైఖరి వివాదాస్పదమే. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కావచ్చు. వివాహం, అక్రమసంబంధాలు, పన్నులు ఎగ్గొట్టడం.. ఇలా బోలెడన్నిసార్లు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఈ వివాదాల జోరు మరింత పెరిగిందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(మాగా) నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాక అక్రమ వలసదారులు, టారిఫ్లు, వీసాల వంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు విమర్శలకు గురయ్యాయి.ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ ఈ తెంపరి నిర్ణయాల తాలూకూ ఆర్థిక భారంపై వివరణాత్మక విశ్లేషణ ఒకటి చేశారు. దాని ప్రకారం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఇప్పటికే పెట్రోలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సుమారు 15 శాతం వరకూ పెరగ్గా, యూరియా ధర ఏకంగా యాభై శాతం ఎక్కువైంది. డీఏపీ కోసం 27 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పెంపు కాస్తా అమెరికన్లపై ఇప్పటికే సుమారు 13,200 కోట్ల డాలర్ల ఆర్థిక భారం మోపిందని అంచనా. తగ్గిన పర్యాటకులు, విద్యార్థులు... కఠిన వీసా నిబంధనలు అమలు చేయడం, యుద్ధభయం వంటి కారణాలతో అమెరికాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025లో అమెరికాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య సుమారు 40 లక్షలు తక్కువ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 800 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కలేస్తున్నారు. వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్తోపాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకు కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు మళ్లుతూండటం గమనార్హం. ఫలితంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17 శాతం తక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2026కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదు కానీ ఈ ఏడాది తగ్గుదల సుమారు 10 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. ఫలితంగా ఏటా కనీసం వంద కోట్ల డాలర్ల నష్టం ఉండొచ్చని తెలుస్తోంది. యూరప్తో మిలటరీ సంబంధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే అమెరికా, నాటోల మధ్య విపరీతమైన అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్ ఒంటెత్తు పోకడను పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి. దీని ఫలితం సుస్పష్టం. 2025లో యూరోపియన్ దేశాలు మిలటరీపై పెట్టిన ఖర్చులు 14 శాతం వరకూ అంటే సుమారు 86,400 కోట్ల డాలర్లకు చేరినా అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోళ్లు సగానికి తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా పొరుగున ఉన్న కెనడా 15,000 కోట్ల డాలర్లతో యూరోపియన్ డిఫెన్స్ ఫండ్లోకి చేరిపోయింది.చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా ఏఐ వంటి కీలక టెక్నాలజీల విషయంలో దేశీ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీల్లో మెరుగైన వాటిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమెరికాకు దూరంగా జరుగుతున్నట్లు, ఇందుకు ట్రంప్ తీరు, అమెరికా ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, వాణిజ్య వైరాలు, కృత్రిమ మేధ విషయంలో అస్పష్ట వైఖరి, విధానాలు కారణమని కాలమిస్ట్ ఫైనర్ విశ్లేషించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విపత్తు వస్తే ఇల్లు దాక్కుంటుంది!
ఈ మధ్య యూరోపియన్ దేశాలను కార్చిచ్చులు కాల్చిపారేస్తున్నాయి. మూడు రోజుల క్రితం స్పెయిన్లోని ఓ పర్యాటక ప్రదేశంలో కార్చిచ్చు కారణంగా 17 మందికిపైగా మరణించారు. కార్చిచ్చు మాత్రమే కాదు తుపాన్లు చుట్టుముట్టినా ఈ ఇంటికి ఏమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయని తెలిస్తే చాలు ఇల్లు మొత్తం నేల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గొయ్యిలోకి దిగిపోతుంది. అమెరికన్ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుతం పేరు ‘హైబర్ టెక్ హోమ్స్’. మీరు ఎక్కడున్నా ఇంటిని భూమి లోపలికి పంపించేసేందుకు యాప్ రెడీ చేశారు. యాప్లో బటన్ నొక్కడమే ఆలస్యం హైడ్రాలిక్ గేర్ల సాయంతో ఇల్లు.. అడుగున ఉన్న బాక్స్లోకి వేగంగా జారిపోతుంది. ఇంట్లోని విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు, నీటి, మురుగునీటి వ్యవస్థలు ఆటోమెటిక్గా డిస్కనెక్ట్ అవుతాయి. ఇంటి చుట్టూ మంటలు ఆర్పేసే గ్యాస్ పనిచేసేందుకు రెడీ అవుతుంది. ఇల్లు మొత్తం లోపలకు దిగిపోగానే బాక్స్ పైకప్పు మొత్తం మూసుకుపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం 15 నిమిషాల్లో ముగిసిపోతుందని, మొత్తం వ్యవహారం గురుత్వాకర్షణ శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యుత్తు అవసరం కూడా ఉండదని దీని సృష్టికర్తలు చెప్పారు. ఇంటిని ఒక బంకర్లా వాడుకోవడం కుదరదు. విపత్కర పరిస్థితుల్లో ఇంటిని కాపాడొచ్చుగానీ ఆ సమయంలో ఇంట్లో ఉండేందుకు వీలుండదని ఇంజినీర్లు స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశం నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే నెలల్లో దేశం మరో తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (NOAA) హెచ్చరించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య 81 శాతం అవకాశంతో 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో'గా మారవచ్చని తాజా బులెటిన్లో వెల్లడించింది. ఈ పరిణామం భారత్లో వర్షపాతం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని నినో Niño-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్ నినో దశలో ఉన్నప్పటికీ, మరో రెండు మూడు నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉందని NOAA పేర్కొంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్ నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్ నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్-డిసెంబర్ నాటికి ఇది 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో' స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని NOAA అంచనా వేస్తోంది.ఈసారి ఎల్ నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ (IITM) శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ వివరించారు. తూర్పు పసిఫిక్లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్ నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని.. 76 ఏళ్ల రికార్డు బద్ధలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకారం.. గతంలో నమోదైన బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో 60 శాతం సందర్భాల్లో సాధారణం కంటే తక్కువ లేదా లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్లో దేశవ్యాప్తంగా 40 శాతం వర్షలోటు నమోదైంది. మొత్తం సీజన్లో కూడా దీర్ఘకాల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాల వాతావరణంలోనూ కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణలో జులై రెండో వారంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువ. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, కోస్తా జిల్లాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.అయితే ఎల్ నినో అంటే కేవలం వర్షాభావమే కాదు. సముద్రాల వేడి పెరగడం వల్ల గాలిలో తేమ కూడా పెరుగుతుంది. దీంతో ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంటే, మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే వాతావరణం మరింత అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ ప్రపంచం చూసింది. 2015-16లో నమోదైన 'గాడ్జిల్లా ఎల్ నినో' ప్రపంచవ్యాప్తంగా వాతావరణ రికార్డులను బద్దలు కొట్టింది. భారత్లో 2014, 2015 సంవత్సరాలు ఈ శతాబ్దంలో అత్యల్ప వర్షపాతం నమోదైన సంవత్సరాలుగా నిలిచాయి. ఈసారి కూడా అదే స్థాయిలో తీవ్రత పెరిగితే వ్యవసాయం, జలాశయాలు, తాగునీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, ఆహారధరలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.NOAA అంచనా ప్రకారం ప్రస్తుత ఎల్ నినో 2027 వసంతకాలం వరకు కొనసాగే అవకాశం 97 శాతం ఉంది. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జులైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టంతా పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిణామాలపైనే నిలిచింది. -
ధర్మానికి ప్రతీక విదురుడు
మహాభారతంలో విదురుడు ధర్మానికి, జ్ఞానానికి ప్రతీక. విదురుడు అంబిక, అంబాలికల దాసి అయిన పరిశ్రమి కి జన్మించినప్పటికీ, తన అపారమైన మేధస్సు, ధర్మవర్తనతో కురు సామ్రాజ్యాధిపతి ధృతరాష్ట్రునికి ప్రత్యేక సలహాదారుగా, ప్రధానమంత్రిగా ఎదిగాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి ప్రముఖులు కొన్ని సందర్భాలలో విదురుని వద్దకు సలహాల కోసం సంప్రదించేవారు. విదురుడు శ్రీ కృష్ణునికి పరమ భక్తుడు, పాండవుల శ్రేయోభిలాషి.విదురుని జీవితంలో ముఖ్యాంశాలు...విదురుని జన్మరహస్యం ఒక ప్రత్యేకం. కురువంశాన్ని నిలబెట్టి, రక్షించడానికి దేవర న్యాయం ద్వారా వేదవ్యాసుడు అంబిక వద్దకు వెళ్లగా, ఆమె భయంతో కళ్ళు మూసుకోవడంతో అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఆ తర్వాత అంబాలిక భయపడి పాలిపోయినట్లు అవడంతో ఆమెకు పాండురోగంతో కూడిన పాండురాజు జన్మిస్తాడు. మూడవసారి రాణి అంబిక తన దాసి అయిన పరిశ్రమిని పంపగా, ఆ దాసి భయపడకుండా వ్యాసునికి సేవలు చేస్తుంది. దేవరన్యాయం ద్వారా ఆమెకు జ్ఞానస్వరూపుడైన విదురుడు జన్మిస్తాడు. మాండవ్య మహర్షి శాపం వల్ల భూమిపై యమధర్మ రాజు అంశ దాసీపుత్రుడిగా విదురుని పేరుతో జన్మించవలసి వచ్చింది. మొదటి నుండి విదురుడు ఎంతో సత్ ప్రవర్తన కలిగిన వాడు. మహాభారతంలో అత్యంత నీతిపరుడిగా పేరుగాంచాడు. కురుసభలో పాండవులకు జరిగిన అన్యాయాలను, ద్రోహాలను ఖండించాడు. విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులను ‘విదుర నీతి’ అని పిలుస్తారు. ఈ నీతి అత్యంత ప్రాచీనమైన, విలువైన జీవిత సత్యాలను బోధిస్తుంది. విదురునికి ప్రారంభం నుండి కృష్ణ భక్తి ఎక్కువ. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ఎంతో ప్రయత్నించాడు. ఇందుకోసం ద్వారక నుండి రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణుడు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని తోసిపుచ్చి, ధర్మ కోవిదుడైన విదురుని ఇంటే బస చేసి ఆతిథ్యం స్వీకరించాడు. యుద్ధం అనివార్యం అయినప్పుడు విదురుడు కౌరవ పక్షం వహించలేదు. విదుర నీతిలోని ముఖ్యాంఖాలు వచ్చేవారం.... – సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
స్మాల్, మిడ్ క్యాప్లలో పెట్టుబడి అవకాశాలు
చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 ఇండెక్స్లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి. గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.ప్రధానంగా నాలుగు సూత్రాలు.. ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్ఫోలియోను మారుస్తుంటారు. ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.ఇదే సరైన సమయం ఎందుకు అంటే మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్. వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ -
సర్జరీ లేకుండా పేస్మేకర్
గుండె సమస్యలకు చెక్ పెట్టి అది సక్రమంగా కొట్టుకునేలా చేసేందుకు వాడే పేస్మేకర్ అమర్చేందుకు ఇక శస్త్రచికిత్స అవసరం లేదు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్తోనే పనిచేసే పేస్మేకర్ ఒకదాన్ని అభివృద్ధి చేయడం ఇందుకు కారణం. సూక్ష్మస్థాయి అల్ట్రాసౌండ్ ట్రాన్స్డ్యూసర్లు కలిగి ఉండే ఈ సరికొత్త పేస్మేకర్ను ఛాతీపై ఎడమవైపు రొమ్ము కింది భాగంలో అతికించుకుంటే చాలు గుండె ఎలక్ట్రికల్ సిగ్నళ్ల సమస్యలు, కొట్టుకునే పద్ధతిలో తేడాలను సరిచేయవచ్చు. అయితే ఈ పేస్మేకర్ విడుదల చేసే అ్రల్టాసౌండ్ సంకేతాలను గుర్తించేందుకు గుండె కణాలు కొన్నింటిని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ‘ఎంఎస్సీఎల్జీ22ఎస్’పేరున్న అయాన్ ఛానల్తో గుండె కణాల్లో మార్పులు చేసి రక్తం లేదా నేరుగా గుండె కండరాలకు అందజేస్తారు. ఈ కణాలు అ్రల్టాసౌండ్ సంకేతాలకు స్పందించి గుండె ఒక క్రమ పద్ధతిలో కొట్టుకునేలా చేస్తుంది. శబ్ధం(అ్రల్టాసౌండ్), జెనిటిక్స్(కణాల్లో మార్పులకు) రెండింటినీ ఉపయోగిస్తున్నందున ఈ పద్ధతికి సోనోజెనిటిక్స్ అని పేరు. ఇంకోలా చెప్పాలంటే గుండె కణాలు శబ్దాన్ని వినేలా చేస్తారు. ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించి సత్ఫలితాలు సాధించారు. అ్రల్టాసౌండ్ శబ్ధాలకు గుండె కణాలు ఒక క్రమ పద్ధతిలో కొట్టుకున్నాయి. జంతువుల్లోనూ గుండె పనితీరు మెరుగైనట్లు గుర్తించారు. ఎలుకలు, పంది గుండెలకు అమర్చిన ఈ సరికొత్త పేస్మేకర్లు ఎనిమిది నెలలపాటు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేశాయి. మరిన్ని పరీక్షల ద్వారా ఫలితాలను నిర్ధారించుకుంటే మరికొన్నేళ్లలోనే పేస్మేకర్ అమర్చేందుకు శస్త్ర చికిత్స చేయాల్సిన శ్రమ తప్పిపోనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాత్రి సూర్యుళ్లు వచ్చేస్తున్నారు!
పగలంతా సూర్యకాంతి.. రాత్రయితే చీకటి. ఇదీ ప్రకృతి ధర్మం. అయితే దీన్ని మార్చేస్తా అంటోంది రిఫ్లెక్ట్ ఆర్బిటల్. రాత్రిళ్లు కూడా సూర్యుళ్లను వెలిగిస్తాను అంటోంది. రాత్రిపూట సూర్యుడేంటి అని ఆశ్చర్యపోవద్దు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రతిపాదిస్తున్నది నేరుగా సూర్యుడిని రాత్రిపూట వెలిగే చేస్తానని కాదు. భూమి చుట్టూ భారీ అద్దాలు అమర్చి ఎక్కడ కావాలంటే అక్కడ సూర్యుడి వెలుగు ప్రతిఫలించేలా చేస్తానూ అని. నిజానికి ఏడాది క్రితం ఇదే ఐడియాతో కంపెనీ ఏర్పాటైంది కానీ తాజాగా అమెరికా సమాచార, ప్రసార విభాగం ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పచ్చజెండా ఊపడంతో కంపెనీ ఆలోచన మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఈ కంపెనీ ప్రణాళిక ఏమిటి? లాభాలున్నాయా? అల్యూమినియం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ లోహాన్ని ఫుడ్ ప్యాకేజింగ్ మొదలు చాలాచోట్ల వాడుతూంటారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కూడా అత్యంత పలుచటి అల్యూమినియం పొరలనే అద్దాలుగా మార్చి భూమి చుట్టూ పెడతానని చెబుతోంది. కాకపోతే ఒక్కో అద్దం అరవై అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉంటుంది. భూమికి సుమారు 680 కిలోమీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ముందుగా ఎరిన్డిల్–1 పేరుతో తయారు చేసిన ఒక ఉపగ్రహం ద్వారా ఒక్క అద్దాన్ని అక్కడి వరకూ పంపించి పరీక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాత 2035 నాటికల్లా దశలవారీగా భూమి చుట్టూ కనీసం 50 వేల అద్దాలు ఏర్పాటు తిరిగేలా చేస్తారు. ఒక్కో అద్దం భూమివైపునకు మళ్లితే ఐదు చదరపు కిలోమీటర్ల మేర వెలుగులు నిండుతాయి. పోలిక కావాలంటే... హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దాదాపు 2,300 ఎకరాలు ఉంటుంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అద్దం ఒకటి దీంట్లో సగం ప్రాంతాన్ని వెలుగుతో నింపేయగలదు. ఉపయోగాలేమిటి? కంపెనీ చెబుతున్నదాని ప్రకారం బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యుడి వెలుగు రాత్రిళ్లు కూడా అందుబాటులోకి వస్తే పంటలు డబుల్ స్పీడ్తో ఎదుగుతాయి. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చోట జనరేటర్ల అవసరం లేకుండా రాత్రిళ్లూ పనులు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టవచ్చు. విలువైన ప్రాణాలు కాపాడవచ్చు. ఏ అద్దాన్ని ఎటు మళ్లిస్తే ఎక్కడ వెలుగులు పడతాయో లెక్కేసేందుకు కంప్యూటర్లు సరిపోతాయి. ఐడియా బాగానే ఉంది కానీ దీనిపై ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. 1990లలో రష్యా జన్మయా పేరుతో ఇలాంటి ప్రాజెక్టే ఒకటి చేపట్టి విఫలమైంది. అల్యూమినియం పొరలు అంతరిక్షంలో సర్రున చిరిగిపోయాయట. పైగా విశాల విశ్వాన్ని, అంతరిక్షాన్ని మధించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలకు ఈ ప్రకాశాలు పెద్ద అడ్డంకి. గాల్లో ఎగురుతూండగా అకస్మాత్తుగా వచ్చిపడే ప్రకాశం వల్ల తాము గందరగోళానికి గురవుతామని విమానాల పైలెట్లు కూడా హెచ్చరిస్తున్నారు. పక్షులు, ఇతర జీవజాతుల పరిస్థితి ఏమిటన్నది పర్యావరణవేత్తల ఆందోళన. అద్దాలను ఎటు కావాలంటే అటు తిప్పేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ సమస్యలే కావన్నది కంపెనీ వాదన. చూద్దాం ఏమవుతుందో?! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోగ్యప్రదాయిని ‘కోకో నిబ్స్’
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్య ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కోకో నిబ్స్’ గురించే చర్చ నడుస్తోంది! ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ సూపర్ఫుడ్ ఇదేనంటూ సోషల్ మీడియా చెబుతోంది. ఇంతకీ ఇదేంటంటే.. కరకరలాడే డార్క్ చాక్లెట్ ముక్కలు. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ బోలెడు ఉన్నాయని.. వాటిని రోజువారీ డైట్లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు. నిజానికి ఇవి చాక్లెట్ తయారీకి వాడే కోకో గింజల ముక్కలు. వాటిలో ఎలాంటి చక్కెరలు కలపరు.. కాబట్టి ఇవి 100 శాతం ఆరోగ్యకరమైనవి. భావోద్వేగాలను మార్చడం నుంచి గుండెను పదిలంగా ఉంచే వరకు కాకో నిబ్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు. పోషకాల గని మార్కెట్లో దొరికే ఖరీదైన సప్లిమెంట్ల కంటే కోకో నిబ్స్ వంద రెట్లు మేలైనవి. వాటిలో కండరాల పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం, ఎముకలను పటిష్టపరిచే ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే శరీర అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉంచడంలోనూ దోహదపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మంట తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. కోకో నిబ్స్లో ఫెనిలెథైలమైన్, అనండమైడ్ వంటి అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. అందుకే వాటిని సరదాగా ‘లవ్ డ్రగ్’ అని కూడా పిలుస్తారు. ఈ ‘డ్రగ్’ మెదడులో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక సహజ న్యూరోట్రాన్స్మిటర్లా పనిచేస్తుంది. కోకో నిబ్స్లోని ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలోని మంచి కొవ్వు శాతం పెరిగి గుండెపోటు ముప్పు తగ్గుతుంది.డైట్లో ఎలా చేర్చుకోవాలి? కోకో నిబ్స్ కాస్త చేదుగా, కాఫీ గింజల రుచితో కరకరలాడుతుంటాయి. వాటిని మీ మెనూలో రకరకాలుగా వాడుకోవచ్చు» బ్రేక్ఫాస్ట్లో: ఓట్మీల్, కార్న్ఫ్లేక్స్ లేదా పెరుగుపై చల్లుకొని తినొచ్చు.» స్మూతీస్లో: మిల్క్షేక్స్ లేదా స్మూతీస్లో వేస్తే అదనపు క్రంచ్ వస్తుంది.» డెజర్ట్స్ టాపింగ్: ఐస్క్రీమ్లు, కేక్లు, బ్రౌనీస్ వంటి తీపి పదార్థాలపై వాటిని వేసుకుంటే ఆ చేదు, తీపి కాంబినేషన్ అదిరిపోతుంది.» సలాడ్స్: హెల్తీ సలాడ్స్ లేదా గ్రెయిన్ బౌల్స్లో వేసుకుంటే కరకరలాడుతుంది. -
మూగబోయిన స్వర కోయిల
మైసూరు/బెంగళూరు/తెనాలి: తేనెలూరు తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశలా ఎగురవేసిన స్వర కోయిల మూగవోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్.జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన బహుభాషా గాయని ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యురాలైన ఆమె ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్హౌజ్లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవళ వర్ణ సంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవలే బోగాది నగరలోని ఎస్బీఎం లేఔట్ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12.49 గంటలకు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూల్ (బహుళ అవయవ వైఫల్యం)తో గుండెపోటుకు గురయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఆమె బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్హౌజ్లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతంకు ముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్ గ్రౌండ్స్లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆటుపోట్ల జీవితం ఎస్.జానకి తన తీయని కంఠం ద్వారా ప్రజలను ఎంతగా ముగ్ధుల్ని చేశారో ఆమె జీవితం అంతగా ఆటుపోట్లకు గురైంది. 1938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే శ్రద్ధ లేదు. బడి అంటే ఆమడదూరం వెళ్లేవారు. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం. రోడ్డుపైకి వెళ్లినపుడు లతా మంగేష్కర్ పాటలు వింటూ, తాను పాడుతూ పెరిగారు. వివిధ కారణాలరీత్యా శ్రీరామమూర్తి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. సిరిసిల్లలోనే తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమాను చూసి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో జానకి గుర్తుచేసుకున్నారు. పాటలపై కూతురుకు గల ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం ఎవరి వద్దా నేర్చుకోలేదు. గురువు గారు కీర్తనలతో ఆరంభించినా, జానకి ధ్యాసంతా సినిమా పాటలపైనే ఉండేది. అక్కడుండే ‘క్రాంతి కళామండలి యూత్ అసోసియేషన్’లో సినిమా పాటల కచేరీల్లో పాటలు పాడుతున్న కాలంలో, అమ్మ మరణంతో మళ్లీ ఆ కుటుంబం హైదరాబాద్కు చేరుకుంది.జానకి మామయ్య ‘ఫన్ డాక్టర్’చంద్రశేఖర్ వేదికపై ప్రదర్శనలిస్తుండేవారు. మధ్యమధ్యలో జానకి పాటలు పాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు వి.రాంప్రసాద్, జానకి స్వరంలోని ప్రత్యేకతను గమనించారు. కుమారుడు చేసిన సూచనతో చంద్రశేఖర్, చెన్నైలోని రెండు మూడు స్టూడియోలకు జానకి గురించి లేఖ రాశారు. ఏవీఎం స్టూడియో నుంచి ఆడిషన్కు రమ్మని కబురొచి్చంది. స్టూడియో స్టాఫ్గా ఎంపిక చేసుకున్నారు. తాను ఇష్టపడిన రాంప్రసాద్తోనే ఆమెకు 1959లో వివాహమైంది. పాటలకు సంబంధించిన ఒప్పందాలు, రెమ్యూనరేషన్, రాయల్టీలు అన్ని విషయాలు ఆయనే చూసుకున్నారు.1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన జానకి దంపతులకు ఏకైక కుమారుడు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఎక్కువకాలం కొనసాగలేదు. కోడలు ఉమ నర్తకి. దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’అవార్డు కూడా తీసుకున్నారు. ‘పాట నాకు ప్రాణం.. ప్రాణమున్నంతకాలం పాడుతూనే ఉంటాను’అంటుండే జానకి, భౌతికంగా ఊపిరి కోల్పోయినా ఆమె పాట ఇప్పటికీ, ఎప్పటికీ అభిమాన శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తుమ్మలూరు గ్రామంలోని మ్యాక్ ప్రాజెక్టులో 279 నంబర్ విల్లాను కొనుగోలు చేసి కుమారుడు మురళీకృష్ణతో ఆమె నివసించారు. ఒక ఊపు ఊపిన ‘నీ లీల పాడెద దేవా..’ ⇒ 1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో ‘విధియిన్ విళైయట్టు’తమిళ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ వెంటనే తెలుగులో ‘ఎంఎల్ఏ’సినిమా కోసం ‘నీ ఆశ అడియాశ చెయి జారే మణిపూస’పాటను ఘంటసాలతో కలిసి పాడారు. తొలిగా విషాదగీతంతో ఆరంభించినా, ఆమె సినీ కెరీర్ మధుర వెన్నెలలా కొనసాగింది. బావా మరదళ్లు సినిమాలో ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’పాటతో బిజీ అయ్యారు. ⇒ ఆ క్రమంలోనే ‘మురిపించే మువ్వలు’సినిమాలో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’పాట దక్షిణాదిని ఒక ఊపు ఊపింది. తద్వారా సినీ రంగంలో ఆమెకో ప్రత్యేక స్థానం లభించింది. వాస్తవానికి ఆ పాటను పి.లీలతో పాడించాలని నిర్ణయించారు. అంత హైపిచ్తో తాను పాడలేనని, జానకిచే పాడించమని పి.లీల సూచించారు. ఆ పాటకు అభినయించే సావిత్రి మాత్రం సుశీలతో పాడించాలని పట్టుబట్టారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు జానకి చేతనే పాడించారు. ⇒ ఇక జానకి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దిగ్గజ సంగీత దర్శకుల సంగీతానికి పాటలు పాడుతూ బిజీ అయ్యారు. మరో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు జానకి పాటను అనుకోకుండా విన్నారు. వెంటనే పూజాఫలం సినిమాలో ‘పగలే వెన్నెలా.. జగమే ఊయల’పాడించటంతో మరింత బిజీ గాయనిగా మారారు. ⇒ ఆరాధనలో ‘ఆడదాని ఓరచూపులో’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో’వంటి సూపర్ హిట్ పాటలతో జానకి సినిమా పాటల ప్రయాణం ప్రవాహంలా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లి‹Ù, సంస్కృతం, జర్మన్, జపాన్ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో అలుపెరగని కోయిల అనిపించుకున్నారు. వీటిలో 17 వేలకు పైగా సినిమా పాటలు కాగా, మిగిలినవి ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు. సొంత సంగీతంలో పాడారు. వీటితో పలు భక్తి సంగీత క్యాసెట్లు వచ్చాయి.ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ⇒ చిన్న పిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచే వారు సంగీత దర్శకులు. ‘చందమామ రావే’(1987), ‘జడ్జిమెంట్’(1990) సినిమాల్లో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పారు. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యానికి వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయస్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. ⇒ 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు (ఇందులో రెండు టెలివిజన్), ఒడిశా ప్రభు త్వ అవార్డులు లభించాయి. కలైమామణి, సుర్సింగార్, సింగర్ ఆఫ్ ది సెంచరీ, భారతీదాసన్ వంటి అవార్డులు మరికొన్ని. సంగీత ప్రపంచంలో రారా ణిగా వెలుగొందిన జానకి తమిళనాడు కోటాలో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడా గౌరవాన్ని జానకి తిరస్కరించటం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా, దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. గాయనిగా ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడో ఇస్తే ఎలాగని తిరస్కరించారని అంతా భావించారు. ⇒ ఎస్.జానకికి దైవ భక్తి ఎక్కువ. నంజనగూడులోని నంజుండేశ్వర, చాముండేశ్వరి, యోగా నరసింహస్వామి దేవాలయాల్లో తరచూ పూజలు చేసేవారు. అద్భుత సంగీత పయనం అనంతరం 2017 అక్టోబర్ 28న మైసూరు విశ్వవిద్యాలయం మానస గంగోత్రిలోని రంగమందిరంలో ఆమె తన పాటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ప్రజా వేదికల్లో పాడబోనని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారువైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్.జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్.జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తంచేశారు. జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నత గాయని జానకి అని కొనియాడారు. జానకి గానామృతం తరతరాలపాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి తెలుగు ప్రజలకు గర్వకారణం: సీఎం జానకి మృతి పట్ల సీఎం ఎ.రేవంత్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కిషన్రెడ్డి, సంజయ్, రాంచందర్రావు సంతాపం జానకి మృతి పట్ల కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన జానకి కన్నుమూశారనే వార్త విచారకరమని కిషన్రెడ్డి పేర్కొన్నారు. జానకి మరణం భారతీయ సంగీతానికి ఎంతో లోటని సంజయ్ తెలిపారు. ప్రపంచ సంగీతానికి జానకి మరణం తీరని లోటని రాంచందర్రావు పేర్కొన్నారు. జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్ జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. జానకమ్మ మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి మరణవార్త ఎంతో బాధాకరం: కేటీఆర్ జానకి మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జానకి తన బాల్యంలో కొన్నేళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?
పోక్సో కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.పోక్సో ప్రత్యేకత ఏంటి?ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.పోక్సో వచ్చాక కూడా.. బెయిల్ ఎలా?పోక్సో కేసు అంటే బెయిల్ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్ కేసులో..రాజశేఖర్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.చట్టంలో లోపమా.. అమలులో లోపమా?న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన 'స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్ అప్పట్లోనే వినిపించింది.విదేశాల్లో ఎలా ఉంటుంది?అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.బ్రిటన్లో ఎస్హెచ్పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.భారత్లో చట్టం బలహీనమా?శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.షాబాద్ ఘటన చెబుతున్న పాఠంషాబాద్ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.:::వెబ్ ప్రత్యేకం -
రోబోలు ఆపరేషన్ చేశాయి!
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హ్యూమనాయిడ్ రోబోలు (మనుషుల్లా వ్యవహరించేవి) ఒకటి కాదు.. రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాన్డియాగో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ఆపరేషన్లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్ కంట్రోలర్ సాయంతో పని చేయించి పిత్తాశయాన్ని (గాల్బ్లాడర్) తొలగించగా... రెండు హ్యూమనాయిడ్ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ రెండో ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్’జూలై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తరచూ ఇలాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులున్నాయి. మొదటగా వీటి బరువు ఇంట్యూటివ్ సర్జికల్స్ వారి డావిన్సీ సర్జికల్ సిస్టమ్ 820 కిలోల వరకూ బరువు ఉంటే సీఎంఆర్ సర్జికల్స్కు చెందిన వెరిసియస్ 450 కిలోలు ఉంటుంది. మెడ్ట్రానిక్ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్ఏఎస్ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది. వీటిని ఆపరేషన్ థియేటర్లలో అమర్చడం పని చేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలదు.హ్యూమనాయిడ్ రోబోలు ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలవని అంచనా. కాలిఫోర్నీయా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబో సర్గి ఐదు అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కు నడుచుకుని రాగలదు. సర్జికల్ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు. పేద, మధ్యాదాయ దేశాల్లో, వనరులు, వసతులు తక్కువగా ఉన్నచోట్ల ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రాణాలు నిలిపే కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నీయా వర్సిటీ ఇంజినీర్ మైకెల్ ఇప్ తెలిపారు. సర్జరీకి అవసరమైన కత్తులు, ఇతర పరికరాలను పట్టుకునేందుకు అడాప్టర్లను ప్రత్యేకంగా తయారు చేశామని, వీటితో పనిచేయించడం పెద్ద కష్టమేమీ కాలేదని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న సర్జన్ నికితా తరేజా తెలిపారు. ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఆపరేషన్ థియేటర్లో ఎంత బాగా సర్దుకుపోయాయో చూసి ఆశ్చర్యపోయామన్నారు. తొలి ఆపరేషన్లో సెర్గిని పదే పదే రీకాలిబరేట్ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మృత్యువు అంచుల నుంచి రాజ భోగాల వరకు.. అద్భుత ప్రయాణాలు!
రైలు ప్రయాణం అంటే మనందరికీ ఇష్టమే..! చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి నేటి ప్రయాణాల వరకు.. కిటికీ పక్కన కూర్చుని, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, బయట ప్రకృతిని చూడటం ఒక అందమైన, ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. కానీ.. అదే రైలు ప్రయాణం మృత్యువుతో పోరాటంలాంటిదైతే? ఒక్క అంగుళం పట్టాలు తప్పినా, వేల అడుగుల లోతైన లోయలో పడిపోయే భయానక వాతావరణం ఉంటే? ఇంకోవైపు.. ఒక సాదాసీదా రైలు ప్రయాణం, ఏకంగా సెవెన్ స్టార్ హోటల్ను తలపించే విలాసవంతమైన రాజభోగం అయితే?.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో కళ్లు చెదిరేంత లగ్జరీ రైల్వే రూట్ల గురించి ఆసక్తికర విషయాలతో పాటుగా మానవ సాహసానికి, తిరుగులేని ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనమైన రూట్స్ ఇవి.ముందుగా మనం మనుషులను భయపెట్టే ప్రమాదకరమైన రూట్లలోకి చూస్తే.. అర్జెంటీనాలోని 'ట్రెన్ ఎ లాస్ న్యూబ్స్' (Tren a las Nubes).. దీని అర్థం 'మేఘాల్లోకి వెళ్లే రైలు'. సముద్ర మట్టానికి ఏకంగా 13,800 అడుగుల ఎత్తున, ఆండీస్ పర్వతాల గుండా ఈ రైలు వెళ్తుంది. కింద చూస్తే గుండె ఆగిపోయేంత లోతైన లోయలు, పైన మేఘాల గుంపులు. ఈ రూట్లో ప్రయాణించేటప్పుడు ఎత్తు వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, అందుకే విమానాల్లో లాగే ఈ రైల్లో కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో పెడతారు.ఈక్వెడార్లో ఇలా.. ఇక ఈక్వెడార్లోని 'నారిజ్ డెల్ డయాబ్లో' (Nariz del Diablo).. దీనికి 'సైతాన్ ముక్కు' అనే అర్థం ఉంది. నిట్టనిలువుగా, గోడలా ఉండే కొండ చరియలపై జిగ్జాగ్గా, వెనక్కి ముందుకీ నడుస్తూ ఈ రైలు కొండ దిగుతుంది. ఒక్క చిన్న తప్పు జరిగినా రైలు పాతాళంలోకి వెళ్లాల్సిందే. 19వ శతాబ్దం చివర్లో ఈ ట్రాక్ వేసేటప్పుడు వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి సైతాను ముక్కు అనే పేరు వచ్చింది.Tren de las nubes pic.twitter.com/QM7KtHosvu— saltenials (@saltenials) August 29, 2023భారత్లో రూట్స్..భారతదేశంలో కూడా ఇలాంటి రూట్స్ ఉన్నాయా? అంటే కాస్త తక్కువ భయంకరమైనవి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. తమిళనాడులోని 'పాంబన్ బ్రిడ్జ్'ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పాత బ్రిడ్జ్ని సముద్రంపై నిర్మించారు. దీని మీద రైలు వెళ్తుంటే.. కింద భయంకరమైన అలలు, కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు రైలును ఊపేస్తుంటాయి. ఇక సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి రోజున కిటికీ లోంచి చూస్తే కేవలం అనంతమైన సముద్రం తప్ప ఏమీ కనిపించదు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ ఇది.ट्रेन की रफ्तार और पम्बन ब्रिज की मजबूती को देखकर पता चल रहा है कि भारत सरकार का बनाया हुआ है 🚂🛤️🚃 pic.twitter.com/ttPnwQ1HID— Vipin patel 🚩 (@VVipinpatel) July 4, 2026ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం..!! లగ్జరీ! ఒక ఫైవ్ స్టార్ లేదా సెవెన్ స్టార్ హోటల్ పట్టాల మీద నడిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రైలుగా పేరుగాంచినది.. 'వెనిస్ సింప్లాన్-ఓరియంట్-ఎక్స్ప్రెస్' (Venice Simplon-Orient-Express). లండన్ నుంచి పారిస్ మీదుగా వెనిస్ వరకు సాగే ఈ ప్రయాణంలో.. రైలు లోపల అంతా 24 క్యారెట్ల బంగారం నగిషీలు, వెల్వెట్ డిజైన్లు, ప్రపంచ స్థాయి చెఫ్ల వంటకాలు, పర్సనల్ బట్లర్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 1920ల నాటి క్లాసిక్ వైబ్ని ఇది అందిస్తుంది. ఇందులో ఒక్క రాత్రి ప్రయాణానికి టికెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 4 నుంచి 10 లక్షల రూపాయలు!Conheça a suíte de luxo L’Observatoire, do Venice Simplon-Orient-Express, onde cada viagem pode custar cerca de 550 MIL reais. Pagariam? pic.twitter.com/9RVUQoSonW— POINT POP (@Point__Pop) July 9, 2026రష్యాలోని 'ట్రాన్స్-సైబీరియన్ ఎక్స్ప్రెస్' కూడా అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే రూట్లో నడుస్తుంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు 9,289 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ జర్నీలో సైబీరియా మంచు అందాలను, ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్ సరస్సు వైభవాన్ని ఒక నడిచే రాజభవనంలో కూర్చుని చూడొచ్చు.One of the most breathtaking train rides in the world.The Bernina Express travels from Chur, Switzerland to Tirano, Italy on the Rhaetian Railway. It crosses 196 bridges and 55 tunnels, climbs over the Bernina Pass, and then descends into Italy. pic.twitter.com/fun1VhgjL8— Harshvardhan Ram🇯🇵🇹🇭🇬🇧 ☮️☸️ (@FaaltuBooi7) July 5, 2026'మహారాజాస్ ఎక్స్ప్రెస్'..మన దేశంలో కూడా లగ్జరీ రైళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. మన 'మహారాజాస్ ఎక్స్ప్రెస్' (Maharajas' Express) ప్రపంచంలోనే అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా వరుసగా అవార్డులు గెలుచుకుంది. దీని ప్రెసిడెన్షియల్ సూట్ టికెట్ ధర దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది..! విదేశీయులు మన దేశ రాజసం, సంస్కృతిని, అజంతా ఎల్లోరా గుహలను, తాజ్ మహల్ అందాలను చూడటానికి ఈ రాయల్ జర్నీని ఎంచుకుంటారు. లోపలికి వెళ్తే మనం ఒక రాజు కాలంలో ఉన్నామా?? అనే భ్రమ కలుగుతుంది.India is home to some of the world’s most luxurious trains,The Maharajas’ Express often ranked among the finest luxury rail journeys globally. pic.twitter.com/T2bTHevzUX— India Plus (@india_plus_) June 30, 2026సైకలాజికల్ కోణంలో విశ్లేషిస్తే.. మనుషుల్లో రెండు రకాల తీవ్రమైన, పరస్పర విరుద్ధమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి.. అడ్వెంచర్, థ్రిల్ కావాలనుకోవడం, ప్రాణాలను పణంగా పెట్టైనా ప్రకృతి సవాలును జయించి ఆ డోపమైన్ రష్ను అనుభవించాలనుకోవడం. రెండోది.. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకోవడం, సమాజంలో తన హోదాను చాటుకుంటూ తానే ఒక చక్రవర్తిలా ఫీలవ్వడం. ఈ రెండు భిన్నమైన హ్యూమన్ ఎమోషన్స్ను, సైకాలజీని ఈ రైల్వే రూట్లు సంపూర్ణంగా satisfy చేస్తాయి. ఒకటేమో ప్రకృతిని జయించిన మనిషి మొండితనానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక అయితే, ఇంకొకటి మనిషి సృష్టించుకున్న విలాసానికి నిదర్శనం.ప్రమాదకరమైన లోయలైనా, పరమ విలాసవంతమైన భోగీలైనా.. ప్రతి రైలు ప్రయాణమూ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. గమ్యం కంటే ఆ ప్రయాణమే మనకు ముఖ్యం అని చెప్తుంది! మానవ మేధస్సు, ఇంజనీరింగ్ సృష్టించిన ఈ పట్టాల అద్భుతాలు భూమిపై ఎప్పటికీ నిలిచిపోతాయి.Orient Express from Venice to Paris 🚋 the Venice Simplon-Orient-Express embarks on a 24-hour journey Art deco interiors gourmet dining #SundayMorning #SundayVibes #SundayMood ☆ paris.attractive☆ sarahjmea via TT @Sarahhuniverse @CONTEMPRA_INN 🌹pic.twitter.com/TRkmHRKrmG— ContempraINN🌹 (@CONTEMPRA_INN) July 21, 2024 -
పాముల రాజ్యం.. కోట్ల వ్యాపారం.. ఒక్క దెబ్బతో తారుమారు!
పాములు అంటే భయంతో మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పాములే ఒక పెద్ద వ్యాపారం. ముఖ్యంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాములను ప్రత్యేకంగా పెంచే స్నేక్ ఫారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఔషధ పరిశ్రమ, శాస్త్రీయ పరిశోధనలు, పాము విషం సేకరణ, చర్మ ఉత్పత్తులు వంటి అవసరాల కోసం వేల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే..చైనా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల ధాటికి ఓ పాముల పెంపక కేంద్రం దెబ్బతింది. రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో 900కు పైగా పాములు బయటకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బయటకు వచ్చిన వాటిలో కొన్ని విషపూరిత జాతులకు చెందిన పాములు ఉండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక, వరద నీటిలో పాములు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.“స్నేక్ విలేజ్”..అయితే, చైనాలో పాముల పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా జెజియాంగ్ ప్రావిన్స్లోని జిసికియావో (Zisiqiao) ప్రాంతం పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. దీనిని చాలా మంది “స్నేక్ విలేజ్”గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా పాములను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు రకాల సర్పాలను ప్రత్యేక ఫారాల్లో ఉంచుతారు. జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది.దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతం కూడా పాముల పెంపకానికి మరో ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పాముల ఫారాల్లో విషసర్పాలను పెంచి వాటి నుంచి వివిధ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇటీవల వరదల కారణంగా పాములు బయటకు వచ్చిన ఘటన కూడా ఈ ప్రాంతంలోని ఓ ఫారం నుంచే జరిగినట్లు సమాచారం. కాగా, పాముల పెంపకం వెనుక ప్రధానంగా ఔషధ పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాలు ఉన్నాయి. పాము విషాన్ని శాస్త్రీయ పరిశోధనలు, యాంటీ వెనం మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. విషం సేకరించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.Amd Chinese have startto catch these snakes.Food is important https://t.co/7DmN6tKr7c pic.twitter.com/RX24yp0ipi— GeoPanda (@Geotactix) July 8, 2026భద్రతపై టెన్షన్..అలాగే కొన్ని ప్రాంతాల్లో పాము చర్మానికి కూడా డిమాండ్ ఉంటుంది. పాము చర్మంతో కొన్ని రకాల లెదర్ ఉత్పత్తులు తయారు చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాములను ఆహారంగా కూడా వినియోగించే సంప్రదాయం ఉంది. దీంతో పాముల పెంపకం ఒక ప్రత్యేక మార్కెట్గా అభివృద్ధి చెందింది. అయితే విషసర్పాలను పెద్ద సంఖ్యలో ఒకే చోట పెంచడం ఎప్పుడూ ప్రమాదకరమే. భారీ వర్షాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫారాల భద్రతా వ్యవస్థలు దెబ్బతింటే పరిస్థితి అదుపు తప్పుతుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.పాముల పెంపక కేంద్రాల్లో బలమైన రక్షణ గోడలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, యాంటీ వెనం నిల్వలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం తప్పనిసరి. లేకపోతే వ్యాపారం కోసం పెంచిన విషసర్పాలే ప్రజలకు ప్రాణాంతక ముప్పుగా మారే అవకాశం ఉంది. వరదలతో బయటపడిన వందలాది పాముల ఘటన కేవలం ఓ ప్రమాదం మాత్రమే కాదు.. పాముల పెంపకం వెనుక ఉన్న భారీ వ్యాపారం, దాని వల్ల వచ్చే భద్రతా సవాళ్లను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది.When floods become a haven for predators! 🛑 The terrifying side of the recent heavy rains in China... Snakes leaving their burrows and swimming through the floodwaters! 🐍🌊 pic.twitter.com/AbjbZYwjSg— Nature (@NNaturalanimals) July 10, 2026పాముల పెంపకాలు ఇక్కడే.. 1. జిసికియావో (Zisiqiao) – జెజియాంగ్ ప్రావిన్స్చైనాలో అత్యంత ప్రసిద్ధ ‘స్నేక్ విలేజ్’గా పేరు పొందిన ప్రాంతం ఇది.ఇది జెజియాంగ్ ప్రావిన్స్లోని డెక్వింగ్ కౌంటీ, జిన్షి టౌన్ (Xinshi Town) పరిధిలో ఉంది.ఇక్కడ దశాబ్దాలుగా గ్రామస్తులు పాముల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు.కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు జాతులను పెంచుతారు.పాము విషం, పాము చర్మం, ఎండబెట్టిన పాము ఉత్పత్తులు, సంప్రదాయ ఔషధాల కోసం ఈ వ్యాపారం కొనసాగుతోంది.2. హెన్జౌ (Hengzhou).. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ఇటీవల వందల సంఖ్యలో పాములు బయటకు వచ్చిన ఘటనతో వార్తల్లో నిలిచిన ప్రాంతం ఇదే.గ్వాంగ్సీలోని హెన్జౌ ప్రాంతంలో పాముల పెంపక కేంద్రాలు ఉన్నాయి.భారీ వరదల కారణంగా పాముల ఫారం దెబ్బతిని సుమారు 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు సమాచారం.బయటకు వచ్చిన వాటిలో కోబ్రాలు, క్రైట్లు వంటి విషసర్పాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.3. గ్వాంగ్డాంగ్ (Guangdong) ప్రాంతంచైనాలో సంప్రదాయ ఔషధ పరిశ్రమకు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి.పాము ఉత్పత్తులు, ఔషధ వినియోగాలకు సంబంధించిన వ్యాపారానికి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి.4. గ్వాంగ్సీ (Guangxi) ప్రాంతంవేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా కొన్ని రకాల సర్పాల పెంపకానికి అనుకూలంగా భావిస్తారు.పాముల పెంపకం, సంప్రదాయ వైద్య మార్కెట్లతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.పాముల పెంపకంలో సాధారణంగా పెంచే జాతులుకోబ్రా (Cobra)క్రైట్ (Krait)వైపర్ (Viper)పైథాన్ (Python)రాట్ స్నేక్ (Rat snake) -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా వెళ్లడం మరింత కఠినం
అమెరికా కలలకు మరిన్ని సంకెళ్లు పడుతున్నాయి! హెచ్1–బీతోపాటు గ్రీన్కార్డులు, స్టూడెంట్ వీసాలు పొందడమూ చాలా చాలా కష్టం కానుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరిక ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూండటం దీనికి కారణం. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే కానీ.. ఓకే అయితే మాత్రం అమెరికన్ వీసా కావాలంటే కొండలు కరగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఖర్చుతోపాటు విపరీతమైన స్క్రూటినీ, దస్తావేజులు అవసరమవుతాయని, భారతీయ ఐటీ ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వివరాలు... ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’స్లోగన్తో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలస దారులను తరిమేస్తామని తరచూ హూంకరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) విభాగం అక్రమ వలసదారుల ఏరివేతను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూడా. అంతేకాకుండా... ఇతర దేశస్తులు అమెరికాలో పని చేయడంపై కూడా ఆయన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తొలిసారి గద్దెనెక్కినప్పుడు కూడా అమెరికన్ ఉత్పత్తులే కొనాలని, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని ప్రతిపాదించిన ఆయన విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1–బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేయాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)తోపాటు ఐస్ కూడా వీసాల జారీ, అక్రమ వలసదారుల ఏరివేత విషయంలో ఎన్నో మార్పులు చేశారు కూడా. తాజాగా హెచ్1–బీ వీసాల జారీ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం డీహెచ్ఎస్, కార్మీక, విదేశీ వ్యవహారాల శాఖల ఉమ్మడి అజెండాలో ప్రచురితమైంది. ప్రజాభిప్రాయ సేకరణ (టెక్ కంపెనీలు, యూనివర్శిటీలు, వలస కార్మీకుల హక్కుల పరిరక్షణ సంఘాలు) తరువాత అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తరువాత అమల్లోకి వస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రతిపాదనలు వచ్చే నెల నుంచే అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఓపీటీపైనా ఫోకస్అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందేందుకు వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమంలోనూ పలు మార్పులను ప్రతిపాదించారు. 2024 –25లో భారత్ నుంచి సుమారు 3.6 లక్షల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లగా ప్రస్తుతం వారు కోర్సుకు తగ్గట్టుగా ఎంతకాలమైనా అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం మాత్రం ఇలా కుదరదు. నిర్దిష్ట సమయం మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత పొడింపునకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటే వచ్చే ఏడాది ఫ్రిబరి నుంచి ప్రాక్టికల్ ట్రెయినింగ్ నిబంధనలను సమీక్షించనున్నారు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసన్ రంగాల్లో చదివేవారికి ఇచ్చే రెండేళ్ల పొడిగింపుపై ఫోకస్ పెట్టారు. .వీటితోపాటే కొంతమంది విదేశీయులు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశమిచ్చే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (ఈఏడీ) విషయంలోనూ మార్పులు రానున్నాయి. తుది నిబంధనలు ఈ నెలలోనే రానున్నాయి. ఫలితంగా ఈఏడీల ఆటోమెటిక్ పొడిగింపునకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా హెచ్1–బీ వీసాదారుల భార్య/భర్తలే ఎక్కువగా ఈ ఈఏడీల ఆధారంగా ఉద్యోగాలు చేస్తూంటారు. ఈఏడీల పొడిగింపు ఆలస్యమైతే వారు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా పోతుంది. ఇవీ మార్పులుముందుగా వీసా నిబంధనల్లో రాగల మార్పులు చూద్దాం. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశముంది. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు. యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు. అమెరికన్లు చేయలేని పని హెచ1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. ఇంకోలా చెప్పాలంటే కంపెనీలు హెచ్1–బీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలు పెరుగుతాయి. వీసాల పొడిగింపునకూ ఫీజులు వసూలు చేయాని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. పెర్మ్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను కూడా మార్చనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్కు ఎండ అవసరం. పవన విద్యుత్కు గాలి అవసరం. జలవిద్యుత్కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
జర్మనీ తర్వాత భారత్.. ప్రపంచం చూసేలా కొత్త తరం రైలు..
