breaking news
Sakshi Special
-
సూర్యుడికి అద్దం పట్టాల్సిందేనా!
భూమికి ముప్పు తప్పేట్టు లేదు... భూతాపోన్నతికి పగ్గాలేసే లక్ష్యం గురి తప్పుతోంది! సగటు ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగడం ఖాయమవుతోంది. మరి... తరుణోపాయం???? భూతాపోన్నతి ప్రభావాలను తట్టుకునేందుకు ప్రపంచం సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కే పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశాల్లేవు. ఫలితంగా ఈ శతాబ్దం అంతానికి భూమిపై అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన వేడి కారణంగా మనిషి బతికే పరిస్థితులు ఉండవన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవడం తథ్యమన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో రెండు నెలల్లో టర్కీలో వాతావరణ మార్పులపై ఐరాస సదస్సు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. భూతాపోన్నతిని తగ్గించేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించడం ఒక్కటే మేలైన మార్గం అని అనుకునేవారు. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా మనం మారడం, భూతాపోన్నతికి అనుగుణంగా సర్దుకుపోవడాన్ని ఓడిపోవడంగా భావించేవారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో ప్రపంచదేశాలన్నీ విఫలం కావడంతో ఇప్పుడు క్లైమేట్ అడాప్టేషన్ (వాతావరణానికి తగ్గట్టుగా మనం మారడం) అత్యవసరమైన విధానంగా మారిపోయింది. ఫలితంగా ఒకప్పుడు వివాదాస్పదమైన సౌర వికిరణ మార్పు పద్ధతికి ప్రాచుర్యం పెరుగుతోంది. సౌర వికిరణ మార్పు అంటే? సౌర వికిరణ మార్పు లేదా సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ (ఎస్ఆర్ఎం) అంటే సూర్యకాంతిలో కొంత భాగాన్ని మళ్లీ అంతరిక్షంలోకి పంపించడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడికి అద్దం పట్టడం. అయితే ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఏర్పాట్లు అవసరం. భూమిపై పడుతున్న సూర్యరశి్మలో కనీసం ఒక శాతాన్ని ఇలా వెనక్కు పంపించగలిగితే కర్బన ఉద్గారాల ద్వారా వాతావరణంలోకి చేరిన విషవాయువుల ప్రభావాన్ని తగ్గించవచ్చునని సగటు ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. నేలపై లేదంటే అంతరిక్షంలో భారీసైజున్న అద్దాలు ఏర్పాటు చేసి సూర్యుడి నుంచి పడే కాంతి మళ్లీ అంతరిక్షంలోకి చేరేలా చేయాలని ఆలోచించారు. అలాగే అప్పుడప్పుడూ రసాయన కణాలు చల్లడం ద్వారా మేఘాలు మరింత సౌర రేడియోధార్మికతను వెనక్కు పంపించగలమని అంచనాలున్నాయి. అగి్నపర్వతాలు బద్ధలైనప్పుడు వెలువడే పొగ ఆకాశాన్ని కమ్మేసి చాలాకాలంపాటు సూర్యరశ్మి కిందపడకుండా చేస్తున్నట్లు అన్నమాట. ఇదీ వివాదం... ఎస్ఆర్ఎం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది కానీ.. కర్బన ఉద్గారాలను తగ్గించదు. పైగా పర్యావరణ వ్యవస్థలపై దీని ప్రభావం ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. ఎలాగూ ఇది ఉందన్న సాకుతో పరిశ్రమలు, ప్రభుత్వాలు వాతావరణంలోకి చేరుతున్న విష వాయువులను తగ్గించడంపై దృష్టి పెట్టవన్నది మరో ఆందోళన. ఎస్ఆర్ఎం పద్ధతిని ఒకసారి వాడి... ఉష్ణోగ్రతలు తగ్గాయి కాబట్టి నిలిపేద్దామనుకుంటే అది కూడా ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ‘టెర్మినేషన్ షాక్’వల్ల భూమి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. 2023 నుంచి సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కొత్త ఇంధన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత ఉష్ణోగ్రతలు వేగంగా పెరగడం ఈ టెర్మినేషన్ షాక్ను ధ్రువీకరిస్తున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎం పద్ధతిపై ఇప్పటివరకూ స్పష్టమైన విధానం, మార్గదర్శకాలు, నియంత్రణ వ్యవస్థలు లేవు. ఈ నేపథ్యంలో దీన్ని కర్బన ఉద్గారాల తగ్గింపునకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఎమర్జెన్సీ ఏర్పాటుగా మాత్రమే చూడాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. 2024లో స్విట్జర్లాండ్ ఎస్ఆర్ఎంపై ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించగా పలు దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. జపాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు మద్దతివ్వగా, పసిఫిక్, ఆఫ్రికా దేశాలు వ్యతిరేకించాయి. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్సహా కొందరు రిపబ్లికన్లు వాతావరణ మార్పులనే కొట్టిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీలో జరగబోయే వాతావరణ మార్పుల సదస్సు ఎస్ఆర్ఎంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
కొద్దిగా తాగినా మద్యం మద్యమే
మద్యం సేవించడం పట్ల ‘ప్రతిరోజూ అత్యంత పరిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు’ అనే అపోహ ఉండేది. కానీ అది మౌత్, బుక్కల్ మ్యూకోసా (బుగ్గ లోపల) క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతుంది. మద్యం సేవనం లాలాజల ప్రవాహాన్ని తగ్గిస్తుంది, మైక్రోబయోమ్ అసమతుల్యతకు దారితీస్తుందని హార్వర్డ్ హెల్త్ ప్రచురించింది. » మద్యం సేవించడంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వంటి ప్రముఖ సంస్థలు స్పష్టం చేశాయి. ఉదాహరణకు రోజుకు ఒక గ్లాసు వైన్, బీర్ లేదా ఒక షాట్ స్పిరిట్స్ తీసుకునే అలవాటు వల్ల ‘నోరు, గొంతు, అన్నవాహిక, రొమ్ము, పేగు, కాలేయం క్యాన్సర్లను దరికి చేరుస్తుందని ఆ సంస్థలు హెచ్చరించాయి.» తక్కువ మోతాదు కూడా ఇంత హాని కలిగిస్తుందా అనే సందేహానికి వారి వివరణ ఒక్కటే. మద్యం (ఇథనాల్) ఎంత పరిమాణంలో ఉన్నా అది కణాలకు నష్టం కలిగిస్తుంది. ప్రాథమికంగా అది జీవసంబంధమైన యంత్రాంగం మీద ప్రభావం చూపిస్తుంది. » శరీరం ఆల్కహాల్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దానిని అసిటాల్డిహైడ్ అనే విషపూరిత రసాయనంగా మారుతుంది. ఇది క్యాన్సర్ కారకం. కణాల మరమ్మతు ప్రక్రియను అడ్డుకుంటుంది. డీఎన్ఏ దెబ్బతింటుంది.» మద్యం ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయులను పెంచుతుంది. అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రోజుకు ఒక్క పెగ్ తీసుకున్నా సరే బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 14 శాతం పెరిగినట్లే.» నోరు, గొంతు నుంచి కడుపులోకి చేరే క్రమంలో ఆల్కహాల్ ఒక ద్రావకంలా పనిచేస్తుంది. పర్యావరణ విషపదార్థాలు కణాల్లోకి సులభంగా చొచ్చుకుని పోయి ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి. కణజాలం మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. » మద్యాన్ని అధిక మోతాదులో సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు అత్యధికంగా ఉంటాయి. తక్కువ మోతాదు కలిగించే ముప్పు కూడా చిన్నదేమీ కాదు, కాబట్టి క్యాన్సర్ నివారణకు మద్యం సేవించకపోవడమే ఉత్తమమని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ మార్గదర్శకాలను విడుదల చేసింది.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
పిల్లలు ఏఐ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు!
ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నది స్కూల్ పిల్లలే. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పిల్లలు పెద్దల కంటే మూడు రెట్లు వేగంగా కృత్రిమ మేధ సాంకేతికతలను స్వీకరిస్తున్నారు. లక్షలాది మంది పిల్లలు హోంవర్క్ చేయడానికి చాట్బాట్ల సహాయం తీసుకుంటున్నారు. కౌమారదశలో ఉన్న వారు స్కూల్ ప్రాజెక్టులు చేయడానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఏఐని అనుసంధానం చేస్తున్నారని ఇటీవలి ప్రపంచ స్థాయి గణాంకాలు చూపిస్తున్నాయి. » లక్షలాదిమంది పిల్లలు తమ సందేహాలు తీర్చుకోవడానికి ఏఐ మీద ఆధారపడుతున్నారు. బాల్యంలో కలిగే సందేహాలు ఒక ఎత్తయితే, కౌమారంలోకి అడుగుపెట్టినప్పుడు అనేక సందేహాలు వేధిస్తుంటాయి. పెద్ద వాళ్ల దగ్గర వ్యక్తం చేయడానికి సంకోచించే సందేహాల నివృత్తి కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత ఆందోళనల నుంచి బయటపడడానికి మార్గాలను చూపించమని కోరుతున్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కూడా చాట్బాట్లనే ఎంచుకుంటున్నారు.» యూనిసెఫ్ కొన్ని దేశాల్లో ఏఐ వినియోగం మీద సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జూన్లో విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం ‘పిల్లలు పెద్దవాళ్ల కంటే మూడురెట్లు ఎక్కువ వేగంతో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్నారు. 20 మిలియన్లకు పైగా పిల్లలు ఏఐని ఉపయోగిస్తుండగా, వారిలో 13 మిలియన్ల మంది పాఠశాల పని కోసం, 2 మిలియన్ల మంది జీవిత సలహాల కోసం వాడుతున్నారు.» కెనడా 2026 అధ్యయనం ప్రకారం పిల్లల్లో ఐదుగురిలో ఒకరు ఏఐ నుంచి ఎమోషనల్ సపోర్టు తీసుకుంటున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్ కుటుంబాల్లో సింగిల్ చైల్డ్ ఒంటరితనం కారణంగా ఏఐని ఫ్రెండ్గా మార్చుకుంటున్నారు.» కామన్సెన్స్ మీడియా, ప్యూ రీసెర్చ్ సెంటర్ల సర్వేల నివేదిక ప్రకారం 64 నుంచి 70 శాతం టీనేజర్లు సమాచారం వెతకడానికి, మేధోమథనం చేయడానికి, హోమ్వర్క్ చేయడానికి ఏఐ చాట్బాట్లను వాడుతున్నారు.ప్రమాదాలూ ఉన్నాయి!» కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్: ఏఐ షార్ట్కట్లపై ఎక్కువగా ఆధారపడటం వలన జ్ఞానం మెదడు పొరల్లో దీర్ఘకాలం నిక్షిప్తం కాలేదు. ఏకాగ్రతతో అభ్యసించడం ద్వారా మెదడు అభివృద్ధి చెందుతుంది. ఏఐ ఈ ప్రక్రియకు ఆటంకం.» ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) వంటి విద్యా నివేదికలు మితిమీరిన ఏఐ వాడకం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోజువారీ పాఠ్యాంశాల అభ్యాసంలో ఏఐని వాడడం వల్ల పరీక్షల్లో మార్కులు తగ్గడం, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు క్షీణించడం వంటి ప్రమాదాలను హెచ్చరిస్తున్నాయి. » ఏఐ గొప్ప ట్యూటర్గా పని చేస్తోంది, తక్షణం ఫలితాలనిస్తుంది. కానీ ఆ సాధనం లేకుండా సొంతంగా మెదడుతో ఆలోచించి పనిచేసే సామర్థ్యాన్ని పెంచడం లేదని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్పష్టం చేసింది.» అత్యంత ఆందోళన కలిగించే అంశం తప్పుడు సమాచారం. స్కామ్, సామాజిక అంశాల విషయంలో పక్షపాత ధోరణితో, అర్ధవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా కూర్చిన సమాచారాన్ని నూరుశాతం నిజమని నమ్మే ప్రమాదం లేకపోలేదు.» బహిర్గతమైన భయాలు: మూడింట ఒక వంతు మంది పిల్లలు ఆన్లైన్ మోసాలు, తప్పుడు సమాచారం గురించి ఆందోళన చెందుతుండగా, నాలుగింట ఒక వంతు మంది లైంగికంగా అసభ్యకరమైన డీప్ఫేక్లకు భయపడుతున్నారు.వాస్తవాన్ని గుర్తించడం...ఏఐ రూపొందించిన కంటెంట్ను, మనిషి సృష్టించిన కంటెంట్ నుంచి వేరు చేసి చెప్పడంలో పిల్లలు ఇబ్బంది పడతారు. పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ తేడాను గుర్తించే కచ్చితత్వం తగ్గుతుందని ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్’ చెబుతోంది.» తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అభ్యాసం కొనసాగితే అర్ధవాస్తవాలను, పక్షపాత ధోరణి సమాచారాన్ని వడపోసి పిల్లలను కచ్చితమైన సమాచారం వైపు నడిపించడం జరుగుతుంది. ఏఐ విషయంలో అలాంటి భద్రత లేకపోవడం ఆలోచించాల్సిన అంశం అని విద్యావేత్తల సూచన. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
మామిడి పండు చూడ మేలిమై యుండును.. పొట్ట విప్పి చూడ..
(సాక్షి, స్పెషల్ డెస్క్) : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా ఉంది మన మామిడి సంగతి. ప్రపంచంలోనే రుచికరమైన మామిడి పండ్లను భారత్ ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రీమియం ఎగుమతి మార్కెట్లలో మన మామిడి తీవ్ర ఆంక్షలు, తిరస్కరణలను ఎదుర్కొంటోంది. విదేశీ వినియోగదారులు మంచి ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా, నాణ్యత లోపాల వల్ల భారతీయ రైతులు, ఎగుమతిదారులు ఏటా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సంక్షోభానికి బహుళ కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు సాగుతో కష్టాలు దేశంలో సుమారు వెయ్యి మామిడి రకాలున్నప్పటికీ, మార్కెట్లో గిరాకీ కలిగినవి 24 ప్రధాన రకాలు మాత్రమే. వీటిల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగయ్యే బంగినపల్లి, చిన్నరసం, పెద్దరసం అగ్రస్థానంలో నిలిచాయి. మామిడి తోటల యజమానుల్లో అత్యధికులు నగరాల్లో నివసిస్తూ తోటలను కాలానికి కాంట్రాక్టర్లకు లీజుకిస్తున్నారు. కేవలం మూడు నెలల సీజన్ లో వచ్చే తాత్కాలిక లాభాలపై తప్ప, తోట దీర్ఘకాలిక ఆరోగ్యంపై కాంట్రాక్టర్లకు శ్రద్ధ ఉండదు. తక్కువ సమయంలో పంటను కాపాడుకోవటానికి విచక్షణారహితంగా సింథటిక్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు వాడుతున్నారు. నాసిరకం పురుగు మందులను అవసరానికి మించి పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పురుగు మందులను తట్టుకునే శక్తిని చెట్లు పెంచుకుంటున్నాయి. వీటివల్ల కాయ పైకి నిగనిగలాడేలా కనిపించినా, నాణ్యత ఉండటం లేదు. కాయల్లో పండు ఈగ వంటి పురుగులతో పాటు ప్రమాదకర రసాయనాల అవశేషాలు నిండిపోతున్నాయి. ఆంక్షలు.. తిరస్కరణలు పండ్లలో పురుగుల బెడద, అధిక రసాయన అవశేషాల కారణంగా విదేశీ తనిఖీ సంస్థలు భారతీయ మామిడి కన్సైన్మెంట్లను వెనక్కి పంపుతున్నాయి. వేపర్ హీట్ ట్రీట్మెంట్ కేంద్రాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు లోపించటంతో జపాన్ దిగుమతులను నిలిపివేయగా, అధిక పురుగుమందుల అవశేషాలున్నాయనే ఆరోపణలతో నేపాల్ ఇటీవల సరిహద్దుల్లో కఠిన నిబంధనలు తెచ్చింది. గతంలో యూరోపియన్ యూనియన్ కూడా భారతీయ మామిడిపై నిషేధం విధించింది. అమెరికాకు ఎగుమతి చేయడానికి నిర్దేశించిన నాన్–టారిఫ్ ఆంక్షలు దాటటం సాధారణ రైతులు, ఎగుమతిదారులకు పెనుభారంగా మారింది. ప్రస్తుతం మన ఎగుమతుల్లో మూడోవంతు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితమవుతోంది. సాగు పద్ధతి మార్చాలి.. మామిడి రైతులు రసాయన రహిత ఆధునిక సాగు పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. నిరంతర వ్యక్తిగత పర్యవేక్షణ అత్యవసరం. బాధ్యతారహితంగా తోటలను నిర్వహించే కాంట్రాక్టర్ల చేతులకు తోటలను వదిలేయకుండా శాస్త్రీయ పద్ధతుల్లో క్రిమిసంహారకాల వాడకం తగ్గించి, ఫైటోశానిటరీ ప్రమాణాలు పాటిస్తేనే ప్రపంచ మార్కెట్లో భారతీయ మామిడికి అసలైన గిట్టుబాటు ధర లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాలి భూయజమానుల నిర్లక్ష్యం, నాణ్యత లేని రసాయన వ్యవసాయం మన మామిడి ఎగుమతులను దెబ్బ తీస్తున్నాయి. బంగినపల్లికి మంచి నిల్వ సామర్థ్యం ఉన్నా ఏపీ, తెలంగాణల్లో ఇర్రేడియేషన్, ప్యాక్హౌస్ వసతులు లేవు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పదేళ్లకు పైగా మామిడి సాగు చేస్తూ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. అమెరికాలో, గల్ఫ్ దేశాల్లో డోర్ డెలివరీ చేస్తున్నాం. ఈ ఏడాది యూరప్కూ విస్తరిస్తున్నాం. మామిడి ఎగుమతి సీజన్ కేవలం 45–60 రోజులే. పేపర్వర్క్, ఎయిర్ ఫ్లైట్పై జీఎస్టీ పెనుభారంగా మారాయి. ప్రభు త్వం రసాయనాలకు సబ్సిడీలు ఆపి, సహజ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఎగుమతులు పెంచేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. – గుమ్మడపురం రఫీ, మేనేజింగ్ డైరెక్టర్, ఏఆర్4 ఫ్రెష్ ఇంటర్నేషనల్ -
9/11 వేళ.. గాల్లోకి లేచిన ఒకేఒక్క విమానం!
సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. విమానాలను హైజాక్ చేసి అమెరికాపై భీకర దాడులకు పాల్పడింది ఉగ్రసంస్థ అల్ఖైదా. అయితే ఆ దాడుల వేళ దేశవ్యాప్తంగా పౌర విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆకాశం దాదాపు నిర్మానుష్యంగా మారింది. కానీ.. ఆ భయానక పరిస్థితుల్లోనూ ఓ విమానానికి ప్రత్యేక అనుమతితో గాల్లోకి ఎగిరింది.సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత.. అనంతరం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా పౌర విమానాలను నేలకే పరిమితం చేసింది. అమెరికా చరిత్రలో ఇలాంటి దేశవ్యాప్త పౌర విమానాల నిలిపివేత ఇదే తొలిసారి. అయితే ఆనాడు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. సైనిక, అత్యవసర వైద్య విమానాలే తిరిగాయి. ఈ క్రమంలో.. ఎఫ్ఏఏకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది.ఫ్లోరిడాకు చెందిన స్నేక్ ఎక్స్పర్ట్ లారెన్స్ వాన్ సెర్టిమా.. ఒక ఇన్లాండ్ టైపాన్ పామును తిరిగి దాని బోనులో పెట్టే ప్రయత్నం చేయగా అది ఆయన బొటనవేలిని కాటేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్లాండ్ టైపాన్ అనేది అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. కాటు తర్వాత ఆయన పరిస్థితి వేగంగా విషమించింది. స్పృహ కోల్పోవడంతోపాటు కళ్ల నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి రక్తస్రావం మొదలైంది. మయామిలోని వైద్యులు అందుబాటులో ఉన్న యాంటీవెనమ్తో చికిత్స ప్రారంభించారు. అయితే అది సరిపోలేదు. ఇన్లాండ్ టైపాన్ విషానికి ప్రత్యేకంగా ఉపయోగించే యాంటీవెనమ్ అవసరమైంది. ఆ మందు అప్పట్లో న్యూయార్క్, శాన్డియాగోలోని జంతుప్రదర్శనశాలల్లో మాత్రమే లభ్యమవుతోంది. 9/11 దాడులతో న్యూయార్క్ పూర్తిగా కల్లోలంలో ఉండటంతో.. వైద్య బృందం దృష్టి శాన్డియాగోపై పడింది. వాన్ సెర్టిమా పరిస్థితి మరింత విషమించడంతో వైద్య, అగ్నిమాపక అధికారులు విమాన ప్రయాణానికి ప్రత్యేక అనుమతి కోరారు. గంటలపాటు చర్చల అనంతరం FAA అనుమతించింది. 2001 సెప్టెంబర్ 12న శాన్డియాగో నుంచి ఒక చిన్న లియర్జెట్ బయలుదేరింది. విమానం అమెరికా మీదుగా ప్రయాణిస్తుండగా రెండు ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా వెళ్లాయి. శాన్డియాగో నుంచి తెచ్చిన అదనపు యాంటీవెనమ్ మయామికి చేరిన తర్వాత వైద్యులు వెంటనే వాన్ సెర్టిమాకు అందించారు. చికిత్సకు స్పందించిన ఆయన చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజుల తర్వాత టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పాముదేం తప్పు లేదు..తన నిర్లక్ష్యమే కారణమంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారాయన.అమెరికా చరిత్రలో చీకటి రోజుసెప్టెంబర్ 9, 2001.. 19 మంది ఆల్ఖైదా ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. రెండు విమానాలను న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని వాషింగ్టన్ సమీపంలోని పెంటగాన్పైకి దించారు. నాలుగో విమానం ఫ్లైట్ 93ను ప్రయాణికులు తిరగబడటంతో పెన్సిల్వేనియాలోని ఖాళీ ప్రదేశంలో కూల్చివేశారు.ఉదయం 8.46 గంటలకు అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 11 ఉత్తర టవర్ను ఢీకొట్టింది. 9.03 గంటలకు యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్ను ఢీకొట్టింది. 9.37 గంటలకు అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్ను ఢీకొట్టింది. 10.03 గంటలకు ఫ్లైట్ 93 పెన్సిల్వేనియాలో కూలిపోయింది. కొద్దిసేపటికే ట్విన్ టవర్స్ రెండూ కుప్పకూలాయి.దాదాపు 3 వేల మంది బలి..9/11 దాడుల్లో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్లో 2,753 మంది, పెంటగాన్లో 184 మంది, ఫ్లైట్ 93లో 40 మంది ఉన్నారు. 90కుపైగా దేశాలకు చెందిన ప్రజలు బాధితుల్లో ఉన్నారు. ఈ దాడులకు బాధ్యులు ఆల్ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లు. వారంతా ఆల్ఖైదా శిక్షణ పొందినవారేనని ఎఫ్బీఐ దర్యాప్తులో తేలింది. ఈ దాడుల వెనుక ఆల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు దర్యాప్తు నిర్ధారించింది. బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్థాన్లోని అబ్బొట్టాబాద్లో అమెరికా ప్రత్యేక దళాల ఆపరేషన్లో హతమయ్యాడు. ఇదీ చదవండి: పారిస్లోనూ ఇదెక్కడి వివక్ష! -
నీటి కొరతతో సౌదీ అరేబియా ఏం చేసిందో తెలుసా?
ఎటు చూసినా ఎడారి.. మండే ఎండలు.. ఏడాదికి 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం.. శాశ్వత నదులు కూడా లేవు. అయినా సౌదీ అరేబియాలో 3.7 కోట్లకుపైగా జనాభా రోజువారీ అవసరాలకు నీటిని పొందుతోంది. మరి చుక్క నీటి కోసం కూడా ప్రకృతిపై ఆధారపడలేని ఈ దేశం.. కోట్లాది మందికి నీటిని ఎలా అందిస్తోంది? ఎడారి మధ్యలో ఇంత భారీ జలవ్యవస్థను ఎలా నిర్మించింది?సౌదీ అరేబియాలోని తీర ప్రాంతాల్లో భారీ డీశాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సముద్రం నుంచి నీటిని తీసుకొచ్చి, అందులోని ఉప్పు, మలినాలను తొలగించి మంచినీటిగా మారుస్తారు. అనంతరం ఈ నీటిని భారీ పైప్లైన్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలోని నగరాలు, జనావాసాలకు తరలిస్తారు. అంటే.. సహజంగా ప్రవహించే నదులు లేకపోయినా, విస్తారమైన ప్రాంతాలకు నీటిని చేరవేసే ఓ ‘కృత్రిమ నదీ వ్యవస్థ’ను నిర్మించుకున్నట్టే. మరి సముద్రపు ఉప్పునీరు అసలు తాగునీటిగా ఎలా మారుతుంది? ఎడారి, కొండలు, రాళ్లను దాటుకుంటూ ఈ నీరు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది? ఇందుకోసం సౌదీ నిర్మించిన భారీ పైప్లైన్లు, అత్యాధునిక శుద్ధి వ్యవస్థ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరం.భారీ పైప్లైన్ల నిర్మాణంఈ నీటి రవాణాకు ఉపయోగించే పైప్లైన్లు సాధారణమైనవి కావు. ఎడారి వేడి, ఇసుక తుపాన్లు, నేలలోని ఒత్తిడిని తట్టుకునేలా హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్తో వీటిని తయారు చేస్తారు. దాదాపు 1.8 మీటర్ల వ్యాసంతో ఉండే భారీ పైపులను 12 నుంచి 18 మీటర్ల పొడవైన సెక్షన్లుగా తయారు చేసి, ప్రత్యేక ట్రక్కుల్లో ఎడారి ప్రాంతాలకు తరలిస్తారు. పైపులకు తుప్పు పట్టకుండా ప్రత్యేక కోటింగ్ వేసి, అల్ట్రాసోనిక్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వినియోగిస్తారు.ఇసుక.. రాళ్లు.. కొండలు దాటుతూతీర ప్రాంతం నుంచి అంతర్భాగాలకు పైప్లైన్ వేయడం మరో భారీ సవాలు. ముందుగా GPS, ఆధునిక సర్వే పరికరాలతో మార్గాన్ని నిర్ణయిస్తారు. కదిలే ఇసుక దిబ్బలు, అస్థిరమైన భూభాగాలను వీలైనంత వరకు తప్పించుకుంటారు. రాళ్లు, కొండలు ఎదురైతే నియంత్రిత పేలుళ్లతో వాటిని తొలగించి లోతైన కాలువలు తవ్వుతారు. అందులో పైపులను అమర్చి.. ఒక్కో సెక్షన్ను మరొకదానితో అనుసంధానిస్తూ వేల కిలోమీటర్ల నెట్వర్క్ను నిర్మించారు.అసలు నీరు ఎక్కడి నుంచి?ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు నీటి వనరు సముద్రమే. తీరానికి వందల మీటర్ల దూరంలో భారీ ఇన్టేక్ పైపులను ఏర్పాటు చేసి సముద్రపు నీటిని ప్లాంట్లలోకి తీసుకొస్తారు. కొన్ని పైపులు రోజుకు కోట్ల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చేపలు, పీతలు, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులు లోపలికి రాకుండా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.ఉప్పునీరు.. మంచినీరుగా ఎలా?మొదట సముద్రపు నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు. ఫెరిక్ క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాలతో మలినాలను ఒకచోట చేర్చి తొలగిస్తారు. ఆ తర్వాత 1–5 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న సూక్ష్మ కణాలను కూడా పట్టుకునే కార్ట్రిడ్జ్ ఫిల్టర్ల ద్వారా నీటిని పంపిస్తారు.అసలు కీలక ప్రక్రియ రివర్స్ ఆస్మాసిస్ (RO). దాదాపు 60 బార్ ఒత్తిడితో సముద్రపు నీటిని ప్రత్యేక మెంబ్రేన్ల గుండా పంపుతారు. నీటి అణువులు మాత్రమే మెంబ్రేన్ను దాటుతుండగా.. ఉప్పు, ఇతర మలినాలు వెనుకే మిగిలిపోతాయి. అవసరమైతే మరోసారి RO ప్రక్రియ నిర్వహించి మరింత శుద్ధి చేస్తారు.శుద్ధి చేశాక మళ్లీ ఖనిజాలే!అయితే పూర్తిగా శుద్ధి చేసిన నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో నీటికి అవసరమైన ఖనిజాలను మళ్లీ కలుపుతారు. పీహెచ్ స్థాయిని కూడా సరిచేసి.. తాగేందుకు అనువుగా మారుస్తారు.ఖర్చు భారీ.. అవసరం తప్పనిసరిఇంత భారీ నీటి వ్యవస్థను నిర్మించడం అంత చౌక కాదు. ఒక్క కిలోమీటర్ పైప్లైన్ నిర్మాణానికే మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి. భారీ డీశాలినేషన్ ప్లాంట్లకు వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. నీటి ఉత్పత్తి ఖర్చు కూడా సాంకేతికత, విద్యుత్ ధరలు, ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి గణనీయంగా ఉంటుంది. అయినా సౌదీకి మరో మార్గం పెద్దగా లేదు. నదులు లేని దేశం.. తక్కువ వర్షపాతం.. విస్తారమైన ఎడారి. అందుకే సముద్రాన్నే నీటి వనరుగా మార్చుకుని.. వందల కిలోమీటర్ల పైప్లైన్లతో ఆ నీటిని ఎడారి మధ్యనున్న నగరాలకు చేరుస్తోంది. సహజంగా లేని నదులకు బదులుగా ఇంజినీరింగ్తో కృత్రిమ జలధారను సృష్టించుకుంది.ఇదీ చదవండి: ఈఫిల్ టవర్ మూసివేతకు కారణం ఇదే! -
క్విక్ కామర్స్లో సొంత బ్రాండ్ల జోరు
క్విక్ కామర్స్లో పోటీ ఇప్పుడు వేగంగా డెలివరీ చేయడానికే పరిమితం కావడం లేదు. ఎక్కువ మార్జిన్లు, ధరలపై నియంత్రణ, సరుకుల లభ్యత, కస్టమర్ను తమ ప్లాట్ఫామ్లోనే కొనసాగించడం కోసం సంస్థలు సొంత బ్రాండ్లపై దృష్టి పెడుతున్నాయి. దీంతో క్విక్ కామర్స్ విక్రయాల్లో ప్రైవేటు లేబుల్స్ వాటా గణనీయంగా పెరుగుతోంది. 2025లో ప్రారంభంలో 6 శాతం ఉన్న వాటా ప్రస్తుతం 16 శాతానికి చేరినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. స్టేపుల్స్ నుంచే శ్రీకారం సొంత బ్రాండ్ల విస్తరణకు ముందుగా పప్పులు, బియ్యం, పిండి, నూనెలు వంటి రోజువారీ నిత్యావసరాలనే (స్టేపుల్ ఫుడ్)క్విక్ కామర్స్ కంపెనీలు ఎంచుకుంటున్నాయి. తర్వాత ప్రీమియం స్నాక్స్, కూల్డ్రింక్స్, డ్రైఫ్రూట్స్, వెజిటబుల్స్ విభాగాల్లోకి అడుగుపెడుతున్నాయి. టాటా గ్రూప్నకు చెందిన బిగ్ బాస్కెట్ ఈవిషయంలో పోటీ కంపెనీలకన్నా ముందుంది. ప్రైవేట్లేబుల్స్ మొత్తం ఆదాయంలో దాదాపు 35 శాతం వాటాను బిగ్బాస్కెట్ కలిగి ఉంది. బీబీ పాపులర్, బీబీ రాయల్, బీబీ హోమ్, ఫ్రెషో వంటి బ్రాండ్లు విభిన్న విభాగాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్స్టామార్ట్ జోరు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ సొంత బ్రాండ్ల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సుప్రీమ్ హార్వెస్ట్ బ్రాండ్ను 2022లో ప్రారంభించింది. ప్రస్తుతం ఇన్స్టామార్ట్లో విక్రయించే స్టేపుల్స్లో దీని వాటా 25 శాతం. ఏడాది క్రితం ఇది 18 శాతమే. ఉరద్ దాల్ (మినప్పప్పు) అమ్మకాల్లో సుప్రీమ్ హార్వెస్ట్ వాటా 28 శాతం పైగానే. మైదాలో 51 శాతం, రైస్ఫ్లోర్లో 58 శాతం వాటా ఉంది. జెప్టోకు చెందిన డైలీ గుడ్ కూడా స్టేపుల్స్లో 14 శాతం వాటా సాధించింది. ఉరద్ దాల్, పల్లీలు, కిస్మిస్ విక్రయాలు ఈ బ్రాండ్ నుంచే వస్తున్నాయి. సోయాబీన్ నూనెల్లో 16 శాతం, సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో డైలీ గుడ్ 5 శాతం వాటా సాధించింది. ఆచితూచి వ్యవహరిస్తున్న బ్లింకిట్ ఎటర్నల్ (జొమాటో)కు చెందిన బ్లింకిట్ ప్రైవేట్ లేబుల్ ’హోల్ ఫార్మ్’ మాత్రం కొంత నియంత్రిత విధానాన్ని అనుసరిస్తోంది. వినియోగదారులు బ్రాండ్ గురించి పెద్దగా పట్టించుకోని మిల్లెట్స్, ప్రత్యేక స్టేపుల్స్ వంటి విభాగాలపై మాత్రమే దృష్టి పెట్టింది. బార్లీ, వైట్ మటర్ అమ్మకాల్లో హోల్ఫార్మ్ 62 శాతం వాటా సాధించింది. అయితే పప్పులు, డ్రైఫ్రూట్స్ విభాగాల్లో దీని ఉనికి పరిమితంగానే ఉంది. కస్టమర్లకు ఎక్కువ రకాల ఉత్పత్తులను యాప్ ద్వారా అందుబాటులో ఉంచడానికే బ్లింకిట్ ప్రాధాన్యం ఇస్తోంది. రెట్టింపు మార్జిన్లే కీలకం సొంత బ్రాండ్లపై క్విక్ కామర్స్ సంస్థలకు ఎందుకు ఆసక్తి అంటే అధిక లాభాలే..కంపెనీలకు స్టేపుల్స్లో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 15 నుంచి 25 శాతం మార్జిన్లు వస్తున్నాయి. థర్డ్ పార్టీ బ్రాండ్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అదే సమయంలో తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షించి భారీ విక్రయాలు సాధించే వ్యూహాన్ని కూడా ఇవి అనుసరిస్తున్నాయి. సుప్రీమ్ హార్వెస్ట్ చనా దాల్ కేటగిరీ సగటు ధర కంటే దాదాపు 30 శాతం తక్కువగా ఉంటుంది. డైలీగుడ్ మస్టర్డ్ ఆయిల్ థర్డ్ పార్టీ బ్రాండ్ కన్నా 37 శాతం తక్కువ ధరకు, హోల్ఫార్మ్ రాగి పిండి 29 శాతం తక్కువ ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. స్నాక్స్, డ్రింక్స్లోనూ ఎంట్రీ క్విక్ కామర్స్ కంపెనీల సొంత బ్రాండ్ల వ్యూహం అధిక విలువ కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్స్కు కూడా చేరింది. ఇన్స్టామార్ట్ ప్రీమియం బ్రాండ్ నాయిస్కు బెవరేజెస్లో 7 శాతం వాటా, స్నాక్స్లో 5.5 శాతం వాటా సాధించింది.46కు పైగా కేటగిరీల్లో ఈ బ్రాండ్ విస్తరించింది. ప్రస్తుతం ఇన్స్టామార్ట్లో వచ్చే ప్రతి 10 కస్టమర్ బాస్కెట్లలో ఒకదానిలో నాయిస్ ఉత్పత్తులు ఉంటున్నాయని స్విగ్గీ తెలిపింది. ఫ్రెష్ ఫుడ్ మరింత పెద్ద లాభం ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయల విభాగం సొంత బ్రాండ్లకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఈ విభాగంలో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 45 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ విక్రేతలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ఇన్స్టామార్ట్ బెంగళూరులోని ఐదు డార్క్ స్టోర్లలో నెక్టార్ ఫ్రూట్స్, వెజిటబుల్ బ్రాండ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్తో కస్టమర్ల ఖర్చు 10 శాతం పెరిగింది. రీపర్చేజ్ రేటు 12 పాయింట్లు, ప్లాట్ఫామ్ రిటెన్షన్ 7 శాతం పాయింట్లు మెరుగయ్యాయి.జెప్టో కూడా ముంబై, బెంగళూరులోని ప్రీమియం ప్రాంతాల్లో హార్వెస్ట్ స్టోర్ను కస్టమర్లకు ఓపెన్ చేసింది. స్టాక్ ఉంటేనే కస్టమర్ ఉంటాడు ప్రైవేట్ లేబుల్స్ వల్ల అధిక లాభాలే కాదు. ఇన్వెంటరీ, ధర, సరుకుల లభ్యత, ప్లాట్ఫామ్లకు నియంత్రణ లభిస్తుంది. క్విక్ కామర్స్లో ఒక ఉత్పత్తి అందుబాటులో లేకపోతే కస్టమర్ వెంటనే మరో యాప్ కు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డి మాండ్ను ముందుగానే అంచనా వేసి సొంత బ్రాండ్ల ద్వారా సరుకులను తగినంతగా అందుబాటులో ఉంచడం సంస్థలకు కీలకంగా మారుతోంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
చిన్న కథ కాదుగా! రాహుల్ నుంచి కేటీఆర్ దాకా..
రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్, హరీష్రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్ఎస్ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్ స్టేట్మెంట్గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..రాహుల్ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్ అయ్యే ఇమేజ్, సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్కు భిన్నంగా.. మరింత క్యాజువల్ లుక్ను ఆయన తన బ్రాండ్గా మార్చుకున్నారు. అదే రాహుల్ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.ఉదయనిధికి టీషర్టే బ్రాండ్!తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది. 2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్ ధరించడంపై ఆయనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారుటీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్ చుడాసమా టీషర్టు, జీన్స్తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.టీషర్టు.. ఇంత పవర్ఫుల్లా?దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్ బ్రాండింగ్. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్మెంట్. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్’కు మరో ఉదాహరణగా నిలిచింది.ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్ సాలిడ్ వార్నింగ్ -
చైనా బిలియన్ల ప్రాజెక్టు.. పెద్ద పరీక్ష పెట్టిన నేపాల్ వరద
హిమాలయాల్లో ప్రకృతి విలయం సృష్టించిన ప్రతిసారీ అక్కడి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నేపాల్-చైనా సరిహద్దులో సంభవించిన భారీ వరద కూడా అలాంటి ప్రశ్నలనే ముందుకు తెచ్చింది. ఆగస్టు 26న హిమనదం కూలిపోవడంతో వచ్చిన వరదల్లో నేపాల్లోని రసువా ప్రాంతంతోపాటు చైనా వైపున్న గ్యిరాంగ్ సరిహద్దు ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు రద్దీగా ఉండే ఈ సరిహద్దు వాణిజ్య కేంద్రం.. ఇప్పుడు బురద, శిథిలాల కుప్పగా మారింది.ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన గ్యిరాంగ్.. చైనా-నేపాల్ ప్రతిపాదిత రైల్వే మార్గంలో కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఇక్కడి నుంచే రైల్వే నేపాల్లోకి ప్రవేశించి, రసువా మీదుగా కాఠ్మాండూకు చేరేలా ప్రణాళిక ఉంది. చైనా ప్రతిపాదించిన ఈ రైల్వేను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చైనా నుంచి నేపాల్కు నేరుగా రైలు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రాకపోకలకు ఇది కీలకమైన మార్గంగా మారుతుందని అంచనా.అంత ఈజీనా?ఖాట్మాండు-గ్యిరాంగ్ రైల్వే ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదు. నేపాల్ పరిధిలో సుమారు 72 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ పర్వత ప్రాంతం కావడంతో ఇందులో దాదాపు 98.5 శాతం మార్గం సొరంగాలు లేదంటే వంతెనల మీదుగానే నిర్మించాల్సి ఉంటుందని ప్రాథమిక అధ్యయనం తేల్చింది. అంటే.. రైల్వే పట్టాలు వేయడం కంటే ముందుగా కొండలను తొలిచి సొరంగాలు నిర్మించాలి. లోతైన లోయలపై భారీ వంతెనలు వేయాలి. ఎత్తుల్లో భారీ తేడాలను అధిగమించాలి. దీనికితోడు ఈ ప్రాంతం భూకంపాలు, కొండచరియలు, రాళ్లు విరిగిపడటం, మట్టి జారిపోవడం వంటి ప్రమాదాలకు లోనయ్యే ప్రాంతం.ప్రాజెక్టుపై 2018లో నిర్వహించిన ప్రాథమిక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భౌగోళిక పరిస్థితులు, ఇంజినీరింగ్ సవాళ్లు ఈ రైల్వేకు అతిపెద్ద అడ్డంకులని పేర్కొంది. అప్పట్లో సుమారు 2.75 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.ఏళ్లుగా సాగుతున్న అధ్యయనాలుచైనా-నేపాల్ రైల్వే ఆలోచన కొత్తదేమీ కాదు. 2016లో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2018లో బీఆర్ఐలో భాగమైంది. 2019లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. 2022లో పూర్తిస్థాయి సాధ్యాసాధ్యాల అధ్యయనం మొదలైంది. మార్గం, సొరంగాలు, వంతెనలు, స్టేషన్లు, నిర్మాణ వ్యయం, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలపై చైనా సాంకేతిక బృందం పరిశీలనలు చేసింది. తుది నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా? అనేది తేలనుంది.ఇంతలోనే భారీ విపత్తుఇలాంటి సమయంలోనే ఆగస్టు 26న హిమనదం(గ్లేసియర్) కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి నీటితో కలిసి దిగువకు దూసుకొచ్చాయి. నేపాల్లోని రసువా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఆ వరద చైనా వైపు గ్యిరాంగ్ వరకు చేరింది. కీలకమైన సరిహద్దు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఐదు అంతస్తుల కస్టమ్స్ భవనం కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. తాజా లెక్కల ప్రకారం నేపాల్లో 1,300 మందికి పైగా మరణించగా, వేలాది మంది గల్లంతయ్యారు. చైనా వైపు గ్యిరాంగ్లో 43 మంది మృతి చెందగా, 519 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఈ విధ్వంసం ఇప్పుడు రైల్వే ప్రాజెక్టుపై కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. ఒక భారీ వరదతోనే రహదారులు, వంతెనలు, సరిహద్దు మౌలిక వసతులు ఇలా ధ్వంసమైతే.. ఇదే భూభాగంలో నిర్మించబోయే రైల్వే సొరంగాలు, వంతెనలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎలా తట్టుకుంటాయి? అనేదే అసలు ప్రశ్న.రైల్వే కంటే ముందు..తాజా విపత్తు నేపథ్యంలో ప్రాజెక్టు మార్గాన్ని మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. హిమనదాల కదలికలు, వరదల ప్రవాహ మార్గాలు, భూకంప ముప్పు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు వంటి అంశాలపై మరింత లోతైన అధ్యయనాలు అవసరం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవిస్తే రైల్వేకు నష్టం జరగకుండా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, రక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మరోవైపు గ్యిరాంగ్ ప్రాంతం చైనా-నేపాల్ వాణిజ్యానికి కీలకమైన మార్గం. తాజా విపత్తుతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే నిర్మాణానికి ముందే అక్కడి మౌలిక వసతులను ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మార్చాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.బీఆర్ఐ అటకెక్కినట్లేనా?అయితే తాజా వరదలతో చైనా బీఆర్ఐ మొత్తం ఆగిపోయిందని చెప్పలేం. కానీ చైనా-నేపాల్ అనుసంధానానికి కీలకంగా భావిస్తున్న ఈ రైల్వే ప్రాజెక్టుకు మాత్రం ప్రకృతి పెద్ద పరీక్ష పెట్టింది. నిర్మాణం ఇంకా మొదలుకాకపోవడం ఒక రకంగా ప్రాజెక్టుకు అవకాశం కూడా. ఇప్పుడు ఎదురైన విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మార్గం, డిజైన్, భద్రతా ప్రమాణాలను మార్చుకునే అవకాశం చైనాకు ఉంది.హిమాలయాల్లో బీఆర్ఐ రైల్వేను ముందుకు తీసుకెళ్లడం అనుకున్నంత సులభం కాదని తాజా ప్రకృతి విపత్తు గట్టిగా చాటిచెబుతోంది. ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందా? మార్గంలో మార్పులు వస్తాయా? లేదంటే ప్రకృతి సవాళ్లను అధిగమించేలా భారీ ఇంజినీరింగ్ పరిష్కారాలతో చైనా ముందుకెళ్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: యుద్దం ఎఫెక్ట్.. బూతు కంటెంట్తో మరీ ఇంత దిగజారాలా? -
కొత్త ఇంటికి.. కార్పొరేట్లు
ఫార్మా కంపెనీ ఎంఎస్ఎన్... హైదరాబాద్లో ప్రీమియం హౌసింగ్ను నిర్మిస్తోంది. కెమికల్స్ రంగంలోని జువారీ ఇండస్ట్రీస్ సైతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోకి అడుగు పెట్టింది. సిమెంట్ రంగంలోని జువారీ గ్రూప్ ఆటోమొబైల్స్ రంగంలోని హీరో, టీవీఎస్... ఢిల్లీ రెసిడెన్షియల్ హౌసింగ్ మార్కెట్లో వేగంగా అడుగులేస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్ అయితే తమ ‘జేఎస్డబ్ల్యూ ఒన్ హోమ్స్’తో పూర్తిగా టెక్ ఇళ్లను నిర్మిస్తామంటోంది. ఇక టెక్స్టైల్ రంగంలోని అర్వింద్తో పాటు రేమండ్, మ్యాక్స్, అదానీ, ఆదిత్య బిర్లా, మహీంద్రా, టాటా, గోద్రెజ్, ప్రెస్టీజ్, జువారీ వంటిగ్రూపులన్నీ రియల్ ఎస్టేట్లో తమ సత్తా చూపిస్తూనే ఉన్నాయి. అసలు రకరకాల ఇతర వ్యాపారాలు చేసే గ్రూపులన్నీ రియల్ ఎస్టేట్లోకి ఎందుకొస్తున్నాయి? నేరుగా నిర్మాణంలోకే కాకుండా హౌసింగ్తో ముడిపడ్డ పెయింట్స్, వైర్లు, కేబుళ్ల వంటి ఇతర రంగాలపైనా ఎందుకు దృష్టిపెట్టాయి? భారతీయ హౌసింగ్ మార్కెట్ ఏ రకంగా మారుతోంది? ఈ ‘హౌసింగ్ ఎకానమీ’లో లాభపడే కంపెనీలేంటి? భవిష్యత్ విజేతలను గుర్తించటం ఎలా? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్ ప్రత్యేక కథనం.. మీరు కోటి రూపాయల ఇంటిని బుక్ చేశారనుకోండి. ప్రధానంగా బయటకొచ్చేది ఆ రియల్టీ సంస్థ పేరే. కానీ మీరు ఆ ఇంట్లోకి వెళ్లకముందే... అదే ఇంటికోసం రకరకాల కంపెనీలు సిమెంట్, స్టీల్, పైపులు, వైరింగ్ స్విచ్లు, పెయింట్లు, టైల్స్, గమ్లు, శానిటరీవేర్, అద్దాలు, ఫ్యాన్లు, ఏసీలు, వంటింటి ఉపకరణాలు, ఫర్నిచర్, ఇన్సూరెన్స్ వంటివి విక్రయిస్తాయి. అంతేకాదు! ఇల్లంటే ఒకసారి కొనేస్తే అయిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా నిర్వహణ కావాలి. ఇది... అత్యంత భారీ ఆర్థిక వ్యవస్థ. అందుకే.. గృహ యజమానుల ఖర్చుల్లో వాటా కోసం కార్పొరేట్ గ్రూప్ల పోటీ అంతకంతకూ పెరుగుతోంది. భారీ కార్పొరేట్ గ్రూప్లన్నీ ఈ హౌసింగ్ ఎకానమీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. మరి పునాది నుంచి హ్యాండోవర్ వరకూ ప్రతి దశలోనూ లాభపడే కంపెనీలేంటి? వచ్చే రెండు దశాబ్దాల్లో విజేతలుగా నిలిచేదెవరు? కార్పొరేట్ల ఎంట్రీ ఎందుకంటే... రియల్ ఎస్టేట్ మంచి సంబంధాలు అవసరమైన స్థానిక వ్యాపారం. కానీ ఇపుడు నగరాల్లో ఇళ్లు అప్గ్రేడ్ అవుతున్నాయి. కొనుగోలుదార్లు తాము ఇళ్లు కొన్నాక తమను వదిలేకుండా మెరుగైన సౌకర్యాలందించే బ్రాండెడ్ ప్రాజెక్టుల్ని చూస్తున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్ గ్రూపులు ఇందులోకి వస్తున్నది కూడా ఈ కారణంతోనే. పైపెచ్చు చిన్న చిన్న బిల్డర్ల మాదిరి కాకుండా వీళ్లకు మూలధనం ఎక్కువ. దీర్ఘకాలం ప్రాజెక్టు పూర్తయ్యేదాకా వేచిచూడగల సామర్థ్యమూ ఎక్కువే. వీటన్నిటితోపాటు డెవలపర్లు నిర్మాణ సామగ్రి, హోమ్ ఫైనాన్స్, ఇంటీరియర్లు, మెయింటెనెన్స్ వంటి మొత్తం నిర్మాణ వ్యవస్థలో భాగమవుతున్నారు. ఇది వారికి మరిన్ని అవకాశాలనిస్తోంది. ఫార్మా నుంచి ప్రీమియం రియల్టీకి... ఫార్మాలో రాణిస్తున్న అరబిందో, ఎంఎస్ఎన్ సంస్థలు ఆరో రియల్టీ, ఎంఎస్ఎన్ రియల్టీ ద్వారా ప్రీమియం రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఆరో రియల్టీ ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని పూర్తిచేసి వివిధ ప్రాంతాల్లోకి భారీగా విస్తరించగా... ఎంఎస్ఎన్ సంస్థ నియోపోలిస్, తెల్లాపూర్, మంచిరేవుల, పటాన్చెరులో ప్రాజెక్టులు చేస్తోంది. ఫార్మాలో విజయవంతం కావటంతో ఈ సంస్థలకు మూలధనం కొరత లేదు. పైపెచ్చు స్థానిక విశ్వసనీయత తోడవుతుంది. అందుకే వీటికి రియల్టీ అనేది మరో గ్రోత్ ఇంజిన్గా మారుతోంది. కాకపోతే ఈ రియల్టీ విభాగాలు అన్లిస్టెడ్ కనక ఇన్వెస్టర్లు వీటి షేర్లు కొనటం కుదరదు. గోవాలో ప్రీమియం ప్రాజెక్టుతో రసాయనాల కంపెనీ జువారీ ఇండస్ట్రీస్ కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇచి్చంది. హైదరాబాద్, కోల్కతాల్లో ప్రాజెక్టులు ఆరంభిస్తోంది. దీన్నిబట్టి చూసినపుడు రియల్టీలో భవిష్యత్ విజేతలకు భారీ ల్యాండ్ బ్యాంక్లు అక్కర్లేదు. అనుకున్న ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తిచేసే నైపుణ్యం ఉంటే చాలు. కొత్తకోణం... ఆదిత్య బిర్లా ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అ్రల్టాటెక్ తాజాగా వైర్లు, కేబుళ్ల రంగంలోకి ప్రవేశించింది. సిమెంట్ రంగంలో లీడర్గా ఉన్న అ్రల్టాటెక్తో పాటు పెయింట్ల కంపెనీ బిర్లా ఓపస్ కూడా ఈ గ్రూపుదే. ఇపుడు వైర్లు, కేబుళ్లలోకి ఎంట్రీ. అంటే... నిర్మాణంలో అవసరమైన సిమెంట్, చివర్లో అవసరమయ్యే పెయింట్లు, వాల్పుట్టీ, మధ్యలో అవసరమయ్యే వైర్లు కేబుళ్లు, కొనుగోలుకు అవసరమయ్యే ఫైనాన్స్. ఇవన్నీ ఇపుడు గ్రూపు వ్యాపారాల్లోకి చేరిపోయాయి. పైపె చ్చు సిమెంటు కోసం బలమైన డి్రస్టిబ్యూషన్ నెట్ వర్క్ ఉంది. అది మిగతా ఉత్పత్తులకూ పనికొస్తుంది. కాబట్టి పోటీ మామూలుగా ఉండదు. పాలీకేబ్... అదిరిపోయే కథ 2020లో పాలీకేబ్ లిస్టయినపుడు దీన్ని కూడా మరో కేబుల్స్ కంపెనీగానే చూశారు ఇన్వెస్టర్లు. ఓ ఏడాదిపాటు రూ.600–700 రేంజిలో తిరిగిన ఈ షేరు... ఇటీవలే రూ.10 వేలు దాటింది. ఇపుడు రూ.8వేల పైనే ఉంది. అంటే ఐదేళ్లలో పది రెట్లు!!. నిజానికి 2020 తరువాత హౌసింగ్ బూమ్ మొదలైంది. ఇన్ఫ్రా బాగా పెరిగింది. డీలర్ నెట్వర్క్ బలోపేతం చేసుకుంటూ పరిశ్రమలకు అవసరమైన కేబుళ్లు కూడా అందిస్తూ పాలికేబ్ బాగా ఎదిగింది. పైపెచ్చు ఫ్యాన్లు, స్విచ్లు, లైట్లు, ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీలోకీ అడుగుపెట్టింది. లాభార్జనకు దీర్ఘకాలం అవసరమయ్యే ఈ రంగంలో గతేడాదే లాభం కళ్ల చూసింది. అందుకే ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. దీంతో పాటు కీఇండస్ట్రీస్, ఆర్ఆర్ కాబెల్, హావెల్స్, ఫినోలెక్స్ కేబుల్స్ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలిచ్చాయి. అందుకే బలమైన నెట్వర్క్ను ఆసరా చేసుకుని ఆదిత్యబిర్లా గ్రూపు సవాలుకు దిగింది. మరమ్మతులను మరిచిపోవద్దు ఇంటిని కొనుగోలుదారు స్వా«దీనం చేసుకోవటంతోనే హౌసింగ్ స్టోరీ ముగిసిపోదు. గృహప్రవేశం చేసిన తరువాత ఆయా కుటుంబాలు గోడలు రిపేరు చేయించుకుంటాయి. కొందరు టైల్స్ను మారుస్తారు. ఏసీలు బిగిస్తారు. మాడ్యులర్ కిచెన్ పెడతారు. ఫ్యాన్లు అప్గ్రేడ్ చేయటమే కాదు... బాత్రూమ్లలో శానిటరీ వేర్ మారుస్తారు. సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మరమ్మతుల సైకిల్ చాలా పెద్దది. కాబట్టి ఇందులో ముడిపడి ఉన్న కంపెలన్నీ దీర్ఘకాలిక లబి్ధదారులే.చూడాల్సిందేంటి? ఫార్మా గ్రూపులు, రసాయనాల కంపెనీలు, సిమెంటు కంపెనీల వంటివన్నీ హౌసింగ్ గొలుసులోకి ప్రవేశిస్తున్నాయంటే... మన హౌసింగ్ బూమ్ రియల్ ఎస్టేట్కే పరిమితం కావటం లేదని అర్థం. పాలికేబ్ లాంటి వెల్త్ క్రియేటర్లకు చాలా చోటుందని అర్థం. అందుకే ఇకపై ఒక కొత్త ప్రాజెక్టు వస్తోందంటే చూడాల్సింది దాన్నెవరు ఆరంభించారని మాత్రమే కాదు. ఎవరు ఫైనాన్స్ చేస్తున్నారు? సిమెంట్ ఎవరిది? వైరింగ్ ఎవరిది? పెయింట్లు ఎవరివి? ఫర్నిíÙంగ్ ఎవరిది? ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఇవే ‘రియల్’ ఎకానమీ విజేతలు మరి. ఇదీ... హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ డెవలపర్లు ఇళ్లను విక్రయించేది వీరే కనక ఇది నేరుగా లబి్ధపొందే శ్రేణి. → డీఎల్ఎఫ్ → గోద్రెజ్ ప్రాపరీ్టస్ → ప్రెస్టీజ్ ఎస్టేట్స్ → ఒబెరాయ్ రియల్టీ → మాక్రోటెక్ డెవలపర్స్ → బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ → శోభా డెవలపర్స్ గమనించాల్సిన అంశాలు: ఈ కంపెనీల కొత్త ప్రాజెక్టుల లాంచ్లు. ప్రీ–సేల్స్, క్యాష్ కలెక్షన్స్, రుణాలు, భూ సమీకరణ, విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్ల సంఖ్య, డెలివరీ వివరాలు. సిమెంట్, నిర్మాణ సామగ్రి నిర్మాణం సిమెంటు, స్టీలు, కాంక్రీట్తో మొదలవుతుంది. కాబట్టి తొలి లబి్ధదారులు ఈ కంపెనీలేనని చెప్పొచ్చు. లీడర్ల విషయానికొస్తే... → అ్రల్టాటెక్ సిమెంట్ → అంబుజా సిమెంట్ → శ్రీ సిమెంట్ → దాల్మియా భారత్ → రామ్కో సిమెంట్స్ → జేఎస్డబ్ల్యూ సిమెంట్ → టాటా స్టీల్ → సెయిల్ → జిందాల్ స్టీల్ → జేఎస్డబ్ల్యూ స్టీల్ → జిందాల్ స్టెయిన్లెస్ గమనించాల్సిన అంశాలు: ప్రాంతీయ డిమాండ్, సిమెంటు ధరలు, రవాణా ఖర్చులు, సామర్థ్య విస్తరణ, ఇన్పుట్ వ్యయం పెరుగుదల.పెయింట్లు, టైల్స్, శానిటరీవేర్ ఇంటిని స్వా«దీనం చేసుకునే సమయంలో విజేతలయ్యే కంపెనీలివి. ఈ దశలోనే కాంక్రీటు నిర్మాణమనేది నివాసయోగ్యమైన ఇల్లుగా మారుతుంది. గమనించాల్సిన కంపెనీలు... → ఏసియన్ పెయింట్స్ → బెర్జర్ పెయింట్స్ → కాన్సాయ్ నెరోల్యాక్ → ఇండిగో పెయింట్స్ → కజారియా సిరామిక్స్ → సోమానీ సిరామిక్స్ → సెరా శానిటరీవేర్ → ఏజీఎల్ చిరకాలంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ రంగంలోకి బలమైన నెట్వర్క్ ఆసరాతో బిర్లా ఓపస్ ద్వారా ఆదిత్యబిర్లా గ్రూపు... జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ద్వారా జిందాల్ గ్రూపు ప్రవేశించటంతో పోటీ మరింత ఆసక్తికంగా మారింది. హౌసింగ్ ఫైనాన్స్ దీర్ఘకాల ప్లేయర్లు ఈ కంపెనీలు. ఎందుకంటే ఇల్లు ఒకసారి కొన్నా ఇంటి రుణం మాత్రం 15 నుంచి 25 ఏళ్లు కంటిన్యూ అవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఈ కంపెనీలు లబ్ధి పొందుతూనే ఉంటాయి. డిసెంబరు 2024 నాటికి భారత హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లోన్బుక్ ఏకంగా 38.3 లక్షల కోట్లు. → ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ → పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ → కెన్ ఫిన్ హోమ్స్ → హోమ్ ఫస్ట ఫైనాన్స్ → ఆవాస్ ఫైనాన్షియర్స్ → పిరమల్ ఫైనాన్స్ → ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ గమనించాల్సిన అంశాలు: ఈ కంపెనీలిచ్చే రుణం ఎంతమేరకు పెరుగుతోందనేది ప్రధానమైమే. కానీ అదొక్కటే సరిపోదు. ఇచి్చన రుణాల వసూళ్లెలా ఉన్నాయి? అంటే రుణ నాణ్యత ఎంత? దీనికవుతున్న ఖర్చెంత? అంటే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. క్రెడిట్ లాస్ ఏ మేర ఉంది? ఇవన్నీ ప్రధానమే. వైర్లు, ఎలక్ట్రికల్స్, ఉపకరణాలు పూర్తయిన ఇంటికి వైర్లు, స్విచ్లు, లైటింగ్, ఫ్యాన్లు, ఉపకరణాలు కావాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ హౌసింగ్ ఎలక్ట్రికల్స్లో ప్రీమియం ఉత్పత్తులు పెరుగుతున్నాయి. డిమాండ్ఈ రంగంలో గమనించాల్సిన కంపెనీలను చూస్తే... → పాలికేబ్ → కీ ఇండస్ట్రీస్ → వీ–గార్డ్ → ఆర్ఆర్ కబెల్ → హావెల్స్ → ఫినోలెక్స్ కేబుల్స్ → క్రాంప్టన్ గ్రీవ్స్ కన్సూమర్ ఎలక్ట్రికల్స్ → వోల్టాస్ → బ్లూస్టార్పైపులు, గమ్లు, వాటర్ప్రూఫింగ్ కనిపించని లబ్ధిదారులు ఈ కంపెనీలు. ఎందుకంటే వీ టి ఉత్పత్తులకు అందమైన హెడ్లైన్లుండవు. కానీ ప్రతి ఇంటికీ ఇవి తప్పనిసరి. గమనించాల్సిన కంపెనీలు... → ఆస్ట్రల్ → సుప్రీం ఇండస్ట్రీస్ → ప్రిన్స్ పైప్స్ → పిడిలైట్ ఇండస్ట్రీస్ → ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ రమణమూర్తి మంథా -
ప్రపంచం మారిపోయింది!
అవును. మీరు చదివింది అక్షరాలా నిజం. ఎప్పుడో జీపీఎస్, లైడార్ వంటి టెక్నాలజీలేవీ లేని కాలంలో ఫ్రెంచ్ కార్టోగ్రాఫర్ మెర్కాటర్ తయారు చేసిన మ్యాప్ స్థానంలో ఐక్యరాజ్యసమితి సరికొత్త ప్రపంచ పటాన్ని అధికారికంగా ఆమోదించింది. పాత మ్యాప్లో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియాలు వాటి వాస్తవ సైజు కంటే తక్కువగా కనిపిస్తున్నాయని, దాన్ని సరిచేస్తూ ‘ఈక్వల్ ఎర్త్’పేరుతో కొత్త మ్యాప్ తయారు చేశామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ సహా మొత్తం 164 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపగా అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించింది. ఆరు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి. విద్య, మీడియా, అంతర్జాతీయ విధానాల్లో దేశాలకు తగిన ప్రాధా న్యం లభించాలన్నది ఈ మార్పు ఉద్దేశం. ఒకసారి ప్రపంచపటాన్ని చూడండి. ఎగువభాగంలో గ్రీన్ల్యాండ్.. దిగువన ఆఫ్రికా ఖండం కనిపిస్తాయి. రెండింటిలో ఏది పెద్దదంటే మీరేమంటారు? సహజంగానే గ్రీన్ల్యాండ్ అని సమాధానం వస్తుంది. కానీ.. దీంతోపోలిస్తే ఆఫ్రికా ఒకటి కాదు..రెండు కాదు.. 14 రెట్లు ఎక్కువ సైజుంటుంది. మెర్కాటర్ అనే మ్యాపుల తయారీదారు 1569లో సిద్ధం చేసిన మ్యాప్నే మనం ఇప్పటికీ వాడుతూండటం దీనికి కారణం. ఇదొక్కటే కాదు.. ఇలాంటి తేడాలు ఇంకా చాలానే ఉన్నాయి దీంట్లో. ప్రపంచాన్ని కాగితంపై చూపించడానికి చేసుకున్న ఎన్నో రాజీల్లో మెర్కాటర్ మ్యాప్ ఒకటి. భూమి గుండ్రంగా త్రీడీలో ఉంటే.. కాగితం 2డీలో ఉండటం అసలు సమస్యకు కారణం. దీన్ని సరిచేసేందుకు మ్యాప్ ప్రొజెక్షన్ పద్ధతిని ఉపయోగించారు. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత మెర్కాటర్ ప్రొజెక్షన్లో తేడాలు వచ్చేశాయి. భూమధ్య రేఖకు దూరంగా జరుగుతున్న కొద్దీ మ్యాప్లోని భూభాగాల పరిమాణం పెరిగిపోతూ ఉంటుంది. అయితే అప్పట్లో మెర్కాటర్ ఈ మ్యాపును కేవలం సముద్రయానం కోసం మాత్రమే తయారు చేశాడు. అందుకే ఆఫ్రికా విస్తీర్ణం 303.7 కోట్ల చదరపు కిలోమీటర్లయినా.. మెర్కాటర్ మ్యాప్లో 21.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న గ్రీన్ల్యాండ్ కంటే చిన్నగా కనిపిస్తూంటుంది. అప్పట్లో సముద్రయానానికి మెర్కాటర్ మ్యాప్ బాగా పనిచేసింది కానీ.. ఈ తేడాలు అనేక ఇతర సమస్యలను తీసుకొచ్చాయి. ఈక్వల్ ఎర్త్ మ్యాప్ అవసరం ఏర్పడింది ఇందుకే. బోజన్ సావ్రిచ్, టామ్ ప్యాటర్సన్, బెర్న్హార్డ్ జెన్నీ అనే ముగ్గురు కార్టోగ్రాఫర్లు 2018లో ‘ఈక్వల్ ఎర్త్’మ్యాప్ను రూపొందించారు. భూభాగాల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపించడం ఈ ప్రొజెక్షన్ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు...లెక్కల్లో గట్టిగా ఉండటమే కాకుండా.. చూసేందుకు కూడా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచ పటం విషయంలో కొన్ని వందల ప్రొజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిల్లో మెర్కాటర్ సహా ఓ డజను మాత్రమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్లో భూభాగాల పరిమాణాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరో పెద్ద... మిగిలిన వారు చిన్న అన్న భావన భావన ఏర్పడే అవకాశం ఉండదని మద్దతుదారుల అంచనా.ఆఫ్రికా దేశాల ఉద్యమం ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ మ్యాప్ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఉద్యమం ఫలితంగానే సాకారమైందని చెప్పాలి. ఆఫ్రికన్ దేశం టోగో కొత్త మ్యాప్ ప్రతిపాదన చేయగా ఆఫ్రికన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. ఆఫ్రికా పరిమాణాన్ని సరిగ్గా చూపడమే కాకుండా... పాత అసమానతలను సరి చేయాలన్నది ఆఫ్రికా దేశాల ఉద్దేశం. ఇందుకు తగ్గట్టుగానే ఐరాస తీర్మానం కూడా పాఠశాలల్లో, పాఠ్యపుస్తకాల్లో మీడియా, సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఈక్వల్ ఎర్త్ వంటి ప్రొజెక్షన్ల వినియోగాన్ని పెంచమని కోరుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాల్లోనే ఆహుతి చేస్తుంది
భారత రక్షణ రంగ సాంకేతికతలో హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త చరిత్ర లిఖించింది. శత్రువుల డ్రోన్ దాడులను గగనతలంలోనే అత్యంత వేగంగా తిప్పికొట్టే ’ఆహుతి మార్క్–2’ ఎలక్ట్రిక్ మల్టీరోటర్ డ్రోన్ ఇంటర్సెప్టర్ను అపొలియాన్ డైనమిక్స్(డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ)తయారు చేసింది. ఈ డ్రోన్ గంటకు 498 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును అధికారికంగా నమోదు చేసుకుంది. తద్వారా దక్షిణ ఆసియాలోనే అత్యధిక వేగ పరిమితిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఈ స్టార్టప్ 2025లో ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి నేతృత్వంలో ఈ సాంకేతికత రూపుదిద్దుకుంది. అమన్ విరానీ, మానస్ విచారే, ఇషాన్ సూరిలతో కూడిన ప్రతిభావంతమైన బృందం ఈ రికార్డు స్థాయి డ్రోన్ను రాత్రింబగళ్లు కష్టపడి అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హై–స్పీడ్ డ్రోన్ పైలట్ అయిన అమన్ విరానీ ఈ డ్రోన్ ప్రయోగాత్మక పరీక్షల్లో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.పాత రికార్డులు బద్దలు.. గతంలో భారతదేశంలో మల్టీరోటర్ డ్రోన్ల గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా నమోదైంది. అయితే ఆహుతి మార్క్–2 ఆ పాత రికార్డును భారీ వ్యత్యాసంతో అధిగమించింది. 2025లో రూపొందించిన మొదటి తరం ’ఆహుతి’ డ్రోన్ గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగింది. కేవలం ఒకే సంవత్సరంలో ఈ బృందం పాత నమూనాను పూర్తిగా ప్రక్షాళన చేసి, సరికొత్త సాంకేతికతతో పునర్నిర్మించింది. దీనివల్ల డ్రోన్ వేగం ఏకంగా 66 శాతం పెరిగి గంటకు 498 కిలోమీటర్లకు చేరుకుంది. దక్షిణ ఆసియాలోనే ఇంతటి వేగవంతమైన మల్టీరోటర్ డ్రోన్ మరొకటి లేదని కంపెనీ చెబుతోంది. డ్రోన్ ఇంటర్సెప్టర్ అంటే శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి, వాటిని అడ్డుకుని, నాశనం చేసే ఒక అధునాతన రక్షణ వ్యవస్థ. సరళంగా> చెప్పాలంటే డ్రోన్లను వేటాడే మరో డ్రోన్ లేదా మిస్సైల్ అన్నమాట.యుద్ధ వ్యూహాలలో మార్పులు..ప్రస్తుత ఆధునిక యుద్ధాలలో తక్కువ ఖర్చుతో కూడిన ‘షాహెద్’రకానికి చెందిన డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇటువంటి చౌకబారు శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు లక్షల రూపాయల విలువైన ఖరీదైన క్షిపణులను ఉపయోగించడం ఆర్థికంగా భారం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే అపొలియాన్ డైనమిక్స్ ఈ అత్యాధునిక ఇంటర్సెప్టర్ను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో వేగమే అత్యంత కీలకమని, గంటకు 498 కిలోమీటర్ల వేగంతో తాము ఏ రకమైన వైమానిక ముప్పునైనా సమర్థవంతంగా అడ్డుకోగలమని సంస్థ వ్యవస్థాపకులు ధీమా వ్యక్తం చేశారు. సైన్యానికి సరఫరా..ఈ అసాధారణ వేగాన్ని అందుకోవడానికి డ్రోన్ ఫ్రేమ్, ప్రొపల్షన్ వ్యవస్థ, మోటార్ల అమరికను సుమారు పది సార్లు పునఃసమీక్షించి మార్పులు చేశారు. ఈ డ్రోన్ ప్రయాణించే సమయంలో ఒకేసారి 400 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని గ్రహిస్తుంది. ఇదే దీని వేగానికి ప్రధాన కారణం. భారత సైన్యం సహకారంతో బాబినా, గోపాల్పూర్ వంటి సైనిక ఫైరింగ్ కేంద్రాలలో ఈ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటికే ఈ సంస్థ భారత సైన్యానికి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కామికేజ్ డ్రోన్లను సరఫరా చేసింది.క్రూజ్ క్షిపణి లక్ష్యంగా..ప్రమాదకర సరిహద్దు ప్రాంతాలలో మానవ రహిత వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా సైనికుల ప్రాణాలను కాపాడటమే కంపెనీ ముఖ్య ఉద్దేశం. అగ్ని క్షిపణి కార్యక్రమానికి మాజీ ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎం.రామ మనోహర బాబు ప్రస్తుతం ఈ సంస్థ సలహా మండలిలో సేవలందిస్తున్నారు. ఈ సంస్థ 2032 నాటికి వేలాది కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల భారీ పవర్ క్రూజ్ క్షిపణి ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
మన వెన్నంటి చిన్నికృష్ణుడు...
లోక కల్యాణం కోసం శ్రీహరి ధరించిన దశావతారాలలో రామావతారం తర్వాత మళ్లీ అంతటి పరిపూర్ణమైన అవతారం శ్రీ కృష్ణావతారమే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’’.... అని శ్రీమద్భాగవతం శ్రీ కృష్ణుడే భగవంతుడు అని చెబుతుంది. శ్రీ కృష్ణ భగవానుడి లీలల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంత విన్నా భక్తుడి హృదయం పరవశిస్తూనే ఉండటం విశేషం. మన జీవితాలను, సమస్త కర్మలను దేవదేవుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మకు పునరంకితం చేయమని కృష్ణాష్టమి పర్వదినం మనకు గుర్తు చేస్తుంది.శ్రీ నందన నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ వసుదేవులకు స్వయంగా శ్రీ మహావిష్ణువే కృష్ణుని గా జన్మించాడు.అందరికీ అన్నీ తానే అయి....మన పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజాసంప్రదాయాలలోనూ కృష్ణుని చిలిపి బాలునిగాను, పశువులకాపరి గాను, రాధా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగానూ... ఇలా అనేక విధాలుగా శ్రీ కృష్ణుని చిత్రీకరిస్తుంటారు. అంతేకాదు, శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం గురించి ఎన్నో విధాలుగా చదువుతుంటాం. అయినా ఆ కృష్ణుని గురించి తెలుసుకోవలసిన విశేషాలెన్నో ఉంటూనే ఉంటాయి.వెన్న దొంగ ఎందుకయ్యాడు?చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణునిగానూ, వెన్న దొంగగానూ పేరు పొందాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో దేవరహస్యం ఏమంటే... వెలుగుకు, విజ్ఞానానికి సంకేతమైన వెన్న, చీకటికి, అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండలలో ఉండేది, తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడని భాగవత లీలలు చెబుతున్నాయి.నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే, వైష్ణవులు నక్షత్రమే ప్రధానంగా తీసుకుంటారు.ఎలా జరుపుకోవాలంటే...కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తర్వాత ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు అలంకరించి పూజామందిరంలో ముగ్గులు వేయాలి.ఇక ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి భాగవత పురాణాన్ని లేదా శ్రీ కృష్ణ లీలలను పారాయణ చేస్తూ గడుపుతారు. సాయంత్రం వేళ విధి విధానాలతో శ్రీ కృష్ణుని పూజిస్తారు. అనంతరం ఈ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడలను నైవేద్యం పెడతారు. రాత్రి కాగానే ఊయలలు కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాల్ని పవళింపజేసి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అనీ పిలుస్తారు. వేణుమాధవుడు...కృష్ణుడు వేణువును విడిచి పెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే... చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కృష్ణుడు తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. చివరికి అందరూ కలిసి నువ్వంటే కృష్ణుడికి ఎందుకంత ఇష్టమని వేణువుని అడిగితే.. ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అని చెప్పిందట వేణువు. నిజమే కదా! వేణువు అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తన మనసులో ఏ మాలిన్యమూ, భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే.– డి.వి.ఆర్. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్!
హిమాలయాల కొండల్లో.. సునామీ విరుచుకుపడిన వరద నేపాల్ను కోలుకోలేని దెబ్బతీసింది. మంచు, మట్టి, రాళ్లతో ఉప్పొంగిన వరద ప్రవాహం గ్రామాలను, రహదారులను, వంతెనలను మింగేసింది. వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వారం గడిచినా కూడా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఇంతటి విపత్తు తర్వాత ఇప్పుడు నేపాల్ కళ్లు తెరిచింది. మరోసారి ఇలాంటి ముప్పు ఎదురైతే కనీసం కొన్ని నిమిషాల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయాలని చర్యలు మొదలుపెట్టింది.ఆగష్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలపై చైనా తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది నేపాల్ ప్రధాన ఆరోపణ. అయితే తాము సకాలంలోనే స్పందించామని చైనా ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఈ తరుణంలో రసువా జిల్లాలో ఎక్కడైతే వరద ముంచెత్తిందో.. అక్కడే కొత్తగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించింది. చైనా సరిహద్దుకు సమీపంలోని టిమురే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, నదుల ఉద్ధృతి వంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సీస్మిక్ సెన్సర్లు, కెమెరాలు ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు ఉపగ్రహ ఆధారిత వీఎస్ఏటీ (VSAT) కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.పాత వ్యవస్థ ఏమైంది?ఇక్కడే అసలు వైఫల్యం బయటపడుతోంది. గతంలోనూ ఆ ప్రాంతంలో వరదలు, నదీ ప్రవాహాన్ని పర్యవేక్షించే వ్యవస్థ ఉంది. అయితే ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలో పలు పర్యవేక్షణ కేంద్రాలు, గేజ్లు కొట్టుకుపోయాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని కనీసం నాలుగు గేజింగ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో సమాచారం అందించడంలో వ్యవస్థ విఫలమైంది.మొబైల్ నెట్వర్క్ పోయినా..కొత్త వ్యవస్థలో వీఎస్ఏటీని కీలకంగా ఉపయోగించనున్నారు. భారీ విపత్తుల సమయంలో మొబైల్ నెట్వర్క్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయకపోయినా.. ఉపగ్రహం ద్వారా పర్యవేక్షణ కేంద్రాలు అధికారులతో అనుసంధానంలో ఉండేలా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీ ప్రవాహం పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేసి, ప్రజలకు ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపేలా వ్యవస్థను రూపొందించనున్నారు.ఇంకా 4 వేల మంది మిస్సింగ్ఆగస్టు 26న నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదకు నేపాల్ తీవ్రంగా నష్టపోయింది. రెండు దేశాల్లో కలిపి కనీసం 1,114 మంది మరణించగా.. దాదాపు 4 వేల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధిక మరణాలు నేపాల్లోనే నమోదయ్యాయి.41 నిమిషాల ఆలస్యం.. ప్రాణాల మీదకుఈ విపత్తులో హెచ్చరిక వ్యవస్థ వైఫల్యం ఎంత తీవ్రంగా ఉందో ఒక అంశం స్పష్టం చేస్తోంది. వరదకు దారితీసిన మంచు, రాళ్ల విరిగిపాటు ఉదయం సంభవించినప్పటికీ.. అధికారిక హెచ్చరిక ప్రజలకు చేరేసరికి దాదాపు 41 నిమిషాలు గడిచిపోయాయి. ఇలాంటి కొండ ప్రాంతాల్లో 10–15 నిమిషాల ముందస్తు సమాచారం కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కీలకంగా మారుతుంది.చైనాతో మరింత డేటా షేరింగ్ఇకపై చైనాతోనూ విపత్తు సమాచారాన్ని మరింత వేగంగా పంచుకునే దిశగా నేపాల్ అడుగులు వేస్తోంది. హిమనదుల కదలికలు, నీటి మట్టాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడే ప్రమాదకర పరిస్థితులపై రియల్టైమ్ సమాచారాన్ని పొందేందుకు సహకారం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే చైనా ఉపగ్రహ చిత్రాలు, నీటి మట్టం–ప్రవాహ సమాచారం, ఎగువ ప్రాంతాల్లో ఏర్పడిన ప్రమాదాలపై వివరాలను పంచుకున్నట్లు సమాచారం.కొన్ని నిమిషాలైనా.. ప్రాణాలు కాపాడొచ్చు!కొత్త వ్యవస్థ వల్ల భారీ విపత్తును పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రమాదాన్ని కొన్ని నిమిషాల ముందే గుర్తించి హెచ్చరికలు పంపగలిగితే.. ప్రజలను, సరిహద్దు సిబ్బందిని, సహాయక బృందాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి జరిగిన ఘోర వైఫల్యం తర్వాత నేపాల్ హడావుడిగా పాత వ్యవస్థ స్థానంలో కొత్త సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మాత్రం మరో విపత్తు వచ్చినప్పుడు హెచ్చరించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకే ‘చేతులు కాలాక.. ఆకులు పట్టుకుంటున్న నేపాల్’ అనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: నేపాల్ వరదలే కాదు.. భూకంపాలకూ కారణం ఇదే! -
కాంగ్రెస్లో కాంట్రవర్సీల కొండ(డా)
కాంగ్రెస్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కొండా సురేఖ చుట్టూ వివాదాలు ఆగలేదు.. ప్రత్యర్థులతో ఢీ కొట్టిన సందర్భాల కంటే సొంత పార్టీలోనే ఢీకొన్న సందర్భాలే ఎక్కువ!. పదవులు, ఆధిపత్యం, వర్గపోరు, నేతలతో విభేదాలు.. ఇలా ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రాజకీయ ప్రకంపనగా మారింది. ఒక దశలో సినీ హీరోయిన్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తే.. మరో దశలో సొంత పార్టీ నేతలే ఆమె వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్రెడ్డితో విభేదాలు బహిరంగం కావడం.. వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానం గడప దాటడం.. కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా మారింది. అసలు 2018లో కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొండా సురేఖ చుట్టూ చోటుచేసుకున్న వివాదాలేంటి? ఎక్కడెక్కడ ఎవరితో ఢీ కొట్టారు? ఈ రాజకీయ రచ్చలో అసలు ట్విస్టులేంటి?..కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం 2018లో కాంగ్రెస్లో మొదలైంది కాదు. ఆమె అసలు కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానం 1996లోనే ప్రారంభమైంది. 2018లో ఆమె కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు.కొండా సురేఖ తొలి కాంగ్రెస్ ప్రస్థానం..1995: గీసుకొండ మండల పరిషత్ రాజకీయాలతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1996: కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు.1999: శాయంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా, పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు.2000: ఏఐసీసీ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎంపికయ్యారు.2004: శాయంపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.2009: నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ నుంచి వివాదాల పరంపర1. 2018.. కాంగ్రెస్లోకి రీఎంట్రీ2018లో బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే వరంగల్ కాంగ్రెస్లో ఆమె ఆధిపత్యం, స్థానిక నేతలతో సంబంధాలపై చర్చలు మొదలయ్యాయి.2.ఎర్రబెల్లి స్వర్ణతో ఆధిపత్య పోరువరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ విభేదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. 2018లోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగిందని నివేదికలు పేర్కొన్నాయి.3. 2023 నుంచి మళ్లీ తెరపైకి విభేదాలు2023లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయిన తర్వాత సురేఖ రాజకీయ ప్రాధాన్యం భారీగా పెరిగింది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలోకి ఇతర పార్టీల నేతల చేరికలు ఆమెకు అసంతృప్తి కలిగించాయి. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతర నేతలను కాంగ్రెస్లోకి ఎలా తీసుకుంటారని ఆమె బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.4. పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యవహారంకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్లో పార్టీ వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో మంత్రి హోదాలో కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి హంగామా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.5. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఫిర్యాదులుసురేఖ, ఆమె భర్త కొండా మురళి వ్యవహార శైలిపై వరంగల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.6. 2024.. సమంత-నాగచైతన్య విడాకుల వ్యాఖ్యలుఇది కొండా సురేఖ పొలిటికల్ కెరీర్లోనే అత్యంత పెద్ద వివాదాల్లో ఒకటిగా మారింది. మంత్రి హోదాలో ఉండగా.. నటి సమంత, నాగచైతన్య విడిపోవడానికి అప్పటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ విమర్శలు కాస్తా సినీ పరిశ్రమలోకి వెళ్లడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాత పరువునష్టం కేసు వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. రాజకీయంగా కేటీఆర్ను టార్గెట్ చేయాలనుకున్న సందర్భంలో చేసిన ఆమె వ్యాఖ్యలు.. చివరకు ఆమెపైనే పెద్ద రాజకీయ, న్యాయపరమైన వివాదంగా మారాయి.7. రకుల్ ప్రీత్ సింగ్ పేరును ప్రస్తావించడంపై వివాదంసమంత వివాదం సమయంలోనే నటి రాకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా సురేఖ ప్రస్తావించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రకుల్ కూడా సురేఖ తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని తీవ్రంగా స్పందించారు.8. 2025.. మేడారం పనులు, పొంగులేటితో విభేదాలు2025లో మేడారం పనులు, టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో సురేఖకు విభేదాలు బయటపడ్డాయి. తన శాఖ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారన్న అభ్యంతరాలు సురేఖ వర్గం నుంచి వచ్చాయి. ఈ వివాదం క్రమంగా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరుగా మారింది.9.కొండా మురళి వర్సెస్ పొంగులేటిసురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా పొంగులేటిపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.10. మాజీ OSD సుమంత్ అరెస్ట్ ఎపిసోడ్2025లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆమె జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిన ఘటన మరో పెద్ద వివాదానికి దారితీసింది. పోలీసులు సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు రావడం, ఆ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత అభ్యంతరం వ్యక్తం చేయడం, అనంతరం సీఎం రేవంత్రెడ్డి, ఆయన సన్నిహితులపై రాజకీయ కుట్ర ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీశాయి. సురేఖ క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది.11. బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయ వివాదంఈ ఎపిసోడ్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు మరో రాజకీయ చర్చకు తెరతీశాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన తన తల్లిని కొందరు రెడ్డి నేతలు అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించడం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు కారణమైంది.12. 2025-26.. వరంగల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్వరంగల్ కాంగ్రెస్లో సురేఖ వర్గం, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. ఆమెకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం వరుసగా జరిగింది.13. 2026.. ఎర్రబెల్లి స్వర్ణతో మళ్లీ ఢీ2026లో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎర్రబెల్లి స్వర్ణకు ప్రాధాన్యం దక్కడంతో మరోసారి కొండా వర్గం అసంతృప్తి చర్చకు వచ్చింది. 2018 నుంచి కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇంకా ముగియలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.14. 2026.. కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ నాయకత్వం2026లో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్లో కలకలం రేగింది. సీఎం రేవంత్రెడ్డిపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల డిమాండ్ వచ్చింది. విషయం చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.15. ప్రస్తుతం.. రేవంత్తో నేరుగా ఢీతాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం సురేఖ స్వయంగా సీఎం రేవంత్రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. పార్టీలో తన విషయంలో ఒక రకంగా, ఇతర నేతల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మహిళను, బీసీ నేతను కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇక సీఎం రేవంత్రెడ్డి సైతం సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ప్రస్తుతం తీవ్రంగా సాగుతోంది. అయితే తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.మొత్తంగా చూస్తే.. కొండా సురేఖ రాజకీయ ప్రయాణంలో ప్రత్యర్థి పార్టీలతో పోరాటం ఎంత కనిపిస్తుందో.. సొంత పార్టీలో అంతర్గత పోరాటం కూడా అంతే కనిపిస్తోంది. తాజాగా వ్యవహారం ఏకంగా గాంధీభవన్ దాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరడంతో.. ఈసారి వివాదానికి ఎలాంటి ముగింపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. -
జెన్–జీలోనూ మొహమాటపు పోకడలు!
జెన్–జీ అంటే కేర్ఫ్రీ అనుకుంటున్నాం కానీ వారిలోనూ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే మొహమాటం ఉన్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మొహమాటం కారణంగా వారు కెరియర్లో ఎదిగేందుకు సాయపడగల వ్యక్తులను సంప్రదించడం లేదని, నెట్వర్కింగ్కు ఆసక్తి చూపడం లేదని లింక్డ్ఇన్ జరిపిన ఈ అధ్యయనం తెలిపింది. బుధవారం విడుదలైన ఈ నివేదిక ప్రకారం నిత్యం ఆన్లైన్లోనే ఉండే తరానికి చెందిన జెన్–జీ ప్రొఫెషనల్స్లో 83 శాతం మంది ఈ రకమైన పోకడలు చూపుతున్నట్లు తెలిసింది. జడ్జ్ చేస్తారేమో అన్న సంకోచం 44 శాతం మందిని పీడిస్తూంటే.. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందేమో అన్న మొహమాటంతో 39 శాతం మంది సాయపడే వారికి దూరంగా ఉంటున్నారట. మరీ కృతకంగా ఉంటుందేమో అన్న అనుమానంతో ఇతరుల సలహాలు కోరడం, రిలేషన్షిప్ను మెయిన్టెయిన్ చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడం వంటివి చేయని వారు సుమారు 37 శాతం మంది ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్తోపాటు యూకే, యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, సింగపూర్, బ్రెజిల్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో ఈ ఏడాది జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ దాదాపు 18,050 మంది పార్ట్టైమ్ ఉద్యోగుల (18 – 80 ఏళ్ల వారు)ను ప్రశ్నించడం ద్వారా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. భారత్ విషయానికి వస్తే... జెన్–జీలో 79 శాతం మందికి ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అవసరం, ప్రాముఖ్యత గురించి తెలుసు. కానీ సంగం కంటే ఎక్కువ మంది (53 శాతం) వీటిని ఎలా మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు 53 శాతం మంది పరిచయస్తులను (కాంటాక్ట్లు) అసలైన కనెక్షన్స్గా మార్చుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఖర్చులవుతాయన్న ఆందోళన అదనం. లింక్డ్ఇన్ డేటా ప్రకారం ఆయా కంపెనీల్లో ఎవరైనా తెలిసి ఉంటే ఇతరులతో పోలిస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు దాదాపు 8.5 రెట్లు ఎక్కువ. అయితే, జెన్–జీలో సుమారు 59 శాతం మందికి ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఎలా పెంపొందించుకోవాలో ఎవరూ చెప్పలేదట. చాలామంది తమంతట తాము నేర్చుకోవడమో.. లేక పరిమితమైన సలహా, సూచనల ద్వారా ముందుకెళ్లడమో చేశారని లింక్డ్ఇన్ నివేదిక చెబుతోంది. ఫలితంగా ఉద్యోగం కోసం లేదా వృత్తిలో ఎదిగేందుకు ఎవరిని సంప్రదించాలి? ఎప్పుడు సంప్రదించాలి? ఏం మాట్లాడాలి? వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం కష్టమవుతోందని తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. జెన్–జీ ఈ సమస్యలు ఎదుర్కొంటూంటే మిలినియల్స్ (1981–1996 మధ్య పుట్టిన వారు), అంతకు ముందు తరం జెన్ ఎక్స్ (1965–1980 మధ్య పుట్టిన వారు) ఉద్యోగులు మాత్రం అప్పుడే ఉద్యోగాల్లోకి చేరిన అపరిచితులకు సైతం తాము సాయం చేస్తామని చెప్పడం విశేషం. – న్యూఢిల్లీ -
పెద్దన్నా.. ఏంటీ కన్ఫ్యూజన్?? ఆంక్షలా.. దాడులా?
ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు.అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’ఆరు వారాల్లో ముగుస్తుందని ట్రంప్ గతంలో చెప్పిన యుద్ధం.. ఆరు నెలలు దాటినా కొనసాగుతుండటం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు పలుమార్లు ఈ యుద్ధం ముగిసిందని, అమెరికా విజయం సాధించిందని ప్రకటించినప్పటికీ.. ఇరాన్తో ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా చల్లారలేదు. ట్రంప్ వైఖరిలో తరచూ కనిపిస్తున్న ఈ మార్పులపై అమెరికా రాజకీయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ట్రంప్ పాలనలోని విధానాలపై అవగాహన ఉన్న మాజీ భద్రతా అధికారి ఒకరు.. ఇరాన్పై యుద్ధం స్పష్టమైన ప్రణాళిక లేకుండానే ప్రారంభమైందని, ఇప్పటికీ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్తో ఎవ్వరూ సంతృప్తిగా లేరా?రిపబ్లికన్ పార్టీలో ఇరాన్ ఉద్రిక్తతలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం మరింత పొడిగితే చమురు ధరలు పెరిగి.. అమెరికన్లపై భారం పడుతుందని, వచ్చే మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా యుద్ధంపై అప్రమత్తంగా ఉన్న వర్గాలు సైతం సంఘర్షణ త్వరగా ముగియాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్పై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుకునే హార్డ్లైన్ వర్గం కూడా ట్రంప్ తీరుపై పూర్తిగా సంతృప్తిగా లేదు.ట్రంప్ ప్రచార బృందంలో పని చేసిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్ను అదుపులోకి తీసుకురావాలన్న ట్రంప్ లక్ష్యాన్ని సమర్థించే రిపబ్లికన్లు కూడా ప్రస్తుత పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మరో రిపబ్లికన్ వ్యూహకర్త ఈ పరిస్థితిని సరదాగా ‘ఫ్రెండ్లీ జోన్లో చిక్కుకున్నట్లుంది’ అంటూ అభివర్ణించారు. అంటే.. ట్రంప్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా పూర్తిగా ఏ వర్గాన్నీ సంతృప్తిపరచడం లేదన్నమాట.మధ్యంతర ఎన్నికల వేళ పెరుగుతున్న ఒత్తిడిఅమెరికాలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది. ఇప్పటికే అధిక ధరలతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్న సమయంలో.. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపితే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా గతంలో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా జరిగేది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి.‘ఇది వ్యూహంలో భాగమే’అయితే ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఈ పరిణామాలను మరోలా చూస్తున్నారు. ఇరాన్పై సైనిక, ఆర్థిక ఒత్తిడిని ఒకేసారి కొనసాగించడం ఉద్దేశపూర్వక వ్యూహమేనని వారు చెబుతున్నారు. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోకుండా ఒత్తిడి కొనసాగిస్తూ.. మరోవైపు ఆంక్షల ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పడే వరకు వేచి చూడాలన్నది ట్రంప్ వ్యూహంగా వారు పేర్కొంటున్నారు.మాజీ అమెరికా రాయబారి జేమ్స్ జెఫ్రీ కూడా తాజా పరిణామాలను ఇరువైపులా జరుగుతున్న ప్రతిచర్యలుగానే అభివర్ణించారు. ఇరాన్, అమెరికా రెండూ పూర్తిస్థాయి దాడులకు తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.యుద్ధం త్వరగా ముగిస్తే మంచిదిఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగంలోనే యుద్ధాన్ని ముగించాలన్న అభిప్రాయం బలపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. చమురు పరిశ్రమకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకారం.. ఘర్షణలను ముగించాలన్న ఒత్తిడి భారీగా ఉంది. ఇరాన్ పూర్తిగా బలహీనపడే వరకు ఒత్తిడి కొనసాగించాలని భావించే అధికారులు కూడా ఉన్నారు. ఇరాన్ను తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలోకి నెట్టినప్పుడే అది అమెరికాతో తమకు అనుకూలమైన ఒప్పందానికి వస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదుఅమెరికా విధిస్తున్న ఆంక్షలు తమను చర్చల బాట పట్టిస్తాయన్న వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా వాదనలు అబద్ధాలంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘలీబాఫ్ విమర్శించారు. అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా ఇరాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసే చైనా.. అంతర్జాతీయ చట్టాలకు ఆధారం లేని ఏకపక్ష అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.మొత్తంగా.. ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేయాలా? సైనిక దాడులతో లొంగదీసుకోవాలా? లేక ఒత్తిడితోనే చర్చల బాట పట్టించాలా? అన్నది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఒకవైపు యుద్ధం ముగిసిందంటూనే.. మరోవైపు దాడుల హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత మళ్లీ చర్చలకు సంకేతాలివ్వడం అమెరికా వ్యూహంపై సందేహాలకు తావిస్తోంది. ఇరాన్ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ట్రంప్ నిర్ణయం ఏదైనా కావొచ్చు.. కానీ యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాలు!. ఇదీ చదవండి: ఈసారి కాస్త గట్టిగానే కొడతాం -
26 విపత్తుల తేదీ!
ఏడాదిలో ఉండే 365 రోజుల్లో ప్రకృతి విపత్తులు ఎప్పుడైనా ఏర్పడవచ్చు.... ఒకట్రెండు ఒకే తేదీలో వస్తే.. కాకతాళీయం, యాదృచి్ఛకం అనుకుంటాం... ఇలా కాకుండా బోలెడన్ని ప్రకృతి విపత్తులు.. 26వ తేదీనే వస్తే...? ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా నేపాల్ను వరద ముంచేసింది కానీ... గతంలో ఇదే 26వ తేదీ ఎన్ని విపత్తులు వచ్చాయో తెలుసా?సుమారు 96 ఏళ్లు అవుతోంది.. 26వ తేదీ ప్రకృతి విపత్తులు సంభవించడమనే ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకోవడం. 1930లో టర్కీని కుదిపేసి 32,700 మంది ప్రాణాలు తీసిన భూకంపం సంభవించింది నవంబరు 26. ఆ తరువాత కూడా అనేకసార్లు నెలలు మారినా విపత్తులు మాత్రం 26వ తేదీనే జరగడం యాదృచి్ఛకం అని కొట్టిపారేయలేమేమో. ప్రకృతి వైపరీత్యాల మాట అలా ఉంటే మానవ తప్పిదాల కారణంగా చోటు చేసుకున్న భారీ దుర్ఘటనల్లో కొన్ని కూడా 26వ తేదీనే చోటు చేసుకున్నాయి. మచ్చుకు కొన్నింటిని చూద్దాం. ఆగస్టు 26, 2026: నేపాల్ను ముంచేసిన మెరుపు వరదలు: హిమాలయ పర్వత శిఖరాల్లో ఓ హిమానీనదం అకస్మాత్తుగా విరిగి కిందకు పడటంతో నేపాల్లోని రసువా జిల్లాలో భోటే కోశి నదికి మెరుపు వరద వచ్చింది. దీంతో గ్రామాలు మునిగాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఆగస్టు 31 నాటికి 900 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 4,500 మంది గల్లంతయ్యారు. అక్టోబర్ 26, 2015: హిందూకుష్ భూకంపం: హిందూకుష్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారతదేశంసహా అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర కొన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దాదాపు 400 మంది మరణించారు. మే 26, 2006: యోగ్యకర్త భూకంపం, ఇండోనేíసియా: ఇండోనేíÙయాలోని జావా ద్వీపంలో యోగ్యకర్త సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. వేల ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. 5,700 మందికి పైగా మృతి చెందారు. జూలై 26, 2005: మహారాష్ట్ర వరదలు: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాజధాని ముంబైలో ఒకే ఒక్కరోజులో 944 మి.మీ. వర్షం నమోదైంది. రోడ్లు, ఇళ్లు, రైల్వే లైన్లు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. రాష్ట్రం మొత్తమ్మీద 1,094 మంది మృతి చెందారు. డిసెంబర్ 26, 2004: సునామీ ప్రళయం... సుమత్రా తీరం సమీపంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీగా మారి హిందూ మహాసముద్ర తీర దేశాలపై విరుచుకుపడింది. ఇండోనేసియా, శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దాదాపు 2,28,000 మంది మరణించగా మరెందరో గల్లంతయ్యారు. చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక విపత్తుల్లో ఒకటిగా ఇది నమోదైంది. డిసెంబర్ 26, 2003: బామ్ భూకంపం, ఇరాన్: ఇరాన్లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపం చారిత్రక నగరం బామ్, చుట్టుపక్కల గ్రామాలను ధ్వంసం చేసింది. వేల భవనాలు మట్టిదిబ్బలుగా మారాయి. ఈ ప్రకృతి విపత్తులో సుమారు 31,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 25–26, 2002: వరుస భూకంపాలతో అఫ్గానిస్తాన్ అతలాకుతలం: ఉత్తర అఫ్గానిస్తాన్లోని బఘ్లాన్ ప్రాంతంలో రాత్రిపూట వరుస భూకంపాలు సంభవించి 1800 మంది ప్రాణాలు బలితీసుకున్నాయి. మట్టి ఇళ్లు కూలిపోగా వేల మంది నిరాశ్రయులయ్యారు. జనవరి 26, 2001: గుజరాత్ భూకంపం: 2001 జనవరి 26న గుజరాత్లో భయంకర భూకంపం సంభవించింది. ఫలితంగా కచ్ ప్రాంతం ధ్వంసమైంది. సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోగా... 1,66,000 మందికి పైగా గాయపడ్డారు. జూలై 26, 1963: స్కోప్జే భూకంపం: అప్పటి యుగోస్లేవియాలోని స్కోప్జే నగరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరం ధ్వంసమైంది. 2,00,000 మంది నిరాశ్రయులయ్యారు. 1,070 మంది మృతి చెందారు. నవంబర్ 26, 1943: లాడిక్ భూకంపం, టర్కీ: టర్కీలోని లాడిక్–సామ్సన్–హవ్జా ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. టర్కీ ఉత్తర ప్రాంతంలో విస్తృత నష్టం జరిగింది. 4,020 మంది మృతి చెందారు. డిసెంబర్ 26–27, 1939: ఎర్జింకాన్ భూకంపం, టర్కీ: టరీ్కలోని ఎర్జింకాన్ ప్రాంతంలో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం 32,700 మంది ప్రాణాలు బలితీసుకుంది. అపారమైన ఆస్తినష్టం నమోదైంది. మానవ తప్పిదాలు తెచ్చిన విపత్తులు... → సెప్టెంబర్ 26, 2023: ఖరాఖోష్ వెడ్డింగ్ హాల్ అగ్నిప్రమాదం... ఇరాక్లోని మోసుల్ సమీపంలోని ఖరాఖోష్లోని వెడ్డింగ్ హాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. భవనం లోపలే పటాకులు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. పైరోటెక్నిక్స్ మండే పదార్థాలను తగలబెట్టాయి. నిండిన హాల్లో నిప్పు వేగంగా వ్యాపించింది. 100 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. → ఆగస్టు 26, 2021: కాబూల్ ఎయిర్పోర్ట్ బాంబు పేలుడు అఫ్గానిస్తాన్లోని కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఆత్మా హుతి దాడిలో 183 మంది మృతి చెందారు. వీరిలో 170 మంది ఆఫ్గాన్ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు.→ నవంబర్ 26, 2008: ముంబై ఉగ్రదాడులు దేశాన్ని కుదిపేసిన అత్యంత భారీ ఉగ్రవాద దాడి ఇది. 2008 నవంబర్ 26 రాత్రి ముంబైలోకి ప్రవేశించిన పది మంది లష్కర్–ఎ–తొయిబా ఉగ్రవాదులు ఏకకాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెరి్మనస్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ వంటి ప్రాంతాల్లో కాల్పులకు దిగారు. మూడు రోజుల పాటు సాగిన ఈ ఉగ్రదాడిలో భద్రతాదళాలు తొమ్మిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 166 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయపడ్డారు.→ మే 26, 1991: లాడా ఎయిర్ ఫ్లైట్ 004 ప్రమాదం బ్యాంకాక్ నుంచి వియన్నాకు వెళ్తున్న లాడా ఎయిర్ బోయింగ్ 767 విమానం థాయిలాండ్లో కూలిపోయింది. ఇంజన్ థ్రస్ట్ రివర్సర్ అనూహ్యంగా విచ్చుకోవడంతో విమానం నియంత్రణ కోల్పోయి ముక్కలైపోయి కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 223 మంది మృతి చెందారు. – న్యూఢిల్లీ -
ఆమె కన్నీటి శాపమే.. నేపాల్ను వెంటాడుతోందా?
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు.. వరుస ప్రకృతి విపత్తులు ఓవైపు తరచూ తలెత్తుతున్న రాజకీయ సంక్షోభాలు మరోవైపు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ ముప్పు ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులతో పశుపతి నేల నేపాల్ సతమతమవుతోంది. తాజా జల విలయం కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న కష్టాలను మరోసారి కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితులు తమకు బాగా అలవాటేనని, కోలుకోవడం కూడా సాధారణమేనని నేపాల్ చెబుతున్నప్పటికీ.. ఈ పరిస్థితుల వెనక ప్రచారంలో ఉన్న ఓ గాథ తాజాగా తెరపైకి వచ్చింది. ‘సతి లే సరాపేకో దేశ్’.. సతి శాపానికి గురైన దేశం. నేపాల్ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఇది. రాజరికం అంతరించి పోయిన సమయంలో.. అలాగే వరుసగా ప్రభుత్వాలు కూలినప్పుడల్లా ఈ పదం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ఇది కేవలం ఇందుకే పరిమితం కాలేదు.. ప్రకృతి ప్రకోపం చూపించినప్పుడు కూడా అక్కడి జనాలు దీనిని గుర్తు చేసుకుంటారు. అసలు నేపాల్ శపించిన ఆ మహిళ ఎవరు? ఆమె విషాద గాథ ఏంటి? సతీసహగమన సమయంలో ఆమె పెట్టిన కన్నీరే నేపాల్ దుస్థితికి కారణమా?.. నాలుగు వందల ఏళ్ల కిందట జరిగింది ఏంటి?.. నేపాల్లో 17వ శతాబ్దంలో ఖాట్మాండు లోయను మల్ల రాజులు పరిపాలించేవారు. అధికారం, ఆధిపత్య పోరులతో రాజదర్బాలు కుట్రలకు, కుతంత్రాలుగా నిలయంగా కనిపించేవి. ఆ వంశంలో రాజు లక్ష్మీ నరసింహ మల్లా కొలువులో కాజీ భీమ్ మల్లా అనే సేనాపతి ఉండేవాడు. సైనిక వ్యవహారాల్లోనే కాకుండా పరిపాలన, టిబెట్తో వాణిజ్య సంబంధాల్లోనూ ఆయన రాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ కీలక వ్యక్తిగా ఎదిగారు. రాజు వద్ద ఆయనకు పెరుగుతున్న ప్రాధాన్యం.. సాధారణంగానే సామంత రాజుల్లో అసూయను పెంచింది.చాడీలు విని.. భీమ్ మల్లాపై కుట్రలు పన్నిన ప్రత్యర్థులు.. రాజు లక్ష్మీ నరసింహుడికి లేనిపోని వన్నీ నూరిపోశారు. దాంతో తన సింహాసనానికి భీమ్ ముప్పుగా మారుతున్నాడేమో అని అనుమానం పెంచుకున్నారాయన. అలా రాజద్రోహం ఆరోపణలతో ఎలాంటి విచారణ జరపకుండానే ఆయన్ని చెరసాలలో బంధించి.. మరణశిక్ష అమలు చేశారు. అది చూసి.. ఆయన భార్య భువనలక్ష్మి గుండె పగిలేలా రోదించింది. రాజ్యం సైతం కన్నీరు పెట్టింది.చితిపై నుంచే శాపం?నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తిని లక్ష్మీ నరసింహుడు అకారణంగా, కుట్రలకు తలొగ్గి చంపడాన్ని భువనలక్ష్మి తట్టుకోలేకపోయారు. ఆ కాలంలో నేపాల్లో సతి ఆచారం ఉండేది. భర్త మరణించిన తర్వాత భార్య కూడా అతడి చితిపై ఆత్మాహుతి చేసుకునే పరిస్థితులు ఉండేవి. భువనలక్ష్మి కూడా భర్త భీమ్ మల్లా చితిపై ఆత్మార్పణం చేసుకున్నారు. అయితే అంతకు ముందు తన భర్తకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను అన్యాయంగా చంపిన ఈ నేల, ఈ రాజ్యాన్ని మనశ్శాంతిగా ఉండబోవని, సర్వనాశనం అవుతాయని శపించారు. ఆ తర్వాత రాజు లక్ష్మీ నరసింహుడు సైతం తన పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని.. ఆయన కాలంలోనే వరదలు సంభవించాయని చెబుతుంటారు. అలా ఆమె శాపం నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతూనే ఉందని ఓ జానపద కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాథ నుంచే ‘సతి లే సరాపేకో దేశ్’(Sati le Sarape ko Desh) అనే పదబంధం పుట్టిందని చెబుతారు.అయితే కాలక్రమంలో ఈ గాథ భువనలక్ష్మి అనే మహిళ కన్నీటి కథకు మాత్రమే పరిమితం కాలేదు. నేపాల్లో తరచూ తలెత్తిన రాజకీయ అస్థిరత, అధికార పోరాటాలు, పాలనా సంక్షోభాలు.. అదనంగా ముంచెత్తున్న ప్రకృతి విపత్తులను ప్రస్తావించేటప్పుడు ఈ పదబంధాన్ని వ్యంగ్యంగా, ఆవేదన పూరితంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు ఆకస్మిక వరదల వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది. View this post on Instagram A post shared by 𝒩 (@nishantchillma)ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త.. మనుషుల్ని మోసం చేస్తున్న ఏఐ! -
ఐదు నిమిషాల ప్రార్థనతో.. నొప్పులూ, యాంగ్జైటీ, ఆందోళన దూరం!
కేవలం ఐదు నిమిషాలపాటు ప్రార్థన చేయడం వల్ల నొప్పులూ, ఉద్విగ్నతలూ, ఆందోళన వంటివి చాలావరకు తగ్గే అవకాశముందంటూ అమెరికా పరిశోధకులు నిర్వహించిన ఓ తాజా అధ్యయనం చెబుతోంది. ‘యాన్నల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ప్రార్థనతో యాంగ్జైటీ, ఆందోళన తగ్గడం వల్ల దానికి అనుగుణంగానే నొప్పులూ చాలావరకు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. తీవ్రమైన నొప్పి లేదా తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్న 180 మందిని ఈ పరిశోధన కోసం ఎంపిక చేశారు. తొలుత వైద్యులు వారిని పరిశీలించి రెండు టీములుగా విభజించారు. ఒక టీములోని వారికి శిక్షణ పొందిన వాలంటీర్స్ ఆధ్వర్యంలో నొప్పితో బాధపడుతున్న వారిని తాకుతూ వాళ్ల నొప్పి తగ్గడం కోసం ఐదు నిమిషాల పాటు ప్రార్థనలు చేశారు. మరో టీములోని వారికి ఐదు నిమిషాలపాటు లలిత సంగీతాన్ని వినిపించారు. సంగీతం విన్నవారితో పోలిస్తే... ప్రార్థన చేసిన వారి టీములోని సభ్యుల్లో ఎక్కువ మందికి నొప్పి తగ్గినట్లు తేలింది. రెండు వారాల తర్వాత కూడా ఈ తేడా కనిపించింది. అయితే ఆరు వారాల తర్వాత మాత్రం ఈ నొప్పి తగ్గుదల అనేది అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పరిశోధకులు తెలిపారు. ఇక యాంగ్జైటీ, ఆందోళన విషయంలో మాత్రం ఫలితాలు మరింత కాలం వరకు బాగానే ఉన్నాయి. ప్రార్థన చేయించుకున్నవారిలో... ప్రేయర్ ముగిసిన వెంటనే ఆందోళన చాలావరకు తగ్గింది. ప్రార్థన వల్ల మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుని, అవి ఆరోగ్యానికి కొంత మేలుచేసి ఉండొచ్చని, అయితే ఇది సాధారణ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు చెబుతున్నారు. -
స్కిన్ ప్యాచ్తో చర్మ కేన్సర్కు మేలైన చికిత్స!
ఓ చిన్న స్కిన్ ప్యాచ్ ద్వారా చర్మ కేన్సర్కు ఓ సమర్థమైన, మేలైన చికిత్సను కనుగొనే పనిలో ఉన్నారు క్వీన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇందులో భాగంగా అత్యంత సన్నగా ఉండే సూదులతో కూడిన ఓ డిజాల్వబుల్ 3–డి ప్రింటెడ్ ప్యాచ్ను చర్మంపై కేన్సర్ ఉన్నచోట అతికిస్తారు. అలా అతికించిన ఈ ప్యాచ్ డిజాల్వబుల్ కావడంతో.. చర్మానికి తగిన మందును అందిస్తూ... ఈ క్రమంలో దానంతట అదే కరిగిపోయి, చర్మంలో కలిసిపోతుంది. అంతగా నొప్పి ఉండని ఈ చికిత్సలో ప్యాచ్పైన 5–ఫ్లోరోరేసిల్ అనే ఔషధంతో పాటు మన పసుపులో ఉండే ఔషధ గుణాలుండే పదార్థమైన కర్క్యుమిన్ కూడా ఉంటుంది.ఈ ఔషధాలు మైక్రోనీడిల్స్ ద్వారా చర్మ కేన్సర్ తాలూకు కేన్సరస్ కణాలను నేరుగా టార్గెట్ చేస్తూ వాటిని తుదముట్టిస్తాయి. ఈ ఔషధం విజయవంతమైతే అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. వాటిల్లో కొన్ని... ఎక్కడ కేన్సర్ సమస్యఉందో అక్కడికే ఔషధాన్ని నేరుగా పంపడం, నొప్పిలేకుండా ఔషధాన్నివ్వడం, శరీరంలోకి మందులు ఇవ్వాల్సిన అవసరాన్ని తగ్గించడం, మెడికల్ వృథా పదార్థాలను గణనీయంగా తగ్గించగలగడం వంటి లాభాలుంటాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ఇంకా ప్రయోగాలూ, పరిశీలన దశలోనే ఉంది. ఒకవేళ విజయవంతమైతే చర్మ కేన్సర్ చికిత్సలో ఇదో విప్లవాత్మకమైన మలుపు అయ్యే అవకాశముందంటున్నారు ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న పరిశోధకులు. -
‘మిద్దె’కు మద్దతిస్తే..‘అర్బన్’కు ఆరోగ్యమే!
సాక్షి, స్పెషల్ డెస్క్: నగరాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటల సాగు పెరుగుతున్నా, అది కేవలం గృహస్తుల హాబీగానే మిగిలిపోతోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ను మునిసిపల్ మాస్టర్ ప్లాన్లలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే మొత్తం ఆహారంలో సుమారు 70 శాతం నగరాల్లోనే వినియోగమవుతోందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) చెబుతోంది. విధానపరమైన చర్యల ద్వారా నగరాలను ‘ఎడిబుల్ సిటీ’లుగా అంటే.. పర్యావరణ అనుకూల, సుస్థిర ఆహారోత్పత్తి కేంద్రాలుగా మార్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.భువనేశ్వర్లో ఇటీవల జరిగిన అధ్యయనం మిద్దె తోటలపై ఆసక్తిని తెలియజెప్తోంది. 70% మంది గృహస్తులు మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్నా, 35% మాత్రమే ప్రస్తుతం పండిస్తున్నారు. 56% ప్రభుత్వ/విద్యా సంస్థల్లో ఖాళీ స్థలాలు, 67% సంస్థల్లో అనువైన టెర్రస్లు ఖాళీ స్థలాలున్నాయి. అయితే, అర్బన్ అగ్రికల్చర్ ప్రోత్సాహక విధానాల్లేవు. భువనేశ్వర్ మాదిరిగా ఇక్కడ కూడా లోతైన అధ్యయనాలు చేసి తగిన విధానాలు అమల్లోకి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఏం చెయ్యాలి?⇒ అర్బన్ అగ్రికల్చర్ విస్తరణకు స్థల కొరత, నీటి కొరత పెద్ద అవరోధాలు. వీటిని అధిగమించటానికి నిపుణులు కింది ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తున్నారు.⇒ వాణిజ్య భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలో రూఫ్టాప్ లేదా వర్టికల్ గార్డెనింగ్కు స్థలాన్ని తప్పనిసరి చేయటం.⇒ ఇళ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మురుగునీటి శుద్ధి వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను స్థానిక మిద్దె తోటలు, ఇంటిపంటల సాగుకు అనుసంధానించటం.⇒ తడి చెత్తతో కంపోస్టింగ్ చేసి నాణ్యమైన సేంద్రియ ఎరువులను పంపిణీ చేయటం.⇒ తోటలు పెంచే ఇళ్లకు ఆస్తి పన్నులో 5–10% రాయితీ, బిందు సేద్యం కిట్లపై సబ్సిడీలు అందించటం.⇒ ప్రజా స్థలాలు, భవనాల్లో ఆహారోత్పత్తిని పట్టణ ప్రణాళికలో భాగం చేసి స్థానిక మార్కెట్లతో అనుసంధానించటం.‘ఎడిబుల్ సిటీ’లకు విధానాల మద్దతువాతావరణ మార్పుల నేపథ్యంలో పట్టణాలు, నగరాల్లో కుటుంబాలకు తాజా, పోషక ఆహారాన్ని అందించడంలో అర్బన్ అగ్రికల్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరటి, మిద్దె, బాల్కనీ తోటలను విస్తరించటానికి అనుకూలమైన ప్రభుత్వ విధానాల మద్దతు అవసరం. వ్యవసాయ, పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖల సమన్వయంతో ‘ఎడిబుల్ సిటీల’ను అభివృద్ధి చేసి, పర్యావరణ అనుకూల నగరాలను తీర్చిదిద్దడం అత్యవసర వ్యూహం. – డా. వినీత కుమారి, డిప్యూటీ డైరెక్టర్, ‘మేనేజ్’, సెంటర్ ఫర్ అర్బన్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్ నగర ప్రణాళికలో భాగం చేయాలివాతావరణ మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వల్ల ఆహార పంపిణీ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతున్నందున మిద్దె తోటలు వంటి అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను నగర ప్రణాళికలో భాగం చేయాలి. ‘కోకోపోనిక్స్’వంటి మట్టిలేని ఆధునిక సాగు పద్ధతులు స్థల కొరత, నీటి కొరతను అధిగమించి స్థానిక ఆహార భద్రతను పెంచుతాయి.అందువల్ల రాష్ట్ర విధానాలు పట్టణ వ్యవసాయాన్ని, వ్యర్థాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించి నగరాలను పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దాలి. – డాక్టర్ డి. కలైవనన్, శాస్త్రవేత్త, భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్), బెంగళూరుమిద్దెతోటల్లో ఎల్నినో జాగ్రత్తలుఎల్నినో వర్షాభావ పరిస్థితుల్లో మిద్దె తోటల్లో నీటిని ఆదా చేయడం ముఖ్యం. కుండీల్లో ఎండుటాకులు లేదా కొబ్బరి పొట్టుతో మల్చింగ్ చేసి, తేమ ఆవిరవకుండా చూడాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే అవసరమైనంత నీరు పోయాలి. బాల్కనీల్లో బాటిల్ డ్రిప్ వాడడం, ఎండ తీవ్రతను తగ్గించేందుకు 50% గ్రీన్ షేడ్ నెట్ ఏర్పాటు చేయటం వల్ల తక్కువ నీటితో కూరగాయలు, పండ్ల మొక్కలను రక్షించుకోవచ్చు.– తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సీనియర్ మిద్దెతోట నిపుణుడు, హైదరాబాద్ -
నవ్వుతో నెట్టింట గెలిచాడు! ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్!!
ఆ నవ్వు ప్రపంచాన్నే చుట్టేసింది.. ఎన్నో మీమ్స్, రీల్స్కి కేరాఫ్ అడ్రస్ అయింది.. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.. కానీ.. ఆ నవ్వు వెనుక ఓ బతుకు పోరాటం ఉంది.. పేదరికం కారణంగా మూడో తరగతితోనే చదువుకు దూరమైన ఓ బాలుడి కథ ఉంది.మొబైల్ లేకున్నా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ.. ప్రస్తుతం అరుణ్ షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ, సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. నటనపై ఆసక్తితో, తన కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నాడు. 15 నుంచి 20 నిమిషాల నిడివితో కూడిన 20 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. సొంత మొబైల్ లేకున్నప్పటికీ ఇతరుల మొబైల్, కెమెరాలు వాడి తన, ఇతరుల చానళ్లలో షార్ట్ ఫిల్మ్స్ పోస్ట్ చేస్తున్నాడు. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నానని అరుణ్కుమార్ ‘సాక్షి’తో తెలిపాడు.అయితే, అదే నవ్వు..అతడి జీవితానికి కొత్త దారిని చూపించింది. లారీ క్లీనర్గా చిరుజీవితం గడుపుతున్న బాలుడిని సోషల్ మీడియా స్టార్గా చేసింది. మధ్యలో ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించాలనే అతడి ఆశకు ఊపిరిపోసింది. ఆ నిష్కల్మషమైన నవ్వునే తన కలలకు మెట్లుగా చేసుకుని ముందుకెళ్లేలా చేసింది. అతడే అరుణ్కుమార్. రీల్స్ చివర్లో అతడి నవ్వును చూస్తే చాలు.. మనసుకు ఎంతో హాయి అనిపిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన బచ్చల లక్ష్మీసమ్మయ్య, రాజేశ్వరిల కుమారుడు అరుణ్కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మూడో తరగతితోనే ఆపేశాడు. చదువుకోవాలనే ఆశ ఉన్నా, కుటుంబ పరిస్థితులు అతన్ని కూలి పనుల వైపు నడిపించాయి. అదే గ్రామానికి చెందిన తన బావ నెహ్రూ లారీపై క్లీనర్గా పని చేశాడు. ఆ సమయంలో భూపాలపల్లిలో లారీలో నుంచి బొగ్గు అన్లోడ్ చేసే క్రమంలో టీ తాగుతుండగా నెహ్రూ వేసిన ఓ జోక్కు అరుణ్కుమార్ తనివితీరా నవ్వాడు. ఆ నిష్కల్మషమైన, గుండెల్లోంచి వచ్చిన నవ్వు నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందంటే, ఆ వీడియో కొద్ది కాలంలోనే వైరల్ అయిపోయింది. మీమ్స్, రీల్స్లో ఎక్కడ చూసినా అరుణ్ నవ్వే దర్శనమివ్వడం మొదలైంది. తన నవ్వు తెచ్చిన గుర్తింపు అరుణ్ జీవితానికి కొత్త దిశను చూపించింది. బావ నెహ్రూ ప్రోత్సాహంతో చదువుకోవాలనే తన పాత కలని గుర్తుచేసుకున్నాడు. ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్షలు రాసి, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. - భూపాలపల్లి -
టికెట్.. టికెట్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్న ఆర్టీసీ డిపోగా కామారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడ మొత్తం 212 మంది కండక్టర్లుండగా.. ఇందులో 85 మంది మహిళా కండక్టర్లే కావడం విశేషం. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా మహిళలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం లేదు. కొంత ఆలస్యమైనా సరే ఆర్టీసీ బస్సు కోసం వేచిచూస్తున్నారు.కొన్నిసార్లు బస్సుల్లో నిల్చునేందుకు కూడా స్థలం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో బస్సు నడిపే డ్రైవర్తో పాటు టికెట్ ఇచ్చే కండక్టర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిండా ప్రయాణికులున్నా, కాలుకదిలించడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులున్నా ఓపికగా పనిచేస్తున్నారు. మహిళా కండక్టర్లు సింగిల్ క్రూ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలన్నీ చేస్తున్నారు.రద్దీ రూట్లోనే ఎక్కువ మంది...కామారెడ్డి బస్ డిపో పరిధిలో మహిళా కండక్టర్లు ఎక్కువగా రద్దీ రూట్లలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఎక్కువ మంది ప్రయాణించే బాన్సువాడ, కరీంనగర్, నిజాంసాగర్, రామాయంపేట రూట్లలో రెగ్యులర్గా డ్యూటీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటలలోపు డిపోనకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెల్లవారకముందే మేల్కొని ఇల్లు, వాకిలి శుభ్రం చేసి, వంట సిద్ధం చేసి సద్దిమూట కట్టుకొని డిపోనకు చేరుకుంటారు. 85 మందిలో దాదాపు అందరూ రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలోనే డ్యూటీ చేస్తున్నారని డిపో మేనేజర్ దినేశ్కుమార్ ‘సాక్షి’తో తెలిపారు.భారం పెరిగింది..మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సమస్యలున్నా డ్యూటీ డ్యూటీయే కదా.. మా డిపోలో ఎక్కువ మంది మహిళా కండక్టర్లు ఉండడాన్ని గర్వంగా ఫీలవుతాం. – మహేశ్వరి, కండక్టర్ అన్నం పెడుతోంది...పద్నాలుగేళ్లుగా డ్యూటీ చేస్తున్నా. కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది. పనిలో అలసిపోతాం. అయినా, డ్యూటీకి వెళ్లాల్సిందే. కండక్టర్ ఉద్యోగమే అన్నం పెడుతున్న ప్పుడు ఇబ్బంది అయినా డ్యూటీ సక్రమంగా చేయాల్సిందే కదా. – శైలజ, కండక్టర్ -
ఆట.. మీ జీన్స్లో ఉందా?
ఒక చిన్న డీఎన్ఏ నమూనా.. దేశంలో ఒక పెద్ద క్రీడా భవిష్యత్తుకు క్లూ కానుంది! మన క్రీడాకారులు మైదానంలో చెమట చిందించక ముందే.. వారి జన్యువులను ల్యాబ్లో విశ్లేషించి ఎవరు భవిష్యత్ చాంపియన్లు కాగలరో గుర్తించే ప్రయత్నం మొదలైంది! ఎవరు ఏ క్రీడలో రాణించగలరు? ఎవరి శరీరం ఏ ఆటకు అనువుగా ఉంటుంది? ఎవరిలో ఎంత శక్తి దాగుంది? అనే ప్రశ్నలకు సమాధానాలను డీఎన్ఏలో వెతికే సరికొత్త ప్రయోగానికి గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.అహ్మదాబాద్ వేదికగా 2030లో జరగే కామన్వెల్త్ క్రీడల్లో చాంపియన్లుగా నిలిచే సత్తా ఉన్న వారెవరో వెలికితీసేందుకు దేశంలోనే తొలిసారిగా గుజరాత్ ప్రభుత్వం క్రీడా జీనోమిక్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రీడాకారుల జన్యు సమాచారాన్ని వారి శారీరక, క్రీడా ప్రదర్శన వివరాలతో అనుసంధానించి సమగ్ర ప్రొఫైళ్లను రూపొందించనుంది. వాటి ఆధారంగా క్రీడా ప్రతిభను గుర్తించడంతోపాటు అందుకు అనువైన క్రీడాశిక్షణను రూపొందించడం, క్రీడాకారులకు అనువైన క్రీడను ఎంపిక చేయడం, గాయాల నిర్వహణ వంటి అంశాలను మరింత మెరుగ్గా చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమాన్ని గుజరాత్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అమలు చేస్తోంది. ఇందుకోసం గుజరాత్ అథ్లెట్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించనుంది. ఇందులో క్రీడాకారుల జన్యు, శారీరక, క్రీడా ప్రదర్శనకు సంబంధించిన సమాచారాన్ని సమీకరిస్తారు. ‘‘క్రీడా ప్రతిభను గుర్తించి, క్రీడాకారులను అభివృద్ధి చేసేందుకు మరింత శాస్త్రీయ, ఆధారిత విధానాన్ని రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం’’ అని గుజరాత్ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి అర్జున్ మోఢ్వాడియా తెలిపారు.ఈ ఏడాది 2,000 డీఎన్ఏ నమూనాలుమొదటి దశలో టెన్నిస్ క్రీడాకారుల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించనున్నారు. తదుపరి దశలో ఆర్చరీ, ఫెన్సింగ్, జూడో, షూటింగ్ క్రీడాకారులను చేర్చనున్నారు. ఈ ఏడాది సుమారు 2,000 నమూనాలు, వచ్చే ఏడాది 10,000 నమూనాలు సేకరించి విశ్లేషించాలని గుజరాత్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 14 ఏళ్లలోపు, 14 నుంచి 18 ఏళ్లలోపు, 18 ఏళ్లు పైబడిన క్రీడాకారుల కోసం వేర్వేరు విభాగాలతో డేటాబేస్ రూపొందించనున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి చాంపియన్లకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, టెన్నిస్, తైక్వాండో, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, ఆర్చరీ, షూటింగ్, చెస్ తదితర క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని డేటాబేస్లో చేర్చనున్నారు.గాయాలు, శిక్షణపై కూడా ఉపయోగంజన్యు లక్షణాలు కండరాల నిర్మాణం, ఓర్పు, జీవక్రియ, వ్యాయామానికి శరీరం స్పందించే తీరు, కోలుకునే వేగం, గాయాలకు గురయ్యే అవకాశాలు వంటి అంశాలతో ఏ మేరకు సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకునేందుకు స్పోర్ట్స్ జీనోమిక్స్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ‘‘జన్యు, జీవసంబంధ సమాచారాన్ని సమీకరించడం ద్వారా ప్రతి క్రీడాకారుడికి మరింత సమగ్ర ప్రొఫైల్ను రూపొందించడమే గుజరాత్ నమూనా లక్ష్యం. తద్వారా క్రీడాకారుల ప్రతిభపై మరింత లోతైన అవగాహన లభిస్తుంది’’ అని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి బి. భారతి తెలిపారు. -
విశ్వ వీక్షణకు మూడో కన్ను!
విశ్వరహస్యాలను ఛేదించేందుకు మరో మహా ప్రయత్నం మొదలు కానుంది! హబుల్, జేమ్స్ వెబ్ టెలిస్కోపులకు వందరెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూడగల టెలిస్కోపు ప్రయోగానికి నాసా, స్పేస్ఎక్స్లు సిద్ధమవుతుండటం దీనికి కారణం. అన్నీ సవ్యంగా సాగితే నేడు అమెరికాలోని ఫ్లారిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్–ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్పై ఈ టెలిస్కోపు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరానికి పయనం కానుంది. లగ్రాంజ్ పాయింట్–2గా పిలిచే చోటు నుంచి విశ్వంపై ఓ కన్నేయనుంది ఈ టెలిస్కోపు. ఈ ప్రాంతంలో సూర్యుడు, భూముల గురుత్వ శక్తి దాదాపు సమానంగా ఉండటం వల్ల టెలిస్కోపు స్థిరంగా ఒకే చోటులో ఉండగలదు. కెన్నెడీ స్పేస్ సెంటర్లోని 39ఏ లాంచ్ కాంప్లెక్స్లో ఆదివారం ఉదయం 7.26 గంటలకు జరగనున్న ఈ ప్రయోగానికి సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. నాసా మొట్టమొదటి ప్రధాన ఖగోళ శాస్త్రవేత్త ‘నాన్సీ గ్రేస్ రోమన్’పేరు ఈ టెలిస్కోపునకు పెట్టారు. ‘మదర్ ఆఫ్ హబుల్’గా నాన్సీ గ్రేస్ రోమన్కు పేరు. విశాల విశ్వం రహస్యాలను ఛేదించేందుకు నాసా ఉపయోగిస్తున్న టెలిస్కోపుల్లో నాన్సీ గ్రేస్ రోమన్ మూడోది. హబుల్ టెలిస్కోపు సుమారు 36 ఏళ్లుగా భూమికి 500 కిలోమీటర్ల ఎత్తులోంచి విశ్వ గవాక్షంగా పనిచేస్తోంది. సుమారు 2.4 మీటర్ల వెడల్పుతో ఉన్న దర్పణం (లెన్స్)తో సుదూర పాలపుంతలు, నక్షత్ర మండలాలు (నెబ్యులే), గ్రహాలను దృశ్య, పరారుణ కాంతుల్లో చూస్తూ ఫొటోలు పంపుతోంది. నాసా 2021లో ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్–2 నుంచి విశ్వం ఏర్పడిన తొలినాళ్ల నాటి పాలపుంతలు, సౌర కుటుంబానికి ఆవల ఉన్న గ్రహాలు (ఎక్సోప్లానెట్లు), వాటి వాతావరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. తాజాగా ప్రయోగిస్తున్న నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోపు దృశ్యకాంతితోపాటు పరారుణ కాంతిలోనూ విశ్వాన్ని చూడగలదు. హబుల్, జేమ్స్ వెబ్లతో పోలిస్తే ఇది వంద రెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూడగలదు. ఎక్సోప్లానెట్ల లెక్కలు, కృష్ణ శక్తి, కృష్ణ పదార్థం (డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్) రహస్యాలను తేల్చడం దీని లక్ష్యాల్లో కొన్ని. ప్రయోగ లక్ష్యాలు → కృష్ణ పదార్థం, విశ్వ వ్యాపనానికి కారణమైన కృష్ణ శక్తిపై పరిశీలన (మహా విస్ఫోటం తరువాత విశ్వం అంతకంతకూ విస్తరిస్తోంది. దీన్నే విశ్వవ్యాపనం అంటాం) → ఎక్సోప్లానెట్ల లెక్కలు, చిత్రాలు. → వందల కోట్ల పాలపుంతలను గుర్తించి విశ్వం ఆకారానికి ఒక రూపు? ప్రధాన పరికరాలు1. వైడ్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంట్ 300 మెగాపిక్సెళ్ల డిజిటల్ కెమెరాలా పనిచేస్తుంది ఇది. హబుల్ కంటే వందరెట్లు ఎక్కువ ప్రాంతాన్ని చూసేందుకు అవకాశం కలి్పస్తుంది. అదే సమయంలో రెజల్యూషన్లో పెద్ద మార్పు ఉండదు. పాలపుంతల సర్వేకు, కృష్ణ శక్తి, వందలకోట్ల నక్షత్రాలు, పాలపుంతల అధ్యయనానికి ఉపయోగిస్తారు. 2. కరోనాగ్రాఫ్ ఇన్స్ట్రుమెంట్ బలహీనమైన కాంతితో ప్రకాశించే ఎక్సోప్లానెట్ల ఫొటోలు తీసే సమయంలో నక్షత్ర కాంతిని నిరోధిస్తుంది. ఎక్సోప్లానెట్లపైన వాతావరణాన్ని, వెలుతురు కారణంగా కనిపించని గ్రహాలను గుర్తించేందుకూ సాయపడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'బ్యూటీ ఫుల్' బిజినెస్
విశాఖపట్నంలోని ఎండాడకు చెందిన శ్రీహరి వయసు 29 ఏళ్లు. బీటెక్ చదివాడు. అలాగే, అప్పలరాజు వయసు 32. ఎంబీఏ చదివాడు. వీరిద్దరూ మార్కెట్లో డిమాండ్ ఉన్న సెలూన్ రంగాన్ని గుర్తించి సుమారు 850 చదరపు అడుగుల స్థలంలో మొదట హెయిర్ కట్, బియర్డ్ గ్రూమింగ్, ఫేషియల్, హెయిర్ స్పా సేవలు ప్రారంభించారు. కస్టమర్ల అభిరుచి తెలుసుకున్న తర్వాత వీరు హెయిర్ కలర్, హెయిర్ ట్రీట్మెంట్స్, వెడ్డింగ్ గ్రూమింగ్ ప్యాకేజీలను జోడించారు. ఇక ప్రచారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చుచేయకుండా సోషల్ మీడియాను ఉపయోగించారు. కొత్త హెయిర్స్టైల్స్, మేకోవర్ వీడియోలను స్థానికంగా ప్రచారం చేయడంతో క్రమంగా రిపీట్ కస్టమర్లు పెరిగారు. సేవల సంఖ్య కంటే కస్టమర్ మళ్లీ రావడమే వ్యాపారానికి బలంగా మార్చుకున్నారు.బెజవాడకు చెందిన వంశీది తొలుత సాదాసీదా బార్బర్ షాపు. యువత అవసరాలను గుర్తించి మార్కెట్ డిమాండ్కు తగ్గట్లుగా తన వ్యాపారాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా మెన్స్ గ్రూమింగ్పై దృష్టిపెట్టాడు. సాధారణ హెయిర్ కట్తో ఆగకుండా బియర్డ్ డిజైనింగ్, హెయిర్ కలర్, ఫేషియల్, స్పా, పార్టీ–వెడ్డింగ్ గ్రూమింగ్ సేవలను ఒకేచోట అందుబాటులోకి తెచ్చాడు. వాట్సాప్ రిమైండర్లు, పండుగ ఆఫర్లు, కాంబో ప్యాకేజీలతో కస్టమర్లను రిపీట్ విజిట్లకు తీసుకురావడంపై దృష్టిపెట్టాడు. ‘బార్బర్ షాప్’ నుంచి ‘గ్రూమింగ్ స్టూడియో’గా మారడం ద్వారా పురుషుల్లో పెరుగుతున్న వ్యక్తిగత సంరక్షణ ఆసక్తిని వ్యాపార అవకాశంగా మలుచుకున్నాడు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సెలూన్ పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోందనడానికి ఈ రెండు ఉదంతాలే ఉదాహరణ. మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా సెలూన్ల సేవలూ మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం హెయిర్ కట్తో పాటు షేవింగ్కే పరిమితమైన ఈ సెలూన్ల ఓనర్లు ఇప్పుడు మార్కెట్ డిమాండ్లతో హెయిర్ స్పా, స్కిన్ కేర్, హెయిర్ కలర్, మేకప్, గ్రూమింగ్ ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తున్నారు. మారుతున్న జీవనశైలి, స్వీయ రక్షణపై యువతలో అవగాహన పెరగడంతో ఈ వ్యాపారం ఇప్పుడొక విలాసవంతమైన సేవ నుండి నిత్యావసర సేవగా మార్పు చెందింది. మెట్రో నగరాల నుంచి పట్టణాల వరకు ఈ తరహా బ్యూటీ సేవలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. దీంతో కొత్తతరం వ్యాపార రంగాల్లో బ్యూటీ, గ్రూమింగ్ బిజినెస్ ఒకటిగా మారింది. ఫలితంగా ఉద్యోగం కోసం ఎదురుచూడటం కంటే ఈ రంగం వైపు కూడా నేటి యువత దృష్టిపెడుతోంది. నగరాల్లోనే మూడో వంతు..రాష్ట్రంలో 2025 అక్టోబరు నాటికి 7,020 బ్యూటీ సెలూన్లు ఉన్నట్లు ‘బిజినెస్ డేటా’ వెల్లడించింది. 2023తో పోలిస్తే ఇది 5.78 శాతం పెరుగుదల. ముఖ్యంగా ఇందులోని 6,653 సెలూన్లు (94.77 శాతం) సింగిల్ ఓనర్ వ్యాపారాలే కావడం విశేషం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మరో 500 వరకు సెలూన్లు ఏర్పాటైనట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని సెలూన్ వ్యాపారంలో ప్రధాన నగరాల వాటా గణనీయంగా ఉంది. విశాఖపట్నంలో 909, విజయవాడలో 718, గుంటూరులో 512 సెలూన్లు ఉన్నాయి. ఈ మూడు నగరాల్లోనే 2,139 సెలూన్లు ఉన్నాయి. అంటే.. రాష్ట్రంలోని మొత్తం సెలూన్లలో ఇవి సుమారు 30.5 శాతం. నగరాల్లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ యువతలో గ్రూమింగ్పై పెరుగుతున్న ఆసక్తి కొత్త మార్కెట్ను సృష్టిస్తోంది. పెద్ద బ్రాండ్లతో పాటు చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించే వారికి కూడా ఈ రంగంలో అవకాశాలున్నాయని సూచిస్తోంది. సెలూన్ మార్కెట్ పైపైకి.. భారత సెలూన్ మార్కెట్ విలువ 2024లో సుమారు రూ.1,01,949 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) వెల్లడించింది. 2033 నాటికి ఇది రూ.2,01,185 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో సుమారు 7.9 శాతం (సీఏజీఆర్ – కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) వృద్ధి నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. మరోవైపు.. సెలూన్ వ్యాపారం యజమానికి మాత్రమే ఆదాయం ఇవ్వదు. హెయిర్ స్టైలిస్టులు, బ్యూటీషియన్లు, మేకప్ ఆర్టిస్టులు, రిసెప్షనిస్టులు, మేనేజర్లకు కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది. అందుకే నైపుణ్య శిక్షణతో పాటు మార్కెటింగ్, కస్టమర్ మేనేజ్మెంట్, డిజిటల్ ప్రమోషన్పై అవగాహన ఉన్న యువత ఈ రంగంలో వేగంగా ఎదిగే అవకాశం ఉంది. చిన్న పట్టణాల్లోనూ అవకాశాలు.. బ్యూటీ, పర్సనల్ కేర్పై వినియోగదారుల ఖర్చు పెరగడం, యువతలో గ్రూమింగ్పై ఆసక్తి, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలు ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేస్తున్నాయి. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో మార్కెట్ ఇప్పటికే పోటీగా మారింది. అయినా జిల్లా కేంద్రాలు, చిన్న పట్టణాలు, మండల కేంద్రాల్లో ఇంకా అవకాశాలు ఉన్నాయి. పెద్ద నగరాల్లో ఉన్న ప్రీమియం సేవలను స్థానిక అవసరాలకు తగ్గ ధరల్లో అందించగలిగితే చిన్న పట్టణాల్లోనూ మంచి కస్టమర్ బేస్ ఏర్పడే అవకాశం ఉంది. -
నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?
హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్ఫ్లడ్స్ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.బుధవారం నేపాల్లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్ సరిహద్దులోని చైనా రీజియన్లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.చైనా చరిత్రలో మాయని మచ్చనేపాల్ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్ ప్రావిన్స్లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్ డ్యామ్’గా పేరుపొందింది.కానీ 1975 ఆగస్టులో టైఫూన్ నినా కారణంగా హెనాన్లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.ఒక రాత్రిలో 62 డ్యామ్లు!1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్ డ్యామ్ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 2 లక్షల మందికిపైనే..ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్టన్, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. ప్రస్తుతం నేపాల్–టిబెట్ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.ఇదీ చదవండి: ఇరాన్ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా? -
వాతావరణ మార్పుల ప్రభావమే!
→ జూన్, 2013... కేదార్నాథ్ క్లౌడ్బరస్ట్. ఆరువేల మంది మృతి → ఫిబ్రవరి 2021... రిషిగంగ నందాదేవీ వద్ద మంచు అవపాతం... 200 మంది మరణం. రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు ధ్వంసం. → ఆగస్టు 2025... ఉత్తరకాశీలోని ధరాలి వద్ద ఖీర్ గంగాపై క్లౌడ్బరస్ట్... మెరుపు వరదలతో నలుగురి మరణం. యాభైమంది గల్లంతు. → తాజాగా... నేపాల్లో హిమనదం కుప్పకూలి మెరుపు వరదలు.. → వందలాది మంది మృతి.. ఆస్తినష్టం!హిమాలయ పర్వత ప్రాంతంలో సంభవించిన పై నాలుగు భారీ ప్రకృతి విపత్తులకు కారణం ఏమిటి? వాతావరణ మార్పులే అంటున్నారు హిమనీనదాల నిపుణుడైన మనీశ్ మెహతా. కేదార్నాథ్, రిషిగంగ, ధరాలి ప్రమాదాలపై దీర్ఘకాలం అధ్యయనం చేసిన ఈయన హిమాలయ పర్వత ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులను, ప్రమాద ఘటనలను వేర్వేరుగా చూడలేమని స్పష్టం చేస్తున్నారు. భూతాపోన్నతి ఫలితంగా ఈ ప్రాంతంలోని చాలా హిమనీనదాల కుంచించుకుపోతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనివల్ల ఒక ప్రమాదముంది. మంచు, నీటితో కూడిన ప్రాంతం తగ్గిపోవడం వల్ల అడుగున వదులుగా ఉండే మట్టి, రాళ్లు, శిథిలాలు అలాగే ఉండిపోతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే ఈ ప్రాంతాల్లో నేల స్థిరంగా ఉండదు. ఎప్పుడైనా ఆకస్మాత్తుగా భారీ వర్షాలు పడినా, పెద్ద మొత్తంలో మంచు కరిగినా ఈ మట్టి, రాళ్లు చాలా సులువుగా వాలు ఉన్నవైపు వెళ్లిపోతాయి. అతితక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురిస్తే వదులుగా ఉన్న మట్టి, రాతిప్రాంతం త్వరగా నీటితో నిండిపోయి అకస్మాత్తుగా కిందివైపుకు కదులుతాయని, ఇది కాస్తా కొండచెరియలు విరిగిపడేందుకు లేదా రాతి శిథిలాలు దొర్లేందుకు కారణమవుతాయని ఆయన వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఎత్తైన పర్వతప్రాంతాల్లో గడ్డకట్టిన మంచు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉంటాయని, దీనివల్ల అక్కడ తాత్కాలికంగా ఒక డ్యామ్ లాంటి నిర్మాణం ఏర్పడుతుందని చెప్పారు. ఈ తాత్కాలిక అడ్డుగోడ పగిలిపోతే అప్పటివరకూ అక్కడకు చేరిన నీరు, మంచు ఒక్కసారిగా చాలా వేగంగా దిగువ ప్రాంతాలవైపు ప్రయాణిస్తాయని తెలిపారు. కేదార్నాథ్సహా మిగిలిన చోట్ల వచ్చిన విపత్తుల్లోనూ నీటితోపాటు భారీ బండరాళ్లు కూడా దొర్లుకుంటూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నీరు మాత్రమే ప్రవహిస్తే పుట్టే శక్తికంటే ఇలా రాళ్లతో కూడిన ప్రవాహపు శక్తి చాలా ఎక్కువని... మార్గమధ్యంలో ఉండే రహదారులు, వంతెనలు, భవనాలు ఏవీ తట్టుకోలేవని తెలిపారు. వాస్తవానికి హిమాలయ పర్వత ప్రాంతంలో కొండచెరియలు విరిగి పడటం కొత్తేమీ కాదని, కానీ వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు ఇలాంటి ఘటనలతో రాగల ప్రమాదాల గురించి పనరాలోచన చేయాల్సి ఉందని ఆయన హెచ్చరించారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలతోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ కావడం గమనించదగ్గ మార్పని మెహతా చెబుతున్నారు. గతంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా ఎక్కువగా ఉండేదని, ఫలితంగా రాత్రిపూట మంచు కరిగే వేగం తగ్గేదని ఆయన వివరించారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూండటంతో హిమనీనదాలు పగలు, రాత్రి కరుగుతున్నాయని వివరించారు. భూతాపోన్నతితోపాటు హిమనీ నదాలు కుంచించుకుపోవడం, వర్ష, హిమపాతాల్లో వచ్చిన తేడాలు, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల, వదులు మట్టితో కూడిన హిమనీ నదీ గర్భాలు, లోతైన పర్వత సానువులు వంటిని అన్నీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మనీశ్ మెహతా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్కు మెడోగ్ ముప్పు?
నేపాల్లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు... వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తినష్టమూ తీవ్రంగానే ఉంది. అయితే నేపాల్ కాదు కానీ... భారత్ ఇలాంటి మరో ముప్పు ముంగిట్లో ఉందా? అవునంటున్నారు నిపుణులు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతి భారీ జలవిద్యుత్తు ప్రాజెక్టు ఇందుకు కారణమంటున్నారు వారు. మెడోగ్ పవర్ స్టేషన్గా పిలుస్తున్న ఈ భారీ డ్యామ్ను 2033లోగా పూర్తి చేసేందుకు చైనా పరుగులు పెడుతోంది. యార్లుంగ్ సాంగ్పో నదిపై 16,700 కోట్ల డాలర్ల ఖర్చుతో అరవైవేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ యార్లుంగ్ సాంగ్పో నదే అరుణాచల్ ప్రదేశ్లో సియాంగ్ నదిగా ఆ తరువాత అసోంలో బ్రహ్మపుత్రగా మారి బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. మెడోగ్ పవర్స్టేషన్ నిర్మాణం ఒక రకంగా మన నెత్తిన వాటర్ బాంబు లాంటిది. హిమాలయ పర్వత శ్రేణిలో ఉండటం ఒక కారణమైతే... ఇది భూకంపాలు జరిగే ప్రాంతంలో కడుతూండటం ఇంకో కారణం. చైనా భూగర్భ శాస్త్రవేత్తలు నెల రోజుల క్రితమే ఇక్కడ ఒక అధ్యయనం జరిపి.. మెడోగ్ పవర్స్టేషన్ పైజెన్ ఫాల్ట్పైనే ఉందని తేల్చారు. చిన్నపాటి భూకంపం వచ్చినా దాని ప్రభావం దిగువన ఉన్న మనపై పడుతుంది. యార్లుంగ్ సాంగ్పోపై పెత్తనం చైనాదే కావడం... దిగువన మనం ఉండటం భారత్ ఆందోళనకు మరో కారణం. ప్రాజెక్టు ద్వారా నీటి విడుదలలో ఏ చిన్న మార్పు వచ్చినా మనకు వరద ముప్పు తప్పదన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు నమోదైతే అరుణాచల్ ప్రదేశ్తోపాటు అసోం, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆస్తి, ప్రాణనష్టాలు జరిగే అవకాశముంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి విడుదల తగ్గి వ్యవసాయానికి సమస్యలొస్తాయి. అయితే... మెడోగ్ వపర్ స్టేషన్తో వచ్చే సమస్యలకు పరిష్కారంగా భారత్ సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ బహుళార్థక ప్రాజెక్టును నిర్మిస్తోంది. కాకపోతే ఇదొక్కటే త్రీగార్జెస్ డ్యామ్ కంటే పెద్దదైన మెడోగ్ బలాన్ని తట్టుకోగలదా అన్నది ప్రశ్న!!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రీల్స్తో రీచ్
సోషల్ మీడియా రీల్స్. ప్రస్తుతం దేశాన్ని కమ్మేస్తున్న మేనియా ఇదే. కుర్రకారు నుంచి వృద్ధుల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్.. ఫోన్లో రీల్స్ను స్క్రోల్ చేయడం సర్వ సాధారణ మైపోయింది. భారతీయ మార్కెట్ను సైతం రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న కొత్త ఉత్పత్తుల సమాచారం తెలుసుకునేందుకు.. వివిధ ఉత్పత్తులతో సరిపోల్చేందుకు.. ఏ ఉత్పత్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకునేందుకు కూడా సగటు భారతీయులు రీల్స్పైనే ఆధార పడుతున్నారు. ప్రధానంగా జెన్జీ తరం సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాలను సైతం రీల్స్ మేనియా ప్రభావితం చేస్తోందని మెటా తాజా సర్వే వెల్లడించింది. ప్రధానంగా కాస్మొటిక్స్, ఫ్యాషన్, ఫిట్నెస్, క్రీడలు, ఇతర యాక్ససరీస్ ఉత్పత్తుల విక్రయాలను సోషల్ మీడియా రీల్స్ ప్రభావితం చేస్తున్నాయి. రీల్స్ చూడాలి.. తరువాతే కొనాలి⇒ జెన్జీ తరంలో 81 శాతం మంది కొత్త ఉత్పత్తుల గురించి రీల్స్ ద్వారానే తెలుసుకుంటామన్నారు. వాటిలో 66 శాతం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుంటున్నామని.. 47 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ⇒ 76 శాతం మంది మహిళలు తమ కొనుగోలు నిర్ణయాలను రీల్స్ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ⇒ గ్రామీణ ప్రాంతాల ఖాతాదారుల్లో 76 శాతం మంది ఆర్థిక విషయాలపై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు రీల్స్పై ఆధారపడుతున్నారు.‘మెటా’ ఏం తేల్చిందంటే..⇒ ‘మెటా ఇంపోసోస్ –2026’ పేరిట విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కసారైన రీల్స్ చూడాల్సిందే⇒ భారత్లో మెటా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఖాతాదారుల్లో 90 శాతం మంది రీల్స్ను చూస్తున్నారు. అతి తక్కువ నిడివి గల వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.⇒ జెన్జీ తరానికి చెందిన వారిలో 98 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తున్నట్టు చెప్పారు. ⇒ మెటా ఖాతాదారులైన మహిళల్లో 96 శాతం మంది రోజుకు ఒక్కసారైన రీల్స్ చూస్తామన్నారు.⇒ అధిక ఆదాయం కలిగిన వర్గాల్లో 88 శాతం మంది తాము రోజుకు ఒక్కసారైనా రీల్స్ చూస్తామన్నారు. -
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు. మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..అమ్మ సంకోచం.. నాన్న సరే...సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను. వ్యతిరేకతను ఎదుర్కొన్నా...గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది. ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్తో పాటు భారత్లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.కెరీర్గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి. ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది. అమ్మాయిలూ... అలా చేయండిఅమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.– సత్యబాబు, సాక్షి -
చనిపోని దేహంతో.. చెడిపోని ప్రాణంతో!
మనిషి శరీరాన్ని పోలిన యంత్రుడు మరమనిషి. కానీ మనిషికి సాధ్యమైన పనులను మరింత వేగంగా, కచ్చితంగా చేయగలిగే శక్తి!. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ దృశ్యాలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. కృత్రిమ మేధ (AI), రోబోటిక్స్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. మనిషి, యంత్రం మధ్య ఉన్న తేడాను రోజురోజుకూ తగ్గిస్తోంది. ఈ మార్పునకు తాజా ఉదాహరణే ‘టియాన్గాంగ్ అల్ట్రా’.చైనా మరోసారి సాంకేతిక ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. ఈసారి కారణం కారు కాదు, క్షిపణి కాదు.. ‘టియాన్గాంగ్’ (Tiangong) అనే హ్యూమనాయిడ్ రోబోట్. మనిషిలా రెండు కాళ్లపై నడవడం, చకచకా మెట్లు ఎక్కడం, ఎత్తుపల్లాలపై బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం, పరిసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాలతో ఈ రోబోట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్ పరిశ్రమలు, ఆరోగ్య సేవలు, విపత్తు నిర్వహణలో టియాన్గాంగ్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.జస్ట్ 8.86 సెకన్లలోనే..బీజింగ్లో జరుగుతున్న 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్లో.. 16 దేశాలకు చెందిన సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఇందులో టియాన్గాంగ్ అల్ట్రా తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల పరుగును కేవలం 8.86 సెకన్లలో పూర్తి చేసింది. ఇంతకు ముందు ఇదే రోబోట్ 9.39 సెకన్లతో ఉసేన్ బోల్డ్ రికార్డును అధిగమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టియాన్గాంగ్ కేవలం నడిచే రోబోట్ కాదు. పరుగులో వేగాన్ని పెంచుకుంటూనే తన శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవడం, అడుగుల్లో చిన్న మార్పులు చేసుకోవడం, ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా కదలికలను సరిచేసుకోవడం దీని ప్రత్యేకత. అలా బాక్సింగ్ సహా పలు కేటగిరీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది.అసలు టియాన్గాంగ్ అంటే?టియాన్గాంగ్ అనే చైనీస్ పదానికి స్వర్గ భవనం అని అర్థం. మనిషి శరీర నిర్మాణాన్ని పోలిన పూర్తి పరిమాణ హ్యూమనాయిడ్ రోబోట్ ఇది. బ్రెయిన్ను బట్టి మనిషి శరీరం ముందుకు నడుస్తుంది. ఇదే టియాన్గాంగ్ విషయంలో ఆ పనిని సెన్సర్లు, కంప్యూటింగ్ వ్యవస్థ, కృత్రిమ మేధ(AI) చేస్తాయి. చుట్టూ ఉన్న వస్తువులు, అడ్డంకులు, నేల పరిస్థితులను గుర్తించి.. వాటికి అనుగుణంగా తన కదలికలను మార్చుకుంటుంది.కళ్లుగా కెమెరాలు.. చెవులే సెన్సర్లుటియాన్గాంగ్కు మనిషిలా కళ్లూ, చెవులూ ఉండవు కదా! వాటి పనిని చేసే సాంకేతిక వ్యవస్థ ఉంది. కెమెరాలు, లిడార్ సెన్సర్లు, ఫోర్స్ సెన్సర్లు, ఇతర సెన్సింగ్ వ్యవస్థలు పరిసరాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటాను ఏఐ ఆధారిత కంప్యూటింగ్ వ్యవస్థ విశ్లేషిస్తుంది. ముందున్న అడ్డంకి ఎంత దూరంలో ఉంది? నేల సరిగ్గా ఉందా? అడుగు ఎక్కడ వేయాలి? వేగాన్ని తగ్గించాలా? పెంచాలా? వంటి విషయాలపై క్షణాల్లో నిర్ణయం తీసుకుని కాళ్లు, చేతులు, శరీర కదలికలను సమన్వయం చేస్తుంది. అందుకే టియాన్గాంగ్ నడకలో మెషిన్ కంటే మనిషి కదలికలను పోలిన సహజత్వం కనిపిస్తుంది.తోసినా.. తడబడినా పడిపోదు!హ్యూమనాయిడ్ రోబోట్లకు అతిపెద్ద సవాళ్లలో ఒకటి సమతుల్యం(బ్యాలెన్స్). రెండు కాళ్లపై నడిచే యంత్రం చిన్న పొరపాటుతోనైనా కిందపడే ప్రమాదం ఉంటుంది. అయితే టియాన్గాంగ్ ఇందులో గణనీయమైన పురోగతి సాధించింది. ఎవరైనా తోసినా, నేల ఒక్కసారిగా మారినా శరీర బరువును మార్చుకుని తిరిగి బ్యాలెన్స్లోకి వచ్చేసేలా దీన్ని రూపొందించారు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగును ముందుగానే ఊహించి.. అవసరమైతే కదలికను మధ్యలోనే సరిచేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. అంటే.. మనిషి తడబడినప్పుడు వెంటనే కాలు మార్చి నిలబడినట్లే, ఈ రోబోట్ కూడా తన కదలికలను సర్దుబాటు చేసుకుంటుంది.పరుగే కాదు.. ఇంకా చాలాటియాన్గాంగ్ పేరు ఇప్పుడు 100 మీటర్ల పరుగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నప్పటికీ.. దాని అసలు లక్ష్యం క్రీడా ప్రదర్శన కాదు. మనుషులు చేసే అనేక పనులను భవిష్యత్తులో రోబోట్లు చేపట్టేలా సాంకేతికతను అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్టరీల్లో యంత్రాల మధ్య పనిచేయడం, గోదాంల నుంచి వస్తువులను తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం, విపత్తుల సమయంలో శిథిలాల్లోకి వెళ్లడం వంటి పనుల్లో హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంతే కాదు.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం, ఆసుపత్రుల్లో కొన్ని పనులు నిర్వహించడం వంటి సేవల్లోనూ భవిష్యత్తులో వీటి వినియోగం పెరగొచ్చని రోబోటిక్స్ రంగం అంచనా వేస్తోంది.ఒక్క రోబోట్ కాదు.. చైనా పెద్ద ప్రయోగంటియాన్గాంగ్ను అభివృద్ధి చేసింది.. బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్. ఇది ఒక వ్యక్తి చేసిన ప్రయోగం కాదు. ఇంజినీర్లు, రోబోటిక్స్ నిపుణులు, ఏఐ పరిశోధకులు, విద్యా సంస్థలు కలిసి పనిచేసిన పెద్ద ప్రాజెక్టు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ను భవిష్యత్ పరిశ్రమల్లో కీలక రంగంగా చైనా భావిస్తోంది. అందుకే పరిశోధన, తయారీ, ఏఐ సాంకేతికతలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ముందుకు వెళ్తోంది.మనిషికి ప్రత్యామ్నాయమా?టియాన్గాంగ్ అల్ట్రా రికార్డు చూసిన వెంటనే తలెత్తే ప్రశ్న ఇదే. భవిష్యత్తులో రోబోట్లు మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తాయా?. నిపుణుల దృష్టిలో ప్రస్తుతానికి సమాధానం అంత సులభం కాదు. హ్యూమనాయిడ్ రోబోట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మానవుడిలా అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను గ్రహించడం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోవడం వంటి సామర్థ్యాల్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.8.86 seconds for 100m.🏃💨 That's not a sprinter. That's #Tiangong Ultra, a #humanoid #robot.It just broke the human record for a 100m sprint at the World Humanoid Robot Games. And honestly? My 100m time is looking real slow right now. 🤖🥇#humanoidrobot #TiangongUltra pic.twitter.com/11UUlgY9q4— So Shanghai (@shanghai490528) August 26, 2026మనిషి చేసే పనులను మనిషితో కలిసి చేయగలిగే తెలివైన యంత్రాల యుగం మొదలైంది. కేవలం 100 మీటర్లను 8.86 సెకన్లలో పరుగెత్తిన టియాన్గాంగ్ ఆ భవిష్యత్తుకు టీజర్ మాత్రమే. మనిషిలా ఆకారం.. యంత్రంలా శక్తి.. ఏఐ ఆలోచన.. టియాన్గాంగ్ రికార్డు కేవలం ఒక రోబోట్ గెలుపు కాదు రాబోయే సాంకేతిక ప్రపంచానికి చైనా ఇచ్చిన సంకేతం.:::వెబ్డెస్క్ ప్రత్యేకంఇదీ చదవండి: ఆ రహస్య విమానంలో వచ్చింది ఆయనేనంట! -
ట్రంప్ వార్నింగ్.. ఇరాన్కు కటీఫ్ చెప్పాల్సిందేనా?
ఇరాన్పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్గా మారింది. ముఖ్యంగా ఇరాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యంభారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్భారత్కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.ఇదీ చదవండి: జింగ్పిన్ రాక.. భారత్తో బంధం బలపడేనా?చాబహార్ను వదులుకోవడం అంత సులభమా?ఇరాన్తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్గా మారుతున్నప్పటికీ.. ఇరాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?ప్రస్తుతానికి భారత్పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్కు అసలు పరీక్ష.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఏకే 47 స్థానంలో దేశీ షేర్
ఆగస్టు 23, 2026... అమెథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. ఠప్..ఠప్..ఠప్ మంటూ తుపాకీ శబ్దాలు వినిపించాయి! ఇవేవో మామూలు శబ్దాలు అనుకునేరు... ఆత్మనిర్భర భారత నిర్మాణంలో మేలి ముందడుగు! పూర్తిగా దేశీయంగా నిర్మించిన, ఏకే–47 కంటే మేలైన... అసాల్ట్ రైఫిల్ పరీక్షల శబ్దాలవి!!! ఉత్తరప్రదేశ్లోని అమెథీలో ఈ ఆదివా రం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండో రష్యన్ రైఫిల్స్తో కలిసి అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశీ అసాల్ట్ రైఫిల్ ఏకే203–షేర్ను విజయవంతంగా పరీక్షించారు. ఇందులోని ప్రతి విడిభాగం కూడా పూర్తిగా మన దేశంలోనే తయారవడం విశేషం. రష్యా తయారీ ఏకే–47తో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఆయుధమని మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి. ఏకే47 కంటే రెట్టింపు దూరం (సుమారు 800 మీటర్లు)లోని లక్ష్యాలను కూడా ‘షేర్’ ఛేదించగలదు. అలాగే సుమారు 600 గ్రాములు తక్కువ బరువు ఉంటుంది. ఏకే47 నిమిషానికి 600 బుల్లెట్లను పేల్చగలిగితే షేర్ ద్వారా ఇంకో వంద ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేయవచ్చు. అంతేకాదు.. అవసరాన్ని బట్టి షేర్ను మడుచుకోవడం, తుపాకీ వెనుకభాగానికి, ట్రిగ్గర్కు మధ్య ఉన్న దూరాన్ని పెంచుకోగలగడం షేర్తో వచ్చే లాభాలు. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేసిన తుపాకీ. భారత సైనికులు, ఇతర భద్రతా దళాలు 1990లలో ఇన్సాస్ అసాల్ట్ రైఫిల్ను ఉపయోగించే వారు. అయితే తరచూ జామ్ కావడం ఈ తుపాకీలోని ప్రధాన లోపం. ఫలితంగా మిలటరీలో దశలవారీగా ఇన్సాస్ స్థానంలో ఏకే47 వినియోగం పెరుగుతూ వచ్చింది. శిక్షణతోపాటు రాష్ట్ర పోలీసు బలగాలు, సీఏపీఎఫ్, రిజర్వ్ బెటాలియన్లు ఇప్పటికీ ఇన్సాస్పైనే ఆధారపడుతున్నాయి. ఏకే–47 అంతర్జాతీయంగా ఫేమస్. కానీ డిజైన్ లోపాలు చాలానే ఉన్నాయి. అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకునే వెసులుబాటు లేకపోవడం ప్రధానమైంది. టెలిస్కోప్తోపాటు కొన్ని ఇతర సరంజామాను అమర్చుకునే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు షేర్లో పికాటెనీ ట్రెయిల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏకే47లో వెనుకవైపు చెక్క మడిమ నుంచి ట్రిగ్గర్కు ఉన్న దూరం మారదు. పైగా ఆధునిక యుద్ధరీతుల్లో వచ్చిన మార్పులను అందుకోవడం పాతకాలపు ఏకే47తో సాధ్యం కాదని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఓసీ, ఎల్ఏసీల వంటి కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పటిష్టం చేసేందుకు ఏకే203–షేర్ ఎంతో ఉపయోగమని అంచనా.ఈ నేపథ్యంలో ఏకే47 స్థానంలో షేర్లను వాడేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటే అసాల్ట్ రైఫిల్స్ కోసం ఇకపై రష్యాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఉత్పత్తి త్వరలో... ఆగస్టు 23న కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో షేర్ను మొట్టమొదటిసారి పరీక్షించారు. ఆర్మీ సైనికులు వచ్చే నెలలోనే దీనిపై తమ పరీక్షలు మొదలుపెట్టనున్నారు. ఈ పరీక్షలకు ఎంతకాలం పడుతుందో స్పష్టంగా చెప్పలేము కానీ.. వీలైనంత తొందరగా ముగించే అవకాశమైతే ఉంది. ఆర్మీ ఆమోదం కూడా లభిస్తే 2030 నాటికల్లా కనీసం ఆరు లక్షల ఏకే203–షేర్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ తయారీ పూర్తిస్థాయిలో జరిగే సమయంలో ప్రతి వంద సెకన్లకు ఒక ‘షేర్’ఫ్యాక్టరీ నుంచి బయటకొస్తుందని అంచనా. దేశీ అవసరాలు పూర్తయిన తరువాత ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఏకే203–షేర్లను ఎగుమతి చేసేందుకూ అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎఫ్ అండ్ ఓ... ముంచేస్తోంది!
స్మోకింగ్ కిల్స్... అని హెచ్చరించినా సిగరెట్లు తాగుతూనే ఉంటారు. మద్యపానం హానికరం అన్నా... తాగేవారు మానరు. స్టాక్ మార్కెట్ డే ట్రేడింగ్ కూడా అలాంటిదే. ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సెబీ వార్నింగ్ డే ట్రేడర్లకు పట్టదు. ఎందుకంటే ఇదో వ్యసనం. గతేడాది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో జనం పోగొట్టుకున్నది ఏకంగా 91,685 కోట్లు. దీన్లో రూ.20వేల కోట్లు పన్నులు, ఎక్సే్ఛంజీల చార్జీలు, బ్రోకరేజీ సంస్థల ఫీజలుకు పోతే... మరో 72 వేల కోట్లు నికరంగా పోగొట్టుకున్నవి. విచిత్రమేంటంటే చరిత్రలో తొలిసారిగా మన మార్కెట్లలో డే–ట్రేడర్ల సంఖ్య గతేడాది తగ్గిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 20 లక్షల మంది తగ్గిపోయారు. అంటే.. పోగొట్టుకున్నవారంతా మౌనంగా మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తున్నారన్న మాట. మార్కెట్లలో ఎందరు నష్టపోతున్నారు? ఎందరు లాభపడుతున్నారు? అసలు ట్రేడింగ్ ధోరణి ఎలా ఉంది? ఏ వయసు వారు ట్రేడింగ్లోకి వస్తున్నారు? మూలధనం ఎంత పెడుతున్నారు? అసలు షేర్లు కొంటున్నారా? ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారా? అనే అంశాలపై ‘సెబీ’ రెండు అధ్యయనాల్ని విడుదల చేసింది. డే–ట్రేడర్లకు కనువిప్పు కలిగించే ఈ అధ్యయనాల సమాహారమే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ..నెలకోసారి ఎక్స్పైరీ ఉండే ఆప్షన్లు వారానికోసారి ఎక్స్పైరీతో ఫ్రెష్గా ముస్తాబవుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్లే కాకుండా క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్లో సైతం ఆప్షన్లు జోరందుకున్నాయి. ఖాతాలో పదివేలున్నా సరే ట్రేడింగ్ చేయొచ్చునంటూ కొన్ని బ్రోకరేజీ సంస్థలు యువతను ఆకర్షిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో గనక షేర్లుంటే... డబ్బులు లేకపోయినా మార్జిన్తో ట్రేడింగ్ చేసుకోవచ్చని ఊరిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది. కానీ ఫలితమైతే మారలేదు. నష్టాలు తప్పటంలేదు. డే ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సత్యాన్ని సెబీ తాజా అధ్యయనం ద్వారా మరోసారి చెప్పింది. కాకపోతే కొన్నేళ్లుగా ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ట్రేడర్ల సంఖ్య... గతేడాది మాత్రం తొలిసారిగా తగ్గింది. అదికూడా మామూలు తగ్గుదల కాదు. ఏకంగా 20 శాతం. ఈ అధ్యయనం ప్రకారం... → 2026 ఆర్థిక సంవత్సరంలో 87.7% మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో ఏకంగా రూ.72,000 కోట్లు పోగొట్టుకున్నారు. అదికూడా ఎక్సే్ఛంజీలకు, బ్రోకరేజీలకు చెల్లించిన ఛార్జీలు కాకుండా. ఈ ఛార్జీలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తంగా వీరు నష్టపోయింది రూ.92 వేల కోట్లు పైనే. → ఎక్సే్ఛంజీ చార్జీలు, బ్రోకరేజీలు కాకుండానే 2025లో పోగొట్టుకున్న రూ.1.11 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాకపోతే ట్రేడర్ల సంఖ్య కూడా 98 లక్షల నుంచి 78 లక్షలకు పడిపోయింది. → సగటు ట్రేడరు పోగొట్టుకున్న మొత్తం మాత్రం రూ.1.13 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు పెరిగింది. → గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ట్రేడర్ల సంఖ్య తగ్గిపోవడమన్నది ఇదే తొలిసారి.మార్కెట్లకు దూరమవుతున్నదెవరు? తొలిసారి 20% మంది మార్కెట్లను వదిలేశాక.. మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఎందరు నష్టపోతున్నారన్నది కాదు. ఇంకా ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారన్నది. సెబీ అధ్యయనంలో దీనిక్కొంత సమాధానం దొరికింది. అదేంటంటే ఇపుడు రిటైల్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో యువత సంఖ్యే ఎక్కువని. చిన్న ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలతో సంబంధంలేని మామూలు ట్రేడర్లు వీరికి తోడవుతున్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసే రిటైలర్లలో 43% మంది 30 ఏళ్ల లోపు వారే. వీరిలో 90% మంది గతేడాది నష్టపోయిన వారే. ఈ యువ ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్లకన్నా 93 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో పెడుతున్నారు. అంటే... రూ. 1,000 షేర్లలో ఉంటే 93 వేలు ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్కు వాడుతున్నారన్న మాట. అంటే వీళ్లెవరూ తమ షేర్లలో రిస్క్ తగ్గించుకోవటానికి ఎఫ్ అండ్ ఓను ఉపయోగించుకోవట్లేదు. జస్ట్ దాన్నో బెట్టింగ్ సాధనంగా చూస్తున్నారు. అంతే! వాస్తవమేంటంటే ఓ ఇన్వెస్టరుకు తన ఖాతాలో రూ.లక్ష విలువైన షేర్లున్నాయనుకోండి. వాటిపై వచ్చే మార్జిన్తో కోట్ల రూపాయల ఎఫ్ అండ్ఓ ట్రేడింగ్ చేయగలడు. అది చాలా ఎక్కువ మొత్తం కనక నష్టం వస్తే ఈ లక్షలో రూపాయి కూడా మిగలకపోవచ్చు. తక్కువ ట్రేడింగ్... ఎక్కువ లాభం లాభాలు ఆర్జించిన వారి విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తోంది. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదిస్తున్న ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్ల విలువకన్నా ఏకంగా 73 రెట్లు ఎక్కువ ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారన్నది సెబీ తేలి్చన వాస్తవం. కానీ ఏడాదికి రూ.కోటికన్నా ఎక్కువ సంపాదించేవారు మాత్రం తమ పోర్టుఫోలియోకన్నా 14 రెట్లు మాత్రమే అధికంగా ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ సంపాదించేవారు తక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు. తక్కువ సంపాదించేవారు, నష్టపోతున్న వారు మాత్రమే అత్యధికంగా ట్రేడింగ్ చేస్తున్నారు. ముగ్గురిలో ఒకరు.. అలాంటివారే! కొంతమంది ట్రేడర్లకు ఇన్వెస్ట్మెంట్లతో ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. వారి ఖాతాల్లో జీరో షేర్లున్నా సరే... ఎఫ్ అండ్ ఓ మాత్రం జోరుగా చేస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలా పూర్తి స్పెక్యులేషన్ ట్రేడింగ్నే చేస్తున్నారట. వాస్తవానికి ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో 78 శాతం మంది తమ ఖాతాల్లో రూ.లక్ష కన్నా తక్కువ షేర్లున్నవారే. కానీ ట్రేడర్లు పోగొట్టుకుంటున్న మొత్తంలో 70 శాతం వీళ్లదే. అంటే.. వీళ్లు తమ షేర్లతో సంబంధం లేకుండా ఎఫ్ అండ్ ఓ చేస్తున్నారు. భారీగా పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్స్... అదే ఆకర్షణ ఎఫ్ అండ్ ఓ అంటే... ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. కానీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చెయ్యాలంటే భారీగా డబ్బులుండాలి. నష్టమైనా, లాభమైనా సమ పాళ్లలోనే ఉంటుంది. కానీ ఆప్షన్స్లో అలాకాదు. రూ.100, వెయ్యితో కూడా ఆప్షన్స్ చేయొచ్చు. అప్పటికప్పుడే వెయ్యి డబుల్ అయిపోవచ్చు. సున్నా కూడా అయిపోవచ్చు. ఇదే అసలైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎంతలా పెరిగిందంటే... 2020లో ఎఫ్ అండ్ ఓలో రూ.100 టర్నోవర్ జరిగితే అందులో రూ.5 మాత్రమే ఆప్షన్స్ది. మిగతా మొత్తం ఫ్యూచర్స్దే. కానీ 2025 వచ్చేసరికి ఈ 5 ఏకంగా రూ.41కి చేరింది. నిజానికి ఆప్షన్ కొనటమంటే షేరు కొన్నట్లు కాదు. ఎందుకంటే షేర్లకు ఎక్స్పైరీ ఉండ దు. పడినా మళ్లీ కోలుకుంటాయి. కానీ ఆప్షన్లకు ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ గడు వు దగ్గరకొస్తున్నకొద్దీ ఆప్షన్ ప్రీమియం కరిగిపోతుంది. చివరికి సున్నా అయిపోతుంది. అలాగని ఆప్షన్లు కొనటం మాత్రమే రిస్కనుకుంటే అదీ పొరపాటే. ఆప్షన్లు కొనేవారి కన్నా అమ్మే వారిలో నష్టపోయేవారు తక్కువే. కానీ వారి నష్టాలు మాత్రం బీభత్సం. అప్షన్లు కొనేవారి సగటు నష్టాలు రూ.4.6 లక్షలు ఉంటే... అమ్మేవారి సగటు నష్టాలు రూ.51.7 లక్షలు. దీన్నిబట్టే రిస్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సెబీ ప్రయోగం ఫలించిందా? నిజానికి ఎఫ్ అండ్ ఓ నిబంధనల్ని కఠినం చేయటాన్ని సెబీ 2024లోనే మొదలుపెట్టింది. → వీక్లీ ఆప్షన్ల సంఖ్యను తగ్గించింది. కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటే ట్రేడింగ్ను నియంత్రించవచ్చనేది సెబీ వ్యూహం. → కాంట్రాక్టు సైజుల్ని పెంచింది. అంటే కొనటానికి అవసరమయ్యే మొత్తాన్ని బాగా పెంచింది. ఇలా చేయటం వల్ల లాభమైనా, నష్టమైనా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చాలామంది దూరంగా ఉంటారన్నది సెబీ ఆలోచన. → ఆప్షన్ ప్రీమియంలను కొనటానికైనా, అమ్మటానికైనా కావలసిన మొత్తాన్ని పూర్తిగా ముందే చెల్లించటమనే నిబంధన తెచ్చింది. → పొజిషన్ల పరిమితుల్ని ఇంట్రాడేలో పర్యవేక్షించటం... ఎక్సే్ఛంజీలన్నింటినీ ఒక తాటిమీదికి తెస్తూ ఎక్స్పైరీ తేదీల్ని హేతుబద్ధం చేయటం వంటివి చేసింది. కాకపోతే తాజా అధ్యయనాన్ని పరిశీలిస్తే కొన్ని కోణాల్లో సెబీ చర్యలు ఫలితాలనిచ్చాయి. రిటైలర్ల టర్నోవర్ తగ్గింది. వాళ్ల సంఖ్య తగ్గింది. నష్టాలు తగ్గాయి. కానీ దీనివల్ల.. నష్టపోయే ట్రేడర్లేమైనా తగ్గారా అంటే అలాంటిదేమీ జరగలేదు. నష్టపోయేవారి సంఖ్య అసాధారణంగానే ఉంది. పైపెచ్చు వారి నష్టాలు పెరిగాయి. కాబట్టి నాణ్యమైన ట్రేడర్లు పెరగటమన్నదే ఇపుడు సెబీ ముందున్న అతిపెద్ద సవాలు.ఆ 23 శాతం మందే...సెబీ వివరాల ప్రకారం... ట్రేడింగ్లో నష్టాల్లో 90 శాతం వరకూ కేవలం 23 శాతం మంది నుంచే వస్తున్నాయి. అంటే... మొత్తంగా 78 లక్షల మంది రూ.91వేల కోట్లు పోగొట్టుకుంటే... అందులో రూ.82 వేల కోట్లు పోగొట్టుకున్నది 18 లక్షల మందే. దీన్నిబట్టి కొందరు ఈ ట్రాప్లో ఇరుక్కుని అత్యధికంగా పోగొట్టుకుంటున్నారని అర్థమవుతుంది. వీళ్ల ధోరణిని విశ్లేషిస్తే బయటపడ్డ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. అవి... → వీళ్లు తమ ఆదాయానికి మించి అత్యధికంగా టర్నోవర్ నమోదు చేస్తున్నారు. → పదేపదే నష్టాలొచ్చినా డబ్బులు తెచ్చి పెడుతున్నారు. → ఎక్స్పైరీ డేనాడు అత్యధికంగా ట్రేడ్ చేస్తున్నారు. → వీరి టర్నోవర్కు–పోర్టుఫోలియోకు పొంతన లేదు. → పదేపదే ఆప్షన్లు కొనటం... లాట్ సైజు పెంచుకుంటూ పోయి పోగొట్టుకోవటం.మెట్రోలకే పరిమితం కాదిప్పుడు... మొబైల్ యాప్లు, టెక్నాలజీ షేర్ల ట్రేడింగ్ను సమూలంగా మార్చేశాయి. పలితం... ఈ ఎఫ్ అండ్ ఓ ఆకర్షణ ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కావటం లేదు. దేశంలో ప్రధానంగా గుర్తించిన 30 మెట్రో నగరాలను మినహాయిస్తే... వాటి వెలుపలున్న ప్రాంతంలోనే ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 72 శాతం ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ మెట్రోలకు వెలుపల జరుగుతున్నట్లు వెల్లడయింది. అంటే నష్టపోతున్నవారిలో ఎక్కువ మంది టైర్–2, టైర్–3 పట్టణాలు, గ్రామాలకు చెందినవారన్న మాట. అది ఆందోళనకరమన్నది నిపుణుల మాట. అసలు లాభపడ్డది ఎవరు? సెబీ అధ్యయనం ప్రకారం చూస్తే రిటైల్ ట్రేడర్లు రూ.72వేల కోట్లు పోగొట్టుకుంటే... సంస్థాగత ఇన్వెస్టర్లు, సంస్థలు రూ.72వేల కోట్లు లాభాలను ఆర్జించాయి. ప్రొప్రయిటరీ ట్రేడర్లు అత్యధికంగా రూ.44వేల కోట్లు లాభపడగా, ఎఫ్పీఐలు రూ.14వేల కోట్లు, కార్పొరేట్లు రూ.8వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్లు రూ.3వేల కోట్లు, ఎల్ఎల్పీ/పార్ట్నర్షిప్ సంస్థలు రూ.3వేల కోట్లు ఆర్జించాయి. ఇది రిటైలర్లు పోగొట్టుకున్న రూ.72వేల కోట్లకు సమానం. ఇక మిగిలిన మొత్తంలో ఎన్ఎస్ఈ రూ.11,366 కోట్లు, బీఎస్ఈ రూ.3,134 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేశాయి. కొంత మొత్తం ప్రభుత్వానికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూపంలో చేరింది. కొంత సెబీకి ఛార్జీల రూపంలో చేరగా... మిగిలింది బ్రోకరేజీ రూపంలో బ్రోకరేజీ సంస్థలకు దక్కింది. అయితే ఇదంతా ట్రేడర్లు పోగొట్టుకున్న లెక్క మాత్రమే. లాభాలను ఆర్జించినట్లు చెబుతున్న సంస్థలు కూడా బ్రోకరేజీ, కొంత ఎస్టీటీ, కొంత ఎక్సే్ఛంజీలకు చార్జీలుగా చెల్లిస్తాయి. అంటే ఈ ట్రేడింగ్ వ్యవస్థపై ఫీజులు, పన్నులు, బ్రోకరేజీల రూపంలో పోతున్నదే ఎక్కువ భాగమన్నమాట!రమణమూర్తి మంథా -
డిప్రెషన్కు పండంటి చిట్కా
సాక్షి స్పెషల్ డెస్క్: ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. అయితే, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యూకేలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ప్రతిరోజూ ఒక గ్లాసు సహజమైన పండ్ల రసం లేదా స్మూతీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడమే కాకుండా డిప్రెషన్ లక్షణాలు తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకునే 42 మంది వ్యక్తులపై 4 వారాల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. పాల్గొన్నవారిని వివిధ గ్రూపులుగా విభజించి, ఒక గ్రూప్కు క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక గ్లాసు 100 శాతం స్వచ్ఛమైన పండ్ల రసం లేదా స్మూతీ అందించారు. 4 వారాల ముగింపులో, ప్రతిరోజూ పండ్ల రసం తాగిన వారిలో డిప్రెషన్ స్కోరు గణనీయంగా తగ్గడం గమనించారు.ఆరోగ్యకర ప్రయోజనాలు ⇒ సాధారణంగా జ్యూస్లలో సహజంగా ఉండే చక్కెరల వల్ల బరువు పెరగడం లేదా జీవక్రియ దెబ్బతినడం జరుగుతుందనే ఆందోళన ఉంటుంది. అయితే పరిమిత పరిమాణంలో తాగిన జ్యూస్.. మెటబాలిజంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపటం లేదని పరిశోధకులు గమనించారు. ⇒ పండ్లలో పుష్కలంగా లభించే విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల క్షీణతను అడ్డుకోవడంతో పాటు శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను (వాపు) ను గణనీయంగా తగ్గిస్తాయి. ఇవి మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. ⇒ ఈ పోషకాలన్నీ మన శరీరంలో సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే సెరోటోనిన్, డోపమైన్ వంటి మూడ్ బూస్టింగ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి, వాటి సమతుల్యతను కాపాడటానికి అనుకూలమైన వాతావరణాన్ని కలి్పస్తాయి. సాధారణంగా ప్రతిరోజూ కావాల్సిన మోతాదులో నేరుగా పండ్లను నమిలి తినడం చాలామందికి వీలుపడదు. అలాంటి వారికి ఒక చిన్న గ్లాసు జ్యూస్ లేదా స్మూతీ ద్వారా ఆ పోషకాలన్నీ శరీరానికి చాలా సులభంగా అందుతాయి. -
నిద్రకు చక్కటి ఉప్పాయం
‘నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఉప్పు కణికల మీద పాదాలను ఆనిచితే మంచి నిద్రపడుతుంది’అంటే మొదట్లో ఇన్స్ట్రాగామ్ వైద్య సలహాగానే కొట్టిపారేశాను. కానీ ఓ వారం పాటు ఆచరించిన తర్వాత అనేక విషయాలను సాధికారంగా చెప్పగలుగుతున్నాను– అని వెల్నెస్ ఎక్స్పర్ట్ అతుల్ రజని చెప్పారు. ఒక వెడల్పు ట్రేలో నాలుగు గరిటెల ఎప్సమ్సాల్ట్ కణికలను పరిచి ఆ ఉప్పు మీద పది నిమిషాలపాటు నిలబడాలి. దేహం బరువును ఒక పాదం నుంచి మరోపాదానికి మారుస్తూ ఉండాలి. నిలబడలేక కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను ఉప్పు మీద పెట్టి కొద్దిగా అదుముతూ చీలమండలను వలయాకారంగా తిప్పాలి. గులకరాళ్లలో నడుస్తున్న భావన కలుగుతుంది. పదునైన స్ఫటికాలు పాదాల అరికాళ్ళలోకి నొక్కుకోవడం వింతైన, ప్రశాంతమైన అనుభూతినిస్తుంది... అని తన అనుభవాన్ని వివరించారు.స్క్రీన్ స్క్రోలింగ్ అడిక్షన్కు మందు! ఈ ఎప్సమ్ సాల్ట్ థెరపీ స్మార్ట్ఫోన్ స్క్రోలింగ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి దోహదం చేస్తోంది. ఈ చిన్న ప్రక్రియ నా దృష్టిని స్మార్ట్ఫోన్ నుంచి మరల్చింది. ప్రతి రోజూ పడుకునే ముందు గంటల తరబడి చేసే డిజిటల్ స్క్రోలింగ్కు ఇది చెక్ పెట్టింది. ఆ నిశ్శబ్దంలో నా దృష్టి పాదాల కింద ఉన్న చల్లదనం, ఒత్తిడి, శ్వాస లయపైకి మళ్ళింది. వారం గడిచేసరికి స్పష్టమైన మార్పు వచ్చింది. ఫోన్ చూడటం మానేసి, రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం పొందే మానసిక విరామాన్ని ఆస్వాదించాను. అంతేకాకుండా, ఎప్సమ్ సాల్ట్ వల్లమడమల వద్ద ఉన్న గరుకు చర్మం మృదువుగా మారింది. మన కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, స్క్రీన్లు , నోటిఫికేషన్ల వల్ల మెదడు అప్రమత్తంగానే ఉంటుంది. దీనికి విరుగుడుగా సాల్ట్ థెరపీ పనిచేసింది– అని అతుల్ రజని తన అనుభవాన్ని పంచుకున్నారు. ⇒ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ తులసి రామ్ ప్రకారం, నిద్రకు ఉపక్రమించే సమయంలో చేసే తేలికపాటి సాగదీతలు (స్ట్రెచింగ్స్) రక్త ప్రసరణను మెరుగుపరిచి, నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. ఎప్సమ్ సాల్ట్ థెరపీని నిద్రలేమికి పూర్తి స్థాయి చికిత్సగా కాకుండా, ఒక నైట్–టైమ్ వెల్నెస్ రొటీన్గా చూడటం మంచిది. ఆధునిక సమాజం ఈ వైద్యప్రక్రియను ఇంతవరకు జానపద చిట్కా వైద్యంగానే పరిగణించింది. మెగ్నీషియం సల్ఫేట్ వల్ల కలిగే ప్రయోజనాల కోణంలో శాస్త్రీయ అధ్యయనాలు నిర్ధారించిన తర్వాత, ఆల్టర్నేటివ్ మెడిసిన్ గుర్తించిన నేపథ్యంలో వెల్నెస్ కేంద్రాలు ఈ వైద్యాన్ని అందిపుచ్చుకున్నాయి. శాస్త్రీయ పరిశోధనలు మరింత విస్తృతంగా కొనసాగుతున్న కారణంగా అధికారిక ప్రకటనకు ఇంకా సమయం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
ఈ ప్రేమ ఆర్టిఫిషియల్
ఒంటరిగా ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడేందుకు ఓ మనిషి కావాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చే మాట కావాలి. ప్రేమలో ఉన్నప్పుడు భావాలను పంచుకునే వ్యక్తి కావాలి. కానీ ఇప్పుడు ఈ అవసరాలకు కృత్రిమ మేధ (ఏఐ) చాట్బాట్లను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. ఏఐతో గంటల తరబడి మాట్లాడటం.. దానినే స్నేహితుడిగా, గర్ల్ఫ్రెండ్గా, బాయ్ఫ్రెండ్గా భావించడం కూడా కొత్త ట్రెండ్గా మారుతోంది. ఏఐ గర్ల్ఫ్రెండ్/ ఏఐ బాయ్ఫ్రెండ్/ ఏఐ కంపానియన్ వంటి అప్లికేషన్లు వినియోగదారులతో గంటల తరబడి మాట్లాడుతున్నాయి. గత సంభాషణలను గుర్తుంచుకుంటున్నాయి. వారి అభిరుచులకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. కొన్నిసార్లు ప్రేమను, ఆప్యాయతను, ఆకర్షణను కూడా అనుకరిస్తున్నాయి. ఈ సాంకేతికతలో ఒంటరితనానికి తాత్కాలిక మందు ఉన్నా.. దాని మరో కోణం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ అనేది మనిషికి డిజిటల్ తోడుగా మారుతున్న కొద్దీ, అదే సాంకేతికత నమ్మకాన్ని సంపాదించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి, డబ్బు ఖర్చు చేయించడానికి, చివరకు బ్లాక్మెయిల్ చేయడానికి కూడా దోహదపడే అవకాశం పెరుగుతుంది.⇒ 2022 నుంచి ఏఐ కంపానియన్ యాప్స్ డౌన్లోడ్లు - 16.5 కోట్లు⇒ గత నాలుగేళ్లలో వినియోగదారులు వెచ్చించిన వ్యయం - రూ. 4,000 కోట్లు⇒ 2026లో మొదటి ఆరు నెలల్లోనే చేసిన ఖర్చు - రూ. 1,500 కోట్లుభావోద్వేగ ఒంటరితనంప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. 2026లో సైకలాజికల్ సైన్స్లో ప్రచురితమైన అధ్యయనం రెండువేల మందికి పైగా పెద్దలను పరిశీలించింది. ఒంటరితనం ఉన్న వ్యక్తులు సోషల్ చాట్బాట్లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం కనిపించడంతోపాటు, అధిక చాట్బాట్ వినియోగం తర్వాత భావోద్వేగ ఒంటరితనం పెరిగినట్లు కూడా అధ్యయనం తెలిపింది. ఇటీవల ప్రకృతిలో మనుషుల ప్రవర్తనపై ఏఐ కంపానియన్ వినియోగదారులపై మరో అధ్యయనం ప్రచురితమైంది. ఏఐ కంపానియన్ వినియోగదారుల్లో ఎమోషనల్ వెల్–బియింగ్, మెంటల్ హెల్త్ సమస్యలు తలెత్తే అవకాశాలు గమనించారు.అన్నీ తెలుసుకుంటుంది.. మనిషి ఒంటరితనాన్ని తగ్గించుకోవడానికి సాంకేతికతను నమ్మి కుటుంబ సమస్యలు, సంబంధాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, భయాలు, ఇష్టాలు, లైంగిక అభిరుచులు వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా తెలియకుండానే వెల్లడించే అవకాశం ఉంటుంది. రోజులు, నెలలు కొనసాగిన సంభాషణ ఒక వ్యక్తి గురించి అత్యంత సమగ్ర డిజిటల్ ప్రొఫైల్గా మారవచ్చని సైబర్భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ ముఖం సృష్టించడం.. నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ తయారు చేయడం వంటి ప్రమాదాలున్నాయని చెప్పారు. వాయిస్ క్లోనింగ్తో ఫోన్ కాల్స్, డీప్ఫేక్ టెక్నాలజీతో సహజంగా కనిపించే సంభాషణలు రూపొందించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.పెరుగుతున్న వ్యాపారంఒక వ్యక్తి తనకు నచ్చిన ఏఐ క్యారెక్టర్తో రోజూ గంటల తరబడి మాట్లాడటం ప్రారంభిస్తే, ఆ అనుబంధాన్ని కొనసాగించేందుకు సబ్స్క్రిప్షన్లు, అదనపు ఫీచర్లు, ప్రత్యేకమైన కంటెంట్ కోసం డబ్బు ఖర్చు చేయడం మొదలవుతుంది. ముఖ్యంగా లైంగిక ఆకర్షణను ఆధారంగా చేసుకున్న ఏఐ క్యారెక్టర్లు వినియోగదారుల దృష్టిని ఎక్కువసేపు నిలుపుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా అప్లికేషన్లలో పూర్తిగా ఏఐ కంటెంట్తో నడిచే అకౌంట్స్, వాటి అకౌంట్ సబ్స్క్రిప్షన్స్ లక్షల్లో వ్యాపారానికి దారి తీస్తున్నాయి. ఉచిత చాట్ తర్వాత ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక క్యారెక్టర్లు, అదనపు సంభాషణలు, వ్యక్తిగతమైన ఇమేజ్లు, అడల్ట్ కంటెంట్ వంటి వాటికి చెల్లింపులు చేయించే విధానాలు పెరుగుతున్నాయి.ఏఐ ఒక్కటే మార్గం కాదుఒంటరితనం, ఇతర భావోద్వేగ సమస్యలకు ఏఐ ఒక్కటే ఆధారంగా మారకూడదు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు లేదా అత్యంత సున్నితమైన ఫొటోలు, వీడియోలను డిజిటల్ కంపానియన్స్ లేదా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులతో పంచుకోవడం ప్రమాదకరం. ప్రత్యేకంగా న్యూడ్ వీడియో కాల్స్ లేదా వ్యక్తిగత వీడియో కాల్స్ను రికార్డ్ చేసే అవకాశం ఉన్నందున, ఆన్లైన్ సంబంధాల్లో జాగ్రత్త మరింత అవసరం. హనీట్రాప్ పేరుతో బెదిరించినప్పుడు డబ్బు చెల్లించడం సమస్యను పరిష్కరించదు. చాట్లు, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్ వివరాలు, చెల్లింపు వివరాలు, స్క్రీన్షాట్లు వంటి ఆధారాలను భద్రపరచి వెంటనే ఫిర్యాదు చేయాలి.–అద్వైత్ కంభం, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు -
బంగ్లా నిర్ణయంపై హైటెన్షన్.. భారత్కు డేంజర్ బెల్!
