breaking news
Sakshi Special
-
కాస్ట్లీ అభిమానం.. కాసులు కుమ్మరిస్తేనే ఆ మహాభాగ్యం!
ఫుట్బాల్ లెజెండ్ మెస్సీతో ఒక్క ఫొటోకి 10 లక్షలంట!.. “అంత ఖర్చా?” అని ఆశ్చర్యపోయినవాళ్లు ఎందరో.కానీ ఆ ఒక్క ఫొటో కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోయాయని తెలుసా?అటు స్టేడియం, థియేటర్ గేట్ల వద్ద పొడవైన క్యూలు సరిపోదన్నట్లు ఇటు ఆన్లైన్లో వీఐపీ ప్యాకేజీల హడావిడి.గుండెల నిండా ఉండాల్సిన అభిమానం.. ఇప్పుడు కాసులు కుమ్మరించి కొనుగోలు చేసే ట్రెండ్గా మార్కెట్లో దూసుకుపోతోంది..తమ అభిమాన తారలను, ఆటగాళ్లను.. గ్రౌండ్లలో, స్క్రీన్లపైనే చూడడంతో సరిపోదన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు. ప్రత్యక్షంగా కలిసి వీలైతే ఓ ఫొటో.. కుదిరితే కలిసి భోజనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వేల నుంచి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఫుట్బాల్ రారాజుగా పేరున్న మెస్సీతో ఫొటో కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు ఇందులో భాగమే!. అది ఎలాగంటే..🐐గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ భారత్లో పర్యటిస్తున్నారు. ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ కోసం రూ.9.95 లక్షలు + జీఎస్టీ కలిపి రూ.10 లక్షల దాకా అవుతోంది. ఈ ప్యాకేజీలో మెస్సీతో షేక్ హ్యాండ్, ప్రొఫెషనల్ గ్రూప్ ఫొటో(ఆరగురు దాకా ఉండొచ్చు.. నో సెల్ఫీ.. నో సోలో ఫొటో!), ప్రైవేట్ లౌంజ్ యాక్సెస్ (ఒక గంట పాటు, ప్రత్యేక ఫుడ్ & బేవరేజెస్తో) అన్నీ కలిపే ఉంటాయి. ఆయన ఎలాగూ వీవీఐపీ కాబట్టి ఆయనకు ఉండే భద్రత నడుమే ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే అవి మనకూ వర్తిస్తాయన్నమాట. సాధారణంగా.. బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ కొన్ని సెకన్లు కనిపిస్తే చాలని కోట్లు కమ్మరిస్తుంటాయి కంపెనీలు. సో.. జస్ట్ ఫొటోకే అంత ఖర్చా?.. అని అనుకోవడానికి ఏమాత్రం లేదు. 😲మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు ఖర్చవుతున్నట్లే.. మరో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో విషయంలోనూ భారీగానే ఈ ఛార్జ్ ఉంటోంది. ఫుట్బాల్ స్పెషల్ ఈవెంట్స్లో పాస్తో కలిపి ఫొటో కోసం రూ. 5-7 లక్షల దాకా వసూలు చేస్తుంటారు. పాప్ సింగర్లు టేలర్ స్విఫ్ట్ ప్రదర్శన పాస్తో పాటు ఫొటో కోసం రూ.40 వేల నుంచి 80 వేల మధ్య, అలాగే.. మరో పాప్ సెన్సేషన్ జస్టిన్ బీబర్తో ఫొటో, సంతకం కోసం లక్ష దాకా ఛార్జ్ చేస్తున్నారు. కొరియాకు చెందిన బీటీఎస్ బ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ప్యాకేజీ రూ.2 లక్షలకు తక్కువ కాకుండా ఉన్నాయి మరి.👉ఎంతసేపు హాలీవుడ్ రేంజేనా?.. మన దగ్గర అలాంటి తారలు లేరని అనుకుంటున్నారా?. అక్కడికే వస్తున్నాం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారూఖ్ ఖాన్, రణ్బీర్ కపూర్, అలియా భట్, దీపికా పదుకొనే.. కొందరు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి చార్జీలు రూ.లక్షకు తక్కువ కాకుండానే ఉన్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 😇ఈ డబ్బులు సెలబ్రిటీలు వసూలు చేసేవి కావు. కార్పొరేట్ ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్స్, చారిటీ ఈవెంట్లలో భాగంగా ఏర్పాటు చేసే మీట్ ద గ్రీట్లో భాగంగా వసూలు చేస్తారు. ఇందులో వీఐపీ ఆతిథ్యం, స్పెషల్ పాస్, బ్యాక్ స్టేజ్ ఫొటోలు.. వగైరాతో బోనస్గా ఫొటో దిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవేవీ వాళ్లు వాళ్ల జేబుల్లో వేసుకునేందుకు నిర్ణయించే చార్జీలు కావన్నమాట. (నోట్: పైన పేర్కొన్న ఛార్జీలు ఫిక్స్ చేసినవి కావు.. ఈవెంట్లను.. డిమాండ్ను బట్టి మారే అవకాశమూ లేకపోలేదు). ☠️ఇది ప్రత్యేక వీఐపీ అనుభవం మాత్రమే. ఛార్జీలు ఉంటాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులకు ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ. పైగా వీటిని నిర్వాహకులు పక్కా వెబ్సైట్ల నుంచే నిర్వహిస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ స్కామ్లకు అవకాశం లేకపోలేదు. అందుకే అధికారిక టికెట్ ప్లాట్ఫారమ్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో కోనే ప్రయత్నంలో మోసపోకూడదని చెబుతుంటారు. 🥱ఇంత చెప్పాక కూడా.. లక్షల తగలేసి ఇదేం వెర్రితలలు వేసిన అభిమానం రా అయ్యా?.. అంతెందుకు బుజ్జీ అనుకుంటున్నారా?.. ఎవరి ఇష్టం వారిది కదా!. సినీ తారలు క్యాజువల్గా బయట తిరిగినప్పుడు కూడా రిక్వెస్ట్ చేసి దిగొచ్చు. ఒకవేళ వాళ్లు నో చెప్పడమో.. ఫోన్లు లాక్కోవడమో.. కుదరితే నాలుగు పీకడమో చేశారాంటరా?.. అప్పుడు ఏ మహేష్బాబునో, వెంకీ మామనో, ఐకాన్ స్టార్ బన్నీనో, రౌడీ విజయ్దేవరకొండనో లేదంటో పరభాషల్లో రజినీకాంత్, విజయ్, విజయ్ సేతుపతినో, మమ్మూటీ, మోహన్లాల్ మాదిరి అభిమానుల కోసం స్పెషల్ సెషన్లు నిర్వహించి ఫ్రీగా ఫొటోలకు ఫోజులు ఇచ్చే తారలు బోలెడు మంది ఉండనే ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏఐ ఉండనే ఉందిగా! అంటారా?.. మ్.. అది మీ ఇష్టం ఇక.. చెలరేగిపోండి. -
తండ్రి సొంతింటి కల నెరవేర్చిన బిడ్డ
అహ్మదాబాద్లోని కొత్త ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్న 61 ఏళ్ల గిర్ధర్భాయ్ జిరావాలా కళ్ల ముందు.. విషాద జ్ఞాపకాలు ఒకేసారి మెదిలాయి. వజ్రాల పాలిషింగ్ కార్మికునిగా కష్టపడి జీవితాన్ని నెట్టుకొచ్చిన ఆయన, ప్రస్తుత సొంత ఇంటిని, కొత్త ఫర్నిచర్ను చూస్తున్న ప్రతిసారీ, గుండెలో ఏదో తెలియని భారం. ఎందుకంటే, ఇది ఆయన కష్టంతో కొనుక్కున్న ఇల్లు కాదు. అది.. మరణానంతరం ఆయన పెద్ద కొడుకు మహేష్ జిరావాలా నెరవేర్చిన వాగ్దానం. కొద్ది రోజుల ముందు, గిర్ధర్భాయ్కి గుండెపోటు వచి్చంది. అప్పటివరకు కుటుంబంపై ఉన్న కొంత అప్పుల భారం, నరోడా ప్రాంతంలో అద్దె ఇంట్లో ఆరుగురు సభ్యుల జీవితం.. ఇవన్నీ ఆయనకు నిద్ర పట్టనివ్వలేదు. నేనున్నాను నాన్నా..కానీ, 34 ఏళ్ల సినీ నిర్మాత మహేష్, అన్నీ తానై తండ్రిని చూసుకునేవాడు. తండ్రి బాధను చూసి తట్టుకోలేక, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘నాన్నా! మీరు ఇకపై పనికి వెళ్లొద్దు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. నా తాజా సినిమాల నుంచి మంచి ఆదాయం వస్తుంది, దీపావళి లోపు అప్పులన్నీ తీర్చేసి, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తాను’.. అని గట్టిగా మాటిచ్చాడు. ఆకాశం నుంచి దిగిన మృత్యువుఅప్పటికి మహేష్.. హేతల్ను వివాహం చేసుకుని కేవలం మూడు నెలలే అయింది. కొత్త జీవితం, పెద్ద కలలు.. కుటుంబమంతా ఆశగా దీపావళి పండుగ కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఆశలకు ఆయుష్షు తక్కువైంది. జూన్ 12వ తేదీ.. విధి వక్రీకరించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలి, అగి్నకీలల్లో చిక్కుకుంది. ఆ భయంకరమైన విషాదంలో విమానంలోని ప్రయాణికులే కాక, నేల మీదున్న 19 మంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్ పక్కన రోడ్డుపై నుంచి వెళ్తున్న మహేష్ జిరావాలా కూడా ఆ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మరణం తర్వాత నెరవేరిన కల మహేష్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచినా, అతని వాగ్దానాన్ని మాత్రం మరిచిపోలేదు. విమాన ప్రమాదంలో పరిహారంగా ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ నుంచి మహేష్ కుటుంబానికి రూ.1.25 కోట్లు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా హేతల్కు పరిహారంగా రూ.4 లక్షలు లభించాయి. మొత్తంగా అందిన రూ.1.29 కోట్ల నుంచి, మహేష్ భార్య హేతల్ తన వాటా కింద రూ.54 లక్షలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మిగిలిన రూ.75 లక్షలు గిర్ధర్భాయ్ చేతికొచ్చాయి. కొడుకు కల నెరవేర్చాను.. కళ్లలో వేదన సుడులు తిరుగుతున్నా, గిర్ధర్భాయ్ మనసులో తన కొడుకు కోరికను నెరవేర్చాలనే తపన బలంగా ఉంది. ‘ఆ రూ.75 లక్షలతో, ముందుగా మహేష్ కలలుగన్నట్టు రూ.15 లక్షల అప్పును తీర్చేశాను. ఆ తర్వాత, రూ.45 లక్షలతో ఇంటిని కొనుగోలు చేశాను.. ఇలా నా కొడుకు కోరికను నెరవేర్చాను’.. అని గిర్ధర్భాయ్ చెప్పారు. కొత్త ఇంట్లో ఫర్నిచర్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి, మిగిలిన రూ.5 లక్షలను తన మనవరాలి (తమ్ముడు కార్తీక్ కూతురు) భవిష్యత్తు కోసం పక్కన పెట్టారు. మహేష్ ఆ చిన్నారికి ఆరేళ్లు రాగానే దత్తత తీసుకోవాలని కలలు కనేవాడు. ‘ఆ రూ.75 లక్షల్లో ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలకపోయినా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇకపై పనిచేయలేను. నా కొడుకు మరణం తర్వాత కూడా మా కుటుంబానికి గౌరవాన్ని అందించాడు’.. అని వణుకుతున్న గొంతుతో గిర్ధర్భాయ్ చెప్పారు. ఆకాశం నుంచి దిగిన మృత్యువు మహేష్ను దూరం చేసింది. కానీ, ఆ బిడ్డ త్యాగం ఒక తండ్రికి.. ఒక కుటుంబానికి ఆర్థిక ఆసరా కలి్పంచింది. సొంత ఇంటి కల నెరవేర్చి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ఇది ప్రేమ.. వాగ్దానం ముందు మరణం కూడా ఓడిపోయిన విషాదగాథ.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్ఫోన్ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
ఇండిగో.. ఇదేందయ్యో!
టికెట్ బుక్ అయిందంటే చాలు.. విమాన సంస్థ నమ్మకంగా తమను సమయానికి గమ్యానికి చేరుస్తుందన్న హామీ లభించినట్టు భావిస్తాం. వాతావరణం అనుకూలించక, సాంకేతిక సమస్యతో సర్వీసు రద్దయితే ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరిగిందేమోనని అర్థం చేసుకుంటాం. అలాకాకుండా కార్యాచరణ నిర్లక్ష్యంతో కస్టమర్లకు ఇచ్చిన హామీని ఆపరేటర్ ఉల్లంఘిస్తే..? దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఉదాసీనతగా భావించాలి. అంతేకాదు పెద్ద వైఫల్యం కూడా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా నిలవడానికి బదులుగా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కోట్లాది మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ప్రజల ఊహలకు అతీతంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది ప్రయాణికుల మాట. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన చర్యల అమలుకు బదులు సలహా ప్రకటనలకే పరిమితమైంది. వివిధ దేశాల్లో విమానయాన సంస్థలు విఫలమైనప్పుడు ప్రయాణికులకు పరిహారం అందుతుంది. ఆపరేటర్లను వదిలిపెట్టరు. టికెట్కు అయిన ఖర్చు వెనక్కి ఇవ్వడం, భోజనాలు, పానీయాలు, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాటు వంటివి ఒకప్పుడు భారత్లో అమలయ్యాయి. కానీ దశాబ్ద కాలంగా నియంత్రణ చర్యలు పేలవంగా, అస్థిరంగా, అరుదుగా శిక్షలతో అమలవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయొచ్చంటే.. సర్వీసు ఆలస్యం, కంపెనీ ప్రకటనలు, సమాచారాన్ని కస్టమర్లు రికార్డ్ చేయాలి. చాంతాడంత క్యూలు, ఖాళీ అయిన కౌంటర్లు, సిబ్బంది ప్రవర్తన మొదలైన వాటి ఫొటోలు, వీడియోలను సేకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘భోజనం, వసతి, ప్రత్యామ్నాయ విమానం, ప్రయాణ బిల్లులను ఉంచుకోవాలి. వినియోగదారుల ఫోరమ్స్లో పరిష్కారం కోసం ఇటువంటి ఆధారాలు అవసరం. డీజీసీఏ ఎయిర్సేవా పోర్టల్కు ఫిర్యాదు చేయాలి.జిల్లా వినియోగదారుల కోర్టులనూ ఆశ్రయించాలి. సేవా ఉల్లంఘన కింద ఆపరేటర్కు చట్టపరమైన నోటీసు పంపాలి. బాధిత ప్రయాణికులు సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఉమ్మడి పరిహార దావాలకు క్లాస్ పిటిషన్లను దాఖలు చేయవచ్చు’అని చెబుతున్నారు.బిజినెస్ క్లాస్ అంటేనే..: ఇండిగో వైఫల్యాన్ని బహిరంగంగా ఖండించాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘వివిధ కంపెనీల ప్రముఖులు, తరచూ ప్రయాణించేవారు ఆపరేటర్ను సామాజిక మాధ్యమాల్లో ఎండగడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ సంస్థల కంటే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎక్కువగా భయపడతాయి. పదేపదే సేవలు ఉల్లంఘించే ఆపరేటర్లతో ఒప్పందాలను కార్పొరేట్ సంస్థలు నిలిపివేయొచ్చు. పెద్ద క్లయింట్లను కోల్పోవడం అంటే వ్యాపారాన్ని పోగొట్టుకున్నట్టేనని విమానయాన సంస్థలు భావిస్తాయి’అని చెబుతున్నారు.మన దగ్గరా అమలవ్వాలి..: నియంత్రణ పరంగా సంస్కరణలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేయాలన్నది నిపుణుల మాట. ‘ఈయూ 261 తరహా నిబంధనల కోసం ఒత్తిడి చేయాలి. ఎయిర్లైన్ వల్ల కలిగే అంతరాయానికి కస్టమర్ల అభ్యర్థన ఆధారంగా కాకుండా ఆటోమేటిక్గా పరిహారం అందాలి. ఆపరేటర్లే భోజనాలు, ఆశ్రయాన్ని కల్పించాలి. జరిమానాలు ఆర్థికంగా ఉండాలి. ఉల్లంఘనలు పెరిగిన కొద్దీ జరిమానా అదే స్థాయిలో అధికం కావాలి’అని సూచిస్తున్నారు.ఏ దేశంలో ఎలా ఉందంటే..చాలా పరిణతి చెందిన విమానయాన మార్కెట్లలో కంపెనీల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. భారీ జరిమానాలు, కోర్టులు, వినియోగదార్ల ఫోరమ్స్లో వ్యాజ్యాలు, ఆపరేటర్లపై కఠిన చర్యలతోపాటు నియంత్రణ పరంగా జోక్యం చేసుకుంటాయి. యూరప్: ఈయూ నిబంధన 261 ప్రకారం.. విమానం ఆలస్యం, రద్దు అయితే ఒక్కో ప్యాసింజర్కు 600 యూరోల వరకు పరిహారం చెల్లించాలి. తప్పనిసరి భోజనం, పానీయాలు, వసతి కల్పించాలి. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇవ్వడం లేదా మరో మార్గంలో (రీ–రూటింగ్) గమ్యస్థానానికి పంపించాల్సిన బాధ్యత ఆపరేటర్దే. అమెరికా: 2022లో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ సంక్షోభంతో ప్రజల ఆగ్రహం, కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. భారీ మొత్తంలో కంపెనీ రీఫండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు హోటల్ కవరేజ్, భోజనం, రీబుకింగ్ సహాయం, రీఫండ్స్ లభించాయి.కెనడా: ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం ఎయిర్లైన్ లోపం కారణంగా తలెత్తే అంతరాయాలకు ప్రతి ప్యాసింజర్కు 125–1,000 కెనడియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ్రస్టేలియా: ప్రయాణికులను తప్పుదారి పట్టించడం, వారికి ఏదైనా హాని కలిగితే విమానయాన నియంత్రణ సంస్థలు ఆపరేటర్లకు జరిమానా విధిస్తాయి. -
కోర్–5 సూపర్ క్లబ్
వరల్డ్ ఆర్డర్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే బలం, సామర్థ్యం ఆధారంగా వరుస క్రమంలో దేశాల అమరిక. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలే శాసించే ఈ వరల్డ్ ఆర్డర్ త్వరలో పెను మార్పులను చవిచూడనుందా? ఇప్పటిదాకా అత్యంత బలోపేతమైన కూటమిగా ఉన్న జీ7 వైభవం గతించనుందా? దాన్ని తోసిరాజనేలా అతి శక్తిమంతమైన సరికొత్త కూటమి ఒకటి శరవేగంగా పురుడు పోసుకుంటోందా? అన్ని రంగాల్లోనూ నిర్నిరోధంగా దూసుకుపోతున్న నయా భారత్ ది అందులో అతి కీలక పాత్ర కానుందా? అంటే, అవుననే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ముఖ్యంగా కొద్దిరోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు, చేతలు, చాప కింద నీరులా ఆయన చకచకా సాగిస్తున్న ప్రయత్నాలు ఇందుకు ప్రబల సంకేతాలేనని చెబుతున్నారు. కోర్–5 పేరిట కొత్త కూటమికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత డిజిటల్ వార్తా పత్రిక పొలిటికో రాసి కథనం అంతర్జాతీయంగా పెను సంచలనమే సృష్టిస్తోంది. అమెరికా, భారత్, మరో రెండు ఆసియా దిగ్గజాలైన చైనా, జపాన్ తో పాటు ఆశ్చర్యకరంగా రష్యా కూడా ఇందులో భాగస్వామి కానుందని పొలిటికో కథనం సారాంశం. అమెరికాకు సంబంధించిన రక్షణ, జాతీయ భద్రతా వ్యవహారాలను అత్యంత కచి్చతత్వంతో నివేదించే డిఫెన్స్ వన్ సైట్ ను ఉటంకిస్తూ అది ఈ మేరకు పేర్కొంది. ఈ కోర్ గ్రూప్నకు ముద్దుగా ’సీ5 సూపర్ క్లబ్’ గా నామకరణం కూడా చేసింది! నిజంగా గనుక అదే జరిగితే చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన కూటమి ఇదే అవుతుందని అంతర్జాతీయ నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమెరికా జాతీయ భద్రతా వ్యూహంలో ప్రచురించకుండా రహస్యంగా ఉంచిన భాగంలో సీ5 గురించి వివరంగా ఉన్నట్టు వాషింగ్టన్, వైట్ హౌస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి! ట్రంప్ తీసుకువస్తున్న సరికొత్త సీ 5 ప్రతిపాదనలపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, జపాన్ ప్రధాని తకాయిచీ స్పందనలేమిటో తెలియాల్సి ఉంది. యూరప్ దేశాలకు చెక్? జీ7 కూటమిలో అమెరికా, కెనడా , జపాన్ ను మినహాయిస్తే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ రూపంలో నాలుగు యూరప్ దేశాలే ఉన్నాయి. పలు అంశాల్లో వాటి దూకుడు పట్ల ట్రంప్ కొద్దికాలం గుర్రుగా ఉన్నారు. చీటికిమాటికి అన్ని విషయాల్లోనూ తమ మాటే నెగ్గాలనే ఒంటెత్తు పోకడతో అవి శిరోభారంగా మారాయని భావిస్తున్నారు. వాటికి చెక్ పెట్టేందుకే ఈ కొత్త కూటమికి ఆయన తెర తీస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా విదేశాంగ విధానంలోనే ఇది పెను మార్పు కానుంది! అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టిన గత 80 ఏళ్లలో నిత్యం యూరప్ ను తన అతి సన్నిహిత భాగస్వామిగానే పరిగణిస్తూ రావడం తెలిసిందే.ట్రంప్ సంకేతాలు సీ 5 గ్రూప్ గురించి నిజానికి ట్రంప్ కొంతకాలంగా స్పష్టమైన సంకేతాలే ఇస్తూ వస్తున్నారు. గత జూన్ లో జరిగిన జీ7 శిఖరాగ్రాన్నే ఇందుకు ఆయన వేదికగా మలచుకోవడం విశేషం. జీ7 కూటమిలో రష్యా కొనసాగి ఉండాల్సిందని, ఆ మాటకొస్తే చైనాకూ ఎన్నడో చోటు దక్కాల్సిందని ఆయన కుండబద్ధ్దలు కొట్టారు. తొలుత జీ8గా ఉన్న ఈ కూటమి కాస్తా, 2014లో క్రిమియాను ఆక్రమించిన కారణంగా రష్యాకు ఉద్వాసన పలకడంతో జీ7గా మారింది. ‘నిజానికి అతి పెద్ద తప్పిదమది. అలా చేయకుంటే నేడు ఇంత భారీ యుద్ధమే జరుగుతుండేది కాదు‘ అని ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఉదేశించి జీ7 వేదికగానే ట్రంప్ కుండబద్ధ్దలు కొట్టారు. సి5 మరీ సత్యదూరం ఏమీ కాకపోవచ్చని బైడెన్ హయాంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో కీలకపాత్ర పోషించిన టోరీ తౌసిగ్ చెప్పడం విశేషం. ‘ట్రంప్ కు సిద్ధాంతాలపై పెద్దగా నమ్మకం లేదు. తన ఆలోచనలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు ఏది పనికొస్తే అదే అప్పటికి ఆయన సిద్ధాంతం! ఆ లెక్కన కొంతకాలంగా తనకు శిరోభారంగానే గాక అమెరికాకు ఆర్థికంగానూ, ఇతరత్రా కూడా భారంగానే పరిణమిస్తున్న యూరప్ దేశాలను వదిలించుకునేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు.అప్పుడే ఎజెండా రెడీ? అవుననే అంటోంది పొలిటికో. జీ7 మాదిరిగా తర చూ భేటీ కావాలని, అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించాలని ట్రంప్ భావిస్తున్నట్టు అది వివరించింది. అంతేకాదు, పశ్చిమాసియా భద్రతే సీ5 తొలి ఎజెండా అని కూడా డిఫెన్స్ వన్ ను ఉటంకిస్తూ చెప్పేసింది! ముఖ్యంగా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఉప్పూ నిప్పుగా ఉన్న సంబంధాలను సరిదిద్దడం సీ5 ’తొలి అసైన్ మెంట్’ అని చెప్పుకొచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫస్ట్ క్లాస్ నేషనల్ హైవేలు.. మృత్యు మృగాలు!
ప్రతి నిమిషానికి 2.. గంటకు 136.. రోజులో 3,260 మంది.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల రూపంలో పోతున్న ప్రాణాల సంఖ్య ఇది. సేఫ్టీ ప్రచారాలు.. చర్యలు ఈ లెక్కను మరుసటి ఏడాదికి పెరగకుండా ఆపలేకపోతున్నాయి. ఇందునా భారతదేశం యాక్సిడెంట్లకు హాట్స్పాట్గా కొనసాగుతూ వస్తోంది. లక్షలాది ప్రమాదాలు, అపార ప్రాణనష్టం దేశానికి ఒక పెద్ద సవాలుగా మారాయి. అందునా.. శీతాకాలంలో ఈ రేటు మరింతగా ఉంటోంది. ఆ లోతుల్లోకి వెళ్తే.. భారతదేశం రోడ్డు భద్రతలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. 2025 జనవరి-జూన్ మధ్య యాక్సిడెంట్లో రూపంలో 29,000 మంది(కేవలం జాతీయ రహదారులపైన) బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. కానీ, భారత్లో ప్రతి సంవత్సరం సుమారు 1.5–1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు (అన్నిరకాల యాక్సిడెంట్ల రూపంలో). ఇది ప్రపంచ మొత్తం మరణాల్లో 11%గా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా (2025) నివేదిక ప్రకారం.. రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ అత్యంత ప్రమాదకర దేశంగా ర్యాంక్ అయ్యింది. డ్రైవింగ్ పరిస్థితులు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు, అధిక వేగం ప్రమాదాలకు కారణంగా ఈ నివేదిక చూపించింది. డాటా ఫర్ ఇండియా అనే సంస్థ సర్వే ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాద మరణాలు నమోదు చేసే దేశం.కారణాలు ఇవిగో..👇👉చాలా రహదారులు సరైన డిజైన్ ప్రమాణాలు లేకుండా నిర్మించబడ్డాయి. వాటిపై సంకేతాలు (sign boards), స్పీడ్ బ్రేకర్లు, డివైడర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం రాత్రి సమయంలో ప్రమాదాలకు దారితీస్తోంది. 👉ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం.. అధిక వేగం, తప్పు దిశలో డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ దాటడం వంటి ఉల్లంఘనలు కారణాలుగా ఉంటున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరుగతున్నాయి. వీటికి తోడు.. 👉టూవీలర్ హెల్మెట్, ఫోర్ వీలర్లో సీటు బెల్ట్ వాడకాలు కూడా మరణాల రేటుపై ప్రభావం చూపెడుతోంది. హిట్ అండ్ రన్, ఓవర్ స్పీడ్లు కూడా మరణాలకు కారణం అవుతున్నాయి.డబ్యూహెచ్వో అంచనా ప్రకారం, హెల్మెట్ వాడితే తల గాయాలు 40% తగ్గుతాయి, సీటు బెల్ట్ వాడితే మరణాలు 50% తగ్గుతాయి.👉ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ (Golden Hour) లో చికిత్స అందకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అంబులెన్స్ సేవలు, ట్రామా కేర్ సెంటర్లు సరైన స్థాయిలో ఉండడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు దూరంగా ఉండటం వల్ల సమయానికి చికిత్స అందక ప్రాణాలు పోతున్నాయి.శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరగుతున్నాయి. గణాంకాల ప్రకారం.. చలికాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 30వేలకు తక్కువగా ఉండడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. పొగమంచు (Fog): దృశ్యమానం(విజిబిలిటీ) తగ్గిపోవడం వల్ల వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం సాధారణంగా మారింది.తడి రహదారులు: మంచు, తేమ కారణంగా రహదారులు జారిపోవడం, బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.అధిక వేగం: డ్రైవర్లు వేగం తగ్గించకపోవడం, ఫాగ్ లైట్లు వాడకపోవడం.అత్యవసర సేవల ఆలస్యం: ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సహాయం అందకపోవడం వల్ల మరణాలు పెరుగుతాయి.యాక్సిడెంట్.. డెత్స్.. లెక్కలు:2022లో: 4.5 లక్షల ప్రమాదాలు, 1.5 లక్షల అధికారిక మరణాలు2023లో: 4.8 లక్షల ప్రమాదాలు, 1.72 లక్షల మరణాలు2024లో.. 4.73 లక్షల యాక్సిడెంట్లు(కాస్త తగ్గినా) మరణాలు 1.77 లక్షలకు పెరిగాయి2025 (జనవరి–జూన్): జాతీయ రహదారులపై 29,018 మరణాలు (పూర్తి గణాంకాలు రావాల్సి ఉంది) భారతదేశంలో హైవేలు మొత్తం రహదారి నెట్వర్క్లో ఉండేది కేవలం 2% మాత్రమే. వీటికి ఫస్ట్ క్లాస్ హైవేల గుర్తింపు ఉంది. కానీ, దేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 50% కంటే ఎక్కువ వాటా వీటికే ఉంది. 2025లో ఇప్పటిదాకా సగటున రోజుకి హైవేల మీద 150 మరణాలు సంభవించాయి. అంటే.. ప్రతీ గంటకూ ఆరు మరణాలు అన్నమాట. ఈ లెక్కన హైవేలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వెనుక నుంచి ఢీకొనడం (Rear-end collisions) రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరుగుతున్న విభాగం. ఇవి మొత్తం ప్రమాదాల్లో 21%కి కారణమవుతాయి. అలాగే మొత్తం మరణాల్లో 20% వీటి నుంచే ఉంటున్నాయి.హిట్-అండ్-రన్ కేసులు రోడ్డు ప్రమాదాల్లో మరణాలకు పెద్ద కారణం. ఇవి మొత్తం మరణాల్లో 18% వాటా కలిగి ఉన్నాయి. లోయల్లో వాహనాల పడి జరిగే ప్రమాదాలు.. ఐదు శాతం కంటే తక్కువే ఉంటోంది. కానీ, వీటి ద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. మధ్యాహ్నా టైంలోనే అధిక యాక్సిడెంట్లు!గణాంకాలను (MoRTH నివేదికలు) పరిశీలిస్తే.. ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్య ప్రమాదాలు 25–30% వరకు నమోదవుతాయి. - మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సుమారు 40% దాకా ఉంటోంది(అధిక రద్దీ కారణంగా..). ఇక.. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి మధ్య ప్రమాదాల సంఖ్య 20–25% దాకా ఉంటోంది. అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల సమయంలోనే ప్రమాదాల సంఖ్య కనిష్టంగానే ఉంటోంది. కానీ, అర్ధరాత్రి దాటాక జరిగే యాక్సిడెంట్లలోనే మరణాల రేటు అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాల సంభవించే దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్(2024లో 24వేల మరణాలు.. ఈ ఏడాది కూడా అంతకు మించే..), తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ,రాజస్థాన్లో అత్యధిక మరణాల నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన సగం రోడ్డు ప్రమాదాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయి. -
ఆమె టైమ్ బాలేదు!
సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసుకు వస్తేనే కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ, స్పెయిన్లో ఒక మహిళ.. చాలా ముందుగా ఆఫీసుకు వస్తోందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. మీరు చదివింది నిజమే.. స్పెయిన్లో రూల్ అంటే రూలే మరి. మేనేజర్ల ఆదేశాలుబేఖాతర్.. స్పెయిన్కు చెందిన 22 ఏళ్ల ఒక ఉద్యోగిని అధికారికంగా ఉద యం 7.30 గంటలకు పని ప్రారంభించాలి. కానీ, ఆమె అలవాటు ప్రకారం రోజూ దాదాపు 6.45 గంటలకే కార్యాలయానికి చేరుకునేది. ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే పద్ధతిని పాటించింది. ఈ విషయంలో కంపెనీ ఆమెకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన పనులేవీ లేవని, ముందే రాకూడదని స్పష్టంగా చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు.ఎందుకుముందే వచ్చావ్! కంపెనీ యాజమాన్యానికి సహనం నశించింది. ఆదేశాలను ఉద్యోగిని పట్టించుకోకపోవడం, నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైన దు్రష్పవర్తనగా భావించింది. ‘ఇది కేవలం ఉత్సాహం కాదు, కంపెనీ ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే’.. అని మేనేజర్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో చేయగలిగిన ముఖ్యమైన పనులేవీ లేనప్పటికీ, కావాలనే పదేపదే ఆదేశాలను బేఖాతర్ చేయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు.న్యాయస్థానంలో నూచుక్కెదురుకంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన తొలగింపు అన్యాయమని వాదిస్తూ అలికెంట్ సోషల్ కోర్టులో సవాలు చేసింది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా.. సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె అదే అలవాటును కొనసాగించిందని తేలింది. కొన్నిసార్లు, ఆమె ఆఫీసుకు రాకముందే కంపెనీ యాప్లో లాగిన్ కావడానికి కూడా ప్రయతి్నంచినట్లు కోర్టు దృష్టికి వచి్చంది.రూల్ అంటే రూలే మరి..న్యాయమూర్తి.. ఉద్యోగం నుండి తొలగించడానికి కారణం ‘ముందే ఆఫీస్కు రావడం’కాదని, పనిచేసే చోట నియమాలను పాటించడానికి నిరాకరించడమే ప్రధాన కారణమని తన తీర్పులో స్పష్టం చేశారు. ఉద్యోగుల చట్టం ఆర్టికల్ 54 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేలి్చ, కంపెనీ తొలగింపు నిర్ణయాన్ని కోర్టు సమరి్థంచింది. ప్రస్తుతానికి తీర్పు మారకపోయినా, ఆమె ఇంకా వాలెన్సియా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచుకొండల్లో పెనుముప్పు!
హిమాలయాలు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పేనా? మంచుకొండల్లో పెను విలయం తప్పదా? అది కూడా అతి త్వరలోనే ముంచుకురానుందా? ఆ ఆస్కారం చాలానే ఉందని చెబుతున్నారు సైంటిస్టులు. ఏకంగా 7.6 తీవ్రతతో జపాన్ ను తాజాగా వణికించిన లేను భూకంపం ఇందుకు సూచికేనని అని వారు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఉత్పాతాన్ని ఇప్పటి నుంచే ’గ్రేట్ హిమాలయన్ ఎర్త్ క్వేక్’ గా పిలిచేస్తున్నారు కూడా! పేలనున్న మందుపాతర! జపాన్ భూకంపం వంటి ప్రాకృతిక విలయాలకు ఆస్కారం అత్యంత ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉన్న విషయం తెలిసిందే. దాంతో అక్కడ జనానికి ఈ విపత్తులు, ముఖ్యంగా భూకంపాలతో సహజీవనం పరిపాటిగా మారింది. త్వరలో హిమాలయాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తేలా ఉందన్నది భూ భౌతిక శాస్త్రవేత్తల ఆందోళన. హిమాలయ ప్రాంతాన్ని ఏ క్షణంలోనైనా పేలనున్న మందుపాతరగా వాళ్లు అభివరి్ణస్తున్నారు. హిమాలయాల అడుగున టెక్టానిక్ ప్లేట్ల కుమ్ములాటే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంటే అక్కడ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్ ను ఢీకొడుతూ వస్తోంది. దాంతో కొన్ని సహస్రాబ్దాలుగా ఆ ప్రాంతమంతటా భూగర్భంలో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు అతి భారీ పరిమాణంలో విడుదలవడం ఖాయమన్నది సైంటిస్టుల మాట. ‘అదే జరిగితే రిక్టర్ స్కేలుపై ఏకంగా 8, లేదా అంతకు మించిన తీవ్రతతో భూమి కంపిస్తుంది. దాని ప్రభావానికి మొత్తం ఉత్తర భారతమే గాక నేపాల్, ఇరుగుపొరుగు దేశాలు కూడా కనీవినీ ఎరగనంతటి స్థాయిలో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను చవిచూడాల్సి రావచ్చు‘ అని వారు హెచ్చరిస్తున్నారు. చరిత్రే సాక్షి హిమాలయాలకు భూకంపాలు, అందులోనూ భారీ ప్రకంపాలు నిజానికి కొత్తేమీ కాదు. 1934లో ఏకంగా 8 తీవ్రతతో సంభవించిన భూకంపం బిహార్ మీదుగా నేపాల్ దాకా ఉత్పాతం సృష్టించింది. ఇటీవలి చరిత్ర చూసుకున్నా, 2015లో నేపాల్లోని హిమ సానువుల్లో 7.8 తీవ్రతతో వచి్చన భూకంపం అక్కడ భారీ జన, ఆస్తి నష్టాలకు కారణమైంది. అయితే హిమాలయాల్లో భూకంపం వచ్చేస్తుందని ఆందోళన అక్కర్లేదన్నది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాశ్ మిశ్రా మాట. ‘హిమాలయాల్లో సైంటిస్టులు చెబుతున్నట్టు ప్రాకృతిక ఉత్పాతమేదీ రాబోదు. నిజానికి ఎన్నెన్నో ఉత్పాతాల నుంచి దేశాన్ని కాపాడుతున్న పెట్టని కోట మన హిమ సానువులు. భూ పలకల ఒరిపిడి విలయానికి దారి తీస్తుందని బెంబేలు పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆ ఒరిపిడి తాలూకు ఒత్తిడి 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూకంపాల రూపంలో ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంది. కనుక గ్రేడ్ హిమాలయన్ ఎర్త్ క్వేక్ గురించి మరీ ఆందోళన పనిలేదు‘ అని చెప్పుకొచ్చారాయన. కానీ ఎవరెన్ని చెప్పినా సమీప కాలంలో భారీ భూకంపానికి హిమ సానువులు సిద్ధమవుతున్నాయన్నదే మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయం. బీఐఎస్ దీ అదే మాట ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్కు జోన్ల మ్యాపింగ్ కూడా మెజారిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాయాన్నే బలపరుస్తుండటం విశేషం. అందులో భాగంగా భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) తాజాగా సవరించింది. అత్యధిక రిసు్కతో కూడిన జోన్ 6 ను కొత్తగా ఏర్పాటు చేయడమే గాక హిమాలయ ప్రాంతమంతటినీ దాని పరిధిలోనే చేర్చింది! ఇవన్నీ మంచు కొండల్లో ముంచుకు రాగల పెను ముప్పు ముందస్తు సూచికలేనని చెబుతున్నారు. -
తల వేలాడేస్తున్న.. పైలట్ పక్షులు
పైలట్ల పని వేళల విషయంలో పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టం లేక ఇష్టారాజ్యంగా విమానాలు రద్దుచేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది ఇండిగో సంస్థ. ఈ నేపథ్యంలో పైలట్ల పని గంటలు, వారిపై ఒత్తిడి వంటి అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత పౌర విమానయాన రంగం శరవేగంతో ‘టేకాఫ్’ అవుతున్నప్పటికీ, నియమ నిబంధనలకు విరుద్ధంగా పైలట్ల చేత పని చేయించటం అన్నది ఊహించని ‘పక్షిఘాతం’లా పరిణమించే ప్రమాదం ఉందని ‘సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్’ అనే ఎన్జీఓ గత జూన్లోనే హెచ్చరించిన విషయం తాజాగా వార్తల్లోకి వచ్చింది.‘సేఫ్టీ కల్చర్ సర్వే –2024: పైలట్ ఫెటీగ్ అండ్ వర్క్ ఎన్విరాన్మెంట్’ పేరిట 530 మంది పైలట్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ‘సేఫ్టీ మేటర్స్ ఫౌండేషన్’.. పనిభారం పైలెట్లకు కుంగదీస్తోందని వెల్లడించింది. ఇది భారతీయ పైలట్ల ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ.విమాన విధులు–సమయ పరిమితులలో ప్రభుత్వం చేసిన మార్పులను అమలు చేయకపోవటం వల్ల పైలట్లు అలసటకు గురవుతున్నారని తెలిపింది. పైలట్లకు విశ్రాంతి తప్పనిసరి అని, రాత్రి విధులను కుదించవలసిన అవసరం కూడా ఉందని సూచించింది.డిమాండ్ను తట్టుకునేందుకే!అదనపు పనిగంటలు, ఇతర వృత్తి సంబంధ మార్పుల వల్ల భారతీయ పైలట్లలో 83 శాతం మంది తీవ్రమైన అలసటకు గురవుతున్నట్లు సర్వే గుర్తించింది. పౌర విమానయానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో డిమాండ్ను తట్టుకోవటానికి రాత్రి నడిపే విమాన సర్వీసులను పెంచటం కూడా సమస్యకు కారణం అవుతున్నట్లు సర్వే వివరించింది. ఇండియాలో ఒక పైలట్ సగటు విమాన పని గంటలు 2015లో 407 వరకు ఉండగా, 2020లో అవి 165 గంటలకు తగ్గినప్పటికీ, తిరిగి 2024లో 246 గంటలకు పెరిగాయని సర్వే పేర్కొంది.‘రోస్ట్’ చేస్తున్న రోస్టర్! సేఫ్టీ కల్చర్ సర్వే – 2024 ప్రకారం, తరచు జరుగుతున్న రోస్టర్ మార్పులు (పైలట్ విధుల వేళల్లో మార్పులు) తమ అలసటకు కారణం అవుతున్నట్లు 74 శాతం పైలట్లు తెలిపారు. 19.4 శాతం మంది మరీ అంత స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, మార్పులు గణనీయమైన ప్రభావాన్నే చూపుతున్నాయని అంగీకరించారు.రీ–అసైన్ మెంట్లువిమానయాన సంస్థలు పైలట్లకు మొదట కేటాయించిన విమానాన్ని మార్చినప్పుడు (టెయిల్ స్వాప్) పైలట్లు ఒత్తిడికి, అలసటకు లోనవుతున్నట్లు సర్వే గుర్తించింది. దాదాపు 63.8 శాతం మంది పైలట్లు టెయిల్ స్వాప్ అనేది తీవ్రమైన అలసటను కలిగిస్తుందని అన్నారు.పెద్దగా పెరగలేదుభారతదేశంలో పైలట్ల సంఖ్య 2015లో 3,973 నుండి 2024లో 11,775కి పెరిగింది. కానీ ఈ పదేళ్లలో పైలట్–ఎయిర్ క్రాఫ్ట్ నిష్పత్తి 13.8–14.5 మధ్యలోనే స్థిరంగా ఉంది. అంటే ప్రతి విమానానికీ 13 నుంచి 15 మధ్య మాత్రమే పైలట్లు ఉన్నారన్నమాట. (ఆధారం : డి.జి.సి.ఎ.)పెరిగిన పని గంటలుకోవిడ్ తర్వాత చాలా భారతీయ విమానయాన సంస్థలు పైలట్ సగటు విమాన ప్రయాణ గంటలను పెంచేశాయి. 2024 (నవంబర్ వరకు) లో మాత్రం ప్రయాణ గంటల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. -
భారత్లో నచ్చిన పార్టీకి ఓటేసే ఛాన్స్ వస్తే..
నచ్చిన అభ్యర్థికే ఓటేయడం అన్నది ఓటర్ల ఇష్టం. కానీ, నచ్చిన పార్టీకి కూడా ఓటేసే అవకాశం వస్తే.. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితుల ఏర్పడితే??. ఇందుకోసం ఒక ఓటరు.. రెండు ఓట్ల విధానం మన దేశంలోనూ అమలయ్యేలా చూడాలని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు. లోక్సభ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విప్లవాత్మక సంస్కరణను ప్రతిపాదన చేశారాయన. ఇంతకీ ఇలాంటి విధానం ఒకటి ఉందని.. అది ఏ దేశంలో అమల్లో ఉందని.. అది ఎలా పని చేస్తుందనే విషయం మీకు తెలుసా?..ఎమ్ఎమ్పీ (మిక్స్డ్ మెంబర్ ప్రపొర్షనల్) మోడల్.. జర్మనీ దేశం ఈ పద్దతిని ఫాలో అవుతోంది. దీని ప్రకారం.. అర్హత గల పౌరులకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటుతో అభ్యర్థులను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన వారు నేరుగా పార్లమెంట్కి వెళ్తారు. మరో ఓటు మాత్రం పార్టీలకు వేయాల్సి ఉంటుంది!.దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయో దాని ఆధారంగా మొత్తం పార్లమెంట్లో ఆ పార్టీకి ఉండాల్సిన సీట్లు(అదనపు) నిర్ణయిస్తారు. ఆ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి కూడా.!ఉదాహరణకు.. A, B, C అనే మూడు పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్లు.. తమ నియోజకవర్గంలో ఎవరు గెలవాలో నిర్ణయించడానికి ఓటేస్తారు.. రెండో ఓటు దేశవ్యాప్తంగా ఏ పార్టీకి ఎంత శాతం సీట్ల రావాలో నిర్ణయించడానికన్నమాట. ఇందులో A అనే పార్టీ స్థానికంగా 180 సీట్ల నెగ్గింది. B అనే పార్టీ 90 సీట్లు గెలిచింది. C అనే పార్టీ 29 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే.. దేశవ్యాప్తంగా ఓట్ల శాతం అంటే పార్టీ ఏకి వచ్చిన ఓట్లు 40% ఓట్లు( రేషియో ప్రకారం.. 280 సీట్లు రావాల్సి ఉంటుంది), పార్టీ బీకి 35% ఓట్లు(రేషియో ప్రకారం.. 245 సీట్లు రావాల్సి ఉంటుంది). పార్టీ సీకి 25% ఓట్లు(175 సీట్లు రావాల్సి ఉంటుంది) పోలయ్యాయి. ఈ లెక్క ప్రకారం.. పార్టీ ఏకి అదనంగా 100 సీట్లు, పార్టీ బీకి అదనంగా 155 సీట్లు, పార్టీ సీకి అదనంగా 146 సీట్లు కేటాయిస్తారు.జర్మనీలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది ఎక్కువ ఓట్లు పొందిన పార్టీ + ఎవరు కూటమి చేస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పార్టీ A (40%) ఒంటరిగా మెజారిటీ సాధించలేకపోతే, పార్టీ C (25%)తో కలిస్తే 65% మెజారిటీ వస్తుంది. అలాగే పార్టీ B (35%) + పార్టీ C (25%) కలిస్తే 60% మెజారిటీ వస్తుంది. ఇలా MMPలో స్థానిక గెలుపు + జాతీయ ఓట్ల శాతం రెండూ కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి.భారత్లో.. భారత్ పార్లమెంటరీ ఎన్నికల విధానాన్ని అవలంభిస్తోంది. దీనిని ఎఫ్పీటీపీ ( First Past The Post)గా వ్యవహరిస్తారు. ఈ విధానంలో ప్రజలు నేరుగా అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఏ వ్యక్తికైతే అధికంగా ఓట్లు పోలవుతాయో వారినే విజేతగా నిర్ణయిస్తారు. ఎక్కువ సభ్యులు ఏ పార్టీ వాళ్లు ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజారిటీ గనుక సాధించకపోతే అప్పుడు కూటమికి వెళ్తుంది. అంతేగానీ.. పార్టీలకు ప్రత్యేకించి సీట్ల కేటాయింపు అనేది ఉండదు.మిక్స్డ్ విధానం వల్ల ఒరిగేదేంటి?..ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం పార్లమెంట్లో న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అంటే, ఒక పార్టీకి వచ్చిన ఓట్ల శాతం ప్రకారం సీట్లు కేటాయించబడతాయి, దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశం కలగవచ్చు. అలాగే స్థానిక ప్రతినిధులు కూడా ఎలాగూ ఉండనే ఉంటారు. చట్ట సభలో స్థానికత ఫ్లస్ జాతీయ విధానం రెండూ ప్రతిబింబిస్తాయి.ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ రావడం అరుదుగా జరగొచ్చు. కాబట్టి రెండు లేదంటే అంతకంటే ఎక్కువ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల సహకారం, చర్చలు, సమతుల్య నిర్ణయాలు ఎక్కువగా జరుగుతాయి.ఓటర్లు తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిని ఎంచుకోవచ్చు. అదే సమయంలో, తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసి దేశవ్యాప్తంగా ఆ పార్టీకి సీట్లు పెంచవచ్చు. దీని వల్ల ఓటు వృథా అనే ప్రస్తావనే ఉండదు. ఎంఐఎం అధినేత ఒవైసీ ఈ ఎంఎంపీ మోడల్ను భారతదేశంలో అమలు చేయాలని ప్రతిపాదించడం వెనుక బలమైన కారణం ఉంది, భారత్లో ప్రస్తుతం అమలువుతున్న FPTP విధానం వల్ల చట్టసభలో చిన్న పార్టీలకు, మైనారిటీలకు, ప్రాంతీయ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే ఎంఎంపీ విధానం వల్ల ప్రజలు వేసిన ఓట్ల శాతం న్యాయంగా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రాతినిధ్యం కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎఫ్పీటీపీ వల్ల విధానంలో ఒక పార్టీకి తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు రావొచ్చు. కానీ ఎంఎంపీలో అలాంటిది జరిగే అవకాశం ఉండదు. తద్వారా ప్రజాస్వామ్యం మరింత సమతుల్యంగా ఉంటుంది. -
ఒక నోట్ల కట్ట.. డజను ఎంపీలు
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఒక సంఘటన, ’నవ్వుకు నోబెల్ బహుమతి’ ఉంటే.. అది పాకిస్తాన్ పార్లమెంటుకే దక్కేదని నిరూపించింది. స్పీకర్ అయజ్ సాదిక్ గారు, పార్లమెంటు ఫ్లోర్పై పడి ఉన్న ఒక చిల్లర నోట్ల కట్టను చూశారు. అందులో ఏకంగా 10.. రూ.5,000 పాకిస్తాన్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే, భారతీయ కరెన్సీలో దాదాపు రూ.16,500 విలువ అన్నమాట. ఈ మొత్తం పాక్ కరెన్సీలో మహా అయితే రెండు బిర్యానీ ప్యాకెట్లకు సరిపోతుంది. నోట్లు పది.. చెయ్యెత్తింది డజను మంది స్పీకర్ సాదిక్.. ఎంపీల నిజాయితీకి పరీక్ష పెడదామని గొప్పగా అనుకున్నారు. అయితే, అది ఎంత హాస్యాస్పదంగా మారుతుందో ఆయన ఊహించలేకపోయారు. ‘ఎవరి డబ్బు ఇది? దయచేసి చేయి ఎత్తండి!’.. అని ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు. ఆయన నోటి మాట పూర్తి కాకముందే, అదో కబాబ్ దొరికినట్లు.. ఒక్క సెకన్లో 12 మంది ఎంపీలు హుటాహుటిన చేతులు పైకెత్తేశారు. ఎంపీల వేగం చూసి స్పీకర్ గారికి నోట మాట రాలేదు. ‘నోట్లు ఉన్నది పదే. మరి యజమానులు ఏకంగా పన్నెండు మందా??’.. అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. పాకిస్తాన్కు చెందిన ఆజ్ టీవీ కథనం ప్రకారం, ఆ డబ్బు దాని నిజమైన యజమాని అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ఎంపీ ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి చేరింది. ఆయన అసెంబ్లీ కార్యాలయం నుండి ఆ మొత్తాన్ని అందుకున్నారు. తలంటిన పాకిస్తానీలు సోషల్ మీడియాలో తెగ వైరలైన ఈ వీడియోపై చాలా మంది పాకిస్తానీలు తమ చట్టసభ సభ్యుల వైఖరిని ఛీత్కరించుకున్నారు. ఆ నోట్లు తమవేనని చేతులెత్తిన 12 మంది ఎంపీలను పదవుల నుంచి తొలగించాలని కొందరు పాకిస్తానీలు కోరారు. ‘స్పీకర్ షరీఫ్ సోదరుల నుండి వచ్చిన 25 మిస్డ్ కాల్స్ గమనించలేదు’.. అని మహ్నూర్ ఆసిఫ్ వెటకారంగా ట్వీట్ చేశాడు. మరొకరు ‘ఎంపీలు లక్షల్లో జీతాలు, ప్రోత్సాహకాలు తీసుకుంటారు, అయినా వారి పరిస్థితి ఇదే’.. అని ట్వీట్ చేశారు. పార్లమెంటులో దొరికిన డబ్బులు కూడా అప్పుగా తీసుకొచి్చనవేమో అని పాకిస్తానీలు వెటకారంగా వ్యాఖ్యానించడం మరో హైలైట్. రజియా సుల్తాన్ అనే ఫేస్బుక్ యూజర్ నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ను ఇందులోకి లాగారు. ‘పీఎంఎల్ఎన్ చాలా పేద పార్టీ. స్పీకర్ వారికి ఆ డబ్బు ఇవ్వాల్సింది.. అది మరియం నవాజ్ సన్నబడేందుకు సహాయపడుతుంది’.. అని పోస్టు చేశారు. మొత్తానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీద నడుస్తుంటే, పార్లమెంటు సభ్యులు మాత్రం ఫ్లోర్పై పడి ఉన్న రూ.16 వేల చిల్లర నోట్ల కోసం ప్రపంచం ముందు పరువు మొత్తం పోగొట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారీ తారల... రుజువులు చిక్కాయి
భారీ తారలు. మన సూర్యుని కంటే ఏకంగా పది వేల రెట్లు పెద్దవి! పైగా నిన్నా మొన్నటికి కూడా కావవి! తొలి విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) జరిగిన కొన్ని కోట్ల ఏళ్ల వ్యవధిలోనే పుట్టుకొచ్చాయి. అంటే అతి పురాతన నక్షత్రాలన్నమాట. ఇలాంటివి ఈ అనంత విశ్వంలో ఉన్నాయనింతకాలం సైంటిస్టులు అనడమే తప్పించి ఇదమిత్థంగా తేల్చిచెప్ దాఖలాలు మాత్రం లేవు. అలాంటి తొలినాళ్ల భారీ తారల ఉనికికి సంబంధించి పక్కా రుజువులను మానవాళి తాలూకు అతి పెద్ద అంతరిక్ష నేత్రం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా ఒడిసిపట్టింది..!దొరికాయిలా...ఈ భారీ తారలను రాకాసి నక్షత్రాలుగా సైంటిస్టులు ముద్దు పిలుచుకుంటూ ఉంటారు. వాటి పరిమాణే అందుకు కారణం. సూర్యునితో పోలిస్తే అవి కనీసం 1,000 నుంచి 10,000 రెట్లు పెద్దవి మరి! జీఎస్ 3073 అనే అతి సుదూర నక్షత్ర మండలంలోని రసా యనిక అవశేషాలను జేమ్స్ వెబ్ తాజాగా పట్టించింది. వాటిని అనంతరం ఈ రాకాసి తారల ఉనికిని సైంటిస్టులు అసందిగ్ధంగా నిర్ధారించారు.పురాతన క్రిష్ణ బిలాలకూ మూలమివేసృష్టి ఆవిర్భావం జరిగిన కొన్ని కోట్ల ఏళ్లకే అతి భారీ కృష్ణ బిలాలు ఊపిరి పోసుకున్నాయి. ఇందుకు ఎన్నో రుజువు కూడా దొరికాయి. అదెలా సాధ్యపడిందీ అనే సందేహా లకు కూడా ఈ తొలినాళ్ల రాకాసి తారల ఉనికితో సమా దానం దొరికినట్టయింది.ఇలా అధ్యయనం..తొలి తరల ఉనికి కోసం సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్, హార్వర్డ్, స్మిత్సోని యన్, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ సంయుక్తంగా పరిశోధన చేపట్టాయి. ఇందుకో సం తొలుత జీఎస్ 3073 నక్షత్ర మండలంలోని నైట్రోజన్ – ఆక్సిజన్ నిష్పత్తిని అవి లెక్కగట్టి 0.46గా తేల్చాయి. సాధారణ తారలతో కూడిన గెలాక్సీల్లో ఇంతటి నిష్పత్తి అక్షరాలా అసాధ్యం. జీఎస్ 3073లో వందలాది కోట్ల ఏళ్ల క్రితమే భారీ, అంటే రాకాసి తారలు మనుగడ సాగించాయని దీన్నిబట్టి వర్సిటీల బృందం తేల్చింది. ‘తొలినాళ్ల రాకాసి తారలు నిజమేనా అని 20 ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధానికి ఈ అధ్యయనం తెర దించింది. ఇందుకు సంబంధించిన తొలి పక్క రుజువులు జీఎస్ 3073లో చిక్కాయి‘ అని అధ్యయన బృంద సారథి డానియల్ వాలెన్ హర్షం వెలిబుచ్చారు. వీటిని తొలి తరం తారలుగా ఆయన అభివర్ణించారు. ఈ ఆసక్తికర అధ్యయన ఫలితాలను ఆస్ట్రో ఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురించారు.కొసమెరుపుజీఎస్ 3037 గెలాక్సీ కేంద్ర స్థానంలో ప్రస్తుతం సూపర్ నోవాలను కూడా తలదన్నే అతి భారీ కృష్ణబిలం ఉందట. అది బహుశా కచ్చితంగా తొలి తరం రాకాసి తార తాలూకు రూపాంతరమే అయి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మనకూ సొంత స్పేస్ స్టేషన్
గుజరాత్ నుంచి సాక్షి ప్రతినిధి : ‘సొంత అంతరిక్ష కేంద్రాలు కలిగిన దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. 2028లో భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం షురూ అవ్వనుంది’ అని ఇస్రోలో భాగమైన అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ నీలేశ్ ఎం.దేశాయ్ తెలిపారు. స్వదేశీ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఐదు రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి విడి భాగాలు పంపాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా 2028లో తొలి రాకెట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. 2035 నాటికి విడి భాగాలన్నింటినీ అంతరిక్షంలోకి చేర్చి ఇంటిగ్రేషన్ పూర్తి చేస్తామన్నారు. దీంతో భవిష్యత్తులో రోదసీ యాత్ర చేసే వ్యోమగాములు స్వదేశీ అంతరిక్ష కేంద్రంలో దిగి చంద్రుడి మీదకు వెళ్తారని చెప్పారు. ఎస్ఏసీ పనితీరు గురించి నీలేశ్ ఎం.దేశాయ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 2027లో మానవ సహిత ప్రయోగం మానవ రహిత అంతరిక్ష ప్రయోగం దిశగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) వేగంగా అడుగులు వేస్తోంది. గగన్యాన్ ప్రయోగంలో భాగంగా తొలుత నాలుగు మానవ రహిత ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. 2026 ఫిబ్రవరిలో తొలి ప్రయోగం చేపట్టబోతున్నాం. 2026లోనే మరో రెండు, 2027లో చివరి ప్రయోగం పూర్తి చేస్తాం. అదే ఏడాది ఆఖరులో మానవ సహిత ప్రయోగం పూర్తి చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా 2022లోనే గగన్యాన్ పూర్తి చేయాల్సి ఉంది. కరోనా, ఇతర సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడింది. గగన్యాన్ యాత్రకు వ్యోమగాములుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నలుగురు కెపె్టన్లను ఎంపిక చేశాం. వీరిలో ఒకరైన శుభాన్షు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు తిరిగి ఎయిర్ ఫోర్స్కు వెళ్లగా, ఇద్దరు శిక్షణలో కొనసాగుతున్నారు. 2027లో గగన్యాన్లో ఎంత మంది వ్యోమగాములు రోదసీ యాత్ర చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు వ్యోమగాములు ఉంటే మంచిదని భావిస్తున్నాం. వ్యోమగాములు సురక్షితంగా అంతరిక్ష యాత్ర చేసి, తిరిగి వచ్చేందుకు వీలుగా వాహక నౌకను తీర్చి దిద్దుతున్నాం. డీఆర్డీఏ, ఇతర స్వతంత్ర సంస్థలు నౌకను సర్టిఫై చేస్తాయి. స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్ల తయారీ సెమీ కండక్టర్లలో స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇస్రో కార్యకలాపాలకు సెమీ కండక్టర్లు కీలకమైనవి. ఇస్రో అవసరాల కోసం సెమీ కండక్టర్లు బయట నుంచి కొనే పని లేకుండా చేస్తున్నాం. అంతే కాకుండా బయటి సంస్థల అవసరాలకూ సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నాం. ఎస్ఏసీలో దేశంలోనే మొదటి సారిగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో సెమీ కండక్టర్లు తయారు చేస్తున్నాం. ఈ సాంకేతికను వాడుకోవడానికి ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో ఎంతో చిన్న దేశమైన తైవాన్పై ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంది. ఎస్ఏసీ ఎంతో విభిన్నం ఇస్రోలో భాగమైన మిగిలిన సంస్థలతో పోలిస్తే ఎస్ఏసీ ఎంతో విభిన్నమైంది. ఉపగ్రహ పేలోడ్లను ప్రజలు, ప్రభుత్వం, సమాజానికి ఉపయోగకరమైన కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్, దేశ రక్షణ, జాతీయ ప్రయోజనం కోసం అభివృద్ధి చేయడంలో ఎస్ఏసీకి ప్రత్యేకత ఉంది. దేశంలో వాతావరణాన్ని అంచనా వేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. అంతరిక్షంలోని శాటిలైట్ వ్యవస్థ ద్వారా 15 రోజుల ముందే వాతావరణ పరిస్థితులను అంచనా వేసి, సమాచారాన్ని ఐఎండీకి చేరవేస్తున్నాం. దీంతో తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతాయి. -
లాగ్ ఔట్ అంటే 'లాగ్ ఔటే'!
రిమోట్, హైబ్రీడ్ వర్క్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. విధానం ఏదైనా ఈ డిజిటల్ యుగంలో ఒకవైపు పనిభారం మరోవైపు కెరీర్లో పరుగు. వెరసి ఉద్యోగులు విశ్రాంతి కరువై అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. తీవ్ర పని ఒత్తిడితో కొందరు ‘కఠిన నిర్ణయాలూ’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ కల్చర్ వచ్చాక ఉద్యోగుల పనితీరు మారింది. గంటలకొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చోవడం ఉద్యోగుల వంతు అవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే.. పని గంటలు ముగిశాక కూడా ఆఫీస్ నుంచి ఫోన్, వీడియో కాల్స్, మెయిల్స్, సందేశాలకు స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ స్పందించకపోతే ఎక్కడ వేటుపడుతుందోనన్న ఆందోళన ఉద్యోగులను వెంటాడుతోంది. దీనికితోడు వారానికి 90 గంటల పని ఉండాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ ఈ ఏడాది ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఓలా భవీశ్ అగర్వాల్ సైతం ఇదే రీతిన స్పందించడంతో పని గంటల విషయంలో భారత్లో కార్పొరేట్ కంపెనీల వర్క్ప్లేస్ కల్చర్కు వారి వ్యాఖ్యలు ప్రతిబింబం అంటూ పెద్ద దుమారమే రేగింది. వర్క్–లైఫ్ బ్యాలెన్స్పై తీవ్ర చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు తెరపైకి వచ్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే ఇటీవల లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025ను ప్రవేశపెట్టారు. అధికారిక పని గంటలు ముగిశాక.. సెలవు దినాల్లో పని సంబంధిత కాల్స్, సందేశాలు, ఈ–మెయిల్స్, వీడియో కాల్స్ను ఉద్యోగులు తిరస్కరించేలా చట్టపరమైన హక్కును కల్పించాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. – సాక్షి, స్పెషల్ డెస్క్నిరంతరం అందుబాటులో..నేటి డిజిటల్ ప్రపంచంలో అధిక పని కారణంగా తీవ్ర మానసిక, భావోద్వేగ, శారీరక ఒత్తి డిని తగ్గించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యతను ప్రోత్సహించడం ‘రైట్ టు డిస్కనెక్ట్’ లక్ష్యమని సుప్రియా సూలే చెప్పారు. ‘ఆధునిక వర్క్ కల్చర్లో ఉద్యో గులు నిరంతరం అందుబాటులో ఉండటం సర్వసాధార ణమైంది. స్పందించేందుకు డిజి టల్ సాధ నాలు సౌలభ్యంగానే ఉన్నప్పటికీ కార్మికులు రేయింబవళ్లు ఈ–మెయిల్స్ను తనిఖీ చేయ డానికి, సందేశాలకు ప్రతిస్పందించడానికి ఒత్తిడిని అనుభవిస్తున్న సంస్కృతిని కూడా ఈ సాధనాలు సృష్టించాయి’ అని సభ దృష్టికి తీసుకెళ్లారు. పని గంటలకు మించి డిజిటలై జేషన్ ద్వారా విధులు నిర్వర్తించినప్పటికీ అదనపు చెల్లింపులు చేయకుండా కంపెనీలు సాగిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవడం కూడా ఈ బిల్లు ఉద్దేశమని ఆమె వివరించారు.అమలుపైనే ఆధారం..కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందిలో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది కార్యరూపంలోకి వస్తే వర్క్ప్లేస్ కల్చర్ మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఈ బిల్లు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని కాపాడటం, శ్రేయస్సును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బిల్లు ఉద్దేశం నిజంగా నెరవేరడంపై సందేహం తలెత్తుతోంది. బిల్లు చట్టంగా మారి ఉద్యోగులకు బలమైన రక్షణ కల్పించినా దీర్ఘకాలంగా పాతుకుపోయిన పని సంస్కృతి నిబంధనలను మార్చడానికి ఇది ఒక్కటే సరిపోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ‘డిస్కనెక్ట్ బిల్లు కాగితంపై చాలా బాగుంది. కానీ సంస్థలు అమలు చేసే పని విధానంపై నిజమైన మార్పు ఆధారపడి ఉంటుంది. అవాస్తవిక పనిభారం, సరిహద్దులు లేకపోవడం, పేలవమైన సమయ నిర్వహణ పద్ధతుల వంటి సమస్యలను కంపెనీలు పరిష్కరించకపోతే లొసుగులు రాజ్యమేలతాయి’ అని ఓ సైకాలజిస్ట్ వ్యాఖ్యానించారు. మూలాన్ని మార్చడం ద్వారా..రైట్ టు డిస్కనెక్ట్తో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పనివేళల్లో ఉత్సాహంగా ఉండటానికి కష్టపడటం, కఠినమైన గడువులను జయించడానికి ఒత్తిడిని ఎదుర్కోవడం లేదా సిబ్బంది కొరత వంటివి ఉద్యోగులు తరచూ ఎదుర్కొనే సవాళ్లను ఈ బిల్లు పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు. ‘చట్టపరమైన నిబంధనలు మాత్రమే కార్యాలయాల్లో పని సంస్కృతిని మార్చలేవు. సమస్య మూలానికి మందు వేయడం ద్వారా ఆరోగ్యకరమైన పని–జీవిత సమతౌల్యత సాధించవచ్చు. అనుకూలమైన, ఆచరణాత్మకమైన, రోజువారీ వాస్తవాలపై ఆధారపడిన వ్యవస్థలు ఉద్యోగులకు అవసరం’ అని వారు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను అర్థవంతంగా రూపొందించడానికి ఉద్యోగులు, సంస్థలు కలిసి పనిచేయాలన్నది నిపుణుల భావన.బిల్లులో ఏముందంటే..» అధికారిక పని గంటల తరువాత, సెలవు రోజుల్లో ఆఫీస్ ఫోన్కాల్స్, వీడియోకాల్స్, మెయిల్స్, సందేశాలను ఉద్యోగులు తిరస్కరించవచ్చు. » స్పందించని సిబ్బందిపై కంపెనీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.» ఒకవేళ నిబంధనలను కంపెనీ ఉల్లంఘిస్తే.. మొత్తం ఉద్యోగుల వేతనంలో ఒక శాతానికి సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు.» సిబ్బంది హక్కుల పరిరక్షణకు ప్రత్యేక సంక్షేమ సంస్థ ఏర్పాటు.» అధికారిక సమయానికి మించి పనిచేసే ఉద్యోగులకు ప్రామాణిక వేతనాల ప్రకారం ఓవర్ టైం చెల్లింపుతో పరిహారం. » పనివేళల తరువాత ఉద్యోగులను సంప్రదించడానికి పరస్పరం అంగీకరించిన నిబంధనలను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు. -
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇక రైల్వే వంతు!
విమానయాన రంగంలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభం ఎంతటి గందరగోళానికి, నష్టానికి దారి తీసిందో తెలిసిందే. పైలట్ల విషయంలో రెస్ట్ రూల్స్ అమల్లోకి రావడం.. దాంతో కొరత తలెత్తి విమాన సర్వీసులు ఆగిపోవడం(కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలున్నాయ్).. చివరకు తాత్కాలికంగా ఆ రూల్స్ను కేంద్రం వెనక్కి తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు ఆ ఫోకస్ భారతీయ రైల్వే వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రైళ్లను నడిపే లొకో పైలట్లు (train drivers) తమకూ విశ్రాంతి అవసరమనే గళం వినిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోట్లాది ప్రయాణికుల భద్రతను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ‘‘రైల్వేలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కానీ, మేం తీసుకునేది అతికొద్ది విశ్రాంతి. చేసేది 14 నుంచి 23 గంటలపాటు నిరంతరంగా పని. ఇలాంటి దీర్ఘకాలిక డ్యూటీలు అలసటను పెంచి, ఏకాగ్రతను తగ్గిస్తాయి. ఫలితంగా.. లక్షల మంది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఎఫ్ఆర్ఎంఎస్(Fatigue Risk Management System) ఆధారంగా డ్యూటీ అవర్స్ పరిమితులు అమలు చేయాలి’’ అని లోకోపైలట్లు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, రైళ్లను నడిపే పైలట్లపై ఒత్తిడి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కఠిన డ్యూటీ అవర్స్పై పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం రైల్వేలో అలాంటివేం లేకపోవడంతో వాళ్ల ఆందోళనను తీవ్ర తరం చేస్తోంది. ఒకవైపు భారతీయ రైల్వేస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు లోకో పైలట్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల మానవ తప్పిదాలు జరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్లు:భద్రతాపరమైన నియమాలు.. లోకో పైలట్లకు అలసటను తగ్గించే విధానాలు, నియమాలు అమలు చేయాలి.రోస్టర్.. షిఫ్ట్లను శాస్త్రీయంగా, సమయపూర్వకంగా కేటాయించాలి.వారంతాపు విశ్రాంతి.. వారానికి కనీసం ఒక విశ్రాంతి రోజు తప్పనిసరిగా ఇవ్వాలి.పోలిక సబబేనా?.. విమానయానం.. రైల్వే.. ఈ రెండు రంగాల్లో పైలట్లు, లోకో పైలట్ల అలసట, దీర్ఘకాలిక డ్యూటీలు, విశ్రాంతి లేకపోవడం వల్ల ప్రయాణికుల విషయంలో భద్రతా సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి పైలట్ల విశ్రాంతి నియమాలను పాటించకపోవడం వల్ల విమానయాన రంగంలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. కానీ, ఇదే సమస్య రైల్వేలోనూ ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతోందని ఏఐఎల్ఆర్ఎస్ఏ(All India Loco Running Staff Association) చెబుతోంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. అదే ప్రైవేట్ కార్పొరేషన్లు (ఇండిగో వంటి సంస్థలు) భద్రతా నియమాలను పాటించకపోతే.. ప్రభుత్వం వారికి తలొగ్గుతుంది అని కొందరు లోకో పైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా.. రోజుకు 6 గంటల డ్యూటీ పరిమితి. ప్రతి డ్యూటీ తర్వాత 16 గంటల విశ్రాంతి. వారానికి ఒక కంపల్సరీ రెస్ట్.. డిమాండ్లను 1970 నుంచే ఏఐఎల్ఆర్ఎస్ఏ వినిపిస్తోంది. 80-90 మధ్య కాలంలో నిరంతర ఆందోళనలు జరిగాయి. కాస్త గ్యాప్ తర్వాత.. 2000 సంవత్సరం నుంచి మళ్లీ ఉద్యమాలు జరిగాయి. 2024 అక్టోబర్లో దేశవ్యాప్త నిరసన నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వేలాది లొకో పైలట్లు సమావేశమై, రైల్వే బోర్డుకు మెమోరాండం సమర్పించారు. అయినా చలనం లేకపోవడంతో.. ఇప్పుడు ఇండిగో సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘లొకో పైలట్ల ఆందోళనలు ప్రజల భద్రతకు సంబంధించిన కీలక హెచ్చరికగా భావించాలి. రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే కొత్త నియమాలు, విశ్రాంతి విధానాలు అమలు చేయకపోతే, రైళ్ల భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. విమానయాన రంగంలో జరిగిన సంక్షోభం తర్వాత, రైల్వేలోనూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడే చర్యలు అత్యవసరం’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అంగారకునిపైనా... ఒక గంగ!
అవును. నిజమే. ఇప్పుడు పూర్తిగా పొడిబారి కనిపిస్తున్న అంగారక గ్రహం ఒకప్పుడు జల కళతో మురిసిపోయేదట. దానిమీద కూడా గంగ వంటి జీవ నదులు పొంగి పారేవట. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 అతి పెద్ద నదీ వ్యవస్థలతో ఆ గ్రహం కళకళలాడిపోయేదట. ఇందుకు సంబంధించి పక్కా రుజువులు తాజాగా వెలుగు చూడటం విశేషం...!అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ బృందం అంగారకునిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. అక్కడి నీటిపారుదల వ్యవస్థలపై తొలిసారిగా జరిగిన ఈ సమగ్ర పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం 16 భారీ నదీ వ్యవస్థలు ఒకనాడు గురు గ్రహంపై విలసిల్లినట్టు తేలింది. ప్రాంతాలన్నిటా ఒకప్పుడు జీవం ఉనికి ఉండేదనేందుకు ఇది ఒక ప్రబల తార్కాణమని అధ్యయన బృందం చెబుతోంది.జల కళ ఇలా... గురు గ్రహంపై జలావిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. కొన్ని వందల కోట్ల ఏళ్ల కిందట అంతూ పొంతూ లేని రీతిలో కురిసిన వర్ష ధారల ధాటికి అక్కడ లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా విలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏ మాత్రమూ తీసిపోవని అధ్యయన బృందం అంటోంది. ఆ లెక్కన ఒకనాడు గురు గ్రహమూ చక్కని జల కళతో విలసిల్లే ఉంటుందని చెబుతోంది. అంతేకాదు, ఆ భారీ జల రాశి ఏకంగా మహా సముద్రాలుగా కూడా రూపు దాలి్చందట! ‘గురు గ్రహంపై నదులు ఉండేవన్నది చాలాకాలంగా మనకు తెలిసిన సంగతే. అయితే బతికి సంబంధించి ఇంత స్పష్టతతో కూడిన వివరాలు వెలుగులోకి రావడం మాత్రం ఇదే తొలిసారి‘ అని అధ్యయన బృంద సారథి తిమోతీ ఎ.గౌడ్జ్ హర్షం వెలిబుచ్చారు. నదులు, లోయలు, అగాథాలు, పర్వతాలు తదితరాల చిహా్నలతో కూడిన 19 వ్యవస్థలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో 16 ఏకంగా లక్ష చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణంతో కూడుకుని ఉండటం విశేషం. ‘‘అయితే భూమిపై ఉన్న జల వ్యవస్థలతో పోలిస్తే ఇవి మరీ పెద్దవే కావు. ఉదాహరణగా చెప్పాలంటే ఒక్క అమెజాన్ నదీ వ్యవస్థ విస్తీర్ణమే ఏకంగా 62 లక్షల చదరపు కి.మి. ఉంటుంది’’అని తిమోతీ వివరించారు.అమూల్య వివరాలు సమీప భవిష్యత్తులో అంగారక యాత్రలకు నాసా తదితర అంతరిక్ష సంస్థలు సిద్ధమవుతుండటం తెలిసిందే. అందుకు ఈ అరుణ గ్రహం మీద ఏ ప్రాంతాలను ఎంచుకోవాలో తేల్చుకునేందుకు ఈ పరిశోధన చక్కని వీలు కలి్పస్తుందని సైంటిస్టులు ఉంటున్నారు. అంతేగాక అక్కడ ఏయే ప్రాంతాలు ఆవాసయోగ్యమో కూడా కచి్చతమైన అంచనాకు వచ్చేందుకు తోడ్పడుతుందని హర్షం వెలిబుచ్చుతున్నారు. పరిశోధన పూర్తి వివరాలు పీఎన్ఏఎస్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస
శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్స్టార్ దిలీప్ తనపై అత్యాచారం చేసేందుకు ఒక గ్యాంగ్తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్ 8న జడ్జిమెంట్ వినగలిగింది. మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్ను నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్స్టార్ దిలీప్ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.→ అసలేం జరిగింది?మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.→ తర్వాత ఏం జరిగింది?మొదట పోలీసులు ఇదో బ్లాక్మెయిల్ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్గా గమనించలేదు.→ అరెస్టులుపోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్ సునీ జైల్మేట్నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్ డబ్బు బేలెన్స్ చెల్లించమని’ పల్సర్ సుని రాసినట్టుగా చెప్పే లెటర్ బయటకు ‘లీక్ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్ 24, 2017న దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు.→ దిలీప్పై ఆరోపణ ఎందుకు?నటుడు దిలీప్, నటి మంజు వారియర్ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్కు మరో నటి కావ్య మాధవన్తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్కు, కావ్యా మాధవన్కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. ఈలోపు 2015లో మంజు, దిలీప్లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.→ 2018లో విచారణ మొదలుఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో హనీ ఎం.వర్గీస్ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్మెంట్స్ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం. -
ఫెడ్పై మార్కెట్ దృష్టి
ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్ ఫండ్స్(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్లో వాణిజ్య లోటు 59.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్లో చైనా 90 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి. ఆర్బీఐ ఎఫెక్ట్ దేశీయంగా ఆర్బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్బీఐ 5 బిలియన్ డాలర్ల రుపీ డాలర్ స్వాప్నకు తెరతీయనుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు జీఎస్టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మార్కెట్లలో ట్రెండ్ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రిటైల్ ధరలు.. నవంబర్ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్ ధరలు నమోదవుతుండటం గమనార్హం! ఎఫ్పీఐల అమ్మకాల స్పీడ్ తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్ దేశీ స్టాక్స్లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించిన ఎఫ్పీఐలు అక్టోబర్లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!బుల్లిష్గా..గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. → ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది. → బీఎస్ఈ సెన్సెక్స్ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫోన్.. సమస్యల జోన్
తిండి, బట్ట, నీడ.. వాటి సరసన స్మార్ట్ఫోన్ కూడా వచ్చి చేరింది. ఎంతలా అంటే ఈ ఉపకరణం లేకుంటే జీవితమే లేదన్నంతగా. టీనేజ్కు రాకముందే పిల్లల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు స్మార్ట్ఫోన్ కలిగి ఉండటం హానికరమని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. చంటి పిల్లలు ఏడవకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారి స్మార్ట్ఫోన్లలో వీడియోలను చూపిస్తున్నారు. పిల్లలకు నడక మొదలైన నాటి నుంచే వారికి మొబైల్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. ‘ఫోన్ ఇస్తే చాలు.. స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఓ మూలన కూర్చుంటారు. వాళ్లతో ఎటువంటి ఇబ్బంది ఉండదు’అనే ఆలోచనతో బలంగా అమలు చేస్తున్నారు. చదువు, విజ్ఞానం కోసం పిల్లలు స్మార్ట్ ఫోన్స్తో వెచి్చంచే సమయం పిసరంత అయితే.. వీడియో గేమ్స్, రీల్స్, చాటింగ్కు సమయం కొండంత ఉంటోంది.అయితే పిల్లలకు స్మార్ట్ఫోన్స్ ఇవ్వడం స్వయంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టినట్టేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 12 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్ఫోన్ కలిగి ఉండటం వల్ల మానసిక అనారోగ్య సమస్యలు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు.. ఇతరులతో పోలిస్తే స్మార్ట్ఫోన్స్ ఉన్న పిల్లల్లో నిరాశ, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.ఎవరు విశ్లేషించారంటే.. యూఎస్లో 2018 నుంచి 2020 మధ్య కాలంలో అడాల్సెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ (ఏబీసీడీ) అధ్యయనంలో 10,588 మంది కౌమారదశ పిల్లలు పాలుపంచుకున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చిన ఈ అధ్యయనం యూఎస్లో ‘మెదడు అభివృద్ధి, పిల్లల ఆరోగ్యం’పై అతిపెద్ద దీర్ఘకాలిక అధ్యయనంగా నిలిచింది. చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్పియా, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయన సమాచారాన్ని విశ్లేషించారు. వారి కంటే మెరుగ్గా..: ఏబీసీడీ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 63.6% మందికి స్మార్ట్ఫోన్స్ ఉన్నాయి. సగటున 11 ఏళ్లకే వారు ఈ ఉపకరణాన్ని దక్కించుకున్నారు. ఆ డేటా ఆధారంగా చిన్న పిల్లల వద్ద స్మార్ట్ఫోన్ ఉండటం వల్ల నిద్రలేమి, ఊబకాయం వంటి ప్రమాదాలు పెద్దవారి కంటే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు. స్మార్ట్ఫోన్ కలిగి ఉన్నవారిలో తక్కువ వయసున్న పిల్లల్లో ఆరోగ్య ఫలితాలు మరింత దిగజారుతున్నాయని వెల్లడైంది. 12 సంవత్సరాల వయసులోపు స్మార్ట్ఫోన్ పొందిన పిల్లలను, స్మార్ట్ఫోన్ లేని పిల్లలను కూడా ఈ అధ్యయనం పోల్చింది.ఒక సంవత్సరం తరువాత స్మార్ట్ఫోన్లు లేనివారు వాటిని కలిగి ఉన్న వారి కంటే మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నారని పరిశోధకులు కనుగొన్నారు. పిల్లల దగ్గర ట్యాబ్లెట్ పీసీలు లేదా ఐప్యాడ్స్ వంటి ఇతర పరికరాలు ఉండవచ్చని.. వాటి వినియోగం వల్ల కూడా ఫలితాలు ఇలాగే ఉంటాయని తెలిపారు. ఓ కన్నేసి ఉంచండి..: అయితే స్మార్ట్ఫోన్లు కౌమారదశలో ఉన్న అందరి ఆరోగ్యానికి హానికరమని తాము చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సానుకూల, ప్రతికూల పరిణామాలను సమతౌల్యం చేస్తూ అధిక స్క్రీన్ వినియోగం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను జాగ్రత్తగా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఎంత సమయం వాడాలనే అంశాన్ని స్పష్టంగా వివరించాలన్నారు.బెడ్రూమ్లో, భోజనం, హోంవర్క్ సమయంలో ఎలా వాడాలో తెలియజేయాలని... ప్రైవసీ, కంటెంట్ సెట్టింగ్స్ను మార్చాలని సూచిస్తున్నారు. పిల్లలు వారి ఫోన్లలో ఏమి చేస్తున్నారో పర్యవేక్షించాలని... అనుచితమైన కంటెంట్కు వారు గురికాకుండా, స్మార్ట్ఫోన్లు నిద్రకు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలని చెబుతున్నారు.⇒ ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్లలోపు పిల్లల్లో 71%, 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 42% మంది వద్ద సొంత స్మార్ట్ఫోన్ ఉంది. ⇒ ప్యూ రీసెర్చ్ ప్రకారం 2024లో 13–17 ఏళ్ల టీన్స్లో 95% మంది స్మార్ట్ఫోన్ కలిగి ఉన్నారు.⇒ 12 ఏళ్లలోపు వారిలో 42% మంది ప్రతిరోజూ సగటున 2–4 గంటలు డిజిటల్ తెరల ముందు గడుపుతున్నారు. -
ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీత కూడా స్పష్టం చేసింది.– దాసరి దుర్గాప్రసాద్ -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్కు సహాయం అందించాడు. తరువాత మెషిన్గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
లొకేషన్ పట్టేస్తారు..
