Sakshi Special
-
ట్రంప్ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చూసేద్దాం...చివరిసారి!
ఏ ఆటలో అయినా నిలకడగా రాణిస్తూ... మంచి గుర్తింపు తెచ్చుకునే ప్లేయర్లు చాలా మంది ఉంటారు. కానీ తమ ఉనికితోనే మ్యాచ్ను రసవత్తరంగా మార్చేసి... చిన్న కదలికలతో ఆబాలగోపాలాన్ని మంత్రముగ్ధులను చేసేవారు కొందరే! స్టార్, సూపర్ స్టార్ స్థాయి దాటేసి అలా లెజెండ్గా మారిన పలువురు ప్లేయర్లు ఈ ‘ఫిఫా’ ప్రపంచకప్తో అంతర్జాతీయ ఫుట్బాల్కు టాటా చెప్పనున్నారు. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), నెమార్ (బ్రెజిల్), మొహమ్మద్ సలా (ఈజిప్ట్), లూకా మోడ్రిక్ (క్రొయేషియా), మాన్యుయెల్ న్యూయెర్ (జర్మనీ), విర్జిల్ వాన్ డిక్ (నెదర్లాండ్స్), కెవిన్ డి బ్రూనీ (బెల్జియం), సాడియో మానె (సెనెగల్), సన్ హెంగ్ మిన్ (దక్షిణ కొరియా), జేమ్స్ రోడ్రిగెజ్ (కొలంబియా) ఇలా ఈ జాబితా చాలా పెద్దదే! ఈ దిగ్గజాలను ఆయా దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్ల్లో చూడటం దాదాపు ఇదే చివరిసారి కానుంది. అలాంటి వాళ్ల కెరీర్ను ఓసారి పరిశీలిస్తే...మెస్సీ... అర్జెంటీనా తురుపుముక్క సుదీర్ఘ కాలంగా అర్జెంటీనా జట్టు తురుపుముక్కగా ఉన్న స్టార్ స్ట్రయికర్ లియోనెల్ మెస్సీ ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 తర్వాత కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్లో జరిగిన మెగా టోర్నీ సమయంలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న 39 ఏళ్ల మెస్సీ... అప్పుడు అర్జెంటీనా జట్టు వరల్డ్ చాంపియన్గా నిలవడంతో... సుదీర్ఘకాలంగా తాను కన్న కలను ఆస్వాదించేందుకు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 198 మ్యాచ్లాడిన మెస్సీ 115 గోల్స్ కొట్టాడు. ఐదుసార్లు ‘ఫిఫా’ వరల్డ్కప్లో పాల్గొన్న మెస్సీ... రికార్డు స్థాయిలో ఆరోసారి మెగా టోర్నీలో ఆడిన అనంతరం వీడ్కోలు పలికే అవకాశాలున్నాయి. మరే ఆటగాడికీ సాధ్యం కాని రీతిలో ఈ అర్జెంటీనా స్టార్ 26 ప్రపంచకప్ మ్యాచ్లు ఆడాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనున్న అర్జెంటీనా జట్టు... టైటిల్ను నిలబెట్టుకొని మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అతడి నాయకత్వ పటిమ, అనుభవం ఈ టోర్నీలో అర్జెంటీనాకు మరింత బలాన్నిస్తాయని యోచిస్తోంది. ఫిట్నెస్ ఎంతో కీలకమైన ఫుట్బాల్లో 39 ఏళ్ల వయసు వరకు కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. జాతీయ జట్టుతో పాటు క్లబ్లు కలుపుకుంటే కెరీర్లో మొత్తం 1151 అధికారిక మ్యాచ్లు ఆడిన మెస్సీ... 906 గోల్స్ చేశాడు.రొనాల్డో... ముందే చెప్పేశాడుయావత్ క్రీడా ప్రపంచం ‘సీఆర్7’గా పిలుచుకునే... ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఈ ప్రపంచకప్ అనంతరం కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మెస్సీతో సరిసమానంగా రికార్డు స్థాయిలో ఆరోసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ బరిలోకి దిగనున్న 41 రొనాల్డో ఇదే తనకు చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే వెల్లడించాడు. కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన రొనాల్డో లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సైతం చేజిక్కించుకున్నాడు. అయితే సుదీర్ఘ కాలంగా ఎంతగానో తపిస్తున్నా ‘ఫిఫా’ విన్నర్స్ ట్రోఫీ మాత్రం అతడి చేతికి చిక్కలేదు. ‘ఔర్ ఏక్ ధక్కా... ఇస్ బార్ పక్కా’ అన్నట్లు తన చివరి ప్రయత్నంలో అయినా అందని ద్రాక్షను అందుకోవాలని రొనాల్డో భావిస్తున్నాడు. 2003లో తొలిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో... 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో పోర్చుగల్ తరఫున 226 మ్యాచ్లు ఆడి 143 గోల్స్ చేశాడు. ప్రస్తుతం సౌదీ అరేబియాకు చెందిన ‘అల్ నాసర్’ క్లబ్కు సారథ్యం వహిస్తున్న రొనాల్డో... ఇటీవలే సౌదీ ప్రొ లీగ్ టైటిల్ సాధించి ఫుల్ జోష్లో ఉన్నాడు. అదే ఊపు ప్రపంచకప్లోనూ కొనసాగిస్తూ తన చిరకాల లక్ష్యాన్ని అందుకుంటాడా చూడాలి. సీనియర్ స్థాయిలో ఇప్పటి వరకు 1320 మ్యాచ్లు ఆడిన రొనాల్డో 970 గోల్స్ చేశాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్కు ప్రతిరూపంగా నిలచే రొనాల్డో... సోషల్ మీడియాలో వంద కోట్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకున్న తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.నెమార్... బ్రెజిల్ గుండె చప్పుడు మూడుసార్లు ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆడిన బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ చివరి టోర్నీకి సిద్ధమవుతున్నాడు. తన తరంలో జట్టుకు అందని ట్రోఫీని అందించాలనే బలమైన సంకల్పంతో ఉన్నాడు. అయితే ఫిట్నెస్ కారణాలరీత్యా అతడు అన్నీ మ్యాచ్లు ఆడతాడా అనేది సందేహమే. అత్యధికంగా ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002లో) వరల్డ్ చాంపియన్గా నిలిచిన బ్రెజిల్ ‘సిక్సర్’ కొట్టాలంటే నెమార్ ప్రదర్శన కీలకం కానుంది. ఇది తనకు చివరి మెగా టోర్నీ అని 34 ఏళ్ల నెమార్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు. జాతీయ జట్టు తరఫున 128 మ్యాచ్లు ఆడిన నెమార్... 79 గోల్స్ చేయడంతో పాటు మరో 59 గోల్స్కు సహకారం అందించాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా కొనసాగుతున్న నెమార్ చివరి వరల్డ్కప్లోనూ అదే నిలకడ కొనసాగించాలని భావిస్తున్నాడు. ఐదో ప్రపంచకప్ ఆడనున్న జర్మనీ గోల్ కీపర్ న్యూయెర్ (40 ఏళ్లు), మెక్సికో గోల్ కీపర్ ఒచోవా (40 ఏళ్లు), కొలంబియా కెప్టెన్ జేమ్స్ రోడ్రిగెజ్ (34 ఏళ్లు), సాడియో మానె (34 ఏళ్లు), విర్జిల్ వాన్ డిక్ (35 ఏళ్లు), కెవిన్ డి బ్రూనీ (35 ఏళ్లు), సన్ హెంగ్ మిన్ (34 ఏళ్లు) కూడా చివరిసారి ప్రపంచకప్లో కనిపించనున్నారు.సలా... వన్ మ్యాన్ షో క్లబ్ ఫుట్బాల్ లివర్పూల్ తరఫున సంచలనాలు నమోదు చేసిన ఈజిప్ట్ సూపర్ స్టార్ మొహమ్మద్ సలాకు కూడా ఇదే చివరి ‘ఫిఫా’ వరల్డ్కప్ కానుంది. 2010లో సీనియర్ స్థాయిలో తొలి మ్యాచ్ ఆడిన సలా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 115 మ్యాచ్లాడి 67 గోల్స్ చేశాడు. అటాకింగ్కు పెట్టింది పేరైన సలా... రెప్పపాటులో ప్రత్యర్థి ప్లేయర్లను బోల్తా కొట్టించడంలో నేర్పరి. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి (2018లో) ప్రపంచకప్ బరిలోకి దిగిన సలా... 2 మ్యాచ్లాడి రెండు గోల్స్ చేశాడు. క్లబ్ ఫుట్బాల్లో 750కి పైగా మ్యాచ్లాడిన అనుభవం ఉన్న అతడు... ఈజిప్ట్ను ఎలా ముందుకు నడిపిస్తాడనేది కీలకం. మైదానంలో అతడి వేగం, గోల్స్ చేయడంలో అతడి సామర్థ్యంపై ఈజిప్ట్ భారీ ఆశలు పెట్టుకుంది. సుదీర్ఘ ‘ఫిఫా’ వరల్డ్కప్ చరిత్రలో ఈజిప్ట్ ఇప్పటి వరకు మూడుసార్లు (1934, 1990, 2018) మాత్రమే మెగా టోర్నీకి అర్హత సాధించింది. 33 ఏళ్ల సలాకు ఫిట్నెస్ పరంగా సమస్యలు లేకపోయినా... ఇప్పటి వరకు ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈజిప్ట్ వచ్చే సీజన్కు అర్హత సాధిస్తుందా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో... అతడికిదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశాలున్నాయి. లూకా మోడ్రిచ్... క్రొయేషియా ఆశ క్రొయేషియా మిడ్ఫీల్డర్ లూకా మోడ్రిచ్ ఐదోసారి ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ జట్టు ఆడిన సగానికి పైగా మ్యాచ్ల్లో బరిలోకి దిగిన 40 ఏళ్ల మోడ్రిక్ చివరిసారి ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీ ఆడనున్నాడు. కెరీర్లో 196 మ్యాచ్లాడిన మోడ్రిచ్... 28 గోల్స్ చేశాడు. గోల్స్ పరంగా చూసుకుంటే సంఖ్య తక్కువే కనిపించినా మిడ్ఫీల్డ్లో అతడి అనుభవం జట్టుకు ఎంత బలాన్నిస్తుందో గత ప్రపంచకప్లో రుజువైంది. 2022 టోర్నీలో అనూహ్య ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించిన మోడ్రిచ్... క్రొయేషియాను మూడో స్థానంలో నిలిపాడు. ప్రస్తుతం ఇటలీ లీగ్లో ఏసీ మిలాన్ క్లబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లూకా... ఇటీవల గాయపడి కోలుకున్నాడు. ముఖానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఈ టోర్నీలో అతడు సేఫ్టీ మాస్క్తో బరిలోకి దిగొచ్చు. క్రొయేషియా జట్టు సంధి దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో లూకా అనుభవం ఆ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేనేజర్ డాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. – సాక్షి క్రీడా విభాగం -
ఇదేం జెలసీ లోకేశ్?
చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రంలో యువ ఐటీ మంత్రి.. అందునా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యే.. అతితక్కువ ఖర్చుతో పెట్టుబడుల్ని ఆకర్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తేడా సహజంగానే రాజకీయ వర్గాల్లో పెద్ద డిబేట్కు దారితీసింది..విజయ్ కేబినెట్లో పరిశ్రమల మంత్రిగా ఉన్న ఎస్. కీర్తన ప్రస్తుతం సోషల్ మీడియా స్టైల్ పాలనతో హాట్ టాపిక్గా మారారు. మొన్నటి ఎన్నికల్లో శివకాశిలో నెగ్గిన ఆమె.. కొన్నిచోట్ల తెలుగులో ప్రచారం చేసి అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు పాలనలోనూ అదే జెన్జీ మార్క్ చూపిస్తూ రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలకు నేరుగా డిజిటల్గా రిక్వెస్టులు పంపడం, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్ వాడటం వంటివి తమిళనాడులో కొత్త చర్చకు దారి తీశాయి.దీంతో సహజంగానే కొంతమంది కంపెనీల దృష్టి తమిళనాడు వైపు మళ్లుతోందన్న ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కీర్తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ “రీల్స్ మంత్రిగా పాలన సాగుతోంది” అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై ఆమె మాత్రం “అంత తొందరెందుకు?.. వెయిట్ అండ్ సీ ఫర్ రిజల్ట్” అంటూ స్పందిస్తూ తన దారి తాను కొనసాగిస్తున్నారు.ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అక్కడి రాజకీయాల్లో వేలు పెట్టడం.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వివాదానికి మరింత వేడి పెంచాయి. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెట్టాలని కీర్తనకు ఇచ్చిన సూచన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఒకవైపు ఇది సాధారణ సలహాగా కనిపించినా.. మరోవైపు ఈ వ్యాఖ్యల తర్వాత తమిళనాడులో ప్రతిపక్షాలు ఆ అంశాన్ని పట్టుకుని కీర్తనపై విమర్శలు మరింత తీవ్రతరం చేసినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మొత్తం వ్యవహారం వెనుక మరో కోణం కూడా చర్చలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా మారకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పలు రాష్ట్రాల ఎన్నికలకు పని చేసిన అనుభవం ఉంది. ఇందులో భాగంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని వినికిడి. విశేషం ఏంటంటే.. ఆ సమయంలోనే ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు డిజిటల్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్లపై మంచి పట్టు సాధించారట. అయితే వేగంగా పెంచుకుంటున్న డిజిటల్ ఇమేజ్, యువతలో కీర్తనకు లభిస్తున్న ఫాలోయింగ్ వంటి అంశాలు కొందరు రాజకీయ వర్గాల్లో కంటగింపుగా మారుతున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యమే లోకేష్ ఎంట్రీకి కారణమైందని చర్చ నడుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణలో కీర్తన చేస్తున్న కొత్త తరహా ప్రయోగాలు.. ఏపీలోని సంప్రదాయ ప్రమోషన్ మోడల్ను ప్రశ్నిస్తున్నాయన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంతోనే ‘మీ రాష్ట్రం సంగతి మీరు చూస్కోవచ్చు కదా!’ అంటూ కొందరు తమిళులు లోకేశ్ను నిలదీస్తున్నారు. సోషల్ మీడియాలో రీల్స్, ఆధునిక ప్రెజెంటేషన్ స్టైల్తో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒకవైపు కీర్తన ప్రయత్నం చేస్తుంటే.. ప్రజాధనాన్ని అభివృద్ధి కంటే ఇమేజ్ బిల్డింగ్కు అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది కూటమి ప్రభుత్వం. కీర్తన నేపథ్యానికి తోడు.. వాడుతున్న డిజిటల్ కమ్యూనికేషన్ స్టైల్, యువతలో ఆమెకు పెరుగుతున్న ఫాలోయింగ్ కూడా లోకేష్ వర్గానికి అసౌకర్యంగా మారిందన్న చర్చ ఉంది. దీంతో ఈ మొత్తం వ్యవహారం పాలసీ డిబేట్ కంటే వ్యక్తిగత రాజకీయ ఈర్ష్యగా మారిందన్న వ్యాఖ్యలు గట్టిగా వినిపిస్తున్నాయి. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు ‘జెలసీ పాలిటిక్స్’ చర్చగా మారింది. -
ఆమె ప్రశ్నిస్తే ట్రంప్కే కాదు.. ఎవరికైనా చెమట్లు పట్టాల్సిందే!
ఇంటర్వ్యూల ఫార్మాట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సాధారణ ప్రశ్న.. జవాబుల కంటే కఠిన ప్రశ్నలతో సంచలనాలు రేపే సెషన్లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే ఎదురుగా డొనాల్డ్ ట్రంప్లాంటి నేతల ముందు అడుగు వేయడం అంటేనే చాలా మంది జర్నలిస్టులు జాగ్రత్తపడే పరిస్థితి. కానీ ఆ ఒత్తిడిని లెక్కచేయకుండా ధైర్యంగా కఠిన ప్రశ్నలు వేసిన ఒక జర్నలిస్ట్.. ఇప్పుడు హాట్టాపిక్గా మారారు. ఇక చాలూ అనుకుంటూ ఆయన్ని ఇంటర్వ్యూ మధ్యలోనే వాకౌట్ చేయించిన.. “ఆమె ఎవరబ్బా?” అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది.. ఆమె పేరు.. క్రిస్టెన్ వెల్కర్. ఎన్బీసీ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రధానంగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ట్రంప్ చేసిన ఆరోపణలపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఆధారాలు చూపాలంటూ ఆయన్ని పదే పదే ప్రశ్నించారు. అయితే ఆయన మాత్రం ఆ ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అదే అంశాన్ని ఆమె మళ్లీ మళ్లీ ప్రస్తావించడంతో ఇంటర్వ్యూ వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సారీ డార్లింగ్ అంటూనే.. తీవ్రంగా విమర్శిస్తూ ట్రంప్ విసుగ్గా కోటుకు ఉన్న లాపెల్ మైక్, వైర్లెస్ ట్రాన్స్మిటర్తో పాటే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే మళ్లింది.WOW -- Trump crashes out and cuts his interview with Welker short as she presses him on his lack of evidence for claiming elections are rigged"You're either crooked or you're stupid. Let's call it quits. Because I've had enough. Thank you darling," he tells her.""I traveled… pic.twitter.com/qQaNIDnX4y— Aaron Rupar (@atrupar) June 7, 2026క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వార్తా రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆమె, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించారు. అనంతరం జర్నలిజాన్ని తన వృత్తిగా ఎంచుకుని స్థానిక టెలివిజన్ ఛానళ్లలో రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించారు. రిపోర్టింగ్లో చూపిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్హౌస్ కరస్పాండెంట్గా నియమితులైన ఆమె, అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే.. క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో. అప్పటి ట్రంప్–బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ, చర్చను నియంత్రించిన తీరు ఆమెకు విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చా కార్యక్రమాల్లో ఒకటైన “మీట్ ద ప్రెస్”కు 2023లో ఆమె హోస్ట్గా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్-అమెరికన్ మహిళా హోస్ట్గా, రెండో మహిళా యాంకర్గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ను ఆమె ఇంతకు ముందు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు.. గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడన్.. ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్, రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె ప్రశ్నించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానాల్లోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతమైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ఘటనతో మరోసారి ఆమె పేరు.. తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. -
గాడ్జిల్లా వచ్చేస్తోంది! భారత్పై దాని నీడ పడితే..
గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తే నగరాలు వణికిపోతాయి. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. అది సినిమా కథ. కానీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్జిల్లా’ మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంటే.. భారత్కు మాత్రం మరో భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఈ దాని నీడ గనుక పడితే జరిగిన నష్టం.. పెను సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి!. వాతావరణ ప్రపంచంలో ప్రస్తుతం ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే "గాడ్జిల్లా ఎల్ నినో". సాధారణంగా రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఎల్ నినో ఈసారి.. అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యూరప్కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్లో వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య, తూర్పు పసిఫిక్ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనించే "నినో-3.4" ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రకటించేందుకు అవసరమైన 0.5 డిగ్రీల పరిమితిని ఇది దాటేసింది. డిసెంబర్ నాటికి ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని యూరోపియన్ ఫోర్కాస్ట్ మోడళ్లు సూచిస్తున్నాయి.అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్ ఎల్ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి "గాడ్జిల్లా ఎల్ నినో" అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా.. ఈ ఎల్ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపవచ్చని భావించి ఆ పేరు పెట్టారు. భారత్పైనే ఎక్కువ ఎందుకు?గాడ్జిల్లా ఎల్నినో గురించి భారత్ ఎక్కువగా ఆందోళన చెందడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూముల్లో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగానే సాగవుతున్నాయి. అందుకే వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది.సాధారణంగా ఎల్నినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవడం జరుగుతుంది.ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 1971-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని హెచ్చరించింది.అయితే సమస్య కేవలం వర్షాలు తగ్గడమే కాదు. వర్షాలు తగ్గితే ముందుగా దెబ్బతినేది వ్యవసాయ రంగం. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం పడిపోవచ్చు. భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోతే తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా.. వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు.గతం ఏం చెబుతోందంటే..1997-98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్ నినోను చూసింది. 2015-16లో మరోసారి సూపర్ ఎల్ నినో నమోదైంది. ఆ సమయంలో భారత్లో సాధారణం కంటే కేవలం 86 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అప్పట్లో భారత్కు ఒక రక్షణ కవచం లభించింది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). 1997లో బలమైన పాజిటివ్ IOD ప్రభావంతో ఎల్ నినో దెబ్బ కొంతవరకు తగ్గింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలోనే ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే సహజ మిత్రుడు ఈసారి భారత్కు అందుబాటులో ఉండకపోవచ్చు.ఎల్ నినోను భారత్ వర్షాకాలానికి విలన్గా భావిస్తే.. ఐవోడీని హీరోగా చెప్పొచ్చు. ఎల్ నినో వల్ల తగ్గే వర్షాలను కొంతవరకు భర్తీ చేసి, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడే శక్తి దీనికి ఉంటుంది. అదెలాగంటే.. ఎల్ నినో వల్ల భారత్లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భారత మహాసముద్రంలో ఏర్పడే ఐవోడీ వాతావరణ పరిస్థితి కొన్నిసార్లు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇది అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి, భారత్కు అదనపు వర్షాలు కురిసేలా సహాయపడుతుంది.ప్రపంచంపై ప్రభావం..అలాగని గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం భారత్కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.కరువు ఖాయమేనా?కచ్చితంగా కాదు. ఎల్ నినో ఒక ప్రమాద సంకేతం మాత్రమే. అది తుది ఫలితం కాదు. వర్షాకాలాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాల తీరు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినా సరే.. ప్రపంచ వాతావరణ నిపుణులు ఇప్పుడు పసిఫిక్పై ప్రత్యేక నిఘా పెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది సాధారణ ఎల్ నినో కాదనే సంకేతాలు కనిపిస్తుండడమే. నోట్: ఇది వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తల అంచనాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణాత్మక కథనం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మారే కొద్దీ అంచనాలు, ప్రభావాలు కూడా మారే అవకాశం ఉంటుంది. -
జెన్ జెడ్.. కొత్త పాఠాలు
అప్పులంటే ఇష్టం లేదు. కానీ... ఈజీగా ‘ఇదిగో తీసుకో’ అంటూ వచ్చే మెసేజీలకు ఇట్టే ఆకర్షితులైపోతారు. అదుపులేకుండా వాడేస్తారు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందో సొంతగానే విశ్లేషిస్తారు. తమకు అన్నీ తెలుసనుకుంటారు. కానీ... రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్లను ఇట్టే నమ్మేస్తారు. ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటారు. కానీ స్మార్ట్ఫోన్లో వేగంగా జరిపే లావాదేవీలతో... డబ్బు నిరంతరం ఖర్చవుతూనే ఉంటుంది. ముందే పొదుపు ఆరంభిస్తున్నారు. చిన్నచిన్న డిస్కౌంట్లు, ఆఫర్లకన్నా... పారదర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలనే నమ్ముతున్నారు. స్మార్ట్ ఫోన్లలో వాడే అప్లికేషన్ల నుంచీ ఎంటర్టైన్మెంట్ వరకూ సబ్ర్స్కిప్షన్లు ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లు, లైఫ్ స్టైల్ను అప్గేడ్ చేసుకోవటం అలవాటు. ఇదంతా ‘జెడ్’ జనరేషన్ గురించి. 16 ఏళ్లు దాటి... 30 ఏళ్లు నిండని యువతరం గురించి. వీరి అలవాట్లు కొన్ని మంచివే అయినా... కొన్నింటి విషయంలో జాగ్రత్తపడాల్సిందే. 2030 నాటికి జెన్ జెడ్, యువ మిలీనియల్స్ దేశీ వినియోగ వ్యయాల్లో మెజారిటీ వాటాకు చేరుతున్న నేపథ్యంలో... వీళ్లేం చేస్తున్నారో... ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ‘సాక్షి వెల్త్’ స్టోరీ ఇది.పదేళ్ల కిందటి వరకూ పర్సులో డబ్బులు లేకుండా కదలడమనేది ఊహక్కూడా అందేది కాదు. కానీ ఇప్పటి జెన్ జెడ్.. చేతిలో స్మార్ట్ఫోన్ తప్ప మరేదీ వెంట తీసుకెళ్లడం లేదు. యూపీఐ సహా డిజిటల్ లావాదేవీలు సర్వ సాధారణమైపోవటమే ప్రధాన కారణం. క్యాష్తో సౌకర్యం తక్కువని భావించటం వల్ల కూడా దీనిపై ఆధారపడటం తగ్గుతోంది. మరో గమనించదగ్గ అంశమేంటంటే ఈ తరం క్రెడిట్ కార్డులకు తక్కువ ప్రాధాన్యమివ్వటం. యూపీఐ, మొబైల్ వాలెట్స్, డెబిట్ కార్డులనే ఎక్కువ వాడటం. క్యాష్ని అత్యంత తక్కువగా ఉపయోగిస్తున్నారు. పేమెంట్ మెథడ్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిదనుకుంటున్నారు. పాత తరం వారు నెలవారీగా కొనుగోళ్లు, పండగ షాపింగ్లు జరుపుతుంటే... ఈ జెన్ జెడ్ మాత్రం వీకెండ్ షాపింగ్లే కాకుండా దాదాపు నిరంతరం ఖర్చు చేస్తూనే ఉన్నారు. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఓటీటీ మెంబర్షిప్లు, గేమింగ్ సబ్్రస్కిప్షన్లు.. ఇలా ఒకటి కాదు నిత్యం బోలెడన్ని చిన్న చిన్న లావాదేవీలు చేస్తూనే ఉంటున్నారు. ఇలా వీరి ఖాతాల్లోంచి నిరంతరం ప్రవహిస్తున్న నగదు ఆధారంగా... ఇపుడొక కొత్త ‘రియల్ టైమ్ స్పెండింగ్ ఎకానమీ’ పుట్టుకొచ్చింది. అది అంతకంతకూ పెరుగుతోంది. అప్పంటే ఇష్టం లేదు.. కానీ.. సాధారణంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుందని యువతపై ఓ అభిప్రాయం ఉంది. కానీ జెన్ జెడ్ తరం ఆర్థిక అలవాట్లు లోతుగా చూస్తే ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక సంక్షోభాలు, కరోనా సమయంలో అనిశ్చితి, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల్లాంటివన్నీ చూసిన మీదట ఈ తరం వాళ్లలో చాలా మంది ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు సంప్రదాయ క్రెడిట్ కార్డులకు బ దులు డెబిట్ కార్డుల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనితో సంప్రదాయ క్రెడిట్ కార్డ్ కంపెనీలకి ఈ సెగ్మెంట్లో అంతగా పట్టు లభించటం లేదు. కానీ కొత్తరూట్లో ‘‘బై నౌ, పే లేటర్’’ (బీఎన్పీఎల్) పేరిట సరికొత్త క్రెడిట్ సర్వీసులు తెచ్చేసరికి జెన్ జెడ్ ఇట్టే ఆకర్షితులయిపోతున్నారు. ఈ– కామర్స్, ఫిన్టెక్ ప్లాట్ఫాంలతో నేరుగా అనుసంధానమైన ఈ తరహా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ ను యువతరం ఎక్కువగా ఉపయోగించుకుంటన్నా రు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. → చాలా తక్కువ డాక్యుమెంటేషన్, అప్పటికప్పుడు అప్రూవల్ → వార్షిక ఫీజులు లేకపోవడం, వడ్డీరహిత గ్రేస్ పీరియడ్ → చిన్న చిన్న మొత్తాల్లో సరళంగా చెల్లించే వెసులుబాటు కాకపోతే, బీఎన్పీఎల్ అనేది చాలా సౌకర్యవంతమైనదే కానీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. వివిధ యాప్ల ద్వారా దాదాపు ఒకే వ్యవధిలో చేసే చిన్న చిన్న కొనుగోళ్లన్నీ ఒకేసారి తడిసి మోపెడై, అప్పుడప్పుడే ఆదాయార్జనలో పడిన యువతకు భారీ రుణ భారంగా మారుతున్నాయి కూడా. ఈ ప్రమాదాన్ని ఊహించాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఫిన్ఫ్లుయెన్సర్ల ప్రభావం..యువతరం ఇప్పుడు ఆర్థిక సలహాల కోసం ఇంట్లో పెద్దవాళ్లనో, బ్యాంకు మేనేజర్లనో, చార్టర్డ్ అకౌంటెంట్లనో సంప్రదించడం తగ్గుతోంది. ఎక్కువగా ఫిన్ఫ్లుయెన్సర్ల వైపు మళ్లే ధోరణి పెరుగుతోంది. పాత తరం వాళ్లు ఆర్థిక సలహాల కోసం తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బ్యాంకు మేనేజర్లు, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, న్యూస్ పేపర్లు.. ప్రింట్ మీడియా, ఫిక్స్డ్ డిపాజిట్లవైపు చూసేవారు. కానీ జెన్ జడ్ మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంటిగ్రేటెడ్ ఫిన్టెక్ యాప్లు, యూట్యూబ్ పాడ్కాస్ట్లు, ఆన్లైన్ కమ్యూనిటీలు (రెడిట్, డిస్కార్డ్), ఆధునిక డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంల వైపు చూస్తున్నారు. అన్ని చోట్లా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల చిన్న వయస్సు నుంచే ఆర్థిక అక్షరాస్యత మెరుగ్గా ఉంటున్నప్పటికీ, తప్పుడు సమాచారం కూడా భారీగానే వ్యాప్తి చెందుతోంది. వీటివల్ల దెబ్బతింటున్నవాళ్లూ పెరుగుతున్నారు. దీంతో అడ్డూ అదుపూ లేకుండా ఫిన్ఫ్లుయెన్సర్లు విస్తరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు నిశితంగా దృష్టి పెడుతున్నాయి. తప్పుల తడకల ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ సలహాలను కట్టడి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి.ముందు నుంచే పెట్టుబడులు.. డిజిటల్ వల్ల కలిగిన ప్రయోజనమేంటంటే... తమ పేరెంట్స్తో పోలిస్తే జెన్ జెడ్ చాలా ముందు నుంచే పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దాదాపుగా అవరోధాలేమీ లేకపోవడంతో నెలకు రూ.100 నుంచి 500 వరకు ఉండే మైక్రో సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి పోర్ట్ఫోలియో చాలా వైవిధ్యంగా ఉంటోంది. మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, డైరెక్ట్ ఈక్విటీలు, డిజిటల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) వంటివి ఈ పోర్ట్ఫోలియోలో ఉంటునాయి. ఇలా సాధ్యమైనంత ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ జనరేషన్ వాళ్లు... వెల్త్ మేనేజర్లకు బంగారు గనుల్లా మారుతున్నారు. ఓ ఇన్వెస్టరును 22 ఏళ్ల వయసులో పట్టుకుంటే ఆ తర్వాత బోలెడన్ని సంవత్సరాల పాటు వారు క్లయింట్లుగా కొనసాగే అవకాశం ఉండటమే దీనిక్కారణం. అయితే, ఆర్థిక సంస్థలు ఇందుకోసం తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటోంది. జెన్ జెడ్ డిస్కౌంట్లు.. లాయల్టీ పాయింట్ల కన్నా ఎక్కువగా చార్జీల విషయంలో పారదర్శకత, నైతికతతో కూడుకున్న వ్యాపార విధానాలు, డేటా ప్రైవసీకి ప్రాధాన్యమిస్తున్నారు. హెచ్చరిక సంకేతాలు.. జెన్ జెడ్కి డిజిటల్ ఐక్యూ ఎక్కువే అయినా... కొన్ని విశిష్టమైన సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటోందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన లైఫ్స్టయిల్ ఖర్చులు: వేగంగా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, వాటికి తగ్గట్లు లైఫ్స్టయిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఖర్చులు మితిమీరిపోతున్నాయి. ఫలితంగా, ఆదాయాలను దీర్ఘకాలిక పొదుపు వైపు మళ్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సబ్స్క్రిప్షన్లతో చిల్లు: నెలవారీగా కట్టే డజన్ల కొద్దీ డిజిటల్ సబ్్రస్కిప్షన్ల వల్ల చిన్న, చిన్నగా పర్సుకు చిల్లులు పడుతున్నాయి. సోషల్ మీడియా ఒత్తిడి: ప్రతిదాన్నీ డిజిటల్గా పోల్చి చూసుకునే సంస్కృతి వల్ల ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్), (ఇప్పుడు దొరకపుచ్చుకోకపోతే ఇంకెప్పటికీ దొరకదేమో అన్న భయం) వల్ల ఖరీదైన ఎక్స్పీరియన్స్లు, లగ్జరీ ఉత్పత్తులను కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఎమర్జెన్సీ నిధుల కొరత: అప్పటికప్పుడు సంతృప్తి కలిగించే ఎక్స్పీరియన్స్లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక భద్రతను పక్కన పెడుతుండటం వల్ల, ఆదాయంపరంగా అనూహ్యమైన షాక్లేవైనా తగిలితే తట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. గెలుపు గుర్రాలు.. జెన్ జెడ్ తెచ్చిన ఆర్థిక విప్లవమనేది దేశీ మార్కెట్ వ్యవస్థలో కొత్త మార్పులకు ఆజ్యం పోసింది. ఈ భారీ డెమొగ్రఫిక్ మార్పులతో ప్రభావితమయ్యే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందవచ్చు. అవేమిటంటే ... → ఫిన్టెక్, వెల్త్ టెక్ ప్లాట్ఫామ్స్: డిజిటల్ చెల్లింపులు, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, మైక్రో రుణాలిచ్చే కంపెనీలు → ప్రైవేట్ బ్యాంకులు: పటిష్టమైన, అధునాతన డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు అందించేవి. → ఫైనాన్షియల్ సూపర్ యాప్స్: పేమెంట్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, బీమాను ఒకే ఇంటర్ఫేస్లో అందించేవి. → అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు: భారీ స్థాయిలో సిప్ రూపంలో రిటైల్ పెట్టుబడులను అందుకుంటున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు. ఇలా, డిజిటల్గా ఆర్థిక సేవలను అందించే, తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగే ఆర్థిక సంస్థలే భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లగలవు. – సాక్షి, వెల్త్ -
యూరియా.. ‘గ్రీన్’ ఐడియా..
ఒక సంక్షోభం మరో సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో..నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన గ్రీన్ యూరియా ఉత్పత్తిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వీడన్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ కనిపెట్టిన గ్రీన్ యూరియా టెక్నాలజీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ప్రముఖ స్వీడిష్ క్లీ¯న్ టెక్ స్టార్టప్ నైట్రోక్యాప్ట్ గుళికల రూపంలో ఉండే హరిత నత్రజని ఎరువుల తయారీ టెక్నాలజీని అభివృద్ధి చేసి పేటెంట్ పొందింది. మన దేశంలోని అధిక సబ్సిడీలతో నడిచే, అధిక ఉద్గారాలు వెలువరించే హేబర్–బోష్ యూరియా ప్లాంట్లకు.. పేటెంట్ పొందిన ఈ టెక్నాలజీ అత్యంత ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.10 దేశాలు.. 34 ఒప్పందాలుగత ఏడాది 20 లక్షల డాలర్ల ఫుడ్ ప్లానెట్ అవార్డును గెల్చుకున్న ఈ సాంకేతికతపై ఇప్పటికే పది దేశాల కంపెనీలు 34 ఒప్పందాలు చేసుకున్నాయని నైట్రోక్యాప్ట్ చెబుతోంది. తూర్పు ప్రాంతానికి చెందిన ఒక భారతీయ కంపెనీ ఈ సాంకేతికతో గ్రీన్ యూరియా ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టు సమాచారం. ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన నేపథ్యంలో ఈ గ్రీన్ యూరియా టెక్నాలజీ వినియోగం వేగవంతమవుతుందని భావిస్తున్నారు. సాధారణ యూరియా వర్సెస్ నైట్రోక్యాప్ట్ గ్రీన్ యూరియాహేబర్–బోష్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను పారిశ్రామికంగా సంశ్లేషణ చేస్తారు. గ్రీన్ యూరియా ప్రక్రియలో ఇనుము ఉత్ప్రేరకాల సహాయంతో అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రత వద్ద నత్రజని, హైడ్రోజన్లను కలిపి యూరియాను తయారు చేస్తారు. -
రూరల్ టీనేజర్లకు టెన్షన్
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఆరుగురు టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్’సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హరియాణాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ దిగ్భ్రాతికరమైన విషయాలు వెలుగుచూశాయి.ఒత్తిడికి ప్రధాన కారణాలు చదువు, పరీక్షల భయంతోపాటు తక్కువ మార్కులు వస్తాయనే ఆందోళన, మరోవైపు ఫెయిల్ అవుతామనే భయం, భవిష్యత్పై అభద్రతా భావం. వీటితోపాటు కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రుల గొడవలు, శారీరక లేదా మానసిక వేధింపులు. కుటుంబ పెద్దల వ్యసనాల కారణంగా ఒత్తిడికి గురైనట్టు తేలింది. సర్వేలో పాల్గొన్న 57 శాతం మంది టీనేజర్లు తమ ఇంట్లో పెద్దవారు మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలైనట్టు తెలిపారు. ఇవేకాకుండా పేదరికం వల్ల అబ్బాయిలు చదువు మానేసి కూలి పనులకు వెళ్తుంటే.. భద్రతా కారణాలు, సామాజిక ఆంక్షల వల్ల అమ్మాయిల చదువు మధ్యలోనే ఆగిపోతోంది. స్కూళ్లలో లేదా బయట జరిగే అవమానాలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.నిశ్శబ్దంగా నరకం.. అవగాహనా రాహిత్యం!ఈ సర్వేలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. చాలామంది టీనేజర్లు తమ బాధను, ఆత్మహత్యా ఆలోచనలను ‘జీవితంలో ఒక భాగం’గా భావిస్తూ భరిస్తున్నారు. మానసిక సమస్యలకు చికిత్స లేదా కౌన్సెలింగ్ ఉంటుందనే కనీస అవగాహన కూడా వారికి లేదు. సమాజంలో ఎక్కడ అవమానం జరుగుతుందోననే భయంతో లోలోపలే కుమిలిపోతున్నారు.గణాంకాలు ఇలా: ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం దేశంలో జరిగే మొత్తం ఆత్మహత్యల్లో 6 శాతం 18 ఏళ్ల లోపు పిల్లలవే. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో 7.6 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.అందుబాటులో లేని చికిత్స: భారతదేశంలో మానసిక ఆరోగ్య చికిత్సకు సంబంధించిన లోటు 83 శాతంగా ఉంది. అంటే సమస్య ఉన్న మెజారిటీ ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. నిపుణుల సూచనలు: చిన్న వయసులోనే వచ్చే మానసిక సమస్యలను పట్టించుకోకపోతే, అవి వారు పెద్దయ్యాక కూడా వెంటాడుతాయని, కాబట్టి తక్షణమే జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. స్కూల్ కౌన్సెలింగ్: ప్రతి పాఠశాలలోనూ పిల్లల సమస్యలను పరిష్కరించేందుకు కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి.ఉపాధ్యాయులకు శిక్షణ: పిల్లల్లో మారుతున్న ప్రవర్తనను, ఒత్తిడిని గుర్తించేలా టీచర్లకు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలి.టెలి–మానస్ వినియోగం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్లైన్ సేవలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి. -
ఏఐ ఏజెంట్ వస్తోంది..
సాక్షి, సెంట్రల్ డెస్క్: స్మార్ట్ఫోన్ మార్కెట్ ఒక చరిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. ఇకపై వినియోగదారులు మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్ల ద్వారా నేరుగా తమ డివైస్లతో ఇంటరాక్ట్ అయ్యే రోజులు రానున్నాయి. ఈ సరికొత్త ఏజెంటిక్ విప్లవంలో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ హోరాహోరీగా తలపడుతున్నాయి.ఆండ్రాయిడ్ ఇక ఏఐ సిస్టమ్గూగుల్ తాజాగా నిర్వహించిన ఆండ్రాయిడ్ షో 2026 వేదికగా గూగుల్ జెమినై ఇంటెలిజెన్స్ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం రూపొందించిన ఒక శక్తివంతమైన ఏఐ లేయర్. కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న ఆండ్రాయిడ్ను, పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్ సిస్టమ్గా మార్చడమే దీని లక్ష్యమని గూగుల్ ప్రకటించింది. వినియోగదారుడి అవసరాలను, సందర్భాన్ని ముందే ఊహించి, వివిధ యాప్ల ద్వారా పనులను ఇది స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న శామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ ఫీచర్లు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.రూ. 53 వేల కోట్ల డీల్తో ఓపెన్ ఏఐ భారీ వ్యూహంమరోవైపు యాపిల్ మాజీ ఐకానిక్ డిజైనర్ జోనీ ఐవ్తో కలిసి ఓపెన్ ఏఐ ఒక సరికొత్త ఏఐ–కేంద్రిత స్మార్ట్ఫోన్ను రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. కంప్యూటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్వచించే లక్ష్యంతో స్క్రీన్లు, సంప్రదాయ యాప్ల అవసరం లేకుండా కేవలం ఏఐ ఇంటరాక్షన్తో నడిచే సరికొత్త డివైస్లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జోనీ ఐవ్కు చెందిన స్టార్టప్ ‘ఐఓ’ను ఓపెన్ ఏఐ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సుమారు రూ. 53 వేల కోట్ల భారీ డీల్తో కైవసం చేసుకుంది. హార్డ్వేర్ రంగంలో ఓపెన్ ఏఐ వేసిన అతిపెద్ద అడుగుగా ఇది నిలిచింది.స్క్రీన్ ట్యాపింగ్, స్వైపింగ్ ఇక గతంఇటీవల ప్రచురితమైన యాప్ ఏజెంట్ మల్టీమోడల్ ఏజెంట్స్ యాజ్ స్మార్ట్ఫోన్ యూజర్స్ అనే పరిశోధనా పత్రం ప్రకారం ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్పై ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం ద్వారా యాప్లను స్వతంత్రంగా ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించాయి. కిరాణా సామగ్రి ఆర్డర్ చేయడం, దరఖాస్తులు నింపడం, అపాయింట్మెంట్లు బుక్ చేయడం వంటి పనులను ఈ ఏజెంట్లు వినియోగదారుడి ప్రమేయం లేకుండానే పూర్తి చేయగలవు.ముఖ్యమైన మార్పులు ఇవీ..పూర్తి ఆటోమేషన్: ఒకే ఒక కమాండ్తో మల్టీ–స్టెప్ పనులను పూర్తి చేయగల ఏఐ.కాంటెక్ట్స్ అవేర్నెస్: యూజర్ లొకేషన్, బిహేవియర్, ఆన్–స్క్రీన్ యాక్టివిటీ ఆధారంగా ముందస్తు సూచనలు.పరిధి విస్తరణ: ఫోన్లకే పరిమితం కాకుండా భవిష్యత్తులో స్మార్ట్ వాచీలు, కార్లు, ల్యాప్టాప్లలోకి జెమిని ఇంటెలిజెన్స్.భారత్పై ప్రభావం!ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో ఆండ్రాయిడ్ మార్కెట్ వాటా అత్యధికంగా ఉండటమే కాకుండా శామ్సంగ్, షావోమి, వన్ప్లస్ వంటి బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్ అత్యంత కీలకమైన వృద్ధి కేంద్రంగా మారింది. వచ్చే వారం జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ ఐ/ఓ 2026 సదస్సులో ఆండ్రాయిడ్ 17, జెమినై ఏఐ, ఆండ్రాయిడ్ ఎక్ఆర్ డివైస్లకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్లను గూగుల్ ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
నిద్రతో పేగుబంధం
మంచినిద్ర లేకపోతే పొట్ట పనిచేయదు... నిజమే నిద్రకు, పేగు ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది. దీన్ని గట్–స్లీప్ యాక్సిస్ అంటారు. పేగులోని బ్యాక్టీరియా మనం నిద్రపోవడానికి అనువైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. సుఖ నిద్రతో దేహంలోని మైక్రోబయోమ్ యంత్రాంగం చక్కగా పనిచేసి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) ప్రకారం మంచి నిద్ర–జీర్ణకోశ ఆరోగ్యం పరస్పర ఆధారితాలు.యంత్రం పనిచేయాలంటే..మన జీర్ణ వ్యవస్థలో సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఆ సముదాయాన్ని, వాటి జన్యు పదార్థం, ఫంగస్లను మైక్రోబయోమ్ అంటారు. ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుంది. ఈ మైక్రోబయోమ్ చక్రం సవ్యంగా సాగాలంటే మంచి నిద్ర అవసరం.మంచినిద్ర లేకపోతే...⇒ పేగులో ఉండే ప్రో–బ్యాక్టీరియా (దేహానికి ప్రయోజనకారి) వృద్ధి తగ్గుతుంది. ప్రో–బ్యాక్టీరియా వృద్ధి తగ్గిందంటే హానికారక బ్యాక్టీరియా వృద్ధిపై నియంత్రణ లేకపోవడంతో ఆ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ స్థితిని డిస్బయోసిస్ అంటారు.⇒ గాఢనిద్రలో ఉన్నప్పుడు విడుదల కావాల్సిన గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యత నిద్రలేమి కారణంగా దెబ్బతింటుంది.⇒ జీవక్రియలు మందగించడం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్కు దారితీస్తుంది.శరీరంలో ఉత్పత్తి అయ్యే 90% సెరోటోనిన్ హార్మోన్ పేగులోనే ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. మానసిక స్థితి, నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది మెలటోనిన్ హార్మోన్కు ముందస్తు దశగా చెప్పవచ్చు. నిద్రపట్టడం, మెలకువ రావడం అనే ప్రక్రియలను మెలటోనిన్ నియంత్రిస్తుంది. పేగు ఆరోగ్యం సరిగా లేకపోతే ఈ ప్రక్రియలో అవరోధాలు ఏర్పడతాయి. అంటే మనం మంచిగా నిద్రపోతేనే జీర్ణవ్యవస్థ తన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేస్తేనే నిద్ర పడుతుంది. -
డాక్టర్ స్మార్ట్ స్కేల్స్!
కేవలం బరువును బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అని చెప్పలేము. ఒకే బరువు ఉన్న ఇద్దరిలో ఒకరు ఫిట్గా, మరొకరు అన్ఫిట్గా ఉండవచ్చు. అందుకే, కేవలం బరువునే కాకుండా శరీర సమగ్ర ఆరోగ్యాన్ని అంచనా వేసే స్మార్ట్ స్కేల్స్ (బాడీ స్కానర్లు) ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బి.ఐ.ఎ. టెక్నాలజీతో పనిచేస్తాయి.అందించే ఆరోగ్య వివరాలు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్: బరువు తగ్గడం కంటే శరీరంలో కొవ్వు శాతం తగ్గడమే ముఖ్యం. ఈ స్కేల్ మీ శరీరంలో కొవ్వు శాతం ఎంతో కచ్చితంగా చెబుతుంది.బాడీ వాటర్ పర్సంటేజ్: శరీరం ఎంతవరకు హైడ్రేటెడ్గా (నీటి శాతం) ఉందో చూపిస్తుంది.మెటబాలిక్ ఏజ్: మీ శరీరం లోపల ఎంత యాక్టివ్గా ఉందో మీ అసలు వయసుతో పోల్చి చెప్తుంది. (ఉదాహరణకు: మీ వయసు 30 ఏళ్లయితే, బాడీ మెటబాలిజం 25 ఏళ్ల యువకుడిలా ఉందా లేదా 40 ఏళ్ల వ్యక్తిగా ఉందా అనేది చెబుతుంది).విసెరల్ ఫ్యాట్: గుండె, కాలేయం వంటి అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయే అత్యంత ప్రమాదకరమైన కొవ్వు ఇది. దీని స్థాయిని బి.ఐ.ఎ. ద్వారా తెలుసుకుని, గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించవచ్చు.ఎముకల సాంద్రత: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.మజిల్ వర్సెస్ ఫ్యాట్: కొవ్వు శరీరాన్ని లావుగా చూపిస్తే, కండరాలు ఫిట్గా ఉంచుతాయి. సాధారణ బరువు మిషన్లలో ఈ తేడా తెలియదు, కానీ స్మార్ట్ స్కేల్ ఈ రెండింటి బరువును విడివిడిగా చూపిస్తుంది. బి.ఐ.ఎ. అంటే ఏమిటి? బయోఎలక్ట్రికల్ ఇంపిడెన్స్ అనాలిసిస్కి సంక్షిప్త రూపమే బి.ఐ.ఎ.ఈ స్మార్ట్ స్కేల్పై నిలబడినప్పుడు, మనకు తెలియకుండానే ఒక చిన్న విద్యుత్ తరంగం శరీరం ద్వారా వెళ్తుంది. ఇది శరీరంలోని కొవ్వు, కండరాలు, నీటి శాతాన్ని బట్టి వేర్వేరు వేగంతో ప్రయాణించి, కచ్చితమైన బాడీ రిపోర్ట్ను లెక్కిస్తుంది.ఇంటిల్లిపాదికీ ఒకటే స్కేల్: ఒకే స్మార్ట్ స్కేల్ను కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు. స్కేల్పై ఎవరు నిలబడ్డారో వారి బాడీ ప్రొఫైల్ను బట్టి ఆటోమేటిక్గా గుర్తించి, వారి వ్యక్తిగత మొబైల్ యాప్కే డేటాను పంపుతుంది. ఒకరి డేటా మరొకరికి కలవదు. -
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
చైనా దాచిన నిజాలు.. 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి!
ప్రజాస్వామ్యం కోసం వీధుల్లోకి వచ్చిన వేలాది మంది యువత.. ట్యాంకులతో వారిపై విరుచుకుపడిన సైన్యం.. ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 1989 టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఇప్పటికీ చైనా చరిత్రలో చెరగని మచ్చగానే మిగిలింది. ఈ ఘటనకు 37 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాటి ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని అరుదైన చిత్రాలు వెలుగులోకి రావడంతో ప్రపంచ దృష్టి మరోసారి ఆ రక్తచరిత్రపైకి మళ్లింది.ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకని ఘటనల్లో టియానన్మెన్ స్క్వేర్ మారణకాండ ఒకటి. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం వేలాది మంది విద్యార్థులు, యువకులు వీధుల్లోకి రావడం.. ఆ ఉద్యమాన్ని చైనా ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అణచివేయడం.. వందల మంది, మరికొందరి అంచనాల ప్రకారం వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం.. ఇవన్నీ చైనా చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి.1980ల చివర్లో చైనా వేగంగా ఆర్థిక సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, రాజకీయ స్వేచ్ఛలు మాత్రం కఠిన నియంత్రణలోనే ఉండేవి. అవినీతి పెరుగుతోందన్న విమర్శలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, ప్రజాస్వామ్య సంస్కరణలపై యువతలో పెరుగుతున్న ఆకాంక్షలు దేశవ్యాప్తంగా అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన సంస్కరణవాది నేత హు యాబాంగ్ మరణం ఉద్యమానికి నాంది పలికింది.హు యాబాంగ్ను విద్యార్థులు, మేధావులు మార్పుకు ప్రతీకగా భావించేవారు. ఆయన మరణం తర్వాత 1989 ఏప్రిల్లో వేలాది మంది విద్యార్థులు బీజింగ్లోని టియానన్మెన్ స్క్వేర్కు చేరుకున్నారు. మొదట ఇది కేవలం సంతాప సభగానే ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య సంస్కరణలు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం భారీ ఉద్యమంగా రూపాంతరం చెందింది.రోజులు గడిచేకొద్దీ నిరసనల తీవ్రత పెరిగింది. విద్యార్థులతో పాటు కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ పౌరులు కూడా ఉద్యమంలో చేరారు. లక్షలాది మంది స్క్వేర్లో గుమికూడడంతో బీజింగ్ అంతర్జాతీయ మీడియా దృష్టిలోకి వచ్చింది. ఒక దశలో ఈ ఉద్యమం చైనా కమ్యూనిస్టు పాలనకే సవాలుగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన ప్రభుత్వం మే నెలలో మార్షల్ లా ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జూన్ 3 రాత్రి నుంచి జూన్ 4 తెల్లవారుజామున వరకు సైన్యం ట్యాంకులు, సాయుధ బలగాలతో బీజింగ్లోకి ప్రవేశించి నిరసనలను అణచివేసింది. ఆ రాత్రి ఏం జరిగిందన్నది ఇప్పటికీ పూర్తిగా స్పష్టంగా లేకపోయినా, ప్రత్యక్ష సాక్షులు మరియు అంతర్జాతీయ మీడియా నివేదికలు వందల నుంచి వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం అధికారిక మరణాల సంఖ్యను ఇప్పటికీ వెల్లడించలేదు.ఈ ఘటనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దృశ్యం “ట్యాంక్ మ్యాన్”. ట్యాంకుల వరుస ముందు ఒంటరిగా నిలబడి వాటిని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చిత్రం ప్రభుత్వ శక్తికి ఎదురుగా వ్యక్తి ధైర్యానికి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయింది.ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన కొత్త చిత్రాలు ఆ రోజుల్లోని ఉద్రిక్త వాతావరణాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. స్క్వేర్లో గుమికూడిన విద్యార్థులు, తాత్కాలిక శిబిరాలు, ప్రజల రద్దీ, సైనిక కదలికలు, ఆందోళనల మధ్య నెలకొన్న ఉద్విగ్న పరిస్థితులు ఈ ఫొటోల ద్వారా మరోసారి ప్రపంచం ముందు ప్రత్యక్షమవుతున్నాయి. చరిత్రలో నమోదు కాని కొన్ని క్షణాలను కూడా ఇవి వెలుగులోకి తీసుకొస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.టియానన్మెన్ ఘటనలో కీలక పాత్ర పోషించిన హు యాబాంగ్ చైనా కమ్యూనిస్టు పార్టీలో సంస్కరణవాది నేతగా గుర్తింపు పొందారు. సాంస్కృతిక విప్లవ సమయంలో అన్యాయానికి గురైన వారికి పునరావాసం కల్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఆయనను ప్రజల్లో మరింత గౌరవనీయుడిగా మార్చాయి. 1987లో ఆయన పదవి నుంచి తప్పించబడ్డారు. 1989 ఏప్రిల్లో ఆయన మరణించడంతో విద్యార్థులు నివాళుల కోసం స్క్వేర్కు చేరుకోవడం చివరికి పెద్ద ఉద్యమంగా మారింది.ఈ ఘటనపై చైనాలో ఇప్పటికీ బహిరంగ చర్చలు పరిమితంగానే ఉన్నాయి. పాఠ్యపుస్తకాలు, మీడియా, సోషల్ మీడియా వేదికలపై కఠిన నియంత్రణ కొనసాగుతోంది. అయినప్పటికీ విదేశాల్లోని చరిత్రకారులు, మానవ హక్కుల సంస్థలు ప్రతి సంవత్సరం ఈ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. అణచివేత వల్ల ఈ ఉద్యమం లక్ష్యాన్ని సాధించకపోయినా, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన చర్చల్లో అది ఒక శాశ్వత గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ కొత్త చిత్రాలు ఆ పోరాటంలో నిలిచిన వేలాది యువత ఆశలు, భయాలు, ధైర్యానికి మరోసారి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది!
భారత సైన్యానికి చెందిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన కాబోయే భార్య ఆరోషికి యూనిఫామ్లో.. అదీ ఆర్మీ హెలికాప్టర్లో ప్రపోజ్ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉండగా ఇవేం పనులంటూ ఆర్మీ అధికారులతో సహా కొందరు దీనిని ఖండించారు. మాజీల్లో కొందరు మాత్రం ‘ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు?’ భరద్వాజ్కు సపోర్ట్ చేశారు. అయితే ఆ రొమాంటిక్ దృశ్యం వెనుక.. అత్యంత కీలకమైన ఓ అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.కెప్టెన్ భరత్ భరద్వాజ్ భారత సైన్యంలో యంగ్ ఆర్మీ ఏవియేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి. ఇటీవలే హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్లో ఫ్రంట్లైన్ సర్వీస్కు సిద్ధమయ్యాడు. అతని కాబోయే భార్య ఆరోషి, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, అధికారిక శిక్షణ పూర్తి అయిన సందర్భంలో భరద్వాజ్ చేసిన ఈ ప్రత్యేక ప్రపోజల్ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువ వయసులో ఉన్న ఈ జంటకు సంబంధించిన ఈ రొమాంటిక్ ఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారితే, మరోవైపు యూనిఫామ్లో వ్యక్తిగత జీవితం ఎంతవరకు సమంజసం అన్న డిబేట్కు కూడా దారితీసింది.భరద్వాజ్ ప్రపోజల్ కోసం ఉపయోగించిన హెలికాప్టర్ ‘చీతా’. గత 50 ఏళ్లుగా భారత సైన్యం దాని మీదే ఆధారపడి ఉంటోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పటియల్ సంస్థ డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 1970ల నుంచి భారత్లో తయారు చేస్తోంది. సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన, క్లిష్టమైన ప్రాంతాల్లో సైనిక రవాణా, గాయపడిన వారిని తరలించడం, సరఫరాలు అందించడం వంటి కీలక బాధ్యతలను ఇది నిర్వర్తిస్తోంది. కానీ దీని భద్రతపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.1974 నుంచి 2022 మధ్య కాలంలో చీతా హెలికాప్టర్లు 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మొన్న.. మే 20న లడఖ్లోని టాంగ్స్టే ప్రాంతంలో మరో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో ఉన్న ముగ్గురు సైనిక అధికారులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఇప్పుడు ఈ ప్రేమకథ పుణ్యమాని ప్రమాదాల పరంపరను మరోసారి కొందరు చర్చకు తీసుకొచ్చారు. అలాగని చీతా మాత్రమే కాదు, దాని సోదర మోడల్ ‘చేతక్’ హెలికాప్టర్ కూడా ప్రమాదాల పరంగా చెడు రికార్డే కలిగి ఉంది. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) వివరాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో చీతా-చేతక్ హెలికాప్టర్లకు సంబంధించిన దాదాపు 191 ప్రమాదాల్లో 294 మంది పైలట్లు మరణించారు. ఈ కారణంగానే వీటిని కొందరు “ఫ్లయింగ్ కాఫిన్స్” (ఎగిరే శవపేటికలు)గా కూడా అభివర్ణించారు.వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ఆధునిక సాంకేతికత, నావిగేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయని మాజీ వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ జీఎస్ బేడీ అభిప్రాయపడ్డారు. దీంతో 2027 నుంచి చీతా, చేతక్ హెలికాప్టర్లను దశలవారీగా సేవల నుంచి తప్పించాలని సైన్యం, వైమానిక దళం నిర్ణయించాయి. వాటి స్థానంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (LUH)ను తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినా, సర్టిఫికేషన్ వివాదాలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఒకవైపు వైరల్ ప్రపోజల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే.. మరోవైపు అదే హెలికాప్టర్లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు మాత్రం ఆధునిక ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాయి. సియాచిన్ నుంచి లడఖ్ వరకు ఎన్నో విజయవంతమైన మిషన్లకు చీతా సాక్ష్యమైనా, దాని వయసు మీద పడడం, ప్రమాదాల చరిత్ర ఇప్పుడు భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. -
ఆదిలాబాద్లో యుద్ధవిమానాల గర్జన!
ఆదిలాబాద్లో యుద్ధ విమానాలు గర్జించబోతున్నాయి. పట్టణానికి ఆనుకొని కొత్తగా నిర్మించబోయే పౌర విమానాశ్రయానికి అనుబంధంగా భారీస్థాయిలో భారత వైమానిక శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన పౌర విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రన్వే కూడా ఉండనున్నందున ఇది ‘జాయింట్ ఎయిర్ ఫీల్డ్‘గా రూపొందనుందని తెలిసిందే. కానీ, శిక్షణ కేంద్రాన్ని సాధారణస్థాయిలో కాకుండా దేశంలోనే కీలక స్థావరంగా మార్చాలని తాజాగా భారత వైమానిక దళం నిర్ణయింది. యుద్ధ విమానాల శిక్షణలో దీన్ని వ్యూహాత్మక కేంద్రంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించింది.ఇది భారీ స్థాయిలో ఉండనున్నందున, ఇక్కడ ఎయిర్ఫోర్స్ సిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతోంది. దీంతో వారి కుటుంబాల కోసం వందల సంఖ్యలో గృహాలను నిర్మించనున్నారు. శిక్షణ, యుద్ధ విమానాలకు రన్వేలు, వాటిని నిలిపేందుకు భారీ హ్యాంగర్లు, మూమెంట్ కోసం ఏప్రాన్లు, టాక్సీవేలు, శిక్షణ కేంద్రానికి సంబంధించిన భారీ భవనాలు, పరిపాలన కార్యాలయ భవనాలు, రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు... వెరసి దేశంలో ప్రధాన ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రంగా మారబోతోంది. – సాక్షి, హైదరాబాద్చిన్న స్ట్రిప్ నుంచి... ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకునే గతంలో వాయుసేన ఎయిర్ర్స్టిప్ ఉండేది. ఆ తర్వాత దాని కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. కానీ, నిజాం కాలం నాటి ఆ ఎయిర్స్ట్రిప్ పరిధిలో దాదాపు 369 ఎకరాల భూమి ఇప్పటికీ ఎయిర్ఫోర్స్ అ«దీనంలోనే ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసే క్రమంలో పాత ఎయిర్్రస్టిప్ స్థానంలో పౌర విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.దీనికి అంగీకరించిన ఎయిర్ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం మరో 400 ఎకరాలు ఇస్తే ఉమ్మడి విమానాశ్రయం (పౌర విమానాశ్రయం, ఎయిర్ఫోర్స్ శిక్షణ కేంద్రం)గా రూపొందించేందుకు సిద్ధమైంది. వెరసి 700 ఎకరాల్లో ఎయిర్బస్ 380 స్థాయి పెద్ద విమానాలు దిగే 9 వేల అడుగుల పొడవైన రన్వేను ప్రతిపాదించారు. కానీ, తాజాగా రక్షణశాఖ ఇక్కడ భా రీ వైమానిక శిక్షణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదనంగా మరో వేయి ఎకరాలు సేకరించి ఇవ్వాలని ప్రతిపాదించింది.వ్యూహాత్మక ప్రాంతం ఆదిలాబాద్ దేశానికి రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఇది ఉత్తర–దక్షిణ భారత దేశాల జంక్షన్గా ఉంటుంది తీర ప్రాంతాలకు దూరంగా అటవీ ప్రాంతాల మధ్యన ఉన్నందున దీన్ని రక్షిత ప్రాంతంగా భారత వాయుసేన భావిస్తోంది. దీంతో ఇక్కడ పూర్తిస్థాయి ఎయిర్ఫోర్స్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దుండిగల్, హకీంపేటల్లోని శిక్షణ కేంద్రాల కంటే ఇది భిన్నంగా ఉండనుందని సమాచారం. నిర్మాణాలు ఈ శిక్షణ కేంద్రంలో భాగంగా యుద్ధ విమానాలు దిగడానికి భారీ రన్వే, విమాన రక్షణ కేంద్రం, పైలట్లకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లతోపాటు రక్షణ సిబ్బంది నివాసానికి ఒక పెద్ద టౌన్షిప్ నిర్మించనున్నారు.ట్రైనింగ్ అకాడమీ–హ్యాంగర్లుఫైటర్ జెట్స్, హెలికాప్టర్ల నిర్వహణకు భారీ హ్యాంగర్లు, అత్యాధునిక రక్షణ సామగ్రి నిల్వ కేంద్రాలు నిర్మిస్తారు. రన్వేకు చేరువలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాయుసేన విమానాలు నిలిపేందుకు ఏప్రాన్, రన్వేకు అనుసంధానమయ్యే టాక్సీవేలను నిర్మిస్తారు. ఇవి సాధారణ విమానాశ్రయం తరహాలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయని సమాచారం. భూమి కావాలంటే పరిహారం ఖర్చు చెల్లించాల్సిందే... ప్రస్తుతం రక్షణశాఖ అ«దీనంలో 369.45 ఎకరాలు ఉండగా, మరో నాలుగొందల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. తాజా ప్రతిపాదన ప్రకారం మరో వేయి ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉన్నందున, దాన్ని కేంద్రమే భరించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఆదిలాబాద్లో డీఫంక్ట్ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధీనంలోని భూములను దీనికి వినియోగించాలని భావిస్తున్నారు.ఫలితంగా పరిహా ర ఖర్చు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతోపాటు నిషానీ ఘాట్, సమీపంలోని రెండు గ్రామాల భూములను సేకరించే అంశాన్ని ప్రత్యామ్నాయంగా చూస్తున్నా రు. ఇప్పటికే రక్షణశాఖ ఈ విమానాశ్రయ పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ను ఆమోదించాల్సి ఉంది. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రస్తుత ప్రణాళిక. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ఆలోచన. -
కుప్పకూలిన వేల కోట్ల సామ్రాజ్యం.. తప్పెక్కడ జరిగింది?
అప్పటివరకు యాక్షన్ ఫిగర్లు అంటే ఎక్కువగా సైనికులు, ఫైర్ఫైటర్లు లాంటి వాస్తవిక పాత్రలే. ఆ తర్వాత కామిక్ పుస్తకాలు.. వాటి ఆధారంగా యానిమేషన్ సిరీస్లు.. సినిమాలు.. ఆఖరికి బొమ్మలు పిల్లల ఆటల ప్రపంచాన్ని ఆక్రమించేశాయి. అయితే 80వ దశకంలో వినోద పరిశ్రమలో ఒక విప్లవాత్మక ఆలోచన మొదలైంది. ముందుగా ఆడుకునే బొమ్మలను రూపొందించి.. వాటి చుట్టూ కథలను నిర్మించాలన్న ఆలోచన చేసింది మ్యాటెల్. అలా పుట్టుకొచ్చిన పాత్రే హీ మ్యాన్. “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్”.. ఆరోజుల్లో అద్భుతమైన ఫాంటసీ లోకం. ఈ ప్రపంచంలో సూపర్ హీరో హీ-మ్యాన్. అతనికి ఉండే అపార శక్తి, పోరాటాలు.. పిల్లల ఊహల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా.. “గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక(బై ద పవర్ ఆఫ్ గ్రేస్కల్… ఐ హేవ్ ద పవర్)”.. అంటూ కత్తి దూసి చెప్పే డైలాగ్ కొన్నితరాల పిల్లలకు ఒక భావోద్వేగం. అప్పటిదాకా బొమ్మల మార్కెట్లో ఉన్న సంప్రదాయన్ని తలకిందులు చేసింది అమెరికాకు మ్యాటెల్ సంస్థ. ముందుగా బొమ్మలను తయారు చేసి, ఆ తర్వాత వాటి చుట్టూ కథలను, పాత్రలను, యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మించడం ప్రారంభించింది. అలా “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” రూపొందించింది. ఇందులో ప్రిన్స్ ఆడమ్.. ఓ మంత్రం చెప్పి శక్తివంతమైన హీ-మ్యాన్ రూపం ధరిస్తాడు. రహస్యాలతో నిండిన గ్రేస్కల్ కోట, హీమ్యాన్ వెంటే ఉండే బ్యాటిల్ క్యాట్(పిరికి పులి కాస్త పవర్ఫుల్గా మారడం..) భయంకరమైన శత్రువు స్కలేటర్ అండ్ కోతో హీమ్యాన్, అతని మిత్రబృందం చేసే పోరాటాలు.. అన్నీ కలిసి ఒక విస్తృతమైన ఫాంటసీ రాజ్యాన్ని సజీవంగా నిలిపాయి. 1983లో ప్రారంభమైన యానిమేషన్ సిరీస్ ఈ ప్రపంచాన్ని టీవీ తెరపైకి తీసుకువచ్చి, ప్రతి ఎపిసోడ్ను ఒక బొమ్మల ప్రకటనలా మార్చేసింది మ్యాటెల్. వెరసి అతితక్కువ టైంలో వేల కోట్ల సామ్రాజ్యంతో సంచలనాలకు నెలవు అయ్యింది. ఒకానొక టైంలో మార్వెల్ లాంటి కొండను సైతం ఢీ కొడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ విజయ యాత్ర ఎంత వేగంగా సాగిందో.. అంతే వేగంగా కుప్పకూలింది. కాస్ట్లీ మిస్టేక్కామిక్ సిరీస్ సూపర్ సక్సెస్తో మ్యాటెల్ నేల మీదకు దిగిరాలేదు. ఎడాపెడా బొమ్మల్ని ఉత్పత్తి చేసింది. ఈ క్రమంలో.. మార్కెట్లో డిమాండ్ను సరిగా అంచనా వేయలేక తడబడింది. దీంతో దుకాణాల్లో సరుకు పేరుకుపోయి నిల్వలు అధికమయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్ఫార్మర్స్, జీఐ జాయ్ లాంటి పోటీ ఫ్రాంచైజీలు మరింత ఆధునిక డిజైన్లు, రూపాంతరం చెందే బొమ్మల కాన్సెప్ట్లతో పిల్లలను ఆకట్టుకోవడం ప్రారంభించాయి. ఈ మార్పుల మధ్య హీ-మ్యాన్ ఆకర్షణ క్రమంగా తగ్గుతూ వచ్చింది.మార్కెటింగ్ తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు చాలవన్నట్లు.. జీతాల విషయంలోనూ మ్యాటెల్ ఎచ్చులకు పోయింది. ఎంత ఎక్కువ ప్రొడక్టులు తయారు చేస్తే అంత బోనస్లు అంటూ చేసిన ప్రకటన.. నిండా ముంచేసింది. ఫలితంగా.. అవసరానికి మించి బొమ్మలు మార్కెట్లోకి వెళ్లాయి. సరఫరా డిమాండ్ను మించిపోయి ధరలు పడిపోయాయి. రిటైలర్లు నమ్మకం కోల్పోయారు. టోటల్గా.. బ్రాండ్ వాల్యూ ఘోరంగా దెబ్బతింది, పుండు మీద కారంలా.. 1987లో వచ్చిన హీ మ్యాన్ లైవ్ యాక్షన్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఆపై వరుసపెట్టి సినిమాలు, సిరీస్లు వచ్చిన ఆకట్టుకోలేకపోయాయి. ఈ వరుస దెబ్బలతో.. కార్టూన్ సిరీస్ కూడా సరైన ముగింపు లేకుండానే అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన పునరుద్ధరణ ప్రయత్నాలు కొంత ఆసక్తిని రేపినా.. పాత స్థాయి క్రేజ్ తేలేకపోయింది. ఇప్పుడు.. ఈ 2026లో కొత్త లైవ్ యాక్షన్ సినిమాతో హీ-మ్యాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎర్లీ రివ్యూస్ అయితే పాజిటివ్గానే వచ్చాయి. ఈసారి మిగిలిన ప్రశ్న ఒక్కటే.. ఈ కొత్త ప్రయత్నం నిజంగా ఆ పాత “శక్తిని” తిరిగి తీసుకురాగలదా? లేకుంటే.. నాస్టాల్జియా మీద ఆధారపడిన మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా?.. వెయిట్ అండ్ సీ.. -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్లో పెద్ది రాంచరణ్లా.. రియల్ లైఫ్లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్తో క్రీడారంగంలో హాట్ టాపిక్గా మారాడు. తాజాగా.. రోమ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్మన్గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్లోనూ అతను అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్లో కొత్త స్టార్గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
విండోపవర్
మీ ఇంట్లో కిటికీల సంఖ్యను రెట్టింపు చేసుకోండి వీలైతే మీ భవనాలను అద్దాలతో కప్పేసుకోండి ఎందుకంటే.. ఇంకొన్ని ఏళ్లలో ఈ కిటికీలు, అద్దాలే విద్యుదుత్పత్తి కేంద్రాలు కానున్నాయి మరి! సూర్యుడి వెలుతురును అడ్డుకోకుండానే విద్యుత్తును అందించడం వీటి ప్రత్యేకత. అదెలాగంటే...సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) సరికొత్త సోలార్ సెల్స్ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవిస్కైట్ అనే పదార్థంతో తయారైన ఈ సోలార్ సెల్స్ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసకోవచ్చు. వెలుతురును కూడా ప్రసారం చేయగల ఈ అర్ధ పారదర్శక సోలార్ సెల్స్ రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయగలవు. ప్రస్తుతం సోలార్ సెల్స్ సిలికాన్తో తయారవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సిలికాన్ ఖరీదు చాలా ఎక్కువ. సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి. బిగించుకోవడం, వాడుకోవడంలోనూ ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో చౌక, మరింత సమర్థమైన సోలార్సెల్స్ తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుమారు రెండు దశాబ్దాల క్రితం పెరోవిసై్కట్ను ప్రత్యామ్నాయంగా గుర్తించారు. కాకపోతే అప్పట్లో వీటి సామర్థ్యం చాలా తక్కువగా అంటే కాంతి రూపంలో పడే శక్తిలో కేవలం రెండు శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలిగేది. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సామర్థ్యం 20 శాతానికి చేరుకోవడం గమనార్హం. వెలుతురు, విద్యుత్తుల బ్యాలెన్స్... ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం పది నానోమీటర్లు. అంటే మనిషి వెంట్రుక కంటే పది వేల రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్పై పడే కాంతిలో 41 శాతం నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ 7.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కాకపోతే చౌక కాబట్టి భవనాలను వీటితో కప్పేసి సిలికాల్ సోలార్ సెల్స్ కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం.. న్యూయార్క్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే ఓ భారీ భవనముంది. ఈ ఒక్క భవనాన్ని ఎన్టీయూ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ తో కప్పేస్తే వందల మెగా వాట్/గంటల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత విద్యుత్తుతో అమెరికాలో 40 వరకూ ఇండ్ల అవసరాలు తీర్చవచ్చునని అంచనా. సవాళ్లూ లేకపోలేదు... పెరోవిసై్కట్ సోలార్ సెల్స్తో ఎన్టీయూ శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవి ఎంతకాలం మన్నుతాయి అన్నది. సిలికాన్ సోలార్ సెల్స్ సగటు ఆయుష్షు సుమారు 25 ఏళ్లు. అయితే పెరోవిసై్కట్ పదార్థానికి తడి తగిలితే సరిగ్గా పనిచేయవు. ఆక్సిజన్, వేడి, అతినీలలోహిత కిరణాలను తట్టుకోవడం కష్టం. అందువల్ల వీటి దీర్ఘకాలిక మన్నికపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడుకోవడం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే స్మార్ట్ గ్లాసెస్, తొడుక్కునే ఎలక్ట్రానిక్స్ వంటివి పదే పదే ఛార్జ్ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్పై ఎన్టీయూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలూ జరుపుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరవచ్చు. పెరుగుతున్న ప్రాధాన్యం... 2009లో జపనీస్ శాస్త్రవేత్త సుటోము మియాసాకా పెరోవిస్కైట్ను సోలార్ సెల్స్ తయారీకి వాడవచ్చునని గుర్తించారు. అప్పటి నుంచి దీని ప్రాధాన్యం ఏటికేడాదీ పెరుగుతూ వస్తోంది. 2012 – 13 కల్లా పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ సామర్థ్యం పది శాతానికి చేరింది. 2015 నాటికి 20 శాతం సామర్థ్యంతో సిలికాన్తో సరి సమానమైంది. మరో ఐదేళ్లకు సిలికాన్ – పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ సామర్థ్యం 30 శాతానికి, తాజాగా టాండెమ్ పెరోవిసై్కట్ – సిలికాన్ మాడ్యూల్స్ 35 శాతానికి చేరుకుంది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో ఈ సోలార్ సెల్స్ పైలెట్ స్థాయి ప్రాజెక్టులు నడుపుతూండటం గమనార్హం. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటింటా ఇంటర్నెట్!
ఇంటర్నెట్... పేరు చెబితేనే ఐటీ ఉద్యోగులు, కంప్యూటర్లు కళ్లముందు కదులుతాయి. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి మాత్రమే. ఈకాలంలో కూలికెళ్లే వ్యక్తి కూడా ఎంచక్కా తన స్మార్ట్ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం పొందుతున్నాడు. వినోదంతోపాటు, ఉపాధి అవకాశాలనూ మెరుగుపరుచుకుంటున్నాడు. భారత్లో ఇంటర్నెట్ వినియోగం పదేళ్లలోనే దాదాపు మూడు రెట్లు ఎక్కువైందంటేనే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం మొత్తమ్మీద ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న దేశాల్లో భారత్ రెండోస్థానానికి చేరింది. దేశ జనాభా 147 కోట్ల పైచిలుకైతే తాజా లెక్కల ప్రకారం దేశంలో క్రియాశీలంగా ఉన్న మొబైల్ఫోన్ కనెక్షన్లు ఏకంగా వందకోట్ల ఆరు లక్షలు. ఇందులో ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య మూడు నుంచి ఆరు లక్షల వరకూ తక్కువ ఉండవచ్చు. అంతే. పదేళ్ల క్రితం అంటే 2015లో ఈ సంఖ్య 35 కోట్లు మించకపోవడం గమనార్హం. అలాగని ఈ టెక్నాలజీ కేవలం నగరాలకే పరిమితం కాలేదు. తాజా గణాంకాల ప్రకారం పల్లె ప్రాంతాల్లో నెట్ వినియోగదారుల సంఖ్య సుమారు 48 కోట్లు ఉంటే పట్టణ/నగర ప్రాంతాల్లో 40 కోట్ల మంది మాత్రమే నెట్ వాడుతున్నారు. గంటన్నర కాలం... దేశంలో రోజుకు కనీసం 90 నిమిషాల సమయం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో సగటు నెట్ వినియోగం కేవలం నాలుగు శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాంతార్ అనే మార్కెటింగ్ సంస్థలు గత ఏడాది సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్ర, కేరళ, గోవా రాష్ట్రాల్లో ఇంటర్నెట్ డెబ్భై శాతం కంటే ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటే యూపీ, బిహార్, జార్ఖండ్లలో 43– 50 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా... ఏం చేస్తున్నారు...? ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధిక శాతం వినోదం కోసమే ఉపయోగిస్తున్నారు. ఓటీటీల కోసం నెట్ వాడుతున్న వారు సుమారు 83 శాతం. అలాగే వాట్సప్ వంటి కమ్యూనికేషన్ అప్లికేషన్లు (75 శాతం), ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా కోసం (74 శాతం) నెట్ వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ చదువులు తరువాతి స్థానాల్లో నిలిచాయి. పీఎంజీదిశ వంటి డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాల పుణ్యమా అని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోంది. ఇంటర్నెట్ ఉన్న కారణంగా స్విగ్గీ, జొమాటో, రాపిడో, ఊబర్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ఉపాధి లభిస్తోంది. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటివి ప్రాథమికంగా వినోదం కోసం ఉద్దేశించినవే అయినప్పటికీ వీటి ద్వారా సామాజిక సంబంధాలు నెరుపుతూండటం గమనార్హం. సాధ్యమైంది ఇలా... పదేళ్లలో నెట్ వినియోగం మూడు రెట్ల పెరగడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. చౌక స్మార్ట్ఫోన్లు, దేశం మారుమూల ప్రాంతాలకూ మొబైల్ఫోన్ సేవలు విస్తరించడం వంటివి నెట్ వినియోగం ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక మొబైల్ డేటా ప్లాన్లు అందుబాటులో ఉండటమూ నెట్ విస్తృతికి తోడైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన భారత్నెట్ కార్యక్రమం తన వంతు పాత్ర పోషించింది. ఆధార్, యూపీఐ వంటి సేవల లభ్యతతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్, ఈ– కామర్స్ ఊపందుకున్నట్లు అర్థమవుతోంది. అంతరాలు తగ్గాలిదేశంలో వందకోట్లకుపైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నప్పటికీ కొన్ని వ్యవస్థీకృత సవాళ్లు మిగిలే ఉన్నాయి. ఇంటర్నెట్ అందుబాటు విషయంలో నగర ప్రాంతాలు ముందున్నాయి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ మోస్తరు వేగంతో పనిచేసే బ్రాడ్బ్యాండ్ అందుబాటులో లేదు. మహిళల నెట్ వినియోగం పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. మొబైల్ డేటా చౌకగా దొరుకుతున్నప్పటికీ ఇప్పటికీ స్మార్ట్ఫోన్లు దిగువ తరగతి కుటుంబాలకు ఖరీదైనవే. డిజిటల్ టెక్నాలజీల సామర్థ్యం గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరడం లేదు. తగిన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల సైబర్ ఫ్రాడ్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
ఇక అనుమానాలు అక్కరలేదు. ఈ ఏడాది ప్రపంచదేశాలకు మాత్రమే కాదు.. భారతదేశానికీ గడ్డుకాలమే. చుట్టపుచూపుగా కరవు కాటకాలను పరిచయం చేసి వెళ్లిపోయే ఎల్–నినో ఈ సారి తన విశ్వరూపాన్ని చూపనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయని, సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువ కానుందని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ సైతం హెచ్చరించింది. ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని పసఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే వచ్చే వాతావరణ మార్పులను ఎల్–నినో అని, చల్లబడితే లా–నినా అంటారని మనకు తెలుసు. భారత్ లాంటి దేశాల్లో లా–నినా అధిక వృష్టికి కారణమవుతూంటుంది. ఈ రెండూ సాధారణంగా 3 నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చి పోతూంటాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ రావడం ఒక సమస్య అయితే... ఒక్కోసారి ఒక్కోలా ప్రభావం చూపడం రెండో సమస్య. భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ఈ రెండు వాతావరణ అంశాల తీవ్రత పెరిగిపోయింది. వర్షపాతంలో విపరీతమైన తేడాలు నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్–నినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరవు కాటకాలు.. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. లా–నినా సందర్భంలోనూ అధిక వర్షపాతాల స్థానంలో నగరాలను ముంచెత్తే క్లౌడ్బరస్ట్లు తరచూ నమోదు అవుతూండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సూపర్ ఎల్–నినో ఏర్పడుతుందన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబరు లోగా... ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే తెలిపిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ అంచనాల్లో సూపర్ ఎల్–నినో ప్రస్తావన లేదు. జూన్ నెలలో ప్రపంచ వాతావరణ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడేందుకు 80 – 90% అవకాశం ఉంది. ఇప్పటికే అగ్ని గుండాన్ని తలపిస్తున్న వాతావరణానికి ఈ సూపర్ ఎల్–నినో ఆజ్యం పోయనుందని, దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్వయంగా ప్రకటించడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. రెండేళ్ల క్రితం 2023–24 లోనూ సూపర్ ఎల్–నినో ఏర్పడినా ఆ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఐదవదిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు – నవంబరుల మధ్య సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకూ ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది కూడా మాడు పగిలే ఎండలు, వడగాడ్పులు తప్పవన్నమాట. ఎండలు పెరిగితే దాని ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందన్నది నిర్వివాద అంశం.మనపై ప్రభావం ఇలా... సూపర్ ఎల్–నినో ప్రభా వం 2026 నైరుతి రుతుపవనాలపై జూలై నెల నుంచి కనిపించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ ఒకటవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూలైలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో కరవు పరిస్థితులు రావొచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా జూలై – ఆగస్టు నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చునని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబరులో ముఖ్యంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సూపర్ ఎల్–నినో ప్రభావం కారణంగా 2026– 27 రబీ సీజన్ పంటలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుంది. -
ఏఐ ఖర్చు తడిసిమోపెడు!