ఒకవైపు పాకిస్తాన్.. మరోవైపు టర్కీ.. మధ్యలో సౌదీ అరేబియా. ఇప్పుడు ఈ సమీకరణంలోకి బంగ్లాదేశ్ కూడా అడుగుపెడుతుందా? అదే జరిగితే భారత్కు ఏంటి పరిస్థితి? ఢిల్లీకి ఇది కేవలం మరో దేశం తీసుకునే విదేశాంగ నిర్ణయమా? లేక భారత్ చుట్టూ మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలకు ఇది సంకేతమా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసియాలో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ తొలిసారి సౌదీ–పాక్–టర్కీ రక్షణ వ్యవస్థలో చేరే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయకుండా.. ‘ముందు బంగ్లాదేశ్ ప్రయోజనాలే’ అంటూ తలుపులు తెరిచి ఉంచింది. దీంతో, కొత్త సమీకరణాలు భారత్ ముందుకు వస్తున్నాయి.ఆగస్టు 7న మక్కాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. మిగిలిన రెండు దేశాలపై కూడా దాడిగా పరిగణించేలా పరస్పర రక్షణ సహకారానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు ఇదే వ్యవస్థలోకి బంగ్లాదేశ్ వస్తే.. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం తెరపైకి రావడం ఖాయం.బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీతో కూడిన ఆర్థిక లేదా రక్షణ వ్యవస్థలో చేరే అవకాశంపై బంగ్లాదేశ్ సానుకూల దృక్పథంతో ఉందని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా.. అది బంగ్లాదేశ్, అక్కడి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. మరో సహాయ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం కూడా ఇదే మాట చెప్పారు. ఏ కూటమిలో చేరాలన్నా జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని తెలిపారు.భారత్కు అసలు ప్రశ్న..ఇక్కడే భారత్కు అసలు ప్రశ్న మొదలవుతోంది. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే వెంటనే భారత్కు సైనిక ముప్పు ఏర్పడుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అంచనాకు తావు లేదు. ఈ రక్షణ ఒప్పందం భారత్ను లక్ష్యంగా చేసుకుని ఏర్పడినదని ఎక్కడా ప్రకటించలేదు. కాబట్టి బంగ్లాదేశ్ చేరినంత మాత్రాన భారత్పై యుద్ధ ముప్పు పెరుగుతుందని చెప్పడం తొందరపాటు అవుతుంది. కానీ సమస్య అంతకంటే లోతైనది. ఇది నేరుగా సైనిక ముప్పు కంటే.. దౌత్యం, వ్యూహాత్మక ప్రభావం, ప్రాంతీయ సమీకరణాలకు సంబంధించిన అంశం.ఎందుకంటే భారత్కు బంగ్లాదేశ్ సాధారణ పొరుగు దేశం కాదు. ఈశాన్య భారతదేశానికి భౌగోళికంగా అత్యంత కీలకమైన దేశం. సరిహద్దు భద్రత నుంచి వాణిజ్యం వరకు, రవాణా మార్గాల నుంచి ప్రాంతీయ కనెక్టివిటీ వరకు ఢాకాతో న్యూఢిల్లీకి ఉన్న సంబంధాలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. గత కొన్నేళ్లుగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కూడా ఈ ప్రాధాన్యత చుట్టూనే బలపడ్డాయి. అలాంటి దేశం ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాలతో కూడిన రక్షణ వ్యవస్థకు దగ్గరవుతే.. ఢిల్లీకి మాత్రం అది సాధారణ పరిణామం కాదు. అందులోనూ పాకిస్తాన్ పేరు ఉండటం మరింత ఆసక్తికరం. భారత్-పాకిస్తాన్ సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలతో నిండిన నేపథ్యంలో.. ఢాకా ఇస్లామాబాద్తో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటే పాక్కు దౌత్యపరంగా అదనపు బలం లభించే అవకాశం ఉంటుంది. దక్షిణాసియాలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ తన ప్రభావాన్ని విస్తరించేందుకు కొత్త వేదిక లభించినట్టవుతుంది.టర్నీతో సవాల్..టర్కీ కూడా ఈ సమీకరణంలో కీలక పాత్ర పోషిస్తోంది. పాక్తో టర్కీకి ఇప్పటికే సన్నిహిత రక్షణ సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తోనూ టర్కీ రక్షణ సహకారాన్ని విస్తరిస్తోంది. మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక, వ్యూహాత్మకంగా అత్యంత ప్రభావశీలమైన దేశం. ఈ మూడు దేశాలతో బంగ్లాదేశ్ ఒకే రక్షణ వ్యవస్థలోకి వస్తే.. పాకిస్తాన్కు పశ్చిమాసియా నుంచి దక్షిణాసియా వరకు విస్తరించే కొత్త దౌత్య నెట్వర్క్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ వెంటనే ఆ కూటమిలో చేరబోతోందని చెప్పడానికి ఇప్పటివరకు ఆధారాలు లేవు. ఢాకా చెబుతున్న “బంగ్లాదేశ్ ఫస్ట్” విధానమే ఇక్కడ కీలకం. ఆర్థికంగా, వాణిజ్యపరంగా లేదా భద్రతాపరంగా తమకు ప్రయోజనం ఉంటేనే అడుగు ముందుకు వేస్తామని బంగ్లాదేశ్ స్పష్టం చేస్తోంది. అంటే ఇది భారత్కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అని ఇప్పుడే తేల్చేయలేం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్లపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు.. అయినా ఢిల్లీకి ఇది ఒక కీలక హెచ్చరిక మాత్రం కావచ్చు. బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానాన్ని కొత్తగా సమతుల్యం చేసుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్తో సంబంధాలు కొనసాగిస్తూనే.. పాక్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలతో కూడా వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవాలని ఢాకా చూస్తే.. దక్షిణాసియాలో భారత్ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంటే.. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరితే భారత్ సరిహద్దుల్లో వెంటనే సైనిక ముప్పు వచ్చేది కాదు. కానీ భారత్ చుట్టూ వ్యూహాత్మకంగా మారుతున్న సమీకరణాల్లో మరో కీలక మలుపు మాత్రం అవుతుంది. ఇవన్నీ కలిస్తే ఢిల్లీ తన ‘నెయిబర్హుడ్ ఫస్ట్’ వ్యూహాన్ని మరింత చురుగ్గా అమలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. -
చైనా రూటే సెపరేటు
జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద నీళ్లున్నాయని తెలుసు. కానీ ఏ రూపంలో? ఎంత మోతాదులో? మనం వాడుకోగలమా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు తెలియనున్నాయి. అంతా చైనా ప్రయోగిస్తున్న ఛాంగీ–7 యాత్ర ఫలితం. ఒక పక్క నాసా తన ఆర్టిమిస్–3 ప్రోగ్రామ్ ద్వారా జాబిల్లిపై శాశ్వత మానవ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తూంటే.. ఇంకోవైపున చైనా వినూత్నమైన రీతిలో జాబిల్లిపై తన ముద్ర వేసేందుకు కృషి చేస్తూండటం విశేషం. జాబిల్లిపై నీరున్న విషయం తెలిసి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. తెలియనిదల్లా అది ఏ రూపంలో ఉంది? వంటి వివరాలు మాత్రమే. ఎందుకంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలుగా సూర్యరశ్మి సోకని అంటే వెలుగు అస్సలు లేని ప్రాంతంలో నీటి ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి ఉష్ణోగ్రతలు –200 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉంటాయని అంచనా. అంతటి శీతల పరిస్థితుల్లో నీరు ఏ రూపంలో ఉందో? మనం దాన్ని ఎలా వాడకానికి అనువుగా మార్చుకోవాలో ఇప్పటివరకూ తెలియదు. ఈ లోపాలన్నింటినీ సరిదిద్దేందుకు చైనా ప్రయత్నిస్తోంది. వచ్చే నెలలో జరిగే చాంగీ–7 ప్రయోగం ఈ దిశగా వేస్తున్న తొలి అడుగు. జాబల్లిపైకి ఇటీవలే జరిగిన ఒక ప్రయోగం విఫలమైనప్పటికీ చైనా సరికొత ఇంజిన్తో తాజా ప్రయత్నం చేస్తోంది. చాంగీ–7 లక్ష్యాలేమిటి? ఇప్పటివరకూ జాబిల్లి దక్షిణ ధ్రువం పైకి జరిగిన అంతరిక్ష ప్రయోగాల కంటే చాంగీ–7 భిన్నమైంది. ఎందుకంటే ఇందులో ఒక ఆర్బిటర్, ల్యాండర్, రోవర్తోపాటు ఒక హాపర్ కూడా ఉంటాయి. 2024 మార్చిలోనే ప్రయోగించి ప్రస్తుతం కక్ష్యలో ఉన్న క్యూకియా–2 రిలే శాటిలైట్ కూడా చాంగీ–7 ప్రయోగానికి ఎంతో ఉపయోగపడనుంది. చాంగీ–7 కచ్చితంగా ఎక్కడ ల్యాండ్ అవుతుందన్నది ఇప్పటికైతే తెలియదు కానీ.. ఆర్టిమిస్–3 ద్వారా నాసా ఏర్పాటు చేయాలని అనుకుంటున్న కేంద్రం కోసం ఎంపిక చేసిన షాకిల్టన్ క్రేటర్కు సమీపంలోనే సూర్యరశ్మి తాకే చోట ఉండవచ్చునని అంచనా. ఈ మొత్తం ప్రయోగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘హాపర్’గురించి. ఇది చక్రాలున్న రోవర్ లాంటిది కాదు. అక్కడి నేలలో గుంతల్లాంటివి కానీ, నెర్రెలు కానీ ఉంటే వాటిని దాటేందుకు ఎగరగల సామర్థ్యం ఉన్నది. సాధారణ వాహనాలు ప్రయాణించలేని లోతులకు కూడా ఇది వెళ్లగలదు. ఆర్టిమిస్–3 ద్వారా నాసా కూడా జాబిల్లిపైని నీటిని, వనరులను గుర్తించి వాడుకునేందుకు చైనా కంటే భిన్నమైన మార్గంలో ప్రయత్నిస్తోంది. చాంగీ–7 చైనా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు కాగా... నైసా వాణిజ్యస్థాయిలో ప్రైవేట్ సంస్థల ద్వారా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చాంగీ–7 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఉపయోగించదగ్గ వనరులు ఏమేం ఉన్నాయి? అన్నదానిపై కూడా దృష్టి పెట్టనుంది. రెండేళ్ల తరువాత అంటే 2028లో జరిగే చాంగీ–8 ద్వారా ఈ వనరులను వాడుకోవడం ఎలా? అన్నదాన్ని పరిశీలించాలన్నది చైనా ఆలోచన. తరువాతి దశలో భాగంగా మానవ సిబ్బంది జాబిల్లిపైకి చేరతారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్, రష్యాకు చెందిన రస్కాస్మోస్ స్పేస్ ఏజెన్సీలు రెండు కలిసి ‘‘ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్’’నిర్మాణం చేపడతాయి. ఏతావాతా... జాబిల్లిపైకి చేరడం ఎలా అన్నది 20వ శతాబ్ధపు అతిపెద్ద సాంకేతికపరమైన సవాలుగా నిలిస్తే... మనిషి అక్కడ ఎలా బతకాలన్నది ఈ శతాబ్ధపు ముఖ్యమైన ప్రశ్నగా అవతరిస్తోందన్నమాట!!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్ నినో సెగ.. ప్రపంచ వాణిజ్య మార్గాలకు గండం?!
ప్రపంచాన్ని ఎల్ నినో రూపంలో మరో సంక్షోభం వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న దీని ప్రభావం.. నవంబర్, డిసెంబర్ నుంచి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలు ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎల్ నినో ప్రభావం ఇప్పుడు వాతావరణాన్ని దాటి ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలపైనా కనిపిస్తోంది.ఎల్ నినో అంటే కేవలం వర్షాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన మార్పు మాత్రమే కాదు. సముద్ర ఉష్ణోగ్రతలు, వాతావరణ నమూనాల్లో వచ్చే మార్పులు.. నీటి లభ్యత నుంచి రవాణా వ్యవస్థల వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నౌకాయాన మార్గాలు కూడా ఈ పరిణామాల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. నీటి మట్టాలు తగ్గడం, కరవు పరిస్థితులు పెరగడం వంటి పరిణామాలు అంతర్జాతీయ షిప్పింగ్కు సవాల్గా మారుతున్నాయి. దీనికి తాజా ఉదాహరణగా అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ నిలుస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన ఈ జలమార్గం ద్వారా ప్రతి ఏడాది వేలాది నౌకలు ప్రయాణిస్తాయి. అయితే పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా కాలువలో నీటి నిల్వలు తగ్గడంతో.. నౌకల రాకపోకలపై పరిమితులు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు దాదాపు 40 నౌకలు ప్రయాణించే పనామా కాలువలో.. నీటి కొరత కారణంగా ఈ సంఖ్యను తగ్గిస్తున్నారు. దీనివల్ల సరకు రవాణా ఆలస్యం కావడం, నౌకల నిర్వహణ ఖర్చులు పెరగడం, చివరకు వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి పరిమితులు మరింత కఠినం కావొచ్చని అంచనా వేస్తున్నారు.మరి హార్ముజ్పై ప్రభావం ఉంటుందా?ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఎల్ నినో ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అక్కడి పరిణామాలు ప్రధానంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిస్థితులు, దేశాల మధ్య సంబంధాలపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఎల్ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఇంధన వినియోగం, సరఫరా వ్యవస్థల్లో మార్పులు చోటుచేసుకుంటే.. పరోక్షంగా హార్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కరవు, పంటల నష్టం, రవాణా అంతరాయాలు పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు, ఆహార ధరలపై ఒత్తిడి పెరగొచ్చు.ప్రపంచ ఇంధన సరఫరాలో హార్ముజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. అక్కడ ఏ చిన్న అంతరాయం ఏర్పడినా దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కనిపించే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రత్యక్ష కారణం కాకపోయినా.. వాతావరణ మార్పులతో పెరిగే ఆర్థిక ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థల్లో అస్థిరతలు ఇంధన రంగానికి కొత్త సవాళ్లుగా మారవచ్చు.ఇతర జలమార్గాలకూ ముప్పుఎల్ నినో ప్రభావంతో ఏర్పడే పొడి వాతావరణ పరిస్థితులు ప్రపంచంలోని మరికొన్ని కీలక జలమార్గాలపైనా ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ప్రతి ప్రాంతంలో దీనికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. తీవ్రమైన వేడి, తక్కువ వర్షపాతం, కరవు పరిస్థితులు కొనసాగితే నదులు, కాలువల్లో నీటి మట్టాలు తగ్గి.. నౌకా రవాణాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.యూరప్లోని రైన్ నది వంటి ప్రధాన నదీ మార్గాలు పరిశ్రమలు, సరకు రవాణాకు ఎంతో కీలకం. నీటి మట్టాలు తగ్గినప్పుడు పెద్ద నౌకలు పూర్తిస్థాయిలో సరకు మోసుకెళ్లలేవు. దీంతో రవాణా సామర్థ్యం తగ్గడం, ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డాన్యూబ్ వంటి ఇతర కీలక నదీ మార్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే.. ఇంధనం, ముడి సరుకులు, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.అంటే.. ఎల్ నినో ప్రభావం కేవలం సముద్రాల్లోనే కాదు.. నదులు, కాలువల ద్వారా జరిగే ప్రపంచ వాణిజ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. వాతావరణ మార్పులతో పెరుగుతున్న తీవ్ర పరిస్థితులు భవిష్యత్తులో రవాణా వ్యవస్థలకు కొత్త సవాళ్లుగా మారనున్నాయి.ప్రపంచ వాణిజ్యానికి మరో సవాల్కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ సరఫరా వ్యవస్థలు ఇప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు సరఫరా గొలుసులను ప్రభావితం చేశాయి. ఇప్పుడు ఎల్ నినో కూడా మరో సవాల్గా మారుతోంది. ఒక ప్రాంతంలో కరవు కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం.. మరో ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతినడం.. ఇవన్నీ కలిపి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ముడి సరుకులు, ఇంధన సరఫరాలో మార్పులు వస్తే.. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.భారత్కు ముప్పు ఎంత?ఎల్ నినో ప్రభావం భారత్కు అత్యంత కీలకమైన అంశం. దేశ వ్యవసాయం ఎక్కువగా రుతుపవనాలపై ఆధారపడటం వల్ల వర్షపాతం మార్పులు నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటల దిగుబడి తగ్గడం, నీటి వనరులపై ఒత్తిడి పెరగడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడితే.. చమురు, ఎరువులు, ఆహార దిగుమతుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.వాతావరణం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు..ఒకప్పుడు ఎల్ నినోను కేవలం వాతావరణ పరిణామంగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే శక్తిగా మారింది. సముద్ర మార్గాల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు.. ఇంధన మార్కెట్ల నుంచి ఆహార సరఫరా వరకు.. ఎల్ నినో ప్రభావాలు అనేక రంగాలపై పడే అవకాశం ఉంది.పసిఫిక్ మహాసముద్రంలో మొదలైన ఈ పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభావాలు చూపుతుందో రాబోయే నెలలు కీలకంగా మారనున్నాయి. అందుకే దేశాలు ముందుగానే అప్రమత్తమై.. సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ ప్రణాళికలు, విపత్తు నిర్వహణ చర్యలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
రేవంత్ ఒక్కడే కాదు.. కేంద్రం ‘నో’ చెప్పిన సీఎంలు వీరే!
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి అమెరికా వెళ్లేందుకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. దీనిపై పెద్ద పొలిటికల్ చర్చే నడుస్తోంది. అయితే, విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం రేవంత్కు మాత్రమే ఎదురైన పరిణామం కాదు. గతంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు సీఎంల విదేశీ పర్యటనలకు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిన సందర్భాలున్నాయి. దీంతో ఇప్పుడు రేవంత్ టూర్ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు రాజకీయ క్లియరెన్స్ ఎందుకు అవసరం? కేంద్రం ఎప్పుడు నో చెబుతుంది? గతంలో ఎవరెవరి పర్యటనలు ఆగిపోయాయి? అనే చర్చ మొదలైంది.తాజాగా రేవంత్రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన కోసం బయలుదేరారు. ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడులు, విద్యా సంస్థల భాగస్వామ్యాలు, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను తీసుకురావడమే పర్యటన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో లండన్ నుంచే హైదరాబాద్కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 23న ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ ఇచ్చే ముందు MEA పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినవిగా ఉండాలి అని చెప్పారు. రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రతిపాదిత కార్యక్రమం ఆ ప్రమాణాలకు సరిపోలలేదని, అందుకే క్లియరెన్స్ నిరాకరించినట్లు వెల్లడించారు. రేవంత్రెడ్డి మాత్రం ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ నిర్మాణం వంటి అంశాలను రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా చూడాలని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో జరగాల్సిన కార్యక్రమాలను తన బృందం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన లేకుండానే తెలంగాణ ప్రతినిధి బృందం అమెరికా వెళ్లి కొన్ని ప్రతిపాదిత ఒప్పందాలు, భాగస్వామ్యాలపై ముందుకు వెళ్లనుంది.పలువురు సీఎంలకు ఇలానే.. 👉గతంలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి కూడా విదేశీ పర్యటన విషయంలో కేంద్రం నుంచి అనుమతి రాలేదు. 2021లో రోమ్లో నిర్వహించిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్కు వెళ్లాలని ఆమె భావించారు. అయితే ఆ కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాకు తగిన స్థాయిలో లేదని పేర్కొంటూ MEA అనుమతి నిరాకరించింది. దీంతో టీఎంసీ తీవ్రంగా స్పందించింది. అంతకుముందు చికాగో పర్యటన విషయంలోనూ మమతకు అనుమతి రాలేదని నివేదికలు ఉన్నాయి.👉ఇక ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. 2019లో డెన్మార్క్లో జరిగే C40 క్లైమేట్ సమ్మిట్కు వెళ్లేందుకు ఆయన అనుమతి కోరగా.. ఆ కార్యక్రమం నగర మేయర్ల కోసం ఉద్దేశించినదని, సీఎం స్థాయికి సరిపోదని MEA అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2022లో సింగపూర్ పర్యటనకు కూడా ఆయనకు అనుమతి లభించలేదు.👉పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విషయంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి సహా ప్రతినిధి బృందంతో యూకే, ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లాలని ఆయన భావించారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆ పర్యటనను రూపొందించినప్పటికీ MEA రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. 2024లో పారిస్ ఒలింపిక్స్కు వెళ్లి భారత హాకీ జట్టును ప్రోత్సహించాలన్న మాన్ ప్రయత్నానికీ అనుమతి రాలేదు. అయితే 2025లో జపాన్, దక్షిణ కొరియా పర్యటనకు మాత్రం ఆయనకు అనుమతి లభించింది.👉కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2025లో సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ పర్యటనకు ఆయనకు రాజకీయ క్లియరెన్స్ రాలేదు. అంతకుముందు 2023లో సౌదీ అరేబియాలో జరగాల్సిన కార్యక్రమానికి కూడా అనుమతి సమస్య తలెత్తింది.👉ఇది కేవలం ఇటీవలి కాలానికి సంబంధించిన వ్యవహారం కూడా కాదు. యూపీఏ హయాంలోనూ అప్పటి అసోం సీఎం తరుణ్ గొగోయ్ అమెరికా పర్యటనకు, జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా థాయ్లాండ్ పర్యటనకు రాజకీయ క్లియరెన్స్ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి.అసలు పొలిటికల్ క్లియరెన్స్ అంటే?ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారికంగా విదేశాలకు వెళ్లేటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. విదేశాంగ శాఖ పర్యటన ఉద్దేశం, కార్యక్రమాల స్వభావం, వెళ్లే దేశం, సంబంధిత అంశాలు తదితరాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాజకీయ క్లియరెన్స్ ఇస్తుంది. ఈ అనుమతి లేకుండా అధికారిక విదేశీ పర్యటనకు వెళ్లడం సాధ్యం కాదు. అయితే రేవంత్ విషయంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బ్రిటన్కు అనుమతి ఇచ్చి, అమెరికాకు మాత్రం ఎందుకు నిరాకరించారు? అన్నదే. దీనిపై MEA స్పష్టంగా చెప్పిన కారణం మాత్రం అమెరికా పర్యటనలోని ప్రతిపాదిత కార్యక్రమం సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినది కాదన్నదే. రేవంత్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం చేపట్టిన కార్యక్రమంగా చెబుతోంది. కేంద్రం మాత్రం అనుమతి విషయంలో ప్రోటోకాల్, రాజకీయ క్లియరెన్స్ నిబంధనలనే ముందుకు తెస్తోంది.ఇదిలా ఉండగా.. రేవంత్రెడ్డి ఇప్పటికే ఈ పర్యటన కోసం కోర్టు నుంచి కూడా అనుమతి పొందారు. క్యాష్-ఫర్-ఓట్ కేసులో విదేశీ పర్యటనకు సంబంధించిన షరతులను ఏసీబీ కోర్టు సడలించింది. అయితే ఆ అనుమతి కేంద్రం నుంచి అవసరమైన రాజకీయ క్లియరెన్స్కు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం కేవలం రేవంత్ అమెరికా టూర్ రద్దు అంశంగా మాత్రమే కాకుండా.. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారిక విదేశీ పర్యటనల విషయంలో ఉన్న వ్యవస్థపై కూడా చర్చకు దారితీసింది. -
ఏనుగు చర్మం టైల్తో కూల్ కూల్ కూల్!
ఏసీల్లాంటివి లేకుండానే ఇల్లు చల్లగా ఉంటే భలే బాగుంటుంది కదా? కొంచెం ఖర్చు, శ్రమకోరిస్తే ఇందుకు ఎన్నో మార్గాలు న్నాయి కానీ... పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు తాజాగా ఇంకో సరికొత్త మార్గాన్ని ఆవిష్క రించారు. అడవి ఏనుగుల ను స్ఫూర్తిగా తీసుకుని వాటి చర్మాలను పోలిన సిమెంట్ టైల్స్ తయారు చేశారు వీరు. బయటి గోడలకు వీటిని వాడితే ఇంటిలోపల ఉష్ణోగ్రతలు 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గుతాయని పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది కూడా. ఆసక్తికరమైన ఈ పరిశోధన వివరాలు... ఆఫ్రికాలోని ఏనుగులు మటమటలాడే ఎండల్లోనూ భేషుగ్గా బతికేయగలవు. ఏనుగు చర్మం మందంగా ఉండటం ఒక్కటే కారణం కాదు. చర్మం పైభాగంలో ఉండే పగుళ్లలో నీరు చేరిపోయి... నెమ్మదిగా ఆవిరవుతూ చల్లదనం అందిస్తుంది. ఇదే విషయాన్ని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు భవన నిర్మాణ సామగిర తయారీకి వాడారు. సిమెంట్, డైఆటమేషియస్ మట్టి (కీటకనాశినులుగా చల్లే తెల్లటి పొడిలాంటి మట్టి) సాయంతో పలకల్లాంటివి తయారు చేశారు. వీటిలోనూ పగుళ్లు ఉంటాయి. కాకపోతే అవి ఎలా ఉండాలన్నది మనం నిర్ణయించవచ్చు. ఇలా చేయడం వల్ల వాటిల్లోకి నీరు చేరడమే కాకుండా... ఉపరితలం మొత్తమ్మీద నెమ్మదిగా వ్యాపిస్తుంది కూడా. ఎండ వేడికి ఈ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ వేడిని విడుదల చేస్తుంది. తద్వారా లోపలి ప్రాంతం చల్లగా మారుతుంది. శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల్లో ఈ టైల్స్ దిగువన ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటే, పగుళ్లు ఉన్న టైల్స్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగానూ, పగుళ్లు లేని టైల్స్ ఉపరితలంపై ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్గానూ ఉన్నట్లు తెలిసింది. పగుళ్లు లేని టైల్స్లో ఉపరితల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే.. ఉన్నదాంట్లోని నీరు కారణంగా ఉష్ణోగ్రత పది డిగ్రీ సెల్సియస్ తక్కువగా ఉందన్నమాట. పైగా ఈ చల్లదనం దాదాపు 20 గంటలపాటు అలాగే ఉండటం విశేషం. ఈ రకమైన టైల్స్ వాడితే ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి ఏసీ, కూలర్ల వంటివాటి వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడల్లా ఈ టైల్స్పైకి ఆటోమెటిక్గా నీరు చిమ్మేలా ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగం ప్రాముఖ్యత ఏమిటంటే...భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎండాకాలం వేడి ఏటికేడు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటే ఏసీల వాడకం.. ఫలితంగా విద్యుత్తు వినియోగం కూడా కొండెక్కుతోంది. ఈ ఏడాది మే నెల వరకూ భారత్లో సుమారు కోటీ యాభై లక్షల ఏసీలు అమ్ముడుపోయినట్లు సమాచారం. వడగాడ్పులు, రుతుపవనాల ఆలస్యం వంటి కారణాలతో ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల మే నెలలోనే దేశ గరిష్ట విద్యుత్తు వినియోగం 22 గిగావాట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌక పద్ధతుల్లో ఇళ్లలో చల్లదనాన్ని అందించే ఏర్పాట్లు ఎంతైనా ఆహ్వానించదగ్గవి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బిడ్డను బడికి పంపాలంటేనే.. భయంగా ఉంది
ఆ వీడియోలు చూస్తే ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ఒకటే ప్రశ్న.. ‘స్కూల్కు పంపిన నా బిడ్డ సురక్షితంగా ఇంటికి తిరిగొస్తారా?’.. మొన్న రాజస్థాన్ జైపూర్లో అమైరా.. నిన్న విశాఖపట్నంలో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ మృతి ఘటనలు.. ప్రతి తల్లిదండ్రినీ కలవరపెడుతున్న ప్రశ్నలుగా మారాయి.విశాఖపట్నంలో హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ బాలుడిని మందలించడం, కొట్టడం.. ఆ తర్వాత చిన్నారి ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం కలచివేస్తోంది. అయితే బాలుడి మృతికి అసలు కారణం ఏంటన్నది పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే ఈ ఘటన మరో పెద్ద ప్రశ్నను మన ముందుంచింది. పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు ‘పనిష్మెంట్’ అవసరమా? లేక ఆ పేరుతో మనం వాళ్లలో భయాన్ని పెంచుతున్నామా?..వీడియో చూస్తున్నప్పుడు కోపం రావడం సహజం. ఒక పసివాడిని భయపెట్టి, కొట్టడం సమర్థించలేం. అదే సమయంలో ఒక ప్రశ్న కూడా వెంటాడుతుంది.. ఆ టీచర్ కూడా ఓ బిడ్డకు తల్లే అయ్యి ఉండొచ్చు కదా? తన పిల్లవాడిని ఎవరైనా ఇలా భయపెడితే ఆమె ఎలా స్పందిస్తారు?. ఇక్కడ సమస్య ఒక్క టీచర్తో ముగిసేది కాదు. పిల్లలపై చేయి చేసుకోవడం తప్పు అని తెలిసినా.. ‘కొంచెం కొడితేనే చదువుకుంటారు’, ‘భయపెడితేనే మాట వింటారు’ అనే పాత ఆలోచన టీచర్లలోనే కాదు తల్లిదండ్రుల్లోనూ ఇంకా ఎందుకు బతికే ఉంది?.ఆరేళ్ల పిల్లవాడికి హోంవర్క్ పూర్తి చేయకపోవడం ఒక ‘నేరం’ కాదు. అతడి వయసుకు తగ్గ కారణం ఉండొచ్చు. అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆడుకోవాలనిపించి ఉండొచ్చు. అలసిపోయి ఉండొచ్చు. చెప్పలేని భయం ఏదైనా ఉండొచ్చు. అతడిని కొట్టడం కంటే.. ‘హోంవర్క్ ఎందుకు చేయలేకపోయావు?’ అని అడగాల్సింది.స్కూల్ అంటే భయపడాలా?ఒక పిల్లవాడు టీచర్ను చూస్తే భయపడుతున్నాడంటే అది క్రమశిక్షణ కాదు. అతడు తప్పు చేసినప్పుడు తన మాట చెప్పగలిగేంత భద్రతను అనుభవించాలి. స్కూల్ అంటే భయపడాల్సిన చోటు కాదు.. నేర్చుకోవడానికి, తప్పులు చేయడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి సురక్షితమైన స్థలం.ఇక్కడే రాజస్థాన్లోని అమైరా ఘటనను మరోసారి గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. తొమ్మిదేళ్ల ఆ చిన్నారి తనకు ఎదురవుతున్న ఇబ్బందిని మాటల్లో చెప్పేందుకు, సహాయం కోసం టీచర్ను ఆశ్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు చూపించాయి. కానీ ఆ చిన్నారి ఆర్తనాదాన్ని సకాలంలో ఎవరైనా గుర్తించారా? ఆమె ప్రవర్తనలో కనిపించిన ఆందోళనను ఎవరైనా అర్థం చేసుకున్నారా? అనే ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పిల్లలు ప్రతిసారీ ‘నాకు సమస్య ఉంది’ అని స్పష్టంగా చెప్పలేరు. వారి ఏడుపు, భయం, ప్రవర్తనలో మార్పు.. ఇవన్నీ కూడా సహాయం కోసం చేసే పిలుపులే కావచ్చు.మానసికంగా చూస్తే చిన్నారులపై శారీరక శిక్ష తక్షణ భయాన్ని కలిగించవచ్చు. కానీ దీర్ఘకాలంలో చదువుపై ఆసక్తి తగ్గడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, పెద్దలను చూసి భయపడటం, సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘పనిష్మెంట్’కు బదులుగా పాజిటివ్ డిసిప్లిన్ అవసరం...అయితే పరిష్కారం ఏంటి?1.పాఠశాలల్లో పిల్లలపై చేయి చేసుకోవడం, అవమానించడం, బెదిరించడం విషయంలో జీరో టాలరెన్స్ ఉండాలి. ప్రతి పాఠశాలలో ఫిర్యాదు వ్యవస్థ ఉండాలి. పిల్లలు నేరుగా చెప్పలేకపోయినా.. తల్లిదండ్రులు, కౌన్సిలర్ లేదా నమ్మకమైన ఉపాధ్యాయుడికి విషయం చేరే మార్గం ఉండాలి.2.ఉపాధ్యాయులకు కేవలం సబ్జెక్ట్ బోధనే కాదు.. చైల్డ్ సైకాలజీ, కోపాన్ని నియంత్రించుకోవడం, పాజిటివ్ డిసిప్లిన్పై తప్పనిసరి శిక్షణ ఇవ్వాలి. ఒత్తిడిలో ఉన్న టీచర్కు కూడా కౌన్సెలింగ్ అవసరమే.3.తల్లిదండ్రులు ప్రతిరోజూ ఒక్క ప్రశ్న అడగాలి. “ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు?”. అంతేకాదు.. “ఎవరైనా నిన్ను కొట్టారా? భయపెట్టారా? నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించిందా?”.. అని కూడా ప్రేమగా అడగాలి. ఎందుకంటే పిల్లలు తమ బాధను చెప్పడం నేర్చుకున్నప్పుడే మనం వారిని రక్షించగలం.ఒక చిన్నారి స్కూల్ బ్యాగ్లో పుస్తకాలు మాత్రమే ఉండాలి.. మనసులో భయం కాదు. టీచర్ చేతిలో చాక్ ఉండాలి.. పిల్లల మీద కోపం కాదు. తల్లిదండ్రుల గుండెల్లో నమ్మకం ఉండాలి.. ఏదో ఆందోళన కాదు. పనిష్మెంట్తో పిల్లలను మార్చలేం.. ప్రేమతో, ఓర్పుతో, అర్థం చేసుకోవడంతోనే వారి భవిష్యత్తును మార్చగలం.ఇదీ చదవండి: టీచర్ కొట్టడంతోనే పిల్లాడు చనిపోయాడా? -
మధుమేహానికి బ్యాక్టీరియాతో చెక్?
మన పేవుల్లో ఉండే కోటానుకోట్ల బ్యాక్టీరియా రకాల్లో ఈ–కోలీ ఒకటి. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడుతుంది. కొన్ని రకాలతో ఆరోగ్య సమస్యలూ వస్తాయి. అలాంటి బ్యాక్టీరియాతో టైప్–2 మధుమేహానికి చికిత్స కూడా అందించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు! ప్రీ క్లినికల్ ట్రయల్స్ దాటుకుని జంతు ప్రయోగాల దశకు చేరిన ఈ ఆసక్తికర పరిశోధన వివరాలు.. భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అంటూంటారు. కనీసం పది కోట్ల మంది ఈ జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువ. రోజూ మందులేసుకోవడం, అవి చాలకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు... వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఎవరికైనా భరించలేని వేదనే. అందుకే మధుమేహానికి మెరుగైన చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనాలోని ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి ఒక వినూత్నమైన పరిష్కారాన్ని సూచించారు. గ్లూకోజును పసిగట్టే జన్యు రిసెప్టర్లను ఈ–కోలీ బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టారు. చక్కెర నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువైతే చాలు... ఈ బ్యాక్టీరియా జీఎల్పీ–1 హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇంకోలా చెప్పాలంటే.. ఈ బ్యాక్టీరియా కారణంగా ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు వాడే ఒజెంపిక్తోపాటు సెమాగ్లూటైడ్ వంటి మందులు శరీరంలోనే తయారై విడుదలవుతాయన్నమాట. ఇదీ సమస్య... శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ఇన్సులిన్ విడుదల చేయమని కాలేయానికి సందేశాలు వెళతాయి. ఈ ఇన్సులిన్ కాస్తా గ్లూకోజును మన కణాల తలుపులు తెరిచి గ్లూకోజు లోపలికి చొచ్చుకెళ్లేందుకు సాయపడతాయి. తగినంత గ్లూకోజు కణాల్లోకి చేరిన తరువాత ఇన్సులిన్ విడుదల కూడా తగ్గిపోతుంది. దీంతో కాలేయం అవసరాలకు తగ్గట్టు మళ్లీ చక్కెర తయారు చేసి రక్తంలోకి వదులుతూంటుంది. అయితే మధుమేహం ఉన్నవారిలో ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. కణాలు ఇన్సులిన్కు స్పందించడం మానేస్తాయి. ఫలితంగా చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. సెమాగ్లూటైడ్ వంటి మందులు ఇన్సులిన్ స్థాయిలను పెంచి గ్లూకోజు ఖర్చయ్యేందుకు సాయపడతాయి. ఈస్ట్ చైనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ–కోలీ బ్యాక్టీరియానే రక్తంలోని గ్లూకోజు స్థాయిలను బట్టి జీఎల్పీ–1 హార్మోన్ విడుదల చేసేలా చేశారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇన్సులిన్ విడుదల అవుతూండటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశాలు తక్కువ. మధుమేహం ఉన్న కొన్ని రకాల కోతులు, ఎలుకలపై ఇప్పటికే తాము ఈ బ్యాక్టీరియాను ప్రయోగించామని, మంచి ఫలితాలే వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. హానికర ప్రభావాలు కూడా లేనట్లు స్పష్టమైనట్లు చెప్పారు. మానవ ప్రయోగాలు కూడా నిర్వహించి సత్ఫలితాలు సాధిస్తే ఈ బ్యాక్టీరియా చికిత్స టైప్–2 మధుమేహ బాధితులకు వరం కాగలదనడంలో సందేహం లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరాలతల్లి.. కల్పవల్లి
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వివాహితలు తమ కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారని తెలుసు కదా... అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం రెండు వారాల పాటు చేసుకునే విధంగా రావడం విశేషం. సాధారణంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి శుక్రవారం పౌర్ణమి రోజే వచ్చింది. పౌర్ణమి అమ్మవారికి ఇష్టమైన తిథి కాబట్టి మూడవ శుక్రవారం అయినా ఆ రోజున ఈ వ్రతం ఆచరించడం మరింత శ్రేష్ఠమని పండితుల అభిప్రాయం. శ్రద్ధ, భక్తి, ఓపిక, వెసులుబాటు ఉండాలే కానీ నెలలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం ఆచరించవచ్చునన్నది పెద్దల మాట. ఎప్పుడు చేసుకున్నా, ప్రాంతీయ భేదానుసారం కొద్దిపాటి మార్పు చేర్పులతో చేసుకునే ఈ వరలక్ష్మీ వ్రతవిధానమిది...ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, గడపకు పసుపు, కుంకుమ, అందమైన ముగ్గులతో గృహాలంకరణ చేయాలి. ఒక పీఠంపై బియ్యం పోసి, దానిపై రాగి లేదా వెండి కలశాన్ని ఉంచాలి. కలశంలో నీరు, నాణేలు, పసుపు, కుంకుమ వేసి, పైన మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి లక్ష్మీదేవి గా భావించాలి. అమ్మవారి ముఖరూపాన్ని అలంకరించి పీఠంపై ప్రతిష్ఠించాలి.తోరాలు: తొమ్మిది నూలు దారపు పోగులతో, తొమ్మిది ముడులు వేసి, పసుపు రాసి తోరాలు (రక్షా సూత్రాలు) తయారు చేసి పూజలో ఉంచాలి.సంక్షిప్త పూజా విధానంగణపతి పూజ: సంప్రదాయం ప్రకారం ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుడి పూజతోనే ప్రారంభించాలి. అందువల్ల పసుపు వినాయకుడిని చేసి, అక్షతలు, పూలతో పూజించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. లక్ష్మీ ఆరాధన: ఆ తర్వాత కలశంలో ఉన్న వరలక్ష్మీ దేవికి షోడశోపచార పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తర శతనామావళిని చదువుతూ సుగంధభరితమైన పువ్వులు, కుంకుమతో అర్చన చే యాలి.తోర పూజ: అమ్మవారి మూలమంత్రాలను పఠిస్తూ పూజలో ఉంచిన తోరాలకు పూజ చేసి, ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవడం వ్రతంలో ముఖ్య క్రతువు. నైవేద్యం: లక్ష్మీదేవికి ఇష్టమైన నవధాన్యాలు, బూరెలు, గారెలు, పరమాన్నం, కొబ్బరికాయలు వంటి నవకాయ పిండివంటలను, ఐదు రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. వ్రత కథ: పూర్వం పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించాడు. మగధ దేశంలోని కుండినం అనే నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమ ఇల్లాలు ఉండేది. ఆమె అత్తమామలను, భర్తను దైవంగా భావించి సేవించేది. ఆమె భక్తికి మెచ్చిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో ప్రత్యక్షమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానంటూ వ్రతవిధానాన్ని చెప్పింది. చారుమతి తన కలను కుటుంబ సభ్యులకు వివరించి, ఊరిలోని మిగతా స్త్రీలతో కలిసి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించింది. పూజ పూర్తి కాగానే, వ్రతం చేసిన స్త్రీలందరి ఇళ్లు ధనధాన్యాలతో, బంగారు ఆభరణాలతో నిండిపోయాయి. అప్పటినుండి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ప్రతి ఏటా సంప్రదాయంగా చేసుకుంటున్నారు.వాయనం: పూజ తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి, వ్రత కథాక్షతలను శిరస్సున ధరించాలి. సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి, తాంబూలంలో పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, రవికె గుడ్డ, ప్రసాదాలను వాయనంగా ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి.మరికొన్ని విశేషాలు‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్టమైన’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తి భావనతో కొలిచే వ్రతమే వరలక్ష్మీవ్రతం.శ్రావణ మాసమంటే ఎందుకని ఇష్టం? శ్రవణం లక్ష్మీపతి అయిన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పేరు మీదుగా వచ్చిన మాసం కాబట్టి ఈ మాసమంటే అమ్మవారికి ఇష్టం. అలాగే పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతికరం. వీటన్నిటినీ సమన్వయం చేస్తే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చెయ్యటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. లక్ష్మీ నివాస స్థానాలుమహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్తాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనవి...పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, గోమయం, గోపృష్టం, ఆవు కొమ్ముల మధ్యన, పూజామందిరం, పవిత్రమైన మనస్సు, దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార సంపన్నుడైన పండితుడు లేదా గురువు. శ్రీసూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలి. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందట. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, ధనం, ధాన్యం, సౌభాగ్యం వంటివి కూడా ధనమే. వరలక్ష్మీ వ్రతం పూజా విధానంవరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. అది వరలక్ష్మీవ్రతం. వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు...పండ్లు – పిండివంటలు అలంకరణ వస్తువులు ∙పసుపు, కుంకుమ, గంధం ∙అక్షతలు, అగరుబత్తీలు ∙కర్పూరం, నెయ్యి, నూనె ∙దూది వత్తులు, హారతి పళ్ళెం ∙తమలపాకులు (20), వక్కలు ∙నాణేలు ∙కలశం పాత్ర (వెండి/రాగి/ఇత్తడి) ∙ఐదు రకాల పండ్లు (అరటి, ఆపిల్, దానిమ్మ, ద్రాక్ష, జామ వంటి పండ్లు ∙కొబ్బరికాయలు (కనీసం 3) ∙తోరాలు (9 పోగుల దారాలు) నానబెట్టిన శనగలు ప్రసాదాలు (పరమాన్నం, గారెలు, బూరెలు) ∙అమ్మవారి ముఖరూపం ∙మామిడి ఆకులు, అరటి మొక్కలు ∙పూలమాలలు, విడిపూలు ∙కొత్త రవికల గుడ్డలు (వాయనం కోసం) ∙పీఠం (చెక్క పీట), ఎర్రటి వస్త్రం ∙గాజులు, తాంబూలం వస్తువులు.కలశం ఎందుకు?వరలక్ష్మీ వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి. ఎందుకంటే కలశం అమ్మవారికి ప్రతిరూపం. మట్టిపాత్ర లేదా శక్తిని బట్టి వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కలశం కోసం ఉపయోగించవవచ్చు. కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్త్వానికి సంకేతం. అందులో పోసే నీరు జల తత్త్వానికి సంకేతం. కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు. మిగిలిన శూన్యస్థితి ఆకాశతత్త్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం. కనుక అది వాయుతత్త్వానికి సంకేతంగా ఉంటుంది. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్త్వానికి సంకేతం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్త్వం, శక్తిస్వరూపమైన అమ్మను ఆరాధించటం కలశారాధనలోని అంతరార్థం.– డి.వి.ఆర్. -
రూ.8,452 కోట్ల పీఎంకేర్స్.. బడుల కోసం మళ్లించాలా?
కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ఫండ్ మరోసారి చర్చలోకి వచ్చింది. ఫండ్లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు నిల్వ ఉన్నట్లు తాజా ఆడిట్ వివరాలు వెల్లడించడంతో.. ఈ మొత్తాన్ని ఎక్కడ, ఎలా వినియోగించాలనే అంశంపై చర్చ మొదలైంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి ఈ నిధులను ఉపయోగించాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన డిమాండ్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.యువత తనకు అండగా నిలిస్తేనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. యువత కలలను సాకారం చేసేందుకు అవసరమైన అవకాశాలు, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే.. దేశ భవిష్యత్కు కీలకమైన విద్యారంగం, ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల అభివృద్ధికి పీఎంకేర్స్ నిధులను వినియోగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పీఎంకేర్స్ నిధులు ఎంత పెరిగాయి?.. 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations) ఫండ్ను ఏర్పాటు చేసింది. తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఫండ్లో రూ.8,452 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి.తాజా ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీఎంకేర్స్ ఫండ్ నుంచి మొత్తం చెల్లింపులు కేవలం రూ.87.85 లక్షలుగా ఉన్నాయి. ఇందులో రూ.87.84 లక్షలు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందించే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కోసం ఖర్చయ్యాయి. మిగిలిన మొత్తం బ్యాంకు తదితర చిన్న ఖర్చులకు వెళ్లినట్లు వివరాలు వెల్లడించాయి.అంతకుముందు ఏడాది రూ.7,173 కోట్లుగా ఉన్న నిల్వ.. ఏడాదిలో దాదాపు 17.8 శాతం పెరిగింది. ఇందులో సుమారు రూ.7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా.. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అయితే నిధులు పెరిగినప్పటికీ.. విరాళాల రూపంలో వచ్చే ఆదాయం మాత్రం తగ్గింది. 2024-25లో దేశీయ విరాళాలు రూ.479 కోట్లకు పడిపోయాయి. విదేశీ విరాళాలు కూడా తగ్గినట్లు వివరాలు చెబుతున్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఫండ్కు ప్రధాన ఆదాయంగా మారింది.సీజేపీ డిమాండ్ ఏంటి?పీఎంకేర్స్లో వేల కోట్ల రూపాయలు నిల్వగా ఉన్నప్పటికీ.. దేశంలోని గ్రామీణ పాఠశాలలు కనీస సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నాయని కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు రోడ్లు, తరగతి గదుల్లో బెంచీలు, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ఎత్తిచూపుతూ సీజేపీ ఇప్పటికే ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ బడుల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తూ.. పాఠశాలల పరిస్థితిని పరిశీలించడం, సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా సీజేపీ చెబుతోంది.‘‘ఒకవైపు పాఠశాలలకు నిధుల కొరత ఉందని చెబుతున్నారు.. మరోవైపు రూ.8,500 కోట్లు పీఎంకేర్స్లో ఉపయోగం లేకుండా ఉన్నాయి. ఈ డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకు వినియోగించకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒక మోడల్ హైటెక్ పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.8 కోట్లు ఖర్చవుతుందని లెక్కిస్తే.. ఈ మొత్తంతో వెయ్యికి పైగా ఆధునిక పాఠశాలలు నిర్మించవచ్చని ఆయన చెప్పారు.పీఎంకేర్స్పై వచ్చిన ఆరోపణలు ఏంటి?పీఎంకేర్స్ ఏర్పాటు అయినప్పటి నుంచే ఈ ఫండ్ పారదర్శకతపై ప్రతిపక్షాలు, కొన్ని పౌరసంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ అంశాలపై విమర్శలు వచ్చాయి:ఆర్టీఐ పరిధిలోకి ఎందుకు రావడం లేదు?పీఎంకేర్స్ నిధులు ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నప్పటికీ.. ఇది సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రభుత్వం చెబుతోంది. దీంతో నిధుల సేకరణ, ఖర్చుల వివరాలపై పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని విమర్శలు వచ్చాయి.కాగ్ ఆడిట్ ఎందుకు లేదు?ప్రతిపక్షాలు పీఎంకేర్స్ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆడిట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఇది ప్రభుత్వ నిధులతో కాకుండా స్వచ్ఛంద విరాళాలతో నడిచే ట్రస్ట్ కావడంతో కాగ్ పరిధిలోకి రాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.నిధులు ఎందుకు ఎక్కువగా నిల్వ ఉన్నాయి?రూ.8,452 కోట్లలో ఎక్కువ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండటంపై కూడా విమర్శలు వచ్చాయి. అత్యవసర సహాయం కోసం ఏర్పాటైన ఫండ్లో ఇంత పెద్ద మొత్తం వినియోగం లేకుండా ఉండటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.‘‘అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో వేల కోట్ల రూపాయలు ఉండగా.. వినియోగం ఎందుకు తక్కువగా ఉంది?’’ అనేది చాలా మంది అడిగేది. మరోవైపు ప్రభుత్వం మాత్రం.. పీఎంకేర్స్ అనేది అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన స్వచ్ఛంద విరాళాల ట్రస్ట్ అని, అవసరమైన సందర్భాల్లో ఉపయోగించేందుకు నిధులు అందుబాటులో ఉండాలని చెబుతోంది.ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి?పీఎంకేర్స్ ఒక స్వతంత్ర ట్రస్ట్ అని, దీనికి ఎలాంటి బడ్జెట్ నిధులు కేటాయించరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు, సంస్థలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలతో ఇది నడుస్తుందని పేర్కొంటున్నాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, వెంటిలేటర్ల కొనుగోలు, అత్యవసర వైద్య సదుపాయాల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో వచ్చే విపత్తులు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు నిధులను నిల్వ ఉంచాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది. అయితే..సీజేపీ డిమాండ్కు ప్రజల్లో కొంత మద్దతు కనిపిస్తున్నప్పటికీ.. ఆచరణలో ఇది అంత సులభం కాదన్నది ప్రభుత్వ వర్గాల మాట. పీఎంకేర్స్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు అత్యవసర సహాయానికి సంబంధించినవి కావడంతో.. నిధులను విద్యా రంగానికి మళ్లించాలంటే ట్రస్ట్ నిబంధనలు, చట్టపరమైన అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే దేశంలో పాఠశాలల మౌలిక వసతుల సమస్యలు ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి భారీ నిధులను ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే రంగాల్లో వినియోగించాలనే డిమాండ్ మాత్రం కొనసాగుతోంది.అసలు ప్రశ్న ఏంటి?పీఎంకేర్స్ విషయంలో ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు.. విపత్తుల సమయంలో వెంటనే ఉపయోగించుకునేలా భారీ నిధి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. ప్రజల విరాళాలతో ఏర్పడిన వేల కోట్ల నిధులు మరింత పారదర్శకంగా ఉండాలని, అవసరమైన రంగాలకు ఉపయోగపడాలని విమర్శకులు కోరుతున్నారు.రూ.8,452 కోట్ల పీఎంకేర్స్ నిధి.. కేవలం ఓ ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. అత్యవసర నిధి లక్ష్యం, ప్రజా ప్రయోజనం, పారదర్శకత మధ్య సమతుల్యతపై జరుగుతున్న పెద్ద చర్చకు ఇది కేంద్ర బిందువుగా మారింది. -
పొద్దున లేవగానే ఫోన్.. రాత్రి పడుకునే వరకు స్క్రోలింగ్!
సాక్షి, హైదరాబాద్ : అలారం ఆపగానే చేతి వేళ్లు ఫోన్ వైపే వెళ్తున్నాయా? ‘ఒక్క నిమిషం’ అంటూ మెసేజ్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ అరగంట గడిచిపోతోందా? రాత్రి పడుకునే ముందు చివరిసారి ఫోన్ చూడాలనుకుని రీల్స్ చూస్తూ గంటలు గడుపుతున్నారా? ఇది ఇప్పుడు చాలామందిలో కనిపిస్తున్న డిజిటల్ అలవాటు. ఉదయం లేవగానే స్క్రీన్తో రోజును ప్రారంభించడం, రోజంతా నోటిఫికేషన్లు చెక్ చేయడం, రాత్రి నిద్రకు ముందు రీల్స్ చూడటం.. ఇలా చాలామందిలో స్క్రీన్ వినియోగం పెరిగిపోతోంది. దీని ప్రభావం నిద్ర, ఏకాగ్రత, మానసిక స్థితిపై పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొద్దున ఫోన్ ఎందుకు వద్దు? నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఫోన్లో వచ్చే మెసేజ్లు, ఈమెయిల్స్, వార్తలు, సోషల్ మీడియా పోస్టులు మన దృష్టిని ఒక్కసారిగా అనేక అంశాల వైపు మళ్లిస్తాయి. ముఖ్యంగా ప్రతికూల వార్తలు లేదా పని సంబంధిత సందేశాలు కనిపిస్తే.. రోజును ప్రశాంతంగా ప్రారంభించడానికి బదులుగా ఒత్తిడితో ప్రారంభించే అవకాశం ఉంటుంది. ‘ఒక్కసారి చూస్తాను’ అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంటే.. రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా పోస్టులు వరుసగా కనిపిస్తూనే ఉంటాయి. ఒక కంటెంట్ తర్వాత మరో కంటెంట్ చూడాలనే ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా ఉదయం చేయాల్సిన పనులు ఆలస్యం కావచ్చు. రోజులో ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి పట్టే సమయం కూడా పెరగొచ్చు. ఉదయం ఫోన్కు దూరంగా ఉండాలంటే.. మొదటి 30 నిమిషాలు: నిద్ర లేవగానే ఫోన్ చూడకుండా రోజును ప్రారంభించే ప్రయత్నం చేయండి. అలారం కోసం: సాధ్యమైతే ఫోన్కు బదులుగా సాధారణ అలారం గడియారం ఉపయోగించండి. దీంతో ఉదయం అలారం ఆపడానికి ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నోటిఫికేషన్లకు బ్రేక్: అవసరం లేని యాప్ల నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. ప్రతి అలర్ట్కు వెంటనే స్పందించాల్సిన అవసరం లేకుండా చేసుకోండి. స్క్రీన్కు సమయ పరిమితి: రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా కోసం రోజువారీ సమయ పరిమితి పెట్టుకోండి. ఉదయపు ప్రత్యామ్నాయం: లేవగానే నీరు తాగడం, కొద్దిసేపు నడవడం, స్ట్రెచింగ్ చేయడం, పుస్తకంచదవడం వంటి అలవాట్లను పెంచుకోండి. సూర్యకాంతి: ఉదయం కొంతసేపు సహజ కాంతిలో గడిపితే రోజును చురుగ్గా ప్రారంభించవచ్చు. రోజు ప్లాన్: ఫోన్ నోటిఫికేషన్లను అనుసరించకుండా.. ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను ముందుగానే డైరీలో రాసుకోవడం మంచిది. డోపమైన్ అంటే?ఫోన్ చూడగానే మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలై ఆనందానికి బానిస అయిపోతున్నామనే ప్రచారం ఉంది. డోపమైన్ అనేది మెదడులోని నాడీకణాల మధ్య సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషించే న్యూరోట్రాన్స్మీటర్. కొన్ని రకాల అలవాట్ల రూపకల్పనలో ఇది భాగస్వామి. మనకు ఆసక్తికరంగా అనిపించే లేదా రివార్డ్ లభించే అనుభవాలు మళ్లీ చేయాలనే ప్రేరణలో డోపమైన్ వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే సోషల్ మీడియా లైక్లు, కొత్త నోటిఫికేషన్లు, షార్ట్ వీడియోలు వంటి తక్షణ రివార్డులు పదేపదే అందుబాటులో ఉంటే.. వాటిని మళ్లీ మళ్లీ చూడాలనే అలవాటు బలపడవచ్చు. » షార్ట్ వీడియో యాప్స్లో ఒక వీడియో పూర్తికాగానే మరో వీడియో సిద్ధంగా ఉంటుంది. మనం వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్తదనం, ఆసక్తికరమైన కంటెంట్ వరుసగా అందడం వల్ల మరికొంతసేపు చూడాలనే కోరిక కలగవచ్చు. ఇలా ఐదు నిమిషాల కోసం మొదలైన స్క్రోలింగ్ అరగంటకు.. ఆ తర్వాత గంటకు చేరుతుంది. రోజువారీ పనులు, చదువు, వ్యాయామం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవచ్చు. » ముఖ్యంగా ఇది నిద్రకు పెద్ద సమస్యగా మారుతుంది. నిద్ర సమయం తగ్గితే మరుసటి రోజు అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యలు కనిపించవచ్చు. » సోషల్ మీడియాలో ఇతరుల విజయాలు, ప్రయాణాలు, జీవనశైలిని పదేపదే చూడటం వల్ల కొందరు తమ జీవితాన్ని వారితో పోల్చుకోవచ్చు. దీనివల్ల అసంతృప్తి లేదా తమపై తక్కువ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిద్రకు ముందు ఫోన్కు గుడ్బై » రాత్రి పడుకునే ముందు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల నిద్ర సమయం తగ్గకుండా జాగ్రత్త పడాలి. » ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ వంటి నిరంతరం కొత్తకంటెంట్ అందించే యాప్ల వినియోగాన్ని నిద్రకు ముందు తగ్గించడం మంచిది. » రాత్రి ఫోన్ను మంచం పక్కన కాకుండా కొంత దూరంలో ఉంచండి. చేతికి అందే దూరంలో ఉంటే తెలియకుండానే తీసుకునే అవకాశం ఎక్కువ. » అవసరమైతే ‘డు నాట్ డిస్టర్బ్’ మోడ్ ఉపయోగించడం ద్వారా రాత్రి అంతరాయాలను తగ్గించుకోవచ్చు. అలవాట్లు డిటాక్స్ డోపమైన్ను డిటాక్స్ చేయడం కంటే మన అలవాట్లను డిటాక్స్ చేసుకోవడం ముఖ్యం. ఫోన్ను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. అది మన జీవితాన్ని సులభతరం చేసే సాధనం. కానీ ఉదయం లేవగానే మొదటి పని ఫోన్ చూడటం, ప్రతి కొన్ని నిమిషాలకోసారి నోటిఫికేషన్లు చెక్ చేయడం, రాత్రి నిద్రను త్యాగం చేసి రీల్స్ చూడటం మాత్రం అలవాటుగా మారకూడదు. టెక్నాలజీని మన అవసరాలకు ఉపయోగించుకోవాలి.. డిజిటల్ జీవితానికి దూరం కావడం కాదు.. దానితో సమతుల్యత సాధించడమే అసలుపరిష్కారం. -
ఐపీవోలకు గ్రే మార్కెట్ జోష్
కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగుతుంటే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను అందుకోవడంతోపాటు.. లాభాల లిస్టింగ్తో ఐపీవో మార్కెట్లో జోష్ పెంచుతున్నాయి. ఫలితంగా కొత్త ఇష్యూలకు గ్రే(అనధికార అన్లిస్టెడ్) మార్కెట్లో ప్రీమియం పెరుగుతోంది. వెరసి ఇన్వెస్టర్లకు బస్ మిస్సవుతున్నామన్న ఆందోళన(ఫోమో) పెరిగి దరఖాస్తు చేసేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా లిస్టయిన షిప్రాకెట్ ఇష్యూ ధర రూ. 97కాగా.. రూ. 143 వద్ద నిలిచింది. రూ. 285 ధరతో పోలిస్తే బెహారీలాల్ ఇంజనీరింగ్ రూ. 503 వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుతం మిల్కీ మిస్ట్ డెయిరీ(రూ. 140) తాజాగా 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ. 200 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో మాల్బియో(రూ. 807) రూ. 1,177కు ఎగసి రూ.1,037 వద్ద ముగిసింది. ధూత్ ట్రాన్స్మిషన్(రూ. 871) రూ. 1,404 వద్ద, టెక్నోక్రాఫ్ట్(రూ. 212) రూ. 315 వద్ద, ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్(రూ. 425) రూ. 570 వద్ద ముగిశాయి. అనధికార ప్రీమియం...ఇటీవల పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతుండటంతో ఐపీవోకు వచ్చే కంపెనీల షేర్లు ముందుగా ట్రేడయ్యే అనధికార(గ్రే) మార్కెట్లో ప్రీమియం పలుకుతున్నాయి. ఫలితంగా కొత్త ఇష్యూలకు చిన్న ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. దీంతో షిప్రాకెట్కు రిటైలర్ల విభాగంలో 46 రెట్లు, బెహారీ లాల్కు 53 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఈ బాటలో ఆగ్మంట్, టెంప్సన్స్, సన్షైన్ పిక్చర్స్, స్కైవేస్ ఎయిర్, లలితా జ్యువెలరీ ఇష్యూలకు గ్రే మార్కెట్లో ప్రీమియం ధర పలుకుతోంది. ఐపీవో వేవ్...రూ. 2,600 కోట్ల సమీకరణ లక్ష్యంగా హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, రూ. 1,700 కోట్ల సమీకరణ లక్ష్యంతో లలితా జ్యువెలరీ ఐపీఓలు బుధవారం(19న) ముగిశాయి. ఈ బాటలో నేడు(గురువారం) షేరుకి రూ. 88–93 ధరల శ్రేణితో ఆభరణ వర్తక సంస్థ శంకేష్ జ్యువెలర్స్, రూ. 342–360 ధరల శ్రేణితో టీవీ ప్రొడక్షన్ సంస్థ సన్షైన్ పిక్చర్స్ ఐపీవోలు ముగియనున్నాయి. మరో 4 కంపెనీలు...గజా క్యాపిటల్ బ్రాండ్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీవో బుధవారం(19న) ప్రారంభమైంది. ఇందుకు ధరల శ్రేణి షేరుకి రూ. 152–160కాగా.. తద్వారా రూ. 550 కోట్లు అందుకునే యోచనలో ఉంది. టెంప్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్(ఇండియా) ఐపీవో నేడు(20న) ప్రారంభంకానుంది. రూ. 825 కోట్ల సమీకరణ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ ప్లాట్ఫామ్.. ఆగ్మంట్ ఎంటర్ప్రైజెస్ రేపు(21న) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ బాటలో సోమవారం(24న) లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా రూ. 583 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. గత వారం ఐదు కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ నెల మొదట్లో మరో మూడు కంపెనీలు నిధుల సమీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో లిస్టింగ్ బాట పట్టిన కంపెనీల సంఖ్య 55కు చేరనుంది. రెండు లిస్టింగ్లు సూపర్ హిట్..! ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకొని, సెకండరీ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన రెండు కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ‘షిప్రాకెట్ లిమిటెడ్’ షేరు ఇష్యూ ధరతో పోలిస్తే 48% పెరగ్గా, ‘బెహరీలాల్ ఇంజనీరింగ్’ షేరు సైతం ఏకంగా 76% ప్రీమియంతో మెరిసింది. ‘షిప్ రాకెట్’ మ్యాజిక్ ..! టేమాసెక్, జొమాటోల పెట్టుబడులున్న ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ‘షిప్రాకెట్’ షేరు తొలి రోజే దూసుకెళ్లింది. ఇష్యూ ధర (రూ.97)తో పోలిస్తే బీఎస్ఈలో 34% ప్రీమియంతో రూ.130 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ అనిశి్చతుల్లోనూ ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చివరికి 48% లాభంతో రూ.143 గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,441 కోట్లకు చేరింది. బెహరీలాల్ భళా..! ఐరన్, స్టీల్ తయారీ సంస్థ ‘బెహరీలాల్ ఇంజనీరింగ్’ షేరు మెప్పించింది. ఇష్యూ ధర (రూ.285)తో పోలిస్తే బీఎస్ఈలో 61% ప్రీమియంతో రూ.458 వద్ద లిస్టయ్యింది. ఒకానొక దశలో 89% శాతం ఎగబాకి రూ.537 గరిష్టాన్ని అందుకుంది. చివరకు 76% లాభంతో రూ.503 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,125.91 కోట్లుగా నమోదైంది. లలితా జ్యువెలరీ.. భేష్ఐపీవోకు 63 రెట్లు స్పందన రూ. 190–201 ధరల శ్రేణిలో ఐపీవోకు వచి్చన లలితా జ్యువెలరీకి ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఇష్యూ జ్యువెలరీ కంపెనీలలోనే అత్యధికంగా 63 రెట్లు సబ్్రస్కయిబ్ అయ్యింది. 6,27,61,403 షేర్లు ఆఫర్ చేయగా.. 395 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 145 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 74 రెట్లు, రిటైలర్ల నుంచి 12 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించింది. ఈ నెల 24న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ముందుచూపే ఇరాన్ను బతికించిందా?.. ఇక మీదట ఎలా?
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతులపై ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఇరాన్ ప్రభుత్వం.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టింది? ఇక మీదట ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇరాన్పై అమెరికా ఇప్పటికే విస్తృతమైన ఆంక్షలు అమలు చేస్తోంది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వెయ్యికి పైగా ఇరాన్కు చెందిన వ్యక్తులు, నౌకలు, విమానాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఈ జాబితాను మరింత విస్తరించేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు వ్యాపారానికి సహకరిస్తున్న సంస్థలు, ఆర్థిక లావాదేవీలు, రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్ చమురుకు చైనా ప్రధాన కొనుగోలుదారు. దీంతో అక్కడి చిన్న రిఫైనరీలపై అమెరికా ఇప్పటికే ద్వితీయ ఆంక్షలు విధించింది. ఇరాన్తో లావాదేవీలు నిర్వహించే పెద్ద చైనా బ్యాంకులపైనా చర్యలు తీసుకునే అవకాశముందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ఇరాన్ చమురు ఆదాయానికి మరింత గండి పడటమే కాకుండా అమెరికా–చైనా సంబంధాలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.హర్ముజ్ మూసుకుపోతే..ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మరో కీలక సమస్య హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో యుద్ధానికి ముందు దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగేది. ఇప్పుడు యుద్ధం, దిగ్బంధనం కారణంగా నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇరాన్కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్కూ ఆందోళన మొదలైంది.అయితే హర్ముజ్ను తెరిచే విషయంలో ఇరాన్ కూడా తన షరతులను స్పష్టం చేస్తోంది. అమెరికా దిగ్బంధనం ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, చమురు ఆంక్షలు తొలగించడం, సైనిక చర్యలను నిలిపివేయడం వంటి హామీలు లభించే వరకు జలసంధిని తెరవబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.సముద్ర మార్గం దెబ్బతింటే..హర్ముజ్ సంక్షోభం సుదీర్ఘమైతే దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇరాన్ ముందుగానే గుర్తించింది. సముద్ర మార్గాల్లో సరుకుల రవాణా దెబ్బతిన్నా దేశంలో ఆహారం, వినియోగ వస్తువులు, పారిశ్రామిక ముడిసరుకుల కొరత రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకుంది. పాకిస్థాన్, టర్కియే తదితర దేశాలతో ఉన్న భూ సరిహద్దుల ద్వారా సరుకులను దిగుమతి చేసుకుంటోంది. కాస్పియన్ సముద్రం మీదుగా రష్యా, మధ్య ఆసియా దేశాల నుంచి సరుకులను తీసుకొచ్చే మార్గాలపైనా దృష్టి పెట్టింది.యుద్ధానికి ముందే సరిహద్దు ప్రావిన్సులకు కొన్ని అధికారాలు అప్పగించి అత్యవసర వస్తువుల నిల్వలను పెంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ ముందస్తు నిల్వలే సంక్షోభ సమయంలో ఇరాన్కు కొంత ఊరటనిస్తున్నాయి.చమురు ఆదాయం తగ్గితే..అయితే ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు ఉన్నప్పటికీ ఇరాన్కు అసలు సమస్య ఆదాయమే. దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం, ఆంక్షలు, రవాణా సమస్యల కారణంగా చమురు ఎగుమతులు దెబ్బతింటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. అదే సమయంలో యుద్ధంతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి అదనపు ఖర్చులు అవసరమవుతాయి.ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. చమురు ఆదాయం మరింత పడిపోతే ఈ భారమంతా సామాన్య ప్రజలపై పడే ప్రమాదం ఉంది.ఇంధన కొరత ముంచుకొస్తుందా?చమురు ఎగుమతుల సమస్యకు తోడు ఇరాన్కు ఇంధన సరఫరా కూడా సవాలుగా మారుతోంది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వ్యవస్థలు యుద్ధానికి ముందే ఒత్తిడిలో ఉన్నాయి. దిగ్బంధనం మరింతకాలం కొనసాగితే ఈ రంగాల్లో సంక్షోభం తీవ్రమయ్యే అవకాశం ఉంది.శరదృతువు, చలికాలం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, విద్యుత్, గ్యాస్ కొరత ఏర్పడవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా తగ్గించి.. గృహ అవసరాలకు సరఫరాను కాపాడాల్సిన పరిస్థితి రావచ్చని వియన్నా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ స్టడీస్కు చెందిన ఆర్థికవేత్త మహ్దీ ఘోద్సీ పేర్కొన్నారు.ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే సబ్సిడీ పెట్రోల్ కోటాలను తగ్గించింది. ఇంధన ధరలు పెంచే అంశాన్నీ పరిశీలిస్తోంది.యుద్ధానికి ముందే బలహీనంగా..ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి ప్రస్తుత యుద్ధమే కారణం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒంటరితనం, దేశీయ అవినీతి, పాలనా వైఫల్యాలు ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఇప్పుడు వీటికి యుద్ధం, సముద్ర దిగ్బంధనం, చమురు ఎగుమతుల అంతరాయం తోడయ్యాయి.అంటే ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి రెండు యుద్ధాలు చేస్తోంది. బయట సైనిక పోరాటం కొనసాగుతుండగా.. లోపల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడుకునే పోరాటం సాగుతోంది.పెజెష్కియాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది?ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం వచ్చే రెండేళ్లకు ఆర్థిక స్థిరీకరణ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మార్కెట్లను స్థిరీకరించడం, ప్రజల జీవనోపాధిని రక్షించడం, దేశ ఆర్థిక స్థైర్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. అయితే అత్యవసర చర్యలు కొంతకాలం మాత్రమే ఉపశమనం కల్పించగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.ఇక ముందు ఎలా?ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ముందు రెండు ప్రధాన మార్గాలు కనిపిస్తున్నాయి. అమెరికాతో రాజీకి వచ్చి ఆంక్షలు, దిగ్బంధనం నుంచి ఉపశమనం పొందడం ఒకటి. ఒత్తిడికి తలొగ్గకుండా సైనిక, ఆర్థిక ప్రతిఘటనను కొనసాగించడం రెండోది. ఇరాన్ ఇప్పటివరకు రెండో మార్గానికే ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అయితే యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, చమురు ఎగుమతుల అంతరాయం మరింతకాలం కొనసాగితే ఇరాన్ ముందస్తు ఏర్పాట్లకు కూడా పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, అత్యవసర నిల్వలు కొంతకాలం దేశాన్ని ఆదుకోగలిగినా.. చమురు ఆదాయం లేకుండా దీర్ఘకాలం ఆర్థిక వ్యవస్థను నడపడం మాత్రం కష్టమే.అదే సమయంలో హర్ముజ్ జలసంధి సంక్షోభం ఇరాన్ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయంగా ధరలు పెరగవచ్చు. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా పెరిగే ప్రమాదం ఉంది. -
మరణశిక్ష.. ఎన్ని రకాలున్నాయో తెలుసా?