సాక్షి, స్పెషల్ డెస్క్: అసిస్టెడ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.. సంక్షిప్తంగా ఏ–జీపీఎస్. ఈ సాంకేతికత అంశం ఇప్పుడు భారత్లో కొత్తగా తెరమీదకు వచ్చింది. మెరుగైన నిఘా కోసం మొబైల్ ఫోన్లలో శాటిలైట్ సిగ్నల్స్, సెల్యులార్ డేటా ఆధారంగా పనిచేసే ఈ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో జాతీయ భద్రత ముఖ్యమన్న భావనతో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.⇒ దర్యాప్తులో భాగంగా నేరస్తుల జాడను తెలుసుకోవడంలో మొబైల్ ఫోన్ లొకేషన్ అత్యంత కీలకం. ఈ లొకేషన్ తెలియ జే యాల్సిందిగా టెలికం కంపెనీ లను నిఘా సంస్థలు చట్టపరంగా అభ్యర్థించాల్సి ఉంటుంది. ప్రస్తు తం టెలికం కంపెనీలు సెల్యులార్ టవర్ డేటాను ఉపయో గించడంతో ఒక అంచనాగా మొబైల్ లొకే షన్ను అందిస్తున్నాయి. దీంతో కచ్చితమైన లొకేషన్ను పొందడం లేదని కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు అందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో ఏ–జీపీ ఎస్ టెక్నాలజీని అందు బాటులోకి తేవాలని భావిస్తోంది. ఇది అమలైతే ప్రపంచంలో తొలి దేశంగా భారత్ నిలవనుంది. ఏ–జీపీఎస్ కోసం స్మార్ట్ఫోన్లలో లొకేషన్ సేవలు ఎల్లప్పుడూ యాక్టివేట్ అయి ఉంటాయి. విని యోగదారులు వాటిని నిలిపి వేయడానికి అవకాశం ఉండదు.ఏమిటీ ఏ–జీపీఎస్..ఉపగ్రహ సంకేతాలను, సెల్ టవర్ల నుంచి వచ్చే సమాచారాన్ని రెండింటినీ ఉప యోగించి వేగంగా, మరింత కచ్చి తమైన స్థానాన్ని (లొకేషన్) ఏ–జీపీఎస్ అందిస్తుంది. ఉదాహర ణకు మొబైల్ ఫోన్ వాడుతున్న వ్యక్తిని సెల్ టవర్ ద్వారా ట్రాక్ చేసినప్పుడు.. చాలా సందర్భాల్లో లొకేషన్ చూపిస్తున్న ప్రాంతానికీ, వాస్తవంగా ఫోన్ వాడుతున్న వ్యక్తికి దూరం ఉంటోంది. గతంలో ఈ వ్యత్యాసం 16 కిలోమీటర్ల వరకు ఉండేదని సమాచారం. ఏ–జీపీఎస్ సాంకేతికతతో మొబైల్ యూజర్ను దాదాపు ఒక మీటర్ లోపల ట్రాక్ చేయొచ్చు. అంటే నేరస్తుడు తప్పించుకునే అవకాశమే లేదు. ముఖ్యంగా సిగ్నల్స్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఈ టెక్నాలజీ చక్కని పరిష్కారం. తయారీ కంపెనీలు ఈ సాంకేతికతను మొబైల్ ఫోన్లలో ఇన్–బిల్ట్గా అందించాల్సి ఉంటుంది. పాత ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుంది.ఇన్–బిల్ట్ చేస్తేనే..జియో, ఎయిర్టెల్ వంటి టెలికం కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కేంద్ర ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు ఏ–జీపీఎస్ టెక్నాలజీని మొబైల్ ఫోన్లలో ఇన్–బిల్ట్ చేస్తేనే కచ్చితమైన లొకేషన్ అందించేందుకు వీలవుతుందని, తయారీ సంస్థలను ఈమేరకు ఆదేశించాలని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఐటీ, హోం శాఖలు సమీక్షిస్తున్నాయి. గోప్యత సమస్యలు తలెత్తుతాయంటూ ఈ ప్రతిపాదనకు దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, శామ్సంగ్ వ్యతిరేకిస్తున్నాయి.సైబర్ నేరాల కట్టడికై..ఇంటర్నెట్ వినియోగం మన దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు సైబర్ నేరాలూ అధికమవుతున్నాయి. వీటి కట్టడిలో భాగంగా నేరస్తులకు చెక్ పెట్టేందుకు ఏ–జీపీఎస్ సరైన పరిష్కారం అని కేంద్రం విశ్వసిస్తోందని టెలికం కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు ఢిల్లీ నుంచి సాక్షితో మాట్లాడారు. ‘పౌరుల హక్కులను రక్షించడంలో ఇది కీలక అడుగు. ఏ–జీపీఎస్ అమలైతే ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి’ అని చెప్పారు.ఆ ఫీచర్ను నిలిపివేయాలి..నేరస్తుల లొకేషన్ ట్రాకింగ్ సమస్యాత్మకంగా మారుతోంది. ‘క్యారియర్ (టెలికం కంపెనీ) మీ స్థానాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తోంది’ అంటూ స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ వినియోగదారులకు పాప్–అప్ సందేశాన్ని పంపి వారిని హెచ్చరిస్తున్నాయని టెలికం కంపెనీలు వాదిస్తున్నాయి. ఇలా పాప్–అప్ మెసేజ్ వస్తే భద్రతా సంస్థలు తనను ట్రాక్ చేస్తున్నాయని యూజర్ సులభంగా అర్థం చేసుకుంటారని వెల్లడించాయి. పాప్–అప్ ఫీచర్ను నిలిపివేయాల్సిందిగా ఫోన్ తయారీ కంపెనీలను ఆదేశించాలని టెల్కోలు ప్రభుత్వాన్ని కోరాయి.ఏ దేశంలోనూ లేదు..ప్రతిపాదిత సేవలను తప్పనిసరి చేయకూడదని మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. పరిక రాల స్థాయిలో లొకేషన్ను ట్రాక్ చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ అసోసి యేషన్ (ఐసీఈఏ) ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. పౌరుల గోప్యతకు భంగం కలిగించే ఈ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, నియంత్రణ పరంగా వంచన చేయడమేనని లేఖలో స్పష్టం చేసింది. ‘మొబైల్ లొకేషన్ను గుర్తించేందుకు ఇప్పటికే లొకే షన్ బేస్డ్ సర్వీసెస్ను పలు టెలికం కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో అందిస్తున్నాయి. దీనికోసం టవర్లో సాంకేతిక మార్పులు చేస్తే చాలు. ప్రత్యేకంగా మొబైల్స్లో ఇన్బిల్ట్ చేయాల్సిన అవసరం లేదు’ అని ఒక సాంకేతిక నిపుణుడు తెలిపారు. -
బుధునికి ఓ ‘తోక’
బుధుడు. సౌర వ్యవస్థలో అత్యంత బుల్లి గ్రహం. అంతేగాక సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా. అయితే అది క్రమంగా చెదిరిపోతోందా? కొద్దికాలానికి గ్రహ లక్షణాలను కోల్పోయేలా ఉందా? ఆ అవకాశం లేకపోలేదు అన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బుధ గ్రహం ఉన్నట్టుండి తోకచుక్క లక్షణాలు ప్రదర్శిస్తోంది. అవును! దానికి ఏకంగా 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవున సాగిన తోక ఇప్పుడు సైంటిస్టు లోకాన్ని అబ్బురపరుస్తోంది. సోడియం వాయువులతో కూడిన అది దూరదూరాల దాకా తన వెలుగులను విరజిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియకు చెందిన స్టీవెన్ బెలావియా అనే సైంటిస్టు ఈ తోక తాలూకు ఫోటోను తొలిసారిగా తీసి ప్రపంచానికి చూపాడు. అది జరిగింది కూడా బుధవారమే (డిసెంబర్ 3న) కావడం.మరో విశేషం.సూర్యునితో సాన్నిహిత్యం వల్లే...బుధ గ్రహానికి ఇలా ఒక తోక పుట్టుకు రావచ్చని అప్పుడెప్పుడో 1980లోనే సైంటిస్టులు అత్యంత కచితత్వంతో కూడిన అంచనా వేయడం విశేషం. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటమే తోక పుట్టుకకు కారణమని సైంటిస్టులు వివరిస్తున్నారు. బుధుని తాలూకు అత్యంత పలుచనైన వాతావరణంపై సూర్యుని రేడియో ధార్మికత నురగ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫలితంగా బుధాణువులు దాన్నుంచి విడివడుతూ తీవ్ర వేగంతో. అంతరిక్షంకేసి దూసుకు పోతుంటాయి. కొన్నేళ్లుగా ఇవి అతి పొడవున తోక ఆకృతి దాలుస్తున్నాయి. ఈ తోక ఉనికి నిజానికి 2001లోనే నిర్ధారణ అయింది. కాకుంటే దాన్ని చూడటం మాత్రం నేటిదాకా సాధ్యపడలేదు.అత్యంత ప్రకాశవంతంగా...ప్రస్తుతం బుధుడు పరిహేళి క్రమంలో ఉన్నాడు. ఈ దశలో ప్రతి గ్రహమూ తన పరిభ్రమణ క్రమంలో సూర్యునికి అతి సమీపానికి వెళ్తుంది. దాంతో ఈ 2.4 కోట్ల కి.మీ. పొడవైన తోకచుక్క అతి స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తోందిప్పుడు. దాని ప్రకాశంలో మార్పుచేర్పులను నాసా మెసెంజర్ ఉపగ్రహ కొన్నేళ్లుగా స్పష్టంగా గమనిస్తూ వస్తోంది. అంతేగాక దానికి సంబంధించిన కీలక వివరాలను కూడా అందించింది. డిసెంబర్ 9న ఈ తోక మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని సైంటిస్టులు తెలిపారు. ఎంతగా అంటే, ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే ఏకంగా పదింతల వెలుగుతో మెరిసిపోనుందట! సైంటిస్టులు సిద్ధంఆ సమయంలో, అంటే డిసెంబర్ 9న బుధునిపై, దాని తోకపై ఇంకొన్ని పరిశోధనలు చేసి, మరిన్ని కీలక వివరాలు, విశేషాలు వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు ఇప్పటి నుంచే అన్ని పరికరాలతో సిద్ధమవుతున్నారు! ఎందుకంటే గ్రహానికి, తోక చుక్కకు ఉన్న మౌలిక భేదాలనే బుధుని తాలూకు ఈ పొడవాటి తోక సవాలు చేస్తోంది. బహుశా బుధుడు ముక్కలు చుక్కలుగా విడిపోయి ఒక పెద్ద తోక చక్కగా మారే ఆస్కారం కూడా లేకపోలేదన్నది కొందరి సైంటిస్టుల జోస్యం. అదేంతవరకూ ఫలిస్తుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లిళ్లకు వెళ్లలేక!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను నిజంగానే చావుదెబ్బ తీస్తోంది. పెళ్లి అంటేనే చెప్పలేనన్ని పనులుంటాయి. నెలల తరబడి ప్లానింగ్ చేసినా అంతా సజావుగా ముగిసేదాకా పెళ్లంటే ఇరు పక్షాలకూ కత్తిమీద సాము తరహా వ్యవహారమే. అలాంటిది, ఇండిగో దేశీయ విమాన సేవల సంక్షోభం కారణంగా నవ దంపతులు ఏకంగా తమ సొంత పెళ్లి విందు వేదికకే చేరుకోలేక చివరికి వర్చ్యువల్గా హాజరు కావాల్సిన విచిత్రమైన పరిస్థితి తలెత్తడం తెలిసిందే. ఈ సీజన్లో, అంటే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 నడుమ దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. అలాంటి సీజన్ మంచి పీక్లో ఉండగా ఇండిగో విమాన సేవల అంతరాయం పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఆ దెబ్బకు కొన్ని వందల పెళ్లిళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాచిలర్స్ పార్టీ గోవిందా ముంబైకి చెందిన వర్షా అగర్వాల్కు వచ్చే జనవరిలో పెళ్లి జరగనుంది. ఈలోపు తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆరుగురికి కోల్కతాలో ఘనంగా బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాల ని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంది. తను ముంబై నుంచి ఎయిరిండియా విమానంలో ముందుగానే కోల్కతా చేరుకుని వారికోసం ఎదురు చూడసాగింది. కానీ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా కర్మ కాలి ఇండిగోలో టికె ట్లు బుక్ చేసుకున్నారు. తెలియక వారు చేసిన ఈ ఒక్క పొరపాటు చివరికి బ్యాచిలర్స్ పారీ్టకే పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీ నుంచి వరుసగా రెండు రోజుల పాటు కోల్కతాకు ఇండిగో తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసేసింది. దాంతో ఒక స్నేహితురాలితో పాటు వర్షా కూడా హతాశురాలైంది. ఇక హైదరాబాద్ నుంచి రావాల్సిన మిత్రురాలిది మరో వ్యథ. ఆమె సకాలానికి విమానాశ్రయానికి చేరుకున్నా డిస్ ప్లే బోర్డుపై ఎంతకూ కోల్కతా విమానం జాడేకన్పించని పరిస్థితి. ఇండిగో సిబ్బంది నుంచి కూడా అరకొ ర సమాచారమే. చివరికి విమానం ఆలస్యమన్నారు. అలా రెండు మూడుసార్లు జరిగి ఐదారు గంటలు గడిచాక, విమానం రద్దయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘చివరికి నా బ్యాచిలర్స్ పార్టీని ఒకే ఒక్క ఫ్రెండ్తో ఏదో అయిందనిపించి ముంబై తిరిగొచ్చా. ఇండిగో నాకు మర్చిపోలేని చేదు అనుభవం మిగిల్చింది’’అంటూ మండిపడుతోంది వర్షా. జనవరిలో పుణేలో జరిగే తన పెళ్లికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇండిగో సేవలను నమ్ముకునేది లేదని తెగేసి చెబుతోంది. వీలైతే అసలు జీవితంలో ఎన్నడూ ఇండిగో విమానమే ఎక్కబోనని కూడా అంటోంది! రేడియో ఆరెంజ్లో ఆర్జేగా చేసే గౌరిదీ అలాంటి వ్యథే. ఆఫీసు వ్యవహారంతో పాటు సన్నిహితుల్లో ఒకరు పెళ్లికి కూడా వెళ్లొచ్చని ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకుందామె. కానీ తీరా చూస్తే అది కాస్తా చివరి నిమిషంలో రద్దయింది. అది కూడా తాను విమానాశ్రయానికి చేరుకున్నాక ఇండిగో సిబ్బంది చాలాసేపటికి తీరిగ్గా వెల్లడించారు. తొలుత విమానం ఆలస్యమైందంటూ రెండుమూడుసార్లు దాటవేస్తూ వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి! సిలిగురికి చెందిన వ్యాపారవేత్త అనీశ్ సింఘానియా ది కూడా ఇలాంటి బాధే. ఇండిగో నిర్వాకం వల్ల ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికే వెళ్లలేకపోయానంటూ వాపోతున్నారాయన. ‘‘డిసెంబర్ 4న ముంబై వెళ్లేందుకు ఇండిగోను నమ్ముకున్నా. తీరా చూస్తే ఆ సంస్థ కాస్తా నన్ను నట్టేట ముంచి చేతులు దులుపుకుంది. పోనీ ఇతర సంస్థల విమానాల్లో వెళ్దామంటే అవి కూ డా ఈ దుస్థితిని వీలైనంతగా సొమ్ము చేసుకుని నా ఆశలపై నీళ్లుజల్లాయి. పదేసి రెట్లు పెరిగిన విమాన ధరలు చెల్లించలేక అసలు ప్రయాణమే మానుకు న్నా. ఇండిగోకు నాలాంటివారి ఉసురు తగిలి తీరుతుంది’’అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అనీశ్. దౌత్యాధికారికీ తప్పని తిప్పలు సాధారణ దేశీయ ప్రయాణికులకు మాత్రమే కాదు, భారత్లో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్కూ ఇలాంటి చేదు అనుభవాన్నే రుచిచూపింది ఇండిగో. తన దౌత్య సిబ్బందిలో ఒకరి పెళ్లి నిమిత్తం ఢిల్లీ నుంచి దేవగఢ్కు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్నారాయన. ‘‘ఆ పొరపాటు చేసినందుకు ప్రయాణం రద్దై ఏమీ చేయలేక తీరని బాధకు లోనైన వేలాది మంది ఇండిగో ప్రయాణికుల్లో నేనూ ఒకనిగా మిగిలాను. నా కొలీగ్కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను?’’అంటూ ఎక్స్లో వాపోయారాయన! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంతకీ ఇండిగో ఓనర్ ఎవరో తెలుసా?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త సిబ్బంది విధుల నియమాలు (ఎఫ్డీటీఎల్), సాంకేతిక లోపాల కారణంగా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా విమానాలు ఆలస్యం ఆలస్యం కావడం లేదా రద్దు చేయడం జరిగింది. తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆశించినప్పటికీ.. ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు. మరో పది రోజుల్లో.. సాధారణ కార్యకలాపాలు తిరిగి కొనసాగవచ్చని కంపెనీ తెలిపింది. ఇటువంటి తరుణంలో ‘ఇండిగో’ యజమాని ఎవరు? అని నెట్టింట చర్చ జరుగుతోంది.. ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ను రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ కలిసి స్థాపించారు. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 1989లో ఏర్పాటు అయ్యింది. వాయు రవాణా నిర్వహణలో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ మార్కెట్ వాటా పరంగా భారతదేశంలో అతిపెద్ద క్యారియర్గా ఎదిగింది. రాహుల్ భాటియా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సంస్థలోని కీలక వాటాదారులలో ఒకరు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన భాటియా నాయకత్వంలో ‘ఇండిగో’ కేవలం విమానయానానికి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రంగాలకూ విస్తరించింది.వీటిలో హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఎయిర్లైన్ మేనేజ్మెంట్, పైలట్ శిక్షణ, ఎయిర్క్రాఫ్ట్ నిర్వహణ ఇంజనీరింగ్ వంటి ముఖ్య వ్యాపార వెంచర్లు ‘ఇండిగో’లో ఉన్నాయి. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ భాటియా ఆస్తుల నికర విలువ $8.1 బిలియన్లు(సుమారుగా రూ. 67,230 కోట్లు) ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రాహుల్ భాటియా 420వ స్థానంలో ఉన్నారు. అతను ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో ప్రమోటర్గా ఉంటూ, నేరుగా 0.01% వాటా లేదా 40,000 షేర్లను కలిగి ఉన్నారు.మరొక సహ వ్యవస్థాపకుడు అయిన రాకేష్ గంగ్వాల్, ఇండిగోను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, 2022లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుండి వైదొలిగారు. అప్పటి నుండి ఆయన ఎయిర్లైన్లో తన వాటాను విక్రయిస్తున్నారు. ప్రస్తుత బీఎస్ఈ (బీఎస్ఈ) డేటా ప్రకారం రాకేష్ గంగ్వాల్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్లో సుమారు 4.53% వాటా లేదా 1,75,30,493 షేర్లను కలిగి ఉన్నారు. అంతకుముందు ఆయన దాదాపు 13.5% వాటా కలిగి ఉండేవారు. ఇండిగో ప్రస్తుతం 434 సొంత విమానాలను కలిగివుంది. అలాగే రోజుకు 2,300 విమానాలను నడుపుతూ, దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’ గర్భిణి సునాలి కథ సుఖాంతం -
అదిగదిగో ‘తెలంగాణ ఏనుగు!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విస్తారంగా ఏనుగులు.. ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. జూపార్కులు, సర్కస్లలో తప్ప తెలంగాణ భూభాగంలో ఏనుగుల సంచారాన్ని చూసిన దాఖలాలు ఉండవు. కానీ గతంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి ఏనుగుల గుంపు వచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగుల సంగతి పక్కనపెడితే, ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో ఏనుగులు విస్తారంగా తిరుగాడాయన్న మాట చరిత్ర పరిశోధకులు అడపాదడపా చెప్తుంటారు. తాజాగా ఇందుకు సంబంధించిన మరో ఆధారం వెలుగు చూసింది. మానేరు నది ఒడ్డున అడవి సోమనపల్లి శివారు అడవి (మంథని సమీపం)లోని గుట్టగుండుకు ఏనుగు చిత్రం వెలుగు చూసింది. ఇది దాదాపు 13 వేల ఏళ్ల కిందట మధ్యరాతియుగంలో గీసిన చిత్రంగా నిపుణులు తేల్చారు. నాటి మానవులు, తమతో సహజీవనం చేసిన జంతువుల జాడలను ఇలా చిత్రాల రూపంలో నిక్షిప్తం చేశారు. పలు రకాల జంతువులు, మనుషుల బొమ్మల్లో ఏనుగు చిత్రం కనిపించింది. దీంతో అప్పట్లో ఆ ప్రాంతంలో ఏనుగుల సంచారం విస్తృతంగా ఉండేదన్న విషయం రూఢీ అవుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. గతంలో హైదరాబాద్ శివారులోని గుండ్లపోచంపల్లి శివారు గుట్ట గుహలో కూడా ఆదిమానవులు గీసిన ఏనుగు చిత్రం గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి అలాంటి రాతి చిత్రం వెలుగుచూసింది. ఆసిఫాబాద్ అడవుల్లో రాక్షస బల్లి (డైనోసార్) శిలాజాన్ని జీఎస్ఐ గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్లో ఆ శిలాజం ప్రదర్శనాంశంగా ఉంది. దాదాపు 6 కోట్ల సంవత్సరాల కిందటినాటిదని దాని డేటింగ్ను శాస్త్రవేత్తలు తేల్చారు. అప్పటి ప్రకృతి ఉత్పాతం ఫలితంగా డైనోసార్లు అంతరించాయి. అలా ప్రకృతి విపత్తులతో ఎన్నో జీవజాతులు కాలగర్భంలో కలిసిపోగా, కొన్ని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాయి. అలా ఒకప్పుడు విస్తారంగా తిరుగాడిన ఏనుగులు కూడా వాతావరణ ప్రభావంతో తెలంగాణ భూభాగాన్ని విడిచి వెళ్లాయని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యరాతి యుగం (సాధారణ యుగానికి ముందు 10 వేల ఏళ్ల నుంచి 8 వేల ఏళ్ల మధ్య కాలం), కొత్త రాతియుగం, చారిత్రక యుగం కాలాల్లో ఏనుగులు సంచరించాయని స్పష్టమవుతోంది. తాజాగా అడవి సోమనపల్లి సమీపంలోని మానేరు నది ఒడ్డున ఉన్న గుట్టలో ఆదిమానవుల ఆశ్రయాన్ని స్థానిక యువకులు గుర్తించారు. దీన్ని తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు చొల్లేటి శ్రీనివాస్ పరిశీలించి వాటి చిత్రాలను సేకరించారు. వీటిని ఆదిమానవుల రాతి చిత్రాల నిపుణుడు బండి మురళీధరరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ హరగోపాల్ పరిశీలించి, ఇందులోని చిత్రాలు పాత, మధ్య, కొత్త, చారిత్రకయుగాల్లో గీసినట్టు గుర్తించామని చెప్పారు. ఆయా కాలాల్లో ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న ఆదిమానవులు ఆ రాతిని కాన్వాస్గా మార్చుకుని చిత్రాలు గీసినట్టు వారు వెల్లడించారు. అంటే చిత్రాలకు, చిత్రాలకు మధ్య వేల ఏళ్ల విరామం ఉందన్నమాట. ఈ చిత్రాల్లో వేటాడుతున్న మనుషులు, చేతి ముద్రలు, డైమండ్ ఆకారపు గీతలు, వివిధ భంగిమల్లో ఉన్న మానవులు, ఎద్దు, జింక, ఏనుగు, తేనెపట్టు, త్రిశూలం, ఆంగ్ల ‘వి’ఆకారపు చిత్రాలతోపాటు ఇతర ఆకృతులున్నాయని, ఈ చిత్రాలు ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు రంగుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రాల్లో చాలావరకు వాతావరణ ప్రభావంతో వెలిసిపోయాయని, మిగతా వాటిని కాపాడుకోవాల్సిన అవసరముందని వారు వెల్లడించారు. -
Savitri: వెండి వెన్నెల జాబిలి..
‘వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’... నింగిలోని జాబిలి ఒక్కటి అందరికీ. తెలుగు వారికి మాత్రం నింగిలోనా, వెండి తెరన రెండు జాబిలుల నిండు సోయగాలు. సావిత్రి జన్మించి నేటికి 90 ఏళ్లు. ఆమె నటించింది సరిగా 15 ఏళ్లు. చనిపోయింది 46 సంవత్సరాలకు! కాని తెలుగు వారు ఆమెను తమ ఆడపడుచుగా భావిస్తూనే ఉన్నారు. మహానటిగా కొలుచుకుంటూనే ఉన్నారు. పదే పదే తలుచుకుంటూనే ఉన్నారు. మన ‘పార్వతి‘, మన ‘మధురవాణి’, మన ‘మిస్సమ్మ’, మన ‘శశిరేఖ’... దేవుడు ఏమరపాటులో తెలుగువారికి ఇచ్చిన అపురూపవరం సావిత్రి. ఆమెకు నివాళి. డిసెంబర్ ఎంత వరదాయిని. సావిత్రిని ఇచ్చింది. డిసెంబర్ ఎంత దుఃఖదాయిని. సావిత్రిని తీసుకెళ్లింది. మంచివాళ్లు వేసే శిక్షలు ఉడుంపట్టులా ఉంటాయి. వదలవు. గింజుకోవాలి. పెనుగులాడాలి. అయినా సరే... వదలవు. సావిత్రిని నమ్ముకున్న వాళ్లందరూ బాగుపడ్డారు. తిరిగి వారిని నమ్మిన సావిత్రి తప్ప. బదులుగా వారిని కొట్టలేదు ఆమె. తిట్టలేదు. కొరడా పట్టుకు శిక్షించలేదు. మరేం చేసింది? కోమాలోకి వెళ్లిపోయింది. బతికే ఉంది. కాని బతికి లేదు. ఊపిరితోనే ఉంది. కాని జీవంతో లేదు.మన వల్ల మోసపోయినవారు మన ఇంటి ముందు ధర్నాకు కూచుంటే ఎంత ఇబ్బందో కోమాలోకి వెళ్లిన సావిత్రి– ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు... నెల కాదు... రెండు నెలలు కాదు... 19 నెలల పాటు అలా నిలదీస్తున్నట్టుగా, పాపాలను లెక్కిస్తున్నట్టుగా మృత్యుశయ్యపై ఉండి తనను వంచించిన వారిని దండించింది. చలన చిత్ర తెర మీద క్షణం విరామం లేకుండా జగజ్జేయమానంగా వెలిగిన తారను నిశ్చలన స్థితికి నెట్టడం తెలుగు వారి చరిత్రలో ఒక ‘ఘనత’. సావిత్రి వీడ్కోలు తీసుకునే నాటికి ఆమె వయసు 46. సాధారణంగా– పుట్టిన పిల్లాపాపలు ఎదిగి వారితో స్త్రీలు ఆనందాలు పంచుకోవడం మొదలయే వయసు అది.‘బాలరాజు’ శతదినోత్సవం బెజవాడలో జరుగుతుంటే చూడటానికి వెళ్లి పొంరపాటున మురుక్కాలవలో జారింది సావిత్రి. విధి ఆమెను సరిగ్గానే హెచ్చరించింది– నువ్వు ఎంచుకోబోయే రంగంలో మురుక్కాలవలూ వుంటాయి... మహా జలపాతాలూ ఉంటాయి... భద్రం అని. చిన్నపిల్ల. గ్రహించలేదు. సినీ పరిశ్రమలో అడుగు పెట్టాక మహా జలపాతం వలే కదిలి, ఉరకలెత్తి, హోరు సృష్టించి, అడ్డులన్నింటినీ కకావికలం చేస్తూ ప్రవహించి... చివరకు కొంత మురుగును ఆమె చూడాల్సే వచ్చింది.చదవడం ఆపండి.. రెండు పాటలు చూడండి..ఒకటి ‘మంచి మనసులు’లో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. ఆ పాట ప్రిలూడ్ మొదలయ్యాక నాగేశ్వరరావు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి చెట్టు వద్ద నిలుచుంటాడు. వెనుక ఒక సెకన్ తేడాలో సావిత్రి పరిగెత్తుకుంటూ రావాలి. మామూలుగా కాదు. ప్రిలూడ్కు తగినట్టుగా గంతులేస్తూ వచ్చి, సరిగ్గా పల్లవి మొదలయ్యే సమయానికి గంతులు ముగించి, పల్లవి అందుకోవాలి. అంతేనా? అల్లరిగా నవ్వుతూ కొద్దిగా పెదవి కొరకాలి. ఇవన్నీ మూడు నాలుగు సెకన్లలో చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు కదా... ఫోనుందని. ట్రై చేయండి. స్టార్ నటీమణులైనా సరే. జస్ట్ ట్రై చేసి చూడాలి.రెండు– ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ’... ఈ పాటలో నాగేశ్వరరావుకే మాటలుంటాయి. సావిత్రికి ఉత్త హమ్మింగ్. నాగేశ్వరరావు పలికే ప్రతి మాటకు సావిత్రి తన హమ్తో జవాబిస్తూ ఉంటే ఆ ఒక్క ముఖంలో ఇన్నేసి భావాలా? ఆ రెండు కళ్లల్లో ఇన్నిన్ని అర్థాలా? ఆమెలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి. చేయగలిగినవారు ఉన్నారేమో గాలించండి. నో. సావిత్రిలా చేయగలిగే దమ్ము సావిత్రికి మాత్రమే ఉంది. ఆమె అతి సులువుగా చేసింది అందరికీ అత్యంత కష్టమైనది.సావిత్రి చిన్నప్పటి నుంచి డాన్సింగ్ స్టార్. ఆ డాన్స్ చూసే ఆమెను నాటకాల్లోకి తీసుకున్నారు. అన్నీ డాన్స్ డ్రామాలే. మగ వేషంలో ఉన్న ఆడపిల్లలతో. రాధా–కృష్ణ, మేనక–విశ్వామిత్ర, నారాయణమ్మ–నాయుడుబావ. స్టేజ్ మీదకు లేడిపిల్ల వచ్చిందా? ఎవరా పిల్ల? సావిత్రి అట గదా. అల్లరిగా చేసినా భలే అందంగా చేస్తుందే! అవును. అల్లరిగానే చేస్తోంది. తండ్రి లేని పిల్లలు అల్లరి ఎక్కువ చేస్తారు. ఏమంటే తండ్రి లేడన్న విషయం మర్చిపోవడానికి.సావిత్రి (Savitri) బాగా అల్లరి చేసేది. పైకి నాన్–సీరియస్. లోన అగాథం. పెదనాన్న ఉన్నాడు. ఎంత ఉన్నా పెదనాన్న నాన్న కాడు. రక్షకుడు. సావిత్రికి కావాల్సింది అదిలించేవారు కాదు. లాలించేవారు. మగవాళ్లంటే పెదనాన్నలా ఉంటారని అనుకోవడం తప్ప లాలించే మగవాణ్ణి, అనునయంగా మాట్లాడే పురుషుణ్ణి చూడలేదామె.పద్నాలుగేళ్ల వయసులో, ఈడేరిన ప్రాయంలో అలాంటి పురుషుణ్ణి మొదటిసారి చూసిందామె. జెమినీ గణేశన్. ఎదుటివారి తప్పులు మనకు తోవ ఇస్తే మన తప్పులు మరొకరికి దారి ఇస్తాయి. ఈ వృత్తం సావిత్రి జీవితంలో పర్ఫెక్ట్గా పూర్తయ్యింది. ఎలాగంటే భానుమతి (Bhanumati) చేసిన రెండు తప్పులు సావిత్రికి లాభించాయి. డి.ఎల్.నారాయణ ‘దేవదాసు’ తీయడానికి నిశ్చయించుకుని పార్వతి వేషం వేయమని అడగడానికి వెళితే ‘నా దగ్గర ప్రోడక్షన్ మేనేజర్గా పని చేసి నన్నే హీరోయిన్గా బుక్ చేయడానికి వచ్చావా’ అన్నట్టుగా ఆమె అంగీకరించ లేదు. ఆ వేషం సావిత్రికి వెళ్లింది.. సావిత్రి వెలిగింది..‘మిస్సమ్మ’ షూటింగ్ మొదలయ్యి రెండున్నర రీళ్లు తీశాక, షూటింగ్ రోజు వ్రతం పెట్టుకుని ఆ సంగతి సరిగ్గా సమాచారం ఇవ్వక షూటింగ్కు రాకపోవడంతో చక్రపాణికీ, భానుమతికీ పేచీ వచ్చింది. చక్రపాణి ఆమె ఎదుటనే అందాకా తీసిన రీళ్లను కుప్పబోసి నిప్పంటించాడు. భానుమతి చేయాల్సిన మిస్సమ్మ భానుమతికి కాకుండా పోయింది. ఆ వేషం సావిత్రికి దక్కింది. సావిత్రికి తిరుగు లేకుండా పోయింది.మరి కొన్నేళ్లకు సావిత్రి చేసిన రెండు తప్పులు– అధిక తిండి, మద్యపానం ఆమెనూ ఆమె రూపాన్ని మార్చేశాయి. ‘దేవత’ (1965) తీసే నాటికి లాంగ్షాట్లో చూపించాలంటే కెమెరామెన్లు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆప్పటికి ఆమె వయసు కేవలం 30. కొత్త హీరోయిన్లు ఆమె అవకాశాలు తన్నుకుపోయారు. విశేషం ఏమంటే ఆమె కంటే ఒక్క సంవత్సరం తర్వాత పుట్టిన జమున 1975 వరకూ హీరోయిన్గా చెలాయించింది.సావిత్రికి ఒక సమస్య ఉంది. ఏదైనా పాత్ర ఇస్తే ఆ పాత్రను అద్భుతంగా అర్థం చేసుకుంటుంది. ఎదురుగా ఉండబోయే పాత్రలు ఇవే అనంటే వాటినీ అంతే బాగా అనలైజ్ చేసుకుంటుంది. కాని ఇంత తెలిసిన నటి ఎందుచేతనో ఎదుట ఉన్న మనిషిని మాత్రం గుర్తించలేదు. వాళ్లు ఎటువంటి వాళ్లో, వాళ్లు ఏ వేషం కట్టి తన వద్దకు వచ్చారో ఎప్పడూ గ్రహించలేకపోయింది. ఆమెకు తెలిసింది ఒక్కటే. నమ్మడం. నమ్మి చెడ్డవాళ్లలో సావిత్రిది ముందు వరుస. ఆమెకు కల్లబొల్లి మాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన వాళ్లు... కొంగు ముడిలో ఉన్న డబ్బు కాజేసినవారు.... తీసుకున్న డబ్బు ఎగ్గొట్టిన వారు... చిల్లరకు ఆస్తులు కొని కొట్టేసిన వాళ్లు.... అందరూ అయినవాళ్లే. నమ్మించిన వాళ్లు.మనిషికి చదువు తోడుండాలి. లేదా చదువుకున్న వారి తోడు ఉండాలి. సావిత్రికి రెండూ లేవు. ఇన్కంటాక్స్ను కట్టాలని, సరిగా కట్టాలని తెలియాల్సిన అవసరం ఉంది. తెలియచేయాల్సిన వారి బాధ్యతా ఉంది. 8లక్షల టాక్స్ బకాయిలు 30 లక్షల వరకూ వెళ్లాయి. ఆమెను దర్శకురాలిని చేద్దామని ఉవ్విళ్లూరిన బృందం హామీ సంతకాలు పెట్టించి పక్కకు తప్పుకుంది. ‘హీరోయిన్’గా చేయడానికి వచ్చిన ‘పరిమితి’ దర్శకురాలిగా అస్తిత్వం చూపమని పోరు పెట్టింది. సొంత నిర్మాణ దర్శకత్వంలో ‘మూగమనసులు’ సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ప్రాప్తం’ గా తీయడం ఒక తొందరపాటైతే, అదే సొంత నిర్మాణ దర్శకత్వంలో చలం హీరోగా ‘వింత సంసారం’ తీయడం గ్రహపాటు. రెండూ ఒకే రోజు 1971 ఏప్రిల్ 14న విడుదలయ్యాయి. ఒక తెలుగు హీరోయిన్ తీసిన రెండు సినిమాలు ఒకేరోజు రెండు భాషల్లో రెండురాష్ట్రాల్లో విడుదల కావడం రికార్డ్. కాని ఆ రికార్డును ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల సావిత్రికి ఎంత పోయిందో, ఆ ఫ్లాప్లు చూపించి ఎంత లాగవచ్చో మాత్రం గుర్తుంచుకున్నారు. డబ్బు పోతే బాధ నిజమే కానీ మనుషులు కొట్టే దెబ్బకు కలిగే బాధ ఇంకా అధికం. నౌకర్లు, చాకర్లు, మంది మార్బలంతో వెలిగిన తార... కారణాలు ఏవైనా ఆమె ఒక్కతి ఒంటరిగా జీవించే స్థితి రారాదు. డయాబెటిస్ పేషంట్ అయినప్పుడు ఆమెకు ఇన్సులిన్, ఆ వెంటనే సరైన ఆహారం ఇచ్చే సిబ్బంది లేని స్థితిలో ఉండటం సరి కాదు. బాధ్యులెవరో తేలాల్సిన దుర్మార్గం అది. ఫలితంగా ఏమైంది? 1980 మే 11న ఔట్డోర్ కోసం బెంగళూరు వెళ్లి ఇన్సులిన్ తీసుకుని, ఆహారం స్వీకరించకుండా నిద్ర పోవడంతో సావిత్రి కోమాలోకి వెళ్లిపోయింది. ఎలాంటి దేహం ఆమెది? పొంలంలో పని చేసి, స్టేజ్ మీద గెంతి, బలమైన ఆహారం తీసుకుని దృఢంగా పెరిగిన దేహం. కాని మనసు తిన్న ఘాతాలతో స్వయంగా తలపెట్టుకున్న అపకారాలతో ఆ దేహం ధ్వంసమైంది.ఆ మహానటి ఒక తల్లి కూడా. ‘బొమ్మలు కొనిపెడతాలే నాన్నా’... అని పక్కనే ఉన్న కుమారుడితో అన్న మాటను నెరవేర్చకుండానే మరో 19 నెలల తర్వాత కన్నుమూసిందా కన్నతల్లి. గొప్ప ప్రతిభ. దానికి అవకాశం దొరకాలి. దొరకబుచ్చుకునేంత వరకు పోరాడాలి. దొరికాక విజృంభించాలి. ఇది... సావిత్రిని చూసి నేర్చుకోవాలి నేటి జెన్ జి తరం.గొప్ప పురోభివృద్ధి... కాని అప్రమత్తంగా ఉండాలి... ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి... ఆరోగ్య క్రమశిక్షణ ఉండాలి... కుటుంబంలో వచ్చే సమస్యలను శ్రద్ధగా పరిష్కరించుకోవాలి... అప్పుడే అది మరింత గొప్ప విజయం... ఇది కూడా సావిత్రిని చూసి నేర్చుకోవాలి.సావిత్రి ఒక స్కూల్.ఆమె నటన, జీవితం రెండూ తెలుగు వారికి శాశ్వత పాఠాలు.మహానటి టాప్ టెన్ 1953 దేవదాసు –వేదాంతం రాఘవయ్య1955 కన్యాశుల్కం – పి పుల్లయ్య1955 మిస్సమ్య– ఎల్వీ ప్రసాద్1957 మాయాబజార్– కెవిరెడ్డి1957 తోడికోడళ్లు – ఆదుర్తి సుబ్బారావు1959 అప్పుచేసి పప్పుకూడు – ఎల్వీ ప్రసాద్1962 గుండమ్మ కథ – కమలాకర కామేశ్వరరావు1963 నర్తనశాల – కమలాకర కామేశ్వరరావు1964 మూగమనుసలు – ఆదుర్తి సుబ్బారావు1965 పాండవ వనవాసం – కమలాకర కామేశ్వరరావుఆమె నోట సన్నాయి పాట‘నీ లీల పాడెద దేవా’.... సన్నాయితో పోటీ పడి ఎస్.జానకి పాడిన ఈ పాట తమిళ డబ్బింగ్ ‘మురిపించే మువ్వలు’లోనిదని అందరికీ తెలుసు. ఈ పాట పాడే సమయానికి ఎస్.జానకికి అంత పేరు లేదు. దాంతో సావిత్రి ఈ పాటను సుశీల వంటి పెద్ద గాయనితో పాడించాలని కోరింది. అయితే సన్నాయితో పోటీ పడే గళం జానకికి తప్ప మరొకరితో లేదని అందరూ తేల్చి చెప్పాక అభినయించడానికి ఒప్పుకుంది. ‘నీ లీల పాడెద దేవా’ పాటను జెమినీ గణేశన్తో అభినయించడం వల్ల ఒక సూపర్హిట్ పాటను ఆ భార్యాభర్తలు అభినయించినవారు అయ్యారు. సావిత్రికి చక్కని గొంతు ఉంది. ఆమె పాటలు కూడా పాడుతుంది. అంతే కాదు షూటింగ్లు లేనప్పుడు తన సినిమాల పాటల రికార్డింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే వెళ్లి కూచునేది. ఆమె తొలిసారి దర్శకత్వం వహించిన ‘చిన్నారి పాపలు’ కు సంగీత బాధ్యతలు పి.లీలకు అప్పగించిందామె. ఆమె దర్శకత్వంలోని ‘మాతృదేవత’లో ‘మనసే కోవెలగా మమతలు మల్లెలుగా’ పాట పెద్ద హిట్.మీకు మీరే మాకు మేమే...స్వాభావికంగా మంచితనం ఉన్న ఆర్టిస్టులో గొప్ప ఆర్ట్ ఉంటే ఆ ఆర్టిస్టుకు తిరుగు ఉండదు. సావిత్రిని చూస్తే మంచి అమ్మాయి అని టక్కున తెలిసి పోతుంది. ఆ ముఖంలో అసామాన్యమైన ప్రతిభ కూడా కనిపిస్తుంటే జనం ఊ.. అన్నా బ్రహ్మరథం పడతారు. ఆ.. అన్నా బ్రహ్మరథం పడతారు. 1955లో సావిత్రి సినిమాలు ముఖ్యమైనవి మూడు వచ్చాయి. ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘కన్యాశుల్కం’. ఒకదానిలో టీచరమ్మ, మరోదానిలో కూరలమ్మి, ఇంకోదానిలో వేశ్య. ‘మిస్సమ్మ’లో కస్సుబుస్సులాడే సావిత్రిని చూసి ఎమ్టీరావు అనే ఎన్.టి.రామారావు (NT Ramarao) ‘నేను కూడా అంతో ఇంతో మంచివాణ్ణే కదండీ’ అంటాడు బెరుగ్గా. అప్పటికి సావిత్రికి స్టార్ స్టేటస్ రాలేదు. కాని తన నటనతో ఎదురుగా ఉన్నది రామారావు అయినా పాత్రకు తగ్గ పై చేయి సాధించగలిగింది. ‘మీకు మీరే మాకు మేమే’ పాటలో సావిత్రి ఈసునసూయలు ఎంత అందమో అంత చందం.‘దొంగ రాముడు’లో నిజమైన కూరగాయల బుట్టను నెత్తిన పెట్టుకుంటే ‘ఎందుకమ్మా... ఉత్త బుట్ట చాలు’ అని ఎవరో అంటే ‘లేదు సార్.. ఉత్త బుట్ట నడకకీ బరువు బుట్ట నడకకీ తేడా ఉంటుంది’ అని మోసిందామె. ఆమె ఆ బుట్టతో నడుస్తుంటే శరీరం చూసి పురుషులకు చిత్త వికారం కలగదు. సావిత్రి అదే సినిమాలో ఖాళీ బుట్టతో నడక కూడా ఎలా ఉంటుందో చూపుతుంది. రెంటికీ తేడా! ఇక ఆర్.నాగేశ్వర రావుతో సావిత్రి పాడిన ‘రావోయి మా ఇంటికి’ కంటితో వింటూ చెవితో చూడాలి.‘కన్యాశుల్కం’లో మధురవాణిని అర్థం చేసుకుని సాహితీ ప్రమాణాలకు తగినట్టుగా ఆ వయసులో నటించడం సావిత్రి మరో రికార్డు! అందులో ‘లొటిపిట్ట’ జోక్కు మధురవాణి సుదీర్ఘంగా నవ్వే సీన్ ఉంది. అంతసేపు వేరెవరైనా నవ్వితే ప్రేక్షకులు తెర చింపేస్తారు. సావిత్రి కాబట్టి చెల్లింది.సావిత్రి తెలుగులో నటించే వేళకు హిందీలో హీరోయిన్లు స్విమ్సూట్లు వేస్తున్నారు. మోడ్రన్ డ్రస్సులు... హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతున్నారు. వాన పాటల్లో తడుస్తున్నారు. కాని సావిత్రి కేవలం కట్టు, బొట్టులతో తను తనలాగే ఉంటూ ప్రేక్షకులను జయించింది. డాన్స్ బాగా వచ్చినా చాలా కొద్దిగా తప్ప చేయలేదు. క్లోజప్ను కాచుకోగల ఏకైక నటి ఆమె. ఆమె క్లోజప్స్ను ‘మాయాబజార్’లో చూడాలి. తల్లిచాటు శశిరేఖ, ప్రేమిక శశిరేఖ, మాయా శశిరేఖ... ఆ సినిమాలో ఆమె ‘మగాడు’లా నటించింది.‘మూగ మనసులు’ స్క్రిప్ట్ విని ‘నేను గౌరి పాత్ర వేస్తాను’ అన్నదట సావిత్రి. ‘నువ్వు ఆ పాత్ర వేస్తే రాధలా వేసే వారిని ఎక్కణ్ణుంచి తేవాలి’ అన్నారట ఆదుర్తి. అవును... నాగేశ్వరరావును ‘ఒరే’ అనగలిగేది, అంటే ప్రేక్షకులు వినగలిగేది సావిత్రి నుంచే. ‘మంచి మనసులు’లోని సావిత్రి వేసిన పాత్రకు ఎందరో అభిమానులు. ఆమె నాగేశ్వరరావును అల్లరి పెడుతుంటే మురిసిన స్త్రీలు నాగేశ్వరరావు దక్కకపోతే ఆమె కంటే ఎక్కువ దు:ఖపడ్డారు.‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవు లేక వీణ’ పాట సున్నితమైనది. భర్తను తలుచుకుంటూ విరహంతో శృంగార భావనను చాలా సటిల్గా చూపుతుంది సావిత్రి. ‘పరువము వృధగా బరువుగా సాగే’ లైన్ దగ్గర తన చెంపను తనే నిమురుకుని, రెండు చేతులు దగ్గరకు చేర్చి ఒళ్లు విరుచుకుంటుందామె. అసభ్యత లేని ఆ చేష్ట శృంగారాభినయానికి ఆనవాలు.ఇటువంటి గొప్ప నటి ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అని తెల్ల వెంట్రుకలతో, బక్క చిక్కి పాడితే, ఎలా ఉన్నా ‘సావిత్రి ఉందట’ అంటూ మహిళా ప్రేక్షకులు పోటెత్తారు. సావిత్రి ఘనతలు చెప్పడం చక్కెరలో పలుకులు లెక్కబెట్టడం. నిరూపణ అక్కర్లేని గొప్పతనం, మహా నటనం సావిత్రిది. అందుకే ఆమె మహానటి సావిత్రి. -
స్నేహ‘వృక్షం’
లండన్ నగరంలోని ట్రాఫాల్గర్ స్క్వేర్.. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, పండుగ శోభతో నిండిపోతుంది. ఆ స్క్వేర్ మధ్యలో నిటారుగా.. వేలాది కాంతులతో వెలిగిపోయే ఒక అద్భుతమైన క్రిస్మస్ చెట్టు కనువిందు చేస్తుంది. ఇది కేవలం ఒక చెట్టు కాదు.. నార్వేజియన్ ప్రజల హృదయం నుండి వచ్చిన ఒక కృతజ్ఞతా బహుమతి. లండన్, నార్వే రాజధాని ఓస్లో నగరాల మధ్య కొనసాగుతున్న ఈ వార్షిక సంప్రదాయం వెనుక దాగిన కథ, మానవ సంబంధాల గొప్పతనాన్ని, చరిత్రను గుర్తు చేస్తుంది. కష్టకాలంలో పుట్టిన స్నేహం ఈ బంధానికి రెండో ప్రపంచ యుద్ధం కల్లోలంలో పునాదులు ఏర్పడ్డాయి. 1940లో, నాజీ జర్మనీ నార్వేపై దండెత్తినప్పుడు, అప్పటి నార్వే రాజు హాకాన్–7, అతని ప్రభుత్వ ప్రతినిధులు లండన్కు శరణార్థులుగా వచ్చారు. అక్కడే ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ గడ్డ నుండే నార్వేజియన్ ప్రతిఘటన ఉద్యమానికి బలం చేకూర్చారు. అంతేకాదు, నాజీలు రేడియోలను నిషేధించినా, బీబీసీ సహకారంతో లండన్ నుండి రహస్యంగా నార్వేజియన్ భాషలో వార్తలను ప్రసారం చేసేవారు. ఆ వార్తలు నార్వే దేశ ప్రజలకు ధైర్యాన్ని, ఆశను నింపిన జీవనాడులు. నిరాశలో ఉన్న వేలాది నార్వేజియన్లకు అక్షరాలా అవి ఓ సాంత్వన! హృదయం నుండి వచ్చిన కానుక యుద్ధం ముగిసిన తర్వాత, నార్వే ప్రజలు తమకు ఆశ్రయం ఇచ్చి, తమ స్వాతంత్య్ర పోరాటానికి సహాయం చేసినందుకు బ్రిటన్పై అపారమైన కృతజ్ఞతను చూపాలనుకున్నారు. ఆ ప్రేమే 1947లో ఓస్లో నగర పాలక సంస్థ ఈ వార్షిక క్రిస్మస్ ట్రీ బహుమతిని ప్రకటించడానికి దారి తీసింది. ఈ బహుమతి కేవలం అలంకరణ వస్తువు కాదు. ‘ఓస్లో ప్రజల స్వేచ్ఛా స్ఫూర్తికి లండన్ ప్రజలు ఇచి్చన అండ’కు ప్రతీక. ‘ఎవర్ ఓస్లో’సాహస యాత్ర ఏటా ఓస్లో అడవుల్లో పెరిగే నార్వేజియన్ స్ప్రూస్ జాతి చెట్టును మాత్రమే ఎంపిక చేస్తారు. కొన్నేళ్ల ముందుగానే నాణ్యమైన చెట్లను గుర్తించి, వాటికి ప్రత్యేక సంరక్షణ అందిస్తారు. ఈ ఏడాది చెట్టుకు ముద్దుగా ‘ఎవర్ ఓస్లో’అని పేరు పెట్టారు. సుమారు 60 ఏళ్ల వయసు, 20 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్టు, వేలాది చెట్ల నుండి ఎంపికైంది. నవంబర్ 21న జరిగిన ప్రత్యేక వేడుకలో దీనిని నరికి, ఓ ప్రత్యేక ఉయ్యాలలో ఉంచి, రోడ్డు మార్గంలో ఓడరేవుకు తరలించారు. అక్కడి నుండి మొదలైంది అసలు ప్రయాణం. దాదాపు 26 గంటల పాటు సముద్రంలో ప్రయాణించాక ఆ చెట్టు లండన్కు చేరుకుంది. లండన్ చేరుకున్నాక, దాన్ని ట్రక్కులో ట్రాఫాల్గర్ స్క్వేర్కు తరలించారు. ఈ ప్రయాణమంతా ఆ చెట్టు.. రెండు దేశాల స్నేహ సందేశాన్ని మోసుకొచ్చిన ఒక రాయబారిలా సాగింది. సంప్రదాయ దీపాలంకరణ సోషల్ మీడియాలో ఈ చెట్టును ‘బ్రిటన్ జాతీయ నిధి’గా అభివర్ణిస్తారు. ఏటా డిసెంబర్ మొదటి గురువారం జరిగే దీపాలంకరణ వేడుకతో లండన్లో క్రిస్మస్ కౌంట్డౌన్ మొదలవుతుంది. ఈ చెట్టుకు నార్వేజియన్ సంప్రదాయం ప్రకారం నిలువు వరుసలలో దీపాలను అమరుస్తారు. ఈ కాంతులు.. స్క్వేర్లోని ప్రజలకు ఆశ, శాంతి సందేశాన్ని ఇస్తాయి. ఈ క్రిస్మస్ ట్రీ, జనవరి 5 వరకు ట్రాఫాల్గర్ స్క్వేర్లో ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత దీనిని కంపోస్ట్ తయారీకి వినియోగిస్తారు. ప్రతి క్రిస్మస్కు నార్వే పంపే ఈ ట్రీ బహుమతి, కేవలం పండుగ ఆనందం కోసం కాదు. యుద్ధ గాయాలను, మళ్లీ వెలిగించిన ఆశలను గుర్తుచేసే శాశ్వత చిహ్నం. ట్రాఫాల్గర్ స్క్వేర్లో ఈ దీపాలు వెలిగిన ప్రతిసారీ, అది క్రిస్మస్కు సంకేతం మాత్రమే కాదు.. కష్టకాలంలో ఒక దేశం మరో దేశానికి ఇచ్చిన అండ.. సాటి మనిషిపై చూపిన మానవత్వం.. నేటికీ సజీవంగా ఉన్నాయనడానికి హృదయపూర్వకమైన, శాశ్వతమైన కృతజ్ఞతా వెలుగు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
నాసిరకానికి మందు
ఫార్మసీలో అడుగు పెట్టగానే మందులు, న్యూట్రాస్యూటికల్స్, కొన్ని రకాల జనరల్ ఐటమ్స్ దర్శనమిస్తాయి. ఇక నుంచి ఓ క్యూఆర్ కోడ్ కూడా ప్రత్యక్షం కానుంది. క్యూఆర్ కోడే కదా అని తీసిపారేయకండి. భారత ఔషధ భద్రతా వ్యవస్థలో ఇదొక పెద్ద ముందడుగు. ఔషధాల వల్ల ఆరోగ్య సమస్య తలెత్తితే ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలు, హోల్సేల్ మందుల దుకాణాల్లో అందరికీ కనిపించేలా ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్తోపాటు టోల్ఫ్రీ నంబర్ 1800–180–3024 ప్రదర్శించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆదేశించింది.ఔషధం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే.. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వినియోగదారులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య, ఆ మందు తాలూకా బ్యాచ్, కంపెనీ వివరాలు అందిస్తే చాలు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిట రింగ్ సిస్టమ్ ఈ ఫిర్యాదులను స్వీకరించి సదరు బ్యాచ్లో తయారైన ఔషధాల నాణ్యతను పరీక్షి స్తుంది. లోపం ఉందని తేలితే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటారు.నేరుగా ప్రజల నుంచే..మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు ఇటీవల 23 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఔషధ తయారీలో ఫార్మా –గ్రేడ్కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే ముడిపదార్థాలను ఉపయోగించినట్టు ఈడీ తేల్చింది. ఔషధ రంగ పరిమాణంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో నాసిరకమైన మందులు, నకిలీలు పెద్ద ముప్పుగా నిలిచాయి. ఔషధాల వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాలపై ఫిర్యాదులను నేషనల్ ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ కింద 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది.నకిలీలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే టాప్–300 బ్రాండ్స్ ఔషధాలపై కంపెనీలు క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నాయి. అన్ని టీకాలు, యాంటీమైక్రోబయాల్స్, నార్కోటిక్, సైకోట్రోపిక్ మందులకు దశలవారీగా ఈ విధానం అమలు చేయనున్నారు. అయితే ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఉత్పాదన గుర్తింపు సంఖ్య, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీ చూపిస్తుంది. ఈ వివరాలు చూపించలేదంటే నకిలీ అన్నట్టు.ఒక్క ఫిర్యాదు సైతం..ఆరోగ్య రంగంలో ఉన్న నిపుణుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. సీడీఎస్సీఓ తాజా నిర్ణయం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, నేరుగా వారి నుంచే ఫిర్యాదులు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో ఔషధాల వల్ల తలెత్తే హానికర సంఘటనలను ట్రాక్ చేసే విధానంలో క్యూఆర్ కోడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు.‘వాస్తవానికి ప్రాణాలకు హాని జరిగితే తప్ప ఇటువంటివి బయటి ప్రపంచానికి తెలియవు. చాలా మంది రోగులు మందుల వల్ల దుష్ప్రభావాలు సహజమని లేదా తాత్కాలికమైనవని భావిస్తారు. సంబంధిత అధికారులను ఎప్పుడూ అప్రమత్తం చేయరు. దీంతో నాసిరకమైన మందుల గుర్తింపు జరగడం లేదు. సమస్యను ముందుగానే గుర్తించడంలో, వందలాది మందికి ఎదురయ్యే హానిని నివారించడంలో ఒక్క ఫిర్యాదు సైతం సహాయపడుతుంది’ అని సీడీఎస్సీఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.మూడు గంటలకు ఒకటి..దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 32,000 కంటే ఎక్కువ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 2,500కుపైగా శాంపిల్స్ నకిలీ, కల్తీ అయ్యాయని నిర్ధారణ అయింది. సగటున ప్రతిరోజూ ఎనిమిది మందులు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టుల్లో విఫలమవుతున్నాయి. అంటే దాదాపు ప్రతి మూడు గంటలకు ఒకటి అన్నమాట.ముప్పు ఉందని భావిస్తే..తయారీ సంస్థలపై తనిఖీలు నిరంతరంచేపడుతు న్నాం. ప్రధానంగా దగ్గు మందుల వంటి ముప్పు ఉండే ఔషధ తయారీ యూనిట్లలో నాణ్యతను పరీక్షిస్తూనే ఉన్నాం. ఫార్మసీల్లో క్యూఆర్ కోడ్ అమలైతే తయారీ సంస్థల్లో జవాబుదారీ, నాణ్యత విషయంలో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా జనవరి నుంచి గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) కొత్త రూల్స్ రానున్నాయి. – పి.రాము, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణప్రజలకే ప్రయోజనం..దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మందుల దుకా ణాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం అమలైతే ప్రజలకే ప్రయోజనం కలుగుతుంది. అసోసియే షన్ తరఫున క్యూఆర్ కోడ్స్ ముద్రించి అన్ని దుకా ణాలకు సరఫరా చేస్తున్నాం. నాసిరకం, నకిలీలకు మేం వ్యతిరేకం. ఔషధాన్ని పరీక్షిస్తేనే నాణ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మందుల తయారీ విషయంలో పటిష్ట జీఎంపీ, లైసెన్సింగ్ విధానాలు అమలు కావాలి. – డాక్టర్ ఘీసూలాల్ జైన్, ప్రెసిడెంట్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ -
రిటైల్ ఇన్వెస్టర్లు స్మార్ట్గురూ!
ఈ కేలండర్ ఏడాది(2025) మార్చి మొదలు రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపట్ల కొంతమేర విముఖతను ప్రదర్శిస్తున్నారు. దీంతో అప్పుడప్పుడూ కొనుగోళ్లకు కట్టుబడినప్పటికీ అడపాదడపా విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇదే బాటలో గత రెండు నెలల్లో మరింత అధికంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ద్వారా స్మార్ట్గా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. కొద్ది నెలలుగా ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ కదులుతున్నాయి. ఇటీవలే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 86,100 పాయింట్లు, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 26,300ను అధిగమించాయి. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ హెచ్చుతగ్గుల మధ్య లాభాలు ఆర్జించాయి. అక్టోబర్లో ఇండెక్సులు 4.5 శాతం పుంజుకోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్(100) 5.8 శాతం, స్మాల్ క్యాప్(100) 4.7 శాతం చొప్పున ఎగశాయి. ఈ ప్రభావంతో నవంబర్లోనూ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ మరింత బలపడినప్పటికీ స్మాల్ క్యాప్ 3 శాతం క్షీణించింది. సరిగ్గా ఇదే సమయంలో అంటే గత రెండు నెలల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఉమ్మడిగా రూ. 23,405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఈ ట్రెండ్ ఇప్పటివరకూ 2025 పొడవునా కనిపించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అప్రమత్తతతో.. నిజానికి మార్కెట్లు బలపడుతున్నప్పుడు విక్రయాలకు ప్రాధాన్యమిస్తూ వచి్చన రిటైలర్లు దిద్దుబాటుకు లోనైనప్పుడు కొనుగోళ్లు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా దేశీ స్టాక్స్పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే మరోపక్క ఇదే సమయంలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్) పెట్టుబడులను కొనసాగించడం ప్రస్తావించదగ్గ అంశం! వివిధ పథకాలలో కొంతమంది రిటైలర్లు సిప్ల ద్వారా పెట్టుబడులు కొనసాగించడం మ్యూచువల్ ఫండ్లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా స్వల్పకాలిక పెట్టుబడుల విషయంలో రిటైలర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అధిక విలువల్లో కొనుగోలు చేసిన షేర్ల విషయంలోనూ మార్కెట్ల తీరు ఆధారంగా కొద్దిపాటి నష్టాలకు లేదా లాభాలకు అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మరోపక్క అంతగా లాభాలకు ఆస్కారం లేదనిపించిన దీర్ఘకాలిక పెట్టుబడులపైనా ఇదే ధోరణి అనుసరిస్తున్నట్లు వివరించారు. ఐపీవోలలోనూ 2025లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే రిటైలర్లు ఐపీవోలో లిస్టింగ్ లాభాలకోసమే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో లిస్టింగ్ రోజునే అత్యధిక శాతం ఇన్వెస్టర్లు హోల్డింగ్స్ విక్రయించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ సాంగ్
తెలంగాణ జానపదలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయని, నృత్యకారిణి నాగదుర్గ నుంచి తాజాగా విడుదలైన పాట ‘పేరుగల్ల పెద్దిరెడ్డి’ ప్రస్తుతం యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ, ఈ కొత్త పాటతో మరోసారి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. పేరుగల్ల పెద్దిరెడ్డి అంటూ వచ్చిన ఈ పాట తండ్రి మీద ప్రేమతో కూతురు చెబుతున్న నేపథ్యంలో ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని, జానపద లయను ప్రతిబింబిస్తూ ఈ పాట ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే, నాగదుర్గ ఈ పాటలో తనదైన శైలిలో చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శుక్రవారం విడుదలైన ఈ పాట కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్ను సాధిస్తూ ట్రెండింగ్లో నిలిచింది. పల్లె జానపద పాటల అభిమానుల మధ్య ఈ పాట క్రేజీ హిట్గా మారడంతో నాగదుర్గ ఖాతాలో మరో విజయవంతమైన జానపద పాట చేరింది. ఈ పాటకు బుల్లెట్ బండి లక్ష్మణ్ సాహిత్యం అందించగా.. మమత రమేష్ గానం చేశారు. సంగీతాన్ని మదన్ కే అందించారు. -
మన అంతరిక్ష కేంద్రానికి తుది రూపు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అతి పెద్ద ఘనత సాధించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్)కు తుదిరూపు ఇచ్చింది. దాని ఆకృతీకరణ (కన్ఫిగరేషన్) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా దీన్ని కీలక మైలురాయిగా శాస్త్ర సాంకేతిక లోకం వేనోళ్ల కీర్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ స్థాయి పరిశీలన కమిటీ బీఏఎస్ తుది రూపును పూర్తిస్థాయిలో పరిశీలించడం, ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. ఈ శుభవార్తను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో వెల్లడించారు. ఏమిటీ బీఏఎస్? ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానం సాయంతో రూపొందిస్తున్న మన సొంత అంతరిక్ష కేంద్రమిది. ఇందులో మొత్తం ఐదు మాడ్యూళ్లు ఉంటాయి. మరో పదేళ్లలో అంటే 2035 నాటికి దీన్ని ఆరంభించి కార్యకలాపాలు మొదలు పెట్టాలన్నది ఇస్రో లక్ష్యం. బీఏఎస్– 01 పేరిట మన అంతరిక్ష కేంద్రం తొలి మాడ్యూల్ అభివృద్ధికి కేంద్రం 2024లో పచ్చజెండా ఊపింది. ఫౌండేషనల్ మాడ్యూల్ను 2028 కల్లా ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయిలో పరీక్షించి చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఏడాదిలోనే బీఏఎస్ నిర్మాణం పూర్తి చేయడం విశేషం. దాని తాలూకు విడి భాగాలు, ఉప వ్యవస్థలు తదితరాలన్నీ చక్కగా పని చేస్తున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గగన్యాన్ ప్రాజెక్టులో అంతర్గతంగా బీఏఎస్కు నిధులు తదితరాలు సమకూర్చారు. దీనికి కేటాయింపులను ఏకంగా రూ.29,193 కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఎన్నెన్నో విశేషాలు... → బీఏఎస్ నిర్మాణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలన్నింటికీ అనుగుణంగా ఇస్రో పూర్తి చేసింది. → గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా భూ దిగువ కక్ష్య (ఎల్ఈఓ)లోకి మానవసహిత ఉపగ్రహాన్ని పంపాలన్న తొలి లక్ష్య సాధనలో బీఏఎస్ పాత్ర కీలకం కానుంది. → అంతరిక్షంలో పలు కీలక పరీక్షలు, ప్రయోగాలు కూడా బీఏఎస్ చేపట్టనుంది. → భారత్ సత్యం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత చంద్రయాన్లో కూడా ఇదే కీలకం కానుంది. → అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితుల్లో ఇతర అంతరిక్ష కేంద్రాలతో ఎప్పటికప్పుడు అనుసంధానం అయ్యేందుకు దీంట్లో అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. → బీఏఎస్లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రయోగించిన కొద్ది కాలంలోనే అన్ని అంతరిక్ష కేంద్రాలకూ అది సారథిగా ఎదిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. → ఇతర అంతరిక్ష కేంద్రాలతో భాగస్వామ్యం దిశగా ఇస్రో ఇప్పటికే చర్చలు మొదలుపెట్టడం విశేషం – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీవుల ఇంటర్నెట్.. వైద్యం సూపర్ 'ఫాస్ట్'!
ఇంటర్నెట్ అంటే తెలుసు. మరి ‘జీవుల ఇంటర్నెట్’ అంటే? ఆరోగ్య సంరక్షణ కోసం మానవ శరీరాలను డిజిటలైజ్ చేయటం. ఇంకా చెప్పాలంటే.. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే. తద్వారా కేన్సర్ వంటి జబ్బుల్ని పుట్టుకలోనే గుర్తించి అప్పటికప్పుడు చికిత్స చెయ్యవచ్చు. వృద్ధాప్యాన్ని సైతం జయించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ అందమైన కల పీడకలగానూ మారే హ్యాకింగ్ ముప్పూ పొంచి ఉందనే అనుమానాలూ లేకపోలేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) నుంచే ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్ (ఐఓబీ) లేదా జీవుల ఇంటర్నెట్ మాట పుట్టింది. సాంకేతికత ద్వారా గణాంకాల సేకరణ, సత్వర పంపిణీలో మనిషి జోక్యాన్ని సాధ్యమైనంత తగ్గించటమే ఐఓటీతో ఒనగూడే ప్రయోజనం. రోజువారీ పనుల్లో వాడే గృహోపకరణాల దగ్గరి నుంచి ఆధునిక పారిశ్రామిక పరికరాల వరకు సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతికతల సహాయంతో నిరంతరం అనుసంధానమై ఉంటూ ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని, గణాంకాలను ఎప్పటి కప్పుడు పరస్పరం పంచుకోవటం ఐఓటీలో జరిగే పని.– సాక్షి, స్పెషల్ డెస్క్ఏంటి ఈ ఐఓబీ?» ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్.. మనుషుల దేహాలను ఇంటర్నెట్కు ఈ సాంకేతికత అనుసంధానిస్తుంది. అతి చిన్న, అత్యంత అధు నాతన సెన్సర్లు మన శరీరాల్లోకి ప్రవేశించటం ఐఓబీ ద్వారా సుసాధ్యమవుతుంది. సెన్సర్లు, సాఫ్ట్వేర్, ఇతర సాంకేతి కతల సహాయంతో మనిషి దేహంలో జరిగే ఆరోగ్యమార్పులను సూక్ష్మ స్థాయిలోనే గుర్తిస్తారు. అంతేకాదు, దేహం లోపలికి సూక్ష్మ రోబోలను పంపి చికిత్స చేయటానికీ ఐఓబీ దోహదం చేస్తుంది.ఇంటర్నెట్ మూడో దశ» డిజిటల్ యుగంలో ఇప్పుడు మూడో దశ నడుస్తోంది. మొదటి దశలో కంప్యూటర్లు వచ్చాయి. రెండో దశలో రోజు వారీ జీవితాన్ని ప్రభావితం చేసే వస్తువులను కంప్యూటర్తో అనుసంధానం జరిగింది. ఇంటర్నెట్ మూడో దశలో ‘జీవుల ఇంటర్నెట్’ వస్తోంది. మైక్రోస్కోపిక్ సెన్సర్ల ద్వారా మన శరీరాలతో ఇంటర్నెట్ను నేరుగా కనెక్ట్ చెయ్యటమే దీని ఉద్దేశ మని ఇటలీ మిలన్ లోని బోకోని విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో అన్నారు. ‘జెల్ ఆధారిత ‘బయో రోబోలు’ దేహంలో ఉంటూ మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా, రక్తం గడ్డ కడుతున్నప్పుడు గుర్తించి సమాచారం అందిస్తాయి. అవసరమైతే ఆస్పిరిన్ మందును కూడా విడు దల చేస్తాయి. వైరస్లు దాడి చేసినప్పుడు టీకాలను సైతం అప్పటి కప్పుడు యాక్టివేట్ చేస్తాయి’ అని ఆయన అంటున్నారు.వైద్య పరిశోధనలో మేలిమలుపు‘జీవ ఇంటర్నెట్’.. మన అవయవాల నుంచి ఎప్పటికప్పుడు తాజా డేటాను సేకరించటం ద్వారా వైద్య పరిశోధనను సమూలంగా మార్చగలదు. ముఖ్యంగా వృద్ధాప్యాన్ని ఓడించడం.. పేద దేశాల్లోనూ ప్రతి ఒక్కరూ వ్యాధుల్లేకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడటం.. వంటి అద్భుత కలలను జీవుల ఇంటర్నెట్ నెరవేర్చుతుందని ఆశిస్తున్నారు. » నిశ్శబ్ద గుండెపోట్లను సకాలంలో గుర్తిస్తుంది» అవసరమైనప్పుడు మందులను విడుదల చేస్తుంది.» శరీరం లోపల నుంచే చికిత్సలను అందిస్తుంది» తద్వారా ప్రాణాలను కాపాడుతుంది మరణాలు నివారించవచ్చు..ఈ సాంకేతికత కొన్ని కొత్త పరిణామాలకు దారితీస్తుందని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో గ్రిల్లో చెబుతు న్నారు. ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వల్ల వ్యాధులు అభివృద్ధి చెందకముందే వాటిని గుర్తించడం సులభం అవుతుంది. ఆహారంలో మార్పులు లేదా మరింత వ్యక్తిగతీకరించిన వ్యాయామ దినచర్యలను సూచించవచ్చు. సకాలంలో హెచ్చరికలు పంపడం ద్వారా మరణాలను నివారించవచ్చు. ఒక్క అమెరికాలోనే ప్రతి సంవత్సరం 8,05,000 మంది గుండె పోటుతో మరణి స్తుంటే.. సమస్యను గుర్తించలేక 1,70,000 మంది ‘నిశ్శబ్ద’ గుండెపోట్లతో చనిపోతున్నారు. జీవుల ఇంటర్నెట్ యుగంలో వైద్య పరిశోధన, ఔషధ ఆవిష్కరణ ఇప్పటిలా కాకుండా అత్యంత వేగవంతమవుతుంది. భారీ డేటాబేస్లు సమస్యకు ఏది పనిచేస్తుందో చూపించే నమూనాలను సూచిస్తాయి. ఔషధాలు చాలా త్వరగా, చౌకగానే కాకుండా కచ్చితత్వంతోనూ అభివృద్ధి అవుతాయి.పీడ కల కాకుండా..మన శరీరాలను డిజిటలైజ్ చేసే జీవుల ఇంటర్నెట్ను మనం జాగ్రత్తగా వినియోగించాలని నిపు ణులు సూచిస్తున్నారు. హ్యాకర్లు ‘ఇంటర్నెట్ ఆఫ్ బీయింగ్స్’ ను లక్ష్యంగా చేసుకుంటే ఎదురయ్యే విపరిణామాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. -
సాహో... సాగర ధీర
సముద్రాన్ని జీవితంతో పోలుస్తారు తాత్వికులు. సముద్రంలో మౌనం ఉంటుంది. కల్లోలం ఉంటుంది. పడి లేచిన కెరటాలు ఉంటాయి. సవాళ్ల విషయంలో భారత నావికాదళం కూడా సముద్రంలాంటిదే. ఆ సవాళ్లను అధిగమించి భారత నావికా దళంలో వివిధ కీలక విభాగాల్లో తొలి మహిళలుగా చరిత్ర సృష్టించిన రోల్ మోడల్స్ గురించి...భారత నావికా యుద్ధనౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా కమాండర్గా ప్రేరణ దియోస్థలీ చరిత్ర సృష్టించింది. ముంబైకి చెందిన ప్రేరణ ‘జీసస్ అండ్ మేరీ కాన్వెంట్’ స్కూలులో చదువుకుంది. నేవీలో పనిచేయాలనే లక్ష్యానికి స్కూలు రోజుల్లోనే బీజం పడింది. సెయింట్ జేవియర్స్ కాలేజీలో సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రేరణ 2009లో నావికాదళంలో చేరింది. ప్రేరణను స్ఫూర్తిగా తీసుకొని ఆమె తమ్ముడు కూడా నావికా దళంలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ప్రారంభ సమస్యలు ఎదుర్కొంది ప్రేరణ. గోవాలో తన మొదటి ఎన్సీసీ సెయిలింగ్ క్యాంప్లో సెయిల్ బోట్ మూడుసార్లు బోల్తా పడింది. అయినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. పట్టుదలతో సెయిలింగ్లో ప్రావీణ్యం సాధించింది. ఒడిశాలోని చిల్కా సరస్సులో జరిగిన సెయిలింగ్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. కెరీర్ తొలిరోజుల్లో సముద్ర నిఘా విమానంలో పరిశీలకురాలిగా శిక్షణ పొందింది. 2012లో చైనా వాణిజ్యనౌకపై సోమాలియ దొంగలు దాడికి దిగినప్పుడు, ఆ దాడిని తిప్పి కొడుతూ చేసిన ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన ప్రేరణ భారత్ నేవీ విదేశ్ సేవాపతకాన్ని అందుకుంది.నేవీలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్భారత నావికాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ (క్యూఎఫ్ఐ)గా చరిత్ర సృషించింది కమాండర్ దివ్యశర్మ. డోర్నియర్ పైలట్లుగా పనిచేసిన మొదటి ముగ్గురు మహిళలలో న్యూ దిల్లీకి చెందిన దివ్యశర్మ ఒకరు. ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఫ్రంట్లైన్ కార్యకలాపాల కోసం నావికా ఏవియేటర్లకు శిక్షణ ఇవ్వడంలో ఇన్స్ట్రక్టర్లది కీలక పాత్ర.గతంలో ఫిక్స్డ్–వింగ్ విమానాలను నడిపిన దివ్య ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్లలో పైలట్లకు శిక్షణ ఇచ్చే సర్టిఫికెట్ అందుకుంది. న్యూ దిల్లీలోని మాల్వియానగర్కు చెందిన దివ్య కెరీర్ తొలి రోజుల్లో నుంచే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ వస్తోంది. డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ (డీవోఎఫ్టీ) కోర్సులో అత్యత్తమ ప్రతిభ చూపింది. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం, అంకితభావానికి గుర్తింపుగా ‘ఫస్ట్ ఇన్ ఫ్లయింగ్’ అవార్డ్ అందుకుంది.నావికా దళంలో నారీశక్తిభారత నావికాదళంలో ఒకప్పుడు మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. అయితే కాలక్రమంలో మహిళల శక్తిసామర్థాల్యను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి దారులు తెరిచింది ఇండియన్ నేవీ. ఒకప్పుడు మాండోవి, గోవా బ్రాంచ్లలో ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్... మొదలైన వాటిలో పరిమిత పాత్ర పోషించిన మహిళలు కీలకమైన విభాగాల్లోకి వచ్చి సత్తా చాటుతున్నారు. నేవీలో పైలట్, ఫైటర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా... ఎన్నో కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, ప్రిగేట్... మొదలైన ఫ్రంట్లైన్ యుద్ధనౌకలలో మహిళలు విధులు నిర్వహించడం నావికాదళంలో మహిళల పాత్రకు సంబంధించి విప్లవాత్మక అభివృద్ధి. లింగసమానత్వానికి పెద్ద పీట వేయడంలో భారత నావికాదళం ముందు వరుసలో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం భారత నావికాదళం మహిళా అధికారులకు (వైద్యేతర శాఖలు) మెరిట్ ఆధారంగా పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసింది.తొలి మహిళా ఫైటర్ పైలట్భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించింది ఆస్తా పూనియా. ‘మహిళా ఫైటర్ పైలట్తో భారత నౌకాదళంలో కొత్త శకం మొదలైంది’ అన్నారు అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకుంది ఆస్తా పూనియా. నాన్–ఫైటర్ ఆపరేషన్లలో మహిళా అధికారులు ఉన్నప్పటికీ ఫైటర్ స్ట్రీమ్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఉత్తర్ప్రదేశ్లోని మేరర్కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్ చేసింది. ఎన్నో పరిమితుల కారణంగా నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ చరిత్ర సృష్టించింది. ఎంతోమంది యువతులకు రోల్మోడల్గా నిలిచింది.తొలి మహిళా పైలట్ఉత్తర్ప్రదేశ్లోని తిల్హార్కు చెందిన శుభాంగి స్వరూప్ భారత నావికాదళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది. 2017లో కన్నూర్లోని ‘ఇండియన్ నేవల్ అకాడమీ’ నుంచి పట్టభద్రురాలైన మొదటి బ్యాచ్ మహిళా అధికారులలో శుభాంగి ఒకరు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయో టెక్నాలజీలో ఇంజినీరింగ్ చేసింది. హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందింది. నావికా దళంలో పనిచేసిన తండ్రి కమాండర్ జ్ఞాన్స్వరూప్ శుభాంగికి స్ఫూర్తి.‘నేవీలో పనిచేయడం అంటే మాటలు కాదు. తట్టుకుంటావా?’ అని తండ్రి అడిగినప్పుడు ‘యస్’ అని చెప్పింది శుభాంగి. ఆమె నేషనల్ తైక్వాండో ఛాంపియన్ కూడా.ఆమె అమరత్వంవృత్తి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన భారత వైమానిక దళంలోని తొలి మహిళా అధికారి కిరణ్ షెఖావత్. అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ 2015 మార్చి 24న గోవా తీరంలో జరిగిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. ముంబైలో పుట్టిన కిరణ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఫిజిక్స్లో పట్టా పుచ్చుకుంది. ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో చేరడానికి ముందు ఒక ప్రైవేట్బ్యాంకులో పనిచేసింది. తన ఐదు సంవత్సరాల కెరీర్లో దేశంలోని వివిధ నౌకాదళ స్టేషన్లలో విధులు నిర్వహించింది. నేవీలోకి రావాలనుకోవడానికి తండ్రి స్ఫూర్తి. ఆయన నేవీ ఆఫీసర్. రచయిత నికోలస్ స్పార్క్కు కిరణ్ పెద్ద అభిమాని. అతడి అన్నిపుస్తకాలు చదివింది. ఆ పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాలు చూసింది. కుమార్తె చనిపోయిన తరువాత ఆమె పేరు మీద ‘లెఫ్టినెంట్ కిరణ్ షెఖావత్’ ఫౌండేషన్ స్థాపించాడు తండ్రి. హరియాణాలోని కుర్తాలలో కిరణ్ షెఖావత్ గౌరవార్థం రెండు ఎకరాల భూమిని షహీద్ పార్క్గా అభివృద్ధి చేశారు. ఈ పార్క్లో కిరణ్ విగ్రహం ఏర్పాటు చేశారు. -
నాలుగు కాళ్ల దేవతలు!
అది పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లా, నవద్వీప్ పట్టణం. ఎముకలు కొరికే చలి. నిశ్శబ్దపు తెల్లవారుజాము.. ఆ చీకట్లో రైల్వే కార్మికుల కాలనీలోని ఒక బాత్రూమ్ వెలుపల నేలపై నవజాత శిశువు. శరీరంపై ఎలాంటి వస్త్రం లేదు.. పురిటి నెత్తురు మరకలు తొలగలేదు.. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చూడని ఆ పసికందును ఎవరో కనికరం లేకుండా వదిలివేశారు. ఆ చిన్ని ప్రాణం గడ్డకట్టే చలిలో వణికిపోయింది.. విలవిల్లాడిపోయింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వలయం కట్టి.. తెల్లార్లూ కాపలా కాసివీధి కుక్కల గుంపు ఒకటి ఆ శిశువును చుట్టుముట్టింది. అవి అరవలేదు. కదలకుండా, ప్రశాంతంగా.. శిశువు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచాయి. రాత్రంతా, అవి నిశ్శబ్ద సైనికుల్లా నిలబడ్డాయి. వేకువ వెలుగు వచ్చే వరకు.. ఆ బిడ్డ దగ్గరకు ఎవరినీ రాని వ్వలేదు. పసికందును తాకనివ్వలేదు. ‘ఉదయం లేచాక కనిపించిన ఆ దృశ్యం గుర్తొస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది’.. అని స్థానికుడు సుక్లా మొండల్ ఉద్వేగంగా చెప్పారు. ‘ఆ కుక్కలు మామూలుగా లేవు. అవి అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఆ బిడ్డ బతకడానికి పోరాడుతోందని అవి అర్థం చేసుకున్నట్లు అనిపించింది’.. అని వ్యాఖ్యానించారు.పసికందు చుట్టూ సెంట్రీల్లా..తెల్లవారుజామున శిశువు చిన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అప్పటివరకు ఎవరో జబ్బు పడిన బిడ్డ అనుకున్న స్థానికులకు, ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు. ఆ కుక్కలు కంచె వేసినట్లు, సెంట్రీల్లా పసికందు చుట్టూ నిల్చున్నాయి. సుక్లా మొండల్ ధైర్యం చేసి, మెల్లగా ముందుకు వెళ్లగానే.. ఆ కుక్కలు పక్కకు తప్పుకున్నాయి. వెంటనే ఆమె బిడ్డను తన దుపట్టాలో చుట్టి ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు, ఆ బిడ్డకు ఎటువంటి గాయాలు లేవని, కేవలం పుట్టిన కొన్ని నిమిషాలకే ఎవరో వదిలేశారని నిర్ధారించారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.మనుషుల్ని మించిన మానవీయత..‘మేము ఎప్పుడూ ఈసడించుకుని.. తిట్టుకునే శునకాలే ఇవి.. కానీ, ఈ బిడ్డను వదిలి వెళ్లిన వారికంటే ఇవే ఎక్కువ మానవత్వాన్ని చూపించాయి’.. అని ఒక రైల్వే కార్మికుడు వ్యాఖ్యానించారు. సాయంత్రం అయ్యేసరికి కాలనీలో దృశ్యం మారిపోయింది. ఆ రాత్రంతా బిడ్డను కాపాడిన కుక్కల దగ్గరికి కాలనీలోని చిన్నారులంతా వెళ్లారు. వాటిని ఆప్యాయంగా నిమిరారు. ప్రేమతో బిస్కెట్లు తినిపించారు. ఆ కుక్కలు కేవలం ఒక శిశువును కాపాడటమే కాదు, ఆ రోజు ఆ కాలనీ ప్రజలందరికీ ఒక సందేశమిచ్చాయి. మానవత్వం అనేది నాలుగు కాళ్లపై కూడా రావచ్చని నిరూపించాయి.ఇలాంటి ఘటనే.. 1996లో కోల్కతా సమీపంలో ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది. ఓ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త గుట్టలో వదిలేశారు. అయితే ఆ బిడ్డకు మూడు వీధి కుక్కలు కాపలాగా ఉన్నాయి. చివరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బిడ్డ సంరక్షణా కేంద్రానికి చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోల్డ్లోన్స్లో దక్షిణాది రాష్ట్రాలే టాప్
సాక్షి, స్పెషల్ డెస్క్: రుణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావడం, తక్కువ పత్రాలు, సౌకర్యవంతమైన నిబంధనలు.. అందుకే జనం గోల్డ్లోన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పైగా ఇటీవలి కాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. దీంతో తాకట్టు పెట్టిన పసిడిపై అందుకునే రుణ మొత్తమూ అధికమైంది. అయితే ఆసక్తికర విషయం ఏటంటే భారత్లో దక్షిణాది వాసులే అత్యధికంగా బంగారంపై లోన్లు తీసుకుంటున్నారు. ఖరీదైన రుణాలవైపు.. సగటున ఒక్కో వినియోగదారుడు అందుకున్న రుణ మొత్తం 2023 సెప్టెంబర్లో రూ.1.1 లక్షలు ఉంటే.. రెండేళ్లలో రూ.1.64 లక్షలకు చేరింది. రూ.లక్ష లోపు విలువ చేసే రుణ ఖాతాల సంఖ్య తగ్గింది. రూ.లక్షకుపైగా విలువ చేసే రుణ ఖాతాలు దూసుకెళ్లాయి. మొత్తం రుణాల్లో విలువ పరంగా.. రూ.లక్ష లోపు విలువచేసే రుణాల వాటా రెండేళ్లలో 25.9% నుంచి 14.4% పడిపోయింది. అలాగే రూ.5 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా దాదాపు రెండింతలైంది. పసిడి విలువ పెరగడమూ ఈ జోరుకు కారణమైంది. దేశవ్యాప్తంగా మొత్తం రిటైల్ రుణాల్లో గోల్డ్లోన్స్ అత్యధికంగా 27 శాతం వాటా కైవసం చేసుకున్నాయి.దేశంలో మొత్తం బంగారు రుణాలు సెపె్టంబర్ నాటికి రూ.14.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా ఏకంగా 76.55% ఉంది. రూ.4.9 లక్షల కోట్లతో తమిళనాడు తొలి స్థానం కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. మొత్తం గోల్డ్ లోన్స్లో టాప్–10 రాష్ట్రాలు రూ.13.2 లక్షల కోట్లు కైవసం చేసుకోగా, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా కేవలం రూ.1.3 లక్షల కోట్లు మాత్ర మే. అయితే ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య 3.69 కోట్ల మంది కస్టమర్లు రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పసిడి రుణాలు అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే రుణ మొత్తం 53%, వినియోగదారుల సంఖ్య 16% పెరగడం విశేషం. -
అప్పుతో స్మార్ట్ఫోన్
భారత్లో గత ఏడాది 15.1 కోట్ల స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి కొత్తగా వచ్చి పడ్డాయి. ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ మధ్య.. అంటే తొమ్మిది నెలల్లో దాదాపు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇంత భారీస్థాయిలో వీటి విక్రయాలు జరగడానికి ప్రధాన కారణం సులభంగా రుణాలు దొరకడమే. ఈ ఏడాది స్మార్ట్ఫోన్ కోసమే అత్యధికులు లోన్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సెప్టెంబర్ నాటికి దేశంలో రిటైల్ లోన్స్ మొత్తం రూ.156.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాదిలో వీటి విలువ ఏకంగా 18% పెరిగిందంటే జనం ఏ స్థాయిలో అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 67 కోట్ల యాక్టివ్ రుణ ఖాతాలున్నాయి. ఈ ఖాతాల సంఖ్య సంవత్సరంలో 7.1% దూసుకెళ్లింది. కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీ హోమ్ క్రెడిట్ ఇండియా 2025లో భారతీయుల రుణాల తీరుపై ఓ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది రుణగ్రహీతల్లో 46% మంది స్మార్ట్ఫోన్ కొనుగోలుకే అప్పు చేశారని వెల్లడించింది. 25% మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి రుణం అందుకున్నారని తెలిపింది. ఆర్థిక లక్ష్యాల సాధనకు.. అవసరానికి అప్పు తీసుకోవడం గతం. ఇప్పుడు జనం తీరు మారింది. ఆకాంక్షలు, స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారంలో పెట్టుబడి, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రుణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వారి వ్యూహాత్మక, భవిష్యత్తుకు బాటలు వేసే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధ్యయనం తెలిపింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వారి ఆకాంక్షలను, కలలను వాస్తవంగా మార్చడానికి స్మార్ట్ క్రెడిట్ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని వివరించింది. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల నుంచి సగటు కుటుంబ ఆదాయం నెలకు రూ.33,923 కలిగిన 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తులు సర్వేలో పాలుపంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాల సాధనకు.. అవసరానికి అప్పు తీసుకోవడం గతం. ఇప్పుడు జనం తీరు మారింది. ఆకాంక్షలు, స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు, వ్యాపారంలో పెట్టుబడి, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రుణాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వారి వ్యూహాత్మక, భవిష్యత్తుకు బాటలు వేసే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అధ్యయనం తెలిపింది. దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వారి ఆకాంక్షలను, కలలను వాస్తవంగా మార్చడానికి స్మార్ట్ క్రెడిట్ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని వివరించింది. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 17 ప్రధాన నగరాల నుంచి సగటు కుటుంబ ఆదాయం నెలకు రూ.33,923 కలిగిన 18–55 ఏళ్ల వయసున్న వ్యక్తులు సర్వేలో పాలుపంచుకున్నారు. తమ కాళ్లమీద తాము.. రుణాల తీరును చూస్తుంటే తమ కాళ్లమీద తాము నిలబడాలన్న ఆలోచన జనంలో పెరిగింది. వ్యాపారం ప్రారంభించేందుకు, ప్రస్తుత బిజినెస్ను విస్తరించేందుకు రుణం అందుకున్నవారు 2022లో 14% మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరాల నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2023లో 19%, గత ఏడాది 21% నమోదైంది. ఈ ఏడాది ఇది 25 శాతానికి పెరిగింది. చిన్న నగరాల్లో జోరుగా.. రుణాలు తీసుకున్నవారిలో 65 శాతం మంది మొబైల్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు, సేవలు అందుకుంటున్నారు. మొబైల్ బ్యాంకింగ్లో మిల్లీనియల్స్ (1981–1996 మధ్య పుట్టినవారు) ముందున్నారు. అలాగే మెట్రో సిటీస్ అత్యధిక విస్తృతి కలిగి ఉన్నాయి. ప్రథమ శ్రేణి నగరాలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి నగరాల్లోని రుణగ్రహీతలు అధికంగా మొబైల్ బ్యాంకింగ్కు అలవాటు పడటం గమనార్హం. మొత్తంగా ఆన్లైన్ లెండింగ్ కంపెనీల నుంచి రుణం పొందడానికి 49 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. -
అన్నంత పని చేయబోతున్న ట్రంప్?!
ఇల్హాన్ ఒమర్ను అమెరికా నుంచి వెళ్లగొడతారా? ఆమెను పంపించేయాల్సిందేనని అక్కడి ప్రజలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?. ట్రంప్ చెబుతున్నట్లు ఆమె నిజంగానే ఇమ్మిగ్రేషన్ ఫ్రాడ్కు పాల్పడ్డారా? భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది?.. అసలు ఇంతకీ ఇల్హాన్ ఒమర్ నేపథ్యం ఏంటి?.. అమెరికా చట్ట సభ్యురాలు, మిన్నెసోటా రాష్ట్రానికి చెందిన డెమోక్రాటిక్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్. తాజాగా ఆమె వివాహం,ఇమ్మిగ్రేషన్ విషయంలో మోసానికి పాలపడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా పౌరసత్వం కోసం సొంత సోదరుడినే వివాహం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. దీంతో పాటు ఆమె చేస్తున్న యాంటీ అమెరికా కామెంట్లకు అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. డీనేచురలైజ్ చేసి (పౌరసత్వం రద్దు చేసి) దేశం నుంచి వెల్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ట్రంప్ అలా అనేసరికి.. 2009లో ఒమర్ అహ్మద్ నూర్ సయీద్ ఎల్మీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అక్రమంగా అమెరికాకు వలస వచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ఆమె వివాహమాడారని.. కేవలం అమెరికాలో స్థిరపడేందుకు ఆమె మోసం చేశారని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను అమెరికా నుంచి బయటకు పంపించేస్తామని వ్యాఖ్యానించారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో సాధారణంగానే చర్చ పెద్దదైంది. ఈ ఆరోపణలను ఒమర్ ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇస్లామోఫోబిక్, రాజకీయ ప్రేరేపితమైనవిగా అభివర్ణించారామె. రాజకీయంగా తనను బలహీనపర్చేందుకు జరుగుతున్న దాడి అని అన్నారామె. అయితే.. గతంలోనూ..ఇల్హాన్ ఒమర్పై ఈ ఆరోపణలు కొత్తవేం కావు. 2016లో సోమాలి-అమెరికన్ ఫోరమ్ ఒకటి ఈ అభియోగాన్ని తెరపైకి తెచ్చింది. 2018 కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనూ ఈ అంశంపై పెద్ద చర్చ నడిచింది. తీవ్ర అభియోగాల నేపథ్యంతో కొన్ని మీడియా సంస్థలు ఇన్వెస్టిగేషన జర్నలిజంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయతనం చేశాయి. 2019-20 మధ్య ఎఫ్బీఐ, హౌజ ఎథిక్స్ కమిటీ ఈ అభియోగాన్ని పరిశీలించి ఏం తేలకపోవడంతో కేసులు మూసివేశాయి కూడా. అయినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు. దీంతో అమెరికా రాజకీయాల్లో ఇమ్మిగ్రేషన్ & పౌరసత్వంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. వెళ్లగొట్టాల్సిందే..! ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఆమెను అమెరికా నుంచి పంపించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఉద్యమిస్తున్న మాగా కార్యకర్తలు, కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కోరుతున్నారు. ఈ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నారు. ఆమె మ్యారేజ్ సర్టిఫికెట్ను ఎక్స్ ఖాతాలో వైరల్ చేస్తూ.. సాగనంపాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు.ఇల్హాన్ ఒమర్(43).. పుట్టింది సోమాలియాలో. ఆ దేశ అంతర్యుద్ధంతో 8 ఏళ్ల వయసులో కెన్యాకు చేరుకుని నాలుగేళ్లపాటు శరణార్థ శిబిరాల్లో గడిపింది. అక్కడి నుంచి అమెరికాకు చేరుకున్న ఆమె.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందింది. 2018 నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు ఆమె చట్టసభకు ఎన్నికయ్యారు. అది సాధ్యమేనా?అమెరికా చట్టం ప్రకారం, నేచురలైజ్డ్ సిటిజన్ (పౌరసత్వం పొందిన వ్యక్తి)ను డీనేచురలైజ్ చేయవచ్చు, కానీ అది స్పష్టమైన, బలమైన ఆధారాలతో మాత్రమే సాధ్యం. డీనేచురలైజేషన్ జరిగితే, ఆ వ్యక్తి పర్మనెంట్ రెసిడెంట్ లేదంటే అక్రమ వలసదారుగా మారతారు. తర్వాతే డిపోర్టేషన్ జరుగుతుంది. ఈ మధ్యలో కోర్టు జోక్యాలతో ఏదైనా జరగొచ్చు. అయితే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు ప్రధానంగా యుద్ధ నేరస్తులు, ఉగ్రవాదులపై మాత్రమే జరిగాయి. ఒమర్పై వినిపిస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు(ఫోరెన్సిక్ సహా) లేకపోవడం వల్ల చట్టపరంగా చర్యలు తీసుకోవడం కష్టమే. భారత్కు ఎందుకు అంత కోపంవివాదాలు ఆమెకు కొత్తేం కాదు. ఆమె బహిరంగంగా చేసిన పలు ప్రకటనలు తీవ్ర దుమారం రేపాయి. సోమాలియా నా సొంతం దేశం అంటూ అమెరికాను ఆమె కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఒకటి బలంగా వినిపిస్తుంటుంది. అంతేకాదు.. గాజా సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్, అమెరికాను ఉగ్ర గ్రూపులతో పోల్చారామె. అలాగే.. ఇల్హాన్ ఒమర్ గతంలో భారత వ్యతిరేక వైఖరితో వార్తల్లో నిలిచారు. 2022లో ఆమె పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను సందర్శించి, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆమె భారతదేశంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీ ఈ పర్యటనను తీవ్రంగా ఖండించింది. -
అణుశక్తి బిల్లు.. గేమ్ చేంజర్ అయ్యేనా?