భారత రైల్వేలో ఇక కొత్త శకం మొదలుకానుంది. ఇన్నాళ్లు నల్లటి పొగలు కక్కుతూ పరుగులు పెట్టిన డీజిల్ ఇంజిన్ల స్థానంలో.. పర్యావరణానికి మిత్రంగా నిలిచే ఓ కొత్త తరం రైలు భారత్లో అడుగుపెట్టబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పరుగులు పెట్టే ఈ రైలు భారత రైల్వే రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలకనుంది.భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును సిద్ధం చేస్తున్నాయి. హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలును తొలిదశలో పరీక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రైలు పనిచేసే విధానం కూడా ఆసక్తికరమే. సాధారణ రైళ్లలా డీజిల్ దహనం కాదు.. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా ఫ్యూయల్ సెల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో రైలు కదులుతుంది. ఈ ప్రక్రియలో వెలువడేది ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. అంటే పొగ లేదు.. కాలుష్యం తక్కువ.భారత్ రూపొందిస్తున్న ఈ హైడ్రోజన్ రైలు సాధారణ రైలు కాదు. ఇది 10 కోచ్లతో, రెండు డ్రైవింగ్ పవర్ కార్లతో రూపొందుతోంది. సుమారు 2,400 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో భారత బ్రాడ్గేజ్ మార్గాల్లో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ రైలు వెనుక భారత రైల్వే పరిశోధన సంస్థ RDSO కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం హర్యానాలోని జింద్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో ఈ రైలు గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ సాంకేతికత భారత్కు కొత్త కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి. హైడ్రోజన్ రైలును వాణిజ్య ప్రయాణికుల సేవల్లో తొలిసారిగా ఉపయోగించిన దేశం జర్మనీ.🚨 HUGE! India’s first indigenous Hydrogen Train has been OFFICIALLY approved.— The pilot run will take place on the Jind–Sonipat section in Haryana.— The train features a 10-coach hydrogen-powered configuration. pic.twitter.com/MblnoqrTRw— Megh Updates 🚨™ (@MeghUpdates) June 5, 2026 2022లో జర్మనీ Alstom Coradia iLint పేరుతో ప్రపంచంలోని తొలి వాణిజ్య హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును ప్రారంభించింది. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ రైలును ఉపయోగించారు. పొగకు బదులుగా నీటి ఆవిరితో ప్రయాణం సాగించడం దీని ప్రత్యేకత. జపాన్, చైనా, అమెరికా కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి. జపాన్లో East Japan Railway Company హైడ్రోజన్ ఆధారిత రైళ్లను పరీక్షించింది. చైనా పట్టణ రవాణా, తక్కువ దూర మార్గాల కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో కూడా డీజిల్కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రవాణాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.హైడ్రోజన్ రైళ్ల వల్ల ముఖ్యంగా విద్యుదీకరణ చేయడం కష్టమైన మార్గాల్లో భారీ ప్రయోజనం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, తక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో డీజిల్ స్థానాన్ని ఇవి భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రైళ్ల ప్రయాణం అంత సులభం కాదు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు, నిల్వ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక స్టేషన్ల నిర్మాణం వంటి సవాళ్లు ఉన్నాయి. కానీ ఒకసారి ఈ వ్యవస్థ విస్తృతంగా అందుబాటులోకి వస్తే రైల్వే రంగంలో కాలుష్యాన్ని తగ్గించే అతిపెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భారత రైల్వే పట్టాలపై కనిపించబోయేది కేవలం మరో రైలు కాదు.. పర్యావరణాన్ని కాపాడుతూ పరుగులు పెట్టే కొత్త భారతానికి ప్రతీకగా నిలిచే హైడ్రోజన్ రైలు.🚨 BIG BREAKING Indiaʼs first HYDROGEN-POWERED train SUCCESSFULLY completed its trial run between Delhi and Jind 🔥 — Reached speeds of up to 120 kmph.— Emergency braking and oscillation performance were SUCCESSFULLY tested. pic.twitter.com/KOh5uesN9J— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026అసలు లక్ష్యం ఏంటి?భారత రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ఇప్పటివరకు డీజిల్ లోకోమోటివ్లు నడిచే మార్గాల్లో ఇంధన ఖర్చు, కాలుష్యం రెండూ పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు “Hydrogen for Heritage” వంటి ప్రాజెక్టుల కింద హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.హైడ్రోజన్ రైళ్లు ముఖ్యంగా..విద్యుదీకరణ లేని రైల్వే మార్గాలపర్వత ప్రాంతాలుపర్యాటక ప్రాధాన్యత ఉన్న మార్గాలుతక్కువ రద్దీ ఉన్న రూట్లు.. వంటి ప్రాంతాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.హెరిటేజ్ రూట్లకు ప్రాధాన్యం ఎందుకు?భారత రైల్వేలు కొన్ని చారిత్రక రూట్లలో డీజిల్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. ఈ మార్గాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ రైళ్లను ఉపయోగించే ఆలోచన ఉంది. ఉదాహరణకు కొండ ప్రాంత రైల్వే మార్గాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రైలులో ఒకేసారి సుమారు 2,500 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 27 హైడ్రోజన్ సిలిండర్లు, హైడ్రోజన్ లీకేజ్ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు. -
సూర్యుడి ‘సర్వ’ దర్శనం!
సరిగ్గా... జూలై ఎనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం 4.40 నిమిషాలకు ఏం జరిగిందో తెలుసా? ఒక అరుదైన ఘట్టం నమోదైంది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది సూర్యుడిని చూడగలిగారు. అది కూడా ఒకే ఒక్క నిమిషం మాత్రమే. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఆగ్నేయాసియా దేశాలు కొన్ని, అంటార్కిటికాలు మాత్రమే చీకట్లో ఉండిపోయాయి! ఇలా ఎందుకంటే సూర్యుడి చుట్టూ తిరిగే భూమి ఒకపక్కకు వాలి ఉంటుందని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. జూన్, జూలైలో ఈ వాలు సూర్యాభిముఖంగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు భూమి ఒక ప్రత్యేక స్థానంలోకి వచ్చి చేరుతుంది. సూర్యుడి వెలుగు భూమ్మీద అత్యధిక ప్రాంతంపై పడుతూ ఉంటుందన్నమాట. ఈ ఏడాది జూలై ఎనిమిదవ తేదీ కూడా ఒకటి. ఈ రోజు గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ ప్రకారం ఉదయం 11.10 గంటలకు మొత్తం 820 కోట్ల మంది ప్రజలకు సూర్యుడి వెలుతురును పొందగలిగారు. అలాగని అన్ని చోట్లా పట్టపగల్లాంటి ప్రకాశం లేదులెండి. ఈ భాగ్యం 690 కోట్లమందికి దక్కితే... దీపాల అవసరం లేనంత వెలుగును ఇంకో 58 కోట్ల మంది అనుభవించారు. ఆకాశం నల్లబడి.. దిగంతం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితి ఇంకో 49 కోట్ల మందికి లభించింది. చీకటిపడే ముందు లీలగా కనిపించే వెలుతురును 24.9 కోట్ల మంది చూశారు. సుమారు 8.3 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో ఒక్క శాతం మంది మాత్రమే నిశిరాత్రిలో ఉండిపోయారు. ప్రపంచ జనాభాలో 90 శాతం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుందన్నది ఒక విశేషమైతే.. 99 శాతం మందికి ఒకే ఒక్క నిమిషం సూర్యుడి దర్శనం లభించడం ఇంకో విశేషం అన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్కు ‘తీస్తా’ పరీక్ష
భారత్లోని సిలిగురి కారిడార్ సమీపంలో ఉన్న తీస్తా నదీ ప్రాజెక్టుపై చైనా మరోసారి దృష్టి సారించింది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ దేశం చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు షేక్ హసీనా ప్రభుత్వం వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాజెక్ట్ సున్నితమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉండటంతో ఈ పరిణామాలు భారత్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆధిపత్య పోటీ.. తూర్పు హిమాలయాల్లో పుట్టి, సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశించే తీస్తా నది 414 కిలోమీటర్లు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. ఇందులో అధిక వాటా కావాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ కారణంగా ఇరుదేశాల మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. మహ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చడానికి భారత్ ముందుకొచ్చింది. దీనిపై 2016 నుంచి చైనా కన్ను ఉంది.అయితే, 2020లోనే తీస్తా ప్రాజెక్టును ఆవిష్కరించినప్పటికీ, ఆర్థికపరమైన పరిమితులు, సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడంతో భారత్ ఆందోళనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా తుది ఆమోదాన్ని నిలిపివేశారు. అది ప్రణాళిక దశను దాటి ముందుకు సాగలేదు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కుదుర్చుకున్న తాజా ఒప్పందం, తీస్తా విషయంలో చైనాకున్న ఆసక్తిని తెలియజెప్పడమే కాదు.. బంగ్లాదేశ్పై ఆధిపత్యానికి భారత్, చైనాల మధ్య పోటీని కూడా ప్రతిబింబిస్తోంది.ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి సాధ్యాసాధ్యాల అధ్యయనానికే పరిమితమైనప్పటికీ, బంగ్లాదేశ్లోని అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా మరింతగా పాలుపంచుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న పవర్చైనా సంస్థ వల్ల మరింత ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేది ప్రైవేట్ సంస్థ కాదు. ఇది చైనా ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ద్వంద్వ–ఉపయోగ మౌలిక సదుపాయాలను నిర్మించిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. చైనా బంగ్లాదేశ్తో కలిసి పనిచేయనున్న తీస్తా ప్రాజెక్ట్ ఏమిటి? తీస్తా నది వెంబడి వరదలను నియంత్రించడం, నీటి భద్రతను మెరుగుపరచడం, నదీ జీవావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడం ఈ తీస్తా సీఎంఆర్పీ లక్ష్యం. నదీ తీరాల వెంబడి రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ కేంద్రాలు, పర్యాటక సౌకర్యాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు అభివృద్ధి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. 2016 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ జల అభివృద్ధి బోర్డు, చైనా ఇంజనీరింగ్ సంస్థ పవర్చైనాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంతో తీస్తా సీఎంఆర్పీ ప్రారంభమైంది.2019మేలో ఈ ప్రాజెక్ట్కు అధికారిక ప్రభుత్వ చట్రం లభించింది. 2020లో దీనినొక భారీ నదీ పునరుద్ధరణ కార్యక్రమంగా బహిరంగంగా ఆవిష్కరించారు. అప్పటి ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం సాధ్యాసాధ్యాల అధ్యయనాలను ప్రారంభించి, 2020లో ఈ ప్రతిపాదనను ఆవిష్కరించింది. వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతంలో పెద్ద ప్రాజెక్ట్పై భారత్ ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఆమె తుది ఆమోదం తెలపలేదు. చైనానే ఎందుకు?ఇప్పుడు మరోసారి చైనాతో బంగ్లాదేశ్ భాగస్వామ్యం కావడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమయ్యే గణనీయమైన ఆర్థిక వనరులు, అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యం. ఆనకట్టలు, నదీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. వరద నియంత్రణ, నీటిపారుదల రంగాలలో దానికి విస్తృతమైన అనుభవం ఉంది. 2022లో పూర్తయిన పద్మా వంతెనతో సహా, బంగ్లాదేశ్లో కూడా చైనా సంస్థలు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించాయి. తీస్తా నదీ జలాల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన మరో కారణం. బంగ్లాదేశ్కు ఎక్కువ నీటిని మళ్లించడం వల్ల రాష్ట్రంలోని రైతులకు నష్టం జరుగుతుందని పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కోల్కతా సమ్మతి లేకుండా కేంద్రం ముందుకు సాగలేకపోయింది. 2024లో తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ నిధులు సమకూర్చడానికి కేంద్రం ముందుకొచ్చింది. హసీనా వైదొలగడంతో తలెత్తిన రాజకీయ గందరగోళం చర్చలను నిలిపివేసింది. మహమ్మద్ యూనస్ మధ్యంతర పాలనలో భారత ప్రతిపాదన అటకెక్కింది. చైనా, భారత్ కంటే వేగంగా కదిలింది.భారత్కు ఆందోళన ఎందుకు? తీస్తా నది ప్రాజెక్టుపై చైనా–బంగ్లాదేశ్ ఒప్పందం గురించి భారత్ ఆందోళన చెందడానికి బలమైన కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది భౌగోళిక సామీప్యత. బంగ్లాదేశ్లోని నీల్ఫామరి, రంగపూర్ ప్రాజెక్టు ప్రాంతాలు, మనదేశంలోని జల్పాయిగురి జిల్లాకు ఆనుకొని ఉన్నాయి. అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్ కూడా ఇదే ప్రదేశంలో ఉంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే అత్యంత ఇరుకైన ఈ సన్నని భూభాగం, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే ఏకైక భూమార్గం. ఈ ప్రాంతంలో శత్రు ఉనికి భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీస్తుంది.బంగ్లాదేశ్లో చైనా ప్రభావం భారత్కు రెండు వైపుల భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. తీస్తా బేసిన్లో చైనా ప్రమేయం పెరగడం వల్ల అంతర్గత అశాంతి చెలరేగుతుంది. ఇప్పటికే సున్నితమైన ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతుంది. నదీ జలవనరుల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్తో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. ప్రాజెక్ట్పై అభిప్రాయాలను గతంలోనే ఆ దేశానికి తెలిపింది. ప్రస్తుతానికి, తీస్తా సాధ్యాసాధ్యాల అధ్యయనం చివరికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి. -
కప్ గెలవకపోయినా... ప్రపంచాన్ని గెలిచాడు
ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డియోర్ అవార్డు... ఐదుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాలర్గా ‘ఫిఫా’ ఎంపిక... యూరోపియన్ యూనియన్ అత్యుత్తమ ఆటగాడిగా మూడుసార్లు ఘనత... నాలుగుసార్లు యూరోపియన్ యూనియన్ ‘గోల్డెన్షూ’ విజేత... చాంపియన్స్ లీగ్, నేషన్స్ లీగ్, యూరోపియన్ చాంపియన్షిప్లలో కలిపి ఏకంగా 35 ట్రోఫీ విజయాల్లో సభ్యుడిగా అసాధారణ రికార్డు...ప్రపంచ ఫుట్బాల్లో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక గోల్స్...మొత్తంగా ప్రొఫెషనల్ ఫుట్బాల్లో 1300కు పైగా మ్యాచ్లు... దాదాపు 1000 గోల్స్... ఇంతటి అత్యద్భుత కెరీర్ అతని సొంతం!అయితే ఇన్ని సాధించినా ఆ ఒక్కటి మాత్రం అతనికి దక్కలేదు.చివరకు వరల్డ్కప్ మాత్రం లేకుండానే క్రిస్టియానో రొనాల్డో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితేనేమి... ప్రపంచకప్ గెలవలేకపోయినా క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఏమాత్రం తగ్గదు. వరల్డ్కప్ విజయంలో భాగం కాలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అతని ఆటతో ఉర్రూతలూగిపోయిన మైదానాలు రొనాల్డో స్థాయిని చూపించాయి. ఆటపై అతను వేసిన ముద్ర అభిమానుల మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. – సాక్షి క్రీడా విభాగం ఫుట్బాలర్ కాకపోయి ఉంటే నా కొడుకు ఇటుకలు మోసేవాడు, తాపీ మేస్త్రీ పని చేసేవాడు... రొనాల్డో గురించి అతని తల్లి చెప్పిన మాట ఇది. నిజంగానే అతని నేపథ్యం అలాంటిది. పేరుకే సైనికుడు అయిన అతని తండ్రి తాగుబోతుగా మారి.. రొనాల్డో పుట్టే సమయానికే ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత స్థానికంగా ఒక గార్డెన్లో పని చేసినా ఆదాయం చాలా స్వల్పం. దాంతో తల్లి వేర్వేరు ఇళ్లల్లో, హోటల్లలో పని మనిషిగా చేస్తూ ఇంటిని నడపాల్సి వచ్చింది. అప్పటికే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్న తల్లి ఈ పేదరికం కారణంగానే తన నాలుగో గర్భాన్ని తొలగించుకోవాలని చూసింది. అయితే ప్రమాదం అంటూ డాక్టర్లు తిరస్కరించడంతో వెనకడుగు వేసింది. కానీ ఆ పుట్టే నాలుగోవాడు చరిత్ర సృష్టిస్తాడని, ప్రపంచ క్రీడారంగంలోనే శిఖరానికి చేరతాడని ఆమె ఊహించలేదు. మొదటి నుంచీ రొనాల్డోకు చదువు అబ్బలేదు. ఒకసారి స్కూల్లో టీచర్పై కుర్చీ కూడా విసరడంతో అతడిని బయటకు పంపించారు. అంతే ఆరో తరగతితోనే చదువు ముగిసిపోయింది. అయితేనేమి ఫుట్బాల్లో మాత్రం అతను రారాజుగా వెలిగాడు.తాను ప్రాణంగా, పిచ్చిగా ప్రేమించిన ఫుట్బాల్లో మాత్రం అతను కఠోర శ్రమకు వెనుకాడలేదు. ప్రాణం పెట్టి పట్టుదలగా ఆడటమే రొనాల్డోను చాంపియన్ ప్లేయర్గా మార్చింది. అతను బాగా పేరు సంపాదించుకున్న తర్వాత పోర్చుగల్లో మ్యాగీలాంటి కంపెనీలు, సూపర్ మార్కెట్లకు అతని తల్లి ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. అయితే రొనాల్డోకు 20 ఏళ్ల వయసులో ఇంకా స్టార్ కాకముందే మద్యం కారణంగా వచ్చిన అనారోగ్యంతో అతని తండ్రి చనిపోయాడు. అసాధారణ ప్రతిభతో... ఏడేళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో ఆట మొదలైంది. ఆ వయసులోనే స్థానిక క్లబ్ ఆండోరిన్హాకు అతను ఆడటం మొదలు పెట్టాడు. అక్కడే అతనిలో అపార ప్రతిభ ఉందని గుర్తించిన కోచ్లు ప్రోత్సహించారు. చదువు అబ్బదని తెలిసిన క్షణాన పూర్తి సమయం ఆటకే కేటాయిస్తే అద్భుతాలు సాధ్యమని కోచ్ ఇచ్చిన సలహాతో రొనాల్డో తల్లి ఏకీభవించడంతో అతనికి మరో లోకం లేకుండా పోయింది. ఫుట్బాల్, ఫుట్బాల్... ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే... ఎక్కడైనా అదే ధ్యాస. అప్పటికే బ్రెజిల్ దిగ్గజాలు రొనాల్డో నజారియో, రొనాల్డిన్హోలను అభిమానించడం మొదలు పెట్టిన ఈ కుర్రాడు ఒక్కసారిగా దూసుకుపోయాడు. తన ఆటతో ప్రమోషన్ సాధిస్తూ జూనియర్ ఆటగాడిగా పదేళ్లపాటు మూడు వేర్వేరు క్లబ్లకు ఆడి రొనాల్డో తన విలువేంటో చూపించాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో సీనియర్ ఆటగాడిగా తొలిసారి లిస్బన్లో స్పోర్టింగ్ క్లబ్ పోర్చుగల్కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడితో మొదలైన అతడి ప్రస్థానం ఆ తర్వాత ప్రపంచ ఫుట్బాల్ను శాసించే స్థాయికి తీసుకెళ్లింది. గత 24 ఏళ్లుగా రొనాల్డో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.అరుదైన వ్యాధిని దాటి... మైదానంలో చిరుతలా ఇప్పుడు దూసుకుపోతున్న రొనాల్డో ఫుట్బాల్ ప్రపంచం చిన్నప్పుడే ముగిసిపోయేది. అతను నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకునే అరుదైన వ్యాధి టాకీకార్డియా బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతను బతికిపోయాడు. గుండెకు ప్రత్యేక శస్త్రచికిత్స జరిపిన తర్వాత అతను కోలుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మళ్లీ ఫుట్బాల్ మైదానంలోకి వచ్చి తన ఆటను చూపించడం విశేషం. పోర్చుగల్ను గెలిపించి...జాతీయ జట్టు తరఫున రొనాల్డో వరల్డ్ కప్ గెలవకపోయినా... ఈ టోర్నీలో అతని ప్రభావం తక్కువగా కనిపించినా.. 23 ఏళ్లుగా పోర్చుగల్ సీనియర్ టీమ్కు స్టార్ అట్రాక్షన్ అతడే. ఫలితాలు ఎలా వచ్చినా అతని చుట్టే టీమ్ భ్రమించింది. రొనాల్డోను మినహాయిస్తే మరో ఆటగాడి గురించి ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆలోచించలేని పరిస్థితి ఉంది. క్లబ్ ఫుట్బాల్లో చూపిన అద్భుత ప్రదర్శనలు ఇక్కడ పునరావృతం చేయలేదనే విమర్శలు వచ్చినా... సహచరుల అండ లేకుండా ఒంటి కాలితో అతను అందించిన విజయాలు ఎన్నో. అసలు రొనాల్డో వల్లనే పోర్చుగల్ టీమ్ గెలవాలని కోరుకునే అభిమానులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 233 మ్యాచ్లలో టీమ్కు ప్రాతినిధ్యం వహించిన అతను 2016 యూరోలో జట్టును చాంపియన్గా నిలిపాడు. రెండుసార్లు అతని సారథ్యంలోనే టీమ్ నేషన్స్ లీగ్ విజేతగా నిలిచింది. 2006 నుంచి 2026 వరకు ఆరు వరల్డ్ కప్లు ఆడిన రొనాల్డో 27 మ్యాచ్లు ఆడి 11 గోల్స్ కొట్టాడు. 2006లో టీమ్ అత్యుత్తమంగా సెమీఫైనల్ చేరింది.ఈతరం ఆటగాళ్ళలో అర్జెంటీనా స్టార్ మెస్సీతో ఇన్నేళ్లుగా అతడిని పోల్చడం రివాజుగా మారిపోయింది. ఇతర ఘనతలను పక్కన పెడితే 2022లో వరల్డ్ కప్ గెలవడంతో రొనాల్డో కంటే మెస్సీ ఒక మెట్టు పైకి కనిపిస్తున్నా... ప్రజాదరణ, ఆటపరంగా రొనాల్డో ఎవరికంటే తక్కువ కాదు. వ్యక్తిగత ఘనతలు, సాధించిన రికార్డులు, రివార్డులు చూస్తే అతని స్థాయి కూడా శిఖరాన ఉందంటే అతిశయోక్తి లేదు.క్లబ్లతో కనకాభిషేకం... 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్కు చెందిన ప్రఖ్యాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో రొనాల్డో జత కట్టడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. ఈ క్లబ్కు ఆరేళ్లు, ఆ తర్వాత రియల్ మాడ్రిడ్తో తొమ్మిదేళ్లు అతని ఆటలో అత్యుత్తమ స్థాయిని చూపించాయి. బంతి డ్రిబ్లింగ్తో మొదలు పెడితే ఎదురు లేకుండా గోల్పోస్ట్ వరకు దూసుకుపోయే తత్వం, మెరుపు వేగంతో ప్రత్యర్థి డిఫెండర్లను ఏమార్చే వైనం, తనకే సాధ్యమైన అరుదైన విన్యాసాలతో రొనాల్డో ప్రపంచ ఫుట్బాల్లో ఐకాన్గా మారిపోయాడు. ఈ పదిహేనేళ్లు అతని నామస్మరణతో అసంఖ్యాక ఫ్యాన్స్ ఊగిపోయారు. దాంతో సహజంగానే వాణిజ్యపరంగా అతని విలువ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఆటపరంగా ఒప్పందాల మొత్తం రికార్డులు సృష్టిస్తుండగా, బ్రాండింగ్ పరంగా కూడా అసాధారణ ఆర్జన అతని ఖాతాలో చేరింది. అత్యధిక మొత్తం అందుకున్న ఫుట్బాలర్గా ఫోర్బ్స్ జాబితాలో ఎప్పుడు చూసినా అతని పేరు కనిపించింది. ఆరేళ్ల క్రితమే కేవలం ఆటతోనే బిలియన్ డాలర్లు సంపాదించిన తొలి ఫుట్బాలర్గా రొనాల్డో గుర్తింపు పొందాడు. సీఆర్ 7 బ్రాండింగ్తో అతను ఏ వ్యాపారం మొదలు పెట్టినా కనకవర్షం కురిసింది. రియల్ మాడ్రిడ్తో విభేదాలతో ఇటలీలోని యువెంటస్ క్లబ్కు చేరినప్పుడు కూడా రికార్డు మొత్తంలో ట్రాన్స్ఫర్ జరిగింది. 100 మిలియన్ యూరోలు చెల్లించి యువెంటస్ సొంతం చేసుకోగా... తొలి రోజు కేవలం ఆ టీమ్లో రొనాల్డో జెర్సీ అమ్మకాల ద్వారానే 62.4 మిలియన్ డాలర్లు రావడం అతని స్థాయి ఏమిటో చూపించింది. గోల్ సాధించినప్పుడల్లా అతను తనదైన శైలిలో సుయ్య్య్... అంటూ ప్రదర్శించే ప్రత్యేక విన్యాసం ప్రతీ యువ ఫుట్బాల్ మదిలోసిగ్నేచర్గా నిలిచిపోయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా రొనాల్డో అందనంత ఎత్తులో నిలిచాడు. సొంత దేశంలోనైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే అతని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది. ప్రస్థానం ఎప్పటి వరకు...జొహాన్న్క్రఫ్, ఫెరెన్స్ పుస్కాస్, పావోలో మాల్డిని, మైకేల్ ప్లాటిని, ఆల్ఫ్రెడో డి స్టిఫానో, డేవిడ్ బెక్హామ్, వేన్ రూనీ, ఒలివార్ కాన్, నెమార్... తమ అద్భుత ఆటతో ఫుట్బాల్లో ఎన్నో ఘనతలు సాధించినా వరల్డ్ కప్ను మాత్రం ముద్దాడని ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఈ జాబితాలో ఇప్పుడు రొనాల్డో కూడా చేరాడు. అతని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. అయితే ఆటలో పదును, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు కూడా అతని జోరు ముందు దిగదుడుపే. చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేసినా... పోర్చుగల్కు మున్ముందు కూడా ప్రాతినిధ్యం వహిస్తానని అతను చెబుతున్నాడు. అందుకే అధికారికంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. అయితే జాతీయ జట్టు తక్కువ సంఖ్యలో ఆడే మ్యాచ్లు, మార్పు కోరుకునే ఫెడరేషన్ వంటి కారణాలతో పోర్చుగల్ తరఫున మిగిలింది చాలా తక్కువ కెరీరే కావచ్చు. అయితే క్లబ్ ఫుట్బాల్లో మాత్రం అతని క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్కు అతను ఆడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చి అయినా సరే ఇప్పట్లో అతడిని వదిలేసేందుకు క్లబ్ ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పుకున్నా మరో క్లబ్ కచ్చితంగా ఈ సూపర్ స్టార్ కోసం వేచి చూస్తుందనడంలో సందేహం లేదు. వరల్డ్ కప్లో అతని స్థాయికి తగిన మెరుపులు కనిపించకపోయినా ... మరికొంత కాలం రొనాల్డో విన్యాసాలకు లోటు ఉండకపోవచ్చు. 1 వరుసగా ఆరు ప్రపంచకప్లలో గోల్ చేసిన ఏకైక ప్లేయర్146 జాతీయ జట్టు తరఫున ప్రపంచంలో అత్యధికగోల్స్ చేసిన ఆటగాడు 233 జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్లుఆడిన ఏకైక ప్లేయర్ 4 రొనాల్డో నెగ్గిన క్లబ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ టైటిల్స్. రియల్ మాడ్రిడ్ తరఫున మూడుసార్లు (2015, 2017, 2018), మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరఫున ఒకసారి (2009) రొనాల్డో ఈ ఘనత సాధించాడు.35 కెరీర్లో రొనాల్డో గెలిచిన మొత్తం ట్రోఫీలు100కోట్లు సోషల్ మీడియాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య -
చర్చల యుద్ధానికి సిద్ధం
లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి భంగపడిన అధికార ఎన్డీఏ కూటమి ఈసారి మరింత పదునైన వ్యూహంతో ముందుకొస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ కృతనిశ్చయంతోఉంది. అయితే బడ్జెట్ సమావేశాల్లో ఐక్యత చాటి మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినట్లే ఈసారి ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.దీంతో జూలై 20వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీదాకా ఈసారి వర్షాకాల సమావేశాలు వ్యూహప్రతివ్యూహాలతో హోరాహోరీగా సాగనున్నాయి. మొత్తంగా ఈసారి 19 సార్లు ఇరుసభలు సమావేశంకానున్నాయి. బడ్జెట్ సెషన్లో మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినప్పటికీ ఇప్పటికీ అధికార, విపక్షల బలాబలాల్లో మార్పులొచ్చాయి.ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిన 27 స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి ఎన్డీఏ తన బలాన్ని పెంచుకుంది. వీళ్లుగాక స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు, చిన్న పార్టీల మద్దతునూ కూడగడుతోంది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 150కి చేరుకోబోతోంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల సంఖ్యాబలం(160)కి సమీపంలో ఉండటం గమనార్హం. పశ్చిమబెంగాల్లో ఖాళీగాఉన్న మరో మూడు రాజ్యసభ స్థానాలనూ కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోనుంది. దీంతోపాటు లోక్సభలోనూ బీజేపీ బలం ఎక్కువకానుంది. తగ్గిన విపక్షాల బలం ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష పార్టీల సంఖ్యాబలం తగ్గిపోయింది. దీంతో విపక్ష పార్టీల మధ్య ఐక్యత సైతం బలహీనపడింది. తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన అధికార పగ్గాలు చేపట్టిన విజయ్ జోసెఫ్కు చెందిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సుతరామూ ఇష్టంలేని మిత్రపక్షం డీఎంకే తన మైత్రిబంధానికి చరమగీతం పాడింది. వీటికితోడు పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని షాక్కు గురిచేస్తూ 20 మంది టీఎంసీ ఎంపీలు సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకి మద్దతు పలికారు. ఈ పార్టీ ఇప్పటికే ఎన్డీఏకూ మిత్రపక్షంగా ఉంది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రేకు గుబ్బై చెప్పి ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు పరోక్షంగా బీజేపీకి మద్దతు పలకడంతో లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ మరింత బలం పుంజుకుంది. విపక్షాల నుంచి సవాళ్లు.. ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థుల డిజిటల్ మూల్యాంకనం తప్పులతడకగా మారడం, అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు, స్వర్ణాభరణాలు చోరీకి గురికావడం, దేశంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకడం, పశ్చిమాసియా యుద్ధాగ్ని జ్వాలల భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సెగలు పుట్టించడంతో ప్రభుత్వ అంతర్గత, విదేశాంగ విధానం విఫలమైందంటూ విపక్షాలు పార్లమెంట్ వేదికగా పదునైన విమర్శనాస్త్రాలు సంధించనున్నాయి. టీఎంసీ, శివసేన(యూబీటీ) తిరుగుబాటుఎంపీల మద్దతులో లోక్సభలో ఎన్డీఏ బలం 318 లేదా 319కి పెరిగే వీలుంది. అయినాసరే మూడింట రెండొంతుల(360) బలానికి బీజేపీ 40 స్థానాలను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, నివేదికలు..ఢిల్లీలో అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఉదంతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంతవర్మను పదవి నుంచి తొలగించేందుకు, కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ అంశంలో అధికార, విపక్షాలు ఏకతాటిమీదకొచ్చాయి. ఇవీ బిల్లులు.. 1. రాజ్యాంగ(130వ) సవరణ బిల్లు తీవ్రమైన నేరాలకు పాల్పడి అరెస్టయి ఏకధాటిగా 30 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండిపోయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు సభ ముందుకురావొచ్చు. అయితే ఇప్పటికే ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 2. విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు, 2026 ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 3. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు గత ఏడాది డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 4. సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు, 2025 ఈ బిల్లును 2025 డిసెంబర్ 18వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 5. కార్పొరేట్ చట్టాల(సవరణ)బిల్లు, 2026 2026 మార్చి 23వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. -
‘స్లీప్’ డేంజర్!
ఆధునిక జీవనశైలి, శారీరక మార్పుల వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో ఒకటిగా మారుతోంది. మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారని వైద్య అధ్యయనాలు, వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గంటల తరబడి నిద్ర పట్టకపోవడం...రాత్రిపూట పదే పదే మెలకువ రావడం...రాత్రి వేళల్లో కాళ్లు లాగడం వల్ల నిద్రకు భంగం కలగడం.. ఇలా అనేక రకాల నిద్ర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.అధ్యయనాలు, సర్వేల్లో ఏం తేలిందంటే ? తాజాగా ఐ–స్లీప్స్ (నిమ్హన్స్–ఐఐఐటీ హైదరాబాద్) పరిశోధనలో పక్షవాతానికి సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా ఇతర అవయవాల నుంచి వచ్చిన కణాలు అడ్డుపడి ఆక్సిజన్ అందకపోవడం) వచి్చన రోగుల నిద్రను పరిశీలించగా, వారిలో 85% మంది శ్వాస రుగ్మతలతో బాధపడుతున్నట్లు తేలింది. వృద్ధులలో దాదాపు 37% మంది దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. షిఫ్ట్ వర్కర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, నిరుద్యోగులలో (13.34%) బయోలాజికల్ క్లాక్ దెబ్బతినడం వల్ల నిద్ర రుగ్మతలు ఎక్కువగా నమోదవుతున్నాయి ⇒ ఎయిమ్స్ న్యూఢిల్లీ పరిశోధకుల సమగ్ర విశ్లేషణ ప్రకారం.. సుమారు 4.7 కోట్ల మందికి తీవ్రమైన స్లీప్ అప్నియా ఉంది. దీనివల్ల నిద్రలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి ⇒ 2026 రెస్మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వే ప్రకారం నిద్రలేమి సమస్య పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువ శారీరక, మానసిక ప్రభావాన్ని చూపుతోంది. భారతీయులలో నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి/ఆందోళన (39%), ఆఫీసు పనులు (37%), ఇంటి పనుల బాధ్యతలు (31%) ప్రధాన కారణాలు.78% మంది నిద్ర సమస్యల కోసం డాక్టర్ను సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ⇒ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్–2026 సర్వే ప్రకారం...దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యధిక నిద్రలేమి ఉన్న నగరంగా నిలిచింది. మెరుగైన నిద్ర నాణ్యతతో చెన్నై నగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు 90% మంది భారతీయులు పడుకునే ముందు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని తేల్చింది. ⇒ బ్లెస్ కోహోర్ట్ స్టడీ 2025 ప్రకారం.. తీవ్రమైన స్లీప్ అప్నియా ఉన్న రోగులలో మధుమేహం, రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు ఈ క్లినికల్ అధ్యయనం స్పష్టం చేసింది. ⇒ లోకల్ సర్కిల్స్ 2026 సర్వే ప్రకారం...సుమారు 72% మంది రాత్రి వేళల్లో మూత్రవిసర్జన కోసం లేవడం వల్ల నిద్రాభంగం కలుగుతోందని తెలిపింది. ఇది డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం కావచ్చునని, 46% మంది రాత్రిపూట కనీసం 6 గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని తెలిపింది. దాదాపు 55% మంది ఇండియన్లు అర్ధరాత్రి దాటిన తర్వాతే పడుకుంటున్నారని పేర్కొంది.నిద్రలేమితో ఆరోగ్య ప్రమాదాలు⇒ సరైన నిద్ర లేకపోతే రక్తపోటు పెరిగి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుదల. ⇒ ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్–2 డయాబెటిస్ వస్తుంది. ⇒ ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, తీవ్రమైన డిప్రెషన్, మానసిక ఆందోళనకు దారితీస్తాయి. ⇒ డ్రైవర్లలో అలసట, నిద్రమత్తు కారణంగా దేశంలోని హైవేలపై దాదాపు 40% ప్రమాదాలు జరుగుతున్నాయి.సమతుల్యమైన నిద్రలో హైదరాబాద్కు రెండవస్థానం గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ 2026 అధ్యయనం ప్రకారం భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధిక నాణ్యత, అత్యంత సమతుల్యమైన గల నిద్రను అనుభవిస్తున్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. అలాగే, 42% మంది ప్రజలు ఆలస్యంగా నిద్రపోతున్నారని, సుమారు 31% మందికి నిద్రలేమి లేదా నిద్ర సరిపోకపోవడం గురించిన ఆందోళనలు చెందుతున్నారని పేర్కొంది.ఒకే సమయాన్ని అలవాటు చేసుకోవాలి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలకు దూరంగా ఉండాలి. రాత్రి భోజనం నిద్రపోయే సమయానికి కనీసం 2–3 గంటల ముందే ముగించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సాయంత్రం వేళల్లో కాఫీ, టీ, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. శారీరక వ్యాయామం, యోగా చేయడం వల్ల గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రపోయే గది ప్రశాంతంగా, కాంతి లేకుండా చీకటిగా, అనుకూలమైన ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోవాలి. – డా. జీసీ ఖిల్నాని, ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ నిపుణులు ముఖ్యాంశాలు ఇవీ ... ⇒ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో 30% నుంచి 40% మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ⇒ పురుషుల(8.3%)తో పోలిస్తే మహిళల్లో (10.3%) ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు దక్షిణాది రాష్ట్రాలో జరిపిన ఒక వైద్య సర్వేలో తేలింది. ⇒ నిద్రలేమితో బాధపడుతున్న వారిలో కేవలం 3% మంది మాత్రమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. ⇒ స్లీప్ అప్నియా ఉన్న రోగులలో 60% నుంచి 70% మంది ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ⇒ భారతీయుల సగటు నిద్ర సమయం 5.77 గంటలకు పడిపోయింది. ⇒ భారత్లో 140 కోట్లకు పైగా జనాభా ఉండగా, నిద్ర రుగ్మతలకు చికిత్స చేసే సరి్టఫైడ్ స్లీప్ స్పెషలిస్ట్లు 500 కంటే తక్కువ మందే ఉన్నారు. -
నిశీధిలో ఔషధాలు
కారుచీకటి.. సూర్యుడి కిరణం కూడా చొరబడటానికి వీల్లేని ప్రదేశం.. అప్పుడప్పుడూ వినిపించే గబ్బిలాల శబ్దాలు తప్ప లోపలంతా నిశ్శబ్దం. అవే పర్యాటక కేంద్రాలుగా భాసిల్లే గుహలు. జీవం మనుగడకే సాధ్యం కాని ఆ రాతిగోడల మధ్య మానవాళి ప్రాణాలను కాపాడగల ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల సామ్రాజ్యం నిశ్శబ్దంగా పెరుగుతోందని మీకు తెలుసా? అవును నిశీధిలో దాగున్న ఈ కంటికి కనిపించని జీవులే రేపటి వైద్య రంగానికి సరికొత్త దిక్సూచి కాబోతున్నాయి. భారతదేశంలో ఉన్న 1,500కు పైగా సహజ గుహల్లో పెరిగే సూక్ష్మజీవులు భవిష్యత్తులో ప్రాణాంతకమైన వ్యాధులకు సరికొత్త యాంటీబయాటిక్స్ అందించడమే కాకుండా.. అంతరిక్ష పరిశోధనలకు, పర్యావరణ శుద్ధికి కూడా కీలకం కానున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దామా? ప్రతి గుహలో ఒక విలక్షణమైన జీవావరణం గోవాలోని క్యూపెమ్ ప్రభుత్వ కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత దబోల్కర్ రాసిన పరిశోధన వ్యాసం ఇటీవల ప్రముఖ ‘జియో మైక్రోబయాలజీ జర్నల్’లో ప్రచురితమైంది. భారతదేశంలోని గుహలు కేవలం పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదని, అవి అపార జీవవైవిధ్యానికి నిలయాలని ఆమె నిరూపించారు. ఆహారం దొరకని, సూర్యరశ్మి సోకని క్లిష్ట పరిస్థితులను తట్టుకొని ఆస్పెర్గిల్లస్, పెన్సిలియమ్, క్లాడో స్పోరియమ్ వంటి ఫంగస్ రకాలు మన గుహల్లో జీవిస్తున్నాయి. ఇవి గుహల్లోని రాళ్లను, ఖనిజాలను ఆహారంగా మార్చుకుంటూ ప్రత్యేకమైన ఎంజైమ్లను విడుదల చేస్తూ సొంతంగా ఒక మైక్రో ఎకో సిస్టమ్నే సృష్టించుకుంటున్నాయి. అలాగే మేఘాలయలోని సున్నపురాయి గుహలు, ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు, ఛత్తీస్గఢ్లోని కోటమ్సర్ గుహ, గోవాలోని లాటరైట్ గుహలు, దక్కన్ ప్రాంతంలోని అగ్నిపర్వత గుహలు.. ఇలా ప్రతి భూగర్భ వ్యవస్థకు దాని సొంత సూక్ష్మ జీవావరణ వ్యవస్థ ఉంది. యాంటీబయాటిక్స్ విప్లవం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు బాక్టీరియాలు మందులకు లొంగకపోవడం. ఈ గుహల్లోని శిలీంధ్రాలు వేల ఏళ్లుగా ఇతర సూక్ష్మజీవులతో పోటీ పడుతూ, వాటిని ఎదుర్కోవడానికి తమలో తాము శక్తివంతమైన రసాయన రక్షణలను అభివృద్ధి చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు తదుపరి తరం యాంటీబయాటిక్స్ తయారీకి మూలస్తంభాలు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలను, ప్రమాదకర రసాయనాలను విచ్ఛిన్నం చేయగల ఎంజైములు కూడా ఈ ఫంగస్లలో ఉన్నాయి. బయోటెక్నాలజీ రంగంలో ఇవి సరికొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడిపై మనుగడ సాధ్యమేనా? ఈ అధ్యయనం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాలేదు. గుహలలోని ఈ జీవుల సహన శక్తి ఆస్ట్రోబయాలజిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తీవ్రమైన రేడియేషన్, వనరులు లేని కఠిన పరిస్థితులను తట్టుకోగల ఈ శిలీంధ్రాల లక్షణాలను బట్టి చూస్తే, భవిష్యత్తులో మానవుడు అంగారక గ్రహం లేదా మంచుతో నిండిన యూరోపా (గురుడి ఉపగ్రహం) వంటి చంద్రులపై అడుగుపెట్టినప్పుడు, అక్కడ జీవం మనుగడకు ఇవే ఆధారాలు కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలోని గుహలు సైన్స్ రంగానికి ఒక సరికొత్త సరిహద్దుగా నిలిచాయి. నిశీధిలో దాగి ఉన్న ఈ చిన్నజీవులు మానవాళి భవిష్యత్తుకు వెలుగులు ఇవ్వనున్నాయి. -
ఇలా చేద్దాం 'సర్'
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)– 2026లో భాగంగా గత నెల 25న రాష్ట్రంలో ఓటర్ల గణన ప్రక్రియప్రారంభమైంది. ఇప్పటికే ‘సర్’ పూర్తయిన రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించడంతో రాష్ట్రంలో సైతం ఆందోళన నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా మారి నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలతో ప్రమేయం లేకుండా వయోజనులైన పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఓటరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ‘సర్’పై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం ఇదీ...1 ఎన్యూమరేషన్ దశఫారం ఇస్తేనే ఓటుఓటు హక్కు పరిరక్షణకు ఓటరు వేయాల్సిన తొలి అడుగు .. ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నింపి సంతకం/వేలి ముద్ర వేసి బూత్ స్థాయి అధికారికి(బీఎల్ఓ) నిర్దేశిత గడువు జూలై 24లోగా తిరిగి ఇవ్వాలి. అప్పుడే వారి పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారం ఎలా పూరించాలి?» బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతోపాటు ఎలా నింపాలో అవగాహన కల్పిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని మూడు విభాగాలుగా విభజించి రూపొందించగా, ఎగువ విభాగంలో సంబంధిత ఓటరు పేరు, ఎపిక్ సంఖ్య, చిరునామా, ఫొటో తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉంటాయి. పాత ఫొటో ముద్రించి ఉంటే కొత్త ఫొటోను అతికించడానికి ఒక బాక్స్ ఇదే విభాగంలో ఉంటుంది. » చివరిసారిగా రాష్ట్రంలో 2002లో ‘సర్’ నిర్వహించి తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఉంటే.. ఆ వివరాలను ఫారం మధ్యలోని రెండో విభాగంలో నింపాల్సి ఉంటుంది. తప్పొప్పులతో సంబంధం లేకుండా 2002 జాబితాలో వివరాలు ఎలా ఉంటే సరిగ్గా అలానే పూరించాలి. ఎడమవైపు కాలమ్లో ఓటరు, కుడి వైపు కాలమ్లో బంధువుకి సంబంధించి 2002 జాబితాలోని వివరాలు రాయాలి. 2002 జాబితాలో ఇద్దరిలో ఒకరి పేరే ఉంటే సంబంధిత కాలమ్లో ఆ వివరాలను నమోదు చేయాలి. ఇద్దరిలో ఒకరి పేరు లేకుంటే సంబంధిత కాలమ్ ఖాళీగా వదిలేయాలి. ఇద్దరి పేర్లూ లేకుంటే రెండు కాలమ్స్నూ ఖాళీగా వదిలేయాలి. » ఇక కింద ఉండే మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ,ఆధార్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు– వారి ఎపిక్ నంబర్, తల్లి పేరు–ఆమె ఎపిక్ నంబర్, జీవిత భాగస్వామి పేరు–ఎపిక్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఒక ప్రతిని బీఎల్ఓ తీసుకుని మరో ప్రతిని రశీదుగా తన సంతకంతో తిరిగి ఓటరుకే ఇస్తారు. రశీదును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో అవసరం పడొచ్చు. ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్రం పేర్లే రాయాలి2002 సర్ ఓటర్ల జాబితాలో మీ పేరు, మీ బంధువుల పేర్లను రాసే కాలమ్స్లో జిల్లా రాయాల్సిన చోట ఉమ్మడి జిల్లా, రాష్ట్రం రాయాల్సిన చోట తెలంగాణ రాయాలి. అసెంబ్లీ నియోజకవర్గం రాయాల్సిన చోట 2002 నాటి అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి. 2002 తర్వాత రాష్ట్రం, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో ఎన్నికల యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.2002 జాబితాలో పేరెలా వెతకాలి?2002 నుంచి ఒకే చిరునామాలోఉంటున్న ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఇబ్బందులు ఉండవు. 2002 ఓటర్ల జాబితాలో వారి పేరు, బంధువుల పేర్ల వివరాలు స్థానిక బీఎల్ఓల వద్ద ఉంటాయి. ప్రస్తుతం కొత్త చిరునామాలో నివాసముంటున్న ఓటర్లు మాత్రం 2002లో ఎక్కడ నివాసం ఉన్నారో ఆ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తమ పేరు, బంధువు పేర్లను అన్వేషించక తప్పదు. 2002 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో వాటి సరిహద్దులతోపాటు పేర్లూ మారాయి. నాటి నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ వివరాలతో 2002 జాబితాలో పేర్లను వెతకవచ్చు. ఈసీ వెబ్సైట్ (https://www.eci.gov.in) తోపాటు సీఈఓ తెలంగాణ వెబ్సైట్ (https://ceotelangana.nic.in/SIR&2002. html) లో ‘2002 ఓటర్ల జాబితా’ను అందుబాటులో ఉంచారు. ఇక్కడ రెండు రకాల సెర్చ్ సౌలభ్యం కల్పించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలో సెర్చ్ చేసుకోవచ్చు. ఓటరు పేరు, ఇతర వివరాలతో సైతం పేర్లను వెతికే మరో సదుపాయం కల్పించారు.ఓటరు అందుబాటులో లేకుంటే?నిబంధనల ప్రకారం ఓటరే తన ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపాలి. విద్య, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు మాత్రం మినహాయింపు కల్పించారు. వారి కుటుంబ పెద్ద భర్తీ చేసి తన సంతకంతో బీఎల్ఓకు తిరిగి ఇవ్వవచ్చు. బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకుంటే..ఎన్యూమరేషన్ ఫారాన్నికేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https:// voters.eci. gov.in) ద్వారా సమర్పించవచ్చు. అయితే, ఆధార్ అథెంటికేషన్ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్సైట్ (https:// ceotelangana.nic. in) నుంచి తమ ప్రాంత బీఎల్ఓ ఫోన్ నంబర్ను తీసుకుని నేరుగా ఫోన్ చేయొచ్చు. ఈసీ వెబ్సైట్లో ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు.2 ఎన్యూమరేషన్ తర్వాతి దశముసాయిదాలో పేరు ఉందా?పోలింగ్ కేంద్రాల వారీగా సర్ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాను సైతం పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.గరిష్టంగా ఎన్నిఅభ్యంతరాలు?ముసాయిదాజాబితాలోని అనర్హుల పేర్ల తొలగింపునకు రాజకీయ పార్టీల బూత్ స్థాయిఏజెంట్ల (బీఎల్ఏ)తో పాటు ఇతరులెవరైనా రోజుకు 10కి మించకుండా గరిష్టంగా 30 వరకు అభ్యంతరాలను ఆగస్టు 30లోగా ఫారం–7 ద్వారా తెలపవచ్చు.ముసాయిదాలో పేరు లేకుంటే ?ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫారం–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫారం–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు(ఫారం–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ముసాయిదా జాబితాకు మార్పులు చేర్పులు చేసి తుది జాబితా ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి.2002లో ఓటరు పేరు లేకుంటే? ఓటరు పేరు సర్2002 ఓటర్ల జాబితాలో లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 2002 జాబితాలో వారి తల్లిదండ్రులు/ నాయనమ్మ, తాతయ్యల పేర్లను సేకరించి ఎన్యూమరేషన్ ఫారంలోనిసంబంధిత కాలమ్లో పూరిస్తే సరిపోతుంది.స్వీయ ధ్రువీకరణ ఎవరు ఇవ్వాలి?కొత్తగా ఓటరుగా నమోదుకావడానికి ఫారం–6, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటును బదిలీ చేసుకోవడానికి ఫారం–8 దరఖాస్తును స్వీయ ధ్రువీకరణ ఫారంతోపాటు బీఎల్ఓకు సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత ఓటరే సంతకం చేయాలి. ఒకే రాష్ట్రం పరిధిలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒకే నియోజకవర్గంలో మరో చిరునామాకి ఓటును బదిలీ చేసుకోవడానికి స్వీయ ధ్రువీకరణ అవసరం లేదు.3 నోటీసులు/విచారణ దశనోటీసులు ఎవరికి ఇస్తారు?రెండు కేటగిరీల ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా లో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్లో తేడాలను గుర్తించిన ఓటర్లతోపాటు 2002 ఓటర్ల జాబితాలో తమతోపాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు మాత్రమే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు ఇస్తారు. నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది.పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే..నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణపత్రం సమర్పిస్తే సరిపోతుంది.1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారం కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 పత్రాలు 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 2. ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ పోస్టాఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థలు 01.07.1987కు ముందు జారీ చేసిన గుర్తింపు పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్ట్ 5. గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదో తరగతి/విద్యా ధ్రువీకరణ పత్రాలు 6. ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస సర్టిఫికెట్ 7. అటవీ హక్కుల సర్టిఫికెట్ 8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ 9. జాతీయ పౌరుల రిజిస్టర్ (తెలంగాణకు వర్తించదు) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ 11. ప్రభుత్వం ఇచ్చిన స్థలం/ఇంటి కేటాయింపు పత్రం 12. ఆధార్ కార్డు (గుర్తింపు ధ్రువీకరణ మాత్రమే. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంత ధ్రువీకరణకుస్వీకరించరు)12 రకాల పత్రాలూ లేకుంటే?భారత పౌరులనే ఓటర్లుగా నమోదు చేయడానికి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంతోపాటు గుర్తింపు ధ్రువీకరణకు రుజువులు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ను స్వీకరిస్తారు. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ కోసం మిగిలిన 11 రకాల పత్రాలనే రుజువుగా స్వీకరించనున్నారు. ఒకవేళ ఈ 11 రకాల పత్రాలూ లేని ఓటర్లు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలనూ రుజువులుగా సమర్పించవచ్చు. అయితే ఈ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం. కలెక్టర్,సీఈఓకు అప్పీల్విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద 15 రోజుల్లోగా జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తోపాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద 30 రోజుల్లోగా సీఈఓకు రెండో అప్పీల్కు అవకాశం కల్పిస్తారు.‘సర్’ షెడ్యూల్ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీజూన్ 25 నుంచి జూలై 24 వరకుముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 31ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకునోటీసుల జారీ/ విచారణ, ఎన్యూమరేషన్ ఫారాలు/ అభ్యంతరాలు/ దరఖాస్తుల పరిష్కారం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకుతుది జాబితా ప్రచురణ అక్టోబర్ 1-సాక్షి, హైదరాబాద్ -
నడకకు నజరానా!