ఒక నేరానికి విధించే అత్యంత కఠినమైన శిక్ష.. మరణశిక్ష. అయితే దాన్ని అమలు చేసే విధానం మాత్రం దేశానికో రకంగా ఉంటుంది. ఉదాహరణకు.. భారత్లో ఉరి. అలాగే కొన్నిదేశాల్లో లెథల్ ఇంజెక్షన్, కొన్ని చోట్ల తుపాకీతో కాల్చిచంపడం.. ఇంకొన్ని చోట్ల రాళ్లతో కొట్టి చంపడం, శిరచ్ఛేదం.. ఇలా ఎన్నో. అయితే భారత్లో ఉరి విధానంపై సుప్రీంకోర్టు తీర్పుతో.. నొప్పి లేకుండా చంపే మార్గాలపై, ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న మరణశిక్ష పద్ధతులపై మరోసారి చర్చ మొదలైంది.మన దేశంలో ప్రస్తుతం మరణశిక్ష అమలు చేసే చట్టబద్ధమైన పద్ధతి ఉరి. అంటే మెడకు ఉరి బిగించి మరణం సంభవించే వరకు వేలాడదీయడం. ఉరి విధానం క్రూరమైనదని, దాని స్థానంలో తక్కువ బాధ కలిగించే పద్ధతిని తీసుకురావాలని కోరుతూ వచ్చిన పిటిషన్ను తాజాగా(మంగళవారం) సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయ పద్ధతులపై భవిష్యత్తులో కొత్త శాస్త్రీయ ఆధారాల ఆధారంగా పరిశీలనకు అవకాశం ఉంటుందని కోర్టు సంకేతం ఇచ్చింది.ఉరి.. 40 నిమిషాలుభారత్లో అమలయ్యే ఉరి విధానం ఎక్కువ సమయం తీసుకుంటుందని పిటిషనర్ వాదించారు. ఉరిలో ఖైదీ చనిపోయినట్లు నిర్ధారించడానికి 40 నిమిషాలకుపైగా పట్టొచ్చని, షూటింగ్లో కొన్ని నిమిషాలు, ఇంట్రావీనస్ లెథల్ ఇంజెక్షన్లో సుమారు 5 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పోలికను లా కమిషన్ 187వ నివేదికలోని వివరాలతోనూ సమర్థించారు.లెథల్ ఇంజెక్షన్: అమెరికాలో అత్యంత సాధారణంగా ఉపయోగించే విధానం. 2025లో అమెరికాతో పాటు చైనా, వియత్నాంలోనూ ఈ పద్ధతి ద్వారా మరణశిక్షలు అమలైనట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఫైరింగ్ స్క్వాడ్: తుపాకులతో కాల్చి మరణశిక్ష అమలు చేసే పద్ధతి. 2025లో అఫ్గానిస్థాన్, చైనా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, సోమాలియా, తైవాన్, యూఏఈ, అమెరికా, యెమెన్ తదితర దేశాల్లో ఈ విధానం నమోదైంది.ఎలక్ట్రిక్ చైర్: విద్యుత్ ప్రవాహం ద్వారా మరణశిక్ష అమలు చేసే పద్ధతి. ఇది ప్రధానంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ విధానంగా కొనసాగుతోంది.గ్యాస్/నైట్రోజన్: గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించే పద్ధతులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. 2025లో అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ అస్ఫిక్సియేషన్ ద్వారా మరణశిక్ష అమలు నమోదైంది. ఓ చాంబర్లో దోషుల్ని ఉంచి ఈ శిక్ష అమలు చేస్తారు.సౌదీలో.. శిరచ్ఛేదంప్రపంచంలో అత్యంత భిన్నమైన పద్ధతుల్లో ఒకటి శిరచ్ఛేదం. 2025లో సౌదీ అరేబియాలో ఈ విధానం ద్వారా మరణశిక్షలు అమలయ్యాయి. అమ్నెస్టీ గణాంకాల ప్రకారం.. అదే దేశంలో కాల్చివేత, లెథల్ ఇంజెక్షన్ వంటి పద్ధతులూ నమోదయ్యాయి.ఉరి ఎక్కడెక్కడ?భారత్లో మాత్రమే కాదు.. మరణశిక్ష అమలుల్లో ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, జపాన్, కువైట్, సింగపూర్, దక్షిణ సూడాన్ దేశాల్లో ఉరి విధానం ఉపయోగించినట్లు అమ్నెస్టీ పేర్కొంది. అలాగే.. కొన్ని దేశాల్లో చట్టాలతో సంబంధం లేకుండా నైతిక శిక్షల పేరిట రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం లాంటివి చేస్తున్నారు.ప్రపంచంలో మరణశిక్ష తగ్గుతున్నా..అయితే.. మరణశిక్షను రద్దు చేస్తున్న దేశాలు పెరుగుతున్నప్పటికీ.. కొన్ని దేశాల్లో అమలులు మాత్రం కొనసాగుతున్నాయి. 2025లో అమ్నెస్టీ 17 దేశాల్లో కనీసం 2,707 మరణశిక్షల అమలును నమోదు చేసింది. ఈ సంఖ్య 2024తో పోలిస్తే 78 శాతం ఎక్కువ. చైనాలో అమలు చేసినట్లు భావిస్తున్న వేలాది మరణశిక్షలు ఈ లెక్కల్లో లేవు. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలు ఇప్పటికే మరణశిక్షను చట్టపరంగానో, ఆచరణలోనో రద్దు చేశాయి. అంటే.. ఒకవైపు భారత్లాంటి దేశాల్లో మరణశిక్ష అమలులు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు దానికి దూరమవుతున్నాయి. -
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
(జోధ్పూర్ సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు)దేశంలో వందేభారత్ రైళ్ల హవా కొనసాగుతోంది. సౌకర్యవంతమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికతతో వహ్వా అనిపించుకుంటున్న వందేభారత్ రైళ్ల కోసం కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రత్యేక నిర్వహణ డిపో నిర్మాణం వేగంగా సాగుతోంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని జోధ్పూర్ డివిజన్లో భగత్ కీ కోఠి వద్ద ఏర్పాటైన ఈ హైటెక్ డిపోలో మొదటి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 13 నాటికి తొలిదశ నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు. విశాఖç³ట్నం–బెంగళూరు, విశాఖపట్నం–తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జోధ్పూర్ డిపో కీలక కేంద్రంగా మారనుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విజయవాడ ఆధ్వర్యంలో ఏపీ మీడియా ప్రతినిధుల బృందం ఈ డిపోను సందర్శించగా.. డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అనురాగ్ త్రిపాఠి వివరాలు వెల్లడించారు.స్లీపర్ సర్వీసులు పెరగాలంటే..వందేభారత్ స్లీపర్ రైళ్లకు ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు రైల్వే మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. సర్వీసుల సంఖ్య పెరగాలంటే నిరంతర పీరియాడిక్ సర్వీసింగ్, అధునాతన నిర్వహణ సౌకర్యాలు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) రష్యా–భారత్ సంయుక్త సంస్థ కినెట్ రైల్వే సొల్యూషన్స్ సహకారంతో వందేభారత్ స్లీపర్ డిపో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశ పనులు రూ.167 కోట్లతో దాదాపు పూర్తయ్యాయి.రెండో దశతో కలిపి మొత్తం వ్యయం సుమారు రూ.362 కోట్లు. రెండు దశల పనులు పూర్తయితే ఒకేసారి 24 కోచ్లతో కూడిన మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లకు కేవలం ఆరు గంటల్లో పూర్తిస్థాయి పీరియాడిక్ మెయింటెనెన్స్, సర్వీసింగ్ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన నాలుగు ప్రత్యేక డిపోల్లో ఇది ఒకటి. ఢిల్లీ, జైపూర్, అజ్మీర్, బార్మర్, అహ్మదాబాద్ మార్గాల్లో తిరిగే రైళ్లకు ఇది ప్రధాన సేవా కేంద్రంగా నిలుస్తుంది. ఇతర డివిజన్ల రైళ్లు కూడా నిర్వహణ కోసం ఇక్కడికే వస్తాయి.ప్రపంచస్థాయి సాంకేతికత.. భద్రతకు ప్రాధాన్యంవందేభారత్ రైళ్లలో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగిస్తున్నారు. అండర్ గేర్, అప్పర్ గేర్ తనిఖీలతో పాటు కవచ్ భద్రతా వ్యవస్థ, అడ్వాన్స్డ్ వీల్ అలైన్మెంట్, ప్రత్యేక వీల్ లేత్ లైన్లు, పిట్ లైన్లు, భారీ మరమ్మతుల కోసం అత్యాధునిక క్రేన్లతో కూడిన సిక్ లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాక్లు, షెడ్లు వంటి మౌలిక వసతులు రైల్వే యాజమాన్యంలోనే ఉంటాయి. రైల్వే ఉద్యోగులు, ప్రైవేట్ నిపుణులు వీటిని సంయుక్తంగా నిర్వహిస్తారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించే విధంగా విడిభాగాలు, పరికరాల కొనుగోలు జరుగుతుంది.జోధ్పూర్ డివిజన్లో మెగా పనులు⇒ జోధ్పూర్ డివిజన్లో బర్మేర్, జైసల్మేర్లలో కూడా కోచింగ్ డిపోలు అభివృద్ధి చేస్తున్నారు. ⇒ 1,625 కి.మీ. రైల్వే మార్గాలున్న ఈ డివిజన్లో రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో జోధ్పూర్, జైసల్మేర్, పాలి ప్రాంతాల్లోని మూడు ప్రధాన స్టేషన్లతో పాటు 15 ⇒ అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. ⇒ ఒక్క జోధ్పూర్ స్టేషన్ పునరాభివృద్ధికే రూ.500 కోట్లు కేటాయించారు. రూ.3,000 కోట్లకు పైగా వ్యయంతో 270 కిలోమీటర్ల సమ్ద్రి–భిల్ది ట్రాక్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి.⇒ తొలి భాగం 2026 నాటికి, మొత్తం ప్రాజెక్టు 2028 నాటికి పూర్తికానుంది.⇒ గూడ్స్ రైలు సేవల ద్వారా ఆదాయం పెంచడంపై దృష్టి సారించారు.⇒ సిమెంట్, సున్నపురాయి రవాణాకు 8 కొత్త ప్రైవేట్ ఫ్రైట్ సైడింగులు నిర్మాణంలో ఉన్నాయి. ⇒ ఇవి రాబోయే మూడేళ్లలో రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపట్టారు.⇒ వందేభారత్ స్లీపర్ రైల్ డిపో రాకతో జోధ్పూర్ ప్రాధాన్యత మరింత పెరగనుంది. -
ఇక ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్ మునుపటిలా ఉండవు!
సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు, రీల్స్, వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నాం. అయితే ఇంతగా అలవాటైన ఈ సోషల్ మీడియా అనుభవం అతిత్వరలో మారిపోనుందా?.. ఇది వరకులా అది మనకు వినోదం పంచడం సాధ్యం కాదా?. మెటాపై కేసు విచారణలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం, వారి వ్యక్తిగత డేటా రక్షణ అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అమెరికాలో మెటా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కీలక కేసు ఇప్పుడు విచారణ దశకు చేరుకుంది. ఈ కేసులో మెటా ఓడిపోతే.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఇప్పటివరకు వినియోగదారులకు అత్యంత సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలోని 30 రాష్ట్రాలు కలిసి వేసిన ఈ కేసు మెటాపై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక జరిమానా విధించే పరిస్థితికీ దారితీయొచ్చు కూడా. ఏం జరిగింది?2023లో అమెరికాలోని 30 రాష్ట్రాలు మెటాపై కేసు దాఖలు చేశాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి కీలక రాష్ట్రాలు కూడా ఇందులో ఉన్నాయి. పిల్లలు, టీనేజర్లను ఆకర్షించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను రూపొందించి, వారు ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్లలో ఉండేలా చేస్తున్నారని రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేకాదు.. చిన్నారుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫెడరల్, రాష్ట్ర చట్టాలను మెటా ఉల్లంఘించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారులను పదేపదే యాప్లోకి తిరిగి తీసుకురావడానికి నోటిఫికేషన్లు, సిఫార్సు వ్యవస్థలు, ఆటోప్లే వీడియోలు, అనంతంగా కంటెంట్ చూపించే విధానం వంటి ఫీచర్లను ఉపయోగిస్తోందని రాష్ట్రాలు చెబుతున్నాయి.నేటి నుంచే కీలక విచారణమెటాపై అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన ఈ కీలక కేసులో ప్రధాన విచారణ నేటి నుంచి(ఆగస్టు 18) ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జ్యూరీ ఎదుట వాదనలు జరగనున్నాయి. విచారణ సుమారు 6–8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రాలు మెటా యువతను ఎక్కువసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉండేలా డిజైన్ చేసిందని ఆరోపిస్తున్నాయి. దీంతో.. తీర్పు ఎలా రానుందా? అనే ఉత్కంఠ ఇప్పటి నుంచే మొదలైంది.మెటా ఓడితే ఏం మారొచ్చు?ఈ కేసులో రాష్ట్రాలు కేవలం డబ్బు జరిమానా మాత్రమే కోరడం లేదు. పిల్లలు, టీనేజర్ల కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పనిచేసే విధానాన్నే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.అందులో ముఖ్యమైనవి..టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల ధ్రువీకరణ తప్పనిసరి చేయడం.పిల్లలు, టీనేజర్లు అనేక ఖాతాలు సృష్టించకుండా నియంత్రణలు విధించడం.యువ వినియోగదారులకు కనిపించే లైక్ కౌంట్లను తొలగించడం.ఒక కంటెంట్ తర్వాత మరొకటి నిరంతరం చూపించే ఇన్ఫినిట్ స్క్రోల్ను నిలిపివేయడం.టీనేజర్లను ఎక్కువసేపు యాప్లో ఉంచేలా పనిచేస్తున్న రికమెండేషన్ అల్గారిథమ్లలో మార్పులు చేయడం.ముఖం, శరీర రూపాన్ని మార్చే కొన్ని ఇమేజ్ ఫిల్టర్లను తొలగించడం.వీడియోలు ఆటోమేటిక్గా ప్లే అయ్యే ఆటోప్లే ఫీచర్ను నిలిపివేయడం.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వంటి తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే పోస్టులను పరిమితం చేయడం. ఇవన్నీ చూస్తే.. ఈ కేసు, మెటాకు రాబోయే తీర్పు ఎంతో కీలకమని స్పష్టమవుతోంది. వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ప్రాథమిక వినియోగ అనుభవమే మారిపోయే అవకాశం ఉంది.పిల్లలను ‘యూజర్లు’గా మార్చడమే లక్ష్యమా?ఇదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. పిల్లలు, టీనేజర్లు ప్లాట్ఫామ్లలో ఎక్కువసేపు ఉండేలా మెటా ఉద్దేశపూర్వకంగా కొన్ని ఫీచర్లను రూపొందించిందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఒక వీడియో పూర్తయిన వెంటనే మరొకటి మొదలవడం, స్క్రోల్ చేస్తూనే కొత్త కంటెంట్ రావడం, తరచూ నోటిఫికేషన్లు రావడం వంటి అంశాలు వినియోగదారులను మళ్లీ మళ్లీ యాప్లోకి తీసుకువస్తాయని వాటి వాదన. అంటే.. యూజర్ యాప్ను ఉపయోగిస్తున్నాడా? లేక యాప్ యూజర్ను ఉపయోగిస్తోందా? అనే పెద్ద ప్రశ్న ఈ కేసులో ముందుకు వస్తోంది.లైక్ బటనే కీలకం?సోషల్ మీడియాలో లైక్ అనేది సాధారణంగా కనిపించే చిన్న సంఖ్య. కానీ పిల్లలు, టీనేజర్లపై దాని ప్రభావం పెద్దదిగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎంతమంది లైక్ చేశారు? ఇతరుల పోస్టులకు తన పోస్టుకు వచ్చిన స్పందన ఎంత? ఇతరులతో పోలిస్తే తాను ఎలా ఉన్నాను? అనే ఆలోచనలు యువతలో సామాజిక పోలికలకు దారితీయొచ్చని ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో మెటా స్వయంగా నిర్వహించిన పరిశోధనల నుంచి కూడా రాష్ట్రాల న్యాయవాదులు ఆధారాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. లైక్ కౌంట్లు సోషల్ కంపారిజన్*కు దారితీస్తాయని, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పోలికలు ఒంటరితనం, శరీర రూపంపై ప్రతికూల భావన, నెగెటివ్ మూడ్తో సంబంధం కలిగి ఉన్నాయని మెటా అంతర్గత పరిశోధనలు సూచించినట్లు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మెటా వాదన ఏంటి?అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తోంది. యువతకు మద్దతు ఇవ్వడంలో తమ సంస్థకు దీర్ఘకాలిక నిబద్ధత ఉందని, కేసులోని ఆధారాలు తమ వైఖరిని సమర్థిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే మరో రాష్ట్రంలో మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూ మెక్సికోలోని ఒక కేసులో మెటాపై 942 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు యువ వినియోగదారులకు సంబంధించిన పలు మార్పులు చేయాలని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వినియోగదారులకు లైక్ కౌంట్లను తొలగించడం, నగ్న చిత్రాలకు సంబంధించిన మెసేజింగ్ను నిరోధించడం, పుష్ నోటిఫికేషన్లను నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం వంటి ఆదేశాలు అందులో ఉన్నాయి. మెటా ఆ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసు చాలా పెద్దదే!న్యూ మెక్సికో కేసు ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం. కానీ తాజా కేసులో 30 రాష్ట్రాలు కలిసి మెటాను ఎదుర్కొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అమెరికా జనాభాలో దాదాపు మూడింట రెండొంతుల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందువల్ల మెటా ఈ కేసులో ఓడిపోతే.. తీర్పు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా అమెరికా అంతటా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో పిల్లలు, టీనేజర్ల అనుభవాన్ని మార్చే అవకాశం ఉంది. సోషల్ మీడియా భవిష్యత్తుపై ప్రభావం?ఈ కేసు మరో అసలు ప్రశ్నను కూడా ముందుకు తెస్తోంది. పిల్లలను ఆకర్షించడానికి రూపొందించిన సోషల్ మీడియా ఫీచర్లకు ఎంతవరకు పరిమితులు ఉండాలి? కంపెనీల వ్యాపార ప్రయోజనాల కంటే చిన్నారుల మానసిక ఆరోగ్యం, గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలా? తల్లిదండ్రుల నియంత్రణ ఎంతవరకు ఉండాలి?. మెటా ఓడితే.. లైక్ల సంఖ్య కనిపించని ఇన్స్టాగ్రామ్, నిరంతర స్క్రోల్ లేని ఫేస్బుక్, తల్లిదండ్రుల అనుమతి అవసరమయ్యే టీనేజర్ ఖాతాలు, పరిమితమైన నోటిఫికేషన్లు వంటి కొత్త సోషల్ మీడియా అనుభవం మొదలయ్యే అవకాశం ఉంది. -
‘‘ఈ నెలాఖరుకు చంపేస్తా’’
మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ ఛాట్జీపీటీతో జరిపిన సంభాషణ అమెరికాకు చెందిన డారెన్ ఝా అనే వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. బ్రేకప్ తరువాత మాజీ ప్రేయసిపై అక్కసునంతా ఛాట్జీపీటీలో వెళ్లగక్కుకున్న డారెన్ ‘‘ఈ నేలాఖరులోగా ఆమెను చంపేస్తా’’. ‘‘నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు’’లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఆ సంభాషణ మొత్తాన్ని ఛాట్జీపీటీ యజమాని ఓపెన్ ఏఐ ఎఫ్బీఐకి ఇచ్చేసింది. దీంతో అతడిపై కేసు నమోదైంది. శిక్ష కూడా పడింది. వివరాలు... పాతికేళ్ల వయసున్న డారెన్ ఝూ అమెరికాలోని ఫ్లారిడా వాసి.నాలుగైదు నెలల క్రితం ఛాట్జీపీటీ వాడటం మొదలుపెట్టారు. గర్ల్ఫ్రెండ్తో తెగతెంపులై కొంత సమయమే అయ్యింది. మొదట్లో బ్రేకప్ గురించి, మాజీ ప్రేయసి ఇష్టాఇష్టాల గురించి ఛాట్జీపీటీపై వాకబు చేశాడు. ఆమె ఎక్కడెక్కడ తిరిగేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ప్రేమను మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు అనుకుందో ఏమో... ఛాట్జీపీటీ కూడా అతడి ప్రశ్నలకు తగ్గ సమాధానాలిచ్చింది. అయితే రాను రాను డారెన్ మాటలు దారితప్పడం మొదలైంది. మానభంగం, హత్య, ఆత్మహత్యలపైకి మళ్లింది. ఒక మెసేజ్లో డారెన్ టిపికల్ భగ్న ప్రేమికుడి టైప్లో... ‘‘ఆమె నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్క కూడదు’’, ‘‘ఈ నెలాఖరుకు ఆమెను చంపేస్తా’’అని ఛాట్జీపీటీతో చెప్పినట్లు అధికారులు గుర్తించారు. అక్కడితో ఆగిపోయినా బాగుండేది. కానీ ఆ అమ్మాయి వెళ్లే జిమ్ వద్ద తాను పూలబోకేతో వేచి చూశానని, నన్ను కాదంటే అంతే అంటూ బెదిరించేందుకు సిద్ధమయ్యానని కూడా డారెన్ ఛాట్జీపటీతో చెప్పుకున్నట్లు తెలిసింది. మరికొన్ని మెసేజీల్లోనైతే తుపాకితో బెదిరించి ఇంట్లోకి జొరబడాలని, ఆపై లైంగిక దాడికి పాల్పడాలని కూడా ప్లాన్ చేశాడట. తన వద్ద ఏఆర్–15 రకం రైఫిల్, గ్లాక్ హ్యాండ్ గన్, 12–గేజ్ షాట్గన్లు కూడా ఉన్నట్లు, వీటి ఫొటోలతోపాటు, రబ్బరు గ్లౌవ్స్, జిప్టైల ఫొటోలు కూడా మాజీ ప్రియురాలికి పంపినట్లు డారెన్ ఛాట్జీపీటీతో పంచుకున్నాడు. ‘‘ఆమెకు టెక్స్ట్ చేశా. ఈ రాత్రి మానభంగం చేస్తున్నా’’అని ప్రకటించాడు కూడా. అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు కానీ.. ఛాట్జీపీటీ యజమాని ఓపెన్ ఏఐలో కదలిక మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని వారు నేరుగా ఎఫ్బీఐకి రిపోర్టు చేశారు. దీంతో మే నెలలో డారెన్ అరెస్ట్ కూడా జరిగింది. బెదిరింపులు, వెంటపడటం, సెల్ఫోన్ అక్రమ వినియోగం వంటి కేసులు దాఖలయ్యాయి. మూడు రోజుల క్రితం డారెన్ తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు కూడా. కేసు విచారించిన న్యాయమూర్తి స్కాట్ సాస్కేర్ డారెన్కు ఎనిమిదేళ్ల శిక్ష (జైలు శిక్ష కాదు) విధించారు. దీని ప్రకారం మొదటి రెండేళ్లు డారెన్ కాలికి ఒక ఎల్రక్టానిక్ పరికరాన్ని బిగించుకుని తిరగాల్సి ఉంటుంది. దాంతోపాటు మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్ గర్ల్ఫ్రెండ్ను కలవడం కానీ, మత్తుమందులు, మద్యం సేవించడం కానీ, తుపాకులు కలిగి ఉండటం కానీ చేయకూడదు. నేరాలన్నీ ఒప్పుకున్నందుకు గాను డారెన్కు జైలుకెళ్లకుండా, ఎనిమిదేళ్ల పరిశీలనలో ఉండే అవకాశం దక్కింది. ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి విచిత్రమైన, భయంకరమైన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క ఏఐ టూల్స్ సాయంతో ఎన్నో క్రిమినల్ కేసులను పరిష్కరిస్తూండగా ఇంకో పక్క వీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలూ ఎక్కువయ్యాయి. బెంగళూరులో ఇటీవల మూడు హత్యల కేసు నిందితుడు ఒకరు గూగుల్ జెమినీ ఏఐతో కొన్ని నెలలు సంభాషించి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శరీరంలో బోలెడన్ని గడియారాలు!
న్యూఢిల్లీ: వయసులు రెండు రకాలని మీకు తెలుసా? అవునండి. ఇది నిజం. ఒకటేమో మీరు పుట్టిన సంవత్సరం నుంచి ఇప్పటివరకూ లెక్కపెడితే వచ్చేది. రెండోది... బయలాజికల్ ఏజ్ అని పిలిచేది మన శరీరం తాలూకూ వయసు. రెండింటికీ తేడా ఏమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్. ఒకే ఏడాది కొనుగోలు చేసిన రెండు కార్లలో ఒకటి ఎక్కువ మైళ్లు తిరిగితే.. దాని బయలాజికల్ ఏజ్ ఎక్కువ. రెండోదానిది తక్కువ అని. కారు బదులు మిమ్మల్ని ఊహించుకుంటే బయలాజికల్ ఏజ్ అంటే ఏమిటో అర్థమైపోతుంది. సరే...ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన బయలాజికల్ ఏజ్ను అంచనా కట్టేందుకు ఉపయోగపడే ఎపిజెనిటిక్ గడియారాలు చాలా తెలివైనవి శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను కూడా ఇవి పరిశీలిస్తూంటాయని ఇటీవల జరిగిన అధ్యయనం ఒకటి తెలిపింది. కొంచెం వివరంగా చూస్తే... మన శరీర క్రియలన్నీ జన్యువుల ఆధారంగానే జరుగుతాయని, కళ్ల రంగు మొదలుకొని ఒడ్డూ, పొడవు, ఇతర లక్షణాలకూ ఈ జన్యువులే కారణమని మనం చదువుకుని ఉంటాం. పుట్టుకతో వచ్చే ఈ జన్యువులు ఆన్/ఆఫ్ అవుతూంటాయి. ఆన్ అయినప్పుడు శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లు ఉత్పత్తి అవుతూంటాయి. ఆఫ్ అయినప్పుడు కావు. డీఎన్ఏ పోగులు కొన్ని వచ్చి జన్యువులకు అతుక్కోవడం వల్ల ఈ ఆన్/ఆఫ్లు జరుగుతూంటాయి. ఇలా అతుక్కున్న డీఎన్ఏ పోగుల్లోని కూర్పు ఆధారంగా బయలాజికల్ ఏజ్ను అంచనా కట్టవచ్చు. 2013లో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఎపిజెనిటిక్ గడియారం ‘హార్వత్ క్లాక్’శరీరంలోని 51 కణజాలాల్లో ఉండే ‘353 సీపీజీ’ప్రాంతాల్లోని డీఎన్ఏ పోగుల కూర్పును పరిశీలించి బయలాజికల్ వయసును అంచనా వేస్తుంది. తరువాతి కాలంలో ఈ హార్వత్ క్లాక్తోపాటు రక్తానికి మాత్రమే సంబంధించిన హన్నుమ్ క్లాక్, ఆయుష్షు, వ్యాధుల ముప్పులను అంచనా వేసే గ్రిమ్ ఏజ్ క్లాక్, ఫీజో ఏజ్ క్లాక్, ట్రాన్స్స్క్రిప్టోమిక్ క్లాక్, పోటియోమిక్ క్లాక్, మలీ్టయోమిక్ క్లాక్ అని బోలెడన్నింటి గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది. వీటన్నింటి ఆధారంగా మన బయలాజికల్ వయసుకు సంబంధించిన వేర్వేరు విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు గ్రిమ్ ఏజ్ క్లాక్ ద్వారా మనకు ఫలానా వ్యాధి వస్తుందా? రాదా? అని అంచనా వేయవచ్చునన్నమాట. అన్ని గమనిస్తూంటాయి.. మన ఎపిజెనిటిక్ గడియారాలు శరీర రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియలు, కణాల మధ్య సమాచార వినిమయాల్లో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గుర్తిస్తూంటాయని ‘ఎన్పీజీ ఏజింగ్’జర్నల్లో ప్రచురితమైన తాజా పరిశోధన వ్యాసం ఒకటి తెలిపింది. హోర్వాత్, హన్నుమ్, ఫీనోఏజ్ గ్రిమ్ఏజ్లతోపాటు డునెడిన్పేస్ ఎపిజెనిటిక్ గడియారాలను కొలవడం ద్వారా తామీ అంచనాకు వచి్చనట్లు సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా.. తాము జన్యువులు ఆన్/ఆఫ్ స్థితుల ఆధారంగా సరికొత్త ఎపిజెనిటిక్ క్లాక్ ఒకదాన్ని సిద్ధం చేశామని ఇది వయసుతోపాటు వచ్చే సమస్యలు మరణాలను మరింత కచి్చతంగా లెక్కకట్టగలదని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త థాలిడా ఎమ్ అర్బావాంగ్ తెలిపారు. ‘‘వయసు అంటే చాలామంది బర్త్డే కేక్పై వెలిగించే కొవ్వొత్తులు అనుకుంటారు. వాస్తవానికి ఇది మన శరీరంలోపలి కణాల్లో ఏం జరుగుతోందన్న దానికి సంబంధించింది’’అని థాలిడా వ్యాఖ్యానించారు. ఎపిజెనిటిక్ గడియారాలు ఒక్కోటి మన వయసుకు సంబంధించిన ఒక్కో అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూంటాయని తాము గుర్తించినట్లు తెలిపారు. అమెరికాలో సుమారు 3227 మంది రక్త నమూనాలను పరిశీలించి, జన్యువులకు అతుక్కునే డీఎన్ఏ పోగుల కూర్పు, జన్యువుల ఆన్/ఆఫ్ స్థితులను పోల్చి చూశామని చెప్పారు. వీటి ఆధారంగా శరీరంలో శక్తిని సమన్వయ పరచడం మొదలుకొని కణాల అభివృద్ధి, రోగ నిరోధక వ్యవస్థ కణాలు పనిచేయడం వరకూ అనేక అంశాలను అర్థం చేసుకుని తుది అంచనాకు వచ్చామని చెప్పారు. ఇవన్నీ కూడా జీవక్రియలు, రోగ నిరోధక వ్యవస్థలో వచ్చే మార్పులు, కణాల మధ్య సమాచార వినిమయం వంటివి గమనిస్తున్నట్లు తెలిసిందన్నారు. హోర్వత్ గడియారం జీవక్రియలకు సంబంధించిన సమాచారాన్ని గమనిస్తే, హన్నుమ్ క్లాక్ హోమియోస్టాసిస్, వాసు్కలర్ వాల్ ఇంటరాక్షన్లను గమనిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. అలాగే గ్రిమ్ఏజ్ క్లాక్ ఇంటెర్ఫెరాన్ సిగ్నలింగ్ను పరిశీలిస్తుందన్నారు. -
‘యుద్ధంతో జీవించలేం’.. ఇరాన్లో వినిపిస్తున్న కొత్త స్వరం
అమెరికా–ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్లో అంతర్గత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. యుద్ధ మార్గమా? లేక దౌత్య మార్గమా? అనే ప్రశ్నపై దేశ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖటామీ చేసిన వ్యాఖ్యలు టెహ్రాన్లో కొత్త చర్చకు దారితీశాయి.‘‘యుద్ధంతో ఎప్పటికీ జీవించలేం.. సమస్యలను పరిష్కరించేందుకు దౌత్య మార్గాలను అన్వేషించాలి’’ అని ఖటామీ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత ఇరాన్ విధానంపై పరోక్ష విమర్శలుగా భావిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే.. దేశ అంతర్గత సమస్యలు, ప్రజల జీవన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.సంస్కరణవాద నేత ఖటామీ స్వరంమహ్మద్ ఖటామీ 1997 నుంచి 2005 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సంస్కరణవాద భావజాలానికి దగ్గరగా ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పాశ్చాత్య దేశాలతో సంబంధాల మెరుగుదల, రాజకీయ సంస్కరణలు, పరిమిత దౌత్య విధానాలకు ఆయన మద్దతు ఇచ్చేవారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా.. ఇరాన్లో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం కారణంగా తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో శాంతి, చర్చల ప్రస్తావన చేయడం రాజకీయంగా కీలక సంకేతంగా మారింది.‘‘ప్రజలు యుద్ధంలో జీవించలేరు’’యుద్ధం ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని ఖటామీ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. దేశ ప్రజల ఆర్థిక పరిస్థితులు, సాధారణ జీవనం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఉండాలని సూచించారు. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక ఘర్షణలు కొనసాగితే ప్రజలపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవైపు కఠిన వైఖరిలో అధికార వర్గంఅయితే ఇరాన్ అధికార వ్యవస్థలోని కీలక వర్గాలు మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో కఠిన వైఖరినే కొనసాగిస్తున్నాయి. సుప్రీం లీడర్ వర్గం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. ఇరాన్లో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ప్రతిఘటన విధానానికే మద్దతు ఇస్తోంది. భద్రత, విదేశాంగ విధానం, ప్రాంతీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించే ఐఆర్జీసీ.. అమెరికా, ఇజ్రాయెల్పై వ్యతిరేకతను దేశ రక్షణలో భాగంగా చూస్తోంది.అధ్యక్షుడి పాత్ర పరిమితంప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ గతంలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అనుకూలంగా మాట్లాడిన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో తుది నిర్ణయాధికారం సుప్రీం లీడర్, భద్రతా వ్యవస్థ చేతుల్లో ఉంటుంది. అందువల్ల అధ్యక్షుడి వైఖరి కంటే.. సుప్రీం లీడర్ వర్గం, సైనిక వ్యవస్థ నిర్ణయాలే కీలకంగా మారుతాయి.ఆర్థిక సమస్యలు.. ప్రజల్లో అసంతృప్తిఇరాన్లో యుద్ధ వాతావరణం, ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు, అంతర్జాతీయ అవకాశాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యుద్ధం మరింత కొనసాగితే ఈ సమస్యలు తీవ్రం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో దేశంలో కొంత వర్గం దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతోంది.ముందున్న మార్గం ఏంటి?ఖటామీ వ్యాఖ్యలు వెంటనే ఇరాన్ విదేశాంగ విధానాన్ని మార్చే అవకాశం లేకపోయినా.. దేశంలో ఉన్న అంతర్గత భిన్నాభిప్రాయాలను మాత్రం బయటపెట్టాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కఠినంగా ముందుకు వెళ్లాలనే వర్గం.. మరోవైపు దేశ ప్రయోజనాల కోసం చర్చలకు అవకాశం ఇవ్వాలనే వర్గం మధ్య ఇరాన్లో చర్చ కొనసాగుతోంది. యుద్ధం మరింత తీవ్రం అవుతుందా? లేదంటే దౌత్యానికి కొత్త మార్గం తెరుచుకుంటుందా? అనేది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది. ఖటామీ వ్యాఖ్యలు మాత్రం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో కొత్త ప్రశ్నలకు తెరలేపాయి. -
మూన్ బేస్..స్పేస్ రేస్
దశాబ్దాల కల సాకారానికి రంగం సిద్ధమైందిఆరేళ్లలో జాబిల్లిపై శాశ్వత మానవ ఆవాసం రెడీ గ్రహాంతరాళాల శోధనకు ఇదే నిచ్చెన నాసా, ఇస్రో, జాక్సా, ఈఎస్ఏలు కలిసికట్టుగా రెడీ చేస్తున్న మూన్బేస్ వింతలు విశేషాలు... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నా సా) జాబిల్లిపై శాశ్వత నివాసం కట్టేందుకు ఉద్దేశించిన ‘మూన్ బేస్’ ప్రాజెక్టులో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భాగస్వామి కానుంది. ఈ రెండు మాత్రమే కాదు యూరోపియన్, జపాన్ అంతరిక్ష సంస్థలు చేయి కలపనున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే నాసా ఆధ్వర్యంలోని ఆర్టీమిస్–3 ప్రాజెక్టులో భాగంగా 2032 నాటికల్లా మూన్ బేస్ సిద్ధమవుతుందని అంచనా. ఈ స్థావరం ద్వారా మనకు ఒనగూరే ప్రయోజనాలు, ఏ దేశం ఏ రకంగా ఈ ప్రాజెక్టు పూర్తికి సాయపడుతుంది? అన్నది ఇక్కడ ఆసక్తికరం. 60, 70 ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంతరిక్ష ప్రయోగాలైతే చేస్తున్నారుగానీ భౌతికంగా చందమామను దాటి వెళ్లింది లేదు. కారణాలు అనేకం. అయితే మూన్బేస్ ఈ పరిస్థితిని మార్చేస్తుందని అంచనా. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి నివసించేందుకు అవకాశమున్న ఏకైక గ్రహం అంగారకుడిపైకి చేరేందుకు మూన్బేస్ ఆధారం కానుంది. జాబిల్లిపై దొరికే వనరులను సద్వినియోగం చేసుకునేందుకు, తద్వారా ఎప్పటికైనా అంగారక గ్రహంపై అడుగుపెట్టాలన్నది సంకల్పం. ఇందుకు కావాల్సిన టెక్నాలజీలను పరిశీలించేందుకు మూన్బేస్ కీలకం కానుంది. ఎండ కన్ను పడని చోట... మూన్బేస్ను చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఏర్పాటు చేయాలని నాసా నిర్ణయించింది. సూర్యుడి వెలుతురు ఏమాత్రం సోకని ఈ ప్రాంతంలో నీటితోపాటు ఆవాసానికి తగిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయని అంచనా. ఇస్రో 2009లో జరిపిన చంద్రయాన్–1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికి నిర్ధారణ కాగా.. 2019 నాటి చంద్రయాన్–2 ద్వారా అక్కడి ఖనిజాలు, నీటి అణువుల గుర్తింపు కొనసాగుతోంది. చంద్రయాన్–2లోని అత్యాధునిక కెమెరాల పుణ్యమా అని ఇప్పుడు మనకు ఆ ప్రాంతపు అత్యంత స్పష్టమైన ఛాయాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్టెమిస్–3తో షురూ... 2027లో ప్రారంభమయ్యే ఆర్టెమిస్–3 ద్వారా వ్యోమగాములు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగనున్నారు. ల్యాండర్ వ్యవస్థల పరిశీలనతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. తర్వాత 2028–2030 మధ్య మానవ ఆవాసానికి సంబంధించిన మాడ్యూల్స్, విద్యుత్తు సరఫరాకు కావాల్సిన పవర్ గ్రిడ్ను ఒక్కొక్కటిగా చంద్రునిపైకి చేరుస్తారు. అవసరాల మేరకు వ్యోమగాములు, సరుకులు రవాణా అవుతూంటాయి.ఆవాస ప్రాంతాల మాడ్యూల్స్ బెలూన్ల మాదిరిగా విచ్చుకునేవిగా ఉంటాయి. వీటితోపాటు అక్కడి రేడియోధార్మికత నుంచి రక్షణ కోసం ప్రత్యేక బంకర్లు, ఆహారం పండించుకునేందుకు గ్రీన్హౌస్లు ఏర్పాటు చేస్తారు. నాలుగు కిలోమీటర్ల గొయ్యిలో... జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని షాకిల్టన్ క్రేటర్ వద్ద మూన్ బేస్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 21 కిలోమీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల లోతు ఉండే భారీ లోయ ఈ షాకిల్టన్ క్రేటర్. అందువల్ల గొయ్యి అంచుల్లో 24 గంటలూ సూర్యరశ్మి సోకుతూ ఉంటుంది. లోపల మాత్రం ఎలాంటి వెలుతురూ ఉండదు. ఈ సహజ నిర్మాణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు నాసా క్రేటర్ అంచుల్లో సౌరఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోబోటిక్ రోవర్లు కలిగిన పవర్ గ్రిడ్ను ఏర్పాటు చేసి సౌరశక్తిని వినియోగించుకుంటారు. 2032 నాటికి సిద్ధం? ప్రాథమిక అంచనాల ప్రకారం మూన్బేస్ నిర్మాణం 2032 నాటికల్లా పూర్తి కావాలి. 2030 నాటికల్లా వ్యోమగాముల ప్రయాణాలు మొదలవుతాయని అంచనా. స్పేస్–ఎక్స్ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో పరిశోధనశాలలు, ఇతర వాణిజ్య ఏర్పాట్లు చేస్తారు. జాబిల్లిపై దొరికే నీరు, మట్టి నుంచి అవసరమైన ఇంధన వనరులు (హీలియం, ఆక్సిజన్ వంటివి) వెలికితీసే ఇన్–సిటు రిసోర్స్ యూటిలైజేషన్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లాలంటే భూమి పై నుంచి రాకెట్ ఇంధనాన్ని మోసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి విడిపోయినట్లు అంచనాలున్న జాబిల్లిని విస్తృతంగా అధ్యయనం చేయడం ద్వారా భూ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం సులువు అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయ్యేందుకు కొన్ని అంశాలు కలిసి రావాలి. మొదటిది అంతర్జాతీయ సహకారం. రెండోది ఆర్థిక వనరులు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కిలోగ్రాము బరువును జాబిల్లిపైకి చేర్చేందుకు భారీస్థాయిలో ఖర్చు అవుతుంది. అలాంటిది టన్నులకు టన్నులు అక్కడికి పంపించాలంటే అవసరమైన నిధులు సేకరించడం ఎలా అన్నది ప్రశ్న. –సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మరీ ఇలా ఉన్నారేంటి!’.. ఇజ్రాయెల్ సెటిలర్ల దుశ్చర్య
ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం కేవలం భూమి, సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు నీటి వనరులపై ఆధిపత్య పోరు కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజ ఊటలను ఇజ్రాయెలీ సెటిలర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో తమ వ్యవసాయం, జీవనాధారం దెబ్బతింటోందని కన్నీరు పెడుతున్నారు. అయితే మరో వాదనతో ఇజ్రాయెలీ వర్గాలు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి.జోర్డాన్ లోయలోని ఫసాయిల్ గ్రామం ఈ వివాదానికి కేంద్రంగా మారింది. తరతరాలుగా స్థానిక రైతులకు ఆధారంగా ఉన్న ఓ సహజ ఊట నీటిని ఇజ్రాయెల్ సెటిలర్లు మళ్లించుకున్నారు. ఆ సమీపంలోని ఓ పురాతన కొలనును నింపి.. ఈతలు కొడుతూ వినోదం పొందుతున్నారు. అదే సమయంలో కొందరు.. ఉత్త పుణ్యానికే ట్యాంకర్లలో ఊట నీటిని నింపి దారి పొడవునా పారబోసుకుంటూ పోవడం, నిర్జన ప్రదేశంలో వదిలేయడం లాంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాలస్తీనా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.Israeli settler terrorists deliberately emptied Palestinian water tanks onto the ground in Ein al-Hilweh, in the northern Jordan Valley of the occupied West Bank.Palestinians in this herding community struggle every day for water after Israeli settlers seized their main spring… pic.twitter.com/EzRjMz621l— Ihab Hassan (@IhabHassane) August 10, 2026ఈ నీటితో గతంలో తమ పొలాల్లో వంకాయలు, సొరకాయలు, పుచ్చకాయలు వంటి పంటలు పండించేవారమని.. ఇప్పుడు సాగు నిలిచిపోయిందని వాపోతున్నారు. “నీరు లేకపోవడంతో మా పొలాలు ఎండిపోయాయి. కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది” అని ఫసాయిల్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పైపులను స్వాధీనం చేసుకున్నారని, ఊట వైపు వెళ్లేందుకు కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.కొలనుగా మారిన ఊట.. పర్యాటక ప్రాంతమా?స్థానికులు చెబుతోంది ఏంటంటే.. ఊట నీటిని మళ్లించి పురాతన కొలనును నీటితో నింపారు. అనంతరం దానిని పర్యాటక ఆకర్షణగా ప్రచారం చేశారు. అయితే ఇజ్రాయెల్కు చెందిన కొందరు సెటిలర్లు మాత్రం మరోలా వాదిస్తున్నారు. ఈ ప్రాంతం తమ చారిత్రక వారసత్వంలో భాగమని చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత? అనేదానిపై పురావస్తు నిపుణులు మరోలా స్పందించారు.Israeli "settlers" in the occupied West Bank diverted a spring that had long served as a lifeline for the Palestinian village of Fasayil, redirecting its water to fill a pool at an archaeological site and turning it into a tourist attraction.Palestinian farmers said the loss of…— Clash Report (@clashreport) August 14, 2026ఈ ప్రాంత చరిత్రపై పూర్తి స్పష్టత లేదని అంటున్నారు. దీంతో చరిత్ర, పురావస్తు అంశాలను ఉపయోగించి వెస్ట్ బ్యాంక్పై ఆధిపత్య భావనను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.‘ఇది నీటి యుద్ధం’.. పాలస్తీనా ఆరోపణపాలస్తీనా అధికారులు మాత్రం నీటి వనరుల నియంత్రణను పెద్ద సమస్యగా చూస్తున్నారు. నీటిని నిలిపివేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. “ఇది శబ్దం లేని బుల్లెట్లాంటి నీటి యుద్ధం” అని పాలస్తీనా వాటర్ అథారిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. వెస్ట్ బ్యాంక్లోని పలు నీటి, పారిశుద్ధ్య వనరులపై ఈ ఏడాది దాడులు జరిగినట్లు నమోదైంది. ముఖ్యంగా జోర్డాన్ లోయ ప్రాంతాల్లో నీటి వనరులపై నియంత్రణ కోసం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అతిత్వరలో ఇది తాగునీటికి విస్తరించవచ్చనే ఆందోళన సైతం వ్యక్తమవుతోంది అక్కడ. గ్రామాలపై పెరుగుతున్న ఒత్తిడినీటి సమస్యతో పాటు సెటిలర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని పాలస్తీనియన్లు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో నీరు, విద్యుత్ సరఫరాలను నిలిపివేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెప్పారు. మరోవైపు.. ఇజ్రాయెల్ సెటిలర్లు మాత్రం అవంతా ఆరోపణలనే అంటున్నారు. ఈ ప్రాంతాలు తమ చారిత్రక, మతపరమైన వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. పురాతన ప్రదేశాల అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహంలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సమర్థించుకుంటున్నారు.భవిష్యత్లో మరింత ఉద్రిక్తత?వెస్ట్ బ్యాంక్లో భూమి తర్వాత నీరు మరో ప్రధాన వివాద అంశంగా మారుతోంది. వ్యవసాయం, తాగునీరు, జీవనోపాధికి ఆధారమైన సహజ వనరులపై నియంత్రణ కోసం జరుగుతున్న పోరు భవిష్యత్లో మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ’వెడ్ మి గుడ్’ నివేదిక వెల్లడించింది. 2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు డిమాండ్ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్ మార్కెట్పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్లాండ్ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది. పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీగా పెరిగిన బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు భారతీయులు చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు సగటు బడ్జెట్ రూ.58 లక్షలు అయితే విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్ సగటు బడ్జెట్ రూ.1.5 కోట్లు పైమాటే. అయినా లగ్జరీ పెళ్లిళ్ల మార్కెట్ మరింత విస్తరిస్తోందని ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.సంక్షోభంతో మారుతున్న ఎంపిక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న భద్రతా పరిస్థితులు, విమాన చార్జీలు పెరుగుదల, హోటళ్ల టారిఫ్లు అమాంతం పెరిగిపోవడం కూడా భారతీయుల పెళ్ళి ప్రణాళికలను ప్రభావితం చేశాయి. అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం భారతీయ సంపన్న కుటుంబాలు మార్చుకోవడం లేదని కేవలం దేశాన్నే మార్చుకుంటున్నాయి. భద్రత, ప్రయాణ సౌలభ్యం, అతి«థులకు కూడా సులభమైన వీసా విధానం ఉన్న శ్రీలంక, ఇండోనేíÙయా దేశాలపై ఇప్పుడు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నాయి.టాప్ విదేశీ వెడ్డింగ్ గమ్యస్థానాలు థాయ్లాండ్, బాలి (ఇండోనేషియా) వియత్నాం, మలేషియా ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ భారత్లో ఇవీ... దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ తొలి ఐదు స్థానాల్లో ఉండగా, ఉదయ్పూర్,జైపూర్,జైసల్మేర్,జో«ద్పూర్, గోవా కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. శ్రీలంకకు భారతీయుల వెల్లువ శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం 2023లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆదేశాన్ని సందర్శించగా 2024లో 4.17 లక్షలు, 2025లో అది 5.30 లక్షలు దాటింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకకు అతిపెద్ద విదేశీ పర్యాటక మార్కెట్. ఈ పెరుగుతున్న పర్యాటక ప్రవాహమే డెస్టినేషన్ వెడ్డింగ్ రంగానికి ఊతమిస్తోంది. ఇది లగ్జరీ హోటళ్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, క్యాటరింగ్, టూరిజం రంగాలకు కూడా కోట్లాది వ్యాపారాన్ని సృష్టిస్తున్న భారీ పరిశ్రమగా మారుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశభక్తి అంటే?
పిల్లలూ... నేడు ఆగస్టు 15. జెండా ఎగరేశాం. ‘జైహింద్’, ‘వందేమాతరం’ అని స్కూల్లో నినాదాలు చేశాం. కానీ దేశభక్తి అంటే ఏమిటి? కేవలం జెండా ఎగురవేయడమా? నినాదాలు చేయడమా? కాదు పిల్లలూ! దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం. మన అమ్మను, నాన్నను ప్రేమించినట్టే దేశాన్ని కూడా ప్రేమించడం. దేశభక్తి అంటే ఇదే...1. పరిశుభ్రత పాటించడం దేశభక్తి: రోడ్డు మీద చెత్త వేయకుండా డస్ట్బి¯Œ లో వేయడం. మన ఇల్లు, స్కూల్, పార్క్ను శుభ్రంగా ఉంచడం. మన దేశం అందంగా ఉంటే మనకే గర్వం కదా!2. కష్టపడి చదవడం దేశభక్తి: డాక్టర్ అయ్యి రోగులకు సేవ చేయడం. ఇంజనీర్ అయ్యి కొత్త కొత్త వస్తువులు కనిపెట్టడం. సైనికుడై సరిహద్దు కాపాడడం. టీచర్ అయ్యి మంచి పౌరులను తయారు చేయడం. ఇవన్నీ దేశభక్తే!3. అందరినీ ప్రేమించడం దేశభక్తి: మన దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరం కలిసి ఉంటాం. ఒకరితో ఒకరు గొడవ పడకుండా, స్నేహంగా ఉండడం. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటే ఇదే.4. చిన్న చిన్న నియమాలు పాటించడం దేశభక్తి: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం. నీళ్లు, కరెంట్ వృథా చేయకపోవడం. చెట్టు నాటడం. పెద్దలను గౌరవించడం. ఇవన్నీ చిన్న పనులే. కానీ కోటిమంది చేస్తే దేశం ఎంత బాగుంటుంది! గుర్తుంచుకోండి పిల్లలూ!దేశం అంటే భూమి మాత్రమే కాదు. అందులో ఉండే మనుషులు, చెట్లు, నదులు, భాషలు – అన్నీ కలిపితేనే దేశం. వాటన్నిటినీ గౌరవించడమే అసలైన దేశభక్తి. ఈ ఆగస్టు 15న మనం ప్రమాణం చేద్దాం. ‘నేను మంచి పౌరుడిగా ఉంటా. నా దేశం కోసం ఏదో ఒక మంచి పని చేస్తా’ అని. సరేనా.∙ -
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
ఆగస్టు పదిహేనంటే ముందు దేశభక్తి గీతాల అడావిడి. క్లాసులో ఎవరికీ సరిగా పాడటం రాదు. కాని అందరూ చేతులెత్తేవారే. ఊరి హైస్కూల్లో... ఏ హైస్కూల్లో అయినా నలుగురైదుగురు టీచరమ్మలు ఉంటారు. ఒక ఐవోరుకి పాటల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. అంతో ఇంతో పాడేవాడై కూడా ఉంటాడు. వీళ్లకు హెడ్మాస్టర్ పుణ్యమా అని ఈ దేశభక్తి పాటల డ్యూటీ. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్లను వెతికి గ్రూపులు చేసి పాడించడం. మరి టెన్త్క్లాస్ వాళ్లో? వాళ్లకు పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. చదువుకోవాలి. ఈ ఆపరేషన్కు దూరంగా ఉంచాలి. అయితే ఒక సర్దా ఉందండోయ్. రిహార్సల్స్ పేరు చెప్పి పీరియడ్స్ ఎగ్గొట్టొచ్చు. ఐవోర్ల స్టాఫ్రూమ్లో రిహార్సల్స్. ప్రతిసారీ అవే పాటలు. బ్యాచ్లు మారతాయంతే.‘వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం’..‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’...‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా’...‘సారే జహాసే అచ్ఛా హిందూసితా హమారా’...‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’...‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’....అదేంటోగాని ఆగస్టు పదిహేనుకు ఫండు పిల్లలే తేవాలి. రంగు కాగితాలకీ, చార్ట్లకీ, పురికొసలకీ. ఇంట్లో అడగాలి. ఎంత? పావలా... అర్ధరూపాయి... అమ్మో అన్ని డబ్బులే. మరి 1985–86ల్లో అవి పెద్ద డబ్బులే. కొందరు తెచ్చేవారు. కొందరు మెదలకుండా ఉండేవాళ్లు. క్లాసులో ఎవడైతే పరమ బేవార్సు స్టూడెంట్గా ఉంటాడో వాడికి రంగు కాగితాలు కట్ చేయడంలో, రంగురంగుల త్రికోణాలు పురికొసకు అంటించి వేళ్లాడగట్టడంలో తోట తరణి అంత అనుభవం ఉంటుంది. వాడికి సేకరించి ఐదురూపాయల పావలా ఇస్తే తుర్రున బుక్స్టోర్కు పరిగెత్తి రంగు కాగితాలూ కత్తెర కొని ఒక టీమ్తో మైదా పిండి ఉడకబెట్టించి ఆ పనిలో ఉంటాడు. బోర్డును నీటుగా కడిగి, తడిపిన రంగు చాక్పీస్లతో ‘స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందంగా రాసే స్టూడెంట్లు ప్రతి క్లాస్లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు మ్యాథ్స్లో వీక్... డ్రాయింగ్లో ఫస్ట్. ఈ డ్యూటీ వారిది.అయితే ప్రతి సెక్షన్ వారికీ ఈ ఆగస్టు 15న కాస్త కుళ్లు ఉండేది ఒకే ఒక వ్యక్తి మీద. వాడు ఎస్.పి.ఎల్. ఆ రోజు వాడి డాబు, దర్పాన్ని ఆపేవాడుండదు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వాడు ఎన్సిసి డ్రస్సు లాంటిది వేసుకొని ఎర్రబంతి వేళ్లాడే ఖాకీ క్యాప్ పెట్టుకొని ఏ పోలీస్ ఆఫీసరులానో ఉంటాడు. వాడు ‘అటెన్షన్’ అంటే అటెన్షన్. వాడు ‘స్టాండ్ ఎట్ ఈజ్’... అంటే తెరిపి. జెండా ఎగరేయడానికి వీడు మార్చింగ్ చేస్తూ హెడ్మాస్టర్ని, చీఫ్గెస్టునీ తీసుకొస్తాడు. జెండా ఎగరేశాక వీడు సెల్యూట్ కొడితే హెడ్మాస్టర్ వీడికి సెల్యూట్ కొడతారు. మిగిలిన పిల్లలకి ఈ చాన్స్ ఎక్కడా? అందుకే వాడంటే కొంచెం ఇది.ఆగస్టు పదిహేనుకు పూలు తెచ్చి జెండాలో పెట్టే పని టీచరమ్మలది. పూలున్న జెండాను పొట్లంలా చుట్టి జెండాకర్ర కొసాకు పంపించడం, తాడు లాగినప్పుడు జెండా విడివడి పూలు అందరి మీద పడేలా కట్టడం అందరికీ వచ్చనుకుంటున్నారా? రాదు. దానికి పీఈటీ వోరు ఎక్స్పర్ట్. ఆయనే అది చేయాలి. మనం చేస్తే తాడు లాగితే జెండా ఊడదు. పరువు పోతుంది. అందుకని ప్రతి ఆగస్టు 15న తాడు లాగితే జెండా ఎగరుతుందా లేదా అని అదో టెన్షన్.ప్రతి స్టూడెంట్ బాగా ఉతికిన యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకొని మరీ ఆ రోజున వేసుకోవాలి. చెంబిస్త్రీ, చేటిస్త్రీ తప్పదు. పాపం హాస్టల్ పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొచ్చినా వారికి ఇస్త్రీ వీలు లేకపోవడంతో చిన్నబుచ్చుకునేవారు. ఫ్రెండ్సు వారితో చేరి ‘ఏం పర్లేదు లేరా. మీ చొక్కాలే మా చొక్కాల కంటే తెల్లగా ఉన్నాయి’ అని ఉత్సాహపరిచేవారు. వారు నూనె రాసుకున్న తలలతో తెల్లగా నవ్వేవారు.రోజూ స్కూలు ఉదయం తొమ్మిదికైతే ఆ రోజున ఎనిమిదికే సిద్ధం. గ్రౌండ్లో సుద్దపొడి వేసి లైన్లు కొట్టి ఒక్కో సెక్షన్ ఒక్కో లైన్లో నిలబడేలా చేసేవారు. జెండా కర్ర దగ్గర స్టేజ్. ఊరి ఆర్డివోనో తాసిల్దారో రిటైరై వెళ్లిపోయిన హెడ్మాస్టరో చీఫ్ గెస్టు. టిఫిన్ చేసొచ్చిన పిల్లలూ... చేయకుండా వచ్చిన పిల్లలూ... చాక్లెట్లు ఎన్ని పంచొచ్చో ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న పిల్లలూ... వీళ్లు మళ్లీ ఇంట్లో తోబుట్టువులకు హామీ ఇచ్చి వచ్చి ఉంటారు... చాక్లెట్లు తెచ్చిస్తా అని. అదొక టెన్షన్. హెడ్మాస్టర్ మూడ్ బాగుంటే రెండు పెద్ద పెద్ద పళ్లేలు తెప్పించి మూడు నాలుగు రకాల చాక్లెట్లు పోయించి, నయాపైసాకు ఒకటి వచ్చే బ్రిటానియా రౌండ్ బిస్కెట్లు వాటిలో కలిపి, మిశ్రీ ముక్కలు కూడా మిక్స్ చేసి గుప్పెడు గుప్పెడు పంచితే అదీ కిక్కు. పాపం కొన్ని వీధి బడుల్లో బొరుగుల్లో బెల్లం ముక్కలు కలిపి పంచేవారు. ఆ స్కూళ్ల ఆగస్టు 15కు పిల్లలు వెళ్లేవాళ్లు కాదు.అయితే చాక్లెట్లు, బిస్కెట్లు అంత సులువుగా రావు. ఎండ వాయకొడుతున్నా లెక్కచేయకుండా జెండా వందనం చేయించి, దేశభక్తి గీతాలు పాడించి, గెస్టు స్పీచు, హెడ్మాస్టరు స్పెషలు స్పీచు ఇచ్చి... దేశం తాలుకు బాధ్యతలన్నీ ఆ పూట ఎదురుగా నిలుచున్న పిట్ల ప్రాణాలకే అప్పజెప్పేసేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేసేవారు. ఆ బాలలేమో స్కూల్లేదు కదా... మధ్యాహ్నం మేట్నీకి డబ్బులెలా అనే మనాదిలో ఉంటారు.ఇన్నింటి మధ్య కూడా ఆగస్టు పదిహేను బాగుండేది. స్కూల్లోని ప్రతి క్లాసు రంగు కాగితాలతో రెపరెపలాడేది. ప్రతి గుండె మీద త్రివర్ణపతాకం గుండు పిన్నుతో అంటుకుపోయేది. ప్రతి పెదవి మీద గాంధీ నెహ్రూ సుభాసుబోసు భగత్సింగుల పేరు పలికేది. ‘హమ్ బుల్బులేహై ఇస్కే ఏ గుల్సితా హమారా’... ఈ దేశపు గువ్వపిట్టలం... రెక్కలు సాచి ఎగురతాం అని పాడుతూ ప్రతి చిన్నారి హృదయం ఆకాంక్ష చేసేది. పొందికైన బట్టల్లో టీచర్లు, ఉపాధ్యాయులు హుందాగా కనిపించేవారు. ప్రతి పీరియడ్కూ బెల్లు కొట్టే ప్యూన్ ఆ రోజు చాక్లెట్లు పంచుతూ చక్కగా నవ్వేవాడు. క్లాసులు చిమ్మే ఆయమ్మ కొప్పులో చామంతులు పెట్టుకొని కొత్తగా కనిపించేది. అందరం పెద్దయ్యి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కాసేపైనా గట్టిగా అనిపించేది. ఇక రోజూ చేసే ప్రతిజ్ఞ ఆ రోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. ‘నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను’.... ఈ ఒక్కలైను భవిష్యత్తు సమాజాన్ని నిర్మించేది. ‘ఈ దేశ సంపదకు అర్హుడనవ్వడానికి సదా కృషి చేస్తాను’ ఈ లైనూ ముఖ్యమే.మనం అర్హులమై ఉండాలి. మనం మన సమాజాన్ని ప్రేమించడానికి. మనల్ని మన దేశం ప్రేమించడానికి. పాఠశాల మరో తల్లి గర్భం. అక్కడ పొందే జవసత్వాలు, బుద్ధి కుశలతలు, చదువూ సంస్కారాలు... ఇవే నిజమైన దేశభక్తి. ఇవే నిజమైన ఆగస్టు 15. ప్రతి తరాన్ని ‘అర్హులైన తరం’గా మలచగలినంత కాలం మన దేశ ఖ్యాతికీ, దీప్తికీ ఢోకా లేదు. అలా జరిగినంత కాలం విశ్వానికి మనమే ‘భాగ్య విధాతలం’. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... భరతమాతకు ప్రతిరూపమే. ఏ తల్లిబిడ్డలైనా అందరూ భరతమాత బిడ్డలే.జెండా ఊంచా రహేగా హమారా.భారతమాతాకీ జై. జైహింద్!విదేశీ గడ్డపై మన జెండా!జర్మనీలోని స్టట్గార్డ్లో 1907లో జరిగిన ఒక విప్లవ సమావేశంలో భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్షలను చాటి చెప్పేలా డిజైన్ చేసిన ఒక జెండా (ఇప్పటి జాతీయ జెండా కాదు)ను ఎగరేశారు భికాజీ కామా. విదేశీ గడ్డపై మన జెండా ఎగరేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.గాంధీ గారి రేడియోనానిక్ మోత్వానీ అనే వ్యాపారవేత్త అమెరికా, ఇంగ్లాండ్ల నుంచి రివర్స్–ఇంజినీర్ యాంప్లిఫయర్స్, మైక్రోఫోన్స్, లౌడ్స్పీకర్లను దిగుమతి చేసుకొని ‘చికాగో రేడియో’ ప్రారంభించారు. ఈ రేడియో మహాత్మాగాంధీ ప్రసంగాలను విస్తృతంగా ప్రసారం చేసేది. స్వాతంత్య్ర సమరయోధులు రహస్య, భూగర్భ నెట్వర్క్లను నడపడంలో మోత్వానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలు ఉపయోగపడ్డాయి.క్యాట్ ఆర్మీస్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై నిరసన కార్యక్రమాలు సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించేవారు. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సూరత్లో క్యాట్ ఆర్మీ(మంజరి సేన) అనే సంఘంలోని మహిళలు జాతీయజెండా రంగులలో ముంచిన ఖాదీ వస్త్రాలు ధరించి బ్రిటిష్ అధికారులను ధిక్కరించారు. ∙సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు లక్నోలాంటి నగరాల్లో ‘సైమన్ గో బ్యాక్’ అని రాసి ఉన్న గాలిపటాలను ఎగరేశారు.అసామాన్య మహిళలుకొత్తగా వెలుగులోకి వచ్చిన బీబీసి వారి ఫొటో ఆర్కైవ్లో.... ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య మహిళలు ఎంత ధైర్యసాహసాలు, అంకితభావంతో పాల్గొన్నారో, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా నడిపించారో కళ్లకు కట్టే ఫొటోలు ఉన్నాయి. పోలీసులను బహిరంగంగా సవాలు చేశారు, మాటకు మాట బదులిచ్చారు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు.నివేదిత వజ్ర ఫ్లాగ్సిస్టర్ నివేదిత 1904లో భారత జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. ‘నివేదిత వజ్ర ఫ్లాగ్’ అని పిలిచే ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగుల నేపథ్యం, తెల్లని తామరపువ్వుతో కూడిన వజ్రం చిహ్నం, వందేమాతరం నినాదం కనిపిస్తాయి.దండి యాత్రలో అతి పిన్న వయస్కుడుఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సబర్మతి ఆశ్రమం నుండి ‘దండి యాత్ర’ ప్రారంభించారు గాంధీజీ. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ మార్చ్లో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కుడు పదహారేళ్ల విఠల్ లీలాధర్ ఠక్కర్. -
79 నుంచి 80కి.. మన జీవితంలో ఏం మారింది?
జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఎర్రకోట వేదికగా దేశ ప్రగతి ప్రస్థానం మరోసారి వినిపిస్తుంది. రహదారుల నుంచి రాకెట్ల వరకు.. డిజిటల్ చెల్లింపుల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ సాధించిన విజయాలను ప్రభుత్వం దేశం ముందుంచుతుంది. కానీ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం కేవలం విజయాలను లెక్కించుకునే సందర్భమే కాదు.. ఆ అభివృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో సమీక్షించుకునే సమయం కూడా.79వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 80వ దినోత్సవం వరకు భారత్ ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ విప్లవం, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ వేదికపై పెరిగిన ప్రాధాన్యం.. ఇవన్నీ కొత్త భారత్ చిత్రాన్ని చూపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగాలు, ధరల భారం, ఆదాయ అసమానతలు, వ్యవసాయ సమస్యలు వంటి ప్రశ్నలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి వేగం పెరిగిన ఈ ఏడాదిలో.. ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో ఎంతవరకు కనిపించింది? ఇదే 80వ స్వాతంత్ర్య దినోత్సవం ముందున్న అసలు ప్రశ్న.జీడీపీ నుంచి జేబు దాకా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. తయారీ రంగం, సేవల రంగం, మౌలిక వసతులు, స్టార్టప్ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగాయి. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు పరిశ్రమలకు ఊతమిస్తున్నాయి.భారత్ ఆర్థిక పరిమాణం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో భారత మార్కెట్ ఆకర్షణీయంగా మారిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.అయితే మరోవైపు సామాన్య కుటుంబాల లెక్కలు వేరుగా ఉన్నాయి. నిత్యావసర ధరలు, విద్య, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు పెరగడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. దేశ సంపద పెరుగుతున్న వేగం.. ప్రతి కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతున్న వేగంతో సమానమా? అనే చర్చ కొనసాగుతోంది.మన డిజిటల్ భారతం.. భారత్లో అత్యంత వేగంగా కనిపించిన మార్పుల్లో డిజిటల్ విప్లవం ఒకటి. ఒకప్పుడు బ్యాంకు సేవల కోసం రోజుల తరబడి వేచి చూసిన ప్రజలు ఇప్పుడు మొబైల్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిన్న వ్యాపారి, కూరగాయల విక్రేత, ఆటో డ్రైవర్.. ఇలా సామాన్యుడి జీవితంలోనూ డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. యూపీఐ వంటి వ్యవస్థలు భారత ఆర్థిక లావాదేవీల రూపాన్ని మార్చాయి.అదే సమయంలో కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను తెస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా రంగాల్లో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే AI కారణంగా ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతుందన్న ఆందోళన కూడా పెరుగుతోంది.రయ్.. రయ్..తిరిగేయ్దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త ఎక్స్ప్రెస్వేలు, రహదారులు, మెట్రో ప్రాజెక్టులు, రైల్వే ఆధునీకరణతో ప్రయాణ రూపం మారుతోంది. వందే భారత్ వంటి రైళ్లు ఆధునిక రైల్వేకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతోంది. విమానాశ్రయాల విస్తరణతో విమాన ప్రయాణం కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది.అయితే మరోవైపు గ్రామీణ రహదారులు, ప్రజా రవాణా, నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరడం కూడా అంతే ముఖ్యం.అంతరిక్ష విజయాలే..చంద్రయాన్ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం, ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు అవకాశాలు, కొత్త పరిశోధనలపై దృష్టి పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ భారత్ పాత్ర పెరిగింది. అమెరికా, రష్యా, యూరప్, ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రపంచ వేదికపై పెరిగిన ఈ ప్రాధాన్యం భారత్ ఆర్థిక, దౌత్య శక్తిని ప్రతిబింబిస్తోంది.యువ భారత్.. ఆశలు పెద్దవి, సవాళ్లు కూడాభారత్ యువ జనాభా దేశానికి అతిపెద్ద బలం. అదే సమయంలో వారికి అవకాశాలు కల్పించడం అతిపెద్ద బాధ్యత. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే లక్షలాది మంది యువతకు స్థిరమైన ఉద్యోగం, మెరుగైన వేతనం, ఉద్యోగ భద్రత ఇప్పటికీ కీలక అంశాలుగానే ఉన్నాయి. పోటీ పరీక్షలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. జెన్జీ ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి.అభివృద్ధి కథలో మరో వైపు79 నుంచి 80కి భారత్ ప్రయాణం చూస్తే విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి. డిజిటల్ శక్తి పెరిగింది. మౌలిక వసతులు విస్తరించాయి. అంతరిక్షం నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ తన ముద్ర వేస్తోంది. కానీ ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ, భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపుతో మాత్రమే కొలవలేం.ఒక రైతు ఆదాయం పెరిగిందా?ఒక యువకుడికి ఉద్యోగం దొరికిందా?ఒక కుటుంబానికి వైద్యం, విద్య భారం తగ్గిందా?ఒక సామాన్యుడి జీవన ప్రమాణం మెరుగుపడిందా?.. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే అసలు అభివృద్ధికి కొలమానం.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తన విజయాలను వేడుకగా జరుపుకుంటోంది. అదే సమయంలో ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమూ ఇదే. గత ఏడాదిలో భారత్ చాలా మారింది.. కానీ ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో మరింత స్పష్టంగా కనిపించడమే వచ్చే ప్రయాణానికి అసలైన సవాల్.:::వెబ్ ప్రత్యేకం -
మనలోనూ ‘హైబ్రిడ్ ఇంజిన్’!
(సాక్షి, స్పెషల్ డెస్క్) : మనం నడిపే కార్లు అధునికతను సంతరించుకుంటున్నాయి. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్తో కూడిన హైబ్రిడ్ ఇంధన వ్యవస్థతో కూడిన వాహనాలు పరుగులు తీస్తున్నాయి. రోడ్డు పరిస్థితులు, ప్రయాణ వేగాన్ని బట్టి కారు దానంతట అదే ఏ ఇంధనాన్ని వాడాలో ఎంచుకుంటుంది. అయితే మన శరీరంలోని కణాలు కూడా ఇలాంటి అద్భుతమైన ‘హైబ్రిడ్ ఇంజిన్’వ్యవస్థతో నడుస్తున్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ ఈ హైబ్రిడ్ ఇంజిన్ను సవ్యంగా వాడుకోలేక పోతున్నామని, ఈ కారణంగానే 80 రకాల జీవక్రియ సంబంధిత జబ్బుల పాలవుతున్నామని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆసక్తికరమైన ఈ సంగతులేమిటో ఒకసారి చూద్దాం.. హైబ్రిడ్ ఇంధనాలు గ్లూకోజ్, కొవ్వు మానవ దేహంలో కణాలు కూడా శక్తి కోసం ‘గ్లూకోజ్’(చక్కెర), ‘కొవ్వు’(ఫ్యాట్) అనే రెండు రకాల ఇంధనాలపై ఆధారపడతాయి. అయితే కణాలు ఈ రెండింటినీ ఒకేసారి ఉపయోగించలేవు. సందర్భాన్ని బట్టి ఇంధనం మారుతుంది. ఈ వ్యవస్థను ‘ర్యాండల్ సైకిల్’(గ్లూకోజ్–ఫ్యాటీ ఆసిడ్ సైకిల్) లేదా ‘మెటబాలిక్ స్విచ్’అంటారు. ఈ స్విచ్ను నియంత్రించే మాస్టర్ హార్మోన్ ‘ఇన్సులిన్’. మనం ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో ఇన్సులిన్ హార్మోన్ పెరిగి, కణాలు గ్లూకోజ్ను మాత్రమే శక్తిగా మార్చుకునేలా చేస్తుంది. ఆ సమయంలో కొవ్వు వినియోగం ఆగిపోతుంది. కణంలోని మైటోకాండ్రియా తలుపు తీసి గ్లూకోజ్ను దాని లోపలికి పంపేది ఇన్సులిన్ హార్మోనే. అయితే అపరిమిత పిండి పదార్థాలతో కూడిన ఆహారం నిరంతరం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నాణ్యతను కోల్పో యి మైటోకాండ్రియా తలుపు తెరుచుకోవడమనే వ్యవస్థ సమర్థవంతంగా పని చేయలేదు. ఈ స్థితే ‘ఇన్సులిన్ రెసిస్టె¯న్స్’(ఇన్సులిన్ నిరోధకత)కు దారితీస్తుంది. అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు లేదా పిండి పదార్థాల ఆహారానికి ఎక్కువ గంటల పాటు విరామం ఇచ్చినప్పుడు కొవ్వు నిల్వల వాడకం మొదలవుతుంది. సమస్య ఎక్కడ వస్తోంది?ఆధునిక జీవనశైలిలో భాగంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, పదేపదే స్నాక్స్, తీపి పానీయాలు తీసుకోవటం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటున్నాయి. దీనివల్ల కొవ్వును కరిగించే ద్వారం నిరంతరం మూసే ఉంటుంది. ఇన్సులిన్ శరీరంలో భారీగా కొవ్వు పేరుకుపోతుంది. కణాలు కేవలం గ్లూకోజ్ పైనే ఆధారపడటం వల్ల ఇంజిన్ వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో అతిగా పేరుకుపోయిన కొవ్వు ఊరికే ఉండదు. విషపూరిత రసాయనాలుగా మారి ఇన్ఫ్లమేషన్ (వాపు)ను కలిగిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతే కాలక్రమేణా ఊబకాయం, టైప్–2 మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి 80 రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని కార్డియాక్, మెటబాలిక్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు.పరిష్కారం ఏమిటి?శరీరంలోని ఈ హైబ్రిడ్ ఇంజిన్ను రీసెట్ చేయాలంటే ఏం చెయ్యాలి? ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించి ప్రొటీన్లు, మంచి కొవ్వులు తీసుకోవాలి. రెండు భోజనాల మధ్య 6 గంటల విరామం ఇవ్వటం వల్ల ఇన్సులిన్ తగ్గి, కొవ్వు కరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఇన్సులిన్ తో సంబంధం లేకుండా కండరాలు గ్లూకోజ్, కొవ్వు లను అవసరం మేరకు నేరుగా వాడుకుంటాయి. సరైన జీవనశైలితో ఈ స్విచ్ను అదుపులో ఉంచుకోవచ్చన్న మాట. అంటే.. హైబ్రిడ్ ఇంజిన్ను సక్రమంగా వాడుకోగలిగితే వ్యాధుల బారిన పడకుండా జీవించవచ్చు లేదా మందులు వాడకుండానే ఆరోగ్యం సాధించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
సమంగా వర్షం పడితేనే.. సాగు బాగు..!
సాక్షి, స్పెషల్ డెస్క్ : ఒకసారి భారీగా వర్షం పడటం కంటే.. సమతుల్య వర్షపాతంతోనే సాగుకు మేలు అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పంటకు అవసరమైన దశలో వర్షం పడినా, తక్కువ వర్షపాతం ఉన్నా, ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చాలా ఎక్కువ వర్షపాతం అవసరం లేనప్పుడు పడితే మాత్రం, పంట నష్టపోవటమే కాకుండా దిగుబడిలో కూడా చాలా తేడా వస్తుందంటున్నారు. ప్రస్తుతం సాధారణంగా ఒక నెల రోజుల్లో పడే వర్షం అంతా.. మూడు, నాలుగు రోజులు లేదా ఒక 10 రోజుల్లో పడటం.. లేదంటే ఒక్కోసారి ఒకే రోజులోనూ పడుతోంది, దీనివల్ల పంటలకు నిస్సందేహంగా నష్టం ఉంటుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఎల్నినో కారణంగా తొలి రెండు నెలలు అసమాన సాధారణ వర్షపాతం నమోదైంది. ఇటీవలి భారీ వర్షాలతో ఆ అసమానత తగ్గింది. ముందు వర్షాలు లేనందువల్ల ఇప్పుడు పడిన అధిక వర్షాలు రైతులకు నిస్సందేహంగా ఉపయోగపడతాయి. ఇప్పటికే వేసిన పంటల పెరుగుదల తిరిగి పుంజుకుంటుంది. ఇప్పటికైతే వర్షపాతం లోటు చాలా వరకు తగ్గిపోయింది. ఇక ముందు పంటలకు అవసరానికి అనుగుణంగా సమతుల్యంగా వర్షం పడితే పర్వాలేదు. అలా కాకుండా వర్షాలు విపరీతంగా ఎక్కువైపోతే.. ఆ అదనపు నీటిని పొలాల్లో నుంచి ఎప్పటికప్పుడు బయటకు పంపాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఏ కారణం వల్ల రైతులు ఆ పని చెయ్యలేకపోతే ఏ పంటైనా, అది ఏ దశలో ఉన్నా, కలుపు, వేరుకుళ్లు, తెగుళ్లు, పురుగు వంటి సమస్యలు రైతును చుట్టుముట్టి దిగుబడి నష్టపరచడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. వర్షం ఎక్కువైనా,తక్కువైనా పంటలను కాపాడుకోవటం ఎలా? వర్షాలు కురవని సమయంలో బెట్టను తట్టుకోవటానికి, ఒకేసారి వర్షం ఎక్కువై నీరు నిలిచినప్పుడు పంటలను రక్షించుకోవటానికి రైతులు తేమ సంరక్షణ పద్ధతులుపాటించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డా. లీలారాణి రైతులకు ఆచరణాత్మక సూచనలు చేశారు. సాలుకు అడ్డంగా దుక్కి: విత్తనం వేయక ముందే కొండ వాలుకు లేదా నేల వాలుకు అడ్డంగా దుక్కి దున్నుకోవటం వల్ల వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా నేలలో ఇంకుతుంది. బోదెలు–కాలువల పద్ధతి: పంటలను బోదెలపై విత్తుకోవటం వల్ల అధిక వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా వరద నీటిని సులభంగా బయటకు పంపొచ్చు. వర్షాలు లేని సమయంలో ఈ కాలువలే తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుతాయి. ఎత్తు మడుల సాగు: నీటి ముంపు త్వరితగతిన నివారించటానికి ఎత్తు మడుల పద్ధతి విశేషంగా తోడ్పడుతుంది. నాగలితో గొడ్డు చాలు: వర్షాధార పంటల్లో ఆఖరి గుంటక తోలిన తర్వాత ఒక గొడ్డు చాలు (గబ్బచాలు) వేసుకోవాలి. ఇది నీరు బయటకు పోవటానికి, బెట్ట సమయంలో తేమను కాపాడటానికి ఉపయోగపడుతుంది. చేను గట్లు, డ్రైనేజీ కాలువల నిర్వహణ: పొలం చుట్టూఉన్న గట్లు, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని, నీరు వెంటనే బయటకు వెళ్లేలా ‘డ్రైనేజీ’వసతి సరిగ్గా ఉంచుకోవాలి. పంట కుంటల నిర్మాణం: తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో పొలం దిగువ ప్రాంతంలో పంట కుంటలు (ఫామ్ పాండ్స్) తవ్వుకోవాలి. భారీ వర్షాల నీటిని ఇందులో మళ్లించి, ఆ తర్వాత బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షక తడిగా వాడుకోవచ్చు. భారీవర్షాలు కురిసిన తర్వాత వరద నీటిని రైతులు వీలైనంత త్వరగా బయటకు తీసివేయాలి. అదను చూసుకొని వెంటనే అంతర కృషి చేయాలి. ఎకరానికి 20 కేజీలు యూరియా, 10 కేజీల పొటాష్ ను పైపాటుగా వెయ్యాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెలంగాణలో ఇలాంటి పరిస్థితే ఉంది.. సమానంగా విస్తరించిన వర్షపాతంతో వ్యవసాయం బాగుంటుంది. పంటకు అవసరమైన కీలక దశల్లో తగినంత నీరు లభించడమే మంచి దిగుబడి పొందటానికి ముఖ్యం. చాలా రోజులు వర్షం లేకుండా ఒకేసారి కుంభవృష్టి కురిస్తే వర్షపాతం లోటు తగ్గినా, పంటలకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితే నెలకొంది. మొదట్లో తీవ్ర కొరత వచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల అతివృష్టి సమస్య. ఇక ముందూ వర్షాలు ఎక్కువైతే సమస్యలే. వర్షాధారంగా ఎక్కువగా సాగయ్యే పత్తి, వరి, మొక్కజొన్న, కంది, సోయాచిక్కుడు, పెసర, మినుము వంటి పంటలకు ఈ అసమాన వర్షపాతం వల్ల వివిధ దశల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం మేం వెలువరించే వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను గమనిస్తూ రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాటిస్తే పంట నష్టాన్ని కనీసం 50 శాతం వరకు అరికట్టవచ్చు. – డాక్టర్ పి. లీలారాణి -
ఒకే ఇంట్లో కలి'విడి'గా!
బెంగళూరుకు చెందిన యువ దంపతులుమల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాపనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో, వేర్వేరు షిఫ్ట్లలో పనిచేయడం మొదలు పెట్టారు. అలసటకు గురై నిద్రపోయేవేళలోనే ఓ 10 నిమిషాలు మాట్లాడుకొనేవారు. అలా వారి మధ్య దూరం పెరగడంతో 6 నెలల క్రితం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఓ జంట సైతం స్టార్టప్ కంపెనీలో పని ఒత్తిడి, టార్గెట్లు, వారాంతాల్లోనూ పనివేళల వల్ల ఒకరికొకరు మాట్లాడుకోవడం బాగా తగ్గించేశారు. మానసిక వైద్యుడి వద్ద కౌన్సెలింగ్కు వెళ్తే కౌన్సెలర్ చెప్పిన మాట ఒక్కటే ‘‘మీరు భాగస్వాముల కంటే కొలీగ్స్లా ప్రవర్తిస్తున్నారు’’. భావోద్వేగపరంగా కనెక్ట్ కాకపోవడంతో ఇద్దరూ విడిగా ఉండాలని డిసైడయ్యారు. ఇది లీగల్గా విడాకులు కాదు.. ఎమోషనల్ విడాకులు! సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తలిద్దరికీ తీరికలేని ఉద్యోగాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు మీటింగ్లు, డెడ్లైన్లు... ఒకే ఇంట్లో ఉంటున్నా మాటలు కరువవుతున్న తీరు. ఆఫీసు కష్టాలు చెప్పుకుందామన్నా.. ఇంట్లో సంతోషాలు పంచుకుందామన్నా మెసేజ్లే దిక్కు. ఇదే ఇప్పుడు మె ట్రో నగరాల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణుల కుటుంబాల్లో కనిపిస్తున్న విచిత్ర పరిస్థితి. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా దంపతుల మధ్య మనసులు మాత్రం దూరమవుతున్నాయి. దీన్నే వైద్య నిపుణులు సైలెంట్ డైవోర్స్ అంటున్నారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరగడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని అంటున్నారు. గతంలో ఆఫీస్కు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో మాట్లాడుకునేందుకు సమయం ఉండేది. ఇప్పుడు 24 గంటలూ నాలుగు గోడల మధ్యఉన్నా కమ్యూనికేషన్ మాత్రం తగ్గిపోయింది. జాతీయ మానసిక ఆరోగ్య, నాడీ శా్రస్తాల సంస్థ 2025 సర్వే ప్రకారం మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో 38 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల భాగస్వామితో గొడవలుపెరిగాయని చెప్పారు. బంధం పెంచుకుంటేనే.. సైలెంట్ డైవోర్స్కు పరిష్కారం చట్టంలో కాదు.. కమ్యూనికేషన్లో ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పని విధానం వల్ల ఇంట్లో ఉండేందుకు లభించిన సమయాన్ని భార్యాభర్తలు పరస్పరం తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. మాటల్లోనే పరిష్కారం.. ‘సైలెంట్ డైవోర్స్’సమస్యలతో చాలా జంటలు మా వద్దకు వస్తున్నాయి. భిన్న కుటుంబ నేపథ్యాలకు చెందిన దంపతుల్లో, భర్తకన్నా భార్య సంపాదనఎక్కువగా ఉన్న సందర్భాల్లో, సాంస్కృతిక తేడాలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న దంపతులు ఇలాంటి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి మా సలహా ఒకటే. దంపతులుమనసువిప్పి మాట్లాడుకుంటే సమస్యలకుపరిష్కారం లభిస్తుంది. సమస్యను తొలిదశలోనే గుర్తించి పరిష్కరించుకుంటే విడాకుల దాకా పరిస్థితి వెళ్లదు. – డా.సి. వీరేందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
కొలంబియా భూకంపం: ఒక్క కుదుపు.. సెకన్లలో శవాల దిబ్బలు!
ప్రకృతి కన్నెర్ర చేస్తే.. మనిషి నిర్మించిన ప్రపంచం క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. అప్పటివరకు జనజీవనంతో కళకళలాడిన నగరాలు భూమి ఒక్కసారి కంపించగానే శిథిలాల గుట్టలుగా మారిపోతాయి. కట్టుకున్న ఇళ్లు కూలిపోతాయి.. కుటుంబాలు చెల్లాచెదురవుతాయి.. ప్రాణాలతో బయటపడిన వారి కళ్ల ముందు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదం జీవితాంతం వెంటాడుతుంది..భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన లాటిన్ అమెరికా.. ఇలాంటి ఎన్నో ప్రకృతి విలయాలకు సాక్షిగా నిలిచింది. భూమి పొరల్లో చోటుచేసుకున్న కదలికలు కొన్ని సెకన్లలోనే నగరాల రూపురేఖలను మార్చేశాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. తాజాగా కొలంబియాలో సంభవించిన భారీ భూకంపం మరోసారి ఈ ప్రాంతంలోని పాత విషాదాలను ప్రపంచానికి గుర్తుచేసింది. ఈ ప్రకంపనల ధాటికి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Powerful 7.4-magnitude earthquake hits Manizales, Colombia 🇨🇴 (10.08.2026)@AmirSaeedAbbasi @HussainAhmedCh8 @KulAalam #Colombia pic.twitter.com/FI2lrySjd8— Media Talk (@mediatalk922) August 11, 2026హైతీ.. ప్రపంచాన్ని కదిలించిన విషాదంలాటిన్ అమెరికా చరిత్రలో అత్యంత భయానక భూకంపాల్లో 2010లో హైతీలో సంభవించిన ప్రకంపనలు ఒకటి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0 మాత్రమే అయినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం ఊహించని స్థాయిలో కనిపించింది. రాజధాని పోర్ట్–ఔ–ప్రిన్స్ నగరం తీవ్రంగా దెబ్బతింది. వేలాది భవనాలు కూలిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు శిథిలాలుగా మారాయి. భూకంప నిరోధక ప్రమాణాలు లేని నిర్మాణాలు భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.ఈ విపత్తులో సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక దేశం మొత్తం కోలుకోవడానికి ఏళ్లు పట్టింది.నిద్రలోనే మృత్యువు ఒడిలోకి వేలమంది.. 1868లో ఈక్వెడార్, కొలంబియా ప్రాంతాలను కుదిపేసిన భూకంపాలు మరో మహా విషాదాన్ని మిగిల్చాయి. **7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు** అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. ప్రజలు గాఢనిద్రలో ఉన్న సమయంలో సంభవించిన ఈ భూకంపం.. క్షణాల్లో వేలాది ఇళ్లను శిథిలాలుగా మార్చింది. ఈక్వెడార్లో సుమారు 40 వేల మంది, కొలంబియాలో మరో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. చారిత్రక రికార్డుల ప్రకారం.. ఇబారా నగరం కొన్ని క్షణాల్లోనే విధ్వంసానికి గురైందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.పెరూలో భూకంపం.. కదిలిన పర్వతం1970లో పెరూలో సంభవించిన భూకంపం ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. 7.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు అండీస్ పర్వతాల్లో భారీ మంచు, రాళ్ల కొండచరియలు విరిగిపడేలా చేశాయి. మంచు, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం వేగంగా దూసుకొచ్చి యుంగే, రన్రాహిర్కా ప్రాంతాలను కప్పేసింది. కొన్ని నిమిషాల్లోనే అక్కడి జనజీవనం పూర్తిగా తారుమారైంది. ఈ ఘటనలో సుమారు 66,794 మంది మరణించారు. ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు ఎంతటి ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటన చాటిచెప్పింది.ఈక్వెడార్లో ప్రకృతి ప్రకోపం.. 40 వేల మంది బలి1797లో ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ఆ దేశ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఘటనల్లో ఒకటి. 8.3 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు భారీగా కొండచరియలు విరిగిపడేలా చేశాయి. రియోబాంబా, లతకుంగా, అంబాటో వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విషాదంలో సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.చిలీ.. భూకంపాల దేశంలో విషాద జ్ఞాపకంప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో చిలీలో 9.5 తీవ్రతతో నమోదైంది. అయితే అత్యధిక మరణాలు మాత్రం 1939లో వచ్చిన చిల్లాన్ భూకంపంలో చోటుచేసుకున్నాయి. 8.3 తీవ్రతతో వచ్చిన ఆ ప్రకంపనలు చిల్లాన్, కాన్సెప్సియన్ నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. బలహీన నిర్మాణాల కారణంగా సుమారు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం తర్వాత చిలీ భూకంప నిరోధక నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.వెనిజులా నుంచి అర్జెంటీనా వరకు.. విషాదాల ఆనవాళ్లులాటిన్ అమెరికాలో మరెన్నో భూకంపాలు వేలాది కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చాయి. 1812 వెనిజులా భూకంపం సుమారు 26 వేల మందిని, 1868 అరికా భూకంపం దాదాపు 25 వేల మందిని, 1976 గ్వాటెమాలా భూకంపం 23 వేల మందిని బలిగొన్నాయి. 1797 వెనిజులా భూకంపం, 1861 అర్జెంటీనా భూకంపం కూడా వేలాది ప్రాణాలను హరించాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం తర్వాత వచ్చిన సునామీలు, అగ్ని ప్రమాదాలు మరణాల సంఖ్యను మరింత పెంచాయి.ఎందుకింత ప్రాణ నష్టం?లాటిన్ అమెరికా భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారడానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంతం భారీ టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉండటమే. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉన్న చిలీ, పెరూ, ఈక్వెడార్, కొలంబియా వంటి దేశాలు తరచూ భౌగోళిక కదలికలను ఎదుర్కొంటుంటాయి.సముద్రపు అడుగున ఉన్న నాజ్కా టెక్టానిక్ ప్లేట్.. దక్షిణ అమెరికా ప్లేట్ కిందికి జారిపోవడం వల్ల భూమి లోపల భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భారీ ప్రకంపనలు సంభవిస్తాయి. అందుకే ఈ ప్రాంతంలో తరచూ శక్తివంతమైన భూకంపాలు చోటుచేసుకుంటుంటాయి.ప్రకృతి హెచ్చరిక.. మనిషికి గుణపాఠంభూకంపాలను ఆపడం మనిషి చేతుల్లో లేదు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. భూకంప నిరోధక నిర్మాణాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ ప్రణాళికలు ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. లాటిన్ అమెరికా భూకంప చరిత్ర ఒక చేదు నిజాన్ని చెబుతోంది. భూమి కదిలేది కొన్ని సెకన్లే.. కానీ ఆ ప్రకంపనలు మిగిల్చే విషాదం తరతరాల పాటు నిలిచిపోతుంది అని. -
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
హైదరాబాద్లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది.ప్రియాంక.. పక్కన యాక్సిడెంట్ దృశ్యంప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది.బ్రిటన్లోనూ డ్రంక్ డ్రైవింగ్పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి.ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి.లెక్కలు చెబుతున్న భయానక నిజంమద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. కేవలం ట్రాఫిక్ తప్పిదం కాదు ప్రాణాలను బలిగొనే ప్రమాదకర నిర్ణయం. భారత్లో 2022లో డ్రంక్ డ్రైవింగ్తో 4,201 మరణాలు.. 2023లో 9,143 కేసులు.. 2024లో 8,270 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతూ పోతోంది. ఇవే కాకుండా.. ఇతరుల ప్రాణాలు తీయడమే కాకుండా, తాగి తమ ప్రాణాలు తీసుకుంటున్నవాళ్ల లెక్కలు ఇంకా బోలెడు ఉన్నాయి.భారత్లో చట్టాలు ఉన్నా.. భారత్లోనూ డ్రంక్ డ్రైవింగ్పై చట్టాలు ఉన్నాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే భారత న్యాయ సంహిత (BNS) కింద నిర్లక్ష్యపు చర్యలకు సంబంధించి మరింత తీవ్రమైన కేసులు నమోదు చేయవచ్చు. అయితే సమస్య చట్టాల కొరతలో కాదు.. వాటి అమలులో ఉందనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.శిక్ష భయం ఎందుకు రావడం లేదు?డ్రంక్ డ్రైవింగ్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోవచ్చు.. ఎన్నో కుటుంబాలు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయినప్పటికీ కొందరిలో ఈ నేరం పట్ల సరైన భయం కనిపించడం లేదు.ఇతర దేశాల్లో డ్రంక్ డ్రైవింగ్పై చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం, లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు వంటి పరిణామాలు ఉంటాయనే భయం వాహనదారుల్లో ఉంటుంది. ప్రమాదంలో మరణం సంభవిస్తే కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధిస్తారు.హైదర్షా కోట్ హిట్ అండ్ రన్ దృశ్యం ఇదిభారత్లోనూ చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు, శిక్షలు పడే వేగమే ప్రధాన సవాల్గా మారుతోంది. కేసులు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఎక్కువ కాలం కొనసాగడం.. శిక్షలు ఆలస్యంగా పడటం వల్ల కొందరిలో నేరం పట్ల భయం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కఠిన చట్టాలతో పాటు.. వాటిని వేగంగా, సమర్థంగా అమలు చేయడం కూడా అంతే కీలకం. ఎందుకంటే మద్యం మత్తులో స్టీరింగ్ పట్టే ప్రతి వ్యక్తి తన ప్రాణాన్నే కాదు.. రోడ్డుపై ఉన్న ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు. శిక్ష భయం పెరిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.మారాల్సింది మనస్తత్వం కూడా..ప్రపంచ దేశాలు చెబుతున్న పాఠం ఒక్కటే.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం సరదా కాదు, అది ప్రాణాలతో చెలగాటం. కఠిన చట్టాలతో పాటు.. వాటి అమలు, ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరగాల్సిన అవసరం ఉంది. హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్న వేళ.. ‘‘తాగాను.. డ్రైవ్ చేస్తాను’’ అనే నిర్లక్ష్య ఆలోచనకు అడ్డుకట్ట పడాల్సిన సమయం వచ్చింది. -
అంతరిక్షంలో వరి సాగు
రోదసీ పరిశోధనల్లో మానవాళి మరొక చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా ‘తియాంగాంగ్’ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు వరి పంటను తొలిసారి విజయవంతంగా పండించారు. విత్తనం వేసి ధాన్యాన్ని నూర్చే వరకు జీవిత చక్రాన్ని పూర్తి చేసి ప్రతిష్టాత్మక మైలురాయిని దాటారు. అంతరిక్షంలో సుదీర్ఘకాలం నివసించే రోదసీ యాత్రికులకు స్వయంసమృద్ధిగల ఆహార భద్రతను అందించే ప్రయత్నాల్లో ఈ ప్రయోగం విప్లవాత్మక మలుపుగా నిలిచింది.అంతరిక్ష కాలనీలకు మార్గంఈ సంచలన ప్రయోగం ద్వారా రోదసీలోనే ఆహారాన్ని పండించటం మాత్రమే కాకుండా, వ్యోమగాములు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయటానికి కూడా అవకాశం దొరికింది. నీటి వ్యవస్థను సహజ సిద్ధంగా శుద్ధి చేయటం కూడా సాధ్యమవుతుంది. అంతరిక్షంలో ‘క్లోజ్డ్–లూప్ ఎకోసిస్టమ్’ రూపుదిద్దుకో వడానికి ఇది ప్రాథమిక అడుగు.భవిష్యత్తులో మార్స్ లేదా చంద్రుడిపై కాలనీలు నిర్మించే క్రమంలో భూమి నుంచి ప్రతీసారీ ఆహారాన్ని మోసుకెళ్లే అవసరం లేకుండా, అక్కడే స్వయంగా పంటలు పండించుకునేందుకు ఇక మీదట 100 శాతం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ అంతరిక్ష వరి విత్తనాల్లోని జన్యుపరమైన మార్పులను అధ్యయనం చేయటం ద్వారా భూమిపై తీవ్ర ప్రతికూల వాతావరణ మార్పులను ఎదుర్కొనే నూతన వరి రకాలను అభివృద్ధి చేయటానికి కూడా ఈ పరిశోధన దోహదపడుతుందని చెబుతున్నారు.ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాలు..భూమిపై గురుత్వాకర్షణ ప్రభావంతో మొక్కల వేళ్లు కిందికి, కాండం పైకి పెరుగుతాయి. అయితే, రోదసీలోని మైక్రోగ్రావిటీ (శూన్య గురుత్వాకర్షణ శక్తి)లో వాతావరణంలో మొక్కల పెరుగుదల శైలి మారినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష ఇంక్యుబేటర్లలో ప్రత్యేక ఎల్ఈడీ కాంతి, ద్రవ పోషకాల ద్వారా నీరు, ఎరువుల వరి పంట పండించారు. ఈ ప్రయోగంలో పొడవు రకం వరి మొక్కలు అనుకున్న దానికంటే ఆలస్యంగా ధాన్యాన్ని పండించగా, పొట్టి రకం మొక్కలు సరైన సమయంలోనే పండాయి.అంతరిక్ష వరి సాగు ముఖ్యాంశాలుఅంతరిక్ష కేంద్రం: చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్సాగు చేసిన పంట: వరి (పొడవు, పొట్టి రకాలు)ప్రయోగ కాలం: 120 రోజులు మైలురాయి: శూన్య గురుత్వా కర్షణలో ‘నారు నుంచి నూర్పిడి వరకు’ ప్రయోగం విజయవంతంముఖ్య ప్రయోజనాలు: రోదసీలో ఆహారోత్పత్తి, ఆక్సిజన్ పునరుత్పత్తి, నీటి శుద్ధి వ్యవస్థల అనుసంధానం -
బ్యాంకు కాటుకు రైతు దెబ్బ!
