breaking news
Sakshi Special
-
నౌకా విలాపం..
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమా పోర్ట్కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.మార్చి 4: ఒమన్కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.మార్చి 5: ఇరాక్లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్గార్డ్ ప్రకటించింది.మార్చి 12: ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భాషకందని భావ విన్యాసం
అక్షరాలు లేని కథ రాయాలి. వర్ణాలతోనే భావాలు చెప్పాలి. పరమాత్ముడి రూపానికి పవిత్రంగా జీవం పోయాలి. భారత, భాగవత గాథలు కళ్లకు కట్టినట్టు వివరించాలి. చేతిలోకి తీసుకున్న సాధారణ వస్త్రం పని పూర్తయ్యాక కళాఖండంలా మారాలి. ఇన్ని జరగాలంటే.. కళాకారులు వస్త్ర శస్త్రాలతో విన్యాసం చేయాలి. ఆ విన్యాసాల సమాహారమే కలంకారీ. వస్త్రం ఎంపిక, రంగుల తయారీ, వర్ణాల అద్దకం, భావాల వ్యక్తీకరణ..ఇలా అన్నీ అపురూప ప్రక్రియలే. ఈ మహోన్నత కళకు ఇటీవల సమున్నత గౌరవం లభించింది. – శ్రీకాకుళం కల్చరల్ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ గాథలు, భాగవత కథలు.. ఒక వస్త్రంపై చెప్పే అపురూప కళ కలంకారీ. కలంకారీ చీరల గురించి తెలిసినంత వివరంగా కలంకారీ కళ గురించి అంతగా ఎవరికీ తెలియదు. దేశానికి ప్రముఖులు వచ్చే సందర్భాల్లోనూ, జ్ఞాపికలు ఇవ్వాల్సిన సందర్భాల్లోనూ మొదటి ఎంపిక ఈ కలంకారీ ఆకృతులే. ఈ కళలో వ్రస్తాల ఎంపిక నుంచి తుది అంకం ముగిసేంత వరకు ఓ యజ్ఞమే జరుగుతుంది. వస్త్రం ఎంపిక ఇలా.. కలంకారీ ప్రక్రియలో కాటన్ వ్రస్తాలను వాడుతా రు. ఈ వ్రస్తాన్ని ముందురోజు రాత్రి నీళ్లలో నానబెడతారు. మరుసటి రోజు ఆ గుడ్డను బాగా ఉతికి దానిలో ఉన్న గంజిని పూర్తిగా తీసివేస్తారు. తర్వాత పాలు, కరక్కాయ మిశ్రమాన్ని తయారు చేసి, ఆ మిశ్రమంలో ఈ కాటన్ గుడ్డను బాగా ముంచి దానికి కరక్కాయ–పాలు మిశ్రమం బాగా పట్టుకునేలా రుద్దుతారు. ఆ తర్వాత గుడ్డను పిండి అందులో ఉన్న అదనపు మిశ్రమాన్ని తీసివేసి ఎండలో ఆరనిస్తారు. గుడ్డ బాగా ఆరిన తర్వాత నుంచి కుంచె ప్రక్రియ ప్రారంభిస్తారు. సహజ రంగులు మాత్రమే.. ఈ కళలో సహజమైన మొక్కలు, ఖనిజాల నుంచి తీసిన రంగులను మాత్రమే ఉపయోగిస్తారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, నలుపు, గోధుమ రంగులు ప్రధానమైనవి. ఈ రంగులు బట్టలకు స్థిరంగా ఉండటానికి పటిక, ఇనుప రేకుల వంటి సహజసిద్ధమైన వాటిని ఉపయోగిస్తారు. ఎరుపు రంగును మాడర్ చెట్ల బెరడు లేదా పటిక, బెల్లం నీటి మిశ్రమం నుంచి తయారు చేస్తారు. నలుపును ఇనుప తుప్పు, బెల్లం మిశ్రమం ద్వారా చేస్తారు.పసుపును.. పసుపు, దానిమ్మ తొక్కలు నుంచి తయారు చేస్తారు. నీలం రంగును.. నీలిమందు మొక్క నుంచి తయారు చేస్తారు. ఆకుపచ్చ రంగును .. నీలిమందు, పసుపు రంగులను కలపడం ద్వారా తయారు చేస్తారు. గోధుమ/మట్టి రంగులను.. కాశీ, ఇతర సహజ పదార్థాల నుంచి తీసుకుంటారు. సింథటిక్ రంగులు అస్సలు ఉపయోగించరు.స్త్రీల చిత్రాలకు పసుపు, దేవతల చిత్రాలకు నీలం, రాక్షసుల చిత్రాలకు ఎరుపు / ఆకుపచ్చ రంగులు వాడతారు. మన కళాకారుడు ధను శ్రీకాకుళానికి చెందిన ధను అండ్లూరి ఈ కలంకారీ కళలో రాణిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ధనుంజయ్ పుట్టింది పెరిగింది శ్రీకాకుళంలోనే. తండ్రి జగదీశ్వర్ రావు ఆర్టీసీ మెకానిక్. ధనుకు చిన్ననాటి నుంచి కళలంటే మక్కువ. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆ దిశగా ప్రోత్సహించారు.చదువు కూడా అదే రీతిలో కొనసాగింది. కలంకారీ పెయింటింగ్లో డిప్లమాతో పాటు శిల్ప కళలోనూ ఆయన డిగ్రీలు పొందారు. ‘వైభవ గోవింద’ కళాఖండానికి 2019లో టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. ‘కృష్ణలీల’ చిత్రానికి గాను 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ అవార్డు తీసుకున్నారు. కలమిదే.. ఈ కళలో ఉపయోగించే కలం(కుంచె) చాలా ప్రత్యేకం. వెదురు పుల్లకు, కమ్మలె (లేదా పత్తి) ముక్కను అమర్చి, దారంతో బాగా చుట్టి తయారు చేసే ప్రత్యేకమైన బ్రష్ ఇది. మనకు కావాల్సిన విధంగా ఈ బ్రష్ను చేతితోనే తయారు చేస్తారు.ఎలా వేస్తారంటే..?» వస్త్రాన్ని పాలు–కరక్కాయ మిశ్రమంలో ముంచే ప్రక్రియలన్నీ ముగిశాక కుంచె సహాయంతో నలుపు రంగును ఉపయోగించి, ముందుగా సిద్ధం చేసిన రంగుతో గీయాల్సిన బొమ్మలు, చిత్రాలను గీయడం ప్రారంభిస్తారు. » నలుపు రంగుతో చిత్రాలు పూర్తయ్యిన తర్వాత, ఆ గుడ్డను పారే నీళ్లలో అంటే నది లేదా నీరు పారే కాలువ దగ్గర ముంచి కడుగుతారు. » ఇలా చేయడం వల్ల గుడ్డపై ఎక్కువగా ఉన్న నలుపు రంగు వదిలిపోతుంది.» తర్వాత, మరుసటి రోజు ఎరుపు రంగు ప్రక్రియను ప్రారంభిస్తారు. » గుడ్డను మళ్లీ పాలు, కరక్కాయ మిశ్రమంలో పిండి సిద్ధం చేస్తారు. » తర్వాత స్పటికం లేదా పటిక (అలమ్) ను పొడి చేసి నీళ్లలో కలిపి, ఎక్కడైతే ఎరుపు రంగు రావాలో అక్కడ ఆ నీటిని అద్దుతారు. ఆ తర్వాత ఆరిన గుడ్డను బాయిలింగ్ ప్రక్రియకు తీసుకెళ్తారు. » ఒక పెద్ద కుండలో నీళ్లు పోసి బాగా మరిగిస్తారు. ఆ మరుగుతున్న నీళ్లలో చావలికొడి, మంజిష్ట, సురుడు చెక్క వంటి చెట్ల వేర్లను వేస్తారు. » అప్పుడు ఆ నీరు క్రమంగా ఎరుపు రంగులోకి మారుతుంది.» అందులో ముందుగా పటికతో రాసిన గుడ్డను ముంచి తీసినప్పుడు, ఎక్కడైతే పటిక రాసి ఉంటుందో అక్కడ ఎరుపు రంగు బాగా పడుతుంది.» తర్వాత ఆ గుడ్డను మళ్లీ చల్లని నీళ్లలో ఉతికి, పారే నీళ్లలో బాగా కడుగుతారు.» దీంతో అదనపు రంగు పోయి గుడ్డపై నలుపు, ఎరుపు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. » ఆ తర్వాతి రోజు గుడ్డను మళ్లీ పాలలో పిండి సిద్ధం చేసి, ఆపై పసుపు, నీలం, పచ్చ వంటి ఇతర సహజ రంగులను వేస్తారు. » చివరిగా మళ్లీ వేడి నీళ్లలో బాయిలింగ్ ప్రక్రియ చేసి కలంకారి చిత్రాన్ని పూర్తిచేస్తారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ గౌరవం చిరస్మరణీయం రాష్ట్రపతి చేతులమీదుగా స్మారకం అందుకోవడం చిరస్మరణీయ ఘట్టం. దేశ అత్యున్నత స్థాయిలో కలంకారీ కళకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. – ధను అండ్లూరి, కలంకారీ కళాకారుడు, శ్రీకాకుళం -
వంటింటి వార్కు 'చెక్'..
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్ అయిపోతే? సిలిండర్ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్–ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. గ్యాస్ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్ కుక్టాప్స్), ఎలక్ట్రిక్ కుక్కర్, సోలార్ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. వంటింటి శ్రమను తగ్గించేలా.. స్టవ్తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లు ఒకప్పుడు స్టవ్ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు. పొడులు ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. రెడీమేడ్ ఆవకాయ మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్గా చేసుకుని ఫ్రిజ్లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. చాలా సులభంగా బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి. మంచి ప్రత్యామ్నాయం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులు కూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనేవెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచిప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ. మిక్స్డ్ సలాడ్లు మొలకలు (పెసలు, శనగలుమొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్ రూట్ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కలుపుకోవచ్చు) పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి చాలాసులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినాఫర్వాలేదు. ముల్లంగిపెరుగు పచ్చడి, పచ్చిపులుసు వంటివి అప్పటికప్పుడుతయారుచేసుకోవచ్చు. కొబ్బరి తురుముతో పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే కోసంబరి సిద్ధం. ఈ రెడీమేడ్ లడ్డూలు–తీపి పొడులు కేవలం వంటలే కాదు టైమ్ పాస్కి, స్నాక్స్లా తినడానికి రెడీమేడ్గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. -
విద్యకు విశ్వ ‘భారతం’
సాక్షి, స్పెషల్ డెస్క్: మన దేశంలో విద్యనభ్యసించే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణాసియా నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు భారత్కు వస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి కూడా డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వంటి విధాన సంస్కరణలే ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాలు, గుర్తింపు, ఉపాధి అవకాశాలతో ముడిపడిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. 2025లో వివిధ దేశాలకు చెందిన 58,000 మంది విద్యార్థులు భారత్లో చదువుతున్నట్టు అంచనా. మన దేశంలోని విద్యా సంస్థల్లో చేరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య 2030 వరకు ఏటా సుమారు 8% పెరుగుతుందని అంతర్జాతీయంగా ఉన్నత విద్య సమాచారం, ర్యాంకింగ్స్ను అందించే లండన్కు చెందిన క్యూఎస్ తన ‘క్యూఎస్ గ్లోబల్ స్టూడెంట్ ఫ్లోస్: ఇండియా 2026’నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా గమ్యస్థానాలలో ఒకటిగా భారత్ నిలుస్తుందని వెల్లడించింది. భారత్కు కొత్త అవకాశాలు.. పదేళ్లలో భారత్కు వచ్చే అంతర్జాతీయ వి ద్యార్థుల సంఖ్య పెరగడానికి దేశీయంగా ప్ర భుత్వ విధాన సంస్కరణలు, దక్షిణాసియా –ఆఫ్రికా నుంచి పెరుగుతున్న డిమాండ్, సంప్రదాయ విదేశీ విద్యా గమ్యస్థానాలలో విపరీతంగా పెరుగుతున్న ఖర్చులు ప్రధాన కారణం. భారత్ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2047 నాటికి 5 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తెలి సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా నాణ్యమై న విద్య కోసం అధికం అవుతున్న డిమాండ్ భారత్కు కొత్త అవకాశాలను కలి్పస్తోంది. వీసా నిబంధనలతో.. ఆంగ్లం మాట్లాడే విద్యా గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అక్కడ ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు విపరీతంగా పెరగడం వల్ల ప్రపంచ విద్యా రంగంలో మార్పులు వస్తున్నాయి. దీంతో చాలా మంది విద్యా ర్థులు తక్కువ ఖర్చుతో కూడిన, సులభంగా ప్రవేశం లభించే విద్యా కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్లో విద్యా వ్యయం తక్కువగా ఉండడం, విస్తరిస్తున్న ఉన్నత విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులకు ప్రధాన ఆకర్షణలుగా మారుతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి.. ⇒ పెరుగుతున్న ఆదరణ: దక్షిణాసియా తర్వాత ఆఫ్రికా దేశాల నుంచి ప్రధానంగా సబ్–సహారన్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ⇒ వృద్ధి రేటు: విద్యార్థుల రాక ఏటా 6% వృద్ధి చెందుతుందని అంచనా. ఈ దేశాల్లో యువత ఎక్కువ. ఉన్నత విద్యకు పరిమితమైన అవకాశాలు. ⇒ జింబాబ్వే: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. 2024లో భారత్కు విద్యార్థులను పంపిన దేశాల్లో 7వ స్థానం. 2030 నాటికి 6వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా.. ⇒ స్థిరమైన సహకారం: ఈప్రాంతం నుంచి విద్యార్థుల రాక స్థిరంగా కొనసాగుతోంది. ⇒ యూఏఈ: 2030 నాటికి భారత్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 5% వరకు ఉండే అవకాశం.ఆకర్షణీయమైన అంశాలు..⇒ భౌగోళిక సామీప్యత: పొరుగు దేశాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయా ణ సౌలభ్యం మెరుగ్గా ఉండటం. ⇒ సాంస్కృతిక సారూప్యత: ఆహారం, జీవనశైలి, భాషాపరంగా ఉన్న దగ్గరి సంబంధాలు విద్యార్థులకు సౌకర్యవంతంగా అనిపించడం. ⇒ తక్కువ ఖర్చు: ఇతర దేశాలతో పోలిస్తే విద్యా, జీవన వ్యయాలు చాలా తక్కువగా ఉండటం. ⇒ ప్రధాన సమస్య: భారతీయ విద్యా సంస్థల విషయంలో కంపెనీల దృష్టిలో గుర్తింపు, విద్యాపరమైన గుర్తింపు మధ్య పెద్ద వ్యత్యాసం. ⇒ మెరుగుపడిన ఎంప్లాయర్ ర్యాంకింగ్: గత దశాబ్దంలో భారతీయ గ్రాడ్యుయేట్లపై కంపెనీలకు ఉన్న నమ్మకం, గుర్తింపు గణనీయంగా పెరిగింది. ⇒ స్థిరంగా ఉన్న అకడమిక్ సూచీలు: విద్యా నాణ్యత, పరిశోధనలు, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల పరంగా ఉండే గుర్తింపులో మాత్రం పెద్దగా మార్పు లేదు.భారత్లో చదువుతున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో దక్షిణాసియా దేశాలు దాదాపు సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే విద్యార్థులు మొత్తం ప్రవేశాలలో 30% కంటే ఎక్కువ. రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతం నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా నేపాల్ కొనసాగుతుందని అంచనా. -
'వేడి'.. ప్రాణాలపై దాడి
మూడు అత్యధిక ఉష్ణ సంవత్సరాలుగా 2023, 2024, 2025 రికార్డు సృష్టించినట్లు అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత లానినా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే 2026 కూడా ఈ వరుసలో చేరేలా ఉంది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆసియా ఖండంలో వేడి రెట్టింపవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకీ మన దేశంలో అధిక వేడి ముప్పు స్థితిగతులు ఎలా ఉన్నాయి? అధ్యయనాలేం చెప్తున్నాయి? ప్రభుత్వాలేం చేస్తున్నాయి? -సాక్షి, స్పెషల్ డెస్క్విపత్తు అంటే? భారతీయ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం పగటి ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్, కోస్తా తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీలు దాటితే వడగాడ్పు (హీట్వేవ్) పరిస్థితులు ఏర్పడినట్లు భావిస్తారు. ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే వడగాడ్పు రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే తీవ్ర వడగాడ్పుల రోజుగా ప్రకటిస్తారు. ఎవరికి ఎక్కువ ముప్పు? ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు, వస్తువులు అమ్ముకునే చిరువ్యాపారులు, రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు ఎండ దెబ్బ ముప్పు మరీ ఎక్కువ. ఇతర వయసు్కల కంటే వృద్ధులు, పిల్లలకు ముప్పు ఎక్కువ. 20 డిగ్రీల సెల్సియస్కు మించి పెరిగే ఎండ వల్ల ప్రతి డిగ్రీకి 2–3 శాతం మేరకు పని సామర్థ్యం తగ్గిపోతోంది.57 శాతం జిల్లాలకు అధిక వేడి ముప్పు కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోని సగానికి పైగా (57%) జిల్లాల్లో అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 734 జిల్లాలకు గాను 151 జిల్లాలు అధిక వేడి ముప్పును, 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే జీవిస్తున్నారు. గత 40 ఏళ్లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పగళ్ల కంటే రాత్రులే ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ఏసీలు, కూలర్ల వాడుక ఎంత? మండే ఎండలను తట్టుకునేందుకు గదుల్లో కూలింగ్ సదుపాయం కల్పించుకోవటం ప్రజలకు నిత్యావసరంగా మారుతోంది. నేషనల్ శాంపిల్ సర్వే (2024) గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం కుటుంబాలు, నగరాలు/పట్టణాల్లో 42 శాతం కుటుంబాలు మాత్రమే ఎయిర్ కండిషనర్లు లేదా కూలర్లను ఉపయోగిస్తున్నాయి. రిఫ్రిజిరేటర్లను మాత్రం 33 శాతం గ్రామీణ కుటుంబాలు, 68 శాతం నగర/పట్టణ కుటుంబాలు వాడుతున్నాయి. ఏటా5.46 లక్షల మంది మృతి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ అధ్యయనం ప్రకారం ఆరుబయట పనులు చేసే 160 కోట్ల మందికి అధిక వేడి ముప్పుఎక్కువగా ఉంది. కూలింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న భారత్ సహా 77 దేశాల్లోని 100 కోట్ల మందికి ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంది. ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 5,46,000 మంది చనిపోతున్నారని ‘సస్టెయినబుల్ ఎనర్జీ ఫర్ ఆల్’సంస్థ నివేదిక చెబుతోంది. 2024లో మేల్కొన్న ప్రభుత్వంఅధిక వేడి ముప్పు గత మూడేళ్లలో ఉధృతం కావటంతో అధిక వేడిని తట్టుకునే ప్రత్యేక ప్రణాళికలతో పాలకులు సంసిద్ధతను పెంచుకోవటం తప్పనిసరైంది. అధిక వేడిని ఒక విపత్తుగా పరిగణిస్తూ 2024లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. వడగాడ్పుల బాధితుల కోసం విపత్తు సహాయక నిధులను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీంతో అవకాశం ఏర్పడింది. అనేక రాష్ట్రాలు నగర, జిల్లా, స్థానిక స్థాయిలో హీట్ యాక్షన్ ప్లాన్లను రూపొందించుకోవటం ప్రారంభించాయి. ఫలితంగా కొన్ని చోట్ల అధిక వేడిని తట్టుకునే ఉపాయాలను ప్రభుత్వ స్థాయిలో అమలు చేయడం మొదలైంది. -
ఏఐ ఆఫీసర్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్–కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్మానవ శ్రమను భర్తీ చేయలేదుకొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 1980ల్లో స్ప్రెడ్షీట్స్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్కీపింగ్ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. ఏఐ నిపుణుల కొరత.. మ్యాన్పవర్ గ్రూప్ నిర్వహించిన గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ సర్వే ప్రకారం.. భారత్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్–4లో భారత్ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. ఏఐ లిటరసీ, ఏఐ మోడల్ డెవలప్మెంట్ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో.. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రిసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలంటే.. ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్ స్థాయి ’చీఫ్ ఏఐ ఆఫీసర్స్’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్ పెరగనుంది. వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్ అనలిస్ట్ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, స్మార్ట్ గ్రిడ్ అనలిస్ట్ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్ టూల్స్ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది. -
శత్రు భయంకర క్షిపణి
ఇరాన్పై ఇంతకు మునుపెన్నడూలేనంతగా విచ్చలవిడిగా దాడులు చేస్తున్న అమెరికా బలగాలు తాజాగా తమ అమ్ములపొదిలోని మరో నూతన క్షిపణిని ఇరాన్ మీదకు ప్రయోగించాయి. ప్రపంచంలో ఆయుధాల తయారీరంగ దిగ్గజం లాక్హీడ్ మార్టీన్ ప్రత్యేకంగా అమెరికా బలగాల కోసం అభివృద్ధిచేసి ఇచ్చిన ‘ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్(పీఆర్ఎస్ఎం) సైతం ఇప్పుడు ఇరాన్పై దాడులకు సిద్ధమైంది.యుద్ధంలో పీఆర్ఎస్ఎంను తొలిసారిగా ఉపయోగించినట్లు అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ‘‘చరిత్రలోనే తొలిసారిగా దీర్ఘ శ్రేణి క్షిపణి పీఆర్ఎస్ఎంను ఇరాన్పై మొదలెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఉపయోగించాం. తీవ్రమైన దాడులను విజయవంతంగా పూర్తిచేసింది. క్షిపణుల సాయంతో శత్రుసేనలను ఎటూ పాలుపోకుండా చేస్తున్న మా సాయుధ బలగాల శక్తియుక్తులను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో వ్యాఖ్యానించారు. క్షిపణి లాంచర్ అయిన హైమొబిలిటీ ఆర్టీలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ఎం142 నుంచి పీఆర్ఎస్ఎంను ప్రయోగించిన వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ తన ఖాతాలో షేర్చేశారు. దాడిచేస్తే తప్పించుకోవడం కల్ల.. అమెరికాలోని మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేసే లాక్హీడ్ మార్టీన్ సంస్థ 2023 డిసెంబర్లో ఈ రకం క్షిపణులను అమెరికా బలగాలను అప్పగించింది. కనిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంలో నాశనంచేయడం పీఆర్ఎస్ఎంల ప్రత్యేకత. రాకెట్లను ప్రయోగించే వాహనాలైన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(ఎంఆర్ఎల్ఎస్)తోపాటు హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ల నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు.ముఖ్యంగా ఎంఎల్ఆర్ఎస్ఎం–270, హైమార్స్ఎం–142 వాహనాల మీద నుంచి కొత్త క్షిపణులను ఎంతో సులభంగా ప్రయోగించవచ్చు. దీని దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. క్షిపణిని ఇతర రకాల లాంచర్ల నుంచి సైతం ప్రయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో ఎలాగైనా ఇతర లాంచర్ల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ‘ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్’విధానంలో దీనిని రూపొందించారు. వేర్వేరు ఇతర కంపెనీల లాంచర్ నుంచి ఎంతో వేగంగా దీనిని ప్రయోగించవచ్చు. అత్యంత సురక్షితం.. యుద్ధక్షేత్రాలకు తరలించే క్రమంలో పొరపాటున పేలిపోయే అవకాశమే ఉండదు. ప్రయోగించకముందే రవాణా సమయంలో పొరపాటున కిందపడినా, అగి్నకి ఆహుతైనా, పదునైన వస్తువులు గుచ్చుకున్నా ఇది పేలదు. కేవలం ప్రయోగించాక ట్రిగ్గర్ను క్రియాశీలంచేశాక మాత్రమే భారీస్థాయిలో పేలిపోయి పెనువినాశనం సృష్టిస్తుంది. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ఏటీఏసీఎం)గా పిలిచే దీర్ఘశ్రేణి పాత తరం ఎంజీఎం–140 బాలిస్టిక్ క్షిపణుల స్థానంలో కొత్త పీఆర్ఎస్ఎంలను తీసుకొచ్చారు. ఇవి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు.పాత క్షిపణుల పరిధి కేవలం 300 కిలోమీటర్లుకాగా కొత్త క్షిపణుల పరిధి 500 కిలోమీటర్లు. దీంతో పాత లాంచర్ల మీద నుంచే మరింత ఎక్కువ దూరాలకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీలు చిక్కిందని అమెరికా ఆర్మీ అధికారులు చెప్పారు. దుబాయ్ సమీపంలోని రస్ అల్ ఖైమా సమీపంలోని మూసండం ద్వీపకల్పం ఇరాన్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే పరిధితో పనిచేసే పీఆర్ఎస్ఎంలతో ఇరాన్పైకి నిరాటంకంగా దాడిచేయాలని అమెరికా భావిస్తోంది.రష్యాతో 1987లో కుదుర్చుకున్న మధ్య శ్రేణి అణ్వాస్త్రాల నిరోధక చట్టం అమల్లో ఉంటే పీఆర్ఎస్ఎస్ల వినియోగానికి అవరోధాలు ఎదురయ్యేవి. 2019లో ఈ ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడంతో కొత్త క్షిపణుల తయారీ, వినియోగానికి అమెరికా తలుపులు బార్లా తెరిచిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి,నేషనల్ డెస్క్ -
నాయకి..
దేశంలో మహిళా నిపుణులు నాయకత్వ స్థానం కోసం ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు పని ప్రదేశంలో సమానత్వాన్ని సైతం కోరుకుంటున్నారు. నియామకాల్లో వివక్ష, వేతన వ్యత్యాసాలు ఇప్పటికీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ.. వారు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. ‘మహిళా నిపుణులు ఏమి కోరుకుంటున్నారు’పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ తన రెండవ ’వాయిస్ ఃవర్క్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 50కిపైగా పరిశ్రమలకు చెందిన 50,000 మందికిపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను గుర్తించడానికి, వాటిని సరిదిద్దడానికి క్రమబద్ధమైన విశ్లేషణ (ఈక్వల్ పే ఆడిట్) జరగాలని కోరుకుంటున్నారు. అంటే సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్ భారీగా పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే మెన్స్ట్రువల్ లీవ్కు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్టాప్లో హైదరాబాద్..సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 83% మంది తాము నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. గత ఏడాది జరిపిన సర్వేలో మూడింట రెండొంతుల మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళా నాయకత్వానికి అత్యధిక స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడంలో హైదరాబాద్ (86%) టాప్లో నిలిచింది. అయితే కార్యాలయాల్లో వివక్ష ఇప్పటికీ ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. దాదాపు ఇద్దరు మహిళల్లో ఒకరు తమ వివాహం లేదా మాతృత్వ ప్రణాళికల గురించి ఉద్యోగ ఇంటర్వ్యూలలో వెల్లడించడానికి సంకోచిస్తున్నారు. వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఇందుకు కారణం. ఫ్రెషర్స్లో 29% మంది, 10–15 ఏళ్ల పని అనుభవం ఉన్న నిపుణులలో 40% మంది ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కార్యాలయాల్లో వేతన సమానత్వం లేదని మూడింట ఒక వంతు మంది భావిస్తున్నారు. నియామకాలు, పదోన్నతుల్లో పక్షపాతం చూపిస్తున్నారని 42% మంది తెలిపారు.మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ప్రోత్సాహాన్ని పొందుతున్నారని భావిస్తున్నారా?అవును 83%కాదు 17% -
అన్నింటా 'ఆమె'
అడ్డంకులను అధిగమిస్తూ.. అవహేళనలు, అవమానాలను దాటుకుంటూ నేడు అన్ని రంగాలనూ ఆమె జయిస్తోంది. దేశ రక్షణ మొదలు క్రీడల వరకు.. ప్రభుత్వ కొలువుల నుంచి ప్రైవేటు ఉద్యోగాల దాకా అన్నింటా తనదైన ముద్ర వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి బడ్జెట్ తయారు చేయడం నుంచి దేశ బడ్జెట్ రూపొందించే స్థాయి దాకా అతివ హవా కొనసాగుతోంది. దేశంలో నారీ శక్తి ఇప్పుడు కేవలం నినాదానికే పరిమితం కాకుండా అదొక నిరంతర ప్రవాహంగా మారింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళామణుల సమాహారం. – సాక్షి, హైదరాబాద్దేశ రక్షణకు పాటుపడుతూ.. దేశ రక్షణ రంగంలోనూ అతివలు చురుగ్గా రాణిస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ (పోరాటంలో మొదటి మహిళా యుద్ధ పైలట్), కల్నల్ సోఫియా ఖురేషి (విదేశాలలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ) ఉన్నారు. భారత నావికాదళ యుద్ధనౌకకు మొదటి మహిళా కమాండర్గా ప్రేరణ దేవస్థలీ గుర్తింపు పొందారు. రక్షణ రంగం (డిఫెన్స్) లో భావనా కాంత్తోపాటు అవని చతుర్వేది మోహనా సింగ్ దేశ తొలితరం ఫైటర్ పైలట్లుగా ఖ్యాతిగాంచారు. అంతరిక్షం రంగంలో రీతూ కరిధాల్ (రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా) మంగళయాన్, చంద్రయాన్–2 మిషన్లలో కీలకపాత్ర పోషించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్లో పారామిలిటరీ దళాల్లో పూర్తిగా పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి సిమ్రాన్ బాలా నాయకత్వం వహించారు. ‘భారత క్షిపణి మహిళ’గా పేరుగాంచిన డాక్టర్ టెస్సీ థామస్ డీఆర్డీవోలో కీలకమైన క్షిపణి ప్రాజెక్టులను ముందుండి నడిపించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో 20–30% మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆటల్లో ఐకాన్లుగా..క్రీడారంగంలో మేరీ కోమ్ (బాక్సింగ్) మిథాలీ రాజ్ (క్రికెట్) వంటి క్రీడల్లో ఐకాన్లుగా మారారు. పి.వి. సింధు (బ్యాడ్మింటన్) రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. వివిధ రంగాల్లో ముందంజ...దేశంలో 20% స్టార్టప్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 2022 నాటికి అగ్రశ్రేణి కంపెనీలలో సీఈవో/ఎండీ పాత్రలలో మహిళా ప్రాతినిధ్యం 55% పెరిగింది. ప్రముఖ వ్యక్తులలో ఫల్గుణి నాయర్ (నైకా), కిరణ్ మజుందార్–షా (బయోకాన్) అగ్రభాగాన కొనసాగుతున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిశ్రమలో 30% మంది, వ్యవసాయ శ్రామికశక్తిలో దాదాపు 42% మంది అతివలు ఉన్నారు. జార్ఖండ్లోని ‘రాణి మిస్త్రీలు’(క్వీన్ మేస్త్రీలు) భవన నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం ద్వారా సంప్రదాయ పాత్రలకు మించి ముందుకు సాగుతున్నారు. ఇంకా సవాళ్లు.. : అనేక రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నప్పటికీ మహిళలు ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లింగ వేతన అంతరం ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే ఒకే రకమైన పనికి మహిళలకు తక్కువ వేతనం లభిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో లింగ వేతన అంతరం ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో వ్యవసాయంలో జీతం లేని కుటుంబ కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్పొరేట్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు ఉన్నతస్థాయి నాయకత్వ స్థానాలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు, సీనియర్ స్థాయిల్లో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ‘బోర్డు’ల్లోనూ ఆమెప్రైవేట్ సంస్థల్లో 29% బోర్డు డైరెక్టర్ పదవులను, ప్రభుత్వ సంస్థల్లో 20% డైరెక్టర్ల పోస్టుల్లో మహిళలు కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలోని మొత్తం సంస్థల డైరెక్టర్ల పదవుల్లో 32 శాతం అతివలు ఉన్నారు. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్ కంపెనీలు మొత్తం పురుష బోర్డుల కంటే సగటున 16% నుంచి 29% ఎక్కువ నిధులను సేకరించాయి. 2015 తర్వాత స్థాపించిన కంపెనీలు పాత సంస్థల కంటే (16%) ఎక్కువ వైవిధ్యాన్ని (20% మహిళలు) కలిగి ఉన్నాయి. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్ కంపెనీలు, పూర్తిగా పురుషుల బోర్డులు ఉన్న వాటి కంటే ఏడాదిలోగా పబ్లిక్గా ఇష్యూకు వెళ్లే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఇంజనీర్, ర్యాపర్, మేయర్.. బాలేన్
ఆయన పాటలు జెన్ జెడ్ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన ఆయన ఇప్పుడు ప్రధాని అయి నేపాల్ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అతడే బాలేంద్ర షా..నేపాలీలు ముద్దుగా పిల్చుకునే బాలేన్..!మార్చి 4వ తేదీ. మరో రెండు రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుండగా ఝాపా జిల్లా వాసులు బాలేన్తో సెల్ఫీ కోసం క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారం కోసం వచి్చన బాలేన్తో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో, కార్యకర్తలు వారిని నియంత్రించే పనిలో బిజీ అయిపోయారు. బాలేన్తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడే వారిని క్యూలో నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి 10 సెకన్ల చొప్పున సమయమిచ్చారు. ఆ జనం మధ్యలో బాలెన్ నిలబడి ఉన్నారు. నల్లటి బ్లేజర్, నీటుగా ట్రిమ్ చేసిన గడ్డం, తనదైన స్టయిల్లో దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఆయన వారిని బాలేన్, ఒక కరచాలనం, ఒక చిరునవ్వు, ఒక సెలీ్ఫతో సంతోషపెడుతున్నారు. బాలేన్ ధరించే దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలు ఇప్పటికీ ఆన్లైన్లో బాలేన్ షా గ్లాసెస్ పేరుతో జనం కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇంతటి జనాదరణ కలిగిన 36 ఏళ్ల బాలేన్..అదే బాలేంద్ర షా కఠ్మాండుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్ నారాయణ్ షా నలుగురు కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షతో మెలిగిన ఇతడికి కవితలు రాయడమంటే తెగపిచి్చ. నేపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర, భారత్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చదివాడు. 2013లో నేపాల్లో బాగా పేరున్న ర్యాబార్జ్ పోటీలో గెలుపొందాడు. అందులో బాలేన్ అవినీతి, రాజకీయ స్తబ్ధత, వారసత్వ పాలన వంటి వాటిపై స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని విమర్శకులు అంటున్నారు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తుంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు. అమెరికా, చైనాతోపాటు భారత్నూ వదల్లేదు..!గతేడాది సెప్టెంబర్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలేన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ, ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్లను తిట్టిపోసిన బాలేన్..వీరితో ఏపనీ కాదంటూ ఫేస్బుక్లో షాకిచ్చే పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాలేన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ 16 వేల సార్లు ప్రస్తావనకు వచి్చనట్లు అంచనా. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. రెండు నెలల అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేసిన రా్రïÙ్టయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు. మేయర్గా దూకుడు... 2022లో బాలేన్ కఠ్మాండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యరి్థగా పోటీకి దిగి ఏకంగా 61 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న పారీ్టలను షాక్ తినిపించారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. కఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. 2025 సెప్టెంబర్లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్జెడ్ ఆందోళనలు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముందుంది ‘యుద్ధ గండం’.. ట్రంప్నకు భారీ షాక్?
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి వారం రోజులవుతోంది. ఈ యుద్ధం పశ్చిమాసియాలో తొమ్మిది దేశాలకు విస్తరించింది. ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సైన్యం ఎక్కడా తగ్గకుండా శక్తిమేరకు పోరాడుతోంది. ఇజ్రాయెల్తోపాటు పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలకే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సొంతదేశంలో అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తోంది. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘర్షణను త్వరగా ముగించకపోతే మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, చివరకు ట్రంప్కు పదవీ గండం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ను ఎలాగైనా లొంగదీసుకోవడానికి అమెరికా సైన్యం వనరుల సమకూర్చుకుంటోంది. తమ సైన్యాన్ని, ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ యుద్ధం మరో ఆరు నెలలకుపైగానే.. అంటే సెపె్టంబర్ దాకా కొనసాగే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణిస్తే యుద్ధం ముగిసిపోతుందని, ఇరాన్ తలవంచడం ఖాయమని, అక్కడ ప్రభుత్వం మారిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. కానీ, క్షేత్రస్థాయిలో జరుగున్నది మరొకటి. ఖమేనీ హత్యపట్ల ఇరాన్ ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా వారంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేని యుద్ధం సుదీర్ఘ యుద్ధానికి ఇజ్రాయెల్తోపాటు అమెరికా సైతం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఇరాన్లో నిఘా కార్యకలాపాలు ముమ్మరం చేస్తోంది. అదనంగా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులను ఫ్లోరిడాలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపించాలని పెంటగాన్కు యూఎస్ సెంట్రల్ కమాండ్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు రష్యా నుంచి 30 రోజులపాటు చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్కు అమెరికా తాత్కాలికంగా మినహాయింపు ఇచి్చంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా రోజులు పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో జరిగే యుద్ధాలు కొన్ని నెలలపాటు కొనసాగుతుంటాయి. ఇరాన్లో యుద్ధానికి అప్పటికప్పుడు ప్రణాళిక తయారుచేశారు. ముందస్తు సన్నద్ధత అంటూ ఏదీ లేదు. అందుకే ఇది ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్కు నష్టమెందుకు? అమెరికాలో నవంబర్లో మిడ్టర్మ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ట్రంప్ రెండేళ్ల పాలన పూర్తి కావడానికి ముందు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇరాన్ యుద్ధం ఈ ఎన్నికలపై గట్టి ప్రభావం చూపడం తథ్యమని అంటున్నారు. ట్రంప్ అనవసరంగా ఈ యుద్ధం తెచి్చపెట్టారన్న అభిప్రాయం అమెరికాలో వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని అంటున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. రిపబ్లికన్ పారీ్టలో చీలిక కనిపిస్తోంది. ట్రంప్ను వ్యతిరేకించేవారు ఎక్కువవుతున్నారు. తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ అండతోనే ఇరాన్పై దాడులు ఆరంభించామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. తద్వారా ట్రంప్ పోద్బలంతోనే ఇరాన్లో నిప్పుల కుంపటి రగించారని అమెరికన్లు నిర్ణయానికొచ్చారు. అసలు ఖమేనీని హత్య చేయడం వెనుక ఔచిత్యం ఏమిటని ప్రశి్నస్తున్నారు. గత అమెరికన్ అధ్యక్షులు ఇరాన్పై యుద్ధానికి ఇష్టపడలేదు. ఆ పని మొదట తానే చేశానని ట్రంప్ గొప్పగా చెప్పుకోవడం ప్రజలకు రుచించడం లేదు. యుద్ధ ప్రభావం ఇప్పటికే మొదలైంది. ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నాయి. ఇవన్నీ ట్రంప్కు సవాలుగా మారుతున్నాయి. మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు లభిస్తే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకోవాలన్న డిమాండ్లు సొంత పారీ్టలోనే ఊపందుకోవచ్చు. అది ప్రజా ఉద్యమంగా మారితే ట్రంప్ మధ్యలోనే దిగిపోక తప్పదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
భీకరపోరుకు 7 రోజులు
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి ఏడు రోజులు పూర్తయ్యాయి. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలోని పలు ఇతర దేశాలు కూడా దాడుల బారిన పడుతున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా సరుకు రవాణా పడకేయడంతో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటిదాకా ఇరాన్లో కనీసం 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్లో పదుల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇరాన్పై దాడులను కనీసం మరో రెండు వారాలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్, నాలుగైదు వారాలు పట్టొచ్చని అమెరికా చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక హెజ్బొల్లా గ్రూపు వంటివాటి రంగప్రవేశంతో రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మరింతగా విస్తరిస్తూ వస్తోంది. పశ్చిమాసియా కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా దీర్ఘకాలం పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల పాటు యుద్ధం ఎలా సాగిందో చూస్తే... ఒకటో రోజు ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్, ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఫిబ్రవరి 28న శనివారం ఇరాన్పై భారీ స్థాయి యుద్ధానికి దిగాయి. బరిలోకి దిగుతూనే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయడం ద్వారా ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాయి! ఆయన నివాస, కార్యాలయ ప్రాంగణంలో అత్యున్నత స్థాయి రక్షణ భేటీ జరుగుతుండగా పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఏకంగా 30కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఖమేనీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవద్దనే ఉద్దేశంతో అత్యంత శక్తిమంతమైన బ్లూ స్పారో క్షిపణిని కూడా ప్రయోగించినట్టు తాజాగా తేలింది! ఖమేనీ భార్య, కోడలుతో పాటు కనీసం 40 మందికి పైగా ఉన్నత స్థాయి నేతలు, సైనిక కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారు. ఆ వెంటనే ఇరాన్ అణు, సైనిక, క్షిపణి లంచ్ ప్యాడ్ వ్యవస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా 100కు పైగా యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ భవనాలు, అధ్యక్ష భవనంతో పాటు రాజధాని టెహ్రాన్వ్యాప్తంగా క్షిపణుల వర్షం కురిసింది. ఓ స్కూలుపై జరిగిన దాడిలో 165 మందికి పైగా విద్యారి్థనులు దుర్మరణం పాలయ్యారు. అనూహ్య దాడి నుంచి తేరుకుని ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై భారీగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడికి దిగింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యం చేసుకుంటూ యూఏఈ మొదలుకుని దోహా దాకా పలు దేశాలపై దాడులు చేయడంతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిగా మారింది. రెండో రోజు ఇరాన్కు చెందిన తొమ్మిది యుద్ధ నౌకలను అమెరికా ముంచేయడంతో యుద్ధం మరింతగా విస్తరించింది. అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దాడులు నేలమట్టం చేశాయి. ఇరాన్వ్యాప్తంగా 100కు పైగా నగరాలపైకి దాడులు విస్తరించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం నమోదయ్యాయి. ఇరాన్ దాడుల్లో అమెరికాకు కూడా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కువైట్లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. ఇజ్రాయెల్లోని బేట్ షెమెష్ నగరంలోనూ 9 మంది మృత్యువాత పడ్డారు. మూడో రోజు హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దులపైకి క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం లెబనాన్కు కూడా విస్తరించింది. అక్కడి హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ నిల్వలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దాంతో ఒక్క బీరూట్లోనే 31 మందికి పైగా మరణించారు. దేశమంతటా మృతుల సంఖ్య 50 దాటింది. గల్ఫ్లోని చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది! డ్రోన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీపై స్వల్పంగా దెబ్బ తింది. దాంతో ఆ క్షేత్రాన్ని సౌదీ మూసేసింది. కువైట్ ఫైటర్ జెట్ జరిపిన ‘ఫ్రెండ్లీ ఫైర్’లో అమెరికా ఏకంగా మూడు యుద్ధవిమానాలను కోల్పోయింది! వాటిలోని పైలట్లు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. వాటిని కూలి్చంది తమ యుద్ధ విమానాలేనని ఇరాన్ చెప్పుకొచ్చింది. నాలుగో రోజు ఇరాన్పై దాడులను అమెరికా తీవ్రతరం చేసింది. సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై బీ–2 బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులను తీవ్రతరం చేసింది. కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించింది. దానిగుండా ప్రయాణించే నౌకలకు నిప్పు పెడతానని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా సౌదీ రాజధాని రియాద్తో పాటు కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో వాటిని మూసేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దోహా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్పై కూడా ఇరాన్ పెద్దపెట్టున దాడులు జరిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల పోరుకు దిగింది! 80 సరిహద్దు గ్రామాల వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది.ఐదో రోజు యుద్ధం టర్కీ దాకా విస్తరించింది. ఆ దేశంపైకి ఇరాన్ ఏకంగా ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. భారత్తో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్కు చెందిన భారీ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాపై శ్రీలంక తీర సమీపంలో అమెరికా దాడి చేసింది. మార్క్–48 టోర్పెడో ప్రయోగించి దాన్ని ముంచేసింది. నౌకలోని 120 మందిలో 87 మంది మరణించారు. గల్ఫ్లోని తమ స్థావరాలను కాపాడుకునేందుకు పలు యూరప్ దేశాలు కూడా ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. ఆరో రోజు టెహ్రాన్ గగనతలంలో ఇరాన్ సుఖోయ్–35 యుద్ధ విమానాన్ని ఇజ్రాయెలీ ఎఫ్–35 ఫైటర్ జెట్ నేలకూల్చింది. ఇరాన్లో 170కి పైగా నగరాలు దాడులకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,230 దాటింది. తమ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై డ్రోన్లు, బోట్లతో దాడికి దిగింది. కువైట్, ఇరాక్ల్లో కూడా మరో రెండు చమురు నౌకలను నష్టపరిచింది. దాడులు అజర్బైజాన్కు కూడా విస్తరించాయి. ఇరాన్ డ్రోన్ల దాడిలో అక్కడి నఖ్చివాన్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ఏడో రోజు ఇరాన్పై క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగాయి. దక్షిణ ఇరాన్ను అమెరికా, మధ్య, పశ్చిమ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేశాయి. లెబనాన్పై కూడా దాడులను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. టెల్ అవీవ్పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. పశ్చిమాసియా, పరసర ప్రాంతాల్లో ఇప్పటికే 14 దేశాలు యుద్ధంతో ప్రభావితమవుతున్నాయి.ఎన్నెన్ని సమస్యలో! యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హార్మూజ్ గుండా భారత్కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు. ఏం జరగనుంది? యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. అయితే రెండు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పరుగే జీవితం
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది. ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్కి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్లో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.మార్చుకున్న షెడ్యూల్...చదువుకునే రోజుల్లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబుల్ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్లో నా జీవన శైలి ఉంటుంది. విదేశీ పోటీల్లోనూ...దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్ కాంపిటిషన్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఈ యేడాది జనవరిలో అజ్మీర్లో జరిగిన రన్నింగ్ రేస్లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విజయ వర్ణాలు
కాంతిపుంజంలో ఏడు రంగులు దాగి ఉంటాయి. స్త్రీ సామర్థ్యం ఒక కాంతి కిరణమే! ప్రసరించే ప్రతిచోటా వెలుతురై వెల్లివిరుస్తుంది. ప్రతి రంగూ మరో రంగుకు బలం ఇస్తుంది. స్త్రీలు ఆకాశంలో సగం మాత్రమే కాదు.. ఆకాశమంతా నిండిన ఏడు వర్ణాలు. ఇక్కడ ఏడు రంగాల్లో ఏడు గెలుపు కథలు చదవండి.మ్యాథ్స్ మాస్ట్రో నళిని అనంత రామన్ రంగం గణితంప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలలో నళిని అనంత రామన్ ఒకరు. డైనమిక్ సిస్టమ్స్, క్వాంటంపై నళిని విశేష కృషి చేశారు. ఆమె పరిశోధన హెన్రీ పాయింకేర్ ప్రైజ్, ఇన్ఫోసిస్ ప్రైజ్తో పాటు అనేక అంతర్జాతీయ గుర్తింపులను సాధించింది. గణితంపై పని చేస్తున్న ప్రముఖ పరిశోధకులలో ఒకరిగా నిలిచింది. తల్లిదండ్రులిద్దరూ గణిత శాస్త్రవేత్తలు కావడంతో నళినికి అంకెలతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. గణితానికి సంబంధించిన విశేషాలు వినడం అంటే కథలు విన్నంత సంతోషంగా ఉండేది. ‘గణితాన్ని బాగా ఇష్టపడేదాన్ని. అలా అని ఇతర సబ్జెక్లను నిర్లక్ష్యం చేయలేదు’ అని బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు నళిని. పదహారు సంవత్సరాల వయసులో ఫ్రాన్స్లో గణితానికి ప్రసిద్ధి చెందిన ‘ఎకోల్ నార్మల్ సుపీరియర్’ విద్యాసంస్థలో చేరింది. పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత అనేక పరిశోధన సంస్థలలో పనిచేశారు నళిని. ప్రస్తుతం స్ట్రాస్బోర్గ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సంక్లిష్టమైన గణిత సమస్యలను తేలికైన ఉదాహరణలతో అర్థం చేసుకునేలా చేయడం ఆమె ప్రత్యేకత. డైనమిక్ సిస్టమ్కు సంబంధించిన సారాంశాన్ని బిలియర్డ్స్ టేబుల్పై దొర్లే బంతిని ఉదాహరిస్తూ చెబుతుంటారు.చరిత్ర సృష్టించిన విజయంపూజా కృష్ణమూర్తిరంగం: క్రీడలుబ్రెజిల్ 135 ఆల్ట్రాను పూర్తి చేయడం ద్వారా పూజా కృష్ణమూర్తి చరిత్ర సృష్టించింది. 135 మైళ్ల కఠినమైన రేసుకు అర్హత పొంది విజయం సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. 48 గంటలలోనే ఈ రేసును పూర్తి చేసింది. ఈ ఘనత ఆమెను ప్రపంచ ప్రఖ్యాత రన్నర్లలో ఒకరిగా నిలిపింది. పర్వతాలతో ప్రేమ పూజాకు చిన్న వయసు నుంచే మొదలైంది. పూజ ను, ఆమె సోదరి ప్రియాను వారి తల్లి హిమాలయాలలో ట్రెక్కింగ్కు తీసుకెవెళ్లేది. ‘ట్రెక్కింగ్ వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఓర్పు, క్రమశిక్షణ’ అని చెబుతుంది పూజ. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ చేసిన పూజ ఆ తరువాత ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరింది. పరుగు అనేది ఆమె జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. 2011లో తల్లి, సోదరితో కలిసి హాఫ్–మారథాన్కు వెళ్లింది. ‘ఐదు కిలోమీటర్ల నా మొదటి పరుగు ప్రయాణం అలా మొదలైంది’ అంటూ జ్ఞాపకాల దారులలోకి వెళుతుంది పూజ. హాఫ్–మారథాన్ తరువాత పది కిలోమీటర్ల రేసులలో పాల్గొనడం మొదలుపెట్టింది. సరదాగా మొదలైన పూజాకృష్ణమూర్తి పరుగు ప్రయాణం చరిత్ర సృష్టించే వరకు వెళ్లింది.నవ యువ స్వర సంచలనం హన్సికా పరీఖ్రంగం: సంగీతంఇండియన్ పాప్ మ్యూజిక్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సికా పరీఖ్. అజ్మీర్లోని సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన హన్సికా పరీఖ్కు సంప్రదాయ సంగీతం మాత్రమే కాదు నవతరం సంగీతం అంటే కూడా ఇష్టం. చిన్నప్పటి నుంచి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మునిగి తేలింది హన్సిక. అలా అని అక్కడే ఉండి పోలేదు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సంగీత ధోరణుల గురించి తెలుసుకునేది. ఆమె పాట ప్రస్థానం ఎలా ప్రారంభం అవుతుంది అంటే.. మొదట ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ట్యూన్ క్రియేట్ చేస్తుంది. ఆ ట్యూన్ను మెల్లగా మనసు పొరల్లోకి తీసుకుంటూ పదాలు అల్లుతుంది. ‘కొత్త సంగీత ధోరణుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కొత్త ఆర్టిస్ట్లతో పనిచేయడం కూడా అంతే ముఖ్యం’ అంటుంది హన్సికా పరీఖ్.చిత్ర సంచలనంగీతా గంభీర్రంగం: సినిమాఈ సంవత్సరం ఆస్కార్ డాక్యుమెంటరీ రేసులో సంచలనం సృష్టించారు భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్ గీతా గంభీర్. రెండు వేర్వేరు చిత్రాలకు రెండు నామినేషన్లు సాధించారు. ‘ది పర్ఫెక్ట్ నైబర్’ అనే ఆమె చిత్రం ఫీచర్స్ విభాగంలో ‘బెస్ట్ డాక్యుమెంటరీ’కి నామినేట్ అయింది. మరో చిత్రం ‘ది డెవిల్ ఈజ్ బిజీ’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్కు నామినేట్ అయింది. నామినేషన్లకు ముందే ఈ రెండు చిత్రాలు అకాడమీ 15 షార్ట్ లిస్ట్లో ఉన్నాయి. ‘రెండు చిత్రాలను చాలా ప్రేమతో, శ్రద్ధతో నిర్మించాను. ఈ చిత్రాలకు వచ్చిన స్పందన సంతోషంగా ఉంది’ అంటున్నారు గీత. గీతా గంభీర్ బోస్టన్లో జన్మించారు. ఆమె తండ్రి శరద్ ఇంజినీరింగ్ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న గీత డాక్యుమెంటరీ ఫిల్మ్మేకింగ్తో తన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫిల్మ్ ఎడిటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత నాన్ ఫిక్షన్ ప్రోగ్రామింగ్ విభాగంలో అత్యుత్తమ పిక్చర్ ఎడిటింగ్లో రెండు ఎమ్మీ అవార్డ్లను గెలుచుకున్నారు.గేమ్ చేంజర్ఆశా శర్మరంగం: గేమింగ్తమ గేమింగ్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీయీవోగా ఆశా శర్మను నియమించింది మైక్రోసాఫ్ట్. యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటాలోని కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్న ఆశాశర్మకు టెక్నాలజీ, ప్రాడక్ట్, ఆపరేషన్ లీడర్షిప్లకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. 2011లో మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విభాగంలో తన కెరీర్ ప్రారంభించింది ఆశ. రెండు సంవత్సరాల తరువాత పోర్చ్ గ్రూప్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టింది. ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అమ్మకాలు, మార్కెటింగ్... మొదలైన వాటికి సంబంధించిన బాధ్యతలు చూసేది. ‘ఏ బాధ్యత తీసుకున్నా విజయవంతం చేస్తుంది’ అని పేరు తెచ్చుకున్న ఆశాశర్మ సరికొత్త బాధ్యతతోనూ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఏ.ఐ. ఐకాన్ అశ్వినిఅశోకన్రంగం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సిలికాన్ వ్యాలీలో పది సంవత్సరాలు పని చేసిన అశ్విని అశోకన్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చి, ఏఐ ప్లాట్ఫామ్ ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ ప్రారంభించింది. అత్యంత ఆధునిక ఏఐ ఉత్పత్తులను నిర్మించడంలో ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ‘మన దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అదే సమయంలో నిరుద్యోగం ఉంది’ అంటున్న అశ్విని తన కంపెనీ కోసం ప్రతిభావంతులను వెదకడంలో ఎప్పుడూ ముందుంటుంది. కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసింది అశ్విని. ‘ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్ను గమనించడం మంచిదేగానీ, వాటిని మనం గుడ్డిగా అనుసరించలేం. మన దేశ నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి’ అంటున్న అశ్విని ఏ.ఐ నాడి తెలిసిన నిపుణురాలు. ఏ.ఐ.ని సామాన్య ప్రజలకు ఎలా చేరువ చేయాలో తెలిసిన ఎంటర్ప్రెన్యూర్.ఆరోగ్య భాగ్యం సౌమ్య స్వామినాథన్రంగం: హెల్త్శిశు వైద్యురాలు, క్లినికల్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై విశేష కృషి చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రెటరీగా పనిచేశారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా చేరారు. అదే సంస్థలో చీఫ్ సైంటిస్ట్ అయ్యారు. కోవిడ్ కాలంలో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి కృషి చేశారు. 2009 నుండి 2011 వరకు యూనిసెఫ్, యూఎన్డీపి/ వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ల ‘రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రాపికల్ డిసీజెస్’ అనే స్పెషల్ ప్రోగ్రామ్కు కో ఆర్డినేటర్గా పనిచేశారు. ‘మన దేశంలో అందరికీ పోషకాహారం అందడం లేదు’ అంటారు. ఆమె తరచూ ‘హిడెన్ హంగర్’ అనే మాట అంటుంటారు. అంటే... తగినంత ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందక పోవడం. పిల్లలకు తగినంత పోషకాలు లభించక పోతే జరిగే దీర్ఘకాలిక నష్టాల గురించి ఎన్నో వేదికలపై నొక్కి చెప్పారు. చెన్నైలో పుట్టిన సౌమ్య ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కూతురు. -
అంతరిక్షపుటంచు నుంచి...
నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం అత్యంత కచి్చతత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్లపాటు ఇరాన్ను ఒంటిచేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్లో నడి»ొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు. అసలీ దాడి ఎలా జరిగింది, ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధం ఏమిటనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్ను ‘రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకెళ్లిందంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే! అసలేమిటి నీలి పిచ్చుక? మూడు బాలిస్టిక్ టార్గెట్ క్షిపుణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలో సుదూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణులను ఫైటర్ జెట్ లేదా రాకెట్కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని ‘అంతరిక్ష క్షిపణి’గా కూడా పిలుస్తుంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్లో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి, నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రుదేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైళ్లను డమ్మీగా ఉపయోగించి, ప్రాక్టీస్ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు. బరువు 1,900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్తోపాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టమ్తో ముందుకెళ్తుంది. బయటి నుంచి అందే సిగ్నల్తో పనిలేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. బ్లూ స్పారో స్ఫూర్తితో ‘రాక్స్’ ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు దీటుగా బ్లూ స్పారోను డిజైన్ చేశారు. భూవాతావరణాన్ని దాటి ముందుకెళ్లి, మళ్లీ భూవాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్ జెట్కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూవాతావరణం పరిధి వరకూ వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్లి భూవాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందుభాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందికి వచ్చే భాగాన్ని రీ–ఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్హెడ్తోపాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్టనిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిస్సైల్ ఇరాన్ సుప్రీంలీడర్ను బలి తీసుకుంది. రఫేల్ సంస్థ బ్లూ స్పారో డెవలప్మెంట్తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో ‘రాక్స్’ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన కచి్చతత్వంతో లక్ష్యాలను ఛేదించడం రాక్స్ క్షిపణుల ప్రత్యేకత. శత్రుదేశాలు జీపీఎస్ సిగ్నల్స్ను జామ్ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూఉపరితలంతోపాటు అంతర్భాగంలోని లక్ష్యాన్ని తాకుతాయి. 500 కిలోల వార్హెడ్ను మోసుకెళ్లగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్(చిత్తుప్రతి) అనుకుంటే రాక్స్ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్క్ 48.. నిశ్శబ్ద మృత్యువు
అమెరికా నావికాదళం అమ్ములపొదిలోని మరో సముద్రగర్భ అస్త్రం విశేషాలు తాజాగా ఇరాన్ యుద్ధనౌకపై దాడి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దాని పేరు మార్క్48. జలాంతర్గామి నుంచి ప్రయోగించి ఈ టోర్పెడోకు అమెరికా నావికాదళం ‘మార్క్ 48’అనే పేరుపెట్టింది. ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దేనా’యుద్ధనౌకను కూల్చడం ద్వారా రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారిగా ఒక శత్రునౌకను టోర్పెడోతో జలసమాధి చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించడంతో ఇప్పుడు మార్క్48పై చర్చ మొదలైంది. దశాబ్దాలుగా నిశ్శబ్ద సేవ.. → అమెరికా నేవీ అ«దీనంలో సేవలందించే జలాంతర్గాముల్లో ప్రస్తుతం మార్క్ 48 టోర్పెడోలను ఉపయోగిస్తున్నారు. తొలిసారిగా 1972లో దీనిని తయారుచేశారు. తర్వాత పలుమార్లు నవీకరించారు. → ఇప్పుడు మార్క్48 ఏడీక్యాప్(అడ్వాన్స్డ్ కేపబిలిటీ) వేరియంట్ను వాడుతున్నారు. ఇందులో ఆధునీకరించిన ఎల్రక్టానిక్, గైడెడ్, ప్రొపల్షన్ వ్యవస్థలు ఉన్నాయి. → ఒక్కో టోర్పెడో 21 అడుగుల చుట్టుకొలతతో 19 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు ఏకంగా 1,700 కేజీలు. యాక్టివ్, పాసివ్ సోనార్లతో ఇది పనిచేస్తుంది. → ఆగి ఉన్న యుద్ధనౌకతోపాటు వేగంగా వెళ్తున్న యుద్ధనౌకలను ఇది లక్ష్యంగా చేసుకుని గురిచూసి పేల్చేయగలదు. → గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలాంటి శబ్దం లేకుండా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. ఒక్కో టోర్పెడో తయారీకి రూ.38.48 కోట్లు ఖర్చవుతుంది. → శత్రువుల నౌకలను ఎదురుగా ‘హల్’భాగాన్ని ఢీకొట్టకుండా అడుగు భాగానికి వెళ్లి ఢీకొట్టి పేలిపోతుంది. దీంతో నౌకఅడుగుకు భారీ రంధ్రం పడుతుంది లేదా ముక్కలు చెక్కలు అవుతుంది. దీంతో నౌక వేగంగా సముద్రజలాల్లో మునిగిపోతుంది. భారీ మందుగుండు పేలడంతో నౌక అడుగున ఒక పెద్ద గాలిబుడగ ఏర్పడుతుంది. దీంతో నౌక మరింత వేగంగా మునిగిపోతుంది. ఒకవేళ పాక్షికంగా దెబ్బతిన్నా కీలక వ్యవస్థలు విఫలంకావడంతో ఎదురుదాడి చేయలేక చేతులెత్తేస్తుంది.. → గైడెన్స్ వైర్తో ఇది అనుసంధానమై ముందుకు దూసుకుపోతుంది. ఒకవేళ వైర్ తెగిపోయినా ఆటోమోడ్లో పనిచేస్తూ పని చక్కబెడుతుంది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, అల్గారిథమ్లతో ఇది పనిచేస్తుంది. అత్యంత లోతైన, సంక్లిష్టమైన సముద్ర జలాల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది → అమెరికా నావికాదళంలోని లాస్ ఏంజెలెస్, సీఊల్ఫ్, ఒహాయో, వర్జీనియా తరగతి బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గాముల్లోనూ ఈ టోర్పెడోలను అమర్చారు → యుద్ధనౌకలతోపాటు శత్రుదేశ జలాంతర్గాములను వెంటాడి దాడిచేయగలదు → ‘శ్రీలంక సమీప సముద్రజలాల్లో ఉన్న ఇరాన్ యుద్ధనౌకపైకి కేవలం ఒక్క టోర్పెడోనే ప్రయోగించాం. భారీ యుద్ధనౌకను జలసమాధి చేయడానికి ఇలాంటి నిశ్శబ్ద మృత్యువు ఇదొక్కటి చాలు’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేన్ కెయిన్ వ్యాఖ్యానించారంటే దీని సామర్థ్యం ఏమిటో ఇట్టే తెల్సిపోతుంది → ముఖ్యంగా అణుఇంధనంతో నడిచే జలాంతర్గాములను నాశనం చేసేందుకు ఈ టోర్పెడోను డిజైన్చేశారు. → సోవియట్ రష్యా సాంకేతికతకు దీటుగా ఎంకే37, ఎంకే14, ఎంకే16 టోర్పెడోలను రిప్లేస్ చేస్తూ ‘ప్రాజెక్ట్ నోబాస్కా’లో భాగంగా దీనిని రూపొందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అణ్వస్త్ర రాశులు!
ఇరాన్తో అమెరికా అణు చర్చలు చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నా లెక్కచేయకుండా అధ్యక్షుడు ట్రంప్ దానిపై ఉన్నట్టుండి యుద్ధానికి తెర తీశారు. ఆ దేశం ఎన్నటికీ అణ్వ్రస్తాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇజ్రాయెల్తో కలిసి ఉన్నపళంగా ఇరాన్పై అంత స్వేచ్చగా దాడికి దిగగలిగారంటే దానివద్ద అణు బాంబులు లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై మాత్రం ట్రంప్ ఎంతగా కత్తులు నూరినా, నాలుగేళ్లుగా కఠిన ఆంక్షలు తదితర చర్యలకే పరిమితమయ్యారే తప్ప ఎన్నడూ యుద్ధానికి దిగే సాహసం చేయలేదు. ఆ దేశం వద్ద అపారంగా పోగుపడ్డ అణ్వాయుధ నిల్వలే అందుకు ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణుపాటవమున్న దేశాలెన్ని, వాటి వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయి అన్నది ఓసారి చూస్తే... అణ్వస్త్ర దేశాల జాబితాలో అగ్రాసనం అమెరికా, రష్యాలదే. ప్రపంచంలోని మొత్తం అణుబాంబుల్లో 90 శాతానికి పైగా ఈ రెండు దేశాల వద్దే పోగుపడ్డాయి! ఆ రెండింట్లో సంఖ్యాబలం రీత్యా రష్యాదే పైచేయి. అమెరికా వద్ద 5,277 అణు బాంబులుంటే రష్యా వద్ద ఏకంగా 5,459 దాకా పోగుపడ్డాయి! అమెరికా తన అణ్వాయుధాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో కూడా మోహరించి ఉంచడం విశేషం! రష్యా కూడా తన అణ్వాస్త్రాల్లో కొన్నింటిని మిత్ర దేశం బెలారస్లో ఉంచింది. ఇతర అణ్వస్త్ర దేశాల్లో ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యపై కచి్చతమైన స్పష్టత లేదు. ఇజ్రాయెల్ వద్ద కనీసం 200 అణు బాంబుల తయారీకి అవసరమైన అన్ని వనరులూ ఉన్నట్టు చెబుతారు. ఆ దేశం ఇప్పటికే 90 అణు బాంబులను తయారు చేసిందని అంచనా. ఉత్తర కొరియా కూడా 50 అణు బాంబుల తయారీకి అవసరమైన యురేనియం తదితరాలను పలు మార్గాల సేకరించి ఉంచుకున్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. అణు పాటవమున్న మొత్తం 9 దేశాల వద్దా కలిపి 12,341 అణు బాంబులున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ 2025 నివేదిక చెబుతోంది. వాటిలో 9,600కు పైగా అణు వార్హెడ్లు ఏ క్షణంలోనైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఆయా దేశాల సైన్యం నియంత్రణలో ఉన్నట్టు సమాచారం. అయితే ప్రచ్ఛన్నయుద్ధ కాలంతో పోలిస్తే ఇది చాలా తక్కువే కావడం విశేషం. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నింటి దగ్గరా కలిపి ఏకంగా 70 వేల పై చిలుకు అణు వార్హెడ్లు పోగుపడ్డాయి!– సాక్షి, నేషనల్ డెస్క్ -
రణరంగంలోకి భీకర బాంబర్
అణుచర్చల విషయంలో ‘దౌత్యం’విఫలమై దిగాలుగా కూర్చున్న వేళ ‘యుద్ధం’ఒళ్లువిరిచి రణక్షేత్రంలో కరాళనృత్యం చేస్తుండగా ఆ నృత్యాన్ని మరింత రక్తికట్టించేందుకు అమెరికా తన అమ్ముల పొదిలోని బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ భారీ విమానాలను రంగంలోకి దింపింది. ఏడు దశాబ్దాలకు పైగా ఈ యుద్ధవిమానాలు అమెరికా వాయుసేనలో కీలకభూమిక పోషిస్తున్నాయి. ఒకేసారి 32,000 కేజీల బరువైన బాంబులను జారవిడిచే సత్తా ఉన్న ఈ విమానాల రాకతో రణరీతులు మారనున్నాయని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్నీ భారీస్థాయిలో.. → 1955 ఫిబ్రవరిలో అమెరికా వాయుసేన కోసం బోయింగ్ సంస్థ ఈ విమానాలను తయారుచేసి ఇచి్చంది. ఆనాటి నుంచి పలు మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ అప్పగించిన పనిని అద్భుతంగా పూర్తిచేశాయి. → ప్రచ్ఛన్నయుద్ధకాలంలో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఎనిమిది ఇంజిన్లతో భారీ బాడీతో అధునాతనంగా దీనిని తయారుచేశారు. → ఏకంగా 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ సువిశాల ప్రాంతంపై తమ పట్టు నిలుపుకుని డేగ కన్నుతో పరిశీలిస్తూ అత్యంత ఖచి్చతత్వంతో బాంబులు జారవిడుస్తాయి. → సెన్సార్లు మొదలు, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్దాకా అన్నిరకాల ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. → ఈ విమానంలో ఒకేసారి 30 భారీ బాంబులను అమర్చవచ్చు. అందుకే దీనిని కింగ్ ఆఫ్ బాంబర్స్ అని కూడా పిలుస్తారు. → ఇంధనం కోసం ఆగకుండా ఏకధాటిగా వేల కిలోమీటర్ల ప్రయాణిస్తాయి. 1991 జనవరిలో ఇరాక్పై దాడి కోసం ఈ విమానాలు అమెరికాలోని లూసియానాలోని బార్క్డేల్ స్థావరం నుంచి బయల్దేరి ఎక్కడా ఆగకుండా ఇరాక్కు వచ్చి బాంబులేసి మళ్లీ అలాగే వెళ్లిపోయాయి. అలా ఏకధాటిగా 35 గంటలపాటు 23,000 కిలోమీటర్ల ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డ్ను సృష్టించాయి. → గగనతలంలో మధ్యస్థాయి వేగంతో ప్రయాణించే ఈ విమానం గగనతలంలో వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దం వినలేనంత కర్ణ కఠోరంగా ఉంటుంది. → గైడెడ్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులు ఇలా వేర్వురు రకాల బాంబులను ఇవి ప్రయోగించగలవు. → 225 కేజీలు, 450 కేజీలు, 900 కేజీలు ఇలా వేర్వేరు బాంబులను వేర్వేరు దిశలో ఒకేసారి ప్రయోగించగలవు. జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునీషన్(జేడ్యామ్) టెక్నాలజీతో ఈ బాంబులు పనిచేస్తాయి. బాంబులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మాదిరి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంపై పడి శత్రువుల స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేస్తాయి. → వేలకిలోల బాంబులతో ప్రయాణించే ఈ విమానాన్ని టేకాఫ్ చేయాలంటే అత్యంత పొడవైన రన్వే అవసరం. ప్రస్తుతం ఇరాన్పై దాడుల కోసం బ్రిటన్లోని గ్లూసిస్టర్షైర్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ ఫెయిర్ఫోర్డ్ వైమానిక స్థావరాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. ఈ స్థావరంలో సువిశాలమైన ఏకంగా 9,993 అడుగుల పొడవైన రన్వే ఉంది. దీంతో రెక్కలకు ఎలాంటివి అడ్డురాకుండా సులువుగా టేకాఫ్ తీసుకోవచ్చు. → ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా ద్వీపంలోని స్థావరం నుంచి ఇవి రణరంగంలోకి ప్రవేశించాయని వార్తలొచ్చాయి. → ఇరాన్ బలగాల కమాండ్, కంట్రోల్ పోస్ట్లపై బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం పెద్ద ఎత్తున దాడులు చేస్తోందని తాజాగా యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. → బీ–52హెచ్ వేరియంట్ విమానం ఏకధాటిగా 15,000 కిలోమీటర్లు ప్రయాణించి 70,000 పౌండ్ల బాంబులను ప్రయోగించగలదు → ప్రస్తుతం అమెరికా అమ్ములపొదిలో ఇలాంటివి 76 విమానాలు ఉన్నాయి. → వియత్నాం యుద్ధం మొదలు గల్ఫ్ యుద్ధం, అఫ్గానిస్తాన్, ఇరాక్ దాకా పలు యుద్ధాల్లో పాల్గొన్న బీ–52 బాంబర్లు ఇప్పుడు ఇరాన్ పనిపట్టేందుకు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి → ఈ విమానాలకు ‘పెద్దగా అందవికారంగా బానపొట్టతో ఉన్న మనిషి(బిగ్ అగ్లీ ఫ్యాట్ ఫెలో–బఫ్)’అనే ముద్దుపేరు కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వచ్చేస్తోంది ‘డూమ్స్ డే’ క్షిపణి
ఇరాన్పై యుద్ధం నానాటికీ భీకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యకు దిగింది. ‘డూమ్స్డే’మిసైల్గా పేరొందిన మినట్మ్యాన్–3 ఖండాంతర క్షిపణిని పరీక్షించింది! అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి అమెరికా వైమానిక దళ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. అది ఏకంగా 4,200 మైళ్లకు పైగా దూరం ప్రయాణించి పశ్చిమ మధ్య పసిఫిక్లోని మార్షల్ దీవుల సమీపంలో రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సైట్ వద్ద లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్టు అమెరికా ప్రకటించింది. జీటీ 255గా పేర్కొంటున్న ఈ క్షిపణి ప్రయోగానికి ఇరాన్పై యుద్ధంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. క్షిపణి వ్యవస్థ తాలూకు విడి భాగాల పనితీరు తదితరాలను పూర్తిస్థాయిలో మదింపు వేసేందుకే పరీక్ష జరిపినట్టు 576వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ క్యారీ రే తెలిపారు. దీర్ఘకాలిక అవసరాల రీత్యా అమెరికా అణుపాటవం నిత్యం యుద్ధ సన్నద్ధంగా ఉండేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.రేంజ్ 6,000 కి.మీ. పైనేమినట్మ్యాన్–3 క్షిపణి సామర్థ్యం అంతా ఇంతా కాదు. అమెరికా వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థకు ఇది గుండెకాయ వంటిదంటే అతిశయోక్తి కాదు! అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన దీని రేంజ్ ఏకంగా 6,000 కి.మీ. పై చిలుకే! గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోషిమాపై పడ్డ అణుబాంబు కంటే ఏకంగా 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్హెడ్లను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు! ఖండాలకు ఆవల ఉన్న లక్ష్యాలను కూడా నిమిషాల వ్యవధిలో తుత్తునియలు చేయగలదు. అమెరికా ఇప్పటికే దీన్ని పలుమార్లు పరీక్షించి చూసింది. చివరిసారి గత నవంబర్లో దీన్ని పరీక్షించింది. ఈ క్షిపణుల తయారీని 1979లో మొదలు పెట్టారు.ఆ పేరెందుకు?అమెరికా అణ్వాయుధ సంపత్తిలో అత్యంత వినాశనకరమైన అస్త్రం మినట్మ్యాన్–3యే. అణుయుద్ధం అంటూ వస్తే ఇది సృష్టించే విధ్వంసం అంచనాలకు కూడా అందదు. అక్షరాలా ప్రళయం సృష్టిస్తుందనే అర్థంలో దీనికి డూమ్స్ డే అనే ముద్దుపేరు వచ్చింది. మినట్మ్యాన్–3 రేంజ్ 6,000 కి.మీ. అని అమెరికా చెబుతున్నా వాస్తవానికి అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నది రక్షణ నిపుణుల మాట. భూమిపై ఏ లక్ష్యాన్నయినా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని చెబుతారు. పైగా ఈ క్షిపణి ఘన ఇంధనంతో నడుస్తుంది. దాంతో నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. సమస్య తలెత్తితే క్షణాల వ్యవధిలో సిద్ధమై శత్రువు పని పట్టగలదు. పైగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీ ఎంట్రీ వెహికిల్స్ (ఎంఐఆర్వీ)లను మోహరించే సామర్థ్యం కూడా మినట్మ్యాన్–3 సొంతం. కనుక ఒకే ప్రయోగంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను అలవోకగా ఛేదించగలదు. అమెరికా వద్ద ప్రస్తుతం ఈ క్షిపణులు 400కు పైగా ఉన్నట్టు అంచనా. వీటిని అమెరికా పశ్చిమ ప్రాంతంలో అత్యంత గోప్యంగా భూగర్భ కేంద్రంలో మోహరించి ఉంచారు. అండర్గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ దానితో సంబంధం తెగిపోయినా ప్రత్యేకంగా రూపొందించిన ఈ–6బీ లాంచ్ కంట్రోల్ విమానం నుంచి ఈ క్షిపణులను ఆపరేట్ చేసే సౌలభ్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధ దేవతలు
దశాబ్దాలుగా, పశ్చిమాసియాలోని ఆరోగ్య వ్యవస్థకు భారతీయ నర్సులు వెన్నెముకలా నిలుస్తున్నారు. ‘ఏంజెల్స్ ఇన్ వైట్’గా మన్ననలు పొందుతున్నారు. 1990ల నాటి కువైట్ యుద్ధం నుండి తాజా ఇరాన్ యుద్ధం వరకు.. వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలు అందించటంలో మన నర్సులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్నర్సులదీ ‘పోరాటమే’!ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఇరాన్ యుద్ధం’లో భారతీయ నర్సులు స్థిరచిత్తంతో నిర్భయంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు సైనికుల్లా పోరాడుతున్నారు. అక్కడ వారు చేస్తున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గొప్ప మానవతా సేవ కూడా.కేరళ నర్సులే ఎక్కువపశ్చిమ ఆసియాలో నర్సులుగా పనిచేస్తున్న భారతీయ మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందినవారే.యుద్ధంలోనూ సంసిద్ధంతాజా యుద్ధంలో భారతీయ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతో ధైర్యంగా, నిలకడగా గాయపడినవారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి నేరుగా సంబంధం లేని దేశాలలో సైతం ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులలో కూడా మన నర్సులు ఆరోగ్య సేవలకు సంసిద్ధమై ఉన్నారు.దృఢ సంకల్పానికి నిదర్శనంసంక్షోభ సమయాలలో ఎవరి దేశానికి వాళ్లు వెళ్లిపోయేందుకు తొందరపడుతున్నా భారతీయ నర్సులకు మాత్రం అక్కడేఉండి సేవలు అందించినఘన చరిత్ర ఉంది. పశ్చిమ ఆసియాలో గతంలో సంభవించిన ఎన్నో ప్రధాన సంక్షోభాల సమయంలో వారి ఉనికి ఎంతో కీలకంగా నిలిచింది.ప్రాణాలకు తెగించి సేవలుకువైట్, ఇరాక్ వంటి యుద్ధ క్షేత్రాలలో బాంబు దాడులు, క్షిపణి ముప్పులు పొంచి ఉన్నప్పటికీ, భారతీయ నర్సులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన మహోన్నత చరిత్ర ఉంది.వైద్య వ్యవస్థకు వెన్నెముకయుద్ధం కారణంగా స్థానిక వైద్యులు, సిబ్బంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, భారతీయ నర్సులు అక్కడే ఉండి ఆసుపత్రులు మూతపడకుండావైద్య వ్యవస్థను నిలబెట్టారు.అంతర్జాతీయ గుర్తింపుఅత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పనిచేసే ‘ఫ్రంట్లైన్ వారియర్స్’ గా భారతీయ నర్సులు (ముఖ్యంగా కేరళకు చెందిన వారు) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.మానవతా దృక్పథంరాజకీయ అశాంతి, అంతర్యుద్ధాల సమయంలో పౌరులకు, గాయపడిన సైనికులకు ఎటువంటి వివక్ష లేకుండా నిరంతరాయంగా చికిత్స అందించడంలో మనవాళ్లు కీలక పాత్ర పోషించారు.సంక్షోభ నిర్వహణపరిమిత వనరులు, మందుల కొరత ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో భారతీయ నర్సులు అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. -
నిద్రలేమి.. మహిళల్లోనే ఎక్కువ!
సాక్షి, స్పెషల్ డెస్క్: మహిళల్లో నిద్రలేమి అనేది ఒక క్లిష్టమైన ప్రజారోగ్య సమస్యగా అవతరించింది. పురుషుల కంటే మహిళలే నిద్ర విషయంలో అధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో అసమానత ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాలు. ఫలితంగా నేటి కాలంలో చాలామంది భారతీయ మహిళలకు నాణ్యమైన నిద్ర అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా మెడికల్ డివైసెస్ తయారీలో ఉన్న రెస్మెడ్ ఇటీవల గ్లోబల్ స్లీప్ సర్వే–2026 నిర్వహించింది. భారత్తోపాటు అమెరికా, చైనా, యూకే, జ ర్మనీ, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్, పోలండ్, సింగపూర్, మెక్సికో దేశాలకు చెందిన 30 వేల మంది పాలుపంచుకున్నారు. ఇందులో భారత్ నుంచి 5 వేల మంది ఉన్నారు. ఈ సర్వే ప్రకారం.. నిద్రలేమి సమస్యతో 38% మంది భారతీయ మహిళలు ఇబ్బందిపడుతున్నారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 29% మాత్రమే. వంట, ఇంటి పనులు; పిల్లలు, పెద్దల సంరక్షణ.. భారతీయ మహిళల భు జాలపై సహజంగా ఉండే భారం. ఇంటి నిర్వహణకు సంబంధించిన మానసిక ఒత్తిడి దీనికి అదనం. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అటు వృత్తి బాధ్యతలనూ మోయాల్సి వస్తోంది. భిన్నమైన ప్రభావం..: సామాజిక, మానసిక ఒత్తిళ్లు స్త్రీ పురుషులపై రాత్రి నిద్ర విషయంలో ఎలా భిన్నంగా ప్రభావం చూపుతాయో ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నిద్రాభంగం కావడానికి మానసిక ఒత్తిడి, ఆందోళనను ప్రధాన కారకాలుగా 42% మంది మహిళలు పేర్కొన్నారు. ఈ విషయంలో పురుషుల సంఖ్య 36% ఉంది. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాయని 39% మంది మహిళలు, 33% మంది పురుషులు చెబుతున్నారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్థిర, నాణ్యమైన నిద్ర అవసరమని ప్రపంచవ్యాప్తంగా 90% మంది గుర్తించారు. ఆహారం, వ్యాయామంతోపాటు నిద్రను అత్యంత ముఖ్యమైన అలవాటుగా 44% మంది భారతీయులు పరిగణిస్తున్నారు. అయినప్పటికీ 53% ప్రజలు వారానికి నాలుగు రాత్రులు లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే నాణ్యమైన నిద్రను పొందుతున్నట్లు తెలిపారు. ఇది అవగాహనకు, వాస్తవానికి మధ్య పెరుగుతున్న భారీ అంతరాన్ని నొక్కి చెబుతోంది. వేరబుల్ టెక్నాలజీతో.. నిద్ర ప్రాముఖ్యతపై ప్రజల్లో అధిక అవగాహన ఉన్నప్పటికీ సమస్యలున్నవారు వైద్యపరంగా సాయం తీసుకోవడం లేదు. 78% మంది భారతీయులు నిద్ర సమస్యల పరిష్కారం కోసం వైద్యుడిని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. సాధారణ చెకప్లలో 69% మందికి మాత్రమే దీనికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని ఆసుపత్రులు మరింత చురుకుగా నిద్ర సమస్యలను గుర్తించాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. 75% మంది భారతీయులకు తమ నిద్ర విధానాలను మరింత నిశితంగా గమనించడానికి స్మార్ట్వాచెస్, ఫిట్నెస్ బ్యాండ్స్ వంటి వేరబుల్ టెక్నాలజీ దోహదపడుతోంది. ఈ పరికరాలు నెగిటివ్ ఫలితాలు చూపితే.. 66% మంది వినియోగదారులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వైద్య సలహాను పొందుతామని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై.. నాణ్యమైన నిద్ర తక్కువగా ఉండటం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా అంతకుమించిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. సరైన నిద్రలేని రాత్రి తర్వాత తాము మరింత చిరాకుగా, ఒత్తిడితో లేదా నిరాశతో ఉన్నట్లు అత్యధికులు తెలిపారు. ప్రత్యేకించి 30% మంది నిద్రలేమికి, కుంగుబాటు లక్షణాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు గుర్తించారు. -
భారీ జీతంతో సమ్తృప్తే!
భారీ జీతం అందుకోవాలి. వృత్తిపరంగా ఎదగాలి. ప్రపంచస్థాయిలో గుర్తింపు రావాలి. ఇదీ ఓ సగటు భారతీయ టెకీ మనసులో మాట. ఇందుకోసం అంతర్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీల్లో పనిచేయాలని ఆకాంక్షిస్తుంటారు. అయితే అధిక వేతనం ఎల్లప్పుడూ పని ప్రదేశంలో సంతృప్తిని, వృత్తిపరమైన ఎదుగుదలను అందించలేదని ఒక నివేదిక వెల్లడించింది. ప్రధాన సంస్థలలో పని వాతావరణాన్ని అంచనా వేయడానికి 40,686 మంది ఉద్యోగుల రేటింగ్స్, జీతాల డేటాను విశ్లేషించిన అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ఓ నివేదికను రూపొందించింది. పని ప్రదేశంలో సంతృప్తి, వృత్తిపరమైన ఎదుగుదల అవకాశాలు, మేనేజ్మెంట్ పనితీరును విశ్లేíÙంచింది. మన దేశంలో టెకీలు కోరుకుంటున్న ప్రధాన కంపెనీల జాబితా ఒకటైతే.. భారత్లో పనిచేయడానికి ఉత్తమ సంస్థలుగా పేరొందిన సంస్థల జాబితా వేర్వేరుగా ఉండటం ఆసక్తికరం. – సాక్షి, స్పెషల్ డెస్క్భారీ వేతనం ఉంటే.. పోటీతత్వంతో కూడిన నేటి ఉద్యోగ మార్కెట్లో సరైన పని ప్రదేశాన్ని ఎంచుకోవడం మునుపటి కంటే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. చాలామంది నిపుణులు కేవలం జీతంపైనే కాకుండా వృత్తిపరమైన ఎదుగుదల, పని సంస్కృతి, దీర్ఘకాలిక స్థిరత్వంపై కూడా దృష్టి సారిస్తున్నారు. పని–జీవిత సమతుల్యత ఉద్యోగుల సంతోషాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని తేలింది. కెరీర్ను మార్చుకోవాలనుకునే నిపుణులకు జీతం ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా ఉంది. అంటే భారీ వేతనం ఉంటే కెరీర్ మారేందుకు సిద్ధం అన్నమాట. టాప్–15లో లేవు.. భారత్లో టెకీలు, జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టేవారు అత్యధికంగా కోరుకునే సంస్థల జాబితాను బ్లైండ్ రూపొందించింది. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అట్లాసియన్, ఫ్లిప్కార్ట్, జీటా, ఇన్మోబి, టెకియన్ కార్ప్, ఊబర్, వాల్మార్ట్, సేల్స్ఫోర్స్, ఎడోబ్, మెటా, ఒరాకిల్, షేర్చాట్ ముందు వరుసలో ఉన్నాయి. బ్లైండ్ బెస్ట్ వర్క్ప్లేసెస్ జాబితాలో అత్యుత్తమ రేటింగ్ పొందిన టాప్–10 కంపెనీల్లో ఎన్విడియా, గూగుల్, యాపిల్, అకామాయ్ టెక్నాలజీస్, వీఎమ్వేర్, ఎడోబ్, టార్గెట్, క్రెడ్, నోకియా, థాట్వర్క్స్ ఉన్నాయి.గూగుల్, ఎడోబ్ మాత్రమే ఈ రెండు జాబితాల్లోనూ నిలిచాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి భారీ వేతనాలు ఇచ్చే కంపెనీలు టాప్–15 బెస్ట్ వర్క్ప్లేసెస్లో చోటు సంపాదించుకోలేకపోయాయి. ఎన్విడియా, యాపిల్, అకామాయ్ టెక్నాలజీస్ వంటి అత్యుత్తమ రేటింగ్ పొందిన సంస్థలకు అత్యధికంగా కోరుకునే కంపెనీల జాబితాలో స్థానం దక్కలేదు. ఉద్యోగుల సెంటిమెంట్.. అధిక జీతాలు ఎల్లప్పుడూ ఉద్యోగ సంతృప్తితో సంబంధం కలిగి ఉండవని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అత్యధిక జీతాలు ఇచ్చే కంపెనీలలో మూడో వంతు కంటే తక్కువ మాత్రమే అత్యుత్తమ రేటింగ్ పొందిన పని ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రతిభను ఆకర్షించినప్పటికీ ఉద్యోగులను నిలుపుకోవడంలో, వారిని ఉత్సాహపరచడంలో పని సంస్కృతి, నాయకత్వం కీలక పాత్ర పోషిస్తాయని నిరూపితమైంది.ఉద్యోగుల సంతృప్తి అనేది కేవలం జీతంపై మాత్రమే కాకుండా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. ఉద్యోగి ఏదేని కంపెనీలో దీర్ఘకాలం కొనసాగాలంటే నాయకత్వ నాణ్యత, వృత్తిపరమైన అభివృద్ధి, పని సంస్కృతి ఇప్పటికీ కీలకమైనవి. ఆర్థిక ప్రోత్సాహకాలతోపాటు సహాయక వాతావరణాన్ని సమతుల్యం చేసే సంస్థలు మాత్రమే నైపుణ్యం కలిగిన నిపుణులను నిలుపుకోగలవు, బలమైన ఖ్యాతిని నిర్మించుకోగలవని తెలిపింది.ఏడాదిలో భారత్లోని నిపుణులు వెతికిన కంపెనీలు, పదాలు... ⇒ అత్యధికంగా వెతికిన కంపెనీల పేర్లు: మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్, అమెజాన్, సేల్స్ఫోర్స్, మెటా, అట్లాసియన్, యాపిల్, క్వాల్కామ్, ఈబే. ⇒ తరచూ సెర్చ్ చేసిన పదాలు: లేఆఫ్, ఆఫర్, హెచ్–1బీ, మెటా ఇండియా, గూగుల్ ఇండియా, మెటా లండన్. -
'స్థూలం'గానూ తెలియదంతే!
శారీరక శ్రమ లేని జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి స్థాయిలు.. వెరసి జీవక్రియ సంబంధిత సమస్యలు జనాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం (ఒబేసిటీ), మధుమేహం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బరువు తగ్గేందుకు శ్రమిస్తున్నప్పటికీ.. ఒబేసిటీ చికిత్సలపై మాత్రం వీరికి అవగాహన తక్కువగా ఉంటోందట. మార్చి 4న జరిగే ‘ప్రపంచ ఊబకాయ దినం’సందర్భంగా పరిశోధన సంస్థ కాంటార్ ఇండియా విడుదల చేసిన ’జీఎల్పీ–1 ఆపర్చునిటీ ఇండెక్స్ రిపోర్ట్’ ప్రకారం.. పట్టణ ఊబకాయుల్లో 85% మంది అంటే 6.2 కోట్ల మంది బరువు తగ్గడానికి చురుగ్గా ప్రయత్నిస్తున్నారు. మధుమేహ నియంత్రణ, బరువు తగ్గింపు కోసం అంతర్జాతీయంగా కొత్త తరం చికిత్సలు ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో.. భారత్లోని వ్యాధిగ్రస్తుల్లో అధిక ఆసక్తి ఉన్నప్పటికీ సరైన సమాచారం లేని మార్కెట్గా కనిపిస్తోంది. పట్టణవాసుల్లో కేవలం 4.99% మందికి మాత్రమే ప్రస్తుతం గ్లూకగాన్–లైక్ పెప్టైడ్–1 (జీఎల్పీ–1) మందుల గురించి అవగాహన ఉంది. పట్టణాల్లో ఆరోగ్య సంక్షోభం» 15 ఏళ్లు పైబడిన పట్టణ భారతీయుల్లో సుమారు 20% (7.3 కోట్లు) మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు అంచనా. » దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10.1 కోట్ల మంది డయాబెటిస్ బారిన పడ్డారు. » 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముప్పున్న (ప్రీ–డయాబెటిక్) దశలో ఉన్నారు. » మధుమేహ వ్యాధిగ్రస్తులు గ్రామీణ భారతంలో 8.3%, పట్టణ ప్రాంతాల్లో 14.2% ఉన్నారు. » గ్రామాల కంటే నగరాలు వేగంగా విస్తరించడం, ఐటీ వంటి ఉద్యోగాలతో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం, బయట ఆహారం తినే ధోరణి పెరగడం, విలాసవంతమైన జీవనశైలి ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. స్పష్టంగా అవగాహన లోపం.. » ప్రస్తుతం అవగాహన పరిమితంగా ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వినియోగదారుల్లో చికిత్సను స్వీకరించాలన్న ఆశయం బలంగా ఉంది. » జీఎల్పీ–1 చికిత్సల గురించి తెలిసిన మధుమేహ రోగులలో 49.2% మంది వీటిని ఉపయోగించే అవకాశం ఉందని తెలిపారు. వీరిలో 44.1% మంది వారానికి ఒకసారి తీసుకునే డోసేజ్ ఫార్మాట్లకు మొగ్గుచూపుతున్నారు.ఎక్కడ.. ఎంతమంది?» సంపన్న వర్గంలోనే అధికం: పట్టణ జనాభాలో అత్యంత సంపన్న గృహాలు 40% ఉన్నాయి. అధిక బరువున్న వారిలో 46% మంది ఈ విభాగం నుంచే ఉన్నారు. ఇదే సంపన్న వర్గంలో 36% మంది గత ఏడాది మధుమేహ సమస్యను ఎదుర్కొన్నారు. జీవనశైలి కారణంగా పెరిగిన ఆరోగ్య ముప్పును ఇది సూచిస్తోంది. » మధ్యవయస్కులు ప్రభావితం: అధిక బరువున్న వారిలో జెన్ ఎక్స్ (45–60 ఏళ్ల వారు) వాటా 40% ఉంది. కొనసాగుతున్న జీవనశైలి లోపాలు, మానసిక ఒత్తిడి, పని భారం కారణంగా ఈ వయస్సు వారు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధుమేహం కేసుల్లో 73% మంది జెన్ ఎక్స్ వారే. » దక్షిణాదిలోనే ఎక్కువ: దేశంలో అధిక బరువున్న జనాభాలో 36% దక్షిణాదిలోనే ఉన్నారు. అలాగే పట్టణ మధుమేహం కేసుల్లో 43% ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 26%, తెలంగాణలో 17% మందికి ఈ సమస్య ఉంది.జీఎల్పీ–1 అంటే.. మన జీర్ణకోశంలో ఉత్పత్తయ్యే ఒక హార్మోన్ ఇది. ఆకలిని నియంత్రిస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేయడం, ఆకలిని తగ్గించడం ద్వారా టైప్–2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో జీఎల్పీ–1 మందులు దోహదపడతాయి. -
చందమామ చిక్కేదెవరికి?