నేటి(సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కేంద్ర ప్రభుత్వం దేశ ఇంధన రంగాన్ని సమూలంగా మార్చగల కీలక చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. అదే అణుశక్తి బిల్లు- 2025. ఈ చారిత్రక బిల్లు ముఖ్య ఉద్దేశ్యం అణుశక్తి రంగాన్ని మొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో తెరవడం. తద్వారా దేశంలో క్లీన్ ఎనర్జీ సామర్థ్యం పెంపొందుతుందని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.విధానపరమైన అంతరానికి చెక్ఈ బిల్లులోని అత్యంత కీలక అంశం.. అణు విద్యుత్ ప్లాంట్లకు టారిఫ్ల (సుంకాల)పై తగిన నిర్ణయం తీసుకోవడం. ఇప్పటివరకు అణు రంగంలో ప్రైవేట్ పెట్టుబడిని పరిమితం చేసేలా విధానపరమైన అంతరం ఎదురవుతోంది. సరైన టారిఫ్ రెగ్యులేషన్ విధానాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, ప్రభుత్వం దేశీయ ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించాలని, వారికి లాభదాయకతను కల్పించాలని చూస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లు ఆమోదం పొందితే ఇది విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లకు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఫ్రాన్స్, రష్యా, అమెరికా తదితర దేశాల సాయంతో భారతదేశ అణు సామర్థ్యం బలోపేతం కానుంది.ఇప్పటివరకు న్యూక్లియస్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ఆధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మరింతగా పెరగనుంది. బిల్లులో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ రంగ ప్రవేశం: ఈ బిల్లు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు నేరుగా అణు విద్యుత్ ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడానికి మొదటిసారిగా అనుమతినిస్తుంది.టారిఫ్ రెగ్యులేషన్: అణు విద్యుత్ ప్లాంట్లకు సుంకాల (టారిఫ్) నిర్ణయాన్ని పరిష్కరించడానికి ఈ బిల్లు ఒక విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఇది పెట్టుబడిదారుల లాభదాయకతను, వినియోగదారుల స్థోమతను సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది.టెక్నాలజీ యాక్సెస్: బిల్లు ఆమోదం పొందిన తర్వాత విదేశీ టెక్నాలజీ ప్రొవైడర్లు భారతదేశ అణు ప్రాజెక్టులలో ప్రవేశించడం మరింత సులభం అవుతుంది.వికసిత భారత్ : భారత ప్రభుత్వం ఈ సంస్కరణను ‘వికసిత భారత్’ దార్శనికతలో భాగంగా చూస్తున్నది. క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు.ఎదురయ్యే సవాళ్లుఅయితే ఈ సంస్కరణ పలు సవాళ్లను లేవనెత్తనుంది. విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడనున్నటప్పటికీ భద్రత, ప్రమాద బాధ్యతల ఆందోళనలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే అణు కార్యకలాపాలలో కఠిన నియంత్రణ, పర్యవేక్షణ అత్యవసరం. మరోవైపు కొన్ని ప్రాంతాలలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ప్రభుత్వం చల్లార్చాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుత శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి 19వరకూ జరగనున్నాయి. అణు బిల్లుతో పాటు, చండీగఢ్ కోసం రాజ్యాంగ సవరణ, ఉన్నత విద్యలో సంస్కరణలు సహా 10 ప్రతిపాదిత చట్టాలను ప్రభుత్వం జాబితా చేసింది. అయితే ప్రతిపక్షం ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (సర్), జాతీయ భద్రత, పర్యావరణ ఆందోళనలు తదితర అంశాలపై చర్చను లేవనెత్తాలని భావిస్తున్నాయి. ఏదిఏమైనప్పటికీ అణుశక్తి బిల్లు- 2025 భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఒక చారిత్రక మలుపు కానుంది. ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో.. -
నిర్భయ!భయం ఆమె ‘మెదడు’లోనే లేదు
పొట్టలో ఏదో సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ మనందరికీ తరచూ కలిగేదే. కదా! భయం తాలూకు అనేకానేక సంకేతాల్లో అదొకటి. అలాంటి భయమంటే అసలేమిటో, అదెలా ఉంటుందో ఏమాత్రమూ తెలియని మహిళ ఒకరున్నారు. అందుకు కారణం ఫక్తు వైద్యపరమైనది కావడం విశేషం...!చాలాకాలం కింది సంగతి. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఆమె అలా నడిచి వెళ్తోంది. ఉన్నట్టుండి ఓ సాయుధుడు అటకాయించి ఏకంగా గొంతుపైనే కత్తి పెట్టాడు. కానీ ఆమె కళ్లలో భయం ఛాయలైనా కన్పించలేదు. ‘ఊ, కానీ. ఆలస్యమెందుకు?’అంటూ గొంతు కోయమని ఆహ్వానించింది! దాంతో దొంగ కాస్తా బిత్తరపోయి ఉన్నపళాన కాలికి బుద్ధి చెప్పాల్సి వచి్చంది. మనమైతే దీన్ని సాహసం అంటాం కదా! కానీ సైంటిస్టులు మాత్రం మరేదో అంటున్నారు. ఆ మహిళ తాలూకు ప్రత్యేకతే అందుకు కారణం. ఏమంటే, ఆమె మెదడులో భయాన్ని ప్రాసెస్ చేసి మనసుకు అర్థమయ్యేలా చేసే అమిగ్డాలా అనే వ్యవస్థే పూర్తిగా లోపించింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా కేవలం కొన్ని వందలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రస్తతమైతే ఇలాంటి లక్షణాలున్న ఏకైక వ్యక్తి భూ మండలం అంతటా ఆమె మాత్రమే కావడం విశేషం. వారిలోనూ ఇలా అమిగ్డాలా లోపించిన కేసు ఇది రెండోది మాత్రమే. అందుకే ఆమె వ్యక్తిగత వివరాలను సైంటిస్టులు అతి గోప్యంగా ఉంచారు. మనిషి భయం, ఆందోళన, అసంకల్పిత ఆత్మరక్షణ ప్రతిచర్య వంటివాటిని ఎలా అనుభూతి చెందుతాడో తెలుసుకునేందుకు ఆమెపై పలు పరిశోధనలు జరుపుతున్నారు. తనను కేవలం ఎస్ఎంగా వ్యవహరిస్తున్నారు. అరుదైన వ్యాధి ఎస్ఎంకు అర్బాక్ వీత్ అనే అత్యంత అరుదైన వ్యాధి ఉంది. ఇది తన మెదడులోని అమిగ్డాలాను క్రమంగా మటుమాయం చేస్తూ వచ్చింది. ఇదంతా ఓ పాతికేళ్ల కింది సంగతి. దాంతో ‘ఫియర్లెస్ షీ’గా అప్పట్లో ఆమె ప్రపంచమంతటా ఫేమస్ అయిపోయింది. తనకు నిజంగానే వీసమెత్తు కూడా భయం వేయదా అన్నది తేల్చుకునేందుకు ఎందరో ఎన్నెన్నో రకాల పరీక్షలు పెట్టి చూశారు. అన్నింట్లోనూ విజయం ఆమెదే. పరాజయం... భయానిదీ, పరీక్షకులదీ! ఆమెను దెయ్యల కొంపల్లో ఉంచి తాళం వేశారు. హఠాత్తుగా పాములను మెళ్లో వేశారు. భయంకరమైన హారర్ సినిమాలు ఒంటరిగా కూచోబెట్టి మరీ చూపించారు. ఆమె గత జీవితంలోనే అత్యంత భయానకమని చెప్పదగ్గ ఉదంతాలను పదేపదే పనిగట్టుకుని గుర్తు చేశారు. ఎన్ని చేసినా ఆమెకు భయమన్నదే కలగలేదు. సరికదా, అన్ని సందర్భాల్లోనూ ఎస్ఎం అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా కన్పించి పరీక్షకులకే పరీక్ష పెట్టింది! పుట్టి బుద్ధెరిగిన నాటినుంచీ అసలు భయమంటే ఎలా ఉంటుందో కూడా ఎరగదట తను. 2009–11 మధ్య ఆమెపై పలుమార్లు ప్రాణాంతక దాడులు జరిగాయి. దోపిడీ యత్నాలకూ గురైంది. బెదిరింపులకైతే లెక్కే లేదు! కానీ ఒక్కటంటే ఒక్క ఉదంతంలో కూడా ఆమెలో భయం అణుమాత్రమైనా కన్పించలేదట. ఆమె భయపడ్డ క్షణం... ఇక ఇలా కాదని సైంటిస్టులు ఎస్ఎంను ఓ చిత్రమైన పరీక్షకు గురిచేసి చూశారు. తనతో పాటు తన మాదిరిగానే అమిగ్డాలా కాస్తో కూస్తో పాడైన మరో ఇద్దరిని ప్రయోగశాలలో కూచోబెట్టారు. 35 శాతం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) పీల్చేలా చేశారు. నియంత్రిత పద్ధతిలో చేయగలిగితే దీనివల్ల అవతలి వ్యక్తి ఊపిరాడని పరిస్థితికి లోనవుతాడు. అలా సీఓటూ పీల్చగానే జరిగింది చూసి సైంటిస్టులే అవాక్కయ్యారు. జీవితంలోనే తొలిసారిగా ఎస్ఎం ‘పానిక్’అయింది. అంటే, భయపడిందన్నమాట! సీఓటూ మాస్క్ను ముఖంపై నుంచి ఒక్కసారిగా పీకిపారేసింది. శ్వాస కోసం పెనుగులాడింది. ఇప్పటికి గుర్తు చేసినా సరే, ‘అదో భయానక అనుభూతి’అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మిగతా ఇద్దరు రోగులు కూడా ఎస్ఎం మాదిరిగానే బెదిరిపోయారు.కీలక స్పష్టత ఎస్ఎం బృందంపై చేసిన పరీక్ష ఫలితాన్ని బట్టి సైంటిస్టులు ఒక కీలక స్పష్టతకు వచ్చారు. బయటి ప్రమాదాలను గుర్తించి శరీరానికి, మనసుకు అర్థమయేలా చేసేందుకు అమిగ్డాలా అవసరం. కానీ శరీరం లోపలి నుంచే పుట్టుకొచ్చే భయం మాత్రం దానితో నిమిత్తం లేకుండానే వణుకు పుట్టించేస్తుంది! అంతేకాదు, ‘‘భయానికి మెదడులో మూలం అమిగ్డాలా ఒక్కటే కాదు. అందుకు పలు దారులున్నాయి. అసలు భయం బలహీనత కానే కాదు. మనుగడకు అవసరమైన అత్యంత కీలకమైన సాధనం. ఎందుకంటే భయం ఏ కోశానా లేకపోబట్టే అర్ధరాత్రి, అపరాత్రి అనే లేకుండా ఎస్ఎం ఎటు పడితే అటు తిరిగి ప్రమాదాలను కొనితెచ్చుకుంది. భయముంటే ఇలాంటి పనులు ఎన్నటికీ చేయరు. అంతేకాదు, భయం లేకపోతే ఒంట్లో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. కొసమెరుపుఅయితే, అమిగ్డాలాతో నిమిత్తం లేకుండా ఒంటికి, మనసుకు భయాన్ని అనుభూతం చేసే అంతర్గత సర్క్యూట్లు ఏమిటి, అవెలా పని చేస్తాయి అన్నది మాత్రం సైంటిస్టులకు ఇంకా అంతు చిక్కాల్సే ఉంది! -
ఈ భూమికి ఏమైంది..? వచ్చే ఏడు మరిన్ని విపత్తులే!
వరుస భూకంపాలు. బీభత్సమైన వరదలు. కార్చిచ్చులు. అగ్నిపర్వతాల పేలుళ్లు. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం విపత్తులే. పెను ప్రాకృతిక ఉత్పాతాలే. ఈ ప్రమాదకర ధోరణి కొన్నాళ్లుగా మరీ పెరిగిపోతూ వస్తోంది. ముఖ్యంగా మరో నెల రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్న 2025ను అయితే విపత్తునామ సంవత్సరం అన్నా అతిశయోక్తి కాదేమో! దీనికితోడు, వచ్చే ఏడాది పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఉంటాయన్న హెచ్చరికలు మరింత గుబులు రేపుతున్నాయి...12 వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చేంతటి తీవ్రతతో కూడిన భారీ అగ్నిపర్వత పేలుడు ఇండోనేసియాను తాజాగా అతలాకుతలం చేసి వదిలింది. దాని ధాటికి చెలరేగిన బూడిద మేఘాలు భారత్, చైనా దాకా వ్యాపించాయి. వాటి తాలూకు కలకలం, భయాందోళనలు ఇంకా సద్దుమణగనేలేదు! అదే ఇండొనేసియా కేవలం గత 30 రోజుల్లో ఏకంగా 1,400 పై చిలుకు భూకంపాలను చవిచూసింది. ఈ వర్షాకాలంలో బెంబేలెత్తించే స్థాయి వరదలు ఇటు భారత్లోనూ, అటు పాక్లోనూ తీవ్ర విధ్వంసానికి, పంట నష్టం తదితరాలకు దారితీశాయి. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కాలిపోర్నియా తదితర రాష్ట్రాలను పెను కార్చిచ్చులు భస్మీపటలం చేసినంత పని చేశాయి. ఇవి చాలవన్నట్టు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతటి తీవ్రతతో కూడిన సౌర తుఫాను భూమిని వణికించి వదిలింది. 2025లో ప్రపంచానికి చెమటలు పట్టించిన ప్రాకృతిక విపత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ ఏడాది కాలగర్భంలో కలిసేందుకు ఇంకా నెల రోజులకు పైగా ఉంది. ఈ 30 రోజుల్లో మరిన్ని విపత్తులు ముంచుకురావడం ఖాయమన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. వీటి వెనక ప్రాకృతిక నిమిత్తాలు కొన్నున్నా, ప్రధాన కారణం మాత్రమే మనిషి దురాశేనని సైంటిస్టులు మొదలుకుని పర్యావరణవేత్తల దాకా అంతా ముక్త కంఠంతో మొత్తుకుంటున్నారు. వామ్మో భూకంపాలు! 2025ను భూకంపనామ సంవత్సరంగా కూడా చెప్పవచ్చేమో. పసిఫిక్లోని రింగ్ ఆఫ్ ఫైర్, సమీప ప్రాంతాలన్నీ నిత్యం భూకంపాలతో చిగురుటాకుల్లా వణుకుతూ కాలం గడిపాయి. మార్చిలో మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రతతో కూడిన భూకంపం 5,500 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. ఆగస్టులో అఫ్గానిస్తాన్లో వచ్చిన భూకంపానికి అధికారిక లెక్కల ప్రకారమే 2,500 మందికి పైగా బలయ్యారు. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అక్కడి అధికారులే అంగీకరించారు. ఇవేగాక 7కు మించిన తీవ్రతతోనే 2025లో ప్రపంచవ్యాప్తంగా కనీసం మరో 10 భూకంపాలు సంభవించాయి. అంతకు తక్కువ తీవ్రతతో కూడిన వాటి సంఖ్య అయితే చెప్పనవసరమే లేదు.అక్షరాలా ‘అగ్ని’పర్వతాలే!ఇక అగ్నిపర్వతాల పేలుళ్లు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టాయి. గత నెలలో ఇథియోపియాలోని హైలీ గుబ్బీ అగి్నపర్వతం గత 12 వేల ఏళ్లలో తొలిసారిగా బద్దలై ఆశ్చర్యపరిచింది. దాంతో అటు ఎర్రసముద్రం నుంచి ఇటు అరేబియా దాకా విమాన సేవలకు కూడా అంతరాయం కలిగింది. అగి్నపర్వతాల పేలుళ్లకు భూకంపాలతో అతి సన్నిహిత సంబంధముందని రూర్కీ ఐఐటీలో అర్త్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ సందీప్సింగ్ వివరించారు. ‘‘భూకంపం వల్ల భూమి లోపలి భాగం తీవ్ర కుదుపులకు లోనవుతుంది. ఫలితంగా ద్రవ రూపంలో ఉండే మాగ్నా పైకి తన్నుకురావడం మొదలవుతుంది. దాంతో దాని చుట్టూ ఉండే రాళ్లూ తదితరాలు కుదుపులకు లోనవుతాయి. అగ్నిపర్వత ప్రాంతాల్లో ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. సూర్యుడు కూడా సౌరచక్ర క్రమంలో ప్రస్తుతం ఉత్కృష్ట దశకు చేరుతున్నాడు. దాంతో సౌరతుపాన్లు తరచూ వచ్చి పడుతున్నాయి. ఇవన్నీ కూడా భూమిపై వాతావరణాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. అంతేగాక మరిన్ని ప్రాకృతిక విపత్తులకు కారణంగా మారుతున్నాయి. అంతేకాదు, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్లు, అంతరిక్షంలోని ఉపగ్రహాల పనితీరు తదితరాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. అలా పలు దేశాలు భారీ ఆర్థిక నష్టాల బారిన పడేందుకు కారణమవుతున్నాయి.బాబోయ్ వరదలు! ఇక వరదలు, కార్చిచ్చులైతే ఈ ఏడాది ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసి వదిలాయి. భారత్, పాకిస్తాన్తో పాటు మలేసియా, థాయ్లాండ్ తదితర దేశాలెన్నో వీటి బారిన పడి అల్లాడాయి. అతి కొద్ది సమయంలోనే కుండపోతతో విలయం సృష్టించే క్లౌడ్ బరస్ట్లు రానురానూ ఈ దేశాల్లో పరిపాటిగా మారుతుండటం 2025లో కొట్టొచ్చినట్టుగా కన్పించిన మరో ప్రమాదకర పరిణామం. ఇవన్నీ రానున్న పెను ముప్పులకు హెచ్చరిక సంకేతాలుగానే కనిపిస్తున్నాయి. హిమ ప్రాంతాలన్నింట్లోనూ మంచు శరవేగంగా కరిగిపోతోంది. తాగు, సాగు అవసరాల నిమిత్తం నదీజలాలను రిజర్వాయర్లలో వీలైనంతగా బంధించే ధోరణి ప్రపంచ దేశాలన్నింట్లోనూ నానాటికీ పెరిగిపోతోంది. వీటికి తోడు సగటు భూ ఉష్ణోగ్రతలో కూడా శరవేగంగా వృద్ధి నమోదవుతూ మరింతగా భయపెడుతోంది. పారిశ్రామికీకరణ ముందునాటితో పోలిస్తే అదిప్పటికే ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా పెరిగిపోయి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ‘‘భూమి తాలూకు కీలక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. మనిషి అత్యాశ తమపై మోపుతున్న మోయలేని భారానికి తమ ప్రతిస్పందనను ఇలా పలు ప్రాకృతిక విపత్తుల రూపంలో వ్యక్తం చేస్తున్నాయి. ఈ హెచ్చరిక సంకేతాలను ఇప్పటికైనా అర్థం చేసుకోకుంటే మానవాళి మనుగడకే ప్రమాదం’’అని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. -
ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం
యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి. అంటే ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, శక్తిమేరకు కృషి చేయడం.గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన పరమహంస యోగానంద కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత అనే తన మహత్తర గీతాభాష్యం లో, శ్రీ కృష్ణుని సందేశం గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు.భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు...‘‘కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.’’దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి ఆందోళన చెందుతూ ఉండకండి. ‘‘ ఈ పని చేయడం వల్ల నాకేమి లభిస్తుంది’’ అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చాడు...‘‘ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించు. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావం గలవాడవై ఉండు. ఈ మానసిక సమత్వమే యోగం.’’జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఈ సమభావమే నిజమైన యోగం. అంటే ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీ కృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశాడు. ‘‘సమస్త కర్మలను నాకు అర్పించు! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండు.’’సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు... కోరికలు, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైకమార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించాడు:‘‘నీరు స్పృశించలేని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.’’బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్–రియలైజేషన్ ఫెలోషిప్ను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను భారతదేశంలోను స్థాపించారు. ఆయన ‘ఒక యోగి ఆత్మకథ’ లక్షలాది మందికి యోగాన్ని, ధ్యానాన్ని– ముఖ్యంగా భగవద్గీత కూడా ప్రస్తావించిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను– దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా– కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను పనిచేయడం, కానీ ఫలితాల కోసం పాకులాడకుండా ఉండటం.యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది–వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు. – సత్యశ్రీ -
అంతిమ గౌరవం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం యావత్ భారత్ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన 45 మంది మరణించారు. రక్త సంబం«దీకులు, స్నేహితుల కడచూపునకు నోచుకోనంతగా శరీరాలు అగి్నకి ఆహుతి కావడంతో అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తున్నారు. పరాయి దేశంలో మరణిస్తే చివరిచూపు ఎలా అన్న సందేహం సామాన్యులకు తలెత్తడం సహజం. 2015 నుంచి 2025 అక్టోబర్ మధ్య వివిధ దేశాల్లో చనిపోయిన 57,975 మంది భారతీయుల మృతదేహాలు కేంద్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరాయి.స్వదేశానికి భారత పౌరుల మృతదేహాల తరలింపు, ఆయా దేశాల్లో అంతిమ సంస్కారాలను గౌరవంగా పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సహాయం, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి భారత రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు, కాన్సులేట్లు నిరంతరం శ్రమిస్తున్నాయని వివరించింది. సమాచారం రాగానే.. మరణం గురించి సమాచారం అందిన వెంటనే.. వారి బంధువులను, ఆయా దేశాల అధికారులను సంప్రదించి మరణానికి గల కారణాలను తెలుసుకొని, అవసరమైన లాంఛనాలను పూర్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. స్వదేశానికి మృతదేహాల రవాణా, లేదా కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు ఆయా దేశాల్లోనే అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది మార్చి నెలలో లోక్సభకు వెల్లడించింది. బాధిత కుటుంబానికి బీమా, నష్ట పరిహారం త్వరితగతిన అందేలా తోడ్పడుతున్నట్టు తెలిపింది. సహజ మరణాల కేసుల్లో మృతదేహాలు భారత్కు రావడానికి దేశాన్ని బట్టి 3 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. అసహజ, ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో పోలీసు విచారణ పూర్తయిన తర్వాతే మృతదేహం స్వదేశానికి చేరుతుంది. వెల్ఫేర్ ఫండ్ ద్వారా.. వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు, కాన్సులేట్లు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ను (ఐసీడబ్ల్యూఎఫ్) నిర్వహిస్తున్నాయి. ఎన్నారైలకు కష్ట సమయాల్లో, అత్యవసర సమయాల్లో అత్యంత అర్హత కలిగిన కేసుల్లో, అర్హత కలిగిన సందర్భాల్లో అవసరమైన లాంఛనాలను పూర్తి చేసేందుకు కావాల్సిన ఆర్థిక సహాయం కోసం ఈ ఫండ్ను వినియోగిస్తారు. మృతదేహాల రవాణాకు ఈ ఫండ్ నుంచే ఖర్చు చేస్తారు. -
పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: టింగ్ మంటూ వాట్సాప్ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్కు వచ్చే మెసేజ్ను క్లిక్ చేస్తే యూట్యూబ్కో, ఇన్స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైక్లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు. పెరుగుతున్న యాప్ల వాడకం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్లో ఏఐ యాప్లు డౌన్లోడ్, సబ్ప్క్రైబ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్ల వాడకం పెరిగిందని డిజిటల్ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్ సింక్ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్ కనెక్షన్కు లింక్ అవుతున్నారు. పార్లమెంట్ దాకా ఇదే ట్రెండ్! ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్ క్యాపిటల్ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ పరిశీలనలో తెలిపింది. ఇదో రకమైన ఇంటర్న్షిప్హైదరాబాద్లో ఏఐ ఎంఎల్ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్షిప్గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. – మద్దిని తేజాకుమార్ (ఏఐఎంఎల్ విద్యార్థి) కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి. – విష్ణువర్థన్ రెడ్డి (వరంగల్ డిజిటల్ స్టూడియో) -
ఆత్మస్తుతి... పరనింద
మానవ సంబంధాలలో ఉన్నతమైన విలువలకు, మన ఆత్మగౌరవానికి మూలస్తంభాలుగా నిలిచేవి – నమ్మకం, వినయం, బాధ్యత. అయితే, ఈ ఉన్నత లక్షణాలను ఒక్క దెబ్బతో నేలకూల్చే ఒక అంతర్గత శక్తి ఉంది: అదే అహంకారం. జీవితంలో మనం నిత్యం కోల్పోతున్న ఆంతరంగిక ప్రశాంతతకు, సామాజిక మన్ననకు – ఈ ఆత్మస్తుతి, పరనింద అనేవే ప్రధాన కారణాలు.మన అంతరంగంలో, ‘నేనే గొప్ప’, ‘నా నిర్ణయమే శిరోధార్యం’ అని నిశ్శబ్దంగా వినిపించే ఒక బలమైన, ప్రమాదకరమైన స్వరం ఉంటుంది. ఇదే అహంకారం. ఇది ఒక మానసిక విషం లాగా, మనల్ని ఇతరుల నుండి దూరం చేస్తుంది. నిజానికి, ఈ రెండూ మన లోపల ఉన్న అభద్రతా భావాన్ని, వైఫల్య భీతిని కప్పిపుచ్చే దుర్భేద్యమైన ముసుగులు. ఇవి మన నిజమైన ఎదుగుదలకు, ఇతరులతో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి.అహంకారం రెండు ముఖాలు – స్పష్టమైన అనుభవం. ఈ రెండు లక్షణాలు రోజువారీ జీవితంలో మన నమ్మకమైన బంధాలను ఎలా ఛిద్రం చేస్తాయో గమనిద్దాం.ఆత్మస్తుతి: (అతిశయోక్తి) మీరు ఒక గొప్ప విజయాన్ని సాధించినా, ప్రతి సంభాషణను మీ గొప్పల చుట్టే తిప్పి, ‘ఇదంతా నా తెలివి తేటలే‘ అని పదే పదే ప్రకటిస్తే – వినేవారికి అది సంతోషాన్ని పంచదు, తీవ్రమైన విసుగును, దూరాన్ని పెంచుతుంది. మిమ్మల్ని మీరే పొగుడు కుంటే, ఇతరులు మీకు నిజమైన గౌరవం ఇవ్వడం మానేస్తారు. గొప్ప జ్ఞాని అయిన యాజ్ఞవల్క్యుడు సైతం, తన జ్ఞానాన్ని తానే అతిగా చెప్పుకున్నప్పుడు, పండితుల విమర్శలను ఎదుర్కొన్నారు. పరనింద (పలాయనవాదం): నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడం... వ్యా పారంలో ఎదురుదెబ్బ తగిలితే, పోటీదారులు కారణం, పరిస్థితులే కారణం‘ అని నిందించడం; క్రీడలలో ఓటమి ఎదురైతే ‘అంపైర్ పొర పాటు, రూల్స్ తప్పు‘ అని వాదించడం. ఈ విధంగా తప్పును మరొకరిపై నెట్టడం తాత్కాలికంగా మన అహం కా పాడుకున్నట్టు అనిపించినా, అది మన నైతిక శక్తిని నాశనం చేస్తుంది. మీ వైఫల్యాలకు మీరు బాధ్యత తీసుకోనప్పుడు, ఇతరులు మిమ్మల్ని విశ్వసించడం పూర్తిగా మానేస్తారు. మహాభారతంలో దుర్యోధనుడు తన పతనానికి తన అహంకారాన్ని కాక, ఎప్పుడూ శ్రీ కృష్ణుడిని లేదా పాండవుల అదృష్టాన్ని నిందించేవాడే తప్ప, ఆత్మపరిశీలన చేసుకోలేకపోయాడు. విజయం సాధించినప్పుడు, ‘నా ప్రయత్నం’ అని కాకుండా, ‘మా బృందం/కుటుంబ సహకారం వల్ల సాధ్యమైంది’ అని చెప్పండి. మీ గొప్పతనాన్ని మీరే చెప్పుకోకుండా, మీ పనిని మీకోసం మాట్లాడనివ్వండి.తప్పు జరిగినప్పుడు, వెంటనే ‘దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాధ్యతను ధైర్యంగా అంగీకరించండి. ఈ ఒక్క చర్య మిమ్మల్ని ఇతరుల దృష్టిలో నిజమైన నాయకుడిగా, విశ్వసనీయుడిగా నిలబెడుతుంది.ఆత్మస్తుతి అనేది వృథా అయిన శక్తి, పరనింద అనేది మీ ఎదుగుదలను అడ్డుకునే మానసిక చెరసాల. ఈ అహంకారం అనే సంకెళ్లను తెంచే సాహసం చేసినప్పుడే, మీరు ఆ నిజమైన ఆనందాన్ని, ప్రశాంతతను సొంతం చేసుకుంటారు. ఇతరులపై నిందలు వేయడం ఆపి, మీ బాధ్యతను ప్రేమతో స్వీకరించండి. ఈ వినయం, బాధ్యత అనే రెండు అసాధారణ లక్షణాలతో, మీరు ప్రపంచం నుండి గౌరవంతో పాటు నమ్మకాన్ని, ప్రేరణను కూడా అందుకుంటారు. ఇదే మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.– కె. భాస్కర్ గుప్తా వ్యక్తిత్వ వికాస నిపుణులు -
‘రక్త’ సిందూరం!
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. గురువారం సాయంత్రం, నాందేడ్లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రేమకు చావు లేదు.. సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిని ఉరి తీయండి.. ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పేరులో ఏముంది? విడాకుల వరకూ తీసుకెళ్లింది
కసి ఉండటానికి కారణాలు అవసరం లేదు కానీ, విడిపోవడానికి చాలా వెతుక్కోవచ్చు. తమ పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయం లేక చైనాలో ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. షాంఘైలోని పుడాంగ్ న్యూ ఏరియాలో ఓ జంటకు 2023లో వివాహమైంది. మరుసటి ఏడాది బాబుకు జన్మనిచ్చారు. అయితే, ఆ పిల్లాడి నామకరణం పెద్ద రణంగా మారింది. నేను చెప్పిన పేరే పెట్టాలని ఇరువురూ పట్టుబట్టారు. చివరకు కలిసి ఉండలేం అని కోర్టుకెక్కారు. కేసు పూర్వాపరాలు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. బాబుకు ఏడాది వయసు దాటినా ఇంకా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం, పేరు పెట్టకపోవడం వల్ల టీకాలు వేయడానికీ కుదరకపోవడం మైనర్ హక్కుల ఉల్లంఘనే అని హెచ్చరించారు. భావోద్వేగ సంఘర్షణలలో పిల్లలను బేరసారాలుగా ఉపయోగించకూడదని మందలించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా పేరు పెట్టే విషయంలో ఏకాభిప్రాయానికి రావాల్సిందేనని చెకప్పారు. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పేరులో ఏముంది అని అంటారు.. కానీ ఎంత ఉందో చూశారా? -
పేరు మారిస్తే.. ఫేట్ మారుద్ది!
ఇది కూడా పేరు తెచ్చిన ప్రాబ్లమే. అక్కడ పిల్లాడి పేరు అయితే, ఇక్కడ భార్య పేరు.. అంతే తేడా. ఓ వ్యక్తి తన భార్య పేరును ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ‘చబ్బీ’అని సేవ్ చేసినందుకు ఆమె విడాకులు తీసుకుంది. తుర్కియేలోని ఉసక్ నగరానికి చెందిన భార్యాభర్తల మధ్య ఈ పేరు పంచాయితీ వచ్చింది. భర్త ఆమె పేరును తన ఫోన్లో ‘టొంబెక్’అని సేవ్ చేసుకున్నాడు. అంటే చబ్బీ(బొద్దుగా) అని అర్థం. ఇది చూసిన ఆమె భర్తపై తీవ్రంగా మండిపడి విడాకుల కోసం కోర్టుకెళ్లింది. తన పేరు అలా పెట్టుకోవడం తీవ్ర అవమానకరమని, ఇక అతడితో కలిసి ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. వారికి విడాకులు ఇవ్వడంతోపాటు ఆమె మానసిక క్షోభకు పరిహారం చెల్లించాలని అతడిని ఆదేశిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థంచగా.. మరికొందరు చబ్బీ అని ముద్దుగా పెట్టుకున్నాడేమో అని జాలిపడ్డారు. చూశారా.. పేరులో ఎంతుందో? భర్తలూ.. జర భద్రం మరి..! -
శబరిమల యాత్రలో ఆ రెండుచోట్ల గుండెపోటు ముప్పు!
శబరిమల యాత్రికులకు రెండుచోట్ల గుండెపోటు ముప్పు పొంచి ఉంది! సముద్రమట్టానికి ఎత్తయిన ప్రాంతంలోకి వెళ్తుండడం.. ఉపవాసాలు, డీహైడ్రేషన్, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వయానా కేరళ వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న విషయమిది. పంపా బేస్ నుంచి శబరిమలకు వెళ్లే చిన్నపాదం మార్గంలో అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతోపాటు.. కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ఆరోగ్యశాఖ జారీ చేసిన హెచ్చరికల్లో స్పష్టమవుతోంది. ప్రతిఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య ప్రతిఏటా నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోటుతో భక్తులు కుప్పకూలిపోతున్న ఉదంతాలు.. మరణాలు నమోదవుతున్నట్లు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు(టీడీబీ), కేరళ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు క్రైం డేటా రికార్డ్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఏడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2017–18 సీజన్లో 281 మంది గుండెపోటు బారినపడగా, వారిలో 36 మంది మృతి చెందారు. 2018–19లో 173 గుండెపోటు కేసులు నమోదుకాగా, 24 మంది మరణించారు, 2019–20లో 19, 2022–23లో 24, 2023–24లో మరో 24, 2024–25లో 40 గుండెపోటు మరణాలు నమోదయ్యాయి. 2025–26 సీజన్ ప్రస్తుతం కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఓ మహిళ గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు పోలీసు రికార్డులు చెబుతుండగా, 8 మరణాలు నమోదైనట్లు నాలుగు రోజుల క్రితం ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. 2020–22లో మాత్రం కొవిడ్ ఆంక్షల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సీజన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. అక్కడే ఎందుకు? సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోట్లు అధికంగా సంభవిస్తున్నాయి. నీలిమల కొండ నిటారుగా, చాలా ఎత్తుగా ఉంటుంది. శబరియాత్రలో పెద్దపాదంలో ముక్కు కొండగా పిలిచే కరిమల కొండ తర్వాత.. చిన్నపాదంలో దాదాపు అదే స్థాయిలోనే నీలిమల ఉంటుంది. నీలిమలను అధిరోహించేందుకు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు ఏర్పాటు చేసిన మెట్లు ఉన్నప్పటికీ భక్తులు ఈ ఒక్క కొండను అధిరోహిస్తే ఇబ్బందులు దూరమవుతాయనే ఉద్దేశంతో నడకలో వేగాన్ని పెంచుతారు. లేదంటే.. ముందు నడిచివెళ్లే తమ బృందంలోని సభ్యులను అందుకోవాలనే ఉద్దేశంతో వడివడిగా నడుస్తారు. దాంతో హార్ట్ బీట్లో మార్పులు చోటుచేసుకుంటాయి. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఆక్సిజన్ తగ్గుతుంది. డిమాండ్ పెరగడం.. అందుకు అనుగుణంగా ప్రాణవాయువు అందకపోవడంతో శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా పడిపోతాయి. హార్ట్బీట్లో హెచ్చుతగ్గులకు తోడు.. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో గుండెకు రక్త సరఫరా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదాలుంటాయని వైద్య నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి రుగ్మతలు, కొలె్రస్టాల్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నీలిమల అధిరోహించేప్పుడు వేగాన్ని పెంచడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఇక అప్పాచిమేడు ప్రాంతంలో కొండ ఎత్తుగా లేకున్నా.. అది శిఖరాగ్రం కావడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయని వివరిస్తున్నారు. అందుకే కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మరణాలు ప్రతిఏటా పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన కారణాలివే.. → దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలను పక్కనపెడితే.. ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా బాధితులుగా మారుతున్నట్లు కేరళ వైద్య ఆ రోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కూడా కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. → శబరియాత్ర కోసం భక్తులు రేయింబవళ్లు ప్రయాణంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాత్రంతా ప్రయాణాలు చేస్తుంటారు. భోజనం కూడా సమయానికి తీసుకోరు. సామూహికంగా వంట చేసుకున్నప్పుడో.. శాకాహార హోటళ్లు అందుబాటులో ఉన్నప్పుడో ఆహారం తీసుకుంటారు. కంటినిండా నిద్ర, కడుపునిండా భోజనం లేకపోవడంతో శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. → ఇలాంటి వారిలో డీహైడ్రేషన్ పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయులు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతా యి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. → ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లభ్యత తగ్గితే.. గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. → చాలామంది భక్తులు పంపా బేస్లోని హోటళ్లలో భోజనం చేయగానే.. కొండను అధిరోహించడం చేస్తుంటారని, ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. భోజనం తర్వాత రక్తప్రసరణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళ్తుందని, ఫలితంగా గుండెపై రెట్టింపు ఒత్తిడి ఉంటుందని పేర్కొంటున్నారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే.. రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. → ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెకింగ్ చేసేప్పుడు డీహైడ్రేషన్ సంభవించడం చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. – సాక్షి డిజిటల్ డెస్క్ -
పరిశోధకులకూ ఏఐ
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం క్రమంగా పెరుగుతోంది. విద్యార్థుల దైనందిన అభ్యాసంలో ఈ నూతన సాంకేతికత ఒక భాగమైంది. పరిశోధకులకూ కృత్రిమ మేధ ఆయుధం కావడం విభిన్న రంగాల్లో వేగవంతమైన పురోగతికి జీవం పోసినట్టయింది. వేగంగా పరుగుతీస్తున్న ప్రస్తుత యుగంలో పరిశోధకులు, సంస్థలు కృత్రిమ మేధను ఎంత సమర్థవంతంగా స్వీకరిస్తాయి, సహకారాన్ని పెంపొందించుకుంటాయి, స్థితిస్థాపకతను ఎలా నిర్మిస్తాయి అనే అంశాలపై విజయం ఆధారపడి ఉంటుందని ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్ చెబుతోంది.నెదర్లాండ్స్కు చెందిన ఈ సంస్థ రీసర్చర్ ఆఫ్ ద ఫ్యూచర్ పేరుతో 113 దేశాల్లో సర్వే చేపట్టింది. 3,234 మంది రీసర్చర్స్ ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సాంకేతికత సామర్థ్యంపై సానుకూల ధోరణి, పెరుగుతున్న వినియోగంతో పరిశోధనా వ్యవస్థను ఏఐ పునర్నిర్మిస్తోందని నివేదిక తెలిపింది. ‘పరిశోధకులు ఏఐని ఒక పరివర్తన సాధనంగా గుర్తించారు. ఇది వారి సామర్థ్యాన్ని, సృజనాత్మకతను పెంచుతోంది. డేటా విశ్లేషణకు సాయపడుతోంది. కృత్రిమ మేధ ప్రయోజనాలను ఇప్పటికే వీరు అందుకున్నారు’ అని వివరించింది.సగం కంటే ఎక్కువగా..పనులను ఆటోమేట్ చేయడానికి ఒక సాధనంగా మాత్రమే కాకుండా.. మానవ మేధస్సును పెంపొందించడానికి, అపూర్వమైన వేగంతో వాస్తవ జ్ఞానాన్ని సృష్టించడానికి వీలు కల్పించే సృజనాత్మక భాగస్వామిగా కూడా కృత్రిమ మేధ మారుతోందని నివేదిక వివరించింది. పరిశోధనలో ఏఐ స్వీకరణ పెరిగింది. సర్వేలో పాలుపంచుకున్న పరిశోధకుల్లో 58% మంది రీసర్చ్కు సంబంధించిన పనుల్లో ఏఐ సాధనాలను ఉపయోగించారు. 2024లో ఈ సంఖ్య 37% మాత్రమే. ఈ ఏఐ యూజర్లలో 61% మంది తాజా పరిశోధనలను కనుగొని, సంగ్రహించడానికి, 51% మంది సాహిత్య సమీక్షల కోసం నూతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పారదర్శకత, వేగం.. ఈ రెండు ప్రత్యేకతలు ఏఐ పట్ల విశ్వాసాన్ని పెంచుతాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఏఐ ఆటోమేటిక్గా సూచనలను ఉదహరిస్తున్నప్పుడు పారదర్శకత ఉండాలని 59%, ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అందించాలని 55% పరిశోధకులు అభిప్రాయపడ్డారు.సానుకూల ఫలితాలుసామర్థ్యాన్ని పెంచగలిగే శక్తి ఏఐకి ఉందన్న అంశంపై పరిశోధకుల్లో అత్యధికులు సానుకూలంగా ఉన్నారు. కృత్రిమ మేధ ఇప్పటికే తమ సమయాన్ని ఆదా చేస్తోందని 58% మంది తెలిపారు. రాబోయే 2–3 సంవత్సరాలలో తమ సమయాన్ని ఆదా చేస్తుందని మూడింట రెండువంతులకుపైగా రీసర్చర్స్ ఆశిస్తున్నారు. రాబోయే 2–3 ఏళ్లలో నూతన జ్ఞానాన్ని నడిపించే సృజనాత్మక శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని 61% పరిశోధకులు నమ్ముతున్నారు. కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడంలో తగినంత సిద్ధంగా లేమని అత్యధికులు భావిస్తున్నారు. ఏఐలో తక్కువ శిక్షణ పొందామని 45% రీసర్చర్స్ భావిస్తున్నారు. మూడింట ఒక వంతు పరిశోధకులు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, సిబ్బందికి శిక్షణలో తమ కంపెనీ విధానం బాగుందని అంగీకరిస్తున్నారు.ఏఐ సాధనాలను అస్సలు ⇒ ఉపయోగించని పరిశోధకుల్లో అమెరికా నుంచి 25%, భారత్ నుంచి 26%, చైనా నుంచి 4% ఉన్నారు. ⇒ ఏడేళ్లలోపు అనుభవం ఉన్న రీసర్చర్స్లో 83%, 20 ఏళ్లకుపైగా సీనియారిటీ ఉన్న వారిలో 65% ఏఐ టూల్స్ వాడుతున్నారు.⇒ సర్వేఈ–మెయిల్ ఇన్విటేషన్ ద్వారా ఆన్లైన్లో..⇒ చేపట్టింది ఇన్ఫర్మేషన్, అనలిటిక్స్ కంపెనీ ఎల్సవీయర్⇒ టైటిల్ రీసర్చర్ ఆఫ్ ధ ఫ్యూచర్⇒ ఎప్పుడు: 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య ఎంత మంది: 113 దేశాల నుంచి 3,234 మంది పాల్గొన్నవారు: పరిశోధకులు, విద్యా, పరిశోధన సంస్థల ముఖ్యులుఏఐ టూల్స్ వినియోగం ఇలా..⇒ రీసెర్చ్ పనుల్లో భాగంగా.. 58%⇒ ఇతర అవసరాలకు 26%⇒ అసలు వినియోగించలేదు 16% -
61 శాతం భారత్ భూకంప జోన్లోకి..
ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్పైకీ విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో ఏకంగా 61 శాతం ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్కు పరిధిలోకి చేరడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) కొత్తగా సవరించిన భూకంప డిజైన్ కోడ్ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, పొంచి ఉన్న భూకంప ప్రమాద తీవ్రతను తెలియజెప్పేందుకు కొత్తగా ‘అత్యంత ఎక్కువ రిస్కు’జోన్ కేటగిరీని కూడా చేర్చింది. మొత్తం హిమాలయ ప్రాంతమంతటినీ జోన్–6గా పేర్కొన్న ఈ కేటగిరీలోకే చేర్చడం మరింత ఆందోళన పడాల్సిన అంశం! ఇప్పడేం మారింది? హిమాలయాలు గతంలో 4, 5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతమంతా నిజానికి ఒకే టెక్టానిక్ పలకపై ఉన్నా భూకంప రిస్కు తీవ్రతలో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. అయితే ఆ క్రమంలో భూ లోతుల్లోని పొడవాటి అగాధపు ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పును సరిగా మదింపు చేయడంలో విఫలమైనట్టు సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో పలు అత్యధిక భూకంప రిసు్కన్న పలు భూభాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిసు్కన్నవిగా పరిగణన పొందుతూ వచ్చాయి. దాన్నిప్పుడు సరిచేసినట్టు బీఐఎస్ వెల్లడించింది. నిజానికి మధ్య హిమాలయ ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాల్లో భూకంపం జాడలు కూడా కని్పంచలేదు. అంత మాత్రాన అక్కడ అంతా సజావుగా ఉన్నట్టు అసలే కాదని బీఐఎస్ పేర్కొంది. ఎందుకిలా డేంజర్ జోన్లోకి? హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉన్నాయి. మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశమున్న మందుపాతరపై ఉన్నాయన్నమాట. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేíÙయన్ ప్లేట్లోకి చొచ్చుకుపోతూ వస్తోంది. ఫలితంగా ఏటా కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళ్తోంది. రెండు ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైపైకి పెరుగుతూ వస్తోంది. హిమాలయాల ఆవిర్భావానికి మూలకారణం కూడా ఇదే. ఎవరెస్టుతో పాటు ప్రపంచంలోకెల్లా పలు పర్వత శిఖరాలు హిమాలయాల్లోనే ఉండేందుకూ ఇదే కారణం. కనుక అవి చల్లగా కని్పంచేది కేవలం పైకి మాత్రమే. ఈ టెక్టానిక్ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భమంతా నిత్యం అలజడిమయంగానే ఉంటూ ఉంటుంది. టెక్టానిక్ పలకల పరస్పర తాకిడి భూ కేంద్రంపైనా విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది.ఆ ఒత్తిడి ఎప్పుడో ఓసారి హఠాత్తుగా విడుదలవుతుంటుంది. అది కాస్తా అత్యంత శక్తిమంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తుంది. ఇది చాలదన్నట్టు భూమ్మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే. వయసుపరంగా అన్ని పర్వతాల కంటే చిన్నవి కూడా. దాంతో హిమాలయాల్లోని రాళ్లు తదితరాలు నిత్యం అటూఇటూ మంద్రస్థాయిలో కదలాడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ గనక భూకంపం సంభవిస్తే అతి అత్యంత ప్రాణాంతకమే అవుతుంది. అంతా అక్కడే! మెయిన్ బౌండరీ, మెయిన్ సెంట్రల్, మెయిన్ ఫ్రంటల్... ఇలా భూ కేంద్రంలోని ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్ (భారీ రంధ్రాలని చెప్పుకోవచ్చు)లో అతి పెద్దవన్నీ హిమాలయాల కిందే కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేగాక పలు భూకంప విరామ ప్రాంతాలు (కొన్ని శతాబ్దాలుగా అసలు భూకంపమే రానివి) కూడా హిమాలయాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. అలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపానికి ఎప్పుడైనా ఆస్కారం పుష్కలంగా ఉంటుందట. కర్ణుని చావుకు మాదిరిగా ఇన్ని కారణాలు కలగలిసి హిమాలయాలను ప్రపంచంలోకెల్లా భూకంప రిస్కు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చేశాయి. హిమాలయాల్లోని డెహ్రాడూన్, మొహంద్తో పాటు మొత్తం ఉత్తరాఖండ్ అంతా తాజాగా భూకంప డేంజర్ జోన్లోకి వచి్చంది. అక్కడ జనాభా నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు వరల్డ్ ఎయిడ్స్ డే.. కొత్త తరానికి చెప్పాలి..
మొదట్లో అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో మాత్రమే విస్తరించిన ఎయిడ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయ్యింది. ఆ సంపన్న దేశాల్లోని మత్తు ఇంజెక్షన్ల సంస్కృతి, హోమో సెక్సువల్ ధోరణులతో ఇలా జరిగింది. ఇవేవీ లేని మనలాంటి దేశాల్లో దీని విస్తృతి మొదట్లో దాదాపుగా లేనేలేదు. కానీ తర్వాత్తర్వాత ఇది మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు... పేద దేశాల్లో కూడా విపరీతంగా వ్యాపించిందని తేలింది. ఈ వ్యాధిపై మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేకపోవడంతో చాపకింది నీరులా ఇది వ్యాపిస్తోంది. అందుకే మరోసారి ఈ వ్యాధి గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. ఈ సందర్భంగా ఎయిడ్స్వ్యాధి విషయంలో సమాజంలో చైతన్యం తేవడం కోసం ఏం చేయాలో, అలాగే అనుసరించాల్సిన మార్గాలేమిటన్నది నిపుణులైన డాక్టర్లు సూచిస్తున్న అంశాలివి.ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి వేర్వేరు దేశాల్లో వేర్వేరు అంశాలు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. హోమో సెక్సువాలిటీకి సామాజిక ఆమోదం లేనిచోట్ల, ఇంజెక్షన్ డ్రగ్స్ వాడకం నేరంగా ఉన్న దేశాల్లో వారు తీవ్రమైన వివక్షకు లోనవుతుండటంతో తమ గుర్తింపులను దాచుకోడానికి చేసే ప్రయత్నంలో వారికి చికిత్స అందడం లేదు. దాంతో ఈ తాజా ధోరణులతో హెచ్.ఐ.వి. వ్యాప్తి తీరు మారుతున్నది. సెక్స్ వర్కర్స్, హోమోసెక్సువల్స్, డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకునేవారూ, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఖైదీల వంటి సమూహాలలో ఈ వైరస్ తీవ్రమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇక ఆఫ్రికాలాంటి వెనకబడిన దేశాల్లో అవగాహన లేమితో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం కొత్తగా సోకుతున్న హెచ్.ఐ.వి. ఇన్ఫెక్షన్లలో ఆఫ్రికాలో 25 శాతం, మిగతా ప్రపంచంలో 80 శాతం ప్రజల్లో ఎయిడ్స్ అన్నది పైన పేర్కొన్న హోమో సెక్సువల్, ట్రాన్స్జెండర్, డ్రగ్స్ బాధితులు, ఖైదీల వంటి రిస్క్ గ్రూపులలోనే ఎక్కువ. భారతదేశంలోనూ మిగతా జనాభాతో పోలిస్తే ఇలాంటి సమూహాల్లోనే హెచ్.ఐ.వి. వ్యాప్తి సాధారణ జనాభా కంటే 15–17 రెట్లు ఎక్కువ.భారతదేశం, తెలుగు రాష్ట్రాల పరిస్థితి జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ 2023 అంచనాల ప్రకారం, భారతదేశంలో 25 లక్షల 44 వేల మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. 15–49 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ప్రతి వెయ్యి మందిలో ఇద్దరిలో (0.20%) హెచ్.ఐ.వి. వ్యాపించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 3.90 లక్షల మంది హెచ్ఐవి తో జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల 14 వేల మంది. తెలంగాణలో 1 లక్షా 58 వేల మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 15–49 ఏళ్ల మధ్య వయసు వారిలో హెచ్ఐవి సోకినవారు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ప్రతి వెయ్యిలో ఆరుగురు పైగా (0.62%); తెలంగాణలో ప్రతి వెయ్యికి దాదాపు ఐదుగురు (0.47%) ఉన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక ఎయిడ్స్ మరణాలు నమోదయ్యాయి. అంటే ఇక్కడ 11,430 మంది చనిపోయారు. 2010తో పోల్చినప్పుడు 2023లో కొత్త ఇన్ఫెక్షన్లలో అత్యధిక తగ్గుదల ఆంధ్రప్రదేశ్లోనే కావడం (తగ్గుదల శాతం 76.19%) కొంత ఊరట.2025లో హెచ్.ఐ.వి. మళ్లీ పెచ్చరిల్లడానికి ఇవీ కారణాలు... ఈ ఏడాది 2025లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అనేక చారిత్రక పరిణామాల వల్ల హెచ్.ఐ.వి. కార్యక్రమాలకు నిధుల సంక్షోభం ఎదురైంది. ఈ ఏడాది అమెరికా ప్రభుత్వం 430 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపును ఆకస్మికంగా, ఏకపక్షంగా నిలిపివేయడం వల్ల... దిగువ ఆదాయ, అలాగే మధ్యస్థ ఆదాయ దేశాల్లో హెచ్ఐవి / ఎయిడ్స్ సేవలకు తీవ్రమైన అంతరాయం కలిగింది. అంతర్జాతీయ సంస్థ యుఎన్ ఎయిడ్స్ అంచనా ప్రకారం ఈ నిధులు శాశ్వతంగా నిలిచిపోతే 2029 నాటికి అదనంగా మరో 60 లక్షల కొత్త హెచ్ఐవి కొత్తకేసులు వచ్చే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ఎయిడ్స్ సంబంధిత జబ్బులతో మరణించే ప్రమాదం ఉంది. అంతేకాదు... హెచ్.ఐ.వి. రిస్క్ ఉన్న ప్రత్యేక సమూహాలకు చికిత్స అందిస్తూ ఎయిడ్స్ పై పోరాడే వారిని నేరస్తులుగా చూసే దేశాల సంఖ్య పెరిగింది. పురుష స్వలింగ సంబంధాలు, ట్రాన్స్ జెండర్లకు సామాజిక ఆమోదం లేకపోవడం, డ్రగ్స్ వాడకాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ కొన్ని దేశాల్లో కొత్తగా చేసిన కఠిన చట్టాల కారణంగా వారు తమ వ్యాధిని దాచుకోవడం, చికిత్స కోసం ముందుకు రాకపోవడంతో ఎయిడ్స్ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. దీనివల్ల ఈ వ్యాధి పీడితులకు ఆరోగ్య, వైద్య సేవలు అందించడమూ కష్టసాధ్యమవుతుంది. ఇదీ ఈ ఏడాది (2025) ప్రపంచ ఎయిడ్స్ డే నినాదం ‘సంక్షోభాన్ని అధిగమిస్తూ... కొత్త మార్గంలో పయనిస్తూ’ అన్నది (ఓవర్కమింగ్ డిజ్రప్షన్ – ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్) ఈ ఏడాది నినాదం. అంతర్జాతీయ వితరణ సంస్థలు తగినన్ని నిధులను ఇవ్వడం, ఈ వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న కమ్యూనిటీలు కలిసి పనిచేయడం, మానవ సహజమైన లైంగిక ప్రవృత్తులను సానుభూతితో అర్థం చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవులందరి హక్కులను పరిరక్షించడం, దేశాల నాయకత్వాలు నిబద్ధతతో వ్యవహరించడం, ఈ వ్యాధి తాలూకు మందులను అందరికీ అందుబాటులోకి తేవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని వీలైనంతగా నివారించవచ్చు. అలాగే యౌవన ప్రాంగణంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న కొత్త తరాల వారికి ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ... అందుబాటులో ఉన్న అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సురక్షిత శృంగారం, కండోమ్ వాడకం గురించి విస్తృత ప్రచారం చేస్తే ఈ వ్యాధిని దాదాపుగా పూర్తిగా తుదముట్టించినంతగా నివారించవచ్చునన్నది ప్రముఖమైన వైద్య నిపుణులందరి మాట.కొత్త ఆవిష్కరణలతో పరిస్థితి కొంత ఆశాజనకంలెనాకపావిర్, కాబోటెగ్రావిర్ వంటి దీర్ఘకాలం పనిచేసే కొత్త ఇంజెక్షన్ మందులతో హెచ్.ఐ.వి. నివారణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఏడాదిలో కేవలం రెండు సార్లు ఇంజెక్షన్లు తీసుకోవడంతోనే హెచ్ఐవి నివారణ సాధ్యమవుతుంది. దీంతో ప్రస్తుతం అత్యధిక కొత్త ఇన్ఫెక్షన్స్ వెలుగు చూస్తున్న రిస్క్ గ్రూపుల్లో నివారణ సులభతరమవుతుంది. అయితే వాటి ధరలు ప్రస్తుతం కాస్త ఎక్కువగా ఉన్నందున ఆ ధరలు తగ్గించి ప్రతి దేశంలోని ఆ సమూహాలకు ఈ ఇంజెక్షన్లను అందుబాటులోకి తేవడం అత్యవసరం.డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, ఎయిడ్స్ వ్యాధి నిపుణులు, కాకినాడ -
రూపాయి చాలు!
వరకట్నం మహమ్మారి కోరల్లో చిక్కుకుని అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, అత్తింటి వేధింపులకు వధువుల బతుకులు బలవుతున్నాయి. సరిగ్గా అలాంటి పరిస్థితులలో.. అత్తింటివారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని ఒక వరుడు పెళ్లి వేదికపైనే తిరస్కరించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ గొప్ప మనసున్న వరుడే అవధేశ్ రానా. శభాష్ అవధేశ్ రానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నగ్వా గ్రామానికి చెందిన అవధేశ్ రానా, షాహబుద్దీన్పూర్ గ్రామానికి చెందిన అదితి సింగ్ల వివాహం నవంబర్ 22న ముజఫర్నగర్లో జరిగింది. వివాహంలో ముఖ్య ఘట్టమైన గోరా తిలక్ (బహుమతులు ఇచ్చే వేడుక) సందర్భంగా వధువు అదితి కుటుంబ సభ్యులు వరుడికి రూ.31 లక్షల భారీ మొత్తాన్ని కట్నంగా సమరి్పంచడానికి సిద్ధమయ్యారు. నా మనస్సాక్షికి విరుద్ధం.. సరిగ్గా అప్పుడే.. అక్కడే అవధేశ్ ప్రకటించిన నిర్ణయం అతిథుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ‘క్షమించండి, ఈ డబ్బును నేను స్వీకరించలేను. కట్నం తీసుకోవడం మా సిద్ధాంతాలకు, నా మనస్సాక్షికి విరుద్ధం’.. అని అవదేశ్ స్పష్టం చేశాడు. వేలాది మంది అతిథులు హాజరైన ఆ శుభకార్యంలో, అవధేశ్ చేతులు జోడిస్తూ.. కట్నం మొత్తాన్ని వధువు కుటుంబానికి తిరిగి ఇచ్చేశాడు. ఈ అపూర్వ ఘట్టంతో పెళ్లి పందిరి మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగిపోయింది.మా బంధం రూపాయితో మొదలైంది.. తన నిర్ణయం గురించి అవధేశ్ మాట్లాడుతూ.. ‘నేను కట్నాన్ని బలంగా వ్యతిరేకిస్తాను. ఇది పూర్తిగా తప్పు. ఈ దురాచారం సమాజం నుంచి పూర్తిగా అంతమవ్వాలి. ఒక తండ్రి తన కూతురి పెళ్లి కోసం జీవితాంతం కష్టపడటం లేదా అప్పులు చేయవలసిన అవసరం లేదు’.. అన్నాడు. ‘మా సంబంధం కేవలం రూపాయి విలువతో మొదలైంది. దానికి మించి నేను ఎలా తీసుకోగలను? రూపాయితో మొదలైంది, రూపాయి దగ్గరే ముగుస్తుంది’.. అని వ్యాఖ్యానించాడు. అవధేశ్ చర్య.. కేవలం నిరసన కాదు, అది దురాచారానికి వ్యతిరేకంగా వినిపించిన ధైర్యగీతం. ఈ తరం యువతరం ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఆయన తీసుకున్న ఆదర్శ నిర్ణయం పెళ్లి బంధానికి సరైన నిర్వచనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ వెదురులో మంచుయుగపు గుట్టు
వెదురులో మురళి దాగుంటుందన్నది తెలిసిందే. అయితే మణిపూర్లోని అతి పురాతన వెదురు శిలాజాల్లో మాత్రం మన దేశపు మంచు యుగానికి సంబంధించిన పలు రహస్యాలే దాగున్నాయి! అంతేనా? భారత్తో పాటు ఆసియా ఖండపు వృక్షశాస్త్ర చరిత్ర గతినే అవి సమూలంగా మార్చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు...!అది అలాంటిలాంటి శిలాజం కాదు. ఏకంగా 37,000 ఏళ్లనాటి వెదురు తాలూకు అత్యంత అరుదైన శిలాజం. ఎందుకంత అరుదైనదీ అంటే వెదురు శిలాజ రూపు దాల్చడం కనాకష్టం. దాని లోపలంతా బోలుగా ఉండటమే అందుకు కారణం. దాంతో అతి త్వరగా కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. అలాంటి వెదురు తాలూకు అతి పురాతన శిలాజాన్ని మణిపూర్లోని ఇంఫాల్ లోయ ప్రాంతంలో సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు. అది ఇప్పటిదాకా వెల్లడించిన, ఇకపై జరిపే పరిశోధనల్లో బయటపెట్టబోయే రహస్యాలు భారత్తో పాటు ఆసియా వృక్షశాస్త్ర చరిత్రనే తిరగ రాయగలవని భావిస్తున్నారు. ఇంఫాల్ లోయ ప్రాంతంలో చిరాంగ్ నదీ తీరాన ఇసుక మేటలు అధికంగా ఉండే చోట ఈ వెదురు శిలాజాలు వెలుగు చూశాయి. ఆసియా ప్రాంతంలో మంచుయుగపు అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని వెదురు తన ఉనికిని కాపాడుకుందనేందుకు ఈ శిలాజాలు తిరుగులేని నిదర్శనమని సైంటిస్టులు చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బృందంతో కలిసి బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ (బీఎస్ఐపీ) సైంటిస్టులు ఈ శిలాజాలపై ముమ్మరంగా పలు పరిశోధనలు జరుపుతున్నారు. వాటి తాలూకు పలు భాగాలను ఒక్కొక్కటిగా దుర్భిణి వేసి మరీ పరిశీలిస్తున్నారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకునేందుకు అవి ఎలాంటి పద్ధతులను అవలంబించిందీ క్రమంగా వెలుగులోకి వస్తోందని వారు చెబుతున్నారు. శిలాజ రూపు దాల్చిన వెదురు జాతిని జెనస్ చిమొనోబాంబూసాగా గుర్తించారు. సహచరులు మాయమైనా... మంచుయుగం తాలూకు అతి ప్రతికూల పరిస్థితులకు తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా చాలారకాల వెదురు జాతులు అంతర్ధానమైపోయాయి. యూరప్ మొదలుకుని అమెరికా ఖండాల దాకా ఇదే పరిస్థితి. అయినా మణిపూర్లోని ఈ జెనస్ జాతి తట్టుకుని నిలవడానికి కారణాలన్నింటినీ కనిపెట్టేందుకు సైంటిస్టుల బృందం అన్నిరకాలుగానూ ప్రయతి్నస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో శిలాజాల తాలూకు విడిభాగాలను ఒక్కొక్కటిగా మథిస్తోంది. ‘‘ఈశాన్య భారతంలోని అపార జీవవైవిధ్యం కారణంగా మంచుయుగపు ప్రభావం ఇక్కడ మరీ ఎక్కువగా పడి ఉండకపోవచ్చు. ఈ వెదురు జాతులు ఆ కష్టకాలాన్ని గట్టెక్కి మనుగడ సాగించేందుకు అదే కారణం కావచ్చు’’అన్న వాదనల్లోని నిజానిజాలను కూడా నిగ్గుదేల్చేందుకు వారు ప్రయతి్నస్తున్నారు. ఈ పరిశోధన వివరాలను పాలయోబోటనీ, పాలియాలజీ జర్నల్ రివ్యూలో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్నాన యంత్రం
అధునాతన సాంకేతికత, ఆవిష్కరణలకు నిలయమైన జపాన్లో మరో వినూత్న సాధనం రూపుదిద్దుకుని విశ్వవిపణిలోకి అడుగుపెట్టింది. హాయిగా నచ్చిన సంగీతం వింటూ, సినిమా చూస్తూ కేవలం 15 నిమిషాల్లో అత్యంత శుభ్రంగా స్నానం పూర్తిచేయాలనుకునే వారి కోసం ‘ ఏ సైన్స్ కో’ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా మానవ వాషింగ్ మెషీన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల ఒసాకా నగరంలో ‘ఎక్స్పో–2025’లోనూ దీని నమూనాను ప్రదర్శించగా ఇప్పుడిది మార్కెట్లోకి వచ్చింది. దీని ధర మూడు కోట్ల రూపాయలు.కష్టపడకుండా చక్కటి స్నానంఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా స్నానంకానిచ్చేలా ఈ వాషింగ్ మెషీన్ను డిజైన్చేశారు. చూడ్డానికి యుద్ధవిమాన కాక్పిట్లాగా తోచినా ఇది వాస్తవానికి పారదర్శక పదార్థంతో చేసిన ఒక పాడ్. 2.3 మీటర్ల పొడవైన ఈ పాడ్లో తల కాస్తంత ఎత్తులో ఉండేట్లు పడుకున్నాక పైన మూత మూసుకుంటుంది. సగం వరకు గోరువెచ్చని స్వచ్ఛమైన నీరు నిండాక అత్యంత వేగంతో నీరు శరీరమంతా చిమ్ముతుంది. వేగం ధాటికి చర్మం మీది మట్టి, మృతకణాలు చెల్లాచెదురవుతాయి. ఈ నీటికి బ్యాక్టీరియావంటి హానికారక సూక్ష్మజీవులను చంపేసే ఔషధ గుణముంది. అసౌకర్యంగా అనిపిస్తే మనసును ఆహ్లాదపరచడానికి ఎదురుగా ఎల్ఈడీ తెరలు సిద్ధంగా ఉంటాయి. నచ్చిన పాట, సినిమా, సంగీతం వెనువెంటనే వినే ఏర్పాట్లు ఉన్నాయి. శరీర ఉష్ణోగ్రతకు తగ్గట్లు నీటి వేడిశాతం మారుతుంది. తుంపర్లు సైతం తమ వంతు కృషిచేస్తూ స్నానంచేసే వ్యక్తి బడలికను పోగొడతాయి. అత్యంత సూక్ష్మ బుడగలు చర్మం మీది మృతకణాలు, చెడు రసాయనాలు, జిడ్డును మటుమాయం చేస్తాయి. ఈ మొత్తం స్నానపర్వం 15 నిమిషాల్లోనే ముగుస్తుంది. శరీరంలో ఏ భాగంలో ఇంకా మురికి ఉండిపోయిందో అప్పటికప్పుడు తనిఖీచేసే బయోమెట్రిక్ స్కానర్లను సైతం ఈ వాషింగ్ మెషీన్లో అమర్చారు. దీంతో అసమగ్రంగా స్నానం కానిచ్చేశామన్న భావన అస్సలు కలగదు. మూడింటి కలబోతస్నానం, స్పా, ఆరోగ్య స్కానింగ్.. ఇలా మూడింటి కలబోతగా తయారైన ఈ వాషింగ్ మెషీన్కు మిరాయ్ నింజెన్ సెంటకుకీ అని పేరు పెట్టారు. జపనీస్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్తు, నింజెన్ అంటే మనిషి, సెంటకుకీ అంటే శుభ్రపరచడం. పూర్తిస్థాయిలో ఆటోమేటిక్గా పనిచేసే వ్యక్తిగత స్నానగదిలా ఇప్పుడిది ఇంటర్నెట్లోనూ హల్చల్ చేస్తోంది. 3 కోట్లరూపాయలు పెట్టి కొనే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉన్నారని కంపెనీ అధికారప్రతినిధి సచికో మయీకురా చెప్పారు. విలాసవంత రిసార్ట్లు, లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, వెల్నెస్ సెంటర్లు, సంపన్నులు దీనిని కొనేందుకు అమితాసక్తి కనబరుస్తున్నారని ఆమె వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అత్యవసరంగా ఏఐ స్కిల్స్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న కొత్త టెక్నాలజీ. కంపెనీలూ ఈ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. జాబ్ మార్కెట్లో ఉద్యోగులు నిలదొక్కుకోవాలంటే కృత్రిమ మేధ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిందే. అది కూడా ఇప్పటికిప్పుడే. ప్రధానంగా టెక్ రంగంలోని సిబ్బందికి ఈ ఆవశ్యకత ఏర్పడింది. ఏఐ స్కిల్స్ ఉన్నఫళంగా నేర్చుకోవాల్సిందేనా? జీసీసీ సొల్యూషన్స్ కంపెనీ ‘ఆన్సర్’.. తన గ్లోబల్ టాలెంట్ ప్లాట్ఫామ్ ‘టాలెంట్500’తో కలిసి రూపొందించిన ‘ఏఐ అడ్వాంటేజ్ సర్వే రిపోర్ట్–2025’ అవుననే చెబుతోంది.కృత్రిమ మేధ నైపుణ్యాలు తమ భవిష్యత్తుకు అనివార్యమైనవిగా టెక్ నిపుణులు భావిస్తున్నారని నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 70% కంటే ఎక్కువ మంది నిపుణులు రాబోయే మూడు నెలల్లో ఏఐ స్కిల్స్ను అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేగంగా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోందని నివేదిక వివరించింది. సొంతంగా చొరవ.. పనిచేస్తున్న సంస్థలు అధికారికంగా ఇచ్చే శిక్షణ కోసం ఉద్యోగులు వేచిచూడటం లేదని నివేదిక తెలిపింది. చాలామంది టెకీలు యూట్యూబ్, సొంతంగా అభ్యాసం, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకుంటున్నారు. 53.7% మంది సొంత డబ్బు వెచి్చంచి నేర్చుకుంటున్నారు. అయితే, నాలుగింట ఒకవంతు మంది రూ.10 వేల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తుండడం విశేషం. ‘ఏఐ నైపుణ్యాలు కెరీర్ను రూపొందిస్తాయని ఉద్యోగులకు తెలుసు. కాబట్టే వేగంగా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సొంతంగా చొరవ తీసుకుంటున్నారు. ప్రధానంగా జీసీసీలకు ఈ ఆవశ్యకత అసలైన ప్రయోజనం చేకూర్చనుంది. నేర్చుకోవడానికి ఆసక్తిగా, సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తి ఏఐ సామర్థ్యాలను ఉన్నతంగా నిర్మించడానికి సరైన పునాదిని సృష్టిస్తుంది. ఈ శక్తికి వెన్నంటి నిలిచినప్పుడు అది సంస్థకు నిజమైన బలంగా మారుతుంది’.. అని నివేదిక స్పష్టం చేసింది.ఎవరెవరు ఉన్నారంటే..భారత్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో (జీసీసీ) ఇంజనీరింగ్, ప్రోడక్ట్, క్యూఏ, డేటా, ఆపరేషన్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న 3,000 మందికి పైగా వృత్తి నిపుణులు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో బెంగళూరు నుంచి 48.5%, హైదరాబాద్ 22.2%, ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి 14.3% మంది ఉన్నారు. మిగిలినవారు పుణే, ముంబై, చెన్నైకి చెందినవారు. సర్వేలో పాల్గొన్న వారిలో 35 ఏళ్లలోపు వారు 71% మంది ఉన్నారు. అయితే కోడింగ్, రీసెర్చ్, డేటా అనాలిసిస్ రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంది. 1–2 ఏళ్లలో తమ ఉద్యోగాల్లో ఏఐ చాలా మార్పులు తెస్తుందని అత్యధికుల భావన. -
అంగారకునిపై నేటికీ జీవం?
అంగారకుడు. పూర్తిగా రాళ్లమయం. ఎటు చూసినా పర్వతాలే. అయితే ఆ గ్రహంపైనా ఒకప్పుడు జీవం ఉండేదని సైంటిస్టులు గతంలోనే నిర్ధారించారు. అయితే వందల కోట్ల ఏళ్ల క్రితమే అది నామరూపాల్లేకుండా పోయిందన్నది వాళ్లు ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాట. అది నిజం కాదని, ఆ తర్వాత కూడా అంగారకునిపై జీవజాలం మనుగడ చాలాకాలం పాటు కొనసాగిందని తాజా పరిశోధన ఒకటి బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇంకా చెప్పాల్సి వస్తే, అంగారకుని లోలోపలి పొరల్లో బహుశా ఇప్పుడు కూడా సూక్ష్మజీవజాలం ఉనికి బయటపడ్డా ఆశ్చర్యం లేదన్నది దాని సారాంశం!దిబ్బలే రాళ్లయిన వేళ...అత్యంత ఆసక్తికరంగా ఉన్న ఈ పరిశోధనకు న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబీ (ఎన్వైయూఏడీ) సైంటిస్టుల బృందం సారథ్యం వహించింది. ఈ అధ్యయన వివరాలను జియోఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా అంగారకునిపై నాసా తాలూకు క్యూరియాసిటీ రోవర్ పరిశోధనలు చేస్తున్న గాలే బిల ప్రాంతంలోని అతి ప్రాచీన ఇసుక దిబ్బలపై ప్రధానంగా దృష్టి సారించారు. లోపలి పొరల్లోని నీటి కారణంగా ఈ ప్రాంతమంతా కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితమే రాళ్లూ గుట్టలమయంగా మారిపోయింది. అంగారకుని మీది ఆ రాళ్ల స్వరూప స్వభావాలను యూఏఈ ఎడారుల్లో అటూ ఇటుగా అలాంటి పరిస్థితుల్లోనే ఏర్పడ్డ అటువంటివే అయిన రాళ్లతో పోల్చి చూశారు. గాలే బిలం సమీపంలోని పర్వత ప్రాంతం నుంచి భారీ నీటి ప్రవాహం ఇసుక దిబ్బల దిగువ పొరలకు ఇంకినట్టు ఈ పరిశోధనకు రీసెర్చ్ అసిస్టెంట్గా వ్యవహరించిన భారతీయ శాస్త్రవేత్త విఘ్నేశ్ కృష్ణమూర్తి వివరించారు. ‘‘ఆ జలం కొన్ని కోట్ల ఏళ్లపాటు వాటిని కిందినుంచి తడుపుతూ వచ్చింది. ఫలితంగా జిప్సం వంటి ఖనిజాలు పురుడు పోసుకున్నాయి. భూమిపై కూడా ఎడారి ప్రాంతాల్లో అత్యంత సహజంగా కనిపించే ఖనిజాల్లో జిప్సం ఒకటన్నది తెలిసిందే. మా పరిశోధనలో అంతిమంగా తేలింది ఒక్కటే. అంగారకుని తడి నేలలు ఉన్నపళంగా పొడిబారిపోలేదు. అక్కడి ఉపరితలం మీది నదీనదాలు, సరస్సుల వంటివన్నీ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత కూడా ఎంతోకొంత జలధార అట్టడుగు పొరల్లో ఉంటూనే వచ్చింది. కనుక మా అంచనా ప్రకారం ఆ ప్రాంతాల్లో సూక్ష్మజీవజాలం నేటికీ ఉనికిలోనే ఉన్నా ఆశ్చర్యమేమీ లేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. అదే గనక జరిగితే జిప్సం తదితర ఖనిజాలతో కూడిన గాలే బిలం వంటి ప్రాంతాలే ఆ జీవానికి ఆటపట్టులని తెలిపారు. కనుక భావి అంగారక యాత్రలన్నింటికీ సహజంగానే అలాంటి ప్రదేశాలే లక్ష్యాలుగా మారతాయని కృష్ణమూర్తి వివరించారు. పరిశోధనకు ఎన్వైయూఏడీ తాలూకు స్పేస్ ఎక్స్ప్లరేషన్ లేబొరేటరీ చీఫ్ దిమిత్రా అట్రీ సారథ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డైనోసార్ల నాటి చేప!
అవడానికి అది చేప మాత్రమే. కానీ దాని ఘనత అంతా ఇంతా కాదు. ఎందుకంటే పూర్వ చారిత్రక యుగం నుంచీ ఉనికిని కాపాడు కుంటూ వస్తున్న అత్యంత మొండి ఘటంగా తిరుగులేని రికార్డు దాని సొంతం. మరోలా చెప్పాలంటే అది డైనోసార్లతో రాసుకుపూసుకు తిరిగిన బాపతు. అంటే కనీసం కోటిన్నర ఏళ్ల నాటిదన్నమాట. అత్యంత కఠినమైన కాలపరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన అంతటి మొండి జీవి ఉనికి కాస్తా ఇప్పుడు ప్రమాదంలో పడింది. కారణం? మనిషే. అతని పేరాశ పుణ్యమా అని అంతరించిపోయే జాబితాలో చేరిన ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడేందుకు క్యూబా సైంటిస్టులు కాలంతో పోటీ పడి మరీ శ్రమిస్తు న్నారు...! అది క్యూబా తీరం వెంబడి పొడవుగా సాగిన ఉప్పునీటి కయ్యలోని జెప్టా చిత్తడి నేలల ప్రాంతం. ప్రాణాంతకమైన వ్యాధులను మోసుకు తిరిగే భయానకమైన దోమలకు పెట్టింది పేరు. అలాంటి ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. డైనోసార్ల కాలంనుంచీ నేటిదా కా మనుగడలో ఉన్న ఒకే ఒక్క చేప జాతి అయిన మంజువారీలకు ప్రపంచంలోకెల్లా ఏకైక ఆవాసమది. పొ డవుగా, సన్నగా, నాజూకుగా, పదునైన పళ్లతో ఉండే ఈ చేప అంతరించే జాబితాలోని జీవజాలంలో ముందువరుసలో ఉంది. దాంతో పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాలూకు అంతరించను న్న జీవుల జాబితాలోకి ఎక్కింది. శతాబ్దాల తరబడి మనిషి సాగించిన విచ్చలవిడి వేటే ఇందుకు ప్రధాన కారణం. దాంతో ఈ సహస్రాబ్దం తొలినాళ్లకల్ల మంజువారీ దాదాపుగా అంతరించిపోయినంత పనైంది! దాంతో ఒక దశలో దానిపై అంతా ఆశలు వదలుకున్నారు! కానీ ఉన్నట్టుండి మూడేళ్లకు అంటే 2003 ప్రాంతంలో జెప్టా చిత్తడినేలల్లో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది. దాంతో క్యూబా సర్కారు కళ్లు తెరిచింది. దాన్ని ఎలాగైనా కాపాడేందుకు నడుం బిగించింది. ఈ గురుతర బా ధ్యతను అక్కడి ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆంద్రెస్ హర్టాడో బృందానికి అప్పగించింది. ఆయన వెంటనే రంగంలోకి దిగారు. మంజువారీ చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేలల సమీ పంలోనే యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రత్యేక హాచరీని ఏర్పాటు చేశారు. వాటి సంఖ్య హాచరీలో పట్టనంతగా పెరిగిన కొద్దీ పెద్ద వయసు చేపలను చిత్తడి కయ్యల్లోకి వదులుతూ వస్తున్నా రు. ఇప్పుడు స్థానిక మత్స్యకారులు తమకు మంజువారీలు తరచూ కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ‘‘అప్పుడే ఆనందించడానికి లేదు. మంజువారీలకు అవసరమైన ఆహారాన్ని బయటి పరిస్థితుల్లో అందుబాటులో ఉంచడం చాలా కష్టమైన పని. ఆ సవాలును పూర్తిగా అధిగమించినప్పుడే నిజమైన ఆశ ఉన్నట్టు. వీటిని అంతరించే జీవుల జాబితా నుంచి కొన్నాళ్ల తర్వాతైనా బయట పడేయడం సాధ్యమని చెప్ప గలమన్నట్టు’’అని వివరించారాయన. క్యూబాలోని చేపల న్నింట్లోకెల్లా మంజువారీ రత్నం వంటిదని గర్వంగా చెబు తారు ఆంద్రెస్. అందుకే ఈ చేపను స్థానికులు క్యూబన్ గార్ అని కూడా మురిపెంగా పిలుచుకుంటారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ వెలిగించిన కిరణం!
అనగనగా ఓ చిన్నారి.. ఐస్క్రీమ్ కొనుక్కోవడానికి ఇంటి గడప దాటింది. అంతే.. తప్పిపోయింది. ఇంటి చిరునామా మరిచిపోయింది. దశాబ్దంన్నరకు పైగా సాగిన ఆ కన్నీటి కథకు, ఆధునిక సాంకేతికత అనూహ్యమైన ముగింపు పలికింది. దశాబ్దం క్రితం నమోదైన ఓ ‘మిస్సింగ్ గర్ల్’ ఫిర్యాదు, అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికత... వెరసి ఓ పాకిస్తానీ యువతిని 17 ఏళ్ల తర్వాత తన కుటుంబంతో తిరిగి కలిపాయి. 2008లో ఇస్లామాబాద్లో తప్పిపోయిన కిరణ్ అనే బాలిక.. ఇప్పుడు 27 ఏళ్ల యువతిగా ఎదిగి కన్నవారి ఒడికి చేరుకుంది.‘నేను ఏడుస్తూ ఒంటరిగా ఉన్నాను. అప్పు డు ఎవరో ఒక దయామయి నన్ను ఇస్లామాబాద్లోని ఎధీ సెంటర్కు తీసుకెళ్లినట్టు గుర్తు. అప్పట్లో నాకు ఏమీ గుర్తు లేదు’.. అని కిరణ్ గుర్తు చేసుకుంది. కొద్ది రోజుల్లోనే, మానవతామూర్తి దివంగత అబ్దుల్ సత్తార్ ఎధీ భార్య బిల్కిస్ ఎధీ.. కిరణ్ను కరాచీకి తీసుకెళ్లారు. అప్పటి నుండి, ఎధీ ఆశ్రయంలో.. బిల్కిస్ సంరక్షణలో కిరణ్ పెరిగింది. కిరణ్ తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఇస్లామాబాద్కు పలుమార్లు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఎథీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.పట్టు వదలని ‘ఎధీ’ ప్రయత్నంఎధీ ఫౌండేషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఫైసల్ ఎధీ భార్య సభా ఫైసల్ ఎధీ మాట్లాడుతూ.. కిరణ్ తల్లిదండ్రులను గుర్తించడానికి ఇస్లామాబాద్కు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. ఆశలు సన్నగిల్లిన సమయంలో, ఫౌండేషన్ ఈ ఏడాది మొదట్లో పంజాబ్లో ’సేఫ్ సిటీ ప్రాజెక్ట్’లో పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ నిపుణుడు నబీల్ అహ్మద్ను సంప్రదించింది. ‘మేము అతనికి కిరణ్ ప్రస్తుత ఫొటోలు, ఆమె బాల్యం గురించి తెలిసిన స్వల్ప సమాచారాన్ని అందజేశాం’.. అని సభా వివరించారు. కేసును సవాలుగా తీసుకున్న నబీల్, ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్లో దశాబ్దం క్రితం నమోదైన ‘మిస్సింగ్ గర్ల్’ రిపోర్ట్ను గుర్తించారు. ఆ రిపోర్ట్లోని పాత ఫొటోలు, కిరణ్ ప్రస్తుత ఫొటోలను, అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్, ట్రాకింగ్ సాఫ్ట్వేర్ల సహాయంతో విశ్లేషించారు. పాత రూపానికి, ప్రస్తుత రూపానికి పోలికలను ఏఐ అత్యంత కచి్చతత్వంతో అందించడంతో, కిరణ్ కుటుంబాన్ని గుర్తించడం సాధ్యమైంది. నా కూతుర్ని చూస్తాననుకోలేదు టైలర్గా పనిచేసే అబ్దుల్ మజీద్, తానే కిరణ్ తండ్రినని ధ్రువీకరిస్తూ కరాచీకి చేరుకున్నారు. ‘కిరణ్ ఫొటోలను పత్రికల్లో వేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. నా కూతురిని చూస్తానని ఆశ వదులుకున్నాను’.. అని మజీద్ భావోద్వేగానికి లోనయ్యారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ అధికారులు తనను సంప్ర దించినప్పుడు ఆ ఆనందాన్ని వరి్ణంచలేనని తెలిపారు. ‘ఇక్కడి నా కుటుంబ సభ్యులను (ఎధీ ఆశ్రయం) వదిలి వెళ్లడం బాధగా ఉన్నా, బిల్కిస్ ఆపాకు నేను ఎప్పటికీ కృతజు్ఞరాలిని’.. అని కిరణ్ సంతోషంగా వీడ్కోలు పలికింది. ఏఐ సాంకేతికత సాయంతో ఎధీ ఆశ్రయం నుండి.. తన కుటుంబానికి చేరిన అయిదో యువతి కిరణ్ కావడం విశేషం. కాలం చెరిపేసిన గతాన్ని, ఏఐ సాంకేతికత చెక్కు చెదరకుండా తిరిగి లిఖించింది... ఇది సైన్స్, సెంటిమెంట్ మేళవించిన అద్భుతం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విపత్తుల 'వైపరీత్యం'..
కరువు, వరదలు, తుపాన్లు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి విపత్తులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఒక్క భారత్కే కాదు ప్రపంచవ్యాప్తంగా రైతన్నలపాలిట ఇవి శాపంగా మారాయి. గడిచిన 33 ఏళ్లలో అంతర్జాతీయంగా ఈ విపత్తులు రూ.2,88,99,900 కోట్ల మేర వ్యవసాయ నష్టాలను కలిగించాయని అంచనా. అంటే ఏటా రూ.8,75,754 కోట్లు. ఇది ప్రపంచ వ్యవసాయ జీడీపీలో దాదాపు 4 శాతం అన్నమాట. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) వ్యవసాయం, ఆహార భద్రతపై విపత్తుల ప్రభావం–2025 పేరుతో రూపొందించిన కొత్త నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 1991–2023 మధ్య విపత్తుల కారణంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ కాలంలో ఊహలకు అందనంతగా 460 కోట్ల టన్నుల తృణధాన్యాలు, 280 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, 90 కోట్ల టన్నుల మాంసం, పాల ఉత్పత్తులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నష్టాలు రోజువారీ తలసరి 320 కిలో కేలరీల తగ్గింపునకు దారితీశాయి. అంటే సగటు శక్తి అవసరాల్లో 13–16 శాతం అన్నమాట. ప్రపంచ నష్టాల్లో ఆసియా అత్యధికంగా 47 శాతం వాటాతో ముందు వరుసలో ఉంది. మొత్తం రూ.1,35,82,953 కోట్ల నష్టం మూటగట్టుకుంది. ఉపాధి, ఆదాయంలో వ్యవసాయం గణనీయమైన వాటాను కలిగి ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ నష్టాలు ఆహార భద్రత, గ్రామీణ స్థిరత్వానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయి. మత్స్య సంపద సైతం..యూఎస్ఏ 22 శాతం లేదా రూ.63.5 లక్షల కోట్ల నష్టాలతో రెండవ స్థానంలో ఉంది. తరచూ వచ్చే కరువులు, తుపాన్లు, అలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు ఇందుకు కారణం. రూ.54 లక్షల కోట్ల నష్టంతో ఆఫ్రికా టాప్–3లో చోటు సంపాదించింది. విపత్తుల కారణంగా వ్యవసాయ జీడీపీలో 7.4 శాతం ఆఫ్రికా కోల్పోతోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అతిపెద్ద భారం ఆఫ్రికాకే. ఫిజీ, మాల్దీవులు, జమైకా, క్యూబా వంటి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ (ఎస్ఐడీఎస్) తుపాన్లు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల వంటి విపత్తులకు ప్రపంచంలోనే అత్యంత ప్రభావితమయ్యే దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. 1985–2022 మధ్య సముద్ర వేడి గాలులు రూ.58,509 కోట్ల నష్టాలను కలిగించాయి. ఇది ప్రపంచ మత్స్య సంపదలో 15 శాతం ప్రభావితం చేసింది. మత్స్య, ఆక్వాకల్చర్ రంగం 50 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి మద్దతు ఇస్తోంది. విప్లవాత్మక మార్పులు.. కరువులు, వరదలు మొదలుకుని తెగుళ్లు, వేడి గాలుల వరకు.. ఈ ప్రకృతి విపత్తులు ఆహార ఉత్పత్తి, జీవనోపాధి, పోషకాహారాన్ని దెబ్బతీస్తున్నాయి. విపత్తుల వల్ల తలెత్తే సంక్షోభం నుంచి వ్యవసాయ ఆహార వ్యవస్థలను గట్టెక్కించడానికి మాత్రమే డిజిటల్ ఆవిష్కరణలు పరిమితం కాలేదు.ముందస్తు చర్యలతో డేటా ఆధారిత స్థితిస్థాపకత నిర్మాణానికి మారడంలో సాయపడుతున్నాయి. ప్రమాదాలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరికలను అందించడం, రైతులు వేగంగా నిర్ణయం తీసుకోవడంలో డిజిటల్ టెక్నాలజీలు ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని నివేదిక వివరించింది. గేమ్ చేంజర్గా.. వ్యవసాయ విపత్తు ప్రమాదాలను తగ్గించే విషయంలో డిజిటల్ వినియోగం గేమ్ చేంజర్గా నిలిచిందని ఎఫ్ఏఓ నివేదిక కితాబిచి్చంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), రిమోట్ సెన్సింగ్, మొబైల్ కనెక్టివిటీ, డ్రోన్స్, సెన్సార్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాధనాలు ఇప్పుడు రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వేగంగా అందిస్తున్నాయని తెలిపింది. ఇవి ముందస్తు హెచ్చరిక, సలహా సేవలు, బీమా, ముందస్తు చర్యలను మెరుగుపరుస్తున్నాయని వెల్లడించింది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (జీఐఈడబ్ల్యూఎస్) వంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పెట్టుబడి పెట్టిన ప్రతి డాలర్కు ఏడు డాలర్ల వరకు రాబడిని ఇవ్వగలవని నివేదిక తెలిపింది. -
కొల్లేరుకు అతిథులొచ్చారు!