‘‘ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు..’’ ‘‘ప్రతి రంగంలోనూ ఏఐ, రోబోలదే రాజ్యం’’ ఇంకో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండనే ఉండరు’’ కృత్రిమ మేధ.. అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకోవర్గం సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్లను వదిలేసుకున్నారు. కానీ...ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు ఆరు నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లక్ష వరకూ ఇంజనీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్లు నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది.కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే.... ఏఐ వాడితే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి... వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు రావడమే! ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి.ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్లలో లెక్కిస్తూంటారు. ఉదాహరణకు మీరు ‘ Hello, How are you? ‘ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏక మొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు. టోకెన్లుగా విభజిస్తుంది. ‘ " Hel", " lo", " How", " are", " you" ‘ లు ఒకొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే... అందులోని ఒక్కో టోకెన్కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. 70 శాతం ఏఐదే.. కానీ... కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేసింది. ‘‘ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు’’అని ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటన్జరో వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘సాఫ్ట్వేర్ కోడ్లో 70 శాతం వరకూ ఏఐ ఆధారంగానే జరుగుతోంది. అయితే దీని వల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతోందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు’’అని ఊబర్ సీఓఓ ప్రశాంత్ మహేంద్ర రాజ చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఏఐపై పెడుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం లేదన్నమాట. ఉద్యోగాల కోత మాటేమిటి? ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది.వీటిని కలిగిఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి!!–సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇల్లు.. కట్టొచ్చు, ప్రింట్ చేయవచ్చు..!
ఈ మధ్య ఫ్రాన్స్లో ఓ అపార్ట్మెంట్ కట్టారు. కట్టారు అనడం కంటే ప్రింట్ చేశారనడం కరెక్ట్. ఎందుకంటే పన్నెండు పోర్షన్లు ఉన్న ఈ మూడంతస్తుల బిల్డింగ్లో గోడలన్నీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసినవే మరి. అక్కడక్కడ స్తంభాలు పాతి... కాలమ్స్, పైకప్పులు అమర్చి సిద్ధం చేశారు. ఆ తరువాత తలుపులు, కిటికీలు, వైరింగ్, బాత్రూమ్ ఫిట్టింగ్ వంటివి అమర్చడంతో సాధారణ పద్ధతుల్లో కట్టేదాని కంటే మూడు నెలల ముందుగానే ‘విలియా స్ప్రింట్’పూర్తయింది. ఫ్రాన్స్లోని చారిత్రక నగరం రీమ్స్లోని బెజాన్స్ ప్రాంతంలో విలియా స్ప్రింట్ నిర్మాణం జరిగింది. ఒక్కో అపార్ట్మెంట్ సుమారు 800 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంది. ప్రత్యేకమైన, ఫైబర్ కలిపిన కాంక్రీట్ వాడి గోడలు కూడా నిర్మాణం తాలూకూ బరువును మోసేలా చేశారు. దీనివల్ల స్తంభాల సంఖ్య గణనీయంగా తగ్గింది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వాడటం పుణ్యమా అని కాంక్రీట్ను సమర్థంగా వినియోగించుకోగలిగారు. పది శాతం వరకూ ఆదా చేయగలిగారు. గత ఏడాది మార్చిలో త్రీడీ ప్రింటింగ్ మొదలై 34 రోజుల్లో ముగిస్తే ఆ తరువాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఈ భవనం ఈ ఏడాది ఏప్రిల్లో గృహప్రవేశానికి సిద్ధమైంది. విలియా స్ప్రింట్ నిర్మాణానికి కోబోడ్ బాడ్–2 అనే భారీ త్రీడీ ప్రింటర్ను వినియోగించారు. ఇదే మెషీన్ గతంలో భూకంపాలను తట్టుకోగల ఇల్లు, డేటా సెంటర్ను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. సూపర్ స్పెషల్ ఏర్పాట్లు... త్రీడీ టెక్నాలజీ వాడటం ఒక్కటే విలియా స్ప్రింట్ ప్రత్యేకత కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. హోల్సిమ్ అనే సంస్థ నిర్మాణ స్థలంలోనే కాంక్రీట్ను తయారు చేసి ఇవ్వడం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అలాగే సుమారు 5400 చదరపు అడుగుల విస్తీర్ణంలో సౌర శక్తి ఫలకాలు, హైబ్రిడ్ గ్యాస్/హీట్ పంప్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఈ భవన విద్యుత్తు అవసరాలను 60 శాతం వరకూ తీరుస్తాయి. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ అపార్ట్మెంట్ బిల్డింగ్గా విలియా స్ప్రింట్ రికార్డు నెలకొల్పింది. కాకపోతే ఈ బిల్డింగ్ డెవలపర్ ప్లూరియల్ నోవిలియా త్వరలోనే రెండు త్రీడీ ప్రింటర్లను వాడి ఏకకాలంలో 40 అపార్ట్మెంట్లను కట్టే ఆలోచనలో ఉన్నందున ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఇదిలా ఉంటే 2030 నాటికి 25 శాతం ఇళ్లను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసేందుకు దుబాయ్ ప్రయత్నిస్తోంది. భారత్లోనూ ఊపందుకుంటోంది... త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది అటు తయారీ రంగంలో.. ఇటు గృహనిర్మాణ రంగంలోనూ ఊపందుకుంటోంది. యూరోపియన్ దేశాల మాదిరిగా మరీ విస్తృతంగా కాకున్నా బుడిబుడి అడుగులైతే పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం మద్రాస్ ఐఐటీ ‘త్వస్త’పేరుతో తొలి త్రీడీ ప్రింటెడ్ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆరువందల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఇల్లు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్శించింది కూడా. త్వస్తతోపాటు ప్రఖ్యాత ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ కూడా గృహనిర్మాణాన్ని వేగంగా, చౌకగా పూర్తి చేసేందుకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. మరోవైపు ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోనూ ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ పాట లతాజీది కాదండీ.. నాదే!
ఆ స్వరం వినిపిస్తే చాలు… చెవుల్లో తేనె పోసినట్లు, మనసు ఎక్కడో మెల్లగా తేలిపోతున్న అనుభూతి కలిగేది. రేడియోలో అలనాటి పాటలు మోగుతుంటే చాలామంది “ఆహా.. ఎంతైనా లతా మంగేష్కర్ గారే కదా… ఆ గాత్రం అంత మధురంగా ఉంటుందో!” అని మురిసిపోయేవారు. కానీ ఆ మాధుర్యానికి మూలం ప్రతిసారి లతా మంగేష్కర్ స్వరం మాత్రమే కాదు. ఆ కాలంలో అంతే మృదువుగా, అంతే హృద్యంగా శ్రోతలను ఆకట్టుకున్న మరో గొంతు సుమన్ కళ్యాణ్పూర్ది కూడా. వినేవారిని గందరగోళంలో పడేసేంత సమానతతో, ఆమె గాత్రం లతా గాత్రానికి ఏమాత్రం తగ్గకుండా అదే మాధుర్యాన్ని, అదే భావాన్ని మనసులో నిలిపేది.అలనాటి మధుర గాన గంధర్వి, ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయోభారంతో ముంబైలోని తన నివాసంలో ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీత స్వర్ణయుగానికి చెందిన మరో గొప్ప స్వరం మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.1937 జనవరి 28న అప్పటి బ్రిటీష్ భారతదేశంలోని ఢాకాలో (ప్రస్తుత బంగ్లాదేశ్) సుమన్ హెమ్మాడిగా జన్మించిన ఆమె చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చారు. సంగీతం, చిత్రలేఖనం రెండింటిపైనా ఆసక్తి ఉన్న ఆమె ముంబైలోని ప్రముఖ సర్ జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదువుకున్నారు. అయితే అభిరుచిగా ప్రారంభమైన సంగీత ప్రయాణమే తర్వాత ఆమె జీవితాన్ని మలిచింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుని 1950లలో సినీ గాన రంగంలో అడుగుపెట్టారు. 1960, 70 దశకాల్లో ఆమె స్వరం దేశవ్యాప్తంగా మార్మోగింది. “నా తుమ్ హమే జానో”, “ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే”, “తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే”, “నా నా కర్తే ప్యార్”, “దిల్ ఏక్ మందిర్ హై” వంటి పాటలు సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా Mohammed Rafiతో కలిసి పాడిన యుగళగీతాలు అపార ప్రజాదరణ పొందాయి.రఫీ కాంబోలోనే.. సుమన్ కళ్యాణ్పూర్ కెరీర్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరానికి చాలా దగ్గరగా ఉండటం. దీంతో ఆమె పాడిన అనేక పాటలను శ్రోతలు లతా పాటలుగానే భావించేవారు. ఒకసారి తన పాటలను కూడా లతాజీ పాటలుగా గుర్తిస్తున్నారని చెప్పినప్పుడు, సుమన్ నవ్వుతూ “బాబోయ్.. ఆ గొంతు నాదేనండీ.. లతాజీది కాదు!” అంటూ సరదాగా స్పందించిన సంఘటన సంగీత వర్గాల్లో ఇప్పటికీ గుర్తుంటుంది. అదే కాలంలో హిందీ సినీ పరిశ్రమలో రఫీ–లతా మధ్య పాటల రాయల్టీ, క్రెడిట్ అంశాలపై వచ్చిన చిన్న ప్రొఫెషనల్ విభేదాల కారణంగా కొన్ని ప్రాజెక్టుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఏర్పడిన ఆ గ్యాప్ నేపథ్యంలోనే సుమన్ కళ్యాణ్పూర్ వంటి గాయనిలకు కూడా అవకాశాలు లభించాయి. అలా లతా పాడని కొన్ని పాటల్లో సుమన్ స్వరం వినిపించింది.లతాజీ ఏమనే వారంటే.. అయితే ఈ పోలికను ఆమె ఎప్పుడూ ప్రతికూలంగా తీసుకోలేదు. “నా స్వరం లతాజీ స్వరాన్ని పోలి ఉండొచ్చు. కానీ సంగీత పరిజ్ఞానం ఉన్నవారు రెండింటి మధ్య తేడాను గుర్తిస్తారు” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. లతా మంగేష్కర్పై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆమెను సన్నిహిత స్నేహితురాలిగానే భావించేదాన్నని కూడా సుమన్ చెప్పింది. ఇక.. లతా మంగేష్కర్ కూడా సుమన్ కళ్యాణ్పూర్ గురించి పలు ఇంటర్వ్యూలలో గౌరవంగానే మాట్లాడేవారు. “సుమన్కు చాలా మంచి స్వరం ఉంది. ఆమె గొంతు మధురంగా ఉంటుంది. మా ఇద్దరి స్వరాలు ఒకేలా అనిపించడంతో ప్రేక్షకులు కొన్నిసార్లు గందరగోళానికి గురయ్యేవారు. ప్రతి గాయకురాలికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది” అంటూ లతాజీ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. పద్మభూషణ్.. 1958లో వ్యాపారవేత్త రమానంద్ కళ్యాణ్పూర్ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె పేరు సుమన్ హెమ్మాడి నుంచి సుమన్ కళ్యాణ్పూర్గా మారింది. ఆమె భర్త ప్రతి రికార్డింగ్కు వెంట ఉండేవారని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. గ్లామర్కు, ప్రచారానికి దూరంగా సాధారణ జీవితాన్ని గడపడం ఆమె ప్రత్యేకత. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, కన్నడ, అస్సామీ, ఒడియా, గుజరాతీ, భోజ్పురి సహా అనేక భాషల్లో ఆమె పాటలు పాడారు. దాదాపు 700కు పైగా పాటలతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె గాన సేవలకు గుర్తింపుగా మహారాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్ అవార్డు ప్రదానం చేయగా, 2023లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్తో సత్కరించింది.అయితే సంగీత విమర్శకులు, పరిశీలకులు తరచూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంటారు—సుమన్ కళ్యాణ్పూర్కు తన ప్రతిభకు తగినంత గుర్తింపు, ప్రధాన స్థాయి ప్రచారం పూర్తిగా దక్కలేదని. ఆమె స్వరం లతా మంగేష్కర్ స్వరంతో పోలికకు గురవడంతో, అనేక సందర్భాల్లో ఆమె ప్రత్యేకత నీడలో పడిపోయిందని వారు చెబుతుంటారు. అనేక మంది అభిప్రాయం ప్రకారం, అదే స్వర్ణయుగంలో ఉన్నప్పటికీ సుమన్కు రావాల్సిన స్థాయి గౌరవం, స్టార్డమ్ పూర్తిగా అందలేదన్న భావన సంగీత ప్రపంచంలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.ఆమె మరణంతో ఒక స్వరం ఆగిపోయి ఉండొచ్చు. కానీ “ఆజ్కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే” వినిపించే ప్రతిసారీ, “నా తుమ్ హమే జానో” మళ్లీ మళ్లీ హృదయాల్లో మోగే ప్రతిసారీ సుమన్ కళ్యాణ్పూర్ అనే మధుర జ్ఞాపకం సంగీత ప్రేమికుల మధ్య చిరకాలం జీవిస్తూనే ఉంటుంది. -
అందుకే ఆర్సీబీ సంబురాలకు బ్రేక్!
ఒకటి క్రికెట్ కప్.. మరొకటి ఫుట్బాల్ ట్రోఫీ. ఒకటి బెంగళూరు.. ఇంకొకటి పారిస్. క్రీడలు వేరు, దేశాలు వేరు. కానీ రెండు నగరాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయి. విజయోత్సవాలు ఎక్కడ, ఎలా ముగియాలి?. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట దేశాన్ని కుదిపేస్తే.. తాజాగా పీఎస్జీ ఛాంపియన్స్ లీగ్ విజయం తర్వాత పారిస్లో చెలరేగిన అల్లర్లు ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. ఈ రెండు ఘటనలు కలిసి క్రీడా సంబరాలపై కొత్త హెచ్చరికగా మారాయి.యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ను ఓడించి ప్యారిస్ సెయింట్ జర్మైన్ (PSG) మరోసారి యూరప్ ఛాంపియన్గా నిలిచిన వెంటనే పారిస్ వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. మొదట అది ఆనందోత్సవంలా కనిపించింది. ఐఫిల్ టవర్ క్లబ్ రంగులతో మెరిసింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కానీ కొద్ది గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కార్లకు నిప్పంటించడం, దుకాణాలపై దాడులు, పోలీసులపై రాళ్లు రువ్వడం, వీధుల్లో విధ్వంసం చోటుచేసుకున్నాయి.అధికారిక లెక్కల ప్రకారం ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 780 మందికిపైగా అరెస్టయ్యారు. 264కు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. క్రీడా విజయాన్ని జరుపుకునేందుకు ప్రారంభమైన రాత్రి చివరకు చట్టవ్యవస్థకు సవాలుగా మారింది.ఈ దృశ్యాలు భారత అభిమానులకు గత ఏడాది బెంగళూరులో జరిగిన విషాదాన్ని గుర్తు చేశాయియి. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకున్నప్పుడు నగరం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. జట్టు విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. కానీ భారీ జనసందోహాన్ని పోలీసులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయపడ్డారు. క్రీడా చరిత్రలో నిలిచిపోవాల్సిన ఆనంద క్షణం విషాద అధ్యాయంగా మారిపోయింది.ఆ ఘటన కేవలం ఒక ప్రమాదంగా ముగియలేదు. క్రీడా విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వాలు, పోలీసు శాఖలు, క్రీడా సంస్థల ఆలోచననే మార్చేసింది. అభిమానుల భావోద్వేగం ఎంత ముఖ్యమో, వారి భద్రత కూడా అంతే ముఖ్యమని అందరికీ అర్థమైంది.అందుకే.. ఈ ఏడాది ఆర్సీబీ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచినప్పటికీ, గతంలో లాగా భారీ ర్యాలీలు, నియంత్రణలేని బహిరంగ సంబరాలకు అవకాశం ఇవ్వలేదు. బెంగళూరు పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున గుమికూడే కార్యక్రమాలపై పరిమితులు విధించారు. భారీ జనసందోహాలు ఏర్పడే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయోత్సవాల కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్సీబీ యాజమాన్యం కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు ఇచ్చింది. గత ఏడాది విషాదాన్ని గుర్తుచేస్తూ, వీధుల్లోకి పెద్ద ఎత్తున రావద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే సురక్షితంగా విజయాన్ని ఆస్వాదించాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సోషల్ మీడియా వేదికగా బాధ్యతాయుతమైన సంబరాలు జరుపుకోవాలని సూచించింది. సాధారణంగా జట్లు అభిమానులను బయటకు రమ్మని పిలుస్తాయి. కానీ ఈసారి అభిమానులు సురక్షితంగా ఉండటమే పెద్ద సంబరమని ఆర్సీబీ భావించడం గమనార్హం.What a night. What a feeling. 🥹To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️As the celebrations begin, let’s be responsible. 🙌Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026వాస్తవానికి పారిస్ ఘటన, బెంగళూరు తొక్కిసలాట రెండూ ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. క్రీడా విజయాలు ప్రజలను ఏకం చేయగలవు. కానీ అదే భావోద్వేగం అదుపు తప్పితే ప్రమాదకరంగా మారుతుంది. సంబరాలు అల్లర్లకు దారి తీసినా, జనసందోహం ప్రాణాలను బలిగొన్నా చివరకు నష్టపోయేది అభిమానులే.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడా నిర్వాహకులు ఒక కొత్త వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. విజయం ఎంత గొప్పదైనా, భద్రత దానికంటే గొప్పది. బెంగళూరు తొక్కిసలాట నేర్పిన పాఠాన్ని పారిస్ అల్లర్లు మరోసారి గుర్తు చేశాయి. కప్లు ప్రతి ఏడాది ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదనే బాధ్యత మాత్రం అందరిదీ. అందుకే ఈసారి ఆర్సీబీ సంబరాలకు బ్రేక్ పడింది. అది ఆనందంపై ఆంక్ష కాదు... గత విషాదం మళ్లీ పునరావృతం కాకూడదన్న ముందస్తు జాగ్రత్త. -
కూర్చుని తింటేనే మేలు
ఎంత బిజీగా ఉన్నా సరే.. తినడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చాలామంది నడుస్తూ లేదా డ్రైవ్ చేస్తూ లేదా ప్రయాణిస్తూ త్వరత్వరగా తినేస్తుంటారు. దీనినే ఈటింగ్ ఆన్ ది గో (కదులుతూ తినడం) అంటారు. ఇలా హడావుడిగా తినడం వల్ల శరీరానికి ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో వైద్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మందగిస్తుందినడుస్తూ తినేటప్పుడు ఆహారాన్ని సరిగ్గా నమలడం కుదరదు. దీనివల్ల ఆహారం పెద్ద పరిమాణంలో నేరుగా కడుపులోకి వెళుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు రక్తం జీర్ణవ్యవస్థ వైపు కాకుండా కాళ్లు, చేతుల కండరాల వైపు ప్రవహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.తెలియకుండానే అతిగా తినేస్తాం ప్రయాణాల్లో లేదా వేరే పనుల్లో ఉంటూ తినడం వల్ల మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. కడుపు నిండిందనే సంకేతాన్ని మెదడు సకాలంలో అందుకోలేదు. దీంతో మనకు తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువ క్యాలరీలు లాగించేస్తాం.ఊబకాయం.. బరువు పెరగడం త్వరత్వరగా నడుస్తూ తినే అలవాటు ఉన్నవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరం ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించకుండా, వాటిని నేరుగా కొవ్వుగా మార్చే ప్రమాదముంది. గ్యాస్ సమస్యలు (బ్లోటింగ్, గ్యాస్) కదులుతూ వేగంగా తినడం వల్ల ఆహారంతోపాటు ఎక్కువ మొత్తంలో గాలి కూడా కడుపులోకి వెళుతుంది. ఇది కడుపులో ఉన్నప్పుడు, గ్యాస్ నొప్పులను కలిగిస్తుంది. ఫలితంగా తరచు తేన్పులు వస్తాయి.మానసిక తృప్తి ముఖ్యం ప్రశాంతంగా తిన్నప్పుడే ఆ హారం రుచి, సువాసన మనసుకు తృప్తినిస్తాయి. హడావుడిగా తినడం వల్ల కడుపు నిండినట్టు అనిపించినా, మానసికంగా ఇంకా ఏదో తినాలనే కోరిక మిగిలిపోతుంది. కాబట్టి రోజులో ఎంత పని ఉన్నా.. భోజనానికి కాస్త సమయం కేటాయించడం మంచిది. -
20 నిమిషాల ఎండతో చర్మ కేన్సర్ ముప్పు!
సూర్యరశ్మి వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్–డి లభిస్తుందనేది నిజమే. కానీ, అదే సూర్యుడి నుంచి వెలువడే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు మన చర్మ కణాల లోపలికి చొచ్చుకుపోయి డీఎన్ఏ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సన్న్్రస్కీన్ లోషన్ లేకుండా కేవలం 20 నిమిషాల పాటు తీవ్రమైన ఎండకు గురైతే చర్మ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక ’స్కిన్ కేన్సర్ ఫౌండేషన్’, ‘హార్వర్డ్ మెడికల్ స్కూల్’పరిశోధకులు వెల్లడించారు.నిమిషాల్లోనే డీఎన్ఏ ముక్కలు!సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చాలా శక్తివంతమైనవి. మనం ఎటువంటి రక్షణ (సన్ స్క్రీన్ వంటివి) లేకుండా ఎండలో నిలబడిన మొదటి 10 నుంచి 20 నిమిషాలలోపే ఈ కిరణాలు చర్మ కణాల లోపల ఉండే డీఎన్ఏ నిర్మాణాన్ని ముక్కలు చేయడం లేదా మార్చడం ప్రారంభిస్తాయని పరిశోధకులు తెలిపారు.కేన్సర్గా ఎలా మారుతుంది? డీఎన్ఏ దెబ్బతిన్నప్పుడు శరీరం దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ పదేపదే తీవ్రమైన ఎండకు గురికావడం వల్ల ఆ డీఎన్ఏ శాశ్వతంగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల చర్మ కణాలు అదుపు లేకుండా పెరిగిపోయి కేన్సర్ కణుతులుగా మారతాయి.ముప్పు 80 శాతం పెరుగుతుంది!అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అధ్యయనాల ప్రకారం.. కేవలం ఇరవై నిమిషాల ఎండ తీవ్రతకే చర్మం ఎర్రగా కందిపోతుంది (దీనినే సన్బర్న్ అంటారు). ఒక వ్యక్తి తన జీవితకాలంలో కేవలం 5 సార్లు తీవ్రమైన సన్బర్న్కు గురైతే, ఆ వ్యక్తికి అత్యంత ప్రమాదకరమైన ‘మెలనోమా’అనే స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశం 80 శాతం పెరుగుతుంది.రోగనిరోధక శక్తి తగ్గుతుంది పరిశోధనల ప్రకారం.. ఇరవై నిమిషాల ఎండ తీవ్రత చర్మంలోని రోగనిరోధక కణాలను తాత్కాలికంగా నిర్వీర్యం చేస్తుంది. దీనివల్ల చర్మానికి కేన్సర్ కణాలతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు పాడైన చర్మ కణాల డీఎన్ఏ, వెంటనే కాకుండా 10 లేదా 20 సంవత్సరాల తర్వాత కేన్సర్గా బయటపడొచ్చు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండ తక్కువగా ఉన్నట్టు అనిపించినా, మేఘావృతమై ఉన్నా కూడా బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం, గొడుగు వాడటం లేదా శరీరాన్ని పూర్తిగా కప్పుతూ దుస్తులు ధరించడం వంటి రక్షణ చర్యలు తప్పనిసరి. -
ఎల్నినో ఎఫెక్ట్: ఈసారి ఆ “అద్భుతం” జరగకపోతే..?
రెండేళ్లపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు ఈసారి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్ధకాలం తరువాత రుతుపవనాలు బలహీనంగా మారే ప్రమాదం ఉందన్న భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలే ఇందుకు కారణం. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే ప్రమాదమే కాకుండా.. ఆ లోటు తీవ్రంగా ఉండే అవకాశమూ ఉందని ఐఎండీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే 2015 నాటి అత్యల్ప వర్షపాత రికార్డులు బద్ధలవుతాయా?, ప్రజలు మరోసారి కరవు కోరల్లో చిక్కుకుంటారా? అన్న అందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.భారతదేశానికి జీవనాధారం లాంటి నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో దాదాపు 70 శాతం వర్షాన్ని అందిస్తాయి. 2024, 2025లో ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయి. జలాశయాలు నిండిపోయాయి. వ్యవసాయం కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చింది. కానీ 2026లో ఈ సానుకూల పరిస్థితి ప్రతికూలంగా మారిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.👉భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయికి కేవలం 90 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంచనా నిజమైతే 2015 తర్వాత దేశంలో నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఇదే అవుతుంది. ఆ ఏడాది భారత్ తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సమయంలో పంటలు దెబ్బతినడం, నీటి వనరులు తగ్గిపోవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవడం వంటి ప్రభావాలు కనిపించాయి.ఇక ఈసారి మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. సాధారణంగా ఇలాంటి బలహీన మాన్సూన్ వచ్చే అవకాశం కేవలం 16 శాతం మాత్రమే ఉండగా, తాజా అంచనాల్లో అది ఏకంగా 60 శాతానికి పెరిగింది. అంటే సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమే ఎక్కువగా ఉందని అర్థమన్నమాట.ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఎల్నినో అనేది.. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ నుంచి వచ్చే గాలులు, సముద్ర ప్రవాహాలు భారతదేశ రుతుపవనాలను బలపరుస్తాయి. అయితే ఎల్నినో వల్ల ఈ గాలుల వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఫలితంగా భారతదేశానికి చేరే తేమ తగ్గి.. వర్షాలూ తగ్గిపోతాయి. అందుకే ఎల్నినో ప్రభావం వచ్చిన చాలా సంవత్సరాల్లో భారత్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.ఇక్కడ మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈసారి ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే సహజ వాతావరణ వ్యవస్థ అయిన భారత మహాసముద్ర డైపోల్ (IOD) కూడా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఐవోడీ సానుకూలంగా (positive phase) ఉన్నప్పుడు భారతదేశానికి అదనంగా తేమను అందించి వర్షపాతం కొంతవరకు పెరగడానికి సహాయపడుతుంది. కానీ ఈసారి అది న్యూట్రల్గా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీని అర్థం ఏమిటంటే.. ఎల్నినో వల్ల వర్షాలు తగ్గే ప్రభావాన్ని సమతుల్యం చేసే “సహజ రక్షణ వ్యవస్థ” పనిచేయదన్నమాట. ఫలితంగా వర్షపాతం తగ్గే ప్రమాదాన్ని తగ్గించే అదనపు బలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఎల్నినో ప్రభావం నేరుగా మాన్సూన్పై ఎక్కువగా పడే అవకాశం ఉండి.. వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని పెంచుతోంది.ప్రాంతాల వారీగా చూస్తే మధ్య భారతం, దక్షిణ భారతం, వాయువ్య భారతంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి ఒడిశా వరకు విస్తరించిన మాన్సూన్ కోర్ జోన్లో వర్షాభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో పంటలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.👉వర్షాలు తగ్గితే వరి, పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల ఉత్పత్తి తగ్గి ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ ప్రజలపై భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయం స్పష్టం చేస్తున్నారు. ఎల్నినో ఉన్నప్పటికీ ప్రతి సారి కరువు తప్పనిసరిగా వస్తుందనేది కాదు. గతంలో కూడా కొన్ని ఎల్నినో సంవత్సరాల్లో సాధారణ వర్షాలు నమోదైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అయితే.. ఈ సీజన్ సూచనలు మాత్రం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు. 2015 కరువు రికార్డు మళ్లీ తిరగరాయబడుతుందా? లేదంటే ఏదైనా అద్భుతం జరిగి ఈసారి నైరుతి ఆశ్చర్యపరుస్తుందా? అని వాతావరణ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఇజ్రాయెల్ యుద్ధకాలపు సన్నద్ధత
హైఫా చారిత్రక నగరం. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత సైనికుల సాయంతో విముక్తి పొందిన నగరం. ఇజ్రాయెల్లో మూడో అతిపెద్ద నగరం. ‘ఇజ్రాయెల్ శాన్ ఫ్రాన్సిస్కో’ అని కూడా పిలుస్తుంటారు. అంతేకాదు.. ఒకప్పుడు యూదులు, అరబ్బుల సహజీవనానికి ప్రతీక. మరి ఇప్పుడు ప్రస్తావించుకోవడానికి ప్రధాన కారణం.. ఈ నగరం వీధుల కింద నిశ్శబ్దంగా సేవలందిస్తున్న భూగర్భ ఆస్పత్రి. సైరన్ల మోతలు సర్వసాధారణమైపోయిన ప్రాంతంలో వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. లెబనాన్ సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఫాలోని రాంబం హెల్త్ కేర్ క్యాంపస్లో ఈ భూగర్భ ఆస్పత్రి ఉంది. సాధారణ సమయాల్లో మూడంతస్తుల పార్కింగ్ స్థలంగా ఉండే ఈ నిర్మాణం అత్యవసర సమయాల్లో, 72 గంటల్లో 2వేల పడకల ఆస్పత్రిగా మారిపోతుంది. యుద్ధకాలం స్థైర్యానికి, అత్యవసర వైద్య సంసిద్ధతకు దీనిని ఏర్పాటు చేసింది. 2006 లెబనాన్ యుద్ధంలో నేర్చుకున్న పాఠాలతో ఇజ్రాయెల్ నిర్మించిన ఈ ఆస్పత్రి అసాధారణ పరిస్థితుల్లో ఒక ప్రపంచ నమూనాగా మారింది. యుద్ధకాల ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అధ్యయనం చేస్తున్న దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. నిరంతర క్షిపణి, డ్రోన్, రసాయన దాడులను సైతం తట్టుకునేలా నిర్మించారు. సముద్ర మట్టానికి దాదాపు తొమ్మిది మీటర్ల దిగువన ఉన్న ఈ హాస్పిటల్ ప్రపంచంలోనే ఏకైక భారీ భూగర్భ ఆసుపత్రి. నాలుగేళ్లలో.. రూ.1,154 కోట్లతో..ఈ చారిత్రాత్మక ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. దాదాపు 120 మిలియన్ డాలర్లు ఖర్చయింది. మూడంతస్తుల్లో ఉన్న ఈ భూగర్భ వైద్య సముదాయాన్ని యుద్ధ సమయంలో క్షిపణి దాడులను తట్టుకునేలా నిర్మించారు. ఒకేసారి 2,200 మంది రోగులకు చికిత్స అందిస్తుంది. మధ్యధరా సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ నరగంలో భూగర్భ నిర్మాణం ఒక పెద్ద ఇంజనీరింగ్ సవాలుగా నిలిచింది. దాదాపు 100 పంపులను ఉపయోగించి రెండేళ్ల పాటు ప్రతిరోజూ సముద్రపు నీటిని నిరంతరం బయటకు తోడేశారు. మళ్లీ నీరు చొరబడకుండా ఉండేందుకు ప్రత్యేక జలనిరోధక నిర్మాణ సామగ్రిని ఉపయోగించారు.పదివేల మందికి పైగా...ఇరాన్పై దాడి ప్రారంభించిన నాటి నుంచి ఈ ఆస్పత్రి దేశవ్యాప్తంగా క్షిపణి దాడుల్లో గాయపడిన పదివేల మందికిపైగా చికిత్స అందించింది. 144 మంది ఇజ్రాయెల్ సైనికులు చికిత్స పొందారు. ప్రస్తుతం సుమారు 14 మంది సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడులు తీవ్రమైన తరువాత కేవలం ఎనిమిది గంటల్లోనే దాదాపు 900 మంది రోగులను భూగర్భంలోకి తరలించి ఆసుపత్రి తన అత్యవసర సంసిద్ధతను ప్రదర్శించింది. ప్రధాన ఆస్పత్రి భవనంలోని రోగులను పటిష్టమైన ఈ నేలమాళిగకు వేగంగా తరలించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్కడ వైద్య బృందాలు చికిత్సను పునఃప్రారంభించాయి. వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది.. ప్రతి ఒక్కరికీ యుద్ధకాలపు బాధ్యతలు కేటాయించారు. డేకేర్ సెంటర్ కూడా...ఆస్పత్రిలో ప్రస్తుతం 6,500 మంది నర్సులు, 2,000 మంది వైద్యులు పనిచేస్తున్నారు. క్షిపణి దాడుల సమయంలో వీరు తమ చికిత్సను కొనసాగిస్తారు. సంఘర్షణలు ఎక్కువ కాలం కొనసాగినా.. వైద్యులు, నర్సులు, సంరక్షకులు పిల్లల సంరక్షణ గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఇక్కడ ప్రసూతి విభాగం, మూడు నెలల నుంచి 12 ఏళ్ల వయసున్న 70 మంది పిల్లలుండేలా పూర్తిస్థాయి డేకేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇటీవల దాడులు తీవ్రంగా ఉన్న సమయంలో వీరు దాదాపు నెలన్నర పాటు అజ్ఞాతంలోనే ఉండి వైద్య సేవలు అందించాల్సి వచ్చింది. మూడు రోజులైనా..ఆసుపత్రిలో ఆహారం, పెట్రోల్, ఆక్సిజన్, వైద్య సామాగ్రి కూడా ఉన్నాయి. వీటితో మూడు రోజుల పాటు స్వయం సమృద్ధిగా ఉండగలదు. కరోనావైరస్ సంక్షోభ సమయంలో ఈ ఆసుపత్రిని వినియోగించారు. గుహలాంటి విశాలమైన ప్రదేశంలో రోగులకు చికిత్స చేయడంలో ఉన్న ఇబ్బందులను సిబ్బంది అప్పుడు తెలుసుకున్నారు. క్లాస్ట్రోఫోబియా (ఇరుకు ప్రదేశాలంటే భయం) ఉన్నవారి అసౌకర్యాన్ని తగ్గించాలని గోడలను పూల పోస్టర్లతో అలంకరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక కాబోయే సీఎం.. కుటుంబం గురించి తెలుసా?
కర్ణాటక రాజకీయాల్లో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న నాయకత్వ మార్పు ఖాయమైంది. కాంగ్రెస్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న డీకే.. ఇప్పుడు అధికార పీఠం ఎక్కబోతుండటంతో ఆయన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రస్థానం, ఆస్తుల వివరాలపై నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది.. డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. 1962 మే 15న కర్ణాటకలోని కనకపుర ప్రాంతంలో జన్మించారు. వొక్కలిగ సమాజానికి చెందిన ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యంతో ఎదిగింది. తండ్రి కెంపేగౌడ, తల్లి గౌరమ్మ. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న డీకే.. విద్యార్థి దశలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సతనూరు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన.. తర్వాత కనకపురకు మారి వరుస విజయాలు సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్లో అత్యంత ప్రభావవంతమైన వొక్కలిగ నేతగా గుర్తింపు పొందారు.కుటుంబం కూడా హైప్రొఫైల్!డీకే శివకుమార్ భార్య ఉషా శివకుమార్. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. ఒక కుమారుడు ఆకాశ్. పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ వ్యాపారవేత్త, కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో జరిగింది. ఈ వివాహం దేశవ్యాప్తంగా హైప్రొఫైల్ ఈవెంట్గా నిలిచింది.డీకే కుటుంబంలో రాజకీయ ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఆయన సోదరుడు డీకే సురేష్ కుమార్ కూడా కాంగ్రెస్ నేతగానే గుర్తింపు పొందారు. బెంగళూరు రూరల్ నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచారు. దీంతో డీకే కుటుంబం కర్ణాటక కాంగ్రెస్లో శక్తివంతమైన రాజకీయ కుటుంబంగా ఎదిగింది.కాంగ్రెస్కు ‘ట్రబుల్ షూటర్’డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్కు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందారు. కర్ణాటకలో సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడటం, రిసార్ట్ రాజకీయాలు నిర్వహించడం, ప్రభుత్వాలను నిలబెట్టడం వంటి వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. గుజరాత్లో అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రక్షించడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.దేశంలోనే ధనిక నేతల్లో ఒకరుడీకే శివకుమార్ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. 2018 ఎన్నికల సమయంలోనే దాదాపు రూ.840 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించారు. తర్వాతి అఫిడవిట్లలో ఈ ఆస్తుల విలువ మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బెంగళూరులో భారీ స్థలాలు, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ వాహనాలు, ఆభరణాలు, ఖరీదైన గడియారాలు ఆయన పేరుతో ఉన్నట్లు అఫిడవిట్లలో నమోదైంది. ఇటీవల రూ.43 లక్షల విలువైన కార్టియర్ వాచ్పై కూడా రాజకీయ వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన డీకే.. “నా దగ్గర రోలెక్స్ కూడా ఉంది” అంటూ సెటైరిక్గా బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.ఈడీ, ఐటీ కేసులతోనూ వార్తల్లో..డీకే శివకుమార్ రాజకీయ జీవితంలో వివాదాలు కూడా తక్కువ లేవు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్, ఐటీ దాడుల కేసుల్లో ఆయన పేరు పలుమార్లు వార్తల్లో నిలిచింది. 2019లో ఈడీ కేసులో అరెస్టై జైలుకూ వెళ్లారు. అయితే ఆ తర్వాత మరింత బలంగా రాజకీయాల్లో తిరిగి నిలబడ్డారు.ఇప్పుడు సీఎం కుర్చీ..2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే డీకే సీఎం అవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ హైకమాండ్ అప్పట్లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ సహనంతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో.. ఆయన కల నిజం కాబోతోందన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. -
రెండు దశాబ్దాల తరువాత..
కేరళలోని కోజికోడ్ సమీపంలో ఉన్న ఫెరోక్లోని ఆ ఇంట్లో బక్రీద్ నాడు అసలైన వేడుక జరిగింది. సౌదీ జైలులో రెండు దశాబ్దాలు గడిపి, మరణశిక్షను ఎదుర్కొన్న వ్యక్తి కేరళకు తిరిగి వచ్చాడు. టీనేజర్ మృతికి కారణమయ్యారనే అభియోగంతో మరణశిక్ష పడిన వ్యక్తి.. ఉరిశిక్ష నుంచి తృటిలో తప్పించుకుని ఇంటికి తిరిగొచ్చాడు. డ్రైవర్గా వెళ్లి కేర్ టేకర్గా..సౌదీ అరేబియాకు వెళ్లడానికి ముందు రహీం కేరళలో ఆటోరిక్షా, స్కూల్ బస్సు నడిపాడు. ఆరుగురు తోబుట్టువులలో అందరికంటే చిన్న వాడైన అతను, డ్రైవర్గా ఉద్యోగం సంపాదించి తర్వాత 2006 నవంబర్ 28న రియాద్కు వెళ్లాడు. కానీ, పక్షవాతంతో బాధపడుతూ శ్వాస పరికరంపై ఆధారపడి జీవిస్తున్న 17 ఏళ్ల వ్యక్తికి కేర్టేకర్గా పని ఇచ్చారు. 2006 డిసెంబర్ 24న, ఆ బాలుడిని వెనుక కూర్చో బెట్టుకుని రహీమ్ వాహనం నడుపుతుండగా శ్వాస సహాయక పరికరం ఊడిపోవడంతో ఆ బాలుడు మరణించాడు. అప్పుడు 26 ఏళ్ల వయసున్న రహీం, సౌదీ అరేబియాకు వచ్చిన కేవలం 28 రోజులకే అరెస్టయ్యాడు. 2011లో సౌదీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ శిక్షను సమర్థించాయి.పరిహారంతో పరిష్కారం...అతనికి మరణశిక్ష ఎప్పుడైనా పడొచ్చని అతని కుటుంబం అనుక్షణం భయంతో జీవించింది. అయితే రూ. 34 కోట్ల పరిహారం ఇస్తే రహీంను క్షమించడానికి ఆ కుటుంబం అంగీకరించింది. దీంతో అతని మరణ శిక్షను రద్దు చేశారు. పొట్టకూటి కోసం అంతదూరం వెళ్లిన రహీం అంతమొత్తాన్ని ఎలా ఇవ్వగలడు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీ సమాజం అతనికి సాయం చేసింది. భారీ క్రౌడ్ఫండింగ్తో విరాళాలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల్లోనే విరాళాలు సేకరించి పరిహారం పూర్తిగా చెల్లించారు. అయితే, రహీం 20 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేయాలని సౌదీ అధికారులు ఆదేశించారు. అరబిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మే 20న ఆ శిక్ష ముగిసింది.తండ్రిని కోల్పోయి.. కోజికోడ్లో రహీం కుటుంబానికి ఈ సమయం పరీక్షలా నిలిచింది. అతను జైలు పాలైన ఆరు నెలలకే తండ్రి ముహమ్మద్కుట్టి మరణించారు. క్షమాభిక్ష మంజూరైన తర్వాత 2024 నవంబర్లో తల్లి ఫాతిమా అతన్ని ఒక్కసారి మాత్రమే కలవగలిగింది. వీడియో కాల్స్ వారికి ఊరటనిచ్చాయి. ఈ సుదీర్ఘ నిరీక్షణకు గురువారం తెరపడింది. తనకు పునర్జన్మను ప్రసాదించిన వారందరికీ రహీం కృతజ్ఞతలు తెలిపాడు. ఇంటికి చేరుకున్న రహీం ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. తన ప్రాణాలు నిలబెట్టి, తన విడుదలను సుసాధ్యం చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులందరికీ రహీం ధన్యవాదాలు తెలిపాడు. బక్రీద్ పండుగ సమయంలోనే రహీం తిరిగి రావడం తమ ఆనందాన్ని రెట్టింపు చేసిందని అతని స్నేహితులు, స్థానికులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ఇది కూడా చదవండి: పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు -
యుద్ధం: విషాదంతో పాటు విషం
యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి.మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం. పారిశ్రామిక అగ్నిప్రమాదాలుటెహ్రాన్ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి.ఇవి శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఇది ఎక్కువకాలంపాటు కొనసాగితే ఈ ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. క్యాన్సర్ల ప్రమాదం పెరగడంతో పాటు, కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. ఇరాన్లో వాయు నాణ్యత ఇప్పటికే ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ పారిశ్రామిక మంటలు లక్షలాది మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడటానికి కారణమవుతాయి. నేల కాలుష్యం, విషపూరిత శిధిలాలు మందుగుండు సామగ్రి, సైనిక శిధిలాల పేలుడు దీర్ఘకాలిక నేల కాలుష్యానికి దారితీస్తుంది. బాంబు దాడికి గురైన ప్రాంతాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లేదా క్రోమియం వంటి భారీ లోహాలు పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య కారకాలు నేలల్లో నిలిచిపోయి క్రమంగా ఆహార గొలుసులలోకి ప్రవేశిస్తాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం ఆస్బెస్టాస్, పారిశ్రామిక రసాయనాలు, పేలని ఆయుధాల అవశేషాల శిథిలాలు, పట్టణ విధ్వంసం.సంఘర్షణానంతర కాలంలో ఈ పదార్థాల నిర్వహణ ప్రధాన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఉక్రెయిన్లో, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలపై జరిగిన బాంబు దాడుల వల్ల అనేక కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ్యాపించాయి. గాజా స్ట్రిప్లో, భవనాలు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం వల్ల లక్షలాది టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇవి కాలుష్య నిర్మూలన, పునరి్నర్మాణ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. ధ్వంసమైన నగరాలను పునర్నిర్మించడం వాతావరణంపై అదనపు భారం పడుతుంది. మరింత నీటి సంక్షోభంయుద్ధం నీటి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆనకట్టలు, కీలకమైన మౌలిక నీటి సదుపాయాలను ధ్వంసం చేసి జనాభాను నియంత్రించడానికి ప్రత్యర్థి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. కరువులు, వ్యవసాయంలో అధిక వినియోగం, వివాదాస్పద నీటి నిర్వహణ విధానాలతో ఇప్పటికే ఇరాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల ఏర్పడే కాలుష్యం నీటి నాణ్యతను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయనుంది.పేలుళ్లు, అగ్నిప్రమాదాల కారణంగా హైడ్రోకార్బన్లు పట్టణ మురుగునీటి వ్యవస్థలలోకి, కొన్ని జలమార్గాల్లోకి ప్రవహించి, నేలలను, భూగర్భ జలాలను కలుషితం చేశాయి. ఇక విద్యుత్ గ్రిడ్లు, శుద్ధి కర్మాగారాలపై బాంబు దాడులు చేయడం వల్ల కీలకమైన నీటి శుద్ధి ప్రక్రియ నిలిచిపోతుంది. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు తక్షణమే వ్యాధుల బారిన పడుతున్నారు. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్లో సముద్రం పాలైన చమురు, ఆ ప్రాంతంలోని హాక్స్బిల్ సముద్ర తాబేళ్లు అంతరించడానికి, అక్కడి గ్రీన్ తాబేళ్ల వినాశనానికి కారణమైంది.అంతరించనున్న అడవులుసంఘర్షణ అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంధన కొరత ఏర్పడినప్పుడు, బొగ్గు, వంటచెరుకు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు అంతరించపోతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు కనుమరుగైన చోట అడవుల నరికివేత పెరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూడాన్. 2023లో ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు2022లో ప్రపంచవ్యాప్త గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 5.5 శాతానికి సైనిక దళాలదే. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరిగేకొద్దీ, దాని వల్ల ఏర్పడే కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. 26 దేశాలు ఏడాది పొడవునా విడుదల చేసే ఉద్గారాల కంటే గాజా సంఘర్షణలో మొదటి 120 రోజుల్లోనే ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయని ఒక పరిశోధనలో తేలింది. ఇరాన్ యుద్ధంలో జలాంతర్గామి కార్యకలాపాలు, సుదూర బాంబర్ దాడులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటివల్ల వెలువడే ఉద్గారాల భారం చాలా ఎక్కువ. గల్ఫ్ యుద్ధంలోనూఈ ప్రాంతం గతంలోనూ యుద్ధ కాలుష్యాన్ని చూసింది. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో, ఇరాకీ దళాలు 600 కంటే ఎక్కువ కువైట్ చమురు బావులకు నిప్పంటించాయి. నెలల తరబడి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో గల్ఫ్ అంతటా వాయు కాలుష్యం, నేల, భూగర్భ జలాల కాలుష్యం విస్తృతమైంది. అది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమైంది. ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి పరిహార కమిషన్కు నష్టపరిహారంగా ఇరాక్ 50 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.ఉక్రెయిన్లోనూమరో భయంకరమైన తాజా ఉదాహరణ ఉక్రెయిన్. యుద్ధం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ ఇంధన డిపోలు, పారిశ్రామిక ప్రాంతాలు, రసాయన గిడ్డంగులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి, నదులు, వ్యవసాయ భూములను కలుషితం చేశాయి. చమురు కేంద్రాల్లో మంటలు, అటవీ నిర్మూలన, దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడిన కాలుష్యం నీటి వ్యవస్థల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. -
4 వారాలు.. 4 ఏళ్లు వెనక్కి!
సాక్షి స్పెషల్ డెస్క్: వయసు పెరగడం అనేది శారీరక క్రియ. అయితే వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా, శరీర కణాలను ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం 4 వారాల పాటు సరైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే.. మన శరీర జీవసంబంధిత వయసును (బయలాజికల్ ఏజ్) ఏకంగా 3 నుంచి 4 ఏళ్ల వరకు వెనక్కి మళ్లించవచ్చని ఆ్రస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన విశేషాలు అంతర్జాతీయ జర్నల్ ‘ఏజింగ్ సెల్’లో ప్రచురితమయ్యాయి.ఏమిటీ పరిశోధన?సాధారణంగా మనం పుట్టిన తేదీని బట్టి లెక్కించే వయసును ‘క్రోనలాజికల్ ఏజ్’అంటారు. కానీ మన శరీరంలోని కణాలు, అవయవాల ఆరోగ్యం ఆధారంగా నిర్ణయించే అసలు వయసును బయోలాజికల్ ఏజ్ అంటారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 65 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 104 మంది వృద్ధులను నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి నాలుగు వారాల పాటు నాలుగు వేర్వేరు ఆహార ప్రణాళికలను (డైట్ ప్లాన్లు) అందించి పరిశీలించారు. ఈ ప్రయోగ కాలంలో నాలుగు గ్రూపుల వారి రక్తపోటు, ఇన్సులిన్ స్థాయిలు, కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ (వాపులు) వంటి 20 రకాల ఆరోగ్య సూచికలను, అలాగే శరీరం ఎంత వేగంగా వయసు మీరుతోందో చెప్పే ‘ఎపిజెనెటిక్ క్లాక్’పై నిరంతర అధ్యయనం చేశారు.ఆశ్చర్యకరమైన ఫలితాలు⇒ తక్కువ కొవ్వు తింటూ, కలగూర కార్బోహైడ్రేట్లు (తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, దుంపలు) తీసుకున్నవారిలో అత్యధికంగా 4.1 సంవత్సరాల బయోలాజికల్ వయస్సు తగ్గింది. ⇒ జంతు ప్రోటీన్లను (మాంసాహారం) తగ్గించి, మొక్కల ఆధారిత ప్రోటీన్లు తీసుకున్న వారిలో 2.9 నుంచి 3.2 ఏళ్ల వయస్సు తగ్గింది. ⇒ జంతు ఆధారిత కొవ్వులు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న సాధారణ ఆహారం తిన్న వారి వయస్సులో ఏ మార్పూ కనిపించలేదు.వృద్ధ జన్యువులు – యవ్వన జన్యువులు మన శరీరంలో ‘డీఎన్ఏ మైథెలేషన్’అనే ఒక ముఖ్యమైన ప్రక్రియ జరుగుతుంది. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం ఈ ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తాజా పరిశోధన ప్రకారం.. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు, వృద్ధాప్యానికి కారణమయ్యే జన్యువులు ‘స్విచ్ ఆఫ్’అవుతాయి. అదే సమయంలో మనల్ని యవ్వనంగా ఉంచే జన్యువులు మరింత మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి.ఆహారంతో పాటుగా...వయసును వెనక్కి మళ్లించే మ్యాజిక్ ఫలితం దక్కాలంటే కేవలం తిండి మార్చడమే కాదు.. ప్రతిరోజూ కనీసం 7 గంటల నాణ్యమైన నిద్ర, రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం, శరీరానికి సరిపడా నీరు తాగడం వంటి నియమాలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ఆహార ప్రణాళికలివే.. ⇒ మాంసాహారం,ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం. ⇒ మాంసాహారం, తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం. ⇒ శాకాహారం, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం. ⇒ శాకాహారం, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం. -
అమ్మో.. ఒకటో తారీఖు! ఇక ‘ధరల తుపాను’ మొదలా?
దాదాపు నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడం కేవలం వాహనదారులకు షాక్ మాత్రమే కాదు.. రాబోయే భారీ ఆర్థిక తుపానుకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కానీ ఈ పెంపు ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల వరకే పరిమితం కాదని.. త్వరలోనే ప్రతి ఇంటి బడ్జెట్ను కుదిపేసే పరిస్థితి రావొచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.తాజాగా సోమవారం పెట్రోల్పై లీటర్కు రూ.2.61, డీజిల్పై రూ.2.71 చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పటికే మే 15, 19, 23 తేదీల్లో కూడా వరుస పెంపులు చోటుచేసుకోవడంతో.. పదిరోజుల వ్యవధిలోనే పెట్రోల్పై మొత్తం రూ.7.34, డీజిల్పై రూ.7.45 వరకు భారమైంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.117 దాటగా.. హైదరాబాద్, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు సామాన్యుల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. “అమ్మో.. ఒకటో తారీఖు!”. ఎందుకంటే జీతాలు ఖాతాల్లో పడే సమయానికే గ్యాస్ సిలిండర్ ధరలపై మరో పెంపు ప్రకటన వచ్చే అవకాశముందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో.. గృహ వినియోగ LPG సిలిండర్ రేట్లు కూడా త్వరలో పెరగొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. మిగతా నిత్యావసరాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలకు అసలు కారణం మాత్రం ఇంధర ధరల పెంపే. భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. కూరగాయల నుంచి పాలు వరకు.. ఆన్లైన్ డెలివరీ నుంచి విమాన టికెట్ల వరకు.. అన్నీ డీజిల్, పెట్రోల్పైనే ఆధారపడి ఉంటాయి. దీంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి ఆ ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపైనే పడుతుంది. ముందుగా ప్రజా రవాణా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బస్సులు, ఆటోలు, క్యాబ్లు, ట్యాక్సీల ఛార్జీలు పెరగొచ్చని సంకేతాలు వస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఎగసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. త్వరలోనే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ యాప్లు, ఈ-కామర్స్ కంపెనీలు కూడా డెలివరీ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు వేయొచ్చని అంచనా. ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న కంపెనీలు.. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా ఆ ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది. కనీస ఆర్డర్ విలువ పెరగడం, డెలివరీ ఫీజులు అధికమవడం వంటి మార్పులు కనిపించొచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. రైతులు ట్రాక్టర్లు, మోటార్లు, నీటి పంపులు వంటి వ్యవసాయ పరికరాల కోసం డీజిల్పైనే ఆధారపడాల్సి వస్తోంది. డీజిల్ ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరిగి.. చివరకు ఆ భారం కూడా ఆహార ధరల రూపంలో ప్రజలపైనే పడుతుంది.ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు కేంద్రానికీ పరిమితులే కనిపిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు త్వరలో చల్లారే సూచనలు లేకపోవడం, హర్ముజ్ మార్గంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.ఇంధన ధరల పెంపు అంటే కేవలం బైక్కు పెట్రోల్ కొట్టించుకునే ఖర్చు పెరగడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఉద్ధృతం కావడానికి అది ఆరంభ సంకేతమని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ‘సర్దుకుపోదాం’ అనుకున్న సామాన్యుడు.. ఇక ముందు ‘ఎంత తగ్గించుకుని బతకాలి?’ అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన పెరుగుతోంది. -
మన విద్యార్థులకు కరెన్సీ కష్టాలు
రూపాయి విలువ పతనం.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు శాపంగా మారింది. ఒక్కపూట తింటూ అర్థాకలితో బతుకుతున్నారు. తక్కువ ధరలో దొరుకుతుందని కొందరు కాలం చెల్లిన ఆహారం కోసం వెతుకుతున్నారు. డబ్బులు సరిపోక అదనపు పనులు చేస్తున్నారు. ఇదంతా వారి చదువులపై ప్రభావం చూపి విద్యార్థుల గ్రేడ్లు దెబ్బతింటున్నాయి. భారత రూపాయి ఇప్పుడు అమెరికన్ డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ సంక్షోభం కొన్ని నెలల్లోనే తీవ్రమైంది. డాలర్కు రూపాయి విలువ 95 మార్కును దాటింది. ఏ క్షణంలోనైనా అది 100 చేరుకునే అవకాశం ఉంది. కొన్నేళ్ల కిందటి వరకు పౌండ్తో పోలిస్తే రూపాయి బలహీనంగా కనిపించేది. 2013లో పౌండ్తో రూపాయి విలువ మూడంకెల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 2022లో, యూరోతో పోలిస్తే రూపాయి 100 మార్కును తాకింది. ఇప్పుడు, డాలర్ విలువ 100 రూపాయలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కడుపు మాడ్చుకుంటూ విదేశాల్లో చదువు అంటే తాము ఊహించుకున్న జీవితం వేరు.. కానీ అక్కడ గడుపుతున్న జీవితం మరోలా ఉంది. బలహీనపడుతున్న రూపాయి, విదేశాల్లోని చాలా మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంపన్న కుటుంబాల పిల్లలు తప్ప.. మధ్య తరగతి కుటుంబాల నుంచి వెళ్లిన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. కొందరు అసలు భోజనమే మానేయాల్సి వస్తోంది. మరికొందరు రోజుకు ఒక్క పూట భోజనంతో బతుకుతున్నారు. యూకే, యూఎస్, ఆ్రస్టేలియా, సింగపూర్లోని విద్యార్థులదీ ఇదే పరిస్థితి. బయట తినడం మొత్తమే మానేస్తున్నారు. తక్కువ ధర ఉన్న ఆహారం కోసం ‘టూ గుడ్ టు గో’వంటి యాప్లపై ఆధారపడుతున్నారు. ఈ యాప్లు కోస్టా కాఫీ, స్టార్బక్స్ వంటి ఫుడ్ అవుట్లెట్లలో గడువు ముగియబోతున్న ఆహార వివరాలను పెడతాయి. ఆ లిస్టింగ్ లైవ్లోకి వచ్చిన వెంటనే క్షణాల్లో అయిపోతోంది. వేరోవరో బుక్ చేసుకుని అది చేజారిపోకుండా ఉండేందుకు విద్యార్థులు స్టోర్కు పరుగెడుతున్నారు. అదీ దొరక్కపోతే ఆకలితో అలమటించాల్సిందే. వర్సిటీ ఆహార పంపిణీపై అమెరికాలోని చాలా మంది విద్యార్థులు డబ్బు ఆదా చేసుకోవడానికి విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఆహార పంపిణీపై ఆధారపడుతున్నారు. చాలా విశ్వవిద్యాలయాలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తాయి. బయట తినే ఖర్చులను తగ్గించుకోవడానికి విద్యార్థులు ఆ సామాగ్రిని తమ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకుంటున్నారు. కిరాణా సామగ్రిని సైతం కలిసి కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లను షేర్ చేసుకుంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ఏడెనిమిది మంది విద్యార్థులు ఒకే గదిలో లేదా అపార్ట్మెంట్లో ఇరుక్కుని ఉంటున్నారు. అదనపు పని చాలా మంది విద్యార్థులు తమకు అధికారికంగా అనుమతి ఉన్న పని గంటలకు మించి పనిచేస్తున్నారు. అధికారిక పార్ట్టైమ్ ఉద్యోగాలతోపాటు డిపార్ట్మెంట్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో నేల తుడవడం వంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేస్తున్నారు. పౌండ్ బలపడుతున్న కొద్దీ యూకేలోని చిన్న విశ్వవిద్యాలయ పట్టణాల్లోనూ రోజువా రీ జీవితం మరింత ఖరీదైనదిగా మారింది. క్యాబ్ల సంగతి పక్కన పెడితే.. ప్రజా రవాణా కూడా ఖరీదైనదిగా మారింది. దీంతో డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది. భారత్లోని కుటుంబాలపై భారం... ఇది కేవలం విదేశాల్లోని విద్యార్థులనే కాదు.. భారత్ నుంచి వారి చదువుకు డబ్బు పంపుతున్న కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ కరెన్సీ పతనం మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపడానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయిస్తారు. ట్యూషన్ ఫీజులు, అద్దె, రానుపోను విమాన ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులను లెక్కిస్తారు. ఈ క్రమంలో కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుతం కరెన్సీ విలువ తగ్గడం ఫీజుల పెంపుదలలా పనిచేస్తోంది. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు సెమిస్టర్ వారీగా ఫీజులు వసూలు చేస్తాయి. రూపాయి విలువ పడిపోవడంతో చివరి సెమిస్టర్ల నాటికి అప్పటికే తీసుకున్న విద్యా రుణం సరిపోవడం లేదు. విద్యార్థుల ఖర్చులు పెరగడంతో మిగిలిన ఫీజులను భరించడానికి వారి తల్లిదండ్రులు అదనపు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఒకే డిగ్రీ కోసం రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక కోర్సులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రూపాయి–డాలర్ మారకపు రేటులో చిన్నపాటి తగ్గుదల కూడా నాలుగైదేళ్లలో అదనంగా పెరిగే లక్షల రూపాయలను అదనంగా చెల్లించాల్సి వస్తోంది. గ్రేడ్లపై ప్రభావం.. భారతీయ విద్యార్థుల కష్టాలు వారి గ్రేడ్లలో ప్రతిబింబిస్తున్నాయి. డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు భోజనం మానేస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు ఒకే గదిలో ఇరుక్కుని ఉంటున్నారు. నిరంతరం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో వారు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల గురించే కాకుండా, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. వలస, పని వీసాల నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడంతో హెచ్–1బీ వీసా వ్యవస్థ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్పై అనిశ్చితి ఏర్పడింది. భవిష్యత్ గందరగోళంగా మారింది. డిస్కౌంట్లో దొరికిన ఆహారం తినే... ‘‘విదేశాల్లో చదువుకునే వారందరూ సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు కాదు. స్కాలర్షిప్లపై చదువుకుంటున్న వారున్నారు. పిల్లల డిగ్రీల కోసం ఇళ్లను తాకట్టు పెట్టిన తల్లిదండ్రులూ ఉన్నారు. నా మాస్టర్స్ కోసం బడ్జెట్ వేసుకునేటప్పుడు రూపాయి అంశాన్ని నేను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ నేను లండన్ వెళ్లాక అర్థమైంది. అప్పుడు అమెరికన్ డాలర్ విలువ రూ.85 ఉంది. నేను తిరిగొచ్చేసరికి రూ. 93కి పెరిగింది. లండన్లో నేను చాలాసార్లు యాప్ల్లో డిస్కౌంట్లో దొరికిన ఆహారం తెచ్చుకునే కడుపు నింపుకున్నాను. యూకేలో ఉన్నా, అమెరికాలో చదువుతున్నా.. ఇంటి నుంచి పంపిన డబ్బును సరిపోయేలా వాడుకోవాలనే ఆందోళన ఉంటుంది. ఇది విద్యార్థుల గ్రేడ్లపై ప్రభావం చూపిస్తుంది’’అని యూకేలో చదువుకొని వచ్చిన థానేకు చెందిన మాన్వి కోలి చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాప్ల దా‘రుణాలు’... ట్రాప్లో పడితే అంతే!
రమేష్ నెలవేతనం రూ.12,000. కానీ, తను కట్టాల్సిన ఈఎంఐ రూ.46,700. మరి ఎలా చెల్లిస్తాడు? ఇదేమైనా సాధ్యమయ్యే పనేనా? వాస్తవానికి రమేష్ ఏ నూటికో వెయ్యికో ఒక్క కేసు కాదు. తక్కువ, మధ్యాదాయ వర్గాల్లో ఇపుడు ఎక్కువ మంది ఇంచుమించు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. డిజిటలైజేషన్ వల్ల ఎన్నో లాభాలున్నట్లే నష్టాలూ ఉన్నాయి. వాటి ప్రతిఫలమే ఈ రుణాల ఊబి. ఎందుకంటే ఒకప్పుడు రుణాలు కావాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే తప్ప వచ్చేది కాదు. ఇప్పుడైతే రుణ దాతలే ‘లోన్ కావాలా?’ అని ఫోన్లు చేసి అడగటమే కాక... మెయిల్స్, మెసేజీలతో హోరెత్తిస్తున్నారు. ఏదో ఒక బలహీన క్షణంలో అవసరాల్ని బేరీజు వేసుకోకుండా ఓకే బటన్ నొక్కేస్తే చాలు. నిమిషాల్లోనే కోరుకున్నంత రుణం బ్యాంక్ ఖాతాలలో వచ్చిపడుతోంది. తీర్చే స్థోమత ఉందా? లేదా అన్న పట్టింపు కూడా ఈ డిజిటల్ రుణదాతలకు అవసరం లేదు. పాన్, ఆధార్ ఇస్తే చాలు. నిమిషాల్లో రుణ దరఖాస్తును డిజిటల్గా ప్రాసెస్ చేసి, రుణం మంజూరు చేసేస్తున్నాయి. దీంతో ఒకే వ్యక్తి పలు యాప్ల నుంచి రుణం తీసుకోవటం సాధ్యమవుతోంది. తీరా కట్సాల్సి వచ్చినప్పుడే అసలు నొప్పి తెలుస్తోంది. ఆర్బీఐ ఇప్పటికే కఠిన నియంత్రణలు తెచ్చినా... ఈ రుణ యాప్స్ విపరీత మార్కెటింగ్కు తెరపడడం లేదు. ఇచ్చే వాడు ఏదో మార్గంలో ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు. కాకపోతే తీసుకునే వారే విచక్షణతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నెన్నో ఉదంతాలు.. → ఓ కాంట్రాక్టు కార్మికుడు 13 మంది సభ్యుల కుటుంబానికి ఏకైక ఆధారం. వైద్య అత్యవసర పరిస్థితుల్లో మార్గం తోచక.. ఆరు డిజిటల్ లోన్ యాప్స్ నుంచి అందినంత రుణం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆదాయానికి నాలుగు రెట్లు అధికంగా ఈఎంఐ కట్టలేక లబోదిబోమంటున్నాడు. → మానవ వనరుల విభాగంలో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ నెలసరి వేతనం రూ.25,000. 14 యాప్స్ నుంచి తీసుకున్న రుణాలు రూ.20 లక్షలు దాటేశాయి. → ఒక డ్రైవర్ నెలవారీ రూ.40,000 సంపాదిస్తున్నాడు. కానీ, అతడు తీర్చాల్సిన అప్పడు రూ.17 లక్షలు. ఐదు సంస్థల నుంచి ఈ రుణం తీసుకున్నాడు. → ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయితే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 20 సంస్థల నుంచి ఏకంగా రూ.37 లక్షల రుణాలు వాడేసుకున్నాడు. బ్యాంక్లు, ఫైనాన్స్ సంస్థలు, డిజిటల్ లోన్ యాప్స్ ఇలా ఏ ఆఫర్నూ అతడు వదల్లేదు. → ఒక కంపెనీకి మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా సంఘటిత, అసంఘటిత సంస్థల నుంచి రూ.1.14 కోట్ల రుణ సాయాన్ని తీసుకున్నాడు. → నేడు ఈ తరహా రుణమిచ్చే, పుచ్చుకునే సంస్కృతి బలంగా విస్తరిస్తుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలియకుండానే ట్రాప్లోకి.. → అత్యవసర వైద్యం, స్కూల్ ఫీజు చెల్లించాల్సిన గడువు సమీపించడం, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు బకాయి గడువు మించిపోతుండడం, చివరికి స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి బయటపడేందుకు సైతం యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. → సంప్రదాయ బ్యాంక్లు, టాప్ టైర్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) రుణ దరఖాస్తులను ఆసాంతం విశ్లేషించిన తర్వాతే రుణ మంజూరును నిర్ణయిస్తుంటాయి. → కానీ, నడమంత్రపు సిరిని కోరుకుంటున్న లోన్ యాప్స్ మాత్రం సంప్రదాయ రక్షణ విధానాలను బైపాస్ చేస్తూ చిటికెలో రుణాలకు ఒకే చెబుతున్నాయి. తద్వారా మార్కెట్ విస్తరణే వాటి వ్యాపార మంత్రంగా మారిపోయింది. → పాన్ నంబర్తో ఎలాంటి తనఖా అవసరం లేకుండానే ఐదు నిమిషాల్లోపే రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నాయి. → దీంతో అవసరంలో ఉన్న వారు, మరో మార్గం లేదన్నట్టు మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా శక్తికి మించి రుణాలను తీసుకుంటున్నారు. → తొలుత రూ.1,000 లేదా రూ.5,000తో మొదలైనా.. చివరికి రూ.లక్షలకు ఇది విస్తరిస్తోంది. చార్జీలతో బాదుడే బాదుడు → ఈ తరహా రుణాలకు అలవాటు పడ్డవారు ఇక ఆ సుడిగుండం నుంచి బయటపడడం కష్టమే. ఎందుకంటే ఇవి వసూలు చేసే చార్జీలు ఆ స్థాయిలో ఉంటున్నాయి. → ప్రాసెసింగ్ ఫీజు, ప్లాట్ఫారమ్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఇలా రకరకాల చార్జీలు లోన్ యాప్స్కు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. → సాధారణంగా ఈ రుణాలను 30 రోజుల్లోపే తీర్చేయాల్సి ఉంటుంది. లేదంటే రుణగ్రహీత కోలుకులేనంతగా మరిన్ని చార్జీల బాదుడు మొదలవుతుంది. ఈ బాదుడు నుంచి బయటపడేందుకు రుణదాతలు మరో యాప్ తలుపు తట్టి అప్పటికి గట్టెక్కేసే మార్గం వెతుక్కుంటున్నారు. అడ్డదారులు.. అడ్డగోలు విధానాలు → ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలే రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది. కనీసం పేమెంట్బ్యాంక్లు సైతం రుణాలివ్వడానికి లేదు. → కానీ, ఈ నిబంధనలను ఫిన్టెక్ కంపెనీలు బైపాస్ చేస్తున్నాయి. తాము నేరుగా రుణాలివ్వకుండా మధ్యవర్తిత్వంతో రుణగ్రహీతలపై దండెత్తుతున్నాయి. → ఒక యాప్ లేదా ఫిన్టెక్ ఒకటికి మించిన ఎన్బీఎఫ్సీలు, బ్యాంక్లతో టైఅప్ పెట్టుకుని, వాటి తరఫున రుణ వేదికగా మారుతోంది. → కస్టమర్లను ఆకర్షించడం, డేటాను విశ్లేషించడం, రుణం మంజూరు చేయించడం, దాన్ని వసూలు చేయడం తదితర పనులు చేస్తున్నాయి. → అసలు రుణం మంజూరు చేసేది బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ అయితే.. మిగిలిన పనులన్నింటినీ ఇవి కానిచ్చేస్తున్నాయి. ఆర్బీఐ పర్యవేక్షణకు దూరంగా వ్యాపార వృద్ధి కోసం దూకుడుగా వ్యవహరించడం వీటి వంతు. → ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీతో నేరుగా సంప్రదింపుల్లేకపోవడంతో రుణ గ్రహీత హక్కులకు రక్షణ లేకుండా పోతోంది. వారు బాధితులుగా మారుతున్నారు. → రూ.25,000 సంపాదించే వ్యక్తికి రూ.20 లక్షల రుణం ఎక్కడి నుంచి వస్తోంది? డెలివరీ సేవలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తికి రూ.37 లక్షల రుణాలను యాప్స్ ఎలా మంజూరు చేస్తున్నాయి? → రుణ గ్రహీత పాన్ నంబర్ ఆధారంగా రుణ చరిత్రను సమగ్రంగా పరిశీలించి కదా అర్హతను తేల్చాలి? కానీ వాస్తవంలో ఇవేవీ లేకుండా ఒకటికి మించిన యాప్లు ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఎలా వసూలు చేసుకోవాలో వాటికి తెలుసు గనుక.బాదుడు ఇలా..రుణం మొత్తం రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు రూ.800 ప్లాట్ఫారమ్ చార్జీలు రూ.300 చేతికి వచ్చేది రూ.8900 14 రోజుల తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.10,500→ చాలా రుణ యాప్స్ 30–40 శాతం వడ్డీ అంటూ ఊదరగొడుతుంటాయి. → కానీ, వాస్తవంగా రోజుకు 1% చొప్పున వసూలు చేస్తుంటాయి. అంటే వార్షిక వడ్డీ 365%. → ఈ ప్రకారం.. రూ.10,000 రుణానికి వారంలో రూ.10,700 చెల్లించాల్సి ఉంటుంది. → పెనాల్టీలు, ఆలస్యపు రుసుములు అదనం. → రూ.10,000 రుణానికి రూ.500 (10 శాతం) ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటున్నవీ ఉన్నాయి. ఎంతో వ్యత్యాసం రుణం రకం వార్షిక వడ్డీ రేటు(%) గృహ రుణం 8–10 వ్యక్తిగత రుణం 12–18 క్రెడిట్ కార్డు 36–42 డిజిటల్ లోన్ యాప్స్ 60– 365నట్లు బిగిస్తున్న ఆర్బీఐ → రుణ యాప్స్ అడ్డగోలు వ్యవహారాలు తెలియడంతో ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. → రుణానికి సంబంధించి కీలక సమాచార నివేదికను (కేఎఫ్ఎస్) రుణ గ్రహీతకు ఇవ్వాల్సిందేనని తేలి్చంది. → రుణ గ్రహీత కాంటాక్టులు, ఫైల్స్ యాక్సెస్ను కట్టడి చేసింది. → రుణాలను ఇస్తున్న బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. → కేంద్రం, దర్యాప్తు సంస్థలు చట్టవిరుద్ధమైన యాప్స్ను బ్లాక్ చేయించాయి. → అయినప్పటికీ కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. రుణ గ్రహీతలు విచక్షణతో వ్యవహరిస్తేనే బయటపడగలుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎక్కువే → ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిజిటల్ లెండింగ్ యాప్లకు గ్రోత్ సెంటర్లుగా మారాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. → స్మార్ట్ఫోన్ల వినియోగం అధికంగా ఉండడం, గిగ్ ఎకానమీ (తాత్కాలిక పనులతో కూడిన ఉపాధి అవకాశాలు) విస్తరిస్తుండడం, వినియోగ ధోరణి కొత్త పుంతలు తొక్కుతుండడం, స్టాక్ ట్రేడింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇలా ఎన్నో కారణాలున్నాయి. → ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో లోన్ యాప్స్ విస్తరణ రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. దాంతో మనదగ్గర బాధితులు ఎక్కువే. ఇవి డేంజర్ బెల్స్.. → ఆదాయంలో రుణ వాయిదాలు 40 శాతం మించడం. → ఒకే సమయంలో రుణాలు మూడుకు మించడం. → ఒక రుణం నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని తీసుకోవడం. → రుణ విషయాలను రహస్యంగా ఉంచడం. విద్యావంతులదీ అదే దారి... → యాప్స్ ద్వారా ఎడాపెడా రుణాలు తీసుకుంటున్న వారిలో అందరూ పేదవారే అనుకోవటానికి లేదు. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు సైతం ఉంటుండడం ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోంది. → కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికులు తదితర తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగానే ఈ లోన్ యాప్ ట్రాప్లో పడుతున్నారు. → వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలను ఇష్టారీతిన వాడేసిన విద్యావంతులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్టాక్ మార్కెట్ డే ట్రేడర్లు, యువ వేతన జీవులు, క్రిప్టో ఇన్వెస్టర్లు సైతం ట్రేడింగ్లో చేతులు కాల్చుకుని.. లోన్ యాప్స్ను ఆశ్రయిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. వసూళ్లలోనూ అరాచకం.. → డిజిటల్ యాప్ కదా రుణం తీసుకుని కట్టకపోయినా ఏం కాదులే? అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. వసూలు కోసం అవి అనుసరించే మార్గాలు తెలిస్తే వళ్లు జలదరిస్తుంది. → ఊళ్లల్లో వడ్డీ వ్యాపారుల గురించి వినే ఉంటారు. 5–10 రూపాయల వడ్డీతో రోజువారీ/నెలవారీ వసూలు చేసుకునే వారిని చూస్తే అప్పు తీసుకున్న వారు వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు సంఘటిత ముసుగులోని లెండింగ్ యాప్లు, ఫిన్టెక్లు వీరిని మించి వ్యవహరిస్తున్నాయి. . → ఈ యాప్స్కు ఫోన్లోని కాంటాక్టులు, కాల్ లాగ్, ఫొటో గ్యాలరీలు, డివైజ్ను మానిటర్ చేసే రైట్స్ను రుణ గ్రహీతలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. → రుణాన్ని చెల్లించనప్పుడు రుణ గ్రహీత బంధువులకు ఫోన్ కాల్స్ వేధింపులు ఆరంభమవుతాయి. అంతేకాదు అతడు/ఆమె పనిచేసే యాజమాన్యానికీ మెస్సేజ్లు వెళతాయి. రుణ గ్రహీత ఫోన్లోని ఫొటోలను మారి్ఫంగ్ చేసి వాటి ఆధారంగా బెదిరింపులూ ఎదురుకావొచ్చు. → వాట్సాప్ గ్రూపుల్లోనూ డీఫేమ్ చేస్తాయి. ఇలా వీలైన ప్రతీ మార్గంలో రుణ గ్రహీతలను వెంటాడి, వేధించి వసూలు చేసుకోవడమే వాటికి తెలిసిన విద్య. -
భారీ రాబడులకు.. సిఫ్ సఫారీ!
ఈక్విటీల్లో మెరుగైన రాబడులకు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కని మార్గం. ఈక్విటీలకు మించి అధిక రాబడులు, ప్రత్యామ్నాయ సాధనాల్లో పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వంటి సర్వీసులు (పీఎంఎస్) సైతం ఉన్నాయి. కానీ, ఈక్విటీల్లోనే అధిక రిస్క్ తో మరింత రాబడి కోరుకునే వారి పరిస్థితి ఏంటి? ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) సాధనం ఇటీవలే మార్కెట్ ప్రవేశం చేసింది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్–హెడ్జ్ ఫండ్ తరహా పెట్టుబడులకు మధ్య వారధిగా దీన్ని రూపొందించారు. కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం వచ్చిన ఈ సాధనంతో సంపద సృష్టి సాధ్యమేనా..? బడా ఇన్వెస్టర్లు సైతం ఎందుకు ‘సిఫ్’పై మనసు పారేసుకుంటున్నారు? ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసం..స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)లు సాధారణ మ్యూచువల్ ఫండ్స్ మాదిరి కావు. డెరివేటివ్స్ మార్కెట్లో (ఫ్యూచర్స్–ఆప్షన్స్) ఇవి లాంగ్–షార్ట్ వ్యూహాలను అనుసరిస్తాయి. డెట్ సెక్యూరిటీలు, ఈక్విటీ–డెట్ కలిసిన హైబ్రిడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అసెట్ అలోకేషన్ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుంటాయి. అంటే వివిధ సాధనాల మధ్య కేటాయింపులను ఎప్పటికప్పుడు పరిస్థితులు, అవకాశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాయి. రంగాల వారీ పెట్టుబడులను వ్యూహాత్మకంగా మారుస్తుంటాయి. హెడ్జింగ్ విధానాలను కూడా అనుసరిస్తాయి. అంటే పెట్టుబడుల విలువ భారీగా పడిపోకుండా వ్యూహాలను ఆచరణలో పెడతాయి.తేడా ఏంటి? → సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్లు ర్యాలీ చేసినప్పుడే రాబడులను ఇవ్వగలవు. → సిఫ్లు మాత్రం మార్కెట్లు ఆటుపోట్లు, అస్థిరతలను చవిచూస్తున్న తరుణంలో లేదా మార్కెట్లు పడిపోతున్న తరుణంలోనూ షార్ట్సెల్లింగ్ విధానాలు, హెడ్జింగ్ వ్యూహాలతో రాబడులను ఇవ్వగలవు. → ఉదాహరణకు ఒక లాంగ్–షార్ట్ సిఫ్ 75–80 శాతం పెట్టుబడులను క్యాష్ మార్కెట్లో లాంగ్ పొజిషన్లకు కేటాయించి.. 20–25 శాతాన్ని డెరివేటివ్స్లో షార్ట్ పొజిషన్లపై పెట్టుబడిగా పెడుతుంది. → రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలమైన ప్రత్యా మ్నాయ పెట్టుబడి సాధనంగా సిఫ్లను నిపుణులు అభివర్ణిస్తున్నారు.రాబడికి గ్యారంటీ లేదు..? రిస్కూ ఎక్కువే! → సిఫ్ల్లోనూ రిస్క్ చాలా ఎక్కువ. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. → ఎందుకంటే సిఫ్లు డెరివేటివ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పొజిషన్లలో తరచూ మార్పులు చేస్తుంటాయి. → ఫండ్ మేనేజర్ ప్రతిభ, రిస్క్ సామర్థ్యాలు, మార్కెట్ సైకిల్స్, నిర్వహణలో క్రమశిక్షణ ఇలాంటి అంశాలెన్నో రాబడులను నిర్ణయిస్తుంటాయి. → నిర్వహణ సరిగ్గాలేని సిఫ్లలో రాబడి తక్కువే ఉండొచ్చు. అదే సమయంలో నాణ్యమైన సిఫ్లు ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించగలవు. → సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్/ఫ్లెక్సీ/మల్టీక్యాప్)లో రిస్క్ సిఫ్లతో పోల్చితే తక్కువే. కొంత రాబడుల పరంగానూ స్థిరత్వం ఉంటుంది. → ఎందుకంటే నాణ్యమైన కంపెనీలు, చక్కని యాజమాన్యం, ఆయా రంగాల్లో వ్యాపార అవకాశాల ఆధారంగా దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. → సిఫ్లు దూకుడుగా ఏక కాలంలో ఒకటికి మించిన వ్యూహాలను అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్ ఎక్కువే. → కానీ, దీర్ఘకాలంలో సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే సిఫ్లు 3–8% మేర అధిక రాబడులను ఇవ్వగలవన్నది విశ్లేషకుల అంచనా. → సగటున 6 శాతం అధిక రాబడి వచ్చినా దీర్ఘకాలంలో సంపద సృష్టి పరంగా చెప్పుకోతగ్గంత వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణ: రూ.10 లక్షలు ఏటా 12 శాతం చొప్పున పెరిగితే 10 ఏళ్లలో రూ.31 లక్షలు అవుతుంది. అదే ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ పోతే పదేళ్లకు రూ.52 లక్షలు అవుతుంది.బడా ఇన్వెస్టర్లలో ఆసక్తి → కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది. → బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్లపై అమితాసక్తి చూపిస్తున్నారు. → ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. → రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి. → ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధా→ కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది. → బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్లపై అమితాసక్తి చూపిస్తున్నారు. → ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. → రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి. → ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధానం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్లాంటివే మెరుగ్గా రాణించగలవు. → పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్లు పాటిస్తాయి. → పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. → కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.నం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్లాంటివే మెరుగ్గా రాణించగలవు. → పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్లు పాటిస్తాయి. → పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. → కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.లిక్విడిటీ ఎక్కువే.. → సిఫ్లలో లిక్విడిటీ ఎక్కువ. అయినప్పటికీ, వీటిలో షార్ట్–టర్మ్ ట్రేడింగ్ను నిరుత్సాహపరచడానికి చాలా ఫండ్స్ మొదటి 6 నెలలు లేదా ఏడాదిలోపు పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ‘ఎగ్జిట్ లోడ్’ విధిస్తున్నాయి. → ఏఐఎఫ్లలో పెట్టుబడి కొన్నేళ్ల పాటు లాకిన్ అవుతుంది. → సిఫ్లలో రోజువారీ, వారం, క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. → కానీ, కనీసం ఐదేళ్లపాటు అయినా సిఫ్లలో పెట్టుబడి కొనసాగించినప్పుడే మెరుగైన రాబడులను చూడగలరన్నది విశ్లేషకుల అభిప్రాయం. → ప్రస్తుతానికి మార్కెట్లో 9 సిఫ్లే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని సంఖ్యలో, మరిన్ని వ్యూహాలతో అందుబాటులోకి రానున్నాయి. → మెరుగైన రిస్క్ నిర్వహణ, వైవిధ్యంతో కూడిన సిఫ్లను దీర్ఘకాలంలో కాస్త అదనపు రాబడికి మార్గంగా భావించొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. → అంతిమంగా రాబడులు అన్నవి ఇన్వెస్టర్ల ధోరణి, క్రమశిక్షణపైనా ఆధారపడి ఉంటాయన్నది విస్మరించొచ్చు. రాబడులు ? సిఫ్లో రాబడులకు దీర్ఘకాల చరిత్ర లేదు. 2024లో సెబీ ఈ విభాగానికి పచ్చజెండా ఊపగా.. మొదటి సిఫ్.. క్వాంట్ లాంగ్–షార్ట్ ఫండ్ 2025 సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చింది. ఎంత మేర ఆశించొచ్చు? ఫండ్ నిపుణుల అంచనాలు.. స్ట్రాటజీ వార్షిక రాబడి (విధానం) అంచనా (%లో) హైబ్రిడ్ లాంగ్–షార్ట్ సిఫ్ 10–16 ఈక్విటీ లాంగ్–షార్ట్ సిఫ్ 14–22 టాక్టికల్/సెక్టార్ రొటేషన్ సిఫ్ 18 డెట్ లాంగ్–షార్ట్ సిఫ్ 8–12– సాక్షి, వెల్త్ -
శునకం.. తెచ్చె కనకం!