దశాబ్దాల తర్వాత జాబిల్లిపై అమెరికా దృష్టిసారించిన మరుక్షణమే చైనా సైతం తన అంతరిక్ష పరిశోధనలకు చందమామను కేంద్రస్థానంగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రాకెట్లు, వ్యోమనౌకలు, ల్యాండర్లతో రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. 2028కల్లా చంద్రునిపై ‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ద్వారా మానవసహిత ప్రయోగాలను పునరుద్ధరించాలని అమెరికా ప్రణాళికలు రచించింది. ప్రతిరంగంలో అమెరికాతో పోల్చుకుని ఆ దిశగా పావులు కదిపే చైనా ఇప్పుడు శాస్త్ర పరిశోధనలు, అంతరిక్ష వనరులు, దేశ ప్రయోజనాలే పరమావధిగా ముందడుగు వేస్తోంది. దీంతో ఒక్కసారిగా చంద్రుని కేంద్రంగా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల పోటీకి తెరలేచింది. చైనా ఎలా సంసిద్ధమవుతోంది? మానవసహిత ప్రయాణాలు సాధ్యమయ్యేలా అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్–10 రాకెట్ను చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి సంబంధించిన తక్కువ కాలానికి ఇంజిన్ను పూర్తి లేదా పాక్షిక సామర్థ్యంతో మండించడం(క్రిటికల్ స్టాటిక్ ఫైర్), ప్రయోగశాలలో రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షించడం(లో ఆలి్టట్యూట్ డెమోన్్రస్టేషన్ టెస్ట్)లను విజయవంతంగా పూర్తిచేసింది. వ్యోమగాములను మోసుకెళ్లే పునర్ వినియోగ క్యాప్సూ్యల్ ‘ది మెంగ్జోయూ’ను చైనా పరీక్షిస్తోంది. ఈ క్యాపూŠస్ల్తో డైనమిక్ ప్రెషర్ విధానంలో వ్యోమగాములు తప్పించుకునే టెస్ట్ను విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి వ్యోమనౌక గాల్లోకి లేచేటప్పుడు హఠాత్తుగా అగ్నిప్రమాదం లాంటివి జరిగితే వ్యోమగాములు తప్పించుకునే మ్యాక్స్ క్యూ అబోర్ట్ టెస్ట్నూ విజయవంతంగా పరీక్షించింది. చైనా వ్యోమగాములు(టైకోనాట్స్)ను చందమామ ఉపరితలం మీదకు తీసుకెళ్లే తిరిగి కక్ష్యలోకి తీసుకొచ్చే ‘ది లాన్యే లూనార్’ల్యాండర్నూ చైనా పరీక్షిస్తోంది. లాన్యే అంటే చందమామను హత్తుకోవడం. ఈ పదాన్ని మావో జెడాంగ్ తన కవితలో తొలిసారిగా ఉపయోగించారు. సిముల్యేషన్ సమయంలో ఈ ల్యాండర్.. ల్యాండింగ్, టేకాఫ్లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తిచేసిందని చైనా ఇటీవలే ప్రకటించింది. చందమామపైకి లాంగ్ మార్చ్–10 రాకెట్ పలు మార్లు ప్రయోగాలకు అనువుగా ప్రయోగవేదికలను విస్తరిస్తున్నారు. లాంచ్ప్యాడ్లు, ట్రాకింగ్ స్టేషన్లు, అనుబంధ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో హైనాన్లోని వెన్చాంగ్ స్పేస్క్రాఫ్ట్ లాంచ్సైట్లో నిర్మాణపనులు వేగవంతమయ్యాయి. వ్యోమగా ములతో కూడిన డీప్–స్పేస్ ఆపరేషన్ల కోసం ఇతర కీలక వసతులను అందుబాటులోకి తెస్తున్నారు.చందమామ మీదకు వెళ్లేది ఎప్పుడు? మరో నాలుగేళ్లలో తొలి వ్యోమగాముల బృందాన్ని చందమామ మీద దింపాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ షెడ్యూల్ ప్రకారం చకచకా జరుగుతున్నాయని ‘ది చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ’ప్రకటించింది. ‘‘ప్రయోగ పరీక్షలు అన్నీ విజయవంతమవుతూ, మౌలికసదుపాయాల కల్పన పూర్తవుతూ లక్ష్యాన్ని చేరువచేస్తున్నాయి. అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయిని త్వరలో చేరుకోబోతున్నాం’’అని స్పేస్ ఏజెన్సీ పేర్కొంది.ఈ ఏడాది బిజీబిజీ.. 2026లో బిజీ షెడ్యూల్తో చైనా దూసుకుపోతోంది. సొంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రం ‘తియాన్గాంగ్ స్పేస్ స్టేషన్’కు రెండు సార్లు వ్యోమగాములను పంపనుంది. సరకులను పంపేందుకు ఒక ప్రయోగం చేయనుంది. ఒక టైకోనాట్ను ఒక పూర్తి ఏడాదికాలం అక్కడే ఉంచనుంది. తద్వారా సుదీర్ఘకాలంపాటు అంతరిక్షంలో ఉంటే ఎలాంటి అనారోగ్యపరిస్థితులను ఎదుర్కోవాల్సి రావొచ్చు? అనే అంశంపై అధ్యయనంచేయనుంది. కొత్త మాడ్యూళ్లను తీసుకెళ్లేందుకు హాంకాంగ్, మకావూ నుంచి ఇద్దరు టైకోనాట్స్ను అంతరిక్ష కేంద్రానికి పంపనుంది. పాకిస్తాన్ వంటి అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల వ్యోమగాములకు చైనా స్పేస్స్టేషన్ స్వాగతం పలకనుంది. నాసా మిషన్లో వచి్చన మార్పులేంటి? 2027లో దిగువ కక్ష్యలో తొలుత ఒక వ్యోమనౌకను ప్రయోగించనుంది. వాణిజ్య లాం్యడర్లతో అనుసంధానం కోసం రిహార్సల్ చేయనుంది. ఈ కమర్షియల్ ల్యాండర్లను స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజిన్ సంస్థలు రూపొందిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్టిమిస్–2 ప్రాజెక్ట్ను అమెరికా చేపట్టనుంది. వ్యోమగాములతో బయల్దేరే వ్యోమనౌక చంద్రుని సమీప కక్ష్యలోకి వెళ్లి అక్కడి నుంచి జాబిలి సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుని స్వల్ప గురుత్వాకర్షణ శక్తినే వడిసెలా వాడుకుని తిరిగి భూమి దిశలో పయనించనుంది. 2027లో ఆర్టిమిస్–3 ఆ తర్వాత 2028లో ఆర్టిమిస్–4ను అమలుచేయనుంది. మళ్లీ చందమామపై దృష్టి ఎందుకు సారించారు? చంద్రుని దక్షిణ ధృవంలోని బిలాల్లో ఘనరూప నీరు ఉందని తాజా పరిశోధనలు బలంగా చెబుతున్నాయి. ఈ నీటిని ఉపయోగించుకుని అక్కడ వ్యోమగాముల కోసం స్థిరనివాసాలు ఏర్పాటుచేయాలని అమెరికా భావిస్తోంది. అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాలు చేయాలని ఆశిస్తోంది. అరుణ గ్రహంపై యాత్రకు జాబిలిని మజిలీగా మార్చుకోవాలని భావిస్తున్నారు. హీలియం–3 అనే అరుదైన ఐసోటోప్ చందమామపై సమృద్దిగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యోమగాములు అక్కడ స్థిరపడ్డాక ఈ ఐసోటోప్తో కేంద్రక సంలీన చర్య ద్వారా నిరంతరాయంగా కరెంట్ను ఉత్పత్తిచేసి విద్యుత్ అవసరాలను తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎకానమీకి క్రూడ్ షాక్
పశ్చిమాసియా మిసైళ్ల మోతతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ అట్టుడుకుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ముడి చమురు భగ్గుమంటోంది. ప్రపంచ క్రూడ్, గ్యాస్ సరఫరాకు కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లపై ఇరాన్ విరుచుకుపడుతుండటంతో క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. సోమవారం క్రూడ్ రేట్లు 13 శాతం దూసుకెళ్లాయి. చమురు ధరలు మరింత పెరిగితే.. అసలే అంతంతమాత్రంగా ఉన్న అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతున్న భారత్ లాంటి దేశాలకు క్రూడ్ సెగ శరాఘాతంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు.. గల్ఫ్ దేశాలకు మన ఎగుమతులు కూడా దిగజారితే ఎకానమీకి దెబ్బమీద దెబ్బ పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.అమెరికా – ఇజ్రాయెల్, ఇరా¯Œ మధ్య చెలరేగిన యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం అగి్నగుండంగా మారుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హర్ముజ్ జలసంధిని యుద్ధ ప్రభావంతో ఎక్కువ కాలంపాటు మూసివేస్తే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 15 శాతం, గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరాల్లో 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ట్యాంకర్ ట్రాఫిక్ను వెంటనే పునరుద్ధరించకపోతే క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్ల పైకి దూసుకెళ్తుందని కన్సల్టెన్సీ సంస్థ వుడ్ మెకెంజీ పేర్కొంది. సోమవారం నైమెక్స్ క్రూడ్ రేటు బ్యారెల్ 75 డాలర్లను తాకగా.. బ్రెంట్ క్రూడ్ 83 డాలర్ల గరిష్టానికి చేరింది. హర్ముజ్ జలసంధి మూసివేతతో షిప్పింగ్ రేట్లు, బీమా ధరలు మరింత పెరిగిపోవచ్చని కూడా మెకెంజీ హెచ్చరించింది.రెమిటెన్సులపై ప్రభావం.. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం వల్ల వీరి ఉపాధికి ముప్పు రావొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాల కోతలకు దారితీస్తుంది. ఇది రెమిటెన్సుల (విదేశాల నుంచి భారతీయులు స్వదేశానికి పంపే సొమ్ము) మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 2023–24 ఆర్బీఐ గణాంకాల ప్రకారం భారత్కు 118.7 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు రాగా.. అందులో సుమారు 38 శాతం (40–45 బిలియన్ డాలర్లు) గల్ఫ్ దేశాల నుంచే (ఇందులో సగం వాటా యూఏఈదే) వచ్చాయి. ఇరాన్ దాడులతో యూఏఈ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇతర గల్ఫ్ దేశాల ఎకానమీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో భారత్కు వచ్చే రెమిటెన్సులపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా.సరఫరాలకు గండి.. ఒకపక్క, హర్ముజ్లో అడ్డంకులు.. మరోపక్క సౌదీ తదితర దేశాల్లో రిఫైనరీలపై ఇరాన్ దాడులకు తెగబడుతుండటంతో క్రూడ్ సరఫరాలకు గండి పడే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఒపెక్ ప్లస్ దేశాలు సరఫరాలను పెంచడానికి యతి్నస్తున్నాయి. అయినప్పటికీ కీలకమైన ఈ జలసంధి ద్వారా ఎగుమతులను పునరుద్ధరించేందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చని వుడ్ మెకెంజీకి చెందిన సీనియర్ వైస్ప్రెసిడెంట్ అలాన్ గెల్డర్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం సమయంలో క్రూడ్ బ్యారెల్ ధర గరిష్టంగా 130 డాలర్లకు భగ్గుమంది (2008లో బ్యారెల్ 148 డాలర్లు ఆల్టైమ్ గరిష్టం).ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వార్ దెబ్బకు తోడు హర్ముజ్ ద్వారా రవాణాకు గండిపడటంతో క్రూడ్ 100 డాలర్ల పైకి ఎగబకావచ్చనేది ఆయన అంచనా. ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రం వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొన్ని సరఫరాలను పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ.. హర్ముజ్ ఎగుమతుల నష్టాన్ని పూర్తిగా పూడ్చడం సాధ్యం కాదని కూడా గెల్డర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) సరఫరాల్లో 20 శాతం రవాణా కూడా హర్ముజ్ ద్వారానే జరుగుతోంది. ప్రధానంగా ఖతార్ నుంచి ఆసియా, యూరప్ మార్కెట్లకు ఎల్ఎన్జీ భారీగా రవాణా అవుతుంది. తాజా సరఫరా అంతరాయాలతో గ్యాస్ రేట్లు కూడా మండిపోతాయని నిపుణులు చెబుతున్నారు.ఎగుమతులపై ఎఫెక్ట్గల్ఫ్ వార్తో ఎగుమతుల రంగంపై పెను ప్రభావం పడే అవకాశముంది. పశ్చిమాసియా మార్కెట్లలో డిమాండ్ పడిపోతుంది. భారత్కు పశ్చిమాసియా ప్రధాన ఎగుమతి మార్కెట్. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు దేశీ ఎగుమతులకు కీలకం. భారత్ మొత్తం ఎగుమతుల్లో 17 శాతం (62 బిలియన్ డాలర్లు) వాటా పశ్చిమాసియాదే. ఇందులో ముఖ్యంగా బాస్మతి బియ్యం, చక్కెర, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఉత్పత్తులు, రత్నాభరణాలు, టెక్స్టైల్, ఫార్మా ఉత్పత్తులతోపాటు ఐటీ సేవల ఎగుమతుల పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. డిమాండ్ తగ్గడం ఒకెత్తయితే హర్ముజ్ జలసంధి గుండా రవాణా స్తంభించడం కంపెనీలను మరింత దెబ్బతీసే అంశం. ఎగుమతులకు అంతరాయంతో 30కి పైగా లిస్టెడ్ కంపెనీలపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.మార్కెట్లు బేర్... కూడ్ దెబ్బకు తోడు, రూపాయి పతనం.. దిగుమతుల భారం... ఎగుమతులకు గండితో మన జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడతాయి. ఇప్పటికే తిరోగమనం బాట పట్టిన విదేశీ ఇన్వెస్టర్లు మరింత అమ్మకాలకు తెగబడే అవకాశం ఉంది. నిఫ్టీ ఆల్టైమ్ గరిష్టం (26,373 పాయింట్లు) నుంచి తాజాగా (24,603 పాయింట్లు) 7 శాతం మేర పడింది. ఎకానమీపై గల్ఫ్ వార్ దెబ్బకు మన మార్కెట్లలో ఆటుపోట్లు తప్పవని, మరింత దిగజారే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.భారత్కు డబుల్ షాక్... భారత్ ముడిచమురు అవసరాల్లో 85 శాతం (రోజుకు దాదాపు 4.2 మిలియన్ బ్యారెల్స్) దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో ప్రస్తుతం దాదాపు సగం హర్ముజ్ జలసంధి ద్వారానే మనకు చేరుతోంది. ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం దెబ్బకు క్రూడ్ రేట్లు ఎగబాకుతుండటంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడయ్యే పరిస్థితి. వార్ ఎక్కువ రోజులు సాగి.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైకి చేరితే.. పెట్రోలు, డీజిల్ ధరలు కూడా భగ్గుమంటాయి. దీంతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చి ప్రజల జేబుకు చిల్లుపడుతుంది. మరోపక్క, డాలరుతో రూపాయి మారకం విలువ 91.5కు పడిపోవడం కూడా ఎకానమీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. రూపాయి పతనంతో చమురు దిగుమతులు మరింత భారంగా మారతాయి.దీనివల్ల రూపాయి విలువ మరింత పడిపోయేందుకు దారితీయొవచ్చని ఇంధన రీసెర్చ్ సంస్థ రిస్టాడ్ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. బ్యారెల్ క్రూడ్ ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) మేర దిగజారుతుందని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. ఇక అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి భారత్ చమురు సరఫరా దాదాపు నిలిపివేసింది. భారత్కు రావాల్సిన రోజుకు 1.8 మిలియన్ బ్యారెల్స్ చౌక రష్యా క్రూడ్ ఇప్పుడు చైనాకు తరలిపోతోంది. 10–15 డాలర్ల డిస్కౌంట్ ధరకు లభించే రష్యా క్రూడ్ను కాదనుకోవడం.. ధరలు భగ్గుమనడం భారత్ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఎయిర్లైన్స్ లబోదిబో... భారత్ నుంచి పశ్చిమ దేశాలకు రాకపోకల్లో దుబాయ్ కీలకమైన ట్రాన్సిట్ హబ్గా నిలుస్తోంది. యుద్ధంతో గల్ఫ్ మొత్తం వార్ జోన్గా మారడం, గగనతలాలను మూసేయడంతో భారతీయ విమానయాన సంస్థలు లబోదిబోమంటున్నాయి. ఎయిర్పోర్టుల మూసివేతతో యూరప్, యూకేలకు వెళ్లే పలు విమానాలు రద్దుకావడం, మరికొన్ని వేరే రూట్లకు మళ్లించడం వల్ల ప్రయాణికులకు తిప్పలతోపాటు ఇండిగో, ఎయిరిండియాల వంటి ముఖ్యమైన ఎయిర్లైన్స్ ఖర్చులు భారీగా ఎగబాకనున్నాయి. చమురు రేట్ల పెరుగుదల ప్రభావం (ఏటీఎఫ్) కూడా కంపెనీలకు కునుకులేకుండా చేస్తోంది. భారతీయ, అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు వారానికి రూ.875 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చని మారి్టన్ కన్సలి్టంగ్కు చెందిన మార్క్ డి.మారి్టన్ పేర్కొన్నారు. యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించకపోవడం.. గల్ఫ్ దేశాల విషయంలో సెంటిమెంట్ దెబ్బతినడంతో ట్రావెల్ కంపెనీలు కూడా భారీగా నష్టపోతాయనేది పర్యాటక రంగ నిపుణుల మాట. -
పశ్చిమాసియా పైనే మార్కెట్ ఫోకస్
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆందోళనలు ఉపశమించే వరకూ సెంటిమెంటు బలహీనపడనున్నట్లు అంచనా వేశారు. వీటికితోడు చమురు ధరలకు రెక్కలువస్తే అటు వాణిజ్య లోటు, ఇటు రూపాయి బలహీనపడవచ్చని తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి. హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది. వెరసి తాజా పరిస్థితులు దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్కు ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తవచ్చని, దీంతో ఆర్బీఐ పరపతి విధానాలపై ప్రభావం పడవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొ న్నారు. టెక్నాలజీ స్టాక్స్లో బలహీనతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా ప్రస్తావించారు. ఆటో అమ్మకాల ఎఫెక్ట్ రేపు(3న) హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఫిబ్రవరి నెలకు ఆటో రంగ(వాహన) అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా నేడు(2న) ఆటో కౌంటర్లు వెలుగులో నిలచే వీలుంది. వారాంతాన ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కొత్త సిరీస్ ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఈ బాటలో ఈ వారం పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. మరోపక్క యూఎస్, చైనా గణాంకాలు సైతం విడుదలకానున్నాయని, వీటి ఆధారంగా ఈ వారం మార్కెట్లలో యాక్టివిటీ నమోదుకానున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. సాంకేతికంగా చూస్తే..గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులుగా మారి రూ. 22,615 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధభయాలు ఇండెక్సులను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి అంచనాల ప్రకారం.. → ఈ వారం నిఫ్టీ 25,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. 24,800–24,700 స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. ఇక్కడినుంచి బౌన్స్ అయితే 25,500–25,700 పాయింట్లవరకూ బలపడవచ్చు. → సెన్సెక్స్ 81,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. ఆపై 80,500–80,100 పాయింట్లస్థాయిలో మద్దతు కనిపించే వీలుంది. ఇక్కడి నుంచి పుంజుకుంటే 82,000– 82,500 పాయింట్లవరకూ పురోగమించే అవకాశముంది. గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం(ఫిబ్రవరి 23–27) దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 1,528 పాయింట్లు(2 శాతం) పతనమై 81,287 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 393 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,179 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
చీకటి – వెలుగులు
సాఫ్ట్వేర్ రంగంలో ‘నైట్ డ్యూటీ’ అనే మాట వింటూనే ఉంటాం. బతుకు పోరాటంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లను ఊడ్చే మహిళా స్వీపర్లూ రాత్రిపూటే విధులను నిర్వర్తిస్తుంటారు. సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్ స్టేషన్ పరిసరాలలో రాత్రి రెండు గంటల సమయంలో రోడ్లను ఊడుస్తూ కనిపించింది కంతి రాణి. కాసేపు ఆమెతో మాట కలిపితే ఒంటిచేత్తో బతుకుబండిని ఎలా లాక్కొస్తుందో ఇలా మన ముందు ఆవిష్కరించింది..‘‘కష్టాలు వచ్చాయని ఆగిపోతమా? చావో బతుకో తేల్చుకోవాలి. రాత్రిపూట రోడ్లమీద పని అంటే మాకు భయమే ఉంటుంది. కానీ, బతుకు భయం అంతకన్నా పెద్దది. అందుకే, ధైర్యంగానే ఈ పని చేస్తుంటాం. రాత్రి ఏడు గంటలకు డ్యూటీలో చేరితే, మళ్లా తెల్లారి ఐదున్నర అయితది డ్యూటీ దిగేసరికి. ఇంటికి చేరేసరికి ఏడు గంటలు. రాత్రంగా రోడ్లు ఊడ్చి ఊడ్చి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాం. అందుకని, ముందుగా స్నానం చేసి, ఇంటి పనులు చేసుకొని, ఇంట్ల వాళ్లకు ఇంత వండిæపెట్టి, నేను తిని, పగటేల పన్నెండు గంటలకు పడుకుంట. మళ్లా సాయంకాలం ఐదు గంటలకు లేచి, పనులు చేసుకొని, ఏడు గంటలకు డ్యూటీకి పోత. పదహారేళ్లుగా ఇదే నా పని.. ఒంటి చేతి కష్టమే!మా ఊరు జనగాం దగ్గర వెలిగొండ. చిన్నతనంలోనే మా అమ్మనాయన నాకు పెండ్లి చేశారు. మా అమ్మనాయనకు ముగ్గురు ఆడపిల్లలం, ఓ మగపిల్లాడు. నా భర్త పేరు జక్రయ్య. మా నాయిన సొంత అక్క కొడుకు. చిన్నప్పుడు బావిలో పడి, ఓ కాలు పనిచేయదు. ‘కాలు సరిగా పనిచేయని వాడిని ఎవరూ పెండ్లి చేసుకోరు’ అని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండు మా నాయిన. నా పెళ్లి నాటికి నాకు పదిహేనేండ్లు కూడా లేవు. ఊళ్లో కొన్నాళ్లు ఉన్నం. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రు. బతుకుదెరువు కష్టమైతే హైదరాబాద్ వచ్చినం. మొదట హౌజింగ్ బోర్డ్ ఏరియా లో ఉండేవాళ్లం. అక్కడే ఉప్పర్ పనికి పోయిన, ఇండ్లల్ల పనిచేసిన. మా ఆయన పనికెళితే, పడిపోయేటోడు. దీంతో నేనే ఆయన్ని ఇంట్లో ఉంచి, పిల్లలను స్కూల్కు పంపించి, పనికి పోయేదాన్ని. ఆ తర్వాత తెలిసినవాళ్ల ద్వారా స్వీపర్ పనిలో చేరిన. అప్పుడు యాప్రాల్లోని బాలాజీ నగర్కి వచ్చి, ఇల్లు తీసుకొని ఉన్నం. పిల్లలను పదోతరగతి వరకు చదివించిన. ఆ తర్వాత పెండ్లిండ్లు చేసిన. అన్నీ ఒంటి చేత్తోనే. కలిగిన దాంట్లో సాయం...మా అక్కచెల్లెళ్ల లో ఒక చెల్లెలికి, భర్త చనిపోయి మస్తు కష్టపడుతుంది. తమ్మునికి ముగ్గురు ఆడపిల్లలు. తమ్ముడికి ఆరోగ్యం బాలేక చనిపోయాడు. దీంతో మా మరదలు పిల్లలను పెంచడానికి మా లెక్కనే కష్టపడుతుంటది. అందుకని నాకు కలిగినదాంట్లో వాళ్లకు సాయం చేస్తుంటాను. పిల్లల పెండ్లిండ్లకు అప్పు అయ్యింది, మెల్లగా తీర్చుకుంటున్న. పండగలొస్తే మహా కష్టం..బోనాలు, వినాయక చవితి, జెండా పండగల సమయాలలో, పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు .. చాలా పని ఉంటది. ఎంతంటే... మాపని ఘోరం అని చెప్పచ్చు. గుడుల దగ్గర, స్టేషన్, ట్యాంక్బండ్.. వేరే వేరే చోట్లల్లా డ్యూటీ ఉంటుంది. ఆ రోజుల్లో చెత్త చానా ఎక్కువ ఉంటుంది. ఊడ్చి ఊడ్చి చేయి రెక్కలు బాగా నొప్పి పెడతాయి. ప్రాణాలు అరచేతిలోనే..యాక్సిడెంట్లు అవుతుంటాయి. అర్థరాత్రి దాటిందంటే ట్రాఫిక్ ఉండదు కదా! బండ్లు, వ్యానులు మస్తు స్పీడ్గా పోతుంటయి. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా, ఊడుస్తుండగా యాక్సిడెంట్లు అయినయి. మా గ్రూప్లోనే నలుగురైదుగురు చనిపోయారు. పానాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తుంటాం. ఇది కాకుండా తాగినోళ్లు ఉంటారు. తాగి, రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్లు ఉంటారు. వాళ్లను జరగమంటే.. ఆ మత్తులో గలీజు మాటలు అనేటోళ్లు ఉంటారు. తిడుతుంటరు. మీద మీదకు వస్తుంటరు. పోలీసులు ఉంటారు. కానీ, రోజూ వాళ్లకు ఎన్నని చెబుతం. అందుకే, అలాంటోళ్ల నుంచి దూరంగా ఉంటూ మా పని మేం చేసుకుంటూ పోతుంటం. బతుకుదెరువు కోసం తప్పదు, అన్నీ భరిస్తాం. మా గ్రూప్లో పదిహేను మంది దాకా ఉంటాం. అందరివీ సమస్యలే. నెలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అంతకు మించి ఒక్కరోజు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతది. నెలంతా ఊడ్చితే పదివేల రూపాయల దాకా వస్తాయి. అందులోనే అన్నీ సర్దుకుంటాం. ఇప్పుడంటే నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. చిన్న చిన్న పిల్లలున్న తల్లుల కష్టం ఇంకా పెద్దది.ఒకరికి ఒకరం... మా గ్రూప్ వాళ్లం కలిసినప్పుడు ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుంటాం. కానీ, ఎవరి కష్టాలు వారివే. ఊడ్చి ఊడ్చి మెడలు గుంజుతాయి. మళ్లీ ఇంటికొచ్చి పనులు చేసుకోవాలి. ఈ పనిలో చేరిన కొత్తలో చేతనైంత కాలం పని చేసుకోవచ్చు అన్నారు. కానీ, అరవై ఏళ్లు దాటినవాళ్లు పని నుంచి దిగిపోయారు. వాళ్లకు పెన్షన్ ఏమీ లేదు. కానీ, వాళ్ల ఇంట్ల బిడ్డకో, కొడుకుకో మళ్లీ స్వీపర్ పని ఇస్తరు’ అంటూ రాత్రిళ్లు రోడ్లు ఊడ్చే పనుల్లోని చీకట్లను, బతుకులో నింపుకుంటున్న వెలుగును పంచుకుంది రాణి. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
ఖమేనీ అంతానికి... ఎందుకంత పంతం?
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్ను బ్రిటన్, అమెరికాలు ‘ఆపరేషన్ బూట్’ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దె దించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహొల్లా ముసావీ ఖొమేనీ సారథ్యంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటినుంచీ అమెరికాకు ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు.పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణిక్యంతో తుత్తునియలు చేశారు. ఇరాన్కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్ను, యెమెన్లో హూతీలను, లెబనాన్లో హెజ్»ొల్లా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపర్చుకున్నారు. దాంతో ఖమేనీ ఆధిపత్యానికి గండికొట్టేందుకు అమెరికా శతథా ప్రయతి్నంచింది. ఇరాన్లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి, సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి... ఇలా పలు రకాలుగా ప్రయతి్నంచి విఫలమైంది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారీ తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడిచేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వప్రయత్నంచేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిదీన్–ఇ–ఖల్ఫ్ (ఎంఈకే)కు ఆర్థికసాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థ జూన్దుల్హాకు అండదండలు అందించింది. ఇరాన్ ప్రభుత్వ నేతలు, కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పింది. మతపాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను షికార్లు చేయించేది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించేది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లనూ విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తనవంతు సాయం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతలో మానసిక అనారోగ్యం
సాక్షి, స్పెషల్ డెస్క్: కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ స్నాక్స్, ఇన్స్టంట్ నూడుల్స్, రెడీ టు ఈట్.. ఇలా చెప్పుకూంటూ పోతే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితా పెద్దగానే ఉంటుంది. యువతలో ఉత్పాదకత, భావోద్వేగ స్థిరత్వం తగ్గడానికి వీటి వినియోగం ప్రధాన కారణమని ఒక అధ్యయనంలో తేలింది. పని చేసే జనాభా ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది ఆందోళన కలిగించే విషయం. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ కింద వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సేపియన్ ల్యాబ్స్ విడుదల చేసిన గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక ప్రకారం.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావం కేవలం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకే పరిమితం కాలేదు. మానసిక, మేధోపరమైన పనితీరు తగ్గడానికి కూడా కారణమవుతున్నాయని కొత్త ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 18–34 ఏళ్ల వయస్సు వారిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యువతపైనే ప్రభావం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న 18–34 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో 41% మంది వైద్యపరంగా నిర్ధారించదగిన తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వారితో పోలిస్తే రోజువారీ జీవితంలో ఉత్పాదకతతో పనిచేయడంలో తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని నివేదించిన యువత దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. 2024–25 మధ్య 85 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రజల అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగ తీరుతెన్నులను పరిశీలించింది. 18–34 ఏళ్ల వయస్సు గలవారు 2,21,190 మంది, 55 ఏళ్లు పైబడిన వారు 3,00,522 మంది ఇందులో పాల్గొన్నారు. ప్రతికూలత పెంచుతోంది.. యువతలో ఎదురవుతున్న మొత్తం మానసిక అనారోగ్య సమస్యల్లో 15–30% వరకు కేవలం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను తరచుగా తీసుకోవడం వల్లేనని అధ్యయనం అంచనా వేస్తోంది. ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రధానంగా కుంగుబాటు లక్షణాలతోపాటు, భావోద్వేగ, మేధోపరమైన నియంత్రణ కోల్పోయే సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. వీటి వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల మెరుగైన మానసిక ఆరోగ్య ఫలితాలు కనిపిస్తున్నట్లు తేలింది. ప్రాసెస్ చేసిన ఆహారంలో వాడే రసాయన మిశ్రమాల సంఖ్య, క్లిష్టత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయని, ఇది మన శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాన్ని మరింత పెంచుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే.. తయారీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలు. వీటిలో కొవ్వు, చక్కెర, ఉప్పు పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సహజ ఆహార పోషకాలు చాలా తక్కువ. ఇవి సాధారణంగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల మిశ్రమంతో తయారవుతాయి. వీటిలో ఆహారాన్ని ఎక్కువ కాలం మన్నికగా ఉంచే ప్రిజర్వేటివ్స్; నూనె; నీటిని చిక్కటి, సమాన మిశ్రమంగా ఉంచే ఎమల్సిఫైయర్స్; తీపిని ఇచ్చే స్వీట్నర్స్; కృత్రిమ రంగులు, రుచులు ఉంటాయి. ఎవరెవరు ఎంత తింటున్నారు? » ప్రపంచవ్యాప్తంగా: ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న జనాభాలో 18–34 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 54% మంది వారంలో ఎక్కువ రోజులు లేదా ప్రతిరోజూ అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను తీసుకుంటున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో ఇటువంటివారు కేవలం 26% ఉన్నారు. » భారత్: యువతలో 44% మంది క్రమం తప్పకుండా ఈ ఫుడ్ను ఆస్వాదిస్తున్నారు. 55 ఏళ్లు పైబడిన వారిలో ఈ ఫుడ్ను ఆరగించేవారు 11% మాత్రమే. అలవాట్లను మార్చుకోగలిగితే.. భావోద్వేగ, మేధోపరమైన నియంత్రణ, మానసిక పటిమ.. ఇవి కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా పని ప్రదేశంలో ఉత్పాదకత, విస్తృత సామాజిక స్థిరత్వానికి పునాది వంటిది. ఇలాంటి సామర్థ్యాలను ఈ పుడ్ దెబ్బతీస్తోందని తాజా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే యువతలో మానసిక ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తున్న పలు అంశాలను ఈ నివేదిక గుర్తించింది. వీటిలో చిన్న వయస్సులోనే స్మార్ట్ఫోన్ల వాడకం, బలహీనపడిన కుటుంబ బంధాలు, తగ్గుతున్న ఆధ్యాత్మికత, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగం ప్రధానమైనవి. వీటన్నింటిలో ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగిన, ప్రభుత్వ విధానాల ద్వారా నియంత్రించగలిగే అంశంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. -
పిల్లల లోకానికి 'లాక్'
పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. గతవారం ఢిల్లీలో జరిగినఏఐ ఇంపాక్ట్ సదస్సులో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పిల్లల్ని ఆన్లైన్నుంచి దూరం చేస్తూ నియంత్రణలను అమలు చేస్తున్నాయి. –సాక్షి స్పెషల్ డెస్క్నియంత్రణ ఎందుకు?సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఆన్లైన్ లో భద్రతా పరమైన ముప్పు పొంచి ఉండటం పట్ల సామాజికవేత్తలు, పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రణ గురించి యోచిస్తోంది.అమలు సాధ్యమేనా?నియంత్రణలు విధించడం మంచిదే అయినా, వాటిని అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదా : ఇంట్లో అందరూ వాడే ఫోన్ల ద్వారా పిల్లలు సులభంగా తమ వయసును తప్పుగా చూపి సోషల్ మీడియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో నియంత్రణ నిష్ఫలం అవుతుంది. మరికొన్ని సమస్యలునియమాలు కఠినంగా ఉంటే పిల్లలు తక్కువ పర్యవేక్షణ ఉండే ఇతర ప్రమాదకరమైన యాప్స్ వైపు వెళ్లే ప్రమాదం ఉంది. అదీగాక, ఇంటర్నెట్లో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని కూడా వారు కోల్పోవచ్చు. చివరికి మంచి చేయబోతేచెడు ఎదురైనట్లవుతుంది. నిపుణుల సూచనపిల్లలను సోషల్ మీడియాకు దూరం చేయడం కంటే కూడా, టెక్నాలజీ కంపెనీలు తమ ప్లాట్ఫాంల డిజైన్ను మార్చాలని నిపుణులు చెబుతున్నారు. యాప్స్కు బానిసల్ని చేసే ఫంక్షన్లను, ఆప్షన్లను తొలగించాలని వారు చెబుతున్నారు. అలాగే కంటెంట్ను సరిగ్గా నియంత్రించేలా కంపెనీలపై ఒత్తిడి తేవడమే సరైన పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు. -
లోన్స్ లో 'గోల్డ్' టాప్
బంగారం రుణాలు భారత్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. కొత్తగా మంజూరైన రిటైల్ లోన్స్లో దాదాపు మూడింట ఒకవంతు వాటాతో ఈ విభాగం అగ్రస్థానం కైవసం చేసుకుంది. పసిడి ధర పరుగు తీస్తుండడంతో తాకట్టు ద్వారా అందుకునే రుణ మొత్తమూ పెరుగుతోంది. దీంతో జనం గోల్డ్లోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 2025 అక్టోబర్–డిసెంబర్ కాలంలో రూ.8.17 లక్షల కోట్ల గోల్డ్లోన్స్ మంజూరయ్యాయి. ఇదే కాలంలో పర్సనల్ లోన్స్, హోమ్, ఆటో, కంన్జ్యూమర్ డ్యూరబుల్, టూ వీలర్ లోన్స్ కలిపి కస్టమర్లు మొత్తం రూ.8.03 లక్షల కోట్ల రుణం అందుకున్నారు. విలువపరంగా పసిడి రుణాలు ఈ ఐదు విభాగాల కంటే అధికంగా నమోదు కావడం విశేషం. గత ఏడాది జూలై–సెప్టెంబర్లో కొత్తగా తీసుకున్న పసిడి రుణాలు రూ.6.04 లక్షల కోట్లు. దీనిని బట్టి రుణ మార్కెట్లో పుత్తడి ఏ స్థాయిలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ నాటికి కస్టమర్లు మొత్తం రూ.43 లక్షల కోట్ల హోమ్ లోన్స్ అందుకున్నారు. బంగారం రుణాలు రూ.16.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే గోల్డ్లోన్స్ రెండేళ్లలో రెండింతలు కావడమే. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యధికులు లక్ష లోపే..తాకట్టు పెట్టిన బంగారం ద్వారా కస్టమర్లు అందుకున్న సగటు రుణం 2025 అక్టోబర్–డిసెంబర్లో రూ.1.9 లక్షలకు చేరింది. రెండేళ్ల క్రితం ఇది కేవలం రూ.1.1 లక్షలు మాత్రమే. అంటే సగటు లోన్ మొత్తం 72% పైగా పెరిగిందన్నమాట. ఇక రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారి సంఖ్య 51.1% ఉంది. కొత్త కస్టమర్లలో సగం మంది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) ద్వారా గోల్డ్లోన్ స్వీకరించారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి 32.7%, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా 8.5% మంది రుణం పొందారు. వినియోగదారుల్లో 36–45 వయసున్నవారు దాదాపు మూడింట ఒకవంతు ఉన్నారు. 56% మంది రుణగ్రహీతలు పురుషులు కాగా మిగిలినవారు స్త్రీలు. భారత్లో పసిడి రుణాలు ఇలా..2025 డిసెంబర్ నాటికి మొత్తం గోల్డ్లోన్స్ రూ.16.2 లక్షల కోట్లు ఏడాదిలో రుణ విలువ వృద్ధి 44.1%ఖాతాల సంఖ్య 9.07 కోట్లుగత ఏడాది అక్టోబర్–డిసెంబర్లో కొత్తగా మంజూరైన రుణం రూ.8.17 లక్షల కోట్లు -
పరిశోధనల్లో దారి దీపాలు
‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.సైన్స్లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తితోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనే మాటకుకాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. సైన్స్ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...శాస్త్రరంగంలో ‘షా’జీఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్ కంట్రోల్ సెంటర్ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్ మిషన్’కు అధ్యయన డైరెక్టర్గా, రిసోర్సెస్–2 ఏకి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్ ‘ఆత్య–ఎల్1’కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా సేవలందించడం ఆమె కెరీర్లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజినీరింగ్లపై రచనలు చేశారు.ఆకాశదేశాన...చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్.సైంటిఫిక్ ఫిలాసఫీకంప్యుటేషనల్ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్ లెర్నింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) తొలి మహిళా డైరెక్టర్గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్’ విభాగంలో ఇన్ఫోసిస్ ప్రైజ్, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్లు గెల్చుకున్నారు. .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.అప్పుడే మహిళల పురోగతిగౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో బయో–ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్వారి ప్రోత్సాహమే నా బలంసైన్స్ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నా కెరీర్ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.– డాక్టర్ సుధా కళ్యాణి, సీనియర్ మేనేజర్ అండ్ హెడ్, లైఫ్ సైన్స్ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్ పార్క్కాదంబిని గంగూలీకలకత్తా మెడికల్ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్గా చరిత్ర సృష్టించారు.మేరీ పూనెన్ లూకోస్భారతదేశంలో తొలి మహిళా సర్జన్ జనరల్ మేరీ పూనెన్ లూకోస్. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.ఆనందీ బాయి జోషిపాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.జానకీ అమ్మాల్ఎడవలత్ కక్కట్ జానకి అమ్మాల్ ప్రసిద్ధ బోటనిస్ట్. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్లోని సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ తొలి డైరెక్టర్ (1952)కమలా సోహోనీకమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళ.అసిమా ఛటర్జీఅసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్లో డాక్టరేట్ పొందిన తొలి మహిళ.కమల్ జయసింగ్ రణదివేకమల్ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో తొలిసారిగా టిష్యూ కల్చర్ రిసెర్చ్ ల్యాబ్ని ప్రారంభించారు.బీబా చౌదరిభారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.పూర్ణిమా సిన్హాభౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.అన్నా మణిఅన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్ ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్కు సంబంధించి విశేష కృషి చేశారు. -
యువతలో మానసిక అనారోగ్యం!
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో కుటుంబ బంధాలు బలహీనపడడం, జీవన శైలి మారిపోవడం, స్మార్ట్ఫోన్లు యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కుంగుబాటుకు గురి చేస్తున్నాయి. ప్రపంచమంతటా ఈ పరిణామం నెలకొంది. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 18 నుంచి 34 ఏళ్లలోపు యువతలో మానసిక అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక ఆరోగ్య గణన(ఎంహెచ్క్యూ) ర్యాకింగ్లో 84 దేశాలకుగాను భారత్కు 60వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా చెందిన సేపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ హెల్త్’పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. తాజాగా తమ నివేదికను విడుదల చేసింది. భారతీయ యువతలో మానసిక ఆరోగ్యం దిగవ స్థాయిలో ఉన్నట్లు తేలి్చచెప్పింది. దేశంలో 55 ఏళ్లు దాటిన పెద్దలతో పోలిస్తే 18–34 ఏళ్ల యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. → సేపియన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం.. భారతీయ యువత సగటు ఎంహెచ్క్యూ స్కోర్ 33గా ఉంది. వారు ‘బాధల్లో ఉన్న, కష్టపడుతున్న’కేటగిరీలో నిలిచారు. → 55 ఏళ్లు దాటిన పెద్దల సగటు స్కోర్ దాదాపు 100గా ఉండడం గమనార్హం. వారు ‘జీవితాన్ని చక్కగా నిర్వహించుకుంటున్న, విజయవంతమైన’కేటగిరీలో ఉన్నారు. → కోవిడ్–19 మహమ్మారి మొదలైన తర్వాత యువతలో మానసిక అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయని, వారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోలేదని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, చీఫ్ సైంటిస్టు తార త్యాగరాజన్ చెప్పారు. 2019 నుంచి తాము అధ్యయనం కొనసాగిస్తున్నామని, 55 ఏళ్లు దాటినవారి మెంటల్ హెల్త్లో పెద్దగా మార్పులు లేవని వెల్లడించారు. వారి ఎంహెచ్క్యూ స్కోర్ స్థిరంగా ఉందని స్పష్టంచేశారు. → ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాల్లో పెద్దల కంటే 18–34 ఏళ్ల యువతే మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటోంది. → చీకటి ఖండంగా భావించే ఆఫ్రికాలోని ఘన, నైజీరియా, జింబాబ్వే, కెన్యా, టాంజానియా తదితర దేశాల్లోని యువతలో మానసిక అనారోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే వారిలో మెంటల్ హెల్త్ మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. → జపాన్, తైవాన్, హాంకాంగ్, యునైటెడ్ కింగ్డమ్(యూకే), చైనా యువతలో మెంటల్ హెల్త్ ఏమాత్రం బాగా లేదని అధ్యయనం తెలియజేసింది → రెండేళ్లపాటు ఈ సర్వే నిర్వహించారు. 84 దేశాల్లో 10 లక్షల మందికిపైగా ప్రజలను ప్రశ్నించారు. ఇంటర్నెట్ ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో వేర్వేరు వయసులకు చెందినవారు ఉన్నారు. ఆధునిక జీవితం యువత మానసిక ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. → సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యువతలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి మానసిక ఆరోగ్యం క్రమంగా దిగజారుతోంది. → భారత్లో 18–34 ఏళ్ల యువతలో 64 శాతం మంది తాము కుటుంబ సభ్యులతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 55 ఏళ్లు దాటివారిలో 78 శాతం మంది ఇదే మాట చెప్పారు. ఆధికంగా ఆదాయం ఆర్జిస్తున్నవారి కంటే కుటుంబంతో కలిసి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. → ప్రపంచవ్యాప్తంగా సగటున 14 ఏళ్లకు మొదటిసారిగా స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తుండగా, భారత్లో సగటున 16.5 ఏళ్లకు స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభిస్తున్నారు. → ఇండియాలో 55 ఏళ్లు దాటినవారిలో కేవలం 11 శాతం మంది అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకుంటున్నారు. యువతలో మాత్రం ఏకంగా 44 శాతం మంది ఇలాంటి హానికర ఆహారం స్వీకరిస్తున్నారు. → ప్రజల్లో మానసిక అనారోగ్య సమస్యలపై పశ్చిమ దేశాలు దృష్టి పెడుతున్నాయి. దీనిపై పరిశోధన, పరిష్కార మార్గాల కోసం ప్రతిఏటా నిధుల కేటాయింపులు పెంచుతున్నాయి. అమెరికా ప్రభుత్వం 2024లో ఇందుకోసం 2.2 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. యూకే సైతం భారీగానే నిధులు ఖర్చుచేస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. → మానసిక అనారోగ్యం విషయంలో కేవలం చికిత్సతో సరిపెట్టకుండా.. అందుకు మూల కారణం ఏమటన్నది పరిశోధిస్తున్నామని తార త్యాగరాజన్ తెలియజేశారు. కుటుంబ బంధాలు బలహీన పడడం, ఆధ్యాతి్మక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లకు బానిస కావడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించకుండా.. అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వంటివి యువతకు ముప్పుగా పరిణమిస్తున్నాయ ని వివరించారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మానసిక ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకోవాలని చెప్పారు. -
ఐపీఓ రివర్స్ గేర్!
గత రెండు మూడేళ్లుగా రికార్డుల హోరుతో దలాల్ స్ట్రీట్లో దుమ్మురేపిన ఐపీఓ మార్కెట్.. కొత్త ఏడాదిలో కళతప్పుతోంది. ఈ ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీల షేర్లలో చాలా వరకు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. అంతేకాదు, అరంగేట్రంలో తుస్సుమనిపిస్తుండటంతో లిస్టింగ్ లాభాల కోసం ప్రైమరీ మార్కెట్ వెంటపడే మదుపరులకు నిరాశ తప్పడం లేదు.ఏదైనా కంపెనీ ఐపీఓకు వస్తోందంటే మార్కెట్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తేది. బంపర్ లిస్టింగ్లతో ఇన్వెస్టర్లకు లాభాల పంటే. మరిప్పుడో.. లాభాల సంగతి అటుంచితే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయాం అంటూ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టే పరిస్థితి. 2026లో ఇప్పటిదాకా ప్రధాన ఎక్సే్చంజీల తో పాటు ఎస్ఎంఈ ప్లా ట్ఫామ్లో 32 కంపెనీ లు నిధుల సమీకరణ చేపట్టాయి. ఇందులో 11 కంపెనీలు నష్టా లతో అరంగేట్రం చేశాయి. 21 కంపెనీలు లాభాలతో లిస్టయినప్పటికీ.. చివరికి తొలిరోజున లాస్లోనే ముగిశాయి. అన్నింటికంటే అందోళనకరమైన అంశం ఏంటంటే.. 60% (19) కంపెనీల షేర్లు ఇప్పుడు ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోవడం రివర్స్ ట్రెండ్కు అద్దం పడుతోంది.గతేడాది ఘనం... ఈ ఏడాది ఇప్పటిదాకా ప్రీమియంతో లిస్టయిన 21 కంపెనీల్లో కేవలం 8 కంపెనీల షేర్లు మాత్రమే రెండంకెల్లో లాభాలు అందించాయి. గతేడాది ఇదే కాలంలో 18 స్టాక్స్ రెండంకెల వృద్ధితో అరంగేట్రం చేశాయి. మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో సగటు లిస్టింగ్ లాభం 8% కావడం దీనికి నిదర్శనం. కాగా, ఎస్ఎంఈ విభాగంలో లిస్టయిన అన్ని రంగాల్లోనూ ఈ ఏడాది ప్రతికూల పనితీరు కనబడుతోంది. అన్నింటికంటే తీవ్రంగా యజూర్ ఫైబర్స్ షేరు ఐపీఓ ధరతో పోలిస్తే 70 శాతం దిగువన ట్రేడవుతోంది. అరిటాస్ వినైల్, నర్మదేష్ బ్రాస్ ఇండస్ట్రీస్, విక్టరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్మర్ సెక్యూరిటీ, కనిష్క్ అల్యూమినియం షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే 42%–66% కిందికి జారడం ఎస్ఎంఈ కౌంటర్లో కరెక్షన్ తీవ్రతను సూచిస్తోంది. ప్రధాన ఇష్యూలు అంతంతే.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ప్రధాన ఎక్సే్చంజీల్లో (మెయిన్ బోర్డ్) ఐపీఓల జోరు కూడా తగ్గింది. కేవలం 5 కంపెనీలు మాత్రమే లిస్టింగ్ బాట పట్టాయి. ఇందులో కేవలం రెండు కంపెనీలు.. భారత్ కోకింగ్ కోల్ (44.6% లాభం), అమాగీ మీడియా ల్యాబ్స్ (6.9%) మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ఫ్రాక్టల్ ఎనలిటిక్స్ 10.1%, ఆయ్ ఫైనాన్స్ 1% షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ 4.3% నష్టాల్లో ఉన్నాయి. కాగా, 2025 తొలి రెండు నెలల్లో 50 లిస్టింగ్లు నమోదు కాగా, ఈ ఏడాది 32 ఇష్యూలు మార్కెట్లను తాకాయి. పబ్లిక్ ఆఫర్ల పరంగా 2025లో రికార్డుల మోత మోగింది. ఏకంగా 373 ఐపీఓలు వరుసకట్టాయి. ఇందులో 270 ఎస్ఎంఈ ఇష్యూలు కాగా, 103 మెయిన్ బోర్డ్ లిస్టింగ్లు ఉన్నాయి. అయితే, 2024లో అత్యధికంగా సగటు లిస్టింగ్ లాభాలు 49% నమోదయ్యాయి. 2025లో ఇది 10.6 శాతంగా ఉంది.మెరుపులు రెండే.. మొత్తం 32 లిస్టెడ్ కంపెనీల్లో 13 స్టాక్స్ మాత్రమే ఇష్యూ ధరపైన కదలాడుతున్నాయి. ఇందులో గ్రోవర్ జ్యుయెల్స్ ఐపీఓ ఇన్వెస్టర్లకు 95 శాతం లాభాలను పంచింది. కేఆర్ఎం ఆయుర్వేద, అక్రిషన్ న్యూట్రేవేద, భారత్ కోకింగ్ కోల్ వరుసగా 52%, 49%, 45% చొప్పున దూసుకెళ్లాయి. భారత్ కోకింగ్ కోల్ (97.5%), ఈ టూ ఈ ట్రాన్స్పోర్టేషన్ (90%).. లిస్టింగ్లో జిగేల్మన్నవి ఈ రెండే. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లిస్టింగ్లను చూస్తే, ఆరు కంపెనీల షేర్లు 90% పైగా ప్రీమియంతో బంపర్ లాభాలందించడం విశేషం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
చేలు.. ఏఐ మేలు
ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో భాగంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఉపకరించే ఏఐ ఆధారిత సాంకేతికతలపై వెలువడిన సంకలనం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏఐ–అగ్రిటెక్ ఇన్నోవేషన్ సెంటర్, వాధ్వానీ ఏఐ, ప్రపంచ బ్యాంకు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సహకారంతో రూపొందిన ఈ సంకలనంలో 13 దేశాల్లో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న 260 ఆవిష్కరణల్లోంచి 26 ఉత్తమ ఏఐ వ్యవసాయ ఆవిష్కరణలను పొందుపరిచారు. రైతులకు వ్యవసాయ సూచనలు ఇచ్చేందుకు 13 ఏఐ సాంకేతికతలు, కోత అనంతరం, ట్రేసబిలిటీ, మార్కెట్ అవకాశాలపై 4, రుణ పరపతికి సంబంధించినవి 2, కార్బన్ మార్కెట్లపై 2, మరో 5 అభివృద్ధి దశలో ఉన్న ఏఐ సాంకేతికతల గురించి ఇందులో వివరించారు.కొన్ని ఏఐ వ్యవసాయ సాంకేతికతలు.. వాటి పనితీరు ఇలా..⇒ మహారాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన ‘మహా విస్తార్’ మొబైల్ అప్లికేషన్లు, వెబ్ ప్లాట్ఫామ్స్, వాయిస్ బేస్డ్ సరీ్వసులను రైతులకు అందిస్తోంది. పంటల సాగు, పశువులు/ కోళ్లు/ చేపల రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను స్థానిక భాషలో అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ యాప్ను ఇప్పటికే 22 లక్షల రైతులు డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. రైతులు అడిగిన 15 లక్షల ప్రశ్నలకు ఏఐ సహకారంతో జవాబులు ఇచ్చారు.⇒ డిజిటల్ జ్ఞానం తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే త్రీ–ఇన్–వన్ ఏఐ డిజిటల్ వ్యవస్థ ‘ఫామ్బెటర్’. కెన్యా రూపొందించగా ఆఫ్రికా దేశాల రైతులు వాడుతున్నారు. 30% వరకు దిగుబడి పెరిగింది. 15% వరకు కోత అనంతర నష్టాలు తగ్గాయి. ⇒ తెలంగాణలో విత్తనోత్పత్తి రైతులకు ఉపయోగపడుతున్న ఏఐ ఆధారిత సీడ్ ఇంటెలిజెన్స్ డాష్బోర్డ్ వ్యవస్థ ‘సీడ్వర్క్స్ కోపైలట్’. దీని ద్వారా 8 వేల హైబ్రిడ్ వరి విత్తన రైతులు లబ్ధి పొందారు.⇒ 17 ఏళ్ల అనుభవంగల డిజిటల్ గ్రీన్ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వైజరీ ప్లాట్ఫామ్ ‘ఫార్మర్చాట్’. 4 లక్షల మంది భారతీయ రైతులతోపాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్ రైతులు వాడుతున్నారు. దీని సాయంతో రైతులకు వ్యవసాయ విస్తరణ వ్యయం 35 డాలర్ల నుంచి ఒక డాలర్కు తగ్గింది. ⇒ కాలిఫోర్నియా (అమెరికా)కు చెందిన ‘స్పోర్కామ్’గాలిలోని క్రిములను కనిపెట్టి రానున్న చీడపీడల గురించి రైతులకు ముందస్తు సూచనలిస్తుంది. 4 కోట్ల ఎకరాల్లో వాడుతున్నారు.⇒ తెలుగు రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో 1.2 కోట్ల మంది రైతులకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ‘ఫీల్డ్వైజ్’ఏఐ సేవలందిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా దోహదపడుతోంది. ⇒ పశువుల మెడలో సెన్సార్ను అమర్చడం ద్వారా జబ్బులను ముందే పసిగట్టేందుకు ‘కౌ నెక్లెస్ సెన్సార్స్’సంస్థ ఏఐ సేవలందిస్తోంది. ⇒ గుజరాత్కు చెందిన పరేఖ్ అగ్రిటెక్ ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తోంది. రైతులు తమ ధాన్యానికి 5% నుంచి 7% అధిక ధర పొందుతున్నారు. ⇒ పండ్ల నాణ్యతను గుర్తించి గ్రేడింగ్ చెయ్యడంలో 95% కచ్చితత్వంతో ఏఐ ఆధారిత పరికరం పంజాబ్ రైతులకు సేవలందిస్తోంది. ⇒ సింగపూర్కు చెందిన ‘టీఆర్ఎస్టీ01’సంస్థ దక్షిణాసియా దేశాల్లోని లక్షన్నర మంది రైతులకు ట్రేసబిలిటీ సేవలందిస్తోంది. ⇒ ‘ఖేత్స్కోర్’సంస్థ రైతు పరపతి సామర్థ్యాన్ని తెలియజెప్పే స్కోర్ను అందిస్తోంది. ఈ స్కోర్ ఆధారంగా రైతులు సులువుగా రుణాలు పొందవచ్చు. ⇒ గులాబి పురుగు నుంచి పత్తిని కాపాడే ఏఐ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ టెక్నాలజీని జాతీయ పత్తి పరిశోధనా సంస్థ రూపొందించింది. దీని సాయంతో 39% పురుగుమందుల వాడకం తగ్గింది. 18% దిగుబడి పెరిగింది. ⇒ ఐసీఏఆర్ రూపొందించిన ఏఐ ఆధారిత సాయిల్ టెస్టింగ్ వ్యవస్థ ‘వసుధ’. ⇒ ద్రాక్ష తదితర పండ్ల తోటల్లో పురుగుమందుల పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడే ఏఐ ఆధారిత ‘ఫామ్ గార్డియన్ రోవర్’వ్యవస్థ మహారాష్ట్రలో వినియోగిస్తున్నారు.⇒ దేశంలో 86% మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడేలా రూపొందించిన మొబైల్ యాప్ ఆల్ట్ కార్బన్. నేలలోని 25 స్థూల, సూక్ష్మ పోషకాల స్థాయిని, వాతావరణ పరిస్థితులను మిళితం చేసి రైతులకు స్పష్టమైన సూచనలు చేసే విలక్షణ యాప్ ఇది. పశ్చిమ బెంగాల్లో 2,847 మంది వరి, తేయాకు రైతులు దీన్ని వాడటం ద్వారా 18% ఎరువుల వాడకం తగ్గించుకొని 20% నుంచి 32% మేరు దిగుబడి పెంచుకున్నారు. ఏఐతో సాగుకు సాయం...వ్యవసాయ సంబంధ నిర్ణయాలు తీసుకోవడంలో, ఒడిదుడుకులను తట్టుకుంటూ దిగుబడులను పెంచుకోవడంలో కృత్రిమ మేధ దోహదపడుతోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, రైతులతో కలసి ఆచరణాత్మక శాస్త్రీయ దృష్టితో రూపొందించే ఏఐ వ్యవస్థలు ప్రయోజనకరమైన డిజిటల్ సూచనలను అందించగలుగుతున్నాయి. కానీ సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు. ఈ సాంకేతికతలను సక్రమంగా అమలు చేస్తే వాతావరణ మార్పులను, ఒడిదుడుకులను తట్టుకునేందుకు దోహదపడతాయి. – డాక్టర్ ఎం.ఎల్. జాట్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ -
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్లో ఆర్కిటెక్ట్. వారిద్దరూ తమ వివాహం కేవలం ఒక ఫంక్షన్ హాల్కే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి మూడు రోజులపాటు పండుగలా చేసుకోవాలని విశాఖపట్నం తీరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నారు.సాక్షి, సెంట్రల్ డెస్క్: ఒకప్పుడు ఆకాశమంత పందిరి.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావుడి. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమారుడి ఇళ్లల్లో ఉరుకులు పరుగులు కనిపించేవి. ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగా బాలి, మాల్దీవులు, రాజస్థాన్, కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. మన మధ్యే.. మన రాష్ట్రంలోనే ప్రకృతి అందాల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడం నయా ట్రెండ్గా మారింది. సంప్రదాయబద్ధంగా.. ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపిస్తున్నారు. వధూవరుల తరఫు సమీప బంధువులతో పాటు అత్యంత ఆత్మీయుల సమక్షంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహానికి ముందు బ్యూటీ సెషన్లు, స్థానిక సంస్కృతిని తెలుసుకునే వర్క్షాప్లు వంటి వినూత్న కార్యక్రమాలు 2026లో ట్రెండ్గా ఉన్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్కే జై కొడుతున్నారు. వధువు తరఫున 40–50 మంది.. వరుడి తరఫున మరో 40–50 మందితో ప్రశాంతంగా పెళ్లి వేడుకను ముగిస్తున్నారు. ఆ తరువాత సొంతూళ్లలో బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.చుట్టూ ప్రకృతి అందాలు.. సెలయేటి సవ్వళ్లు.. పక్షుల కిలకిలా రావాల మధ్య అడుగులో అడుగేస్తూ.. వధూవరుల ‘సప్తపది’ తంతు ఆహా.. అన్నట్టు ఉంటోంది. మొదటి రోజు: పెళ్లి సందడి రుషికొండ సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్లో బంధువులందరికీ స్వాగతం పలికారు. సాయంత్రం సముద్రపు గాలుల మధ్య జరిగిన ’మెహందీ’ వేడుక కన్నుల పండువగా సాగింది. రెండవ రోజు: పసుపు సంబరం ఉదయాన్నే బీచ్ ఎదురుగా ఉన్న తోటలో ’హల్దీ’ వేడుక జరిగింది. పసుపు రంగు బట్టల్లో అతిథులందరూ ఒకరిపై ఒకరు పూల రెక్కలు, పసుపునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. సాయంత్రం ‘సంగీత్’ వేడుకలో సముద్రపు అలల హోరు మధ్య డీజే పాటలకు అంజలి, రమేష్ కుటుంబ సభ్యులు నృత్యాలతో హోరెత్తించారు. మూడవ రోజు: కల్యాణ ఘట్టం తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున మంటపం పచ్చని మామిడి ఆకులు, మల్లెపూల అలంకరణలతో దివ్యంగా ఉంది. బాలభానుడి కిరణాలు సముద్రాన్ని తాకుతున్న వేళ.. వేద మంత్రాల సాక్షిగా రమేష్ అంజలి మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ శైలిలో అతిథులకు మర్చిపోలేని అనుభూతినిచి్చంది. ఇలా వీరేకాదు అత్యధికులు ఈ తరహా వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ హితంగానూ.. ప్లాస్టిక్ రహిత అలంకరణలతో స్థానిక కళాకారులు, స్థానిక వంటకాలకు స్థానం కల్పిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బాధ్యతాయుతమైన ట్రెండ్గా మారింది. 2026 నాటికి భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మార్కెట్ విలువల 18 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. 2033 నాటికి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఏపీలోనూ ఆదరణ మన రాష్ట్రంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగాయి. విశాలమైన తీర ప్రాంతాలు, కొండకోనల నడుమ రిసార్ట్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన వారు సైతం విశాఖపట్నం, భీమిలి, చీరాల, బాపట్ల వంటి తీరాలతోపాటు దిండి, కోనసీమలోని రిసార్ట్స్, కొండ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వివాహ వేదికలుగా మార్చుకుంటున్నారు.దోహదం చేస్తున్న అంశాలివీ » జెన్ జెడ్ అభిరుచులకు డెస్టినేషన్ వివాహాలు అద్దం పడుతున్నాయి. » విహార యాత్రలా మాత్రమే కాకుండా.. వధూవరుల కుటుంబాల మధ్య అనుబంధాలను మరింతగా పెనవేస్తాయని జెన్ జెడ్ భావిస్తోంది. » డెస్టినేషన్ వెడ్డింగ్స్తో ఏర్పాట్ల కోసం పడే శ్రమ, ఖర్చులను కూడా పరిమితం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపించి మధురానుభూతి పొందుతున్నారు. » సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, కొండ ప్రాంతాల వంటి ప్రకృతి అందాల నడుమ పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గుర్తుండిపోయే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు లభిస్తున్నాయి. » ఆదాయం పెరగడంతో చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ను సామాజిక హోదాకు గుర్తింపుగా భావిస్తున్నారు.మధురానుభూతి గతంలో పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉండేది. ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులంతా హైరానా పడాల్సి వచ్చేది. అందుకే మా అబ్బాయి అమర్ శంకర్ వివాహం విశాఖలోని రిసార్ట్స్లో ప్లాన్ చేశాం. ఆత్మీయుల సమక్షంలో చేసిన పెళ్లి మధురానుభూతి ఇచ్చింది. వచ్చిన బంధువులంతా మినీ ట్రిప్లా ఎంజాయ్ చేశారు. మేము కూడా అతిథుల మాదిరిగా సరదాగా గడిపాం. – యు.ఉషాదేవి, విజయనగరంబడ్జెట్ ఫ్రెండ్లీగానే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేసుకోవచ్చు. వధూవరుల అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా సరే మేం చేస్తాం. స్టేజి ఎంపికపైనే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సమకూరుస్తున్నాం. – టి.రవళి, తలశిల వెడ్డింగ్ ప్లానర్స్, విజయవాడఅతిథుల్లా వస్తే చాలు వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అతిథుల్లా వస్తే చాలు. వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు, నచ్చిన మెనూ, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రఫీ, ఘట్టానికి తగ్గట్టు స్టేజి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం అందరూ వివాహాన్ని గ్రాండ్గా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టు సరీ్వసు అందిస్తున్నాం. – అభి, అభి ఈవెంట్స్ అండ్ ఫుడ్ కేటరర్స్, రాజమండ్రి -
చివర్లోనూ చిక్కులు!
ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి గ్రహణం వీడడం లేదు. కర్వెన మినహా చివరి దశలో ఉన్న నాలుగు రిజర్వాయర్లు, పంప్హౌస్ల పనులు కొన్నిచోట్ల నత్తనడకన సాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అటకెక్కాయి. నిధులు, పరిహారం చెల్లింపు సమస్యలే ఇందుకు ప్రధాన కారణం కాగా.. పనుల పూర్తికి సర్కారు మరోసారి డెడ్లైన్ (వచ్చే మార్చి) పొడిగించక తప్పని పరిస్థితి నెలకొంది.చివరి దశలో 4 రిజర్వాయర్ల పనులుమొదటి దశలో ఐదు రిజర్వాయర్లు.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్లో అంజనగిరి (6.80 టీఎంసీలు), వనపర్తి జిల్లా ఏదులలో వీరాంజనేయ (6.55 టీఎంసీలు), నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెంలో వెంకటాద్రి (16.58 టీఎంసీలు), మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెనలో కురుమూర్తిరాయ (19.15 టీఎంసీలు), జడ్చర్ల మండలంలోని ఉద్ధండాపూర్ (15.91 టీఎంసీలు) నిర్మాణం చేపట్టారు.కర్వెన మినహా (ఇక్కడ నీళ్లు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు) నాలుగు చోట్ల పంప్హౌస్లు నిర్మించారు. మొత్తంగా సుమారు ఏడాదిన్నర క్రితమే అంజనగిరి 100 శాతం, వీరాంజనేయ 95, వెంకటాద్రి 90, కర్వెన 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఏదులలో రిజర్వాయర్ కట్టకు రివిట్మెంట్, ఉద్ధండాపూర్లో పంప్హౌస్ తవ్వకం, హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి కాగా.. సర్జ్పూల్, పంప్హౌస్ కాంక్రీట్ పనులు పూర్తి చేయాల్సి ఉంది.ఆ 2.5 కి.మీ. పనులు పూర్తయితే జలకళనార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 16 కి.మీ.,ల సొరంగం పూర్తయింది. 8.3 కి.మీ.ల ఓపెన్ కెనాల్ నుంచి నీటిని తరలించాలి. ఇందులో కుడికుళ్ల, తిర్నాంపల్లి మధ్య 2.5 కి.మీ.,ల మేర మాత్రమే పనులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ సుమారు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లను నీటితో నింపే అవకాశం ఉంది.ఇంకా అసంపూర్తిగా ఉన్నవి..మొత్తం 18 ప్యాకేజీలకు గాను ప్యాకేజీ–12లో వట్టెం నుంచి కర్వెన వరకు ఓపెన్ కెనాల్ పనులు ఒక శాతమే మిగిలాయి. ప్యాకేజీ–4లో నార్లాపూర్ నుంచి ఏదుల వరకు టన్నెల్ నిర్మాణం పూర్తి కాగా.. 2.74 కి.మీ. మేర గ్యాంట్రీ లైనింగ్ పూర్తి కావాలి. ప్యాకేజీ–7లో ఏదుల నుంచి వట్టెం వరకు 14.853 కి.మీ మేర (ఎడమ), 5.287 కి.మీ.,ల మేర (కుడి) సొరంగాల గ్యాంట్రీ లైనింగ్.. 2.94 కి.మీ.,ల మేర ఎడమ.. 0.339 కి.మీ.,ల మేర కుడి సొరంగం బెడ్ లైనింగ్ పనులు పూర్తికావాల్సి ఉంది.తాగునీటి పనులు మాత్రమే..?నార్లాపూర్ పంప్హౌస్లో ప్రత్యామ్నాయంతో కలుపుకొని మొత్తం 8 మోటార్లు కాగా ఇప్పటివరకు 4 అమర్చారు. నెలరోజుల్లో 2, 3, 4 పంప్ల డ్రైరన్ చేపట్టనున్నారు. ఏదులలో 10 మోటార్లకు గాను ఐదింటిని డ్రైరన్కు సిద్ధం చేశారు. వట్టెంలో 10 మోటార్లకుగాను నాలుగింటి డ్రైరన్ పూర్తవగా.. ఐదోది డ్రైరన్కు సిద్ధంగా ఉంది. ఉద్ధండాపూర్లో ఆరింటికి మూడింటి పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులను తాగునీటి అవసరాలకు ఉపయోగపడేవేనని స్పష్టమవుతోంది.నిధులు, పరిహార సమస్యలు..నార్లాపూర్, ఏదులలో రిజర్వాయర్ల పరిధిలో ఇళ్లు, భూములు కోల్పోయిన ముంపు ప్రాంతాల నిర్వాసితులకు సంబంధించి పరిహార సమస్యలు ఉన్నాయి. బండరావిపాకులలో 18 ఏళ్లు నిండిన వారికి 300 ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతోపాటు పరిహారం పక్కదారి పట్టిందంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అలాగే కొల్లాపూర్ మండలంలోని ముంపు ప్రాంతాలైన సున్నపుతండా, ఒడ్డె గుడిసెల్లో నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. ఫలితంగా ఆయా ముంపు ప్రాంతాల వారు ఖాళీ చేయకుండా అక్కడే నివసిస్తున్నారు. దీంతో ఆయా రిజర్వాయర్ల పరిధిలో మోటార్లు డ్రైరన్కు సిద్ధంగా ఉన్న ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. వట్టెంలో సుమారు రూ.200 కోట్ల నిధులు పెండింగ్లో ఉండడంతో పనులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.ప్రాజెక్టు వివరాలు⇒ పరిపాలన అనుమతులు: 10.06.2015⇒ లబ్ధి పొందే జిల్లాలు: 6 (నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ)⇒ పనుల ప్రారంభం: 2015 జూన్ 11(భూత్పూర్ మండలం కర్వెనలో ప్రాజెక్టు పైలాన్ను అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు)⇒ సాగు నీరందించే లక్ష్యం : 12.30 లక్షల ఎకరాలు⇒ తాగునీరు అందే ప్రాంతాలు: 70 మండలాలు, 1,226 గ్రామాలువ్యయ వివరాలు ఇలా.. ⇒ అంచనా వ్యయం: రూ.35,200 కోట్లు⇒ సవరించిన వ్యయం: రూ.55,086 కోట్లు⇒ సర్కారు తాజా అంచనా: రూ.80,000 కోట్లు -
గాలి నుంచి నీరు!
నీరు. సకల జీవరాశులకు ప్రాణాధారం. అలాంటి నీటి లభ్యత ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. ముఖ్యంగా స్వచ్ఛమైన తాగునీటికి దేశాలన్నీ కటకటలాడే రోజు ఎంతో దూరంలో లేదని పలు సర్వేలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత స్వచ్ఛమైన నీటిని నేరుగా గాలి నుంచే సులువుగా తయారు చేసుకునే టెక్నాలజీని నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ఒమర్ యాగీ అభివృద్ధి చేశారు.భారీ ప్లాంట్లు, పరికరాల అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. ఇందుకోసం కేవలం ఒక షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే యంత్రాన్ని యాగీ రూపొందించారు. ఒక్కో యంత్రం సాయంతో రోజుకు కనీసం 1,000 లీటర్ల నీటిని నేరుగా గాలి నుంచే ఒడిసిపట్టవచ్చు! అంతేకాదు, అత్యంత పొడి వాతావరణంతో కూడిన ఎడారి ప్రాంతాల్లో కూడా ఈ పరిజ్ఞానం భేషుగ్గా పని చేస్తున్నట్టు తేలింది! దీన్ని ప్రపంచపు దాహార్తిని తీర్చగల కీలక పరిణామంగా భావిస్తున్నారు. రెటిక్యులర్ కెమిస్ట్రీతో... గాలి నుంచి నీటిని సేకరించడంపై చేసిన పరిశోధనలకు ప్రొఫెసర్ యాగీకి 2025లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. కాలిఫోరి్నయాకు చెందిన ఆయన సొంత డీప్టెక్ కంపెనీ అటోకో గాలి నుంచి నీటిని సేకరించే టెక్నాలజీపై చాలాకాలంగా పరిశోధనలు చేస్తోంది. ఎడారుల వంటి అత్యంత పొడి వాతావరణంలో కూడా గాలి నుంచి అతి సులువుగా నీటిని తయారు చేయగల పారిశ్రామిక యంత్రాన్ని అటోకో తాజాగా రూపొందించింది. రెటిక్యులర్ కెమిస్ట్రీగా పిలిచే సాంకేతికత సాయంతో ఈ అద్భుతాన్ని సాధించింది. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ (ఎంఓఎఫ్)లను రూపొందించింది. నానో టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ ఎంఓఎఫ్లను ఒకరకంగా నీటిని పీల్చుకునే స్పాంజీలతో పోల్చవచ్చు.కాకపోతే ఇవి అత్యాధునిక అణు స్పాంజీలన్నమాట. గాలిలోని తేమను, కనిపించని వాయువులను ఇవి శోషించుకుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయిక అటా్మస్పియరిక్ వాటర్ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ) ద్వారా గాలి నుంచి నీటిని సేకరించే ప్రక్రియ అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. అందులో గాలిలోని తేమను నీటి బిందువులుగా మార్చే శీతలీకరణ స్థాయిని రాబట్టేందుకు సమీప వాతావరణం మొత్తాన్నీ కూలింగ్ ప్రక్రియ సాయంతో చల్లబరచాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ యంత్రాలు భారీగా విద్యుత్ను వాడుకుంటాయి. కానీ ఎంఓఎఫ్లకు ఇలాంటివేమీ అవసరముండవు. అధిశోషణంగా పిలిచే సహజ ప్రక్రియ ద్వారా గాలిలోని నీటి అణువులను అవి నేరుగా ఆకర్షిస్తాయి.గాలిని బలవంతంగా చల్లబరిచే అవసరం లేకుండా గాలిలోని నీటి అణువులను ఎంఓఎఫ్లు నేరుగా తమకేసి ఆకర్షించుకుంటాయి. మరోలా చెప్పాలంటే అవి రసాయనిక అయస్కాంతాల్లా పని చేస్తాయి. దాంతో నీటి అణువులు వాటి ఉపరితలాలపైకి వచ్చి అతుక్కుపోతాయి. యాగీ సరికొత్త రెటిక్యులర్ కెమిస్ట్రీ టెక్నాలజీకి మొత్తానికీ ఇదే అత్యంత కీలకం. అలా అతుక్కున్న నీటి అణువులను కొద్దిపాటి వేడి సాయంతో వాటిని ఎప్పుడు కావలిస్తే అప్పుడు కంటైనర్లోకి ఒడిసిపట్టుకోవచ్చు. అలా ఎలాంటి కాలుష్యమూ లేని అత్యంత స్వచ్ఛమైన నీరు సమకూరుతుంది.అంతేకాదు, ఈ ప్రక్రియంతా భారీ యంత్రాల బాదరబందీ లేకుండా అత్యంత సులువుగా, సహజంగా జరిగిపోతుంది. పైగా సూర్యుని నుంచి వచ్చే వేడి సాయంతోనే పని పూర్తవుతుంది. కనుక విద్యుత్కేంద్రాలు, భారీ పైపుల వంటివాటి అవసరమే ఉండదు! నీటికొరత ఉన్న ప్రాంతాల్లో షిప్పింగ్ కంటైనర్ పరిమాణంలో ఉండే ఎంఓఎఫ్ యంత్రం బిగించుకుంటే చాలన్నమాట. ఎడారి నేలల్లోనూ... సాంప్రదాయిక పద్ధతుల్లో గాలి నుంచి నీటిని తయారు చేయాలంటే తేమ శాతం కనీసం 45కు మించి ఉండాల్సిందే. లేదంటే అవి చేతులెత్తేస్తాయి. కనుక ఎడారుల వంటి అత్యంత పొడి ప్రదేశాలకు అవి పనికిరావు. కానీ గాల్లో తేమ 20 శాతం కంటే తక్కువగా ఉన్నా యాగీ టెక్నాలజీ భేషుగ్గా పని చేస్తుందని తేలింది. అంటే ఎన్నడూ వర్షమే కురవని, అత్యంత వేడి గాలులతో కూడిన ప్రాంతాల్లో కూడా దాని సాయంతో నీటిని తయారు చేసుకోవచ్చన్నమాట. ఎడారుల్లో గాలిలో నీటి అణువులు చాలా తక్కువగా ఉంటాయి. అటోకో రూపొందించిన ఎంవోఎఫ్లు రసాయన అయస్కాంతాలు తేమ 10 శాతం మాత్రమే ఉండే అత్యంత పొడి వాతావరణంలో కూడా నీటి అణువులను తమకేసి ఇట్టే ఆకర్షిస్తాయి. భారత్లోనూ... భారత్లో కూడా గాలి నుంచి నీటి తయారీకి అక్వో అనే దేశీయ కంపెనీ అట్మాస్పియరిక్ వాటర్ జనరేటర్ల (ఏడబ్ల్యూజీ)ను తయారు చేసింది. ఇవి అధునాతన సంక్షేపణ పరిజ్ఞానం సాయంతో పని చేస్తాయి. అవి గాలిని లోనికి పీల్చుకుంటాయి. అందులోని దుమ్ము, ధూళి వంటివాటిని తొలగించి శీతలీకరణ స్థాయికి చల్లబరిచి నీటిని సేకరిస్తాయి. దాన్ని కార్బన్ ఫిల్టరేషన్, యూవీ స్టెరిలైజేషన్ వంటి పలు దశల్లో శుభ్రపరిచి వినియోగానికి అనువుగా మారుస్తారు. అక్వో ఇప్పటికే మధ్యప్రదేశ్లోని హర్దువా మంగ్రా ప్రాంతంలో 1,500 మంది దాహార్తిని తీరుస్తోంది. హల్దియా రిఫైనరీకి ఈ పద్ధతిలో నీటిని సరఫరా కూడా చేస్తోంది. కాకపోతే ఈ విధానంలో నీటి ఉత్పత్తి ఉష్ణోగ్రత, గాల్లో తేమపై ఆధారపడి ఉంటుందని అక్వో వ్యవస్థాపకుడు, సీఈఓ నవ్కరణ్ సింగ్ బగ్గా వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ..ఆ నేపథ్యమే ప్రేరణప్రొఫెసర్ యాగీది అత్యంత దయనీయమైన నేపథ్యం. ఆయన జోర్డాన్లోని శరణార్థి శిబిరాల్లో పెరిగారు. నీటికి తీవ్ర కటకట అక్కడ అత్యంత సాధారణ దృశ్యం. దాంతో పెరిగి పెద్దవాడయ్యే క్రమంలో యాగీ నిత్యం దాహార్తినే చవిచూస్తూ వచ్చారు. తర్వాతి తరాలు తనలా గొంతెండి అల్లాడకుండా ఏదో చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని చెబుతారాయన. ఆ తపనతోనే రసాయన శాస్త్రంలో విశేషమైన కృషి చేస్తూ వచ్చారు. తన కెరీర్ను దానికే అంకితం చేశారు.ఎన్నెన్ని ఉపయోగాలో...!యాగీ రూపొందించిన వినూత్న ఎంఓఎఫ్ యంత్రాన్ని ప్రపంచానికి నీటి కొరతను సమూలంగా తీర్చగల వరదాయినిగా చెప్పవచ్చు...⇒ నీటికొరత ఇప్పటికే అతి పెద్ద ప్రపంచ సమస్యల్లో ప్రధానమైనదిగా మారుతోంది.⇒ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది సురక్షిత తాగునీటి సౌకర్యానికి దూరమైనట్టు ఐరాస చెబుతోంది.⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఎంఓఎఫ్ యంత్రాలు గేమ్చేంజర్లు కాగలవు. ఎందుకంటే గాలిలోని నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదుల్లోని నీటి కంటే ఏకంగా ఆరు రెట్ల అధికమని పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక గాలి నుంచే నేరుగా నీటిని ఒడిసిపట్టుకోగలిగితే దాహార్తి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.⇒ పైగా ఈ పద్ధతి ద్వారా అత్యంత స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది.⇒ పాతాళాన్ని తాకిన భూగర్భ జలాలపై, వాటర్ ట్యాంకులపై ఆధారపడటం తగ్గిపోతుంది. -
డేటా.. 'నీరెలా'?
సాక్షి, స్పెషల్ డెస్క్ : భారత్ కేంద్రంగా డేటా సెంటర్ల నుంచి కార్యకలాపాలు సాగించే విదేశీ క్లౌడ్ సేవల కంపెనీలకు తాజా బడ్జెట్లో 2047 వరకు ట్యాక్స్ హాలిడే (పన్ను మినహాయింపు) ప్రతిపాదించారు. తద్వారా ఈ రంగంలో రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. క్లౌడ్ మౌలిక వసతులను కీలక రంగాల్లో ఒకటిగా, అలాగే కంప్యూటింగ్ సామర్థ్యాలను నిర్వహణ వ్యయాలుగా కాకుండా మూలధనంగా వర్గీకరించడం ద్వారా భారత్ ప్రపంచ డిజిటల్ ఫ్యాక్టరీగా మారేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశ్రమ ధీమాగా ఉంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ సెంటర్ల విస్తరణతో నీరు, శక్తి వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగించే అంశం. డిజిటలీకరణ భారత్లో వేగంగా విస్తరిస్తోంది.ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కృత్రిమ మేధ (ఏఐ), 5జీ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్–2023తోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం డేటా మన దేశంలోనే నిల్వ చేయాలి. ఈ నేపథ్యంలో భారత్లో డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఐటీ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న కేంద్రీకృత సౌకర్యాలేఈ డేటా సెంటర్లు. ఐదు నగరాలకే.. డేటా సెంటర్ల సామర్థ్యం 2019తో పోలిస్తే భారత్లో 2024 నాటికి నాలుగింతలు దాటింది. అయితే 94% సామర్థ్యం అయిదు నగరాలకే పరిమితమైంది. వీటిలో దేశ ఆర్థిక రాజధాని ముంబై మినహా మిగిలిన చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణె నగరాలు ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. డేటా సెంటర్ల దూకుడుతో భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని న్యూయార్క్కు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్, రేటింగ్స్ కంపెనీ ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా వేస్తోంది. ఈ కేంద్రాల్లో సర్వర్లను చల్లబరిచేందుకు నీటి ఆధారిత కూలింగ్ సిస్టమ్స్ను పెద్దఎత్తున వినియోగిస్తారు. అందుకే నీరు చాలా అవసరమవుతుంది. ఇక భారత్లో మొత్తం విద్యుత్ వినియోగంలో డేటా కేంద్రాల వాటా 2024తో పోలిస్తే ఆరేళ్లలో మూడింతలు కానుందని అంచనా. 1 మెగావాట్కు 25.5 మిలియన్ లీటర్లు » 100 పదాల ఈ–మెయిల్ రూపొందించినందుకు ఏఐ చాట్బాట్ను చల్లబరిచే కూలింగ్ వ్యవస్థకు వాతావరణ పరిస్థితులను బట్టి 200–1,500 మిల్లీలీటర్ల నీరు అవసరం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయా పరిశోధకులు గుర్తించారు. » డిజిటల్ మౌలిక వసతులను ధ్రువీకరించే న్యూయార్క్ సంస్థ అప్టైమ్ ఇన్స్టిట్యూట్ అంచనా ప్రకారం డేటా సెంటర్ల శీతలీకరణ అవసరాల కోసం 1 మెగావాట్ లోడ్కు సంవత్సరానికి 25.5 మిలియన్ లీటర్ల నీరు అవసరం. ఉద్యోగాలు అంతంతే.. » భారత్లో 130కిపైగా డేటా సెంటర్స్ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. » 85కు పైచిలుకు కేంద్రాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. » 100 మెగావాట్ల ఫెసిలిటీ రాకతోకార్యకలాపాలు, నిర్వహణ, టెక్నీషియన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, మేనేజర్లు వంటి 100–200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. » భారీస్థాయి కేంద్రం నిర్మాణ సమయంలో 100 మెగావాట్లకు ఎలక్ట్రికల్,మెకానికల్, నిర్మాణం వంటి విభాగాల్లో 400–600 మందికి 18–36 నెలలపాటు ఉపాధి లభిస్తుంది. -
రెండు కొత్త జాతుల ఆర్మీ చీమల గుర్తింపు
తూర్పు కనుమల్లో రెండు జాతులకు చెందిన ఆర్మీ చీమలను కనుగొన్నారు. కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, ప్రియదర్శనన్, ఒడిశాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్(నైసర్) పరిశోధకులు బికాశ్ సాహు, నిఖితా కుమారన్, అనిరుద్ధ దత్తారాయ్ తమ పరిశోధనలో ఈ చీమలను గుర్తించారు. ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో అనిక్టస్ చిట్టోరెన్సిస్, శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో అనిక్టస్ లంకమల్లెన్సిస్ రకానికి చెందిన చీమలను గుర్తించారు. ఈ ఆర్మీ చీమలు సంచార జాతులు.ఇవి నిర్వహించే సామూహిక మేత దాడులు ఇతర కీటకాలు, పక్షులు, బల్లులకు ఆహారాన్ని అందించేందుకు తోడ్పడతాయి. ఇవి పర్యావరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఇవి ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల్లో కనిపించే అత్యంత సంచార మాంసాహారులు. వాటి శరీరాలతో తాత్కాలిక బయోవాక్స్ను ఏర్పాటు చేసుకుంటాయి. సామాజిక కీటకాలుగా అవి భారీ కాలనీలను ఏర్పాటు చేసుకుంటాయి.ఇవి దండెత్తి కీటకాలు, ఇతర చిన్న కీటకాలను తింటాయి. పెద్ద, పదునైన కోరలతో కుట్టగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటివరకు పరిశోధన, అధ్యయనాల ఆధారంగా దేశంలో 38 రకాల ఆర్మీ చీమలను గుర్తించారు. ఇప్పుడు ఈ రెండు కొత్త జాతులను కనుగొనడంతో ఆర్మీ చీమల జాతుల సంఖ్య 40కి చేరుకుందని కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, జీవ వైవిద్య పరిశోధకులు మంజునాథ్ ఎస్ నాయక్ తెలిపారు. -
దమ్ముంది.. దన్ను కావాలి
ఏఐ సదస్సు చూపిన ‘ఇంపాక్ట్’ఢిల్లీలో ఐదు రోజుల ఐఏ ఇంపాక్ట్ సదస్సు ఇటీవలే ముగిసింది. ఇండియా ఈ సదస్సును మొదటిసారి నిర్వహించింది. ప్రపంచ దేశాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలపై అంతా దృష్టి పెట్టారు. ఇండియాకైతే ఇది ఒక కీలకమైన సందర్భం. మన ఏఐ వ్యవస్థలో ఉన్న బలాలు, పూరించుకోవలసిన లోట్లను ఈ సదస్సు స్పష్టం చేసింది.నిపుణుల సంఖ్యలో రెండో స్థానంఏఐ రంగంలో మెరికలు ఉన్న దేశంగా ఇండియా పేరు పొందింది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉంది. 2024 ‘టార్టాయిస్ గ్లోబల్ ఏఐ ఇండెక్స్’ ప్రకారం, ఏఐ సామర్థ్యంలో ఇండియా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. ఏఐ నిపుణుల సంఖ్యలో మాత్రం 2వ స్థానంలో నిలిచింది.సౌకర్యాలలో 68వ స్థానంఏఐ ఆపరేషన్స్లో ఇండియా 3వ స్థానంతో మంచి ప్రతిభ కనబరిచింది. అయితే కంప్యూటింగ్ పవర్, ఇతర సౌకర్యాల విషయంలో 68వ స్థానంలో ఉంది. ఈ కారణంగా అమెరికా, చైనాతో పోటీ పడటం భారత్కు కష్టం కావచ్చన్న అభిప్రాయం ఏఐ పరిశ్రమంలో వ్యక్తం అవుతోంది.ఉన్నది కొన్నే సూపర్ కంప్యూటర్లుప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన 500 సూపర్ కంప్యూటర్లలో ఇండియా వాటా కేవలం 1 శాతం మాత్రమే. అంటే, ఏఐకి కావలసిన కంప్యూటింగ్ సామర్థ్యం మన దగ్గర చాలా తక్కువగా ఉంది. అమెరికా ఈ విషయంలో చాలా ముందుంది. ప్రపంచంలోని మొత్తం సూపర్ కంప్యూటర్లలో 35 శాతం సిస్టమ్లు, దాదాపు 48 శాతం కంప్యూటింగ్ సామర్థ్యం అమెరికా దగ్గరే ఉంది.ట్రైనింగ్ డేటాలో 3 శాతం వాటాఏఐ ట్రైనింగ్ డేటా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడులలో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే. అంటే, మన దేశానికి చాలా తక్కువ పెట్టుబడులు అందుతున్నాయి. ఈ విషయంలో అమెరికా 56 శాతంతో అందరికంటే ముందుంది. ఆ తర్వాత చైనా 17 శాతంతో, ఐరోపా సమాఖ్య దేశాలు 15 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రపంచాన్ని శాసించగలమా?మన దగ్గర అద్భుతమైన తెలివితేటలు కలిగిన నిపుణులు ఉన్నారు. కానీ, ఆ తెలివితేటలకు తగ్గట్టుగా శక్తివంతమైన కంప్యూటర్లు, భారీ పెట్టుబడులు తోడవాల్సి ఉంది. అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడాలంటే, కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యం మాత్రమే సరిపోదు; సొంతంగా డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లను పెంచుకోవాలి. అప్పుడే ఇండియా ఏఐ ప్రపంచాన్ని శాసించ గలుగుతుంది.⇒ హెచ్.పి.సి. సిస్టమ్ : హై పెర్ఫార్మింగ్ కంప్యూటింగ్ (యంత్ర సామర్థ్యం)⇒ హెచ్.పి.సి. కెపాసిటీ : హై పెర్ఫార్మింగ్ కెపాసిటీ (శక్తి సామర్థ్యం)⇒ హెచ్.ఐ.సి.: హై ఇన్కం కంట్రీస్; యు.ఎం.ఐ.సి.: అప్పర్ మిడిల్ ఇన్కం కంట్రీస్⇒ ఎల్.ఎం.ఐ. సి. : లోయర్–మిడిల్ ఇన్కం కంట్రీస్ -
ముచ్చటైన మరో మూడు పక్షులు
తిరుపతి సిటీ: తిరుపతి శేషాచల అడవుల్లో తిరుపతి నేచర్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో మరో మూడు అరుదైన పక్షి జాతుల్ని గుర్తించినట్టు గరుడ అట్లాస్ బృందం ఆదివారం వెల్లడించింది. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్) బృందంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది పరిశోధకులు పక్షిజాతుల గణన, వాటి వైవిధ్యం, మనుగడ, జీవన విధానంపై ప్రత్యేక సర్వే చేపట్టారు. 2022లో ఏర్పడిన తిరుపతి బర్డ్ అట్లాస్ ఇటీవల గరుడ అట్లాస్గా పేరు మార్చుకుని తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ, శేషాచల అడవుల్లోనూ సంచరించే పక్షిజాతుల డేటాను సేకరించేందుకు శ్రీకారం చుట్టింది. విడతల వారీగా అటవీ ప్రాంతాలలో సర్వే చేపట్టి అరుదైన పక్షి జాతులను గరుడ అట్లాస్ బృందాలు కెమెరాల్లో బంధిస్తున్నాయి. తిరుపతి ప్రాంతంలో తొలిసారిగా పసుపు చెంప పిట్ట (ఇండియన్ ఎల్లో టిట్) అనే అరుదైన పక్షిని కనిపెట్టామని గరుడ అట్లాస్ ప్రతినిధులు చెప్పారు. వీటితో పాటు పసుపు గొంతు బుల్బుల్ పిట్ట (ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్), లీసెర్ విజిలింగ్ డక్ బేబీ వంటి అరుదైన పక్షిజాతులు తిరుపతి ప్రాంతంలో ఉండటం విశేషమన్నారు. కొండలపై నివసించే రాప్టర్ ఐన్ షాహీన్ ఫాల్కన్ పక్షులు సైతం తిరుమల ఘాట్ రోడ్డులో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని తెలిపారు.ఇప్పటివరకు 274 పక్షిజాతుల గుర్తింపు మానవ సమాజంతో పక్షిజాతుల అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు ఐజర్ బృందంలో పరిశోధకుడైన హరీష్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ బృందాలు ఇప్పటివరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో 55 వేల పక్షుల గమనాలను పరిశీలించాయని చెప్పారు. ఇందులో 274 పక్షిజాతులు ప్రకృతిలో మమేకమై ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 5 ఎడిషన్లలో పక్షి జాతుల డేటాను సేకరించామని, వాటిని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఆయన వెంట పుష్యామిత్ర, టీఎన్ఎస్ ప్రతినిధి పి రామచంద్రారెడ్డి తదితరులున్నారు. -
నేటి పాత స్మార్ట్ఫోన్లే... రేపటి ఫైటర్ జెట్లు!