కైకలూరు: శీతాకాలపు విడిది పక్షుల కిలకిలారావాలతో కొల్లేరు కళకళలాడుతోంది. లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తన రెక్కల చప్పుళ్లతో కొల్లేరుకు విదేశీ అతిథి పక్షులు వచ్చేశాయ్. ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొల్లేరు పక్షుల వీక్షణకు అనువైన కాలం. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు కొల్లేరుకు విచ్చేస్తారని అటవీ శాఖ అంచనా వేస్తోంది. సర్వేల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 482 పక్షి జాతులు ఉన్నాయి. సింహభాగం 210 పక్షి జాతులు కొల్లేరులో సంచరిస్తాయి. కొల్లేరు ప్రాంతానికి రష్యా, బ్రిటన్, సైబీరియా, బంగ్లాదేశ్, నైజీరియా, ఆ్రస్టేలియా, శ్రీలంక తదితర 29 దేశాల నుంచి 71 జాతులకు చెందిన వలస జాతి పక్షులు 1.20 లక్షలు వస్తాయని అంచనా. ప్రపంచంలో పక్షి జాతులు 11,145 ఉండగా, భారతదేశంలో 1,378 ఉన్నాయి. భారతదేశ పక్షి జాతుల వాటా 12.3 శాతంగా ఉంది. కొల్లేరులో స్వదేశీ, విదేశీ అన్ని పక్షులూ కలిపి 4 లక్షల వరకు శీతాకాలంలో విహరిస్తాయి. పక్షుల అత్తారిల్లు కొల్లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్సార్ సదస్సు గుర్తించిన ఏకైక చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. దీని విస్తీర్ణం 2,22,300 ఎకరాలు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించింది. కొల్లేరు 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. ఇరు జిల్లాల్లో ఆటపాక, మాధవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడ గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తితో మార్చి మొదటి వారంలో పుట్టింటికి వెళతాయి. కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో పెలికాన్ పక్షులు అధికంగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్గా నామకరణ చేశారు. బార్ టెయిల్డ్ గాడ్విట్ నిరి్వరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇవి కొల్లేరు అభయారణ్య ప్రాంతానికి ఏటా వస్తాయి.ఆర్కిటిక్ టర్న్ అత్యధిక దూరం వలస పోయే పక్షి ఆర్కిటిక్ టర్న్. ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే చేరుకుంటుంది. అలస్కా నుంచి న్యూజిలాండ్కు వలస వెళ్తుంది.బార్ హెడెడ్ గీస్ ఎక్కువ ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందిన బార్ హెడెడ్ గీస్. ఇది సముద్రమట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణించి, భారత భూభాగంలోని చిలుకా, పులికాట్ తదితర సరస్సులకు వస్తాయి. గ్రేట్ స్నైప్ అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్ స్నైప్, ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిని పరికరాలతో వీక్షించడం కూడా కష్టం.కొల్లేరుకు ప్రతి ఏటా వచ్చే విదేశీ వలస పక్షులు.. నార్తరన్ పిన్టైల్ (సూది తోక బాతు), రెడ్ క్రిస్టడ్ పోచర్ట్ (ఎర్రతల చిలువ), కామన్ శాండ్ పైపర్ (ఉల్లంకి పిట్ట), పసిఫిక్ గోల్డెన్ స్లోవర్ (బంగారు ఉల్లంకి), కామన్ రెడ్ షాంక్ (ఎర్రకాళ్ల ఉల్లంక్), బ్రాహ్మణి షెల్ డక్(బాపన బాతు), గ్రేట్ వైట్ పెలికాన్ (తెల్ల చిలుక బాతు), బ్లాక్ క్యాప్డ్ కింగ్ఫిషర్(నల్ల తల బుచ్చిగాడు), గుల్ బిల్డ్ టర్న్(గౌరి కాకి ముక్కు రేవుపిట్ట), కాస్పియన్ టర్న్(సముద్రపు కాకి), గ్రేటర్ శాండ్ ప్లోవర్(పెద్ద ఇసుక ఉల్లంకి), రూఫ్ (ఈల వేసే పెద్ద చిలువ), మార్స్ శాండ్పైపర్ (చిత్తడి ఉల్లంకి) వంటివి దాదాపు 71 జాతులు ఉన్నట్టు గుర్తించారు. పక్షులకు ఎల్లలుండవు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. శీతాకాలంలో హిమాలయాలకు దూరంగా నార్తరన్ దేశాలు మంచుతో ఉంటా యి. దీంతో ఆహారం కోసం పక్షులు వలస వస్తాయి. చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు వీటికి అనువైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కాలుష్యం కారణంగా వలస పక్షులు తగ్గుతున్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యతగా ఉండాలి. – శ్రీరామ్రెడ్డి, తెలుగు రాష్ట్రాల ఈ–బర్డ్ సమీక్షకుడు, హైదరాబాదు పక్షులను ప్రేమించాలి పక్షులను నేస్తాలుగా భావించి ఆదరించాలి. కొల్లేరు వాతావరణం అనుకూలంగా ఉండటంతో పక్షులు వలస వస్తున్నాయి. అటవీ శాఖ పక్షుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరన ఏషియన్ వాటర్ బర్డ్స్ సెన్సస్(ఏడబ్ల్యూసీ) చేయాలని భావిస్తున్నాం. ఏలూరు జిల్లాలో ఆటపాక, మాధవాపురంలో పక్షుల విహార కేంద్రాలను అభివృద్ధి చేశాం. కొల్లేరు పక్షుల వీక్షణకు ఇదే అనువైన సమయం. – బి.విజయ, జిల్లా అటవీశాఖ అధికారి, ఏలూరు -
స్క్రీన్పై 'బ్యాన్'
ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించారు. వచ్చే డిసెంబర్ 10 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తోంది. వీరు కొత్తగా సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరవడానికి వీల్లేదు. ఇప్పటికే ఉంటే అవి రద్దు అవుతాయి. ఈ బిల్లుకు 2024 నవంబర్ 28న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. తద్వారా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ప్రపంచంలో నిషేధాన్ని ప్రకటించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా అవతరించింది. ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్సామాజిక మాధ్యమాలతో పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. వీటిలో ఉండే కంటెంట్ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సుకు హాని కలిగిస్తోంది. పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా నిషేధానికి శ్రీకారం చుట్టినట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చేపట్టిన ఒక అధ్యయనంలో 10–15 సంవత్సరాల వయసున్న పిల్లల్లో 96% మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. వీరిలో 10 మందిలో ఏడుగురు హానికరమైన కంటెంట్, వేధింపులకు గురయ్యారని తేలింది.నిషేధం బాటలో మరిన్ని..ఇప్పటికే చాలా దేశాలు పాఠశాలల్లో స్మార్ట్ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయి. తాజాగా సోషల్ మీడియా బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా బాటలో మరిన్ని దేశాలు ఉన్నాయి. పదిహేనేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించనున్నట్టు డెన్మార్క్ ప్రకటించింది. అయితే 13, ఆపై వయసున్న పిల్లలు వీటిని వినియోగించాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి.పిల్లల దైనందిన జీవితం, బాల్యాన్ని రూపొందించడంలో హానికరమైన కంటెంట్, వాణిజ్య ఆసక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న డిజిటల్ ప్రపంచంలో వారిని ఒంటరిగా వదిలివేయకూడదని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. పదహారేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియా వాడకుండా వచ్చే ఏడాది నుంచి అడ్డుకట్ట వేయనున్నట్టు మలేషియా వెల్లడించింది. హానికారక కంటెంట్ 18 ఏళ్లలోపు పిల్లలకు చేరకుండా బ్రిటిష్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను యూకే అమలు చేస్తోంది. పదిహేనేళ్లలోపు పిల్లలను సామాజిక మాధ్యమాల నుంచి దూరం చేసేందుకు నార్వే ఓ చట్టాన్ని తీసుకొస్తోంది. న్యూజిలాండ్, ఫ్రాన్స్, పాకిస్తాన్ సైతం ఈ బాటలో ఉంది. ‘15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లల రోజువారీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలి’.. అని నెదర్లాండ్స్ ప్రభుత్వం సూచించింది.కోట్లలో యూజర్లు..ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, స్నాప్చాట్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాలను వినియోగించేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 566 కోట్లు ఉన్నట్టు అంచనా. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగిస్తున్నారు. బడికి వెళ్లే పిల్లలూ ఇందుకు మినహాయింపు కాదు. ఒక్కొక్క దేశాన్నిబట్టి 13–17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 95% వరకు, 8–12 ఏళ్లవారిలో 40% మందికి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.అత్యధికుల మాట అదే..ఫ్రాన్స్కు చెందిన మార్కెట్ రిసర్చ్ కంపెనీ ఇప్సాస్ ఈ ఏడాది జూన్–జూలైలో 30 దేశాల్లో సర్వే చేపట్టింది. 18–75 ఏళ్ల వయసున్న 23,700 మంది ఇందులో పాలుపంచుకున్నారు. ఇప్సాస్ ఎడ్యుకేషన్ మానిటర్–2025 ప్రకారం.. 14 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలంటూ 71% మంది తమ గళం వినిపించారు. గత ఏడాది సర్వేలో 65% మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండోనేషియాలో 87% మంది, ఫ్రాన్స్ 85, ఆస్ట్రేలియాలో 79% మంది బ్యాన్వైపు మొగ్గు చూపారు. అయితే భారత్లో గత ఏడాది 73% మంది ఈ అంశాన్ని ఏకీభవిస్తే.. 2025లో ఈ సంఖ్య 68%కి వచ్చి చేరింది. -
శని వలయాలు ‘కనిపించుట’ లేదు!
శని. అందమైన వలయాలతో సౌరకుటుంబం మొత్తంలోనూ అత్యంత ప్రత్యేకంగా కన్పించే గ్రహం. అది కాస్తా తాజాగా భారీ మార్పుచేర్పులకు లోనవుతోంది. అంటే మరేమీ లేదు. శని గ్రహం చుట్టూ అందంగా చుట్టుకుని కన్పించే వలయాలు దాదాపుగా ‘మటుమాయం’అయిపోతున్నాయి! ఆదివారం రాత్రి వినువీధిలోకి విహంగవీక్షణం చేసిన ఔత్సాహికులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామం కొట్టొచ్చినట్టుగా కన్పించి ఆశ్చర్యపరిచింది. అయితే అంతమాత్రాన శని గ్రహానికి నిజంగానే ఏదో ‘శని’దాపురించిందని మనమెవరమూ ఆందోళన పడాల్సిన పనేమీ లేదట! ఎందుకంటే దాని వలయాలు నిజానికి ఎటూ మాయం కాలేదని ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ‘‘అది కేవలం మన దృక్ భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ప్రస్తుతం శని భూమికి ఏటవాలు కోణంలో ఉంది. దాంతో దాని తాలూకు వలయాలు భూమి నుంచి కన్పించడం తాత్కాలికంగా దాదాపు అసాధ్యంగా మారింది. మరీ ముఖ్యంగా ఔత్సాహికులు ఉపయోగించే చిన్నాచితకా టెలిస్కోపుల సాయంతో వాటిని చూడటం కనాకష్టం’’అని వారు వివరించారు. ‘రింగ్’క్రాసింగ్! ప్రస్తుతం భూమి నుంచి చూస్తే శని వలయాలు మాయమైనట్టు కన్పించేందుకు రింగ్ ప్లేన్ క్రాసింగ్గా పేర్కొనే అరుదైన దృగ్విషయమే కారణమట. ఈ సమయంలో భూమి సరిగ్గా శని గ్రహం తాలూకు వలయాల తలానికి సమాంతరంగా పయనిస్తుందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. దాంతో ఈ సమయంలో భూమి నుంచి చూస్తే ఆ వలయాలు పైనుంచో, కిందినుంచో కాకుండా సరిగ్గా ఒక పక్కనుంచి మాత్రమే కన్పిస్తాయి. దాంతో అవక్కడ లేవనే అనిపిస్తుంది. అదీ సంగతి! ఎంత రింగ్ క్రాసింగ్ ప్రభావమైనా సరే, అంత పెద్ద శని గ్రహాన్ని పాముల మాదిరిగా చుట్ట చుట్టుకుని ఉండే అందాల వలయాలు కన్పించకుండా పోవడం ఏమిటని అనిపించడం సహజమే. కాకపోతే అందుకు సహేతుకమైన కారణం కూడా లేకపోలేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘శని వలయాలు ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో కూడుకుని ఉంటాయి. కానీ అంతా చేస్తే వాటి మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లే! పైగా ఈ దశలో వాటినుంచి భూమికేసి వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పం. వెరసి సుదూరంలో ఉన్న మన భూ గ్రహం నుంచి వాటిని సమాంతరంగా, అంటే ఒక పక్కగా చూసినప్పుడు దాదాపుగా కన్పించవు. దాంతో అవసలు లేవనే అన్పిస్తుంది’’అని వివరించారు. సమాన వంపు కోణం! శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. కాకపోతే ప్రతి 13 నుంచి 15 ఏళ్లకోసారి మాత్రం కొంతకాలం పాటు ఇలా అసలు కన్పించకుండా పోతాయి. అసలున్నాయా, లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న తొలిసారి రింగ్ప్లేన్ క్రాసింగ్ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కన్పించకుండాపోయింది. తాజాగా ఆదివారం మాత్రం ఈ పరిణామం సాయం సమయంలో జరగడంతో అందరికీ కనువిందు చేసిందన్నమాట. మరో ఐదేళ్లకల్లా, అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్లీ పూర్తిస్థాయిలో కనువిందు చేయనున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ హీ మేన్
‘ధరమ్ జీ’ ‘ధరమ్ పాజీ’ ‘వీరూ’ ‘ధరమ్ వీర్’... అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులూ యాభై ఏళ్లుగా ప్రేమగా పిలుచుకున్న బాలీవుడ్ హీమేన్ ధర్మేంద్ర కన్నుమూశారు. రొమాంటిక్ సినిమాలతో మొదలు యాక్షన్ సినిమాల వరకు అన్నీ చేసి ‘సకల నటనా వల్లభుడు’ అనిపించుకున్న ధర్మేంద్ర మృతితో ఒక శకం ముగిసింది.ధర్మేంద్ర గారూ... దేశానికి అమితాబ్ మంచి హెయిర్ స్టయిల్ ఇచ్చాడు. రాజేష్ ఖన్నా ఫ్యాషనబుల్ కుర్తా ఇచ్చాడు. మిథున్ డిస్కో డాన్స్ ఇచ్చాడు. మీరేం ఇచ్చారు?’ ధర్మేంద్ర ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి సమాధానం ఇచ్చారు. ‘ఆరోగ్యం ఇచ్చాను. నన్ను చూసి దేశంలో ఎందరో యువకులు జిమ్ వైపు నడిచారు. నేను దేశానికి కండ ఇచ్చాను. అంతకు మించింది ఏముంది?’13 ఏళ్ల పిల్లవాడుగా ధర్మేంద్ర ఉన్నప్పుడు లూథియానా మినర్వా థియేటర్లో ‘షహీద్’ అనే సినిమా చూశాడు. అందులో ఒకతను ‘వతన్ కే రాహ్ మే వతన్ కే నౌజవాన్ షహీద్ హో’... అని చేతిలో జెండా పట్టుకుని పాడుతున్నాడు. అతణ్ణి హీరో అంటారని, అతని పేరు దిలీప్ కుమార్ అని ధర్మేంద్రకు తెలియదు. కాని థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఒకటే నిశ్చయించుకున్నాడు– ‘నేను అతనిలాగే మా ఊరి థియేటర్లో తెర మీద కనిపిస్తా’.అది ఏ సమయమో. ఆ మాటను ఏ నక్షత్రాలు విన్నాయో.ధర్మేంద్ర తండ్రి స్కూల్ టీచర్. పెద్ద కొడుకు ధర్మేంద్ర తన మార్గంలో నడిచి ప్రొఫెసర్ కావాలని ఆయనకు ఉండేది. ధర్మేంద్రకు చదువు వంటబట్టలేదు. పైగా సినిమా పురుగు కుట్టింది. దాంతో క్లాసులో ఏమీ వినలేక, చెప్పలేక తండ్రి చేతిలో రోజూ తిట్లే. ఇంటికి వచ్చి తల్లితో ‘నన్ను స్కూల్కు పంపకు. నాన్న నన్ను మిగిలిన పిల్లల కంటే ఎక్కువ తిడుతున్నాడు’ అని ఫిర్యాదు చేసేవాడు. మొత్తానికి మెట్రిక్తో చదువు ఆగి, రైల్వే శాఖలో క్లర్క్ ఉద్యోగం దొరికి, 19 ఏళ్లకు పెళ్లి కూడా అయిపోయింది. కాని అతణ్ణి వెండితెర పిలుస్తూ ఉంది. రోజూ అతడి బాధ చూసిన తల్లి ‘నీకు అంతగా నటించాలని ఉంటే ఒక అర్జీ పడేయొచ్చు కదరా’ అంది అమాయకంగా. ఉద్యోగానికి అర్జీగానీ హీరో కావడానికి అర్జీ ఉంటుందా? ఏమో... అర్జీ పెట్టాలేమో అనుకుంటున్న ధర్మేంద్రకు అప్పుడే ‘ఫిల్మ్ఫేర్ టాలెంట్ హంట్’ ప్రకటన పేపర్లో కనిపించింది.బిమల్ రాయ్, గురుదత్ల పర్యవేక్షణలో కొత్త నటీనటుల అన్వేషణ. అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి అప్పటికప్పుడు ‘మలేర్కోట్లా’ అనే టౌన్కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. కారణం ఫొటో స్టూడియో అక్కడే ఉంది. అక్కడ జాన్ మహమ్మద్ అనే ఫొటోగ్రాఫర్తో ‘నన్ను దిలీప్కుమార్లా ఫొటో తియ్యి’ అనంటే అతను అంతకన్నా అందంగా ఫొటో తీశాడు. వెంటనే బొంబాయి నుంచి పిలుపు వచ్చింది. మహా దర్శకులైన బిమల్రాయ్, గురుదత్ స్క్రీన్ టెస్ట్ చేశారు. గురుదత్ ఏ సినిమా ఆఫర్ చేయలేదుగానీ బిమల్రాయ్ ‘నీకు వేషం ఇస్తున్నా’ అన్నాడు. సినిమా పేరు ‘బందినీ’.సినిమా రంగంలో ఇదిగో అంటే ఆర్నెల్లు. ‘బందినీ’ నిర్మాణం లేటయ్యింది. ఈలోపు ధర్మేంద్రకు పస్తులు మొదలయ్యాయి. బిమల్రాయ్ బుక్ చేసిన నటుడు కాబట్టి ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ (1960) అనే సినిమాలో హీరోగా 51 రూపాయల అడ్వాన్సుతో పని దొరికింది. మొదటి సినిమాగా అదే రిలీజైంది. కాని ఫ్లాప్. ఆ కష్టకాలంలో తనలాగే వేషాల కోసం ప్రయత్నిస్తున్న మనోజ్ కుమార్ ఫ్రెండ్ అయ్యాడు. రోజుల తరబడి స్టూడియోల చుట్టూ తిరగడం, భార్యనూ... ఉద్యోగాన్నీ వదిలేసి బొంబాయిలో ఏం చేస్తున్నావ్ అని తండ్రి అక్షింతలతో ఉత్తరాలు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం వేల వేదనలు అనుభవించాడు. అప్పుడు ‘బందినీ’ (1963) విడుదలైంది. కొద్దిగా గుర్తింపు. ‘ఆయి మిలన్ కీ బేలా’ (1963) నెగెటివ్ రోల్. రాజేంద్ర కుమార్ హీరో. కాస్త హిట్ అయ్యింది. ఈ సమయంలోనే అతను మన మహానటి సావిత్రి (Savitri) పక్కన హీరోగా ‘గంగాకీ లహరే’ (1964)లో నటించాడు. ఆ సంగతి సావిత్రికి, ధర్మేంద్రకు తప్ప ప్రేక్షకులకు తెలియదు. అంత ఫ్లాప్ ఆ సినిమా. ధర్మేంద్ర స్ట్రగుల్ కొనసాగింది.సినిమా పరిశ్రమలో ‘గాడ్ఫాదర్’ ఉండాలని అంటూ ఉంటారు. ధర్మేంద్రకు ‘గాడ్మదర్’ దొరికింది. ఆమె పేరు మీనా కుమారి. మన ‘నాదీ ఆడజన్మే’ సినిమాను హిందీలో ‘మై భీ లడ్కీ హూ’ (1964)గా రీమేక్ చేస్తుంటే మొదటిసారి మీనాకుమారితో నటించాడు ధర్మేంద్ర. మీనాకుమారి అప్పటికే తన వివాహ బంధం నుంచి బయటపడింది. ఆమె మనసు ఒక మంచి మిత్రుడి కోసం చూస్తోంది. ఆ సమయంలో సిగ్గరిగా, స్నేహంగా ఉన్న ధర్మేంద్ర ఆమెకు ఆప్తుడుగా అనిపించాడు. మీనాకుమారి పేరు మీద ఇంకా సినిమాలు ఆడుతున్న రోజులు అవి. అందువల్ల మీనాకుమారి ధర్మేంద్రను చాలా ప్రమోట్ చేసింది. వారిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. పూర్ణిమ (1965), కాజల్ (1965), ఫూల్ ఔర్ పత్థర్ (1966), చందన్ కా పల్నా (1967), ‘బహారోంకి మంజిల్’ (1968)... వీటిలో ఫూల్ ఔర్ పత్థర్ సూపర్హిట్. ఆ తర్వాత ధర్మేంద్ర ఆగలేదు. అతణ్ణి పెద్ద హీరో చేసిన మీనాకుమారి అతని జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.ఆశాఫరేఖ్, ధర్మేంద్ర జోడి ప్రేక్షకులకు నచ్చింది. ‘ఆయా సావన్ ఝూమ్ కే’... పాట రేడియోలో పెద్ద హిట్. సినిమా కూడా సూపర్హిట్. ‘ఆయా సావన్ ఝూమ్ కే’ సినిమాతో ధర్మేంద్ర కెరీర్ పూర్తిగా సెటిల్ అయ్యింది. ఇతను యాక్షన్, సెంటిమెంట్, రొమాంటిక్ సినిమాలు చేయగలడు అని ఇండస్ట్రీకి తెలిసిపోయింది. హీరోయిన్లు మాలాసిన్హా, సైరాబాను, వహీదా రెహమాన్, షర్మిలా టాగోర్ అందరూ ధర్మేంద్ర పక్కన నటించడానికి పోటీలు పడ్డారు. అయితే అతను నటించడానికి పోటీ పడిన హీరోయిన్ ఆ తర్వాతి రోజుల్లో వచ్చింది. హేమమాలిని!ధర్మేంద్రలో ఒక మంచి, సెన్సిబుల్ నటుడు ఉన్నాడు. ఆ సంగతిని హృషికేష్ ముఖర్జీ పసిగట్టాడు. ‘అనుపమ’ (1966), ‘సత్యకామ్’ (1968), ‘చుప్కే చుప్కే’ (1975)... ఇవన్నీ ధర్మేంద్రతో తీశాడు. ధర్మేంద్ర మొత్తం కెరీర్లో అత్యుత్తమ నటన ప్రదర్శించిన సినిమాగా ‘సత్యకామ్’ను విమర్శకులు గుర్తిస్తారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ‘చుప్కే చుప్కే’లో ధర్మేంద్ర వేసిన ‘ప్యారేమోహన్’ అనే పాత్రకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ధర్మేంద్ర కామెడీని ప్రేక్షకులు ఈ సినిమాలో ఎంతో ఎంజాయ్ చేశారు. విశేషం ఏమంటే ఇందులో ధర్మేంద్ర బోటనీ ప్రొఫెసర్. సినిమా రిలీజయ్యాక తండ్రికి చూపించి ‘నువ్వు కోరినట్టుగా నేను బోటనీ ప్రొఫెసర్ అయ్యాను చూడు’ అనంటే ఆయన ఎప్పటిలానే ‘ఏడ్చావులే బడుద్దాయి’ అని అని అక్షింతలు వేశాడు.ధర్మేంద్ర హీరో. అతను హీరోగా ఉంటే పక్క పాత్ర ఉంటుంది తప్ప వేరెవరో హీరోగా ఉంటే అతను పక్కపాత్ర కాదు. ‘షోలే’లో హీరో ధర్మేంద్ర. సినిమాలో ప్రాణాలతో మిగిలేది కూడా అతడే. కాని అమితాబ్ కూడా అసాధ్యుడిగా నటించాడు. ధర్మేంద్రకు రాజకీయాలు చేయడం తెలియదు. కొత్త తరం వస్తే అసూయ లేదు. ఒడ్డూ పొడవూ ఉన్న అమితాబ్ తనను దాటేస్తాడనే భయం లేకుండా ‘జయ్’ పాత్రకు అమితాబ్ను తీసుకోండని తనే ఒక మాట వేశాడు దర్శకుడికి. ‘షోలే’ (1975) విడుదలయ్యి మరికొన్ని రోజుల్లో 4కెలో రీరిలీజ్ అవనుంది. యాభై ఏళ్లుగా షోలే ఖ్యాతి ధర్మేంద్రను భారత ప్రేక్షకులకు చేరువ చేస్తూనే ఉంది. ప్రతి కొత్తతరం ఈ సినిమా చూసి ధర్మేంద్రకు ఫ్యాన్స్ అయ్యారు. ‘కుత్తే మై తేరా ఖూన్ పీజావూంగా’ డైలాగ్ ధర్మేంద్ర ఒక్కసారి చెప్తే ఆ తర్వాతి తరాలు వందసార్లు చెప్తూనే ఉన్నాయి.1980ల తర్వాత ధర్మేంద్ర మల్టీస్టారర్ సినిమాల్లో హీరోగా క్షణం తీరిక లేకుండా గడిపాడు. అదే సమయంలో తన కుమారుడు సన్ని డియోల్ను ‘బేతాబ్’ (1983)లో లాంచ్ చేసి హీరోగా నిలబెట్టాడు. కొడుకుతో ధర్మేంద్ర తీసిన ‘ఘాయల్’ కూడా సూపర్డూపర్ హిట్ అయ్యింది. ఈ కాలంలో హీరోగా ధర్మేంద్ర కొన్ని సినిమాలు చేస్తుంటే హీరోగా సన్నిడియోల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. డింపుల్ కపాడియా (Dimple Kapadia) వంటి హీరోయిన్లు ఇద్దరి సరసనా నటించారు. ఆ తర్వాత చిన్న కొడుకు బాబీ డియోల్ను ‘బర్సాత్’తో లాంచ్ చేశాడు ధర్మేంద్ర.ధర్మేంద్ర ఎప్పుడూ తన పని గురించి తప్ప ఎత్తులు పైఎత్తులు వేస్తూ కూచోలేదు. పంచాయతీలకు దిగలేదు. అనవసరంగా మీడియా ముందుకు రాలేదు. ఇన్నేళ్లలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తక్కువ. అవార్డు ఫంక్షన్లకు హాజరవడం, పార్టీలు ఇవన్నీ చాలా పరిమితంగా చేసేవాడు. ధర్మేంద్రకు రైతుగా ఉండడటం ఇష్టం. అందుకే కుమారులిద్దరూ కలిసి లోనావాలా దగ్గర 100 ఎకరాల ఫామ్హౌస్ ఏర్పాటు చేశాడు. సినిమాలను పూర్తిగా తగ్గించుకున్నా ఆ ఫామ్హౌస్లోనే ఎక్కువగా గడిపాడు ధర్మేంద్ర, ‘మీ వయసు ఎంత?’ అని ధర్మేంద్రను అడిగితే ‘అది కెమెరా చెప్తుంది’ అనేవాడు. కెమెరా తన కంటితో ఆయనను ఎప్పుడూ యంగ్గా, ఆరోగ్యవంతుడిగా, ధీరుడిగా, హీమాన్గానే చూపిస్తూ వచ్చింది. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఆయన ఆ రూపంతోనే మిగిలిపోతాడు. ధర్మేంద్ర నటించిన ‘గాడీ బులా రహీహై’ పాటలో ‘గాడీ’ అంటే మృత్యువుకు సంకేతం. ఇన్నాళ్లకు మబ్బుల సెట్టింగ్, మెరుపుల ఆర్క్ లైట్లు ఉన్న చోటుకు తీసుకెళ్లే గాడీ ఎక్కి తరలిపోయాడు ధర్మేంద్ర. గాడీ బులా రహీహై... సీటీ బజా రహీహై.హేమమాలినితో ప్రేమకథహిందీ సినిమాల్లో హేమమాలిని (Hema Malini) రాకను బాంబేలో పెద్ద దుమారంగా మార్చిన వ్యక్తి రాజ్కపూర్. హేమమాలిని హిందీలో హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ‘సప్నోంకా సౌదాగర్’ (1968)లో రాజ్కపూర్ హీరో. ఆ సినిమా పబ్లిసిటీ కోసం ‘డ్రీమ్ గర్ల్ హేమమాలిని’ అంటూ బాంబే అంతా హోర్డింగ్స్ పెట్టించాడు. అలా ఆమె బాలీవుడ్ హీరోల దృష్టిలో పడింది. ఆ వెంటనే ధర్మేంద్రతో ‘తుమ్ హసీ మై జవాన్’ (1969)లో నటించింది. ధర్మేంద్ర అప్పటికే వివాహితుడైనా, నలుగురు పిల్లల తండ్రయినా హేమమాలిని ఆకర్షణలో పడ్డాడు. సౌత్ హీరోయిన్లు హిందీలో ఎప్పుడూ టాప్స్టార్స్గానే ఉన్నారు. వహీదా రహెమాన్, వైజయంతీమాల, రేఖ... ఇప్పుడు హేమమాలిని. ఆమె స్నేహం కోసం అందరూ ఎదురు చూసిన వారే. వీరిలో మనోజ్ కుమార్, జితేంద్ర, సంజీవ్ కుమార్, ధర్మేంద్ర ఉన్నారు. ‘షోలే’ (1975) చేసే సమయానికి ధర్మేంద్ర ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆమెకు దగ్గరవడానికి ఆమెతో నటించే సీన్లలో రీటేక్ల కోసం లైట్బాయ్స్ను ఏదో ఒక తప్పు చేయమని తప్పుకు వంద రూపాయలు ఇచ్చేవాడు– ఆ రోజుల్లో. దాంతో హేమమాలినికి ధర్మేంద్ర అవస్థ తెలిసి వచ్చింది. అయినప్పటికీ ఇంట్లో అనంగీకారం, ధర్మేంద్ర మొదటి పెళ్లి కారణంగా హేమ మనసు ద్వైదీభావంతో ఉండేది. ఆ సమయంలోనే జితేంద్రతో దాదాపుగా ఆమె వివాహం వరకూ వెళ్లడం, మద్రాసుకు అందుకై వాళ్లు చేరుకోగా ధర్మేంద్ర మరో ఫ్లయిట్లో అక్కడకు వెళ్లి ఆమెను ఒప్పించి పెళ్లి కేన్సిల్ చేయడం ఆ రోజుల్లో వార్తగా వచ్చింది. చివరకు ధర్మేంద్ర, హేమమాలిని 1980లో వివాహం చేసుకున్నారు. ఇది పెద్ద వార్త. అయితే ధర్మేంద్ర తన కుటుంబాన్ని హేమమాలిని జీవితంలో జోక్యం చేసుకోకుండా, హేమమాలిని తాను అతని కుటుంబంలో జోక్యానికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ (Prakash Kaur) ఎప్పుడూ ఈ విషయమై ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేదు. వారి ఇద్దరు కుమార్తెల్లో ఇషా డియోల్ సినిమాల్లో రావడం ధర్మేంద్రకు అంగీకారంగా లేకపోయినా తర్వాత ఆమెతో పాటు కలిసి నటించాడు కూడా. ‘నేను నా కుమార్తెను నటించ వద్దు అన్నాను నిజమే. నన్ను నా తండ్రి నటించ వద్దు అన్నాడు కదా. సినిమా రంగంలో కెరీర్ ఎంపికపై తల్లిదండ్రుల అభిప్రాయం ఉండటం తప్పు కాదు’ అంటాడు ధర్మేంద్ర. అయితే ధర్మేంద్ర కుమారులు సన్ని డియోల్, బాబీ డియోల్ (Bobby Deol) తమ సవతి తల్లి కుమార్తెలతో అంత మంచి అనుబంధంలో ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. వారు నలుగురూ కలిసిన సందర్భాలు దాదాపుగా లేనట్టే.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర (Dharmendra) మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. ధర్మేంద్ర టాప్ 10 పాటలు1. యా దిల్ కి సునో దునియా వాలో ∙అనుపమ2. ఆప్ కే హసీన్ రుఖ్మె ఆజ్ నయా నూర్ హై ∙బహారె ఫిర్ భి ఆయేగీ3. బహారోంనె మేరా చమన్ లూట్ కర్ ∙దేవర్4. సాథియా నహీ జానా కె జీనా లగే ∙ఆయా సావన్ ఝూమ్ కే5. ఆజ్ మౌసమ్ బడా బే ఇమాన్ హై ∙లోఫర్6. పల్ పల్ పల్ దిల్ కే పాస్ ∙బ్లాక్ మెయిల్7. కోయి హసీనా జబ్ రూఠ్ జాతీ హై తో ∙షోలే8. ఓ మెరి మెహబూబా ∙ధరమ్ వీర్9. హమ్ బేవఫా హర్గిజ్ న థే ∙షాలిమార్10. జిల్మిల్ సితారోంకా ఆంగన్ హోగా ∙జీవన్ మృత్యుమాఫియాకి ధర్మేంద్ర హడల్1980లలో ప్రతి చిన్నా చితకా హీరోలకు మాఫియా నుంచి కాల్స్ వచ్చేవి. ‘భాయ్ మాట్లాడతాడట’ అనంటే అందరూ ఒణికిపోయేవారు. డబ్బులు కొందరు ఇచ్చేవారు. ఇలాగే ఒకసారి ధర్మేంద్రకు కూడా ఫోన్ వచ్చింంది. ధర్మేంద్ర ఫోన్ అందుకుని ‘మీరు ఎంత మంది ఉంటారు. ఒక పది మంది ఉంటారా? మీకు నేనొక్కణ్ణే చాలు. కాదు కూడదన్నారో ఒక ఫోన్ కొడితే మా పంజాబ్ నుంచి లారీలకు లారీలు కత్తులతో దిగుతారు. రండి చూసుకుందాం’ అన్నాడు. అంతే! మళ్లీ మాఫియా నుంచి ధర్మేంద్రకు ఫోన్ లేదు.నేను వెళ్లే గుడి పేరు ‘జిమ్’ధర్మేంద్ర మద్యపాన ప్రియుడు అనేది జగద్విదితం. సాయంత్రం ఏడు తర్వాత హరిహరాదులు ఏకమైనా ఆయన పెగ్ చేతిలోకి తీసుకోకుండా ఉండడు. రాత్రిళ్లు ఎంతసేపు ఎన్ని పెగ్గులు పుచ్చుకున్నా ఉదయం ఐదు గంటలకంతా జిమ్లో ఉండటం ఆయనకు అలవాటు. తుఫాను వచ్చినా కూడా ఈ అలవాటు చివరి వరకూ మానలేదు. ‘నేను, నా ఇద్దరు కుమారులు, ఇంటి స్త్రీలు కూడా జిమ్కు రోజూ వెళతారు. మా ఇంట్లో ఉండే జిమ్ మాకు గుడితో సమానం’ అంటారు ధర్మేంద్ర. ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. లోనావాలాలో ఫామ్హౌస్ పెట్టాక అక్కడి నుంచి రోజూ 15 లీటర్ల పాలు రైల్లో ముంబైకి చేరేది ధర్మేంద్ర పరివారం అవసరాలకు. ముంబైలో దొరికే పాలు కల్తీ అవుతాయనే కారణాన. -
చంద్రుని పుట్టుక కోసం..
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అంటూ అత్యంత కవితాత్మకంగా పలవరించాడు దాశరథి. చంద్రుని పుట్టుక కోసం నిజంగానే ఓ భారీ సురగోళం రాలి కనుమరుగైందట! అవున్నిజమే. భూమికి ఏకైక ఉపగ్రహమైన చందమామ ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచి్చంది. చాలాకాలం క్రితం, అంటే ఏకంగా 450 కోట్ల ఏళ్ల నాడు మన సౌరకుటుంబంలో అటూఇటుగా అంగారకుని సైజుతో కూడిన థెయా అనే భారీ గ్రహం కూడా ఉండేదట. ఆ లెక్కన పరిమాణంలో దాన్ని భూమికి అక్క వంటిదన్నమాట! అది కాస్తా (తొలి)నాటి భూమితో ఢీకొట్టి ముక్కలు చెక్కలైందట. వాటిలో చిన్నాచితకా ముక్కలన్నీ నామరూపాల్లేకుండా పోగా, మిగిలిపోయిన అతి పెద్ద భాగమే మన చందమామగా రూపుదిద్దుకుంది! అంటే చంద్రునికి జన్మనిచ్చే క్రమంలో దాని తల్లి ఏకంగా ప్రాణత్యాగమే చేసిందన్నమాట. అంతేకాదు, థెయా ఢీకొన్న ఫలితంగా భూ అక్షం కూడా భారీ మార్పుచేర్పులకు లోనై ఇప్పుడున్న క్రమంలోకి మారింది. దాంతో జీవకోటి ప్రాదుర్భావానికి, అందుకు అనువైన వాతావరణం అమరేందుకు భూమి మరింత వీలుగా మారిందట. అలా థెయా తాను కనుమరుగైపోతూ కూడా ఇటు భూమికి ఎనలేని సాయం చేయడమే గాక, అటు చంద్రునికి ఏకంగా ఉనికినే ఏర్పరచింది. గుట్టు విప్పిన ఐసోటోపులు థెయా ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే దాదాపుగా నిర్ధారించారు. అయితే అది ఎంత పరిమాణంలో ఉండేది, దాని మూలాలేమిటి, కూర్పు ఎలాంటిది వంటి ప్రశ్నలకు ఇంకా జవాబులు లభించాల్సే ఉంది. వీటికి సమాధానాలు కనిపెట్టేందుకు జర్మనీలోని మాక్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఒక భారీ ప్రయోగానికి తెరతీశారు. అందులో భాగంగా ఇనుము, రాళ్లు తదితరాలతో పాటు అపోలో అంతరిక్ష యాత్రలో భాగంగా చంద్రుని పై నుంచి, పలు సమీప ఉల్కల నుంచి వ్యోమగాములు తెచి్చన ఆరు నమూనాల ఐసోటోపులను పరీక్షించారు. ముఖ్యంగా భూమి, చంద్రుడు, ఉల్కల తాలూకు ఐసోటోపుల పరస్పర నిష్పత్తిని రివర్స్ ఇంజనీరింగ్గా పేర్కొనే ప్రక్రియ ద్వారా పోల్చి చూశారు. థెయా మన సౌరకుటుంబ లోపలి భాగంలోనే ఏర్పడిందని, అందులోనూ భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండేదని తేల్చారు. అంతేగాక సౌరమండలంలో భూ గ్రహం ఉన్న అకర్బన మండల పరిధిలోనే థెయా కూడా ఉండేదని అధ్యయన సారథి తిమో హాప్ వివరించారు. ‘‘భూమి కంటే కూడా సూర్యునికి థెయా దగ్గరగా ఉండేది గనుక మరింత వేడిగా, వాయుమయంగా ఉండేదన్నది వాస్తవం. భూమితో పోలిస్తే చంద్రుడు చాలా పొడిగా ఉండేందుకు ఇది కూడా ముఖ్య కారణమే’’ అని ఆయన వివరించారు. బుధ, శుక్ర గ్రహాల నుంచి కూడా నమూనాలను సేకరించగలిగిన నాడు థెయాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కచి్చతంగా వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను సైన్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మానసిక రుగ్మతలతో బేజార్
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, అది భారత్లో ఒకింత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అలాగే, పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రుగ్మతలు రెట్టింపు ఉన్నట్లు తేలింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2015–16, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)– 2019, లాన్సెట్ అధ్యయనం–2020 , మెంటల్ హెల్త్ అట్లాస్–2024, డబ్ల్యూహెచ్ఓ–2025 అధ్యయనాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న మానసిక రుగ్మతల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి.దేశంలో ప్రతి 100 మందిలో 11 మందికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో జీవిస్తుండగా.. భారత్లో ప్రతీ 100 మందిలో 11 మందికి ఈ సమస్యలు ఉన్నట్లు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే స్పష్టం చేసింది. అలాగే ప్రతీ 100 మందిలో 14 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి మానసిక సమస్యను ఎదుర్కొన్నట్లు తేలి్చంది. గ్రామాల్లో 6.9% మంది బాధితులు ఉండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 13.5 శాతంగా ఉంది. అలాగే, మానసిక రుగ్మతలు పురుషుల (10%) కంటే మహిళల్లో (20%) అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. మహిళల్లో నిరాశ, ఆందోళన వంటి సమస్యల కారణంగా మానసిక రుగ్మతలు పెరుగుతున్నట్లు తేలింది. ప్రత్యేకంగా 15–29 ఏళ్ల మధ్య ఉన్న వారిలో నిరాశ, ఆందోళన లాంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. మానసిక సమస్యల్లో నిరాశ 6.2%, ఆందోళన 4.7% ప్రధానమైనవిగా మెంటల్ హెల్త్ అట్లాస్ పేర్కొంది. ఆర్థిక భారంఅవగాహనలోపం, సామాజిక వివక్ష, నిపుణుల కొరత వల్ల 70% నుంచి 92% మంది సరైన మానసిక చికిత్స అందుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రతీ లక్ష మంది జనాభాకు ముగ్గురు మానసిక వైద్యులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేయగా, భారత్లో మాత్రం 0.75 మంది మానసిక వైద్యులే ఉన్నారు. మానసిక సమస్యలు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఆయుర్దాయం తగ్గడానికి కారణమవుతాయని తేలింది. మానసిక రుగ్మతల వల్ల ఉత్పాదకత తగ్గడం, వైద్యం వంటి పరోక్ష ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి మానసిక రుగ్మతల కారణంగా వైద్య ఖర్చులు, పరోక్ష ఖర్చులతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై భారం 16 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్పష్టం చేసింది. అవీ ఇవీ..⇒ మానసిక రుగ్మతల్లో మూడింట ఒక వంతు 14 ఏళ్ల వయస్సుకే మొదలవుతుండగా, సగం రుగ్మతలు 18వ ఏటి కల్లా, మూడింట రెండొంతులు 25 ఏళ్ల వయస్సు కల్లా మొదలవుతున్నాయి.⇒ ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం అధికంగా పడింది. ఆ సమయంలో బాధితుల సంఖ్య 25% పెరిగింది. ఉద్యోగాల కోతలు, ఆర్థిక అభద్రత వల్ల ఒత్తిడి స్థాయిలు, మానసిక సమస్యలు పెరిగాయి.⇒ కేంద్ర ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రులు బెంగళూరు (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో, తేజ్పూర్ (ఎల్జీబీఆర్ఐఎంహెచ్)లో, రాంచీ (సీఐపీ)లో ఉన్నాయి. అన్ని ఎయిమ్స్లలో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక వైద్య సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లు: 14416, 1800–891–4416⇒ 2023లో భారత్లో మానసిక రుగ్మతలతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 1,71,418 ⇒ వీరిలో 72.8% పురుషులు, 27.2% మహిళలు ⇒ ఈ సమస్యతో ఏటా ప్రపంచంలో జరిగే ఆత్మహత్యలు: 7,27,000 ⇒ సాధారణ ప్రజలతో పోలిస్తే మానసిక రుగ్మతలున్న వారు ఆత్మహత్యలు చేసుకునే ముప్పు: 16 రెట్లు ఎక్కువ ⇒ నిరాశ వల్ల గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు: 72 శాతం అధికం -
కొనకుండానే.. షి‘ కారు’!
ఇపుడు కారు లగ్జరీ కాదు. అవసరం. సిటీ ట్రాఫిక్లో కష్టమైనా సరే... కారుంటే కాస్త బెటర్. మరి కారు కొనాలంటే...? బీమా, ట్యాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అన్నీ కలిస్తే రోడ్డుమీదికొచ్చేసరికి తడిసి మోపెడు. ఈఎంఐతో పాటు డౌన్పేమెంటూ కావాలి. అందుకేనేమో..! యువతరం కారు కొనడానికన్నా లీజుకు తీసుకోవటానికే మొగ్గు చూపుతోంది. రోజూ కాస్త ఎక్కువ దూరమే ప్రయాణిస్తాం కనక తమకు ఇదే బెటర్ అంటోంది. నిజమేనా? కారు కొనటం మంచిదా లేక లీజుకు తీసుకోవటం మేలా? ఏది బెటర్? లీజులో ఉండే రిస్కులేంటి? అసలు మన తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు లీజుకు ఇస్తున్న కంపెనీలేంటి? లీజుకు తీసుకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలుసుకుందాం... – సాక్షి, వెల్త్ డెస్క్ లీజుపై ఆసక్తి ఎందుకంటే...→ కార్ల ధరలు ప్రియమయ్యాయి. దాదాపు రూ.13 లక్షల విలువైన ఎస్యూవీ... రోడ్డుమీదికి వచ్చేసరికి రూ.18–19 లక్షలవుతోంది. కొనాలంటే రూ.3–4 లక్షల డౌన్ పేమెంటూ కావాలి. → లీజుకు తీసుకుంటే డౌన్పేమెంట్ అక్కర్లేదు. → అవసరమైనపుడు బీమా కంపెనీలతో పేచీలు అక్కర్లేదు. → పదేపదే సర్వీసు సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. → కారు మార్చాలనుకున్నపుడు విక్రయించే బాధ కూడా లేదు. లీజింగ్ అనుకూలమేనా? అనుకూలమనే చెప్పాలి. ప్రతి రెండు మూడేళ్లకు కార్లను మార్చేవారికి... బీమా చెల్లింపులు, సర్వీసింగ్, టైర్లు– బ్యాటరీలు మార్చటం వంటి బాదరబందీలు వద్దనుకునే వారికి... తరచూ ఉద్యోగరీత్యా ప్రాంతాలు మారేవారికి ఇది అనుకూలమే.వీరికి కొనుక్కుంటేనే బెటర్...కారును కనీసం 8 నుంచి పదేళ్లు మార్చకుండా ఉంచుకునే వారికి... ఏడాదికి 20వేల కి.మీ. కన్నా ఎక్కువ తిరిగే వారికి.. కారును నచి్చనట్లు మార్చుకోవాలనుకునే వారికి కొనుక్కోవటమే నయమని చెప్పాలి. అసలు ఏంటీ లీజింగ్?→ లీజింగ్ కంపెనీయే కారు కొని రిజి్రస్టేషన్ చేయిస్తుంది. బీమా చేయించటంతో పాటు నిర్వహణ కూడా చూసుకుంటుంది. నెలనెలా అద్దె చెల్లించి దాన్ని లీజుకు తీసుకోవచ్చు. లీజు పీరియడ్ అయిపోయాక కారు ఇచ్చేయొచ్చు. ఇపుడిపుడే ఇండియాలో విస్తరిస్తున్న ఈ విధానం యూరప్, అమెరికాల్లో చాలా కాలంగాఉన్నదే.లీజు కంపెనీల్లో తేడాలేంటి?→ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిక్స్, మైల్స్, రెవ్ వంటి సంస్థలు ఈ లీజు సేవలు అందిస్తున్నాయి. → ఒరిక్స్కు తయారీదార్లతో ఒప్పందాలున్నాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ లీజింగ్ సేవలందిస్తోంది. లాకిన్ పీరియడ్ ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. ముందే గనక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే కొంత ఫీజుంటుంది. → మైల్స్ లాకిన్ పీరియడ్ మూడు నెలలతో మొదలవుతుంది. కొత్త కార్లతో పాటు వాడేసిన సర్టిపైడ్ కార్లనూ అందించటం దీని ప్రత్యేకత. దీర్ఘకాలం లాకిన్ వద్దనుకునే వారికిది అనుకూలం. → రెవ్ సంస్థ నెలరోజుల సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. ఇక 1–4 ఏళ్ల లాకిన్తో ఈఎంఐ లీజింగ్నూ అందిస్తోంది. హ్యుందాయ్ కార్లలో చాలా వాటిని లీజుపై ఇస్తున్నది ఈ కంపెనీయే.→ కారు లీజింగ్ → కారు కొనడంఏకమొత్తం చెల్లింపు→ తొలినెల అద్దె+ సెక్యూరిటీ డిపాజిట్ → 15–20 శాతం డౌన్పేమెంట్తో పాటు బీమా, ఆన్రోడ్ చార్జీలు.నెలవారీ ఎంత?→ స్థిరమైన అద్దె (బీమా, నిర్వహణ ఛార్జీలు కలిసే ఉంటాయి) → ఈఎంఐతో పాటు బీమా, నిర్వహణ చార్జీలూ ఉంటాయి.ఓనర్షిప్→ గడువు ముగిశాక వాహనం తిరిగి ఇచ్చేయాలి. → రుణం తీరాక వాహనం సొంతమవుతుంది. రీసేల్ చేయొచ్చు.పన్ను ప్రయోజనాలు→ ఉద్యోగస్తులకు వారి కంపెనీ పాలసీ ప్రకారం ప్రయోజనాలు ఉంటాయి. అద్దె మినహాయింపు ఉంటుంది కనుక వ్యాపారాలకూ అనుకూలమే. → నేరుగా ఎలాంటి పన్ను ప్రయోజనాలూ ఉండవు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీజు విధానాలు అందుబాటులో ఉన్నాయంటే.. → కార్పొరేట్ లీజింగ్→ కనీస లీజు కాలం 2 నుంచి ఐదేళ్లుంటుంది. బీమా, నిర్వహణ, రోడ్ ట్యాక్స్, బ్రేక్డౌన్ సపోర్ట్ అన్నీ లీజింగ్ కంపెనీయే చూసుకుంటుంది. → ఎవరికి అనుకూలం?: కంపెనీలకు, ఎక్కువ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్కు → సానుకూలాంశాలు: డౌన్పేమెంట్ అవసరం లేదు. నిర్వహణ తలనొప్పులేవీ ఉండవు. → ప్రతికూలాంశాలు: దీర్ఘకాలం లాకిన్ పీరియడ్. ఈఎంఐతో పోలిస్తే నెలవారీ అద్దె కాస్త ఎక్కువ చెల్లించాల్సి రావటం.→ లీజ్ టు ఓన్ → లీజు కాలం ముగిసిన తరువాత వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. నిర్వహణ వ్యయాలను లీజింగ్ కంపెనీ, లీజుదారుడు తలాకొంత భరించాల్సి ఉంటుంది. → ఎవరికి అనుకూలం?: చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, స్వయం ఉపాధి వారికి ఇది అనుకూలమనే చెప్పాలి. ఎందుకంటే నెలవారీ చెల్లింపులు ఈఎంఐకి అటూఇటుగా ఉంటాయి. → కార్ సబ్స్క్రిప్షన్ → దీన్లోనూ డౌన్పేమెంట్ ఉండదు. బీమా, సర్వీసు చార్జీలను కంపెనీయే చూసుకుంటుంది. దాదాపుగా నెల నుంచి రెండేళ్లవరకు పీరియడ్తో మైల్స్, రెవ్, క్విక్లిజ్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఈ విధానంలో క్రెటా వంటి మిడ్సైజ్ ఎస్యూవీలకు నెలకు రూ.30 వేల నుంచి 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. → నెలవారీ రెంటల్స్... → తాత్కాలికంగా కారు కావాలనుకునేవారికి, ప్రాజెక్టు పనులపై వచి్చనవారికి, ట్రావెలర్స్కి కనుక తామే డ్రైవ్ చేసుకునేలా కార్లు కావాలంటే జూమ్కార్, రెవ్, మైల్స్ వంటి కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. → ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్లే తీసుకోవచ్చు. లాకిన్ పీరియడ్ ఉండదు. కాకుంటే నెలవారీ చెల్లింపు కాస్త ఎక్కువ ఉంటుంది.→ కార్ల కంపెనీల సబ్స్క్రిప్షన్... → మారుతి, హ్యుందాయ్ వంటి సంస్థలు ఒరిక్స్, రెవ్, మైల్స్ వంటి కంపెనీల ద్వారా ఈ విధానంలో వాహనాలను అందిస్తున్నాయి. ఈ విధానంలో కొత్త కారును నేరుగా తయారీ కంపెనీ నుంచే తీసుకోవచ్చు. → స్విఫ్ట్ వంటి కార్లు నెలకు రూ.18,350 నుంచి లభిస్తున్నాయి. బ్రాండ్ సపోర్ట్తో పాటు నెలవారీ ఎంత చెల్లించాలో ముందే తెలుస్తుంది.డబ్బులిచ్చే స్వతంత్రమే వెల్త్దశాబ్దాలుగా మన ఆర్థిక ఆలోచనలు యాజమాన్యం చుట్టూనే తిరుగుతున్నాయి. ఇల్లు, భూమి, కారు, బంగారం ఏదైనా కొనటమే. కానీ ఇప్పటి మధ్య తరగతి ఈ నియమాల్ని తిరగరాస్తున్నారు. నేటి యువతరం ‘దీన్నెలా కొనాలి?’ అని కాకుండా ‘దీన్నెలా సొంతం చేసుకోవాలి?’ అని ఆలోచిస్తున్నారు. కార్లను లీజుకు తీసుకుంటున్నారు. ల్యాప్టాప్లకు అద్దె చెల్లిస్తున్నారు. సబ్ర్స్కిప్షన్ ఫోన్లు, కో–లివింగ్ ఇళ్లు ఇవన్నీ దీన్లో భాగమే. సొంతం చేసుకోవటం కన్నా దాన్ని ఉపయోగించుకోవటం మీదే ఫోకస్ పెడుతున్నారు. లగ్జరీకి బదులు తమకొచ్చే ఆదాయాన్నే దృష్టిలో ఉంచుకుంటున్నారు.డౌన్పేమెంట్లు, రుణాల్లో మునిగిపోయే బదులు చేతిలో నగదు, ట్రావెలింగ్, ఇన్వెస్ట్మెంట్లు, కొత్త అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి ఆర్థికంగా మంచిదే. గాడ్జెట్లు అద్దెకు తీసుకోవటం వల్ల టెక్నాలజీ మార్పుల్ని ఎదుర్కోవచ్చు. కో–లివింగ్తో దీర్ఘకాల కమిట్మెంట్లు ఉండవు. సబ్స్క్రిప్షన్లతో మిగిలే మొత్తాన్ని సిప్లు, బాండ్ల వంటి పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. అలాగని ‘సొంతం’ సంస్కృతి పోయేదేమీ కాదు. ఇది కాస్త స్మార్ట్గా సొంతం చేసుకోవటమంతే!. సంపదకు నేటి మధ్య తరగతి కొలమానం తమ దగ్గరుండే వస్తువులు కాదు. చేతిలోని డబ్బులిచ్చే స్వతంత్రమే. ఈ విధానాలపై సరైన సమాచారాన్నిస్తూ పాఠకుల కరదీపిక కావటానికే ఈ సాక్షి వెల్త్. – ఎడిటర్ -
అడుగడుగునా ఉచ్చులు.. ఉసురు తీసే ప్రమాదాలు!
నల్లమల అటవీ ప్రాంతంలో పులలకు రక్షణ కరువైంది. ఒక వైపు వేటగాళ్ల ఉచ్చులు.. మరో వైపు ఆహారం, నీటి కోసం జనారణ్యం వైపు వస్తూ పులులు ప్రమాదాలకు గురువుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నామన్నా నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. నల్లమలలో పులి గాండ్రిపులు వినిపించాలంటే వాటి సంరక్షణను అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అవి ఎక్కువగా సంచరించే రహదారుల సమీపంలో అండర్, అప్పర్పాస్లు ఏర్పాటు చేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దదోర్నాల: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వుడు నల్లమల ప్రాజెక్టులో మొత్తం 87 పెద్ద పులులున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత పులులు మరో 200 నుంచి 205 వరకు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. నల్లమల పరిధిలోని మార్కాపురం, నెక్కంటి, గంజివారిపల్లి, కొర్రపోలు, దోర్నాల, విజయపురిసౌత్, యర్రగొండపాలెం అటవీ రేంజీ పరిధిలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. అయితే వేటగాళ్ల ఉచ్చులు, రోడ్డు ప్రమాదాలతో పాటు అనారోగ్య సమస్యలతో నల్లమలలోని కొన్ని వన్యప్రాణుల మునుగడ ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే కొన్ని రకాల చిరుతలు అంతరించి పోగా, నమీబియా లాంటి దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నల్లమలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవుల్లో రెండో స్థానం చిరుత పులులది. వీటి జీవిత కాలం 12 నుంచి 15 ఏళ్లు మాత్రమే. పెద్దపులులు, చిరుతపులులు ఆహారం, నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖాధికారులు వన్యప్రాణుల సంరక్షణకు అన్నీరకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్పిట్లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చారు. ఆహారం కోసం అవి సమీప గిరిజన ప్రాంతాల వైపు వస్తూనే ఉన్నాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు.. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. అభయారణ్యాలలో అండర్, ఓవర్ పాసులు ఏర్పాటు చేయాలి.. శ్రీశైలం వెళ్లే భక్తులు, నల్లమల అటవీ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటక ప్రేమికులు సౌకర్యవంతమైన ప్రయాణాలతో పాటు, నల్లమల అభయారణ్యంలో వణ్యప్రాణులు సురక్షితంగా సంచరించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలతో అవి ప్రమాదాలకు గురి కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. రోడ్డుకు ఓ వైపు నుంచి మరో వైపుకు వెళ్లే విధంగా అండర్ పాస్లు, ఓవర్ పాస్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారికి పై భాగంలో ఏర్పాటు చేసే వంతెన( ఓవర్ పాస్)లు, మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డుకు కింది భాగాన ఏర్పాటు చేసే బ్రిడ్జి (అండర్పాస్)ల ద్వారా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే వీలుంటుందని వారు సూచిస్తున్నారు. వీటి ఏర్పాటుపై అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. చనిపోతున్న పులులు, చిరుతలు» జనారణ్యంలోకి వస్తున్న పులులు, చిరుతలు మృత్యువాత పడుతున్నాయి. » 2024లో అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలో విద్యుత్ కంచె తగిలి చిరుత మృతి చెందింది. » 2023 నవంబర్ 10న శ్రీశైలం ఘాట్లో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. » 2023 సంవత్సరం నవంబర్ 6వ తేదీన మండల పరిధిలోని రోళ్లపెంట వద్ద కోతిని వేటాడబోయిన చిరుతపులి కోతితో సహా నీళ్లలో పడి మృత్యవాత పడింది. » 2022 జనవరి 22వ తేదీన ఆర్ చెలమ బావి వద్ద కోతులను వేటాడుతూ రోడ్డును దాటుతున్న ఓ చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే చిరుత మృతి చెందింది. » 2022 జనవరి 13వ తేదీన శ్రీశైలం రహదారిలోని జంగిల్ సఫారీ వద్ద రోడ్డును దాటుతున్న చిరుతపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో చిరుత మృత్యువాత పడింది. » 2021 నవంబర్ 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు రైలుకిందపడి పెద్దపులి మృతి చెందింది. » 2020 ఏప్రిల్లో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండ అటవీ ప్రాంతంలో వృద్ధాప్యంతో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక పెద్దపులి మృతి చెందింది. వీటితో పాటు మండల పరిధిలోని చెంచుకుంట వద్ద రైతులు పెట్టిన విషాహారం తిని చిరుతపిల్ల మృత్యువాత పడింది. దేవలూడు ప్రాంతంలో చిరుతను చంపి గుర్తులు లేకుండా కొందరు దుండగులు తగలబెట్టారు. దీంతో పాటు గతంలో తుమ్మల బైలు, శ్రీశైలం ముఖద్వారం వద్ద చిరుత పులులు రోడ్డును దాటే క్రమంలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మృత్యువాత పడిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. -
తిండికి తక్కువే..!
మూడు పూటలా భోజనం. మధ్యమధ్యలో టీ. సాయంత్రం అయ్యిందంటే బజ్జీలు, చాట్ ఏదైనా కడుపులో పడాల్సిందే. అంతేనా? పండ్లు, బిస్కెట్లు వంటివి కూడా ఉంటాయిగా. దాదాపు ప్రతి ఇంటా కథ ఇలాగే ఉంటుంది. ఈ లెక్కన ఓ నలుగురు ఉన్న కుటుంబంలో తిండికి తడిసిమోపెడు అవుతుంది అనుకుంటే పొరపాటే. తిండికంటే ఎక్కువగా వినియోగ వస్తువులు–సేవలు, మన్నికైన వస్తువులపై భారతీయులు అధికంగా వెచి్చస్తున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. మన దేశంలో తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన జీవన ప్రమాణాలపై ఆశలు, ఆకాంక్షలు.. వెరసి కుటుంబాలు ప్రతినెలా చేస్తున్న వినియోగ వ్యయాల తీరు మారుతోంది. ఆహారం కంటే అధికంగా వినియోగ వస్తువులు, మన్నిక కలిగిన వాటి కోసం (కన్జ్యూమబుల్స్, డ్యూరబుల్స్) ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారత్లో కొనుగోళ్ల తీరుతెన్నులను వివరిస్తూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) తాజాగా ఓ సర్వే చేసింది. 2011–12లో చేపట్టిన నేషనల్ శాంపిల్ సర్వేతో పోలుస్తూ 2023–24 నాటికి వచి్చన మార్పులతో ఈ గృహ వినియోగ వ్యయ సర్వేకు రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఈఏసీ–పీఎం ప్రతినిధులు షమికా రవి, సింధుజ పెనుమర్తి రూపొందించిన ఈ నివేదికను ఈఏసీ–పీఎం ఇటీవల విడుదల చేసింది.పల్లెలకూ పాకిన సంస్కృతి.. దేశంలో 12 ఏళ్లలో మారిన వ్యయాల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పల్లెల్లోనూ ఆహారం కోసం చేస్తున్న వ్యయాలు 52.9% నుంచి 47 శాతానికి తగ్గాయి. గృహ వ్యయంలో ఆహారేతర వస్తువుల వాటా మొత్తం ఏకంగా 53% ఎగబాకింది. పట్టణవాసుల తొలి ప్రాధాన్యత డ్యూరబుల్స్, కన్జ్యూమబుల్స్దే. వీటి వాటా 57.4% నుంచి 60.3 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఆహారానికి చేస్తున్న ఖర్చు 42.6% నుంచి 39.7 శాతానికి పడిపోయింది. దుస్తులు, పాదరక్షలు వంటి ప్రాథమిక అవసరాల నుంచి వ్యక్తిగత వస్తువులు, కిచెన్ ఉపకరణాలు, గృహోపకరణాలు, వాహనాలపై.. అంటే ఆస్తి నిర్మాణం వైపు వ్యయాలు మారుతున్నాయి. జీవన ప్రమాణాలపై.. ప్రజల్లో అవగాహన, రుణ లభ్యత పెరగడం, మెరుగైన ఆర్థిక వ్యవస్థ.. వ్యక్తిగత ఉత్పాదకత, జీవన ప్రమాణాలపై సానుకూల ప్రభావం చూపుతోంది. మోటారు వాహనాలు, టీవీలు, మొబైల్ హ్యాండ్సెట్స్, రిఫ్రిజిరేటర్లు సొంతం చేసుకునేందుకు జనం మొగ్గుచూపుతున్నారు. అయితే టీవీల కొనుగోలు పట్టణ ప్రాంతాలలో కొంతతగ్గింది. మొబైల్ ఫోన్లను టీవీలకు ప్రత్యామ్నాయంగా భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోందని నివేదిక వివరించింది. గృహోపకరణాల్లో రిఫ్రిజిరేటర్లదే పైచేయి. పట్టణ ప్రాంతాల్లో వీటి కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. మన్నికైన వస్తువులు (డ్యూరబుల్స్): టీవీ, ల్యాప్టాప్/పీసీ, మొబైల్ ఫోన్, టూవీలర్, కారు, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ/కూలర్.వినియోగ వస్తువులు (కన్జ్యూమబుల్స్), సేవలు: సబ్బులు, సౌందర్య సాధనాలు, స్టేషనరీ, మందులు, పెట్రోల్/డీజిల్, విద్య, వైద్యం. -
టెంపుల్ టౌన్ జాబితాలో మరో ఆలయం
మంథని: ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచిన మంత్రపురి వేదాలకు పుట్టినిల్లు. వేయి సంవత్సరాలకు పైగా మహోన్నత చరిత్ర కలిగిన మంత్రపురి దేవాలయాలకు నిలయమై టెంపుల్ టౌన్గా కూడా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా అష్టభుజ వినాయకుని గుడి, దక్షిణ భారతదేశంలో ఏకైక పశ్చిమముఖ శివలింగం పెద్దపల్లి జిల్లా మంథనిలోనే దర్శనమిస్తాయి. మంథనిలో ఒక్క వేంకటేశ్వర స్వామి ఆలయం మినహా అన్నిదేవతల ఆలయాలను పురాణకాలంలోనే నిర్మించారు. ఇటీవల మరిన్ని దేవాలయాలు వెలిశాయి. తాజాగా గురువారం తెలంగాణలో కొత్తగా మూడు దేవాలయాలు నిర్మించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ప్రకటించారు. ఇందులో కరీంనగర్, దుబ్బాక, మంథనికి చోటు కల్పించారు. కాగా మంథని మండలం కన్నాల గ్రామంలో సెంటిమెంట్ టెంపుల్గా పేరున్న శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. కానీ, టీటీడీ (TTD) దేవాలయ నిర్మాణంలో మంథనిలో అన్ని దేవాలయాలకు ప్రసిద్ధిగా పరిఢవిల్లనుంది. అన్ని దేవతామూర్తుల ఆలయాలు ప్రసిద్ధి గాంచిన మహాలక్ష్మీ అమ్మవారి దేవాలయంతోపాటు కన్యకా పరమేశ్వరి, లలితాదేవి, సరస్వతీ అమ్మవారి దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే 11 పురాతన హనుమాన్ దేవాలయాలతో పాటు నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయం.. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశ్చిమ ద్వారం, పశ్చిమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. మరో ఐదు శివాలయాలు ఉన్నాయి. మంథని పట్టణానికి ఉత్తర ముఖంలో వెలసిన మహాగణపతి ఆలయం భక్తులకు అభయమిస్తూ పూజలు అందుకుంటోంది. పూజల్లో మొదటి ఆదిదేవుడైన గణపతినే కొలుస్తారు. ఇక్కడ గణపతికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది. గౌతమేశ్వరుడు మంథని (Manthani) పట్టణ సమీపంలో ప్రవహిస్తున్న గోదావరి నది పక్కన ఎత్తయిన ప్రదేశంలో ప్రాచీన కళ ఉట్టిపడుతుండేదే గౌతమేశ్వరాలయం. శతాబ్ద కాలం క్రితం ఈ దేవాలయాన్ని వొజ్జల కిష్టయ్య అనే వ్యక్తి పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం (Temple) ఎన్నోసార్లు గోదావరి నది ఆటుపోట్లకు గురైనా చెక్కు చెదరకుండా ఉంది. దేవాలయ ప్రాంగణంలోని పురాతన ఆలయాలు కొంత మేరకు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంగణంలో శివపంచాయనం, రామాలయం, సరస్వతి, లక్ష్మీదేవిల ఆలయాలు ఉన్నాయి. దత్తాత్రేయ ఆలయం మంథని పట్టణ సరిహద్దులో నిర్మించిన దత్తాత్రేయ ఆలయం ఈ ప్రాంత భక్తులకు కొంగుబంగారమైంది. అరవై ఏళ్ల క్రితం మంథనికి చెందిన దోమల రాధమ్మ శిష్యుడైన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి మహారాజాకిషన్ ప్రసాద్ సహాయంతో ఈ దేవాలయం రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఏటా ఈ ఆలయంలో దత్తాత్రేయ జయంతి వేడుకలను, నవరాత్రులను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. శీలేశ్వర – సిద్ధేశ్వర ఆలయం పట్టణ నడిబొడ్డున వెలసిన శీలేశ్వర–సిద్ధేశ్వరాలయం మంథని చరిత్రకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. కాకతీయ సైన్యా«దీశుడు శీలప్పనాయుడు, సిద్ధప్పనాయుడుల జ్ఞాపకార్థం ఈ దేవాలయాన్ని ప్రోలరాజు నిర్మించినట్లు తెలుస్తోంది. మంథనికి చెందిన లోకె రామన్న రామానాంద్ర సరస్వతీ స్వామిగా సన్యాసం స్వీకరించి 1942లో ఆలయాన్ని పునరుద్ధరించారు. సుందరమైన శిల్పసంపదతో నిర్మించిన ఈ ఆలయంలో రెండు దేవాలయాలు ఉన్నాయి. దేవాలయంలో గర్భగుళ్లకు ఇరువైపులా నల్లరాతితో చెక్కిన నందీశ్వరులను, నాట్య మయూరిల విగ్రహాలను ఏర్పాటు చేశారు. చింతపండు స్వామి వీణవంక నుంచి చింతపండు బండ్లపై వచి్చన లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని వరదరాజ స్వామి ఆలయంలో ప్రతిíÙ్ఠంచారు. ఈ దేవాలయానికి మంథని చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుడ విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆండాళ్ అమ్మవారు, గోదాదేవి, శ్రీకృష్ణార్జునుల విగ్రహాలు దర్శనమిస్తాయి.పశ్చిమ ముఖ శివలింగం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా పశి్చమ ద్వారం, పశి్చమ ముఖం కలిగిన శివలింగం మంథనిలో మాత్రమే ఉంది. భిక్షేశ్వరాలయంగా పిలిచే ఈ ఆలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీలేశ్వర– సిద్ధేశ్వర దేవాలయం, సురాబాండేశ్వరుడు, గౌతమేశ్వరుడు, ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నారు. వీరబ్రహ్మంగారి దేవాలయం, షిరిడీసాయి ఆలయం, అయ్యప్ప దేవాలయం, రేణుకా ఎల్లమ్మ దేవాలయం, బలవీర హనుమాన్ ఆలయం, నాగదేవత ఆలయం, కాళీకాదేవి, గంగాదేవి, బద్దిపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. ప్రాచీన చరిత్ర కలిగిన మంథనిలో ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని అనడానికి మంత్రపురిలోని ఆలయాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.. -
నాటి రిఖీ.. నేటి రవి చౌదరి!
అదొక అద్భుతం. బాలీవుడ్ సినిమాకు తీసిపోని వాస్తవం. పదహారేళ్ల వయసులో తలకు బలమైన గాయమై.. గతాన్ని పూర్తిగా మరిచిపోయి అదృశ్యమయ్యాడొక వ్యక్తి. చిత్రంగా అదే వ్యక్తి సరిగ్గా 45 ఏళ్ల తర్వాత.. మరో గాయంతో పాత జ్ఞాపకాలన్నీ ముసురుకుని కుటుంబాన్ని చేరుకున్నాడు. ఆయనే నాటి రిఖీ.. నేటి రవి చౌదరి.భారమైన బతుకుల్లో ఆనందభాష్పాలు హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లా, నది గ్రామంలో ఇటీవల ఈ అపూర్వ కలయిక జరిగింది. కొడుకు చనిపోయాడని ఇన్నాళ్లు భారంగా బతికిన తల్లిదండ్రులు, తోబుట్టువులు.. తమ ప్రియమైన రిఖీని అతడి భార్యాబిడ్డలతో సహా చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆరోజు.. ఆ గ్రామంలో సంగీతం, పూల వర్షం, ఆనందభాష్పాలు తప్ప మరేమీ కనిపించలేదు.గాయంతో పునర్జన్మ..రిఖీ అనే యువకుడు 1980లో హరియాణాలోని యమునా నగర్లో ఒక హోటల్లో పనిచేసేవాడు. అంబాలా వెళ్లే మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం తగిలింది. ఆ గాయం అతని మెదడులోని ప్రతి జ్ఞాపకాన్ని తుడిచి పెట్టేసింది. పేరు, ఊరు, కుటుంబం.. అన్నీ మరిచిపోయి జీవచ్ఛవంలా మిగిలాడు. కొత్త స్నేహితులు అతనికి రవి చౌదరి అని పేరు పెట్టారు. గతం తెలియని రవి, ముంబైకి చేరుకుని చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. తరువాత మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లి, అక్కడి ఒక కాలేజీలో పనిచేస్తూ స్థిరపడ్డాడు. అక్కడే సంతోషి అనే అమ్మాయిని వివాహం చేసుకుని, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.మలుపు తిప్పిన మరో గాయంకొన్ని నెలల క్రితం, అతడి జీవితాన్ని మళ్లీ మార్చే మరో సంఘటన జరిగింది. అతని తలకు మరో చిన్న గాయమైంది. అంతే.. రవికి నిద్రలో అస్పష్టమైన దృశ్యాలు కనిపించడం మొదలయ్యాయి. తన గ్రామం నదిలోని మామిడి చెట్టు, సన్నని దారులు, సటౌన్ అనే చోట ఉన్న ఇంటి పెరడు.. ఇవే రవికి పదే పదే కలలో కనిపించాయి. అవి కలలు కావు.. ఒకప్పటి జ్ఞాపకాలని తెలుసుకోవడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. వెంటనే, అతను ఒక కాలేజీ విద్యార్థి సహాయంతో సటౌన్ వివరాల కోసం వెతకడం మొదలుపెట్టాడు. గూగుల్లో నది గ్రామం గురించి వెతుకుతున్నప్పుడు, వారికి ఒక కేఫ్కు సంబంధించిన ఫోన్ నంబర్ దొరికింది. రిఖీ ఆ నంబర్కు ఫోన్ చేసి, గ్రామ పెద్ద రుద్ర ప్రకాశ్తో మాట్లాడాడు. మాటామంతీ తర్వాత.. రిఖీ బంధువులలో ఒకరైన ఎం.కె.చౌబేకు పాత విషయాలు గుర్తుకొచ్చాయి. ఈ వివరాలన్నీ సరిపోలడంతో, చివరకు నవంబర్ 15న రిఖీ.. 45 ఏళ్ల నిరీక్షణకు తెరదించి కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు.శాస్త్రానికి అందని అద్భుతం ‘గాయం కారణంగా కోల్పోయిన జ్ఞాపకాలు తిరిగి రావడం అనేది అత్యంత అరుదుగా, అద్భుతాలలో మాత్రమే జరుగుతుంది. వైద్య పరీక్షలు, బ్రెయిన్ స్కానింగ్ల తర్వాతే దీనికి కచి్చతమైన కారణం తెలుస్తుంది’.. అని మానసిక ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆదిత్య శర్మ పేర్కొన్నారు. 45 ఏళ్ల నిశ్శబ్దం, తరాల అంతరం.. వీటన్నింటినీ ఒకే ఒక్క జ్ఞాపకం ఛేదించింది. కుటుంబ బంధాన్ని తిరిగి కలిపింది. కాలం చేసిన గాయానికి వైద్యం చేసే శక్తి ప్రేమకు మాత్రమే ఉందని ఈ సంఘటన రుజువు చేసింది. రిఖీ, రవి చౌదరిగా.. ఇప్పుడు రెండు జీవితాల సారాన్ని తనలో నింపుకొన్నాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గర్భధారణకు కారణమయ్యే... జెనెటిక్ స్విచ్
మహిళల్లో గర్భధారణకు అంకురార్పణ చేసే అత్యంత మౌలికమైన జెనెటిక్ స్విచ్ (జన్యు మీట)ను మన సైంటిస్టులు కనిపెట్టారు! పిండం గర్భాశయ ద్వారంలోకి సజావుగా చేరేందుకు వీలు కల్పించేది ఇదేనట! కనుక ఏ కోణంలో చూసినా దీన్ని జన్యు శాస్త్రంలోనే గాక ప్రసూతి వైద్యంలోనూ అతి పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. జన్యు శాస్త్ర ప్రస్థానాన్నే పునర్ నిర్వచించగలదని భావిస్తున్న ఈ కీలక పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ ప్రత్యుత్పత్తి, శిశు వైద్య పరిశోధన సంస్థ (ఎన్ఐఆర్ఆర్ సీహెచ్), ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు సారథ్యం వహించడం విశేషం. పిండాన్ని తనలోకి స్వీకరించేందుకు గర్భాశయం సన్నద్ధం కావడం వెనక ఇమిడి ఉండే కీలకమైన కణజాల పనితీరును మన సైంటిస్టులు ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చారు. గర్భధారణ జరగాలంటే బుల్లి పిండం గర్భ సంచి మార్గంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని ఇంప్లాంటేషన్ గా పిలుస్తారు. గర్భధారణ దిశగా ఇది తొలి అడుగు మాత్రమే కాదు, ఒకరకంగా పునరుత్పత్తి ప్రక్రియ అంతటిలోనూ ఇదే అత్యంత కీలకం. గర్భ విచ్ఛిత్తికే గాక, చివరికి వంధ్యత్వానికి కూడా ఇంప్లాంటేషన్ లో వైఫల్యమే మూల కారణం!ఇలా చేశారు...హోక్సా10, ట్విస్ట్2 అనే రెండు కీలక జన్యువులను సైంటిస్టులు తమ పరిశోధన క్రమంలో గుర్తించారు. గర్భధారణ విషయంలో ఇవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులుగా పని చేస్తూనే, అంతిమంగా అందుకు వీలు కల్పించడం విశేషం! ఎందుకంటే హోక్సా10 సాధారణంగా గర్భాశయ ద్వారాన్ని రక్షణాత్మక కణజాలాల సాయంతో నిత్యం మూసి ఉంచి కాపాడుతూ ఉంటుంది. ఇందుకోసం అది అనునిత్యం ఏకంగా 1,200 కణాలను నియంత్రిస్తూ ఉంటుంది. కానీ, సరిగ్గా పిండం ఆ ద్వారం వైపు వచ్చే వేళకు హోక్సా10 తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మరోలా చెప్పాలంటే దాని పనితీరు స్తంభిస్తుందన్నమాట. మరుక్షణమే ట్విస్ట్2 ఒళ్లు విరుచుకుని క్రియాశీలకం అవుతుంది. గర్భాశయ కణజాలాన్ని మృదువుగా మార్చి పిండం దాని ద్వారం గుండా సజావుగా లోనికి సాగేలా చేస్తుంది. హోక్సా10, ట్విస్ట్2 నడుమ సంబంధం వల్ల గర్భాశయ ద్వారం గట్టిదనం నుంచి మృదుత్వాన్ని, అవసరం తీరగానే తిరిగి యథాస్థితికి మారుతున్నట్టు ఇండియన్ ఇన్సి్టట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం రూపొందించిన మ్యాథమాటికల్ రీ మోడలింగ్ లో తేలింది. అనంతరం ఎలుకల్లో ప్రయోగాత్మకంగా ట్విస్ట్2 కార్యకలాపాన్ని నిరోధించి చూడగా గర్భధారణ ప్రక్రియే నిలిచిపోవడాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు కాల్ డెత్ డిస్కవరీ జర్నల్ లో తాజాగా ప్రచురితమయ్యాయి.ప్రయోజనాలు ఎన్నెన్నో!ఈ జెనెటిక్ స్విచ్ ఉనికి వెలుగులోకి రావడానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ జన్యువులు, వాటి స్వరూప స్వభావాలు, పనితీరు తదితరాల గురించి మనకు ఇప్పటిదాకా తెలిసింది గోరంత అయితే తెలియాల్సిందేమో కొండంత. కీలకమైన జన్యు నెట్ వర్క్ తదితరాలపై మరింత అవగాహనకు జెనెటిక్ స్విచ్ వీలు కల్పించగలదు. తద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మెరుగైన చికిత్సతో పాటు తీవ్ర గాయాలను త్వరితంగా నయం చేయడం వంటివీ వీలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి‘ అని వారు వివరించారు. ‘కొన్నిసార్లు ఆరోగ్యకరమైన పిండం కూడా ఫలదీకరణ చెందడంలో విఫలమవుతుంటుంది. అందుకు కారణాలను అన్వేషించడంలో జెనెటిక్ స్విచ్ వ్యవస్థ ఉనికి ఎంతగానో తోడ్పడుతుంది. ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ చికిత్స ప్రక్రియలు మరింతగా విజయవంతం అయ్యేలా చేయగలదు‘ అని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పదిలో 'ఒకరే'..
అన్నింటా మేము అన్నట్టు వ్యాపారాల్లోనూ మహిళామణులు రాణిస్తున్నారు. పెట్టుబడి స్థాయి ఎంతదైనా తాము ప్రారంభించిన వ్యాపారాన్ని నిలబెట్టడమే కాదు.. ఆవిష్కరణల్లోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చిన్న దుకాణమైనా, స్టార్టప్ అయినా.. కుటుంబ బాధ్యతలు, పెట్టుబడి కొరత రూపంలో నిరంతర అడ్డంకులను మహిళా వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క దేశానికో ఈ సవాళ్లు పరిమితం కాలేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్51 దేశాల్లో సర్వేబాబ్సన్ కాలేజ్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను అంచనా వేసేందుకు నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టు అయిన ‘గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్షిప్ మానిటర్ (జీఈఎం)’తాజాగా 2024/2025 ఉమెన్స్ ఆంట్రప్రెన్యూర్షిప్ రిపోర్ట్ను విడుదల చేసింది. సర్వేలో భారత్, చైనా, యూఎస్, యూకే, జర్మనీ సహా 51 దేశాలకు చెందిన లక్షలాది మంది పాలుపంచుకున్నారు. మహిళలు వ్యాపారం ప్రారంభించడంలో, కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న తీరును ఇందులో సమగ్రంగా వివరించింది. ప్రపంచ దేశాల జాతీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేయడానికి జీఈఎం డేటా ఉపయోగకరమైన సాధనంగా స్థానం సంపాదించింది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశ్వసించే వనరుగా నిలిచింది. ఉద్యోగ ప్రత్యామ్నాయంగా.. అనేక మంది మహిళా వ్యవస్థాపకులకు వ్యాపారం ఒక ఉద్యోగ ప్రత్యామ్నాయం. ఒకే వ్యక్తి నిర్వహించేలా వారు చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలను వ్యాపారం వైపు నడిపించడానికి గల కారణాల్లో.. ఉద్యోగ కొరత 71.1%, సంపదను పెంచుకోవడం 57.3%, ప్రత్యేకత చూపించుకోవడానికి 49.8%, వారసత్వ వ్యాపారం 31.5% కారణాలుగా చెప్పారు. వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న వ్యాపారాలను నడుపుతున్న చాలా మంది మహిళలు అధిక ఆదాయ దేశా లకు చెందినవారని నివేదిక తెలిపింది. వారు డిగ్రీలను కలిగి ఉండటంతోపాటు అధిక ఆదాయ కుటుంబాల నుంచి వచ్చారు. డిజిటల్ మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. స్థిరత్వ లక్ష్యాలను చేరుకుంటారని నివేదిక వివరించింది. కుటుంబానికే ప్రాధాన్యత..2024లో ప్రపంచవ్యాప్తంగా 3.4% మంది మహిళలు వ్యాపారాన్ని మూసివేశారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 3.8% ఉంది. కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారాన్ని మూసివేసినట్టు 21% మహిళలు, 14.3% మంది పురుషులు వెల్లడించారు. అంటే కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారానికి దూరం అవుతున్న మహిళల సంఖ్య పురుషుల కంటే 47% ఎక్కువ. వ్యాపారాన్ని కాపాడుకోవడం ఒకవైపు, గృహ బాధ్యతలు మరోవైపు.. ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో చాలా మంది మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక వెల్లడించింది. వ్యాపార రంగంలో మహిళల పురోగతి మందగించడానికి ప్రధాన అడ్డంకి ఏమిటంటే.. చాలా మంది మహిళలు స్టార్టప్లను ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా వారి భుజాలపై పడటమే. 23వ స్థానంలో మనం.. ఒక ఆర్థిక వ్యవస్థలో 18–64 సంవత్సరాల వయసు గల జనాభాలో.. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వారి (42 నెలలలోపు) సంఖ్య ఆధారంగా టోటల్ ఎర్లీ స్టేజ్ ఆంట్రప్రెన్యూరియల్ యాక్టివిటీ (టీఈఏ) రేట్ను ఇస్తారు. 10% టీఈఏ రేటుతో భారత్ 23వ స్థానంలో ఉంది. మన దేశంలో టీఈఏ రేట్ మహిళల్లో 10.3%, పురుషుల్లో 14% ఉంది. ఇక 32% రేటుతో తొలి స్థానంలో ఈక్వెడార్ నిలిచింది.» పురుషులతో పోలిస్తే మహిళా పెట్టుబడిదారులు 2.5 రెట్లు ఎక్కువగా స్త్రీలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. » అనధికారిక పెట్టుబడులలో మూడింట రెండు వంతులు పురుష వ్యాపారులకే వెళ్లాయి. » పెట్టుబడిదారులు, పెట్టుబడి గ్రహీతలు.. ఈ రెండు విభాగాల్లోనూ మహిళల సంఖ్య తక్కువ. » 2024లో ఎనిమిది మంది పురుషులలో ఒకరు, పది మంది స్త్రీలలో ఒకరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. » నూతన ఆవిష్కరణలను తెచ్చే స్టార్టప్స్లో 18 దేశాలలో మహిళా వ్యాపారులు పురుష వ్యాపారులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నారు.» 19 దేశాలలో మహిళల స్టార్టప్ రేట్లు పెరిగాయి. జోర్డాన్, మొరాకోలో రేట్లు రెట్టింపు అయ్యాయి. -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్తో కూడిన ఏఐ మోడల్స్ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్ప్రెన్యూర్గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్ఫామ్ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్ఫామ్ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
ప్రకటనలు గుర్తుండట్లేదు..!
యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్.. వేదిక ఏదైనా ఈ సామాజిక మాధ్యమాల్లో విహరిస్తున్నవారే ఎక్కువ. స్మార్ట్ఫోన్ యూజర్లు గంటల తరబడి వీడియోలను వీక్షిస్తున్నారు. దీంతో డిజిటల్ వీడియోలు భారత్లో అత్యంత ప్రధాన వినోద మాధ్యమంగా మారాయి. అయినప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ముంచెత్తుతున్న ప్రకటనలు వీక్షకుల మదిలో నమోదు కాకపోవడం ఆసక్తికరం. ఆర్కే స్వామి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ (సీఎస్ఐఎం), హన్స రీసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. పది ప్రధాన నగరాల్లో ముఖాముఖి ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 3,000 మందికి పైగా ఆన్లైన్ కస్టమర్లు పాలుపంచుకున్నారు. వీరంతా కలిసి 600 పైచిలుకు బ్రాండ్ల పేర్లను వెల్లడించారు.సగటున ఒక్కో యూజర్ 1.5 బ్రాండ్స్ను మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. పదకొండు బ్రాండ్స్ మాత్రమే 3 శాతం మందికి పైగా గుర్తున్నాయి. జెప్టో, జొమాటో, మీషో, నెస్కఫే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, బ్లింకిట్, కంట్రీ డిలైట్, రమ్మీ సర్కిల్, డ్రీమ్11 వీటిలో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రధానంగా ఆన్లైన్ బ్రాండ్స్, గేమింగ్ ప్లాట్ఫామ్స్కు మాత్రమే బ్రాండ్స్ రీకాల్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగింట మూడొంతులు..వాట్సాప్లో వచ్చిన నాలుగు వీడియోలలో మూడింటిని యూజర్లు వీక్షించడమే కాదు వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేస్తున్నారు. సామాజిక భాగస్వామ్యం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉందనడానికి ఇది సూచిక అని నివేదిక తెలిపింది. వీక్షకులు ఎక్కువగా ఉండే ప్లాట్ఫామ్లలో కూడా వీడియో యాడ్స్ను మ్యూట్ చేయడం, దాటవేయడం (స్కిప్) వల్ల ప్రకటనల ప్రభావాన్ని గణనీయంగా దెబ్బ తీస్తున్నాయని వివరించింది. భారత్లో ఎక్కువగా ఉపయోగించే వీడియో ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో యూజర్లు అధిక సమయం గడిపినప్పటికీ ఈ వేదికపైనా బ్రాండ్ రీకాల్ (గుర్తు పెట్టుకోవడం) పేలవంగా ఉందని తెలిపింది. ⇒ 600 బాండ్స్లో ప్రతీ బ్రాండ్ రీకాల్ మార్క్ 1 శాతం లోపే ఉంది. ⇒ యూజర్లు రోజూ సగటున 2.17 గంటలపాటు వీడియోలను చూస్తున్నారు. ⇒ 93% మంది మొబైల్ ఫోన్లోనే వీడియో కంటెంట్ను వీక్షిస్తున్నారు.⇒ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రధాన ప్లాట్ఫామ్స్. ⇒ తమ మొబైల్ తెరపై వచ్చిన ప్రకటనలు స్కిప్ చేస్తున్నట్టు 78% మంది తెలిపారు. ⇒ యాడ్స్ అసంబద్ధంగా ఉంటున్నాయని 57% మంది వెల్లడించారు. ⇒ తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి ఉంటే ప్రకటనలను మ్యూట్ చేస్తామని 50% మంది చెప్పారు.⇒ ప్రకటనలను చూడటానికి అభ్యంతరం లేదని, రెండుసార్లు వీక్షించాల్సి వస్తే ఇష్టపడడం లేదని 8% మంది వెల్లడించారు.పేర్లు చెప్పాలేక.. డిజిటల్ ప్రకటనల కోసం భారత్లో కంపెనీలు ఏటా రూ.22,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇంత భారీ స్థాయిలో వెచ్చిస్తున్నప్పటికీ బ్రాండ్స్ పేర్లు జనం మదిలో పెద్దగా లేకపోవడమేకాదు.. వాటితో తక్కువ మమేకం కావడం ప్రకటనదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంతో వీక్షకులు నిర్దిష్ట బ్రాండ్స్ పేర్లను చెప్పలేకపోయారు. బ్రాండ్ పేరుకు బదులుగా ‘మొబైల్ ప్రకటన’, ‘దుస్తుల ప్రకటన’అని వర్ణించారని నివేదిక తెలిపింది. యూజర్లు చెప్పిన చాలా బ్రాండ్స్ ఫుడ్ డెలివరీ, ఈృకామర్స్, కాఫీ, కిరాణా సామగ్రి వంటి విభాగాలకు చెందినవి. ప్రకటనల ప్రభావం కంటే రోజువారీ వినియోగం ఈ బ్రాండ్లకు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. బ్రాండ్ రీకాల్: ఉత్పత్తులు, సేవల గురించి ఆలోచించేటప్పుడు ఎటువంటి క్లూ లేకుండా ఒక బ్రాండ్ను వెంటనే గుర్తు చేసుకోవడం, లేదా గుర్తించగల సామర్థ్యమే బ్రాండ్ రీకాల్. వినియోగదారు మదిలో ఒక బ్రాండ్ ఎంత బాగా పాతుకుపోయింది, కొనుగోలు నిర్ణయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తోంది, ఏ మేరకు కస్టమర్ విశ్వాసాన్ని చూరగొన్నదీ తెలిపే కొలమానం ఇది. ఉదాహరణకు సాఫ్ట్ డ్రింక్ అనగానే కోకాృకోలా, పెప్సీ గుర్తుకొస్తాయి. అధిక బ్రాండ్ రీకాల్ కలిగి ఉండడమే ఇందుకు కారణం. -
‘బ్రేకింగ్ న్యూస్’తో వణికిపోయిన పిఠాపురం!