(సాక్షి, స్పెషల్ డెస్క్) : రోజుకు కేవలం 20 నిమిషాల నడక లేదా శారీరక వ్యాయామం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మీ జేబును కూడా నింపుతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రజలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు, తద్వారా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు పలు దేశాల్లో ప్రభుత్వాలు వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నాయి. నిర్ణీత సమయం పాటు నడిచే లేదా వ్యాయామం చేసే పౌరులకు నగదు బహుమతులు, షాపింగ్ వోచర్లు తదితర ప్రోత్సాహకాలను నేరుగా అందిస్తున్నాయి. ఈ జాబితాలో సింగపూర్, దుబాయ్ (యూఏఈ), కెనడాలతో పాటు కొత్తగా యునైటెడ్ కింగ్డమ్ చేరింది. ఏటా 2,700 కోట్ల డాలర్ల భారం ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ వైద్య బడ్జెట్లపై పెనుభారం పడుతోంది. శారీరక వ్యాయామం కొరవడినందున ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలకు ప్రతి ఏటా సుమారు 2,700 కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. పౌరులు రోజుకు 30 నిమిషాలు నడక తదితర శారీరక వ్యాయామాలు చేస్తే, ఈ దీర్ఘకాలిక వ్యాధులను 40 శాతం వరకు అరికట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు వ్యాయామానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంపై పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. నెలలో 42 కి.మీ. నడక ఆరోగ్యం కోసం అనుదినం నడిచే దేశ పౌరులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వచ్చే జనవరిలో ప్రారంభం కానున్న ‘మూవ్మెంట్ 26.2‘అనే నడక సవాలు కార్యక్రమానికి ఒలింపిక్స్ పతక విజేత సర్ బ్రెండన్ ఫోస్టర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు రోజుకు కనీసం 20 నిమిషాలు (1.4 కి.మీ.) నడిస్తే, నెలలో 42 కిలోమీటర్లు (పూర్తి మారథాన్ దూరం) నడవగలుగుతారు. తమ నడక వివరాలను ఆన్లై¯న్లో లేదా ఫోన్లు, స్మార్ట్వాచ్ల ద్వారా నమోదు చేసుకోవాలి.నడక సవాలును పూర్తిచేసిన వారికి డిస్కౌంట్ వోచర్లు, ఇతర బహుమతులు లభిస్తాయి. ‘ఇది నిజంగా ఒక సరళమైన, సాధించదగిన, అర్థవంతమైన ప్రయోజనాలందించే సవాలు..’అని బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా’ప్రచారోద్యమాన్ని నడుపుతున్నప్పటికీ.. పౌరులకు నేరుగా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక బహుమతులు అందటం లేదు. అయితే దేశంలోని కొన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా కంపెనీలు, కొన్ని ఫిట్నెస్ యాప్లు రోజువారీ నడక లక్ష్యాలను చేరుకుంటే ప్రీమియం తగ్గింపులు, రివార్డ్ పాయింట్లను ఇస్తున్నాయి. ఏ దేశంలో ఎంత నడక, ఎలాంటి ప్రోత్సాహకాలు? » సింగపూర్ నేషనల్ స్టెప్స్ చాలెంజ్ (హెల్దీ 365 యాప్): రోజుకు 5,000–10,000 అడుగులు లేదా 20 నిమిషాల శ్రమ/ సూపర్ మార్కెట్ వోచర్లు, ఉచిత రవాణా (సబ్వే/బస్) పాస్లు » యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఎన్హెచ్ఎస్ బెటర్ హెల్త్ (పైలట్ ప్రాజెక్ట్): రోజుకు 20–30 నిమిషాల చురుకైన నడక/ షాపింగ్ డిస్కౌంట్లు, ఉచిత సినిమా టికెట్లు, జిమ్ వోచర్లు » దుబాయ్ (యూఏఈ) దుబాయ్ ఫిట్నెస్ చాలెంజ్ (30్ఠ30): ప్రతిరోజూ 30 నిమిషాల చొప్పున నెల వ్యాయామం/ ప్రత్యేక డిస్కౌంట్ కూపన్లు, లక్కీ డ్రా ద్వారా బహుమతులు » కెనడా పార్టిసిప్ యాక్షన్ (ప్రభుత్వ నిధులు): నిర్దేశిత వారపు / నెలవారీ ఫిట్నెస్ లక్ష్యాలు సాధించాలి/స్పోర్ట్స్ గియర్, బ్రాండెడ్ వస్తువులు గెలుచుకునే అవకాశం -
ట్రంప్ను కూల్ చేసేందుకు.. నాటో కొత్త ఎత్తుగడలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నంలో అట్లాంటిక్ కూటమి (నాటో) కీలక అడుగులు వేస్తోంది. సభ్యదేశాల మధ్య ఐక్యతపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేయడంతో పాటు, వాషింగ్టన్ ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ఐరోపా భద్రతకు పెరుగుతున్న సవాళ్లు, అమెరికా వైఖరిలో వచ్చిన మార్పులు, సభ్యదేశాలపై ట్రంప్ ఒత్తిడి.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న అంకారా(టర్కీ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.నాటో ఏర్పడి దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఐరోపాలోని మొత్తం 32 దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ సైనిక వ్యయంలో సగానికి పైగా ఈ దేశాలదే. అలాంటి కూటమిలో గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అమెరికా లేకుండా నాటో కొనసాగగలదా? అదే సమయంలో మరో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అమెరికా ఎందుకు మిగతా దేశాల భద్రత కోసం అంత భారీగా ఖర్చు చేయాలి? ఈ రెండో ప్రశ్ననే డొనాల్డ్ ట్రంప్ అత్యంత బలంగా లేవనెత్తారు.ట్రంప్కు నాటోపై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ కూటమి నిర్వహణ తీరుపై ఆయన చాలాకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చిస్తుంటే, ఐరోపాలోని అనేక దేశాలు మాత్రం తమ భద్రత బాధ్యతను అమెరికాపైనే వదిలేశాయని ఆయన విమర్శిస్తున్నారు. "అమెరికా డబ్బుతో యూరప్ భద్రత ఎందుకు?" అనే ప్రశ్నను ఆయన ఎన్నికల ప్రచారంలోనే కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ పదేపదే లేవనెత్తారు. సభ్యదేశాలు తగిన రక్షణ వ్యయం చేయకపోతే అమెరికా తన భద్రతా హామీలను పునఃసమీక్షిస్తుందని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక దశలో అమెరికా నిజంగానే నాటో నుంచి తప్పుకుంటుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది.అయితే ట్రంప్ ఎప్పుడూ ‘‘నాటోను రద్దు చేస్తాను’’.. ‘‘నాటో నుంచి తప్పుకుంటాం’’ అని అధికారికంగా ప్రకటించలేదు. ఆయన లక్ష్యం కూటమిని బలహీనపరచడం కాదని, సభ్యదేశాలు కూడా సమాన బాధ్యతలు తీసుకునేలా చేయడమేనని ఆయన సన్నిహితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అంకారాలో జరుగుతున్న సమావేశం చూస్తే, ట్రంప్ ఎన్నాళ్లుగానో చెబుతున్న అంశాలకే నాటో స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అందుకే ఈసారి సభ్యదేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలనే లక్ష్యాన్ని దశలవారీగా 5 శాతానికి పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 3.5 శాతం నేరుగా సైనిక సామర్థ్యాల పెంపు, ఆయుధాల కొనుగోలు, సైనిక దళాల ఆధునికీకరణకు వినియోగిస్తారు. మిగిలిన 1.5 శాతం సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ పరిశ్రమ, సైనిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. నాటో చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ వ్యయ లక్ష్యంగా భావిస్తున్నారు.ఇదొక్కటే కాదు.. సమావేశం ముగింపులో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 మీద తమ నిబద్ధత "అచంచలం" అని మరోసారి ప్రకటించనున్నారు. ఈ నిబంధనే నాటోకు వెన్నెముకగా భావిస్తారు. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి మిగతా సభ్యదేశాలన్నీ రక్షణకు ముందుకు రావాలనేది దీని సారాంశం. ట్రంప్ గతంలో ఈ అంశంపైనా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ సమావేశంలో మరో కీలక అంశం ఉక్రెయిన్. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీవ్కు సైనిక, ఆర్థిక సహకారాన్ని ఎలా కొనసాగించాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే గత సమావేశాలతో పోలిస్తే ఈసారి ఉక్రెయిన్ అంశం కంటే అమెరికా-నాటో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ట్రంప్ వైఖరి కారణంగా కూటమిలో ఎలాంటి చీలికలు ఏర్పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.నాటోలోని చాలా దేశాలు ఇప్పటికే రక్షణ వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు కేవలం మూడు దేశాలే జీడీపీలో 2 శాతం రక్షణకు ఖర్చు చేసేవి. ఇప్పుడు 32 సభ్యదేశాల్లో మెజారిటీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాయి. ఇప్పుడు 5 శాతం లక్ష్యంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా-చైనా పోటీ, రష్యా దూకుడు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ఇలా అనేక పరిణామాలు ఒకేసారి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాయకత్వంలోని నాటోలో ఎలాంటి బలహీనత కనిపించినా అది ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను విస్మరించకుండా, వాటికి సమాధానమిస్తూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తున్నాయి.అమెరికా లేకుండా నాటోను ఊహించడం కష్టం. అదే సమయంలో నాటో లేకుండా ఐరోపా భద్రతను ఊహించడం కూడా అంతే కష్టం. ఈ వాస్తవాన్ని గుర్తించిన సభ్యదేశాలు ఇప్పుడు ఒకే సందేశం ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోకుండా, కూటమి బలాన్ని మరింత పెంచుకోవడం. అంకారా సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రానున్న సంవత్సరాల్లో అమెరికా-నాటో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించనున్నాయి. -
అరవ వేట.. తీరం విలవిల!
‘‘ తీరం మనదే..వేటా మనదే.. రాజీలేదు.. ఎవరైనా వస్తే రానిచ్చే పరిస్థితి లేదు. మన తీరంపై మనకే హక్కులు.. పొరుగు రాష్ట్రానికి చెందిన బోటు కనబడితే కలెక్టర్కు మెసేజ్ వస్తుంది. అప్రమత్తం అవుతాం. ఎవరనీ రానివ్వం’’ అంటూ ఈ ఏడాది మే 19వ తేదీన వేట విరామ సాయం అందించే కార్యక్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇది.‘‘తమిళనాడు సోనాబోట్ల ఆగడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవు. స్పీడ్ బోట్ల ద్వారా సముద్రంలో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోంది.’’ అంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. వేట విరామం తర్వాత పాండిచ్చేరి కరైకల్ బోట్లు వస్తున్నాయి. మత్స్యకారులపై దాడులు చేస్తున్నాయి. విలువైన మత్స్య సంపద దోచుకుపోతున్నాయి. పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం కావడంతో జిల్లాలో కడలిపుత్రులకు భద్రత కరువైంది. మంగళవారం వీటి దాడిలో సుమారు రూ.6 లక్షలకు పైగా విలువైన వలలు దెబ్బతిన్నాయని, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మత్స్యకారులు వాపోతున్నారు. సింగరాయకొండ: వేట విరామం తర్వాత ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి కడలిలో గంగపుత్రులు వేట మొదలు పెట్టారు. వారం రోజులు వేట సవ్యంగానే సాగింది. ఆ తర్వాత తమిళనాడు బోట్ల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం తీరానికి 18 నాటికల్మైళ్ల దూరంలో సోనాబోట్లు వేటసాగించాలి. నిబంధనలు మీరి పావు కిలోమీటరు దూరంలోనే చేపల వేట సాగిస్తున్నాయి. ఇటీవల వేట నిషేధ కాలం ముగిసిన నాటి నుంచి ప్రతి రోజు సోనాబోట్లు తీరానికి సమీపంలో వేటాడుతూ లక్షలాది రూపాయల వలలను తెంచేస్తూ మత్స్యకారులకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి. పాండిచ్చేరి కరైకల్ ప్రాంతానికి చెందిన సోనాబోట్లు యథావిధిగా హల్చల్ చేస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ సంయుక్తంగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతిరోజు మూడు పెట్రోలింగ్ బోట్లతో పహారా కాస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నా సోనా బోట్ల ఆగడాలు కొనసాగుతుండడం గమనార్హం. తాము ఈ ప్రాంతంలో వేటసాగిస్తున్నామని సమాచారం పంపితే చెన్నై, కడలూరు బోట్లు కొన్ని సందర్భాల్లో దూరంగా వెళ్లిపోతున్నాయని, పాండిచ్చేరి కరైకల్ మత్స్యకారులు మాత్రం దౌర్జన్యంగా వచ్చి మా వలలు తెంచుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో గస్తీ ఉత్తమాటే.. ప్రకాశం జిల్లాలో సుమారు 70 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, గుడ్లూరు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 39 మత్స్యకార గ్రామాలున్నాయి. మొత్తం 50 వేల జనాభా. చేపల వేటపై ఆధారపడి సుమారు 12 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు 2,303 బోట్లు ఉండగా వాటిలో సుమారు 1,661 మోటరైజ్డ్ బోట్లు, 642 నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి.సముద్రంలో పక్క రాష్ట్రాల సోనాబోట్లను అడ్డుకునేందుకు జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఒకటి, కృష్ణపట్నం పోర్టు వద్ద రెండు పెట్రోలింగ్ బోట్లను ఏర్పాటు చేసి వాటిని మెరైన్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నామని, ఇప్పటి వరకు 6 సోనాబోట్లను పట్టుకున్నామని మెరైన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే వందలాది బోట్లు తీరానికి సమీపానికి వచ్చి వేట సాగిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి.ప్రతిరోజు తెల్లవారు జామున 2 గంటలకు వెళ్లి ఉదయాన్నే తిరిగి వస్తామని అయితే కరైకల్ బోట్లు మూడు గంటల సమయంలో తీరానికి దగ్గరగా వచ్చి వేటాడుతుండడంతో లక్షలాది రూపాయల వలలు ధ్వంసవుతున్నాయని, దీంతో రాత్రిపూట వేటకు వెళ్లటం మానుకున్నామని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట విరామం ప్రారంభమైన తర్వాత వారం రోజులపాటు దూరంగా వేట సాగించిన తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు మళ్లీ విజృభించాయని మత్స్యకారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట కొత్తపట్నం తీరానికి, మంగళవారం ఉదయం పాలక తీరానికి వచ్చిన బోట్లు వలలను ధ్వంసం చేసి విలువైన మత్స్య సంపదన దోచుకుపోయాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.మత్స్య సంపద తుడిచిపెట్టుకు పోతోంది కరైకల్కు చెందిన సోనాబోట్లు తీరానికి దగ్గరగా చేపల వేట చేయటంతో మత్స్య సంపద తుడిచిపెట్టుకు పోతోంది. దీంతో ఇటీవల కాలంలో తీరంలో మత్స్యసంపద లభించటం లేదు. ఖర్చులకు కూడా రావటం లేదు. ఇలాగైతే ఎలా బతకాలి. – నాయుడు వెంకటేశ్వర్లు, మత్స్యకారుడు, ఊళ్లపాలెంవలలు ధ్వంసమవుతున్నాయి ప్రతిరోజు రాత్రి 2 గంటలకు చేపల వేటకు వెళ్లి ఉదయాన్నే తీరానికి వస్తాం. కానీ ఇటీవల కాలంలో సోనాబోట్లు తీరానికి దగ్గరగా రావటంతో రూ.20 వేల విలువైన వల ధ్వంసమైంది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దౌర్జన్యంగా వలలు తెంచుకుపోయాయి. దీంతో రాత్రి పూట చేపల వేటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. రాత్రి పూట వెళితేనే చేపలు దొరుకుతాయి. – తంబు హరిబాబు, మత్స్యకారుడు, ఊళ్లపాలెం -
70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్ విమానం ఇదేనా?
ఆకాశంలో ఎగిరే విమానం ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచం ఒకటే సమాధానం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ సమాధానాన్నే మార్చేయాలనే ఓ స్టార్టప్ చేస్తున్న సాహసోపేత ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన విమానాల రూపమే గతం కావొచ్చనే చర్చా.. ఇటు విమానయాన రంగంలో మొదలైంది. ప్రపంచంలోని రెండు దిగ్గజ కంపెనీలు కూడా ఈ కొత్త ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!..దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్ను రెండు దిగ్గజ సంస్థలు.. బోయింగ్, ఎయిర్బస్ శాసిస్తూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న బడా విమానాలన్నీ దాదాపుగా ఇవి రూపొందించినవే. అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్జీరో (JetZero) ఈ ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. సంప్రదాయ విమానాల కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్తో, ఇంధన వినియోగాన్ని సగానికి తగ్గిస్తామని చెబుతున్న కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తోంది.రెక్కలు–శరీరం ఒకటే..అమెరికాలోని మొహావే ఎడారిలో జెట్జీరో పూర్తి పరిమాణంలో ప్రదర్శన (డెమోన్స్ట్రేటర్) విమానాన్ని నిర్మిస్తోంది. సాధారణ విమానాల్లో శరీరం (ఫ్యూజలేజ్), రెక్కలు వేర్వేరుగా ఉంటాయి. కానీ జెట్జీరో ఆ డిజైన్కు పుల్స్టాప్ పెట్టే పని చేపట్టింది. ఆ కంపెనీ రూపొందిస్తున్న విమానంలో రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి. దీనినే ‘‘బ్లెండెడ్ వింగ్ బాడీ’’ (Blended Wing Body) డిజైన్ అంటారు. ఈ ఆకారం మంతా రే (Manta Ray) చేపను పోలి ఉంటుంది.50 శాతం ఇంధనం ఆదా!ప్రస్తుతం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు ఇంధనమే. జెట్జీరో విమానం సాధారణ జెట్లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. దీని ఆకారం కారణంగా.. గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు తక్కువ నిరోధం (డ్రాగ్) ఏర్పడటం వల్ల ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. విమానం వెనుక భాగంపై ఇంజిన్లను అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని కంపెనీ చెబుతోంది.మరింత సుఖవంతమైన జర్నీ..ఈ విమానం లోపలి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం ఆకారంలోని కేబిన్కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీంతో.. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. వంటగదులు (గ్యాలీలు), మరుగుదొడ్లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.జెట్జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని జెట్జీరో అడుగులు వేస్తోంది.నాసా పరిశోధనలకు కొనసాగింపుబ్లెండెడ్ వింగ్ బాడీ ఆలోచన కొత్తది కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు పూర్తి పరిమాణంలో వాణిజ్య విమానాన్ని నిర్మించే స్థాయికి ఏ సంస్థా రాలేదు. ‘‘కొత్త టెక్నాలజీని కనిపెట్టడం కాదు... ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతను ఉపయోగించి వాణిజ్య విమానంగా మార్చడమే మా లక్ష్యం’’ అని జెట్జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ చెబుతున్నారు.అమెరికా వైమానిక దళం అండజెట్జీరో ఆషామాషీ కంపెనీ ఏం కాదు. 2023లో అమెరికా వైమానిక దళం ఈ ప్రాజెక్టు కోసం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్(United Airlines), అలస్కా ఎయిర్లైన్స్ (Alaska Airlines) వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా జెట్జీరోలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై విమానయాన రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.2030 నాటికి..జెట్జీరో లక్ష్యం ప్రకారం డెమోన్స్ట్రేటర్ విమానం వచ్చే ఏడాది(2027) నాటికి తొలి పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఈ డిజైన్ను సైనిక రవాణా, గగనతల ఇంధన నింపే (Aerial Refueling) విమానాలుగా కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.సవాళ్లు భారీగానే.. ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ నిజంగానే ప్రకటించిన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి ధ్రువీకరణ పొందడానికి సంవత్సరాల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ‘‘ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. కానీ అసాధ్యమని కూడా చెప్పలేం’’ అని విమానయాన రంగపు విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయపడుతున్నారు.విమానాల రూపకల్పనలో దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మార్పులు రాలేదు. జెట్జీరో ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో మనం ప్రయాణించే విమానాల ఆకారంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన అనేక పరీక్షలను ఈ స్టార్టప్ విజయవంతంగా దాటాల్సి ఉంటుంది.:::వెబ్ స్పెషల్నోట్: కథనంలో చూపించిన విమానం తాలుకా ఫొటోలు ఏఐ జనరేటెడ్వి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా పాఠకుడికి చూపించాం.. -
గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం!
ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్ ఉత్సాహంలో మునిగిపోయింది. స్టేడియాలు అభిమానుల సందడితో మారుమోగుతున్నాయి. కానీ గాజాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. కరెంట్ ఉండే కొద్దిసేపైనా టీవీ ముందు గుమిగూడటం.. ఇంటర్నెట్ సిగ్నల్ కోసం భవనాలపైకి ఎక్కడం.. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మ్యాచ్లు చూడటం అక్కడి ప్రజల దైనందిన దృశ్యం. అలాంటి యుద్ధ వాతావరణంలోనూ ఫుట్బాల్ మాత్రం వారికి కాసేపైనా భయాన్ని మరిచిపోయే ప్రపంచంగా మారింది.అయితే అక్కడి నుంచే ఇప్పుడు మరో ఫుట్బాల్ కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అవయవాలు కోల్పోయిన గాజా యువతులు.. ఇప్పుడు ఫుట్బాల్ మైదానంలో తమ జీవితానికి కొత్త అర్థం వెతుకుతున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అమ్మాయిలతో కలిసి పాలస్తీనాలో తొలి మహిళల అంప్యూటీ ఫుట్బాల్ జట్టుగా ఏర్పడి(amputee).. చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి వారం.. డీర్ అల్-బలాహ్లో దాడుల్లో మిలిగిన కొద్దిపాటి గడ్డి మైదానంలో వారు సాధన చేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. ఒకరోజు ప్రపంచ వేదికపై పాలస్తీనా జెండాను ఎగురవేయడం.గాజా ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ దాదాపు ఆరు వేల మంది అవయవాలు కోల్పోయారు. వీరందరికీ కృత్రిమ అవయవాలు, దీర్ఘకాలిక పునరావాసం అవసరమైంది. ఈ పరిస్థితుల్లోనే 2018లో స్థాపించబడిన పాలస్తీనా అంప్యూటీ ఫుట్బాల్ అసోసియేషన్ కొత్త ఆశాకిరణంగా మారింది. యుద్ధం తర్వాత వికలాంగుల సంఖ్య పెరగడంతో మహిళల జట్టులో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.‘‘మా మైదానాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి లేదు. అయినా ఈ అమ్మాయిల సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది" అని అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఫౌద్ అబూ ఘూలియన్ చెబుతున్నారు. ప్రపంచకప్ సందర్భంగా గాజా నుంచి వినిపించాల్సిన గొంతులు కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఈ మహిళలు నిజమైన ఛాంపియన్లని ఆయన అంటున్నారు. 2027లో జరగనున్న మహిళల అంప్యూటీ ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనడమే తమ లక్ష్యమని వెల్లడించారు.24 ఏళ్ల రోజాన్ ఖైరా జీవితాన్ని మాత్రం యుద్ధమే ఒక్కసారిగా మార్చేసింది. 2023 నవంబరులో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబ ఇంటిపై బాంబు పడటంతో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఒకప్పుడు పరుగుపందేల్లో పతకాలు గెలిచిన ఆమెకు అది పెద్ద దెబ్బే. కానీ అదే సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అంప్యూటీ ఫుట్బాల్ జట్టులో చేరి తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటోంది.గోల్కీపర్ ఐషా అల్ అబద్లా కథ మరింత హృదయవిదారకం. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి తెల్ల భాస్వర(వైట్ పాస్పరస్) రసాయన ప్రభావానికి గురికావడంతో ఐషా ఒక చేయి పూర్తిగా అభివృద్ధి చెందకుండా జన్మించింది. అయినా దానిని ఆమె ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. ఎనిమిదేళ్లుగా ఫుట్బాల్ ఆడుతున్న ఆమెకు ఆటే జీవితం. "మైదానంలోకి దిగితే యుద్ధానికి ముందు ఉన్న రోజులు గుర్తొస్తాయి. మా జీవితంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది" అని చెబుతోంది.అయితే వీరి పోరాటం మైదానంలోనే ముగియడం లేదు. చాలామందికి శరణార్థి శిబిరాల నుంచి సాధనకు రావడానికి ప్రయాణ ఖర్చులే భారంగా మారుతున్నాయి. ఆహార కొరత, పోషకాహార లోపం, క్రీడా సామగ్రి కొరత వంటి సమస్యలు ప్రతిరోజూ వెంటాడుతున్నాయి. అయినా "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మా పట్టుదల మాత్రం తగ్గదు" అని రోజాన్ ధైర్యంగా చెబుతోంది.ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ను చూస్తుంటే... డీర్ అల్-బలాహ్లోని ఈ యువతులు కూడా వీలైనప్పుడల్లా ఆ మ్యాచ్లను చూస్తున్నారు. కానీ వారు కేవలం ప్రేక్షకులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకరోజు అదే ప్రపంచం తమ ఆటను కూడా చూడాలని... తమ గాయాలను కాదు, తమ గెలుపును గుర్తించాలని కలలు కంటున్నారు. యుద్ధం వారి అవయవాలను దూరం చేసినా... ఫుట్బాల్పై ప్రేమను, జీవితంపై ఆశను మాత్రం ఏ బాంబూ చెరిపేయలేకపోయింది. -
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్కు డబుల్ డోస్..
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా.. ఇప్పుడు తూర్పు ఆసియాలో నడుస్తున్న హైడ్రామాను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న ‘తోక దేశం’ లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది!చైనా చేతిలో రిమోట్ పనిచేయట్లేదా?ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లా ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం.. ఇటు అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం.. వీటన్నిటి మధ్య చైనా అసహనం..! అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా-రష్యాల మధ్య ఉత్తర కొరియా ఎలా నలిగిపోతోంది? లేక ఇద్దరినీ వాడుకుంటోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.జుచే నుంచి హత్యల వరకు..ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే.. మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్లాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక 'జుచే' (Juche) అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జుచే అంటే.. ‘స్వయం సమృద్ధి’ అని అర్థం. అంటే.. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం, అభివృద్ధి చెందడం. దాంతో.. ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్లో దూసుకుపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఒక చీకటి సామ్రాజ్యంగా మిగిలిపోయింది. ఎంతలా అంటే, రాజధాని ప్యాంగ్యాంగ్ మినహా దేశంలో దశాబ్దాల పాటు కరెంట్ కూడా లేని పరిస్థితి.కట్ చేస్తే.. 1990ల్లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటివరకు రష్యా నుంచి కొరియాకు వస్తున్న సాయం ఆగిపోయింది. ఈ పరిణామాలతో కిమ్ ఇల్ సంగ్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నారు. 'జుచే' వర్కవుట్ కాదని గ్రహించి, దక్షిణ కొరియాతో విలీనం కోసం చర్చలకు సిద్ధపడ్డారు. కానీ, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విలీనం జరిగితే తమ పదవులు ఊడిపోతాయని భయపడిన అక్కడి మిలిటరీ జనరల్స్.. కిమ్ ఇల్ సంగ్ను రహస్యంగా అంతమొందించారు. ఆ తర్వాత వచ్చిన కిమ్ జోంగ్ ఇల్.. కరడుగట్టిన కమ్యూనిస్ట్ భావజాలంతో బతికారు. ఆయన తెచ్చిన అనాలోచిత అగ్రికల్చర్ సంస్కరణల వల్ల దేశంలో ఏకంగా 20 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. కిమ్ హత్యాకాండ..!దేశాన్ని నాశనం చేస్తున్న కిమ్ జోంగ్ ఇల్ను చూసి మిలిటరీ జనరల్స్ అలర్ట్ అయ్యారు. తర్వాతి తరం అయినా ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలని.. అప్పట్లో చిన్న పిల్లోడైన కిమ్ జోంగ్ ఉన్ను స్విట్జర్లాండ్కు పంపించి చదివించారు. కానీ, అనుకోకుండా కిమ్ జోంగ్ ఇల్ చనిపోవడంతో.. కేవలం 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే కిమ్ జోంగ్ ఉన్ దేశాధినేత అయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ జనరల్స్ తన తాతను, తండ్రిని ఎలా వాడుకున్నారో కిమ్కు బాగా తెలుసు. అందుకే పవర్లోకి రాగానే.. తన తండ్రి కాలం నాటి పాత తరం జనరల్స్ను ఒక్కొక్కరినీ లేపేయడం మొదలుపెట్టాడు. సింగపూర్లో ఒకరిని చంపించాడు. రైల్వే మినిస్టర్ను ఏకంగా రైలు కిందే వేయించాడు. డిఫెన్స్ అటాచీని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్తో షూట్ చేయించాడు. ఇలా భయోత్పాతం సృష్టించి.. టోటల్ పవర్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కిమ్.ఉత్తర కొరియాపై చైనా పెత్తనం కిమ్ అంతర్గతంగా పవర్ స్ట్రాంగ్ చేసుకున్నా.. ఎక్స్టర్నల్గా చైనా ఆధిపత్యం ఎక్కువైంది. 2017 సమయంలో.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. కిమ్ను బీజింగ్ పిలిపించుకుని తాతలా క్లాసులు పీకేవారు. చైనా మీడియా కూడా కిమ్ను ఒక చిన్న ప్రావిన్స్ లీడర్లా తక్కువ చేసి చూపించేది. ఇది ఈ యంగ్ డిక్టేటర్కు అస్సలు నచ్చలేదు. చైనా అహాన్ని దెబ్బకొట్టడానికి.. కిమ్ నేరుగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో చేతులు కలిపాడు. సింగపూర్, వియత్నాంలలో సమ్మిట్స్ జరిగాయి. అయితే, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్రీఫింగ్స్ సరిగ్గా చదవకపోవడం వల్ల.. ఆ చర్చలు ఫలించలేదు. అమెరికా చాప్టర్ క్లోజ్ అయింది.కలిసొచ్చిన ఉక్రెయిన్ యుద్ధంచైనా ఒత్తిడి పెరుగుతోంది. మరి కిమ్ ఏం చేయాలి? సరిగ్గా అప్పుడే వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం! 2022లో ఉక్రెయిన్పై యుద్ధం వల్ల రష్యా ఒంటరైంది. ఆయుధాల కొరత వచ్చింది. ఇదే అదనుగా కిమ్ రంగంలోకి దిగాడు. దశాబ్దాలుగా దాచి ఉంచిన కోట్ల కొద్దీ ఆర్టిలరీ షాట్స్ను రష్యాకు ట్రైన్ల ద్వారా పంపాడు. ఎంతలా అంటే, యుద్ధంలో రష్యా వాడిన ఆయుధాల్లో మూడింట ఒక వంతు ఉత్తర కొరియా అందజేసినవే..! అంతేకాదు.. ఏకంగా 10,000 మంది కొరియన్ సైనికులను రష్యా బోర్డర్లో రష్యా తరఫున యుద్ధం చేయడానికి పంపాడు. దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి కిమ్ ఏం తీసుకున్నాడో తెలుసా? అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ..! ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సాంకేతికత! దీనివల్ల ఇప్పుడు ఉత్తర కొరియా అమెరికాలోని ఏ మూలనైనా న్యూక్లియర్ మిసైల్తో కొట్టగల సామర్థ్యం సంపాదించింది. అంటే, కిమ్కు కావాల్సిన డబ్బు, ఎనర్జీ, టెక్నాలజీ అన్నీ ఇప్పుడు రష్యా ఇస్తోంది. దీంతో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కిమ్కు పూర్తిగా తప్పిపోయింది!నో విలీనం..ఇదీ అసలు మ్యాటర్. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్యాంగ్యాంగ్ ఎందుకు వెళ్లారంటే.. తమ చేతుల్లోంచి జారిపోయి రష్యా గూటికి చేరిన కిమ్ను మళ్లీ లొంగదీసుకోవడానికి. కానీ కిమ్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా సాయం చేస్తేనే ఓకే అని.. లేదంటే పొమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నాడు. ఎందుకంటే కిమ్ ఈ ఏడాది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజ్యాంగాన్ని మార్చేసి, "ఇకపై దక్షిణ కొరియాతో విలీనం అనే ముచ్చటే లేదు.. మాది విడిగా ఉండే ఒక స్వతంత్ర అణు దేశం" అని డిక్లేర్ చేసేశాడు. చైనా లాంటి ఒక గ్లోబల్ సూపర్ పవర్కే చుక్కలు చూపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో, ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
మెడ వణుకుతోంది… కనీసం ఫోన్ను పట్టుకోలేకపోతున్నా!
ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.స్మార్ట్ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్ బాడీ (Phone Body)”. అంటే..ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.20–20–20 రూల్ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మెడ పోశ్చర్పై దృష్టిఫోన్ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.స్క్రీన్ టైమ్ పరిమితిరోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.శారీరక కదలికలు తప్పనిసరిప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.గ్రిప్ & చేతి వ్యాయామాలుబంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.బయట గడిపే సమయం పెంచాలిసహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.డిజిటల్ డీటాక్స్ అలవాటువారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష!
దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే సైనిక చర్య తప్పేలా లేదా? అమెరికా ఒకవేళ సైనిక చర్యకు దిగితే.. ఏయే మార్గాలను ఎంచుకుంటుంది? ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధం అంటే.. అమెరికాకు భారీ నష్టమే కాకుండా.. ఊహించని రిస్క్ కూడా. అసలు ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు సాధ్యం అవుతుందా? ప్రాణనష్టం లేకుండా యుద్ధాన్ని ముగించడం అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్కు సాధ్యమేనా?..ఇరాన్ ఓ కంచుకోట..!భౌగోళికంగా ఇరాన్ ఒక సహజమైన కోట లాంటిది. ఆ దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలుంటే.. లోపల భయంకరమైన ఎడారులు, ఉప్పు నేలలు ఉన్నాయి. శత్రు సైన్యం ఇరాన్ లోపలి నగరాల వరకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే, అమెరికా మిలటరీ ప్లానర్స్ ఒక సరికొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లకుండా, కేవలం దాని దక్షిణ తీరప్రాంతాన్ని(Southern Coastline) టార్గెట్ చేయడం! ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్థిక, సైనిక వనరులు ఉన్నాయి. కానీ మిలిటరీ నిపుణులు ఒక మాట అంటారు. ఇరాన్లో అడుగుపెట్టే మొదటి తొలి మైలు దూరాన్ని కిలోమీటర్లలో కొలవవచ్చు, కానీ తదుపరి 100 మైళ్లను సంవత్సరాలలో కొలవాల్సి ఉంటుందనేది దాని సారాంశం..! అందుకే.. ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ముందు కేవలం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..1. ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఈ ద్వీపం ఇరాన్కు చమురు విషయంలో గుండెకాయలాంటిది. భూతల దాడులకు దిగితే.. అమెరికా కన్నుపడే మొదటి ప్రాంతం ఇదే. ఇరాన్ దేశ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90% నుంచి 95% ఇక్కడి నుంచే జరుగుతాయి. పర్షియన్ గల్ఫ్లో లోతు తక్కువగా ఉండటం వల్ల, ఇరాన్ తన మెయిన్ల్యాండ్ నుంచి పైప్లైన్ల ద్వారా చమురును ఈ దీవికి తెచ్చి, ఇక్కడ పెద్ద ట్యాంకర్లలో లోడ్ చేస్తుంది. అంటే, ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ మోకాళ్లపై పడుతుందని అమెరికా అనుకోవచ్చు. కానీ రిస్క్ ఏంటంటే.. ఇక్కడ దాడి జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అవుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న అరబ్ దేశాల ఆయిల్ ఫీల్డ్స్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుంది.2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz): ఇక అమెరికా ఎంచుకునేందుకు అవకాశమున్న రెండో మార్గం.. హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన జలసంధి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం అమెరికా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దీని చుట్టూ ఇరాన్ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరం, ఖేష్మ్ ఐలాండ్లను దాటుకుని అమెరికా ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఇరాన్ దగ్గర వందలాది స్పీడ్ బోట్లు, మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి అమెరికా నౌకాదళంపై నిరంతరం రాకెట్ల వర్షం కురిపించగలవు. ఇక్కడ ఆపరేషన్ మొదలైతే, అది పరిమితంగా కాకుండా.. ఒక సుదీర్ఘమైన ప్రపంచ ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.3. మూడు ద్వీపాలు.. ఫైబర్-ఆప్టిక్ డ్రోన్ల ముప్పు: ఇక అమెరికా వద్ద ఉండే మూడో ఆప్షన్.. గల్ఫ్లో ఉండే మూడు చిన్న ద్వీపాలు. అవి.. అబు మూసా, గ్రేటర్ టంబ్, లెస్సర్ టంబ్. అమెరికా సైన్యం వీటిని ఈజీగా ఆక్రమించి.. మిలిటరీ బేస్లు పెట్టొచ్చు. కానీ, అమెరికా సేనలకు అసలు నరకం ల్యాండింగ్ అయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది... అదే ఫైబర్-ఆప్టిక్ డ్రోన్. సాధారణ డ్రోన్లను అమెరికా తన టెక్నాలజీతో ‘జామ్’ చేయగలదు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ మీద పనిచేయవు, వీటికి వెనుక 60 కిలోమీటర్ల పొడవైన వైర్ ఉంటుంది. వీటిని జామ్ చేయడం అసాధ్యం! ఇరాన్ కొండల చాటు నుండి ఈ డ్రోన్లను వందల సంఖ్యలో వదిలితే.. ఈ ద్వీపాల్లో ఉండే అమెరికా సైనికులు కేవలం ‘సిట్టింగ్ డక్స్’ అంటే.. సులభమైన టార్గెట్స్ లాగా మిగిలిపోతారు.4. చాబహార్ పోర్ట్ (Chabahar Port): భూతల దాడుల కోసం అమెరికా వద్ద ఉండే నాలుగో ఆప్షన్ చాబహార్ పోర్ట్. దీన్ని భారత్ కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గరున్న ఏకైక ఓపెన్ ఓషన్ డీప్-వాటర్ పోర్ట్ ఇది. ఇది గల్ఫ్ దేశాలకు కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ ల్యాండ్ అవ్వడం అమెరికాకు ఈజీ. కానీ సమస్య ఏంటంటే.. ఇక్కడ అమెరికాకు ఎలాంటి లెవరేజ్ దొరకదు. ఇరాన్ ప్రధాన నగరాలకు, ఆయిల్ ఫీల్డ్స్కు చాబహార్ చాలా దూరంలో ఉంది. దీన్ని పట్టుకుని అమెరికా సాధించేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇరాన్ను లొంగదీసుకోవాలంటే, అమెరికా సైన్యం దేశం లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. అంటే మళ్లీ ఒక పెద్ద గ్రౌండ్ వార్లోకి దిగాల్సిందే.5. ఖుజెస్తాన్ (Khuzestan)-ప్రాక్సీల వ్యూహం: గ్రౌండ్ వార్కు అమెరికా సిద్ధమైతే.. ఆ దేశం ఎంచుకునే ఐదో ఆప్షన్ ఖుజెస్తాన్ మాత్రమే. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన రూట్. ఇది చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కువైట్లోని అమెరికా బేస్ నుంచి ఇక్కడికి రావడం అమెరికాకు ఈజీ. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్పై దాడికి ఇదే రూట్ను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమెరికా సైన్యం మాత్రం ఇరాక్లోని బస్రా మీదుగా రావాలి. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న 2 లక్షల మంది 'ప్రాక్సీ మిలిషియా' సైన్యం కాపు కాసి ఉంటుంది. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దును తాకక ముందే.. ఇరాక్లోనే ఒక భారీ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ 5 ప్రాంతాలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకు దారులు ఉన్నాయి. కానీ, గెలవడానికి దారులు లేవు. వెస్ట్రన్ బోర్డర్లో ఉన్న కుర్దిష్ తిరుగుబాటుదారులను వాడుకోవాలని చూసినా.. అది ఇరాన్ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచి దేశాన్ని మరింత ఏకం చేస్తుంది. చివరగా చెప్పాలంటే.. యుద్ధంలో ఎవరు మొదట కొట్టారు? లేదా ఎంత గట్టిగా కొట్టారు? అనేది ముఖ్యం కాదు. చివరి వరకు తట్టుకుని ఎవరు నిలబడ్డారు? అనేదే ముఖ్యం.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
‘ఏఐ’తో ‘ఆట’లొద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మన దేశంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే–2024 ప్రకారం భారతీయుల్లో 65 శాతం మంది జనరేటివ్ ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కవ. విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అదే సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, గోప్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్ 2025’ అధ్యయనం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ముగ్గురిలో ఒకరు వారి వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలను ఏఐతో పంచుకుంటున్నారు. ఏఐతో వ్యక్తిగత విషయాలు చర్చించిన వారిలో 25 శాతం మంది ‘మనుషుల కంటే ఏఐ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’ అని భావిస్తున్నారు.ఆలోచనా శక్తిపై ప్రభావంఇదే సర్వేలో మరో ఆందోళనకర అంశం బయటపడింది. ఏఐ గురించి తెలిసిన పిల్లల్లో 75 శాతం మంది ఏఐ పనితీరుపై అవగాహన లేక దాన్నొక సెర్చ్ ఇంజిన్లా భావిస్తున్నారు. అలాగే 46 శాతం కుటుంబాలు ఏఐ వల్ల తప్పుడు సమాచారం (మిస్ఇన్ఫర్మేషన్) వచ్చే ప్రధాన ప్రమాదమని పేర్కొన్నాయి. ఏఐ వెంటనే సమాధానాలు అందించడం వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. హోంవర్క్, ప్రాజెక్టులు, వ్యాసాలు అన్నింటికీ ఏఐపై ఆధారపడితే సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దెబ్బతినే అవకాశం ఉంది. యునిసెఫ్ నివేదికల ప్రకారం.. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరితనం, భావోద్వేగ సంబంధాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.‘ఏఐ’ రూపంలో కొత్త ముప్పుఏఐ అందించే సమాచారం ఎల్లప్పుడూ సరైనదే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాస్తవాలకు విరుద్ధమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని కూడా అందించవచ్చు. చిన్నారులు దానిని నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అలాగే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, చాటింగ్ డేటా వంటి సమాచారాన్ని ఏఐ ప్లాట్ఫారమ్లలో పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీతో డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలు సృష్టించడం సులభమవుతోంది. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 33 శాతం మంది టీనేజర్లు వారి అనుమతి లేకుండా వారి ఫొటోలను ఉపయోగించి డీప్ఫేక్ చిత్రాలు రూపొందించారని తెలిపారు. అలాగే 54 శాతం మంది ఇలాంటి కంటెంట్ను అందుకున్నట్లు చెప్పారు. యూకేలో 8 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో దాదాపు 22 శాతం మంది ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. 40 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలకు ఏఐ భద్రత గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ వివరించలేదు. ఏఐ వాడే పిల్లల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆరోగ్యం లేదా శరీరానికి సంబంధించిన సలహాల కోసం చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఆరుగురిలో ఒకరు (సుమారు 17 శాతం) ఏఐ ద్వారా అనుచిత కంటెంట్ చూశామని తెలిపారు.ఈ నేపధ్యంలో పిల్లల విద్య, మానసిక అభివృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనతో కొన్ని దేశాలు పాఠశాలల్లో ఏఐ వినియోగంపై నియంత్రణ విధించాలని భావిస్తున్నాయి. కానీ ఏఐను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు. పిల్లలు దానిపై పూర్తిగా ఆధారపడకుండా, ఇతర మంచి విషయాలవైపు మళ్లేలా వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాగే తప్పుడు సమాచారం, గోప్యత, డీప్ఫేక్ ముప్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన సాధనం. అయితే నియంత్రణ లేకుండా వినియోగిస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్–2025 అధ్యయనం ప్రకారం ఏఐ వినియోగం ఇలా..జనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగిస్తున్న విద్యార్థులు – 35 శాతంవీరిలో సందేహాల నివృత్తికి – 73 శాతంకొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి – 48 శాతంపరీక్షల సన్నద్ధతకు – 32 శాతంఅమెరికాలో కామన్సెన్స్ మీడియా 2026 అధ్యయనం ప్రకారం..9 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో ఏఐ వినియోగిస్తున్న వారు – 86 శాతం వీరిలో నిత్యం ఏఐతో మమేకమయ్యే వారు – 25 శాతంఏఐ కంపానియన్ చాట్బాట్ల ఉపయోగించే టీనేజర్లు – 72 శాతంరోజూ వాటితో మాట్లాడేవారు – 13 శాతం -
చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ Steven Spielberg తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.2001 జూన్ 29న A.I. Artificial Intelligence రిలీజ్అయ్యింది. జులై మొదటి వారంలో భారత్లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్ మేధస్సు, స్పీల్బర్గ్ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. ఈ కథలో డేవిడ్ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. -
నాటోతో అమెరికాకు తల్లాక్?
ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. క్లుప్తంగా నాటో.. ఇప్పుడు నాటో-అమెరికా మధ్య ఇడుపు కాయితం.. అదే విడాకులు జరగనున్నాయా? నాటో నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిపోతుందా? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సైనిక అత్యవసర పరిస్థితి లేదా యుద్ధం వస్తే.. నాటో కూటమికి ఎలాంటి సైనిక సహాయం పంపాలనే నియమాలను ఆయన మార్చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. నాటో దేశాలకు ఇకపై అమెరికా మద్దతు చాలా చాలా తక్కువగా ఉంటుంది.నాటోకు ఈ సపోర్ట్ ఉండదు..•విమాన వాహక నౌకలు (Carriers) ఉండవు•క్యారియర్ యుద్ధ విమానాలు ఉండవు•ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు (Precision munitions) ఉండవు•లాజిస్టికల్ సరఫరా (రవాణా సదుపాయాలు) ఉండదు•శాటిలైట్ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంటుంది.చైనాతో యుద్ధానికి సిద్ధం??అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం.. చైనాతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చనే ఉద్దేశంతో అమెరికా పనిచేయాలని హెగ్సెత్ భావిస్తున్నారు. అందుకే.. చైనాతో పోరాడటానికి అవసరమయ్యే ఏ సైనిక వనరులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకూడదని నిర్ణయించారు. ఇక అనధికారికంగా చూస్తే ఇరాన్ యుద్ధం తర్వాత, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోయింది. అన్ని వనరులను కేవలం చైనా కోసమే కేటాయించాలని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు, ఇక ప్రపంచంలో మరెక్కడా జోక్యం చేసుకోలేదు. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం నడిపిన తీరు వల్ల, తూర్పు అర్ధగోళం నుంచి అమెరికా తన పట్టును కోల్పోతుందనేది నిర్వివాదాంశం..! రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటంటే.. ఐరోపా (Europe) ఇక తనను తాను కాపాడుకోవాలే తప్ప.. అమెరికా సాయం ఉండదు.భవిష్యత్ ఏమిటి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో.. నాటో కూటమి పేపర్పై మాత్రమే మిగిలి ఉంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా చేతులెత్తేస్తే, ఐరోపా దేశాల వద్ద లేని ప్రత్యేకమైన అమెరికన్ ఆయుధాలు రావని తేలిపోతే.. ఇక నాటో కూటమికి అర్థమే ఉండదు. దీంతో, నాటో కథ ముగిసినట్లే అవుతుంది!. 1949 నుండి నాటో ప్రణాళిక ఎలా ఉందంటే అమెరికా కొన్ని పెద్ద సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఐరోపా దేశాలు వాటిని చేయవు. ఐరోపా దేశాలు ఎప్పుడూ అమెరికాపై ఆధారపడేలా చేయడం కోసమే యూఎస్ఏ అలా చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే, వారి సైన్యాలన్నింటినీ అమెరికానే కమాండ్ చేయాలనేది దాని ఆలోచన. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు ముగిసిపోయింది. ఐరోపాలో అమెరికా తన సైనిక ప్రభావాన్ని కోల్పోయింది.ఐరోపాకు కింకర్తవ్యమ్..?ఇప్పుడు ఐరోపా దేశాలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నందున, అమెరికాతో ఉన్న 'ఇంటర్ఆపరబిలిటీ' (Interoperability) అంటే.. కలిసి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అమెరికా ఆయుధ వ్యవస్థలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి డిజైన్ అయ్యాయి. కానీ ఐరోపా దేశాలు ఎదుర్కొనే యుద్ధాలు అలాంటివి కావు. ఒక యుద్ధంలో తమ సైన్యాన్ని నడిపించే అమెరికాతో కలిసి పనిచేయడం కోసమే ఐరోపా దేశాలు ఇంతకాలం అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయి. కానీ అమెరికా సైన్యమే రానప్పుడు, ఇక ఆ ఆయుధాలను వాడటంలో ఎలాంటి అర్థం లేదు. ప్రస్తుత డ్రోన్ల యుగంలో.. అమెరికా తరహా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి ఐరోపాకు 10 నుండి 15 ఏళ్ల సమయం లేదు. అంత వేగంగా వాటిని నిర్మించలేరు. కాబట్టి, వారు ఉక్రెయిన్ తరహా ఆయుధాలను తయారు చేసుకుంటారు. వీటికి బ్యాకప్గా బహుళ-దేశాల అణ్వాయుధ రక్షణను ఏర్పాటు చేసుకుంటారు.ఇది ఎలా సాగుతుందో కాలమే చెప్పాలి. సరిగ్గా ఒక సంవత్సరంలోనే ఐరోపా, అమెరికా సైన్యాలు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వారు కలిసి పనిచేయాల్సి వచ్చినా, వేర్వేరు కమాండ్ స్ట్రక్చర్స్, వేర్వేరు వ్యూహాలతో పనిచేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వల్ల నాటో కూటమికి చరమగీతం పాడినట్లవ్వడమే కాకుండా.. ఐరోపా దేశాలు తీసుకునే ఆయుధ కొనుగోలు నిర్ణయాలు కూడా ఈ కూటమిని శాశ్వతంగా ముగించేలా చేస్తాయి. నాటో (NATO) ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా ఒక వ్యూహాత్మక విచ్ఛిన్నం (Strategic breakdown), సరికొత్త ప్రపంచ సమీకరణాల వైపు అడుగులు వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, అమెరికా ఒకే వైపు కాకుండా, రెండు వేర్వేరు ధ్రువాలుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు. -
15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు!
ఒక దేశపు కరెన్సీ విలువను మరో దేశపు కరెన్సీతో స్థిరంగా అనుసంధానించి ఉంచడం.. ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవడం సాధారణ నిర్ణయం కాదు. అలాంటి కీలక అడుగే ఇప్పుడు బొలీవియా వేసింది. 15 ఏళ్లుగా కొనసాగిన డాలర్ పెగ్ విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డాలర్ పెగ్ను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మార్పు బొలీవియా ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయనుంది? పరిశీలిస్తే..సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను అమెరికన్ డాలర్కు స్థిరంగా కట్టిపెడతాయి. దీనినే "డాలర్ పెగ్" అంటారు. బొలీవియా కూడా గత 15 ఏళ్లుగా తన కరెన్సీ అయిన "బొలివియానో" విలువను డాలర్తో స్థిరంగా కొనసాగించింది. మార్కెట్లో పరిస్థితులు ఎలా మారినా.. ఒక నిర్దిష్ట మారకపు రేటును ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో డాలర్ నిల్వలు అవసరమవుతాయి.సడన్గా ఎందుకు?..ఇటీవలి కాలంలో బొలీవియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంధన దిగుమతులు, విదేశీ చెల్లింపుల కోసం అవసరమైన డాలర్లను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు మార్కెట్లో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకలా ఉండగా, బ్లాక్ మార్కెట్లో డాలర్ ధర మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది.ఇకపై..డాలర్ పెగ్ విధానాన్ని రద్దు చేయడంతో ఇకపై బొలీవియా కరెన్సీ విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. అంటే డిమాండ్, సరఫరా ఆధారంగా కరెన్సీ విలువ పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. ఈ నిర్ణయం తర్వాత బొలివియానో విలువ గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావంగా.. దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరికొన్ని దేశాలు..బొలీవియా నిర్ణయం ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో అనేక దేశాలు డాలర్తో ఉన్న స్థిర అనుబంధాన్ని వదిలేశాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా 1990లలో తన కరెన్సీ పెసోను డాలర్కు 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం అర్జెంటీనా కరెన్సీ భారీగా విలువ కోల్పోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా గత కొన్నేళ్లుగా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో కరెన్సీపై నియంత్రణలను సడలిస్తోంది.అయితే మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.ఒక దేశం తన కరెన్సీని డాలర్కు కట్టిపెట్టడం ఎంత కష్టమో, ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా అంతే కీలక నిర్ణయం. బొలీవియా తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెబుతూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.భారత్ డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. మన కరెన్సీ రూపాయి 'మేనేజ్డ్ ఫ్లోట్' విధానంలో ఉండటంతో.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే రూపాయిలో తీవ్ర ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. -
ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపం
1. చిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)2 . ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు)3. క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెరి్నంగ్ ఆపరేషన్స్, హోస్టింగ్)4. ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటం)5. ఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)6. ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)ఏఐ సామ్రాజ్య శ్రేణిలో దిగ్గజాలు వీరే? -
వేలి గోరు సైజులో పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు!