కొత్త ఫోన్ కొనగానే పాతదానిని చెత్త ఫోన్ అంటూ చెత్తబుట్టలో పడేయడం చాలామందికి అలవాటు. కానీ ఆ పాత ఫోన్లో ‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’గా పిలిచే అత్యంత విలువైన భూ అయస్కాంత మూలకాలు అత్యంత సూక్ష్మపరిమాణంలో ఉంటాయి. వాటిని విదేశాల నుంచి వేలాది కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకునే బదులు ఈ పాత ఫోన్ల నుంచే సంగ్రహిస్తే? కేంద్రం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేస్తోంది. తద్వారా లక్షల కోట్ల విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని భావిస్తోంది! ‘‘టన్ను ముడిఖనిజం నుంచి కేవలం ఒకట్రెండు కిలోల కోబాల్ట్ మాత్రమే తీయగలం. అదే టన్ను పాత బ్యాటరీల నుంచి ఏకంగా 50 నుంచి 80 కేజీల దాకా సమీకరించవచ్చు. పైగా ముడిఖనిజ కోబాల్ట్ కంటే ఇది 40 ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది’’ అని గ్రేటర్ నోయిడా కేంద్రంగా పనిచేసే లిథియం–అయాన్ బ్యాటరీ తయారీ సంస్థ ‘లోహం’ రీసైక్లింగ్ హెడ్ సయ్యద్ గజన్ఫర్ అబ్బాస్ సాఫ్వీ చెప్పారు. ‘‘ఇప్పటికే ఎంతో శ్రమించి తయారుచేసిన స్మార్ట్ఫోన్ వంటి ఈ–వేస్ట్లో ఎంతో విలువైన ఖనిజాలుంటాయి. వాటిపై భారత్ ఇప్పటిదాకా సరైన దృష్టి సారించలేదు’’ అని ఈ–వేస్ట్ మేనేజ్మెంట్, లిథియం–అయాన్ బ్యాటరీ కంపెనీ అట్టెరో సహ వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా చెప్పారు. యుద్ధ విమానాలు అత్యంత తేలిగ్గా, అత్యంత దృఢంగా ఉండటానికి నియోడైమియం వంటి ఈ మూలకాలే కారణం. వాటిలో ఇంధనం ప్రవాహాలు, రెక్కల కదలికలు, కాక్పిట్కు కరెంటు సరఫరా చేసే జనరేటర్లను పర్యవేక్షించే సెన్సార్లకు అవే శక్తినందిస్తాయి. ‘‘భారత్ ప్రస్తుతం ఈ–వేస్ట్ను విదేశాలకు అనవసరంగా ఎగుమతి చేస్తోంది. అలాగాక భారత్లోనే భారీగా శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఈ–వేస్ట్లోని భూ అయస్కాంత మూలకాలను సంగ్రహించి యుద్ధ విమానాల తయారీకి సది్వనియోగం చేసుకోవచ్చు. అత్యంత అరుదైన ఖనిజాల కోసం చైనా వంటి ప్రత్యర్థి దేశాలపై ఆధారపడే దురవస్థ తొలగుతుంది’’ అని ముంబై కేంద్రంగా పనిచేసే శుద్ధ సాంకేతిక సంస్థ ‘లీకో’ సీఈవో గౌరవ్ దోల్వానీ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందలసార్లు చార్జ్ చేసినా... అస్సలు తగ్గని సామర్థ్యం!
మనం ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలన్నీ మండే స్వభావమున్న రసాయనాలతో తయారు చేసినవే. వాటికి పూర్తి భిన్నంగా నీటి ఆధారిత అణువులతో రూపొందిన వినూత్న జింక్ అయాన్ బ్యాటరీని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ (సీఈఎన్ఎస్) పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో పునరుద్పాతక ఇంధన నిల్వ మరింత భద్రంగా, చవగ్గా, విశ్వసనీయంగా మారనుంది. ఈ విధానంలో తయారైన జింక్ అయాన్ బ్యాటరీని 500 సార్లు చార్జ్ చేసి వాడాక కూడా అచ్చం కొత్తదాని మాదిరిగా ఏకంగా 98 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని పరిశోధకులు వెల్లడించారు! సౌర ఫలకాలు, విండ్ టర్బైన్ల నుంచి తయారైన విద్యుత్ను నిల్వచేసేందుకు దోహదపడే జింక్ భూమిపై చవగ్గా, సులభంగా, విస్తారంగా లభిస్తుంది. బ్యాటరీలో జింక్ ఒకవైపు పొరగా పనికొస్తుంది. మరోవైపు క్యాథోడ్గా ఏ మూలకాన్ని వాడాలనేది ఇన్నాళ్లూ సమస్యగానే మిగిలిపోయింది. ఈ సవాలుకు మాలిబ్డినం డైసలై్పడ్తో సీఈఎన్ఎస్ శాస్త్రవేత్తలు పరిష్కారం చూపారు. మాలిబ్డినం, సల్ఫర్లతో దాన్ని తయారుచేశారు. సల్ఫర్ నుంచి అత్యంత పల్చటి పొరలను అభివృద్ధి చేశారు. అవి శక్తిని నిల్వ చేసుకోవడమే గాక నిరంతరాయంగా సరఫరా కూడా చేయగలవని నిరూపించారు. నియంత్రిత వేడి వ్యవస్థ విధానం ద్వారా దీన్ని సుసాధ్యంచేశారు. దీంతో బ్యాటరీని చార్జ్ చేసినప్పుడు శక్తి సులభంగా లోపలికి వెళ్లడమే గాక అంతే సులభంగా డిశ్చార్జ్ అవుతోంది. భద్రమైన, అత్యంత సుస్థిరమైన ఆపరేటింగ్ పరిమితి అయిన 0.2–1.3 ఓల్ట్ స్థాయిని శాస్త్రవేత్తలు సాధించారు. తద్వారా బ్యాటరీ పాడవకుండా వందలసార్లు చార్జ్ చేసుకుని వాడుకోవచ్చు. చార్జింగ్ అనంతరం వాడే క్రమంలో కేవలం 0.3 శాతం శక్తి మాత్రమే వృథాగా పోతోంది. మిగతాదంతా బ్యాటరీలోనే నిల్వ ఉంటోంది. ఇలా 99.7 శాతం ‘కొలంబిక్ ఎఫీషియెన్సీ’ సాధించడం విశేషం. ఈ కాయిన్–సెల్ నమూనా బ్యాటరీని ఎల్సీడీ టైమర్కు చార్జింగ్ పెట్టడం ద్వారా వాణిజ్య స్థాయిలో విజయవంతంగా పరీక్షించారు. ఈ పరిశోధన వివరాలు అమెరికా కెమికల్ సొసైటీ ‘ఎనర్జీ అండ్ ఫ్యూయల్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. – న్యూఢిల్లీ -
మనోవేదనను 'మెషీన్' చెప్పేస్తుంది
ఒకరు చెబుతున్నది నిజమో లేక అబద్ధమో లై డిటెక్టర్ టెస్ట్ చిటికెలో చెప్పేస్తుంది. నాడీ స్పందనలు, బీపీలో హెచ్చుతగ్గులు, శ్వాస తీసుకోవడంలో మార్పులను విశ్లేషించి ఆయా అంశాలను నిర్ధారిస్తుంది. అదే తరహాలో డిప్రెషన్ను కేవలం ఒక్క వాయిస్ శాంపిల్తో మెషీన్ లెర్నింగ్ చాలా వరకు కచ్చితత్వంతో తొలిదశలోనే గుర్తిస్తోంది! ఈ మేరకు సాగిన అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. సంప్రదాయ చికిత్సా పద్ధతుల్లో డిప్రెషన్ను నిర్ధారించేందుకు వైద్యులు రోగులను కొన్ని ప్రశ్నలడిగి వారి భావోద్వేగ పరిస్థితులను అంచనా వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిలో బాధితులు వారంతట వారుగా ముందుకొస్తే తప్ప వైద్య సాయం చేసేందుకు వీలు ఉండదు. దీనివల్ల చాలా సందర్భాల్లో బాధితులకు వైద్య సహాయం ఆలస్యం అవుతోంది. కానీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించేందుకు ఏఐ సాంకేతికతను తెరపైకి తెచ్చారు. కుంగుబాటుకు గురైన వారి స్వరంలో హెచ్చుతగ్గులను మెషీన్ లెర్నింగ్ అల్గోరిథంల సాయంతో విశ్లేషిస్తున్నారు. కేవలం వాట్సాప్ ఆడియో ఫైల్స్ను విశ్లేషించడం ద్వారా డిప్రెషన్ బాధితుల లక్షణాలను 70 శాతం నుంచి 96 శాతం వరకు కచ్చితత్వంతో మెషీన్ లెర్నింగ్ టూల్స్ గుర్తిస్తున్నట్లు ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్నారు. 25–30 సెకన్ల ఆడియో ఫైల్లోని స్వరంలో హెచ్చుతగ్గులు, వాల్యూమ్, స్పీచ్ రేట్ వంటి శబ్ద లక్షణాలను విశ్లేషించడం ద్వారా ఆయా వ్యక్తుల మనోవ్యథను మెషీన్ లెర్నింగ్ మోడల్స్ గుర్తిస్తున్నట్లు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ఎయిమ్స్పరిశోధన ఇలా...డిప్రెషన్ను ముందుగానే గుర్తించడానికి స్పీచ్ అనాలిసిస్ ఒక ఆచరణాత్మక సాధనంగా ఉంటుందా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా పరిశోధకులు 423 మంది వాలంటీర్ల నుంచి (ప్రధానంగా 18–25 సంవత్సరాల ఏళ్ల వారు) సంతోషం, బాధలో ఉన్నప్పుడు మాట్లాడిన స్వర నమూనాలను సేకరించి విశ్లేషించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్లు వారి క్లినికల్ మానసిక ఆరోగ్య స్థితిని నిర్ధారించుకోవడానికి ప్రామాణిక మానసిక పరీక్షలను కూడా చేయించుకున్నారు. ఈ అధ్యయనంలో వారి స్వరం, స్వర స్థాయి, స్వర శక్తితో సహా వాక్పటిమ, ఉచ్ఛారణ, ఇతర గుర్తులపై పరిశోధకులు దృష్టి సారించారు. దీనిప్రకారం నిరాశతో మాట్లాడిన సందర్భాల్లో వాక్పటిమ, భావోద్వేగ స్వరం, తక్కువ స్వర స్థాయిలను గమనించారు. అలాగే వాయిస్ విశ్లేషణను క్లినికల్ డేటాతో పోల్చినప్పుడు నమూనా నాణ్యతను బట్టి మెషీన్ లెర్నింగ్ మోడల్స్దాదాపు 60 శాతం నుంచి 78 శాతం కచ్చితత్వంతో నిస్పృహ లక్షణాలను సరిగ్గా అంచనా వేశాయని గుర్తించారు.వాయిస్ నోట్స్ ద్వారా...పీఎల్వోఎస్ మెంటల్ హెల్త్లో ప్రచురితమైన మరో నివేదిక ప్రకారం బ్రెజిల్కు చెందిన మానసిక వైద్య పరిశోధకుడు విక్టర్ ఒటాని నేతృత్వంలోని పరిశోధకులు... డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలు ఉన్న, అవి లేని వ్యక్తులను వేరు చేయడంలో మెషీన్ లెర్నింగ్ మోడళ్లు సహాయపడతాయా అని పరీక్షించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి నుంచి స్వల్ప వ్యవధిగల వాట్సాప్ వాయిస్ సందేశాలను రికార్డ్ చేశారు. ఆ ఆడియో క్లిప్ల నుంచి సేకరించిన శబ్ద లక్షణాలపై ఏడు వేర్వేరు మెషీన్ లెర్నింగ్ నమూనాలు, ప్రామాణిక క్లినికల్ ఇంటర్వ్యూలను ఉపయోగించి కుంగుబాటును నిర్ధారించారు. దీని ప్రకారం ఏఐ నమూనాలు మహిళల్లో 91.67 శాతం వరకు, పురుషులలో 80 శాతం వరకు కచ్చితత్వంతో కుంగుబాటును గుర్తించాయి.ఇతర ప్రపంచ అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి...ది యానల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్లో ప్రచురితమైన మరో అధ్యయనం మాటలు, స్పందనల్లోని నిరాశను గుర్తించడానికి ఏఐ–ఆధారిత వాయిస్ బయోమార్కర్ సాధనాన్ని మూల్యాంకనం చేసింది. మెషీన్ లెర్నింగ్ సాధనం 70 శాతం కంటే ఎక్కువ కేసుల్లో ఆడియో ఫైల్ను సమర్పించిన 25 సెకన్లలోనే మోస్తరు నుంచి తీవ్ర నిరాశలో ఉన్న బాధితుల స్వరాలను గుర్తించింది. యూఎస్, కెనడాలోని దాదాపు 15,000 మంది వయోజనుల నుంచి సేకరించిన వాయిస్ రికార్డింగ్లను పరిశోధకులు విశ్లేషించి అల్గోరిథం ఇచ్చిన ఫలితాలను ప్రామాణిక డిప్రెషన్ ప్రశ్నపత్రాలతో పోల్చినప్పుడు ఈ మేరకు ఫలితాలు వచ్చాయి. అయితే ఈ విధానం క్లినికల్ డయాగ్నోసిస్కు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. -
యువతలో పక్షవాతం ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పక్షవాతం బారిన పడుతున్న ప్రతి ఏడుగురిలో ఒకరు 45 ఏళ్లలోపు యువతేనని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. పక్షవాతం ఘటనల్లో అధిక రక్తపోటు అనేది ప్రధాన హేతువుగా పరిణమించిందని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. పక్షవాతం పడిన వారిలో మూడు నెలల్లోపే సగానికి పైగా రోగులు మరణించడం లేదా తీవ్రమైన అంగవైకల్యం బారినపడటం వంటివి జరుగుతున్నాయని సర్వే వెల్లడించింది. ఈ అధ్యయనం వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్ట్రోక్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. → 2020–2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 30 ఆసుపత్రుల్లో నమోదైన 34,792 పక్షవాతం కేసులను ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో రోగుల సగటు వయస్సు 59.4 సంవత్సరాలు కాగా, వీరిలో 45 ఏళ్లలోపు వారు 13.8 శాతం మంది ఉన్నారు. → మొత్తం రోగుల్లో 63.4 శాతం మంది పురుషులుకాగా 72.1 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. → రోగుల్లో 74.5 శాతం మందిని అధిక రక్తపోటు వేధిస్తోంది. → మొత్తం రోగుల్లో మధుమేహం బారినపడిన వాళ్లు 27.3 శాతం మంది, పొగాకు నమిలే అలవాటు ఉన్న వాళ్లు 28.5 శాతం మంది, ధూమపానం సేవించే వ్యక్తులు 22.6 శాతం మంది, మద్యపానం సేవించే అలవాటు ఉన్న వాళ్లు 20.2 శాతం మంది ఉన్నారు. మొత్తం రోగుల్లో మహిళలు రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండగా పురుషుల్లో పొగాకు, మద్యపానం వినియోగం అత్యధికంగా ఉందని అధ్యయనంలో తేలింది. → పక్షవాతం వచ్చిన వెంటనే తొలి 4–5 గంటలు అత్యంత కీలకం. అయితే కేవలం 20 శాతం మంది మాత్రమే ఆ సమయంలోపే ఆసుపత్రికి చేరుకుంటున్నారు. → 37.8 శాతం మంది మాత్రం స్ట్రోక్ వచి్చన 24 గంటల తర్వాతే ఆస్పత్రిలో చికిత్స కోసం చేరుతున్నారు. దీంతో ఇలాంటి వారిలో మరణాల శాతం అత్యధికంగా ఉంటోంది. → మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిన(ఇస్కీమిక్) కేసులు మొత్తం కేసుల్లో 60 శాతం ఉన్నాయి. రక్తనాళాలు చిట్లిపోయిన(ఇంట్రాసెరెబ్రల్ హీమరేజ్) కేసులు 34.2 శాతం ఉన్నాయి. ఈ తరహా కేసుల్లో ఆసుపత్రిలో ఉండగానే 13.9 శాతం మంది మృతిచెందారు. → మొత్తంగా సగానికి పైగా రోగులు మరణం లేదా తీవ్రమైన అంగవైకల్యంతో బాధపడుతున్నట్లు తేలింది. → మహిళల్లో మరణాల కంటే అంగవైకల్యం కేసులు అధికంగా ఉన్నాయి. -
బీమా వృద్ధికి ఎఫ్డీఐల దన్ను
దేశీయంగా బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం పరిశ్రమ వృద్ధికి దోహదపడే పురోగామి చర్యగా కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ మహేష్ బాలసుబ్రమణియన్ అభివరి్ణంచారు. జీఎస్టీపరమైన చర్యలతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు 18 శాతం, సంప్రదాయ పథకాలు 4.5 శాతం చౌకగా లభిస్తాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. మరిన్ని విశేషాలు.. భారత బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐలను అనుమతించడం వల్ల పెట్టుబడులు, పోటీ తదితర విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు సకాలంలో తీసుకున్న పురోగామి చర్య. తదుపరి దశలో అధిక వృద్ధిని వేగవంతంగా సాధించడానికి పరిశ్రమకు కావల్సిన దీర్ఘకాలిక పెట్టుబడులు లభించేందుకు ఇది ఉపయోగపడుతుంది. కస్టమర్ కోణంలో చూస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడి పెరగడం వల్ల సహజంగానే ఆవిష్కరణలకు ఊతం లభిస్తుంది. బీమా సంస్థలు డిజిటల్ ప్లాట్ఫాంలపై భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు వీలవుతుంది. దీనితో జీవిత బీమా మరింత సరళంగా మారి, ఇంకా అందుబాటులోకి వస్తుంది. అంతిమంగా కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, దీటైన ధరలో లభిస్తాయి. సరీ్వసులు కూడా మెరుగుపడతాయి. ఇక, ఏజెంట్లు, బ్రోకర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లులాంటి ఇంటరీ్మడియరీలకు ఈ సంస్కరణతో మరింత విస్తృతమైన, వైవిధ్యమైన మార్కెట్ ఏర్పడుతుంది. బీమా సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో కూడా విస్తరిస్తున్న తరుణంలో బీమాపై అవగాహనను పెంచడంలో, ఆఖర్లో ఉన్న వారికి కూడా బీమాను చేరువ చేయడంలో వారి పాత్ర ఇంకా కీలకంగా మారుతుంది. ఇన్సూరెన్స్ విస్తృతి ఇంకా అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో కవరేజీని విస్తరించడం, ఆర్థిక భద్రతను పటిష్టం చేయడానికి సంబంధించిన దీర్ఘకాలిక విజన్కి ఇది దన్నుగా నిలుస్తుంది. ప్రీమియంలు, డిమాండ్పై జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఎలా ఉంది? ఇది వినియోగదారులకు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చేదే. భారత్లో సాధారణంగా సున్నా శాతం శ్లాబ్ను నిత్యావసరాలకు, మనుగడ సాగించేందుకు కీలకమైన ఉత్పత్తులకు రిజర్వ్ చేశారు. బీమాను ఈ ‘ఎసెన్షియల్’ విభాగంలోకి చేర్చడం ద్వారా, ఆర్థిక భద్రత అనేది ఉన్నా లేకున్నా ఫర్వాలేదు అనుకోవడానికి లేదని, ప్రతి కుటుంబానికి ఇది కీలక అవసరమని ప్రభుత్వం ఒక శక్తివంతమైన సందేశం ఇచి్చనట్లయింది. 18 శాతం మేర చౌకగా లభించడం వల్ల, పూర్తిగా ప్రొటెక్షన్ పథకాలైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల విషయంలో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటోంది. ప్రొటెక్షన్లో సాధారణంగా వెనుకబడి ఉన్న భారత్లాంటి మార్కెట్లో ఇది చాలా పెద్ద కరెక్షన్గా చెప్పవచ్చు. దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మొదటిదేమిటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 18 శాతం చౌకగా లభించడం వల్ల తొలిసారిగా తీసుకునే వారికి మరింత అందుబాటులోకి వస్తుంది. ఇక రెండో కోణంలో చూస్తే, ప్రస్తుత కస్టమర్లకు అదనపు భారం పెరగకుండా 18 శాతం అధిక కవరేజీ లభించినట్లవుతుంది. అసలు బీమా లేని వారికి, సరైన కవరేజీ లేని వర్గాలకి కూడా జీఎస్టీ కోతతో ప్రయోజనాలు లభిస్తాయి. సాంప్రదాయ పథకాలు 4.5 శాతం, రెన్యువల్స్ 2.25 శాతం చౌకగా లభించడం వల్ల కస్టమర్లకు సానుకూలంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బీమా ధోరణులు ఎలా ఉంటున్నాయి? ఆర్థికంగా భారీ ఆకాంక్షలు, పురోగామి ఆలోచనా ధోరణులున్న వినియోగదారులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జీవిత బీమాకి సంబంధించి విశిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. కాంటార్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్లాంటి అర్బన్ సెంటర్ల సారథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో క్రియాశీలక ప్లానింగ్, పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ, జీవిత బీమాపై అత్యధిక స్థాయిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. ఆర్థిక భద్రతకు నెలకొన్న డిమాండ్ని ఈ డేటా సూచిస్తోంది. సర్వే ప్రకారం ఈ ప్రాంతంలోని వినియోగదారుల్లో 78 శాతం మందికి సేవింగ్స్ ప్లాన్స్ గురించి అవగాహన ఉంది. గ్యారంటీగా ఏకమొత్తాన్ని అందించే, లేదా, స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లను పరిశీలిస్తామని 87 శాతం మంది తెలిపారు. పొదుపు ఆధారిత పథకాలకు ప్రాథమికంగా ప్రాధాన్యమిస్తున్నప్పటికీ, సమగ్ర భద్రతవైపు మళ్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లోని మొత్తం ఎన్వోపీల్లో టర్మ్ పాలసీల వాటా 32 శాతంగా ఉండగా, వీటి వృద్ధి 50 శాతం మేర ఉంటోందని కోటక్ లైఫ్ గమనించింది. సంపదను పెంపొందించుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఉంటోందో ప్రొటెక్షన్కి కూడా అంతే ప్రాధాన్యత లభిస్తోంది. బ్యాంకెష్యూరెన్స్ వాటా 48 శాతంగా, ప్రొప్రైటరీ మాధ్యమాల వాటా 52 శాతంగా మా పంపిణీ వ్యవస్థ సమతూకమైన విధంగా ఉంటోంది. వచ్చే మూడు నుంచి అయిదేళ్లలో వృద్ధి, విస్తరణ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? కార్యకలాపాలు ప్రారంభించిన 25వ సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) సాధించడమనేది జీవిత బీమాలాంటి దీర్ఘకాలిక వ్యాపారంలో కోటక్ లైఫ్ సంపాదించుకున్న విశ్వసనీయతకు నిదర్శనం. మేము ఇప్పుడు 4.3 కోట్ల మందికి భద్రతనిస్తూ, దేశీయంగా దిగ్గజ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తున్నాం. హ్యాపీయూ యాప్లాంటి వాటితో మరింత ఆరోగ్యకరమైన, సురక్షితమైన విధంగా జీవించేలా కస్టమర్లను ప్రోత్హిస్తున్నాం. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో గణనీయంగా విస్తరించనున్నాం. ప్రస్తుత 333 శాఖల స్థాయి నుంచి రాబోయే కొన్నేళ్లలో రెట్టింపు స్థాయికి పెంచుకోనున్నాం. ఈ క్రమంలో 1 లక్ష మందికి పైగా ఉన్న మా డి్రస్టిబ్యూటర్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ, సర్వీసింగ్ .. ఆటోమేషన్ని బలోపేతం చేసుకునేందుకు డిజిటల్కి సంబంధించి పెట్టుబడులను కొనసాగిస్తాం. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం ఎలా ఉంటోంది? కస్టమర్లు, భాగస్వాములు, ఉద్యోగులు అందరికీ సమగ్రమైన ప్రయోజనాలను అందించే విధంగా ఏఐ, ఎంఎల్ (మెషిన్ లెరి్నంగ్), ఆటోమేషన్ కలిసికట్టుగా పని చేయాలని మేము భావిస్తాం. కస్టమర్ల విషయానికొస్తే సోర్సింగ్ నుంచి క్లెయిమ్స్ వరకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నాం. క్లెయిమ్ల విషయంలో ఏఐ చాట్బాట్ల దన్నుతో 80 శాతం లావాదేవీలను డిజిటల్కు మార్చగలిగాం. 2 లక్షల క్లెయిమ్ల్లో 65 శాతం క్లెయిమ్లను ఫైనల్ డాక్యుమెంట్లు అందిన రోజే సెటిల్ చేశాం. పాలసీల విక్రయాలు, సరీ్వసు కోసం అడ్వైజర్లకి ఆప్టిమస్, బూస్ట్ 360, స్మార్ట్సెల్లాంటి సాధనాలను అందుబాటులోకి తెచ్చాం. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మద్దతు లభించేలా, కావ్య పేరిట ఏఐ ఆధారిత హెచ్ఆర్ అసిస్టెంట్ని ప్రవేశపెట్టాం. బీమా విస్తృతి పెరగడానికి ఎలాంటి వ్యూహాలు అవసరం? దేశీయంగా జీవిత బీమా విస్తృతి ప్రస్తుతం గ్లోబల్ బెంచ్మార్క్ల కన్నా చాలా దిగువన దేశ జీడీపీలో అత్యంత తక్కువగా 2.8 శాతం స్థాయిలోనే ఉంటోంది. ప్రొటెక్షన్ అంతరం దాదాపు 17 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో 80 శాతం మేర ఉంటోంది. 2050 నాటికి రిటైర్మెంట్ సేవింగ్స్ అవసరాలు, లభ్యత మధ్య అంతరం 85 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సవాళ్ల తీవ్రత, సత్వరం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ ప్రధానంగా ట్రిపుల్ ‘ఏ’ ఫ్రేమ్వర్క్, అంటే అవగాహన పెంపొందించడం (ఎవేర్నెస్), మరింత అందుబాటులోకి తేవడం (యాక్సెసబిలిటీ), చౌకగా అందించడమనే (అఫోర్డబిలిటీ) వ్యూహాన్ని అమలు చేస్తోంది. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో -
సోలో లైఫే సో బెటరూ
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి వరకు కూడా ఈ లోకం అంతా ‘జంట’లమయమే! హోటల్ కువెళ్తే ఎదురెదురుగా రెండు కుర్చీలు, ట్రావెల్ ప్యాకేజీలంటే తప్పనిసరిగా కపుల్ ఆఫర్లు, వీకెండ్స్ అంటే ఫ్యామిలీ హడావిడి. కానీ ఈ ‘నిండైన’ దృశ్యం మెల్లిగా మార్పు చెందుతోంది. ఎక్కడ చూసినా సోలో ‘రాజా సాబ్’లు, ఏకాంతవాస రాణీ రత్నమాలలు దర్శనం ఇవ్వటం మామూలైపోయింది.సింగిల్ రిజర్వేషన్రెస్టారెంట్లలో సింగిల్ టేబుల్ రిజర్వేషన్తో మొదలైన ఈ ధోరణి, ఎవరో తోడు లేని వారు చేస్తున్న పని కాదు. ఎవరి తోడూ అవసరం లేదని అనుకుంటున్న వారు ఎంచుకుంటున్న మార్గం. మునుపటిలా, ‘‘ఎవరైనా కలిసి వస్తే వెళ్దాంలే..’’ అని వేచి ఉండే రోజులు పోయాయి! ఇప్పుడు తినటానికైనా ఒక్కరే,విహరించటానికైనా ఒక్కరే.ఎవరూ లేక కాదుఇదేమీ ఒంటరితనం కాదు. ఒక స్వీయ చికిత్స. తనకి నచ్చినట్టు తాను ఉండటం మాత్రమే. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎవరితోనూ సర్దుబాటు ఉండదు. తనకు నచ్చిన దారి, తనకు నచ్చిన వేగం, తనకు నచ్చిన స్థలం! సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్వేచ్ఛ.వింత అసలే కాదుభోజనం, ప్రయాణం, వినోదం.. ఇప్పుడు సోలో జీవన శైలికి సంకేతంగా మారింది. లైవ్ ఈవెంట్లకు ఒక్కరే వెళ్లేవారు ఎక్కువయ్యారు. ఉదయ్పూర్, కూర్గ్, సిక్కిం వంటి సురక్షిత మైన ప్రాంతాలకు మహిళలు ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. డిమ్ లైట్ల డైనింగ్ హాళ్లలో టేబుల్కు ఒకరే కూర్చొని భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఖర్చు తగ్గించుకోవటం కాదు, ఎంతైనా ఖర్చుపెట్టి ఏకాంతాన్ని కొనుక్కోవటం.మార్కెట్ పసిగట్టేసింది!ఇదేదో చిన్న మార్పు కాదని బిజినెస్ లోకానికి అర్థమైపోయింది. రాబోయే కాలంలో సమాజాన్ని ముంచెత్తనున్న ఒక పెద్ద ‘వేవ్’ అని కనిపెట్టేసింది. ఇకనేం, కంపెనీల ఆలోచనా విధానమే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ‘ఫ్యామిలీ’ చుట్టూ తిరిగిన మార్కెట్ ఇప్పుడు లైట్ హౌస్లా తన ఫోకస్ను ఒంటరి కెరటాల మీదకు మళ్లించింది.ఇండియాలో ‘ఒంటరి’ డేటా⇒ 2020నాటికి ఉన్న ఒంటరి వ్యక్తుల గృహాల సంఖ్య 1 కోటి 74 లక్షలు⇒ 2030కి ఒంటరి గృహాల సంఖ్యలో అంచనా పెరుగుదల 5.5 శాతం⇒ సోలో దేశీయ ప్రయాణాల బుకింగ్లలో పెరుగుదల : ఏటా 20–35 శాతం⇒ గత ఏడాది ఒంటరిగా ఈవెంట్లకు, సినిమాలకు వెళ్లినవారు : 18 లక్షలకు పైగా⇒ 2025–2030 మధ్య పెరగనున్న సోలో ట్రావెల్ మార్కెట్ విలువ సుమారు : రూ. 359 కోట్ల 36 లక్షల 50 వేలు -
మనసే మంత్రం..!
పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అత్యంత కీలక ఘట్టం. అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే కులం, వయసు, ఆస్తితో సంబంధం లేకుండా సరైన జోడీ ఉండాల్సిందేనన్నది నేటి తరం మాట. ‘మనసే మంత్రం’అని జపించే వారి సంఖ్య మన దేశంలో అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరం. భాగస్వామి వేట, వివాహం విషయంలో భారత్లో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయాలను నేటి తరం ఎలా తిరగరాస్తోంది అన్న అంశంపై జీవన్సాథీ మ్యాట్రిమోనీ ఓ నివేదికను రూపొందించింది. దశాబ్ద కాలంలో (2016–2025) మారిన యూజర్ల పోకడలు, అలాగే ఈ ఏడాది దేశవ్యాప్తంగా 30 వేల పైచిలుకు యాక్టివ్ మెంబర్స్ నుంచి సేకరించిన అభిప్రాయాలను ఇందులో పొందుపరిచారు. భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కులం, మతం, వయసు, సంపాదన చూడకుండా తమ ఆలోచనా ధోరణి, అభిరుచులు ఎంతవరకు కలుస్తున్నాయనే దానికి అత్యధికులు ప్రాధాన్యం ఇస్తున్నారని నివేదిక వివరించింది. సరైన భాగస్వామి దొరకడమే పెళ్లికి అసలైన అర్హతగా 90% మంది భావిస్తున్నారు.భారతీయులు తమ భాగస్వాములను ఎంచుకునే విధానంలో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. కుల ప్రాధాన్యాలు తగ్గాయి. పునర్వివాహాల పట్ల ఆదరణ పెరుగుతోంది. వివాహ వయసు ఆలస్యమవుతోంది. వరుడు/వధువు ఎంపికలో కుటుంబమూ జోక్యం చేసుకోవాలన్న ధోరణి కనపడుతోందని నివేదిక తెలిపింది. యువత తమ పెళ్లి విషయంలో మరింత స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కఠినమైన నిబంధనలు లేదా నిర్ణీత వయసుకంటే పరస్పర అవగాహన, సమాన విలువలతోపాటు మానసికంగా సిద్ధపడ్డాకే పెళ్లికి సై అంటున్నారు. విడాకుల పట్ల ఉన్న సామాజిక వివక్ష క్రమంగా తగ్గుతోంది.కులం గోడలు బద్దలు: భాగస్వామి ఎంపికలో కులం కంటే వ్యక్తిగత విలువలు, ఆలోచనల కలయికకు నేటి తరం ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది. కులం ముఖ్యం అన్నవారు దశాబ్దం క్రితం 91% ఉంటే.. ఇప్పుడీ సంఖ్య ఏకంగా 54 శాతానికి వచ్చి చేరింది. మెట్రోల్లో వీరి సంఖ్య 49% ఉంది. పునర్వివాహానికి సై: గతంతో పోలిస్తే ప్రస్తుతం పునర్వివాహం పట్ల సమాజంలో సానుకూల మార్పు కనిపిస్తోంది. ఇటువంటి వారి సంఖ్య 2016లో కేవలం 11% మాత్రమే. 2025 నాటికి ఈ సంఖ్య 16%కి చేరింది. అంటే దశాబ్ద కాలంలో 43% పెరిగారన్న మాట. విడాకులు తీసుకున్న వారికి వస్తున్న సంబంధాలలో 15% మంది అవివాహితులు. అంటే గత చరిత్ర కంటే వ్యక్తిత్వానికే ప్రాముఖ్యత పెరుగుతోంది. అప్పుడే పెళ్లి భాజాలు‘నాకు 25 ఏళ్లు వచ్చాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి’అనే ఆలోచన పోయి ‘నన్ను అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే నేను సిద్ధం’అనే ధోరణి కనపడుతోంది. కెరీర్ స్థిరత్వం, వ్యక్తిగత ఎదుగుదలతోపాటు మానసిక ప్రశాంతత, జీవితం పట్ల స్పష్టత వచ్చిన తర్వాతే పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే భాగస్వామి కోసం వెతికే వయస్సు 29 ఏళ్లకు చేరింది. దశాబ్దం క్రితం ఈ వయసు 27 ఉంది. ఇద్దరూ సంపాదిస్తేనే..వివాహ బంధంలో పాతకాలపు ఆర్థిక పద్ధతులు ఇప్పుడు మారుతున్నాయి. 87% మంది పురుషులు తమ కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 15% మంది మహిళలు తమ కంటే తక్కువ సంపాదిస్తున్న పురుషులతో పెళ్లికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరూ సంపాదించాలని భావిస్తున్నారు. కేవలం 8% మంది మాత్రమే ఒక్కరు సంపాదిస్తే చాలని నమ్ముతున్నారు. కుటుంబమూ ఒప్పుకోవాల్సిందే..యువత తమ భాగస్వామిని తామే ఎంచుకుంటున్నారు. 77% మంది తమ ప్రొఫైల్ను తామే నిర్వహిస్తున్నారు. 2016లో ఇటువంటివారి సంఖ్య 67%. కుటుంబం మేనేజ్ చేస్తున్న అమ్మాయి/అబ్బాయి ప్రొఫైల్స్ సంఖ్య 33% నుంచి 23%కి పడిపోయింది. పెళ్లికి తల్లిదండ్రుల ఆమోదం మరియు సలహాలకు 69% విలువ ఇస్తున్నారు. అమ్మాయిల విషయంలో ఈ సంఖ్య 75% ఉంది. ఆసక్తికర అంశం ఏమంటే మ్యాచ్ మేకింగ్లో తల్లిదండ్రుల కంటే తోబుట్టువుల పాత్ర పెరుగుతోంది. -
అరవై దాటినా.. ఆగని అడుగులు
సాధారణంగా అరవై ఏళ్లు దాటాయంటే జీవితం ముగిసిపోయిందని, ఇక విశ్రాంతి తీసుకోవడమే మిగిలిందని అనుకుంటాం. కానీ, భారతదేశంలో ఇప్పుడొక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అదే.. ‘సిల్వర్ రివల్యూషన్’. వృద్ధులు పాత ఆలోచనలను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో మళ్లీ వ్యాపకాల్లో అడుగులు వేస్తున్నారు. తెల్లబడిన జుట్టు వెనుక ఉన్న అపారమైన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడేలా తమ ‘రెండవ ఇన్నింగ్స్’ను ప్రారంభిస్తున్నారు.ప్రధాన కారణాలుమెరుగైన ఆరోగ్య సదుపాయాలు, డిజిటల్ పరిజ్ఞానం, తమకంటూ ఒక గుర్తింపు ఉండాలనే తపన... ఈ మూడు ప్రధాన కారణాలు, అరవై దాటిన వారిని ఏదో ఒక పనిని చేపట్టేందుకు ప్రేరణ కలిగిస్తున్నాయని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ తాజా నివేదిక వెల్లడించింది.అపోహలకు భిన్నంగా...!యువతరంలో దాదాపు సగం మంది ఇప్పటికీ వృద్ధులను, ‘ఇతరులపై ఆధారపడేవారు’ గానే భావిస్తుండగా, అందుకు భిన్నంగా వృద్ధులు సమాజంలో చురుకైన పాత్ర పోషించటం విశేషమని నివేదిక పేర్కొంది. ‘‘ఇతరుల సహాయం తీసుకునే వ్యక్తులుగా ఉండాలని వారు అనుకోవడం లేదు. బదులుగా, సమాజానికి దిక్సూచిగా ఉండాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, కొత్త వృత్తులను ప్రారంభించాలని బలంగా కోరుకుంటున్నారు’’ అని తెలిపింది.మరింత దృష్టి పెట్టాలి‘పెద్దల’ అనుభవాన్ని, శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలంటే, మన వ్యవస్థల్లో మరింతగా మార్పులు జరగవలసిన అవసరం ఉందని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ అధ్యయనం సూచించింది. ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరింది.⇒ వృద్ధులకు వారి అనుభవానికి తగ్గట్టుగా కన్సల్టింగ్ లేదా మార్గదర్శకత్వ బాధ్యతలను అందించే అనుకూలమైన ఉద్యోగాలను కల్పించటం.⇒ యువత, వృద్ధులు కలిసి తమ జ్ఞానాన్నిపంచుకునే వేదికలను ఏర్పాటు చేయటం.⇒ నేటి ఆధునిక యుగంలో వృద్ధులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటానికి అవసరమైన డిజిటల్ పరిజ్ఞానాన్ని నేర్పించే ప్రోగ్రామ్లను రూపొందించటం.యువతరం, అనుభవం కలిస్తే!‘సిల్వర్ రివల్యూషన్’ అనేది కేవలం వృద్ధులకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది పౌరులందరి బాధ్యత. వృద్ధులలోని అపారమైన జ్ఞానాన్ని గౌరవిస్తూ, వారికి అవసరమైన డిజిటల్ సహకారాన్ని అందిస్తే, ఆ అనుభవం సమాజానికి ఉపయోగపడుతుందని, యువతరం ఉత్సాహం,వృద్ధుల అనుభవం కలిసినప్పుడే, మెరుగైన దేశాన్ని నిర్మించుకోగలమని ‘హెల్ప్ఏజ్ ఇండియా’ తెలిపింది.వృద్ధులకు పని పథకాలుఅరవై దాటిన వారికి పని కల్పించటం కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ‘సేక్రెడ్’ (సీనియర్ ఏబుల్ సిటిజెన్స్ ఫర్ రీ–ఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నీటీ), అటల్ వయో అభ్యుదయ్ యోజన (ఎ.వి.వై.ఎ.వై) తదితర పథకాలతో పాటుగా, ఎల్డర్లైన్ అనే హెల్ప్ లైన్ (14567)ను ప్రవేశపెట్టింది.వృద్ధుల ‘అదృశ్య’ సేవలుకుటుంబాలకు, సమాజానికి వృద్ధులు అందిస్తున్న సహకారం (అంకెలు శాతాల్లో)సేవలు - భాగస్వామ్యంసలహాలు, జీవితానుభవాలు - 72 పిల్లల సంరక్షణ - 50ఇంటి పనులు చక్కబెట్టటం - 47 కుటుంబానికి డబ్బు సహాయం - 36మనో ధైర్యాన్ని ఇవ్వటం - 31సామాజిక కార్యక్రమాలు - 19వృద్ధులను యువత ఎలా చూస్తోంది? (అంకెలు శాతాల్లో)అభిప్రాయం - అంగీకరించిన వారు గౌరవనీయులైన అనుభవజ్ఞులు - 51ఒకరిపై ఆధారపడేవారు - 48 నైతిక విలువలకు నిటువుటద్దం - 43కుటుంబానికి పెద్ద దిక్కు - 36పని గురించి ఏం అంటున్నారు? (అంకెలు శాతాల్లో)వృద్ధుల మనోభావాలు - ఎంత?పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలి - 36వీలైనంత కాలం పని చేస్తూనే ఉండాలి - 40తమ ప్రస్తుత సేవలకు గుర్తింపు ఉంది - 78 ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తోంది - 44అప్పుడప్పుడు మాత్రమే గుర్తింపు ఉంటోంది -34 -
ఆమె అడుగుజాడలు
మన దేశంలోని మొట్ట మొదటి మహిళా ఆంత్రపాలజిస్ట్ ఐరావతి కార్వే. జర్మనీలో శిక్షణ పొందిన కార్వే పుణేలోని దక్కన్ కళాశాలలో మావనశాస్త్ర విభాగాన్ని ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, నాగరికత, కులవ్యవస్థపై ఆమె విలువైన రచనలు చేశారు. ఆంత్రపాలజీ అంటే గుర్తుకు వచ్చే మహిళ అయినప్పటికీ కార్వే జీవితం గురించి చాలా విషయాలు తెలియవు. ఈ లోటును పూరించేలా ఆమె మనవరాలు ఉర్మిలా దేశ్పాండే, విద్యావేత్త థియాగో బార్బోసాతో కలిసి ‘ది రీమార్కబుల్ లైఫ్ ఆఫ్ ఐరావతి కార్వే’ అనే పుస్తకం రాశారు.ఆమెదే రిస్క్అండమాన్, నికోబార్ దీవులలోని ఆదిమజాతి ప్రజలపై పరిశోధన చేసిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త మధుమాల చటోపాధ్యాయ. అండమాన్ దీవులలో ఫీల్డ్వర్క్ చేయడానికి మధుమాలను అనుమతించే ముందు ఆంత్రపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించదని నిర్ధారిస్తున్న పత్రాలపై సంతకం చేయాలని కోరింది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. అండమాన్, నికోబార్ దీవులలోని వివిధ తెగలపై ఆరు సంవత్సరాలు పరిశోధన చేశారు.ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ20వ శతాబ్దంలో ‘ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ’ ఊపందుకుంది. పురుషాధిపత్య వాదనలు, వివరణలను సవాలు చేసింది. మన దేశంలో వర్గం, కులం, ప్రాంతాల వారీగా మహిళల స్థితిగతులను అధ్యయనం చేయడంలో ఫెమినిస్ట్ ఆంత్రపాలజీ కీలక పాత్ర పోషించింది. ఉదాహరణకు దళిత మహిళలు పితృస్వామ్య భావజాలానికి మాత్రమే కాకుండా కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడం గురించి విశ్లేషించింది. -
ఇచట కలలు అమ్మబడును!
‘నాకొక కల వచ్చింది తెలుసా!’ అని చెబితే... ‘బ్రహ్మాండంగా ఉంది. ప్లీజ్...ఆ కలను నాకు అమ్ముతావా’ అని అవతలి వ్యక్తి అడిగితే నవ్వుకుంటాం. ఇప్పుడు నవ్వులాటగా అనిపించినా ఒకప్పుడు ఇలాంటి సంభాషణలు సహజంగా జరిగేవి. వన్స్ అపాన్ ఏ టైమ్ కొరియాలో కలల క్రయ, విక్రయాలు జోరుగా సాగేవి. అలనాటి అరుదైన సంప్రదాయానికి తిరిగి ప్రాణం పోస్తోంది కొరియన్ ఆర్టిస్ట్ లొంగ్సు పార్క్...ఆరవ శతాబ్దంలో కొరియాలో కలల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగేవి! కలలలో తమకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే శకునాలు ఉంటాయని ఒకప్పుడు కొరియాలో బలంగా నమ్మేవాళ్లు. కల గురించి విన్న వ్యక్తి ఆ కల తనకు ప్రయోజనకరంగా ఉంది అని భావిస్తే, తనకు విక్రయించాల్సిందిగా కలలు కన్న వ్యక్తిని అడగవచ్చు. అమ్మడానికి ఆ వ్యక్తి ఓకే అంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేదా విలువైన వస్తువు ఏదైనా ఇవ్వవచ్చు.ఎస్... ఆధారాలు ఉన్నాయి!‘అకాడమీ ఆఫ్ కొరియన్ స్టడీస్ ఆర్కైవ్స్’లో కలల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు 1900 సంవత్సరంలో తనకు వచ్చిన కలలో డ్రాగన్, పులి కనిపించిన ఒక వ్యక్తి తన కలను అమ్ముకున్నాడు.అత్యవసరంగా డబ్బు అవసరం ఉండడం వల్లే తన కలను విక్రయించినట్లు ఒప్పంద పత్రంలో ఉంది. కొన్నిసార్లు కలలు అమ్మడానికి ఆ కలల యజమానులు అంగీకరించకపోవచ్చు. తమ కలలు రహస్యంగానే ఉండిపోవాలని అనుకోవచ్చు. తమ కలలను ఇతరులతో పంచుకుంటే వాటి శక్తి తగ్గిపోతుందనుకోవడమే దీనికి కారణం.గతం నుంచి వర్తమానంలోకి...పన్నెండవ శతాబ్దానికి చెందిన కొరియన్ అధికారిక చరిత్ర ‘ది హిస్టరీ ఆఫ్ త్రీ కింగ్డమ్స్’లో కలల అమ్మకాలకు సంబంధించిన పురాతన కథలు ఉన్నాయి. అలనాటి ఆ పాత సంప్రదాయాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చింది లండన్కు చెందిన కొరియన్ ఆర్టిస్ట్ లొంగ్సు పార్క్.అలా మొదలైంది...కొన్ని సంవత్సరాల క్రితం లండన్లోని ఒక కేఫ్లో తన స్నేహితురాలిని కలిసినప్పుడు మాటల మధ్యలో రాత్రి తనకు కలలో టొమాటో సైజ్ బ్లూ బెర్రీ కనిపించిందని చెప్పింది పార్క్.‘ఎంత మంచి కల! నాకు అమ్మేసెయ్’ అని ప్రతిపాదించింది ఆ స్నేహితురాలు. పార్క్ స్నేహితురాలు గర్భవతి. గర్బంతో ఉన్న వారికి బ్లూ బెర్రీ కలలో కనిపిస్తే... పండంటి బిడ్డ పుడతాడని కొరియాలో నమ్మకం!తన కలను అమ్మేసింది పార్క్. హోటల్ బిల్ను పార్క్ స్నేహితురాలే చెల్లించడంతో డీల్ పూర్తయింది! ‘ఇష్ట పూర్వకంగా ఉంటేనే కలల లావాదేవీలు పనిచేస్తాయి’ అని చెబుతోంది పార్క్. కొన్ని నెలల తరువాత... పండంటి బిడ్డను కన్నట్లు స్నేహితురాలి నుంచి మెసేజ్ వచ్చింది.దీంతో కొరియన్ సంప్రదాయాలలోని కలల గురించి పార్క్కు ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తే కలల వెబ్సైట్కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. డ్రీమ్ అడ్వర్టైజింగ్మెలకువతో ఉన్నప్పుడే కాదు నిద్రలో ఉన్నప్పుడు కూడా కస్టమర్లకు చేరువకావడానికి రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నాయి కొన్ని పెద్ద కంపెనీలు. ‘వద్దు బాబోయ్’ అనుకున్నా ఆ కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు కలలలోకి వస్తాయన్న మాట! తరుచుగా వినిపించే, కనిపించే ఆడియో, వీడియో క్లిప్ల ద్వారా వినియోగదారుల సబ్కాన్షియస్లోకి వెళుతున్నాయి బడాకంపెనీల ప్రకటనలు. ఈ కాన్సెప్ట్ను ‘డ్రీమ్ అడ్వర్టైజింగ్’ అంటున్నారు. ‘డ్రీమ్ అడ్వర్టైజ్మెంట్స్ రాబోయే కాలంలో పీడకలగా మారనున్నాయి’ అని హెచ్చరిస్తున్నారు స్లీప్ ఎక్స్పర్ట్లు. అమెరికన్ యువతలో 48 శాతం మందికి ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన అడ్వర్టైజింగ్ కలలు తరచుగా వస్తున్నట్లు ఒక నివేదిక తెలియజేసింది. కోకా–కోలా, యాపిల్, మెక్డోనాల్డ్లాంటి ప్రసిద్ధ బ్రాండ్లకు సంబంధించిన కలలు వస్తుంటాయట. యాదృచ్ఛికంగా ఈ బ్రాండ్లకు సంబంధించిన యాడ్స్ పదే పదే చూడాల్సి రావడం, మెమోరీ రీయాక్టివేషన్ వల్లే ఇలాంటి కలలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.కలలు వేలం వేస్తారు!కలల వేలానికి సంబంధించి లొంగ్సు పార్క్ ఒక వెబ్సైట్ను ప్రారంభించింది. తమకు వచ్చిన కలల గురించి ఈ వెబ్సైట్ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చునని తెలియజేసింది. ‘మేము కొనుగోలు చేసిన కల నిజమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి. దానికి ఆధారం ఏమిటి’ ఈ ప్రశ్నను చాలామంది పార్క్ను అడుగుతుంటారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు కలలను నిరూపించుకునే ఆధారలేవీ లేవు. అది అసాధ్యం కూడా. ఒకరిపై ఒకరికి విశ్వాసమే ప్రధానం. నిజాయితీ మాత్రమే ప్రధానం’ అని చెబుతుంది పార్క్. వెబ్సైట్లో కొన్ని కీలక పదాలు నమోదు చేస్తారు. ఉదాహరణకు ‘పాము’ అనే కీవర్డ్ కనిపించింది అనుకుందాం. అది పాము కలకు సంబంధించిన వ్యక్తి గురించి సమాచారాన్ని అందిస్తుంది. పాములు కలలో కనిపిస్తే కొరియన్ సంప్రదాయం ప్రకారం జీవితంలో, కెరీర్లో విజయం సాధించబోతున్నారని అర్థం. మంటల్లో ఇల్లు ఉన్నట్లు కల వస్తే కష్టాలు కాలిపోతున్నాయని అర్థం. చెడు శకునాలకు సంబంధించిన కలలు కూడా ఉన్నాయి. పండ్లు ఊడిపోయినట్లు కల వస్తే సన్నిహిత వ్యక్తిని కోల్పోతున్నారని అర్థం.ఆ కలే... అవతార్!‘కలలదేముంది? ఇలా వస్తాయి... అలా పోతాయి’ అని రాత్రి కలలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఎన్నో కలలు ఎన్నో ఆవిష్కరణలకు కారణం అయ్యాయి. అద్భుతమైన ఆలోచనలు ఎన్నో తనకు కలల రూపంలోనే వచ్చాయని చె΄్పారు ప్రసిద్ధ శాస్త్రవేత్త నికోలా టెస్లా. తన ఆత్మకథ ‘మై ఇన్వెన్షన్స్’లో కలల ప్రస్తావన ఉంటుంది. చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ‘అవతార్’ గురించి పరిచయం అక్కర్లేదు. ‘అవతార్’ ఐడియా జేమ్స్ కామెరూన్కు ఎలా వచ్చింది అనేది ఆసక్తికర విషయం. కామెరూన్ యువకుడిగా ఉన్నప్పుడు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో అతడికి మరో లోకం కనిపించింది. బంగారంలా మెరుస్తున్న చెట్లు, అందమైన జీవులతో ఉన్న అద్భుత లోకం ఇది. ఆ కల కామెరూన్తో ఉండి చివరికి అవతార్లో పండోర ప్రపంచంగా రూపం దాల్చింది. ‘పందొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను కన్న కల అది’ అని ‘అవతార్’ గురించి చెబుతుంటారు కామెరూన్. -
యువహో.. ప్రీమియంకు జయహో
సాక్షి, స్పెషల్ డెస్క్ : వాహనాల విషయంలో కస్టమర్ల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. సులభ వాయిదాల్లో చెల్లించే అవకాశాలు విస్తృతం అయ్యాయి. ఆకట్టుకునే మోడళ్లు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. పైగా వినియోగదారులకు ఖర్చు చేయదగ్గ ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇంకేముంది.. నచ్చిందే తడవుగా యువ కస్టమర్లు ప్రీమియం బైక్స్తో దూసుకుపోతున్నారు. భారతీయ ద్విచక్ర వాహన విపణి క్రమంగా అధిక ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రీమియం బైక్స్ వైపు మళ్లుతోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి కాలంలో రూ.80,000 ప్రారంభ ధర కలిగిన 125 సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల మోడళ్ల వాటా మొత్తం మోటార్ సైకిల్స్ మార్కెట్లో 26% చేరుకుంది. 2019–20లో ఇది 22.1% నమోదైంది. గత సెప్టెంబర్లో జీఎస్టీ సవరణతో ధరలు తగ్గడం కూడా ఈ వృద్ధికి దోహదపడింది. ప్రీమియమైజేషన్ వైపు.. భారత్లో 125 సీసీ, అంతకంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్స్ వాటా ఈ స్థాయికి చేరుకోవడం ఆరేళ్లలో ఇదే అత్యధికం. 2024–25లో మొత్తం మోటార్సైకిళ్ల విక్రయాలలో ఈ సెగ్మెంట్ 24.4% వాటాను కలిగి ఉంది. జీఎస్టీ హేతుబద్దీకరణ తర్వాత మోటార్సైకిల్స్ విభాగం బలమైన రికవరీని చూసిందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 125 సీసీ వరకు ఉన్న ఎంట్రీ–లెవల్ మోడల్స్ 73% వాటాతో మార్కెట్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ డిమాండ్ క్రమంగా 150–350 సీసీ శ్రేణి వైపు మళ్లుతోంది. ఏటా వృద్ధి చూస్తుంటే వినియోగదార్లకు ఇవి అందుబాటులో లభించడం, మారుతున్న ప్రీమియమైజేషన్ ధోరణిని ప్రతిబింబిస్తోంది. టాప్లో రాయల్ ఎన్ఫీల్డ్.. తయారీ కంపెనీల్లో రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ మోటార్ ఈ ప్రీమియమైజేషన్ ధోరణి ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన సంస్థలుగా అవతరించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ 125 సీసీ+ సెగ్మెంట్లో తన మార్కెట్ వాటాను 2019–20లో 27% నుంచి 2025–26 మొదటి తొమ్మిది నెలల్లో 32%కి పెంచుకుంది. జెఫరీస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ వాటా 15% నుంచి19%కి చేరింది. బజాజ్ ఆటో వాటా 32% నుంచి 22%కి తగ్గడం వల్ల ఈ రెండు సంస్థలు లాభపడ్డాయి. -
నోట్లు నిజం.. కోట్లు అబద్ధం
వధువు అడుగు పెడుతుంటే అక్షతలు చల్లడం ఆచారం.. కానీ అక్కడ ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిసింది. డ్యాన్స్ ఫ్లోర్ అడుగు కనిపించనంతగా కరెన్సీ తివాచీ పరచుకుంది. ఫిబ్రవరి 14న పంజాబ్లోని తార్న్ తరణ్లో జరిగిన ఒక వివాహం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ పెళ్లిలో ఏకంగా రూ.10 కోట్లను వానలా కురిపించారన్న వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అసలేం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియోలో వరుడు సంచుల్లోంచి నోట్ల కట్టలను తీసి గాలిలోకి విసురుతుంటే, అతిథులు కూడా అతనితో జత కలిసారు. చూస్తుండగానే ఆ ప్రాంగణమంతా కరెన్సీ మయమైపోయింది. ఆ్రస్టేలియాలో ట్రక్కుల వ్యాపారం చేసే వరుడి కుటుంబం కావడంతో, ఆ ఆడంబరం చూసి నెటిజన్లు ఆ మొత్తం రూ.8.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు కట్టేశారు. ఇది పంజాబీ సంప్రదాయంలో భాగమే అయినా, ఈ స్థాయి ధన ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేసింది.అవి పది రూపాయల నోట్లే! అయితే, ఈ ‘కోట్ల’కథనంపై వరుడి కుటుంబం, ఈవెంట్ మేనేజర్లు తీవ్రంగా స్పందించారు. ఇది కేవలం వ్యూస్ కోసం జరిగిన అతిశయోక్తి అని వారు కొట్టిపారేశారు. ‘మేము సంబరాల్లో భాగంగా డబ్బులు విసిరిన మాట వాస్తవమే, కానీ అది రూ.2 లక్షలు మాత్రమే. సోషల్ మీడియా దీనిని కోట్లకు పెంచేసింది’.. అని వరుడి సోదరుడు స్పష్టం చేశారు. ఆ నోట్లలో ఎక్కువ భాగం పది రూపాయల నోట్లేనని, వాటితో పాటు కొన్ని డాలర్లు కూడా ఉన్నాయని డీజే యజమాని వివరించారు. మొత్తం విలువ రూ.2.5 లక్షల నుండి రూ.4 లక్షల లోపే ఉంటుందని తేలి్చచెప్పారు.సోషల్ మీడియా కనికట్టే! వ్యూస్, లైకుల కోసం సోషల్ మీడియా ఎంతటి కలి్పత గాథలనైనా అల్లుతుందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. కళ్లముందు నోట్ల తివాచీ కనిపించినా, ఆ మెరుపు వెనుక ఉన్నది కోట్ల సంపద కాదు.. కేవలం ప్రచారపు ఆర్భాటమే. నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పడానికి ఈ ‘క్యాష్ పారీ్ట’ఒక ఉదాహరణ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉవ్వెత్తున..
అత్యంత భారీ పరిమాణంలో నిప్పు రవ్వలు వేలాది అడుగుల ఎత్తుకు ఎగసిపడుతుంటే ఎలా ఉంటుంది? ఇదుగో, అచ్చం ఇలాగే ఉంటుంది! హవాయీ దీవుల్లో కిలవెయా అగ్నిపర్వతం బద్దలైంది. అందులోంచి లావా ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతోంది. దాని తాలూకు రెండు పాయలు సోమవారం రాత్రి ఫౌంటేన్ మాదిరిగా పైపైకి ఎగజిమ్మాయి. ఒకటి 1,300 అడుగులు, మరొకటి 1,000 అడుగుల చొప్పున పైకి ఎగశాయి. ఆకాశంలో ఎర్రని కాంతులతో చూపరులను కట్టిపడేశాయి. వాటి తాలూకు బూడిదైతే ఏకంగా 35 వేల అడుగుల ఎత్తు దాకా చేరింది! ఈ దృశ్యాలను లక్షలాది మంది ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు. హవాయీ నేషనల్ పార్కులోని కిలవెయా ప్రపంచంలో అత్యంత చురుగ్గా ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటి. దాని అడుగున భారీ పగుళ్లున్న కారణంగా మాగ్మా ప్రవాహాలు తరచూ తేలిగ్గా పైకి ఎగదన్నుతూ ఉంటాయి. దాంతో అది పదేపదే బద్దలవుతూ, భారీగా లావాను వెదజల్లుతూ వీక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.ముఖ్యంగా గత డిసెంబర్ 23 నుంచీ ఇప్పటిదాకా కిలవెయా పదేపదే బద్దవుతూ, కొన్ని గంటల వ్యవధిలోనే శాంతిస్తూ వస్తోంది. ఈసారి అది 1.5 కోట్ల క్యూబిక్ అడుగుల మేరకు లావాను వెదజల్లి ఉంటుందని అంచనా! అది ఏకంగా 11 వేల ఒలింపిక్ సైజు స్విమ్మింగ్పూల్స్ను నింపేందుకు సరిపోతుందట!! ఎప్పట్లాగే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణ, ఆస్తినష్టం వంటివేవీ సంభవించలేదు. మూడు వారాల తర్వాత కిలవెయా మరోసారి బద్దలవుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు!
అణ్వ్రస్తాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా, మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తోంది! అరుణాచల్ప్రదేశ్కు 800 కి.మీ. దూరంలో సిచువాన్ ప్రావిన్స్లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది!! అత్యున్నత స్థాయి నిఘా వర్గాలను, ఉపగ్రహ చిత్రాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక ఈ మేరకు వెలువరించిన కథనం కలకలం రేపుతోంది. 2030 నాటికి కనీసం 1,000 పై చిలుకు అణు వార్హెడ్ల సామర్థ్యం సంతరించుకోవడమే చైనా లక్ష్యమని ఆ కథనం పేర్కొంది! అరుణాచల్ సమీపంలో చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ, జనావాసాలను ఏర్పాటు చేస్తూ భారత్ను కవి్వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి వాయవ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవేమీ కాదు. అమెరికా, నాటి సోవియట్ యూనియన్లకు దీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవే. అప్పట్లోనే వాటిలో వేలాదిగా సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను నియోగించింది. జిటాంగ్, పింగ్టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. కానీ 20 ఏళ్లుగా ఆ రెండు ప్లాంట్లపై చైనా బాగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అంతేగాక అణు వార్హెడ్ల తయారీకి వాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసిందట! ఆ క్రమంలో ఆ రహస్య అణు కేంద్రాలను జిన్పింగ్ సర్కారు నానాటికీ విస్తరిస్తూ వస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాలు కూడా తాజాగా తేల్చాయి. అక్కడ అణు వార్హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగం పుంజుకున్నట్టు శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్ను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ‘‘జిటాంగ్ ప్లాంటు వద్ద కొత్త బంకర్లు, అత్యంత దృఢమైన గోడలు పుట్టుకొచ్చాయి. పైపుల వ్యవస్థను బాగా విస్తృతపరిచారు. అక్కడ ప్రమాదకర అణువ్యర్థాల పరిమాణం భారీగా పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనం. అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్టు పలు ఆధారాలున్నాయి’’అని రెనీ పేర్కొన్నారు. వీటిని హార్వర్డ్ వర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హుయ్ జాంగ్ కూడా ధ్రువీకరించారు. ఇక పింగ్టాంగ్ ప్లాంటులో యురేనియం శుద్ధి కార్యకలాపాలు సాగుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అక్కడ ఏకంగా 360 అడుగుల ఎత్తైన నిర్మాణాలున్నట్టు తెలిపింది. ప్రధాన భవనం పరిసరాల్లో పలు కొత్త నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్టు వెల్లడించింది. మూడో స్థానంలో చైనా అణ్వాయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా ప్రస్తుతం ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. దాని వద్ద ప్రస్తుతం కనీసం 600 అణు వార్హెడ్లు ఉన్నట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ అంచనా వేసింది. 2030 నాటికి దాన్ని కనీసం 1,000కి పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5,400 అణు వార్హెడ్లు ఉండగా అమెరికా వద్ద 5,200 దాకా ఉన్నాయి.వాటితో పోలిస్తే చైనా అణు సంపత్తి తక్కువే అయినా, వాటి సంఖ్యను అది శరవేగంగా పెంచుకుంటున్న తీరు ఆందోళన కలిగించేదేనని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా నడుమ అమల్లో ఉన్న వ్యూహాత్మక అణు నిరాయు«దీకరణ ఒప్పందం ఇటీవలే ముగియడం తెలిసిందే. దాన్ని పునరుద్ధరించే క్రమంలో చైనాను కూడా ఒప్పందం పరిధిలోకి తేవాల్సిన తరుణం ఆసన్నమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పిండం గుండె.. గండం పెరుగుతుండె!
సాక్షి, సిటీబ్యూరో: తల్లిగర్భంలో ఉండగానే పిండం గుండె లయ తప్పుతోంది. హార్ట్బీట్ రేటు గణనీయంగా తగ్గిపోతోంది. హైదరాబాద్లో ఇలాంటి కేసులు ఇటీవల బాగా పెరిగాయి. రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్కు నెలకు 300 కేసులు వస్తుండగా, అందులో సుమారు 30 వరకు ఫీటల్ హార్ట్ రేటు సమస్యలున్నాయి. గర్భం దాల్చిన 16 వారాల నుంచి 18 వారాల్లో ఎర్లీ టిఫా స్కాన్ చేసి పిండం పరిస్థితిని గుర్తించవచ్చని, సరైన సమయంలో స్పందించి చికిత్స అందిస్తే, పుట్టబోయే బిడ్డకు సాధారణ జీవితం అందించేందుకు వీలుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? జాగ్రన్ సిండ్రోమ్, ఎస్ఎల్ఈ, యాంకలైజింగ్, స్పాండలైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న గర్భిణుల్లోని పిండంపై హార్ట్బీట్ రేటుపై ప్రభావం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో పిండం గుండె తెల్లగా మారిపోతోంది. గుండె చుట్టూ నీరు చేరుతుంది. హార్ట్ వాల్్వలు లీకవుతాయి. ఇటువంటి సమయంలో తల్లి నుంచి ప్లాసెంటా ద్వారా చికిత్స చేయడంలో ఎఫెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆశించిన మేరకు ఉండటంలేదు. దీంతో నేరుగా పీటస్కే ట్రీట్మెంట్ అందించే అత్యంత సంక్లిష్టమైన వైద్యసేవలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్కు తెలంగాణలోని ఇతర జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి రిఫరల్ కేసులు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తుమ సేవలు పిండం గుండెకు చికిత్సను ఇప్పటివరకు తల్లి నుంచే అందిస్తుండగా, తాజాగా నేరుగా ట్రీట్మెంట్ చేసే అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. పిండం హార్ట్ రేటు తక్కువగా ఉండటం, గుండె చుట్టూ నీరు చేరడం వంటి సందర్భాల్లో నేరుగా ఇమ్యునోగ్లోబిలిన్ థెరఫీ చేస్తున్నారు. దీనిలో 95 శాతం సక్సస్ రేటు ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇమ్యునోథెరపీ సేవలందించే ఆసుపత్రులు ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో ఉన్నాయి.అందులో హైదరాబాద్కు స్థానం లభించడం గమనార్హం. అంతర్జాతీయంగా అత్యుత్తమ వైద్యసేవలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోందనేందుకు ఇదొక ఉదాహరణ. అత్యాధునిక శస్త్రచికిత్సల్లో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో వివిధ దేశాల నుంచి శస్త్రచికిత్సల కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడి చికిత్సలపై ప్రఖ్యాత అమెరికన్ మ్యాగ్జైన్ జాక్ (జేఏసీసీ)లోనూ కథనాలు ప్రచురితం కావడం గరి్వంచదగ్గ విషయమని వైద్యునిపుణులు పేర్కొంటున్నారు.18వ వారం నుంచి ట్రీట్మెంట్ నెలకు 300 కేసుల వరకు ఫీటల్ ఎకో చేస్తున్నాం. అందులో పది శాతం కేసుల్లో ఫీటల్ హార్ట్ రేట్ సమస్యలు ఉంటున్నాయి. గర్భం దాల్చిన 16 నుంచి 18 వారాల్లో ఎర్లీ టిఫా స్కాన్ చేయించుకోవడం మంచిది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుర్తించి, త్వరితగతిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయంలో ఇమ్యునోథెరపీ చేస్తున్నాం. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినా నిలవకపోవడం, అబార్షన్లు వంటి సమస్యలు ఉన్నపుడు ఎక్సటెండెడ్ ఏఎన్ఐ టెస్టు చేయించుకోవాలి. పిల్లల కోసం ప్లానింగ్ చేసుకునేటప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాలి. – డా. భార్గవి, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ -
ఒకే ఒక్కడు..!
ఢిల్లీ.. దేశ రాజధాని! మెరిసిపోయే మెట్రోలు, రాజప్రసాదాల్లాంటి భవనాలు.. కానీ వాటి వెనుకే వికృతమైన మురికి కూపాలు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు, బస్టాండ్ల దగ్గర దుర్గంధాలు అలవాటైపోయాయి. చూసీచూడనట్టు ముక్కు ముడుచుకుని వెళ్లిపోవడం నగరజీవి దైనందిన చర్య అయిపోయింది. కానీ, ఆ మురికిని చూసి ఒక సామాన్యుడి రక్తం మరిగింది. అతనే మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ ‘ఆసిఫ్ హిందుస్తానీ’. తన చేతిలోని కెమెరాను ఆయుధంగా, చీపురును ధ్వజంగా మార్చుకుని, ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాలకుల నిర్లక్ష్యంపై ఆసిఫ్ ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. నలుగురికి 62 పార్కుల బాధ్యత ఆసిఫ్ చేసేది కేవలం వీధులు ఊడ్చడం కాదు.. ప్రభుత్వ అసమర్థతను నిలదీయడం.. ఢిల్లీలోని రోహిణిలో ఒక మురికి బస్టాండ్ను స్వయంగా శుభ్రపరచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. ఆయన నిగ్గు తేలి్చన వాస్తవాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. పశి్చమ ఢిల్లీలో కేవలం నలుగురు పారిశుధ్య కార్మికులు కలిసి 62 పార్కులను నిర్వహించాలట! ఇది మనుషులకు సాధ్యమయ్యే పనేనా? పారిశుధ్య కారి్మకులకు పని చేయాలనే ఉన్నా, వారి దగ్గర సరైన పరికరాలు లేవు. కాలం చెల్లిపోయి, కనీసం చెత్తను లోడ్ చేయడానికి కూడా పనికిరాని తుప్పు పట్టిన వాహనాలు అధికారుల దౌర్భాగ్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. నిర్లక్ష్యపు గోడలు బద్దలు కొడుతూ.. ‘పరిశుభ్రత.. అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది వ్యక్తిగత జవాబుదారీతనం’.. అని ఆసిఫ్ గట్టిగా నమ్ముతున్నాడు. చిప్స్ ప్యాకెట్ లేదా ప్లాస్టిక్ స్ట్రా రోడ్డుపై పారేసే ముందు ‘ఒక్క క్షణం ఆగి ఆలోచించండి’అని ఆయన పిలుపునిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం చేసే ఆలోచనే నగరాన్ని మారుస్తుందన్నది ఆయన వాదన. మౌలిక వసతుల కన్నా మనుషుల మైండ్సెట్ మారడమే నిజమైన పరిష్కారమని నిరూపిస్తున్నాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూనే, పౌర బాధ్యతను గుర్తు చేస్తున్న ఆసిఫ్ పోరాటం ఇప్పుడు ఒక ప్రభంజనంలా మారుతోంది. రేపటి కల.. సంయుక్త పోరాటం ఆసిఫ్ లక్ష్యం కేవలం ఒక్క రోజు నిరసన కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. యువతలో చైతన్యం తీసుకురావడం ద్వారా పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ‘ప్రభుత్వం, పౌరులు కలిసి పనిచేసే ఒక పటిష్టమైన నమూనా రావాలి’.. అని ఆయన గొంతెత్తుతున్నాడు. అధికారుల ఏసీ గదుల వెనుక దాగున్న ఉదాసీనతను కడిగేయాలంటే, సామాన్యుడు ఇలా వీధిలోకి రాక తప్పదని ఆసిఫ్ తన ప్రతి అడుగుతోనూ చాటి చెబుతున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోదసిలో నిఘా యుద్ధం!
జేమ్స్బాండ్ సినిమాల్లో హీరో అలవోకగా ఖండాలన్నీ చుట్టేస్తుంటాడు. చట్టవ్యతిరేక, విద్రోహ సంస్థల గుట్టుమట్లు రట్టుచేసి భారీ ఉపద్రవాలను అడ్డుకుంటాడు. శత్రువుల రహస్య స్థావరాలను నేలమట్టం చేస్తుంటాడు. ఈ నిఘా పోరు 21వ శతాబ్దపు వాస్తవిక ప్రపంచంలో భూమిని దాటేసి ఏకంగా అంతరిక్షానికి చేరింది! ఇంతకాలం నేలల తేమ శాతం, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు తదితరాలపై అధ్యయం చేస్తూ వచి్చన ఉపగ్రహాలు నిఘా కార్యకలాపాల్లో తలమునకలు అవుతున్నాయి. వైరి దేశాల ఉపగ్రహాలపై కన్నేస్తున్నాయి. ఏ సమయంలో ఏ దేశంపై ఎందుకు తిరగాడుతున్నాయో కూపీ లాగుతున్నాయి. ప్రధాన దేశాలన్నీ దాదాపుగా ఇదే బాటపట్టడంతో ఇప్పుడు అంతరిక్షంలో సరికొత్త శాటిలైట్ నిఘా యుద్ధానికి తెర లేచింది. బెంగళూరుకు చెందిన దిగంతర సంస్థ ఒకటి ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్్కకు చెందిన స్టార్లింక్ శాటిలైట్ల జాడను విజయవంతంగా కనిపెట్టడం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన అజిస్టా స్పేస్ సంస్థ ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) ఎప్పుడు, ఎక్కడ తిరుగుతోందో కనిపెట్టి ఔరా అనిపించింది. వీటిని ఒకరకంగా ఇతర ఉపగ్రహాలపై నిఘా ఘటనలుగానే చెప్పొచ్చు. శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు సరికొత్త ‘స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్’ (ఎస్ఎస్ఏ) పరిజ్ఞానం ఇప్పుడు కీలకంగా మారింది. రెండు ఉపగ్రహాలు పొరపాటున ఢీకొనే ఆస్కారాన్ని తప్పించడమే గాక వాటి సిగ్నళ్లను జామ్ చేయడం, శాటిలైట్ను ధ్వంసం చేయడాన్ని నిలువరించడం కోసం ముందు ప్రత్యర్థి ఉపగ్రహాలు ఎక్కడున్నాయో కనీసం పక్కాగా తెలిసి ఉండాలి. ఈ కారణంగా కూడా నింగిలో నిఘా నేత్రాన్ని తెరవాల్సిన అనివార్యత దేశాలకు ఏర్పడిందని ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఏకే భట్ అన్నారు. ఈ నేపథ్యంలో ‘స్పైయింగ్ ఇన్ స్కై’ ఇప్పుడిక ఎంతమాత్రమూ సైన్స్ఫిక్షన్ స్థాయికి పరిమితం కాలేదు. భూమిపై జేమ్స్బాండ్ చేసి పనినే ఇప్పుడు ఆకాశంలో కృత్రిమ ఉపగ్రహాలు విస్తృతస్థాయిలో చేయబోతున్నాయి. ఇందులో ఆధిపత్యం ఎవరితో భవిష్యత్తులో తేలిపోనుంది. ఎవరు గమనిస్తున్నారో తెలిసుండాలి ‘‘కమ్యూనికేషన్, సైనిక, పౌర, పరిశోధనావసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నా అవి రహస్య పనులనూ చేస్తున్నాయి. ఇతర దేశాల ఉపగ్రహాలు భారత్లోని ఏఏ భూభాగాలపై ఎందుకు తిరుగుతున్నాయో కచి్చతంగా మనకు తెల్సి ఉండాల్సిందే. ఇది నిఘా, వ్యూహాత్మక ఆపరేషన్లకు అత్యంత కీలకం. అందుకే శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడింది’’ అని అజిస్టా స్పేస్లో స్పేస్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భరత్ సింహా రెడ్డి చెప్పారు. ‘‘ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలు ఆపరేషన్ సిందూర్దాకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధా్దలకు కీలక సమాచారం ఉపగ్రహాల నుంచే అందింది. కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్, నేవిగేషన్, టార్గెట్ ఇలా అన్ని విభాగాలను పటిష్టంచేయడంలో శాటిలైట్లే కీలక పాత్ర పోషించాయి’’ అని దిగంతర సీఈఓ, వ్యవస్థాపకులు అనిరుధ్ శర్మ అన్నారు. సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ (ఎస్ఎస్ఏ)లో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తూ భారత్ అంతర్జాతీయ నిఘా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఏటా ఆరు నుంచి పది ఉపగ్రహాలను తయారు చేసేలా అజిస్టా సంస్థ కొత్త ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్ తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. ఇది 2027 ద్వితీయార్ధంలోపు ప్రారంభం కావచ్చు. శత్రువులు ప్రయోగించే క్షిపణుల జాడను శాటిలైట్ ద్వారా గుర్తించే కొత్త ఉపగ్రహాన్ని 2027లోపు ప్రయోగిస్తామని ఈ సంస్థ తెలిపింది. అంతరిక్షంలో అర్లీ వారి్నంగ్ సిస్టమ్ను ఇది మరింత పటిష్టపరచనుంది. సాంప్రదాయకంగా భూతలంపై రాడార్ వ్యవస్థలు, ఆకాశంలో చక్కర్లు కొట్టే నిఘా విమానాలకు తోడుగా ఇప్పుడు అంతరిక్షంలోనూ నిఘా ఉపగ్రహాల రాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పామ్ కాల్స్.. ఇక బ్లాక్!
అవాంఛిత, మోసపూరిత కాల్స్, సందేశాలు ప్రపంచానికి సవాల్గా మారాయి. వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు ఆర్థిక నష్టాలకూ ఇవి కారణం అవుతున్నాయి. మన దేశంలో 95% మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, సందేశాలు వెల్లువెత్తుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సిద్ధమవుతోంది. కస్టమర్ అందుకున్న కాల్, మెసేజ్ను టెలికం కంపెనీ స్పామ్గా గుర్తిస్తే ఆ నంబర్ను బ్లాక్ లిస్టులోకి చేర్చాలని భావిస్తోంది. అలాగే అధికారిక ఫిర్యాదు లేకపోయినా స్పామ్ మెసేజ్లు పంపే మొబైల్ నంబర్ను డిస్కనెక్ట్ చేయాలన్న ప్రతిపాదనపై ట్రాయ్ కసరత్తు చేస్తోంది. టెలికం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తోంది. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో ఐదు ప్రత్యేక ఫిర్యాదులను స్వీకరిస్తే స్పామర్పై చర్య తీసుకుంటున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక నంబర్ను వరుసగా 10 రోజులపాటు అనుమానిత స్పామ్గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే.. ఆ నంబర్కు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్య తీసుకోవచ్చు. ఇది అమల్లోకి వస్తే స్పామ్ కాల్స్, మెసేజెస్ కట్టడికి టెలికం కంపెనీలు చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచి్చనట్టు అవుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్రియల్ టైమ్లో విశ్లేషించి.. ప్రస్తుతం దేశంలో ఏదైనా అవాంఛిత సమాచారాన్ని స్పామ్గా గుర్తించడానికి నిర్దిష్ట నియమాలు లేవు. కాల్స్, సందేశాలు పంపినవారి రోజువారీ వినియోగ తీరు, కాల్స్ ఎంత సమయం మాట్లాడుతున్నారు, ఎన్ని సందేశాలు పంపిస్తున్నారు, ఎవరెవరికి, ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఈ కాల్స్ చేస్తున్నారు వంటి అంశాలను టెల్కోలు ఉపయోగిస్తున్న ఏఐ సాంకేతికత రియల్ టైమ్లో విశ్లేషించి.. అవాంఛిత కాల్స్, మెసేజెస్ను గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. కాల్ను అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది కస్టమర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అనుమానిత స్పామ్గా గుర్తించిన అనేక కాల్స్ నిజమైన కాలర్ల నుంచి వచి్చనవే ఉంటున్నాయి. వాటిలో గిగ్ వర్కర్లతోపాటు ఇతర వాణిజ్య సంస్థలు ఉన్నాయి.వ్యవస్థీకృతంగా మోసాలు.. 2024 సెపె్టంబర్ నుంచి 2026 జనవరి మధ్య 7,100 కోట్ల స్పామ్ కాల్స్, 290 కోట్ల స్పామ్ సందేశాలను గుర్తించినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. 8 లక్షలకుపైగా మోసపూరిత లింక్స్ను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కాల్ సెంటర్లతో వ్యవస్థీకృతంగా మోసపూరిత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. సైబర్ నేరగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 92.7 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని భారతీ ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ వెల్లడించారు. 250కిపైగా కొలమానాలను పరిగణనలోకి తీసుకొని స్పామ్ కాల్స్, సందేశాలను గుర్తిస్తున్నట్టు చెప్పారు.⇒ టెల్కోలు ఏఐ సొల్యూషన్స్ సాయంతో ప్రతి నెలా సుమారు 40 కోట్ల కాల్స్, సందేశాల ను అనుమానిత స్పామ్గా గుర్తిస్తున్నాయి. ⇒ నమోదు కాని టెలీమార్కెటర్ల నుంచి వస్తున్న వాటిలో 7.5 కోట్ల కాల్స్, ఎస్ఎంఎస్లు ప్రతిరోజూ బ్లాక్ అవుతున్నాయి. ⇒ స్పామర్లపై టెల్కోలకు రోజుకు సగటున 10,000 ఫిర్యాదులు మాత్రమే అందుతున్నాయని సమాచారం. ⇒ 2025 ఫిబ్రవరిలో 1,16,213 స్పామ్ ఫిర్యాదులు టెల్కోలకు అందగా 2025 డి సెంబర్లో ఆ సంఖ్య 3,34,317కు చేరింది. ⇒ ఫిర్యాదులలో ఎక్కువ భాగం నమోదు కాని టెలిమార్కెటర్లపైనే ఉంటున్నాయి. ⇒ టెలిమార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు సాధారణంగా 10 అంకెల మొబైల్ నంబర్ ద్వారా కాల్స్ చేస్తున్నారు. ⇒ భారత్లో 116 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారిలో అవాంఛిత కాల్స్ను నివారించేందుకు ట్రాయ్ తీసుకొచి్చనడు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) సేవలను 22 కోట్ల మంది మాత్రమే ఎంపిక చేసుకున్నారు. -
ఆయన జగం ..ఆమె సగం
బ్రహ్మానంద స్వరూపుడు, నిర్వికారుడు, నిత్యమూ శమాది గుణ సంపత్తి కలవాడు కనుక శివుడు అని ‘శివ’ పదానికి వ్యుత్పత్తి.‘శివ’ అంటే పరమేశ్వరుడు.‘శివా’ అంటే పార్వతి. పేర్లలో కూడా ఏక రూపత కలిగిన ఆది దంపతులు వారు స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురూ సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వర రూపం.‘గౌరి సగం – శివుడు సగం – అర్ధ నారీశ్వరమే అఖిల జగం’ అంటూ అవినాభావమైన ఆ ఆదర్శ దంపతుల అద్వైత రూపాన్ని మహాకవి ఆరుద్ర కీర్తించారు. వాగర్థాలవలె కలిసిపోయిన వారని కాళిదాసు ప్రస్తుతించారు. ప్రకృతి – పురుషులే సృష్టికి మూలమని, అయితే ఇందులో ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పోషించే పాత్ర మరింత కీలకమైనదని చెప్పడానికి జగద్గురు ఆది శంకరులు తమ ‘సౌందర్యలహరి‘ లోని తొలి శ్లోకంలోనే ఇలా చెప్పారు:‘శివః శక్త్యా యుక్తో యది భవ తి శక్తః ప్రభవితుమ్ / నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి ‘.శక్తి స్వరూపిణి అయిన జగదంబతో కూడినప్పుడే పరమేశ్వరుడు సమస్త సృష్టిని నిర్వహించడానికి సమర్థుడై ఉంటాడు. పార్వతితో కూడనినాడు అంతటి శివుడూ కాస్తంత కదలడానికి కూడా శక్తిలేనివాడే అవుతాడు. అంతేకాదు. ఆదిశంకరాచార్యులవారు మరొక అడుగు ముందుకు వేసి ‘చితాభస్మమును దేహమంతా పులుముకొని, కంఠంలో గరళాన్ని ధరించి, దిగంబరుడై, జటాధారిగా, మెడలో పాములను వేసుకొని, పుర్రెను చేతిలో పట్టుకొని, యాచక వృత్తితో జీవిస్తూ, శ్మశానవాసిగా ఉన్న ఈశ్వరుడు ముజ్జగాలకే అధిపతి కావడం కేవలం పార్వతీదేవిని పెండ్లి చేసుకోవడం వలన లభించిన ఫలితమేనంటూ తమ ‘దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం’లో నొక్కి వక్కాణించారు. ఇలా భర్త ఔన్నత్యానికి కారణభూతురాలు అతని ఇల్లాలే అని ఆదిశంకరులు జగతికి చాటి చె΄్పారు. ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికే పరమేశ్వరుడు జగన్మాత పార్వతిని తన దేహంలో సగభాగంగా స్వీకరించాడు. శివుడంటేనే శక్తిమయుడు. శక్తి అంటేనే శివుని అభివ్యక్తి. శివశక్తులు రెండూ విశ్వానికి ఆధారమైన మూల పదార్థాలు. ఆ అర్ధనారీశ్వరుని స్వరూపాన్ని మహా శివరాత్రి సందర్భంగా ఆవిష్కరించుకొందాం.అర్ధనారీశ్వరత్త్వంఅర్ధనారీశ్వర స్వరూపంలో కుడిభాగం శివునిది. ఎడమభాగం పార్వతిది. శివుని మేని ఛాయ బంగారు వర్ణం కాగా, పార్వతీదేవిది కర్పూర సమ ధవళ వర్ణం. శివునిది జటలు కట్టిన రాగిరంగు కేశపాశం కాగా, అమ్మవారిది అందంగా అలంకరింపబడిన నల్లని కేశపాశం. విశాలమైన, పోడవైన, నీలోత్పలం వంటి నయనం జగన్మాతదైతే, వికసించిన ఎర్ర కమలం వంటి నేత్రం ఈశ్వరునిది. తన చెవికి ఆ తల్లి రత్నపు చెవిపోగు ధరించగా, సర్పాలనే ఆయన తన చెవికి ధరిస్తాడు. పార్వతి దివ్యాభరణాలను ధరించి ఉండగా, ఆయన నాగాభరణ శోభితుడు. అమ్మవారు దివ్యమైన పట్టువస్త్రాలను అలంకరించుకొంటే, ఆయన దిగంబరుడై దర్శనమిస్తాడు. కస్తూరి, కుంకుమ వంటి సౌభాగ్య ద్రవ్యాలను ఆమె అలదుకొంటే, దేహమంతా చితాభస్మాన్ని శివుడు పులుముకొని ఉంటాడు. ఆమె పాదం అందెలతోను, ఆయన పాదం నాగ కంకణాలతోనూ కనిపిస్తాయి.ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయైసమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమశ్శివా యైచ నమః శివాయఅమ్మవారి ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమవుతుంది. అయ్యవారి తాండవ నృత్యంతో విశ్వం మొత్తం శివునిలో కలిసిపోతుంది. జగత్తుకే మాతా పితరులైన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంగా కలిసి ఉన్న తత్త్వానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకభావం.రెండు విభిన్నమైన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పరస్పర సమన్వయాన్ని సాధించిన వైనానికి సాకార రూపమే అర్ధనారీశ్వరం. విభిన్న లక్షణాలున్నప్పటికీ అన్యోన్యానురాగంతో దాంపత్య బంధాన్ని కొనసాగించాలన్నది అర్ధనారీశ్వరుడు ఇచ్చే సందేశం. ఈ తత్త్వాన్ని ఆకళింపు చేసుకోగలిగితే భూమిపై ప్రతి జంటా ఆ ఆదిదంపతుల లాగా అన్యోన్యతకు సాకార రూపమై నిలుస్తుంది. అలా ఉండే ప్రయత్నం మనమందరం చేయగలిగితే మన సంస్కృతిలో భాగమయిన వివాహధర్మం కలకాలం మనగలుగుతుంది !– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
పట్నం కోతి సలహాలు
ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను’’ అంటూ పిలిచింది.చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్ రాయించుకున్నాయి.‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి. -
బెర్ముడా ట్రయాంగిల్..ముక్కోణపు సుడిగుండం!
ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒకవేళ ఆ బెర్ముడా ట్రయాంగిల్ నిజంగానే వేరే లోకానికి తీసుకెళ్లే ఒక ‘ఆకలిగొన్న ద్వారం’ అయితే, మీరు వెళ్లే క్రూజ్ షిప్పుల ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశంలో ఉండేవి. మీ జర్నీ టికెట్ వెనుక ‘మనుషులు మిస్ అయితే మాకు సంబంధం లేదు’ అని బోలెడన్ని కండిషన్లు పెట్టేవారు. కానీ అలాంటిదేం లేదు! అక్కడ ట్రాఫిక్ ఎక్కువ, వాతావరణం అప్పుడప్పుడు కల్లోలంగా ఉంటుంది. దానికి తోడు చిన్న చిన్న మానవ తప్పిదాలు. ఇవన్నీ కలిసి ఆ ఏరియాని ఒక మిస్టరీలా మార్చేశాయి అంతే!... నిజంగా అంతేనా! ఇలా పైపైన చెప్పేస్తే మిస్టరీ కాకుండా పోతుందా? అక్కడేమీ మర్మం లేదని చెప్పేవాళ్లు, మరి ఆ స్పాట్లోకి రాగానే నౌకలు ఎందుకు మునిగిపోతున్నాయో, విమానాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నాయో కూడా చెప్పొద్దా?! అవును చెప్పాలి. ‘వాట్ ఇఫ్ సైన్స్’ అనే సంస్థకు చెందిన పరిశోధకుడు రోనాల్ట్ కాపర్ తాజాగా అదే చెబుతున్నారు.మీథేన్ తప్ప మిస్టరీ కాదు!బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఓడలు, విమానాలు మాయమైపోతుంటే ఇన్నాళ్లూ ఏ అతీంద్రియ శక్తులో, లేకుంటే ఏలియన్లో వాటిని మింగేస్తున్నాయని అనుకున్నాం. కాని, అందుకు కారణం మిథేన్ గ్యాస్ అని రోనాల్డ్ కాపర్ బృందం చేసిన పరిశోధన తేల్చేసింది! సముద్రం అడుగుభాగం నుండి అప్పుడప్పుడు మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా బయటికి తన్నుకొస్తుందనీ, ఆ గ్యాస్ ధాటికి ఆ ప్రాంతం మీదుగా వెళ్లే ఓడలు బ్యాలెన్స్ తప్పి మునిగిపోవటం, విమానాల ఇంజన్లు మొరాయించి కూలిపోవటం జరిగి ఉండొచ్చని రోనాల్డ్ బృందం చెబుతోంది. అయితే ఆ గ్యాస్ అప్పట్లో ఎందుచేతనో ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఉండే అవకాశం చాలా తక్కువని కూడా అంటోంది! లోకం అంతా ఇన్నాళ్లూ దయ్యాల ట్రయాంగిల్ అని భయపడితే, చివరికి అది సముద్రానికి వచ్చిన ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ అని తేలిపోయిందన్న మాట!త్రిభుజాకార ప్రమాద స్థలిసినిమా భాషల్లో చెప్పాలంటే, ఇది ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉండే ఒక ‘మాయా బజార్’ లాంటి ప్రదేశం. ఫ్లోరిడాలోని మయామీ, బ్రిటన్లోని బెర్ముడా దీవి, ప్యూయెర్టోరికోలోని సాన్జువాన్.. ఈ మూడు పాయింట్లను కలిపితే ప్రత్యక్షమయ్యే పెద్ద ‘ముక్కోణపు సుడిగుండమే’ బెర్ముడా ట్రయాంగిల్. సుమారు 5 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ఈ అదృశ్య జల అగాధ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించటానికి 500 ఏళ్లుగా మానవాళి సంశయిస్తూనే ఉంది. ఓడల కెప్టెన్ల దగ్గర నుండి, విమాన పైలట్లు, కథలు రాసే రైటర్లు, రీసెర్చ్ చేసే మేధావుల వరకు... అందరూ తలా ఒక థియరీతో, ఎవరి ఊహకు అందినట్లు వారు ఏదో చెప్పారు కాని, ఆనాటి బెర్ముడా ట్రయాంగిల్ ప్రమాదాలకు అసలు కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సముద్రం మధ్యలో ఉన్న ఈ ‘నో ఎంట్రీ’ త్రిభుజస్థలి చుట్లూ కోకొల్లలుగా ఎన్నో కథలున్నాయి. అలాగైతే ఇప్పుడీ మీథేన్ గ్యాస్ కూడా ఒక కథే అనుకోవాలా?ఎందుకు మునుగుతున్నాయి!‘డైలీ మెయిల్’ తాజా వార్తా కథనం ప్రకారం, ఈ సరికొత్త మీథేన్ గ్యాస్ సిద్ధాంతాన్ని పైకి తీసుకొచ్చినవారే.. రోనాల్డ్ కాపర్. సముద్రం అడుగున గడ్డకట్టుకుపోయిన మీథేన్ గ్యాస్ ఒక్కసారిగా పెద్ద త్రేన్పుగా బద్దలై బయటకు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే నీటి సాంద్రత తగ్గిపోతుంది. అలా నీరు పల్చబడిపోతే, దాని మీద గంభీరంగా తేలుతూ వెళ్లే ఓడలకి ‘బ్యాలెన్స్’ తప్పుతుంది. ఇంకేముంది, ఏ సంకేతం, హెచ్చరిక లేకుండానే ఓడలు సముద్రం గర్భంలోకి జారిపోతాయి. పోనీ ఆకాశంలో వెళ్లే విమానాలైనా అక్కడ సురక్షితమా అంటే, అదీ లేదట! సముద్రం నుండి విడుదలైన గ్యాస్ గాలిలోకి చేరితే, అక్కడ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఫలితంగా బాగా దిగువగా విమానం వెళితే కనుక ఇంజన్లు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే, అక్కడ ఏదో శక్తి వచ్చి వాటిని లాగేయడం లేదు. సముద్రం వదిలిన గ్యాస్ వల్ల ఓడలకు, విమానాలకు హఠాత్తుగా, ‘తట్టుకునే శక్తి’ తగ్గి, మునిగిపోతున్నాయి అంటున్నారు రోనాల్డ్, ఆయన బృందం. ఇప్పుడెందుకు అలా లేదు?! అదొక బ్యాడ్ టైమ్ అంటారు రోనాల్డ్. అప్పట్లో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఈ మీథేన్ గ్యాస్ విస్ఫోటాలు చాలా చురుగ్గా ఉండేవట. కాలక్రమేణా సముద్రం అడుగున ఉండే పరిస్థితులు స్థిమితపడి, ఆ గ్యాస్ లీకేజీలు, అక్కడి వింత వాతావరణం ఇప్పుడు తగ్గిపోయాయని ఆయన చెబుతున్నారు. ‘‘ఇంతకాలం మనం అనుమానిస్తూ వస్తున్నట్లు అక్కడ ఏ ఏలియన్లు లేరు, వేరే లోకానికి వెళ్లే దారులూ లేవు. అదంతా కేవలం ప్రకృతి చేసిన ఒక వింత విన్యాసం’’ అని అంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఓడలు హాయిగా షికార్లు చేయటం లేదు, విమానాలు దర్జాగా ఎగరటం లేదు. కొంత భయమైతే ఉంది. మీథేన్ కథ కూడా గ్యాసేనా?సోషల్ మీడియాలో ఇప్పుడీ రోనాల్డ్ కాపర్ మీథేన్ గ్యాస్ థియరీ వైరల్ అవుతోంది కాని, వాస్తవం అయితే వేరేలా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్లో అప్పట్లో నిజంగానే అన్ని గ్యాస్ పేలుళ్లు సంభవించాయా? అని అడిగితే... గట్టిగా సమాధానం చెప్పే సాక్ష్యాలు మాత్రం దాదాపుగా లేవు. అంటే ఇది కూడా ఒక అంచనానేనా?! అమెరికన్ కోస్ట్ గార్డ్లు మొదట్నుంచీ బెర్ముడా ట్రయాంగిల్ ఉనికిని నమ్మటం లేదు. అసలు మ్యాప్లో అలాంటి డేంజర్ జోనే లేదు’’ అని కూడా వారు ఏనాడో తేల్చి చెప్పారు. నేటికీ వీడని ‘సైక్లోప్స్’ మిస్టరీ1918లో అమెరికా నేవీకి చెందిన ‘సైక్లోప్స్’ అనే ఒక భారీ సరుకు రవాణా ఓడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ఓడలో ఉన్న 306 మంది సిబ్బంది గాలిలో కలిసిపోయినట్లుగా, జాడ లేకుండా పోయారు. కనీసం ఓడ అవశేషాలు కూడా దొరకలేదు. దాంతో ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. ఓడ ఓవర్ లోడ్ అయి మునిగిపోయిందని, అందులో ఉన్న మాంగనీసు పేలిపోయిందని, ఓడలో పెద్ద గొడవ జరిగి ఒకర్నొకరు చంపుకున్నారని.. ఇలా రకరకాల కారణాలు వెతుక్కున్నారు. కొందరైతే సముద్రం అడుగున ఉన్న ఏదో ఒక పెద్ద రాక్షస జంతువు వచ్చి ఓడను నమిలేసిందని కూడా ప్రచారం చేశారు. అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది కాబట్టి, జర్మనీ వాళ్లే తమ ఓడను ముంచేశారేమో కూడా అనుమానాలు వచ్చాయి. జర్మనీ మాత్రం ‘‘ఆ ఘటనతో మాకు సంబంధం లేదు’’ అని స్పష్టంగా చెప్పేసింది. మరోవైపు సైంటిస్టులు దాన్నొక సహజ ప్రమాదంగా కొట్టిపడేశారు. అయితే అసలేం జరిగింది అనే దానికి సమాధానం మాత్రం ఎవరి దగ్గరా లేదు. ఆ ఓడ ఏమైందో ఇప్పటికీ ఒక పెద్ద ‘మిస్టరీ’!ఏమైనా, టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు శాటిలైట్లు, సూపర్ వెదర్ రిపోర్టులు అందుబాటులోకి వచ్చాక బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంటే, టెక్నాలజీ ముందు ఈ మిస్టరీలు తోక ముడిచాయని అనుకోవచ్చా?! ఐదు శతాబ్దాల మిస్టరీ!బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ, క్రిస్టోఫర్ కొలంబస్ సముద్రాలపై షికారు చేస్తున్నప్పటి నుంచీ ఉంది. 1492లోనే కొలంబస్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఆకాశంలో ఏవో వింత వెలుగులు చూశానని తన డైరీలో రాసుకున్నారు. బహుశా ఆ వెలుగులనే మనం ఏలియన్స్ (గ్రహాంతర జీవులు) అనుకుంటున్నామా? శతాబ్దాల తరబడి ఆ రూట్లో వెళ్లే నావికులు, ‘‘అయ్యా! మా దిక్సూచి ఇక్కడికి రాగానే పిచ్చిపిచ్చిగా తిరుగుతోంది, సడన్ గా తుపానులు వస్తున్నాయి’’ అని చెబుతుండేవారు. అందువల్ల కూడా మెల్లమెల్లగా ఆ ప్రాంతానికి చెడ్డ పేరు వచ్చేసింది. అసలు కథ మాత్రం 1974లో మొదలైంది. చార్లెస్ బెర్లిట్జ్ అనే ఆయన ‘ది బెర్ముడా ట్రయాంగిల్’ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, ‘‘ఇప్పటి వరకు అక్కడ వెయ్యి మందికి పైగా మనుషులు మాయమైపోయారు!’’ అని ఒక బాంబు పేల్చారు. దాంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది, అప్పటి నుండి ఈ ట్రయాంగిల్ అంటేనే గజగజ వణికిపోవడం మొదలుపెట్టింది. కొలంబస్ చూసిన ఆ ‘లైట్లు’, బెర్లిట్జ్ రాసిన ఆ ‘కథలు’ కలిపి ఈ బెర్ముడా ట్రయాంగిల్ని ఒక గ్లోబల్ సెలబ్రిటీ విలన్ని చేసేశాయి.లాయిడ్స్ ఆఫ్ లండన్ పరిశోధనప్రపంచంలోనే పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ‘లాయిడ్స్ ఆఫ్ లండన్’ వాళ్లు కూడా కొంత పరిశోధన జరిపించి, ‘‘మిగతా సముద్ర ప్రాంతాల్లో ఎంత రిస్క్ ఉందో, అక్కడ కూడా అంతే ఉంది. అక్కడేదో అయిపోతుందని ఊహించకండి, మా పరిశీలన ప్రకారం అక్కడ అంతా మామూలు పరిస్థితులే ఉన్నాయి..’’ అని చాలాకాలం క్రిందటే ప్రకటించారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం కొంతమంది రీసెర్చర్లు, మేధావులు, ‘‘ఏంటి బ్రదర్.. అంతా గ్యాస్ అని ఎలా తేల్చేస్తారు, గ్యాస్ కాకపోతే’’ అని రోనాల్డ్ థియరీని వి¿ే దిస్తూ, అది కచ్చితంగా మిస్టరీనే అంటున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ గురించి పుస్తకాలు రాసే నైజెల్ వాట్సన్, ‘‘ఎవరి సిద్ధాంతం వారిదే అయితే, అసలు కారణం ఒకటేదో ఉండి ఉంటుంది’’ అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భాగం గ్యాస్ థియరీ నిజమా లేక ఏలియన్స్ నిజమా అన్నది పక్కన పెడితే, జనం ఎప్పుడూ ఏదో ఒక వింతను కోరుకుంటూనే ఉంటారు. అందుకే ఈ ట్రయాంగిల్ కథలు ఇంకా బతికున్నాయి. అయినా ప్రపంచంలో ఇదొక్కటే కాదు కదా ట్రయాంగిల్, మరి మిగతా ట్రయాంగిళ్ల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం లేదు?’’ అని వాట్సన్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బెర్ముడా ట్రయాంగిల్ స్టోరీ ఒక పక్క గ్యాస్, మరో పక్క బాస్ (ఏలియన్స్), ఇంకో పక్క మాస్ (పుకార్లు)ల మధ్య సజీవంగా ఉంటూ వస్తోంది.సాక్షి, స్పెషల్ డెస్క్ -
వేలెంటైన్స్ వర్సెస్ కవిత్వంతో కర్సేస్!!
ఇవాళ్ల వేలెంటైన్స్ డే అటగా. తమ ప్రేమను కవితాత్మకంగా ఎక్స్ప్రెస్ చేసే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారటగా. అందుకే సినిమాల్లో ప్రేయసి మీద పాటలుంటాయటగా. చిన్నప్పట్నుంచీ నాదంతా సినిమా స్టైల్. అందుకే కవితంటే అదో అమ్మాయి పేరని మాత్రమే తెలిసినా, కవిత్వం రాతకు అక్షరమ్ముక్క రాకపోయినా... నేనూ కవితలు రాయడం మొదలుపెట్టా. అసలా పనిని నేను అ...ఆ... లు దిద్దడ మప్పట్నుంచే ప్రారంభించా. ఫ్యూచర్లో నేనెవరైనా అమ్మాయిని ఇష్టపడితే మరి అప్పటికప్పుడు కవిత్వం రాకపోతే ఎలా...? అందుకే... ఎందుకైనా మంచిదంటూ పేడపురుగు ఉండలు ఉండలుగా దొర్లించుకుపోయినట్టుగా... అప్పుడింతా అప్పుడంతా కవిత్వం పోగేసుకున్నా. అదంతా వరసల్లో పేర్చా. ఆ మాటల్లోని కొన్ని ఆణిముత్యాలూ. ప్రేమరత్నాలూ ఇవే... ఓ నా ప్రేయసీ... నువ్వు మంచి ఫూడీవటగా... నీకు బహుమతిగా ఇద్దామని రంగురంగుల ఇంద్రధనుస్సును పనీర్ ముక్కల్లాగా కోసి ఆకాశపు నీలిప్లేటులో అడావుడిగా పట్టుకొచ్చా. ఆత్రంగా పెట్టుకొచ్చా. ఇంధ్రధనుస్సునే ఎందుకు వంచానని అడుగుతున్నావా? అందరూ చంద్రవంకల్నీ నెలవంకలనీ కవిత్వంలో రాస్తారట కదా. మరి... నేనందరికన్నా డిఫరెంటుగా! అందుకే వెల్లకిలా పడి ఉండే నెలవంక షేపుకు ఎగ్జాట్లీగా బోర్లావేసినట్టుండే రెయిన్బోనెంచుకున్నా. చాలామంది రక్తంతో ప్రేమలేఖ రాస్తారటగా నేను మాత్రం ఆ రెయిన్బో ముక్కల్ని వేడివేడిగా నీ నోటికందిద్దామని నా రక్తపు నూనెలో ఎర్రగా గోలిచ్చి పెట్టా.స్టవ్వు మంటకు నా రక్తపు వేడి కూడా తోడైతేనా బంగారానికి దీటుగా ఆ ముక్కలకీ బంగారపు రంగొచ్చేలామంచి డీప్ ఫ్రై చేయవచ్చని... దాంతోనా లవ్వు కూడా డీపుగా ఉంటుదన్నది నా ఆశ.ఆ ఫ్రై ముక్కల ప్యాకింగు కోసంసిల్వర్ ఫాయిల్స్ కోసం ఎంతో వెదికా. టైముకు అవి కనిపించలేదు. అందుకే... పలచని స్ట్రాటోక్యుములస్ మబ్బులంచుల్లో ఉన్న వెండి సిల్వర్ లైనింగును కట్ చేసి వేడి తగ్గకుండానే సదరు పనీరింద్రధనుస్సు ముక్కల్ని ప్యాక్ చేసి పెట్టా.నువ్వు నైసుగా కోసుకుని తినేందుకు నైఫు కూడా కనిపించలేదు. అందుకే... బోర్లా ఉన్న ఇంద్రచాపం వెన్ను బెండుతీసి ఓ అంచుకు బాగా సానపట్టా.అదే రెయిన్బో చివరల్ని లైటుగా కాల్చి ప్రతిరంగు జాయింటు దగ్గర కొద్దిగా చీల్చిరంగురంగుల ఫోర్కుగా దాన్ని నీకందిద్దామని ఇక్కడే వేచి చూస్తున్నా.మన ఫాస్టెస్టు ట్రైనులా రాజధానెక్సెప్రెస్సులానా బ్లడ్ప్రెషరిప్పటికే ప్రేమపట్టాలపై గ్యాలప్పేస్తోంది. సూపర్సానిక్ స్పీడులో ఉన్న నా రక్తపోటు పంపును... యూఎస్ వెళ్లాలనుకున్న ఇంజనీరు పాలిటి ట్రంపులా అడ్డుపడి ఎలాగోలా అదుపులోకి తెచ్చెయవా ఫ్లీజ్! నా ప్రేమను యాక్సెప్ట్ చేయకుండా నన్ను నిరాశపరచి గేదె తగిలాక గాయపడ్డ వందేభారత్లా నా గుండెను గాయపరిచి వేడుక చూడకంటూ వేడుకుంటున్నాను. తోడుండమంటున్నాను.ఇట్లుమామిడిటెంక మన్మథలెంక ప్రేమలేఖకు ఈవినింగ్ లోపల జవాబూ వచ్చింది. ‘‘ఏయ్ మిస్టర్... చదువుతున్నంతసేపూ గుర్తొచ్చింది షాకిచ్చే శాకినీ... చదివాక నా పరిస్థితి ఢామ్మంటూ ఢాకినీ!... ఇలా నువ్వు నీ లవ్లెటర్తో నా చెవిలో చేతబడి చేశావ్. కర్ణభేరిపై కాష్మోరా ప్రయోగించావ్. అసలే సినిమా పిచ్చోడివి కదా... అందుకే నీకర్థమయ్యేలా చెబుతున్నా విను. కవుల పట్ల జంధ్యాలకున్న అభిప్రాయాలన్నీ రీల్ చేసి ఇస్తున్నా.చూడు. చూశాక... ఇంకెప్పుడూ నాకు కాల్ చేయకూ... కవిత్వంతో నన్ను కాల్చేయకు. – లవ్వు పాలిట యాంటీ ప్రొజెక్టరణీ... నీ ప్రేమ రిజెక్టరణి...– యాసీన్ -
ప్రేమంటే అంతేగా! అంతేగా!
‘అంతేగా... అంతేగా’ ఈ సినిమా డైలాగ్ ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయింది. ‘ముద్దమందారం’ ప్రదీప్ కాస్తా ‘అంతేగా.. అంతేగా’ ప్రదీప్ను చేసింది. నేటికాలం ప్రేమలకు అసలు సిసలు శత్రువు ఇగో. చిన్న చిన్న ఇగోలతోనే లవ్ బ్రేకప్లు పెరుగుతున్నాయి. ‘నా మాటే నెగ్గాలనే’ పంతానికి పోకుండా ‘అంతేగా! నువ్వు చెప్పింది రైటే కదా!’ అనే ఒక్కమాట ప్రేమను పదికాలాల పాటు నిలుపుతుంది.వంద అబద్ధాలు ఆడయినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. ఒక్క అంతేగా, అంతేగా! డైలాగ్ వాడితే ఎన్ని ప్రేమలైనా నిలబెట్టుకోవచ్చు.. సరదాగా నవ్వుకుని.. కాస్త సీరియస్గా ఆలోచించండి.‘సెల్ఫ్ సెంట్రిక్గా ఉండే ప్రేమలు దీర్ఘకాలం మనలేవు. రిలేషన్ ఒక పుష్పగుచ్చంలా ఉండేలా చూసుకోవాలి’ అంటున్నారు సీనియర్ నటుడు ప్రదీప్ కొండపర్తి, సరస్వతి దంపతులు. 37 ఏళ్ల కుటుంబ జీవనంలోని ప్రేమను ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా పంచుకున్న విశేషాలు..ఆరేంజ్డ్ నుంచి లవ్ప్రదీప్: మాది మ్యారేజ్ తర్వాత ప్రేమ. అరేంజ్డ్ మ్యారేజ్. చెట్టుకు నీళ్లు పోస్తేనే అది పువ్వులు ఇస్తుంది. మనిషి కూడా అంతే, గుప్పెడు ప్రేమను పంచితే తిరిగి ప్రేమను అందిస్తాడు. ఈ మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి ప్రేమ అనే పుష్పగుచ్చంలో ఇలా సాగిపోతున్నాం. సరస్వతి: నా ఎం.ఎ. తర్వాత పెళ్లి అయ్యింది. చిన్న కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలోకి వచ్చాను. ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాల్సినవి, మలుచుకోవాల్సినవి తప్పక ఉంటాయి. నేను కొంచెం సైలెంట్. ప్రదీప్ గారితో జర్నీ స్టార్ట్ అయ్యాక ఆయన అందించిన ప్రేమ, కంఫర్ట్ వల్ల సులువుగా అందరిలో కలిసిపోయాను. పెళ్లి తర్వాత పీహెచ్డి చేశాను, యాంకరింగ్ ఫీల్డ్లోకి వచ్చాను, పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాను.. ఇదంతా ప్రదీప్గారి సపోర్ట్ వల్లే.భేదాభిప్రాయాలుసరస్వతి: సాధారణంగా ఎదుటివారిని మార్చాలనుకున్నప్పుడే విభేదాలు తలెత్తుతాయి. అయితే, మన ప్రవర్తన ద్వారా అవతలి వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. ఇద్దరూ ఓపెన్గా ఉంటేనే పాజిటివ్ ఛేంజ్ తీసుకు రాగలుగుతాం. నా వరకు నేను డిసిప్లిన్గా ఉంటాను. టైమ్, నీట్నెస్.. ఖచ్చితత్త్వం పాటిస్తాను. ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే కొంత పాజ్ ఇచ్చి చూడాలి. అప్పుడు వారికే అర్థమైపోతుంది.ప్రదీప్: ఇద్దరమూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రెయినర్స్గా ఉన్నాం. కాబట్టి, ముందు మేం పాటించి, అవి మిగతావారికి చెబుతాం. అందుకే, మాట తీరు, ప్రవర్తన సరిగ్గా ఉండటానికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏది చేసినా మనవాళ్లతో బాగుండటానికే అనుకుంటే ఎన్ని విభేదాలు ఉన్నా అవి పెద్దవిగా అనిపించవు.త్యాగాలుప్రదీప్: ఎంత బిజీ అనుకున్నా సరే కొన్నింటికి తప్పక టైమ్ కేటాయించుకోవాల్సిందే! కలిసి చేసే ప్రయాణంలో బిజీ అంటే కుదరదు. ‘నా నుంచి మన’ అనుకుంటే అద్భుతమే కదా! సరస్వతి: ఇద్దరి మధ్య స్నేహం ఉండాలి. ఎదుటివారి కోణంలో నుంచి ఆలోచించాలి. చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఏదైనా సందర్భం ఎదురైనప్పుడు ‘ఇబ్బంది పడకు, నేను చూసుకుంటాలే’ అని చెప్పాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే, దానిగురించి అవతలి వారికి చెప్పే సంస్కారం ఇద్దరిలోనూ ఉండాలి. బలహీనతలను పట్టుకొని నస పెట్టకూడదు. కొన్ని విషయాల్లో సర్దుకుపోయే తత్త్వం ఉండాలి.అలవాట్లుప్రదీప్: రిలేషన్ షిప్ను ఒక బొకేలా తీసుకుంటే అందులో అలవాట్లు కూడా వస్తాయి. అయితే, అలవాట్లు వ్యసనాలు కాకూడదు. పాటలు పాడటం, రచనలు చేయడం, టీవీ.. ఇలా చాలా విషయాల్లో భార్యాభర్తల అలవాట్లలలో తేడాలు ఉంటాయి. వాటి గురించి కామెంట్స్ చేయడం, జోకులేయడం చేస్తే.. బాధపడే సందర్భాలూ ఉంటాయి. రోజులో అరగంటసేపైనా మాట్లాడుకుంటే ఇద్దరి మధ్యా అవగాహన పెరుగుతుంది. సరస్వతి: ఇద్దరికీ నష్టం కలుగుతున్నాయనుకున్న అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని పక్కన పెట్టేయడమే మేలు. మా వరకు విసుగు అనిపించే అలవాట్లు లేవు. చాలా మందికి వ్యసనాల వల్ల సమస్య ఉంటుంది. ముందుగా గుర్తించి, వాటికి ఒక హద్దు గీసుకుంటే సరి!ఊహించని కానుకప్రదీప్ : చివరి వరకు మిగిలేది భార్యభర్తలే. ఒకరి ఎక్స్పెక్టేషన్స్ని మరొకరు అర్ధం చేసుకొని, వాటిని అందించగలగాలి. ఎప్పుడైతే ఎదుటివారి భావాలకు, టైమ్కు ప్రాధాన్యత ఇస్తామో, అదే తిరిగి మనకు వస్తుంది. ప్రతి చర్యలో, మాటలో నీకు నేనున్నాను అనే ఎక్స్ప్రెషన్ను ఇవ్వగలిగితే చాలు. సమస్యలు రావు.సరస్వతి: ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. పార్టనర్కి ఊహించని కానుక ఇవ్వాలని ఉంటుంది. అది, డైమండ్ నెక్లెస్లు కానక్కర్లేదు. సందర్భాన్ని బట్టి ఒక పేపర్పైన లవ్ సింబల్ గీసి, ఇచ్చినా ఆ సమయానికి అది పెద్ద కానుకే. ఆ ప్రేమలో స్వచ్ఛతనే చూడాలి. ఒకసారి నా బర్త్డే రోజున రిలేటివ్స్ పెళ్లికి వెళ్లాం. తిరిగి వస్తూ చార్మినార్ దగ్గర అర్ధరాత్రి కేక్ కట్ చేయించారు. నాటి సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా ఊహించనివి ఎంతో ఆనందాన్నిస్తాయి. మా ఇద్దరి అభిరుచులు వేరు, ఆలోచనలు వేరు, నచ్చే కలర్స్ వేరు.. చాలా వైరుధ్యం ఉంది. కానీ, మేం ఇద్దరం ఒకటే.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Valentines Day: ఒక ప్రేమిక సజీవ కథ
‘ప్యార్ కియాతో డర్నా క్యా’... ప్రేమకు భయం లేదని, వెరపు వద్దని చెప్పిన పాత్ర అనార్కలీ. ఆ పాత్రకు జీవం పోసిన మధుబాల లక్షల అభిమానుల ప్రేమిక. ఫిబ్రవరి 14న ఆమె జన్మించడం యాదృచ్చికం కాదు. ఆమె పుట్టుక ఒక గొప్ప ప్రేమ కథ ‘మొఘల్ ఏ ఆజమ్’ను ఆచంద్రార్కం చేసింది. ఆమె జీవితం వినూత్న ప్రేమకథగా ముగిసింది. ప్రేమికుల దినం ప్రత్యేక కథనం.మధుబాల గుండెలో బాల్యం నుంచి రంధ్రం ఉంది. ఆ తర్వాత ఆ గుండెను ఎందరో తూట్లు పొడిచారు. తెర మీద. తెర బయట.‘మొఘల్–ఏ– ఆజమ్’లో అనార్కలీ ప్రేమను అక్బర్ చక్రవర్తి అంగీకరించడు. నిజజీవితంలో మధుబాల ప్రేమను ఆమె తండ్రి అంగీకరించలేదు. తెర జీవితం, నిజ జీవితం కొందరికి ఒకేలా మారతాయి.‘మొఘల్–ఏ–ఆజమ్’లోని అనార్కలీ పాత్ర మొదట నర్గీస్కు వెళ్లింది. నాటి సింగింగ్ సూపర్ స్టార్ సురయ్యకు వెళ్లింది. ఇద్దరూ చేయలేదు. దానికోసం మధుబాల జన్మెత్తి ఉన్నప్పుడు అది ఆమెకే కదా చేరాలి. చేరింది. మధుబాల అనార్కలీగా నటించింది. నటించడం ఏమిటి... మధుబాలే అనార్కలీ అయ్యింది. సువాసనలీనే పువ్వు తొందరగా రాలిపోతుందన్నట్టు మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో చనిపోయింది. కాని నేటికీ జీవించే ఉంది. కారణం– అనార్కలీ పాత్ర ఆమెను బతికిస్తూ ఉంది.కాదు– ఆమె అనార్కలీని పునరుజ్జీవం చేస్తూ ఉంది. సరే.. ఇద్దరూ కలిసి ప్రేమకు అమరత్వం తెచ్చారు.‘మొఘల్–ఏ–ఆజమ్’ కథ నిజమో అబద్ధమో తెలియదు కాని అది జనానికి చాలా ఇష్టం. ఒక నిరుపేదరాలిని రాకుమారుడు, భావి సామ్రాట్ కోరుకుంటే ఆ కథ జనానికి నచ్చకుండా ఎలా ఉంటుంది? అక్బర్ కుమారుడు జహంగీర్ (ముద్దుపేరు సలీమ్) తన రాజాస్థానంలో ఉన్న అనార్కలీ అనే నాట్యకత్తెతో ప్రేమలో పడ్డాడట. అది తెలిసి అక్బర్ ఆమెను సజీవ సమాధి చేశాడట. అలాగని జనస్మృతిలో ఉన్న కథను దర్శకుడు కె.ఆసిఫ్ చాలా పెద్దగా, అట్టహాసంగా, ‘తీయదలిచాడు. ఎంతగా అంటే ఆరేడు లక్షల్లో సినిమా అవుతున్న రోజుల్లో కోటి రూపాయలతో. సలీమ్గా దిలీప్ కుమార్ను తీసుకున్నాడు. అక్బర్గా పృథ్వీరాజ్ కపూర్ను. అనార్కలీగా మధుబాలా.మధుబాలాకు ఇండియన్ మార్లిన్ మన్రో అని పేరు. ‘మహల్’తో ఆమె మెరిసినా,‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘చల్తీ కా నామ్ గాడీ’... ఆకర్షణగా నిలిచినా ఆమె నటనకు సవాలుగా నిలిచే సినిమా అంతవరకూ లేదనే చెప్పాలి. ‘మొఘల్–ఏ–ఆజమ్’తో ఆ అవకాశం వచ్చింది. దానిని ఆమె ఒక సవాలుగా స్వీకరించింది.మధుబాల క్లాసికల్ డాన్సర్ కాకపోయినా నాటి కథక్ ఆచార్యుడు కిష్షు మహరాజ్ దగ్గర నృత్యం నేర్చుకుని ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ పాటలో మెరుపు వేగంతో పాదాలను కదిలించింది. చురకత్తుల కంటే వాడిగా చూపులను విసిరి అక్బర్ పాదుషానే కాదు ప్రేక్షకులను కూడా కలవర పరిచింది. మేరునగధీరుల వంటి పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్లను ఢీకొడుతూ నటించడం సామాన్యం కాదు. ‘నీ చివరి కోరిక ఏమిటో కోరుకో’ అని అక్బర్ అడిగితే ‘ఒక్క రోజైనా మొఘల్ సామ్రాజ్యపు సింహాసనానికి రాణిగా ఉండాలని ఉంది’ అంటుంది అనార్కలీ. ‘నీ అల్పబుద్ధి మానుకున్నావు కాదు’ అంటాడు అక్బర్. ‘అయ్యా... ఇది నా కల కాదు. మీ కుమారుడి కల. అతని కల అసంపూర్ణంగా ఉంచి నేను మరణించలేను’ అంటుంది అనార్కలీ. ఆమెది విఫల ప్రేమకథే. కాని బాక్సాఫీసు దగ్గర సఫలమైంది. ఆ ప్రేమకథ గెలుస్తూనే ఉంది నేటికీ.మధుబాల దిలీప్ కుమార్ని ప్రేమించింది. దిలీప్కుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని మధుబాల మీద ఆధారపడిన కుటుంబం ఆమె వివాహమయ్యాక దిక్కులేనిదవుతుందని మధుబాల తండ్రి దిలీప్కుమార్తో తగాదా పెట్టుకున్నాడు. కోర్టు గొడవలు దాకా వెళ్లింది. మనసు విరిగిన దిలీప్ ఆ తర్వాత మధుబాల ముఖం చూడలేదు. మొఘల్–ఏ– ఆజమ్లో నటించే సమయంలో వారి మధ్య మాటలే లేవు. కాని తెర మీద రొమాన్స్ను పండించారు. ఆ తర్వాత గాయకుడు కిశోర్ కుమార్ మధుబాలను ప్రేమించినంత పని చేశాడు. వారి వివాహం జరిగాక సాగిన 9సంవత్సరాల కాపురం పెళుసైనది. గుండె జబ్బుతో బాధ పడుతున్న మధుబాలను కిశోర్ లండన్లో కూడా చూపించాడు. నయం కాదని తెలిశాక మృత్యువు తెచ్చే ఎడబాటును తట్టుకోవడానికి బహుశా ముందు నుంచే దూరమయ్యాడు. ఒక అందమైన సుందరి, కోమలమైన హృదయం గల స్త్రీ గుండె నిండుగా ప్రేమ పొందకనే మరణించింది. జీవించి ఉండగా, మరణించాక... నేటికీ ఎందరికో పోస్టర్గర్ల్గా గోడల మీద ఉంటున్న మధుబాల... తాను కోరుకున్న ప్రేమను, తన మనసు నింపే ప్రేమను పొంది ఉంటే మరికొన్నాళ్లు బతికి ఉండేదేమో. ప్రేమికుల రోజు జన్మించిన మధుబాల ప్రేమ ఉన్నంత కాలం ఒక గులాబీని ఆమె స్మరణలో పొందుతూనే ఉంటుంది ఏ అనామక అభిమాని నుంచో.ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నాఔర్ అబ్ హమె కర్నా క్యాజబ్ ప్యార్ కియాతో డర్నా క్యా: -
కొన్ని క్యాన్సర్లను నివారించొచ్చు
సాక్షి, స్పెషల్ డెస్క్: క్యాన్సర్.. ప్రపంచాన్ని వణికిస్తున్న అత్యంత భయంకరమైన వ్యాధి. ఏటా ఒక కోటి మంది ఈ వ్యాధి బారినపడి కన్నుమూస్తున్నారంటే ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కొత్త క్యాన్సర్ కేసుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ నివారించదగినవే. అంటే ఏటా 71 లక్షల మందిని ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడవచ్చన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. 2022లో 1.87 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ సోకింది. ఇందులో సుమారు 38% కేసులు ఇన్ఫెక్షన్లు (అంటువ్యాధులు), జీవనశైలి అలవాట్లు, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల సంభవించాయని అంచనా. ఇవన్నీ నివారించదగినవే. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే గర్భాశయ క్యాన్సర్లను సకాలంలో టీకాలు వేయడం ద్వారా అడ్డుకోవచ్చు. అలాగే స్మోకింగ్ వల్ల కలిగే అనేక కణితులను ధూమపానం మాన్పించడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇలా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చడానికి ‘శక్తివంతమైన అవకాశం’ఉందని పరిశోధకులు అంటున్నారు. కొన్ని క్యాన్సర్లు అనివార్యం.. వయసు పెరిగే కొద్దీ మన డీఎన్ఏలో అనివార్యంగా జరిగే నష్టం లేదా వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యువులు వారసత్వంగా రావడం వల్ల కొన్ని క్యాన్సర్లు అనివార్యం. అయితే 10లో దాదాపు నాలుగు కేసులను నివారించవచ్చన్న అంశం జనంలో ఆసక్తి రేకెత్తిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే 30 నివారించగల కారకాలను డబ్ల్యూహెచ్ఓలో భాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అనే సంస్థ విశ్లేషించింది. ధూమపానం, అతినీలలోహిత (అ్రల్టావయోలెట్) కిరణాలు వీటిలో ఉన్నాయి. ఇవి మన డీఎన్ఏను నేరుగా దెబ్బతీస్తాయి. ఊబకాయం, శరీరంలో వాపు, హార్మోన్లను మార్చే అతి తక్కువ శారీరక శ్రమ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. వాయు కాలుష్యం వల్ల నిద్రాణమైన క్యాన్సర్ కణాలు మేల్కొంటాయని ఏజెన్సీ వెల్లడించింది. ధూమపానం ప్రధాన కారణం క్యాన్సర్కు దారితీసే తొమ్మిది ఇన్ఫెక్షన్లను కూడా ఏజెన్సీ నివేదించింది. వీటిలో హెచ్పీవీ, కాలేయ క్యాన్సర్కు దారితీసే హెపటైటిస్ వైరస్లు, కడుపు నొప్పి, అల్సర్స్, తీవ్రమైన గ్యాస్ సమస్యలకు కారణం అయ్యే హెలికోబాక్టర్ పైలోరి బ్యాక్టీరియా ఉన్నాయి. పరిశోధన బృందం 2022 నుండి 36 రకాల క్యాన్సర్ కేసుల డేటాను.. అలాగే 185 దేశాలలో 2012–22 మధ్య ఈ వ్యాధికి మూలమైన 30 ప్రమాద కారకాల సమాచారాన్ని విశ్లేషించి నివేదికను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్యాన్సర్ కేసులకు ధూమపానం ప్రధాన కారణమని వెల్లడించింది. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫెక్షన్లు, మద్యపానం ఉన్నాయి. భవిష్యత్తులో క్యాన్సర్ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రమాద కారకాలను నివారించడం అత్యంత శక్తివంతమైన మార్గాలలో ఒకటి అని పరిశోధన వెల్లడించింది. దేశాలకు అనుగుణంగా.. పురుషుల క్యాన్సర్లలో 45% నివారించదగినవిగా ఉండగా.. మహిళల్లో ఇది 30% ఉంది. నివారణ స్థాయి పురుషులలో అధిక స్థాయిలో ఉండడానికి కారణం.. ధూమపాన ప్రియులు పురుషుల్లో ఎక్కువగా ఉండడమే. యూరప్లో నివసించే మహిళల్లో క్యాన్సర్ దరి చేరకుండా ఫుల్స్టాప్ పెట్టే మొదటి మూడు కారణాల్లో ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం ఉన్నాయి. సబ్–సహారా ఆఫ్రికాలో మహిళల్లో నివారించగల క్యాన్సర్లలో ఇన్ఫెక్షన్ల వాటా దాదాపు 80% ఉంది. అంటే ఈ క్యాన్సర్లను పరిష్కరించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తీసుకునే చర్యలు ప్రతి ప్రాంతం లేదా దేశానికి అనుగుణంగా ఉండాలని నివేదిక వివరించింది. సగం వాటా వాటిదే.. నేచర్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం ధూమపానం, వాయు కాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్, హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్తో ముడిపడి కడుపు క్యాన్సర్, హ్యూమన్ పాపిలోమా వైరస్తో గర్భాశయ క్యాన్సర్.. నివారించగల మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇవి దాదాపు సగం ఉంటాయి. ధూమపానం నియంత్రణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ చేపట్టిన దేశాల్లో క్యాన్సర్ కేసులు తగ్గాయని నివేదిక తెలిపింది. ధూమపానం ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. మహిళల్లో 30% నివారించవచ్చు.. ⇒ నివేదిక ప్రకారం.. మహిళల్లో 92 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో సుమారు 30% నివారించవచ్చు. ⇒ సబ్ సహారా ఆఫ్రికా వంటి తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో సరై్వకల్ క్యాన్సర్ కేసులు అధికం. ⇒ అధిక ఆదాయ దేశాలైన ఉత్తర అమెరికా, యూరప్లో మహిళల్లో క్యాన్సర్కు స్మోకింగ్ ప్రధాన కారణం. ⇒ పురుషుల్లో 43 లక్షల నివారించదగ్గ క్యాన్సర్ కేసుల్లో 25% ధూమపానం కారకంగా నిలిచింది. ⇒ ఇన్ఫెక్షన్తో కూడిన క్యాన్సర్ కేసులు పురుషుల్లో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలో ఎక్కువ. -
దేశంలో 40% మందిలో ఫ్యాటీ లివర్!
సాక్షి, స్పెషల్ డెస్క్: దేశంలో కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దాదాపు 40 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఫ్యాటీ లివర్ (కొవ్వు పేరుకుపోయిన కాలేయం) సమస్యను ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. భారతీయులలో తక్కువ బరువు ఉన్నప్పటికీ పొత్తికడుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటోందని.. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఈ వ్యాధి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.అధ్యయనంలో తేలిన అంశాలివీ..లాన్సెట్ (ఆగ్నేయాసియా) జర్నల్లో ప్రచురితమైన ఫెనోమ్ ఇండియా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నుంచి 2024 జూన్ మధ్య 27 నగరాల్లో జరిపిన పరిశోధనలో సుమారు 38.9 శాతం మందిలో ఆల్కహాల్తో సంబంధం లేని మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) ఉన్నట్లు తేలింది. కాలేయం గట్టిపడటం లేదా మచ్చలు పడటం (ఫైబ్రోసిస్) ముప్పు సాధారణ వ్యక్తుల్లో 1.7% మందిలో ఉంది. ఇప్పటికే ఎంఏఎస్ఎల్డీ సమస్య ఉన్నవారిలో లివర్ ఫైబ్రోసిస్ 6.3 శాతం మందిలో.. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తంగా 2.4 శాతం మందిలో ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపించాయి. సైలెంట్ కిల్లర్..గతంలో నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యను ఇప్పుడు ఎంఏఎస్ఎల్డీగా పిలుస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య ఉన్న వారిలో చాలా మందికి తమ కాలేయం దెబ్బతింటోందనే విషయం ప్రాథమిక దశలో తెలియదు. ఈ వ్యాధి కాలేయాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఎంఏఎస్ఎల్డీ కాలేయాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తోంది. దేశ జనాభాలో గణనీయమైన శాతం మందిలో లివర్ ఫైబ్రోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కాలేయం గట్టిపడే (స్కారింగ్) ప్రక్రియకు ప్రారంభ దశ. దీన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేస్తే అది కాలక్రమేణా కాలేయం పూర్తిగా దెబ్బతినే సిర్రోసిస్ లేదా ప్రాణాంతక కాలేయ కేన్సర్కు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దేశ జనాభా విస్తృతిని, వేగంగా పెరుగుతున్న మధుమేహం, స్థూలకాయం కేసులను పరిగణనలోకి తీసుకుంటే ఫ్యాటీ లివర్ రోగుల స్థాయి ఆందోళనకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు వంటి జీవక్రియ సంబంధిత సమస్యలే ఫ్యాటీ లివర్కు ప్రధాన మూలాలని పరిశోధకులు స్పష్టం చేశారు. సరైన జీవనశైలి, పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
డబ్బుఉందా? డెబిట్! లేదా? క్రెడిట్!
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరో కీలక మలుపు తీసుకుంటోంది. అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా త్వరలో భారత్లో ఒకే కార్డుతో అటు డెబిట్కి, ఇటు క్రెడిట్కి రెండు విధాలుగా ఉపయోగపడేలా ‘డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దేశంలో క్రెడిట్ వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో పోలిస్తే ప్రస్తుతం భారత్లో యూపీఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది ప్రధానంగా బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ అయ్యే విధానమే. డెబిట్ కార్డులు కూడా ఖాతాలో డబ్బు ఉంటేనే పనిచేస్తాయి. మరోవైపు, క్రెడిట్ కార్డులు సౌకర్యవంతమే అయినా వాటి వినియోగం డిజిటల్ రూపంలో,యూపీఐ చెల్లింపుల విషయంలో ఇంకా పరిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీసా తీసుకొస్తున్న కొత్త కార్డు యూపీఐతో అందే సౌలభ్యం, డెబిట్ కార్డుతో చేయగల నియంత్రణ, క్రెడిట్ కార్డు ఫ్లెక్సిబిలిటీ ఈ మూడింటినీ కలిపిన ఉపయోగకరమైన సాధనంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకులు, వినియోగదారులకు లాభాలు ఈ కొత్త విధానం ద్వారా బ్యాంకులు తమ రిస్క్ పాలసీలకు అనుగుణంగా క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించగలుగుతాయి. వినియోగదారులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కార్డులని ప్రతిచోటుకూ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్నా క్రెడిట్ కార్డు లేని మధ్యతరగతి వర్గానికి ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం నిపుణుల అంచనాల ప్రకారం, ఈ విధానం నగదు వినియోగాన్ని తగ్గించడంలో, టైర్–2, టైర్–3 నగరాల్లో కార్డు వినియోగాన్ని పెంచడంలో, ఫార్మల్ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, అతిగా క్రెడిట్ వినియోగం వల్ల వినియోగదారుడు అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకే ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రతిపాదిస్తున్న ఈ డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు భారత్ చెల్లింపుల వ్యవస్థను మరింత స్మార్ట్గా, ఫ్లెక్సిబుల్గా మార్చే విధానంగా పరిగణించవచ్చు. ఇది వినియోగదారుల సౌకర్యం, బ్యాంకులకు భద్రత ఈ రెండింటికీ మధ్య సమతుల్యత తీసుకురావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కార్డు కాదు కాంబోప్యాక్ వీసా అభివృద్ధి చేసిన ‘ఫ్లెక్సిబుల్ క్రెడెన్షియల్ (వీసా ఫ్లెక్స్) ’ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. 16 అంకెల ఒకే కార్డు నంబర్ ద్వారా కస్టమర్ లావాదేవీ చేసే సమయంలో అది అవసరాన్ని బట్టి డెబిట్గా లేదా క్రెడిట్గా వాడుకోవచ్చు. చెల్లింపు ఎలా జరగాలన్నది కస్టమర్ కొనుగోలు చేసే విలువ మొత్తం, లేదా వినియోగదారు ముందుగా ఎంచుకున్న సెట్టింగ్స్ ఆధారంగా ఆటోమేటిక్గా నిర్ణయమవుతుంది.ఉదాహరణకు, రోజువారీ చిన్న ఖర్చులు డెబిట్గా, పెద్ద కొనుగోళ్లు క్రెడిట్లో జరిగేలా ఈ కార్డును సెట్ చేసుకోవచ్చు.భారత్ ఎందుకు కీలక మార్కెట్? భారత్లో క్రెడిట్ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో నగదు లావాదేవీల వాటా చాలా పెద్దది. ఈ పరిస్థితిలో ఒకే కార్డు ద్వారా డెబిట్–క్రెడిట్ సౌకర్యం ఇవ్వడం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరించవచ్చని వీసా భావిస్తోంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
ఆరోగ్యాన్నలా.. డీప్ ఫ్రై చేయొద్దు!
ఆహార పదార్థాలకు నూనె లేదా కొవ్వు తోడైతే రుచి ఇనుమడిస్తుంది. అయితే, ఈ వంట ప్రక్రియలో, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలో వేపుడు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వేపుళ్లు, పిండి వంటలు, గారెలు, పూరీలు, బజ్జీలు, పునుగులు, అప్పడాలు, వడియాలు.. మనం ఇష్టంగా తినే ఇటువంటివి వండేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఆ ఆహారమే విషతుల్యంగా మారి అనారోగ్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో ప్రాణాంతక జబ్బులకూ కారణం కావొచ్చు. వేపుళ్లకు లేదా డీప్ ఫ్రైలకు నూనెలు, కొవ్వు పదార్థాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వేపుళ్లకు ఏయే నూనెలు విడిగా వాడొచ్చు? ఏయే నూనెలను కలిపి వాడొచ్చు? అనే విషయాలూ ముఖ్యమే.. అవేమిటో చూద్దాం.. గుండె జబ్బులు, కేన్సర్ ముప్పు?నూనెలు, కొవ్వుల్లో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు (పీయూఎఫ్ఏ– ‘పూఫా’లు) ఉంటాయి. ఒకసారి వేపుడుకు వాడితే ప్రమాదం లేదు. ఒక్కసారి వేపుడు లేదా డీప్ ఫ్రై చేయడానికి వాడిన నూనెను మళ్లీ వేపుళ్ల కోసం వాడితే అవి హానికరంగా మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నూనెలు, కొవ్వుల్లోని ‘పూఫా’లు వేపుడు కోసం రెండు అంతకన్నా ఎక్కువసార్లు అధికంగా వేడి చేసినప్పుడు ఆక్సీకరణం చెందుతాయి. ఆక్సీకరణం చెందిన పూఫాలతో కూడిన ఆహారం తీసుకున్న వారు గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సెంటర్ ఫర్ లిపిడ్ రీసెర్చ్ మాజీ చీఫ్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు.వేపుళ్లకు ఏయే నూనెలు మేలు?కరకరలాడే వంటకాల తయారీ కోసం వంట నూనెలను ఎక్కువ మంటపై పొగలు కక్కేలా వేడి చేయాల్సి ఉంటుంది. స్మోక్ పాయింట్ను మాత్రమే చూడకుండా రసాయన స్థిరత్వాన్ని బట్టి వేపుళ్లకు నూనెను ఎంచుకోవాలి. ఇందుకు ఉపయోగపడే నూనెలు ఏవంటే.. అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండే కొబ్బరి నూనె, పామాయిల్ వంటివి లేదా వేరుశనగ నూనె, శుద్ధి చేసిన వరి తవుడు నూనె, అధిక ఓలిక్ పొద్దుతిరుగుడు (మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లం కలిగిన) నూనెలు ఆహారాన్ని వేయించడానికి మంచివని డాక్టర్ ప్రసాద్ వివరించారు.కలిపి వాడుకోదగినవిఇంట్లో రోజువారీ కూరల్లో లేదా డీప్ ఫ్రైలకు కూడా కనీసం రెండు రకాల వంట నూనెలు కలిపి వాడుకుంటే మేలని, నిలువ పచ్చళ్లకు నువ్వుల నూనె మంచిదని డా. ప్రసాద్ చెప్పారు. వాటిలో ఉండే పోషకాలను బట్టి కలిపి వాడుకోదగిన నూనెలు ఇవీ.. పామాయిల్ + సోయా నూనెపామాయిల్ + పొద్దుతిరుగుడు నూనె వరి తవుడు నూనె + నువ్వుల నూనెఆలివ్ నూనె + పొద్దుతిరుగుడు లేదా సోయా ఆయిల్మళ్లీ ఫ్రైలకు వాడొద్దు..మన ఇంట్లో వేపుళ్లకు ఒకసారి వాడిన నూనెను పారబోయాల్సిన అవసరం లేదు. ఆ నూనెను వడగట్టి కూరల తాలింపుల్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 3–4 రోజుల్లోనే (వేపుళ్లకు కాకుండా) కూరల్లో వాడుకోవాలి. నిల్వ ఉంచితే ఆ నూనె చెడిపోయే అవకాశం ఉంది. అయితే, డీప్ ఫ్రైలకు వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేపుళ్లకు వాడితే ప్రమాదం. అవి తిన్న వారు దీర్ఘకాలంలో హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బుల పాలయ్యే ముప్పు ఉంది. –డాక్టర్ ఆర్బీఎన్ ప్రసాద్, మాజీ చీఫ్ సైంటిస్ట్ -
యూఎస్ ‘అవాంఛిత’ జాబితాలో మనోళ్లు
అమెరికాలో వలసదారులను లక్ష్యం చేసుకుని ట్రంప్ సర్కారు తాజాగా మరో చర్యకు దిగింది. ‘పలు తీవ్ర నేరాలకు పాల్పడ్డ, అభియోగాలను ఎదుర్కొంటున్న వారు’ అని పేర్కొంటూ పాతిక వేల మంది వలసదారులతో కూడిన జాబితాను హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) తాజాగా విడుదల చేసింది. ‘అత్యంత దారుణాలకు పాల్పడి అరెస్టైన వారు’ అనే పేరిట ఈ మేరకు ఏకంగా సరికొత్త డేటాబేస్నే రూపొందించారు! 2025 నుంచి అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అదుపులోకి తీసుకున్న వారితో కూడిన ఈ జాబితాలో 89 మంది భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు ఆర్థిక నేరాలు, మోసాల కేసుల్లో పోలీసులకు చిక్కినవారే కావడం గమనార్హం. కాగా కొందరు లైంగిక దాడులు, డ్రగ్ ట్రాఫికింగ్, ఇతర హింసాత్మక నేరాల్లో అరెస్టయ్యారు. అమెరికాలో ఉన్న వలసదారుల్లో నేరగాళ్లు, అసాంఘిక శక్తులను దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరూ సులువుగా గుర్తించేందుకు తాము రూపొందించిన ఈ కొత్త వెబ్సైట్ తోడ్పడుతుందని డీహెచ్ఎస్ అసిస్టెంట్ సెక్రెటరీ ట్రిసియా మెక్లాలిన్ చెప్పారు. అలాగే వారు పాల్పడ్డ నేరాలు, వాటి తీవ్రత కూడా అందరికీ తెలిసొస్తుందన్నారు. పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ నిందితులను వారి పేరు, జాతీయత, అరెస్టయిన రాష్ట్రం... ఇలా పలు రకాలుగా సెర్చ్ చేసి చూసుకునేందుకు సంబంధిత వెబ్సైట్లో అవకాశం కల్పించారు. ఈ జాబితాలోని 89 మంది భారతీయుల్లో 22 మందిపై దొంగతనాలు, పన్ను ఎగవేత, ఆన్లైన్ మోసాల వంటి ఆర్థిక నేరాల అభియోగాలున్నాయి. 21 మంది దోపిడీలు, ఇతర హింసాత్మక ఘటనల అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 17 మంది లైంగిక నేరాల్లో పోలీసులకు చిక్కారు. అణచివేతను సమర్థించుకునేందుకే...! డీహెచ్ఎస్ రూపొందించిన ఈ ‘అత్యంత దారుణ నేరగాళ్ల’జాబితా పలు విమర్శలకు కూడా తావిస్తోంది. దానిపై స్థానిక సామాజికవేత్తలు, హక్కుతల నేతలే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు! ‘‘నిందితులు, వారు పాల్పడ్డారంటున్న నేరాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా కేవలం పోలీసుల అదుపులో ఉండగా తీసిన వాళ్ల మగ్షాట్స్ (ఫొటోలు), సైట్లో ఉంచడం, విచారణ దశలోనే ఏకపక్షంగా నేరగాళ్లనే ముద్ర వేయడం దారుణం. ఇది ఏ మాత్రమూ సరికాదు. కేవలం వలసదారులపై తీసుకుంటున్న అత్యంత కఠినమైన అణచివేత చర్యలను సమర్థించుకోవడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది’’అని వారు ఆరోపిస్తున్నారు. ‘‘ఈ జాబితా పూర్తిగా శ్వేతేతరులతో నిండిపోయి ఉంది. దీన్ని చూసే అమెరికన్లకు వారంతా నేరగాళ్లు, దొంగలు అన్న అభిప్రాయం ఏర్పడే ఆస్కారముంది’’అంటూ మైన్ వలసదారుల హక్కు సంఘం నేత రూబెన్ టోరెస్ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. అసలు పనిగట్టుకుని మరీ ఇలాంటి వెబ్సైట్ రూపొందించి హడావుడిగా ఇలా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచి్చందని యూనివర్సిటీ ఆఫ్ మన్ స్కూల్ ఆఫ్ లాస్కు చెందిన రెఫ్యూజీ అండ్ హ్యూమన్రైట్స్ క్లినిక్ డైరెక్టర్ అన్నా వెల్చ్ ప్రశ్నించారు. ఇది కేవలం అమెరికావ్యాప్తంగా వలసదారులపై ట్రంప్ సర్కారు ఏడాదికి పైగా పాల్పడుతున్న అత్యంత అమానవీయ చర్యలను సమర్థించుకునే ఎత్తుగడగానే కనిపిస్తోందంటూ ఆక్షేపించారు. డీహెచ్ఎస్ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రేజీ క్రేజీ.. మేడిన్ ఇండియా లగేజీ
ఇప్పుడు ట్రావెల్ అనేది అప్పుడప్పుడు మాత్రమే వేసే ట్రిప్పులకే పరిమితం కాకుండా, రెగ్యులర్ జీవన విధానంగా మారిపోయింది. దీంతో అత్యంత నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే లగేజీకి డిమాండ్ పెరుగుతోంది. డిజైన్, పనితీరు, నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా ఉండే దేశీ బ్రాండ్స్ ఉత్పత్తులను కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింబించడం, స్టయిల్కి పెద్దపీట వేయడం, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్లోబల్ లగేజీ, బ్యాగ్ తయారీ పరిశ్రమలో చైనా ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రస్తుతం క్రమంగా భారత్లో తయారీవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. మేడిన్ ఇండియా నినాదం, ఇన్వెస్టర్లలో ఆసక్తి, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి ఇందుకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత లగేజ్ పరిశ్రమ రూ. 26,700 కోట్లకు చేరనుంది. 2023 నుంచి 2028 మధ్య ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. 60 శాతం మంది వినియోగదారులు దేశీ లేదా చిన్న బ్రాండ్స్ని కొనడానికి ఇష్టపడుతుండగా, 14 % మంది మరికాస్త ఎక్కువ చెల్లించి ప్రీమియం ఉత్పత్తులను కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థలు .. సూట్కేసులు, ట్రాలీలు, బ్యాక్ప్యాక్లు, బిజినెస్ బ్యాగ్లు మొదలైనవి విక్రయించే అప్పర్కేస్ ఇందులో సింహభాగం ఉత్పత్తులను ప్రధానంగా నాసిక్ (మహారాష్ట్ర), రుద్రపూర్ (ఉత్తరాఖండ్)లోని తమ ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దన్ను గల అప్పర్కేస్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చే మూడేళ్ల వృద్ధికి సరిపడేంతగా నెలకు 1,00,000 యూనిట్ల స్థాయిలో ఉంది. భారత్లోనే తయారీ వైపు మళ్లుతున్న ప్రీమియం బ్రాండ్లలో యూమ్ అంకుర సంస్థ కూడా ఒకటి. మేడిన్ ఇండియాను తమ ప్రధాన బ్రాండ్ ఐడియాలజీగా పరిగణిస్తామని సంస్థ కో–¸ఫౌండర్ నైనా పరేఖ్ తెలిపారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీని, ముఖ్యంగా అల్యూమినియం, హార్డ్ లగేజీ సోర్సింగ్, అసెంబ్లీని చైనా నుంచి భారత్కి మార్చుకుంటున్నామని వివరించారు. కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఆవిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ, విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పరేఖ్ వివరించారు. వివిధ భాగస్వామ్యాల ద్వారా యూమీకి ఏటా 4,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని 7,00,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరో కంపెనీ మిరాజియో ప్రస్తుతం తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్లో తయారు చేసేందుకు భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. మార్కెట్ వాటాపై కన్ను.. యూమీ ఇప్పటివరకు రూ. 35 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 250 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని, 2029–30 నాటికి ప్రీమియం లగేజ్ సెగ్మెంట్లో 8–10% వాటా ను లక్ష్యంగా పెట్టుకుంది. అటు అప్పర్కేస్ దాదాపు 2,000 రిటైలర్లు, మూడు ఎక్స్క్లూజివ్ స్టోర్స్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2–3 శాతంగా ఉండగా, వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 10 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ అనే సంస్థ వచ్చే రెండేళ్లలో బ్యాక్ప్యాక్ల తయారీ సామర్థ్యాన్ని సుమారు 20% పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
నెట్టింట 'డీప్గా' నకిలీలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల డీప్ఫేక్ ప్రకటనలు, క్లోన్డ్ వాయిస్లు, వీడియోలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నాయి. 2025లో ఏకంగా 80 లక్షల డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లోకి చొచ్చుకుపోయాయి. ఈ వీడియోల కారణంగా బాధితుల కీర్తిప్రతిష్టలకు భంగం కలగడంతోపాటు సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇటువంటి కంటెంట్కు సోషల్ మీడియా వేదికలు ‘ఏఐతో రూపొందించినది’ అని యూజర్లకు కనిపించేలా ప్రసారం చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్సైబర్ నేరగాళ్ల లక్ష్యం ఎవరంటే..» ఫేక్ యాడ్స్, గౌరవానికి భంగం కలిగించే డీప్ఫేక్ వీడియోల్లో 40% సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నారు.» వేధింపులు, మోసాలకు సంబంధించిన వీడియోలతో బాధితులుగా మిగిలిన వారిలో 35% మంది ప్రైవేట్ వ్యక్తులు.» ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, డీప్ఫేక్ కంటెంట్తో సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న వారిలో 99% మంది మహిళలే.» వ్యాపారులు లక్ష్యంగా నకిలీ ప్రొఫైల్స్, బ్రాండ్ పేరుతో 40% మోసాలు జరుగుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ కంటెంట్ విస్తృతి ఇలా..» గతేడాది 80 లక్షలకుపైగా డీప్ఫేక్ ఫైల్స్ ఆన్లైన్లో చక్కర్లు కొట్టాయని అంచనా.» ఏటా ఈ కంటెంట్ 900% అధికం అవుతోంది.» 2023తో పోలిస్తే డీప్ఫేక్ ఫైల్స్ గత ఏడాదికి 1,500% పెరిగాయి. » ఇటువంటి కంటెంట్ ఉత్తర అమెరికాలో ఏకంగా 1,740%, ఆసియా పసిఫిక్లో 1,530% పెరిగింది.» డీప్ఫేక్ కంటెంట్లో సింహభాగం వీడియోలు కైవసం చేసుకున్నాయి.డీప్ఫేక్తో అంతర్జాతీయంగా ఆర్థిక మోసాలు..» డీప్ఫేక్ కంటెంట్ను ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసాలు ఏడాదిలో 3,000% అధికం అయ్యాయి.» వాయిస్ క్లోనింగ్ విధానం సైబర్ నేరగాళ్ల మోసాల్లో సర్వసాధారణం» డీప్ఫేక్ కంటెంట్ కారణంగా గరిష్టంగా ఒక బాధితుడు నష్టపోయిన మొత్తం రూ.2.18 కోట్లు.» కంపెనీలు, ఫైనాన్స్ టీమ్స్, కుటుంబాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. డీప్ఫేక్ ఖాతాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా..సంవత్సరం సంఖ్య2019 15,0002022 5 లక్షలు2023 10 లక్షలుడీప్ఫేక్ దుర్వినియోగంపై అంతర్జాతీయంగా నమోదైన కేసులు..సంవత్సరం కేసుల సంఖ్య2024 1502025 జనవరిృమార్చి 179(ఆధారం: లాత్వియాకు చెందిన ఫోరెన్సిక్ డివైజెస్, ఐడెంటిటీ వెరిఫికేషన్ సొల్యూషన్స్ కంపెనీ రెగ్యులా) -
మనసు బాగుంటే..మెరుపు గ్యారంటీ!
ఎన్ని క్రీములు వాడినా మొటిమలు తగ్గడం లేదా? అయితే సమస్య మీ చర్మంలో లేదు. మీ మైండ్లో ఉంది! ముఖానికి ఎన్ని మెరుగులు దిద్దినా ‘గ్లో’ రావటం లేదా? అందుకు కూడా కారణం మీ మెదడే అంటున్నారు వైద్య నిపుణులు. విషయం ఏంటంటే..మీ చర్మం కేవలం ఒక పొర మాత్రమే కాదు. అది మీ లోపల మసులుతున్న భావోద్వేగాలను ప్రదర్శించే ఒక పెద్ద డిజిటల్ బోర్డు కూడా. ఎంత కడిగి, ఎంత రుద్ది, ఎన్ని లేపనాలు పూసినా మీ ముఖ చర్మం కాంతి విహీనంగా ఉంటోందంటే.. దోషం మీ మేకప్ కిట్లో కాకుండా, మీ కోపతాపాల్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి!ఎమోషనల్ లగేజీఅందం అనేది చర్మంపై కనిపించేదే అనుకుంటాం. కానీ మానసిక ఒత్తిడి చర్మాన్ని మసకబార్చి, ఎముకల దాకా వెళ్తుంది. మీరు ఎప్పుడూ కోపంతో రగిలిపోతుంటే, మీ బాడీ ‘కార్టిసో ల్’ అనే హార్మోన్స్ ను విచ్చలవిడిగా విడుదల చేస్తోందని అర్థం. అది మీ మూడ్ని పాడు చేయడమే కాదు, ముఖాన్ని ఆయిలీగా మార్చేసి, మొటిమలకి ఘన స్వాగతం పలుకుతుంది.భయం కూడా అంతే!మీలోని భయం మీ శరీరాన్ని ఎప్పుడూ ‘యుద్ధం’ చేసే ఒత్తిడి మూడ్లో ఉంచుతుంది. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. అంటే, పులి వచ్చి మీద పడబోతోందన్న భయంలో మీ శరీరం తత్తరపాటుగా ఉండి, అందాన్ని పట్టించుకోవడం మానేస్తుందన్నమాట!మీ లోపలే దివ్యౌషధాలు!అదృష్టవశాత్తూ మీలోనే ఒక ‘ల్యాబొరేటరీ’ ఉంది. అది మీ చర్మాన్ని కాంతివంతం చేసే హార్మోన్లను తయారు చేస్తుంటుంది. ఖరీదైన సౌందర్య సాధనాల అవసరం లేకుండానే, మీ శరీరం ఉత్పత్తి చేసే నాలుగు హ్యాపీ హార్మోన్లతో మీ చర్మం పదికాలాలు కాంతులీనుతుంది. నవ్వు రాకున్నా నవ్వండిమీకు అసలు నవ్వు రాకపోయినా, అప్పుడప్పుడు కావాలని నవ్వండి. మీరు నవ్వగానే మీ మెదడు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఫీలయ్యి డొపమైన్ను, సెరోటోనిన్ విడుదల చేస్తుంది. దీనికి కొంచెం కృతజ్ఞత, ఇంకొంచెం సంతృప్తి తోడైతే అది మీకు మీరు చేసుకునే ఒక ఉచిత ‘బయోలాజికల్ ఫేషియల్’ అవుతుంది. పది రకాల స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అయ్యే కంటే, ప్రశాంతంగా ఊపిరి తీసుకోవడం సాధన చెయ్యండి. కడిగితే పోని ఏకైక మేకప్.. మీ ‘ప్రశాంతమైన మనసు’ మాత్రమే అని గుర్తించండి! ప్రశాంతంగా ఉండాలిఆందోళన, ఒత్తిడి, ఇతర మానసికమైన సమస్యలు ఏవైనా చర్మ సౌందర్యంపై తప్పక ప్రభావం చూపుతాయి. భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిజాల్, ఎడ్రినలిన్ వంటి రసాయనాలు వెలువడతాయి. అవి మన హార్మోన్ల అసమతౌల్యతకు కారణమవు తాయి. ఎమోషనల్ డిస్ట్రబెన్స్ల వల్ల జుట్టు రాలిపోవడం, చర్మంపై నల్లమచ్చలు రావడం వంటి ఇతర సమస్యలూ తలెత్తే అవకాశాలూ ఉంటాయి. అలాగే, చర్మంలో నిగారింపు తగ్గి, కాంతి విహీనం అవుతుంది. వ్యాధి నిరోధకత తగ్గడంతో ఇన్ఫెక్షన్లకూ ఆస్కారముంటుంది. అందుకే చర్మాన్ని సంరక్షించుకోవటానికి మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండడం, ప్రశాంతంగా గడపడం చాలా ముఖ్యం. – డాక్టర్ స్వప్న ప్రియ, సీనియర్ డెర్మటాలజిస్ట్నాలుగు ‘హ్యాపీ హార్మోన్’లుడొపమైన్: ఇదొక ‘గోల్–గెట్టర్’ (లక్ష్యసాధకుడు) లాంటిది. వ్యాయామం చేసినా, ఏదైనా చిన్న పని విజయవంతంగా పూర్తి చేసినా, మ్యూజిక్ విన్నా ఇది విడుదల అవుతుంది.ఎండార్ఫిన్లు: ఇవి శరీరం విడుదల చేసే సహజసిద్ధ నొప్పి నివారిణులు. (పెయిన్ కిల్లర్స్). నవ్వినా లేదా కొంచెం డార్క్ చాక్లెట్ తిన్నా ఇవి ఉబికి వస్తాయి. ఆక్సిటోసిన్: ఇది ప్రేమను పంచే హార్మోన్. ఎవరినైనా ఆత్మీయంగా హత్తుకున్నా, పెట్ యానిమల్స్తో ఆడుకున్నా ఇది ఉత్పత్తి అవుతుంది.సెరొటోనిన్: ఇది మీ మూడ్ మెకానిక్. సూర్యరశ్మి, మెడిటేషన్ ద్వారా దీన్ని సెట్ చేసుకోవచ్చు.మీ అందానికి శత్రువులు – వాటి ప్రభావాలు -
ఆన్లైన్లో అనకొండలున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది. ఆ నెట్టింట ప్రయోజనాలూ, ఉపయోగాలతో పాటు మింగేసే అనకొండలు కూడా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఉండడం ఈరోజుల్లో సవాలుగా మారింది. ‘ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించాలి. తొందరపాటు కూడదు’ అనేది సేఫ్టీ ఇంటర్నెట్ తారకమంత్రం...గిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్గిబ్లీ–స్టైల్ ఏఐ ఆర్ట్ మన ఫొటోలను చిత్రవిచిత్రమైన, యానిమీ–స్టైల్ చిత్రాలుగా మారుస్తుంది. సరదా సంగతి ఎలా ఉన్నా, ఈ గిబ్లీ–స్టైల్ ఆర్ట్ ట్రెండ్ అనేది ప్రైవసీ, డాటా సెక్యూరిటీకి సంబంధించి ముప్పు తెచ్చిపెడు తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. మరికొన్ని...ప్రైవసీ నైట్మేర్: గిబ్లీ–స్టైల్ ఆర్ట్లాంటి ఫీచర్లను అందించే కొన్ని యాప్లు, ప్లాట్ఫామ్లు యూజర్ల ముఖ కవళికలు, రకరకాల ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన చిత్రాలను సేకరించి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాయి. దీన్నే ప్రైవసీ నైట్మేర్ అంటున్నారు.డీప్ఫేక్: మహిళలు, పిల్లలు అప్లోడ్ చేసిన పర్సనల్ ఫొటోలు, సెల్ఫీలతో డీప్ఫేక్స్ సృష్టించే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఓకే అనేస్తున్నారు: ఫ్యూచర్ మోడల్ ట్రైనింగ్కు సంబంధించి స్టోర్ చేయడానికి, విక్రయించడానికి ఏఐ డెవలపర్లు పర్సనల్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలను చాలామంది యూజర్లు తెలియకుండానే అంగీకరిస్తున్నారు!లైక్నెస్ ఎక్స్ప్లాయిటేషన్నిజమైన వ్యక్తి, ముఖ్యంగా మహిళల పోలికలను, ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్స్లో మెర్జ్ చేస్తున్నారు. వీటిని హానికరమైన పనుల కోసం ఉపయోగించే ప్రమాదం ఉంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు→ ప్రైవసీ పాలసీకి సంబంధించి స్పష్టత లేని, అనుమానించే రీతిలో ఉన్న ఏఐ టూల్స్ను ఉపయోగించవద్దు.→ ప్రైవసీ పాలసీలను జాగ్రత్తగా చదవాలి. అప్లోడ్ చేసిన ఇమేజ్లను ఏఐ ప్లాట్ఫామ్లు ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నాయనేది లోతుగా అర్థం చేసుకోవాలి.→ దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండే సెన్సిటివ్, పర్సనల్ ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.→ ఫొటోలను అప్లోడింగ్ చేసే ముందు లొకేషన్ డాటా, వ్యక్తిగత వివరాలు లేకుండా చూసుకోవాలి.→ ఏఐ అకౌంట్స్ ఆథెంటికేషన్ కోసం స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలి.→ ఉచిత ఏఐ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అనుమతులు కోరితే వాటిని ఉపయోగించే విషయంలో పునరాలోచన చేయాలి.వాయిస్ క్లోనింగ్ స్కామ్ఒక తండ్రికి విదేశాల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కుమారుడు వికాస్ వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.‘ఒక కేసులో వికాస్ను అరెస్ట్ చేశాం. ఒకసారి మాట్లాడండి’ అన్నది అవతలి గొంతు.‘నాన్న... నేను చెప్పిన ఎకౌంట్కు అర్జంటుగా డబ్బు పంపించు. అలా చేయకపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది’ భయం ఉట్టిపడే గొంతుకతో అన్నాడు వికాస్. అది తన కుమారుడి వాయిసే కాబట్టి ఆ పెద్దాయన వారు అడిగినన్ని డబ్బులు పంపాడు.ఆ తరువాత ఎప్పటికో వికాన్ నుంచి ఫోన్ రాగానే ఆత్రంగా ఫోన్ ఎత్తాడు...‘రిలీజ్ చేశారా? క్షేమంగా ఉన్నావా?’ అని ఆత్రంగా అడిగాడు.‘రిలీజ్ చేయడం ఏమిటి?’ అని షాకై పోయాడు వికాస్. జరిగినందంతా చెప్పాడు తండ్రి. తన వాయిస్ ఎవరో క్లోనింగ్ చేశారు అనే విషయం వికాస్కు అర్థమైంది. బ్లాక్మెయిల్ చేయడం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వరకు స్కామర్స్ వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. దీన్ని ‘వాయిస్ క్లోనింగ్ స్కామ్’ అంటారు.జాగ్రత్తలు→ అనుమానించడానికి ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా ‘మీ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది’లాంటి మాటలు స్కామర్లు ఉపయోగిస్తారు. వెంటనే ఎమోషనల్ కాకుండా కాస్త ఆలోచించడం మంచిది.→ అపరిచిత ఫోన్లకు సంబంధించి ‘నిజమా? కాదా?’ అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులతో సీక్రెట్ పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారికి మాత్రమే జవాబు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడగాలి.→ స్కామర్లు మీ వాయిస్ కాప్చర్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలను మీ సన్నిహితులు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితులు విధించాలి.స్మిషింగ్ స్కామ్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో వ్యక్తిగత, ఆర్థిక, లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి రూ పొందించిన మోసపూరిత టెక్ట్స్ మెసేజ్ను స్మిషింగ్ స్కామ్ అంటారు. ‘మీ ఎకౌంట్ను సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ మెసేజ్ రావచ్చు. ‘డియర్ కస్టమర్’ పేరుతో వచ్చే మెసేజ్లో పెద్దగా వివరాలేమీ లేకపోవడం, అనుమానాస్పద మేసేజ్లు, ఊహించని రిక్వెస్ట్లు నోటిఫికేషన్ల రూపంలో రావడం.. మొదలైనవి స్మిషింగ్ స్కామ్లో భాగం.కొన్ని జాగ్రత్తలు→ తెలియని, అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ల నుంచి వచ్చిన లింక్లను క్లిక్ చేయకూడదు. అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేయవద్దు → చట్టబద్ధమైన కంపెనీ లేదా బ్యాంకు నుండి వచ్చినట్లు ఏదైనా మెసేజ్ క్లెయిమ్ చేసుకుంటే, టెక్ట్స్లో ఉన్నవి కాకుండా వారి అధికారిక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా వారిని నేరుగా సంప్రదించాలి.→ అనుమానంగా అనిపించిన మెసేజ్లను మీ సెల్యూలార్ ప్రొవైడర్కు, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్సీసీ)కు రిపోర్ట్ చేయాలి.→ సెన్సిటివ్ ఎకౌంట్స్కు సంబంధించి మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)ను ఎనేబుల్ చేయాలి.... ఇవి మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ స్కామ్స్, విషింగ్ ఎటాక్స్, గేమింగ్ స్కామ్స్, ఆన్లైన్ డేటింగ్ ఫ్రాడ్స్... ఇలా ఎన్నో స్కామ్లు ఆన్లైన్లో పొంచి ఉన్నాయి. ‘నాకు అన్నీ తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే బాధితుల్లో మొదటి వరసలో మీరే ఉంటారు!అందుకే ఆన్లైన్కు సంబంధించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ కోసమై నెట్ (వల)లో పడెనే... పాపం...మన దేశంలో రొమాన్స్ స్కామ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్లో నకిలీ ప్రొఫైల్ను ఉపయోగిస్తున్నారు. డాక్టర్, మిలిటరీ ఆఫీసర్, సాఫ్ట్వేర్ కంపెనీ సీయీవో... ఇలా రకరకాల ప్రొఫైల్లను సృష్టిస్తున్నారు. ఈ ప్రొఫైల్ నిజమే అనుకొని ప్రేమ ప్రపంచంలోకి వచ్చిన వారిని, ప్రేమబంధం బలపడిన తరువాత ‘అర్జంటుగా అవసరం ఉంది డియర్’ అని (ఫేక్) ఎమర్జెన్సీల పేరుతో డబ్బు లాగుతున్నారు. ఇదొక రకం అయి™ó, సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం అనేది మరో రకం. డేటింగ్ యాప్లలో 39 శాతం మంది యూజర్లు వివిధ రూపాల్లో రొమాన్స్ స్కామ్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ల బారిన పడిన బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. ఆత్మçహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు... → పేరు నమోదు చేసుకునే ముందు డేటింగ్ యాప్ లేదా మ్యాట్రిమోనియల్ అథెంటిసిటీని ధ్రువీకరించుకోవాలి → నివాస చిరునామా, వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచకపోవడం మంచిది → డేటింగ్ యాప్లో పరిచయం అయిన వారిని ప్రత్యక్షంగా కలుసుకొని తగిన ప్రశ్నలు అడగాలి → మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి → బ్యాంకింగ్ సమాచారం, గుర్తింపు లేదా పాస్పోర్ట్ కాపీలు, ముఖ్యమైన సమాచారం తెలియని సైట్లకు అందించవద్దు. -
మన ఓణీకి రాణింపు!
మనం దేన్నయితే ‘ఓల్డ్ ఫ్యాషన్’అని అలుసుగా చూస్తున్నామో.. దేన్నయితే కేవలం తల దాచుకోవడానికో, మొహం తుడుచుకోవడానికో వాడుతున్నామో.. అదే ఇప్పుడు అమెరికాలో ఒక ‘స్టైల్ బాంబ్’లా పేలింది! ‘ఓణీని కనిపెట్టిన భారతీయులారా.. మీకు పాదాభివందనం’.. అంటూ ఒక అమెరికన్ యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే.. మన ఇంటి ఓణీ అవును, మనం ఓణీ అనో.. చున్నీ లేదా దుపట్టా అని పిలిచే ఆ రెండు మీటర్ల వస్త్రమే ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్గా మారిపోయింది. అమెరికాకు చెందిన కెమి అనే యువతి, తన పాశ్యాత్య దుస్తులపై భారతీయ యువతలు ధరించే ఓణీని వేసుకుని ఒక్కసారిగా మురిసిపోయింది. ‘నా అందం ఒక్కసారిగా పది రెట్లు పెరిగిపోయింది.. ఇది కదా అసలైన ఫ్యాషన్ అంటే!’.. అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మురిసిపోతున్న అమెరికా అమ్మడు మనం మోడ్రన్ పిచ్చితో చున్నీలను అటకెక్కించి జీన్స్, టీషర్టులకు అలవాటు పడుతుంటే.. ఆ అమెరికా అమ్మాయి మాత్రం మన ఓణీని భుజంపై వేసుకుని మురిసిపోతోంది. ‘ఈ కాన్సెప్్టను కనిపెట్టిన భారతీయులకు నా పాదాభివందనం. ఇది కేవలం వస్త్రం కాదు, ఒక అద్భుతం!’అంటూ ఆమె కొనియాడుతోంది. మనం విదేశాల వైపు వ్యామోహంతో చూస్తుంటే, వాళ్లు మాత్రం మన సంస్కృతిలోని చిన్న చిన్న విషయాలను పట్టుకుని వావ్ అంటున్నారు. మన ఇంటి ఓణీకి ఇప్పుడు అమెరికా వీధుల్లో ఎర్ర తివాచీ స్వాగతం దక్కుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రగతి బాటలో కలిసి నడుద్దాం
కౌలాలంపూర్: ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేషియా తీర్మానించుకున్నాయి. వాణిజ్యంలో అత్యధిక ప్రాధాన్య రంగాలతోపాటు పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, తయారీ, సెమీకండక్టర్ల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రగతి బాటలో కలిసి నడవాలని నిర్ణయించాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్, మలేషియా కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన ఆదివారం మలేషియా పరిపాలనా రాజధాని అయిన పుత్రజయలో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్, మలేషియా మధ్య 11 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సెమీకండక్లర్ట రంగంలో ఫ్రేమ్వర్క్ ఒప్పందంతోపాటు కీలక రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి. భేటీ అనంతరం మోదీ, అన్వర్ ఇబ్రహీం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. మానవాళికి శత్రువుగా మారిన ఉగ్రవాద భూతాన్ని సమాధి చేయడానికి ప్రపంచదేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో తన వైఖరిని కుండబద్ధలు కొట్టినట్లు మోదీ బహిర్గతం చేశారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు గానీ, రాజీపడడం గానీ ఉండబోదని స్పష్టంచేశారు. భారత్–మలేషియా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని వివరించారు. ఇరుదేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగా లోతైన, సౌహార్ధ సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. వ్యూహాత్మక విశ్వాసంతో ఇరుదేశాల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ‘అంతర్జాతీయ’ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి మలేషియాలో భారత కాన్సులేట్ జనరల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటం, నిఘా సమాచారం పంచుకోవడం, మారిటైమ్ సెక్యూరిటీ విషయంలో మలేషియాతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. రక్షణ బంధాన్ని సైతం విస్తృతపర్చుకుంటామని వివరించారు. కృత్రిమ మేధ(ఏఐ), డిజిటల్ టెక్నాలజీతోపాటు సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రతపై భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచానికి గ్రోత్ ఇంజన్గా ఎదుగుతోందని వెల్లడించారు. మలేషియా లాంటి మిత్రదేశాల అండతో ‘ఆసియాన్’ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెప్పారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇండో–పసిఫిక్లో ఆసియాన్తో కలిసి అభివృద్ది, శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అన్వర్ ఇబ్రహీంతో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, మలేషియా మధ్య స్నేహసంబంధాలు పెరుగుతుండడం ఇరుదేశాలకు మేలు చేస్తుందని వెల్లడించారు. సవాళ్లను అధిగమించాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం తప్పనిసరి అని తేల్చిచెప్పారు. భారత్–మలేషియా సంబంధాల విషయంలో అన్వర్ ఇబ్రహీం చక్కటి చొరవ చూపుతున్నారని కొనియాడారు. చరిత్రాత్మక నిర్ణయం: ఇబ్రహీం భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని ఇబ్రహీం ప్రశంసించారు. భారత్తో భాగస్వామ్యం వల్ల తమకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇరుదేశాల వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీల్లో నిర్వహించుకోవాలన్నది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.భారత సంతతి నేతలతో భేటీ మలేషియాలో భారత సంతతి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్తో వారి భావోద్వేగ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత సంతతి వ్యక్తులు ప్రజా జీవితంలో సాధిస్తున్న విజయాలు గర్వకారణమని ఉద్ఘాటించారు. మలేషియాలో అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. భారత్, మలేషియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని వివరించారు. భారత్ను అభివృద్ధి చేయడంలో మోదీ దార్శనికత, కార్యాచరణ స్ఫూర్తిదాయమని భారత సంతతి నేతలు పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో: ప్రధాని నరేంద్ర మోదీ మలేషియాలో నలుగురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యేందుకు వారు చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇంధన రంగంలో పునరుత్పాదక, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్లో భాగస్వామ్యంపై వారితో చర్చించారు. అలాగే భారత్, మలేషియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలతోనూ మోదీ భేటీ అయ్యారు. అనంతరం రెండు రోజుల మలేషియా పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశం చేరుకున్నారు. -
శత్రు శాటిలైట్లపై నిఘా
భూతలం మీదకు దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలో, గాల్లో ధ్వంసంచేసే గగనతల రక్షణ వ్యవస్థలు భారత్కు ఉన్నాయి. అయితే మన సైనిక స్థావరాల జాడ కనిపెట్టేందుకు నింగిలో సంచరించే శత్రుదేశాల కృత్రిమ ఉపగ్రహాల జాడ పసిగట్టి అప్రమత్తం చేసే వ్యవస్థ గతంలో భారత్కు లేదు. తాజాగా ఆ శక్తిసామర్థ్యాల సముపార్జనలో భారత్ కీలక ముందడుగువేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన అంకుర సంస్థ ఒకటి కొత్త తరహా పరిశోధనలు చేస్తూ ఈ అప్రమత్త వ్యవస్థ అందిపుచ్చుకుంటోంది. అంతరిక్షంలో ఒకరకంగా అతిపెద్ద ఉపగ్రహంగా పేరొందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) జాడను కనిపెట్టి ‘అజిస్టా స్పేస్’తన సత్తా చాటింది. కక్ష్య మార్చుకుని భారత గగనతలంపై చక్కర్లు కొడుతూ కీలక సమాచారాన్ని సేకరించే అనుమానాస్పద శత్రు ఉపగ్రహాల జాడను కనిపెట్టేందుకు ఈ కొత్త స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్(ఎస్ఎస్ఏ) పరిజ్ఞానం ఎంతగానో సాయపడుతుందని అజిస్టా స్పేస్ పేర్కొంది. గుర్తు తెలియని ఉపగ్రహాల జాడను గుర్తించడంతోపాటు వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పర్యవేక్షణ పనులను పూర్తిచేసే పరిజ్ఞానాన్నే ఎస్ఎస్ఏగా పిలుస్తారు. తాజాగా భారత్ మీదుగా ఐఎస్ఎస్ పయనిస్తున్న సమయంలో దాని ఫొటోలను తమ ఏఎఫ్ఆర్ సెన్సార్ సాయంతో సేకరించామని అజిస్టా స్పేస్ ప్రకటించింది. భూమి ఫొటోలు తీయడానికి బదులు ఆకాశంలో నిర్దేశిత ప్రాంతం గుండా పయనించే, నిర్దేశిత ప్రాంతంపై నిఘా పెట్టే ఉపగ్రహాలను కనిపెట్టేందుకు నాన్–ఎర్త్ ఇమేజింగ్(ఎన్ఈఐ) పనుల కోసం ఈ అంకుర సంస్థ ఒక చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. దానిపై బిగించిన ఎలక్ట్రో–ఆప్టికల్ కెమెరా సాయంతో ఈ ఫొటోలను తీయగలిగింది. అత్యంత కచ్చితత్వంతో ఫొటోలు ఈనెల మూడో తేదీన రెండు వేర్వేరు సందర్భాల్లో ఐఎస్ఎస్ జాడను అత్యంత కచ్చితత్వంతో గుర్తించామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అప్పుడు తీసిన ఫొటోలను విడుదలచేసింది. 300 కిలోమీటర్లు, 245 కిలోమీటర్ల దూరాల నుంచి దాని ఫొటోలను తీసింది. దాని గమనానికి సంబంధించి మొత్తం 15 ఛాయాచిత్రాలను సేకరించింది. ఎదురుగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న సూర్యుని సూర్యకిరణాలు తీక్షంగా తగులుతున్నా, అత్యంత వేగంగా అంతరిక్ష కేంద్రం ప్రయాణిస్తున్నాసరే దాని పొజిషన్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తూ ఫొటోలు తీయడం విశేషం. ఫొటోల సేకరణలో తమ ట్రాకింగ్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని కంపెనీ వెల్లడించింది. 2.2 మీటర్ల రెజల్యూషన్తో ఫొటోలు తీయడం గమనార్హం. అంటే ఒక్కో పిక్సెల్ను పరిగణనలోకి తీసుకుంటే ఫొటో తీసే సమయానికి అది కచ్చితంగా ఎంత దూరంలో ఉందనేది తేల్సిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇంతటి కచ్చితత్వంతో ఫొటోలు తీసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం కీలక ముందుడుగుగా నిపుణులు పేర్కొన్నారు. ఇది భవిష్యత్తులో ఇతర అనుమానాస్పద ఖగోళ వస్తువులు, గ్రహశకలాలు, శత్రు శాటిలైట్ల స్థితిగతులను అంచనా వేసే శక్తిసామర్థ్యాల మెరుగుకు ప్రేరణగా నిలుస్తుందని ఖగోళ నిపుణులు చెప్పారు. శాటిలైట్ ట్రాకింగ్ అల్గారిథమ్ను మరింతగా మెరుగుపర్చుకుంటే అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలను సముపార్జించడం త్వరలోనే సాకారమవుతుందని వాళ్లు ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్లో తయారై, భారత్ నుంచి పర్యవేక్షణలో ఉన్న ఒక బుల్లి ఉపగ్రహం ఐఎస్ఎస్ ఫొటోను తీయడం ఇదే తొలిసారి అని అజిస్టా స్పేస్ ప్రకటించింది. ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలిచిపోనుంది. భూకక్షల్లో వేలాదిగా కృత్రిమ ఉపగ్రహాలు పోగుబడుతుండటం, పాడైన, కాలంచెల్లిన ఉపగ్రహాలు ఢీకొని అంతరిక్ష చెత్త ఎక్కువవడం, వీటి మధ్య శత్రుదేశాల ఉపగ్రహాలు భారత్పై నిఘా పెట్టడం వంటి భిన్న పరిస్థితుల్లో ఆకాశంపై పెద్ద నిఘా కన్ను వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్(ఎస్ఎస్ఏ) పరిజ్ఞానంలో అగ్రగామిగా మారడం తక్షణావసరంగా మారింది. అజిస్టా స్పేస్ సంస్థ ఎలక్ట్రో–ఆప్టికల్ పేలోడ్లతోపాటు శాటిలైట్ వ్యవస్థలు, ఇమేజ్–ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్లు, నిఘా, పర్యవేక్షణ ఉపగ్రహాలకు సంబంధించిన విడిభాగాలనూ తయారుచేస్తోంది. ఇవి పౌర, రక్షణ, వాతావరణ సంబంధ ఉపగ్రహాలకు అక్కరకొస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొల్లేరులో... పక్షుల కనువిందు
కైకలూరు : కొల్లేరు అభయారణ్యంలో ఏషియన్ బర్డ్ సెన్సస్ 2025–2026 ఫిబ్రవరి 4తో ముగిసింది. రాజమండ్రి సర్కిల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎప్) బీఎన్ఎన్ మూర్తి, జిల్లా ఫారెస్టు డీఎఫ్వో బి.విజయ ఆధ్వర్యంలో 5 జట్లుగా పక్షుల గణన చేశారు. పీసీసీఎఫ్ మూర్తి అంచనా ప్రకారం ఈ ఏడాది కొల్లేరు అభయారణ్యంలో 40 లక్షల నుంచి 50 లక్షల పక్షులు శీతాకాలంలో సంచరించినట్లు సమాచారం. దాదాపు 30,000 కిలోమీటర్ల నుంచి విదేశాల నుంచి పక్షుaలు వస్తాయి. ఈ ఏడాది 200 జాతుల పక్షులు కొల్లేరులో ఉన్నట్లు భావిస్తున్నారు. సెన్సస్ బృందాల సమాచారం మేరకు నార్తర్న్న్ పిన్టైల్ పక్షులను ఎక్కువగా గుర్తించారు. ప్లేమింగోస్, కామన్టీల్, గార్కానీ, గాడ్వీట్, శాండ్ పైపర్స్, జకానా, ఫిన్ టైల్, రఫ్ వంటి పక్షులను గమనించారు. మరి కొద్ది రోజుల్లో తుది పక్షుల గణన నివేదిక వెలువడనుంది. గణన జరిగిన ప్రాంతాలు ఇవే.. కొల్లేరు అభయారణ్య పరిధిలో మాదాపురం, మొండికోడు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, కొక్కిరాల లంక, బొమ్మిలి లంక, ఆగడాల లంక, చెట్నెంపాడు, మల్లవరం, దోసపాడు, క్రొవ్వలి, కేదవరం, పోతులూరు, కొల్లేటికోట, పైడిచింతపాడు, గోకర్ణ పురం, గుమ్మళ్లపాడు, ఆలపాడు, పల్లెవాడ, అడవి కొలను, పెదనిండ్రకొలను, డీ.గోపవరం, సిద్ధాపురం, పల్లెవాడ, ఆటపాక, పెదఎడ్లగాడి, శ్రీపర్రులో కొల్లేరు పక్షుల సర్వే జరిగింది. -
ఓటీసీ 'మందు'
చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల దగ్గరకు వెళ్లడం గతం. ఇప్పుడు ముందుగా గూగుల్లో సెర్చ్ చేయడం.. లేదంటే బంధువులు, సన్నిహితుల సలహా తీసుకుని సమీపంలోని ఫార్మసీకి వెళ్లి కావాల్సిన మందులు తెచ్చుకోవడం. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలైతే ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అందుకే భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాల వినియోగం పెరుగుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్వినియోగదార్లకు అవగాహన పెరగడం, అందుబాటు ధర.. వెరసి ఓటీసీ ఔషధాల వినియోగం క్రమంగా అధికం అవుతోంది. మన దేశంలో ఓటీసీ మందుల వ్యాపారం 2020–24 మధ్య సగటున ఏటా 10% పెరిగింది. 2026–30 మధ్య ఇది 13% వృద్ధి చెందుతుందని ఈవై పాథనాన్ నివేదిక చెబుతోంది. భారత్లో 2024లో రూ.47 వేల కోట్ల విలువైన ఓటీసీ మందులు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో ఈ విలువ రెండింతలు దాటుతుందని అంచనా.అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో వీటి వ్యాపారం చాలా తక్కువ. కానీ వృద్ధి వేగం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.17.37 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ ప్రధాన మార్కెట్లు. ఈ దేశాల్లో ఏటా సగటున ఒక్కో వ్యక్తి ఓటీసీ మందులకు రూ.6,300–11,700 ఖర్చు చేస్తున్నారు. భారత్లో ఇది కేవలం రూ.270–360 మధ్య ఉంది. జాగ్రత్తగా వాడితేనే..ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) మెడిసిన్ అంటే ప్రి్రస్కిప్షన్ లేకుండా వినియోగదారులకు నేరుగా ఫార్మసీల్లో విక్రయించే ఔషధాలు. తలనొప్పి, జలుబు, అలెర్జీలు, నొప్పి వంటి చిన్న చిన్న సమస్యల చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లడానికి బదులుగా నేరుగా మందుల షాపు నుంచి జనం కొనుగోలు చేస్తారు. ఊళ్లలో అయితే స్థానిక మందుల షాపు యజమానితో నేరుగా పరిచయం ఉండటంతో సమస్య చెబితే మందులు ఇస్తారన్న నమ్మకమూ ఉంటుంది. నిర్దేశించిన సూచనలకు అనుగుణంగా వీటిని జాగ్రత్తగా వినియోగిస్తేనే ప్రభావవంతంగా ఉంటాయి. అతిగా వాడితే దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చిన్న సమస్యలు ఎక్కువకాలం ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాల్సిందే. దేశంలో ఓటీసీ ఔషధాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నియంత్రిస్తుంది. ప్రివెంటివ్ కేర్కు ప్రాధాన్యం జబ్బులు రాకుండా జనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవనశైలి మారడంతో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి రోగాలు పెరుగుతున్నాయి. వీరితోపాటు కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలున్న వారు సపోర్ట్ థెరపీలో భాగంగా సప్లిమెంట్స్ వాడుతున్నారు. వీరికి ఎక్కువ కాలంపాటు సప్లిమెంట్స్ అవసరం. అందుకే న్యూట్రాస్యూటికల్స్కు డిమాండ్ బాగా పెరిగింది. ఎంతో కాలంగా ఔషధ రంగంలో ఉన్న కంపెనీల నాణ్యమైన ఓటీసీ ఉత్పత్తులను కొనేందుకే జనం మొగ్గు చూపుతున్నారు. – ఆళ్ల లీలా రాణి, డైరెక్టర్, లీ హెల్త్ డొమెయిన్ 2024లో ఆరోగ్యం కోసం.. ⇒ స్కిన్కేర్, వెయిట్ మేనేజ్మెంట్, ఫిట్నెస్కు సంబంధించి 2.7 కోట్ల ఆన్లైన్ సెర్చ్లు నమోదయ్యాయి⇒ 25 లక్షల మంది ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.⇒ ఆరోగ్య స్థితిని పర్యవేక్షించేందుకు 40% మంది వేరబుల్స్ వాడుతున్నారు -
వాయిదాల వార్నింగ్!
ఆదాయాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ఎదిగి... ఎగువ మధ్య తరగతిగా మారుతోంది. కాకపోతే ఈ ఆదాయాలతో పాటు ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. ఇది సహజమే. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే చిక్కల్లా... మధ్య తరగతి పొదుపు తగ్గుతుండటమే. ఎందుకంటే దేశంలో పొదుపు మొత్తాల శాతం దశాబ్దాల కనిష్ఠానికి చేరిపోతోంది. ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది. అదేంటంటే... ఈఎంఐల ఉచ్చు. ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, విద్య... ఇలా ప్రతిదీ ఇపుడు ‘సులభతరమైన’ నెలవారీ వాయిదాల్లో దొరికేస్తోంది. దీనికి కంపెనీలు పెడుతున్న ముద్దుపేరు బీఎన్పీఎల్. ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి. ఈ ఈజీ కొనుగోళ్ల మాయలో పడి ఆర్థిక ప్రణాళికలను, క్రమశిక్షణను అటకెక్కించే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నుంచి బయటపడకపోతే ఉచ్చులో చిక్కుకుని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటూ హెచ్చరిస్తున్నదే ఈ ‘వెల్త్ స్టోరీ’.ఈఎంఐల సమస్య ఎకాయెకిన కాకుండా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మొదలవుతోంది. క్రమంగా పెనుభారంగా మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తోంది. తామరతంపరగా పెరిగిపోయే ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తున్నాయి. అప్పులకు, ఇంటి అవసరాలకు చెల్లించేయగా.. చివరికి పొదుపు చేసేందుకు పైసా మిగ లని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు పొదుపు వాయిదా పడిపోతుంది. ఇది ఒక స్థాయిని చేరాక పొదుపు సంగతి పక్కనబెడితే ఖర్చులకూ సరిపోని పరిస్థితి. వీటికి తోడు ఊహించని విధంగా ఏ చిన్న కుదుపు వచ్చినా (ఉద్యోగం పోవడం, వైద్యం ఖర్చుల్లాంటివి) అప్పుల కోసం హైరానా పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటోంది. గృహ రుణం ఈఎంఐ, కారు రుణం ఈఎంఐ, వ్యక్తి గత రుణం లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, విద్యారుణం ఈఎంఐ ఇలా ప్రతి దానికి ఈఎంఐలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.లెక్కేసుకుంటే.. .సాధారణంగా ఈఎంఐల గురించి ఫైనాన్షియల్ ప్లానర్లు చెప్పే సూత్రం ఒకటి ఉంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల భారం 30–35 శాతానికి మించకూడదు. కానీ వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో వాయిదాల భారం 50–60 శాతం పైగా ఉంటోంది. ఇక క్రెడిట్ కార్డ్ రోలోవర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి నెలా అలా పెరుగుతూనే ఉంటోంది. డిఫాల్ట్ ముప్పును అటుంచితే కనీసం ఊపిరి కూడా తీసుకోలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.ఈ సమస్య ఎందుకింత వేగంగా పెరుగుతోంది.. అప్పులు, ఈఎంఐల సమస్య వేగంగా పెరుగుతుండటానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని... రుణాలు సులువుగా దొరకడం ఇప్పుడు రుణం తీసుకోవడమనేది గతంలోలాగా సుదీర్ఘ ప్రక్రియగా ఉండటం లేదు. క్షణాల్లో లోన్స్ కి అప్రూవల్ లభిస్తోంది. నిమిషాల్లో క్రెడిట్ అయి పోతోంది. జీవన విధానంపరమైన ద్రవ్యోల్బణం జీతం పెరిగిందంటే చాలు లైఫ్ స్టయిల్ని కూడా మార్చేసే ధోరణి ఉంటోంది. దానికి తగ్గట్లుగా లోన్ తీసుకోవడం, ఇంకో కొత్త ఈఎంఐని జోడించుకోవడం చక చకా జరిగిపోతోంది. ‘‘నో–కాస్ట్ ఈఎంఐ’’ భ్రమ అసలు వడ్డీ ప్రసక్తే ఉండదు.. తీసుకున్నంతే కట్టొచ్చు అని ఆర్థిక సంస్థలు ఊరిస్తుంటాయి. కానీ మన లెక్కకు అందని, మనకు తెలియని వడ్డీ ఎంతో కొంత ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. సామాజిక ఒత్తిళ్లు వచ్చినదానితో ఇంట్లో ఎంతగా సర్దుకుని ఉందామనుకున్నా హంగులు, ఆర్భాటాలు లేకపోతే ఉపయోగం లేదు అనే రకంగా సామాజిక ఒత్తిడి ఉంటోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్స్ లాంటివి విజయానికి గుర్తుల్లాగా ఉంటున్నాయి. చెల్లించుకోక తప్పదు మూల్యం.. ఈఎంఐలు అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఎమర్జెన్సీ నిధి అనేది ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు దెబ్బతింటాయి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామనుకున్నా నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటుంది. వీటన్నింటి వల్ల శాశ్వత ప్రాతిపదికన ఒకే ఒక్కటి లభిస్తుంది. అదేంటంటే మానసిక ఒత్తిడి. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ట్రబుల్ అనేది ఆసుపత్రి వ్యయాల రూపంలో కూతవేటు దూరంలోనే ఉంటుంది.మూడు ప్రశ్నలు.. ఏ రుణం తీసుకోవాలన్నా ముందుగా మీకు మీరు ఓ మూడు ప్రశ్నలు వేసుకోండి. అవేంటంటే.. → ఈ ఈఎంఐ తీసుకున్న తర్వాత కూడా పొదుపును యథాప్రకారం కొనసాగించగలనా? → ఒక 3 నెలల పాటు ఆదాయం రాకపోయినా కూడా ఈఎంఐలను కట్టగలనా? → ఈఎంఐపై కొనుక్కుంటున్నదేదైనా సరే నా భవిష్యత్తును మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక కేవలం లైఫ్స్టయిల్కే పనికొచ్చేదా? వీటిల్లో దేనికైనా సరే జవాబు ‘‘నో’’ అని వస్తే.. కాస్త ఆలోచించండి. చివరిగా చెప్పేదేమిటంటే.. రుణాలు, ఈఎంఐలనేవి చెడ్డవి కావు. కాకపోతే ఈఎంఐలు మరీ ఎక్కువైపోతే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనిశ్చితి నెలకొన్న తరుణంలో షో కోసం అప్పు మీద కొని పెట్టుకునేవాటికంటే పొదుపు చేయడం, చేతిలో డబ్బు ఆడటమే చాలా ముఖ్యమని గుర్తెరగాలి.బయటపడేదిలా.. పీకల్లోతు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.. 1. ఈఎంఐలకు ఒక పరిమితి విధించుకోవాలి → మొత్తం ఈఎంఐల భారం నెలకు నికరంగా వచ్చే ఆదాయంలో మూడో వంతు స్థాయికి మించకుండా చూసుకోవాలి. → ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని డిసైడ్ కావాలి. 2. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోండి. → ఎటు పోయి ఎటొచ్చినా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడేంత నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఆ తరువాతే కొత్త లోన్స్ గురించి ఆలోచించాలి. 3. అధిక వడ్డీ రుణాల నుంచి బైటపడాలి → ముందుగా వడ్డీ భారం ఎక్కువగా ఉండే క్రెడిట్ కార్డులపై రుణాలు, వ్యక్తిగత రుణాలను తీర్చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. → కాస్త కాస్త చొప్పున ప్రీపేమెంట్ చేసినా, భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 4. ‘‘అవసరం’’, ‘‘అప్గ్రేడ్’’కి మధ్య వ్యత్యాసం.. → సాధారణంగా మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి. స్థాయిని చూపించుకునేందుకు తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు. ఉదాహరణకు సొంత ఇల్లు అనేది ఒక అవసరం. కానీ ఖరీదైన కార్లు, కొత్త గ్యాడ్జెట్స్కు మారుతుండటమనేది అప్గ్రేడ్ కావాలనే తాపత్రయానికి నిదర్శనం. -
నన్ను పెళ్లి చేసుకుంటావా ?!
‘వాలెంటైన్స్’ వీక్ మొదలైంది. నిన్నంతా గులాబీల పరిమళం (రోజ్ డే). నేడు, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?!’’ అని వేడుకొనే రోజు (ప్రపోజ్ డే). రేపు, మధురమైన చాక్లెట్ డే. 10న టెడ్డీ డే. 11న ప్రామిస్ డే. 12న హగ్ డే. 13న కిస్ డే.14 శనివారం, వాలెంటైన్స్ డే. ఎనిమిది రోజుల ప్రేమవారం.. ఈ వరుసంతా!అన్నిట్లోకి అపురూపమైనది ఇవాళ్టి ప్రపోజ్ డే. ఈ సందర్భంగా –కొందరు తత్వవేత్తల ప్రపోజల్స్ గురించి.తత్త్వవేత్తల ఆలోచనలు సాధారణ ప్రపంచానికి అంతుపట్టవు. వాళ్లకు ఎంతో సరళమైనది, లోకానికి కఠినాతికఠినంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి అనే లాలిత్యమైన భావనలు కూడా వారిలో ‘మేధాగర్భితమై’ ఉంటాయి. మానవ మాత్రులం పూలగుత్తులు, వెన్నెల రాత్రులతో ప్రేమను పండించుకోవాలని చూస్తుంటే... వారు మాత్రం తర్క వితర్కాలు, విడ్డూరమైన ఒప్పందాలతో ప్రేమను ‘కుదుర్చుకోవటం’ చరిత్రలో మనకు కనిపిస్తుంది! పాశ్చాత్య ఫిలాసఫర్లు మాత్రమే కాదు, భారతీయ తాత్త్విక చింతనాపరులూ ప్రేమ / పెళ్లి ‘ప్రపోజల్’ విషయంలో వాళ్లదైన స్థాయిలో సతమతమైనవారే లేదా తమ ప్రియురాళ్లను సతాయించినవారే.ఫ్రెడరిక్ నీషేనీషే 19వ శతాబ్దపు జర్మన్ తత్త్వవేత్త. ఈయన తన ప్రియురాలికి (వన్ సైడ్ లవ్) ముచ్చటగా మూడుసార్లు ప్రపోజ్ చేశారు. ఆ ప్రియురాలు ‘లూ ఆండ్రియాస్ సలోమీ’ అసాధారణ మేధావి! ఈయన్ని మించినావిడ! భావోద్వేగాల పరంగా ఆమె స్థాయి ఎక్కడో ఎగువన ఉంటే, నీషే స్థాయి ఎక్కడో దిగువన ఉండేది. ‘‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని ఆయన ఆమెను ఒకసారి అడిగి ఊరుకోలేదు. మూడు ప్రయత్నాలు చేశారు. మొదటి ప్రయత్నంలో, నేరుగా అడిగే ధైర్యం లేక తన స్నేహితుడు పాల్ రేని రాయబారిగా పంపారు. అదే అతడు చేసిన పొరపాటు. ఆ రాయబారికి కూడా ఆమె అంటే ప్రాణం! నీషే ప్రేమ గురించి చెప్పకుండా తన ప్రేమ గురించి ఆమెకు చెప్పాడు. చివరికి ఆమె ఇద్దరికీ ‘నో’ చెప్పేసింది. అలాగని ఆమె ఆ రెండు పురుషాత్మల ఆశా దీపాన్ని ‘ఉఫ్’మనేమీ ఆర్పేయలేదు. ‘‘మన ముగ్గురం కలిసి ఒక ‘పరిశుద్ధ త్రిమూర్తులు’గా బ్రహ్మచర్యం పాటిస్తూ, కేవలం చదువుకు అంకితమై ఒకే ఇంట్లో ఉందాం’’ అని ప్రతిపాదించింది. నీషే మొదట అయిష్టంగానే ఒప్పుకున్నా, ఆ తర్వాత వారి పవిత్ర స్నేహబంధాన్ని ఆమెతో పెళ్లిగా మార్చుకుందామని రెండుసార్లు ప్రయత్నించారు. పాపం ఆయన తర్కం ఆమె దగ్గర చీమంత కూడా పని చేయలేదు.సోరెన్ కిర్కేగార్డ్కిర్కేగార్డ్ 19వ శతాబ్దపు డెన్మార్క్ వేదాంత వేత్త. రెజీన్ ఒల్సెన్ అనే యువతికి ఆయన చేసిన ప్రపోజల్ మొదట్లో చాలా పద్ధతిగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ప్రదర్శించిన విన్యాసాలే చరిత్రలో ఒక వింత అధ్యాయంగా మిగిలిపోయాయి. ఆయన అడిగారు, ఆమె సరేనంది... ఆ ఆనందం కనీసం మూణ్ణాళ్లైనా కాదు కదా, రెణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది! అందుకు కారణం ఆమె కాదు. అతడే. లవ్ని ప్రపోజ్ చేశాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది తనకున్న అకారణ విషాద భావన తత్వం (మెలంకలీ), దేవుని పట్ల ఉన్న భక్తి... ఒక మంచి భర్తగా ఉండటానికి ఏమాత్రం పనికిరావని ఆయన సిద్ధాంతీకరించుకున్నారు! పోనీ, గౌరవప్రదంగా విడిపోవచ్చు కదా? అదీ లేదు! ఆమెకు తన మీద ద్వేషం, అసహ్యం కలిగేలా చేసుకుని, బ్రేకప్ వల్ల ఆమె బాధపడకూడదనే వింత ఆలోచనతో తన గురించి తనే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టుకున్నారు. బయట అందరి ముందు కావాలనే ఒక మూర్ఖుడిలా, దుర్మార్గుడిలా ప్రవర్తిస్తూ తన పరువును తనే తీసుకున్నారు.ఇమ్మాన్యుయేల్ కాంట్ ఈయన 18వ శతాబ్దపు ప్రముఖ భావవాద జర్మనీ తత్త్వవేత్త. సమయాన్ని పాటించడంలో, విషయాలను విశ్లేషించి, వర్గీకరించటంలో మహాజ్ఞాని. సమస్య ఏంటంటే, లవ్ ప్రపోజల్ని ఆయన ఒక అందమైన అనుభూతిలా కాకుండా, తాను ఛేదించలేని ఒక క్లిష్టమైన గణిత సమస్యలా చూశారు. సంగతేంటంటే, ఇద్దరు అమ్మాయిలకు (ఒకేసారి కాదు లెండి, ఒకరి తర్వాత ఒకరికి) ఆయన ప్రపోజ్ చేయాలనుకున్నారు కాని, మేధస్సు ఆడిన ఊగిసలాటతో ఆ పని చేయలేకపోయారు. పెళ్లి వల్ల వచ్చే ఆర్థిక లాభనష్టాలు; తార్కికమైన ప్లస్లు, మైనస్లు లెక్కగట్టడానికి ఆయన ఎంత సమయం తీసుకున్నారంటే... చివరకు ఆయన ఒక నిర్ణయానికి వచ్చి, పెళ్లికి మానసికంగా సిద్ధం అయ్యేనాటికి.. ఒకమ్మాయి ఊరు విడిచి వెళ్లిపోయింది. ఇంకో అమ్మాయి హాయిగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పాపం, కాంట్.. తన లోపల ఉండే ప్రాఫిట్ అండ్ లాస్ల గడియారం కంటే... మనుషుల జీవ గడియారమే వేగంగా తిరుగుతుందని గుర్తించలేకపోయారు!జి.డబ్ల్యూ.ఎఫ్. హెగెల్ఈయన ఒక తార్కిక ప్రేమికుడు! 18వ శతాబ్దం నాటి ప్రఖ్యాత జర్మన్ తత్త్వవేత్త. ప్రతి పదార్థానికీ చలనం ఉంటుందన్న హెగల్ సూత్రం, మార్క్సిస్టు గతి తార్కిక భౌతికవాదంపై ఎంతో ప్రభావం చూపింది. అర్థం కాని భాషకు, భారమైన సిద్ధాంతాలకు హెగల్ మారుపేరు. ‘మేరీ వాన్ టుచర్’ కి ఆయన చేసిన ప్రపోజల్ కూడా ఆయన శైలిలోనే కొంచెం గంభీరమైనది.ఆమె కోసం ఆయన కవితలు రాశారు. కానీ అవి మెదడుకు మేత పెట్టేలా ఉండేవి తప్ప, మనసున మల్లెల మాలలను ఊగించేవి కావు. ‘‘నిష్కల్మషమైన ప్రేమ అనేది బాగానే ఉంటుంది కానీ, ఒక మనిషి వ్యక్తిత్వ వికాసానికి ‘పెళ్లి’ అనేది ఒక చట్టపరమైన, సామాజికమైన అవసరం. అందుకే మనం పెళ్లి చేసుకుందాం..’’ అని ఆమెతో అనేవారు. అంటే తన లవ్ ప్రపోజల్ని కూడా ఆయన తన ‘ఫెనోమెనాలజీ ఆఫ్ స్పిరిట్’ అనే గ్రంథంలోని ఒక క్లిష్టమైన పాఠంలా మార్చేశారు. అదృష్టవశాత్తూ, మేరీకి ఆయన ప్రపోజల్ నచ్చటంతో ఆయన్ని పెళ్లాడింది.జీన్ పాల్ సార్త్రే సార్త్రే 20వ శతాబ్దారంభపు ఫ్రెంచి తత్త్వవేత్త. నాటక రచయిత, రాజకీయ కార్యకర్త, సాహితీ విమర్శకుడు. ‘విడ్డూరం’ అనే పదానికి అసలైన అర్థం సార్త్రే, ఆయన ప్రియురాలు సిమోన్ డిబోవర్. వీరు ప్రేమించుకున్నారు కాని, పెళ్లి చేసుకోలేదు! ‘చేసుకోకపోవడమే ప్రేమ పరమార్థం’ అన్నట్లు ఉండిపోయారు. సార్త్రే, ఆమెకు ఒక వినూత్నమైన ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే, ప్రతి రెండేళ్లకు ఒకసారి తమ పెళ్లిని ‘రెన్యువల్’ చేసుకునే ఒక ఒప్పందం! ‘‘మన మధ్య ఉన్నది అత్యంత ‘అవసరమైన’ ప్రేమ (!); కాని లోకంలో ఉన్న ‘అనవసరమైన’ పెళ్లిని కూడా మనం చవి చూడటం మంచిది’’ అని సార్త్రే ఆమెను ఒప్పించారు. ఫలితంగా, వారు రెండేళ్లకోసారి పెళ్లి అనే భావనను (!) పొడిగించుకుంటూ 51 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అలాగని ఏనాడూ ఒకే ఇంట్లో నివసించలేదు. పైగా, తమ తమ ఇతర ప్రేమాయణాల గురించి కాఫీ తాగుతూ హాయిగా చర్చించుకునేవారు. ‘ఓపెన్ రిలేషన్షిప్’ అనే పదం పుట్టకముందే, ఆ కాన్సెప్ట్కి వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచారు!మొత్తానికి ఈ పాశ్చాత్య తత్త్వవేత్తల ప్రేమకథలు వింటుంటే.. ‘ప్రేమ గుడ్డిది’ అనే మాట కంటే, ‘ప్రేమ తాత్త్వికమైనది’ అనే మాట కరెక్ట్ ఏమో అనే ఆలోచన కలుగుతుంది.::: భారతీయ తత్త్వవేత్తల ప్రపోజల్స్ :::మనవాళ్ల తాత్త్విక సంప్రదాయాలు ఎక్కువగా వైరాగ్యం, మోక్షం వైపు మొగ్గు చూపుతాయి. అందుకే, ఒక జ్ఞాని సంసార జీవితంలోకి (గృహస్థాశ్రమం) అడుగుపెట్టడం అంటే ప్రాచీన భారతదేశంలో అదొక పెద్ద ‘మేధాపరమైన కల్యాణ వేదిక’! పెళ్లి ప్రపోజల్స్ అంటే కేవలం మనసులు కలవడం మాత్రమే కాదు... అవి ధర్మం గురించి, ఆత్మల అనుసంధానం గురించి జరిగే హై–వోల్టేజ్ డిబేట్లు!యాజ్ఞవల్క్య మహర్షిఉపనిషత్తుల కాలం నాటి మేధావు లందరిలో యాజ్ఞవల్క్యుడు ఒక శిఖరం లాంటి వాడు. పెళ్లి విషయంలో కూడా ఆయనది ఒక రకమైన ‘మెటాఫిజికల్’ (అధిభౌతిక) అప్రోచ్! ఆయన తన రెండో భార్య మైత్రేయిని పెళ్లి చేసుకున్నప్పుడు, అది ఇప్పట్లో లాగా ‘నేన్నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?‘ అని అడిగే మామూలు ప్రపోజల్ కాదు. మైత్రేయి అసామాన్యురాలు. గొప్ప విదుషీమణి. అంటే, మహా పండితురాలు. ఆమెకు కావలసింది నగలు, బంగారం లేదా హోదా కాదు. ఆమెకు ‘అమరత్వ సిద్ధి’ రహస్యం కావాలి. యాజ్ఞవల్క్యుడు ఆమెకు ఒక సంసార బంధాన్ని కాకుండా, ఒక ‘ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని’ ఆఫర్ చేశారు. ఆయన ఆమెతో ఒక మాట అన్నారు. ‘‘భర్తను భర్త కోసం ప్రేమించకూడదు, ఆయనలో ఉన్న ‘ఆత్మ కోసం ప్రేమించాలి’’ అని! అదే, ఆమెకు ఆయన చేసిన పెళ్లి ప్రపోజల్. దానర్థం ఏమిటంటే, మనం హాయిగా అడవికి వెళ్లి కూర్చుని, మోక్షం వచ్చే వరకు ఈ విశ్వం గురించి వాదించుకుంటూ ఉందాం – అని! ఇదొక రకమైన ‘స్టడీ–బడ్డీ’ లేదా క్లాస్మేట్ ప్రపోజల్ లాంటిది. పెళ్లి తర్వాత పార్టీలు, ఫంక్షన్లు కాదు... నేరుగా పరలోకానికి టికెట్ బుక్ చేసుకునే ప్రణాళిక అన్నమాట.మండన మిశ్రుడు 8వ శతాబ్దంలో, గొప్ప మీమాంస పండితుడైన మండన మిశ్రుడికి ఉభయభారతి అనే తాత్త్వికురాలితో వివాహం జరిగింది. నిజానికి ఆమె తెలివితేటల ముందు ఆయన మేధస్సు కాస్త తక్కువేనని ఆ కాలంలోనే చెప్పుకునేవారు. నిజానికైతే వీరి వివాహాన్ని ఒక ప్రేమ బంధంలా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన ‘జ్ఞాన సమ్మేళనం’ లాగా అభివర్ణించాలి. మండన మిశ్రుడి పెళ్లి ప్రపోజల్ కూడా అదే విధంగా జరిగింది. ఇక, వీరి కాపురం ఎలా ఉండేదంటే... అదొక నిరంతర తాత్త్వికాంశాల తరగతి గదిలా ఉండేది. ఒకసారి సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో వాదనకు దిగారు. అప్పుడు మండన మిశ్రుడు ఏ మగ పండితుడినీ న్యాయనిర్ణేతగా పెట్టుకోకుండా, తన భార్యనే ఆ స్థానంలో ఉండమన్నారు! ఆ చర్చలో భర్త ఓడిపోతుంటే, ఆమె ఏమాత్రం మొహమాటపడకుండా నిజాన్ని అంగీకరించింది. అయితే, ఆమె అక్కడితో ఆగిపోలేదు. ‘‘నా భర్తను ఓడించినా, ఆయనలో సగభాగమైన నన్ను ఓడిస్తేనే మీ విజయం పూర్తవుతుంది’’ అని శంకరాచార్యుల వారికే సవాలు విసిరింది! పైగా, ‘‘నువ్వు సన్యాసివి, అసలు పెళ్లి చేసుకుంటే వచ్చే జీవితానుభవాలే నీకు తెలియవు. మరి నీకు సంపూర్ణ జ్ఞానం ఉందని ఎలా చెబుతావు?’’ అని శంకరాచార్యుల వారిని ప్రశ్నించింది.మహావీరుడుజైనమతంలో 24వ తీర్థంకరుడైన మహావీరుడు చివరికి సర్వసంగ పరిత్యాగిగా మారినప్పటికీ, ఆయన వివాహం గురించి చరిత్రలో ఒక పెద్ద తాత్త్విక చర్చే నడిచింది. పురాణ గాథల ప్రకారం, ఆయన మనసు లోక కల్యాణం మీద ఉండటంతో, ఆయనను ఈ ప్రాపంచిక బంధాల్లో బంధించాలని తల్లిదండ్రులు యశోదతో పెళ్లి నిశ్చయించారు. అంటే, ఆయన పెళ్లి ప్రపోజల్ వెనుక ఆయన ప్రమేయం కంటే, వారి తల్లిదండ్రుల ప్లానే ఎక్కువగా ఉందన్నమాట! మొత్తానికి మహావీరుడు పెళ్లి చేసుకున్నారు కాని, ఆ సంసార జీవితంలో ఉంటూనే అంతర్గతంగా పూర్తి వైరాగ్యంతో ఉండేవారు. ఒకసారి ఊహించుకోండి... ‘‘నేను నీ పక్కనే కూర్చొని ఉంటాను కాని, నా మనసు మాత్రం ఎక్కడో విశ్వంలోని అనంతమైన శూన్యంలో విహరిస్తూ ఉంటుంది’’ అని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? సామాన్యులకు బోధపడే తత్త్వం అయితే కాదు.::: ‘సారీ, నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’:::భక్తి, అద్వైత సంప్రదాయాల్లోని కథలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది అక్కడి తత్త్వవేత్తలు ప్రపోజ్ చేసే విధానం చాలా భిన్నంగా, విచిత్రంగా ఉంటుంది. వారు తమ భాగస్వామికి ప్రాపంచిక విషయాల పట్ల ఎంత ‘నిర్లిప్తత’ ఉందో పరీక్షించి కానీ ముందడుగు వేసేవారు కాదు. నాటి పురుష తాత్వికులు ప్రపోజ్ చేయాలంటే, ఒక షరతు పెట్టేవారు. తనకు కాబోయే భార్య తన ‘దైవ చింతన’కు ఏమాత్రం అడ్డంకి కాకూడదు– అని! పెళ్లి్ల సంబంధం అని అమ్మాయిని చూడటానికి వెళ్లినప్పుడు కూడా మన తత్త్వవేత్తలు ఆమె అందం గురించి కాకుండా... జనన మరణాల గురించి, దేహం తాలూకు అశాశ్వతత్వం గురించి అత్యంత కఠినమైన ప్రశ్నలు అడిగేవారు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదైనా ప్రాపంచికమైన ఆశలతోనో లేదా మామూలు భావోద్వేగాలతోనో సమాధానం చెబితే, ‘‘సారీ... నీలో వైరాగ్యం తక్కువగా ఉంది’’ అని తిరస్కరించేవారు. అంటే, అది పెళ్లి చూపుల్లా కాకుండా, ఒక ఆత్మకు జరిగే టెక్నికల్ ఇంటర్వ్యూ లాగా ఉండేది! మొత్తానికి పశ్చిమ దేశాల తత్త్వవేత్తలైనా, మన భారతీయ మేధావులైనా... ప్రపోజల్ విషయంలో వారి లాజిక్కులు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటాయని అర్థమౌతోంది. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
సైకిల్ తొక్కే పోస్టుమ్యాన్ కనిపించరు!
ఖాకీ రంగు యూనిఫామ్.. మెడలో సంచీ.. సైకిల్ మీద ప్రయాణం... పోస్ట్మ్యాన్ అనగానే ఠక్కున స్ఫురించే దృశ్యమిది. పల్లెలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా, సైకిల్ మీద ఇంటింటికి వెళ్లి ఉత్తరాలు ఇవ్వడం సాధారణ విషయం. ఇటీవలి కాలంలో సైకిళ్లను వదిలి అంతా మోటారు వాహనాల వైపు మళ్లినా.. ఇంటింటికి వెళ్లాల్సి రావటం, తపాలా డబ్బాల వద్ద ఆగి క్లియర్ చేయాల్సి రావటం వల్ల పోస్ట్మ్యాన్ మాత్రం సైకిళ్లనే నమ్ముకున్నారు. కొత్తగా విధుల్లో చేరిన యువతరం కొందరు తప్ప సింహభాగం పోస్ట్మ్యాన్లు సైకిల్తోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సావాసం ఇకపై ముగియనుంది. తపాలా శాఖ చేసిన మార్పులతో వారు సైకిల్కు బైబై చెప్పనున్నారు.కేంద్రీకృత డెలివరీ విధానంతో..ఇంతకాలం ఏ తపాలా కార్యాలయానికి ఆ తపాలా కార్యాలయం ఉత్తరాల బట్వాడాతో కొనసాగేవి. ఉత్తరాలు/కవర్లు/ ఇతర పార్సిళ్లు నేరుగా ఆ పోస్టాఫీసుకే వచ్చేవి. అక్కడి పోస్ట్మ్యాన్ వాటిని సారి్టంగ్ చేసి సంబంధిత చిరునామాల్లో డెలివరీ చేసేవారు. గత సెప్టెంబర్లో తపాలాశాఖ కొత్త విధానాన్ని తెచి్చంది. ప్రతి పోస్టాఫీసులో డెలివరీ సెంటర్ లేకుండా.. ఆ ప్రాంతంలోని ఏడెనిమిది తపాలా కార్యాలయాలకు కలిపి ఒక డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాని పరిధిలోని పోస్ట్మ్యాన్ అక్కడికే వచ్చి సారి్టంగ్ చేసుకుని తమ పరిధిలోని ఉత్తరాలు/పార్సిళ్లను తీసుకెళ్లి డెలివరీ చేయాలి.కనీసం 10 కి.మీ.కు పైగా దూరం వెళ్లి వారు ఈ తంతు నిర్వహించాలి. దీంతో సైకిళ్లు వదిలి మోటారు వాహనాలు వాడాలని తపాలాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు తనే ఎలక్ట్రిక్ బైక్లు ఇస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈ కేంద్రీకృత డెలివరీ విధానం నగరాలు, పెద్ద పట్టణాలతో మొదలైంది. పోస్టల్ రిక్రూట్మెంట్ రూల్స్లో, పోస్ట్మ్యాన్కు సైకిల్ ఉండాలన్న అంశం ఉంటూ వచి్చంది. ఇప్పుడు టూవీలర్ లైసెన్స్ ఉండాలి అని చేర్చారు. ఫలితంగా హైదరాబాద్, వరంగల్లలో సైకిళ్ల మీద తిరిగే పోస్ట్మ్యాన్ కనిపించడం లేదు. త్వరలో మిగతా ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం మాయం కానుంది. ఆందోళన బాటలో...ఎక్కడో 10 కి.మీ. దూరంలో ఉన్న డెలివరీ కేంద్రానికి వెళ్లి లేఖలు తెచ్చుకోవటం కోసం సైకిళ్లకు బదులు మోటారు వాహనాలు వాడాలని పేర్కొన్న తపాలాశాఖ, వారికి ఇస్తానన్న ఎలక్ట్రిక్ బైకులను మాత్రం ఇవ్వలేదు. దీంతో సొంత వాహనాలను వాడాల్సి వస్తోంది. ఇందుకు పెట్రోల్ ఖర్చు చెల్లించటం లేదు. ఇది తమకు భారమవుతోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.⇒ కొత్త డెలివరీ విధానంలో సంబంధిత చిరునామాకు వెళ్లిన తర్వాత యాప్ ద్వారా పార్సిల్ మీద ఉన్న బార్కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అది పోస్టాఫీసులో రికార్డు అవుతుంది. నిర్ధారిత సమయంలోనే డెలివరీ అయిందని నిర్ధారించుకునేందుకు ఈ విధానం పెట్టారు. దీనికి మొబైల్ డేటా కోసం ప్రతి నెలా రూ.350 చెల్లించాల్సి ఉన్నా.. ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ⇒ వీటిపై ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేసినా పట్టించుకోకపోవటంతో త్వరలో «వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. అప్పటికీ స్పందన రాకపోతే సమ్మెకు సిద్ధమని పోస్ట్మ్యాన్ సంఘం ప్రకటించింది. -
2 గంటలకో స్కామ్ మెసేజ్
ఆన్లైన్ వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో డిజిటల్ మోసాలు ఆందోళనకర స్థాయిలో అధికమవుతున్నాయి. నమ్మదగిన సందేశాలు, డీప్ఫేక్ వాయిస్, క్యూఆర్ కోడ్స్తో సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. తమను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్న విషయం అత్యధికులు గ్రహించడం లేదు. నష్టం జరిగాకే తాము మోసపోయినట్టు గుర్తిస్తున్నారు. కొత్త నంబర్లు, మెసేజ్ల ద్వారా మొబైల్కు వచ్చే లింక్స్ను తెరవకూడదని ఆర్బీఐ, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు హెచ్చరిస్తున్నా, నేరాల సంఖ్య తగ్గడం లేదు.రోజుకు సగటున 13 మెసేజ్లు..: సందేశం, ఈ–మెయిల్ రూపంలో, సోషల్ మీడియా యాప్స్లో సగటున రోజుకు 13 మోసపూరిత (స్కామ్) మెసేజ్లను భారతీయులు అందుకుంటున్నారు. అంటే రెండు గంటలకో స్కామ్ సందేశం వస్తోందన్న మాట. ఆన్లైన్లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడానికి సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 102 గంటలు సమయం వెచ్చిస్తున్నారని ఆన్లైన్ ప్రొటెక్షన్ సేవలు అందిస్తున్న అంతర్జాతీయ దిగ్గజం మ్యాకఫీ ‘2026 స్టేట్ ఆఫ్ ద స్కామివర్స్’నివేదిక వెల్లడించింది. స్కామర్స్ కేవలం 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే స్కామ్ పూర్తి చేస్తున్నారని తెలిపింది. బాధితులు సగటున రూ.93,915 నష్టపోయినట్టు వెల్లడించింది. లింక్ లేకుండానే.. డెలివరీ నోటీసులు, సబ్స్క్రిప్షన్ పునరుద్ధరణ, బ్యాంక్ అలర్ట్ వంటి సందేశాలు కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి సైబర్ నేరగాళ్లు ఉపయోగించే సాధారణ వ్యూహాలుగా మారాయి. కొత్త ఎత్తుగడ ఏమంటే అనుమానాస్పద సోషల్ మీడియా సందేశాలలో 20% ఎటువంటి లింక్ లేకుండా వస్తున్నాయి. 66% మంది వినియోగదారులు ఈ లింక్ రహిత సందేశాలకు స్పందించారు. స్కామర్ల ఉచ్చులో పడడానికి ఈ అంశం కూడా కారణమైంది. రోజుకు కనీసం నాలుగు డీప్ఫేక్ వీడియోలు తమకు ఎదురవుతున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. డీప్ఫేక్ వీడియోల్లో 65% ఇన్స్ట్రాగామ్ వేదికగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు వాయిస్–క్లోన్ స్కామ్ను ఎదుర్కొన్నారు. వాయిస్–క్లోన్ అంటే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బ్యాంక్ లేదా ప్రభుత్వ అధికారుల గొంతును అనుకరిస్తూ చేసే వాయిస్ మెసేజ్ అన్నమాట. అధునాతన వ్యూహాలతో.. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70% మంది గత సంవత్సరం తమ సోషల్ మీడియా ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను తెరవడంలో ఏడాది క్రితం కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉన్నామని 82% మంది చెప్పారు. అయినా, స్కామర్లు అధునాతన వ్యూహాల ద్వారా ఇటువంటి వినియోగదారులను కూడా బోల్తా కొట్టిస్తున్నారు. నెటిజన్లను నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు ఏఐ, అధునాతన డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తూ ఆర్బీఐ, బ్యాంకులు, ట్రాయ్, ఆధార్, ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లతో సందేశాలను పంపడంతోపాటు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. సర్వే గురించి.. ⇒ నివేదిక పేరు: మ్యాకఫీ 2026 స్టేట్ ఆఫ్ ద స్కామివర్స్ ⇒ ఎందుకు: ఆన్లైన్ మోసాలకు సంబంధించి నేరగాళ్ల వైఖరి, ప్రవర్తన, బాధితుల అనుభవాలను తెలుసుకోవడానికి ⇒ ఏఏ దేశాలు: భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ⇒ ఎప్పుడు: 2025 నవంబర్లో సర్వే నిర్వహణ ⇒ ఎవరెవరు: 18 ఏళ్లు పైబడిన 7,592 మందిపై ⇒ విధానం: ఆన్లైన్ వేదికగా ⇒ సర్వేలో పాల్గొన్న 87% మంది భారతీయులు తాము వ్యక్తిగతంగా ఆన్లైన్ స్కామ్ను అనుభవించామని చెబుతున్నారు.⇒ సైబర్ నేరగాళ్ల చేతిలో ఆర్థికంగా నష్టపోయినట్టు 51% మంది వెల్లడించారు. ⇒ ఒక స్కామర్ తన లక్ష్యాన్ని మోసం చేసి డబ్బు లేదా సమాచారాన్ని దొంగిలించడానికి పట్టిన సమయం కేవలం 5 నిమిషాలే.⇒ఒక సంవత్సరం క్రితం కంటే నేడు తమ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉందని 63% మంది నమ్ముతున్నారు.⇒ స్కామ్ బాధితుల్లో 24% మందిని ఏడాదిలోపే సైబర్ నేరగాళ్లు మళ్లీ లక్ష్యంగా చేసుకున్నారు. ⇒ 90% మంది మోసపూరిత క్యూఆర్ కోడ్ అందుకున్నారు. స్కాన్ చేయగానే ప్రమాదకర స్థాయికి 38% మంది చేరుకున్నారు.⇒ డీప్ఫేక్ స్కామ్ను గుర్తిస్తామన్న నమ్మకం లేదని, తమను తాము రక్షించుకోలేమని మూడింట ఒక వంతుకుపైగా మంది తెలిపారు. -
ఏఐ పెట్టుబడుల్లో భారత్ @ 8
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం. మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది.ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటివరకు మొత్తంగా రూ.55 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘భారీ డేటా సెంటర్ల’ సంఖ్య 1,136 కాగా 2030 నాటికి ఇది 2,000 దాటొచ్చని అంచనా.ఆధారం: వరల్డ్ ఎకనమిక్ ఫోరం శ్వేతపత్రం -
హైడ్రాను ప్రభుత్వం పావుగా వాడుకుంటోందా?
అమృతా ప్రణయ్లాంటి సంచలనాత్మక కేసును డీల్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్.. ఆ తర్వాతి కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న హైడ్రా అనే ఓ వ్యవస్థను కమిషనర్ హోదాలో ముందుకు నడిపిస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా సరే.. హైడ్రా ‘రైట్ రూట్’లోనే ముందుకు వెళ్తోందని అంటున్నారాయన. అలాంటి వ్యక్తి.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఇల్లు కట్టుకుని ఉంటున్నారా?.. సాక్షి డిజిటల్కు ఎక్స్క్లూజివ్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభుత్వం మారితే హైడ్రా పరిస్థితి?రంగనాథ్: హైడ్రాకు ఐదేళ్లు ఏమాత్రం సరిపోదు. పది.. పదిహేనేళ్లు.. ఇలా నిరంతరాయంగా పని చేసినా సరిపోవు. ఉదాహరణకు.. మన చుట్టురా వేల చెరువులు ఉన్నాయి. వాటి పునరుద్దరణకు మొదటి అడుగు వేశాం. అదసలు అలా కొనసాగుతుంది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువైంది. వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ అనేది రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధి(ఆర్టికల్ 51-A(g) ప్రకారం). పొరుగున ఉన్న కర్ణాటకలో చూసుకుంటే చెరువుల సంరక్షణ 2008 నుంచే కొనసాగుతుంది. అక్కడ ఇన్నేళ్లలో ప్రభుత్వాలు మారాయి కదా. కాబట్టి.. ఆ అవకాశాలను కొట్టిపారేయలేం.ప్రభుత్వాన్ని, బ్యూరోక్రట్లు వేరుగా చూసే పరిస్థితులు ఉన్నాయా? రంగనాథ్: నా భుజం మీద తుపాకీ పెట్టి ప్రభుత్వం సామాన్యులను కాలుస్తోంది అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. పావుగా వాడుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఛాయిస్. అలాగే ఆ అధికారులపై విమర్శలు వచ్చినప్పుడు.. సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కూడా. ఈ సంస్థకు రాజకీయాలకు సంబంధం లేదు. వాటికి హైడ్రా అనే వ్యవస్థ దూరం కూడా.ఒత్తిళ్లతో పెద్దవాళ్లను టచ్ చేయట్లేదన్న విమర్శలపై ఏమంటారు?రంగనాథ్: 2024 జులైలో హైడ్రా ఏర్పాటైంది. ఆగస్టు నుంచి అక్రమ కట్టడాలపై కొరడా జులిపించడం మొదలుపెట్టాం. పేదవాళ్ల ఇళ్లనే కాదు.. ప్రముఖుల నిర్మాణాలనూ వదిలిపెట్టలేదు. ఎన్ కన్వెషన్ కూల్చివేత అందుకు ఉదాహరణ. సినీ, రాజకీయ, వ్యాపార.. ఇతర రంగాల ప్రముఖుల కట్టడాలను కూల్చేశాం. కొన్నిసార్లు సామాజిక కోణంలో చూశాం. అందుకే ఎన్నో బస్తీలను వదిలేశాం. కొన్ని కేసుల్లో న్యాయం కూడా అందించాం. కొన్నింటికి ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) ఇంకా డిసైడ్ కాలేదు. ఒక్కసారిగా ఫిక్స్ అయితే వాటిని వదిలిపెట్టం. సోషల్ మీడియాలో ప్రచారాన్ని పట్టుకుని హైడ్రా పని తీరును శంకించాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోం కూడా. పనిలో 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ కోసం ప్రయత్నిస్తున్నాం. నమ్మకం ఉంది కాబట్టే హైడ్రా ప్రజావాణికి జనం ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి కదా.ఒవైసీ కాలేజ్ను టచ్ చేయలేదన్న రాజకీయ విమర్శల నేపథ్యంలో తీసుకోబోయే యాక్షన్ ఎలా ఉందనుంది?రంగనాథ్: ఒవైసీ కాలేజీలాగే చాలా భవనాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క ఆ కాలేజ్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలి?. అక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఉండవచ్చు, పుల్లారెడ్డి లేదంటే వెంకట్ రెడ్డి కాలేజీ ఉండొచ్చు.. ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఒక నిర్దిష్టమైన పాలసీ లేకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిష్కారం కనిపించదు. నిజంగా మనం ఒక్క లింక్పై మాత్రమే దృష్టి సారిస్తున్నాం. ఒక్క కేసును మాత్రమే ఎత్తి చూపుతున్నాం. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ హైడ్రా సైలెంట్గా ప్రభుత్వ భూముల్ని, చెరువులను కబ్జా చేసిన వాటిని కూలగొట్టి ఎంతో మేలు చేస్తున్నాం.వేల, లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కాపాడుతున్నాం. హైడ్రా అనేది దేశంలోనే వినూత్నమైన ప్రభుత్వం. జాతీయ మీడియా సంస్థలే కాదు.. ఐఎస్బీ కూడా హైడ్రాను ప్రస్తావించింది. ముంబైలోనూ హైడ్రా తరహా వ్యవస్థ కోరుకుంటున్నారు. అలాగే హైడ్రా పని తీరు కూడా మారింది. కూలగొట్టడమే కాదు.. చెరువుల పునర్మిరాణాలు చేపడుతోంది. కొందరు హైడ్రా పరిధి పెంచమని కోరుతున్నారు. దేవదాయ భూముల్ని ఎందుకు పరిరకక్షించకూడదని అనుకుంటున్నాం కూడా. కానీ, పాలసీ, ఎఫ్టీఎల్ ఫైనల్ నోటిఫికేషన్పై క్లారిటీ రావాల్సి ఉంది. కోర్టులు కూడా ఈ విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులకు వాస్తవాలు వివరించే ప్రయత్నాలు మేం చేస్తున్నాం.హైడ్రా కార్యాచరణలో లోపాల గురించి..రంగనాథ్:చూసే వాళ్లను బట్టి ఉంటుంది. చెరువుల్లో వ్యర్థాలు చికెన్, మటన్, చేపల వేస్టేజ్లు పడేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెళ్లి సమస్య పరిష్కరించాం. నష్టంగా భావించేవాళ్లు.. వేళ్లమీద లెక్కపెట్టుకునేవాళ్లు. వాళ్లు హైడ్రా ఉద్దేశాలను తప్పుబడతారు. కానీ, వందల, వేల, లక్షల మందికి మంచి జరుగుతోంది. వాళ్లు మౌనంగా ఉంటారు. జరిగే మంచి గురించి వాళ్లు మాట్లాడుకోరు. మాట్లాడే ఆ ఒకరిద్దరి గురించే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా!. కాబట్టి ఉద్దేశం మంచిదే.. అలాగే కార్యాచరలోనూ సవ్యంగానే ఉంది.మీ ఇల్లు కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉందంట కదా?రంగనాథ్: నేను ఉండేది మధురానగర్లో. నా ఇంటికి కిలోమీటర్ దూరంలో కృష్ణకాంత్ పార్క్ ఉంది. అది ఒకప్పుడు చెరువు. ఆ చెరువు దిగువన ప్రాంతంలో నేను ఉంటా. అది ఎఫ్టీఎల్ పరిధికి ఎంతో దూరం. ఎవరో సెన్స్ లేకుండా కాంట్రవర్సిటీ కోసం క్రియేట్ చేసింది. హైడ్రా మీద వీలైనంత మంది అన్ని విధాల దాడులు చేశారు.. ఇంకా చేస్తున్నారు. అందులో భాగమే ఈ ప్రచారం కూడా.(నవ్వుతూ..)రంగనాథ్ కూల్చివేతలకు వెళ్లడం అవసరమా?రంగనాథ్: కచ్చితంగా అలా అనేం లేదు. ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షించొచ్చు. కానీ, ఒక్కోసారి హైడ్రా కమిషనర్గా అది నా బాధ్యత. ఎన్నో ఒత్తిళ్లు ఎదురవుతుంటాయి.. విమర్శలు వస్తుంటాయి. ఆ బాధ్యతలను ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆపరేషన్లప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. బ్యూరోక్రట్గా, సివిల్ సర్వెంట్గా, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా.. తక్కువ మందికి డ్యామేజ్ కలిగేలా ఎక్కువ మందికి లాభం కలిగేలా చూడాల్సిందే. అప్పుడే కదా.. తర్వాతి తరాలు హైడ్రా గురించి మాట్లాడుకునేది. -
న్యూస్టార్ట్ ముగింపు.. తీవ్ర ఒత్తిడిలో భారత్!
ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్లీ పెరగనుందా?. అమెరికా-రష్యా మధ్య న్యూస్టార్ట్ ఒప్పందం ముగియడం ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అదనుగా.. ఇటు పాక్-చైనాలు పరస్పర అణు సహకారంతో భారత్కు సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. అయితే.. ఇదంతా ఇండియా మంచికే అంటున్నారు నిపుణులు. అమెరికా–రష్యా మధ్య ఉన్న New START అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం గడువు 2026 ఫిబ్రవరి 5వ తేదీతో ముగిసింది. ఒప్పందం పునరుద్ధరణ ప్రస్తావనే లేకపోవడంతో.. ఈ రెండు దేశాల మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేకుండా పోయాయి. ఇప్పుడు అమెరికా, రష్యా తమ అణు శక్తిని ఇష్టానుసారం పెంచుకునే అవకాశం పొందాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళనలకు దారితీస్తోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న అణు శక్తి దేశాలపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది. అమెరికా–రష్యా పరిమితులు తొలగిపోవడంతో కొత్త ఆయుధ పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. పెద్ద శక్తులే ఆయుధాలను పెంచుకుంటే.. మనం ఎందుకు నియంత్రించుకోవాలి? అని ఇతర దేశాలు భావించొచ్చు. ఇదే అదనుగా.. తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకునే దిశగా అడుగులు వేయవచ్చు. అదే గనుక జరిగితే.. అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించడానికి 1970లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ ఒప్పందం ఎన్పీటీ (Non-Proliferation Treaty) కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఎన్పీటీ అంటే.. • కొత్త దేశాలు అణు ఆయుధాలు తయారు చేయకుండా నిరోధించడం.• ఇప్పటికే అణు శక్తి కలిగిన దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్) ఆయుధాలను తగ్గించడం.• అణు శక్తిని శాంతి ప్రయోజనాల కోసం (ఉదా: విద్యుత్ ఉత్పత్తి) ఉపయోగించడానికి సహకారం అందించడం.భారత్పై ప్రత్యక్ష ప్రభావంభారత్ ఇప్పటిదాకా క్రెడిబుల్ మినిమమ్ డిటర్రెన్స్ అనే అణు వ్యూహాన్ని పాటిస్తోంది. దీని ప్రకారం.. శత్రువు దాడి చేయకుండా నిరోధించడానికి, భారత్ వద్ద ఉన్న అణు శక్తి నమ్మదగినది (credible)గా ఉండాలి. అది శత్రువుకు నమ్మదగిన నిరోధక శక్తిగా (deterrent) పనిచేయాలి. అవసరానికి మించి పెద్ద అణు నిల్వలు కాకుండా.. తన భద్రతకు అవసరమైన కనీస అణు ఆయుధ శక్తిని మాత్రమే కలిగి ఉంటే చాలూ(Minimum). అలాగే.. భారత్ అణు ఆయుధాలను మొదటగా వాడకూడదు(No First Use-NFU). కానీ దాడి జరిగితే తప్పనిసరిగా ప్రతిదాడి చేయొచ్చు. శత్రువు మొదట దాడి చేసినా, భారత్ వద్ద ప్రతిదాడి చేసే సామర్థ్యం ఉండాలి( Second Strike Capability). 1999లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ‘‘డ్రాఫ్ట్ న్యూక్లియర్ డాక్ట్రైన్’’లో సీడీఎం అనే సూత్రాన్ని ప్రకటించింది. ఆపై 2003లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఏర్పాటుతో ఎన్ఎఫ్యూలో కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం.. బయోలాజికల్ లేదంటే కెమికల్ దాడి జరిగినా అణు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించారు. మొత్తంగా భారత అణువిధానం.. అణ్వాయుధాలను రక్షణ కోసం మాత్రమే దాడి కోసం కాదు అని పాటిస్తూ వస్తోంది. అయితే.. భారమే అయినా..న్యూస్టార్ట్స్ గడువు ముగిసింది. అణ్వాయుధ పోటీలో భాగంగా చైనా తన అణు శక్తిని పెంచే అవకాశం లేకపోలేదు. అలాగే పాకిస్తాన్తో అణు సహకారం పెంచుకోవచ్చు కూడా. అణ్వాయుధ పోటీ వల్ల ఈ రెండు దేశాలు మరింత శక్తివంతమైన వ్యూహాలను అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే.. భారత్ కూడా తన నిరోధక శక్తిని పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా.. భారత్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, సబ్మేరిన్ ఆధారిత అణు నిరోధక శక్తిను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అణు ఆయుధాల అభివృద్ధి, నిర్వహణ ఖర్చులు భారత్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచొచ్చు. అలాగే.. రక్షణ బడ్జెట్లో మరింత పెంపు అవసరం పడుతుంది. అంటే ఆర్థిక, భద్రతా, రాజనీతిక సవాళ్లు పెరుగుతాయన్నమాట. మరోవైపు.. అమెరికా–రష్యా పోటీ వల్ల కొత్త మల్టిలేటరల్ చర్చలు అవసరం అవుతాయి. జీ20, బ్రిక్స్ సదస్సులతో పాటు ఐక్యరాజ్య సమితి లాంటివి అందుకు వేదికలు అవుతాయి. ఇందులో భారత్కు కచ్చితంగా ప్రాధాన్యత లభించవచ్చు. ఎన్పీటీలో సభ్యత్వం లేని భారత్ ఇదే అదనుగా అంతర్జాతీయ వేదికలపై పారదర్శకత, నియంత్రణ చర్యలు కోరవచ్చు. ఇది భారత్కు గ్లోబల్ లీడర్షిప్ అవకాశాన్ని కలిగిస్తుంది. నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగిస్తున్న భారత్.. తన నైతిక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఏంటీ న్యూస్టార్ట్? న్యూస్టార్ట్ (New Strategic Arms Reduction Treaty) అనేది.. అమెరికా–రష్యా మధ్య 2010లో కుదిరిన అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం. పూర్తి పేరు: Treaty between the United States of America and the Russian Federation on Measures for the Further Reduction and Limitation of Strategic Offensive Arms. దీని ప్రధాన ఉద్దేశ్యం రెండు దేశాల వద్ద ఉన్న వ్యూహాత్మక అణు ఆయుధాలను పరిమితం చేసి, ప్రపంచ భద్రతను బలోపేతం చేయడం.కోల్డ్ వార్ తర్వాత అమెరికా, రష్యా వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధ ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో 2010 ఏప్రిల్ 8న, ప్రాగ్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ సంతకం చేశారు. 2011 ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చింది. తరువాత 2021లో 5 సంవత్సరాలు పొడిగించబడింది. ఇందులో భాగంగా.. అణు ఆయుధాల విషయంలో ప్రపంచంలో శక్తివంతమైన దేశాలైన అమెరికా, రష్యాలు పరిమితంగా ఉండాలి. ఒకదానికొకటి లెక్కలు చెప్పుకోవాలి. అలాగే అణు ఆయుధాల నియంత్రణ ద్వారా ఇతర దేశాలకు కూడా భద్రతా హామీ ఇవ్వాలి. కానీ, 2026 ఫిబ్రవరి 5న గడువు ముగిసింది. ఇప్పుడు అమెరికా–రష్యా మధ్య అణు ఆయుధాలపై ఎలాంటి అధికారిక పరిమితులు లేవు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
'సేవా' కుటుంబం
కుటుంబం అంతా కలిసి పాల్గొనే సేవా కార్యక్రమాలు పిల్లల వ్యక్తిత్వాన్ని చక్కగా రూపుదిద్దటమే కాకుండా, వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దుతాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, ఒక మంచి పని కోసం కుటుంబం అంతా కలిసికట్టుగా శ్రమించటం వల్ల, పిల్లలు పెరిగి పెద్దయ్యాక అవి తీపి జ్ఞాపకాలుగామిగిలిపోతాయని మనోవికాస నిపుణలు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతరులకు సహాయం చేయడంలోని గొప్పతనం, ఔన్నత్యం ‘వాలంటీరింగ్’ ద్వారా పిల్లలకు అర్థం అవుతుంది. దీనివల్ల వారిలో జాలి, దయ, కరుణ, ఓర్పు, కృతజ్ఞతా భావం వంటి మంచి గుణాలు ఏర్పడతాయి. మనం చేసే చిన్న సాయమైనా ఒకరి జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో పిల్లలు స్వయంగా తెలుసుకుంటారు.ఆత్మ విశ్వాసం పెరుగుతుందితల్లిదండ్రులు పిల్లల్ని తరచూ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవటానికి తీసుకెళ్లటం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల పట్ల ప్రేమతో మెలుగుతారు. నలుగురితో కలిసి పని చేయటం నేర్చుకుంటారు. సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను అలవరచుకుంటారు. కుటుంబ బంధం బలపడుతుందిఇంట్లో అందరూ కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, రోజూవారీ పనుల ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ఫోన్లకు, టీవీలకు లేదా ఇంటి పనులకే పరిమితం అయిపోకుండా.. ఒక మంచి లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేసినట్లవుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను బలపరుస్తుంది.ఎలాంటి సేవల్ని ఎంచుకోవాలి?పిల్లల వయసును బట్టి, వారికి ఆసక్తి ఉన్న పనులు ఎంచుకోవడం ముఖ్యం. చిన్న పిల్లలైతే చేతులతో చేసే చిన్న చిన్న పనులను ఇష్టపడతారు, అదే కొంచెం పెద్ద పిల్లలైతే బాధ్యత తీసుకునే పనులను లేదా నాయకత్వం వహించే పనులకు చొరవ చూపుతారు. ఏమైనా, అది వారికి సరదాగా అనిపించాలి. ఆ పని తప్పక చేయాలనే ఉత్సాహం వారిలో కలగాలి. పనుల ఎంపికకు ఇవే గీటురాళ్లు. నెలకు ఒక్కసారి.. కుదరకపోతే రెండునెలలకు ఒక్కసారైనా వాలంటీరింగ్ చేసినా చాలు, అది పిల్లల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. నివేదికలు..అధ్యయనాలు‘పాయింట్స్ ఆఫ్ లైట్’ అనే స్వచ్ఛంద సంస్థ ఏటా ‘ఫ్యామిలీ వాలంటీర్ డే’ ని నిర్వహిస్తుంది. కుటుంబంతో కలిసి సేవ చేయడం వల్ల పిల్లల్లో సహానుభూతి పెరుగుతుందని, సామాజిక బాధ్యత అలవడుతుందని వారి అధ్యయనాలు చెబుతున్నాయి.యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సర్వే ప్రకారం, స్వచ్ఛంద సేవల్లో పాల్గొనే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు 18 నుంచి 35 శాతం వరకు తక్కువగా ఉంటున్నాయి. ఇండియానా యూనివర్సిటీ జరిపిన సర్వేలో టీనేజర్లు, బాలలు సేవా కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా సమాజం తీరును గ్రహిస్తున్నారు. సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకుంటున్నారు. చిన్నప్పటి నుండి సేవ చేసే అలవాటు ఉన్న పిల్లలు, పెద్దయ్యాక కూడా సమాజానికి సేవ చేసే అవకాశం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ‘కార్పొరేషన్ ఫర్ నేషనల్ అండ్ కమ్యూనిటీ సర్వీస్’ గణాంకాలు చెబుతున్నాయి. -
ఇండియా టీచింగ్..వరల్డ్ లెర్నింగ్
దేశీ ఎడ్టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో విదేశాల బాట పడుతున్నాయి. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు విద్యా వ్యాపారాన్ని దూకుడుగా విస్తరిస్తున్నాయి. అప్గ్రాడ్, సింప్లీలెర్న్, బ్రైట్చాన్స్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి. మన ఎడ్టెక్ కంపెనీలు ప్రధానంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియాపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వియత్నాం, థాయ్ల్యాండ్, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్లాంటి మార్కెట్లలో విస్తరిస్తున్నాయి. ఆయా మార్కెట్లలో వినియోగదారుల ప్రొఫైల్ దాదాపు మన దేశం తరహాలోనే ఉండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. థాయ్, వియత్నాంలో అప్గ్రాడ్: టీమ్లీజ్ గణాంకాల ప్రకారం ఆగ్నేయాసియా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు 2 కోట్ల మంది పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలపై మన సంస్థలు దృష్టి పెడుతున్నాయి. బెంగళూరుకు చెందిన అప్గ్రాడ్ సంస్థ థాయ్ల్యాండ్, వియత్నాంలో కార్యకలాపాలు విస్తరించింది. అలాగే యూఏఈ, మేనా ప్రాంతంలో (మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) వర్క్ఫోర్స్ శిక్షణకు సంబంధించి వివిధ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే సింప్లీలెర్న్ కంపెనీ వివిధ సంస్థలు, ప్రభుత్వాల భాగస్వామ్యాలతో అమెరికా, బ్రిటన్, పశ్చిమాసియావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక కిడ్స్ లెర్నింగ్ ప్లాట్ఫాం అయిన బ్రైట్ఛాంప్స్ సంస్థ ఏకంగా 30 పైగా దేశాల్లో విస్తరించింది. యూఏఈ, సౌదీ అరేబియా, వియత్నాం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఆకర్షణీయంగా ఆగ్నేయాసియా: వియత్నాం, థాయ్ల్యాండ్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు వేగంగా డిజిటల్ ఎకానమీలుగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో కెరియర్ పురోగతికి సంబంధించిన కోర్సులను నేర్చుకోవడంపై పెరుగుతున్న ఆసక్తిని అవకాశంగా మల్చుకోవడంపై ఎడ్టెక్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. 2024–25లో అప్గ్రాడ్ ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 20–25 శాతంగా నమోదైంది. అటు సింప్లీలెర్న్ అంతర్జాతీయ యూజర్లలో 11 శాతం మంది బ్రిటన్, పశ్చిమాసియాలో ఉన్నారు. ఇక తమ గ్లోబల్ యూజర్లలో 30 శాతం మంది ఆగ్నేయాసియా, దక్షిణాసియా వారు ఉన్నారని బ్రైట్ఛాంప్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా పోటీ: మన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నప్పటికీ అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పోటీ ఎదుర్కొనాల్సి వస్తోంది. యుడెమి, ఎరుడైటస్, యుడాసిటీ, కోర్సెరాలాంటి గ్లోబల్ సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో దూకుడుగా విస్తరిస్తున్నాయి. తమకు విదేశీ మార్కెట్లలో కోర్సెరా, ఎరుడైటస్ నుంచి పోటీ ఉంటోందని అప్గ్రేడ్ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఎమెరిటస్, కోర్సెరా, యుడాసిటీలను సింప్లీలెర్న్ ఢీకొంటోంది. మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యయాలతో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశీ కంపెనీలు.. ఆయా మార్కెట్లలో పటిష్టపడేందుకు ప్రయతి్నస్తున్నాయి. లీడ్ గ్రూప్ ఈ ఏడాది 1,200 పాఠశాలలతో భాగస్వామ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
అంతరిక్ష సంక్షేమం కోసం స్టార్గేజ్
ఇతరుల బాగు కోరే వారే మంచి మనిషి అని శతాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడీ మంచి పనిని అంతరిక్ష వేదిగా ఆచరించి చూపుతా మని ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్కు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో వందల కిలోమీటర్ల ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు హఠాత్తుగా స్థానచలనం చెందిన విపత్కర సందర్భాల్లో సమీప ఉపగ్రహాల ఆపరేటర్లను అప్రమత్తంచేసే అత్యాధునిక ఆన్లైన్ టూల్ ‘స్టార్గేజ్’ను అందుబాటులోకి తెచ్చినట్లుస్పేస్ఎక్స్ ప్రకటించింది. దీనిని స్పేస్ సిట్యూవేషనల్ అవేర్నెస్ సిస్టమ్ అని కూడా పిలుస్తున్నారు.ఏమిటీ స్టార్గేజ్?ఇదొక అప్రమత్త వ్యవస్థ. ఉపగ్రహాల ఇంధనం ఖాళీ అవడం, లేదా ఉపగ్రహం విఫలమై దిగువ కక్ష్యలోకి జారిపోవడం లేదా స్వేచ్ఛగా ఇష్టమొచ్చినట్లు తిరిగే సందర్భాల్లో అవి అంతరిక్ష బాంబుల్లా మారిపోతాయి. సమీప ఉపగ్రహాలకు ఢీకొట్టి సర్వనాశనం చేస్తాయి. తర్వాత ఇది శృంఖల చర్యలా విశృంఖలంగా జరిగి వందల ఉపగ్రహాలు ధ్వంసమయ్యే పెను ప్రమాదముంది. ఈ అంతరిక్ష ప్రమాదాన్ని మొగ్గదశలోనే తుంచేసే శక్తి ఈ స్టార్గేజ్కు ఉంది. అస్తవ్యస్తంగా కదులుతున్న ఉపగ్రహాల జాడ, లొకేషన్ను ఇతర ఆపరేటర్లకు ఉచితంగా స్పేస్ఎక్స్ అందిస్తుంది. దాంతో తమ ఉపగ్రహాలను ఆ ప్రమాదకర ఉపగ్రహం నుంచి దూరంగా తీసుకెళ్లడమో, దిగువ కక్ష్యలోకి సురక్షితంగా మార్చడమో సాధ్యమవుతుంది. దీంతో ఉపగ్రహాల యాక్సిడెంట్ను నివారించవచ్చు. కేవలం ఉపగ్రహాలు మాత్రమేకాకుండా హఠాత్తుగా దూసుకొచ్చిన చిన్నపాటి గ్రహశకలాల లొకేషన్నూ ఆపరేటర్లకు స్టార్గేజ్ అందిస్తుంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం ఇవ్వడం స్టార్గేజ్ ప్రత్యేకత. అత్యాధుని సెన్సార్లు, సంక్టిష్లమైన సాఫ్ట్వేర్ సాయంతో పాత ఉపగ్రహాల శకలాలనూ స్టార్గేజ్ గుర్తించి వాటి జాడను ఆపరేటర్లకు అందజేస్తుంది. ఒకచోట పొగుబడిన శకలాల ప్రాంతాలను గుర్తించి అప్రమత్తంచేస్తుంది. ఉపగ్రహాలు ఢీకొట్టే అవకాశాలు గణనీయంగా తగ్గించి తద్వారా అంతరిక్ష చెత్త పోగుబడకుండా, ఆ ప్రాంతంలో మరో కొత్త ఉపగ్రహం వచ్చి చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. పౌర, సౌనిక, నిఘా, వాతావరణ ఉపగ్రహాల ప్రయోగాలతో దిగువ భూకక్ష్యల్లో కొత్త ఉపగ్రహాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు వేలాది ఉపగ్రహాల కూటమి స్టార్లింక్తో ఉపగ్రహాల సంఖ్య వేలాదిగా ఎక్కువైంది. ఈ తరుణంలో అంతరిక్షం సైతం ఒక రద్దీ అయిన రహదారిలో మారింది. రోడ్డుపై వాహనాలను క్రమబద్ధీకరించే ట్రాఫిక్ కానిస్టేబుల్ తరహా వ్యవస్థ తక్షణావసరమైంది. ఈ అవసరాన్ని స్టార్గేజ్ తీర్చనుంది.అదనంగా కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్..ఇప్పుడున్న ఉపగ్రహాలు కొన్ని గంటల తర్వాత ఏ దిశగా ఎంత దూరం కదులుతాయి అనే వివరాలను స్టార్గేజ్ ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఉపగ్రహాల ఆపరేటర్లకు ఉచితంగా అందివ్వనుంది. దీంతో తోటి ఉపగ్రహాలతోపాటు ఖగోళ వస్తువులు, స్పేస్ చెత్త ఎక్కడున్నాయో ఇట్టే తెల్సిపోతుంది. వీటికి అనుగు ణంగా ఆపరేటర్లు తమ భవిష్యత్ ఉ పగ్రహాల ప్రయోగాల తేదీలను సవరించుకోవ చ్చు. దీని వల్ల అత్యంత విలువైన సమయం, ప్రయోగాల ఖర్చు కలిసివస్తాయి. స్టార్గేజ్ అందించనున్న అత్యంత విలువైన డేటా షేరింగ్ సమాచారాన్ని నాసా, ఇతర అంతర్జాతీయ ఉపగ్రహ ఆపరేటర్లు ఎప్పట్నుంచో కోరుతుండగా ఇన్నేళ్లకు ఇది సాకారమైంది. గత ఏడాది డిసెంబర్లో స్టార్లింక్ ఉపగ్రహ కూటమికి అత్యంత సమీపంగా చైనా ఉపగ్రహం దూసుకొచ్చింది. అవి ఢీకొట్టే పెనువినాశనం సంభవించేది. దీంతో భయపడిన స్టార్లింక్ ఏకంగా తమ 4,400 ఉపగ్రహాలను వెనువెంటనే 480 కిలోమీటర్ల దిగువ కక్ష్యలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దనే సదుద్దేశంతో ఉచితంగా ఈ సేవలను స్టార్లింక్ అంతర్జాతీయంగా అన్ని దేశాలకు అందుబాటులోకి తెచ్చింది. కంజంక్షన్ డేటా మెసేజెస్(సీడీఎం)లను ఎప్పటికప్పుడు స్టార్గేజ్ పంపనుంది. కంజంక్షన్ స్క్రీనింగ్ సర్వీస్ ద్వారా గంటల తర్వాత రావాల్సిన డేటాను కేవలం నిమిషాల్లోనే సీడీఎంల రూపంలో ఆపరేటర్లు పొందొచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మౌనంగానే మెడలు వంచి!
అసలే అతను డొనాల్డ్ ట్రంప్. శత్రువులా, మిత్రులా అన్న తేడా కూడా లేకుండా అన్ని దేశాలనూ హడలెత్తిస్తూ వస్తున్న వ్యక్తి! కఠిన పదజాలంతో కూడిన బెదిరింపులతో, ఎడాపెడా టారిఫ్ల బాదుడుతో వణుకు పుట్టించడాన్నే తన నైజంగా మార్చుకున్నారు. రెండోసారి అధికారం చేపట్టింది మొదలు, ఈ ఏడాది కాలంలో ప్రపంచ దేశాలకు ఒకరకంగా పీడకలలా పరిణమించారు. చివరికి దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి అతి సన్నిహిత మిత్ర దేశాలు కూడా ట్రంప్ బెదిరింపులకు జడిసి ఆయన డిమాండ్లకు అనుగుణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో భారత్ విషయంలో మాత్రం ట్రంప్ హఠాత్తుగా దిగొచ్చిన తీరు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తోంది. భారత్పై 50 శాతం టారిఫ్లను ఏకంగా 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సోమవారం ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీన్ని భారత్ సాధించిన ఘన విజయంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో తొలినుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గకుండా, మాటల యుద్ధానికి బదులివ్వకుండా సంయమనం పాటిస్తూనే చివరికి మౌనంగానే ఆయన మెడలు వంచారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ వుతోంది. బెదిరింపులనే తిరుగులేని ఆయుధంగా చేసుకుంటూ గత ఏడాది కాలంలో ట్రంప్ చెలరేగి పోయారు. దేశాధినేతలంతా తాను చెప్పినట్టు వినాలన్న ఒంటెత్తు పోకడ ప్రదర్శించారు. చివరికి నోబెల్ శాంతి పురస్కారానికి తాను అర్హుడినంటూ ప్రకటనలు చేయాల్సిందిగా వారిని ఒత్తిడి చేసే స్థాయికీ వెళ్లారు! పాక్ లాంటి పలు దేశాల అధినేతలు అందుకు తలొగ్గారు కూడా. కానీ మోదీ నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. దాంతో ట్రంప్ ఇగో దెబ్బ తిన్నది కూడా. మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేయనందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పట్టాయి. ప్రధాని మాత్రం వీటిని పట్టించుకోలేదు. అంతేగాక ట్రంప్ బెదిరింపుల ఉచ్చులో పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఒప్పందం విషయమై ట్రంప్ నాలుగుసార్లు స్వయంగా ఫోన్ కాల్స్ చేసినా పట్టించుకోలేదు. ఆయన కారాలు, మిరియాలు నూరుతున్నా లక్ష్యపెట్టకుండా బ్రిటన్, న్యూజిలాండ్, అనంతరం ఒమన్లతో లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తద్వారా స్వతహాగా వ్యాపారి అయిన ట్రంప్నే మించిపోయే స్థాయిలో మోదీ వ్యాపార దక్షత ప్రదర్శించారు. ఈ చర్యతో ఆయనను పునరాలోచనలో పడేశారు. ఇక గత నెలలో యూరోపియన్ యూనియన్తో అతి కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీదని కొనియాడుతున్న ఈ డీల్ భారత్పై దూకుడు విషయంలో ట్రంప్కు గట్టిగా బ్రేకులు వేసిందని చెబుతున్నారు.27 దేశాల కూటమి అయిన ఈయూతో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని మరింత పెంచింది. ట్రంప్ చపలచిత్తం పుణ్యమా అని ఇతర దేశాల దృష్టిలో అమెరికా శరవేగంగా విశ్వసనీయతను కోల్పోతూ వస్తోంది. అందుకు విరుద్ధంగా భారత్ మాత్రం అత్యంత నమ్మదగ్గ భాగస్వామ్య దేశంగా తన ప్రతిష్టను పెంచుకుంటూ వచ్చింది. పైగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ను ఏ దేశమూ ఇప్పుడు తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఇందుకు అమెరికా కూడా మినహయింపు కాదు. అందుకే వ్యవసాయ, పాడి తదితర కీలక రంగాలను అమెరికా పరిశ్రమలకు బాహాటంగా తెరిచేందుకు కరాఖండిగా నిరాకరించి కూడా ఒప్పందానికి ట్రంప్ను భారత్ ఒప్పించగలిగింది! అదే సమయంలో ట్రంప్ ఎంతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ప్రతి వ్యాఖ్యలకు దిగకుండా మోదీ పరిణతి ప్రదర్శించారు. చైనాతో స్నేహ గీతంట్రంప్ దూకుడుకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా వ్యూహాత్మకంగా చైనాకు దగ్గరయ్యేందుకు కూడా భారత్ వెనకాడలేదు. గతేడాది షాంఘై సహకార సమాఖ్య భేటీకి హాజరయ్యేందుకు ఏడేళ్ల అనంతరం మోదీ చైనాలో పర్యటించారు! ఆ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ట్రంప్ కూడా వాటిపై చిర్రబుర్రులాడారు. భారత్, రష్యాలను అమెరికా చివరికి చైనాకు కోల్పోయిందంటూ నిట్టూర్చారు! ఆ తర్వాత రెండు నెలలకే పుతిన్కు ఢిల్లీలో మోదీ రాచమర్యాదలు చేశారు.రష్యాతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇలా పలు అగ్ర రాజ్యాలతో భారత్ వ్యూహాత్మకంగా ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకుంటున్న వైనం కూడా ట్రంప్ను పునరాలోచనలో పడేసింది. భారత్ అక్కడితోనే ఆగలేదు. ట్రంప్ టారిఫ్లకు ప్రతీకా రంగా తాను కూడా అమెరికాపై సుంకాలు బాదింది! అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, తృణధాన్యాలపై ఏకంగా 30 శాతం టారిఫ్లు విధించింది. ట్రంప్లా గొంతెత్తి ప్రకటనలు చేయకుండా మౌనంగానే గత నవంబర్ నుంచే వాటిని వసూలు చేయడం కూడా ప్రారంభించింది.‘ఒప్పందం’పై మోదీ మౌనంభారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయిందని ట్రంప్ ప్రకటించినా, దానిపై మోదీ మాత్రం సూటిగా స్పందించకపోవడం విశేషం. అంతేగాక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ ఒప్పుకుందని, అమెరికా నుంచి దిగుమతులను ఏకంగా 500 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లనుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ మౌనమే వహించారు. కేవలం టారిఫ్ల తగ్గింపుకు హర్షం వ్యక్తం చేయడానికే తన స్పందనను పరిమితం చేయడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ ‘గోర్’ ఫ్యాక్టర్సెర్గియో గోర్. భారత్లో అమెరికా నూతన రాయబారి. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు వెనక ఆయన పాత్ర కీలకంగా నిలిచింది. ఇరు దేశాల సంబంధాలు కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిన తరుణంలో గత జనవరి 12న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎన్నడూ లేనంత బలోపేతం చేయడమే ఆ సందర్భంగా స్పష్టంగా ప్రకటించారు. ‘నిజమైన మిత్రులు తొలుత విభేదించవచ్చు. కానీ అంతిమంగా ఒక్కతాటిపైకే వస్తారు’ అని చెప్పుకొచ్చారు. అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరేదీ లేదని కూడా స్పష్టం చేశారు.ఖనిజాల అన్వేషణ, ఏఐ టెక్నాలజీ వాడకానికి సంబంధించి అమెరికా ఏర్పాటు చేసిన ‘పాక్స్ సిలికా’ కూటమిలో చేరాల్సిందిగా భారత్ను ఆహ్వానించారు కూడా. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభన కాస్తా ఆయన వచ్చిన మూడు వారాల్లోపే వీడిపోవడం విశేషం. ట్రంప్కు అత్యంత సన్నిహితునిగా గోర్కు పేరుంది. ఏ సందర్భంలోనైనా గోర్ను తాను పూర్తిగా విశ్వసిస్తానని ట్రంప్ చెబుతుంటారు. భారత్తో ఒప్పందం, టారిఫ్ల తగ్గింపు విషయంలో ట్రంప్పై ఆయన ప్రభావం చాలా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.మాకు సమాచారం లేదు: రష్యా మాస్కో: చమురు కొనుగోళ్ల నిలిపి వేతపై భారత్ నుంచి ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదని రష్యా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేసేందుకు భారత్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇకపై వెనెజువెలా నుంచే భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ మంగళవారం ఈ మేరకు స్పందించారు. భారత్తో వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.ట్రంప్ వ్యాఖ్య లను నిశితంగా పరిశీలి స్తున్నట్టు రష్యా ఇంధన రంగ వ్యవహారాలు చూసే ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ చెప్పారు. భారత రిఫైనరీల నుంచి ఒప్పందాల రద్దు దిశగా ఎలాంటి నోటీసులూ అందలేదని రష్యా ఇంధన శాఖ వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఉక్రెయిన్తో యుద్ధం అనంతరం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ భారీగా పెంచుకోవడం తెలిసిందే. ఆ దేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న దేశంగా కూడా నిలిచింది. దీనిపై అమెరికాతో పాటు యూరప్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయని సంగతి తెలిసిందే. -
పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ
‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’2024 అధ్యయనం ప్రకారం మన దేశంలో 25 లక్షల మంది క్యాన్సర్తో పోరాడుతున్నారు. గత ముపై ్ప ఏళ్లలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 24 శాతం పెరగడమే ఇంత భారీ సంఖ్యకు కారణం. అయితే క్యాన్సర్ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు సైకో అంకాలజిస్ట్లు. క్యాన్సర్ పోరాటంలో బాధితునికి సైకో ఆంకాలజిస్ట్లు అందించే సహాయం ఏమిటి?‘ఇటీవల మా అధ్యయనం ఏం చెబుతున్నదంటే క్యాన్సర్ ట్యూమర్తో పాటు మనసుకు కూడా వైద్యం చేయడం వల్ల క్లినికల్గా మంచి ఫలితాలు వస్తాయని. ఆంకాలజీ విభాగంలో సైకాలజీ ఇక ఎంత మాత్రం ఆప్షనల్ కాదు. తప్పనిసరి అవసరం’ అన్నారు న్యూఢిల్లీలోని ఎంఓసి క్యాన్సర్ కేర్ సెంటర్ వైద్యుడు డాక్టర్ నిఖిల్ హింతాని. ‘అందుకే దేశంలోని క్యాన్సర్ సెంటర్లలో సైకో ఆంకాలజిస్ట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది’ అన్నారాయన.క్యాన్సర్ బారిన పడటం ఎవరినైనా కుంగదీసే విషయమే. క్యాన్సర్ నిర్థారణ అయ్యాక ప్రతి పేషంట్కు తనవైన భావోద్వేగ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంతో పాటు వ్యాధిని ఎదుర్కొనాలి... ఈ రెంటి సమన్వయానికి కౌన్సిలింగ్ తప్పనిసరి అంటున్నారు క్యాన్సర్ నిపుణులు. అందుకే ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాటంలో సైకో ఆంకాలజిస్ట్ల ప్రాధాన్యం పెరిగింది.→ ఎవరీ సైకో ఆంకాలజిస్టులు?క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే నిపుణులను ‘ఆంకాలజిస్టు’ అంటారని తెలిసిందే. ఆ విభాగంలోనిదే ఈ ‘సైకో–ఆంకాలజీ’. సైకాలజీలో మాస్టర్స్ లేదా పిహెచ్డి చేసి, సైకో ఆంకాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు ‘సైకో ఆంకాలజిస్ట్లు’గా విధులకు సిద్ధమవుతారు. ఆంకాలజిస్ట్లతోటి, పేషంట్స్తోటి సమన్వయం చేసుకుంటూ పేషంట్ మనసుకు స్వాంతన ఇస్తూ వారిలో ధైర్యం నూరి పోయడం, క్యాన్సర్ను గెలవగలననే భరోసాను ఇవ్వడం వీరి ప్రధాన పని.→ క్యాన్సర్ నయమైన వారికీ అండగా..క్యాన్సర్ నయమైన తర్వాత కూడా క్యాన్సర్ విజేతలకు అనేక ఆందోళనలు ఉంటాయి. చికిత్స వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిని తట్టుకోలేక కొందరు కుంగి పోతుంటారు. అటువంటి వారికీ ‘సైకో–ఆంకాలజీ’ అండగా ఉంటుంది. తిరిగి మేలైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా సహజంగా జీవించాలో నేర్పుతుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్య సూత్రాలు, ఒత్తిడి లేని జీవనాన్ని పాటించేలా సూచనలు చేస్తారు సైకో–ఆంకాలజిస్టులు. క్యాన్సర్ నయం కాగానే అంతా మామూలై పోయిందని చాలామంది భావిస్తుంటారు. అక్కడి నుంచే అసలైన సవాళ్లు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం అత్యవసరమని, దానికి ‘సైకో– ఆంకాలజీ’ తోడ్పడుతుందని అంటున్నారు.→ దశాబ్ద కాలంగా ‘సైకో–ఆంకాలజీ’పై పెరుగుతున్న అవగాహన మనదేశంలో ఎక్కువగా రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు బాధితులుగా ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం. పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ బారిన పడితే ఇక ఆ కుటుంబంలో నెలకొనే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో క్యాన్సర్కు గురైన వారు ధైర్యంగా ఉంటే మిగిలినవారూ ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. అందుకు ‘సైకో–ఆంకాలజీ’ కీలక భూమిక పోషిస్తుంది. గత పదేళ్లుగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ‘క్యాన్సర్ని ఎదుర్కొవడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కునేలా వారిని సిద్ధం చేయడమే మా బాధ్యత’ అంటున్నారు ‘సైకో– ఆంకాలజిస్టులు’.మానసిక ధైర్యమే కొండంత అండసైకో ఆంకాలజీలో పేషంట్కు అవసరాన్ని బట్టి ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’, ‘స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్స్’, ‘యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ’, ‘స పోర్టివ్ ఎక్స్ప్రెసివ్ థెరపీ’, ‘సైకో థెరపీ’, ‘ఫ్యామిలీ అండ్ కపుల్స్ థెరపీ’, ‘ట్రామా ఇన్ఫార్మ్డ్ థెరపీ’... వంటి అనేక థెరపీలు సైకో ఆంకాలజిస్ట్లు అందిస్తారు. ఎన్ని మందులు ఉన్నా వైద్యులు ఇచ్చే భరోసా వారిలో కొండంత బలాన్ని నింపుతుంది. క్యాన్సర్ మీద ఉన్న అనేక అ పోహల కారణంగా ఈ వ్యాధికి గురైన వారు తీవ్ర మానసిక వేదనతో పాటు చుట్టూ ఉన్న వారి జాలిచూపులు, చికిత్స సమయంలో నొప్పి, తమకేమవుతుందోనన్న ఆందోళన, డబ్బు కోసం కుటుంబ సభ్యులు పడే ఆరాటం.. వీటన్నింటితో సతమతం అవుతుంటారు. సైకో–ఆంకాలజిస్టులు వారితో మాట్లాడి బతుకు మీద ఆశ కలిగించేందుకు ప్రయత్నిస్తారు. -
ఏ రంగు ఉప్పు మంచిది?