ఏంటి నమ్మశక్యంగా లేదా? కొన్ని విషయాలు అలాగే ఉంటాయ్ మరి. కానీ నమ్మాల్సిందే. ఓవైపు వీధికుక్కలు.. అవి పెడుతున్న పాట్లపై సుప్రీంకోర్టు కన్నెర్రజేస్తుంటే, మరోవైపు పెంపుడు శునకాలు కొందరికి కనకవర్షం కురిపిస్తున్నాయ్. వాటి ఆలనాపాలనా చూడటం ద్వారా బోలెడంత ఆదాయం సంపాదించిపెట్టే చాన్స్ ఇస్తున్నాయ్. కానీ ఇక్కడ కాదండోయ్.. అమెరికాలో ప్రస్తుతం అక్కడ ’డాగ్ నానీ’లకు డిమాండ్ మామూలుగా లేదు. ధనిక కుటుంబాలకు చెందినవారు తమ పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ప్రొఫెషనల్ కేర్టేకర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం అధికమొత్తంలో జీతాలు కూడా చెల్లిస్తున్నారు. అమెరికాలో ఫుల్టైమ్ డాగ్ నానీలు నెలకు 10వేల డాలర్ల నుంచి రూ.24వేల డాలర్లకుపైగా (భారత కరెన్సీలో దాదాపు రూ.9.5 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు) సంపాదిస్తున్నారు. అంటే ఏడాదికి గరిష్టంగా రూ.2.76 కోట్లు. వింటేనే బాప్రే అనిపిస్తోంది కదూ? – సాక్షి, సెంట్రల్ డెస్క్ ఎందుకు ఇంత డిమాండ్? కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడపడంతో వాటితో అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను చాలా బాధ్యతగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమైంది. పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించి లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.డాగ్ నానీల బాధ్యతలేంటి? డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు.. శారీరక దృఢత్వానికి తగిన వ్యాయామాలు చేయించడం, ప్రత్యేకంగా రూపొందించిన ఆహారాన్ని అందించడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం, యజమానులు ఇంట్లో లేనప్పుడు కుక్కలు ఒంటరితనానికి గురికాకుండా 24 గంటలూ వాటిని కనిపెట్టుకుని ఉండటం వంటి బాధ్యతలు ఉంటాయి.మరి అంత చెల్లిస్తున్నప్పుడు ఇంత చేయాల్సిందే కదా? అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేని వారి పరిస్థితి ఏమిటి అంటే.. అలాంటి మధ్యతరగతి ప్రజల కోసం అమెరికాలో ’ది పెట్ నానీ’, ’ది పా నానీ’ వంటి ప్రొఫెషనల్ ఏజెన్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి గంటల ప్రాతిపదికన లేదా రాత్రి సమయాల్లో కుక్కలను చూసుకోవడానికి నిపుణులను పంపుతాయి. అలాగే, ’రోవర్’, ’పెట్ బ్యాకర్’ వంటి మొబైల్ యాప్ల ద్వారా కూడా స్థానికంగా ఉండే డాగ్ సిట్టర్లను బుక్ చేసుకోవచ్చు. ఎంత చదువు చదివితే ఇంత శాలరీ వస్తుంది.. ఇదేదో బాగుంది..అమెరికా పోదాం చలో అనుకునేవారు కాస్త ఆగాల్సిందే.. ఎందుకంటే, అమెరికాలో డాగ్ నానీగా స్థిరపడటం అంత సులువు కాదు. ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ పెట్ సిట్టర్స్’ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే పెంపుడు జంతువులకు ప్రథమ చికిత్స, వాటి హెల్త్ ఇన్సూరెన్స్ నిర్వహణ, క్లీన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రికార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం. -
ఏఐతో కంబైన్డ్ స్టడీ!
చదువుకోవడానికి పక్కా టైంటేబుల్ ఉంటే సగం విజయం సాధించినట్లే. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా, ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాసైపోవచ్చు. –సాక్షి స్పెషల్ డెస్క్పోమోడోరో టెక్నిక్ గంటల తరబడి బ్రేక్ లేకుండా చదివితే బుర్రకెక్కదు. అందుకే పోమోడోరో టెక్కిక్ అనే ఈ స్మార్ట్ పద్ధతిని పాటించండి. ⇒ 25 నిమిషాలు శ్రద్ధగా చదవండి. ⇒ 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి (నడవడం, నీళ్లు తాగడం). ⇒ ఇలా 4 సార్లు అయ్యాక, 15–30 నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోండి. ⇒ ఇతర విషయాలను దూరం పెట్టండి. చదువుకునే సమయంలో ఫోన్ సైలెంట్లో పెట్టి మీకు దూరంగా ఉంచండి. సోషల్ మీడియా నోటిఫికేషన్ మీ సమయాన్ని వృథా చేయకుండా చూసుకోండి. ఎలా చదవాలి? ముందుగా మీ సిలబస్ను ఒక పేపర్పై రాసి, ఏఐ టూల్స్ సాయంతో టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. కళ్ల ముందు స్పష్టమైన ప్లాన్ ఉంటే అయోమయం పోతుంది. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోతే, ఏఐ టూల్స్ వాటంతటవే మీ కాల ప్రణాళికను సర్దుబాటు చేస్తాయి. చదువును సులువు చేసే 4 ఏఐ టూల్స్ 1. షోవెల్ యాప్ (స్టడీ ప్లానర్): మీ కాలేజీ సమయాలు, నిద్ర, ఇతర పనులు, సబ్జెక్ట్ డెడ్లైన్ వివరాలను ఇందులో నింపితే మీకు మిగిలిన ఖాళీ సమయాన్ని లెక్కించి ఒక మంచి టైమ్ టేబుల్ ఇస్తుంది. 2. నోషన్ ఏఐ (ఆల్ ఇన్ వ¯న్ ఆర్గనైజర్): గజిబిజిగా ఉన్న సిలబస్ లిస్ట్ను ఇది ఒక చక్కటి పట్టికగా మార్చేస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ట్రాక్ చేయడానికి ఇది మంచి టూల్. 3. చాట్జీపీటీ (పర్సనల్ స్టడీ కోచ్): మీ అవసరానికి తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తుంది. ఉదాహరణకు: ‘‘నాకు వచ్చే నెల మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, రోజుకు 2 గంటలే చదవగలను, ప్లాన్ ఇవ్వు’’అని అడిగితే క్షణాల్లో వీక్లీ ప్లాన్ రెడీ చేసి ఇస్తుంది. 4. టుడూఇస్ట్ (స్మార్ట్ టాస్క్ మేనేజర్): ‘‘ఈ వారం హిస్టరీ ప్రాజెక్ట్ చేయాలి, రోజూ సై¯న్స్ రివిజన్ చేయాలి’’అని మీరు సాధారణంగా టైప్ చేస్తే, ఈ ఏఐ వాటి డెడ్లై¯న్ను గుర్తించి క్యాలెండర్లో ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. -
తులసి గబ్బార్డ్ ఎగ్జిట్.. వైట్హౌస్లో ఏం జరిగింది?
అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్హౌస్ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. భారతీయ మూలాలు లేకున్నా.. తులసి గబ్బార్డ్(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్ గబ్బర్డ్ సమోవన్-యూరోపియన్ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్ గబ్బార్డ్ అమెరికన్. కానీ ఆమె తల్లి క్యారెల్ గబ్బార్డ్కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. ఏం జరిగి ఉండొచ్చు?అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ట్రంప్.. పొగిడారు కదా!ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్హౌస్ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్మీడియాలో తుల్సీ గబ్బార్డ్ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.తులసి గబ్బార్డ్ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. -
అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే!
ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూసేవి.. ఇప్పుడు మాత్రం మెల్లగా తమవైపు తిరుగుతున్నాయని చైనా నమ్ముతోంది. అమెరికా వేసిన ఆర్థిక దెబ్బలు, సాంకేతిక ఆంక్షలు, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని మరింత బలపడిపోయామని బీజింగ్ భావిస్తోంది. అంతేకాదు.. “ఇప్పటి నుంచి ఆటను నడిపేది మేమే” అనే సంకేతాలు కూడా పంపిస్తోంది. ట్రంప్ పర్యటన తర్వాత మారిన చైనా వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.రాజకీయ విశ్లేషకుడు ఆర్నాడ్ బెర్ట్రాండ్ వెల్లడించిన వివరాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఒక పరిశోధనా సంస్థ తయారుచేసిన నివేదిక ఆధారంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా-చైనా సహజీవనం దిశగా ప్రపంచంలో జరుగుతున్న మహా మార్పు” అనే అంశంపై రూపొందిన ఈ నివేదికలో.. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న భారీ మార్పులను చైనా ఎలా చూస్తోందో వివరించారు.ఈ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు అమెరికాను “అడ్డుకోలేని మహాశక్తి”గా చూడటం లేదట. గత కొన్నేళ్లుగా అమెరికా చేసిన ఆర్థిక ఒత్తిడులు, దిగుమతి సుంకాలు, సాంకేతిక ఆంక్షలు, ప్రపంచ దేశాలను చైనా నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగినా కూడా చైనా ఎదుగుదలేం ఆగలేదని బీజింగ్ బలంగా భావిస్తోంది. అందుకే “అమెరికా తన బలమైన దెబ్బ ఇప్పటికే కొట్టేసింది.. ఇక చైనాను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు” అనే నమ్మకం అక్కడ బలపడిందని చెబుతున్నారు.ఈ ఆలోచనకు చైనా మాజీ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన “దీర్ఘకాల పోరాట సిద్ధాంతం”ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. మొదట బలహీనంగా ఉన్న దేశం శక్తివంతమైన దేశం ఒత్తిడిని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ చివరకు ప్రత్యర్థిని మించిపోతుంది. ప్రస్తుతం చైనా అదే దశలో ఉందని ఆ నివేదిక చెబుతోంది.బలప్రయోగం కాదు, కానీ..ప్రపంచ తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు, పర్యావరణ హిత ఇంధన సాంకేతికత, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో చైనా వేగంగా ఆధిపత్యం పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు.. భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే రంగాల్లో కూడా చైనా ముందుకు దూసుకెళ్తోందన్న మాట. ఇంకో కీలక అంశం ఏమిటంటే.. ప్రపంచ క్రమం కూడా మారుతోందని చైనా భావిస్తోంది. ఒకప్పుడు అమెరికా చుట్టూ తిరిగిన ప్రపంచం.. ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుందని, అందులో తామే ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నామని బీజింగ్ అంచనా వేస్తోంది. అయితే ఈ మార్పు యుద్ధాల ద్వారా కాదని.. ఆర్థిక బలం, పరిశ్రమల శక్తి, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్య సంబంధాల ద్వారా వస్తోందని నివేదిక చెబుతోంది. అంటే చైనా ప్రపంచాన్ని బలవంతంగా జయించాలని కాదు.. ప్రపంచ దేశాలు స్వయంగా చైనాపై ఆధారపడే పరిస్థితి వస్తోందని భావిస్తోందన్నమాట.ఇప్పటివరకు చైనా వ్యూహాత్మక పత్రాల్లో కనిపించిన “అమెరికా భయం” ఈసారి కనిపించలేదని బెర్ట్రాండ్ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికాను పెద్ద ముప్పుగా చిత్రీకరించిన చైనా.. ఇప్పుడు మాత్రం దాన్ని మేనేజ్ చేయగలిగే అంశంగా మాత్రమే చూస్తోందట. అంటే అమెరికా ఇబ్బందులు కలిగించగలదు కానీ.. చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేదనే నమ్మకం అక్కడ పెరిగిపోయిందన్నమాట.తగ్గేదే లే!అయితే చైనా నేరుగా యుద్ధ దారిలో వెళ్లాలని అనుకోవడం లేదని కూడా ఈ నివేదిక చెబుతోంది. అమెరికాతో పరస్పర గౌరవం, సహజీవనం అవసరమని సూచించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలు జరగకుండా సంభాషణలు కొనసాగించాలని, కృత్రిమ మేధస్సు నియంత్రణ, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని సూచించింది. అదేసమయంలో తైవాన్ విషయంలో మాత్రం చైనా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తైవాన్ చివరకు చైనాతో కలవాల్సిందేనని, అమెరికా అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ‘తైవాన్ సుదూర’ వ్యాఖ్య చేసి ఉంటాడనే విశ్లేషణ నడుస్తోంది. మొత్తంగా ఈ నివేదిక ద్వారా.. ప్రపంచ భవిష్యత్తు నాయకత్వం తమదేనని చైనా ఇప్పుడు గట్టిగా నమ్ముతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని.. తమ ప్రభావం పెరుగుతుందని బీజింగ్ భావిస్తోంది. అయితే అది యుద్ధాలతో కాదు.. ఆర్థిక బలం, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యాలతో సాధ్యమవుతుందని చైనా అంచనా వేస్తోంది. -
మండే ఎండల్లో ముంచెత్తే వానలు?
దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్న వేళ ఉత్తరభారత ప్రజలకు సూర్యప్రతాపం నుంచి భారీ ఉపశమనం కల్పించేందుకు అనూహ్యంగా ఉత్తరభారతంపై భారీ వర్షాలు కురిపించేందుకు పాశ్చాత్య భంగం(వెస్టర్న్ డిస్టబెన్సెస్) సంసిద్ధమవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాశ్చాత్య భంగం తాలూకు గాలుల తాజా ఉపగ్రహ చిత్రాలను వాతావరణ శాఖ విడుదలచేసింది. వడగాల్పులు, ఉక్కపోతతో ఉత్తరభారత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో చలికాలంలో మంచు, వర్షాలకు కారణమయ్యే పాశ్చాత్య భంగం తాలూకు గాలులు హఠాత్తుగా భారత్ దిశగా వస్తుండటంతో ఎండాకాల వేడిమి జనాలకు ఊరట లభించనుంది. మే 21వ తేదీన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల్లో పాశ్చాత్య భంగం సంబంధిత గాలులతో మేఘాలు, తుపానుకు ముందు కన్పించే వాతావరణం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, వాయవ్య భారత గగనతలాలపై అలుముకున్నట్లు కన్పించింది. తెల్లని దట్టమైన మేఘాలు హిమాలయ పర్వతాల వైపు, ఉత్తరభారత మైదానాల దిశగా పయనం మొదలెట్టినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అరేబియా సముద్రం మీద సైతం తేమతో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. ఈశాన్య భారతం మీద, బంగాళాఖాతం మీద సైతం మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పాశ్చాత్య భంగం లేదా పశ్చిమ విక్షోభం అనేది భారత్ను చుట్టుముడితే మరింతగా తేమను మోసుకొచ్చి ఉత్తరభారతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన, ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఉత్తర పాకిస్తాన్, జమ్మూకశ్మీర్లపై ఆకాశం అతిగా మేఘావృతం కావడంతో ఇక్కడి వాతావరణం హఠాత్తుగా మారుతూ అస్థిర పరిస్థితులను తీసుకురావచ్చు. ఈశాన్యభారతం మీదా మేఘాలు అతిగా కన్పిస్తుండటంతో వర్షాకాలం ప్రారంభంకాకమునుపే మెరుపులతో కూడిన వర్షాలు పడే ఆస్కారముందని నిపుణులు అభప్రాయపడ్డారు. పాశ్చాత్య భంగం ఇలాగే ఉధృతమై ముందుకు సాగితే ఉత్తరభారతంలో ముఖ్యంగా జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాల్లో వచ్చే కొద్దిరోజుల్లో వర్షాలు మొదలయ్యే వీలుంది. ధూళి తుపాన్లు, వడగండ్ల వానలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. పాశ్చాత్య భంగం మోసుకొచ్చి తేమ కారణంగా పడే వర్షాలు యావవత్ భారతదేశంలో ఎండ బాధలను పూర్తిగా తగ్గించకపోయినా ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గడానికి ఖచ్చితంగా దోహదపడతాయని నిపుణులు భరోసా ఇచ్చారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం దక్షిణప్రాంతాల్లో పెరిగిన మేఘాల సంచారం నెమ్మదిగా వర్షాకాల వాతావరణాన్ని సృష్టిస్తోంది. పాశ్చాత్య భంగం వేగంగా భారత్ను చుట్టుముడితే కనీసం ఉత్తర భారత ప్రజలకైనా ఈ ఉక్కపోత రాత్రుల నుంచి ఉపశమనం కల్గుతుంది. వడదెబ్బల భయం తగ్గుతుంది. అయితే విచ్చలవిడిగా పెరుగుతున్న కాలుష్యం, శిలాజ ఇంధనాల అతి వినియోగం, క్లోరోఫ్లోరో కార్భన్లు భారీ స్థాయిలో వెలువడటం వంటివి భారత్లో వడగాల్పులు వచ్చే అవకాశాలు ప్రతిఏటా మరింత పెంచేస్తాయని నిపుణులు హెచ్చరించారు. ఏమిటీ పాశ్చాత్య భంగం? మధ్యధరా సముద్ర ప్రాంతం, కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాల నుంచి మొదలై తూర్పు దిశగా పయనిస్తూ భారత్లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో శీతాకాలంలో వర్షాలను కురిపించే అల్పపీడన వాయు ప్రసరణ వ్యవస్థను పాశ్చాత్యభంగం లేదా పశ్చిమ విక్షోభం అని పిలుస్తారు. పశ్చిమ విక్షోభ గాలులు తేమను మోసుకొస్తూ ఉత్తరభారతంలో మరీ ముఖ్యంగా హిమాలయాల్లో శీతాకాలంలో భారీగా మంచుకురవడానికి కారణమవుతాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లోనూ వర్షాలకు ఈ పాశ్చాత్య భంగమే కారణం. భారత్లో గోధుమపంట దిగుబడినీ పశ్చిమ విక్షోభం నిర్ణయిస్తుంది. సరైన సమయంలో చుట్టుముట్టే పశ్చిమ విక్షోభంతో పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్లో గోధుమ దిగుబడి పెరుగుతుంది. శీతాకాలంలో మేఘాలు, వర్షం, హిమపాతం తెచ్చే పాశ్చాత్యభంగం ఒకరకంగా ఉత్తరభారతానికి మరో వర్షాకాలం వంటిది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏ జిల్లా హీట్ రిస్క్ ఎంత?
న్యూఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వి రాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) మనదేశంలో (1982–2022 మధ్య) 40 ఏళ్ల వాతావరణ గణాంకాలను విశ్లేషించి ఏ జిల్లా హీట్ రిస్క్ ఇండెక్స్ ఎంతో లెక్కగట్టింది. ఈ అధ్యయనం ప్రకారం..మన దేశంలోని అప్పటికి ఉన్న 734 జిల్లాలకుగాను 266 జిల్లాలు అత్యధిక వేడి ముప్పును, 151 జిల్లాలు అధిక వేడి ముప్పును ఎదుర్కొన్నాయి. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ జిల్లాల్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. అధిక వేడి ముప్పును ఎదుర్కొంటున్న తొలి పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు: ఢిల్లీ, ఆంధ్రపదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఏపీతో పోల్చితే తెలంగాణ నయం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత సీజన్లో ఎండల తీవ్రత ఏఏ జిల్లాల్లో ఎంత ఎక్కువగా ఉందో మనం చూస్తున్నాం. అయితే గత కొన్ని దశాబ్దాల వాతావరణ గణాంకాల ప్రకారం ఏఏ జిల్లాల హీట్ రిస్క్ స్కోర్ ఎంత చూస్తే... ⇒ తెలంగాణలోని 33 జిల్లాల్లో 9 జిల్లాలు (జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల) అత్యధిక’హీట్ రిస్క్ లో ఉన్నాయి. మరో 14 జిల్లాలు అధిక రిస్క్ లో, మిగతా 10 జిల్లాలు మోస్తరు వేడి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ⇒ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి 5 జిల్లాలు (ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం) అత్యధిక హీట్ రిస్క్ లో ఉంటే, మిగతా ఉమ్మడి 8 జిల్లాలు అధిక హీట్ రిస్క్ లో ఉన్నాయి. – (సాక్షి, స్పెషల్ డెస్క్ ) -
నదీజలాల్లో తగ్గిపోతున్న ఆక్సిజన్
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉప్పు గాలితో ‘ఊపిరి’ తీసుకోండి!
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం ప్రకారం ప్రపంచంలో దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడిన వారిలో అధిక శాతం మన దేశంలోనే ఉన్నారు. ముఖ్యంగా మన నగరాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రజలు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి ఉప్పుతో చేసే హాలోథెరపీ తేలికపాటి చికిత్స ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు గాలి చేసే మంచి.. ఉప్పు గదిలో కూర్చొని ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ, విశ్రాంతి తీసుకోవడమే సాల్ట్ రూమ్ హాలోథెరపీ లేదా సాల్ట్ థెరపీ. ఉప్పు గాలి శ్వాసనాళాన్ని శుభ్రపరిచి బలహీనంగా ఉన్న ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ థెరపీతో శ్వాసకోశ సమస్యలు నయంకావడంతోపాటు నిద్ర కూడా సరిగా పడుతుందని అధ్యయనంలో తేలింది. ఔషధాల తయారీలో ఉపయోగించే సోడియం క్లోరైడ్ను హాలో జనరేటర్ అనే యంత్రం సాయంతో చిన్నచిన్న రేణువులుగా మారుస్తారు. ఆ కణాలు గాలిలో తేలుతూ గది అంతటా ఆవరిస్తాయి. ఉప్పులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, మ్యూకోలైటిక్ (కఫాన్ని పలచబరిచే) గుణాలు సహజంగా ఉంటాయి. ఆ గాలిని పీల్చడం వల్ల ఉప్పు కణాలు శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని పలచగా చేసి శ్వాస తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని ఆల్టర్నేటివ్ మెడిసిన్ నిపుణులు అంటున్నారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ అధ్యయన సంస్థ ప్రపంచంలో 160కిపైగా దేశాల్లో సేవలందిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్కు అనుబంధంగా పనిచేస్తోంది. దాదాపు 12 వేల మంది పరిశోధకులు ఈ అధ్యయనాల్లో పాల్గొంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్ -
పని 'పాడ్' అవకుండా..
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం కొత్తగా ప్రైవేట్ వర్క్స్పేస్ పాడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేసేవారు, వృత్తి నిపుణులు, సుదీర్ఘ ప్రయాణాల్లో భాగంగా మధ్య మధ్య విమానా శ్రయంలో గంటల సమయం గడిపే ట్రాన్సిట్ ట్రావెలర్స్, ప్రశాంతంగా పని చేసుకునేందుకు ఈ ప్రత్యేక పాడ్స్ను ఏర్పాటు చేశారు. మియో పాడ్స్ డాట్ స్పేస్ అనే స్టార్టప్ ఈ సేవలను ప్రారంభించింది. ప్రస్తుతానికి తొలిదశలో బోర్డింగ్ గేట్ 9, గేట్ 10 సమీపంలో నాలుగు ప్రైవేట్ పాడ్స్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా బుక్ చేసుకొని వెంటనే వినియోగించుకోవచ్చు. అంతేకాదు ముందస్తుగా 7 రోజుల వరకూ రిజర్వేషన్ చేసుకొని వినియోగించుకునే సౌకర్యం కూడా కల్పించారు సౌండ్ ప్రూఫ్... సరైన వెంటిలేషన్ఈ పాడ్స్ను పూర్తి సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. శబ్ద నిరోధక వ్యవస్థ, సౌకర్యవంతమైన సీటింగ్, చార్జింగ్ పోర్టులు, వెంటిలేషన్, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. విమానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో సమావేశాలు, వీడియో కాల్స్, వ్యక్తిగత చర్చలు లేదా కార్యాలయ పనులకు ఎటువంటి అంతరాయాలు, ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ఈ సందర్భంగా మియో పాడ్స్ వ్యవస్థాపకుడు వికాస్ సెఠియా మాట్లాడుతూ ప్రయాణ సమయాన్ని కూడా ఉత్పాదకంగా మార్చాలనే ఆలోచనతో ఈ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రారంభ ట్రయల్స్ సమయంలోనే 2,000 మందికి పైగా ప్రయాణి కులు స్కాన్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 30 నిమిషాల వినియోగానికి రూ.299 (జీఎస్టీ కలిపి) చార్జ్ చేస్తున్నారు. ఈ సేవలను తర్వాత ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో కూడా విస్తరించే ప్రణాళికలో సంస్థ ఉన్నట్టు సమాచారం.విశ్రాంతితో నిద్రపోవచ్చు ఇటీవలే ట్రాన్సిట్ ప్రయాణికులకు విశ్రాంతి సౌకర్యాన్ని అందించేందుకు రెస్టింగ్ పాడ్లను ప్రారంభించారు. విమానాల మధ్య విరామం కోరుకునే వారికి, జేపాడ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ పాడ్లు అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయం లోపల ఏర్పాటు చేసిన ఈ రెస్టింగ్ పాడ్లు, టెర్మినల్లోనే ఉండడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి విమానాశ్రయం బయటకు వెళ్లడం లేదా హోటల్ గదిని బుక్ చేసుకోవడం ఇష్టం లేని, సుదీర్ఘ లేఓవర్లు ఉన్న ప్రయాణికులకు ఉపయుక్తంగా మారాయి. ఇందులో ఇద్దరు చొప్పున ఉండేందుకు ఆరు ప్రైవేట్ పాడ్లు, ప్రత్యేకంగా మహిళల కోసం ఎనిమిది పాడ్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాడ్ ఉంది. విమాన టికెట్లు లేని సందర్శకులు కూడా పాడ్ను బుక్ చేసుకునే అవకాశం అందిస్తుండడం విశేషం. గంటకు రూ.500 ఆపైన ధరలో ఇవి అందుబాటులో ఉన్నాయి. -
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్ఫామ్ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్వర్క్లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. -
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
‘‘నేనేం రాజకీయాల్లో లేను. నాకంటే వయసులో చిన్నోడు సీఎం అయ్యాడని నేనెందుకు కుళ్లుకుంటా?’’ అంటూ సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించడం ఇప్పుడు తమిళనాట మాత్రమే కాదు దక్షిణాదిలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఓడిపోయిన మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం.. గొప్ప విజయంతో సీఎం అయిన విజయ్ను, అదీ పెద్ద స్టార్గా ఉండి కూడా మర్యాదకైనా పలకరించకపోవడంపై రజనీ అభిమానుల నుంచే పెదవి విరుపులు కనిపించాయి. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చిందనేది భోగట్టా. అయితే.. రజనీకాంత్ మాట్లాడిన కొన్నిగంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో విజయ్ ఫ్యాన్ అయిన తన కొడుక్కి రజనీ ఫ్యాన్ అయిన ఓ తండ్రి హితబోధ చేస్తాడట. అది ‘బాషా’ రేంజ్ ఎలివేషన్ కావడంతో ఆ కొడుకు కన్నీరు పెట్టాడంట. విజయ్ అభిమాని చేసిన పోస్ట్ అంటూ అది హల్ చల్కావడంతో.. ‘‘రజనీ ది గ్రేట్’’ అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే అదంతా అభిమానులను శాంతింపజేయడం.. తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం రజనీ తరఫున జరిగిన పీఆర్ స్టంట్ అంటూ ఓ బాంబ్ పేలడం ఈ ఎపిసోడ్ను మరో మలుపు తిప్పింది. సినీ ప్రపంచంలో అభిమానుల మధ్య పోటీలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, రజనీ–విజయ్ విషయంలో “ఫ్యాన్ వార్ చరిత్ర” కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తొలినాళ్లలో ఇద్దరూ వ్యక్తిగతంగా స్నేహపూర్వకంగా కనిపించినా.. అభిమానుల మధ్యే విభేదాలో లేదంటో స్టార్ డమ్ విషయంలో ఇగో అనేదో ఏమో తెలియదుగానీ పోను పోను ఆ ఇద్దరి ఆటిట్యూడ్ను అవి పూర్తిగా మార్చేశాయి. సినిమాలపరంగానే కాదు.. రాజకీయాలతోనూ ఆ గ్యాప్ మరింతగా ముదిరింది. 1990ల చివరలో రజనీ అప్పటికే “సూపర్స్టార్” స్థాయిలో ఉన్నాడు. ఆ టైంలోనే విజయ్ యువ హీరోగా ఎదుగుతున్నాడు. ఆరోజుల్లో రజనీ సినిమా విడుదలైతే తమిళనాట పండుగ వాతావరణం నెలకొనేది. అయితే దానికి పోటీగా విజయ్ అభిమానులు ‘మాస్ వాతావరణాన్ని సృష్టిస్తూ’ సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఇది రజనీ అభిమానులకు ఏమాత్రం సహించేది కాదు. అలా ఈ పోటీ నెమ్మదిగా బాక్సాఫీస్ కలెక్షన్ల దాకా వెళ్లింది. ఇద్దరి సినిమాలు ఒకేసారి, కాస్త గ్యాప్లో లేదంటే ఒకే ఏడాదిలో విడుదలైనా సరే.. హిట్లు-ఫట్లు, కలెక్షన్ల లెక్కలు చూపిస్తూ కొట్టుకోసాగారు. ఈ క్రమంలో ఫేక్ కలెక్షన్ల ఆరోపణలతో పరస్పరం తిట్టిపోసుకోవడం.. ఫ్లెక్సీలు, బ్యానర్లు చించేసుకోవడం.. క్రమంగా సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వార్స్ దాకా చేరుకుందది. ఆ సమయంలో ఇద్దరూ వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ను వారించడం.. మళ్లీ రిపీట్ కావడం అవుతూ ఉండేది. ఈలోపు.. విజయ్ సినీ కెరీర్ ఎవరూ అందుకోలేనంత పీక్స్కు చేరుకుంది.కొంతకాలం సైలెంట్గా ఉన్న ఇద్దరి ఫ్యాన్స్.. జైలర్ సినిమా టైంలో రజనీ వ్యాఖ్యలతో మళ్లీ మొదలుపెట్టారు. ‘‘కాకి ఎప్పుడూ గద్దను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగని గద్ద తన స్థాయిని తగ్గించుకోలేదు. అంతకంతకు పైకి ఎగిరిపోతుంది. మన స్థాయిని తగ్గించకుండా.. మన దారిలో ముందుకు పోవాలి’’ అంటూ రజనీకాంత్ చెప్పిన కుట్టీ స్టోరీ విజయ్ అభిమానులకు మంట తెప్పించింది. విజయ్ను కాకితో పోల్చాడంటూ అవమానంగా ఫీలై తలైవా మీద సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు. ఇది ఎంతదాకా చేరిందంటే.. తన వ్యాఖ్యలను విజయ్ అభిమానులు పొరపాటుగా అర్థం చేసుకున్నారని స్వయంగా రజనీనే వివరణ ఇచ్చుకునేదాకా. దీనికి కౌంటర్గానే విజయ్ ‘లియో’ క్లైమాక్స్లో గద్ద రిఫరెన్స్ చూపించారనే ప్రచారం ఒకటి ఉంది. పొలిటికల్ టర్న్..!90వ దశకంలో భయంకరమైన ఫ్యాన్డమ్ను చవిచూసిన రజనీ.. ఆ టైంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. అయితే ఆధ్యాత్మిక ధోరణి, ఆరోగ్య సమస్యలు, మరేయితర కారణాలతో తెలియదుగానీ ఆయన ఆ పని చేయలేదు. బదులుగా జయలలితను ఢీ కొడుతూ డీఎంకే పార్టీ(కరుణానిధి.. ఎంకే స్టాలిన్) కుటుంబానికి మద్దతు ఇస్తూ వచ్చారు. అదలా కొన్నేళ్లపాటు సాగింది. చివరకు సొంతంగా రాజకీయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆయన.. ఉన్నట్లుండి వెనక్కి తగ్గడం ఆయన అభిమానుల్ని సైతం బాధించింది. అదే సమయంలో.. విజయ్ టీవీకే పార్టీ ప్రకటన, రాజకీయ దూకుడు.. తాజా తమిళనాడు విక్టరీ.. రజనీ ఫ్యాన్స్ను మరింత కుంగదీసింది. అది తారాస్థాయికి చేరుకుని రజనీనే తిట్టిపోసేదాకా చేరుకుంది. నిజానికి రజనీకాంత్ స్టైల్, మేనరిజంను అనుకరిస్తూనే విజయ్ సినిమాలపరంగా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడని కోలీవుడ్లో ఒక టాక్. అంతెందుకు విజయ్ అభిమానులు కూడా ఆ విషయాన్ని నిర్మోహమాటంగానే ఒప్పుకుంటారు. కానీ, రజనీ అభిమానుల్లో ఇలాంటి మెచ్యూరిటీ ఏమాత్రం కనిపించదు. విజయ్ను ఎంతసేపు తిట్టడం, వీలైనప్పుడల్లా ట్రోలింగ్ చేయడంతోనే గడిపేస్తుంటారు. ఇంత జరుగుతున్నా రజనీ ఏనాడూ తన అభిమానుల్ని వద్దని వారించిన పని చేయలేదు. ఇటు విజయ్ కూడా ఏనాడూ రజనీ ఫ్యాన్స్ చేస్తున్న దాడిపై నేరుగా స్పందించలేదు. బదులుగా తన అభిమానులకు “పాజిటివ్గా ఉండండి, కష్టపడి పనిచేయండి”.. ‘‘ నీ విజయంతో ఎదుటివారిని ఓడించు.. నీ నవ్వుతో వారిని మట్టికరిపించు’’ ఇలాంటి మోటివేషన్ స్పీచ్లతో సందేశాలిస్తూ వచ్చాడు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాక కూడా ఆ హుందాతనం అలాగే కొనసాగడం అది అటు తన అభిమానులనే కాదు.. రజనీ, అజిత్.. ఇలా ఇతర హీరోల ఫ్యాన్స్ను కూడా ఆకట్టుకోగలిగింది. ఒకరకంగా ఇదే ఆయనపై గౌరవం మరింత పెంచి.. ఆయన నాయకత్వానికి బలం చేకూరింది. అయితే ‘‘ఆ స్టార్డమ్ నుంచి బయటకు వచ్చి సీఎంగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అంటూ విజయ్కు రజనీ ఇచ్చిన సలహా.. అక్కసు వెల్లగక్కడంకాక మరేంటనే? కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. తన సమకాలీకుడు(కమల్ హాసన్) స్వయంగా వెళ్లి విజయ్ను అభినందించడం.. విజయ్ విజయంపై మొక్కుబడిగా ఎక్స్లో ఓ మెసేజ్ పెట్టడం.. ఆపై తాజా ప్రెస్మీట్ వ్యాఖ్యల ఆంతర్యం.. విజయ్ విషయంలో రజనీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. -
ఎఫ్ఐఐ వర్సెస్ డీఐఐ రిటైలర్లు చూడని కథేంటి?
రమణమూర్తి మంథా ‘‘ఈ రోజు ఎఫ్ఐఐలు రూ.5,000 కోట్ల విలువైన షేర్లు అమ్మారు. డీఐఐలు రూ.5,267 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.’’ క్రికెట్ స్కోరులా కొన్నాళ్లుగా ఇన్వెస్టర్లు రోజూ ఇదే వార్త చూస్తున్నారు. అంకెలు మారొచ్చు కానీ... అమ్ముతున్నది ఎఫ్ఐఐలే. కొంటున్నది దేశీ ఫండ్లే. ఎందుకిలా? విదేశీ ఇన్వెస్టర్లకు మన మార్కెట్లపై విశ్వాసం తగ్గుతోందా? లేదా మన దేశీ మ్యూచువల్ ఫండ్లు బలోపేతమయ్యాయా? నిజమేంటి? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిందొక్కటే. ఇదేదో స్మార్ట్ మనీకి, నడమంత్రపు సిరికి జరుగుతున్న యుద్ధమేమీ కాదు. రెండు భిన్నమైన పవర్ సెంటర్ల మధ్య పోరాటం. కాకపోతే ఎఫ్ఐఐల దగ్గరున్న ఆయుధాలు పెద్దవి. ఆ ఆయుధాల్ని ఎలా వాడతారో వివరించేదే ఈ వెల్త్ స్టోరీ...దేశీ ఫండ్లు ప్రధానంగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాయి. కానీ విదేశీ ఫండ్లు అమెరికా వడ్డీ రేట్లను, డాలర్ కదలికల్ని, ముడిచమురు– బంగారం ధరల్ని, బాండ్ ఈల్డ్స్ని, కమోడిటీ సైకిల్స్ని, గ్లోబల్ లిక్విడిటీని గమనిస్తుంటాయి. ఇదే పెద్ద తేడా. మన దేశీ ఫండ్లు ఒక బోర్డ్పై చెస్ ఆడుతుంటే... విదేశీ ఫండ్లు ఒకేసారి పది బోర్డులపై ఆడుతుంటాయి. అలాగని ఎఫ్ఐఐలే ఎప్పుడూ గెలుస్తారని కాదు. రిస్క్ లను వాళ్లు ముందే గమనిస్తారన్నది మాత్రం వాస్తవం.ఎఫ్ఐఐలు ఎందుకు చేస్తారంటే...ఉదాహరణకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిందనుకోండి. తక్షణం అమెరికన్ బాండ్లు ఆకర్షణీయంగా మారతాయి. డాలర్ బలపడి... ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు వీక్గా మారతాయి. భారత్ వంటి మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కెళ్లటం జరిగిపోతాయి. అంతేతప్ప ఇన్ఫోసిస్ ఒక్కరోజులో మారిపోవటమో, హెచ్డీఎఫ్సీ నష్టాల్లోకి జారిపోవటమో, ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్లను కోల్పోవటమో జరగలేదని గుర్తుంచుకోవాలి. ఎఫ్ఐఐలు విక్రయించారంటే దానర్థం... వారికి ఎక్కువ లాభాలు వచ్చే మార్కెట్లోకి డబ్బును మళ్లిస్తున్నారని. అందుకే కొన్నిసార్లు కంపెనీల ఫలితాలు అదరగొట్టినా మార్కెట్లు మాత్రం పడిపోతూ ఉంటాయి. కరెన్సీయే ప్రధాన సమస్య!ఇన్వెస్టర్లు పొరపడేది ఇక్కడే. ఎందుకంటే మన ఇన్వెస్టర్లు రూపాయిల్లో ఆలోచిస్తే విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లలో ఆలోచిస్తారు. ఒకవేళ మన మార్కెట్లలో 10 శాతం లాభం వచ్చినా... రూపాయి గనక 8 శాతం పడిపోతే నికరంగా విదేశీ ఇన్వెస్టరుకు దక్కేది 2శాతం లాభమే. అందుకే ఎఫ్ఐఐలు రూపాయి కదలికల్ని, దిగుమతి బిల్లు పెంచే చమురు, బంగారం, వెండి ధరల్ని, ద్రవ్యలోటును, ఆర్బీఐ పాలసీని నిశితంగా గమనిస్తుంటారు. వీటిలో దేన్నీ దేశీ ఇన్వెస్టర్లు నియంత్రించే పరిస్థితి లేదు. దేశంలోని అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్లు కూడా పెరుగుతున్న డాలర్తో పోరాడే పరిస్థితి లేదు. మాటే... బంగారం మార్కెట్ల పరిస్థితిని ముందు చెప్పేది బంగారమే. ఎందుకంటే అనిశ్చితి పెరుగుతున్న కొద్దీ బంగారం ధరలు పెరిగి.. డాలర్ బలోపేతమవుతుంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు జాగ్రత్తపడతారు. బంగారమంటే కేవలం నగలు కాదు. అంతర్జాతీయంగా ఇదో థర్మామీటర్. ఇటీవల ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులన్నీ దూకుడుగా బంగారం కొన్నాయి. ఎందుకని? భౌగోళిక అనిశ్చితి పెరిగి కరెన్సీ ఊగిసలాడుతుందని, వృద్ధి మందగిస్తుందని అవి ఊహించడం వల్లే. ఈ సంకేతాల్ని మొదట అందుకునేది విదేశీ ఇన్వెస్టర్లే. రిటైలర్లు చేయాల్సిందేంటి?రిటైలర్లు గమనించాల్సిందొకటే. ఎవరు అమ్ముతున్నారు... ఎవరు కొంటున్నారని కాదు. దేన్ని అమ్ముతున్నారు... దేన్ని కొంటున్నారనేది. ఎఫ్ఐఐలు భయపడి అమ్మేస్తున్నపుడు కొంటే దీర్ఘకాలంలో సంపద సృష్టి సాధ్యమేనని నిరూపించిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, ఐటీసీ వంటివి ఉన్నాయి. బలమైన క్యాష్ ఫ్లో, మార్కెట్ లీడర్షిప్, దీర్ఘకాల చరిత్ర వీటి సొంతం. ఎఫ్ఐఐలు విక్రయించేసినంత మాత్రాన వీటి వృద్ధి దెబ్బతినదు. కానీ రిటైలర్లు ఇవన్నీ పట్టించుకోకుండా రాకెట్లలా పెరుగుతున్న షేర్ల వెంట పరుగులు తీస్తేనే సమస్య వస్తుంది. డిఫెన్స్, పీఎస్యూ, రెన్యూవబుల్ ఎనర్జీ, కొత్త తరం టెక్ కంపెనీలంటూ స్టోరీలు ప్రత్యక్షమై... ఆ స్టోరీల వెంబడి కొన్ని షేర్లు హద్దూ అదుపూ లేకుండా పెరగటం... వాటి వెనక పడటమే అసలైన ప్రమాదకరం. ఎందుకంటే కంపెనీల ఆదాయాలు గనక వాటి షేర్ల ధరను ప్రతిఫలించకపోతే విదేశీ ఇన్వెస్టర్లు పట్టించుకోరు. అందుకే వారు లాభాలతో బయటపడతారు.గెలిచేదెవరంటే...? ఎఫ్ఐఐలు విక్రయిస్తున్నంత మాత్రాన రిటైలర్లు భయపడాల్సిన పని లేదు. ఎందకంటే ఎఫ్ఐఐలు– డీఐఐల లక్ష్యాలు వేరు. ఎఫ్ఐఐలు గ్లోబల్ అలొకేషన్, రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తే... డీఐఐలు సిప్ పెట్టుబడులు, రిటైర్మెంట్ నిధి, బీమా నిధులు, దేశ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. దీనివల్ల ఆసక్తికర పరిస్థితులు తలెత్తుతాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా ఎఫ్ఐఐలు విక్రయిస్తే... దేశ దీర్ఘకాలిక వృద్ధిలో భాగమయ్యే షేర్లను డీఐఐలు కొంటుంటారు. అంటే... ఇద్దరూ గెలిచినట్టే. భారత్ది నిర్మాణాత్మక బలం.. స్టోరీలను పక్కనబెడితే దేశీయంగా బలమైన ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థ ఉంది. నెలవారీ సిప్ ప్రవాహాలు చాలా బలంగా ఉంటున్నాయి. మార్కెట్లలోకి బీమా, పింఛన్ నిధుల రాక పెరిగింది. డీమ్యాట్ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఇదో నిర్మాణాత్మక మార్పు. ఓ పదేళ్ల కిందట చూస్తే... ఈ స్థాయిలో ఎఫ్ఐఐలు గనక షేర్లను విక్రయిస్తే మార్కెట్లు కుప్పకూలేవి. కానీ ఇపుడు డీఐఐలు ఆదుకోగలుగుతున్నాయి. కాకపోతే ఈ మద్దతును ఆధిపత్యంగా చూడలేం. ఎందుకంటే లిక్విడిటీని, విలువను, కరెన్సీని, ఆఖరికి మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయగలిగేది విదేశీ ఇన్వెస్టర్లే. దీన్ని విస్మరించలేం. మార్కెట్ని మార్కెట్గానే చూడాలి... విదేశీ ఇన్వెస్టర్లు విక్రయించినంత మాత్రాన అదేదో చెత్త కంపెనీ అని... డీఐఐలు కొన్నంత మాత్రాన మంచి కంపెనీ అని అనుకోవటానికి లేదు. ఆదాయం, క్యాష్ ఫ్లో, గవర్నెన్స్ బాగున్న కంపెనీలనే మార్కెట్ ఆదరిస్తుంది. ఓపిగ్గా వేచిచూడటంతో పాటు, విలువల పరంగా క్రమశిక్షణ చూపించే ఇన్వెస్టర్లకే లాభాలొస్తాయి. -
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్గా బంగారాన్ని అలొకేషన్లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్లు ఎస్జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్లా చూడండి. ఇన్సూరెన్స్ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్ -
సారస్వత పరిషత్లో... అరుదైన సాహితీ సంస్మరణ!
అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్లో హైస్కూల్ టీచర్గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ప్రధానాచార్యులుగా, ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ’ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్లోని ‘తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్’ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ ‘తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు’ అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.“అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్”: ఆచార్య చంద్రశేఖరరెడ్డిప్రధాన ప్రసంగానికి ముందు ‘ఎమెస్కో బుక్స్’ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. “తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన ‘చారిత్రక విమర్శకుడి’గా గణిస్తున్నాం. అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో ‘కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు’ లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే” అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.అలాగే, కె.కె.ఆర్. వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తూ, “సమాజంలోని సమకాలీన సంఘటనలపై ఆయన స్పందించేవారు. సర్వసాధారణంగా ఆయన ఎంత సంయమనం పాటిస్తారో, ప్రపంచంలో దుర్మార్గాన్ని చూస్తున్నప్పుడు అంత అసహనం వ్యక్తం చేసేవారు. వాటి గురించి రాయకున్నా, ఉపన్యసించకున్నా... మిత్రులతో తన బాధ, ఆవేదన, ఆవేశం పంచుకొనేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని మంచిని ఎంతగా అభిమానిస్తామో... చెడును అంత తీవ్రంగా ఖండించడమన్నది శిష్యులందరూ ఆయనను చూసి నేర్చుకున్నదే. అందుకే, ఒక్కమాటలో కె.కె.ఆర్. సంఘ సంస్కరణవాది కూడా” అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు. అందుకు తగ్గట్టే ‘తెలుగు వారి చరిత్ర – సంఘ సంస్కరణోద్యమాలు’ అంశంపై ప్రధాన ప్రసంగకర్త వకుళాభరణం రామకృష్ణ సైతం భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడైన ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ వద్ద పరిశోధన సాగించిన ఉద్దండులంటూ ఆయన కృషిని స్థూలంగా పరిచయం చేశారు.“ఆ సమగ్ర స్వరూపమే తెలుగువారి చరిత్ర”: వకుళాభరణంవకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేస్తూ, ఢిల్లీలోని జె.ఎన్.యు.లో సాగిన తన చరిత్ర పరిశోధన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకులైన రొమిల్లా థాపర్, సర్వేపల్లి గోపాల్ తదితరులతో జరిగిన సంగతులు పంచుకున్నారు. “తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణలకు దీపధారి లాంటి కందుకూరి వీరేశలింగం మీద రిసెర్చ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పినప్పుడు మా గైడ్ సర్వేపల్లి గోపాల్ అన్న ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తు. ‘పరిశోధనంటే - వీరేశలింగం వితంతు వివాహాలు జరిపాడు, బాలికా విద్యను ప్రోత్సహించాడు లాంటివి కాదు రాయాల్సింది. ‘హౌ బి శానిటైజ్డ్ ది సొసైటీ’ (తెలుగు సమాజాన్ని ఆయన ఎలా శుభ్రపరిచాడు) అన్నది చెప్పాలి, రాయాలి’ అన్నారాయన. అది నా మనసులో నాటుకొని, పరిశోధనకు మార్గదర్శకమైంది. కష్టపడి ఆయన దగ్గరే ఎం.ఫిల్, ఆ తర్వాత పీహెచ్డీ చేశాను” అని తెలిపారు.“ఒకసారి ‘యునెస్కో’ ఆహ్వానంపై సర్వేపల్లి గోపాల్ గారు ప్యారిస్కు వెళ్ళినప్పుడు, ఆయన స్థానంలో నన్ను పెడితే, నేను పాఠాలు చెప్పడం ఓ అపూర్వ గౌరవం. ‘ఆఖరి టాపిక్ మిగిలిస్తే, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత నేనే ఆ పాఠం చెబుతాన’ని వెళ్ళే ముందు గోపాల్ అన్నారు. తీరా, పర్యటన నుంచి తిరిగొచ్చాక విద్యార్థులకు ఆ పాఠం కూడా నన్నే చెప్పమనేశారు. నేను ఆ పాఠం చెబుతుంటే, ఆయన కూడా ఆ క్లాసులో కూర్చొని విన్న క్షణాలు మర్చిపోలేను” అని వకుళాభరణం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.ఈ మే 15 నాడే 88 వసంతాలు పూర్తి చేసుకొని, 89వ ఏట అడుగిడిన వకుళాభరణం దాదాపు నలభై నిమిషాల తన ప్రసంగంలో, ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో జరిగిన ప్రధానమైన మార్పులను ఓపికగా ప్రస్తావించారు. బ్రిటీషు వారి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదలైన ఉద్యమం, 1913 నాటి బాపట్ల ‘ప్రథమాంధ్ర మహాసభ’ నుంచి ఆంధ్ర రాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు, చివరకు 2013 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాల క్రమాన్ని ఆయన స్థూలంగా వివరించారు.కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రవేశం తర్వాత నడచిన సంస్కరణోద్యమాల తీరుతెన్నుల గురించి ‘సోషల్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే తన సిద్ధాంత గ్రంథంలో విపులంగా చర్చించిన వకుళాభరణం రామకృష్ణ, “గురజాడ, గిడుగు, కందుకూరి... ఈ ముగ్గురూ తెలుగు నేలకు వేగుచుక్కల త్రయం. వారిలో మొదటి ఇద్దరు సాహితీస్రష్టలూ విజయనగరం వారే కావడం విశేషం. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చినవారిలో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు... ఈ ముగ్గురి పేర్లూ చెప్పుకొని తీరాలి” అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటిని ఆయన తన ప్రసంగంలో చూచాయగా ప్రస్తావించారు. రాజకీయంగా, సామాజికంగా, కళాత్మకంగా, సాంస్కృతికంగా తెలుగు నేలపై వచ్చిన మార్పుల్ని లోతుగా చూసినప్పుడే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర – దాని పరిణామాలు – పర్యవసాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో సారస్వత పరిషత్ గ్రంథాలయాన్ని తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్న వకుళాభరణం, చారిత్రక విమర్శ దృక్పథంతో కె.కె.ఆర్. చేసిన సాహిత్య కృషిని ప్రశంసించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, కె.కె.ఆర్.తో సాగిన స్నేహాన్ని స్మరించుకున్నారు.అయిదేళ్ళుగా... ప్రతి ఏటా... అదే వేదికపై!నిజామాబాద్ జిల్లాలోని ‘తెలంగాణ విశ్వవిద్యాలయం’లో తెలుగు శాఖలో ఆచార్యత్వం వహిస్తున్న డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ఈ మొత్తం సభా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. “ఉత్తమ ఆచార్యుడిగా, లోతైన సాహితీ విమర్శకుడిగా పేరున్న కె.కె.ఆర్. మరణానంతరం ఆయన శిష్య మిత్ర బృందం ఆచార్య చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో ఏటా ఒక ప్రత్యేక సాహితీ కార్యక్రమం చేస్తోంది. తొలి ఏడాది ‘కె.కె.ఆర్. సంస్మరణ’ పేరిట ఆయన సంస్మరణ సంచిక తీసుకువచ్చారు. రెండో ఏడాది ఆయన బహుముఖీన వ్యక్తిత్వంపై ‘కె.కె.ఆర్. సాహిత్య వ్యక్తిత్వం’ పేరిట పలువురు సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం వెలువరించారు. ఆ తర్వాత నుంచి మూడేళ్ళుగా ఏటా ఒక సుప్రసిద్ధుడితో సంస్మరణ ప్రసంగాలు చేయిస్తున్నారు. తత్త్వశాస్త్ర ఆచార్యులు డాక్టర్ అడ్లూరి రఘురామరాజు, సాహితీ విమర్శకుడు డాక్టర్ బి. తిరుపతిరావుల అనంతరం ఈసారి మూడో సంస్మరణ ప్రసంగం – చరిత్ర పరిశోధకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారిది” అంటూ లక్ష్మణ చక్రవర్తి అయిదేళ్ళ ప్రస్థానాన్ని అద్దంలో చూపారు. అలాగే, తాజా సభలో విడుదలైన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగ పుస్తకాలు రెంటికీ లక్ష్మణ చక్రవర్తే సంపాదకత్వ బాధ్యతలు వహించడం విశేషం. పిల్లలకు ప్రేమ పంచి... ఆచరణలో గౌరవం చూపి...ప్రధాన ప్రసంగానికి ముందు సభలో కె.కె.ఆర్. శిష్యమిత్రులు పలువురు మాట్లాడుతూ, మాస్టారితో తమ అనుబంధాన్నీ, వారి జ్ఞాపకాలనూ పంచుకున్నారు. కె.కె.ఆర్. వద్ద చదువుకున్న 73 ఏళ్ళ అధ్యాపకుడు డాక్టర్ డి. నరసయ్య అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, “విద్యార్థులను సైతం గౌరవించడాన్ని ఆచరణలో చూపిన అరుదైన టీచర్ ఆయన. ఆ విశిష్ట గుణం ఆయన దగ్గరే చూశాను. విద్యార్థులతో ‘అంత్యాక్షరి పద్యపఠనం’తో పాటు ‘స్లో సైక్లింగ్’ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ, పిల్లలతో అంతగా మమేకమైన టీచర్గా కె.కె.ఆర్. సార్ను మర్చిపోలేము” అన్నారు.జర్నలిస్ట్ రవీంద్రబాబు మాట్లాడుతూ, “ఎం.ఏ, ఎంఫిల్ కె.కె.ఆర్ గారి దగ్గరే చేశా. ఆధునిక కవిత్వం, స్ట్రక్చర్ ఆఫ్ మోడరన్ తెలుగు, సంస్కృతంలోని కాళిదాసు ‘మేఘసందేశం’... ఇలా ఏ సబ్జెక్ట్నైనా ఆయన బోధించేవారు. తాను చెప్పిన అంశం మీద కాకుండా, అప్పట్లో కొత్తగా వచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ ‘హో’ కవితా సంపుటి మీద నేను పరిశోధన చేస్తానంటే ఆయన అభ్యంతర పెట్టలేదు. ముందుగా తానే ఆ పుస్తకం తెప్పించుకొని, చదివి, పరిశోధక విద్యార్థినైన నాకు సరైన మార్గనిర్దేశనం చేసిన అరుదైన గైడ్ ఆయన” అని వివరించారు.అరుదైన అధ్యయనశీలి ఆఖరి కోరిక!‘తెలుగు అకాడెమీ’కి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన రచయిత, భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్య మాట్లాడుతూ, “విద్యార్థులు, పరిశోధకులపై కె.కె.ఆర్. ఆప్యాయత అపారం. ఏదైనా తనకు తప్పు అనిపిస్తే మాత్రం... మిత్రధర్మం, శిష్యధర్మం ఎంత ఉన్నా సరే వెరవకుండా, వాటిని పక్కనబెట్టి మరీ నిక్కచ్చిగా ఆయన తన అభిప్రాయం చెప్పేవారు. కె.కె.ఆర్. తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవిత కాలంలోని సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలోని చైతన్యశీలత, మార్పులను చెబుతూ జీవిత కథనం రాయాలని భావించారు. తీరని ఆయన కోరికను ఇప్పటికైనా మిత్రులెవరైనా పూనుకొని తీరిస్తే బాగుంటుంది” అని సూచన చేశారు. సారస్వత పరిషత్లో చదువుకొని సినీ, టీవీ నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న మానిక్ అప్పటి తన అనుభవాలు పంచుకున్నారు.కుటుంబంతో కాదు... సాహితీ కుటుంబంతో!ఈ కార్యక్రమానికి కె.కె.ఆర్. సతీమణి ఊర్మిళ, కుమారుడు సుమన్, మనుమడు స్వభావ్తో సహా కె.కె.ఆర్. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. “కేవలం కుటుంబ సభ్యులమే కాకుండా, సాహితీ బంధువులందరితో కలసి ఏటా కె.కె.ఆర్.ను స్మరించుకోవడం కోసం అయిదేళ్ళుగా ఇలా సాహితీ ప్రసంగాల సభ జరుపుతున్నాం. గతంలో కె.కె.ఆర్. ఇలాంటి ప్రసంగాల ‘సారస్వత వేదిక’ను దాదాపు పదేళ్ళ పాటు నిర్వహించారు. దాని ఫలితంగానే, సాహిత్య చరిత్ర వ్యాసాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిన ‘తెలుగు సాహిత్యం - మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ లాంటి లాంటి పుస్తకాల రూపంలో ఆ ప్రసంగాలు మిగిలాయి. ఆ ఫక్కీలోనే ఇప్పుడీ వార్షిక ప్రసంగాలు చేయిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతరంతోనూ, ఆధునిక వక్తలతోనూ ఇలాంటి ఆలోచనాత్మక సంస్మరణ ప్రసంగాలు ఇప్పించాలని భావిస్తున్నాం” అని ఊర్మిళ సభాముఖంగా ప్రకటించారు. అతిథులకు తమ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, ‘తెలుగు అకాడెమీ’ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ‘ఆకాశవాణి’ వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు ‘సారస్వత వేదిక’ పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో! - రెంటాల జయదేవ -
వెండి దిగుమతులపై ఆంక్షలు
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా సంక్షోభం వేళ విదేశీ మారక (డాలర్ల) నిల్వలను కాపాడుకునే క్రమంలో దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పసిడి, వెండి, ప్లాటినంలపై సుంకాలను పెంచిన ప్రభుత్వం వెండికి సంబంధించి మరిన్ని నియంత్రణలను ప్రకటించింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే (ఫ్రీ ఇంపోర్ట్) కేటగిరీలో ఉన్న వెండిని ఆంక్షలు వర్తించే ‘రిస్ట్రిక్టెడ్’ కేటగిరీలోకి మార్చింది. దీనితో ఈ విభాగంలోని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు అవసరం ఉంటుంది. తాజా పరిణామంతో ఇకపై 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, సెమీప్రాసెస్డ్ సిల్వర్, సిల్వర్ పౌడర్, సాదా వెండి ఆభరణాల్లాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలన్నా డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమవుతాయి.అయితే, 100 శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు (ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)లోని యూనిట్లకు ఈ ఆంక్షలు వర్తించవు. కాకపోతే, అవి దిగుమతి చేసుకున్న వాటిని భారత మార్కెట్లో విక్రయించకుండా, పూర్తిగా ఎగుమతి మాత్రమే చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు ముందస్తు అనుమతి తీసుకున్నా సరే... ఒకసారి 100 కిలోలకన్నా ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకోవటానికి అనుమతించరు. ఇక ఎగుమతి ఆధారిత యూనిట్లు తొలుత దిగుమతి చేసుకున్న వెండిని వినియోగించి... అందులో కనీసం 50 శాతాన్ని ఎగుమతి చేసినట్లు నిరూపిస్తేనే మరోసారి దిగుమతికి అనుమతిస్తారు. విలువైన లోహాల దిగుమతి కోసం విదేశీ మారక నిల్వలను భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో పసిడితో పాటు వెండి దిగుమతులపై కేంద్రం సుంకాలను ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.12 బిలియన్ డాలర్ల దిగుమతులుభారత దిగుమతుల్లో వెండి వాటా ఏడాదికి దాదాపు 7 వేల నుంచి 9 వేల టన్నుల వరకు ఉంటోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2025– 26లో వెండి దిగుమతులు పరిమాణం పరంగా 42 శాతం పెరిగి 7,335 టన్నులకు చేరాయి. విలువపరంగా 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందుకు కారణం. దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానంగా సిల్వర్ పౌడర్, బులియన్ కడ్డీలు, ముడి రూపంలోని వెండి ఉంటున్నాయి. కొత్త నిబంధనలతో వెండి దిగుమతుల్లో సింహభాగానికి డీజీఎఫ్టీ అనుమతి తప్పనిసరి కానుంది. ఎందుకీ నిర్ణయాలుకేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత విలువైన ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడం అందులో ఒకటి. అలాగే వివిధ దేశాలతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును నియంత్రించడం మరో లక్ష్యం. థాయ్లాండ్, యూఏఈలాంటి దేశాలతో భారత్కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్నాయి. దీనితో సుంకాల భారం భారీగా ఉండకుండా, ఆయా దేశాల మార్గం గుండా దిగుమతి చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కనుక, ఎఫ్టీఏల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రజలపై ప్రభావం ఏంటంటే..ఆభరణాలు ప్రియం..: అంతర్జాతీయంగా వెండి ధరలు భారీ స్థాయిలోనే కదలాడుతున్నాయి. ఇటీవలి సుంకాల విధింపుతో సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దీనికి తోడు ఇక సంక్లిష్టమైన లైసెన్సు ప్రక్రియ కూడా తోడైతే దిగుమతుల్లో జాప్యానికి దారి తీయొచ్చు. ఫలితంగా దేశీయంగా డిమాండ్, అలాగే ధరలు కూడా భారీగా ఎగిసే అవకాశం ఉంది. మన దగ్గర శుభకార్యాలు, ఇతరత్రా గిఫ్ట్ ఐటెమ్స్లో వెండి వినియోగం ఎక్కువే ఉంటోంది. అయితే, చిన్న వ్యాపారులు, ఆభరణాల తయారీదార్లకు ముడి వస్తువు వ్యయాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు వాటి రేట్లు కూడా పెరిగిపోతాయి. స్మగ్లింగ్ ముప్పు..: దిగుమతి సుంకాలను పెంచినప్పుడే స్మగ్లింగ్ ముప్పులపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు మరిన్ని నియంత్రణల వల్ల ఈ రిస్కులు ఇంకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలకు షాక్..: కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా ఇతరత్రా పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు .. ఇలా ఒకటేమిటి, అనేక అవసరాల కోసం సిల్వర్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తాజా నియంత్రణల వల్ల ఆయా పరిశ్రమలకు ముడి వస్తువు ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అవి తయారు చేసే ఉత్పత్తుల ధరలూ పెరుగుతాయి. పెట్టుబడులకు కొనసాగనున్న ఆసక్తి..పసిడితో పాటు ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిని కూడా ఓ కీలకమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు స్థాయిలో ఉండటంతో రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నా సిల్వర్వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల కోణంలో దీనికి డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. -
‘పొరపాటున కూడా బంగారం కొనొద్దు.. ఎందుకో తెలుసా?’
అది నరకలోకం. ఆరోజు ఇద్దరు వ్యక్తులు భూలోకం నుంచి కొత్తగా నరకానికి వచ్చారు. అందులో మన దేశానికి చెందిన చెంబయ్య కూడా ఉన్నాడు. ఆ ఇద్దరికి ఒక మూలన ఓ రెడ్ ఫోన్ కనిపించింది. ‘ఏమిటది?’ అని డ్యూటీలో ఉన్న యమభటుడిని అడిగారు.‘ఈ ఫోన్ నుంచి మీ దేశానికి హాయిగా ఫోన్ చేసుకోవచ్చు. ఫ్రీగా కాదు. కక్షలు చెల్లించాల్సి ఉంటుంది’ అని చెప్పాడు యమభటుడు. ‘కక్షలు ఏమిటి?’ ఆశ్చర్యంగా అడిగాడు మన చెంబయ్య.‘మీ లోకంలో లక్షలు అంటారు కదా... మా లోకంలో కక్షలు అంటారు’ అని వివరణ ఇచ్చాడు యమభటుడు. ‘మా దేశానికి ఫోన్ చేసుకోవడానికి ఎన్ని కక్షలు అవుతాయి?’ అడిగాడు చెంబయ్య.‘అరవై కక్షలు అవుతాయి’ అని చెప్పాడు యమభటుడు.‘ఎన్ని గంటలు మాట్లాడవచ్చు?’ అడిగాడు చెంబయ్య.‘గంటలు కాదు... అరగంట మీద ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడాలి’ అని రూల్ చెప్పాడు యమభటుడు. ‘సరేలే...ఆ రెడ్ ఫోన్ ఇలా ఇవ్వు’ అని అరవై కక్షలు చెల్లించాడు చెంబయ్య.‘నా భార్య మంగతాయారుకు ఫోన్ చేస్తాను’ అనుకున్న చెంబయ్య అర క్షణంలోనే మనసు మార్చుకొని తన క్లోజ్ఫ్రెండ్ కోటేశ్వర్రావుకు ఫోన్ కలిపి... ‘హలో కోటిగా... ఎలా ఉన్నావురా?’ అని ఆప్యాయంగా అడిగాడు. ‘ఎవరు?’ అని గంభీరంగా అడిగాడు అటునుంచి కోటేశ్వర్రావు.‘ ఒక్కరోజుకే నన్ను మరిచిపోయావా... తెలివి తక్కువ దద్దమ్మ... వెస్ట్ ఫెలో... ఈస్ట్ఫెలో, నార్త్ ఫెలో, ఇడియెట్... రాస్కెల్.... సచ్చినోడా...’ అనడం మొదలు పెట్టాడు చెంబయ్య. కోటేశ్వర్రావుని ప్రేమగా, ఆప్యాయంగా, అనుబంధంగా వేస్ట్ ఫెలో, ఇడియెట్, రాస్కెల్, సచ్చినోడా... అని పిలిచే ఏకైన వ్యక్తి శ్రీ చెంబయ్య. దీంతో ఆ తిట్లకు కోటేశ్వర్రావు వెంటనే కనెక్ట్ అయ్యాడు.‘ఒరే చెంబిగా నువ్వట్రా ఫోన్ చేసింది! గుర్తు పట్టలేదు సుమీ...సారీ’ అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు కోటేస్వర్రావు. అంతలోనే అతడికి తెలుగు నవలలో లాగా భృకుటి ముడిపడింది. దవడ కండరం బిగుసుకుపోయిది. అతడి గుండెల్లో భయం అనే గుండె రాయి పడింది.‘ఒరే చెంబిగా.... నువ్వు నిన్ననే కదరా సచ్చింది..’ భయం భయంగా అడిగాడు కోటేశ్వర్రావు.‘యూ ఆర్ ఆబ్సొల్యూట్లీ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్’ అని చెంబయ్య బదులు ఇచ్చాడో లేదో...‘వామ్మో దెయ్యం’ అని వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకున్నాడు కోటేశ్వర్రావు.‘పిరికి వెధవ’ అని ఫ్రెండ్ను తిట్టుకున్న కోటేశ్వర్రావు తన భార్యకు ఫోన్ చేశాడు...‘ఎలా ఉన్నావు నా బంగారం’ అని భార్య మంగతాయారును ప్రేమగా, గోముగా అడిగాడు.‘పొరపాటున కూడా బంగారం కొనొద్దు. ఎందుకో తెలుసా...’ అంటూ నాన్స్టాప్గా చెప్పడం మొదలుపెట్టింది మంగతాయారు. ‘మంగా, అసలు నేను ఎవరనుకుంటున్నావు?’ కోపంతో ఉరిమాడు చెంబయ్య. ‘మీరెవరో నాకెలా తెలుస్తుంది? చెప్పండి’ అని విసుగ్గా అడిగింది శ్రీమతి మంగతాయారు.‘స్వయానా నీ భర్త చెంబయ్యను’ అని తనను తాను పునఃపరిచయం చేసుకున్నాడు చెంబయ్య.అంతే...‘యావండీ.. నన్ను విడిచి వెళ్లిపోవడానికి మీకు కాలేయం ఎలా వచ్చింది’ అంటూ అర క్షణం గ్యాప్ ఇవ్వకుండా ఏడ్వడం మొదలుపెట్టింది మంగతాయారు. ఆమె ఏడుపు పుణ్యమా అని అరగంట మీద ఆరు నిమిషాల టైమ్ గ్యాస్ స్టవ్ మీది కొవ్వొత్తిలా స్పీడ్గా కరిగిపోయింది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఎలాస్కిన్ టేలర్ తన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడాడు.‘అదేమిటి? నా దగ్గర అరవై కక్షలు తీసుకున్నావు. ఈ అమెరికా వాడి దగ్గర ఆరు కక్షలే తీసుకున్నావు?!’ యమభటుడిని అడిగాడు చెంబయ్య. ‘లోకల్ కాల్కు అంతే అవుతుంది’ అన్నాడు యమభటుడు. ‘అమెరికా లోకల్ ఏమిటి... అక్కడెక్కడో ఉంటే’ కోపంగా అన్నాడు చెంబయ్య. ‘ట్రంప్ వార్ మొదలు పెట్టినప్పటి నుంచి అమెరికన్ల జీవితం నరకప్రాయం అయింది. సో... ఇప్పుడు అమెరికా లోకల్ కాల్ పరిధిలోకే వస్తుంది’ శాంతంగా బదులిచ్చాడు యమభటుడు!– యాకుబ్ పాషా -
బ్రిటీష్కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్ను ముగించాలంటూ విజయ్కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కు చేసిన రిక్వెస్ట్తో ఆమె వార్తల్లో నిలిచింది. -
త్వరలో ట్రావెల్ ట్యాక్స్.. విదేశాలకెళ్తే వాయింపే!
అంతర్జాతీయ పరిణామాలతో వేగంగా కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలను (డాలర్లు) కాపాడుకోవడం కోసం ‘బంగారం కొనడాన్ని తగ్గించుకోండి. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోండి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు అనుగుణంగానే ఇందులో మొదటి రెండింటినీ కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పసిడి కొనుగోళ్లకు కాస్త అడ్డుకట్ట వేసేందుకు బంగారంపై సుంకాలను పెంచింది. అలాగే పెట్రోల్ ధరలను తాజాగా పెంచింది. ఇక, ఇప్పుడు విదేశీ ప్రయాణాల వంతు వచ్చింది. అనవసర విదేశీ విహారయాత్రలు, పర్యటనలను తగ్గించే దిశగా ఫారిన్ ట్రావెల్ని మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలపై ట్యాక్స్లు/సెస్సులు/సర్చార్జీలు వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రేపో మాపో వడ్డించడమైతే ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా ఏడాది పాటు వర్తించేలా ట్యాక్స్ విధించవచ్చని భావిస్తున్నారు. విదేశీ పర్యటనలపై విధించే ట్యాక్సులు, సెస్సులు, సర్చార్జీల ద్వారా వచ్చే నిధులు మొత్తం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలోకి కాకుండా నేరుగా కేంద్రం ఖాతాలోకే వెళ్లొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలా వచ్చిన నిధులతో, క్రూడాయిల్ దిగుమతుల వ్యయాల భారాన్ని కాస్త భర్తీ చేసుకోవచ్చనే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నాయి. దీనిపై అత్యున్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 232 బిలియన్ డాలర్ల టూరిజం పరిశ్రమ.. దాదాపు 231.6 బిలియన్ డాలర్ల విలువతో భారత్ టూరిజం రంగం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో నాలుగో స్థానానికి ఎగబాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగం దేశీయంగా 10 శాతం మేర ఉద్యోగాలను కల్పిస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, వీసాల లభ్యత సులభతరం కావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, డెస్టినేషన్ వెడ్డింగ్ల్లాంటి అంశాలతో విదేశీ ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫారిన్ ట్రావెల్ సెగ్మెంట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2024లో విదేశీ పర్యటనల వ్యయాలు సుమారు 18.82 బిలియన్ డాలర్లుగా ఉండగా 2034 నాటికి 55.39 బిలియన్ డాలర్లకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. 2025లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 6 శాతం పెరిగి 3.27 కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ ప్రయాణాల విషయంలో 2019లో 10వ స్థానంలో ఉన్న భారత్ 2027 నాటికి అయిదో స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ ప్రస్తుతం డాలర్ నిల్వలను కాపాడుకోవాల్సి వస్తుండటంతో అనవసర విదేశీ పర్యటనలకు కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశీ ట్రావెల్కి దన్ను.. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశీయంగా పర్యాటకానికి ఊతం లభించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం ద్వారా విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించగలిగితే ఆ విధంగా ఫారెక్స్ని సమకూర్చుకునేందుకు వీలవుతుందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఫ్లైట్స్ రేట్లకు రెక్కలు.. ఇంధన వ్యయాలు, గగనతలాలపై ఆంక్షలు, నిర్వహణపరమైన అనిశి్చతులతో ఇప్పటికే పలు అంతర్జాతీయ రూట్లలో ఫ్లయిట్ చార్జీల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎయిరిండియాలాంటి దేశీ విమానయాన సంస్థలు భారాన్ని భరించలేక కొన్ని రూట్లలో ఫ్లయిట్స్ని రద్దు కూడా చేస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో వారానికి దాదాపు వంద ఇంటర్నేషనల ఫ్లయిట్ సరీ్వసులను తగ్గించుకుంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది. అలాగే ఏడు రూట్లలో సరీ్వసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో మొత్తం మీద విదేశీ రూట్లలో సీట్లు సుమారు 27 శాతం తగ్గుతాయని పేర్కొంది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగినంత వరకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్పై ప్రభావం తప్పదని ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ సంస్థ ఇక్సిగో వర్గాలు పేర్కొన్నాయి. (సాక్షి బిజినెస్ డెస్క్) -
సామాన్యుడికి చమురు చిచ్చు
సాక్షి, బిజినెస్ డెస్క్: పెట్రో ధరల భారం ఎప్పుడూ పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే ఆగదు. ప్రతి వంటగదిలోకి, ప్రతి పొలంలోకి, ప్రతి కుటుంబ బడ్జెట్లోకి చొరబడుతుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలు వంటగ్యాస్కు ఎక్కువ చెల్లిస్తున్నారు. రైతులు డీజిల్ ధరను ఎక్కువ భరిస్తున్నారు. కారి్మకులు రవాణాకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ వేతనాలతో అనేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల అదనపు భారాన్ని మోపుతుంది. అండర్ రికవరీల పేరుతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలపై ఆరి్ధక భారాన్ని మోపుతున్నాయని దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.గత సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు ఆ లాభాలను చమురు సంస్థలు వినియోగదారులకు ఎప్పుడూ అందించలేదని, కానీ పెట్రోలియం ఉత్పత్తులపై భారీ పన్నుల భారం మాత్రం ప్రజలు సంవత్సరాలుగా భరించాల్సి వస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల జీవనం అతలాకుతలమవుతుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా సీఎన్జీ, డీజిల్ ధరల పెంపుతో ఆటో డ్రైవర్లు, రవాణా కారి్మకులు, ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడే అవకాశముంది. ఇరాన్ యుద్ధం ప్రభావం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేస్తుండగా భారత్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగి ఆగి ఎట్టకేలకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. రెండు నెలలకు పైగా భారీ నష్టాలు భరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. అదే సమయంలో సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 పెంచడంతో రవాణా రంగంపై అదనపు ఒత్తిడి పడింది. ప్రజా రవాణా వ్యవస్థలో డీజిల్ కీలక పాత్ర పోషిస్తుంది. డీజిల్పై ఆధారపడే ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మార్కెట్ సరఫరా గొలుసులన్నింటిపై ఇప్పుడు అదనపు భారం పడనుంది.రవాణా సంస్థలు ఇప్పటికే చార్జీలు కనీసం 3% పెరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. టాక్సీ, బస్సు రవాణా, డెలివరీ చార్జీలు కూడా వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పాలు, ధాన్యాలు, మందులు, నిత్యావసర వస్తువుల నుంచి ఆన్లైన్ డెలివరీల వరకు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్ ధరల పెంపుతో సాగు ఖర్చులూ పెరగనున్నాయి. రైతులు పంటలను మార్కెట్లకు తరలించే ఖర్చు కూడా పెరగడంతో ఆహార ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం మళ్లీ వేగం? ఏప్రిల్లోనే రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, హోల్సేల్ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి ఎగిసింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపు కారణంగా వచ్చే మూడు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% దాటే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో రిజర్వ్ బ్యాంక్కు ద్రవ్యోల్బణ నియంత్రణ మరింత క్లిష్టం కానుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల కోతలపై ఆశలు తగ్గిపోగా, ఇప్పుడు మరింత కఠిన ఆర్థిక విధానాలు కొనసాగించే పరిస్థితి ఏర్పడే అవకాశముంది. దీనివల్ల ధరలు మరింత పెరుగుతాయి. ఇంకా పెరిగే చాన్స్ ఉందా? ప్రస్తుతం చేసిన రూ.3 పెంపు ఆయిల్ కంపెనీల నష్టాలను పూర్తిగా భర్తీ చేయదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఈ ధరల పెంపు పూర్తి ఉపశమనం కాదని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 105–110 డాలర్ల వద్ద కొనసాగితే, ఇప్పటికీ రోజుకు వందల కోట్ల నష్టాలు తప్పవని అంచనా. పరిస్థితి మరింత దిగజారితే మరోసారి ఇంధన ధరల పెంపు కూడా తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.పెట్రోల్ ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్డీజిల్, ఏటీఎఫ్పై సుంకం తగ్గింపున్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పెట్రోల్ ఎగుమతులను కట్టడి చేసి దేశీయంగా లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 3 చొప్పున ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (ఎస్ఏఈడీ) పేరిట విండ్ఫాల్ ట్యాక్స్ విధించింది. డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 23 నుంచి రూ. 16.5కి, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) రూ. 33 నుంచి రూ. 16కి తగ్గించింది. ఇవి మే 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై రోడ్, ఇన్ఫ్రా సెస్సు ఉండబోదని పేర్కొంది. నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంధన సంస్థలకు వచ్చే అసాధారణ లాభాలపై తాత్కాలికంగా విధించే సుంకాలను విండ్ఫాల్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు. -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు
(రమణమూర్తి మంథా): ఇరాన్ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.దీంతో డాలర్ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..అన్నింటిపై ప్రభాaవం..సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..⇒ బైక్పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది⇒ ఆటో, క్యాబ్ చార్జీలు పెరుగుతాయి⇒ బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుందికూరగాయలు, నిత్యావసరాలు కూడా...డీజిల్ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. ఎల్పీజీ, హోటల్ బిల్లులు కూడా పెరుగుతాయిదేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్ కిచెన్లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..విమానాల్లో వాడే జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కూడా క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్లైన్స్ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుందికేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.ఈఎంఐలు పెరగొచ్చు!ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్ లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. స్టాక్ మార్కెట్ షేక్చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. నోట్: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్(6 లీటర్లు) వినియోగిస్తోంది. కంపెనీలకు తిప్పలు చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్లైన్స్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. ప్రభుత్వానికి ఇబ్బందులు..చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...⇒ ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.⇒ మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.⇒ ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.సామాన్యులు చేయాల్సిందేంటి?⇒ అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి⇒ కుటుంబ బడ్జెట్ను ముందే ప్లాన్ చేసుకోవాలి⇒ ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి⇒ సిప్లు, బంగారం, డిఫెన్సివ్ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి⇒ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి -
రాత్రిళ్లు... ఉక్కపోతే!