టిట్ ఫర్ ట్యాట్ అనండి.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనండి.. ఇంకో పేరు ఏదైనా పెట్టుకోండి. హాసన్ జిల్లా సకలేశ్పుర కెనెరాబ్యాంకులో జరిగిన ఈ ఘటన మాత్రమిప్పుడు సోషల్ మీడియాలో పిచ్చవైరల్ అవుతోంది. ‘‘రైతన్నా.. పొగరుబోతు బ్యాంకుకు భలే బుద్ధి చెప్పావు’’అన్న కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే... చొక్కన గౌడ అనే రైతు కెనెరాబ్యాంకు నుంచి యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఠంచనుగా తిరిగి కట్టేశాడు కూడా. హమ్మయ్య అప్పు బాధ తీరిందిలే అనుకుని ఇంటికెళితే.. కొంత కాలానికే బ్యాంకు నుంచి ఒక నోటీసొచ్చింది. ఇదేమిటబ్బా అని చూస్తే అతడికి షాక్.. ‘‘ఇంకో 9.34’’రూపాయలు బాకీ ఉన్నావు. కట్టూ అంటూ బ్యాంకు తాఖీదు. బ్యాంకు అధికారుల అతికాకపోతే.. రూ.యాభై వేలు కట్టినోడికి తొమ్మిది రూపాయల ముప్ఫై నాలుగు పైసలు ఎక్కువవుతుందా? చొక్కన గౌడ కూడా ఇలాగే ఫీలయ్యాడు. సరే అనుకుని బ్యాంకుకు వెళ్లాడు. మిగిలిన బాకీ వివరాలతో పే ఇన్ స్లిప్ నింపాడు. పది రూపాయల నోటు జత చేసి బ్యాంకు అధికారికి ఇచ్చాడు. వాళ్లేమో భలే నిక్కచ్చిగా పనిచేశాము మేము అనుకుని భుజాలు చరుచుకుని సీలు వేసిన స్లిప్ను చొక్కనగౌడకు రిటర్న్ ఇచ్చాడు. అక్కడ మొదలైంది తకరారు. ‘‘పది రూపాలిచ్చా. మీకివ్వాల్సింది రూ.9.34. ఆ విషయమే స్లిప్లో రాశా. మీరు సీల్ కూడా వేశారు. మరి... బాకీ 66 పైసల మాటేమిటి?’’అన్నాడు చొక్కనగౌడ. నోట మాట రాలేదు బ్యాంకు అధికారులకు. ఈ ఘటన ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ తాజాగా మరోసారి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యింది. కొసమెరుపు ఏమిటంటే.. చొక్కనగౌడ డిమాండ్కు తలొగ్గిన బ్యాంకు 66 పైసల మొత్తాన్ని అతడి ఖాతాలోకి జమ చేయడం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరెస్ట్ ఒడిలో విషాద గాథ.. ‘గ్రీన్ బూట్స్’ ఎవరివంటే?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం.. ఎవరెస్ట్. అక్కడ అడుగు పెట్టడం ప్రతి పర్వతారోహకుడి జీవిత కల. కానీ ఆ మంచు పర్వతం ఎన్నో విషాదాలకు కూడా సాక్షిగా నిలిచింది. ఇటీవల హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న పర్వత ప్రమాదాలు మరోసారి ఎత్తైన శిఖరాలపై దాగి ఉన్న ముప్పును గుర్తుచేశాయి. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలుగా ఎవరెస్ట్ డెత్ జోన్లో ఓ రాతి చాటున మిగిలిపోయిన ఓ భారత సైనికుడి కథ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచానికి ‘గ్రీన్ బూట్స్’గా పరిచయమైన ఆ మృతదేహం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది.ఎవరెస్ట్ ఉత్తర మార్గంలో శిఖరానికి వెళ్లే సమయంలో ఓ రాతి గుహలాంటి ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ మంచులో కూరుకుపోయిన ఓ పర్వతారోహకుడి మృతదేహం ఎన్నో ఏళ్లుగా కనిపించేది. అతడి కాళ్లకు ఉన్న ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు పర్వత బూట్ల కారణంగా ఆ మృతదేహానికి ‘గ్రీన్ బూట్స్’ అనే పేరు వచ్చింది.ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లే ప్రతి పర్వతారోహకుడికి అది ఓ భయానక గుర్తుగా మారింది. విజయం కోసం చివరి దశలో ఉన్న వారికి.. ప్రకృతి శక్తుల ముందు మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేసే విషాద చిహ్నంగా నిలిచింది.మూడు దశాబ్దాల మిస్టరీకి తెరఏళ్ల పాటు ‘గ్రీన్ బూట్స్’ ఎవరిది అనే దానిపై అనేక ఊహాగానాలు కొనసాగాయి. చాలామంది అది భారత ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కు చెందిన పర్వతారోహకుడు త్సెవాంగ్ పాల్జోర్ మృతదేహమని భావించారు. కారణం.. 1996లో ఎవరెస్ట్ యాత్రకు వెళ్లిన ఆరుగురు సభ్యుల ITBP బృందంలో పాల్జోర్ కూడా ఉండటం, ఆయన కూడా ఆకుపచ్చ రంగు బూట్లు ధరించడం.అయితే తాజా ఆధారాలు, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ‘గ్రీన్ బూట్స్’గా గుర్తించిన మృతదేహం నిజానికి మరో ITBP సభ్యుడు లాన్స్ నాయక్ డోర్జీ మోరప్దిగా నిర్ధారణ అయింది.1996.. విషాద యాత్రడోర్జీ మోరప్ కథ 1996 ఎవరెస్ట్ విషాదంతో ముడిపడి ఉంది. ఆ ఏడాది ITBP బృందం ఎవరెస్ట్ను ఉత్తర మార్గం నుంచి అధిరోహించేందుకు బయలుదేరింది. చైనా వైపు నుంచి ఉన్న ఈ మార్గం అత్యంత కఠినమైనదిగా పరిగణిస్తారు. ఆరుగురు సభ్యుల బృందంలో ముగ్గురు ప్రతికూల వాతావరణం కారణంగా వెనుదిరిగారు. కానీ సుబేదార్ త్సెవాంగ్ స్మాన్లా, లాన్స్ నాయక్ డోర్జీ మోరప్, హెడ్ కానిస్టేబుల్ త్సెవాంగ్ పాల్జోర్ మాత్రం ముందుకు సాగారు.ఎట్టకేలకు వాళ్లు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. సుమారు 8,849 మీటర్ల ఎత్తులో భారత జెండాను రెపరెపలాడించారు. కానీ విజయంతో తిరిగి వస్తున్న సమయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మంచు తుఫాను వారిని చుట్టుముట్టింది. ఆ తర్వాత ముగ్గురూ తిరిగి రాలేదు.విజయం కంటే కష్టమైన తిరుగు ప్రయాణంఎవరెస్ట్పై శిఖరాన్ని చేరుకోవడం మాత్రమే కాదు.. అక్కడి నుంచి సురక్షితంగా కిందకు రావడమే అసలు సవాల్. డోర్జీ మోరప్ తిరుగు ప్రయాణంలో తీవ్ర చలికి గురయ్యారు. మంచుతో గడ్డకట్టిన చేతులతో పరికరాలను సరిగ్గా ఉపయోగించలేకపోయారని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. చివరకు ఆయన 8,500 మీటర్ల ఎత్తులో ఓ రాతి చాటు ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రదేశం తర్వాత ‘గ్రీన్ బూట్స్ గుహ’గా మారింది.భర్త కోసం మూడు దశాబ్దాల నిరీక్షణడోర్జీ మోరప్ ఎవరెస్ట్కు బయలుదేరే ముందు తన భార్యతో చివరిసారి మాట్లాడారు. విజయం సాధించి తిరిగి వస్తానని చెప్పారు. కానీ ఆ మాటలు జ్ఞాపకంగానే మిగిలిపోయాయి. మృతదేహాన్ని చూడకపోవడంతో ఆయన భార్యకు భర్త మరణాన్ని పూర్తిగా అంగీకరించడం కూడా కష్టమైంది. మూడు దశాబ్దాలుగా ఓ చివరి వీడ్కోలు కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తూనే ఉంది.ఎందుకంత కష్టం?ఎవరెస్ట్పై 8,000 మీటర్లకు పైగా ఉన్న ప్రాంతాన్ని ‘డెత్ జోన్’ అంటారు. అక్కడ ఆక్సిజన్ స్థాయి సముద్ర మట్టంతో పోలిస్తే మూడో వంతు మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోతాయి. అలాంటి ప్రాంతంలో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్. మంచు చరియలు, తీవ్రమైన గాలులు, తక్కువ ఆక్సిజన్ కారణంగా అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కూడా ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది.ఎవరెస్ట్పై ఉన్న దాదాపు 200కు పైగా మృతదేహాల్లో చాలా వరకు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. వాటిని తరలించడం కంటే.. కొత్తగా ఎవరెస్ట్ను అధిరోహించడమే కొన్నిసార్లు సులభమని నిపుణులు చెబుతారు.‘గ్రీన్ బూట్స్’ మరో విషాదానికి సాక్షి2006లో బ్రిటిష్ పర్వతారోహకుడు డేవిడ్ షార్ప్ ఇదే ప్రాంతంలో తీవ్ర చలికి గురై మరణించారు. కొందరు పర్వతారోహకులు మొదట ఆయనను ‘గ్రీన్ బూట్స్’ మృతదేహంగా భావించారని అప్పట్లో చర్చ జరిగింది. ఈ ఘటన ఎవరెస్ట్పై రక్షణ బాధ్యతలు, మానవత్వంపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఇప్పుడు మొదలైన చివరి ప్రయాణండీఎన్ఏ పరీక్షలతో డోర్జీ మోరప్ గుర్తింపు ఖరారైన తర్వాత.. ఆయన అవశేషాలను స్వదేశానికి తీసుకురావాలని ITBP నిర్ణయించింది. దీనికి ప్రత్యేకంగా అత్యంత అనుభవజ్ఞులైన పర్వతారోహకుల బృందం అవసరం. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఈ ఆపరేషన్ పూర్తి కానుంది.30 ఏళ్లుగా ఎవరెస్ట్ మంచులో నిశ్శబ్దంగా ఉన్న ఓ భారత వీరుడి కథకు ఇప్పుడు ముగింపు పలికే సమయం వచ్చింది. ప్రపంచానికి ‘గ్రీన్ బూట్స్’గా కనిపించిన ఆ గుర్తు వెనుక.. ఓ సైనికుడి త్యాగం, ఓ కుటుంబం ఎదురుచూపు, ఓ అసంపూర్తి వీడ్కోలు దాగి ఉంది. -
దెబ్బ మీద దెబ్బ.. పుండు మీద కారం.. జుకర్బర్గ్ ఉక్కిరిబిక్కిరి
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా సామ్రాజ్యం అది. ప్రపంచాన్ని కలిపిన వేదికగా ఎదిగిన ఆ సంస్థ.. అదే సమయంలో టెక్ రంగంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీగా నిలిచింది. పేరు మార్చుకుని ఫేస్బుక్ నుంచి మెటాగా మారినా.. ఫేట్ మాత్రం మారడం లేదు. విమర్శలు, కోర్టు కేసులు, బిలియన్ల డాలర్ల జరిమానాలు, చివరకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు.. ఆ ప్రయాణంలో భాగంగా కొనసాగుతూనే ఉన్నాయి.తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందనే ఆరోపణలతో అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాపై భారీ జరిమానా విధించింది. మైనర్ల భద్రత విషయంలో సంస్థ విఫలమైందని, వినియోగదారులను ఎక్కువ సమయం ప్లాట్ఫామ్లలోనే గడిపేలా చేసే ఫీచర్లను రూపొందించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మెటాకు మొత్తం 567 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,700 కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఇదే కాదు..ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటన కూడా మెటాకు ఇబ్బందులు తెచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే వీడియో తొలగించామని వివరణ ఇచ్చిన సంస్థ.. అనంతరం భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. అయితే ఇవి మెటాకు ఎదురైన తొలి వివాదాలు కావు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల చుట్టూ గతంలోనూ డేటా లీకులు, ప్రైవసీ ఉల్లంఘనలు, ఫేక్ న్యూస్, పిల్లల భద్రత వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరిగాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపిన వేదికగా పేరు తెచ్చుకున్న మెటా.. ఇప్పుడు బాధ్యత, భద్రత, పారదర్శకత వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.కేంబ్రిడ్జ్ అనలిటికా షాక్ఫేస్బుక్(మెటా) చరిత్రలో అత్యంత పెద్ద కుదుపు తెచ్చిన ఘటనల్లో ఇది ఒకటి. కోట్లాది మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారం వారి అనుమతి లేకుండా సేకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో మార్క్ జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో ఫేస్బుక్ డేటా భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.పిల్లల భద్రతపై ప్రశ్నలుఇన్స్టాగ్రామ్ యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందం, ఫాలోవర్లు, లైక్ల సంస్కృతి యువతలో ఒత్తిడిని పెంచుతోందని విమర్శలు వచ్చాయి. అంతర్గత పరిశోధనల్లో కొన్ని సమస్యలు బయటపడినా సంస్థ తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలతో మెటా ఇప్పుడు కోర్టు కేసులను ఎదుర్కొంటోంది.జుకర్బర్గ్ క్షమాపణలు.. సెనేట్లో భావోద్వేగ క్షణాలుపిల్లల ఆన్లైన్ భద్రతపై అమెరికా సెనేట్ విచారణ సందర్భంగా మార్క్ జుకర్బర్గ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఉద్దేశించి ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారనే ప్రచారం జరిగినప్పటికీ, అధికారిక రికార్డుల్లో ఆయన ఏడ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ పిల్లల భద్రత అంశంపై ఆయన భావోద్వేగానికి గురైన విషయం మాత్రం చర్చనీయాంశమైంది.ఫేక్ న్యూస్ తుఫాను.. ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావంఫేస్బుక్, వాట్సాప్లలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించడం అనేక దేశాల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రచారం జరుగుతోందనే ఆరోపణలు రావడంతో మెటా కంటెంట్ నియంత్రణ విధానాలపై ప్రశ్నలు తలెత్తాయి.వాట్సాప్ పాలసీ వివాదం.. యూజర్లలో పెరిగిన అనుమానాలు2021లో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ప్రకటించడంతో పెద్ద వివాదం మొదలైంది. యూజర్ల డేటా ఫేస్బుక్తో పంచుకుంటారనే భయంతో చాలామంది ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్స్ వైపు వెళ్లారు. ఆ తర్వాత మెటా వివరణలు ఇచ్చినా.. ప్రైవసీపై ప్రజల్లో ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు.మయన్మార్ ఘటనలు.. ద్వేష ప్రచారంపై ఫేస్బుక్ విమర్శలుమయన్మార్లో రోహింగ్యాలపై జరిగిన హింస సమయంలో ద్వేష ప్రచారం వ్యాప్తికి ఫేస్బుక్ వేదికగా మారిందనే విమర్శలు వచ్చాయి. కంటెంట్ పర్యవేక్షణలో తమ వైఫల్యాలు ఉన్నాయని ఫేస్బుక్ కూడా అంగీకరించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా బాధ్యతపై కొత్త చర్చకు ఇది కారణమైంది.లైక్ల మాయాజాలం.. ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్పై ఆరోపణలుయువత ఎక్కువ సమయం యాప్లో గడిపేలా ఇన్స్టాగ్రామ్ డిజైన్ చేశారనే విమర్శలు వచ్చాయి. లైక్లు, కామెంట్లు, ఫాలోవర్ల కోసం పరుగులు పెట్టేలా చేసే అల్గారిథమ్ యువతలో ఆందోళన, అసంతృప్తిని పెంచుతోందని నిపుణులు హెచ్చరించారు.మెటావర్స్ కల.. భారీ పెట్టుబడులు, భారీ నష్టాలుఫేస్బుక్ పేరును మెటాగా మార్చిన జుకర్బర్గ్.. వర్చువల్ ప్రపంచమైన మెటావర్స్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు. భారీ ఖర్చులు, షేర్ విలువ పతనం, ఉద్యోగుల తొలగింపులతో మెటాకు కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి.డేటా గోప్యతపై యూరప్ కఠిన చర్యలుయూరోపియన్ యూనియన్ డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మెటాపై పలు సందర్భాల్లో భారీ జరిమానాలు విధించాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహించాలన్న విషయంలో టెక్ కంపెనీలకు యూరప్ గట్టి హెచ్చరికలు ఇచ్చింది.ఏఐ యుగం.. డీప్ఫేక్లతో కొత్త తలనొప్పులుకృత్రిమ మేధస్సు పెరుగుతున్న కొద్దీ మెటాకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డీప్ఫేక్ వీడియోలు, నకిలీ కంటెంట్, పిల్లలకు సంబంధించిన ప్రమాదకరమైన కంటెంట్ విషయంలో సంస్థపై ఒత్తిడి పెరిగింది. భవిష్యత్తులో సోషల్ మీడియా కంపెనీలకు కేవలం టెక్నాలజీ సరిపోదని.. బాధ్యత కూడా అవసరమని ఈ వివాదాలు గుర్తుచేస్తున్నాయి.జరిమానాల చరిత్ర కూడా మెటాకు ఓ పెద్ద మచ్చగానే మిగిలింది. ఫేస్బుక్ పేరుతో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు డేటా ప్రైవసీ, యూజర్ల సమాచారం దుర్వినియోగం, పిల్లల భద్రత వంటి అంశాల్లో మెటాపై బిలియన్ల డాలర్ల జరిమానాలు పడ్డాయి. ఇందులో అత్యంత భారీ దెబ్బ 2019లో కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా వివాదం కేసులో అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) విధించిన 5 బిలియన్ డాలర్ల జరిమానా. ఆ తర్వాత యూరప్లో యూజర్ల డేటా రక్షణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2023లో ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ 1.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది. ఫేస్ రికగ్నిషన్ డేటా సేకరణ వ్యవహారంలో అమెరికాలోని టెక్సాస్తో 1.4 బిలియన్ డాలర్ల సెటిల్మెంట్, వాట్సాప్ ప్రైవసీ నిబంధనల ఉల్లంఘనపై 225 మిలియన్ యూరోలు, ఇన్స్టాగ్రామ్లో పిల్లల డేటా రక్షణ లోపాలపై 405 మిలియన్ యూరోలు వంటి భారీ జరిమానాలు ఎదురయ్యాయి. తాజాగా పిల్లల మానసిక ఆరోగ్యం, మైనర్ల భద్రత విషయంలో అమెరికా న్యూ మెక్సికో కోర్టు విధించిన భారీ ఆర్థిక శిక్ష కూడా మెటా సంక్షోభాల జాబితాలో చేరింది. మొత్తంగా చూస్తే.. మెటా చెల్లించిన, చెల్లించాల్సి వచ్చిన జరిమానాల విలువ బిలియన్ల డాలర్లలోనే ఉంది.ఒకప్పుడు ప్రపంచాన్ని కలిపే వేదికగా మొదలైన ఫేస్బుక్ ప్రయాణం.. ఇప్పుడు యూజర్ భద్రత, గోప్యత, బాధ్యత అనే మూడు కీలక ప్రశ్నల మధ్య సాగుతోంది. ప్రతి వివాదం మార్క్ జుకర్బర్గ్కు మరో పరీక్షగా మారుతోంది. -
సీతాకోక చిలుకలు ఎగిరిపోతున్నాయి!
మునుపెన్నడూ చూడని సీతాకోక చిలుక మీకు దర్శనమిచ్చిందా? స్మార్ట్ఫోన్తో ఫొటో తీసి.. ఇన్స్టాలో షేర్ చేసి మురిసిపోయారా? ఓకే కానీ... ఆ సీతాకోక చిలుక అక్కడకు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించారా? అప్పటివరకూ ఉన్న ప్రాంతంలో వేడి ఎక్కువ కావడంతో... చల్లబడదామని ఎగిరొచ్చింది. భూమ్మీద అన్నిచోట్లా ఇప్పుడు ఇదే తంతు.. పర్యావరణ విధ్వంసానికి, భూతాపోన్నతి పాపం!పెట్రోలు, డీజిళ్ల విచ్చలవిడి వాడకం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం వంటి రకరకాల కారణాలతో భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఈ పెరుగుదలను 2100 నాటికి 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేయగలిగితే భూమ్మీద మనిషన్నవాడు ఉండగలడని, లేదంటే మహా విపత్తు తప్పదన్న హెచ్చరికలూ చాలానే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటివాళ్లు కొందరు భూతాపోన్నతి, వాతావరణ మార్పులు చైనా సృష్టి అని కొట్టివేయవచ్చు కానీ.. సీతాకోక చిలుక జాతులు కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూండటం మాత్రం వాటికి ప్రత్యక్ష సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపోన్నతి పరిణామాల్లో ఇదీ ఒకటి. మోనాష్ యూనివర్సిటీ (ఆ్రస్టేలియా), ఫ్రీడ్రిచ్ షిల్లర్ యూనివర్సిటీ (జర్మనీ), యూనివర్సిటీ ఆఫ్ పికార్డీ జూల్స్ వర్నె (ఫ్రాన్స్) పరిశోధకులు నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ఇప్పటికే పది సీతాకోక చిలుక జాతుల్లో కనీసం ఒకటి తమ ఆవాస ప్రాంతాన్ని మార్చేసుకుంది. వీటి కదలికలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు సీతాకోక చిలుకల నివాస పరిధిపై జరిపిన 565 అధ్యయనాలను పరిశీలించారు. దాదాపు 6180 నివేదికలు, నిపుణులు సిద్ధం చేసిన 68 అంచనాలను కూడా కలుపుకుని విశ్లేషించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. దాదాపు 80 శాతం సీతాకోక చిలుక జాతులు తమ పరిధిని విస్తరించాయి. కొన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి ఇంకొన్ని తూర్పు నుంచి పశ్చిమం వైపు. ఇంకొన్ని జాతుల నివాస పరిధి కుంచించుకుపోయింది. గతంలో ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో తిరుగుతూంటే ఇప్పుడు అంతకంటే తక్కువ స్థలంలో బతికేస్తున్నాయన్నది ఒక ఉదాహ రణ. కొన్ని సీతాకోక చిలుక జాతులైతే కొండ ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువకు.. ఎగువ నుంచి దిగువకు మారిపోయాయి. ఎందుకిలా అంటే... సీతాకోక చిలుకలు తమ నివాస పరిధిని మార్చుకోవడంలో వాతావరణ మార్పులు, వడగాడ్పు, వరదల్లాంటి తీవ్ర వాతావరణ ఘటనల భాగస్వామ్యం 70 శాతం! ఈ తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ కనిపిస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావన్ చౌదరి (మోనాష్ యూనివర్సిటీ) తెలిపారు. వ్యవసాయం, అటవీ ప్రాంతాలు తగ్గిపోతూండటం, నగరీకరణ, సీతాకోక చిలుకల ఆవాస ప్రాంతాల విధ్వంసం ఇతర కారణాలుగా తెలుస్తోంది. పర్యావరణ వ్యవస్థలో సీతాకోక చిలుకలది చాలా ముఖ్యపాత్ర. పర పరాగ సంపర్కానికి సాయపడతాయి. గొంగళి పురుగులు పక్షులు, సాలెపురుగులు, ఇతర కీటకాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. సీతాకోక చిలుకలు కనిపించకుండా పోతే ఆయా ప్రాంతాల్లో మొక్కలు, నేలల్లోనూ మార్పులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రకృతిని పరిరక్షించుకోవడం.. అందులో చిన్న భాగమైనప్పటికీ సీతాకోక చిలుకలను కాపాడుకోవడం అవసరమవుతుంది. అధ్యయనం వివరాలు నేచర్ ఎకాలజీ అండ ఎవల్యూషన్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలా కూర్చుంటున్నారు? 'ప్లీజ్ చెక్'!
కార్యాలయాల్లో ఒక వ్యక్తి కూర్చునే లేదా నిలబడే భంగిమ వారి భావోద్వేగాలను, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని కెనడాలోని మెక్గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిటారుగా కూర్చున్న వారు రిస్క్ తీసుకునే పనుల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని.. ముందుకు వంగి కూర్చున్న వారి కంటే ఎక్కువ సానుకూల భావాలను వ్యక్తపరుస్తారని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు మన మానసిక స్థితిపై శరీరం చూపే ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయని మెక్గిల్ విశ్వవిద్యాలయ సైకియాట్రీ విభాగ ప్రొఫెసర్ జార్జ్ ఆర్మోనీ తెలిపారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అధ్యయనం ఇలా..అధ్యయనంలో భాగంగా కొందరు ఉద్యోగు లను మొదట ఒక ట్యాబ్లో కొత్త టాస్క్ చేయాలని పరిశోధకులు కోరారు. ఆయా ఉద్యోగులు నిటారుగా కూర్చోవడానికి వీలు గా ట్యాబ్ను సర్దుబాటు చేయగల ఒక టేబుల్పై ఉంచారు. అలాగే మరికొందరు ఉద్యోగుల కోసం టేబుల్ ఎత్తును తగ్గించి వారు ముందుకు వంగి కూర్చునేలా ట్యాబ్ను ఉంచారు. ఇక రెండవ దశలో ఉద్యోగులకు ఒక రిస్క్ తీసుకునే పరీక్షను ఇచ్చారు. అందులో వర్చువల్ బెలూన్ను ఊదడం ద్వారా బహుమతులు గెలుచుకోవ చ్చని చెప్పారు. ఈ టాస్క్లో నిటారుగా కూర్చున్న వారు ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ బహుమతులు గెలుచుకున్నారని, వారు సరైన వ్యూహంతో రిస్క్ తీసుకున్నారని ఆర్మోనీ వివరించారు. నిటారుగా కూర్చున్న ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు.వర్క్ప్లేస్ ఎర్గోనామిక్స్ అంటే?ఉద్యోగుల శారీరక సామర్థ్యాలు, పరిమితులకు తగినట్లుగా పని వాతావరణాన్ని, పరికరాలు, ఫర్నిచర్ను అమర్చే శాస్త్రం. సులభంగా చెప్పాలంటే మనిషికి పనిని మార్చడం కాకుండా మనిషికి సౌకర్యంగా ఉండేలా పనిచేసే విధానాన్ని లేదా వాతావరణాన్ని కల్పించడమే ఎర్గోనామిక్స్. -
సత్వరమే ‘పారాక్వాట్’ నిషేధం!
దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు/గడ్డి మందు ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ తయారీ, అమ్మకం, వాడకంపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ‘క్రిమిసంహారక మందుల చట్టం–1968’లోని సెక్షన్ 27 కింద ఈ మేరకు గత నెల 13న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే గడువు ఈ నెల 13తో ముగియనుంది. దీంతో, ఈ ప్రతిపాదిత నిషేధాజ్ఞలపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదిత నిషేధాన్ని ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని ‘ఆశా–కిసాన్ స్వరాజ్’ జాతీయ సహ సమన్వయకర్త కవిత కురుగంటి నేతృత్వంలో 270 మందికి పైగా వైద్య నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి గురువారం సంయుక్త వినతిపత్రం సమర్పించారు. వీరిలో తెలంగాణ సహా అనేక రాష్ట్రాల వారున్నారు. పారాక్వాట్ అత్యంత తీవ్రమైన విషపూరిత గడ్డిమందు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప పరిమాణంలో శరీరంలోకి వెళ్లినా ఇది ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఈ రసాయన విషప్రభావానికి గురైన వారిలో మరణాల రేటు ఏకంగా 70% వరకు ఉంటోంది. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేదు. రసాయన పరిశ్రమల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వం పారాక్వాట్పై నిషేధ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రిమిసంహారకాల నియంత్రణకు బలమైన ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ యాక్ట్’ తీసుకురావాలని కూడా నిపుణులు డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో నిషేధించిన ప్రమాదకర రసాయనాలను భారత్లోనూ స్వయంచాలకంగా నిషేధించాలన్నారు. 70కి పైగా దేశాలలో కొన్ని దేశాలు పారాక్వాట్ వినియోగాన్ని నిషేధించాయి, కొన్ని దేశాలు తీవ్రంగా నియంత్రించటం తెలిసిందే. అయితే, వ్యవసాయ విధాన విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి కేంద్రానికి విడిగా లేఖ రాశారు. పారాక్వాట్పై నిషేధాన్ని అమలు చేసే క్రమంలో ఇప్పటికే దిగుమతి చేసుకున్న నిల్వలను విక్రయించుకోవడానికి ఒక 6 నెలల గడువు మాత్రమే ఇవ్వాలని, ఎగుమతుల పేరుతో ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
మసాయ్ మారాకు పర్యాటక ముప్పు
అభివృద్ధి రెండువైపులా పదునైక కత్తిలాంటిది. అది మంచి చేస్తామని చెబుతూనే తరతరాలుగా బతుకున్న నేలను నెమ్మదిగా ఆక్రమిస్తుంది. చివరకు మనుషులనే కాదు, జంతువులను తన నేలను తనకే పరాయిని చేస్తుంది. పర్యాటకం కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందంటారు. కానీ కొన్నిసార్లు ఆ అవకాశం కనబడకుండానే కబళించేస్తుంది. దాన్ని అందుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మసాయి మారాలో ఈ రెండు ప్రక్రియలు.. మొత్తంగా పర్యావరణాకి, స్థానిక సమాజాలకు ముప్పు తెచ్చిపెట్టాయి.మసాయి మారా. కెన్యాలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం. అద్భుతమైన, వైవిధ్యభరితమైన అనేక జాతులకు అందమైన నిలయం. ఆఫ్రికాలోని సుప్రసిద్ధ సఫారీ గమ్యస్థానాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది సందర్శకులు ఈ అభయారణ్యానికి వస్తారు. 1960వ దశకంలో ఈ రిజర్వ్ను స్థాపించినప్పటి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో కెన్యా ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల డాలర్లు సమకూరుతున్నాయి. స్థానికులకు ఉద్యోగాలతోపాటు, స్థానిక వ్యాపారాలు లబి్ధపొందుతున్నాయి. ఈ లాభాలపై బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ కన్ను పడింది. అభయారణ్యం అంతటా విస్తరిస్తున్న విలాసవంతమైన శిబిరాలు, లాడ్జీలు పర్యావరణ వ్యవస్థపై ఆందోళనలు పెంచుతున్నాయి. అనియంత్రిత అభివృద్ధి వన్యప్రాణుల ఆవాసాలను దెబ్బతీస్తోందని, టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్, కెన్యాలోని మసాయి మారా నేషనల్ రిజర్వ్ మధ్య జరిగే వన్యప్రాణుల వలసకు ముప్పు కలిగిస్తోందని పర్యావరణ పరిరక్షకులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా, మసాయి మారా కెన్యా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. పర్యాటకం నిస్సందేహంగా కెన్యా ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భాగం. ఇది ఏటా బిలియన్ల షిల్లింగ్లను ఆర్జిస్తూ, సఫారీ గైడ్లు, హోటల్ కారి్మకులు, రవాణా నిర్వాహకులు, హస్తకళల విక్రేతలు, మసాయి వర్గాల వంటి వేలాది మందికి ఉద్యోగాలను కల్పిస్తోంది. అయితే, ఈ పర్యాటకం, అభివృద్ధి వల్ల నష్టాలు కలుగుతున్నాయి. వలస మార్గాల సమీపంలో జరుగుతున్న నిర్మాణాలు, వాహనాల రద్దీ, మానవ కార్యకలాపాలు జంతువుల కదలికలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన వన్యప్రాణులపై ఇవి అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. జంతువులను వేటాడేందుకు సఫారీ వ్యాన్లు వాటి చుట్టూ గుమిగూడటం తరచుగా వాటిని భయపెడుతోంది. వాహనాల మార్గాలు జంతువుల దారులను వెంబడించడంతో సహజ ప్రక్రియలకు అంతరాయం కలుగుతోంది. మౌలిక సదుపాయాల నిర్వహణ సరిగా లేకపోవడంతో అభయారణ్యంలో కాలుష్యం పెరుగుతోంది. కీలకమైన వలస మార్గాల్లో విలాసవంతమైన హోటళ్లను నిర్మిస్తున్నారు. ఇవి నీటి వనరులను అడ్డుకుంటున్నాయి. కొత్తగా నిర్మించిన విలాసవంతమైన శిబిరాల్లో ఒకటి ‘గ్రేట్ మైగ్రేషన్’ మార్గానికి అడ్డుగా మారింది. సింహాలు, దున్నలు, హిరోలా జింకలు, వైల్డ్బీస్ట్లతో సహా అనేక జాతుల జనాభా తీవ్రంగా పడిపోయింది. ప్రతి సీజన్లో ఆ ప్రాంతం గుండా ప్రయాణించే లక్షలాది వైల్డ్బీస్ట్లకు ఇది ఒక కీలకమైన ప్రదేశం. ఇటీవలి సంవత్సరాల్లో వాటి సంఖ్య 150,000 నుంచి కేవలం 15,000కి పడిపోయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రిజర్వ్లోని సున్నితమైన ప్రాంతాలలో కొత్త పర్యాటక వసతులపై 2023లో నిషేధం విధించినప్పటికీ, కొత్త శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సౌకర్యాలు విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. న్యాయ పోరాటం అభయారణ్యం లోపల, చుట్టుపక్కల పర్యాటక శిబిరాల నిర్మాణం, విస్తరణను సవాలు చేస్తూ పరిరక్షణ బృందాలు కోర్టుకెక్కాయి. ఈస్ట్ ఆఫ్రికా లా సొసైటీ, నేచురల్ జస్టిస్, జస్ట్యాక్ట్, ఆఫ్రికా సెంటర్ ఫర్ పీస్ అండ్ హ్యూమన్ రైట్స్ తాజాగా పిటిషన్ దాఖలు చేశాయి. కేసు విచారణ పూర్తయ్యే వరకు మసాయి మారా నేషనల్ రిజర్వ్లో నిర్మాణాలు, విస్తరణను నిలిపివేయాలని కోరుతున్నాయి. పలు బహుళ జాతి కంపెనీలు, ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్స్ నిర్మాణం, నిర్వహణను సవాలు చేశాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసం కొనసాగితే మారా పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం వాటిల్లవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?
పంట పొలాల్లో కనిపించే పాములు మనకు ప్రాణాంతక శత్రువుల్లాగే కనిపిస్తాయి. కానీ, అవగాహనతో చూస్తే.. నిజానికి అవి ఉచితంగా పంటలను కాపాడేందుకు ప్రకృతి ప్రసాదించిన రైతు మిత్రులేనని అర్థమవుతుంది. దేశంలో ఏటా 15–20 శాతం ధాన్యం ఉత్పత్తి ఎలుకలు, పందికొక్కుల వల్ల నాశనమవుతోందని అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఒక జత ఎలుకలు ఒక ఏడాది వ్యవధిలో 800 నుంచి 1,000 వరకు సంతతిని పెంచగలవు. వీటిని అరికట్టటానికి విష రసాయనాలను రైతులు వాడుతుంటారు. అవి నేల సారాన్ని పాడుచేయటమే కాకుండా, ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నా యని నిపుణులు చెబుతున్నారు. 80% పాములతో ప్రమాదం లేదుమన దేశంలోని పొలాల్లో కనిపించే పాముల్లో 80 శాతానికి పైగా (జెర్రిపోతు వంటివి) అసలు విషం లేనివే. ఒక నాగు పాము లేదా జెర్రిపోతు తన జీవితకాలంలో వేలాది ఎలుకలను వేటాడి తింటుంది. అయితే, ఈ విషయంపై అవగాహన లోపి స్తోంది. 20% విషపూ రిత పాముల భయంతో.. కనిపించిన పామునల్లా చంపటం వల్ల పొలాల్లో ఎలుకల జనాభా విపరీతంగా పెరిగి రైతులకు రెట్టింపు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.పాముల నుంచి రక్షణ ఎలా?పాము కాట్ల వల్ల గత పాతికేళ్లలో మన దేశంలో లక్షా ఇరవై వేల మంది చనిపోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది ఈ కారణంతో చనిపోవటం లేదు. పొలాల్లో రాత్రివేళల్లో టార్చ్లైట్ ఉపయోగించటం, లాంగ్ గమ్ బూట్లు ధరించటం వంటి చర్యల ద్వారా 90% వరకు పాము కాటు ప్రమాదా లను అడ్డుకోవచ్చని అధ్యయనాలు చెబుతు న్నాయి. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన పాములను పారదోలే ఎలక్ట్రానిక్ చేతి కర్రలు వంటి ఆధునిక పరికరాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని రైతులకు అందుబాటు లోకి తేవటానికి ప్రభుత్వం చర్యలు తీసుకో వాలి. అంతేకాదు, పాము కాటు బాధితుల ప్రాణరక్షణ కోసం గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవెనమ్ను అందుబాటులో ఉంచాలి. పాముల సమస్యపై గ్రామీణులు, రైతులకు అవగాహన కల్పించటంపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
కలర్ఫుల్ పక్షులకే కష్టాలు!
ప్రకృతి ఒడిలో తిరిగే రంగురంగుల పక్షుల అందమే ఇప్పుడు వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ రంగుల పక్షులతో పోలిస్తే.. ప్రకాశవంతమైన, ఆకర్షణీ యమైన రంగుల్లో కనిపించే పక్షులకే అంతరించి పోయే ముప్పు ఎక్కువగా ఉందని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు మాంటెగ్యూ నీట్ క్లెగ్, నటాలియా ఒకాంపొ–పెన్యులా వియత్నాంలో పక్షులను పరిశీలించే యాత్ర ద్వారా కొన్ని రంగు రంగుల పక్షులు తీవ్ర ప్రమా దంలో ఉన్నాయని, వ్యాపార వర్గాల్లో వాటికే అధిక గిరాకీ ఉందని గ్రహించారు. అనంతరం అంతర్జాతీయంగా పరిస్థితే మిటో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దగ్గర ఉన్న రెడ్ లిస్ట్లోని సుమారు 4,334 పాసరీన్ (పాటలు పాడే) కోవకు చెందిన పక్షి జాతుల స్థితిగతులను విశ్లేషించారు. పిచ్చుకలు, బుల్బుల్ వంటి పక్షులు కూడా వాటిలో ఉన్నాయి. వారి సందేహం నిజమేనని అధ్యయనంలో తేలింది. అక్రమ రవాణా దెబ్బరంగురంగుల ఈకలున్న పక్షులకు ముప్పు పెరగ డానికి ప్రధాన కారణం మానవ ప్రలోభాలు, పెంపుడు పక్షుల అక్రమ రవాణా వ్యాపారమేనని పరిశో ధకులు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా అరుదైన రంగురంగుల పక్షులను ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ పక్షులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని.. దీంతో వేటగాళ్లు అడవుల నుంచి ఆకర్షణీయమైన పక్షులను పట్టుకొని అక్రమ రవాణా చేయడం వల్ల అడవుల్లో వాటి సంఖ్య వేగంగా పడిపోతోందని పరిశోధకులు పేర్కొన్నారు.ప్రత్యేకతలే శాపం..అడవుల నరికివేతతో పక్షుల సహజ నివాస ప్రాంతాలు వేగంగా దెబ్బతింటున్నాయి. సాధా రణ పక్షులు విభిన్న వాతావ రణాలకు సులువుగా అల వాటుపడగలవు. కానీ విభిన్న రంగులు, ప్రత్యేక ఆహార అలవాట్లుగల రంగురంగుల పక్షులు నిర్దిష్ట మైన పర్యావరణ వ్యవస్థలపైనే ఆధారపడి జీవి స్తాయి. అటువంటి నివాస ప్రాంతాలు ధ్వంసం కావడం వాటి ఉనికికే ప్రమాదకరంగా మారిందని పరిశోధకులు గుర్తించారు. చెట్ల జాతుల విత్తనాల వ్యాప్తికి, పూల పుప్పొడి రేణువుల చేరవేతకు, పర్యా వరణ సమతుల్యతకు పక్షులు దోహదపడతాయి. ఇవి అంతరించిపోతే పర్యావరణం దెబ్బతింటుంది. పక్షుల అక్రమ రవాణాను కఠిన చట్టాలతో అరి కట్టాలి. అరుదైన రంగుల పక్షులు నివసించే అటవీ ప్రాంతాలను పరిరక్షించే ప్రత్యేక ప్రణాళికలను ప్రపంచ దేశాలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
నిజాయితీకో పరీక్ష..
రోడ్డుపై వంద రూపాయల కాగితం కనిపిస్తే ఏం చేస్తారు? నోటు మీదా అని అడుగుతారు కొందరు... జేబులో పెట్టేసుకునేవారు ఇంకొందరు.. దేవుడి హుండీలో వేసేవాళ్లు మరికొందరు.. కొందరిది నిజాయితీ, ఇంకొందరిది ఆశ, మరికొందరిది.. పాపభీతి! రూ.వంద స్థానంలో బంగారు గొలుసు ఉంటే...? నార్వేలోనైతే యజమానికి తిరిగి అప్పగించే ప్రయత్నం చేస్తారట. మెక్సికో, పెరూల్లోనైతే పది రూపాయల కాగితమున్నా.. నొక్కేస్తారట. ఈ ఏడాది మొదట్లో... జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి కొంతమంది పరిశోధకులు ఖాళీ పర్సులు, కొంత నగదు, తాళం చెవులతో బయలుదేరాడు. ఎందుకు ఇవన్నీ అని అధికారులు అడిగితే సైన్స్ ప్రయోగం అని వివరించారు. వీరంతా... 40 దేశాల్లోని 355 నగరాలకు వెళ్లి... ఎవరూ చూడకుండా అక్కడక్కడ ఒక్కో పర్సు పడేశారు. ప్రతిదాంట్లో షాపింగ్ లిస్ట్, కొంత నగదు, తాళం చెవి, బిజినెస్ కార్డులు ఉన్నాయి. ఎన్ని తిరిగి యజమానుల (బిజినెస్ కార్డు)కు తిరిగి వస్తాయో చూద్దామని, వాటిద్వారా ఏ దేశం ఎంత నిజాయితీ కలదో అంచనా వేద్దామన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం. రోడ్డుపై పడ్డ పర్సులను ప్రజలు తిరిగి ఇస్తారా? పర్సులో డబ్బు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? వంటివన్నీ పరిశీలించాలని అనుకున్నారు. ఈ ప్రయోగం ద్వారా తెలిసిందేమిటీ అంటే... ప్రపంచం మొత్తమ్మీద అత్యంత నిజాయితీగల దేశం స్విట్జర్లాండ్ అని!. పడేసిన ప్రతి నాలుగు పర్సుల్లో కనీసం మూడు సొంతదారులకు చేరాయి. కచ్చితంగా చెప్పాలంటే 76 శాతం పర్సులు రిటర్న్ అయ్యాయి. నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, పోలండ్, చెక్ రిపబ్లిక్, న్యూజీల్యాండ్, జర్మనీ, ఫ్రాన్స్లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాల్లో బ్యాంకులు, పోలీస్ స్టేషన్లలో పడేసుకున్న పర్సులు కూడా ఎంచక్కా యజమానులకు చేరాయి. ‘‘మొరాకో, పెరూ, చైనాల్లో చాలా తక్కువ మంది రిటర్న్ చేశారు’’అని ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ సి.రఫ్ (జ్యూరిచ్ యూనివర్శిటీ) తెలిపారు. నగదు ఎక్కువైతే... ఈ ప్రయోగంలో ఆశ్చర్యకరమైన ఫలితం ఏమిటంటే... పర్సుల్లో నగదు ఎంత ఎక్కువైతే.. తిరిగి ఇచ్చేసే వారి శాతం కూడా అంతేస్థాయిలో పెరగడం. దాదాపు 38 దేశాల్లో వంద డాలర్ల వరకూ నగదు ఉన్న పర్సులు ఎక్కువగా (72 శాతం) తిరిగి వస్తే తక్కువ పదిహేను డాలర్ల వరకూ డబ్బున్నవి సగమే వెనక్కు వచ్చాయి. మెక్సికో, పెరూ దేశాలు మాత్రం ఈ ట్రెండ్కు భిన్నంగా నడుచుకున్నట్లు తేలింది. అగ్రరాజ్యం అమెరికా, యూకేల్లో పర్సుల్లోని డబ్బుతో సంబంధం లేకుండా కొంచెం అటు ఇటుగా సగం మాత్రమే రిటర్న్ వచ్చినట్లు గుర్తించారు. ఫలితంగా ఈ రెండు దేశాలు 21, 22 స్థానాల్లో నిలిచాయి. బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, పడేసిన పర్సుల్లో కూడా అత్యధికం యజమానుల చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ముజ్యియంలలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి అప్పగించడంపై వీటిల్లో ఏర్పాట్లు ఏమీ లేకపోవడం కారణం కావచ్చునని అంచనా. ఇన్ని చెప్పుకున్న తరువాత.. అతితక్కువ నిజాయితీగల దేశాల గురించి కూడా తెలుసుకోవాలి కదా... ఈ ప్రయోగంలో చిట్టచివర నిలిచిన దేశం పెరు. దానికి ఎగువన చైనా, మొరాకోలు ఉన్నాయి. పెరులూ ఐదింటిలో ఒక పర్సు మాత్రమే రిటర్న్ అయితే మొరాకో, చైనాలో పరిస్థితి మరి కాస్త నాలుగింటిలో ఒకటిగా గుర్తించారు. ఈ ప్రవర్తనకు కారణాలు? ఈ రకమైన ఫలితాలు శాస్త్రవేత్తలు ఊహించకపోయినా రెండు ప్రధాన కారణాలనైతే గుర్తించారు. మొదటిది ఇతరులకు సహాయం చేయాలనే కోరిక. రెండోది... నగదు ఎక్కువగా ఉన్న పర్సులను వెనక్కు ఇవ్వకపోతే తమను దొంగలు అనుకుంటారనే భయం. స్వార్థం, నిజాయితీల మధ్య సంఘర్షణను ఎదుర్కొంటున్నప్పుడు, మనిషి తమను తాము దొంగలుగా చూసుకోవడానికి ఇష్టపడరు,‘ అని పరిశోధన బృందం వివరించింది. మొత్తమ్మీద చూస్తే మనిషి మరీ అంత నిజాయితీ లేని వాడేమీ కాదని ఈ ప్రయోగం చెబుతోందన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక్రిశాట్కు క్రిస్పర్ కాస్9 సాంకేతికత!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చిన్న, సన్నకారు రైతుల ఆహార భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త జన్యు సవరణ వంగడాల రూపకల్పన దిశగా హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) పరిజ్ఞానమైన ‘క్రిస్పర్ కాస్9’ను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించుకునేందుకు అమెరికా కంపెనీల నుంచి ఇక్రిశాట్ తాజాగా హక్కులు పొందింది. క్రిస్పర్ కాస్9 సాంకేతికతపై ప్రధాన పేటెంట్లు అమెరికా సంస్థలకు ఉన్నాయి.మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనల స్థాయిలో ప్రయోగశాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దాని ఆధారంగా రూపొందించిన జన్యుమార్పిడి విత్తనాలను వాణిజ్యపరంగా రైతుల వద్దకు తీసుకెళ్లటానికి అత్యధిక లైసెన్సింగ్ రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో క్రిస్పర్ కాస్9 జన్యుసవరణ సాంకేతికత సొంతదారులైన అమెరికా సంస్థలు కోర్టేవా అగ్రిసై¯Œన్స్, బ్రాడ్ ఇ¯న్స్టిట్యూట్లు మానవతా దృక్పథంతో ఇక్రిశాట్కు ఉచితంగా దీర్ఘకాలిక లైసెన్స్ ఇవ్వటం విశేషం. తద్వారా ఎలాంటి పేటెంట్ వివాదాలు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో ఇక్రిశాట్ పరిశోధనలు పూర్తి చేసేందుకు, లైసెన్సింగ్ రుసుము నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఇదో మైలురాయి: ఇక్రిశాట్ డీజీ: ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చేసే పంటల విత్తనాలపై పేటెంట్ భారం ఉండదు కా బట్టి, ఆసియా, ఆఫ్రికాలోని పేద రైతులకు వాతావరణ మార్పు ల వల్ల సంభవించే అనావృష్టి, తీవ్రమైన కరువు, కొత్త రకం తెగుళ్లను తట్టుకునే కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాలకు సంబంధించి సరికొత్త జన్యుసవరణ విత్తనాలు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి.‘ఈ ఒప్పందం ఇక్రిశాట్కు, మెట్ట వ్యవసాయంపై ఆధారపడిన లక్షలాది మంది చిన్న రైతులకు, వారి కుటుంబాలకు ఒక పరివర్తనాత్మక మానవతా మైలురాయి’ అని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. కాగా సాధారణ సాంప్రదాయ పద్ధతిలో వాతావరణ మార్పుల ను తట్టుకునే కొత్త పంట రకాన్ని తయారు చేయటానికి 10–15 ఏళ్లు పడుతుందని, ఈ ఒప్పందం ద్వారా క్రిస్పర్ కాస్9ను నేరుగా వాడటం వల్ల 3–5 సంవత్సరాల్లోనే కొత్త వంగడాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
జంతర్ మంతర్ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఆందోళనలు, నినాదాలు, ప్రజా ఉద్యమాలు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా.. తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నా.. అనేక వర్గాలకు ఇది దశాబ్దాలుగా కీలక వేదికగా మారింది. తాజాగా నీట్ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలకు కూడా ఇదే ప్రాంతం వేదికైంది. ఇలాంటి చరిత్ర ఉన్న జంతర్ మంతర్ను నిరసనల కోసం వినియోగించడంపై పునరాలోచించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం, కేంద్రం–ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో ఈ చారిత్రక ప్రాంతం మరోసారి చర్చలోకి వచ్చింది.అయితే జంతర్ మంతర్ పుట్టుక నిరసనల కోసం కాదు. ఖగోళ పరిశోధనల కోసం నిర్మించిన ఈ ప్రదేశం.. కాలక్రమేణా ప్రజల సమస్యలు ప్రతిధ్వనించే ప్రజాస్వామ్య వేదికగా మారింది. ఒకప్పుడు సూర్యుడు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత పాలకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రజలు తమ గళాన్ని వినిపించే వేదికగా పరిణామం చెందింది. మరి ఈ మార్పు ఎలా జరిగింది? జంతర్ మంతర్ చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమాలు ఏవి? ఆ లోతులోకి వెళ్తే. ఖగోళ కేంద్రం నుంచి ఉద్యమాల వేదిక వరకుజంతర్ మంతర్ను 18వ శతాబ్దంలో జైపూర్ మహారాజు సవాయి జైసింగ్-2 నిర్మించారు. 1724లో నిర్మించిన ఈ ఖగోళ పరిశోధనా కేంద్రంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాల కదలికలను అధ్యయనం చేసేందుకు భారీ పరికరాలను ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతదేశ శాస్త్రీయ ఆలోచనలకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.జంతర్ మంతర్ అనే పేరు కూడా దాని చరిత్రతో ముడిపడి ఉంది. సంస్కృతంలోని ‘యంత్ర’ (పరికరం), ‘మంత్ర’ (సూత్రం లేదా లెక్కింపు) అనే పదాల నుంచి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఖగోళ గణనలకు ఉపయోగించే ప్రత్యేక యంత్రాల కారణంగా ‘యంత్ర మంత్ర’ కాలక్రమంలో ‘జంతర్ మంతర్’గా ప్రాచుర్యంలోకి వచ్చింది.కానీ కాలం మారింది. ఢిల్లీ నగరం విస్తరించడంతో పాటు జంతర్ మంతర్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సమీపంగా ఉండటం వల్ల తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం మొదలైంది. అలా ఖగోళ పరిశోధనలకు వేదికగా ప్రారంభమైన ఈ ప్రదేశం.. క్రమంగా దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిరసన వేదికల్లో ఒకటిగా మారింది.అన్నా ఉద్యమంతో దేశవ్యాప్త గుర్తింపుజంతర్ మంతర్కు భారీ గుర్తింపు తెచ్చిన ఉద్యమాల్లో 2011లో అన్నా హజారే నేతృత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమం ఒకటి. బలమైన లోక్పాల్ చట్టం కోసం జరిగిన ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలో భాగమయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహాన్ని దేశం మొత్తం చూసేలా చేసిన ఈ ఉద్యమం తర్వాత జంతర్ మంతర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.అయితే అన్నా ఉద్యమంతోనే జంతర్ మంతర్ నిరసనల చరిత్ర ప్రారంభం కాలేదు. అంతకుముందు నుంచే ఉద్యోగాలు, కార్మిక హక్కులు, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అనేక సంఘాలు, రాజకీయ పార్టీలు ఇక్కడ ఆందోళనలు నిర్వహించాయి. అన్నా ఉద్యమం మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా నిలిపింది.నిర్భయ ఘటనతో యువత కదిలి..2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయం కోసం, కఠిన చట్టాల కోసం జరిగిన నిరసనల్లో జంతర్ మంతర్ కీలక కేంద్రంగా మారింది. యువత ఒక్కటిగా పోరాటానికి దిగింది. ఈ ఉద్యమం ఒక ఘటనకు వ్యతిరేకత మాత్రమే కాదు.. దేశంలో మహిళల భద్రత, న్యాయ వ్యవస్థ, చట్టాలపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రజల ఆగ్రహం ప్రభుత్వాలను స్పందించేలా చేసిన సందర్భాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.రైతు ఉద్యమాలకు సాక్ష్యంజంతర్ మంతర్ చరిత్రలో రైతు ఉద్యమాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వ్యవసాయ సమస్యలు, కనీస మద్దతు ధర, రైతుల ఆదాయం వంటి అంశాలపై రైతు సంఘాలు ఎన్నోసార్లు ఇక్కడ తమ గళాన్ని వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020–21లో జరిగిన రైతు ఉద్యమ సమయంలో జంతర్ మంతర్ మరోసారి కీలకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఆందోళనలు సాగినప్పటికీ.. రైతు సంఘాలు ఇక్కడ ప్రత్యేక నిరసనలు నిర్వహించి తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యవసాయ విధానాలపై పెద్ద చర్చకు దారితీసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.రెజ్లర్ల ఆందోళనతో మరోసారి చర్చలోకి2023లో మహిళా రెజ్లర్ల నిరసనలతో జంతర్ మంతర్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఆరోపణలకు సంబంధించి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు క్రీడా రంగంలో మహిళల భద్రత, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై పెద్ద చర్చకు కారణమయ్యాయి.నీట్ నిరసనలు.. కొనసాగుతున్న గళంఇటీవల నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై విద్యార్థులు కూడా జంతర్ మంతర్ను ఆశ్రయించారు. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్ వంటి అంశాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం, వివిధ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై కూడా అనేక వర్గాలు ఇక్కడ నిరసనలు చేపట్టాయి. ఇలా జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతంగా కాకుండా.. ప్రజల సమస్యలు దేశవ్యాప్తంగా వినిపించే వేదికగా మారింది.ఇబ్బందులు కూడా ఉన్నాయా?అయితే జంతర్ మంతర్ నిరసనల వల్ల సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. తరచూ జరిగే ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని, స్థానిక ప్రజలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్కు బదులుగా ప్రత్యేక నిరసన వేదిక ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది.ప్రజాస్వామ్యానికి ప్రతీక.. మార్పు అవసరమా?జంతర్ మంతర్ భారత ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించే హక్కుకు ఇది ప్రతీకగా నిలిచింది. అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండటం వల్ల ప్రజల గొంతు పాలకుల వరకు చేరే అవకాశం కల్పించింది. అయితే నగర నిర్వహణ, సాధారణ ప్రజల సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని న్యాయస్థానం పరిశీలిస్తోంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న.. జంతర్ మంతర్ ఉద్యమాల వేదికగా కొనసాగుతుందా? లేక కొత్త నిరసన కేంద్రానికి మారుతుందా? అనేది. -
పర్సులో ప్లాస్టిక్ పవర్
స్మార్ట్ఫోన్ కొనాలన్నా, విమానం టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నా, అభిమాన హీరో సినిమా మొదటి ఆట టికెట్ కొనాలన్నా, ఇష్టమైన గాయకుడి కచేరీకి వెళ్లాలనుకున్నా.. ఒకప్పుడు ధర చూసి నిర్ణయం తీసుకునే వినియోగదారుడు ఇప్పుడు ఏ కార్డు వాడితే ఎక్కువ క్యాష్బ్యాక్ వస్తుంది?, ఏ కార్డుతో కొంటే ముందుగా టికెట్ దొరుకుతుంది? ఏ బ్యాంక్ ఆఫర్ బెస్ట్? అని లెక్కవేస్తున్నాడు. క్రెడిట్ కార్డులు ఒకప్పటిలా కేవలం బిల్లు చెల్లింపు సాధనాలుగా కాకుండా కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తివంతమైన మార్కెటింగ్ ఆయుధాలుగా మారాయి. డిజిటల్ చెల్లింపుల ప్రపంచాన్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు బిల్లులు చెల్లించే సాధనంగా చివర్లో బయటకు వచ్చే క్రెడిట్ కార్డు... ఇప్పుడు వినియోగదారుడి కొనుగోలు నిర్ణయాలను శాసించే ‘ప్లేయింగ్ కార్డ్’గా మారి కొనడానికి ముందే ప్రభావితం చేస్తోంది. ధర కంటే ఆఫర్, అవసరం కంటే రివార్డు ముఖ్యమవుతున్న ఈ కొత్త వినియోగ సంస్కృతి, ప్లాస్టిక్ కార్డు పవర్ రిటైల్ మార్కెట్ను కొత్త దిశలో నడిపిస్తున్న ట్రెండ్పై వెల్త్ స్టోరీ దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణతో పాటు క్రెడిట్ కార్డుల పాత్ర కూడా వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు కొనుగోలు పూర్తయ్యాక ఉపయోగించే క్రెడిట్ కార్డు కొనుగోలు ప్రక్రియ ప్రారంభంలోనే కస్టమర్ను ప్రభావితం చేస్తోంది. ఈకామర్స్, ట్రావెల్, ఎల్రక్టానిక్స్, వినోద రంగాల్లో ప్రత్యేక క్రెడిట్ కార్డుల ఆఫర్లు కొనుగోలు నిర్ణయాలను మలుపు తిప్పుతున్నాయి. ఏ వస్తువు కొనాలి అన్న ప్రశ్నతో పాటు ఏ కార్డుతో కొనాలి అనే ప్రశ్న కూడా ఇప్పుడు కస్టమర్ ముందుంటోంది. రూపే కార్డు యూపీఐ అనుసంధానంతో కిరాణా దుకాణం నుంచి ఫుడ్ డెలివరీ వరకు చిన్న చిన్న మొత్తాలకు కూడా క్రెడిట్ కార్డులు వినియోగంలోకి వస్తున్నాయి. యువతరం ఆసక్తితో క్రెడిట్ కార్డుల ఆదరణ మరింత పెరుగుతోంది. ఉద్యోగం వచ్చిన వెంటనే తొలి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే వారిసంఖ్య గణనీయంగా పెరిగింది. ఖర్చుల నిర్వహణ, క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి ముఖ్యంగా రివార్డు పాయింట్లు కోసం యువత కార్డులను ఎక్కువగా ఎంచుకుంటోంది. దీంతో క్రెడిట్ కార్డు వ్యాపారంలో పోటీకూడా తీవ్రమవుతోంది. వినియోగదారులు ఇప్పుడు ఒకే కార్డుకు పరిమితం కావడం లేదు. ప్రయాణాలకు ఒకటి, షాపింగ్కు మరొకటి, రోజువారీ ఖర్చులకు ఇంకొకటి అంటూ దాదాపు మూడు నుంచి ఐదు కార్డులను వాడుతున్నారు. దీంతో బ్యాంకులు కస్టమర్ లాయల్టీ (విధేయత) నిలబెట్టుకునేందుకు రకరకాల ఆఫర్లతో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో కో బ్రాండెడ్ కార్డులను అందుబాటులోకి తెస్తున్నాయి. మార్కెట్ పరిశోధన సంస్థల అంచనా ప్రకారం భారత క్రెడిట్ కార్డు మార్కెట్ విలువ 2025లో 20.1 బిలియన్ డాలర్లు కాగా 2034 నాటికి 38.3 బిలియన్ డాలర్లకు పెరగనుంది. కొనుగోలుకు ముందే కార్డుల ప్రభావం గతంలో క్రెడిట్ కార్డుల ప్రధాన అవసరం, ఆకర్షణ షాపింగ్ బిల్లులు చెల్లించడం, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ ఇంకా కొన్ని డిస్కౌంట్ ఆఫర్లకే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. షాపింగ్కు ముందే వస్తువును ఏ కార్డుతో కొనాలి అనేది వినియోగదారుల నిర్ణయంలో కీలకంగా మారింది. ఫలితంగా ప్రతి కొనుగోలు ఒక చిన్న ఆర్థిక లెక్కగా మారుతోంది. సినిమాలు, లైవ్ ఈవెంట్లు, కచేరీలు, నాటికలు, నృత్య ప్రదర్శనలు, కొత్త గాడ్జెట్ల విడుదల, ఈకామర్స్ పండగ సేల్స్ సమయంలో క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన కార్డు ఉంటే ముందుగానే టికెట్ దొరుకుతుంది. అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. క్యాష్బ్యాక్ లభిస్తుంది. దీంతో కార్డునుబట్టి అది అందించే ప్రయోజనాలను బట్టి వినియోగదారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటికోసం ఒకటికి మించి కార్డులను వాడుతున్నారు. ఆఫర్లే అసలు ఆయుధం క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు, ఈఎంఐ సదుపాయాలు, ప్రత్యేక సేల్స్ యాక్సెస్లు ఇప్పుడు బ్యాంకుల ప్రధాన పోటీ ఆయుధాలుగా మారాయి. పండుగ సీజన్లలో ఈకామర్స్ లావాదేవీల్లో ప్రత్యేక కోబ్రాండెడ్ కార్డుల ఆఫర్లతో బిజినెస్ బాగా జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్లలో కో బ్రాండెడ్ కార్డులు కేవలం చెల్లింపు సాధనాలుగా కాకుండా వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనను నిర్దేశిస్తున్నాయి. క్రెడిట్ కార్డుల ప్రయాణంలో యూపీఐ అనుసంధానం కీలక మలుపుగా మారింది. రూపే క్రెడిట్ కార్డులతో చిన్న చిన్న మొత్తాలకు కూడా కార్డు వాడే అలవాటు పెరిగింది. కిరాణా, ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సేవలు ఇలా రోజువారీ ప్రతి ఖర్చులోనూ క్రెడిట్ కార్డులు ప్రవేశించాయి. ఇది వినియోగ ఫ్రీక్వెన్సీని పెంచడమే కాకుండా క్రెడిట్ కార్డు వాడకాన్ని అప్పు చేయడం అనే భావన నుంచి ఖర్చు చేసే సాధనంగా భావించేలా చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.ఎక్కువ కార్డులు.. ఎక్కువ ప్రమాదం ఒకప్పుడు ఒక కుటుంబానికి ఒకటి, లేదా రెండు కార్డులు ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు మూడు నుంచి ఐదు కార్డులు వాడుతున్నారు. ప్రయాణాలకు ఒకటి, షాపింగ్కు ఒకటి, రివార్డులకు మరొకటి ఉపయోగిస్తున్నారు.దీంతో వినియోగదారుల లాయల్టీ ఒక బ్యాంకు, ఒక కార్డు కాకుండా కొనుగోలు సమయంలో అత్యుత్తమ ప్రయోజనం ఇచ్చే కార్డు వైపు మారిపోతోంది. ఈ సౌలభ్యం వెనక కొన్ని కనబడని ప్రమాదాలు దాగున్నాయి. ఎక్కువ క్యాష్బ్యాక్లు, ప్రత్యేక ఆఫర్లు, సులభతరమైన క్రెడిట్ కారణంగా అవసరం లేని కొనుగోళ్లు పెరుగుతాయి. చిన్న చిన్న బకాయిలైనా ఎక్కువ కార్డుల వాడకం వల్ల నెలవారీ బిల్లు కట్టే సమయంలో పెద్ద భారంగా మారతాయి. రుణం సులభంగా లభించినా క్రెడిట్ కార్డులపై బ్యాంకులు 30 శాతానికి పైగా వడ్డీ గుంజుతాయి.ఆదాయానికి, చేసే ఖర్చుకి పొంతనలేక యువతరం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న విషయాన్ని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రుణ వినియోగం అమెరికాలో 2008 నాటి లేమాన్ బ్రదర్స్ సంక్షోభాన్ని ఎలా సృష్టించిందో తెలుసుకోవాలని చెబుతున్నారు. జెన్ జెడ్ చేతిలో కార్డు శక్తి→ అమెజాన్–పేకెర్నీ ఇండియా నివేదిక ప్రకారం యువతలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. → 65% మంది యువ తరం ఉద్యోగంలో చేరిన వెంటనే తొలి క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు → 32% మంది ఖర్చుల నిర్వహణ కోసం కార్డులు వాడుతున్నారు → 30% మంది క్యాష్బ్యాక్లు, రివార్డుల కోసం ఎంచుకుంటున్నారు → 23% మంది క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు కార్డులు ఉపయోగిస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా క్రెడిట్ కార్డుల వినియోగం పరిశ్రమకు కొత్త అవకాశాలను కల్పిస్తోంది. – సాక్షి, వెల్త్ డెస్క్ -
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్ఫామ్స్లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై పీబీ ఫిన్టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్ఫామ్పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్కు పీబీ ఫిన్టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్లో కేవలం జాబ్ పోర్టల్గా మిగిలిపోకుండా రెజ్యుమ్లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్ఫామ్గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్లో కూడా ప్రాపర్టీ సెర్చ్లో ఏఐ హోమ్ అడ్వయిజర్ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్కు అడ్రస్గా నిలిచిన జస్ట్ డయల్కు అర్బన్కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్ఫామ్గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్ట్రేడ్కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్ఫామ్గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్పీరియన్స్లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్ప్లేస్లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు. పాలసీ బజార్ ఫిన్టెక్, ఆరమ్ ప్రాప్టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
మీ స్టీల్ బాటిల్ మంచిదేనా?
మన ఆరోగ్యం మనం తాగే నీటిపైనే కాకుండా, ఆ నీటిని నిల్వ ఉంచే పాత్రలపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణ ప్లాస్టిక్ సీసాల వల్ల శరీరంలోకి చేరే బిస్ఫెనాల్–ఎ (బీపీఏ), సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు (మైక్రోప్లాస్టిక్స్), అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాల (నానోప్లాస్టిక్స్) ముప్పు నుంచి తప్పించుకోవటానికి చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, మార్కెట్లో లభించే అన్ని స్టీల్ బాటిళ్లూ ఆరోగ్యానికి సురక్షితమైనవి కావు. ఏది ఉత్తమమైన స్టీల్? తాగునీటిని నిల్వ చేయడానికి దేశ విదేశాల్లో ‘304’, ‘316’స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్లను అత్యంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. 304 లేదా 18/8 గ్రేడ్ స్టీల్లో 18% క్రోమియం, 8% నికెల్ ఉంటాయి. ఇది తుప్పు పట్టదు. సహజమైన రుచి, వాసనను మార్చదు. 316 లేదా 18/10 గ్రేడ్ స్టీల్లో అదనంగా 2% నుంచి 3% ‘మాలిబ్డినం’అనే లోహం ఉంటుంది. దీనివల్ల బాటిల్కు తుప్పు నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ/బత్తాయి రసం, మజ్జిగ, డిటాక్స్ వాటర్ లేదా ఆల్కలైన్ వాటర్ వంటి ఆమ్ల గుణం ఉన్న పానీయాలను పోసుకోవటానికీ ఇది అత్యంత సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ స్టీల్తో ముప్పు నాసిరకం సాధారణ స్టీల్ బాటిళ్లు తాగు నీటిని పోసుకోవటానికి గానీ, పండ్ల రసాలకు గానీ పనికిరావు. తక్కువ ధరకు లభించే బాటిళ్ల తయారీలో 201/202 గ్రేడ్ స్టీల్ వాడతారు. తయారీ వ్యయం తగ్గించడానికి వీటిలో ఖరీదైన నికెల్ వాడకాన్ని తగ్గించి, 5.5%–7.5% వరకు ‘మాంగనీస్’ను కలుపుతారు. ఈ బాటిళ్లలో నీరు లేదా పండ్ల రసాలు పోసినప్పుడు మాంగనీస్ నీటిలో కరుగుతుంది. ఇది రోజూ శరీరంలోకి చేరితే కాలక్రమేణా కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బాటిళ్లకు తుప్పును తట్టుకునే శక్తి తక్కువ. కొద్దిరోజులకే లోపల ఎర్రటి తుప్పు మచ్చలు ఏర్పడి, నీటిలోకి లోహపు రుచి/వాసన వస్తుంది. నాణ్యతను గుర్తించేదెలా? » భారతీయ ప్రమాణాల ప్రకారం.. స్టీల్ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్ 17803:2022’, థర్మోస్/వ్యాక్యూమ్ బాటిళ్ల తయారీలో ‘ఐఎస్ 17526:2021’నిబంధనలు పాటించాలి. ఐఎస్ఐ ముద్రనూ తప్పనిసరిగా బాటిల్పై ముద్రించాలి. » అమెరికా ఎఫ్డీఏ, యూరోపియన్ ఈఎఫ్ఎస్ఏ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. 304/316 గ్రేడ్ స్టీల్ బాటిల్స్ మాత్రమే సురక్షితమైనవి. మన దేశంలో కొత్త స్టీల్ బాటిల్ కొనేముందు దాని అడుగు భాగంలో లేదా ప్యాకింగ్ బాక్స్పై 304 లేదా 316తోపాటు ఐఎస్ఐ మార్కు ఉందో లేదో చూసుకోవాలి. » సాధారణ 201 లేదా 202 గ్రేడ్ స్టీల్ బాటిళ్ల అడుగున లేదా బాక్స్పై ఈ అంకెలను రాయొచ్చు లేక రాయకపోవచ్చు. మనమే గమనించుకోవాలి. – (సాక్షి, స్పెషల్ డెస్క్) -
బీజేపీకి గుడ్బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్జీ నిరసనల ఎఫెక్ట్తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
జనరిక్స్కు గుడ్బై.. స్పెషాలిటీ డ్రగ్స్కు వెల్కమ్
భారత ఔషధ పరిశ్రమలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు తక్కువ ధరల జనరిక్ మందులతో ప్రపంచమార్కెట్లో ఆధిపత్యం చాటిన భారత ఫార్మా కంపెనీలు ఇప్పుడు అధిక విలువ కలిగిన స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మందులు, ఇతర బ్రాండెడ్ వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నాయి. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరల పోటీ, మార్జిన్ల తగ్గుదలతో కంపెనీలు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద ఫార్మా సంస్థలైన సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యా»ొరేటరీస్, సిప్లా, లుపిన్ కంపెనీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఫార్మా రంగంలో వస్తున్న ఈ మార్పును తెలియజేస్తున్నాయి. సంప్రదాయ జనరిక్స్ బదులుగా లాభాలు అందించే ప్రత్యేక ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, వినూత్న చికిత్సలపై కంపెనీలు దృష్టి పెట్టాయి. ఈ మార్పులో సన్ ఫార్మా ఇతర కంపెనీలకన్నా ముందంజలో ఉంది. కంపెనీ గ్లోబల్ ఇన్నొవేటివ్ మెడిసిన్స్ వ్యాపారం 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 1.4 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో 22 శాతానికిపైగా స్పెషాలిటీ మందుల నుంచి వస్తోంది. రుమేనియా, బ్రెజిల్, చైనా మార్కెట్లలో ఇలుమ్యా వంటి వినూత్న ఔషధాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయని కంపెనీ తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ కూడా బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్, ఇంకా అనేక విభిన్న ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ 2025–26లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక వార్షిక ఆదాయాన్ని రెడ్డీస్ నమోదు చేసింది. ప్రాథమిక వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఎఫ్ఓ ఎం.వి. నరసింహం తెలిపారు. మరోవైపు సిప్లా తన ఆఫ్రికా వ్యాపారం, శ్వాసకోశ చికిత్సలు, బ్రాండెడ్ ప్రి్రస్కిప్షన్ ఔషధాల ద్వారా బలమైన వృద్ధిని సాధిస్తోంది. కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ వ్యాపారం 400 మిలియన్ డాలర్లకు పైగా నమోదు చేసింది. బయోసిమిలర్స్ను భవిష్యత్తులో భారీ అవకాశాలున్న విభాగంగా కంపెనీ భావిస్తోంది. లుపిన్ కూడా అమెరికా వెలుపల మార్కెట్లు, బ్రెజిల్ వంటి దేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ బ్రెజిల్ వ్యాపారం స్థానిక కరెన్సీలో 113 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 60కి పైగా ఇంజెక్టబుల్స్, శ్వాసకోశ ఉత్పత్తుల అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వచ్చే ఏడాదిలోగా అమెరికా మార్కెట్లో తొలి బయో సిమిలర్ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మాలో మార్పులు ఇలా కొనసాగుతుండగా దేశీయ ఔషధ మార్కెట్ కూడా బలపడుతోంది. ఈక్విరస్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం 2026 మే నాటికి భారత ఫార్మా మార్కెట్ 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 3.2 శాతం నేరుగా జరిగిన అమ్మకాల నుంచే రావడం గమనార్హం. ఇది నిజమైన వినియోగ డిమాండ్ను సూచిస్తోందని ఈక్విరస్ తెలిపింది. భారత ఫార్మారంగం జనరిక్స్ తయారీ కేంద్రం అనే గుర్తింపును దాటి పరిశోధన ఆధారిత అధిక విలువ కలిగిన ప్రపంచస్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదిగే దిశగా ప్రయాణంప్రారంభించింది. వచ్చే రోజుల్లో స్పెషాలిటీ డ్రగ్స్, బయోసిమిలర్స్, కొత్త మార్కెట్లే భారత ఫార్మా వృద్ధికి ప్రధాన ఇంధనంగా మారనున్నాయి. స్పెషాలిటీ మందులు అంటే? సాధారణ జ్వరం, దగ్గు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు మందులు అన్ని మెడికల్ షాపుల్లో సులభంగా లభిస్తాయి. వీటి తయారీ కూడా సులభం, అలా కాకుండా క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, మలి్టపుల్ స్లెరోసిస్, సోరియాసిస్, హెపటైటిస్, హెచ్ఐవీ వంటి క్లిష్టమైన దీర్ఘకాలిక వ్యాధుల కోసం తయారుచేసే అత్యాధునిక అధిక ధర ఔషధాలు. వీటి తయారీ, పరిశోధనకి చాలా ఖర్చు అవుతుంది. ఇవి ప్రత్యేక ఆసుపత్రులు, ఫార్మసీల ద్వారానే లభిస్తాయి. సాధారణ మందులతో పోలిస్తే ధరలు ఎక్కువ. చాలావరకు ఇంజెక్షన్, ఇన్ఫ్యూషన్ రూపంలో ఇస్తారు. వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. ఈ మందుల అమ్మకాలపై లాభాల మార్జిన్ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. జనరిక్స్ మార్కెట్లో పోటీ పెరగడంతో ఫార్మా కంపెనీలకు స్పెషాలిటీ డ్రగ్స్ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా మారుతున్నాయి. పేటెంట్ ఆధారిత ఉత్పత్తులు కావడంతో పోటీ కూడా తక్కువగా ఉంటుంది.– సాక్షి, బిజినెస్డెస్క్ -
ప్రాణాలు కాపాడిన వాచ్
అవును! మీరు చదివింది నిజమే. ఆపిల్ వాచ్ అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అతని వాచ్లోని ‘ఫాల్ డిటెక్షన్’ఫీచర్ ఆటోమేటిక్గా పనిచేసి ఎమర్జెన్సీకి కాల్ చేసి అతనికి సరైన సమయంలో వైద్యం అందేలా చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం.. ఒహాయోకు చెందిన మహమ్మద్ ఇస్లాం అనారోగ్యంగా అనిపించడంతో ఆఫీసులో సెలవు తీసుకుని ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆ రోజు ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెవి దగ్గర నొప్పి, నడవడం కూడా కష్టంగా అనిపించింది. అయినా, ఇంట్లో చెత్తను పడేయడానికి బయటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు.. స్పృహ వచ్చేసరికి విపరీతమైన చెమటలు. అతికష్టం మీద లేచి పక్కనే ఉన్న కుర్చీని పట్టుకుని కూర్చున్నాడు. ఇంతలో అంబులెన్స్ సైరన్ శబ్దం. తాను కింద పడటాన్ని గుర్తించిన ఆపిల్ వాచ్ అత్యవసర సేవలకు కాల్ చేసిందని గ్రహించాడు. వెంటనే సిన్సినాటి విశ్వవిద్యాలయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిందని వైద్యులు గుర్తించారు. తాను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటున్నాడు. తన చేతి ఆపిల్ వాచ్లో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేసిందో చెబుతున్నాడు. వాచ్ ఏం చేసింది? అతను గట్టిగా కింద పడటాన్ని వాచ్ గ్రహించింది. మణికట్టును తట్టి, అలారం మోగించి, ‘ఆర్ యూ ఓకే’అని అడుగుతూ ఒక హెచ్చరికను ప్రదర్శిస్తుంది. వాచ్ ధరించిన వ్యక్తి కదులుతూ ఉంటే, స్పందించే వరకు వేచి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి సుమారు ఒక నిమిషం పాటు కదలకుండా ఉన్నారని గుర్తిస్తే, 30–సెకన్ల కౌంట్డౌన్తో మణికట్టును తడుతూ క్రమంగా, బిగ్గరగా హెచ్చరికను మోగిస్తుంది. కౌంట్డౌన్ ముగిసినా ఎలాంటి స్పందన రాకపోతే, వాచ్ స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. ఖచ్చితమైన లొకేషన్ను కూడా షేర్ చేస్తుంది. వ్యక్తి కింద పడిపోయాడని గుర్తించినట్లు అత్యవసర కాంటాక్ట్లకు సందేశం పంపుతుంది. ఈ ఫీచర్ 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది. 18 నుంచి 54 ఏళ్ల మధ్య వయస్సున్నవారైతే మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు. మహమ్మద్ ఇస్లాం విషయంలోనూ ఇదే జరిగింది. ఫోన్ ఎమర్జెన్సీకి కాల్ చేసింది. ఈ లోపు అతనికి స్పృహ రావడం ఇంకా మంచిదైంది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
టీనేజ్ పిల్లల్లో పాప్కార్న్ బ్రెయిన్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్లో చాట్ చేస్తూ, గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయిపోయింది. వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఎం.లెవీ దీనినే ’పాప్కార్న్ బ్రెయిన్’ అన్నారు. డిజిటల్ మల్టీటాస్కింగ్కు అలవాటు పడి, పాప్కార్న్లాగా ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా దూకడం, నిజ జీవితంలోని నెమ్మదైన పనులపై ఏకాగ్రత కోల్పోవడాన్ని ఇది సూచిస్తుంది. దీనిని మానసిక సమస్య అని నిర్ధారించలేదు. కానీ ఆందోళన పడాల్సిన మానసిక స్థితి అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.పాప్కార్న్ బ్రెయిన్ లక్షణాలు⇒ ఒకే పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేకపోవడం, ఒక విషయం మీద ఆసక్తి, శ్రద్ధ వెంట వెంటనే మారిపోవడం ళీ నిమిష నిమిషానికి నోటిఫికేషన్లు, కొత్త డిజిటల్ కంటెంట్ కోసం పరితపించడం ⇒ సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వైఫల్యం. పెద్దల సూచనలను పాటించడంలో మైండ్ను వెంటనే కనెక్ట్ చేసుకోలేక ఇబ్బంది పడటం. ఒక్కమాటలో చెప్పాలంటే పరధ్యానం. ళీ నిద్ర లేమి, ఆందోళన చెందడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడంతల్లిదండ్రులు ఏం చేయాలి?⇒ రోజూ కొంత సమయం స్క్రీన్లు లేకుండా ప్రశాంతంగా, వర్తమానంలో గడపడం వల్ల మెదడు తిరిగి ఏకాగ్రతను పుంజుకుంటుంది. ⇒ స్క్రీన్ వినోదానికి కేటాయించినంత సమయాన్ని శారీరక శ్రమకు, ఇతర హాబీలకూ కేటాయించాలి. పిల్లల చదువు పూర్తయిన తర్వాత మిగిలిన సమయానికి తగినట్లు టైంటేబుల్ ఇవ్వాలి. ⇒ పిల్లలకు నిరంతరం ఏదో ఒక డిజిటల్ స్టిమ్యులేషన్ అవసరం లేదు. ఖాళీగా ఉండటం వల్ల వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనల రెక్కలు విచ్చుకుంటాయి. సహనం పెరుగుతుంది.⇒ వర్చువల్ ప్రపంచం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా ముఖాముఖి గడిపేలా ప్రోత్సహించాలి. ⇒ ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటి హాబీలను ప్రోత్సహించాలి. చదివిన విషయాన్ని ఇంట్లో వాళ్లతో చర్చించే వాతావరణం కల్పించాలి. తల్లిదండ్రులతో కలిసి వాకింగ్ చేయడం అలవర్చాలి. పజిల్ పూరించడం, డ్రాయింగ్ లేదా క్రాఫ్ట్ వంటి హాబీలతో చిన్న చిన్న ప్రాజెక్టు చేసేవిధంగా ప్రోత్సహించాలి. పిల్లలపై ప్రభావం మెదడు అభివృద్ధి చెందే కీలక దశలో డిజిటల్ పరధ్యానం వారిలో కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అధ్యయనాల ప్రకారం, మితిమీరిన ఇంటర్నెట్ వాడకం పిల్లల్లో వాచిక మేధస్సు తగ్గడానికి కారణమవుతోంది. అలాగే, నిజ జీవిత సామాజిక నైపుణ్యాలు లోపించి, చిన్న సమస్యలకే వారు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. -
బాస్కే బాస్ ఎవరు?