40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పిఠాపురం అనే గ్రామం. ఆ ఊరిలోని సర్పంచ్ ఇంటి వరండాలో ఏర్పాటు చేసిన ఏకైక టీవీని చూసి ఊరి ప్రజలంతా హడలిపోతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఏ చిత్రలహరి పాటనో.. సినిమానో.. వార్తలో కాకుండా ఆ ఊరి ప్రజల గుట్టునే ‘‘బ్రేకింగ్ న్యూస్’’గా ప్రసారం చేయడం మొదలుపెట్టింది ఆ టీవీ. “బ్రేకింగ్ న్యూస్! రామయ్య పొలంలో పని చేయకుండా చెరువుకట్టపై నిద్రపోతున్నాడు!”.. టీవీలో చుక్కలు వస్తూనే బ్యాక్గ్రౌండ్లో ఓ పురుషుడి గొంతుతో గట్టిగా చెప్పింది. అది విని అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వుల్లో మునిగిపోయారు. ఆ వెంటనే ‘‘కిష్టయ్య భార్య అతనికి తెలియకుండా టౌన్కు వెళ్లి సినిమా చూస్తోంది’’ అనడంతో ఆ నవ్వులు మరింత పెరిగాయి. సీతమ్మ పొరుగింటి వంటకాలు రుచి చూసి.. తనింట్లో వండినవాటిని చెత్తబుట్టలో పడేస్తోంది అనగానే.. సీతమ్మ ముఖం వాడిపోగా జనం అంతా కేరింతలు కొట్టారు. అయితే..ఆ టీవీ ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులు.. ఆశ్చర్యంలో మునిగిపోయిన ప్రజలు.. నెమ్మదిగా అది చెబుతున్న బ్రేకింగ్ న్యూస్ వింటూ ఆందోళనకు గురయ్యారు. అందుకు కారణం.. అది బయటపెడుతున్న రహస్యాలే!. దాని వల్ల ఊళ్లో వాళ్ల చిచ్చు రాజుకుంటోంది. కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చివరాఖరికి.. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే.. ఆ టీవీని కట్టేశారు. దానికి ఉన్న డిష్ యాంటేనాను పీకేయించాడు సర్పంచ్. అయినా అది ‘బ్రేకింగ్ న్యూస్’ చెప్పడం ఆపలేదు. దీంతో ఊరి పెద్ద తలపట్టుకున్నాడు. చివరకు రచ్చబండ దగ్గరకు ప్రజలను ఆహ్వానించాడు. ఇకపై మనం నిజాయితీగా ఉందాం. అప్పుడు టీవీ మనల్ని బ్రేకింగ్ న్యూస్గా చూపించే అవకాశం ఉండదు అన్నాడు. దానికి అంతా సరే అన్నారు. ఆ రోజు నుంచి గ్రామంలో అబద్ధమనేది వినిపించలేదు. మోసాలు తగ్గాయి. ఎవరి ఇళ్లలో వాళ్లు కాపురాలు చేసుకుంటూ హాయిగా గడిపారు. ఆ టీవీ నేర్పిన గుణపాఠంతో నిజాయితీగా జీవిస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఆ టీవీ.. ఎప్పుడు ఏం బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందా? అని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది.ఇవాళ(నవంబర్ 21..) ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా ఓ చిన్ని కల్పితకథ -
కుట్లకు బదులు ‘ఫెవిక్విక్’!
పసిబిడ్డ తలకు గాయమై రక్తమోడుతుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బిడ్డను కాపాడుకునేందుకు ఆసుపత్రికి పరుగులు తీశారు. కానీ, అక్కడి వైద్యుని నిర్వాకం మానవత్వాన్ని, వృత్తి ధర్మాన్ని ప్రశ్నార్థకం చేసింది. కుట్లు వేయాల్సిన చోట, రూ.5 విలువైన ’ఫెవిక్విక్’ (సూపర్ గ్లూ) పూశాడు. చికిత్స పేరుతో ఆ పసిబిడ్డపై దారుణ ప్రయోగం చేశాడు. రాత్రంతా నొప్పి తాళలేని బిడ్డ రోదన, తల్లిదండ్రులకు పీడకలగా మిగిల్చింది. ఫెవిక్విక్తో వైద్యం! ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరం జాగృతి విహార్కు చెందిన సర్దార్ జస్పిందర్ సింగ్ ఇంట్లో ఆడుకుంటున్న పసివాడి తల అనుకోకుండా టేబుల్ అంచుకు బలంగా తగిలింది. అంతే, రక్తం ధారగా కారిపోయింది. ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా బిడ్డను వెంటనే సమీపంలోని భాగ్యశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాధారణంగా తలకు గాయమై రక్తం వస్తుంటే, దాన్ని శుభ్రం చేసి కుట్లు వేయడం వైద్యుని విధి. కానీ, ఆ డాక్టర్.. రూ.5 విలువైన ఫెవిక్విక్ ట్యూబ్ కొనుక్కు రమ్మని చిన్నారి తల్లిదండ్రులను పురమాయించాడు. అదివిన్న తల్లిదండ్రులు షాకైనా, బిడ్డ గాయం తీవ్రత వల్ల ఏమీ మాట్లాడలేకపోయారు. వారు తెచి్చన గ్లూను డాక్టర్.. ఆ పసిబిడ్డ తలపై రక్తమోడుతున్న గాయంపై పూశాడు. గ్లూ అంటించడంతో.. నొప్పి తట్టుకోలేక చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యుడిని ప్రశి్నస్తే, ‘కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది’.. అని తేలిగ్గా కొట్టిపారేశాడట. కంగుతిన్న వైద్యులు ఆ రాత్రి ఆ బిడ్డ తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేదు. ఆ పసిబిడ్డ ఏడుపు, నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దీంతో, తెల్లవారగానే బిడ్డను తీసుకొని లోకప్రియ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాయాన్ని పరిశీలించి కంగుతిన్నారు. తలమీద గట్టిగా అతుక్కుపోయిన ఆ జిగురును చూసి షాకయ్యారు. ఆ గట్టిపడిన అడ్హెసివ్ను (ఫెవిక్విక్ను) తొలగించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి జిగురును తొలగించి, గాయాన్ని పూర్తిగా శుభ్రం చేసి, నాలుగు కుట్లు వేశారు. తల్లిదండ్రులు ఆ డాక్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒకవేళ ఫెవిక్విక్ గాయం నుంచి కారిపోయి కంట్లోకి పోయి ఉంటే, ఎంత ఘోరం జరిగేది? మా బిడ్డకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారు?’అని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశం.. ఈ దారుణ సంఘటనపై బాధిత చిన్నారి కుటుంబం నేరుగా.. మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా దృష్టికి తీసుకెళ్లింది. ‘చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక ఆధారంగా ఆ వైద్యునిపై తగిన చర్యలు తీసుకుంటాం’.. అని డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. బాధిత కుటుంబం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాల యం దృష్టికి కూడా తీసుకెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్టైటిల్స్తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
టైగర్ జిందా హై!
ఔను. పులి నవ్వింది. నిత్యం సింహగర్జనలే వింటూ వచ్చిన గుజరాతీలకు శ్రవణానందం కలిగేలా గొంతెత్తి మరీ గాండ్రించింది. మూడు దశాబ్దాల పై చిలుకు సుదీర్ఘ విరామం అనంతరం గుజరాత్ లో దర్జాగా పాదం, కాదు కాదు, పంజా మోపింది. దాంతో, పులుల కోసం తమ 32 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు తెర పడి గుజరాతీలు తెగ సంబరపడి పోతున్నారు. గుజరాత్. మన దేశంలో సింహాలకు ఆలవాలమైన ఏకైక రాష్ట్రం. అయితే అంత పెద్ద రాష్ట్రంలో పెద్ద పులి తిరగాడి మూడు దశాబ్దాలు దాటింది. ఆ లోటును తీరుస్తూ ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో కాలు మోపింది. పొరుగునున్న మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, దొహాడ్ జిల్లాలోని రతన్ మహ ల్ అభయారణ్యంలో 9 నెలలుగా స్వేచ్ఛా విహారం చేస్తోంది. కొన్నేళ్లుగా పులులు అడపదడపా పక్క రాష్ట్రాల నుంచి రావడం పరిపాటే అయినా, ఏదో చట్టం చూపుగా ఇలా వచ్చి అలా వెళ్లినవే తప్ప ఇలా నెలల పాటు తిష్ఠ వేసుకున్న దాఖలా మాత్రం ఇదేనని గుజరాత్ అటవీ అధికారులు చెబుతున్నారు. ఇంత కాలం ఉండటమంటే ఇక ఇక్కడే ఉండిపోవడమేనని వారు వివరించారు. దీన్ని తమకు గర్వకారణంగా, గుజరాత్ పర్యావరణ, జీవ వైవిధ్య చరిత్రలోనే సువర్ణాక్షరాలతో రాయదగ్గ ఉదంతంగా అభివరి్ణంచారు రాష్ట్ర అటవీ మంత్రి అర్జున్ మోద్వాడియా. అటవీ శాఖ అధికారులు కూడా, ‘ఇన్నేళ్లుగా పులులకు మొహం వాచి ఉన్నాం. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకునేది లేదు. గుజరాత్ లో పులుల సంఖ్యను ఇతోధికంగా పెంచడమే ఇప్పుడు మా ఏకైక లక్ష్యం‘ అంటున్నారు. వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ ఐదేళ్ల కోడె ప్రాయంలో ఉన్న మగ పులి. దాంతో దానికి ఈడూ జోడూ అయిన ఒక చూడ చక్కని ఆడ పులిని సెట్ చేసే ప్రయత్నంలో పడింది గుజరాత్ అటవీ శాఖ. మధ్యప్రదేశ్లోని జబువా, కథియవాడా ప్రాంత అడవుల్లో కొన్నేళ్లుగా పులుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో వాటికి అవసరమైన వేట దొరక్క వలస బాట పడుతున్నాయి. గుజరాత్ లోకి ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ ఆ బాపతేనని అటవీ అధికారులు చెబుతున్నారు. గుజరాత్ నేలపై పులులు అరుదుగా అప్పుడెప్పుడో 1980ల్లో ఒకసారి, మళ్లీ 2002 ప్రాంతంలో ఇంకోసారి చట్టం చూపుగా అడుగు పెట్టాయని వారు వివరించారు. ‘గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతం సింహాలకు పెట్టింది పేరు. ఇక సెంట్రల్ గుజరాత్ చిరుతలకు ఆలవాలం. ఇప్పుడు పులి రాకతో మా రాష్ట్రానికి నిండుడ వచ్చింది‘ అన్నది వారి మాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘స్పాట్’ పెట్టిందో సఫా..!
దాని పేరు స్పాట్.. బరువు దాదాపు ఒక జర్మన్ షెపర్డ్ కుక్కతో సమానం. అయితే ఇది కేవలం డాన్స్ వీడియోలతో వైరలైన రోబో శునకం కాదుసుమా.. ప్రస్తుతం ఇది అమెరికా, కెనడాలోని 60కి పైగా పోలీసు విభాగాలలో, అత్యంత ప్రమాదకరమైన మిషన్లలోకి దూసుకుపోతోంది. దీనిధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి: ప్రాథమిక యూనిట్ ధర దాదాపు రూ.90 లక్షలు (100,000 డాలర్లు). అధునాతన అదనపు పరికరాలతో కలిపి ఇది రూ.2.2 కోట్లు (250,000 డాలర్లు) దాటిపోతుంది.ప్రాణాపాయ మిషన్లలోకి ప్రవేశం అయిదేళ్ల క్రితం ఆవిష్కరించిన ఈ నాలుగు కాళ్ల రోబో, ఇప్పుడు పోలీసుల అత్యవసర ఆపరేషన్లలో కీలకంగా మారింది. మానవ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన చోట, స్పాట్ ముందుంటుంది. ప్రమాదకరమైన వస్తువులను తనిఖీ చేయడానికి, సాయుధ గ్యాంగ్స్టర్ల మధ్య చిక్కుకున్న బందీల రక్షణలో, రసాయనాలు చిందటం లేదా ప్రమాదకరమైన ప్రదేశాల సర్వేల్లో దీని సేవలు అపారం. ఒక హోస్టేజ్ రెస్క్యూ మిషన్ గురించి మసాచుసెట్స్ స్టేట్ పోలీస్కు చెందిన ట్రూపర్ జాన్ రగోసా చెబుతూ, ‘స్పాట్ ఒక ఆ దుండగుడిని ఎదుర్కొన్నప్పుడు, ’ఏంటీ కుక్క?’ అంటూ అవాక్కయ్యాడు’.. అని తెలిపారు.‘స్పాట్’ ఏం చేయగలదంటే.. ‘స్పాట్’ను ఒక టాబ్లెట్ కన్సోల్ ద్వారా నియంత్రించవచ్చు. ఈ రోబో సామర్థ్యాలు సంప్రదాయ చక్రాల రోబోల కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఎగిరి దూకడం, మెట్లు ఎక్కడం, జారే ఉపరితలాలపై నడవడం. మలి్టపుల్ కెమెరాల నుండి లైవ్ వీడియో స్ట్రీమ్ పంపడం, ఆటోమేటిక్గా అడ్డంకులను గుర్తించి, దారి మళ్లడం లాంటి సవాళ్లను అవలీలగా ఎదుర్కొంటుంది. తాళం వేసిన తలుపులను కూడా తెరవగలుగుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,000 స్పాట్ రోబోలు పనిచేస్తుండగా, భద్రతా ఏజెన్సీల నుండి డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని బోస్టన్ డైనమిక్స్ వైస్ ప్రెసిడెంట్ బ్రెండన్ షుల్మాన్ తెలిపారు.పోలీసు ప్రపంచానికి పెద్ద అండ చివరికి, డ్యాన్స్ వీడియోలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ రోబో, ఇప్పుడు ఆధునిక పోలీసు వ్యవస్థ సంక్లిష్ట ప్రపంచంలోకి దూసుకుపోతూ, ఆవి ష్కరణకు, వివాదా నికి మధ్య నిలుస్తోంది. రూ.90 లక్షల ఈ ’రోబో డాగ్’ భవి ష్యత్తు పోలీసు ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతోందనేది మాత్రం నిస్సందేహం.అంతులేని ప్రశ్నలు.. ఆందోళనలు స్పాట్ ప్రవేశంతో సాంకేతికత ఎంత ఆశ కలిగిస్తోందో, అంతకు మించిన ప్రశ్నలు, భయాలు రేకెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు, పోలీసు వ్యవస్థలో ఒక కొత్త శకానికి సంకేతం. న్యూయార్క్ పోలీసులు 2021లో స్పాట్ను ఉపయోగించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దాని అధిక ధర, నిఘా పాత్రపై ప్రజలు ఆందోళన చెందారు. నిరసనల కారణంగా తాత్కాలికంగా ఆపినా, తర్వాత కొత్తగా రెండు యూనిట్లు కొనుగోలు చేశారు. టెక్సాస్ ఏ అండ్ ఎం ప్రొఫెసర్ రాబిన్ మర్ఫీ మాట్లాడుతూ.. స్పాట్ చురుకుదనం గొప్పదే అయినా, రోబోటిక్ సాధనాల వాడకం పెరిగితే పోలీసులు ప్రజల నుండి మరింత దూరం అవుతారన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ ర్యాన్ కాలో మాట్లాడుతూ.. ‘అధికారులు ప్రాణాలను పణంగా పెట్టకూడదు, కానీ మనం రోబోటిక్ పోలీసు రాజ్యంగా మారకూడదు’.. అని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చలికాలం మూడ్ భద్రం
చలికాలం పని చేయబుద్ధి కాదు. హుషారుగా అనిపించదు. అదో వెలితిగా అనిపించే భావన. నిరాశ. ఆకలి లేకపోవడం. ఎండ, వెలుతురు లేక చిరాకు. ఇదంతా ఏదో మామూలు విషయం కాదని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అనే ఒక విధమైన డిప్రెషన్ అని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం వస్తే మూడ్ను చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోడవం చాలా అవసరం అంటున్నారు. అసలు ఈ ‘శాడ్’ ఏమిటి?ఉదయాన్నే సూర్యుడి ముఖం చూసి పనిలో పడితే అదోతృప్తి. సూర్యకిరణాలు ఒంటిని తాకితే లోలోపల ఉత్తేజం. కాసింత ఎండ పొడ తగిలితే మనసంతా ఉత్సాహం. కాని చలికాలంలో వణికించే చలి ఆ అవకాశాన్ని అరుదుగా ఇస్తుంది. పొద్దున లేవగానే మంచు స్వాగతం పలుకుతుంది. రోజంతా పలుచటి వెలుతురు తప్ప సూర్యుడు అందించే ఉత్తేజం మనకు చేరదు. దాంతో ఒళ్లంతా బద్దకంగా, మనసంతా గజిబిజిగా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని ‘వింటర్ బ్లూస్’ అంటుంటారు. ఇంత వరకూ మామూలే. కాని కొందరికి ఈ సమయం చాలా నిరాశ, నిర్లిప్తతలు ఆవరిస్తాయి. ఏదో కోల్పోయినట్టు, అంతా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. కొందరికి ఆకలి మందగిస్తుంది. తెలియని డిప్రెషన్ కి కొందరు లోనవుతారు. దీన్నే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ (శాడ్) అంటున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఎండకు– మెదడుకు...చలికాలం తొందరగా నిద్ర లేవాలనిపించదు. చలిలో లేచి ఏదైనా చేయాలనిపించదు. ఎనిమిది గంటలు దాటితే తప్ప సూర్యుడు తేటగా కనిపించడు. కాసింత వేడి ఒంటికి తగిలాక కొంచెం ఉత్సాహం వచ్చి పనులు మొదలుపెడతారు చాలామంది. ఇదంతా ఎందుకు? వాతావరణానికీ, మన మనసుకు మధ్య ఉండే సంబంధమే ఇందుకు కారణం అంటున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. ‘సూర్యుడి వెలుగు కారణంగా మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. చలికాలంలో ఆ చర్యలు జరగకపోవడం వల్ల నిస్సారంగా, బద్దకంగా అనిపిస్తుంది’ అని వివరిస్తున్నారు.చలికాలమే మేలు అనుకుంటారా?ఎండాకాలం తట్టుకోలేనంత వేడి ఉంటుంది. చలికాలం వస్తే బాగుండని ఆ వేడి తట్టుకోలేక కొందరు అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం చలికాలం నచ్చదు. రోజంతా ఉత్సాహం లేని పనులు చేస్తూ, గంటల కొద్దీ ఒకేచోట గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో ఒంట్లో సెరటోనిన్, మెలటోనిన్ రసాయనాలు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు వైద్యులు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం కూడా దీనికి తోడై డిప్రెషన్ లోకి నెట్టేస్తుందని అంటున్నారు. అందుకే చలికాలం అనగానే కొందరిలో ఆనందం మాయమైపోతుంది. సంతోషం దూరమవుతుంది. ఏ పనీ చేసేందుకు ఆసక్తి రాక మిన్నకుండిపోతుంటారు.దీన్ని గుర్తించేదెలా?‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అందరిలో ఉంటుందని చెప్పలేం. ఒకవేళ ఉన్నా, దాన్ని గుర్తించడం కష్టం. అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగిన దేశాల్లో చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారు తొందరగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. తమకున్నది ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’ అన్న విషయం కూడా వారికి తెలియడం లేదు. కొందరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు అధికంగా తినడం, దురలవాట్లకు లోనవడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆ ప్రభావం అంతా వారి ఆరోగ్యం మీద పడి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.శాడ్ లక్షణాలు...→ రోజువారి పనుల్లో ఆసక్తి కోల్పోవడం → నిరాశ ∙ఏకాగ్రత కోల్పోవడం→ ఒంటరితనం, ఏకాంతం ఇష్టపడటం→ నిద్రలేమి, అలసట (లేదా) అధిక నిద్ర, అధిక తిండి → నలుగురిలో కలవకపోవడంఏమిటి పరిష్కారం?→ చలికాలంలో రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం, యోగా చేయడం ఉత్తమమైన మార్గం. దీని వల్ల శరీరానికి ఉల్లాసంగా అనిపించడంతోపాటు మానసికంగా ఏదో ఒక పని చేయాలన్న సంసిద్ధత ఏర్పడుతుంది.→ ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయకుండా రకరకాల పనులపై దృష్టి నిలపడం మరో పరిష్కారం. → డిప్రెషన్ భావన వచ్చినప్పుడు ఆత్మీయులతో మాట్లాడటం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం వంటివి మనసును తేలికపరుస్తాయని అంటున్నారు. → చలికాలాన్ని ప్రకృతి సహజమైన విషయంగా భావించి, మనసు దృఢ పరుచుకుంటే మానసికంగా బలవంతులు అవుతారని వైద్యులు సూచిస్తున్నారు. -
చలపతితో మొదలు నంబాల, హిడ్మాతో ముగింపు!
మావోయిస్టు పార్టీని, ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఆపరేషన్ కగార్(Operation Kagaar) చేపట్టింది అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ. ఇందుకోసం 2026 మార్చిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే.. ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు.. ఇతరత్రా పరిణామాలు ఆ లక్ష్యానికి భద్రతా బలగాలను చేరువే చేశాయి. కేంద్ర హోం శాఖ గణాంకాలు పరిశీలిస్తే.. గత పదేళ్లలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్గఢ్-ఒడిశా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక.. ఆ పార్టీకి వరుస గట్టి దెబ్బలు తగలడం మొదలైంది. మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి (రామచంద్ర రెడ్డి అలియాస్ ప్రతాప్)తోసహా 13 మంది మావోయిస్టులు 2025 జనవరి 21న ఛత్తీస్గఢ్–ఒడిశా సరిహద్దులోని జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్తో ఒడిషాలో మావోయిస్టు ఉద్యమం శకం ముగిసింది. అయితే.. ఈ ఎన్కౌంటరే కగార్కు ప్రారంభ సంకేతంగా మారింది. ఇక్కడి నుంచే.. కేంద్రం చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలు మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చాయి.ఆపరేషన్ కగార్ (Operation Kagaar)లో భాగంగా.. 1 లక్షకు పైగా భద్రతా సిబ్బంది, డ్రోన్లు, AI ఆధారిత నిఘా పరికరాలను దట్టమైన అడవుల్లో వినియోగించాయి భద్రతా బలగాలు. ఈ వ్యూహాత్మక చర్యలు వల్ల మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లు.. ఇంకోవైపు మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈలోపు..అబూజ్మడ్ అడవుల్లో మే 21వ తేదీన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నంబాలతో పాటు ఆ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులతో పాటు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అయ్యింది. ఇక్కడి నుంచి మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టసాగాయి. ఆ వెంటనే మల్లోజుల వెంకటరావు (సోను), ఆశన్న వంటి కీలక నేతలు సరెండర్ కావడం.. ఇంటెలిజెన్స్ ఆధారంగా కూంబింగ్ ఆపరేషన్లు పెరగడం వల్ల ఉద్యమం లోపల భయాందోళనలు పెరిగాయి. సెంట్రల్పై కమిటీ లొంగిపోయిన సభ్యుల ఆరోపణలు.. వాళ్లను ఉద్యమ ద్రోహులుగా సెంట్రల్ కమిటీ ప్రకటించడం.. ఇలా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ విశేషం ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగింది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావించింది కూడా. ఇప్పుడు అది కూడా జరగడంతో ఆపరేషన్ కగార్ దాదాపుగా ముగిసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. -
భారత ఉన్నత విద్యకు స్వర్ణయుగం
పరిశోధక విద్య విషయంలో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. ఆరేళ్లలో విశ్వవిద్యాలయాల పీహెచ్డీ ప్రవేశాల్లో ఏకంగా 21శాతం వృద్ధి కనిపిస్తోంది. అంటే 2019లో 97,947 ప్రవేశాల నుంచి 2025లో 1,18,556కి చేరుకుంది. ఇక పీహెచ్డీల సమర్పణ, అవార్డుల స్వీకరణ 49 శాతం పెరిగి 24,481కి ఎగబాకింది. వీటి ఫలితంగా పరిశోధన ప్రచురణలు మూడు రెట్లు వేగాన్ని సాధించి పేటెంట్ల సంఖ్య పెరుగుదలలో తోడ్పాటును అందిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పదేళ్ల డేటా ఆధారంగా ప్రముఖ సర్వీస్ నెట్వర్క్ సంస్థ– కేపీఎంజీ చేసిన అధ్యయనంలో వెల్లడైన పలు ఆసక్తికరమైన అంశాలు ఇవీ... – సాక్షి, అమరావతిప్రపంచ వాటా పెరుగుదలపరిశోధన కోసం దశాబ్ద కాలంగా సాగిస్తున్న కృషి పేటెంట్ల సంఖ్య పెరుగుదలతో స్పష్టంగా కనిపిస్తోంది. 2018–25 మధ్య విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ సంస్థల ప్రచురణ వాల్యూమ్స్ 150 శాతం, ఫార్మసీ, మేనేజ్మెంట్లో 300 శాతం వృద్ధి చెందాయి. ఈ కాలంలోనే ప్రపంచ పరిశోధన ప్రచురణలలో భారతదేశ వాటా 3.5 శాతం నుంచి 5.2 శాతానికి దూసుకెళ్లింది. ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకుల నేతృత్వంలో బోధన శాతం గణనీయంగా పెరిగింది. దీనితో దేశీయంగా పీహెచ్డీ ప్రవేశాలు, అవార్డుల స్వీకరణ గణాంకాలు గణనీయంగా పెరిగాయి.విద్యా నైపుణ్యం, బోధన నాణ్యతకు ప్రాధాన్యం..దేశంలోని అగ్రశ్రేణి సంస్థల్లో దాదాపు 60% పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకులు బోధన సాగిస్తున్నారు. తద్వారా పరిశోధన, విద్యా నైపుణ్యం, బోధనా నాణ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇక్కడ దేశంలోని టాప్ 100 ఉన్నత విద్యా సంస్థలలో పీహెచ్డీ అర్హత కలిగిన అధ్యాపకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మేనేజ్మెంట్ సంస్థలలో 90 శాతానికి పైగా, ఇంజనీరింగ్ కళాశాలల్లో 80 శాతానికి పైగా పీహెచ్డీ అర్హత కలిగిన వారితో విద్యా బోధన కొనసాగుతోంది. కొన్ని అగ్రశ్రేణి సంస్థల్లోని వివిధ విభాగాల్లో 73 శాతానికి పైగా పీహెచ్డీ–అర్హత కలిగిన అధ్యాపకుల నియామకం కనిపిస్తోంది.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ నిలువుటద్దం..⇒ దేశంలో ఏటా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థల సంఖ్య పెరుగుతుండడం విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యా సంస్థల బోధన నాణ్యత, వాటి సామర్థ్యానికి నిలువుటద్దం.⇒ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో దరఖాస్తు చేసుకునే విద్యాసంస్థల సంఖ్య 2016లో 2,426 కాగా, 2025 నాటికి 217 శాతం పెరిగి 7,692కి చేరింది.⇒ ఇక కళాశాలల విభాగంలో 401 శాతం అంటే 803 నుంచి 4,030వరకు సంస్థలు ర్యాంకుల కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది.⇒ ర్యాంకింగ్స్ విషయంలో ఐఐఎస్సీ బెంగళూరు, జేఎన్యూ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఈ విషయంలో ప్రైవేటు వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.⇒ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులతో పాటు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కీలకం. ఈ విషయంలో తాజాగా భారత్ 54 సంస్థలతో నాల్గవ అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా అవతరించింది. -
నెరుస్తోంది ఇండియా
మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి 23 కోట్లకు చేరుకోనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్న వృద్ధులకు ఇది రెండింతలకు పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. భారత జనాభాలో వృద్ధుల వాటా 2011లో ఉన్న 8.6 శాతం నుంచి 2050 నాటికి 19.5 శాతానికి చేరనుంది. అంటే సుమారు 31.9 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.ఐదింట ఒకరికే బీమా.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లాసి’(లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా) నివేదిక ప్రకారం.. భారత్లో 60 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు 15 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఐదింట ఒకరు మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తున్నారని నివేదిక పేర్కొంది.పింఛను పైనే ప్రాణాలన్నీ..45 ఏళ్లు..అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలను కూడా వృద్ధుల్లో చేరిస్తే 2050 నాటికి జనాభాలో దాదాపు 40 శాతం మంది.. అంటే 65.5 కోట్ల మంది వృద్ధులు ఉంటారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దాదాపు 70 శాతం మంది వృద్ధులు తమ రోజువారీ అవసరాలకు కుటుంబ సభ్యులపైన, సాధారణ పెన్షన్లపైన ఆధారపడి ఉన్నవారేనని నివేదిక తెలిపింది. చేయూతగా ప్రభుత్వ పథకాలు..వృద్ధుల కోసం ప్రభుత్వం కనీసం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు నెలవారీ పెన్ష¯ŒŒ కు హామీ ఇచ్చే ‘అటల్ పెన్షన్ యోజన’, వృద్ధుల సాధికారత కోసం ‘అటల్ వయో అభ్యుదయ యోజన’, గ్రాంట్–ఇన్–ఎయిడ్ పథకం, సీనియర్ సిటిజన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ను అమలు చేస్తోంది.వేల కోట్ల సిల్వర్ ఎకానమీ..వృద్ధులు వినియోగించే వస్తువులు, పొందే సేవల విలువ ఏడాదికి రూ.73,000 కోట్లుగా ఉన్నట్టు నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ మొత్తం మరెన్నో రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్థిక పరిభాషలో దీనిని ‘సిల్వర్ ఎకానమీ’అంటున్నారు.మరిన్ని పథకాలు అవసరం..60 ఏళ్ల వయసులో ఆదాయం ఆగిపోతుంది. చాలామంది నిరాడంబరమైన జీవనశైలికి మారటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే 50 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలూ వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుతున్నాయి.అనారోగ్యాలతో సహజీవనందాదాపు 75 శాతం మంది వృద్ధులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక అనారోగ్యాలతో జీవిస్తున్నారు. 40 శాతం మంది కనీసం ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. పట్టణాల్లోని వృద్ధుల్లో మధుమేహం అత్యంత సాధారణ దీర్ఘకాలిక సమస్యగా ఉంది. దాదాపు 20 శాతం మంది నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధుల కోసం వినూత్నంగా..ఇండియాలో పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు వినూత్నమైన ఉత్పత్తులు, సేవలను ప్రవేశపెడుతున్నాయి. ఐటీసీ స్నాక్ ఫుడ్స్ ‘కంట్రోల్ + ఆల్ట్ + డిలీట్’అనే క్రియేటివ్ ఫార్ములాతో వృద్ధుల కోసం ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. కొవ్వులు, సోడియం వంటి మూలకాలను ‘కంట్రోల్’చేసి, చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వంటి ఆల్టర్నేటివ్లను (ఆల్ట్) ఉపయోగించి, కృత్రిమ రంగులను, రుచులనీ ‘డిలీట్’చేయటమే ఈ ఫార్ములా. -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి. ఆ రథం ఎటు వెళ్ళాలో మనసు నిర్ణయిస్తుంది. అయితే, ఆ మనసును నడిపించాల్సిన పరమసారథ్యం కేవలం మన స్వీయ నియంత్రణలోనే ఉంది. భావోద్వేగాలనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటేనే మన జీవిత ప్రయాణం సవ్యంగా, నిర్దేశిత గమ్యం వైపు సాగుతుంది. ఒకవేళ ఈ పగ్గాలు వదిలేస్తే, అవి మనల్ని అదుపుతప్పి, పదేపదే నిరాశ, దుఃఖం అనే లోయల్లో పడేస్తాయి. మనసు మన అధీనంలో లేకపోతే, జీవితం ఒక నిరంతర పోరాటంలా మారి, శాశ్వత ఆనందాన్ని దూరం చేస్తుంది. మన అంతర్గత ప్రశాంతతకు ఇదే పునాది.సాధారణంగా మన భావోద్వేగాలు సముద్రంలో ఉప్పొంగే శక్తిమంతమైన అలల మాదిరిగా ఉంటాయి. కోపం, దుఃఖం, భయం, అసూయ వంటివి మనల్ని క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి, అనాలోచిత నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కానీ, సనాతన ధర్మం బోధించినట్టుగా, మనం కేవలం మన భావోద్వేగాలకు బానిసలం కాదు; వాటిని శాసించగలిగే అపారమైన శక్తి కేంద్రం మనలోనే దాగి ఉంది. మనసును నిగ్రహించుకోవడానికి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు అత్యంత సులువైన, అద్భుతమైన మార్గాలుగా పనిచేస్తాయి.కర్మ మార్గం–ఫలితాల ఆశ లేకుండా, కేవలం ఉన్నత లక్ష్యాల కోసం నిస్వార్థ నిబద్ధతతో మన కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్దేశిస్తుంది. చివరగా, భక్తి మార్గం–జీవితానికి అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే అని నిశ్చయంగా నమ్మి, విశ్వశక్తిలో లీనమవడమే. ఈ త్రికరణ శుద్ధి కలయిక మనసుకు తిరుగులేని స్థైర్యాన్ని, అఖండమైన అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుంది.నిజమైన ఆత్మనిగ్రహం ద్వారానే మనం అంతరంగ శాంతికి శాశ్వత వారధిని నిర్మించగలం. ఈ వారధిని నిర్మించిన మహనీయుల జీవితాలు మనకు శాశ్వత ప్రేరణ. ఉదాహరణకు, సింహాసనం కళ్లముందే కరిగిపోయినప్పుడు, శ్రీరాముడు ఉవ్వెత్తున ఎగిసిన కోపాగ్నిని కేవలం అణచివేయలేదు. ఆయన వ్యక్తిగత ఆశను, ఆవేశాన్ని త్యజించి, ధర్మానికి శిరసు వంచారు. ఇది కేవలం తండ్రి మాటకు గౌరవం కాదు, బాహ్య పరిస్థితులకు అతీతంగా తన అంతర్గత ప్రశాంతతను తానే నిర్ణయించుకునే అత్యున్నత వివేకం. అలాగే, మహాభారతంలో ధర్మరాజు, అపారమైన దుఃఖం, రాజ్య నష్టం మధ్య కూడా, తన స్థైర్యాన్ని పోగొట్టుకోకుండా, క్షమతో... వివేకంతో వ్యవహరించారు. ఈ ఉదాహరణలు కేవలం కథలు కావు; భావోద్వేగాలపై పట్టు సాధిస్తే, విధి రాతను సైతం తన జీవితపు ఉన్నత గమ్యానికి అనుగుణంగా మలచుకోవచ్చని నిరూపించాయి.గుర్తుంచుకోండి: మన జీవితమనే ఈ అద్భుతమైన ప్రయాణంలో, మన గమ్యాన్ని నిర్దేశించే తిరుగులేని సారథులం మనమే. ఇక ఆలస్యం చేయక, ప్రతి క్షణాన్ని వివేకంతో, ప్రేమతో నింపి, మన హృదయం కోరుకునే ప్రశాంతమైన, అద్భుతమైన భవిష్యత్తును మన చేతులతో నిర్మించుకుందాం.మన అంతర్గత ప్రపంచంలో కలిగే ప్రతి ఆలోచనా అలజడి, ప్రతి ప్రతిస్పందన ఒక కర్మగానే పరిగణించబడుతుంది. ఈ కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి, జ్ఞానయోగం మనకు నిష్పాక్షిక పరిశీలన అనే వివేకాన్ని అందిస్తుంది. అంటే, కళ్ళ ముందు జరిగే నాటకాన్ని చూస్తున్నట్లుగా, మన ఆలోచనలను, భావోద్వేగాలను తటస్థంగా, నిశితంగా గమనించడం. ఈ దృష్టి వివేకానికి పదునైన కత్తిలా పనిచేసి, ప్రతిచర్యలకు బదులుగా, ప్రశాంతమైన, సరైన ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది.భావోద్వేగాలను నియంత్రించగలగడమే నిజమైన, నిస్సందేహమైన శక్తి. ఎందుకంటే, అది మనల్ని బాహ్య పరిస్థితుల బందీగా కాకుండా, మన స్వీయ మనసుకి నిజమైన అధిపతిగా నిలబెడుతుంది. అశాంతి, ఆందోళనల నుంచి సంపూర్ణ విముక్తి ΄÷ందడానికి, మనసును మనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా మలచుకోవాలి. యోగా, ధ్యానం, ఆత్మపరిశీలన వంటి సాధనల ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
స్టారా.. ఫ్రాడ్ స్టరా...
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రయోజనాలే కాదు.. అదే స్థాయిలో నష్టమూ జరుగుతోంది. ఏఐ సాంకేతికతతో రూపొందిన లక్షలాది డీప్ఫేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పలు కంపెనీలను ప్రమోట్ చేస్తున్నట్లుగా సెలబ్రిటీల డీప్ఫేక్ వీడియోలు సైతం ఉన్నాయి. దీంతో ఏది నిజమైనదో, ఏది కాదో అంతుబట్టడంలేదు. నిజమైన వీడియోలను పోలిన ఈ మోసపూరిత కంటెంట్ ఆన్లైన్ స్కామ్గా మారడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, స్పెషల్ డెస్క్మోసగాళ్ల మాయ.. సామాజిక మాధ్యమాల్లో అనేక వైరల్ వీడియోలలో పలు బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తూ సెలెబ్రిటీలు కనిపిస్తున్నారు. ఈ వీడియోలు చూడడానికి నిజమైనవిగా కనిపిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి డీప్ఫేక్ వీడియోలను మోసగాళ్లు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కంపెనీ మ్యాకఫీ 2025 సంవత్సరానికిగాను ‘మోస్ట్ డేంజరస్ సెలెబ్రిటీ: డీప్ఫేక్ డిసెప్షన్ లిస్ట్’విడుదల చేసింది. భారత్లో డీప్ఫేక్ సెలబ్రిటీ వీడియోల్లో అత్యధికంగా షారుఖ్ ఖాన్ దర్శనమిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సినీనటి అలియా భట్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. 2025 ఆగస్ట్లో ఆన్లైన్లో నిర్వహించిన మ్యాకఫీ సర్వేలో ఆ్రస్టేలియా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, జపాన్, యూకే, యూఎస్కు చెందిన వేలాది మంది వినియోగదారులు పాలుపంచుకున్నారు.డీప్ లెర్నింగ్ టెక్నిక్స్తో.. ఏఐని ఉపయోగించి ప్రత్యేకంగా డీప్ లెర్నింగ్ టెక్నిక్స్తో సృష్టించిన వీడియో, ఇమేజ్, ఆడియోను డీప్ఫేక్ అంటారు. నిజమైన వ్యక్తి ఎప్పుడూ చేయని పనిని చేస్తున్నట్లు లేదా చెబుతున్నట్లు చూపించడానికి.. వాస్తవికత ఉట్టిపడేలా కంప్యూటర్ సాయంతో, ఇప్పటికే ఉన్న వీడియోలు, ఫొటోలు, ఆడియోలను అనుకూలంగా మార్చుకుని నకిలీ కంటెంట్ తయారు చేయడమే ఈ డీప్ఫేక్ ప్రత్యేకత. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, మోసం వంటి తప్పుడు ప్రయోజనాల కోసం డీప్ఫేక్లను ఉపయోగిస్తున్నారు. నకిలీ ఎండార్స్మెంట్స్, ఫాలోవర్లను పెంచుకోవడానికి బహుమతులను ఇవ్వడం వంటివి ప్రోత్సహించడానికి, ప్రజలను మోసపూరిత వెబ్సైట్స్, ఫిషింగ్ లింక్స్ లేదా హానికరమైన డౌన్లోడ్స్ వైపు మళ్లించడానికి డీప్ఫేక్లలో సెలబ్రిటీల పేర్లను సైబర్ నేరస్తులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.సగటున రూ. 34,500 నష్టం..సైబర్ నేరస్తులు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి భారత్కు చెందిన ప్రసిద్ధ వ్యక్తుల వరకు వారి అనుమతి లేకుండా, వారి వీడియోలు, పేర్లను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారని మ్యాకఫీ వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 90% మంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో నకిలీ లేదా ఏఐతో రూపొందిన సెలబ్రిటీ ప్రకటనల వీడియోలకు బలయ్యారని నివేదిక వెల్లడించింది. ఫలితంగా ఒక్కో బాధితుడికి సగటున రూ. 34,500 నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇన్ఫ్లుయెన్సర్స్, ఆన్లైన్ ప్రముఖులున్న డీప్ఫేక్ కంటెంట్ను 60% మంది భారతీయులు వీక్షించారు. మోసపూరిత కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని మ్యాకఫీ తెలిపింది. మూడు సెకన్ల ప్రసంగంతో..సెలబ్రిటీల వీడియోలు, చిత్రాలు, స్వరాన్ని వారి అనుమతి లేకుండా ఉపయోగిస్తూ డీప్ఫేక్ వీడియోలతో సామాన్యులను మోసం చేస్తున్నారని నివేదిక పేర్కొంది. మూడు సెకన్ల ప్రసంగం ఉంటే చాలు.. స్కా మర్లు ఇప్పుడు నమ్మశక్యం కాని విధంగా డీప్ఫేక్లను రూపొందిస్తున్నారని మ్యాకఫీ వెల్లడించింది. ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్లో చర్మ సంరక్షణ వస్తువులకు సంబంధించిన వీడియోలు 42% ఉన్నాయి. బహుమతులు 41%, క్రిప్టోకరెన్సీ లేదా ట్రేడింగ్ స్కీమ్స్ వీడియోలు 40% ఉన్నాయి.వేగంగా వ్యాప్తి.. ‘డీప్ఫేక్లు సైబర్ నేరస్తుల మోసపూరిత విధానాలను మా ర్చాయి. ఒకప్పుడు డిజిటల్ ఉపకరణం, కంప్యూటర్, నెట్వర్క్లోకి మోసపూరితంగా సైబర్ నేరగాళ్లు చొరబడి (హ్యా క్) అ«దీనంలోకి తీసుకునేవాళ్లు. ఇప్పుడు మానవ నమ్మకా న్ని హ్యాక్ చేస్తున్నారు. టెక్నాలజీ ఇప్పుడు మనం ఆరాధించే వ్యక్తుల స్వరాలు, ముఖాలు, ప్రవర్తనలను సులభంగా అ నుకరించగలదు. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ దే శంలో ప్రతిరోజూ లక్షలాది మందికి దర్శనమిస్తుండటంతో ఇటువంటి నకిలీలు తక్షణమే వ్యాప్తి చెందుతాయి’అని మ్యా కఫీ నివేదిక వివరించింది. భారత్లోని సెలబ్రిటీ సంస్కృతి, కోట్లాదిగా ఉన్న ఆన్లైన్ యూజర్లు వెరసి ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. -
బంగారానికి డబ్బులు కాస్తాయ్!
ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు). దేశ జీడీపీలో 88.8 శాతానికి సమానం. పసిడి ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంతటి విలువైన పసిడిని బీరువాల్లోనో.. లేదంటే బ్యాంక్ లాకర్లలో పెట్టే వారి ముందు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాడకంలో లేని పసిడిని ఉత్పాదకతకు వినియోగించుకోవచ్చు. అదనపు రాబడి మార్గాలను ప్రయతి్నంచొచ్చు. బంగారం రుణాలు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, పసిడి ఆధారిత పెట్టుబడుల పథకాలు ఇలా ఎన్నో సాధనాలున్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కేంద్ర సర్కారు 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్/పసిడి నగదీకరణ పథకం)ను తీసుకొచ్చింది. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని ఉత్పాదకత వైపు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద వ్యక్తులతోపాటు సంస్థలు భౌతిక బంగారాన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. జమ చేసిన మేర బంగారం విలువపై ఏటా 2.25–2.5 శాతం మేర వడ్డీని పొందొచ్చు. దీనివల్ల సదరు బంగారాన్ని ఎక్కడ భద్రంగా నిల్వ చేసుకోవాలన్న ఆందోళన ఉండదు. బంగారం ఆభరణాలు, కాయిన్లు, కడ్డీలను అధీకృత కేంద్రానికి తరలించి అక్కడ స్వచ్ఛత పరీక్షిస్తారు. ఈ పథకం కింద కనీసం 10 గ్రాముల బంగారం నుంచి ఎంత వరకు అయినా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. జమ చేసిన మేర బంగారానికి (స్వచ్ఛత అనంతరం) బ్యాంక్లు డిపాజిట్ రసీదును జారీ చేస్తాయి. సదరు బంగారాన్ని కరిగించి వినియోగంలోకి తెచ్చుకుంటాయి. గడువు ముగిసిన తర్వాత జమ చేసినంత బంగారాన్ని తిరిగి పొందొచ్చు. లేదంటే అప్పటి విలువ మేరకు నగదు రూపంలోనూ తీసుకోవచ్చు. 2025 మార్చి నుంచి మధ్య, దీర్ఘకాల గోల్డ్ మానిటైజేషన్ డిపాజిట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడాది, మూడేళ్ల కాలానికే ప్రస్తుతం ఈ పథకం కింద బంగారం డిపాజిట్కు అనుమతి ఉంది. దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. మంచి విలువైన పథకం అయినప్పటికీ దీనిలో పాల్గొనే వారు చాలా తక్కువగా ఉంటున్నట్టు ఆనంద్రాఠి వెల్త్ మ్యూచువల్ ఫండ్స్ విభాగం హెడ్ స్వేత రజని తెలిపారు. బంగారం ఆభరణాలతో ఉన్న దీర్ఘకాల అనుబంధం, సెంటిమెంట్ను ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. కనీసం దెబ్బతిన్న ఆభరణాలు, వినియోగించని వాటి విషయంలో అయినా గోల్డ్ మానిటైజేషన్ పథకం ఎంతో అనుకూలం. రిస్క్ లేని రాబడులను అందుకోవచ్చు. ఆభరణాలతో భావోద్వేగమైన బంధం ఉన్న వారికి ఇది అనుకూలం కాదు. ఎందుకంటే మానిటైజేషన్ కింద డిపాజిట్ చేస్తే వాటిని పూర్వపు రూపంలో తిరిగి పొందలేరని రజని తెలిపారు. → ఇది ప్రభుత్వ హామీ కలిగిన పథకం. ఇందులో డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రాబడి 2.25–2.5%. వడ్డీని ఏటా చెల్లిస్తారు. → ఆభరణాలు, కాయిన్లను డిపాజిట్ చేయొచ్చు. గడువు తీరిన తర్వాత తిరిగి బంగారం లేదంటే నగదు రూపంలో తీసుకోవచ్చు. → కేవలం 1–3 ఏళ్ల కాలానికే అందుబాటులో ఉంటుంది. వేగంగా నగదు మార్చుకోవడానికి ఇందులో అవకాశం లేదు. గడువు ముగిసే వరకు ఆగాల్సిందే. → 10 గ్రాముల్లోపు బంగారండిపాజిట్కు అవకాశం లేదు. నగలపై రుణం.. వినియోగించకుండా ఉన్న ఆభరణాలను, వాటితో ఉన్న అనుబంధం దృష్ట్యా గోల్డ్ మానిటైజేషన్కు మనసొప్పని వారు.. వాటిని రుణాల కోసం వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుపై రుణాన్ని వేగంగా పొందొచ్చు. బంగారం తాకట్టు విలువపై 75 శాతం వరకు రుణం కింద బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఇస్తుంటాయి. రూ.5 లక్షల్లోపు రుణాలకు 85 శాతం విలువ వరకు కూడా (ఎల్టీవీ) ఇస్తాయి. ప్రతి నెలా వడ్డీ చెల్లించి, గడువు ముగిసిన తర్వాత అసలు చెల్లించొచ్చు. కొన్ని బ్యాంకులు గడువు చివర్లో వడ్డీ, అసలు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. కాకపోతే వడ్డీని ప్రతి నెలా చార్జ్ చేస్తుంటాయి. దీంతో ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టకపోతే, దానిపై రెండో నెలలో వడ్డీ భారీగా పెరిగిపోతుంది. రుణాన్ని సమాన నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. బంగారం తాకట్టుపై ఓవర్డ్రాఫ్ట్ రుణాన్ని కూడా పొందొచ్చు. అనుమతించిన రుణాన్ని అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. తిరిగి ఎప్పుడైనా చెల్లించొచ్చు. ఎలాంటి ఆదాయపత్రాలు, క్రెడిట్ స్కోర్ ఈ రుణాలకు అవసరం లేదు. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటోంది. అదే బంగారంపై రుణాలు 8 శాతం రేటు నుంచి లభిస్తున్నాయి. గోల్డ్ అప్రైజర్, ప్రాసెసింగ్ చార్జీల పేరుతో కొంత చార్జీ భరించాల్సి ఉంటుంది. ముందుగా రుణాన్ని చెల్లించేస్తే ఎలాంటి చార్జీ పడదు. కొన్ని సంస్థలు ముందస్తు చెల్లింపులపై కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. రుణ గడువు ముగిసిన తర్వాత చెల్లింపుల్లో విఫలమైతే 30–60 రోజుల వ్యవధి అనంతరం, బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు వేలం వేస్తుంటాయి. → ఆభరణాల విలువపై 85 శాతం వరకు రుణంగా పొందొచ్చు. → వ్యక్తిగత రుణాలు తీసుకుని అధిక వడ్డీ భారం మోస్తున్న వారు.. తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారం ఆభరణాలు, కాయిన్లపై రుణంతో భారాన్ని తగ్గించుకోవచ్చు. → గడువులోపు రుణాన్ని తీర్చివేయడంలో విఫలమైతే బంగారాన్ని వేలం వేస్తారు. → రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు గణనీయంగా పడిపోతే, కొంత మొత్తాన్ని మధ్యంతరంగా చెల్లించాల్సి రావడం ప్రతికూలత.బంగారం లీజుకు.. బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కొంత రాబడి పొందొచ్చు. నగల వ్యాపారులకు (జ్యుయెలర్) మూలధన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వారు దుకాణాల్లో ఆభరణాల నిల్వ కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం పడుతుంది. కనుక నగల వ్యాపారులు ఆభరణాలను లీజుకు తీసుకుని ఈ అవసరాలను గట్టెక్కుతుంటారు. దీనిపై కొంత రాబడి చెల్లిస్తుంటారు. దీనివల్ల బంగారాన్ని బీరువా లేదా బ్యాంకు లాకర్లకు పరిమితం కాకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే సాధనంగా మార్చుకోవచ్చు. సేఫ్గోల్డ్ అనే ప్లాట్ఫామ్ ఇందుకు వీలు కలి్పస్తోంది. ఈ సంస్థను సంప్రదించినట్టయితే అనుమతి తీసుకుని, లీజుకు ఇచ్చిన బంగారాన్ని కరిగించి అందులోని స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అనంతరం 24 క్యారెట్ బంగారం కిందకు మారుస్తారు. అనంతరం సంబంధిత వ్యక్తి పేరుపై డిజిటల్ గోల్డ్ ఖాతా తెరిచి బంగారం విలువ మేరకు జమ చూపిస్తారు. అనంతరం సేఫ్గోల్డ్ ప్లాట్ఫామ్పై లిస్ట్ అయిన నగల వ్యాపారులకు మీ బంగారాన్ని లీజుకు ఇవ్వొచ్చు. ఏటా 2–5 శాతం మధ్య రాబడి లభిస్తుంది. రాబడిని రూపాయిల్లో కాకుండా తిరిగి బంగారం రూపంలోనే జమ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో తాము లీజుకు ఇచ్చిన బంగారానికి అదనంగా మరికొంత పసిడిని పోగుచేసుకోవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా, దీర్ఘకాలంలో అదనపు రాబడిని ఈ మార్గంలో సంపాదించుకోవచ్చు. → ఈ విధానంలో ఆభరణాలు, కాయిన్లను కరిగించి, వాటి విలువపై 2–5 శాతం మధ్య రాబడి చెల్లిస్తారు. → కోరుకున్నప్పుడు తిరిగి పాత ఆభరణాలను పొందడం సాధ్యపడదు. ఒకవేళ భౌతిక బంగారం రూపంలోనే వెనక్కి తీసుకునేట్టు అయితే డెలివరీ చార్జీలు చెల్లించుకోవాలి. ఫండ్స్లోకి మార్చుకోవడం భౌతిక బంగారాన్ని గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి మార్చుకోవడం మరో మార్గం. దీనివల్ల భద్రతపరమైన రిస్క్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా నగదుగా మార్చుకోవచ్చు. ఇందులో లాభ, నష్టాలు రెండూ ఉన్నాయి. నాణ్యత, నిల్వ, భద్రతాపరమైన రిస్్కలను తొలగించుకోవడం సానుకూలతలు. పెద్ద మొత్తంలో బంగారం కలిగిన వారికి, దాన్ని కాపాడుకోవడం, ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం పెద్ద సవాలే. ఇలాంటి వారు మొత్తం కాకపోయినా సగం బంగారాన్ని అయినా డిజిటల్ రూపంలోకి మార్చుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఏడాది నిండిన తర్వాత డిజిటల్ గోల్డ్ను విక్రయించిన సందర్భంలో వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించి, డిజిటల్గా మారిపోవడం వల్ల పారదర్శకత, భద్రత, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, డిజిటల్ రూపంలో (ఈటీఎఫ్లు) ఉంటే స్వల్ప స్థాయిలో ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.కొత్త ఆభరణాలకు అప్గ్రేడ్... కొందరు ఇంట్లో వినియోగంలో లేని బంగారాన్ని అలాగే ఉంచేసి, కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. దీనికి బదులు పాత బంగారాన్ని కొత్త ఆభరణాల కిందకు అప్గ్రేడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. కొత్త ఆభరణాల కిందకు మార్చుకోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగంలోకి వస్తుంది. దీంతో కొత్తవాటి కొనుగోలుకు అదనపు పెట్టుబడి అవసరం రాదు. కొత్త డిజైన్లకు, తయారీ కోసం చార్జీల వరకు చెల్లిస్తే చాలు. సున్నా తరుగు లేదా అతి తక్కువ తరుగు చార్జీల ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్రెండ్కు అనుగుణంగా కొత్త ఆభరణాలను ధరించామన్న సంతృప్తి దక్కుతుంది. → గతంలో ఎప్పుడో కొన్న ఆభరణాల్లో స్వచ్ఛత పాళ్లు తక్కువ. ఇప్పుడు వాటిని హాల్మార్క్ ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. → వినియోగంలో లేని ఆభరణాలనే కొత్త ఆభరణాల అప్గ్రేడ్ కోసం పరిశీలించొచ్చు. → బంగారం విలువలో 10–15 శాతం చార్జీలను భరించాల్సి రావచ్చు. జీఎస్టీ కూడా పడుతుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక జర్మన్ బందీ ఆశల వంటకం!
చరిత్రలో కొన్ని ఆహార పదార్థాలు రుచిని మాత్రమే అందించవు.. అవి అనేక భావోద్వేగాలు, మహా విపత్తుల నుండి విజయవంతంగా గట్టెక్కిన అద్భుత ధైర్యసాహస గాథల్ని కూడా తమతో మోసుకొస్తాయి. అలాంటిదే జర్మనీలో పుట్టిన ‘బౌమ్కూచెన్’ అనే ఈ ప్రత్యేకమైన కేక్! ట్రీ కేక్ అని పిలిచే ఈ స్వీట్, వలయాలతో కూడిన చెట్టు కాండాన్ని పోలి ఉండడం వల్ల.. జపాన్లో దీర్ఘాయుష్షుకు, శ్రేయస్సుకు చిహ్నంగా మారింది. ఈ రుచికరమైన కేక్ ప్రయాణానికి.. మధురమే కాదు, కష్టాల కడలిని ఈదిన చారిత్రక నేపథ్యం ఉంది. దీని మూలాలు.. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్లోని ఓ చిన్న ద్వీపమైన నినోషిమాలో బందీగా ఉన్న ఒక జర్మన్ మిఠాయి తయారీదారుతో ముడిపడి ఉన్నాయి. యుద్ధ శిబిరంలో మొలకెత్తిన శాంతియుత ఆలోచన నినోషిమా.. ఒకప్పుడు సైనిక క్వారంటైన్ కేంద్రంగా, తొలి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ యుద్ధ ఖైదీల శిబిరంగా ఉండేది. 1915లో చైనాలోని క్వింగ్డావోలో పట్టుబడిన జర్మన్ మిఠాయి తయారీదారు కార్ల్ జుఖైమ్ 1917లో ఇక్కడికి వచ్చాడు. నినోషిమాలోని జర్మన్ బందీలకు కొంతమేర స్వేచ్ఛ ప్రసాదించారు. దాంతో వారు వంట చేసుకోవడానికి అనుమతి పొందారు. అప్పుడే జుఖైమ్ తన బౌమ్కూచెన్ వంటకాన్ని ఇక్కడే పరీక్షించాడని భావిస్తున్నారు. ఇప్పటికీ, నినోషిమాలో సందర్శకులు వెదురు కర్రపై పిండిని పోసి, బొగ్గుల నిప్పుపై వేడి చేస్తూ, పొరలు పొరలుగా బౌమ్కూచెన్ వంటకం తయారీ నేర్చుకుంటారు. కేక్ పొరలు బ్రౌన్ రంగులోకి మారిన ప్రతిసారీ, కొత్త పొర పోస్తారు. ఇది చెట్టు కాండంపై వలయాల మాదిరిగా మారుతుంది. ఈ పద్ధతిని జుఖైమ్ నూరేళ్ల క్రితం ఆ యుద్ధ శిబిరంలోనే ప్రారంభించారు. భూకంపాలు, బాంబు దాడులను తట్టుకుని.. యుద్ధం ముగిసిన తర్వాత కూడా జుఖైమ్ జపాన్లోనే ఉండిపోయాడు. మార్చి 1919లో హిరోషిమా ప్రిఫెక్చరల్ ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్లో ఆయన చేతితో చేసిన బౌమ్కూచెన్ వాణిజ్యపరంగా ప్రారంభమైంది. అది అద్భుతమైన ప్రజాదరణ పొందింది. 1922లో యోకోహామాలో ఒక పేస్ట్రీ షాప్ను కూడా తెరిచాడు. కానీ, 1923లో వశ్నిచ్చిన గ్రేట్ కాంటో భూకంపం ఆ వ్యాపారాన్ని నాశనం చేసింది. ఆ తర్వాత కోబ్కు మకాం మార్చి కాఫీ షాప్ తెరిచాడు. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగియడానికి కేవలం రెండు నెలల ముందు, కోబ్పై అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఆ స్టోర్ కూడా నేలమట్టమైంది. అయినా, జుఖైమ్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన భార్య ఎలిస్, అంకితభావం గల జపనీస్ సిబ్బంది సహాయంతో కోబ్లోనే వ్యాపారాన్ని తిరిగి వృద్ధి చేసుకున్నాడు. జపాన్ లొంగిపోయేందుకు ఒక రోజు ముందు, ఆగస్టు 14, 1945న జుఖైమ్ అనారోగ్యంతో మరణించినప్పటికీ, ఆయన స్థాపించిన జుఖైమ్ కో లిమిటెడ్ నేటికీ జపాన్ అగ్రశ్రేణి కాన్ఫెక్షనరీ సంస్థలలో ఒకటిగా కొనసాగుతుండటం విశేషం. బౌమ్కూచెన్.. శాంతికి, సౌభాగ్యానికి ప్రతీక! ఈ ‘వృక్ష కేక్’ మూలాలు విపత్తులు, యుద్ధాలతో ముడిపడి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం జపాన్ సంస్కృతిలో ఇది విడదీయరాని భాగమైంది. దీని వలయాల నిర్మాణం నిరంతరాయమైన జీవితానికి, వృద్ధికి ప్రతీకగా భావిస్తారు. పెళ్లిళ్లు, పుట్టినరోజుల వంటి శుభకార్యాలకు అత్యంత ప్రజాదరణ పొందిన బహుమతిగా మారింది. మచ్చా, చిలగడదుంపల వంటి స్థానిక వంటకాలతో కలిపి జపనీస్ శైలిలో మార్పులు చెందింది. నినోషిమా వెల్కమ్ సెంటర్ అధిపతి కజుకి ఒటాని చెప్పినట్లు.. ‘జుఖైమ్ వంట.. శాంతి కోసం చేసిన వ్యక్తీకరణ’. మరణం, విధ్వంసం చుట్టుముట్టిన చోట ఊపిరి పోసుకున్న బౌమ్కూచెన్ అనే ఈ తీపి వంటకం.. కష్టాల నుంచి బయటపడిన మానవ ఆశలు, మనుగడకు ఒక నిశ్శబ్ద సాక్ష్యంగా నిలిచింది. ఇది కేవలం ఒక కేక్ కాదు. యుద్ధాలనూ, విపత్తులనూ జయించిన ఒక అద్భుతమైన కథ! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక పరీక్ష.. 13 గంటలు
ప్రతి నవంబర్లో.. దక్షిణ కొరియా నేలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంటుంది. ఆ రోజు దేశం ఊపిరి బిగబట్టి నిల్చుంటుంది. కారణం.. ఆ రోజు పిల్లల భవితవ్యాన్ని నిర్ణయించే అత్యంత ప్రతిష్టాత్మక కాలేజీ ప్రవేశ పరీక్ష ’సునుంగ్’ జరగడమే. ఆ రోజు ఆకాశంలో విమానాలు ఆలస్యమవుతాయి, వీధుల్లో వాహనాల శబ్దం తగ్గుతుంది. దుకాణాలు సైతం మూతపడతాయి. లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించే ఈ మహాపరీక్ష కోసం సిద్ధమవుతారు. ఈ పరీక్షలో విజయం యూనివర్సిటీ ప్రవేశాన్ని మాత్రమే కాదు.. విద్యార్థుల ఉద్యోగం, ఆదాయం, నివాసం, చివరికి వివాహ బంధాన్ని సైతం ప్రభావితం చేస్తుంది.సాధారణంగా విద్యార్థులందరికీ ఇది ఉదయం 8.40 గంటలకు మొదలై సాయంత్రం 5.40 గంటలకు ముగిసే 8 గంటల మెగా మారథాన్. పరీక్ష ముగిశాక విద్యార్థులంతా అలసటతో స్కూలు గేటు దాటి బయటికి వస్తారు. అక్కడ తమ కోసం నిరీక్షిస్తున్న తల్లిదండ్రుల ఆనందభాష్పాల ఆలింగనంతో కష్టాన్ని మరిచిపోతారు. కానీ కొందరు విద్యార్థులకు కన్నీరు కార్చేందుకు కూడా సమయం దొరకదు. చీకట్లో ఆశల వెలుగును వెతుక్కుంటారు. పరీక్ష కేంద్రం గదిలోనే మిగిలిపోతారు. రాత్రి 10 గంటల వరకు కూడా వారి పోరాటం కొనసాగుతుంది. వారంతా తీవ్ర దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థులు. ఆ క్షణమే వారి అసలు కన్నీటి కథకు అంకురార్పణ! సుదీర్ఘ పోరాటమే.. సాధారణ విద్యార్థులకంటే 1.7 రెట్లు ఎక్కువ సమయం.. వారికి కేటాయించినా, ఈ సునుంగ్ పరీక్ష దాదాపు 13 గంటల సుదీర్ఘ పోరాటమే. అదనపు విదేశీ భాషా విభాగాన్ని తీసుకుంటే.. ఈ పరీక్ష రాత్రి 9.48 గంటల వరకు సాగుతుంది. వారికి మధ్యాహ్న భోజన విరామం మాత్రమే ఉంటుంది. రాత్రి భోజనానికి విరామం లేదు. పరీక్ష నిరాటంకంగా కొనసాగుతుంది. 13 గంటలు.. అంటే ఒక రోజులో దాదాపు సగం సమయం కేవలం పరీక్ష కోసం కేటాయించాలి. నొప్పిని భరిస్తూ.. చేతులే కళ్లుగా దీనికి కారణం బ్రెయిలీ పరీక్ష పత్రాల బరువు. ప్రతి ఒక్క వాక్యం, చిహ్నం, పటం బ్రెయిలీలోకి మారినప్పుడు, ఒక్కొక్క ప్రశ్నపత్రం సాధారణ ప్రశ్నపత్రం కంటే 6 నుంచి 9 రెట్లు మందంగా మారుతుంది. సియోల్ హాన్బిట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ విద్యార్థి అయిన 18 ఏళ్ల హాన్ డోంగ్హు్యన్ ఈ ఏడాది సుదీర్ఘ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులలో ఒకడు. పుట్టుకతోనే పూర్తిగా అంధుడైన డోంగ్హు్యన్ కాంతిని కూడా గుర్తించలేడు. ‘సుదీర్ఘ పరీ క్ష కాబట్టి నిజంగా అలసిపోతాను. తప్పించుకునే ప్రత్యేక చిట్కాలేవీ నాకు తెలియవు. నా స్టడీ షెడ్యూల్ను అనుసరిస్తా ను. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. అదే ఏకైక మార్గం’.. అన్నాడు డోంగ్హు్యన్. ఆత్మ విశ్వాసమే ఆలంబన సుమారు 16 పేజీలుండే కొరియన్ భాషా విభాగానికి సంబంధించిన బ్రెయిలీ పుస్తకం దాదాపు 100 పేజీలు ఉంటుంది. డోంగ్హు్యన్ తన వేళ్లతో బ్రెయిలీని చదువుతున్నంత వేగంగానే, జ్ఞాపకశక్తితో వివరాలను నిక్షిప్తం చేసుకుంటూ ముందుకు సాగాలి. ‘మధ్యాహ్నం భోజనం వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో, ఆంగ్లం తర్వాత.. అప్పుడు నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. మాకు రాత్రి భోజన విరామం లేదు. భోజనం చేయాల్సిన సమయంలో పరీక్షతో కుస్తీ పట్టడం మరింత అలసటను కలిగిస్తుంది’.. అన్నాడు 18 ఏళ్ల జియాంగ్–వోన్. అయినా, ‘చివరికి ఒక గొప్ప విజయం ఉంటుంది అనే భావనే నన్ను ముందుకు నడిపిస్తుంది’.. అని గొప్ప ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆలస్యంగా మెటీరియల్ అంధ విద్యార్థులకు పరీక్ష వ్యవధి, సుదీర్ఘ అధ్యయన గంటలు కష్టం అనిపించదు. వారిముందున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే.. అధ్యయన సామగ్రిని పొందడం! సాధారణ విద్యార్థులు ఆధారపడే ప్రముఖ పాఠ్యపుస్తకాలు, ఆన్లైన్ ఉపన్యాసాలు వీరికి అందుబాటులో ఉండవు. బ్రెయిలీ వెర్షన్లు చాలా తక్కువ. జాతీయ పరీక్షకు సంబంధించిన ఈబీఎస్ (ఎడ్యుకేషనల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్) తయారీ పుస్తకాలు వీరికి ఆలస్యంగా అందుతాయి. ‘సాధారణ విద్యార్థులు తమ ఈబీఎస్ పుస్తకాలను జనవరి–మార్చి మధ్య తీసుకుని ఏడాది పొడవునా చదువుకుంటారు. మాకు బ్రెయిలీ ఫైల్స్ పరీక్షకు కొన్ని నెలల ముందు ఆగస్టు లేదా సెపె్టంబర్ నెలల్లో మాత్రమే అందుతాయి’.. అని జియాంగ్–వోన్ వాపోయాడు. సెల్యూట్ చేయకుండా ఉండలేం అంధ విద్యార్థులకు సునుంగ్ అనేది కేవలం కాలేజీ ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు.. బతుకు ప్రయాణంలో ఎన్నో ఏళ్ల సహనానికి.. పట్టుదలకు నిదర్శనం! ‘బ్రెయిలీ చదవడం అంటే వేలికొనలతో ఉబ్బెత్తు చుక్కలను తాకడం. నిరంతర ఘర్షణ వల్ల వారి చేతులు చాలా నొప్పి పెడతాయి. కానీ వారు దానిని గంటల తరబడి చేస్తారు. అంధ విద్యార్థులు అనుభవించే శారీరక, మానసిక శ్రమకు సెల్యూట్ చేయకుండా ఉండలేం’.. అని విద్యార్థుల గురువైన కాంగ్ సియోక్–జు కొనియాడారు. ‘సునుంగ్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డే ఇన్ సౌత్ కొరియా’.. అనే వీడియో, దక్షిణ కొరియాలో సునుంగ్ పరీక్ష రోజు దేశం యావత్తు ఎలా నిలిచిపోతుందో.. ఈ పరీక్ష ప్రాధాన్యం, ఒత్తిడిని వివరిస్తుంది. నవంబర్ 13న దక్షిణ కొరియా దేశవాప్యంగా 1310 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,54,174 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను డిసెంబర్ 5న వెల్లడిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓట్లు వచ్చినా సీట్లు రాలే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి. 2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్బంధన్కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే.. ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కృత్రిమ మేధతో.. కొలువుల కోత
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. కంపెనీలు కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడం. ఏఐలో పెట్టుబడులు పెట్టడం, పెరుగుతున్న వ్యయాలను కట్టడి చేయడంలో భాగంగా కంపెనీలు తమ వ్యాపార విధానాన్ని మార్చుకోవడం కూడా కొలువుల కోతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఏఐ అధిక వినియోగం ఉద్యోగుల తీసివేతలకు కారణం అవుతుందని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఈ ఏడాది జూన్ లో జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఆయన కంపెనీ విషయంలో నిజమైంది. సుమారు 14,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ఇటీవలే అమెజాన్ ప్రకటించింది. ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి, ఖర్చులు తగ్గించుకునేందుకు మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం వరకు తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ప్రకటించింది. మెటా, టీసీఎస్.. ఇలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టాయి. వారికంటే ఎక్కువ జీతాలుఏఐ నైపుణ్యాలున్న కార్మికుల సగటు వేతనాలు.. సంబంధిత రంగంలోని ఇతర ఉద్యోగుల సగటు జీతం కంటే 56% అధికంగా ఉండడం విశేషం. ప్రధానంగా హోల్సేల్–రిటైల్, ఇంధనం, సమాచారం, రవాణా – నిల్వ, రియల్టీ, తయారీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో ఈ వ్యత్యాసం ప్రధానంగా కనిపిస్తోంది. ఏఐ రంగంలో నిపుణుల కొరత వల్లే.. ఈ నైపుణ్యాలకు కంపెనీలు ఎక్కువ విలువ ఇస్తున్నాయని పరిశ్రమ చెబుతోంది. ఈ సంవత్సరం మొత్తం లేఆఫ్లలో ఇంటెల్, లెనోవో వంటి హార్డ్వేర్ కంపెనీల వాటా సుమారు 28%. అమెజాన్, ఈబే తదితర కంపెనీలు 14%, సేల్స్ (సేల్స్ఫోర్స్) 9%, కంజ్యూమర్ టెక్ (మెటా, గూగుల్) సంస్థలు 7% వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.పెట్టుబడులు ఇంతింతై..ప్రపంచవ్యాప్తంగా 2013లో ఏఐ రంగంలో పెట్టుబడులు సుమారు 15 బిలియన్ డాలర్లు కాగా.. 2019 నాటికి 103 బిలియన్ డాలర్లకి, 2024కి 252 బిలియన్ డాలర్లకి పెరిగాయి. -
మితంగా తీసుకున్నా ముప్పే
భోజనం, స్నాక్స్ సమయంలో సోడా ఒక ప్రధాన ఆహారంగా మారింది. మితంగా సోడా తీసుకోవడం కూడా కాలేయ ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను కలిగిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజూ డైట్ సోడా లేదా చక్కెరతో తయారైన పానీయాలు తాగడం వల్ల నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ) ప్రమాదం పొంచి ఉందని తేలింది. చక్కెరతో తయారైన తీపి పానీయాలు (ఎస్ఎస్బీలు), తక్కువ చక్కెర లేదా చక్కెరరహిత తీపి పానీయాలు (ఎల్ఎన్ఎస్ఎస్బీ) రెండూ కూడా జీవక్రియను దెబ్బతీస్తాయి.తద్వారా మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. ఎంఏఎస్ఎల్డీని గతంలో వైద్యులు ఎన్ఏఎఫ్ఎల్డీ అని పిలిచేవారు. రోజూ ఒక బాటిల్ డైట్ సోడా/కృత్రిమ చక్కెరతో తయారైన పానీయాలు తాగడం వల్ల ఎంఏఎస్ఎల్డీ ప్రమాదం 60% పెరుగుతుంది. అలాగే చక్కెర పానీయాల విషయంలో ఈ వ్యాధి ముప్పు 50% అధికం అవుతుందని అధ్యయనంలో తేలింది. లక్ష మందికిపైగా.. జీవ సంబంధమైన, ఆరోగ్యం, జీవనశైలి సమాచారాన్ని సేకరిస్తున్న యూకే బయోబ్యాంక్ డేటా ఆధారంగా... దశాబ్ద కాలంలో 1,23,788 మందిపై ఈ పరిశోధన సాగించారు. పరిశోధన ప్రారంభంలో ఎవరికీ కాలేయ వ్యాధి లేదు. సమగ్ర ఆహార సంబంధ ప్రశ్నావళి ఉపయోగించి పరిశోధకులు పానీయాల వినియోగంతో మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్కు ఉన్న సంబంధాన్ని పరిశీలించారు.నాన్–ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ను మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇది సంభవిస్తుంది. సిర్రోసిస్ లేదా కాలేయ కేన్సర్కు కూడా కారణమవుతుంది. అధికంగా ఆల్కహాల్ తాగేవారిలో ఎంఏఎస్ఎల్డీ సాధారణంగా వచ్చే సమ స్య. అమెరికాలో గత 30 సంవత్సరాల్లో ఎన్ఏఎఫ్ఎల్డీ బాధితుల సంఖ్య దాదాపు 50% పెరిగింది. ప్రస్తుతం అక్కడి జనాభాలో దాదాపు 38% మంది ఈ వ్యాధిబారిన పడ్డట్టు పరిశోధనలు చెబుతున్నాయి. అపోహ వీడండి..చైనా సుజోలోని సూచో విశ్వవిద్యాలయానికి చెందిన అనుబంధ ఆసుపత్రి గ్రాడ్యుయేట్ విద్యారి్థ, ప్రధాన అధ్యయన రచయిత లిహే లియు ఆశ్చర్యకరమైన ఫలితాలను వివరించారు. ‘చక్కెర ఆధారిత తీపి పానీయాలపై చాలాకాలంగా అధ్యయనం జరుగుతోంది. అయితే డైట్ పానీయాలు ఆరోగ్యకరమైనవిగా జనం పరిగణిస్తున్నారు. ఇవి ఎంత మాత్రమూ సురక్షితం కాదు. మా అధ్యయనం ప్రకారం తక్కువ లేదా చక్కెర రహిత తీపి పానీయాలు రోజుకు ఒకే డబ్బా తీసుకున్నప్పటికీ మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని తేలింది. డైట్ సోడాలు తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధితో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది’అని అన్నారు. నీటిని స్వీకరించడం వల్ల..చక్కెర లేదా డైట్ సోడాలకు బదులుగా మంచి నీటిని స్వీకరించడం వల్ల ఫలితాలు మారిపోయాయి. సోడాలకు బదులుగా నీరు తీసుకోవడం వల్ల వ్యాధి వచ్చే అవకాశం దాదాపు 13% తగ్గింది. డైట్ పానీయాల విషయంలో 15% కంటే ఎక్కువ తగ్గింది. అయితే చక్కెర పానీయాలకు బదులుగా డైట్ పానీయాలు, అలాగే డైట్ పానీయాలకు బదులుగా చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించలేదని పరిశోధనలో తేలింది. ‘నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మొత్తం జీవక్రియ పనితీరుకు సాయపడుతుంది. అందుకే నీరు ఆరోగ్యకరమైన పానీయం’అని లియు తెలిపారు. కాలేయంలో కొవ్వు ‘చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర పెరుగుదలను ప్రేరేపించడం, ఇన్సులిన్ స్థాయిలను పెంచడం, కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహించడం ద్వారా కాలేయానికి హాని కలిగిస్తాయి. చక్కెర పానీయాల్లో అధిక చక్కెర రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ వేగంగా పెరుగుదలకు కారణమవుతుంది. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అధిక చక్కెరతో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. డైట్ సోడాలు తక్కువ కేలరీలు కలిగి ఉన్నప్పటికీ ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండవచ్చు’అని లియు వివరించారు. చక్కెరతో తయారైన, తక్కువ లేదా చక్కెర రహిత తీపి పానీయాలు పేగుల్లోని సూక్ష్మజీవుల సమూహాన్ని (గట్ మైక్రోబయోమ్) మార్చగలవు. కడుపు నిండిన భావనకు అంతరాయం కలిగిస్తాయి. తీపి ఆహారాల పట్ల ఆసక్తి పెంచుతాయి. ఇన్సులిన్ స్రావాన్ని కూడా ప్రేరేపిస్తాయని నివేదిక వివరించింది. -
మొగలి పూలు.. రైతుకు సిరులు!