తెల్ల ఉప్పు.. లేత గులాబీ రంగు.. నల్ల ఉప్పు.. ఇలా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల ఉప్పులు వస్తున్నాయి. వీటిలో ఏది మంచిది? ఏది ఎక్కువ తీసుకోవాలి? ఏది తక్కువ తీసుకోవాలి? సగటు మనిషి రోజూ ఎంత ఉప్పు తింటే మంచిది? సోడియంతో పాటు పొటాషియం ఎంత నిష్పత్తిలో తీసుకోవాలో తెలుసా? ఈ అంశాలపై జాతీయ పోషకాహార సంస్థ ఏం చెబుతోంది?సాధారణంగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే ఉప్పు రెండు రకాలు. సముద్రపు నీటి ద్వారా తయారయ్యేది ఒకటి. భూగర్భ నిక్షేపాల నుంచి సేకరించినది రెండోది. ఇదే రాక్ సాల్ట్. సముద్రపు నీటిని తీరప్రాంతాల్లోని ఉప్పు కయ్యల్లో నిల్వచేసి ఎండగడితే నీరు ఆవిరై ఉప్పు తయారవుతుంది. ఈ ముడి ఉప్పును ‘ఉప్పు కల్లు’ అంటారు.ఉప్పు ఏదైనా ఒకటే – ఎన్ఐఎన్భారతీయ వైద్య పరిశోధనా మండలికి చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) జారీ చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ఉప్పు ఏదైనా ఒకటే. సముద్రపు తెల్లని ముడి ఉప్పుతో ఎడిబుల్ సాల్ట్, టేబుల్ సాల్ట్ లేదా సోడియం క్లోరైడ్ తయారు చేస్తారు. వీటిలో ఏ ఉప్పు అయినా పోషక విలువల్లో పెద్ద తేడా ఉండదు. శుద్ధి చేసిన ఉప్పు, శుద్ధి చెయ్యని ఉప్పు.. ఈ రెండు రూపాల్లో మనకు ఉప్పు దొరుకుతుంది.శుద్ధి చేసిన ఉప్పులో దాదాపు 99% స్వచ్ఛత ఉంటుంది. ముడి కల్లు ఉప్పు సుమారు 96% స్వచ్ఛతతో ఉంటుంది. తెల్లని ముడి ఉప్పును శుద్ధి చేసి సన్నటి రవ్వగా మార్చి, అయోడిన్ చేర్చి, గడ్డకట్టకుండా ఉంచే పదార్థాన్ని కలిపితే టేబుల్ సాల్ట్ సిద్ధమవుతుంది. ఉప్పులో సాధారణంగా సోడియంతో పాటు మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, గంధకం, నత్రజని వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి.ఇలా తయారుచేస్తారుసాధారణ తెల్లని శుద్ధి చేసిన లేదా శుద్ధి చెయ్యని ముడి ఉప్పుతో పాటు ప్రత్యేక వంటకాలకు లేదా ప్రత్యేక సందర్భాల్లో రాక్ సాల్ట్ను ఉపయోగిస్తుంటారు. రాతి నుంచి తయారయ్యే రాక్ సాల్ట్లో రెండు రకాలు ఉన్నాయి: లేత గులాబీ రంగు ఉప్పు, నల్ల ఉప్పు. వీటిలో స్ఫటికాల పరిమాణం, రంగు, వాసన వేరుగా ఉంటాయి. పింక్ సాల్ట్ను వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, బొగ్గు, విత్తనాలు, చెట్ల బెరడు వంటి వాటిని కలిపి ఎక్కువ కాలం నిల్వ చేస్తే నల్ల ఉప్పు తయారవుతుంది. ఏ రకమైన ఉప్పులోనైనా సోడియం స్థాయి దాదాపు ఒకేలా ఉంటుంది. రక్తపోటు తగ్గాలంటే అది ఏ ఉప్పు అయినా సరే పరిమితంగానే వాడుకోవటం ఉత్తమం.రోజుకెంత తీసుకోవాలి?ఎన్ఐఎన్ ఆహార మార్గదర్శకాల ప్రకారం.. ⇒ ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాములకు మించకుండా అయోడిన్ కలిపిన ఉప్పు తీసుకోవచ్చు. ⇒ మనం రోజుకు 400 గ్రా. కూరగాయలు, 100 గ్రా. పండ్లు తింటే 0.5 గ్రా. వరకు సోడియం వస్తుంది. కాబట్టి, రోజుకు 4.5 గ్రాములకు మించకుండా ఉప్పు తీసుకుంటే సరిపోతుంది.శాస్త్రీయంగా నిరూపితం కాలేదుపింక్ సాల్ట్ ఖేవ్రా సాల్ట్ మైన్ నుంచి వస్తుంది. బ్లాక్ సాల్ట్ అగ్నిపర్వత మూలాల నుంచి వస్తుంది. వీటి నాణ్యత ప్రాసెసింగ్ స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. వాటి ఉత్పత్తి మూలాలు వేరు కాబట్టి సముద్రపు నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే సాధారణ తెల్ల ఉప్పుతో పోల్చితే వాసన, రుచి మాత్రమే భిన్నంగా ఉంటాయి. అన్ని రకాల టేబుల్ సాల్ట్లో కనీసం 97–99% సోడియం క్లోరైడ్ ఉంటుంది. పోషకాహార దృక్కోణం నుంచి చూస్తే అన్ని రకాల లవణాలు సాధారణ ఉప్పుతో సమానంగానే ఉంటాయి. పింక్, బ్లాక్ సాల్ట్ వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న వాదనలు ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. – డాక్టర్ బి.అనిల కుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం -
ధ్యాన ప్రయాణం
కొన్ని పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చాక ఎంతకాలమైనా అవి మన హృదయాన్ని వీడిపోవు. అక్కడి ప్రకృతి సౌందర్యం, అద్భుతమైన మనుషుల ప్రవర్తన మన మనసులో అలాగే నిలిచిపోతాయి. అలాంటి వాటిలో అత్యుత్తమమైన స్థానం ‘తవాంగ్’కి దక్కుతుంది. అరుణాచల్ప్రదేశ్లో ఉన్న ‘తవాంగ్’ ఒక హిల్ స్టేషన్ మాత్రమే కాదు. మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే అత్యుత్తమమైన డెస్టినేషన్. పర్వతాల మధ్యలో, మేఘాల నడుమ, బౌద్ధ మత సారాన్ని గ్రహిస్తూ సాగే ధ్యాన ప్రయాణం విశేషాల గురించి ట్రావెలర్ ఎం.జి. కిషోర్ వివరిస్తున్నారు...మహిళా సన్యాసుల మఠాలుతవాంగ్లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ (జడలు బర్రె) మిల్క్తో చేసిన టీ తాగాను. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.తవాంగ్లో కొన్ని బౌద్ధ మఠాలను కేవలం మహిళా సన్యాసులు మాత్రమే నిర్వహిస్తారు. దలైలామా పుట్టినరోజు సందర్భంగా తవాంగ్ వెళ్లాను. ఒక మహిళా మఠానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు ఇచ్చిన యాక్ (జడలు బర్రె) మిల్క్తో చేసిన టీ తాగాను. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉన్నా, నాలాంటి ప్రయాణికులు వచ్చినప్పుడు నిష్కల్మషమైన చిరునవ్వుతో పలకరించే విధానం అరుదుగా కనిపించే విషయం.ఇక్కడ చేయాల్సిన 5 పనులు 1. తవాంగ్కు బయల్దేరినప్పుడు మీకు ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బంది అనిపిస్తే అరుణాచల్ ప్రదేశ్లో అతి ఎత్తైన పర్వత మార్గం ‘సేలా పాస్’ వచ్చిందని అర్థం. ఘనీభవించిన సేలా సరస్సు మీదుగా ప్రయాణించవచ్చు. స్వర్గ సరస్సు అని దీనికి పేరు. ఈ ప్రయాణం అత్యద్భుతంగా అనిపిస్తుంది.2. తవాంగ్లో వార్ మెమోరియల్, పీ.టి.సో లేక్, ఉర్గేలింగ్ మోనాస్టరీ ... తప్పక సందర్శించదగినవి. 3. అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అక్కడికి వెళ్లి, శిలాఫలకాలపై చెక్కిన సూక్తులు చదివి, అర్ధం చేసుకోవచ్చు.4. బౌద్ధమతంలో కీలక ప్రదేశం కాబట్టి ఇక్కడ జీవహింసకు తావు ఉండదు. కాబట్టి మీరు చీకటి పడ్డాక బయటికి వెళ్తే ఒక డజను కుక్కలు కనిపిస్తే షాక్ అవ్వకండి. అలాగని ఈ కొండ కుక్కలను తేలికగా తీసుకోకండి. ఎక్కడ బయట తిరగాలన్నా చీకటి పడేలోపే అని గుర్తుంచుకోవాలి. 5. తవాంగ్ మోనాస్టరీలో మీరు బౌద్ధ సన్యాసులను జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చు.సందర్శనీయ స్థలాలు తవాంగ్లో అన్ని దిశల్లో సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. తవాంగ్ మోనాస్టరీ నుంచి అన్నీస్ నన్నరీ అనే మహిళల మఠం, లోకల్ మార్కెట్లు, ఇక్కడి చిన్న చిన్న కేఫ్లు, విండ్ హార్స్ అని పిలిచే రంగురంగుల పతాకాలు, ఇవన్నీ ఎవర్గ్రీన్ మెమరీలుగా మిగిలిపోతాయి. ఇక టౌన్ నుంచి బయటికి వస్తే మాధురీ లేక్ చుట్టూ ఉన్న ప్రశాంతత, భారత్–చైనా సరిహద్దు వద్ద ఉన్న బూమ్లా పాస్ ప్రయాణం, మధ్య మధ్యలో కనిపించే ఎన్నో సరస్సులు, ఇవన్నీ మర్చిపోవడం దాదాపు అసాధ్యం.చైనా బార్డర్ ఉన్న బూమ్లా పాస్ వెళ్లాలంటే మీకు ఇన్నర్ లైన్ పర్మిట్తో పాటు లోకల్ అధికారుల నుంచి అనుమతి కూడా అవసరం అవుతుంది. మీరు ఇక్కడ బైక్ రెంట్కు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. ఆర్మీ క్యాంపుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధం అని తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం.చూరా సబ్జీఅరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయినప్పటి నుంచి మెనూలో మార్పు కనిపిస్తుంది. ఇక్కడ తూ΄ా, చౌమీన్, మోమోస్, అ΄ాంగ్, చూరా సబ్జీతో ΄ాటు అనేక రకాల కొత్త రుచులను ఆస్వాదించవచ్చు.నేను బస చేసిన వారికే ఉదయం బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయమని చె΄్పాను. దాంతో మధ్యాహ్నం సమయంలోనే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగాను. మీరు డ్రాగన్ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల నార్త్ ఈస్ట్ వెరైటీలు లభిస్తాయి.ఇక్కడ ప్రతి ఇంటి ముందు టన్నుల కొద్దీ బంగాళాదుంపలు కనిపిస్తాయి. వాటిని కూరల్లో వినియోగించడంతో ΄ాటు జస్ట్ ఉడకబెట్టి ఉప్పు, మసాలా వేసుకుని తినేస్తారు. ఈ అలవాటు నాకు కాస్త కొత్తగా అనిపించింది. ఎలా వెళ్లాలి?!∙తవాంగ్కు వెళ్లే మార్గం కూడా తవాంగ్ ఎక్స్పీరియెన్స్ లో భాగమే. గమ్యం కన్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలని నేర్పే జర్నీ ఇది. ∙గౌహతికి అన్ని ప్రాంతాల నుంచి బస్సు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ∙గౌహతి నుంచి తవాంగ్ వెళ్లే దారిలో పర్వతాల మధ్య మెలికలు తిరిగే రహదారులు, మధ్యలో చేతికి అందేంత దూరంలో మేఘాలు, బ్రహ్మపుత్ర లోయ, దిరాంగ్ వ్యాలీ, వాటిని తడిపేస్తూ ముందుకు వెళ్తున్న బ్రహ్మపుత్ర నది.. ఇవన్నీ మనసును మరో లోకంలో విహరింపజేస్తాయి. గమనిక : తవాంగ్ వెళ్లడం కోసం మంచి ట్రావెల్ హిస్టరీ ఉన్న బస్సు లేదా ట్యాక్సీని మాత్రమే ఎంచుకోవాలి.ఎక్కడ ఉండాలి?∙తవాంగ్లో హోమ్స్టేలు, లోకల్ హౌసులు, మోనాస్టరీ చుట్టూ ఉన్న చిన్న చిన్న లాడ్జీలు అన్నీ కూడా ఈ టౌన్ థీమ్లో పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి. ∙హిల్ వ్యూ ఉన్న రూమ్లోంచి ఉదయం సూర్యోదయం చూసిన తరువాత అరుణాచల్ ప్రదేశ్ను ‘‘ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్’’ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. ఎందుకంటే భానుడి తొలికిరణం ఇక్కడే పడుతుంది.అతిపెద్ద మఠంభారతదేశంలోనే అతిపెద్ద మోనాస్టరీ అనే మఠం తవాంగ్లో ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మఠం. ఈ మోనాస్టరీలో ఉదయం, సాయంత్రం బౌద్ధ సన్యాసుల ్రపార్థనలు, యాక్ నెయ్యితో వెలిగే దీపాలు, సన్యాసులు నడిచే మార్గాలు, మోనాస్టరీ లోపల చిత్రకళ... ఇవన్నీ మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.లోనార్ లేక్ దక్కన్ పీఠభూమిలో అంతరిక్ష రహస్యంభూమికి, అంతరిక్షానికి మధ్య జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సాక్ష్యంగా నిలుస్తుంది మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. ఎన్నో సందేహాలతో పాటు కుతూహలం కలిగించే ప్రదేశం ఇది. అలాగే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రదేశం కూడా. ఎందుకంటే ఇది మనకు తెలిసిన చరిత్రకు ముందు జరిగిన చరిత్ర.ఇక్కడ ఒకానొక కాలంలో ఉల్క పడటం వల్ల భారీ గుండం ఏర్పడింది అని, అది తరువాత సరస్సుగా మారిందని చెబుతారు. సాధారణంగా ఇలాంటి క్రేటర్లు వేల నుంచి లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటాయి. ఈ క్రేటర్లు భూమి – అంతరిక్షం మధ్య ఉన్న చరిత్రకు సాక్ష్యాలు. సౌరమండలంలో జరిగిన మార్పులకు చిహ్నాలు అని కూడా చెప్పవచ్చు. అలాగే భూమిపై జీవనం ఎలా వికసించింది అనేది తెలుసుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి. చుట్టుపక్కల ఉన్న రాళ్లలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కావాలంటే మీరూ ఒకసారి ప్రయత్నించవచ్చు. ఉదయం వేళ పక్షుల కిలకిలారావాలతో పాటు, చాలా తక్కువ సంఖ్యలో పర్యాటకులను కూడా చూడవచ్చు. లోనార్ లేక్ పర్యావరణ వ్యవస్థ అనేది చాలా సున్నితమైనది. అందుకే దీనిని పర్యాటక ప్రాంతంగా ప్రమోట్ చేయడం లేదు. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చు. పర్యాటకులు పరిశీలించవచ్చు. అంతే కానీ, లోనార్కు వెళ్లి ‘చూసొచ్చాం’ అని కాకుండా భూమి చరిత్రను ‘తెలుసుకుని వచ్చాం’ అని చెప్పడం బెస్ట్.ఫోన్లో ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి?!ప్రయాణాల్లో డాక్యుమెంట్స్ చూపించమని అధికారులు కోరితే పేపర్లు వెతికే అవసరంఈ రోజుల్లో లేదు. మీ ఫోన్ లోనే అన్నీ సేవ్ చేసుకోండి. ఈ సింపుల్ టిప్స్ మీకోసం..∙ఈ రోజుల్లో చాలా మంది ప్రయాణికులు తమ డాక్యుమెంట్స్ అంటే ఐడీ ప్రూఫ్స్, హోటల్ బుకింగ్, ట్రైన్ వివరాలు అన్నీ కూడా ఫోన్ లోనే సేవ్ చేసుకుని బయల్దేరుతున్నారు. పేపర్ ఫైల్స్ క్యారీ చేయడం కన్నా స్క్రీన్ పై డిపెండ్ అవ్వడం ఇప్పుడు సాధారణం అయింది. అయితే దీని కోసం ఒక చిన్న డిజిటల్ ట్రావెల్ హ్యాబిట్ను మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ∙ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లౌడ్ స్టోరేజీలో (Google Drive లాంటివి) ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకోండి.∙ఇందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ , టికెట్లు, కన్ఫర్మేషన్స్ , వీసా.. ఇలా అన్ని డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫోన్ పోయినా లేదా బ్యాటరీ లో అయినా గూగుల్ డ్రైవ్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.∙తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్పోర్టులో, రైల్వే కౌంటర్లో, హోటల్ రిసెప్షన్ లో హఠాత్తుగా ఎవరైనా డాక్యుమెంట్స్ అడిగినప్పుడు బ్యాగ్లలో వెతకడం కన్నా ఫోన్ లో డాక్యుమెంట్స్ క్షణాల్లో వారికి చూపించవచ్చు.హంపి ఇక్కడ ప్రతి రాయికీ ఓ కథ ఉందిహంపి అంటే చాలా మంది శిధిలాల నగరం అని పిలుస్తుంటారు. కానీ హంపిలో అడుగుపెట్టగానే మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్.. ఇవి శిథిలాలు కాదు. ఇవి పురాతనమైన నగరం తాలుకూ ఙ్ఞాపకాలు అని!హిస్టరీ క్లాసుల్లో వినేటప్పుడు బోర్ కొట్టిన విషయాలను ఇక్కడి శిథిలాలు నోరు తెరచి తమ కథను చెబుతున్నట్టు అనిపిస్తుంది. రాళ్లకు జీవం ఉండదు. అయితే హంపీ జీవం లేని ప్రదేశం కాదు. ఇక్కడ రాళ్లు, ఆలయాలు, నదీ శబ్దం ఇన్నీ కూడా మనల్ని పర్యాటకులుగా కాదు ఒక చరిత్రకారుడిలా ట్రీట్ చేస్తాయి. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి మనం గతంలోకి వెళ్లిపోతాం. సూర్యాస్తమయం సమయంలో హంపీ రంగులు ఒక అందమైన కవిత్వంలా కనిపిస్తాయి. రాళ్ల రంగును డామినేట్ చేసే బంగారు వర్ణం ఒక డిఫరెంట్ షేడ్లా మారిపోతాయి. చరిత్రను మనం పుస్తకాల్లో చదవడం అలవాటు చేసుకున్నాం. కాని పుస్తకాలు దాటి అర్థం చేసుకునే అవకాశం మాత్రం హంపీ లాంటి ప్రదేశాల్లోనే దొరకుతుంది.లంగ్కావిస్ట్రెస్ నుంచి బ్రేక్...లంగ్కావి వెళ్తే సరి!మలేషియాలోని లాంగ్కావి ద్వీపంలో అడుగు పెట్టగానే టైమ్ బ్రేక్ తీసుకుందేమో అనిపించకమానదు. అంతా కాస్త స్లో అవుతుంది. అండమాన్ సముద్ర తీరంలో ఉన్న ఈ ఐలాండ్ బీచులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. క్రౌడ్, సౌండ్, హడావిడి లేని బీచ్ ఎక్స్పీరియెన్స్ కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. మొత్తానికి, స్లో టూరిజం ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.ఎలా చేరుకోవాలంటే...లంగ్కావికి విమానంలో సులభంగా చేరుకోవచ్చు. కౌలాలంపూర్ నుంచి ప్రతీ రోజూ డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగా కౌలాలంపూర్ చేరుకుని, అక్కడి నుంచి దేశీయ విమానాల్లో లాంగ్కావికి ప్రయాణిస్తారు. అలాగే, ఇక్కడికి చేరుకునేందుకు ఫెర్రీ ఆప్షన్ కూడా ఉంది. పెనాంగ్ లేదా కౌలా కెదాహ్ నుంచి లాంగ్కావికి రెగ్యులర్ ఫెర్రీలు నడుస్తాయి.చిరుగాలుల సవ్వడి..లాంగ్కావిలో యాక్టివిటీస్ అంటే సుడిగాలిలా కాకుండా చిరుగాలిలా ఉంటాయి. సింపుల్ అండ్ స్మూత్ యాక్టివిటీస్ ఉంటాయి. బీచ్ వాక్, సన్ సెట్ చూడటం, మాంగ్రోవ్ వనాల్లో బోట్. లాంగ్కావి అనేది సాధారణ పర్యాటక ప్రదేశం కాదు. హడావిడి ఉండదు, ట్రావెల్ లిస్ట్ కంప్లీట్ చేయాలనే తొందర కూడా కనిపించదు. కాబట్టి, నిజంగా బుర్రకు బ్రేక్ కావాలి అంటే.. లాంగ్కావి బెస్ట్ ప్లేస్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.పర్యటన కాలం∙ పర్యటనకు సరైన సమయం అనేది సీజన్ ను బట్టి మారుతుంది. మంచు చూడాలనుకుంటే చలికాలంలో వెళ్లొచ్చు. ∙ తవాంగ్ను ప్రశాంతంగా చూడాలంటే చలికాలానికి ముందు వెళ్లడం మంచిది. ∙ వర్షాకాలం మాత్రం ప్లాన్ చేయకపోవడం ఉత్తమం.∙ మొత్తానికి నార్త్ ఈస్ట్ ఎంత అందంగా ఉంటుందో స్వయంగా కళ్లతో సందర్శిస్తేనే తెలుస్తుంది. ఒక్కసారి వెళ్తే ఈ ప్రయాణం మైండ్లో స్టోర్ అయి, గుండెలో రిపీట్ మోడ్లో ప్లే అవుతూనే ఉంటుంది.– ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు -
నా చేతి వేళ్ళు
ఈ మధ్య రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్రమాత్ర కూడా పని చేయడం లేదు. ఏదైనా నవలో, కథో చదువుకుందామంటే కుదరదు. లైట్ వేస్తే, మా ఆవిడ చిరాకు పడుతుంది. పాపం తనకు కూడా నాలాగే వార్ధక్యం ముంచుకొచ్చింది. ఎప్పుడో గాని ఆమెకు నిద్ర పట్టదు. ఆ సమయంలో నేనే డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజు కూడా అంతే! మెల్లిగా లేచి బాల్కనీలోకి నడిచాను. నగర సుందరికి కూడా నాలాగే నిద్ర పట్టడం లేదేమో! రోడ్లన్నీ కదులుతున్న వాహనాల లైట్ల వల్ల దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నప్పుడు మా నాన్న చిటికెన వేలు పట్టుకుని వచ్చినప్పుడు విస్తుపోయి చూశాను, నగర సౌందర్యాన్ని. అప్పటి నుండి చూస్తున్నాను నగరం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంది. ఏ నగరానికీ ఎప్పుడూ వార్ధక్యం రాదు, మనుషుల్లాగా, నాలాగా! నేను వార్ధక్యంలోకి వచ్చాను గాని, తరతరాలుగా నగరాలు యౌవ్వనంగానే ఉంటాయి. నాకైతే శరీరానికి వచ్చిన ఈ ముసలితనం అస్సలు నచ్చడం లేదు. ఇవ్వాళ మరీ ఘోరం! మంచినీళ్ళు తాగుదామని, మంచం పక్కనే ఉన్న నీళ్ళ సీసాను చేతుల్లోకి తీసుకుని, ఎంత ప్రయత్నించినా, దాని మూత తీయలేకపోయాను. చేతులు వణుకుతున్నాయి. చేతుల్లో బలం లేకుండా పోతుందేమో? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాను, మరీ ఇవ్వాళే ఎందుకిలా? రోజురోజుకి... మొన్నటికి మొన్న టాబ్లెట్ షీటు నుండి, అల్యూమినియం ఫాయిల్ తుంచి టాబ్లెట్ తీసుకోవడానికి, కత్తెరను ఉపయోగించాల్సి వచ్చింది. నా చేతులు నాకు అన్యాయం చేస్తున్నాయా? నా చేతులను చూసుకున్నాను. నాకేం తేడా కనిపించడం లేదు. కాని, ఎందుకిలా?... నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు చేతులు వణుకుతున్నాయంటే అది పార్కిన్సన్ వ్యాధి లక్షణమని. అప్రయత్నంగానే, నా చేతుల్లో ముఖాన్ని దాచుకుని భోరున ఏడ్చాను. వృద్ధాప్యం మనిషిని ఇంత డొల్లగా మార్చేస్తుందా? నా రెండు చేతులు, నా వేళ్ళు మామూలివి కాదు. అందరూ కాళ్ళ మీద పరిగెడితే, నేను నా చేతి వేళ్ళ మీద పరిగెత్తాను. అటువంటి నా చేతులు బలహీనంగా, దీనంగా మారుతున్నాయా? నా చేతులూ, వేళ్ళూ నన్నింత మోసం చేస్తాయనుకోలేదు. ఆ చేతులను చూస్తూ ఉంటే, మనసు ఒక దృశ్యం వైపు పరిగెత్తుతుంది. నా చదువు మధ్యలో ఉండగానే, మా నాన్న చనిపోయాడు. నడి సముద్రంలో, లంగరు లేని పడవలా, మా బతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. కారుణ్య నియామకం కింద దిగువ శ్రేణి గుమాస్తాగా ప్రభుత్వం నన్ను నియమించింది. నేను ఏప్రిల్ 1975 లో ఉద్యోగంలో చేరాను. తినడానికి తిండి దొరికింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్న లేడన్న మాటే గాని, రోజులు యథావిధిగా నడుస్తున్నాయి. ఒక్క రెండు నెలలు గడిస్తే నా బీయస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యేవి. కాని, ఎవరికీ దాని గురించి, నా గురించి పట్టింపే లేదు. నన్ను నరకకూపంలోకి తోసి, వాళ్ళంతా హాయిగా ఉన్నారు. కాని, మా నాన్న మరణించిన ఆఫీసులో, ఆయన కూర్చుని ప్రాణం వదిలిన కుర్చీలోనే కూర్చొని, పని చేయడం నాకు మాత్రం ప్రతి దినం ప్రాణగండంగా ఉండేది. అలా, పంతొమ్మిదేళ్ళ వయసులో ఉన్న నేను మాత్రం లోలోపలే దహించుకు పోయేవాడిని. భవిష్యత్తు గురించి నేను కన్న కలలన్నీ దగ్ధమయిపోయాయి. నాకు మెడిసిన్లో సీటు వచ్చినా, నన్ను చదివించలేనని మా నాన్న బాధపడుతుంటే, నేనే ‘ఫర్వాలేదు నాన్నా! బీయస్సీలో చేరుతాను.’ అని ఓదార్చాను. బీయస్సీ తర్వాత యమ్మెస్సీ, అటు తర్వాత కెమిస్ట్రీలో రీసెర్చి చేయాలనీ, లేదా యంబీఏ చేయాలనీ ఎన్నో ఆశలుండేవి. అవన్నీ ఇప్పుడు అందని ద్రాక్షలే! కనీసం బీయస్సీ అయినా పూర్తి చేయగలనా లేదా అన్నదే, ప్రస్తుతం నన్ను పీడిస్తున్న సమస్య. నేను రెండు నెలలు సెలవు పెట్టి బీయస్సీ పరీక్షలు రాస్తానంటే ఇంట్లో, బయటా, ఆఫీసులో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే, నేను సెలవు పెట్టినన్ని రోజులకు జీతం రాదు, అదీ వాళ్ళ బాధ. అలా అందరూ కట్టకట్టుకుని వద్దనే సరికి నాలో మరింత పట్టుదల పెరిగింది. నేను సెలవు పెట్టే తీరుతాననుకున్నాను. అలాగే చేసి, బీయస్సీ పరీక్షలు రాశాను. మొదటి నుంచీ మా నాన్న చెప్పిన ఒక్క సూత్రాన్నే నేను పాటించే వాడిని. పదిసార్లు చదివిన దాని కన్నా ఒకసారి రాయడం వల్ల విషయం గుర్తుంటుందనే వాడు. అందుకే పరీక్ష సమయానికి గంట ముందు వరకు నేను సమాధానాలు రాస్తూ ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే, ఈ పరీక్షలు నాకు జీవన్మరణ సమస్య. ఇప్పుడు బీయస్సీ పాస్ కాకపోతే మళ్ళీ రాసే ఓపికా ఉండదు, వీలు కలగదని నాకు తెలుసు. అందుకే, నా మెదడును నా వేళ్ళల్లో నింపి, ప్రాక్టీసు చేశాను. ఎందుకంటే నాకు ప్రిపరేషన్కు ఉన్న సమయం చాలా తక్కువ. మిగిలిన సహాధ్యాయులకున్న ప్రిపరేషన్ లగ్జరీ నాకు లేదు. ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలి. రాసుకోవాలి. పరీక్షలు రాయాలి. ఆరు పేపర్లకు ఉన్న మూడు గంటల పరీక్షలను అలవోకగా రాశాను. బీయస్సీ మంచి మార్కులతో పాసయ్యాను. అతి సులభంగా లభించవలసిన విజయం, నాకు అతి కష్టం మీద లభించింది. అయినా కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాన్న మరణంతో నేను చాలా కృంగిపోయాను. గుండు చేయించుకోవడంతో న్యూనతభావం నన్ను మరింత దిగజార్చింది. అంతకు ముందు వరకు కాలేజీలో యాక్టివ్గా ఉండే నేను, ఒక శిక్ష పడ్డ దోషిలా తలవంచుకుని ఒక మూలలో నిలబడేవాణ్ణి. అటువంటిది నేను బీయస్సీ పాస్ కావడం, కెమిస్ట్రీలో యూనివర్సిటీ రాంక్ రావడంతో నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. మా కెమిస్ట్రీ లెక్చరర్లు నన్ను యంయస్సీ చేయమనీ, లెక్చరర్లంతా కలిసి ఫీజులు కడతామని ఎంతగానో చెప్పారు. కాని, నేను ఆల్రెడీ ఒక భారాన్ని, అవమానాన్ని మోస్తూ బతుకునీడుస్తున్నాను. దానికి అదనంగా మరొకరి దయాదాక్షిణ్యాలను భరించే శక్తి లేదు నాకు. లెక్చరర్లు, యూనివర్సిటీ ఖర్చులు భరించినా, నా మీద ఆధారపడిన నా కుటుంబ సభ్యుల కడుపులు నింపవలసిన బాధ్యతను నేను మరవలేను కదా? అయితే, ఆ పరీక్షలతోనే నా చేతులకు, నా చేతి వేళ్ళకు ఉన్న శక్తి తెలిసింది.అంతకంటే, ముఖ్యంగా నా శక్తి మీద నాకు నమ్మకం కలిగింది. ఎన్ని సమస్యలున్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా పరీక్షా సమయంలో అవేవీ నా ఏకాగ్రతను భంగం చేయలేకపోయాయి. నా చేతి వేళ్ళే నా ఆయుధాలుగా మార్చుకుని, జీవితంలో మరో పోరాటానికి సమాయత్తమయ్యాను. 1970, 80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్ల ద్వారానే జరిగేవి. నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. బీయస్సీ గ్రాడ్యుయేట్ అంటే అప్పట్లో కొంత గౌరవం ఉండేది. కాని, మామూలు క్లరికల్ ఉద్యోగాలకు, పదవ తరగతి మాత్రమే విద్యార్హత కాబట్టి, విపరీతమైన పోటీ ఉండేది. అది కూడా సీనియారిటీని బట్టే పిలుపు వస్తుంది. ఎక్సే్ఛంజ్ ముందు నోటీసు బోర్డులో, ఏయే ఆఫీసుల్లో ఏయే ఖాళీలు ఉన్నాయో లిస్టులు పెట్టేవారు. అలా చాలా రోజుల నుంచి ఆ బోర్డులో పెట్టి ఉన్న ఒక నోటీసు నన్ను ఆకర్షించింది. అది కలెక్టర్ కార్యాలయంలో, స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన నోటీసు. ఎంక్వైరీ చేస్తే అది నిజమేనని డిగ్రీ, టైప్ హయ్యర్, షార్టుహ్యాండ్ లోయర్ పాస్ ఉంటే అర్హత లభిస్తుందని చెప్పారు. ‘మరి ఇన్ని నెలల నుంచి నోటీసు బోర్డులో ఉంది. అభ్యర్థులు రావడం లేదా?’ అన్న నా ప్రశ్నకు ‘ఈ రోజుల్లో షార్టుహ్యాండ్ పాసయిన వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటీ? షార్టుహ్యాండ్ పరీక్ష పాస్ కాగానే వారి కోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత, ఆ సర్వీస్ వదులుకుని కొత్త పోస్టులోకి ఎందుకు వస్తారు?’ అని చెప్పారు. నేను ఆలోచనల్లో పడ్డాను. మా నాన్న బతికున్న రోజుల్లో బలవంతాన టైపురైటింగులో చేర్పించడంతో, నేను టైప్ హయ్యర్ పాసయ్యాను. అలాగే, ఎక్కడో ఉచిత షార్టుహ్యాండ్ కోచింగ్ అంటే అందులో చేరి అరవయ్యవ ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్నాను. కాని, టెక్నికల్ బోర్డు పరీక్షలు రాయలేకపోయాను. స్టెనో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలిసినప్పటి నుండి నాలో ఒక నూతనోత్సాహం పెరిగింది. స్టెనో ఉద్యోగం పెద్దదేమీ కాకపోవచ్చు. కానీ, ఈ కారుణ్య నియామకం అన్న పదమే నచ్చడం లేదు. నాన్న చనిపోయిన సీట్లో కూర్చుని, ఆయన డీల్ చేసిన ఫైళ్ళలో నోట్ రాయడమంటే, నాకు నరకం కనిపిస్తుంది. ఇటువంటి సున్నితమైన విషయాలను ఎవ్వరూ అంత సులభంగా అర్థం చేసుకోరు. కాని, నా భార్య మాత్రం నన్ను ప్రోత్సహించింది. రోజువారీ కుటుంబ బాధ్యతలను చేపట్టడానికి మా ఇంటికి కోడలు కావలసి వచ్చింది. అలా ఇంటికి పెద్దవాడిగా నా పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక అనంత సాగరంలో, కాగితపు పడవ మీద, సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. షార్టుహ్యాండ్ పరీక్ష వివరాలు తెలుసుకున్నాను. కాని, ఇన్స్టిట్యూట్లలో చేరి పరీక్ష రాయడానికి సంవత్సరం పడుతుందన్నారు. కాని, నా కంత టైము లేదు. నాకు ఆల్రెడీ అరవై ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్న అనుభవం ఉంది. దేవుణ్ణి తలచుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టాను. షార్టుహ్యాండ్ ప్రాక్టీసు కోసం ముఖ్యంగా కావలసినవి ప్రశాంతమైన, నిశ్శబ్దంగా ఉండే రూము, డబుల్ లైనులో ఉండే ప్రత్యేకమైన నోట్ బుక్స్, పెన్సిళ్ళు. ఒకటి, రెండున్నరేళ్ళ వయసున్న మా అమ్మాయిలను, నా భార్య గొడవ చేయకుండా చూడడం వలన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. నేను షాపుల్లో దొరికే ఖరీదైన షార్టుహ్యాండ్ నోటు బుక్కులు కొనలేని పరిస్థితి. కాబట్టి, తెల్ల కాగితాలు, అర ఠావు, పావు ఠావు అని అప్పట్లో హోల్ సేల్గా దొరికేవి. అవి తెచ్చి కట్ చేసి, నోటు బుక్కులుగా కుట్టించేది నా భార్య. పెన్సిళ్ళు మాత్రం కొనాల్సిందే. ఎందుకంటే, షార్టుహ్యాండులో రాసే స్ట్రోక్స్ కొన్ని లైట్ కలరులో కొన్ని చిక్కటి కలరులో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, గీత మీద లైటు కలరులో ఏటవాలుగా ఒక పావు ఇంచు గీత లైట్ కలరులో రాస్తే ‘పి’ అనీ, దాన్నే ‘పే’ గా కూడా చదువుకోవచ్చు. అదే ఒత్తుగా రాస్తే ‘బి’ అనీ; అదే ‘బే’ కూడా అవుతుంది. అందుకని మంచి పెన్సిళ్ళు ముఖ్యం. ఆయుధాలన్నీ సర్దుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అది మామూలు ప్రాక్టీసు కాదు. ఒక మహా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా ప్రాక్టీస్ మొదలయింది. లక్ష్యం తొంభై రోజుల్లో జరిగే షార్టుహ్యాండ్ లోయర్ స్పీడ్ ఎగ్జామ్. నిముషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని, ఆ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి లిపిబద్ధం చేసి, రాసి చూపించాలి. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఐదారేళ్ళు క్లర్కుగా పనిచేశాను కాబట్టి, నాకు డ్రాఫ్టింగ్ పట్ల అవగాహన ఉంది. ఇంగ్లీష్ భాషలో వాక్య నిర్మాణం, వ్యాకరణం, పంక్చుయేషన్ మార్కుల గురించిన పరిజ్ఞానం, నాకు షార్టుహ్యాండ్ పరీక్షకు బాగా ఉపయోగపడింది. నేను ప్రాక్టీస్ మొదలు పెట్టిన పది రోజులకు నాకు ఒక విషయం అవగతమయింది. షార్టుహ్యాండులో, అవతలి వ్యక్తి ఇచ్చిన డిక్టేషన్ ను రాసుకుని, ఇంగ్లీషులోకి ట్రాన్స్క్రైబ్ చేయడమే ముఖ్యం. అందుకోసం షార్టుహ్యాండ్ స్ట్రోక్సే అవసరం లేదు. ఉదాహరణకు, ఒక డిక్టేషన్లో ’హైదరాబాద్’ అనే పదాన్ని స్ట్రోక్లో రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ స్ట్రోక్ రాసే బదులు ’ఏ’ అని రాసుకుంటే సరిపోతుందని నాకనిపించింది. అట్లాగే చెబుతున్న డిక్టేషన్లోని సబ్జెక్టును బట్టి, ‘పార్లమెంట్’ అని వస్తే, ‘పీ’ అని రాసుకుంటే, తర్వాతి పదాలను సులువుగా రాసుకోవచ్చని నాకర్థమయింది. అయితే అందుకు ఇంగ్లీషు భాష మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇంగ్లీషు వార్తాపత్రికలు చదివితే, ఆ పరిఙ్ఞానం వస్తుంది. నేను రోజుకు ఇరవై గంటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి. తిండీ తిప్పలు పట్టించుకోలేదు. బాత్రూములో ఉన్నా పదాలను షార్టుహ్యాండులో వేళ్ళ మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. బొటన వేలితో మిగిలిన వేళ్ళ మీద స్ట్రోక్స్ రాసేవాణ్ణి. కళ్ళ ముందు ఏ వస్తువు కనబడ్డా, ఏ మనిషి కనబడ్డా ఆ పేర్లను వేళ్ళ మీద షార్టుహ్యాండులో రాసే ప్రయత్నం చేసేవాణ్ణి. ‘చెంబు’ కనపడితే, చెంబుని స్ట్రోక్సులో బొటన వేలుతో, చూపుడు వేలు మీద రాసేవాణ్ణి. నడుస్తున్నప్పుడూ, భోంచేస్తున్నప్పుడూ, పిల్లలను ఎత్తుకున్నప్పుడూ, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడూ, బొటన వేలు, చూపుడు వేలు మీద చకచకా స్ట్రోక్స్ రాస్తూనే ఉండేవాణ్ణి. విశ్రాంతిగా ప్రాక్టీస్ మీద కూర్చున్నప్పుడు, మా ఆవిడ కుట్టిన పుస్తకాల మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. నేను ప్రాక్టీస్ చేసిన పుస్తకాలు మా చిన్న ఇంట్లో గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చేవి. కొన్ని పుస్తకాల్లోని రాతలను రబ్బరుతో తుడిచేసి మళ్ళీ ప్రాక్టీసుకు సిద్ధం చేసేవారు. షార్టుహ్యాండు పరీక్షలో స్పీడ్ ముఖ్యం. అందుకని, చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని, ఆంగ్ల పత్రికలలో వచ్చే సంపాదకీయాలను, నిమిషానికి వంద పదాలు వచ్చే విధంగా నేనే రికార్డ్ చేసుకుని, వాటిని షార్టుహ్యాండ్లో రాసేవాణ్ణి. కాని, దాని వల్ల నేనే డిక్టేషన్ చెప్పి, నేనే ట్రాన్సై్కబ్ చేయడంతో కొన్ని పదాలు నాకు ముందే తెలిసిపోవడం వలన, నేను సులువుగా రాయగలుగుతున్నానేమోనని నాకే అనిపించింది. దాంతో తెలిసిన వాళ్ళతో డిక్టేషన్ రికార్డు చేయించేవాణ్ణి. ఇన్స్టిట్యూటులో రిక్వెస్టు చేసి, అక్కడి స్పీడ్ డిక్టేషన్లను, రికార్డింగ్ చేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాణ్ణి. ఒకసారి, మా పొరుగున ఉన్న అంకుల్ వచ్చి, ‘అర్ధరాత్రి మీ ఇంట్లో నుండి ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. ఆ టైములో ఎవరు వింటున్నారు?’ అని అడిగాడు. నేను నా షార్టుహ్యాండ్ పరీక్ష గురించి చెప్పాను. ఆయన చాలా సంతోషపడి, ‘బెస్టాఫ్ లక్’ అని చెప్పాడు. మూడు నెలల్లో నేను ఆరు కిలోల బరువు తగ్గాను. బట్టలు లూజు అయిపోయాయి. కళ్ళు గుంటలు పడి, ముఖం పీక్కు పోయింది. గడ్డం పెరిగి, ఒక పిచ్చోడిలా తయారయ్యాను. కాని, నా ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. నిమిషానికి వంద పదాలు సులభంగా రాయగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం నా ముఖంలో తొణికిసలాడుతున్నట్టుగా నాకే తోచింది. పరీక్ష రోజున, పెన్సిల్ ముట్టుకోలేదు. ప్రశాంతంగా ఉన్నాను. దేవుడికి నమస్కరించి, పరీక్ష హాలుకు బయల్దేరాను. షార్టుహ్యాండ్ పరీక్షలో, అభ్యర్థులు కంగారు పడడం సహజం. కాని, నేను ఎటువంటి ఆందోళన లేకుండా, రిలాక్స్డ్గా కూర్చున్నాను. పరీక్ష మొదలయింది. కంచుకంఠంతో డిక్టేషన్ మొదలయింది. ఎగ్జామినర్ నోటి నుండి దొర్లుతున్న పదాలను చెవులు నిక్కించి స్పష్టంగా విని వాటికి స్ట్రోక్స్ రాయడం ప్రారంభించాను. నా చెవుల్లోకి వేరే శబ్దమే వినిపించడం లేదు. షార్టుహ్యాండ్ పరీక్ష మిగతా పరీక్షల్లా కాదు. ఒక్క పదం వినడం మిస్ అయితే కంగారు మొదలై తరువాత అనేక పదాలతో లంకె కుదరదు. అందుకని ఒక పక్కన ప్రపంచం బద్దలైపోతున్నా, పట్టించుకోకూడదు. అందుకే, చాలామంది, ఐదారు సార్లు షార్టుహ్యాండ్ ‘లోయర్’ పరీక్ష రాస్తే గానీ ఉత్తీర్ణత సంపాదించరు. ఆ ఎగ్జామ్ హాల్ వాతావరణం, ఆ హడావుడి, ఆ సందడి, ఆందోళన అనుభవంలోకి రావాలి. అప్పుడు గాని, డిక్టేషన్ మీద ఏకాగ్రత కుదరదు. నేను చకచకా ట్రాన్స్క్రైబ్æ చేసి పేపరు ఇచ్చేసి, ఇంటికి వచ్చి, అన్నం తిని, రెండు రోజుల పాటు పడుకున్నాను. నా చేతులూ, వేళ్ళూ ఎంత అలసిపోయాయో నాకే తెలుసు. ఆ మూడు నెలల్లో కొన్ని లక్షల పదాలు రాశాయి నా వేళ్ళు. కొన్ని వేల పుస్తకాలను నా చేతులు పట్టుకున్నాయి. ఒక మహా మరయంత్రంలా, చక్కటి ప్రిసిషన్తో మెదడు, చెవులు, చేతులు, వేళ్ళు పనిచేశాయి. రిజల్ట్స్ వచ్చాయి. నేను రాష్ట్రంలో ప్రప్రథముడిగా పాసయి, గోల్డ్ మెడల్ సాధించాను. ఆ క్షణంలో, నా భార్య నా చేతి వేళ్ళను ముద్దు పెట్టుకుంది. అది ఒక ప్రారంభం మాత్రమే. షార్టుహ్యాండులో నా ప్రజæ్ఞ వల్ల ఆ తర్వాత అనేక విజయాలు సాధించాను. బ్యాంకులో స్టెనోగ్రాఫర్, ఐఏయస్ ఇంటర్వ్యూ, గ్రూప్ పరీక్షల్లో ప్రప్రథముడిగా ఉద్యోగం రావడం జరిగిపోయాయి. ఇప్పటికీ, కొత్త పదం కనిపిస్తే నా బొటన వేలు, చూపుడు వేలు మీద రాయడానికి ప్రయత్నిస్తుంది. కాని, ఏం లాభం. ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది. నన్ను జీవితంలో విజేతగా నిలబెట్టిన నా చేతులు – నా మెదడు విన్న ప్రతి మాటను అక్షర రూపంలోకి లిపిబద్ధం చేసిన నా వేళ్ళు– ఇప్పుడు నా మాట వినడం లేదు. రాయడం అటుంచి, పెన్సిల్ కూడా పట్టుకోలేనంతగా వణుకుతున్నాయి. రుజాగ్రస్తుణ్ణయ్యాను అనుకునే సరికి కన్నీరు ఉబికి వచ్చింది. సన్నటి వాన మొదలయింది. బాల్కనీలో నుండి లోపలికి నడిచాను. వర్షానికి తడిస్తే ఆస్త్మా పెరుగుతుంది. అందుకే ఇన్హేలర్ పీల్చి, మంచం మీద కూర్చున్నాను. పక్కనే నా భార్య పడుకుని ఉంది. నాలాగా కాకండా తనెప్పుడూ మంచానికి ఎడమ వైపు పొందికగా పడుకుంటుంది. టైం ఎంతయిందో తెలియదు కాని, అది కచ్చితంగా బ్రాహ్మీముహుర్తమే. నా భార్య అలా ప్రశాంతంగా పడుకుని ఉండడం చూస్తే, మనసు ఆనందంతో నిండిపోయింది. కారణం తెలియదు. కొన్ని సంతోషాలకు కారణం ఉండదు. భగవంతుని దయ వలన ఇన్నేళ్ళూ ఒకరికొకరంగా బతికి సంసారాన్ని నడిపాము. పిల్లలు ప్రయోజకులయ్యారు. నా భార్య జుట్టును ప్రేమగా నిమిరాను. తను నిద్రలోనే, ‘ఏమైనా కావాలా?’ అని అడిగింది. నేను తన చెంప మీద సుతారంగా ముద్దు పెట్టుకుని ‘ఏమొద్దు, పడుకో!’ అని నా ఆఫీసు రూములోకి నడిచాను. చాలాసేపు మది నిండా ఒక సంతృప్త భావనతో చీకట్లో మౌనంగా కూర్చుండిపోయాను. ‘నాకేం తక్కువ? జీవితంలో అన్నీ అనుభవించాను. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాను. ఏవో కొన్ని పుస్తకాలు రాశాను. మనిషి జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు ఈ జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు. పండిన ఆకు రాలిపోవడం అత్యంత సహజం. ఆ ప్రక్రియలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. వాటిల్లో అనారోగ్యం కూడా ఒకటి. డెబ్భై ఏళ్ళ వయసులో శరీరం, యౌవ్వనంలో ఉన్నట్టుగా, హుషారుగా ఎలా ఉంటుంది? డెబ్భై ఏళ్ళ తర్వాత లభించిన ప్రతి రోజూ బోనస్ జీవితంగానే భావించాలి.’ నా ఆలోచనల్లో నేనుండగానే, లైటు వెలిగింది. నేను తలెత్తి చూశాను. మా ఆవిడ కాఫీ కప్పుతో నిలబడింది. ‘వద్దన్నానుగా?’ అని అన్నాను. తను నవ్వుతూ, ‘మీకు కావాలని నాకు తెలుసుగా?’ అంది నవ్వుతూ. వర్షం వెలిసిన తర్వాత విరిసిన హరివిల్లులా ఉంది, నిద్రమత్తులో ఉన్న తన ముఖంలోని ఆ నవ్వు. తనలో గొప్పతనం ఏమిటంటే, పడుకుని లేచినా ముఖం తాజాగా ఉంటుంది. జుట్టు చెదరదు. ఆమె ముఖాన్నే చూస్తూ, కాఫీ కప్పు అందుకున్నాను. నేను తన కష్టాన్ని సరిగా గుర్తించలేదేమోనని, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. సుమారు యాభై ఏళ్ళ మా సంసారంలో నాకు ఎన్నడూ ఏ లోటూ రాకుండా చూసుకుంది. పేరుప్రఖ్యాతులు నాకు వచ్చినా తనకొచ్చినంతగా సంబరపడేది. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తన చేతిని స్పృశించాను. ఆ స్పర్శ నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ‘కాఫీ తాగండి!’ అని వెళ్ళబోతూ, ‘ఏంటి, ఆఫీసు రూములో కూర్చున్నారు? మళ్ళీ ఏమైనా రాయబోతున్నారా?’ అంటూ తలుపు దగ్గరకు వేసి బయటకు నడిచింది. ఆమె మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి, ‘అవును ఎందుకు రాయగూడదు?’ అన్న సందేహం నాలో ఉత్పన్నమయింది. మీరు గమనించారా? నేనైతే ఇప్పుడే గమనించాను. కాఫీ కప్పు తీసుకున్నప్పుడు నా చేతి వేళ్ళు మునుపటంతగా వణక లేదు. నా వేళ్ళను చూశాను. ఏదో కొత్త ఉత్తేజంతో తొణికిసలాడుతున్నట్టుగా, నవనవలాడుతూ కనిపించాయి. ‘ప్లేసిబో ఎఫెక్ట్’ గురించి నేనే ఎన్నోసార్లు రాశాను. ఇప్పుడు ఆ ప్రయోజనం నాకే అనుభవంలోకి వస్తున్నట్టుగా అనిపించింది. కంప్యూటర్ తెరిచి, స్పీకరులో కథ ‘డిక్టేషన్’ చెపుతుంటే, వాయిస్ రికార్డర్ ద్వారా, కంప్యూటర్ తెర మీద, అక్షరాల రూపంలో కథ పురుడుపోసుకుంటుంది. ఇప్పుడు కూడా షార్టుహ్యాండే, డిక్టేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇప్పుడు చేతివేళ్ళ పనిని కంప్యూటర్ చేసేస్తోంది. -
ఇక చిన్న నోట్ల ఏటీఎంలు!
సాక్షి, స్పెషల్ డెస్క్: డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నా.. ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయుల దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతో ముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా రూ.10, రూ.20 నాణేలను విరివిగా ప్రవేశపెట్టినా జనం నుంచి వీటికి స్పందన అంతంతే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇళ్లకే పరిమితం అవుతున్న నాణేలు! తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావనతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్నేళ్లుగా రూ.10, రూ.20 కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్ను తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్బీఐని కోరాలని భావిస్తోంది. అలాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు, నాణేలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనుంది. పరిశీలనలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను పంపిణీ చేసే నమూనా యంత్రాలను ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలకు ఆమోదముద్ర పడితే వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ముంబై శాఖలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరును ఆర్బీఐ పరిశీలించింది. ముంబై పైలట్ ఫలితాలను సమీక్షించడంతో పాటు ఆర్బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ఏటీఎంలను బ్యాంకుల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
భారత్పై మొబైల్ మాల్వేర్ దాడులు
ఇంటర్నెట్ వాడకం పెరిగే కొద్దీ మొబైల్ మాల్వేర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా అధికం అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కస్టమర్ల మొబైల్స్లోకి హానికరమైన సాఫ్ట్వేర్ (మాల్వేర్) ద్వారా చొరబడేందుకు కొత్త పంథాను అందిపుచ్చుకుంటున్నారు. మొబైల్ మాల్వేర్ దాడులకు గురైన దేశాల్లో మరోసారి భారత్ అగ్రశ్రేణి కేంద్రంగా అవతరించింది. డిజిటలైజేషన్ దిశగా దూసుకెళ్తున్న భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్స్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారని అమెరికాకు చెందిన ఐటీ సెక్యూరిటీ సంస్థ జీస్కేలర్ చెబుతోంది. మొబైల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ విభాగాల్లో మాల్వేర్ దాడులపై కంపెనీ రూపొందించిన థ్రెట్ల్యాబ్జ్–2025 థ్రెట్ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొబైల్ మాల్వేర్ దాడుల్లో 26 శాతం వాటాతో భారత్ మొదటిస్థానంలో ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్లక్ష్యం ఆర్థిక లాభం..అంతర్జాతీయంగా సైబర్ నేరగాళ్లకు మన దేశం అతిపెద్ద లక్ష్యంగా మారింది. మొబైల్ యాప్స్, డిజిటల్ చెల్లింపులు, రోజువారీ జీవితంలో ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన పరికరాల వినియోగం పెరగడం వల్ల భారత్లో మొబైల్ మాల్వేర్ అటాక్స్ ఏడాదిలో 38 శాతం అధికమయ్యాయి. మొబైల్ మాల్వేర్ దాడుల ప్రధాన లక్ష్యం పాస్వర్డ్స్, బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడం. తద్వారా ఆర్థిక లాభం పొందడం. అలాగే కంపెనీల సేవలకు అంతరాయం కలిగించి డబ్బు డిమాండ్ చేయడం. బ్యాంక్ ఖాతా నిలిచిపోతుందనో, పాయింట్స్ రిడీమ్, ఆధార్ అప్డేట్, తరచూ వాడుతున్న యాప్ అప్డేట్ పేరుతో మొబైల్ యూజర్లను సైబర్ నేరస్తులు వలలో వేసుకుంటున్నారు. యాప్ స్టోర్లలోకి మాల్వేర్..యాప్ స్టోర్లలోకి హానికరమైన యాప్స్ చొరబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. గూగుల్ ప్లే స్టోర్లో 239 హానికర ఆండ్రాయిడ్ యాప్స్ను జీస్కేలర్ పరిశోధకులు గుర్తించారు. ఈ యాప్స్ ఇప్పటికే 4.2 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఈ యాప్స్లో చాలా వరకు ఉత్పాదకత మెరుగుపరిచే సాధనాలుగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆండ్రాయిడ్ మాల్వేర్ కార్యకలాపాలు 2024తో పోలిస్తే గత సంవత్సరంలో 67 శాతం పెరిగాయి. స్పైవేర్, బ్యాంకింగ్ మాల్వేర్ కీలక ముప్పుగా పరిణమించాయి. ఐఓటీ డివైస్ల విషయానికివస్తే రూటర్స్ 75% దాడులకు గురయ్యాయి. మొబైల్ మాల్వేర్ బాధిత టాప్–10 దేశాల్లో భారత్, యూఎస్, కెనడా, మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, ఇజ్రాయిల్, యూకే, యూఏఈ, ఇటలీ ఉన్నాయి. టాప్–4లో భారత్..భారత్లో రిటైల్, హోల్సేల్ వ్యాపారులు, సంస్థలను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. మొత్తం మాల్వేర్ దాడుల్లో వీటి వాటా 38% ఉంది. హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్ వాటా 31% ఉంది. తయారీ, ఇంధన సంబంధిత రంగాలను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. ఈ పరిశ్రమలు కనెక్టెడ్ వ్యవస్థలు, ఐఓటీ పరికరాలపై ఎక్కువగా ఆధారపడతాయి. అధిక నష్టాన్ని కలిగించాలని చూస్తున్న సైబర్ నేరగాళ్లకు ఇవి ఆకర్షణీయమైన లక్ష్యాలుగా మారాయి. మొత్తం ఐఓటీ మాల్వేర్ కార్యకలాపాల్లో 54% వాటాతో గ్లోబల్ హాట్స్పాట్గా అమెరికా నిలిచింది. 5 శాతం వాటాతో భారత్ నాల్గో స్థానంలో ఉంది. మొబైల్ చెల్లింపులపై..మన దేశంలో బ్యాక్డోర్, బోట్నెట్–స్టైల్ మాల్వేర్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 16 లక్షలపైచిలుకు ఆండ్రాయిడ్ టీవీ బాక్సుల్లోకి మాల్వేర్ చొచ్చుకుపోయిందని ఒకనివేదిక వెల్లడించింది. ఇందులో ప్రధాన బాధిత దేశంగా భారత్ ఉంది. చమురు, సహజవాయువు రంగంలో ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మాల్వేర్ దాడులు చేస్తున్నారని వివరించింది. అంతేగాక మొబైల్ చెల్లింపులపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని తెలిపింది. -
అంతరిక్షంలోకి 10 లక్షల ఏఐ శాటిలైట్లు!
ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలను అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్మస్క్ రంగం సిద్ధంచేస్తున్నారు. మానవాళి కృత్రిమ మేధ అవసరాలను వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షం నుంచే నేరుగా తీర్చేందుకు ఏకంగా 10,00,000 ఏఐ సూపర్కంప్యూటర్లను నింగిలోకి పంపనున్నారు. ఒక్కో కృత్రిమమేథ సూపర్కంప్యూటర్ను ఒక్కో ఉపగ్రహంతో అనుసంధానించి సేవలు అందించాలని మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మొత్తంగా 10 లక్షల ఏఐ సూపర్కంప్యూటర్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాలని స్పేస్ఎక్స్ నిర్ణయించింది. ప్రయోగాల కోసం అమెరికా ప్రభుత్వ అనుమతి కోరారు. అతిపెద్ద జల్లెడ మాదిరిగా శాటిలైట్లన్నీ ఒకదానితో మరోటి లేజర్ కాంతిపుంజంతో అనుసంధానమై ఉంటాయి. తద్వారా ఉమ్మడిగా ఊహించనంత వేగంగా కృత్రిమ మేధ సేవలను అందించనున్నాయి. ఇన్నేసి సూపర్కంప్యూటర్లను భూమిపై సర్వర్ఫామ్లో ఏర్పాటుచేసి నిర్వహించాలంటే అత్యధిక స్థాయిలో విద్యుత్ను నిరంతరంగా సరఫరాచేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాకపోవడంతో సౌరశక్తిని ఉపయోగించుకుని ఆకాశంలోనే అతిపెద్ద సోలార్ప్యానెల్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా 10 లక్షల ఏఐ కంప్యూటర్ల శక్తి అవసరాలు తీర్చనున్నారు. 1968లో వచ్చిన ‘2001: స్పేస్ ఒడిస్సీ’హాలీవుడ్ చిత్రంలో ‘హాల్ 9000’కృత్రిమమేధావి చేసే ప్రయోగాలు ఇన్నాళ్లూ సినిమాలకే పరిమితంకాగా ఇకపై వాటిని నిజజీవితంలోకి తీసుకొస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఏఐ కంప్యూటర్ల దండును నింగిలో మోహరింపజేసి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది వినియోగదారుల కృత్రిమమేధ అవసరాలు తీర్చబోతున్నామని మస్క్ వివరించారు. ఈ వ్యవస్థకు ‘ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్’అని పేరు పెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే భూమిపై వినియోగదారులకు సంబంధించిన విపరీతమైన సమాచారం, సంక్లిష్టమైన డేటాను అత్యధిక వేగంతో ప్రాసెస్ చేయడమూ సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా ఏఐ మోడళ్లను పరీక్షించి అందుబాటులోకి తేవచ్చు. భూమి నుంచి 500 నుంచి 2,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఒకదానితో మరోటి ఢీకొట్టకుండా వీలైనంత దూరంలో కక్ష్యలో స్థిరపరచనున్నారు. ‘‘ఊహించనంతగా వచ్చి పడుతున్న ఏఐ డిమాండ్ను అందుకోవాలంటే భూమి మీద సౌకర్యాల విస్తరణతో సాధ్యంకాదు. అంతరిక్షంలో కక్ష్యల్లో కొలువుతీరిన లక్షలాది ఉపగ్రహాలతోనే ఇది సాధ్యం. పుష్కలంగా లభించే సౌరశక్తిని ఒడిసిపట్టి ఈ సూపర్కంప్యూటర్ల విద్యుత్శక్తి అవసరాలు తీర్చుతాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా కేంద్రంగా అంతరిక్షాన్ని సిద్ధంచేయబోతున్నాం’’అని మస్క్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. స్టార్లింక్ స్ఫూర్తితో.. ఇప్పటికే వేలాది కృత్రిమ ఉపగ్రహాలతో మస్క్ కు చెందిన స్టార్లింక్ సంస్థ విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీని స్ఫూర్తితోనే ఏఐ సేవలు అందించేందుకు ఆర్బిటల్ డేటా సెంటర్ సిస్టమ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన పనులు మొదలెట్టారు. ఇందుకోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(యూఎస్ఎఫ్సీసీ) వద్ద స్పేస్ఎక్స్ దరఖాస్తు చేసుకుంది. భూమిపై ఏర్పాటుచేసిన డేటా సెంటర్లు పవర్ గ్రిడ్లతో అనుసంధానమై ఉన్నాయి. విద్యుత్ అంతరాయం పెద్ద అవరోధంగా తయారైంది. అతిపెద్ద సర్వర్ఫామ్ల ఏర్పాటుకు భూమి సేకరణ ఇబ్బందిగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భూమి సేకరణ అనేది ఖరీదైన వ్యవహారంగా తయారైంది. విద్యుత్ తయారీకి బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వినియోగిస్తారు. దీంతో ఇంతపెద్ద ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడమూ కష్టమే. ఈ సమస్యలేవీ అంతరిక్షంలో ఉండవు. ఆ కారణంతోనూ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు నింగిని వేదికగా ఎంపికచేశారు. భూమి మీద ఏఐ సూపర్కంప్యూటర్లను చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరం. అదే అంతరిక్షంలో శూన్యం ఉంటుందికాబట్టి ఇది సహజ రిఫ్రిజిరేటర్గా పనిచేస్తుంది. రాత్రిళ్లు అత్యల్ప ఉష్ణోగ్రతలకు ఏఐ వ్యవస్థ ఆటోమేటిక్గా చల్లబడుతుంది. విద్యుత్ అవసరం కూడా ఉండదు. 10 లక్షల ఉపగ్రహాల మధ్య సమాచారాన్ని హైస్పీడ్ లేజర్ కాంతిపుంజం రూపంలో బదిలీచేస్తారు. దీంతో ట్రిలియన్ల బైట్ల డేటా వేగంగా సరఫరా అవుతుంది. ఈ వ్యవస్థ మొత్తం ఆకాశంలో ఏర్పాటయ్యాక ప్రతి టన్ను సౌరఫలకాల వ్యవస్థ నుంచి ఏకంగా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీంతో అక్కడి డేటా సెంటర్ల శక్తి అవసరాలు సైతం తీరనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరాఠా గడ్డపై ‘సునేత్ర’ చరిత్ర.. వీళ్ల గురించి తెలుసా?
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి కానున్నారు. ఆమె శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో ఐదుగురు మహిళలు.. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యలక్ష్మి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.కమలమ్మ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1952లో కమలమ్మ తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో, ఆమె దేశ చరిత్రలోనే మొదటి ఉప ముఖ్యమంత్రిగా చర్రితలో నిలిచిపోయారు.పాముల పుష్ఫ శ్రీవాణి.. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు.తారాసింగ్.. పంజాబ్కు చెందిన తారా సింగ్ 1960లో తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె విధుల్లో కొనసాగారు.రాజేంద్ర కౌర్ భట్టాల్.. పంజాబ్కు చెందిన రాజేంద్ర కౌర్ భట్టాల్ 1996లో ఉప ముఖ్యమంత్రిగా విధుల్లో కొనసాగారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లకు పైగా ఆమె డిప్యూటీ సీఎంగా ఉన్నారు.నిత్యానందా దేవి.. బీహార్కు చెందిన నిత్యానందా దేవి 1990ల్లో తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో ఆమె విధులు నిర్వహించారు.జమునా దేవి.. మధ్యప్రదేశ్కు చెందిన జమునా దేవి 1998లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఐదేళ్ల పాటు కొనసాగారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం ఐదేళ్ల పీరియడ్ మొత్తం ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దీంతో, ఎక్కువ కాలం డీప్యూటీ సీఎంగా ఉన్న మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.కమలా బెనీవల్.. రాజస్థాన్కు చెందిన కమలా బెనీవల్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎంగా కొనసాగారు. 2003లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.దియా కుమారి.. రాజస్థాన్కు చెందిన దియా కుమారి బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా దాదాపు రెండేళ్ల పాటు ఉన్నారు. ప్రస్తుత భజన్ లాల్ శర్మ ప్రభుత్వంలో 2023 నుంచి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.పార్వతీ పరిడా.. ఒడిశాకు చెందిన పార్వతి ప్రస్తుత సీఎం మోహన్ చరణ్ మాంఝీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. 2024 జూన్ నుంచి బాధ్యతల్లో ఉన్నారు.అయితే, దేశంలో ముఖ్యమంత్రి స్థానాల్లో మహిళలు ఎక్కువ కాలం సేవలు చేసినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రలుగా మాత్రం చాలా తక్కువ మంది, తక్కువ కాలం మాత్రమే విధుల్లో ఉన్నారు. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం (2026 జనవరి నాటికి) రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఒడిశా) మాత్రమే మహిళలు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మహిళల రాజకీయ ప్రాధాన్యం పెరుగుతున్నందున మరిన్ని రాష్ట్రాల్లో మహిళలు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది. -
ఏఆర్సీ ఖాళీ
ఆరిలోవ: దశాబ్దాల పాటు సింహాల గర్జనలు, పులుల గాండ్రింపులతో దద్దరిల్లిన విశాఖలోని ఆరిలోవ జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ) ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఒకప్పుడు 34 పెద్ద పులులు, 34 సింహాలు కలిపి మొత్తం 68 వన్య మృగాలతో కళకళలాడిన ఈ కేంద్రం నేడు వెలవెలబోతోంది. కాలక్రమంలో వృద్ధాప్య సమస్యలతో ఒక్కో జంతువు మృత్యువాత పడగా, చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన ‘బిగో’అనే ఆడ సింహం కూడా ఈ నెల 7న కన్నుమూసింది. దీంతో ఏఆర్సీ పూర్తిగా ఖాళీ అయ్యింది. 2000లో కేంద్రం ఏర్పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జూ పార్కు సమీపంలో, జాతీయ రహదారిని ఆనుకొని 2000లో జంతు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో సర్కస్ కంపెనీలు గ్రామాలు, పట్టణాలకు వచ్చి ప్రజలకు వినోదాన్ని పంచేవి. ఆయా కంపెనీలు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు, కుక్కల చేత బలవంతంగా విన్యాసాలు చేయించేవి. ఈ క్రమంలో మూగజీవాలు సర్కస్ యాజమాన్యాల చేతిలో హింసకు గురవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో సర్కస్లలో జంతువులతో విన్యాసాలు చేయించడాన్ని తప్పుబడుతూ, వాటితో ఆటలాడించకూడదని 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోని వివిధ సర్కస్ కంపెనీల నుంచి జంతువులను స్వాదీనం చేసుకుంది. వాటి సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి, మైసూరు, ముంబయి, చెన్నైలలో ప్రత్యేకంగా ఐదు జంతు పునరావాస కేంద్రాల(యానిమల్ రెస్క్యూ సెంటర్–ఏఆర్సీ)ను నిర్మించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంతాల్లోని జూలాజికల్ పార్కులకు అప్పగించింది. ప్రసిద్ధ సర్కస్ కంపెనీలైన ఫేమస్, జెమిని, అజంతా తదితరాల నుంచి స్వాధీనం చేసుకున్న పులులు, సింహాలను ఈ ఐదు ఏఆర్సీలకు తరలించింది. అప్పటి నుంచి వాటికి ఆహారం, వైద్యం అందించి సంరక్షించారు. ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం ఈనెల 7న బిగో(24) అనే ఆడ సింహం మృతి చెందడంతో ఏఆర్సీలో జంతువులేవీ లేవు. ఈ విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు, సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా(సీజెడ్ఏఐ) దృష్టికి తీసుకెళ్లాం. ఉన్నతాధికారుల అనుమతితో ఈ స్థలాన్ని జూ పార్కు అవసరాలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తాం. గత 25 ఏళ్లుగా ఇక్కడి సిబ్బంది, వైద్యులు జంతువులకు అత్యుత్తమ సేవలు అందించారు. – జి.మంగమ్మ, క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కువిశాఖ ఏఆర్సీలో 68 జంతువులుకేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2000లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 2001లో ఇది ప్రారంభమైంది. ఇక్కడకు తీసుకొచ్చిన 34 పెద్ద పులులు, 34 సింహాల కోసం ప్రత్యేకంగా ఇనుప కేజ్లు, నైట్ క్రాల్స్, అవి స్వేచ్ఛగా తిరగడానికి విశాలమైన ఎన్క్లోజర్లు నిర్మించారు. వాటికి సకాలంలో ఆహారం, వైద్యం అందించడానికి వెటర్నరీ ఆసుపత్రి, ఒక వైద్యుడు, సహాయకులు, జంతు సంరక్షకులను నియమించారు. అవి యుక్త వయసులో ఉన్నప్పుడు వాటి గాండ్రింపులు, గర్జనలతో ఏఆర్సీ ప్రాంతం హోరెత్తేది. జాతీయ రహదారిపై వెళ్లే వారికి సైతం ఆ గర్జనలు వినిపించేవి. ఇప్పుడు అవన్నీ మరణించడంతో అక్కడ నిశబ్దం ఆవహించింది. సహజంగా అడవుల్లో పులులు, సింహాల సగటు జీవిత కాలం 15 నుంచి 16 ఏళ్లు కాగా, ఇక్కడ సంరక్షణలో అవి 20 నుంచి 25 ఏళ్లకు పైగా జీవించడం విశేషం. అర్జున్ (26), కొనాల్ (26) అనే మగ సింహాలు, మాధురి (25), సుధ (23), రాణి (23) అనే ఆడ సింహాలు ఎక్కువ కాలం జీవించాయి. వీటితో పాటు సీత (24) అనే ఆడ పులి, వినయ్ (21) అనే మగ పులి కూడా ఇక్కడ సుదీర్ఘ కాలం జీవించాయి. వృద్ధాప్యం కారణంగా అవయవాలు పనిచేయకపోవడం, పక్షవాతం వంటి వ్యాధులతో ఇవి మృతి చెందాయి. మంచి పోషకాహారం, వైద్యం అందించడం వల్లే అవి ఎక్కువ కాలం జీవించాయని అధికారులు తెలిపారు. -
గ్రీన్లాండ్కు పాచి పడుతోంది!
ప్రపంచంలోనే అతి పెద్దవైన గ్రీన్లాండ్ దీవులకు పెను ముప్పు పొంచి ఉంది. అయితే అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది నెలలుగా బెదిరిస్తూ వస్తున్న ఆక్రమణ ముప్పు కాదు. పాచి ముప్పు! అవును. అపారమైన మంచుకు నిలయమైన గ్రీన్లాండ్ దీవులు నానాటికీ విపరీతంగా పాచిపట్టిపోతున్నాయి! దాంతో అక్కడ మంచు కరుగుదల రేటు చూస్తుండగానే మరింత ప్రమాదకర స్థాయికి పెరిగిపోతోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే గ్రీన్లాండ్కే కాక ప్రపంచమంతటికీ త్వరలో పెను ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా పలు తీర నగరాలు, ప్రాంతాలు అనుకున్న దానికంటే చాలా ముందుగానే సముద్రంలో మునిగిపో తాయని అంచనా వేస్తున్నారు.దుమ్ము తదితరాల వల్ల హిమానీ నదాల్లో పాచి పరిమాణం క్రమంగా పెరిగిపోతోంది. దీనివల్ల మంచు కూడా స్వచ్ఛని తెలుపు రంగు కోల్పోయి మకిలిపడుతుంది. ఫలితంగా మంచు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. దాంతో అది కరిగే వేగం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఇప్పుడు గ్రీన్లాండ్ దీవుల్లో అదే జరుగుతోంది. తాజా అధ్యయనం ఒకటి ఈ మేరకు తేల్చింది. ఈ దెబ్బకు సముద్రమట్టం కూడా వేగంగా పెరుగుతోందని నిర్ధారించింది. ఈ అధ్యయనం వెల్లడించింది. దుమ్మూధూళి, ఖనిజాల తాలూకు సూక్ష్మకణాలు గాలితో పాటుగా గ్రీన్లాండ్ మంచుపై భారీ పరిమాణంలో వచ్చిపడుతున్నాయట. ‘‘వాటివల్ల మంచుపై నాచు పొర ఏర్పడుతోంది.దాంతో తెల్లని మంచు కాస్తా రంగు మారి వెలిసిపోతోంది. అలా అది సూర్యరశ్మిని మరింత ఎక్కువగా గ్రహిస్తోంది’’ అని అధ్యయన బృంద సారథి ప్రొఫెసర్ జెనిన్ మెక్కచోన్ వివరించారు. ‘‘ఫలితంగా మంచు మరింతగా కరిగిపోతోంది. ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వెచ్చని ఉపరితలం మరింత నాచు ఏర్పడటానికి, దుమ్ము పేరుకోవడానికి కారణమవుతుంది. తద్వారా గ్రీన్లాండ్ మంచు తెలుపును కోల్పోయి నానాటికీ మరింతగా ముదురు రంగులోకి మారుతుంది. దాంతోపాటే అది సూర్యరశ్మిని మరింతగా గ్రహిస్తుంది. అలా అక్రమంగా ఇదో విషవలయంగా మారుతుంది’’ అని ఆయన హెచ్చరించారు. గ్రీన్లాండ్లోని మంచు పూర్తిగా కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం ఏకంగా 7 మీటర్లు పెరుగుతుంది! లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మంది నిర్వాసితులుగా మారిపోతారు. వారి జీవనోపాధికి గండి పడుతుంది. -
మళ్లీ బతకాలన్న ఆశతో..
మరణం అనేది జీవనానికి చివరి అంకమే. అయితే ఆధునిక సాంకేతికతపై అపారమైన నమ్మకం ఉన్న కొంతమంది ఈ భావనకే సవాల్ విసురుతున్నారు. ‘ఈరోజు కాకపోయినా వందల వేల ఏళ్ల తర్వాతైనా సైన్స్ మళ్లీ బ్రతికించగలదన్న ఆశతో’ తమ శరీరాలను భద్రపర్చుకుంటున్నారు. ఈ విధానమే క్రయోజెనిక్స్. సాధారణంగా ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరికొంతమంది వైద్య పరిశోధనల కోసం తమ దేహాలను దానం చేస్తారు. కానీ, ప్రపంచంలోని కొంతమంది అత్యంత ధనవంతులు మాత్రం మరణించిన తర్వాత తమ శరీరాలను లేదా మెదడును అత్యాధునిక క్రయోజెనిక్స్ చాంబర్లలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టించి భద్రపర్చుకుంటూ భవిష్యత్పై ఆశలు పెంచుకుంటున్నారు. ఖర్చు ఘనం.. క్రయోజెనిక్స్ అనేది శాస్త్రీయ ప్రక్రియ. మరణించిన వెంటనే, శరీరాన్ని అత్యంత వేగంగా మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో (లిక్విడ్ నైట్రోజన్) గడ్డకట్టిస్తారు.ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటే, కణజాలంలో ఎలాంటి రసాయన మార్పులూ జరగవు. ఈ ప్రక్రియలో రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ అనే ద్రవాన్ని ప్రవేశపెడతారు. కణాలు దెబ్బతినకుండా, శరీరం లేదా మెదడును ‘కాలం నిలిపిన’ స్థితిలో భద్రపరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్లో ఉన్న శరీరానికి కాలంతో సంబంధం ఉండదు. కణజాలం పాడయ్యే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతుంది. ఇలా వందల, వేల ఏళ్లు భద్రపరచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తి శరీరం భద్రపర్చాలంటే భారతీయ కరెన్సీలో రూ.1.60 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు, మెదడు మాత్రమే భద్రపర్చాలంటే రూ.కోటిన్నరకు పైగా ఖర్చవుతుందని అంచనా. అమెరికా, రష్యా దేశాల్లో ఇందుకోసం ఇన్సూ్యరెన్స్ కంపెనీలు కవరేజ్ కూడా కల్పిస్తుండటం విశేషం. ఇప్పటికే 500 మందికి పైగా మరణానంతరం తమ శరీరాలు, మెదడును ఈ క్రయోజెనిక్స్ చాంబర్స్లో భద్రపర్చుకున్నారు. అధ్యయనాల్లో భిన్నాభిప్రాయాలు.. క్రయోజెనిక్స్ అంశంపై ఇటీవల కాలంలో ప్రపంచంలోని ప్రముఖ వర్సిటీలు, వైద్య పరిశోధన సంస్థలు అనేక అధ్యయనాలు చేస్తున్నాయి. అమెరికాలో ఆల్కార్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ (ఆరిజోనా), క్రయోజనిక్స్ ఇన్స్టిట్యూట్ (మిచిగావ్)ల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ (యూకే) జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్–2023తో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్ (యూఎస్ఏ) తమ బ్రిటిష్ మెడికల్ జర్నల్–2023లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో ఈ క్రయోజెనిక్స్పై ప్రత్యేకంగా ప్రస్తావించాయి. అయితే కాలిఫోర్నియా వర్సిటీ న్యూరో సైన్స్పై జరిపిన అధ్యయనంలో మెదడును గడ్డకట్టిన తర్వాత జ్ఞాపకాలు, నాడి సంబంధాలు పూర్తిస్థాయిలో తిరిగి పనిచేయడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ (జర్మనీ) తమ క్రియో బయోలజీ జర్నల్–2024లో కణజాలాన్ని గడ్డకట్టే ప్రక్రియలోనే సూక్ష్మస్థాయిలో నష్టం జరుగుతుందని పేర్కొంది. చిన్న అవయవాల పునరుద్ధరణ వరకే విజయం సాధ్యమైందని, పూర్తి మానవశరీర పునరుద్ధరణ ఇంకా సాధ్యం కాలేదని తెలిపింది. ఏ దేశాల్లో ముందున్నాయి.. క్రయోజెనిక్స్ రంగంలో అమెరికా, రష్యా దేశాలు ముందున్నాయి. చైనా ఇటీవలే ఈ అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. కెనడా, యూరప్,జర్మనీ, స్విట్జర్లాండ్, యూకేల్లో పరిమిత స్థాయిలో పరిశోధనలు జరుగుతుండగా, ఆ్రస్టేలియాలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా క్రయోజెనిక్ పేషెంట్లు (మరణానంతరం) ఉన్న దేశంగా అమెరికా రికార్డుల్లోకెక్కింది. ఆ తర్వాత రష్యా కూడా ఈ తరహా సదుపాయాలను కల్పించింది. రష్యాలోని క్రియోరుస్ అనే సంస్థ పూర్తి శరీరం, మెదడు భద్రపరిచే సదుపాయం కలిగి ఉంది. సైన్స్పై అతి నమ్మకం, డబ్బు ఇచ్చే ధైర్యం..కోల్పోయేదేముందన్న భావన ఈ తరహా ప్రయోగాలకు పురిగొల్పుతుందంటున్నారు. :::సాక్షి ప్రత్యేక కథనం -
పట్టాలు తప్పని పారిశుధ్యం!
సాధారణంగా మన ఊళ్లలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది? ప్లాట్ఫాం నిండా పల్లీల తొక్కలు, పాన్పరాగ్ ఉమ్ములు, పట్టా ల మీద ప్లాస్టిక్ కవర్లు, దుర్గంధం.. ప్రయాణికులకు అనుభవమే. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే.. ‘ఇది మన దేశంలోనేనా?’.. అని ముక్కున వేలేసుకోవడం ఖాయం! మచ్చుకైనా కానరాని చెత్త అస్సాంకు చెందిన రేజావుల్ అనే యువకుడు కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్కు వెళ్లినప్పుడు అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. వెంటనే కెమెరా తీసి ప్లాట్ఫాం నుంచి రైలు పట్టాల వరకు మొత్తం వీడియో తీశాడు. ప్లాట్ఫాం మీద అద్దంలా మెరుస్తున్న పలకలు ఒకెత్తయితే, సాధారణంగా చెత్తాచెదారంతో నిండిపోయే పట్టాల మీద.. కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకపోవడం విశేషం. ‘ఏక్ భీ కచ్రా నహీ మిలేగా’ (ఇక్కడ ఒక్కటంటే ఒక్క చెత్త ముక్క కూడా మీకు దొరకదు!)’అని ఆ కుర్రాడు తన వీడియోలో కొనియాడాడు. మిలియన్ల వ్యూస్.. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల్లోనే వైరలై మిలియన్ల వ్యూస్ను కొల్లగొట్టింది. ఇది కేవలం రైల్వే అధికారుల ఘనత మాత్రమే కాదు, అక్కడి ప్రజల పౌర బాధ్యత (సివిక్ సెన్స్)కు నిదర్శనమని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసి నా, ప్రజలు సహకరించకపోతే ఏ ప్రాంతం శుభ్రంగా ఉండదని ఈ వీడియో నిరూపించింది. శుభ్రత అనేది వనరుల మీద కాదు, మనుషుల ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని కేరళ ప్రజలు చాటిచెప్పారు. మిగతా రాష్ట్రాల వారు కూడా కన్నూర్ స్టేషన్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ నెటిజన్లు వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. పాలనా యంత్రాంగం పని కాదిది.. మన అందరి బా ధ్యతని కన్నూర్ స్టేషన్ గట్టిగా నినదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచు ‘నది’!
మంచు కురవడం తెలిసిందే.. కానీ మంచు పారడమే వింత. ఎండిపోయిన నేలలు.. మంచు కోసం నిరీక్షించిన కొండల్ని ఒక్కసారిగా ప్రకృతి పలకరించింది. కానీ, ఈసారి పలకరింపు మామూలుగా లేదు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లా, పాంగి లోయలో ప్రకృతి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. గలగల పారే నదులను చూసుంటాం, కానీ ఇక్కడ ఏకంగా ‘మంచు నదే’రోడ్ల మీద ఉరకలేస్తోంది.. కనులముందే కదిలే హిమ కావ్యం! దాదాపు ఏడాది కాలంగా మంచు కరువుతో అల్లాడిన హిమాలయాల్లో, పశి్చమ గాలులు సృష్టించిన ఇంద్రజాలమిది. పన్నెండు అంగుళాల మందపాటి మంచు పొర కరిగి, లోయల వెంట ప్రవహిస్తుంటే.. అది చూడ్డానికి తెల్లటి పాల సముద్రంలా కనిపిస్తోంది. స్థానికులు ఆ మంచు నదిపై అడుగులు వేస్తూ ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దారులు అదృశ్యం అందాన్ని పక్కన పెడితే, ఈ హిమపాతం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. హిమాచల్లో ఏకంగా 700కు పైగా రోడ్లు మంచు కింద కూరుకుపోయాయి. విమానాలు రద్దయ్యాయి, హైవేలు మూతపడ్డాయి. జమ్మూ కశీ్మర్ నుంచి ఉత్తరాఖండ్ వరకు అంతా మంచు మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు ఢిల్లీలో వడగళ్ల వాన, మరోవైపు హిమాలయాల్లో మంచు తుపాన్లు.. ప్రకృతి తన గమనాన్ని ఎంత వేగంగా మార్చుకుంటుందో ఈ దృశ్యాలే సాక్ష్యం. వరం.. శాపం ఒకేసారి మంచు కురవడం వల్ల గంగా, బియాస్, చీనాబ్ వంటి నదులకు జీవం వస్తుంది. అటు పంజాబ్, హరియాణా రైతులు సాగు చేసే గోధుమ పంటకు ఇది అమృతం లాంటిది. కానీ, ఇలా ఒక్కసారిగా విరుచుకుపడే ప్రతికూల వాతావరణం.. భవిష్యత్తులో పెను ప్రమాదాలకు సూచికని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ తెల్లటి పొర కింద లోయ ఉంది.. హిమాచల్ మంచు అందం వెనుక ఒక భయానక నిశ్శబ్దం దాగి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక చిన్న నోట్ల ఏటీఎంలు!
సాక్షి, స్పెషల్ డెస్క్ : డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నా.. ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయుల దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లతోముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా రూ.10, రూ.20 నాణేలను విరివిగా ప్రవేశపెట్టిన జనం నుంచి వీటికి స్పందన అంతంతే ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగాఅందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. ఇళ్లకే పరిమితం అవుతున్న నాణేలు! తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావనతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్నేళ్లుగా రూ.10, రూ.20 కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్ను తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్బీఐని కోరాలని భావిస్తోంది. అలాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు, నాణేలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనుంది. పరిశీలనలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరు తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను పంపిణీ చేసే నమూనా యంత్రాలను ప్రస్తుతం ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద పరీక్షిస్తున్నారు. ఈ ఏటీఎంలకు ఆమోదముద్ర పడితే వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వంటి జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ముంబై శాఖలో హైబ్రిడ్ ఏటీఎం పనితీరును ఆర్బీఐ పరిశీలించింది. ముంబై పైలట్ ఫలితాలను సమీక్షించడంతో పాటు ఆర్బీఐ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ఏటీఎంలను బ్యాంకుల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలుచెబుతున్నాయి. » ఆర్బీఐ గణాంకాల ప్రకారంప్రస్తుతం దేశవ్యాప్తంగాచలామణిలో ఉన్న కరెన్సీలోపరిమాణం పరంగా 41.2% వాటా రూ.500 నోట్లదే. విలువలో 86% వాటాతో ఈ పెద్ద నోటు ఆధిపత్యం చెలాయిస్తోంది. » రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50 నోట్లు మొత్తం కరెన్సీలో పరిమాణం పరంగా 38% వాటాఉంటాయి. విలువలో 3.1% మాత్రమే. » 2016 నవంబర్ 4 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ.17.97 లక్షల కోట్లు. కాగా 2026జనవరి 9 నాటికి ఇది రూ.39.27 లక్షల కోట్లకు చేరింది. -
దేశాన్ని షాక్కు గురి చేసిన విషాదాలు
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం యావత్ దేశాన్ని షాక్కు గురి చేసింది. అయితే ఈ ఘటన మరోసారి రాజకీయ నేతల హెలికాఫ్టర్.. విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో కూడా పలువురు ప్రముఖ నేతలు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయి దేశాన్ని విషాదంలో ముంచారు. ఆ ఘటనలను ఓసారి గుర్తు చేసుకుంటే.. 2001లో.. కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావ్ సింధియా విమాన ప్రమాదంలో మరణించారు. గ్వాలియర్ రాజవంశానికి చెందిన మాధవరావ్.. 9సార్లు లోక్సభకు ఎంపీగా పని చేశారు. రైల్వే, పర్యాటకం, మానవ వనరుల అభివృద్ధి, సివిల్ ఏవియేషన్ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఢిల్లీ నుంచి పాట్నాకు ఆయన ప్రయాణిస్తున్న విమానం ఘజియాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మాధవరావ్తో పాటు పలువురు అనుచరులు మరణించారు.జీఎంసీ బాలయోగి.. దేశ తొలి దళిత లోక్సభ స్పీకర్. 2002లో స్పీకర్గా ఉన్న టైంలో ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. మార్చి 3వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పరిసరాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో బాలయోగితో పాటు ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశాన్ని షాక్కు గురి చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి సీఎంగా ఉన్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బేగంపేట నుంచి బయల్దేరిన గంట సేపటికి నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో వైఎస్సార్ సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖాండు కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. 2011 ఏప్రిల్ 30వ తేదీన ఆయన ప్రయానిస్తున్న హెలికాఫ్టర్ తవాంగ్ జిల్లా అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దోర్జీ ఖాండుతో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2025 జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 260 మంది మరణించిన సంగతి తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో.. బల్వంత్రాయ్ మెహతా విమాన ప్రమాదంలో మరణించారు. 1965లో ఆయన ప్రయాణిస్తున్న విమానంపై పాకిస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ కచ్ వద్ద దాడి జరిపింది. దేశంలో ఇప్పటిదాకా.. యుద్ధంలో మరణించిన ఒకే ఒక్క సీఎంగా బల్వంత్రాయ్ మెహతా నిలిచారు. అణు శాస్త్రవేత్త హోమి జహంగీర్ బాబా.. 1965లో ఆల్ప్స్ పర్వతాల్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించారు. కేంద్ర మాజీ మంత్రి మోహన్ కుమారమంగళం 1973లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంలో మరణించారు. నటుడు ఇందర్ థాకూర్ 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మరణించారు. హిమాచల్ ప్రదేశ్లో 1994లో జరిగిన ప్రమాదంలో పంజాబ్ మాజీ గవర్నర్ సురేంద్ర నాథ్ మరణించారు 1997లో కేంద్ర రక్షణ మంత్రి(సహాయ) ఎన్వీఎన్ సోము అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారుఅరుణాచల్ ప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి దేరా నాతుంగ్ 2001లో తవాంగ్ వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారుమేఘాలయా ఎమ్మెల్యే సైప్రియన్ సంగ్మా 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారుచైల్డ్ ఆర్టిస్ట్ తరుణీ సచ్ దేవ్.. నేపాల్లో 2012లో జరిగిన ప్రమాదంలో మరణించారుపైన చెప్పుకునే జాబితానే కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, హర్యానా మంత్రి ఓం ప్రకాశ్ జిందాల్ కూడా యూపీ షాహరన్పూర్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో మంత్రి సురేందర్ సింగ్ కూడా దుర్మరణం పాలయ్యారు. ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా డిసెంబర్ 08, 2021లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి మధులిక, మరో 12 మంది మరణించారు. 2004, ఏప్రిల్ 17న సినీ నటి సౌందర్య తన సోదరి అమర్నాథ్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలోనే మరణించారు. ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ (1980) ఢిల్లీలో ఈ తరహా ప్రమాదంలోనే కన్నుమూయగా.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్లు కూడా విమాన ప్రమాదాల్లోనే మరణించారన్న ప్రచారం ఉన్నది తెలిసిందే. -
పాడ్‘కాస్ట్’.. కబుర్లకు కాసులు
సాక్షి, స్పెషల్ డెస్క్ : నాడు రేడియో–నేడు పాడ్కాస్ట్.. ఒకప్పుడు మన తాతయ్య తరం వాళ్లు రేడియోలు చెవి దగ్గర పెట్టుకుని వింటూ కనిపించేవాళ్లు. ఇప్పుడు మనం ఫోన్లు చేత్తో పట్టుకుని పాడ్కాస్ట్లు వింటున్నాం. సీన్ మారింది కానీ, ‘వినే’ అలవాటు మాత్రం మారలేదు. పాడ్కాస్ట్లు వినడంలో ప్రపంచంలోనే ఇండియా ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానంలో ఉంది. వినటం మన డీఎన్ఏలోనే ఉంది!కబుర్లు వినే అలవాటు భారతీయుల డీఎన్ఏలోనే ఉన్నట్లుంది. ఆ అలవాటుకు తగ్గట్లుగా పాడ్కాస్ట్లు రకరకాల సబ్జెక్టులపై కమ్మటి లోకాభిరామాయణం వినిపిస్తున్నాయి. ఏమీ తోచక బోర్ కొడుతున్నప్పుడు పాడ్కాస్ట్.. ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు పాడ్కాస్ట్.. నాలెడ్జ్ కోసం, వినోదం కోసం, మనశ్శాంతి కోసం పాడ్కాస్ట్... ఇలా పాడ్కాస్ట్లనేవి భారతదేశపు అధునాతన రేడియోలు అయ్యాయి. తక్కువ ధరకే లభ్యమౌతున్న వై–ఫై, 4జీ, 5జీ డేటా..పాడ్కాస్ట్లకు అమితమైన ప్రజాదరణదక్కడానికి ప్రధాన కారణాలు.పాడ్కాస్ట్లకు డబ్బులే డబ్బులుఇండియాలో పాడ్కాస్ట్ రంగంఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం. వాణిజ్య ప్రకటనదారులు కూడా ‘వినేవారు మనవారే’ అన్నంత ఉదారంగా, పాడ్కాస్ట్లకు ప్రకటనలను కుమ్మరిస్తున్నారు.ఏం వింటున్నారు?కామెడీ అనుకుంటున్నారు కదూ! కాదట. ‘జ్ఞానాన్ని’ ఎక్కువగా ఇష్టపడుతున్నారట!అందులోనూ భక్తి, మోటివేషన్, బిజినెస్ అంటే చెవులు కోసుకుంటారని స్పాటిఫై, యూట్యూబ్ వార్షిక నివేదికలు చెబుతున్నాయి. ఎక్కడ వింటున్నారు?ప్రధానంగా యూట్యూబ్లో పాడ్కాస్ట్లనువింటున్నారు. యూట్యూబ్లోనే వీడియో పాడ్కాస్ట్లను చూస్తున్నారు. అలాగే కొన్ని మ్యూజిక్ యాప్స్ కూడా పాడ్కాస్ట్లనుఅందిస్తున్నాయి. 2026లోపాడ్కాస్ట్లు ఎలాఉండబోతున్నాయి?లోకల్ ఫీల్ : ఇంగ్లిష్ను మించి తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఇతర భాషల్లో పాడ్కాస్ట్లు హోరెత్తించబోతున్నాయి.ఏఐ వాయిస్ : నిజమైన మనుషుల స్థానంలో ఏఐ రోబోలే మనకు పాడ్కాస్ట్లను వినిపిస్తాయి.లైవ్ షోలు : కేవలం ఫోన్లలోనే కాదు, స్టేజ్ మీద కూడా పాడ్కాస్ట్లను చేసి టికెట్స్ విక్రయిస్తారు. (ఆధారం : గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అండ్ మార్క్ఎన్టెల్ అడ్వైజర్స్) -
మువ్వన్నెల గౌరవం!
జెండా పడిపోవచ్చు.. కానీ భారతీయుడి దేశభక్తి ఎప్పుడూ తలవంచుకోదు!.. అని ఓ ఆటో డ్రైవర్ నిరూపించాడు. గణతంత్ర దినోత్సవాల వేళ సోషల్ మీడియాను ఫిదా చేస్తున్న అద్భుత దృశ్యమిది. ఆకాశమంత దేశభక్తికి ఆస్కారం అక్కర్లేదు.. చిన్నపాటి గౌరవం చాలని చాటి చెప్పిన క్షణమది.చిన్నారి కళ్లలో వెలుగుఅనన్య సింగ్ అనే యువతి తన రాపిడో ఆటోలో వెళ్తుండగా.. పక్కనే ఒక కారు కిటికీలోంచి ఓ చిన్నారి ఉత్సాహంగా జాతీయ జెండాను ఊపుతోంది. వేగంగా వెళ్తున్న ఆ కారు గాలికి అకస్మాత్తుగా ఆ పాప చేతిలో ఉన్న త్రివర్ణ పతాకం జారి రోడ్డుపై పడిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాపిడో డ్రైవర్ తన ఆటోను ఆపాడు. కిందపడిన జెండాను అత్యంత భక్తితో చేతుల్లోకి తీసుకున్నాడు. దానిపై ఉన్న ధూళిని దులిపి, ఎంతో ప్రేమగా తిరిగి ఆ చిన్నారికి అందజేశాడు. తన జెండా దక్కగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన ఆనందం, దాన్ని అందిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ కళ్లలో కనిపించిన సంతృప్తి.. ‘వందేమాతరం’ ఆత్మను ప్రతిబింబించాయి.అది అద్భుతం‘నా రాపిడో డ్రైవర్ ఆ జెండాను తీసి, తుడిచి, అంత ప్రేమతో తిరిగి ఇచ్చిన తీరు అద్భుతం’.. అంటూ అనన్య సింగ్ వీడియోను ఎక్స్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. ఈ ఏడాది ‘వందేమాతరం – 150 ఏళ్లు’ థీమ్తో భారత్ గణతంత్ర వేడుకలను జరుపుకొంటోంది. కర్తవ్య పథ్లో సైనిక కవాతులు ఒకవైపు దేశ బలాన్ని చాటుతుంటే, రోడ్డు మీద సామాన్య ఆటో డ్రైవర్ చూపిన ఈ ‘జన భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) దేశపు సంస్కారాన్ని చాటిచెప్పింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
యాప్రే యాప్..