అడవిలో పులి అడుగుపెడితేనే చాలా జంతువులు అప్రమత్తమవుతాయి. నిశ్శబ్దంగా కదులుతూ.. క్షణాల్లో వేటను ముగించే సామర్థ్యం దాని సొంతం. బలమైన పంజా, పదునైన గోర్లు, శక్తివంతమైన దవడలతో పులి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ అడవిలో అసలు నిజం వేరే ఉంది.. ఎంతటి శక్తివంతమైన జీవికైనా ప్రకృతిలో ఒక సవాల్ తప్పదు. అడవికి బాస్గా పేరున్న పులి కూడా కొన్ని జంతువుల ముందు ఆచితూచి అడుగు వేయాల్సిందే.భారీ శరీరం, అపారమైన బలం, సమూహంగా కదిలే శక్తి, ఊహించని దూకుడు.. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న జీవులు పులికి కూడా ఎదురుదెబ్బ ఇవ్వగలవు. అవసరం లేని పోరాటాలకు పులి కూడా దూరంగా ఉంటుంది.. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం ప్రాణాలకే ముప్పు కావచ్చు. తన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ‘పెద్ద పిల్లి’కి సైతం కొన్ని జంతువులు గట్టి సవాల్గా నిలుస్తాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day, Global Tiger Day) సందర్భంగా.. పులిని కూడా వెనక్కి తగ్గించే ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం.అడవిలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఏనుగు ఒకటి. భారీ శరీరం, అపారమైన బలం, తెలివి కారణంగా ఏనుగులు చాలా జంతువులకు సవాల్ విసురుతాయి. సాధారణంగా పులులు పెద్ద ఏనుగులపై దాడి చేయవు. ముఖ్యంగా ఏనుగుల మందలోకి వెళ్లడం పులికి ప్రమాదకరం. చిన్న ఏనుగు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగినా.. తల్లి ఏనుగు, మొత్తం మంద కలిసి పులిని తరిమికొట్టగలవు. ఒక్కసారి ఏనుగు దాడి చేస్తే.. పులికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏనుగుల సమూహాన్ని చూసినప్పుడు పులి కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.పులికి అసలైన పరీక్ష ఇదే..పులికి ఇష్టమైన ఆహారాల్లో అడవి దున్న (గౌర్) ఒకటి. అయితే దాన్ని వేటాడటం అంత సులభమైన విషయం కాదు. భారీ శరీరం, బలమైన కాళ్లు, పదునైన కొమ్ములు అడవి దున్నకు ప్రధాన ఆయుధాలు. ఒక పెద్ద అడవి దున్న ఎదురుదాడికి దిగితే పులికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులులు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద అడవి దున్నలపై కాకుండా.. బలహీనంగా ఉన్నవి, ఒంటరిగా ఉన్నవాటిపై దృష్టి పెడతాయి.మొసలితో మామూలుగా ఉండదుభూమిపై పులి ఎంత శక్తివంతమైనదైనా.. నీటిలో పరిస్థితులు మారిపోతాయి. పెద్ద మొసళ్లు తమ పరిధిలో అత్యంత ప్రమాదకరమైనవి. నదులు, చెరువుల్లోకి దిగినప్పుడు పులి కూడా మొసలి దాడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో మొసలి బలం, దాని ఆకస్మిక దాడి పులికి ముప్పుగా మారుతుంది. అయితే పులులు కూడా మంచి ఈతగాళ్లే. అవసరమైతే నదులను దాటి వేట కొనసాగించగల సామర్థ్యం వాటికి ఉంటుంది.ఊహించని ప్రత్యర్థికొన్ని అడవి ప్రాంతాల్లో పులులు, ఎలుగుబంట్లు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ముఖ్యంగా స్లోత్ బేర్ (ఎలుగుబంటి) చాలా దూకుడుగా స్పందించే జంతువు. ఆహారం లేదంటే ప్రాంతం విషయంలో ఎదురుపడినప్పుడు ఎలుగుబంటి వెనక్కి తగ్గకపోవచ్చు. దాని బలమైన గోర్లు, దూకుడు స్వభావం కారణంగా పులి కూడా ఇలాంటి ఘర్షణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.మరి సింహం పులిని ఓడించగలదా?పులి, సింహం మధ్య ఎవరు బలమైనవారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. శారీరక బలం, ఒంటరి వేట విషయంలో పులికి కొంత ఆధిక్యత ఉంటుందని చెబుతారు. అయితే సింహం బలం వేరే. అది గుంపుగా జీవిస్తుంది. ఒక సింహం కంటే.. మొత్తం గుంపుగా ఉన్న సింహాలు చాలా ప్రమాదకరం. పులి, సింహం ఎదురుపడితే ఎవరు గెలుస్తారనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. వాటి పరిమాణం, వయసు, ఆరోగ్యం, పరిస్థితులపై ఫలితం ఆధారపడి ఉంటుంది.పులి అసలు బలం ఏంటి?పులి గొప్పతనం కేవలం దాని బలంలో లేదు.. దాని వ్యూహంలో ఉంది. ఒంటరిగా జీవించే ఈ జంతువు సహనం, తెలివి, సమయస్ఫూర్తితో వేటాడుతుంది. తనకంటే పెద్ద జంతువులను కూడా సరైన సమయం చూసి ఎదుర్కోగలదు. కానీ అవసరం లేని పోరాటాలకు వెళ్లదు. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం దాని ప్రాణాలకు ముప్పే. అడవిలో శాశ్వతంగా బాస్ ఎవరూ ఉండరు. ప్రతి జీవికి ఒక బలం ఉంటుంది.. అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంటుంది. -
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
రాష్ట్రంలో రాయల్ గర్జన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెద్ద పులులు సందడి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వాటి కదలికలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్కు 60 కి.మీ దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో 50 ఏళ్ల తర్వాత పెద్దపులి కనిపించి స్థానికులను ఆశ్చర్యంతో పాటు భయాందోళనలకు గురిచేసింది. రాష్ట్ర రాజధానికి దాదాపు వంద కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాల్లో.. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పులి ప్రవేశించింది. వీటితో పాటు.. కొన్నిరోజులుగా వివిధ జిల్లాల్లో పెద్దపులుల పాదముద్రలు, వాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. పులులు ఆహార అన్వేషణకు, తమ ఆవాస స్థిరీకరణ కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నాయనే వాదన దీనినే బలపరుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో (టైగర్ రిజర్వ్ల వెలుపలి ప్రదేశాల్లో) దాదాపు ఆరేడు కొత్త పులుల (మొత్తం కలిపి) సంచారంపై తమకు సమాచారం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రస్తుతం 19 జిల్లాల్లో వాటి పాదముద్రలు, విసర్జనలు (పెంటికలు), ఆవులు, దూడలు, ఇతర జంతువులపై దాడుల వంటి ఘటనల ద్వారా గుర్తించినట్టు సాక్షికి వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశించిన ఈ ఆరేడు పులుల కదలికలే ఆయా జిల్లాల్లోనూ కనిపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక పులి మణుగూరులో స్థిర నివాసం ఏర్పరుచుకోగా, ఆంధ్రా–ఖమ్మం సరిహద్దులలో మరొకటి, లక్సెట్టిపేటలో ఇంకొకటి, తిర్యాణీ–ఆసిఫాబాద్లలో మరోటి సంచరిస్తోంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో పెద్దపులుల సంఖ్య 48 నుంచి 50 దాకా ఉండొచ్చునని అటవీ అదికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా ఫొటోలు, తదితర ఆధారంగా చూస్తే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో 36 (అదనంగా పులి పిల్లలు 6 దాకా), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) చుట్టుపక్కల అయిదు.. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఇంకా ఇతర జిల్లాల్లో మూడు, నాలుగు ఉంటాయని చెబుతున్నారు. అక్కడి నుంచే వలసలు..ఆదిలాబాద్ జిల్లాలోకి పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని తాడోబ–అంధారీ టైగర్ రిజర్వ్, తిప్పేశ్వర్ వైల్డ్లైఫ్ సఫారీపార్క్ ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి పులుల అభయారణ్యాల నుంచి పెద్దపులుల వలసల పెరుగుదల ప్రధాన కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి పులులు గోదావరి, ఇంద్రావతి, పెన్గంగా నదులు దాటి తెలంగాణ అడవుల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని టైగర్ రిజర్వ్లలో పులుల సంతతి బాగా పెరగడంతో, ఆహారం–ఆవాసం వెతుకులాటలో ఈ వలసలు పెరుగుతున్నాయి. ఈ విధంగా పొరుగు రాష్ట్రాల నుంచి.. టైగర్ కారిడార్గా ఉన్న రాష్ట్రంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మీదుగా పెద్దపులులు వివిధ జిల్లాల్లో సంచరించడం అధికమైంది. జగిత్యాల, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో పులుల కదలికలు పెరిగాయి. అయితే మహారాష్ట్ర నుంచి కవ్వాల్ రిజర్వ్కు పులులు వస్తున్నప్పటికీ.. అవి అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. తరచూ వలస పులులు వస్తూ పోతుండడంతో అనిశ్చితి ఏర్పడింది.ఏటీఆర్లోనే 42.. కేటీఆర్లో పులుల పునరుద్ధరణ ప్రాజెక్టురాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో అటవీ రక్షణ చర్యలు విజయవంతం కావడంతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా 2026 ముందస్తు అంచనాల ప్రకారం.. ఏటీఆర్లో గతంలో ఉన్న 36 నుంచి పెద్దపులుల సంఖ్య 42కి పెరిగింది. ఇక్కడ విజయవంతంగా సంతానోత్పత్తి జరుగుతోంది. అమ్రాబాద్ పులుల వర్గీకరణ ఇలా ఉంది.. ఆడ పులులు –18, మగ పులులు –14, అర్ధ–వయోజన పులులు–2, పులి పిల్లలు (కబ్స్)–8 ఉన్నాయి. తాజా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ 2026) నివేదికల ప్రకారం.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ (ప్రధాన) ఏరియాలో ప్రస్తుతం ఎటువంటి శాశ్వత లేదా సంతానోత్పత్తి చేసే పులులు లేవు.మహారాష్ట్రలోని తడోబా–అంధారి, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి రిజర్వ్ల నుండి సుమారు 5 పులులు అప్పుడప్పుడు కవ్వాల్ సరిహద్దులు, బఫర్ జోన్, కారిడార్ల (కాగజ్నగర్ డివిజన్) గుండా ఇక్కడికి వస్తూ వెళ్తుంటాయి. అయితే, అవి ఇక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు. అడవుల నరికివేత, మానవ జోక్యం, శాశ్వత ఆడ పులులు లేకపోవడం, వేటాడే జంతువుల కొరత కారణంగా పులులు ఇక్కడ స్థిరపడలేక పోతున్నాయి. కవ్వాల్లో పులుల సంఖ్యను పెంచేందుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఇటీవల మొదటి దశ పులుల పునరుద్ధరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్ నుండి ఐదు పులులను (కనీసం ఒక ఆడపులితో కలిపి) కవ్వాల్కు తరలించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పులుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం (కోర్ ఏరియా) నుంచి గ్రామాల తరలింపు ఒకవైపు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్థానిక గిరిజన తెగల నుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ను మహారాష్ట్రలోని తడోబా రిజర్వ్తో కలిపే కారిడార్ను సురక్షితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1,500 చ.కి.మీ పరిధిని ’కుమురం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్’గా నోటిఫై చేయాలని భావించింది. అయితే తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, దీని ఏర్పాటుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని స్థానిక గిరిజనులు భారీ బంద్ నిర్వహించడంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది. -
జాబిల్లిని ఢీకొట్టనున్న రాకెట్ శకలం!
సరిగ్గా ఇంకో ఎనిమిది రోజులు! అంటే ఆగస్టు 5వ తేదీ... చందమామపై ఓ రాకెట్ శరవేగంతో కుప్పకూలిపోనుంది! రాక్షసబల్లులు అంతరించిపోయేందుకు ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనడం కారణమని అంటారు. ఆగస్టు ఐదున జాబిల్లిని ఢీకొట్టబోతున్న రాకెట్ శకలం అంత పెద్దదీ కాదు.. అక్కడ రాక్షసబల్లి కాదు కదా.. చిన్న చీమ లాంటి జీవి కూడా లేదు. కాబట్టి మనిషికొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ... ఈ ఘటన మనకు ఒక అవకాశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఇదే చందమామపై బోలెడన్ని స్థావరాలు కట్టేçసుకోవాలనుకుంటున్న మనిషి... కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తోంది. ఇప్పుడు వివరాల్లోకి వద్దాం... స్పేస్ ఎక్స్ గురించి మీకు తెలుసు కదా.. ఈ కంపెనీ గత ఏడాది చంద్రుడిపైకి ఒక రాకెట్ను ప్రయోగించింది. రెండు ల్యాండర్లను జాబిల్లిపైకి పంపాలన్న ఈ ప్రాజెక్టు విజయవంతమైంది కానీ... వాడేసిన ఒక భాగం మాత్రం కొంచెం దూరంలో తిరుగుతూ ఉంది. అస్థిర కక్ష్యలో వదిలేసిన కారణంగా అది నెమ్మదిగా జాబిల్లివైపు వెళుతోంది. భూమికి తిరిగి వచ్చేందుకు లేదా అంతరిక్షంలోకి వెళ్లిపోయేందుకు ఇంధనం లేదు దీంట్లో. ఫలితంగా చంద్రుడి ఆకర్షణ శక్తి ప్రభావంతో ఆగస్టు ఐదవ తేదీ గంటకు 8700 కిలోమీటర్ల వేగంతో పడిపోనుంది. ఈ ధాటికి సుమారు 60 నుంచి 70 అడుగుల భారీ గుంత పడనుంది. చంద్రుడిపైని మట్టి (రెగోలిథ్) కొన్ని కిలోమీటర్ల ఎత్తువరకూ చిమ్మనుంది. అంతే. భూమికి కానీ... మన వ్యోమగాములకు గానీ.. కక్ష్యలో తిరుగుతున్న ఇతర ఉపగ్రహాలకు కానీ ఎలాంటి నష్టమూ లేదు. కానీ... జాబిల్లి ఎవరిది? తెలిసికానీ.. తెలియకుండా కానీ దాని రూపురేఖలను మార్చే హక్కు మనిషికి ఉందా? అన్నది కీలకం కానుందని అంతర్జాతీయ అంతరిక్ష నిపుణులు అంటున్నారు. జాబిల్లిపై రాకెట్ శకలం కూలిపోవడం ఒక అరుదైన ఘట్టమే. రాకెట్ సైజు, వేగం, ఎక్కడ పడుతోంది? అన్న సమాచారం మనకు ఎలాగూ తెలుసు కాబట్టి... భారీ శకలాలు ఢీకొన్నప్పుడు ఎలా కంతలు పడతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడవచ్చు. అయితే మన భూమి మాదిరి జాబిల్లిపై వాతావరణం లేదు. గాలి కూడా ఉండదు. అందుకే అప్పుడెప్పుడో 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆ్రల్డిన్లు వేసిన అడుగుల జాడలు ఇప్పటికీ చెదరకుండా ఉన్నాయి. స్పేస్–ఎక్స్ రాకెట్ శకలం మాదిరి ఏవేవో వచ్చి జాబిల్లిపై కూలిపోతూంటే.. ఇలాంటి వారసత్వ చిహ్నాలు కనుమరుగవుతాయని.. లేదంటే ఇప్పటికే జాబిల్లిపై ఉన్న సైంటిఫిక్ పరికరాలను ధ్వంసం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతరిక్షం మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఏ దేశం కూడా దీన్ని తమదిగా చెప్పుకునే అవకాశం లేకుండా 1967లో అంతర్జాతీయ ఒప్పందం ఒకటి కుదిరింది. అయితే ఇందులో జాబిల్లిసహా అంతరిక్షాన్ని ఎలా వాడుకోవాలన్న అంశంపై మార్గదర్శకాలు కానీ.. నియంత్రణలు కానీ లేవు. ఆయా దేశాలు, కంపెనీలదే బాధ్యత. అంటే... ఇప్పుడు స్పేస్–ఎక్స్ రాకెట్తో జరిగే నష్టానికి ఆ కంపెనీ, అమెరికాది బాధ్యతన్నమాట. ఇక్కడే వివాదం మొదలవుతుంది. అందుకే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేందుకు జాబిల్లిపైకి జరిపే ప్రయోగాలపై ఒక అంతర్జాతీయ రిజిస్ట్రీ సిద్ధం చేయాలని, ఎవరైనా తప్పు చేస్తే నోటీసులు జారీ చేయాలని, పర్యవేక్షణకు ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాట్లు జరగాలని నిపుణులు కోరుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్వాచ్లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్వాచ్లు, స్పోర్ట్స్వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్పూల్స్, పూర్తిస్థాయి జిమ్లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్కో, వాకింగ్కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్వేర్, బాటా, రిలాక్సో ఫుట్వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్లు. రెండు యాక్టివ్ లైఫ్స్టయిల్ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్ఫిట్ జిమ్లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
జంతర్ మంతర్ నిరసనల కాలక్రమం
జూన్ 6, 2026: జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు షురూ! ⇒ ప్రధాన డిమాండ్: నీట్ యూజీ–2026 పేపర్ లీక్, సీబీఎస్ఈ ఆన్‑ స్క్రీన్ మార్కింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. జూన్ 28, 2026: సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష మొదలు. దేశవ్యాప్తంగా అందరి, ముఖ్యంగా జెన్–జీ దృష్టిని ఆకర్షించిన ఘట్టమిది. ⇒ భారతదేశం నలుమూలల నుంచి సీజేపీ ఉద్యమానికి సంఘీభావం. వెల్లువలా జంతర్మంతర్కు జెన్–జీ. జూలై 18, 2026: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను హైకోర్టు ఆదేశాల మేరకు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్ భార్య అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు జూలై 21న మెదాంత ఆసుపత్రికి తీసుకెళ్లేందకు అనుమతిచి్చంది. జూలై 20, 2026: చలో సంసద్ ర్యాలీ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు. మహిళలు సహా పలువురు విద్యార్థులకు గాయాలు. కొంతమందిపై పెల్లెట్ గన్ ప్రయోగం. జంతర్ మంతర్ చుట్టూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల మోహరింపు. జూలై 23, 2026 (రాత్రంతా జాగరణ): గాయాలు, అలసట ఉన్నప్పటికీ విద్యార్థులు నిరసన శిబిరాన్ని కొనసాగించారు. ఆటలు, పాటలతో సందడిగా రాత్రంతా సందడిగా మారింది జంతర్ మంతర్. ⇒ దేశం నలుమూలల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఎందరో ఉద్యమంలో పాల్గొంటున్న వారికి స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆహార పానీయాలు పంపించడం, కుర్రాళ్ల విన్యాసాలతో ఆ రాత్రి నిరసన కార్యక్రమాల్లో కొంగొత్త వైఖరిని ఆవిష్కరించింది. గాయాలతో విశ్రాంతి తీసుకుంటున్న కొందరికి స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారం, నీరు, మందులు పంపిణీ చేశారు; ఉక్కబోత నుంచి ఉపశమనం కలిగించేందుకు విసనకర్రలతో వారికి సపర్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ⇒ నిరసనకారులు రాక్స్టార్ సినిమాలోని ‘‘సడ్డా హక్’’తోపాటు చాలా సినిమా పాటలను ఉత్సాహంగా పాడి, ఆడారు. నినాదాలు రాత్రంతా మారుమోగాయి. జూలై 24, 2026: కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ నేత జితేంద్ర సింగ్ మెదాంత ఆసుపత్రిలో సోనమ్ వాంగ్చుక్తో చర్చలు జరిపారు. ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన షరతులకు రాతపూర్వక అంగీకారం తెలపడంతో ఆమరణ నిరాహార దీక్షను ఉపసంహరించుకుంటున్నట్లు సోనమ్ వాంగ్చుక్ ప్రకటించారు. జూలై 25, 2026: పేపర్ లీక్పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ⇒ నిరసనకారులు దీనిని పాక్షిక విజయంగా ప్రకటించారు, కానీ పరీక్షల నిర్వహణ. పారదర్శకతపై మరిన్ని సంస్కరణలు అవసరమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. -
కాక్రోచే అనుకుంటే.. కదం తొక్కింది!
ఒక్క మాట.. మహోద్యమంగా మారింది. ‘కాక్రోచ్’ పుట్టుకకు కారణమైంది.. ఈ ఏడాది మే 16న దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ యాదవ్ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్య ఒకటి వైరల్ అయిపోయింది. దేశంలోని నిరుద్యోగ యువత బొద్దింకల్లా (కాక్రోచ్) మారారని సీజేఐ వ్యాఖ్యానించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమైంది. తన ఉద్దేశం అది కాదని సీజేఐ తరువాత చెప్పుకున్నారు అది వేరే విషయం. కానీ...యువతను బొద్దింకలతో పోల్చారన్న విషయం.... మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదువు చదివి.. అమెరికాలోని బస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్పై పీజీ చేస్తున్న 30 ఏళ్ల అభిజిత్ దీప్కేకు అంతగా రుచించలేదు.అప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అనుభవం ఉండటమో ఇంకో కారణమో తెలియదు కానీ... సీజేఐ వ్యాఖ్యపై వ్యాఖ్యానిస్తూ.... ‘‘బొద్దింకలన్ని ఒక్కటైతే ఏమవుతుంది?’’అని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది కాస్తా జెన్–జీ గుండెలను నేరుగా తాకింది. ఇంకేముంది... రికార్డు సమయంలో లక్షల మంది ఫాలోవర్లు సిద్ధమైపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతగానంటే... ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకుంటూ వచి్చన భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్యను కూడా మించిపోయేంత! యువతలోని ఈ జోష్ అభిజిత్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ... అప్పటికే నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో తలపట్టుకుని ఉన్న కేంద్రం మే 21న మారు పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ హ్యాండిల్ను స్తంభింపజేసింది. ఇంకేముంది అగ్గి రాజుకుంది! మద్దతుదారులు ‘Cockroach is Back’’, పేరుతో కొత్త హ్యాండిల్ను సృష్టించడం, గంటల్లోనే 280,000 కంటే ఎక్కువమంది ఫాలోవర్లు చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎక్స్ హ్యాండిల్ పునరుద్ధరణకు ఢిల్లీ హైకోర్టును నిరాకరించడం (మే 29వ తేదీ)తో ఇరుపక్షాల్లోనూ పంతం పెరిగినట్టు అయ్యింది. ఈ లోపుగానే ఒక పక్షం కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులపై రకరకాల ముద్రలు వేయడం మొదలుపెట్టారు.ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఉద్యమాలు నడపడం ఏమిటని అభిజిత్ను ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానంగా జూన్ మొదటి వారంలో అభిజిత్ దేశానికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే జూన్ ఆరవ తేదీన నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో నిరసనకు దిగారు. కొన్ని రోజుల తరువాత లడాఖ్ విద్యావేత్త, ఇంజినీర్ సోనమ్ వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతివ్వడం, ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జరిగిపోయాయి. వాంగ్చుక్ సుమారు 26 రోజులపాటు నిరాహార దీక్ష చేసిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను ఆసుపత్రికి తరలించడం, ఆ తరువాత రెండు రోజులకు అంటే జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ ర్యాలీలో పోలీసుల లాఠీచార్జితో జెన్–జీ మొత్తం ఏకమైంది. ఈ దశలో కేంద్రం కూడా ఒక మెట్టు దిగి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశమిస్తూ... ప్రశ్న పత్రాల లీకేజీలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిందితులకు మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష, పది కోట్ల రూపాయల వరకూ జరిమానా విధిస్తామని ప్రకటించారు. అయినా సరే.. అభిజిత్ దిప్కే వర్గం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనే ఉద్యమం ఆగుతుందని కుండబద్దలు కొట్టారు. దీంతోపాటు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని, ఛలో సంసద్లో విద్యార్థులపై లాఠీలు ఝళిపించిన పోలీసులపై చర్యలు, విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకూడదన్న షరతులు పెట్టాయి. రెండు దఫాల చర్చల తరువాత ప్రధాన్ రాజీనామా మినహా మిగిలిన షరతులకు ఓకే చెప్పింది. అయినప్పటికీ ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ పట్టు వీడలేదు. దీంతో ఎట్టకేలకు జూలై 25న ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచి్చంది. దీంతో ఉద్యమమైతే సమసింది కానీ... ముందేం జరుగుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహరాలో ఏనుగులు.. దట్టమైన అడవులు! గతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి.. సహారా. పేరు వినగానే మన కళ్ల ముందు అంతులేని ఇసుక తిన్నెలు, మండే ఎండలు, చుక్క నీరు కూడా దొరకని నిర్మానుష్య భూభాగమే కనిపిస్తుంది. దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఎడారి.. ప్రస్తుతం ఉత్తర ఆఫ్రికాలోని పలు దేశాలను కప్పేసి ఉంది. కానీ వేల సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతం పూర్తిగా భిన్నంగా ఉండేదంటే నమ్మగలమా?ఇప్పుడు ఇసుక తుఫానులతో కనిపించే సహారా.. ఒకప్పుడు పచ్చని గడ్డి మైదానాలు, దట్టమైన అడవులు, ప్రవహించే నదులు, భారీ సరస్సులతో కళకళలాడిన ప్రాంతం. అక్కడ ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, ఖడ్గమృగాలు వంటి భారీ జంతువులు సంచరించేవి. మనుషులు కూడా అక్కడ నివసిస్తూ వేటాడుతూ, చేపలు పట్టుతూ, వ్యవసాయం చేస్తూ జీవించేవారట.‘గ్రీన్ సహారా’గా మారిన ఎడారిశాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. సుమారు 11 వేల నుంచి 5 వేల సంవత్సరాల క్రితం మధ్య కాలంలో సహారా ప్రాంతం ‘ఆఫ్రికన్ వెట్ పీరియడ్’ (African Humid Period)గా పిలిచే తేమతో కూడిన దశను ఎదుర్కొంది. ఆ సమయంలో భూమి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎడారి ప్రాంతం పచ్చని భూభాగంగా మారింది. అప్పట్లో సహారాలో అనేక సరస్సులు ఏర్పడ్డాయి. కొన్ని సరస్సులు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేవని ఆధారాలు చెబుతున్నాయి. నదులు ప్రవహించడంతో జీవ వైవిధ్యం పెరిగింది. ఇప్పటి ఇసుక దిబ్బల కింద కూడా పురాతన నదీ మార్గాలు, సరస్సుల ఆనవాళ్లు శాస్త్రవేత్తలకు కనిపించాయి.గోడలపై కనిపించిన గతంసహారా ప్రాంతంలోని పురాతన రాతి చిత్రాలు కూడా అక్కడి చరిత్రను చెబుతున్నాయి. వేల సంవత్సరాల నాటి గుహలు, రాళ్లపై చెక్కిన చిత్రాల్లో ఏనుగులు, నీటి గుర్రాలు, జిరాఫీలు, పశువులు వంటి జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. ఇవి ఒకప్పుడు అక్కడ విస్తారమైన జీవజాలం ఉండేదనడానికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఆ కాలంలో మనుషులు కూడా అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వేటతో పాటు పశుపోషణ, వ్యవసాయం చేసినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి.ఎలా ఎడారిగా మారింది?సహారా మార్పుకు ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి అక్షం స్వల్పంగా మారడం వల్ల సూర్యకిరణాల ప్రభావం, వర్షపాతం నమూనాలు మారాయి. క్రమంగా వర్షాలు తగ్గిపోయాయి. సరస్సులు ఎండిపోయాయి. నదులు కనుమరుగయ్యాయి. పచ్చని మైదానాలు క్రమంగా ఇసుక ప్రాంతాలుగా మారిపోయాయి. వేల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో సహారా ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటిగా మారింది.భవిష్యత్తులో మళ్లీ మారుతుందా?ప్రకృతి చరిత్రలో ఎడారులు శాశ్వతంగా ఒకే రూపంలో ఉండవని సహారా కథ చెబుతోంది. వాతావరణ పరిస్థితులు మారితే భూభాగాలు కూడా మారిపోతాయని ఇది నిరూపిస్తోంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల ప్రభావంతో సహారా మళ్లీ పచ్చగా మారే అవకాశం తక్షణ భవిష్యత్తులో లేదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి సహారా మనకు ఓ అంతులేని ఎడారిలా కనిపించినా.. దాని ఇసుక పొరల కింద ఓ పచ్చని చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు నదులు ప్రవహించిన, జంతువులు సంచరించిన, మనుషులు జీవించిన ఈ భూమి.. ప్రకృతి శక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. -
గల్ఫ్లో డ్రోన్ వార్.. ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరు?.. అమెరికా ఆరా
గల్ఫ్ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడులు ఇప్పుడు మరో అంతర్జాతీయ రహస్యానికి తెరతీశాయి. అమెరికా కీలక నిఘా సంస్థ సీఐఏకు చెందిన రహస్య స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అయితే ఈ దాడుల వెనుక ఇరాన్ సొంత సామర్థ్యమే ఉందా? లేక మరేదైనా శక్తి సాంకేతికంగా సహకరించిందా? అన్న కోణంలో అమెరికా నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి.ముఖ్యంగా ఇరాన్ ఉపయోగించిన డ్రోన్ల కచ్చితత్వం, లక్ష్యాలను చేరుకున్న విధానం అమెరికా అధికారుల్లో అనుమానాలు పెంచుతోంది. ఇంత అధునాతన సామర్థ్యం కలిగిన డ్రోన్లు ఎలా సిద్ధమయ్యాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.CIA స్థావరాలే లక్ష్యంగా?రాయిటర్స్ కథనం ప్రకారం.. మార్చిలో గల్ఫ్ ప్రాంతంలోని కొన్ని సీఐఏ అనుబంధ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీఐఏ కేంద్రం, ఇరాక్లోని మరో సీఐఏ అనుబంధ ప్రాంతం కూడా లక్ష్యంగా మారినట్లు సమాచారం. మరిన్ని రహస్య స్థావరాలు కూడా దాడుల పరిధిలోకి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దాడులకు ఇరాన్కు చెందిన ‘షహీద్’ డ్రోన్లను ఉపయోగించినట్లు పాశ్చాత్య నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.టెక్నాలజీ ఆ దేశానిదేనా?అమెరికా దర్యాప్తులో ఇప్పుడు కీలకంగా మారిన అంశం.. ఇరాన్ డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచడంలో రష్యా పాత్ర ఉందా అన్నది. ముఖ్యంగా రష్యాకు చెందిన ‘కొమెటా-ఎం’ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఇరాన్ డ్రోన్లలో ఉపయోగించారా అనే కోణంలో పరిశీలన సాగుతోంది. ఈ సాంకేతికత వల్ల డ్రోన్లు మరింత కచ్చితంగా లక్ష్యాలను చేరుకోవడంతో పాటు, వాటిని ఎలక్ట్రానిక్ జామింగ్తో అడ్డుకోవడం కూడా కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.దాడుల వెనుక నిఘా సమాచారమా?ఇరాన్కు రష్యా కేవలం సాంకేతిక సాయం మాత్రమే అందించిందా? లేక లక్ష్యాల వివరాలు, నిఘా సమాచారం కూడా ఇచ్చిందా? అనే అంశాన్ని అమెరికా పరిశీలిస్తోంది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇరాన్ అసలు లక్ష్యం అమెరికా రాయబార కార్యాలయాలు కావొచ్చని, సీఐఏ కేంద్రాలు అనుకోకుండా దెబ్బతిని ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై తుది నిర్ధారణకు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.రష్యా–ఇరాన్ బంధంపై కొత్త చర్చఇప్పటికే రష్యా, ఇరాన్ మధ్య సైనిక సహకారం కొనసాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ డ్రోన్ల వినియోగంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న వేళ.. గల్ఫ్లో అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడుల్లో రష్యా పాత్ర ఉందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అమెరికా, రష్యా ప్రభుత్వాలు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.డ్రోన్లతో సాగుతున్న ఆధునిక యుద్ధంలో.. ఒక దేశం దాడి చేస్తే, దాని వెనుక సాంకేతిక బలం ఎవరిది? అనే ప్రశ్న ఇప్పుడు గల్ఫ్ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఇరాన్ డ్రోన్ దాడుల వెనుక నిజంగా రష్యా హస్తం ఉందా? లేక ఇది కేవలం అనుమానమేనా? అమెరికా దర్యాప్తు తేల్చాల్సి ఉంది. -
ప్రతి సెకను ఇక పక్కా..
ఆధునిక డిజిటల్ యుగంలో ప్రతి సెకను కూడా ఎంతో విలువైనది. మనం మొబైల్ ఫోన్ ద్వారా చేసే నగదు బదిలీలు, ఫోన్ కాల్స్, విద్యుత్ సరఫరా వ్యవస్థల పర్యవేక్షణ, ఉపగ్రహ సమాచార మార్పిడి వంటి రంగాలన్నింటికీ కచ్చితమైన సమయం అత్యంత ముఖ్యం. అయితే మన దేశంలో ఇలాంటి కీలక వ్యవస్థలన్నీ ఇప్పటివరకు అమెరికాకు చెందిన అంతరిక్ష ఉపగ్రహ ఆధారిత వ్యవస్థలపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించి భారతదేశానికి డిజిటల్ సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తిని చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ’ఒకే దేశం, ఒకే కాలం’ అనే అద్భుతమైన సంకల్పంతో సరికొత్త ’వైట్ రాబిట్’ సాంకేతిక ఆధారిత నెట్వర్క్ను బెంగళూరులోని ప్రాంతీయ ప్రమాణాల ప్రయోగశాలలో ప్రారంభించింది. ఏమిటీ వైట్ రాబిట్ సాంకేతికత..?గతంలో కంప్యూటర్లు, సర్వర్లలో సమయాన్ని సరి చేయడానికి సాధారణ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వాడేవారు. కానీ ఆయా ప్రోటోకాల్స్ను ఎంత పకడ్బందీగా పాటించినా వాటిలో మిల్లీసెకన్ల (సెకనులో వెయ్యో వంతు) తేడా వచ్చేది. వైట్ రాబిట్ సాంకేతికత ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుంది. యూరప్ అణు పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు మొదటగా ఈ సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఇది ఆప్టికల్ ఫైబర్ సహాయంతో నడిచే ఒక అత్యంత కచ్చితమైన నెట్వర్క్ ప్రోటోకాల్. దీని ద్వారా అనుసంధానించిన గడియారాలు ఒక నానో సెకను (సెకనులో వంద కోట్ల వంతు) కంటే తక్కువ తేడాతో కచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. సాధారణంగా సమాచార ప్రసారంలో నెట్వర్క్ ఆలస్యం కావడం వల్ల సమయం మారే అవకాశం ఉంటుంది. కానీ వైట్ రాబిట్ సాంకేతికత ఆ ఆలస్యాన్ని ఎప్పటికప్పుడు స్వయంచాలకంగా సరిచేస్తూ అన్ని ప్రాంతాల్లోని పరికరాలు ఒకే అత్యున్నత కచ్చితమైన సమయంతో నడిచేలా చూస్తుంది. సమష్టి కృషితో సాధించిన విజయం.. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నేషనల్ ఫిజికల్ ల్యా»ొరేటరీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వంటి అగ్రగామి సంస్థలు సమష్టిగా కృషి చేసి ఈ స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. బెంగళూరు ప్రయోగశాల నుండి చెన్నైలోని జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ కేంద్రానికి ఈ సురక్షిత కాల ప్రసారాన్ని విజయవంతంగా పరీక్షించారు. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో నమ్మకమైన ఇంటర్నెట్ ఎంత ముఖ్యమో సురక్షితమైన కాలపాలన అంతకంటే ముఖ్యం. అభివృద్ధి చెందిన భారతదేశ విజన్ దిశగా, డిజిటల్ మౌలిక సదుపాయాలలో స్వయం సమృద్ధిని సాధించడంలో ఈ ’వైట్ రాబిట్’ సాంకేతికత ఒక మైలురాయిగా నిలుస్తుంది. దేశంలోని అన్ని వ్యవస్థలు, కంప్యూటర్లు, ప్రభుత్వ రంగాలు ఒకే రకమైన కచ్చితమైన సమయాన్ని పాటించేలా చూసే అధికారిక విధానాన్నే కాలపాలన అంటారు. దేశీయ కాలమానానికి భద్రతా కవచం.. ప్రస్తుతం బ్యాంకింగ్, రక్షణ రంగాలు విదేశీ ఉపగ్రహ సంకేతాల ద్వారా సమయాన్ని పొందుతున్నాయి. వీటికి సైబర్ దాడులు జరగడం, సంకేతాలను తారుమారు చేయడం లేదా జామింగ్ వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. ఒకవేళ ఈ విదేశీ వ్యవస్థలు నిలిచిపోతే మన దేశ డిజిటల్ వ్యవస్థ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ వైట్ రాబిట్ ఆధారిత భూతల నెట్వర్క్ రూపుదిద్దుకుంది. ఇది భారతదేశ అధికారిక కాల పరిశోధన ప్రయోగశాలల నుండి నేరుగా భారతీయ ప్రమాణ కాలాన్ని సురక్షితంగా సరఫరా చేస్తుంది. దీనివల్ల బాహ్య శక్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.కచ్చితమైన కాలముద్రలు..సాధారణంగా ఒక డిజిటల్ నెట్వర్క్లో ఏదైనాఒక సంఘటన లేదా లావాదేవీ జరిగినప్పుడు అది జరిగిన రోజు, గంట, నిమిషం, సెకను, సెకనులో వంద కోటో వంతు (నానో సెకను) సమయాన్ని కూడా డిజిటల్గా రికార్డు చేయడాన్ని ’కచ్చితమైన కాలముద్ర’ అంటారు. లావాదేవీలకు ఆధారం: ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు, ఆ డబ్బు ఏ కచ్చితమైన సమయానికి ఖాతా నుండి కట్ అయింది, అవతలి వారికి చేరిందీ లేనిదీ ఈ కాలముద్ర ద్వారానే తెలుస్తుంది. ఒకవేళ లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి ఇది ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. సైబర్ మోసాల నిరోధం: ఒకే బ్యాంక్ ఖాతా లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఒకే నిమిషంలో రెండు వేర్వేరు నగరాల్లో లావాదేవీలు జరిగితే, కాలముద్రల సహాయంతో భద్రతా వ్యవస్థలు ఆ మోసాన్ని వెంటనే గుర్తించి ఖాతాను నిలిపివేస్తాయి. స్టాక్ మార్కెట్ వ్యాపారం: స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు వేగంతో మారిపోతుంటాయి. ఒక షేరును ఎవరు ముందు కొన్నారనేది మైక్రోసెకన్లు, నానోసెకన్ల కాలముద్రల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇది ట్రేడింగ్లో పారదర్శకతను పెంచుతుంది. డిజిటల్ రికార్డుల భద్రత: కంపెనీలు, ప్రభుత్వాలు, బ్యాంకులు తమ డిజిటల్ ఫైళ్లలో ఎవరు, ఎప్పుడు, ఏ మార్పులు చేశారో తెలుసుకోవడానికి ఈ కాలముద్రలు ఉపయోగపడతాయి. ఇది వ్యవస్థలో అవకతవకలు జరగకుండా చూస్తుంది. రక్షణ, కమ్యూనికేషన్ రంగాలు: ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలు, మొబైల్ నెట్వర్క్లు (5జీ వంటివి) సరిగ్గా పనిచేయడానికి అన్ని పరికరాలు ఒకే కచ్చితమైన సమయాన్ని కలిగి ఉండాలి. చిన్న సమయ తేడా ఉన్నా సమాచార ప్రసారం నిలిచిపోయే ప్రమాదం ఉంది. – సాక్షి, హైదరాబాద్ -
ఇక ఫేస్ను కూడా అమ్ముకోవచ్చు!
ఇప్పటివరకు మనం ఇళ్లు, భూములు, బంగారం, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల గురించి విన్నాం, చూశాం. కానీ ‘ఫేస్వాల్యూ’అనే మాటను నిజం చేస్తూ... మనుషులు తమ ముఖాలను కూడా అమ్ముకునే రోజులు వచ్చేశాయని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, చైనా వినోద రంగంలో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్! చైనాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించే షార్ట్ డ్రామాల పరిశ్రమ ఊహించని వేగంగా విస్తరిస్తోంది. రోజుకు వందలాది కొత్త వీడియోలు విడుదలవుతున్నాయి. అయితే, పరిమిత బడ్జెట్ కారణంగా ఒకే నటుడి ముఖం వేర్వేరు పాత్రల్లో, భిన్నమైన రూపాల్లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఒక వీడియోలో ప్రేమకథలో హీరోగా కనిపించిన వ్యక్తి... మరో వీడియోలో హంతకుడిగా, ఇంకో దాంట్లో డాక్టర్గా దర్శనమిస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్లు చేయడం నిర్మాతలకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొందరు నిర్మాతలు ఫేస్ బయ్యింగ్ అనే క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చారు. అందంగా ఉండి, ఎలాగైనా స్క్రీన్పై కనిపించాలనే కోరిక ఉన్న సామాన్యులను ఆహ్వానించి వారి ముఖాలను త్రీడీ స్కాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వారి డిజిటల్ రూపాన్ని భద్రపరుచుకుంటారు. ఈ డిజిటల్ ఫేస్లను ఏఐ సాయంతో తమ డ్రామాలు, సిరీస్లలో వాడుకుంటారు. దీనివల్ల సదరు వ్యక్తులు ప్రత్యక్షంగా షూటింగ్కు రావాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఒక్కసారి ఆ ఒప్పందంపై సంతకం చేస్తే... తమ ముఖాలపై ఆ అమ్మకందారులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయినా ఫర్వాలేదంటూ కేవలం 500 యువాన్లు (సుమారు రూ. 6 వేలు) ఆశపడి చాలామంది తమ ముఖ హక్కులను నిర్మాతలకు రాసిచ్చేస్తున్నారట. డిజిటల్ అస్తిత్వానికే ప్రమాదమా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ ట్రెండ్పై సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మన డిజిటల్ ఫేస్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే, దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారనే దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. భవిష్యత్తులో ఈ డేటాను సైబర్ నేరాలు, డీప్ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం మన డిజిటల్ గుర్తింపునే శాశ్వతంగా అమ్మేసుకోవడం... నిజంగా లాభమా? లేక కొరివితో తలగోక్కున్నట్టా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.-సాక్షి, సెంట్రల్ డెస్క్ -
హమాస్కు కొత్త బాస్.. గాజా కన్నీళ్లు తుడుస్తాడా?
యుద్ధం, ఆకలి, నిరాశ్రయ జీవితంతో అల్లాడుతున్న గాజాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ కొత్త అత్యున్నత నాయకుడిగా ఖలీల్ అల్-హయ్యా ఎన్నికయ్యారు. యాహ్యా సిన్వార్ తర్వాత సంస్థ పగ్గాలు చేపట్టిన ఆయనకు హమాస్ అంతర్గత ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ నాయకత్వ మార్పుతో గాజా ప్రజల ముఖచిత్రంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు!..యుద్ధం తమ ఇళ్లను, కుటుంబాలను, భవిష్యత్ను దెబ్బతీసిన వేళ.. హమాస్ నాయకత్వ మార్పుపై గాజా ప్రజల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కొత్త నాయకుడు కాల్పుల విరమణ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తుండగా.. మరికొందరు నాయకులు మారినా పరిస్థితులు మారకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరీ ఖలీల్ అల్-హయ్యా?ఖలీల్ అల్-హయ్యా హమాస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నేత. గాజాలో జన్మించిన ఆయన.. 1987లో హమాస్ ఏర్పాటైన నాటి నుంచి సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇస్లామిక్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. అనంతరం జోర్డాన్, సూడాన్లలో ఉన్నత విద్యను అభ్యసించారు.రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన అల్-హయ్యా.. ఆ తర్వాత హమాస్లో చురుకైన నాయకుడిగా ఎదిగారు. 2006లో పాలస్తీనా శాసనసభ ఎన్నికల్లో గాజా నుంచి విజయం సాధించారు. అనంతరం హమాస్ పొలిట్బ్యూరోలో కీలక సభ్యుడిగా మారారు. హమాస్ మాజీ నేతలు ఇస్మాయిల్ హనియె, యాహ్యా సిన్వార్లకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన.. సంస్థ రాజకీయ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నారు.చర్చల బల్లపై కీలకంగా.. ఖలీల్ అల్-హయ్యాకు మరో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్తో జరిగిన పరోక్ష చర్చల్లో హమాస్ తరఫున ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందాలపై ఖతార్, ఈజిప్ట్ వంటి మధ్యవర్తి దేశాలతో చర్చలు జరిపిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికతో భవిష్యత్లో హమాస్ చర్చల వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది. యుద్ధాన్ని కొనసాగించే వైఖరినే అనుసరిస్తారా? లేక చర్చలకు మరింత ప్రాధాన్యం ఇస్తారా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.యుద్ధం మిగిల్చిన వ్యక్తిగత విషాదంఖలీల్ అల్-హయ్యా జీవితంలోనూ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. 2007లో ఆయన ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో భార్య, పిల్లలు, సోదరులు సహా పలువురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో జరిగిన దాడుల్లోనూ ఆయన కుటుంబానికి చెందిన మరికొందరు మరణించారు. ఈ వ్యక్తిగత విషాదాలు ఆయన రాజకీయ వైఖరిపై ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్పై కఠిన వైఖరిని కొనసాగించే నేతల్లో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు.గాజా ప్రజలకు బతుకే ముఖ్యంహమాస్లో కొత్త నాయకుడు ఎన్నికైనప్పటికీ.. గాజాలో సామాన్య ప్రజల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇళ్లు కోల్పోయి, శిబిరాల్లో జీవిస్తున్న వేలాది కుటుంబాలకు రాజకీయ పరిణామాల కంటే రోజువారీ అవసరాలే ప్రధానంగా మారాయి. “మాకు నాయకులు మారడం ముఖ్యం కాదు.. మా పిల్లలకు ఆహారం కావాలి. తాగునీరు కావాలి. మందులు కావాలి. భయం లేకుండా జీవించే పరిస్థితి కావాలి” అని పలువురు గాజా ప్రజలు చెబుతున్నారు. మరికొందరు.. “ఏ నాయకుడు వచ్చినా మా జీవితాల్లో మార్పు కనిపించకపోతే ప్రయోజనం ఏమిటి? మాకు శాంతి కావాలి” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆశలు.. అనుమానాలు రెండూఖలీల్ అల్-హయ్యాకు చర్చల అనుభవం ఉండటంతో కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతా సహాయం వంటి అంశాల్లో పురోగతి సాధించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం నాయకుడు మారినా హమాస్ ప్రాథమిక విధానాల్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయన ఎన్నిక హమాస్ పోరాట వైఖరిని కొనసాగించే సంకేతమని విశ్లేషిస్తున్నవారూ ఉన్నారు.ముందున్న అతిపెద్ద సవాల్ ఇదేప్రస్తుతం ఖలీల్ అల్-హయ్యా ముందున్న సవాల్ హమాస్ను నడిపించడం మాత్రమే కాదు. యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజాలో పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు? కాల్పుల విరమణను స్థిరంగా కొనసాగించగలరా? అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య సంస్థ భవిష్యత్ వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారు? అన్నది కీలకంగా మారింది.గాజాలో మానవతా సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారగా.. ఆహారం, వైద్యం, విద్యుత్, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఖలీల్ అల్-హయ్యా నాయకత్వంపై ప్రపంచం దృష్టి పెట్టినా.. గాజా ప్రజల ఆకాంక్ష మాత్రం ఒక్కటే. “మాకు రాజకీయ విజయాలు వద్దు.. మా పిల్లలు భయపడకుండా బతికే రోజు రావాలి.” -
నీట్ లీక్.. రాజీనామా కచ్చితంగా చేయాలా??
ఒక పరీక్ష.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్.. కోట్లాది కుటుంబాల ఆశలు. అలాంటి పరీక్షా వ్యవస్థలో చిన్న లోపం జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మరి దేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్-యూజీలో ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు బాధ్యత ఎవరిది? లీక్కు పాల్పడిన వ్యక్తులదా? లేక ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న మంత్రిదా?..నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ అటు నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ డిమాండ్ను తోసిపుచ్చుతోంది. ప్రశ్నపత్రం లీక్కు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని, పరీక్షా వ్యవస్థలో మున్ముందు ఈ తరహావి జరగకుండా సంస్కరణలు చేపడుతున్నామని చెబుతోంది.అయితే ఇక్కడ అసలు ప్రశ్న.. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలి?. ఆయనేమైనా పేపర్ లీక్ చేశారా?. ఆయనపై ఎలాంటి ఆరోపణలు లేవు కదా అని!. కానీ.. తన శాఖ పరిధిలో ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థాపరమైన వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదా? అంటూ ఇంకోవైపు కూడా ఒత్తిడి నెలకొంది.నైతిక బాధ్యతా?.. పెద్ద మాటే!రాజకీయాల్లో “నైతిక బాధ్యత” అనేది చట్టపరమైన నేరంతో సమానం కాదు. ఒక మంత్రి స్వయంగా తప్పు చేశారని నిరూపణ కాకపోయినా.. తన శాఖలో జరిగిన తీవ్రమైన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవడం అనే సంప్రదాయం భారత రాజకీయాల్లో గతంలో కనిపించింది. అయితే కాలంతో పాటు ఈ సంప్రదాయంపై అభిప్రాయాలు మారాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు సాధారణంగా.. “తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం, దర్యాప్తు పూర్తి చేయడం, వ్యవస్థను సరిదిద్దడం”నే బాధ్యతగా చెబుతున్నాయి. ఇదే నీట్ వివాదంలోనూ కేంద్రం వాదన.గతం ఏం నేర్పింది మరి?నీట్ వ్యవహారంలో మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తోంది. 2024లోనూ నీట్-యూజీ నిర్వహణపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్షా విధానంపై అనుమానాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఆ సమయంలోనూ కేంద్ర విద్యాశాఖపై ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు ధర్మేంద్ర ప్రదానే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నీట్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినడంతో.. “గత వివాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? వ్యవస్థలో లోపాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు నీట్ వివాదాల నేపథ్యంలో కొందరు విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆందోళనలకు లోనై అఘాయిత్యాలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో.. పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు చెబుతున్నారు.అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. లీకో, అవకతవకలో.. పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావడమే అసలు బాధ్యత అని ప్రభుత్వం చెబుతోంది.గతంలో నైతిక బాధ్యతతో పదవి వదిలిన నేతల గురించి తెలుసా?.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న వీళ్లు పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి మరి!. లాల్ బహదూర్ శాస్త్రి..స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యతకు తొలి ఉదాహరణగా తరచూ ప్రస్తావించే పేరు లాల్ బహదూర్ శాస్త్రి. 1956లో తమిళనాడులోని అరియలూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి శాస్త్రి ప్రత్యక్షంగా కారణం కాదు. అయినప్పటికీ రైల్వే మంత్రిగా శాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలుత ఆయన నిర్ణయాన్ని అంగీకరించకపోయినా.. శాస్త్రి పట్టుదలతో చివరకు రాజీనామాను ఆమోదించారు.టీటీ కృష్ణమాచారి..1958లో వెలుగులోకి వచ్చిన ముండ్రా కుంభకోణం కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఎల్ఐసీ పెట్టుబడుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు, ఆర్థిక శాఖపై వచ్చిన విమర్శల నేపథ్యంలో అప్పటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన శాఖపై వచ్చిన బాధ్యతను స్వీకరిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇది కూడా నైతిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పబడుతుంది.మాధవరావ్ సింధియా.. 1992లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం అనంతరం పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావ్ సింధియా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష కారణం కాకపోయినా.. శాఖ మంత్రిగా వ్యవస్థాపరమైన లోపాలకు బాధ్యత వహించడం రాజకీయాల్లో నైతిక ప్రమాణంగా నిలిచింది.నితీశ్ కుమార్.. గైసాల్ రైలు ప్రమాదం1999లో పశ్చిమ బెంగాల్లోని గైసాల్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వందలాది మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్.. ప్రమాదానికి తాను ప్రత్యక్ష కారణం కాకపోయినా, రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.జార్జ్ ఫెర్నాండెజ్..2001లో తెహల్కా నిర్వహించిన ‘ఆపరేషన్ వెస్ట్ ఎండ్’ స్టింగ్ ఆపరేషన్ రక్షణ శాఖలో అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ వ్యవహారంపై తీవ్ర రాజకీయ దుమారం రేగడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పటికీ.. ఆ సమయంలో రక్షణ శాఖపై వచ్చిన ఆరోపణలకు రాజకీయ బాధ్యత వహించిన ఘటనగా ఇది నిలిచింది.ప్రతి వైఫల్యానికి రాజీనామా జరిగిందా?అలా ఏం జరగలేదు. భారత రాజకీయ చరిత్రలో ప్రతి పరిపాలనా వైఫల్యానికి మంత్రి పదవి వదిలిన సందర్భాలు లేవు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు దర్యాప్తులు, కమిటీలు, సంస్కరణలతో ముందుకు వెళ్లాయి. అందుకే ఇప్పుడు నీట్ వివాదంలోనూ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వాదన ప్రకారం.. లీక్కు పాల్పడిన వ్యక్తులు గుర్తించబడ్డారు. అరెస్టులు జరిగాయి. దర్యాప్తు కొనసాగుతోంది. ఒక నేరానికి పాల్పడిన వ్యక్తుల చర్యలకు మంత్రిని నేరుగా బాధ్యుడిని చేయడం సరైన విధానం కాదని కేంద్రం చెబుతోంది.మరోవైపు ఆందోళనకారులు, ప్రతిపక్షాల వాదన మాత్రం వేరుగా ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు.. వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న మంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.నీట్ వివాదం.. అసలు పరీక్ష ఎవరికంటే?నీట్ లీక్ వివాదం చివరకు ఒక మంత్రి పదవి ప్రశ్నకే పరిమితం కాదు. దేశంలోని పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మిస్తారు? భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి భరోసా ఇస్తారు? అన్నదే అసలు సవాల్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? లేదా అన్నది రాజకీయ నిర్ణయం. కానీ “ఒక వ్యవస్థ విఫలమైతే.. దాని అధిపతి ఎంతవరకు బాధ్యత వహించాలి?” అనే పాత ప్రశ్నను నీట్ వివాదం భారత రాజకీయాల్లో మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ::వెబ్ ప్రత్యేకం -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్కు అతిపెద్ద రాజకీయ సవాల్గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్గా వెల్లడించారు. -
సీఎన్జీ.. సూపర్ క్రేజ్!
దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్ మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల సెగకు తోడు కాలుష్య నిబంధనల్లో నెలకొన్న అనిశ్చితితో కారు ప్రియులు ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే కార్లకు సై అంటున్నారు. అధిక మైలేజీ.. తక్కువ మెయింటెనెన్స్.. పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటంతో సీఎన్జీ కార్లు మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. గతంలో అరకొరగా ఉన్న బంకులు ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. మొత్తంమీద డీజిల్ను ఓవర్టేక్ చేసి సీఎన్జీ కార్లు అమ్మకాల్లో టాప్–2 ప్లేస్లో దూసుకెళ్తున్నాయి.మన రోడ్లపై ఇప్పటికీ పెట్రోల్ కార్లదే హవా. అయితే, గత రెండు మూడేళ్లుగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మరింత ఫోకస్ చేస్తున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో సీఎన్జీ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో రెండో అత్యంత ప్రాధాన్య ఇంధనంగా నిలిచింది. 2025–26లో అమ్ముడైన మొత్తం కార్లలో సీఎన్జీ వాటా దాదాపు 22 శాతానికి ఎగబాకింది. అంటే 10 లక్షలకు పైగా సీఎన్జీ కార్లు రోడ్డెక్కాయన్నమాట! 2024–25లో సీఎన్జీ కార్ల వాటా 19.6 శాతంగా ఉంది. మూడేళ్ల క్రితం 12–13 శాతం వాటా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపైంది. మరోపక్క, గతేడాదే డీజిల్ కార్లను దాటేసిన సీఎన్జీ కార్ల జోరు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. 2025–26లో డీజిల్ కార్ల వాటా 18.23 శాతం నుంచి 2026–27లో 18.08 శాతానికి తగ్గింది. పెట్రోల్ కార్లదీ ఇదే బాట. తొలిసారిగా 2025–26లో వాటి వాటా 50 శాతం దిగువకు పడిపోవడం గమనార్హం. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), హైబ్రిడ్ కార్ల విక్రయాలు కూడా రయ్ అంటున్నాయి. గతేడాది ఈవీల వాటా 2.61% నుంచి 4.25 శాతానికి ఎగబాకడం దీనికి నిదర్శనం. జూన్లోనూ జూమ్... ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు ఈ ఏడాది జూన్లో కూడా దుమ్మురేపాయి. రిటైల్ సేల్స్లో తొలిసారి వీటి వాటా 40 శాతాన్ని అధిగమించింది. 2025 జూన్లో ఇది 33.3 శాతమే. అలాగే ఈ ఏడాది మేలో 38 శాతంగా ఉంది. మరోపక్క, పెట్రోల్, డీజిల్ కార్ల వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఇక సీఎన్జీ కార్లు తగ్గేదేలే అంటూ టాప్గేర్లో అమ్ముడయ్యాయి. జూన్ అమ్మకాల్లో సీఎన్జీ వాటా 24.3 శాతానికి ఎగసింది. హైబ్రిడ్ 8.3%, ఈవీలు 7.8% వాటా (31,823 కార్లతో ఆల్టైమ్ గరిష్టం) దక్కించుకున్నాయి.ఎందుకీ డిమాండ్..→ కారు కొనుగోలుదారులు సీఎన్జీకి జై కొట్టడానికి అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ వ్యయమే ప్రధాన కారణం. పెట్రోల్తో పోలిస్తే సీఎన్జీ కార్లకు ఒక్కో కిలోమీటర్ జర్నీకి అయ్యే ఖర్చు 40–50 శాతం తక్కువ. → నేరుగా కంపెనీలు విడుదల చేస్తున్న సీఎస్జీ వేరియంట్ల రేటు పెట్రోల్ కంటే రూ.80,000–1,00,000 ఎక్కువగా ఉంటోంది. అంటే, ఏటా సుమారు 15,000–20,000 కిలోమీటర్లు తిరిగేవారికి ఈ అదనపు వ్యయం 18 నెలల్లోనే రికవరీ అయిపోతుంది. అవసరమైతే పెట్రోలు ఆప్షన్ ఉండనే ఉంటుంది. ఈ వెసులుబాటు, ఇంధన ఆదానే ఇప్పుడు మాస్ మార్కెట్లో సీఎస్జీ కార్లకు కిర్రాక్ క్రేజ్ తెచ్చిపెడుతోంది. → సీఎన్జీ బంకులు శరవేగంగా విస్తరిస్తుండం కూడా ఈ కార్ల వైపు కస్టమర్లు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏడాది క్రితం సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ 300 నగరాలు, పట్టణాల్లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 600కు చేరింది. → ఇదంతా ఒకెత్తయితే.. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం కూడా ఎక్కువ మంది సీఎన్జీని నమ్ముకుంటున్నారు. ఆటోమొబైల్ డీలర్ల సంఘాల ఫెడరేషన్ (ఫాడా) సర్వే ప్రకారం ఇంధన ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో సీఎన్జీ, ఈవీలే బెటర్ అని 56.9% మంది కస్టమర్లు భావిస్తున్నారట! → కాలుష్య నిబంధనలను కఠినతరం చేస్తుండటం వల్ల కూడా డీజిల్ కార్ల నుంచి సీఎన్జీ, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో డీజిల్ వాహనాల కాలపరిమితిని పదేళ్లకు తగ్గించడం, మరిన్ని నగరాలూ ఇదే బాటలో నడుస్తాయన్న ఆందోళనలు, పాలసీ అనిశ్చితి డీజిల్ కార్ల డిమాండ్కు కోత పెడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ వల్ల కాలుష్యం చాలా తక్కువ. → గతంలో ఎంట్రీ స్థాయి మోడళ్లలోనే అందుబాటులో ఉన్న సీఎన్జీ వేరియంట్లను ఆటోమొబైల్ దిగ్గజాలు ఇప్పుడు అన్ని మోడళ్లకూ విస్తరించాయి. మారుతీ సుజుకీ దాదాపు తన మొత్తం కార్ల రేంజ్లో ఫ్యాక్టరీ ఫిటెడ్ సీఎన్జీ ఆప్షన్లను అందిస్తోంది. ఇక టాటా మోటార్స్ సైతం జోరు పెంచింది. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్తో పాటు టాప్ ఎండ్ మోడళ్లలో సైతం సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. జూన్లో 2–3 శాతం మేర ధరలు పెరిగినా, సీఎన్జీ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదన్నది డీలర్ల మాట.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! -మంథా రమణమూర్తి -
వేడి ఒత్తిడితో చదువు చిత్తు!
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దేశంలోని చాలా ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యాసం, ఆరోగ్యం, శ్రేయస్సును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఓ తాజా సర్వే చెబుతోంది. గత ఏడాది వేసవి కన్నా ఈ ఏడాది వేసవి ఎక్కువ వేడి ఒత్తిడిని కలిగించిందని స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యూ (సీఆర్వై (క్రైౖ ) నిర్వహించిన ‘ఫీలింగ్ ద హీట్’అధ్యయన నివేదిక వెల్లడించింది. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 3,096 మంది 10–17 ఏళ్ల బడి పిల్లలు ఎదుర్కొన్న వేడి ఒత్తిడి బాధలపై ‘క్రై’సర్వే చేసింది. ఎల్నినో పరిస్థితులు ప్రపంచ ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏపీలో అత్యధికంగా 88 శాతందేశంలో గత వేసవిలో వేడి సంబంధిత ఇబ్బందుల కారణంగా దాదాపు పది మందిలో ఏడుగురు పిల్లలు పాఠశాలలకు లేదా పాఠాలకు దూరమయ్యారు. అధిక వేడి తమ ఏకాగ్రతను దెబ్బతీసిందని 76 శాతం మంది చెప్పారు. డీహైడ్రేషన్, తలనొప్పి, తీవ్రమైన అలసట, కళ్లు తిరగటం, నిద్ర పట్టటంలో ఇబ్బంది వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రోజువారీ కూలి పనులు లేదా శారీరక శ్రమ చేసే పేద కుటుంబాల్లో బడి పిల్లలు ఇతర పిల్లల కన్నా ఎక్కువగా అధిక వేడి బాధల బారిన పడుతున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 68 శాతం మంది పాఠశాలకు లేదా సాధారణ కార్యకలాపాలకు హాజరు కాలేకపోయారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 88 శాతం మంది హాజరు కాలేదు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ కాగా పశ్చిమ బెంగాల్లో వీరి సంఖ్య దాదాపు 72 శాతంగా ఉంది.76% మందిలో ఏకాగ్రత తగ్గింది తెలంగాణలో 65–70% మంది పాఠశాల విద్యార్థులు ఎండ తీవ్రత భరించలేక స్కూళ్లకు సెలవు పెట్టారు లేదా క్లాసులకు వెళ్లలేదు. విపరీతమైన ఉక్కపోత వల్ల పాఠాలపై 76% మంది విద్యార్థులు ఏకాగ్రతతో దృష్టి పెట్టలేకపోయారు. తగినంత నీరు అందక శారీరకంగా నీరసించటం, తలనొప్పితో ఇబ్బంది పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల ఇళ్లలో రాత్రి పూట విద్యుత్ కోతలు, ఉక్కపోత వల్ల పిల్లలు సరిగ్గా నిద్రపోలేకపోయారు. దీనివల్ల మరుసటి రోజు బడిలో వారు చురుగ్గా ఉండలేకపోయారు. సర్వేను పరిగణనలోకి తీసుకోవాలి ఉష్ణోగ్రత రికార్డులు వేడి ఎంత పెరుగుతోందో మనకు స్పష్టం చేస్తుండగా, ఆ వేడి స్కూలు పిల్లల జీవితాలను దెబ్బతీస్తోందో వారే మనకు చెబుతున్నారని ‘క్రై’ముఖ్య కార్యనిర్వహణాధికారి పూజా మర్వాహా అన్నారు. వేడి నివారణ కార్యాచరణ ప్రణాళికలు, వాతావరణ మార్పును ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించేటప్పుడు విధాన రూపకర్తలు ఈ అధ్యయన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. -
భారత రైల్వే చరిత్రలో గ్రీన్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. హరియాణా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే.. ఆ తర్వాత డీజిల్, విద్యుత్ శకాలను దాటుకుని, ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం ’హైడ్రోజన్’వైపు అడుగులు వేసింది. బ్రాడ్గేజ్ మార్గాల్లో ఇప్పటికే 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రమాదాలకు తావులేదు.. భద్రత అమోఘం! హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికులలో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీకైనా, అది ఒకచోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఉంది. జింద్ వద్ద అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్! హరియాణాలోని జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుది్వశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్) ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేస్తారు. దీనిని 500 బార్ ప్రెజర్ వద్ద నిల్వ చేసి, రైళ్లకు 350 బార్ ప్రెజర్ వద్ద నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో రెండు పవర్ కార్లలో గ్యాస్ నింపే సదుపాయం ఉంది. ఈ రైలును ‘మేక్ ఇన్ ఇండియా’కింద భారత్లోనే రూపొందించారు. రైలు ప్రత్యేకతలు.. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లతో మాత్రమే నడుస్తుండగా, భారత్లో ఏకంగా 10 కోచ్ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డ్నెలకొల్పే ఆస్కారముంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హరియాణాలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపునున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 75 కి.మీ వేగంతో నడపనున్నారు. రైలుకు ఇరువైపులా రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు (డీపీసీ)లు ఉంటాయి. ఇవి చెరో 1,200 కిలోవాట్ల (1600 హెచ్పీ) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్యాకప్ కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీలను జతచేశారు.నిప్పులు చిమ్మని హరిత రథంమారనున్న భారతీయ రైల్వే ముఖచిత్రం బొగ్గుతో నడిచే రైళ్లు మొదలు విద్యుత్తో నడిచే రైళ్లదాకా కొనసాగిన భారత రైల్వే ప్రస్థానంలో సరికొత్త హరిత అతిథి నేడు వచ్చిచేరుతోంది. వాతావరణంలోని కర్భన ఉద్గారాలను అస్సలు వెదజల్లని వాతావరణహిత హరిత రైలు రాకతో భారత రైల్వే ముఖచిత్రం మారబోతోందని రైల్వే రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలా పనిచేస్తుంది? సంప్రదాయక రైలు మాదిరి ఈ రైలు నుంచి కాలుష్యకారక ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలువడవు. హరిత శకటం నుంచి కేవలం నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ రైలు ముందుభాగంలో లేదా పైభాగంలో లేదా ప్రత్యేక కంపార్ట్మెంట్లో భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువును నిల్వచేసే ట్యాంకర్ ఉంటుంది. దీనికి సమీపంలో ఫ్యూయల్సెల్ వ్యవస్థ ఉంటుంది. ట్యాంక్లోని హైడ్రోజన్ను ప్రత్యేక పైపుల ద్వారా ఫ్యూయల్సెల్లోకి పంపిస్తారు. అయితే అది ఫ్యూయల్ సెల్లోకి వచ్చే క్రమంలోనే ప్రోట్రాన్లు, ఎల్రక్టాన్లుగా విడిపోతుంది. ఎల్రక్టాన్లు ఫ్యూయల్ సెల్లోకి వెళ్లవు. ప్రత్యేక సర్క్యూ ద్వారా ప్రవహిస్తాయి. ఇదే రైలు ముందుకు కదలడానికి సాయపడుతుంది. ఫ్యూయల్సెల్లోకి వచ్చే ప్రోటాన్లు అనేవి బయటి గాలి నుంచి వచ్చే ఆక్సీజన్తో ఎల్రక్టానిక్ రసాయన చర్య జరిపి విద్యుత్ను, నీటి ఆవిరిని ఉత్పత్తిచేస్తాయి. ఈ నీటి ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. విద్యుత్ మాత్రం అక్కడే ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను ముందుకు కదిలేలా చేస్తాయి. రైలు ఒకవేళ నెమ్మదిగా వెళితే ఆ సమయంలో ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ద్వారా జనించిన విద్యుత్ అనేది రైలులో అమర్చిన భారీ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుంది. ఇది అవసరమైన వేళల్లో హఠాత్తుగా రైలు వేగం పెరిగేందుకు సాయపడుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో ఈ రైలు పనిచేస్తుందని శివనాడార్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ హర్ప్రీత్ సింగ్ అరోరా చెప్పారు. ఓవర్హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగల నుంచి వచ్చే విద్యుత్తో విద్యుత్ ఆధారిత రైలు పనిచేస్తాయి. కానీ హైడ్రోజన్ రైళ్లలో అత్యధిక పీడనంతో నింపిన హైడ్రోజన్ ఈ ప్రోటాన్ ఎక్సే్ఛంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ విధానంలో ఆక్సీజన్తో చర్య జరిపి అటు విద్యుత్ను, ఇటు నీటి ఆవిరిని, పరిమిత స్థాయిలో వేడిమిని అందిస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ మేథోసంస్థలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మౌష్మీ మొహంతీ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోటా తన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు మరో ప్రశ్నపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతిక విప్లవం నడిపించబోతోంది?..ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులనే సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి.👉ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా, శాస్త్రవేత్తలా పరిశోధనలు చేయడం, ఇంజినీర్లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.👉ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI). ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.👉భవిష్యత్తులో మరో కీలక మార్పు ‘ఎంబాడీడ్ ఏఐ’ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా, మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పని చేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు-కంప్యూటర్ అనుసంధానం (Brain-Computer Interface), జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతిక విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే, మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే.. భవిష్యత్తులో ఏజీఐ, ఎంబాడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.:::వెబ్ ప్రత్యేకం -
మళ్లీ గోల్డెన్ డేస్!
రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు కొంతకాలంగా వినియోగదారులను కొనుగోళ్లకు దూరం ఉంచాయి. అయితే ఇటీవల ధరల మంట కొంతమేర చల్లబడడంతో దేశీయ జ్యువెలరీ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. డాలర్ల వినియోగం కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కస్టమ్స్ డ్యూటీ కారణంగా కొన్నినెలలు మందగించిన జ్యువెలరీ డిమాండ్ ఇప్పుడు వేగంగా పుంజుకుంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ధరల తగ్గుదలతో పాటు, భారతీయ కుటుంబాల్లో ప్రతి శుభకార్యానికి బంగారానికి ఉన్న సాంస్కృతిక బంధం జ్యువెలరీ మార్కెట్ను మళ్లీ పరుగులు తీయిస్తోంది. బంగారం దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 6–15 శాతానికి పెంచిన తర్వాత కొనుగోలుదారులు నగల షాపింగ్కు బ్రేక్నిచ్చారు. వేచిచూసేధోరణి అవలంబించారు. ఇటీవల బంగారం భారీగానే తగ్గడంతో ప్రస్తుత ధరల వద్ద తిరిగి కొనుగోలు చేసేందుకు మార్కెట్లో అడుగుపెడుతున్నారని ప్రముఖ ఆభరణాల సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రా. బంగారం ధర చారిత్రక గరిష్టస్థాయి రూ.1,85,000 తాకిన తర్వాత తిరిగి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఒక్క జూన్ నెలలోనే బంగారం ధర 8% కన్నా తగ్గడం నగల ప్రియులకు ఊరటనిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జువెలరీ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్పై ఆశలు బంగారం డిమాండ్ 70%కి పైగా పడిపోయినప్పటికీ ధరలు కొంత తగ్గిన తర్వాత పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, మార్కెట్లో ఫుట్ఫాల్స్ పెరగడం, నగల విక్రయాలు పుంజుకోవడం జ్యూవెలరీ రంగానికి మళ్లీ మంచిరోజులొచ్చాయని బంగారం వర్తకులు భావిస్తున్నారు.కొన్ని నెలలుగా అమ్మకాలు తగ్గి వెలవెలబోయిన జ్యువెలరీ పరిశ్రమ ఇప్పుడు వచ్చే శ్రావణం, దసరా, దీపావళి, వివాహాల సీజన్పై భారీ ఆశలు పెట్టుకుంది. అధిక ధరల కారణంగా తక్కువ వెయిటేజ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వైపు మళ్లిన వినియోగదారులు మళ్లీ మేలిమి బంగారు నగలు, సంప్రదాయ ఆభరణాల కొనుగోలుకు ఉత్సాహం చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. భారతదేశంలో బంగారం కొనడం కేవలం పెట్టుబడే కాదు, సంప్రదాయం కూడా. మార్కెట్ బలంగా కోలుకుంటోందని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొంటున్నారు. రానున్న పండుగ సీజన్ ఆభరణాల మార్కెట్కు మళ్లీ బంగారు కాంతులు తెస్తుందని ఆశిస్తున్న రిటైలర్లు షాపుల విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేస్తున్నారు. టైటన్ కొత్తగా 77 స్టోర్లను, కల్యాణ్ జ్యూవెలర్స్ 524 స్టోర్లకు నెట్వర్క్ను విస్తరించింది. దూసుకెళుతున్న జ్యువెలరీ షేర్లు క్యూ1 ఫలితాలపై అంచనాలు, పెరుగుతున్న అమ్మకాలు, కొత్త స్టోర్ల విస్తరణతో ఆభరణాల కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. బ్రోకరేజ్ సంస్థల బయ్ రేటింగ్స్ కూడా ర్యాలీకి కారణం.→ కల్యాణ్ జ్యువెలర్స్: షేరు ధర 10 రోజుల్లో 68 శాతం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆదాయం 38 శాతం పెరిగింది. బుధవారం షేరు రూ.548 వద్ద ముగిసింది. → టైటాన్: కంపెనీ షేరు ధర ఆల్టైం గరిష్ట స్థాయిని తాకింది. తని‹Ù్క జ్యువెలరీ విభాగంలో 39 శాతం వృద్ధి నమోదు కావడంతో షేరు పరుగులు పెడుతోంది. బుధవారం రూ.4,579 వద్ద ముగసింది. → సెన్కో గోల్డ్: కొత్తగా 8 స్టోర్లను ప్రారంభించడంతో స్టాక్ బలంగా పుంజుకుంది. షేరు రూ.373 వద్ద ముగిసింది. → తంగమయిల్ జ్యువెలరీ: షేరు జీవితకాల గరిష్టాన్ని చేరింది. నెలరోజుల్లో స్టాక్ 30% పైగా లాభపడింది. రూ.6,618 వద్ద ముగిసింది. → స్కైగోల్డ్ అండ్ డైమండ్స్: షేరు ధర కొత్త రికార్డు స్థాయిని తాకింది. బుధవారం రూ.630 వద్ద ముగిసింది. కొత్త డిజైన్లకు ఆదరణ కొత్తతరం కస్టమర్లు కేవలం బంగారం బరువు కన్నా డిజైన్, ఫ్యాషన్, రోజువారీ వినియోగానికి అనువైన నగలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతరం కస్టమైజ్డ్ ఆధారిత కలెక్షన్లు, డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ, లైట్ వెయిట్ నగలను ఇష్టపడుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విపత్తులు వచ్చి.. 'లైఫ్ పాడ్' అవకుండా..
సునామీలు ముంచెత్తినా.. భూకంపాలు భయపెట్టినా బిందాస్గా ఉండొచ్చు.. బుల్లెట్లు కాల్చినా.. బాంబులు పేల్చినా.. బాల్టీ తన్నేయకుండా బేఫికర్గా జీవించొచ్చు..అది అవదమ్మ అంటారా.. అలా అవ్వాలంటే మీరా డబ్బులు ఖర్చు పెట్టి.. ముందు ఓ లైఫ్ పాడ్ను కొనాలి.. ఇంతకీ ఏంటిది? యుద్ధ పరిస్థితులు, ఉగ్రదాడులు, వరదలు, సునామీలు, భూకంపాలు.. ఇలా ప్రకృతి లేదా మానవుడు సృష్టించిన ఉత్పాతాల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఫ్రాన్స్కు చెందిన మొమెంటం టెక్నాలజీస్ సంస్థ ‘లైఫ్ పాడ్’లను అభివృద్ధి చేసింది. వీటిని అత్యంత బలమైన లోహాలతో తయారుచేశారు. తరలించడం కూడా తేలిక. పైగా.. వివిధ రకాల విపత్తులకు అనుగుణంగా మూడు రకాల పాడ్లను రూపొందించారు. డబ్ల్యూ–1 ఆకస్మిక వరదలు, ఆనకట్టలు తెగిపోవడం, సునామీలు వంటి వాటి కోసం తయారుచేశారు. ఇది తేలియాడే క్యాప్సూల్లాంటిది. ఇద్దరు నుంచి నలుగురు ఉండొచ్చు. నీళ్లలో వినియోగానికి అనుగుణంగా దీన్ని అత్యంత మన్నికైన అల్యూమినియంతో చేశారు. పెద్ద పెద్ద శిథిలాల్ని ఢీకొట్టినా తట్టుకుంటుంది. ప్రస్తుతం ఇది తుది దశలో ఉందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.38 నుంచి 45 లక్షల దాకా ఉండే అవకాశముంది. బీ–1 ఉగ్రదాడులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించారు. ఇద్దరు ఉండొచ్చు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే దీని లోపలికి వెళ్లి లాక్ చేసుకునేలా తయారుచేశారు. పరిశ్రమలు, భద్రత దళాలు ఉండే ప్రాంతాల్లో వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రొటోటైపు రెడీగా ఉంది. దీని ధర రూ.32 లక్షలు. క్యూ–1 భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాల్లో ప్రాణాలకు కాపాడేందుకు దీన్ని తయారుచేశారు. ఇల్లు లేదా అపార్టుమెంటు నుంచి బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఇది రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చు. దీని ధర ఇంకా ప్రకటించలేదు. ఇటీవల పారిస్లో జరిగిన వివాటెక్ ప్రదర్శనలో ఈ మూడు లైఫ్ పాడ్లను కంపెనీ అధినేత సెడ్రిక్ ఆవిష్కరించారు. అయితే ఇవన్నీ ఉన్నా.. ప్రాణాలు పోతేనో అని మూల‘శంక’ మాస్టారు ఒకరు డౌట్ రైజ్ చేశాడు.. అంతే.. సెడ్రిక్.. ఆ ఒక్క మాటతో లేచి.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ....... – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
‘ఆ నలుగురు’రానిది జీవితమా?
చనిపోయాక పాడె మోసే ‘ఆ నలుగురు’రాకపోతే జీవితానికి అర్థమే లేదు. ఇతిహాసాలు, పురాణాలు, పెద్దలు..ఏనాడో విడమరచి చెప్పిన జీవిత పరమార్థం ఇది.. దానిని విస్మరిస్తే జరిగేదేమిటో చెప్పడానికి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన నరరూప రాక్షసుడు రాజ్కుమార్ ఉదంతమే నిఖార్సయిన నిదర్శనం. రాక్షసుడు అనాథ శవంగా చితి మంటల్లో కాలిపోయినా.. పుట్టినిల్లు, మెట్టినిల్లు, పక్కింట్లో కూడా విషాద జ్వాలలు రగిల్చిపోయాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మలను కిరాతకంగా రాజ్కుమార్ హతమార్చాడు. బాధితులకు ఏ వ్యవస్థా న్యాయం చేయలేదు. పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేదు. ఆన్లైన్ బెట్టింగ్ గేములు, అప్పుల ఊబి, విచ్చలవిడి వ్యసనాలు, అక్రమ సంబంధాలతో కొందరు దారి తప్పి ఉన్మాదులుగా మారుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం నేరం జరిగిన తర్వాత స్పందించడం కాదు. క్షేత్రస్థాయిలో వ్యసనాల అదుపు, కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నేరగాళ్లపై తక్షణ కఠిన చర్యలు తీసుకునే నిరంతర నిఘా వ్యవస్థలు సమాజంలో అత్యవసరంగా పెరగాలి. అనాథగా కాలిపోయిన ఉన్మాదం రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకున్నాక, అతని మరణవార్త విన్నాక..సమాజంలో ఎక్కడా ’అయ్యో పాపం’అనే మాట వినిపించలేదు. పుట్టిన ఊరికి అతని శవాన్ని తేవద్దని గ్రామస్తులు నినదించగా, కన్న తల్లిదండ్రులు సైతం కడచూపు చూసేందుకు నిరాకరించారు. చివరకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి అనాథ శవంలా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. పాపం పండిన రోజున ఉన్మాదికి దక్కిన శాస్తి ఇది. వ్యవస్థ వైఫల్యం.. పోక్సో చట్టంలో లొసుగులు ఈ రక్తపాతానికి పోలీసుల నిర్లక్ష్యం, నిఘా లోపమే ప్రధాన కారణం. పోక్సో కేసు నమోదై, నిందితుడు బెయిల్పై బయట తిరుగుతున్నప్పుడు అతని కదలికలపై నిరంతర నిఘా ఉంచడంలో స్థానిక పోలీసులు, ఇంటెలిజె¯న్స్ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. బాధితులకు తగిన రక్షణ కల్పించలేకపోయారు. ఈ తీవ్ర నిర్లక్ష్యానికి కారణమైన సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, జరగాల్సిన ఘోరం జరిగిపోయాకే ఈ చర్యలు చేపట్టడం వ్యవస్థలోని అసమర్థతను ఎత్తిచూపుతోంది. బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి తెచ్చిన కఠినమైన పోక్సో చట్టంలో పోలీసులు ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే బలహీనమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఇక్కడ అతిపెద్ద లోపం. చట్టపరమైన లొసుగులు, అవినీతి వల్లే నేరగాళ్లకు చట్టం పట్ల భయం పోతోంది. డబ్బు వెదజల్లి సెక్షన్లు మార్చుకుని, బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చి బాధితులపై పగ తీర్చుకునే అవకాశం లభిస్తోంది. కామాంధులకు, ఉన్మాదులకు ఇలాంటి చట్టపరమైన లొసుగులు వరంగా మారకూడదు. మరోవైపు నిందితుడు అప్పులు చేస్తూ, జులాయిగా తిరుగుతూ భార్యాపిల్లలను, కన్నవారిని వేధిస్తున్నాడని తెలిసినా చుట్టుపక్కల సమాజం, పంచాయతీలు, బంధుమిత్రులు ఎందుకు నిలదీయలేకపోయారు? సమాజంలో పెరుగుతున్న ఈ ’మనకెందుకులే’అన్న ఉదాసీన ధోరణే ఇలాంటి ఉన్మాదులకు పరోక్షంగా ఊతమిస్తోంది. సైకోలపై నిఘా, సోషల్ ప్రొఫైలింగ్ ఎప్పుడు? మానసిక అనారోగ్యాన్ని ఒక జబ్బుగా గుర్తించే భావన మన దేశంలో లేదు. ఒక వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తున్నా అది సాధారణ గొడవగానే కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వపరంగా సైకోథెరపీ క్లినిక్లు, మానసిక విశ్లేషణ కేంద్రాలు కిందిస్థాయి వరకు అందుబాటులో లేవు. తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో సైతం మానసిక వైద్య సేవలు నామమాత్రంగానే ఉన్నాయి. నేర ప్రవత్తి ఉన్నవారిని గుర్తించి, వారికి బలవంతంగానైనా మానసిక చికిత్స అందించే క్లినిక్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో మన దగ్గర కూడా నేర చరిత్ర, హింసాత్మక ప్రవృత్తి ఉన్న వారిపై ’సైకో–సోషల్ ప్రొఫైలింగ్’, ఎల్రక్టానిక్ ట్యాగింగ్ వంటి నిరంతర నిఘా వ్యవస్థలు రావాలి. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మానసిక చికిత్సా కేంద్రాలు (సైకోథెరపీ క్లినిక్లు) ఏర్పాటు చేసి, నేర ప్రవృత్తి గలవారికి కౌన్సెలింగ్ అందించాలి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్పై ఎలాంటి ప్రభావం?భారత్కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
ఏ'మీ మాంస'కృత్తులు?
సాక్షి స్పెషల్ డెస్క్ : ప్రొటీన్ అనే పదం ఇటీవల బాగా వాడుకలోకి వచ్చింది. ఆరోగ్యం కాపాడుకోవడంపై పెరుగుతున్న ఆసక్తి, వివిధ మాధ్యమాల ద్వారా పెంచుకుంటున్న అవగాహన ఇందుకు కారణం. ఫిట్నెస్ ప్రియులు మొదలుకుని అంతోఇంతో ఆరోగ్య స్పృహ ఉన్నవారు సైతం ప్రొటీన్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. కొందరు వైద్యులు కూడా ఈ ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నారు. మధుమేహానికి మూల కారణమైన కార్బోహైడ్రేట్లు గణనీయంగా తగ్గించాలని, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని అంటున్నారు. ప్రొటీన్ కండరాల పెరుగుదలకు, బలమైన ఎముకలకు దోహద పడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పప్పుధాన్యాల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధను సొమ్ము చేసుకోవడానికి మార్కెట్ శక్తులు పావులు కదుపుతున్నాయి. ప్రొటీన్ కోసం ఏం తినాలి అనే విషయంలో కొంత తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. ప్రొటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాల మీదకు దృష్టిని పోనివ్వకుండా తక్కువ ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ‘సూపర్ ఫుడ్’పేరిట ప్రాచుర్యంలోకి తేవడం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ప్రొటీన్ విషయంలో కొన్ని అపోహలు, అసలు వాస్తవాలను ఒకసారి తెలుసుకుందాం. అపోహలు, వాస్తవాలుఅపోహ: శాకాహారం అంత ప్రభావవంతంగా ఉండదు వాస్తవం: శాకాహారం నుంచి అందే ప్రొటీన్లతో కండరాలను పెంచుకోవడం సాధ్యం కాదని, ఆరోగ్య పరిరక్షణకు అంతగా దోహదపడదనే అభిప్రాయంలో ఏ మాత్రం నిజం లేదు. మొక్కల ప్రోటీన్లు అసంపూర్ణంగా (అన్ని రకాల అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లను తయారు చేయడానికి సహాయపడే ప్రాథమిక అణువులు) లేకపోవడం) ఉంటాయనేది నిజమే. కానీ అన్ని రకాల అమైనో ఆమ్లాలను ఒకే ఆహార పదార్థం నుండి పొందవలసిన అవసరం లేదు. ధాన్యాలు, పప్పుధాన్యాలు, నట్స్ (గింజలు), విత్తనాలను కలిపి లేదా మార్చి మార్చి వినియోగించడం ద్వారా సంపూర్ణమైన అమైనో యాసిడ్లను పొందవచ్చు. అపోహ: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే కండరాలు వాటంతట అవే పెరుగుతాయి వాస్తవం: ప్రొటీన్ కండరాల నిర్మాణం, మరమ్మతు, జీవక్రియలకు మూలమే. కానీ అది ఒక్కటే సరిపోదు. ప్రొటీన్తో పాలు అవసరమైన మేరకు కేలరీలు, వ్యాయామం కూడా అవసరం. అపోహ: శరీరం ఒక భోజనంలో కేవలం 30 గ్రాముల ప్రొటీన్ మాత్రమే తీసుకోగలుగుతుంది వాస్తవం: మనిషి తీసుకునే ప్రొటీన్ అంతటినీ శరీరం గ్రహిస్తుంది. అయితే కండరాల ప్రొటీన్ సంశ్లేషణ విషయంలో మాత్రమే 30 నుంచి 40 గ్రాముల పరిమితి ఉంది. కానీ కండరాల ఉత్తేజితానికి పోగా మిగతా ప్రొటీన్ శరీర క్రియల నిర్వహణ, కణజాలం పరిరక్షణతో పాటు పని చేయడానికి అవసరమైన శక్తిగా ఉపయోగపడుతుంది. అపోహ: ప్రొటీన్ తీసుకుంటే సరిపోతుంది.. వాస్తవం: ప్రొటీన్ తీసుకోవడం మంచిదే అయినా అది ఒక్కటే సరిపోదు. పీచు పదార్థాలతో పాటు శక్తిని ఇచ్చే ఆహారం కూడా అవసరం. అపోహ: బాదం గింజలు తీసుకుంటే చాలు. రోజూ ఉదయం గుప్పెడు బాదం పప్పులు తింటే శరీరానికి తగినంత ప్రొటీన్ అందుతుంది. వాస్తవం: గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్), సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కానీ వీటిలో ప్రొటీన్ ఒక మోతాదులోనే ఉంటుంది. సమృద్ధిగా ఉండదు. వందగ్రాముల బాదం పప్పుల్లో 21 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే 570 మైక్రోగ్రాములకు పైగా కేలరీలు, 50 గ్రాముల కొవ్వులు కూడా ఉంటాయి. శరీరానికి అవసరమైన 30 గ్రాముల ప్రొటీన్ బాదం గింజల ద్వారా అందాలంటే ఆ బాదంతో పాటు అందిన 800 కేలరీలను వ్యాయామం లేదా ఇతర దైనందిన కార్యకలాపాల ద్వారా ఖర్చు చేయాలి. అపోహ: వ్యాయామం తర్వాత టేబుల్ స్పూన్ పీనట్ బటర్ తింటే ప్రొటీన్ సమృద్ధిగా అందుతుంది. వాస్తవం: పొట్టుతీయని గింజలతో పోలిస్తే పీనట్ బటర్ కొవ్వు నిండిన ఆహారం అనే చెప్పాలి. టేబుల్ స్పూన్ పీనట్ బటర్లో 3.5 లేదా 4 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అదే సమయంలో దాదాపు 100 కేలరీలు, 8 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. ఇది మంచి శక్తినిచ్చే ఆహారమే, కానీ ప్రొటీన్ పుష్కలంగా లభించే ఆహారం కాదు. అపోహ: స్మూతీల్లో ఒక స్పూన్ చియా విత్తనాలు కలిపితే శరీరానికి తగినంత ప్రొటీన్ అందినట్లే. వాస్తవం: చియా సీడ్స్ పోషకాల పరంగా ఒక అద్బుతం. అయితే ఇందులో బాగా ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, జీర్ణమయ్యే పీచు, క్యాల్షియం. టేబుల్ స్పూన్ (సుమారు 12 గ్రాములు) చియా సీడ్స్లో కేవలం 2 గ్రాముల ప్రొటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి కానీ ప్రొటీన్ కోసం కాదు. అపోహ: మాంసం కంటే బ్రోకలీలో ప్రొటీన్ ఎక్కువ. వాస్తవం: ఇది అందమైన పదాలతో తప్పుదోవ పట్టిస్తున్న సమాచారం. బ్రోకలీలో కేలరీలు, ప్రొటీన్ల నిష్పత్తిని బేరీజు వేస్తూ చెబుతుంటారు. కానీ నిజా నికి బ్రోకలీలో కేలరీలు దాదాపుగా లేనట్లే. అలాగని 30 గ్రాముల ప్రొటీన్ల కోసం బ్రోకలీ తినాలంటే రోజుకు కిలోకు పైగా పచ్చి బ్రోకలీ తినాలి. బ్రోకలీని విటమిన్లు, పీచు కోసం తినాల్సిందే. ప్రొటీన్ కోసం బ్రోకలీ అనేది హాస్యాస్పదం. అపోహ: వరి అన్నం బదులు క్వినోవా అన్నం తినడం వల్ల ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అందుతుంది. వాస్తవం: క్వినోవా 9 రకాలైన అమైనో యాసిడ్లు అందే ప్లాంట్ ప్రొటీన్ ఉన్న అద్భుతమైన ఆహారం. గింజల్లో ఇలా సమగ్రమైన ప్రొటీన్ అరుదు. కానీ ఇది ప్రధానంగా కార్బోహైడ్రేట్ ఆహారం. వంద గ్రాముల క్వినోవా అన్నంలో 4.4 గ్రాముల ప్రొటీన్ ఉంటే 21 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. దేనిలో ఎంత ప్రొటీన్ ఉంది? 1. చికెన్ ఛాతీ: వంద గ్రాముల చికెన్ (ఛాతీ) బ్రెస్ట్లో 31 గ్రాములు ప్రొటీన్ ఉంటుంది. 2. పనీర్: వంద గ్రాముల పనీర్లో 18 నుంచి 23 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 3. పెద్ద కోడిగుడ్డు: ఇందులో ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. తెల్లసొనలో ప్రొటీన్, పసుపు సొనలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. 4. సోయా ముక్కలు: వందగ్రాముల ఎండిన సోయా ముక్కల్లో (చంక్స్/మీల్మేకర్) 52 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులో అమైనో యాసిడ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. 5. పప్పుధాన్యాలు: ఉడికించిన వందగ్రాముల పప్పులో పీచుతో కూడిన ప్రొటీన్ 9 గ్రాములు ఉంటుంది. ఏం తింటే మంచిది? మార్కెట్ మాయాజాలంలో పడకుండా ఆహారంలో ఏమేమి ఉండేలా చూసుకోవాలనేది.. ఎవరికి వారు తమ దైనందిన కార్యకలాపాలు, వ్యాయామం, వయసు, శరీరం తీరు, జీవక్రియల తీరు ఆధారంగా నిర్ణయించుకోవాలి » కొవ్వు లేని మాంసం, చేపలు, గుడ్లు, పనీర్, టోఫు (సోయా పనీర్), సోయా తగిన పాళ్లలో ఉండాలి. » గింజలు, కాయధాన్యాలు, క్వినోవా, ఆకు కూరలు, కూరగాయలతో సమతుల ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన కొవ్వులు, సమగ్రమైన కార్బోహైడ్రేట్లు, సూక్ష్మ పోషకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
ట్రెంపరితనం తెచ్చిన తంటా!