కంప్యూటింగ్ రంగంలో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక మైక్రోప్రాసెసర్పై ఏకంగా పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు (100 బిలియన్) అమరిపోయాయి. నానోమీటర్ (మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు తక్కువ సైజు) కంటే తక్కువ సైజున్న ట్రానిస్టర్లతో తయారైన ఈ మైక్రోప్రాసెసర్ సైజు మన వేలి గోరు సైజు మాత్రమే! కొన్నేళ్ల క్రితం రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో మైక్రోప్రాసెసర్ను సిద్ధం చేసిన ఐబీఎం తాజా ఆవిష్కరణతో తన రికార్డును తానే బద్దలు చేసింది. కంప్యూటర్ల మెదడుగా చెప్పుకునే మైక్రోప్రాసెసర్పై ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటే వాటి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సిస్టర్ల సంఖ్య, కంప్యూటర్ల వేగం రెండూ 18 – 24 నెలలకు ఒకసారి రెట్టింపు అవుతాయని 1965లోనే ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ లెక్కకట్టారు. 1971లో ఇంటెల్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ‘ఇంటెల్ 4004’లో 2,300 ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండేవి. ఆ తరువాత మూర్స్ లా ప్రకారమే వీటి సంఖ్య, కంప్యూటర్ల వేగం పెరుగుతూ వచ్చింది. అయితే.. ట్రాన్సిస్టర్ల సైజు తగ్గుతున్న కొద్దీ సమస్యలూ పెరిగిపోయాయి. ప్రాసెసర్లు విపరీతంగా వేడెక్కిపోవడం ఇందులో ఒకటైతే విద్యుత్తు వినియోగమూ పెరగడం ఇంకోటి. ఈ నేపథ్యంలో వేగాన్ని పెంచుతూనే వేడిని తగ్గించేందుకు, మైక్రోప్రాసెసర్లలో వేర్వేరు కోర్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఒక దశ దాటిన తరువాత ఈ టెక్నిక్ కూడా పనిచేయకుండా పోయింది. ఇక కంప్యూటర్ల వేగం పెరగదు అని అనుకునే లోపు ఐబీఎం ట్రాన్సిస్టర్లను ఒకదానిపై ఒకటి పేర్చడం మొదలుపెట్టింది. ఈ త్రీడీ అవతారమే తాజాగా అభివృద్ధి చేసిన ఒక నానోమీటర్ మైక్రోప్రాసెసర్! ఐదేళ్ల క్రితం ఐబీఎం అభివృద్ధి చేసిన మైక్రోప్రాసెసర్లో రెండు నానోమీటర్ల సైజు టాన్సిస్టర్లు 5,000 కోట్ల వరకూ ఉండేవి. వేగం 50 శాతం ఎక్కువ... పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లున్న తాజా మైక్రోప్రాసెసర్ రెండు నానోమీటర్లతో తయారైన దాని కంటే 50 శాతం ఎక్కువ వేగంతో పని చేస్తుందని, వాడుకునే విద్యుత్తు కూడా 70 శాతం వరకూ తక్కువని ఐబీఎం తెలిపింది. జనరేటివ్ ఏఐ సర్వీసులు మొదలుకొని మొబైల్ఫోన్లలోనే క్లౌడ్ సేవలతో పనిచేసేందుకు ఈ కొత్త మైక్రోప్రాసెసర్లు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. తాము కేవలం ఎక్కువ ట్రాన్సిస్టర్లను అమర్చేందుకు మాత్రమే పరిమితం కాకుండా సిలికాన్తోపాటు వేర్వేరు ఇతర పదార్థాలను వాడటం ద్వారా ఈ ఘనతలు సాధించినట్లు ఐబీఎం తెలిపింది. ఇదంతా ఒక ఎత్తు. ఇంత సూక్ష్మస్థాయి మైక్రోప్రాసెసర్లను తయారు చేయడం ఇంకో ఎత్తు. తైవాన్ సెమీ కండక్టర్ దిగ్గజం టీఎస్ఎంసీ రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్లను గత ఏడాది నుంచే పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలుపెట్టింది. ఐదేళ్ల క్రితం ఐబీఎం సిద్ధం చేసిన రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్ల ప్రాసెసర్ తయారీ రాపిడస్ ద్వారా వచ్చే ఏడాది తయారు కానుంది. ఆపిల్ కూడా టీఎస్ఎంసీ ద్వారా తన లేటెస్ట్ ప్రాసెసర్ ఎం6ను ఈ ఏడాదే తయారు చేయనుందని అంచనా. అంటే.. ఒక నానోమీటర్ ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకో ఐదారేళ్లు పడుతుందన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే!
ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి!తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం వినియోగించడం ఆకట్టుకుంది.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026అయితే ఈ ట్రెండ్కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ పాట కేవలం సినిమా పాటగా కాకుండా భారత సాంస్కృతిక ప్రభావానికి ప్రతీకగా మారింది. విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు సైతం ఈ పాటను తమ కార్యక్రమాల్లో ప్రస్తావించడం విశేషం. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక రాజకీయ ప్రచారాల్లో బాహుబలి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక సామూహిక చర్చగా మారినప్పుడు, అనేక రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో అదే శైలిని అనుకరించాయి. "ఎవరు ఎవరిని మోసం చేశారు?" అనే ప్రచారాల నుంచి "అసలు బాహుబలి ఎవరు?" అనే పోలికల వరకు బాహుబలి రిఫరెన్స్లు విస్తృతంగా వినిపించాయి.అంతేకాదు, కేజీఎఫ్, జైలర్లోని "హుకుం" పాట బీజీఎంలతో వీడియోలు.. కొన్ని సినిమాల్లో యాక్షన్ రిఫరెన్స్లు, కాంతారలోని సంప్రదాయ చిహ్నాలు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పిన "వన్స్ అపాన్ ఎ టైమ్" స్టైల్ నేరేషన్.. ఇవన్నీ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాల్లో కనిపించాయి. ఇటీవల కొన్ని పార్టీల ప్రచార వీడియోలు చూస్తే అవి రాజకీయ ప్రకటనలా.. సినిమా టీజర్లా అన్న సందేహం కలగడం సహజమే.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందుకు ప్రధాన కారణం ప్రజల మీడియా వినియోగ పద్ధతుల్లో వచ్చిన మార్పు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద ప్రసంగాల కంటే 30 సెకన్ల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాదరణ పొందిన పాట లేదా డైలాగ్ను ఉపయోగిస్తే సందేశం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, అలాంటి కంటెంట్ మీమ్స్, రీల్స్ రూపంలో మరింత వైరల్ అవుతుంది.అయితే ఈ ట్రెండ్పై విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయాల వంటి కీలక అంశాలను వినోదాత్మకంగా మార్చడం వల్ల అసలు సమస్యలు చర్చకు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతాల కంటే వైరాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తే ప్రజాస్వామ్య చర్చలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో రాజకీయాల భాష మారిపోయింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. ఒక వైరల్ పాట, ఒక హిట్ డైలాగ్, ఒక సినీ రిఫరెన్స్.. ఇవే నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే నేటి రాజకీయాల్లో కొత్త సూత్రం ఒక్కటే.. "వైరల్ కావాలంటే.. సినిమా టచ్ తప్పనిసరి!".. -
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్నెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
కండ కలిగితే ఆయుష్షు కలదోయ్!
ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దీంతోపాటు అప్పుడప్పుడూ కండలు పెంచేందుకు బరువులెత్తండి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కండలు ప్రదర్శనకు మాత్రమే కాదు...నాలుగు కాలాలు ఎక్కువ బతికేందుకూ సాయపడతాయట. ఇదేదో ఆషామాషిగా చేసిన అధ్యయనం కాదండోయ్. అమెరికాలో సుమారు 30 ఏళ్లుగా 1.5 లక్షల మంది నర్సులను పరిశీలించి చేసుకున్న నిర్ధారణ. రెండేళ్లకు ఒకసారి వీరి నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. వారంలో 90 – 120 నిమిషాలపాటు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు (బరువులు, పుషప్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్, డంబెల్స్, బార్బెల్స్) చేస్తే చేయని వారితో పోలిస్తే అకారణంగా మరణించే అవకాశాలు 13% తగ్గినట్లు తేలింది. అలాగే గుండెజబ్బులతో మరణించే చాన్స్ 19%, నాడీ సమస్యలతో చావు ముప్పు 27% తక్కువైనట్లు తెలిసింది. బరువులు ఎత్తితే ఆరోగ్యమన్నారు కదా అని అతిగా చేయొద్దని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వారానికి రెండు గంటల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేసినా అదనపు ప్రయోజనం ఏదీ లభించలేదు. మరో విషయం.. ఏరోబిక్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రెండు చేస్తే లాభమెక్కువ. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కనీసం రెండున్నర గంటలు చేసిన వారిలో చావు ముప్పు 26 నుంచి 43 % తక్కువగా ఉన్నట్లు స్పష్టం కాగా... స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు జోడిస్తే ముప్పు మరింత తగ్గింది. ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే... కేన్సర్ ఉన్న వాళ్లు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు కొంత తగ్గించడం అవసరం. వారంలో గంటపాటు చేసినా మెరుగైన ఫలితాలుంటాయి. కండలతో దీర్ఘాయుష్షు ఎలా...? శరీరం మొత్తమ్మీద జీవక్రియల పరంగా బాగా చురుకుగా ఉండేవి కండల్లోని కణజాలాలు. అందువల్లనే కండలు బలంగా ఉంటే రక్తంలోని గ్లూకోజు నియంత్రణ సాధ్యమవుతుంది. మధుమేహం నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. ఇది కాస్తా గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. కండరాలు ముడుచుకుపోయినప్పుడు విడుదలయ్యే మైయోకైన్స్ అనేక జబ్బులకు దారితీయగల ఇన్ఫ్లమేషన్ (మంట/వాపు)లను తగ్గిస్తుంది. కండలు కాలేయం, కొవ్వు కణజాలం, రక్తనాళాలు, ఎముకలు, మెదళ్లకూ మేలు జరుగుతుంది. దీర్ఘకాలంలో ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రక్తపోటును తగ్గించడమే కాకుండా.. రక్తనాళాలు పెళుసు బారకుండా చేస్తాయి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండలు గట్టిగా ఉంటే పట్టు బాగా ఉంటుంది కాబట్టి పడిపోవడం, ఎముకలు విరగడం వంటివి తక్కువగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం...జిమ్కు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇంట్లోనే రోజూ కాసేపు బరువులు ఎత్తేయండి. దీర్ఘాయుష్మాన్ భవ అని మీకు మీరే దీవించేసుకోండి! –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏసీల కోసం పొలిటికల్ ఫైట్.. ఎక్కడో తెలుసా?
ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏసీలను వ్యతిరేకించిన దేశంలో.. ఇప్పుడు వాటిపైనే రాజకీయ యుద్ధం మొదలైంది. మండిపోతున్న ఎండలు, మూతపడుతున్న పాఠశాలలు, ఉక్కిరిబిక్కిరవుతున్న ఆస్పత్రులు, ప్రాణాపాయ స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు.. చివరికి రాజకీయ పార్టీలను కూడా రెండు వర్గాలుగా విడగొట్టాయి. ఏసీలు అవసరమా? వద్దా? అన్న అంశమే ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.ఆ దేశమే ఫ్రాన్స్. గత కొన్ని రోజులుగా అక్కడ నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ వారం ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్కు చేరువైన ఉష్ణోగ్రతలు నమోదవగా.. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన రోజు కూడా ఇదేనని అధికారులు వెల్లడించారు. వేడి తీవ్రతతో వేలాది పాఠశాలలు తాత్కాలికంగా మూతపడగా.. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పోర్టబుల్ ఏసీల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పిల్లలు కొంతసేపైనా తరగతి గదుల్లో ఉండేందుకు, అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలు రాత్రిపూట నిద్రపోయేందుకు ఏసీలే మార్గమవుతున్నాయి. అయితే ఇక్కడే రాజకీయ చర్చ మొదలైంది. ప్రతిపక్షం మాత్రం ఈ వేడి పరిస్థితులను ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. కుడిపక్ష (రైట్ వింగ్) నాయకురాలు మరీన్ లె పెన్.. దేశంలోని అన్ని పాఠశాలలు, ఆస్పత్రుల్లో తక్షణమే ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. కోట్లాది కుటుంబాలు తమ ఇళ్లలో ఏసీలు అమర్చుకునేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రజల ప్రాణాల కంటే పర్యావరణ సిద్ధాంతాలు ముఖ్యమా? అంటూ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు.అదే సమయంలో పర్యావరణవాదులు, గ్రీన్ పార్టీ తమ పాత వైఖరిని కొంత సవరించుకున్నాయి. ఇప్పటివరకు ఏసీలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ పార్టీ.. ప్రస్తుత తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో కనీసం పాఠశాలలు, ఆస్పత్రుల్లో మాత్రం శీతలీకరణ సదుపాయాలు తప్పనిసరి అని అంగీకరించింది. అయితే దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా ఏసీల వినియోగాన్ని ప్రోత్సహించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తోంది. అధిక విద్యుత్ వినియోగం, గ్రీన్హౌస్ వాయువుల విడుదల, నగరాల్లో వేడి మరింత పెరగడం వంటి పర్యావరణ సమస్యలను గుర్తు చేస్తూ జాగ్రత్తలు అవసరమని చెబుతోంది.మరోవైపు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రభుత్వం సమతుల్య వైఖరిని అవలంబిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అవసరమైన చోట ఏసీల వినియోగాన్ని సమర్థిస్తూనే.. దేశమంతా ఏసీలను విస్తృతంగా ప్రోత్సహించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. భవనాల్లో మెరుగైన ఇన్సులేషన్, సహజ గాలి ప్రసరణ, పచ్చదనం పెంపు వంటి శాశ్వత పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రులు, పాఠశాలలు వంటి కీలక ప్రాంతాల్లో శీతలీకరణ సదుపాయాలు అనివార్యమనే విషయాన్ని కూడా అంగీకరిస్తోంది.ప్రస్తుతం ఫ్రాన్స్లో కేవలం 25 శాతం ఇళ్లలో మాత్రమే ఏసీలు ఉన్నాయి. అదే స్పెయిన్, ఇటలీల్లో ఈ సంఖ్య 50 శాతం కాగా.. అమెరికా, జపాన్లలో దాదాపు 90 శాతం ఇళ్లలో ఏసీలు ఉన్నాయి. దీంతో పెరుగుతున్న వేడి పరిస్థితుల్లో ఫ్రాన్స్ కూడా తన పాత విధానాన్ని మార్చక తప్పదనే అభిప్రాయం బలపడుతోంది.మొత్తానికి.. ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఏసీలను దూరంగా ఉంచిన ఫ్రాన్స్.. ఇప్పుడు అదే ఏసీల అవసరంపై రాజకీయంగా, సామాజికంగా కొత్త చర్చను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలా? లేక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శీతలీకరణ సదుపాయాలను విస్తరించాలా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్రాన్స్ రాజకీయాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. -
మనకు కావాలి ‘ఏఐ రిస్క్ ఫండ్’
సాక్షి స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన కళ్ల ముందే సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిస్తోంది. నిత్యం చేసే పనులు, డేటా విశ్లేషణ వంటి రంగాలను ఏఐ వేగంగా భర్తీ చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా, కాలేజీ పూర్తి చేసుకుని బయటకొచ్చే యువతకు మొదటి ఉద్యో గం సంపాదించడం మునుపటి కంటే సవాలుగా మారవచ్చు. మారుతున్న కాలంలో పిల్లలను కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా మార్చకుండా.. సృజనాత్మకంగా ఆలో చించేలా, సరికొత్త నైపుణ్యాలు పెంపొందించుకునేలా, ఏఐతో కలిసి పనిచేసేలా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు.‘ఏఐ రిస్క్ ఫండ్’ నేటి తరం అత్యవసరం!మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల భవి ష్యత్తు కోసం ‘ఏఐ రిస్క్ ఫండ్’ లేదా ఒక ప్రత్యేకమైన పొదుపు ఖాతాను ఏర్పాటు చేయడం ఇప్పుడు చాలా అవసరం. పిల్లల పెళ్లిళ్లకు, కాలేజీ ఫీజులకు డబ్బు దాచినట్లే.. ఏఐ యుగంలో వారి కెరీర్ స్థిరపడే వరకు ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒక ‘రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్’ అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతాన్ని గమనిస్తే, ఏ కొత్త సాంకేతికత వచ్చినా పాత ఉద్యోగాలను తుడిచేసి, సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, పాతవి పోవడానికి, కొత్తవి పుట్టుకురావడానికి మధ్య కొంత సమయం (ట్రాన్సిషన్ పీరియడ్) పడుతుంది. ఈ లోపు పిల్లలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడకుండా నిలబడడానికి ఈ ‘రిస్క్ ఫండ్’ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఏఐని శత్రువుగా కాదు.. మిత్రుడిగా చూడాలి!ఒకప్పుడు మంచి మార్కులు, పెద్ద డిగ్రీలు ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ నేడు కేవలం మార్కులు సరిపోవు. ఏఐ యుగంలో రాణించాలంటే సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, వినూత్న ఆలోచనలు ప్రాణాధారాలు. పిల్లలు ఏఐని చూసి భయపడకుండా, దానిని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా, ఏఐ నుంచి సరైన సమాధానాలు రాబట్టడానికి ‘సరైన ప్రశ్నలు అడగడం’ అనేది అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారబోతోంది.‘ఏఐ ఫండ్’ వల్ల ముఖ్య ప్రయోజనాలుపిల్లలు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం ఏఐ వల్ల మారిపోతే, వారు తక్షణమే మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని (ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ మొదలైనవి) నేర్చుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. చదువు పూర్తి కాగానే వెంటనే ఉద్యోగం రాకపోయినా, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, తదుపరి కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫండ్ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం వెతకడం కంటే, సొంతంగా ఏఐ టూల్స్ ఉపయోగించి స్టార్టప్లు లేదా సరికొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ పొదుపు మొత్తమే తొలి పెట్టుబడిగా మారుతుంది. -
ఫలకాల కదలికల వల్లే
20000+! ఏడాది కాలంలో భూమ్మీద సంభవించే భూకంపాల సంఖ్య ఇది. అంటే సగటున రోజుకు 55 వరకూ భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. సాధారణంగా వీటిల్లో చాలావరకూ తక్కువ తీవ్రత ఉన్నవే. మనుషులు గుర్తించలేనివి కూడా. కానీ...బుధవారం అటు అమెరికాలోని కాలిఫోర్నీయాలో... దక్షిణ అమెరికాలోని వెనెజువెలా, తూర్పున ఉన్న జపాన్లో వచ్చిన భూకంపాలు మాత్రం కొంచెం ప్రత్యేకమని చెప్పాలి. కాలిఫోర్నియాలోని రెడ్వుడ్ వ్యాలీలో సుమారు 5.6 తీవ్రతతో భూకంపం రాగా.. ఏడు గంటల తరువాత వెనెజువెలాలో 7.2 తీవ్రతతో ఒకసారి.. 39 సెకన్ల తరువాత 7.5 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. ఈ డబుల్ భూకంపాల తరువాత 25 నిమిషాలకే జపాన్లోని కుజి వద్ద సముద్రంలో మరోసారి భూమి సుమారు 6.9 తీవ్రతతో కంపించింది. ఇలా 24 గంటల వ్యవధిలో ఇంత ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు రావడం అరుదైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఘటనలకు కారణం ఆయా ప్రాంతాల్లోని టెక్టానిక్ ఫలకాల కదలికలు కావడం. భూమి పొరల కదలికలు... భూమి ఉపరితలం నుంచి సుమారు 70 కిలోమీటర్ల లోతు వరకూ ఉండే క్రస్ట్.. దాని దిగువన ఉండే మాంటెల్ పై భాగం భారీ ఫలకాలుగా విడిపోయి ఉంటుంది. వీటినే టెక్టానిక్ ఫలకాలంటారు. వీటిల్లో పసిఫిక్, నార్త్ అమెరికన్, యురేసియన్, ఆఫ్రికన్, అంటార్కిటిక్, ఇండో–ఆ్రస్టేలియన్, సౌత్ అమెరికన్ ఫలకాలు ప్రధానమైనవి. కరీబియన్, నాజ్కా, కోకస్, అరేబియన్, ఫిలిప్పీన్ పేర్లతో కొన్ని చిన్న ఫలకాలూ ఉన్నాయి. టెక్టానిక్ ఫలకాలు నిత్యం కదులుతూ ఉంటాయి. ఏడాది కాలంలో సుమారు పది సెంటీమీటర్ల దూరం ప్రయాణిస్తాయని అంచనా. సుమారు ఐదు కోట్ల ఏళ్ల క్రితం యురేసియన్ ఫలకాన్ని ఇండియన్ ఫలకం ఢీకొన్న ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడింది. ఇండియన్ ఫలకం ఇప్పటికీ ఏడాదికి ఐదు సెంటీమీటర్ల చొప్పున యురేసియన్ ప్లేట్ను ముందుకు తోస్తోంది కూడా. ఢీకొనడం కాకుండా.. ఒకదాని కిందకు ఒకటి చేరిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూకంపాలు చోటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ టెక్టానిక్ ఫలకాల రాపిడి కాస్తా అగ్నిపర్వతాలు ఏర్పడేందుకు కారణమవుతూంటుంది. టెక్టానిక్ ఫలకాలు దూరం దూరంగా జరగడం వల్ల భారీ లోయలూ పుడతాయి. సెయింట్ ఆండ్రియాస్ ఇందుకు ఒక ఉదాహరణ. ️వెనెజువెలాలో ఏం జరిగింది?: దక్షిణ అమెరికాలోని వెనెజువెలా సౌత్ అమెరికన్, కరీబియన్ ఫలకాల సంగమ స్థలిలో ఉంటుంది. కరీబియన్ ఫలకం తూర్పు వైపునకు కదులుతూ సౌత్ అమెరికన్ ఫలకంపై ఒత్తిడిని పెంచుతూంటుంది. బోకాన్, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలర్, మోర్న్ ప్రాంతాల్లోని ఫాల్ట్ జోన్లలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బుధవారం నాటి భూకంపాలు ఈ ఫాల్ట్ జోన్లు ఉన్న చోటే సంభవించడం గమనార్హం. మూడు ఫలకాల రాపిడి: జపాన్లో భూకంపాలు నిత్యకృత్యం అంటే అతిశయోక్తి కాదు. పసిఫిక్, ఫిలిప్పీన్, యురేసియన్ ఫలకాలు మూడూ ఇక్కడే కలుసు కుంటూండటం ఇందుకు ఒక కారణం. బుధవారం నాటి భూకంపం ఇవాటే ప్రాంతంలో సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించింది. సాన్ ఆండియాస్ ఫాల్ట్: కాలిఫోర్నీయాలో తరచూ సంభవించే భూకంపాలు సాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ వల్లనే. ఇక్కడ పసిఫిక్ ఫలకం నార్త్ అమెరికన్ ఫలకం కింది నుంచి వెళుతూంటుంది. బుధవారం సాయంత్రం కాలిఫోర్నీయాలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్లో వివాదం.. మరి ఇతర దేశాల్లో పరిస్థితి ఏంటి?
పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదంటూ కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్పోర్ట్ కోసం పోలీసు వెరిఫికేషన్ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్పోర్ట్ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా? లేదంటే భారత్లాగే అభ్యంతరాలు ఉన్నాయా? పరిశీలిస్తే.. పాస్పోర్ట్ అనగానే చాలా మందికి అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా తన పౌరులకే పాస్పోర్ట్లు జారీ చేస్తుంది. అయితే చట్టపరంగా అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండదు. పాస్పోర్ట్కు ఇచ్చే చట్టబద్ధ హోదా దేశానికో విధంగా ఉంటుంది.అమెరికాలో.. ప్రపంచంలో పాస్పోర్ట్ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. అక్కడ చెల్లుబాటు అయ్యే అమెరికన్ పాస్పోర్ట్ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్ పాస్పోర్ట్ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో జనన ధ్రువీకరణ పత్రం (Birth Certificate), Certificate of Citizenship, US Passport.. ఈ మూడు ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్పోర్ట్కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోనూ..అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్ లా దేశాల్లో కూడా పాస్పోర్ట్కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్పోర్ట్ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడేనని అధికారులు భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది.యూరప్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి యూరోపియన్ దేశాల్లో పాస్పోర్ట్ బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు (National ID Cards) కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్పోర్ట్తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్పోర్ట్ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు.మరి భారత్లాంటి దేశాలు ఉన్నాయా?అవును.. భారత్ మాత్రమే కాదు కొన్ని దేశాల్లో పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన అది పౌరసత్వానికి శాశ్వత, అంతిమ రుజువు కాదని భావిస్తారు. ఉదాహరణకు కెనడాలో పాస్పోర్ట్కు అధిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. సిటిజన్షిప్ సర్టిఫికెట్(Citizenship Certificate) అనే ప్రత్యేక పత్రాన్ని పౌరసత్వానికి మరింత బలమైన ఆధారంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్తో పాటు పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి రావొచ్చు.అలాగే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్లు, ప్రత్యేక సిటిజన్ కార్డులు, ప్రభుత్వ రికార్డులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.అసలు ఎన్ని దేశాలు పాస్పోర్ట్ను పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తున్నాయి?. ఇదే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఒకే విధమైన అధికారిక జాబితా లేదు. అయితే సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ భాగం పాస్పోర్ట్ను పౌరసత్వానికి బలమైన, ప్రాథమిక ఆధారంగా అంగీకరిస్తాయి. మరోవైపు కొన్ని దేశాలు మాత్రం అదనపు పౌరసత్వ ధ్రువీకరణ వ్యవస్థలను కూడా కొనసాగిస్తున్నాయి. అంటే ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్పోర్ట్కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.భారత్లో వివాదం ఎందుకంటే.. భారత్లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్ సిటిజన్షిప్ డాక్యుమెంట్" లేదు. ఆధార్ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది.చర్చ ఎటు దారితీస్తోంది?పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువా? కాదా? అనే ప్రశ్న కంటే.. భారత్లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా? అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాస్పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా.. భారత్లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు బహుళ పత్రాల అవసరం కొనసాగుతోంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ భవిష్యత్తుపై పెద్ద చర్చగా మారుతోంది. -
వందేళ్లకొకసారి సంభవించే అరుదైన భూకంపం!
వామ్మో.. భూమి రెండుగా చీలిపోయిందా? అన్నట్లు వెనెజువెలా వణికిపోయింది. జంట భూకంపాలు రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. భారీ భవనాలు ఊగిపోతూ కుప్పకూలిపోగా.. సుదూరాన ఉన్న కొలంబియా దేశ రాజధాని బోగొటాలో ఆ ప్రకంపనల ప్రభావం కనిపించింది. వేల నుంచి లక్ష వరకు మరణాలు ఉండొచ్చన్న అంచనాల మధ్య దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇంతటి భారీ విధ్వంసానికి కారణమైన ఈ రెండు భూకంపాలు.. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే ఎలా సంభవించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.దక్షిణ అమెరికా దేశం వెనిజువెలా భూకంపాల దెబ్బకు అతలాకుతలమైంది. మొదట 7.1 తీవ్రతతో భూమి కంపించగా, ఆ భయం తగ్గకముందే కేవలం 39 సెకన్లలోనే 7.5 తీవ్రతతో రెండో భారీ ప్రకంపన అదే ప్రాంతాన్ని తాకింది. ఈ రెండు శక్తివంతమైన భూకంపాలు కలిసి దేశాన్ని కుదిపేసి, ప్రజలను వీధుల్లోకి పరుగులు తీయించాయి. సాధారణంగా ఒక భారీ భూకంపం సంభవించిన తర్వాత భూమి లోపల ఒత్తిడి కొంతవరకు విడుదలవుతుంది. ఆ తర్వాత చిన్నచిన్న ఆఫ్టర్షాక్లు మాత్రమే వస్తాయి. కానీ వెనెజువెలా ప్రకంపనల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. రెండు పెద్ద భూకంపాలు వరుసగా రావడంతో విధ్వంసం రెట్టింపైంది. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను శాస్త్రవేత్తలు ‘‘సిస్మిక్ డబ్లెట్” (Earthquake Doublet)’’ గా పేర్కొన్నారు. అంటే ఒకే ప్రాంతంలో ఉన్న భూగర్భ చీలికలు లేదంటే ఫాల్ట్ లైన్లు చాలా తక్కువ వ్యవధిలో విడివిడిగా విరగడం. సాధారణంగా ఒక భూకంపం తర్వాత మరొకటి గంటలు లేదంటే రోజుల గ్యాప్తో వస్తాయి. కానీ ఇక్కడ కేవలం 39 సెకన్లలోనే రెండో భారీ భూకంపం రావడం ఈ ఘటనను అరుదైనదిగా మార్చింది.వెనెజువెలాలో మొదటి భూకంపం తర్వాత పక్కనున్న భూగర్భ చీలికలపై ఒత్తిడి పెరిగి, వెంటనే రెండో భారీ భూకంపం సంభవించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఒత్తిడి తట్టుకోలేక సమీపంలోని మరో చీలిక కూడా కదలడంతో రెండో భూకంపం వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.వెనెజువెలా భౌగోళికంగా అత్యంత ప్రమాదకర భూకంప జోన్లో ఉంది. కరీబియన్ ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్ కలిసే ప్రాంతంలో ఈ దేశం ఉంది. ఈ రెండు భూభాగాలు నిరంతరం ఒకదానికొకటి స్లైడ్ అవుతూ కదులుతుంటాయి. ఈ కదలికల వల్ల భూగర్భంలో భారీ ఒత్తిడి ఏర్పడి, అది ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి.బొకోనో, సాన్ సెబాస్టియన్, ఎల్ పిలార్, మోరోన్ వంటి అనేక ఫాల్ట్ జోన్లు పరస్పరం అనుసంధానమై ఉండటంతో, ఒక ప్రాంతంలో జరిగిన కదలిక మరో ప్రాంతాన్ని కూడా వెంటనే ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇదే ఈసారి రెండు భారీ ప్రకంపనలు వరుసగా రావడానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రస్తుతం వెనెజువెలా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సహాయక బృందాలు శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి. రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. ఈ డబ్లెట్ భూకంపాల తర్వాత ఆఫ్టర్షాక్ల ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే బలహీనమైన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండటంతో ప్రజలను బయటే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సాధారణంగా వందేళ్లకు ఒకసారి లేదంటే అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి తీవ్ర స్థాయి జంట భూకంపాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో సాధారణంగా మొదటి భూకంపం తర్వాత భూగర్భ ఒత్తిడి సమీప ఫాల్ట్లకు బదిలీ అవుతుంది. ఆ ఒత్తిడి వెంటనే విడుదలైతే రెండో పెద్ద భూకంపం సంభవిస్తుంది. ఇండోనేషియా, ఇరాన్, అమెరికాలోనూ ఎర్త్క్వేక్ డబ్లెట్ చోటు చేసుకున్నాయి. అయితే వెనిజువెలాలో ఈసారి కేవలం 39 సెకన్లలోనే రెండు భారీ ప్రకంపనలు రావడం భూమి లోపల ఉన్న ఒత్తిడి ఎంత అస్థిరంగా ఉందో చూపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇదీ చదవండి: జంట భూకంపాల దెబ్బ.. లక్ష మంది మృతి? -
యుద్ధంతో ప్రయోజనమే లేదు
ఇరాన్తో అమెరికా మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధ సమయంలో ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఇరాన్ ముగించింది. దీంతో హార్మూజ్ జలసంధి తెరుచుకుంది. ఇరు దేశాలు శాశ్వత శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ఇంతా చేసి ఈ నాలుగు నెలల యుద్ధంలో అమెరికా సాధించిందేమిటి? అగ్ర రాజ్యానికి 40 బిలియన్ డాలర్ల నష్టం మిగిల్చిన ఈ యుద్ధానికి తగిన ఫలితం వచ్చిందా? ఇదే విషయంపై రాయిటర్స్/ఇప్సోస్ జూన్ 18–22 మధ్య అమెరికాలో సర్వే నిర్వహించింది. ఇంతా చేస్తే అసలు ఈ సంఘర్షణకు విలువే లేదంటున్నారు సర్వేలో పాల్గొన్న సగం మంది అమెరికన్లు. యుద్ధానికి అయిన ఖర్చుకు తగిన ఫలితం సాధించిందని పావు వంతు అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. మరో పావు వంతు మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు. అమెరికా అగ్రరాజ్యం అంటే... ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎంతటి ప్రజామోదం ఉండాలి. కానీ.. యుద్ధ కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ తగ్గింది. రెండో పదవీకాలంలో అత్యల్ప స్థాయికి వచ్చింది. ఆయన ఆమోద రేటింగ్ 34%కి పడిపోయింది. ఇక, ప్రజల జీవన వ్యయంపై ట్రంప్కు ఆమోదం 22 శాతంగా ఉంది, ఇది ఆయన అధ్యక్ష పదవీకాలంలోనే అత్యల్ప స్థాయి. అంతేకాక, వైట్హౌస్లో ఆయనకు ముందున్న డెమొక్రటిక్ అధ్యక్షుడు జో బైడెన్ తన అధ్యక్ష పదవీకాలం చివరిలో పొందిన రేటింగ్ కంటే కూడా ఇది తక్కువ. బలహీన స్థితిలో అమెరికా ఇరాన్పై దాడులకు ఆదేశించడానికి ముందు ఉన్న దానికంటే అమెరికా ఇప్పుడు మరింత బలహీనమైన స్థితిలో ఉందని 35% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇరాన్తో అమెరికా మరింత బలమైన స్థితిలో ఉందని కేవలం 23% మంది అమెరికన్లు మాతమ్రే నమ్ముతున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్కి చెందినవారు సగం మంది మాత్రమే ఉండటం గమనార్హం. శాంతి ఒప్పందం నిలవదు.. మరి ఈ మధ్యంతర శాంతి ఒప్పందంపై మెజారిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒప్పందమైనా ఎక్కువ కాలం నిలస్తుందా అంటే? కష్టమేనంటున్నారు. ఇక, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం జరిగే అవకాశం లేనే లేదని 63% మంది అమెరికన్లు చెబుతున్నారు. రిపబ్లికన్లలో దాదాపు సగం మంది, డెమొక్రాట్లలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే.. శాశ్వత శాంతి సాధ్యమవుతుందని 18 శాతం మంది నమ్ముతున్నారు. దీనిని విశ్వసించే వారిలో 34 శాతం రిపబ్లికన్లు, వీరిలో 10 శాతం డెమొక్రాట్లు ఉండటం గమనార్హం. పెరిగిన ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, ఖరీదైన విదేశీ యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచుతానని వాగ్దానం చేసి ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, మే నెలలో అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4.2 శాతం పెరిగింది. 2023 తర్వాత ఇదే అత్యధికం. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలే జీవన వ్యయ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. మధ్యంతర శాంతి ఒప్పందం ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినా.. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ముందున్న ధరతో పోలిస్తే, గ్యాసోలిన్ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఒక గ్యాలన్ సాధారణ పెట్రోల్ సగటు ధర 4.50 డాలర్లకు పైగా ఉన్న స్థాయి నుంచి 3.93 డాలర్లకు పడిపోయింది. అయితే, యుద్ధం ప్రారంభమవ్వడానికి ముందున్న ధరతో పోలిస్తే మాత్రం ఇది అధికమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘రాబందు’ రాజసం!
రెక్కల నిండా స్వేచ్ఛను నింపుకొంది. దిక్చక్రాల సరిహద్దులు దాటింది. ఆకాశాన్నే సామ్రాజ్యంగా మార్చుకుందా రాజ విహంగం. పంజరాల గోడల మధ్య పుట్టి పెరిగినా, ప్రకృతి పిలుపు అందుకోగానే అడవి బాట పట్టింది. మహారాష్ట్ర కొండల్లో రెక్కలు విప్పిన ఓ రాబందు.. మధ్యప్రదేశ్ వనసీమలను దాటుకుంటూ, ఏకంగా మూడు వేల కిలోమీటర్ల అవతల ఉన్న రాజస్థాన్ రాజకోటను ముద్దాడింది. అంతరించిపోతున్న తన జాతి మనుగడకు సరికొత్త ఆశల రెక్కలు తొడుగుతూ.. వన్యప్రాణి సంరక్షణ చరిత్రలోనే ఒక అద్భుతమైన ‘మహా యాత్ర’ను లిఖించింది..మూడు రాష్ట్రాల మీదుగా.. వన్యప్రాణి సంరక్షణలో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని మేల్ఘాట్ అడవుల్లో శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా విడిచిపెట్టిన ‘ఎక్స్–67’ (ఎక్స్67) అనే ఐదేళ్ల ఆడ రాబందు.. కేవలం 27 రోజుల్లో మూడు రాష్ట్రాల మీదుగా ఏకంగా 3,334 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, రాజస్థాన్లోని ప్రసిద్ధ రణథంబోర్ టైగర్ రిజర్వ్కు చేరుకుంది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ కిశోర్ రీథే బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. మానవ సంరక్షణలో పెరిగి, అడవిలోకి వెళ్లిన పక్షులు.. మనుషుల సాయం లేకుండా స్వయంగా ఆహారాన్ని వెతుక్కోగలవని, ప్రకృతి శైలికి అద్భుతంగా అలవాటుపడగలవని ఈ ఘనత నిరూపించింది. భారతదేశంలో వేగంగా అంతరించిపోతున్న రాబందుల జనాభాను తిరిగి పెంచేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇది పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.అడవుల నెట్వర్క్లోనే బసఈ ఏడాది జనవరి 2న మేల్ఘాట్ నుంచి సోలార్ ట్రాకింగ్ ట్యాగ్లు అమర్చి వదిలిన 15 రాబందులలో ఈ ‘ఎక్స్–67’ ఒకటి. మొదట నాలుగు నెలల పాటు స్థానిక అడవుల్లోనే తిరుగుతూ ప్రకృతికి అలవాటుపడిన ఈ పక్షి.. మే 28న తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. మహారాష్ట్ర నుంచి బయలుదేరి మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వ్, భోపాల్ ప్రాంతం, చిరుతలను పునరుద్ధరించిన కునో నేషనల్ పార్క్లలో తాత్కాలికంగా బస చేస్తూ.. మంగళవారం నాటికి రాజస్థాన్ రణథంబోర్ చేరుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్ను సముద్రంలో ముంచేస్తారా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సముద్రంలో కూల్చేయనున్నారా? సుమారు ముప్పై ఏళ్లుగా పలు శాస్త్ర పరిశోధనలకు వేదికగా నిలిచిన ఈ భారీ అంతరిక్ష కేంద్రం ఇక గత చరిత్ర కానుందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అవునని అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా). అయితే వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరమేమొచ్చింది? భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఈ 450 టన్నుల బరువైన కేంద్రాన్ని సముద్రంలో కూల్చేస్తే ప్రమాదమేమీ లేదా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో... ఎప్పుడో 1998లో రష్యా మొదలుపెట్టిన ఐఎస్ ఎస్ నిర్మాణం అమెరికాతోపాటు అనేక ఇతర దేశాల భాగస్వామ్యంతో 2000లో పూర్తయింది. ఆ తరువాత దశల వారీగా ఒక్కో పరిశోధన కేంద్రాన్ని జోడించుకుంటూ విస్తరించింది. మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా అందులో అనేకానేక ముఖ్యమైన ప్రయోగాలు జరిగాయి. వైద్యం, అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో పంటలెలా పండుతాయి? పదార్థాల ధర్మాలు ఎలా మారతాయి? అన్న విషయాలతోపాటు భూమిని నిత్యం పరిశీలించేందుకు కూడా ఐఎస్ఎస్ ఎంతో ఉపయోగపడింది. అయితే 1998లో తొలి మాడ్యూల్ను ప్రారంభించినçప్పుడు ఐఎస్ఎస్ వయసు 15 ఏళ్లు మాత్రమే అని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఇది అంతకు రెట్టింపు సమయం సేవలందించింది. ఫలితంగా ఈ నిర్మాణం అంత సురక్షితమైంది కాదన్న అంచనాలు ఉన్నాయి. పైగా మరమ్మతు చేయడం మరింత భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలోనే 2030 నాటికల్లా ఐఎస్ఎస్ను నెమ్మదిగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చి సముద్రంలో కూల్చేయాలని నాసా ప్రతిపాదిస్తోంది. ఉపగ్రహ శ్మశానంలో... ఐఎస్ఎస్ ఒక చివర నుంచి ఇంకో చివర వరకూ ఉన్న దూరం సుమారు 358 అడుగులు. వెడల్పు 239 అడుగులు. ఎత్తు 66 అడుగులు. ఇంత భారీ సైజున్న ఐఎస్ఎస్ను కూల్చేయడం అంటే ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పొరబాటున జనావాసాలున్న చోట కూలితే ఇక అంతే సంగతులు. అందుకే నాసా దీన్ని పాయింట్ నీమో వద్ద సముద్రంలో పడేలా చేస్తామంటోంది. కాలం చెల్లిన, అదుపు తప్పిన ఉపగ్రహాలన్నింటినీ కూల్చే ప్రాంతమే ఈ పాయింట్ నీమో. పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో న్యూజిల్యాండ్, దక్షిణ అమెరికాల మధ్య ఉంటుంది ఇది. అక్కడి నుంచి కనీసం 2,688 కిలోమీటర్ల దూరం వెళితే గానీ మనిషి అన్నవాడు కనిపించడు. పైగా ఈ ప్రాంతలో నౌకలు తిరిగేది కూడా చాలా తక్కువ. ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చే వ్యోమగాములు కూడా ఈ ప్రాంతంలోనే భూమ్మీదకు చేరుతూంటారు. ఒకవేళ అనుకోని విధంగా ఐఎస్ఎస్ ముక్కలు ముక్కలైనా ఈ నిర్మానుష్య సముద్ర ప్రాంతంలో పడటం వల్ల ఎవరికీ అపాయం జరగదన్న అంచనాతో నాసా దీన్ని ఎంచుకుందన్నమాట. పర్యావరణవేత్తల ఆందోళన... ముందుగా చెప్పుకున్నట్లు ఐఎస్ఎస్ బరువు సుమారు 450 టన్నులు. రకరకాల లోహాలు, ప్లాస్టిక్ పదార్థాలతో తయారైంది. అంతేకాకుండా... బోలెడన్ని రసాయన అవశేషాలు కూడా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ పర్యావరణానికి ముఖ్యంగా సముద్ర జలచరాలకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఐఎస్ఎస్ను పాయింట్ నీమో వద్ద కూల్చాలన్న ప్రతిపాదనపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాన్ని వ్యర్థాలను పడేసే చెత్తకుప్ప మాదిరిగా చూడొద్దని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తంగా కూల్చేయడం కంటే... ఐఎస్ఎస్లో పనికొచ్చే వ్యవస్థలు, ఇంజిన్లు, మోటార్లను అక్కడే మరమ్మతు చేసి వాడుకోవాలని... ఎలాగైతే ఒక్కో భాగాన్ని జోడించి ఐఎస్ఎస్ను సిద్ధం చేశారో.. అదే పద్ధతిలో దశలవారీగా విడగొట్టి అత్యవసరం అనుకున్న భాగాలను మాత్రమే కూల్చేయాలని సూచిస్తున్నారు. శకలాల కారణంగా ఏ దేశానికైనా నష్టం జరిగితే ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం పరిహారం చెల్లించాలని 1972 నాటి స్పేస్ లయబిలిటీ కన్వెన్షన్ చెబుతోందని, దురదృష్టవశాత్తూ ఈ నియమం సముద్రాలకు వర్తించదని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ఓషన్ ఫౌండేషన్’అధ్యక్షుడు మార్క్ స్పేడ్లింగ్ చెబుతున్నారు. ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. మనుషులకు దూరంగా కూల్చేస్తున్నారని చెప్పుకుంటున్నా.. ఆ ప్రాంతానికీ ఎంతో కొంత విలువ ఉంటుందన్నది గుర్తించాలని చెబుతున్నారు. చూద్దాం ఏమవుతుందో? ఎలా కూలుస్తారంటే... → 2028లో ఐఎస్ఎస్ కూల్చివేత ప్రక్రియ మొదలవుతుంది. ఐఎస్ఎస్కు వెన్నెముక లాంటి జార్యా (రష్యా మాడ్యూల్) కక్ష్యను క్రమ పద్ధతిలో తగ్గిస్తారు. భూమి సహజ ఆకర్షణ శక్తికి గురయ్యేలా చేస్తారు. → 2029లో స్పేస్ ఎక్స్కు చెందిన డీ ఆర్బిటింగ్ అంతరిక్ష నౌక ఒకటి ఐఎస్ఎస్కు అనుసంధానమవుతుంది. సుమా రు 46 థ్రస్టర్లను ఉపయోగించి నియంత్రిత పద్ధతిలో ఐఎస్ఎస్ను పాయింట్ నిమోకు చేరుస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూపర్ ఎల్నినో వెనుక బంగారు రహస్యం!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న "సూపర్ ఎల్నినో" పేరు వినగానే కరువు, వరదలు, పంటనష్టం, ఆహార సంక్షోభమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వాతావరణ దృగ్విషయం అందరికీ శాపమేనా? ఆశ్చర్యకరంగా, కొన్ని దేశాలకు మాత్రం సూపర్ ఎల్నినో బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడో పంటలు ఎండిపోతుంటే.. మరెక్కడో రికార్డు దిగుబడులు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో ఆనకట్టలు నిండిపోతాయి. ప్రకృతి సృష్టించే ఈ అసమాన సమీకరణంలో విజేతలు ఎవరు? ఓటమిపాలయ్యే దేశాలు ఏవి?.ప్రపంచ వాతావరణ వ్యవస్థలో అత్యంత ప్రభావశీలమైన ఘటనల్లో ఎల్నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఎల్నినో ఏర్పడుతుంది. ఈ వేడిమి మరింత తీవ్రరూపం దాల్చినప్పుడు దానిని "సూపర్ ఎల్నినో"గా పిలుస్తారు. 1982-83, 1997-98, 2015-16లో నమోదైన సూపర్ ఎల్నినోలు ప్రపంచవ్యాప్తంగా వందల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. సూపర్ ఎల్నినో ప్రభావం కేవలం వర్షాలకే పరిమితం కాదు. మనం ఉదయం తాగే కాఫీ నుంచి సాయంత్రం తినే చాక్లెట్ వరకు, రైతు పొలం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వాతావరణ నిపుణులు సూపర్ ఎల్నినోను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి’గా అభివర్ణిస్తుంటారు.అయితే ప్రకృతి ఇక్కడే తన విచిత్రాన్ని చూపిస్తుంది. ఒకే వాతావరణ పరిణామం కొన్ని దేశాలకు విపత్తుగా మారితే, మరికొన్ని దేశాలకు అది వరంలా మారుతుంది. ముఖ్యంగా అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే వంటి వ్యవసాయాధారిత దేశాలు ఎల్నినో సంవత్సరాల్లో అధిక వర్షపాతం కారణంగా భారీ పంట దిగుబడులను నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. సోయాబీన్, మొక్కజొన్న, గోధుమల ఉత్పత్తి పెరగడంతో ఈ దేశాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వీటికి మరింత డిమాండ్ పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుంది.ఇక అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రాంతాలకు కూడా ఎల్నినో కొన్నిసార్లు ఊరటనిస్తుంది. సాధారణంగా కరువుతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో వర్షపాతం పెరిగి జలాశయాలు నిండుతాయి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. వ్యవసాయ రంగానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది. హైడ్రోపవర్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఎల్నినో ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చేస్తుంది. ఒక దేశంలో పంటలు విఫలమైతే, మరో దేశం ఆ కొరతను భర్తీ చేస్తూ భారీ ఎగుమతుల ద్వారా లాభపడుతుంది. 1997-98 సూపర్ ఎల్నినో సమయంలో కొన్ని దక్షిణ అమెరికా దేశాల వ్యవసాయ ఎగుమతులు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే ఈ లాభాల వెనుక కూడా ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక దేశంలో పంటలు బాగా పండినా, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ధరల అస్థిరత ఏర్పడుతుంది. సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఆహార ధరలు పెరగడం వంటి పరిణామాలు చివరికి లాభపడిన దేశాలపైనా ప్రభావం చూపుతాయి. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు, వర్షాభావం, పంట నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్లో రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం పడితే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.వాతావరణ మార్పుల కారణంగా ఎల్నినో ప్రభావాలు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దశాబ్దాలకు ఒకసారి కనిపించే తీవ్ర ఎల్నినో పరిస్థితులు ఇప్పుడు మరింత తరచుగా సంభవించే అవకాశముందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని అర్థం ప్రపంచం భవిష్యత్తులో మరిన్ని వాతావరణ షాక్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాట.చివరగా.. సూపర్ ఎల్నినో అనేది కేవలం సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి. ఎక్కడో రైతు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే, మరో దేశంలో అదే వర్షాలు బంగారు పంటలుగా మారతాయి. ఎక్కడో ఆనకట్టలు ఎండిపోతుంటే, మరెక్కడో నీరు పొంగిపొర్లుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఎల్నినోను ప్రకృతి నిర్వహించే ప్రపంచ స్థాయి లాటరీగా అభివర్ణిస్తారు. కానీ ఈ లాటరీలో కొందరు గెలిచినా, చివరికి చెల్లించాల్సిన మూల్యం మాత్రం మొత్తం ప్రపంచానిదే. -
బంధం ముగిస్తే సరిపోదా?.. బలి ఎందుకు?