రాత్రి సమయాల్లోనూ ఉక్కపోత, వేడి వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండువేసవిలో సూర్యాస్తమయం తర్వాత చాలా సేపటి వరకు పడకగదులు ఉక్కపోతగానే ఉంటున్నాయి. దీంతో నిద్రకు అంతరాయం కలగడం, చిరాకు పెరగడం వంటి వాటితో మరుసటి రోజు పని, కార్యకలాపాల నిర్వహణలో ఉత్సాహం, చురుకుదనం కోల్పోయి ఉత్పాదకత కూడా ప్రభావితమవుతోంది.హైదరాబాద్, బెంగళూరు సహా దాదాపుగా అన్ని మహానగరాలు, పట్టణాల్లో ఇదే సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లలో రాత్రిపూట వేడిమి ఒక తీవ్రమైన సంక్షోభంగా మారుతోంది. సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గకపోవడం వల్ల, పగటిపూట వేడి నుంచి భౌతికంగా కోలుకోవడానికి వీలులేకుండా ఒక ‘ఉష్ణ లోటు’ ఏర్పడుతోంది. 2026 వివిధ అధ్యయనాలు, నివేదికల ప్రకారం చూస్తే...2026 మే నాటికి భారత్లో పగటి కంటే రాత్రుళ్లే వేగంగా వేడెక్కుతున్నాయని, 76% జనాభా తీవ్రమైన, మిశ్రమ వడగాలుల బారిన పడే అధిక ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. – సాక్షి, హైదరాబాద్ఇదీ అధ్యయనం...2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య ఏడు నెలల హై–రిజల్యూషన్ సెన్సార్ డేటా ఆధారంగా క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం పెరుగుతున్న వాతావరణ ముప్పును సూచిస్తోంది. ఉదయం నుంచి కాంక్రీట్ గోడలు, నేలలు నిల్వ ఉంచుకున్న ఎండ వేడిమి విడుదల కావడం వల్ల, రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 34.7ని సెంటిగ్రేడ్ల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తెల్లవారుజామున కూడా, ఉష్ణోగ్రతలు 33.8ని నుంచి 34ని సెంటిగ్రేడ్ల మధ్యే ఉండటంతో ఇళ్లల్లోని వారికి పెద్దగా ఉపశమనం లభించడం లేదు.ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ప్రచురితమైన ఈ పరిశోధనలో వడగాలుల సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి, మరణాల రేటు పెరగడానికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. నిద్రపై జరిపిన అధ్యయనాలు ఇంకా సూచించేదేమిటంటే, ఇళ్లలో 26–28 నిసెంటిగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నిద్ర నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తాయి, అయితే 30ని సెంటిగ్రేడ్ల మించిన ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక అసౌకర్యానికి క్రమంగా పెరిగే శారీరక ఒత్తిడికి దోహదం చేస్తాయి. తాజాగా ఇండియా హీట్ సమ్మిట్–2026 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. పట్టణ ప్రణాళికలు.. పర్యావరణహితంగా లేకే సమస్యలు మనదేశంలో నగరీకరణ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో, నగరాలు, పట్టణాలు ‘కాంక్రీట్ జంగిళ్లు’గా మారాయి. హైదరాబాద్, బెంగళూరు ఇతర నగరాల్లో పట్టణ ప్రణాళికలు, పర్యావరణహితంగా లేకనే సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవి కూడా నగరీకరణపై ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. అర్భనైజేషన్కు సంబంధించి ఒక బ్లూప్రింట్, కచి్చతమైన ప్లానింగ్, దీర్ఘకాలిక నగర సుస్థిరాభివృద్ధి, ప్రకృతి, పర్యావరణ అనుకూల ‘డిజైన్ విత్ నేచర్’వంటివి, గాలి వీచే దిశ, వర్షపాతం, బహిరంగ, ఖాళీస్థలాలు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా క్రీడామైదానాలు, పార్కులు, స్కూళ్లు వంటి వాటిని అంతర్భాగం చేసి ‘లేయర్డ్ ప్లానింగ్’చేయాల్సి ఉండగా అది జరగలేదు. – ప్రొఫెసర్ .కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్తఅధ్యయనం ముఖ్యాంశాలు... ⇒ గత దశాబ్ద కాలంలో ఇండో–గంగా మైదానంలో తేమ స్థాయిలు 10% పెరిగాయి ⇒ దీనివల్ల ఉష్ణోగ్రత 3–5ని సెంటిగ్రేడ్లు అధికంగా ఉన్నట్టు అనిపిస్తుంది ⇒ రాత్రిపూట సహజంగా చల్లబడే ప్రక్రియను అణచివేస్తుంది ⇒ అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో దాదాపు 49% మంది ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు ⇒ రాత్రులు వెచ్చగా ఉన్నప్పుడు, మానవ శరీరం చల్లబడలేదు, దీనివల్ల శరీరంలో వేడి భారం పెరిగి పక్షవాతం, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదం పెరుగుతుంది -
NEET వివాదం: చైనా మోడల్తో ఏ లీకులు ఉండవ్!
భారతదేశపు పోటీ పరీక్షల్లో తరచూ పేపర్ లీకులు, అవకతవకలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. తాజాగా నీట్-యూజీ 2026 రద్దు ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టం చేసింది. అయితే.. విద్యార్థుల భవిష్యత్తు, వారి మనోధైర్యం దెబ్బతింటున్న ఈ పరిస్థితుల్లో కఠిన చర్యలపై దృష్టిసారించడం అవసరమని నిపుణులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా.. చైనా మోడల్ తెర మీదకు తెచ్చారు. భారత్లో ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడాలంటే చైనా మాదిరి కఠిన చర్యలు అవసరమని ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ చెబుతున్నారు. ఈ మోడల్లో భాగంగా.. చైనా తన జాతీయ ప్రవేశ పరీక్ష గావ్కావో కోసం విస్తృతమైన చర్యలు తీసుకుందని.. అంతకంటే ముందు విద్యా సంస్కరణల్లో డబుల్ రిడక్షన్ విధానంతో సమూల మార్పులు చేసిందని గుర్తు చేస్తున్నారాయన. చైనా 2001లో తెచ్చిన ఈ విధానం (Double Reduction Policy) ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులపై ఉన్న అధిక హోంవర్క్ భారాన్ని తగ్గించడం. అలాగే ప్రైవేట్ ట్యూషన్ల ఒత్తిడిని తగ్గించడం, కుటుంబాల ఖర్చులను ఆదా చేయడం, పాఠశాల విద్యను అందరికీ సమానంగా అందించడం. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్యూషన్లపై డ్రాగన్ కంట్రీ కఠిన నియంత్రణలు విధించింది. వారాంతాలు, సెలవుల్లో కోచింగ్ క్లాసులను నిషేధించింది. అదే సమయంలో.. అవకతవకలపై జరగకుండా కఠిన చర్యలు అవలంభించింది. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష నిర్వహణ వరకు అధునాతన భద్రతా సాంకేతికతలు పాటించింది. ఈ మధ్యకాలంలో ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేసింది. ఆపై.. నకిలీ సీట్లు, అవకతవకల అడ్మిషన్లను అరికట్టేందుకు కఠిన పరిశీలన చేపట్టింది. సమాన అవకాశాల పేరిట గ్రామీణ, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోటాలు కల్పించింది.ఏంటీ గావ్కావో (Gaokao)? గావ్కావో అనేది చైనాలో ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(National College Entrance Examination). దానర్థం “ఉన్నత పరీక్ష”. ఇది చైనాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం తప్పనిసరి. 1952లో ఈ ఎంట్రెన్స్ టెస్ట్ మొదటిసారి నిర్వహించారు. ప్రతీ ఏడాది జూన్లో ఈ పరీక్ష జరుగుతుంటుంది. 2025లో సుమారు 1.3 కోట్ల విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.ఈ ఎంట్రెన్స్లో ఒక్క మార్కు తేడా కూడా విద్యార్థి చేరే విశ్వవిద్యాలయాన్ని నిర్ణయిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక స్థానం అన్నీ ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. అందుకే చైనా సమాజంలో గావ్కావోను “జీవితాన్ని తీర్చిదిద్దే పరీక్ష”గా భావిస్తుంటుంది. అందుకే కఠోర నియంత్రణలు, భద్రతా చర్యలు, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా చైనా ఈ పరీక్ష సమగ్రతను కాపాడుకుంటోంది. అయితే..అందుకే భారత్కు అవసరం!భారతదేశంలో చైనాలోలాగా ఒకే ఎంట్రెన్స్ ఉండదు. NEET, JEE ఇలా వివిధ రకాల పోటీ పరీక్షలు ఉంటాయి. ఇవి లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ పేపర్ లీకులు, “గెస్ పేపర్లు” వంటి అవకతవకలు ప్రజల నమ్మకాన్ని.. విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాయి. అందుకే చైనా మోడల్ను భారత్ ఓ పాఠంగా నేర్వాలని ఆనంద్ కుమార్ లాంటి వాళ్లు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు నితిన్ విజయ్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. చైనా మోడల్ చెప్పేది ఏంటంటే.. కఠిన నియంత్రణలు, పారదర్శకత, సమాన అవకాశాలు. ఇవి ఉంటేనే పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలుస్తుంది. చైనా మాదిరిగా భారత్లోనూ కోచింగ్ పరిశ్రమపై కఠిన నియంత్రణలు అవసరమని.. ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణలో అధునాతన సాంకేతికతలు వినియోగించాలని.. అదనంగా గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు సురక్షితమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అమ్మ అంటే.. అంతులేని బలం
ఫ్రెండ్స్, ఈరోజు మదర్స్ డే కదా. మరి అమ్మకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? నిజానికి అమ్మకు అసలు సిసలు గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఆమె చెప్పిన మాటను పాటించడం. అలా పాటిస్తే... మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు అమ్మ మాటను విజయానికి బాటగా చేసుకున్నారు. ‘అమ్మ నా వెనుక ఉంది’ అనుకుంటే వారికి ఎంతో బలంగా ఉండేది. ‘అమ్మ నాతో ఉంది’ అనుకుంటే ఎంతో సందడిగా, సంతోషంగా ఉండేది. ‘అమ్మ ఆశీర్వచనం ఉంది’ అని గుర్తు తెచ్చుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగేది. విజయం చేరువయ్యేది. ఎందరో మహానుభావులు... అందరికి వెనుక అమ్మ ఉంది...నా ప్రపంచం అమ్మకు మాత్రమే తెలుసు!ప్రఖ్యాత శా్రçస్తవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ పుస్తకంలో తన తల్లి గురించి ఇలా కవితాత్మకంగా రాశారు...‘నాకు పదేళ్ల వయసున్న ఆరోజు ఇంకా గుర్తుందిఅన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అసూయపడేలా....నీ ఒడిలో నిద్రిస్తున్నప్పటి సంగతి. అది ΄పౌర్ణమి రాత్రి.నా ప్రపంచం నీకు మాత్రమే తెలుసు అమ్మా... నా అమ్మా!అర్ధరాత్రి, నా మోకాళ్లపై కన్నీళ్లు జారుతుండగా... నేను మేల్కొన్నప్పుడు...నీ బిడ్డ బాధ నీకు తెలుసు, నా అమ్మా నీ శ్రద్ధగల హస్తాలు నా బాధను సున్నితంగా తుడిచివేశాయినీ ప్రేమ, విశ్వాసం, శ్రద్ధ నాకు బలాన్ని ఇచ్చాయి.అమ్మకు ఇచ్చిన మాటగాంధీజీ లా చదవడం కోసం ఇంగ్లాండ్కు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడైన ఆంగ్లేయుడు పరిచయం అయ్యాడు. కొన్ని మాటల తరువాత మాంసం ప్రస్తావన వచ్చింది.‘నేను తినను’ అని చెప్పారు గాంధీజీ‘ఇంగ్లాండ్లో ఎంతో చలిగా ఉంటుంది. అక్కడ మాంసం లేకుండా బతకడం అసాధ్యం’ అన్నాడు ఆంగ్లేయుడు.‘అక్కడి ప్రజలు మాంసం లేకుండా కూడా జీవించగలరని విన్నాను’ అన్నారు గాంధీజీ.‘పచ్చి అబద్ధం. మాంసం తినకుండా అక్కడ జీవించడం అసాధ్యం. అది లేకుండా మీరు జీవించలేరు’ అన్నాడు ఆంగ్లేయుడు.‘మీ సలహాకు థ్యాంక్స్. కాని నేను మా అమ్మకు మాంసం తినను అని మాట ఇచ్చాను. ఒకవేళ అది లేకుండా జీవించడం అసాధ్యం అని తేలితే నేను భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడతాను’ అన్నారు గాంధీజీ.తియ్యటి ఆ పిలుపు ఎప్పుడూ గుర్తుంటుంది! సచిన్ తెందూల్కర్ తల్లి పేరు...రజని.‘ఆమె ప్రోత్సాహం, ప్రార్థనలు నాకు వెన్నుదన్నుగా ఉన్నాయి. అమ్మ నా బలం’ అనేవారు సచిన్.చిన్నప్పుడు సచిన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు...‘సచిన్... సచిన్’అంటూ పిలిచేవారు రజని.‘సచిన్... సచిన్ అనే అమ్మ పిలుపు తీయగా ఉంటుంది. అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది’ అంటారు సచిన్.‘ప్రతి తల్లి తన బిడ్డ ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కోరుకుంటుంది. సచిన్ విషయంలో నేను కూడా అంతే’ అనేవారు రజని. -
నేటి అమ్మ మేటి యోధ
వయసు ముప్పై వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కుటుంబం.. సమాజం... విసిరే సవాళ్లు ఎన్ని! కాని గెలవడం ఆమెకు తెలుసు. ఆమె నేటి అమ్మ. ఈ అమ్మకు పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు.నాకు నేను మిగలాలిపెళ్లి అయ్యింది. పిల్లాడు పుట్టాడు. ఉద్యోగం ఉంది. సంతోషమే. కానీ ‘నేను’ ఏమయ్యాను అనే ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అద్దంలో చూసుకుంటే కనిపించేది ఒకరి భార్య, ఒకరి తల్లి, ఒక కంపెనీ ఉద్యోగి. కానీ వీళ్ల వెనుక ఉత్సాహం ఉరకలెత్తే ‘అమ్మాయి’ కూడా ఉండాలే. నాటి అమ్మాయిని కాపాడుకోవడం నేటి అమ్మకు తెలుసు. అందుకు తను ఏం చేస్తోంది? తనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకుంటోంది. తనకు ఆసక్తి ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకుంటోంది. వాలెంటరీ గ్రూప్తో పని చేస్తోంది. నెలకి ఒక్కసారైనా ఫ్రెండ్స్ను కలుస్తుంది. పూర్వపు బృందానికి లంకెలా పని చేస్తోంది. నేటి అమ్మ ఏకకాలంలో అమ్మ, వ్యక్తి కూడా.80శాతం తృప్తి చాలుఆఫీసులో ప్రమోషన్ కోసం మీటింగ్ నడుస్తోంది. ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది. అటు వైపు చూడాలా.. ఇటు వైపు చూడాలా? 30 ఏళ్ల అమ్మ రెండుగా చీలిపోతుంది. ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక స్వాతంత్య్రం పోతుంది. పిల్లాడిని వదిలేస్తే మనసు ముల్లు గుచ్చుకుంటుంది. అందుకే రెండూ బేలెన్స్ చేసుకుంటోంది. ‘గిల్ట్’ని పక్కన పెట్టడం నేర్చుకుంటోంది. ఆఫీసులో 100 శాతం, ఇంట్లో 100 శాతం ఇవ్వలేనని ఒప్పుకుని, రెండు చోట్లా 80 శాతం నిజాయితీగా ఇస్తోంది. ‘సూపర్ ఉమన్’ కాకపోయినా ‘తృప్తి ఉన్న అమ్మ’ అవుతోంది.నా శరీరం నా కవచండెలివరీ తర్వాత పొట్ట మీద గీతలు, జుట్టు రాలడం, నడుం నొప్పి, నిద్రలేమి. 20 ఏళ్ల వయసులోని చురుకుదనం 30కి వచ్చేసరికి మాయం. సోషల్ మీడియాలో ‘ఫిట్ మామ్’లను చూసి తనను తాను తిట్టుకోవాలా? నో. నేటి అమ్మ అలా చేయదు. అద్దంలో కనిపించే గీతల్ని ‘యుద్ధ గాయాలు’గా చూస్తోంది. వాటిని అలా ఉండనిచ్చి పిల్లాడిని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు 30 నిమిషాలు నడుస్తోంది. యూట్యూబ్ చూసి 10 నిమిషాల యోగా చేస్తోంది. ‘సైజ్ జీరో’ కాదు, ‘జీరో టెన్షన్ హెల్త్’ తన టార్గెట్ చేసుకుంది. శరీరాన్ని ద్వేషించడం మానేసి, అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేటి అమ్మ... జీవన ప్రయాణాన్ని గౌరవిస్తోంది.నేను ముద్దాయిని కానుపిల్లాడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా... ‘అమ్మ సరిగా చూడట్లేదు’. పిల్లాడు అల్లరి చేశాడా... ‘తల్లి ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే ఉంటారు’. బయటి వాళ్ల మాటలు సరే... సొంత వాళ్లే ‘మా అమ్మలా నువ్వు లేవు’ అని పోలుస్తారు. 30 ఏళ్ల అమ్మ ప్రతి రోజూ బోనులో నిలబడుతుంది. అయితే ముద్దాయిలా కాదు. నిర్దోషిగా. పరాయి మాటలకు చెవులు మూసుకోవడం నేర్చుకుంటోంది. ‘నా పిల్లాడికి ఏం కావాలో నాకు తెలుసు’ అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటోంది. ఫోన్ పక్కన పెట్టి పిల్లాడితో రోజూ 30 నిమిషాలు మాట్లాడుతోంది. మార్కులతో పాటు వాడితో అనుబంధం ముఖ్యమని చెబుతోంది. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్లకు తన పిల్లాడి నవ్వే సమాధానం అని ప్రూవ్ చేస్తోంది.నా రేపటి చూపుపిల్లాడి స్కూల్ ఫీజు, ఇంటి ఇ.ఎం.ఐ, అత్తమామల మందులు... సంపాదనలో సగం కళ్ల ముందే కరిగిపోతుంది. ఫ్రెండ్ మంచి చీర కొనుక్కుంటే ‘నేను ఎప్పుడు కొనుక్కోవాలి’ అని 30 ఏళ్ల అమ్మ మనసు చిన్నబోతుంది. తన కలల్ని ‘తర్వాత’ అనే అరలో దాచేస్తుంది. అయితే ఎన్నాళ్లు? అందుకే అమ్మ మారింది. ‘తర్వాత’ని ‘ఇప్పుడే’గా మార్చుకుంటోంది. నెలకి కొన్ని డబ్బులైనా తన పేరు మీద సేవ్ చేస్తోంది. ఫ్రీలాన్స్ పని చేస్తోంది. ఆన్లైన్లో చీరలు అమ్ముతోంది. భర్తతో బడ్జెట్ డిస్కస్ చేస్తోంది. ‘కుటుంబం కోసం’ అనే మాటతో పాటు ‘నా కోసం’ అనే ‘అర’ను జత చేసుకుంటోంది.నా టాలెంట్ నా కల పెళ్లికి ముందు ఆమెకు ఒక కల ఉండేది. డ్యాన్సర్ అవ్వాలి, లేదా బిజినెస్ పెట్టాలి, లేదా ఒక్కతే లడాఖ్ వెళ్లాలి. పిల్లాడు పుట్టాక ఆ కలల ఫైల్ మూసేసింది. ‘ఇప్పుడు కుదరదులే’ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మరి ఇప్పుడు? తన కలలను తవ్వి బయటకు తీస్తోంది. ఉద్యోగం, పిల్లాడితో సమయం... పోగా మిగిలిన కాసేపు తన కల కోసం కేటాయిస్తోంది. ఆన్ లైన్ క్లాస్లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. కథలు రాస్తోంది. ఇంటి నుంచే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. భర్తతో ‘నాకూ ఒక లడాఖ్ కావాలి’ అని ధైర్యంగా అడుగగలుగుతోంది. ‘అమ్మ’ అయిన తర్వాత కలలు చావవు, విరామంతో మేల్కొంటాయి అంతే అని ప్రపంచానికి చెబుతోంది. మరి నేటి అమ్మ కదా. అమ్మా... మము కన్నందుకు పాదాభివందనందేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. తప్పు. అమ్మతో సాటి రాగల దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అంగీకరించడు. అందుకే కవి అంటాడు... ‘అమ్మ లేకుంటే జననం లేదు, అమ్మ లేకుండా గమనం లేదు’. అవును. అమ్మ లేకుండా చేసేది ఏమి గమనం’ అమ్మ లేకుండా సాగేది ఏమి గమ్యం? అమ్మా... ఎలా సాకావు మమ్మల్ని. ‘అకలి’ అని నువ్వు ఏనాడూ అనలేదు. మా కడుపు నిండితే నీ కడుపు నిండిందనుకున్నావు. ‘స్వార్థం’ అనే భావన ఏనాడూ చూపలేదు. నీకున్నదంతా మాకే పంచి పెట్టావు. అలసిన సంగతి తెలియనిచ్చావా? తెచ్చిపెట్టుకున్న హుషారుతో మమ్మల్ని విజయాల వైపు పరుగులెత్తించావు.మేము పాసైతే నువ్వు పాసయ్యావనుకుని, మేము ఇంటర్వ్యూకెళితే నువ్వు ఉపవాసం ఉండి, మేము గెలిస్తే నీకు ప్రైజ్ వచ్చిందనుకుని మురిసిపోయే అమాయకురాలివి. ఎంత క్షమ నీకు. ఎంత ఆర్తి. ఎంత ఆర్ద్రత నీ పిల్లల కోసం. నీ ప్రతి ప్రార్థన మా కోసమే కదా. ‘మదర్స్ డే’ అని చెప్పి స్టేటస్ పెట్టి, నీతో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాం. నువ్వనే ఒక మహాకావ్యంలో మేమొక అధ్యాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. కృతజ్ఞతాశ్రువులతో నీ చేతులను ముద్దాడతాం. ‘అమ్మా.. మము కన్నందుకు పాదాభివందనం’ అని నీ పాదాలు అంటి ఆశీర్వాదం తీసుకుంటాం.అమ్మా.. నీకు శతకోటి ప్రణామాలు. -
మీ వంటింట్లోని ప్లాస్టిక్ ప్రాణాంతకమా
మనం రోజూ వాడే వాటర్ బాటిల్స్ నుంచి లంచ్ బాక్సుల వరకు ప్రతి ప్లాస్టిక్ వస్తువు అడుగున ఒక చిన్న త్రిభుజం.. అందులో ఒక నంబర్ ఉండటం మీరెప్పుడైనా గమనించారా? అసలు ఆ నంబర్లు దేనిని సూచిస్తాయి? అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం? ఎంత వరకు ప్రమాదకరం? ఈ ఆసక్తికర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వర్గీకరణ.. సొసైటీ ఆఫ్ ది ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ (ఎస్పీఐ) అనే సంస్థ 1988లో ప్లాస్టిక్ను ఏడు రకాలుగా వర్గీకరించింది. ఈ వర్గీకరణ వ్యవస్థను రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ (ఆర్ఐసీ) అని పిలుస్తారు. ప్లాస్టిక్ రకాలను గుర్తించి వాటికున్న రీసైక్లింగ్ సామర్థాన్ని బట్టి వాటికి 1 నుంచి 7 నంబర్లను కేటాయించారు.1 పీఈటీ: సాఫ్ట్ డ్రింక్ సీసాలు, వాటర్ బాటిళ్ల తయారీకి ఈ రకం ప్లాస్టిక్ని వాడతారు. వాటిని పదేపదే ఉపయోగిస్తే యాంటిమోనీ అనే హానికర రసాయనాలు వెలువడవచ్చు. అత్యధికంగా రీసైకిల్ అవుతున్న ప్లాస్టిక్ ఇది. 2హెచ్డీపీఈ: పాల డబ్బాలు, షాంపూ బాటిళ్లు, డిటర్జెంట్ డబ్బాలకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్. రసాయనాల విడుదల తక్కువ. సులభంగా రీసైకిల్ చేయవచ్చు. 3 పీవీసీ (వినైల్): పైపులు, పిల్లల బొమ్మలు, క్లింగ్ ఫిల్ములు (గాలి చొరబడకుండా గిన్నెలపై మూతలుగా వాడే ప్లాస్టిక్ షీట్స్) తయారు చేసేందుకు వాడతారు. అయితే దీన్ని ‘పాయిజన్ ప్లాస్టిక్’అంటారు. ఇందులో కేన్సర్ కారక డయాక్సిన్లు, థాలేట్లు ఉంటాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. 4 ఎల్డీపీఈ: ప్లాస్టిక్ కవర్లు, బ్రెడ్ ప్యాకెట్లకు వాడతారు. ఇది కూడా కొంతవరకు సురక్షితమైనదే. కొన్ని అవసరాలకు మాత్రమే రీసైకిల్ చేస్తారు. 5 పీపీ: పెరుగు కప్పులు, సిరప్ బాటిళ్లు, వేడి ఆహార కంటెయినర్లకు వాడతారు. వేడిని తట్టుకుంటుంది. దీనిని కూడా సురక్షితమైన రకంగానే పరిగణిస్తారు. రీసైక్లింగ్ సాధ్యమే. 6 పీఎస్ (పాలీస్టెరీన్): ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, టీ–కప్పులు, ప్యాకింగ్ మెటీరియల్, ఎగ్ కార్టన్స్, ధర్మోకోల్ తయారీకి వాడతారు. వేడి తగిలితే స్టెరీన్ అనే విష పదార్థం విడుదల అవుతుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా దీనిని రీసైకిల్ చేయరు. చేయడం కూడా కష్టం. 7 ఇతర ప్లాస్టిక్లు: నైలాన్, సన్ గ్లాసెస్, బేబీ బాటిల్స్ (కొన్ని రకాలు) తయారు చేస్తారు. ఇది మిశ్రమ ప్లాస్టిక్. రీసైక్లింగ్ దాదాపు అసాధ్యం.పర్యావరణ నిపుణుల సూచనల ప్రకారం 2, 4, 5 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులను వాడటం కొంత వరకు సురక్షితం. కానీ 3, 6, 7 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారాన్ని ఓవెన్లో వేడి చేయడం లేదా వేడి పదార్థాలను ఉంచడం మానుకోవాలి. ఈసారి మీరు కొనే ప్లాస్టిక్ బాటిల్ అడుగున నంబర్ చూడటం మర్చిపోకండి! -
అమ్మ ప్రేమకో నూలుపోగు
చిన్నప్పుడు అమ్మ మన చేయి పట్టుకుని బజారుకు తీసుకెళ్లి ఎన్నో కొని పెట్టి ఉంటుంది. మనం అమ్మకు ఏదైనా కొని పెట్టి ఎంతకాలం అయ్యింది? అమ్మ ఏమీ అడగదు... పిల్లలకు ఇబ్బంది అని. కాని చిన్నప్పుడు మన ప్రతి ఇబ్బందిని వెయ్యి కళ్లతో చూసి దూరం చేసి ఉంటుంది. మే 10 మదర్స్ డే. ఇక్కడున్న బహుమతులన్నీ మీరు అమ్మకు ఇవ్వొచ్చు. అన్నీ కలిపినా పదీ పదిహేను వేలు మించవు. అమ్మ ప్రేమ ముందు ఆ విలువ దిగదుడుపు కదూ.1. ఎలక్ట్రికల్ హాట్ వాటర్ బ్యాగ్మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పితో అమ్మ రాత్రిళ్లు నిద్రపోదు. కాపడం పెట్టుకోవడానికి గ్యాస్ మీద నీళ్లు కాచి పొయ్యి దగ్గర నిలబడే ఓపిక ఉండదు. మనందరం ఆమె ఇంటి సభ్యులమే. కాని ఎవరు ఏ పనిలో ఉన్నారో అని అమ్మ డిస్ట్రబ్ చేయదు. మౌనంగా నొప్పులు భరిస్తుంది. ఆమెకు ఈ హాట్ వాటర్ బ్యాగ్ కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ బ్యాగ్ను అయిదు నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటలు వేడిగా ఉంటుంది. రాత్రి పక్కలో పెట్టుకుంటే వెన్ను నొప్పి మాయం, హాయిగా నిద్ర. ‘వీడు నా నొప్పిని గుర్తుపెట్టుకున్నాడు’ అమ్మ తృప్తి పడితే ఎంత సంతోషం! వెల: రూ.300 నుంచి.2. నాన్–స్లిప్ స్లిప్పర్స్ + బాత్రూమ్ హ్యాండిల్ బార్‘అమ్మా జాగ్రత్త‘ అని ఫోన్ లో చెప్తాం కానీ బాత్రూమ్లో జారి పడితే లేపడానికి ఉండం. ఈ స్లిప్పర్స్ వేసుకుంటే తడి నేల మీద కూడా జారదు. గోడకి ఒక హ్యాండిల్ బార్ బిగిస్తే పట్టుకుని లేవొచ్చు, అమ్మ కోసం అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అమ్మ నిద్ర పోయే ముందు ఆమె పాదాలు నొక్కుతూ కూర్చునే టైమ్ ఉండటం లేదు. కనీసం ఈ స్లిప్పర్స్తో అయినా కొంత పరిహారం చేసుకోవచ్చు. వెల: రూ.800 నుంచి3. బిగ్ బటన్ ఫోన్ విత్ ఎస్.ఓ.ఎస్స్మార్ట్ఫోన్ ఇస్తే అమ్మకి కన్ ఫ్యూజన్. లాక్ తియ్యడం, వాట్సాప్ చేయడం... ఒక్కోసారి రాంగ్ నంబర్కి కాల్ వెళ్తుంది. అదే ఈ ఫోన్ లో అయితే నంబర్లు పెద్దగా కనిపిస్తాయి. పైగా మూడు ఫోటో బటన్లు ఉంటాయి. మన ఫోటో నొక్కితే డైరెక్ట్గా మనకే కాల్ వస్తుంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే అయిదు నంబర్లకి కాల్, మెసేజ్ వెళ్తుంది. అమ్మకు మనం గుర్తు పెట్టుకుని ఫోన్ చేయకపోయినా అమ్మ మనల్ని గుర్తు పెట్టుకొని ఫోన్ చేయడానికి ఇదే మంచి కానుక. వెల: 1200 నుంచి.4. రీడింగ్ గ్లాసెస్అమ్మకు కంటి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఆమెకు కొత్త అద్దాలు మార్చి ఎంత కాలం అయ్యింది? మంచి రీడింగ్ గ్లాసులు కొని పెడితే ఆమె చదువుకునే గీత, రామాయణం స్పష్టంగా కనపడతాయి. న్యూస్పేపర్ హాయిగా చదువుకోవచ్చు. టీవీ సీరియల్ కంటే ఈ పుస్తకం మనశ్శాంతి ఇస్తుంది, టైమ్పాస్ అవుతుంది. చిన్నప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకుని నీతి కథలు, రాముడి కథ చెప్పి నిద్రపుచ్చింది. ఇవాళ మనం ఇచ్చిన కళ్లజోడు ఆవిడకి కథల పుస్తకాలు చదివేందుకు ఉపయోగపడి నిద్ర పుచ్చుతాయి. రూ. 500 నుంచి.5. వాకింగ్ స్టిక్ విత్ ఎల్.ఇ.డి. లైట్ ప్లస్ సీట్ఒక వయసుకు వచ్చాక గుడికి వెళ్లాలన్నా, మార్కెట్కి వెళ్లాలన్నా ‘తోడు ఎవరున్నారు‘ అనే భయం అమ్మకు. ఈ స్టిక్ పట్టుకుంటే ఆసరాగా ఉంటుంది. అలిసిపోతే మడత విప్పి సీట్ మీద కూర్చోవచ్చు. రాత్రి కరెంట్ పోయినా ఎల్ఇడి లైట్ వెలిగిస్తే దారి కనపడుతుంది, కాలు జారదు. ‘అమ్మా, నువ్వు నడవలేవులే‘ అని ఇంట్లో కూర్చోబెట్టే బదులు ‘ఈ స్టిక్ పట్టుకో, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు‘ అని ధైర్యం ఇస్తే అదే అసలైన గిఫ్ట్. రూ. 1000 నుంచి.6. మెడిసిన్ ఆర్గనైజర్ బాక్స్ విత్ అలారంషుగర్, బీపీ, కీళ్ల నొప్పులు... రోజుకి నాలుగు రకాల మాత్రలు. ‘వేసుకున్నానో లేదో‘ అని అమ్మ కన్ ఫ్యూజ్ అవుతుంది. ఒకోసారి రెండుసార్లు వేసుకుంటుంది. ఈ బాక్స్లో ఏడు రోజుల మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి లెక్కన విడివిడిగా సర్దొచ్చు. టైమ్కి అలారం మోగితే తిప్పలు లేకుండా వేసుకుంటుంది. మనకు జ్వరం వస్తే అర్ధరాత్రి లేచి మరీ మాత్ర వేసిన అమ్మకు ‘అమ్మా, నీ ఆరోగ్యం నాకు గుర్తుంది‘ అని చెప్పే కానుక ఇది. రూ.700 నుంచి.7. ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్‘తలనొప్పిగా ఉంది... కళ్లు తిరుగుతున్నాయి’... అని అమ్మ అంటే వెంటనే హాస్పిటల్కి పరుగెత్తక్కర్లేదు. చేతికి కట్టి బటన్ నొక్కితే 30 సెకన్లలో బి.పి, పల్స్ రీడింగ్ ఇస్తుంది. డాక్టర్కి ఫోన్ లో చెప్పొచ్చు, వైద్య సలహా తీసుకోవచ్చు. చిన్నప్పుడు మనం జారి పడితే అమ్మ గుండె వేగం పెరిగేది, ఇవాళ ఆవిడ గుండె లయ తప్పకుండా చూసే బాధ్యత మనది. ‘అమ్మా, నీ గుండె చప్పుడు నాకు వినపడుతుంది, ఇదిగో మిషన్ పెట్టి చూస్తున్నా’ అని భరోసా ఇవ్వొచ్చు. వెల: రూ.15008. మెత్తటి కాటన్ నైటీలు – 2 జతలుఅమ్మ ఇంట్లో వేసుకునే బట్టల మీద ఎప్పుడైనా దృష్టి పెట్టామా? చిరిగిపోయిన, వెలిసిపోయిన, బిగుతుగా ఉండే నైటీతోనే రాత్రిళ్లు నిద్రపోతుంది. ‘నాకు కొత్త బట్టలేందుకురా, ఉన్నవి చాల్లే‘ అంటుంది. కానీ మెత్తటి, లూజ్గా, చెమట పీల్చే కాటన్ నైటీ వేసుకుంటే ఆవిడకి హాయిగా నిద్రపడుతుంది. ముఖ్యంగా వేసవిలో. లేత రంగు, పెద్ద సైజు, ముందు జిప్ లేదా బటన్స్ ఉన్న రెండు జతల నైటీలు కొనివ్వండి. చిన్నప్పుడు స్కూల్ యూనిఫాం మాసిపోకుండా, మడత నలగకుండా అమ్మే ఇస్త్రీ చేసి వేయించేది. ఇవాళ ఆవిడ సౌకర్యంగా ఉండటానికే అమ్మ ప్రేమకో నూలుపోగు. వెల: రూ.1200 నుంచి 2 జతలకి.కె. -
యుద్ధం మిగిల్చిన విషాదం
యుద్ధం ఎప్పుడూ విషాదాన్నే మిగుల్చుతుంది. కళ్లముందే సర్వస్వం కాలిపోవడం, ఆత్మీయులను కోల్పోవడం.. ఆర్థికంగానే కాదు, మానసికంగానూ చేసే గాయం అంతా ఇంతా కాదు. ‘ఆపరేషన్ సింధూర్’సమయంలోనూ పాక్ జరిపిన షెల్లింగ్, కాల్పులు సరిహద్దు గ్రామాల్లో వినాశనం సృష్టించాయి. కుటుంబాలకు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇళ్లు విధ్వంసమై అనేక కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి.‘ఆపరేషన్ సింధూర్’తరువాత.. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైపు నుంచి భారీ ఫిరంగులు, మోర్టార్ షెల్లింగ్ జరిగింది. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, మతపరమైన కట్టడాలు, వాణిజ్య భవనాలపై షెల్లింగ్ జరిగింది. వందలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి పారిపోయాయి. కాల్పులు జరిగి ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడే జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నది. ప్రస్తుతానికి శాంతి నెలకొంది. పిల్లలు బడికి వెళ్తున్నారు. ప్రజలు తమ పొలాల్లో పనిచేస్తున్నారు. కానీ, ఆసంఘర్షణ తాలూకు గాయాలు సరిహద్దు గ్రామవాసుల జీవితాలను ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఉత్తర కశ్మీర్లోని ఉరి, బోనియార్ నుంచి జమ్మూలోని పూంచ్, రాజౌరి వరకు సరిహద్దు ప్రాంత ప్రజలను భయం, మానసిక క్షోభ ఇంకా వెంటాడుతున్నాయి. ఫిరంగి శకలాలతో ఆటలు.. ఆ నాలుగు రోజుల యుద్ధం పిల్లల మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వాళ్లు జోలపాటల కంటే ముందే మోర్టార్ షెల్స్ శబ్దాన్ని విన్నారు. ఒకప్పుడు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు.. ఇప్పుడు మొనదేలిన లోహపు ముక్కలతో ఆడుకుంటున్నారు. షెల్లింగ్, నిరాశ్రయులవ్వడం పిల్లలను మానసిక వేదనకు గురి చేసింది. ఇప్పటికీ పెద్ద శబ్దాలు వినపడితే పిల్లలు భయపడుతున్నారు. ఐదేళ్ల అమీరా జాన్, తన ఇంటిపై పడి పేలిన ఫిరంగి గుళ్ల శకలాలను సేకరించి ఒక పెట్టె నిండా నింపింది. ఒకప్పుడు మట్టి బొమ్మలతో ఆడుకున్న చిన్నారి ఇప్పుడు యుద్ధ శకలాలను ఆటవస్తువులుగా మార్చుకుంది. రాళ్లు, మట్టితో కట్టిన వారి ఇంటిపై షెల్లింగ్ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. పగిలిన కిటికీలను పాలిథీన్ షీట్లతో కప్పి ఉంచారు. ‘మా ఇంటి మీద షెల్లింగ్ తర్వాత నేను ఏడుస్తూ నిద్రపోలేదు. నా తోబుట్టువులు, తల్లిదండ్రులతో సురక్షిత ప్రాంతానికి పరుగెత్తా. రాత్రంతా మేం దాక్కునే ఉన్నాం’అని ఆ పీడకలను గుర్తు చేసుకుంది. యుద్ధం నాలుగు రోజుల్లో ముగిసినప్పటికీ, అమీరా లాంటి పిల్లలకు యుద్ధ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. పూంచ్లోనూ షెల్లింగ్ తీవ్ర గాయాలను మిగిల్చింది. ఒక దేవాలయం, ఒక గురుద్వారా, ఒక మదర్సా దెబ్బతిన్నాయి. ఇక్కడి అతిపెద్ద మదర్సా జియా–ఉల్–ఉలూమ్లో ముగ్గురు విద్యార్థు లు, ఉపాధ్యాయుడు మరణించారు. బంకర్లు లేవు.. షెల్లింగ్ మానసికంగానే కాదు.. ఆర్థికంగానూ తీవ్ర నష్టం కలిగించింది. ఇళ్లు దెబ్బతిన్న వారిలో చాలామంది ఇప్పటికీ తాత్కాలిక ఆశ్రయాల్లో నివసిస్తున్నారు. బాంబు దాడు ల్లో ధ్వంసమైన తమ ఇళ్లను తిరిగి నిర్మించుకోవడానికి పోరాడుతున్నారు. ‘షెల్లింగ్ దాడి జరిగి సరిగ్గా ఏడాది. ఆ భయానక పరిస్థితులు మాకు ఇంకా గుర్తున్నాయి. మా ఇళ్లు ధ్వంసమైంది. వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం మొదట రూ.1.30 లక్షలు, ఆ తర్వాత రూ. 2 లక్షలు ఇచ్చింది. దాంతో ఏం చేయగలం? ధ్వంసమైన ఇళ్లను తిరిగి నిర్మించుకోవడానికి ఆ పరిహారం సరిపోదు. ఇంకా కూలిన గోడల మధ్యే నివసిస్తున్నాం’అని ఉరి నివాసి తాలిబ్ హుస్సేన్ అన్నారు. సరిహద్దు గ్రామాల్లో బంకర్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఉరి ఉప–జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఒక బంకర్ నిర్మించారు. ఇలాంటి బంకర్లు ఇంకా చాలా ఏర్పాటు చేయాల్సి ఉంది. కాల్పులు జరిగినప్పుడల్లా నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. కానీ, ఆచరణలో లేదు. మళ్లీ ఏ క్షణమైనా కాల్పులు ప్రారంభం కావచ్చని, తమకు బంకర్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఏ క్షణంలోనైనా పరుగెత్తడానికి సిద్ధంగా‘ఆకాశం నుంచి రాళ్లలా పడ్డ షెల్లుల శబ్దాల ప్రతిధ్వనులు పీడకలల్లా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ, ఏ క్షణంలోనైనా పరుగెత్తడానికి సిద్ధంగా ఉండాలని రాత్రంతా బట్టలు వేసుకునే ఉంటాను’అని ఉరి తహసీల్లోని పరాన్పిల్లా గ్రామంలో 5వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల ఉమైర్ యూనుస్ చెబుతున్నాడు. ఉమైర్ తోటి విద్యార్థులూ అంతే దిగ్భ్రాంతికి గురయ్యారు. భయంతో చదువుపై దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ‘గతంలోలా చదివినవి గుర్తుంచుకోలేకపోతున్నాను. నా మనసు వేరే ఆలోచనలతో నిండిపోయింది’అని షెల్లింగ్ తరువాత బారాముల్లా పట్టణానికి పారిపోయి వచ్చిన సుహానా ఇలియాస్ అంటోంది. ‘ఇక్కడి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే సరిహద్దు గ్రామాల్లో విద్య ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. మళ్లీ పుంజుకోకపోతే పెద్ద దెబ్బ అవుతుంది. ఈ ప్రాంతం ఇప్పటికే చాలా చూసింది. మా పిల్లల చదువు నాశనం కావడం మాకు ఇష్టం లేదు’అని పాఠశాల నిర్వాహకుడు 35 ఏళ్ల నాసిర్ సలీం చెబుతున్నారు. సన్నద్ధత లేదు.. షెల్లింగ్ కారణంగా గతేడాది వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సీజన్లో తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేవలం శాంతి మాత్రమే సరిపోదని, సన్నద్ధత ముఖ్యమని, దీర్ఘకాలిక భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పూంచ్, రాజౌరిలలో అత్యంత తీవ్రమైన షెల్లింగ్ జరిగింది. ‘మేము రాత్రి భోజనం చేస్తుండగా పేలుళ్లు మొదలయ్యాయి. పిల్లలు ఏడుస్తున్నారు. జనం పరుగులు తీస్తున్నారు. రాత్రంతా జరిగిన ఆ షెల్లింగ్లో మా బంధువును కోల్పోయాం. ఉదయానికల్లా అతడు లేడు.’అని పూంచ్ నివాసి ముజఫర్ హుస్సేన్ కన్నీటి పర్యంతమయ్యారు. షెల్లింగ్ సమయంలో గాయపడిన వారిలో ఉరికి చెందిన జీనత్ కూడా ఒకరు. ఇల్లు పూర్తిగా కలిపోవడంతో ఆమె ఇంటిని వదిలి పారిపోయారు. పాక్షిక నష్టం కింద ఆమెకు రూ.1.06 లక్షలు, చికిత్స కోసం మరో లక్ష రూపాయలు అందింది. కానీ చికిత్స కోసం కేటాయించిన డబ్బు మందులకే ఖర్చయిపోయింది. ఉండటానికి గూడు లేకుండా పోయిందని దుఃఖిస్తున్నారు. పిల్లలను చదివించడమే లక్ష్యంగా ఈ నాలుగు రోజుల షెల్లింగ్లో ఒక్క పూంచ్ జిల్లాలోనే నలుగురు పిల్లలతో సహా 16 మంది మరణించారు. మండి తహసీల్లో షాహిదా కౌసర్.. కాల్పుల్లో తన భర్త మహమ్మద్ అబ్రార్ మాలిక్ను కోల్పోయింది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి నానా కష్టాలు పడుతోంది. ‘ఆయన డ్రైవర్, మా కుటుంబానికి అతనొక్కడే ఆధారం. ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. షెల్లింగ్ మొదలైనప్పుడు వాష్రూమ్కు వెళ్లాడు. అక్కడే చనిపోయాడు. మా ఇల్లు కూడా దెబ్బతింది. ఇంటి మరమ్మతులు ఇంకా చేయించుకోలేకపోయాను. నాకు ముగ్గు రు పిల్లలు, అందరూ బడికి వెళ్తున్నారు. వాళ్లను ఉన్నత చదువులు చదివించడమే నా లక్ష్యం’అని కౌసర్ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడులో రాష్ట్రపతి పాలన? లేకుంటే..
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఒక అగ్రనటుడు పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి బలం లేకున్నా ప్రభుత్వ ఏర్పాట్లకు ప్రయత్నించడం.. మ్యాజిక్ ఫిగర్ లేదంటూ గవర్నర్ అందుకు అనుమతించకపోవడం విమర్శలకూ తావిచ్చింది. ఈ తరుణంలో తమిళనాడులో మే 10 దాటితే ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో.. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ 118.. అంటే ప్రభుత్వ ఏర్పాటునకు మరో 10 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించింది. విజయ్ రెండు చోట్ల పోటీ చేసి నెగ్గడంతో.. ఇంకో సీటు అదనంగా అవసరం కానుంది. అంటే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే సరిపోతుందన్నమాట.ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత బలనిరూపణ చేసుకుంటామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు విజయ్ రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో.. ఇలాంటి సందర్భాల్లో గవర్నర్లు సానుకూలంగా వ్యవహరించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. కానీ, తమిళనాడు విషయంలోనే గవర్నర్ ఆర్లేకర్ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి బలం చూపించాకే సీఎంగా ప్రమాణం చేయాలని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజయ్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో..విజయ్కు ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో.. తమిళనాడు 16వ అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈలోపు ప్రభుత్వ ఏర్పాటు అంశం కచ్చితంగా ఓ కొలిక్కి రావాలని లేదు. కాకుంటే గవర్నర్ తన విశిష్ట అధికారాల్ని (Discretionary Powers) ఉపయోగించే అవకాశమూ లేకపోలేదు. ఒకటి.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేదాకా కొనసాగమని కోరడం.. రెండోది టీవీకేను పక్కనపెట్టి ఇతర కూటములను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించడం.. మూడోది రాష్ట్రపతి పాలన విధించే అవకాశం!.తమిళనాడులో గతంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. కరుణానిధి హయాంలో 1976 జనవరి నుంచి 516 రోజులపాటు, ఎంజీఆర్ సీఎంగా ఉన్న టైంలో 1980 ఫిబ్రవరి నుంచి 113 రోజులపాటు, 1988లో ఎంజీఆర్ మరణాంతరం ఆయన సతీమణి జానకీ సీఎంగా ఉన్నప్పుడు 363 రోజులపాటు, చివరగా.. 1991లో కరుణానిధి హయాంలో 145 రోజులపాటు రాష్ట్రపతి పాలన విధించారు.రాజకీయ విశ్లేషకులు చెబుతోంది ఏంటంటే.. ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాలనే కచ్చితమైన రూల్ రాజ్యాంగంలో లేదు. కాకుంటే.. మెజారిటీ నిరూపించలేకపోయినా.. ప్రభుత్వం ఏర్పడకపోయినా "రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది" అని కారణాన్ని చూపిస్తూ కేంద్రానికి గవర్నర్ నివేదిక పంపే అవకాశం ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదని/ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం కొనసాగడం అసాధ్యమని కేంద్రం భావిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఆ అవకాశం లేకపోలేదు.సాధారణంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ముందుగా అవకాశం ఇవ్వడం ఒక సంప్రదాయం. అయినప్పటికీ, అది రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉండదు. గవర్నర్ తన నిర్ణయాన్ని మెజారిటీ నిరూపణ ఆధారంగా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా తమిళనాడు ఎపిసోడ్ నేపథ్యంలో.. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు అప్పుడు గవర్నర్లు రాష్ట్రపతి పాలనకు సిఫార్సులు చేసిన సందర్భాలు ఉన్నాయి.1996లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 174 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ టైంలో మేజిక్ ఫిగర్ 213. బీజేపీకి అది సాధ్యం కాలేదు. ఏ కూటమి కూడా మెజారిటీ సాధించలేకపోవడంతో అప్పటి గవర్నర్ రాష్ట్రపతి పాలన కొనసాగించారు(ఎస్పీ-బీఎస్పీ కూటమి కూలిపోవడంతో 1995లోనే గవర్నర్ మోతీలాల్ వోరా రాష్ట్రపతి పాలన విధించారు). ఆ తర్వాత ఏడాదికి బీజేపీ-బీఎస్పీ కూటమి ఏర్పడి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కేసు.. ఇక్కడ ఒక పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందడం ముఖ్యం కాదు అని చెప్పింది. ఇక.. 2005 బీహార్ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఒకవైపు కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే అప్పటి గవర్నర్ బూటా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొదటి సమావేశం జరగకముందే ఆ అసెంబ్లీని రద్దు చేసి.. ‘‘హార్స్ ట్రేడింగ్ జరుగుతోంది’’ అని కేంద్రానికి నివేదిక పంపి రాష్ట్రపతి పాలన విధించారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం.. గవర్నర్ వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టడం.. అది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయమని.. గవర్నర్ అధికారాలను పరిమితం చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగాయి. అయితే అప్పటికే ఎన్నికల తేదీలు ప్రకటించడంతో కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం ఇక్కడికే పరిమితం చేసింది.విజయ్ పార్టీ (TVK) అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు దాటలేకపోవడంతో గవర్నర్ మద్దతు లేఖలు కోరుతున్నారు. ఆయన అడిగిన దాంట్లో తప్పుందని కూడా అనలేం. 2006లో డీఎంకేకు 96 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ, మిత్రపక్షాల మద్దతు లేఖలతో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకొచ్చింది. మెజారిటీ ఉండడంతో గవర్నర్ అందుకు అనుమతించారు. ఆ తర్వాత బలనిరూపణలో ప్రభుత్వం నెగ్గింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే అమలు చేసే చర్య. ప్రస్తుత తమిళనాడు విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు దారి తీసే అవకాశం కూడా. గవర్నర్ నివేదికలు, ఆర్టికల్ 356 వినియోగం.. కోర్టు సమీక్షకు లోబడి ఉండాలని గతంలో న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అలాగే ఎన్నికల ద్వారా వచ్చిన అసెంబ్లీని రద్దు చేయడం అత్యంత అసాధారణం కూడా. ఒకవేళ.. తమిళనాడు గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ గనుక ఏదైనా అసాధారణ నిర్ణయం తీసుకుంటే టీవీకే పార్టీ సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. -
అమ్మలా చూసుకునే డే కేర్ సెంటర్
పిల్లలకు క్రష్ ఉంది. మరి అమ్మకు ఉందా? అమ్మను బాగా చూసుకోవాలనుకునే కూతురి సాయానికి, అత్తగారిని సౌకర్యంగా చూడాలనుకునే కోడలు జాబ్కు వెళ్లడానికి, అమ్మ ఒక్కర్తే ఉంటే సేఫ్ కాదేమో అనుకునే కొడుకు కోడళ్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మను బాగా చూసుకునే ‘డే కేర్ సెంటర్’ ఎందుకు ఉండకూడదు? ఉన్నాయి. వాటితో మనం పొందే సాయం ఏమిటి?చంటి పిల్లలను గుండెలకు హత్తుకుని పెంచుకోవాలి. కాని మారిన కాలంలో, పని చేయక తప్పని పరిస్థితుల్లో వారిని ‘క్రష్’లో వదలడం అలవాటు చేసుకున్నాం. మన పని ముగియగానే వెళ్లి తెచ్చుకుంటున్నాం. అమ్మకు కూడా ఈ ఏర్పాటు ఎందుకు ఉండకూడదు? ‘ఎల్డర్ కేర్ సెంటర్’లు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో ఎన్ని వస్తే అంత మంచిది కదా...ఒక ఆందోళన పోయింది...స్వాతికి చాలా రోజులుగా ఆందోళన ఉంది. ఇంట్లో అత్తగారు ఉంటారు. తను, భర్త ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాలి. అత్తగారు ఉండటం తనకు ఇష్టమే. కాని ఆమె వయసు 73. గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు హుషారు లేదు. డిమెన్షియా లక్షణాలు కనిపిస్తున్నాయి. బి.పి. మాత్ర వేసుకోవడం మర్చిపోతుంది. ఒకవేళ తాము లేనప్పుడు కాలు జారి పడితే? గ్యాస్ ఆన్ చేసి మర్చిపోతే? ఫోన్ చేస్తే ఒక్కోసారి తీయదు. ఆమె టీవీ ముందు ఉండి ఫోన్ తీయకపోతే తనకు ఆఫీసులో చాలా టెన్షన్ వచేస్తుంది– ఏమయ్యిందో అని. సాయంత్రం తను ఇంటికొచ్చి చూసే వరకు అత్తగారికి మరో మనిషి దిక్కు లేదు. ఇదంతా మైండ్లో తిరుగుతుంటే సరిగా పని చేయలేకపోతోంది. పైగా ఏదో గిల్ట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తగారిని బాగా చూసుకునే, అత్తగారి వయసు వాళ్లు తోడు ఉండే, కబుర్లు చెప్పే, కాలక్షేపం చేయించే ఒక ‘ఎల్డర్ డే కేర్ సెంటర్’ ఎందుకు ఉండకూడదు. అని ఆలోచించింది. వెతికింది. అలాంటిది ఉంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.ఇదేదో బాగుందే..!హైదరాబాద్లో కొంచెం దూరంలో దొరికిన ‘సీనియర్ డే కేర్ సెంటర్’లో స్వాతి తన అత్తగారికి అడ్మిషన్ తీసుకుంది. దీనికి ముందు భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. తర్వాత పెద్దావిడకు వివరించి చెప్పారు. ముందు ఆమె కొంచెం ఇబ్బంది పడినా ‘సరే... కొన్నాళ్లు చూస్తాను... నచ్చితే సరే’ అంది. అడ్మిషన్ అయ్యాక అత్తగారి జీవితం మారింది. ఆమె ఉదయాన్నే లేచి రెడీ అయితే ఉదయం తొమ్మిదికి వ్యాన్ వచ్చి తీసుకెళ్తుంది. సీనియర్ డే కేర్ సెంటర్లో ఆమెలాంటి ఇరవైమంది ఇదివరకే ఉన్నారు. వారంతా అమ్మమ్మలు, నానమ్మల వయసు వారే. పరిచయాలై మొదటి రోజే ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ ఉదయం 10 గంటలకు యోగా, 11 గంటలకు భజన, మధ్యాహ్నం ఫిజియో, అందరితో కలిసి భోజనం... బీపీ, షుగర్ చెక్ చేస్తారు. మాత్ర వేస్తారు. సాయంత్రం నాలుగుకి గేమ్స్, అయిదు గంటలకు స్కూల్ నుంచి వచ్చిన మనవడితో వీడియో కాల్ చేయిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి.మళ్లీ స్కూల్కు వెళ్లినట్టే...‘దీనిని సీనియర్ డే కేర్ సెంటర్ అనడం కంటే అమ్మమ్మ–తాతయ్యల బడి అనడం సరదాగా ఉంటుంది. అందరం ఈ వయసులో మళ్లీ బడికొచ్చినట్టే కదా’ అంటారు సీనియర్ కేర్ సెంటర్లో చేరినవారు. ‘ఇంట్లో ఉంటే నేను పేషెంట్ని. ఇక్కడికి వస్తే పర్సన్ని. ఇక్కడ నాకు పేరు ఉంది, పాట ఉంది, పని ఉంది’ అంటారు మరొకరు. హైదరాబాద్లో ఇప్పటికి మూడు నాలుగు ప్రయివేట్ ఎల్డర్ కేర్ సెంటర్లు నడుస్తున్నాయి. బెంగళూరులో ‘నైటింగేల్స్ ఎల్డర్ కేర్’, చెన్నైలో ‘ధరణి సీనియర్ కేర్’ పేర్లతో ఇవి ఉన్నాయి. హైదరాబాద్లో, తెలంగాణ అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లు 40 వరకూ ఉన్నాయి. వీటిలో ఖర్చు చాలా తక్కువ.మరి ఖర్చు ఎంత?ప్రయివేట్ ఎల్డర్ కేర్ సెంటర్లలో నెలకు ఖర్చు రూ.8,000 నుంచి రూ.15,000 ఉంటుంది. పెద్దవాళ్లకోసం ఫుల్ టైమ్ అటెండర్ని ఇంట్లో పెడితే 18,000 కు పైనే అవుతుంది. పైగా ఆ అటెండర్కి ట్రైనింగ్ ఉండదు. ఇక్కడ ట్రైన్డ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు.‘అమ్మ సేఫ్’ అనే అనే ధైర్యం ఉంటుంది. ప్రమోషన్ మిస్ కావడం, జాబ్ మానేయడం ఉండదు. ఎందుకంటే ‘హెల్ప్ఏజ్ ఇండియా’ లెక్కల ప్రకారం దేశంలో 62 శాతం మహిళలు తల్లిదండ్రుల బాగోగుల కోసం కెరీర్ని త్యాగం చేస్తున్నారు. అదే ‘డే కేర్’ ఉంటే ఆ త్యాగం అవసరం లేదు. పైగా ఇలాంటి సెంటర్ల వల్ల అమ్మకు/అత్తగారికి ఒంటరితనం బాధ పోయి మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి మారిన కాలానికి తగ్గట్టు అమ్మ/కూతురు.. అత్త/కోడలు మారాలి. అందరూ అమ్మలే. అమ్మలు బాగుండాలి. మంచి డే కేర్ ఎలా ఎంచుకోవాలి? మీరు అమ్మను ఇక్కడ చేర్చాలనుకుంటే ఈ కింద పాయింట్స్ చెక్ చేయండి.1. అయిదు మందికి కనీసం ఒక ట్రైన్డ్ నర్స్ ఉండాలి.2. సిసి టీవీ ఉందా...ఫోన్లో లైవ్ చూసే సౌకర్యం ఉందా కనుక్కోండి.3. ఎమర్జెన్సీ సమయానికి తగినట్టుగా దగ్గర్లో ఆస్పత్రితో టై–అప్, అంబులెన్స్ సౌకర్యం ఉందా చూడండి.4. యోగా, ఫిజియో, భజన, గేమ్స్– రోజూ షెడ్యూల్ ఉండాలి.5. వారానికి రెండుసార్లు జనరల్ ఫిజీషియన్ విజిట్ ఉండాలి.– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నిప్పు-నీరు కలిసే చాన్సే లేదా?
అధికారం అయితే నీది లేదంటే నాది.. ద్రవిడ సిద్ధాంతం ఆధారంగా నడిచే తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు ఇదే . అయితే ఈసారి విజయ్ అనే రూపంలో ‘మార్పు’ ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకును గట్టిగా దెబ్బ కొట్టింది. వాటిని పక్కన నెట్టేసి అధికారం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వైరాన్ని పక్కన పెట్టి డీఎంకే–అన్నాడీఎంకేలు చేతులు కలుపుతాయా?.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రహస్య చర్చలు జరుపుతున్నాయి. ఈ రెండూ కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నాయి. తద్వారా అత్యధిక స్థానాలు గెల్చుకున్న విజయ్కు భారీ షాక్ తగలబోతోంది. అదే టైంలో.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన తమను ఇంతకాలం అవసరానికి వాడుకున్న జాతీయ పార్టీలనూ దెబ్బ కొట్టబోతున్నాయి. ఇది నిన్న సాయంత్రం నుంచి తమిళనాట జరుగుతున్న ప్రచారం. అయితే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే రెండూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశాయి. ఇది టీవీకే ఆడుతున్న చిల్లర మైండ్గేమ్ అని తిట్టిపోశాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే మాట ఒకటి ఉంది. అలాంటప్పుడు డీఎంకే-అన్నాడీఎంకే.. ఈ పార్టీల మధ్య స్నేహం ఎందుకు అసాధ్యం?. తమిళ రాజకీయాల పేజీలను తిరగేస్తే.. ఏనాడూ ఈ పార్టీలు జట్టు కట్టిన సందర్భం కనిపించదు. స్థానిక ఎన్నికల దగ్గరి నుంచి ఎందులో అయినా సరే మద్దతు అనేది భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. కేవలం ద్రవిడ ఉద్యమ వారసత్వం, తమిళ భాషా హక్కుల అంశాల్లో రెండు పార్టీలూ ఒకే వేదికను పంచుకోవడం తప్పించి. ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తాయిపుట్టుకే..1972లో కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే నుంచి ఎంజీ రామచంద్రన్ (MGR) బహిష్కరించింది. ఆ అవమానానికి ప్రతీకారంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే (AIADMK) స్థాపించారు. కొత్త పార్టీ ప్రకటన సమయంలో.. డీఎంకేలో అవినీతి పెరిగిపోయిందని సంచలన ఆరోపణలు చేశారాయన. నాటి నుంచి నేటి దాకా.. ఒక పార్టీ ఉనికి మరొక పార్టీని వ్యతిరేకించడం మీదనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఈ రెండూ కలిస్తే, అవి తమ మౌలిక సిద్ధాంతాన్ని తామే తుడిచేసుకున్నట్లు అవుతుంది.భిన్న ధృవాల రాజకీయం (Bipolar Politics)గత 50 ఏళ్లుగా తమిళ ప్రజలకు ఈ రెండు పార్టీలే ప్రత్యామ్నాయాలు. డీఎంకే పాలన నచ్చకపోతే అన్నాడీఎంకేకి.. అది నచ్చకపోతే మళ్ళీ డీఎంకేకు ఓటు వేస్తూ అధికారం కట్టబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే.. అప్పటివరకు ఈ రెండు పక్షాల మధ్య చీలి ఉన్న 70-80 శాతం ఓటు బ్యాంకు గందరగోళానికి గురవుతుంది. ఇది మూడవ శక్తికి (తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే వంటి పార్టీలకు) రెడ్ కార్పెట్ పరిచినట్లు అవుతుంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఇవి ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఉండాలని కోరుకుంటాయి.కేడర్ స్థాయి ఘర్షణదశాబ్దాలుగా కొనసాగుతున్న వైరంలో.. కేవలం నాయకులే కాదు, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా భాగస్వాములు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి చోటా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. గత ఐదు దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ.. దాడులు చేసుకుంటూ..ఆఖరికి హత్యలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెరిగిన క్యాడర్, అకస్మాత్తుగా పొత్తు పెట్టుకుంటే దానిని అంగీకరించడం అసాధ్యం. నాయకులు పైన కలిసినా, కింద కార్యకర్తలు కలవడం కష్టమైన పని.మరి జాతీయ పార్టీలతో జట్టు?.. తమిళ గడ్డపై ఎట్టి పరిస్థితుల్లో మత శక్తులకు చోటు ఉండకూడదు.. అనేది ద్రవిడ సిద్ధాంత ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఎందుకనేది పరిశీలిస్తే.. 👉ఢిల్లీలో పట్టు కోసం (Influence in Delhi)తమిళనాడులో ఈ రెండు పార్టీలు ఎంత బలంగా ఉన్నా.. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపడం కూడా ఎంతో అవసరం. కేంద్రంలో చట్టాలు చేయాలన్నా లేదంటే రాష్ట్రానికి నిధులు రావాలన్నా జాతీయ పార్టీల మద్దతు అవసరం. పైగా కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. కేంద్ర క్యాబినెట్లో తమ ఎంపీలకు మంత్రి పదవులు దక్కుతాయి. తద్వారా రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావచ్చనేది ఒక లెక్క.👉విడదీసి పాలించడం (Cutting the Competition)తమిళనాడులో కాంగ్రెస్కు, బీజేపీకి సొంతంగా గెలిచే సత్తా తక్కువ (సుమారు 5% నుండి 10% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది). ఈ చిన్న ఓటు బ్యాంకు కూడా మూడో పార్టీకి వెళ్తే తమకు నష్టం జరుగుతుందని ద్రవిడ పార్టీలు భయపడతాయి. అందుకే, ఆ జాతీయ పార్టీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపరచడం వీరి వ్యూహం. 👉సిద్ధాంతం vs అధికారం (Ideology vs Pragmatism)ద్రవిడ సిద్ధాంతం (Dravidian Ideology) ప్రకారం మతతత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. కానీ ఎన్నికల రాజకీయాల్లో 'గెలవడమే' ముఖ్యం. సాధారణంగా "సెక్యులరిజం" పేరుతో డీఎంకే కాంగ్రెస్తో జతకడుతుంది. అదే సమయంలో బీజేపీని "మతతత్వ పార్టీ" అని విమర్శిస్తూ ద్రవిడ ఓటర్లను ఆకట్టుకుంటుంది. అయితే.. జయలలిత ఉన్నప్పుడు హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్నిసార్లు బీజేపీతో సాఫ్ట్గా ఉండేవారు. అదే ఆ తర్వాతి కాలంలో ఎన్డీయే పొత్తునకు కారణమైంది. అయితే అది కేవలం రాజకీయ అవసరం కోసమే తప్ప సిద్ధాంతపరంగా కాదు. అందుకే ఈ రెండు పార్టీలు ఏ క్షణమైనా జాతీయ పార్టీలతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. విజయ్ రాకతో సీన్ మారేనా?2026 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడుకు మునుపెన్నడూ లేని రీతిలో ఆసక్తికర రాజకీయం అందించాయి. అగ్రనటుడు విజయ్ రెండేళ్ల కిందట స్థాపించిన టీవీకే తొలి ఎన్నికల్లోనే అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. డీఎంకే అధికారం కోల్పోయి రెండో స్థానంలోకి, ప్రతిపక్ష అన్నాడీఎంకే మూడో ప్లేస్లోకి పడిపోయాయి. తమిళనాట హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే (TVK) పార్టీని అడ్డుకోవడానికైనా ఈ రెండు పార్టీలు కలుస్తాయేమోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తమ 50 ఏళ్ల సిద్ధాంత పోరాటాన్ని ఒక్క ఎన్నిక కోసం వదులుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇదే అసలు సమస్య.. నాయకత్వ అహంకారం-పట్టుదల ఈ రెండు పార్టీలకు ఇప్పటికీ కొనసాగుతున్న ఓ కామన్ గుణం. జనతా సర్కార్ ఉన్న టైంలో.. ఇందిరా గాంధీని దెబ్బ కొట్టడానికి ఈ తమిళ శక్తులను ఒక్కటి చేసే ప్రయత్నం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రయత్నం ఎందుకనో ఫలించలేదు. ఎంజీఆర్ తదనంతరం జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు. అయితే కరుణానిధి-జయలలిత ఉన్న కాలంలో ఈ వైరం వ్యక్తిగత స్థాయికి చేరింది. అది ఎంతలా అంటే.. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత పట్ల జరిగిన అవమానం(ఆమె చీరను లాగడం..), 75 ఏళ్ల వయసులో కరుణానిధిని అర్ధరాత్రి పూట ఇంట్లోంచి లాక్కొచ్చి మరీ జయ సర్కార్ అరెస్ట్ చేయించడం.. ఇలాంటి సంఘటనలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహపూర్వక చర్చలు అనే దారులు పూర్తిగా మూసివేశాయి. బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఆ తర్వాతి కాలంలో.. ఆ పార్టీల అధినేతలుగా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి (EPS) కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి కింద మరొకరు పని చేయడానికి ఏ నాయకుడూ సిద్ధపడరు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాజీ పడటం అనేది ద్రావిడ రాజకీయాల్లో దాదాపు అసాధ్యమైన విషయం.తమిళనాడు రాజకీయ చరిత్రలో డీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అది ఒక చారిత్రక భావోద్వేగ ఘర్షణ. అందుకే నిప్పు నీరు కలవడం అసాధ్యమనే చెప్పచ్చు. ఒకవేళ కలిసే ప్రయత్నాలు జరిగితే.. ఆ క్షణమే ద్రావిడ రాజకీయాల అస్తిత్వం దెబ్బతింటుందని వారి నమ్మకం. అందుకే వారు 'మొండిగా' విడివిడిగానే పోరాడతారు తప్ప, చేతులు కలపరు. -
అమ్మకు రెండు తరాల బరువు
కూతురి కాలేజ్ ఫీజు ఒకవైపు... మామగారికి పక్షవాతం మరోవైపు... 50 దాటిన మహిళలు ఇలా ఒకేసారి రెండు తరాల మధ్య స్ట్రెస్ అనుభవిస్తున్నారు. దీనినే ‘శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్’ అంటారు. భర్తతో అడ్జస్ట్ అవడం, మెనోపాజ్ సమస్యలు ఇందుకు అదనం. ఒక సర్వే ప్రకారం అర్బన్ ఇండియాలో 35 శాతం మహిళలు ఇలా పిల్లలూ పెద్దల మధ్య నలుగుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్న ఒక అమ్మ ఏం చేసింది?ఆమెలాంటి అమ్మను మనం చాలామందిని చూసి ఉంటాం. వయసు 49 ఏళ్లు. హైదరాబాద్లో స్కూల్ అడ్మిన్గా ఉద్యోగం. మధ్యతరగతి జీవితం. ఈమె చన్నీళ్లకు భర్త సంపాదన వేణ్ణీళ్లు. ఇద్దరూ సంపాదించకపోతే బండి నడవదు. ఆమె పని ఉదయం ఏడుకే మొదలైపోతుంది. గిన్నెలు, టిఫిన్ వండటాలు... చేయదగ్గవే. కాని అత్తగారిని చూసుకోవాలి. డెబ్బై అయిదేళ్ల అత్తగారికి డైపర్ మార్చడం, మందులు వేయడం, టిఫిన్ తినేలా చూసి ఆ తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేసుకొని ఆఫీసుకు పరుగు పెట్టడం... ఒకరోజు కాదు రెండు రోజులు కాదు... నిత్యం.ఆఫీసులో ఉండగా కూతురి ఫోన్ వస్తుంది. కాలేజీ ఫీజు గురించి. కొడుకు ఫోన్ వస్తుంది... దొరకని ఉద్యోగం గురించి... చేరాల్సిన కోర్సు గురించి. ఆఫీసులో బాసు పని మీద పని చెప్తుంటాడు. అలిసి సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ డ్యూటీ. అత్తగారికి డిన్నర్, కూతురికి కౌన్సెలింగ్, కొడుకుకి మోటివేషన్. రాత్రి పదకొండుకు మంచం మీద వాలితే ఆమెకు కలిగే భావన ఏమిటి?ఆమెలో మార్పులురోజులు గడిచే కొద్దీ ఆమెలో మార్పులు వచ్చాయి. అవి ఆమె అదుపులో లేవు. ఏమిటవి? ఎవరిని చూసినా కోపం రావడం. అత్తగారు మంచం తడిపితే అరిచేసి తర్వాత గిల్టీ ఫీల్ అయ్యి ఏడవడం. రోజురోజుకూ ఖర్చులు పెరిగి ఇప్పుడే రూపాయి మిగలకపోతే నాకు అరవై వచ్చేసరికి ఏం మిగులుతుంది అనే ఆందోళన. అద్దంలో చూసుకుంటే తనకు తానే గుర్తు పట్టని రూపం. మెనోపాజ్ చికాకు, నడుము నొప్పి, బి.పి... ఒకరోజు ఆఫీస్లో కళ్లు తిరిగి పడిపోయింది. డాక్టర్ ఆమె సంగతి అంతా గ్రహించి ‘మీరు ఇప్పుడు మారకపోతే, మీ అత్తగారి పక్క బెడ్ మీదే మీరుంటారు’ అన్నాడు. ‘మీకూ జీవితం ఉండాలి. మీరు అమ్మగా మాత్రమే బతుకుతున్నారు’ అన్నాడు.మొదలైన మార్పుడాక్టర్ మాటతో ఆమెలో ఆలోచన రేగింది. ఒక స్నేహితురాలి సహాయంతో ఒక సైకాలజీ కౌన్సిలర్తో మాట్లాడింది. ‘శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్’ గురించి కొంత క్లారిటీ తెచ్చుకుంది. కొన్ని మార్పులు చేసుకుంది. జీవితం అంటే తనకు తాను మిగిలేలా బతకడం అనే ఎరుక తెచ్చుకుంది. ఈ అమ్మ మరి ఏం చేసింది?‘సూపర్ ఉమన్’ టైటిల్ వదిలేసిందికుటుంబ సభ్యులతో మీటింగ్ పెట్టి భర్త, కొడుకుతో ఖచ్చితంగా చెప్పింది– ‘నేను ఒక్కదాన్నే చేయలేను. మీరు కూడా చేయాలి’. ఇప్పుడు ఉదయం అత్తగారి మందులు భర్త బాధ్యత. సాయంత్రం భోజనం కొడుకు పెడతాడు. డైపర్ మార్చే పనిలో కూతురు సాయం పడుతుంది. సాయం అడగడం బలహీనత కాదు, తెలివి అని ఆమెకు అర్థమైంది.తనకంటూ రెండు రోజులునెలకు రెండు రోజులు... అంటే ఆదివారాలు తను పూర్తి విశ్రాంతి తీసుకోదలిచింది. ఆ రెండురోజుల కోసం ఒక హోమ్ నర్స్ను అత్తగారి కోసం ఏర్పాటు చేస్తుంది. అలాగే వంట పూర్తిగా బంద్ చేసి పిల్లలు చేసేదో బయటి నుంచి తెచ్చేదో ఉండాలంటోంది. ఆ రెండు రోజులు సినిమా, నిద్ర, ఫ్రెండ్స్తో కబుర్లు. ఆ రెండు రోజుల బలంతో మిగిలిన 28 రోజులు లాగించగలుగుతోంది.ఆర్థిక బరువు తగ్గించికూతురితో స్పష్టంగా చెప్పింది– ‘ఈ సెమిస్టర్ ఫీజు కడతాను. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకో. నా రిటైర్మెంట్ ఫండ్ ఖాళీ అయితే, రేపు నేను మీ మీద భారం అవుతాను’. కొడుక్కి కూడా కోర్సులు చేరాలంటే పార్ట్టైమ్ చేసి సంపాదించు అని.తన సమయం– ‘మీ’ టైమ్రోజులో తన సమయం కొంత ఉండాలనుకుంది. ప్రతిరోజూ ఉదయం కాసేపు టెర్రస్ మీద నిలబడి కాఫీ తాగుతుంది. ఆ టైమ్లో చేతిలో ఫోన్ ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు. అలాగే సాయంత్రం డిన్నర్ తర్వాత కాసేపు పచార్లకు సమయం. 6 నెలల తర్వాత ఆమె బి.పి. కంట్రోల్లోకి వచ్చింది. అందరూ దారికి వచ్చారు. నేను నా జీవితాన్ని కాపాడుకున్నాను అనుకుంది ఆ అమ్మ. కాదు మహిళ. కాదు కాదు ఒక జీవని. -
బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరు?
కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలుకొట్టి 15ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమబెంగాల్ను ఏలిన మమతాబెనర్జీని ఘోరంగా ఓడించి ఇంటికి సాగనంపిన కమలనాథుల్లో ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చిలో ఆసీనులవుతారనే ప్రశ్న తలెత్తింది. ఆ కుర్చీకి తామే అర్హులమంటూ రాష్ట్ర ముఖ్యనేతలు బీజేపీ అధిష్టానం వద్ద వాదనలు గట్టిగా విన్పిస్తున్నారు. వీరి వాదనల్లో ఎవరి వాదనకు అగ్రనేతలు మోదీ, అమిత్షా ద్వయం సమ్మతి తెలుపుతుందో త్వరలో తేలిపోనుంది.అయితే మమతను ఒంటిచేత్తో మట్టికరిపించిన రాష్ట్ర రాజకీయ దురం«ధరుడిగా ఘనత సాధించిన సువేందు అధికారికే సీఎం పీఠం దక్కే అవకాశముందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే గుజరాత్ మొదలు మధ్యప్రదేశ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్దాకా ప్రతిసారీ కొత్త ముఖాలకు అవకాశమిచి్చన బీజేపీ అధిష్టానం ఈసారి పశ్చిమబెంగాల్లోనూ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే ఆస్కారముందనే వాదనా తెరమీదకొచి్చంది. ఈ నేపథ్యంలో ఐదారుమంది నేతల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. వారి గురించి క్లుప్తంగా.. సువేందు అధికారి.. బెంగాల్లో అత్యధిక మందికి చిరపరిచితమైన నేత. గతంలో మమతాబెనర్జీకి కుడిభుజంగా ఉంటూ నందిగ్రామ్లో రైతు ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేత తర్వాత టీఎంసీకి తిలోదకాలిచ్చి కమలదళంలో చేరి కీలక నేతగా ఎదిగారు. గతంలో నందిగ్రామ్లో మమతను ఓడించి ఈసారి భవానీపూర్లోనూ మమతకు ఓటమి రుచిచూపించారు. క్షేత్రస్థాయిలోనూ పార్టీపై పట్టుసాధించిన సువేందుకు సీఎం అయ్యే అవకాశాలు మిగతావారికంటే మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నారదా స్టింగ్ ఆపరేషన్ ఉదంతంలో లంచం తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కి పరువుపోగొట్టుకున్నారు. సమిక్ భట్టాచార్య ఆర్ఎస్ఎస్ మూలాలున్న భట్టాచార్య ఇటీవలే పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు ఆరంభించారు. ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. అగ్రనేతల సుడిగాలి పర్యటనలను సమన్వయంచేసుకుంటూనే సొంతంగా పలు ప్రచారకార్యక్రమాల్లో పాల్గొని టీఎంసీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించి ప్రజల్లో గుర్తింపుపొందారు. పార్టీలో నేతలను ఏకతాటి మీదకు తీసుకురావడంలో దిట్టగా పేరొందారు. కులమతాలకతీతంగా అన్ని వర్గాల్లోనూ పార్టీని విస్తరింపజేసే సత్తా ఈయనకు ఉందని అగ్రనాయకత్వంలోనూ ఈయన మంచిపేరు సంపాదించారు. ఈయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే మాటా విన్పిస్తోంది. అగ్నిమిత్ర పాల్ గతంలో వృత్తిరీత్యా ఈమె ఒక ఫ్యాషన్ డిజైనర్. బెంగాల్లో ముందంజలో ఉండి పార్టీని నడిపించే క్రియాశీలక మహిళా నేతల్లో ఈమె కూడా ఒకరు. బీజేపీ మహిళా మోర్చాకు గతంలో అధ్యక్షురాలిగా సేవలందించారు. తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి గతంలో పట్టభద్రురాలైన ఈమె తరచూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూపా గంగూలీ దిగ్గజ నిర్మాత, స్క్రీన్రచయిత బీఆర్ చోప్రా తెరకెక్కించిన అద్భుత సీరియల్ ‘మహాభారత్’లో ద్రౌపది పాత్రతో యావత్ భారతానికి చిరపరిచితమైన నటి రూపా గంగూలీ. బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. తర్వాత సోనానూర్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ మంచి పేరుతెచ్చుకున్నారు. బెంగాల్ బీజేపీ మహిళా మోర్చాకు అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలందించారు. ఆకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. దిలీప్ ఘోష్ బీజేపీ ఫైర్బ్రాండ్గా పేరొందారు. గతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2021లో పార్టీ టీఎంసీకి గట్టిపోటీ ఇవ్వడంలో సఫలీకృతమయ్యారు. ఆనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమంటే వామపక్షలు, కాంగ్రెస్ కాదు అని బీజేపీయే ప్రజల పక్షాన పోరాడుతోందని నిరూపించే ప్రయత్నంచేశారు. తక్కువకాలంపాటే బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్గా కొనసాగినా వ్యవహారాలను చక్కబెట్టడంలో తనదైన ముద్రవేశారు. సీఎం రేసులో తానూ ముందంజలో ఉన్నానని నిరూపించుకున్నారు. గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 12 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కష్టపడిపనిచేసి త్వరగానే రాష్ట్ర చీఫ్ స్థాయికి ఎదిగారు. అయితే వాచాలత్వంతో తరచూ వివాదాస్పద వ్యాఖ్యానాలుచేస్తూ అప్రతిష్ట తెచ్చుకోవడం ఈయనకు రివాజుగా మారింది. అయినాసరే రాజకీయ చతురతతో నెగ్గుకురాగల సమర్థుడని ఆయనకుపేరుంది. సువేందుకు ఈయన ఒక్కరే గట్టిపోటీ ఇచ్చే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దీదీ పతనానికి కారణాలెన్నో..