అగ్రరాజ్యం అమెరికా ఏకాకి అవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగా గుదిబండలవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అంటున్నారు జాన్ ఫైనర్. న్యూయార్క్టైమ్స్ పత్రికలో ఈయన రాసిన కథనం ప్రకారం అధ్యక్షుడి తెంపరితనం కాస్తా పౌరులకు వందల కోట్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. మిత్రదేశాలనూ వదలకుండా చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యేందుకు కారణమవుతోందని విశ్లేషిస్తున్నారు.అధ్యక్షుడిగానే కాదు.. అంతకుముందు కూడా డొనాల్డ్ జే ట్రంప్ వైఖరి వివాదాస్పదమే. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కావచ్చు. వివాహం, అక్రమసంబంధాలు, పన్నులు ఎగ్గొట్టడం.. ఇలా బోలెడన్నిసార్లు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఈ వివాదాల జోరు మరింత పెరిగిందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(మాగా) నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాక అక్రమ వలసదారులు, టారిఫ్లు, వీసాల వంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు విమర్శలకు గురయ్యాయి.ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ ఈ తెంపరి నిర్ణయాల తాలూకూ ఆర్థిక భారంపై వివరణాత్మక విశ్లేషణ ఒకటి చేశారు. దాని ప్రకారం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఇప్పటికే పెట్రోలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సుమారు 15 శాతం వరకూ పెరగ్గా, యూరియా ధర ఏకంగా యాభై శాతం ఎక్కువైంది. డీఏపీ కోసం 27 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పెంపు కాస్తా అమెరికన్లపై ఇప్పటికే సుమారు 13,200 కోట్ల డాలర్ల ఆర్థిక భారం మోపిందని అంచనా. తగ్గిన పర్యాటకులు, విద్యార్థులు... కఠిన వీసా నిబంధనలు అమలు చేయడం, యుద్ధభయం వంటి కారణాలతో అమెరికాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025లో అమెరికాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య సుమారు 40 లక్షలు తక్కువ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 800 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కలేస్తున్నారు. వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్తోపాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకు కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు మళ్లుతూండటం గమనార్హం. ఫలితంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17 శాతం తక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2026కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదు కానీ ఈ ఏడాది తగ్గుదల సుమారు 10 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. ఫలితంగా ఏటా కనీసం వంద కోట్ల డాలర్ల నష్టం ఉండొచ్చని తెలుస్తోంది. యూరప్తో మిలటరీ సంబంధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే అమెరికా, నాటోల మధ్య విపరీతమైన అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్ ఒంటెత్తు పోకడను పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి. దీని ఫలితం సుస్పష్టం. 2025లో యూరోపియన్ దేశాలు మిలటరీపై పెట్టిన ఖర్చులు 14 శాతం వరకూ అంటే సుమారు 86,400 కోట్ల డాలర్లకు చేరినా అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోళ్లు సగానికి తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా పొరుగున ఉన్న కెనడా 15,000 కోట్ల డాలర్లతో యూరోపియన్ డిఫెన్స్ ఫండ్లోకి చేరిపోయింది.చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా ఏఐ వంటి కీలక టెక్నాలజీల విషయంలో దేశీ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీల్లో మెరుగైన వాటిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమెరికాకు దూరంగా జరుగుతున్నట్లు, ఇందుకు ట్రంప్ తీరు, అమెరికా ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, వాణిజ్య వైరాలు, కృత్రిమ మేధ విషయంలో అస్పష్ట వైఖరి, విధానాలు కారణమని కాలమిస్ట్ ఫైనర్ విశ్లేషించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విపత్తు వస్తే ఇల్లు దాక్కుంటుంది!
ఈ మధ్య యూరోపియన్ దేశాలను కార్చిచ్చులు కాల్చిపారేస్తున్నాయి. మూడు రోజుల క్రితం స్పెయిన్లోని ఓ పర్యాటక ప్రదేశంలో కార్చిచ్చు కారణంగా 17 మందికిపైగా మరణించారు. కార్చిచ్చు మాత్రమే కాదు తుపాన్లు చుట్టుముట్టినా ఈ ఇంటికి ఏమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయని తెలిస్తే చాలు ఇల్లు మొత్తం నేల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గొయ్యిలోకి దిగిపోతుంది. అమెరికన్ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుతం పేరు ‘హైబర్ టెక్ హోమ్స్’. మీరు ఎక్కడున్నా ఇంటిని భూమి లోపలికి పంపించేసేందుకు యాప్ రెడీ చేశారు. యాప్లో బటన్ నొక్కడమే ఆలస్యం హైడ్రాలిక్ గేర్ల సాయంతో ఇల్లు.. అడుగున ఉన్న బాక్స్లోకి వేగంగా జారిపోతుంది. ఇంట్లోని విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు, నీటి, మురుగునీటి వ్యవస్థలు ఆటోమెటిక్గా డిస్కనెక్ట్ అవుతాయి. ఇంటి చుట్టూ మంటలు ఆర్పేసే గ్యాస్ పనిచేసేందుకు రెడీ అవుతుంది. ఇల్లు మొత్తం లోపలకు దిగిపోగానే బాక్స్ పైకప్పు మొత్తం మూసుకుపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం 15 నిమిషాల్లో ముగిసిపోతుందని, మొత్తం వ్యవహారం గురుత్వాకర్షణ శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యుత్తు అవసరం కూడా ఉండదని దీని సృష్టికర్తలు చెప్పారు. ఇంటిని ఒక బంకర్లా వాడుకోవడం కుదరదు. విపత్కర పరిస్థితుల్లో ఇంటిని కాపాడొచ్చుగానీ ఆ సమయంలో ఇంట్లో ఉండేందుకు వీలుండదని ఇంజినీర్లు స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశం నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే నెలల్లో దేశం మరో తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (NOAA) హెచ్చరించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య 81 శాతం అవకాశంతో 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో'గా మారవచ్చని తాజా బులెటిన్లో వెల్లడించింది. ఈ పరిణామం భారత్లో వర్షపాతం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని నినో Niño-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్ నినో దశలో ఉన్నప్పటికీ, మరో రెండు మూడు నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉందని NOAA పేర్కొంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్ నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్ నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్-డిసెంబర్ నాటికి ఇది 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో' స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని NOAA అంచనా వేస్తోంది.ఈసారి ఎల్ నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ (IITM) శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ వివరించారు. తూర్పు పసిఫిక్లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్ నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని.. 76 ఏళ్ల రికార్డు బద్ధలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకారం.. గతంలో నమోదైన బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో 60 శాతం సందర్భాల్లో సాధారణం కంటే తక్కువ లేదా లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్లో దేశవ్యాప్తంగా 40 శాతం వర్షలోటు నమోదైంది. మొత్తం సీజన్లో కూడా దీర్ఘకాల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాల వాతావరణంలోనూ కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణలో జులై రెండో వారంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువ. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, కోస్తా జిల్లాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.అయితే ఎల్ నినో అంటే కేవలం వర్షాభావమే కాదు. సముద్రాల వేడి పెరగడం వల్ల గాలిలో తేమ కూడా పెరుగుతుంది. దీంతో ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంటే, మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే వాతావరణం మరింత అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ ప్రపంచం చూసింది. 2015-16లో నమోదైన 'గాడ్జిల్లా ఎల్ నినో' ప్రపంచవ్యాప్తంగా వాతావరణ రికార్డులను బద్దలు కొట్టింది. భారత్లో 2014, 2015 సంవత్సరాలు ఈ శతాబ్దంలో అత్యల్ప వర్షపాతం నమోదైన సంవత్సరాలుగా నిలిచాయి. ఈసారి కూడా అదే స్థాయిలో తీవ్రత పెరిగితే వ్యవసాయం, జలాశయాలు, తాగునీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, ఆహారధరలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.NOAA అంచనా ప్రకారం ప్రస్తుత ఎల్ నినో 2027 వసంతకాలం వరకు కొనసాగే అవకాశం 97 శాతం ఉంది. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జులైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టంతా పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిణామాలపైనే నిలిచింది. -
ధర్మానికి ప్రతీక విదురుడు
మహాభారతంలో విదురుడు ధర్మానికి, జ్ఞానానికి ప్రతీక. విదురుడు అంబిక, అంబాలికల దాసి అయిన పరిశ్రమి కి జన్మించినప్పటికీ, తన అపారమైన మేధస్సు, ధర్మవర్తనతో కురు సామ్రాజ్యాధిపతి ధృతరాష్ట్రునికి ప్రత్యేక సలహాదారుగా, ప్రధానమంత్రిగా ఎదిగాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి ప్రముఖులు కొన్ని సందర్భాలలో విదురుని వద్దకు సలహాల కోసం సంప్రదించేవారు. విదురుడు శ్రీ కృష్ణునికి పరమ భక్తుడు, పాండవుల శ్రేయోభిలాషి.విదురుని జీవితంలో ముఖ్యాంశాలు...విదురుని జన్మరహస్యం ఒక ప్రత్యేకం. కురువంశాన్ని నిలబెట్టి, రక్షించడానికి దేవర న్యాయం ద్వారా వేదవ్యాసుడు అంబిక వద్దకు వెళ్లగా, ఆమె భయంతో కళ్ళు మూసుకోవడంతో అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఆ తర్వాత అంబాలిక భయపడి పాలిపోయినట్లు అవడంతో ఆమెకు పాండురోగంతో కూడిన పాండురాజు జన్మిస్తాడు. మూడవసారి రాణి అంబిక తన దాసి అయిన పరిశ్రమిని పంపగా, ఆ దాసి భయపడకుండా వ్యాసునికి సేవలు చేస్తుంది. దేవరన్యాయం ద్వారా ఆమెకు జ్ఞానస్వరూపుడైన విదురుడు జన్మిస్తాడు. మాండవ్య మహర్షి శాపం వల్ల భూమిపై యమధర్మ రాజు అంశ దాసీపుత్రుడిగా విదురుని పేరుతో జన్మించవలసి వచ్చింది. మొదటి నుండి విదురుడు ఎంతో సత్ ప్రవర్తన కలిగిన వాడు. మహాభారతంలో అత్యంత నీతిపరుడిగా పేరుగాంచాడు. కురుసభలో పాండవులకు జరిగిన అన్యాయాలను, ద్రోహాలను ఖండించాడు. విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులను ‘విదుర నీతి’ అని పిలుస్తారు. ఈ నీతి అత్యంత ప్రాచీనమైన, విలువైన జీవిత సత్యాలను బోధిస్తుంది. విదురునికి ప్రారంభం నుండి కృష్ణ భక్తి ఎక్కువ. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ఎంతో ప్రయత్నించాడు. ఇందుకోసం ద్వారక నుండి రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణుడు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని తోసిపుచ్చి, ధర్మ కోవిదుడైన విదురుని ఇంటే బస చేసి ఆతిథ్యం స్వీకరించాడు. యుద్ధం అనివార్యం అయినప్పుడు విదురుడు కౌరవ పక్షం వహించలేదు. విదుర నీతిలోని ముఖ్యాంఖాలు వచ్చేవారం.... – సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
స్మాల్, మిడ్ క్యాప్లలో పెట్టుబడి అవకాశాలు
చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 ఇండెక్స్లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి. గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.ప్రధానంగా నాలుగు సూత్రాలు.. ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్ఫోలియోను మారుస్తుంటారు. ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.ఇదే సరైన సమయం ఎందుకు అంటే మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్. వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ -
సర్జరీ లేకుండా పేస్మేకర్
గుండె సమస్యలకు చెక్ పెట్టి అది సక్రమంగా కొట్టుకునేలా చేసేందుకు వాడే పేస్మేకర్ అమర్చేందుకు ఇక శస్త్రచికిత్స అవసరం లేదు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్తోనే పనిచేసే పేస్మేకర్ ఒకదాన్ని అభివృద్ధి చేయడం ఇందుకు కారణం. సూక్ష్మస్థాయి అల్ట్రాసౌండ్ ట్రాన్స్డ్యూసర్లు కలిగి ఉండే ఈ సరికొత్త పేస్మేకర్ను ఛాతీపై ఎడమవైపు రొమ్ము కింది భాగంలో అతికించుకుంటే చాలు గుండె ఎలక్ట్రికల్ సిగ్నళ్ల సమస్యలు, కొట్టుకునే పద్ధతిలో తేడాలను సరిచేయవచ్చు. అయితే ఈ పేస్మేకర్ విడుదల చేసే అ్రల్టాసౌండ్ సంకేతాలను గుర్తించేందుకు గుండె కణాలు కొన్నింటిని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ‘ఎంఎస్సీఎల్జీ22ఎస్’పేరున్న అయాన్ ఛానల్తో గుండె కణాల్లో మార్పులు చేసి రక్తం లేదా నేరుగా గుండె కండరాలకు అందజేస్తారు. ఈ కణాలు అ్రల్టాసౌండ్ సంకేతాలకు స్పందించి గుండె ఒక క్రమ పద్ధతిలో కొట్టుకునేలా చేస్తుంది. శబ్ధం(అ్రల్టాసౌండ్), జెనిటిక్స్(కణాల్లో మార్పులకు) రెండింటినీ ఉపయోగిస్తున్నందున ఈ పద్ధతికి సోనోజెనిటిక్స్ అని పేరు. ఇంకోలా చెప్పాలంటే గుండె కణాలు శబ్దాన్ని వినేలా చేస్తారు. ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించి సత్ఫలితాలు సాధించారు. అ్రల్టాసౌండ్ శబ్ధాలకు గుండె కణాలు ఒక క్రమ పద్ధతిలో కొట్టుకున్నాయి. జంతువుల్లోనూ గుండె పనితీరు మెరుగైనట్లు గుర్తించారు. ఎలుకలు, పంది గుండెలకు అమర్చిన ఈ సరికొత్త పేస్మేకర్లు ఎనిమిది నెలలపాటు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేశాయి. మరిన్ని పరీక్షల ద్వారా ఫలితాలను నిర్ధారించుకుంటే మరికొన్నేళ్లలోనే పేస్మేకర్ అమర్చేందుకు శస్త్ర చికిత్స చేయాల్సిన శ్రమ తప్పిపోనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాత్రి సూర్యుళ్లు వచ్చేస్తున్నారు!
పగలంతా సూర్యకాంతి.. రాత్రయితే చీకటి. ఇదీ ప్రకృతి ధర్మం. అయితే దీన్ని మార్చేస్తా అంటోంది రిఫ్లెక్ట్ ఆర్బిటల్. రాత్రిళ్లు కూడా సూర్యుళ్లను వెలిగిస్తాను అంటోంది. రాత్రిపూట సూర్యుడేంటి అని ఆశ్చర్యపోవద్దు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రతిపాదిస్తున్నది నేరుగా సూర్యుడిని రాత్రిపూట వెలిగే చేస్తానని కాదు. భూమి చుట్టూ భారీ అద్దాలు అమర్చి ఎక్కడ కావాలంటే అక్కడ సూర్యుడి వెలుగు ప్రతిఫలించేలా చేస్తానూ అని. నిజానికి ఏడాది క్రితం ఇదే ఐడియాతో కంపెనీ ఏర్పాటైంది కానీ తాజాగా అమెరికా సమాచార, ప్రసార విభాగం ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పచ్చజెండా ఊపడంతో కంపెనీ ఆలోచన మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఈ కంపెనీ ప్రణాళిక ఏమిటి? లాభాలున్నాయా? అల్యూమినియం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ లోహాన్ని ఫుడ్ ప్యాకేజింగ్ మొదలు చాలాచోట్ల వాడుతూంటారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కూడా అత్యంత పలుచటి అల్యూమినియం పొరలనే అద్దాలుగా మార్చి భూమి చుట్టూ పెడతానని చెబుతోంది. కాకపోతే ఒక్కో అద్దం అరవై అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉంటుంది. భూమికి సుమారు 680 కిలోమీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ముందుగా ఎరిన్డిల్–1 పేరుతో తయారు చేసిన ఒక ఉపగ్రహం ద్వారా ఒక్క అద్దాన్ని అక్కడి వరకూ పంపించి పరీక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాత 2035 నాటికల్లా దశలవారీగా భూమి చుట్టూ కనీసం 50 వేల అద్దాలు ఏర్పాటు తిరిగేలా చేస్తారు. ఒక్కో అద్దం భూమివైపునకు మళ్లితే ఐదు చదరపు కిలోమీటర్ల మేర వెలుగులు నిండుతాయి. పోలిక కావాలంటే... హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దాదాపు 2,300 ఎకరాలు ఉంటుంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అద్దం ఒకటి దీంట్లో సగం ప్రాంతాన్ని వెలుగుతో నింపేయగలదు. ఉపయోగాలేమిటి? కంపెనీ చెబుతున్నదాని ప్రకారం బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యుడి వెలుగు రాత్రిళ్లు కూడా అందుబాటులోకి వస్తే పంటలు డబుల్ స్పీడ్తో ఎదుగుతాయి. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చోట జనరేటర్ల అవసరం లేకుండా రాత్రిళ్లూ పనులు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టవచ్చు. విలువైన ప్రాణాలు కాపాడవచ్చు. ఏ అద్దాన్ని ఎటు మళ్లిస్తే ఎక్కడ వెలుగులు పడతాయో లెక్కేసేందుకు కంప్యూటర్లు సరిపోతాయి. ఐడియా బాగానే ఉంది కానీ దీనిపై ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. 1990లలో రష్యా జన్మయా పేరుతో ఇలాంటి ప్రాజెక్టే ఒకటి చేపట్టి విఫలమైంది. అల్యూమినియం పొరలు అంతరిక్షంలో సర్రున చిరిగిపోయాయట. పైగా విశాల విశ్వాన్ని, అంతరిక్షాన్ని మధించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలకు ఈ ప్రకాశాలు పెద్ద అడ్డంకి. గాల్లో ఎగురుతూండగా అకస్మాత్తుగా వచ్చిపడే ప్రకాశం వల్ల తాము గందరగోళానికి గురవుతామని విమానాల పైలెట్లు కూడా హెచ్చరిస్తున్నారు. పక్షులు, ఇతర జీవజాతుల పరిస్థితి ఏమిటన్నది పర్యావరణవేత్తల ఆందోళన. అద్దాలను ఎటు కావాలంటే అటు తిప్పేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ సమస్యలే కావన్నది కంపెనీ వాదన. చూద్దాం ఏమవుతుందో?! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోగ్యప్రదాయిని ‘కోకో నిబ్స్’
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్య ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కోకో నిబ్స్’ గురించే చర్చ నడుస్తోంది! ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ సూపర్ఫుడ్ ఇదేనంటూ సోషల్ మీడియా చెబుతోంది. ఇంతకీ ఇదేంటంటే.. కరకరలాడే డార్క్ చాక్లెట్ ముక్కలు. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ బోలెడు ఉన్నాయని.. వాటిని రోజువారీ డైట్లో చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సిఫారసు చేస్తున్నారు. నిజానికి ఇవి చాక్లెట్ తయారీకి వాడే కోకో గింజల ముక్కలు. వాటిలో ఎలాంటి చక్కెరలు కలపరు.. కాబట్టి ఇవి 100 శాతం ఆరోగ్యకరమైనవి. భావోద్వేగాలను మార్చడం నుంచి గుండెను పదిలంగా ఉంచే వరకు కాకో నిబ్స్ చేసే మేలు అంతా ఇంతా కాదు. పోషకాల గని మార్కెట్లో దొరికే ఖరీదైన సప్లిమెంట్ల కంటే కోకో నిబ్స్ వంద రెట్లు మేలైనవి. వాటిలో కండరాల పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం, ఎముకలను పటిష్టపరిచే ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే శరీర అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్గా ఉంచడంలోనూ దోహదపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మంట తగ్గించడంలో, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. కోకో నిబ్స్లో ఫెనిలెథైలమైన్, అనండమైడ్ వంటి అద్భుతమైన సమ్మేళనాలు ఉన్నాయి. అందుకే వాటిని సరదాగా ‘లవ్ డ్రగ్’ అని కూడా పిలుస్తారు. ఈ ‘డ్రగ్’ మెదడులో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక సహజ న్యూరోట్రాన్స్మిటర్లా పనిచేస్తుంది. కోకో నిబ్స్లోని ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా రక్తపోటు అదుపులోకి వస్తుంది. శరీరంలోని మంచి కొవ్వు శాతం పెరిగి గుండెపోటు ముప్పు తగ్గుతుంది.డైట్లో ఎలా చేర్చుకోవాలి? కోకో నిబ్స్ కాస్త చేదుగా, కాఫీ గింజల రుచితో కరకరలాడుతుంటాయి. వాటిని మీ మెనూలో రకరకాలుగా వాడుకోవచ్చు» బ్రేక్ఫాస్ట్లో: ఓట్మీల్, కార్న్ఫ్లేక్స్ లేదా పెరుగుపై చల్లుకొని తినొచ్చు.» స్మూతీస్లో: మిల్క్షేక్స్ లేదా స్మూతీస్లో వేస్తే అదనపు క్రంచ్ వస్తుంది.» డెజర్ట్స్ టాపింగ్: ఐస్క్రీమ్లు, కేక్లు, బ్రౌనీస్ వంటి తీపి పదార్థాలపై వాటిని వేసుకుంటే ఆ చేదు, తీపి కాంబినేషన్ అదిరిపోతుంది.» సలాడ్స్: హెల్తీ సలాడ్స్ లేదా గ్రెయిన్ బౌల్స్లో వేసుకుంటే కరకరలాడుతుంది. -
మూగబోయిన స్వర కోయిల
మైసూరు/బెంగళూరు/తెనాలి: తేనెలూరు తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశలా ఎగురవేసిన స్వర కోయిల మూగవోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్.జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన బహుభాషా గాయని ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యురాలైన ఆమె ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్హౌజ్లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవళ వర్ణ సంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవలే బోగాది నగరలోని ఎస్బీఎం లేఔట్ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12.49 గంటలకు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూల్ (బహుళ అవయవ వైఫల్యం)తో గుండెపోటుకు గురయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఆమె బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్హౌజ్లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతంకు ముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్ గ్రౌండ్స్లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆటుపోట్ల జీవితం ఎస్.జానకి తన తీయని కంఠం ద్వారా ప్రజలను ఎంతగా ముగ్ధుల్ని చేశారో ఆమె జీవితం అంతగా ఆటుపోట్లకు గురైంది. 1938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే శ్రద్ధ లేదు. బడి అంటే ఆమడదూరం వెళ్లేవారు. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం. రోడ్డుపైకి వెళ్లినపుడు లతా మంగేష్కర్ పాటలు వింటూ, తాను పాడుతూ పెరిగారు. వివిధ కారణాలరీత్యా శ్రీరామమూర్తి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. సిరిసిల్లలోనే తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమాను చూసి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో జానకి గుర్తుచేసుకున్నారు. పాటలపై కూతురుకు గల ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం ఎవరి వద్దా నేర్చుకోలేదు. గురువు గారు కీర్తనలతో ఆరంభించినా, జానకి ధ్యాసంతా సినిమా పాటలపైనే ఉండేది. అక్కడుండే ‘క్రాంతి కళామండలి యూత్ అసోసియేషన్’లో సినిమా పాటల కచేరీల్లో పాటలు పాడుతున్న కాలంలో, అమ్మ మరణంతో మళ్లీ ఆ కుటుంబం హైదరాబాద్కు చేరుకుంది.జానకి మామయ్య ‘ఫన్ డాక్టర్’చంద్రశేఖర్ వేదికపై ప్రదర్శనలిస్తుండేవారు. మధ్యమధ్యలో జానకి పాటలు పాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు వి.రాంప్రసాద్, జానకి స్వరంలోని ప్రత్యేకతను గమనించారు. కుమారుడు చేసిన సూచనతో చంద్రశేఖర్, చెన్నైలోని రెండు మూడు స్టూడియోలకు జానకి గురించి లేఖ రాశారు. ఏవీఎం స్టూడియో నుంచి ఆడిషన్కు రమ్మని కబురొచి్చంది. స్టూడియో స్టాఫ్గా ఎంపిక చేసుకున్నారు. తాను ఇష్టపడిన రాంప్రసాద్తోనే ఆమెకు 1959లో వివాహమైంది. పాటలకు సంబంధించిన ఒప్పందాలు, రెమ్యూనరేషన్, రాయల్టీలు అన్ని విషయాలు ఆయనే చూసుకున్నారు.1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన జానకి దంపతులకు ఏకైక కుమారుడు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఎక్కువకాలం కొనసాగలేదు. కోడలు ఉమ నర్తకి. దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’అవార్డు కూడా తీసుకున్నారు. ‘పాట నాకు ప్రాణం.. ప్రాణమున్నంతకాలం పాడుతూనే ఉంటాను’అంటుండే జానకి, భౌతికంగా ఊపిరి కోల్పోయినా ఆమె పాట ఇప్పటికీ, ఎప్పటికీ అభిమాన శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తుమ్మలూరు గ్రామంలోని మ్యాక్ ప్రాజెక్టులో 279 నంబర్ విల్లాను కొనుగోలు చేసి కుమారుడు మురళీకృష్ణతో ఆమె నివసించారు. ఒక ఊపు ఊపిన ‘నీ లీల పాడెద దేవా..’ ⇒ 1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో ‘విధియిన్ విళైయట్టు’తమిళ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ వెంటనే తెలుగులో ‘ఎంఎల్ఏ’సినిమా కోసం ‘నీ ఆశ అడియాశ చెయి జారే మణిపూస’పాటను ఘంటసాలతో కలిసి పాడారు. తొలిగా విషాదగీతంతో ఆరంభించినా, ఆమె సినీ కెరీర్ మధుర వెన్నెలలా కొనసాగింది. బావా మరదళ్లు సినిమాలో ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’పాటతో బిజీ అయ్యారు. ⇒ ఆ క్రమంలోనే ‘మురిపించే మువ్వలు’సినిమాలో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’పాట దక్షిణాదిని ఒక ఊపు ఊపింది. తద్వారా సినీ రంగంలో ఆమెకో ప్రత్యేక స్థానం లభించింది. వాస్తవానికి ఆ పాటను పి.లీలతో పాడించాలని నిర్ణయించారు. అంత హైపిచ్తో తాను పాడలేనని, జానకిచే పాడించమని పి.లీల సూచించారు. ఆ పాటకు అభినయించే సావిత్రి మాత్రం సుశీలతో పాడించాలని పట్టుబట్టారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు జానకి చేతనే పాడించారు. ⇒ ఇక జానకి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దిగ్గజ సంగీత దర్శకుల సంగీతానికి పాటలు పాడుతూ బిజీ అయ్యారు. మరో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు జానకి పాటను అనుకోకుండా విన్నారు. వెంటనే పూజాఫలం సినిమాలో ‘పగలే వెన్నెలా.. జగమే ఊయల’పాడించటంతో మరింత బిజీ గాయనిగా మారారు. ⇒ ఆరాధనలో ‘ఆడదాని ఓరచూపులో’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో’వంటి సూపర్ హిట్ పాటలతో జానకి సినిమా పాటల ప్రయాణం ప్రవాహంలా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లి‹Ù, సంస్కృతం, జర్మన్, జపాన్ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో అలుపెరగని కోయిల అనిపించుకున్నారు. వీటిలో 17 వేలకు పైగా సినిమా పాటలు కాగా, మిగిలినవి ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు. సొంత సంగీతంలో పాడారు. వీటితో పలు భక్తి సంగీత క్యాసెట్లు వచ్చాయి.ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ⇒ చిన్న పిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచే వారు సంగీత దర్శకులు. ‘చందమామ రావే’(1987), ‘జడ్జిమెంట్’(1990) సినిమాల్లో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పారు. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యానికి వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయస్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. ⇒ 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు (ఇందులో రెండు టెలివిజన్), ఒడిశా ప్రభు త్వ అవార్డులు లభించాయి. కలైమామణి, సుర్సింగార్, సింగర్ ఆఫ్ ది సెంచరీ, భారతీదాసన్ వంటి అవార్డులు మరికొన్ని. సంగీత ప్రపంచంలో రారా ణిగా వెలుగొందిన జానకి తమిళనాడు కోటాలో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడా గౌరవాన్ని జానకి తిరస్కరించటం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా, దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. గాయనిగా ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడో ఇస్తే ఎలాగని తిరస్కరించారని అంతా భావించారు. ⇒ ఎస్.జానకికి దైవ భక్తి ఎక్కువ. నంజనగూడులోని నంజుండేశ్వర, చాముండేశ్వరి, యోగా నరసింహస్వామి దేవాలయాల్లో తరచూ పూజలు చేసేవారు. అద్భుత సంగీత పయనం అనంతరం 2017 అక్టోబర్ 28న మైసూరు విశ్వవిద్యాలయం మానస గంగోత్రిలోని రంగమందిరంలో ఆమె తన పాటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ప్రజా వేదికల్లో పాడబోనని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారువైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్.జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్.జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తంచేశారు. జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నత గాయని జానకి అని కొనియాడారు. జానకి గానామృతం తరతరాలపాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి తెలుగు ప్రజలకు గర్వకారణం: సీఎం జానకి మృతి పట్ల సీఎం ఎ.రేవంత్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కిషన్రెడ్డి, సంజయ్, రాంచందర్రావు సంతాపం జానకి మృతి పట్ల కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన జానకి కన్నుమూశారనే వార్త విచారకరమని కిషన్రెడ్డి పేర్కొన్నారు. జానకి మరణం భారతీయ సంగీతానికి ఎంతో లోటని సంజయ్ తెలిపారు. ప్రపంచ సంగీతానికి జానకి మరణం తీరని లోటని రాంచందర్రావు పేర్కొన్నారు. జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్ జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు సంతాపం తెలిపారు. జానకమ్మ మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి మరణవార్త ఎంతో బాధాకరం: కేటీఆర్ జానకి మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జానకి తన బాల్యంలో కొన్నేళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
పోక్సో చట్టం.. కవచమా? కాగితపు పులినా?
పోక్సో కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన నిందితుడు ప్రతీకారంతో ఆరుగురిని కిరాతకంగా హత్య చేయడం.. అందునా బాధిత బాలికను అపహరించి అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోక్సో.. పిల్లలకు కవచమా? నిందితులకు అవకాశమా? తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగిన సామూహిక హత్యలు ఈ ప్రశ్నను మరోసారి దేశం ముందుకు తెచ్చాయి. దీంతో పిల్లల రక్షణ కోసం రూపొందించిన కఠిన ‘పోక్సో’ చట్టం అమలులో ఏ మేర లోపాలున్నాయి? మైనర్లకు రక్షణ కల్పించాల్సింది బదులు నిందితులకు అవకాశంగా మారుతున్నాయా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.మన దేశంలో 2012లో లైంగిక దాడుల్లో మైనర్ల రక్షణ కోసం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఏడాది డిసెంబర్లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఘటన జరిగింది. ఈ రెండు సంఘటనలను చాలామంది ఒకటిగా భావిస్తుంటారు. కానీ వాస్తవానికి పోక్సో చట్టం నిర్భయ ఘటనకు కొన్ని నెలల ముందే (2012 నవంబర్ 14 నుంచి) అమల్లోకి వచ్చింది. అయితే నిర్భయ ఘటన తర్వాత మహిళల భద్రత, లైంగిక నేరాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పోక్సో చట్టం అమలు మరింత కఠినంగా మారింది. 2019లో కేంద్ర ప్రభుత్వం పోక్సోకు కొన్ని సవరణలు చేసి, కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష వరకు విధించే అవకాశాన్ని కూడా చట్టంలో చేర్చింది.పోక్సో ప్రత్యేకత ఏంటి?ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి బాలుడు, బాలికకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. శారీరక దాడితో పాటు లైంగిక వేధింపులు, అశ్లీల ప్రదర్శనలు, ఆన్లైన్ లైంగిక వేధింపులు, పిల్లల అశ్లీల చిత్రాల తయారీ, వినియోగం వంటి అనేక నేరాలను ఇందులో స్పష్టంగా నిర్వచించారు. అలాగే ప్రత్యేక పోక్సో కోర్టులు, ఇన్కెమెరా విచారణ, బాధితుడి గుర్తింపు గోప్యంగా ఉంచడం, పిల్లలకు అనుకూలమైన విచారణ విధానం వంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి.పోక్సోకు ముందు పరిస్థితి ఏంటి?చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే.. పోక్సోకు ముందే పిల్లలపై లైంగిక నేరాలకు చట్టమే లేదనేది. కానీ అది నిజం కాదు. పోక్సోకు ముందు కూడా భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అత్యాచారం, అసభ్య ప్రవర్తన, వేధింపులు, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధించేవారు. అయితే ఆ చట్టాల్లో పిల్లల కోసం ప్రత్యేక నిర్వచనాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక విచారణ విధానం లేవు. ముఖ్యంగా అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులు, శారీరక సంబంధం లేకుండా జరిగే లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం వంటి అనేక నేరాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనం లేకపోవడంతో నిందితులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండేవి.పోక్సో వచ్చాక కూడా.. బెయిల్ ఎలా?పోక్సో కేసు అంటే బెయిల్ రాదనుకోవడం సరికాదు. నేర తీవ్రత, సాక్ష్యాలు, దర్యాప్తు దశ, నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం, బాధితుల భద్రత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టులు బెయిల్పై నిర్ణయం తీసుకుంటాయి. అంటే చట్టం బెయిల్ను పూర్తిగా నిషేధించలేదు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో విధించే షరతులు, వాటి అమలు చాలా కీలకం. షాబాద్ కేసులో..రాజశేఖర్ విషయంలో ఇదే జరిగి ఉంటుంది.చట్టంలో లోపమా.. అమలులో లోపమా?న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య ఎక్కువగా చట్టంలో కంటే అమలులోనే ఉంది. బెయిల్పై విడుదలైన నిందితులపై నిరంతర నిఘా, బాధిత కుటుంబాలకు రక్షణ, నిందితుడు బాధితులను సంప్రదించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయడం, అవసరమైతే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వంటి వ్యవస్థలు మన దేశంలో ఇంకా పరిమితంగానే ఉన్నాయి.ఇలాంటి చర్చ ఇదే తొలిసారి కాదు. పోక్సో చట్టం అమలు, దాని వ్యాఖ్యానంపై గతంలోనూ దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో తీవ్ర చర్చ జరిగింది. 2021లో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన 'స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్' తీర్పు దేశవ్యాప్తంగా వివాదానికి దారితీసింది. బట్టలపై నుంచి తాకితే అది పోక్సో కింద లైంగిక దాడి కాదన్న వ్యాఖ్యలపై బాలల హక్కుల సంస్థలు, న్యాయ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టివేస్తూ.. లైంగిక ఉద్దేశంతో పిల్లలను తాకే ఏ చర్య అయినా పోక్సో పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే పోక్సో కేసుల్లో బెయిల్పై విడుదలైన నిందితులు బాధితులను బెదిరించడం, సాక్షులపై ఒత్తిడి తీసుకురావడం వంటి ఘటనలు కూడా గతంలో పలు రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. దీంతో బెయిల్ షరతులను మరింత కఠినతరం చేయడం, బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించడం, విడుదలైన నిందితులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న డిమాండ్ అప్పట్లోనే వినిపించింది.విదేశాల్లో ఎలా ఉంటుంది?అమెరికాలో పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని రికార్డుల్లో(Sex Offender Registry)లో నమోదు చేసి.. విడుదల తర్వాత కూడా ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తారు. పిల్లల పాఠశాలలు, పార్కులు, నివాస ప్రాంతాలకు వెళ్లకుండా కోర్టులు ఆంక్షలు విధిస్తాయి.బ్రిటన్లో ఎస్హెచ్పీవో( Sexual Harm Prevention Orders) ద్వారా నిందితుల కదలికలు, పిల్లలతో సంబంధాలు, ఇంటర్నెట్ వినియోగంపైనా పరిమితులు విధించవచ్చు.ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్లో విడుదలైన లైంగిక నేరస్థులపై ఎలక్ట్రానిక్ ట్రాకింగ్, పోలీసు పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి.భారత్లో చట్టం బలహీనమా?శిక్షల పరంగా చూస్తే భారత పోక్సో చట్టం ప్రపంచంలోనే కఠినమైన చట్టాల్లో ఒకటి. తీవ్రమైన కేసుల్లో జీవిత ఖైదు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కానీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే. చట్టం కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితులపై కఠిన నిఘా, బాధిత కుటుంబాల భద్రత, వేగవంతమైన విచారణ, సాక్షుల రక్షణ వంటి అంశాలు కూడా అంతే బలంగా అమలు కావాలి.షాబాద్ ఘటన చెబుతున్న పాఠంషాబాద్ సామూహిక హత్యలు కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు. పిల్లల రక్షణ కోసం రూపొందించిన చట్టం అమలు విషయంలో ఉన్న లోటుపాట్లను మరోసారి గుర్తు చేశాయి. పోక్సోను మరింత కఠినతరం చేయాలా? లేదంటే ఇప్పటికే ఉన్న చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చట్టం కంటే దాని అమలు, బెయిల్ తర్వాత నిందితుల పర్యవేక్షణ, బాధిత కుటుంబాల భద్రతను బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.:::వెబ్ ప్రత్యేకం -
రోబోలు ఆపరేషన్ చేశాయి!
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హ్యూమనాయిడ్ రోబోలు (మనుషుల్లా వ్యవహరించేవి) ఒకటి కాదు.. రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాన్డియాగో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ఆపరేషన్లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్ కంట్రోలర్ సాయంతో పని చేయించి పిత్తాశయాన్ని (గాల్బ్లాడర్) తొలగించగా... రెండు హ్యూమనాయిడ్ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ రెండో ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్’జూలై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తరచూ ఇలాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులున్నాయి. మొదటగా వీటి బరువు ఇంట్యూటివ్ సర్జికల్స్ వారి డావిన్సీ సర్జికల్ సిస్టమ్ 820 కిలోల వరకూ బరువు ఉంటే సీఎంఆర్ సర్జికల్స్కు చెందిన వెరిసియస్ 450 కిలోలు ఉంటుంది. మెడ్ట్రానిక్ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్ఏఎస్ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది. వీటిని ఆపరేషన్ థియేటర్లలో అమర్చడం పని చేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలదు.హ్యూమనాయిడ్ రోబోలు ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలవని అంచనా. కాలిఫోర్నీయా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబో సర్గి ఐదు అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కు నడుచుకుని రాగలదు. సర్జికల్ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు. పేద, మధ్యాదాయ దేశాల్లో, వనరులు, వసతులు తక్కువగా ఉన్నచోట్ల ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రాణాలు నిలిపే కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నీయా వర్సిటీ ఇంజినీర్ మైకెల్ ఇప్ తెలిపారు. సర్జరీకి అవసరమైన కత్తులు, ఇతర పరికరాలను పట్టుకునేందుకు అడాప్టర్లను ప్రత్యేకంగా తయారు చేశామని, వీటితో పనిచేయించడం పెద్ద కష్టమేమీ కాలేదని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న సర్జన్ నికితా తరేజా తెలిపారు. ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఆపరేషన్ థియేటర్లో ఎంత బాగా సర్దుకుపోయాయో చూసి ఆశ్చర్యపోయామన్నారు. తొలి ఆపరేషన్లో సెర్గిని పదే పదే రీకాలిబరేట్ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మృత్యువు అంచుల నుంచి రాజ భోగాల వరకు.. అద్భుత ప్రయాణాలు!
రైలు ప్రయాణం అంటే మనందరికీ ఇష్టమే..! చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి నేటి ప్రయాణాల వరకు.. కిటికీ పక్కన కూర్చుని, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, బయట ప్రకృతిని చూడటం ఒక అందమైన, ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. కానీ.. అదే రైలు ప్రయాణం మృత్యువుతో పోరాటంలాంటిదైతే? ఒక్క అంగుళం పట్టాలు తప్పినా, వేల అడుగుల లోతైన లోయలో పడిపోయే భయానక వాతావరణం ఉంటే? ఇంకోవైపు.. ఒక సాదాసీదా రైలు ప్రయాణం, ఏకంగా సెవెన్ స్టార్ హోటల్ను తలపించే విలాసవంతమైన రాజభోగం అయితే?.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో కళ్లు చెదిరేంత లగ్జరీ రైల్వే రూట్ల గురించి ఆసక్తికర విషయాలతో పాటుగా మానవ సాహసానికి, తిరుగులేని ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనమైన రూట్స్ ఇవి.ముందుగా మనం మనుషులను భయపెట్టే ప్రమాదకరమైన రూట్లలోకి చూస్తే.. అర్జెంటీనాలోని 'ట్రెన్ ఎ లాస్ న్యూబ్స్' (Tren a las Nubes).. దీని అర్థం 'మేఘాల్లోకి వెళ్లే రైలు'. సముద్ర మట్టానికి ఏకంగా 13,800 అడుగుల ఎత్తున, ఆండీస్ పర్వతాల గుండా ఈ రైలు వెళ్తుంది. కింద చూస్తే గుండె ఆగిపోయేంత లోతైన లోయలు, పైన మేఘాల గుంపులు. ఈ రూట్లో ప్రయాణించేటప్పుడు ఎత్తు వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, అందుకే విమానాల్లో లాగే ఈ రైల్లో కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో పెడతారు.ఈక్వెడార్లో ఇలా.. ఇక ఈక్వెడార్లోని 'నారిజ్ డెల్ డయాబ్లో' (Nariz del Diablo).. దీనికి 'సైతాన్ ముక్కు' అనే అర్థం ఉంది. నిట్టనిలువుగా, గోడలా ఉండే కొండ చరియలపై జిగ్జాగ్గా, వెనక్కి ముందుకీ నడుస్తూ ఈ రైలు కొండ దిగుతుంది. ఒక్క చిన్న తప్పు జరిగినా రైలు పాతాళంలోకి వెళ్లాల్సిందే. 19వ శతాబ్దం చివర్లో ఈ ట్రాక్ వేసేటప్పుడు వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి సైతాను ముక్కు అనే పేరు వచ్చింది.Tren de las nubes pic.twitter.com/QM7KtHosvu— saltenials (@saltenials) August 29, 2023భారత్లో రూట్స్..భారతదేశంలో కూడా ఇలాంటి రూట్స్ ఉన్నాయా? అంటే కాస్త తక్కువ భయంకరమైనవి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. తమిళనాడులోని 'పాంబన్ బ్రిడ్జ్'ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పాత బ్రిడ్జ్ని సముద్రంపై నిర్మించారు. దీని మీద రైలు వెళ్తుంటే.. కింద భయంకరమైన అలలు, కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు రైలును ఊపేస్తుంటాయి. ఇక సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి రోజున కిటికీ లోంచి చూస్తే కేవలం అనంతమైన సముద్రం తప్ప ఏమీ కనిపించదు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ ఇది.ट्रेन की रफ्तार और पम्बन ब्रिज की मजबूती को देखकर पता चल रहा है कि भारत सरकार का बनाया हुआ है 🚂🛤️🚃 pic.twitter.com/ttPnwQ1HID— Vipin patel 🚩 (@VVipinpatel) July 4, 2026ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం..!! లగ్జరీ! ఒక ఫైవ్ స్టార్ లేదా సెవెన్ స్టార్ హోటల్ పట్టాల మీద నడిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రైలుగా పేరుగాంచినది.. 'వెనిస్ సింప్లాన్-ఓరియంట్-ఎక్స్ప్రెస్' (Venice Simplon-Orient-Express). లండన్ నుంచి పారిస్ మీదుగా వెనిస్ వరకు సాగే ఈ ప్రయాణంలో.. రైలు లోపల అంతా 24 క్యారెట్ల బంగారం నగిషీలు, వెల్వెట్ డిజైన్లు, ప్రపంచ స్థాయి చెఫ్ల వంటకాలు, పర్సనల్ బట్లర్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 1920ల నాటి క్లాసిక్ వైబ్ని ఇది అందిస్తుంది. ఇందులో ఒక్క రాత్రి ప్రయాణానికి టికెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 4 నుంచి 10 లక్షల రూపాయలు!Conheça a suíte de luxo L’Observatoire, do Venice Simplon-Orient-Express, onde cada viagem pode custar cerca de 550 MIL reais. Pagariam? pic.twitter.com/9RVUQoSonW— POINT POP (@Point__Pop) July 9, 2026రష్యాలోని 'ట్రాన్స్-సైబీరియన్ ఎక్స్ప్రెస్' కూడా అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే రూట్లో నడుస్తుంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు 9,289 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ జర్నీలో సైబీరియా మంచు అందాలను, ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్ సరస్సు వైభవాన్ని ఒక నడిచే రాజభవనంలో కూర్చుని చూడొచ్చు.One of the most breathtaking train rides in the world.The Bernina Express travels from Chur, Switzerland to Tirano, Italy on the Rhaetian Railway. It crosses 196 bridges and 55 tunnels, climbs over the Bernina Pass, and then descends into Italy. pic.twitter.com/fun1VhgjL8— Harshvardhan Ram🇯🇵🇹🇭🇬🇧 ☮️☸️ (@FaaltuBooi7) July 5, 2026'మహారాజాస్ ఎక్స్ప్రెస్'..మన దేశంలో కూడా లగ్జరీ రైళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. మన 'మహారాజాస్ ఎక్స్ప్రెస్' (Maharajas' Express) ప్రపంచంలోనే అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా వరుసగా అవార్డులు గెలుచుకుంది. దీని ప్రెసిడెన్షియల్ సూట్ టికెట్ ధర దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది..! విదేశీయులు మన దేశ రాజసం, సంస్కృతిని, అజంతా ఎల్లోరా గుహలను, తాజ్ మహల్ అందాలను చూడటానికి ఈ రాయల్ జర్నీని ఎంచుకుంటారు. లోపలికి వెళ్తే మనం ఒక రాజు కాలంలో ఉన్నామా?? అనే భ్రమ కలుగుతుంది.India is home to some of the world’s most luxurious trains,The Maharajas’ Express often ranked among the finest luxury rail journeys globally. pic.twitter.com/T2bTHevzUX— India Plus (@india_plus_) June 30, 2026సైకలాజికల్ కోణంలో విశ్లేషిస్తే.. మనుషుల్లో రెండు రకాల తీవ్రమైన, పరస్పర విరుద్ధమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి.. అడ్వెంచర్, థ్రిల్ కావాలనుకోవడం, ప్రాణాలను పణంగా పెట్టైనా ప్రకృతి సవాలును జయించి ఆ డోపమైన్ రష్ను అనుభవించాలనుకోవడం. రెండోది.. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకోవడం, సమాజంలో తన హోదాను చాటుకుంటూ తానే ఒక చక్రవర్తిలా ఫీలవ్వడం. ఈ రెండు భిన్నమైన హ్యూమన్ ఎమోషన్స్ను, సైకాలజీని ఈ రైల్వే రూట్లు సంపూర్ణంగా satisfy చేస్తాయి. ఒకటేమో ప్రకృతిని జయించిన మనిషి మొండితనానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక అయితే, ఇంకొకటి మనిషి సృష్టించుకున్న విలాసానికి నిదర్శనం.ప్రమాదకరమైన లోయలైనా, పరమ విలాసవంతమైన భోగీలైనా.. ప్రతి రైలు ప్రయాణమూ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. గమ్యం కంటే ఆ ప్రయాణమే మనకు ముఖ్యం అని చెప్తుంది! మానవ మేధస్సు, ఇంజనీరింగ్ సృష్టించిన ఈ పట్టాల అద్భుతాలు భూమిపై ఎప్పటికీ నిలిచిపోతాయి.Orient Express from Venice to Paris 🚋 the Venice Simplon-Orient-Express embarks on a 24-hour journey Art deco interiors gourmet dining #SundayMorning #SundayVibes #SundayMood ☆ paris.attractive☆ sarahjmea via TT @Sarahhuniverse @CONTEMPRA_INN 🌹pic.twitter.com/TRkmHRKrmG— ContempraINN🌹 (@CONTEMPRA_INN) July 21, 2024 -
పాముల రాజ్యం.. కోట్ల వ్యాపారం.. ఒక్క దెబ్బతో తారుమారు!
పాములు అంటే భయంతో మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పాములే ఒక పెద్ద వ్యాపారం. ముఖ్యంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాములను ప్రత్యేకంగా పెంచే స్నేక్ ఫారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఔషధ పరిశ్రమ, శాస్త్రీయ పరిశోధనలు, పాము విషం సేకరణ, చర్మ ఉత్పత్తులు వంటి అవసరాల కోసం వేల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే..చైనా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల ధాటికి ఓ పాముల పెంపక కేంద్రం దెబ్బతింది. రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో 900కు పైగా పాములు బయటకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బయటకు వచ్చిన వాటిలో కొన్ని విషపూరిత జాతులకు చెందిన పాములు ఉండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక, వరద నీటిలో పాములు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.“స్నేక్ విలేజ్”..అయితే, చైనాలో పాముల పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా జెజియాంగ్ ప్రావిన్స్లోని జిసికియావో (Zisiqiao) ప్రాంతం పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. దీనిని చాలా మంది “స్నేక్ విలేజ్”గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా పాములను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు రకాల సర్పాలను ప్రత్యేక ఫారాల్లో ఉంచుతారు. జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది.దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతం కూడా పాముల పెంపకానికి మరో ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పాముల ఫారాల్లో విషసర్పాలను పెంచి వాటి నుంచి వివిధ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇటీవల వరదల కారణంగా పాములు బయటకు వచ్చిన ఘటన కూడా ఈ ప్రాంతంలోని ఓ ఫారం నుంచే జరిగినట్లు సమాచారం. కాగా, పాముల పెంపకం వెనుక ప్రధానంగా ఔషధ పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాలు ఉన్నాయి. పాము విషాన్ని శాస్త్రీయ పరిశోధనలు, యాంటీ వెనం మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. విషం సేకరించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.Amd Chinese have startto catch these snakes.Food is important https://t.co/7DmN6tKr7c pic.twitter.com/RX24yp0ipi— GeoPanda (@Geotactix) July 8, 2026భద్రతపై టెన్షన్..అలాగే కొన్ని ప్రాంతాల్లో పాము చర్మానికి కూడా డిమాండ్ ఉంటుంది. పాము చర్మంతో కొన్ని రకాల లెదర్ ఉత్పత్తులు తయారు చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాములను ఆహారంగా కూడా వినియోగించే సంప్రదాయం ఉంది. దీంతో పాముల పెంపకం ఒక ప్రత్యేక మార్కెట్గా అభివృద్ధి చెందింది. అయితే విషసర్పాలను పెద్ద సంఖ్యలో ఒకే చోట పెంచడం ఎప్పుడూ ప్రమాదకరమే. భారీ వర్షాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫారాల భద్రతా వ్యవస్థలు దెబ్బతింటే పరిస్థితి అదుపు తప్పుతుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.పాముల పెంపక కేంద్రాల్లో బలమైన రక్షణ గోడలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, యాంటీ వెనం నిల్వలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం తప్పనిసరి. లేకపోతే వ్యాపారం కోసం పెంచిన విషసర్పాలే ప్రజలకు ప్రాణాంతక ముప్పుగా మారే అవకాశం ఉంది. వరదలతో బయటపడిన వందలాది పాముల ఘటన కేవలం ఓ ప్రమాదం మాత్రమే కాదు.. పాముల పెంపకం వెనుక ఉన్న భారీ వ్యాపారం, దాని వల్ల వచ్చే భద్రతా సవాళ్లను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది.When floods become a haven for predators! 🛑 The terrifying side of the recent heavy rains in China... Snakes leaving their burrows and swimming through the floodwaters! 🐍🌊 pic.twitter.com/AbjbZYwjSg— Nature (@NNaturalanimals) July 10, 2026పాముల పెంపకాలు ఇక్కడే.. 1. జిసికియావో (Zisiqiao) – జెజియాంగ్ ప్రావిన్స్చైనాలో అత్యంత ప్రసిద్ధ ‘స్నేక్ విలేజ్’గా పేరు పొందిన ప్రాంతం ఇది.ఇది జెజియాంగ్ ప్రావిన్స్లోని డెక్వింగ్ కౌంటీ, జిన్షి టౌన్ (Xinshi Town) పరిధిలో ఉంది.ఇక్కడ దశాబ్దాలుగా గ్రామస్తులు పాముల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు.కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు జాతులను పెంచుతారు.పాము విషం, పాము చర్మం, ఎండబెట్టిన పాము ఉత్పత్తులు, సంప్రదాయ ఔషధాల కోసం ఈ వ్యాపారం కొనసాగుతోంది.2. హెన్జౌ (Hengzhou).. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ఇటీవల వందల సంఖ్యలో పాములు బయటకు వచ్చిన ఘటనతో వార్తల్లో నిలిచిన ప్రాంతం ఇదే.గ్వాంగ్సీలోని హెన్జౌ ప్రాంతంలో పాముల పెంపక కేంద్రాలు ఉన్నాయి.భారీ వరదల కారణంగా పాముల ఫారం దెబ్బతిని సుమారు 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు సమాచారం.బయటకు వచ్చిన వాటిలో కోబ్రాలు, క్రైట్లు వంటి విషసర్పాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.3. గ్వాంగ్డాంగ్ (Guangdong) ప్రాంతంచైనాలో సంప్రదాయ ఔషధ పరిశ్రమకు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి.పాము ఉత్పత్తులు, ఔషధ వినియోగాలకు సంబంధించిన వ్యాపారానికి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి.4. గ్వాంగ్సీ (Guangxi) ప్రాంతంవేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా కొన్ని రకాల సర్పాల పెంపకానికి అనుకూలంగా భావిస్తారు.పాముల పెంపకం, సంప్రదాయ వైద్య మార్కెట్లతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.పాముల పెంపకంలో సాధారణంగా పెంచే జాతులుకోబ్రా (Cobra)క్రైట్ (Krait)వైపర్ (Viper)పైథాన్ (Python)రాట్ స్నేక్ (Rat snake) -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా వెళ్లడం మరింత కఠినం
అమెరికా కలలకు మరిన్ని సంకెళ్లు పడుతున్నాయి! హెచ్1–బీతోపాటు గ్రీన్కార్డులు, స్టూడెంట్ వీసాలు పొందడమూ చాలా చాలా కష్టం కానుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరిక ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూండటం దీనికి కారణం. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే కానీ.. ఓకే అయితే మాత్రం అమెరికన్ వీసా కావాలంటే కొండలు కరగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఖర్చుతోపాటు విపరీతమైన స్క్రూటినీ, దస్తావేజులు అవసరమవుతాయని, భారతీయ ఐటీ ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వివరాలు... ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’స్లోగన్తో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలస దారులను తరిమేస్తామని తరచూ హూంకరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) విభాగం అక్రమ వలసదారుల ఏరివేతను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూడా. అంతేకాకుండా... ఇతర దేశస్తులు అమెరికాలో పని చేయడంపై కూడా ఆయన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తొలిసారి గద్దెనెక్కినప్పుడు కూడా అమెరికన్ ఉత్పత్తులే కొనాలని, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని ప్రతిపాదించిన ఆయన విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1–బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేయాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)తోపాటు ఐస్ కూడా వీసాల జారీ, అక్రమ వలసదారుల ఏరివేత విషయంలో ఎన్నో మార్పులు చేశారు కూడా. తాజాగా హెచ్1–బీ వీసాల జారీ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం డీహెచ్ఎస్, కార్మీక, విదేశీ వ్యవహారాల శాఖల ఉమ్మడి అజెండాలో ప్రచురితమైంది. ప్రజాభిప్రాయ సేకరణ (టెక్ కంపెనీలు, యూనివర్శిటీలు, వలస కార్మీకుల హక్కుల పరిరక్షణ సంఘాలు) తరువాత అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తరువాత అమల్లోకి వస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రతిపాదనలు వచ్చే నెల నుంచే అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఓపీటీపైనా ఫోకస్అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందేందుకు వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమంలోనూ పలు మార్పులను ప్రతిపాదించారు. 2024 –25లో భారత్ నుంచి సుమారు 3.6 లక్షల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లగా ప్రస్తుతం వారు కోర్సుకు తగ్గట్టుగా ఎంతకాలమైనా అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం మాత్రం ఇలా కుదరదు. నిర్దిష్ట సమయం మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత పొడింపునకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటే వచ్చే ఏడాది ఫ్రిబరి నుంచి ప్రాక్టికల్ ట్రెయినింగ్ నిబంధనలను సమీక్షించనున్నారు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసన్ రంగాల్లో చదివేవారికి ఇచ్చే రెండేళ్ల పొడిగింపుపై ఫోకస్ పెట్టారు. .వీటితోపాటే కొంతమంది విదేశీయులు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశమిచ్చే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (ఈఏడీ) విషయంలోనూ మార్పులు రానున్నాయి. తుది నిబంధనలు ఈ నెలలోనే రానున్నాయి. ఫలితంగా ఈఏడీల ఆటోమెటిక్ పొడిగింపునకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా హెచ్1–బీ వీసాదారుల భార్య/భర్తలే ఎక్కువగా ఈ ఈఏడీల ఆధారంగా ఉద్యోగాలు చేస్తూంటారు. ఈఏడీల పొడిగింపు ఆలస్యమైతే వారు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా పోతుంది. ఇవీ మార్పులుముందుగా వీసా నిబంధనల్లో రాగల మార్పులు చూద్దాం. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశముంది. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు. యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు. అమెరికన్లు చేయలేని పని హెచ1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. ఇంకోలా చెప్పాలంటే కంపెనీలు హెచ్1–బీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలు పెరుగుతాయి. వీసాల పొడిగింపునకూ ఫీజులు వసూలు చేయాని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. పెర్మ్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను కూడా మార్చనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్కు ఎండ అవసరం. పవన విద్యుత్కు గాలి అవసరం. జలవిద్యుత్కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
జర్మనీ తర్వాత భారత్.. ప్రపంచం చూసేలా కొత్త తరం రైలు..
భారత రైల్వేలో ఇక కొత్త శకం మొదలుకానుంది. ఇన్నాళ్లు నల్లటి పొగలు కక్కుతూ పరుగులు పెట్టిన డీజిల్ ఇంజిన్ల స్థానంలో.. పర్యావరణానికి మిత్రంగా నిలిచే ఓ కొత్త తరం రైలు భారత్లో అడుగుపెట్టబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ పరుగులు పెట్టే ఈ రైలు భారత రైల్వే రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలకనుంది.భారతీయ రైల్వేలు గ్రీన్ ఎనర్జీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును సిద్ధం చేస్తున్నాయి. హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలును తొలిదశలో పరీక్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ రైలు పనిచేసే విధానం కూడా ఆసక్తికరమే. సాధారణ రైళ్లలా డీజిల్ దహనం కాదు.. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా ఫ్యూయల్ సెల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో రైలు కదులుతుంది. ఈ ప్రక్రియలో వెలువడేది ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే. అంటే పొగ లేదు.. కాలుష్యం తక్కువ.భారత్ రూపొందిస్తున్న ఈ హైడ్రోజన్ రైలు సాధారణ రైలు కాదు. ఇది 10 కోచ్లతో, రెండు డ్రైవింగ్ పవర్ కార్లతో రూపొందుతోంది. సుమారు 2,400 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో భారత బ్రాడ్గేజ్ మార్గాల్లో అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ రైలు వెనుక భారత రైల్వే పరిశోధన సంస్థ RDSO కీలక పాత్ర పోషిస్తోంది. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, సరఫరా కోసం హర్యానాలోని జింద్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో ఈ రైలు గంటకు సుమారు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేలా ప్రణాళికలు ఉన్నాయి. అయితే ఈ సాంకేతికత భారత్కు కొత్త కాదు.. ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణం ప్రారంభించాయి. హైడ్రోజన్ రైలును వాణిజ్య ప్రయాణికుల సేవల్లో తొలిసారిగా ఉపయోగించిన దేశం జర్మనీ.🚨 HUGE! India’s first indigenous Hydrogen Train has been OFFICIALLY approved.— The pilot run will take place on the Jind–Sonipat section in Haryana.— The train features a 10-coach hydrogen-powered configuration. pic.twitter.com/MblnoqrTRw— Megh Updates 🚨™ (@MeghUpdates) June 5, 2026 2022లో జర్మనీ Alstom Coradia iLint పేరుతో ప్రపంచంలోని తొలి వాణిజ్య హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును ప్రారంభించింది. డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ రైలును ఉపయోగించారు. పొగకు బదులుగా నీటి ఆవిరితో ప్రయాణం సాగించడం దీని ప్రత్యేకత. జపాన్, చైనా, అమెరికా కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి. జపాన్లో East Japan Railway Company హైడ్రోజన్ ఆధారిత రైళ్లను పరీక్షించింది. చైనా పట్టణ రవాణా, తక్కువ దూర మార్గాల కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో కూడా డీజిల్కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ రవాణాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.హైడ్రోజన్ రైళ్ల వల్ల ముఖ్యంగా విద్యుదీకరణ చేయడం కష్టమైన మార్గాల్లో భారీ ప్రయోజనం ఉంటుంది. పర్వత ప్రాంతాలు, తక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో డీజిల్ స్థానాన్ని ఇవి భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ రైళ్ల ప్రయాణం అంత సులభం కాదు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు, నిల్వ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక స్టేషన్ల నిర్మాణం వంటి సవాళ్లు ఉన్నాయి. కానీ ఒకసారి ఈ వ్యవస్థ విస్తృతంగా అందుబాటులోకి వస్తే రైల్వే రంగంలో కాలుష్యాన్ని తగ్గించే అతిపెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భారత రైల్వే పట్టాలపై కనిపించబోయేది కేవలం మరో రైలు కాదు.. పర్యావరణాన్ని కాపాడుతూ పరుగులు పెట్టే కొత్త భారతానికి ప్రతీకగా నిలిచే హైడ్రోజన్ రైలు.🚨 BIG BREAKING Indiaʼs first HYDROGEN-POWERED train SUCCESSFULLY completed its trial run between Delhi and Jind 🔥 — Reached speeds of up to 120 kmph.— Emergency braking and oscillation performance were SUCCESSFULLY tested. pic.twitter.com/KOh5uesN9J— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026అసలు లక్ష్యం ఏంటి?భారత రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. ఇప్పటివరకు డీజిల్ లోకోమోటివ్లు నడిచే మార్గాల్లో ఇంధన ఖర్చు, కాలుష్యం రెండూ పెద్ద సవాళ్లుగా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు “Hydrogen for Heritage” వంటి ప్రాజెక్టుల కింద హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.హైడ్రోజన్ రైళ్లు ముఖ్యంగా..విద్యుదీకరణ లేని రైల్వే మార్గాలపర్వత ప్రాంతాలుపర్యాటక ప్రాధాన్యత ఉన్న మార్గాలుతక్కువ రద్దీ ఉన్న రూట్లు.. వంటి ప్రాంతాల్లో ఉపయోగపడే అవకాశం ఉంది.హెరిటేజ్ రూట్లకు ప్రాధాన్యం ఎందుకు?భారత రైల్వేలు కొన్ని చారిత్రక రూట్లలో డీజిల్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నాయి. ఈ మార్గాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు హైడ్రోజన్ రైళ్లను ఉపయోగించే ఆలోచన ఉంది. ఉదాహరణకు కొండ ప్రాంత రైల్వే మార్గాల్లో పర్యావరణ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రైలులో ఒకేసారి సుమారు 2,500 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 27 హైడ్రోజన్ సిలిండర్లు, హైడ్రోజన్ లీకేజ్ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు. -
సూర్యుడి ‘సర్వ’ దర్శనం!
సరిగ్గా... జూలై ఎనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం 4.40 నిమిషాలకు ఏం జరిగిందో తెలుసా? ఒక అరుదైన ఘట్టం నమోదైంది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది సూర్యుడిని చూడగలిగారు. అది కూడా ఒకే ఒక్క నిమిషం మాత్రమే. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఆగ్నేయాసియా దేశాలు కొన్ని, అంటార్కిటికాలు మాత్రమే చీకట్లో ఉండిపోయాయి! ఇలా ఎందుకంటే సూర్యుడి చుట్టూ తిరిగే భూమి ఒకపక్కకు వాలి ఉంటుందని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. జూన్, జూలైలో ఈ వాలు సూర్యాభిముఖంగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు భూమి ఒక ప్రత్యేక స్థానంలోకి వచ్చి చేరుతుంది. సూర్యుడి వెలుగు భూమ్మీద అత్యధిక ప్రాంతంపై పడుతూ ఉంటుందన్నమాట. ఈ ఏడాది జూలై ఎనిమిదవ తేదీ కూడా ఒకటి. ఈ రోజు గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ ప్రకారం ఉదయం 11.10 గంటలకు మొత్తం 820 కోట్ల మంది ప్రజలకు సూర్యుడి వెలుతురును పొందగలిగారు. అలాగని అన్ని చోట్లా పట్టపగల్లాంటి ప్రకాశం లేదులెండి. ఈ భాగ్యం 690 కోట్లమందికి దక్కితే... దీపాల అవసరం లేనంత వెలుగును ఇంకో 58 కోట్ల మంది అనుభవించారు. ఆకాశం నల్లబడి.. దిగంతం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితి ఇంకో 49 కోట్ల మందికి లభించింది. చీకటిపడే ముందు లీలగా కనిపించే వెలుతురును 24.9 కోట్ల మంది చూశారు. సుమారు 8.3 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో ఒక్క శాతం మంది మాత్రమే నిశిరాత్రిలో ఉండిపోయారు. ప్రపంచ జనాభాలో 90 శాతం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుందన్నది ఒక విశేషమైతే.. 99 శాతం మందికి ఒకే ఒక్క నిమిషం సూర్యుడి దర్శనం లభించడం ఇంకో విశేషం అన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్కు ‘తీస్తా’ పరీక్ష
భారత్లోని సిలిగురి కారిడార్ సమీపంలో ఉన్న తీస్తా నదీ ప్రాజెక్టుపై చైనా మరోసారి దృష్టి సారించింది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ దేశం చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు షేక్ హసీనా ప్రభుత్వం వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాజెక్ట్ సున్నితమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉండటంతో ఈ పరిణామాలు భారత్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆధిపత్య పోటీ.. తూర్పు హిమాలయాల్లో పుట్టి, సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి ప్రవేశించే తీస్తా నది 414 కిలోమీటర్లు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. ఇందులో అధిక వాటా కావాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ కారణంగా ఇరుదేశాల మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. మహ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చడానికి భారత్ ముందుకొచ్చింది. దీనిపై 2016 నుంచి చైనా కన్ను ఉంది.అయితే, 2020లోనే తీస్తా ప్రాజెక్టును ఆవిష్కరించినప్పటికీ, ఆర్థికపరమైన పరిమితులు, సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడంతో భారత్ ఆందోళనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా తుది ఆమోదాన్ని నిలిపివేశారు. అది ప్రణాళిక దశను దాటి ముందుకు సాగలేదు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వం కుదుర్చుకున్న తాజా ఒప్పందం, తీస్తా విషయంలో చైనాకున్న ఆసక్తిని తెలియజెప్పడమే కాదు.. బంగ్లాదేశ్పై ఆధిపత్యానికి భారత్, చైనాల మధ్య పోటీని కూడా ప్రతిబింబిస్తోంది.ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి సాధ్యాసాధ్యాల అధ్యయనానికే పరిమితమైనప్పటికీ, బంగ్లాదేశ్లోని అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా మరింతగా పాలుపంచుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న పవర్చైనా సంస్థ వల్ల మరింత ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేది ప్రైవేట్ సంస్థ కాదు. ఇది చైనా ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ద్వంద్వ–ఉపయోగ మౌలిక సదుపాయాలను నిర్మించిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. చైనా బంగ్లాదేశ్తో కలిసి పనిచేయనున్న తీస్తా ప్రాజెక్ట్ ఏమిటి? తీస్తా నది వెంబడి వరదలను నియంత్రించడం, నీటి భద్రతను మెరుగుపరచడం, నదీ జీవావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడం ఈ తీస్తా సీఎంఆర్పీ లక్ష్యం. నదీ తీరాల వెంబడి రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ కేంద్రాలు, పర్యాటక సౌకర్యాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు అభివృద్ధి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. 2016 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ జల అభివృద్ధి బోర్డు, చైనా ఇంజనీరింగ్ సంస్థ పవర్చైనాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంతో తీస్తా సీఎంఆర్పీ ప్రారంభమైంది.2019మేలో ఈ ప్రాజెక్ట్కు అధికారిక ప్రభుత్వ చట్రం లభించింది. 2020లో దీనినొక భారీ నదీ పునరుద్ధరణ కార్యక్రమంగా బహిరంగంగా ఆవిష్కరించారు. అప్పటి ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం సాధ్యాసాధ్యాల అధ్యయనాలను ప్రారంభించి, 2020లో ఈ ప్రతిపాదనను ఆవిష్కరించింది. వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతంలో పెద్ద ప్రాజెక్ట్పై భారత్ ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఆమె తుది ఆమోదం తెలపలేదు. చైనానే ఎందుకు?ఇప్పుడు మరోసారి చైనాతో బంగ్లాదేశ్ భాగస్వామ్యం కావడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమయ్యే గణనీయమైన ఆర్థిక వనరులు, అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యం. ఆనకట్టలు, నదీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. వరద నియంత్రణ, నీటిపారుదల రంగాలలో దానికి విస్తృతమైన అనుభవం ఉంది. 2022లో పూర్తయిన పద్మా వంతెనతో సహా, బంగ్లాదేశ్లో కూడా చైనా సంస్థలు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించాయి. తీస్తా నదీ జలాల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన మరో కారణం. బంగ్లాదేశ్కు ఎక్కువ నీటిని మళ్లించడం వల్ల రాష్ట్రంలోని రైతులకు నష్టం జరుగుతుందని పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కోల్కతా సమ్మతి లేకుండా కేంద్రం ముందుకు సాగలేకపోయింది. 2024లో తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ నిధులు సమకూర్చడానికి కేంద్రం ముందుకొచ్చింది. హసీనా వైదొలగడంతో తలెత్తిన రాజకీయ గందరగోళం చర్చలను నిలిపివేసింది. మహమ్మద్ యూనస్ మధ్యంతర పాలనలో భారత ప్రతిపాదన అటకెక్కింది. చైనా, భారత్ కంటే వేగంగా కదిలింది.భారత్కు ఆందోళన ఎందుకు? తీస్తా నది ప్రాజెక్టుపై చైనా–బంగ్లాదేశ్ ఒప్పందం గురించి భారత్ ఆందోళన చెందడానికి బలమైన కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది భౌగోళిక సామీప్యత. బంగ్లాదేశ్లోని నీల్ఫామరి, రంగపూర్ ప్రాజెక్టు ప్రాంతాలు, మనదేశంలోని జల్పాయిగురి జిల్లాకు ఆనుకొని ఉన్నాయి. అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్ కూడా ఇదే ప్రదేశంలో ఉంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే అత్యంత ఇరుకైన ఈ సన్నని భూభాగం, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే ఏకైక భూమార్గం. ఈ ప్రాంతంలో శత్రు ఉనికి భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీస్తుంది.బంగ్లాదేశ్లో చైనా ప్రభావం భారత్కు రెండు వైపుల భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. తీస్తా బేసిన్లో చైనా ప్రమేయం పెరగడం వల్ల అంతర్గత అశాంతి చెలరేగుతుంది. ఇప్పటికే సున్నితమైన ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతుంది. నదీ జలవనరుల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్తో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. ప్రాజెక్ట్పై అభిప్రాయాలను గతంలోనే ఆ దేశానికి తెలిపింది. ప్రస్తుతానికి, తీస్తా సాధ్యాసాధ్యాల అధ్యయనం చివరికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి. -
కప్ గెలవకపోయినా... ప్రపంచాన్ని గెలిచాడు
ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డియోర్ అవార్డు... ఐదుసార్లు ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాలర్గా ‘ఫిఫా’ ఎంపిక... యూరోపియన్ యూనియన్ అత్యుత్తమ ఆటగాడిగా మూడుసార్లు ఘనత... నాలుగుసార్లు యూరోపియన్ యూనియన్ ‘గోల్డెన్షూ’ విజేత... చాంపియన్స్ లీగ్, నేషన్స్ లీగ్, యూరోపియన్ చాంపియన్షిప్లలో కలిపి ఏకంగా 35 ట్రోఫీ విజయాల్లో సభ్యుడిగా అసాధారణ రికార్డు...ప్రపంచ ఫుట్బాల్లో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక గోల్స్...మొత్తంగా ప్రొఫెషనల్ ఫుట్బాల్లో 1300కు పైగా మ్యాచ్లు... దాదాపు 1000 గోల్స్... ఇంతటి అత్యద్భుత కెరీర్ అతని సొంతం!అయితే ఇన్ని సాధించినా ఆ ఒక్కటి మాత్రం అతనికి దక్కలేదు.చివరకు వరల్డ్కప్ మాత్రం లేకుండానే క్రిస్టియానో రొనాల్డో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితేనేమి... ప్రపంచకప్ గెలవలేకపోయినా క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఏమాత్రం తగ్గదు. వరల్డ్కప్ విజయంలో భాగం కాలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, అతని ఆటతో ఉర్రూతలూగిపోయిన మైదానాలు రొనాల్డో స్థాయిని చూపించాయి. ఆటపై అతను వేసిన ముద్ర అభిమానుల మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. – సాక్షి క్రీడా విభాగం ఫుట్బాలర్ కాకపోయి ఉంటే నా కొడుకు ఇటుకలు మోసేవాడు, తాపీ మేస్త్రీ పని చేసేవాడు... రొనాల్డో గురించి అతని తల్లి చెప్పిన మాట ఇది. నిజంగానే అతని నేపథ్యం అలాంటిది. పేరుకే సైనికుడు అయిన అతని తండ్రి తాగుబోతుగా మారి.. రొనాల్డో పుట్టే సమయానికే ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత స్థానికంగా ఒక గార్డెన్లో పని చేసినా ఆదాయం చాలా స్వల్పం. దాంతో తల్లి వేర్వేరు ఇళ్లల్లో, హోటల్లలో పని మనిషిగా చేస్తూ ఇంటిని నడపాల్సి వచ్చింది. అప్పటికే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్న తల్లి ఈ పేదరికం కారణంగానే తన నాలుగో గర్భాన్ని తొలగించుకోవాలని చూసింది. అయితే ప్రమాదం అంటూ డాక్టర్లు తిరస్కరించడంతో వెనకడుగు వేసింది. కానీ ఆ పుట్టే నాలుగోవాడు చరిత్ర సృష్టిస్తాడని, ప్రపంచ క్రీడారంగంలోనే శిఖరానికి చేరతాడని ఆమె ఊహించలేదు. మొదటి నుంచీ రొనాల్డోకు చదువు అబ్బలేదు. ఒకసారి స్కూల్లో టీచర్పై కుర్చీ కూడా విసరడంతో అతడిని బయటకు పంపించారు. అంతే ఆరో తరగతితోనే చదువు ముగిసిపోయింది. అయితేనేమి ఫుట్బాల్లో మాత్రం అతను రారాజుగా వెలిగాడు.తాను ప్రాణంగా, పిచ్చిగా ప్రేమించిన ఫుట్బాల్లో మాత్రం అతను కఠోర శ్రమకు వెనుకాడలేదు. ప్రాణం పెట్టి పట్టుదలగా ఆడటమే రొనాల్డోను చాంపియన్ ప్లేయర్గా మార్చింది. అతను బాగా పేరు సంపాదించుకున్న తర్వాత పోర్చుగల్లో మ్యాగీలాంటి కంపెనీలు, సూపర్ మార్కెట్లకు అతని తల్లి ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. అయితే రొనాల్డోకు 20 ఏళ్ల వయసులో ఇంకా స్టార్ కాకముందే మద్యం కారణంగా వచ్చిన అనారోగ్యంతో అతని తండ్రి చనిపోయాడు. అసాధారణ ప్రతిభతో... ఏడేళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో ఆట మొదలైంది. ఆ వయసులోనే స్థానిక క్లబ్ ఆండోరిన్హాకు అతను ఆడటం మొదలు పెట్టాడు. అక్కడే అతనిలో అపార ప్రతిభ ఉందని గుర్తించిన కోచ్లు ప్రోత్సహించారు. చదువు అబ్బదని తెలిసిన క్షణాన పూర్తి సమయం ఆటకే కేటాయిస్తే అద్భుతాలు సాధ్యమని కోచ్ ఇచ్చిన సలహాతో రొనాల్డో తల్లి ఏకీభవించడంతో అతనికి మరో లోకం లేకుండా పోయింది. ఫుట్బాల్, ఫుట్బాల్... ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే... ఎక్కడైనా అదే ధ్యాస. అప్పటికే బ్రెజిల్ దిగ్గజాలు రొనాల్డో నజారియో, రొనాల్డిన్హోలను అభిమానించడం మొదలు పెట్టిన ఈ కుర్రాడు ఒక్కసారిగా దూసుకుపోయాడు. తన ఆటతో ప్రమోషన్ సాధిస్తూ జూనియర్ ఆటగాడిగా పదేళ్లపాటు మూడు వేర్వేరు క్లబ్లకు ఆడి రొనాల్డో తన విలువేంటో చూపించాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో సీనియర్ ఆటగాడిగా తొలిసారి లిస్బన్లో స్పోర్టింగ్ క్లబ్ పోర్చుగల్కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడితో మొదలైన అతడి ప్రస్థానం ఆ తర్వాత ప్రపంచ ఫుట్బాల్ను శాసించే స్థాయికి తీసుకెళ్లింది. గత 24 ఏళ్లుగా రొనాల్డో అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు.అరుదైన వ్యాధిని దాటి... మైదానంలో చిరుతలా ఇప్పుడు దూసుకుపోతున్న రొనాల్డో ఫుట్బాల్ ప్రపంచం చిన్నప్పుడే ముగిసిపోయేది. అతను నిమిషానికి 100 సార్లకు పైగా గుండె కొట్టుకునే అరుదైన వ్యాధి టాకీకార్డియా బారిన పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ అతను బతికిపోయాడు. గుండెకు ప్రత్యేక శస్త్రచికిత్స జరిపిన తర్వాత అతను కోలుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతను మళ్లీ ఫుట్బాల్ మైదానంలోకి వచ్చి తన ఆటను చూపించడం విశేషం. పోర్చుగల్ను గెలిపించి...జాతీయ జట్టు తరఫున రొనాల్డో వరల్డ్ కప్ గెలవకపోయినా... ఈ టోర్నీలో అతని ప్రభావం తక్కువగా కనిపించినా.. 23 ఏళ్లుగా పోర్చుగల్ సీనియర్ టీమ్కు స్టార్ అట్రాక్షన్ అతడే. ఫలితాలు ఎలా వచ్చినా అతని చుట్టే టీమ్ భ్రమించింది. రొనాల్డోను మినహాయిస్తే మరో ఆటగాడి గురించి ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆలోచించలేని పరిస్థితి ఉంది. క్లబ్ ఫుట్బాల్లో చూపిన అద్భుత ప్రదర్శనలు ఇక్కడ పునరావృతం చేయలేదనే విమర్శలు వచ్చినా... సహచరుల అండ లేకుండా ఒంటి కాలితో అతను అందించిన విజయాలు ఎన్నో. అసలు రొనాల్డో వల్లనే పోర్చుగల్ టీమ్ గెలవాలని కోరుకునే అభిమానులే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. 233 మ్యాచ్లలో టీమ్కు ప్రాతినిధ్యం వహించిన అతను 2016 యూరోలో జట్టును చాంపియన్గా నిలిపాడు. రెండుసార్లు అతని సారథ్యంలోనే టీమ్ నేషన్స్ లీగ్ విజేతగా నిలిచింది. 2006 నుంచి 2026 వరకు ఆరు వరల్డ్ కప్లు ఆడిన రొనాల్డో 27 మ్యాచ్లు ఆడి 11 గోల్స్ కొట్టాడు. 2006లో టీమ్ అత్యుత్తమంగా సెమీఫైనల్ చేరింది.ఈతరం ఆటగాళ్ళలో అర్జెంటీనా స్టార్ మెస్సీతో ఇన్నేళ్లుగా అతడిని పోల్చడం రివాజుగా మారిపోయింది. ఇతర ఘనతలను పక్కన పెడితే 2022లో వరల్డ్ కప్ గెలవడంతో రొనాల్డో కంటే మెస్సీ ఒక మెట్టు పైకి కనిపిస్తున్నా... ప్రజాదరణ, ఆటపరంగా రొనాల్డో ఎవరికంటే తక్కువ కాదు. వ్యక్తిగత ఘనతలు, సాధించిన రికార్డులు, రివార్డులు చూస్తే అతని స్థాయి కూడా శిఖరాన ఉందంటే అతిశయోక్తి లేదు.క్లబ్లతో కనకాభిషేకం... 18 ఏళ్ల వయసులో ఇంగ్లండ్కు చెందిన ప్రఖ్యాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్తో రొనాల్డో జత కట్టడంతో అతని కెరీర్ మలుపు తిరిగింది. ఈ క్లబ్కు ఆరేళ్లు, ఆ తర్వాత రియల్ మాడ్రిడ్తో తొమ్మిదేళ్లు అతని ఆటలో అత్యుత్తమ స్థాయిని చూపించాయి. బంతి డ్రిబ్లింగ్తో మొదలు పెడితే ఎదురు లేకుండా గోల్పోస్ట్ వరకు దూసుకుపోయే తత్వం, మెరుపు వేగంతో ప్రత్యర్థి డిఫెండర్లను ఏమార్చే వైనం, తనకే సాధ్యమైన అరుదైన విన్యాసాలతో రొనాల్డో ప్రపంచ ఫుట్బాల్లో ఐకాన్గా మారిపోయాడు. ఈ పదిహేనేళ్లు అతని నామస్మరణతో అసంఖ్యాక ఫ్యాన్స్ ఊగిపోయారు. దాంతో సహజంగానే వాణిజ్యపరంగా అతని విలువ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఆటపరంగా ఒప్పందాల మొత్తం రికార్డులు సృష్టిస్తుండగా, బ్రాండింగ్ పరంగా కూడా అసాధారణ ఆర్జన అతని ఖాతాలో చేరింది. అత్యధిక మొత్తం అందుకున్న ఫుట్బాలర్గా ఫోర్బ్స్ జాబితాలో ఎప్పుడు చూసినా అతని పేరు కనిపించింది. ఆరేళ్ల క్రితమే కేవలం ఆటతోనే బిలియన్ డాలర్లు సంపాదించిన తొలి ఫుట్బాలర్గా రొనాల్డో గుర్తింపు పొందాడు. సీఆర్ 7 బ్రాండింగ్తో అతను ఏ వ్యాపారం మొదలు పెట్టినా కనకవర్షం కురిసింది. రియల్ మాడ్రిడ్తో విభేదాలతో ఇటలీలోని యువెంటస్ క్లబ్కు చేరినప్పుడు కూడా రికార్డు మొత్తంలో ట్రాన్స్ఫర్ జరిగింది. 100 మిలియన్ యూరోలు చెల్లించి యువెంటస్ సొంతం చేసుకోగా... తొలి రోజు కేవలం ఆ టీమ్లో రొనాల్డో జెర్సీ అమ్మకాల ద్వారానే 62.4 మిలియన్ డాలర్లు రావడం అతని స్థాయి ఏమిటో చూపించింది. గోల్ సాధించినప్పుడల్లా అతను తనదైన శైలిలో సుయ్య్య్... అంటూ ప్రదర్శించే ప్రత్యేక విన్యాసం ప్రతీ యువ ఫుట్బాల్ మదిలోసిగ్నేచర్గా నిలిచిపోయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా రొనాల్డో అందనంత ఎత్తులో నిలిచాడు. సొంత దేశంలోనైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే అతని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది. ప్రస్థానం ఎప్పటి వరకు...జొహాన్న్క్రఫ్, ఫెరెన్స్ పుస్కాస్, పావోలో మాల్డిని, మైకేల్ ప్లాటిని, ఆల్ఫ్రెడో డి స్టిఫానో, డేవిడ్ బెక్హామ్, వేన్ రూనీ, ఒలివార్ కాన్, నెమార్... తమ అద్భుత ఆటతో ఫుట్బాల్లో ఎన్నో ఘనతలు సాధించినా వరల్డ్ కప్ను మాత్రం ముద్దాడని ఆటగాళ్లుగా నిలిచిపోయారు. ఈ జాబితాలో ఇప్పుడు రొనాల్డో కూడా చేరాడు. అతని ప్రస్తుత వయసు 41 ఏళ్లు. అయితే ఆటలో పదును, చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు కూడా అతని జోరు ముందు దిగదుడుపే. చివరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేసినా... పోర్చుగల్కు మున్ముందు కూడా ప్రాతినిధ్యం వహిస్తానని అతను చెబుతున్నాడు. అందుకే అధికారికంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. అయితే జాతీయ జట్టు తక్కువ సంఖ్యలో ఆడే మ్యాచ్లు, మార్పు కోరుకునే ఫెడరేషన్ వంటి కారణాలతో పోర్చుగల్ తరఫున మిగిలింది చాలా తక్కువ కెరీరే కావచ్చు. అయితే క్లబ్ ఫుట్బాల్లో మాత్రం అతని క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్కు అతను ఆడుతున్నాడు. ఎంత డబ్బు ఇచ్చి అయినా సరే ఇప్పట్లో అతడిని వదిలేసేందుకు క్లబ్ ఇష్టపడటం లేదు. ఒకవేళ తప్పుకున్నా మరో క్లబ్ కచ్చితంగా ఈ సూపర్ స్టార్ కోసం వేచి చూస్తుందనడంలో సందేహం లేదు. వరల్డ్ కప్లో అతని స్థాయికి తగిన మెరుపులు కనిపించకపోయినా ... మరికొంత కాలం రొనాల్డో విన్యాసాలకు లోటు ఉండకపోవచ్చు. 1 వరుసగా ఆరు ప్రపంచకప్లలో గోల్ చేసిన ఏకైక ప్లేయర్146 జాతీయ జట్టు తరఫున ప్రపంచంలో అత్యధికగోల్స్ చేసిన ఆటగాడు 233 జాతీయ జట్టు తరఫున అత్యధిక మ్యాచ్లుఆడిన ఏకైక ప్లేయర్ 4 రొనాల్డో నెగ్గిన క్లబ్ ఫుట్బాల్ వరల్డ్ కప్ టైటిల్స్. రియల్ మాడ్రిడ్ తరఫున మూడుసార్లు (2015, 2017, 2018), మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరఫున ఒకసారి (2009) రొనాల్డో ఈ ఘనత సాధించాడు.35 కెరీర్లో రొనాల్డో గెలిచిన మొత్తం ట్రోఫీలు100కోట్లు సోషల్ మీడియాలో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య -
చర్చల యుద్ధానికి సిద్ధం
లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి భంగపడిన అధికార ఎన్డీఏ కూటమి ఈసారి మరింత పదునైన వ్యూహంతో ముందుకొస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ కృతనిశ్చయంతోఉంది. అయితే బడ్జెట్ సమావేశాల్లో ఐక్యత చాటి మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినట్లే ఈసారి ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.దీంతో జూలై 20వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీదాకా ఈసారి వర్షాకాల సమావేశాలు వ్యూహప్రతివ్యూహాలతో హోరాహోరీగా సాగనున్నాయి. మొత్తంగా ఈసారి 19 సార్లు ఇరుసభలు సమావేశంకానున్నాయి. బడ్జెట్ సెషన్లో మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినప్పటికీ ఇప్పటికీ అధికార, విపక్షల బలాబలాల్లో మార్పులొచ్చాయి.ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిన 27 స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి ఎన్డీఏ తన బలాన్ని పెంచుకుంది. వీళ్లుగాక స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు, చిన్న పార్టీల మద్దతునూ కూడగడుతోంది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 150కి చేరుకోబోతోంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల సంఖ్యాబలం(160)కి సమీపంలో ఉండటం గమనార్హం. పశ్చిమబెంగాల్లో ఖాళీగాఉన్న మరో మూడు రాజ్యసభ స్థానాలనూ కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోనుంది. దీంతోపాటు లోక్సభలోనూ బీజేపీ బలం ఎక్కువకానుంది. తగ్గిన విపక్షాల బలం ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష పార్టీల సంఖ్యాబలం తగ్గిపోయింది. దీంతో విపక్ష పార్టీల మధ్య ఐక్యత సైతం బలహీనపడింది. తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన అధికార పగ్గాలు చేపట్టిన విజయ్ జోసెఫ్కు చెందిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సుతరామూ ఇష్టంలేని మిత్రపక్షం డీఎంకే తన మైత్రిబంధానికి చరమగీతం పాడింది. వీటికితోడు పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని షాక్కు గురిచేస్తూ 20 మంది టీఎంసీ ఎంపీలు సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకి మద్దతు పలికారు. ఈ పార్టీ ఇప్పటికే ఎన్డీఏకూ మిత్రపక్షంగా ఉంది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రేకు గుబ్బై చెప్పి ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు పరోక్షంగా బీజేపీకి మద్దతు పలకడంతో లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ మరింత బలం పుంజుకుంది. విపక్షాల నుంచి సవాళ్లు.. ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థుల డిజిటల్ మూల్యాంకనం తప్పులతడకగా మారడం, అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు, స్వర్ణాభరణాలు చోరీకి గురికావడం, దేశంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకడం, పశ్చిమాసియా యుద్ధాగ్ని జ్వాలల భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సెగలు పుట్టించడంతో ప్రభుత్వ అంతర్గత, విదేశాంగ విధానం విఫలమైందంటూ విపక్షాలు పార్లమెంట్ వేదికగా పదునైన విమర్శనాస్త్రాలు సంధించనున్నాయి. టీఎంసీ, శివసేన(యూబీటీ) తిరుగుబాటుఎంపీల మద్దతులో లోక్సభలో ఎన్డీఏ బలం 318 లేదా 319కి పెరిగే వీలుంది. అయినాసరే మూడింట రెండొంతుల(360) బలానికి బీజేపీ 40 స్థానాలను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, నివేదికలు..ఢిల్లీలో అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఉదంతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంతవర్మను పదవి నుంచి తొలగించేందుకు, కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ అంశంలో అధికార, విపక్షాలు ఏకతాటిమీదకొచ్చాయి. ఇవీ బిల్లులు.. 1. రాజ్యాంగ(130వ) సవరణ బిల్లు తీవ్రమైన నేరాలకు పాల్పడి అరెస్టయి ఏకధాటిగా 30 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండిపోయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు సభ ముందుకురావొచ్చు. అయితే ఇప్పటికే ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 2. విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు, 2026 ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 3. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు గత ఏడాది డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 4. సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు, 2025 ఈ బిల్లును 2025 డిసెంబర్ 18వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. 5. కార్పొరేట్ చట్టాల(సవరణ)బిల్లు, 2026 2026 మార్చి 23వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. -
‘స్లీప్’ డేంజర్!