సాక్షి, అమరావతి: సుగంధ పరిమళాలు వెదజల్లే మొగలి పూలు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఈ పూల సాగుపై ఇప్పుడిప్పుడే రైతులు దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో మొగలి పొదలున్న ఒడిశాలో అధ్యయనం చేసిన ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సువిశాలమైన సముద్ర తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ ఈ మొగలి పూలసాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా గుర్తించింది. తీరంలోనే కాదు.. అంతర పంటగానూ సాగు చేసే దిశగా రైతులను చైతన్యపరచడానికి అడుగులు వేస్తోంది. మొగలి పూల నుంచి నూనె, అత్తరు, ఆకులు, రెమ్మల నుంచి నీరు, ఆకులు, రెమ్మలు, స్టెమ్లను వివిధ రకాల హ్యాండీక్రాఫ్టŠస్ను తయారు చేస్తున్నారు. గతేడాది మొగలి పూల నూనె లీటరు రూ.21 లక్షలకు పైగా పలికిందంటే దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదీ సాగు విధానం.. ప్రపంచంలో మరే ఇతర వృక్ష జాతికి లేని విశిష్టత ఈ మొగలి పొదల సొంతం. మగ చెట్లు పూలు పూస్తే ఆడ చెట్లు కాయలు కాస్తాయి. ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు బతుకుతాయి. 25–30 ఏళ్ల వరకు పంటనిస్తాయి. ఒండ్రు మట్టి, ఇసుక, ఎర్రమట్టి నేలలు వీటి సాగుకు అనుకూలం. దుక్కిదున్ని 2 అడుగుల దూరంలో ఎకరాకు మట్టి స్వభావాన్ని బట్టి 150–280 మొక్కలు నాటుకోవచ్చు. లైన్ల మధ్య 8–10 అడుగులు దూరం ఉండాలి. వీటి సాగులో ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. ప్రారంభంలో కొద్దిగా నీళ్లుంటే చాలు. ఎకరాకు రూ.లక్ష వరకు మొదట్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వ్యయం చేస్తే చాలు. అయితే ఇప్పటి వరకు వీటికి ప్రత్యేకంగా నర్సరీలంటూ ఎక్కడా లేవు. ఇప్పటికే సాగులోని మొక్కల స్టమ్లను తీసుకొచ్చి చెరకుగడల మాదిరిగా నాటితే వాటంతటవే పెరుగుతాయి. వరి పొలాలు, కాలువ గట్ల వెంబడి, ఇళ్లకు, పశువుల కొట్టాలకు కంచెలా, రోడ్ల కిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్గానూ నాటుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల్లోనూ అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. క్యాజరీనా, యూకలిప్టస్, జీడి మామిడి, తాటిగచ్చక వంటి వాటికి దీటుగా తీరంలో సముద్ర కోతను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా, పొలాలకు రక్షణగా కంచెగా, మడ అడవుల్లా, తుపానులు, ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఇవి దోహదపడతాయి. ఎకరాకు 11వేల పూల ఉత్పత్తి జూన్ నుంచి ఆగస్టులోపు మొగలి నాటుకునేందుకు అనుకూలం. ఈ పంటకు తేమ శాతం అధికంగా ఉండాలి. నాటిన మూడేళ్ల తర్వాత ఏటా 3 సీజన్లలో పంట (పూలు) చేతికొస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు, డిసెంబర్ నుంచి జనవరి వరకు, మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఇలా మూడు సీజన్లలో పూలు పూస్తాయి. మూడో ఏట నుంచి చెట్టుకు 15–20 పూలు (ఎకరాకు 5,600)పూస్తాయి. అదే ఐదేళ్లు దాటితే 35–50 పూలు (ఎకరాకు 11,200) పూస్తాయి. ఒక్కో చెట్టు ఏడాదిలో 800–1000 వరకు పూలు పూస్తుంది. వర్షాకాలంలో పూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తీరానికి 3 కి.మీ. వరకు సాగైన పంట నుంచి నెం.1 క్వాలిటీ పూల దిగుబడి వస్తుంది. ఉదయం 5–6 గంటల్లోపు పూచే పూలను ఫస్ట్ క్వాలిటీ పూలుగా, 6–10 గంటల మధ్య పూచే పూలను సెకండ్ క్వాలిటీగా, 10–11గంటల మధ్య థర్డ్ క్వాలిటీ పూలగా పరిగణిస్తారు. మొగ్గ దశలోనే వీటిని కట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ పూలకు ఒక్కొక్క దానికి రూ.35–45, రెండో రకానికి రూ.20–25, మూడో రకం పూలకు రూ.10–15 ధర లభిస్తుంది. పండుగ సీజన్లలో థర్డ్ క్వాలిటీ పూలు సైతం మార్కెట్లో రూ.40 వరకు ధర పలుకుతాయి. తీరానికి 3 కి.మీ.వరకు నాటిన మొక్కల ద్వారా వచ్చే ఫస్ట్ క్వాలిటీ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గరిష్టంగా ఎకరా పూల ద్వారా 2.75 కిలోల వరకు నూనె ఉత్పత్తి అవుతుంది. సగటున కిలో రూ.9.25 లక్షలు పలుకుతుండగా, మొగలి పూల ద్వారా తయారయ్యే అత్తరు లీటరు రూ.40–80వేలు, మొగలి జలం లీటర్ రూ.5–20వేల వరకు పలుకుతోంది. నూనెను ఫుడ్ బేవరేజస్లో విరివిగా వినియోగిస్తారు. అదే మొగలి జలాలను సెంటెడ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. రైతుల నుంచి ఫ్యాక్టరీలు నేరుగా పూలను కొనుగోలు చేస్తాయి. ఒడిశాలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి మొగలి సాగుకు ప్రపంచంలోనే ఒడిశాలోని గంజాం జిల్లా బరంపురం పరిసర ప్రాంతాలు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 వేల ఎకరాల్లో మొగలి సాగవుతోంది. ఈ ప్రాంతంలో 400కు పైగా పరిశ్రమలున్నాయి. 12 వేల మందికిపైగా ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి ఈ పూలు సాగు చేసే రైతులే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా నూనె, అత్తరు, నీరు వంటి ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలోఉత్తరప్రదేశ్లోని కనోజ్లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ఏపీలో ఉద్దానం, సోంపేట, ఇచ్చాపురం, కవిటితో పాటు ప్రకాశం, చీరాల, బాపట్ల, పశి్చమ గోదావరి జిల్లాల్లో ఈ పంట సహజ సిద్ధంగా సాగవుతోంది. ఒడిశా స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లాలో 400 ఎకరాలు వరకు రైతులు మొగలి సాగు చేస్తున్నారు.ఆదాయం వచ్చే పంటగా అభివృద్ధి చేస్తున్నాం మొగలి పొదల సాగు రైతులకు ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం లోతైన అధ్యయనం సాగుతోంది. మొగలి పొదలు పెంచే రైతులకు అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు బోర్డు ద్వారా అందజేస్తాం. స్వల్ప వ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం ఒడిశా నుంచి నాణ్యమైన మొగలి అంట్లు అందుబాటులోకి తీసుకొస్తాం. పంట భూముల రక్షణకు ఏర్పాటు చేసుకునే మొగలి చెట్లు పెట్టుబడిలేని ఆదాయ వనరుగా ఉపయోగపడతాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొగలి హెర్బల్ గార్డెన్స్ పెంపకాన్ని బోర్డు ద్వారా ప్రోత్సహిస్తాం. – ఆవుల చంద్రశేఖర్, సీఈవో, ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు -
వరదనీటి రెస్టారెంట్
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్లాండ్లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు. చేపలతో కలిసి విందు! మధ్య థాయ్లాండ్లోని ఒక రెస్టారెంట్లో భోజనం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆ భోజనానుభవం కోసమే కస్టమర్లు పోటెత్తుతున్నారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదా సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న నది ఉప్పొంగి 11 రోజులైనప్పటి నుంచి, వరద ముంపునకు గురైన నదీతీర రెస్టారెంట్ ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారింది. నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి లేదా చేపలకు మేత వేస్తూ.. ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్లు ఉత్సాహంగా వస్తున్నారు. బ్యాంకాక్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ పాఠోమ్ ప్రావిన్స్లోని పా జిత్ రెస్టారెంట్లో కుటుంబాలు లంచ్ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడుల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు. ఎవరూ రారనుకున్నా.. పా జిత్ రెస్టారెంట్ 30 ఏళ్లకు పైగా నదీతీరంలో స్థిరంగా ఉందని యజమాని పోర్న్కామోల్ ప్రాంగ్ప్రెంప్రీ తెలిపారు. దాదాపు నాలుగేళ్ల క్రితం తొలిసారి రెస్టారెంట్ మునిగినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘కస్టమర్లు ఎవరూ రారని అనుకున్నాను.. కానీ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి, ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు’.. అని ఆమె గుర్తు చేసుకున్నారు. లాభాలే లాభాలు వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, రోజుకు దాదాపు 10,000 బాట్ల (భారత కరెన్సీలో సుమారు రూ.23,000) నుండి 20,000 బాట్ల (సుమారు రూ.46,000) వరకు తన లాభం రెట్టింపయ్యిందని ఆమె వివరించారు. పిల్లలు ఇష్టపడే రెస్టారెంట్ అదే ప్రావిన్స్లో నివసించే 29 ఏళ్ల చోంఫునట్ ఖంతనితి.. తన భర్త, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చారు. ‘ఇక్కడ చాలా బాగుంది. పిల్లలను ఇక్కడికి తీసుకురావచ్చు. చేపలను చూసినప్పుడు వారు అల్లరి చేయడం తగ్గిస్తారు. థాయ్లాండ్లో ఇలా చేపలు పైకి వచ్చేది ఈ ఒక్కచోట మాత్రమేనని అనుకుంటున్నాను’.. అని ఆమె చెప్పారు. 63 ఏళ్ల బెల్లా విండీ.. తన కాళ్లను చేపలు కొరుకుతున్న అనుభూతిని ఆస్వాదించాలని ఈ రెస్టారెంట్కు వచ్చారు. ‘సాధారణంగా, నీరు చాలా ఎక్కువగా ఉంటే చేపలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడి ప్రకృతి అనుభవం ఈ రెస్టారెంట్ ముఖ్య ఆకర్షణ, ఇది ప్రజలను ఆకర్షిస్తుంది’.. అన్నారు. ఇతర ప్రాంతాలకు నష్టమే ఈ వరదలు పా జిత్ రెస్టారెంట్కు అసాధారణ అదృష్టాన్ని తెచి్చనప్పటికీ, థాయ్లాండ్లోని అనేక ఇతర ప్రాంతాలను మాత్రం తీవ్రంగా దెబ్బతీశాయి. జూలై చివరి నుండి, వరదల కారణంగా 12 మంది మరణించారని, ఇద్దరు తప్పిపోయారని ప్రకృతి విపత్తుల విపత్తుల నివారణ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం నాటికి, 13 ప్రావిన్స్లలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య ప్రాంతాలలో 4,80,000 మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారని వివరించింది.కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని.. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని ’పా జిత్’ రెస్టారెంట్ నిరూపించింది. నదీతీరం మునిగిపోయినా, దాన్ని వినూత్న ’డైనింగ్ డెస్టినేషన్’గా మార్చుకుంది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయ్లాండ్ పౌరులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం! మీకు కూడా ఈ వింత రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుందా?.. చూడాలనిపిస్తోందా?.. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు
నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొందరు బాలతారల ఇంటర్వ్యూలు, సిక్స్ ఇయర్స్ ఏజ్లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, సిక్స్టీన్లోకి అడుగు పెట్టి, యువ హీరో కావడానికి రెడీగా ఉన్న ర్యాన్ జాయ్తో మాటామంతీ!చిన్నప్పటి మహేశ్ని!ఆరేళ్ల వయసులోనే బాల నటుడిగా కెరీర్ స్టార్ చేసి, ఇప్పుడు స్వీట్ సిక్స్టీన్లో ఉన్నాడు ర్యాన్. కొంచెం మహేశ్బాబు పోలికలతో కనిపించే ర్యాన్ చిన్నప్పటి మహేశ్గా రెండు సినిమాల్లో నటించాడు. ఆ విశేషాలతో పాటు మరిన్ని విశేషాలు ఈ విధంగా పంచుకున్నాడు ర్యాన్ జాయ్.→ మా నాన్నగారి వృత్తిరీత్యా మేం చిన్నప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. నేను అక్కడే పుట్టాను. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్లేవారు. ఆ క్యారెక్టర్లకు కావల్సిన ఏజ్ లేదని సెలక్ట్ చేసేవాళ్లు కాదు. ఫైనల్లీ ‘హైదరాబాద్ లవ్స్టోరీ’లో చాన్స్ వచ్చింది. తెలుగులో నా కెరీర్ ఆ సినిమాతో మొదలై, ఈ మధ్య చేసిన ‘జయమ్మ పంచాయతీ’ వరకూ సక్సెస్ఫుల్గా సాగుతోంది.→ నా ఫీచర్స్ మహేశ్ సార్కి దగ్గరగా ఉండటంవల్లే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాల్లో చిన్నప్పటి మహేశ్బాబుగా యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అయితే మహేశ్ సార్తో నా కాంబినేషన్ సీన్స్ ఉండవు కాబట్టి, ఆయన్ను కలవలేదు. ఒకే ఒక్కసారి ‘మహర్షి’ సెట్స్లో ఆయన ఉన్నప్పుడు ఆ దగ్గర్లోనే నేను ఉన్నాను. ఫొటో కావాలని అడిగితే, అప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నారు. ఆయన కళ్లనిండా నీళ్లు ఉన్నాయి. కొంచెం ఆగమన్నారు. చాలా టైమ్ పట్టింది. ఇక వెళ్లిపోతుంటే, ఆయనే పిలిచి ఫొటో దిగే చాన్స్ ఇచ్చారు.→ ఇప్పటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్గా 20కి పైగా సినిమాలు చేశాను. వాటిలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘నేల టికెట్టు’ వంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్గారు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో లెంగ్తీ రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 16 కాబట్టి... అటు చైల్డ్ ఆర్టిస్ట్గా చేయలేను... ఇటు నా వయసున్న క్యారెక్టర్లు తక్కువ ఉంటాయి. సో... కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. → నేను హీరో అవాలనుకుంటున్నాను కాబట్టి... బాడీ బిల్డింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. అలాగే థియేటర్ క్లాసెస్ తీసుకుందామనుకుంటున్నాను. హీరో అనిపించుకోవడానికి ఏమేం కావాలో అన్నీ నేర్చుకుంటాను. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని కూడా ఉంది. మెయిన్ టార్గెట్ హీరో అయినప్పటికీ ఫ్యూచర్లో బిజినెస్ మీద కూడా ఫోకస్ పెడతాను. → ఒక కంప్లీట్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఆమిర్ ఖాన్లా అన్నమాట. ఆయన చేసే సినిమాలు ఒకదానికి ఒకటి పోలిక ఉండవు. వెరైటీగా ఉంటూ ట్రూగా ఉంటాయి. అలా నిజాయతీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను. సినిమా...నాటిక‘ఒక్క క్షణం, కేజీఎఫ్ 2, తండేల్, కింగ్డమ్, కిష్కింధపురి, లవ్స్టోరీ, సరిలేరు నీకెవ్వరు’.. వంటి మూవీస్తో గుర్తింపు తెచ్చుకున్న భానుప్రకాశ్ చెప్పిన విశేషాలు.→ అన్నమయ్య జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామం ఎగువపల్లి మా ఊరు. మా నాన్న సురేశ్ అమసగారు. చిన్నప్పుడే మా తాతయ్య హైదరాబాద్కి వచ్చేశారు. మా నాన్న ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టర్గా చేస్తున్నారు. మా నాన్నకి డైరెక్టర్ కావాలని లక్ష్యం. అయితే ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో నిర్మాతగా సుమారు 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు నాన్న. అలా మా నాన్న నిర్మిస్తున్న ‘నీ కొరకు నేను వేచి ఉంటాను’ షార్ట్ ఫిల్మ్లో ఒక పాత్రకి ఓ అబ్బాయి కావాల్సి వచ్చింది. ఎవరూ సెట్ కాలేదు.. ‘నువ్వు చేస్తావా? అని నాన్న అడగడంతో చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అల్లు శిరీష్ సార్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ (2017) బాల నటుడిగా నా ఫస్ట్ మూవీ. → నేను హైదరాబాద్లో పుట్టి, పెరిగాను. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు నేను సెట్స్కి బుక్స్ తీసుకెళతాను. ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్ని నా ఫ్రెండ్స్ని అడిగి, షూటింగ్ గ్యాప్లో రాసుకుంటాను. చాలా సందర్భాల్లో ఒకే సమయంలో ఇటు ఎగ్జామ్స్, అటు షూటింగ్స్ వచ్చాయి. అయితే షూటింగ్స్ షెడ్యూల్ సడెన్ గా ఫిక్స్ అవుతుంటాయి కాబట్టి వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎఫ్ఏ 1, ఎఫ్ఏ 2 వంటి పరీక్షలుంటే టీచర్స్ నా కోసం మళ్లీ కండక్ట్ చేస్తారు. → నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత తోపు, తురుం అయినా కానీ ఫ్రెండ్స్ వద్ద నేను జస్ట్ భానుప్రకాశ్ అంతే... నేను నటించిన ఏదైనా సినిమా చూసినప్పుడు నా నటన గురించి టీచర్లు, ఫ్రెండ్స్ మాట్లాడతారు. వాళ్లందరికీ నేను నటించిన ఓ మంచి సినిమా చూపించాలని కోరిక. మా బంధువులు నేను నటించిన సినిమా చూస్తున్నప్పుడు ‘హే.. భాను వచ్చాడు...’ అంటూ బాగా ఎగ్జయిట్ అవుతారు. → ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలు అంతరించిపోతున్నాయి. వాటికి ఆదరణ దక్కడం లేదు. నేను ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే నాటికలో నటించాను. ఈ ఏడాది మార్చి 28న తొలి ప్రదర్శన ఇచ్చాను. ఇప్పటివరకూ పద్దెనిమది ప్రదర్శనలు ఇచ్చాను. ఆ నాటిక ఎక్కడ వేసినా శశి అనే నా పాత్రకు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తోంది. సినిమా పుట్టకముందు నుంచి నాటకరంగం ఉంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ ఉన్న నాలాంటి చైల్ట్ ఆర్టిస్ట్స్కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు కానీ, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. కానీ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటకం ఎక్కడ ప్రదర్శించినా ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీలో, గుజరాతీలోనూ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక వేశాం. పేరెంట్స్కి గిఫ్ట్స్‘‘భవిష్యత్లో నేను ఒక మంచి ఆర్టిస్టును అవ్వాలనుకుంటున్నాను. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే రోల్స్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నాను. యాడ్స్ కూడా చేస్తున్నాను. వేటికవే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్’’ అని చెప్పాడు ఉజ్వల్ తేజ్. ‘భైరవం, ఆయ్’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు ‘గాలివాన, పరంపర’ వంటి వెబ్ సిరీస్లోనూ మెరిశాడు ఉజ్వల్ తేజ్. ‘నిండు నూరేళ్ళ సావాసం’, ‘పాపే మా జీవనజ్యోతి’ వంటి సీరియల్స్తో బిజీగా ఉంటున్న ఉజ్వల్ పంచుకున్న కొన్ని విషయాలు...→ మా స్వస్థలం కర్నూలు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. 8వ క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పట్నుంచి యాక్టింగ్, డ్యాన్స్ ఇష్టం. వాటిలో నాకున్న స్కిల్ని మా పేరెంట్స్ గమనించి, డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయించారు. అక్కడ మా పేరెంట్స్ ఫ్రెండ్ ఒకరి సలహాతో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లో పోటీ చేశాను. తమిళనాడులో తెలంగాణ స్టేట్ను, దుబాయ్లో ఇండియానూ రిప్రజెంట్ చేసి, విజేతగా నిలిచాను.→ నా తొలి సినిమా పేరు ‘నా సినిమా ఆగిపోయింది’. ఈ చిత్రంలో యాక్ట్ చేసేప్పుడు నాకు సరిగ్గా యాక్టింగ్ రాదు. కానీ ఆ సినిమా డైరెక్టర్ ప్రోత్సాహంతో బాగా నటించగలిగాను. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. దీనికన్నా ముందు నేను యానీ మాస్టర్తో ఓ యాడ్ చేశాను.ఏ ఒక వైపు యాక్టింగ్... మరోవైపు స్టడీస్... ఈ రెంటినీ ఎలా బ్యాలన్స్ చేస్తున్నానంటే.. షూటింగ్ స్పాట్కి బుక్స్ తీసుకు వెళ్తాను. షూటింగ్లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మా అమ్మగారు నా చేత చదివిస్తుంటారు. నేను ఏవైనా క్లాసులు మిస్ అయితే నా టీచర్స్ నాకు రీ క్యాప్ చేస్తారు. నా ఫ్రెండ్స్ నోట్స్లు ఇస్తారు. → మా స్కూల్లో చిల్డ్రన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక చిల్డ్రన్స్ డేకి మా స్కూల్లో ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. కానీ అదే రోజు నేను షూటింగ్లో పాల్గొనాలి... అయితే అనుకోకుండా నేను ఆ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఇది తెలిసి మా ప్రిన్సిపాల్ మేడమ్ నన్ను పిలిపించి, అప్పటికప్పుడు నాతో డ్యాన్స్ చేయించారు. అది నాకో హ్యాపీ మూమెంట్. కొన్నిసార్లు నాకు షూటింగ్ ఉన్న రోజే ఎగ్జామ్స్ కూడా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమా యూనిట్ దగ్గర అనుమతి తీసుకుని, ఎగ్జామ్స్ రాసేవాడిని. ఇలా కుదరకపోతే మా ప్రిన్సిపాల్ నాకు సపోర్ట్ చేస్తారు.ఏ నా తొలి సంపాదనతో మా అమ్మానాన్నలకు బహుమతులు ఇవ్వడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నా మూవీస్ ‘బ్రిలియంట్ బాబు’, ‘స్మాల్ టౌన్ బాయ్స్’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. సుద్దపూసని కాదు‘‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్లోలాగా నేను చదువులో సుద్దపూసని కాదు. నాకెప్పుడూ 90కి పైగా మార్కులు వస్తుంటాయి. నాకు పరీక్షలు ఉన్నప్పుడు ఏవైనా షూటింగ్స్ ఉంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ చదువుకే ప్రియారిటీ.. ఆ తర్వాతే ఏదైనా. అందుకే ఏ పరీక్షనూ ఇప్పటివరకు మిస్ అవలేదు’’ అని రోహన్ రాయ్ తెలిపాడు. ‘వినయ విధేయరామ, రాజుగారి గది 2, రంగుల రాట్నం, మిస్టర్ మజ్ను, చెక్, సూపర్ మచ్చి, గుడ్లక్ సఖి..’ వంటి పలు సినిమాలతో పాటు సీరియల్స్లో, ‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించిన రోహన్ రాయ్ చెప్పిన విశేషాలు.మా నాన్న సుబ్బారాయుడుగారు (చీరాల) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. అమ్మ రాధామాధవి బేసికల్గా నా మేనేజర్ కూడా. నా కోసం తన పని వదులుకుంది. నా డేట్స్ చూసుకోవడంతో పాటు షూటింగ్స్కి నా వెంట వస్తుంటుంది. → చిన్నప్పుడు ఇంట్లో టీవీ బాగా చూసేవాణ్ణి. నా వయస్సు ఐదేళ్లున్నప్పుడే ఎవరైనా మా ఇంటికి వచ్చి వెళ్లాక వాళ్లని ఇమిటేట్ చేసేవాణ్ణి. వాళ్లు కూర్చునే, నడిచే విధానాన్ని కూడా. అప్పుడు నాకు, మా కుటుంబ సభ్యులకు అర్థమైంది నాకు నటన అంటే ఇష్టం అని. టీవీలో స్క్రోలింగ్ చూసి ‘డ్రామా జూనియర్స్’ ఆడిషన్స్కి నన్ను తీసుకెళ్లింది అమ్మ. అందులో నేనే ఫస్ట్ కంటెస్టెంట్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 చేశాను. ‘డ్రామా జూనియర్స్’లో నా నటన చూసి డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారు ఆడిషన్ చేసి, ‘వినయ విధేయ రామ’ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఓంకార్గారు ‘రాజుగారి గది 2’లో చాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది. → హీరోలు నానీగారిని, నవీన్ పొలిశెట్టిగారిని చూసినప్పుడు నేను కూడా వారిలా కావాలనిపించేది. తెరపై వాళ్లు నటిస్తున్నట్లు ఉండదు... వారిద్దరూ నేచురల్ యాక్టర్స్. కథ, పాత్రల్ని ఎంపిక చేసుకునే విధానంలో వాళ్లిద్దర్నీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను. నానీగారు హీరో కాదు.. ఆర్టిస్ట్. కథ నచ్చితే ఆయన ఏదైనా చేయగలరు.→ నా జీవితంలో మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘హ్యాష్టాగ్ 90స్’ వెబ్ సిరీస్. దాని తర్వాత వెంట వెంటనే సినిమాలు రావడం, మంచి పాత్రలు ఎంచుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్గారు హీరోగా రాహుల్ శ్రీనివాస్గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రంలో నేను చేసిన రాము పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం శివాజీగారితో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమా చేశాను. త్వరలో విడుదల కానుంది. → షూటింగ్ ఉన్నప్పుడు క్లాసులు మిస్ అవుతాను. నైట్ లేదా షూటింగ్ గ్యాప్లో చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాను. యూట్యూబ్, గూగుల్ తల్లి కూడా ఉంది. వాటి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాను. రాత్రిళ్లు మేలుకుని నోట్స్ రాసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్రెండ్స్, టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అప్పులు తీర్చాను‘కిష్కింధపురి, పరాక్రమం’ చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు అర్షిత్. చిరంజీవి, నాగార్జునలను స్ఫూర్తిగా తీసుకుని, భవిష్యత్లో పెద్ద నటుడు కావాలనుకుంటున్న అర్షిత్ పంచుకున్న కొన్ని విషయాలు....→ స్వస్థలం గోదావరి ఖని. హైదరాబాద్లో ఉంటున్నాం. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. నాకు నటన అంటే ఆసక్తి కలగడానికి మా అక్క కారణం. అలాగే ‘పిల్లలు పిడుగులు’ టీవీ షో నుండి ‘డ్రామా జూనియర్స్’ వరకు... నేను ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. షూటింగ్ సమయంలో ఎగ్జామ్స్ ఉంటే ముందుగా షూటింగ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను పరీక్షలకు హాజరు కాకపోయినా వాళ్ళు నాకు విడిగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నా క్లాస్లో నేనే టాపర్ని. షూటింగ్ గ్యాప్లో చదువుకుంటాను. నా ట్విన్ సిస్టర్ స్టడీ సిలబస్లో నాకు సహాయం చేస్తుంది. ఇంట్లో కూడా అమ్మానాన్నలు నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు.→ సినిమాల్లో నటిస్తూ, సిల్వర్ స్క్రీన్ పై కనిపించినంత మాత్రాన నన్ను క్లాస్లో ప్రత్యేకంగా ఏం చూడరు. క్లాస్లో అందరిలానే నేనూ ఓ సాధారణ అబ్బాయిని. అయితే మా బంధువులు నన్ను చూసి గర్వపడుతుంటారు. పెద్ద హీరోలతో పని చేయడం నాకు స్ఫూర్తినిస్తుంది. సెట్స్లో వారి కష్టాన్ని గమనిస్తుంటాను. వాళ్ల కష్టాన్ని చూసి, నేను చాలా నేర్చుకుంటుంటాను. హీరోలతో కలిసి పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.→ చైల్డ్ ఆర్టిస్టుగా నా మొదటి సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రంలో నటించినందుకు రూ. 1000 పారితోషికం ఇచ్చారు. నా తొలి సంపాదనను మా తల్లిదండ్రులకు ఇచ్చేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించగా, నేను యాక్ట్ చేసిన ‘పచ్చిపులుసు’ షార్ట్ ఫిల్మ్కి, రూ. 15 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా లభించింది. ఆ తర్వాత మా అప్పులు కొన్ని తీర్చేశాను. ‘కిష్కింధపురి’ సినిమా తర్వాత నాకు మంచి గుర్తింపు లభిస్తోంది. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒక మంచి యాక్టర్గా ప్రేక్షకుల చేత గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.యాక్టింగ్... చారిటీ బాల నటుడిగా 25కి పైగా సినిమాల్లో నటించాడు నాగచైతన్య వర్మ. ‘అమీర్పేటలో, నారప్ప, నా సామిరంగా, జటాధర, పేకమేడలు, లగ్గం’ వంటి పలు సినిమాలతో పాటు ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్తో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నాగచైతన్య వర్మ తన ఫ్యూచర్ ప్లాన్స్ని ఇలా పంచుకున్నాడు... → మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చమర్తివాండ్ల పల్లి. నటుడు కావాలనే నా ఆకాంక్షను మా అమ్మానాన్న వరలక్ష్మి దేవి, నాగార్జున రాజు ప్రోత్సహించారు. ‘అమీర్పేటలో’ సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్కి సెలవు పెడతాను కదా... అప్పుడు ఫ్రెండ్స్ని అడిగి నోట్స్ రాసుకుంటాను. స్కూల్ వాళ్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎగ్జామ్స్కే. ఎగ్జామ్స్లో నాకు 80 శాతంపైన మార్కులు వస్తుంటాయి. టాప్ 5 ర్యాంక్స్లో కచ్చితంగా నేను ఉంటాను.→ నా సినిమాలు చూసినప్పుడు ‘బాగా నటించావ్.. ఇలాగే ముందుకెళ్లు’ అని టీచర్లు, నా స్నేహితులు చెబుతుంటారు.. ఈ ఆగస్టులో విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్లో అవసరాల శ్రీనివాస్గారి చిన్నప్పటి పాత్రలో నెగటివ్ రోల్ చేశాను. నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. ఈ నెల 7న విడుదలైన ‘జటాధర’ సినిమాలో హీరో సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర చేశాను. మంచి మూవీ చేశానని పొగిడారు.→ నేను నటించడం మా బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకి చాలా ఇష్టం. ‘నువ్వు ఇంకా బాగా నటించి, మంచి స్థాయికి వెళ్లాలి’ అని అంటుంటారు. నా సినిమా చూసి బాగా చేశావని చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. తెలుగు సినిమా వేదిక మా తెలుగు తల్లి, కళావారధి సౌజన్యంతో 2023లో నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో ఉత్తమ బాలనటుడిగా ఆర్. నారాయణమూర్తి సార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. → జూలై 28న నా పుట్టినరోజు సందర్భంగా కడపలోని బాలల అనాథాశ్రమానికి నా పారితోషికంలో నుంచి ప్రతి ఏడాదీ నగదు సాయం చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది.ఏ ప్రస్తుతం ప్రభాస్గారి ‘ఫౌజి’తోపాటు ‘హే భగవాన్, యుఫోరియా, సహకుటుంబానాం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, బ్యాచ్ మేట్స్, అర్జునుడి గీతోపదేశం’ సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నా. ఏడేళ్లు...మూడు గంటలు...ఏడు రికార్డులు∙నృత్య ప్రతిభకళ పట్ల ప్రేమ ఉంటే ఏ వయసు అయినా వండర్స్ సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం శర్నీథా దత్త రచ్చ. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉంటున్న ఈ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇటీవల రంగప్రవేశం (సోలో అరంగేట్రం)తో ఏకధాటిగా మూడు గంటల పాటు కూచిపూడి నృత్యం చేసిన అరుదైన గుర్తింపుతో పాటు ఏడు రికార్డులను సొంతం చేసుకుంది. అతి పిన్న వయస్కురాలైన కళాకారిణి గా శర్నీథ వార్తల్లో నిలిచింది.శర్నీథా దత్త రచ్చ రెండవ తరగతి చదువుతోంది. రెండేళ్లక్రితం శాస్త్రీయ నృత్యంలో ఓనమాలు దిద్దిన శర్నీథ ఇటీవల సంక్లిష్టమైన నాట్య భంగిమలను, తిల్లానాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.సాధనమున రికార్డులు... శర్నీథా నృత్యాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. చూసి శర్నీథ ప్రతిభను గుర్తించాయి. అసాధారణమైన ఈ ప్రతిభకు శారద కళాక్షేత్రం నుంచి ’నాట్యమయూరి’ అవార్డును గురువు భావన పెద్రపోలు నుంచి అందుకున్నది. అలసట ఎరగని తపన... శర్నీథా తల్లిదండ్రులు రచ్చ హరి వినోద్, నరీనా దేవి కూతురి మూడేళ్ల వయసు నుంచి శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ‘నృత్యం అంటే శర్నీథకు ప్రాణం. ప్రాక్టీస్ అంటే చాలు సాధన చేస్తూనే ఉంటుంది. నృత్యాంగేట్రం చేయడానికి ఎనిమిది నెలలు ప్రాక్టీస్ చేసింది. వారణాసి లో అసి ఘాట్, అయోధ్య రామమందిరం లోపల, చిదంబరం గర్భగుడి దగ్గర, బాసరలో... నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ సబ్ జూనియర్లో పాల్గొని, ఐదవ స్థానంలో నిలిచింది. శర్నీథ నృత్యసాధనలో చూపే భక్తి, శ్రద్ధ ప్రముఖ నృత్యకారులను కూడా మెప్పిస్తుంది. అభినయంలో చిన్న వయస్సులోనే చూపే ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను సమ్మోహ పరుస్తుంది. – నిర్మలారెడ్డి -
కలలకు రంగులు
పిల్లలూ! ఇవాళ బాలల దినోత్సవం. అంటే చాచా నెహ్రూ పుట్టినరోజు. ఆయన మన దేశానికి మొదటి ప్రధాని. ఆయనకు చిన్నారులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ‘బాలల దినోత్సవం’ జరుపుకుంటాం. ‘చిల్డ్రన్స్ డే’ సందర్భంగా చాచా నెహ్రూ మెచ్చే పది రకాల థీమ్స్తో మీకు నచ్చిన బొమ్మలు గీసి ఇంట్లో, స్కూల్లో పెడితే ఎలా ఉంటుంది? వాటిని మీకు నచ్చిన వారికి బహుమతిగా ఇస్తే చాలా బాగుంటుంది కదా? మరెందుకు ఆలస్యం? వెంటనే బొమ్మలు గీయడం మొదలుపెట్టండి. ఈ 10 థీమ్స్ మీకోసమే. → చిన్నారులు–చాచా నెహ్రూ: ఇవాళ్టి బాలల చేతుల్లోనే రేపటి దేశభవిత ఉంటుంది. అందుకే చాచా నెహ్రూ బాలల గురించి ఆలోచించేవారు. తన ప్రతి నిర్ణయం రాబోయే తరాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో తెలుసుకునేవారు. అటువంటి చాచా నెహ్రూ ఇవాళ ఉంటే ఎలా ఉండేది? ఈ కాలం చిన్నారుల్ని చూసి ఆయన ఎలా మురిసిపోయేవారు? వారితో కలిసి ఎలా ఆడిపాడేవారు? ఇవన్నీ ఊహించుకొని ఓ చక్కని బొమ్మ గీయండి. మీరు గీసే ఆ బొమ్మ భవితకు మార్గదర్శకంగా మారి, అందరి మనసుల్లో నిలిచిపోతుంది. → అందరికీ విద్య: మీరందరూ చక్కగా బడికెళ్లి చదువుకుంటారు. ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. మరి మీలాంటి చిన్నారులు చాలామంది బడికి దూరంగా ఉన్నారన్న విషయం తెలుసా? వారంతా రోజు కూలి చేసి పొట్టపోసుకుంటున్నారన్న సంగతి తెలుసా? అలాంటి వారి బాధల్ని మీరు మీ చిత్రాల్లో చూపండి. వారిని చదువుకు చేరువ చేసే మార్గాలు ఆలోచించమనేలా మెసేజ్ ఇవ్వండి.→ పర్యావరణం ముఖ్యం: పచ్చని చెట్లు, చెంగుచెంగున గెంతే సాధుజంతువులు, సెలయేళ్లు, జలపాతాలు... ఇవన్నీ మీకు ఇష్టం కదా? వాటిని రంగుల్లో చిత్రించడం మీకెంతో సరదా కదా? అయితే అనేక కారణాలతో పర్యావరణం ప్రమాదంలో ఉంది. కాలుష్యం కోరల్లో పడి నలిగిపోతోంది. దీనివల్ల జనం అనేక సమస్యలతో బాధపడుతున్నారు. రానురాను పరిస్థితులు మరింత దారుణమవుతాయి. వాటికి అడ్డుకట్ట వేయడం మీ బాధ్యత కూడా. పర్యావరణాన్ని కాపాడుకుందామనే సందేశంతో బొమ్మ గీసి పెట్టండి. → టెక్నాలజీ– మంచీచెడూ: ప్రస్తుతం అందరికీ టెక్నాలజీ చేరువయ్యింది. ఏఐ రాకతో సరికొత్త టెక్నాలజీకి ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటి వాడకంపై అందరికీ అవగాహన కావాలి. ఆ టెక్నాలజీని చెడు కోసం కాకుండా మంచి పనుల కోసం వాడేలా మీరు చిత్రాల ద్వారా సందేశం ఇవ్వండి.→ భిన్నత్వంలో ఏకత్వం: మన దేశం అనేక సంస్కృతులకు, సంప్రదాయాలకు ఆలవాలం. ఒక్కోచోట ఒక్కో భాష, ఒక్కో పద్ధతి... అయినా అందరం ఒకే దేశంగా కలిసి ఉంటున్నాం. దీన్నే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అంటారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాలు గీయండి. అన్నీ కలిసిన భారతదేశాన్ని చూపించండి. → కలలు కనండి..సాధించండి: ‘కలలు కనండి.. సాధించండి’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. మీకూ ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. పెద్దయ్యాక మీరేం అవ్వాలనుకుంటున్నారో ఆలోచించి, ఇప్పుడే ఓ చిత్రం గీయండి. అందులో మీరెలా ఉండబోతున్నారో ఊహించుకోండి. అది మీకు స్ఫూర్తిని ఇస్తుంది.→ ఆనందాల హరివిల్లు: చిన్నారుల ఆనందమే కుటుంబం ఆనందం కదా? మీరు ఆనందంగా ఉండేందుకు చేసే పనులేమిటి? ఆడుకోవడం, సైకిల్ తొక్కడం, టీవీ చూడటం, పాటలు వినడం.. ఇలా అనేక పనులు ఉంటాయి. వాటన్నింటినీ కలిపి బొమ్మలుగా గీయండి. వాటిని చూసినప్పుడల్లా మీకు ఆనందాన్ని అందిస్తాయి. → బాలల హక్కులు: మీది ఈ దేశం. అందరికీ ఉన్నట్టే, ఈ దేశంలో మీకూ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. విద్య, వైద్యం, చదువు, ఆహ్లాదకర వాతావరణం.. ఇవన్నీ మీకు దక్కాల్సిన హక్కులు. వాటి గురించి తెలుసుకొని, అవే బొమ్మలుగా గీయండి. వాటి గురించి ఇతరులకు తెలియజెప్పండి. → అంతరిక్ష వికాసం: మన దేశం అంతరిక్ష ప్రయోగాల్లో ముందంజలో ఉంది. మంగళయాన్, చంద్రయాన్... అలాగే బాహుబలి శాటిలైట్... ఇలా మనం గొప్పగా ప్రగతి సాధిస్తున్నాం. ఇస్రోలో మన సైంటిస్ట్లు ఎన్నో ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలో మన దేశ వికాసం ఎలా ఉందో బొమ్మల్లో చూపి క్లాస్రూమ్లో డిస్ప్లే చేయండి.→ భావిభారత్: మరో 20 ఏళ్లలో భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? భారత్లో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు ఊహిస్తున్నారు? ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇవన్నీ ఆలోచించి బొమ్మలు గీయండి. వాటిని అందరికీ చూపించండి. భావిభారత్ను మీ చిత్రాల్లో చూడటం అందరికీ ముచ్చటగా ఉంటుంది. -
కొలువుల్లో వాటా పెరిగింది
భారత్లో కృత్రిమ మేధతో (ఏఐ) నడిచే రంగాలు తమ నియామకాల సరళిలోని ప్రాధాన్యాలను మార్చుకోవడంతో ఐదేళ్లలో తొలిసారిగా మహిళల ఉపాధి సామర్థ్యం పురుషులను మించిపోయిందని ఇండియా స్కిల్స్–2026 నివేదిక వెల్లడించింది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలు ఉపాధి సామర్థ్యాల కొలమానాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులు 80 శాతం, ఐటీ ఇంజనీర్లు 78 శాతం ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది. వారిలో పురుషుల కంటే మహిళా గ్రాడ్యుయేట్స్కే నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నట్లు పేర్కొంది. ఏఐ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్కు సంబంధించిన విభాగాలు మహిళలకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్శిక్షణ ఇప్పించి మరీ..నిపుణుల కొరతను నిరంతరంగా ఎదుర్కొంటున్న కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాలలోని సంస్థలు.. సూక్ష్మ–క్రెడెన్షియల్స్ (నిర్ధిష్ట నైపుణ్యాలు), పరిమిత స్థాయి యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ మహిళలను నియమించుకుంటున్నాయి. ఏఐ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవటం, మహిళల నైపుణ్యాలకు ఎక్కువ అవకాశాలకు లభించటం కూడా ఒక కారణమని నివేదిక తెలిపింది. ఐదేళ్లలో ముందడుగు..ప్రస్తుతం మహిళల ఉద్యోగ సామర్థ్యం రేటు 54 శాతం వద్ద ఉంది. ఐదేళ్లలో మొదటిసారిగా పురుషులను దాటి మెరుగైన ప్రతిభను కనబరిచారు. పురుషుల విషయంలో ఈ సామర్థ్యం రేటు 51.5 శాతం ఉంది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం నగరాలు, పట్టణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. న్యాయ, ఆరోగ్య సేవల రంగాలలోని ఉద్యోగ అవకాశాలపై మహిళలు వరుసగా 96.4 శాతం, 85.95 శాతం మంది ఆసక్తి చూపుతుండగా; పురుషుల్లో 83.11 శాతం మంది గ్రాఫిక్ డిౖజైన్, 64.67 శాతం మంది ఇంజినీరింగ్ డిజైన్ ఉద్యోగావకాశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ఫాస్ట్ మూవింగ్..’ లోనూ..! ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్ వంటి రంగాలు 1–5 సంవత్సరాల అనుభవం ఉన్న మహిళల్ని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానాలలో ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ మహిళా నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ల నియామకాలు 35 శాతానికి చేరుకోవడం విశేషం. వీరిలో మహిళలకే కాస్త ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తోందని నివేదిక పేర్కొంది. కామర్స్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు గత సంవత్సరం ఉన్న 55 శాతం నుంచి ఈ ఏడాదికి 62.81 శాతానికి పెరిగాయి. సైన్స్, ఆర్ట్స్కి సంబంధించిన రంగాలు కూడా ఉద్యోగ అవకాశాల పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మూడింటిలోనూ మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందని నివేదిక తెలిపింది. -
ఏఐ వచ్చేసింది... మేల్కోండి!
సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు.. ఆర్జీవీ!విమర్శలకు బెదరడు.. మనసులో ఉన్న చెప్పకా మానడు.తన ట్వీట్లతో తరచూ వివాదాల్లో ఉండే ఈ సినీ దర్శక దిగ్గజం...తాజాగా విద్యా వ్యవస్థపై తన విమర్శలను ఎక్కుపెట్టాడు.కృత్రిమ మేధ అంతకంతకూ విసృ్తతమవుతున్న ఈ తరుణంలో..పాత పద్ధతులనే పట్టుకు వేళ్లాడటం ఆత్మహత్య సదృశ్యమని స్పష్టం చేశాడు.ఈ మేరకు ఆర్జీవీ చేసిన ఎక్స్ పోస్ట్. తెలుగులో మీ కోసం... హే.. స్టూడెంట్స్... మేలుకోండి. చదువు చచ్చిపోతోంది. ఉత్సవాలు జరుపుకోండి!కృత్రిమ మేథ ఎంత వేగంగా పెరుగుతోందో.. అన్ని వర్గాల వారూ దాన్ని వాడటం కూడా అంతే స్పీడుగా జరిగిపోతుంది. ఈ కాలపు చదువులు చచ్చిపోతున్న విషయమే అందుకు రుజువు. వైద్యవిద్యను ఉదాహరణగా తీసుకుందాం...వైద్య విద్యార్థి మానవ శరీరం, దాని పనితీరులను అర్థం చేసుకునేందుకు ఐదేళ్లు ఖర్చు చేస్తాడు. ఆ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇంకో రెండేళ్లు.. ఆపై స్పెషలైజేషన్ కోసం మరో రెండుమూడేళ్లు పనిచేయాలి. అంటే సుమారు దశాబ్ధకాలం ఆ విద్యార్థి శరీర కండరాలు, నాడులు, అవయవాలు.. వాటి పనితీరు, పనిచేసే విధానం గురించి నెమరేసుకుంటూనే ఉంటాడన్నమాట. వీటన్నింటి ఆధారంగా శరీరంలో ఏది సరిగా లేదో గుర్తించి తగిన చికిత్స ఇస్తాడు. అయితే...కృత్రిమ మేథ మహా శక్తిమంతమైంది. లక్షల మెడికల్ కేసులు అరక్షణంలో చదివేయగలదు. రోగుల సమాచారాన్ని స్కాన్ చేసేసి.. రోగమేమిటో వేగంగా, కచ్చితంగా తేల్చయగలదు. అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా ఏ చికిత్స తీసుకోవాలో కూడా సూచిస్తుంది. అలాంటప్పుడు ఒక యంత్రం పది సెకన్లలో చేసే పని కోసం పదేళ్లు వృథా చేయడం ఎంత వరకూ కరెక్ట్?ఓ ప్రముఖ వైద్యుడు నాతో పంచుకున్న విషయాలు చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది!‘‘చాలా బాధేస్తోందండి. చాలామంది పేద పిల్లలు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. కానీ చదువు పూర్తి చేసి వచ్చేసరికి.. వీళ్లకు చేసే పనేమీ ఉండదు’’ అన్నారు ఆయన. ఇదేదో కల్పన కాదు. ఈ కాలపు వాస్తవం. వైద్యం ఒక్కటే కాదు.. ఏ రకమైన ఇతర కోర్సులకైనా ఇది వస్తుంది.ఏఐ రాజ్యమేలే ప్రపంచంలో సంప్రదాయ విద్యావ్యవస్థను పట్టుకు వేళ్లాడటం వెనక్కు నడవడమే. తెలివితక్కువతనం కూడా. మనదంతా భట్టీ పట్టేసే విద్యా వ్యవస్థ. సమాచారం అన్నది చాలా అరుదుగా దొరికే కాలంలో సిద్ధం చేశారు దీన్ని. కానీ ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా చటుక్కున దొరుకుతోంది. భట్టీ పట్టేడయం, జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడు జ్ఞానం కానేకాదు. మూర్ఖత్వం. నలభై ఏళ్ల క్రితం గుర్తుండి పోయేంతవరకూ ఎక్కాలు అప్పజెప్పేవాళ్లం. ఆ తరువాత కాలిక్యులేటర్లు వచ్చాయి. ఎక్కాలు నెమరేయడం మానేశాం.‘‘మన మెదళ్లు లెక్కపెట్టడం మరచిపోతే ఎలా’’, ‘‘ఏదో ఒక రోజు యంత్రాలూ పనిచేయకపోతే? అని కొందరు డౌట్లూ లేవనెత్తారు. ఇదెలా ఉంటుందంటే... కారు సరిగ్గా పనిచేయదేమో అనుకుని గుర్రపు బగ్గీని రెడీగా పెట్టమన్నట్లు!పాత పద్ధతులే సుఖం అనుకునే వారికి విప్లవాత్మకమైన మార్పులన్నీ కుట్రల్లాగే కనపడతాయి. అదే భయం, అభద్రత, తమల్ని తాము కాపాడుకునేందుకు వాడే అబద్ధాలే ఇప్పుడు కృత్రిమ మేధ విషయంలో మళ్లీ తెరపైకి వస్తున్నాయి.ఈ కాలపు ఏఐ విప్లవం విశ్వవిద్యాలయాల కోసం మంత్రులు లేదంటే పాతవాసన కొట్టే బోర్డుల ఆమోదం కోసం ఎదురు చూడటం లేదు. ఎదగని వాటిని తుడిచిపెట్టేస్తుంది. ఈ లైన్లో మొట్టమొదట ఉండేది విద్యార్థులే. కాబట్టి... విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వెంటనే తీసుకురావడం అనేది అవసరం మాత్రమే కాదు.. మన మనుగడకు కీలకం కూడా. లేదంటే... ఈనాటి విద్యార్థులే బలిపశువులు. ఏమీ తెలియని తల్లిదండ్రులు, అజ్ఞానులైన విధాన రూపకర్తల మోసానికి వీరు బలికాక తప్పదు. వీళ్లే కదా.. ఇప్పటి విద్యార్థులను ‘లేని’ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నది?!తరగతి గదుల్లో ఏఐ టూల్స్ వాడకాన్ని వెంటనే మొదలుపెట్టాలి. ఇదేదో పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు కాదు. విద్యార్థులకు అవసరమైన అసిస్టెంట్లుగా!చదువు చెబుతున్నామన్న భ్రమల నుంచి పాఠశాలలు బయటపడటం మంచిది. విద్యార్థులు కృత్రిమ మేథ టూల్స్ను ఎంత తెలివిగా, సృజనాత్మకంగా వాడుతున్నారో పరీక్షించేందుకు మాత్రమే పాఠశాలలు పరిమితం కావాలి. భవిష్యత్తులో క్వశ్చన్ పేపర్లు.. ‘‘మీకేం తెలుసు’’ అని అడక్కూడదు. ఏఐతో ఎంత వేగంగా, లోతుగా, సృజనాత్మకంగా పనిచేయించుకోగలరో చూడాలి. ఎందుకంటే..... అన్నీ తెలిసినవాడు కాదు. ఏఐని సరైన ప్రశ్న వేయగలిగిన వాడు మాత్రమే జీనియస్!విద్యార్థులూ... ఏఐ సృష్టించే విధ్వంసం ముంగిట్లో ఉన్నారు మీరు. మీ టెక్ట్స'బుక్ల కింద పునాదులు కదిలిపోతున్నాయి. గుర్తించండి. మీ డిగ్రీలు.. వాటిని ప్రింట్ చేసేందుకు వాడే కాగితంతోనూ సరిపోవు. చచ్చిపోయిన వ్యవస్థ అవశేషాల మధ్య మీ ప్రొఫెసర్లు మీకు పాఠాలు చెబుతున్నారు.ఇంకా పాత పద్ధతుల్లోనే చదువుకుంటే... మీరు కాలగతిలో కలిసిపోతారు. ఏఐ మిమ్మల్ని తినేయదు కానీ.. మిమ్మల్ని పట్టించుకోకుండా సాగిపోతూంటుంది. అంతే!కాబట్టి... మార్కుల కోసం చదవడం ఆపేయండి. ఏఐని ఎలా వాడాలో నేర్చుకోండి! ఎందుకంటే... ఏఐని వాడకం తెలియని వాళ్లను ఆ ఏఐ మింగేస్తుంది!నోట్: నా ఈ రాతలపై సహేతుక అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు నేను రెడీ! EDUCATION is DEADHey students wake up and CELEBRATE the DEATH of EDUCATION The explosion of A I will be in direct proportion to a public acknowledgement by all concerned, that our present day education system is dead Here’s looking at the medical course for an example A…— Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2025 -
స్వీట్ వార్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే పార్టీలన్నీ పండగ వాతావరణంలో మునిగిపోయాయి! ఫలితం అధికారికంగా రాకముందే, గెలుపు సంబరాల కోసం బీజేపీ ఏకంగా 501 కేజీల లడ్డూలు ఆర్డర్ చేసిందట. ఇదెక్కడి ఓవర్ కాని్ఫడెన్స్ అనుకుంటున్నారా? ఖుషీఖుషీగా కమలదళం ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకే పట్టం కట్టడంతో, కమలదళం నాయకులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘కౌంటింగ్ రోజు మాకు హోలీ, దసరా, దీపావళి, ఈద్.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చేస్తాయి!’.. అంటూ బీజేపీ కార్యకర్త కృష్ణ కుమార్ కల్లూ తెగ సంబరపడుతున్నారు. ఈ భారీ లడ్డూల ఆర్డర్ రావడం నిజమేనని పట్నాలోని మిఠాయి కొట్టు యజమాని కూడా ధ్రువీకరించారు. ఏకంగా 501 కేజీల లడ్డూలను నవంబర్ 14 ఉదయం డెలివరీ చేయాల్సి ఉందట. అంటే.. బీజేపీ కార్యాలయాలు మిఠాయి దుకాణలను తలపించబోతున్నాయన్నమాట! మర్డర్ కేసు అభ్యర్థి ’మాంసం’ విందు! ఇదొక్కటే కాదు.. ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న మరో కీలక అభ్యర్థి సంబరం ఇంకాస్త ’గట్టిగా’ ఉంది. జేడీ(యూ)కి చెందిన మోకామా అభ్యర్థి అనంత్ సింగ్, ఒక హత్య కేసులో జైలులో ఉన్నప్పటికీ, తన విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంత్ సింగ్కు ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. అందుకే, ఆయన ఈసారి తన మద్దతుదారులు, ఓటర్ల కోసం నవంబర్ 14న పటా్నలో భారీ విందు ఏర్పాటు చేశారు. అంతా ఊహించినట్టే జరిగితే, ఆ రోజు అక్కడ పెద్ద మటన్ బిర్యానీ పార్టీ జరిగే అవకాశం ఉంది! ‘లడ్డూలు వెర్సెస్ మటన్’ వార్ మొత్తానికి, ఓట్ల లెక్కింపు ముందే బిహార్లో ’లడ్డూలు వెర్సెస్ మటన్’ వార్ మొదలైందన్నమాట! ఈ అతి విశ్వాసాన్ని చూసి ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ నవ్వుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ అత్యున్నత నాయకత్వం కనుసన్నల్లోనే వస్తున్నాయని కొట్టిపారేస్తున్నారు! నవంబర్ 14న కౌంటింగ్ తర్వాత ఈ 501 కేజీల లడ్డూలు అందరి నోరు తీపి చేస్తాయో లేక ఈ భారీ ’స్వీట్’ ఆర్డర్ చూసి మిగిలిన పార్టీలు కన్నీరు పెట్టుకుంటాయో చూడాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రా...రమ్మని
చుట్టూ ఎత్తైన కొండలు... ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉండే భారీ వృక్షాలు...పరమశివుని జటాజూటం నుంచి జాలువారుతున్నట్టు జలపాతాల హొయలు... పాల సంద్రం భువిలో వెలిసిందా అనేలా శ్వేతవర్ణ మేఘాల సోయగాలు... పచ్చి గాలి మధురాను భూతి...మట్టి గంధం సువాసన... పక్షుల కిలకిలా రావాలు, ఆకుల సవ్వడులు... ఇలా పంచేంద్రియాలను ప్రకృతితో మమేకం చేసే మరెన్నో ప్రత్యేకతల స్వర్గధామం... అల్లూరి మన్యం. పర్యాటక సీజన్లో ఈ అందాలు ద్విగుణీకృతమవుతాయి. కొద్ది రోజులు సాధారణ జీవితం గురించి మరిచిపోయి ఎంచక్కా ప్రకృతితో మమేకమవ్వాలను కుంటున్న వారికి ఇది సరైన సమయం.సాక్షి,పాడేరు: మన్యంలో పర్యాటక సీజన్ ప్రారంభమైంది. నవంబర్ మొదటి వారం నుంచి జనవరి నెలాఖరు వరకూ నెలకు రెండు లక్షల మంది పర్యాటకులు అల్లూరి జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో సుమారు నెలకు రూ.5 కోట్లపైనే బిజినెస్ జరుగుతుంది. సహజ ప్రకృతి అందాలకు నిలయమైన ఏజెన్సీలో ఈ సీజన్లో అప్పుడే పర్యాటకుల సందడి ఆరంభమైంది. జిల్లాలో బొర్రాగుహలు, వంజంగి హిల్స్, లంబసింగి, చాపరాయి జలపాతం తదితర ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తున్నారు. పర్యాటకుల కోసం ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా వంజంగి హిల్స్ వద్ద అటవీశాఖ రూ.35 లక్షల వ్యయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నలుచెరగులా... జిల్లాలోని 22 మండలాలున్నాయి. పర్యాటకంలో ప్రతీ మండలానికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. అనంతగిరి నుంచి ఎటపాక వరకు అన్ని మండలాల్లోను పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి ఏడాది దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలకు పర్యాటకులంతా ఫిదా అవుతారు. » పాడేరు మండలంలోని వంజంగి హిల్స్ విశ్వవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ఈకొండలపై సూర్యోదయం, మేఘాల అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. » అరకులోయ మండలంలోని మాడగడ,చింతపల్లి మండలంలోని చెరువులవెనం, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ ప్రాంతాలు మంచి వ్యూపాయింట్లుగా పర్యాటకులను అలరిస్తున్నాయి. ఇక్కడ పొగమంచు,సూర్యోదయం అందాలు అబ్బుర పరుస్తున్నాయి. అనంతగిరి మండలంలోని బొర్రాగుహలతో పాటు అరకులోయలోని పద్మాపురం గార్డెన్,గిరిజన మ్యూజియం,లంబసింగి,సిలేరు,మారేడుమిల్లి.మోతుగూడెం పర్యాటక ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. జలపాతాల హోరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జలపాతాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. పెదబయలు మండలంలోని పిట్టల»ొర్ర, అనంతగిరిలోని కటికి, తాడిగుడ, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి, సీలేరు ప్రాంతంలోని ఐస్గెడ్డ, మోతుగూడెంలోని పొల్లూరు, మారేడుమిల్లి ప్రాంతాలలో జలపాతాలకు పర్యాటకుల తాకిడి నెలకొంది. దేవీపట్నం, వి.ఆర్.పురం ప్రాంతాలలో పాపికొండల విహార యాత్రకు లాంచీలపై పర్యాటకులు తరలివెళుతున్నారు. వలిసె పూల అందాలు అదుర్స్ ఈసీజన్లో వలిసెపూలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి.భూమికి పసుపు రంగేసినట్టు ఉండే వలిసెపూల తోటల్లో ఫొటోలు తీసుకునేందుకు సందర్శకులు ఎంతో ఇష్టపడుతున్నారు. ఏటా భారీగా వ్యాపారం పర్యాటకులు అధికంగా తరలివస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో వ్యాపారలావాదేవీలు భారీగా జరుగుతాయి. నెలకు రూ.5 కోట్లపైనే వ్యాపారం జరుగుతుంది. పాడేరు, అనంతగిరి, అరకులోయ, జి.మాడుగుల, చింతపల్లి, రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో హోటళ్లు, ఇతర వ్యాపారులకు అధిక ఆదాయం సమకూరుతుంది. పర్యాటక ప్రాంతాల్లో స్థానిక గిరిజనులు కూడా పలు రకాల ఫుడ్ కోర్టులు,చికెన్ వంటకాలు,అటవీ,వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలతో జీవనోపాధి పొందుతున్నారు. ప్రకృతి అందాలు కొలువైన ‘గుడి’సెరంపచోడవరం: దట్టమైన అడవి.. మధ్యలో ఎత్తైన కొండపై మెలికలు తిరిగే ఎర్రమట్టి దారి.. మార్గమధ్యంలో ఆకట్టకునే జలపాతం ఇవన్నీ కలిపి ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్గా మారేడుమిల్లి కొండలు మారాయి. మారేడుమిల్లికి సుమారు 36 కిలోమీటర్లు దూరంలో తూర్పు కనుమల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని గడ్డి కొండలు(గ్రాస్ ల్యాండ్స్)లో ఉన్న గుడిసె అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఎౖత్తైన కొండల మధ్య సూర్యోదయాన్ని, ప్రకృతి అందాలను తనివి తీరా చూసేందుకు రాష్ట్రాలు దాటి మరీ పర్యాటకులు వస్తున్నారు. మారేడుమిల్లికి 36 కిలోమీటర్ల దూరం మారేడుమిల్లికి 36 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుడిసె పర్యాటక ప్రాంతాన్ని తిలకించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మారేడుమిల్లి నుంచి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తరువాత ఆకుమామిడి కోట గ్రామం వస్తుంది. అక్కడ నుంచి మరో 14 కిలోమీటర్లు ప్రయాణిస్తే గుడిసె కొండలను చేరుకోవచ్చు. ఆకుమామిడి కోట వద్ద ఉన్న ఫారెస్టు చెక్పోస్టు వద్ద వాహనాలకు రూ. 300, మనిషికి రూ. 100 చెల్లించిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణిస్తే పుల్లంగి గ్రామం వస్తుంది. అక్కడ నుంచి గుడిసె వెళ్లేందుకు ఎత్తైన కొండల మధ్య ఘాట్ రోడ్డులో ప్రయాణించాలి. కొండ పై భాగానికి చేరుకున్న తరువాత అక్కడ విశాలమైన గడ్డితో కూడిన మైదానం కనిపిస్తుంది. ఇక్కడి అందాలు, సూర్యోదయం దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. గతంలో రాత్రి సమయంలో అక్కడే పర్యాటకులు ఉండేందుకు అటవీ శాఖ వారు అనుమతించారు. పర్యాటకుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ విపరీతంగా ప్లాసిక్ట్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో రాత్రి బసను రద్దు చేశారు.ఆకుమామిడి కోట పరిసర ప్రాంతాల్లో రాత్రి బస చేసి, తెల్లవారుజాము 4 గంటల సమయంలో గుడిసెలో సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు వెళతారు. గుడిసె ప్రాంతంలో పర్యాటకులు గడిపేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ అనుకూలంగా ఉంటుంది. ఆకుమామిడి కోట నుంచి గుడిసె కొండమీదకు ప్రైవేట్ వాహనాల్లో పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రూ. 3వేల వరకు చార్జి చేస్తున్నారు. క్యాంపెయిన్ టెంట్లకు గిరాకీ సీజన్లో రోజుకు కనీసం వెయ్యి మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. దీంతో ఇక్కడ క్యాంపెయిన్ టెంట్లకు గిరాకీ పెరిగింది. రంపచోడవరం, మారేడుమిల్లిలో ఈ టెంట్లను అద్దెకు ఇస్తారు. టెంట్ సైజును బట్టి రూ.500 నుంచి రూ.750 వరకూ వసూలు చేస్తున్నారు. పర్యాటకుల్లో కొందరు మారేడుమిల్లిలో గల ప్రైవేట్, ఎకో టూరిజం గదుల్లో బస చేసి, తెల్లవారుజామున కొండమీదకు వెళతారు. దుంపవలస జలపాతం ఆకుమామిడి కోట నుంచి బోడ్లంక వెళ్లే రహదారిలో గల దారగెడ్డ గ్రామం నుంచి దుంపవలస వెళ్లాలి. అక్కడి జలపాతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. గుడిసె వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు దుంపవలస జలపాతంలో స్నానాలు చేస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తూ మైమరిచిపోతారు. ఆకుమామిడి కోట నుంచి సుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతం ఉంది. -
ఇద్దరిలో ఒకరికి..!
మధుమేహం (డయాబెటిస్)..దీనికి సైలెంట్ కిల్లర్ అనే పేరుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 83 కోట్లు దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. అయితే మన దేశంలో అధికంగా మధుమేహ రోగులుండటం ఆందోళన కలిగించే అంశం. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం 20 ఏళ్లకు పైబడిన వారిలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్ పేషెంట్లు ఉన్నట్టు అంచనా. మరో 13.6 కోట్ల మందికి మధుమేహం ముప్పు పొంచి ఉంది. అయితే చాలామందికి తమకు వచ్చే ప్రమాదం గురించి తెలియడం లేదు. అంతేకాదు డయాబెటిస్ ప్రాబల్యం విషయంలో భారతదేశం ప్రపంచ సగటు కంటే చాలా ముందుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రీ డయాబెటిస్కు దారి.. పరీక్షించినవారిలో 58% మందికి ఇన్సులిన్ నిరోధకత ఉందని హెచ్ఓఎంఏ–ఐఆర్ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇది జీవక్రియ ప్రమాదానికి ముందస్తు గుర్తు. ఇన్సులిన్ నిరోధకత అనేది శరీర కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్కు సరిగ్గా స్పందించని ఒక పరిస్థితి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సాధారణంగా ఆహారం నుండి లభించే గ్లూకోజ్ను శక్తి కోసం కణాలలోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది. అయితే నిరోధకత ఏర్పడినప్పుడు గ్లూకోజ్ రక్త ప్రవాహంలోనే ఉంటుంది. దానిని భర్తీ చేయడానికి పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ను విడుదల చేస్తుంది. తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే అది ప్రీ డయాబెటిస్కు దారితీస్తుంది. చివరికి టైప్–2 డయాబెటిస్కు కారణం అవుతుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో.. » నలుగురిలో ఒకరికి అసాధారణ రీతిలో థైరాయిడ్ (హైపోౖథెరాయిడిజం) » ముగ్గురిలో ఒకరికి కాలేయ పనితీరులో సమస్యలు » దాదాపు సగం మందికి ఏదో ఒక రకమైన మూత్రపిండాల బలహీనత » సుమారు 90% మందికి అసాధారణ లిపిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. » 30 ఏళ్లలోపు వారిలోనూ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయి. » 30–39 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇప్పటికే అధిక చక్కెర స్థాయిలు. » 60 ఏళ్లుపైబడ్డవారిలో ప్రతి 10లో 8 మంది రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు ఉంటున్నాయి. చిన్న వయస్సు వారిపైనా ప్రభావం డిజిటల్ హెల్త్కేర్ ప్లాట్ఫామ్ ఫార్మ్ఈజీ అధ్యయనం ప్రకారం భారత్లో ఇద్దరిలో ఒకరికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 40 లక్షలకు పైగా రోగ నిర్ధారణ నివేదికలు, 1.9 కోట్ల ఔషధ ఆర్డర్లను కంపెనీ విశ్లేషించింది. ‘డయాబెటిస్: ది సైలెంట్ కిల్లర్ స్వీపింగ్ ఎక్రాస్ ఇండియా’పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 28.4% మందికి మధుమేహం నిర్ధారణ అయింది. 27.5% మందికి ముప్పు పొంచి ఉంది. అంటే వీరు టైప్–2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి వృద్ధులను మాత్రమే కాకుండా చిన్న వయస్సు వారిని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం 90% మందిలో కాలేయం, లిపిడ్ (కొవ్వులు, నూనె, హార్మోన్లు), గుండె, థైరాయిడ్ సమస్యలకు దారితీసిందని నివేదిక తెలిపింది. సగం మందికి తెలియదు.. స్పష్టమైన లేదా ముందస్తు లక్షణాలు లేకుండానే జనం డయాబెటిస్ బారిన పడుతున్నారు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తున్నారు. వయస్సు, లింగం, జీవనశైలి, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఆందోళన కలిగించే ముఖ్య విషయం ఏమిటంటే 50% కంటే ఎక్కువ మందికి తాము ఈ వ్యాధిబారిన పడ్డ విషయం తెలియకపోవడం. గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బతినడం, దృష్టి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే వరకు ఈ వ్యాధి బయటపడడం లేదట. సాధారణ రక్త పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం తీసుకోవడమే ఉత్తమ మార్గం అని నిపుణులు చెబుతున్నారు. -
ఆ స్టార్టప్ నుంచి.. ఈ స్టార్టప్ వచ్చే..
ఒకప్పుడు తాము పెట్టిన అంకుర సంస్థను ఏ కారణంతోనైనా మూసేయాల్సి వచ్చినా.. అమ్మాల్సివచ్చినా సిగ్గుపడేవారు. నలుగురూ ఏమనుకుంటారో అని భయపడేవాళ్లు. కానీ, కాలం మారింది. గౌరవప్రదంగానే మూసేస్తున్నారు లేదా రికార్డు ధరకు అమ్మేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కొత్త స్టార్టప్ పెట్టేస్తున్నారు. ‘మాఫియా’ సామ్రాజ్యం సృష్టిస్తున్నారు. ఏమిటీ ‘మాఫియా’.. వీటికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. మనదేశంలో ఈ ట్రెండ్ ఏమిటి? – సాక్షి, స్పెషల్ డెస్క్క్రెడ్.. చాలామందికి సుపరిచితమైన ఫిన్టెక్ యాప్. దీని వ్యవస్థాపకుడు కునాల్ షా. ముంబైకి చెందిన కునాల్ మొదట ఫ్రీచార్జ్ అనే ఫిన్టెక్ స్టార్టప్ పెట్టాడు. 2015లో దాన్ని 400 మిలియన్ డాలర్లకు అమ్మేసి.. కొన్నేళ్ల తరవాత క్రెడ్ ఏర్పాటుచేశాడు. ఫ్లిప్కార్ట్... దీనికి పరిచయం కూడా అవసరం లేదు. ఈ ఆలోచన ఐఐటీ గ్రాడ్యుయేట్లు సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ది. ఫ్లిప్కార్ట్ సూపర్హిట్ అయిన తరవాత.. 2018లో ఇందులోని 77 శాతం వాటాను అమెరికాకు చెందిన వాల్మార్ట్కు రికార్డు స్థాయిలో 16 బిలియన్ డాలర్లకు అమ్మేశాడు సచిన్. తరవాత ‘నవి’ అనే ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించాడు. ఇలా దేశంలో సుమారు 40కిపైగా స్టార్టప్ల వ్యవస్థాపకులు.. ఉన్నవి అమ్మేసి లేదా మూసేసి కొత్తవి పెట్టి కూడా విజయవంతమయ్యారు. 2024లో 12.7 బిలియన్ డాలర్లుదేశంలో ప్రస్తుతం 5 లక్షలకుపైగా స్టార్టప్లు ఉన్నాయి. 2016లో వీటి సంఖ్య కేవలం 500. మార్కెట్ విశ్లేషణ సంస్థ ట్రాక్సన్ డేటా ప్రకారం.. 2016లో వీటికి వార్షికంగా సమకూరిన నిధులు 5.2 బిలియన్ డాలర్లే. కానీ, 2024లో అందిన పెట్టుబడులు ఏకంగా 12.7 బిలియన్ డాలర్లు. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు, స్టార్టప్లకు ప్రోత్సాహం, అటల్ ఇన్నోవేషన్ మిషన్.. వంటివి కూడా ఔత్సాహికులకు వరంలా మారాయి.షేర్లు కొని శ్రీమంతులై..ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు.. తమ ఉద్యోగులకు సంస్థ షేర్లను తక్కువ ధరకే కొనుక్కునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆ తరవాత వారు అమ్ముకోవచ్చు లేదా ఉంచుకోవచ్చు, అది వారిష్టం. డేటా ప్లాట్ఫామ్ ‘దక్రెడిబుల్’ గణాంకాల ప్రకారం.. 2020–25 మధ్య సుమారు 100 స్టార్టప్లు తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాయి. ఇలా కొనుగోలు చేసిన స్టాకుల విలువ 1.7 బిలియన్ డాలర్లని అంచనా. ఆ సంస్థ షేర్ల ధర పెరిగితే కొన్నవాళ్లకు పండుగే అన్నమాట. అలా అమాంతంగా డబ్బు వచ్చినప్పుడు.. చాలామంది ఉద్యోగం మానేసి ‘కొత్త స్టార్టప్’ ఆలోచనలు చేస్తున్నారు. అదో ‘మాఫియా’మాఫియా.. అండర్వరల్డ్లతో లింకులున్న స్టార్టప్లు అనుకునేరు.. కాదు కాదు! ఒక స్టార్టప్ను ప్రారంభించి.. అది సూపర్ సక్సెస్ అయిన తరవాత అందులోని వాళ్లు బయటికి వచ్చి కొత్త స్టార్టప్లు పెడుతుంటారు కదా. అలాంటప్పుడు సదరు మాతృ సంస్థ మాఫియాగా ఈ కంపెనీలన్నింటినీ పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ అమెరికాలోని సుప్రసిద్ధ ఫిన్టెక్ కంపెనీ పేపాల్తో మొదలైంది. పేపాల్లో పనిచేస్తూ బయటికి వచ్చిన వాళ్లలో ఎలాన్ మస్క్ ఒకరు. ఆయనే టెస్లా, ఎక్స్ వంటి అనేక సుప్రసిద్ధ కంపెనీల అధిపతి. చాడ్ హర్లీ, స్టీవ్ చెన్ వంటి వాళ్లు.. యూట్యూబ్ వ్యవస్థాపక బృంద సభ్యులు. వీళ్లందరినీ ‘పేపాల్ మాఫియా’ అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే మనదేశంలోనూ ఫ్లిప్కార్ట్ మాఫియా, జోహో మాఫియా, జొమాటో మాఫియా, స్విగ్గీ మాఫియా, పేటీఎం మాఫియా వంటివి ఉన్నాయి. అత్యధికంగా ‘ఫ్లిప్కార్ట్ మాఫియా’ ద్వారా 236 స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. మెట్రోల్లోనే కాదు..స్టార్టప్లు, ఫండింగ్ అంటే మెట్రో నగరాల్లోనే అనుకుంటాం. కానీ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ స్టార్టప్లు పెరుగుతున్నాయి. వాటిలో పెట్టుబడులు పెట్టేవాళ్లు కూడా పెరుగుతున్నారు. -
'జంక్'డం లేదు..!
నోరూరించే పానీయాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఐస్క్రీమ్స్, బిస్కట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితా పెద్దదే. చిన్న కిరాణా కొట్టుకు వెళ్లినా.. పెద్ద సూపర్ మార్కెట్లో అడుగుపెట్టినా.. వందలాది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రంగురంగుల ప్యాకుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ జంక్ ఫుడ్ మెదడుకు సైతం హాని కలిగిస్తున్నాయట. అంతేకాదు పదేపదే వీటిని తినాలన్న కోరికను పెంచేలా మెదడును ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, స్పెషల్ డెస్క్సాధారణ భోజనమేకాదు పిండి వంటలు, తీపి పదార్థాలు, ఇతర అల్పాహారాలు ఇంట్లో పరిమితంగానే తయారు చేసుకోగలం. అదే మార్కెట్లో ఎప్పటికప్పుడు లెక్కలేనన్ని రుచులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆరగిద్దామా అన్నట్టు భోజన ప్రియులను ఉసిగొల్పుతున్నాయి. ఇవే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. ఫిన్లాండ్లోని హెల్సింకి విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం ప్రకారం అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారాలు మెదడు ఆలోచనలను మార్చేస్తున్నాయి. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. ఎలా, ఎప్పుడు తింటారో నియంత్రించే మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతోందని పరిశోధకులు కనుగొన్నారు. ఆకలి, భావోద్వేగం, ప్రవర్తనకు కారణమయ్యే హైపోథాలమస్, అమిగ్డాలా, రైట్ న్యూక్లియస్ అక్యుంబెన్స్ వంటి కీలక మెదడు భాగాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావితం చేస్తున్నాయి. ఇంగ్లండ్కు చెందిన యూకే బయోబ్యాంక్, కెనడాలోని మాంట్రియల్ న్యూరోలాజికల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో 33,654 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఒక్క హెల్సింకి మాత్రమేకాదు.. ఈ జంక్ ఫుడ్ వల్ల అనర్థాలు ఉన్నాయని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పది మందిలో ఒకరు..పలు అధ్యయనాల ప్రకారం పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ఆహార ప్రకటనలలో ఎక్కువ భాగం కేలరీలు అధికంగా ఉండే, పోషకాలు తక్కువగా ఉన్న ఉత్పత్తులు ఉంటున్నాయి. ఈ ప్రకటనల్లో నాలుగింట మూడొంతులు అనారోగ్యకరమైన ఆహారాలవేనట. వీటికి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. పోషకార లోపంతో బాధపడుతున్న పిల్లల కంటే.. పాఠశాల వయస్సు, కౌమారదశలో ఉన్న పిల్లల్లో ఊబకాయులు ఎక్కువట. ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల వయసున్న పిల్లలు, టీనేజర్లలో 18.8 కోట్ల మంది ఊబకాయులున్నారు. అంటే సుమారు ప్రతి 10 మంది పిల్లలు, యువతలో ఒకరు (9.4%) ఊబకాయం బారిన పడ్డారని యూనిసెఫ్ చెబుతోంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 3% నమోదైంది. ప్రధానంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. బాల్యంలో ఊబకాయం టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని కేన్సర్స్తో సహా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుదల, ఆలోచనా నైపుణ్యాలు, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు.4 రోజులు చాలు..యూఎన్సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం అధిక కొవ్వు ఉన్న జంక్ ఫుడ్ జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని భాగాలకు వెంటనే అంతరాయం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేవలం నాలుగు రోజులపాటు బర్గర్స్, ఫ్రైస్, పిజ్జా, చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినడం వల్ల హిప్పోక్యాంపస్లోని న్యూరాన్లు అతిగా, చురుగ్గా మారి జ్ఞాపకశక్తిని దెబ్బతీశాయని పరిశోధనలో తేలింది. ఉపవాసం లేదా ఆహార మార్పులు మెదడు ఆరోగ్యాన్ని పునరుద్ధరించగలవని, ఊబకాయం సంబంధిత చిత్తవైకల్యం, అల్జీమర్స్ను నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది.రక్తహీనతకు దారితీస్తోంది..కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన క్వీన్ మేరీ హాస్పిటల్ నిర్వహించిన సర్వేలో 100 మంది యుక్త వయసు అమ్మాయిలలో 9 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. 25% మంది అమ్మాయిలు రోజూ జంక్ ఫుడ్ తింటుండగా, 71% మంది సాధారణ భోజనాన్ని ఫాస్ట్ ఫుడ్తో భర్తీ చేసినట్లు అంగీకరించారు. రక్తహీనతకు జంక్ ఫుడ్ ప్రత్యక్ష కారణం కానప్పటికీ పోషకాహారాన్ని విస్మరించడంలో, ఇనుము లోపాన్ని తీవ్రతరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని అధ్యయనం తెలిపింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే..ఇంటి వంటలో సాధారణంగా ఉపయోగించని ఆహార పదార్థాలతో ఫ్యాక్టరీల్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ను తయారు చేస్తారు. అధిక–ఫ్రక్టోజ్ కాన్ సిరప్, ఎక్కువ కాలం మన్నేలా హైడ్రోజనేటెడ్ నూనెలు, కృత్రిమ రంగులు, రుచి పెంచే ముడిపదార్థాలను ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తులను సౌలభ్యం, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా రూపొందిస్తారు. పోషక విలువలు తక్కువ. కొవ్వు, చక్కెర, ఉప్పు అధిక స్థాయిలో ఉంటాయి.పారిశ్రామిక పద్ధతుల్లో: వీటిని ఇంట్లో కాకుండా కర్మాగారాల్లో అధునాతన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. ప్రత్యేక పదార్థాలు: పిండి పదార్థాలు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, లాక్టోస్ వంటి ప్రాసెస్, శుద్ధి చేసిన ప్రొటీన్, కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ వాడతారు. రుచి పెంచేలా: ఇంటి వంటల్లో అరుదుగా ఉపయోగించే రుచి పెంచే ముడిపదార్థాలు, రంగులు, సరైన మిశ్రమం, దీర్ఘకాలిక మన్నిక కోసం ఎమల్సిఫైయర్స్ జోడిస్తారు. తినడానికి సిద్ధం: సౌలభ్యం కోసం తినడానికి రెడీగా ఉన్న లేదా వేడి చేయడానికి సిద్ధంగా ఉండేలా రూపొందిస్తారు. -
చిన్న పార్టీలకు పెద్ద పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్లో మంగళవారం జరు గనున్న రెండో దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు పెద్ద పరీక్షను ఎదుర్కోనున్నాయి. ఎన్నికలు జరుగ నున్న 122 స్థానాలకు గాను చాలాచోట్ల వివిధ కూటముల్లోని చిన్న పార్టీలు సహా స్వతంత్రంగా పోటీ చేస్తున్న పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు ఏమాత్రం సత్తా చాటుతాయన్న దానిపైనే గెలుపోటములు ప్రభావితమై ఉన్నాయి. అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠరెండో దశలోని 122 నియోజకవర్గాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండగా, ఇందులో 101 జనరల్, 19 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. గత 2020 ఎన్నికల్లో 122 స్థానాల్లో బీజేపీ 42 గెలుచుకోగా, ఆర్జేడీ 28, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5, ఎంఐఎం 5 సీట్లను గెలుచుకున్నాయి. ఈ స్థానాల్లో ఎంఐఎం మినహా మిగతా చిన్న పార్టీలేవీ పెద్దగా గెలవలేదు. ఈసారి పరిస్థితి వేరేగా ఉంది. ఇండియా, మహాగఠ్బంధన్ కూటముల్లోని చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. ముఖ్యంగా ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి పార్టీ మొత్తంగా 28 స్థానాల్లో పోటీ చేస్తుండగా, రెండో దశ పోలింగ్ జరిగేవి అందులో 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఇక్కడ బీజేపీకి బలంగా ఉన్న రాజ్పుత్లు, జేడీయూకు మద్దతుగా నిలుస్తున్న ఓబీసీ. ఈబీసీ వర్గాలతో పాశ్వాన్ వర్గాన్ని కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే బీసీ వర్గాల్లో వచ్చిన చీలిక పాశ్వాన్కు ఏమాత్రం మద్దతిస్తాయన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇక జతిన్రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం) సైతం 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 4 రిజర్వుడ్ స్థానాలే ఉన్నాయి. ఇందులోనూ టెకారీ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ తన భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ స్థానంలో గెలిస్తే అనిల్కుమార్ మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. హెచ్ఏఎం పోటీచేస్తున్న అనేక స్థానాల్లో ఆయనకు పోటీగా మహాగఠ్బంధన్లోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. మాంఝీ వర్గాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా అన్ని రకాల ప్రణాళికలు వేశారు. ఆ పార్టీ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో ఆయన భార్య స్నేహలతను సైతం పోటీలో ఉంచారు. ఇక మహాగఠ్బంధన్లో ఉన్న వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) సైతం మొత్తం 12 సీట్లలో పోటీ చేస్తుండగా, రెండో దశలో 7 స్థానాలున్నాయి. ఇందులో 5 నియోజకవర్గాల్లో ‘మల్లా’కమ్యూనిటీకి చెందిన వారే అధికంగా ఉండటంతో ఇందులో కనీసంగా 5 స్థానాలు గెలుస్తామని కూటమి బలంగా నమ్ముతోంది. ఆర్జేడీ నమ్ముకున్న ముస్లిం–యాదవ్ ఫార్ములాకు మల్లాలు తోడైతే ఇక్కడ విజయం ఖాయమని భావిస్తోంది. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండో దశలో 100 చోట్ల పోటీలో నిలవగా, ఎక్కువగా ఉత్తరప్రదేశ్కు సరిహద్దుగా ఉన్న 32 నియోజకవర్గాలనే ఆమె లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేశారు. కనీసంగా 2 నుంచి 5 స్థానాలు గెలుస్తామని బీఎస్పీ చెబుతోంది. ఇక సీమాంచల్లోని 24 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించిన ఎంఐఎం ఈసారి 11 స్థానాల్లో పోటీకి దిగింది. ఇక్కడ అర డజను సీట్లు గెలుస్తామని పార్టీ ధీమాతో ఉంది. ప్రశాంత్కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ సైతం 110 చోట్ల పోటీలో ఉంది. ఆయన పార్టీ వైపు ఎక్కువగా యువత, మహిళలు ఆకర్షితులు కావడంతో చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. -
కేరళ ఎన్బీఎఫ్సీలా మజాకా..
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒక్కో కుటుంబంలో ఎంత బంగారం ఉంటుంది. సామాన్యుల దగ్గరైతే తులాల్లో ఉంటుంది. సంపన్నులైతే కిలోల్లో. మరి మన కేరళలోని నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వద్ద ఉన్న పసిడి ఎంతో తెలుసా? జస్ట్ 381 టన్నులు. ఈ కంపెనీలన్నీ ఒక దేశమైతే.. నిల్వల పరంగా ఈ దేశం ప్రపంచంలో 16వ స్థానంలో ఉండేదంటే ఆశ్చర్యంవేయక మానదు. అనేక యూరోపియన్ దేశాల కంటే ఈ నిల్వలు అధికంగా ఉండడం విశేషం. విదేశీ మారక ద్రవ్య ఆస్తులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వంటి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటాయి.అయితే కేంద్ర బ్యాంకులు కలిగి ఉన్న పసిడి నిల్వల పరిమాణంలో అంతర్జాతీయంగా భారత్ 7వ స్థానంలో ఉంది. 2025 సెపె్టంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 880.18 టన్నుల పుత్తడి ఉంది. కేరళకు చెందిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం ఏకంగా 381 టన్నులకు చేరుకుంది. అంటే ఆర్బీఐ వద్ద పోగైన పసిడిలో 43.28% అన్నమాట. ప్రపంచంలో బంగారం వినియోగంలో అతిపెద్ద కస్టమర్గా భారత్ నిలిచింది. భారతీయుల వద్ద 25,000 టన్నుల పైచిలుకు పసిడి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక దేశీయ రుణ మార్కెట్లో 2,950–3,350 టన్నుల పుత్తడి పూచీకత్తుగా ఖజానాలలో దాచినట్టు అంచనా. వెనుకంజలో పెద్ద దేశాలు కేరళకు చెందిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియర్లు ఒక దేశమైతే.. పోర్చుగల్తో అమీతుమీ తేల్చుకునే స్థాయిలో పోటీపడేది. 382.66 టన్నులతో పోర్చుగల్ 15వ స్థానంలో ఉంది. అంతేకాదు అనేక యూరోపియన్ దేశాల అధికారిక నిల్వలను కేరళ ఎన్బీఎఫ్సీలు మించిపోవడం విశేషం. ఈ గోల్డ్ లోన్ కంపెనీల వారీగా చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ 208 టన్నుల నిల్వలతో అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ (కేఎస్ఎఫ్ఈ) 67.22 టన్నులు, మణప్పురం ఫైనాన్స్ 56.4, ముత్తూట్ ఫిన్కార్ప్ 43.69, ఇండెల్ మనీ వద్ద సుమారు 6 టన్నుల పుత్తడి ఉంది. ఈ సంస్థల వద్ద ఉన్న మొత్తం నిల్వలు 381 టన్నులు దాటిపోయాయి. అయితే యూకే 310.29, స్పెయిన్ 281.58, ఆస్ట్రియా వద్ద 279.99 టన్నులు ఉంది. బ్రెజిల్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సైతం కేరళ ఎన్బీఎఫ్సీల కంటే వెనుకంజలోనే ఉన్నాయి. బంగారం పొదుపు సాధనమేకాదు హోదాకు చిహ్నం. అవసరానికి ఆదుకునే ఆపన్నహస్తం. అందుకే భారత్లో బంగారు రుణాల వ్యాపారం దశాబ్దాలుగా ఆర్థికంగా శక్తివంతంగా మారింది. తృతీయ, ఆ తర్వాతి స్థాయి నగరాలు, చిన్నపట్టణాలు, పల్లెల్లో బంగారు రుణాలే తక్షణ అవసరాలకు మొదటి ప్రాధాన్యత. వ్యాపారం, పిల్లల చదువుకయ్యే ఫీజులు, ఇంటి అవసరాలు, అత్యవసరాలు.. కారణం ఏదైనా తొలుత గుర్తొచ్చేది ఇంట్లో ఉన్న బంగారమే. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1.24 లక్షలు దాటింది.పుత్తడి ఈ స్థాయిలో ప్రియం కావడంతో బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది. గ్రాముకు రూపాయి లభ్యత పెరిగింది. ప్రజలు తమ ఆభరణాలను తాకట్టు పెడుతుండటంతో మార్కెట్లోకి మరింత బంగారం వస్తోంది. ద్రవ్య కొరత రుణగ్రహీతలను బంగారం ఆధారిత క్రెడిట్ కోసం మళ్లేలా చేస్తోంది. కంపెనీలు కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు తీసుకుని నిమిషాల్లో రుణం ఇస్తున్నాయి. అంతరాన్ని పూరిస్తున్నాయి..బంగారం ధరల పెరుగుదల భారత మార్కెట్కు.. ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గాలకు వరంగా మారింది. అన్సెక్యూర్డ్ లోన్స్పై పరిమితుల కారణంగా బ్యాంకుల నుంచి అప్పు దొరకడం అంత సులభం కాదు. కానీ బంగారు రుణాలు ఆ అంతరాన్ని పూరిస్తున్నాయి. భారత్లోని బంగారు రుణాల్లో వ్యవస్థీకృత సంస్థల వాటా 37%. మిగిలిన 63% వాటాను చిన్న ఫైనాన్షియర్లు, స్థానిక వడ్డీ వ్యాపారుల వంటి నియంత్రణ లేని అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. అయితే రుణం తిరిగి చెల్లించని పక్షంలో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని నిర్దేశిత కాలం తర్వాత కంపెనీలు వేలం వేస్తాయి. తాకట్టు పెట్టిన దాంట్లో వేలం వేసిన పసిడి వాటా గతంలో 2.5% ఉండేది. ఇప్పుడు ఇది ఒక శాతానికి వచి్చంది.⇒ మన దేశంలో ఖజానాల్లో పూచీకత్తుగా ఉన్న బంగారం 2,9503,350 టన్నులు⇒ కేరళ ఎన్బీఎఫ్సీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన పసిడి 381 టన్నులు⇒ భారతీయుల వద్ద ఉన్న బంగారం 25,000 టన్నులు⇒ 2025 సెపె్టంబర్ నాటికి ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 880.18 టన్నులు⇒ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడిలోఅంతర్జాతీయంగా భారత్ స్థానం -
ఫ్యాన్సీ పాస్వర్డ్.. 123456
123456..ఫ్యాన్సీ నంబరు కదా.. ఇది చూడగానే పెదవిపై ఓ చిరునవ్వు.. అంతేనా.. చాలామంది కళ్లు కాస్త పెద్దవిగా కూడా అయి ఉంటాయి. ఎందుకంటే లక్షలాది మంది ఈ నంబరును ఆన్లైన్ ఖాతాలకు పాస్వర్డ్గా పెట్టుకున్నారు కాబట్టి. ఈ జాబితాలో మీరూ ఉంటే కచ్చితంగా పాస్వర్డ్ మార్చుకోవాల్సిందే. యూకేకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ ‘కంపేరిటెక్’ఓ ఆసక్తికర నివేదికను రూపొందించింది.2025లో డేటా బ్రీచ్ ఫోరమ్స్లో లీక్ అయిన 200 కోట్లకుపైగా రియల్ అకౌంట్ పాస్వర్డ్స్ను కంపేరిటెక్ సేకరించింది. ఆ డేటా ఆధారంగా అత్యధికంగా ఉపయోగించిన పాస్వర్డ్స్ జాబితాను విడుదల చేసింది. 123456 పాస్వర్డ్ను ఏకంగా 76,18,192 మంది తమ ఆన్లైన్ ఖాతాలకు ఉపయోగిస్తున్నారు. 12345678ను 36.7 లక్షలు, 123456789ను 28.6 లక్షల మంది వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లోadmin, 1234 పాస్వర్డ్స్ ఉన్నాయి. అత్యధికంగా వినియోగించిన టాప్–100 పాస్వర్డ్స్లో 53వ స్థానాన్ని India@123 ఆక్రమించింది. డేటా బ్రీచ్ ఫోరమ్స్ యూజర్ల సమాచారాన్ని తస్కరించిన ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు తరచూ డార్క్ వెబ్లో కనిపిస్తాయి. ఇవి సైబర్ నేరస్తులు దొంగిలించిన డేటాను పంచుకోవడానికి, కొనుగోలు, విక్రయించడానికి మార్కెట్ ప్లేస్లు, చర్చా కేంద్రాలుగా పనిచేస్తాయి. దొంగిలించిన సమాచారంతో సిద్ధంగా ఉన్న మార్కెట్ను రహస్యంగా అందించడం ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఈ వేదికలు సులభతరం చేస్తాయి. ప్యారిస్లోని లూవ్ (Louvre) మ్యూజియంలో సెక్యూరిటీ సిస్టమ్కు Louvre అనే పదం పాస్వర్డ్గా ఉంది. ఇంత సులభంగా ఉండడం వల్లే దోపిడీ నిమిషాల్లో పూర్తయ్యింది. సుమారు రూ.900 కోట్ల విలువైన ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. కనీసం 12 అక్షరాలు.. పాస్వర్డ్ కనీసం 12 అక్షరాలు ఉండాలని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. సులభంగా గుర్తించే అవకాశం ఇవ్వకుండా చిన్న, పెద్ద అక్షరాలు, సంఖ్యలు, చిహ్నాల కలయికతో రూపొందించుకోవాలి. కుటుంబ సభ్యులు, వ్యక్తులు, ఉత్పత్తి పేరును పాస్వర్డ్గా ఉపయోగించకపోవడం మంచిది. తద్వారా మరొకరి చేతుల్లోకి పాస్వర్డ్ వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ⇒ 65.8% పాస్వర్డ్స్ 12 అక్షరాల కంటే తక్కువ ఉన్నాయి ⇒ 3.2% ఖాతాలకు 16 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలను ఉపయోగించారుబాధితులు కావొద్దు ఇంటికి తాళం వేసినప్పుడు ఒకటికి రెండుసార్లు లాగి సరిగ్గా పడిందా లేదా అని చూస్తుంటాం. అలాంటిది మన కష్టార్జితం అంతా దాచుకున్న బ్యాంకు ఖాతాలు లేదా పేమెంట్ యాప్స్, జీ–మెయిల్ అకౌంట్స్ వంటి ముఖ్యమైన సాధనాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆన్లైన్ పాస్వర్డ్ను మరొకరు సులభంగా ఊహించగలిగితే, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఒకే పాస్వర్డ్ను ఉపయోగించే వ్యక్తులు ఎక్కువమంది ఉంటే అటువంటి ఖాతాలను హ్యాకర్లు సులభంగా ఛేదించడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏఐ సాధనాలను సైబర్ నేరస్తులు ఆయుధంగా చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో నెటిజన్లు జాగ్రత్త పడకపోతే బాధితులుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఊహించడం కష్టంగా, దొంగిలించేందుకు వీలులేని క్లిష్టమైన పాస్వర్డ్ను పెట్టుకోండి అంటూ బ్యాంక్స్, ఆన్లైన్ సేవల కంపెనీలు తరచూ చెప్పేది ఇందుకే. సులభంగా ఊహించేలా.. ⇒ చాలా పాస్వర్డ్స్ను ఆరోహణ లేదా అవరోహణ సంఖ్యలతో.. అంటే వరుస క్రమంలో 12345 లేదా 54321 మాదిరిగా సులభంగా ఊహించేలా ఉంటున్నాయి. ⇒ టాప్–1,000లో నాలుగింట ఒక వంతు పాస్వర్డ్స్ పూర్తిగా సంఖ్యలతోనే పెట్టుకున్నారు. ⇒ 123 అంకెలతో 38.6%, 321తో 2%, abc పాస్వర్డ్తో 3.1% ఖాతాలు ఉన్నాయి. ⇒ 18వ స్థానంలో 111111, 35వ స్థానంలో నిలిచింది. ⇒ 3.9% , password, 2.7% admin, 1% welcome అనే పదాలను కలిగి ఉన్నాయి. -
బతుకును గానం చేసిన కవి
‘మాయమై పోతున్నడమ్మా మనిషి’... అని మనిషి కోసం వెతుకులాడినా ‘కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిచి మొక్కితే అమ్మరా’... అని ప్రకృతిని ఆరాధించినా ‘జయజయహే తెలంగాణ’ అని తెలంగాణ తల్లికి జ్యోతలు అర్పించినా అందెశ్రీకే సాధ్యం. జనజీవన గాథలను పాటగా మలచిన అమర కవి అందెశ్రీకి నివాళి...పాటల మాగాణంగా వాసికెక్కిన తెలంగాణలో ఒక దిక్కార గొంతుక అందెశ్రీ. అక్షరాలు రాని దశ నుండి ఒక రాష్ట్రానికి రాష్ట్రగీతం అందించే దశకు ఎదిగిన కవి ఆయన. తెలంగాణ నేలన వందలాదిమంది పాటకవులు ఉన్నారు. అందరూ తమ తమ సృజనస్థాయుల్లో కృషి చేశారు. కాని వారిలో అందెశ్రీ తనదైన శైలితో కోట్లాది హృదయాలను గెలుచుకున్నాడు. చదవడం, రాయడం రాకముందే పాటలు అల్లి పాడడం మొదలు పెట్టిన ఆయనది జానపదుల శైలి. ఆ శైలినే మొదట కొనసాగించాడు. తర్వాత తనకు తెలిసిన జీవితాన్ని పాటల్లోకి ఒంపుతూ వెళ్లాడు. అట్లా ఆయన పాటల నిండా తనదైన ముద్ర పరుచుకుని ఉంది.అందెశ్రీ పాటల్లో సామాజిక సమస్యల మీద రాసిన పాటలది సగపాలు. తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలది సగపాలు. సామాజిక సమస్యల మీద అందెశ్రీ రచించిన పాటల్లో పల్లెతనం ఆవహించుకుని ఉంటుంది. పల్లె బతుకును పాటగా అల్లడం ద్వారా ఆయన ఈ మట్టి మీద, మనుషుల మీద తనకున్న ఎడతెగని ప్రేమ, మమకారాన్ని అక్షరాల్లో చూపిస్తాడు. పూర్వ వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో జన్మించిన అందెశ్రీకి పల్లెను పట్టుకోవడంలో తనదైన దృష్టి ఉంది. తెలంగాణ పల్లెల్లో ఉండే మానవ సంబంధాలను అర్థం చేసుకుని తనకున్న దళిత జీవిత అస్తిత్వం నుండి వాటిని పాటలుగా మలిచాడు. తాను రాసిన ‘సూడా సక్కాని తల్లి, సుక్కల్లో జాబిల్లి’ పాటలో పల్లెల్లో కులవృత్తుల భాగస్వామ్యాన్ని గానం చేశాడు. సబ్బండ కులాలు ఎట్లా గ్రామ స్వరాజ్యంలో పాలుపంచుకుంటాయో వర్ణించాడు. చేతివృత్తులకు శిరస్సు వంచి నమస్కరించాడు. అలాంటి చేతి వృత్తులు గ్లోబలైజేషన్ నేపథ్యంలో విధ్వంసానికి గురైనప్పుడు ఆయనే ‘కొమ్మ చెక్కితే బొమ్మరా...అది కొలిచి మొక్కితే అమ్మరా...’ అంటూ ధిక్కారాన్ని పలికించాడు. అంతర్జాతీయ కుట్రలను ఎండగట్టాడు. ‘భాష మీద దాడి చేసిరిబతుకు మీద దాడి చేసిరి తరతరాలుగా భరతజాతిని బహువిధాలుగ బాధపెడితిరిఎవరి నమ్మకాలు వారివిఎక్కిరించే హక్కులెకడివి?అగ్గికి చెదలెట్ల పడుతది?నిగ్గదీసి అడుగుతున్నా’అంటూ నిలదీశాడు. తెలంగాణ గ్రామాల్లో ఉండే వెనుకబడిన కులాల జీవనం మీద కూడా అందెశ్రీ పాటలు రాశాడు. ‘తలమీద సుట్టా బట్టాఆ పైనా పండ్లా తట్టాపండ్లు పండ్లోయనిపల్లెంత తిరుగుకుంటూబజార్ల కూసోనమ్మిబతుకెళ్ల దీసుకున్నా’అంటూ ‘తెనుగోల్ల ఎల్లమ్మ’ బతుకును పాటల్లో అద్భుతంగా చిత్రించాడు అందెశ్రీ. ఇక మాదిగల సాంస్కృతిక జీవనంలో భాగమైన డప్పు పాత్రను అత్యద్భుతంగా వర్ణించాడు. ‘మాదిగయ్యల మేథ నుండి పురుడు పోసుకున్నదిమానవ జాతులను ఎపుడూ మేలుకొలుపుతుంటది’ అంటూ డప్పు ఇప్పటికీ గ్రామాల్లో పోషించే పాత్రను గొప్పగా ఆవిష్కరించాడు. డప్పు మీద అందెశ్రీ రాసిన ఈ పాట అత్యంత తాత్విక గాఢతను కలిగి ఉంది. ‘ఊరిలో ఏ సావుకైనా ముందే ఉంటానంటది... ఏడుపెందుకు లోకమందున ఎవరు బతుకుతరంటది’ అంటాడాయన ఆ పాటలో తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ రాసిన ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకమైంది. ‘సూడు తెలంగాణ సుక్కనీరు లేనిదానా’అంటూ తెలంగాణ అరవయేండ్ల దు:ఖానికి గొంతుకను ఇచ్చి మోసినవాడు అందెశ్రీ. అలాగే ఉద్యమ కాలంలో ‘జై బోలో తెలంగాణ...’ అంటూ తాను రాసిన పాట తెలంగాణ ప్రజానీకాన్ని ఉర్రూత లూగించింది. అందెశ్రీ రాసిన తెలంగాణ పాటల్లో తలమానికమైంది ‘జయజయహే తెలంగాణ...’ పాట. ఈ పాట తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలే దీనిని రాష్ట్ర గీతంగా భావించారు. స్కూళ్లు, ఆఫీసుల్లో ఈ పాటను పాడుకుని దినచర్యను ్రపారంభించారు. అట్లా తెలంగాణ వచ్చిన పదేళ్ల తరువాత అధికారికంగా ఇదే గీతాన్ని రాష్ట్ర గీతంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ పాట నుండి తెలం గాణ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటాడు అందెశ్రీ. ముఖ్యంగా ఇందులో వాడిన భాష పండిత భాష. బాగా చదువుకున్న పండితుల కంటే తాను ఏ మాత్రం తక్కువకాదని నిరూపించుకునేలా ఈ పాటలో పద ప్రయోగాలు చేశాడు.అటు పల్లె పాటలైనా, ఇటు పండిత పాటలైన మెప్పించి, ఒప్పించగలిగే శక్తి ఆయన పాటలకే ఉందంటే అతిశయోక్తి కాదు. అందెశ్రీ రచించిన పాటల్లో ఎక్కువగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి ‘మాయమై పోతున్నడమ్మా... మనిషన్నవాడు’ పాట. ఈ పాటలో అందెశ్రీ ఆధునిక కాలంలో మృగ్యమై పోతున్న మానవ విలువల మీద ఒక హెచ్చరిక లాంటి స్వరాన్ని వినిపించాడు. తాను జీవించిన కాలాన్ని పాటతో వెలిగించిన ఈ పాటల ప్రజాకవి, ధిక్కారమే తన చిరునామాగా జీవించాడు. పాట ఉన్నంత కాలం అందెశ్రీకి మరణం లేదు. – డా. పసునూరి రవీందర్,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు -
సింపుల్ గా జాబ్ మారుతున్నారు!