పశ్చిమ బెంగాల్ ప్రజలతో దీదీ(అక్క) అని ఆప్యాయంగా పిలిపించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ రాజకీయంగా సంచలనాలకు మారుపేరు. కరడుగట్టిన కమ్యూనిస్టులకే చుక్కలు చూపించిన నాయకురాలిగా 15 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలన సాగించారు. వరుసగా నాలుగోసారి విజయంపై కన్నేసినప్పటికీ ఆశలు నెరవేరలేదు. దీదీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. మరోసారి ఆమె పాలనను కోరుకోవడం లేదని తేల్చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పట్టంగట్టారు. మమతా బెనర్జీ పార్టీ పరాజయానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ప్రభుత్వంపై వెల్లువెత్తిన వ్యతిరేకత. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, కుంభకోణాలు, మహిళలపై అఘాయిత్యాలు, కట్ మనీ సంస్కృతి, అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రజలు సహించలేకపోయారు. మరోవైపు హిందూ ఓటు బ్యాంకు దూరం కావడం దీదీ కొంప ముంచింది. 71 ఏళ్ల మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డి పోరాటం సాగించారు. అన్ని స్థానాలకూ తానే అభ్యర్థినని చెప్పుకోగా ప్రజలు అంగీకరించలేదు. ప్రభుత్వంలో, పార్టీలో మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మితిమీరిన పెత్తనం మేనత్త ఓటమికి మరో ముఖ్య కారణమైందని సొంత పార్టీ నేతలే ఆక్షేపిస్తున్నారు. భవానీపూర్లో సోమవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన అభిషేక్ బెనర్జీని చూసిన బీజేపీ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. చోర్, చోర్(దొంగ, దొంగ) అంటూ నిందించారు. ప్రజల్లో ప్రబలిన అసంతృప్తి బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పేరిట మమతా బెనర్జీకి అతిపెద్దసవాలు ఎదురైంది. ఎస్ఐఆర్ కింద రాష్ట్రంలో దాదాపు 90 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందని, తమ మద్దతుదార్ల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మమతా బెనర్జీ గగ్గోలు పెట్టినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. తొలగింపునకు గురైన ఓటర్లలో చాలామంది తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదార్లేనని తెలుస్తోంది. 2011 నుంచి నిరాటంకంగా అధికారంలో కొనసాగుతున్న దీదీపై సహజంగానే ప్రజా వ్యతిరేకత పెరిగింది. ఒకప్పుడు పారిశ్రామిక రాజధానిగా వెలుగొందిన బెంగాల్లో పరిశ్రమలు మూతపడడం, నిరుద్యోగం పెరిగిపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించాయి. ప్రధానంగా యువత విరక్తి చెందింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం పరాయి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం వారిని కుంగదీసింది. దాంతో ఎన్నికల్లో టీఎంసీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దెబ్బతీసిన మైనార్టీ సంతుష్టీకరణ 2011లో మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని గెలిచారు. ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్దికాలానికే కాంగ్రెస్ను అణచివేసేందుకు ప్రయతి్నంచారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీకి దూరమై, కమ్యూనిస్టులకు దగ్గరయ్యింది. దీదీ పతనానికి అడుగులు అప్పుడే పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీల సంతుష్టీకరణ రాజకీయాలను దీదీ నమ్ముకున్నారు. ఈ అంశాన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంది. దీదీ హిందువుల వ్యతిరేకి అంటూ ఉధృతంగా ప్రచారం చేసింది. చొరబాటుదార్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు చేస్తోందని ఆరోపించింది. కేంద్రం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏను మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని అమలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇవన్నీ ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్రవేశాయి. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భద్రంగుండేనా..!
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు మరింత తీవ్రతరం అవుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో సంభవించే గుండె జబ్బులు ఇప్పుడు పాఠశాల విద్యార్థులు, యువకుల్లోనూ అధికం అవుతున్నాయి. 2022–23లో దేశంలోని ప్రతి వెయ్యి మందిలో 131 మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా 2025 నాటికి ఆ సంఖ్య 152కు పెరిగింది. మొత్తం రోగాల్లో గుండె జబ్బుల వాటానే అధికం. ఈ అంశం ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్ఎస్ఎస్)–80వ నివేదికలో వెల్లడైంది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం నమోదవుతున్న మొత్తం వ్యాధుల్లో 25.6 శాతం వాటాతో గుండె జబ్బులే ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏడేళ్లలో మూడు రెట్లు పెరుగుదల దేశంలోని 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో గుండె జబ్బులు ముప్పే అధికంగా ఉంది. వృద్ధుల్లో నమోదవుతున్న మొత్తం జబ్బుల్లో హృద్రోగ సమస్యల వాటా 37.8 శాతం ఉంది. ఇక 15 నుంచి 44 ఏళ్ల యువత, మధ్యవయసు్కల్లో మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం వంటి మెటబాలిక్, ఇన్ఫెక్షన్ల అనంతరం గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టమైంది. 30 నుంచి 44 ఏళ్ల వారిలో 15.3 శాతం వాటాతో గుండె సమస్యలు మూడో స్థానంలో ఉన్నాయి. 45–59 ఏళ్ల వారిలో 30.1 శాతంతో రెండో ప్రధాన అనారోగ్య సమస్యగా కనిపిస్తోంది.2017–18లో చేపట్టిన ఎన్ఎస్ఎస్ సమయంలో ప్రతి లక్ష మందిలో 1333 మంది గుండె సమస్యలతో బాధపడుతున్నట్టుగా వెల్లడించగా, 2025 నాటికి వారి సంఖ్య 3,891కు పెరిగింది. ఈ లెక్కన పరిశీలిస్తే గుండె జబ్బుల సమస్యలు ఏడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు తేటతెల్లమవుతోంది. ఇంత వేగంగా సమస్య పెరగడమంటే ఇది సైలెంట్ ఎపిడెమిక్ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంటు వ్యాధుల కంటే వేగంగా జీవనశైలి వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ఇది దేశానికి పెద్ద ఆరోగ్య సవాలని స్పష్టం చేస్తున్నారు. గుండె జబ్బుల బారినపడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. -
ఇన్వెస్టర్లూ పారాహుషార్!!
స్టాక్ మార్కెట్లో తరచూ కొన్ని థీమ్లు మెరుస్తాయి. భవిష్యత్తు అద్భుతమంటూ బ్రోకరేజ్ కంపెనీలు కొన్ని రంగాల స్టోరీలు తెరపైకి తెస్తాయి. మారుతున్న పరిస్థితులు, ప్రభుత్వ ఫోకస్, కంపెనీలు పెట్టే ఖర్చు... వీటి ఆధారంగా ఈ స్టోరీని అల్లుతారు. వీటికి నిపుణుల సిఫారసులు తోడవుతాయి. దీంతో ఆ రంగంలోని షేర్లు దూసుకుపోతాయి. సహజంగానే ఆ రంగంలోని దిగ్గజాలు ఆ ర్యాలీని లీడ్ చేస్తూ ఉంటాయి. తమాషా ఏంటంటే... అదే థీమ్ ముసుగులో ఆ రంగానికి చెందిన చిన్నాచితకా కంపెనీలు కూడా రివ్వుమంటాయి. ఫండమెంటల్స్ ఏమాత్రం లేని షేర్లు లీడర్లను మించిపోతుంటాయి. ఇదే ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆపరేటర్ల హస్తవాసితో దూసుకెళ్లే షేర్ల జోలికి చిన్న ఇన్వెస్టర్లు వెళితే... ఆ తరవాత పతనంలో అమ్ముకోవటం అంత తేలిక్కాదు. ఇదంతా ఎందుకంటే... ఇపుడు మన మార్కెట్లో డిఫెన్స్, ఏరోస్పేస్ థీమ్ నడుస్తోంది. ఏడాదిగా ఈ రంగంలోని షేర్లు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. షేరు పీఈ (షేరుకు ఆర్జన) ఏకంగా 150–200 దాటిపోతోంది కూడా. అంటే... ఆ కంపెనీ ఇంకో 200 ఏళ్లలో సంపాదించే ఆదాయానికి తగ్గట్టుగా ఆ షేరు ఇప్పుడే పెరిగిపోయిందన్న మాట. మరి ఇలాంటి షేర్ల విషయంలో జాగ్రత్తపడాలి కదా? అదెలాగో వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ఒకే ఒక్క ఏడాదిలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో ఉన్న, ఉన్నట్లు చెబుతున్న పలు షేర్లు రెండు, మూడు, నాలుగు రెట్లు కూడా పెరిగిపోయాయి. నిజానికి ఈ రంగం లాంగ్టర్మ్ పటిష్ఠంగానే ఉంది. కొన్ని కంపెనీల ఆర్డర్ బుక్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఒక రంగం బాగుందంటే దానర్థం ఆ రంగంలోని షేర్లను ఏ ధర పడితే ఆ ధరకు కొనొచ్చని కాదు కదా? ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదేమిటంటే మొదట స్టోరీ. దాంతో భారీగా రీ–రేటింగ్. ఫండ్లు, ఆ రంగంపై అవగాహన ఉన్నవారు, సమాచారం తెలిసినవారు ముందుగా ఆయా షేర్లు కొంటారు. ఇదంతా స్మార్ట్ మనీ. షేర్లు పెరుగుతాయి. అప్పుడు రిటైలర్లు కొంటారు. ఇంకా పెరుగుతాయి. ఇక దొరకవేమోనన్న భయంతో మరికొందరు రిటైలర్లు దూకుతారు. వేల్యుయేషన్లు పెరిగిపోతాయి. కరెక్షన్ ఆరంభం. అయితే ధర తగ్గటం... లేదా దీర్ఘకాలంపాటు అక్కడే కదలటం. ఇలా ఏ రకంగానైనా దెబ్బతినేది ఆలస్యంగా కొన్న రిటైలర్లే. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలో చూద్దాం... 1. ఆర్డర్ బుక్ భారీగా ఉన్నా... → డిఫెన్స్ వ్యవహారాల్లో ఎగ్జిక్యూట్ కావటానికి దీర్ఘకాలం... అంటే 3–5 ఏళ్లు పడుతుంది. → ఎగ్జిక్యూషన్ రిస్క్లు ఎక్కువ. ఆర్డర్లన్నీ ఆచరణలోకి రాకపోవచ్చు కూడా. 2. ప్రభుత్వ ప్రీమియం పెరుగుతోంది... → చారిత్రకంగా చూస్తే ప్రభుత్వ రంగ డిఫెన్స్ కంపెనీలు 10–20 పీఈ మధ్య ట్రేడయ్యేవి. → ఇపుడైతే వాటి చారిత్రక విలువల కన్నా 5–10 రెట్లు ఎక్కువ పీఈ వద్ద ట్రేడవుతున్నాయి. 2. ఆర్జనను మించి షేరు పరుగు... → ఈ కంపెనీల ఆదాయాలు ఏటా 20 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి. → కానీ ఈ కంపెనీల షేర్ల విలువ ఏడాదిలో 200–300 శాతం పెరిగిపోతోంది. ఇలాగైతే జాగ్రత్త... → స్టాక్ నిట్టనిలువుగా పెరుగుతూ వచ్చిందంటే... కొనేముందు ఆలోచించండి. → స్టాక్ ధర ఎంత ఉంది? దాని ఆదాయం ఎంత పెరుగుతోంది? అనేది చూడండి. → నిదానంగా కొనటం ముఖ్యం. ఒకేసారి మొత్తం కొంటే తరవాత కష్టం. చెయ్యాల్సిందేంటి? → కరెక్షన్ కోసం చూడండి. ఎందుకంటే షేర్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉండవు. కనీసం 30–40 శాతం తగ్గేదాకా ఎదురుచూడండి. → షేరు ధర కన్నా... కంపెనీ ఆదాయం పెరుగుదలపై ఫోకస్ పెట్టండి. → వేగంగా పెరుగుతున్న చిన్న షేర్ల కన్నా... లీడర్లపై దృష్టిపెట్టండి. లోకల్ కంపెనీల డ్రీమ్ రన్... జాగ్రత్త! తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటార్ టెక్నాలజీస్, అపోలో మైక్రో సిస్టమ్స్, సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, బొందాడ ఇంజినీరింగ్ వంటి షేర్లు డిఫెన్స్ థీమ్తో ఇటీవల బీభత్సంగా ఎగిశాయి. ఎంటార్ షేరు ఏకంగా రెండుమూడు నెలల వ్యవధిలోనే 3–4 రెట్లు పెరిగిపోయింది. ఆదాయాలకు మించి పెరుగుతున్న ఇలాంటి షేర్లలో కరెక్షన్ వస్తే అది కూడా తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి రిటైలర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. ఇవీ.. డిఫెన్స్లో లీడర్లు → హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ → భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ → భారత్ డైనమిక్స్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్.. హెవీ డిఫెన్స్లో → మజగన్ డాక్ షిప్బిల్డర్స లిమిటెడ్ → కొచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ → గార్డెన్రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ప్రైవేటు డిఫెన్స్ షేర్లు... (స్మాల్–మైక్రోకాప్) → డాటా పాటర్న్స్ ఇండియా → పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ → సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బాగా పెరిగిన తెలుగు రాష్ట్రాల షేర్లు → ఎంటార్ టెక్నాలజీస్ → అజాద్ ఇంజినీరింగ్ → బొందాడ ఇంజినీరింగ్ → సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (ఒకనాటి మెగాసాఫ్ట్) → అపోలో మైక్రో సిస్టమ్స్ (వీటిలో చాలా షేర్లు నిట్టనిలువుగా పెరిగినవని) పక్క పట్టిక చూస్తే 320 పీఈ వద్ద ట్రేడవుతున్న షేర్లు ఆరు నెలలు తిరక్కుండా ఆరేడు రెట్లు పెరిగిన షేర్లు కనిపిస్తాయి. నెలలోనే రెట్టింపయిన షేర్లూ ఉన్నాయి. మరి వీటి ఆదాయాలు ఆ స్థాయిలో పెరిగాయా? ఈ ప్రశ్నకు ఆశాజనకమైన జవాబు రాదు. ఆదాయాలు కొంత పెరుగుతూ ఉండొచ్చు. కానీ ఆదాయాలకు 10 నుంచి 20 రెట్లు షేర్లు పెరిగిపోవ టమే ఆందోళనకరం. రిటైలర్లు ఇలాంటి సమయాల్లో ఇంకా పెరుగుతాయనే ఆశతో ఎంటరయితే పడిపోయే అవకాశమూ ఉంది. ఎందుకంటే అప్పటిదాకా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చు. పైపెచ్చు స్టోరీ ఆధారంగా పెరిగిన షేర్లు ఆ స్టోరీ గనక నిజం కాకపోతే నేలచూపులు చూడొచ్చు. అపుడు రిటైల్ ఇన్వెస్ట ర్లు ఎంతో కొంతకు అమ్ముకుని బయటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. నష్టాలు భారీగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని థీమ్ల వెంట పరుగులు పెట్టవద్దన్నది నిపుణుల సలహా. ఒకవేళ మీరు గనక థీమ్ను బలంగా నమ్మితే... ఆ రంగంలో లీడర్లను ఎంచుకోవాలే తప్ప చిన్నషేర్ల వెంట క్విక్ మనీ కోసం పరుగులు పెడితే ఇబ్బందులేనన్నది గ్రహించాలి. (రమణమూర్తి మంథా) -
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
‘ఫాస్ట్’గా అనర్థాలు
సాక్షి, హైదరాబాద్: ఫాస్ట్, జంక్ ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్)తో అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. యూపీఎఫ్లను అధికంగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ మరణాల ప్రమాదం 50 శాతం పెరగడంతోపాటు గుండెపోటు, పక్షవాతం, ఆంజైనా వంటి అధిక ముప్పు కూడా పొంచి ఉంది. ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్న వారిలో మరణాల రేటు 21 శాతం పెరగడంతోపాటు ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు తలెత్తుతున్నట్లు వెల్లడైంది. కొన్ని రకాల కేన్సర్లతో ముడిపడి ఉన్నట్టు కూడా ఆధారాలున్నాయి.ముఖ్యంగా పెద్దపేగు కేన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉండటంతోపాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), ఇతర సమస్యలకు మూలంగా దీనిని భావిస్తున్నారు. భారత్లో యూపీఎఫ్లు ప్రత్యక్షంగా ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయని 2025–26లో నిర్వహించిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత వైద్య విద్యార్థులపై 2025లో జరిపిన ఒక అధ్యయనంలో... 87.2% మంది అధిక మొత్తంలో యూపీఎఫ్లను వినియోగిస్తున్నారని , దీనివల్ల వారిలో ఒత్తిడి పెరిగిందన్న విషయాన్ని కనుగొన్నారు. యూపీఎఫ్లు ఇవీ.. బ్రెడ్డు, చిప్స్, చక్కెర కలిపిన పానీయాలు, సోడాలు, ప్యాక్ చేసిన కేకులు, స్నాక్స్, ఇన్స్టంట్ మీల్స్, నగ్గెట్స్, హాట్ డాగ్లు, బేకన్, డెలి మీట్స్ తదితరాలు ఏ అధ్యయనం ఏం చెప్పిందంటే... ⇒ కేంద్రప్రభుత్వ ఎకనమిక్ సర్వే 2025–26: భారత్లో ఊబకాయం పెరుగుదలకు యూపీఎఫ్ను ప్రధానకారణంగా గుర్తించింది. ఈ ఉత్పత్తుల ధరలను అత్యధిక జీఎస్టీ స్లాబ్లో పెట్టి వీటి వినియోగాన్ని తగ్గించాలని సిఫార్సు చేసింది. ⇒ ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ గైడ్లైన్స్–2026: యూపీఎఫ్లో ముఖ్యమైన న్యూట్రియెంట్స్ లేవని, ఆరోగ్యానికి హానికరంగా పరిణమించే ఎమల్సిఫైర్స్, స్టెబిలైజర్స్ వంటివి ఉన్నాయంది. ⇒ లాన్సెట్ అధ్యయనం 2026: యూపీఎఫ్లు టైప్ 2 డయాబెటీస్కు, కుంగుబాటుకు, గుండె సంబంధిత జబ్బులకు కారణమవుతున్నట్టు ఆధారాలు లభించాయని చెప్పింది. ⇒ డబ్ల్యూహెచ్వో సౌత్–ఈస్ట్ ఏషియా రిపోర్ట్: భారత్లో యూపీఎఫ్ల వినియోగం ఏటా 13.3 శాతం పెరుగుతోందని, అత్యవసరంగా ప్రభుత్వ విధానాలను సవరించి ఫ్రంట్–ఆఫ్ ప్యాకేజీలపై హెచ్చరికల లేబుళ్లు ప్రచురించాలని సూచించింది. ⇒ సేపీయన్ ల్యాబ్స్–2026: భారత్లో 44 శాతం యువత (18–34 ఏళ్లలోపు వారు) యూపీఎఫ్లు రెగ్యులర్గా తింటున్నారు. ఇది మెదడు ఆధారిత మానసిక సామర్థ్యంపై ప్రభావం చూపడానికి లంకె ఉన్నట్టుగా తెలిపింది.ఇంటి ఆహారం బెస్ట్..ముఖ్యంగా అధిక చక్కెర, ఉప్పు, అనారోగ్య కొవ్వు, ఇతర పదార్థాలు ఓవర్లోడ్ అయ్యి కాలేయంపై ప్రతికూల ప్రభావంతో ఫ్యాటీలివర్, ఇన్ఫ్లమేషన్తో కాలేయ దీర్ఘకాలిక డ్యామేజీకి దారితీస్తుంది. ఈ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే ఆస్తమా, వీజింగ్, క్రానిక్ బ్రాంకైటిస్, సీవోపీడీ, స్లీప్ ఆప్నియాకు దారితీస్తాయి. ఇవి స్కూల్ పిల్లలు మొదలుకుని పెద్దవారిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి.పిల్లల్లో ఎదుగుదల సమస్యలతోపాటు అన్నివర్గాల వారిలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. వీటికంటే కూడా ఇంట్లో తయారుచేసిన ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, ప్రొటీన్ అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. షుగరీ డ్రింక్స్కు బదులు మంచినీళ్లు తాగాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ లేబుళ్లపై చక్కెర, ఉప్పు, ట్రాన్స్ఫాట్, ఇతర పదార్థాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామాలు, మంచినిద్ర తదితరాల ద్వారా కాలేయం, గుండె, శ్వాసకోశాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద -
దెయ్యం కావాలంటూ ప్రకటన!
కొన్ని సందేహాలు తీర్చుకొనుటకు దెయ్యంతో చిన్న ఇంటర్వ్యూ కావలెను. సదరు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగువాడు మా బుజ్జిగాడు. వాడి అడ్రస్... బుజ్జిగాడు, ప్రేమ్నగర్ కాలనీ, చింతల్బస్తీ, ఖైరతాబాద్, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఫలానా... ఫలానా. మా బుజ్జిగాడు పగలు నిద్రపోయి రాత్రంతా అల్లరిచేస్తూ ఉంటాడు కాబట్టి సంప్రదింపులకు దెయ్యాలకూ వీలుగా ఉంటుంది. ఆసక్తిగల దెయ్యాలు సదరు ఫోన్ నంబరులో నేరుగా సంప్రదించవచ్చు. ఇట్లు రాంబాబు.ఈ ప్రకటన చూడగానే మా రాంబాబుగాడికి ఫోన్ చేయక తప్పలేదు. ‘‘ఎందుకురా ఆ ప్రకటన ఇచ్చావ్?’’ అంటూ నేనడగ్గానే వాడు భోరుమన్నాడు. తమ బుజ్జిగాడికొచ్చిన డౌట్లు గురించి బిక్కుబిక్కుమంటూ వాడు చెప్పిన వివరాలివి... ‘‘నాన్నా... దెయ్యాలు ఒరిజినల్గా తాము పుట్టినరోజునే బర్త్–డే చేసుకుంటాయా? లేదంటే... తాము చచ్చిన రోజునే అవి దెయ్యాలై పుడతాయి కాబట్టి తమ డెత్–డే రోజున బర్త్డే చేసుకుంటాయా?’’ అడిగాడు. రాంబాబుగాడికి ఏం చెప్పాలో తోచలేదట. బుజ్జిగాడొచ్చి ఈ డౌటడిగాక వాడి సందేహంలోనూ న్యాయముందని అనిపించిందట. అంతేకాదు... తన పుట్టినరోజునే తానూ చచ్చిపోవాలనీ... దాంతో దెయ్యంగా మారాక బర్త్–డే విషయంలో తనకూ పెద్దగా కన్ఫ్యూజన్ ఉండదనీ... పైగా పుట్టినరోజూ, చచ్చినరోజూ ఒకటే అయితే డేటు మర్చిపోకుండా ఉండేందుకు మాం...ఛి అడ్వాంటేజు కూడా ఉంటుందని అనిపించిందట.మరోరోజు బుజ్జిగాడు మరోమారు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘నాన్నా... ఆరోజున నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ దెయ్యాల్లో... జుట్టుదెయ్యాలూ, గుండు దెయ్యాలూ, కొరివిదెయ్యాలూ, రాఛ్ఛాసులూ, బ్రమ్మరాచ్చసులూ, పిశాచులూ, బేతాళ పిచాచులూ అంటూ రకరకాల కులాలుంటాయని మన బే...ద్ధ రచయిత పతంజలి గారు చెప్పారంటూ ఎవరికో స్పీచు ఇచ్చావ్ కదా. అప్పుడూ... దెయ్యాల్లో గనకా ఎలచ్చన్లు గట్రా అవుతుంటే ఎక్కడ ఏ క్యాస్టు దెయ్యాలు ఎక్కువో... అక్కడ వాళ్లనే క్యాండిడేటుగా నిలబెడతారు కదా’’ అని అడిగాడు బుజ్జిగాడు.రాంబాబుగాడిక్కూడా అది కరెక్టుగా అనిపించిందట. ఉదాహరణకు ‘చింతనిప్పుల అనే ఓ చింతలతోపు నియోజకవర్గంలో కొరివిదెయ్యాల కులపోళ్లు ఎక్కువగా ఉన్నారనుకుందాం. అక్కడ పిశాచాల కులపు క్యాండిడేటును నిలబెడితే వాడికి ఓట్లు పడతాయా? అలాగే ‘మర్రిఊడల’ అనే మరో నియోజకవర్గంలో బేతాళ పిశాచాలు ఎక్కువగా ఉంటే అక్కడ మన జుట్టుదెయ్యాలకు ఓటెవడేస్తాడు!! బుజ్జిగాడు చెప్పాక ఈ డౌటు తననూ వేధించిందం’టూ వాడు మధనపడ్డాడు.ఇంకోరోజు మా పోర్షన్ కు ముందు ఓ షట్టర్లో రెంటుకుండే ఓ టైలర్గారి దగ్గర వెళ్లి... ‘‘అంకుల్... దెయ్యాలు తమ తెల్లచీరలకు పీకోఫాల్సూ, వాళ్లకు మ్యాచింగు బ్లౌజులూ మీరే కుడతారా?’’ అంటూ తనను తరచూ ముద్దుచేస్తుండే ఆ టైలర్గారిని అడిగాట్ట. ఆయన దగ్గర ఉండే చనువు కొద్దీ ఈ ప్రశ్నైతే వేశాడుగానీ అతడికీ ఏం చెప్పాలో తెలియలేదు. ‘‘ఏమో... దెయ్యాల జుట్టుకు షాంపూలూ, దువ్వెన్లూ ఎక్కణ్ణుంచి కొంటారో’’ అంటూ బుజ్జిగాడు అడిగిన మరో ప్రశ్నకు... సదరు టైలరూ, మా వీధిలోని కిరాణా కొట్టు ఓనర్లతో పాటు నేనూ డౌట్లలో మునిగిపోయాం.‘‘దెయ్యాల గురించి మావాడు తరచూ అడిగే ప్రశ్నలకు జవాబులివ్వలేకా... వాడు రోజు విడిచి రోజు... ఈ ప్రశ్నల్తో వేధిస్తుంటే తట్టుకోలేకా ఈ ప్రకటన ఇచ్చాన్రా! ఈ యాడ్ చూసుకొని ఎవడైనా పిల్లపిశాచిగాడో, ఏ దెయ్యప్పిల్లో రెస్పాండ్ అయితే... వాడికీ మా బుజ్జిగాడికీ ఫ్రెండ్షిప్పు కుదిర్చేసి నేను హాయిగా, హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండొచ్చని ఇచ్చాన్రా ఈ ప్రకటన’’ అంటూ భోరుమన్నాడు మా రాంబాబుగాడు. చదవండి: సారీ... విసిగి వేసారి..ఈలోపు నేనూరుకోలేదు. మా రాంబాబుగాణ్ణి మరింత కన్ఫ్యూజన్లో పడేస్తూ... ‘‘అన్నట్టూ... దెయ్యాలు న్యూస్ పేపర్లు చదువుతాయంటావా?’’ అని అడిగా. – యాసీన్ -
వస్తున్నాయ్ ఫీలింగ్స్!
ఈ మధ్యే మా స్కూల్ రీయూనియన్ జరిగింది. నా చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుని చాలాసేపు ముచ్చటించుకున్నాం. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్.. కాల్స్.. వీడియో కాల్స్. నెమ్మదిగా మా మధ్య వ్యక్తిగత విషయాలను పంచుకునేదాకా వెళ్లింది. ఇప్పుడు అతని గురించే ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. అతనికింకా పెళ్లి కాలేదు. నా భర్త చాలా మంచోడు. అయినా కూడా ఆయన్ని, పిల్లల్ని వదిలేసి అతనితో వెళ్లిపోవాలని అనిపిస్తోంది?. అందుకు అతను కూడా సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దీని నుంచి నేను ఎలా బయటపడాలి??.. ఈ తరహా కేసులు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. స్కూల్ గెట్ టు గెదర్లో.. పాత స్నేహితుడితో మళ్లీ సంబంధం మొదలుపెట్టిన ఓ మహిళ ఘాతుకానికి పాల్పడింది. ప్రియుడితో మిగిలిన జీవితం పంచుకునేందుకు భర్త, కడుపున పుట్టిన బిడ్డలను అడ్డు తొలగించుకోవాలనుకుంది. పెరుగన్నంలో విషం పెట్టి చంపాలని చూసింది. అభం శుభం తెలియని పిల్లలు చనిపోగా.. అదృష్టవశాత్తూ భర్త భార్య స్కెచ్ నుంచి బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సమీపంలోని కిష్టారెడ్డిపేటలో కిందటి ఏడాది మార్చిలో ఈ ఘోరం జరిగింది. రజిత.. తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న స్రవంతి.. టెన్త్ క్లాస్ గెట్ టు గెదర్లో పాల్గొంది. అక్కడ వాట్సాప్ గ్రూప్ నుంచి నెంబర్ తీసుకుని ఓ కానిస్టేబుల్ ఆమెతో చాటింగ్ చేశాడు. మొదట్లో ఆమె పట్టించుకోలేదు. తనకూ విడాకులయ్యాయని.. మీరు నచ్చారని.. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని నమ్మించాడు. ఆపై ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా అని గర్భవతిని చేశాడు. తీరా తాను తాను మోసపోయానని గుర్తించిన ఆమె న్యాయం కోసం రోడ్డెక్కింది. సూర్యాపేటలో కిందటి ఏడాది నవంబర్లో జరిగింది ఈ ఘటన.. తాజాగా.. సీతారాం అనే వ్యక్తి తన భార్య రేణుకా వివాహేతర సంబంధాల్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని సూసైడ్ లేఖ బయటకు రావడం సంచలన చర్చకు దారి తీసింది. రెండు లక్షల జీతంతో తన భార్యను బాగా చూసుకుంటున్నప్పటికీ.. ఇతరులతో వివాహేతర సంబంధం నడిపిందని.. ఆమె ప్రైవేట్ వీడియోలు నెట్టింట చేరుకున్నాయని.. ఇంకా తాను బతికి ఎందుకని.. లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో భార్య, ఆమెతో అఫైర్లు పెట్టుకున్న వ్యక్తులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వ్యవహారం నడిపిన వాళ్లలో స్కూల్, ఇంటర్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రీయూనియన్ల, గెట్ టు గెదర్ల అసలు ఉద్దేశ్యం పాత స్నేహాలను గుర్తుచేసుకోవడం.. జ్ఞాపకాలను పంచుకోవడం. కానీ ఇప్పుడవి విపరీతాలకు దారితీస్తున్నాయి. పాత పరిచయాలు అనైతిక సంబంధాలకు దారి తీస్తూ.. కుటుంబ బంధాలను చెరిపేస్తున్నాయి. కోరికెలు గుర్రాలై పరిగెడుతూ.. ఆ స్పీడ్లో ప్రాణాలు తీయడమో లేదంటే ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నాయి. కొన్నిసార్లు అన్నిరకాలుగా మోసపోయి బాధితులుగా కూడా మిగిలిపోతున్నారు. ఈ పరిణామాలు సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.సైకాలజిస్టులు చెబుతున్నది ఏమిటంటే.. రీయూనియన్లలో కలుసుకునే పాత స్నేహితులు, అప్పటి యవ్వన జ్ఞాపకాలు, భావోద్వేగాలు మళ్లీ రగిలిస్తాయి. ఆ క్షణిక ఉత్సాహం, కొత్తగా ఏర్పడిన అనుబంధం, కొందరిని వివాహేతర సంబంధాల వైపు నెడుతుంది. కానీ ఆ నిర్ణయాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, జీవిత భాగస్వామి నమ్మకం, సమాజంలో గౌరవం అన్నీ ఒక్కసారిగా కూలిపోతున్నాయి. కాబట్టి.. రీయూనియన్లు జ్ఞాపకాల పండుగగా ఉండాలి. అంతేకానీ అవి కాపురాలను ముక్కలు చేసే వేదికలవ్వకూడదు. కుటుంబ బంధాలను కాపాడుకోవడం, సంబంధాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. రీయూనియన్ల, గెట్ టు గెదర్లో కలిసే స్నేహం, జ్ఞాపకాలు ఆనందాన్ని పంచాలి కానీ జీవితాలను శిధిలం చేయకూడదంటున్నారు. -
సరస్సు అడుగున నగరం!
అది కిర్గిస్థాన్లోని ఇస్సిక్ కుల్ ఉప్పునీటి సరస్సు. ప్రపంచంలో ఎన్నో చెరువులుండగా దీని గురించే ఎందుకు చెప్పుకోవాలంటే ఆ చెరువు కింద ఓ పురాతన నగరం దాగి ఉంది కాబట్టి! 15వ శతాబ్దంలో సంభవించిన భారీ భూకంపం టోరు ఐగిర్ అనే నగరాన్ని నాశనం చేయగా అనంతర కాలంలో సంభవించిన మార్పులతో అక్కడ ఏర్పడిన ఉప్పునీటి సరస్సు ఆ నగరాన్ని మింగేసింది.అయితే పశ్చిమాసియా దేశాల్లో మధ్యయుగ నివాస ప్రదేశాల గురించి అధ్యయనం చేస్తున్న రష్యా పరిశోధకుల బృందం.. అంతర్ధానమైన సిల్క్రూట్ ఆనవాళ్లను వెలికితీయడంతోపాటు 13, 14వ శతాబ్దాల నాటి నెక్రోపోలిస్ సైట్ల శోధన మొదలుపెట్టింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన అండర్వాటర్ ఆర్కియాలాజిస్ట్ మ్యాక్సిమ్ మెన్షికోవ్ ఆధ్వర్యంలోని పరిశోధన బృందం ఇస్సిక్ కుల్ సరస్సు కింద దాగి ఉన్న టోరు ఐగిర్ నగరాన్ని గతేడాది గుర్తించింది. క్రీస్తుపూర్వ నగరమిది.. క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో వర్తక, వాణిజ్యం కోసం సిల్్కరూట్లో ఏర్పడిన నగరాల్లో టోరు ఐగిర్ నగరం కూడా ఒకటి. చైనా నుంచి పశి్చమ దేశాలకు ప్రయాణించే వర్తకులకు ఇది మజిలీ నగరంగా ఉండేది. ఈ నగరం ఆనవాళ్లను గుర్తించేందుకు సరస్సు అడుగుకు వెళ్లిన పరిశోధకులకు ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, టర్కీ రాజవంశీయుల, ఇస్లామిక్ పాలన ఆనవాళ్లు, ఇస్లాం సంప్రదాయ సమాధులు కనిపించాయి. ధాన్యాన్ని పిండి చేయడానికి ఉపయోగించిన మన తిరగలి వంటి సాధనాలు, చెక్క, రాతి దూలాలతో నిర్మించిన భవనాలు, సిరామిక్ కళాఖండాలు కూడా కంటబడ్డాయి.అక్కడ ఓ మసీదు, స్నానశాల, ఇస్లామిక్ విశ్వవిద్యాలయంతోపాటు చక్కటి ఎక్స్టీరియర్తో ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఉంది. అండర్ వాటర్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డ్రోన్ షూటింగ్ ప్రక్రియల ద్వారా నీటి అడుగున ఉన్న నగరం గురించి అండర్వాటర్ ఆర్కియాలజిస్టులు ప్రపంచానికి తెలియచేశారు. ఈ ఫొటోలను పరిశీలిస్తే నాటి భవన నిర్మాణంలో కాలి్చన ఇటుకలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇటుకలతో పోలిస్తే నాటి ఇటుకలు పరిమాణంలో చాలా పెద్దవి. ఒక్కమాటలో చెప్పాలంటే టోరు ఐగిర్ నగరం క్రీస్తు పూర్వం 1,300 నుంచి 3,300 ఏళ్ల మధ్య విరాజిల్లిన సింధు నాగరకతను గుర్తుచేసింది. -
బ్రహ్మాస్త్రం సిద్ధం!
అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించే రహస్య అస్త్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. దాని గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావడం తథ్యమని పేర్కొంది. ఇదొక ‘సూపర్ వెపన్’అని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ తేల్చిచెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. రహస్య అస్త్రం ప్రస్తుతం శత్రువు పక్కనే ఉందని వెల్లడించారు. అది చూసి వారి(అమెరికా) గుండె పేలిపోదనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చెబుతున్న రహస్య ఆయుధం ‘హూట్ రాకెట్ టార్పెడో’కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధం. అనుకూలతలే కాకుండా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని అంటున్నారు. అసలేమిటి హూట్ టార్పెడో? ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006లో ఇరాన్ రహస్యంగా పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం ఈ టార్పెడో ప్రత్యేకత. శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. హూట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. కానీ, రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్–కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికాదళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ, హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. → హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకుపైగా వార్హెడ్లను(శక్తివంతమైన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లగలదు. → హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. → సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. → హూట్ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. కచి్చతంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. → అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే మోహరించి ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. → హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. → హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచి్చనప్పుడు శత్రుసైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. → ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. → ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. → ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే, అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ, అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మారనున్న సీన్.. మోదీ సర్కార్కు పెద్ద పరీక్షే!
పలు దేశాల్లో పోరాటాలతో ప్రభుత్వాలను గద్దె దించిన ఘనత జెన్ జీదే. అలాంటి తరం భారత్లో కొత్త రాజకీయ సమీకరణకు కారణం కాబోతోందా?. రాజకీయాన్ని కేవలం కంటెంట్గా చూసే ఈ జనరేషన్.. రాబోయే ఎన్నికల్లో నిజంగానే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతోందా?.. అవుననే అంటున్నాయి పలు విశ్లేషణలు.భారత రాజకీయాల్లో 12 ఏళ్ల కిందట నాయకత్వ మార్పు జరిగింది. అప్పట్లో మిల్లెనియల్స్ అనే తరం (1981–1996లో పుట్టినవాళ్లు) పెద్ద ఎత్తున ఓటర్లుగా ఉన్నారు. వారు యూపీఏ పాలనతో విసిగిపోయో.. మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూసో.. ఎన్డీయేకు రెండుసార్లు పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో ఓటర్లలో మూడో వంతుగా, 2019లో దాదాపు 40 శాతంగా ఉండి మోదీ సర్కార్ను గెలిపించారు. కానీ, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆ సీన్ మారబోతోంది.2024 ఎన్నికల్లో జెన్జీ రూపంలో 9 కోట్ల మంది కొత్త ఓటర్లు సరికొత్త రాజకీయ సమీకరణకు సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా.. ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చినా మెజారిటీపై ప్రభావం చూపెట్టింది. అయితే మరో మూడేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఈ తరమే. అప్పటికల్లా భారత జనాభా 151 కోట్లకు చేరవచ్చని ఓ అంచనా. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం.. మిల్లెనియల్స్ + జెన్జీ కలిపి 91 కోట్లకు చేరుకుంటుందని.. ఇందులో జెన్జీ తరంవాళ్లే అత్యంత పెద్ద వర్గం ఓటర్లుగా(43 నుంచి 47 శాతం) ఉండబోతున్నారు.1997–2012 మధ్య పుట్టిన జెన్జీ తరం మోదీ పాలన చూస్తూ పెరిగారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాం గురించి వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు(తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్లు లేకపోలేదు). కాబట్టి ఈ జనరేషన్ బీజేపీ ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఓ వ్యవస్థగానే చూస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జెన్జీ జనాభా సుమారు 2.5 బిలియన్లు, అంటే ప్రపంచ జనాభాలో 30% అన్నమాట. ప్రపంచంలోనే అత్యధికంగా ఒక్క భారతదేశంలోనే 40 కోట్ల దాకా ఈ జనాభా ఉంది. ఇప్పటికే వారు దేశ కార్మిక శక్తిలో నాలుగో వంతుగా ఉన్నారు. 2030 నాటికి వీళ్ల ద్వారా ఎకనమీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని ఓ అంచనా. సంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా రాజకీయ అవగాహన పొందడం వీరికున్న మరో ప్రత్యేకత.అయితే.. భారత్లో దేశీయంగా ఐటీ వృద్ధి మందగించడం, విద్యావకాశాలు తగ్గిపోతుండడం, నిరుద్యోగం రేటు గణనీయంగా పెరగడం, విదేశీ అవకాశాలు కఠినతరం కావడం, ఆర్థిక భద్రత కొరవడడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గిగ్, తయారీ రంగాల్లో యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నా.. ఆ వాదనతో జెన్జీ ససేమీరా అంటోంది. ఇది కేవలం విధానపరమైన చర్చ మాత్రమే కాదు.. ఈ జనరేషన్కి నిత్యజీవిత సమస్య కూడా.సోషల్ మీడియా ఒకప్పుడు అధికార మార్పుకు కీలకమైన సాధనం. అయితే ఇప్పుడు అదొక విభిన్న వేదికగా మారింది. ఒక కథనాన్ని ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా పలు కోణాల్లో చర్చించేందుకు అక్కడ అవకాశం ఉంటోంది. ఇందులో అత్యధికంగా పాల్గొంటోంది కూడా జెన్జీనే.కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కచ్చితంగా భిన్నంగా ఉండబోతున్నాయి. అంటే గత ఎన్నికల్లా బీజేపీ-కాంగ్రెస్ల పోలిక కంటే.. ‘‘మాకు మంచి చేసింది ఎవరు?’’ అనే ప్రశ్నే 2029లో వారి ఓటును డిసైడ్ చేయబోతోంది. వీళ్ల తీర్పు గతం ఆధారంగా కాకుండా, ప్రస్తుత ఫలితాలు (ఉద్యోగాలు, విద్య, అవకాశాలు) ఆధారంగా ఉండబోతోంది. ఈ లెక్కన 2029 ఎన్నికలు మోదీ సర్కార్కు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.పైన చెప్పుకున్నది రాజకీయ అభిప్రాయం ఎంత మాత్రం కాదు. ఇది డేటా ఆధారిత విశ్లేషణ. పీఎల్ఎఫ్ఎస్ (Periodic Labour Force Survey)భారతదేశంలో ఉద్యోగాలు, నిరుద్యోగం, కార్మికశక్తి పాల్గొనడం వంటి అంశాలపై డేటా ఇస్తుంది. కేంద్ర బ్యాంక్ RBI ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై నివేదికలు విడుదల చేస్తుంది. నాస్కామ్(NASSCOM) .. ఐటీ రంగంలో ఉద్యోగాలు, వృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై నివేదికలు ఇస్తుంది. ఈ మూడింటి డేటా ఆధారంగా.. Gen Z Is Not Impressed With Modi | The 2029 Election Warning అనే యూట్యూబ్ వీడియోలో Gen Z ఓటర్ల ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అవకాశాల లోటు గురించి వివరించారు.అలాగే.. ది పయనీర్ పత్రిక రాసిన ఓ వ్యాసంలో(Why Urban Gen Z Voters Prefer Narendra Modi’s Performance-Driven Politics) పట్టణ జెన్జీ ఓటర్లు ఫలితాలు, పనితీరు ఆధారంగా రాజకీయాలను అంచనా వేస్తున్నారని విశ్లేషించారు. అలాగే అజంతా అనే ఓ జర్నలిస్టు కమ్ రచయిత్రి ‘Youth and Politics: How Gen Z Is Reshaping India’s Democracy’ అనే వ్యాసంలో జెన్జీ రాజకీయ అవగాహన, 2024 ఎన్నికల్లో వారి పాత్ర గురించి, ఆపై సోషల్ మీడియా ప్రభావం, 2029 ఎన్నికల్లో వాళ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది అని విశ్లేషించారు. VIDEO Credits: What Does This Data Say -
ప్లాస్టిక్ వ్యర్థాలతో పార్కిన్సన్కు మందు
రోజువారీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరమైన ఔషధాలుగా మార్చటం సాధ్యమేనని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ‘వాడేసిన ప్లాస్టిక్ సీసాలు ఎందుకు పనికొస్తాయి... నేల, నీటిని కలుషితం చేయడానికి తప్ప’అని అనుకుంటూ ఉంటాం. కానీ, అది నిజం కాదు. పాత ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించి అద్భుతమైన ఔషధం తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ఇంగ్లండ్కు చెందిన ఎడిన్బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వృద్ధుల వ్యాధుల్లో ఒకటైన పార్కిన్సన్కు చెక్ చెప్పే అద్భుత ఔషధాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రపంచంలో తొలిసారి తయారు చేశారు. నేచర్ సస్టయినబిలిటీ జర్నల్లో ఈ పరిశోధనా వ్యాసం ఇటీవల ప్రచురితమైంది. ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం పర్యావరణ భారం మాత్రమే కాదని, ప్లాస్టిక్ రసాయన నిర్మాణంలో బంధితమైన కార్బన్ అణువులను ఔషధాల తయారీకి వనరుగా వాడుకోవచ్చని పరిశోధకులు నిరూపించారు. జన్యుమారి్పడి చేసిన ఈ–కోలి సూక్ష్మక్రిమి ఈ కార్బన్ను మార్చగలదని పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా సాధారణంగా సీసాలు, ఆహార ప్యాకేజింగ్లో ఉపయోగించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ)తో పార్కిన్సన్ వ్యాధి చికిత్సకు కీలకమైన లెవోడోపా మందును తయారు చేశారు. ప్రస్తుతం లెవోడోపా మందును ఉత్పత్తి చేసే ప్రక్రియ అనేక శిలాజ ఇంధన ఆధారిత రసాయన దశలపై ఆధారపడి ఉంటుంది. అధిక శక్తి వినియోగంతో కూడిన అధిక కార్బన్ను విడుదల చేసే ఖరీదైన ప్రక్రియ ఇది. ఈ సంప్రదాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ సీసాలతో మందులు తయారు చేయొచ్చని కనుగొన్నారు. అయితే ఎడిన్బరో విశ్వవిద్యాలయ పరిశోధకులే ప్లాస్టిక్తో పారాసెటమాల్ ట్యాబ్లెట్లను తయారు చేసే పద్ధతిని గతంలో కనిపెట్టారు. కేవలం 24 గంటల్లోనే ఒక లీటరు పీఈటీ సీసాలోని 90% వరకు ప్లాస్టిక్ను పారాసెటమాల్గా మార్చారు. 500 ఎంజీ పారాసెటమాల్ మాత్రలు నాలుగు తయారు చేయటానికి ఇది సరిపోతుంది.పార్కిన్సన్ బాధితులు కోటి వయోవృద్ధులకు వణుకు, కండరాలను బిగుతుగా మార్చేసే సమస్యలను కలిగించే జబ్బే పార్కిన్సన్. ప్రపంచవ్యాప్తంగా కోటిమంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలను నియంత్రిచడానికి లెవోడోపా అత్యంత ప్రభావవంతమైన ఔషధంగా మారింది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ జబ్బును నయం చేసే ఔషధాల అవసరమూ పెరుగుతోంది. దీంతో లెవోడోపాను ఉత్పత్తి చేయటానికి సుస్థిరమైన మార్గాలను కనుగొనటం అత్యంత ఆవశ్యకమైంది. ప్రయోగశాలలో సాధించిన ఈ అద్భుత ఆవిష్కరణ ఎంత ఉత్తేజకరమైనదైనా, పారిశ్రామిక స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఔషధాలు ఉత్పత్తి ప్రారంభించే దశకు రావటం రాత్రికి రాత్రే జరగదు.ఇంజనీర్లు తక్కువ ఖర్చుతో కూడిన తయారీ ప్రక్రియలను అభివృద్ధి చేయాలి. అలాగే ఉత్పత్తులు కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నియంత్రణ సంస్థలు సంతృప్తి చెందాలి. ఇందుకు చాలా కాలమే పడుతుంది. పెట్టుబడి భారీగానే అవసరమవుతుంది. శాస్త్రవేత్తలు, పరిశ్రమదారులు, విధాన రూపకర్తల మధ్య సన్నిహిత సమన్వయం అవసరం. ఏదేమైనా ఈ అద్భుత ఆవిష్కరణ సమీప భవిష్యత్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను ఔషధాలుగా మార్చే ఉత్పత్తి ప్రారంభ దశకు చేరుతుందని ఆశిద్దాం. -
ఫలితాలు, ఫెడ్పైనే ఫోకస్
అటు హార్మూజ్పై వివాదాలు, ఇటు ముడిచమురు ధరలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, దేశీ కార్పొరేట్ క్యూ4 ఫలితాలకు ఇన్వెస్టర్లు అత్యధిక ప్రాధాన్యత వచ్చే వీలుంది. వెరసి ఈ వారం సైతం తీవ్ర ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. మరోపక్క ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్ మరింత వేడెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలిచే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) పాలసీ సమీక్ష నిర్ణయాలు కీలకంగా నిలవనున్నాయి. వెరసి పలు అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మే 1) స్టాక్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఐఐపీ.. గత వారాంతాన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, వరుణ్ బెవరేజెస్, ఏయూ స్మాల్బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, అదానీ టోటల్, మారుతీ సుజుకీ, ఎటర్నల్, గార్డెన్రీచ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పవర్, ఇండియన్ బ్యాంక్, వారీ ఎనర్జీస్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, చోళమండలం తదితరాల పనితీరు వెల్లడికానుంది. మార్చి నెలకు రేపు(28న) పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ 5.2 శాతం వృద్ధిని సాధించింది. ఇతర అంశాలు విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల ఎగువకు చేరాయి. డాలరుతో మారకంలో రూపాయి 93.5కు బలహీనపడింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో భారీఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరగనుంది. దీంతో ఆర్బీఐ కఠిన విధానాలకు తెరతీయవలసి ఉంటుందని ఆరి్ధకవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా వివాదాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు తెలియజేశారు.సాంకేతికంగా చూస్తే ప్రధానంగా ఐటీ రంగం 10 శాతం పతనంకావడంతో గత వారం మార్కెట్లు క్షీణించాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 23,650–23,500 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇక్కడ బలపడితే.. 24,700వరకూ పురోగమించే అవకాశముంది. ఇక సెన్సెక్స్ 76,000–75,600 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 77,300ను అధిగమించే వీలుంది. ఆపై 78,000 పాయింట్లను దాటవచ్చు. దిగువస్థాయిల్లో 75,000 వద్ద రికవరీకి వీలుంది. చమురు షాక్ గత వారం ముడిచమురు ధరలు 8–10 శాతం ఎగశాయి. దీనికితోడు ఐటీ దిగ్గజాలు నిరుత్సాహపరచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగాయి. వెరసి గత వారం(20–24) నికరంగా సెన్సెక్స్ 1,829 పాయింట్లు(2.3 శాతం) పతనమైంది. 76,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 456 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి 23,898 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ స్వల్పంగా 0.6–0.2 శాతం మధ్య నీరసించాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు
ఒక్క ట్వీట్తో మార్కెట్లు ఒకటిరెండు శాతం పడిపోవటం... అలాగే పెరిగిపోవటం జరుగుతోంది. అసలు మార్కెట్ల డైరెక్షన్ ఎటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందో, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. చమురు ధరలు బీభత్సంగా పెరుగుతున్నాయి. రూపాయి దారుణంగా పడిపోయింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ తరహా ఊగిసలాటలో సొమ్ము చేసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్టర్లకది సాధ్యం కాదు. మరేం చెయ్యాలి? దీన్నుంచి పోర్టుఫోలియోను కాపాడుకోవటమెలా? దీనిపై ఫోకస్ చేస్తున్నదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...మ్యూచ్వల్ ఫండ్ల ద్వారా కావచ్చు... నేరుగా కావచ్చు. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిందొక్కటే. ఊగిసలాటలు, కల్లోలాలు మార్కెట్కు సహజం. అసాధారణమేమీ కాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే మార్కెట్లు ఇంకా ఎంత పడతాయనేది కాదు. దానికి మనమెలా స్పందించాలనేదే. మార్కెట్లు శాశ్వతం... హెచ్చుతగ్గులు తాత్కాలికం మార్కెట్ కరెక్షన్లు నాటకీయంగా ఉంటాయి. ఇక కోలుకోవేమో అనేంత భయం పుట్టిస్తాయి. పోర్టుఫోలియో విలువ పడిపోతుంది. వార్తలన్నీ నిరాశాజనకంగానే ఉంటాయి. ఇదిగో... ఇలాంటి దశలోనే చాలామంది ఇన్వెస్టర్లు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను (సిప్) తాత్కాలికంగానో, శాశ్వతంగానో నిలిపేస్తుంటారు. కాకుంటే ఇది చాలా ఖరీదైన పొరపాటు. ఎందుకంటే తెలివైన ఇన్వెస్టరుకు ఇవన్నీ తాత్కాలికమని, సంపద సృష్టి అనేది దీర్ఘకాలికమని స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు పతనమైనపుడే సిప్ బలంగా మారుతుంది. → అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. → దీనివల్ల సగటు ఖరీదు ధర తగ్గుతుంది. → మార్కెట్లు రికవరీ అవుతున్నపుడు పెరుగుదల వేగంగా ఉంటుంది. → ఈ రుపీ కాస్ట్ యావరేజింగ్ అనేదే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంజిన్లా పనిచేస్తుంది.అసలైన మంత్రం... అసెట్ అలొకేషన్ డైవర్సిఫైడ్ పోర్టుఫోలియో ఉంటే రిస్కు పూర్తిగా పోకున్నా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అసెట్లు రకరకాలుగా పనిచేస్తాయి. ఈక్విటీ వృద్ధికి తోడయితే డెట్ ఫండ్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. బంగారం అనేది ఈ రెండింటికీ హెడ్జ్గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ డైవర్సిఫికేషన్ అనేది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. లైఫ్సైకిల్ ఫండ్స్లో క్రమశిక్షణే ‘పెట్టుబడి’ లైఫ్సైకిల్ ఫండ్స్... ఇవి ఏం చేస్తాయనేది వీటి పేరులోనే ఉంది. ఇవి మన జీవితానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అంటే.. తొలినాళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాన్ని పెడతాయి. మెల్లగా తగ్గించుకుంటూ వెళతాయి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ... డెట్లో మొత్తాన్ని పెంచుకుంటూ వెళతాయి. ఉదాహరణకు... → లక్ష్యంలోని తొలి 20–30 ఏళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాయి. → తరువాతి 5–10 ఏళ్లు బ్యాలెన్స్డ్గా ముందుకెళతాయి. → మెచ్యూరిటీకి దగ్గరయ్యేటపుడు డెట్పై ఫోకస్ పెంచుతాయి. → ఇలా ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ల సమయంలో భావోద్వేగాలకు తావుండదు. → అలాగని ఇవేమీ రిసు్కలేకుండా ఉండవు. లైఫ్సైకిల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అలొకేషన్ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి. ఖర్చుల నిష్పత్తిని, పన్ను ప్రభావాన్ని, మెచ్యూరిటీకి దగ్గర పడుతున్నపుడు పోర్టుఫోలియో తీరును నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒకేరకమైన స్ట్రక్చర్ ఉన్నా... ఫండ్ మేనేజర్ల కారణంగా ఫండ్ల పనితీరు మాత్రం వేరుగా ఉండొచ్చు. సిప్ నిలిపేయటమే అసలు తప్పుఅన్నిటికన్నా సంపద సృష్టికి అడ్డంపడేది మార్కెట్ల పతనం కాదు. ఇన్వెస్టర్ల వైఖరే. ఎందుకంటే భయం తారస్థాయికి వెళ్లినపుడు... → ఇన్వెస్టర్లు సిప్ను నిలిపేస్తారు. → ఈక్విటీ ఫండ్ల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. క్లారిటీ కోసం దీర్ఘకాలం వేచిచూస్తారు. కాకపోతే... ఈ క్లారిటీ వచ్చేసరికి మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లెపుడూ తక్కువ ఖరీదులో అమ్మేసి బాగా పెరిగాక కొంటుంటారు. తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అదే తేడా.మార్కెట్ టైమింగ్ ముఖ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ల కోసం సరైన సమయం కోసం చూస్తుంటారు. నిజానికి నిపుణులకు కూడా ఇవి సరిగ్గా తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ ఉండటం... క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ పోవటం... మన అసెట్ అలొకేషన్కు కట్టుబడి ఉండటం తప్పనిసరి. నిపుణులు చెప్పేదేంటంటే మార్కెట్లలో సమయం కోసం ఎదురుచూడటం కన్నా... ఎక్కువ సమయం ఉండటమే లాభాన్నిస్తుందని.ఇన్వెస్టర్లు ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు పరిస్థితులేమీ అంత స్థిరంగా లేవు. క్రమశిక్షణతోనే దీనికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అందుకని చేయాల్సిందేంటంటే... → సిప్లను ఆపేయకుండా నిరంతరం కొనసాగించండి. → పోర్టుఫోలియో విలువను చూడకుండా... అసెట్ అలొకేషన్ను సమీక్షించుకోండి. → భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే భయం, ఆశ సంపద సృష్టికి శత్రువులుగా మారతాయి. → లక్ష్యాలకు తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్లు కొనసాగించండి. షార్ట్టర్మ్ ట్రెండ్ను బట్టి కాకుండా దీర్ఘకాల పనితీరు ఆధారంగా ఫండ్లను ఎంచుకోండి. → మీకు క్రమశిక్షణ లేదని మీరు భావిస్తే లైఫ్సైకిల్ ఫండ్స్ను ఎంచుకోండి. వాటిలో ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ఉంటుంది... భావోద్వేగాల పరమైన తప్పులు జరగవు. -
ఇలాంటి ఓ అంతర్యుద్ధం జరుగుతోందని తెలుసా?
మనుషుల చరిత్రలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తరచుగా కనిపిస్తాయి. రాజ్యాల కోసం, మతాల కోసం, జాతుల కోసం జరిగిన ఈ పోరాటాలు సమాజాలను శాశ్వతంగా మార్చేశాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇలాంటి అంతర్యుద్ధాలు జరుగుతాయని.. వాటి ఫలితంగా 11 ఏళ్లుగా నిత్యం కారడవిలో రక్తపాతం జరుగుతోందని మీకు తెలుసా?.. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్.. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీ సమూహంగా పేరుగాంచిన న్గోగో(Ngogo) కమ్యూనిటీకి కేరాఫ్. సాధారణంగా చింపాంజీలు 50 లోపే ఒక సమూహంగా ఉంటాయి. కానీ, న్గోగో జాతివి మాత్రం 200లకు పైనే కలిసి ఉండేవి. ఇది పరిశోధకులను ఎంతో ఆశ్చర్యపరిచేది. ఒకప్పుడు కలిసే ఉంటూ.. కలిసే వేటాడుతూ.. కాలం వెల్లదీస్తుంటాయివి. అలాంటిది ఓరోజు అనూహ్యమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఉన్నట్లుండి.. ఆ చింపాంజీ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఒకదానితో మరొకటి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా అది ఘర్షణలకు దారి తీసింది. మనుషుల్లాగే.. అవి గ్యాంగ్ వార్లు చేస్తుండడం, పక్కా ప్లానులతో ప్రత్యర్థులు దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించాయి. చివరకు వాటిలో అవి కొట్టుకుని చంపుకునే దాకా వెళ్లింది పరిస్థితి. అలా.. 2015 నుంచి ఇప్పటిదాకా ఏడు పెద్ద చింపాజీలు, మరో 17 పిల్ల చింపాంజీలు మరణించాయి. మరో 14 చింపాంజీలు జాడ లేకుండా పోయాయి. ప్రస్తుతం వెస్టర్న్ గ్రూప్, సెంట్రల్ గ్రూప్ల మధ్య అంతర్యుద్ధంతో నిత్యం కిబాలేలో రక్తం చిందుతోంది. ప్రఖ్యాత పరిశోధకుడు ఆరన్ సాండెల్ ఈ సంఘటనను “చింపాంజీల సివిల్ వార్”గా అభివర్ణించారు. 2014లో ఆ కమ్యూనిటీని అదుపు చేసిన కొన్ని చింపాజీలు వ్యాధులతో చనిపోవడం.. కొత్త ‘ఆల్ఫా మేల్’ రావడం వల్ల సంబంధాలు బలహీనపడ్డాయని చెబుతున్నారాయన. ఆయన మాటల్లో.. ఇది మనుషుల మధ్య మతం, జాతి కోసం జరుగుతున్న యుద్ధంలా కాదు. సంబంధాలు, ఆధిపత్యం, సామాజిక బంధాలు బలహీనపడటం వల్లే చింపాంజీల మధ్య విభజన జరిగింది అని అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనను 70వ దశకంలో జేన్ గూడాల్ గోంబే నేషనల్ పార్క్(టాంజానియాలోని అతి చిన్న నేషనల్ పార్క్)లో జరిగిన “ఫోర్ ఇయర్ వార్”తో పోలుస్తున్నారు. అప్పట్లో కూడా ఒకే సమూహంలో పెరిగిన చింపాంజీలు.. కహామా, కసకెలా కమ్యూనిటీలుగా విడిపోయి చంపుకున్నాయి. అయితేనీ వైరంతో తక్కువ కాలంలోనే ఆ జాతి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. న్గోగో చింపాంజీల యుద్ధం ఎలా ముగుస్తుందో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు. ఇక్కడ మూడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. సెంట్రల్ గ్రూప్ తమను తాము బలపరుచుకుని రక్షించుకోవడం. రెండోది.. వెస్టర్న్ గ్రూప్ పూర్తిగా ఆధిపత్యం సాధించి సెంట్రల్ గ్రూప్ను అంతమొందించడం. మూడోది.. రెండు గ్రూపులు మళ్లీ కలిసిపోవడం. అయితే చివరిది చాలా అరుదుగా జరిగే అవకాశం అని పరిశోధకులు చెబుతున్నారు. -
వడదెబ్బకు పొగ పెడదామా?
వేసవి ఠారెత్తిస్తోంది. ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. హీట్ వేవ్ వార్నింగులు, జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయ్. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ చర్చోపచర్చలు కూడా సాగిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో ఈ వడగాలులు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలో ఓ లుక్కేద్దాం రండి.వడగాలులు అంటే..? సింపుల్గా చెప్పాలంటే వేడి గాలులు. వాతావరణం ఎగువన (9,800–24,900 అడుగులు) ఉన్న అధిక పీడన ప్రాంతం బలపడి.. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఒక ప్రాంతంపై నిలిచి ఉన్నప్పుడు వడగాలులు ఏర్పడతాయి. 1950లలో నుంచి భూమిపై దాదాపు ప్రతి ప్రాంతంలోనూ వేడిగాలులు అంతకంతకూ పెరుగుతున్నాయ్. వాతావరణ మార్పుల వల్ల 2024 నుంచి ఇవి మరింత తీవ్రతరం అయ్యాయి. అనేక ప్రాంతాలు 45 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను చవిచూస్తున్నాయ్.మనపై ఎలాంటి ప్రభావం?ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ మానవ శరీరం ఒత్తిడికి గురవుతుంది. సాధారణంగా మన శరీరం 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద చక్కగా పనిచేస్తుంది. ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత శ్వాస వేగవంతమవుతుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద శరీరం చల్లగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల శక్తి వినియోగం దాదాపు 35% పెరుగుతుంది. శరీర అంతర్గత ఉష్ణోగ్రత కొంతసేపు స్థిరంగా ఉన్నప్పటికీ, ఎక్కువసేపు ఈ వేడికి గురికావడం ప్రమాదకరం. 42 డిగ్రీల సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రమైన హానిని కలిగిస్తాయి.అందువల్ల మన శరీర ఉష్ణోగ్రతను 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్థిరంగా ఉంచడానికి మన మెదడులో ఉండే హైపోథాలమస్ అనే భాగం పనిచేస్తుంటుంది. అయితే, బయట మరీ వేడి వాతావరణం ఉంటే మన శరీరం ఆ వేడిని నిరంతరాయంగా గ్రహిస్తుండటం వల్ల చల్లబరచడం కష్టమవుతుంది. మన శరీరంపై ఏర్పడిన చెమట ఆవిరయ్యే పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుంది.పొడి వాతావరణంలో చెమట త్వరగా ఆవిరై మన శరీరంలోని అధిక వేడిని వెంటనే తొలగిస్తుంది. అదే తేమతో కూడిన రోజులలో తేమ గాలిలో నిండి ఉండటం వల్ల చెమట ఆవిరి కావడం నెమ్మదిస్తుంది. దీంతో శరీరం వేగంగా వేడెక్కడానికి, వడదెబ్బకు గురికావడానికి కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం తన అంతర్గత వేడిని నియంత్రించుకోవడానికి అధికంగా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు గుండె, మూత్రపిండాలు అధిక ఒత్తిడికి లోనవుతాయి.మెదడుకూ ముప్పే.. అధిక వేడి శరీరంపైనే కాకుండా నాడీ సంబంధిత ముప్పుగానూ పరిణమిస్తోంది. మెదడుపై ఇది చూపించే ప్రభావం.. మైగ్రేన్లు, మూర్చల నుంచి మానసిక రుగ్మతలు, పక్షవాతం రావడం వరకు కారణమవుతోంది. మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, దేనికైనా ప్రతిస్పందించినప్పుడు మెదడు కొంచెం వేడిని విడుదల చేస్తుంది. అప్పుడు శరీరం దానిని చల్లబరుస్తుంటుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ ప్రక్రియ ఫెయిలైతే మొత్తం శరీర వ్యవస్థ అదుపు తప్పుతుంది. వేడి వాతావరణం మనం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తుంది.అంతేకాకుండా మధుమేహం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి సమస్యలు ఉన్నవారిలో అధిక వేడి సమయంలో వడదెబ్బ, కండరాల నొప్పుల నుంచి తీవ్రమైన డీహైడ్రేషన్, వడదెబ్బ వరకు సంభవించవచ్చు, వడదెబ్బ వల్ల అధిక చెమట, నీరసం, వికారం, కండరాల నొప్పులు కలుగవచ్చు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి.. తీవ్రమైన వడదెబ్బగా మారితే.. అది గందరగోళం, మూర్ఛలు, అవయవ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. అధిక చెమట పట్టడం వల్ల నిర్జలీకరణం (డీహైడ్రేషన్), అవసరమైన లవణాల నష్టం కూడా జరగవచ్చు, దీనివల్ల తల తిరగడం, స్పృహ కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది.అత్యధిక వేడి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. శరీరం ప్రధాన ప్రాధాన్యం చల్లగా ఉండటమే. ఇందుకోసం చెమట ద్వారా వేడిని విడుదల చేయడానికి శరీరం చర్మానికి ఎక్కువ రక్తాన్ని పంపుతుంది. ఈ మార్పు వల్ల జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ తగ్గి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపులో భారంగా అనిపించడం, ఆకలి తగ్గడం, యాసిడ్ రిఫ్లక్స్ లేదా సాధారణ అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. శరీరంలో తగినంత ద్రవాలు లేనప్పుడు, జీర్ణక్రియ మరింత మందగిస్తుంది, దీనివల్ల మలబద్దకం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ముఖ్యంగా వృద్ధులలో, వేడి వాతావరణంలో తగినంత నీరు తాగని వారిలో సర్వసాధారణంగా కనిపిస్తాయి.ముప్పు తప్పాలంటే ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఇంటి లోపలే ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12–3 గంటల మధ్యలో బయటకు వెళ్లొద్దు. దాహం లేకున్నా ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. ఎండలో కష్టసాధ్యమైన పనులు చేయకూడదు. ఓఆర్ఎస్, లస్సీ, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉన్న, నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.పిల్లలు, జంతువులను పార్క్ చేసి ఉన్న వాహనాల్లో వదిలిపెట్టకూడదు. ఆల్కహాల్, టీ, కాఫీ వంటివి తాగకూడదు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడి గుడ్డతో తుడవాలి లేదా మామూలు నీళ్లను తలపై చల్లాలి. ఓఆర్ఎస్, నిమ్మకాయ నీళ్లు లేదా గంజి వంటి రీహైడ్రేట్ పానీయాలు అందించాలి. వెంటనే వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలి. -
డేటా వార్!.. కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్లోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) బాంబు పేల్చింది. సముద్రంలోని ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రయాణిస్తోంది. కేబుల్స్కు ముప్పు వాటిల్లితే నష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. చాలా దేశాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే. -సాక్షి, స్పెషల్ డెస్క్హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, వాటికి ఉన్న ముప్పును ఐఆర్జీసీకి అనుబంధంగా ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన నివేదికలో వివరించింది. ఇంధన రవాణాకే గాక ప్రపంచ డేటా ప్రవాహానికీ ఈ జలసంధి అత్యంత కీలక మార్గమని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ సముద్ర కేబుల్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాయని నొక్కి చెప్పింది. కేబుళ్ల ల్యాండింగ్ స్టేషన్స్, క్లౌడ్ హబ్లను శత్రువుపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక కేంద్రాలని తెలిపింది. ఎలాంటి అంతరాయం కలిగినా ఆయా దేశాల ఆర్థిక, సమాచార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉన్నాయి. మూల స్తంభాలుగా.. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి గుండా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ భారీ నెట్వర్క్ ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కీలక అనుసంధానంగా నిలుస్తుంది. పశ్చిమ దేశాలతో భారత్ను అనుసంధానించే ఐదు ప్రధాన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు మన దేశ డిజిటల్ కమ్యూనికేషన్లకు మూల స్తంభాలుగా ఉన్నాయి. వీటిలో ఫాల్కన్ నెట్వర్క్, ఆసియా–ఆఫ్రికా–యూరప్–1, టాటా టీజీఎన్–గల్ఫ్, సౌత్ఈస్ట్ ఆసియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్–4, ఇండియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్ ఉన్నాయి. కేవలం ఎర్ర సముద్రం గుండానే 15–20 కేబుల్స్ వెళ్తున్నాయి. రిలయన్స్ అభివృద్ధి చేస్తున్న ఇండియా–యూరప్–ఎక్స్ప్రెస్, ఇండియా–ఆసియా–ఎక్స్ప్రెస్, గూగుల్కు చెందిన ధివారు సముద్ర కేబుల్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. సేవలకు అంతరాయం.. ఒకటి లేదా రెండు కేబుల్స్ దెబ్బతింటే ఆ అంతరాయాన్ని సాధారణంగా సరిచేయొచ్చు. అనేక కేబుల్స్ తెగిపోతే ఇంటర్నెట్ వేగం తగ్గడం, వెబ్సైట్స్ పనిచేయకపోవడం, బ్యాంకింగ్, క్లౌడ్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన దేశంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్లో సుమారు 60% ముంబై నుంచి గల్ఫ్ ప్రాంతం మీదుగా యూరప్ వైపు వెళ్లే మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మిగిలిన ట్రాఫిక్ చెన్నై నుంచి సింగపూర్ మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపు సాగే మరో మార్గం ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల నుంచి ఆసుపత్రి డేటా వరకు అన్నీ ’క్లౌడ్’లో భద్రపరచి ఉన్నాయి. కనెక్టివిటీ పోతే ఈ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. భారత్ ఒక ’డిజిటల్ ద్వీపం’ లాంటిది. మన అంతర్జాతీయ డేటాలో 97% సముద్ర మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మరమ్మతులకు నెలలు.. తరచుగా నౌకల లంగర్ల వల్ల జరిగే ప్రమాదవశాత్తు నష్టాలు కూడా ఇంటర్నెట్ అంతరాయాలకు కారణమవుతాయి. భారీ స్థాయిలో నష్టం జరిగితే వాటిని సరిచేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. 2024, 2025లో ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఎర్ర సముద్రంలోని పలు సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గడంతోపాటు అనేక దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఆ ప్రాంతంలోకి ప్రవేశం పరిమితంగా ఉండటం వల్ల మరమ్మతులు చేయడానికి నెలలు పట్టింది. రిస్క్ అనాలసిస్.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం దిగ్గజాలు తమ అంతర్జాతీయ డేటా ప్రసారం కోసం ఈ హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. హార్ముజ్ గుండా వెళ్లే కేబుల్స్కు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడటానికి ఇరాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరపాలని ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో టెలికం శాఖ ఆపరేటర్లందరినీ తమ డేటా మార్గాల భద్రతపై ’రిస్క్ అనాలిసిస్’ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కేబుల్స్ దెబ్బతింటే డేటాను ప్రత్యామ్నాయ మార్గాల (సింగపూర్ లేదా పసిఫిక్ రూట్) ద్వారా ఎలా మళ్లించాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. -
వైరుధ్యం వైవిధ్యాల విలక్షణ గాయని జానకి
నదులెన్నో ఉంటాయి... నదులలో గంగానది ప్రత్యేకతే వేరు... కారణం ఆ నది అనేక స్థలాలను స్పృశిస్తూ వాటిని క్షేత్రాలుగా మార్చటమే కాకుండా తన పేరును కూడా మార్చుకుంటుంది... అలాగే నేపథ్య గాయనీమణులెందరో ఉన్నా ఎస్. జానకి ప్రత్యేకతే వేరు. ఎందరో సంగీత దర్శకుల పాటలకు తన గాత్రంతో న్యాయం చేసి, వారి పేరు నిలబెట్టారు జానకమ్మ.గళంలో మాధుర్యం, స్థాయితో పాటు అనుకరణ కళ జానకమ్మ ప్రత్యేకత. తన గాత్రం ద్వారా ఆమె ఆరేళ్ల పాప మొదలు అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు ఆయా పాత్రలను ఆవిష్కరించారు. అటు శాస్త్రీయ సంగీతాన్ని, ఇటు జానపద సంగీతాన్ని అలవోకగా ఆలపించారు. నవరసాలను పలికించే అద్వితీయ స్వరం కలిగిన అపర గాన సరస్వతి. భక్తి, రక్తి, ముక్తి, శక్తి... ఇలా ఏ పాటకైనా న్యాయం చేసే ఏకైక గాయని. ఏ శ్రుతిలోనైనా పాడగలిగే విలక్షణ ప్రతిభామణి... ఇంత వైరుధ్యం, వైవిధ్యం కలిగి ఉండటం అరుదాతి అరుదు. ముఖ్యంగా చెప్పాలంటే స్వరానుకరణలో ఆమెకు ఆమే సాటి... ఆమెకు లేరు పోటీ.నీ లీల పాడెద దేవా...: జానకమ్మ టాలెంట్ తొలిసారి ‘మురిపించే మువ్వలు’ (1962) చిత్రం ద్వారా బయటపడింది. ఈ సంగీత నృత్య చిత్రానికి ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు సంగీతం అందించారు. సన్నివేశం ప్రకారం ఇది నాద స్వరంతో పోటీ పడుతూ సాగే శాస్త్రీయ సంగీతంలో పాడాల్సిన పాట. ఈ పాట బాణీని విన్న తర్వాత లీల తాను అంత హై పిచ్లో పాడలేనని చెప్పి జానకమ్మ పేరును సూచించారు. ఆ విధంగా జానకి తొలుత తమిళంలో ‘సింగార వేలనే దేవా’ అని పాడి తెలుగులో ఆరుద్ర రాసిన ‘నీ లీల పాడెదా దేవా...’ పాటను అవలీలగా పాడారు. ఇందులో ఆమె నాద స్వరంతో పోటీగా స్వర కల్పన చేయడం న భూతో న భవి ష్యతి. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కారుకురిచ్చి అరుణాచలం నాద స్వరం వాయించగా, జానకి నాద స్వరం శ్రుతిలోనే ఆలపించడం విశేషం. కారణం నాద స్వరం ‘హై పిచ్’లో ఉంటుంది. ఇలా నాద స్వరంతో పోటీ పడుతూ ‘సన్నాయి అప్పన్న’ (1980) చిత్రంలోనూ జీకే వెంకటేశ్ సంగీతంలో ‘కదిలించు నీ కలికి హృదయం’ పాటను మన హృదయాలు కరిగించేలా పాడారు జానకమ్మ. ఈ పాటకు ప్రముఖ సంగీత విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ హిందుస్థానీ సంగీతంలో ప్రముఖ వాద్యమైన షెహనాయ్ను వాయించడం విశేషం. షెహనాయ్, నాద స్వరాలతో పాటు వేణువుతో పోటీపడుతూ ‘సప్త పది’ (1981)లో ‘నెమలికి నేర్పిన నడకలివే’ పాటను అదే శ్రుతిలో పాడి అలరించారు జానకమ్మ. సిరిమల్లె పువ్వల్లె నవ్వు...: మామూలుగా సాహిత్యం లేకుండా కేవలం లయ బద్ధంగా నవ్వుతూ పాటను రక్తికట్టించడం ఆషామాషీ కాదు. కానీ జానకమ్మ ‘జ్యోతి’ (1976) చిత్రంలో తాళం ప్రకారం నవ్వి అందరినీ నివ్వెరపరచారు. చక్రవర్తి సంగీతంలో బాలుతో కలిసి పాడిన ‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లే నవ్వు...’ పాటలో ఆమె ఆద్యంతం నవ్వుతో తన భావాలను వ్యక్తీకరించడం విశేషం. ఇందులో బాలు స్వరాలు పాడితే జానకమ్మ దానికి అవే స్వరాలను నవ్వుతో పలికించడం విశేషం.చలికి వణికినట్లుగా...: ‘శంకరాభరణం’ చిత్రంలో శంకరశాస్త్రి తన పదేళ్ళ కూతురు శారదను తెల్లవారు ఝామునే ఒక నదీ తీరంలో కంఠం లోతు వరకు కూచోబెట్టి సంగీత పాఠాలు బోధిస్తుంటాడు. ఈ సన్నివేశంలో జానకమ్మ బాలిక స్వరానికి తగ్గట్టు మాత్రమే కాకుండా అపస్వరం లేకుండా శ్రుతిలో పాడటం విశేషం. అలాగే ఒక చోట వేగంగా ఆలపించే స్వరాలను కూడా శిష్యురాలిలా తడబడుతూ పాడటం విశేషం. ఇదే చిత్రంలో పెళ్లి చూపుల సందర్భంలో శారద హిందోళ రాగంలో ‘సామజ వర గమనా’ అనే త్యాగరాజ కీర్తన పాడుతూ, అబ్బాయిని చూస్తూ ప్రేమ పారవశ్యంలో ఏకాగ్రత కోల్పోయి నిషిద్ధ స్వరాలైన రిషభ స్వరాన్ని స్పృశిస్తుంది. దాంతో శంకర శాస్త్రి... శుద్ద హిందోళం రాగంలో రిషభం ఎలా వచ్చింది? అని ఆగ్రహిస్తాడు. ఈ పాట శాస్త్రీయంగా మొదలై, మధ్యలో చరణాలలో నాయికా నాయకుల ప్రణయంతో విహరించి, పాట చివర ఆలాపనలో అన్య స్వర ప్రయోగంతో తప్పు పాడి, సంబంధమే కాదనుకొనే ప్రళయానికి దారి తీస్తుంది. బాలుర గొంతులను అనుకరిస్తూ...: ‘సప్తపది’లో ‘గోవుల్లు తెల్లన... గోధూళి తెల్లన... గోపయ్య నల్లన?’ అనే వర్ణ వివక్షతను ప్రశ్నిస్తూ రాసిన గీతాన్ని బాలుతో కలిసి రెండు గొంతులతో వైవిధ్యంగా పాడారు జానకమ్మ. ఈ రెండు గొంతులలో ఒకటి పదేళ్ల బాలుడైతే, మరోటి మూడేళ్ల వయసుగల బాబు కావడం విశేషం. మూడేళ్ల బాబు పాడినప్పుడు ఆ గొంతులో స్వరాలు కుదురుకోవు కాబట్టి శ్రుతిలో కాకుండా మామూలుగా పాడారు. కాస్త పరిణతి చెందాక శ్రుతి, లయ మాధుర్యం ఉంటాయి. ఈ వైవిధ్యాన్ని జానకమ్మ ఎంతో ప్రతిభతో చూపించారు. గోదావరి గల గలలలా...: 1964లో ‘పూజాఫలం’ సినిమాలో ఘనం శీనయ్య రాసిన ‘పదం’ ను కురంజి రాగంలో ఎస్. రాజేశ్వరరావు స్వరపరచగా జానకమ్మ సశాస్త్రీయంగా పాడారు. ఈ పదంలో ‘శీలమింతైన విడువ జాలను రా’ అన్న పంక్తిలో జానకమ్మ గాత్ర గమకాలు గోదావరి గల గలలను మించి జాలువారాయి. రాజ ఓ రాజ...: ‘చిలక జోస్యం’ (1983 ) సినిమాలో కేవీ మహదేవన్ సంగీతంలో బాలు, జానకి పాడిన ‘రాజ ఓ రాజ ఓ బాలరాజా..’ నవ్వుల వానలో ముంచెత్తించింది. ఈ పాటలో అల్లు రామలింగయ్య, రమాప్రభ అభినయించారు. వీటూరి రాసిన ఈ పాటలో ‘లైలాను నేను మజ్నూవు నీవు... మన ప్రేమ నగరు మాయా బజారు, యమగోల’ అని సాహిత్యమంతా అక్కినేని, ఎన్.టి.ఆర్ నటించిన చిత్రాల పేర్లతో రూపొందించింది కావడం విశేషం. పాటలో... ‘నీ కులుకులు, నీ తళుకులు, గిలి గిలి’ అన్నపుడు జానకమ్మ మత్తుగా నవ్విన తీరు పాటకు బోనస్. ‘శివ’ (1989) సినిమా కోసం ఇళయరాజా స్వరపరచిన ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలో జానకమ్మ ఎక్స్ప్రెషన్స్ శృంగార రస తరంగాలలో ఓలలాడించే విధంగా ఉన్నాయి.హమ్మింగ్లో అభివ్యక్తులు: కొన్ని పాటల్లో ఒక్కోసారి నాయకుడు మాత్రమే పాటను ఆలపిస్తుంటాడు... నాయిక హమ్మింగ్ చేస్తుంది. తెలుగు సినిమాలలో జానకమ్మే ఈ హమ్మింగ్లను పాడటం విశేషం. అంతేకాదు... ఆ... ఊ... ఆహా... ఓహో అని మాత్రమే అంటూ భావాన్ని వ్యక్తం చేసిన ఘనత ఆమెది. ‘సిరి సంపదలు’ (1964) చిత్రంలో ఘంటసాలతో పాడిన ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ..’ అని ప్రశ్నిస్తే, హీరో వెంటనే ‘వింత కాదు, నా చెంత నా ప్రియురాలు ఉండటమే సుమీ’ అని జవాబు చెప్పి సమర్థించుకొంటాడు. ఈ పాటలో ప్రశ్నకు... జవాబుకు సైతం జానకమ్మ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వర్ణనాతీతం. ఆలాపనలో ఆకర్షణలు...: ‘రావణుడే రాముడైతే’ (1978) చిత్రంలో జీకే వెంకటేశ్ సంగీతంలో ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’ పాట జానకమ్మ ఆలాపనతో మొదలవుతుంది. పాట తాలూకు ప్రతి చరణాంతంలో ఆమె తారా స్థాయిలో (సా..ని ని పా..ప ని రీ) చేసిన ఆలాపన రవి వర్మ చిత్రాన్ని స్వరచిత్రం చేస్తుంది. ‘ఆకలి రాజ్యం’ (1980)లో ‘తన్న నన్న నాన తన్న నన్న’ అని ట్యూన్ మాత్రమే ఇస్తూ హీరో పాట సాహిత్యాన్ని రాయించే గీతంలో పాట ఆద్యంతం నాయిక భావాలకు తగ్గట్టుగా నాయ కుడు సాహిత్యాన్ని ఎలా అందిస్తాడోనని ఆసక్తి కలుగుతుంది. పడుచు పిల్ల... ముసలి అవ్వల గాత్రానుకరణ...: ‘శ్రీవారికి ప్రేమ లేఖ’ (1984) కోసం రమేశ్ నాయుడు స్వరపరచిన పాటలో నాయిక ప్రేమలేఖ రాస్తూ ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ సాగే పాటలో ఊర్పులు, నిట్టూర్పులను జానకమ్మ పలికించిన తీరు మాటలకందనిది. ‘శ్రీవారి శోభనం’ (1985) చిత్రంలో వేటూరి రాసిన ‘అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక’ పాటను రమేశ్ నాయుడు సంగీతంలో అటు పడుచు పిల్ల వలె ఇటు ముసలి అవ్వ వలె గొంతు మారుస్తు పాడటం జానకమ్మకే చెల్లింది.వీణలో లీనమైన గానం: ‘ఓ వీణ చెలి నా ప్రియ సఖి’ (చంద్రహాస 1965) వంటి వీణ పాటలు జానకమ్మ గాత్ర వైవిధ్యానికి మెచ్చు తునకలు. హనుమంత రావు స్వరపరచిన ఈ గీతంలో జానకమ్మ వీణతో పోటీ పడి పాడారు. ఇక నవరసభరితమైన గీతాలలో.. ‘ఇల్లు ఇల్లాలు’ (1972) చిత్రంలో కేవీ మహదేవన్ సంగీతంలో ‘వినరా సూరమ్మ కూతురు మగడా...’ అంటూ జానకమ్మ, రాజబాబు పాడిన హాస్య గీతం ఆల్ టైం హిట్ అయింది. అప్పలాచార్య రాసిన ఈ పాట బుర్ర కథలాగా మొదలవుతుంది.ఎదలో లయ ఎగసే...: ‘నీరాజనం’ (1988)లో ఓపీ నయ్యర్ సంగీతంలో సినారె రాసిన ప్రణయ గీతం ‘నిను చూడక నేనుండలేను’లో బాలు గాత్రానికి దీటుగా జానకమ్మ ఆలాపనలు స్వరామృత గుళికలే. ‘అన్వేషణ’ (1985) చిత్రంలో వేటూరి రాసిన ‘ఎదలో లయ ఎగసే లయ’ పాట పాడిన తీరు గురించి రాయడానికి పదాలు లేవు. ఈ సన్నివేశానికి గాను ఇళయరాజా స్వరకల్పనలో జానకమ్మ పాడిన తీరు అలరిస్తుంది. ఇలా జానకమ్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు... ఆమె ఓ ప్రవహించే జీవనది ... ఆ నదిలో నుంచి ఎంతైనా స్వీకరించవచ్చు... అనుభూతికి ఆకాశమే హద్దు.– డాక్టర్ వి.వి. రామారావు(రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత) -
అమ్మో.. అమెరికా సైన్యం లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్గా ఎదిగిన అమెరికా.. పెద్దన్న పాత్రలో పలు దేశాల్లో తన సైన్యాన్ని మోహరిస్తోంది. పశ్చిమాసియా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో ఈ మోహరింపులు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ సంక్షోభాలు, అంతర్యుద్ధాలు, యుద్ధాలు, వాణిజ్య మార్గాల రక్షణ, ఉగ్రవాదం.. ఇలా రకరకాల కారణాలతో అగ్రరాజ్యంతో మిత్రదేశాలతో ఈ తరహా డీల్ కుదుర్చుకోవాల్సి వస్తోంది. మరి ఏ దేశంలో ఆ ఫిగర్ ఎక్కువగా ఉందో తెలుసా?.. తెలిస్తే మీకు కచ్చితంగా షాకవుతారు.అమెరికా సైన్యం ఎక్కువగా మధ్యప్రాచ్యంలో లేదంటే యూరప్లో ఉంటుందని చాలామంది అనుకుంటారు. తాలిబన్ల దాడుల టైంలో(2001–2021) అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో అత్యధికంగా సైనికులను మోహరించింది. 2011 నాటికల్లా ఆ సంఖ్య లక్షకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021లో చివరి దశలో కేవలం 2,500 సైనికులు మాత్రమే మిగిలి.. అటుపై ఆగస్టు 2021లో పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత గణాంకాల ప్రకారం.. అమెరికా సైన్యం 1,71,500 మంది సైనికులను విదేశాల్లో మోహరించింది. అందులో ప్రపంచంలో అత్యధికంగా మోహరించింది మాత్రం జపాన్లోనే!!. ఎందుకిలా?.. జపాన్కంటూ సొంత సైన్యం లేదా?.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబులేసిన దేశపు సైన్యాన్నే ఎందుకు ప్రొత్సహించాల్సి వచ్చింది?..అణుబాంబుల తర్వాత..రెండో ప్రపంచ యుద్ధంలో.. జపాన్ అంత త్వరగా ఓటమిని అంగీకరించలేదు. యుద్ధాన్ని త్వరగా ముగించడానికి, జపాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. హిరోషిమా, నాగసాకిలపై మూడు రోజుల వ్యవధిలో అణుబాంబులు ప్రయోగించింది. లక్షల సంఖ్యలో మరణాలు.. లెక్కలేనంత మందిపై రేడియేషన్ ప్రభావం. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లపాటు అమెరికా ఆధీనంలో ఉండిపోయింది జపాన్. ఆ తర్వాత తన వీక్నెస్ను పసిగట్టింది. తన రాజకీయ, రక్షణ వ్యవస్థను జపాన్ సమూలంగా మార్చుకుంది.1947లో అమెరికా పర్యవేక్షణలో జపాన్ కొత్త రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఇందులో “యుద్ధం చేయకూడదు, సైన్యం పెట్టకూడదు” అనే క్లాజ్ ఏర్పాటు చేసుకుంది. సైన్యం కోసం కాకుండా.. ఆర్థిక అభివృద్ధి ఇందుకోసం సాంకేతికత, పరిశ్రమల రంగాలపై దృష్టిసారించాలని నిర్ణయించుకుంది. ఆపై 1951, 1960లో జపాన్ తన రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగిస్తూ US-Japan Security Treaty చేసుకుంది. అప్పుడు ఏర్పడ్డ అమెరికా సైన్యం స్థావరాలు.. ఏమాత్రం తగ్గకుండా మరింత వ్యూహాత్మకంగా పెరిగాయి.ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే.. 2026 నాటికి జపాన్లో సుమారు 61 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (35,989), దక్షిణ కొరియా (23,766) ఉన్నాయి. చైనా, ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉండడంతో అమెరికా సైన్య సహాయం తీసుకుంటోంది. ఆ రెండు దేశాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవడం కోసం జపాన్ రక్షణ బాధ్యతకు అమెరికా ముందుకొచ్చింది. పసిఫిక్ సముద్రంలో వాణిజ్య మార్గాలను రక్షించడానికి జపాన్లోని స్థావరాలు ఒకినావా, యోకోసుకా, మిసావా ముఖ్యమైనవిగా ఉన్నాయి.అక్కడే ఎక్కువ.. అమెరికా సైన్యం జపాన్లో అత్యధికంగా మోహరించబడింది. మొత్తం మీద జపాన్లో 120కి పైగా అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది Okinawa దీవి గురించి. చైనా, తైవాన్, ఉత్తర కొరియా దగ్గరగా ఉండటం వల్ల అమెరికా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఇక్కడే అతిపెద్ద ఎయిర్ బేస్ (Kadena Air Base) ఉంది. సుమారు 23,000 పైగా అమెరికా సైనికులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది ఉన్నారు.అభ్యంతరాలు కూడా..అయితే.. అమెరికా సైన్యం మోహరింపుపై జపాన్లో అభ్యంతరాలూ ఉన్నాయి. స్థావరాల కోసం అధిక భూభాగాన్ని వినియోగించుకోవడం.. తరచూ ప్రమాదాలు.. స్థానికులపై అమెరికా సైనికులు దాడులకు తెగబడడం.. శబ్ధ కాలుష్యంపై ఒకినావా (Okinawa)లో ఇప్పటికీ నిరసనలు జరుగుతుంటాయి. 2025లో రెజల్యూట్ జపాన్ పేరుతో ఇరు దేశాలు ఎయిర్షో నిర్వహించాయి. అయితే ‘‘మా దీవులను యుద్ధభూమిగా మార్చొద్దు’’ అంటూ స్థానికులు రోడ్లను బ్లాక్ చేశారు. అమెరికా బేస్ల కారణంగానే పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదని.. తద్వారా నిరుద్యోగం పెరిగిపోతోందనే విమర్శ ఒకటి ఉంది. అయితే జపాన్ తన రక్షణను స్వయంగా చూసుకోలేని స్థితి. మిత్రదేశం అమెరికాకు ఆ బాధ్యత అప్పగించింది. అందుకే మెజారిటీ ప్రజలు, రాజకీయ వర్గాలు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఒకటుంది. సైన్యం ఉంది, కానీ..జపాన్కి త్రివిధ దళాలతో కూడిన సొంత సైన్యం ఉంది. దాన్ని జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (JSDF) అంటారు. ఇది 1954లో స్థాపించబడింది. దీని వద్ద ఆధునిక ఆయుధాలు, నౌకలు, యుద్ధవిమానాలు ఉన్నాయి. ప్రస్తుతం అందులో సుమారు 2.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ వీటి ప్రధాన లక్ష్యం రక్షణ మాత్రమే.. దాడి కాదు. జపాన్ రాజ్యాంగంలోని 9వ ఆర్టికల్ ప్రకారం.. జపాన్ “యుద్ధం చేయదు, దాడి సైన్యం పెట్టదు.”. మరి జేఎస్డీఎఫ్ ఏం చేస్తుంది? ప్రధానంగా.. రక్షణ, శాంతి పరిరక్షణ, విపత్తు సహాయం, అంతర్జాతీయ శాంతి మిషన్లలో మాత్రమే పాల్గొంటుంది. జపాన్ యుద్ధం కోరుకోదు.. కానీ తన రక్షణ కోసం ఆధునిక సైనిక శక్తిని కలిగి ఉంది. అందువల్ల JSDF “సైన్యం” కంటే “రక్షణ దళం” అనే పేరుతోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. -
తప్పుడు ప్రకటనలకు గూగుల్ చెక్
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు, మోసపూరిత ప్రకటనలు పెద్ద సవాల్ విసురుతుండగా టెక్ దిగ్గజాలు ఏఐ సాయంతో వాటికి చెక్ పెడుతున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా నిబంధనలను ఉల్లంఘించిన వందల కోట్ల యాడ్స్ను నిలువరించినట్లు సెర్చ్ ఇంజన్ రారాజు గూగుల్ తెలిపింది. 60 కోట్ల మోసపూరిత ప్రకటనలు.. సెర్చ్ ఇంజన్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు 90 శాతానికిపైగా వాటా ఉంది. గూగుల్ లక్షలకొద్దీ వెబ్సైట్లలో కోట్లకొద్దీ ప్రకటనలను ప్రదర్శిస్తోంది. ఆటోమేటెడ్ తనిఖీలు ఉన్నప్పటికీ ప్రకటనల సంఖ్య విపరీతంగా ఉండటంతో కొన్ని హానికరమైన యాడ్స్ కూడా ప్రదర్శితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది నిబంధనలను ఉల్లంఘించిన 830 కోట్ల ప్రకటనలను గూగుల్ నిరోధించడం లేదా తొలగించడమో చేసింది. అలాగే 2.49 కోట్ల ప్రకటనకర్తల ఖాతాలను రద్దు చేసింది.భారత్లో నిబంధనలకు పాతరేసిన 48.37 కోట్ల యాడ్స్ను గూగుల్ తొలగించింది. 17 లక్షల ప్రకటనకర్తల ఖాతాలను నిలిపివేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, పెద్ద కంపెనీల పేర్లను వాడుకొని అవి నిజమైన కంపెనీలే అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం, ఇతర కంపెనీల లోగోలు, ఫొటోలు, కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకొని రూపొందించిన యాడ్స్ వాటిలో ఉన్నాయి. తాము చెక్ పెట్టిన యాడ్స్లో స్కామ్లకు సంబంధించిన 60.2 కోట్ల ప్రకటనలు, 40 లక్షల ఖాతాలు ఉన్నాయని కంపెనీ 2025 యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్లో వెల్లడించింది. నేరగాళ్ల చేతిలోనూ ఏఐ..ఇంత భారీ మొత్తంలో ఉన్న మోసపూరిత ప్రకటనలను మనుషులు తనిఖీ చేయడం అసాధ్యం. పైగా ఇటువంటి యాడ్స్ను పెద్ద ఎత్తున సృష్టించడానికి సైబర్ నేరగాళ్లు ఓ అడుగు ముందుకేసి జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నారు. వాటిని రియల్ టైమ్లో గుర్తించి అడ్డుకోవడానికి జెమినై ఏఐ సాయం తీసుకుంటున్నట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఏఐ మోడల్స్ వందల కోట్ల రకాల సంకేతాలను.. అంటే ఒక అకౌంట్ ఎంత పాతది, వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంది, ప్రకటనలు ఇచ్చే విధానం వంటి అంశాలను తనిఖీ చేస్తుంది. వైరస్లు లేదా హ్యాకింగ్ ముప్పులు యూజర్లకు చేరకముందే ఈ వ్యవస్థ వాటిని గుర్తించి ఆపేస్తుందని గూగుల్ తెలిపింది. 830 కోట్ల యాడ్స్లో వాటిని ఎవరూ చూడకముందే 99% కంటే ఎక్కువగా నిరోధించినట్లు కంపెనీ వెల్లడించింది. -
బ్యాక్టీరియాకు బ్యాడ్ టైం!