ఆధునిక జీవనశైలి, శారీరక మార్పుల వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో ఒకటిగా మారుతోంది. మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారని వైద్య అధ్యయనాలు, వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గంటల తరబడి నిద్ర పట్టకపోవడం...రాత్రిపూట పదే పదే మెలకువ రావడం...రాత్రి వేళల్లో కాళ్లు లాగడం వల్ల నిద్రకు భంగం కలగడం.. ఇలా అనేక రకాల నిద్ర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.అధ్యయనాలు, సర్వేల్లో ఏం తేలిందంటే ? తాజాగా ఐ–స్లీప్స్ (నిమ్హన్స్–ఐఐఐటీ హైదరాబాద్) పరిశోధనలో పక్షవాతానికి సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. ఇస్కీమిక్ స్ట్రోక్ (మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా ఇతర అవయవాల నుంచి వచ్చిన కణాలు అడ్డుపడి ఆక్సిజన్ అందకపోవడం) వచి్చన రోగుల నిద్రను పరిశీలించగా, వారిలో 85% మంది శ్వాస రుగ్మతలతో బాధపడుతున్నట్లు తేలింది. వృద్ధులలో దాదాపు 37% మంది దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నారు. షిఫ్ట్ వర్కర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, నిరుద్యోగులలో (13.34%) బయోలాజికల్ క్లాక్ దెబ్బతినడం వల్ల నిద్ర రుగ్మతలు ఎక్కువగా నమోదవుతున్నాయి ⇒ ఎయిమ్స్ న్యూఢిల్లీ పరిశోధకుల సమగ్ర విశ్లేషణ ప్రకారం.. సుమారు 4.7 కోట్ల మందికి తీవ్రమైన స్లీప్ అప్నియా ఉంది. దీనివల్ల నిద్రలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి ⇒ 2026 రెస్మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వే ప్రకారం నిద్రలేమి సమస్య పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువ శారీరక, మానసిక ప్రభావాన్ని చూపుతోంది. భారతీయులలో నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి/ఆందోళన (39%), ఆఫీసు పనులు (37%), ఇంటి పనుల బాధ్యతలు (31%) ప్రధాన కారణాలు.78% మంది నిద్ర సమస్యల కోసం డాక్టర్ను సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ⇒ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్–2026 సర్వే ప్రకారం...దేశ ఆర్థిక రాజధాని ముంబై అత్యధిక నిద్రలేమి ఉన్న నగరంగా నిలిచింది. మెరుగైన నిద్ర నాణ్యతతో చెన్నై నగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు 90% మంది భారతీయులు పడుకునే ముందు మొబైల్ ఫోన్లు వాడుతున్నారని తేల్చింది. ⇒ బ్లెస్ కోహోర్ట్ స్టడీ 2025 ప్రకారం.. తీవ్రమైన స్లీప్ అప్నియా ఉన్న రోగులలో మధుమేహం, రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు ఈ క్లినికల్ అధ్యయనం స్పష్టం చేసింది. ⇒ లోకల్ సర్కిల్స్ 2026 సర్వే ప్రకారం...సుమారు 72% మంది రాత్రి వేళల్లో మూత్రవిసర్జన కోసం లేవడం వల్ల నిద్రాభంగం కలుగుతోందని తెలిపింది. ఇది డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం కావచ్చునని, 46% మంది రాత్రిపూట కనీసం 6 గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని తెలిపింది. దాదాపు 55% మంది ఇండియన్లు అర్ధరాత్రి దాటిన తర్వాతే పడుకుంటున్నారని పేర్కొంది.నిద్రలేమితో ఆరోగ్య ప్రమాదాలు⇒ సరైన నిద్ర లేకపోతే రక్తపోటు పెరిగి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ముప్పు పెరుగుదల. ⇒ ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్–2 డయాబెటిస్ వస్తుంది. ⇒ ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, తీవ్రమైన డిప్రెషన్, మానసిక ఆందోళనకు దారితీస్తాయి. ⇒ డ్రైవర్లలో అలసట, నిద్రమత్తు కారణంగా దేశంలోని హైవేలపై దాదాపు 40% ప్రమాదాలు జరుగుతున్నాయి.సమతుల్యమైన నిద్రలో హైదరాబాద్కు రెండవస్థానం గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్ 2026 అధ్యయనం ప్రకారం భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అత్యధిక నాణ్యత, అత్యంత సమతుల్యమైన గల నిద్రను అనుభవిస్తున్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. అలాగే, 42% మంది ప్రజలు ఆలస్యంగా నిద్రపోతున్నారని, సుమారు 31% మందికి నిద్రలేమి లేదా నిద్ర సరిపోకపోవడం గురించిన ఆందోళనలు చెందుతున్నారని పేర్కొంది.ఒకే సమయాన్ని అలవాటు చేసుకోవాలి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలకు దూరంగా ఉండాలి. రాత్రి భోజనం నిద్రపోయే సమయానికి కనీసం 2–3 గంటల ముందే ముగించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సాయంత్రం వేళల్లో కాఫీ, టీ, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. శారీరక వ్యాయామం, యోగా చేయడం వల్ల గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రపోయే గది ప్రశాంతంగా, కాంతి లేకుండా చీకటిగా, అనుకూలమైన ఉష్ణోగ్రతతో ఉండేలా చూసుకోవాలి. – డా. జీసీ ఖిల్నాని, ప్రముఖ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ నిపుణులు ముఖ్యాంశాలు ఇవీ ... ⇒ దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిలో 30% నుంచి 40% మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ⇒ పురుషుల(8.3%)తో పోలిస్తే మహిళల్లో (10.3%) ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు దక్షిణాది రాష్ట్రాలో జరిపిన ఒక వైద్య సర్వేలో తేలింది. ⇒ నిద్రలేమితో బాధపడుతున్న వారిలో కేవలం 3% మంది మాత్రమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. ⇒ స్లీప్ అప్నియా ఉన్న రోగులలో 60% నుంచి 70% మంది ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ⇒ భారతీయుల సగటు నిద్ర సమయం 5.77 గంటలకు పడిపోయింది. ⇒ భారత్లో 140 కోట్లకు పైగా జనాభా ఉండగా, నిద్ర రుగ్మతలకు చికిత్స చేసే సరి్టఫైడ్ స్లీప్ స్పెషలిస్ట్లు 500 కంటే తక్కువ మందే ఉన్నారు. -
నిశీధిలో ఔషధాలు
కారుచీకటి.. సూర్యుడి కిరణం కూడా చొరబడటానికి వీల్లేని ప్రదేశం.. అప్పుడప్పుడూ వినిపించే గబ్బిలాల శబ్దాలు తప్ప లోపలంతా నిశ్శబ్దం. అవే పర్యాటక కేంద్రాలుగా భాసిల్లే గుహలు. జీవం మనుగడకే సాధ్యం కాని ఆ రాతిగోడల మధ్య మానవాళి ప్రాణాలను కాపాడగల ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల సామ్రాజ్యం నిశ్శబ్దంగా పెరుగుతోందని మీకు తెలుసా? అవును నిశీధిలో దాగున్న ఈ కంటికి కనిపించని జీవులే రేపటి వైద్య రంగానికి సరికొత్త దిక్సూచి కాబోతున్నాయి. భారతదేశంలో ఉన్న 1,500కు పైగా సహజ గుహల్లో పెరిగే సూక్ష్మజీవులు భవిష్యత్తులో ప్రాణాంతకమైన వ్యాధులకు సరికొత్త యాంటీబయాటిక్స్ అందించడమే కాకుండా.. అంతరిక్ష పరిశోధనలకు, పర్యావరణ శుద్ధికి కూడా కీలకం కానున్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దామా? ప్రతి గుహలో ఒక విలక్షణమైన జీవావరణం గోవాలోని క్యూపెమ్ ప్రభుత్వ కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత దబోల్కర్ రాసిన పరిశోధన వ్యాసం ఇటీవల ప్రముఖ ‘జియో మైక్రోబయాలజీ జర్నల్’లో ప్రచురితమైంది. భారతదేశంలోని గుహలు కేవలం పర్యాటక ప్రాంతాలు మాత్రమే కాదని, అవి అపార జీవవైవిధ్యానికి నిలయాలని ఆమె నిరూపించారు. ఆహారం దొరకని, సూర్యరశ్మి సోకని క్లిష్ట పరిస్థితులను తట్టుకొని ఆస్పెర్గిల్లస్, పెన్సిలియమ్, క్లాడో స్పోరియమ్ వంటి ఫంగస్ రకాలు మన గుహల్లో జీవిస్తున్నాయి. ఇవి గుహల్లోని రాళ్లను, ఖనిజాలను ఆహారంగా మార్చుకుంటూ ప్రత్యేకమైన ఎంజైమ్లను విడుదల చేస్తూ సొంతంగా ఒక మైక్రో ఎకో సిస్టమ్నే సృష్టించుకుంటున్నాయి. అలాగే మేఘాలయలోని సున్నపురాయి గుహలు, ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు, ఛత్తీస్గఢ్లోని కోటమ్సర్ గుహ, గోవాలోని లాటరైట్ గుహలు, దక్కన్ ప్రాంతంలోని అగ్నిపర్వత గుహలు.. ఇలా ప్రతి భూగర్భ వ్యవస్థకు దాని సొంత సూక్ష్మ జీవావరణ వ్యవస్థ ఉంది. యాంటీబయాటిక్స్ విప్లవం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు బాక్టీరియాలు మందులకు లొంగకపోవడం. ఈ గుహల్లోని శిలీంధ్రాలు వేల ఏళ్లుగా ఇతర సూక్ష్మజీవులతో పోటీ పడుతూ, వాటిని ఎదుర్కోవడానికి తమలో తాము శక్తివంతమైన రసాయన రక్షణలను అభివృద్ధి చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు తదుపరి తరం యాంటీబయాటిక్స్ తయారీకి మూలస్తంభాలు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలను, ప్రమాదకర రసాయనాలను విచ్ఛిన్నం చేయగల ఎంజైములు కూడా ఈ ఫంగస్లలో ఉన్నాయి. బయోటెక్నాలజీ రంగంలో ఇవి సరికొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంగారకుడిపై మనుగడ సాధ్యమేనా? ఈ అధ్యయనం కేవలం భూమికి మాత్రమే పరిమితం కాలేదు. గుహలలోని ఈ జీవుల సహన శక్తి ఆస్ట్రోబయాలజిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తీవ్రమైన రేడియేషన్, వనరులు లేని కఠిన పరిస్థితులను తట్టుకోగల ఈ శిలీంధ్రాల లక్షణాలను బట్టి చూస్తే, భవిష్యత్తులో మానవుడు అంగారక గ్రహం లేదా మంచుతో నిండిన యూరోపా (గురుడి ఉపగ్రహం) వంటి చంద్రులపై అడుగుపెట్టినప్పుడు, అక్కడ జీవం మనుగడకు ఇవే ఆధారాలు కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలోని గుహలు సైన్స్ రంగానికి ఒక సరికొత్త సరిహద్దుగా నిలిచాయి. నిశీధిలో దాగి ఉన్న ఈ చిన్నజీవులు మానవాళి భవిష్యత్తుకు వెలుగులు ఇవ్వనున్నాయి. -
ఇలా చేద్దాం 'సర్'
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)– 2026లో భాగంగా గత నెల 25న రాష్ట్రంలో ఓటర్ల గణన ప్రక్రియప్రారంభమైంది. ఇప్పటికే ‘సర్’ పూర్తయిన రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించడంతో రాష్ట్రంలో సైతం ఆందోళన నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా మారి నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలతో ప్రమేయం లేకుండా వయోజనులైన పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఓటరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ‘సర్’పై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం ఇదీ...1 ఎన్యూమరేషన్ దశఫారం ఇస్తేనే ఓటుఓటు హక్కు పరిరక్షణకు ఓటరు వేయాల్సిన తొలి అడుగు .. ఎన్యూమరేషన్ ఫారాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నింపి సంతకం/వేలి ముద్ర వేసి బూత్ స్థాయి అధికారికి(బీఎల్ఓ) నిర్దేశిత గడువు జూలై 24లోగా తిరిగి ఇవ్వాలి. అప్పుడే వారి పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారం ఎలా పూరించాలి?» బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతోపాటు ఎలా నింపాలో అవగాహన కల్పిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని మూడు విభాగాలుగా విభజించి రూపొందించగా, ఎగువ విభాగంలో సంబంధిత ఓటరు పేరు, ఎపిక్ సంఖ్య, చిరునామా, ఫొటో తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉంటాయి. పాత ఫొటో ముద్రించి ఉంటే కొత్త ఫొటోను అతికించడానికి ఒక బాక్స్ ఇదే విభాగంలో ఉంటుంది. » చివరిసారిగా రాష్ట్రంలో 2002లో ‘సర్’ నిర్వహించి తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఉంటే.. ఆ వివరాలను ఫారం మధ్యలోని రెండో విభాగంలో నింపాల్సి ఉంటుంది. తప్పొప్పులతో సంబంధం లేకుండా 2002 జాబితాలో వివరాలు ఎలా ఉంటే సరిగ్గా అలానే పూరించాలి. ఎడమవైపు కాలమ్లో ఓటరు, కుడి వైపు కాలమ్లో బంధువుకి సంబంధించి 2002 జాబితాలోని వివరాలు రాయాలి. 2002 జాబితాలో ఇద్దరిలో ఒకరి పేరే ఉంటే సంబంధిత కాలమ్లో ఆ వివరాలను నమోదు చేయాలి. ఇద్దరిలో ఒకరి పేరు లేకుంటే సంబంధిత కాలమ్ ఖాళీగా వదిలేయాలి. ఇద్దరి పేర్లూ లేకుంటే రెండు కాలమ్స్నూ ఖాళీగా వదిలేయాలి. » ఇక కింద ఉండే మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ,ఆధార్ (ఐచ్ఛికం), మొబైల్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు– వారి ఎపిక్ నంబర్, తల్లి పేరు–ఆమె ఎపిక్ నంబర్, జీవిత భాగస్వామి పేరు–ఎపిక్ నంబర్ రాయాల్సి ఉంటుంది. ఒక ప్రతిని బీఎల్ఓ తీసుకుని మరో ప్రతిని రశీదుగా తన సంతకంతో తిరిగి ఓటరుకే ఇస్తారు. రశీదును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో అవసరం పడొచ్చు. ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్రం పేర్లే రాయాలి2002 సర్ ఓటర్ల జాబితాలో మీ పేరు, మీ బంధువుల పేర్లను రాసే కాలమ్స్లో జిల్లా రాయాల్సిన చోట ఉమ్మడి జిల్లా, రాష్ట్రం రాయాల్సిన చోట తెలంగాణ రాయాలి. అసెంబ్లీ నియోజకవర్గం రాయాల్సిన చోట 2002 నాటి అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి. 2002 తర్వాత రాష్ట్రం, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో ఎన్నికల యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.2002 జాబితాలో పేరెలా వెతకాలి?2002 నుంచి ఒకే చిరునామాలోఉంటున్న ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఇబ్బందులు ఉండవు. 2002 ఓటర్ల జాబితాలో వారి పేరు, బంధువుల పేర్ల వివరాలు స్థానిక బీఎల్ఓల వద్ద ఉంటాయి. ప్రస్తుతం కొత్త చిరునామాలో నివాసముంటున్న ఓటర్లు మాత్రం 2002లో ఎక్కడ నివాసం ఉన్నారో ఆ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తమ పేరు, బంధువు పేర్లను అన్వేషించక తప్పదు. 2002 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో వాటి సరిహద్దులతోపాటు పేర్లూ మారాయి. నాటి నియోజకవర్గం పేరు, పోలింగ్ బూత్ వివరాలతో 2002 జాబితాలో పేర్లను వెతకవచ్చు. ఈసీ వెబ్సైట్ (https://www.eci.gov.in) తోపాటు సీఈఓ తెలంగాణ వెబ్సైట్ (https://ceotelangana.nic.in/SIR&2002. html) లో ‘2002 ఓటర్ల జాబితా’ను అందుబాటులో ఉంచారు. ఇక్కడ రెండు రకాల సెర్చ్ సౌలభ్యం కల్పించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలో సెర్చ్ చేసుకోవచ్చు. ఓటరు పేరు, ఇతర వివరాలతో సైతం పేర్లను వెతికే మరో సదుపాయం కల్పించారు.ఓటరు అందుబాటులో లేకుంటే?నిబంధనల ప్రకారం ఓటరే తన ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపాలి. విద్య, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు మాత్రం మినహాయింపు కల్పించారు. వారి కుటుంబ పెద్ద భర్తీ చేసి తన సంతకంతో బీఎల్ఓకు తిరిగి ఇవ్వవచ్చు. బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకుంటే..ఎన్యూమరేషన్ ఫారాన్నికేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https:// voters.eci. gov.in) ద్వారా సమర్పించవచ్చు. అయితే, ఆధార్ అథెంటికేషన్ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్సైట్ (https:// ceotelangana.nic. in) నుంచి తమ ప్రాంత బీఎల్ఓ ఫోన్ నంబర్ను తీసుకుని నేరుగా ఫోన్ చేయొచ్చు. ఈసీ వెబ్సైట్లో ‘బుక్ ఎ కాల్ విత్ బీఎల్ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు.2 ఎన్యూమరేషన్ తర్వాతి దశముసాయిదాలో పేరు ఉందా?పోలింగ్ కేంద్రాల వారీగా సర్ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాను సైతం పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.గరిష్టంగా ఎన్నిఅభ్యంతరాలు?ముసాయిదాజాబితాలోని అనర్హుల పేర్ల తొలగింపునకు రాజకీయ పార్టీల బూత్ స్థాయిఏజెంట్ల (బీఎల్ఏ)తో పాటు ఇతరులెవరైనా రోజుకు 10కి మించకుండా గరిష్టంగా 30 వరకు అభ్యంతరాలను ఆగస్టు 30లోగా ఫారం–7 ద్వారా తెలపవచ్చు.ముసాయిదాలో పేరు లేకుంటే ?ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫారం–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫారం–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు(ఫారం–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ముసాయిదా జాబితాకు మార్పులు చేర్పులు చేసి తుది జాబితా ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి.2002లో ఓటరు పేరు లేకుంటే? ఓటరు పేరు సర్2002 ఓటర్ల జాబితాలో లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 2002 జాబితాలో వారి తల్లిదండ్రులు/ నాయనమ్మ, తాతయ్యల పేర్లను సేకరించి ఎన్యూమరేషన్ ఫారంలోనిసంబంధిత కాలమ్లో పూరిస్తే సరిపోతుంది.స్వీయ ధ్రువీకరణ ఎవరు ఇవ్వాలి?కొత్తగా ఓటరుగా నమోదుకావడానికి ఫారం–6, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటును బదిలీ చేసుకోవడానికి ఫారం–8 దరఖాస్తును స్వీయ ధ్రువీకరణ ఫారంతోపాటు బీఎల్ఓకు సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత ఓటరే సంతకం చేయాలి. ఒకే రాష్ట్రం పరిధిలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒకే నియోజకవర్గంలో మరో చిరునామాకి ఓటును బదిలీ చేసుకోవడానికి స్వీయ ధ్రువీకరణ అవసరం లేదు.3 నోటీసులు/విచారణ దశనోటీసులు ఎవరికి ఇస్తారు?రెండు కేటగిరీల ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా లో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్లో తేడాలను గుర్తించిన ఓటర్లతోపాటు 2002 ఓటర్ల జాబితాలో తమతోపాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు మాత్రమే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు ఇస్తారు. నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది.పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే..నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణపత్రం సమర్పిస్తే సరిపోతుంది.1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధారం కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 పత్రాలు 1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ 2. ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ పోస్టాఫీస్/ఎల్ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థలు 01.07.1987కు ముందు జారీ చేసిన గుర్తింపు పత్రాలు 3. జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్పోర్ట్ 5. గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదో తరగతి/విద్యా ధ్రువీకరణ పత్రాలు 6. ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస సర్టిఫికెట్ 7. అటవీ హక్కుల సర్టిఫికెట్ 8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ 9. జాతీయ పౌరుల రిజిస్టర్ (తెలంగాణకు వర్తించదు) 10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్ 11. ప్రభుత్వం ఇచ్చిన స్థలం/ఇంటి కేటాయింపు పత్రం 12. ఆధార్ కార్డు (గుర్తింపు ధ్రువీకరణ మాత్రమే. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంత ధ్రువీకరణకుస్వీకరించరు)12 రకాల పత్రాలూ లేకుంటే?భారత పౌరులనే ఓటర్లుగా నమోదు చేయడానికి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంతోపాటు గుర్తింపు ధ్రువీకరణకు రుజువులు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ను స్వీకరిస్తారు. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ కోసం మిగిలిన 11 రకాల పత్రాలనే రుజువుగా స్వీకరించనున్నారు. ఒకవేళ ఈ 11 రకాల పత్రాలూ లేని ఓటర్లు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలనూ రుజువులుగా సమర్పించవచ్చు. అయితే ఈ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం. కలెక్టర్,సీఈఓకు అప్పీల్విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద 15 రోజుల్లోగా జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తోపాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద 30 రోజుల్లోగా సీఈఓకు రెండో అప్పీల్కు అవకాశం కల్పిస్తారు.‘సర్’ షెడ్యూల్ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీజూన్ 25 నుంచి జూలై 24 వరకుముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 31ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకునోటీసుల జారీ/ విచారణ, ఎన్యూమరేషన్ ఫారాలు/ అభ్యంతరాలు/ దరఖాస్తుల పరిష్కారం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకుతుది జాబితా ప్రచురణ అక్టోబర్ 1-సాక్షి, హైదరాబాద్ -
నడకకు నజరానా!
(సాక్షి, స్పెషల్ డెస్క్) : రోజుకు కేవలం 20 నిమిషాల నడక లేదా శారీరక వ్యాయామం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మీ జేబును కూడా నింపుతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ కొత్త ట్రెండ్ నడుస్తోంది. ప్రజలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు, తద్వారా వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు పలు దేశాల్లో ప్రభుత్వాలు వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నాయి. నిర్ణీత సమయం పాటు నడిచే లేదా వ్యాయామం చేసే పౌరులకు నగదు బహుమతులు, షాపింగ్ వోచర్లు తదితర ప్రోత్సాహకాలను నేరుగా అందిస్తున్నాయి. ఈ జాబితాలో సింగపూర్, దుబాయ్ (యూఏఈ), కెనడాలతో పాటు కొత్తగా యునైటెడ్ కింగ్డమ్ చేరింది. ఏటా 2,700 కోట్ల డాలర్ల భారం ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ వైద్య బడ్జెట్లపై పెనుభారం పడుతోంది. శారీరక వ్యాయామం కొరవడినందున ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలకు ప్రతి ఏటా సుమారు 2,700 కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. పౌరులు రోజుకు 30 నిమిషాలు నడక తదితర శారీరక వ్యాయామాలు చేస్తే, ఈ దీర్ఘకాలిక వ్యాధులను 40 శాతం వరకు అరికట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు వ్యాయామానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంపై పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. నెలలో 42 కి.మీ. నడక ఆరోగ్యం కోసం అనుదినం నడిచే దేశ పౌరులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వచ్చే జనవరిలో ప్రారంభం కానున్న ‘మూవ్మెంట్ 26.2‘అనే నడక సవాలు కార్యక్రమానికి ఒలింపిక్స్ పతక విజేత సర్ బ్రెండన్ ఫోస్టర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు రోజుకు కనీసం 20 నిమిషాలు (1.4 కి.మీ.) నడిస్తే, నెలలో 42 కిలోమీటర్లు (పూర్తి మారథాన్ దూరం) నడవగలుగుతారు. తమ నడక వివరాలను ఆన్లై¯న్లో లేదా ఫోన్లు, స్మార్ట్వాచ్ల ద్వారా నమోదు చేసుకోవాలి.నడక సవాలును పూర్తిచేసిన వారికి డిస్కౌంట్ వోచర్లు, ఇతర బహుమతులు లభిస్తాయి. ‘ఇది నిజంగా ఒక సరళమైన, సాధించదగిన, అర్థవంతమైన ప్రయోజనాలందించే సవాలు..’అని బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా’ప్రచారోద్యమాన్ని నడుపుతున్నప్పటికీ.. పౌరులకు నేరుగా ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక బహుమతులు అందటం లేదు. అయితే దేశంలోని కొన్ని ప్రైవేట్ ఆరోగ్య బీమా కంపెనీలు, కొన్ని ఫిట్నెస్ యాప్లు రోజువారీ నడక లక్ష్యాలను చేరుకుంటే ప్రీమియం తగ్గింపులు, రివార్డ్ పాయింట్లను ఇస్తున్నాయి. ఏ దేశంలో ఎంత నడక, ఎలాంటి ప్రోత్సాహకాలు? » సింగపూర్ నేషనల్ స్టెప్స్ చాలెంజ్ (హెల్దీ 365 యాప్): రోజుకు 5,000–10,000 అడుగులు లేదా 20 నిమిషాల శ్రమ/ సూపర్ మార్కెట్ వోచర్లు, ఉచిత రవాణా (సబ్వే/బస్) పాస్లు » యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ఎన్హెచ్ఎస్ బెటర్ హెల్త్ (పైలట్ ప్రాజెక్ట్): రోజుకు 20–30 నిమిషాల చురుకైన నడక/ షాపింగ్ డిస్కౌంట్లు, ఉచిత సినిమా టికెట్లు, జిమ్ వోచర్లు » దుబాయ్ (యూఏఈ) దుబాయ్ ఫిట్నెస్ చాలెంజ్ (30్ఠ30): ప్రతిరోజూ 30 నిమిషాల చొప్పున నెల వ్యాయామం/ ప్రత్యేక డిస్కౌంట్ కూపన్లు, లక్కీ డ్రా ద్వారా బహుమతులు » కెనడా పార్టిసిప్ యాక్షన్ (ప్రభుత్వ నిధులు): నిర్దేశిత వారపు / నెలవారీ ఫిట్నెస్ లక్ష్యాలు సాధించాలి/స్పోర్ట్స్ గియర్, బ్రాండెడ్ వస్తువులు గెలుచుకునే అవకాశం -
ట్రంప్ను కూల్ చేసేందుకు.. నాటో కొత్త ఎత్తుగడలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గత కొంతకాలంగా నెలకొన్న విభేదాలకు తెరదించే ప్రయత్నంలో అట్లాంటిక్ కూటమి (నాటో) కీలక అడుగులు వేస్తోంది. సభ్యదేశాల మధ్య ఐక్యతపై ఎలాంటి సందేహాలకు తావులేకుండా చేయడంతో పాటు, వాషింగ్టన్ ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ.. ఐరోపా భద్రతకు పెరుగుతున్న సవాళ్లు, అమెరికా వైఖరిలో వచ్చిన మార్పులు, సభ్యదేశాలపై ట్రంప్ ఒత్తిడి.. ఈ మూడింటి మధ్య జరుగుతున్న అంకారా(టర్కీ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.నాటో ఏర్పడి దాదాపు ఎనిమిది దశాబ్దాలు అవుతోంది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఐరోపాలోని మొత్తం 32 దేశాలు ఈ కూటమిలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ సైనిక వ్యయంలో సగానికి పైగా ఈ దేశాలదే. అలాంటి కూటమిలో గత కొన్నేళ్లుగా ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అమెరికా లేకుండా నాటో కొనసాగగలదా? అదే సమయంలో మరో ప్రశ్న కూడా ముందుకొచ్చింది. అమెరికా ఎందుకు మిగతా దేశాల భద్రత కోసం అంత భారీగా ఖర్చు చేయాలి? ఈ రెండో ప్రశ్ననే డొనాల్డ్ ట్రంప్ అత్యంత బలంగా లేవనెత్తారు.ట్రంప్కు నాటోపై వ్యక్తిగత వ్యతిరేకత లేదు. కానీ కూటమి నిర్వహణ తీరుపై ఆయన చాలాకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏడాది వందల బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చిస్తుంటే, ఐరోపాలోని అనేక దేశాలు మాత్రం తమ భద్రత బాధ్యతను అమెరికాపైనే వదిలేశాయని ఆయన విమర్శిస్తున్నారు. "అమెరికా డబ్బుతో యూరప్ భద్రత ఎందుకు?" అనే ప్రశ్నను ఆయన ఎన్నికల ప్రచారంలోనే కాదు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ పదేపదే లేవనెత్తారు. సభ్యదేశాలు తగిన రక్షణ వ్యయం చేయకపోతే అమెరికా తన భద్రతా హామీలను పునఃసమీక్షిస్తుందని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఒక దశలో అమెరికా నిజంగానే నాటో నుంచి తప్పుకుంటుందా? అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగింది.అయితే ట్రంప్ ఎప్పుడూ ‘‘నాటోను రద్దు చేస్తాను’’.. ‘‘నాటో నుంచి తప్పుకుంటాం’’ అని అధికారికంగా ప్రకటించలేదు. ఆయన లక్ష్యం కూటమిని బలహీనపరచడం కాదని, సభ్యదేశాలు కూడా సమాన బాధ్యతలు తీసుకునేలా చేయడమేనని ఆయన సన్నిహితులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు అంకారాలో జరుగుతున్న సమావేశం చూస్తే, ట్రంప్ ఎన్నాళ్లుగానో చెబుతున్న అంశాలకే నాటో స్పందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అందుకే ఈసారి సభ్యదేశాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలనే లక్ష్యాన్ని దశలవారీగా 5 శాతానికి పెంచేందుకు అంగీకరించాయి. ఇందులో 3.5 శాతం నేరుగా సైనిక సామర్థ్యాల పెంపు, ఆయుధాల కొనుగోలు, సైనిక దళాల ఆధునికీకరణకు వినియోగిస్తారు. మిగిలిన 1.5 శాతం సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, రక్షణ పరిశ్రమ, సైనిక రవాణా వ్యవస్థల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. నాటో చరిత్రలో ఇదే అతిపెద్ద రక్షణ వ్యయ లక్ష్యంగా భావిస్తున్నారు.ఇదొక్కటే కాదు.. సమావేశం ముగింపులో విడుదల చేసే సంయుక్త ప్రకటనలో నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 మీద తమ నిబద్ధత "అచంచలం" అని మరోసారి ప్రకటించనున్నారు. ఈ నిబంధనే నాటోకు వెన్నెముకగా భావిస్తారు. ఒక సభ్యదేశంపై దాడి జరిగితే అది మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి మిగతా సభ్యదేశాలన్నీ రక్షణకు ముందుకు రావాలనేది దీని సారాంశం. ట్రంప్ గతంలో ఈ అంశంపైనా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ సమావేశంలో మరో కీలక అంశం ఉక్రెయిన్. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీవ్కు సైనిక, ఆర్థిక సహకారాన్ని ఎలా కొనసాగించాలన్న దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే గత సమావేశాలతో పోలిస్తే ఈసారి ఉక్రెయిన్ అంశం కంటే అమెరికా-నాటో సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. ట్రంప్ వైఖరి కారణంగా కూటమిలో ఎలాంటి చీలికలు ఏర్పడకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.నాటోలోని చాలా దేశాలు ఇప్పటికే రక్షణ వ్యయాన్ని పెంచడం ప్రారంభించాయి. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు కేవలం మూడు దేశాలే జీడీపీలో 2 శాతం రక్షణకు ఖర్చు చేసేవి. ఇప్పుడు 32 సభ్యదేశాల్లో మెజారిటీ ఆ లక్ష్యాన్ని చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐరోపా దేశాలు తమ సైనిక బలాన్ని పెంచడంపై మరింత దృష్టి సారించాయి. ఇప్పుడు 5 శాతం లక్ష్యంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది.అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం అమెరికా-చైనా పోటీ, రష్యా దూకుడు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు... ఇలా అనేక పరిణామాలు ఒకేసారి చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాయకత్వంలోని నాటోలో ఎలాంటి బలహీనత కనిపించినా అది ప్రత్యర్థి దేశాలకు ప్రయోజనకరంగా మారే అవకాశం ఉందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. అందుకే ట్రంప్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను విస్మరించకుండా, వాటికి సమాధానమిస్తూ కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా ఈసారి అడుగులు వేస్తున్నాయి.అమెరికా లేకుండా నాటోను ఊహించడం కష్టం. అదే సమయంలో నాటో లేకుండా ఐరోపా భద్రతను ఊహించడం కూడా అంతే కష్టం. ఈ వాస్తవాన్ని గుర్తించిన సభ్యదేశాలు ఇప్పుడు ఒకే సందేశం ఇవ్వాలని చూస్తున్నాయి. అమెరికా నమ్మకాన్ని కోల్పోకుండా, కూటమి బలాన్ని మరింత పెంచుకోవడం. అంకారా సమావేశం నుంచి వెలువడే నిర్ణయాలు రానున్న సంవత్సరాల్లో అమెరికా-నాటో సంబంధాలను ఏ దిశగా తీసుకెళ్తాయో నిర్ణయించనున్నాయి. -
అరవ వేట.. తీరం విలవిల!
‘‘ తీరం మనదే..వేటా మనదే.. రాజీలేదు.. ఎవరైనా వస్తే రానిచ్చే పరిస్థితి లేదు. మన తీరంపై మనకే హక్కులు.. పొరుగు రాష్ట్రానికి చెందిన బోటు కనబడితే కలెక్టర్కు మెసేజ్ వస్తుంది. అప్రమత్తం అవుతాం. ఎవరనీ రానివ్వం’’ అంటూ ఈ ఏడాది మే 19వ తేదీన వేట విరామ సాయం అందించే కార్యక్రమంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇది.‘‘తమిళనాడు సోనాబోట్ల ఆగడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవు. స్పీడ్ బోట్ల ద్వారా సముద్రంలో టాస్క్ ఫోర్స్ గస్తీ కాస్తోంది.’’ అంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణరెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. వేట విరామం తర్వాత పాండిచ్చేరి కరైకల్ బోట్లు వస్తున్నాయి. మత్స్యకారులపై దాడులు చేస్తున్నాయి. విలువైన మత్స్య సంపద దోచుకుపోతున్నాయి. పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితం కావడంతో జిల్లాలో కడలిపుత్రులకు భద్రత కరువైంది. మంగళవారం వీటి దాడిలో సుమారు రూ.6 లక్షలకు పైగా విలువైన వలలు దెబ్బతిన్నాయని, ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని మత్స్యకారులు వాపోతున్నారు. సింగరాయకొండ: వేట విరామం తర్వాత ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి కడలిలో గంగపుత్రులు వేట మొదలు పెట్టారు. వారం రోజులు వేట సవ్యంగానే సాగింది. ఆ తర్వాత తమిళనాడు బోట్ల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం తీరానికి 18 నాటికల్మైళ్ల దూరంలో సోనాబోట్లు వేటసాగించాలి. నిబంధనలు మీరి పావు కిలోమీటరు దూరంలోనే చేపల వేట సాగిస్తున్నాయి. ఇటీవల వేట నిషేధ కాలం ముగిసిన నాటి నుంచి ప్రతి రోజు సోనాబోట్లు తీరానికి సమీపంలో వేటాడుతూ లక్షలాది రూపాయల వలలను తెంచేస్తూ మత్స్యకారులకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి. పాండిచ్చేరి కరైకల్ ప్రాంతానికి చెందిన సోనాబోట్లు యథావిధిగా హల్చల్ చేస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ సంయుక్తంగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతిరోజు మూడు పెట్రోలింగ్ బోట్లతో పహారా కాస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నా సోనా బోట్ల ఆగడాలు కొనసాగుతుండడం గమనార్హం. తాము ఈ ప్రాంతంలో వేటసాగిస్తున్నామని సమాచారం పంపితే చెన్నై, కడలూరు బోట్లు కొన్ని సందర్భాల్లో దూరంగా వెళ్లిపోతున్నాయని, పాండిచ్చేరి కరైకల్ మత్స్యకారులు మాత్రం దౌర్జన్యంగా వచ్చి మా వలలు తెంచుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో గస్తీ ఉత్తమాటే.. ప్రకాశం జిల్లాలో సుమారు 70 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, గుడ్లూరు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 39 మత్స్యకార గ్రామాలున్నాయి. మొత్తం 50 వేల జనాభా. చేపల వేటపై ఆధారపడి సుమారు 12 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు 2,303 బోట్లు ఉండగా వాటిలో సుమారు 1,661 మోటరైజ్డ్ బోట్లు, 642 నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి.సముద్రంలో పక్క రాష్ట్రాల సోనాబోట్లను అడ్డుకునేందుకు జువ్వలదిన్నె హార్బర్ వద్ద ఒకటి, కృష్ణపట్నం పోర్టు వద్ద రెండు పెట్రోలింగ్ బోట్లను ఏర్పాటు చేసి వాటిని మెరైన్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నామని, ఇప్పటి వరకు 6 సోనాబోట్లను పట్టుకున్నామని మెరైన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు గమనిస్తే వందలాది బోట్లు తీరానికి సమీపానికి వచ్చి వేట సాగిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి.ప్రతిరోజు తెల్లవారు జామున 2 గంటలకు వెళ్లి ఉదయాన్నే తిరిగి వస్తామని అయితే కరైకల్ బోట్లు మూడు గంటల సమయంలో తీరానికి దగ్గరగా వచ్చి వేటాడుతుండడంతో లక్షలాది రూపాయల వలలు ధ్వంసవుతున్నాయని, దీంతో రాత్రిపూట వేటకు వెళ్లటం మానుకున్నామని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేట విరామం ప్రారంభమైన తర్వాత వారం రోజులపాటు దూరంగా వేట సాగించిన తమిళనాడు, పాండిచ్చేరి బోట్లు మళ్లీ విజృభించాయని మత్స్యకారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట కొత్తపట్నం తీరానికి, మంగళవారం ఉదయం పాలక తీరానికి వచ్చిన బోట్లు వలలను ధ్వంసం చేసి విలువైన మత్స్య సంపదన దోచుకుపోయాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.మత్స్య సంపద తుడిచిపెట్టుకు పోతోంది కరైకల్కు చెందిన సోనాబోట్లు తీరానికి దగ్గరగా చేపల వేట చేయటంతో మత్స్య సంపద తుడిచిపెట్టుకు పోతోంది. దీంతో ఇటీవల కాలంలో తీరంలో మత్స్యసంపద లభించటం లేదు. ఖర్చులకు కూడా రావటం లేదు. ఇలాగైతే ఎలా బతకాలి. – నాయుడు వెంకటేశ్వర్లు, మత్స్యకారుడు, ఊళ్లపాలెంవలలు ధ్వంసమవుతున్నాయి ప్రతిరోజు రాత్రి 2 గంటలకు చేపల వేటకు వెళ్లి ఉదయాన్నే తీరానికి వస్తాం. కానీ ఇటీవల కాలంలో సోనాబోట్లు తీరానికి దగ్గరగా రావటంతో రూ.20 వేల విలువైన వల ధ్వంసమైంది. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా దౌర్జన్యంగా వలలు తెంచుకుపోయాయి. దీంతో రాత్రి పూట చేపల వేటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. రాత్రి పూట వెళితేనే చేపలు దొరుకుతాయి. – తంబు హరిబాబు, మత్స్యకారుడు, ఊళ్లపాలెం -
70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్ విమానం ఇదేనా?
ఆకాశంలో ఎగిరే విమానం ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచం ఒకటే సమాధానం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ సమాధానాన్నే మార్చేయాలనే ఓ స్టార్టప్ చేస్తున్న సాహసోపేత ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన విమానాల రూపమే గతం కావొచ్చనే చర్చా.. ఇటు విమానయాన రంగంలో మొదలైంది. ప్రపంచంలోని రెండు దిగ్గజ కంపెనీలు కూడా ఈ కొత్త ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!..దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్ను రెండు దిగ్గజ సంస్థలు.. బోయింగ్, ఎయిర్బస్ శాసిస్తూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న బడా విమానాలన్నీ దాదాపుగా ఇవి రూపొందించినవే. అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్జీరో (JetZero) ఈ ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. సంప్రదాయ విమానాల కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్తో, ఇంధన వినియోగాన్ని సగానికి తగ్గిస్తామని చెబుతున్న కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తోంది.రెక్కలు–శరీరం ఒకటే..అమెరికాలోని మొహావే ఎడారిలో జెట్జీరో పూర్తి పరిమాణంలో ప్రదర్శన (డెమోన్స్ట్రేటర్) విమానాన్ని నిర్మిస్తోంది. సాధారణ విమానాల్లో శరీరం (ఫ్యూజలేజ్), రెక్కలు వేర్వేరుగా ఉంటాయి. కానీ జెట్జీరో ఆ డిజైన్కు పుల్స్టాప్ పెట్టే పని చేపట్టింది. ఆ కంపెనీ రూపొందిస్తున్న విమానంలో రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి. దీనినే ‘‘బ్లెండెడ్ వింగ్ బాడీ’’ (Blended Wing Body) డిజైన్ అంటారు. ఈ ఆకారం మంతా రే (Manta Ray) చేపను పోలి ఉంటుంది.50 శాతం ఇంధనం ఆదా!ప్రస్తుతం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు ఇంధనమే. జెట్జీరో విమానం సాధారణ జెట్లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. దీని ఆకారం కారణంగా.. గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు తక్కువ నిరోధం (డ్రాగ్) ఏర్పడటం వల్ల ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. విమానం వెనుక భాగంపై ఇంజిన్లను అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని కంపెనీ చెబుతోంది.మరింత సుఖవంతమైన జర్నీ..ఈ విమానం లోపలి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం ఆకారంలోని కేబిన్కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీంతో.. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. వంటగదులు (గ్యాలీలు), మరుగుదొడ్లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.జెట్జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని జెట్జీరో అడుగులు వేస్తోంది.నాసా పరిశోధనలకు కొనసాగింపుబ్లెండెడ్ వింగ్ బాడీ ఆలోచన కొత్తది కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు పూర్తి పరిమాణంలో వాణిజ్య విమానాన్ని నిర్మించే స్థాయికి ఏ సంస్థా రాలేదు. ‘‘కొత్త టెక్నాలజీని కనిపెట్టడం కాదు... ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతను ఉపయోగించి వాణిజ్య విమానంగా మార్చడమే మా లక్ష్యం’’ అని జెట్జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ చెబుతున్నారు.అమెరికా వైమానిక దళం అండజెట్జీరో ఆషామాషీ కంపెనీ ఏం కాదు. 2023లో అమెరికా వైమానిక దళం ఈ ప్రాజెక్టు కోసం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్(United Airlines), అలస్కా ఎయిర్లైన్స్ (Alaska Airlines) వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా జెట్జీరోలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై విమానయాన రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.2030 నాటికి..జెట్జీరో లక్ష్యం ప్రకారం డెమోన్స్ట్రేటర్ విమానం వచ్చే ఏడాది(2027) నాటికి తొలి పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఈ డిజైన్ను సైనిక రవాణా, గగనతల ఇంధన నింపే (Aerial Refueling) విమానాలుగా కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.సవాళ్లు భారీగానే.. ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ నిజంగానే ప్రకటించిన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి ధ్రువీకరణ పొందడానికి సంవత్సరాల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ‘‘ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. కానీ అసాధ్యమని కూడా చెప్పలేం’’ అని విమానయాన రంగపు విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయపడుతున్నారు.విమానాల రూపకల్పనలో దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మార్పులు రాలేదు. జెట్జీరో ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో మనం ప్రయాణించే విమానాల ఆకారంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన అనేక పరీక్షలను ఈ స్టార్టప్ విజయవంతంగా దాటాల్సి ఉంటుంది.:::వెబ్ స్పెషల్నోట్: కథనంలో చూపించిన విమానం తాలుకా ఫొటోలు ఏఐ జనరేటెడ్వి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా పాఠకుడికి చూపించాం.. -
గాయపడ్డ శరీరాలు.. బాంబులకు బదులు బంతితో సమాధానం!
ప్రపంచమంతా ఫిఫా ప్రపంచకప్ ఉత్సాహంలో మునిగిపోయింది. స్టేడియాలు అభిమానుల సందడితో మారుమోగుతున్నాయి. కానీ గాజాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. కరెంట్ ఉండే కొద్దిసేపైనా టీవీ ముందు గుమిగూడటం.. ఇంటర్నెట్ సిగ్నల్ కోసం భవనాలపైకి ఎక్కడం.. బ్యాటరీని పొదుపుగా వాడుకుంటూ మ్యాచ్లు చూడటం అక్కడి ప్రజల దైనందిన దృశ్యం. అలాంటి యుద్ధ వాతావరణంలోనూ ఫుట్బాల్ మాత్రం వారికి కాసేపైనా భయాన్ని మరిచిపోయే ప్రపంచంగా మారింది.అయితే అక్కడి నుంచే ఇప్పుడు మరో ఫుట్బాల్ కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో అవయవాలు కోల్పోయిన గాజా యువతులు.. ఇప్పుడు ఫుట్బాల్ మైదానంలో తమ జీవితానికి కొత్త అర్థం వెతుకుతున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న అమ్మాయిలతో కలిసి పాలస్తీనాలో తొలి మహిళల అంప్యూటీ ఫుట్బాల్ జట్టుగా ఏర్పడి(amputee).. చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి వారం.. డీర్ అల్-బలాహ్లో దాడుల్లో మిలిగిన కొద్దిపాటి గడ్డి మైదానంలో వారు సాధన చేస్తున్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. ఒకరోజు ప్రపంచ వేదికపై పాలస్తీనా జెండాను ఎగురవేయడం.గాజా ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్కడ దాదాపు ఆరు వేల మంది అవయవాలు కోల్పోయారు. వీరందరికీ కృత్రిమ అవయవాలు, దీర్ఘకాలిక పునరావాసం అవసరమైంది. ఈ పరిస్థితుల్లోనే 2018లో స్థాపించబడిన పాలస్తీనా అంప్యూటీ ఫుట్బాల్ అసోసియేషన్ కొత్త ఆశాకిరణంగా మారింది. యుద్ధం తర్వాత వికలాంగుల సంఖ్య పెరగడంతో మహిళల జట్టులో చేరిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.‘‘మా మైదానాలు ధ్వంసమయ్యాయి. సామగ్రి లేదు. అయినా ఈ అమ్మాయిల సంకల్పమే మమ్మల్ని ముందుకు నడిపించింది" అని అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఫౌద్ అబూ ఘూలియన్ చెబుతున్నారు. ప్రపంచకప్ సందర్భంగా గాజా నుంచి వినిపించాల్సిన గొంతులు కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఈ మహిళలు నిజమైన ఛాంపియన్లని ఆయన అంటున్నారు. 2027లో జరగనున్న మహిళల అంప్యూటీ ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనడమే తమ లక్ష్యమని వెల్లడించారు.24 ఏళ్ల రోజాన్ ఖైరా జీవితాన్ని మాత్రం యుద్ధమే ఒక్కసారిగా మార్చేసింది. 2023 నవంబరులో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబ ఇంటిపై బాంబు పడటంతో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఒకప్పుడు పరుగుపందేల్లో పతకాలు గెలిచిన ఆమెకు అది పెద్ద దెబ్బే. కానీ అదే సంఘటన ఆమె సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇప్పుడు అంప్యూటీ ఫుట్బాల్ జట్టులో చేరి తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటోంది.గోల్కీపర్ ఐషా అల్ అబద్లా కథ మరింత హృదయవిదారకం. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి తెల్ల భాస్వర(వైట్ పాస్పరస్) రసాయన ప్రభావానికి గురికావడంతో ఐషా ఒక చేయి పూర్తిగా అభివృద్ధి చెందకుండా జన్మించింది. అయినా దానిని ఆమె ఎప్పుడూ బలహీనతగా భావించలేదు. ఎనిమిదేళ్లుగా ఫుట్బాల్ ఆడుతున్న ఆమెకు ఆటే జీవితం. "మైదానంలోకి దిగితే యుద్ధానికి ముందు ఉన్న రోజులు గుర్తొస్తాయి. మా జీవితంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది" అని చెబుతోంది.అయితే వీరి పోరాటం మైదానంలోనే ముగియడం లేదు. చాలామందికి శరణార్థి శిబిరాల నుంచి సాధనకు రావడానికి ప్రయాణ ఖర్చులే భారంగా మారుతున్నాయి. ఆహార కొరత, పోషకాహార లోపం, క్రీడా సామగ్రి కొరత వంటి సమస్యలు ప్రతిరోజూ వెంటాడుతున్నాయి. అయినా "పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మా పట్టుదల మాత్రం తగ్గదు" అని రోజాన్ ధైర్యంగా చెబుతోంది.ప్రపంచం మొత్తం ఫిఫా ప్రపంచకప్ను చూస్తుంటే... డీర్ అల్-బలాహ్లోని ఈ యువతులు కూడా వీలైనప్పుడల్లా ఆ మ్యాచ్లను చూస్తున్నారు. కానీ వారు కేవలం ప్రేక్షకులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకరోజు అదే ప్రపంచం తమ ఆటను కూడా చూడాలని... తమ గాయాలను కాదు, తమ గెలుపును గుర్తించాలని కలలు కంటున్నారు. యుద్ధం వారి అవయవాలను దూరం చేసినా... ఫుట్బాల్పై ప్రేమను, జీవితంపై ఆశను మాత్రం ఏ బాంబూ చెరిపేయలేకపోయింది. -
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్కు డబుల్ డోస్..
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా.. ఇప్పుడు తూర్పు ఆసియాలో నడుస్తున్న హైడ్రామాను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న ‘తోక దేశం’ లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది!చైనా చేతిలో రిమోట్ పనిచేయట్లేదా?ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లా ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం.. ఇటు అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం.. వీటన్నిటి మధ్య చైనా అసహనం..! అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా-రష్యాల మధ్య ఉత్తర కొరియా ఎలా నలిగిపోతోంది? లేక ఇద్దరినీ వాడుకుంటోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.జుచే నుంచి హత్యల వరకు..ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే.. మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్లాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక 'జుచే' (Juche) అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జుచే అంటే.. ‘స్వయం సమృద్ధి’ అని అర్థం. అంటే.. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం, అభివృద్ధి చెందడం. దాంతో.. ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్లో దూసుకుపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఒక చీకటి సామ్రాజ్యంగా మిగిలిపోయింది. ఎంతలా అంటే, రాజధాని ప్యాంగ్యాంగ్ మినహా దేశంలో దశాబ్దాల పాటు కరెంట్ కూడా లేని పరిస్థితి.కట్ చేస్తే.. 1990ల్లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటివరకు రష్యా నుంచి కొరియాకు వస్తున్న సాయం ఆగిపోయింది. ఈ పరిణామాలతో కిమ్ ఇల్ సంగ్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నారు. 'జుచే' వర్కవుట్ కాదని గ్రహించి, దక్షిణ కొరియాతో విలీనం కోసం చర్చలకు సిద్ధపడ్డారు. కానీ, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విలీనం జరిగితే తమ పదవులు ఊడిపోతాయని భయపడిన అక్కడి మిలిటరీ జనరల్స్.. కిమ్ ఇల్ సంగ్ను రహస్యంగా అంతమొందించారు. ఆ తర్వాత వచ్చిన కిమ్ జోంగ్ ఇల్.. కరడుగట్టిన కమ్యూనిస్ట్ భావజాలంతో బతికారు. ఆయన తెచ్చిన అనాలోచిత అగ్రికల్చర్ సంస్కరణల వల్ల దేశంలో ఏకంగా 20 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. కిమ్ హత్యాకాండ..!దేశాన్ని నాశనం చేస్తున్న కిమ్ జోంగ్ ఇల్ను చూసి మిలిటరీ జనరల్స్ అలర్ట్ అయ్యారు. తర్వాతి తరం అయినా ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలని.. అప్పట్లో చిన్న పిల్లోడైన కిమ్ జోంగ్ ఉన్ను స్విట్జర్లాండ్కు పంపించి చదివించారు. కానీ, అనుకోకుండా కిమ్ జోంగ్ ఇల్ చనిపోవడంతో.. కేవలం 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే కిమ్ జోంగ్ ఉన్ దేశాధినేత అయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ జనరల్స్ తన తాతను, తండ్రిని ఎలా వాడుకున్నారో కిమ్కు బాగా తెలుసు. అందుకే పవర్లోకి రాగానే.. తన తండ్రి కాలం నాటి పాత తరం జనరల్స్ను ఒక్కొక్కరినీ లేపేయడం మొదలుపెట్టాడు. సింగపూర్లో ఒకరిని చంపించాడు. రైల్వే మినిస్టర్ను ఏకంగా రైలు కిందే వేయించాడు. డిఫెన్స్ అటాచీని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్తో షూట్ చేయించాడు. ఇలా భయోత్పాతం సృష్టించి.. టోటల్ పవర్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కిమ్.ఉత్తర కొరియాపై చైనా పెత్తనం కిమ్ అంతర్గతంగా పవర్ స్ట్రాంగ్ చేసుకున్నా.. ఎక్స్టర్నల్గా చైనా ఆధిపత్యం ఎక్కువైంది. 2017 సమయంలో.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. కిమ్ను బీజింగ్ పిలిపించుకుని తాతలా క్లాసులు పీకేవారు. చైనా మీడియా కూడా కిమ్ను ఒక చిన్న ప్రావిన్స్ లీడర్లా తక్కువ చేసి చూపించేది. ఇది ఈ యంగ్ డిక్టేటర్కు అస్సలు నచ్చలేదు. చైనా అహాన్ని దెబ్బకొట్టడానికి.. కిమ్ నేరుగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో చేతులు కలిపాడు. సింగపూర్, వియత్నాంలలో సమ్మిట్స్ జరిగాయి. అయితే, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్రీఫింగ్స్ సరిగ్గా చదవకపోవడం వల్ల.. ఆ చర్చలు ఫలించలేదు. అమెరికా చాప్టర్ క్లోజ్ అయింది.కలిసొచ్చిన ఉక్రెయిన్ యుద్ధంచైనా ఒత్తిడి పెరుగుతోంది. మరి కిమ్ ఏం చేయాలి? సరిగ్గా అప్పుడే వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం! 2022లో ఉక్రెయిన్పై యుద్ధం వల్ల రష్యా ఒంటరైంది. ఆయుధాల కొరత వచ్చింది. ఇదే అదనుగా కిమ్ రంగంలోకి దిగాడు. దశాబ్దాలుగా దాచి ఉంచిన కోట్ల కొద్దీ ఆర్టిలరీ షాట్స్ను రష్యాకు ట్రైన్ల ద్వారా పంపాడు. ఎంతలా అంటే, యుద్ధంలో రష్యా వాడిన ఆయుధాల్లో మూడింట ఒక వంతు ఉత్తర కొరియా అందజేసినవే..! అంతేకాదు.. ఏకంగా 10,000 మంది కొరియన్ సైనికులను రష్యా బోర్డర్లో రష్యా తరఫున యుద్ధం చేయడానికి పంపాడు. దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి కిమ్ ఏం తీసుకున్నాడో తెలుసా? అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ..! ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సాంకేతికత! దీనివల్ల ఇప్పుడు ఉత్తర కొరియా అమెరికాలోని ఏ మూలనైనా న్యూక్లియర్ మిసైల్తో కొట్టగల సామర్థ్యం సంపాదించింది. అంటే, కిమ్కు కావాల్సిన డబ్బు, ఎనర్జీ, టెక్నాలజీ అన్నీ ఇప్పుడు రష్యా ఇస్తోంది. దీంతో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కిమ్కు పూర్తిగా తప్పిపోయింది!నో విలీనం..ఇదీ అసలు మ్యాటర్. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్యాంగ్యాంగ్ ఎందుకు వెళ్లారంటే.. తమ చేతుల్లోంచి జారిపోయి రష్యా గూటికి చేరిన కిమ్ను మళ్లీ లొంగదీసుకోవడానికి. కానీ కిమ్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా సాయం చేస్తేనే ఓకే అని.. లేదంటే పొమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నాడు. ఎందుకంటే కిమ్ ఈ ఏడాది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజ్యాంగాన్ని మార్చేసి, "ఇకపై దక్షిణ కొరియాతో విలీనం అనే ముచ్చటే లేదు.. మాది విడిగా ఉండే ఒక స్వతంత్ర అణు దేశం" అని డిక్లేర్ చేసేశాడు. చైనా లాంటి ఒక గ్లోబల్ సూపర్ పవర్కే చుక్కలు చూపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్లో, ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
మెడ వణుకుతోంది… కనీసం ఫోన్ను పట్టుకోలేకపోతున్నా!
ఆ యువతి తరచూ మెడ నొప్పి, చేతుల్లో బలం తగ్గిపోతున్న సమస్యతో డాక్టర్ను సంప్రదించింది. తన జీవనశైలి, రోజువారీ అలవాట్లు, ఉద్యోగ ఒత్తిడి, నిద్రపోయే భంగిమ.. ఇవన్నీ కారణాలేమోనని ఆమె ముందుగానే అనుకుంది. కానీ అన్ని వివరాలు విన్న తర్వాత డాక్టర్ చెప్పిన మాటలు ఆమెను ఆశ్చర్యంలో ముంచేశాయి. ‘‘అది సాధారణ అలసట కాదు… ఆమె శరీరం ఫోన్ ప్రభావానికి లోనవుతోంది’’ అనే వ్యాఖ్యతో అసలు సమస్యపై కొత్త చర్చ మొదలైంది.స్మార్ట్ఫోన్ వినియోగం ఇప్పుడు లింగ భేదానికి పరిమితం కాని సమస్యగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి స్క్రీన్పై గడపడం వల్ల మెడపై ఒత్తిడి పెరగడం, భంగిమలో మార్పులు, చేతి బలం తగ్గడం వంటి లక్షణాలు యువతలో సాధారణంగా కనిపిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పని, చదువు, వినోదం అన్నీ డిజిటల్ పరికరాలపైనే ఆధారపడటం వల్ల ఈ ప్రభావం మరింత విస్తరిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు… ఆధునిక జీవనశైలి కలిగిస్తున్న సామూహిక ఆరోగ్య సవాలుగా మారుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి డిజిటల్ పరికరాలు మన శరీర ఆకృతినే నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెడ వంగిపోవడం, చూపు బలహీనపడటం, చేతి బలం తగ్గడం, మోటార్ స్కిల్స్పై ప్రభావం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. పైగా ఈ మార్పులన్నింటినీ ఇప్పుడు నిపుణులు ఒక కొత్త పదంతో వివరిస్తున్నారు. అదే “ఫోన్ బాడీ (Phone Body)”. అంటే..ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో కనిపిస్తున్న మార్పులు, భంగిమలో వచ్చే మార్పుల సమాహారం అని దీని అర్థం. ఇది వైద్యపరంగా అధికారిక పదం కాకపోయినా.. ఆధునిక జీవనశైలి ప్రభావాన్ని వివరించేందుకు వాడుతున్నారు. బీబీసీ టెక్నాలజీ జర్నలిస్ట్ థామస్ జర్మైన్ తన తాజా వ్యాసంలో ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించారు.అందులో నిపుణుల చెప్పిన వివరాల ప్రకారం సమస్య కేవలం “స్క్రీన్ టైమ్” మాత్రమే కాదు.. ఎక్కువ సమయం ఇంట్లో కూర్చొని ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోవడం కూడా ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో శారీరక చురుకుదనం తగ్గిపోవడం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని హెచ్చరిస్తున్నారు.👉ప్రపంచవ్యాప్తంగా మయోపియా (దూరం చూపు బలహీనత) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే దీని ప్రధాన కారణం ఫోన్ను దగ్గరగా చూడటం మాత్రమే కాదని, బయట సమయం తగ్గిపోవడమే ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. సహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.👉మరోవైపు “టెక్ నెక్” (Tech Neck) అనే సమస్య కూడా వేగంగా పెరుగుతోంది. నిరంతరం తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల వంచే కోణం పెరిగే కొద్దీ మెడపై పడే బరువు అనేక రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని వల్ల నొప్పులు, కండరాల గట్టిపడటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో పోశ్చర్(posture) మార్పులు కూడా రావచ్చని డెర్మటాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.👉ఇక చేతి బలం విషయంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యువతలో గ్రిప్ స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం చేతుల బలహీనత మాత్రమే కాకుండా మొత్తం శారీరక ఆరోగ్య సూచికగా పరిగణించబడుతోంది.👉టెక్నాలజీ మోటార్ స్కిల్స్పైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఫోన్పై స్వైప్ చేయడం, క్లిక్ చేయడం వంటి పనుల్లో నైపుణ్యం పెరుగుతున్నప్పటికీ, చేతి-మెదడు సమన్వయంపై దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.అయితే నిపుణులు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. రోజూ కొంతసేపు ఫోన్కు విరామం ఇవ్వడం.. కొన్ని అలవాట్లు మార్చుకుంటే “ఫోన్ బాడీ” ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.20–20–20 రూల్ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్లు చూడాలని సూచిస్తున్నారు. ఇది కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మెడ పోశ్చర్పై దృష్టిఫోన్ను కిందకి వంచి చూడకుండా, కంటి లెవెల్లో ఉంచుకోవడం ద్వారా “టెక్ నెక్” ప్రమాదాన్ని తగ్గించవచ్చు.స్క్రీన్ టైమ్ పరిమితిరోజులో నిర్దిష్ట సమయాన్ని మాత్రమే ఫోన్ వినియోగానికి కేటాయించడం మంచిదని నిపుణుల సూచన. అవసరం లేని స్క్రోలింగ్ తగ్గించాలి.శారీరక కదలికలు తప్పనిసరిప్రతి గంటకోసారి లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల గట్టిపడటం తగ్గుతుంది.గ్రిప్ & చేతి వ్యాయామాలుబంతి పట్టుకోవడం, స్ట్రెస్ బాల్ వాడడం, చిన్న హ్యాండ్ ఎక్సర్సైజ్లు చేయడం చేతి బలం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.బయట గడిపే సమయం పెంచాలిసహజ కాంతి కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం కొంత సమయం బయట గడపడం మయోపియా ప్రమాదాన్ని తగ్గించగలదు.డిజిటల్ డీటాక్స్ అలవాటువారానికి ఒకసారి కొన్ని గంటలు ఫోన్ లేకుండా గడపడం మానసికంగా, శారీరకంగా ఉపశమనం ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.మొత్తం మీద, ఫోన్ ఇప్పుడు మన జీవితంలో భాగంగా మారినప్పటికీ, అది శరీరంపై నెమ్మదిగా కానీ స్పష్టంగా ప్రభావం చూపుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయలేకపోయినా, దాన్ని నియంత్రితంగా ఉపయోగించడం ద్వారా శరీరంపై దాని ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఇరాన్ పద్మవ్యూహం... అమెరికాకు అసలైన అగ్నిపరీక్ష!
దాడులు ప్రతి దాడులతో అట్టుడికిపోతున్న పశ్చిమాసియాలో.. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే సైనిక చర్య తప్పేలా లేదా? అమెరికా ఒకవేళ సైనిక చర్యకు దిగితే.. ఏయే మార్గాలను ఎంచుకుంటుంది? ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధం అంటే.. అమెరికాకు భారీ నష్టమే కాకుండా.. ఊహించని రిస్క్ కూడా. అసలు ఇరాన్పై సైనిక చర్య అమెరికాకు సాధ్యం అవుతుందా? ప్రాణనష్టం లేకుండా యుద్ధాన్ని ముగించడం అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చే ఇజ్రాయెల్కు సాధ్యమేనా?..ఇరాన్ ఓ కంచుకోట..!భౌగోళికంగా ఇరాన్ ఒక సహజమైన కోట లాంటిది. ఆ దేశం చుట్టూ ఎత్తైన పర్వతాలుంటే.. లోపల భయంకరమైన ఎడారులు, ఉప్పు నేలలు ఉన్నాయి. శత్రు సైన్యం ఇరాన్ లోపలి నగరాల వరకు వెళ్లడం దాదాపు అసాధ్యమే. అందుకే, అమెరికా మిలటరీ ప్లానర్స్ ఒక సరికొత్త వ్యూహాన్ని ఆలోచిస్తున్నారు. ఇరాన్ లోపలికి వెళ్లకుండా, కేవలం దాని దక్షిణ తీరప్రాంతాన్ని(Southern Coastline) టార్గెట్ చేయడం! ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్థిక, సైనిక వనరులు ఉన్నాయి. కానీ మిలిటరీ నిపుణులు ఒక మాట అంటారు. ఇరాన్లో అడుగుపెట్టే మొదటి తొలి మైలు దూరాన్ని కిలోమీటర్లలో కొలవవచ్చు, కానీ తదుపరి 100 మైళ్లను సంవత్సరాలలో కొలవాల్సి ఉంటుందనేది దాని సారాంశం..! అందుకే.. ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి అమెరికా ముందు కేవలం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..1. ఖార్గ్ ఐలాండ్ (Kharg Island): ఈ ద్వీపం ఇరాన్కు చమురు విషయంలో గుండెకాయలాంటిది. భూతల దాడులకు దిగితే.. అమెరికా కన్నుపడే మొదటి ప్రాంతం ఇదే. ఇరాన్ దేశ మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 90% నుంచి 95% ఇక్కడి నుంచే జరుగుతాయి. పర్షియన్ గల్ఫ్లో లోతు తక్కువగా ఉండటం వల్ల, ఇరాన్ తన మెయిన్ల్యాండ్ నుంచి పైప్లైన్ల ద్వారా చమురును ఈ దీవికి తెచ్చి, ఇక్కడ పెద్ద ట్యాంకర్లలో లోడ్ చేస్తుంది. అంటే, ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీన్ని ఆక్రమిస్తే ఇరాన్ మోకాళ్లపై పడుతుందని అమెరికా అనుకోవచ్చు. కానీ రిస్క్ ఏంటంటే.. ఇక్కడ దాడి జరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ క్రాష్ అవుతుంది. అంతేకాదు, పక్కనే ఉన్న అరబ్ దేశాల ఆయిల్ ఫీల్డ్స్పై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుంది.2. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ (Strait of Hormuz): ఇక అమెరికా ఎంచుకునేందుకు అవకాశమున్న రెండో మార్గం.. హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు ఇది అత్యంత కీలకమైన జలసంధి. అయితే దీన్ని కంట్రోల్ చేయడం అమెరికా అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దీని చుట్టూ ఇరాన్ బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుంది. బందర్ అబ్బాస్ నగరం, ఖేష్మ్ ఐలాండ్లను దాటుకుని అమెరికా ఇక్కడ నిలబడటం చాలా కష్టం. ఇరాన్ దగ్గర వందలాది స్పీడ్ బోట్లు, మిస్సైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి అమెరికా నౌకాదళంపై నిరంతరం రాకెట్ల వర్షం కురిపించగలవు. ఇక్కడ ఆపరేషన్ మొదలైతే, అది పరిమితంగా కాకుండా.. ఒక సుదీర్ఘమైన ప్రపంచ ఆర్థిక యుద్ధంగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది.3. మూడు ద్వీపాలు.. ఫైబర్-ఆప్టిక్ డ్రోన్ల ముప్పు: ఇక అమెరికా వద్ద ఉండే మూడో ఆప్షన్.. గల్ఫ్లో ఉండే మూడు చిన్న ద్వీపాలు. అవి.. అబు మూసా, గ్రేటర్ టంబ్, లెస్సర్ టంబ్. అమెరికా సైన్యం వీటిని ఈజీగా ఆక్రమించి.. మిలిటరీ బేస్లు పెట్టొచ్చు. కానీ, అమెరికా సేనలకు అసలు నరకం ల్యాండింగ్ అయ్యాక మొదలవుతుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది... అదే ఫైబర్-ఆప్టిక్ డ్రోన్. సాధారణ డ్రోన్లను అమెరికా తన టెక్నాలజీతో ‘జామ్’ చేయగలదు. కానీ ఈ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లు రేడియో సిగ్నల్స్ మీద పనిచేయవు, వీటికి వెనుక 60 కిలోమీటర్ల పొడవైన వైర్ ఉంటుంది. వీటిని జామ్ చేయడం అసాధ్యం! ఇరాన్ కొండల చాటు నుండి ఈ డ్రోన్లను వందల సంఖ్యలో వదిలితే.. ఈ ద్వీపాల్లో ఉండే అమెరికా సైనికులు కేవలం ‘సిట్టింగ్ డక్స్’ అంటే.. సులభమైన టార్గెట్స్ లాగా మిగిలిపోతారు.4. చాబహార్ పోర్ట్ (Chabahar Port): భూతల దాడుల కోసం అమెరికా వద్ద ఉండే నాలుగో ఆప్షన్ చాబహార్ పోర్ట్. దీన్ని భారత్ కూడా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గరున్న ఏకైక ఓపెన్ ఓషన్ డీప్-వాటర్ పోర్ట్ ఇది. ఇది గల్ఫ్ దేశాలకు కొంచెం దూరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే.. ఇక్కడ ల్యాండ్ అవ్వడం అమెరికాకు ఈజీ. కానీ సమస్య ఏంటంటే.. ఇక్కడ అమెరికాకు ఎలాంటి లెవరేజ్ దొరకదు. ఇరాన్ ప్రధాన నగరాలకు, ఆయిల్ ఫీల్డ్స్కు చాబహార్ చాలా దూరంలో ఉంది. దీన్ని పట్టుకుని అమెరికా సాధించేది ఏమీ ఉండదు. ఇక్కడి నుంచి ఇరాన్ను లొంగదీసుకోవాలంటే, అమెరికా సైన్యం దేశం లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. అంటే మళ్లీ ఒక పెద్ద గ్రౌండ్ వార్లోకి దిగాల్సిందే.5. ఖుజెస్తాన్ (Khuzestan)-ప్రాక్సీల వ్యూహం: గ్రౌండ్ వార్కు అమెరికా సిద్ధమైతే.. ఆ దేశం ఎంచుకునే ఐదో ఆప్షన్ ఖుజెస్తాన్ మాత్రమే. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన రూట్. ఇది చమురు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కువైట్లోని అమెరికా బేస్ నుంచి ఇక్కడికి రావడం అమెరికాకు ఈజీ. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్పై దాడికి ఇదే రూట్ను వాడుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అమెరికా సైన్యం మాత్రం ఇరాక్లోని బస్రా మీదుగా రావాలి. అక్కడ ఇరాన్ మద్దతు ఉన్న 2 లక్షల మంది 'ప్రాక్సీ మిలిషియా' సైన్యం కాపు కాసి ఉంటుంది. అంటే, అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దును తాకక ముందే.. ఇరాక్లోనే ఒక భారీ అంతర్జాతీయ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ 5 ప్రాంతాలను చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇరాన్లోకి ఎంటర్ అవ్వడానికి అమెరికాకు దారులు ఉన్నాయి. కానీ, గెలవడానికి దారులు లేవు. వెస్ట్రన్ బోర్డర్లో ఉన్న కుర్దిష్ తిరుగుబాటుదారులను వాడుకోవాలని చూసినా.. అది ఇరాన్ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచి దేశాన్ని మరింత ఏకం చేస్తుంది. చివరగా చెప్పాలంటే.. యుద్ధంలో ఎవరు మొదట కొట్టారు? లేదా ఎంత గట్టిగా కొట్టారు? అనేది ముఖ్యం కాదు. చివరి వరకు తట్టుకుని ఎవరు నిలబడ్డారు? అనేదే ముఖ్యం.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
‘ఏఐ’తో ‘ఆట’లొద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మన దేశంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే–2024 ప్రకారం భారతీయుల్లో 65 శాతం మంది జనరేటివ్ ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కవ. విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అదే సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, గోప్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్ 2025’ అధ్యయనం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ముగ్గురిలో ఒకరు వారి వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలను ఏఐతో పంచుకుంటున్నారు. ఏఐతో వ్యక్తిగత విషయాలు చర్చించిన వారిలో 25 శాతం మంది ‘మనుషుల కంటే ఏఐ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’ అని భావిస్తున్నారు.ఆలోచనా శక్తిపై ప్రభావంఇదే సర్వేలో మరో ఆందోళనకర అంశం బయటపడింది. ఏఐ గురించి తెలిసిన పిల్లల్లో 75 శాతం మంది ఏఐ పనితీరుపై అవగాహన లేక దాన్నొక సెర్చ్ ఇంజిన్లా భావిస్తున్నారు. అలాగే 46 శాతం కుటుంబాలు ఏఐ వల్ల తప్పుడు సమాచారం (మిస్ఇన్ఫర్మేషన్) వచ్చే ప్రధాన ప్రమాదమని పేర్కొన్నాయి. ఏఐ వెంటనే సమాధానాలు అందించడం వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. హోంవర్క్, ప్రాజెక్టులు, వ్యాసాలు అన్నింటికీ ఏఐపై ఆధారపడితే సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దెబ్బతినే అవకాశం ఉంది. యునిసెఫ్ నివేదికల ప్రకారం.. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరితనం, భావోద్వేగ సంబంధాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.‘ఏఐ’ రూపంలో కొత్త ముప్పుఏఐ అందించే సమాచారం ఎల్లప్పుడూ సరైనదే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాస్తవాలకు విరుద్ధమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని కూడా అందించవచ్చు. చిన్నారులు దానిని నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అలాగే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, చాటింగ్ డేటా వంటి సమాచారాన్ని ఏఐ ప్లాట్ఫారమ్లలో పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీతో డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలు సృష్టించడం సులభమవుతోంది. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 33 శాతం మంది టీనేజర్లు వారి అనుమతి లేకుండా వారి ఫొటోలను ఉపయోగించి డీప్ఫేక్ చిత్రాలు రూపొందించారని తెలిపారు. అలాగే 54 శాతం మంది ఇలాంటి కంటెంట్ను అందుకున్నట్లు చెప్పారు. యూకేలో 8 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో దాదాపు 22 శాతం మంది ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. 40 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలకు ఏఐ భద్రత గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ వివరించలేదు. ఏఐ వాడే పిల్లల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆరోగ్యం లేదా శరీరానికి సంబంధించిన సలహాల కోసం చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఆరుగురిలో ఒకరు (సుమారు 17 శాతం) ఏఐ ద్వారా అనుచిత కంటెంట్ చూశామని తెలిపారు.ఈ నేపధ్యంలో పిల్లల విద్య, మానసిక అభివృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనతో కొన్ని దేశాలు పాఠశాలల్లో ఏఐ వినియోగంపై నియంత్రణ విధించాలని భావిస్తున్నాయి. కానీ ఏఐను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు. పిల్లలు దానిపై పూర్తిగా ఆధారపడకుండా, ఇతర మంచి విషయాలవైపు మళ్లేలా వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాగే తప్పుడు సమాచారం, గోప్యత, డీప్ఫేక్ ముప్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన సాధనం. అయితే నియంత్రణ లేకుండా వినియోగిస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్–2025 అధ్యయనం ప్రకారం ఏఐ వినియోగం ఇలా..జనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగిస్తున్న విద్యార్థులు – 35 శాతంవీరిలో సందేహాల నివృత్తికి – 73 శాతంకొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి – 48 శాతంపరీక్షల సన్నద్ధతకు – 32 శాతంఅమెరికాలో కామన్సెన్స్ మీడియా 2026 అధ్యయనం ప్రకారం..9 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో ఏఐ వినియోగిస్తున్న వారు – 86 శాతం వీరిలో నిత్యం ఏఐతో మమేకమయ్యే వారు – 25 శాతంఏఐ కంపానియన్ చాట్బాట్ల ఉపయోగించే టీనేజర్లు – 72 శాతంరోజూ వాటితో మాట్లాడేవారు – 13 శాతం -
చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ Steven Spielberg తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.2001 జూన్ 29న A.I. Artificial Intelligence రిలీజ్అయ్యింది. జులై మొదటి వారంలో భారత్లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్ మేధస్సు, స్పీల్బర్గ్ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. ఈ కథలో డేవిడ్ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. -
నాటోతో అమెరికాకు తల్లాక్?
ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.. క్లుప్తంగా నాటో.. ఇప్పుడు నాటో-అమెరికా మధ్య ఇడుపు కాయితం.. అదే విడాకులు జరగనున్నాయా? నాటో నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిపోతుందా? అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ సైనిక అత్యవసర పరిస్థితి లేదా యుద్ధం వస్తే.. నాటో కూటమికి ఎలాంటి సైనిక సహాయం పంపాలనే నియమాలను ఆయన మార్చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. నాటో దేశాలకు ఇకపై అమెరికా మద్దతు చాలా చాలా తక్కువగా ఉంటుంది.నాటోకు ఈ సపోర్ట్ ఉండదు..•విమాన వాహక నౌకలు (Carriers) ఉండవు•క్యారియర్ యుద్ధ విమానాలు ఉండవు•ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు (Precision munitions) ఉండవు•లాజిస్టికల్ సరఫరా (రవాణా సదుపాయాలు) ఉండదు•శాటిలైట్ మద్దతు కూడా చాలా పరిమితంగా ఉంటుంది.చైనాతో యుద్ధానికి సిద్ధం??అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం.. చైనాతో ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చనే ఉద్దేశంతో అమెరికా పనిచేయాలని హెగ్సెత్ భావిస్తున్నారు. అందుకే.. చైనాతో పోరాడటానికి అవసరమయ్యే ఏ సైనిక వనరులను కూడా ఇతర ప్రాంతాలకు తరలించకూడదని నిర్ణయించారు. ఇక అనధికారికంగా చూస్తే ఇరాన్ యుద్ధం తర్వాత, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని అమెరికా కోల్పోయింది. అన్ని వనరులను కేవలం చైనా కోసమే కేటాయించాలని అమెరికా నిర్ణయించుకున్నప్పుడు, ఇక ప్రపంచంలో మరెక్కడా జోక్యం చేసుకోలేదు. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం నడిపిన తీరు వల్ల, తూర్పు అర్ధగోళం నుంచి అమెరికా తన పట్టును కోల్పోతుందనేది నిర్వివాదాంశం..! రాజకీయంగా ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. అదేంటంటే.. ఐరోపా (Europe) ఇక తనను తాను కాపాడుకోవాలే తప్ప.. అమెరికా సాయం ఉండదు.భవిష్యత్ ఏమిటి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో.. నాటో కూటమి పేపర్పై మాత్రమే మిగిలి ఉంటుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే అమెరికా చేతులెత్తేస్తే, ఐరోపా దేశాల వద్ద లేని ప్రత్యేకమైన అమెరికన్ ఆయుధాలు రావని తేలిపోతే.. ఇక నాటో కూటమికి అర్థమే ఉండదు. దీంతో, నాటో కథ ముగిసినట్లే అవుతుంది!. 1949 నుండి నాటో ప్రణాళిక ఎలా ఉందంటే అమెరికా కొన్ని పెద్ద సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది, ఐరోపా దేశాలు వాటిని చేయవు. ఐరోపా దేశాలు ఎప్పుడూ అమెరికాపై ఆధారపడేలా చేయడం కోసమే యూఎస్ఏ అలా చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే, వారి సైన్యాలన్నింటినీ అమెరికానే కమాండ్ చేయాలనేది దాని ఆలోచన. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు ముగిసిపోయింది. ఐరోపాలో అమెరికా తన సైనిక ప్రభావాన్ని కోల్పోయింది.ఐరోపాకు కింకర్తవ్యమ్..?ఇప్పుడు ఐరోపా దేశాలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నందున, అమెరికాతో ఉన్న 'ఇంటర్ఆపరబిలిటీ' (Interoperability) అంటే.. కలిసి పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. అమెరికా ఆయుధ వ్యవస్థలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి డిజైన్ అయ్యాయి. కానీ ఐరోపా దేశాలు ఎదుర్కొనే యుద్ధాలు అలాంటివి కావు. ఒక యుద్ధంలో తమ సైన్యాన్ని నడిపించే అమెరికాతో కలిసి పనిచేయడం కోసమే ఐరోపా దేశాలు ఇంతకాలం అమెరికా ఆయుధాలను కొనుగోలు చేశాయి. కానీ అమెరికా సైన్యమే రానప్పుడు, ఇక ఆ ఆయుధాలను వాడటంలో ఎలాంటి అర్థం లేదు. ప్రస్తుత డ్రోన్ల యుగంలో.. అమెరికా తరహా ఆయుధ వ్యవస్థలను నిర్మించుకోవడానికి ఐరోపాకు 10 నుండి 15 ఏళ్ల సమయం లేదు. అంత వేగంగా వాటిని నిర్మించలేరు. కాబట్టి, వారు ఉక్రెయిన్ తరహా ఆయుధాలను తయారు చేసుకుంటారు. వీటికి బ్యాకప్గా బహుళ-దేశాల అణ్వాయుధ రక్షణను ఏర్పాటు చేసుకుంటారు.ఇది ఎలా సాగుతుందో కాలమే చెప్పాలి. సరిగ్గా ఒక సంవత్సరంలోనే ఐరోపా, అమెరికా సైన్యాలు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల వారు కలిసి పనిచేయాల్సి వచ్చినా, వేర్వేరు కమాండ్ స్ట్రక్చర్స్, వేర్వేరు వ్యూహాలతో పనిచేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ తీసుకున్న ఈ రాజకీయ నిర్ణయం వల్ల నాటో కూటమికి చరమగీతం పాడినట్లవ్వడమే కాకుండా.. ఐరోపా దేశాలు తీసుకునే ఆయుధ కొనుగోలు నిర్ణయాలు కూడా ఈ కూటమిని శాశ్వతంగా ముగించేలా చేస్తాయి. నాటో (NATO) ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా ఒక వ్యూహాత్మక విచ్ఛిన్నం (Strategic breakdown), సరికొత్త ప్రపంచ సమీకరణాల వైపు అడుగులు వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐరోపా, అమెరికా ఒకే వైపు కాకుండా, రెండు వేర్వేరు ధ్రువాలుగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు. -
15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు!
ఒక దేశపు కరెన్సీ విలువను మరో దేశపు కరెన్సీతో స్థిరంగా అనుసంధానించి ఉంచడం.. ఆ తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవడం సాధారణ నిర్ణయం కాదు. అలాంటి కీలక అడుగే ఇప్పుడు బొలీవియా వేసింది. 15 ఏళ్లుగా కొనసాగిన డాలర్ పెగ్ విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? డాలర్ పెగ్ను వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మార్పు బొలీవియా ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయనుంది? పరిశీలిస్తే..సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని దేశాలు తమ కరెన్సీ విలువను అమెరికన్ డాలర్కు స్థిరంగా కట్టిపెడతాయి. దీనినే "డాలర్ పెగ్" అంటారు. బొలీవియా కూడా గత 15 ఏళ్లుగా తన కరెన్సీ అయిన "బొలివియానో" విలువను డాలర్తో స్థిరంగా కొనసాగించింది. మార్కెట్లో పరిస్థితులు ఎలా మారినా.. ఒక నిర్దిష్ట మారకపు రేటును ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. ఇందుకోసం భారీ మొత్తంలో డాలర్ నిల్వలు అవసరమవుతాయి.సడన్గా ఎందుకు?..ఇటీవలి కాలంలో బొలీవియా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇంధన దిగుమతులు, విదేశీ చెల్లింపుల కోసం అవసరమైన డాలర్లను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారింది. మరోవైపు మార్కెట్లో డాలర్ల కొరత తీవ్రమైంది. అధికారిక మారకపు రేటు ఒకలా ఉండగా, బ్లాక్ మార్కెట్లో డాలర్ ధర మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయి బ్లాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో పాత విధానాన్ని కొనసాగించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావించింది.ఇకపై..డాలర్ పెగ్ విధానాన్ని రద్దు చేయడంతో ఇకపై బొలీవియా కరెన్సీ విలువ మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. అంటే డిమాండ్, సరఫరా ఆధారంగా కరెన్సీ విలువ పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. ఈ నిర్ణయం తర్వాత బొలివియానో విలువ గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దీని ప్రభావంగా.. దిగుమతి వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో కరెన్సీ నిజమైన మార్కెట్ విలువను ప్రతిబింబించడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరికొన్ని దేశాలు..బొలీవియా నిర్ణయం ప్రపంచానికి కొత్తేమీ కాదు. గతంలో అనేక దేశాలు డాలర్తో ఉన్న స్థిర అనుబంధాన్ని వదిలేశాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనా 1990లలో తన కరెన్సీ పెసోను డాలర్కు 1:1 నిష్పత్తిలో కట్టిపెట్టింది. కానీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా 2002లో ఆ విధానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం అర్జెంటీనా కరెన్సీ భారీగా విలువ కోల్పోయింది. అలాగే కజకిస్తాన్ 2015లో, ఈజిప్ట్ 2016లో తమ కరెన్సీలను మార్కెట్ ఆధారిత విధానానికి మార్చాయి. నైజీరియా కూడా గత కొన్నేళ్లుగా విదేశీ మారక సంక్షోభం నేపథ్యంలో కరెన్సీపై నియంత్రణలను సడలిస్తోంది.అయితే మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ వంటి దేశాలు ఇప్పటికీ డాలర్ పెగ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దేశాల వద్ద భారీ విదేశీ మారక నిల్వలు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.ఒక దేశం తన కరెన్సీని డాలర్కు కట్టిపెట్టడం ఎంత కష్టమో, ఆ బంధాన్ని తెంచుకోవడం కూడా అంతే కీలక నిర్ణయం. బొలీవియా తీసుకున్న తాజా నిర్ణయం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మారిందో చెబుతూనే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం, కరెన్సీ విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.భారత్ డాలర్ పెగ్ విధానాన్ని అనుసరించదు. మన కరెన్సీ రూపాయి 'మేనేజ్డ్ ఫ్లోట్' విధానంలో ఉండటంతో.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దాని విలువ మారుతుంటుంది. అయితే రూపాయిలో తీవ్ర ఒడిదొడుకులు రాకుండా అవసరమైనప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. -
ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపం
1. చిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)2 . ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు)3. క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెరి్నంగ్ ఆపరేషన్స్, హోస్టింగ్)4. ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటం)5. ఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)6. ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)ఏఐ సామ్రాజ్య శ్రేణిలో దిగ్గజాలు వీరే?