ఒకప్పుడు ప్రేమ విఫలమైతే దూరమయ్యేవారు. పెళ్లి బంధం సరిగా సాగకపోతే విడాకులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా?. ప్రేమించిన వారినే హత్య చేయడం, జీవిత భాగస్వామిని అంతమొందించడం, సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రాణాలు తీయడం వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు బంధాలు ‘బ్రేక్’ అవ్వడం కాకుండా ఎందుకు బలైపోతున్నాయి?. కాస్త లోతుల్లోకి వెళ్తే..మేఘాలయ హనీమూన్ కేసునే పరిశీలిద్దాం. ఇండోర్కు చెందిన జంట.. హనీమూన్కు వెళ్లింది. దంపతులు మిస్ కావడం.. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు.. భర్త చనిపోవం.. భార్య దీనావస్థలో రోడ్డు మీద కనిపించడం.. చివరకు భార్య&ప్రియుడి చేతిలోనే హత్యకు గురవడం తీవ్ర సంచలనం రేపింది. మరోవైపు ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన సర్వేయర్ హత్య కేసులోనూ వివాహేతర సంబంధాల కోణం ప్రధానంగా చర్చకు వచ్చింది. అటు.. ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన మీరట్ "బ్లూ డ్రం" కేసులో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాజాగా పుణెలో పెళ్లికి సిద్ధమవుతున్న కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అది హత్య అని తేలడం సంచలనం సృష్టించింది. ఫొటోషూట్ పేరుతో ఓ కోటకు తీసుకెళ్లి కాబోయే వధువు, ఆమె ప్రియుడే అతన్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది.These are Ketan Agarwal and Siya Goel. They were engaged and supposed to get married this year. Look how happy, in love, and comfortable they are with each other.They must have dreamed of a great future together, but cruel fate had other ideas. On June 18, Siya's birthday,… pic.twitter.com/4Av4OQvXuc— THE SKIN DOCTOR (@theskindoctor13) June 23, 2026ఈ ఘటనల్లో పరిస్థితులు, వ్యక్తులు, ప్రాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే.. సంబంధాన్ని ముగించడం కంటే వ్యక్తినే శాశ్వతంగా తొలగించాలనే ప్రమాదకర ఆలోచన.మనస్తత్వ నిపుణుల ప్రకారం.. నేటి కాలంలో కొందరు ప్రేమను పరస్పర గౌరవంతో కూడిన బంధంగా కాకుండా, స్వాధీన భావంతో చూస్తున్నారు. నువ్వు నాకే చెందాలి.. లేదంటే ఎవరికీ దక్కకూడదు అనే ఆలోచన తీవ్ర స్థాయికి చేరినప్పుడు హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.అలాగే, తిరస్కరణను అంగీకరించలేకపోవడం కూడా కీలక కారణమని నిపుణులు చెబుతున్నారు. సంబంధం కొనసాగకపోతే విడిపోవడం, చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం వంటి మార్గాలు ఉన్నప్పటికీ, కొందరు వాటిని పరాజయంగా భావిస్తున్నారని అంటున్నారు. పరువు పోతుందనే భయం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతామనే ఆందోళన, కుటుంబమో.. సమాజమో ఏమనుకుంటుందో అనే ఒత్తిడి కొందరిని తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సోషల్ మీడియా ప్రభావం కూడా సంబంధాలపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ చిత్రాలతో తమ బంధాలను పోల్చుకోవడం, చిన్న చిన్న విభేదాలను కూడా పెద్ద సమస్యలుగా భావించడం వల్ల అసహనం పెరుగుతోందని చెబుతున్నారు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం, కోపాన్ని ఆరోగ్యకరంగా వ్యక్తం చేయలేకపోవడం, కౌన్సెలింగ్ తీసుకోవడంపై ఇప్పటికీ ఉన్న అపోహలు కూడా సమస్యను మరింత తీవ్రమం చేస్తున్నాయని పేర్కొంటున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఏ బంధంలోనైనా విభేదాలు సహజం. అయితే సంభాషణ, కుటుంబ సభ్యుల సహకారం, అవసరమైతే కౌన్సెలింగ్ ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. బంధం కొనసాగించడం సాధ్యం కాకపోతే విడిపోవడం కూడా ఒక మార్గమే. కానీ ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది స్వాధీనం కాదు, బాధ్యత. బంధం అనేది నియంత్రణ కాదు, పరస్పర గౌరవం. ఆ గౌరవం, నమ్మకం కోల్పోయినప్పుడు బంధాలు బలహీనపడతాయి. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు మరొకరికి లేదన్న విషయాన్ని సమాజం మరచిపోకూడదు.::వెబ్ ప్రత్యేకం -
యుద్ధ ఖైదీలైన కిమ్ సైనికులకు కొత్త జీవితం?
వాళ్లంతా నార్త్ కొరియా నియాంతాధ్యక్షుడు కిమ్కు చెందిన సైనికులు. రష్యా కోసం తుపాకీ పట్టారు.. ఉక్రెయిన్కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. ఇప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు యుద్ధ చెర, మరోవైపు స్వదేశానికి తిరిగి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో వారికి అనూహ్యంగా దాయాది దేశమైన దక్షిణ కొరియా చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. స్వచ్ఛందంగా రావాలనుకుంటే ఆశ్రయం కల్పిస్తామని సియోల్(దక్షిణ కొరియా రాజధాని) ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధ ఖైదీలను వారి ఇష్టానికి విరుద్ధంగా తిరిగి ఉత్తర కొరియా లేదంటే రష్యాకు పంపడం సరైంది కాదని పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, యుద్ధ ఖైదీల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా వివరించింది. విదేశాంగ శాఖ జూన్ 23న విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుతం సియోల్, కీవ్ల మధ్య దౌత్య చర్చల్లో కీలకంగా మారింది. వచ్చే వారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా(Andrii Sybiha) సియోల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్(Cho Hyun)తో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చిక్కిన ఉత్తర కొరియా సైనికుల భవిష్యత్తు, దక్షిణ కొరియాకు రావాలనుకునే వారి పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. ఉత్తర కొరియా ప్రమేయం గత కొంతకాలంగా అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలతో పాటు వేలాది మంది సైనికులను కూడా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యాలోని కుర్సుక్ ఒబ్లాస్ట్ (Kursk Oblast) ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులను ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా దళాలను వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.దక్షిణ కొరియా గూఢచారి సంస్థల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా సుమారు 10 వేల నుంచి 15 వేల మంది వరకు సైనికులను రష్యాకు పంపినట్లు గతంలో వెల్లడైంది. వీరిలో కొందరు యుద్ధంలో మరణించగా, మరికొందరు గాయపడ్డారని, కొందరు ఉక్రెయిన్ సైన్యానికి ఖైదీలుగా చిక్కినట్లు సమాచారం. ఈ ఖైదీల్లో కొందరు ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లాలనే ఆసక్తి చూపడం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా చేసిన తాజా ప్రకటనకు రాజకీయ, దౌత్యపరంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తర కొరియా నుంచి పారిపోయే వారికి గతంలో కూడా దక్షిణ కొరియా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు యుద్ధ ఖైదీల విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది.ఒకవేళ ఉక్రెయిన్ చెరలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే, అది కేవలం మానవతా అంశంగానే కాకుండా ఉత్తర కొరియా-రష్యా సంబంధాలు, కొరియా ద్వీపకల్ప రాజకీయాలపై కూడా ప్రభావం చూపే పరిణామంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బ్రిటన్కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!
లండన్లోని ప్రతిష్ఠాత్మక 10 డౌనింగ్ స్ట్రీట్.. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం, కార్యాలయంల కూడా. బయటకు చూస్తే అది కేవలం ఒక ప్రభుత్వ భవనం. కానీ ఆ చారిత్రక గోడల మధ్య మాత్రం ఒక ప్రత్యేకమైన ఉనికి ఎప్పటినుంచో కొనసాగుతోంది. పదేళ్లలో ఆరుగురు ప్రధానమంత్రులు మారినా, ఆ వాతావరణంలో పెద్దగా మార్పు కనిపించదు. అదే భవనంలో.. దశాబ్దంపైగా అక్కడే మౌనంగా చూస్తూ ఉండిపోయాడు ల్యారీ.. “నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. అప్పుడు ఒక ప్రధాని ఉన్నాడు. తర్వాత ఇంకొకరు. కొంతకాలానికి ఇంకొకరు. ఇప్పుడే ఇంకొకరు రాజీనామా చేశారు. రేపు ఇంకెవరో?.. నేను మాత్రం నా సోఫాలో అలాగే ఉంటూ వస్తున్నా..” అంటూ ల్యారీగాడు ఓ వెక్కిరింపు చూస్తున్నాడు. ల్యారీ.. 11 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చాడు. అప్పట్లో బ్రిటన్కు నాయకత్వం వహిస్తున్నది డేవిడ్ కామెరూన్. యూరప్తో బ్రిటన్ సంబంధాలపై, ఆర్థిక సంక్షోభం ప్రభావాలపై చర్చల్లో మునిగిపోయి ఉన్న సమయం అది. కానీ ల్యారీకి అవేం పట్టింపు లేదు. వాడికి అర్థమైంది ఒక్కటే.. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, మంచి తిండి.. అలాగే రొటీన్ లైఫ్లో కాస్త చేంజ్.ఆ తర్వాత మార్పుల ప్రవాహం మొదలైంది. థెరెసా మే వచ్చారు. బ్రెగ్జిట్ గందరగోళం మధ్య దేశాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, పార్లమెంటులో మద్దతు తగ్గడం, ఒప్పందాలపై విభేదాలు ఆమెను పదవికి రాజీనామా చేసేలా చేశాయి. ఆయన ప్రధాని పీఠం నుంచి దిగిపోయి.. డౌనింగ్ స్ట్రీట్ను వీడుతుంటే ల్యారీ మాత్రం అదే హాలులో నిద్రపోతూనే ఉన్నాడు.తర్వాత బోరిస్ జాన్సన్ వచ్చారు. దేశాన్ని బ్రెగ్జిట్ తర్వాత కొత్త దారిలో నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీల్లో వివాదాలు, కరోనా సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, ఆచరణాత్మక తప్పిదాల ఆరోపణలు ఆయనను కూడా పదవికి దూరం చేశాయి. ఆయన బయటకు వెళ్తున్న టైంలోనూ.. ల్యారీగాడు సోఫాలో మాంచి కునుకు తీస్తున్నాడు.తరువాత లిజ్ ట్రస్ వచ్చారు. అయితే ఆర్థిక విధానాల్లో ఆమె చేసిన భారీ ప్రకటనలు మార్కెట్లను కుదిపేశాయి. ప్రజల్లో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కొన్ని వారాల్లోనే ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె పాలన అయితే బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత తక్కువకాలంలో ముగిసిన అధ్యాయంగా నిలిచింది. “లెట్యూస్(ఆ రకం ఆకుకూర..) తాజాదనం కంటే ఆమె ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేకపోయింది అంటూ సెటైర్లు వినిపించాయి. కానీ, అవేవీ పట్టించుకునే స్థితిలో ల్యారీగాడు లేడు..తర్వాత రిషి సునాక్ వచ్చారు. ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభం, ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ అనిశ్చితి ఆయన ప్రభుత్వాన్ని నిరంతరం పరీక్షించాయి. చివరకు 2024 సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అధికార పగ్గాలు లేబర్ పార్టీ చేతికి మారాయి. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో సునాక్ ప్రధానమంత్రి పదవికి వీడ్కోలు పలికారు. 10 డౌనింగ్ స్ట్రీట్లో మరోసారి అధికార మార్పిడి జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా ల్యారీగాడు తనదైన నిశ్శబ్దంతో గమనిస్తూ ఉండిపోయాడు.తరువాత బాధ్యతలు చేపట్టిన కీర్ స్టార్మర్ పాలన కూడా బ్రిటన్ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారింది. దేశ ఆర్థిక ఒత్తిళ్లు, విధాన నిర్ణయాలపై పెరిగిన విమర్శల మధ్య ఆయన నాయకత్వంపై కూడా అనిశ్చితి కొనసాగింది. చివరికి ఆయన కూడా పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో, 10 డౌనింగ్ స్ట్రీట్లో తాజాగా మరోసారి నాయకత్వ మార్పు తప్పలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, రాజకీయ సమీకరణాలు తిరుగుతున్నా, ఆ చారిత్రక భవనంలోని నిశ్శబ్ద సాక్షి మాత్రం ఎప్పటిలాగే తన స్థానంలో నిలిచే ఉంది.లారీకి రాజకీయాలు అర్థం కావు. కానీ ఒక విషయం మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు.. ఈ ఇంట్లో మనుషులు శాశ్వతం కాదు. వారు వస్తారు, కెమెరాల ముందు నిలుస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, కొన్నిసార్లు దేశాన్ని ప్రశంసిస్తారు, కొన్నిసార్లు విమర్శల్లో మునిగిపోతారు. ఆ తర్వాత ఒక రోజు నిశ్శబ్దంగా వెళ్లిపోతారు. కానీ లారీ మాత్రం ఎప్పటికీ అదే చోట ఉంటాడు. అదే కిటికీ దగ్గర కూర్చుంటాడు. అదే హాలులో నిద్రపోతాడు. అతనికి పదవులు లేవు, ఎన్నికలు లేవు, రాజీనామాలు లేవు. అతని ప్రపంచంలో ఒకే ఒక నిజం ఉంది.. ఆ ఇల్లు, ఆ సోఫా బతికి ఉన్నంత దాకా తనదేనని. ల్యారీ ది క్యాట్ (Larry the Cat).. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్లోని బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసంలో నివసిస్తున్న ప్రసిద్ధ పిల్లి. ఎలుకల్ని పట్టుకునేందుకు “Chief Mouser to the Cabinet Office” అనే అధికారిక హోదాను దానికి కట్టబెట్టారు. అలాగని ఈ పదవి కొత్తది కాదు. అక్కడి ప్రభుత్వ భవనాల్లో ఎలుకల సమస్యను నియంత్రించేందుకు దశాబ్దాలుగా ఇలాంటి ‘మౌసర్ క్యాట్’లను నియమించే సంప్రదాయం ఉంది. ఈ బాధ్యతలను సాధారణంగా క్యాబినెట్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉన్న సిబ్బంది చూసుకుంటారు, అయితే ఈ పిల్లుల సంరక్షణ, ఆహారం, వైద్య సదుపాయాలు వంటి విషయాలను అక్కడి సిబ్బందే నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా ల్యారీ 2011 నుంచి ఈ భవనంలో ఉంటూ, అనేక ప్రధానమంత్రుల కాలాన్ని సాక్షిగా చూసిన ఒక నిశ్శబ్ద అధికారిగా గుర్తింపు పొందాడు. -
చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!
ఆత్మహత్యకు ముందు ఆస్తుల పంపకం, అప్పుల వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. అంతెందుకు ఏటీఎం, ఫోన్పే పిన్ల సమాచారం.. డెత్నోట్లో రాసేసి మరీ వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆఖరికి అంత్యక్రియల ఖర్చులు కూడా కుటుంబమో, బంధువులకు భారం కాకూడదనే ఆలోచనతో చివరి క్షణాలకు ముందే అన్నీ ముందుగానే సర్దేసి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి!. ఎందుకిలా?.. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..చిత్తూరు జిల్లాలోని బంగారెడ్డి పల్లి ప్రాంతంలో దాము అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితుల్లో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరణానికి ముందు ఆయన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు ఏటీఎం పిన్ నెంబర్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని కూడా డెత్నోట్లో నమోదు చేసినట్లు సమాచారం. దానిని టీవీ స్క్రీన్కు అంటించారాయన.ఇలాంటి ఘటన ఒక్కటే కాదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ దంపతులు కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. తాము లేకుండా చెట్టంత కొడుకు బతకలేడనే ఉద్దేశంతో అతన్ని కూడా వాళ్లు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబానికి భారంగా మారకూడదనే ఆలోచనతో వారు అంత్యక్రియల ఖర్చుల కోసం ముందుగానే ఏర్పాట్లు చేయడం, కొంత ఆస్తిని దానం చేయడం, బ్యాంక్ లావాదేవీల వివరాలు సైతం రాసి పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.విజయవాడ సహా కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. నార్త్ ఇండియాలోనూ ఈ తరహా ఘటనలు నమోదవుతుండటంతో ఇది ఒక “కొత్త ధోరణి”గా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఘటనల్లో ఒక సాధారణ మానసిక నమూనా కనిపిస్తోంది.. తాము లేకపోయినా కుటుంబం/తమకు మేలు చేసిన వాళ్లు ఇబ్బంది పడకూడదు అనే భావన. ఇదే ఆలోచనలో వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను చివరి క్షణాల్లో పూర్తిగా క్రమబద్ధం చేసి వెళ్తున్నారు. ఇది బయటకు చూసేందుకు బాధ్యతగా కనిపించినా, నిపుణులు మాత్రం దీన్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తున్నారు.ఈ తరహా ధోరణిపై మానసిక నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా దీర్ఘకాలిక నిరాశ (depression), తీవ్ర ఆందోళన (anxiety), “నిరాశాత్మక ఆలోచనా విధానం” (hopeless thinking pattern) వల్ల వస్తాయి. సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం, అప్పుల భారం, అనారోగ్యం, కుటుంబ బాధ్యతల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి వ్యక్తిని “తప్పించుకోవడమే మార్గం” అనే భావన వైపు నెట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు.ఇది ఒక రకమైన కాగ్నిటివ్ టన్నెల్ విజన్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యక్తి తన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కనిపించడం, ఇతర సహాయ మార్గాలు కనిపించకపోవడం. ఈ దశలో సహాయం కోరే అవకాశం ఉన్నా, దాన్ని ఉపయోగించలేని స్థితి ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు.నిపుణుల హెచ్చరిక ఏంటంటే.. ఆత్మహత్యకు ముందు ఇలా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోవడం బయటకు బాధ్యతగా కనిపించినా, వాస్తవానికి అది తీవ్రమైన మానసిక సంక్షోభానికి చివరి సంకేతమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం త్వరగా స్పందించడం చాలా కీలకమని సూచిస్తున్నారు.ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, జీవన ఒత్తిడులు ఏవైనా కావొచ్చు. కానీ, వాటికి పరిష్కారం జీవితం ముగించడం కాదు. “అన్నీ సర్దేసి వెళ్లిపోవడం” వెనుక కనిపించని మానసిక పోరాటం ఉంటుంది. ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్డమ్ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.విజయ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.అందుకే విజయ్ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”. -
ఈ–20... మనకేంటి?
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది. అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్లో ఇథనాల్ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే. కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు చేయటం మొదలెట్టాయి. జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత? ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ఈ–10 వరకూ ఫర్వాలేదు... ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు. ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే... వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్ను, ఇంజిన్ కాలిబరేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్. ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.పికప్, మైలేజీ సంగతేంటి?ఇథనాల్ను పెట్రోల్తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం. ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.లాభమెవరికి... నష్టమెవరికి?దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల తయారీలో ఉన్నాయి.ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?భారత్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలుబల్రామ్పూర్ చినీ మిల్స్ దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్కు భారీ అవకాశాలు ఉండొచ్చు. త్రివేణి ఇంజినీరింగ్చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దాల్మియా భారత్ షుగర్ లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి. శ్రీ రేణుక షుగర్స్ చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. → గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్లో బలమైన ఉనికి. → సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్చమురు మార్కెటింగ్ కంపెనీలు: → ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ → భారత్ పెట్రోలియం కార్పొరేషన్→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.ఆటో మొబైల్ కంపెనీలు → మారుతీ సుజుకీ దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది. → హీరో మోటోకార్ప్ భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి. → బజాజ్ ఆటో భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే. → భారత్లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. → బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది. (రమణమూర్తి మంథా) -
మట్టి పాటలే మనసు దాకా...– భీమ్స్ సిసిరోలియో
‘‘అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ పాట టాప్లోనే ఉంటుంది. పోటీలో ఉన్నది పాట గానీ మనుషులు కాదని నా ఫీలింగ్. మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎప్పుడూ ఒక కూలీనే. సాధారణంగా ఓ రైతు ఎలా ఉంటాడో, సాధారణ కార్మికుడు ఎలా ఉంటాడో, కూలి పని చేసుకునే వాళ్లు ఎలా ఉంటారో నేను కూడా అంతే’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. నేడు అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్స్ ‘సాక్షి’తో ఎక్స్క్లూజివ్గా పంచుకున్న విశేషాలు...→ రోజూ సంగీత దినోత్సవమే...రోజూ నేను సంగీత ప్రపంచంలోనే ఉంటాను కాబట్టి దేవుడి పాదాల చెంత ఉన్నట్టే ఉంటుంది. రోజూ ఇలాంటి అనుభూతితోనే ముందుకు వెళ్తుంటాను. నేనెప్పుడూ సంగీతంతో సహవాసం చేస్తుంటాను కాబట్టి రోజూ సంగీత దినోత్సవమే. → 30 ఏళ్లు ముందుకి...ఓ పాటను మొదలు పెట్టినప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుందంటే... ఆ పాటని ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు గర్వంగా ఉండాలి, విజయకేతనం ఎగరవేయాలి. మారుతున్న కాలానికి, మనుషుల ఆలోచనా విధానానికి తగ్గట్టుగా, శ్రోతలు వినే ఒరవడికి తగ్గట్టుగా ఆలోచిస్తాను. 20 ఏళ్ల తర్వాత అప్పటి యువత ఈ పాట వింటే ఎలా ఉంటుంది? 30 ఏళ్ల తర్వాత తిరిగి ఆ పాటను మనం వింటే ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తాను. → జానపద గీతం అమ్మలాంటిది జానపద గీతం అమ్మ లాంటిది. జానపదం అంటే మట్టి నుంచి ఉద్భవించినటువంటి మొక్క. ఆ మట్టికి పచ్చదనంతో పాటు గాలిని, మంచి ఫలాలను ఇచ్చే గుణం కూడా ఉంటది. అలాంటి మట్టి పాటలు ఎప్పుడూ ప్రపంచానికి బోర్ కొట్టవు. అలాంటి పాటలు ఈరోజు సినిమాల్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ప్రధాన పాత్రను ఎందుకు పోషిస్తున్నాయంటే అది మట్టి భాష. మట్టి నుంచి వెలువడే పరిమళం మనకు ఎంత అద్భుతమైన అనుభూతిని ఇస్తదో, మట్టి నుంచి వెలువడిన పాటలు కూడా అలా మనసును హత్తుకుంటాయి. అందుకే ప్రపంచ వేదిక మీద కూడా ప్రధానంగా జానపద గీతాలే ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం.→ ప్రజలు నిర్మించిన సౌధాన్ని!నేను ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్టర్లతో పోటీ పడను. అంతేకాదు... మ్యూజిక్ డైరెక్టర్ల పోటీలో నేను లేను. ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. భీమ్స్ అనేవాడు ఇక్కడ ఉంటే బాగుంటుంది. మన భాష పాటలు, మన మానసిక స్థితి, మన స్థితిగతులు తెలిసినవాడు ఇక్కడ ఉండాలని వాళ్లు తీసుకొచ్చి ఇండస్ట్రీలో కూర్చోబెట్టి పాటలు చేయించుకుంటున్నారు. నేను ప్రజల నుంచి ఉద్భవించిన పాటని. నేను కేవలం ప్రజలు నిర్మించిన సౌధాన్ని, వాళ్లు నియమించుకున్న ప్రతినిధిని మాత్రమే. వాళ్లు ఏం చెబితే అది చేస్తా.→ సొంత మనిషిలా చూసుకుంటారు! బయటికెళ్లినప్పుడు కొందరు నన్ను గుర్తుపట్టి.. ‘మీ పాటలు మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చాయి. మేము దుఃఖాల్లో ఉన్నప్పుడు మాకు భరోసానిచ్చాయి... ఆశలు చిగురింపజేశాయి. మీ పాటలు, మీ మాటలు మమ్మల్ని ఉత్తేజపరిచాయి’ అని అంటుంటారు. అయితే ఇవన్నీ ప్రజలే నాకు ఇచ్చిన ఆస్తి. నేను వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నది ధనమో లేదంటే బంగారమో కాదు. వారి దగ్గర నుంచి బుద్ధి, మంచి జ్ఞానం నేర్చుకున్నా. వాళ్ల ప్రేమ, ఆత్మీయత ఎలా ఉంటా యంటే సొంత మనిషిలాగా చూసుకుంటారు.→ వ్యవసాయం చేస్తున్నానుప్రస్తుతం సంగీత దర్శకునిగా కొన్ని సినిమాలు లైనప్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంచెం వ్యవసాయ రంగం మీద ఫోకస్ చేశా. మా నాన్న అంగోతు మంగ్యాగారు చెప్పడంతో ఊరిలో పొలం పనులు చేస్తున్నాను. మా నాన్న, నేను కలిసి వరి, పత్తి, పెసర్లు, వేరుశనగ పంటలు పండిస్తున్నాం. నేను రైతు బిడ్డనే కదా... రైతు బతుకే నాకు ఇష్టం. ఎంత మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. రైతు బిడ్డ రైతు అయితే అంతకంటే ఆనందం ఏముంది. – డేరంగుల జగన్ మోహన్ -
‘చెక్క’నైన చాక్లెట్
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పిల్లల నుంచి పెద్దల దాకా చాక్లెట్ అంటే నచ్చని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని చాక్లెట్లు గట్టిగా, కొన్ని మెత్తగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే మంచులా కరిగిపోయే చాక్లెట్ను ఎప్పుడైనా చూశారా? జపాన్కు చెందిన ఒక మిఠాయి తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పలుచనైన చాక్లెట్ను తీసుకొచ్చింది.ఇటలీకి చెందిన సంప్రదాయ పొరల చాక్లెట్ల నుంచి ప్రేరణ పొంది తయారుచేసిన ఈ చాక్లెట్కు ‘కోర్టెసియా’అని పేరు పెట్టారు. ఇటాలియన్ భాషలో దీనికి ‘చెట్టు బెరడు’అని అర్థం. కేవలం 0.03 మిల్లీమీటర్ల పలుచని చాక్లెట్ పొరను తీసుకుని, చెట్టు బెరడుతో కప్పినట్టు గుండ్రటి కొమ్మను పోలిన ఆకారంలోకి దీన్ని చుడతారు. ఇంతటి సూక్ష్మమైన చాక్లెట్ పొర ను సాధారణ యంత్రాలతో తయారు చేయడం అసాధ్యం. ఇందుకోసం ఒక స్థానిక యంత్రాల నిపుణుడి సహకారంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి పైగా శ్రమించి, ఒక ప్రత్యేకమైన మెషీన్ను తయారుచేశారు.ఈ యంత్రం ద్వారా చాక్లెట్ను అత్యంత నైపుణ్యంతో ఒకే ఒక పలుచని పొరలాగా చుడతారు. చాక్లెట్ నోట్లో పూర్తిగా కరుగుతుంటే దాని రుచే వేరని.. అందుకే తాము ఇలా తయారుచేశామని ఈ చాక్లెట్ తయారీ కంపెనీ వ్యవస్థాపకుడు శాన్క్లిక్కా చెబుతున్నారు. ఈ విభిన్నమైన డెజర్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చెఫ్లు, ప్రముఖ సంస్థలు కోర్టెసియాను అనుకరించడానికి ప్రయత్నించాయి. కానీ ఇప్పటివరకు అది ఎవరికీ సాధ్యం కాలేదు! ఎందుకంటే, ఆ చాక్లెట్ను అంత పలుచగా నొక్కడానికి ఉపయోగించే ప్రత్యేకమైన యంత్రం ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్కటి ఉంది కాబట్టి. ఈ చాక్లెట్ గురించి తెలిశాక మీకూ తినాలని అనిపిస్తోందా అయితే జపాన్కు వెళ్లాల్సిందే! -
ఔరా... కైమెరా...!
రకరకాల, రంగు రంగుల ఆపిల్ పళ్లను కొనడం, తినడం సాధారణమే. కానీ ఒక ఆపిల్ కోసం జనం తండోపతండాలుగా ఓ షాప్కు వెళ్లడం ఎక్కడైనా చూశారా? అది కూడా కొనడానికి, తినడానికి కాదు.. కేవలం చూడటానికి, వీలైతే ఒకసారి ముట్టుకోవడానికి.న్యూజిలాండ్లో ప్రస్తుతం అలాంటి విచిత్రమే జరుగుతోంది. సగం ఎరుపు, సగం పసుపు రంగుతో కనిపిస్తున్న ఓ అరుదైన ఆపిల్ స్థానిక ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగర శివారులో ఉన్న ఓ పండ్ల దుకాణంలో ఈ అరుదైన ఆపిల్ ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తోంది. మార్కెట్కు మే నెలలో వచ్చిన రెడ్ బ్రేబర్న్ ఆపిళ్ల సరఫరాలో ఈ వింత పండు బయటపడింది. దీన్ని చూసి దుకాణ సిబ్బంది మొదట తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. సాధారణంగా పండ్లలో రంగు తేడాలు కనిపిస్తుంటాయి.కానీ ఇలా రెండు వేర్వేరు రంగులు కచ్చితంగా సమానంగా విడిపోయి ఉండటం వారినెంతగానో ఆశ్యర్యపరిచింది. దీంతో ఆ ఆపిల్ను జాగ్రత్తగా భద్రపరిచారు. అయితే, దీని గురించి ఆనోటా ఈనోటా చుట్టుపక్కలకు పాకడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో సన్షైన్ మార్కెట్కు సందర్శకులు క్యూ కట్టారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటుంటే, మరికొందరు పిల్లలను తీసుకువచ్చి ప్రకృతి అద్భుతమంటూ చూపిస్తున్నారు.ఇంకొందరైతే అదృష్టం కోసం ఆపిల్ను తాకాలని కూడా కోరుతున్నారట. ఇలాంటి పండ్లను శాస్త్ర పరిభాషలో ‘కైమెరా ఆపిల్‘ అని పిలుస్తారు. కైమెరా అంటే ఒకే జీవిలో రెండు వేర్వేరు జన్యు లక్షణాలు ఉండటం. పది లక్షల ఆపిళ్లలో ఒకటి మాత్రమే ఇలా రూపుదిద్దుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఫిఫా క్రేజ్: చూస్తే కిక్ రాదు.. అసలు మజా అందులోనే!
భారత్లో ఫుట్బాల్ క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఫిఫా వరల్డ్కప్ నేపథ్యంలో.. ఐపీఎల్ తరహా సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, పబ్లు, స్పోర్ట్స్ బార్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే, యమాల్ వంటి స్టార్ ఆటగాళ్ల అభిమానులు తెరపైకి వచ్చేశారు. అయితే మ్యాచ్ జరిగేటప్పుడు కామెంటేటర్లు తరచూ వాడే పదాలకు చాలామందికి అర్థం మాత్రం తెలియదు. క్రికెట్ను కామెంటరీతో ఏలాగైతే ఆస్వాదిస్తామో.. ఫుట్బాల్ను మరింత ఆస్వాదించాలంటే ముందుగా ఆ ఆటలో వాడే కొన్ని పదాలను అర్థం చేసుకోవాల్సిందే.గోల్ (Goal).. ఫుట్బాల్లో అత్యంత ముఖ్యమైన పదం ఇదే. బంతి పూర్తిగా గోల్పోస్టుల మధ్య, క్రాస్బార్ కిందుగా గోల్లైన్ను దాటితే గోల్గా పరిగణిస్తారు. ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఆఫ్సైడ్ (Offside).. ఫుట్బాల్లో అత్యంత క్లిష్టమైన నిబంధనగా దీన్ని భావిస్తారు. ఆటగాడు బంతి అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందుంటే, అలాగే ఆటలో ప్రభావం చూపితే ఆఫ్సైడ్గా ప్రకటిస్తారు. గోల్ చేసినా అది చెల్లదు. చాలా వివాదాలు, వీఏఆర్ సమీక్షలు ఎక్కువగా ఈ నిబంధన చుట్టూనే తిరుగుతుంటాయి.పెనాల్టీ (Penalty).. పెనాల్టీ బాక్స్లో డిఫెండర్ ఫౌల్ చేస్తే రిఫరీ పెనాల్టీ ఇస్తాడు. అప్పుడు బంతిని పెనాల్టీ స్పాట్పై ఉంచి ఒక ఆటగాడు నేరుగా గోల్పై షాట్ కొట్టే అవకాశం పొందుతాడు. ఫుట్బాల్లో గోల్ చేసే అత్యుత్తమ అవకాశాల్లో ఇది ఒకటి.ఫ్రీ కిక్ (Free Kick).. ఫౌల్ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు లభించే అవకాశం. డైరెక్ట్ ఫ్రీ కిక్.. నేరుగా గోల్ కొట్టవచ్చు. ఇన్డైరెక్ట్ ఫ్రీ కిక్.. మరో ఆటగాడు బంతిని తాకిన తర్వాత మాత్రమే గోల్ చెల్లుతుంది.హ్యాట్రిక్ (Hat-trick).. ఒకే మ్యాచ్లో ఒక ఆటగాడు మూడు గోల్స్ చేస్తే దానిని హ్యాట్రిక్ అంటారు. మెస్సీ, రొనాల్డో, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్లు అనేక హ్యాట్రిక్లు సాధించారు అని తరచూ వింటుటాం కదా!.క్లీన్ షీట్ (Clean Sheet).. గోల్కీపర్ లేదా జట్టు ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ను ముగిస్తే దాన్ని క్లీన్ షీట్ అంటారు. డిఫెండర్లు, గోల్కీపర్లకు ఇది ప్రతిష్టాత్మక గణాంకం.వీఏఆర్ (Video Assistant Referee).. ఫుట్బాల్ మ్యాచ్కి రివ్యూలాంటిది. మైదానంలో రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని వీడియోల ద్వారా పరిశీలించే వ్యవస్థ. ఇందులో.. గోల్ చెల్లుతుందా?, పెనాల్టీ సరైందా?.. రెడ్ కార్డ్ ఇవ్వాలా? ఈ తరహా కీలక నిర్ణయాల్లో వీఏఆర్ ఉపయోగిస్తారు.యెల్లో కార్డ్ – రెడ్ కార్డ్.. యెల్లో కార్డ్.. ఆటగాడికి హెచ్చరికగా ఇస్తారు. రెడ్ కార్డ్.. ఆటగాడిని వెంటనే మైదానం నుంచి పంపిస్తారు. ఆ జట్టు మిగతా మ్యాచ్ను ఒక ఆటగాడు తక్కువతో ఆడాల్సి ఉంటుంది.ఎక్స్ట్రా టైమ్ (Extra Time).. నాకౌట్ మ్యాచ్ల్లో నిర్ణీత 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే అదనంగా 30 నిమిషాలు ఆడిస్తారు.పెనాల్టీ షూటౌట్ (Penalty Shootout).. ఎక్స్ట్రా టైమ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే రెండు జట్లు పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. వరల్డ్కప్లలో ఎన్నో చారిత్రక మ్యాచ్లు ఇలాగే ముగిశాయి.కార్నర్ కిక్ (Corner Kick).. ప్రత్యర్థి ఆటగాడు బంతిని తన గోల్లైన్ దాటి బయటకు పంపితే దాడి చేస్తున్న జట్టుకు కార్నర్ లభిస్తుంది. ఇవి తరచూ గోల్స్కు దారితీస్తుంటాయి.థ్రో-ఇన్ (Throw-in).. బంతి సైడ్లైన్ దాటి బయటకు వెళ్తే చేతులతో మైదానంలోకి విసిరే విధానాన్ని థ్రో-ఇన్ అంటారు.ఎక్స్జీ(xG) అంటే.. Expected Goals (xG) అనే ఆధునిక గణాంకం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది.ఒక షాట్ గోల్గా మారే అవకాశాన్ని శాతం రూపంలో కొలుస్తుంది. జట్టు ఎలా ఆడిందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.డర్బీ (Derby).. ఒకే నగరం లేదా ప్రాంతానికి చెందిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ను డర్బీ అంటారు. ఉదాహరణకు.. రియల్ మాడ్రిడ్-అట్లెటికో మాడ్రిడ్, అలాగే.. ఏసీ మిలాన్ వర్సెస్ ఇంటర్ మిలాన్ ఇలాగన్నమాట.ట్రెబుల్ (Treble).. ఒకే సీజన్లో లీగ్, దేశీయ కప్, ఖండాంతర టోర్నీ గెలిస్తే ట్రెబుల్ అంటారు. ఇది ఫుట్బాల్లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటి.ఫుట్బాల్ కేవలం 22 మంది ఆటగాళ్లు బంతి వెంట పరుగెత్తే ఆట కాదు. దానికి సొంత భాష, సొంత వ్యూహాలు, సొంత పదజాలం ఉన్నాయి. "ఆఫ్సైడ్" ఎందుకు ఇచ్చారు? "వీఏఆర్" ఎందుకు జోక్యం చేసుకుంది? "క్లీన్ షీట్" అంటే ఏమిటి? వంటి విషయాలు అర్థమైతే మ్యాచ్ చూడటంలోనే కాదు.. చర్చల్లో పాల్గొనడంలోనూ మజా పెరుగుతుంది. ప్రపంచ ఫుట్బాల్ను ప్రేమించే భారతీయులు పెరుగుతున్న ఈ సమయంలో.. ఆ ఆటకు సంబంధించిన భాషను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. -
ట్రంప్–మెలోనీ.. ఎక్కడ చెడింది?.. ఆ ఐదే కారణమా?
మొన్నటిదాకా జార్జియా మెలోనీ.. డొనాల్డ్ ట్రంప్కు యూరప్లో అత్యంత సన్నిహిత మిత్రురాలిగా గుర్తింపు పొందారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయనకు అత్యంత నమ్మకమైన యూరోపియన్ భాగస్వామిగా నిలిచారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకోవడం, బహిరంగ వేదికలపై పరస్పరం సరదా వ్యాఖ్యలు చేసుకోవడం కనిపించింది. అలాంటిది ఈ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా మాటల యుద్ధం మొదలవడం, అది వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకోవడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ట్రంప్–మెలోనీ స్నేహానికి ఎక్కడ బీటలు వారాయో గమనిస్తే..ట్రంప్–మెలోనీ బంధం కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు. కుడిపక్ష(రైట్వింగ్) భావజాలం, వలసల నియంత్రణ, జాతీయవాద విధానాలు వంటి అనేక అంశాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అందుకే యూరప్లో ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా మెలోనీకి గుర్తింపు లభించింది. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ స్నేహంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క ఫొటో వివాదం కాదు. గత కొన్ని నెలలుగా పేరుకుపోతున్న రాజకీయ విభేదాల ఫలితంగా కనిపిస్తోంది. ఆ ఐదు కారణాలివే..1. మొదటి చిచ్చు.. యుద్ధమే!ట్రంప్కు మెలోనీ ఎంత సన్నిహితురాలో చెప్పడానికి ఒక ఉదాహరణ చాలనిపిస్తుంది. 2025లో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వేడుకకు హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. ఆ తర్వాత గాజా శాంతి చర్చల సందర్భంగా మెలోనీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలు’ అంటూ కొనియాడారు. కానీ ఇరాన్ యుద్ధం తర్వాత పరిస్థితి మారడం మొదలైంది. హర్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్పై ఒత్తిడి వంటి అంశాల్లో అమెరికా వైఖరికి ఇటలీ పూర్తి మద్దతు ఇవ్వలేదు. యుద్ధంలో పాల్గొనేందుకు మెలోనీ నిరాకరించడంతో ట్రంప్లో అసంతృప్తి పెరిగింది. ఆ అసంతృప్తి క్రమంగా బహిరంగ విమర్శలకు దారితీసింది. మెలోనీకి ధైర్యం లేదని, అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో ఆమె సరైన నాయకత్వం చూపడం లేదంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య విభేదాలు ఎంత దూరం వెళ్లాయో చెప్పకనే చెబుతోంది.2. పోప్ లియో వివాదంఇరాన్ యుద్ధంపై పోప్ లియో XIV శాంతి సందేశం ఇవ్వడం కూడా ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. యుద్ధం విస్తరించకుండా చర్చల ద్వారానే పరిష్కారం వెతకాలని పోప్ పిలుపునివ్వగా.. ట్రంప్ మాత్రం ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పోప్ మాట్లాడటం తగదన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే కాథలిక్ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే ఇటలీ ప్రధాని మెలోనీ మాత్రం పోప్కు బహిరంగంగా అండగా నిలిచారు. ట్రంప్ వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని, పోప్ అభిప్రాయాలను గౌరవించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.ఈ పరిణామం ట్రంప్కు ఏమాత్రం నచ్చలేదని చెబుతున్నారు. అప్పటివరకు మిత్రురాలిగా భావించిన మెలోనీ.. తనకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారనే భావన ఆయనలో ఏర్పడింది. దీంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒక దశలో పోప్ కంటే మెలోనీనే పరిస్థితులను సరిగా అర్థం చేసుకోవడం లేదంటూ ట్రంప్ సెటైర్లు వేయగా.. మెలోనీ కూడా వెనక్కి తగ్గకుండా తన వైఖరిని సమర్థించుకున్నారు. దీంతో విధానపరమైన విభేదం క్రమంగా వ్యక్తిగత స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.3. G7లో బహిరంగ విభేదాలుఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులోనే ఇద్దరి మధ్య విభేదాలు మొదటిసారి బహిరంగంగా బయటపడ్డాయి. ఇరాన్ యుద్ధం, నాటో బాధ్యతలు, పశ్చిమ దేశాల పాత్ర వంటి అంశాలపై జరిగిన చర్చల్లో ట్రంప్ తన అసంతృప్తిని దాచుకోలేదు. యూరప్ అమెరికాను ఒంటరిగా వదిలేసిందని, నాటో మిత్రదేశాలు తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మెలోనీ ఈ వ్యాఖ్యలను నేరుగా సవాలు చేసినట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అమెరికా–యూరప్ భాగస్వామ్యం ఇప్పటికీ బలంగానే ఉందని, పశ్చిమ దేశాల మద్దతును తక్కువ చేసి చూపడం సరైంది కాదని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం.ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని చర్చిస్తున్న దృశ్యాలు బయటకు కనిపించినా.. ఆ సమావేశాల్లో వాతావరణం అంత స్నేహపూర్వకంగా లేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్ తరచూ చేస్తున్న ‘యూరప్ మమ్మల్ని వదిలేసింది’ అన్న వ్యాఖ్యలను మెలోనీ ఖండించగా.. ట్రంప్ కూడా తన వైఖరి నుంచి వెనక్కి తగ్గలేదని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం తెరవెనుక మాత్రమే ఉన్న విభేదాలు G7 వేదికగా అందరికీ కనిపించే స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది విశ్లేషకుల దృష్టిలో ఇదే ఇద్దరి బంధంలో కీలక మలుపుగా నిలిచింది.4. ఫొటో వ్యాఖ్యలతో మరింత దూరంఇద్దరి మధ్య పెరుగుతున్న దూరానికి ప్రతీకగా నిలిచింది ఈ ఫొటో వివాదం. G7 సమావేశం సందర్భంగా మెలోనీ తనతో ఫొటో దిగేందుకు "బతిమాలిందని", "ఆమెపై జాలిపడి ఫొటో ఇచ్చానని" ట్రంప్ వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని మెలోనీ ఈసారి మాత్రం వెంటనే స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితమని, తాను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవ్వరినీ బతిమాలుకోదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.అంతటితో ఆగకుండా, పశ్చిమ దేశాల మిత్రుల పట్ల ట్రంప్ చూపుతున్న వైఖరిపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా మిత్రదేశాల కంటే ప్రత్యర్థి దేశాల నేతల పట్ల ఆయన మరింత మర్యాదగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శించారు. మరోవైపు ట్రంప్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు మెలోనీ తన అభిమానుల్లో ఒకరని, కానీ ఇప్పుడు ఆమె తనకు అభిమానిగా ఉండటం ఇష్టం లేదంటూ మరోసారి వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ విభేదాలుగా మొదలైన ఈ ఘర్షణ.. వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు బహిరంగంగానే పంచులు వేసుకోవడం పరిస్థితి ఎంత మారిపోయిందో చెబుతోంది.5. మెలోనీ శిబిరం నుంచి ఎదురుదాడిఈ వివాదంలో అత్యంత గమనార్హమైన అంశం మెలోనీ చుట్టూ ఉన్న నాయకుల స్పందన. సాధారణంగా ట్రంప్పై నేరుగా విమర్శలు చేయడానికి దూరంగా ఉండే మెలోనీ శిబిరం ఈసారి మాత్రం అసాధారణంగా ఘాటుగా స్పందించింది. ప్రధాని కార్యాలయంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా భావించే జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి ఏకంగా ట్రంప్ అమెరికా–యూరప్ చారిత్రక సంబంధాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలతో యూరప్ అంతటా అమెరికా వ్యతిరేక భావన పెరిగేలా చేస్తున్నారని కూడా విమర్శించారు.ఇంతటితో ఆగకుండా, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం మరింత చర్చకు దారి తీసింది. దీనితో పాటు అమెరికాలో జరగాల్సిన ఇటలీ–అమెరికా వ్యాపార సదస్సు కూడా వాయిదా పడింది. ఈ వివాదాన్ని కేవలం ట్రంప్–మెలోనీ మధ్య వ్యక్తిగత ఘర్షణగా చూడలేం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా–యూరప్ సంబంధాలు, నాటో బాధ్యతలు, ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై ఇరువైపులా పెరుగుతున్న భిన్నాభిప్రాయాలకు ఇది తాజా ప్రతిబింబంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ట్రంప్కు యూరప్లో అత్యంత విశ్వసనీయ మిత్రురాలిగా భావించిన మెలోనీ సైతం ఇప్పుడు బహిరంగంగానే విభేదించడం పరిస్థితి ఎంత మారిపోయిందో సూచిస్తోంది. అందుకే ఈ మాటల యుద్ధం ఇద్దరు నేతలకే పరిమితమవుతుందా? లేక అమెరికా–యూరప్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక దూరానికి, అట్లాంటిక్ మిత్రబంధంలో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. -
అన్నిటికీ ఒకటే క్యూర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగర ప్రజలు ఇకపై వివిధ ప్రభు త్వ విభాగాలకు చెందిన వివిధ సేవల చెల్లింపులను ఒకే యాప్ (క్యూర్–1) ద్వారా చేయొచ్చు. ఈ మేరకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ‘కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టం’ అమలుకు మార్గ దర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు తదితర ప్రభుత్వ బకాయిలన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్ఫాంలో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.ప్రస్తుతం నగర ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు, పన్నులు చెల్లించేందుకు వేర్వేరు పోర్టళ్లను వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు ఇబ్బందులు, శాఖలకు వసూళ్ల సమన్వయంలో సమస్యలు, ఆదాయ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ యాప్ ద్వారా సమగ్ర చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీంతో చెల్లింపుల పారదర్శకత, జవాబుదారీతనం, వసూళ్ల సామర్థ్యం పెరగడంతో పాటు విభిన్న చెల్లింపు వ్యవస్థల అవసరం తొలగిపోనుంది. ఏ సేవలు అందుబాటులోకి?మొదటి దశలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, సెల్ఫ్ అసెస్మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజులు, ఖాళీ భూముల పన్ను (వీఎల్టీ) చెల్లింపులను అనుసంధానించనున్నారు. అలాగే టీజీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, జలమండలికి సంబంధించిన వాటర్, సివరేజి చార్జీలు, హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు కూడా ఈ వేదికలోకి రానున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సూచించే ఇతర సేవలను కూడా ఇందులో చేర్చనున్నారు. యాప్ నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించనున్నారు. రోజువారీ సెటిల్మెంట్యాప్ ద్వారా జరిగే అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్ గేట్వే ద్వారా ప్రాసెస్ అవుతాయి. వసూలైన మొత్తా లు తాత్కాలికంగా కేంద్ర ఖాతాలో నిల్వ చేసి, టీ+0 లేదా టీ+1 విధానంలో సంబంధిత శాఖలకు బదిలీ చేస్తారు. పేమెంట్ వైఫల్యాలు, రీకన్సిలియేషన్ సమస్యలు, ఇతర సేవా వివాదాల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ రెడ్రెస్సల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.పౌరులు క్యూర్ –1 యాప్,మై క్యూర్ యాప్, ఆయా శాఖల పోర్టళ్ల ద్వారా ఫిర్యాదులు నమో దు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖలు 90 రోజుల్లోపు క్యూర్–1 యాప్తో చెల్లింపు వ్యవస్థలోకి మారా ల్సి ఉంటుంది. కాగా.. ఒకే డిజిటల్ ఎకో సిస్టమ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన క్యూర్ –1 యాప్ నగర పాలనలో డిజిటల్ సంస్కరణలకు కొత్త మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తు న్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని పేర్కొంటున్నారు. -
ఉద్దవ్ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్?
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. మొత్తం తొమ్మిది మంది UBT లోక్సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్ ఠాక్రే సీరియస్గా తీసుకున్నారు. హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్ ఎంపీగా అదే లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.మరోవైపు, ఉద్దవ్ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్గా మారిదంటున్నారు. -
ప్రకృతి పిలుపు.. వరుస మారుతోంది!
టాయిలెట్ వస్తే ఏం చేస్తాం? అదేం ప్రశ్న.. వెళ్తాం అంటారా?ఇప్పటివరకు జరిగింది.. జరుగుతోంది ఇదే.. పేదోడి దగ్గర నుంచిపైసలున్నోడి వరకు ఎవరైనా సరే.. టాయిలెట్ వస్తే.. అది ఎక్కడుంటేఅక్కడకు వెళ్లాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. టాయిలెట్ వస్తే.. మనం వెళ్లాల్సిన పనిలేదు. అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. పనిపూర్తయ్యాక చక్కగా వెళ్లిపోతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి..బెడ్ నుంచి లేవలేని వృద్ధులు, పక్షవాతం వచ్చిన రోగుల కోసం చైనాకు చెందిన యుబాన్ అనే టెక్ కంపెనీ ఒక వినూత్నమైన అటానమస్ రోబో టాయిలెట్ను రూపొందించింది. దీనికి షాబాన్ అని పేరు పెట్టారు. షాంఘైలో జరిగిన అంతర్జాతీయ వృద్ధుల సంరక్షణ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించగా.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చక్రాల కుర్చీ తరహాలో ఉండే ఈ కమోడ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక సెన్సర్లతో పనిచేసే ఒక హైటెక్ రోబో. బెడ్పై పడుకున్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ సాయంతో పిలిస్తే చాలు.. బాత్రూమ్లో డాకింగ్ స్టేషన్కు ఉన్న రోబో టాయిలెట్.. బెడ్ పక్కకు వచ్చేస్తుంది. ఇందులో అమర్చిన లైడార్, లేజర్ సెన్సర్ల వల్ల ఇంట్లోని గోడలను లేదా వస్తువులను గుద్దుకోదు. టాయిలెట్ బెడ్రూమ్లోకి వచ్చినా.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇందులో హై–డ్యూటీ ఫోమ్ షీల్డ్, యాక్టివేటెడ్ చార్కోల్ (బొగ్గు) ఫిల్టర్లను ఉపయోగించారు. అందువల్ల బెడ్రూమ్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పని పూర్తయిన తర్వాత సైలెంట్గా బాత్రూమ్లోని తన డాకింగ్ స్టేషన్కు వెళ్లిపోతుంది. అక్కడ డ్రైనేజీ పైపుతో కనెక్ట్ అయ్యి.. లోపల ఉన్న వ్యర్థాలను ఒక సైలెంట్ గ్రైండర్ ద్వారా నలిపేసి ఫ్లష్ చేస్తుంది. ఆ తర్వాత తనను తాను 360 డిగ్రీల కోణంలో పూర్తిగా శానిటైజ్ చేసుకుంటుంది. చివరిగా మళ్లీ తన వాటర్ ట్యాంక్ను నింపుకొని, బ్యాటరీ చార్జ్ చేసుకుని తదుపరి పిలుపు కోసం సిద్ధంగా ఉంటుంది. అంతా బానే ఉంది.. ధర ఎంత అంటారా? చైనా మార్కెట్లో దీని ధర 28,999 యువాన్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు, రోగులకు ఇది ఒక గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు. వయసు పైబడిన వారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి చిన్న అవసరానికి, ముఖ్యంగా ప్రకృతి పిలుపు కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. కేర్టేకర్లకు కూడా ఇది శారీరకంగా పెద్ద శ్రమ. ఈ రోబో వల్ల రోగులు ఎవరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోగలుగుతారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రకృతి మనల్ని పిలిచేది..ఇకపై మనమే ప్రకృతిని పిలవొచ్చు అన్నమాట!! -
గొంతు విప్పకముందే నొక్కేస్తుంది!