సాక్షి, స్పెషల్ డెస్క్: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు మానవాళి దశాబ్దాలుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతో ఆ మందులకు నిరోధకత పెంచుకొని మొండి బ్యాక్టీరియా ‘సూపర్ బగ్స్’గా మారిన నేపథ్యంలో పరిశోధకులు కొత్త యాంటీబయోటిక్స్ కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ జె. కాలిన్స్ నేతృత్వంలోని బృందం ఈ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఏయే రసాయన అణువులు బ్యాక్టీరియాను చంపగలవు.. ఏవి చంపలేవు అనే సమాచారాన్ని జనరేటివ్ ఏఐ మోడల్కు అందించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన యాంటీబయోటిక్స్ తయారీకి అవసరమైన రసాయన సమ్మేళనాన్ని పొందే మార్గాన్ని ఈ బృందం కనుగొంది.ప్రయోగం సాగింది ఇలా..తమ ప్రయోగంలో భాగంగా కాలిన్స్ బృందం ఇప్పటికే తెలిసిన యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలను ఉపయోగించి ఒక జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చింది. యాంటీబయాటిక్ అణువులు ఎలా పనిచేస్తాయో జనరేటివ్ ఏఐ మోడల్ నేర్చుకొని దాని ఆధారంగా 4.5 కోట్లకుపైగా రసాయన నిర్మాణాల పనితీరును పరిశీలించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హాలిసిన్ అనే యాంటీబయోటిక్ క్యాండిడేట్ (చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగించేందుకు వీలుగా గతంలో ప్రీ–క్లినికల్, క్లినికల్ ప్రయోగాల్లో వాడిన ఒక రసాయన అణువు) మొండి బ్యాక్టీరియాకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించింది. ప్రస్తుత యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలతో పోలిస్తే హాలిసిన్ రసాయన నిర్మాణం పూర్తి భిన్నమైనది కావడం విశేషం. దీంతో కాలిన్స్ బృందం హాలిసన్ను మొండి బ్యాక్టీరియా సహా వివిధ రకాల బ్యాక్టీరియాలపై పరీక్షించగా ఇది వాటి శక్తి ఉత్పత్తిని దెబ్బతీయడం ద్వారా సమర్థంగా నాశనం చేసింది. ఎంఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన మరో అధ్యయనంలో పూర్తిగా కొత్త యాంటీబయోటిక్ అణువులను సృష్టించడానికి జెనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ఈ ఏఐ మోడల్ 3.6 కోట్లకుపైగా రసాయన సమ్మేళనాలను రూపొందించి పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏ, గొనేరియా వంటి మొండి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన అణువులను ఇది గుర్తించింది. ఈ సమ్మేళనాలకు ప్రస్తుతమున్న ఏ రకమైన యాంటీబయోటిక్స్తోనూ పోలిక లేదు. ఇవి బ్యాక్టీరియా కణ త్వచాన్ని దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం..పార్కిన్సన్ వ్యాధికి మెరుగైన మందులను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా 2024లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ మిచెల్ వెండ్రూస్కోలో, ఆయన సహచరులు మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించారు. చివరకు ఈ ప్రక్రియ ద్వారా ఐదు ఆశాజనకమైన అణువులను గుర్తించారు. మరోవైపు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక ఏఐ మోడల్ దాదాపు 8,000 మందులను గుర్తించింది. వాటిని 17,000 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది.ప్రారంభ దశల్లోనే ఏఐ దోహదం..మందులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫార్మా కంపెనీల వద్ద ప్రైవేట్గా ఉండటంతో పరిశోధకులకు ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా లక్ష్యాలను గుర్తించడం, అణువులను పరిశీలించడం వంటి ప్రారంభ దశల్లోనే ప్రస్తుతం ఏఐ దోహదపడుతోంది. దీంతో ఏఐ ద్వారా కనుగొనే అనేక మందులు రోగులకు చేరడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, 2017–22 మధ్యకాలంలో 12 కొత్త యాంటీబయోటిక్స్ మాత్రమే ఆమోదం పొందగా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల మాదిరిగానే ఉన్నాయి. -
పేదల కల చెదిరింది!
శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమి మనిషికి జీవితాన్నిస్తుంది..స్వతంత్రుడిగా నిలబెడుతుంది. అందుకే తెలంగాణ ఆత్మ అంతా భూమి చుట్టే తిరుగుతుంది. భూమి కోసమే ఇక్కడ 4 వేల మంది రైతు కూలీలు తొలుత నిజాం, ఆపై భారత సైన్యంతో (1946–51) జరిగిన పోరులో అమరులైతే.. ఇదే నేలపై ఒక్క రక్తం చుక్క చిందకుండా అదే రైతు కూలీలకు భూమి దానంగా ఇచ్చిన సందర్భానికి ఇప్పుడు సరిగ్గా డెబ్బై ఐదేళ్లు. అంటే 1951 ఏప్రిల్ 18న శివరాంపల్లి నుంచి పాదయాత్రగా గాజులపోచంపల్లికి చేరుకున్న వినోబా భావే దళితవాడకు వెళ్లిన సందర్భంలో ‘ఈ ప్రాంత రైతుకూలీలు తుపాకులు ఎందుకు పట్టారని ప్రశి్నస్తే..‘భూమి కోసమే’అంటూ వారు సూటిగా సమాధానం చెప్పారు. ‘మాకు భూమి తప్ప మరో బతుకు లేదు..మా 40 కుటుంబాలకు 80 ఎకరాల భూమిని ఇస్తే మేము స్వతంత్రంగా బతుకుతం..’అంటూ తేల్చిచెప్పారు.ఈ అంశం అదే రోజు భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి చెవిన పడటంతో సాయంత్రం ఊరి మధ్యలో జరిగిన గ్రామసభలో వినోబాను కలిసి తన తండ్రి కోరిక మేరకు 100 ఎకరాల భూదానాన్ని ప్రకటిస్తూ, ఇంగ్లీష్ లో తన చేతిరాతతో రాసిన సంబంధిత పత్రాలను వినోబాకు అందజేశారు. ఈ భూములను అర్హులైన పేదలకు పంచాలని, తాను చేసే భూదానం వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించా. భూదాన యజ్ఞానికి ఇలా పడిన తొలి అడుగు లక్షల మంది రైతు కూలీల్లో భూమిపై ఆశలు నింపింది. పలుచోట్ల వారిని భూయజమానులను చేసింది.గాజుల పోచంపల్లిని భూదాన్ పోచంపల్లిగా మార్చింది. కానీ 75 ఏళ్ల క్రితం నాటి పరిస్థితిని తాజాగా విశ్లేషిస్తే..పోచంపల్లిలో భూదాన్ రామచంద్రారెడ్డి ద్వారా భూములు పొందిన 40 దళిత కుటుంబాల చేతుల్లోనే మెజారిటీ భూములు ఉన్నా.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పలుచోట్ల భూదాన భూములు ఇప్పుడు పెద్దల స్వాధీనంలోకి వెళ్లాయి. తెలంగాణలో ఇంకా పంచకుండా ఉన్న వేల ఎకరాల భూదాన భూములపై విషనాగుల పడగనీడలు కమ్ముకున్నాయి. భూదాన భూముల పక్కదారి భూదాన్ పోచంపల్లి నింపిన స్ఫూర్తితో ఒక్క రక్తపు చుక్క చిందకుండా..తెలంగాణలోని పేదల కోసం వచ్చిన 1,66,529 ఎకరాల భూదాన భూములిప్పుడు ఏం అయ్యాయి.? పంచినవి నిజంగా పేదల చేతుల్లోనే ఉన్నాయా?, పంచని భూములు ఎన్ని? అవి ఎక్కడ? అని ప్రశ్నిస్తే రద్దు అయిన భూదాన్ బోర్డు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా లేవు. పలు రకాల ఫిర్యాదుల నేపథ్యంలో గత ప్రభుత్వం భూదాన బోర్డును రద్దు చేసే నాటికి ఇంకా 75,182 ఎకరాల భూమి వివిధ కారణాలతో పంపిణీ చేయలేదు. అందులో 10 వేల ఎకరాల భూములు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో ఉండగా, పలు ప్రాంతాల్లోని భూములు మళ్లీ పెద్దల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ప్రజా ప్రతినిధులు, పెద్దల అధీనంలో.. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 188, 189 సర్వే నంబర్లలో 30 ఎకరాల భూదాన భూమిని ఒక మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంఎల్ఏ ఒకరు తమ అ«దీనంలో ఉంచుకోగా, కూకట్పల్లిలో సర్వే నంబర్ 353, 354లలో 17 ఎకరాల భూమి కూడా రాజకీయ నాయకుల చెంతకు చేరింది. దొంతనపల్లి, జన్వాడలోని భూదాన్ భూములను ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీ కుటుంబం ఏకంగా తమ ప్రాజెక్టులకు బ్యాంకు గ్యారంటీగా ఇచ్చింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో రంగాపూర్ సర్వే నంబర్ 1 నుంచి 89 వరకు 650 ఎకరాల భూదాన భూమి ఉండాలి.కానీ ఈ భూముల్లో అత్యధికం రియల్ ఎస్టేట్ సంస్థలు విక్రయిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో పేదలకు పంచగా మిగిలిన భూములు ఇంకా 8,327 ఎకరాలు ఉండాలి. కానీ భూదాన్ రికార్డుల్లో అతి తక్కువగా చూపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పేదలకు పంచగా 11, 717, వరంగల్లో 9,632, నల్లగొండలో 13,593, ఖమ్మం జిల్లాలో 22,039 ఎకరాలు భూదాన్ భూములు ఉండాలి. కానీ వీటి లెక్కలు.. భూదాన్ బోర్డు, ప్రభుత్వ రికార్డుల్లో అనేక తప్పుల తడకలతో నిండి ఉండటం గమనార్హం.చట్టం ఉన్నా తూట్లు! భూదాన్ భూములను భూదాన్, గ్రామదాన్ చట్టం 1965లోని సెక్షన్ 14–15 మేరకు భూమిలేని నిరుపేదలకు సాగు కోసం కేటాయించాలి. ఈ భూములు అమ్మడం, కొనటం, బదిలీ, లీజు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టటం నిషేధం. ఒక వేళ ఈ భూమిని సాగు చేయకపోతే సెక్షన్ 17 మేరకు తిరిగి స్వా«దీనం చేసుకునే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉంది. కానీ రెవెన్యూ, భూదాన్బోర్డుల ఉదాసీనత కారణంగా వేల ఎకరాల భూములు పెద్దల ఖాతాల్లో చేరిపోయాయి. ప్రాంతాల్లో భూమిని నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలన్న నిబంధనతో పలుచోట్ల నిరుపేదలకు స్థలాలు ఇచ్చినా, దాన్ని ఆసరాగా తీసుకుని భారీగా అనర్హుల పేర పట్టాలు ఇవ్వడంతో పాటు భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాగా భూదాన్ బోర్డు పునరుద్ధరణే భూముల పరిరక్షణకు మార్గం అని భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి చెప్పారు. సమగ్ర విచారణకు ఆదేశించాలి తెలంగాణలో భూమి కోసం సాయుధ పోరాటం చేసిన ప్రాంతంలోనే.. స్వచ్ఛందంగా భూమిని దానం చేసిన చరిత్ర ఉండటం గర్వకారణం. కానీ ఈ అంశాన్ని సరైన రీతిలో డీల్ చేయలేదు. అందుకే తెలంగాణలో భూమి సమస్య ప్రధానమైంది. ప్రభుత్వం భూదాన్ భూములపై సమగ్ర విచారణకు ఆదేశించాలి. – హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్బోర్డును పునర్వ్యవస్థీకరించాలి భూదాన్ భూములు ఎప్పటికీ ప్రభుత్వ భూములు కావు.ఈ భూముల పంపిణీ ప్రభుత్వ పర్యవేక్షణలో భూదాన్ బోర్డు ద్వారానే చేపట్టాలి. భూదాన బోర్డును సర్వసేవా సంఘ్ ప్రతిని«ధులతో ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – వెదిరె అరవిందరెడ్డి (వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుడు) -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్లను వదిలి వెళ్లడం ఓటింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
కొనేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు
సాక్షి, స్పెషల్ డెస్క్ : తమ కంటెంట్ ద్వారా జనం మదిలో స్థానం సంపాదించుకుంటున్న క్రియేటర్లు.. ఇప్పుడు రిటైల్ రంగంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఎంతలా అంటే.. వారు సూచించిన ఉత్పత్తులను జనం కొనుగోలు చేసేంతగా. ఇంకేముంది.. వాణిజ్యానికి ఒక ప్రధాన ఇంజన్గా క్రియేటర్లు అవతరించారు. గత ఐదేళ్లలో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందంటే ప్రజలకు ఉన్న ఆసక్తిని, పెరుగుతున్న వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. క్రియేటర్లు సృజనాత్మక కంటెంట్ ద్వారా విభిన్న ఉత్పత్తులను పరిచయం చేస్తున్నారు. లైవ్ డెమోలు, సమీక్షలు, సలహాలు ఇస్తూ వినియోగదారులకు వాటిని చేరుస్తున్నారు. వస్తువు ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూపించడం వల్ల వినియోగదారులకు కొనుగోలుపై గట్టి నమ్మకం కలుగుతుంది. ఫ్యాషన్, టెక్నాలజీ, సౌందర్య ఉత్పత్తుల వంటి విభాగాల్లో నిపుణులైన క్రియేటర్లు ఇచ్చే సలహాలు కస్టమర్లకు సరైన వస్తువును ఎంచుకోవడంలో సహాయపడుతున్నాయి. డెలాయిట్–గూగుల్ నివేదిక ప్రకారం 2030 నాటికి భారత ఈ–కామర్స్ రంగానికి క్రియేటర్ల నేతృత్వంలోని వాణిజ్యం 25 బిలియన్ డాలర్లను జోడించనుంది. క్రియేటర్ల సంఖ్య.. 2020: 9–10 లక్షలు 2025: 35–45 లక్షలు48 కోట్లు – ఆన్లైన్ వీడియోలు, కంటెంట్ చూసేవారు. 33 కోట్లు – వీడియోలు చూస్తారు. కానీ ఆన్లైన్లో షాపింగ్ చేయరు. 18 కోట్లు– ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసేవారు.భారత లైవ్ కామర్స్.. ప్రస్తుత వ్యాపారం: సుమారు 100 కోట్ల డాలర్లు2030 నాటికి అంచనాలు: తక్కువలో తక్కువగా 500 కోట్ల డాలర్లు. సాధారణంగా: 700–800 కోట్ల డాలర్లు. గరిష్టంగా: వెయ్యి–1,200 కోట్ల డాలర్లు. వినియోగదారుల ధోరణి 28% – క్రియేటర్ల ద్వారా కొత్త ఉత్పత్తులను తెలుసుకుంటున్నారు. 63% – వస్తువుల సమాచారం, సిఫార్సుల కోసం ఇన్ఫ్లుయెన్సర్లను నమ్ముతున్నారు. 68% – లైవ్ షాపింగ్ ఆస్వాదించడానికి సిద్ధపడుతున్నారు.» క్రియేటర్ల ప్రభావంతో ఐదేళ్లలో ద్వితీయశ్రేణి నగరాలు, చిన్న పట్టణాల నుంచి 5–6 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతారని అంచనా. » సంప్రదాయ ప్రకటనల కంటే తమకు ఇష్టమైన ్రక్రియేటర్ల సిఫార్సులను వినియోగ దారులు 2.5 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. 2030 నాటికి ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ల స్టోర్ ఫ్రంట్స్ ద్వారానే జరుగుతుంది.» 2030 నాటికి లైవ్ కామర్స్ 800 కోట్ల డాలర్ల మార్కెట్గా ఎదుగుతుంది. » కోట్లకొద్దీ ఫాలోవర్లు ఉన్నవారి కంటే తక్కువ మంది ఉన్నా పటిష్టమైన అనుబంధం ఉన్న క్రియేటర్ల ద్వారా అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. » పెద్ద కంపెనీలు మార్కెటింగ్ బడ్జెట్లో 20–30% ఇన్ఫ్లుయెన్సర్లకే కేటాయిస్తున్నాయి.టాప్ కేటగిరీలు..ఫ్యాషన్, లైఫ్స్టైల్: ‘గెట్ రెడీ విత్ మీ’వీడియోలు, ‘ఫ్యాషన్ హాల్స్’ద్వారా ప్రజలు కొత్త ట్రెండ్స్ను అనుసరిస్తున్నారు. ఈ కేటగిరీలో 25–30% ఆన్లైన్ అమ్మకాలు నేరుగా క్రియేటర్ల సిఫార్సుల వల్లే జరుగుతున్నాయి. బ్యూటీ, పర్సనల్ కేర్: మేకప్ ట్యుటోరియల్స్, స్కిన్ కేర్ రివ్యూలకు డిమాండ్ ఉంది. క్రియేటర్లు తమ ముఖంపై ఉత్పత్తులను వాడి చూపే లైవ్ డెమోలను వినియోగదారులు 3 రెట్లు ఎక్కువగా నమ్ముతున్నారు. ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్: 70%పైగా భారతీయులు యూట్యూబ్లో అన్బాక్సింగ్, రివ్యూ వీడియోలను వీక్షిస్తున్నారు. టెక్ క్రియేటర్లు ఇచ్చే బడ్జెట్ గైడెన్స్ వల్ల చిన్న పట్టణాల్లో ఎల్రక్టానిక్స్ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఆరోగ్యం, ఫిట్నెస్: ఇంట్లో వ్యాయామం, డైట్ ప్లాన్స్, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఫుడ్, కుకింగ్: ప్రాంతీయ భాషల్లో వంటల వీడియోలకు కోట్లకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. కిచెన్ అప్లయెన్సెస్, మసాలా బ్రాండ్లు ఈ క్రియేటర్లపై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి -
గరిట పట్టిద్దాం
వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. చదువులకు మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం. కుకింగ్, మనీ మేనేజ్మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్, రీ సైక్లింగ్, ఫిజికల్ యాక్టివిటీస్, నేచర్ లైఫ్, గ్లోబల్ ఎక్స్పోజర్, వెల్బీయింగ్ క్లాసెస్, కమ్యూనికేషన్, డిజటల్ అండ్ టెక్నాలజీ స్కిల్స్.. ఇవన్నీ పాఠాలుగా కాకుండా వివిధ రకాల అంశాలలో అవగాహన కలిగించడానికి మేలైన సమయం. ఈ వేసవిలో పిల్లలకు వినోదాన్ని కూడా ఇచ్చే అంశాలపై నిపుణుల సూచనలతో వరుస కథనాలు.వేసవి సెలవుల్లో పిల్లలకు బోలెడంత ఫ్రీ టైమ్ ఉంటుంది. నచ్చిన ఆటలు, మెచ్చిన వినోదం.. వీటితోనే కాలక్షేపం చేయడం కాకుండా జీవన నైపుణ్యాలు పెంచుకునేందుకు మంచి అవకాశం కూడా. ఆ జాబితాలో ముందుగా వంటింట్లోకి తీసుకెళదాం. పిల్లలను కుదురుగా ఉంచేది, ఏకాగ్రతను పెంచేది, సహనాన్ని, టీమ్ వర్క్ని పరిచయం చేసే పాకశాస్త్రాన్ని పరిచయం చేద్దాం.. రోజూ అమ్మ చేసే వంటకు ఏదో వంక పెట్టే పిల్లలు ఉంటారు. ఒక వంట తయారు చేస్తే, మరోటి అడిగే వారూ ఉంటారు. ఇష్టమైనవన్నీ తయారుచేసి, సమయానికి బాక్స్ కట్టి ఇచ్చే అమ్మ పని తెలియాలంటే ఇదో చక్కని మార్గం కూడా. ‘అమ్మో! వంటింటిని పిల్లలకు అప్పజెప్పడమా!’ అని భయపడకుండా పిల్లల చేత గరిట పట్టిస్తే ఏమేం జరుగుతుందో తెలుసుకుందాం.. → రుచుల ఆస్వాదనవంట పాత్రలు, అందుకు ఉపయోగించే వివిధ రకాల సాధనాలు ముందుగా పరిచయం అవుతాయి. ఆ తర్వాత వంట దినుసులు, కూరగాయలు, ఆకుకూరల పట్ల అవగాహన పెరుగుతుంది. వేటితో ఏ తరహా వంటకాలు తయారు చేయచ్చు, రుచులను కలపడం వంటి ప్రక్రియల్లో పాల్గొంటారు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుంది. ఒక సాధారణ పదార్థాన్ని కొత్తగా ఎలా రూ΄÷ందించవచ్చు, అనే ఆలోచన కూడా వారిలో అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగా ఇటాలియన్ , జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ వంటకాలనూ పరిచయం చేయవచ్చు. దీనివల్ల పిల్లల్లో ప్రపంచ సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది.→ ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతాము తయారు చేసిన వంటకాన్ని కుటుంబ సభ్యులు రుచి చూసి, ప్రశంసిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వయసులోనే ‘నేను చేయగలను‘ అనే భావన అలవాటు అవుతుంది. ఇంటì పనుల్లో తామూ భాగస్వాములు అవుతారు. వంట భారంగా కాకుండా సులభంగా చేసేలా ప్రోత్సహించవచ్చు.→ జట్టుగా విజయం కుకింగ్ క్లాసులలో చేరితే పిల్లలు గ్రూప్స్గా పనిచేస్తారు. ఇది వారికి టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్ను నేర్పిస్తుంది. ఇతరులతో కలిసి పని చేయడం, బాధ్యతలు పంచుకోవడం వంటి లక్షణాలు పెరుగుతాయి.→ సమతుల్యత సాధనవంట సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. వంటలో ఉపయోగించే పదార్థం తక్కువైతే ఎలా మార్చాలి, రుచిని ఎలా సర్దుబాటు చేయాలి... ఇవన్నీ పిల్లల్లో సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచుతాయి. బ్యాలెన్స్ ఎంత అవసరమో తెలియజేస్తుంది.→ మంచి అలవాట్లుముఖ్యంగా వంట చేయడం ద్వారా పిల్లలు ఆహార విలువ తెలుసుకుంటారు. ఏ పదార్థం ఆరోగ్యానికి మంచిది, ఏయే పోషకాలు వేటి ద్వారా లభిస్తాయి,.. వంటి విషయాలు అర్థమవుతాయి. వృథాను అరికట్టడం, మిగిలిన పదార్థాలను తిరిగి ఎలా ఉపయోగించడం, శుభ్రతను ఎందుకు పాటించాలి.. వంటి విషయాల్లో అవగాహన కలుగుతుంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి.→ బాధ్యత పెరుగుతుందివంట చేయడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా పని చేయడం నేర్చుకుంటారు. తమ పనిని తామే పూర్తి చేయడం, శుభ్రత పాటించడం వంటి బాధ్యతలు అలవాటు అవుతాయి. అంతేకాదు, వంట పనిలో భాగంగా వస్తువులను శుభ్రపరచడం, సర్దడం వంటి పనులూ నేర్చుకుంటారు. అదే సమయంలో గ్యాస్, ఎలక్ట్రిక్, కటర్స్.. వంటి వాడకంలో రక్షిత చర్యల గురించి అవగాహన కల్పించవచ్చు. ఇంట్లో వీలు కావడం లేదు అనుకునేవారు కుకింగ్ క్యాంప్స్లో చేర్పించవచ్చు. వంటల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించవచ్చు. వంట ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమనూ, ఆనందాన్ని, రుచుల ఆస్వాదననూ పరిచయం చేయవచ్చు. ఇది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది కూడా.వంట.. వ్యక్తిత్వ వికాస పాఠంపిల్లలు వంట నేర్చుకోవడం ద్వారా ఒక సమగ్రమైన అవగాహన కలుగుతుంది. ఒక డిష్ను ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుస్తుంది. ప్రతి వంటకం తయారీకి పట్టే సమయం వారిలో ఆలోచనాశక్తిని, సహనాన్ని పెంచుతుంది. జంక్ ఫుడ్ ఎందుకు తీసుకోవద్దో తెలుస్తుంది. వంట అంటే ఆడవాళ్లు మాత్రమే చేసేది కాదని కుటుంబంలో అందరూ చేయవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో తెలుస్తుంది. అయితే, వంట పని ఒక భారంగా కాకుండా వినోదాత్మకంగా మార్చగలిగితే పిల్లలు జాయ్ఫుల్గా రుచుల తయారీ పట్ల దృష్టి పెడతారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లల చేత వంటను ఫన్గా చేయించవచ్చు. ఎక్కువ మంది పిల్లలతో కలిసి పాల్గొనేలా చేయాలంటే..అందుకు కిడ్స్ కుకింగ్ క్యాంప్స్ పిల్లలకు వినోదంతో పాటు విలువైన నైపుణ్యాలనూ నేర్పిస్తున్నాయి. – మీరా గిరిజ తాడిమేటి, చెఫ్సాక్షి ‘హెల్త్ ప్లస్’ ఈపేపర్లో...పిల్లలకు వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహార పదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే ప్రత్యేక కథనం... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హెల్త్ ఇన్సూరెన్స్.. మీ ‘ప్లాన్’ ఏంటి?
చందన (38) ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమె భర్త (44) ఓ చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. వీరి కుటుంబానికి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్తో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. చందన ఆటో ఇమ్యూన్ (లూపస్) వ్యాధిని ఎదుర్కొంటోంది. ఆమె భర్తకు మధుమేహం, బీపీ, స్థూలకాయం సమస్యలున్నాయి. వివేక్ (40) ఓ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాడు. ఆయన భార్య (35) గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి కూడా రూ.5 లక్షల కవరేజీతో బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ప్లాన్ ఉంది. చూడ్డానికి హెల్త్ కవరేజీ సమానమే. కానీ ఇక్కడి రెండు కుటుంబాల ఆరోగ్య చరిత్ర వేరు. కుటుంబ సభ్యుల సంఖ్య వేరు. మనలో చాలా మంది బీమా విషయంలో ఒకే ధోరణిని అనుసరిస్తుండడాన్ని గమనించొచ్చు. కానీ, అందరికీ ఒకే తరహా ప్లాన్, అందరికీ ఒకే విధమైన రక్షణ కవరేజీ అన్నది ఎంత మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని గుర్తించాలి. 25 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి మధ్య ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, రిస్క్ ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతీ కుటుంబం కూడా తమ ఆరోగ్య చరిత్ర, వయసు, సభ్యుల సంఖ్య ఆధారంగా మెరుగైన కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఏం చేయాలన్నది ఈ వెల్త్ స్టోరీలో చూద్దాం. వయసు కీలకం..→ ఒకే తరహా బీమా పాలసీ అందరికీ అనుకూలమని చెప్పలేం. → వైద్య విభాగంలో ద్రవ్యోల్బణం 10–12 శాతంగా ఉంటోంది. అంటే ఏటా చికిత్సలు, ఔషధాలు ఇలా మొత్తం మీద వాటి వ్యయాలు ఈ మేరకు పెరుగుతున్నాయి. → మారిన ఆహార నియమాలు, పని వేళలు, తక్కువ శ్రమ కారణంగా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోయింది. 30 ఏళ్ల నుంచే మధుమేహం, బీపీ, థైరాయిడ్ సమస్యలు సాధారణమయ్యాయి. కేన్సర్ల రిస్క్ మన దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ సమగ్రంగా లేకపోతే పొదుపు, పెట్టుబడులన్నీ కరిగిపోయే రిస్క్ ఎదురవుతుంది. → కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం రక్షణ సాధనమే కాదు. ఆర్థిక ప్రణాళికలో ఇదొక భాగం. ఆర్థిక సంక్షోభ నివారణ సాధనం.25–35 ఏళ్ల వారికి.. ప్రధాన లక్ష్యం→ తక్కువ ప్రీమియంపై అధిక కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఎంపిక → అవివాహితులు అయితే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్, వివాహితులు అయితే కుటుంబం అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. → కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల సమ్ ఇన్సూర్డ్తో బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవాలి. → బేసిక్ ప్లాన్ కవరేజీలో తీసుకున్నంత మేర (రూ.5–10 లక్షలు) డిడక్టబుల్ పెట్టుకుని, రూ.20–25 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కొనుగోలు చేయాలి. → ఇలా చేయడం వల్ల ఒక ఏడాదిలో ఆస్పత్రి బిల్లు బేసిక్ ప్లాన్ కవరేజీని మించినప్పుడు, సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు లభిస్తాయి.వీటిపై దృష్టి పెట్టాలి→ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఉండేలా చూసుకోవాలి. → బీమా సంస్థ హాస్పిటల్ నెట్వర్క్ను పరిశీలించాలి. ఎన్ని ఎక్కువ ఆస్పత్రులు జాబితాలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా తాము నివసించే ప్రాంతంలోని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా నెట్వర్క్ పరిధిలో ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల వైద్యం అవసరమైనప్పుడు సులభంగా క్యాష్లెస్ క్లెయిమ్ పొందడం వీలు పడుతుంది. → చిన్న వయసు వల్ల తక్కువ ప్రీమియంతోపాటు ఎలాంటి వ్యాధుల్లేకపోవడం అనుకూలం. అన్ని వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధులకు కవరేజీ)లను ఈజీగా అధిగమించొచ్చు. ఈ తప్పులు వద్దు.. → నేను ఆరోగ్యవంతుడిని కదా, ఇంత చిన్న వయసులో నాకు ఆరోగ్య బీమా ఎందుకు? అన్న ఆలోచన తప్పు. ఆరోగ్య సమస్యలే రానక్కర్లేదు. ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలై క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే బిల్లు వాచిపోవచ్చు. → పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా చాలులే అనుకోవద్దు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా లేదా సంస్థను వీడినా సొంతంగా బీమా రక్షణ ఉండదు.30–50 ఏళ్ల వయసు..ప్రధాన లక్ష్యం→ కుటుంబం అంతటికీ సరైన రక్షణ కల్పించుకోవడం ఈ వయసు వారికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కవరేజీ–ప్రీమియం మధ్య సమతూకం ఉండాలి.ఏది అనుకూలం? → ఈ వయసులో దాదాపు అధిక శాతం వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కనుక వీరికి ఫ్యామిలీ ఫ్లోటర్ సరైనది. అవివాహితులైతే ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం మొత్తానికి కవరేజీ బేసిక్ ప్లాన్లో రూ.10–25 లక్షలు ఉండేలా చూసుకోవాలి. అదే ఇండివిడ్యువల్ ప్లాన్లో రూ.5–10 లక్షలు సరిపోతుంది. → రూ.25–50 లక్షలతో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్లో కవరేజీ మేర డిడక్టబుల్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఒక్కరికైనా, కుటుంబానికైనా సూపర్ టాపప్తో అదనపు రక్షణ అనేది ఈ రోజుల్లో ఎంతో అవసరం.కీలక ప్రాధాన్యతలు వీటికి.. → పెళ్లై పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వారు తాము తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో మెటరి్నటీ (ప్రసవ సంబంధిత) కవరేజీ తప్పక ఉండేలా చూసుకోవాలి. → మధ్య వయసు దృష్ట్యా డే కేర్ ప్రొసీజర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. → హాస్పిటల్లో చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అదే సమస్యకు సంబంధించి తీసుకునే చికిత్సకు కవరేజీ ఉండాలి. ఇప్పుడు చాలా ప్లాన్లు 90–120 రోజుల వరకు చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత కవరేజీని ఇస్తున్నాయి. → రూమ్ రెంట్కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేకపోతే మేలు. → వ్యాధులకు సంబంధించి ఉప పరిమితులు (చెల్లింపుల్లో) ఉండకూడదు. → కో–పేమెంట్ విషయంలో (ప్రతీ క్లెయిమ్లో పాలసీ దారు తన వంతు చెల్లించాల్సిన మొత్తం) దూరంగా ఉండాలి. → బేసిక్ ప్లాన్, సూపర్ టాపప్తో తక్కువ ప్రీమియానికి మెరుగైన కవరేజీ లభిస్తుంది. 50 ఏళ్లు దాటిన వారికి.. వీటికి ప్రాధాన్యం..→ అప్పటికే ఉన్న వ్యాధులతోపాటు అన్ని రకాల కవరేజీలు ఉన్న ప్లాన్ అవసరం. → ఈ వయసులో ఫ్యామిలీ ఫ్లోటర్ కంటే కూడా ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్ మేలు. → బేసిక్ ప్లాన్స్లో రూ.10లక్షల కవరేజీకి అదనంగా 50 లక్షలతో సూపర్ టాపప్ తీసుకోవాలి.వీటిని చూడాలి..→ ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ తీసుకోవాలి. సాధారణంగా పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు సంబంధించి కవరేజీ పొందాలంటే కనీసం 3–4 ఏళ్లు ఆగాలి. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి వ్యయాలకు పాలసీదారు సొంతంగా ఖర్చు చేసుకోవాలి. కొన్ని సంస్థలు కాస్త అదనపు ప్రీమియంతో వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు/మాఫీ చేసేందుకు అనుమతిస్తున్నాయి. → ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ క్లాజు ఉన్నా, సాధ్యమైనంత తక్కువ ప్లాన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. → క్లెయిమ్ చెల్లింపుల రేషియో ఎక్కువ ఉన్న బీమా సంస్థ అయితే నయం. అదే సమయంలో ఆయా బీమా సంస్థ సేవలు బాగున్నాయేమో చూసుకోవాలి.రిస్క్లు..→ ఈ వయసులో పాలసీలకు కంపెనీలు అధిక ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. → అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్ని బీమా సంస్థలు పాలసీ ఇవ్వడానికి నిరాకరించొచ్చు. ఇవి అందరికీ.. → వయసు ఏదైనప్పటికీ అధిక కవరేజీ ఉంటే ఎంతో మంచిది. కనీసం రూ.20 లక్షలు అంతకంటే అధికం (సూపర్ టాపప్) ఉండేలా చూసుకోవాలి. → ఆస్పత్రుల నెట్వర్క్ను ప్రధానంగా చూడాలి. ఎక్కువ ఆస్పత్రుల్లో, అందులోనూ పేరున్న ఆస్పత్రులు అన్నీ ఉంటే మంచిది. → రూమ్ రెంట్లకు సంబంధించి పరిమితులు, కో–పేమెంట్, వ్యాధుల వారీ పరిమితులు ఏవీ లేకుండా చూసుకోవాలి. → పాలసీ తీసుకునే ముందు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ ఆసాంతం చదివి.. అందులో సదుపాయాలు, మినహాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. → గడువులోపు పాలసీని తప్పక రెన్యూ చేసుకోవాలి. దీనికి ఆటో డెబిట్ యాక్టివేట్ చేసుకోవాలి.– సాక్షి, వెల్త్ -
చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!
అమెరికా, ఇరాన్ నడుమ ఎంతో ఆశావహంగా మొదలైన శాంతి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ వైఫల్యం వెనక పలు కారణాలున్నట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి...1. అటు అమెరికా, ఇటు ఇరాన్ తమ ప్రాధాన్యాలకే కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదలతో ఇస్లామాబాద్లో అడుగుపెట్టాయి. ఎవరూ తమ డిమాండ్ల నుంచి ఇసుమంతైనా వెనక్కు తగ్గలేదు. అవతలి వారి వాదనలకు ఏ మాత్రమూ విలువ ఇవ్వలేదు. చర్చలు వైఫల్యానికి ఈ వైఖరే ప్రధాన కారణంగా నిలిచింది. యురేనియం శుద్ది కార్యక్రమాన్ని తక్షణం, శాశ్వతంగా ఆపేయాలని అమెరికా డిమాండ్కు ఇరాన్ ససేమిరా అంది. విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి తీరతామని కరాఖండిగా చెప్పింది.2. చర్చలన్నాక అగ్రరాజ్యాధినేత అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దౌత్యధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇరాన్ బృందం పాక్లో కాలుమోపాక కూడా కాక పెంచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. చర్చలు విఫలమైతే ఇరాన్పై మునుపెన్నడూ ఉపయోగించని శక్తిమంతమైన ఆయుధాలతో మరింత భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన పెట్టిన పోస్టులు పరిస్థితిని దిగజార్చాయి. ఓవైపు చర్చలకు పిలిచి మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏ రకమైన దౌత్య నీతి అంటూ అమెరికా ప్రతినిధులను ఇరాన్ బృందం నిలదీసినట్లు సమాచారం.3. కాల్పుల విరమణ లెబనాన్కూ వర్తిస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా చర్చలను బేఖాతరు చేస్తూ ఆ దేశంపై ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తుండటం ఇరాన్కు సుతరామూ నచ్చలేదు. లెబనాన్పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్ను నిరోధిస్తామని అమెరికా నుంచి ఎలాంటి హామీ రాకపోవడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యవర్తిగా హుందాగా వ్యవహరించాల్సిన పాక్ కూడా పరిస్థితిని దిగజార్చేలా ప్రవర్తించింది. ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పోస్టు పెట్టడంతో మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. చర్చలతో తమ దాడులకు సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టారు.4. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బేషరతుగా తెరవాలని ట్రంప్ డిమాండ్చేశారు. షరతుల్లేకుండా దాన్ని తెరవబోమని, చర్చల్లో బేరసారాలకు హార్మూజ్ తమకు కీలక ఆయుధమని ఇరాన్ ప్రతినిధులు వాదించారు. హార్మూజ్ను తెరవకపోతే ఇరాన్ నాగరికతనే బూడిద చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా తప్పుబట్టారు. హార్మూజ్ను తెరవాలంటే ఇరాన్పై ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అమెరికా బృందం ఒప్పుకోలేదు. పైగా ఈ విషయంలో ట్రంప్ ధోరణినే గట్టిగా సమరి్థంచింది. హార్మూజ్ గుండా పయనించే నౌకల నుంచి చార్జీలు వసూలుకు ఇరాన్తో కలిసి టోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. హార్మూజ్పై తమతో పాటు ఒమన్ పాక్షిక అధికారాలను గుర్తించాలన్న ఇరాన్ డిమాండ్కు అమెరికా ఒప్పుకోలేదు.5. అమెరికా, ఇరాన్ బృందాల మధ్య పరస్పర విశ్వాస లోపం అడుగడుగునా కనిపించింది. హామీలను అవతలి పక్షం పాటిస్తాయా అన్న అనుమానాలు ఇరువైపులా కొట్టొచి్చనట్టు కన్పించాయి. తమ ప్రతిపాదనలు అద్భుతమని అమెరికా చెప్పుకుంటే, అవన్నీ చెత్త షరతులని ఇరాన్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు.ఇక ఏం జరగనుంది? చర్చల వైఫల్యం తాలూకు తక్షణ ప్రభావం కాల్పుల విరమణపై పడే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్పై మూకుమ్మడిగా దాడులు ప్రారంభించే ప్రమాదం కన్పిస్తోంది. చర్చలు విఫలమైతే చరిత్ర చూడని స్థాయిలో ఇరాన్పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అదే జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మూజ్ జలసంధి తెరచుకోని పక్షంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముదిరే ఆస్కారముంది. తమ వద్ద అణుబాంబు లేని కారణంగానే అమెరికా ఇంతగా దాడులకు దిగుతోందన్న అభిప్రాయంతో ఉన్న ఇరాన్, ఇక అణ్వస్త్ర కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించే వీలుంది. భారత్లో ఇంధన కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విస్తరిస్తున్న ప్రచండ వేసవి
సాక్షి, స్పెషల్ డెస్క్: వేసవి వేడి తీవ్రత పెరగటమే కాదు.. వేసవికాలం కూడా ఏటేటా పెరుగుతోంది. మాడు పగిలే ఎండల రోజులు ఏటేటా ముందుగానే ప్రారంభమై, ఆలస్యంగా ముగుస్తూ, మరింత తీవ్రంగా మారుతున్నాయి. వేసవి రోజుల సంఖ్య 1960 నాటి కంటే 2023 మధ్యలో సుమారు 30 రోజులు పెరి గిందని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా పరిశోధనలో వెల్లడైంది. భూమధ్య రేఖ కు దగ్గరి దేశాల్లో 6 దశాబ్దాల క్రితంతో పోలిస్తే వేసవి కాలాలు ముందుగానే కాక మరింత ఆకస్మికంగా వస్తున్నాయని, ఎక్కు వ కాలం కొనసాగుతున్నాయని, వేడితీవ్రత ఏటేటా మరింత పెరుగుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాతావరణంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకోవటం వల్ల ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మారే శారీరక సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తోంది. 1990 తర్వాత ఎక్కువ ఈ తాజా అధ్యయనం వివరాలు ‘ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. వేసవి రోజుల సంఖ్య తొలుత భూమిపై పెరిగాయి. ఆ తర్వాత సముద్రంలోనూ పెరిగాయి. 1961–2023 మధ్యకాలంలో, మధ్య అక్షాంశాలలోని భూభాగాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో ప్రతి సంవత్సరం వేసవికాల వ్యవధి పెరిగింది. తొలి 3 దశాబ్దాల కంటే ఆ తర్వాత మరింత పెరిగింది. 1990–2023 మధ్యలో వేసవి కాలం నిడివి పెరుగుదల సగటు రేటు సుమారుగా దశాబ్దానికి ఆరు రోజులు. అంటే.. 1990తో పోలిస్తే 2023లో వేసవి సుమారు 20 రోజులు ఎక్కువ. కొన్ని నగరాల్లో మరీ ఎక్కువ వేసవికాలం కొన్ని నగరాల్లో సంవత్సరానికి ఒక రోజు కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఉదాహరణకు సిడ్నీ (ఆ్రస్టేలియా)లో ప్రతి దశాబ్దానికి వేసవికాలం 14.8 రోజుల చొప్పున పెరుగుతోంది. అంటే 1990లో 80 రోజులుగా ఉన్న వేసవికాలం ఇప్పుడు సుమారు 130 రోజులకు చేరుకుంది. మిన్నియాపాలిస్ (అమెరికా)లో ప్రతి దశాబ్దానికి 9.3 రోజులు, టొరంటో (కెనడా)లో 8 రోజులు పెరుగుతోంది. వేసవిలో వేడి అంతకంతకూ పెరగడం వల్ల మధ్య అక్షాంశ దేశాల్లోని మనుషుల్లో వేడికి తట్టుకునే శారీరక సామర్థ్యం క్షీణించొచ్చు.పగలు, రాత్రి వేళల్లో శరీరాన్ని చల్లబరచుకోవడానికి మరింత శక్తి అవసరం కావొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ పెరిగే వేసవి తీవ్రత ప్రతికూల ప్రభావం పంటలపై కూడా ఉంటుంది. వసంతకాలం నుంచి వేసవికి, వేసవి నుంచి శరదృతువుకు వాతావరణం మారే దశల్లో వేగం పెరిగింది. దీంతో, వేసవి వేడి తీవ్రత కూడా పెరుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మార్పులపై ఆధారపడిన వ్యవస్థలకు సర్దుబాటు చేసుకోవడానికి సమయం తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతలకు ఇంకా అలవాటు పడని సీజన్ ప్రారంభ రోజుల్లోనే ప్రాణాంతకమైన వడగాలులకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. -
బెంగాలీలను మైనార్టీలు కానివ్వం
జాంగీపూర్/కత్వా/కుష్మాండీ: పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వబోమని తేల్చిచెప్పారు. శనివారం బెంగాల్లోని జాంగీపూర్, కత్వా, కుష్మాండీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ గుర్తింపు, భవిష్యత్తు పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, చొరబాటుదార్లకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్లో చాలా ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మా, మాటీ, మనుష్’నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ వదిలేసిందని, అధికారం నిలబెట్టుకోవడానికి చొరబాటుదార్లపై ఆధారపడుతోందని ధ్వజమెత్తారు. వారి ఓట్లతో వారి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు బీజేపీకి ఆశీర్వాదంగా మారాలని చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. కమ్యూనిస్టులకు కార్బన్ కాపీగా తృణమూల్ ‘‘బెంగాల్లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని కాపాడుతాం. మార్పును ఎవరూ అడ్డుకోలేరు. బెంగాల్లో అహంకారం ప్రదర్శించిన ఎంతోమంది అడ్రస్ లేకుండాపోయారు. బ్రిటిష్ పాలకులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు గతంలో ఏమైందో చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్కు ఎదురవుతుంది. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల్లో హింస జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అది సహించలేక తప్పుడు వీడియోలు, అబద్ధాలను పోస్టు చేస్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ ఇలాంటి కుతంత్రాలు సాగించారు. అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలి. బీజేపీని గెలిపించుకోవాలి. మా, మాటీ, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టు పార్టీలకు కార్బన్ కాపీగా మారిపోయింది. కమ్యూనిస్టు శక్తులు, సిండికేట్లు తృణమూల్ కాంగ్రెస్తో చేతులు కలిపాయి. కమ్యూనిస్టుల పాలనలో జరిగినట్లుగానే వేధింపులు, అరాచకాలు, అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజలను బెదిరించేవారు. నేడు టీఎంసీ రౌడీలు సైతం అదే పని చేస్తున్నారు. అక్రమ ఆయుధా లు, డ్రగ్స్, పశువుల అక్రమ రవాణా, కట్ మనీ, కమీషన్లు.. ఇలా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కాంట్రాక్టు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను కచ్చితంగా శిక్షిస్తాం. ప్రజలను వేధించినవారి కోసం జైలు తలుపులు తెరుచుకుంటాయి’’ అని అన్నారు. శరణార్థులకు భారత పౌరసత్వం ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే మతువా, నామశూద్ర వర్గాలతోపాటు ఇతర శరణార్థులకు సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తాం. చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. వారు వెనక్కి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. చొరబాటుదార్లను కాపాడేవారికి కూడా శిక్ష తప్పదు. బెంగాల్లో మా నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్ ఒక్కటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే సబ్కా హిసాబ్. ప్రతి అరాచకవాదిని, అవినీతిపరుడిని శిక్షిస్తాం. శరణార్థులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. అలాగే బీజేపీ పాలనలో బెంగాల్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తోంది. బెంగాల్లోనూ మహిళల ఓట్లతో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి. బీజేపీ పాలన వచ్చాక.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిండికేట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బెంగాల్లో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తాం. వాటిని ఆపబోం’’అని మోదీ స్పష్టం చేశారు.మహిళల భద్రతే మా ధ్యేయం ‘‘మహిళల భద్రతకు బీజేపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని నేరాలు జరిగాయి. వారిని దారుణంగా వేధించారు. మా ప్రభుత్వం వచ్చాక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. పాత కేసులను మళ్లీ తెరుస్తాం. ఇది మోదీ గ్యారంటీ. మహిళల భద్రతే మా ధ్యేయం. తృణమూల్ ప్రభుత్వం ఫుట్బాల్ ఆటను కూడా సిండికేట్లకు అప్పగించింది. గత డిసెంబర్లో అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా గందరగోళం జరిగింది. ఆ సిగ్గుచేటైన చిత్రాలను ప్రపంచమంతా చూసింది. బెంగాల్లో ప్రభుత్వం అంటే సిండికేట్, సిండికేట్ అంటే ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చట్టవిరుద్ధమైన పాలనకు పర్యాయపదం తృణమూల్ సర్కార్. మమతా బెనర్జీ పార్టీకి సిద్ధాంతాలు, విలువులు లేవు. అందుకే అది ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టలేకపోయింది’’అని మోదీ అన్నారు. -
రూ.1,856 కోట్ల నిఘా డ్రోన్ కనిపించుట లేదు
ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నావికాదళానికి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్ను అగ్రరాజ్యం కోల్పోయినట్టు సమాచారం. గురువారం హార్మూజ్ జలసంధి సమీపంలో గగనతలంలో సీక్రెట్ మిషన్ సందర్భంగా ఉదంతం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎంక్యూ–4సీ ట్రైటాన్గా పిలిచే ఈ డ్రోన్ ఖరీదు ఏకంగా 20 కోట్ల డాలర్లు (రూ.1,856 కోట్లు) కావడం గమనార్హం. రాడార్ల నుంచి హఠాత్తుగా అదృశ్యం కావడం సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఎంక్యూ–4సీ ప్రమాదవశాత్తూ డ్రోన్ కూలిపోయిందా? లేక ఇరాన్ సైన్యం కూల్చివేసిందా? అనేది నిర్ధారణ కాలేదు. ఈ నిఘా డ్రోన్ను 2018లో అమెరికా సైన్యంలో ప్రవేశపెట్టారు. యుద్ధంలో కోల్పోవడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా నష్టపోయింది. ఎఫ్–15ఇ, ఎ–10 వంటి ఆధునిక యుద్ధ విమానాలు నేలకూలాయి. ఎంక్యూ–4సీను కోల్పోవడంతో ఆ నష్టం మరింత పెరుగుతోంది. తొమ్మిది ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లను కూడా అమెరికా నష్టపోయింది. మొత్తానికి పశ్చిమాసియా యుద్ధం అమెరికాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. డ్రోన్ నుంచి అత్యవసర సంకేతం ఎంక్యూ–4సీ డ్రోన్ ఆచూకీ కోసం అమెరికా సైన్యం గాలిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదు. హార్మూజ్ జలసంధిపై మూడు గంటల మిషన్ తర్వాత ఈ డ్రోన్ ఇటలీ దేశం సిగోనెల్లాలోని తన స్థావరానికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. అదృశ్యమయ్యే ముందు అత్యంత వేగంగా కిందికి దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపుతోంది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే 50 వేల అడుగుల ఎత్తు నుంచి 10 వేల అడుగుల ఎత్తుకు దిగినట్లు చెబుతోంది. అత్యంత అధునాతనమైన మానవరహిత నిఘా డ్రోన్లలో ఒకటైన ఎంక్యూ–4సీ ట్రైటాన్ తొలుత సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించి ఆకస్మికంగా ఇరాన్ వైపు మళ్లింది. రాడార్ నుంచి అదృశ్యమయ్యే ముందు 7700 అనే కోడ్ను పంపించింది. ఇది ఒక అత్యవసర సంకేతం. అయితే, ఆ అత్యవసర పరిస్థితి ఏమిటన్నదానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు హార్మూజ్ గగనతలంలోకి నిఘా డ్రోన్ ఎందుకు వెళ్లిందన్నది తెలియరాలేదు. పర్షియల్ గల్ఫ్ చుట్టుపక్కల పర్యవేక్షణ కోసం అమెరికా నావికాదళం గత నెల రోజులుగా ఎంక్యూ–4సీ ట్రైటాన్ను ఉపయోగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకరోజు ముందు ఈ నెల 7వ తేదీన ఈ డ్రోన్ ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్పై చక్కర్లు కొట్టిందని చెబుతున్నారు. గతవారం ఎఫ్–15ఇ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేసిన తర్వాత సహాయక చర్యల్లో డ్రోన్ పాలుపంచుకుంది. ఇది సాధారణ డ్రోన్ కాదు. సుదీర్ఘ కాలంపాటు సముద్ర నిఘా, పర్యవేక్షణ కోసం రూపొందించారు. 24 గంటలపాటు గాల్లో ఆగకుండా ఎగరగలదు. అమెరికా సైన్యానికి తురుపుముక్క లాంటి డ్రోన్ అదృశ్యం కావడం, ఇప్పటికీ ఆచూకీ లేకపోవడం మిస్టరీగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్దే!
మధ్యవర్తి అంటే పెద్దమనిషి తరహాలో పెద్దరికంతో, హుందాగా వ్యవహరించాలి. కానీ దశాబ్దాలుగా ఉగ్రమూకలను చంకనెత్తుకు తిరుగుతూ తమ దేశంలో ఉగ్రవాదమే లేదని బొంకే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపైనా అదే ధోరణిని ప్రదర్శించి మరోసారి నవ్వులపాలైంది. ఇందుకు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తెరమీదకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యంగా నిలిచింది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా పది ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి ‘లెబనాన్’అనే పేరును తొలగించి అమెరికా, ఇజ్రాయెల్లకు పాకిస్తాన్ ప్రతిపాదనలను చేరవేసిందనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్ మధ్యవర్తిత్వంలో తమకు అందిన ప్రతిపాదనల్లో ‘లెబనాన్’అనే పదం ఎక్కడా లేదనేది అమెరికా, ఇజ్రాయెల్ వాదన. దీంతో పాకిస్తాన్ చేసిన అసమర్థ, అసంబద్ధ మధ్యవర్తిత్వం కారణంగా తమపై దాడులభారం తప్పట్లేదని ఇప్పుడు లెబనాన్ పాక్పై ఆగ్రహంగా ఉంది. పాక్ మాత్రం దీంతో తమకెలాంటి సంబంధంలేదని చేతులు దులిపేసుకునేలా మాట్లాడటం గమనార్హం. ‘‘లెబనాన్తో కలుపుకుని ప్రతిచోటా, ఎక్కడా దాడులు జరపబోమని ఇరాన్, అమెరికా, మిత్రదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన అమల్లోకి వచ్చింది’’అని తొలుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’లో ఒక ట్వీట్చేశారు. ట్వీట్చేసిన కొద్దిసేపటికే లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరదాడులు చేయడంతో కాల్పులవిరమణ ఒప్పందంలో లెబనాన్ పేరు ఉందా? లేదా? అనే గందరగోళం తలెత్తింది. ఇందుకు పాకిస్తానే కారణమని లెబనాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ పంపిన ప్రతిపాదనలకు పాకిస్తాన్ ఏకపక్షంగా సవరణలుచేసి అమెరికాకు పంపిందని ఆరోపించింది. ఇరాన్ సైతం ఇదే వాదనలు చేసింది. తాము పంపిన వాటిని మార్చేసి అమెరికాకు పంపడంతోపాటు, అమెరికా పంపిన ప్రతిపాదనలనూ కాస్తంత అటూఇటూ మార్చేసి తమకు అందజేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘సీజ్ఫైర్లో లెబనాన్ ఉందని ఇరాన్ను మధ్యవర్తిత్వ దేశాలు నమ్మించి ఉండవచ్చు. ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లెబనాన్పై దాడి చేయబోమనే ప్రతిపాదనలకు మేం సమ్మతి తెలపలేదు’’అని అన్నారు. ట్వీట్ సైతం అమెరికా నుంచే.. షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’ఖాతాలో ప్రత్యక్షమై ట్వీట్ సైతం సొంతంగా టైప్ చేసింది కాదు అని, అమెరికా అధ్యక్షభవనం నుంచి వచ్చిన సందేశాన్నే ఉన్నది ఉన్నట్లుగా షరీఫ్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. సందేశం మీద తొలుత డ్రాఫ్ట్ అనే పదం కన్పించి తర్వాత అది కన్పించకుండా పోయింది. షరీఫ్ ‘ఎక్స్’లో పోస్ట్చేయబోయే వాక్యాలను తొలుత శ్వేతసౌధం ధ్రువీకరించిందని, వైట్హౌస్ అనుమతితోనే షరీఫ్ ఆ సందేశాన్ని పోస్ట్చేశారని న్యూయార్క్టైమ్స్ పేర్కొంది. దీనిపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఇదే వాస్తవమనే వాదనకు బలం చేకూరింది. ఒక పక్షం వాదనలు, డిమాండ్లను అత్యంత పారదర్శకంగా మరో పక్షానికి అందించడంలో పాకిస్తాన్ విఫలమైందని, అందుకే లెబనాన్ విషయంలో సందిగ్ధత చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇద్దరూ ఇద్దరే
దేశ చరిత్రలో పాదయాత్రలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో లక్ష్య సాధన కోసం యాత్రలు చేసేవారు. ఆ తర్వాత అవి ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం రాజకీయ మలుపు తీసుకున్నాయి. 2003లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర, 2017లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్లో చేసిన పాదయాత్ర.. ఈ రెండూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మహానేత, జననేత చేపట్టిన యాత్రలు ప్రజల జీవితాల్లో.. రాష్ట్ర అభివృద్ధిలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. వాటి ఫలితంగా వచ్చిన ఐదు ప్రధాన మార్పులను ఓసారి పరిశీలిద్దాం.విద్యా రంగంవైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభమైంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కోసం సుమారు రూ.4,000–5,000 కోట్లు ఖర్చు చేశారు. పేద పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. అనేక మంది డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు అయ్యేలా మార్గం సుగమం చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. నాడు–నేడు కార్యక్రమం ద్వారా సర్కారీ బడులను ఆధునికీకరించారు. అమ్మఒడి, జగనన్న వసతి తదితర పథకాల ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించి.. డ్రాపవుట్లను తగ్గించి పేద పిల్లల చదువును కొనసాగించేలా చేశారు. ఒక్క అమ్మ ఒడి పథకం కోసం సుమారు రూ. 35,000 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేశారు. ఈ పాలనలోనే ఇంగ్లీష్ మీడియంతో పాటు అంతర్జాతీయ సిలబస్(IB)తో విద్యాభోదన ప్రయత్నాలు మొదలయ్యాయి. తద్వారా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి పేద విద్యార్థులను తీర్చిదిద్దాలని వైఎస్ జగన్ సంకల్పించారు.ఆరోగ్య రంగంవైఎస్సార్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మక మార్పు ఇది. ఒక అంచనా ప్రకారం.. 2007–2009 మధ్య కాలంలోనే వైఎస్ ప్రభుత్వం రూ.3,500–4,000 కోట్లు పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది.వైఎస్ జగన్ హయాంలో.. ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్స్, ఫ్యామీలీ డాక్టర్ కాన్సెప్ట్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందేలా చేశారు. ఇందుకుగానూ సుమారు రూ.10 వేల కోట్లకు పైనే ఖర్చు చేశారు.రైతన్న రాజ్యంలో.. వైఎస్సార్ హయాంలో.. ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేశారు. సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు. రైతన్నకు రారాజును చేశారు. ఉచిత విద్యుత్ పథకంతో పా జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టులపై సుమారు రూ. 60,000 కోట్లు పైగా ఖర్చు చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. రైతు సంక్షేమం కోసం అదనంగా.. రైతు భరోసా కేంద్రాలు(RBK సెంటర్లు) ఏర్పాటు చేసి, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సమాచారం అందించారు. ఇందుకుగానూ.. సుమారు రూ.4 వేల కోట్ల దాకా ఖర్చు చేశారు. మునుపెన్నడూ లేని రీతిలో పంట బీమా, తక్షణ నష్టపరిహారం అందజేశారు. ఇక.. రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.7,500 కోట్ల చొప్పున ఆర్థిక సహాయం రూపంలో రైతులకు అందజేశారు.ఇరిగేషన్వైఎస్సార్ హయాంలో.. అనేక సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశారు. పోలవరం లాంటి మెగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. జలయజ్ఞం ద్వారా 8.2 మిలియన్ ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యం దిశగా కృషి చేశారు.వైఎస్ జగన్ హయాంలో.. నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి చర్యలు తీసుకున్నారు. పోలవరం పనులను కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. పోలవరం పనులు కొనసాగిస్తూ, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.15,000 నుంచి 20,000 కోట్ల దాకా కేటాయించారు.పారిశ్రామిక రంగంవైఎస్సార్ హయాంలో.. పారిశ్రామిక వృద్ధికి పునాది వేసి, పెట్టుబడులను ఆకర్షించారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు వేల కోట్లు ఖర్చు చేశారు. దానికి తగ్గ ప్రతిఫలం నేటికి కళ్ల ముందు కనిపిస్తోంది.వైఎస్ జగన్ హయాంలో.. పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల కోట్లు కేటాయించారు. భారీ ఎత్తున పెట్టుబడుల్ని, కంపెనీలను రాబట్టగలిగారు. YSR Jagananna Mega Industrial Hub వంటి ప్రాజెక్టులు ప్రారంభించి.. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ ఇద్దరూ పాదయాత్రలు ప్రజలతో నేరుగా మమేకమై, వాళ్ల కష్టాలను దగ్గరగా చూశారు. ఆ పాదయాత్రల తర్వాతే ఇద్దరూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనలో అన్నివర్గాల సమస్యలకు చక్కటి పరిష్కారం చూపగలిగారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. విద్య, ఆరోగ్యం, రైతు సంక్షేమం, ఇరిగేషన్, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలను మార్చేశారు. జగన్ చెప్పినట్లు.. ఆయా రంగాల్లో వైఎస్సార్ వేసిన ముద్రను ఎవరూ చెరిపేయలేరేమో. కానీ, తండ్రి బాటలో పయనించి తన సంక్షేమ పాలనతో ఆ మార్క్ను వైఎస్ జగన్ అందుకోగలిగారనే చెప్పొచ్చు. వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. -
అస్సాం, కేరళలో నేడే పోలింగ్
అస్సాం, కేరళల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా వాటితో పాటే జరగనుంది. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కేరళ, పుదుచ్చేరిల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది. మూడు చోట్లా తమిళనాడు, పశ్చిమబెంగాల్తో పాటు మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.కేరళలో కూటముల పోరుకేరళలో సీపీఎం సారథ్యంలోని పాలక ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్పై కన్నేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. రాష్ట్రంలో ఒక పార్టీ, లేదా కూటమి వరుసగా రెండోసారి నెగ్గడం అదే తొలిసారి. ఎల్డీఎఫ్ ఆశలకు గండికొట్టి ఈ సారి ఎలాగైనా విజయం సా ధించాలని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన కేరళలో ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాల్లో ముక్కోణపు పోరు నెలకొంది.ప్రచార హోరుమూడు కూటములూ నెల రోజులకు పైగా హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గురువారం జరిగే పోలింగ్లో 2.71 కోట్ల మంది ఓటర్లు వాటి భాగ్యరేఖలను తేల్చనున్నారు. ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టార్ ప్రచారకులుగా నిలిచారు. యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎల్డీఎఫ్ కూటమికి మాత్రం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంతా తానై ప్రచార ప్రక్రియను ముందుండి నడిపించారు. సుపరిపాలన, అభివృద్ధి ఈసారి కూడా తమను ఒడ్డుకు చేరుస్తాయని ఎల్డీఎఫ్ ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఆ కూటమిని భయపెడు తున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై తమ విజయం ఖాయమని యూడీఎఫ్ విశ్వసిస్తోంది. సీపీఎం, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ తాము చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని ఆ కూటమి భావిస్తోంది. కొన్నేళ్లుగా కేరళలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ, ఈసారి దాన్ని ఎలాగైనా సీట్ల రూపంలోకి మార్చాలని పట్టుదలగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కలిసొస్తుందని నమ్ముతోంది. – తిరువనంతపురంఅస్సాంలో హోరాహోరీఅస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ కూటములు హోరాహోరి తలపడ్డాయి. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, ఆ పార్టీ ఆశలకు గండి కొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డింది. రెండు పార్టీలూ ఎప్పట్లాగే పలు ప్రాంతీయ పక్షాలతో జట్టు కట్టి బరిలోకి దిగాయి. హిమంత దూకుడు: బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా రెండేసిసార్లు ప్రచారంలో పాల్గొన్నా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, దూకుడైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కూడా ఎక్కువగా పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్పైనే ఆధారపడింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా 99 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. దాని భాగస్వాముల్లో రైజోర్ దళ్ 13, ఏజేపీ 10, సీపీఎం 3, ఏపీహెచ్ఎల్సీ 2 చోట్ల పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. భాగస్వాములు ఏజీపీ 26, బీపీఎఫ్ 11 చోట్ల బరిలో దిగాయి. పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు ఇరు కూటములకూ తలనొప్పిగా మారాయి. 9 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటం విశేషం! రాష్ట్రవ్యాప్తంగా 59 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. జాలూక్బారీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించాలని సీఎం హిమంత ప్రయత్నిస్తున్నారు. లోక్సభ సభ్యుడైన పీసీసీ చీఫ్ గౌరవ్ జోర్హాట్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో 6.42 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు! – గువాహటిపుదుచ్చేరిలో టీవీకే ఉనికి చాటేనా?పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి ఈసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. దానికి పోటీగా విపక్ష డీఎంకే, కాంగ్రెస్లతో కూడిన ఇండియా కూటమితో పాటు సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా తొలిసారి బరిలో దిగింది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరుపైనే ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని డీఎంకే, కాంగ్రెస్ భావిస్తున్నాయి. వాటిలో విజయ్ పార్టీ ఎవరికి నష్టం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ జాతీయవాది సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. – చెన్నై -
'గింజ' నుంచి మరింత గుంజేలా..
సాక్షి, స్పెషల్ డెస్క్ : వరి, గోధుమ వంటి ధాన్యాలను ముఖ్య ఆహారంగా తీసుకునే వారిలో ఇనుము, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలు కనిపిస్తున్నాయి. తగినన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నా, సూక్ష్మ పోషక లోపంతో బాధపడటాన్నే ‘హిడెన్ హంగర్’అంటున్నారు. కేవలం జింక్ సరిపడా అందక ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.బియ్యం, గోధుమల్లో ఉన్న ఇనుము, జింక్లను సైతం శోషించుకోగలుగుతున్నది చాలా తక్కువే. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి, ఎట్టకేలకు అధిగమించే ఉపాయాన్ని కనుగొన్నారు. ఫైటిక్ ఆమ్లమే అడ్డంకి బియ్యంలోని ఫైటిక్ ఆమ్లం అనే పోషక నిరోధక పదార్థమే ఇనుము, జింక్ వంటి సూక్ష్మపోషకాల జీవ లభ్యత (బయో ఎవైలబిలిటీ)ని తగ్గిస్తోందని గుర్తించారు. అన్నంలో సహజంగా ఉండే ఇనుము, జింక్లను మనకు వంటబట్టకుండా ఫైటిక్ ఆమ్లం అడ్డుపడుతోంది. దాన్యాల్లో ఫైటిక్ ఆమ్లంను తగ్గించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సంప్రదాయ బ్రీడింగ్, జన్యు ఇంజనీరింగ్ పద్ధతుల్లో సరికొత్త వంగడాల అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు. వరి గింజలో ఉండే ఫాస్ఫరస్తో ఫైటిక్ ఆమ్లం ముడిపడి ఉంటుంది. దీంతో ఈ పంట రకాల పెరుగుదల, మొలక శాతం, బరువు తగ్గిపోవటం వంటి సమస్యలు వచ్చాయి. జింక్,ఐరన్ల రెట్టింపుశోషణ ఫిలిప్పీన్స్లోని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు ధాన్యంలో ఫైటిక్ ఆమ్లంను విజయవంతంగా తగ్గించగలిగారు. డాక్టర్ రోవెల్ టియోజోన్ జూనియర్, డాక్టర్ నెసె శ్రీనివాసులు తదితరుల బృందం ఈ విజయం సాధించింది. ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తికి మూలమైన ఐఎన్ఓ1 అనే ఎంజైమ్ను గుర్తించారు. దాన్ని నియంత్రించే రసాయనాన్ని గింజ పోసుకునే దశలో వరి పంటపై పిచికారీ చేయడం ద్వారా గింజల్లో పోగుపడే ఫైటిక్ ఆమ్లం పాళ్లను తగ్గించే ఉపాయాన్ని కనిపెట్టారు. దీంతో బియ్యంలో 32%, గోధుమల్లో 47% మేరకు ఫైటిక్ ఆమ్లం తగ్గింది. దీంతో సూక్ష్మపోషకాల జీవ లభ్యతతోపాటు శోషణ స్థాయి పెరిగింది. ఈ బియ్యం తిన్నవారు జింక్, ఐరన్లను గతంలో కన్నా రెట్టింపు స్థాయిలో వంటబట్టించుకోగలిగారని ఐఆర్ఆర్ఐ తాజాగా ప్రకటించింది. అనేక పంటలకు ఉపయోగం జన్యుమారి్పడి తదితర టెక్నాలజీలతో వ్యయప్రయాసల కోర్చి ఇనుము, జింక్ అధికంగా ఉండే కొత్త ధాన్యపు పంటల వంగడాలను రూపొందించటం కన్నా.. ఇప్పటికే ఉన్న వంగడాలను సాగు చేసుకుంటూ గింజ పోసుకునే దశలో ఒక రసాయనాన్ని పిచికారీ చేస్తే సరిపోతుందని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ టెక్నిక్ వరి, గోధుమతోపాటు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, బార్లీ వంటి ఇతర పంటల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. -
రోజుకు 1 జీబీ
సాక్షి, స్పెషల్ డెస్క్: భారత్లో రెండేళ్లుగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఏటా 15 కోట్ల యూనిట్లు దాటుతున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగమూ అంతకంతకూ పెరుగుతోంది. ఇంకేముంది ఇంటర్నెట్ వాడకం జోరు మీద ఉంది. ఒక్కో మొబైల్ యూజర్ సగటున రోజుకు 1.02 గిగాబైట్స్ (జీబీ) డేటా వినియోగిస్తు న్నాడు. నాలుగేళ్లలో ఇది దాదాపు రెండింతలైందంటే మనవాళ్ల వాడకం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం అవుతోంది. మెట్రోలే కాదు పల్లెల్లోనూ జనం ఎంచక్కా ఇంటర్నెట్లో విహరిస్తూ మొబైల్కు గంటల తరబడి అతుక్కుపోతున్నారు.ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్ ⇒ 5జీ చందాదారుల సంఖ్యలో (40కోట్లు)⇒ 5జీ డేటా వినియోగంలో (నెలకు 12.9 ఎక్సాబైట్స్)⇒ 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ చందాదారుల సంఖ్యలో (2026 ఫిబ్రవరికి 1.19 కోట్లు) నివేదిక హైలైట్స్..⇒ దేశవ్యాప్తంగా గత ఏడాది 13.7 కోట్ల 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.⇒ వినియోగంలో ఉన్న 89.2 కోట్ల యూనిట్ల 4జీ ఫోన్లలో 38.3 కోట్ల యూనిట్లు 5జీ సపోర్ట్ చేస్తాయి.⇒ మెట్రో నగరాల్లో మొత్తం ఇంటర్నెట్ వాడకంలో 5జీ వాటా 58%.ఆధారం: నోకియా ఇండియా మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్–2026 నివేదిక -
రీల్ కూడా వార్తే..