అసలే కుర్రకారు. వారి ఆలోచనలూ ఉడుకు రక్తంలా పరుగెడుతుంటాయి. ఉద్యోగం విషయంలోనూ అంతే. ఏళ్లకేళ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూర్చోవడానికి తాము ఒకప్పటి తరం కాదని తేల్చిచెబుతోంది జనరేషన్ –జీ. మంచి వేతనం దొరికితే ఏడాదిలోపే జంప్ చేస్తామని నిర్మొహమాటంగా కుండబద్దలు కొడుతున్నారీ తరం. విశ్వసనీయత, ఉద్యోగ స్థిరత్వం, కెరీర్ వృద్ధి.. ఇదంతా గతం. జీతం, పని సౌలభ్యం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ఈ అంశాలే జెన్ –జీ తరానికి ఇప్పుడు కీలకంగా మారాయని రాండ్స్టాడ్ ఇండియా తాజా నివేదిక చెబుతోంది. పనికి తగ్గ వేతనం జెన్ –జీ నిపుణులకు ఒక ప్రాథమిక డిమాండ్గా ఉన్నప్పటికీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పని చేయాలన్న అంశాలకూ విలువ ఇస్తున్నారని ‘ద జెన్ –జీ వర్క్ప్లేస్ బ్లూప్రింట్’ పేరుతో రూపొందిన ఈ నివేదిక తెలిపింది. 1997–2007 మధ్య జన్మించిన జెన్ –జీ బ్యాచ్లో 35 కోట్ల మందికిపైగా ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%.వృద్ధిని కోరుకుంటున్నారుఅదనపు సెలవు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి సంప్రదాయ ప్రోత్సాహకాలు జెన్ జీని పెద్దగా ఆకర్షించడం లేదు. వీటికి బదులుగా అర్థవంతమైన పని, అభ్యాస అవకాశాలను ఈ తరం కోరుకుంటోంది. చాలామంది ప్రయాణ అవకాశాలు, రిమోట్ గా పని చేసే సౌకర్యాలు ఉన్న కంపెనీల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. తరచూ కంపెనీలు మారడం తప్పుకాదనీ, సుదీ ర్ఘ ప్రయాణంలో భాగంగా వారు వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఎదగడానికి అవకాశాల కోసం చూస్తున్నందున తరచూ ఉద్యోగం మారుతున్నారని తెలిపింది. మారాల్సింది కంపెనీలే!కంపెనీలు ఈ మార్పులకు అనుగుణంగా మారాలని నివేదిక సూచించింది. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచే అవకాశాలు కల్పించడం, మార్గదర్శకత్వం, వారితో మమేకం కావడం, సౌకర్యవంతమైన పని వాతావరణం వంటివి అమలు చేసే కంపెనీలు జెన్–జీ ప్రతిభను ఆకర్షించడమే కాకుండా.. దీర్ఘకాలం పాటు వీరిని తమ సంస్థల్లో ఉద్యోగులుగా నిలుపుకోగలుగుతాయని వివరించింది. అవకాశాలు బోలెడున్నాయని వారు దృఢ నిశ్చయంతో ఉన్నారని నివేదిక తెలిపింది. ఈ తరుణంలో ఉద్యోగావకాశాలు, అభివృద్ధి మార్గాలను ఈ జనరేషన్ కోసం ఎలా రూపొందించాలో కంపెనీలు పునరాలోచించుకోవాలని సూచించింది. బేరీజు వేసుకుని మరీ..మెరుగైన అవకాశాలపై దృష్టి సారించినప్పటికీ తమ ఉద్యోగం / పాత్రలో తాము సమర్థులుగా భావిస్తున్నామని 81% మంది చెబుతున్నారు. 93% మిలీనియల్స్, 89% జెన్ –ఎక్స్తో పోలిస్తే 82% జెన్ –జీ తరం మాత్రమే తమ కంపెనీలో తమకు విలువ ఉందని భావిస్తున్నారు. 94% కంటే ఎక్కువ మంది కొత్త కంపెనీని ఎంచుకునే ముందు తమ దీర్ఘకాలిక ఆకాంక్షలకు తగ్గట్టుగా నూతన ఉద్యోగం ఉందా లేదా అని బేరీజు వేసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా జెన్ –జీ తరంలో ఇలా ఆలోచించేవారి శాతం సగటు 79%. -
మీ కళ్లు చెబుతాయిక... మీ జబ్బులేమిటో!
ముఖం చూసి ఆ మనిషి మూడ్ ఏంటో చెప్పేస్తాం. అలాగే కళ్లు కూడా మన గురించి ఎన్నో విషయాలు చెబుతాయి. కళ్లు నవ రసాలను పలికించటమే కాదు.. మన దేహంలో సూక్ష్మ స్థాయిలో దాగున్న జబ్బుల జాడల్ని కూడా సూక్ష్మంగా అందించగలవట. మన కళ్లలోకి చూసి మన గుండె ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చు. అలాగే మన వయసు ఎంత వేగంగా అయిపోతోంది లేదా వృద్ధాప్యంలోకి ఎంత వేగంగా వెళ్లిపోతున్నాం అనేది కూడా కచ్చితంగా చెప్పవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కంటిలోని చిన్న రక్తనాళాలను లోతుగా పరిశీలిస్తే.. ఆ వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎంత మేరకు ఉందో తెలిసిపోతుంది. అంతేకాదు.. ఒకరి హృదయ నాళాల ఆరోగ్యం, జీవసంబంధమైన వృద్ధాప్య స్థితిని కూడా కళ్లు చెప్పేస్తాయని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఎంతమందిపై చేశారు?కెనడాలోని మెక్మాస్టర్ విశ్వవిద్యాలయం, పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 74 వేల మందిపై సంయుక్త పరిశోధనలు చేశారు. వీరి రెటీనా స్కాన్లు, జన్యు డేటా, రక్త నమూనా విశ్లేషణలను నాలుగు వేర్వేరు సంస్థల నుంచి సేకరించి పరిశోధించారు. కళ్ల ద్వారా తెలుసుకోగలిగే ఆరోగ్య స్థితిగతులపై అత్యంత ఆసక్తికర విషయాలు తెలిశాయి. సైన్సెస్ అడ్వాన్సెస్ జర్నల్లో ఇటీవల ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఎలా చేశారు? ‘కంటిలో ముఖ్యమైన భాగం రెటీనా. రెటీనా స్కాన్ నివేదికల సమాచారంతో జన్యుశాస్త్రం, రక్తపు బయోమార్కర్లను అనుసంధానం చేయటం ద్వారా వృద్ధాప్యం హదృయనాళ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోందో కనుక్కోవటంలో విజయం సాధించాం. రెటీనా రక్తనాళాల్లో మార్పులు తరచుగా శరీరంలోని చిన్న నాళాల్లో జరిగే మార్పులకు అద్దం పడతాయి’ అన్నారు ఈ అ«ధ్యయన రచయిత ప్రొఫెసర్ మేరీ పిగేయ్రే.ఏంటి ప్రాధాన్యత? గుండెకు రక్తాన్ని అందించే నాళాలకు ఎన్ని తక్కువ ఉప నాళాలు ఉంటే గుండె జబ్బుల ముప్పు అంత ఎక్కువగా ఉందని గుర్తించారు. శరీరంలో అధిక వాపు, తక్కువ ఆయుర్దాయం వంటి జీవసంబంధమైన వృద్ధాప్య సంకేతాలను కూడా రెటీనా స్కాన్లు చూపగలుగుతున్నాయని కనుగొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్సల్లో దీని ప్రాధాన్యం ఏమిటంటే.. శరీరం లోపలికి ఏ పరికరాన్నీ చొప్పించకుండానే వ్యాధులను ముందుగానే సూక్ష్మంగా గుర్తించడానికి, చికిత్స చెయ్యటానికి రెటీనా స్కాన్ల సమాచారం కీలకం కాబోతోంది. ఏంటా ప్రోటీన్లు?ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం రక్తపు బయోమార్కర్లు, జన్యు డేటాను సమీక్షించటం. దీని ద్వారా, పరిశోధకులు కంటి రక్త నాళాల్లో మార్పుల వెనుక గల జీవసంబంధమైన కారణాలు కనుగొనగలిగారు. రక్తనాళాలలో వచ్చే మార్పులకు కారణమవుతున్న రెండు ముఖ్యమైన ప్రోటీన్లను ఈ పరిశోధనలో కనిపెట్టారు. వృద్ధాప్యం వేగాన్ని నెమ్మదింపజేయటానికి, గుండె జబ్బుల భారాన్ని తగ్గించడానికి.. భవిష్యత్తులో ఔషధాల తయారీకి, చివరికి జీవితకాలం మెరుగుపరచడానికి.. ఈ ప్రొటీన్లు ఉపయోగపడతాయని ప్రొఫెసర్ మేరీ పిగేయ్రే వివరించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
ప్రతి తొమ్మిది మందిలో ఒకరు భారతీయులు
చదువు అంటే నేర్చుకోవడం..అది కూడా ఆసక్తితో.. కానీ కొన్నేళ్లుగా చదువు అర్థం మారిపోయింది. పోటీపడాలి.. అత్యధిక మార్కులు సాధించాలి. అంతేకాదు ఉత్తమ కళాశాలలో సీటు సంపాదించాలి. ఈ ఒత్తిడి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చదువు అంటేనే చాలామంది భారంగా భావించే స్థాయికి వచ్చారు. ఫలితాలు వారి అంచనాలను అందుకోలేనప్పుడు ఎవరూ ఊహించని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒకటి భారత్లో జరుగుతోంది. 2024 ఐసీ3 స్టూడెంట్ సూసైడ్ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా చదువుల ఒత్తిడి తీవ్రంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. 2013–2022 మధ్య మన దేశంలో లక్షకు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంతో పోలిస్తే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్న విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో 64 శాతం పెరిగింది. ‘పరీక్షలు, మార్కులకు మాత్రమే ఈ సంక్షోభాన్ని ముడిపెట్టకూడదు. విద్యార్థుల్లో భయం,నిశ్శబ్దం అలుముకుంది. వారికి భరోసా లేకపోవడం సమస్యను పెంచుతోంది’అని నివేదిక తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్నమ్మకానికి బదులుగా నిశ్శబ్దం..చదువులు, తల్లిదండ్రుల నుంచి భారీ అంచనాలు, సామాజి కంగా ఇతరులతో పోలిక వంటి ఒత్తిడిని నేటి విద్యార్థులు ఎదు ర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు పడుతున్న బాధ ను ఎవరూ ముందుగా గుర్తించడం లేదని నివేదిక వివరించింది. మార్గనిర్దేశనానికి బదులుగా చాలామంది తరగతి గదుల్లో భయంతో కూడిన ప్రేరణను అనుభవిస్తున్నారు. నమ్మకానికి బదులుగా నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటున్నారు. విద్యలో ప్రధాన భాగంగా కాకుండా కౌన్సెలింగ్ను ఇప్పటికీ చివరి ప్రయత్నంగా చూస్తున్నారు’అని తెలిపింది. పరిష్కారం వారి చేతుల్లోనే..నేర్చుకోవడం, విద్యార్థుల శ్రేయస్సు విషయంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంస్కృతిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ‘విద్యార్థులు చదువును ద్వేషించరు. పెద్దల నుంచి సరైన మార్గనిర్దేశనం లేనప్పుడు వ్యతిరేకిస్తారు. పరిష్కారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. విద్యార్థులు ఆశ్రయించే మొదటి కౌన్సెలర్లు వారే. ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించి, మేమున్నాం అని ధైర్యం చెప్పేలా వినడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు’అని వివరించింది. స్వేచ్ఛా వాతావరణం..నివేదిక ప్రకారం 40 శాతం మంది భారతీయ విద్యార్థులు ఎప్పు డూ కౌన్సెలర్తో మాట్లాడలేదు. అయితే ఈ సంఖ్య గత సంవత్సరం 52 శాతం నమోదైంది. ‘మానసిక ఆరోగ్యం పాఠశాల జీవితంలో రోజువారీ చర్యల్లో భాగం కావాలి. కౌన్సెలింగ్ నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి’అని నివేదిక తెలిపింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ సంక్షోభం ఏర్పడిన తర్వాత మాత్రమే ‘మానసిక ఆరోగ్యం’గుర్తొస్తుందని వివరించింది. సమస్య రాకముందే నివారణ అవసరం. నమ్మకమైన పెద్దలు తరచూ సమావేశం కావడం ద్వారా విద్యార్థులకు మనోధైర్యం లభిస్తుందని తెలిపింది.ఉపాధ్యాయులే కౌన్సిలర్లు.. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ భారీ నిధులు అవసరం లేదని, స్థిరమైన నిర్మాణం, సానుభూతి అవసరమని నివేదిక వివరించింది. ‘ప్రతి ఉపాధ్యాయుడు కౌన్సెలర్ పాత్ర పోషించడం ఒక ఆచరణాత్మక విధానం. ప్రాథమిక శిక్షణతో విద్యార్థుల బాధను ఉపాధ్యాయులు ముందుగానే గుర్తించగలరు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లల బాధ యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో అవరి్టంగ్ స్టూడెంట్ సూసైడ్ టాస్్కఫోర్స్ అభివృద్ధి చేసిన గేట్ కీపర్ ట్రైనింగ్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు సహాయ పడతాయి. స్టూడెంట్ వెల్నెస్ క్లబ్స్, టీచర్–సూ్టడెంట్ అడ్వైజరీ సర్కిల్స్ పాఠశాలల్లో విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు చవకైన మార్గాలు’అని తెలిపింది. మానవ సంబంధాలు.. చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను 83 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంకేతికత మానవ సంబంధాన్ని భర్తీ చేయదని నివేదిక తెలిపింది. విద్యార్థులు త్వరిత సమాధానాల కోసం, లేదా పెద్దలను అడగడానికి సంకోచించినప్పుడు ఏఐ వైపు మొగ్గు చూపొచ్చు. కానీ మనోధైర్యం, జీవిత నిర్ణయాల విషయానికి వస్తే వారు ఇప్పటికీ నిజమైన మానవ సంబంధాన్ని కోరుకుంటారు. నమ్మకమైన పెద్దవారితో 15 నిమిషాల సంభాషణ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’అని వివరించింది. విద్యకు పునాదిగా.. విద్యార్థులకు నిజమైన మార్గదర్శకత్వం కావాలి. వారు చదువుతోనే కాదు.. భావోద్వేగాలు, మారుతున్న స్నేహాలు, గుర్తింపు, భవిష్యత్గురించి అనిశి్చతితో కూడా ఇబ్బంది పడుతున్నారు. వారు స్పష్టత, అనుబంధం, ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నారు. పాఠశాల జీవితంలో మార్గదర్శకత్వం భాగం అయినప్పుడే ఇవి అందుకుంటారు. విద్యలో కౌన్సెలింగ్ పునాది కావాలి. ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లల గోడు వినడానికి, మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. మొత్తం అభ్యాస వాతావరణం మారుతుంది. సమస్యలను పరిష్కరించడంతోపాటు బలమైన, సంతోషకరమైన, మరింత నమ్మకమైన యువతను తీర్చిదిద్దుతుంది’అని వివరించింది. -
టీనేజర్లను.. కాస్త అర్థం చేసుకోండి!
యుక్త వయసు.. జీవితంలో చాలా కీలకమైన దశ. కానీ, ఈ తరుణంలో శరీరంలో వచ్చే మార్పులు యువతను చాలా ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో తల్లిదండ్రులు, సమాజం వారి నుంచి ఆశించడమూ మొదలవుతుంది. ఇవన్నీ కలిసి వారిలో ఒత్తిడి, ఆందోళన పెంచుతాయి. ఏ సందర్భంలో విఫలమైనా నిరాశ పరిచి, కుంగదీస్తాయి. యువత ఎలాంటి సమస్యనైనా సింహాల్లా పరిష్కరించగలరు అన్నారు స్వామి వివేకానందుడు. వారు సింహాల్లా ఎదగాలంటే ఏం చేయాలి.. ఎవరి పాత్ర ఏమిటి?ఏషియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థుల్లో నిత్యం మధ్యస్థం నుంచి తీవ్ర స్థాయి ఆందోళన కనిపించిందట. సగానికిపైగా విద్యార్థుల్లో నిరాశా నిస్పృహలు పట్టి పీడిస్తున్నాయి. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. 65 శాతం మంది తమ భావోద్వేగాలను లేదా ప్రవర్తనను నియంత్రించుకోలేకపోతున్నారట. అనేక కారణాలు‘టీనేజర్ జీవితం చాలా కీలకమైనది. వారి శరీరంలో జరిగే మార్పుల ప్రభావం ఒక ఎత్తయితే.. సమాజంలో గుర్తింపుకోసం వారు పడే ఆరాటం మరొక ఎత్తు. ‘డిజిటల్ ప్రపంచం’ వారిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది’ అంటున్నారు మానసిక నిపుణులు. మీ పిల్లల్లో అలసట, ఒత్తిడి, ఆందోళన, బాధ, కోపం వంటి వాటికి ఈ కింది అంశాలు కారణాలు కావచ్చు.» చదువు ఒత్తిడి » సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం» వీడియో గేమ్స్ అతిగా ఆడటం» సంబంధాలను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం» అతి సమాచారం (చదువు లేదా వినోదం) వల్ల మెదడుపై అధిక ఒత్తిడి » బంధువులు లేదా బయటివాళ్లు భయపెట్టడం లేదా తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం» ప్రమాదాలు లేదా దుర్ఘటనలు » ఆర్థికపరమైన అంశాలు» వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమస్యలువీటి ఫలితంగా టీనేజర్లు దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఆహారం సరిగ్గా తీసుకోరు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇవి శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తాయి.ఇలా చేసి చూడండి!టీనేజర్లు అంటే రేపటి పౌరులు. వారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రులూ, వాళ్లు చదివే కాలేజీల యాజమాన్యాలూ శ్రద్ధ పెట్టాలి.» ‘చదువు, చదువు’ అని వారిని ఒత్తిడి చేయడం తగ్గించాలి.» శారీరక వ్యాయామం ముఖ్యమనే విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. » కాలేజీల్లో జీవన నైపుణ్యాలు నేర్పించాలి. కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి. » చదువు ఒక్కటే కాకుండా, ఆటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుండాలి.» రోజులో కనీసం 8–9 గంటలు నిద్రపోయేలా చూడాలి. » రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే.. సెల్ఫోన్ లేదా టీవీ లేదా కంప్యూటర్లను దూరం పెట్టాలి. » తల్లిదండ్రులు తాము చెప్పేది శ్రద్ధగా వింటారు.. తమ సమస్యకు పరిష్కారం చూపగలుగుతారు అనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి.» ముఖ్యంగా అమ్మాయిలు లైంగిక హింస లేదా దాడులకు గురైనప్పుడు వారిని ఓదార్చడం, ఆ క్షోభ నుంచి వారు బయటపడేలా చేయడంలో తల్లిదండ్రులే కీలకం.తల్లిదండ్రులూ.. గమనించండి!పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి వ్యవహార ధోరణి, ఆహారపు అలవాట్లు, ఫోన్ వాడకం.. వీటన్నింటినీ పరిశీలించాలి. ఇంటికి వచ్చి వెళ్లే స్నేహితులు, బంధువులమీద కూడా ఒక కన్ను వేయాలి. వారి వల్ల కూడా పిల్లలు ప్రభావితం కావచ్చు. మీ పిల్లల్లో ఈ కింది లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. » ప్రతి పనికీ అలసిపోవడం లేదా ఎప్పుడు చూసినా అలసటగా కనిపించడం» ఏ పనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం» భావోద్వేగాలు వెంటవెంటనే మారిపోతుండటం» ఆకలి లేకపోవడం» తరచూ ఒంటి నొప్పులు అనడం» ఏ విషయాన్నీ సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడంఅమ్మాయిలపైనా ప్రభావంకేంద్ర నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం 2022లో 13,044 మంది విద్యార్థులు బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. 2023లో ఈ సంఖ్య 13,892కు పెరిగింది. సాధారణంగా అబ్బాయిలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు అనుకుంటారు అందరూ. కానీ, 2021–23 మధ్య.. అమ్మాయిల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. -
బ్లూ జోన్ ఆహారం.. నిండు నూరేళ్లఆరోగ్యం
అక్కడి ప్రజల్లో నూరేళ్లు దాటినా.. ఏమాత్రం చేవ తగ్గకుండా, శారీరక పటుత్వంతో ఉంటున్నారు. చాలామంది 90వ పడిలో ఉన్నా.. హృద్రోగాలు వారిని దరి చేరడం లేదు. నీరసం, నిస్సత్తువ, అనారోగ్యాల గురించి ఎప్పుడోగానీ వినరట. ఆసక్తికరంగా అనిపించే ఆ ప్రాంతాలే ‘బ్లూ జోన్స్’. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతాల ప్రజలు.. దీర్ఘాయుష్మంతులు. కొన్ని ప్రాంతాల్లో శతాయుష్మంతులు. ఇంతకీ ఎక్కడ ఉన్నాయా ప్రాంతాలు.. వారి ఆరోగ్య రహస్యం ఏమిటి? -సాక్షి, స్పెషల్ డెస్క్ బ్లూ జోన్.. అంటే దీర్ఘాయుష్మంతులు, శతాధిక వృద్ధులు ఉండే ప్రాంతాలు. అమెరికాకు చెందిన డాన్ బ్యూటనర్ అనే రచయిత, జర్నలిస్ట్ ఈ ‘బ్లూ జోన్’ సృష్టికర్త. ఇలాంటివి 5 ప్రదేశాలను ఆయన గుర్తించాడు. అవి1. గ్రీస్ దేశంలోని ఇకారియా. ఇదో ద్వీపం2.ఇటలీలోని సార్డీనియా ద్వీపంలోని ఓగ్లియాస్ట్రా3. జపాన్లోని ఒకినావా4.కోస్టారికా దేశంలోని నికోయా ద్వీపకల్పం5. కాలిఫోర్నియాలోని లోమాలిండా ప్రాంతంలక్షలో 68 మంది!1999లో జరిగిన అధ్యయనం ప్రకారం.. సార్డీనియాలో ప్రతి లక్ష మంది జనాభాకు 13 మంది శతాధిక వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత జనాభా 15.6 లక్షలు» జపాన్లోని ఒకినావాలో ప్రతి లక్ష మందికి 68 మంది.. నూరేళ్లకుపైగా వయసున్నవారు ఉన్నారు. ఈ ప్రాంత జనాభా సుమారు 15 లక్షలు. ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళలు ఇక్కడే ఉన్నారు.» సుమారు 9వేల జనాభా ఉండే ఇకారియా మూడోవంతు మంది 90వ పడిలో ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారట.»సుమారు 25 వేల జనాభా ఉండే లోమా లిండాలో.. 9,000 మంది ఈ బ్లూ జోన్ కిందకు వస్తారు. అమెరికన్ల సగటు ఆయుర్దాయం 78 సంవత్సరాలు కాగా, వీరిది సుమారు 88 సంవత్సరాలకుపైనే అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.»సుమారు 2 లక్షల జనాభా ఉండే నికోయాలో కూడా సగటు ఆయుర్దాయం 85 ఏళ్లకుపైనేనట.ఇవే వీరి ఆరోగ్య రహస్యంపండ్లు, కూరగాయలుతమ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే పండ్లు, కూరగాయలు. ప్రధానంగా బఠానీలు, లెట్యూస్, ఉల్లికాడలు, బొప్పాయి, చిక్కుళ్లుతృణధాన్యాలుఓట్స్, బార్లీ, బ్రౌన్రైస్, జొన్న పొడిఆరోగ్యకరమైన కొవ్వులుఆలివ్ నూనె, అవకాడోగింజలు బాదం, పిస్తా, అక్రోట్లుమాంసాహారంచేపలు (చాలా ప్రాంతాల్లో వారంలో మూడుసార్లు), చాలా తక్కువ రెడ్ మీట్. పానీయాలుఎక్కువ నీరు, కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టీ.శారీరక వ్యాయామంతోట పని, నడక, బద్ధకం లేకుండా పనిచేయాలనుకునే మనస్తత్వంఉప్పు, చక్కెరతక్కువ మోతాదులో..భోజనంఒంటరిగా కాకుండా.. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారితో కలిసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో భోంచేస్తారు. -
గూగుల్ ప్లే స్టోర్లో హానికర యాప్స్!
సాక్షి, స్పెషల్ డెస్క్: టెలికం కంపెనీల దూకుడుతో దేశంలో ఇంటర్నెట్ సేవలు పల్లెలకూ చేరాయి. ఇంకేముంది టెక్నా లజీ వినియోగం అంతకంతకూ పెరుగు తోంది. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధమైంది. హానికరమైన సాఫ్ట్వేర్లతో మొబైల్, కంప్యూటర్లలోకి చొరబడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ మాల్వేర్ పెరుగుతోంది. ఈ ముప్పు ఒక్క భారత్కే కాదు.. అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాకు సైతం ఇది తలనొప్పిగా పరిణమించింది. 239 మాల్వేర్ యాప్స్.. క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ స్కేలర్ థ్రెట్ల్యాబ్జ్ 2025 మొబైల్, ఐఓటీ, ఓటీ థ్రెట్ నివేదిక ప్రకారం 2024 జూన్ నుంచి 2025 మే మధ్య గూగుల్ ప్లే స్టోర్లో 239 హానికరమైన అప్లికేషన్లు (మాల్వేర్) వచ్చి చేరాయి. అంతర్జాతీయంగా మొత్తం 4.2 కోట్ల మంది వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం ఆందోళన కలిగించే అంశం. ఆండ్రాయిడ్ మాల్వేర్ దాడులు గతేడాదితో పోలిస్తే 67 శాతం పెరిగాయి. అయితే స్మార్ట్ఫోన్లపై దాడులకు సైబర్ నేరగాళ్లు ప్రపంచంలోనే అత్యధికంగా భారత్ను ఎంచుకున్నారని నివేదిక వెల్లడించింది. ఏమిటీ మాల్వేర్? మాల్వేర్ అనేది హానికరమైన సాఫ్ట్వేర్. ఇది కంప్యూటర్ సిస్టమ్స్కు హాని, డేటాను దొంగిలించేందుకు.. అనధికారికంగా మొబైల్, కంప్యూటర్లోకి చొరబడేందుకు సైబర్ నేరస్తులు రూపొందించిన ఒక ప్రోగ్రామ్. ఇది కంప్యూటర్ పనితీరులో అంతరాయంతోపాటు ఇతర నష్టాన్ని కలిగిస్తుంది. మొబైల్ చెల్లింపులు లక్ష్యంగా.. గూగుల్ ప్లే స్టోర్ ప్లాట్ఫామ్లో ఉత్పాదకత, ఆటోమేషన్, టాస్్క, డేటా మేనేజ్మెంట్, కస్టమైజేషన్ వంటి హైబ్రిడ్, వర్క్ఫ్లో యాప్స్ కోసం వెతుకుతున్న వినియోగదారులే లక్ష్యంగా మాల్వేర్ దాడులు జరిగాయని నివేదిక వెల్లడించింది. టూల్స్ విభాగంలో చేరిన ఈ హానికరమైన యాప్స్ వినియోగదారులను ఎక్కువగా తప్పుదోవ పట్టిస్తున్నాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ల జోరు కొనసాగుతుండటంతో కార్డు–కేంద్రీకృత మోసాలకు బదులుగా సైబర్ నేరగాళ్లు మొబైల్ చెల్లింపులను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. యూజర్ల కార్యకలాపాలను రహస్యంగా పర్యవేక్షించి సమాచారాన్ని దొంగిలించే స్పైవేర్, ఆర్థిక మోసాల కోసం ఉపయోగించే బ్యాంకింగ్ మాల్వేర్ పెరగడం వల్లే ఆండ్రాయిడ్ మాల్వేర్ దాడులు అధికమయ్యాయని నివేదిక వివరించింది. మూడు ప్రధాన ప్రాంతాల్లో.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ బెదిరింపులు మూడు ప్రధాన ప్రాంతాల్లో అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక వివరించింది. ఇందులో 26% వాటాతో అత్యధిక కార్యకలాపాలు భారత్లో జరుగుతున్నాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే మొబైల్ బెదిరింపు దాడులు భారత్లో 38% ఎక్కువయ్యాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) దాడులకు అమెరికా కేంద్రంగా ఉంది. ఐఓటీ ఆధారిత మాల్వేర్ కార్యకలాపాల్లో అమెరికా ఏకంగా 54% వాటా కలిగి ఉంది. 15% వాటాతో ఆ తర్వాతి స్థానంలో హాంకాంగ్ నిలిచింది. గిట్టుబాటయ్యే రంగాలపై.. గరిష్ట ప్రభావాన్ని అంటే అధిక ఆదాయం వచ్చే రంగాల వైపు దాడులు చేసేందుకే సైబర్ నేరస్తులు మొగ్గుచూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇంధన రంగంలో దాడులు ఏకంగా 387% పెరిగాయి. ఇది కీలక మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న ముప్పును సూచిస్తోందని నివేదిక వివరించింది. తయారీ, రవాణా రంగాలు ఐఓటీ మాల్వేర్ విభాగంలో అత్యంత తరచుగా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా పెట్టుకున్న విభాగాలుగా ఉన్నాయి. మొత్తం ఐఓటీ మాల్వేర్ సంఘటనల్లో 40% కంటే ఎక్కువ వాటాను ఈ రెండు విభాగాలు కలిగి ఉన్నాయి.» ఆండ్రాయిడ్ వాయిడ్ మాల్వేర్ 16 లక్షల ఆండ్రాయిడ్ ఆధారిత టీవీ బాక్స్లకు సోకింది. ప్రధానంగా భారత్, బ్రెజిల్ దీని బారినపడ్డాయి. » రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ఆర్ఏటీ), ఎక్స్నోటీస్ మాల్వేర్స్ చమురు, సహజవాయువు పరిశ్రమలో ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకున్నాయి. -
అప్పు.. అలా చేసేస్తున్నారు!
భారతీయ కుటుంబాల అప్పులు పెరుగుతున్నాయి. ఎంతలా అంటే.. ఆస్తులను మించిన వేగంతో! రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజా గణాంకాల ప్రకారం.. 2019–20తో పోలిస్తే 2024–25 నాటికి కుటుంబాల వార్షిక ఆస్తులు దాదాపు 48% అధికం అయ్యాయి. ఇదే సమయంలో అప్పులు మాత్రం ఏకంగా 104% పెరగడం గమనార్హం. కుటుంబాల పొదుపు, పెట్టుబడుల్లోనూ మార్పులు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ వాటా వేగంగా పెరుగుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్సగటు భారతీయ కుటుంబం గత ఐదేళ్లలో పొదుపు, మదుపు చేయడం కంటే.. అప్పు చేస్తున్న వేగం పెరిగింది. ఆర్థిక ఆస్తులకు 2019–20లో భారతీయ కుటుంబాలు రూ.24.1 లక్షల కోట్లు జోడించాయి. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇవి 48% వృద్ధి చెంది రూ.35.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మరోవైపు 2024–25లో కుటుంబాలకు రూ.15.7 లక్షల కోట్ల విలువైన రుణాల వంటి ఇతర ఆర్థిక బాధ్యతలు పెరిగాయి. వీటి విలువ 2019–20లో రూ.7.7 లక్షల కోట్లు. అంటే 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇవి రికార్డు స్థాయిలో 104% పెరిగిపోయాయన్నమాట. జీడీపీలో ఆస్తులు 10.8%2019–20లో జోడించిన ఆర్థిక ఆస్తులు దేశ జీడీపీలో 12%గా ఉన్నాయి. ఇది 2024–25 నాటికి 10.8%కి తగ్గింది. అలాగే కుటుంబాల రుణ బాధ్యతలు 2019–20లో జీడీపీలో 3.9%గా ఉన్నాయి. 2023–24లో ఇవి ఏకంగా 6.2%కి ఎగబాకాయి. గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గి 4.7%కి చేరాయి. మ్యూచువల్ ఫండ్స్లో..కుటుంబాలు 2019–20లో జోడించిన మొత్తం ఆర్థిక ఆస్తుల్లో వాణిజ్య బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల వాటా 32 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది స్వల్పంగా పెరిగి 33.3%కి చేరింది. 2019–20లో కుటుంబాల డిపాజిట్ల పరిమాణం రూ.7.7 లక్షల కోట్లు. 5 ఏళ్లలో ఇది 54% అధికమై రూ.11.8 లక్షల కోట్లకు చేరుకుంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అప్పట్లో మొత్తం ఆస్తుల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వాటా కేవలం 2.6% మాత్రమే. కానీ గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 13.1%కి ఎగిసింది. 2019–20లో రూ.61,686 కోట్లుగా ఉన్న కొత్త మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో 655% పెరిగి రూ.4.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. -
3 నిమిషాలకో మరణం!
దాదాపు నిమిషానికో రోడ్డు ప్రమాదం.. మూడు నిమిషాలకు ఒక మరణం.. ఇదీ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద సంఘటనల తీరు. వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్డు ప్రమాదాలే కాదు.. క్షతగాత్రులు, మృతుల సంఖ్య సైతం ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2023లో దేశంలో 4,80,583 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో 1.73 లక్షల మంది మరణించగా.. 4.62 లక్షల మంది గాయపడ్డారు. ప్రమాదాల్లో సుమారు 22 శాతం వర్షం, పొగమంచు లాంటి ప్రతికూల వాతావరణంలో జరిగాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో 2024–25లో అన్ని విభాగాల్లో కలిపి 2,56,07,391 కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో సైతం ఏటా 2 కోట్ల పైచిలుకు వెహికల్స్ రోడ్లపైకి వచ్చాయి. వాహనాల సంఖ్యకు తగ్గట్టే ప్రమాదాలూ పెరుగుతున్నాయి. 2023లో దేశవ్యాప్తంగా గంటకు సుమారు 55 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రమాద మృతుల్లో ద్విచక్ర వాహనదారులు ఏకంగా 44.8 శాతం ఉన్నారు. పాదచారులది (20.4 శాతం) ఆ తరువాతి స్థానం. ఇక గుంతల కారణంగా జరిగిన 5,840 ప్రమాదాల్లో 2,161 మంది కన్నుమూశారు. ప్రతికూల వాతావరణంలో..వాతావరణ పరిస్థితులు రోడ్డు ఉపరితల స్థితితోపాటు డ్రైవింగ్పైనా చూపుతాయి. రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. భారీ వర్షం, దట్టమైన పొగమంచు, వడగళ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు డ్రైవింగ్ను ప్రమాదకరంగా మారుస్తాయి. వర్షం.. పొగమంచు -
బెంగళూరులో వినూత్న ప్రయోగం...
నగరాల్లోని అస్తవ్యస్తమైన ట్రాఫిక్ను చూసి మీరెప్పుడైనా తిట్టుకున్నారా? పోలీసులు ఏం చేస్తున్నారని కసురుకున్నారా? చలాన్లతో వేధించడమే వారికి పని అని అనుకున్నారా?. అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే. ఏటికేడాదీ పెరిగిపోతున్న వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా రోడ్లు, రవాణా సౌకర్యాలు మెరుగు కాకపోవడంతో మహా నగరాల్లో ట్రాఫిక్ నరకప్రాయం అవుతున్న సంగతి తెలిసిందే. కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు కూడా గంటల సమయం పట్టే సందర్భాలు తరచూ ఎదురవుతూంటాయి. వర్షమొచ్చిందంటే ఇక అంతే సంగతి. నగరాలు చెరువులైపోతాయి. ఎన్ని మెట్రోలు, బస్సులు, రైళ్లు ఉన్నా.. స్తంభించిపోతాయి. ఆకస్మిక ట్రాఫిక్ జామ్లు, వీవీఐపీల టూర్లు వాహనదారులను విసిగించడమూ కద్దు. అయితే.. దిగితే కానీ లోతు ఎంతో తెలియదని తెలుగు సామెత. ట్రాఫిక్ పోలీసుల విషయమూ అంతే. ఒకసారి వాళ్లు ఎలా పనిచేస్తున్నారన్నది తెలుసుకుంటే కానీ వారి సాధకబాధకాలు, కష్టనష్టాలు తెలియవు. ఇప్పటివరకూ మనలాంటి వారికి ఆ అవకాశం లేకపోయింది కానీ.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులిప్పుడు ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ట్రాఫిక్ కాప్ ఫర్ ఏ డే’ పేరుతో ఆసక్తికలిగిన ప్రజలు ఒక రోజుపాటు ట్రాఫిక్ నియంత్రణలో పాలుపంచుకునేలా చేస్తున్నారు. ఈ కొత్త కార్యక్రమం వివరాలను బెంగళూరు నగర ట్రాఫిక్ విభాగం ఎక్స్ వేదికగా అందరితో పంచుకుంది. ఈ ట్వీట్లో జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను వీలైనంత తగ్గించేందుకు ఏం చేస్తున్నామో ప్రజలకు ప్రత్యక్షంగా వివరించేందుకు ఉద్దేశించింది ఈ కార్యక్రమం’’ అని వివరించారు.What if you were in charge of Bengaluru’s busiest junction for a day? 😎Here’s your chance to step into the shoes of a real traffic officer!Join “#Trafficcopforaday” — a unique initiative by Bengaluru Traffic Police where citizens become part of the force, experience the… pic.twitter.com/o94Hpdsjvy— ಬೆಂಗಳೂರು ಸಂಚಾರ ಪೊಲೀಸ್ BengaluruTrafficPolice (@blrcitytraffic) November 7, 2025అవగాహనతో మొదలు..ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నింటికంటే ముందుగా బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగం పనితీరును వివరిస్తారు. ఆ తరువాత నగరంలోని అత్యంత బిజీ కూడళ్లలో ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు పనిచేయాల్సి ఉంటుంది. పాదాచారులు రోడ్డు క్రాస్ చేసేందుకు సాయపడటం, వాహనాల రాకపోకలకు సిగ్నల్స్ ఇవ్వడం వంటివి చేస్తారు. అంతేకాకుండా... తాము పనిచేసిన కూడళ్ల వద్ద ట్రాఫిక్ను మెరుగుపరిచేందుకు ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని కూడా పంచుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు "ASTraM" అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. పద్దెనిమిదేళ్ల పైబడ్డ బెంగళూరు నగర నివాసులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరం, అభ్యర్థి ఆసక్తి, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి ముందుగా భద్రత నియమాలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ప్రాథమిక అంశాలను వివరించి ఆ తరువాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ అనుభవాలను సోషల్మీడియా ద్వారా ఇతరులతో పంచుకునేలా చేయడం ద్వారా మరింత మందికి ట్రాఫిక్పై అవగాహన పెరుగుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను ప్రజలతో కలిసి పరిష్కరించేందుకు, రహదారి భద్రతను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. -
దానగుణ సంపన్నులు
మనదేశంలో అగ్రశ్రేణి సంపన్నులు.. సంపాదనపైనే కాదు, సేవా కార్యక్రమాలపైనా దృష్టిపెడుతున్నారు. వీరు విద్య, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ ఏడాది వెచ్చించింది రూ.10 వేల కోట్లకు పైగానే! ‘ఎడెల్గివ్ హురున్ ఇండియా’ తాజాగా విడుదల చేసిన దాతృత్వ సంపన్నుల జాబితాలో ఈ ఏడాది కూడా నాడార్ కుటుంబమే అగ్రస్థానంలో ఉంది. 2024–25లో శివ్ నాడార్ ఫౌండేషన్ అత్యధికంగా రూ.2,708 కోట్ల విరాళాలు ఇచ్చింది. తరవాతి స్థానాల్లో ముకేష్, అంబానీ, బజాజ్ కుటుంబం ఉన్నాయి.‘ఎడెల్గివ్ హురున్ ఇండియా’ జాబితా ప్రకారం.. హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన శివ్ నాడార్, ఆయన కుటుంబం గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు సుమారు రూ.7.4 కోట్లు సేవా కార్యక్రమాలకు వినియోగించింది. మొత్తంగా వారి విరాళాలు 2023–24తో పోలిస్తే 26 శాతం పెరిగాయి. రెండో స్థానంలో ఉన్న రిలయ¯Œ ్స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఆయన కుటుంబం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 54 శాతం ఎక్కువగా రూ. 626 కోట్ల సేవా కార్యక్రమాలకు వెచ్చించింది. బజాజ్ కుటుంబం 27 శాతం ఎక్కువగా రూ. 446 కోట్ల విరాళాలతో మూడో స్థానంలో నిలిచింది.వ్యక్తులు తగ్గి... విరాళం పెరిగిహురున్ ఇండియా తాజా జాబితాలో ఈసారి మొత్తం 191 మంది చోటు దక్కించుకున్నారు. నిరుడు 203 మందికి స్థానం లభించింది. అయితే, సగటు విరాళం గతంతో పోలిస్తే రూ.43 కోట్ల నుంచి రూ. 54 కోట్లు పెరిగింది. కాగా, తాజా జాబితాలోని దాతలు ఇచ్చిన విరాళం మొత్తం రూ.10,380 కోట్లు అని నివేదిక వెల్లడించింది.మనం ప్రపంచానికే ఆదర్శం!చైనాతో పోలిస్తే ఇండియా ఎక్కువ దాతృత్వ గుణం కలిగి ఉందని హురూన్ నివేదిక పేర్కొంది. చైనా జీడీపీ దాదాపు 20 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇండియా జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మాత్రమే. కానీ, మనం దాతృత్వంలో చైనాతో సరితూగుతున్నామని, భవిష్యత్తులో దాతృత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా ఉంటుందని నివేదిక ప్రశంసించింది.టాప్ –10 దాన కర్ణులు1 శివ్ నాడార్ రూ.2,708 కోట్లు విరాళాలరంగాలు: విద్య, కళలు, సామాజిక అభివృద్ధి2 ముకేశ్ అంబానీ రూ.626 కోట్లురంగాలు: ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి3 బజాజ్ రూ.446 కోట్లు రంగాలు: గ్రామీణాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు4 కుమార మంగళం బిర్లా రూ.440 కోట్లురంగాలు: ఆరోగ్య సంరక్షణ, విద్య5 గౌతమ్ అదానీ రూ.386 కోట్లురంగాలు: విద్య, నైపుణ్యాభివృద్ధి6 నందన్ నీలేకని రూ.365 కోట్లురంగాలు: ప్రజారోగ్యం, డిజిటల్ డెవలప్మెంట్7 హిందూజా రూ.298 కోట్లురంగాలు: ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆరోగ్యం8 రోహిణీ నీలేకని రూ.204 కోట్లురంగాలు: పర్యావరణం, పాలన, సామాజిక సమానత్వం9 సుధీర్–సమీర్ మెహతా రూ.189 కోట్లురంగాలు: సామాజిక అభివృద్ధి10 సైరస్ పూనావాలా రూ.183 కోట్లురంగాలు: బడుల్లో మౌలిక సదుపాయాలు -
ఖాళీ ఊళ్లు.. ఇంటింటా కన్నీళ్లు!
ఇళ్లకు తాళాలు వేసి, మూటాముల్లె సర్దుకుని, పిల్లాపాపలతో కలసి వాహనాల్లో దూరప్రాంతాలకు వలస వెళ్తున్న వీరు కోసిగి మండలానికి చెందిన వారు. ‘ఉపాధి’ పనులు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడంతో వీరు వలస బాట పట్టారు. విద్యార్థులను సైతం తమ వెంట తీసుకెళ్లడంతో గ్రామీణ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. కర్నూలు(అర్బన్): కరువు నేలపై కూటమి ప్రభుత్వం కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. కరువును అధిగమించాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించడం లేదు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గ్రామాల్లో పనుల్లేక, పస్తులండలేక వేల సంఖ్యలో ప్రజలు దూర ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్తున్నారు. ఇళ్ల వద్ద వృద్ధులను మాత్రమే ఉంచి పిల్లలను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.ఆర్థిక కష్టాలుజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు మంచి కూలీలు హాజరు కావడం లేదంటే, వలసల ప్రభావం ఎంత మాత్రం ఉందో ఊహించుకోవచ్చు. పైగా కూలీలకు చెల్లించాల్సి వేతనాలు ఆగస్టు నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల వరకు ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధి నిధులతో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులకు (సీసీ రోడ్లు, డ్రైనేజీ, ప్రహరీగోడలు, పశువుల షెడ్లు, సోక్పిట్స్) కూడా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ కూలీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ... రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు. అతివృష్టి, అనావృష్టితో ఏయేటికాయేడు జిల్లాలోని రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలకు గురవుతున్నారు. ఈ ఏడాది అధిక శాతం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. తగ్గిన సాగు విస్తీర్ణం వివిధ కారణాలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్లో దాదాపు 59 వేల హెక్టార్ల సాగు విస్తీర్ణం తగ్గింది. కర్నూలు జిల్లాలో 4.22 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 2.38 లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం కాగా, కర్నూలు జిల్లాలో 3.86 లక్షలు, నంద్యాల జిల్లాలో 2.15 లక్షల హెక్టార్లలో మాత్రమే రైతులు వివిధ రకాల పంటలను సాగు చేశారు. సెప్టెంబర్ నెలలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, ఉల్లి తదితర పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడమే గాక, పంటల దిగుబడి కూడా తగ్గింది. రెండు జిల్లాల్లో దాదాపు 30 వేలకు పైగా హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే ప్రక్రియలో పూర్తి జాప్యం చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజారిటీ మండలాల్లో నష్ట పరిహారం అందించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ నేటికి పూర్తి కాలేదు. ఉల్లి రైతుకు కన్నీరే మిగిలింది! ఈ సీజన్లో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, పండిన ఉల్లిని కొనేవారు లేక రైతులు నరకయాతనను అనుభవించారు. అనేక మంది రైతులు ఉల్లి పంటను మేకలు, గొర్రెలకు వదిలి వేయగా, మరి కొందరు పంటను పూర్తిగా దున్నేశారు. మరి కొంత మంది కోసిన ఉల్లిని మార్కెట్కు తీసుకువచ్చినా, ఎలాంటి లాభం లేకపోవడంతో హంద్రీనీవా కాలువలో పడవేశారు. ఉల్లి రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా 2,554 మంది రైతుల వద్ద నుంచి దాదాపు 10 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లిని విక్రయించన 250 మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వం రూ.16.50 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఉల్లిని కొనుగోలు చేసి నెల రోజులు దాటి పోయినా, నేటి వరకు నగదు జమ చేయకపోవడంపైరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందని సబ్సిడీ శనగ విత్తనాలుప్రస్తుత రబీ సీజన్లో రైతులకు అందించాల్సిన శనగ విత్తనాలను కూడా ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొనింది. కర్నూలు జిల్లాలో 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 23 వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేశారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా, కేవలం 12,654 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. రైతులకు అవసరాలకు అనుగుణంగా సకాలంలో శనగ విత్తనాలను అందించక పోవడం పట్ల రైతులు బయటి మార్కెట్లపై ఆధారపడి కొనుగోలు చేశారు.ఎల్లెల్సీ పరిధిలో రెండో పంట సాగు కష్టమే తుంగభద్ర దిగువ కాలువ కింద ఈ ఏడాది రెండో పంటకు నీరందే పరిస్థితి లేదు. టీబీ డ్యాం గేట్ల మార్పుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో భారీ వర్షాలు కురిసినా, నీటిని వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంగా ఎల్ఎల్సీ పరిధిలో 1,07,615 ఎకరాలు, కేసీ కెనాల్ కింద 1.50 లక్షల ఎకరాలు, ఎగువ కాలువ పరిధిలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుకు (20 వేల ఎకరాలు) నీరందని పరిస్థితి నెలకొంది. డ్యాంలో నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గేట్ల మార్పు సాకుతో ఆయకట్టు రైతులకు అన్యాయం చేస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. శ్రీశైలం నీటిపై ఆధారపడిన తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ కాలువల పరిధిలో రెండో ఆయకట్టు సాగుపై ఇప్పటి వరకు స్పష్టత లోపించింది. -
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్లో ఉన్నారు. -
నిషిద్ధ నగరానికి ‘వంద’నం
‘భయంకరం’..!! సింగపూర్కు చెందిన ఆర్కిటెక్ట్ హో పుయ్–పెంగ్, 1980ల చివర్లో బీజింగ్లోని నిషిద్ధ నగరాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు, ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట ఇదే. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఒకప్పటి రాజప్రాసాదం చెత్తతో, పాడుబడిన గిడ్డంగులతో నిండిపోవడం ఆయనను నివ్వెరపరిచింది. కానీ అదే ’భయంకరమైన’ దృశ్యం ఇప్పుడు చైనా అత్యంత అద్భుతమైన వారసత్వ సంపదగా ఎలా మారింది? ఒకప్పుడు మూతపడిన ఓ చిన్న వనం, యావత్ ప్రపంచ దృష్టిని ఎలా ఆకర్షిస్తోంది? ఈ మార్పు వెనుక శతాబ్దపు రహస్యం దాగుంది. పాతికేళ్ల కఠోర శ్రమ ఉంది. చరిత్రలో నిషిద్ధ నగరం పదిహేనో శతాబ్దంలో మింగ్ రాజవంశం పాలనలో కుటుంబం నివాసం, కార్యకలాపాల కోసం దీనిని నిర్మించారు. ఆ తర్వాత క్వింగ్ రాజవంశపు చక్రవర్తులు దీనిని స్వా«దీనం చేసుకుని ఎన్నో భాగాలను పునరుద్ధరించారు. 1925లో, చివరి క్వింగ్ చక్రవర్తి పు యీని ఇక్కడి నుంచి పంపించేసిన తర్వాత ఈ ప్రదేశంలో ’ప్యాలెస్ మ్యూజియం’ ప్రారంభమైంది. అయితే, పునరుద్ధరణ పనులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. చాలా ఏళ్లపాటు ఆ ప్రాంతాల మరమ్మతులు సరిగ్గా జరగకపోవడం, ఈ కట్టడాలు ఎక్కువగా చెక్కతో నిర్మించడం వల్ల తరచూ మంటలు చెలరేగి తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వందేళ్ల తర్వాత గార్డెన్ కనువిందుదశాబ్దాలు గడిచాయి.. మళ్లీ హో పుయే–పెంగ్ సందర్శించేసరికి రూపురేఖలు మారిపోయాయి. ప్యాలెస్ మ్యూజియం 100వ వార్షికోత్సవం సందర్భంగా, దాని ఈశాన్య భాగంలోని ఒక చిన్న ప్రదేశంపై అందరి దృష్టి పడింది. సెపె్టంబర్ 30న ప్రజల కోసం తెరిచిన ఈ ప్రాంతాన్ని మ్యూజియం వర్గాలు ‘మొత్తం ప్రాంగణంలోనే అత్యంత అందమైన తోట’గా అభివరి్ణంచాయి.అదే ’ఖియాన్ లాంగ్ గార్డెన్’ సుమారు ఒక శతాబ్దం పాటు మూతపడిన ఈ గార్డెన్, 1770ల్లో కేవలం ఐదేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని పునరుద్ధరణకు ప్యాలెస్ మ్యూజియం, వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్తో కలిసి ఏకంగా 25 ఏళ్లపాటు శ్రమించింది. వానలోనూ సందర్శకుల తాకిడి ఇటీవల చైనాలో గోల్డెన్ వీక్ సెలవుల్లో, వర్షం పడుతున్నా ఈ ’ఖియాన్ లాంగ్ గార్డెన్’ లోపల సందర్శకులు బారులు తీరారు. చక్రవర్తి ఖియాన్ లాంగ్ పేరు మీదుగా ఈ తోటకు ఆ పేరు వచ్చింది. ఇది చక్రవర్తికి ఒక వ్యక్తిగత ఏకాంత నివాసంగా ఉండాలనే ఉద్దేశంతోనే దీనిని చాలా గోప్యంగా డిజైన్ చేశారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, ఇది ఒక ఫుట్బాల్ మైదానం కంటే చిన్నది. ఈ అద్భుత ప్రయత్నాన్ని చైనా నాయకుడు జి జిన్పింగ్ కూడా ప్రశంసించారు, నిషిద్ధ నగరం కేవలం ఒక భవన సముదాయం కాదు.. అది గత వైభవం. ఆ వంద సంవత్సరాల ప్రయాణానికి ‘వందనం’. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వేగంగా 'వృద్ధ' మేఘాలు!
ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య ఛాయలు తమ సహజ గమనంతో కాకుండా, ఇంకాస్త వేగంగా కమ్ముకొస్తున్నాయని వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి, వేడిమి, ఊబకాయం, హృద్రోగాలు, కేన్సర్ వంటివి మనుషుల సహజమైన వయసు (బయోలాజికల్ ఏజ్) పై ప్రభావం చూపి, లేనిపోని వయోభారాన్ని మోపుతున్నాయని అంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా గతంలో కంటే వేగంగా వృద్ధాప్యం తరుముకొస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఈ వేగాన్ని నెమ్మదింప జేసేందుకు మార్గాలు లేకపోలేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 1965 తర్వాత జన్మించినవారు, అంతకు దశాబ్దం క్రితం జన్మించిన వారి కంటే వేగంగా వార్ధక్యానికి చేరువవుతున్నారని, ఒకప్పుడు వృద్ధులకు శాపంగా పరిణమించిన వ్యాధులు ఇప్పుడు నడి వయసుకు ముందే వచ్చి వాలిపోతున్నాయని వాషింగ్టన్ విశ్వ విద్యాలయంలో తాజాగా జరిగిన అధ్యయనం తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఊబకాయం ఊతమిస్తోంది!మనుషుల్లో వృద్ధాప్యం వేగవంతం అవుతున్న విషయాన్ని తొలిసారి 2016లో ఊబకాయంపై అధ్యయనం చేస్తున్న స్పెయిన్ వైద్య పరిశోధకుల బృందం గుర్తించింది. ఊబకాయ జీవ సంబంధమైన ప్రభావాలు వృద్ధాప్యాన్ని ముందే తెస్తున్నాయని పేర్కొన్నారు. ఊబకాయం వల్ల కొవ్వు కణాలు కరిగే సామర్థ్యం క్షీణించటం, జీవక్రియల్లో చురుకుదనం తగ్గటం, వాతం మూలంగా మూత్రపిండాలు, ఎముకలు, గుండె నాళాల వ్యవస్థ సహా శరీరంలోని అనేక అవయవాల పనితీరు సన్నగిల్లటం ఇందుకు కారణమని పరిశోధకులు అంటున్నారు.17% ఎక్కువ వేగంగత ఏడాది, వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు శీఘ్ర వృద్ధాప్య సంకేతాలను గమనించేందుకు యూకే బయోబ్యాంక్లో నిల్వ ఉన్న 1,50,000 మంది రక్త నమూనాలను విశ్లేషించారు. ఆ నమూనాలన్నీ 37 నుంచి 54 ఏళ్ల వారివి. ఆ పరిశోధనలో.. 1965 తర్వాత జన్మించిన వారిలో వృద్ధాప్య ఛాయలు 17 శాతం ఎక్కువ వేగంతో ఉన్నట్లు తేలింది. అంతేకాదు, వారిలో ముందుగానే ఊపిరితిత్తులు, జీర్ణావయవ, గర్భాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నట్టు కూడా కనుగొన్నారు.మార్పులతో మెరుగవోచ్చునడి వయస్కులు వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నారంటే అందుకు ప్రధాన కారణం ఊబకాయమే అంటున్నారు పరిశోధకులు. ‘వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్’ డేటా ప్రకారం 5–19 ఏళ్ల వారిలో ఊబకాయం రేట్లు 1975 – 2022 మధ్య సుమారు 1000 శాతం వరకు పెరిగాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా ఊబకాయాన్ని, వృద్ధాప్య వేగాన్ని తగ్గించుకోవచ్చని అధ్యయనవేత్తలు సూచిస్తున్నారు.‘వేడికీ’ వయసు పైబడుతోంది!ముందస్తు వార్ధక్యానికి కేవలం ఊబకాయం, ఒత్తిడి, కాలుష్యాలే కాదు.. వాతావరణ మార్పులూ దోహదపడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో.. 56 ఏళ్లు పైబడిన 3,686 మంది వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతలకు గురైన వ్యక్తులు మరింత వేగంగా వృద్ధాప్యానికి చేరువవుతున్నారని, ఉష్ణోగ్రతలో ప్రతి 10 శాతం పెరుగుదల వారి వయసును 1.4 నెలలు పెంచుతోందని కనుగొన్నారు. గత ఆగస్టులో హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన మరో అధ్యయనంలో 25,000 మంది వయోజనుల డేటా విశ్లేషించి.. అందులోనూ వేడి గాలుల ప్రభావాన్ని గుర్తించారు. వయోవేగాన్ని ఇలా కొలుస్తారుఎవరైనా ఎంత వేగంగా వృద్ధులవుతున్నారో తెలుసుకునేందుకు ‘ఎపిజెనెటి క్’ పరీక్ష చేస్తారు. దానిద్వారా ఆ వ్యక్తి డీఎన్ఏలో మార్పులను విశ్లేషించి వారి వృద్ధాప్య వేగాన్ని అంచనా వేస్తారు. పరిశోధన ముఖ్యాంశాలు» 1965కి ముందు జన్మించిన వ్యక్తులలో.. ఇటీవలి దశాబ్దాలలో పుట్టినవారిలో కంటే నిదానంగా వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. » కొందరు వారి వాస్తవ వయసు కంటే 10 ఏళ్లు ఎక్కువగా లేదా 10 ఏళ్లు తక్కువగా (జీవనశైలి వల్ల) కనిపిస్తున్నారు. » ఊబకాయం ఉన్నవారి జీవ గడియారాలు వేగంగా తిరుగుతున్నాయి. » ఆరోగ్యకరమైన ఆహారం, లేదా బరువు తగ్గించే మందుల ద్వారా ఊబకాయాన్ని నివారించటం ద్వారా వయసు మీద పడే వేగాన్ని తగ్గించవచ్చు.» వృద్ధాప్య వేగాన్ని వ్యాయామం ద్వారా గణనీయంగా తగ్గించుకోవచ్చు. -
గుండె చెదిరే కాంతి!
సాక్షి, స్పెషల్డెస్క్: రాత్రి పూట కళ్లు చెదిరే కాంతిలో ఉండటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ (ఎ.హెచ్.ఎ.) ప్రాథమిక అధ్యయ నంలో వెల్లడైంది. కాంతి తీవ్రత మెదడుపై ఒత్తిడిని కలిగించటమే కాక, ధమనుల వాపునకూ కారణమై పలు రకాల హృద్రోగాలకు దారితీస్తున్నట్లు అధ్యయనవేత్తలు గుర్తించారు. రాత్రిపూట ఉండే కృత్రిమ కాంతిని కూడా ‘కాలు ష్యమే’ అంటున్నారు శాస్త్రవేత్తలు. అది ఎంత ఎక్కు వ ఉంటే అంత ఎక్కువ కాలుష్యం అన్నమాట. ఇలా రాత్రిపూట కృత్రిమ కాంతికి, గుండెజబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ (ఎ.హెచ్.ఎ.) పరిశోధకులు.. ప్రధానంగా మెదడు స్కాన్లను పరిశీలించారు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి పర్యా వరణ కారకాల ఒత్తిడి మన నరాలు, రక్తనాళాలను ప్రభావితం చేయటం ద్వారా గుండె జబ్బులకు దారితీస్తాయన్నది తెలిసిందే. అయితే ఇప్పుడు తీవ్రస్థాయి కాంతి కాలుష్యం కూడా అందుకు ఏ మాత్రం తీసిపోలేదని ఎ.హెచ్.ఎ. గుర్తించింది.గుండెపోటు అవకాశాలు ఎక్కువ» రాత్రిపూట అధిక స్థాయి కృత్రిమ కాంతికి గురవు తున్న వ్యక్తుల మెదడుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అది రక్తనాళాల వాపునకు కారణం అవుతోంది.» మెదడు ఒత్తిడిని గ్రహించినప్పుడు అది రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించటం వల్ల రక్తనాళాల్లో వాపు మొదలౌతోంది. క్రమేణా ఈ వాపు... ధమనులు గట్టి పడటానికి దోహ దం చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోంది.» రాత్రిపూట ఎక్కువగా కాంతి అధికంగా పడిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 47 శాతం ఎక్కువగా ఉంది. » కృత్రిమ కాంతి ప్రభావం.. నిద్రించే వ్యవధి, శారీరక శ్రమ, సామాజిక ఆర్థిక స్థితిగతులు, పొరుగింటి చప్పుళ్లు వంటి అంశాలతో సంబంధం లేకుండా అందరిపైనా ఒకేలా ఉంటోంది.» శరీరంపై కృత్రిమ కాంతి ఎక్కువగా పడటం వల్ల దేహధర్మాల సహజత్వానికి అంతరాయం ఏర్పడు తోంది. ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తోంది. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటోంది. తద్వారా అధిక రక్త పోటు, ఊబకాయం, మధుమేహం మొదలౌతున్నాయి. మెదడులో నాళాలు చిట్లటమూ జరుగుతోంది.ఇలా తగ్గించుకోవచ్చుఇండోర్ లైట్లను మసకబార్చటం, వెలుతురును తగ్గించే బ్లాక్ అవుట్ కర్టెన్లను ఉపయోగించటం, నిద్రకు ఉపక్రమించే ముందు స్క్రీన్ వర్క్ (స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ వంటివి) ఆపేయటం వంటివి మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తాయి.35 శాతం అధికంఅమెరికా, యూకే వంటి దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల ప్రకారం.. 5 ఏళ్ల పాటు రాత్రిపూట అధిక కృత్రిమ కాంతి ప్రభావం వల్ల హృద్రోగాల ప్రమాదం దాదాపు 35% వరకు ఎక్కువగా ఉందని తేలింది. గుండెకు ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సంకోచించే అవకాశాలూ (కరొనరీ ఆర్టెరీ డిసీజ్ – సీఏడీ) ఎక్కువగా ఉన్నాయట. -
సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో...
గ్రహాంతర వాసులు ఉన్నారా?...యుగాలుగా సాగుతున్న ఈ చర్చ...ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కారణం?ఎక్కడో ఖగోళ దూరాల నుంచి సూర్యుడివైపునకు దూసుకొస్తున్న ‘త్రీఐ-అట్లాస్’!ఏమిటిది? గ్రహాంతర వాసులకు దీనికి సంబంధం ఏమిటి? చూసేయండి...అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నాలుగు నెలల క్రితం ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. చిలీలోని అట్లాస్ అబ్జర్వేటరీ (వేధశాల) సుదూర విశ్వం నుంచి ఓ భారీ ఆకారం చాలా వేగంగా ప్రయాణిస్తూండటాన్ని గుర్తించింది. దానికి ‘త్రీఐ-అట్లాస్’ అని నామకరణం చేసింది. తోకచుక్కల్లాంటి ఖగోళ వస్తువులను గుర్తించడం నాసాకు కొత్త కాదు. గతంలోనూ ‘1ఐ-ఔముమువా’, ‘2ఐ-బోరిసోవ్’ అనే రెండు ఖగోళ వస్తువులను గుర్తించింది. అయితే వీటితో పోలిస్తే... త్రీఐ-అట్లాస్ వ్యవహారం కొంచెం తేడాగా ఉండటంతో శాస్త్రవేత్తల్లో ఆసక్తి పెరిగింది. మరిన్ని పరిశోధనలు చేపట్టారు. చాలా విషయాలు తెలిశాయి. మిస్టరీ మరింత పెరిగింది. గ్రహాంతర వాసుల నౌక ఏమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే...త్రీఐ-అట్లాస్ ప్రయాణిస్తున్న కక్ష్యను బట్టి చూస్తే ఇది కచ్చితంగా సౌర కుటుంబం అవతల పుట్టినదని స్పష్టమైంది. సెకనుకు 61 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఇది. సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు దీని వేగం మరింత పెరిగి సెకనుకు 68.3 కిలోమీటర్లకు చేరింది. గత నెల 29న సూర్యుడికి 20.4 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది. త్రీఐ-అట్లాస్ చాలా ప్రత్యేకమైందని చెప్పేందుకు ఇవేవీ కారణం కాదు.. మంచు, దుమ్ము, రాళ్లతో తయారయ్యే తోకచుక్కల వెంబడి దుమ్ము, ధూళిలతో కూడిన ప్రాంతం కొంత ఉంటుంది. దీన్నే మనం తోక అంటూ ఉంటాం. సాధారణంగా అన్ని తోకచుక్కల తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి కానీ త్రీఐ-అట్లాస్ తో సూర్యుడి వైపు ఉండటం విశేషం. రాకెట్ లాంటిది ప్రయాణిస్తోందా? లేక ఇంజిన్ నుంచి వెలువడే పొగలాంటిదా? అని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీని స్పీడ్ పెరుగుతున్న తీరును గురుత్వాకర్షణ శక్తితో వివరించలేకపోవడం. ఆక్సిలరేటర్పై కాలు పెడితే వాహనం స్పీడు పెరిగినట్లుగా అన్నమాట. దీన్నిబట్టి త్రీఐ-అట్లాస్ను ఎవరో నడుపుతున్నారని అనిపిస్తోందని, సహజసిద్ధంగా ఇలా జరిగేందుకు అవకాశం లేదని నాసా గెలిలియో ప్రాజెక్టు అధ్యక్షుడు, ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త లియోబ్ చెబుతున్నారు. చివరగా... సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న త్రీఐ-అట్లాస్లో కార్బన్ మోనాక్సైడ్, నీటి ఆవిరి చాల ఎక్కువగా ఉందని, సూర్యూడి నుంచి చాలా దూరంగా ఉన్నా.. బాగా వెలిగిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ తోకచుక్కల కంటే భిన్నం ఈ రెండు లక్షణాలు. అంతేకాదు... ఇది సౌర కుటుంబం కంటే పాతది కావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులదేనా?త్రీఐ-అట్లాస్ గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌక అయ్యేందుకు అవకాశాలు ఎక్కువని అవి లోయెబ్ అంటున్నారు లోయెబ్ స్కేల్లో తాను త్రీఐ-అట్లాస్కు ‘నాలుగు’ మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతర వాసులపై మరోసారి చర్చ మొదలైంది. త్రీఐ-అట్లాస్ వింత ప్రవర్తన, తయారైన తీరులను బట్టి ఇది మానవాతీత టెక్నాలజీ ఆవిష్కరణగానే చూడాలని కొందరు వాదిస్తూంటే.. మరికొందరు ఇలాంటి ఆకారాలు ఖగోళం మీద సహజమేనని వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రహ వ్యవస్థలు ఎలా ఏర్పడతాయో.. జీవం ఆవిర్భావానికి అవసరమైన కీలక మూలకలు విశ్వం మొత్తమ్మీద ఎలా వ్యాపించి ఉన్నాయో తెలుసుకునేందుకు.. గ్రహాలను దాటి ప్రయాణించడమెలా అన్న ప్రశ్నకు ఈ త్రీఐ-అట్లాస్ కొన్ని సమాధానాలు ఇవ్వవచ్చునని శాస్త్రవేత్తల అంచనా... త్రీఐ-అట్లాస్ను మీరూ చూడాలనుకుంటున్నారా..??? కనీసం ఎనిమిది అంగుళాల టెలిస్కోపు ద్వారా ఈ నెల మధ్య నుంచి ఆఖరు వరకూ తెల్లవారుఝామున తూర్పు దిక్కులో మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా చూసేయండి!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
రా రమ్మని..!
కార్తీక సోయగం నగరపు హృదయాన్ని తాకగా, విశాఖ అందాలు ఇప్పుడు పచ్చని వనసమారాధనలకు ముస్తాబయ్యాయి. సముద్రపు గాలి పలకరింపు.. కొండల నడుమ ప్రకృతి ఆలింగనం.. దశాబ్దాలుగా మనకు పరిచయమైన కైలాసగిరి నుంచి కంబాలకొండ.. ముడసర్లోవ నుంచి తెన్నేటి తీరం వరకూ.. ప్రతి పార్కు ఈ మాసంలో ఆనందాల వేదికగా మారింది. రుచికరమైన వనబోజనాలు, పిల్లల కేరింతలు, ప్రకృతి సోయగాల నడుమ సేదదీరాలనుకునే నగరవాసుల కోసం.. ఈ పర్యాటక ప్రాంతాలు ఆహ్వానం పలుకుతున్నాయి. వాటి ప్రవేశ రుసుములు, చేరుకునే మార్గాలు, అక్కడ దాగున్న ప్రత్యేక ఆకర్షణల వివరాలను తెలుసుకుందాం. –ఆరిలోవకార్తీక మాసం ప్రారంభం కావడంతో విశాఖ నగర వాసులు వన భోజనాలకు సిద్ధమవుతున్నారు. నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు పిక్నిక్ స్పాట్లుగా ఆకర్షిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన కైలాసగిరి, ముడసర్లోవ పార్కు, తెన్నేటి పార్కు, వుడా పార్కు, శివాజీ పార్కు, కంబాలకొండ ఎకో టూరిజం పార్కు, ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు వంటి ప్రదేశాలు కార్తీక మాసంలో సందర్శకులతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఈ స్పాట్లలో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు సమావేశాలు నిర్వహించుకోడానికి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కైలాసగిరిశివపార్వతుల కొలువులో సముద్రపు గాలిసొగసునగర పర్యాటక ప్రాంతాలలో కైలాసగిరి ఆణిముత్యంగా నిలిచింది. సముద్ర తీరంలో ఎత్తయిన కొండపై వీఎంఆర్డీఏ ఏర్పాటు చేసిన ఈ పార్కు దశాబ్దాలుగా సందర్శకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఎక్కువ మంది సందర్శించే ఇక్కడ ప్రశాంత వాతావరణం, సముద్రపు గాలులు ప్రత్యేకం. ఇక్కడ ఉన్న శివపార్వతుల విగ్రహాలు, తెలుగు మ్యూజియం, కొత్తగా ఏర్పాటు చేసిన 3డీ, 9డీ పిక్చర్ హాల్, సర్క్యూట్ ట్రైన్ ప్రధాన ఆకర్షణలు. వన భోజనాలకు విశాలమైన మైదాన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. కైలాసగిరికి రోడ్డు మార్గం, మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. అప్పూఘర్, హనుమంతవాక వద్ద మెట్లు మార్గాలున్నా యి. ఆ మార్గం ద్వారా వెళ్లడానికి రూ.5 రుసుం చెల్లించాలి. కైలాసగిరి కూడలి నుంచి రోడ్డు మార్గం ద్వారా కార్లు, బస్లు, ద్విచక్రవాహనాలు ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. దీంతో పాటు అప్పూఘర్ వద్ద ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహించే రోప్వే కూడా అందుబాటులో ఉంది.ముడసర్లోవ పార్కుపచ్చని కొండల మధ్య పల్లెటూరి పలకరింపుముడసర్లోవ పార్కు ఆరిలోవ ప్రాంతంలో బీఆర్టీఎస్ను ఆనుకొని, పచ్చని కొండల మధ్య ముడసర్లోవ రిజర్వాయరు పక్కన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో సామూహిక వనబోజనాలు చేసుకోవడానికి విశాలమైన మైదాన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి చరిత్ర ఉన్న ఈ పార్కును జీవీఎంసీ నిర్వహిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పార్కులో ప్రవేశ రుసుము పెద్దలకు రూ. 10, 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితం.కంబాల కొండపచ్చని కొండల మధ్య ట్రెక్కింగ్ వినోదంజూ పార్కు ఎదురుగా, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కంబాలకొండ ఎకో టూరిజం పార్కు మరో ముఖ్యమైన పిక్నిక్ స్పాట్. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 265 ఎకరాల విస్తీర్ణంలో గల సహజసిద్ధమైన పార్కు చుట్టూ పచ్చని కొండలతో ఆహ్లాదాన్నిస్తుంది. విశాలమైన మైదానాల కారణంగా కార్తీక మాసంలో పలు యూనియన్లు, సంస్థలు, కుటుంబాలు వనబోనాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలం. ఇక్కడ ట్రెక్కింగ్ (2, 3, 5 కి.మీ.), పిల్లల ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఈ పార్కులో ప్రవేశానికి పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 20 చెల్లించాలి. కారుతో లోపలకు వెళ్లడానికి రూ. 1000 రుసుము ఉంటుంది. మధురవాడ వైపు వెళ్లే సిటీ బస్సులు, ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.జూ పార్కువన్యప్రాణుల వింత ప్రపంచం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు ఐదు కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారిని ఆనుకొని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఉంది. ఇది సహజ సిద్ధమైన వాతావరణంలో అనేక వన్యప్రాణులు, పక్షులతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలతో పాటు అనేక పక్షులు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి మైదాన ప్రాంతాలు ఉన్నాయి. వన్యప్రాణులను చూసేందుకు జూ లోపల బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ. 30 టికెట్ చెల్లించాలి. జూ ప్రవేశ రుసుము పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ. 30గా నిర్ణయించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 25, 222 నంబర్ సిటీ బస్సుల్లో లేదా ఆటోల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. -
వృత్తి, వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ఉందా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విధులు, పని–వ్యక్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించడం కీలకంగా మారింది. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు జీవన నాణ్యతను ఎంత వరకు సమతౌల్యంగా ఉండేలా చూస్తున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సంప్రదాయ ‘పని–జీవిత సమతౌల్యత’విధానాల మాదిరిగా కాకుండా ‘జీవితం–పని సమతుల్యత’సాధన అనే అంశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మెరుగైన జీవనశైలితో జీవితానికి మొదటగా, పని లేదా విధులకు ఆ తర్వాత ప్రాధాన్యతనివ్వడం కొంతకాలంగా ఓ నూతన ధోరణిగా ప్రచారంలోకి వచి్చంది. సంతోషకరమైన జీవితం గడుపుతూ పనిపై ఆధిపత్యం చెలాయించకుండా చూడటాన్ని ప్రభావపూరితమైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్గా అంచనా వేస్తున్నారు. చాలా దేశాల్లో ఎక్కువ పని గంటలు, అసమతౌల్య ఆహారం గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇదీ అధ్యయనం...గ్లోబల్ హెచ్ఆర్ సంస్థ ‘రిమోట్’ఏటా ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఆధారిత 60 దేశాలను సర్వే చేస్తోంది. ఆయా దేశాల్లో చట్టబద్ధమైన చెల్లింపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, అనారోగ్య సెలవులు, ప్రసూతి సెలవులు, కనీస వేతనం, ఆరోగ్య సంరక్షణ, సంతోష సూచిక, వారంలో పని గంటలు, ప్రజాభద్రత, ‘ఎల్జీబీటీక్యూ ప్లస్’హక్కులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడపడానికి, విధుల్లో పని చేయడానికి ఎలాంటి పరిస్థితులు వీలు కల్పిస్తాయో, ఏవి వెనుకబడి ఉన్నాయో అంచనా వేసి ర్యాంకులు ఇస్తోంది. అయితే బలమైన విధానాల కారణంగా ఉద్యోగుల శ్రేయస్సులో చిన్న ఆర్థిక వ్యవస్థలు తరచూ పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదికిగాను హెచ్ఆర్ సంస్థ విడుదల చేసిన నివేదికలో అమెరికా సహా అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు టాప్–10లో స్థానం లభించలేదు.యూఎస్ ర్యాంక్ 60లో 59...మొత్తం 60 దేశాల్లో గ్లోబల్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్–2025 పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్ 42వ ర్యాంకుతో అమెరికా కంటే చాలా ముందుంది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం 59వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆధునిక, డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో ప్రజలు పగలు, రాత్రి పని చేస్తారు. అయితే పని–జీవిత సమతౌల్యత అమెరికన్లకు ప్రధాన సమస్యగా మారింది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఉద్యోగులు తక్కువ వేతనంతో కూడిన సెలవులు, తక్కువ కనీస వేతనం పొందుతున్నట్లు వెల్లడైంది. భారత్లో ఉద్యోగులు 35 రోజుల వేతనంతో కూడిన సెలవులను పొందుతున్నారు. పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పరిమిత అనారోగ్య సెలవులు, సుదీర్ఘ పనిగంటలు మాత్రం భారత ఉద్యోగులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.న్యూజిలాండ్కు టాప్ ర్యాంక్...ఈ నివేదికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు మంచి వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులను పొందుతున్నారు. దీంతో వారి ఉద్యోగ జీవితం ఉత్తమంగా ఉంది. వారికి 32 రోజుల వేతనంతో కూడిన సెలవు లభిస్తోంది. అనారోగ్య సెలవు తీసుకుంటే జీతంలో కోత విధింపు లేదు. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అక్కడి ఉద్యోగులకు గంటకు సగటు జీతం మెరుగ్గా చెల్లిస్తున్నారు.నివేదికలోని టాప్–10 దేశాలివే...ర్యాంకు దేశం 1 న్యూజిలాండ్2 ఐర్లాండ్3 బెల్జియం4 జర్మనీ5 నార్వే6 డెన్మార్క్7 కెనడా8 ఆస్ట్రేలియా9 స్పెయిన్10 ఫిన్లాండ్ -
లోకల్ గ్యాంగ్ హాలీవుడ్ రేంజ్ చోరీ
అది పారిస్లోని ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే మ్యూజియం.. కళలు, చరిత్రకు ప్రతీకగా నిలిచే లూవ్రె మ్యూజియం. అలాంటి చోట గత నెలలో జరిగిన 88 మిలియన్ యూరోలు (సుమారు రూ. 760 కోట్లు) విలువైన ఆభరణాల చోరీ యా వత్ ఫ్రాన్స్ను, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ అత్యంత నాటకీయమైన దోపిడీకి పాల్పడింది.. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠా కాదని, సాధారణ చిల్లర దొంగలని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకటించడం విస్మయపరిచింది. సినిమాను తలపించే దొంగతనం దోపిడీ జరిగిన తీరు చూస్తే, అది పక్కా ప్రొఫెషనల్స్ పనే అని అంతా భావించారు. ఎందుకంటే, ఆ రోజు ఉదయం 9.30 గంటలకు, మ్యూజియాన్ని సందర్శకుల కోసం తెరిచిన కొద్దిసేపటికే దొంగలు లోపలికి చొరబడ్డారు. లిఫ్ట్తో ఎంట్రీ నలుగురు దొంగలు దొంగిలించిన మెకానికల్ లిఫ్ట్ వాహనం సాయంతో మ్యూజియం బాల్కనీకి చేరుకున్నారు. 4 నిమిషాల్లో క్లీన్ స్వీప్ అక్కడి నుంచి నేరుగా ’గ్యాలరీ డి అపోలో’లోకి దూరి, డిస్క్ కట్టర్ ఉపయోగించి ప్రదర్శన షో కేసులను పగలగొట్టారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో అత్యంత విలువైన 8 నగలను దోచుకున్నారు. స్కూటర్లపై పరారీఉదయం 9.38 గంటలకు దొంగలు బయట సిద్ధంగా ఉంచిన రెండు స్కూటర్లపై పరారై, ఆ తర్వాత కార్లలోకి మారి పారిపోయారు. ఈ హడావిడిలో దొంగలు దొంగిలించిన ఒక కిరీటాన్ని మాత్రం కింద పడేసి వెళ్లారు. మిగతా ఏడు నగలు ఇప్పటికీ దొరకలేదు. నలుగురు పట్టివేత అరెస్ట్ అయిన నలుగురిలో.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ పారిస్కు ఉత్తరాన ఉన్న పేద ప్రాంతమైన సీన్–సెయింట్–డెనిస్లో నివసించే స్థానికులేనని పారిస్ ప్రాసిక్యూటర్ లారె బెకో స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన ఇద్దరు పురుషులు గతంలో కూడా అనేక దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవించినట్టు పోలీసుల రికార్డుల్లో ఉంది. వీరు వృత్తిపరమైన చిల్లర నేరగాళ్లే తప్ప, అంతర్జాతీయ మాఫియా ముఠాలకు చెందిన వారు కారు. వీరిలో ఒక జంట మాత్రం తమకు ఈ దొంగతనంతో సంబంధం లేదని వాదిస్తోంది. అరెస్టయిన ఇద్దరు పురుషులు మాత్రం.. తమ ప్రమేయాన్ని పాక్షికంగా అంగీకరించారు. ఈ నలుగురు కాక, ఈ దొంగతనాన్ని అమలు చేసిన ఒక వ్యక్తి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. చారిత్రక నగలు చోరీ చేసిన ఆభరణాలలో.. ఎంప్రెస్ యూజీనీ (నెపోలియన్ ఐఐఐ భార్య) ధరించిన బంగారు కిరీటం, మేరీ–లూయిస్ నెక్లెస్, చెవిపోగులు వంటి అత్యంత చారిత్రక విలువైన వస్తువులు ఉన్నాయి. దొంగిలించిన వస్తువులు ఇప్పటికే విదేశాలకు తరలిపోయి ఉండవచ్చని ఆందోళన చెందుతున్నప్పటికీ.. వాటిని భద్రంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామన్న ఆశాభావాన్ని ప్రాసిక్యూటర్ వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత, ఫ్రాన్స్ దేశంలోని ఇతర సాంస్కృతిక సంస్థల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాక, లూవ్రె మ్యూజియం నిర్వాహకులు.. తమ విలువైన ఆభరణాలలో కొన్నింటిని మరింత భద్రత కోసం బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్కు తరలించారు. ఏదేమైనా, ಲచోరీల చరిత్రలో, ఈ సైన్–సెయింట్–డెనిస్ గ్యాంగ్ తమ ’మెకానికల్ లిఫ్ట్’, ’స్కూటర్ ఎస్కేప్’ స్టయిల్తో ఒక నవ్వుల పేజీని లిఖించింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
తేజస్వీకి ప్రతిష్ట.. నితీశ్కు పరీక్ష!