ప్రభుత్వంలో జరుగుతున్నఅవినీతి మీద ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారా? వానలతో దెబ్బతిన్న నగర రోడ్ల గురించిఅధికారులను విమర్శిస్తూ ‘ఎక్స్’లో కోపంతోఏదైనా కామెంట్ చేశారా?వాట్సాప్ గ్రూపులో దేశ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారా?అయితే జాగ్రత్త..మీ కామెంట్లు, పోస్టుల ఆధారంగా రేపు మీరు ఏమనుకుంటారో, ఎవరిని విమర్శిస్తారో, ఏ నిరసనలో పాల్గొంటారో కూడా కృత్రిమ మేధ (ఏఐ) ముందే ఊహించి మీ పేరుతో ఒక ’రిస్క్ స్కోర్’ను రూపొందించే రోజులు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన ఏఐ ఆధారిత నిఘా ప్రాజెక్టు, సాంకేతికత వివరాలు బయటకు పొక్కడంతో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భవిష్యత్తుపై కొత్త ఆందోళనతలెత్తుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ముందే గుర్తించి నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు.. భవిష్యత్తులో వారు పూర్తిస్థాయిలో ప్రభుత్వ విమర్శకులుగా మారే అవకాశముందేమో ముందుగానే గుర్తించి నిషేధించే ఏఐ వ్యవస్థ చైనాలో తయారవుతోంది. చైనాకు చెందిన జీఎడ్జ్ నెట్వర్క్స్ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ డేటా, లొకేషన్ ఆధారంగా పౌరుల ప్రవర్తనను విశ్లేషించి వారిపై నిఘా పెట్టే ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతున్నట్లు వెల్లడైంది. భవిష్యత్తులో ప్రభుత్వ విమర్శకులుగా మారే వారిని ముందుగానే గుర్తించి నియంత్రించడానికి ఈ వ్యవస్థను తయారు చేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అమెరికా విధించిన చిప్ ఆంక్షలతో ఈ ప్రాజెక్టుకు కొంత బ్రేకులు పడినా.. పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజలు అసమ్మతి వ్యక్తం చేయకముందే వారి గొంతు నొక్కేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్ల రూపకల్పనలో జీఎడ్జ్అమెరికాకు చెందిన వాండర్బిల్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీకి చెందిన పరిశోధకులు.. జీఎడ్జ్ సంస్థ తన ప్రభుత్వ మద్దతు ఉన్న పరిశోధనా విభాగం మెసా ల్యాబ్తో కలిసి చైనా పౌరుల సమగ్ర ప్రొఫైళ్లు రూపొందించే పనిలో ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రొఫైళ్ల ఆధారంగా రాజకీయంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వ్యక్తులను ఏఐ సహాయంతో ముందే గుర్తించే టెక్నాలజీని కంపెనీ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడైంది. అయితే అధునాతన చిప్ల ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలు ఈ ప్రాజెక్టు పురోగతిని కొంతవరకు దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో విధించిన ఆంక్షలు కొంత అడ్డుకున్నాయని అంటున్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం కొన్ని పరిమితులను సడలించినప్పటికీ, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఏఐ చిప్లను రూపొందించే ఎన్విడియా తయారీ అత్యాధునిక ప్రాసెసర్లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా చిప్లపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు స్వదేశీ ఏఐ చిప్ల అభివృద్ధిపై చైనా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జీఎడ్జ్ వద్ద ఉన్న గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) ప్రస్తుత ఉత్పత్తులకు సరిపోతున్నప్పటికీ, మరింత శక్తివంతమైన అంచనా వ్యవస్థను రూపొందించాలంటే చైనాకు అత్యాధునిక చిప్లు అవసరమవుతాయని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షకు పైగా పత్రాల లీక్ చైనా అమలు చేస్తున్న గ్రేట్ ఫైర్వాల్ తరహా ఇంటర్నెట్ పర్యవేక్షణ, సెన్సార్షిప్ సాఫ్ట్వేర్ను జీఎడ్జ్ నెట్వర్క్స్ అనేక దేశాలకు వాణిజ్యపరంగా విక్రయిస్తోంది. ఈ సాంకేతికత ద్వారా అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్ ట్రాఫిక్ను పర్యవేక్షించడం, సెన్సార్షిప్ను తప్పించుకునేందుకు పౌరులు చేసే ప్రయత్నాలను గుర్తించడం, ప్రజల ఆన్లైన్ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో జీఎడ్జ్ కు సంబంధించిన లక్షకు పైగా పత్రాలు లీక్ కావడంతో ఈ నిఘా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రాలను విశ్లేషించిన వైర్డ్ సహా పలు మీడియా సంస్థలు, జీఎడ్జ్ తన నెట్వర్క్ భద్రతా సాఫ్ట్వేర్ను ఇథియోపియా, కజకిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ వంటి దేశాలకు ఎగుమతి చేసి అక్కడ మొబైల్ నెట్వర్క్లపై భారీ స్థాయి నిఘా నిర్వహించేందుకు సహకరించినట్లు వెల్లడించాయి. తాజాగా జీఎడ్జ్ ఇంజనీర్లు ప్రజల మొబైల్ సమాచారం, సోషల్ మీడియా కార్యకలాపాలు, లొకేషన్ డేటా ఆధారంగా వ్యక్తుల ప్రవర్తనా నమూనాలను రూపొందిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలు ప్రశ్నార్థకం? కృత్రిమ మేధ సహాయంతో పౌరుల రాజకీయ అభిప్రాయాలను ముందుగానే అంచనా వేసే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా గోప్యత, పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై కొత్త చర్చకు తెరలేపాయి. ఈ రోజు మీ మొబైల్లో చేసిన సెర్చ్, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కేవలం డేటానే కావచ్చు. కానీ రేపు అదే డేటా ఆధారంగా మీరు ముందు ముందు ఒక నిరసనకారుడు, ప్రభుత్వ విమర్శకుడు అయ్యే అవకాశముందని ఏఐ ముద్ర వేస్తే? చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త తరం నిఘా సాంకేతికత ప్రస్తుతం భారత్ సహా ఇతర దేశాలకు అందుబాటులో లేదనుకున్నా, డిజిటల్ పాలన వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో అది పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం చైనా కథ కాదని, డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడి భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక అని అంటున్నారు.మాస్ సర్వైలెన్స్ (భారీ స్థాయి నిఘా వ్యవస్థ)కు కృత్రిమ మేధ జత అయితే జరిగేది ఇదే. ఒక వ్యక్తి ప్రభుత్వం వ్యతిరేకిగా మారకముందే అతడిని గుర్తించి పర్యవేక్షించే స్థాయికి ఈ టెక్నాలజీ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. – బ్రెట్ జే. గోల్డ్స్టీన్, వికెడ్ ప్రాబ్లమ్స్ ల్యాబ్ డైరెక్టర్ ప్రజలు ఏం చేస్తున్నారన్నది మాత్రమే కాదు.. భవిష్యత్తులో వారు ఏం చేయచ్చో ముందే అంచనా వేసే వ్యవస్థలను నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇది నిఘా వ్యవస్థల్లో కొత్త దశ. – అమెరికా భద్రతా వర్గాల విశ్లేషణ -
ట్రంప్ బిగ్ గేమ్! అమెరికా రాజకీయాల్లో ఇజ్జత్ కా సవాల్
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. ఆయన మద్దతు లభిస్తే ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయమనే (స్ట్రయిక్ రేటు ఎక్కువ) అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ట్రంప్ మద్దతు పొందిన కెన్ పాక్స్టన్ ప్రైమరీలో తొలి అడ్డంకిని దాటి, ఇప్పుడు ప్రధాన ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయం పై అందరి దృష్టి నిలిచింది. టెక్సాస్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా ఉంది. ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ మద్దతుతో రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, సీనియర్ సెనేటర్ జాన్ కార్నిన్ను ఓడించి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రైమరీలో గెలవడం ఒక విషయం అయితే, సాధారణ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడం మరో విషయం.ఈ పరిస్థితుల్లో కెన్ పాక్స్టన్కు ఎదురవుతున్న గట్టి పోటీని రిపబ్లికన్ పార్టీ కీలక పరీక్షగా చూస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జేమ్స్ టలారికో నుంచి పెరుగుతున్న సవాల్, ఆయన బలమైన ఫండ్రైజింగ్, అలాగే పాక్స్టన్పై ఉన్న పాత అవినీతి ఆరోపణలు రిపబ్లికన్లకు రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ పోరు రిపబ్లికన్ పార్టీకి “ఇజ్జత్ కా సవాల్”గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.తన మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన కెన్ పాక్స్టన్ను గెలిపించేందుకు ట్రంప్ తన వద్ద ఉన్న అత్యంత భారీ ఎన్నికల నిధిని ఖర్చు చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసిందిరిపబ్లికన్లకు ట్రంప్ వద్ద ఉన్న నిధి కీలకంగా కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నికలు అత్యంత ఖరీదైన రాజకీయ ప్రక్రియల్లో ఒకటి. టెలివిజన్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమావేశాలు, ప్రచార బృందాలు, ఓటర్లను చేరుకునే కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్లు అవసరమవుతాయి. అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తుంటాయి.ట్రంప్కు అనుబంధంగా ఉన్న మాగా (MAGA Inc), సూపర్ పాక్(PAC) వద్ద ప్రస్తుతం 356 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) నిధి ఉంది. ఇది అమెరికా రాజకీయాల్లో అత్యంత భారీ ఎన్నికల నిధుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డబ్బు ప్రధానంగా ట్రంప్ అభిమానులు, వ్యాపారవేత్తలు, పార్టీ మద్దతుదారుల విరాళాల ద్వారా సమీకరించబడింది. అయితే.. 👉ట్రంప్ ఈ డబ్బును టెక్సాస్ కోసం పాక్స్టన్ కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది?.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాక్స్టన్కు ఎన్నికల్లో స్పష్టమైన ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టలారికో ఆర్థిక బలాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడవచ్చు.👉అయితే ట్రంప్ ఈ నిధిని ఖర్చు చేయకుండా దాచిపెడితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. పాక్స్టన్ తన సొంత నిధులతోనే ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ టెక్సాస్ వంటి కీలక రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోతే, అమెరికా సెనేట్లో పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలా జరిగితే భవిష్యత్తులో ట్రంప్ రాజకీయ అజెండాను అమలు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.👉అలాగే.. ట్రంప్ నిధిని వెంటనే ఖర్చు చేయకూడదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. 2026 మధ్యంతర ఎన్నికలతో పాటు రాబోయే జాతీయ రాజకీయ పోరాటాల కోసం ఈ డబ్బును నిల్వ ఉంచడం వ్యూహాత్మకంగా మంచిదని వారు వాదిస్తున్నారు. అందుకే ట్రంప్ ఇప్పటివరకు తన తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు.మొత్తంగా చూస్తే, టెక్సాస్ ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక సెనేట్ సీటు కోసం జరిగే పోటీ కాదు. ట్రంప్ రాజకీయ ప్రభావం, ఆయన ఆర్థిక శక్తి, అలాగే రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. ట్రంప్ తన ‘రూ.3,000 కోట్ల’ రాజకీయ నిధిని తెరపైకి తీసుకొస్తారా? లేదంటే సరైన సమయం కోసం దాచిపెడతారా?.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఈ బిగ్ గేమ్ హాట్ టాపిక్గా మారింది. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్తో డీల్పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్ను కూల్చినందుకు ఇరాన్పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకో భిన్నరుచి.. ఏఐతో గుదిగుచ్చి...
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ఇడ్లీ–సాంబార్, ఫిల్టర్ కాఫీకి ఫేమస్.. హైదరాబాద్ పేరు చెప్పగానే నోరూరించే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఇలా దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రత్యేక రుచులు, వంటకాలు, విభిన్న తయారీ పద్ధతులకు డిజిటల్ రూపం ఇచ్చేందుకు భాగ్యనగరం వేదికగా కసరత్తు జరుగుతోంది. ఆయా వంటకాల్లోని పదార్థాల కల యిక, వంట విధానం సహా ప్రాంతానికో రుచి కలిగిన భారతీయ రుచులను సాంకేతికంగా గుర్తించేందుకు హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిశోధన సాగుతోంది. ఇండియన్ ఫుడ్ మ్యాప్ తయారీ లక్ష్యంగా ప్రొఫెసర్ సీవీ జవహర్ సారథ్యంలో జరుగుతున్న ఈ అధ్యయనంలో కంప్యూటర్ విజన్, ఏఐ సాంకేతికతలను ఉపయోగించి భారతీయ ఆహార ప్రత్యేకతలను పరిశోధక బృందం విశ్లేషిస్తోంది.థాళీ... భళీ...ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు తొలుత భారతీయ థాళీ’పై అధ్యయనం ప్రారంభించారు. సాధారణంగా భారతీయ భోజనంలో అన్నం, పప్పు, కూరలు, రొట్టెలు, పెరుగు, పచ్చళ్లు వంటి అనేక పదార్థాలు కలిసిపోవడం వల్ల వాటి పోషక విలువలను గుర్తించడం ప్రస్తుత యాప్లకు కష్టమవుతోంది. పాశ్చాత్య దేశాల ఆహారాన్ని గుర్తించేందుకు తయారైన చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్లు భారతీయ వంటకాల వైవిధ్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. దీనికి పరిష్కారంగా జీరో–షాట్ ఏఐ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికత కొత్త వంటకాలను ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే గుర్తించి, విశ్లేషిస్తుంది.బిర్యానీపై స్పెషల్ స్టడీహైదరాబాదీ, అవధీ, అంబూర్, కోల్కతా వంటి బిర్యానీ రకాల్లో ఉపయోగించే మసాలాలు, వంట దశలు, పదార్థాల మార్పులను ఏఐ ప్రత్యేకంగా విశ్లేషిస్తోంది. ఈ ప్రాజెక్టు కేలరీలు లెక్కించే సాధనంగా మాత్రమే కాకుండా భారతీయ ఆహార సంస్కృతిని డిజిటల్ రూపంలో భద్రపరిచే ప్రయత్నంగా కూడా మారనుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఓవర్హెడ్ కెమెరా సహాయంతో పనిచేస్తుండగా భవిష్యత్తులో మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ కెమెరాతో భోజనం ఫొటో తీస్తే అందులోని పదార్థాలు, వాటి పరిమాణం, పోషక విలువలను కూడా ఏఐ అంచనా వేస్తుందని బృందం చెబుతోంది.లాభాలివీ..⇒ ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు దేశ ఇంటరాక్టివ్ మ్యాప్ను అన్వేషిస్తూ వివిధ ప్రాంతాల సంప్రదాయ వంటకాలను తెలుసుకోగలరు. ⇒ ప్రతి వంటకం మూలాలు, పదార్థాలు, సాంస్కృతిక ప్రాధాన్యం, తయారీ విధానంతోపాటు వాటిని అందించే రెస్టారెంట్ల గురించి కూడా సమాచారం పొందగలరు. ⇒ కొత్త వంటకాలను తెలుసుకోవాలనుకునే ఆహార ప్రియులకు ఇది దోహదపడటంతోపాటు పర్యాటకులకు అసలైన స్థానిక ఆహార అనుభవాలను కనుగొనడంలో సహాయపడుతుంది. ⇒ భారతీయ ఆహార వారసత్వంపై ఆసక్తి ఉన్న పరిశోధకులు, విద్యార్థులు, సాంస్కృతిక సంస్థలకు ఇది ఉపయుక్తమైన వనరుగా ఉంటుంది.ఏఐ ఆధారిత పరిష్కారాలకు దోహదంసమాచార సేకరణ, వర్గీకరణ కోసం ఏఐ సాధనాలను వినియోగించి అనంతరం ధ్రువీకరణ, భౌగోళిక మ్యాపింగ్ కోసం ప్రత్యేక విధానాలను అభివృద్ధి చేశాం. దీంతో వినియోగదారులకు సులభంగా ఉపయోగపడే ఇంటరాక్టివ్ వేదికను రూపొందించగలిగాం. ఈ డేటా వల్ల రుచులు, పోషకాలు, వినూత్న పద్ధతులపై సాంకేతిక విశ్లేషణ సాధ్యమవుతుంది. దీని ద్వారా భారతీయ ఆహార రంగంలో ఏఐ ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చెందుతాయి. వంటకాల్లోని వైవిధ్యాలను, వంటకాల పరిణామ క్రమాన్ని కూడా చేర్చాలని భావిస్తున్నాం.– ప్రొఫెసర్ సీవీ జవహర్ -
ఫ్లెక్స్ ఫ్యూయల్.. 'పంచ'నామా
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు.. ఇటు మారుతి సుజుకి ఓ కారును మార్కెట్లోకి తెస్తే.. అటు హీరో కంపెనీ బైక్లను దించింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఈ85 పెట్రోలు బంకు కూడా ప్రారంభమైంది. ఈ పరిణామాలను ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థ దిశగా మన దేశం వేసిన ఓ కీలక ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఏమిటి? ఇది ప్రాచుర్యం పొందుతుందా? ఉన్న సమస్యలు ఏమిటి? వంటి వివరాలు మీ కోసం.. అసలు ఏంటివి? పెట్రోలులో ఎంత శాతం ఇథనాల్ కలిపినా నడిచేలా రూపొందించినవే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు. మన దేశం విషయానికొస్తే.. ఇంజన్కు ఎలాంటి నష్టం చేయకుండా.. ఈ20–ఈ100 ఇంధన మిశ్రమంతో ఇవి నడుస్తాయి. అయితే, ఇథనాల్ లోహాన్ని కరిగించే లేదా తినేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంజిన్కు నష్టం జరగకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేక సెన్సర్లు, ఇథనాల్ నిరోధక ఇంధన పైపులు, సీల్స్ను అమరుస్తారు. వాస్తవానికి ఈ సాంకేతికత కొత్తది కాదు. 2000ల ప్రారంభంలోనే ఫోక్స్వ్యాగన్ వీటిని బ్రెజిల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడక్కడ అమ్ముడయ్యే వాహనాల్లో 80 శాతం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే కావడం గమనార్హం. ప్రజల నుంచి ఆదరణ ఉంటుందా? ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ85 ఇంధనం పెట్రోలుతో పోలిస్తే.. లీటరుకు సుమారు రూ.20 తక్కువకు వస్తోంది. అయితే, ఈ వాహనాల తయారీ వ్యయం అధికంగా ఉండటం వల్ల అమ్మకపు ధరలు కూడా ఎక్కువగా ఉండటం.. ఇథనాల్ మిశ్రమం పెరిగే కొద్దీ మైలేజ్ కొంతమేర తగ్గే అవకాశమున్నందున ఈ అంశాల ప్రభావం వినియోగదారులపై పడే అవకాశముంది. ఈ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అంశంపై చర్చలు జరిగినప్పటికీ కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల పన్ను రాయితీలతోపాటు ఇథనాల్ మిశ్రమ ఇంధన ధరను కూడా మరింత తగ్గించే దిశగా ప్రోత్సాహకాలు అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ పరిస్థితి ఏమిటి? 2031–32 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్ వాహనాలు కలిపి 5 శాతం వాటాను దక్కించుకుంటాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పశ్చిమాసియా పరిణామాలు, ఉద్గారాల నియంత్రణ లక్ష్యాల నేపథ్యంలో ప్రభుత్వం దీనికి ప్రాధాన్యమిస్తోంది. కంపెనీలు ఏమనుకుంటున్నాయి? ప్రస్తుతం హీరో, మారుతి సంస్థలు పరిమిత స్థాయిలోనే వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. వీటి తయారీ వ్యయం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై స్పష్టత లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. అదే సమయంలో ఇథనాల్ కలిపిన ఇంధనం తక్కువ ధరలో వస్తున్నప్పటికీ.. ఈ వాహనాల ధరలు ఎక్కువగా ఉండటంతో వీటికి ప్రజల ఆదరణ ఎలా ఉంటుందన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో కంపెనీలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ సరఫరా తగినంత ఉందా? ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆల్ ఇండియా డిస్టిలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. భారత్ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2,000 కోట్ల లీటర్లు. ప్రస్తుతమున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధన లక్ష్యానికి అవసరమయ్యే పరిమాణం(1,100 కోట్ల లీటర్లు) కంటే ఇది ఎక్కువ. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల వినియోగం పెరిగినా.. ఈ మేరకు సరఫరాను పెంచే సామర్థ్యం పరిశ్రమకు ఉందని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
‘డూప్’మైన్ ఆన్లైన్ షాపింగ్!
ఆన్లైన్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్లో యాడ్ చేయడం, పార్శిల్ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూడటం.. ఇదంతా ఒక తీపి అనుభూతి. అయితే, ఈ అలవాటు జేబుకు బాగానే చిల్లు పెడుతుంటుంది. ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా షాపింగ్ చేసేస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా యువత ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అదే డోపమైన్ సైట్లలో షాపింగ్ చేయడం. ఆ విశేషాలేంటో చూద్దామా?నిజానికి ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు.. వాటిని కొనడం వల్ల వచ్చే ఆనందం కంటే.. దానిని వెతికి, కార్ట్లో వేసి, ఆర్డర్ బటన్ నొక్కే ప్రక్రియలోనే మన మెదడులో ‘డోపమైన్’(ఆనందాన్నిచ్చే హార్మోన్) ఎక్కువగా విడుదలవుతుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. కొరియాలో వచ్చిన ఈ ఫేక్ డోపమైన్ యాప్స్ సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుకుంటున్నాయి. ఈ యాప్స్ చూడటానికి వంద శాతం అసలైన షాపింగ్ సైట్ల లాగే ఉంటాయి.ఇందులో వందలాది ప్రొడక్ట్స్, వాటి రేటింగ్లు, కస్టమర్ రివ్యూలు, డిస్కౌంట్ ఆఫర్లు అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దుస్తులు లేదా గాడ్జెట్స్ను సెలెక్ట్ చేసుకుని ‘కార్ట్’లో వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేసి ‘ఆర్డర్’బటన్ కూడా నొక్కవచ్చు. ట్విస్ట్ ఏంటంటే మీరు ఆర్డర్ నొక్కగానే స్క్రీన్ మీద ఒక డెలివరీ బాయ్ మీ ఆర్డర్ని తీసుకుని, బైక్ మీద మీ ఇంటి వైపు వస్తున్నట్లు మ్యాప్లో లైవ్గా చూపిస్తుంది. వస్తువు మీ ఇంటికి చేరేవరకు ఉండే ఆ ఉత్కంఠ, ఎగ్జైట్మెంట్ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ చివరకు మీ ఇంటికి ఎలాంటి వస్తువూ రాదు, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు! దీంతో షాపింగ్ ఖర్చు నుంచి తప్పించుకోవడంతో షాపింగ్ చేశామన్న అనుభూతినీ పొందవచ్చు. అయితే ఈ పద్ధతి డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ, ఇది ఒక రకమైన మానసిక వ్యసనానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏ వస్తువు కొనకపోయినా, ఈ సైట్లలో గడపడం వల్ల షాపింగ్ చేయాలనే అదే ప్రవర్తనా సరళి మెదడులో బలోపేతం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ దక్షిణ కొరియాకే పరిమితమైంది. రెడ్డిట్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఉన్న వ్యాఖ్యలను బట్టి చూస్తే, పాశ్చాత్య దేశాల వారు తమ సమయాన్ని ఇలాంటి నకిలీ పనుల కోసం వె చ్చించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అర్థమవుతోంది. ఏదేమైనా, షాపింగ్ పిచ్చిని వదిలించుకోవడానికి కొరియన్లు కనిపెట్టిన ఈ మార్గం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పైసా ఖర్చు లేకుండా షాపింగ్ మజాను అందించే ఈ ‘ఫేక్ స్టోర్స్’ఐడియా మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (సాక్షి సెంట్రల్ డెస్క్) -
మా ఏఐ మాకే సొంతం..
ఏఐని నియంత్రిస్తున్న దేశాలు రూటు మారుస్తున్నాయి. ఇప్పటిదాకా చిప్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటంపై దృష్టి పెట్టినా... ఇపుడు ఏఐ మోడల్స్నూ నియంత్రించే చర్యలు మొదలెట్టాయి. అమెరికా ప్రభుత్వం ఆదేశించిన మీదట... ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో ఎవరూ వాడకుండా నిషేధించటం... ఒక ఆరంభం మాత్రమే. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలో తప్ప ఇంకెక్కడా వాడకుండా చేయటం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది అమెరికా వ్యూహం కావచ్చనేది నిపుణుల మాట.ఇలాంటి చర్యలతో ఏఐ వాడకంలో అంతరాలు తారస్థాయికి చేరుతాయి కాబట్టి భారతదేశం ఏఐ మిషన్ను ఆరంభించి, రూ.50వేల కోట్లు కేటాయించాలని టెక్నోక్రాట్ మోహన్దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యరి్థంచటం గమనించాల్సిన విషయం. అమెరికా నిషేధం నేపథ్యంలో అసలు ఈ మైథోస్–5, ఫేబుల్–5 ఏం చేస్తాయి? నిషేధంతో నష్టాలేంటి? అమెరికా చెబుతున్న భద్రత కారణాలు నిజమేనా?ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి’ప్రత్యేక కథనం... అమెరికాలో మినహా విదేశాల్లో యాక్సెస్ లేకుండా నిషేధించిన మైథోస్, ఫేబుల్ మోడళ్లు అత్యా«ధునికమే కాదు. శక్తిమంతమైనవి కూడా. ప్రత్యేకించి మైథోస్–5 ఉపయోగించి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించవచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. అందుకే గ్లాస్వింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా దీని వాడకాన్ని కొన్ని సంస్థలకే అందించింది ఆంథ్రోపిక్. మైథోస్లోని ఫీచర్లన్నీ ఉండి... కొన్ని నియంత్రణలతో అందరికీ అందించిన మోడల్ ఫేబుల్. ఒక్కమాటలో చెప్పాలంటే మైతోస్–5 రేసింగ్ కార్ అయితే... సాధారణ రోడ్లపై తిరగటానికి ఆవిష్కరించిన దాని లీగల్ వెర్షనే ఫేబుల్–5. మైథోస్–5 ఎందుకు స్పెషల్ అంటే? అటానమస్ కోడింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, దీర్ఘ కాలిక రీజనింగ్, శాస్త్రీయ పరిశోధనల్లో సాయం విషయంలో మైథోస్కు అసాధారణమైన సామర్థ్యాలున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇక ఫేబుల్ మోడళ్ల విషయానికొస్తే... ⇒ అత్యంత భారీ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను మైగ్రేట్ చేయడానికి ⇒ కొన్నేసి గంటల పాటు రెగ్యులర్గా అటానమస్ పనులు చేయటానికి... ⇒ అడ్వాన్స్డ్ కోడింగ్, ఇంజినీరింగ్ టాస్క్లు చేయటానికి వాడొచ్చు. నిషేధం వల్ల నష్టాలేంటి? ⇒ ఆంథ్రోపిక్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అమెరికా వెలుపల ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ⇒ మెరుగైన కోడ్ను జనరేట్ చేయటం... బగ్స్ను కనిపెట్టడం... భారీస్థాయి సాఫ్ట్వేర్ మైగ్రేషన్లను ఈజీగా చేసే సామర్థ్యాన్ని డెవలపర్లు కోల్పోతారు. ⇒ సైబర్ సెక్యూరిటీలోని లోపాలను కనిపెట్టడానికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టూల్స్ను పరిశోధకులు వాడలేరు. ⇒ అన్నిటికన్నా ప్రధానం... అమెరికా వెలుపల ఉండేవారికి అమెరికాలో ఉండేవారితో పలు అంశాల్లో పోటీపడే సామర్థ్యం తగ్గిపోతుంది. అమెరికన్ కంపెనీలకు ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ పెరిగి... విదేశాల్లోని స్టార్టప్ల ఇన్నోవేషన్ సామర్థ్యం స్లో అవుతుంది. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ల మాదిరి ఏఐ సామర్థ్యాలపై కూడా కొన్ని దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. భారత్కు ఇబ్బందులేంటి? భారత్కు ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ అమెరికన్ ఏఐ మోడళ్ల యాక్సెస్ మన స్టార్టప్లకు ఉండదు. మన సైబర్సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టూల్స్ను కోల్పోతాయి. పైపెచ్చు నిషేధం ఎక్కువకాలం కొనసాగితే మన సాఫ్ట్వేర్ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గొచ్చు. నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏఐ చిప్లను, సెమీకండక్టర్ పరికరాలను, సూపర్ కంప్యూటర్ల హార్డ్వేర్ను మాత్రమే నియంత్రించాయి. ఇపుడు ఏఐ మోడల్ను సైతం అమెరికా ఓ సాఫ్ట్వేర్లా కాకుండా కీలకమైన మిలిటరీ టెక్నాలజీలా చూడటం ఆరంభించింది. ఈ కారణాల వల్లే అమెరికా మోడళ్లపై పూర్తిగా ఆధారపడకుండా భారత్కు సొంత ఏఐ మోడళ్లు ఉండాలని మోహన్దాస్ పాయ్ వంటి టెక్నోక్రాట్లు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏఐ నియంత్రణ మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది కాదనలేని నిజం.ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్లు వెనక్కి వాషింగ్టన్: ట్రంప్ విధానాలతో దేశాలు మాత్రమేకాదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుచేసి పరిశోధన పూర్తిచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచి్చన అధునాతన కృత్రిమమేధ (ఏఐ) టూల్స్ను కంపెనీలు వెనక్కి(రీకాల్) చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అందుబాటులోకి తెచి్చన క్లాడ్ ఫేబుల్5, మైథోస్5 ఏఐ మోడళ్లను వెనక్కితీసుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ శనివారం ప్రకటించింది.భద్రతా కారణాలు చూపి వీటిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షల విధించడంతో తప్పనిపరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భద్రత లేని, క్షేమదాయకంకాని మోడళ్లపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అత్యంత భద్రమైన మా మోడళ్లకు ఏ సాంకేతిక లోపాల మాటున అడ్డుచెబుతున్నారో ప్రభుత్వం వివరిస్తే బాగుండేది. అప్పుడే ఈ ఆంక్షల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని అంతా భావిస్తారు’అని ఆంథ్రోపిక్ తన అసహనం వ్యక్తంచేసింది. (రమణమూర్తి మంథా) -
పేగుబంధమే యమపాశమై!
అమ్మ.. నలుగురు సభ్యులున్న ఇంట్లో ముగ్గురికి సరిపోయే ఆహారం మాత్రమే ఉన్నప్పుడు తనకు ఆకలి లేదని చెప్పి పిల్లల కడుపు నింపే గొప్ప మనసున్న మనిషి.నాన్న..పిల్లల అవసరాల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి.. తన అవసరాలను సైతం త్యాగం చేసి పిల్లల బాగోగుల కోసమే పరితపించే మంచి నేస్తం.మరి అలాంటి తల్లిదండ్రులకు ఇప్పుడేమైంది? కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలకు స్వయంగా మరణశాసనం ఎందుకు లిఖిస్తున్నారు? పిల్లల ప్రాణాలను తీయాలనే కఠినమైన నిర్ణయం ఎలాతీసుకుంటున్నారు? అమూల్యమైన, కల్మషం లేని కన్నప్రేమ యమపాశంగామారుతోందా?తల్లిదండ్రులు తమ పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు గత కొంతకాలంగా ఎక్కువయ్యాయి. అప్పులబాధలో, కుటుంబ కలహాలో, మానసిక ఒత్తిళ్లో.. కారణాలు ఏవైనా సరే.. చావు ఒక్కటే పరిష్కారం అనే భావన వల్లే ఇవి పెరిగిపోతున్నాయ్. పొత్తిళ్లలోని పసిబిడ్డల దగ్గర నుంచి ఇంటర్ చదువుతున్న యుక్తవయసు పిల్లలను సైతం చంపేయడమో.. చనిపోయేలా ప్రేరేపించడమో చేసి, ఆపై వారు కూడా తనువు చాలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగడానికి అనేక సామాజిక, ఆర్థిక, మానసిక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని మర్డర్–సూసైడ్ లేదా ఫిలిసైడ్–సూసైడ్ అని అంటారు. గత ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను విశ్లేషిస్తే ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. డిప్రెషన్ వంటి అంశాలు కీలకంగా కనిపించాయి. వ్యాపారాల్లో నష్టాలు రావడం, ఆన్లైన్ బెట్టింగ్లు లేదా జూదంలో డబ్బులు పోగొట్టుకోవడం, అధిక వడ్డీలకు అప్పులు చేసి తీర్చలేకపోవడం వంటి అంశాల వల్ల కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవ చేయడం, సమాజంలో తలదించుకోవాల్సి రావడం వంటి పరిస్థితులను తట్టుకోలేక ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు కూడా ఇందుకు దారితీస్తున్నాయి. గృహ హింస, వివాహేతర సంబంధాలు లేదా భాగస్వామిపై పగ తీర్చుకోవాలనే వికృత కోపం... చివరికి పిల్లల మరణ శాసనంగా మారుతోంది. చాలా కేసుల్లో తీవ్రమైన డిప్రెషన్ (కుంగుబాటు) సైతం కారణంగా ఉంటోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ఎలా గుర్తించాలి.. ఏం చేయాలి? చనిపోవాలి అనే నిర్ణయం రాత్రికి రాత్రే తీసుకోరు. ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలతో విసిగి వేసారి, తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. తాము చనిపోబోతున్నామనే విషయాన్ని సన్నిహితుల దగ్గర పరోక్షంగా వెల్లడిస్తుంటారు. కాస్త నిర్వేదంగా మాట్లాడుతుంటారు. మన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తే.. వెంటనే వారితో మాట్లాడాలి. ముందుగా వారి సమస్య ఏమిటో అడిగి తెలుసుకోవాలి. నీకేం కాదు.. మేమంతా ఉన్నాం అనే భరోసా కల్పించాలి. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా బయటపడొచ్చో వివరించాలి. ఎంత మాట్లాడినా వారు అలాగే ఉంటే.. మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకెళ్లాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్లైన్ల ద్వారా ఇలాంటి సేవలను ఉచితంగా కూడా అందిస్తున్నాయి.వారు క్రూరులు కాదు.. ఇలాంటి సంఘటనలు చూడగానే సహజంగా మనకు కోపం వస్తుంది. కానీ పిల్లల్ని చంపుకొనే తల్లిదండ్రులు క్రూరులు కారు. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులుగానే వారిని పరిగణించాలి.తీవ్రమైన నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయినవారి ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటివారంతా టన్నెల్ విజన్లో ఉండిపోతారు. అంటే.. సమస్య వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అవకాశాలు ఏవీ కనిపించకుండా, కేవలం చావు మాత్రమే ఏకైక మార్గంగా కనిపించే ఒక విచిత్రమైన మానసిక స్థితి. అలాగే చాలా సంఘటనల్లో పిల్లలపై మితిమీరిన ప్రేమ కూడా ఇందుకు కారణం అవుతోంది. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతుంటే.. వారితో కూర్చుని మాట్లాడాలి. వారు చెప్పింది వినాలి. అలాంటివారికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి పలు ఉచిత హెల్ప్లైన్లు కూడా ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారం కాకుంటే సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి. – విశేష్, సైకాలజిస్ట్ పోటీ ప్రపంచంలోఏమైపోతారోనని.. గతేడాది మార్చిలో కాకినాడలో జరిగిన ఒక విషాదకర సంఘటన అందరినీ నివ్వెరపరిచింది. ఓ ప్రభుత్వ రంగసంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తున్న చంద్ర కిషోర్ అనే వ్యక్తి తన ఇద్దరు కొడుకులను (7 ఏళ్లు, 6 ఏళ్లు) చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విపరీతమైన పోటీ ప్రపంచంలో తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం తీవ్ర నిరాశలోకి నెట్టేసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని సూసైడ్ నోట్లో పేర్కొనడం పలువురిని షాక్కు గురిచేసింది. పిల్లలను చంపడం ఎందుకు?పిల్లలను చంపి తాము చనిపోయే తల్లిదండ్రుల్లో ఒక విచిత్రమైన మానసిక రుగ్మత కనిపిస్తుంది. ‘నేను లేకపోతే నా పిల్లలు రోడ్డున పడతారు. సమాజం వారిని అనాథలుగా చూస్తుంది. నాలాగే వాళ్ళు కూడా కష్టాలు పడకూడదు. అందువల్లే నా వెంట నా పిల్లలను కూడా తీసుకెళ్లిపోతాను’అనే భావన ఇందుకు కారణం. అలాగే జీవిత భాగస్వామి మీద కోపం వల్ల కూడా పిల్లలను చంపేసే సంఘటనలు చూస్తున్నాం. ఇలా చేయడం వల్ల తమ భాగస్వామి జీవితాంతం బాధలో కూరుకుపోతారనే ఆలోచనే ఇందుకు ఉసిగొల్పుతోంది.చిన్నపిల్లలనైతే.. వారికేం తెలియదు కాబట్టి సులభంగా చంపేస్తున్నారు. మరి ఇంటర్ చదివే పిల్లల్ని ఎలా ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారనే సందేహం రావడం సహజం. ఇక్కడ వారు తీసుకున్న నిర్ణయం ఒక్కరోజో, ఒక్క రాత్రో జరగదు. తల్లి లేక తండ్రి.. వారిని కొన్ని నెలలుగా అందుకు మానసికంగా సిద్ధం చేస్తారు. ఏం చేసినా మనం కలిసే చేయాలనే భావనను నెమ్మదిగా వారి మనసులోకి చొప్పిస్తారు. దీంతో ఆ పిల్లలు వారి మాట విని ప్రాణం తీసుకుంటున్నారు.హెల్ప్లైన్ నంబర్లు ఇవే..టెలి–మానస్ (భారత ప్రభుత్వం): 14416 లేదా 1800 891 4416(24 గంటలు అందుబాటులో ఉంటుంది) కిరణ్ హెల్ప్లైన్: 1800–599–0019. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ టెలి–కౌన్సెలింగ్లో తెలుగు సహా 13 భాషలలో సేవలు ఉచితంగా లభిస్తాయి.జీవన హెల్ప్లైన్ టోల్–ఫ్రీ నెంబర్: 1800–425–5438 రోష్ని హెల్ప్లైన్ (హైదరాబాద్): 040–66202000 -
అన్ని లక్షల కోట్లు ఉంటేనా..!!!
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టండి... లక్ష కోట్లు అవుతుంది. జూన్ పదమూడున ఒక డాలర్ మారకం విలువ రూ. 95.1 అంటే.. లక్ష కోట్ల డాలర్లు 95,20,990,00,00,000 రూపాయలకు సమానం! కళ్లు చెదిరే అంకె ఇది. స్పేస్–ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తొలి ఐపీఓతో... దీనికంటే రెండు రెట్ల కంటే ఎక్కువే సంపాదించాడు. ఇంత డబ్బుతో భారత్లో ఎన్ని గొప్ప గొప్ప పనులు చేయవచ్చునంటే...రహదారులు... దేశంలోని జాతీయ రహదారుల విస్తరణకు ఉద్దేశించిన భారత్మాలా పరియోజనకు సుమారు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఐపీఓ ద్వారా 2.1 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 199 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయనుకుంటే.. దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ మళ్లీ తాజాగా నిర్మించడమే కాదు.. ఏకంగా ఆరేళ్లపాటు ఏటికేడాదీ తాజాగా కొత్త రోడ్లు వేస్తూనే ఉండవచ్చు. 2025 నాటి అంచనాల ప్రకారం దేశంలో సుమారు 145,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. నాలుగు లేన్ల రహదారి కిలోమీటర్ మేర నిర్మించేందుకు దాదాపు రూ.20 కోట్లు అవుతుందని అంచనా. స్మార్ట్ సిటీలు... నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. స్పేస్–ఎక్స్ ఐపీఓ డబ్బులతో వీటిల్లో 65 నగరాలను అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లతో అభివృద్ధి చేయవచ్చు. ఐదు కోట్ల మందికి ‘న్యాయ్’... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ న్యాయ్. దేశంలోని మొత్తం ఐదు కోట్ల కుటుంబాలకు నెలకు ఆరువేల రూపాయల చొప్పున నగదు సాయం అందించాలన్నది దీని ఉద్దేశం. అంటే ఒక్కో కుటుంబానికి ఏటా రూ.72 వేలు, మొత్తం రూ.3.6 లక్షల కోట్లు ప్రభుత్వం వద్ద స్పేస్–ఎక్స్ ఐపీఓకు వచ్చినంత సొమ్ము ఉంటే... ఎలాంటి అవాంతరాలు లేకుండా 48 ఏళ్లపాటు పేద కుటుంబాలకు ‘న్యాయ్’అందించవచ్చు. వేల ఏళ్లు ‘ఆయుష్మాన్’... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కలి్పస్తోంది. ఈ పథకాన్ని స్పేస్–ఎక్స్ సొమ్ముతో ఎంత కాలం నడపవచ్చో తెలుసా? 23,000 ఏళ్లు! ఫుల్ సబ్సిడీతో ఈవీలు... సౌర విద్యుత్తుతో పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఒక గిగావాట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ లెక్కన రూ.199 లక్షల కోట్లతో 21,750 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇది ప్రస్తుతం దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి ఇరవై రెట్లు ఎక్కువ. కోట్లాది విద్యుత్తు వాహనాలను ఫుల్ సబ్సిడీతో నడిపించవచ్చు. పెట్రోల్, డీజిళ్ల దిగుమతులు దాదాపు శూన్యం చేయవచ్చు. అందరికీ చింతలేని చదువు... స్పేస్ ఎక్స్ ఐపీఓతో వచ్చిన రూ.199 లక్షల కోట్లతో మస్క్ భారత్లో 70 ఏళ్లపాటు అందరికీ ఉచితంగా చదువులు చెప్పవచ్చు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యకు సుమారు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ప్రపంచానికి అత్యుత్తమ ఇంజనీర్లను ఇచ్చే ఐఐటీలపై ఖర్చు పెట్టాలనుకుంటే జిల్లాకు ఒకటి చొప్పున ఏకంగా 17,400 ఐఐటీలు ఏర్పాటు చేసేందుకు తగిన సొమ్ము ఐపీఓ ద్వారా మస్క్ చెంతకు చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్రూ. 199 లక్షల కోట్లతో... ⇒ భూమి నుంచి చంద్రుడికి రెండుసార్లు 4 లేన్ హైవే నిర్మించవచ్చు. ⇒ దేశంలోని రోడ్లు (63 లక్షల కిలోమీటర్లని అంచనా) అత్యాధునిక హంగులతో కట్టేయవచ్చు. ⇒ స్వర్ణ చతుర్భుజి (ఢిల్లీ–ముంబై–చెన్నై– కోల్కతా) రహదారిని ఎకాఎకిన 300 సార్లు కట్టవచ్చు. ⇒ బోయింగ్ 737లు నాలుగు వేల కంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్జెట్ల వద్ద ఉన్న వాటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విమానాలు అన్నమాట. ⇒ ఐపీఎల్ టీమ్స్ అన్నింటినీ ఓ యాభై సార్లు కొనేయవచ్చు. ⇒ రోజుకో రూ.కోటి ఖర్చు పెడితే మొత్తం ఖాళీ అయ్యేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. -
మనకు ఎల్ ని‘నో’!
సాక్షి స్పెషల్ డెస్క్ : పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ‘సూపర్ ఎల్ నినో’పరిస్థితులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనా లు బలహీనపడి, వర్షాలు తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం ఆ ముప్పు తప్పే అవకాశం ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఒక అరుదైన వాతావరణ పరిస్థితి మనల్ని కాపాడనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్’ (పాజిటివ్ ఐఓడీ) లేదా ‘ఇండియన్ నినో’అని పిలుస్తున్నారు. ఏమిటీ పాజిటివ్ ఐఓడీ?: హిందూ మహాసముద్రం తూర్పు, పశ్చిమ భాగాల మధ్య ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పునే ‘ఐఓడీ’అంటారు. ఈ పరిస్థితులో పశ్చిమ భాగం (భారత్/ఆఫ్రికా వైపు) సముద్రపు నీరు సాధారణం కంటే బాగా వేడెక్కుతుంది. దీనివల్ల భారీగా తేమతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. తూర్పు భాగం (ఇండోనేసియా వైపు)లో నీరు సాధారణం కంటే చల్లబడుతుంది. పసిఫిక్లోని ఎల్ నినో మన దేశానికి వచ్చే రుతుపవన గాలులను వెనక్కి లాగేస్తుంటే.. హిందూ మహాసముద్రంలోని ‘ఇండియన్ నినో’ఆ గాలులను అంతే బలంగా మన దేశం వైపు నెడుతుంది. ఫలితంగా ఎల్ నినో తెచ్చే పొడి గాలులు తటస్థంగా మారి, దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1997 నాటి వాతావరణ అద్భుతం!: ఇలాంటి పరిస్థితి 1997లోనూ చోటు చేసుకుంది. ఆ ఏడాది.. శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్ నినో రావడంతో భారత్లో తీవ్ర కరువు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ సరిగ్గా అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ‘పాజిటివ్ ఐఓడీ’... ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ ఏడాది కరువు రాకపోగా.. దేశంలో సాధారణం కంటే 2 శాతం ఎక్కువే వర్షాలు కురిశాయి. వాస్తవానికి ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ దేశంలో కరువు రావాలనేమీ లేదు. అయితే ఈ ఏడాది మనకు ‘ఇండియన్ నినో’రక్షణగా నిలవబోతున్నదన్న అంచనాలు, భారతీయ రైతాంగానికి, సాధారణ ప్రజలకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. -
ఆ సినిమాను ఇంత లేట్గా చూడడం నా తప్పే!