మొబైల్ అంటేనే యాప్స్. ఉత్పాదకత, వినోదం, సోషల్ మీడియా, విద్య, యుటిలిటీ, ఈ–కామర్స్.. అవసరం ఏదైనా మొబైల్ అప్లికేషన్స్తోనే (యాప్స్) మన జీవితం ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 14,900 కోట్ల యాప్ డౌన్లోడ్స్ నమోదయ్యాయంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. డౌన్లోడ్స్తోపాటు వినియోగంలోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది.ఐఓఎస్, గూగుల్ ప్లే స్టోర్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి వివిధ రకాల యాప్స్నకుగాను 2,84,000 డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఫీచర్స్, కంటెంట్, సేవల కోసం మొబైల్ యూజర్లు ఈ యాప్స్నకు నిమిషానికి రూ.2.9 కోట్లు ఖర్చు చేశారు. తొలిసారిగా గేమ్స్ కంటే యాప్స్పై అధికంగా వ్యయం చేశారని అమెరికాకు చెందిన డిజిటల్ ఇంటెలిజెన్స్, యాప్ డేటా ఎనాలిసిస్ కంపెనీ సెన్సార్ టవర్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాప్ల కథాకమామీషు ఎలా ఉందో చూద్దాం.. -
వెళ్లిరా పాండా..!
అది కేవలం ఒక జూ కాదు.. ఒక దేశపు ఉద్వేగం.. ఆదివారం ఉదయం నుంచే టోక్యోలోని ‘ఉయెనో జూ’వెలుపల వేలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో కెమెరాలు, పాండా బొమ్మలు ఉన్నాయి.. కానీ కనులు మాత్రం వర్షిస్తున్నాయి. ఆఖరి నిమిషం.. కేవలం 60 సెకన్ల పాటు తమ ప్రియమైన కవల పాండాలను కళ్లారా చూసుకునేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. ఎందుకంటే, ఆ నిమిషం తర్వాత జపాన్ గడ్డపై పాండాల శకం శాశ్వతంగా ముగిసిపోతోంది.. సెకనులో.. చెదిరిన కల వీటిని ఆఖరిసారిగా చూసుకునేందుకు.. ఆన్లైన్ లాటరీలో ఒక్కో టికెట్ కోసం 24 మంది పోటీ పడ్డారంటే ఆ పాండాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆఖరిసారిగా.. వెదురు ఆకులను నములుతూ, అమాయకంగా అటూ ఇటూ తిరుగుతున్న కవల పాండాలు.. షా జియావో, లీలీలను చూసి అభిమానులు దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయారు. టికెట్ దొరకని వేలాది మంది జనం జూ గోడల బయటే నిలబడి, పాండాల ఉనికిని అనుభూతి చెందుతూ మౌనంగా వీడ్కోలు పలికారు. రాజకీయాల మధ్య నలిగిన అమాయక ప్రేమ.. పాండాల తరలింపు వెనుక ఒక విషాదకరమైన రాజకీయ నేపథ్యం ఉంది. 1972లో చైనా–జపాన్ దౌత్య సంబంధాల పునరుద్ధరణకు గుర్తుగా వచ్చిన ఈ పాండాలు.. ఇప్పుడు అవే దౌత్య సంబంధాలు క్షీణించడం వల్ల వెళ్లిపోతున్నాయి. తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచి చేసిన వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. సంబంధాలు దెబ్బ తినడంతో, పాండాల లీజు ఒప్పందాలను పొడిగించడానికి చైనా నిరాకరించింది. ఫలితంగా, జనవరి 27న ఈ కవలలు చైనాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. మంగళవారం ఈ కవలలు చైనా వెళ్లిపోయాక, జపాన్లో ఒక్క పాండా కూడా ఉండదు. అర్ధ శతాబ్దపు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అవి మా సొంత బిడ్డలు! ‘నేను ఈ పాండాల కోసం 15 ఏళ్లలో ఒక కోటి ఫొటోలు తీశాను. నా సొంత పిల్లలే నన్ను వదిలి వెళ్తున్నట్టు ఉంది’.. అని తకాహిరో అనే అభిమాని భారమైన హృదయంతో చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ కదిలించాయి. ‘ఈ పాండాలు కేవలం జంతువులు కావు, మా కుటుంబ సభ్యులు. అవి మాకు ఎంతో ఓదార్పునిచ్చాయి’.. అంటూ 54 ఏళ్ల మెచికో కన్నీరు పెట్టుకుంది. పాండాల తరలింపుతో ఏటా సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని జపాన్ కోల్పోనుంది. వ్యాపారులు తమ దుకాణాల బోర్డులు మార్చడానికి నిరాకరిస్తూ, ‘అవి మళ్లీ తిరిగి వస్తాయి’.. అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూగబోయిన జపాన్ హృదయం! ప్రేమకు, ఓదార్పుకు గుర్తుగా నిలిచిన ఈ మూగజీవాలు.. దేశాల మధ్య సరిహద్దు గొడవలకు బలైపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం వీటిని తరలించే విమానం గాల్లోకి ఎగిరినప్పుడు, దాని రెక్కలు ఒక దేశపు 54 ఏళ్ల జ్ఞాపకాలు, కోట్లాది మంది భారమైన హృదయాలను కూడా మూటగట్టుకుని వెళ్లిపోతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తీరం..సొగసు చూడతరమా..!
రేపల్లె: సహజ సౌందర్యానికి చిరునామాగా నిలుస్తున్న బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలను కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు కృష్ణానది, మరోవైపు సముద్రం కలిసి రమణీయ దృశ్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. నదీ ప్రవాహం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు ఈ ప్రాంత ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెనుమూడి రేవు సందర్శకులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. పర్యాటకులను ఆకర్షిస్తున్న దిండి, నిజాంపట్నం బీచ్లు విహారయాత్రలకు అనువుగా ఉన్నాయి. రమణీయంగా విస్తరించిన మడ అడవులు ఈ ప్రాంతానికి మరింత సహజ సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలతో రేపల్లె తీర ప్రాంతం భవిష్యత్తులో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ఆపార అవకాశాలు కలిగిఉంది. పెనుమూడి రేవు ప్రత్యేక ఆకర్షణ: చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెనుమూడి రేవు పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ఒకప్పుడు వాణిజ్యానికి కీలకంగా ఉన్న ఈ రేవు ప్రస్తుతం పర్యాటక దృష్ట్యా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అలాగే దిండి, నిజాంపట్నం బీచ్లు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రశాంత వాతావరణం, విస్తారమైన సముద్ర తీరం విహారయాత్రలకు అనువుగా ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన దీవులుపెనుమూడి–పులిగడ్డ మధ్యలో సహజంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే హంసలదీవిలో కలిసే ముందు కృష్ణా జిల్లా పులిగడ్డ–బాపట్ల జిల్లా పెనుమూడి మధ్యలో మూడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ పాయల మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సూర్యాస్తమయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. ఆకర్షించే బీచ్లు తీరంలో సరైన మౌలిక వసతులు, బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే గమ్యస్థానాలుగా మారడం ఖాయం. ప్రకృతి– అభివృద్ధి సమన్వయానికి ప్రతీకగా నిలువగల ఈ తీరప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజాంపట్నంహార్బర్లో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.451 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులతో కొంత వరకు రూపురేఖలు మారాయి. సినిమా షూటింగ్లకు కేంద్రంఈ ప్రాంతంలోని సహజ దృశ్యాలు ఇప్పటికే పలు సినిమా షూటింగ్లకు వేదికయ్యాయి. వెండితెరపై కనిపించిన తీరం అందాలు పర్యాటక ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. గతంలో పెనుమూడి రేవు, కృష్ణానది వారధిపై జయ జానకీ నాయక, పండుగాడు ఫొటో స్టూడియో వంటి సినిమాల షూటింగులతో పాటు పలు టెలిఫిలింల చిత్రీకరణ జరిగాయి. అభివృద్ధిపై ఆశలుజాతీయ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై సమగ్ర దృష్టి సారించి రేపల్లె తీర ప్రాంతంలో మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు మెరుగుపరిస్తే రేపల్లె తీర ప్రాంతం రాష్ట్ర స్థాయిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదగగలదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పర్యాటక రంగం విస్తరిస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మడ అడవుల రమణీయతతీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు పర్యావరణ పరిరక్షణకు కీలకంగా నిలుస్తూనే ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. జీవ వైవిధ్యంతో కళకళలాడే ఈ అడవులు ఎకో టూరిజానికి అనువైన ప్రాంతాలుగా గుర్తింపు పొందుతున్నాయి. పక్షి జాతులు, సముద్ర జీవులు సమృద్ధిగా ఉండటంతో ప్రకృతి ప్రేమికులకు ఇది అనుకూల ప్రాంతంగా మారింది. -
జాబ్ విత్ 'లైఫ్'.. జెన్ జెడ్ 'స్టైల్'
జెన్ జెడ్.. ప్రపంచాన్ని ఉర్రూతలూగించడమే కాదు... అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్న సైన్యం... విశ్వ భవిష్యత్తుగా అవతరించిన ఈ జెన్ జెడ్ తమకంటూ నిర్దిష్ట అభిప్రాయాలను ఏర్పరచుకుంది. దేశాల్లో అధికార పీఠాలను మార్చడం నుంచి దిగ్గజ కంపెనీల తలరాతలను మార్చడంలోనూ వీరిది కీలకపాత్ర. కొంగొత్త తరం తమ ఉద్యోగాల విషయంలో వేటికి ప్రాధాన్యమిస్తున్నారు... ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారనే దానిపై ప్రముఖ ఉద్యోగ వివరాల వెబ్సైట్ నౌకరీ డాట్ కామ్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ‘ది జెన్ జెడ్ వర్క్ కోడ్ 2026... వాట్ డ్రైవ్స్, ఎంగేజెస్ అండ్ రిటెయిన్స్ దెమ్’అనే పేరుతో నిర్వహించిన ఈ సర్వే వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబైతోపాటు ఇతర నగరాలకు చెందిన ఉద్యోగులున్నారు. – సాక్షి, హైదరాబాద్ఈ సర్వేలో ఏం వెల్లడైందంటే...» జాబ్ ఆఫర్ల కోసం వేతనం కాకుండా దేన్ని పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించగా, 50 శాతం మంది ఉద్యోగంతోపాటు జీవితం కూడా ప్రధానమని, రెండింటినీ సమతుల్యంగా ముందుకు నడిపే ఉద్యోగాలను ఎంచుకుంటామని చెప్పారు. పనిగంటలతో పాటు వారాంతపు వినోదాలకు కూడా ప్రాధాన్యమిస్తామని చెప్పారు. కేవలం ఉద్యోగ అభివృద్ధి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని 31 శాతం చెప్పగా, కంపెనీలో విలువలకు ప్రాధాన్యమిస్తామని 12 శాతం, నాయకత్వ తీరుకు ఓటేస్తామని 7 శాతం అభిప్రాయపడ్డారు. అయితే, 5–8 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగుల్లో 60 శాతం మంది ఉద్యోగంతోపాటు జీవితాన్ని సమపాళ్లలో నడిపించేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. » కెరీర్ అభివృద్ధి అంటే ఏంటని ప్రశ్నించగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడమేనని 57 శాతం, జీతం పెరగడమని 21 శాతం, పదోన్నతి రావడమని 12 శాతం, ప్రాజెక్టులను లీడ్ చేయడమని 10 శాతం మంది చెప్పారు. » ఉద్యోగంలో ఎలాంటి గుర్తింపు కావాలని కోరుకుంటారన్న ప్రశ్నకు.. 81 శాతం మంది ఉద్యోగ వృద్ధి అవకాశాలు రావడమే గుర్తింపు అని చెప్పగా, నగదు బహుమతులు గుర్తింపుగా భావిస్తామని 10 శాతం, అభినందనలు గుర్తింపుగా పరిగణిస్తామని 7 శాతం, వ్యక్తిగతంగా అభినందనలు తెలపడాన్ని గుర్తింపు అనుకుంటామని 2 శాతం మంది వెల్లడించారు. » పని ప్రదేశంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఏ అంశం ప్రభావితం చేస్తోందని ప్రశ్నించగా.. ఉద్యోగం–జీవితం సమతుల్యంగా లేకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని 34 శాతం మంది, ఎలాంటి అభివృద్ధి కనిపించకపోవడం బాధను కలిగిస్తోందని 31 శాతం మంది, చెడు సహచరుల వల్ల ఇబ్బంది పడుతున్నామని 19 శాతం మంది, బాసిజం తట్టుకోలేకపోతున్నామని 16 శాతం మంది చెప్పారు. » ఒకటే ఉద్యోగంలో ఎన్నాళ్లు ఉంటారని అడిగితే.. ఒక ఉద్యోగం ఒక సంవత్సరం మాత్రమే చేస్తామని 14 శాతం మంది, 2–3 ఏళ్లు ఉంటామని 37 శాతం మంది, 4–5 ఏళ్లు ఉంటామని 13 శాతం, ఐదు కంటే ఎక్కువ సంవత్సరాలుగా ఒకే ఉద్యోగం చేస్తున్నామని 36 శాతం మంది చెప్పారు. » కెరీర్కు సంబంధించిన సలహాలను స్నేహితులు, మార్గదర్శకుల నుంచి తీసుకుంటామని 43 శాతం, నెట్వర్కింగ్ వెబ్సైట్ల నుంచి తీసుకుంటామని 40 శాతం, పాడ్కాస్ట్ల ద్వారా తెలుసుకుంటామని 13 శాతం, ఇన్స్ట్రాగామ్ అని 4 శాతం చెప్పారు. » ఈ నివేదికకు ముక్తాయింపుగా... ‘జెన్జీ ఆటలు ఆడటం లేదు. వారికి నిజం కావాలి. నిజం తప్ప ఏమీ అవసరం లేదు. ఈజ్ యువర్ కంపెనీ లిజనింగ్?’అని ప్రస్తావించడం గమనార్హం. -
మంచు ‘దుప్పట్లో’
మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా తెల్లగా మెరిసిపోతూ కన్పిస్తున్న ఈ భవనం ఏమిటో తెలుసా? రష్యా రాజధాని మాస్కోలోకెల్లా ఎత్తైన ప్రఖ్యాత ఒస్టాంకినో టవర్. దీని ఎత్తు అర కిలోమీటరు పైనే. అంటే 540 మీటర్లు! అంతటి టవర్ కూడా విపరీతమైన చలి దెబ్బకు ఇలా నిలువెల్లా ‘తెల్లబోయింది’! ఆద్యంతం మంచుమయంగా మారిపోయింది. ప్రస్తుతం రష్యాను అతలాకుతలం చేస్తున్న అతి శీతల వాతావరణ తీవ్రతకు అద్దం పడుతున్న ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాస్కో, పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 28 డిగ్రీ సెల్సియస్కు పడిపోయాయి. ధ్రువ సుడిగుండం (పోలార్ వెర్టెక్స్) కారణంగా ప్రస్తుతం రష్యాను విపరీతమైన చలిగాలులు వణికించేస్తున్నాయి. ఈ ఆర్కిటిక్ అతి శీతల గాలుల దెబ్బకు ఉత్తరార్ధ గోళమంతా అతలాకుతలం అవుతోంది. ఏ దేశంలో చూసినా ఊళ్లూ, పట్టణాలు తెల్లగా పరుచుకున్న మంచులో మునిగి తేలుతున్నాయి. ఏమిటీ ధ్రువ సుడిగుండం ఇది ధ్రువ ప్రాంతాల సమీపంలో నిత్యం కొనసాగే స్థిర అల్పపీడన వాతావరణం. దాంతో అక్కడి గాలులు సర్వాన్నీ గడ్డకట్టించేంత చల్లగా వణికిస్తూ ఉంటాయి. అయితే అన్నివైపుల నుంచీ ధ్రువాలకు వీచే బలమైన గాలుల వల్ల ఈ అతి శీతల పరిస్థితి సాధారణంగా అక్కడికే పరిమితమై ఉంటుంది. ఆ గాలులు బలహీనపడటం వంటివి జరిగినప్పుడు ధ్రువ సుడిగుండం భారీ కుదుపుకు లోనై అతి శీతల గాలులు బయటికి తోసుకొచ్చి దక్షిణాన సుదూరాల దాకా విరుచుకుపడతాయి. దాంతో ఉత్తర అమెరికా, యూరప్ మొదలుకుని ఆసియాలోని పలు దేశాలు చలి గుప్పెట్లోకి వెళ్లిపోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోందని నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్తో పాటు నాసా సేకరించిన డేటా చెబుతోంది. ఇది ప్రస్తుతం చాలా చురుగ్గా ఉన్నట్టు ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
ఈ విశ్వంలో కేవలం శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే ఏడు కిరణాలు కలిగి, ఒకే ఒక చక్రం కలిగిన ఏడు గుర్రాలతో, అనూరువైన సారథి నడుపుతున్న రథాన్ని అధిరోహించి అంతరిక్షంలో మన మాంసనేత్రంతో చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్య మూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ, మాఘ శుద్ధ సప్తమిన ఆవిర్భవించిన శ్రీ సూర్య నారాయణుని పుట్టినరోజును, సూర్య భగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని ‘‘రథసప్తమి’’ పేరుతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తిరుమలలో శ్రీవారు నేడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విశేషాలు...కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధుల్లో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్యజయంతిగానే గుర్తింపు పొందింది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదది. ఆయన సారథీ అంతే.. వికలాంగుడైన అనూరుడు క్షణం విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడూ విధి నిర్వహణలోనే ఉంటాడు.సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తిచేస్తాడు. అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి, ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా, విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకూ ఆధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో ‘అర్క‘ నామంతో సంచరిస్తాడు.సూర్యారాధన ఫలాలుఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రాజిత్తుకి శమంతక మణిని ప్రసాదించాడని చె΄్తారు. శ్రీ సూర్యభగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయస్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవానుని నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయపాత్రను పొందాడు. సూర్య నారాయణ స్వామిని నిత్యం ప్రార్థించే ద్రౌపదీ దేవిని కీచకుడు సమీపించ బోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి, కీచకుడిని తోసేసి, ద్రౌపదిని రక్షించాడు. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణంతో సమానం. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్య సంపదలను ఇస్తాయని శాస్త్రవచనం. రథసప్తమి ... శ్రీవారి వాహన సేవల వివరాలురథసప్తమి సందర్భంగా తిరుమలలో స్వామివారు ఈనెల 25వ తేదీ, ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై ఊరేగుతూ భక్తులకు ద్శనమిస్తారుఉదయం 5.30 నుండి 8 వరకు : సూర్య ప్రభ వాహనం ఉదయం 9 నుండి 10 వరకు : చిన్న శేష వాహనం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 వరకు : గరుడ వాహనం మధ్యాహ్నం 1 నుండి 2 వరకు : హనుమంత వాహనం మధ్యాహ్నం 2 నుండి 3 వరకు : చక్రస్నానం సాయంత్రం 4 నుండి 5 వరకు : కల్పవృక్ష వాహనం సాయంత్రం 6 నుండి 7 వరకు : సర్వభూపాల వాహనంరాత్రి 8 నుండి 9 వరకు : చంద్రప్రభ వాహనం– అలిదేన లక్ష్మీకాంత్, సాక్షి, తిరుమల -
ఈక్వెడార్ అడవుల్లో అందాల పక్షి ఆఖరి పోరాటం
అండీస్ పర్వతాల దట్టమైన పొగమంచులో, మేఘాలను తాకే ఎత్తయిన అడవుల మధ్య ఓ అపురూపమైన అందాల జీవి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. అది ఒక అద్భుతమైన తేనె పిట్ట (హమ్మింగ్ బర్డ్). దాని పేరు ‘బ్లాక్–బ్రెస్టెడ్ పఫ్లెగ్’. కేవలం 9 సెంటీమీటర్ల పొడవుండే ఈ చిన్ని పిట్టను చూస్తే ప్రకృతి ఒక అందమైన కళాఖండాన్ని సృష్టించిందా.. అనిపిస్తుంది. ఈక్వెడార్ రాజధాని క్విటోకు చిహ్నమైన ఈ హమ్మింగ్ బర్డ్ (తేనె పిట్ట), ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థాయిలో అంతరించిపోతున్న జాతులలో ఒకటిగా నిలిచింది. ప్రమాదంలో ‘చిన్నారి దేవతలు’ ఈ పక్షిని చూడగానే అందరినీ ఆకట్టుకునేది.. దాని కాళ్ల చుట్టూ ఉండే తెల్లటి మెత్తని ఈకలు. అవి చిన్నారి పిట్ట ‘నిక్కరు’వేసుకున్నట్లు అనిపిస్తాయి. కాంస్య–పచ్చ రంగులో మెరిసిపోయే రెక్కలతో ఇది అడవిలో ఒక ఎగిరే మణిలా కనిపిస్తుంది. అందుకే దీనిని అండీస్ పర్వతాల ‘చిన్నారి దేవత’అని పిలుచుకుంటారు. వందల్లో మిగిలిన పక్షులు దురదృష్టవశాత్తూ, ఈ అందమైన పక్షులు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కేవలం 150 నుండి 200 లోపు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మనిషి స్వార్థమే.. పశువుల మేత, వ్యవసాయం కోసం అడవులను నరికేయడంతో ఈ పిట్టలకు గూడు లేకుండా పోతోంది. ఇవి సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉండే నిర్దిష్టమైన అడవుల్లోనే బతకగలవు. ఆ ప్రాంతాలే ఇప్పుడు వ్యవసాయ భూములుగా మారిపోతున్నాయి. ఊపిరి నిలిపే ‘యానకోచా రిజర్వ్’ ఈ పక్షులను కాపాడేందుకు ‘జోకోటోకో ఫౌండేషన్’25 ఏళ్ల క్రితం ‘యానకోచా రిజర్వ్’ను ఏర్పాటు చేసింది. ‘మేము కేవలం ఒక పక్షిని మాత్రమే కాదు, ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థనే కాపాడుతు న్నాం’.. అని పర్యావరణవేత్త పావలా విల్లాల్బా స్పష్టం చేశారు. ప్రస్తుతం పిచించా అగ్నిపర్వత వాలు ప్రాంతాల్లో ఈ అడవులను మళ్లీ పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ స్ఫూర్తి ఆకాశమంత
‘జస్ట్ రిటైర్డ్ స్టార్’ అంటున్నారు సునీతా విలియమ్స్ అభిమానులు. అరవై సంవత్సరాల సునీత జీవితంలో విలువైన అంతరిక్ష అనుభవాలు ఎన్నో... ఎన్నెన్నో! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రారంభ రోజుల నుంచి వివిధ మిషన్ల వరకు... అంతరిక్ష ప్రయాణంలో కీలకమైన ముందడుగులను, మానవులకు అంతరిక్షం ఎలా అందుబాటులోకి వచ్చిందో చూసిన అపురూప కాలానికి సునీత విలియమ్స్ కేంద్రబిందువుగా నిలిచారు. నేడు జాతీయ బాలికా దినోత్సవం. కోట్లాదిమంది బాలికలకు స్ఫూర్తినిచ్చే అపూర్వ శక్తి సునీత విలియమ్స్ జీవితానికి ఉంది. శాస్త్రసాంకేతిక విషయాలే కాదు మధుర గాయకుడు మహ్మద్ రఫీ పాట నుంచి మలబారు అందాల వరకు మాట్లాడే సునీత విలియమ్స్ అంతరంగం ఆమె మాటల్లోనే...బాగా కష్టపడాలనే తపన ఉన్న, సృజనాత్మకత, తెలివితేటలు మూర్తీభవించిన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన అదృష్టం అని నా భర్త చెబుతుంటారు. అది నిజం. నేను పదవీ విరమణ చేసినప్పటికీ చాలా బిజీగా ఉండడం వల్ల ఆ భావన కలగడం లేదు. నా బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించాల్సిన సమయం వచ్చింది.→ అరరే... మిస్సవుతున్నానే!నాకూ ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్) ఉంది! ఆర్టెమిజ్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్న రాబోయే మూన్ మిషన్ నాకు ‘ఫోమో’లాంటిది. చంద్రుడి మీదికి వెళ్లాలని ఎవరికి మాత్రం ఉండదు? అసలు నేను ‘నాసా’లో చేరాలనుకోవడానికి ప్రధాన కారణం అదే. అందువల్ల నాకు ఖచ్చితంగా ‘ఫోమో’ ఉంటుంది. మూన్ మిషన్లో భాగమైన నా స్నేహితులు అదృష్టవంతులు. వారి ప్రయాణాన్ని చూడడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.→ అంతరిక్షం టు లోక సంచారంప్రతి ఒక్కరికి తమకు నచ్చిన ప్రదేశం ఒకటి ఉంటుంది. నా విషయానికి వస్తే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అంతరిక్షం. మరి ఆ తరువాత? అంతరిక్షం తరువాత భూమిపై ఉన్న అందమైన, అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకున్నాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. భారతదేశమంతటా పర్యటించాలనుకుంటున్నాను. ఆ ప్రదేశాలలో కేరళ ఒకటి.→ టాప్ గన్...ఇన్స్పిరేషన్ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచైనా రావచ్చు... అది హాలీవుడ్ అయినా కావచ్చు! అవును... హాలీవుడ్ సినిమా ‘టాప్ గన్’ ప్రభావం నాపై ఉండడం వల్లే తొలిసారిగా జెట్లు నడపాలనుకున్నాను. అయితే నేను హెలికాప్టర్ పైలట్గా మారాను. ఇరవై ఏళ్ల వయస్సులో టెస్ట్ పైలట్కు హాజరైన తరువాత, అక్కడ వ్యోమగాములను కలిసిన తర్వాతే వారికి ఉన్న అర్హతలలో కొన్ని నాకు ఉన్నాయనిపించింది. ‘ఇది నేను ఎంచుకోవాల్సి దారి’ అని అప్పుడే బలంగా అనిపించింది.→ వినాయకుడి ఆశీర్వాదంనా భారతీయ వారసత్వ సంపదపై నాకు చాలా గౌరవం ఉంది. దానిలో కొంత భాగాన్ని వివిధ రూపాల్లో అంతరిక్షంలోకి తీసుకువెళ్లినందుకు సంతోషంగా ఉంది. గణేష్ ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడు. నేను నివసించిన ప్రతిచోటా గణేష్ ఉన్నాడు. అందుకే నాతోపాటు అంతరిక్షంలోకి రావాల్సిందే అనుకున్నాను. ఇక భారతీయ ఆహారం విషయానికి వస్తే... ఎంత తిన్నా తనివి తీరదు. భారతీయ ఆహారం తినబోయే ముందు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతోనే అంతరిక్షంలో నా వెంట కొన్ని సమోసాలు ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది!→ నమ్మలేదు... కాని అది నిజం!నా మొదటి అంతరిక్ష యాత్ర సందర్భంగా...‘భారత్లోని ప్రజలు నువ్వు సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థించారు’ అని నాన్న చెప్పినప్పుడు నేను మొదట నమ్మలేదు. ‘అలా జరిగే అవకాశం లేదు’ అని కూడా అన్నాను. అయితే దినపత్రికలలో వచ్చిన కథనాలు చదివినప్పుడు నాన్న చెప్పింది అక్షరాలా నిజమని తెలుసుకున్నాను. నా స్నేహితురాలు ఒకరు హిమాలయాల్లోని ఒక స్కూల్లో ఉండేది. ఆమె నాతో...‘నీ ఫోటో స్కూల్లో ఉంది’ అని చెప్పింది. భారతదేశం నన్ను తన కుమార్తెగా స్వీకరించడం నాకు హృద్యంగా, సంతోషంగా అనిపించింది.→ ఎలాంటి పుస్తకాలు ఇష్టమంటే...నా జీవితంలో శునకాలకు అధిక ప్రాధాన్యత ఉంది. 2017లో గోర్బి (శనకం పేరు) నాకు దూరమైనప్పుడు చాలా బాధపడ్డాను. నేను అంతరిక్షంలో ఉన్నప్పుడు, ఒక కార్గో నౌకలో నాకు ప్రియమైన శునకాల త్రీడీ–ప్రింటెడ్ మీనియేచర్లను పంపించారు. వాటిని చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది.పుస్తకాలు చదవడం ఇష్టం. అయితే చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ పుస్తకాల కంటే జంతువులు, మిస్టీరియస్ కథల పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉండేది. ఇప్పుడు మాత్రం చరిత్ర, కాల్పనిక చరిత్ర పుస్తకాలు అంటే ఇష్టం. స్లోవేనియన్ సంస్కృతిని పరిచయం చేసే నవల ఒకటి ప్రస్తుతం చదువుతున్నాను. బార్ బార్ దిన్ యే ఆయే!’ తన 59 పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘సారెగామా’ నుంచి ప్రత్యేక బహుమతిని అందుకున్నారు సునీతా విలియమ్స్. లెజెండరీ గాయకుడు మహ్మద్ రఫీ ప్రసిద్ధ పాట ‘బార్ బార్ దిన్ యే ఆయే’ (ఈరోజు మళ్లీ మళ్లీ రావాలి)తో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి సంగీతకారులు, గాయకులతో ప్రముఖ బృందాన్ని ఏర్పాటు చేసింది. ‘రండి... అతి పెద్ద ఐకాన్లతో కలిసి పాడుదాం. అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్కు మనం అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం’ అనే కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ పెట్టింది సారెగామా.’ ఆస్ట్రోనాట్గా సుపరిచితురాలైన సునీతా విలియమ్స్ అథ్లెట్ కూడా..రన్నింగ్, స్విమ్మింగ్, ట్రయాథాన్స్, విండ్సర్ఫింగ్, స్నో బోర్డింగ్, బౌ హంటింగ్, రాక్ క్లైంబింగ్ అంటే ఇష్టం. స్పేస్లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఇక సంగీతం విషయానికి వస్తే గిటార్ వాయించడంలో సునీత విలియమ్స్కు ప్రావీణ్యం ఉంది. -
చికెన్ ముక్క చిక్కుల్లో ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా విమానం ఎక్కారా? అయితే మీ ఆకలిని అణచుకోండి.. లేదంటే ’కోడ్ ఆఫ్ కాండక్ట్’ హెచ్చరిక లేఖ అందుకునేందుకు సిద్ధంగా ఉండండి.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న అభిషేక్ చౌదరి అనే ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా సిబ్బంది చుక్కలు చూపించారు. ముందుగా బుక్ చేసుకున్న మీల్ అడిగినందుకు తనను వేధించారంటూ ఆయన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన యూట్యూబర్ ఫ్రెండ్ ఆకాష్ గుప్తాతో కలిసి దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. నాన్వెజ్ భోజనం బుక్ చేసినా.. జనవరి 19న జరిగిన ఈ ప్రయాణంలో అసలు రచ్చ అంతా నాన్ వెజ్ భోజనం దగ్గర మొదలైంది. అభిషేక్ తన తమ్ముడి కోసం ముందుగానే నాన్–వెజ్ భోజనం బుక్ చేసుకున్నాడు. కానీ ఆహారం అందించే సమయానికి.. అది అయిపోయిందని సిబ్బంది చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే, కనీస మర్యాద లేకుండా ‘నీ టికెట్ చూపించు’అంటూ ఎయిర్ హోస్టెస్ మొరటుగా ప్రవర్తించిందని అభిషేక్ ఆరోపించాడు. పక్కనే ఉన్న ఓ ఫ్రెంచ్ ప్రయాణికుడికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘క్షమాపణ చెప్పాల్సింది పోయి, చాలా దురుసుగా మాట్లాడారు’.. అని ఆ విదేశీ ప్రయాణికుడు కూడా వీడియోలో వాపోయాడు. బెదిరింపులు.. ఆంక్షలు అభిషేక్ ఈ విషయాన్ని సీనియర్ క్రూ మెంబర్ దృష్టికి తీసుకెళ్తే, ఆమె ఇంకా సీరియస్గా ‘నువ్వు నోరు మూసుకో’అని గద్దించిందట. విచిత్రం ఏంటంటే, అభిషేక్ ఈ గొడవను వీడియో తీస్తున్నాడని తెలియగానే, ఫ్లైట్లో లైట్లు డిమ్ చేసేశారట. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక అభిషేక్ దిగకుండా గ్రౌండ్ స్టాఫ్ ఆపేశారు. అతని ఫోన్ లాక్కుని చెక్ చేశారు. ‘జరిగిందేదీ సోషల్ మీడియాలో పెట్టను’.. అని బలవంతంగా రాయించుకున్నారట. పైగా అతను తాగి ఉన్నా డని తప్పుడు ఆరోపణలు చేశారట. చివరగా, పైలట్ సంతకంతో కూడిన ఒక ‘కోడ్ ఆఫ్ కండక్ట్ వార్నింగ్ లెటర్’కూడా చేతిలో పెట్టారు. మొక్కుబడి స్పందన ఈ వీడియో వైరల్ అవ్వడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామని, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరికి షాక్!
అడవిలో కడుపు నిండా మేత లేక.. చాలినంత నీరు దొరక్క ఏనుగులు పొలం బాట పడుతున్నాయి. తమకిష్టమైన టమాట, వరి, అరటి, మామిడి తోటలపై పడి ఆరగిస్తున్నాయి. అడవి నుంచి బయటకొచ్చి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో మృత్యువులా వేలాడుతున్న కరెంట్ తీగలు తగులుకుని ప్రాణాలు విడుస్తున్నాయి. గత పదేళ్లలో మొత్తం 23 ఏనుగులు మృతిచెందగా.. వాటిలో 15 దాకా కరెంట్ షాక్తో మృతిచెందడం అటవీశాఖ అధికారుల భద్రతా చర్యలను ప్రశ్నిస్తున్నాయి. మరికొన్ని పాడుబడిన బావుల్లో.. ఇంకొన్ని మదపుటేనుగుల పెనుగులాటల్లో ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం, కల్లుపల్లి వద్ద మదపుటేనుగు మృత్యువాత పడింది. పలమనేరు: కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీనిలో ఏనుగుల మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. అడవి దాటిన ఏనుగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అడవిలోంచి మేతకోసం వచ్చే ఏనుగులు పలు రకాల ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నాయి. తాజాగా కల్లుపల్లి వద్ద ఓ మదుపుటేనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఇప్పటికి 23 ఏనుగులు మృతిచెందాయి. ఏనుగులను కాపాడుకోవడంలో అటవీశాఖ విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహా‘కా’రం! కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం తక్కువ. ఇష్టౖమైన ఆహారం కోసం అడవిని దాటుతున్నాయి. భయానికి గురై అటవీశాఖ ఏర్పాటు చేసిన సోలార్ఫెన్సింగ్, ఎలిఫెంట్ ట్రెంచ్లను ధ్వంసం చేసి బయటకు వస్తున్నాయి. పొలాల్లోని మామిడి, టమాట, వరి లాంటి ఇష్టమైన ఆహారం కోసం అన్వేíÙస్తున్నాయి. మరికొన్ని కొత్త ప్రాంతాలకు వెళుతున్నాయి. ఇటీవల కాలంలో కౌండిన్యలోని ఏనుగులు గంగవరం, పెద్దపంజాణి, సోమల మీదుగా చంద్రగిరివైపు, బంగారుపాళెం, గుడిపాల వైపు వెళ్లాయి. మదపు టేనుగులే బలి!చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్రేంజ్ల పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతోపాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం, కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ఏనుగులు ప్రవేశిస్తుంటాయి. వీటిల్లో 23 ఏనుగులు వివిధ కారణాలతో మృతిచెందాయి. గత పదేళ్లలో కరెంట్ షాక్లతోనే 15 ఏనుగులు మృతిచెందాయి. మిగిలినవాటిల్లో మూడు మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. మరో రెండు మదపుటేనుగుల దాడులతో, మిగిలినవి పాడుబడిన బావు ల్లో పడడంతో చనిపోయాయి. ముఖ్యంగా ఏనుగులకు కరెంట్ శత్రువులా మారింది. మేతకోసం అడవిని దాటి పంటలపైకొచ్చే ఏనుగులు ఎక్కువగా కరెంట్షాక్లతో మృతిచెందుతున్నాయి. సమాచారం⇒ కౌండిన్యలో మొత్తం ఏనుగులు 107 దాకా⇒ ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించే ఏనుగులు 71 దాకా⇒ కరెంట్ షాక్తోనే మృతిచెందిన ఏనుగులు 15 ⇒ తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే సంచార ఏనుగులు 36⇒ ఇప్పటిదాకా వివిధ కారణాలతో మృతిచెందిన మొత్తం ఏనుగులు 23 శాశ్వత పరిష్కారం చేపడితేనే అడవిని దాటి ఏనుగులు రాకుండా అటవీశాఖ శాశ్వత పరిష్కారాలను చూపడంతో విఫలమవుతోంది. తాజాగా కుంకీ ఏనుగుల ద్వారా అడవిలోని ఏనుగులను కట్టడి చేసే కార్యక్రమం సైతం విజయవంతం కాలేదు. దీంతో ఏనుగులు యథేచ్ఛగా అడవిని దాటి బయటకొస్తున్నాయి. జాతీయ సంపదైన ఏనుగులను కాపాడుకొనేందుకు అటవీశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నిజాం ఆస్తుల్లో వాటా దక్కకుండా కుట్ర
గౌరీభట్ల నరసింహమూర్తి‘నా బాల్యం ఈ చారిత్రక నగరంలోనే సాగింది. హైదరాబాద్ రోడ్లపై విహరించాను, ఇక్కడి చెరువులను చూ శాను, నాటి ఉద్యానవనాల్లో తిరిగాను, మైదానాల్లో ఆట లాడాను. ఇక్కడి ప్రజల జీవనగమనాన్ని పరిశీలించాను. ఈ నగరానికి, ఇక్కడి ప్ర జలకు, ముఖ్యంగా పేదలకు ఏదో చే యాలన్న తపన ఉంది. వేగంగా పురోగమిస్తున్న పది ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అన్న విషయం చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ, నిజాం వా రసుడిగా నాకు దక్కాల్సిన స్థానాన్ని కూ లదోసేందుకు, ఆ ఆస్తుల్లో నాకు వాటా రాకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రలు నన్ను కుంగదీస్తున్నాయి. నేను ఆస్ట్రేలియాలో ఉన్నా హైదరాబాదీనే’... ఇవీ ఎనిమిదో నిజాం ముకరం జా తనయుడు అలెగ్జాండర్ ఆ జం జా చెబుతున్న ఆసక్తికర అంశాలు. నిజాం ఆస్తులపై సవతి తల్లి కుటుంబ సభ్యు లతో ఉన్న వ్యాజ్యాల కోసం నగరానికి వచ్చిన ఆజం జా గురువారం ‘సాక్షి’తో ప్రత్యే కంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ను రెండు శతాబ్దాల పాటు పాలించి న అసఫ్ జాహీ వారసుడిని నేను. ఎనిమిదో నిజాంగా స్వయంగా ప్రభుత్వం గుర్తించిన ముకరం జా కుమారుడిని. వాస్తవానికి నేను ఆయన వారసుడిని. కానీ, ఆయన మాజీ భార్య, ఆమె పిల్లలు న న్ను ఆ వారసత్వానికి దూరం చేసే కు ట్రలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో నిజాం ఆస్తులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్యాలెస్లు ఆయన సొంతం. భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీ నం సమయంలో అధికారికంగా సంక్ర మించిన ఆస్తులున్నాయి. మా నాన్న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ముకరం జా ట్రస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్లో నన్ను సభ్యుడిగా నియమించారు.దాని ద్వారా పేదలకు చవకగా చదువు చెప్పించాలన్నది ఆయన తాపత్రయం. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేనూ నిర్ణయించుకున్నా. కానీ, ముకరం జా వారసులుగా చెప్పుకునేవాళ్లు అందులో ఎన్నో అవకతవకలకు తెరలేపారు. నేను అందులో ఉంటే వారి కుట్రలు సాగవని తేలుసుకుని అందులోనుంచి నన్ను తొలగించారు. నా బాల్యంలో హైద రాబాద్లోని చిరాన్, చౌమహల్లా, ఫలక్నుమా ప్యాలెస్లలో గడిపిన వాడిని. కానీ, ఇప్పుడు అన్ని ప్యాలెస్లు ఉండి కూడా, హైదరాబాద్కు వస్తే హోటల్ గదిలో ఉండాల్సిన దుస్థితి కల్పించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నాకు న్యాయమైన వాటా అందాల్సి ఉంది ముస్లిం పర్సనల్ లా, ఇస్లామిక్ షరియా ప్రకారం ... ఆస్తులను ఆరు భాగాలు చేసి అందులో ఓ భాగం నాకు దక్కాల్సి ఉంది. భారత న్యాయ సూత్రాల ప్రకారం చూసినా నా వాటా నాకు దక్కాల్సిందే. దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఉండే ఆస్తుల విలువలో నాకు న్యాయమైన వాటా అందాల్సి ఉంది. కానీ, అది అందకుండా నన్ను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్యాలెస్లలో ఉన్న విలువైన నిజాం వస్తువులను అక్రమంగా తరలించుకుపోతుంటే బాధగా ఉంది. తరలిన వస్తువులు నిజాంవేనని ధ్రువపరిచే ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నా తండ్రి నుంచి విడాకులు పొందిన మహిళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నా తండ్రి బతికున్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టిన వారు, ఇప్పుడు ఆయన ఆస్తికి వారసులుగా అక్రమాలకు తెర దీశారు.హుస్సేన్ గుర్తుకొస్తారు..చిరాన్ ప్యాలెస్, కింగ్ కోఠి ప్యాలెస్లలో నా బాల్యం సంతోషంగా గడిచింది. ఈ సమయంలో నా కేర్టేకర్గా మా నాన్న హుస్సేన్ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. నన్ను సైకిల్పై తిప్పడం, వీధుల్లో విహారానికి తీసుకెళ్లడం, నేను సంతోషంగా ఉండేలా చేయడం... ఇలా ఆయన చేసిన సేవలు అపారం. ఇప్పు డు హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంటే ఆనాడు హుస్సేన్తో గడిపిన రోజులు గుర్తొచ్చి మనసు భారంగా మారుతోంది. -
పాలక్ పనీర్ ఘాటు..
ఒక చిన్న మైక్రోవేవ్ ఓవెన్.. అందులో వేడెక్కుతున్న పాలక్ పనీర్.. ఆ వాసన నచ్చని ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్. అక్కడితో మొదలైన చిన్న గొడవ.. అంతర్జాతీయ స్థాయి న్యాయపోరాటంగా మారిపోయింది. చివరికి అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ మోకాళ్ల మీదకొచ్చి 200,000 డాలర్లు (సుమారు రూ.1.83 కోట్లు) చెల్లించేలా చేసింది. ఇది కేవలం డబ్బు కోసం జరిగిన పోరాటం కాదు, భారతీయతపై జరిగిన దాడికి ఎదురు దెబ్బ!.అసలేం జరిగిందంటే..యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోల్డర్లో పీహెచ్డీ చేస్తు న్న ఆదిత్య ప్రకాశ్, తన లంచ్ బాక్స్లోని పాలక్ పనీర్ ను వేడి చేస్తుండగా ఒక బ్రిటిష్ స్టాఫ్ మెంబర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఈ వాసన ఘాటుగా ఉంది.. ఇక్కడ ఇలాంటివి వేడి చేయకూడదు’.. అని హుకుం జారీ చేశాడు. ‘శాండ్విచ్లు ఓకే కానీ.. కూరలు వద్దు’.. అంటూ ఆ నిబంధన వెనుక ఉన్న వివక్షను బయట పెట్టాడు. ఇది కేవలం వాసన గురించి కాదని, తన ‘భారతీయత’పై జరిగిన దాడిగా ఆదిత్య భావించారు.అణచివేత మొదలైందిలా..దీనిపై ప్రశ్నించినందుకు ఆదిత్య ప్రకాశ్, అతని కాబోయే భార్య ఊర్మి భట్టాచార్యలపై వర్సిటీ యాజమాన్యం ప్రతీకార చర్యలకు దిగింది. వారి పరిశోధనలకు నిధులను నిలిపివేసింది. టీచింగ్ రోల్స్ నుంచి తొలగించింది. నెలల తరబడి పనిచేసిన పీహెచ్డీ అడ్వైజర్లు కూడా దూరం జరిగేలా ఒత్తిడి తెచ్చింది. చివరికి వారు చెప్పిన పాఠాల్లో ‘సాంస్కృతిక వివక్ష’ గురించి ప్రస్తావించినా, సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకున్నా.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి’.. అంటూ జాత్యహంకార వేధింపులు ఎదురయ్యాయి.తిరగబడ్డ భారతీయ జంటతమ కెరీర్ను పణంగా పెట్టి అయినా సరే, ఆహార వివక్ష (ఫుడ్ రేసిజం)పై పోరాడాలని భారతీయ జంట నిర్ణయించుకుంది. దీనిపై 2025 మే నెలలో సివిల్ రైట్స్ కింద కోర్టులో కేసు వేశారు. ‘మేము భారతీయులం కాబట్టే మా ఆహారాన్ని, మా సంస్కృతిని చిన్నచూపు చూస్తున్నారు’.. అని గళమెత్తారు. చివరకు వర్సిటీ దిగివచ్చి భారీ మొత్తాన్ని నష్టపరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించింది. బాధిత విద్యార్థులకు 200,000 డాలర్లు (సుమారు రూ.1.83 కోట్లు) పరిహారం చెల్లించాలని.. వారి పీహెచ్డీ డిగ్రీలను వెంటనే ప్రదానం చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిషన్ ‘బోరో’!
ఒకవైపు మృతదేహాల గుట్టలు.. మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలు.. ఆదివారం రాత్రి స్పెయిన్లో జరిగిన రైలు ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైంది. 42 మంది ప్రాణాలు కోల్పోయారు.. 150 మందికి పైగా రక్తగాయాలయ్యాయి. కానీ, ఆ రక్త ధారల మధ్య ఒక యువతి కన్నీటి రోదన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుండెలను పిండేస్తోంది. ఆమె అడుగుతోంది తన ప్రాణాల కోసం కాదు.. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్న శునకం ‘బోరో’గురించి.. క్షణంలో మారిన దృశ్యం అనా గార్సియా తన గర్భిణి సోదరితో కలిసి ఆదివారం సాయంత్రం మాలాగా నుంచి మాడ్రిడ్కు హైస్పీడ్ రైలులో వెళ్తోంది. రాత్రి 7.45 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో బోగీలు తునాతునకలయ్యాయి. కిటికీల గుండా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న భీభత్స దృశ్యాలు.. ఆ గందరగోళంలో, అనా గార్సియా కళ్లముందే తన శునకం బోరో భయంతో పారిపోవడం చూసింది. నా ప్రాణాన్ని తెచి్చవ్వండి శరీరమంతా గాయాలు, బుగ్గపై బ్యాండేజ్, కళ్లలో నీళ్లు.. నడవడానికి కూడా శక్తి లేక కుంటుతున్నా అనా గార్సియా మీడియా ముందుకు వచ్చి ఒకటే విజ్ఞప్తి చేసింది.. ‘దయచేసి ఆ మూగజీవాలను వెతకడానికి సహాయం చేయండి. బోరో కేవలం కుక్క కాదు.. మా కుటుంబ సభ్యుడు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి’.. అంటూ ప్రాధేయపడింది. ప్రపంచాన్ని కదిలించిన ఫొటో కుంటుతూనే తన ప్రాణ స్నేహితుడి కోసం ఆమె మళ్లీ ప్రమాద స్థలికి బయల్దేరిన తీరు చూసి స్పెయిన్ మొత్తం కదిలింది. నల్లటి రంగు, తెల్లటి కను»ొమ్మలతో ఉన్న బోరో ఫొటో నిమిషాల్లో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. వేలాది మంది నెటిజన్లు ఫోన్ నంబర్లను షేర్ చేస్తూ బోరో కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇలా కనిపించి.. అదృశ్యం సోమవారం మధ్యాహ్నం టీవీ చానల్ (టీవీఈ) ప్రమాద స్థలాన్ని డ్రోన్తో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక ఆశ చిగురించింది. పొలాల్లో బోరోను పోలిన ఒక కుక్క పరుగెడుతూ కెమెరాకు చిక్కింది. కానీ, అది ఇన్వెస్టిగేషన్ జోన్ కావడంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోయారు. ఆ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది, ప్రమాదం జరిగిన ప్రాంతం దర్యాప్తు సంస్థల ఆ«దీనంలో ఉండటంతో సాధారణ ప్రజలకు ప్రవేశం లేదు. అయితే, బోరో కోసం స్పెయిన్ జంతు హక్కుల పార్టీ ప్రత్యేక అనుమతి పొందింది. ప్రభుత్వ అనుమతితో జంతు సహాయక బృందాలు బుధవారం రంగంలోకి దిగాయి. ‘మేము బోరోను వెతికి తీరుతాం.. ఆ కుటుంబానికి మళ్లీ ఆనందాన్ని ఇస్తాం’.. అని యానిమల్ రైట్స్ పార్టీ ప్రకటించింది. బోరో.. క్షేమంగా తిరిగి రా! చనిపోయిన 42 మంది కుటుంబాల్లో విషాదం ఒకవైపు తాండవిస్తుంటే.. ప్రాణాలతో బయటపడి కూడా తన ప్రియమైన మూగజీవం కోసం ఎదురుచూస్తున్న అనా గార్సియా పోరాటం ఇప్పుడు స్పెయిన్ అంతటా ఉత్కంఠకు గురిచేస్తోంది. బోరో దొరుకుతుందా? అనా తన ప్రాణ స్నేహితుడిని మళ్లీ హత్తుకుంటుందా?.. బోరో క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిట్ కౌయిన్...
అంతా డిజిటల్మయంగా మారుతున్న నేపథ్యంలో పాడి వ్యాపారం కూడా డిజిటల్ బాట పడుతోంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సరే మనం ఆవుల్ని డిజిటల్గా కొనుక్కుని, మెయింటెనెన్స్ బాదరబందీ లేకుండా, రాబడిని అందుకునే విధంగా గోమిని అనే ఓ స్టార్టప్ సంస్థ వినూత్న వ్యాపారాన్ని తెరపైకి తెచ్చింది. బిహార్కి చెందిన ఈ స్టార్టప్ని అర్జున్ శర్మ అనే ఔత్సాహిక వ్యాపారవేత్త ప్రారంభించారు. మేలుజాతి దేశీ ఆవుల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మోడర్న్ టెక్నాలజీతో ఒక్కో ఆవుకి ఎన్ఎఫ్టీ (నాన్–ఫంజిబుల్ టోకెన్)ని సృష్టించి, వాటిని విక్రయిస్తున్నారు. దీనితో అమెరికా, కెనడా, లండన్ ఎక్కుణ్నుంచైనా సరే ఇన్వెస్టర్లు ఎన్ఎఫ్టీలను కొనుక్కోవడం ద్వారా సదరు ఆవులను సొంతం చేసుకోవచ్చు. ఇలా అమ్మిన ఆవుల పోషణ భారాన్ని ఇన్వెస్టర్ల తరఫున ఇక్కడే గోమిని చూసుకుంటుంది. అంతేకాదు వారికి పెట్టుబడి మీద రాబడి కింద ప్రతి నెలా డివిడెండ్ మాదిరి రెండు కిలోల స్వచ్ఛమైన నెయ్యిని కూడా పంపిస్తుంది. అది కూడా వారు కొనుక్కున్న ఆవు ఇచ్చిన పాల నుంచి తీసినదే అయి ఉంటుంది. రూ. 15 లక్షల వరకు రాబడి ..ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోవు. సదరు ఆవు సంతతి పెరిగే కొద్దీ మరింత ఆదాయాన్ని కూడా ఇన్వెస్టరు పొందవచ్చు. పాలు, పిడకలు, అగరొత్తులు ఇత రత్రా ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 25% రాబడిని అందుకోవచ్చు. మొత్తం మీద కాస్తంత ఇన్వెస్ట్ చేస్తే ఓ ఆవును, దాని జీవితకాలంలో రూ. 15 లక్షలకు పైగా రాబడులు అందుకోవచ్చని శర్మ వివరించారు. సరే, దీనికి ఎన్ఎఫ్టీలాంటి సంక్లిష్టమైన టెక్నాలజీ హంగులు ఎందుకంటే, కొనుగోలు, ఆ తర్వాత జరిగే ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం అంటారు అర్జున్ శర్మ. ఈ విధానంలో సిసలైన యజమానిని ధ్రువీకరించే డిజిటల్ సరి్టఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. ఇందులో ఆవు జాతి, వయస్సు, విశిష్ట గుర్తింపు, లొకేషన్, ఆరోగ్యం వివరాలు, రెవెన్యూ షేరింగ్ ఒప్పందం వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. ప్రస్తుతం బిహార్లో కంపెనీకి మూడు క్లస్టర్లు ఉన్నాయి. గో సేవను కేవలం చా రిటీకి పరిమితం చేయకుండా రాబడినిచ్చే లాభ సాటి పెట్టుబడి మార్గంగా మార్చడం వల్ల గో సంరక్షణ వైపు మరింత మంది ఇన్వెస్టర్లను మళ్లించవచ్చనేది అర్జున్ శర్మ ఆలోచన. తద్వారా అంతరించిపోతున్న మేలిమిజాతి దేశీ ఆవులను సంరక్షించవచ్చని ఆయన తెలిపారు. ఈ వినూత్న ప్రయత్నానికి నాబార్డ్ కూడా తోడ్పాటు అందిస్తోంది. రైతుకు కూడా ప్రయోజనం .. కేవలం ఇన్వెస్టర్ల కోణంలోనే కాకుండా రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు శర్మ తెలిపారు. ఫార్మ్లను నిర్వహించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి లభిస్తుందని వివరించారు. తద్వారా ఇటు గోమాతకి అటు మహిళల ఉపాధికి కూడా తోడ్పాటు అందించినట్లవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం వివిధ రకాల ప్లాన్లు కూడా ప్రవేశపెట్టారు. రూ. 3,97,000 నుంచి కొనుగోలు చేయొచ్చు లేదా ముందుగా రూ. 30,000 బుకింగ్ కింద కట్టి ప్రతి నెలా ఈఎంఐ కింద ఓ 24 నెలలు రూ. 17,500 కట్టేలా కూడా ప్లాన్లను గోమిని అందిస్తోంది. కేవలం నెయ్యితో సరిపెట్టకుండా ఆవు పేడను కూడా మానిటైజ్ చేసే పనిలో ఉన్నారు అర్జున్ శర్మ. ఒక్క కేజీ పొడి ఆవు పేడతో అగరొత్తుల్లో ఉపయోగించే 1.4 కేజీ పొడిని తయారు చేయొచ్చని, దీనికి మరింత ఎక్కువ విలువ లభిస్తుందని ఆయన చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘నిమిషాల్లో’ ఆరోగ్యం!
సాక్షి, స్పెషల్ డెస్క్: చెమటోడిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా 31% పెద్దలు, 81% మంది కౌమార దశలో ఉన్నవారు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారట. ఉరుకుల పరుగుల జీవితంతో ముడిపడిన ఉద్యోగులు, వ్యాపారస్తులకు తీరిక సమయం దొరకడం లేదు. టైమ్ దొరికినా చాలామందికి బద్దకం అలుముకుంటోంది. ఇలాంటివారు 1–2 గంటల శారీరక శ్రమ చేసే అవకాశమే లేదు. అందుకే ‘ఎక్సర్సైజ్ స్నాక్స్’ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఒకట్రెండు నిమిషాల్లో చేసే ఈ తేలికపాటి వ్యాయామాలతో రోజంతా ఉత్సాహంగా ఉండడమేగాక జీవనశైలి రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.ఎక్సర్సైజ్ స్నాక్స్ ఇలా..పుషప్స్ : నేలపై, లేదా గోడకు, టేబుల్ ఆసరాగా చేయొచ్చు గోడ కుర్చీ: ఫోన్ చూసే సమయంలో స్క్వాట్స్ : ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కాఫ్ రైజింగ్ : బ్రష్ చేసుకునేప్పుడు డ్యాన్స్ : ఈ ప్రపంచాన్ని మైమరచిపోయి నచ్చినట్టు డ్యాన్స్ మెట్లు : అవకాశం చిక్కినప్పుడల్లా మెట్లు ఎక్కి దిగడం కాళ్లు సాగదీయడం : కుర్చీలో, సోఫాలో కూర్చున్నప్పుడు నడక : ఇల్లు, కార్యాలయం, ఆరుబయట వాకింగ్. స్ట్రెచింగ్ : చేతులు, కాళ్లు, మెడ, నడుమును సాగదీయడం. అలవాట్లు మారాయి బిజీ లైఫ్కు తోడు జనం అలవాట్లు మారాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు లైఫ్స్టైల్ను మార్చేశాయి. సోషల్ మీడియా మోజులో పడి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల తీరు ఇలాగే ఉంది. జీవనశైలి సంబంధ జబ్బుల బారిన పడడమో, ఒకరిని చూసి స్ఫూర్తి పొందడమో లేదా ఆత్మీయులు, వైద్యులు హెచ్చరిస్తే తప్ప వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. ఇటువంటి వారికి ఎక్సర్సైజ్ స్నాక్స్ సరైన పరిష్కారం. ఈ చిన్నచిన్న వ్యాయామాలతో గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. కూల్ మైండ్, ఎనర్జీకితోడు కండరాలు బలంగా తయారవుతాయి. కొన్ని రకాల కేన్సర్లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి మెదడు సంబంధ విధులు మెరుగవుతాయి. మెరుగుపడిన ఆరోగ్యం.. ఎక్సర్సైజ్ స్నాక్స్ అంటే సింపుల్గా ఒకట్రెండు నిమిషాల్లో చేసే వ్యాయామాలు. పుషప్స్, గోడ కుర్చీ, గుంజీల మాదిరిగా కూర్చొని లేవడం (స్క్వాట్స్), పాదాల వేళ్లపై నిలబడి శరీరాన్ని పైకి, కిందకు చేయడం (కాఫ్ రైజింగ్), డ్యాన్స్, మెట్లు ఎక్కి దిగడం, నడక, స్ట్రెచింగ్, ఎగరడం, నిలుచున్నచోటనే పరుగు.. ఇవన్నీ కూడా ఈ విధానంలో భాగంగా చేసుకోవచ్చు. వీటిని వెనువెంటనే చేయాల్సిన అవసరం లేదు. గంటకో, రెండు గంటలకో రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు. రోజులో వీలున్నప్పుడు కాకుండా వీలు చేసుకుని మరీ పలుమార్లు చేయడమే ఉత్తమం. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన విశ్లేషణ ప్రకారం.. ఒకప్పుడు ఎటువంటి వ్యాయామం చేయని పెద్దల్లో ఎక్సర్సైజ్ స్నాక్స్ కారణంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడింది. » పెద్దల్లో వారానికి కనీసం 150 నిమిషాల మితమైన–తీవ్రత కలిగిన లేదా 75 నిమిషాలపాటు తీవ్రమైన శారీరక శ్రమ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. » పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు రోజుకు 60 నిమిషాల వ్యాయామం చేయాలి. » ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్లో ప్రస్తుతం 31% మంది (180 కోట్ల మంది) వ్యాయామాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 35%కి చేరుకుంటుందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. » జపాన్, బ్రెజిల్, భారత్లో ఇటువంటి వారి సంఖ్య అధికంగా ఉంటోందట. నెదర్లాండ్స్ ప్రజలు వ్యాయామాల విషయంలో చురుకుగా ఉంటున్నారు. » ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన ఓ అధ్యయనం ప్రకారం 58% మంది ఎక్కువ వ్యాయామం చేయాలనుకుంటున్నారు. ఇందుకు సమయం లేకపోవడమే ప్రధాన అవరోధంగా వీరు పేర్కొంటున్నారు. శారీరక శ్రమ లేని జనం రోగాల బారిన పడి 2020–30 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థపై రూ.27 లక్షల కోట్ల భారం పడనుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెద్దలపై జరిపిన అధ్యయనంలో... వ్యాయామం చేయని 25,000 మందికి పైగా పెద్దలపై జరిపిన ఒక అధ్యయనంలో.. వేగంగా నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి కార్యకలాపాల ద్వారా ప్రతిరోజూ కేవలం 3–4 నిమిషాలు చురుకుగా వ్యాయామం చేసేవారు ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం 40% తక్కువగా ఉందని తేలింది. వ్యాయామం ఎరగని వారితో పోలిస్తే ఎక్సర్సైజ్ స్నాక్స్ చేసేవారికి హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే ప్రమాదం దాదాపు 50% తక్కువగా ఉంది. -
ట్రంప్ ఏడాది పాలన... ప్రపంచానికి పీడకల
డొనాల్డ్ ట్రంప్ 2.0 క్రమంగా ప్రపంచానికి మర్చిపోలేని పీడకలగా మారుతోంది. అమెరికా అధ్యక్షునిగా రెండో టర్మ్లో ఆయన తొలి 12 నెలల పాలన అన్ని దేశాలనూ చెప్పలేనంత అనిశ్చితికి, అయోమయానికి, అంతకు మించిన అభద్రతా భావానికి గురి చేసింది. 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం చేసింది మొదలు మితిమీరిన దూకుడు, మతిలేని నిర్ణయాలతో ప్రతి దేశాన్నీ ట్రంప్ హడలెత్తిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అమెరికా గౌరవాన్ని, అగ్ర రాజ్యంగా దానికున్న పరువు ప్రతిష్టలను కూడా మంటగలుపుతున్నారు. నోటికొచ్చిన వ్యాఖ్యలు, చౌకబారు కామెంట్లకు ట్రంప్ మారుపేరుగా మారిపోయారు. ఆచితూచి మాట్లాడటం తన డిక్షనరీలోనే లేదని నిరూపిస్తున్నారు. కనీస దౌత్య మర్యాదలకు కూడా తిలోదకాలిస్తూ దేశాధినేతలనే మీడియా సాక్షిగా అవమానించి అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇక ప్రతి దేశంపైనా ఎడాపెడా భారీ టారిఫ్లు విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్నే అతలాకుతలం చేసేశారు ట్రంప్. మాట వినని దేశాలను బెదిరించేందుకు టారిఫ్లను అస్త్రంగా ప్రయోగిస్తూ విపరీతమైన చెడ్డపేరు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలన ఘనతలపై మంగళవారం మీడియాతో ట్రంప్ ఏకంగా గంటా నలభై నిమిషాల పాటు ప్రసంగించారు. 365 రోజుల్లో రోజుకొకటి చొప్పున ఏకంగా 365 విజయాలు సాధించానంటూ గొప్పలకు పోయారు. అమెరికాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేయడంతో పాటు పలు అద్భుతాలు చేశానని చెప్పుకున్నారు. ఆ క్రమంలో మూడొంతులకు పైగా అర్ధసత్యాలు, అసత్యాలే చెప్పి విస్మయపరిచారు. పొరుగు దేశాలను అమెరికాలో కలిపేసుకోవాలన్న విస్తరణ కాంక్షను, గ్రీన్లాండ్ విషయంలో యూరప్ మిత్ర దేశాలతో కూడా కయ్యానికి కాలు దువ్వడాన్నీ అడ్డంగా సమర్థించుకున్నారు. ఈ పెడ పోకడలపై మీడియా అడిగిన ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే బదులిచ్చి సరిపెట్టారు. గడచిన ఏడాదికాలంలో అటు సొంత ప్రజలను, ఇటు ప్రపంచాన్ని ట్రంప్ హడలెత్తించిన తీరుపై ఫోకస్...టారిఫ్లే టారిఫ్లుటారిఫ్లు. ఈ ఏడాది పొడవునా ట్రంప్కు ఫేవరెట్గా మారిన పదం ఇదేనంటే అతిశయోక్తి కాదు. మిత్రులు, ప్రత్యర్థులు, శత్రువులు అని తేడా లేకుండా ప్రతి దేశంపైనా ఎడాపెడా సుంకాల బాదుడుకు దిగారు ట్రంప్. పిడుగుకూ, బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టుగా ప్రతిదానికీ టారిఫ్లనే అస్త్రంగా ప్రయోగిస్తూ వచ్చారు. తద్వారా మొత్తంగా ప్రపంచ వాణిజ్య స్థితిగతులనే అతలాకుతలం చేసి వదిలారు. సగటున అమెరికాతో వాణిజ్యం నెరుపుతున్న ప్రతి దేశంపైనా కనీసం 10 శాతం అదనపు టారిఫ్లు విధించారు. భారత్పై అత్యధికంగా 50 శాతం మేరకు బాదారు. ఈ టారిఫ్లు, పన్నులు, ఫీజుల ద్వారా 2025లో అమెరికా ఏకంగా 287 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు ఆ దేశ ట్రెజరీ విభాగం గణాంకాలే చెబుతున్నాయి. తద్వారా సగటు అమెరికన్లకు ఒరిగిన ప్రయోజనం కూడా ఏమీ లేదని యేల్ వర్సిటీ బడ్జెట్ ల్యాబ్ తేల్చింది. ట్రంప్ మతిలేని టారిఫ్ల వల్ల పెరిగిన నిత్యావసరాల ధరల దెబ్బకు గత ఏడాది కాలంలో ఒక్కో అమెరికన్ కుటుంబంపై కనీసం 1,500 డాలర్ల మేరకు అదనపు భారం పడ్డట్టు అంచనా వేసింది! ఏడు దేశాలపై దాడులు!యుద్ధాలకు తెర దించి ప్రపంచ శాంతిని సుస్థిరం చేస్తానని రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెట్టుకున్న ఒట్టును ట్రంప్ సింపుల్గా గట్టుమీద పెట్టేశారు. ఈ ఏడాది కాలంలో కనీసం ఏడు దేశాలపై దాడులకు తెగబడ్డారు! బాధిత దేశాల్లో ఇరాక్తో మొదలుపెట్టి సోమాలియా, ఇరాన్, యెమన్, సిరియా, నైజీరియా, తాజాగా వెనెజువెలా దాకా ఉన్నాయి. ఈ జాబితాలో తర్వాతి పేరు గ్రీన్లాండే అయ్యేలా కన్పిస్తోంది. ఆ దీవిని ఆక్రమించేందుకు యూరప్ దేశాలతో తగాదాలకు కూడా ట్రంప్ వెనకాడటం లేదు! 2024 జనవరి 20 నుంచి ఈ జనవరి దాకా అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి కనీసం 658 వాయు, డ్రోన్ దాడులకు పాల్పడ్డట్టు ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా మానిటర్ పేర్కొంది!6 లక్షల మంది గెంటివేతట్రంప్ ఏడాది పాలనలోనే అమెరికా నుంచి ఏకంగా 6.05 లక్షల మందిని గెంటేశారు! నిర్బంధం, అధికారుల బెదిరింపులు తదితరాలను తట్టుకోలేక ఏకంగా 19 లక్షల మందికి పైగా స్వచ్ఛందంగానే అమెరికాను వీడి వెళ్లిపోయారు. మొత్తమ్మీద ట్రంప్ యంత్రాంగం అడ్డగోలు నిబంధనల దెబ్బకు గత ఏడాది కాలంలో అమెరికాలో నివసిస్తున్న 16 లక్షల మంది వలసదారుల హోదాను కోల్పోయారు. అంతేగాక ఈ ఏడాది కాలంలో ట్రంప్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏకంగా 66,866 మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్బంధించింది. అంటే సగటున రోజుకు 821 మంది ఊచలు లెక్కబెట్టారు! వీటికితోడు, ఏకంగా 75 దేశాలవారు అమెరికా ఇమిగ్రేషన్ వీసాలు పొందేందుకు వీల్లేకుండా ట్రంప్ నిషేధం విధించారు.బెదిరింపుల దౌత్యందౌత్య మర్యాదలకు, సాటి దేశాధినేతలకు ఇవ్వాల్సిన కనీస గౌరవాదరాలకు కనీవినీ ఎరగని రీతిలో పాతర వేశారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్హౌస్ ముఖాముఖిలో మీడియా సాక్షిగా దారుణంగా అవమానించి ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు. పలువురు దేశాధినేతలను ఉద్దేశించి మీడియాముఖంగా బెదిరింపులకు దిగడం, వారితో తన ప్రైవేట్ సంభాషణలను బయటపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. తద్వారా తనతో భేటీ అంటేనే వాళ్లు తీవ్ర విముఖత చూపేదాకా తెచ్చుకున్నారు.228 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు2025 జనవరి 20న ప్ర మాణస్వీకారం చేసిన తొలి రోజే ట్రంప్ రికార్డు స్థాయి లో 26 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు (ఈఓ) జారీ చేశా రు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో ఆప ద్ధర్మంగా మాత్రమే ఈవో అస్త్రం వాడాలన్న మర్యాదను అటకెక్కించారు. తొలి టర్ములో నాలుగేళ్లలోనూ కలిపి 220 ఈఓలు ఇస్తే, రెండో టర్ములో తొలి ఏడాది కాలంలోనే ఏకంగా 228 ఈవోలు జారీ చేసి మరో రికార్డు సృష్టించారు! పైగా ఆ ఉత్తర్వులు ఫెడరల్ చట్టాలకు భిన్నంగా ఉండొద్దన్న రాజ్యాంగ నిర్దేశాన్ని కూడా తుంగలో తొక్కారు. దాంతో ట్రంప్ ఈవోలు చాలావరకు కోర్టు కేసులకు దారితీశాయి.పర్యావరణం గాలికిఅగ్రరాజ్యంగా అమెరికాను పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో ముందు నిలపాల్సింది పోయి, ఆ బాధ్యతలను క్రమంగా పూర్తిగా వదిలించుకుంటూ ట్రంప్ చేతులు దులుపుకుంటున్నారు. పారిస్ ఒప్పందంతో పాటు పలు కీలకమైన పర్యావరణ ఒప్పందాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ దిశగా తాజా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 30కి పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను రద్దు చేసి పారేశారు. పైగా సముద్రాల్లో ఏకంగా 25 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆఫ్ షోర్ డ్రిల్లింగ్కు పచ్చజెండా ఊపారు!!ఉద్యోగాలు హుష్కాకి!ప్రపంచ దేశాల మీదే కాదు, తన ను నమ్మి గద్దెనె క్కించిన అమె రికన్లపై కూడా ట్రంప్ ఏమాత్రం కనికరం చూపలేదు. కేవలం 10 నెలల్లోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 3.17 లక్షల ఉద్యోగాలను పీకిపారేశారు! అమెరికాను తిరిగి శక్తిమంతమైన దేశంగా మార్చేందుకంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో తెచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) వ్యయ నియంత్రణ పేరుతో ఇలా ఎడాపెడా ఉద్యోగాలను తీసేస్తూ పోయింది. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ (డీఈఐ) కార్యాలయాలన్నింటకీ మూత వేసింది. అంతర్జాతీయ అభివృద్ధి విభాగాన్నే నామరూపాల్లేకుండా చేసేసింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
అందరికీ అమ్మమ్మ
‘‘నా ఫ్రెండ్కు ఫోన్ చేస్తే ‘ఇప్పుడు రాకు, సీరియల్ చూస్తున్నా’ అంది. అమ్మమ్మలు నానమ్మలు సీరియల్స్ చూస్తుంటే పిల్లలకు ఎవరు కథలు చెప్తారని పిల్లల కోసంరాయడం మొదలుపెట్టాను. అలా దేశానికే ‘ఆచి’ (అమ్మమ్మ) అయ్యాను’’ అన్నారు సుధామూర్తి. 50 ఏళ్ల వయసులో రాయడం మొదలుపెట్టి తన 50వ పుస్తకం వెలువరించిన సందర్భంగ ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో వేలాది ప్రేక్షకులతో ఆమె మాట్లాడారు. తన మనవరాలిని దృష్టిలో పెట్టుకుని పిల్లలందరి కోసం కథలెలా రాస్తున్నారో వివరించారు.‘మా కాలం అమ్మమ్మలు, నానమ్మల్లా ఇప్పటి అమ్మమ్మలు, నానమ్మలు లేరు. వాళ్లు సీరియల్స్తో బిజీగా ఉన్నారు. కుంకుమ్ తన అత్తగారిని మెప్పిస్తుందా లేదా అని వారి టెన్షన్. కుంకుమ్ ఒక పాత్ర అట. లేదంటే వాళ్లకు వాట్సప్ గ్రూపులున్నాయి. వాటిలో బిజీగా ఉంటున్నారు. మరి పిల్లలకు మంచి విషయాలు ఎవరు చెప్పాలి... ఎలా చెప్పాలి... ఇప్పటికే మైక్రో ఫ్యామిలీల వల్ల పిల్లలు అమ్మమ్మలతో, నానమ్మలతో గడపడం లేదు. ఉన్న అమ్మమ్మలేమో బిజీ. పిల్లల గురించి చాలా నిర్లక్ష్యం సాగుతోంది. అందుకనే పిల్లల కోసం కథలు రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 50 పుస్తకాలు రాస్తే వాటిలో 30 పిల్లల కోసమే. అందుకే పిల్లలందరూ నన్ను ‘ఆచి’ అని పిలుస్తున్నారు. అలా దేశానికే బామ్మనయ్యాను’ అని హర్షధ్వానాల హోరు మధ్య సుధామూర్తి చెప్పారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో తన 50వ పుస్తకం ‘ది మేజిక్ ఆఫ్ లాస్ట్ ఇయర్ రింగ్స్’ వెలువడ్డ సందర్భంగా ఆమె మాట్లాడారు.→ మనవరాలి కోసం‘లండన్లో పెరుగుతున్న నా ఇద్దరు మనవరాళ్లలో ఒక మనవరాలు అనుష్కకు అక్కడకు వెళ్లినప్పుడల్లా కథలు చెప్పేదాన్ని. ఆ అమ్మాయి లాంటి పాత్ర ‘నూని’ ని సృష్టించి ఆ పాత్రతో ఒక ట్రయాలజీ రాస్తున్నాను. మొదటి భాగం ‘ది మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్’లో మన పిల్లలకు తెలియాల్సిన ఆర్కియాలజీ గురించి చెప్పాను. మన దేశంలో ఆర్కియాలజీ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన దేశం పురావస్తు శాస్త్రాన్ని పట్టుగొమ్మ. సైన్స్, టెక్నాలజీ చదువులో ఎలాగూ ఉంటుంది. ఆర్కియాలజీ ద్వారా గతాన్ని తెలుసుకోమని ఎవరు చెప్తారు? అందుకే ఆ భాగం రాశాను. రెండో భాగం ‘ది మేజిక్ ఆఫ్ లాస్ట్ ఇయర్ రింగ్స్’ రాశాను. ఇది మన దేశ బాలలకు పార్టిషన్ గురించి తెలియాలని రాశాను’ అన్నారామె.→ సునాక్ కుటుంబం కాందిశీకులే‘నా మనవరాలి వంటి పిల్లలకు దేశ విభజన గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే నా అల్లుడు రిషి సునాక్ కుటుంబం కూడా కాందిశీకులే. వాళ్లు పాకిస్తాన్ నుంచి దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నైరోబీలో స్థిరపడి అక్కడి నుంచి కూడా యు.కెకు కట్టుబట్టలతో వలస రావాల్సి వచ్చింది. కాలి కింద నేల లేకపోవడం అంటే ఏమిటో, నేలతో పాటు భాష, సంస్కృతిని కూడా కోల్పోవడం అంటే ఏమిటే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అయితే ఇది నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చేదిలా కాకుండా గతంలో పెద్దవాళ్లు చేసిన తప్పును ఇప్పుడు మనం చేయకూడదు... విభజనలు, విడదీయడాలు ఎవరికీ మంచివి కావు అని అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పుస్తకం రాశాను. మూడవ భాగం నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి రాస్తాను. వాటి గురించి పిల్లలకు ఎవరూ సరిగా చెప్పరు’ అన్నారామె.→ జీవితం సులభం చేయకండిఇవాళ తల్లిదండ్రులు పిల్లలకు అడిగింది సమస్తం అందచేస్తున్నారు. దాంతో వారికి జీవితం ఇంత సులభమనే భావన కలిగిస్తున్నారు. జీవితం ఎంత మాత్రం సులభం కాదు. దానికి దానివైన ఎగుళ్లు, దిగుళ్లు, ఆనందాలు, బాధలు ఉంటాయి. పిల్లల్ని వాటికి ప్రిపేర్ చేయాలి. నా కొడుకు చిన్నప్పుడు కింద పడితే లేపి ‘నడిచిన వాడే పడతాడు. కాళ్లు ఉన్నది నడవడానికి. పడితే లేచి ముందుకు సాగడానికి’ అని చెప్పేదాన్ని. పిల్లలకు సమస్యలే రాకుండా చూడాలనుకోవడం సరి కాదు’ అన్నారామె.రచయితలు కావాలనుకున్న పిల్లలందరూ బాగా పుస్తకాలు చదవాలని, మంచి రచయితలందరూ మంచి పాఠకులని సూచించారామె.– జైపూర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డరైల్ మిచెల్ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే భారత్లో భారత్పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ అందించి కివీస్ హీరోగా మారాడు. భారత్లో భారత్పై మిచెల్ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ లీగ్ మ్యాచ్, సెమీఫైనల్లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్ రేట్తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో కూడా లీగ్ మ్యాచ్లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్లో కూడా కివీస్ ఓడింది. సిరీస్కు సిద్ధమై... భారత్తో వన్డే సిరీస్కు ముందు మిచెల్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్ తరహాలో నెమ్మదైన పిచ్లు ఉండే లింకన్, మౌంట్ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్ షాట్’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్ స్వీప్ల సాధన దీనికి అదనం. స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్ మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడటం. రాజ్కోట్ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్ సమస్య పెరిగింది. కుల్దీప్ తొలి ఓవర్లోనే సిక్స్తో మొదలు పెట్టిన మిచెల్ ...అతని బౌలింగ్లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్ గావస్కర్ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్ ఒక సిరీస్లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్ కారణం. అన్ని ఫార్మాట్లలో... న్యూజిలాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్పై 3–0తో క్లీన్స్వీప్ చేసిన టెస్టు టీమ్లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఆరంభంలో స్పిన్ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్తో పాటు జూనియర్ స్థాయిలో పెర్త్లో ఎక్కువగా క్రికెట్ ఆడిన మిచెల్కు స్పిన్ అంటే మొదటి నుంచీ సమస్యే. ఎప్పుడో 2013లో అండర్–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్... ఐపీఎల్లో ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు, మరో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
స్మార్ట్ఫోన్లోనే క్రియేటివిటీ
సామాజిక మాధ్యమాలు ప్రాచుర్యంలోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ క్రియేటర్లు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చారు. టెక్ట్స్, ఇమేజ్, వీడియో, ఆడియో.. కంటెంట్ రూపం ఏదైనా క్రియేటర్లలో అత్యధికులకు సోషల్ మీడియానే జీవనాధారం. అయితే మొబైల్ ఫోన్ సాయంతో వీరు తమ క్రియేటివిటీని ‘తెర’మీదకు తెస్తున్నారు. భారత్లో అయితే క్రియేటివ్ స్టూడియోలుగా ఈ చిన్న ఉపకరణం అవతరించడం విశేషం. పైగా వ్యాపారం, ఫాలోవర్లను పెంచుకునే లక్ష్యంగా కృత్రిమ మేధను సాధనంగా మలుచుకుంటున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా్రగామ్, వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక మాధ్యమాల్లో 560 కోట్ల మంది విహరిస్తున్నారు. ఇక కంటెంట్ క్రియేటర్లు సుమారు 30 కోట్ల మంది ఉన్నట్టు అంచనా. వీరిలో మన దేశం నుంచి 10 కోట్ల మంది ఉంటారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ క్రియేటర్లతో భారత్ టాప్లో నిలిచింది. ఫొటోలు, వీడియోలు తీయడానికే స్మార్ట్ఫోన్లను వీరు ఉపయోగిస్తారనుకుంటే పొరపడ్డట్టే. ప్రణాళిక, షూటింగ్, ఎడిటింగ్, పబ్లిషింగ్ సైతం ఫోన్లోనే కానిచ్చేస్తున్నారు.మన దేశంలో 80 శాతానికిపైగా క్రియేటర్లు పూర్తిగా స్మార్ట్ఫోన్ కేంద్రంగా తమ సృజనాత్మకతను ప్రపంచం ముందుకు తెస్తున్నారు. మొబైల్ ఫోన్లలోని ఫీచర్స్ మరింత శక్తివంతంగా, సహజంగా మారుతున్నాయి. దాదాపు 90 శాతం మంది రాబోయే కాలంలో మొబైల్ ఆధారిత కంటెంట్ పెంచాలని భావిస్తున్నారని సాఫ్ట్వేర్ కంపెనీ ఎడోబ్ నివేదిక వెల్లడించింది.వేగంగా పనులు.. వృద్ధి, సృజనాత్మకత, విస్తరణకు కీలక సాధనంగా జనరేటివ్ ఏఐ అవతరించింది. భారత్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ సహా ప్రధాన మార్కెట్లకు చెందిన 16,000 మందికిపైగా క్రియేటర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. క్రియేటివ్ ఏఐని వేగంగా స్వీకరించే దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. జనరేటివ్ ఏఐ ఉత్పాదకత సాధనంగా మాత్రమే కాకుండా ఆదాయాన్ని పునరి్నరి్మంచే శక్తిగా భారతీయ క్రియేటర్లు భావిస్తున్నారు. పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్టు చెబుతున్నారు. అసాధ్యం సుసాధ్యం.. ప్రయోగ సాధనంగా మొదలై ప్రస్తుతం రోజువారీ కార్యాచరణగా జనరేటివ్ ఏఐ మారింది. సర్వేలో పాలుపంచుకున్న భారతీయ క్రియేటర్లు కంటెంట్ రూపకల్పనలో ఏదో ఒక రూపంలో జనరేటివ్ ఏఐని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తమ వ్యాపారం, ఫాలోవర్ల సంఖ్య వృద్ధిని వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ సహాయపడిందని 95% మంది వెల్లడించారు. ఇది అసాధ్యంగా ఉండే కంటెంట్ను సృష్టించడానికి వీలు కల్పిస్తుందని 85% మంది నమ్ముతున్నారు. ఆదాయం పెరుగుదల విషయంలో ఈ సాంకేతికత సానుకూల ప్రభావాన్ని చూపిందని 97% మంది భావిస్తున్నారు. కంటెంట్ రూపకల్పనలో తమదే తుది నిర్ణయమని, ఏఐ ఒక సహాయకారిగా మాత్రమే ఉంటుందన్నది వారి మాట. విభిన్న ఏఐ టూల్స్ ఎడిటింగ్, నాణ్యత, కంటెంట్ మెరుగుదలకై అత్యంత సాధారణ వినియోగ సాధనంగా ఏఐ అవతరించింది. ఆలోచనల మెరుగు, మరింత విజువల్ ఎఫెక్ట్స్ కోసమూ వీటిని వాడుతున్నారు. ఒకే ప్లాట్ఫామ్పై ఆధారపడటానికి బదులుగా కంటెంట్ క్రియేటర్లు విభిన్న జనరేటివ్ ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. పదిలో తొమ్మిది మంది ఇటువంటి వారి జాబితాలో ఉండడం విశేషం. తమ సమ్మతి లేకుండా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వారి కంటెంట్ ఉపయోగించే అవకాశం ఉందని దేశీయ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు, అస్థిరమైన అవుట్పుట్ నాణ్యత, ఏఐ మోడల్స్ ఎలా శిక్షణ పొందుతాయనే అంశంపై స్పష్టత లేకపోవడం విస్తృతస్థాయిలో ఏఐ స్వీకరణకు అతిపెద్ద అడ్డంకులుగా క్రియేటర్లు భావిస్తున్నారు. -
ఐఫోన్ అయితే వాడినా ఓకే
దేశీయంగా కొత్త డివైజ్ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్హ్యాండ్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ నెలకొంది. దీంతో రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2025లో 7–8 శాతం మేర వృద్ధి చెందిన సెకండరీ మార్కెట్ ఈ ఏడాది కూడా అదే జోరు కనబర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడుతుండటం, ఆన్లైన్–ఆఫ్లైన్ మాధ్యమాల ద్వారా నేరుగా కస్టమర్లకు మరింత అందుబాటు స్థాయిలో లభిస్తుండటంలాంటి అంశాలు రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలు.. థర్డ్ పార్టీలు రీఫర్బిష్ చేసి, అమ్మే డివైజ్లలో నాణ్యత సరిగ్గా లేకపోవడం, రిటర్నులు ఎక్కువగా వస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి దిగ్గజాలు గతేడాది ఈ విభాగం నుంచి తప్పుకున్నప్పుడు కొంతకాలం అమ్మకాలు నెమ్మదించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సదరు ప్లాట్ఫాంలపై ఆధారపడిన విక్రేతల వ్యాపారం తాత్కాలికంగా దెబ్బతిందని వివరించాయి. దీనితో నేరుగా వినియోగదారులను చేరుకునే వ్యూహాలకు క్యాషిఫై, కంట్రోల్జెడ్లాంటి సంస్థలు పదును పెట్టాయి. ఆన్లైన్ ప్లాట్ఫాంలను, ఆఫ్లైన్ రిటైల్ నెట్వర్క్లను విస్తరించాయి. ప్రభావం ఇంకా తెలియడం లేదు.. చాలామటుకు బ్రాండ్స్ దగ్గర 60–90 రోజుల వరకు సరిపడేంత నిల్వలు ఉండటం వల్ల రేట్ల పెంపు ప్రభావం పూర్తి స్థాయిలో ఇంకా తెలియడం లేదు. కొత్త డివైజ్ల రేట్లు 15–20 శాతం పెరిగాయంటే చాలు, కోవిడ్ కాలంలోలాగా రీఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అప్పట్లో సరఫరాపరమైన సవాళ్ల వల్ల కొత్త ఫోన్లకు కొరత ఏర్పడి, కొనుగోలుదార్లు సెకండ్హ్యాండ్ డివైజ్ల వైపు మళ్లాల్సి వచి్చంది. ప్రస్తుతం కూడా మెమరీ, చిప్ల వ్యయాలు పెరిగి కొత్త డివైజ్ల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాషిఫై వర్గాలు వివరించాయి. ఎంట్రీ లెవెల్ షాక్.. అత్యధిక మార్కెట్ వాటా ఉండే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో రేట్ల పెంపు షాక్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న హ్యాండ్సెట్స్ రేటు వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 శాతం పెరిగి రూ. 15,000కు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే అతి పెద్ద సెగ్మెంట్ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని, దీనితో కస్టమర్లు రీఫర్బిష్డ్ డివైజ్ల వైపు డిమాండ్ మళ్లొచ్చని ఆశిస్తున్నట్లు వివరించాయి. అయితే, రేట్లు పెరగడమనేది మరో ప్రతికూల పరిణామానికి కూడా దారి తీయొచ్చని భావిస్తున్నారు. యూజర్లు తమ పాత డివైజ్లను మరింత కాలం అట్టే పెట్టుకునేందుకు ప్రాధాన్యతనివ్వొచ్చని, ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 50 శాతం డివైజ్లు రీఫర్బిష్డ్ లేదా ఎక్సే్చంజ్ మార్కెట్లోకి రావడానికి అనువైనవిగానే ఉంటున్నాయి. కానీ ఇందులో సగం మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా వాటిని యూజర్లు నిరుపయోగంగా డ్రాలలో పడేయడమో లేక తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ–వ్యర్థాలు, పాత డివైజ్ల విక్రయ విలువ గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. ఐఫోన్లే కావాలి.. రీఫర్బిష్ చేసిన యాపిల్ ఐఫోన్లకు భారీగా డిమాండ్ నెలకొంది. వాటి లభ్యత కూడా పెరుగుతోంది. దీనితో 2019లో సుమారు 2 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ఇప్పుడు 9 శాతానికి చేరుకుంది. రీఫర్బిష్డ్ సంస్థల మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 60 శాతంగా ఉంటోందని పరిశ్రమ అంచనా. లేటెస్ట్ డివైజ్ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో, యాపిల్ డివైజ్లను మొదటిసారిగా వాడే వారు, వేరే బ్రాండ్స్ బదులుగా దాదాపు అదే రేటుకో అంతకన్నా కాస్త తక్కువ రేటుకో లభించే పాత ఐఫోన్లనే తీసుకోవడంవైపు మొగ్గుచూపుతున్నారు. యాపిల్లో ఎంట్రీ లెవెల్ మోడల్ లేకపోవడంతో ఈ ధోరణి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్లో ఏడాది, రెండేళ్ల పాత ఫోన్లతో పోలిస్తే నాలుగైదేళ్లు పాతబడ్డ యాపిల్ ఫోన్లకు కూడా డిమాండ్ బాగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. – సాక్షి బిజినెస్ డెస్క్ -
చాబహర్ పోర్టుపై రాజకీయ రగడ
ఇరాన్లోని చాబహర్ ఓడ రేవు భారత్లో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. ఈ ఓడరేవుతో భారత్కు ఎంతో అనుబంధం ఉంది. పోర్ట్ నిర్మాణంలో దాదాపు దశాబ్ద కాలంగా భాగస్వామిగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ట్రంప్ ఒత్తిడిని తట్టుకోలేక చాబహర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. భారత విదేశాంగ విధానాన్ని అమెరికా వైట్హౌస్ నిర్దేశించే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడింది. భారత్పై పెత్తనం చేయడానికి ట్రంప్ను ఎందుకు అనుమతిస్తున్నారని నిలదీసింది అయితే, కాంగ్రెస్ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికార బీజేపీ కొట్టిపారేసింది. చాబహర్ పోర్ట్ విషయంలో వైఖరి మార్చుకొనే ప్రసక్తే లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చాబహర్ పోర్ట్ నుంచి భారత్ నిజంగా వెనక్కి తగ్గుతుందా, అదే జరిగితే మనకు నష్టమెంత అనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. గ్వాదర్ పోర్టుకు పోటీగా.. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గ్వాదర్ ఓడరేవును చైనా నిర్మిస్తోంది. దాంతో ఆ ప్రాంతంలో స్వీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి భారత్ కూడా రంగంలోకి దిగింది. గ్వాదర్ పోర్ట్కు పోటీగా ఇరాన్ తీరంలో చాబహర్ పోర్ట్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. గత ఏడాది ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాబహర్ పోర్ట్పై సెప్టెంబర్లో అమెరికా సర్కార్ ఆంక్షలు విధించింది. అక్కడ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని భారత్కు సూచించింది. అందుకు ఆరు నెలల గడువు విధించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచి్చంది. పోర్ట్ నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్కు 12 కోట్ల డాలర్లు బదిలీ చేసింది. ఎందుకంత కీలకం? చాబహర్ ఓడ రేవు ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో.. పాక్లోని గ్వాదర్ పోర్ట్కు 170 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ప్రపంచ ఇంధన వ్యాపారానికి చెక్పాయింట్ లాంటి హొర్మూజ్ జలసంధికి సమీపంలోనే ఉండడంతో భారత్ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దీంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. పాకిస్తాన్ రేవులతో పనిలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ ఉత్తర–దక్షిణ రవాణా కారిడార్(ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్ ముఖ్యమైనది. ముంబై నుంచి ఈ పోర్ట్ గుండా రష్యా, యూరప్లకు చేరుకోవచ్చు. సరుకు రవాణా సులభతరమవుతుంది. ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గిపోతుంది. అరేబియా, పశి్చమ హిందూ మహా సముద్రంలో పాక్–చైనాల ఆధిపత్యాన్ని అడ్డుకోవచ్చు. పోర్ట్ నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల కోసం భారత్, ఇరాన్ మధ్య 2003లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో ఇరుదేశాల నడుమ ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహర్లో భారత కార్యకలాపాలు ప్రారంభించింది. చాబహర్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దులోని జహెదాన్ వరకు రైలు మార్గాన్ని అభివృద్ధి చేయడానికి భారత్ అంగీకరించింది. దీంతో వ్యాపార విస్తరణ మెరుగుపడే అవకాశం ఉంది. సుంకాలతో భారత్కు నష్టమే చాబహర్ కోసం భారత్ చేస్తున్న మొత్తం వ్యయం 370 మిలియన్ డాలర్లు. ఇందులో 120 మిలియన్ డాలర్లు ప్రత్యక్ష పెట్టుబడి కాగా, 250 మిలియన్ డాలర్లను ఇరాన్కు రుణంగా ఇస్తోంది. 120 మిలియన్ డాలర్లను ఇప్పటికే ఇరాన్కు అందించింది. చాబహర్పై విధించిన ఆంక్షలు గడువు త్వరలోనే ముగిసిపోనుంది. గడువు పెంపుకోసం భారత ప్రభుత్వం ప్రయతి్న స్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇరాన్పై ట్రంప్ ప్రభు త్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆంక్షలను ఎత్తివేసే సూచనలు కనిపించడంలేదు. పోర్ట్ విషయంలో ఇలాగే ముందుకు వెళ్తే ట్రంప్ హెచ్చరించినట్లు భారత్పై మరో 25 శాతం సుంకాలు అమల్లోకి వచి్చనా ఆశ్చర్యంలేదు. అదే జరిగితే భారత్కు భారీగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. 120 మిలియన్ డాలర్ల పెట్టుబడిని వదులుకోవాలా? లేక అమెరికాతో జరిగే 132 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని వదులుకోవాలా? అనేది భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని అంటున్నారు. మొత్తానికి చాబహర్ ఓడరేవు అంశంలో భారత్ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోందని చెప్పొ చ్చు. భారతదేశ ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 50 శాతం సుంకాలు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీతో మీరు అనుబంధం ఏర్పరుచుకోండి...