వార్తలు, రాజకీయ సంబంధ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారా? రానున్న రోజుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఐటీ నిబంధనలు–2021కి కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఇవి కార్యరూపంలోకి వస్తే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ప్రచురణకర్తలుగా పరిగణిస్తారు. అంటే వారు పోస్ట్ చేసే ప్రతి విషయంపై ప్రభుత్వ నిఘా, బాధ్యత పెరుగుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్క్రియేటర్లూ జాగ్రత్త..వార్తలు, రాజకీయ సంబంధ పోస్టులను పంచుకునే యూట్యూ బర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇప్పటివరకు ప్రభుత్వం వార్తా సంస్థలుగా గుర్తించలేదు. దీనివల్ల టీవీ చానెళ్లకు ఉండే కఠిన నిబంధనలు వీరికి ఉండేవి కావు. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం ఏదైనా కంటెంట్ను ‘తప్పు’అని ప్రభుత్వం భావిస్తే.. దాన్ని వెంటనే తొలగించే అధికారం ప్రభుత్వానికి పెరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు క్రియేటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమిటీ కొత్త ప్రతిపాదన? సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) రెండో సవరణ నిబంధనలు–2026 కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14 వరకు ప్రజల అభిప్రాయాలను కోరింది. సురక్షితమైన ఇంటర్నెట్ను నిర్మించడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతుండగా.. విమర్శకులు మాత్రం ఇది సామాన్యుల డిజిటల్ వాక్ స్వాతంత్య్రంపై ప్రభుత్వానికి అపరిమితమైన కొత్త అధికారాలను కట్టబెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఈ ముసాయిదా నిబంధనలను డిజిటల్ నియంతృత్వంగా అభివర్ణించింది. పరిధిలోకి ఎవరు వస్తారు? ఈ సవరణలు యూట్యూబర్లు, ఇన్స్ట్రాగామ్ రీల్స్ క్రియేటర్లు, ‘ఎక్స్’యూజర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో సహా ప్రైవేట్ వ్యక్తులు పోస్ట్ చేసే వార్తలు, రాజకీయ అభిప్రాయాలతో కూడిన కంటెంట్ ఐటీ నిబంధనలలోని ‘పార్ట్–3’పరిధిలోకి వస్తాయి. గతంలో వృత్తిపరమైన మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన మూడంచెల పర్యవేక్షణ విధానం ఇకపై వీరికి కూడా వర్తిస్తుంది.కొత్త నిబంధన ఏమిటి? ప్రభుత్వం జారీ చేసే లిఖితపూర్వక వివరణలు, సలహాలు, ఉత్తర్వులు, మార్గదర్శకాలను సోషల్ మీడియా సంస్థలు కచ్చితంగా పాటించాలి. ఏదైనా ప్లాట్ఫాం నిరాకరిస్తే వాటికి ఉన్న ‘సేఫ్ హార్బర్’రక్షణను ప్రభుత్వం రద్దు చేస్తుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు తప్పుడు పోస్ట్ పెడితే దానికి ఆ సంస్థను బాధ్యులను చేయకూడదనేది సేఫ్ హార్బర్ నిబంధన ఉద్ధేశం. ఈ రక్షణ పోతే యూజర్లు చేసే ప్రతి తప్పుకు లేదా పెట్టే ప్రతి వివాదాస్పద పోస్ట్కు సదరు కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కోర్టు కేసులు, భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత సమయంలో తొలగించాలి? నోటీసు అందిన 2–3 గంటల్లో ప్లాట్ఫాంలు సదరు కంటెంట్ను తొలగించాల్సి ఉంటుంది. 2021 నిబంధనల ప్రకారం గతంలో ఉన్న 24–36 గంటల సమయ పరిమితితో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు.విస్తృత చర్యల్లో భాగమా? ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం డీప్ఫేక్స్, ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్పై కొన్ని నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం అలాంటి కంటెంట్ ఏఐతో రూపుదిద్దుకుందని లేబుల్ వేయడం, ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరగా తొలగించడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు వస్తున్న కొత్త ఐటీ ప్రతిపాదన దీనికి తదుపరి దశ. ఆన్లైన్లో ప్రజలు మాట్లాడే లేదా పెట్టే పోస్టులపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం దీని ప్రధాన లక్ష్యం. -
ఓటింగ్పై గల్ఫ్ దెబ్బ!
కేరళలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రవాస ఓటర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డవారే. కన్నూర్ మొదలుకుని పాలక్కాడ్ దాకా కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవాసుల ఓట్లు నిర్ణాయకంగా మారుతుంటాయి. దాంతో ఎన్నికల వేళ పార్టీలన్నీ గల్ఫ్ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాయి. వారిని ఓటింగ్కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లోని మలయాళీలు ఈసారి ఓటేసేందుకు వచ్చే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు. ఇది పార్టీల విజయావకా శాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయమని భావిస్తున్నారు.కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ గల్ఫ్ ఓటర్లది కీలక పాత్రగా ఉంటూ వస్తోంది. ఆ దేశాల్లో 2.25 లక్షల మంది దాకా ఓటర్లున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారిలో కనీసం 60 శాతం పైచిలుకు ఓటింగ్ నమోదవడం పరిపాటి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం దెబ్బతో ఈసారి మాత్రం పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. గల్ఫ్ నుంచి భారత్కు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు టికెట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రూ.8 వేల నుంచి 13 వేలలోపు ఉండే టికెట్లు ఏకంగా రూ.60 వేల దాకా ఎగబాకాయి! పైగా సెలవులు తీసుకుని వస్తే ఉద్యోగం ఊడే పరిస్థితి! దాంతో ఈసారి ఓటింగ్ కోసం వచ్చే మలయాళీల సంఖ్య బాగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. 10 శాతం ఓటింగ్ నమోదైనా గొప్పేనని భావిస్తున్నారు!మలబార్లో కీలకంఉత్తర కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ప్రవాసుల ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ఇక్కడ వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే గాక అతి స్వల్ప మెజారిటీలు నమోదవుతుండటమే ఇందుకు కారణం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెరింతల్మన్న అసెంబ్లీ స్థానంలో కేవలం 38 ఓట్ల తేడాతో, కుట్టియాడిలో 333 ఓట్ల మెజారిటీతో ఫలితం తేలింది! తనూర్, త్రితల వంటి చోట్ల మెజారిటీ 5,000 ఓట్ల లోపే నమోదైంది. ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లు వేలాదిగా ఉండటం విశేషం. కుట్టియాడి అసెంబ్లీ స్థానం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 వేల పైచిలుకు ప్రవాస ఓటర్లున్నారు!! నాదపురంలో 12,424 మంది, తిరూర్లో 8,601, కళ్లియసెరిలో 8,097 మంది ప్రవాస ఓటర్లున్నారు. స్వల్ప మెజారిటీలు నమోదయ్యే ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లే నిర్ణాయకంగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఈసారి వారు భారీ సంఖ్యలో స్వదేశానికి వచ్చి ఓటేసే పరిస్థితులు కన్పించకపోవడంతో పార్టీలు కూడా వారిపై ఆశలు వదులుకుంటున్నాయి. స్థానిక ఓట్లపైనే మరింతగా దృష్టి పెడుతూ గెలుపు వేటలో పడ్డాయి. గల్ఫ్ ఓటర్లపై గట్టి పట్టున్న విపక్ష యూడీఎఫ్ కూటమికి ఇది ఒకరకంగా ఎదురుదెబ్బేనని ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ (ఓఐసీసీ) పశ్చిమాసియా కన్వీనర్ కె.టి.ఎ.మునీర్ అభిప్రాయపడ్డారు. ‘‘గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ యూడీఎఫ్ కార్యకర్తల్లో 30 శాతం మంది, మద్దతుదారుల్లో 60 శాతం మంది ఈసారి ఓటింగ్కు రాలేకపోవచ్చు. విమాన టికెట్ల ధరలు నాలుగింతలు, అంతకుమించి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం’’ అంటూ ఆయన వాపోయారు. వారు గల్ఫ్ నుంచే ఓటేసేలా ఇ–ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటే తమకెంతో కలిసొచ్చేదని అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్ -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. మధ్య అస్సాం: అధికారానికి వారధి! నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.ఈసారి కీలకాంశాలివే...→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. → కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. → బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. -
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం
దేశంలో మనకు తెలియకుండానే మన మనుగడకు ప్రమాదకరమైన స్థాయికి దగ్గరగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలను ఇప్పటికే అనుభవిస్తున్నామా? హీట్ వేవ్ (వడగాడ్పుల) ముప్పును లెక్కగట్టేటప్పుడు ఒక్క ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదకరమైన వేడి ముప్పును ముందుగా తెలుసుకోలేకపోతున్నామా?అధిక ఉష్ణోగ్రతతోపాటు అప్పటి గాలిలో సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) శాతాన్ని కూడా కలిపి లెక్కించటం ప్రారంభించాలి. వాస్తవికమైన మనం ఫీలయ్యే వేడి ముప్పు తీవ్రతను ముందుగా గుర్తించటానికి, సహాయక చర్యల సన్నద్ధతను పెంచుకోవటానికి ఇది అవసరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెట్–బల్బ్ ఉష్ణోగ్రత అంటే? ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా పరిగణనలోకి తీసుకోవటాన్ని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు. వేడి ఒత్తిడి అంచనాలో ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమను కలపటం ఎందుకు అంటే.. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. వేడిని తట్టుకునే ప్రక్రియలో చెమట శరీరానికి ఉపయోగపడుతుంది. చర్మంపై నుంచి చెమట ఎంతగా ఆవిరైపోతోందనే దానిపై ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరుగుతోందనేది ఆధారపడి ఉంటుంది.గాలిలో అధిక తేమ ఉన్న పరిస్థితిలో, శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి అంతరాయం కలుగుతుంది. చెమట ఆవిరి కానప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే అలసట, వడదెబ్బ తగులుతాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వేడి, తేమ వల్ల కలిగే ఈ మిశ్రమ ఒత్తిడిని వెట్–బల్బ్ ఉష్ణోగ్రత ద్వారా అంచనా వేస్తారు. వాతావరణ ప్రజారోగ్య స్థితిగతుల అంచనాల్లో ఇదొక కీలకమైన కొలమానమైనా, మన దేశంలో ఇంకా తక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఉష్ణోగ్రత కన్నా తేమే ముఖ్యంకేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.నాయర్ రాజీవన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా అన్నారు.. ‘ప్రస్తుతం మనం తేమ ప్రభావాలపై తగినంత శ్రద్ధ పెట్టటం లేదు. కానీ మన ఆరోగ్యంపై ప్రభావం విషయానికి వస్తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతతోపాటు తేమ కూడా అంతే ముఖ్యమైనది లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది’. ‘డ్రై హీట్’ ఒక్కటే ప్రామాణికమా? ⇒ భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్దేశించే ప్రాథమిక ప్రమాణాల ప్రకారం.. మైదాన ప్రాంతాల్లో 40 (కొండ ప్రాంతాల్లో 30, కోస్తా తీర ప్రాంతాల్లో 37) డిగ్రీల సెల్సియస్ దాటితేనే ప్రస్తుతం వడగాడ్పు (హీట్వేవ్స్)ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. ⇒ ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే ‘వడగాడ్పు’రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే ‘తీవ్ర వడగాడ్పు’రోజుగా ప్రకటిస్తున్నారు. ⇒ అయితే, ఉష్ణోగ్రతతోపాటు గాలిలోని సాపేక్ష తేమను ప్రాథమిక ప్రమాణంగా ఐఎండీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. హీట్వేవ్స్ ప్రకటనకు సాపేక్ష తేమను ఐఎండీ ప్రాథమిక ప్రమాణంగా కాకుండా సెకండరీ విషయంగానే పరిగణించటం వల్ల ఈ ముప్పు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్ని ‘డ్రై హీట్’ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు.⇒ పగటి ఉష్ణోగ్రత ఐఎండీ ప్రమాదకరమని భావించినంత పెరగనప్పుడు కూడా, గాలిలోని అధిక సాపేక్ష తేమ వల్ల, ప్రజలు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పును అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, వృద్ధులు, పిల్లలతోపాటు ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతున్నారు. ⇒ గాలిలో తేమ శాతం సాధారణంగా ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో, కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగర, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పు నేపథ్యంలో ఈ ముప్పు పెరుగుతోంది. హీట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువ కావటానికి ఇదొక ముఖ్య కారణంగా చెబుతున్నారు. ⇒ వడగాడ్పుల ప్రభావం ప్రజలపై ఉన్నా, అధికారికంగా ప్రకటించనందున, ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రజల్లో సంసిద్ధత, అప్రమత్తత లోపిస్తోంది. నివారించదగిన వడగాడ్పు మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ అంతేకాదు, బాధితులకు వైద్య సహాయంలో, సహాయక చర్యల్లో, వడగాడ్పు మృతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ఇది ప్రతిబంధకంగా మారుతోంది. డ్రై హీట్ పద్ధతికి బదులు వెట్–బల్బ్ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతిని అనుసరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. -
అతనే.. భామ
ఆమె నృత్యం చేస్తున్నంతసేపూ అపురూప అందాల రాశి అనుకుంటూ కనురెప్పలు కొట్టడమే మానేసి కళ్ళప్పగించి చూస్తాం! ప్రదర్శన పూర్తయ్యాక కరతాళ ధ్వనుల మధ్య ఆమె ఆమె కాదు, అతను... పేరు సంజయ్ వడపల్లి అని వ్యాఖ్యాత ప్రకటించగానే హాలు అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది! అవును అతను సంజయ్ వడపల్లి! ఆంధ్రనాట్యంలో అద్భుత నర్తకిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. భరత కళాప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత, అభినవ సత్యభామ డాక్టర్ కళాçకృష్ణ ఆయన గురువులు. ప్రస్తుతం హెచ్.ఎస్.బి.సి హాంగ్ కాంగ్ బ్రాంచ్లో అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ శనివారం హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయంలో ఎన్టీఆర్ ఆడిటోరియంలో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడానికి విచ్చేసిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.తన 8వ ఏట డాక్టర్ నటరాజ రామకృష్ణ దగ్గర లాస్య, తాండవ నృత్య సాధనతో ఆరంభించి నృత్యం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. డాక్టర్ కళాçకృష్ణ దగ్గర ప్రబంధ సాంప్రదాయ నవ జనార్ధన పారిజాతం నేర్చుకున్నారు. తొలిసారి సత్యభామ వేషం ధరించి నాట్యం చేసినప్పుడు లభించిన ప్రశంసలతో నాట్య రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సంజయ్ తెలిపారు. తాను సత్యభామగా నర్తించినప్పుడు వేదికపై చూసిన వారు, ఆ తరువాత మేకప్ తొలగించుకుని పలకరిస్తే ఆశ్చర్య పోయేవారని, తానే సత్యభామ అంటే నమ్మే వారు కాదంటూ తొలినాటి ప్రదర్శనల అనుభూతులను గుర్తు చేసుకున్నారు. సంజయ్ వడపల్లి సత్యభామగా నవ జనార్దన పారిజాతంతో1985 నుంచి దేశంలోని వివిధ నృత్యోత్సవాల్లో, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. యునెస్కో, హాంగ్ కాంగ్ ఇన్–క్రెడిబుల్ ఫెస్టివల్, అమెరికాలో జరిగిన నటరాజ రామకృష్ణ జయంతి ఉత్సవాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.డాక్టర్ నటరాజ రామకృష్ణ నృత్య రత్న పురస్కారంఆంధ్రనాట్యం, పేరిణి నాట్య సృష్టికర్త డాక్టర్ నటరాజ రామకృష్ణ పేరిట తమ డ్యాన్సింగ్ బెల్స్ సంస్థ నుంచి జాతీయస్థాయిలో నృత్య రత్న అవార్డును ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల్లో విశేష కృషి చేస్తూ విశ్వవ్యాప్తం చేసే గురువులకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారం కింద 20 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో ప్రతి యేటా గురువులను సత్కరిస్తామని, యువ నర్తకులకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు. ఆంధ్రనాట్య సోలో ప్రదర్శనలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంజయ్ ప్రతిష్టాత్మక సత్రాజితి అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ అవార్డు, ఆంధ్రనాట్య కళాశౌర్య అవార్డు, సింగిడి తెలంగాణ పురస్కారం, నృత్యకౌముది, ముంబయి వారి జాతీయ సమైక్యతా నృత్య పురస్కారం లాంటి పలు అవార్డులు అందుకున్నారు. బాలనటుడైన సంజయ్ వడపల్లి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శృతి లయలు సినిమాలోనూ నటించారు. ప్రబంధ సాంప్రదాయ నవజనార్ధన పారిజాతం ప్రదర్శన విశ్వవ్యాప్తం చేయడంతోపాటు నాట్యాచార్య డాక్టర్ నటరాజ రామకృష్ణ, డాక్టర్ కళాకృష్ణ తెలుగు జాతికి అందించిన నృత్యాంశాలను భావి తరాలకు అందించే ప్రయత్నమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ‘అభినవ అంతర్జాతీయ సత్యభామ’ సంజయ్ వడపల్లి తెలిపారు. ఈనెల 4న నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే తన ప్రదర్శనకు ఉచిత ప్రవేశం అని, కళాప్రియులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి, సాక్షి, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పేరులో నేముంది?
కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరుకుంటోంది. అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీ ఎఫ్ హోరాహోరీ తలపడుతుండగా బీజేపీ సార థ్యంలోని ఎన్డీఏ కూడా ఉనికి చాటుకునే ప్రయ త్నాల్లో ఉంది. అయితే ప్రధాన పార్టీలకు ‘పేర్ల గొడవ’ పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది. తమ అభ్యర్థుల పేరుతోనే ఉన్న పలువురు వ్యక్తులు పోటీలో ఉండటంతో అవి తల పట్టుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా వారిని నయానో భయానో బరి నుంచి తప్పించే పనిలో పడ్డాయి. లేదంటే వాటి ఓట్లకు ఎంతో కొంత గండి పడే పరిస్థితి నెలకొంది. అన్ని స్థానాల్లోనూ అధికార, విపక్ష కూటముల నడుమ హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కొన్ని ఓట్లు తగ్గినా తమ గెలుపోటములే ప్రభావితం అవుతాయంటూ పార్టీలన్నీ ఆందోళన చెందుతున్నాయి.విజయన్పై విజయన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోటీ చేస్తున్న ధర్మదాం నియోజకవర్గంలో కన్నూరుకు చెందిన ఎ.ఎం.విజయన్ అనే మరో వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశాడు! తిరువంబాడిలో ముస్లిం లీగ్ నేత ఖాసింపై అదే పేరుతో ఉన్న మరో ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా కాలంసెరి స్థానంలో మంత్రి పి.రాజీవ్ కూడా ఇలాంటి పరీక్షే ఎదుర్కొంటున్నారు. రాజీవ్ పేరుతో అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నారు. అంబలపుజ స్థానంలో సీపీఎం సీనియర్ నేత జి.సుధాకరన్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సుధాకరన్ అనే పేరున్న మరో అభ్యర్థి కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. కోయిలాండిలో కాంగ్రెస్ నేత కె.ప్రవీణ్కుమార్పై అదే పేరుతో ఉన్న మరో అభ్యర్థి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల పోటీ చేస్తున్న హరిపాద్ స్థానంలో రమేశ్ అనే మరో వ్యక్తీ బరిలో ఉన్నారు. ఇరింజలకుండ స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి థామస్ ఉన్నితాన్కు థామస్ అనే స్వతంత్రుని నుంచి సవాలు ఎదురవుతోంది.బైపోర్లో గమ్మత్తుకోజికోడ్ జిల్లాలోని బైపోర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నేత పి.వి.అన్వర్ బరిలో ఉండగా అదే పేరుతో ఏకంగా మరో నలుగురు పోటీ చేస్తున్నారు! ఎల్డీఎఫ్ తరఫున పర్యాటక మంత్రి పి.ఎ.మహ్మద్ రియాజ్ పోటీ చేస్తున్నారు. అదే పేరుతో మరో ఇద్దరు కూడా బరిలో ఉన్నారు! వట్టియూర్కవు అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే వి.కె.ప్రశాంత్పై కె.ప్రశాంత్ అనే స్వతంత్రుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కె.మురళీధరన్ పోటీ చేస్తుండగా అదే పేరుతో మరో అభ్యర్థి కూడా బరిలో నిలిచారు.ప్రధాన పార్టీలకు ‘ప్రసాద్’చెర్తాల స్థానంలో ప్రధాన కూటముల అభ్యర్థులిద్దరిదీ ఒకే పేరు కావడం విశేషం. ఎల్డీఎఫ్ నుంచి మంత్రి పి.ప్రసాద్, కాంగ్రెస్ నుంచి కె.ఆర్.రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు! ఇది చాలదన్నట్టు ప్రసాద్ అనే మరో వ్యక్తి కూడా స్వతంత్రునిగా ఇక్కడ బరిలో నిలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హిమంత.. అస్సాం మామ
డాక్టర్ హిమంత బిశ్వ శర్మ. అస్సాం రాజకీయ సంక్లిష్టతలను అర్థం చేసుకుని, తదనుగుణంగా తనను తాను మలచుకున్న నేత. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. స్వయం కృషితో ఈశాన్య భారత రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు హిమంత. అస్సామీలు ఆప్యాయంగా ‘మామ’ అని పిలుచుకునేంతటి ప్రజాదరణ ఆయన సొంతం...!ఎన్ఈడీఏ రూపశిల్పి1991 నాటి సంగతి. యువతను తిరిగి కాంగ్రెస్కేసి ఆకర్షించగల యువ నాయకుని కోసం నాటి ముఖ్య మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు హితేశ్వర్ సైకియా ప్రయత్నిస్తున్న రోజులు. హిమంత బిశ్వ శర్మ ఆయన కంట పడ్డారు. అలా కాంగ్రెస్లో చేరారు. ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషి చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. జాలుక్బారి అసెంబ్లీ స్థానాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 1996లో తొలిసారి అక్కడ ఓడినా కుంగిపోలేదు. 2001లో అస్సాం గణ పరిషత్ సీనియర్ నాయకుడు భృగుకుమార్ ఫుకాన్ను ఓడించి సత్తా చాటారు. ఏడాదికే మంత్రి పదవి సాధించారు. జాలుక్బారి నుంచి వరుసగా ఐదు పర్యాయాలుగా అత్యధిక మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. దశాబ్దాల పాటు అస్సాం కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా, సీఎం తరుణ్ గొగొయ్ కుడిచేయిగా కొనసాగారు. అలా 24 ఏళ్లు కాంగ్రెస్కు సేవలందించిన హిమంత, అధిష్టానంతో విభేదాల కారణంగా 2014లో పార్టీకి రాజీనామా చేశారు. 2015లో బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి లేని ఆ పార్టీకి అక్కడ పెద్ద దిక్కుగా మారారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్ఈడీఏ)కి రూపకల్పన చేసి ఆ ప్రాంతంలో బీజేపీ తలరాతను మార్చేశారు. అస్సాంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టారు.కేబినెట్ ఆన్ వీల్స్గువాహటిలోని కాటన్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలిన ఏడో నేతగా హిమంత నిలిచారు. ఆయన నాయకత్వంలో అస్సాం అశాంతి నుంచి బయటపడింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి అస్సాం సీఎంగా హిమంత నిలిచారు. తెల్లవారుజాము వేళ కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయడం ఆయన స్టైల్. సీఈఓ తరహా పనితీరుతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామీణ జిల్లాల్లో అధికారిక సమావేశాలు నిర్వహిస్తూ ‘కేబినెట్ ఆన్ వీల్స్’తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.వివాదాలు, మరకలు→ మియా (బెంగాలీ మాట్లాడే ముస్లిం)లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని హిమంత ప్రకటించడం వివాదాస్పదమైంది→ వలసదారులపై హిమంత రైఫిల్ ఎక్కుపె ట్టినట్టుగా చిత్రించిన ‘పాయింట్ బ్లాంక్’ వీడియో అత్యంత వివాదాస్పదంగా మారింది. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఫిర్యాదులు చేశారు. వామపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. హిమంత మాత్రం అది ఫేక్ అని కొట్టిపారేశారు.→ ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని మదర్సాలనూ సాధారణ పాఠశాలలుగా మార్చాలన్న హిమంత నిర్ణయంపై భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి.→ ‘జీరో టాలరెన్స్’ విధానంలో భాగంగా ప్రభుత్వ, అటవీ భూముల నుంచి వేలాది మందిని వెళ్లగొట్టారు. వారిలో బెంగాలీ మా ట్లాడే ముస్లింలే అధికంగా ఉండటంతో, వారిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకున్నా రని ఆరోపణలొచ్చాయి.వ్యక్తిగత జీవితంహిమంత 1969 ఫిబ్రవరి 1న జోర్హాట్లో జన్మించారు. తండ్రి కైలాశ్నాథ్ శర్మ సాహితీవేత్త. అలా హిమంత పుస్తకాలు, మేధో చర్చల నడుమ పెరిగారు. పాఠశాల విద్యార్థిగానే ఆదివాసీల హక్కుల ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. గువాహటి కాటన్ వర్సిటీ విద్యార్థి సంఘానికి మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే చదువులోనూ రాణించారు. పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కావడం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు గువాహటి హైకోర్టులో ఐదేళ్లు సొలిసిటర్గా కూడా పనిచేశారు. హిమంత భార్య రినికి భుయాన్ శర్మ రాష్ట్రంలో మీడియా టైకూన్గా పేరొందారు. వారికి కొడుకు, కూతురున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగాల్ దీదీకి ‘సరిహద్దు’ సెగ
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తి రేపే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అ్రస్తాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్కు బంగ్లాదేశ్తో 2,216 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది. చొరబాట్లు కేంద్రం వైఫల్యమే.. సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖచిత్రాన్ని మార్చేస్తోందంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయతి్నస్తోంది. మరోవైపు, అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేస్తూ, చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే ‘తీస్తా నదీ జలాల పంపిణీ’వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ‘మతువా’ల చుట్టూ రాజకీయ చదరంగం బెంగాల్లో దాదాపు 17 శాతం ఉన్న దళిత (నామశూద్ర) ‘మతువా’సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచి్చన హామీ వారిని ఆకర్షిస్తోంది. అయితే, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని టీఎంసీ చెబుతోంది. మతువాలు ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సీఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓట్ల ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. సరిహద్దు జిల్లాల్లో పెరిగిన ముస్లిం జనాభా బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5 వేల చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నోరెట్లు ఉంటాయి. సరిహద్దు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతానికిపైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో 40 శాతం వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతి, ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. పెండింగ్లో 40 లక్షల ఎస్ఐఆర్ కేసులు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా, ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్లో 12 లక్షల కేసులు, మాల్డాలో 8 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఉన్నారు.సరిహద్దు జిల్లాల్లో పరిస్థితి ఇలా.. → జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షీదాబాద్, మాల్డా జిల్లాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటలు. కానీ, ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి యతి్నస్తున్నాయి. → రాజ్బన్షీలు, గూర్ఖాలు, తేయాకు తోటల కారి్మకులు ఉన్న ఉత్తర బెంగాల్ (కూచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్) భౌగోళికంగా, సాంస్కృతికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయువుపట్టుగా మారింది. → సుందర్బన్స్ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనారీ్టలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తోంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. -సోమన్నగారి రాజశేఖర్రెడ్డి -
పైప్డ్ గ్యాస్.. దీనిపైనే ఫోకస్
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన అంతరాయాలు.. దిగుమతి చేసుకునే గ్యాస్పై ఆధారపడిన భారత్ను కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) నుండి అందుబాటులో ఉన్న చోట పైప్డ్ నేచురల్ గ్యాస్కు (పీఎన్జీ) మారాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. గృహ వంట గ్యాస్ వినియోగంలో నిర్మాణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉన్న గృహాల వారు మూడు నెలల్లో పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ సరఫరాను నిలిపివేయనున్నట్టు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మళ్లేలా ప్రోత్సహించేందుకు గ్యాస్ పంపిణీ సంస్థలు రెంటల్ స్కీమ్, ఈఎంఐ సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. –సాక్షి, స్పెషల్ డెస్క్దిగుమతులపై ఆధారపడకుండా.. పీఎన్జీ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా కొరతగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పైప్లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు ఎల్పీజీ సిలిండర్లను మళ్లించి ఇంధన భద్రతను పెంపొందించాలన్నది ఆలోచన. ప్రస్తుతం పైప్లైన్లు వేసే కంపెనీలు వివిధ అనుమతులు, అధిక ఫీజులు, స్థల సేకరణ సమస్యలు, హౌసింగ్ సొసైటీల నుండి అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ఈ అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్రానికి ఒకటి కాకుండా దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం ఒక చట్టబద్ధమైన కేంద్ర వ్యవస్థ ఏర్పాటు కానుంది.దేశవ్యాప్తంగా 784 జిల్లాల్లో.. గత డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 1.62 కోట్ల మంది పీఎన్జీ కస్టమర్లు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 10 వేల మంది వినియోగదార్లు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్నారు. మన దేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రస్తుతం 784 జిల్లాలకు విస్తరించింది. ఇవి ప్రతి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ వంటి 307 భౌగోళిక ప్రాంతాలుగా (జియోగ్రాఫికల్ ఏరియా) ఈ నెట్వర్క్ పైపుల ద్వారా సహజ వాయువును గృహ వినియోగదార్లకు అందిస్తోంది. రూ.500 కడితే చాలు.. గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ కావాలంటే వన్ టైమ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీని బట్టి ఇది రూ.9 వేల వరకు ఉంది. భవనంలోని కనెక్షన్ల సంఖ్య పెరిగితే ఈ మొత్తం తగ్గుతుంది. కొన్ని కంపెనీలు కనెక్షన్ను వాయిదాల పద్ధతిలో కూడా ఇస్తున్నాయి. రెండు నెలలకు (బిల్ సైకిల్) రూ.500 కడితే చాలు. తాత్కాలిక కనెక్షన్ కావాల్సినవారు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. పీఎన్జీ ధర ఒక యూనిట్కు (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రూ.51గా ఉంది. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి రెండు నెలలకు సగటున 24 యూనిట్లు ఖర్చు అవుతుందని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అవసరాల్లో సగం దేశీయంగానే ఉత్పత్తి » దేశ గ్యాస్ అవసరాల్లో సగ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. » దేశంలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువులో కృష్ణా–గోదావరి బేసిన్ వాటా 25%, అస్సాం, త్రిపుర బేసిన్ల వాటా 13%గా ఉంది. మిగిలింది ముంబై, రాజస్తాన్, కాంబే బేసిన్ (గుజరాత్) ఉత్పత్తి చేస్తున్నాయి. » 2024–25లో భారత్ 35,594 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేసింది. అదే సమయంలో 35,720 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకుంది. » భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎల్ఎన్జీలో ఖతార్, యూఏఈ వాటా 50% పైమాటే. » మధ్యప్రాచ్యం మీద ఆధారపడడం తగ్గించి యూఎస్, ఆ్రస్టేలియా, రష్యా, మొజాంబిక్ నుంచి పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ కొనుగోళ్ల డీల్స్కు భారత్ శ్రీకారం చుట్టింది. పీఎన్జీ ఎందుకు ?ఇంధన భద్రత, స్థిరత్వం: కేవలం ఓడల ద్వారా హార్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల గుండా వచ్చే ఎల్పీజీపై ఆధారపడటం వల్ల అక్కడ ఏదైనా అంతరాయం కలిగితే లక్షలాది మందికి వంట గ్యాస్ అందకుండా పోతుంది. దీనికి భిన్నంగా స్వదేశీ గ్యాస్ నిల్వలు, వివిధ దిగుమతి కేంద్రాలు, ఇతర దేశాల నుండి సరఫరా అయ్యే పైప్లైన్ నెట్వర్క్ చాలా సురక్షితమైనది, నమ్మదగినది. తక్కువ ఖర్చు: సిలిండర్లు, లారీలు, బాట్లింగ్ ప్లాంట్లు, డీలర్ల ఖర్చులు అన్నీ కలిసి ఎల్పీజీ ధర నిర్ణయం అవుతుంది. పైప్లైన్ ద్వారా గ్యాస్ నేరుగా ఇంటికి చేరడం వల్ల ఈ అదనపు ఖర్చులు తగ్గుతాయి. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ వ్యయం 20–30% తక్కువ అని కంపెనీలు చెబుతున్నాయి. సౌకర్యం, భద్రత: వంట మధ్యలో గ్యాస్ అయిపోతుందనే భయం ఉండదు. ప్రమాద భయం లేదు. ఇందులోని మీథేన్ గాలి కంటే తేలిక. సులభంగా గాలిలో కలిసిపోతుంది. స్వచ్ఛమైన ఇంధనం కూడా. రాయితీ భారాన్ని తగ్గించడం: ప్రభుత్వం ఉజ్వల పథకం కింద కోట్లాది కుటుంబాలకు ఎల్పీజీపై సబ్సిడీ ఇస్తోంది. ప్రజలను పీఎన్జీకి మార్చడం ద్వారా ప్రభుత్వంపై పడే ఈ ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)అతిగా చల్లబర్చిన సహజ వాయువు. దీనిని సుమారు మైనస్ 162 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ రూపంలోకి మారుస్తారు. తద్వారా దాని పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల ట్యాంకర్లలో నింపి సముద్రాల గుండా రవాణా చేయడం సులభం అవుతుంది. ఇది గమ్యస్థానానికి చేరుకున్నాక తిరిగి వేడి చేసి వాయువుగా మార్చి పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తారు.తెలుగు రాష్ట్రాల్లో పీఎన్జీ సేవలు అందిస్తున్న కంపెనీలు.. తెలంగాణ: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్ గ్యాస్, టోరెంట్ గ్యాస్, మహారాష్ట్ర నేచురల్ గ్యాస్. ఆంధ్రప్రదేశ్: ఐఓసీఎల్, మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, థింక్ గ్యాస్. -
ఈజ్ ఆఫ్ లివింగ్ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: జీవన సౌలభ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన అధ్యయనంలో సిటీ టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది. ఈజ్ ఆఫ్ లివింగ్లో నెంబర్ వన్గా నిలిచింది. రియల్ ఎస్టేట్ వృద్ధి, రవాణాసౌకర్యం, ఆహ్లాదకరమైన వాతావరణాలతోపాటు వే ర్వేరు విభాగాల్లో 15 కొలమానాల ఆధారంగా దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో ఈ అధ్యయనం నివేదిక రూపొందింది. ఈ కొత్త నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత ‘నివాసయోగ్యమైన’మ హానగరంగా బెంగళూరును అధిగమించి హైదరాబాద్ నిలిచింది. నివేదిక నేపథ్యం... బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ అన్బాక్సింగ్ బీఎల్ఆర్((బెంగుళూరు నగరం యొక్క కళలు, సంస్కృతి, సాంకేతికత మరియు వారసత్వాన్ని ప్రదర్శించే ఓ వార్షిక వేడుక) ప్రచురించిన ‘వుయ్ ఆర్ సిటీ–2026’వార్షిక నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన ఇండియాస్పోరా గ్లోబల్ ఏఐ సదస్సులో ఈ డేటా నివేదికను విడుదల చేశారు. ‘సిటీ ఇండెక్స్’పేరిట వెలువరించిన 159 పేజీల నివేదికలో, ప్రయాణం, వైవిధ్యం, అవుటింగ్, గృహవసతి, మౌలిక సదుపాయాలు చివరగా వాతావరణం వంటి కొలమానాలను ఉపయోగించి జీవన సౌలభ్యం ఆధారంగా ఎనిమిది నగరాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ ర్యాంకుల ప్రకారం ఉద్యోగాలు, వినియోగం, రవాణా వంటి అంశాల్లో రెండు టెక్ హబ్లు హైదరాబాద్, బెంగుళూర్లు భారతదేశ వృధ్ధికి చోదకశక్తిగా నిలుస్తున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. జనాభాపరంగా ముంబై, ఢిల్లీ ఎంతో పెద్దవైనప్పటికీ ఆర్థిక వృద్ధిలో మాత్రం ఈ రెండు నగరాలు వాటిని మించిపోతున్నాయి. సిటీ ర్యాంక్ను పెంచిన వైవిధ్యం... గృహ వసతి, జీవన వైవిధ్యం వంటి అంశాలు హైదరాబాద్ ర్యాంకింగ్ను పెంచగా, ప్రయాణ సమయం మౌలిక సదుపాయాలు బెంగళూరును రెండవ స్థానానికి నెట్టాయి. ఒక్కో విభాగంలో ఒక్కొక్క నగరం సత్తా చాటినప్పటికీ మొత్తం మీద హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు కోల్కతా నిలిచాయి. అహ్మదాబాద్ అట్టడుగున నిలవగా, చెన్నై, ఢిల్లీ ఎన్సిఆర్, పూణే, గ్రేటర్ ముంబై వరుసగా నాలుగవ, ఐదవ, ఆరవ మరియు ఏడవ స్థానాల్లో నిలిచాయి. కొత్త కంపెనీల ఏర్పాటు, గ్రేడ్–ఎ ఆఫీస్ స్పేస్లు జీసీసీ సెటప్ల వంటి రంగాలలో హైదరాబాద్ బెంగళూరుకు సవాలుగా ఎదుగుతోందని కూడా నివేదిక తెలిపింది. -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
(సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి) పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే. దాంతో అక్కడి పార్టీల తలరాతను మార్చగలిగే శక్తిగా ముస్లింలు ఎదిగారు. దీంతో ఈసారి వాళ్లు ఎవరికి పట్టంకడతారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తృణమూల్కు మొదటి నుంచీ ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. వీరి దన్నుతోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూనే హిందూ ఓట్లను ఐక్యం చేసే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ఓటర్లు రాష్ట్రంలోని కనీసం 110 స్థానాల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. దీంతో మరోసారి ముస్లింల ఐక్యత మరోసారి తృణమూల్ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదంటే వీరిలో ఐక్యత దీపం కొండెక్కి తృణమూల్ పడవను ఓటమి సముద్రంలో ముంచేస్తుందా? లేదంటే చీలిక తెచ్చి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పథకాలతో లబ్ధిపొందిన ముస్లింలు ముస్లింల మద్దతు వెనుక కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేకాకుండా పక్కాగా అమలు చేసిన వ్యూహాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలున్నాయి. ముఖ్యంగా...టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి మద్దతును ఏర్పరచాయి. మహిళల కోసం ‘లక్ష్మీ భండార్’, విద్యార్థుల కోసం ‘సబుజ్ సాథి’, బాలికల విద్యను ప్రోత్సహించే ‘కన్యాశ్రీ’వంటి పథకాలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చాయి. ఈ పథకాలు మతాలకు అతీతంగా అమలయ్యాయి. దీంతో ముస్లిం వర్గాలు ఈ పథకాల నుంచి ఎక్కువ మంది లబ్దిపొందాయి. మైనారిటీ వర్గాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మదర్సాల అభివృద్ధి, ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు, మతపరమైన నాయకులకు గౌరవ వేతనాలు వంటి చర్యలు ‘ప్రభుత్వం మన కోసం పని చేస్తుంది’అనే భావనను ముస్లింలలో బలంగా నాటాయి. ఈ భావన రాజకీయంగా టీఎంసీకి కీలక మద్దతుగా మారింది. గడిచిన పదేళ్లుగా ప్రధాన పోరు బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది. బీజేపీ హిందూ రాజకీయాలతో పోలిస్తే టీఎంసీ సర్వమత సహకార భావనే ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ గెలుపునకు భరోసా అని టీఎంసీ నేతలు ఆశిస్తున్నారు. టీఎంసీ అయితేనే తమ ప్రయోజనాలకు పరిరక్షణగా నిలబడుతుందనే యోచన ముస్లింలలో బలంగా నాటుకుపోయింది. ఈ ఐక్యతే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. స్థానికంగా ముస్లిం నాయకత్వానికి టీఎంసీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ప్రాంతీయ నాయకులను ప్రోత్సహించడంతో ప్రజల్లో ప్రాతినిధ్యం ఉన్న భావన పెరిగింది. ఇది ఓటర్లతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరచింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్, దక్షిణ 24 పరగణాలు వంటి ముస్లిం ప్రభావిత జిల్లాల్లో టీఎంసీకి బలమైన కేడర్ ఉంది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటును సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల బలహీనత టీఎంసీకి అనుకూలంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒకింత ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. అయితే క్రమంగా ఈ రెండు పార్టీలు ప్రభావం కోల్పోవడంతో ప్రత్యామ్నాయం లేక ముస్లింలు టీఎంసీని ఆశ్రయించారు. హిందువులను ఐక్యం చేసే పనిలో కమలదళం బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధాన వ్యూహాల్లో ఒకటి ముస్లిం ఓటును విభజించడం. రెండోది హిందూ ఓటును ఐక్యంగా మార్చడం. ఈ ద్వంద్వ వ్యూహమే 2019 నుంచి పార్టీని బెంగాల్లో ముందుకు నడిపిస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్లను రెండు, మూడు పార్టీల వైపు చూసేలా చేయడమే బీజేపీ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, చిన్న ప్రాంతీయ పార్టీల వైపు ముస్లిం ఓటర్లు చూసేలా బీజేపీ పరోక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని వార్తలొచ్చాయి. హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ మతపరమైన గుర్తింపును బలంగా ప్రస్తావిస్తోంది. సమూహ భావనను బీజేపీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ‘సాంస్కృతిక పరిరక్షణ’, దేవాలయాలపై దాడులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందువుల్లో ఐక్యత పెంపొందేలా శతథా కృషిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమశూద్రులు, రాజ్బంశీలు వంటి వర్గాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఈ వర్గాల మధ్య ప్రస్తావించడం ద్వారా తమ మద్దతును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జంగిల్మహల్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం పెంచుకుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎక్కువ. ఇక్కడ బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కబీర్ మరో ఒవైసీ అవుతారా..? తృణమూల్కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ‘బాబ్రీ మసీదు నమూనాలో మసీదు కడతా’ అంటూ ఆయన మొదటుపెట్టిన రాజకీయాలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. కబీర్తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కబీర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిపోవడంతో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఓటు చీలిపోయే ఆస్కారముంది. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్కు గండికొడుతుంది. వీరిద్దరూ కలిసి 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్ను కంగారు పెడుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో హుమయున్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను బిహార్ రాజకీయాలతో పోల్చుతున్నారు. అక్కడ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటును విభజించి, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు అచ్చం అలాగే హుమాయున్ కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయావకాశాలు తగ్గి బీజేపీ అధికారపీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
ధర దడ!
ఇళ్లలో వినియోగించే ముఖ్యమైన ఎల్రక్టానిక్ వస్తువుల ధరలు ప్రియంగా మారుతున్నాయి. ఒకవైపు కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమల్లోకి రావడం, మరోవైపు ముడిసరుకుల ధరల పెరుగుదలతో కంపెనీలు ఒక విడత రేట్లను పెంచగా.. ఇప్పుడు ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో వ్యయాల భారం పెరిగిపోయిందంటూ మరో విడత రేట్ల పెంపునకు తెరతీరాయి. దీంతో ఏసీలు, టీవీలు తదితర ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీలో శ్లాబుల కుదింపు ఫలితంగా వీటి ధరలు దిగిరాగా.. తాజాగా వీటి ధరలు పూర్వపు స్థాయిలను మించుతున్నాయి. మెమొరీ చిప్ల ధరల పెరుగుదలతో ఇప్పటికే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల ధరలు ప్రియం కావడం తెలిసిందే. కమోడిటీ ధరల్లో అస్థిరతలు, రూపాయి క్షీణత, అధిక రవాణా, ఇంధన వ్యయాలను రేట్ల సవరణకు కారణాలని పంపిణీదారులు, డీలర్లకు కంపెనీలు తెలియజేస్తున్నాయి. ధరల పెంపు విషయమై తమ వాణిజ్య భాగస్వాములకు ఎల్జీ, శామ్సంగ్, పానాసోనిక్, డైకిన్, లాయిడ్స్ తాజాగా సమాచారమిచ్చాయి. ఏసీల ధరలు 10 శాతం వరకు, ఇతర ఉత్పత్తుల ధరలు 5 శాతం వరకు పెంచుతున్నట్టు ఎల్జీ ప్రకటించింది. ఏసీల ధరలను 8–12 శాతం మధ్య పెంచుతున్నట్టు పానాసోనిక్ తెలిపింది. డైకిన్, బ్లూస్టార్ సైతం 12 శాతం పెంపు దిశగా నిర్ణయాన్ని ప్రకటించింది. లాయిడ్స్ ఇప్పటికే ధరలను పెంచింది. శామ్సంగ్ సైతం ధరలను పెంచనున్నట్టు తెలిపింది. మెమొరీ చిప్లు ధరల పెరుగుదలతో టీవీల విక్రయ ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాస్తవానికి తయారీ వ్యయాల భారం పేరుతో ఏసీలు, టీవీల ధరలను 5–9% మధ్య కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు జనవరిలో పెంచడం గమనార్హం. ఈ వరుస పెంపులతో డిమాండ్కు విఘాతం కలగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాహన ధరలు సైతం.. తయారీ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ వాహన విక్రయ ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్ తన ప్యాసింజర్, వాణిజ్య వాహనాల (ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్) ధరలను 0.5–1.5% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సెడెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సైతం తమ వాహనాల ధరలను వచ్చే నెల నుంచి 2% వరకు పెంచుతున్నట్టు ప్రకటించాయి. హోండా సైతం ఈ దిశగా ఆలోచన చేస్తుండగా, మిగిలిన కంపెనీలూ ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. డిమాండ్పై ప్రభావం.. తాజా ధరల పెంపుతో గతేడాది జీఎస్టీ సవరణల కారణంగా తగ్గిన ధరల ప్రయోజనం పూర్తిగా ఆవిరైపోతోందని, ఇది డిమాండ్ను బలహీనం చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి వరుస ధరల పెంపు దురదృష్టకరమని, వినియోగ సెంటిమెంట్పై ప్రభావం చూపిస్తుందని ప్రముఖ ఎల్రక్టానిక్ రిటైల్ చైన్ ‘గ్రేట్ ఈస్టర్న్ రిటైల్’ డైరెక్టర్ పులకిత్ బైద్ పేర్కొన్నారు. ‘‘జీఎస్టీ తగ్గింపు అనంతరం అధిక ముడి సరుకుల ధరల పేరుతో బ్రాండ్లు రేట్లను పెంచేశాయి. ప్రస్తుత అనిశి్చతుల్లో తరచుగా ధరల పెంపు డిమాండ్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’అని బైద్ అన్నారు. డిమాండ్ కోలుకోవడం మొదలైందంటూ, అయితే వరుస ధరల పెంపు డిమాండ్ను దెబ్బతీయొచ్చని ప్రముఖ ఎల్రక్టానిక్స్ బ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైతం అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెట్టింట లాక్డౌన్ చర్చ
సాక్షి, స్పెషల్ డెస్క్ : సరిగ్గా ఆరేళ్ల క్రితం.. అంటే 2020 మార్చి 24న ప్రకటించిన దేశవ్యాప్త కోవిడ్–19 లాక్డౌన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో లాక్డౌన్ అనే అంశంపై గూగుల్ వేదికగా మంగళవారం రోజంతా చర్చ సాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై సోమవారం పార్లమెంటులో ప్రసంగించే క్రమంలో ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితులను కోవిడ్ మహమ్మారితో పోల్చారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఏర్పడిన అంతరాయాన్ని ఎదుర్కోవడానికి కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో చూపినటువంటి సామూహిక సహనం, ఐక్యత, సంసిద్ధతను ప్రజలు ప్రదర్శించాలని ఆయన కోరారు. అదే సమయంలో పౌరులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ నిర్ణయాలను నమ్మాలని ప్రధాని ఉద్ఘాటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త లాక్డౌన్కు సంకేతమని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారమైంది. నాటి దేశవ్యాప్త దిగ్బంధం, నిర్జన రోడ్లు, లక్షలాది మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు పయనం కావడం, కార్యాలయాలు అకస్మాత్తుగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలోకి మారడం వంటి ఆనాటి దుర్భర పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని నెటిజన్లు కంగారుపడ్డారు.దీనికితోడు అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇంధన పొదుపు కోసం 10 సూచనలు చేస్తూ వాటిని ‘కోవిడ్ తరహా చర్యలు’గా అభివర్ణించింది. అయితే ఇది కూడా సోషల్ మీడియాలో తప్పుగా వ్యాప్తి చెందింది. ఐఈఏ పేర్కొన్న ‘స్వచ్ఛంద’ అనే పదాన్ని తీసేసి ఇది ప్రభుత్వం విధించబోయే ‘తప్పనిసరి’ ఆదేశమంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు తప్పుగా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవన్నీ ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు మరింత అగ్గిరాజేశాయి. నెట్టింట లాక్డౌన్ చర్చకు కారణమయ్యాయి. -
పుదుచ్చేరిలో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరోసారి ప్రజాతీర్పు కోరడానికి సిద్ధమైంది. ఆయన సారథ్యంలోని ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమాగా ఉంది. విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా అదృష్టం పరీక్షించుకుంటోంది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరు మరోసారి కలిసొస్తుందని ఎన్డీఏ ఆశిస్తోంది. కూటమి భాగస్వామి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటం, పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులివ్వడాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తోంది. డీఎంకే, కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. హామీలు నెరవేర్చలేదని, శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపిస్తున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ బలపడటంపై బీజేపీ కన్నేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు పుదుచ్చేరిలో ఇప్పటికే పలుమార్లు విస్తృతంగా పర్యటించారు. విజయ్ పార్టీతో చేటెవరికి? అంతర్గత కలహాలు, సీట్లపై సిగపట్లు డీఎంకే కూటమిని కలవరపెడుతున్నాయి. పుదుచ్చేరిలో ఒకప్పుడు ప్రధాన పక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం డీఎంకేకు జూనియర్ భాగస్వామిగా మారిపోయింది. అలాగని డీఎంకే 20 సీట్లకు పట్టుబడుతుండటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసినా సీట్ల పంపకంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దాంతో పలు అసెంబ్లీ స్థానాలకు డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులిద్దరూ నామినేషన్లు వేశారు. ఇది వాటి మధ్య స్నేహపూర్వక పోటీలకు దారి తీస్తే కూటమి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. విజయ్ పార్టీ టీవీకే పోటీలో ఉండటం తమకే లాభమని అధికార, విపక్ష కూటములు రెండూ లెక్కలేసుకుంటున్నాయి. తమిళ జాతీయవాది సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ మూడో స్థానం దక్కించుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏ కూటమి సానుకూలతలు → సీఎం రంగస్వామి ప్రజాదరణ → ప్రధాని మోదీ కరిష్మా → కేంద్ర నిధులతో జరిగిన అభివృద్ధి పనులు → డీఎంకే కూటమి అనైక్యత ప్రతికూలతలు → ప్రభుత్వ వ్యతిరేకత → మంత్రులపై అవినీతి ఆరోపణలు → విజయ్ పార్టీతో ఓటుబ్యాంకుకు గండి పడే ఆస్కారండీఎంకే కూటమి సానుకూలతలు → రంగస్వామి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత→ డీఎంకే ద్రవిడ జాతీయవాద నినాదం → పలు జనాకర్షక పథకాల హామీలుప్రతికూలతలు → సీట్ల సర్దుబాటుపై ఎడతెగని సిగపట్లు → పలు అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులను బరిలో దింపడం– సాక్షి, నేషనల్ డెస్క్ -
రక్షణ ప్లస్ రాబడి
మన దేశంలో ఇన్వెస్ట్మెంట్లంటే మొదటి నుంచీ ఒకటే ధోరణి. అయితే డిపాజిట్లు. లేకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు. ఇవి రెండూ కాకుంటే బంగారం లేదా రియలీ్ట. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇబ్బందికరం అనుకునేవారు మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయించటం. ఇప్పటికీ చాలామందిది ఇదే తీరు. వారికి మ్యూచువల్ ఫండ్లంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవే. కానీ ఇప్పుడు మార్కెట్లు ఇలా వేటిలోనూ ఒకదాంట్లో పెట్టుబడులు పెట్టి ఊరుకునేలా లేవు. అలాగని అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టాలంటే... వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవటం అంత తేలికకాదు. అందుకే ఇలాంటివన్నీ చేసే ఫండ్స్ను చూసుకోవాలి. అటు డెట్లోను, ఇటు స్టాక్ మార్కెట్లో, మరోవైపు బంగారంలోనూ... ఇలా మూడింటా పెట్టుబడులు పెడుతూ... అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లేవే మల్టీ అసెట్ ఫండ్స్. పేరుకు తగ్గట్టే ఇవి భిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. డెట్లో పెడతాయి కనక కొంత రక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పైపెచ్చు అవసరాన్ని బట్టి మారుస్తాయి కనక చక్కని రాబడి కూడా ఇస్తున్నాయి. రిస్క్ లు, రాబడుల మధ్య సమతూకాన్ని పాటిస్తూ వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఈ మల్టీ అసెట్ ఫండ్స్... ప్రస్తుతం అందరికీ అవసరమైనవనటంలో సందేహం లేదు. వాటిపై సమగ్ర అవగాహనే ఈ వెల్త్ స్టోరీ...కనీసం మూడు అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్నే మల్టీ అసెట్ ఫండ్స్గా వ్యవహరిస్తుంటారు. ఇవి పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీల్లో, స్థిరత్వం కోసం డెట్ సాధనాలు– బాండ్స్లో, రిస్క్ లను హెడ్జ్ చేసేందుకు పసిడి/ కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రతి అసెట్ క్లాస్కి కనీసం ఇంత కేటాయించాలనే నిబంధనలుంటాయి. కాబట్టి దానికి తగ్గట్లే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి ఫండ్ ఒకటి ఉంటే సంపూర్ణమైన పోర్ట్ఫోలియో ఉన్నట్లే లెక్క. ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్లను చూస్తే విడివిడిగా స్టాక్స్ని ఎంచుకోవడం కన్నా అసెట్స్ అలొకేషన్ వైపే పరిస్థితులు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డెట్ మార్కెట్లు స్థిరపడుతున్నాయి. పుత్తడి పటిష్టమైన హెడ్జింగ్కి ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక్క అసెట్ని నమ్ముకుంటే వర్కౌట్ కాదని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మల్టీ అసెట్ ఫండ్స్తో ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందుకుంటున్నారు. ఇవి పరిస్థితులను బట్టి వివిధ అసెట్స్ మధ్య కేటాయింపులను ఆటోమేటిక్గా మార్చేస్తాయి. మార్కెట్లలో మార్పులను బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. పోర్ట్ఫోలియో పతనమయ్యే రిస్కులను తగ్గిస్తాయి. మల్టీ అసెట్ ఎందుకు ఉపయోగకరం అంటే..వివిధ అసెట్స్ వ్యాప్తంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు వీలుంటుంది. పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతుంది. ఈక్విటీల్లో మాత్రమే పెట్టే పెట్టుబడులతో పోలిస్తే హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. వీటిలోనైతే మార్కెట్ కరెక్షన్లకు లోనయ్యేటప్పుడు రక్షణ ఉంటుంది. దీర్ఘకాలికంగా సిప్ ఇన్వెస్టింగ్ కోసం ఇవి అనువైనవి కూడా.డెట్ (బాండ్లు) పాత్ర.. డెట్ విభాగమనేది మల్టీ అసెట్ ఫండ్స్కి ఉండే బలాల్లో ఒకటి. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. పోర్ట్ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ఈక్విటీలు కరెక్షన్కి లోనయ్యే సమయంలో పోర్ట్ఫోలియో మరీ ఎక్కువగా పడిపోకుండా కాస్త కుషన్గా పని చేస్తుంది. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బాండ్లు అనేవి భద్రత కోసమే కాక పోర్ట్ఫోలియోను సంరక్షించుకునే వ్యూహంగా కూడా పనికొస్తాయి. సరైన ఫండ్ని ఎంచుకోవడం ఇలా.. అసెట్ అలొకేషన్ని పరిశీలించాలి → ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపించే ఫండ్లలో అధిక రాబడులతో పాటు అధిక రిస్క్ లూ ఉంటాయి. → బ్యాలెన్స్డ్గా పెట్టుబడులు పెట్టే ఫండ్లలో మాత్రమే స్థిరమైన రాబడులుంటాయి. నిలకడపై ఫోకస్ → స్వల్పకాలిక రాబడులను కాకుండా 3–5 ఏళ్ల పనితీరును పరిశీలించాలి. ఫండ్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి → ఐసీఐసీఐ = కాంట్రేరియన్ → ఎస్బీఐ = బ్యాలెన్స్డ్ → క్వాంట్ = అగ్రెసివ్ మీ రిస్కు సామర్థ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవాలి→ కన్జర్వేటివ్ = ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ → మోడరేట్ = ఐసీఐసీఐ, కోటక్ → అగ్రెసివ్ = నిప్పన్, క్వాంట్ ఈ రిస్క్ లుంటాయ్.. మార్కెట్లు బులిష్గా దూకుడు మీదున్నప్పుడు ఇవి పెద్దగా రాణించకపోవచ్చు. అలాగే రాబడులనేవి ఫండ్ మేనేజర్ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక మరీ డైవర్సిఫికేషన్ ఎక్కువగా చేసినా కూడా వృద్ధి అవకాశాలు పరిమితమవుతాయి.– సాక్షి, వెల్త్ -
కునుకుపై కినుక.. నిద్ర ఆరు గంటల్లోపే...
మంచి ఆరోగ్యానికి నిద్ర అత్యంత ముఖ్యం. మానసిక ఒత్తిడి, ఆందోళన, గతి తప్పిన జీవనశైలి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల అతివాడకం, ఆహార అలవాట్లు, అనారోగ్య సమస్యలు.. కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కంటినిండా నిద్ర ఒక కలగా మిగిలిపోతోంది. అయితే మంచిగా నిద్ర పట్టడానికి ఇంట్లో సంతోషకర వాతావరణం, రాత్రిపూట తేలికపాటి భోజనం, పగటిపూట వ్యాయామం దోహదం చేస్తాయన్నది అత్యధికుల మాట. – సాక్షి, స్పెషల్ డెస్క్⇒ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ తాజాగా విడుదల చేసిన దేశవ్యాప్త సర్వే ప్రకారం.. చాలా మంది భారతీయులు ఇప్పటికీ తగినంత అంతరాయం లేని నిద్రను పొందలేకపోతున్నారని వెల్లడైంది. అయితే గతేడాదితో పోలిస్తే పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 12 నెలల్లో అడ్డంకులు లేని నిద్ర రోజుకి ఆరు గంటలు మించలేదని 46% మంది భారతీయులు పేర్కొన్నారు. 2025లో ఈ అభిప్రాయాన్ని వెల్లడించిన వ్యక్తుల సంఖ్య 59% నమోదైంది. దేశవ్యాప్తంగా 2025 డిసెంబర్ నుంచి 2026 మార్చి వరకు 393 జిల్లాల్లో జరిగిన ఈ సర్వేలో 63% మంది పురుషులు, 37% మంది స్త్రీలు పాల్గొన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 42%, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి 26% మంది, మిగిలినవారు ఇతర నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.మంచి నిద్రకు దోహదం చేసే అంశాలు..అంశం - వెల్లడించిన వ్యక్తుల శాతం ఇంట్లో సంతోషకర వాతావరణం - 72తేలికపాటి రాత్రి భోజనం - 65పగటిపూట వ్యాయామం - 65సౌకర్యవంతమైన దుస్తులు - 43రాత్రి 10 గంటల కంటే ముందే పడుకోవడం - 29మనసుకు హాయినిచ్చే సంగీతం - 25దోమల నివారణ ఉత్పత్తులు - 22నిద్రకు ముందు పుస్తకాలు చదవడం - 14నిద్రకు అంతరాయం కలిగించే ప్రధాన కారణాలు..కారణం - శాతంఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం - 72ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే ఇంటి పనులు - 42వరుసగా 8 గంటల పాటు అస్సలు నిద్ర పట్టకపోవడం - 28దోమలు, బయటి శబ్దాలు వంటి ఇతర కారణాలు - 23స్లీప్ అప్నియా వంటి అనారోగ్య సమస్యలు - 19మొబైల్ కాల్స్, మెసేజ్ల వల్ల వచ్చే ఆటంకాలు - 14పిల్లలు/భాగస్వామి వల్ల కలిగే ఇబ్బందులు - 12సౌకర్యవంతంగా లేని మంచం/పరుపు - 9మెరుగైన నిద్ర కోసం..⇒ రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం⇒ నిద్రపోయే 6–8 గంటల ముందే టీ, కాఫీ తాగడం ఆపేయండి⇒ పడుకోవడానికి కనీసం 2–3 గంటల ముందే భోజనం ముగించండి⇒నిద్రకు 2–3 గంటల ముందు ఫోన్లు, టీవీలు చూడటం ఆపండి⇒పడక గది చీకటిగా, నిశ్శబ్దంగా, కొంచెం చల్లగా ఉండేలా చూసుకోండి⇒రోజూ వ్యాయామం లేదా యోగా చేయండి⇒ రాత్రిపూట నీరు, టీ, తీపి పానీయాలు అతిగా తీసుకోవద్దు⇒పడుకునే ముందు పుస్తక పఠనం, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి⇒ పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోకండి⇒సౌకర్యవంతమైన పరుపు, దిండును ఉపయోగించండి -
ఏమిటీ లిటిల్ ఇండియా?
ఇజ్రాయెల్పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వారి సంతతి ముంబై, నవ్గావ్, పుణె, అహ్మదాబాద్ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్పాప్డీ, గులాబ్జాం, పాప్డీ చాట్, భేల్పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాడైతే... పడేయ్ బ్రో!
ఒకప్పుడు ఇళ్లలో ఏదైనా వస్తువు పాడైతే ప్రజలు దాన్ని మరమ్మతు చేయించుకొని తిరిగి ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఉపకరణాలను బాగు చేయించుకోవడం కంటే కొత్త వాటిని కొనడానికే నగరవాసులు మొగ్గు చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వినియోగదారుల ప్రవర్తన, మరమ్మతుల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించడానికి పర్యావరణ పరిశోధన, ప్రచార సంస్థ టాక్సిక్స్ లింక్ ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, నాగ్పూర్ రాంచీలలో సర్వే చేపట్టింది.‘స్టిచ్ ఇన్ టైమ్: ఎవాల్యుయేటింగ్ కన్జూమర్ బిహేవియర్ – ఎలక్ట్రానిక్స్ రిపేర్ యాక్సెసిబిలిటీ’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్లో రిపేరింగ్ కల్చర్ తగ్గిపోతోందని తేలింది. అన్ని ఆదాయ వర్గాల ప్రజల్లోనూ ఇదే ధోరణి ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. వేగవంతమైన వినియోగ సరళిని ప్రతిబింబిస్తూ ఢిల్లీ, హైదరాబాద్లలోని అన్ని ఆర్థిక వర్గాలలోనూ’ రీప్లేస్మెంట్ ట్రెండ్’ బలంగా కనిపిస్తోందని పేర్కొంది.ఓల్డ్ డివైజ్... పాడైతే డోంట్ యూజ్...స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల వంటి ఐటీ, టెలికం పరికరాల విషయంలో హైదరాబాద్లో గణ నీయమైన రీప్లేస్మెంట్ ట్రెండ్ కనిపించింది. పాతబడిన సాంకేతికత, మరమ్మతు ఖర్చుల కారణంగా రూ. లక్ష నుంచి ఐదు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న తక్కువ ఆదాయ వర్గాల్లో ఐటీ పరికరాల రీప్లేస్మెంట్ రేటు అత్యధికంగా 85.71 శాతం ఉంది. టోస్టర్లు, మిక్సర్లు, హెయిర్ స్ట్రెయిటనర్స్ వంటి చిన్న గృహోపకరణాలను 61.54 శాతం మారుస్తుండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్ల వంటి పెద్ద విద్యుత్ ఉపకరణాలను వాటి అధిక ధరల కారణంగా కొంత ఆల స్యంగా మారుస్తున్నారు.ఆదాయ స్థాయిలు పెరిగేకొద్దీ వస్తువుల మార్పిడి రేట్లు కూడా పెరుగుతున్నాయి. అధిక ఆదాయ వర్గాలు సౌకర్యానికి, సాంకేతిక ఉన్నతీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రూ. 20 లక్షలకుపైగా సంపాదించేవారు వస్తువుల మార్పిడికే పెద్దపీట వేస్తున్నారు. ఐటీ, టెలికం పరికరాలు, పెద్ద గృహోపకరణాల మార్పిడి రేటు ఆయా ఆదాయవర్గాల్లో 65 శాతంగా ఉంది.మరమ్మతుల సంస్కృతి తగ్గడానికి కారణాలివే..⇒ గృహోపకరణాలకు మరమ్మతులు చేయించడంలో విడిభాగాల లభ్యత ప్రధాన సమస్యగా ఉంది. ⇒ అధీకృతంకాని మరమ్మతు దుకాణాలు విడిభాగాల కోసం థర్డ్ పార్టీలపై ఆధారపడుతుండటంతో నగర వినియోగదారులు ఆయా దుకాణాలను అంతగా విశ్వసించట్లేదు. ⇒ అసలైన విడిభాగాల అధిక ధర, పరిమిత లభ్యత కారణంగా చాలా మరమ్మతు దుకాణాలు నాన్–ఒరిజినల్ విడిభాగాలపై ఆధారపడుతున్నాయి.⇒ సరైన శిక్షణలేని టెక్నీషియన్లు, పనిచేయని పరికరాల నుంచి విడిభాగాలను సేకరిస్తుండటం లేదా స్థానిక టోకు వ్యాపారులు అనధికారిక మార్కెట్ల నుంచి వాటిని కొనుగోలు చేయడం వల్ల కూడా నగరవాసులు మరమ్మతులవైపు ఆసక్తి చూపించట్లేదు.⇒ సాఫ్ట్వేర్ లాక్లు థర్డ్–పార్టీ మరమ్మతులను నిరుత్సాహపరిచే వారంటీలతో వస్తుండటం కూడా మరో కారణం.రిపేరింగ్ రంగానికి మంచి జరగాలంటే...⇒ అసలైన విడిభాగాలకు థర్డ్–పార్టీ మరమ్మతులపై ఆంక్షలను తొలగించాలి.⇒ సాంకేతిక నిపుణులకు ఆధునిక మరమ్మతు పద్ధతులను అందించడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.⇒ ప్రభుత్వ, ప్రైవేట్ మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.⇒ మరమ్మతులపై క్యాష్బ్యాక్ ఆఫర్లు లేదా పన్ను రాయితీలు ఇవ్వాలి.⇒ గడువుకు ముందే పరికరాలను మార్చే విధానాన్ని నిరుత్సాహపరిచేందుకు గ్రీన్ ట్యాక్స్ విధించడం వంటి చర్యలు చేపట్టాలి.ఈ–వ్యర్థాలను తగ్గిస్తే ముడిపదార్థాల ఆదా..దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి 2010లో 34 బిలియన్ కేజీలు ఉండగా ప్రస్తుత పెరుగుదలనుబట్టి అది 2030 నాటికి 82 బిలియన్ కేజీలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. పరికరాలను మార్చడానికి బదులుగా మరమ్మతు చేయించడాన్ని ఎంపిక చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే శక్తిని, ముడి పదార్థాలను ఆదా చేస్తూనే పెరుగుతున్న ఈ–వ్యర్థాల సమస్యను తగ్గించవచ్చని నివేదిక సూచించింది. -
అభ్యర్థుల ప్రచార పాట్లు!
ఎన్నికల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లడగటం పాత పద్ధతి. పశ్చిమ బెంగాల్లో అభ్యర్థులు ప్రచారం రూటు మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింత పాట్లు పడుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని కుండను పగుల గొట్టడం వంటి ఆటలు ఒకరు ఆడుతుంటే.. మరొక అభ్యర్థి బార్బర్ అవతారమెత్తారు. ఇంకొకరు ఏకంగా వంటింట్లోకి వెళ్లి చపాతీలు చేస్తే.. మరొకరు గుడిలో భజన కీర్తనలు పాడే పరమ భక్తుడిగా మారిపోయారు.చపాతీలు చేస్తూ... అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు అందరికీ తెలిసిందే. హుగ్లీలోని పుర్సురాలో గ్యాస్ లేక కట్టెల పొయ్యితో కుస్తీలు పడుతున్న ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు టీఎంసీ అభ్యర్థి పార్థ హజారీ. ఓ ఇంట్లో నేరుగా కిచెన్లోకి వెళ్లి మట్టి పొయ్యిపై రొట్టెలు చేశారు. సునాయాసంగా రొట్టె చేసి తన పాక కళను ప్రదర్శించారు. ‘‘గతంలో నేను రొట్టెలు చేశాను. వంట గురించి కొంత తెలుసు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక చాలా కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి. వారికి సాయం చేయాలని ప్రయతి్నంచాను’’ అని చెప్పుకొచ్చారు.కళ్లకు గంతలు కట్టుకుని.. రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో అసాధారణమైన ఎన్నికల ప్రచారం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ చంద్ర బౌరీ సంప్రదాయ ‘హండీ ఫోడ్’ ఆట ఆడారు. కళ్లకు గంతలు కట్టుకుని, కుండను కర్రతో పగలగొట్టడానికి ప్రయతి్నంచారు. అయితే కుండ పగులగొట్టడంలో ఆయన విఫలమైనప్పటికీ.. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా ఇలాగే ఓడిపోతుందని సింబాలిక్ చెప్పాలనుకున్నారు. దీనిని బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా విమర్శించారు. కళ్లు మూసుకుని బీజేపీని ఓడించడం సాధ్యం కాదంటూ అధికార పారీ్టపై తవ్రంగా స్పందించిన ఆయన.. సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి క్షురకుడి అవతారమెత్తారు. సాహా దుబ్రాజ్పూర్లో ఒక గ్రామస్తుడికి ఏకంగా గడ్డమే గీశారు! ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.సీపీఎం అభ్యర్థి పూజలు పానిహటిలో సీపీఎం పార్టీ అభ్యర్థి కల్తాన్ దాస్గుప్తా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా పక్కకు పెట్టి మరీ ఏకంగా మహోత్సవ్ తళా ఘాట్ ఆలయంలో ప్రార్థనలతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలాంటి వైరుధ్యాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయని దాస్గుప్తా చెప్పారు. మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత సుభాష్ చక్రవర్తి సైతం ఒకప్పుడు తారాపీఠ్ ఆలయంలో ఇలాగే ప్రార్థనలు చేసి పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు తెరలేపారు. గోపీబల్లవ్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీజేపీ రాజేశ్ మహతో ఏకంగా భక్తుడి అవతారమెత్తారు. ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలోని పటాశిముల్లో ఇంటింటి ప్రచారానికి ముందు హరి నామ సంకీర్తన పాడారు. గ్రామస్తులతో కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సభలో ప్రజలపై గులాల్ చల్లుతూ ఆడుకున్నారు.‘మత్స్య’ రాజకీయాలు బీజేపీ అధికారంలోకి వస్తే మాంసాహారాన్ని నిషేధిస్తుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వాత్ ముఖర్జీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సాల్ట్ లేక్లోని ఐఏ మార్కెట్లో ఆయన ‘కట్ల’ చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ‘‘బెంగాలీ సంస్కృతిలో చేపలు, అన్నం ప్రధానాహారం. అలాంటిది, బీజేపీ గెలిస్తే చేపలను తినకుండా నిషేధం విధిస్తుందని టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘బెంగాలీలకు చేప ఆహారం మాత్రమే కాదు. మన సంప్రదాయం. మన గుర్తింపులో ఒక భాగం. చేప లేకుండా ఏ శుభకార్యమూ ప్రారంభం కాదు. చివరకు పెళ్లి పత్రికలతో కూడా చేపను పంపిస్తారు. అందుకే చేప ద్వారానే నా ప్రత్యర్థులకు సందేశం పంపాలనుకుంటున్నా. చేపలు, అన్నంపై నిషేధం సంగతి అలా ఉంచితే... ప్రజలు కనీసం ఒక చేప ముక్కను కూడా కొనలేని దుస్థితిని టీఎంసీ పాలన తీసుకొచ్చింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలు రెండింతలు ఎక్కువగా చేపలు తినగలుగుతారు’ అని పేర్కొన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్యాస్ తంటాలు.. విద్యుత్ మంటలు
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో విదేశాల్లో బాంబు దాడులు జరుగుతుంటేం ఇక్కడ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. సాగర నగరంలో ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుంటేం మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ఇళ్లల్లో ‘విద్యుత్ మంటలు’ రేపుతున్నాయి. ఈ అసాధారణ పరిస్థితుల ప్రభావంతో నగరంలో విద్యుత్ వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం ఓవైపు ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతుండగాం మరోవైపు యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టౌవ్ల వినియోగం ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది. గత పది రోజులుగా రోజువారీ వినియోగంలో సుమారు 16 శాతం అదనపు లోడు నమోదవుతోంది. మార్చిలోనే మండుతున్న ఎండలు నగరంలో ఎండల ప్రభావం మంటపుట్టిస్తోంది. నడివేసవి రాకముందే ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. గాలిలో ఉష్ణోగ్రతలు 32–34 డిగ్రీల లోపే నమోదవుతున్నా.. ఉక్కబోత మాత్రం 40 డిగ్రీల ప్రభావాన్ని చూపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈసారి వేసవి మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజల్లో ఇప్పుడే గుబులు పుట్టిస్తున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈపీడీసీఎల్ పరిధిలో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి విద్యుత్ వాడకం పెరుగుతుంది. కానీ ఈసారి మార్చి మొదటి వారం నుంచే డిమాండ్ గరిష్ట స్థాయికి చేరింది. 16 మిలియన్ యూనిట్లు అదనం ఈపీడీసీఎల్ పరిధిలో మార్చి నెలలో ప్రతి రోజూ సగటున 78 నుంచి 81 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటుంది. అయితే భానుడి ప్రతాపంతో ఈ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది రోజులుగా రోజువారీ సగటు విద్యుత్ వినియోగం కంటే 14 నుంచి 16 మిలియన్ యూనిట్లు అధికంగా నమోదవుతోంది. ప్రతి రోజూ వినియోగం సెంచరీకి (100 మిలియన్ యూనిట్లు) చేరువలో ఉండటం గమనార్హం. ఈ నెల 7వ తేదీన 96.50 మిలియన్ యూనిట్లు, 12వ తేదీన 96.37 మిలియన్ యూనిట్లుగా నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ‘ఇండక్షన్’ వినియోగం పెరుగుదల విద్యుత్ వినియోగం పెరగడానికి కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు.. విదేశాల్లో జరుగుతున్న యుద్ధం కూడా పరోక్షంగా ఈపీడీసీఎల్పై భారం వేసింది. యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాలో అనిశి్చతి, పెరిగిన సిలిండర్ ధరల ప్రభావం నేరుగా సామాన్యుడి వంటగదిపై పడింది. చాలామంది వినియోగదారులు వంటగ్యాస్కు బదులుగా ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ స్టౌవ్లు, ఇమ్మెర్షన్ హీటర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గృహ వినియోగంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఒక్కో ఇంట్లో వినియోగించే ఇండక్షన్ స్టౌవ్లు గ్రిడ్పై తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నాయి. అధికారుల కసరత్తు శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు జిల్లాలతో పోలిస్తే విశాఖ నగరంలో డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా విశాఖలో ఈ సమయంలో 25 నుంచి 28 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండాలి.. కానీ ఈసారి అది 31 మిలియన్ యూనిట్లు దాటుతోంది. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ఏపీఈపీడీసీఎల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. సాయంత్రం వేళల్లో (పీక్ అవర్స్) గరిష్ట డిమాండ్ 4800 మెగావాట్ల మార్కును దాటుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ల వైఫల్యాలు తలెత్తకుండా తనిఖీలు చేపట్టడంతో పాటు, నిరంతర సరఫరా కోసం గ్రిడ్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. విద్యుత్ పొదుపు పాటించాలి డిమాండ్ పెరుగుతున్నా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నిరంతరం సర్కిల్స్ వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారులు కూడా అనవసరమైన విద్యుత్ వాడకాన్ని తగ్గించి సహకరించాలి. – పృథ్వితేజ్ ఇమ్మడి, ఈపీడీసీఎల్ సీఎండీ -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
ది న్యూ అడిక్షన్ ఎకానమీ.. మీ మెదడుపై అదృశ్య యుద్ధం!