మూడున్నర గంటల నిడివి.. బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే ఓ ఊరి కథ. యాక్షన్ మాస్ మసాలా ఐటెం సాంగుల్లాంటి హంగులేమీ లేవు. పైగా సస్పెన్స్ థ్రిల్లరో, హారర్ జానరో కూడా కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత చాలామంది “అబ్బో” అంటూ ఆ సినిమాను పక్కన పెట్టేయడం సహజమే. కానీ ఒక్కసారి చూడడం మొదలుపెట్టాక ప్రతి సన్నివేశం మనల్ని లోపలికి లాగేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతుంది. మధ్యలో ఆపేయాలన్న ఆలోచనే రానీయకుండా చివరి వరకు కూర్చోబెడుతుంది. 1893లోని చంపానేర్ గ్రామం, వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు, బ్రిటిష్ అధికారుల అహంకారం.. ఇవన్నీ మొదటి నుంచే కథలోకి లాగేస్తాయి. ఘనన్ ఘనన్ పాట వినిపించిన క్షణం నుంచి ప్రేక్షకుడు కూడా ఆ గ్రామస్థులతో కలిసి ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురుచూస్తాడు. రాధా కైసే నా జలే, ఓ పాలన్ హారే వంటి పాటలు కథను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా పాత్రల భావోద్వేగాలను మనసుకు హత్తుకునేలా చేస్తాయి.క్రికెట్ చుట్టూ తిరిగే స్క్రీన్ప్లే.. లగాన్ సినిమా గొప్పతనం కేవలం క్రికెట్లో లేదు. కులవివక్ష, మత సామరస్యం, ఐక్యత, ఆత్మగౌరవం వంటి అంశాలను ఎంతో సహజంగా కథలో కలిపేసింది. ముఖ్యంగా దళితుడైన కచ్రాను జట్టులో చేర్చే సన్నివేశం ఇప్పటికీ గుండెను తాకుతుంది. కాలం మారినా.. సమాజంలోని కొన్ని వాస్తవాలు మాత్రం మారలేదనే ఆలోచన కలిగిస్తుంది.క్రికెట్ మ్యాచ్కు ముందు గ్రామస్తులు ప్రాక్టీస్ చేసే సన్నివేశాలు నవ్విస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మొదట ఒకరిపై ఒకరికి అనుమానాలు ఉన్న వాళ్లు.. చివరకు ఒక లక్ష్యం కోసం ఒక్కటిగా నిలబడటం ప్రేక్షకుడిలోనూ ఓ అనుబంధాన్ని కలిగిస్తుంది. మ్యాచ్ మొదలయ్యాక ప్రతి బంతి ఉత్కంఠను పెంచుతుంది. ప్రతి వికెట్తో గుండె వేగం పెరుగుతుంది. చివరి ఓవర్లలో ప్రేక్షకుడు కూడా చంపానేర్ జట్టులో భాగమైనట్టే ఫీలవుతాడు.వర్షం కురిసే క్లైమాక్స్ కేవలం ఒక విజయానికి గుర్తు కాదు. అవమానాన్ని, ఆకలిని, అన్యాయాన్ని ఎదుర్కొన్న ప్రజల ఆశలకు దక్కిన ప్రతిఫలం. అందుకే లగాన్ దేశభక్తి సినిమా కంటే చాలా పెద్దది. అది మనుషుల గురించి, వారి కలల గురించి, కలిసి పోరాడితే అసాధ్యం కూడా సాధ్యమేనని చెప్పే కథ.ఓ కల నుంచి ఆస్కార్ దాకా!దర్శకుడు అశుతోష్ గోవారికర్ Ashutosh Gowariker మనసులో పుట్టిన ఓ విభిన్న ఆలోచనే ఈ చిత్రానికి బీజం. బ్రిటిష్ పాలనలో ఉన్న ఓ గ్రామం.. కరువు, పన్నుల భారం, ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా క్రికెట్ మ్యాచ్ ద్వారా పోరాడే రైతులు.. ఈ కథను మొదట వినగానే చాలామంది నిర్మాతలు రిస్క్గా భావించారు. పీరియడ్ డ్రామా, గ్రామీణ నేపథ్యం, క్రికెట్, మూడున్నర గంటల నిడివి.. ఇవన్నీ కలిసి కమర్షియల్గా పనిచేయవని అనుకున్నారు.అలాంటి సమయంలో హీరో అమీర్ ఖాన్ Aamir Khan కథపై నమ్మకం ఉంచారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ముందుకొచ్చి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాను నిర్మించారు. భువన్ పాత్రను అమీర్ పోషించగా, గౌరి పాత్రకు గ్రేసీ సింగ్ను తీసుకున్నారు. చంపానేర్కు సాయం చేసే బ్రిటిష్ యువతి ఎలిజబెత్ పాత్రలో రాచెల్ షెల్లీ నటించారు. గ్రామస్థుల పాత్రల కోసం దేశవ్యాప్తంగా ఆడిషన్లు నిర్వహించి నటులను ఎంపిక చేశారు.రఘుబీర్ యాదవ్ (భూరా), ఆదిత్య లఖియా (కచ్రా), యశ్పాల్ శర్మ (లఖా), అఖిలేంద్ర మిశ్రా (అర్జున్), దయాశంకర్ పాండే (గోలి), రాజ్ జుత్షి (ఇస్మాయిల్), ప్రదీప్ రావత్ (దేవా సింగ్ సోధి), అమీన్ హాజీ (బఘా), రాజేష్ వివేక్ (గురన్) గా వీరు అందరూ కలిసి చంపానేర్ గ్రామ జట్టుకు ప్రాణం పోశారు. లగాన్ సమయంలో మాత్రం వీరిలో చాలామంది మధ్యస్థాయి లేదా కొత్త నటులే. అందుకే ఆ ఊరు నిజంగా మన కళ్ల ముందున్నట్టుగా అనిపించింది. ఇదే సినిమా సహజత్వానికి పెద్ద కారణంగా చెప్పొచ్చు.చిత్రీకరణ ప్రధానంగా గుజరాత్లోని భుజ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. మండే ఎండల్లో నెలల తరబడి షూటింగ్ సాగింది. గ్రామం మొత్తం ప్రత్యేకంగా నిర్మించారు. సినిమాలో కనిపించే క్రికెట్ మ్యాచ్ కోసం నటులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు సినిమాకు ప్రాణంగా నిలిచాయి.. ఇప్పటికీ అవి చిరస్మరణీయంగా నిలిచాయి.2001 జూన్ 15న విడుదలైంది లగాన్. మొదట్లో ఒక ప్రయోగాత్మక చిత్రంలా కనిపించినా.. కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందింది. బ్రిటిష్ పాలన, కుల వివక్ష, మత సామరస్యం, గ్రామీణ ఐక్యత వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయంతో లగాన్ అంతర్జాతీయ వేదికల దృష్టిని ఆకర్షించింది. 2002లో జరిగిన 74వ అకాడమీ అవార్డ్స్లో (ఆస్కార్) ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్ పొందింది. ఆస్కార్కు నామినేట్ అయిన మూడో భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చివరకు అవార్డు దక్కకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్కార్ వేదికపై లగాన్ పేరు వినిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా గర్వకారణంగా మారింది.లగాన్.. కేవలం క్రికెట్ కథ కాదు.. ఆత్మగౌరవం కోసం మట్టిమనుషులు చేసిన పోరాటం. సినిమా వచ్చి పాతికేళ్లు అవుతున్నా.. ఆ సినిమాలోని మేజిక్ తగ్గలేదు. మూడు గంటలకుపైగా నిడివి ఉన్నా.. నేటి రీల్ జనరేషన్ను కూడా స్క్రీన్కు అతుక్కుపోయేలా చేస్తోందా కథాకథనం. భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఈ చిత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉండటానికి అదే కారణం కూడా. అందుకే లగాన్ ఒక సినిమా కాదు.. తరాలు మారినా నిలిచే క్లాసిక్. (భాషతో అక్కర్లేదు అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది):::ఓ సినీ ప్రేమికుడు -
‘చిట్టీ’కి పాఠాలతో పాకెట్మనీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ), రొబోటిక్స్ రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కొత్త తరహా ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తోంది. రోజువారీ ఇంటి పనులనే వీడియో తీసి రోబోలకు అర్థమయ్యేలా వివరించే ‘రోబో ట్రైనర్’, ‘ఏఐ డేటా యాక్టర్’ పేరుతో నగరంలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. ఇంటి పనులన్నీ చకచకారోబోలు, హ్యూమనాయిడ్ యంత్రాలు మనుషుల పనితీరును నేర్చుకోవడానికి ప్రత్యేక వీడియో డేటా అవసరం. ఇందుకోసం టెక్ కంపెనీలు సాధారణ వ్యక్తులతో వివిధ పనులను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్నాయి. ఏఐ రోబోలకు ఇంటి పనులు నేర్పేందుకు టెక్ కంపెనీలు ‘హ్యూమన్ యాక్షన్ డేటా’ సేకరిస్తున్నాయి. బట్టలు ఉతకడం మొదలు డోర్ తెరవడం, కాఫీ కలపడం, వంటావార్పు వరకు ఈ రోబోలు ఇట్టే చక్కబెడుతున్నాయి.ఈ పనులన్నింటినీ వాటి ఒంటబట్టించేందుకు ఏఐ సాంకేతికతకు పదునుపెడుతున్నారు. ఇంట్లో చేసే పనులను ఫోన్ కెమెరాలతో షూట్ చేసి ఆ వీడియోలను ఏఐ మోడల్స్కు ఫీడ్ చేస్తారు. ఇలా పనులను ఏఐ మోడ్లో షూట్ చేసే పార్ట్టైమ్ ఉద్యోగాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇలా షూట్ చేస్తే గంటకు రూ. 250 వరకు చెల్లిస్తున్నారు. రోజుకు 4 గంటలు పనిచేస్తే నెలకు రూ. 25 వేల వరకు ఆదాయం వస్తోంది.భవిష్యత్తులో ఇంటి పనులు, పరిశ్రమల కార్యకలాపాలు, సేవారంగంలో రోబోలు మరింత సమర్థంగా పనిచేయడానికి ఈ డేటా ఉపయోగపడనుంది. ఇందుకోసం టెస్లా ఆప్టిమస్, ఫిగర్ ఏఐ, గూగుల్ డీప్మైండ్ రోబో ప్రాజెక్టుల కోసం హైదరాబాద్కు చెందిన డేటామోర్ఫ్, ఇన్స్ట్రక్ట్ ల్యాబ్, రోబో–ఎక్స్ఏఐ వంటి డేటా సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీలో ఆయా సంస్థలకు ప్రత్యేక స్టూడియోలు ఉన్నాయి. ఇంటర్ పాసైన వారికి సైతం అవకాశం కల్పిస్తున్నాయి.ఎక్కువ శ్రమ లేదు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా. కాలేజీ అయ్యాక స్టూడియోకి వెళ్తా. నిన్న అన్నం వార్చడం, ఈ రోజు బెడ్షీట్ మార్చడం షూట్ చేశారు. గంటకురూ. 230 ఇచ్చారు. ఈ పార్ట్టైం జాబ్తో నెలవారీ పాకెట్ మనీ సంపాదించుకుంటున్నా. – శ్రావణి, కూకట్పల్లి -
అంటార్కిటికా కింద 30 బేసిన్లు
అంటార్కిటికా ఖండం అంటేనే మంచుఖండం. సదరన్ (అంటార్కిటిక్) ఓషన్ మీద విస్తరించిన ఈ మంచుఖండం కింద భూభాగం ఉంది. జెనోవా విశ్వవిద్యాలయానికి చెందిన భూ బౌతిక శాస్త్రవేత్త ఎగిడియో అర్మాడిల్లో నేతృత్వంలోని బృందం పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం దాదాపు 30 బేసిన్లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న భూభాగాన్ని గుర్తించింది. పరిశోధకులు దీనిని ఈస్ట్ అంటార్కిటికా ఫ్యాన్ ఆకార బేసిన్ ప్రావిన్స్గా నామకరణం చేశారు.మహాఖండం ఖండాలు కాకముందే..గోండ్వానాలాండ్ అనేది దక్షిణార్థగోళంలో విస్తరించిన ప్రాచీన మహాఖండం. ఇది 1,800 కోట్ల ఏళ్ల కిందట విడిపోవడం మొదలై క్రమంగా ఖండాలుగా మారింది. ఇప్పుడు బయటపడిన భూభాగం గోండ్వానా విడిపోవడానికి ముందే ఏర్పడి ఉంటుందని.. అంటార్కిటికా, ఆ్రస్టేలియా వేరుపడడానికి బహుశా ఈ భూభాగమే కారణం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగిడియో అర్మాడిల్లో బృందం పరిశోధన మొదలు పెట్టింది ఈ భూభాగాన్ని అన్వేíÙంచడానికి కాదు.ఇలాంటి ఒక భూభాగం ఉందని వారికి తెలియదు. అంటార్కిటికా మంచుఖండం మీద 27 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల మేర మంచు ఉంది. ఆ మంచుపొరను తొలగిస్తే తూర్పు అంటార్కిటికా ఎలా ఉంటుందోననే తలంపుతో పరిశోధించారు. రాడార్ చిత్రాలు మంచు కింద కూరుకుపోయి ఉన్న ఈ భూభాగాన్ని చూపించాయి. అందులో 2 వేల కిలోమీటర్ల పొడవున్న తీరప్రాంతం వెంబడి విసనకర్ర ఆకారంలో శిలలు, శిఖరాలు వ్యాపించి ఉన్నాయి.మంచు కరిగితే నేల పైకి లేస్తుంది!ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మంచు తన కింద ఉన్న భూభాగాన్ని కిందకు అదుముతోంది. ఒకవేళ ఆ మంచు కరిగిపోతే కింద ఉన్న నేల ఒక కిలోమీటర్ మేర పైకి లేస్తుంది. రాడార్, గురుత్వాకర్షణ, భూకంపనాల తీవ్రత, అయస్కాంత డేటాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసిన పరిశోధకులు ఈ అవగాహనకు వచ్చారు. అంటార్కిటికా మంచుఖండం ఇప్పటికీ మనుషులు ఛేదించలేనంత జటిలమైనదిగానే ఉంది. కానీ పరిశోధకుల పరిశోధనల్లో క్రమక్రమంగా ఒక్కొక్క రహస్యం బయటపడుతోంది. -
మందుల్లేకుండా కేన్సర్ చికిత్స!
మందుల్లేకుండా కేన్సర్ను నయం చేస్తానని ఎవరైనా చెప్పారనుకోండి.. అస్సలు నమ్మబుద్ధి కాదు. అయితే ఇప్పటికిప్పుడు కాదు కానీ.. భవిష్యత్తులో ఈ అద్భుతం సాధ్యమే అంటోంది టెక్నియాన్ విశ్వవిద్యాలయం. ఇజ్రాయెల్లోని ఈ సంస్థ ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిచ్చాయి. నానో స్థాయి గుళికలతో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కఠినమైన ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదల మందగించినట్లు స్పష్టమైంది. కేన్సర్ బారిన పడితే మరణం తథ్యమన్న కాలం ఎప్పుడో పోయింది. కానీ.. పూర్తిస్థాయి చికిత్స కూడా ఇప్పటివరకూ అందుబాటులో లేదు. కీమోథెరపీ, శస్త్రచికిత్స, రేడియేషన్ వంటి సంప్రదాయ పద్ధతులతో మనిషి జీవితకాలాన్ని గణనీయంగా పెంచుకునే వీలైతే ఉంది. కానీ.. వీటితో దు్రష్పభావాలు చాలా ఎక్కువ. టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయగల సామర్థ్యమున్నవి. అత్యాధునిక నానో కణాలను తయారు చేసిన వీరు చుక్క మందు కూడా ఇవ్వకుండానే ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ కణితి పెరుగుదలను నిలిపివేయగలిగారు. ఇదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే కేన్సర్ కణాలు మన రోగ నిరోధక వ్యవస్థను ఏమార్చేందుకు వేసే ఎత్తుల గురించి అర్థం చేసుకోవాలి. శరీరంలోకి చేరే హానికారక సూక్ష్మజీవులతోపాటు అదుపు తప్పిన కణాలను కూడా ఏరి వేసేందుకు రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని రకాల కణాలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. వీటిని టీ–సెల్స్ అంటారు. కేన్సర్ కణాలు రోగ నిరోధక వ్యవస్థ కళ్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తూంటుంది. ఇందులో భాగంగా కొన్ని రకాల తెల్ల రక్త కణాలను హైజాక్ చేసి కణితి పెరిగేందుకు ఉపయోగించుకుంటాయి. అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కణాలను గుర్తించకుండా చేస్తుంటాయి. టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ హైజాకింగ్ను లక్ష్యంగా చేసుకుని తమ చికిత్స పద్ధతిని అభివృద్ధి చేశారు. కణితి చుట్టూ రక్షణ కవచంగా... టెక్నియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తయారు చేసిన నానో కణాలను ఎంపీసోమ్స్ అని పిలుస్తున్నారు. కణితిని అతుక్కునేందుకు ఇవి కేన్సర్ కణాలు హైజాక్ చేసిన తెల్ల రక్త కణాలతో పోటీపడతాయి. తద్వారా కణితికి ఒక రక్షణ కవచంగా ఏర్పడి అది మరింత పెరగకుండా నిరోధిస్తాయి. కేన్సర్ కణాలపై, ప్రీ క్లినికల్ మౌస్ మోడళ్లలోనూ ఈ నానో కణాలను వాడినప్పుడు అవి కణితి చుట్టూ అసాధారణ స్థాయిలో గుమికూడినట్లు, పెరుగుదలను నిరోధించినట్లు స్పష్టమైంది. ఈ ఎంపీసోమ్స్ను సులువుగా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. నిమిషానికి 20 మిల్లీలీటర్ల నానో కణాలను అంటే గంటకు సుమారు 1.2 లీటర్లు తయారు చేయగలమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఓఫ్రీ విజెన్బ్లిట్ తెలిపారు. పైగా వీటి తయారీకి వాడిన పదార్థాలు సురక్షితమైనవని ఎఫ్డీఏ సైతం ‘జనరలీ రికగ్నైజ్డ్ యాస్ సేఫ్’గా గుర్తించినవి కావడం గమనార్హం. ట్రిపుల్ నెగటివ్ రొమ్ము కేన్సర్ సంప్రదాయ చికత్స పద్ధతులకు సులువుగా లొంగదని, ఎంపీసోమ్స్తో తాము కణితి పెరుగుదలను నిరోధించడం కేన్సర్ చికిత్సలో చాలా పెద్ద మార్పు అని చెప్పారు. పరిశోధన ఫలితాలు ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుట్టింటి గుట్టు అమ్మకు ఎరుక..
ఇంటికెళ్లే దారిని ఎవరైనా మర్చిపోతారా? ఈ పక్షులు మరిచిపోయాయి. అందుకే వాటి పుట్టింటికి వెళ్లే దారిని వాటికి గుర్తు చేసే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఈ ఫొటోలో వాళ్లు చేస్తున్నది అదే..’నార్తర్న్ బాల్డ్ ఐబిస్’ అనే ఈ అరుదైన పక్షులు మధ్య ఐరోపాలో 400 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. దీంతో రెండు దశాబ్దాలు కష్టపడి.. జర్మనీ, ఆస్ట్రియాల్లోని సంరక్షణ శాలల్లో వీటిని పెంచారు. పెంచడం అయితే పెంచారు గానీ.. కాలానుగుణంగా ఇవి వలస వెళ్లి.. తిరిగి పుట్టింటికి తిరిగి రావడం ఎలా? ఎందుకంటే.. ఇవి ఎప్పుడూ వలస వెళ్లలేదు కదా.. దీంతో శాస్త్రవేత్తలే స్వయంగా రంగంలోకి దిగారు. ఆకాశంలో వాటికి ‘మార్గ’దర్శకులుగా మారారు. సాధారణంగా పక్షి పిల్లలు గుడ్డు నుంచి బయటకు రాగానే మొదట చూసే మనుషులను తమ తల్లిగా భావిస్తాయి. దీనిని ఇంప్రింటింగ్ అంటారు. ఇందుకోసం ఆస్ట్రియాకు చెందిన హెలెనా వెహ్నర్, జోహన్నెస్ ఫ్రిట్జ్ అనే ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు ఆ పక్షులకు పెంపుడు తల్లులుగా మారారు. వాటిని ప్రేమగా పెంచి, తమను అనుసరించేలా శిక్షణ ఇచ్చారు. పక్షులు ఎగిరే వయసుకు రాగానే ఫ్రిట్జ్ ఒక చిన్న ’అల్ట్రాలైట్ ఎయిర్క్రాఫ్ట్’ (పారాగ్లైడర్ లాంటి చిన్న విమానం)లో పైలట్గా మారగా, హెలెనా వెనుక సీట్లో కూర్చుని పక్షులను పిలిచారు. అంతే.. వారిని చూసి.. పక్షులు ఆ విమానాన్ని అనుసరిస్తూ ఎగరడం ప్రారంభించాయి. ఇలా జర్మనీ, ఆస్ట్రియా నుంచి స్పెయిన్ వరకు దాదాపు 2,600 కిలోమీటర్ల మేర సాగిన ఈ వినూత్న ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. తమ ప్రయత్నంతో వాటికి సురక్షితమైన వలస మార్గం తెలిసిందని.. వచ్చే ఏడాది ఇవి ఎవరి సహాయం లేకుండానే సొంతంగా తిరిగి రాగలవని.. అంతేకాకుండా తమ పిల్లలకు కూడా ఈ మార్గాన్ని నేర్పుతాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ జోహన్నెస్ ఫ్రిట్జ్ సంతోషం వ్యక్తం చేశారు. 2024లో ఫొటోగ్రాఫర్ గున్నార్ హార్ట్మాన్ ఈ అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించగా, ఈ ఫొటోకు ‘నేచర్ 2026 సైంటిస్ట్ అట్ వర్క్’ ఫొటోగ్రఫీ పోటీలో మొదటి బహుమతి కూడా లభించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఈగ.. యముడి మెరుపు తీగ!
ఒక అడవి జాతి ప్రాణాంతక మాంసాహార ఈగ అమెరికాను వణికిస్తోంది. దీంతో అత్యవసర పరిస్థితులు, ఎగుమతులపై నిషేధాలు విధించారు. క్వారంటైన్ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సాధారణ ఈగ గుడ్ల నుంచి పుట్టే తెల్లని పురుగులు(మ్యాగట్స్/లార్వాలు) చనిపోయిన కణజాలాలను తింటే ఈ ఈగ లార్వాలు సజీవ మాంసాన్నే తింటున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ లార్వా పేరు ‘న్యూ వరల్డ్ స్రూ్కవార్మ్’(ఎన్డబ్ల్యూఎస్). ఇది సోకితే పశువులు, పందులు, మేకలు, పెంపుడు జంతువులే కాకుండా మనుషులకు కూడా ముప్పే.టెక్సాస్లో ఎమర్జెన్సీకొద్దిరోజుల క్రితం టెక్సాస్లోని పశువులు, మేకలతోపాటు న్యూమెక్సికోలోని ఒక పెంపుడు కుక్కలో స్రూ్కవార్మ్ కేసులను గుర్తించినట్లు అధికారులు నిర్ధారించారు. టెక్సాస్ వ్యవసాయ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్లో పశువులు, గుర్రాల దిగుమతిని కెనడా నిషేధించింది. అంతకుముందు మెక్సికోలో ఈ కేసులు రావడంతో అమెరికా కూడా మెక్సికో నుంచి పశువుల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది.మాంసాన్ని కొరికి తింటాయి గాయాలు, తెగిన గాట్లు, పేలు కుట్టిన చిన్న రంధ్రాలు లేదా చర్మం తెరుచుకున్న భాగాలపై ఆడ ఈగ వందల గుడ్లు పెడుతుంది. కొన్ని గంటల్లోనే ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు బయటకు వచ్చి, బతికున్న జీవుల ఆరోగ్యకర మాంసాన్ని కొరికి తింటాయి. సకాలంలో చికిత్స అందించకపోతే.. తీవ్ర గాయాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల జంతువులు 7 నుంచి 14 రోజుల్లో చనిపోతాయి. కొత్తదేమీ కాదు.. అమెరికాకు స్క్రూవార్మ్ కొత్తదేమీ కాదు. అయితే దశాబ్దాల క్రితమే అమెరికా, మెక్సికోలు మాంసాన్ని తినే ఈ ఈగ జాతిని నిర్మూలించాయి. ఉత్తర అమెరికా సరిహద్దుల్లోకి ఇటీవల తిరిగి ప్రవేశించిన ఈ ప్రమాదకర పరాన్నజీవి.. పశుసంవర్థక రంగానికి పెనుముప్పుగా మారింది. గతంలో స్టెరైల్ ఇన్సెక్ట్ కెక్నిక్ ద్వారా అమెరికాలో దీన్ని నిర్మూలించారు. ఇందులో భాగంగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన మిలియన్ల కొద్దీ సంతానోత్పత్తి చేయలేని మగ ఈగలను ప్రకృతిలోకి వదిలారు. తద్వారా వాటి సంతానోత్పత్తి ఆగిపోయింది. అయితే తూర్పు పనామాలోని డారియన్ గ్యాప్ బయోలాజికల్ బారియర్ క్వారంటైన్ జోన్ నుంచి ఈ ఈగలు తప్పించుకొని మధ్య అమెరికా మీదుగా ఉత్తర దిశగా వ్యాపించడంతో ఇప్పుడు మళ్లీ ఈ ముప్పు వచ్చింది. దీంతో టెక్సాస్లో కొత్తగా భారీ స్థాయిలో స్టెరైల్ ఫ్లై ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మనుషులకు సోకిన కొన్ని కేసుల్లో శస్త్రచికిత్స ద్వారా పురుగులను తీసేసి యాంటీ పారాసిటిక్ మందులతో నయం చేశారు. -
పాక్ జిమ్మిక్కు.. పీవోకే రిమోట్ అక్కడే!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించి.. చాలామందికి ఓ సందేహం రావొచ్చు. పాకిస్థాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతమే అయితే అక్కడ ప్రత్యేకంగా ప్రధాని, రాష్ట్రపతి, శాసనసభ, రాజ్యాంగం, జెండా ఎందుకు ఉన్నాయి? పీవోకే నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమా? కాదా?.. ఇటీవల పీవోకేలో చెలరేగిన ఆందోళనలు, పాకిస్థాన్ ప్రభుత్వ అణచివేత చర్యల నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.పాకిస్థాన్ అధికారికంగా పీవోకేను "ఆజాద్ జమ్మూ అండ్ కశ్మీర్"గా పిలుస్తుంది. పేరు వింటే అది స్వతంత్రమో.. స్వయం ప్రతిపత్తితో నడిచే ప్రాంతంలా అనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక శాసనసభ ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, న్యాయవ్యవస్థ, మంత్రివర్గం, జెండా, తాత్కాలిక రాజ్యాంగం కూడా ఉన్నాయి. పైకి చూస్తే ఒక ప్రత్యేక రాజకీయ వ్యవస్థ ఉన్న ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.ఈ వ్యవస్థ వెనుక ఉన్న కథ 1947 విభజన కాలానికి వెళ్తుంది. జమ్మూ కశ్మీర్ సంస్థానం భారత్లో విలీనం కావడంతో మొదటి భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్థాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్లో అధికారిక ప్రావిన్స్గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కశ్మీర్పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఒకవైపు కశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే, మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది.దీంట్లో భాగంగానే 1949 కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్థాన్ తన చేతుల్లోకి తీసుకుంది. అనంతరం 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్రపతి, ప్రధాని, శాసనసభ, న్యాయవ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీవోకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రాజ్యాంగం ప్రకారం పీవోకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా.. ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. కానీ అలా ఏనాడూ జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్థాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీవోకే పరిపాలనలో కూడా పాకిస్థాన్ నుంచి పంపిన అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.అంతేకాదు, పీవోకేలో రాజకీయ వ్యవస్థపై పాకిస్థాన్ ప్రభావం ఎంత బలంగా ఉందో అక్కడి ఎన్నికల విధానం కూడా చూపిస్తుంది. శాసనసభలో కొన్ని స్థానాలు పీవోకేలో నివసించే ప్రజల కోసం కాకుండా, పాకిస్థాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.మరో వివాదాస్పద అంశం విధేయత ప్రమాణం. పీవోకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్ పాకిస్థాన్లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు అక్కడ అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. అలా.. ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ సృష్టించిన నామ మాత్రపు రాజకీయ వ్యవస్థేనని స్పష్టమవుతోంది. ఇక భారత్ మాత్రం పీవోకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీవోకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటోంది. అందుకే పీవోకేకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు, జెండా వంటి వ్యవస్థలు ఉన్నాయనే కారణంతో అది స్వతంత్ర ప్రాంతమో, ప్రత్యేక దేశమో అయిపోదని భారత్ వాదిస్తోంది. దశాబ్దాలుగా ‘ఆజాద్ కశ్మీర్’ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవానికి పీవోకే రాజకీయ, పరిపాలనా, భద్రతా వ్యవస్థలన్నీ ఇస్లామాబాద్ నియంత్రణలోనే కొనసాగుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే పీవోకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే.. పనిచేసేది మాత్రం పాకిస్థాన్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థేనని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మసి పొరలుతొలగిస్తే.. మరపురాని చిత్రాలు
ఇది వందల ఏళ్ల క్రితం దేవాలయం పైకప్పు మీద చిత్రించిన పురాణగాథను ప్రతిబింబించే ఓ వర్ణచిత్రం. కానీ, సమీపంలో భారీ దీపాలు, కాగడాలు వెలిగిస్తుండటంతో వాటిమీద మసి పొరలు కమ్మి అద్భుత, అపురూప చిత్రాలు కనుమరుగయ్యాయి. తాజాగా ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా పైకప్పు మసి పొరలు తొలగించటంతో అవి వెలుగుచూశాయి. కెమికల్ ట్రీట్మెంట్ చేయిస్తే అవి స్పష్టంగా కనిపించనున్నాయి. ఇది కొలనుపాక సోమేశ్వరాలయంలో చోటుచేసుకున్న ఘటన. –సాక్షి, హైదరాబాద్రాష్ట్రంలో కాకతీయులు, వారికి పూర్వం నిర్మించిన ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిల్లో కూడా ఇలాంటి అద్భుత వర్ణచిత్రాలుంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని కాకతీయ త్రికూటాలయంలో శైవ, వైష్ణవ పురాణ గాథల్లోని చిత్రాలు ఇలాగే అనూహ్యంగా వెలుగుచూశాయి. అంతరించిన ఈ ఆలయ చిత్రకళా వైభవాన్ని మళ్లీ ప్రజల ముందుంచాలంటే దేవాలయాల్లో వాటిని గుర్తించాల్సి ఉంది. పిల్లలమర్రి దేవాలయంలో కెమికల్ ట్రీట్మెంట్తో వాటిని కాపాడిన రాష్ట్ర వారసత్వ శాఖ సిద్ధంగా ఉన్నా, అందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు. ఏంటీ చిత్రాలు... : అంతగా అక్షరాస్యత లేని కాలంలో పురాణ గాథలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆలయాల్లో ఇలా చిత్రాలు గీసి చూపటం కూడా ఓ పద్ధతి. పురాతన దేవాలయాలు కేవలం శిల్పకళా నిలయాలు మాత్రమే కాదు, అవి అద్భుత చిత్రకళా వేదికలు కూడా. నాటి రాజులు, శిల్పులు దేవాలయాల పైకప్పులను, రాతి దూలాలను కాన్వాసుగా మార్చేశారు. వాటిపై పురాణగాథలను, రాచరిక వైభవాలను రంగురంగుల చిత్రాలుగా ప్రాణప్రతిష్ట చేశారు. ఈ చిత్రకళా సంప్రదాయం శాతవాహనుల కాలంలోనే మొదలైంది. కాకతీయుల కాలంలో మరింతగా విస్తరించి, విజయనగర సామ్రాజ్య కాలంలో అద్భుతంగా వరి్ధల్లింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ఇందుకు సజీవ సాక్ష్యం. ఇక్కడి పైకప్పులపై గీసిన చిత్రాలు ఆసియాలోనే అతిపెద్ద గోడచిత్రాలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఈ చిత్రాలు వందల ఏళ్లపాటు మనగలిగేలా నాటి చిత్రకారులు పూర్తిగా సహజసిద్ధ రంగులను మాత్రమే వాడేవారు. చిత్రించేచోట ముందుగా సున్నం, జనపనార, బెల్లం నీరు, కరక్కాయల మిశ్రమం పూసేవారు. ఆ పూత తడిగా ఉన్నప్పుడే రంగులు వేసేవారు. దీనివల్ల రంగు రాతి పొరల్లోకి ఇంకిపోయి శతాబ్దాలైనా చెరిగిపోకుండా ఉంటుంది. ఆసక్తి చూపని సర్కారుఇక మరమ్మతులు, ఆధునీకరణ పేరుతో పురాతన దేవాలయాల గోడలు, పైకప్పులపై సున్నపు పూతలతో చాలా దేవాలయాల్లోని చిత్రాలు కనిపించకుండాపోయాయి. ప్రస్తుతం అత్యాధునిక కెమికల్ వాషింగ్ పద్ధతుల ద్వారా కొన్ని ఆలయాల్లో పైకప్పులపై దశాబ్దాలుగా ఉన్న సున్నపు పొరలను జాగ్రత్తగా తొలగిస్తూ, లోపల దాగున్న అసలైన పురాతన చిత్రాలను వెలుగులోకి తెచ్చే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఆసక్తి చూపకపోవటంతో తెలంగాణలో ఆ ప్రక్రియ జరగటం లేదు. వర్ణచిత్రాలున్నాయి...ఇప్పటికీ చాలా దేవాలయాల్లో అతి పురాతన వర్ణచిత్రాలున్నాయని తాజాగా కొలనుపాక దేవాలయం చాటిచెప్తోంది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మసి పొరలు తొలగించగా అస్పష్టంగా చిత్రాలు కనిపించాయి. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిరిపురం నరేందర్ తొలుత గుర్తించగా, తాజాగా ఆ బృంద సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు ఈ చిత్రాలను పరిశీలించి విశ్లేషించారు. పురాణగాథ చిత్రాల్లో విశ్వబ్రహ్మను, ‘శరభ’, సంగరోలు’లాంటి తెలుగు లిపి పదాలు కనిపించాయని వారు చెప్పారు. ఇవి కాకతీయ కాలం తదనంతర చిత్రాలై ఉండొచ్చన్నారు. -
తేనెటీగలు,రొయ్యలకూ 'వ్యాక్సిన్లు'!
సాక్షి స్పెషల్ డెస్క్: మానవులు, పశువులు, పక్షుల లాగే ఇప్పుడు తేనెటీగలు, రొయ్యలకు కూడా ప్రత్యేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లో బయోటెక్నాలజీ రంగంలో ఈ దిశగా జరిగిన పరిశోధనలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి. తేనెటీగలు ‘అమెరికన్ ఫౌల్ బ్రూడ్’ను తట్టుకునేలా.. తేనెటీగలు, రొయ్యలకు ఇంజెక్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, శాస్త్రవేత్తలు ’మెటర్నల్ ఇమ్యూన్ ప్రైమింగ్’అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తేనెటీగల కోసం మృత బ్యాక్టీరియాతో తయారు చేసిన వ్యాక్సిన్ను చక్కెర పాకంతో కలిపి రాణి ఈగకు ఆహారంగా ఇస్తారు. రాణి ఈగ శరీరంలోని రోగనిరోధక కణాలు ఈ మందును అండాలకు అందిస్తాయి. దీనివల్ల పుట్టబోయే పిల్ల ఈగలకు పుట్టుకతోనే ‘అమెరికన్ ఫౌల్ బ్రూడ్’అనే వ్యాధిని తట్టుకునే శక్తి లభిస్తుంది. రొయ్యలకు ’వైట్ స్పాట్ వైరస్’సోకకుండా.. హేచరీలోని తల్లి రొయ్యలకు వ్యాక్సిన్ను ప్రత్యేక గుళికల రూపంలో మేతగా ఇస్తారు. వ్యాక్సిన్ ద్వారా చేకూరే వ్యాధి నిరోధక శక్తి గుడ్లకు తద్వారా పిల్ల రొయ్యలకు అందుతుంది. ఫలితంగా అవి ’వైట్ స్పాట్ వైరస్’బారిన పడకుండా పెరుగుతాయి. ఇదిలా ఉంటే, ముంబైలోని ఐసీఏఆర్కు చెందిన కేంద్రీయ మత్స్య విద్యా సంస్థ (సీఐఎఫ్ఈ) శాస్త్రవేత్తలు రొయ్యల వైట్ స్పాట్ వైరస్ నివారణకు ఒక స్వదేశీ వ్యాక్సిన్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ట్నర్షిప్ మోడ్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చివరి దశ పరీక్షల్లో ఉంది. 2027 చివరి నాటికి మన ఆక్వా రైతులకు వ్యాక్సిన్ వేసిన రొయ్య పిల్లలు (సీడ్) అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రధాన ప్రయోజనాలుప్రపంచవ్యాప్తంగా పంటల పరాగ సంపర్కానికి తేనెటీగలు, ప్రొటీన్ ఆహారంగా రొయ్యలు చాలా కీలకం. ఈ వ్యాక్సిన్ల వల్ల రొయ్యలు, తేనెటీగలలో వ్యాధుల నివారణకు వాడే రసాయనాలు, యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది.పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలుజరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
డాక్టర్ రోబో.. ఫైవ్ ఇన్ వన్!
కాలం మారిపోతోంది. ఒకప్పుడు కత్తులతో శరీరాన్ని కోసి చేసిన శస్త్రచికిత్సలు ఇప్పుడు చిన్న కోతలతో పూర్తవుతున్నాయి. మెరుగైన ఫలితాలిస్తున్నాయి. రోగులకు ఆ చిన్న కోతల బాధ కూడా లేకుండా చేసేందుకు సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన రోబోను ఆవిష్కరించారు. శనగ గింజంత సైజుండే ఈ బుల్లి రోబో చేసే అద్భుతాలు అన్ని ఇన్నీ కావు.. పక్క ఫొటో చూశారా? అందులో శాస్త్రవేత్త చేతిలో కనిపిస్తున్న నల్లటి వస్తువే మన బుల్లి రోబో. దీని పొడవు 4.4 మిల్లీమీటర్లు. వైర్లూ, ఎల్రక్టానిక్స్, బ్యాటరీల్లాంటివి ఏవీ దీంట్లో ఉండవు. అయినప్పటికీ వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్సలు చేసేస్తుంది. కణజాలాన్ని కోయడంతోపాటు శరీరంలో అవసరమైన చోటికి మందులు తీసుకెళ్లి వదిలిపెడుతుంది. కణజాలం లోపలి నుంచి సులభంగా ప్రయాణించగలదు. కేన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి బయాప్సీ చేయాలనుకోండి.. ఈ రోబోను వదిలితే చాలు.. ఎంచక్కా కావాల్సిన కణజాలాన్ని కత్తిరించి పట్టుకొచ్చేస్తుంది. అవసరమైనప్పుడు శరీరం లోపల వేడి పుట్టించి కొన్ని రకాల చికిత్సలకు సాయంగా నిలుస్తుంది కూడా. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సెకన్ కాలంలో ఒక పని నుంచి ఇంకోరకమైన పనికి మారగలగడం దీని ప్రత్యేకత. అయస్కాంత శక్తి మహిమ వైర్లూ, బ్యాటరీల్లాంటివి లేకుండానే ఈ రోబో కేవలం అయస్కాంత శక్తితో పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో ఈ ‘మ్యాగ్నెటిక్ మెడికల్ రోబోటిక్స్’కు ప్రాచుర్యం పెరుగుతోంది. రోబో శరీరం లోపల ఉంటే బయటి నుంచి వైద్యులు అయస్కాంతాల సాయంతో వాటిని కదలిస్తారు. ఇతర పనులు చేయిస్తారన్నమాట. అతి తక్కువ గాట్లూ, కోతలతో శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు ఈ రకమైన రోబోలు బాగా ఉపయోగపడతాయని అంచనా. వీటితో సంప్రదాయ పద్ధతుల్లో చేరుకోలేని శరీరం లోపలి భాగాల్లోనూ సర్జరీలు చేయడం సులువు అవుతుంది. ఈ రకమైన రోబోలు ఇప్పటివరకూ ఏదో ఒక పని మాత్రమే చేయగలిగేవి. మందులు తీసుకెళ్లేందుకు ఒకటి.. కత్తిరించేందుకు ఒకటి ఇలా.. దేనికదే అన్నమాట. అయస్కాంత క్షేత్ర ప్రభావం రోబో మొత్తమ్మీద ఒకేరకంగా పడుతూండటం వల్ల ఒక రోబోతో వేర్వేరు పనులు చేయించలేకపోయే వారు. ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ పరిమితిని అధిగమించగలిగారు. ఏడేళ్ల పరిశోధనలురోబోతో ఐదు రకాల పనులు చేయించేందుకు ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఏడేళ్లుగా కృషి చేస్తున్నారు. వేర్వేరు కోణాల్లోంచి రోబోను అయస్కాంతీకరించడం, సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా గత అవరోధాలను విజయవంతంగా అధిగమించామని శాస్త్రవేత్త లుమ్ గుయో ఝాన్ తెలిపారు. ఒక్కో కోణంలో ఈ మార్పులు చేయడం ద్వారా ఒక్కో రకమైన పని చేయించేలా తాము రోబోలో ఒక మాగ్నెటిక్ రీప్రోగ్రామబుల్ మాడ్యూల్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ బుల్లి రోబోలోని వేర్వేరు ప్రాంతాలు అయస్కాంతానికి భిన్న రీతుల్లో స్పందించేలా చేశామని, అయస్కాంత క్షేత్ర ప్రభావం ఈ ప్రాంతాలపై వేర్వేరుగా ఉంటుందని లుమ్ గుయో వివరించారు. సాఫ్ట్ రోబోటిక్స్లో విరివిగా వాడే పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్ వంటి పదార్థాలతో ఈ రోబోను తయారుచేశారు. పీడీఎంఎస్, ఎకోఫ్లెక్స్ అనేవి సిలికోన్ ఆధారిత పదార్థాలు. ఈ పదార్థంలోనే అక్కడక్కడ ఐదు మైక్రోమీటర్ల సైజున్న అయస్కాంత కణాలను ఏర్పాటు చేశారు. ఈ కణాల అమరిక, అయస్కాంతీకరణల ఆధారంగా రోబో కదలిక, పనులు ఆధారపడి ఉంటాయి. ఫైవ్ ఇన్ వన్ ఎలాగంటే... బయాప్సీ కోసం ఇందులో చిన్న బ్లేడ్ ఉంటుంది. రోబో గట్టిగా పట్టుకుంటే ఈ బ్లేడ్ కణజాలాన్ని కత్తిరించి తనలో దాచుకుంటుంది. బయటకు తీసుకొచి్చన తరువాత కణజాలాన్ని విశ్లేషించడం ద్వారా కేన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ జరుగుతుంది. మందులు పెట్టి రోబోను శరీరం లోపలికి పంపిస్తే ఆ రోబోనే ఔషధాన్ని శరీరంలోకి జొప్పిస్తుంది. ప్రత్యేకమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించడం ద్వారా దీన్ని వేడెక్కించవచ్చు. అల్సర్ల వంటి వాటిని మాడ్చి మాన్పేందుకు ఉపయోగించవచ్చు. కేన్సర్కూ ఈ హైపర్ థెర్మియా పద్దతిని వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కణజాలం మధ్య కదిలేందుకు ఈ రోబోకు దొర్లుకుంటూ వెళ్లే సామర్థ్యాన్ని కల్పించారు. దీంతో రోబో ఎటు కావాలంటే అటు వెళ్లిపోగలదు. కోడి లివర్లో, కృత్రిమ కణజాలం నమూనాల్లో ఈ రోబోను ఇప్పటికే పరిశీలించి సత్ఫలితాలు సాధించామని, మానవ చర్మకణాలతో ప్రయోగాలు జరిపి ఈ రోబో ద్వారా శరీరానికి హాని ఏదీ జరగదని నిర్ధారించుకున్నామని లుమ్ గుయో ఝాన్ తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆశలన్నీ ఇంక ఆ నలుగురి మీదే!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో ముందడుగు వేసింది. దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనుషుల్ని దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టిమిస్ మిషన్కు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఆర్టెమిస్-3 మిషన్కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. భవిష్యత్లో చంద్రుడిపై మానవుల శాశ్వత ఉనికికి బాటలు వేసే కీలక మిషన్ ఇది. అలాంటప్పుడు ఈ నలుగురినే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. నాసా ఎంపిక చేసిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పైలట్ లూకా పార్మిటానో, నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఇందులో ఆండ్రే డగ్లస్ను మినహాయిస్తే మిగతా ముగ్గురు అంతరిక్షయానం చేసి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన అనుభవం, టెస్ట్ పైలటింగ్ నైపుణ్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది. అలాగని వాళ్ల బ్యాక్గ్రౌండ్లు ఆషామాషీగా లేవు.. రాండీ బ్రెస్నిక్: మిషన్కు సారథిఆర్టెమిస్-3 కమాండర్గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు. అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలను, టెస్టింగ్ ఫ్లైట్స్ నడిపారు. ఇప్పటికే రెండు అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్గా కూడా సేవలందించారు. పలు స్పేస్వాక్లలో పాల్గొని అంతరిక్షంలో క్లిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీర్ఘకాలిక మిషన్ల నిర్వహణలో ఆయన అనుభవమే ఆర్టెమిస్-3లో ప్రధాన బలంగా భావిస్తున్నారు.లూకా పార్మిటానో: యూరప్ అంతరిక్ష వీరుడుఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన ఇప్పటికే రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్గా వ్యవహరించిన తొలి ఇటాలియన్గా రికార్డు సృష్టించారు. స్పేస్వాక్లలో విశేష అనుభవం ఉన్న ఆయన అంతరిక్షంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టెమిస్-3లో ఆయన ఎంపిక నాసా-యూరప్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది.ఫ్రాంక్ రూబియో: రికార్డు సృష్టించిన వ్యోమగామినాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం ఆయన అంతరిక్షంలో గడిపిన సమయం. అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేయడంలో ఆయన అనుభవం ఆర్టెమిస్-3 మిషన్కు ఎంతో ఉపయోగపడనుంది.ఆండ్రే డగ్లస్: ఇంట్రెస్టింగ్ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. ఇంజినీరింగ్, రోబోటిక్స్, మానవ-యంత్ర వ్యవస్థలపై నైపుణ్యం కలిగిన ఆయన చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్ చంద్రయాత్రల సాంకేతిక రూపకల్పనలో ఆయన చేసిన కృషిని గుర్తించి నాసా ఈ బృందంలో చోటు కల్పించింది.అమెరికా-యూరప్ కలయికఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం యాదృచ్ఛికం కాదు. చంద్రుడిపై భవిష్యత్ అన్వేషణలు ఒక్క దేశం ఆధిపత్యంలో కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయనే సందేశాన్ని నాసా ఇవ్వాలనుకుంటోంది. ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అందుకే లూకా పార్మిటానో ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇది ట్రయల్ మాత్రమే!ఈ నలుగురి బాధ్యత చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్లో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం వంటి మహత్తర లక్ష్యాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించడం. అందుకే ఆర్టెమిస్-3 బృందాన్ని నాసా సాధారణ వ్యోమగాముల బృందంగా కాకుండా, మానవ అంతరిక్ష అన్వేషణ తదుపరి అధ్యాయాన్ని రాసే బృందంగా అభివర్ణిస్తోంది.ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా మానవరహిత పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాసా, ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్టెమిస్-3తో మరింత కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కానీ, ఇక్కడో క్లారిటీ అవసరం. ఆర్టెమిస్-3 మనుషుల్ని చంద్రుడి మీదకు దించే యాత్ర కాదు. భవిష్యత్లో చంద్రుడిపై వ్యోమగాములను సురక్షితంగా దించేందుకు అవసరమైన అత్యంత కీలక సాంకేతిక ప్రక్రియలను పరీక్షించడమే దీని ప్రధాన లక్ష్యం. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ మిషన్లో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్రుడిపై దిగే ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియను సాధన చేస్తారు. భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మిషన్లో మరో ఆసక్తికర అంశం.. ప్రైవేట్ కంపెనీల పాత్ర. జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న ‘బ్లూ మూన్’ ల్యాండర్, ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ రూపొందిస్తున్న ‘స్టార్షిప్’ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్లతో ఈ వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. భవిష్యత్ అంతరిక్ష యుగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఎలా పనిచేయబోతున్నాయో ఈ మిషన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాబట్టి.. నాసా "మూన్ ల్యాండింగ్కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.అందుకే కీలకంఅంటే ఆర్టెమిస్-3 అనేది చంద్రయాత్రకు ముందు చివరి పరీక్ష. భవిష్యత్లో చంద్రుడిపై దిగే వ్యోమగాముల భద్రతకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టెమిస్-3 బృందం ప్రకటన ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇప్పటివరకు డిజైన్, ఇంజినీరింగ్ దశలో ఉన్న మిషన్ ఇప్పుడు మానవ ప్రయాణానికి సిద్ధమవుతోందనే సంకేతం. 1972లో అపోలో-17 మిషన్ అనంతరం మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవులను తిరిగి చంద్రుడిపై దించాలన్న లక్ష్యంతో నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థిరమైన మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్-3 కీలక మలుపుగా మారనుంది. ఈ మిషన్ విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 ద్వారా మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం మరింత సుగమం కానుంది. అయితే.. ఈ నలుగురు ఆర్టెమిస్-3లో పాల్గొనే నలుగురే కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, నాసా ఆశలన్నీ ఇప్పుడు వీళ్లపైనే ఉన్నాయి.ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు వెళ్తారు. వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్లో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి దిగుతారు. అక్కడ వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరతారు.:::సాక్షి వెబ్ ప్రత్యేకం -
ట్రంప్ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చూసేద్దాం...చివరిసారి!
ఏ ఆటలో అయినా నిలకడగా రాణిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకునే ప్లేయర్లు చాలా మంది ఉంటారు. కానీ తమ ఉనికితోనే మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసి... చిన్న కదలికలతో ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేసేవారు కొందరే! స్టార్, సూపర్ స్టార్ స్థాయి దాటేసి అలా లెజెండ్గా మారిన పలువురు ప్లేయర్లు ఈ ‘ఫిఫా’ ప్రపంచకప్తో అంతర్జాతీయ ఫుట్బాల్కు టాటా చెప్పనున్నారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెమార్ (బ్రెజిల్), మొహమ్మద్ సలా (ఈజిప్ట్), లూకా మోడ్రిక్ (క్రొయేషియా), మాన్యుయెల్ న్యూయెర్ (జర్మనీ), విర్జిల్ వాన్ డిక్ (నెదర్లాండ్స్), కెవిన్ డి బ్రూనీ (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), సన్ హెంగ్ మిన్ (దక్షిణ కొరియా), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా) ఇలా ఈ జాబితా చాలా పెద్దదే! ఈ దిగ్గజాలను ఆయా దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లో చూడటం దాదాపు ఇదే చివరిసారి కానుంది. అలాంటి వాళ్ల కెరీర్ను ఓసారి పరిశీలిస్తే...మెస్సీ... అర్జెంటీనా తురుపుముక్క సుదీర్ఘ కాలంగా అర్జెంటీనా జట్టు తురుపుముక్కగా ఉన్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 తర్వాత కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్లో జరిగిన మెగా టోర్నీ సమయంలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న 39 ఏళ్ల మెస్సీ... అప్పుడు అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడంతో... సుదీర్ఘకాలంగా తాను కన్న కలను ఆస్వాదించేందుకు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 198 మ్యాచ్లాడిన మెస్సీ 115 గోల్స్ కొట్టాడు. ఐదుసార్లు ‘ఫిఫా’ వరల్డ్కప్లో పాల్గొన్న మెస్సీ... రికార్డు స్థాయిలో ఆరోసారి మెగా టోర్నీలో ఆడిన అనంతరం వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో ఈ అర్జెంటీనా స్టార్ 26 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్న అర్జెంటీనా జట్టు... టైటిల్ను నిలబెట్టుకొని మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అతడి నాయకత్వ పటిమ, అనుభవం ఈ టోర్నీలో అర్జెంటీనాకు మరింత బలాన్నిస్తాయని యోచిస్తోంది. ఫిట్నెస్ ఎంతో కీలకమైన ఫుట్బాల్లో 39 ఏళ్ల వయసు వరకు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ జట్టుతో పాటు క్లబ్లు కలుపుకుంటే కెరీర్లో మొత్తం 1151 అధికారిక మ్యాచ్లు ఆడిన మెస్సీ... 906 గోల్స్ చేశాడు.రొనాల్డో... ముందే చెప్పేశాడుయావత్ క్రీడా ప్రపంచం ‘సీఆర్7’గా పిలుచుకునే... ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ప్రపంచకప్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మెస్సీతో సరిసమానంగా రికార్డు స్థాయిలో ఆరోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ బరిలోకి దిగనున్న 41 రొనాల్డో ఇదే తనకు చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే వెల్లడించాడు. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన రొనాల్డో లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సైతం చేజిక్కించుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా ఎంతగానో తపిస్తున్నా ‘ఫిఫా’ విన్నర్స్ ట్రోఫీ మాత్రం అతడి చేతికి చిక్కలేదు. ‘ఔర్ ఏక్ ధక్కా... ఇస్ బార్ పక్కా’ అన్నట్లు తన చివరి ప్రయత్నంలో అయినా అందని ద్రాక్షను అందుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడు. 2003లో తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో... 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పోర్చుగల్ తరఫున 226 మ్యాచ్లు ఆడి 143 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నాసర్’ క్లబ్కు సారథ్యం వహిస్తున్న రొనాల్డో... ఇటీవలే సౌదీ ప్రొ లీగ్ టైటిల్ సాధించి ఫుల్ జోష్లో ఉన్నాడు. అదే ఊపు ప్రపంచకప్లోనూ కొనసాగిస్తూ తన చిరకాల లక్ష్యాన్ని అందుకుంటాడా చూడాలి. సీనియర్ స్థాయిలో ఇప్పటి వరకు 1320 మ్యాచ్లు ఆడిన రొనాల్డో 970 గోల్స్ చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు ప్రతిరూపంగా నిలచే రొనాల్డో... సోషల్ మీడియాలో వంద కోట్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.నెమార్... బ్రెజిల్ గుండె చప్పుడు మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆడిన బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ చివరి టోర్నీకి సిద్ధమవుతున్నాడు. తన తరంలో జట్టుకు అందని ట్రోఫీని అందించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. అయితే ఫిట్నెస్ కారణాలరీత్యా అతడు అన్నీ మ్యాచ్లు ఆడతాడా అనేది సందేహమే. అత్యధికంగా ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) వరల్డ్ చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ ‘సిక్సర్’ కొట్టాలంటే నెమార్ ప్రదర్శన కీలకం కానుంది. ఇది తనకు చివరి మెగా టోర్నీ అని 34 ఏళ్ల నెమార్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున 128 మ్యాచ్లు ఆడిన నెమార్... 79 గోల్స్ చేయడంతో పాటు మరో 59 గోల్స్కు సహకారం అందించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొనసాగుతున్న నెమార్ చివరి వరల్డ్కప్లోనూ అదే నిలకడ కొనసాగించాలని భావిస్తున్నాడు. ఐదో ప్రపంచకప్ ఆడనున్న జర్మనీ గోల్ కీపర్ న్యూయెర్ (40 ఏళ్లు), మెక్సికో గోల్ కీపర్ ఒచోవా (40 ఏళ్లు), కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగెజ్ (34 ఏళ్లు), సాడియో మానె (34 ఏళ్లు), విర్జిల్ వాన్ డిక్ (35 ఏళ్లు), కెవిన్ డి బ్రూనీ (35 ఏళ్లు), సన్ హెంగ్ మిన్ (34 ఏళ్లు) కూడా చివరిసారి ప్రపంచకప్లో కనిపించనున్నారు.సలా... వన్ మ్యాన్ షో క్లబ్ ఫుట్బాల్ లివర్పూల్ తరఫున సంచలనాలు నమోదు చేసిన ఈజిప్ట్ సూపర్ స్టార్ మొహమ్మద్ సలాకు కూడా ఇదే చివరి ‘ఫిఫా’ వరల్డ్కప్ కానుంది. 2010లో సీనియర్ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడిన సలా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 115 మ్యాచ్లాడి 67 గోల్స్ చేశాడు. అటాకింగ్కు పెట్టింది పేరైన సలా... రెప్పపాటులో ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి (2018లో) ప్రపంచకప్ బరిలోకి దిగిన సలా... 2 మ్యాచ్లాడి రెండు గోల్స్ చేశాడు. క్లబ్ ఫుట్బాల్లో 750కి పైగా మ్యాచ్లాడిన అనుభవం ఉన్న అతడు... ఈజిప్ట్ను ఎలా ముందుకు నడిపిస్తాడనేది కీలకం. మైదానంలో అతడి వేగం, గోల్స్ చేయడంలో అతడి సామర్థ్యంపై ఈజిప్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ ‘ఫిఫా’ వరల్డ్కప్ చరిత్రలో ఈజిప్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు (1934, 1990, 2018) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించింది. 33 ఏళ్ల సలాకు ఫిట్నెస్ పరంగా సమస్యలు లేకపోయినా... ఇప్పటి వరకు ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ వచ్చే సీజన్కు అర్హత సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో... అతడికిదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి. లూకా మోడ్రిచ్... క్రొయేషియా ఆశ క్రొయేషియా మిడ్ఫీల్డర్ లూకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జట్టు ఆడిన సగానికి పైగా మ్యాచ్ల్లో బరిలోకి దిగిన 40 ఏళ్ల మోడ్రిక్ చివరిసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీ ఆడనున్నాడు. కెరీర్లో 196 మ్యాచ్లాడిన మోడ్రిచ్... 28 గోల్స్ చేశాడు. గోల్స్ పరంగా చూసుకుంటే సంఖ్య తక్కువే కనిపించినా మిడ్ఫీల్డ్లో అతడి అనుభవం జట్టుకు ఎంత బలాన్నిస్తుందో గత ప్రపంచకప్లో రుజువైంది. 2022 టోర్నీలో అనూహ్య ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించిన మోడ్రిచ్... క్రొయేషియాను మూడో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇటలీ లీగ్లో ఏసీ మిలాన్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లూకా... ఇటీవల గాయపడి కోలుకున్నాడు. ముఖానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఈ టోర్నీలో అతడు సేఫ్టీ మాస్క్తో బరిలోకి దిగొచ్చు. క్రొయేషియా జట్టు సంధి దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో లూకా అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ డాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. – సాక్షి క్రీడా విభాగం -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్టాపిక్గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్మిటర్తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్హౌస్ కరస్పాండెంట్గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్గా, రెండో మహిళా యాంకర్గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. -
గాడ్జిల్లా వచ్చేస్తోంది! భారత్పై దాని నీడ పడితే..
గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తే నగరాలు వణికిపోతాయి. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. అది సినిమా కథ. కానీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్జిల్లా’ మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంటే.. భారత్కు మాత్రం మరో భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఈ దాని నీడ గనుక పడితే జరిగిన నష్టం.. పెను సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి!. వాతావరణ ప్రపంచంలో ప్రస్తుతం ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే "గాడ్జిల్లా ఎల్ నినో". సాధారణంగా రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఎల్ నినో ఈసారి.. అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యూరప్కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్లో వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య, తూర్పు పసిఫిక్ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనించే "నినో-3.4" ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రకటించేందుకు అవసరమైన 0.5 డిగ్రీల పరిమితిని ఇది దాటేసింది. డిసెంబర్ నాటికి ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని యూరోపియన్ ఫోర్కాస్ట్ మోడళ్లు సూచిస్తున్నాయి.అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్ ఎల్ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి "గాడ్జిల్లా ఎల్ నినో" అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా.. ఈ ఎల్ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపవచ్చని భావించి ఆ పేరు పెట్టారు. భారత్పైనే ఎక్కువ ఎందుకు?గాడ్జిల్లా ఎల్నినో గురించి భారత్ ఎక్కువగా ఆందోళన చెందడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూముల్లో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగానే సాగవుతున్నాయి. అందుకే వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది.సాధారణంగా ఎల్నినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవడం జరుగుతుంది.ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 1971-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని హెచ్చరించింది.అయితే సమస్య కేవలం వర్షాలు తగ్గడమే కాదు. వర్షాలు తగ్గితే ముందుగా దెబ్బతినేది వ్యవసాయ రంగం. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం పడిపోవచ్చు. భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోతే తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా.. వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు.గతం ఏం చెబుతోందంటే..1997-98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్ నినోను చూసింది. 2015-16లో మరోసారి సూపర్ ఎల్ నినో నమోదైంది. ఆ సమయంలో భారత్లో సాధారణం కంటే కేవలం 86 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అప్పట్లో భారత్కు ఒక రక్షణ కవచం లభించింది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). 1997లో బలమైన పాజిటివ్ IOD ప్రభావంతో ఎల్ నినో దెబ్బ కొంతవరకు తగ్గింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలోనే ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే సహజ మిత్రుడు ఈసారి భారత్కు అందుబాటులో ఉండకపోవచ్చు.ఎల్ నినోను భారత్ వర్షాకాలానికి విలన్గా భావిస్తే.. ఐవోడీని హీరోగా చెప్పొచ్చు. ఎల్ నినో వల్ల తగ్గే వర్షాలను కొంతవరకు భర్తీ చేసి, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడే శక్తి దీనికి ఉంటుంది. అదెలాగంటే.. ఎల్ నినో వల్ల భారత్లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భారత మహాసముద్రంలో ఏర్పడే ఐవోడీ వాతావరణ పరిస్థితి కొన్నిసార్లు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇది అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి, భారత్కు అదనపు వర్షాలు కురిసేలా సహాయపడుతుంది.ప్రపంచంపై ప్రభావం..అలాగని గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం భారత్కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.కరువు ఖాయమేనా?కచ్చితంగా కాదు. ఎల్ నినో ఒక ప్రమాద సంకేతం మాత్రమే. అది తుది ఫలితం కాదు. వర్షాకాలాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాల తీరు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినా సరే.. ప్రపంచ వాతావరణ నిపుణులు ఇప్పుడు పసిఫిక్పై ప్రత్యేక నిఘా పెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది సాధారణ ఎల్ నినో కాదనే సంకేతాలు కనిపిస్తుండడమే. నోట్: ఇది వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తల అంచనాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణాత్మక కథనం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మారే కొద్దీ అంచనాలు, ప్రభావాలు కూడా మారే అవకాశం ఉంటుంది. -
జెన్ జెడ్.. కొత్త పాఠాలు
అప్పులంటే ఇష్టం లేదు. కానీ... ఈజీగా ‘ఇదిగో తీసుకో’ అంటూ వచ్చే మెసేజీలకు ఇట్టే ఆకర్షితులైపోతారు. అదుపులేకుండా వాడేస్తారు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందో సొంతగానే విశ్లేషిస్తారు. తమకు అన్నీ తెలుసనుకుంటారు. కానీ... రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్లను ఇట్టే నమ్మేస్తారు. ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటారు. కానీ స్మార్ట్ఫోన్లో వేగంగా జరిపే లావాదేవీలతో... డబ్బు నిరంతరం ఖర్చవుతూనే ఉంటుంది. ముందే పొదుపు ఆరంభిస్తున్నారు. చిన్నచిన్న డిస్కౌంట్లు, ఆఫర్లకన్నా... పారదర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలనే నమ్ముతున్నారు. స్మార్ట్ ఫోన్లలో వాడే అప్లికేషన్ల నుంచీ ఎంటర్టైన్మెంట్ వరకూ సబ్ర్స్కిప్షన్లు ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లు, లైఫ్ స్టైల్ను అప్గేడ్ చేసుకోవటం అలవాటు. ఇదంతా ‘జెడ్’ జనరేషన్ గురించి. 16 ఏళ్లు దాటి... 30 ఏళ్లు నిండని యువతరం గురించి. వీరి అలవాట్లు కొన్ని మంచివే అయినా... కొన్నింటి విషయంలో జాగ్రత్తపడాల్సిందే. 2030 నాటికి జెన్ జెడ్, యువ మిలీనియల్స్ దేశీ వినియోగ వ్యయాల్లో మెజారిటీ వాటాకు చేరుతున్న నేపథ్యంలో... వీళ్లేం చేస్తున్నారో... ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ‘సాక్షి వెల్త్’ స్టోరీ ఇది.పదేళ్ల కిందటి వరకూ పర్సులో డబ్బులు లేకుండా కదలడమనేది ఊహక్కూడా అందేది కాదు. కానీ ఇప్పటి జెన్ జెడ్.. చేతిలో స్మార్ట్ఫోన్ తప్ప మరేదీ వెంట తీసుకెళ్లడం లేదు. యూపీఐ సహా డిజిటల్ లావాదేవీలు సర్వ సాధారణమైపోవటమే ప్రధాన కారణం. క్యాష్తో సౌకర్యం తక్కువని భావించటం వల్ల కూడా దీనిపై ఆధారపడటం తగ్గుతోంది. మరో గమనించదగ్గ అంశమేంటంటే ఈ తరం క్రెడిట్ కార్డులకు తక్కువ ప్రాధాన్యమివ్వటం. యూపీఐ, మొబైల్ వాలెట్స్, డెబిట్ కార్డులనే ఎక్కువ వాడటం. క్యాష్ని అత్యంత తక్కువగా ఉపయోగిస్తున్నారు. పేమెంట్ మెథడ్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిదనుకుంటున్నారు. పాత తరం వారు నెలవారీగా కొనుగోళ్లు, పండగ షాపింగ్లు జరుపుతుంటే... ఈ జెన్ జెడ్ మాత్రం వీకెండ్ షాపింగ్లే కాకుండా దాదాపు నిరంతరం ఖర్చు చేస్తూనే ఉన్నారు. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఓటీటీ మెంబర్షిప్లు, గేమింగ్ సబ్్రస్కిప్షన్లు.. ఇలా ఒకటి కాదు నిత్యం బోలెడన్ని చిన్న చిన్న లావాదేవీలు చేస్తూనే ఉంటున్నారు. ఇలా వీరి ఖాతాల్లోంచి నిరంతరం ప్రవహిస్తున్న నగదు ఆధారంగా... ఇపుడొక కొత్త ‘రియల్ టైమ్ స్పెండింగ్ ఎకానమీ’ పుట్టుకొచ్చింది. అది అంతకంతకూ పెరుగుతోంది. అప్పంటే ఇష్టం లేదు.. కానీ.. సాధారణంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుందని యువతపై ఓ అభిప్రాయం ఉంది. కానీ జెన్ జెడ్ తరం ఆర్థిక అలవాట్లు లోతుగా చూస్తే ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక సంక్షోభాలు, కరోనా సమయంలో అనిశ్చితి, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల్లాంటివన్నీ చూసిన మీదట ఈ తరం వాళ్లలో చాలా మంది ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు సంప్రదాయ క్రెడిట్ కార్డులకు బ దులు డెబిట్ కార్డుల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనితో సంప్రదాయ క్రెడిట్ కార్డ్ కంపెనీలకి ఈ సెగ్మెంట్లో అంతగా పట్టు లభించటం లేదు. కానీ కొత్తరూట్లో ‘‘బై నౌ, పే లేటర్’’ (బీఎన్పీఎల్) పేరిట సరికొత్త క్రెడిట్ సర్వీసులు తెచ్చేసరికి జెన్ జెడ్ ఇట్టే ఆకర్షితులయిపోతున్నారు. ఈ– కామర్స్, ఫిన్టెక్ ప్లాట్ఫాంలతో నేరుగా అనుసంధానమైన ఈ తరహా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ ను యువతరం ఎక్కువగా ఉపయోగించుకుంటన్నా రు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. → చాలా తక్కువ డాక్యుమెంటేషన్, అప్పటికప్పుడు అప్రూవల్ → వార్షిక ఫీజులు లేకపోవడం, వడ్డీరహిత గ్రేస్ పీరియడ్ → చిన్న చిన్న మొత్తాల్లో సరళంగా చెల్లించే వెసులుబాటు కాకపోతే, బీఎన్పీఎల్ అనేది చాలా సౌకర్యవంతమైనదే కానీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. వివిధ యాప్ల ద్వారా దాదాపు ఒకే వ్యవధిలో చేసే చిన్న చిన్న కొనుగోళ్లన్నీ ఒకేసారి తడిసి మోపెడై, అప్పుడప్పుడే ఆదాయార్జనలో పడిన యువతకు భారీ రుణ భారంగా మారుతున్నాయి కూడా. ఈ ప్రమాదాన్ని ఊహించాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఫిన్ఫ్లుయెన్సర్ల ప్రభావం..యువతరం ఇప్పుడు ఆర్థిక సలహాల కోసం ఇంట్లో పెద్దవాళ్లనో, బ్యాంకు మేనేజర్లనో, చార్టర్డ్ అకౌంటెంట్లనో సంప్రదించడం తగ్గుతోంది. ఎక్కువగా ఫిన్ఫ్లుయెన్సర్ల వైపు మళ్లే ధోరణి పెరుగుతోంది. పాత తరం వాళ్లు ఆర్థిక సలహాల కోసం తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బ్యాంకు మేనేజర్లు, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, న్యూస్ పేపర్లు.. ప్రింట్ మీడియా, ఫిక్స్డ్ డిపాజిట్లవైపు చూసేవారు. కానీ జెన్ జడ్ మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంటిగ్రేటెడ్ ఫిన్టెక్ యాప్లు, యూట్యూబ్ పాడ్కాస్ట్లు, ఆన్లైన్ కమ్యూనిటీలు (రెడిట్, డిస్కార్డ్), ఆధునిక డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంల వైపు చూస్తున్నారు. అన్ని చోట్లా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల చిన్న వయస్సు నుంచే ఆర్థిక అక్షరాస్యత మెరుగ్గా ఉంటున్నప్పటికీ, తప్పుడు సమాచారం కూడా భారీగానే వ్యాప్తి చెందుతోంది. వీటివల్ల దెబ్బతింటున్నవాళ్లూ పెరుగుతున్నారు. దీంతో అడ్డూ అదుపూ లేకుండా ఫిన్ఫ్లుయెన్సర్లు విస్తరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు నిశితంగా దృష్టి పెడుతున్నాయి. తప్పుల తడకల ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ సలహాలను కట్టడి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి.ముందు నుంచే పెట్టుబడులు.. డిజిటల్ వల్ల కలిగిన ప్రయోజనమేంటంటే... తమ పేరెంట్స్తో పోలిస్తే జెన్ జెడ్ చాలా ముందు నుంచే పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దాదాపుగా అవరోధాలేమీ లేకపోవడంతో నెలకు రూ.100 నుంచి 500 వరకు ఉండే మైక్రో సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి పోర్ట్ఫోలియో చాలా వైవిధ్యంగా ఉంటోంది. మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, డైరెక్ట్ ఈక్విటీలు, డిజిటల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) వంటివి ఈ పోర్ట్ఫోలియోలో ఉంటునాయి. ఇలా సాధ్యమైనంత ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ జనరేషన్ వాళ్లు... వెల్త్ మేనేజర్లకు బంగారు గనుల్లా మారుతున్నారు. ఓ ఇన్వెస్టరును 22 ఏళ్ల వయసులో పట్టుకుంటే ఆ తర్వాత బోలెడన్ని సంవత్సరాల పాటు వారు క్లయింట్లుగా కొనసాగే అవకాశం ఉండటమే దీనిక్కారణం. అయితే, ఆర్థిక సంస్థలు ఇందుకోసం తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటోంది. జెన్ జెడ్ డిస్కౌంట్లు.. లాయల్టీ పాయింట్ల కన్నా ఎక్కువగా చార్జీల విషయంలో పారదర్శకత, నైతికతతో కూడుకున్న వ్యాపార విధానాలు, డేటా ప్రైవసీకి ప్రాధాన్యమిస్తున్నారు. హెచ్చరిక సంకేతాలు.. జెన్ జెడ్కి డిజిటల్ ఐక్యూ ఎక్కువే అయినా... కొన్ని విశిష్టమైన సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటోందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన లైఫ్స్టయిల్ ఖర్చులు: వేగంగా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, వాటికి తగ్గట్లు లైఫ్స్టయిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఖర్చులు మితిమీరిపోతున్నాయి. ఫలితంగా, ఆదాయాలను దీర్ఘకాలిక పొదుపు వైపు మళ్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సబ్స్క్రిప్షన్లతో చిల్లు: నెలవారీగా కట్టే డజన్ల కొద్దీ డిజిటల్ సబ్్రస్కిప్షన్ల వల్ల చిన్న, చిన్నగా పర్సుకు చిల్లులు పడుతున్నాయి. సోషల్ మీడియా ఒత్తిడి: ప్రతిదాన్నీ డిజిటల్గా పోల్చి చూసుకునే సంస్కృతి వల్ల ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్), (ఇప్పుడు దొరకపుచ్చుకోకపోతే ఇంకెప్పటికీ దొరకదేమో అన్న భయం) వల్ల ఖరీదైన ఎక్స్పీరియన్స్లు, లగ్జరీ ఉత్పత్తులను కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఎమర్జెన్సీ నిధుల కొరత: అప్పటికప్పుడు సంతృప్తి కలిగించే ఎక్స్పీరియన్స్లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక భద్రతను పక్కన పెడుతుండటం వల్ల, ఆదాయంపరంగా అనూహ్యమైన షాక్లేవైనా తగిలితే తట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. గెలుపు గుర్రాలు.. జెన్ జెడ్ తెచ్చిన ఆర్థిక విప్లవమనేది దేశీ మార్కెట్ వ్యవస్థలో కొత్త మార్పులకు ఆజ్యం పోసింది. ఈ భారీ డెమొగ్రఫిక్ మార్పులతో ప్రభావితమయ్యే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందవచ్చు. అవేమిటంటే ... → ఫిన్టెక్, వెల్త్ టెక్ ప్లాట్ఫామ్స్: డిజిటల్ చెల్లింపులు, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, మైక్రో రుణాలిచ్చే కంపెనీలు → ప్రైవేట్ బ్యాంకులు: పటిష్టమైన, అధునాతన డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు అందించేవి. → ఫైనాన్షియల్ సూపర్ యాప్స్: పేమెంట్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, బీమాను ఒకే ఇంటర్ఫేస్లో అందించేవి. → అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు: భారీ స్థాయిలో సిప్ రూపంలో రిటైల్ పెట్టుబడులను అందుకుంటున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు. ఇలా, డిజిటల్గా ఆర్థిక సేవలను అందించే, తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగే ఆర్థిక సంస్థలే భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లగలవు. – సాక్షి, వెల్త్ -
యూరియా.. ‘గ్రీన్’ ఐడియా..
ఒక సంక్షోభం మరో సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో..నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన గ్రీన్ యూరియా ఉత్పత్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వీడన్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ కనిపెట్టిన గ్రీన్ యూరియా టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రముఖ స్వీడిష్ క్లీ¯న్ టెక్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ గుళికల రూపంలో ఉండే హరిత నత్రజని ఎరువుల తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేసి పేటెంట్ పొందింది. మన దేశంలోని అధిక సబ్సిడీలతో నడిచే, అధిక ఉద్గారాలు వెలువరించే హేబర్–బోష్ యూరియా ప్లాంట్లకు.. పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ అత్యంత ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.10 దేశాలు.. 34 ఒప్పందాలుగత ఏడాది 20 లక్షల డాలర్ల ఫుడ్ ప్లానెట్ అవార్డును గెల్చుకున్న ఈ సాంకేతికతపై ఇప్పటికే పది దేశాల కంపెనీలు 34 ఒప్పందాలు చేసుకున్నాయని నైట్రోక్యాప్ట్ చెబుతోంది. తూర్పు ప్రాంతానికి చెందిన ఒక భారతీయ కంపెనీ ఈ సాంకేతికతో గ్రీన్ యూరియా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఈ గ్రీన్ యూరియా టెక్నాలజీ వినియోగం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. సాధారణ యూరియా వర్సెస్ నైట్రోక్యాప్ట్ గ్రీన్ యూరియాహేబర్–బోష్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను పారిశ్రామికంగా సంశ్లేషణ చేస్తారు. గ్రీన్ యూరియా ప్రక్రియలో ఇనుము ఉత్ప్రేరకాల సహాయంతో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజని, హైడ్రోజన్లను కలిపి యూరియాను తయారు చేస్తారు. -
రూరల్ టీనేజర్లకు టెన్షన్
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆరుగురు టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హరియాణాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ దిగ్భ్రాతికరమైన విషయాలు వెలుగుచూశాయి.ఒత్తిడికి ప్రధాన కారణాలు చదువు, పరీక్షల భయంతోపాటు తక్కువ మార్కులు వస్తాయనే ఆందోళన, మరోవైపు ఫెయిల్ అవుతామనే భయం, భవిష్యత్పై అభద్రతా భావం. వీటితోపాటు కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, శారీరక లేదా మానసిక వేధింపులు. కుటుంబ పెద్దల వ్యసనాల కారణంగా ఒత్తిడికి గురైనట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది టీనేజర్లు తమ ఇంట్లో పెద్దవారు మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలైనట్టు తెలిపారు. ఇవేకాకుండా పేదరికం వల్ల అబ్బాయిలు చదువు మానేసి కూలి పనులకు వెళ్తుంటే.. భద్రతా కారణాలు, సామాజిక ఆంక్షల వల్ల అమ్మాయిల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. స్కూళ్లలో లేదా బయట జరిగే అవమానాలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.నిశ్శబ్దంగా నరకం.. అవగాహనా రాహిత్యం!ఈ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. చాలామంది టీనేజర్లు తమ బాధను, ఆత్మహత్యా ఆలోచనలను ‘జీవితంలో ఒక భాగం’గా భావిస్తూ భరిస్తున్నారు. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ ఉంటుందనే కనీస అవగాహన కూడా వారికి లేదు. సమాజంలో ఎక్కడ అవమానం జరుగుతుందోననే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.గణాంకాలు ఇలా: ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం దేశంలో జరిగే మొత్తం ఆత్మహత్యల్లో 6 శాతం 18 ఏళ్ల లోపు పిల్లలవే. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో 7.6 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.అందుబాటులో లేని చికిత్స: భారతదేశంలో మానసిక ఆరోగ్య చికిత్సకు సంబంధించిన లోటు 83 శాతంగా ఉంది. అంటే సమస్య ఉన్న మెజారిటీ ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. నిపుణుల సూచనలు: చిన్న వయసులోనే వచ్చే మానసిక సమస్యలను పట్టించుకోకపోతే, అవి వారు పెద్దయ్యాక కూడా వెంటాడుతాయని, కాబట్టి తక్షణమే జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. స్కూల్ కౌన్సెలింగ్: ప్రతి పాఠశాలలోనూ పిల్లల సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి.ఉపాధ్యాయులకు శిక్షణ: పిల్లల్లో మారుతున్న ప్రవర్తనను, ఒత్తిడిని గుర్తించేలా టీచర్లకు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలి.టెలి–మానస్ వినియోగం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ సేవలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. -
ఏఐ ఏజెంట్ వస్తోంది..
సాక్షి, సెంట్రల్ డెస్క్: స్మార్ట్ఫోన్ మార్కెట్ ఒక చరిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. ఇకపై వినియోగదారులు మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్ల ద్వారా నేరుగా తమ డివైస్లతో ఇంటరాక్ట్ అయ్యే రోజులు రానున్నాయి. ఈ సరికొత్త ఏజెంటిక్ విప్లవంలో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ హోరాహోరీగా తలపడుతున్నాయి.ఆండ్రాయిడ్ ఇక ఏఐ సిస్టమ్గూగుల్ తాజాగా నిర్వహించిన ఆండ్రాయిడ్ షో 2026 వేదికగా గూగుల్ జెమినై ఇంటెలిజెన్స్ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం రూపొందించిన ఒక శక్తివంతమైన ఏఐ లేయర్. కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న ఆండ్రాయిడ్ను, పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్ సిస్టమ్గా మార్చడమే దీని లక్ష్యమని గూగుల్ ప్రకటించింది. వినియోగదారుడి అవసరాలను, సందర్భాన్ని ముందే ఊహించి, వివిధ యాప్ల ద్వారా పనులను ఇది స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న శామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ ఫీచర్లు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.రూ. 53 వేల కోట్ల డీల్తో ఓపెన్ ఏఐ భారీ వ్యూహంమరోవైపు యాపిల్ మాజీ ఐకానిక్ డిజైనర్ జోనీ ఐవ్తో కలిసి ఓపెన్ ఏఐ ఒక సరికొత్త ఏఐ–కేంద్రిత స్మార్ట్ఫోన్ను రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. కంప్యూటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్వచించే లక్ష్యంతో స్క్రీన్లు, సంప్రదాయ యాప్ల అవసరం లేకుండా కేవలం ఏఐ ఇంటరాక్షన్తో నడిచే సరికొత్త డివైస్లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జోనీ ఐవ్కు చెందిన స్టార్టప్ ‘ఐఓ’ను ఓపెన్ ఏఐ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సుమారు రూ. 53 వేల కోట్ల భారీ డీల్తో కైవసం చేసుకుంది. హార్డ్వేర్ రంగంలో ఓపెన్ ఏఐ వేసిన అతిపెద్ద అడుగుగా ఇది నిలిచింది.స్క్రీన్ ట్యాపింగ్, స్వైపింగ్ ఇక గతంఇటీవల ప్రచురితమైన యాప్ ఏజెంట్ మల్టీమోడల్ ఏజెంట్స్ యాజ్ స్మార్ట్ఫోన్ యూజర్స్ అనే పరిశోధనా పత్రం ప్రకారం ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్పై ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం ద్వారా యాప్లను స్వతంత్రంగా ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించాయి. కిరాణా సామగ్రి ఆర్డర్ చేయడం, దరఖాస్తులు నింపడం, అపాయింట్మెంట్లు బుక్ చేయడం వంటి పనులను ఈ ఏజెంట్లు వినియోగదారుడి ప్రమేయం లేకుండానే పూర్తి చేయగలవు.ముఖ్యమైన మార్పులు ఇవీ..పూర్తి ఆటోమేషన్: ఒకే ఒక కమాండ్తో మల్టీ–స్టెప్ పనులను పూర్తి చేయగల ఏఐ.కాంటెక్ట్స్ అవేర్నెస్: యూజర్ లొకేషన్, బిహేవియర్, ఆన్–స్క్రీన్ యాక్టివిటీ ఆధారంగా ముందస్తు సూచనలు.పరిధి విస్తరణ: ఫోన్లకే పరిమితం కాకుండా భవిష్యత్తులో స్మార్ట్ వాచీలు, కార్లు, ల్యాప్టాప్లలోకి జెమిని ఇంటెలిజెన్స్.భారత్పై ప్రభావం!ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో ఆండ్రాయిడ్ మార్కెట్ వాటా అత్యధికంగా ఉండటమే కాకుండా శామ్సంగ్, షావోమి, వన్ప్లస్ వంటి బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్ అత్యంత కీలకమైన వృద్ధి కేంద్రంగా మారింది. వచ్చే వారం జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ ఐ/ఓ 2026 సదస్సులో ఆండ్రాయిడ్ 17, జెమినై ఏఐ, ఆండ్రాయిడ్ ఎక్ఆర్ డివైస్లకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్లను గూగుల్ ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
నిద్రతో పేగుబంధం
మంచినిద్ర లేకపోతే పొట్ట పనిచేయదు... నిజమే నిద్రకు, పేగు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది. దీన్ని గట్–స్లీప్ యాక్సిస్ అంటారు. పేగులోని బ్యాక్టీరియా మనం నిద్రపోవడానికి అనువైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సుఖ నిద్రతో దేహంలోని మైక్రోబయోమ్ యంత్రాంగం చక్కగా పనిచేసి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) ప్రకారం మంచి నిద్ర–జీర్ణకోశ ఆరోగ్యం పరస్పర ఆధారితాలు.యంత్రం పనిచేయాలంటే..మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆ సముదాయాన్ని, వాటి జన్యు పదార్థం, ఫంగస్లను మైక్రోబయోమ్ అంటారు. ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈ మైక్రోబయోమ్ చక్రం సవ్యంగా సాగాలంటే మంచి నిద్ర అవసరం.మంచినిద్ర లేకపోతే...⇒ పేగులో ఉండే ప్రో–బ్యాక్టీరియా (దేహానికి ప్రయోజనకారి) వృద్ధి తగ్గుతుంది. ప్రో–బ్యాక్టీరియా వృద్ధి తగ్గిందంటే హానికారక బ్యాక్టీరియా వృద్ధిపై నియంత్రణ లేకపోవడంతో ఆ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ స్థితిని డిస్బయోసిస్ అంటారు.⇒ గాఢనిద్రలో ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యత నిద్రలేమి కారణంగా దెబ్బతింటుంది.⇒ జీవక్రియలు మందగించడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు దారితీస్తుంది.శరీరంలో ఉత్పత్తి అయ్యే 90% సెరోటోనిన్ హార్మోన్ పేగులోనే ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెలటోనిన్ హార్మోన్కు ముందస్తు దశగా చెప్పవచ్చు. నిద్రపట్టడం, మెలకువ రావడం అనే ప్రక్రియలను మెలటోనిన్ నియంత్రిస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం మంచిగా నిద్రపోతేనే జీర్ణవ్యవస్థ తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే నిద్ర పడుతుంది. -
డాక్టర్ స్మార్ట్ స్కేల్స్!
కేవలం బరువును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని చెప్పలేము. ఒకే బరువు ఉన్న ఇద్దరిలో ఒకరు ఫిట్గా, మరొకరు అన్ఫిట్గా ఉండవచ్చు. అందుకే, కేవలం బరువునే కాకుండా శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే స్మార్ట్ స్కేల్స్ (బాడీ స్కానర్లు) ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బి.ఐ.ఎ. టెక్నాలజీతో పనిచేస్తాయి.అందించే ఆరోగ్య వివరాలు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్: బరువు తగ్గడం కంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గడమే ముఖ్యం. ఈ స్కేల్ మీ శరీరంలో కొవ్వు శాతం ఎంతో కచ్చితంగా చెబుతుంది.బాడీ వాటర్ పర్సంటేజ్: శరీరం ఎంతవరకు హైడ్రేటెడ్గా (నీటి శాతం) ఉందో చూపిస్తుంది.మెటబాలిక్ ఏజ్: మీ శరీరం లోపల ఎంత యాక్టివ్గా ఉందో మీ అసలు వయసుతో పోల్చి చెప్తుంది. (ఉదాహరణకు: మీ వయసు 30 ఏళ్లయితే, బాడీ మెటబాలిజం 25 ఏళ్ల యువకుడిలా ఉందా లేదా 40 ఏళ్ల వ్యక్తిగా ఉందా అనేది చెబుతుంది).విసెరల్ ఫ్యాట్: గుండె, కాలేయం వంటి అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు ఇది. దీని స్థాయిని బి.ఐ.ఎ. ద్వారా తెలుసుకుని, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించవచ్చు.ఎముకల సాంద్రత: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.మజిల్ వర్సెస్ ఫ్యాట్: కొవ్వు శరీరాన్ని లావుగా చూపిస్తే, కండరాలు ఫిట్గా ఉంచుతాయి. సాధారణ బరువు మిషన్లలో ఈ తేడా తెలియదు, కానీ స్మార్ట్ స్కేల్ ఈ రెండింటి బరువును విడివిడిగా చూపిస్తుంది. బి.ఐ.ఎ. అంటే ఏమిటి? బయోఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్కి సంక్షిప్త రూపమే బి.ఐ.ఎ.ఈ స్మార్ట్ స్కేల్పై నిలబడినప్పుడు, మనకు తెలియకుండానే ఒక చిన్న విద్యుత్ తరంగం శరీరం ద్వారా వెళ్తుంది. ఇది శరీరంలోని కొవ్వు, కండరాలు, నీటి శాతాన్ని బట్టి వేర్వేరు వేగంతో ప్రయాణించి, కచ్చితమైన బాడీ రిపోర్ట్ను లెక్కిస్తుంది.ఇంటిల్లిపాదికీ ఒకటే స్కేల్: ఒకే స్మార్ట్ స్కేల్ను కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. స్కేల్పై ఎవరు నిలబడ్డారో వారి బాడీ ప్రొఫైల్ను బట్టి ఆటోమేటిక్గా గుర్తించి, వారి వ్యక్తిగత మొబైల్ యాప్కే డేటాను పంపుతుంది. ఒకరి డేటా మరొకరికి కలవదు. -
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది!
భారత సైన్యానికి చెందిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన కాబోయే భార్య ఆరోషికి యూనిఫామ్లో.. అదీ ఆర్మీ హెలికాప్టర్లో ప్రపోజ్ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉండగా ఇవేం పనులంటూ ఆర్మీ అధికారులతో సహా కొందరు దీనిని ఖండించారు. మాజీల్లో కొందరు మాత్రం ‘ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు?’ భరద్వాజ్కు సపోర్ట్ చేశారు. అయితే ఆ రొమాంటిక్ దృశ్యం వెనుక.. అత్యంత కీలకమైన ఓ అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.కెప్టెన్ భరత్ భరద్వాజ్ భారత సైన్యంలో యంగ్ ఆర్మీ ఏవియేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి. ఇటీవలే హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్లో ఫ్రంట్లైన్ సర్వీస్కు సిద్ధమయ్యాడు. అతని కాబోయే భార్య ఆరోషి, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, అధికారిక శిక్షణ పూర్తి అయిన సందర్భంలో భరద్వాజ్ చేసిన ఈ ప్రత్యేక ప్రపోజల్ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువ వయసులో ఉన్న ఈ జంటకు సంబంధించిన ఈ రొమాంటిక్ ఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారితే, మరోవైపు యూనిఫామ్లో వ్యక్తిగత జీవితం ఎంతవరకు సమంజసం అన్న డిబేట్కు కూడా దారితీసింది.భరద్వాజ్ ప్రపోజల్ కోసం ఉపయోగించిన హెలికాప్టర్ ‘చీతా’. గత 50 ఏళ్లుగా భారత సైన్యం దాని మీదే ఆధారపడి ఉంటోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పటియల్ సంస్థ డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 1970ల నుంచి భారత్లో తయారు చేస్తోంది. సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన, క్లిష్టమైన ప్రాంతాల్లో సైనిక రవాణా, గాయపడిన వారిని తరలించడం, సరఫరాలు అందించడం వంటి కీలక బాధ్యతలను ఇది నిర్వర్తిస్తోంది. కానీ దీని భద్రతపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.1974 నుంచి 2022 మధ్య కాలంలో చీతా హెలికాప్టర్లు 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మొన్న.. మే 20న లడఖ్లోని టాంగ్స్టే ప్రాంతంలో మరో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో ఉన్న ముగ్గురు సైనిక అధికారులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఇప్పుడు ఈ ప్రేమకథ పుణ్యమాని ప్రమాదాల పరంపరను మరోసారి కొందరు చర్చకు తీసుకొచ్చారు. అలాగని చీతా మాత్రమే కాదు, దాని సోదర మోడల్ ‘చేతక్’ హెలికాప్టర్ కూడా ప్రమాదాల పరంగా చెడు రికార్డే కలిగి ఉంది. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) వివరాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో చీతా-చేతక్ హెలికాప్టర్లకు సంబంధించిన దాదాపు 191 ప్రమాదాల్లో 294 మంది పైలట్లు మరణించారు. ఈ కారణంగానే వీటిని కొందరు “ఫ్లయింగ్ కాఫిన్స్” (ఎగిరే శవపేటికలు)గా కూడా అభివర్ణించారు.వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ఆధునిక సాంకేతికత, నావిగేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయని మాజీ వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ జీఎస్ బేడీ అభిప్రాయపడ్డారు. దీంతో 2027 నుంచి చీతా, చేతక్ హెలికాప్టర్లను దశలవారీగా సేవల నుంచి తప్పించాలని సైన్యం, వైమానిక దళం నిర్ణయించాయి. వాటి స్థానంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (LUH)ను తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినా, సర్టిఫికేషన్ వివాదాలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఒకవైపు వైరల్ ప్రపోజల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే.. మరోవైపు అదే హెలికాప్టర్లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు మాత్రం ఆధునిక ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాయి. సియాచిన్ నుంచి లడఖ్ వరకు ఎన్నో విజయవంతమైన మిషన్లకు చీతా సాక్ష్యమైనా, దాని వయసు మీద పడడం, ప్రమాదాల చరిత్ర ఇప్పుడు భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. -
ఆదిలాబాద్లో యుద్ధవిమానాల గర్జన!
ఆదిలాబాద్లో యుద్ధ విమానాలు గర్జించబోతున్నాయి. పట్టణానికి ఆనుకొని కొత్తగా నిర్మించబోయే పౌర విమానాశ్రయానికి అనుబంధంగా భారీస్థాయిలో భారత వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన పౌర విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రన్వే కూడా ఉండనున్నందున ఇది ‘జాయింట్ ఎయిర్ ఫీల్డ్‘గా రూపొందనుందని తెలిసిందే. కానీ, శిక్షణ కేంద్రాన్ని సాధారణస్థాయిలో కాకుండా దేశంలోనే కీలక స్థావరంగా మార్చాలని తాజాగా భారత వైమానిక దళం నిర్ణయింది. యుద్ధ విమానాల శిక్షణలో దీన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించింది.ఇది భారీ స్థాయిలో ఉండనున్నందున, ఇక్కడ ఎయిర్ఫోర్స్ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతోంది. దీంతో వారి కుటుంబాల కోసం వందల సంఖ్యలో గృహాలను నిర్మించనున్నారు. శిక్షణ, యుద్ధ విమానాలకు రన్వేలు, వాటిని నిలిపేందుకు భారీ హ్యాంగర్లు, మూమెంట్ కోసం ఏప్రాన్లు, టాక్సీవేలు, శిక్షణ కేంద్రానికి సంబంధించిన భారీ భవనాలు, పరిపాలన కార్యాలయ భవనాలు, రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు... వెరసి దేశంలో ప్రధాన ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రంగా మారబోతోంది. – సాక్షి, హైదరాబాద్చిన్న స్ట్రిప్ నుంచి... ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకునే గతంలో వాయుసేన ఎయిర్ర్స్టిప్ ఉండేది. ఆ తర్వాత దాని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. కానీ, నిజాం కాలం నాటి ఆ ఎయిర్స్ట్రిప్ పరిధిలో దాదాపు 369 ఎకరాల భూమి ఇప్పటికీ ఎయిర్ఫోర్స్ అ«దీనంలోనే ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలో పాత ఎయిర్్రస్టిప్ స్థానంలో పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనికి అంగీకరించిన ఎయిర్ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం మరో 400 ఎకరాలు ఇస్తే ఉమ్మడి విమానాశ్రయం (పౌర విమానాశ్రయం, ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రం)గా రూపొందించేందుకు సిద్ధమైంది. వెరసి 700 ఎకరాల్లో ఎయిర్బస్ 380 స్థాయి పెద్ద విమానాలు దిగే 9 వేల అడుగుల పొడవైన రన్వేను ప్రతిపాదించారు. కానీ, తాజాగా రక్షణశాఖ ఇక్కడ భా రీ వైమానిక శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనంగా మరో వేయి ఎకరాలు సేకరించి ఇవ్వాలని ప్రతిపాదించింది.వ్యూహాత్మక ప్రాంతం ఆదిలాబాద్ దేశానికి రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర–దక్షిణ భారత దేశాల జంక్షన్గా ఉంటుంది తీర ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతాల మధ్యన ఉన్నందున దీన్ని రక్షిత ప్రాంతంగా భారత వాయుసేన భావిస్తోంది. దీంతో ఇక్కడ పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దుండిగల్, హకీంపేటల్లోని శిక్షణ కేంద్రాల కంటే ఇది భిన్నంగా ఉండనుందని సమాచారం. నిర్మాణాలు ఈ శిక్షణ కేంద్రంలో భాగంగా యుద్ధ విమానాలు దిగడానికి భారీ రన్వే, విమాన రక్షణ కేంద్రం, పైలట్లకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లతోపాటు రక్షణ సిబ్బంది నివాసానికి ఒక పెద్ద టౌన్షిప్ నిర్మించనున్నారు.ట్రైనింగ్ అకాడమీ–హ్యాంగర్లుఫైటర్ జెట్స్, హెలికాప్టర్ల నిర్వహణకు భారీ హ్యాంగర్లు, అత్యాధునిక రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు నిర్మిస్తారు. రన్వేకు చేరువలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాయుసేన విమానాలు నిలిపేందుకు ఏప్రాన్, రన్వేకు అనుసంధానమయ్యే టాక్సీవేలను నిర్మిస్తారు. ఇవి సాధారణ విమానాశ్రయం తరహాలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని సమాచారం. భూమి కావాలంటే పరిహారం ఖర్చు చెల్లించాల్సిందే... ప్రస్తుతం రక్షణశాఖ అ«దీనంలో 369.45 ఎకరాలు ఉండగా, మరో నాలుగొందల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం మరో వేయి ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున, దాన్ని కేంద్రమే భరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఆదిలాబాద్లో డీఫంక్ట్ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధీనంలోని భూములను దీనికి వినియోగించాలని భావిస్తున్నారు.ఫలితంగా పరిహా ర ఖర్చు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు నిషానీ ఘాట్, సమీపంలోని రెండు గ్రామాల భూములను సేకరించే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నా రు. ఇప్పటికే రక్షణశాఖ ఈ విమానాశ్రయ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ను ఆమోదించాల్సి ఉంది. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రస్తుత ప్రణాళిక. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ఆలోచన. -
కుప్పకూలిన వేల కోట్ల సామ్రాజ్యం.. తప్పెక్కడ జరిగింది?
అప్పటివరకు యాక్షన్ ఫిగర్లు అంటే ఎక్కువగా సైనికులు, ఫైర్ఫైటర్లు లాంటి వాస్తవిక పాత్రలే. ఆ తర్వాత కామిక్ పుస్తకాలు.. వాటి ఆధారంగా యానిమేషన్ సిరీస్లు.. సినిమాలు.. ఆఖరికి బొమ్మలు పిల్లల ఆటల ప్రపంచాన్ని ఆక్రమించేశాయి. అయితే 80వ దశకంలో వినోద పరిశ్రమలో ఒక విప్లవాత్మక ఆలోచన మొదలైంది. ముందుగా ఆడుకునే బొమ్మలను రూపొందించి.. వాటి చుట్టూ కథలను నిర్మించాలన్న ఆలోచన చేసింది మ్యాటెల్. అలా పుట్టుకొచ్చిన పాత్రే హీ మ్యాన్. “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్”.. ఆరోజుల్లో అద్భుతమైన ఫాంటసీ లోకం. ఈ ప్రపంచంలో సూపర్ హీరో హీ-మ్యాన్. అతనికి ఉండే అపార శక్తి, పోరాటాలు.. పిల్లల ఊహల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా.. “గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక(బై ద పవర్ ఆఫ్ గ్రేస్కల్… ఐ హేవ్ ద పవర్)”.. అంటూ కత్తి దూసి చెప్పే డైలాగ్ కొన్నితరాల పిల్లలకు ఒక భావోద్వేగం. అప్పటిదాకా బొమ్మల మార్కెట్లో ఉన్న సంప్రదాయన్ని తలకిందులు చేసింది అమెరికాకు మ్యాటెల్ సంస్థ. ముందుగా బొమ్మలను తయారు చేసి, ఆ తర్వాత వాటి చుట్టూ కథలను, పాత్రలను, యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మించడం ప్రారంభించింది. అలా “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” రూపొందించింది. ఇందులో ప్రిన్స్ ఆడమ్.. ఓ మంత్రం చెప్పి శక్తివంతమైన హీ-మ్యాన్ రూపం ధరిస్తాడు. రహస్యాలతో నిండిన గ్రేస్కల్ కోట, హీమ్యాన్ వెంటే ఉండే బ్యాటిల్ క్యాట్(పిరికి పులి కాస్త పవర్ఫుల్గా మారడం..) భయంకరమైన శత్రువు స్కలేటర్ అండ్ కోతో హీమ్యాన్, అతని మిత్రబృందం చేసే పోరాటాలు.. అన్నీ కలిసి ఒక విస్తృతమైన ఫాంటసీ రాజ్యాన్ని సజీవంగా నిలిపాయి. 1983లో ప్రారంభమైన యానిమేషన్ సిరీస్ ఈ ప్రపంచాన్ని టీవీ తెరపైకి తీసుకువచ్చి, ప్రతి ఎపిసోడ్ను ఒక బొమ్మల ప్రకటనలా మార్చేసింది మ్యాటెల్. వెరసి అతితక్కువ టైంలో వేల కోట్ల సామ్రాజ్యంతో సంచలనాలకు నెలవు అయ్యింది. ఒకానొక టైంలో మార్వెల్ లాంటి కొండను సైతం ఢీ కొడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ విజయ యాత్ర ఎంత వేగంగా సాగిందో.. అంతే వేగంగా కుప్పకూలింది. కాస్ట్లీ మిస్టేక్కామిక్ సిరీస్ సూపర్ సక్సెస్తో మ్యాటెల్ నేల మీదకు దిగిరాలేదు. ఎడాపెడా బొమ్మల్ని ఉత్పత్తి చేసింది. ఈ క్రమంలో.. మార్కెట్లో డిమాండ్ను సరిగా అంచనా వేయలేక తడబడింది. దీంతో దుకాణాల్లో సరుకు పేరుకుపోయి నిల్వలు అధికమయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్ఫార్మర్స్, జీఐ జాయ్ లాంటి పోటీ ఫ్రాంచైజీలు మరింత ఆధునిక డిజైన్లు, రూపాంతరం చెందే బొమ్మల కాన్సెప్ట్లతో పిల్లలను ఆకట్టుకోవడం ప్రారంభించాయి. ఈ మార్పుల మధ్య హీ-మ్యాన్ ఆకర్షణ క్రమంగా తగ్గుతూ వచ్చింది.మార్కెటింగ్ తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు చాలవన్నట్లు.. జీతాల విషయంలోనూ మ్యాటెల్ ఎచ్చులకు పోయింది. ఎంత ఎక్కువ ప్రొడక్టులు తయారు చేస్తే అంత బోనస్లు అంటూ చేసిన ప్రకటన.. నిండా ముంచేసింది. ఫలితంగా.. అవసరానికి మించి బొమ్మలు మార్కెట్లోకి వెళ్లాయి. సరఫరా డిమాండ్ను మించిపోయి ధరలు పడిపోయాయి. రిటైలర్లు నమ్మకం కోల్పోయారు. టోటల్గా.. బ్రాండ్ వాల్యూ ఘోరంగా దెబ్బతింది, పుండు మీద కారంలా.. 1987లో వచ్చిన హీ మ్యాన్ లైవ్ యాక్షన్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఆపై వరుసపెట్టి సినిమాలు, సిరీస్లు వచ్చిన ఆకట్టుకోలేకపోయాయి. ఈ వరుస దెబ్బలతో.. కార్టూన్ సిరీస్ కూడా సరైన ముగింపు లేకుండానే అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన పునరుద్ధరణ ప్రయత్నాలు కొంత ఆసక్తిని రేపినా.. పాత స్థాయి క్రేజ్ తేలేకపోయింది. ఇప్పుడు.. ఈ 2026లో కొత్త లైవ్ యాక్షన్ సినిమాతో హీ-మ్యాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎర్లీ రివ్యూస్ అయితే పాజిటివ్గానే వచ్చాయి. ఈసారి మిగిలిన ప్రశ్న ఒక్కటే.. ఈ కొత్త ప్రయత్నం నిజంగా ఆ పాత “శక్తిని” తిరిగి తీసుకురాగలదా? లేకుంటే.. నాస్టాల్జియా మీద ఆధారపడిన మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా?.. వెయిట్ అండ్ సీ.. -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్లో పెద్ది రాంచరణ్లా.. రియల్ లైఫ్లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్తో క్రీడారంగంలో హాట్ టాపిక్గా మారాడు. తాజాగా.. రోమ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్మన్గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్లోనూ అతను అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్లో కొత్త స్టార్గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
విండోపవర్
మీ ఇంట్లో కిటికీల సంఖ్యను రెట్టింపు చేసుకోండి వీలైతే మీ భవనాలను అద్దాలతో కప్పేసుకోండి ఎందుకంటే.. ఇంకొన్ని ఏళ్లలో ఈ కిటికీలు, అద్దాలే విద్యుదుత్పత్తి కేంద్రాలు కానున్నాయి మరి! సూర్యుడి వెలుతురును అడ్డుకోకుండానే విద్యుత్తును అందించడం వీటి ప్రత్యేకత. అదెలాగంటే...సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) సరికొత్త సోలార్ సెల్స్ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవిస్కైట్ అనే పదార్థంతో తయారైన ఈ సోలార్ సెల్స్ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసకోవచ్చు. వెలుతురును కూడా ప్రసారం చేయగల ఈ అర్ధ పారదర్శక సోలార్ సెల్స్ రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయగలవు. ప్రస్తుతం సోలార్ సెల్స్ సిలికాన్తో తయారవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సిలికాన్ ఖరీదు చాలా ఎక్కువ. సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి. బిగించుకోవడం, వాడుకోవడంలోనూ ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో చౌక, మరింత సమర్థమైన సోలార్సెల్స్ తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుమారు రెండు దశాబ్దాల క్రితం పెరోవిసై్కట్ను ప్రత్యామ్నాయంగా గుర్తించారు. కాకపోతే అప్పట్లో వీటి సామర్థ్యం చాలా తక్కువగా అంటే కాంతి రూపంలో పడే శక్తిలో కేవలం రెండు శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలిగేది. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సామర్థ్యం 20 శాతానికి చేరుకోవడం గమనార్హం. వెలుతురు, విద్యుత్తుల బ్యాలెన్స్... ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం పది నానోమీటర్లు. అంటే మనిషి వెంట్రుక కంటే పది వేల రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్పై పడే కాంతిలో 41 శాతం నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ 7.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కాకపోతే చౌక కాబట్టి భవనాలను వీటితో కప్పేసి సిలికాల్ సోలార్ సెల్స్ కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం.. న్యూయార్క్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే ఓ భారీ భవనముంది. ఈ ఒక్క భవనాన్ని ఎన్టీయూ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ తో కప్పేస్తే వందల మెగా వాట్/గంటల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత విద్యుత్తుతో అమెరికాలో 40 వరకూ ఇండ్ల అవసరాలు తీర్చవచ్చునని అంచనా. సవాళ్లూ లేకపోలేదు... పెరోవిసై్కట్ సోలార్ సెల్స్తో ఎన్టీయూ శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవి ఎంతకాలం మన్నుతాయి అన్నది. సిలికాన్ సోలార్ సెల్స్ సగటు ఆయుష్షు సుమారు 25 ఏళ్లు. అయితే పెరోవిసై్కట్ పదార్థానికి తడి తగిలితే సరిగ్గా పనిచేయవు. ఆక్సిజన్, వేడి, అతినీలలోహిత కిరణాలను తట్టుకోవడం కష్టం. అందువల్ల వీటి దీర్ఘకాలిక మన్నికపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడుకోవడం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే స్మార్ట్ గ్లాసెస్, తొడుక్కునే ఎలక్ట్రానిక్స్ వంటివి పదే పదే ఛార్జ్ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్పై ఎన్టీయూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలూ జరుపుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరవచ్చు. పెరుగుతున్న ప్రాధాన్యం... 2009లో జపనీస్ శాస్త్రవేత్త సుటోము మియాసాకా పెరోవిస్కైట్ను సోలార్ సెల్స్ తయారీకి వాడవచ్చునని గుర్తించారు. అప్పటి నుంచి దీని ప్రాధాన్యం ఏటికేడాదీ పెరుగుతూ వస్తోంది. 2012 – 13 కల్లా పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ సామర్థ్యం పది శాతానికి చేరింది. 2015 నాటికి 20 శాతం సామర్థ్యంతో సిలికాన్తో సరి సమానమైంది. మరో ఐదేళ్లకు సిలికాన్ – పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ సామర్థ్యం 30 శాతానికి, తాజాగా టాండెమ్ పెరోవిసై్కట్ – సిలికాన్ మాడ్యూల్స్ 35 శాతానికి చేరుకుంది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో ఈ సోలార్ సెల్స్ పైలెట్ స్థాయి ప్రాజెక్టులు నడుపుతూండటం గమనార్హం. –సాక్షి, నేషనల్ డెస్క్