‘నేటి ఉరుకుల పరుగుల జీవితంలో స్త్రీ, పురుషులు కుటుంబాల కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక ఎదుగుదల కోసం ఏమేమి చేయాలా అని నిత్యం ఆందోళన చెందుతున్నారుగానీ తమ కోసం తాము ఏం చేసుకోవాలనే సంగతిని మర్చి΄ోతున్నారు. నేడు ప్రతి మనిషి అన్నీ పట్టించుకుంటూ తనను తాను నిర్లక్ష్యం చేసుకుంటున్నాడు. మీకేమి కావాలో గ్రహించండి. మీతో మీరు అనుబంధం పెంచుకోండి’ అన్నారు ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆధ్యాత్మిక మార్గదర్శి గురు గోపాల్దాస్.‘అయిన వారి కోసం అన్నీ చేయాల్సిందే... కానీ వారి కంటే మీ అయిన వారు మీరే. మీకేం కావాలి? మీ ఇష్టాల గురించి, ఆరోగ్యం గురించి, అభిరుచుల గురించి, లక్ష్యాల గురించి, అసలేమీ చేయకుండా కొన్నాళ్లు గడపాలనుకుంటున్న తీరిక సమయాల గురించి మీరేమి చేసుకుంటున్నారు? మీతో మీ అనుబంధం సరిగా లేక΄ోతే మీ అయినవారికి మీరు చేయాల్సిందంతా ఎలా చేయగలరు?’ అని ప్రశ్నిస్తారు గురు గోపాల్దాస్.‘జైపూర్ సాహితీ సంరంభం’ లో తన తాజాపుస్తకం ‘యూ కెన్ హావ్ ఇట్ ఆల్’ వెలువడిన సందర్భంగా జీవన మార్గాల సులభతరం గురించి ఆయన మాట్లాడారు.మార్చలేని సమస్యలుప్రతి మనిషికీ జీవితంలో సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్ని పరిష్కరించేవి ఉంటాయి... కొన్ని పరిష్కరించలేనివి. ఉదాహరణకు ఫలానా వ్యక్తికి మీరంటే పడదు... మీ గురించి చెడు చెప్తుంటాడు... మీరు ఎంత ప్రయత్నించినా మారడు. దానిని నేను గణితంలో ‘పై’తో ΄ోలుస్తాను. ఏం చేసినా దాని విలువ మారదు. కాబట్టి మార్చలేని సమస్యలను పూర్తిగా వదిలిపెట్టాలి. వాటికై ఏ మాత్రం శక్తి వృథా చేయకూడదు. రెండో రకం సమస్యలు... మార్చదగ్గవి. మీ అబ్బాయికి మంచి కాలేజ్లో సీటు రాని పరిస్థితి ఉంటే మెరుగైన కాలేజ్లో అయినా మీరు సంపాదించగలరు కదా. దీనిని నేను గణితంలో ‘ఎక్స్’ విలువ కనుగొనడంతో ΄ోలుస్తాను. అలాంటి ఎక్స్ సమస్యల గురించి పని చేయాలి. కాబట్టి ‘పై’ను వదిలిపెట్టండి. ‘ఎక్స్’ సంగతి చూడండి.రాళ్లు కింద పడేయండిఒక సాధువు దగ్గరకి ఒక కుర్రవాడు వచ్చి ‘స్వామీ... నాకు మనశ్శాంతి కావాలి’ అని అడిగితే ఆ సాధువు కొన్ని రాళ్ల చూపించి ‘వాటిని వారంపాటు మూటలో వేసుకుని విడువకుండా తిరుగు’ అన్నాడు. ఆ కుర్రవాడు ఆ రోజూ ఆ రాళ్లమూటతో తిరగడం మొదలెట్టాడు. ఆ రాళ్లు రాను రాను బరువయ్యాయి. చివరిరోజు సాధువు ఆ మూటను కింద పడేయ్ అనగానే కుర్రవాడికి మనశ్శాంతి అంటే ఏమిటో అర్థమైంది. మనమంతా అనవసర రాళ్లను మోస్తూ ఉంటాం. అసూయ, కుళ్లు, కుతంత్రం, ద్వేషం, పగ, దురాశ, స్వార్థం... సంబంధం లేని వ్యక్తి/విషయం గురించి అభి్రపాయం, సామాజిక మాధ్యమాలలో ముసుగు ముఖంతో విమర్శలు గుప్పిస్తుంటాం... ఇవన్నీ బరువులు. ఈ రాళ్లను ప్రతిరోజు ఉదయాన్నే లేచి లెక్కబెట్టి పారేయండి. మనశ్శాంతి తప్పక దొరుకుతుంది.మాట్లాడండినేటి మనిషి దేని గురించీ మాట్లాడటం లేదు. అన్నీ మనసులో పెట్టుకుంటున్నాడు. నీతో ఈ సమస్య ఉంది... నా వల్ల ఈ ΄÷రపాటు జరిగింది... అని భార్యాభర్తలు, పిల్లలు, ఉద్యోగులు, ఇరుగు ΄÷రుగు వారు మాట్లాడుకుంటే సమస్యలు లేని సామరస్య జీవితం దొరుకుతుంది. చాలా సమస్యలు కేవలం మాట్లాడక΄ోడం వల్ల పాషాణరూపం దాలుస్తాయి. మౌనం సమస్యకు మూలం. మౌనం వద్దు. మాట మొదలెట్టండి... మాట్లాడండి అని బోధించారు గురు గోపాల్దాస్.ఆయన మాటలను వినడంతో వదిలేయకుండా ఆచరణలో పెడితేనే మనశ్శాంతి కలుగుతుంది.– జైపూర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
క్యూ3 ఫలితాలే దిక్సూచి
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రధానంగా క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాలే నిర్దేశించనున్నాయి. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నప్పటికీ సమీపకాలంలో కార్పొరేట్ పనితీరు, గ్లోబల్ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. గత వారాంతాన ఇండెక్స్లను ప్రభావితం చేయగల బ్లూచిప్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు.. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ క్యూ3 పనితీరు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(19న) కనిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదేవిధంగా ఈ వారం మరిన్ని కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ జాబితాలో బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డీఎల్ఎఫ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎల్టీఐమైండ్ట్రీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితరాలు చేరాయి. వీటితోపాటు పలు మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ప్రకటించనున్న ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ట్రంప్ ఎఫెక్ట్ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడంసహా.. ఇరాన్లో అంతర్యుద్ధానికి మద్దతు పలకడం, గ్రీన్ల్యాండ్ తమదేనంటూ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రక్షణాత్మక పెట్టుబడి సాధానాలుగా భావించే పసిడి, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రిస్క్ పెట్టుబడులు నీరసించే వీలున్నట్లు విశ్లేíÙంచారు. మరోపక్క యూఎస్తో భారత్ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కిరాకపోవడం సైతం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. విదేశీ గణాంకాలు నేడు చైనా.. అక్టోబర్–డిసెంబర్(క్యూ4) జీడీపీ గణాంకాలు ప్రకటించనుంది. జూలై–సెప్టెంబర్(క్యూ3)లో ఎకానమీ 4.8 శాతం ఎగసింది. ఈ బాటలో డిసెంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేట్లపై స్పందించనుంది. ఇక మరోవైపు యూఎస్ క్యూ3 జీడీపీ వృద్ధి రేటు తుది గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ నెల 17కల్లా నమోదైన నిరుద్యోగ గణాంకాలు ప్రకటించనుంది. వారం చివర్లో యూఎస్తోపాటు.. దేశీయంగా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. కాగా.. 27 దేశాలతోకూడిన యూరోపియన్ యూనియన్తో స్వేచ్చా వాణిజ్య చర్చలు తుది దశకు చేరినట్లు వాణిజ్యం, పరిశ్రమల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొన్నారు. నెలాఖరుకల్లా ఒప్పందం ఖరారుకానున్నట్లు మంత్రి తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అతి పెద్ద నీలమణి!
ఊదా రంగులో మెరిసిపోతున్న ఈ నీలమణిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా! ఇది అలాంటిలాంటి నీలం కాదు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నీలమణిగా రికార్డులకెక్కింది! అత్యంత అరుదైనదిగా చెబుతున్న ఈ నీలాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం తొలిసారి ప్రదర్శనకు ఉంచారు. ఇది ఏకంగా 3,536 క్యారెట్ల బరువుందట! అంటే 700 గ్రాములన్నమాట!! దీనికి స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ అని నామకరణం చేశారు. ఇది నకిలీది కాదని, సిసలైన నీలమణేనని జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) కూడా ధ్రువీకరించింది. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజ నీలం ఇదేననీ పేర్కొంది. ఇంత భారీ పరిమాణంలో కూడా ఈ నీలమణి పూర్తిస్థాయి సౌష్టవంతో కూడుకుని ఉండటం విశేషమని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు సహజంగా అమరిన చూడచక్కని గుండ్రనైన రూపు దీని ప్రత్యేకతను ఎన్నో రెట్లు పెంచింది. వీటన్నింటికీ మించి ఇది ఆరు రకాల కాంతి కిరణాలను వెదజల్లుతుందట కూడా! ఇక నీలమణికి అతి ముఖ్యమైన స్వచ్ఛత విషయంలో కూడా సాటి లేని నాణ్యత స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ సొంతమని ప్రదర్శకులు వివరించారు. దీని విలువ కనీసం 30 కోట్ల నుంచి 40 కోట్ల డాలర్లు (రూ.3,628 కోట్లు) ఉంటుందని అంతర్జాతీయ రత్నాల నిపుణులు చెప్పారు. వేలంలో దీనికి అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా దీని యజమానుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నీలమణి 2023లో శ్రీలంక మారుమూల ప్రాంతంలో వజ్రాల నగరంగా పేరొందిన రత్నపురలో దొరికినట్టు దాని యజమానుల్లో ఒకరు వెల్లడించారు. సాటిలేని నాణ్యతతో కూడిన నీలమణులకు శ్రీలంక అనాది కాలం నుంచీ ప్రసిద్ధి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెదాలు కదిలించే రోబో సింగర్!
అవడానికి అదో యంత్రుడే. అయితేనేం? సుమధుర గాత్రం దాని సొంతం. ఎంచక్కా పాడగలదు. అంతేనా? తాను ఆలపించిన పాటలతో ఏకంగా ఓ ఆల్బం కూడా విడుదల చేసేసింది! కొలంబియాకు చెందిన ఈ రోబో ఘనత అక్కడితో ఆగిపోలేదు. పాటలకు సరిగ్గా సరిపోయే విధంగా లిప్సింక్ కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ అరుదైన రోబోను కొలంబియా ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. హ్యూమనాయిడ్లతో సమాచార మారి్పడి మరింత వాస్తవికంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని వారంటున్నారు.యూట్యూబ్ వీడియోలు చూసి...లిప్ సింకింగ్ రోబో తాలూకు ఘనత వెనక కొలంబియా సైంటిస్టుల అవిశ్రాంత శ్రమ దాగుంది. క్రియేటివ్ మెషీన్స్ ల్యాబ్కు చెందిన ప్రొఫెసర్ హోడ్ లిప్సన్ బృందం ఇందుకోసం రొటీన్కు భిన్నంగా వెళ్లి మరీ ప్రయోగం చేసింది. ప్రతి అచ్చుకూ, హల్లుకూ రూల్స్ ఫ్రేం చేసే సాధారణ పద్ధతికి బదులుగా ఓ చిన్నారి ఎలా మాటలు నేర్చుకుంటుందో ఈ రోబో కూడా అచ్చం అలాగే నేర్చుకునేటట్టు చేశారు. దాని మృదువైన రోబో శరీరం కింద 26 బుల్లి మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి దాని ‘స్వర సాధన’మొదలైంది. ముందుగా అద్దం ముందు గంటల తరబడి గడిపింది. సొంత ముఖ కవళికలనే వేలాది రకాలుగా మారుస్తూ, వాటిని తన జ్ఞాపకాల్లో పదిల పరుచుకుంటూ వచ్చింది. అలా తన ముఖాన్ని పూర్తిస్థాయిలో గుర్తు పెట్టుకున్నాక పరిశీలనాత్మక అభ్యసన వైపు మళ్లింది. అంటే ఇతరుల మాటతీరును లోతుగా పరిశీలించింది. ఇందుకోసం ఏఐ సాయంతో యూట్యూబ్లో గంటల తరబడి వీడియోలు చూస్తూ గడిపింది. ఎవరెలా మాట్లాడుతున్నదీ, పాడుతున్నదీ నిశితంగా గమనించింది. ఏ సందర్భంలో పెదాలు ఎలా కదులుతున్నదీ గుర్తు పెట్టుకుంటూ వెళ్లింది. అలా ఎట్టకేలకు ఆడియో సిగ్నళ్లను నేరుగా మోటార్ మూవ్మెంట్స్గా మార్చడంలో విజయం సాధించింది. ఏం మాట్లాడినా దాదాపుగా అందుకు తగ్గట్టుగా పెదాలను కదల్చగల సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంది. తన సరికొత్త నైపుణ్యాన్నంతా రంగరించి ‘హెలో వరల్డ్’పేరిట సొంత పాటల ఆల్బం కూడా రూపొందించేసిందీ గాయక రోబో! అందులోని ఓ పాటను, పలు భాషల్లో మాటలను పెదాల కలయికతో పాటుగా ఇటీవలే ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది కూడా.యంత్రానికి మానవీయ కోణం రోబోకు మానవీయ కోణాన్ని జోడించాలన్నదే తమ ప్రయత్నమని ప్రొఫెసర్ లిప్సన్ వివరించారు. ‘‘బి, డబ్ల్యూ వంటి ఆంగ్ల శబ్దాలను పలకడం మా రోబోకు ఇప్పటికీ సవాలుగానే ఉంది. త్వరలోనే వీటినీ అధిగమిస్తుందన్న నమ్మకం మాకుంది’’అని ధీమా వెలిబుచ్చారు. మనుషులతో కమ్యూనికేట్ చేసిన కొద్దీ అది మరింత మెరుగవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘రోబోల తయారీలో వాటి నడక, దేన్నయినా పట్టుకోగల నేర్పు వంటివాటికే ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ప్రేమ, ఆప్యాయత, ఇష్టం వంటి భావోద్వేగాలను చూపేందుకు ముఖ కవళికలే చాలా ముఖ్యం. ఇప్పటిదాకా రూపొందిన రోబోల్లో ఈ అతి ముఖ్యమైన కోణం లోపించింది. పెద్దలకు రోజువారీ పనుల్లో, లేదా పిల్లలకు చదువులో సాయపడే రోబోలు వారికి ఎంతగా దగ్గరైతే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. ముఖ కవళికలు ఇందుకు బాగా దోహదపడగలవు. ఈ విషయంలో మేం చెప్పుకోదగ్గ విజయమే సాధించాం. వచ్చే దశాబ్ద కాలంలో కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు పుట్టుకొస్తాయంటున్న అంచనాల నేపథ్యంలో వాటితో మనుషులు మరింత దగ్గరితనం ఫీలయ్యేందుకు మా టెక్నాలజీ ఎంతగానో దోహదపడనుంది. జీవకళ ఉట్టిపడే రోబో వారికి సాటిమనిíÙతోనే గడిపిన భావం కలిగించగలదు. కనుక ఇకపై రోబోలు కేవలం మీ ఆజ్ఞలను పాటించడంతోనే సరిపెట్టవు. మీ కళ్లలోకి చూస్తూ నవ్వుతాయి. అప్పుడు మనకు కలిగే భావాలకు వెలకట్టగలమా?’’అన్నారు ప్రొఫెసర్ లిప్సన్. ఈ సరికొత్త లిప్ సింకింగ్ రోబోకు సంబంధించిన వివరాలను సైన్స్ రోబోటిక్ జర్నల్లో ప్రచురించారు.మనిషిని దాదాపుగా అన్ని విషయాల్లోనూ రోబోలు అనుకరించేస్తున్న రోజులివి. కాకపోతే ఎంత చేసినా వాటిలోని కృత్రిమత్వం మాత్రం కొట్టొచ్చినట్టుగా కని్పస్తూనే ఉంటుంది. బిగుసుకుపోయినట్టుగా ఉండటం, జీవంలేని రూపం వాటికీ మనిíÙకీ తేడాను ఎప్పటికప్పుడు పట్టిస్తూనే ఉంటుంది. మిగతా శరీరం మాటంతా ఎలా ఉన్నా కనీసం ముఖం వరకూ అయినా మనిషి మాదిరిగా భావాలు పలకడం రోబోలకు ఇప్పటిదాకా సాధ్యపడని విషయమే. ముఖ్యంగా ఇప్పటిదాకా తయారైన స్పీకింగ్ రోబోలు మాటలకు తగ్గట్టుగా పెదాలను కదిలించలేవు. సరిగ్గా ఈ అడ్డంకినే కొలంబియా సైంటిస్టులు ఇప్పుడు విజయవంతంగా దాటేశారు. మాటలకు, పాటలకు పెదాల కదలిక (లిప్ సింక్) సరిగ్గా సరిపోయేలా వారు రూపొందించిన సరికొత్త రోబో ఇప్పుడు అందరినీ తెగ ఆకర్షిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్, చైనా నడుమ షాక్స్గావ్ రగడ
షాక్స్గావ్. భారత్, చైనా నడుమ సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారిన లోయ. కల్లోల కశీ్మర్లో అత్యున్నత పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇరుదేశాల నడుమ మరోసారి ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోంది. అది ఎప్పటికీ తమదేనని, అక్కడ జరిపే ఎలాంటి నిర్మాణాలనైనా అక్రమమైనవిగానే పరిగణిస్తామని భారత్ తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే. షాక్స్గావ్ తమదేనంటూ చైనా ఎప్పట్లాగే తెంపరితనం ప్రదర్శిస్తోంది. అక్కడి తన నిర్మాణాలన్నీ సక్రమమేనని అడ్డగోలు వాదనకు దిగుతోంది. ఇంతకీ ఏమిటీ షాక్స్గావ్? ఎందుకీ వివాదం?షాక్స్గావ్ లోయ కశ్మీర్లో హంజా–గిల్గిట్ ప్రాంతంలో ఉంటుంది. 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న అతి శీతల ప్రాంతం. ఇటు కారకోరం పర్వత శ్రేణులను, అటు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ను ఆనుకునే ఉంటుంది. దీన్ని ట్రాన్స్ కారకోరం శ్రేణిగా అని పిలుస్తారు. దీనికి ఉత్తరాన చైనా, దక్షిణాన, పశి్చమాన పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం (పీఓకే) ఉన్నాయి. అలా ఈ లోయ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉండటంతో దీనిపై ఆధిపత్యం చాలా ప్రధానంగా మారింది. పాక్ పెట్టిన చిచ్చు.. భారత్, చైనా నడుమ షాక్స్గావ్ చిచ్చు పెట్టింది దాయాది పాకిస్తానే. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే నాటి అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ సైన్యం షాక్స్గావ్ లోయను ఆక్రమించేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపినా అక్కడినుంచి వైదొలగలేదు. భారత్ కూడా ఈ ప్రాంతాన్ని తిరిగి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. 1950ల్లో తూర్పు హంజా గుండా చైనా ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకురావడం మొదలు పెట్టింది. దాంతో ఆ దేశంతో భారత సంబంధాలు క్రమంగా దిగజారడం మొదలైంది. దాంతో 1963లో నాటి పాక్ పాలకుడు అయూబ్ ఖాన్ ఓ కుటిలాలోచన చేశారు. యార్కండ్ నదితో పాటుగా షాక్స్గావ్ లోయ మొత్తాన్నీ చైనాకు ధారాదత్తం చేసేశారు. చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా కొన్నేళ్లుగా చైనా అక్కడ దూకుడుగా పలు నిర్మాణాలు చేపట్టింది. ముఖ్యంగా ఇరు దేశాలనూ అనుసంధానిస్తూ హైవే నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఏకంగా 10 మీటర్ల వెడల్పుతో ఇప్పటికే 75 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా, పాక్ కుదుర్చుకున్న సీపీఈసీ ఒప్పందం షాక్స్గావ్లో చెల్లబోదని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింద. దానిని భారత్ ఎన్నడూ గుర్తించలేదని స్పష్టం చేసింది. అక్కడి చైనా–పాక్ ఆర్థిక కారిడార్ను అక్రమమైనదిగానే గుర్తిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం కుండబద్దలు కొట్టారు. దీనిపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భారత్కు ఇరకాటమే.. ప్రాదేశికంగా, సైనికపరంగా షాక్స్గావ్ అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. అటు పాక్, ఇటు చైనా రూపంలో ఇద్దరు ప్రత్యర్థులు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ కీలక ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టు భారత్కు అత్యంత కీలకం. దీనికి ఒకవైపున్న సియాచిన్ గ్లేసియర్ నుంచి పాక్పై భారత్ నిత్యం డేగకన్ను వేసి ఉంచుతుంది. మరోవైపున ఉన్న కారకోరం శ్రేణి గుండా చైనాపై నిఘా నేత్రం సారిస్తూ ఉంటుంది. ‘‘2024 నాటికే చైనా 4.8 కి.మీ. పొడవైన అఘిల్ కనుమ గుండా దిగువ షాక్స్గావ్ వరకు రోడ్డు నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసింది. నిర్మాణ బృందాల మాటున చైనా సైన్యం అక్కడ మోహరించింది. ఈ ప్రాంతం సియాచిన్కు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది మన భద్రతకు ఎప్పటికైనా ముప్పే’’అని ప్రముఖ భద్రత వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లాని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘దశాబ్దాలుగా సియాచిన్పై భారత్ పట్టు కొనసాగుతోంది. అక్కడినుంచి దక్షిణాన పాక్పై నిత్యం కన్నేసి ఉంచుతున్నాం. ఇప్పుడు ఉత్తరాన షాక్స్గావ్ వైపు నుంచి చైనా ముప్పు ముంచుకొచి్చంది. దాంతో సియాచిన్, పరిసర ప్రాంతాల్లో మనం నిత్యం రెండువైపులా శత్రువులను కాచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. మైనస్ 50 డిగ్రీల అతి శీతల పరిస్థితులుండే చోట మన సైనిక బలగాలను రెండు భాగాలుగా మోహరించాల్సి వస్తుంది’’అని ఆయన వివరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కంటెంట్తగ్గింది గురూ!
సినిమా..భారతీయుల జీవితంలో ఒక భాగం. అతిపెద్ద వినోదం. అభిమాన తారలు, కథ, నటన, పాటలు, హిట్, ఫ్లాప్.. ఇలా సినిమా గురించి చర్చలేని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదు. థియేటర్లో కిటకిటలాడే ప్రేక్షకులు, ఈలలు, చప్పట్లు, చెవులు చిల్లులుపడే శబ్దాల మధ్య మూవీ చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఇదంతా గతం. ‘ఆ ఒక్కటి తగ్గింది పుష్ప’అని ఇప్పుడు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా 2019లో 146 కోట్ల మంది ప్రేక్షకులు వెండి తెర ముందు కూర్చుని సినిమాను ఆస్వాదించారు. 2024లో ఈ సంఖ్య 86 కోట్లకు వచ్చి చేరింది.అంటే అయిదేళ్లలో థియేటర్లకు వచ్చిన వీక్షకుల సంఖ్య 41% తగ్గిందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) నివేదిక వెల్లడించింది. 2025 జూన్–జూలైలో 14,688 మంది సినిమా ప్రేక్షకులపై ఈవై నిర్వహించిన సర్వే, అలాగే నిర్మాతలు, ఇతర భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం..140 కోట్లకుపైగా జనాభా ఉన్న మన దేశంలో ఏటా థియేటర్లకు వచ్చి మూవీని ఆస్వాదించేవారి సంఖ్య దాదాపు 15 కోట్లు మాత్రమే. – సాక్షి, స్పెషల్ డెస్క్కొద్ది రోజులకే ఓటీటీల్లో.. సినిమా కంటెంట్లో నాణ్యత తగ్గిందన్నది ప్రేక్షకుల మాట. అంతేకాదు మూవీస్ రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ఇవే ప్రధాన కారణాలు. కంటెంట్ నాణ్యత పడిపోయిందని 55% ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆకట్టుకునే కథ, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్ మెరుగుపడాలని 70% మంది ఆశిస్తున్నారు.థియేటర్లకు పరుగు తీయాల్సిన అవసరం లేదని..విడుదలైన ఎనిమిది వారాలలోపు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు వస్తున్నాయని 81% మంది నమ్ముతున్నారు. థియేటర్లో రిలీజై ఓటీటీకి వచ్చేందుకు తక్కువ రోజులే ఉంటే సినిమా కోసం వేచి చూస్తామని మూడింట ఒకవంతు మంది చెబుతున్నారు. చేయి తిరిగిన రచయితలు, కథల కొరత ఉందని 78% నిర్మాతలు పేర్కొన్నారు. సగం మంది పైరసీతో.. భారత్లో మొత్తం స్క్రీన్ల సంఖ్య 2019లో 9,527 ఉండగా.. 2024 నాటికి స్వల్పంగా పెరిగి 9,927కి వచ్చి చేరింది. అంటే కేవలం 400 తెరలే కొత్తగా తోడయ్యాయి. 10 లక్షల మంది జనాభాకు స్క్రీన్లు 7.6 నుంచి 6.8కి తగ్గాయి. 10 లక్షల మందికి యునైటెడ్ స్టేట్స్లో 109, యూకేలో 66, చైనాలో 64 తెరలు ఉన్నాయి. భారత్లో 2018–24 నడుమ 1,000 దాకా సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యాయి.మల్టీప్లెక్సులు అయిదేళ్లలో పెట్టుబడులను 12% తగ్గించాయి. భారత్లోని దాదాపు 19,000 పిన్కోడ్స్కుగాను సుమారు 16,350 చోట్ల థియేటర్లే లేవు. సినీ పరిశ్రమను కోలుకోకుండా చేస్తున్న పైరసీ సైతం సమస్యను పెంచుతోంది. వీడియో కంటెంట్ యూజర్లలో 51% మంది పైరసీ సైట్లపై ఆధారపడుతున్నారు. వీరిలో నాలుగింట మూడొంతుల మంది 19 నుంచి 34 సంవత్సరాల వయస్సుగల వారు ఉండడం గమనార్హం. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో సినిమాలు విడుదలైన తర్వాత పైరసీ పెరుగుతోంది.ఒత్తిడిలో పరిశ్రమ..ప్రేక్షకుల సంఖ్య తగ్గడం, పరిమిత స్క్రీన్స్, వీక్షణ అలవాట్లలో వేగవంతమైన మార్పుల కారణంగా చలనచిత్ర ప్రదర్శన రంగం నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మన దేశంలో మొత్తం మీడియా, వినోద రంగం, విస్తృత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూనే ఉన్నప్పటికీ.. 2019 నాటి గరిష్ట స్థాయి నుంచి థియేటర్ల రెవెన్యూ తగ్గుతోంది. 2019–24 మధ్య భారతదేశ థియేటర్ల ఆదాయాలు 0.2% వార్షిక రేటుతో క్షీణించాయి. ఇదే సమయంలో మీడియా, వినోద రంగం 5.42%, జీడీపీ 6.6% వృద్ధి చెందాయి. సినిమా ఆదాయం 2019లో రూ.19,100 కోట్ల నుంచి 2024లో రూ.18,746 కోట్లకు పడిపోయింది. 2019లో రూ.100 కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్లు అందుకున్న సినిమాలు 17 ఉంటే.. 2024లో ఇవి 10కి పరిమితం అయ్యాయి. -
పెద్ద పండగొచ్చింది
అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. బొమ్మల కొలువులు, పేరంటాలు... సంక్రాంతి సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ పిండి వంటలు, పండగ నాడు అవన్నీ పంచటాలు అబ్బో ఊపిరి సలపనంత సందడి. ఇక ఊరంతా ముగ్గుల తివాచీలే. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి పంచుకుంటున్న జ్ఞాపకాలు.పండుగలు ఎన్ని ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకతే వేరు. పెద్ద పండుగ సంక్రాంతి. అప్పట్లో అంటే 60 ఏళ్ల కిందట సంక్రాంతి వస్తుంది అంటే అందరికీ సంబరం. ఆ రోజుల్లో అందరివీ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. సంక్రాంతి అంటే పంట ఇంటికి వచ్చే సమయం. ఆ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేతికి వచ్చిన పంట ఏ వర్షం వల్లనో నాశనం అయిపోవటం లేదు కాబట్టి అందరికీ వారు పడ్డ కష్టానికి శ్రమ చేతికి అందే సమయం. అందరి చేతిలోనూ డబ్బులు ఆడే ఆ సమయంలో బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు వచ్చేసేవాళ్ళు. ఏదో ఒక ఊరిలో బస చేసి రెండు మూడు గ్రామాలు చుట్టపెట్టుకునేవాళ్ళు. ఒక రోజు రెండు రోజులు కాదు సుమారు నెలరోజులు వారి సంచారం ఉండేది. ప్రతి వీధిలో తెల్లవారుజాము నుంచి ముగ్గుల సందడి. ఊరి మొత్తం తివాచీ పరిచారా అన్నట్లు ప్రతి ఇంటి ముందు ముగ్గులే. వాటికి మరింత సొబగు నద్దుతూ గొబ్బిళ్ళు.పెద్ద పండగకు పిల్లా పెద్దా అందరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం ఆనవాయితీ. పల్లెటూర్లలో పదిమంది ఉన్న ఉమ్మడి కుటుంబాల వారి కొత్త బట్టల సరదా ప్రత్యేకంగా ఉండేది. అలవాటుగా బట్టలు కుట్టే దర్జీ మిషన్ తీసుకుని వచ్చి వీళ్ళ వరండాలో తిష్ట వేసేవాడు. అక్కడే బట్టలు కుట్టటం. అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, వాళ్లకు భోగి పండగ రోజున నూనె అంటి స్నానం చేయించే ఇంటి పని వాళ్ళు. ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. భోగి పండ్లు, బొమ్మల కొలువులు, పేరంటాలు. ఆ సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ ఎత్తున తయారు చేసే పిండి వంటలు, సంక్రాంతి పండగ నాడు అవన్నీ పనివారికి పంచటాలు... అబ్బో ఊపిరి సలపనంత సందడి. మిగిలిన అన్ని పండుగల కంటే సంక్రాంతికి మరొక ప్రత్యేకత కనుమ. పశువుల పండగ. ఏడాది పొడుగునా తమకు వ్యవసాయంలో సాయం చేసిన పశువులకు కృతజ్ఞతగా జరిపే పండుగ. పశువులను చెరువుకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి తీసుకువచ్చి పసుపు కుంకాలతో, గులాం రంగులతో మెడ పట్టెడలు కొమ్ములకు మువ్వలు కట్టి అలంకరించి ఎంతో ప్రేమతో చేసేవారు పశువుల పండుగ. కాలక్రమేణ కొంత మార్పు వచ్చినా ఈనాటికి ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది సంక్రాంతి. ఈ నాటి పద్ధతి ప్రకారం గుండుసూది మొదలుకొని కారు వరకు, అన్ని వస్తువుల మీద సంక్రాంతి సేల్. ఆకర్షణీయమైన ఆఫర్లు. ఎవరి ఇంటి ముందు వారు ముగ్గు వేసుకోవటంతో సరిపెట్టకుండా ఎంతోమంది ప్రముఖులు పెద్దపెద్ద మైదానాలలో భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి ఘనంగా బహుమతులు అందజేస్తున్నారు. ప్రతి ఊళ్లోనూ ప్రతి కూడలిలోనూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి భోగి మంటలు. గాలిపటాలతో ఆకాశం కొత్త అందాలు సంతరించుకుంటోంది. సంప్రదాయ వంటకాలు రకరకాలు ఇక్కడ తయారై తాజాగా అమెరికా దేశంలో ఉన్న తెలుగువారి కోసం ఆకాశమార్గాన ఎగిరి పోతున్నాయి. గొప్ప వారి కోసం ప్రత్యేకంగా జరిగే కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పండగకు ముందే భాగ్యనగరం నుంచి సగం మంది సొంత ఊర్లకు ప్రయాణం కట్టడంతో పంతంగి టోల్ గేట్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ సంక్రాంతి పండగలో ఒక భాగం అయిపోయింది. అప్పట్లో చదువులు ఇంత భారంగా ఉండేవి కాదు కాబట్టి సంక్రాంతి పండుగకు బోలెడన్ని సెలవులు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. కాని నగరంలో ఇప్పటికీ కాలనీలలో గంగిరెద్దు వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని లావాదేవీలు ఫోన్ ద్వారానే కాబట్టి గంగిరెద్దు మొహాన స్కానర్ తగిలించి తీసుకువస్తున్నారు. ఏళ్లు గడిచినా, తరాలు మారినా సంక్రాంతి పండుగ వైభవం మాత్రం తగ్గలేదు. ఈనాటికీ పెద్ద పండుగ సంక్రాంతి.ఇక సంక్రాంతి పండుగ విషయంలో నాకు మాత్రమే సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటాను.అప్పుడు నేను సెకండ్ ఫామ్ అంటే ఇప్పటి ఏడవ తరగతి చదువుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా వ్యాసం రాయమన్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మొదటి నుంచి నాకు కొంచెం అత్యుత్సాహం. మామూలుగా గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు అన్నీ రాసిన తరువాత ఏదైనా కొత్తగా రాయాలి అనిపించింది. ‘సంక్రాంతికి శంకరుడు సంక్రమణమున ప్రవేశించును’ అని రాశాను. మా తెలుగు టీచర్ గారు వేరే మతస్తులు. నేను రాసిన విషయం ఆవిడకి తెలియక మరి కొంతమంది టీచర్లని అడిగారుట. అందరూ ఏమో మాకు తెలియదు అని అన్నారుట. చివరికి అందరూ కలిసి సూర్యుడు మేషరాశి అందు ప్రవేశిస్తాడుగానీ శంకరుడు సంక్రమణమున ప్రవేశించటం ఎవరము ఎక్కడా వినలేదు అని నన్ను పిలిచి నిలదీసి అడిగారు. నేను తలవంచుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్లకు అర్థమైంది అది కేవలం నా అతి తెలివి అని. చక్కగా అక్షింతలు వేసి పంపించారు. మరొక సంక్రాంతి వచ్చింది మన జీవితాల్లోకి. పండగనాడు చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా గడపండి. కాస్త మనసు అదుపు చేసుకుని పండగ నాడైనా సెల్ఫోన్ పక్కన పెట్టి, టీవీకి దూరంగా అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొని ఆత్మీయత పెంచుకుంటే అదే అసలైన పండగ... పదిమందితో జరుపుకునేదే పండగ. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకొని ఆ మధురమైన అనుభూతులతో వచ్చే పండగ కోసం ఎదురుచూడటం జీవితానికి సార్ధకత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. -
అందాల కశ్మీరంలో కానరాని మంచు!
కశ్మీర్. ఈ మాట వినగానే మొదట గుర్తొచ్చేవి మంచు దుప్పటి కప్పుకున్న అందాల హిమ శిఖరాలే. కానీ కొన్నేళ్లుగా ఈ దృశ్యం చెదిరిపోతోంది. కశ్మీర్కు మంచు ముఖం చాటేస్తోంది. ఈ ఏడాదైతే చలికాలం రెండొంతులకు పైగా గడిచిపోయినా ఈ భూతల స్వర్గంలో హిమపాతం అత్యంత తక్కువగానే నమోదైంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలను ఎంతగానో ఆందోళన పరుస్తోంది. వాతావరణ మార్పుల తాలూకు తీవ్ర విపరిణామాలకు ఇది మరో సూచిక పర్యావరణవేత్త అంటున్నారు. తక్షణం మేలుకోకుంటే పెను ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.ఆర్థిక సంక్షోభమే..కశ్మీర్ లోయలో ఈ సీజన్లో హిమపాతం సాధారణం కంటే కూడా అతి తక్కువగా నమోదైంది. ఏటా ఈసారికల్లా మంచు దుప్పటి కప్పుకుని శ్వేతవర్ణం సంతరించుకునే చాలా ప్రాంతాలు ఈ ఏడాది మాత్రం మంచు జాడే లేక వెలవెలబోతున్నాయి. దాంతో అందాల కశ్మీరం చాలావరకు బోసిపోయి కన్పిస్తోంది. ఇది పర్యావరణపరంగా పెను ప్రమాద సంకేతం మాత్రమే కాదు, ఆర్థికంగా, సాగుపరంగా, పర్యాటకపరంగా ఈ ప్రాంతాన్ని తీవ్రంగా కుంగదీస్తోంది. మైదానాలు, మరీ అంత ఎత్తులో లేని ప్రాంతాల్లో మంచు లేకపోవడంతో అక్కడి రైతులు, వ్యాపారులు, గైడ్లు తదితరులు లబోదిబోమంటున్నారు. ‘‘పశ్చిమ హిమాలయాల్లో క్రమంగా నెలకొంటున్న తీవ్ర పర్యావరణ అసమతుల్యతకు ఈ పరిణామం అద్దం పడుతోంది. మున్ముందు కశ్మీర్ ప్రాంతం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెబుతోంది’’అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు చెందిన ప్రొఫెసర్ అంజల్ ప్రకాశ్ విశ్లేషించారు. కశ్మీర్, జమ్మూ ఆర్థిక స్థితిగతులపై కొంతకాలంగా ఆయన లోతైన అధ్యయనం చేస్తున్నారు. అన్నింటికీ మంచే కీలకం.. కశ్మీర్ లోయలో కురిసే మంచు కేవలం అందాలకు ప్రతీక మాత్రమే కాదు. దానికి ఇతరత్రా కీలక ప్రయోజనాలెన్నో ఉన్నా యి. ఈ భారీ మంచు దుప్పట్లు శీతాకాలం అనంతరం సహజ నీటి వనరుగా రూపొందుతాయి. చలికాలంలో గడ్డకట్టి ఉండి, అనంతరం వేసవి వస్తున్న కొద్దీ దిగువ ప్రాంతాలకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేస్తూ కీలక జల వనరులుగా మారతాయి. జీలం వంటి కీలక నదులకు కూడా ఈ నీరు ప్రాణదాయినిగా మారుతుంది. పలు పట్టణాలు, గ్రామాలకు నీరందించే సెలయేళ్లకు ఈ జలమే ఆధారం. కశ్మీర్ లోయలోని వ్యవసాయమంతా ఇలా వేసవిలో కరిగే నీటిపైనే ఆధారపడి నడుస్తుంటుంది. ‘‘ఇప్పుడిలా మంచు ఈ స్థాయిలో తగ్గిపోవడమంటే సాగు నుంచి తాగునీటి దాకా ఇక్కట్లు తప్పవని అర్థం. నాణ్యతకు దేశమంతటా పెట్టింది పేరైన కశ్మీర్ యాపిల్స్ వంటి వాటి దిగుబడి భారీగా తగ్గిపోవడం ఖాయం. రైతులు విధిలేక భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వస్తుంది. కొన్నేళ్లకు దాని లభ్యతా అనుమానంగానే మారుతుంది’’అని ప్రకాశ్ హెచ్చరించారు. వేగంగా వేడెక్కుతున్నాయ్! ఉత్తర భారతదేశంలో పర్వత ప్రాంతాలు, ముఖ్యంగా హిమాలయాలు ఇతర మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా వేడెక్కుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ‘‘ఇది ప్రపంచ సగటు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. పైగా ప్రమాదకర ఈ ధోర ణి ఏటా వేగం పుంజుకుంటోంది’’అని వారు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. దేశాలన్నీ మే ల్కొని ఈ వినాశకర పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసే చర్యలకు తక్షణం పూనుకోని పక్షంలో మిగిలేది వినాశనమేనని వారు హెచ్చరిస్తున్నారు!ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోయినా...శీతాకాలం వచ్చిందంటే కశ్మీర్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీ సెల్సియస్ కంటే కూడా దిగువకు పడిపోవడం పరిపాటి. ఈసారి కూడా అదే జరిగింది. కానీ జరగనిదల్లా హిమపాతం మాత్రమే. గుల్మార్గ్, సోన్మార్గ్, పీర్పంజల్ శ్రేణి వంటి అత్యున్నత కొండ ప్రాంతాలకే ఈసారి హిమపాతం పరిమితమైంది. మిగతా కశ్మీరమంతా మంచు జాడ లేక వెలవెలబోతున్నాయి. మంచు ఇలా ఈ ప్రాంతానికి ముఖం చాటేయడానికి గ్లోబల్ వారి్మంగ్ ప్రధాన కారణమని పర్యావరణవేత్త అనిల్ జోషి స్పష్టం చేస్తున్నారు.పడకేసిన పర్యాటకం.. శీతాకాలపు మంచు, అనంతరం వేసవిలో సకాలంలో అది కరగడం.. ఈ రెండూ కశ్మీర్కు జీవనాడులు అని చెప్పాలి. సాగు మొదలుకుని పర్యాటకం దాకా అన్నీ వీటిపైనే ఆధారపడి సాగుతాయి. ఈసారి మంచు లేకపోవడం పర్యాటకంపై గట్టి ప్రభావమే చూపింది. ఏటా శీతాకాలం ఇక్కడ అతి పెద్ద పర్యాటక సీజన్. అలాంటిది ఈసారి కశ్మీర్కు వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదవుతోంది. ఏటా స్కీయింగ్ వంటివి జరిగే చోట్ల ఈసారి మంచు కంటికి కనిపించని పరిస్థితి నెలకొనడమే ఇందుకు కారణం. దాంతో తమ జీవనోపాధి దారుణంగా దెబ్బతింటోందని గైడ్ల సమాఖ్య మొదలుకుని హోటల్ వర్గాల దాకా వాపోతున్న పరిస్థితి!– సాక్షి, నేషనల్ డెస్క్ -
పండుగను ఆస్వాదిద్దాం
అదే పండగ. కాని తీరు మారింది. గతంలో నలుగురూ కూడి ఆస్వాదన చేసేవారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదనలో జ్ఞాపకం మిగులుతుంది. ఎంజాయ్మెంట్ క్షణికం. పండుగ చేసుకోవడం సులభమైంది. పెరట్లో పూచే బంతిపూల చెట్ల వరుస నేడు కుండీలు చేరాయి. గ్లోబల్ మార్పుల్లో సంక్రాంతిని కొత్తగా చూడాలి... అంటున్నారు ప్రసిద్ధ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చిన ప్రతి సంక్రాంతి పండగ నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతపు పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పంటతో పాటు తోటల నుంచి తాజా చిక్కుడు కాయలు, ఏజన్సీ ముళ్ళ వంకాయలూ, పచ్చి మిరపకాయలు ఇళ్ళకు గుట్టగా వచ్చి పడేవి. తియ్య గుమ్మడి పళ్లు సరేసరి. ‘కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూ దుమారమ్ము నద్ది పండ రేగడి బండి నార కన్పండువై ΄÷లుచు మిర్యపు పండు బొట్టు పెట్టి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వీధి‘ అని రాసేడు ఆనాడెప్పుడో కవి. దేశంలో ఇప్పుడు పంట ఉత్పత్తి పెరిగింది. ఎరువులు, పురుగుల మందులు మనవి కాదనుకుంటే దిగుబడి పెరిగింది. బజార్ల నిండా బంతి పూలు, చేమంతి పూలు విరగబడి ఉంటున్నాయి. ఈ ఏడాది చలి కూడా బావుంది. పుష్యమాసానికి తగినట్టు ఉంది. పాత, పాత సంక్రాంతి రోజులను గుర్తుకు తెచ్చింది. మా గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఇంత గ్లోబల్ నాగరికత వల్ల కమ్ముకొన్న ΄÷గ అంతటిలోనూ ధనుర్మాసమంతా వీథి వీథినా వాకిళ్లలో ముగ్గులు పెడుతూనే ఉన్నారు.మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు సంక్రాంతి సంప్రదాయ వేడుకలకు గ్లోబల్ మెరుపుల మధ్య పరాకు పడినట్టయేరు. ఎనభయిల్లో మా రాజవొమ్మంగికి టూరింగ్ టాకీస్ వచ్చినప్పుడు జనం సంక్రాంతి పండగని పక్కన పెట్టి విగబడి సినిమాకి పోయేవారు. ఆ రోజుల్లో పండగ తాలూకు అన్ని సంబరాలూ తగ్గేయి. గ్లోబల్ నాగరికత అలా పండుగను వెనక్కు నెట్టింది. కానీ తిరిగి దేశమంతా మళ్లీ కొత్తదారుల్లో పండుగను వెతుక్కుంటోంది. నా చిన్నప్పుడు మా పెరట్లో పశువుల శాల ఉండేది. అక్కడి ఆవు పేడ తీసుకెళ్లి మా వెదురు కంచె అవతల ఉన్న చింత చెట్టు మాను మీద గిరిజన పిల్లలతో కలిసి పిడకలు వేసేదాన్ని. ఆ చింత చెట్టు మాను దాని చుట్టూ ముగ్గురు చేతులు చాపి కౌగిలించుకుంటే పట్టే అంత పెద్దగా ఉండేది. బహుశా ఒక 300 ఏళ్ల వయసు అయి ఉంటుంది దానిది. భోగి పండగ నాటికి ఆ పిడకలన్నీ గుచ్చి భోగిమంటలో వేయటానికి. ఇది ఒక వారం రోజుల కార్యక్రమం. ఇప్పుడు అమెజాన్ నుంచి డైరెక్ట్గా ఆవుపేడ, పిడకలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలకి ఆ సంప్రదాయం కావాలి, ఎలా దొరికినా సరే. దాంట్లో ఉన్నది అందమా, పుణ్యమా, పురుషార్ధమా అన్నది వేరే విషయం. మేము చదువులకి పట్టణానికి వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి మా పల్లెటూళ్ళకి తరలి వెళ్లే వాళ్ళం. ఎక్కడెక్కడ చుట్టాలూ, బంధువులూ ఇళ్లలో కలిసి పండగ చేసుకునేవారు. ఇవాళ మనిషి రోజులో ఎక్కువ గంటలు సెల్ఫోన్తో జీవిస్తున్నాడు. కానీ సెల్ఫోన్ ద్వారా కూడా చేస్తున్నది సమూహానికి దగ్గర అయ్యే ప్రయత్నమేనేమో. అందులో ఉన్న వాట్సాప్ నిండా ఎన్ని గ్రూపులు ఉంటాయో చెప్పలేం. బయట గ్రూపులే కాక కుటుంబాల గ్రూపులని, కుటుంబాల్లో కజి¯Œ ్స గ్రూపులని, ఒక ఊరి బంధువుల గ్రూపులని రకరకాలు. ఇలా ఒకరినొకరు కలుపుకుంటూ మళ్లీ తిరిగి ఈ పండగలకి ఎక్కడో చోట అందరూ కలవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కలుస్తూ ఉంటున్నారు. పల్లటూర్లు, రిసార్ట్లు నిండి పోతున్నాయి.తిరిగి అవే అరిసెలు, అవే బొబ్బట్లు, అవే చక్రాలు, అవే పిండి వంటలు. పూర్వం వండుకుని తినేవారు. ఇప్పుడు చేయించుకుని తింటున్నారు. సాంకేతికంగా వస్తున్నటువంటి పెనుమార్పులు చూసినప్పుడు, ఇవి మానవ జీవితంలో తీసుకొస్తున్న సౌకర్యాలను గాని, అలజడులను గాని గమనిస్తున్నప్పుడు మన పాత సరదాలన్నీ వెనక్కి పోయాయా అనే విచారం కలుగుతుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే మనుషులు మళ్ళీ తిరిగి కష్టపడకుండా ఇంకా సులువుగా పండగలను ఎంజాయ్ చేయడానికి సర్వవిధాలా సంసిద్ధులవుతూనే ఉన్నారు. ఇది నగరాలకు కూడా మినహాయింపు కాదు. అసలు జీవితంలో తిండినేనా, అనుబంధాన్నేనా పూర్వం ఆస్వాదించే వారు. ఇప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదన వేరు ఎంజాయ్ వేరు. నేను ఎప్పుడో చె΄్పాను– ఈ ఎంజాయ్మెంట్ అన్నది కూడా గ్లోబలైజేషన్ తాలూకు జార్గాన్ అని. ఎంజాయ్మెంట్ క్షణికం. ఆస్వాదనలో జ్ఞాపకం, కొనసాగింపు ఉంటాయి.సంక్రాంతి పండుగ అంటే మూడు నెలల ముందు నుంచి రైలు టికెట్లు దొరక్కపోవడం, బస్సులు కిటికిటలాడుతూ ఉండటం ఇప్పటికీ ఆ పండగ తాలూకు అట్టహాసాన్ని చెప్తూనే ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి, ΄÷లాల నుంచి తోటల నుంచి దూరంగా వచ్చేసిన నేను కూడా సంక్రాంతి పండగ ముందు నాలుగు బంతిపూల కుండీలు, నాలుగు చామంతి పూల కుండీలు కొనుక్కుని ప్రతి ఏడాది బాల్కనీలో పెట్టుకుని కవులను తలుచుకుంటూ ఉంటాను. ‘బంతి పువ్వులకు చామంతులకు నెయ్యమును గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వైపు’వాడ్రేవు వీరలక్ష్మీ దేవి రచయిత్రి, సాహితీ విమర్శకులు -
నాటి సౌర తుఫాను... భూమిని వణికించింది!
2024 అక్టోబర్లో సంభవించిన భారీ సౌర తుఫాను భూమిని గట్టిగా వణికించిందని సైంటిస్టులు తాజాగా తేల్చారు. ముఖ్యంగా భూ అయస్కాంత క్షేత్రంపై అది పెను ప్రభావమే చూపిందట. భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సౌర అబ్జర్వేటరీయే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం విశేషం!నాటి సౌర తుఫాను భూ అయస్కాంత క్షేత్రంతో పాటు దాని తాలూకు రక్షణ వ్యవస్థలను కూడా పునాదులతో సహా కంపింపజేసింది! ఆదిత్య ఎల్1 అందించిన డేటాను విశ్లేషించిన మీదట సైంటిస్టులు ఈ మేరకు నిర్ధారించారు. ఆ తుఫానర తాలూకు పెను ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆదిత్య ఎల్1 అందించిన డేటాను అప్పటికే అందుబాటులో ఉన్న ఇతర అంతర్జాతీయ డేటాతో కలగలిపి నాసా లోతుగా విశ్లేషించింది. 2024 అక్టోబర్లో సూర్యునిపై అతి శక్తిమంతమైన ప్లాస్మా పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా చెలరేగిన అపార శక్తి కణాలు అతి భారీ పరిమాణంలో భూమికేసిదూసుకొచ్చాయి. భూమిని సూర్యుని తాలూకు పరారుణ, రేడియో ధార్మిక కిరణాలు తదితరాల బారినుంచి అనునిత్యం కాపాడే అయ స్కాంతావరణాన్ని అపార శక్తితో ఢీకొ ట్టాయి. వాటి ధాటికి అది కిందమీదులై నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆ ఆఘాతం దెబ్బకు అయస్కాంతావరణం స్వల్పకాలం పాటు చెప్పుకో దగ్గ స్థాయిలో కుంచించుకు పోయిందట కూడా! అంతేగాక భూ ఎగువ వాతావరణ పొరల్లో అరోరా ప్రవాహాలు విపరీత స్థాయికి పెరిగాయి. ఫలితంగా పలు కృత్రిమ ఉపగ్రహాలు కూడా ప్రభావితం కావడం, పలు దేశాల్లో కమ్యూనికేషన్ల వ్య వస్థ తాత్కాలికంగా దెబ్బతినడం, పవర్ గ్రిడ్లు, మౌలిక వ్యవస్థలు పడకేయడం, జీపీఎస్ వ్యవస్థలు మొరాయించడం తెలిసిందే. ఈ భీకర సౌర తుఫానుకు సంబంధించిన రియల్ టైమ్ నిర్మాణాత్మక విశ్లేషణను ఆదిత్య ఎల్1 అందించింది. అంతరిక్షంలో జరుగుతున్న కీలక పరిణా మాలకు సంబంధించి రియల్ టైమ్ డేటా ఆవశ్యకతను ఈ ఉదంతం మరోసారి కళ్లకు కట్టిందని సైంటిస్టులు చెబుతు న్నారు. ముఖ్యంగా 2026లో సూర్యప్ర తాపం పరాకాష్టకు చేరవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇది మరీ ముఖ్యమని వారంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్!
అది టోక్యో వీధి.. మధ్యాహ్నపు ఎండ.. నిత్యం కిటకిటలాడే ఆ నగరంలో ఒక వృద్ధుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతని కళ్లలో ఒక తరం కిందటి జ్ఞాపకం మెరుస్తోంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం విడిపోయిన తన ప్రాణ మిత్రుడు కనిపిస్తాడా? అసలు ఆ పాత ఈమెయిల్ చిరునామా ఇంకా పని చేస్తోందా?అమ్మ దాచిన అపురూప నిధికథ అమెరికాలోని నార్త్ కరోలినాలో మొదలైంది. వాల్టర్ అనే వ్యక్తి.. తన తల్లి మరణానంతరం ఆమె పాత వస్తువులను సర్దుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చనిపోవడానికి ముందు ఆమె రాసుకున్న పాత కాగితాల మధ్య.. ఒక చిరునామా, ఒక పాత ఈమె యిల్ ఐడీ కనిపించింది. అది 48 ఏళ్ల క్రితం తన ఇంట్లో ఎక్సే్ఛంజ్ స్టూడెంట్గా ఉన్న జపాన్ మిత్రుడు కజుహికోది. అతను వాల్టర్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అలా వాల్టర్, కజుహికోలు చిన్నప్పుడే మంచి మిత్రులయ్యారు. వాల్టర్ తల్లికి కజుహికో అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి సొంత కొడుకులా ఉండేవాడు. అందుకే ఆమె పాత కాగితాల్లో కజుహికో వివరాలను, ఆఖరికి అతని పాత ఈమెయిల్ చిరునామాను కూడా భద్రంగా రాసి పెట్టుకుంది.ఆఖరి ప్రయత్నం ఫలించిందినిజానికి 48 ఏళ్ల తర్వాత ఆ ఈమెయిల్ పని చేస్తుందని ఎవరూ అనుకోరు. కానీ జపాన్ వెళ్లే విమానం ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు, వాల్టర్ ఒక చిన్న సాహసం చేశాడు. ‘ఆ ఈమెయిల్ ఐడీ ఇప్పుడు పనిచేస్తుందో లేదో.. ఆ మిత్రుడు బతికే ఉన్నాడో లేదో’.. అన్న సందేహంతోనే ఒక మెయిల్ పంపాడు. విమానం దిగేసరికి అద్భుతం జరిగింది.. నాలుగు దశాబ్దాల నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతూ.. అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. జపాన్లో ఉన్న కజుహికో స్పందించాడు. కానీ వారి మధ్య భాష సమస్య ఎదురైంది. వాల్టర్ మిత్రుని భార్య నోబుకో మధ్యవర్తిగా మారి, వారిద్దరి మధ్య సందేశాలను అనువదించింది. చివరికి టోక్యోలో ఒక లంచ్ మీటింగ్ ఖరారైంది.కన్నీటి ఆలింగనంనిర్దేశించిన ప్రదేశంలో ఇద్దరూ కలుసు కున్నారు. 48 ఏళ్ల క్రితం యవ్వనంలో చూ సుకున్న ఆ ఇద్దరి కనులు.. ఇప్పుడు ముడతలు పడ్డ ముఖాల్లో ఒకరినొ కరిని గుర్తు పట్టా యి. ఇంకేమీ మా ట్లాడలేదు.. ఒకరి నొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ ఆలింగనంలో అర్ధ శతాబ్దపు ఎడబాటు, ఆనందం, కన్నీళ్లు అన్నీ కలిసిపోయాయి. ఈ దృశ్యం చూసిన వారందరి కనులు చెమర్చాయి.స్నేహానికి ’ఎక్స్పైరీ డేట్’ లేదు!వాల్టర్ కుమార్తె మెరెడిత్ డీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వారి ఆలింగనం చూసి సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. చితికిపోయిన కాగితం మీద దొరికిన అక్షరం.. విడిపోయిన ఇద్దరు మిత్రులను కలిపింది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, స్వచ్ఛమైన స్నేహానుబంధం ఏనాటికీ వాడిపోదని ఈ సంఘటన నిరూపించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూత్ ఫుల్ పవర్
‘శక్తి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అది నీలోనే ఉంది’ అని మేల్కొలుపుతూ దారి చూపుతాడు. ‘మీరు ప్రయాణించే మార్గం పదునైన కత్తి అంచులాంటిది. అయినా భయపడకండి. నిస్పృహను వీడండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అంటూ అంతులేని ధైర్యాన్ని ఇస్తాడు. ఆ మహానుభావుడు... వివేకానందుడు. ‘స్వామి వివేకానంద’... యువతరానికి ఇష్టమైన పేరు. లక్ష్య సాధనలో వేనవేల ఆయుధాల బలం ఇచ్చే పేరు. రేపు‘జాతీయ యువజన దినోత్సవం’ సందర్భంగా... ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30–2026 జాబితాలో చోటు సాధించిన వివిధ రంగాల యువదిగ్గజాల గురించి....1.కాజల్ బేదా (29) అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్అది కోవిడ్ కల్లోల కాలం. ఆ సమయంలో బ్రాండ్ స్టోరీ టెల్లింగ్ ప్రాధాన్యాన్ని, శక్తిని గ్రహించింది కాజోల్ బేదా. 2020లో ముంబైలో మార్కెటింగ్, ప్రకటన ఏజెన్సీ ‘స్క్రిబుల్డ్’ను ప్రారంభించింది. యూకేలో మీడియా ్ర΄÷డక్షన్లో శిక్షణ తీసుకున్న అనుభవం ‘స్క్రిబుల్డ్’ను విజయవంతంగా నడపడంలో ఉపయోగపడింది. ప్రస్తుతం కంపెనీ క్లైంట్లలో నైకా, అదాని గ్రూప్, అమెజాన్ ప్రైమ్లాంటి పెద్ద బ్రాండ్లు ఉన్నాయి.2. అనీత్ పద్దా (26)ఎంటర్టైన్మెంట్చిన్నప్పుడు అనీత్ పద్దా పెద్దగా మాట్లాడేది కాదు, భావవ్యక్తీకరణ కూడా అంతంత మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని తల్లి ఆమెకు కవిత్వంతోపాటు ఇతర కళలను పరిచయం చేసింది. భావోద్వేగాలు అంటే ఏమిటి? టెక్నిక్ అంటే ఏమిటి... లాంటి విషయాలను పరిచయం చేసింది. విశేషం ఏమిటంటే ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేరకుండానే నటన స్వయంగా నేర్చుకుంది అనీత్. తనను తాను వ్యక్తపరుచుకోవడానికి అనీత్కు కళలు బలంగా ఉపయోగపడ్డాయి. సైయారా (2025) లో అనీత్ అద్భుతపాత్ర ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది.3. ప్రియా డాలి (29)డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్క్రియేటివ్ డైరెక్టర్ అయిన ప్రియా డాలీ డిజైన్, స్టోరీ టెల్లింగ్, కమ్యూనిటీ బిల్డింగ్ లాంటి ఎన్నో రంగాలలో పనిచేస్తోంది. ‘సృష్టి మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ’ నుంచి పట్టా పుచ్చుకున్న ప్రియ 2017లో మీడియా ప్లాట్ఫామ్ ‘గైసీ ఫ్యామిలీ’లో ఇంటర్న్గా చేరింది. ఆ ప్లాట్ఫామ్ను మల్టీ–ఫార్మట్ క్వీర్ మీడియా, కల్చరల్ సెంటర్గా రూపొందించడంలో తన వంతు సహకారం అందించింది. టిండర్, గోద్రెజ్లాంటి బ్రాండ్ల కోసం పనిచేసింది. క్రియేటివ్ స్టూడియో ‘ఆర్ యూ సీరియస్’ కు ప్రియ డాలి కో–ఫౌండర్.4. పూజా మాలిక్ (28) ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్పూజా మాలిక్ ‘ఈక్విట్రేసర్స్ వెల్త్ అడ్వైజర్స్’ ఫౌండర్. వ్యక్తులు, కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయని తమ పెట్టుబడులను తిరిగి పొందడంలో సహాయపడే ఎసెట్ రికవరీ సంస్థ ఇది. రికవరీ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా ఉండేలా చూసుకునే లక్ష్యంతో పనిచేస్తుంది. మరచిపోయిన బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటి షేర్లు, డివిడెండ్లతో పాటు ఇతర ఆర్థికపరమైన ఆస్తులను ట్రాక్ చేయడం, నిజమైన వారసులను గుర్తించడానికి సంబంధించి పనిచేస్తోంది.5. మౌమితా బసక్ (29), ఆర్ట్మౌమితా బసక్కు భిన్నమైన బెంగాలీ వ్రçస్త కళలు కొట్టినపిండి. సాధారణ వస్త్రాలకే తన కళతో అసాధారణ అందాన్ని తీసుకు వస్తుంది. పాతదుస్తులను ఆకట్టుకునే కళాకృతులుగా తీర్చిదిద్దుతుంది. టీ, కాఫీ రంగులను ఉపయోగించి ప్రత్యేకమైన అల్లికలు సృష్టిస్తుంది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో స్కాలర్షిప్లు అందుకుంది. అవార్డ్లు అందుకుంది. మౌమితా బసక్ కళాకృతులు మన దేశంలోని పలు ప్రాంతాలతో పాటు లండన్, స్పెయిన్, పోలాండ్లోని గ్యాలరీలలో ప్రదర్శితమయ్యాయి.6. సిమోన్ మోహన్ (28)ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ‘సొంత ఇంట్లో ఉన్నట్లే హాయిగా ఉంది’ అనే మాట గెస్ట్ నోట వినిపించాలనే లక్ష్యంతో మొదలైంది రహో హాస్పిటాలిటీస్. ప్రయాణ అనుభవాలను పునర్నిర్వచించాలని సంకల్పించింది. ‘క్వాలిటీ స్టే అంటే కచ్చితంగా ఇదే’ అనేలా చేయాలనుకుంది. సిమోన్ మోహన్ మాజీ రాజకీయ వ్యూహకర్త. ‘రహో హాస్పిటాలిటీస్’ ద్వారా హోమ్ స్టే మార్కెట్లోకి అడుగుపెట్టిన కొంతకాలానికే అద్భుత విజయం సాధించింది.7. రమ్య యల్లాప్రగడ (28), లక్షయ్ సాహ్నీ (28) హెల్త్కేర్రమ్య యల్లాప్రగడ, లక్షయ్ సాహ్ని 2020లో ‘మార్బుల్ హెల్త్’ను స్థాపించారు. న్యూరోటెక్నాలజీ కంపెనీ ఇది. కంపెనీకి సంబంధించి కీలక ప్రాడక్ట్ ‘ఈజ్’ మన దేశానికి సంబంధించి ఫస్ట్ మెడికల్లీ లైసెన్స్డ్ పోర్టబుల్ న్యూరోమాడ్యులేషన్ డివైజ్. ఈ పరికరాన్ని ఆస్పత్రులలో వినియోగిస్తున్నారు. ‘మార్బుల్ హెల్త్’ ప్రధానంగా సైకియాట్రిస్ట్లు, హాస్పిటల్స్తో కలిసి పనిచేస్తోంది. ఆందోళన, కృంగుబాటు, న్యూరోరిహబిలేషన్స్కు సంబంధించి విస్తృత పరిశోధనలు నిర్వహిస్తోంది ‘మార్బుల్ హెల్త్’.8.ఆకృతి రావల్ (29) డీ2సితల్లి ప్రేరణతో చేనేత వస్త్రాలపై ఆసక్తి పెంచుకుంది ఆకృతి రావల్. ‘హౌజ్ ఆఫ్ చికంకారి’ పేరుతో వాట్సాప్ వేదికగా తన బ్రాండ్ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ లక్నో చుట్టుపక్కల ఉన్న చేనేత కళకారులతో కలిసి పనిచేస్తోంది. ప్రామాణికమైన చికంకారి దుస్తులను కొనుగోలుదారులకు చేరువ చేస్తుంది. తన బ్రాండ్ ద్వారా ఎంతోమంది చేనేత కళాకారులకు స్థిర ఆదాయాన్ని అందిస్తోంది.9. శీతల్దేవి (18)స్పోర్ట్స్జమ్మూ కశ్మీర్లోని మారుమూల పర్వతగ్రామానికి చెందిన శీతల్దేవి మన దేశంలోని ప్రసిద్ధ పారా–ఆర్చరర్లో ఒకరిగా ఎదిగింది. చేతులు లేకుండా జన్మించిన శీతల్దేవిని సంకల్పబలమే విజయపథంలో నడిపించింది. పాదాలను ఉపయోగించి విలువిద్యలో ప్రావీణ్యం సాధించింది. అథ్లెట్ కావాలని ఎప్పుడూ కోరుకోని శీతల్దేవి పదిహేడు సంవత్సరాల వయసులో మన దేశంలోని అతి పిన్న వయస్కురాలైన పారాలింపిక్ పతక విజేతగా, ఆ తరువాత ప్రపంచ చాంపియన్గా నిలిచింది.10. ముబస్సిరా ఖాలీద్ (26), ఫ్యాషన్‘అజ్రాఖ్ కళ అనేది పురుషులకు మాత్రమే సాధ్యం అయ్యే కళ’గా పేరు తెచ్చుకుంది. తరతరాల ఈ అప్రకటిత నిర్వచనాన్ని తిరగరాసింది ముబస్సిరా ఖాలీద్ ఖత్రీ. ఎన్నో అడ్డంకులను అధిగమించి సంక్లిష్టమైన ఈ సంప్రదాయ కళలో విజయం సాధించింది. సంప్రదాయ అజ్రాఖ్ కళారీతులను ప్రీహ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ప్రింటింగ్తో సృజనాత్మకంగా కలిపి విలక్షణమైన డిజైన్లను రూపొందించింది. తన బ్రాండ్ ‘ఎలిసియస్’ను ప్రపంచస్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటోంది.11. గిరిష్ మెహతా (27), అనిష శర్మ (27) సోషల్ ఇంపాక్ట్గిరీష్ మెహతా, అనిషా శర్మ కేర్ లీవర్స్ ఇన్నర్ సర్కిల్ ఫోరం(సిఎల్ఐసి) కో–ఫౌండర్స్. కేర్లీవర్ల కోసం కేర్ లీవర్ల ద్వారా నిర్వహిస్తున్న ప్లాట్ఫామ్ ఇది. అనాథాశ్రమాలలో పెరిగిన వీరికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. తమ సోషల్ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ కేర్ లీవర్స్కు (బాలల సంరక్షణ గృహాల నుండి వయోజన జీవితంలోకి అడుగుపెట్టే యువతీ యువకులు) సపోర్ట్ ఇస్తుంది. ఓటర్ కార్డ్, ఆధార్... మొదలైనవి పొందడానికి, ప్రభుత్వ పథకాలు అందించడానికి, స్వయం సహాయ సంఘాలకు సంబంధించి కేర్ లీవర్స్కు ‘సీఎల్ఐసీ’ సహాయం అందిస్తోంది. -
కార్లు మాట్లాడుకుంటాయి
రోడ్డు ప్రమాదాలు.. నిత్యం మనం వింటున్నవే. అయితే మారేది తీవ్రత మాత్రమే. కొత్త బండ్లు ఏ రీతిన పెరుగుతున్నాయో.. ప్రమాదాలు కూడా అదే స్థాయిలో అధికం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 2023లో 4,80,583 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటి కారణంగా 1,72,890 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందించే బదులుగా ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో 2,56,07,391 కొత్త వెహికల్స్ రోడ్డెక్కాయి.కొన్నేళ్లుగా ఏటా కోట్లాది వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ఇంకేముంది ప్రమాదాలూ పెరిగి లక్షలాది కుటుంబాలకు తీరని శోకం మిగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వెహికల్–టు–వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ టెక్నాలజీని భారత్లో ప్రవేశపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. 2026 చివరి నాటికి ఈ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించేందుకు ఈ సాంకేతికత దోహదం చేస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా..నెట్వర్క్, ఇంటర్నెట్ అవసరం లేకుండా వాహనాలు ఒకదానితో ఒకటి నేరుగా షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా సంభాíÙంచుకోవడానికి ఈ సాంకేతికత వీలు కల్పిస్తుంది. రహదారుల మీద పార్క్ చేసిన వాహనాలను అదే మార్గంలో వేగంగా ప్రయాణించే ఇతర వాహనాలు ఢీకొట్టకుండా నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు సమయంలో యాక్సిడెంట్లను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు సిగ్నల్స్ను ఒకదానితో మరొకటి ఇచ్చిపుచ్చుకుంటాయి.మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు హెచ్చరికలను పంపుతాయి. వాహన స్థానం, కదలిక దిశ, వేగంలో మార్పులు, బ్రేకులు వేస్తున్న తీరు ఏవిధంగా ఉందో వంటి సమాచారం ఇతర వాహనాలకు చేరవేస్తుంది. ముందున్న వాహన వేగం నెమ్మదించడం వంటి ప్రమాదకర పరిస్థితిని గుర్తించినప్పుడు డ్రైవర్కు హెచ్చరిక పంపుతుంది. స్పందించే సమయం పరిమితంగా ఉన్నా, దారి కనిపించని పరిస్థితుల్లో కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వ్యవస్థకు సాంకేతిక ప్రమాణాలు, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ను ఖరారు చేయడానికి ప్రభుత్వం వాహన తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా అమలుకోసం రేడియో స్పెక్ట్రమ్ ప్రత్యేకంగా కేటాయిస్తారు. వాహనాల మధ్య అడ్డంకులు లేని సమాచార మారి్పడి కోసం ప్రత్యేకంగా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను అందుబాటులో ఉంచడానికి టెలికం శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది. రూ.5 వేల కోట్ల బడ్జెట్తో.. దేశంలో 36 కోట్లకుపైగా రిజిస్టర్డ్ వెహికల్స్ పరుగు తీస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలున్న భారత్లో వీ2వీ సాంకేతికత అమల్లోకి వస్తే రోడ్డు భద్రత విషయంలో పెద్ద అడుగుపడ్డట్టే. ఇలాంటి సాంకేతికత ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.వీ2వీ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రత్యేకతలివీ.. ⇒ ఈ వ్యవస్థ వాహనాల్లో ఇన్స్టాల్ చేసిన సిమ్ కార్డ్ లాంటి పరికరం ద్వారా షార్ట్ రేంజ్ వైర్లెస్ సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. ⇒ ఈ పరికరం ట్రాఫిక్ లైట్స్తో కమ్యూనికేట్ చేయగలదు. అత్యవసర వాహనాలకు ప్రాధాన్యం ఇస్తుంది. ⇒ వాహనదారులకు రూట్ మ్యాప్ ప్లానింగ్లో సహాయపడుతుంది. ⇒ మరొక వాహనం ఏ దిశ నుంచి అయినా చాలా దగ్గరగా వచ్చినప్పుడు.. రియల్ టైమ్లో హెచ్చరికలు అందుతాయి. పొగ మంచు అధికంగా కురుస్తున్నప్పుడు దారి ఏమాత్రం కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ చుట్టూ ఉన్న వెహికల్స్ ఎంత దూరంలో ఉన్నాయో అలర్ట్ చేస్తుంది. వాహనం సమీపిస్తున్నా, రోడ్డు పక్కన నిలిచి ఉన్నా డ్రైవర్లను హెచ్చరిస్తుంది. ⇒ వెహికల్కు 360 డిగ్రీల కోణంలో అన్ని వైపుల నుంచి సంకేతాలను అందిస్తుంది. ⇒ ప్రతి వాహనంలో ప్రత్యేక హార్డ్వేర్ ఏర్పాటుకు కొన్ని వేలు ఖర్చు అవుతుంది. కానీ ఈ ధరలు ఇంకా వెల్లడి కాలేదు. ⇒ 2026 చివరి నాటికి ఈ సాంకేతికతను నోటిఫై చేయడానికి రవాణా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ⇒ తొలుత ఈ పరికరాలను కొత్త వాహనాల్లో (ప్లాంట్లలోనే) ఇన్స్టాల్ చేస్తారు. ⇒ ఇతర అన్ని వాహనాల్లో దశలవారీగా అమలు చేస్తారు. -
ఆశావహ సంవత్సరమే..!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పట్ల భారతీయుల్లో ఆశావహ దృక్పథం వ్యక్తమవుతోంది. కుటుంబ శ్రేయస్సు, వ్యక్తిగత పరివర్తన, ఆప్తులకు ప్రాధాన్యం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు మొగ్గుచూపనున్నారు. ఇటీవల నిర్వహించిన ఇప్సాస్ గ్లోబల్ ప్రిడిక్షన్స్– 2026 సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా అత్యంత ఆశావహ వైఖరిని కనబరిచిన వారిలో 90 శాతంతో ఇండోనేసియన్లు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా–89%, చీలి, థాయ్లాండ్, పెరు 86%తో కాస్త ముందంజలో ఉండగా, ఇండియన్లు 81 %గా నిలిచారు.భారత్లో జరిపిన పరిశీలనలో పాల్గొన్న వారిలో...పది మందిలో 8 మంది 2026 మెరుగ్గా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 30 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రధానంగా రాబోయే జీవితం, కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు, ఆర్థిక దృక్పథాలు కుటుంబానికి వెచి్చంచే సమయం, వ్యక్తిగత వృద్ధి, ప్రపంచ ఫుట్బాల్ పట్ల ఆసక్తి, ఏఐ విస్తృత వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు, ఉపాధిపరంగా ఎదురయ్యే కష్టనష్టాలు, ఆందోళనలు తదితరాలపై అభిప్రాయాలు సేకరించారు. 2026 గురించి ఇలా... వ్యక్తిగత ప్రాధాన్యాలకు మించి ప్రపంచ, జాతీయ పరిణామాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడిందని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. పది మందిలో ఎనిమిది మంది భారతీయులు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెప్పగా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, చిలీ పౌరులు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.⇒ సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం 2026లో ముగియాలని ఇద్దరు భారతీయులలో ఒకరు కోరుకుంటున్నారు. ఇతర దేశాల్లోని ప్రజల అభిప్రాయాలతో సరిపోల్చిస్తే, 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రావొచ్చని భారతీయులు సైతం అంచనా వేస్తుండడం విశేషం. ⇒ పది మందిలో ఆరుగురు భారతీయులు 2026లో ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే వారి ఆందోళన స్థాయి ఇండోనేసియా, సింగపూర్ పౌరుల కంటే తక్కువగా ఉంది. ఆ దేశాల్లో పది మందిలో తొమ్మిది మంది పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ను అంచనా వేస్తున్నారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు 2026లో తీవ్రమైన వాతావరణ సంఘటనలకు భయపడుతున్నారు. ⇒ భారతీయుల ప్రాధాన్యతలు వ్యక్తిగత శ్రేయస్సు, కుటుంబ సంబంధాలపై బలంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ఏడాది కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలని 82% కోరుకుంటున్నారు. ఈ భావన ఇండోనేసియా, రొమేనియా, మలేసియా వంటి దేశాల్లోనే కనిపించింది. ⇒ పది మందిలో ఎనిమిది మంది భారతీయులు వ్యాయామాని కి అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎక్కువ సేపు ఇందులో గడపాలని భావిస్తున్నారు. 2025లో దీనిని నిర్లక్ష్యం చేశామన్న అపరాధ భావం కారణంగా కొత్త సంవత్సరంలో ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ⇒ భారత్లో సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ శాతం మంది గతేడాదితో పోల్చిస్తే 2026లో సోషల్ మీడియాకు వెచి్చంచే సమయాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు సమతుల్యత, వ్యక్తిగత శ్రేయస్సు, మెరుగుదల దిశలో మరింత కృషి సాగించాలని భావిస్తున్నారు. సర్వే ముఖ్యాంశాల్లో మన దేశానికి సంబంధించి... అధిక ఆశావాదం: భారతీయుల్లో అధిక స్థాయిల్లో ఆశావాదం వ్యక్తమైంది. 2026 మెరుగ్గా ఉంటుందని 81% మంది ఆశిస్తున్నారు ప్రాధాన్యాలు: ఈ ఏడాది కీలకమైన భారతీయ ప్రా ధాన్యతలలో కుటుంబ సమయం (82%), ఫిట్నెస్, వ్యక్తిగత శ్రేయస్సు వంటి వాటికి పెద్దపీట వేశారు.ఏఐ ఆందోళనలు: 62% మంది ఇండియన్లు ఏఐ వల్ల ఉద్యోగ నష్టాలు ఎదురు కావొచ్చునంటున్నారు. అయితే 57% మంది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని భావిస్తున్నారు రక్షణ–భద్రతా భయాలు: వ్యక్తిగత రక్షణ, భద్రతల విషయంలో ఒకింత నిరాశావాదం వ్యక్తమైంది. తమ ప్రాంతం తక్కువ సురక్షితంగా మారుతుందని 55% మంది భావిస్తున్నారు. పెద్ద ఉగ్రవాద దాడి జరగొచ్చునని 53% మంది భయపడుతున్నారు ⇒ 2026లో అనేక సంభావ్య ముప్పులను కూ డా గుర్తించారు. వీటిలో పెద్ద ఉగ్రవాద దా డి భయాలతో పాటు ఆర్థిక మాంద్యం సంభావ్యత, ప్రజల్లో అశాంతి, అక్రమ వలసలకు సంబంధించిన ఆందోళనలు ఉన్నాయి. ⇒ గతేడాది దేశానికి, సొంత కుటుంబాలకు నష్టదాయకంగా పరిణమించిందని కొందరు అభివర్ణించారు.గతేడాది కఠినమే2025 పలువురు భారతీయులకు కఠినమైన సంవత్సరంగా నిలిచింది. ఆర్థిక ఒత్తిళ్లు, ఆపరేషన్ సిందూర్ ద్వారా పూర్తిస్థాయి యుద్ధం, తీవ్రమైన వాతావరణ ప రిస్థితులు, ట్రంప్ సుంకాల విధింపు–ఉద్యోగాల కోత లు, ఇతర సవాళ్ల నేపథ్యంలో ఇండియన్లు 2026 పట్ల ఆశావాద దృక్పథాన్ని కనబరుస్తున్నారు. 2025 కంటే 2026 మెరుగ్గా ఉంటుందని నమ్ముతున్నారు. కుటుంబం, స్నేహితులతో బంధానికి అధిక ప్రాధాన్యం, వ్యక్తిగత శ్రేయస్సుపై దృష్టి కేంద్రీకరణ, ఈ ఏడాది జరిగే ఫిఫా వరల్డ్కప్పై అధిక ఆసక్తి వంటివి వెల్లడయ్యాయి. – సురేశ్ రామలింగం, సీఈఓ, ఇప్సాస్ ఇండియా -
ఆపరేషన్ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.నెలల తరబడి నిఘా!అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్లో భాగంగా.. కారకస్లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది. సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్ చేశారు. రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్గ్రిడ్ (గురి డ్యామ్ నెట్వర్క్)ను అమెరికా టార్గెట్గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.సైబర్ ఎటాక్ ఎలా చేశారంటే.. అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్గ్రిడ్ కార్పొరేషన్పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్వేర్ను చొప్పించారు. ఈ మాల్వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్కు అమెరికా తన సొంత మాల్వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.అత్యంత చాకచక్యంగా..నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!కలిసొచ్చిన సూటర్సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్వేర్తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.భారత్ ఎంత వరకు సురక్షితం?వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విషయంలోనూ ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్పై జరిగితే ఎలా ఉంటుంది?.. ఐదేళ్ల క్రితం చైనా మాల్వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్వేర్ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్లలో మాల్వేర్పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.:: హెచ్.కమలాపతిరావు -
వెంచర్ క్యాపిటల్కు బై ఐపీఓకు.. హాయ్
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు లిస్టింగ్వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్కు ప్రాధాన్యమిస్తున్నాయి. వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం! బ్రాండ్ బిల్డింగ్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్తోపాటు.. టాలెంట్ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్లకు జోష్నిస్తున్నట్లు వివరించాయి.జాబితా ఇలా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్ల జాబితాలో స్క్రిప్బాక్స్, మైగేట్, ఫ్యాబ్హోటల్స్, క్లాస్ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్లు సైతం అధికంగా లిస్టింగ్కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు. ఇదీ తీరు తొలి, మలి దశ స్టార్టప్లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్వెంచర్, ఫండ్ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్లు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 👉ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ రేజా పహ్లవి ప్రొఫైల్- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.అధికారం వద్దంటూనే,. - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.- ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది. -
తెలుగులోనే తొలి ఛార్జి‘షీ’ట్
తెలుగులో అభియోగపత్రం దాఖలుచేసిన తొలి మహిళా పోలీస్ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లోని దుండిగల్ పోలీసుస్టేషన్లో హెడ్–కానిస్టేబుల్గా పనిచేస్తున్న మాలోత్ స్వరూప తెలుగులో అభియోగపత్రం దాఖలు చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. దీంతోపాటు పోలీసు పరిభాషలో ఫైనల్ రిపోర్టుగా పిలిచే నివేదికనూ తెలుగులో రూపొందించి, ఉన్నతాధికారికి సమర్పించిన తొలి అధికారిణిగా రికార్డుకెక్కారు. తాను పనిచేస్తున్న పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ పోలిశెట్టి సతీష్తోపాటు కమిషనర్ మస్తీపురం రమేష్లు దీనికి స్ఫూర్తి అని స్వరూప చెప్తున్నారు. ఆ ‘తొలి తెలుగు మహిళ’ దీని పూర్వాపరాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆంగ్లంలోనే ఉండటం పరిపాటి. ‘జెన్–జెడ్’ను మినహాయిస్తే... గ్రామాల్లోనే కాదు, పట్టణాలు, నగరాల్లోనూ ఆ భాషపై పట్టు ఉన్న వారు చాలా తక్కువ. దీంతో అనేకమంది ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి బాగా చదువుకున్న వారిమీద ఆధారపడాల్సిందే. ఇక పోలీసు విభాగం విషయానికి వస్తే తమ వద్దకు వచ్చే ఫిర్యాదు తెలుగు భాషలో ఉన్నా... అధికారులు దాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసి మరీ కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు, కేసు డైరీలతో పాటు ఛార్జిషీట్ అనే అభియోగపత్రం కూడా ఇంగ్లీషులోనే రూపొందించి న్యాయస్థానానికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలూ తమ మాతృభాషలోనే కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అనివార్య కారణాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది అమలు కావట్లేదు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్న మస్తీపురం రమేష్ గతంలో హైదరాబాద్ ఈస్ట్జోన్కు డీసీపీగా పనిచేశారు. అప్పట్లో తెలుగును పోలీసు విభాగంలో అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆయన స్ఫూర్తితోనే అప్పట్లో చాదర్ఘాట్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేసిన పోలిశెట్టి సతీష్ 2021లో రెండు కేసులకు సంబంధించిన అభియోగపత్రాలను తెలుగులో రూపొందించి కోర్టుకు సమర్పించారు. గతంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేసిన అవినాష్ మహంతి హెడ్–కానిస్టేబుల్ స్థాయి అధికారులను దర్యాప్తు అధికారులుగా మార్చారు. కొన్ని కేసుల్ని వీళ్లే దర్యాప్తు చేసి, అభియోగపత్రాలు దాఖలు చేసేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసు విభాగంలోకి విద్యాధికులే వచ్చి చేరుతున్నారు. అయితే వారికి ఆంగ్లంపై పట్టు తక్కువ కావడం వల్ల ఆసక్తి ఉన్నప్పటికీ అభియోగపత్రాల దాఖలులో ఉన్న ఇబ్బంది మూలాన దర్యాప్తు అధికారులుగా మారట్లేదు. ఈ విషయం గమనించిన ఇన్స్పెక్టర్ పోలిశెట్టి సతీష్ తెలుగులోనే రూపొందించి, దాఖలు చేయడానికి ప్రయత్నించమని ప్రోత్సహించారు. ఆ స్ఫూర్తితో తెలుగులో చార్జ్షీట్స్ వేయాలని నిర్ణయించుకున్నా. బౌరంపేటకు చెందిన వెంకటేష్ తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న దానిపై ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి తెలుగులో రూపొందించిన అభియోగపత్రాన్ని మేడ్చల్లోని మొదటి తరగతి మేజిస్ట్రేట్కు సమర్పించా. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ఓ మహిళ వలస కూలీ, ఆమె కుమార్తె తప్పిపోయిన కేసు దర్యాప్తును పూర్తిచేశాను. వారి ఆచూకీ కనిపెట్టి, కుటుంబీకులకు అప్పగించిన తర్వాత కేసు మూసివేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన తుది నివేదికను తెలుగులో రూపొందించి మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డికి సమర్పించా. సాధారణంగా ఇలాంటి కేసులకు సంబంధించిన చార్జ్షీట్, ఫైనల్ రిపోర్టులను గరిష్టంగా రెండు గంటల్లో తయారు చేయవచ్చు. అయితే తెలుగులో పదాలు వెతుక్కోవాల్సి రావడంతో మూడేసి రోజులు పట్టింది. భవిష్యత్తులోనూ ఈ విధానాలను కొనసాగిస్తా!మాది మెదక్ జిల్లా. నేను దుండిగల్లోనే పుట్టిపెరిగాను. అక్కడి జిల్లా పరిషత్ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివాను. గ్రాడ్యుయేషన్ మాత్రం ఇంగ్లీషు మీడియంలో పూర్తి చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి రిక్రూట్మెంట్లోనే కానిస్టేబుల్గా ఎంపికయ్యాను. ప్రస్తుతం హెడ్–కానిస్టేబుల్ హోదాలో పని చేస్తున్నాను. ఇటీవల డీజీపీ బి. శివధర్ రెడ్డి చేతుల మీదుగా ‘సైబర్ యోధ’ అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సైబర్ క్రైమ్ కేసుల్లో పెండెన్సీ లేకుండా చూసినందుకు నాకీ అవార్డు లభించడం చాలా సంతోషం. – స్వరూప, హెడ్–కానిస్టేబుల్, దుండిగల్ పోలీసుస్టేషన్తెలుగులోనే ఉంటే న్యాయం జరుగుతుందని...ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్షీట్స్ ఇంగ్లీషులో ఉంటున్నాయి. దీనివల్ల తన ఫిర్యాదులోని అంశాలను ఎలా దర్యాప్తు చేశారో, అభియోగపత్రాల్లో ఏం ΄÷ందుపరిచారో బాధితులకు తెలియట్లేదు. తాను చేసింది ఏ చట్ట ప్రకారం నేరమనేది నిందితుడికీ అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ కోర్టు పత్రాలనూ చదవలేరు. ఇవన్నీ తెలుగులో ఉంటే దర్యాప్తులోని లోపాలను బాధితులు కూడా కనిపెట్టి నిర్లక్ష్యం చేసిన అధికారుల్నీ నిలదీస్తారు. అలా సరైన న్యాయంపొందగలుగుతారు. బీఎన్ఎస్ ప్రకారం మాతృభాషలోనూ అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. – పోలిశెట్టి సతీష్, ఇన్స్పెక్టర్, దుండిగల్ పోలీసుస్టేషన్వీలున్నంత వరకు తెలుగులోనే అందిస్తాందుండిగల్ హెడ్–కానిస్టేబుల్ స్వరూపను ఆదర్శంగా తీసుకుని, ఎందరో స్ఫూర్తి ΄÷ందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య భాష ఓ అగాథంలా మారిపోయింది. సామాన్యుల కోసం పని చేసే ప్రభుత్వాలు, యంత్రాంగాలు వారికి అర్థమయ్యేలా సాధారణ వాడుక భాషలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలి. పరిపాలనపరమైన అనేక అంశాలపై వివిధ సర్క్యులర్లు నిత్యం పంపిస్తూ ఉంటాం. వీటితో పాటు వీలున్నంత వరకు మెమోలను కూడా తెలుగులోనే జారీ చేయాలని నిర్ణయించాం. ఓ సబ్–ఇన్స్పెక్టర్ వ్యవహారానికి సంబంధించిన తొలి సర్క్యులర్ను ఇప్పటికే తెలుగులో ఇచ్చాం. – మస్తీపురం రమేష్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ – శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
హీరో కాబోయి జీరో
అమ్మాయి ప్రేమ కోసం ‘యాక్సిడెంట్’ డ్రామా..ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలి.. తన దృష్టిలో హీరోగా నిలిచిపోవాలి.. ఇదీ ఒక యువకుడి పిచ్చి ఆలోచన. దీనికోసం అతను వేసిన ప్లాన్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. రోడ్డుపై ఘోర ప్రమాదండిసెంబర్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలు. కోచింగ్ క్లాస్ ముగించుకుని ఓ యువతి తన స్కూటర్పై ఇంటికి వెళ్తోంది. పతనంతిట్ట సమీపంలోని వళ ముట్టం ఈస్ట్ వద్దకు రాగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆమె స్కూటర్ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. కారు ఆగకుండా మెరుపు వేగంతో వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు భయబ్రాంతులయ్యారు.‘రక్షకుడు’ ఎంట్రీఏం చేయాలో తెలియక జనం తత్తరపడుతున్న సమయంలో.. అక్కడికి ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి రంజిత్ రాజన్ అనే యువకుడు కంగారుగా దిగాడు. ‘నేను ఆమె భర్తను’.. అంటూ అందరినీ నమ్మించాడు. ఎంతో ఆవేదన నటిస్తూ ఆమెను హుటాహుటిన కొన్నీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అందరూ అతన్ని ‘దేవుడు పంపిన రక్షకుడు’ అని మెచ్చుకున్నారు.విస్తుపోయే నిజం!ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య తనిఖీల్లో.. ఆ యువతికి తీవ్ర గాయాలైనట్లు తేలింది. కుడి చేయి ఎముక పక్కకు జరగడం, వేలు విరగడంతో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. మొదట ఇది సాధారణ హిట్ అండ్ రన్ కేసు అని పోలీసులు భావించారు. కానీ, విచారణ ముదిరే కొద్దీ పోలీసులకు అనుమానం కలిగింది. రంజిత్ మాటల్లో పొంతన లేకపోవడంతో లోతుగా ఆరా తీశారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు.పక్కా ప్రణాళికతో..ఆ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదు.. రంజిత్ పక్కాగా ప్లాన్ చేసి చేయించాడు.. అదెలా అంటే.. ‘యువతిని తన స్నేహితుడు అజాస్ కారుతో గుద్దిస్తాడు. వెంటనే తనే అక్కడికి చేరుకుని కాపాడినట్టు నటించాలి. యువతికి, ఆమె కుటుంబానికి తనపై విపరీతమైన ప్రేమ, కృతజ్ఞత కలిగేలా చేయాలి. మళ్లీ ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలి..’పారని సైకో ప్రేమికుడి పాచికప్రేమ పేరుతో ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ‘సైకో’ ప్రేమికుడి పాచిక పారలేదు. పోలీసులు రంజిత్తో పాటు అతడికి సహకరించిన అజాస్ ను అరెస్ట్ చేశారు. సాధారణ యాక్సిడెంట్ కేసు కాస్తా ఇప్పుడు ‘హత్యాయత్నం’ కేసుగా మారింది. నకిలీ ‘ప్రేమల’ వెనుక దాగున్న ఇలాంటి క్రూరత్వాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే..– సాక్షి, నేషనల్ డెస్క్