ప్రపంచం మొత్తం మీ అరచేతిలో ఉందని మీరు సంబరపడుతున్నారా? కానీ వాస్తవానికి ఆ అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోనే మిమ్మల్ని బందీని చేస్తోందని మీకు తెలుసా? సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్ను మాత్రమే తయారుచేయడం లేదు; అవి మన ప్రమేయం లేకుండానే మనల్ని బానిసలుగా మార్చే ‘డిజిటల్ డ్రగ్స్’ను డిజైన్ చేస్తున్నాయి. దీనినే నిపుణులు ‘అడిక్షన్ ఎకానమీ’ అని పిలుస్తున్నారు. మీ సమయమే వారి పెట్టుబడి!సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే మనం డబ్బులు చెల్లిస్తాం. కాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని మనం భ్రమపడుతుంటాం. ఒక వస్తువుకు మీరు డబ్బు చెల్లించడం లేదంటే, అక్కడ మీరే ఒక వస్తువు అని అర్థం. మీ సమయం, శ్రద్ధ, వ్యక్తిగత సమాచారమే వారి పెట్టుబడి. మీరు ఫోన్ చూస్తూ గడుపుతున్న ప్రతి అదనపు నిమిషం ఈ కంపెనీల పాలిట ఒక బంగారు గుడ్డు. మీరు ఎంత ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోతే, ఆ కంపెనీల షేర్ల విలువ అంతగా పెరుగుతుంది. 2026 ముగిసే నాటికి సోషల్ మీడియా యాడ్ మార్కెట్ సుమారు రూ.26 లక్షల కోట్లకు చేరుకోనుందంటే, మన ఏకాగ్రతను వారు ఎంత ఖరీదైన వస్తువుగా మార్చారో అర్థం చేసుకోవచ్చు. మెటా, గూగుల్ వంటి సంస్థలు రోజుకు వేల కోట్లు సంపాదిస్తున్నాయంటే, దానికి ఇంధనం మన మెదడులోని డోపమైన్, మన చేతిలోని సమయమే!దిగ్భ్రాంతికర గణాంకాలు 2025–26 నివేదికల ప్రకారం ఇటీవలి గణాంకాలు చూస్తుంటే మనం ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది.→ సగటు భారతీయుడు రోజుకు దాదాపు 6.5 గంటల సమయాన్ని ఇంటర్నెట్పై గడుపుతున్నాడు. ఇందులో మూడు గంటల కంటే ఎక్కువ సమయం కేవలం వినోదం, సోషల్ మీడియాకే పరిమితం. → ఒకప్పుడు మనుషుల్లో పన్నెండు సెకన్లుగా ఉన్న అటెన్షన్ స్పాన్, ఇప్పుడు ఎనిమిది సెకన్లకు పడిపోయింది. ఒక గోల్డెన్ ఫిష్ అటెన్షన్ స్పాన్ తొమ్మిది సెకన్లు. అంటే మనం దానికంటే ఘోరంగా ఉన్నామన్నమాట! → రోజుకు ఐదుగంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న టీనేజర్లలో ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం 35 శాతం పెరిగినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నివేదిక చెబుతోంది. → ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ వల్ల 2025లో భారతీయ కుటుంబాలు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోయినట్లు అంచనా.బయటపడటం ఇలా... ఈ ‘అడిక్షన్ ఎకానమీ‘లో మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని తాకట్టు పెట్టకండి. ఈ రోజే మీ డిజిటల్ ప్రయాణాన్ని నియంత్రించుకోండి. స్మార్ట్ఫోన్ కంటే మీ స్మార్ట్నెస్ గొప్పదని నిరూపించండి! → మీ ఫోన్ స్క్రీన్ను రంగులు లేకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో మార్చండి. రంగులు లేకపోతే మెదడుకు ఆ దృశ్యాలు ఆకర్షణీయంగా అనిపించవు, తద్వారా ఫోన్ వాడకం 30 శాతం తగ్గుతుంది. → ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మెదడుకు చిన్న విరామాన్ని ఇస్తుంది. → డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఫోన్ను అనుమతించకండి. ముఖ్యంగా నిద్రపోయే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టడం వల్ల ’మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి గాఢ నిద్ర పడుతుంది. → మీ ఫోన్లోని సెట్టింగ్స్లో ’డిజిటల్ వెల్–బీయింగ్’ ఆప్షన్ ద్వారా ప్రతి యాప్కు సమయాన్ని కేటాయించుకోండి. సమయం ముగియగానే యాప్ లాక్ అయ్యేలా చూసుకోండి. → ఖాళీ సమయం దొరకగానే ఫోన్ తీయకండి. ఆ ఖాళీ సమయాన్ని ఆలోచనల కోసం, ప్రకృతిని గమనించడం కోసం కేటాయించండి. సృజనాత్మకత ఎప్పుడూ ఖాళీ మెదడులోనే పుడుతుంది.మెదడును హ్యాక్ చేస్తున్న సైకాలజీటెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు వందల సంఖ్యలో సైకాలజిస్టులను నియమించుకుంటాయి. ఎందుకో తెలుసా? మన మెదడులోని బలహీనతలను కనిపెట్టడానికి. జూదం ఒక వ్యసనం. ఒక లాటరీలో ఎప్పుడు జాక్పాట్ తగులుతుందో తెలియదు. సైకాలజిస్టుల సహాయంతో అలాంటి వ్యసనాన్ని సోషల్ మీడియాలో ‘నోటిఫికేషన్స్’ ద్వారా సృష్టించారు. అలాగే మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ప్రేరేపించే డోపమైన్ను రిలీజ్ చేసేలా లైక్స్, కామెంట్స్ పనిచేస్తాయి.నెవెర్ మైండ్ స్మార్ట్ఫోన్ మోసుకొచ్చిన మాయ రోగాల్లో ‘డూమ్ స్క్రోలింగ్’ ఒకటి. ‘డూమ్ స్క్రోలింగ్’ బారినపడిన వారు అదేపనిగా స్మార్ట్ఫోన్లో కలత రేపే వార్తలను స్క్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వార్తలను చూస్తూ ఆందోళనకు, దిగులుకు లోనవుతారు. అయినా, వారు ‘డూమ్ స్క్రోలింగ్’ను నియంత్రించుకోలేరు.సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
వేడి.. ఒత్తి‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్: ఆరుబయట శరీరాన్ని ఒక మోస్తరుగా కదిలించే చిన్నా చితకా పనులు చెయ్యడం, నడక వంటి వ్యాపకాలు ఆరోగ్యదాయకమని అందరికీ తెలిసిందే. ఈ జీవనయోగ్యతకు అధిక వేడి విఘాతం కలిగిస్తోంది. ఎంత సమయం మేరకు ఇలా హరించుకుపోతోందో అమెరికా పరిశోధకులు తాజాగా లెక్కగట్టారు. వృద్ధులే కాకుండా యువత కూడా బోల్డన్ని ‘జీవనయోగ్యమైన గంటల’సమయాన్ని కోల్పోతున్నారో శాస్త్రీయంగా పరిశోధించారు. మిగతా దేశాల్లో కన్నా మన దేశంలోనే జీవనయోగ్యత తగ్గిపోతోందంటున్నారు. భూమి వేడెక్కుతున్న కొద్దీ, తీవ్రమైన వేడి మానవ ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధులకు, పేద ప్రజలకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న వేడితో జీవన సౌలభ్యం తగ్గిపోతోంది. మానవుల పనుల వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల జీవనానందాన్ని హరిస్తున్నాయి. అమెరికా నిపుణుల తాజా అధ్యయనంలో ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ ల్యూక్ అలెగ్జాండర్ పార్సన్స్ నేతృత్వంలో పలు అమెరికా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ‘ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్:హెల్త్ జర్నల్’లో ఇటీవల ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. నడవడం లేదా రోజువారీ తేలికపాటి ఇంటి పనులను సురక్షితంగా చేసుకునే సామర్థ్యాన్ని వేడి ఎలా ప్రభావితం చేస్తున్నదో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గంటల వారీ ఉష్ణోగ్రత, తేమకు సంబంధించిన డేటాను (1950–2024) విశ్లేషించారు. ఆరోగ్యవంతులైన యువకులు (18–40 సంవత్సరాలు), వృద్ధుల(65 ఏళ్లు పైబడినవారు) పై దృష్టి కేంద్రీకరించారు. ‘జీవనయోగ్యత’అంటే?ప్రజలు వేడి వలన శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరగకుండా.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు శారీరక శ్రమను కలిగించే రోజువారీ (కూర్చోవడం, నడవడం, తేలికపాటి ఇంటిపనులు) పనులను సురక్షితంగా, సౌకర్యవంతంగా చెయ్యగలిగే సానుకూల వాతావరణ పరిస్థితులను ‘జీవనయోగ్యమైన’(లివబుల్) కాలంగా చెప్పుకోవచ్చు. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఈ సౌలభ్యం తగ్గిపోతోంది. అనుదినం విలువైన ‘జీవనయోగ్యమైన సమయం’అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నానాటికీ ఇది కుంచించుకోపోతోందని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్గారాలు తగ్గించాల్సిందే..జనసాంద్రత ఎక్కువగా ఉండే దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో, ప్రజలకు వేడి బాధలు ఎక్కువని కూడా ఈ అధ్యయనం తేల్చింది. భారతీయ యువత 10 వేల కోట్ల గంటలు, వృద్ధులు లక్ష కోట్ల గంటలకు పైగా హాయిగా గడిపే ‘జీవనయోగ్యమైన’సమయాన్ని కోల్పోయారని చెబుతోంది. వేడి ఒత్తిడిని తట్టుకోవటంలో వృద్ధులకు తక్కువ సామర్థ్యం ఉంటుంది కాబట్టి వీరికి ఎక్కువ గంటలు అసౌకర్యం కలుగుతోందని గుర్తించారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, వేడిని తట్టుకోవటానికి మరింత గట్టి చర్యలు తీసుకోకపోతే, ఈ ముప్పు మరింతగా పెరుగుతూనే ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.వృద్ధుల్లో 78%,యువతలో 35% బాధితులుగత 75 సంవత్సరాలుగా వేడి ప్రాంతాలలో ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఆరుబయట గడపగలిగే గంటల సంఖ్య తగ్గిపోయిందని, తద్వారా జీవనయోగ్యత కూడా తగ్గిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో, అల్పాదాయ ప్రాంతాల్లో ప్రజలు చాలా వేడి సమయాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి సంవత్సరం వందల నుంచి వేల గంటలను వేడి వాతావరణంలో గడుపుతున్నారు. వృద్ధులు ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నారు. కొన్ని నివాస ప్రాంతాల్లో సంవత్సరానికి 3,000 గంటల వరకు సురక్షితం కాని స్థాయిలో వేడి ఒత్తిడిని అనుభవిస్తున్నారు. కలిగిన కుటుంబాల్లోని వృద్ధులు నీడ పట్టున లేదా ఏసీ గదుల్లో గడుపుతుంటే.. పేద వృద్ధులు బయట పనులు ఎక్కువ సేపు చెయ్యలేక తక్కువ సంపాదనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.వృద్ధులకే ఎక్కువ ఇబ్బంది వృద్ధులకు వేడి వలన కలిగే ఇబ్బంది యువతతో పోల్చితే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏటా సగటున 900 గంటల పాటు వీరు వేడి వల్ల తీవ్ర అసౌకర్యంగా జీవిస్తున్నారు. 1950లలో ఇది సంవత్సరానికి 600 గంటలే. దీని అర్థం ఏమంటే, సంవత్సరంలో సుమారు 10 శాతం కాలం పాటు, తీవ్రమైన వేడి కారణంగా వృద్ధులు ఆరుబయట తేలికపాటి పనులు చేయటం కూడా సురక్షితం కాదు. ఆ మేరకు వారు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతుంది. ఒకే రకమైన పరిసర ఉష్ణోగ్రత, తేమ ఉన్నప్పటికీ యుక్తవయసు్కల శరీరాలు చెమటను విడుదల చేయడం ద్వారా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడం లేదా చల్లబరచుకోవడం జరుగుతుంది. అయితే, వృద్ధుల శరీరాలు ఈ పనిని అంత సమర్థవంతంగా చేయలేవని పరిశోధకులు వివరించారు. -
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్ -
ఇంగ్లీష్... ఈజీగా!
ఇంగ్లీష్ అనేది హిందూ మహాసముద్రమంత పెద్దది. ఎంత నేర్చుకున్నా.... నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. కొద్దిమందికి ఇంగ్లీష్ బాగానే అర్థం అవుతుంది. కాని రెండు మూడు వాక్యాలు కూడా ధైర్యంగా మాట్లాడలేరు. కొందరు ఏదో రకంగా ఇంగ్లీష్ మాట్లాడతారుగానీ, ఆ భాషకు సంబంధించిన జ్ఞానం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అర్పిత్ మిట్టల్ ‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రూపకల్పన చేశాడు. తొలి అడుగుతోనే ఆదరణను సొంతం చేసుకున్నాడు...‘స్పేస్ఎక్స్.ఏఐ’కి రెండు లక్షల సంఖ్యలో మంత్లీ యూజర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది చిన్న చిన్న పట్టణాలకు చెందినవారే. గూగుల్ ప్లేలో ఈ యాప్ డౌన్లోడ్లు కోటి దాటాయి. ‘స్పేస్ఎక్స్.ఏఐ’ ఫౌండర్ హోదాలో దిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నాడు అర్పిత్.‘ఎడ్టెక్ ప్లాట్ఫామ్లు ఏఐని ఫీచర్లా ఉపయోగిస్తున్నాయి. మా ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఏఐ అనేది యాంత్రికంగా ఉండదు. టీచర్లాగే వ్యవహరిస్తుంది’ అంటాడు అర్పిత్ మిట్టల్.ప్రాక్టికల్గా మాట్లాడేలా...యాప్ ఓపెన్ చేయగానే సుదీర్ఘమైన గ్రామర్ పాఠాలు వినిపించవు. ఇతరులతో సహజంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సంక్లిష్టమైన గ్రామర్ పాఠాలతో కాకుండా ప్రాక్టికల్గా, సులభంగా ఇంగ్లీష్ మాట్లాడేలా చేస్తుంది. ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్, వర్క్ప్లేస్ డిస్కషన్స్, కస్టమర్ కాల్...మొదలైన వాటి ద్వారా ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయిస్తాం. ఏ రకంగా చూసినా గురువుకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు. అయితే ప్రాక్టిస్ టైమ్పై పరిమితిని తొలగించడం ద్వారా గుడ్ టీచింగ్కు ఇది సరిౖయెన వేదిక అవుతుంది’ అంటున్నాడు అర్పిత్. అందరికి ఒకేలా అని కాకుండా ప్రతి సెషన్ పర్సనల్ యూజర్లకు అనుగుణంగా ఉంటుంది. ఈ లెర్నింగ్ యాప్ కోర్ లాజిక్ విషయానికి వస్తే....‘రిపిటీషన్ ద్వారా మాట్లాడడం అనేది మెరుగుపడుతుంటే, రిపిటేషన్లు కొనసాగనివ్వండి’ మరొకటి...‘ప్రతి లెర్నర్కు అపరిమితంగా మాట్లాడే సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రాక్టిస్ గ్యాప్ లేకుండా చూడడం’ఏ యాసలో మాట్లాడినా సరే!→ మన దేశంలో ఇంగ్లీష్ నేర్చుకునేవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. రెండు మూడు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడలేని వారి నుంచి, అనర్గళంగా మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వారు ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యాసకుల స్థాయికి అనుగుణంగా మా జనరేటివ్ ఏఐ తనను తాను సర్దుబాటు చేసుకుంటుంది. శ్రద్ధగా నేర్చుకునేలా చేస్తుంది. వారు మాట్లాడే విధానం, ఉచ్చారణ, ఉపయోగించే పదాలు...మొదలైన వాటిని విశ్లేషిస్తుంది. ఉదాహరణకు... ఒక లెర్నర్ ప్రాథమిక వాక్యాలను సులభంగా చెప్పగలుగుతుంటే కొత్త పదాలు, జాతీయాలను ఉపయోగించి సంక్లిష్టమైన వాక్యాలు రాయడానికి ప్రయత్నించమని ఏఐ వారికి సలహా ఇస్తుంది. మన దేశంలో అనేక రకాల యాసలు ఉన్నాయి. అవి ఒకే రాష్ట్రంలో కూడా విభిన్నంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుండి సేకరించిన నిజమైన స్వరాలతో సిస్టమ్కు శిక్షణ ఇచ్చాం. దీనివల్ల లెర్నర్స్ పంజాబీ, బెంగాలీ, తమిళం, మరాఠీ... ఏ యాసలో మాట్లాడినా సరే, అది అర్థం చేసుకొని కచ్చితమైన ఫీడ్బ్యాక్ను అందిస్తుంది.→ పది మిలియన్ల డౌన్లోడ్ల స్థాయికి చేరుకోవడం రాత్రికి రాత్రి జరగలేదు. ఒకే ఒక్క చానెల్ ద్వారా సాధ్యపడలేదు. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించి లెర్నర్లు ఎదుర్కొంటున్న సమస్యలను 360 డిగ్రీల కోణంలో అర్థం చేసుకొని, విశ్లేషించుకొని ప్లాట్ఫామ్కు రూపకల్పన చేశాం. భయంభయంగా కాకుండా ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్ మాట్లాడేలా చేశాం. మన దేశంలో స్పోకెన్ ఇంగ్లీష్ సాధనాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే ఎంత ఎక్కువమందికి చేరువ అవుతామనేదే అసలు సిసలు విజయం. మౌత్టాక్ మా విజయానికి ప్రధాన కారణం.→ మేము కేవలం కొన్ని భాషలను నేర్పించడానికో లేదా ప్రజలను ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం కోసం సిద్ధం చేయడానికో ప్రయత్నించడం లేదు. నిజజీవిత సంభాషణలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉదాహరణకు ఆఫీసులో మేనేజర్తో ఎలా మాట్లాడాలి, డాక్టర్కు అనారోగ్య లక్షణాలను ఎలా వివరించాలి, ఇంటర్వ్యూలలో ఆత్మవిశ్వాసంతో తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలి...మొదలైనవి. నిజజీవిత సందర్భాలను దృష్టిలో పెట్టుకొని పాఠాలను డిజైన్ చేయడం వల్ల లెర్నర్లు తమకు అలవాటైన వాతావరణంలో ఉన్నట్లు భావిస్తారు. దీంతో వారు ఉత్సాహంగా, వేగంగా నేర్చుకుంటారు.– అర్పిత్ మిట్టల్, ఫౌండర్, స్పేస్ఎక్స్.ఏఐ -
సోషల్ మీడియాతో సంతోషం ఆవిరి!
హెల్సింకీ: ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా యువతలో సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. లేనిపోని ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా పశి్చమ దేశాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్–2026’ఇదే విషయం వెల్లడించింది. గ్యాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సస్టెనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ఈ నివేదిక రూపొందించారు. అధ్యయనంలో భాగంగా 147 దేశాల్లో లక్షల మందిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యంత సంతోషంగా ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈసారి టాప్–10 జాబితాలో ఫిన్లాండ్తోపాటు ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్కు 29వ ర్యాంకు లభించింది. భారత్కు 116వ ర్యాంకు దక్కింది. నివేదికలోని కీలక అంశాలివీ.. → కోస్టారికా దేశం 2023లో 23వ స్థానంలో ఉండగా, 2026లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. → ఏమాత్రం సంతోషంగా లేని దేశాల్లో అఫ్గానిస్తాన్, సియెర్రాలియోన్, మలావీ నిలిచాయి. → అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో 25 ఏళ్లలోపు యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. సంతోషానికి దూరమవుతున్నారు. → మనుషులు సంతోషంగా ఉండాలంటే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సామాజికంగా ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. → సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉన్న దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉంటున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ ఎమ్మానుయేల్ డీ నెవ్ చెప్పారు. లాటిన్ అమెరికా దేశాల్లో కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టంచేశారు. → ఫిన్లాండ్తోపాటు ఉత్తర యూరోపియన్ దేశాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటన్నది పరిశీలిస్తే.. అక్కడి సంపద, ఆ సంపద పంపిణీలో సమానత్వం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉండడం, ఆర్థిక విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం వంటివి కనిపిస్తాయి. -
ఇరాన్ ఆయువుపట్టు.. సౌత్ పార్స్
సౌత్ పార్స్. ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే అత్యంత కీలకమైన సహజవాయువు క్షేత్రం. తాజాగా ఈ క్షేత్రంపై అమెరికా దాడి చేయడంతో ఇరానియన్లకు ఒక్కసారిగా విద్యుత్ కష్టాలు వచ్చిపడ్డాయి. శీతాకాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు మొదలు పరిశ్రమల్లో ముడిసరుకు దాకా ఇదే సౌత్ పార్స్ నుంచి సరఫరా అయ్యే సహజవాయువునే ఇరాన్లో ఉపయోగిస్తున్నారు. దీంతో సౌత్ పార్స్ క్షేత్రం ఇరాన్కు ఎంతటి కీలకమైందనే అంశం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వేల కిలోమీటర్లలో విస్తరించి.. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ సహజవాయు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఇరాన్లోని అసలూయే నగరానికి సమీపంలో పర్షియన్ గల్ఫ్ సముద్రతీరంలో ఏకంగా 9,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడ సహజవాయువు నిల్వలను తొలిసారిగా కనుగొన్నారు. ఇంతటి భారీ నిల్వలను సొంతంగా ప్రాసెసింగ్ చేసి, నిల్వ చేసి, వ్యాపారంచేసే శక్తిసామర్థ్యాలు ఇరాన్కు లేవు. దీంతో పొరుగుదేశం ఖతర్ను సాయం కోరింది. దీంతో ఖతర్, ఇరాన్లు సంయుక్తంగా గ్యాస్ఫీల్డ్ను అభివృద్ధి చేశాయి. ఇరాన్ ప్రధానభూభాగం వైపు ఉన్న క్షేత్రాన్ని సౌత్ పార్స్గా, మిగతా క్షేత్రాన్ని నార్త్ ఫీల్డ్గా పిలుస్తున్నారు. నార్త్ ఫీల్డ్ను ఖతర్ నిర్వహిస్తోంది. మొత్తం సహజవాయు క్షేత్రంలో 33 శాతం భూభాగాన్నే సౌత్ పార్స్గా పిలుస్తారు. దీని మీదనే అమెరికా దాడిచేసింది. ఇరాన్ 80 శాతం దేశీయ నేచురల్ గ్యాస్ అవసరాలను సౌత్ పార్స్ క్షేత్రమే తీరుస్తోంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ద్రవరూప సహజవాయువును అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం ఇరానే. ఇరాన్ ఈ క్షేత్రంలో తయారైన లిక్విడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ)తోనే దేశవ్యాప్తంగా విద్యుత్ను తయారుచేస్తోంది. శీతాకాలంలో గడ్డకట్టే చలి నుంచి రక్షణ కోసం ఇళ్లను వేడిచేసే హీటింగ్వ్యవస్థలకు ఈ గ్యాసే ప్రాణాధారం. ఇరాన్ పరిశ్రమల్లో ముడిపదార్థంగానూ ఇదే గ్యాస్ అక్కరకొస్తోంది. దేశ ఇంధన జీవనాడిగా మారిన సౌత్ పార్స్పై అమెరికా దాడులతో ఇరాన్ ఇంధన కష్టాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తమ ప్రాణాధార వ్యవస్థ మీదనే దాడులు జరగడంతో ఇరాన్ ఇకపై మరింతగా దాడులతో చెలరేగిపోయే ప్రమాదముందని ఇంధన నిఘా సంస్థ ‘మాంటెల్ న్యూస్’లో భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఆండ్రిస్ కాలా చెప్పారు. కొంత ఎల్ఎన్జీని ఇరాక్కూ ఇరాన్ సరఫరాచేస్తోంది. వాస్తవానికి ఎల్ఎన్జీని ఎగుమతి చేసేందుకు ఇరాన్ మూడు ప్రాజెక్టులను తీసుకొచ్చినా అమెరికా అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అవి కార్యరూపం దాల్చలేదు – సాక్షి, నేషనల్ డెస్క్ -
రస్ లఫాన్.. ఇండియాకు కీలకం
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్తో కలిసి గ్యాస్క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్జీ కంటైనర్ షిప్లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతోంది. ఖతర్కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, సీఎన్జీ, పీఎన్జీ అంతా ఇక్కడే.. భారత్లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్ఎన్జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదీ ఏఐ ప'వార్'!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఉక్రెయిన్ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం. దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..1. అమెరికా: మొత్తం బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్ డాలర్లు కేటాయించారు.2. చైనా: మొత్తం బడ్జెట్ 314 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్ క్లస్టర్ల కోసం 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.3. రష్యా: మొత్తం బడ్జెట్: 149 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.4. భారత్: మొత్తం బడ్జెట్: 93.5 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ కలిసి ‘మిషన్ సుదర్శన్ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..1. ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ: ది గోస్పెల్ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్ టార్గెట్ సిస్టమ్. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. లావెండర్: సోషల్ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. వేర్ ఈజ్ డాడీ?: లావెండర్ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్ సాధనం. స్మార్ట్ షూటర్స్: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్–సైట్స్. 2. ఉక్రెయిన్–రష్యా యుద్ధం: అటానమస్ డ్రోన్లు: రష్యన్ జీపీఎస్ జామింగ్ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. డెల్టా సిస్టమ్: ఇది ఉక్రెయిన్ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్ టైమ్ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 3. వెనిజులానికోలస్ మదురోను పట్టుకోవడానికి కారకాస్లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని (పలాంటిర్ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. ఇరాన్ (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ): కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్ మావెన్, క్లౌడ్ ఏఐని ఉపయోగించారు. -
ఒంటరి.. డిజిటల్ దరి
సాక్షి, స్పెషల్ డెస్క్ : పట్టణీకరణ, పని ఒత్తిడి, మారుతున్న సామాజిక సంబంధాలు.. కారణం ఏదైనా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేవలం పనిముట్టుగా మాత్రమే కాకుండా మనుషులకు ఒక ‘డిజిటల్ తోడు’గా మారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో కోట్లాది మంది వినియోగదారులు ఏఐ కంపానియన్ యాప్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 18–30 ఏళ్ల వయసు వారు ఈ యాప్స్ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ యాప్స్ మనుషులతో స్నేహితుల్లా లేదా ఒక తోడులా సంభాషిస్తున్నాయి. సాధారణ చాట్బాట్స్ కంటే ఇవి భిన్నమైనవి. వినియోగదారుల భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికి తగినట్లుగా స్పందిస్తాయి.ఐటీ ఉద్యోగుల వాడకమే అధికం..వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా కేవలం కాలక్షేపం కోసం ‘డిజిటల్ స్నేహితుల’తో యూజర్లు గంటల తరబడి గడుపుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని యువత, ఐటీ ఉద్యోగులు వాటిని అధికంగా ఉపయోగిస్తున్నారు. వాటి వాడకం వల్ల వినియోగదారుల్లో 30% నుంచి 50% వరకు సానుకూల మార్పు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగిస్తున్నట్లు అంచనా. యూజర్లపరంగా అమెరికా అగ్రస్థానంలో ఉంది.ఇదీ మార్కెట్..నాస్కామ్ లెక్కల ప్రకారం 2024లోప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపానియన్ మార్కెట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 30.8% వార్షిక వృద్ధిరేటుతో 2030 నాటికి 140.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం 2024లోభారత్లో ఏఐ కంపానియన్ మార్కెట్ ఒక బిలియన్ డాలర్లుగా ఉంది. 40.4% వార్షిక వృద్ధితో 2030 నాటికి 7.9 బిలియన్ డాలర్లనుతాకుతుందని అంచనా.రోజుకు 45 నిమిషాలు..» భారత్లో ఏఐ కంపానియన్ యాప్స్ వినియోగం ప్రపంచ సగటు కంటే 40% వేగంగా పెరుగుతోంది.» సగటున ఒక్కో వినియోగదారు రోజుకు45 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు.» వినోదం కోసమే కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఆధారం: నాస్కామ్, సెన్సార్ టవర్, టెక్నావియో, గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రయోజనాలు ఇవీ..» సామాజికంగా ఒంటరినని బాధపడే వారికి ఈ యాప్స్ 24/7 అందుబాటులో ఉండే స్నేహితుడిలా తోడుంటాయి. » కొన్ని యాప్స్ ఒత్తిడి,ఆందోళన, కుంగుబాటుతగ్గించడానికి ‘కాగ్నిటివ్బిహేవియరల్ థెరపీ’ పద్ధతులను వాడుతూసహాయపడతాయి. » మనుషులతో మాట్లాడితే వారు మనల్ని జడ్జ్ చేస్తారనే భయం ఉంటుంది. కానీ ఏఐతో ఎలాంటి సంకోచం లేకుండా మనసులోని మాటలు పంచుకోవచ్చు.నష్టాలూ ఉన్నాయి» మన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల డేటా హ్యాక్ అయ్యే లేదా ప్రకటనల కోసం అమ్ముడయ్యే ప్రమాదం ఉంది. » మనుషుల కంటే ఏఐతోనే ఎక్కువ సమయం గడపడం వల్ల నిజజీవితంలో సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయి, మనుషులతో మాట్లాడటం కష్టంగా మారవచ్చు. » మనుషులు ఏఐ స్నేహితులకు బానిసలుగా మారే ప్రమాదం. » ఏఐ ఇచ్చే సలహాలు వాస్తవ విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉండే అవకాశం. -
పేద మహిళలకు క్లైమేట్ బీమా
అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందే పేద మహిళలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అభద్రతకు గురవుతున్నారు. తీవ్ర వడగాడ్పులు, భారీ వర్షాలు, తీవ్ర చలిగాలులు వీచే రోజుల్లో పనులకు వెళ్లలేకపోతే ఆదాయం ఉండదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పొట్ట తిప్పలకు పనులకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో అనారోగ్యాల పాలవుతున్నారు. వీరికి ఆదాయ, ఆరోగ్య భద్రతను కల్పించడానికి కొన్ని రాష్ట్రాల్లో ‘పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్’ను అమలు చేస్తున్నారు. – (సాక్షి స్పెషల్ డెస్క్)పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్ అంటే..ఈ పని బీమా పాలసీ తీసుకున్న వారికి మాత్రం.. వేడి, చలి, వాన ఒక పరిమితికి మించితే చాలు వీరు పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే భద్రంగా ఉంటూ బీమా పరిహారం పొందొచ్చు. వాతావరణం మామూలుగా ఉంటేనే పేద మహిళలకు రోజువారీ పనులు సజావుగా దొరుకుతాయి. వాతావారణంలో ఏ మాత్రం తేడా వచ్చినా వారికి పని ఉండదు. పట్ట ణ / గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండ్లు/ నెత్తిమీద బుట్టలు పెట్టుకొని సరుకులు అమ్ముకునే వారు, చిరు వ్యాపార సంస్థల్లో పనిచేసే వారు, చిన్నాచితకా కూలి పనులు, వ్యవసాయ మహిళా కార్మికులకు రెక్కాడితే గాని డొక్కాడదు. ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పని మానితే ఆదాయం పోతుందన్న బెంగతో పనులు కొనసాగిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వారికి ఆదాయ భరోసా ఇవ్వటానికి ప్రారంభమైనదే పారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూరెన్స్.అనేక రాష్ట్రాల్లో అమలుపారామెట్రిక్ క్లైమేట్ ఇన్సూ్యరెన్స్ను తొలుత అమలు చేసిన రాష్ట్రం నాగాలాండ్. కేరళలో పాల సహకార మార్కెటింగ్ సమాఖ్య 1,500 ఎంఎంకి మించి అధిక వర్షపాతం వల్ల పనిదినాలు కోల్పోయే వారికి బీమా అమలు చేస్తోంది. గుజరాత్లో ఈ బీమా పథకాన్ని నేషనల్ ఇన్సూ్యరెన్స్ వైమో సేవ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సహకార బీమా సంస్థ అమలు చేస్తోంది. ఆహ్మదాబాద్, పరిసర జిల్లాల్లో 2023 ఏప్రిల్లో వైమో సేవ సంస్థ ఈ బీమాను తొలుత అమలు ప్రారంభించింది. 2024 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్ లలోని 22 జిల్లాలో 50 వేల మంది 18–70 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ బీమా కల్పించారు. » వడగాడ్పుల బీమా ప్రీమియంగా ప్రతి మహిళ రూ.350 ప్రీమియం చెల్లించాలి. 43.2 డిగ్రీల సెల్సియస్కు మించి ఉష్ణోగ్రత ఎన్ని రోజులు పెరిగితే అన్ని రోజులకు ఒకరికి రోజుకు రూ.400 చొప్పున (అత్యధికంగా రూ. 3 వేలు) పరిహారంగా చెల్లిస్తున్నారు. » 45.28 అంగుళాలకు మించి వర్షపాతం వల్ల పనులు కోల్పోయినా పరిహారం ఇచ్చే బీమాను కూడా అమలు చేస్తున్నారు. ప్రీమియం రూ.425. అత్యధికంగా రూ. 7 వేల వరకు పరిహారం చెల్లిస్తున్నారు. » ఉష్ణోగ్రత, వర్షపాతం పెరుగుతున్న కొద్దీ పరిహారం తదనుగుణంగా పెరుగుతుంది.పారామెట్రిక్ బీమా అవసరం ఏమిటి?» 2023లో కనీవిని ఎరుగనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం గుర్తుంది కదా. దాదాపు వంద రోజుల పాటు ఒక మోస్తరు వడగాడ్పులు వీచాయి. ఆరుబయట పనులు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయటం ప్రమాదకరంగా మారింది. 2024, 2025లలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. » ఆ ఏడాది అతి ఉష్ణం వల్ల మన దేశం 18,100 కోట్ల పని గంటలు కోల్పోయింది. తద్వారా రూ. 13 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని లాన్సెట్ అంచనా వేసింది. » మహిళలు ఎక్కువ క్లైమేట్ రిస్క్కు గురవుతుంటారు. గర్భస్రావాలు లేదా నెలలు నిండకుండానే ప్రసవించటం వంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఉంటారు. » మన దేశంలో ఆదాయం కోసం పనిచేసే మహిళల్లో 92% మంది చిన్నా చితకా రోజువారీ పనులు చేసుకొని పొట్టపోసుకునేవారే. » ప్రతికూల వాతావరణం వల్ల మహిళల సారథ్యంలోని కుటుంబాలు ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోతున్నాయని ప్రపంచవ్యాప్త అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పరిమితికి మించి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే మహిళ సారథ్యంలోని కుటుంబానికి 34% ఆదాయం తగ్గిపోతోందని ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ–2024) అంచనా. » ఎండాకాలంలో 97% మంది అసంఘటిత రంగ మహిళా కార్మికుల ఆదాయం తగ్గిపోతోంది. వేడి వల్ల పని సామర్థ్యం తగ్గిపోవటంతో 20–25% రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. -
ప్రతి ముగ్గురిలో ఒకరికి నకిలీల బెడద
సాక్షి, స్పెషల్ డెస్క్: కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టుగా.. ఔషధాలు, ఎల్రక్టానిక్స్, రెడీమేడ్స్, ఎఫ్ఎంసీజీ.. ఇలా దాదాపు అన్ని విభాగాల్లోనూ నకిలీ వస్తువుల తాకిడి భారతీయ వినియోగదారుల మార్కెట్లను ముంచెత్తుతోంది. పది మంది పట్టణ వినియోగదారుల్లో తొమ్మిది మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా నకిలీ ఉత్పత్తిని కొనుగోలు చేశారంటే మన రిటైల్ వ్యవస్థలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. లాభాపేక్షలేని అథెంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (ఏఎస్పీఏ), రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ సంయుక్తంగా విడుదల చేసిన స్టేట్ ఆఫ్ కౌంటర్ఫీటింగ్ ఇన్ ఇండియా 2025 నివేదిక ప్రకారం.. ఏడాది కాలంలో సుమారు 35% మంది పట్టణ వినియోగదారులు నకిలీ ఉత్పత్తుల బారిన పడ్డారు. ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ విడిభాగాలు, దుస్తులు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి విభాగాల్లో నకిలీ వస్తువుల ప్రభావం పెరుగుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్లలో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఏడాది కాలంలో నకిలీ వస్తువుల బెడద పెరిగిందని 74% మంది నమ్ముతున్నారు. మూడింట రెండొంతుల మంది తాము నకిలీ ఉత్పత్తులను గుర్తించగలమని విశ్వాసంగా ఉన్నప్పటికీ.. మరిన్ని అవగాహన కార్యక్రమాలు అవసరమని 93% మంది భావిస్తున్నారు. సింహభాగం ఆన్లైన్లో.. గత 12 నెలల్లో తాము నకిలీ దుస్తులను చూశామని లేదా కొనుగోలు చేశామని దాదాపు మూడింట ఒక వంతు మంది వినియోగదారులు తెలిపారు. నకిలీ ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయాలు ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్ మార్కెట్లలోనూ దర్శనమిస్తున్నాయి. రోజువారీ వినియోగ వస్తువులపైనా వాటి ప్రభావం పెరుగుతోంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, గృహ వినియోగ వస్తువుల వంటి ఎఫ్ఎంసీజీ విభాగాల్లో కౌంటర్ఫీట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఔషధాల నకిలీలు ప్రజారోగ్యానికి పెద్ద సవాల్గా మారుతున్నాయి. కౌంటర్ఫీట్ ఆటోమోటివ్ విడిభాగాలు వాహనాల పనితీరును, విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా భద్రత పరంగా తీవ్ర ఆందోళనలను కలిగిస్తున్నాయి. గృహోపకరణాలు, ఎల్రక్టానిక్స్తో కూడిన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా నకిలీల బెడద పెరుగుతోంది. నకిలీ వ్యవసాయ ముడిసరుకులు పంట దిగుబడి, రైతుల ఆదాయం, ఆహార భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. అయితే కౌంటర్ఫీట్ వస్తువుల కొనుగోళ్లలో సగానికి పైగా ఆన్లైన్ చానళ్ల ద్వారానే జరుగుతున్నాయి. ఆరోగ్యం, క్షేమానికి ముప్పు.. నకిలీల బెడద దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఒక అంతర్జాతీయ సమస్య. నకిలీ వస్తువులు వినియోగదారుల ఆరోగ్యం, క్షేమానికి ముప్పు కలిగించడమే కాకుండా మార్కెట్ పోటీని దెబ్బతీస్తాయి. అసలైన తయారీదారులకు నష్టం కలిగిస్తాయి. ప్రభుత్వాలకు పన్ను ఆదాయం రాకుండా చేస్తాయి. భారత్లో మూడేళ్లలో నకిలీ ఘటనలు పెరిగాయి. నకిలీ వస్తువులను తయారు చేసేవారు సాంకేతికంగా మరింత బలపడ్డారు. ఈ–కామర్స్ వృద్ధి, మార్కెట్ల ప్రపంచీకరణ వల్ల నకిలీలపై పోరాటం మరింత సవాలుగా మారిందని నివేదిక వెల్లడించింది. నకిలీ వస్తువుల నిరోధానికి, అక్రమ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలో అథెంటికేషన్ (ధ్రువీకరణ) వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంగా ఏఎస్పీఏ 1998 నుంచి పనిచేస్తోంది. వివిధ రంగాల్లో నకిలీల ప్రభావం.. » దుస్తులు: 31% » వ్యవసాయ ఉత్పత్తులు: 30% » మందులు: 28% » ఎఫ్ఎంసీజీ: 27% » వాహన విడిభాగాలు: 22% » ఎల్రక్టానిక్స్: 18% కొనుగోలు మార్గాలు.. » ఆన్లైన్ ప్లాట్ఫామ్స్: 53% » స్థానిక దుకాణాలు: వ్యవసాయ ఉత్పత్తులు 75%, మందులలో 63% వాటా » సోషల్ మీడియా: దుస్తుల విభాగంలో 46%, ఎలక్ట్రానిక్స్లో 35% వాటా వినియోగదారుల వైఖరి.. » ధర వ్యత్యాసం: కౌంటర్ఫీట్ గూడ్స్ అసలైన వాటికంటే 22% చౌకగా ఉంటాయని అంచనా » అదనపు చెల్లింపు: అసలైన వస్తువుల కోసం సగటున 9% అదనంగా చెల్లించడానికి కస్టమర్లు సిద్ధం » ఫిర్యాదు చేసే ధోరణి: నకిలీ వస్తువులపై ఫిర్యాదు చేసేందుకు 50% మంది రెడీ -
ఆరు రుచుల పండుగ
ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. ఈ రుచులు లేకపోతే స్వాదిష్టత లేదు. ఈ అనుభూతులు లేనిది జీవితం కాదు. అందుకే ఉగాది మనల్ని అన్ని రుచులతో అన్ని అనుభూతులతో అనుదినాన్ని సెలబ్రేట్ చేసుకోమని అంటున్నారు సాహితీవేత్త జి.వి. పూర్ణచందు‘రుచి’లో సంస్కృతి ఉంది. సౌందర్యం ఉంది. అనుభూతి ఉంది. ఆనందం ఉంది. ‘రుచించటం’ అంటే కమ్మగా మనసుకు అంగీకార యోగ్యంగా, ఙ్ఞానదాయకంగా ఉండటం అని! ఉగాదిని ఆరు రుచుల పండుగగా భావించటం వలన రుచులు మన శరీరంపై, మనసుపై, మస్తిష్కంపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం అవుతుంది. ఉగాది నాలుకకు, మనసుకు, మెదడుకు సంబంధించిన రుచుల సమ్మేళనంగా జరిగే పండుగ. తెలుగులో ‘ఉగము’ అంటే ఆయువు. ‘ఆద’ అంటే కష్టం. ‘ఆదట’ అంటే ప్రేమ, తృప్తి. కాబట్టి ‘ఉగాది’ సుఖదుఃఖాల్ని, నిర్మాణ విచ్ఛిన్నాల్ని, తీపి పులుపుల్ని సమన్వయం చేసుకుంటూ సాగిపోవాలని, జీవితాన్ని ప్రేమించి సంతృప్తి పొందాలని, ఉన్నతికి మెట్లు పరుచుకోవాలని మనకు సూచిస్తోంది. ఉగాది నుండి ఉగాది దాకా జరిగే పరిణామాల్ని, ఎదురయ్యే అవరోధాల్ని గోచార రీత్యా అంచనావేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు తెలుగువాడు!మనసు రుచులు రుచులు ఆరు... తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఒక్కో రుచికీ ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈ ఆరు రుచులూ శరీరానికే కాదు మనసుకూ మెదడుకు కూడా పోషణ నిస్తాయి. ఆహారంలోని ఆరు రుచులే సత్త్వ రజస్తమో గుణాలను ప్రేరేపిస్తున్నాయని భగవద్గీత పేర్కొంది. ‘యథా అన్నం తథా మనః’ ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. భోజనం అనేది కడుపు నింపి పోషించటానికే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. నోటికైనా, మనసుకైనా, మెదడుకైనా రుచులు ఆరే! జీవితానికి ఆనందాన్ని, సంప్రదాయాన్ని, సామూహిక అనుభూతిని అందించేది ఆరు రుచులతో కూడిన ఆహారం. ఉగాది పండుగ ఈ ఆరు రుచుల ప్రాధాన్యతని నొక్కి చె΄్తోంది.త్రిగుణాత్మక రుచులుమనిషి మెదడులోని ఆలోచనలను తమోగుణం నియమిస్తే, రజోగుణం ప్రవర్తింపచేస్తే, సత్త్వగుణం నియంత్రిస్తుందని మన సిద్ధాంతం. మెదడు రుచులకు కూడా ఇలాంటి గుణాలే ఉంటాయి. ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. వీటిలో ఏ రుచిని వదిలి జీవించగలం...? నోటి రుచుల్ని, మనసు రుచుల్ని సమ్మేళనం చేసుకోగలిగితే శరీరమూ మనసు, ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది. ఉగాది పండుగ ఆరు రుచులకూ అంతటి ప్రాధాన్యత నిచ్చింది.నోటి రుచులుతీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు.... ఈ 6 రుచులు ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాల్ని వండుకోగలిగితే ఆహారం ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటుంది. భారత దేశం మొత్తంలో తమ ప్రధానమైన ఆహారాన్ని అన్నం అని నోరారా పిలిచేది ఒక్క తెలుగువారే! మనకు అన్నం అంటే ఆరు రుచులతో కూడిన పదార్థాలను ఆస్వాదిస్తూ తినటం అని! అలా మనల్ని ఆరు రుచులకి అంకితం చేసింది ఉగాది! ఈనాటికీ ఉగాది ప్రబోధం ఆరు రుచుల్ని విడవొద్దనే! ఉగాది పచ్చట్లో వేపపూతని కూడా చేర్చటం ద్వారా ఆహార ఔషధ ప్రాధాన్యతని ఉగాది గుర్తు చేస్తోంది! -
కొత్త తరం ఉగాది స్వరం
ఉగాదంటే వాకిట్లో పూల రుతువుచిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం. చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది. నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది. రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం. ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని. సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు. ‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
వెలుగుల భారత్కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ అణు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు విస్తరిస్తోంది. సెన్సార్ల ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రతిక్షణం పర్యవేక్షించే సాంకేతికతను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్ సాంకేతికత అభివృద్ధి, సహాయం డైరెక్టర్ డాక్టర్ జిష్ణు ద్వివేది, ఆర్ఆర్క్యాట్లో ఆవిష్కరణలు, వ్యాపార ప్రారంభాలను ప్రోత్సహించే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ పీఐఈ హబ్) డైరెక్టర్ డాక్టర్ క్రైస్ట్ ప్రకాష్ పాల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ వెళ్లిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..ఆధునిక సాంకేతికతతో అణు విద్యుత్ ఉత్పత్తి దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్ఆర్ కాట్ ముందంజలో ఉంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతలు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వైద్య రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అణు రియాక్టర్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అలాగే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగించే పరికరాలు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల పరికరాల నాణ్యతను పెంచుతున్నాయి. అత్యాధునిక పదార్థాలతో తయారైన పరికరాలు ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి. ముందుగానే లోపాలు గుర్తించే టెక్నాలజీ విద్యుత్ కేంద్రాల్లో పరికరాల లోపాలు ముందుగానే గుర్తించడానికి ఆర్ఆర్ కాట్ రూపొందించిన ఆధునిక లేజర్, డయాగ్నస్టిక్ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతల ద్వారా విద్యుత్ ప్లాంట్లలో జరిగే లోపాలను త్వరగా గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్ మాత్రమే కాకుండా పునరుత్పాదక శక్తి రంగంలో కూడా ఆర్ఆర్ కాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సౌర శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే అధునాతన పరికరాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ టెక్నాలజీలు భవిష్యత్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు విద్యుత్ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, పరికరాల తయారీ, నిర్వహణలో ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. దేశంలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ఇక్కడి కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు దేశ విద్యుత్ భద్రతకు అండగా నిలుస్తున్నాయి. -
నూకలతో డిజైనర్ బియ్యం
సాధారణ వరి బియ్యం కన్నా మూడు రెట్లు అధిక ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సరికొత్త డిజైనర్ వరి బియ్యం మన వంటగదిలోకి త్వరలోనే రానున్నాయి. పసుపు రంగులో ఉండే ఈ పోషక సంపన్న బియ్యం చూడ్డానికి, తినటానికి సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్)కు అనుబంధంగా తిరువనంతపురంలోని నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్ను ఉత్పత్తి చేసే సాంకేతికతను రూపొందించారు.దేశంలో తెల్ల బియ్యం తినే కోట్లాది మందిని వేధిస్తున్న సూక్ష్మ పోషకాహార లోపాన్ని పరిష్కరించటం, షుగర్ ముప్పును తగ్గించే లక్ష్యంతో ఈ బియ్యాన్ని రూపొందించినట్లు ఎన్ఐఐఎస్టీ ప్రకటించింది. సాధారణ తెల్ల వరి బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.డిజైనర్ బియ్యం అంటే?వరి బియ్యం నూకను పిండి చేసి.. అందులో ఉండే పిండి పదార్థం, మాంసకృత్తులు, పీచును వేరుచేస్తారు. ఎక్కువ మోతాదులో ఉండి బ్లడ్ షుగర్ పెంచుతున్న పిండి పదార్ధాన్ని తగ్గించి, ప్రొటీన్లను మూడు రెట్లు పెంచేలా, సమతుల్యత పొందేలా బియ్యాన్ని తిరిగి తయారు చేస్తారు. ఇది జీవక్రియ సంబంధమైన అనారోగ్యానికి చురుకైన, నిర్మాణాత్మక పరిష్కారంగా పనిచేసే పోషక–సాంద్రత గల ఆహారమని చెబుతున్నారు. మన అభీష్టానికి అనుగుణమైన సుగుణాలతో రూపొందించింది కాబట్టి ‘డిజైనర్ బియ్యం’ అని పిలుస్తున్నారు.పౌష్టికాహార లోపానికి చెక్మన దేశం ఒక విలక్షణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధిక గ్లైసెమిక్ సూచిక (జీఐ)తో కూడిన తెల్ల బియ్యంతో భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాదకరమైన వేగంతో పెరుగుతుంది. మరోవైపు, లక్షలాది మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తగినన్ని కేలరీల అన్నం తిన్నప్పటికీ ప్రొటీన్, ఖనిజాల లోపం వస్తోంది.డిజైనర్ రైస్ ప్రయోజనాలుతక్కువ జీఐ (55 కంటే తక్కువ): శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. ప్రొటీన్ పవర్హౌస్: సాధారణ బియ్యంలో 6–8% ప్రొటీన్ ఉంటుంది. ఈ బియ్యంలో 20% కంటే ఎక్కువే ఉంటుంది.బలవర్థకమైన రక్షణ: ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12ను కలిపి తయారు చేసిన బియ్యం కావటంతో రక్తహీనతను తగ్గిస్తుంది.పిండి తగ్గించి ప్రొటీన్లు పెంచాండిజైనర్ బియ్యాన్ని ఒక ‘ఆహార భవన నిర్మాణం’గా భావించండి. ఉదాహరణకు.. సాధారణ బియ్యం లాంటి ఒక భవనం ఉందనుకోండి. ఇది ఎక్కువగా ‘చక్కెర ఇటుకల’ (పిండి పదార్థం)తో తయారైన ఇల్లు. ఎన్ఐఐఎస్టీ పరిశోధకుల బృందం ఆ ఇంటిలోని ఇటుకలన్నింటినీ విడదీశారు. ఆ ఇటుకల్లో ఎక్కువగా ఉన్న పిండి పదార్ధాన్ని చాలావరకు తొలగించి, ఆ ఖాళీని ప్రొటీన్ల ఇటుకలతో భర్తీ చేశారు. జన్యుమార్పిడి సాంకేతికతకు బదులు ఆహార శుద్ధి సాంకేతికతను ఉపయోగించి ఈ బియ్యాన్ని రూపొందించారు. తక్కువ ధరకు అమ్ముడయ్యే వరి నూకను మెత్తని పిండిగా చేసి.. అందులో పిండి పదార్ధాన్ని తీసేసి.. ఆ మేరకు ప్రొటీన్లు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్–బీ12 వంటి సూక్ష్మపోషకాలను కలిపారు.ఈ మిశ్రమాన్ని లేత పసుపు రంగులో ఉండే సన్న వరి బియ్యపు గింజలుగా తయారు చేశారు. మనకు తెలిసిన బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. రుచిగా, సంతృప్తికరంగా ఉండేలా డిజైనర్ బియ్యాన్ని తయారు చేశారు. అధిక ప్రొటీన్ ఉన్న కారణంగా ఈ బియ్యంతో వండిన అన్నం మామూలు అన్నం కంటే రుచిగా ఉంటుంది. నూకలకు విలువ పెరుగుతుంది కాబట్టి రైతులకూ ఉపయోగకరమే. –డాక్టర్ ఆనందరామకృష్ణన్, సీఎస్ఐఆర్–ఎన్ఐఐఎస్టీ డైరెక్టర్, డిజైనర్ రైస్ ప్రాజెక్ట్ రూపశిల్పి -
నెతన్యాహు ఎక్కడ?
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్షేమమేనా? ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అసలు బతికే ఉన్నారా? ఇలాంటి రకరకాల ప్రశ్నలు, పుకార్లతో శనివారం సోషల్ మీడియా హోరెత్తిపోయింది. నెతన్యాహు ఎక్స్ ఖాతా నుంచి శుక్రవారం విడుదల చేసిన అధికారిక వీడియోనే వీటన్నింటికీ కారణంగా మారడం విశేషం. ఇరాన్పై తలపెట్టిన యుద్ధం గురించి ఇజ్రాయెలీలను ఉద్దేశించి అందులో ఆయన ప్రసంగించారు. అయితే వీడియోలో ఒకచోట నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లున్నట్టుగా కన్పించింది. అది నెటిజన్లను వెంటనే ఆకర్షించింది. చూస్తుండగానే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. వాస్తవానికి నెతన్యాహు రెండు చేతులకూ ఐదు వేళ్లే ఉంటాయి.దాంతో ఆ అధికారిక వీడియో పలు అనుమానాలకు తావిచి్చంది. దానిపై రకరకాల విశ్లేషణలూ తెరపైకొచ్చాయి. అందులో ఉన్నది నెతన్యాహు కాదని, అది ఏఐ జెనరేటెడ్ వీడియో అని నెటిజన్లు అనుమానం వెలిబుచ్చారు. మార్చి 2వ తేదీన నెతన్యాహు కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడిని పలువురు గుర్తు చేశారు. ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, బహుశా మరణించి ఉంటారని ఇరాన్ అప్పుడే ప్రకటించింది. కానీ కాసేపటికే నెతన్యాహు బాహాటంగా కన్పించారు. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో దెబ్బతిన్న పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వీడియోలను ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. దాంతో ఆయన మరణించారన్న వార్తలకు తెరపడింది. కానీ మార్చి 2 నాటి దాడిలో నెతన్యాహు నిజంగానే మరణించడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని తాజాగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.యుద్ధం మధ్యలో ఆ విషయం బయటికొస్తే ఇరాన్కు నైతిక బలంగా మారుతుందనే భయంతో ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచి ఉంటుందన్నది వారి విశ్లేషణ. అందుకే నాటినుంచీ ఏఐ సాయంతో నెతన్యాహు వీడియోలను రూపొందిస్తూ ప్రపంచాన్ని మభ్యపెడుతోందన్నది వాటి సారాంశం. కానీ నెతన్యాహు తాజా వీడియో నిజమైనదేనని పలు ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు అంటున్నాయి. వీడియో నిజమే గానీ కుడి చేతికి ఆరు వేళ్లు వాస్తవం కాదని గ్రోక్ తేల్చింది. ఒకానొక ఫ్రేమ్లో నిర్దిష్ట కోణంలో అరచేతికి ఆరో వేలున్నట్టు కేవలం దృశ్యభ్రాంతి కలుగుతోందని పేర్కొంది.అయినా ఆన్లైన్ రగడకు తెర పడకపోవడం విశేషం! ‘నెతన్యాహు ఎక్కడ?’, ‘బిబి (నెతన్యాహు ముద్దుపేరు) క్షేమమేనా?’అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వరద కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు తమ వాదనకు మద్దతుగా శుక్రవారం నాటి అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెసెంట్ ఇంటర్వ్యూను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. వైట్హౌస్లో ఓ మీడియా ప్రతినిధికి బెసెంట్ ఇంటర్వ్యూ ఇస్తుండగా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ‘అత్యవసర’పిలుపు రావడంతో ఉన్నపళంగా ‘సిచ్యుయేషన్ రూమ్’కేసి పరుగెత్తారు. ఏకంగా రెండు గంటల అనంతరం తిరిగొచ్చారు.తర్వాత ఇంటర్వ్యూ కొనసాగించినా బెసెంట్లో తడబాటు, గొంతులో వణుకు కనిపించాయి. ‘‘నెతన్యాహు ఇక లేరని బహుశా ట్రంప్కు ఉప్పంది ఉంటుంది. అదే విషయాన్ని బెసెంట్తో పంచుకున్నారు. తడబాటుకు అదే కారణం కావచ్చు’’అని సోషల్ మీడియా యూజర్లు విశ్లేíÙస్తున్నారు. ప్రఖ్యాత రాజకీయ వ్యాఖ్యాత జోహనస్ ఎం.కొన్రాడ్త్ కూడా నెతన్యాహు మరణించారని సదరు వీడియోను ఉటంకిస్తూ పేర్కొనడం విశేషం. ఆ విషయం తెలియడం వల్లే బెసెంట్ అంతగా దిగ్భ్రాంతికి లోనైనట్టు కన్పించారని ఆయన కూడా చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ గురించి తెలుసా?
సినిమా అసోసియేషన్ ఫర్ చిన్న చిన్న పురుగులూ...జిందాబాద్! : సంగతేమిటంటే... చీమలూ, బొద్దింకలూ, బల్లులూ... ఆఖరికి దోమల వంటి చిన్న చిన్న కీటకాలన్నీ కలిసి ‘‘సినిమా అసోసియేషన్ ఫర్ చిన్నచిన్న పురుగులు’’ సంఘం (సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ) పెట్టుకున్నాయి. ఆ సంఘ ప్రారంభ సమావేశం సందర్భంగా... ప్రెస్ మీట్లో పత్రికల, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాయి. అవి ఇవి... రిపోర్టర్ : ఈ సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్ దోమగారూ... అయినా మీ కీటకాలన్నీ ఎందుకండీ ఈ ‘చిన్న పురుగుల’ అసోసియేషన్ పెట్టాయి? అసోషియేషన్ ప్రసిడెంట్ దోమ (స్పీచ్ ఇస్తున్న ధోరణిలో) : ఇప్పుడూ... పున్నమినాగు ఫార్మూలాతో బోల్డన్ని సూపర్హిట్టుపాముల మూవీస్ వచ్చేశాయి. కొండవీటి ‘సింహాలూ’, ‘చిరుత’ల్లాంటి పేర్ల మీద బంపర్హిట్లూ ఉన్నాయి. ఇక అడవిరాముడూ, వేటగాడులాంటి బ్లాక్బస్టర్లలో ఏనుగులూ, సింహాలూ, పులులూ, ఎలుగుబంట్లూ ఎట్సెట్రాలు తెగ యాక్టింగు చేసేశాయి. ముత్యాలముగ్గు సినిమాలో కోతి, ఆఖరికి పొట్టేలు పున్నమ్మల్లో పొట్టేలు సైతం తెగ పెర్ఫార్మెన్సు చూపించేశాయి. మరి ఇంకా చెప్పాలంటే... ‘అద్దమంటి మనసు ఉందీ... అందమైనా వయసు ఉందీ’ పాటలో మా ప్రియతమ సోదరీమణి అయిన బర్రెగారు సాక్షాత్తూ పెద్ద ఎన్టీఆర్ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని యాక్షనింగు కుమ్మేసింది. వాళ్లంటే పెద్ద పెద్ద జీవులు. అవన్నీ పెద్ద జీవుల అసోసియేషన్ పెట్టుకున్నాయి. మరి... ఈ నేపథ్యంలో మాకూ ఓ సంఘం ఉండొద్దా మరి? రిపోర్టర్ : అవంటే పెద్ద జీవులూ... పెద్ద హీరోలకు దీటుగా వాటి పేర్ల మీదే డైరెక్టుగా మూవీలొచ్చేశాయి. సినిమాల విజయంలో మరి మీ చిన్న పురుగుల పాత్ర ఏమిటి? చీమ (గొంతు సవరించుకుంటూ గొట్టం ముందుకు వస్తూ) : ‘సింహాద్రి’ సినిమా చూశారా సార్? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి మా చీమనే యూజ్ చేసుకున్నారు. మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఏకంగా ఓ లవ్సాంగ్ రాయాల్సి వచ్చిందీ... తీయాల్సి వచ్చింది...చీమ చీమ చిమ చీమా చీమా చీమ చీమ చిమ చీమ చీ...ఈ...ఈ...మా... చీమ తీపి చిరునామా ప్రేమా... తెలుసుకోవె భామా... అంటూ సదరు డ్యూయెట్టులో హీరోహీరోయిన్లు చీమ చుట్టూ చిందులు తొక్కితేగానీ మూవీ హిట్టవ్వలేదు మరి! రిపోర్టర్ : సినిమాలకు మీరెలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు బొద్దింకగారూ, బల్లిగారూ?బొద్దింక : హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి ఈ సినిమా రంగానికి ఇతోధికంగా మేము చేసుకుంటున్న పవిత్రమైన సేవలు ఇన్నని చెప్పడానికి లేదండీ. చాలా మూవీస్లో మమ్మల్ని చూసి... ‘‘అమ్మో బొద్దింక...’’ అంటూ అరుస్తూ హీరోయిన్... హీరో ఒళ్లోకి దూకుతుంది. అంతే... లవ్వూ... డ్యూయెట్టూ!! (అంటూ గర్వంగా తన పొడవాటి కాక్రోచు మీసాల్ని దువ్వుకుంది). అంతేకాదండి... మేమిలా నటించినా హిట్టే... మమ్మల్ని చంపాలన్నా ‘హిట్టే’! (కప్బోర్డులోని హిట్ మందును సీసా కేసి చూపిస్తూ అన్నది).బల్లి : మేము కూడా ఏమీ తక్కువ కాదండి. బొద్దింకల్లాగే మమ్మల్ని చూసి హీరో మీదకు గెంతే హీరోయిన్లకు కొదవలేదండీ. ఇప్పుడంటే పెద్దగా లేదుగానీ... పాత సినిమాటాకీసుల్లో వెండితెర మీద మా బంగారు పాదాలు మోపుతూ... హీరో హీరోయిన్ల ముఖాలమీదా, ఒంటిమీదా పాకుతూ తెగ తిరిగేవాళ్లం. తెరమీద ఒక్కోసారి స్ప్రింటూ, మరోసారి మారథానూ ఇంకోసారి ఫోర్,ఫోర్ మీటర్సు రిలేలాంటి రన్నింగు రేసులూ చేసేవాళ్లం. ఇక ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాంటి సినిమాలో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్ గారు తన బాత్రూమ్లో పాకుతున్న బల్లిని చూసి... పరకాయ ప్రవేశం చేసిన హీరోయేమో అనుకుంటుంది. బల్లిని చూసి హీరో అనుకుందంటే... దీన్ని బట్టి తెలియడం లేదూ మేం ‘హీరో మెటీరియల్’ అనీ! చదవండి: కూరగాయ హీరోల 'పోకిరి' కిరిరిపోర్టర్ : (కొద్దిగా వ్యంగ్యం ధ్వనిస్తూ...) అన్నట్టూ దోమగారూ!! మలేరియాలూ, డెంగీలు తీసుకొచ్చే మీరు ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్ ఎలా అయ్యారు సార్? దోమ : (కోపంగా...) హేం మాహాడుతున్నారు మీరు? రోబో సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అండ్ రోబో చిట్టీల మధ్య ప్రేమకు కారణం మేమే. ‘రోబోకు ఐశ్వర్యారాయ్ పెట్టే ‘ప్రేమ పరీక్ష’ ఏమిటో తెల్సా మీకు? తనను కుట్టిన దోమను పట్టుకొచ్చి దాంతో సారీ చెప్పించమనే కదా! మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతవరకూ మిస్ వరల్డు ఐశ్వర్యారాయ్ను కుట్టిన జీవేదైనా ఉందా... ఒక్క దోమ తప్ప? మరి ఈ నేపథ్యంలో చూస్తే... ఈ చిన్న పురుగుల సంఘానికి నేను తప్ప ప్రెసిడెంట్గా ఉండటానికి అర్హులెవరైనా ఉన్నాయా సార్? ...అంటూ అరుస్తూ ‘‘చిన్న పురుగుల సంఘం పట్ల మీ కానొర్టర్ల వివక్ష నశించాలీ... మా సీఐఏ అదే... సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ వర్థిల్లాలి... చిన్న చిన్న సినీ పురుగులూ జిందాబాద్’’ అని నినాదాలిస్తూ కోపంగా ప్రెస్మీట్ నుంచి వాకౌట్ చేసింది దోమ. దాంతోపా టే మిగతా ఇన్సెక్ట్స్ కూడా!– యాసీన్ -
మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు
సాక్షి, హైదరాబాద్: ‘షెల్టర్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారే తప్ప.. మేం లొంగిపోలేదు. అలా అనివార్య పరిస్థితుల్లో బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాం. మేం ఆయుధాలు వీడినా, మావోయిస్టు సిద్ధాంతాలను వదల్లేదు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తాం’అని ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి వెల్లడించారు. ఫిబ్రవరి 18న హైదరాబాద్లో షెల్టర్లో ఉన్నప్పుడు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారన్నారు. అంతకు రెండు రోజుల ముందే అడవుల నుంచి బయటకు వచ్చామని, ఏళ్లపాటు అడవుల్లో మేం సేఫ్గా ఉన్నామని... కానీ అర్బన్లో రెండు రోజులకే పట్టుబడ్టట్టు చెప్పారు.దండకారణ్యంలో ప్రతి క్షణం తూటాల మధ్యే ఉద్యమం చేశామని వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దగ్గర హామీ ఇచ్చినట్టుగా ఇకపై బహిరంగ జీవితంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని రేవంత్రెడ్డి ద్వారా కేంద్రాన్ని కోరామని చెప్పారు. నిషేధం ఎత్తివేస్తే పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) సహా మావోయిస్టులు అంతా ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తామన్నారు. త్వరలోనే మావోయిస్టు అమరుల కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ తనకు తెలియదని, చివరి సారిగా 2024లో చూసినట్టు తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేవ్జీ అనేక అంశాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మీరు ఎత్తివేస్తే.. మేం రద్దు చేస్తాం అని చెప్పాం మేం ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి చట్టబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు అప్పగించి లొంగిపోతారని, అవసరమైతే పీఎల్జీఏను కూడా రద్దు చేస్తామని చెప్పాం. అయితే మేమే మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామన్నట్టుగా తప్పుగా ప్రచారమైంది. సీఎంతో చర్చలో రెండో ముఖ్యమైన అంశం... మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారని కేసులు పెట్టి, జైళ్లలో ఉంచిన వారందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కోరాం. ఆ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. పార్టీ దెబ్బతిన్నది.. విప్లవ ఉద్యమం దెబ్బతిన్నదని ఒప్పుకోక తప్పదు ప్రస్తుతం అజ్ఞాతంలో ఇంకా కొందరు ఉన్నారు. అయితే, పార్టీ దెబ్బతిన్నది.. విప్లవోద్యమం దెబ్బతిన్నదని ఒప్పుకోక తప్పదు. అయితే మేం అనుసరించిన విధానం, సిద్ధాంతం తప్పని కాదు. ప్రజలను సంఘటితం చేసే వరకు పార్లమెంటరీ పార్టీ విధానంలో ఎన్నికలకు పోయేది లేదు. ఆ ఇద్దరూ పార్టీలో చీలిక తెచ్చారు పార్టీ కార్యదర్శి పదవి విషయంలో మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనుకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆ మాటకొస్తే కుల, వర్గ, ప్రాంత వివక్ష, లింగబేధాలకు తావులేనిది మావోయిస్టు పార్టీలోనే. అయితే, బసవరాజు బతికుండగానే సరెండర్ అవుదామని ప్రతిపాదన పెట్టిన వ్యక్తి మల్లోజుల. మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణంగా సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలే. వారే పార్టీని చీల్చారు. ఆయుధాలు తీసుకెళ్లవద్దంటే ఆయుధాలతో వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత లొంగుబాట్లను మేం నియంత్రించలేని స్థితికి పరిస్థితి వెళ్లింది. వారు శత్రువుతో చేతులు కలిపారు. మా తప్పు వల్లే పార్టీ నష్టపోయిందని ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అప్పుడే వారితో కలిసి పనిచేసేందుకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. మా దగ్గర రూ. కోట్ల డబ్బు..కిలోల కొద్దీ బంగారం అన్నది ఉత్త ప్రచారమే మీడియాలో వార్తలు వచ్చినట్టుగా మావోయిస్టు పార్టీ దగ్గర వందల కోట్ల రూపాయల డబ్బు, కిలోల కొద్ది బంగారం లేదు. అదంతా పూర్తి అవాస్తవం. అయితే పార్టీ నడిపేందుకు, జనతన సర్కార్ నడిపేందుకు కొన్ని ఖర్చులు తప్పవు. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టుకొని ఆ మేరకే కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తాం. నా దగ్గర డబ్బు ఎప్పుడూ లేదు. అర్బన్ నక్సలిజం అన్న పదమే చట్ట విరుద్ధం ప్రజల తరఫున పోరాడే వారి గొంతు నొక్కడానికి, రాసే వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు పెట్టిన పదమే అర్బన్ నక్సలిజం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలో చెబుతూనే ప్రభుత్వ వ్యతిరేకంగా స్వేచ్ఛగా మాట్లాడితే అర్బన్ నక్సలిజం అంటున్నారు. ఆ పదమే తప్పు. మార్చి 31 తర్వాత మావోయిజం అంతం సాధ్యం కాదు. కానీ, మేం పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వాలు ఒప్పుకుంటే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారు ఆయుధాలతో బయటికి వచ్చేలా మేం కృషి చేస్తాం. అమరుల కుటుంబాలకు అండగా నిలబడతాం మావోయిస్టు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు మేం అండగా ఉన్నామని చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. వారంతా ఒంటరివారు కాదు.. మేం ఉన్నామన్న భావన వారిలో కల్పించేలా అందరినీ కలవాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి వారి ద్వారా ఆరి్థక సాయం అందేలా చేస్తాం. సివిల్ సొసైటీలో పెద్దల ద్వారా వారికి ఆ ఆర్థిక సాయం అందేలా చూస్తాం. ఇదొక దీర్ఘకాలిక కార్యక్రమంగా పెట్టుకుంటాం. తొలుత తెలంగాణలో ప్రారంభించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం. -
వంటింటి వార్కు చెక్..
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే చర్చ. వంటింట్లో గ్యాస్ అయిపోతే? సిలిండర్ సమయానికి రాకపోతే? ప్రత్యామ్నాయం ఏంటి? వంటలు ఎలా? ఇదంతా ఎందుకంటే యూఎస్–ఇరాన్ యుద్ధం ప్రభావం ఇప్పుడు మన వంటింటి వరకూ వచ్చింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధమే కావొచ్చు. కానీ ఆ వార్ కాస్తా ఎల్పీజీ సరఫరాను దెబ్బతీయడంతో ప్రతి ఇంటి సమస్యగా మారింది. ఈ సమస్య రోజురోజుకూ ముదురుతోంది. ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వంట గ్యాస్కు, వంటలకూ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం తక్షణ పరిష్కారం. గ్యాస్ లేదంటే ముందుగా గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్ కుక్టాప్స్), ఎలక్ట్రిక్ కుక్కర్, సోలార్ కుక్కర్, ఇతర అప్లయెన్సెస్. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతున్నా అందరికీ కొనే స్తోమత ఉండకపోవచ్చు. పల్లెల్లో కట్టెలు, బొగ్గు వంటివి ఇంధనంగా వాడుతున్నారు. పట్టణాల్లో వీటిని వాడటం సాధ్యం కాదు. ఉపకరణాలను కొనలేనివారు, సహజ ఇంధనాలను వాడలేనివారు, ఇంకా చెప్పాలంటే అందరూ.. ఇవేవీ అవసరం లేకుండానే సహజ పదార్థాలతో వంటలు ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామా.. వంటింటి శ్రమను తగ్గించేలా.. స్టవ్తో పనిలేకుండా సహజ ఆహారంతో విభిన్న వంటకాలను నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని పచ్చళ్లు, పొడులు రోట్లో లేదా రాయిపై నూరుకోవచ్చు. మిక్సీ ఉంటే మిక్సీలోనూ కొన్ని వేసుకోవచ్చు. నూనెల వాడకం, వేపుళ్లు తగ్గించవచ్చు. వండటం, పాత్రలు శుభ్రం చేసుకోవడంలో మహిళలు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఖర్చూ తగ్గుతుంది. ఇక రుచి అంటారా.. వేరుశనగ, నువ్వుల వంటి నూనె గింజల పొడులు వాడతాం కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. పూర్వకాలపు నిల్వ రోటి పచ్చళ్లుఒకప్పుడు స్టవ్ అవసరం లేకుండానే రోటి పచ్చళ్లు తయారుచేసుకునేవాళ్లు. నూనె తాలింపు కూడా చాలా వాటికి అవసరం లేదు. వేడి వేడి అన్నంలో వీటిని కలుపుకొని తింటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. పండు మిర్చి పచ్చడి, టమాటా పచ్చడి, కరివేపాకు పచ్చడి, క్యారెట్ పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి, కరివేపాకు క్యారెట్ పచ్చి కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ కారం, దోసకాయ–మామిడి కాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి వంటివి ఇలా తయారుచేసుకోవచ్చు. మామిడి పిందెలతో కూడా నిల్వ రోటి పచ్చడి పెట్టుకోవచ్చు. పుటా్నల పప్పు, చింతపండు, ఎండుమిర్చి వంటి వాటితో పచ్చడి చేయవచ్చు. పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఉసిరి, పచి్చమిర్చి, ఉప్పు కలిపి నూరి గ్రీన్ చట్నీ చేసుకుంటే రుచిగా ఉంటుంది. పచ్చి పెసరపప్పు లేదా పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, పొట్టు పెసరపప్పుతో పచ్చడి చేసుకోవచ్చు.మంచి ప్రత్యామ్నాయం తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయిత, మిద్దెతోట ప్రచారకులుకూరగాయలు, నూనె గింజల వంటి సహజ పదార్థాలు వాడతాం కాబట్టి వంటకాలు రుచికరంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అలాగే ఉంటాయి. సహజ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఉంటుంది. వాడే పదార్థాలు ఎవరి స్తోమతను బట్టి వారు ఎంచుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మంచి ప్రత్యామ్నాయం. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తక్కువ. పొడులు ఎన్ని కూరలు ఉన్నా.. పొడులను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. వెల్లుల్లి కారం, పెసరపప్పు పొడి, కంది పొడి, కారప్పొడి, నువ్వుల కారం మొదలైనవి త్వరగా చేసుకోవచ్చు. రెడీమేడ్ ఆవకాయ మామిడి కాయ ఆవబద్దలు మన ఇళ్లలో ఉండే పెద్దలందరికీ తెలుసు. అప్పటికప్పుడు తయారుచేసుకుని అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. క్యాలీఫ్లవర్ పచ్చడి, దోస ఆవకాయ, సొరకాయ వంటివి కూడా ముక్కలతో రెడీమేడ్గా చేసుకుని ఫ్రిజ్లో ఓ 10 రోజుల వరకు నిల్వ ఉంచుకుని వాడుకోవచ్చు. చాలా సులభంగా బ్యాచిలర్లు చాలా సులభంగా, గ్యాస్ అవసరం లేకుండానే తయారుచేసుకునే పచ్చళ్లు చాలా ఉన్నాయి. ఉల్లి–నిమ్మ పచ్చడి, మామిడల్లం పచ్చడి (వేసవిలో వచ్చే మామిడి అల్లంతో), అల్లం కారం, ఉల్లిగడ్డ పచ్చడి, పచి్చమిర్చి పచ్చడి, పచ్చి టమాటా పండ్లతో నిల్వ పచ్చడి వంటివి ఈ కోవలోకి వస్తాయి.మిక్స్డ్ సలాడ్లు మొలకలు (పెసలు, శనగలు మొదలైనవి), నానబెట్టిన పల్లీలు, క్యారెట్, బీట్ రూట్ తురుము, కీరదోస ముక్కలు, జామకాయ ముక్కలు, కాస్త నిమ్మరసం చల్లిబ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్లు (వీటిలో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కలుపుకోవచ్చు)పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి చాలా సులభంగా చేసుకోగలిగేది. తాలింపు లేకపోయినా ఫర్వాలేదు. ముల్లంగి పెరుగు పచ్చడి, పచ్చి పులుసు వంటివి అప్పటికప్పుడు తయారుచేసుకోవచ్చు.కొబ్బరి తురుముతో పచ్చి కొబ్బరి తురుము, దంచిన పచ్చి మిర్చి కలిపి అందులో నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే మామిడికాయ తురుము కలిపినా బాగుంటుంది. పచ్చి పెసరపప్పు,పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, నిమ్మరసం, ఉప్పు కలుపుకొంటే కోసంబరి సిద్ధం.ఈ రెడీమేడ్ లడ్డూలు–తీపి పొడులు కేవలం వంటలే కాదు టైమ్ పాస్కి, స్నాక్స్లా తినడానికి రెడీమేడ్గా లడ్డూలు, తీపి పొడులు తయారుచేసుకోవచ్చు. ఇవి పిల్లలకు చాలా బలమైన ఆహారం. మొక్కజొన్న పిండికి, బెల్లం కలిపి సత్తు పిండి తయారుచేసుకోవచ్చు. దానిపై బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్లు అలంకరణ చేసుకుని తినొచ్చు. వేరు శనగ పొడి, బెల్లం కలిపి పొడి చేసుకోవచ్చు. అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుముతోనూ లడ్డూ చేసుకోవచ్చు. -
నౌకా విలాపం..
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ ఖైమా పోర్ట్కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.మార్చి 4: ఒమన్కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.మార్చి 5: ఇరాక్లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రస్ అల్ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్గార్డ్ ప్రకటించింది.మార్చి 12: ఇరాక్లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భాషకందని భావ విన్యాసం
అక్షరాలు లేని కథ రాయాలి. వర్ణాలతోనే భావాలు చెప్పాలి. పరమాత్ముడి రూపానికి పవిత్రంగా జీవం పోయాలి. భారత, భాగవత గాథలు కళ్లకు కట్టినట్టు వివరించాలి. చేతిలోకి తీసుకున్న సాధారణ వస్త్రం పని పూర్తయ్యాక కళాఖండంలా మారాలి. ఇన్ని జరగాలంటే.. కళాకారులు వస్త్ర శస్త్రాలతో విన్యాసం చేయాలి. ఆ విన్యాసాల సమాహారమే కలంకారీ. వస్త్రం ఎంపిక, రంగుల తయారీ, వర్ణాల అద్దకం, భావాల వ్యక్తీకరణ..ఇలా అన్నీ అపురూప ప్రక్రియలే. ఈ మహోన్నత కళకు ఇటీవల సమున్నత గౌరవం లభించింది. – శ్రీకాకుళం కల్చరల్ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ గాథలు, భాగవత కథలు.. ఒక వస్త్రంపై చెప్పే అపురూప కళ కలంకారీ. కలంకారీ చీరల గురించి తెలిసినంత వివరంగా కలంకారీ కళ గురించి అంతగా ఎవరికీ తెలియదు. దేశానికి ప్రముఖులు వచ్చే సందర్భాల్లోనూ, జ్ఞాపికలు ఇవ్వాల్సిన సందర్భాల్లోనూ మొదటి ఎంపిక ఈ కలంకారీ ఆకృతులే. ఈ కళలో వ్రస్తాల ఎంపిక నుంచి తుది అంకం ముగిసేంత వరకు ఓ యజ్ఞమే జరుగుతుంది. వస్త్రం ఎంపిక ఇలా.. కలంకారీ ప్రక్రియలో కాటన్ వ్రస్తాలను వాడుతా రు. ఈ వ్రస్తాన్ని ముందురోజు రాత్రి నీళ్లలో నానబెడతారు. మరుసటి రోజు ఆ గుడ్డను బాగా ఉతికి దానిలో ఉన్న గంజిని పూర్తిగా తీసివేస్తారు. తర్వాత పాలు, కరక్కాయ మిశ్రమాన్ని తయారు చేసి, ఆ మిశ్రమంలో ఈ కాటన్ గుడ్డను బాగా ముంచి దానికి కరక్కాయ–పాలు మిశ్రమం బాగా పట్టుకునేలా రుద్దుతారు. ఆ తర్వాత గుడ్డను పిండి అందులో ఉన్న అదనపు మిశ్రమాన్ని తీసివేసి ఎండలో ఆరనిస్తారు. గుడ్డ బాగా ఆరిన తర్వాత నుంచి కుంచె ప్రక్రియ ప్రారంభిస్తారు. సహజ రంగులు మాత్రమే.. ఈ కళలో సహజమైన మొక్కలు, ఖనిజాల నుంచి తీసిన రంగులను మాత్రమే ఉపయోగిస్తారు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, నలుపు, గోధుమ రంగులు ప్రధానమైనవి. ఈ రంగులు బట్టలకు స్థిరంగా ఉండటానికి పటిక, ఇనుప రేకుల వంటి సహజసిద్ధమైన వాటిని ఉపయోగిస్తారు. ఎరుపు రంగును మాడర్ చెట్ల బెరడు లేదా పటిక, బెల్లం నీటి మిశ్రమం నుంచి తయారు చేస్తారు. నలుపును ఇనుప తుప్పు, బెల్లం మిశ్రమం ద్వారా చేస్తారు.పసుపును.. పసుపు, దానిమ్మ తొక్కలు నుంచి తయారు చేస్తారు. నీలం రంగును.. నీలిమందు మొక్క నుంచి తయారు చేస్తారు. ఆకుపచ్చ రంగును .. నీలిమందు, పసుపు రంగులను కలపడం ద్వారా తయారు చేస్తారు. గోధుమ/మట్టి రంగులను.. కాశీ, ఇతర సహజ పదార్థాల నుంచి తీసుకుంటారు. సింథటిక్ రంగులు అస్సలు ఉపయోగించరు.స్త్రీల చిత్రాలకు పసుపు, దేవతల చిత్రాలకు నీలం, రాక్షసుల చిత్రాలకు ఎరుపు / ఆకుపచ్చ రంగులు వాడతారు. మన కళాకారుడు ధను శ్రీకాకుళానికి చెందిన ధను అండ్లూరి ఈ కలంకారీ కళలో రాణిస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ధనుంజయ్ పుట్టింది పెరిగింది శ్రీకాకుళంలోనే. తండ్రి జగదీశ్వర్ రావు ఆర్టీసీ మెకానిక్. ధనుకు చిన్ననాటి నుంచి కళలంటే మక్కువ. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆ దిశగా ప్రోత్సహించారు.చదువు కూడా అదే రీతిలో కొనసాగింది. కలంకారీ పెయింటింగ్లో డిప్లమాతో పాటు శిల్ప కళలోనూ ఆయన డిగ్రీలు పొందారు. ‘వైభవ గోవింద’ కళాఖండానికి 2019లో టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా సత్కారం అందుకున్నారు. ‘కృష్ణలీల’ చిత్రానికి గాను 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ అవార్డు తీసుకున్నారు. కలమిదే.. ఈ కళలో ఉపయోగించే కలం(కుంచె) చాలా ప్రత్యేకం. వెదురు పుల్లకు, కమ్మలె (లేదా పత్తి) ముక్కను అమర్చి, దారంతో బాగా చుట్టి తయారు చేసే ప్రత్యేకమైన బ్రష్ ఇది. మనకు కావాల్సిన విధంగా ఈ బ్రష్ను చేతితోనే తయారు చేస్తారు.ఎలా వేస్తారంటే..?» వస్త్రాన్ని పాలు–కరక్కాయ మిశ్రమంలో ముంచే ప్రక్రియలన్నీ ముగిశాక కుంచె సహాయంతో నలుపు రంగును ఉపయోగించి, ముందుగా సిద్ధం చేసిన రంగుతో గీయాల్సిన బొమ్మలు, చిత్రాలను గీయడం ప్రారంభిస్తారు. » నలుపు రంగుతో చిత్రాలు పూర్తయ్యిన తర్వాత, ఆ గుడ్డను పారే నీళ్లలో అంటే నది లేదా నీరు పారే కాలువ దగ్గర ముంచి కడుగుతారు. » ఇలా చేయడం వల్ల గుడ్డపై ఎక్కువగా ఉన్న నలుపు రంగు వదిలిపోతుంది.» తర్వాత, మరుసటి రోజు ఎరుపు రంగు ప్రక్రియను ప్రారంభిస్తారు. » గుడ్డను మళ్లీ పాలు, కరక్కాయ మిశ్రమంలో పిండి సిద్ధం చేస్తారు. » తర్వాత స్పటికం లేదా పటిక (అలమ్) ను పొడి చేసి నీళ్లలో కలిపి, ఎక్కడైతే ఎరుపు రంగు రావాలో అక్కడ ఆ నీటిని అద్దుతారు. ఆ తర్వాత ఆరిన గుడ్డను బాయిలింగ్ ప్రక్రియకు తీసుకెళ్తారు. » ఒక పెద్ద కుండలో నీళ్లు పోసి బాగా మరిగిస్తారు. ఆ మరుగుతున్న నీళ్లలో చావలికొడి, మంజిష్ట, సురుడు చెక్క వంటి చెట్ల వేర్లను వేస్తారు. » అప్పుడు ఆ నీరు క్రమంగా ఎరుపు రంగులోకి మారుతుంది.» అందులో ముందుగా పటికతో రాసిన గుడ్డను ముంచి తీసినప్పుడు, ఎక్కడైతే పటిక రాసి ఉంటుందో అక్కడ ఎరుపు రంగు బాగా పడుతుంది.» తర్వాత ఆ గుడ్డను మళ్లీ చల్లని నీళ్లలో ఉతికి, పారే నీళ్లలో బాగా కడుగుతారు.» దీంతో అదనపు రంగు పోయి గుడ్డపై నలుపు, ఎరుపు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి. » ఆ తర్వాతి రోజు గుడ్డను మళ్లీ పాలలో పిండి సిద్ధం చేసి, ఆపై పసుపు, నీలం, పచ్చ వంటి ఇతర సహజ రంగులను వేస్తారు. » చివరిగా మళ్లీ వేడి నీళ్లలో బాయిలింగ్ ప్రక్రియ చేసి కలంకారి చిత్రాన్ని పూర్తిచేస్తారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ గౌరవం చిరస్మరణీయం రాష్ట్రపతి చేతులమీదుగా స్మారకం అందుకోవడం చిరస్మరణీయ ఘట్టం. దేశ అత్యున్నత స్థాయిలో కలంకారీ కళకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. – ధను అండ్లూరి, కలంకారీ కళాకారుడు, శ్రీకాకుళం