పట్నా గద్దె కోసం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రసకందాయంలో పడింది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతుండగా, విపక్షాల ‘మహాగఠ్బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ‘ఉద్యోగాల హామీ’తో దూసుకెళ్తున్నారు. ఈ మహా సంగ్రామంలో కీలక నియోజకవర్గాలు రాష్ట్ర భవిష్యత్తును శాసించనున్నాయి. ఇవి కేవలం అభ్యర్థుల గెలు పోటములను మాత్రమే కాదు తేజస్వీ ప్రతిష్టకు, నితీశ్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. ఈ 14 కీలక స్థానాల ను ఓసారి పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో కొందరు అగ్రనే తల భవితవ్యం కొన్ని ప్రత్యేక నియో జకవర్గాలతో ముడిపడి ఉంది. వారి గెలుపు కంటే, వారి ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఇక్కడ కీలకం.1.రాఘోపూర్: ఈ నియోజకవర్గం తేజస్వీ యాదవ్కు కంచుకోట. గత పదేళ్లుగా ఈయన ఇక్కడి నుంచే భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దీంతో ఈసారి మెజారిటీ ఎంత? అనే చర్చ సైతం ఇప్పటికే మొదలైంది. ఇక్కడ యాదవ–ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే. అయితే ఈసారి మెజారిటీ తగ్గొచ్చనే ప్రచారం మొదలైంది. 2020 ఎన్నికల్లో తేజస్వీతో తలపడిన బీజేపీ కీలకనేత సతీష్ కుమార్ యాదవ్ ఈసారి సైతం బరిలో దిగి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి తేజస్వీ గెలిచినా మెజారిటీ తగ్గితే అది తేజíస్వీకి ఇబ్బందే. 2. నలంద: ఇది ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా. నలంద ఆయన రాజకీయాలకు కేంద్ర స్థానం కూడా. ఇది ఆయన సామాజిక వర్గమైన కుర్మీ జనాభా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జేడీయూ అభ్యర్థి, మంత్రి శ్రవణ్ కుమార్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనను మహాగఠ్బంధన్ అభ్యర్థి, కాంగ్రెస్ నాయకుడు కౌశలేంద్ర కుమార్ ఢీకొంటున్నారు. నితీశ్ నేరుగా పోటీ చేయకపోయినా, ఇక్కడ జేడీయూ గెలుపు అనేది సీఎం నితీశ్కు అత్యంత ప్రతిష్టాత్మకం. 3. జముయ్: లోక్జనశక్తి( ఎల్జేపీ– రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రాథినిధ్యంవహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో ఈ జముయ్ శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ పాశ్వాన్(దళిత) వర్గం ఓట్లు కీలకం. అధికార ఎన్డీఏ కూటమిలో సీఎం నితీశ్ కుమార్తో విభేదాల తర్వాత కూటమిలో చిరాగ్కు ఏ స్థాయిలో పరపతి ఉందనేది ఈ స్థానంలో గెలుపుతో తేలిపోనుంది. ఎన్డీఏ తరపున అంతర్జాతీయ షూటర్, బీజేపీ నేత శ్రేయసి సింగ్ మరోసారి పోటీలో నిలబడ్డారు. ఆర్జేడీ నుంచి షంషాద్ ఆలం బరిలో ఉన్నారు. నితీశ్పై కోపంతో చిరాగ్ సొంత కూటమి అభ్యర్థిని ఓడిస్తారా? లేదంటే మిత్రధర్మం పాటించి తమ ఓట్లు కూడా బీజేపీకి పడేలా చేస్తారా? చూడాలి!4. హసన్పూర్: లాలూ కుటుంబం లేకుండా.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2020లో ఈస్థానం నుంచి గెలిచారు. అయితే ఈసారి హసన్పూర్లో సమీకరణాలు పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తేజ్ప్రతాప్ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడం, ఆర్జేడీ కొత్తగా మాలా పుష్పంను బరిలోకి దించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ తేజ్ ప్రతాప్తో సంబంధంలేకుండా ఆర్జేడీ ఏ మేరకు విజయతీరాలను చేరుకుంటుందనేది ఆసక్తికరం. 5. కిషన్గంజ్: రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరు కిషన్గంజ్లో జరుగుతోంది. ఇక్కడ జనాభాలో దాదాపు 70 శాతం మంది ముస్లింలే. ‘లౌకిక’ ఓటు అనేది ఇక్కడ ప్రధానం. ఇక్కడ పోరు ఎన్డీఏ–మహాగఠ్బంధన్ మధ్య కాదు. మహాగఠ్బంధన్–ఎంఐఎం మధ్యే పోరులా ఉంది. 2020లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజాహరుల్ హుస్సేన్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ పోటీచేస్తున్నారు. ఎన్డీఏ తరఫున బీజేపీ నేత స్వీటీ సింగ్, ఎంఐఎం తరఫున షామ్స్ ఆగాజ్ పోటీ పడుతున్నారు. ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చితే 2020లో మాదిరిగానే బీజేపీ అనూహ్యంగా లబ్ధి పొందే అవకాశముంది.6.ఆరా: కుల సమీకరణాల యుద్ధభూమి భోజ్పూర్ ప్రాంతంలోని ఆరా నియోజకవర్గంలోనూ కుల రాజకీయాలు చాలా ఎక్కువ. ఇక్కడ చాన్నాళ్లుగా ఎన్డీఏ తరఫున రాజ్పుత్లు, ఆర్జేడీ తరఫున యాదవ్లు పోటీపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈబీసీ) ఓటర్లు ఇక్కడ ‘కింగ్మేకర్’గా మారనున్నారు.7.అగియావ్ (ఎస్సీ): అగియావ్ (ఎస్సీ) నియోజకవర్గం సీపీఐ–ఎంఎల్(లిబరేషన్) పార్టీకి కంచుకోట. 2020లో ఇక్కడ మనోజ్ మంజిల్ గెలిచారు. దళిత, పేద, భూమిలేని కార్మికులే ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున సీపీఎం నేత శివప్రకాశ్ రంజన్ పోటీ చేస్తుండగా ఎన్డీఏ తరఫున బీజేపీ నాయకుడు మహేష్ పాశ్వాన్ నిలబడ్డారు. 8. ముంగేర్: భూమిహార్ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం ముంగేర్. సాంప్రదాయంగా ఎన్డీఏకు మద్దతిచ్చే ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు తేజస్వీయాదవ్ ‘ఏ టు జెడ్’ నినాదమిచ్చారు. ఇక్కడ ఎన్డీఏ తరఫున బీజేపీ నేత కుమార్ ప్రణయ్ బరిలో నిల్చున్నారు. ఆర్జేడీ తరఫున ముఖేష్ యాదవ్ రంగంలోకి దిగారు. ఎంఐఎం అభ్యర్థి హసన్ సైతం ముందడుగు వేయడంతో ఇక్కడ త్రిముఖపోరు అనివార్యమైంది. 9. పట్నా సాహిబ్: రాజధానిలోని పట్నా సాహిబ్ నియోజకవర్గం బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇక్కడ వైశ్యులుసహా అగ్ర వర్ణాల ఓట్లు అధికం. మోదీ ఛరిష్మా, జాతీయవాదం ఇక్క డ చాలా బలంగా పనిచేస్తాయి. 2020లో బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయినాసరే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను మార్చేసి రత్నేష్ కుష్వాహాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. మహాగఠ్బంధన్ కూటమి నుంచి కాంగ్రెస్ నేత శశాంత్ శేఖర్ పోటీ చేస్తున్నారు. 10. గయా టౌన్: మగధ్ రాజధాని గయా టౌన్ కూడా బీజేపీకి మరో బలమైన కేంద్రం. ఇక్కడ వైశ్య, అగ్రవర్ణాల ఓట్లు కీలకం. బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఇక్కడ మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ తరపున మోహన్ శ్రీవాస్తవ బరిలో ఉన్నారు.11. ఝంఝార్పూర్: మిథిలాంచల్లోని ఝంఝార్పూర్ నితీశ్ కుమార్ అత్యంత వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకుకు అసలైన పరీక్ష. 2020లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి కూడా ఎన్డీఏ తరఫున బీజేపీ నేత, మంత్రి నితీశ్ మిశ్రా బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ఓడితే, అది నితీశ్ తన ప్రధాన ఓటు బ్యాంక్పై పట్టు కోల్పోతున్నారనడానికి సంకేతం.12. భాగల్పూర్: ‘సిల్క్ సిటీ’ భాగల్పూర్లో కాంగ్రెస్ ’స్ట్రైక్ రేట్’ పరీక్షకు నిలుస్తోంది. 2020లో మహాగఠ్బంధన్ ఓటమికి కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఒక కారణం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ శర్మ (కాంగ్రెస్)ను, 2020లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ నాయకుడు రోహిత్ పాండే ఢీకొట్టనున్నారు. ఆర్జేడీ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ కావడం ఇక్కడ కీలకం.13. పూర్ణియా: సీమాంచల్ రాజధాని పూర్ణియాలో మిశ్రమ జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం–యాదవ్ సమీకరణాలు పనిచేస్తాయి. వీరితోపాటు ఈబీసీ ఓటర్ల మద్దతు కూడగడితేనే అభ్యర్థి గెలుపు సాధ్యం. 14. బెట్టియా: పశ్చిమ చంపారన్లో ‘చెరకు బెల్ట్’గా పేరొందిన బెట్టియా నియోజకవర్గంలో రైతుల తీర్పు కీలకం కానుంది. చెరకు చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాస్త్రాలు. ఇక్కడ బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవితో కాంగ్రెస్ అభ్యర్థి వాసి అహ్మద్ పోటీ పడుతున్నారు. -
పేరు వీఐపీ.. ‘ఇండియా’లో వీవీఐపీ
బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చల తర్వాత ఒక చిన్న పార్టీకి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం యావత్ దేశాన్ని అతని వైపు చూసేలా చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు ‘ఇండియా’ కూటమిలో ఉన్నప్పటికీ 44 ఏళ్ల యువనేతను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి ప్రస్తుతం 15 సీట్లలో మాత్రమే పోటీపడుతున్న పార్టీ నేత ఇప్పుడు ‘ఇండియా’ కూటమి ప్రచార కార్యాక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ. మల్లా (మత్య్సకార) వర్గానికి చెందిన సహానీ ప్రస్తుతం మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ‘మల్లా’లే అత్యంత కీలకం.. బిహార్లో మల్లా వర్గం వాళ్లు ప్రధానంగా పడవ నడిపడం, చేపలు పట్టడం వృత్తిలో కొనసాగుతారు. వీరినే నిషాద్, కేవత్ అని కూడా పిలుస్తారు. మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామర్హి, షెయోహర్, కిషన్గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశి్చమ చంపారన్ జిల్లాల్లో ఈ వర్గం మత్స్యకారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జనాభాలో వీరు ఐదారు శాతం దాకా ఉంటారు. అత్యత వెనుకబడిన కులాల (ఈబీసీ) సమూహంలో వీరు అతి ముఖ్యమైన ఓటు బ్యాంక్గా ఎదిగారు. ముజఫర్పూర్ వంటి కొన్ని జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ వర్గం నేతలే ఎంపీలుగా గెలుస్తున్నారు. కీలక నేత జై నారాయణ్ ప్రసాద్ సైతం ఈ వర్గంవారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో పేరు, పలుకుబడి సాధించింది ముఖేశ్ సహానీ మాత్రమే. సహానీ తనను తాను ‘మల్లా కుమారుడు’గా ప్రకటించుకొని ఈ వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. సేల్స్మ్యాన్ నుంచి నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థి దాకా.. 1981లో దర్భంగా>లో ఒక మత్స్యకారుల కుటుంబంలో ముఖేష్ సహానీ జన్మించారు. ‘సన్ ఆఫ్ మల్లా’ అనే పేరుతో కొత్త క్రేజ్ సంపాదించుకున్నారు. 19 ఏళ్ల వయసులో బిహార్ను విడిచిపెట్టి, ముంబైలో సేల్స్మ్యాన్గా పనిచేశాడు. అనంతరం బాలీవుడ్లోకి సెట్ డిజైనర్గా అడుగుపెట్టాడు. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్, సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలకు పనిచేశాడు . ముంబైలో ముఖేష్ సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపాడు. 2013లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బిహార్æ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న, దివంగత కర్పూరీ ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి ప్రేరణ పొందారు. బిహార్ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కోసం పోరాడటానికి సహానీ తిరిగి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. రాజకీయ కారణాలతో బీజేపీని వదిలి 2015లో నిషాద్ వికాస్ సంఘ్ను స్థాపించారు. ఇదే తర్వాత 2018లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీగా రూపాంతరం చెందింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేశ్ సమానీ నాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు మద్దతు ఇచ్చాడు. కానీ తర్వాత అతనితో విడిపోయాడు. మల్లా సమాజానికి రిజర్వేషన్లు, సౌకర్యాలు ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత మోసం చేశారని ఆరోపణలు గుప్పిస్తూ నితీశ్ నుంచి తెగతెంపులు చేసుకున్నారు. కొంత కాలానికి మళ్లీ ఎన్డీఏలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేసి 4 సీట్లలో గెలిచారు. స్వయంగా సహానీ ఓటమిని చవిచూసినప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఒక ఏడాది తర్వాత ఆయన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు బీజేపీలో చేరారు. తర్వాత ఈయన 2024లో ఇండియా కూటమిలో చేరారు. కూటమిలో తనకు 40 స్థానాలు ఇవ్వాలని కోరినప్పటికీ అది సాధ్యపడకపోవడంతో 15 సీట్లు కేటాయించింది. అయితే ఆయన వర్గానికి ఉన్న ప్రాధాన్యత దష్ట్యా ఆయన్ను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.50–60 నియోజకవర్గాలపై ప్రభావంఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం సహానీ తన దూకుడు పెంచారు. తనను రాజకీయంగా అణచివేసిన నితీశ్ కుమార్, బీజేపీలే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. కేవలం 15 సీట్లలో పోటీ చేస్తున్న ఒక పార్టీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని ‘ఆఫర్’చేయడం వెనుక ‘ఇండియా’ కూటమి పక్కా వ్యూహం కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్జేడీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ (సుమారు 31 శాతం)కు అదనంగా, నితీశ్ కుమార్కు వెన్నెముకగా ఉన్న ఈబీసీ (అత్యంత వెనుకబడిన తరగతులు) ఓటు బ్యాంకును చీల్చడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 36% ఉన్న ఈబీసీలలో, 5–6% ఉన్న నిషాద్ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా, ఈబీసీలందరికీ ‘ఇండియా’ కూటమి బలమైన సందేశం పంపింది. సహానీ పోటీ చేస్తున్న 15 స్థానాల కంటే, ఆయన తన సామాజిక వర్గం బలంగా ఉన్న మిథిలాంచల్, సీమాంచల్, చంపారన్ ప్రాంతాల్లోని సుమారు 50–60 నియోజకవర్గాలపై చూపే ప్రభావమే కీలకం. ఆయన తన నిషాద్ ఓట్లను ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు బదిలీ చేయగలిగితే, అది ఎన్డీఏ, ముఖ్యంగా జేడీ(యూ) కోటను బద్దలు కొట్టగలదు. అందుకే ‘వీఐపీ’నేతగా ఉన్న సహానీ, ఇప్పుడు బిహార్ ఎన్నికల రాజకీయాల్లో ‘వీవీఐపీ’గా మారి, మొత్తం ఫలితాన్నే శాసించే కీలక నేతగా ఆవిర్భవించారు. -
దేవ దీపావళి... జ్వాలాతోరణం
కార్తీకమాసమంతా పర్వదినాల పరంపరే అయినప్పటికీ ఈ మాసంలో కొన్ని పర్వాలు కన్నుల పండువగా జరుగుతాయి. అలాంటి వాటిలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణ విశిష్టత ఏమిటి, ఎలా నిర్వహిస్తారో తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమినాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అలా అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు. ఈ నిర్మాణంపై ఆవునెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వరులని పల్లకిలో అటూ ఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. అలా వారి ఊరేగింపు అనంతరం భక్తులు కూడా ఆ మంటల కింది నుంచి దూరి వెళ్తారు.మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం, యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే శ్రీమన్నారాయణుని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి సర్వదేవతా కటాక్షం లభిస్తుందనీ, వారికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదనీ కార్తీక పురాణం చెబుతోంది. అందుకే భక్తులు తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.దీనివెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద స్వామివారి పల్లకి పక్కనే నడుస్తూ...‘‘నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని సంకల్పం చెప్పుకోవాలి. అనంతరం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి – ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం...లక్ష్మీనారాయణులను కూడా...కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణులను కూడా ఆరాధిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు వ్రతమాచరించి సత్యనారాయణ స్వామి వ్రత కథను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు, తులసిచెట్టు ఈ మూడింట్లో ఎక్కడో ఒక చోట దీపం వెలిగించాలి.కాశీలో దేవ దీపావళికాశీలో ఈ కార్తీక పున్నమినాడు దేవదీపావళీ రూపంలో వేడుకలు జరుగుతుంటాయి. ఆ రోజున కాశీలోని గంగా ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగిస్తారు. ఒకేసారి ఘాట్లలో దీపాల వరుసలు వెలిగినప్పుడు, మొత్తం నగరం దీపతోరణంలా కనిపిస్తుంది. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా వారణాసికి చేరుకుంటారు.ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడనీ, ఆ విజయాన్ని పురస్కరించుకుని దేవతలు కాశీలో దీపాలు వెలిగించి వేడుక చేసుకున్నార నీ, అప్పటినుండి ఈ పండుగ దేవ దీపావళిగా ప్రసిద్ధి చెందిందనీ స్థలపురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం గంగా హారతి చూడడం ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఈ దివ్య వీక్షణం కోసం గంటల తరబడి భక్తులు ఘాట్లలో ఓపిగ్గా ఎదురు చూస్తారు. కార్తీక పౌర్ణమిని సిక్కులు గురునానక్ జయంతిగా జరుపుకుంటారు. – డి.వి.ఆర్. -
బిహార్ రాజకీయాల్లో జార్ఖండ్ జోక్యం
బిహార్లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. జార్ఖండ్ రాష్టానికి చెందిన నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప గెలుపు సాధ్యం కాదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. బిహార్, జార్ఖండ్ సరిహద్దుల వెంట రాజ్మహల్ కొండలు ఉన్నాయి. ఆ కొండల వెంట ఉండే కతియార్, భాగల్పూర్లోని కహాల్గావ్, బంకా, జముయ్ జిల్లాల్లోని ఎక్కువ భాగం ప్రజలు సంస్కృతి, భాష పరంగా జార్ఖండ్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో రాజకీయంగా తూర్పు బిహార్పై జార్ఖండ్ నేతల ప్రభావం ఉంటుందని స్వయంగా స్థానిక ఓటర్లే చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలోని గిరిజనుల ఓట్లే నేతల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. జార్ఖండ్ కేంద్రంగా వ్యూహ రచన చకై, బంకాలోని బెల్హార్, కటారియా కతిహార్లోని మణిపురి, భాగల్పూర్లోని కహాల్గావ్ అసెంబ్లీ స్థానాల్లో గిరిజనులు ఎక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గతంలో చకయి స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది. ఈ ప్రాంత వాసులు గత ఏడాది నవంబర్లో గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జముయి జిల్లా ఖైరా బ్లాక్లోని గిరిజన ఫ్రైడే వేడుకకు రెండు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నేతలు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైతం ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. జార్ఖండ్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయతి్నస్తోంది. ఓట్లను రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇరు కూటములు కుల సమీకరణలను బేరీజు వేసుకుంటున్నాయి. చకయి చేజిక్కాలంటే.. జముయి జిల్లాలోని చకయి అసెంబ్లీ నియోజకవర్గం జార్ఖండ్లోని దేవరి సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ఓటర్లలో 20.8 శాతం మంది యాదవులు, 11.5 శాతం మంది ముస్లింలు, 8.4 శాతం మంది గిరిజనులు ఉన్నారు. వీళ్లే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. జేఎంఎం, జేడీయూ ఎన్నికల చిహ్నాలు దాదాపు ఒకే ఆకృతిలో ఉండటం జేడీయూ బాగా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఓట్లు జేడీయూకు పడుతున్నాయనే ఫిర్యాదులు గతంలోనే వెల్లువెత్తాయి. 2010లో జేఎంఎం టికెట్పై సుమిత్ సింగ్ 188 ఓట్ల తేడా గెలిచారు. 2020లో అతనే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యరి్థని 581 ఓట్లతో ఓడించారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. బెల్హార్ బలాబలాలు కీలకమే జార్ఖండ్లోని దేవ్ఘర్ సమీపంలోని బెల్హార్ సైతం జార్ఖండ్ మూలాలున్న నేతలతో ఇరు కూటములకు సవాల్గా మారింది. 2015 ఎన్నికల్లో కటోరియాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్కిషోర్ ప్రసాద్ జేఎంఎం టికెట్పై పోటీ చేశారు. 2010 సురేంద్ర ప్రసాద్ గుప్తా జేఎంఎం నుంచి పోటీచేసి 11 వేల ఓట్లు సాధించారు. 2005 ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి శైలేంద్ర కుమార్ 3 వేల ఓట్లు సాధించారు. మొదట్నుంచీ ఇక్కడ జార్ఖండ్ మూలాలున్న నేతలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఎన్డీఏ, విపక్షాల ‘ఇండియా’ కూటమి జేఎంఎం నేతల ప్రసన్నం కోసం అనేక వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2020లో ఇక్కడ జేడీయూకు చెందిన మనోజ్ యాదవ్ సమీప అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు రామ్దేవ్ యాదవ్పై కేవలం రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆర్జేడీ హవా కొనసాగితే అధికార కూటమికి ఇక్కడ పరాభవం తప్పదుకహల్గావ్ కహానీ జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతానికి అనుకుని ఉన్న కహల్గావ్ సీటు ఇక్కడ కీలకమైంది. ఈ స్థానం నుంచి తన కుమారుడిని అభ్యర్థిగా నిలపాలని జార్ఖండ్ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారు. గొడ్డా ఎమ్మెల్యే సంజయ్ జార్ఖండ్లో ఆర్జేడీ కోటా నుంచి మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు దీపికా పాండేసింగ్ సైతం తన సన్నిహితురాలు ప్రవీణ్ కుషా్వహాను ఈ స్థానం నుంచి పోటీకి నిలపాలని ప్రయతి్నంచారు. వీళ్లను ప్రసన్నం చేసుకుని తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గతంలోనే ప్రయతి్నంచారు. కహల్గావ్లోని గోరాదిహ్లో ఇటీవల సమావేశం నిర్వహించారు. అయితే అందరినీ కలుపుకొనిపోవడం ఆయనకు తలనొప్పిగానే మారింది. ఎన్డీఏ ఇక్కడ సమీకరణలపై ముమ్మర కసరత్తు చేస్తోంది. కటోరియాను ఆకట్టుకునేదెలా? కటోరియా స్థానంపై గత 35 సంవత్సరాలుగా జేఎంఎం పార్టీ కన్నేసింది. 2015, 2020లో జేఎంఎం బంకా జిల్లాలోని కటోరియా స్థానం నుంచి అంజలి హన్నాను నిలబెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రెండు సీట్లలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఏ పార్టీ తరఫున పోటీచేసినా సరే ఆ అభ్యరి్థకి జార్ఖండ్ నేతల ఆశీస్సులు కీలకం. ముఖ్యంగా జేఎంఎం మద్దతు అత్యంత ముఖ్యం. అనుకూలమైన అభ్యర్థులను రంగంలోకి దించిన పార్టీలు విజయావకాశాలకు పావులు కదుపుతున్నాయి. ‘మణి’హారం ఎవరిదో? ఎస్టీలకు కేటాయించిన కతిహార్లోని మణిహరి సీటును కైవసం చేసుకుంటామని జేఎంఎం ప్రకటించింది. గిరిజన ఓటు తమకు అనుకూలమని చెబుతోంది. గత ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో పార్టీల గెలుపు అంచనాలు తారుమారయ్యాయి. ఈసారి ఈ ఇబ్బంది రాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు జార్ఖండ్ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. చివరకు జేఎంఎం చించిన నేతలనే అన్ని పార్టీలూ బరిలోకి దించాయి. అయితే ఇక్కడ పడకేసిన అభివృద్ధి అనేదే ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే వీలుంది. -
సేవా రంగంలో... 19 కోట్ల మంది!
దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం సేవా రంగంలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో.. నిర్మాణ, తయారీ వంటి రంగాలతో పోలిస్తే సేవా రంగంలోనే అత్యధిక ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో.. సేవా రంగంలో ఉన్న మహిళల శాతం కేవలం 10.5 శాతం కాగా.. పట్టణాల్లో ఏకంగా 60 శాతం కావడం విశేషం. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం గత ఆరేళ్ల కాలంలోనే ఈ రంగంలో 40 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి.ఆ రంగాల్లో స్త్రీలు అధికంమొత్తం ఉద్యోగుల్లో.. పట్టణాల్లో ఉన్నవారిలో 60.8 శాతం సేవా రంగంలో ఉంటే, గ్రామాల్లో ఇది కేవలం 18.9 శాతం. మొత్తం సేవా రంగంలోని ఉద్యోగుల్లో పురుషులు 34.9 శాతం కాగా, స్త్రీలు 20.1 శాతం. » విద్య, ఆరోగ్యం, రిటైల్ రంగాల్లో మహిళల వాటా ఎక్కువగా ఉంది. » మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 74 శాతం.. 30–44 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. » మొత్తం సంఖ్యలో దాదాపు 38 శాతం పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసినవారే. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో/కార్మికుల్లో సేవారంగంలో 50 శాతం ఉంటే.. మనదేశంలో 31 శాతం ఉన్నారు. దేశంలో 2023–24 నాటికి జనాభాలో సేవా రంగంలో ఉన్నది 18.8 కోట్ల మంది.తెలుగు రాష్ట్రాలుమొత్తం ఉద్యోగుల్లో.. సేవా రంగంలో పనిచేసేవారు అత్యధికంగా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 48.5 శాతం మంది ఇందులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇది 31.8 శాతం కాగా, తెలంగాణలో 34.8 శాతం. సేవా రంగంలోని ఉప విభాగాల్లో.. 2023–24లో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. » సమాచారం, కమ్యూనికేషన్లు; ఆతిథ్యం, ఆహారం; రవాణా, నిల్వ; రియల్ ఎస్టేట్; ఆర్థికం, బీమా; కళలు, వినోదం; ఆరోగ్యం, సామాజిక సేవ; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగం; ఇతర సేవలు వంటి విభాగాల్లో ఏపీ టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో ఉంది.» సమాచారం, కమ్యూనికేషన్లు; రవాణా, నిల్వ; రియల్ ఎస్టేట్; ఆర్థికం, బీమా; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగం; ఇతర సేవలు, కుటుంబ కార్యకలాపాలు వంటి విభాగాల్లో తెలంగాణ టాప్–10 రాష్ట్రాల జాబితాలో ఉంది.సామాజిక భద్రత ప్రధానంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నీతి ఆయో గ్ కొన్ని సూచనలు చేసింది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్, ఎమ్ఎస్ఎమ్ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని పేర్కొంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింత విస్తరించాలని తెలిపింది. మహిళల ప్రాతినిధ్యం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. -సాక్షి, స్పెషల్ డెస్క్ -
డిస్కౌంట్ కావాలా..జీఎస్టీ తగ్గించాలా?
ఇలాంటి సంఘటనలు ఇటీవల నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత నెల 22వ తేదీ నుంచి పలు వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజూ ముమ్మరంగా అన్ని శాఖల అధికారులు ప్రచారం చేస్తూనేఉన్నారు. కానీ కొన్ని రకాల వస్తువుల ధరలు మాత్రం తగ్గడం లేదు. తమ వద్ద పాత స్టాక్ ఉందని, జీఎస్టీ తగ్గించి ఇచ్చి మేం నష్టపోవాలా అని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేలకు పైగా రిటైల్, హోల్సేల్ మెడికల్షాపులు ఉన్నాయి. వీటిలో ప్రతిరోజూ రూ.కోట్ల దాకా వ్యాపారం సాగుతోంది. అయితే ఈ దుకాణాల్లో అధిక శాతం ప్రజలకు జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు అందడం లేదు. గతంలో ఔషధాలు, శస్త్రచికిత్సల పరికరాలపై 12 శాతం, కొన్నింటిపై మాత్రమే 5శాతం జీఎస్టీ ఉండేది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా గత నెల 22వ తేది నుంచి మందులపై ఉన్న 12శాతం జీఎస్టీని 5 శాతానికి, క్యాన్సర్ సహా అరుదైన వ్యాధులకు వాడే 33 రకాల మందులపై జీఎస్టీని పూర్తిగా తొలగించింది. ఈ నూతన ధరల ప్రయోజనాలను సెపె్టంబర్ 22వ తేదీ నుంచే ప్రజలకు అందించాలని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ పేర్కొంది. కానీ మెజారిటీ దుకాణాల్లో ఈ తగ్గింపు ధరలు లభించడం లేదు. జీఎస్టీపై అధిక శాతం ప్రజలకు అవగాహన ఉన్న కర్నూలు నగరంలోనే నూతన సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఇక నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు, కోడుమూరు వంటి ప్రాంతాల్లో అడిగినా జీఎస్టీ తగ్గించే నాథుడే కరువయ్యారు. అధికారులకు తగ్గించామని చెబుతూనే ! ఒకవైపు జీఎస్టీ 12 శాతం నుంచి 7 శాతంకు తగ్గించి మందులు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం అందించిన ఫలాలు ప్రజలకు చేరువ కావాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మేళాలు, ప్రచార జాతాలు, ర్యాలీలు నిర్వహించి అధికారులు అవగాహన కల్పించారు. కానీ వారి ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. ఏ దుకాణంలోనూ జీఎస్టీ తగ్గించి ఇవ్వడం లేదు. ఎక్కడా పాత, కొత్త ధరల బోర్డులు ఏర్పాటు చేయలేదు. అడిగితే మా వద్ద పాత స్టాక్ ఉందని, కొత్త స్టాక్ ధరలు తగ్గించి వస్తే ఇస్తామని దుకాణదారులు చెబుతున్నారు. ఇప్పుడు మీకు(వినియోగదారులకు) 7శాతం తగ్గించి ఇస్తే తాము నష్టపోతామని వారు పేర్కొంటున్నారు. పాత నిల్వలైనా ప్రస్తుత తగ్గిన ధరల ప్రకారమే అమ్మాలని స్పష్టమైన ఆదేశాలు అధికారులు ఇచ్చినా అమలు కావడం లేదు. జీఎస్టీ అధికారులతో పాటు డ్రగ్ నియంత్రణ అధికారులు నిఘా పెంచి తరచూ తనిఖీలు చేస్తేనే జీఎస్టీ తగ్గింపు ఫలాలు ప్రజలకు అందే వీలుంది. » కర్నూలు నగరానికి చెందిన విజయ్కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ మెడికల్షాపునకు వెళ్లి మందులు కొన్నాడు. ఇందుకు అతనికి రూ.1,200 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.1,080 ఇవ్వాలని షాపు అతను సూచించాడు. ‘ఇప్పుడు మందులపై కూడా 7 శాతం జీఎస్టీ తగ్గింది కదా తగ్గించరా’ అని దుకాణదారున్ని విజయ్కుమార్ ప్రశ్నించాడు. ‘మీకు ఇప్పటికే 10 శాతం డిస్కౌంట్ ఇచ్చాం కదా...జీఎస్టీ కావాలంటే ఆ డిస్కౌంట్ ఉండదు’అని చెప్పాడు. దీంతో డిస్కౌంట్తోనే సరిపెట్టుకుని విజయకుమార్ వెళ్లిపోయాడు.» కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన మాధవరెడ్డి స్థానికంగా ఉన్న ఓ మెడికల్షాపులో మందులు కొన్నాడు. ఈ మేరకు రూ.3,600 బిల్లు అయ్యింది. డిస్కౌంట్ పోను రూ.3,140 చెల్లించాలని షాపు అతను సూచించాడు. బిల్లు కావాలని అడిగితే బిల్లు కావాల్సి వస్తే నీకు జీఎస్టీ 7 శాతం మాత్రమే తగ్గింపు ఉంటుందని చెప్పాడు. 3 శాతం నష్ట పోవాల్సి వస్తుందని భావించి మాధవరెడ్డి బిల్లు లేకుండానే మందులు తీసుకెళ్లిపోయాడు. జీఎస్టీ తగ్గింపు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దుచాలా దుకాణాల్లో నూతన జీఎస్టీ సంస్కరణల ఫలాలు అందడం లేదు. ఎవ్వరైనా అవగాహన ఉండి జీఎస్టీ తగ్గింది కదా ధరలు తగ్గాలి కదా అని అడిగితే నీకు జీఎస్టీ తగ్గించాలంటే డిస్కౌంట్ అడగొద్దు అని చెబుతున్నారు. జీఎస్టీ 12 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. అంటే ఎంఆర్పీపై 7 శాతం మాత్రం తగ్గుతుంది. అదే డిస్కౌంట్ అయితే ఎంఆర్పీపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. మనం జీఎస్టీ తగ్గించాలని అడిగితే డిస్కౌంట్ కోల్పోతాం. ఫలితంగా 3 శాతం మనకే నష్టమని భావించి అధిక శాతం వినియోగదారులు దుకాణదారులు ఇచ్చిన బిల్లుకు మందులు తీసుకుంటున్నారు. బిల్లు కావాలని అడిగిన వారికీ ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లు కావాలంటే డిస్కౌంట్ అడగొద్దని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. బిల్లు ఇస్తే ఎంఆర్పీపై 7 శాతం జీఎస్టీ తగ్గించి ఇవ్వాలి. అదే బిల్లు లేకుండా అయితే 10 శాతం డిస్కౌంట్తో ఇవ్వొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలతో వ్యాపారులు మైండ్గేమ్ ఆడుతున్నారు. పాత స్టాక్ ఉన్నా జీఎస్టీ తగ్గించి అమ్మాలి చాలా మంది జీఎస్టీ సంస్కరణల మేరకు ఔషధాలు విక్రయించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే అందరికీ నూతన జీఎస్టీ ప్రకారం మందులు విక్రయించాలని ఆదేశాలు ఇచ్చాం. ఈ మేరకు వాట్సాప్లలో మెసేజ్లు పంపించాం. కరపత్రాలు మెడికల్షాపుల వద్ద అతికించాం. ఇటీవల కర్నూలులో నిర్వహించిన మేళాలో మూడు స్టాళ్ల ద్వారా అవగాహన కల్పించాం. కానీ చాలా మంది పాత స్టాక్ ఉందని చెబుతూ ధరలు తగ్గించకుండా మందులు విక్రయిస్తున్నారని తెలిసింది. ఇకపై ముమ్మరంగా దాడులు చేస్తాం. మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే ధరలు తగ్గించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు తప్పకుండా బిల్లులు తీసుకోవాలి. – పి.హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్, కర్నూలు -
పారాచూట్ నేతలతో పరేషాన్..!
పారాచూట్ నేతలు ఏమేరకు విజయా న్ని అందిస్తారనేది బిహార్లోని అన్ని పార్టీల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు అన్ని పార్టీల నేతలూ దీన్నో సమస్యగానే భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా అకస్మాత్తుగా పార్టీలో చేరిన వారికి(పారాచూట్ నేతలకు), టిక్కెట్ ఇచ్చి బరిలో దించడం చకచకా చేసేశాయి. దీంతో ఆ పార్టీలు జనంలోకి వెళ్లలేక, అప్పటి వరకూ జనంలోనే ఉన్న అసంతృప్తి నేతలకు సమాధానం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితులు విజ యావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతా యని విశ్లేషకులు అంటున్నారు. బిహార్ పీఠం చేజిక్కించుకోవడానికి ప్రతీ నియో జకవర్గమూ కీలకంగా మారింది. అందుకే ప్రతీ సీటుపైనా పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టిక్కెట్ చేజిక్కించుకున్న స్థానాల్లో విజయం సాధించాలంటే ప్రత్యేక వ్యూహ రచన తప్పదని భావిస్తున్నాయి.ఎవరిపై ‘జాలి’?దర్భంగా జిల్లా జాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రిషి మిశ్రా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయన తాత లలిత్ నారాయణ్ మిశ్రా రాజకీయ వారసత్వం టిక్కెట్ విషయంలో మలుపు తప్పింది. దీంతో తాజాగా పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆర్జేడీ అభ్యర్థి జబీర్ అన్సారీ ఇక్కడ ఎమ్మెల్యే. ముస్లిం, యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో అభ్యర్థి మార్పు కారణంగా ఓటు బదలాయింపు ఏమేర ఉంటుందనేది కాంగ్రెస్ వర్గాల్లోనూ సందేహంగానే ఉంది. అలీనగర్లో అల్లుకుపోతారా?గాయకుడు మైథిలీ ఠాకూర్ను బీజేపీ అలీనగర్ నుంచి పోటీకి దింపింది. ఇది బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఇంతకాలం కేడర్లో ఉంది. బ్రాహ్మణ ఓటర్లు ఎన్డీయే పక్షం వైపు ఉన్నారనే విశ్వాసమే దీనికి కారణం. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన మిశ్రీలాల్ యాదవ్ 2020లో కేవలం 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈయన ఎన్డీయే అభ్యర్థి అయినప్పటికీ ఈసారి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్లు చీలిపోతే కష్టమని, కొత్త అభ్యర్థి గెలుపు జాతీయ నాయకుల ప్రచారంపై ఆధారపడి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ ప్రయోగం సరికాదనే వాదన ఆ పార్టీ నుంచి విన్పిస్తోంది.‘ఔరా’అన్పించేదెవరు?ముజఫర్పూర్ జిల్లా ఔరై నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రాంతం. బీజేపీ అభ్యర్థి రామ్ సూరత్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే. 47 వేల ఓట్ల మెజారిటీతో గతంలో గెలిచారు. ఇప్పుడీ స్థానాన్ని రమా నిషాద్కు కేటాయించింది పార్టీ. ఇప్పటి వరకూ ఆమె పార్టీలో కూడా లేరు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకూ ఆమె దూరంగానే ఉన్నారు. కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకుంటున్నారు. పార్టీలో చేరడం, టిక్కెట్ ఇవ్వడం అన్నీ నాలుగు రోజుల్లోనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆమె ఎలా ప్రభావితం చేస్తారన్నది ప్రశ్నగానే మిగిలిపోయిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.ఆకట్టుకునేదెలా?పైన పేర్కొన్న చోట్లనే కాదు.. అనేక సీట్లలో ఇదే ప్రయోగం. దీన్ని మార్పు అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. స్థానిక అంశాలపై ప్రస్తుత అభ్యర్థిని ప్రజల అసంతృప్తికి దూరం చేయడమే వ్యూహమంటున్నాయి. టిక్కెట్ ఇవ్వడానికి ముందు జేడీయూలో ఉన్న కౌశల్ యాదవ్, పూర్తిమ యాదవ్ను నవాడ, గోవింద్పూర్ స్థానాలకు ఎంపిక చేయడం వ్యూహమేనని ఆర్జేడీ తెలిపింది. యాదవ్ ఓట్లకు గాలం వేయడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. శివహార్ నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఉన్న చేతన్ ఆనంద్ను జేడీయూ నైన్బీనగర్ నుంచి బరిలోకి దింపింది. రాజ్పుత్లను ఆకర్షించడానికి జేడీయూ కోమల్ సింగ్ను నామినేట్ చేసింది, ఆయన తల్లి వీణా దేవి ఎల్జేపీ ఎంపీ. బీజేపీకి చెందిన అజయ్ కుష్వాహా జేడీయూ కండువా కప్పుకున్న వెంటనే ఆ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఎల్జేపీ సీటు సాధించడంలో విఫలమైన సరితా పాశ్వాన్ జేడీయూలో చేరారు. దీంతో, ఆమె ఆ పార్టీ అభ్యర్థి అయిపోయారు. ఇలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు అన్ని పార్టీల్లో ఉన్నా విజయావకాశాలపై అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.వనం దుర్గాప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..!
బిహార్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మరోమారు పట్నా గద్దెనెక్కేందుకు నితీశ్ ఉవి్వళ్లూరుతుంటే ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఆయనను పడొగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. సమరంలో ఎవరు గట్టెక్కుతారో నిర్ణయించే గెలుపు వ్యూహాలు మాత్రం రాజధాని పాటలీపుత్రలో కాకుండా రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో దాగి ఉన్నాయి. సీమాంచల్లోని మతపరమైన ఓటు బ్యాంకు, మిథిలాంచల్లోని ఈబీసీల మద్దతు, మగద్లోని దళిత ఓటర్లు, భోజ్పుర్లోని గ్రామీణ–పట్టణ వ్యత్యాసాలు అనే ఈ 4 అంశాలపైనే అధికార, విపక్ష కూటముల భవిష్యత్ ఆధారపడి ఉంది. నితీశ్ పాలనపై తీర్పుతో పాటు కుల, ప్రాంతీయ అస్తిత్వాల మధ్య జరుగుతున్న ఈ పోరు అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములకు అసలుసిసలు పరీక్ష పెడుతోంది. కుల సమీకరణాల పునాదులపై జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఎన్డీఏ ‘డబుల్ ఇంజిన్’నినాదం, మహాగఠ్బంధన్ ‘సామాజిక న్యాయం’హామీ రెండూ పదునైన అ్రస్తాలే.సీమాంచల్: మహాగఠ్బంధన్ కోటలో ‘చీలిక’గండం సీమాంచల్లో కిషన్గంజ్, అరేరియా, పూరి్నయా, కతిహార్ అనే నాలుగు ఉపప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 28 స్థానాలున్నాయి సీమాంచల్ అనేది బిహార్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతం. కిషన్గంజ్లో దాదాపు 70 శాతం జనాభా ముస్లింలు కాగా, ఇతర జిల్లాల్లో 35–45 శాతం వరకు ఉంటారు. ఇది సహజంగానే ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. ‘ముస్లిం –యాదవ్’సమీకరణంలో ‘ముస్లిం’ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని, మహాగఠ్బంధన్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాగఠ్బంధన్ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీని ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠ్బంధన్ చూస్తోంది. ఎంఐఎం అనేది బీజేపీ ‘బీ–టీమ్’అని, ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తూ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మహాగఠ్బంధన్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్డీఏ పూర్తిగా మహాగఠ్బంధన్ ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే తమకు అంత లాభం చేకూరుతుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు గాలమేస్తోంది. మిథిలాంచల్: నితీశ్కు అసలు సిసలు అగ్నిపరీక్ష మిథిలాంచల్లో ప్రధానంగా దర్భంగా, మధుబని, సమస్తిపూర్, సహర్సా, సుపాల్, మధేపుర ప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 50–60 స్థానాలున్నాయి. ఇది అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణాలున్న ప్రాంతం. బ్రాహ్మణులు, రాజ్పుత్లు (బీజేపీ ఓటు బ్యాంకు), యాదవులు (ఆర్జేడీ బలం) ఇక్కడ బలంగా ఉన్నారు. అయితే, ఫలితాలను శాసించేది మాత్రం ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు). మల్లా, టెలీ, ధానుక్ వంటి అనేక చిన్న కులాలు సీఎం నితీశ్ కుమార్కు అండగా నిలుస్తున్నాయి. అయితే ‘సన్ ఆఫ్ మల్లా‘గా పిలుచుకునే ముఖేశ్ సహానీకి నిషాద్ కమ్యూనిటీపై గట్టి పట్టుంది. ఈయన ప్రస్తుతం మహాగఠ్బంధన్ కూటమిలో ఉండటం వారికి కలిసి రానుంది. ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది. నితీశ్ను ముందు నిలిపి ఈబీసీ ఓట్లను, అగ్రవర్ణాల ఓట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ ఆశపడుతోంది. ఈ కూటమి 2020లో మెరుగైన ప్రదర్శన చేసి 34 సీట్లు గెలుచుకుంది. మహాగఠ్బంధన్ మాత్రం ’సహానీ’తో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్ చేస్తోంది. ముస్లిం, యాదవ్లతోపాటు ఈసారి మల్లాలను, వామపక్ష పారీ్టలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలని విపక్షపారీ్టలు ఆశిస్తున్నాయి. నితీశ్పై ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈబీసీ ఓట్లను తమ వైపు తిప్పుతుందని మహాగఠ్బంధన్ గట్టిగా నమ్ముతోంది. ఇది నితీశ్ విశ్వసనీయతకు అసలైన పరీక్ష.మగధ్: ‘లెఫ్ట్’జోరుకు కళ్లెం! మగధ్ ప్రాంతంలో గయా, జెహానాబాద్, ఔరంగాబాద్, నవాడా, అర్వాల్ అనేవి ముఖ్యమైనవి. ఇక్కడ సుమారు 28 స్థానాలున్నాయి. మగధ్ ప్రాంతం ఆర్జేడీ, వామపక్షాలకు కంచుకోట. ఇక్కడ యాదవులు, దళితులు/మహాదళితులు (ముసహర్, పాశ్వాన్), భూమిహార్ల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. 2020లో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ప్రాంతంలోని 26 స్థానాల్లో మహాగఠ్బంధన్(ముఖ్యంగా ఆర్జేడీ, సీపీఐ –ఎంఎల్) ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్డీఏలోని జితన్ రాం మాంఝీ (హెచ్ఏఎం పారీ్ట), చిరాగ్ పాశ్వాన్ (లోక్జనశక్తి– పాశ్వాన్) గత కొంతకాలంగా బలాన్ని పుంజుకుంటున్నారు. ఈ దళిత మిత్రుల సాయంతో 2020 నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. గయా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ (ముసహర్ నేత), చిరాగ్ పాశ్వాన్ (పాశ్వాన్ నేత) ద్వారా విపక్షాల దళిత ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. మహాగఠ్బంధన్ మాత్రం ‘ఆర్జేడీ (యాదవ్), సీపీఐ–ఎంఎల్ (అణగారిన వర్గాలు/దళితులు) అనే విజయవంతమైన ఫార్ములాను నమ్ముకుంది. ఈసారి కూడా తమను అదే ఫార్ములా విజయతీరాలకు చేర్చనుందని బలంగా నమ్ముతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మగధ్ ప్రాంతంలో తప్పనిసరిగా మోదీ మ్యాజిక్ పనిచేయాల్సిందే. 2020లో గెలిచిన ఆరు సీట్లను పెంచుకుని ఈసారి కనీసం 15 సీట్లలో విజయపతాక ఎగరేస్తేనే అధికారంపై ఆశలు బలపడతాయి.భోజ్పూర్: నగరాలపై ‘కమలం’ఆశ భోజ్పూర్ పరిధిలో పట్నా, భోజ్పుర్(ఆరా), రోహ్తాస్, బక్సర్, కైమూర్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ మొత్తంగా దాదాపు 46 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజ్పుత్ల గడ్డగా పిలుస్తారు. అగ్రవర్ణాలలో రాజ్పుత్ల ఆధిపత్యం ఎక్కువ. ఆర్జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్, జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మీ–కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. పటా్నలోని పట్టణ ఓటర్లు (కాయస్థులు, బనియాలు) బీజేపీకి మద్దతునిస్తున్నారు. 2020లో మగధ్ లాగే భోజ్పుర్ గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠ్బంధన్ అద్భుతమైన ప్రదర్శన చేసి 43 స్థానాలకు గాను ఏకంగా 30 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును, అగ్రవర్ణాలను ఏకీకరణ చేస్తూనే ఈబీసీ, ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. మహాగఠ్బంధన్ మాత్రం గ్రామీణ పట్టు నిలుపుకునే యత్నం చేస్తోంది. ఈ చతుర్ముక పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే ఫలితాల వెల్లడిదాకా ఆగక తప్పదు. -
ఎంత ఖర్చయినా ధరిస్తాం
ఈ రోజుల్లో చేతి వేళ్లకు, మణికట్టుకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ధరించే ట్రెండ్ పెరిగిపోయింది. చాలామంది చేతులకు స్మార్ట్ వాచ్లు కనిపిస్తున్నాయి. ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్మార్ట్ రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ రింగులు వంటివి ధరిస్తున్నారు. చెవుల్లో పెట్టుకునే వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటివన్నీ కలిపి.. 2024లో దేశంలో మొత్తం సుమారు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయంటే వాటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో రిస్ట్ బ్యాండ్ సగటు అమ్మకం ధర (ఏఎస్పీ) సుమారుగా రూ.12,000 ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇలా వేళ్లకో, మణికట్టుకో ధరించే స్మార్ట్ గ్యాడ్జెట్ల సగటు అమ్మకం ధర ప్రస్తుతం రూ.1,920 వరకూ ఉంది. ధర పెరుగుతున్నా వా టిని కొనడానికి ఎవరూ వెనకాడటం లేదు. 2025లో మొదటి ఆరు నెలల్లో 5 కోట్లకుపైగా ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్లు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడిప్పుడే స్మార్ట్ రింగ్స్కి మార్కెట్ పెరుగుతోంది. అలాగే మెటా, లెన్స్కార్ట్ల వంటివి ఉత్పత్తులు మార్కె ట్లోకి తీసుకురావడంతో స్మార్ట్ గ్లాసెస్కి కూడా ఆదరణ పెరుగుతోంది. రిస్ట్ బ్యాండ్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. భారీగా షిప్మెంట్లు2025 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) స్మార్ట్ గ్యాడ్జెట్ల షిప్మెంట్లు (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే సంఖ్య) 2.67 కోట్ల వరకు జరిగాయని ఐడీసీ చెబుతోంది. స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ల షిప్మెంట్లు రికార్డు స్థాయిలో 118% పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్ రింగ్స్ సుమారు 75వేలు, స్మార్ట్ గ్లాసెస్ 50వేలకుపైగా మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన ఇయర్వేర్లో సింహభాగం వైర్లెస్ ఇయర్బడ్స్ (టీడబ్ల్యూఎస్) కావడం.. వీటికి పెరుగుతున్న క్రేజ్కి నిదర్శనం.మొదట్లో అదో క్రేజ్స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లకీ చాలా తేడా ఉంది. ‘వీటిపై మొదట్లో క్రేజ్ ఎక్కువ ఉంటోంది. ఎందుకంటే.. ఆరోగ్య, ఆహార సంబంధ విషయాలపై ఇచ్చే వివరాలు, స్కోర్లు ఆసక్తికరంగా ఉంటాయి. రానురాను.. రోజూ అవే విషయాలను ఆ గ్యాడ్జెట్స్ ఇస్తుండటంతో వాటిని వాడే వారిలో మొదట్లో ఉన్న ఆసక్తి తరవాత ఉండటం లేదు. మొదట్లో అందరూ చూడాలని, అందులోని వివరాలు తెలుసుకోవాలని పెట్టుకునేవారు.. తరవాత్తరవాత అందరూ చూడాలని మాత్రమే వాటిని ధరిస్తున్నారు’ అంటున్నారు టెక్ నిపుణులు. చాలామంది ఇలా బోర్ కొట్టడం వల్ల తమ మొదటి స్మార్ట్ వాచ్ను అప్డేట్ చేయడం లేదు. ‘చాలా స్మార్ట్ వాచ్లు రోజువారీ నడిచిన అడుగుల లెక్క, గుండె కొట్టుకునే రేటు వంటివి తప్ప కొత్త విషయాలు ఉండటం లేదు’ అంటున్నారు వినియోగదారులు.ఆలోచించి కొంటున్నారు‘ఇవి వన్టైమ్ పర్చేజ్ ఐటెమ్స్గా మారిపోతున్నాయి. అంటే స్మార్ట్ఫోన్ని చాలామంది ఏడాదికొకటి మారుస్తారు. కానీ, స్మార్ట్ వాచ్లు, రింగ్ల వంటి వాటిని ఒకసారి కొన్నాక... మళ్లీ కొత్తది కొనేందుకు ఇష్టపడటం లేదు. చాలా విషయాల్లో ఈ తరం వారు.. ఒక వస్తువును చూడగానే లేదా దాని గురించి వినగానే కొనేస్తుంటారు. కానీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ల విషయంలో అలా కాదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటున్నారు. అందుకే వీటి ధరలను పెంచాల్సి వస్తోంది. కానీ, ఉత్పత్తిలో ప్రత్యేకత ఉంటే వాటిని ఎంత ధర పెట్టి కొనడాని కైనా వినియోగదారులు సిద్ధపడుతున్నారు’ అని కంపెనీలు చెబుతున్నాయి. -
పేదరికాన్ని కొలిచేదెలా?
కేరళ రాష్ట్రం పేదరికాన్ని జయించిందట. రాష్ట్రంలో కడు పేదలు అసలు లేరని ఆ రాష్ట్రం గొప్పగా ప్రకటించుంది. అంటే.. ఇక్కడ అందరూ ధనవంతులనేనా అర్థం? కాదు. పేదరికం అంటే డబ్బుల్లేకపోవడం మాత్రమే కాదు. కడు పేదరికం లేదా దుర్భర దారిద్ర్యం అనేదానికి నిర్వచనం వేరు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంపై ఏం చెబుతుందంటే... మనిషి బతికేందుకు అత్యవసరమైన కనీస అవసరాలు తీరకపోవడమే కడు పేదరికం అని!. తినేందుకు తిండి, తాగేందుకు సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఉండేందుకు ఒక గూడు, విద్య వంటివి ప్రాథమిక మానవ అవసరాలని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 కోట్ల మంది కడు పేదరికంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, యుద్ధం, ఆర్థిక అస్థిరతల వంటివి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 తరువాత అంతర్జాతీయంగా పేదరికం మళ్లీ పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సరే.. మరి ఎంత ఆదాయం ఉంటే పేదరికాన్ని దాటినట్టు?. ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం... రోజుకు 1.90 డాలర్ల సంపాదన ఉన్న వారు అంతర్జాతీయ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు. ఈ లెక్క 2016 నాటిది. 2024 నాటి లెక్కల ప్రకారం రోజుకు 2.66 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారు కటిక దరిద్రంలో ఉన్నట్టు. ఈ మొత్తం పర్చేసింగ్ పవర్ పారిటీకి తగ్గట్టుగా అంటే వివిధ దేశాల్లోని కాస్ట్ ఆఫ్ లివింగ్ను పరిగణలోకి తీసుకుని లెక్కించింది. కనీస అవసరాలను కూడా అందుకోలేనంత పేదలు ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు ఈ లెక్క ఉపయోగపడుతుందని అంచనా. ప్రాముఖ్యత ఏమిటి?నిజజీవిత ఉదాహరణ ఒకదాన్ని పరిశీలిద్దాం... ఓ పల్లెలో అత్యధికులు రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదిస్తున్నారని అనుకుందాం. అప్పుడు ఈ పల్లెలోని కుటుంబాలు పోషకాహారం పొందలేరు. ఫలితంగా పోషకాహాల లోపాలు వస్తాయి. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం అందుబాటులో లేకపోతే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులతో కలిసి పనికెళ్లే అవకాశం ఉంటుంది. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే ఐక్యరాజ్య సమితి పేదరికం తొలగింపును సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిగా నిర్ధారించింది. ఆ దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పేదరిక నిర్మూలన అనేది కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతోనే జరిగిపోదు. వీలైనంత ఎక్కువమంది పేదలకు పని కల్పించడం పేదరిక నిర్మూలనకు చాలా కీలకం. అయితే పని చేసేందుకు అవసరమైన పరిస్థితులు కూడా బాగా ఉండేలా చూసుకోవాలి. 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 63 కోట్ల మంది కార్మికులుంటే.. వీరిలో 20 శాతం మంది ఆదాయం తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకూ ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలన విషయంలో మానవ, కార్మిక హక్కుల పరిరక్షణ కూడా ముఖ్యమవుతుంది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
తిరుపతితో మొదలు.. అసలేందుకీ తొక్కిసలాటలు?
దేశ చరిత్రలోనే 2025 ఏడాది ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. మునుపెన్నడూ లేని రీతిలో.. ఈ యేడు వరుసగా తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని అత్యంత విషాదకరమైనవిగా నిలిచాయి. అధిక జనసమూహం, భద్రతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. ఆ ఘటనలను పరిశీలిస్తే.. తిరుపతి తొక్కిసలాట.. తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే తొలిసారి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 8వ తొక్కిసలాట జరిగి.. ఆరుగురు భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులు కౌంటర్ల వద్ద భారీగా గుమికూడారు. ఆ సమయంలో ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో గేట్ను తెరిచారు. దీంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కుంభమేళాలో మహా విషాదం.. జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య పుణ్యస్నాన దినాన లక్షలాది భక్తులు గంగానదిలో స్నానం చేయడానికి చేరుకున్నారు. అయితే.. చీకట్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో స్పష్టత కొరవడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో.. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. రైల్వే అనౌన్స్మెంట్లో తీవ్ర గందరగోళం, అప్పటికే ప్లాట్ఫారమ్ 14, 15 వద్ద అధిక జనసంచారం, రైలు రాకతో ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుంటూ ప్లాట్ఫారమ్లపైకి చేరడంతో తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపమే ఈ ఘటనకు కారణమని తర్వాత తేలింది.బెంగళూరు స్టేడియం బయట.. జూన్ 4వ తేదీన బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా నెగ్గడంతో.. విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. అంచనాలకు మించి అభిమానులు రావడం.. వాళ్లను అదుపు చేయలేకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.కరూర్ ఘటన.. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. నిర్వహణ లోపమని, విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న జనం గందరగోళానికి గురై తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ కుట్ర అంటూ టీవీకే ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు జోక్యంతో ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు నడుస్తోంది.కాశీబుగ్గ ఆలయం వద్ద.. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు(మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు). ఏకాదశి కావడంతో భక్తులు భారీగా రావడంతో ఇది చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా పేరున్న ఆలయంలో.. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది. -
పోక్సో నేరగాడికి సుప్రీంకోర్టు క్షమాభిక్ష!
దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అరుదైన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని 142వ నిబంధన మేరకు తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి మరీ పోక్సో కేసులో నేరస్తుడిగా నిరూపితమైన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించింది. జైలుశిక్ష రద్దు చేసింది. ఆ వ్యక్తి నేరం చేసిన మాట వాస్తవమైనప్పటికీ తరువాత బాధితురాలిని పెళ్లి చేసుకోవడం.. పుట్టిన బిడ్డతో కలిసి సంసారం కొనసాగిస్తుండటాన్ని పరిగణలోకి తీసుకుని తామీ నిర్ణయానికి వచ్చినట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెస్సీలతో కూడిన బెంచ్ తీర్పునిచ్చింది. ఆసక్తికరమైన ఈ కేసు వివరాలు..తమిళనాడుకు చెందిన కృపాకరన్ అనే వ్యక్తి 2017లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. న్యాయ విచారణ అనంతరం న్యాయస్థానం అతడికి ఐపీసీ సెక్షన్ 366 (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కింద ఒక నేరానికి ఐదేళ్లు, ఇంకోదానికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పును కృపాకరన్ మద్రాస్ హైకోర్టులో సవాలు చేశాడు. బాధితురాలిని తాను పెళ్లి చేసుకున్నానని, బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. కానీ 2021 సెప్టెంబరులో హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కృపాకరన్ చెబుతున్న విషయాలను నిర్ధారించుకునేందుకు సుప్రీంకోర్టు తమిళనాడు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని పురమాయించింది. బాధితురాలు కూడా కోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ... తాను కృపాకరన్పై ఆధారపడ్డానని, అతడితోనే సంసారం చేయాలని తీర్మానించుకున్నానని స్పష్టం చేసింది. బాధితురాలి తండ్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణకు హాజరవడమే కాకుండా... కృపాకరన్ నేరాన్ని, శిక్షను రద్దు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేశారు. తమిళనాడు లీగల్ సెల్ అథారిటీ ఉన్నతాధికారి కూడా కృపాకరన్, బాధితురాలు సుఖంగానే ఉన్నారని, సంసారం బాగానే గడుస్తోందన్న నివేదిక అందడంతో భార్యపిల్లలను బాగా చూసుకోవాలని, ఏ రకమైన ఇబ్బంది పెట్టినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సుప్రీంకోర్టు అతడి నేరాన్ని, శిక్ష రెండింటినీ రద్దు చేసింది. సామాజిక సంక్షేమం కోసమే..కృపాకరన్ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘చట్టాలనేవి సామాజిక సంక్షేమం కోసమే’’ అన్న జస్టిస్ బెంజిమన్ కార్డోజో (అమెరికా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి) వ్యాఖ్యతోనే తీర్పును ప్రారంభించడం విశేషం. కృపాకరన్ చేసింది తీవ్రమైన నేరమే అయినప్పటికీ ఆ తరువాత జరిగిన పరిణామాలను, వాటి ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ తీర్పునిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులను నిరోధించేందుకే పోక్సో లాంటి చట్టాలను రూపొందించారని, శిక్షలను ఖరారు చేశారని తెలిపింది. అయితే, ఈ శిక్షలను యథాతథంగా అమలు చేసే ముందు వాస్తవిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అన్నింటికీ ఒకేతీరున కాకుండా.. ఆయ కేసులను బట్టి ఈ న్యాయస్థానం తీర్పులు ఇస్తుందని తెలిపింది. అవసరమైన సందర్భాల్లో కఠినంగానే కాకుండా.. కరుణతోనూ తీర్పులుంటాయని న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మెసీల ధర్మాసనం వివరించింది. కృపాకరన్ కేసులో నేరం జరిగింది కామంతో కాకుండా ప్రేమతో అన్న అంచనాకు రావడం వల్ల తాము రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలతో అతడి నేరాన్ని, శిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
దేశానికి 'పెళ్లి కళ'
ఈ ఏడాది ఆఖరు రెండు నెలల్లో దేశవ్యాప్తంగా జరగనున్న 46 లక్షల వివాహాల ద్వారా రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరగొచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సి.ఎ.ఐ.టి.) అంచనా వేస్తోంది. దాని ప్రకారం ఒక్క ఢిల్లీలోనే 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్ల బిజినెస్ జరగనుంది. ఈసారి స్వదేశీ ‘డెస్టినేషన్’లు దేశానికి సరికొత్త పెళ్లి కళ తేబోతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గత ఏడాదికీ, ఈ ఏడాదికీ పెళ్లిళ్ల సంఖ్యలో పెద్ద తేడా లేనప్పటికీ, పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మాత్రం ఈసారి గణనీయంగా పెరగవచ్చని సి.ఎ.ఐ.టి. చెబుతోంది. ఆదాయాల్లో పెరుగుదల; ఆర్థిక రంగం పరుగులు తీయడం, పండుగ సీజన్లో రికార్డు స్థాయి కొనుగోళ్లు.. తదితర అంశాలన్నీ కలిసి భారీగా పెళ్లిళ్ల బిజినెస్కు దోహదం కావచ్చునని సి.ఎ.ఐ.టి. భావిస్తోంది. ప్రధాని పిలుపునకు స్పందనసంపన్న భారతీయులు తమ వివాహాలను దేశంలోనే, దేశవాళీ ఉత్పత్తులతోనే నిర్వహించుకోవాలని గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ‘వెడ్ ఇన్ ఇండియా’ పేరిట పిలుపు ఇచ్చారు. ఆ నేపథ్యంలో కూడా దేశవాళీ పెళ్లిళ్ల బిజినెస్లో భారీ పెరుగుదల కనిపించనుందని దేశంలోని 75 ప్రధాన నగరాల్లో సి.ఎ.ఐ.టి. నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని సంపన్నుల్లో (కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడి పెట్టదగిన ఆస్తులు ఉన్నవారు) 80–85 శాతం మంది ఈసారీ స్వదేశీ డెస్టినేషన్ల వైపు మొగ్గు చూపుతున్నారట. వాటిల్లో రాజస్థాన్ ప్యాలెస్లు, గోవాలోని రిసార్ట్లతో పాటు.. కొత్తగా వయనాడ్, కూర్గ్, రిషికేష్, సోలన్, షిల్లాంగ్ల వంటి కొత్త ప్రాంతాలు ఉన్నాయని ప్రముఖ ట్రావెల్ సంస్థ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. ‘లోకల్’ క్రేజ్వివాహ వేడుకల కొనుగోళ్లలో రానున్న రెండు నెలల్లో 70 శాతం వరకు దేశీయ ఉత్పత్తులు ఉంటాయని సి.ఎ.ఐ.టి. అంచనా వేస్తోంది. సంప్రదాయ కళాకారులు, ఆభరణాల వ్యాపారులు, దుస్తుల తయారీ యూనిట్లు కూడా ఈ పెళ్లిళ్ల సీజన్లో రికార్డు స్థాయిలో ఆర్డర్లు పొందుతున్నట్లు పేర్కొంది. రాజస్థాన్కు సూపర్ డిమాండ్రాజస్థాన్లో సాంస్కృతిక వారస్వత వైభవం కలిగిన వేదికలు వివాహాలకు అత్యధిక డిమాండ్లో ఉన్నాయి. అక్కడి చాలా హోటళ్లు ముందే బుక్ అయిపోయాయి కూడా. ఈ హోటళ్లు ఈసారి 20–30 శాతం ఎక్కువగా ఆదాయాన్ని చూడబోతున్నాయి. లగ్జరీ రైలు ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ కూడా గత ఏడాది నుండి అందుబాటులోకి రావటంతో ‘డెస్టినేషన్’ పెళ్లిళ్లకు రాజస్థాన్ మరింత ఆకర్షణీయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో..తెలుగు పంచాంగాల ప్రకారం సుమారుగా నవంబరు ఆఖరి వారంలో శుక్ర మూఢమి ప్రారంభమై దాదాపు 80 రోజులకుపైగా ఉంటుంది. ఈ సమయంలో వివాహాలు చేయకూడదన్నమాట. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ నవంబరులో భారీగా వివాహాలు జరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఏటా పెరుగుతున్న వ్యయంసి.ఎ.ఐ.టి. డేటా ప్రకారం.. వివాహాలకు భారతీయులు చేస్తున్న ఖర్చు భారీగా పెరుగుతోంది. 2022లో 32 లక్షల వివాహాలకు రూ.3.75 లక్షల కోట్ల ఖర్చు అయితే.. 2023లో 38 లక్షల వివాహాలకు రూ.4.74 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2024లో 48 లక్షల వివాహాలకు రూ.5.9 లక్షల కోట్లు వెచ్చించారు. -
ఎవరి తలరాత మారుస్తారో?
ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బిహార్లో ముస్లిం ఓటర్లు సైతం పారీ్టల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం–యాదవ్ ఫార్ములానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని తమ వర్గానికి ఇవ్వకపోవడంతో వారిలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం అగ్గిని రాజేయనున్నాయో తెలియాల్సి ఉంది. ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు తమను మహాగఠ్బంధన్లో చేర్చుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విన్నపాన్ని పెడచెవిన పెట్టడం ఇండియా కూటమికి పరీక్షగా మారింది. అదే సమయంలో, ముస్లింలలోని వెనకబడిన కులాల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. మైనారిటీ వంతెన దాటాల్సిందే.. బిహార్లోని మొత్తం 10.41 కోట్లు జనాభాలో 1.75 కోట్ల ముంది ముస్లింలు అంటే 17.7 «శాతం మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 87 చోట్ల 20 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లింలున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది. బిహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలన ఉన్న ’సీమాంచల్’ప్రాంతం గురించే. కిషన్గంజ్, అరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70శాతం కాగా, అరియా, కతిహార్, పూరి్ణయా జిల్లాల్లో 30–45శాతం వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహాట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50–60శాతం పైగా వీరే ఉన్నారు. గత ఎన్నికలే గుణపాఠం 2020 ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠ్బంధన్ ఓట్లను చీలి్చంది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహాట్, బహదూర్గంజ్, కోచాధామన్లలో జెండా ఎగరేసింది. ఈ ఐదు స్థానాల నష్టమే తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠ్బంధన్లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరినా ఆర్జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో, తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవడంపై కాంగ్రెస్కు ఉన్న అయిష్టత మరో కారణం. ఏకీకరణను నమ్ముకున్న ఇండియా కూటమి సీమాంచల్ వెలుపల, మైనారిటీలు 15– 25 శాతం వరకు ఉండే అనేక ’స్వింగ్’నియోజకవర్గాలు ఉన్నాయి. దర్భంగా, మధుబని (మిథిలాంచల్), సివాన్, గోపాల్గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో వీరు ఒంటరిగా గెలిపించలేరు, కానీ వీరి ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారు. ఇక్కడే ఆర్జేడీ అజేయమైన ముస్లిం–యాదవ్ సమీకరణం బలంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 17.7 శాతం ముస్లింలు, 14 శాతం యాదవులు కలిస్తే, అది దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీతో కలిసి ఉన్నందున ముస్లింలు తమతో కలిసిరారన్న కారణంతో జేడీయూ గతంలో 10 సీట్ల సంఖ్యను 6కు తగ్గించింది. చీలికపై నితీశ్ ఆశలు..! నితీశ్ కుమార్ ‘మహాగఠ్బంధన్’లో ఉన్నంత వరకు మైనారిటీ ఓటర్లకు అది సురక్షితమైన కూటమి. ఆర్జేడీ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకుకు, నితీశ్ ‘ఈబీసీ’ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ, నితీశ్ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉండడంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీశ్ కుమార్, బీజేపీతో ఉన్నప్పటికీ, మైనారిటీలలోని అట్టడుగు వర్గా లైన ‘పస్మాందా’(వెనుకబడిన కులాలు) ముస్లింలను ఆకట్టుకునే ప్రయ త్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ‘ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ (అష్రాఫ్) ముస్లింలకే పెద్ద పీట వేసింది, పస్మాందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డాం’అనేది నితీశ్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ ‘పస్మాందా’కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5–10శాతం చీల్చగలిగినా, అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠ్బంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందిఎంఐఎం ఆత్మగౌరవ నినాదం ఒవైసీ పార్టీ ‘ఓటు బ్యాంకు’గా ఉండటానికి బదులు, ‘సొంత రాజకీయ నాయకత్వం’కోసం పిలుపునిస్తోంది. ‘మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్లు మిమ్మల్ని వాడుకున్నాయి’అనే అసదుద్దీన్ ఒవైసీ నినాదం సీమాంచల్లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి, 10–15 శాతం ఓట్లు చీల్చగలిగితే..అది నేరుగా ఎన్డీయేకు లాభం చేకూరుస్తుంది. సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
ఈ కెమెరాకు భయం లేదు
‘బిందూ... బాడీ’... అని ఆమెకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో. బిందు ఫ్రీలాన్స్ ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్. రాత్రిళ్లు ప్రమాదాలు, నేరాలు జరిగినప్పుడు సీన్ దగ్గర ఉన్న మృతదేహాలను చట్టపరమైన సాక్ష్యాలకు ఉపయోగపడేలా ఫొటోలు తీయడం ఒక విద్య. ఆ విద్యలో ఆరితేరిన బిందు కేరళలో ఇప్పటికి 3000 కేసులకు ఫొటోగ్రాఫర్గా పని చేసింది. పురుషులైనా స్త్రీలైనా ధైర్యంగా చేయలేని ఈ పనిని చేసి చూపిస్తున్న బిందు పరిచయం.కేరళ త్రిషూర్ జిల్లా కొడంగలూర్లోని బిందూ (46) ఇంటిలో అర్ధరాత్రి ఫోన్ మోగిందంటే ఆమెకు వెంటనే డ్యూటీ పడిందని అర్థం. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగింది... నేరం జరిగింది.. సూసైడ్ కేసు... అక్కడకు వెళ్లి వెంటనే ఫొటోలు తీయకపోతే ఆ సాక్ష్యాధారాలు చెదిరిపోవచ్చు. అందుకే బిందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కెమెరా బ్యాగ్ భుజాన వేసుకుని మోటర్ సైకిల్ మీద బయలుదేరుతుంది. త్రిషూర్ జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు బిందూయే ఔట్సోర్స్ ఫొటోగ్రాఫర్. ఘటనా స్థలాలలో పోలీసులకు సహాయంగా, చట్టపరమైన పరిశోధనకు వీలుగా, న్యాయస్థానాల్లో ప్రవేశానికి అర్హమైన ఫొటోలు తీసే వారిని ‘ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్’ అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఫొటోగ్రాఫర్లు ఉంటారు. లేనప్పుడే సమస్య. త్రిషూర్లో బిందూయే చాలామందికి ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్.అనుకోకుండా ఒకరోజువి.వి.బిందుది కొడంగల్లో మధ్యతరగతి కుటుంబం. ఇంటర్ వరకూ చదివాక ఆర్థిక స్తోమత లేక చదువు మానేసి ఒక ఫొటోస్టూడియోలో రిసెప్షనిస్టుగా చేరింది. అక్కడ లైటింగ్ చేసే కుర్రాళ్లు యజమాని లేనప్పుడు కెమెరాతో ఎలా ఫొటో తీయాలో ప్రయోగాలు చేస్తుంటే అప్పుడప్పుడు వారితో పాటు కలిసి గమనించేది. తొలుత ఏ ఆసక్తి లేకపోయినా తర్వాత ఆసక్తి ఏర్పడి ఆరు నెలల్లో కెమెరా అంటే ఏమిటో ఫొటోలు ఎలా తీయాలో ఫండమెంటల్స్లో కొట్టినపిండి అయ్యింది. దాంతో యజమాని ఆమెను అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్కు పంపేవాడు. అయితే ఒకరోజు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది... ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని. వేరే ఎవరూ దొరక్క బిందూను పంపాడు యజమాని. ఇది 2004లో జరిగింది. అది బావిలో మృతదేహం కేసు. అక్కడకు వెళ్లి ఫొటోలు తీసిన బిందు మళ్లీ ఆ పని జన్మలో చేయకూడదని నిశ్చయించుకుంది. ‘అలాంటి వృత్తిలో ఎవరు ఉంటారు?’ అంటుందామె. కాని మరి కొన్ని రోజులకు మళ్లీ ఫోన్ వచ్చింది. డబ్బు అవసరం ఆమెకు మళ్లీ కెమెరా పట్టుకుని వెళ్లేలా చేసింది.విరామం తీసుకున్నాపెళ్లయ్యాక ఈ పనికి విరామం ఇచ్చి 2008లో భర్తతో కలిసి బెంగళూరు వెళ్లిపోయింది బిందు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భర్తతో విడిపోయి తిరిగి 2014లో కొడంగలూరుకు చేరుకుంది. వచ్చిన రోజే ఆమెకు మళ్లీ పోలీసుల నుంచి ఫోన్. ‘ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నేళ్లలో నాలాగా ముందుకొచ్చిన ఫొటోగ్రాఫర్లు అక్కడ లేరు. నైపుణ్యం కూడా లేదు’ అందామె గర్వంగా. అందుకే పోలీసులు ఆమెను బతిమిలాడి తిరిగి పనిలో పెట్టారు. ఒక సి.ఐ. అయితే తన శాలరీ సర్టిఫికెట్ ఆమె లోను కోసం పూచీ పెట్టి 2 లక్షలు అప్పు ఇప్పించి మంచి కెమెరా కొనుక్కునేలా చేశాడు. ఇక బిందూ ఆగలేదు. పనిలో కొనసాగుతూనే ఉంది నేటికీ.కేసుకు 2000 రూపాయలుబిందు ఇప్పుడు ఏడు స్టేషన్లకు ఇన్క్వెస్ట్ ఫొటోగ్రాఫర్గా ఉంది. ‘నాకు రోజుకు యావరేజ్గా ఒకటి లేదా రెండు కేసులు వస్తాయి. వెళ్లి ఫొటోలు తీస్తాను. కేసుకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఘటనా స్థలికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చూసినవన్నీ మైండ్లో నిండిపోతాయి. కాని ఇంటికి వచ్చి ఒక్కసారి పిల్లల్ని చూసుకున్నాక అన్నీ మర్చిపోతాను. నా పని ఎలా చేయాలో నాకు తెలుసు. సీనియర్ ఆఫీసర్లు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అప్పుడప్పుడు యంగ్ ఆఫీసర్లు ఇలా కాదు అలా అంటూ తెలివి ప్రదర్శిస్తారు. ఇవన్నీ మామూలే’ అంటుందామె. ఇంత భిన్నమైన వృత్తిలో ఇంతగా రాణిస్తున్న బిందూ గురించి బయటి లోకానికి తెలియదు. ఇటీవలే అక్కడి సీనియర్ ఫొటోగ్రాఫర్, నటుడు కె.ఆర్.సునీల్ ‘అసామాన్య సామాన్యుల’ పై ఒక పుస్తకం అక్కడ వెలువరించాడు. అందులో బిందూపై కూడా కథనం ఉంది. అలా ఆమె జీవితం అందరికీ తెలిసింది. గుండె దడదడనేర/ప్రమాద ఘటనా స్థలాల్లోకి పోలీసులు వెళ్లడానికే జంకుతారు. అలాంటిది బిందు వెళ్లి ఊరికే చూసి రావడం కాదు... కొన్ని నిర్దేశిత యాంగిల్స్లో దగ్గరగా వెళ్లి తీయాలి. కొత్తల్లో ఆమెకు చాలా వొణుకుగా ఉండేది. ‘ఒకసారి భయంతో ఫ్లాష్ మర్చిపోయి వెళ్లాను. మళ్లీ తెచ్చుకొని తీయాల్సి వచ్చేది. మరోసారి కెమెరాలో రీల్ లోడ్ చేయడం మర్చిపోయాను. కాని రాను రాను మెల్లగా అన్నీ అలవాటయ్యాయి. ఏ వృత్తయినా ప్రొఫెషనలిజం వచ్చేంత వరకూ కష్టమే. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకే’ అంటుంది బిందూ. -
మనిషి ‘తిరుగుడు’ ఎక్కువైంది!
సాక్షి, స్పెషల్ డెస్క్: 1850ల నాటి మాట... అప్పట్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నడకే ప్రధాన సాధనం. కానీ, 2025 నాటికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికైనా వెళ్లాలంటే కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లు, రైళ్లు, విమానాలు.. ఇలా ఎన్నో మార్గాలు. అందుకే, ఇప్పుడు నడక అనేది ఏకంగా ఏడో స్థానానికి వెళ్లిపోయింది. భూమిపై ఉన్న జలచరాల సంచారం (టోటల్ బయోమాస్ మూవ్మెంట్ – టీబీఎం) పారిశ్రామిక విప్లవం తరువాత.. సగానికి తగ్గిపోయింది. అదే సమయంలో మనుషులు అటూ ఇటూ తిరగడం 40 రెట్లు పెరిగింది. సుప్రసిద్ధ నేచర్ జర్నల్కి చెందిన ‘నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్’ విభాగంలో ప్రచురితమైన అధ్యయనం ఈ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. భూమిపై జలచరాల సంచారం (టోటల్ బయోమాస్ మూవ్మెంట్ – టీబీఎం) పారిశ్రామిక విప్లవం తరువాత తగ్గిపోవడానికి ప్రధాన కారణం.. చేపలు, తిమింగలాలను మనుషులు వేటాడటమే. చెప్పాలంటే మొత్తం మానవుల టీబీఎంలో.. భూమిపై ఉన్న జంతువులు, జలచరాలు, పక్షుల టీబీఎం ఆరోవంతు మాత్రమేనట. ప్రస్తుతం మానవ సంచారంలో దాదాపు 65 శాతం.. మోటారు వాహనాల ద్వారానే జరుగుతోంది. నడక ద్వారా 20 శాతం ఉంటే.. సైకిల్ ద్వారా జరుగుతున్నది మరో 20 శాతం. విమానాల ద్వారా తిరుగుతున్నవారు 10 శాతం కాగా, రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నవారు 5 శాతం.ఆ నాలుగూ కారణంఈ అధ్యయనంలో అమెరికా, జర్మనీ, ఇజ్రా యెల్కు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. వీరు మానవ ప్రయాణాలు పెరగడానికి కార ణాలుగా ప్రధానంగా 4 అంశాలను పేర్కొన్నారు.⇒ జనాభా పెరుగుదల⇒ మోటారు వాహనాల వాడకం పెరగడం ⇒ శిలాజ ఇంధనాల వినియోగంలో వృద్ధి⇒ ప్రయాణాలకు అనువైన సదుపాయాలు, సౌకర్యాల ఏర్పాటు⇒ అధిక ఆదాయ దేశాల్లో ఉన్నవారు ప్రపంచ జనాభాలో దాదాపు 16 శాతం. మొత్తం జనాభా కదలికల్లో వీరిదే దాదాపు 30 శాతం.⇒ అల్పాదాయ దేశాల్లో ఉన్న వారు ప్రపంచ జనాభాలో 9 శాతం. మొత్తం జనాభా సంచారంలో వీరి వాటా కేవలం 4 శాతమే.95 శాతానికి పెరిగింది1850లలో..ఈ భూమిపై మొత్తం క్షీరదాల్లో క్రూర మృగాల (జలచరాలు, వన్యప్రాణులు) బరువు 50 శాతం ఉంటే.. మానవులు, ఇతర పెంపుడు జంతువుల బరువు 50 శాతం ఉండేది. 2020 నాటికి మానవులు, ఇతర పెంపుడు జంతువుల బరువు ఏకంగా 95 శాతానికి పెరిగిపోయింది.ఏమిటీ టోటల్ బయోమాస్ మూవ్మెంట్మనుషుల జనాభాతో పోలిస్తే భూమిపై పక్షులు, జంతువులు చాలా ఎక్కువ కదా, మరి అవి ప్రయాణించే దూరం కంటే మనుషులు ప్రయాణించే దూరం ఎక్కువ కావడం ఏమిటి? అనే సందేహం చాలామందికి వస్తుంది. అందుకు ప్రధాన కారణం దీన్ని గణించడానికి తీసుకునే ప్రమాణమే. పర్యావరణ ఆరోగ్యం, సహజ వనరుల వినియోగం, పర్యావరణంపై మానవుల ప్రభావం వంటి అంశాలు అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు ‘టోటల్ బయోమాస్ మూవ్మెంట్’ను ఉపయోగిస్తారు.దీని ప్రమాణమే గ్రాస్ టన్ను కిలోమీటర్లు (జీటీకే). ఒక ప్రాణి బరువును, అది ఒక ఏడాదిలో ప్రయాణించిన దూరంతో గుణిస్తే వచ్చేదే జీటీకే. ఎంత ఎక్కువ బరువు ఉంటే అంత ఎక్కువ జీటీకే అన్నమాట. చాలా పక్షులు ఏటా కొన్ని వేలు, లక్షల కిలోమీటర్లు వలస పోతుంటాయి. కానీ వాటి బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల వాటి టీబీఎం చాలా తక్కువగా ఉంటుంది. -
తిండిలోనే ఉంది.. తూగుటుయ్యాల!
సాక్షి, స్పెషల్ డెస్క్: పగటి పూట పండ్లు, కూరగా యలు, సంక్లిష్ట (నెమ్మదిగా జీర్ణమయ్యే) కార్బోహైడ్రేట్లను తీసుకునే వారు కలతలు లేని, ప్రశాంతమైన నిద్రను ఆస్వాదిస్తున్నారట. అందుకు భిన్నంగా – చక్కెర, ప్రాసెస్ చేసిన పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు.. శారీరక అసౌకర్యానికి, నిద్రాభంగానికి కారణం అవుతున్నాయట. ప్రముఖ జర్నల్ ‘స్లీప్ హెల్త్’లో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాలు వెల్లడించింది. నిద్రలేమికి ఒత్తిడి, గంటల తరబడి స్క్రీన్ను చూడటం, క్రమరహితమైన పని వేళలు ప్రధాన కారణాలుగా ఉన్నప్పటికీ... నిద్రను నియంత్రించటంలో ఆహారం బలమైన సహాయక పాత్రను పోషిస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి వాటితో కూడిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు.. శరీర ధర్మాల సహజ లయను నిర్వహించడానికి, వాపుల గుణాన్ని తగ్గించడానికి, జీర్ణక్రియకు, తద్వారా మంచి నిద్రకు దోహదపడతాయని అధ్యయనంలో తేలింది. రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రించే అమెరికన్ యువతపై ఈ అధ్యయనం జరిగింది. ఆహారం నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోటానికి వారి ఆహారపు అలవాట్లను, మణికట్టుకు అమర్చే నిద్ర మానిటర్ల రీడింగ్లను అధ్యయనవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు.ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు ⇒ చక్కెర, ప్రాసెస్డ్ పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు అసౌకర్యాన్ని, రాత్రిపూట తరచూ మెలకువ రావటానికి కారణం అవుతున్నాయి. ⇒ కొన్ని ఆహారాలు సహజంగా నిద్ర నాణ్యతను పెంచుతున్నాయి. అరటిపండ్లు, కివీ పళ్లు, టార్ట్ చెర్రీస్ (పుల్లటి చెర్రీలు) సహజ మెలటోనిన్ను, సెరటోనిన్ కలిగి, నిద్ర స్పందనలను నియంత్రిస్తున్నాయి. పాలకూర, క్యాబేజీ రకం ఆకుకూరలలోని మెగ్నిషియం కండరాలను సడలిస్తోంది. గింజలు, అవకాడోలు, చిలగడదుంపలు నిద్ర హార్మోన్లను సమతులం చేయడంలో సహాయకారిగా ఉంటున్నాయి. సమయమూ ముఖ్యమే ⇒ ఆహారంతో పాటుగా, అది తీసుకునే సమయం కూడా నిద్రకు చాలా ముఖ్యం. ఆలస్యంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అధిక ప్రొటీన్లు లేదా కారంగా ఉండే వంటకాలు అజీర్ణాన్ని రేకెత్తిస్తాయి. కెఫిన్, డార్క్ చాక్లెట్ నిద్రను ఆలస్యం చేస్తున్నాయి. ⇒ మధ్యాహ్న భోజనాన్ని సమృద్ధిగా తీసుకోవాలి. అది జీర్ణక్రియ బలంగా ఉండే సమయం. ⇒ రాత్రి భోజనం తేలికగా, సమతులంగా ఉండాలి, రాత్రి 8 గంటలలోపు, లేదా నిద్రవేళకు కనీసం 2 గంటల ముందు తినటం పూర్తి చేయాలి. ⇒ పడుకునే ముందు ఒక చిన్న చిరుతిండి, అరటిపండు, గోరువెచ్చని పాలు లేదా నానబెట్టిన బాదం తినటం వల్ల అర్ధరాత్రి ఆకలిగా అనిపించదు.‘ప్రశాంత పోషకాలు’ ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అధికంగా ఉండే ఆహారాలు.. పాలు, గింజలు వంటివి. ఇవి నిద్ర హార్మోన్లను తయారు చేయటంలో కీలకం⇒ మెగ్నిషియం, విటమిన్ బి6.. ఆకుకూరలు, అరటిపండ్లు, అవకాడోలలో లభిస్తాయి. కండరాలను, నరాలను సడలించి విశ్రాంతినిస్తాయి.⇒ మెలటోనిన్ (రాత్రివేళల్లో మెదడులో ఉత్పత్తి అయ్యే హార్మోన్) అధికంగా ఉండే ఆహారాలు.. చెర్రీలు, ఓట్స్, కివీ, అరటిపండ్లు. ఇవి నాణ్యమైన నిద్రకు తోడ్పడతాయి. ⇒ పొటాషియం అధికంగా ఉండే టమాటా,చిలగడదుంపలు నిద్ర లయల్ని స్థిరీకరిస్తాయి.నిద్రాభంగం కలిగించేవి⇒ రాత్రి కడుపునిండా తినటం, ఆలస్యంగా తినటం, వేపుళ్లు, కారాలు.. జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి. కలత నిద్రకు కారణం అవుతాయి. ⇒ కెఫిన్, ఆల్కహాల్, చక్కెరలు మెలటోనిన్ను అణిచివేస్తాయి. నిద్రా భంగం కలిగిస్తాయి⇒ నిమ్మజాతి పండ్లు లేదా అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారాలు కూడా, బాగా పొద్దుపోయాక తింటే నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. -
కండరాలకూ జ్ఞాపకాలు!
తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మాటలు వినగానే.. అవి మన మెదడు సొత్తే అనుకుంటాం. కానీ, మన శరీరం అంతటా అల్లుకొని ఉండే కండరాలకు కూడా సొంత తెలివితేటలు, జ్ఞాపకాలు ఉంటా యట. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు గానీ, వాస్తవం. అంతెందుకు..? వ్యాయామం చేస్తే కండరాలు బలంగా పెరుగుతాయని మనకు తెలుసు. అయితే, మానేసిన కొన్నాళ్లకు ఆ విషయాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ, కండరాలు మాత్రం మర్చిపోవట. మళ్లీ కొన్నేళ్ల తర్వాత తిరిగి మొదలు పెట్టినా, మన కండరాలు గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని అధ్యయనాల్లో తేలింది. – సాక్షి, సాగుబడికండరాలకూ సొంత తెలివితేటలతో కూడిన జ్ఞాపకాలుంటాయట. మీరు కండరాలను ఎంతగా ఉపయోగిస్తే, అవి మీ శరీరానికి అంత ఎక్కువ శాశ్వత ప్రయోజనకరమైన వనరుగా మారుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సైకిల్ తొక్కేట ప్పుడు శరీరంలో కండరాలు కలిసికట్టుగా సమన్వయంతో కదలటం నేర్చుకుంటాయి. ఆ చలనశీలతను చిరకాలం పాటు గుర్తుపెట్టుకుంటాయి. జ్ఞాపకాలతో మరింత వేగంగా!కండరాల ఎపిజెనెటిక్ జ్ఞాపకశక్తిపై షార్పుల్స్ విశేష పరిశోధనలు చేశారు. ప్రవర్తన, పరిస్థితుల ప్రభావం వల్ల జన్యు వ్యక్తీకరణలో వచ్చే మార్పులను ఎపిజెనెటిక్ మార్పులు అంటారు. అంటే, జన్యువులు మారవు, కానీ అవి పనిచేసే విధానం మారుతుంది. వ్యాయామంతో కలిగే జన్యు వ్యక్తీకరణ మార్పులకు సంబంధించిన జ్ఞాపకాలను కండరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయని షార్పుల్స్ పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని నెలలు లేదా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వ్యాయామం ప్రారంభించినప్పుడు పాత జ్ఞాపకాల ఆధారంగా మొదట్లో కన్నా వేగంగా కండరాలు బలం పుంజుకుంటాయని ఆయన కనుగొన్నారు. చప్పున గుర్తుతెచ్చుకుంటాయిమన కండరాల్లోని కణాలు.. శరీర కదలికలను, వ్యాయామాన్ని కలకాలం గుర్తుపెట్టుకోగలవు. అవసరమైనప్పుడు వాటిని మళ్లీ చప్పున గుర్తుతెచ్చుకోవటమే కాకుండా మొదట్లో కన్నా చప్పున స్పందించగలవని ఇటీవల వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. ‘మానవ శరీరంలో అవయవాల చుట్టూ ఉండే కండరాల్లోని కణాలు విలక్షణమైనవి. అవి పొడవుగా, పల్చగా, పోగుల మాదిరిగా ఉంటాయి. నిద్రాణంగా ఉండే ఈ మూల కణాలు శరీర కదలికలు/వ్యాయామం వల్ల వత్తిడి కలిగినప్పుడు లేదా గాయం తగిలినప్పుడు చైతన్యవంతమై కండర వృద్ధికి దోహదపడతాయి. చాలా ఏళ్ల తర్వాత మనం మళ్లీ వ్యాయామం చేసినా గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని మా పరిశోధనల్లో తేలింది’ అంటారు కండర శాస్త్రవేత్త డా. ఆడమ్ షార్పుల్స్. ఆయన ఓస్లోలోని నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రతికూల జ్ఞాపకాలు!కండర కణాలు అన్ని వేళలా ‘సానుకూల జ్ఞాపకాల’తోనే స్పందించాలనేం లేదు. ఒక్కోసారి ‘ప్రతికూల జ్ఞాపకాల’తోనూ ప్రతిస్పందించవచ్చు. ప్రతికూలతకు వ్యాధి కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు.. పదేళ్ల క్రితం రొమ్ము కేన్సర్కు చికిత్స పొందిన మహిళల్లో కండరాలు ‘ప్రతికూల జ్ఞాపకాల’ వల్ల వారి వయసుకు మించి పట్టు సడలి, క్షీణించటాన్ని షార్పుల్స్ గుర్తించారు. వారితో ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయించినప్పుడు కండరాలు వయసుకు తగిన రీతిలో పున రుజ్జీవనం పొంది పటుత్వం పెంచుకోగలిగాయి. ప్రతికూల జ్ఞాపకాలపై సానుకూల జ్ఞాపకాలు పైచేయి సాధించటం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన అంటారు. -
ఆర్జేడీ యువ రాగం
దశాబ్ధాలుగా బిహార్ ఎన్నికలను కుల రాజకీయాలు శాసిస్తున్నాయి. అయితే, రాష్ట్ర ఓటర్ల మనోగతానికి అనుగుణంగా ఆర్జేడీ యువ నేత, మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కొత్త పంథాలో దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో కులరాజకీయాల డోసును కాస్తంత తగ్గించి యువతే లక్ష్యంగా వాగ్దానాల జల్లు కురిపిస్తున్నారు. యువ తను పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతానని ఇటీవల వాగ్దానం చేశారు. యువత పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లకుండా వాళ్ల కు ఇక్కడే ఉపాధి అవకాశాలు సృష్టిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం వలసల కట్టడి, ఆరి్ధక మద్దతు, అభివృద్ధి నినాదాలను చేస్తున్నారు. వీటిని ముందుపెట్టి ఎన్నికల్లో భారీ లబ్ధి పొందేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో 25 శాతం మంది యువ ఓటర్లే ఉన్నారు. కులం పేరు చెప్పి ఓట్లు అడిగే బదులు వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి హామీలనిస్తూ తేజస్వీ యువరాగం అందుకున్నారు. ఈ రాగానికి యువత ఏస్థాయిలో మంత్ర ముగ్ధులు అవుతారో, ఈ మంత్రం ఏమేరకు పనిచేస్తుందనేది కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు సంపూర్ణ క్రాంతి ఉద్యమంలోంచి నాయకులుగా ఎదిగిన లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్లు బిహార్లో వచి్చన సామాజిక, రాజకీయ పరిణామాల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇద్దరు నేతలు మొన్నటివరకు కులాలకే అధిక ప్రాధాన్యతనిస్తూ కుల రాజకీయాలు చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ అనుసరించిన పంథాను పక్కనబెట్టి తేజస్వీ యాదవ్ దూసుకెళ్తున్నారు. బిహార్లో యువ ఓటర్ల ధ్యాస ఇప్పుడు పెద్దగా కులం మీద లేదనే వాదన ఒకటి ఉంది. విద్యావకాశాలు అధికమవడం, పెరిగిన వలసలు, నగరీకరణతో యువతలో కుల ప్రస్తావన పెద్దగా లేదని తెలుస్తోంది. నిరుద్యోగ భూతాన్ని తరిమేసి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలి్పంచే నేతలకు జై కొట్టేందుకు యువ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ అంచనాలతో యువతను తేజస్వీ ప్రధాన ఆయుధంగా మలుచుకుంటున్నారని తెలుస్తోంది. 1.63 కోట్ల మందే గురి బిహార్లోని 243 నియోజకవర్గాల్లో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18–32 ఏళ్ల వయసు వారు ఏకంగా 1.63 కోట్ల మంది ఉన్నారు. ఇక కొత్త ఓటర్ల సంఖ్య 14 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 70.9 శాతం కాగా, నిరుద్యోగిత రేటు 10.3 శాతంగా ఉంది. రాష్ట్రంలోని యువతలో 20 శాతం కంటే ఎక్కువ మంది నిరుద్యోగులుగా నిట్టూర్చుతున్నారు. బిహార్లో సరైన ఉపాధి దొరక్క బతుకుజీవుడా అంటూ ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. యువత మెరుగైన నైపుణ్యం, విద్యా సామర్థ్యాల సముపార్జన కోసం ఆర్జనపై దృష్టిపెట్టారు. సంపాదించే ఆ కాసింత డబ్బుతో తర్వాత శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్కు వెళ్తున్నారు. ఇలాంటి యువ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని తేజస్వీ యాదవ్ ‘ఛత్ర యువ సంసద్’కార్యక్రమం మొదలెట్టారు. యువజన కమిషన్ను ఏర్పాటు చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని, వెనుకబడిన విద్యార్థులకు ఇంటి నుంచే ట్యూటర్ల సౌకర్యం కలి్పస్తామని హామీ గుప్పించారు. సైన్స్, గణితం, ఇంగ్లి‹Ùలో వెనుకబడిన విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు నేరుగా వెళ్లి వారి కోసం అదనపు సమయం కేటాయిస్తారని తేజస్వీ హామీ ఇచ్చారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థల్లో చేరేలా, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునే స్థాయిలో బిహార్ విద్యా వ్యవస్థను సంస్కరిస్తానని వాగ్దానం చేశారు. ఈ హామీల దృష్ట్యానే బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ను ఇష్టపడుతున్నట్లు యువ ఓటర్ల మనోగతం వెల్లడైందని తాజా సర్వేలో తేలింది. 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు అనుకూలంగా స్పందించారు.సోమన్నగారి రాజశేఖర్రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
యువతలో హార్ట్ స్ట్రోక్స్!
సాక్షి, హైదరాబాద్ : భారత యువతలో గుండెపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోంది. గతంలో 50–60 ఏళ్లకు పైబడిన వారికే హార్ట్స్ట్రోక్స్ పరిమితమయ్యేవి. అందుకు భిన్నంగా ఇప్పుడు 45 ఏళ్లలోపు వారు 15–20 శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం 45 ఏళ్లలోపు వారిలో ఇంతకంటే తక్కువ స్ట్రోక్ కేసులు సంభవిస్తున్నాయి. నగరాల్లో ఐటీ ఉద్యోగులు, నిపుణులు, అధిక స్క్రీన్ సమయం గడుపుతున్న విద్యార్థులు ముందస్తు వాస్కులర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 25–40 ఏళ్ల మధ్యలోని పురుషులు, మహిళలు గుండె సమస్యలకు గురవుతున్నారు. ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు జన్యుపరంగా హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2023 లాన్సెట్ నివేదిక, ఇతర తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే.. భారత్లో ఏటా 15–18 లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మరణాలకు రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా గుండెపోట్లు నిలుస్తున్నాయి. ప్రమాదకారకాలపై నిపుణుల మాట » ఆధునిక జీవనశైలి మన శరీరం కంటే వేగంగా మన ధమనులను వృద్ధాప్యం బారిన పడేలా చేస్తోంది. » మధుమేహం, అధిక రక్తపోటు,ధూమపానం, వాయు కాలుష్యం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు దీని పెరుగుదలకు కారణమవుతున్నాయి. » స్లీప్ అప్నియా–స్ట్రోక్ మధ్య బలమైన సంబంధం ఉంది. స్ట్రోక్తో బాధపడుతున్న వారిలో దాదాపు 50–70 శాతం మందికి స్లీప్ అప్నియా కూడా ఉంటుంది. ఈ పరిస్థితి ఒక వ్యక్తి రాత్రిపూట గురక పెట్టడానికి, పదేపదే మేల్కొనడానికి కారణమవుతుంది. దీని వలన ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి, రక్త నాళాలపై ఒత్తిడి వస్తుంది. » ప్రారంభ స్ట్రోక్ తర్వాత చికిత్స చేయకపోతే, రెండేళ్లలోపు పునరావృతమయ్యే అవకాశం 50 శాతం ఉంటుంది. ప్రతి నిమిషం విలువైనదియువ భారతీయుల జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి వారిని మరింతప్రమాదంలో పడేస్తున్నాయని కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్తో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు మిలియన్ల మెదడు కణాలు వేగంగా చనిపోతాయి కాబట్టి ఈ లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. అందువల్ల స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం చాలా విలువైనది. ఈ నేపథ్యంలో 2025లో ‘ఎవ్రీ మినిట్ కౌంట్స్’అనే ప్రచార అంశంతో గుండెపోట్ల నివారణ, లక్షణాల గుర్తింపు, సకాలంలో చికిత్స ప్రాముఖ్యతను వివరించేలా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఎలా గుర్తించాలి? ముఖం, చేయి లేదా కాలు యొక్క ఒకవైపుఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి, మాటల్లో అస్పష్టత, మసకబారిన దృష్టి, తలతిరగడం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లాంటి ముందస్తుహెచ్చరికలను విస్మరించకూడదు. ఈ లక్షణాలున్న వారిని సీటీ/ఎమ్మారై స్కాన్ సౌకర్యాలున్నఆసుపత్రికి తీసుకెళ్లాలి ప్రమాదాన్ని ఇలా తగ్గించుకోవచ్చు.. » గుండె జబ్బులను పూర్తిగా నివారించలేరు కానీ జీవనశైలిలో మార్పులు, అవగాహనతో ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. » ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్,అధిక చక్కెర పానీయాలు మానేయాలి. » ఆహారంలో పుష్కలంగా పండ్లు, కూరగాయలు,తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి. » ధూమపానం మానేయాలి. మద్యపానం పరిమితం చేయాలి. » క్రమం తప్పకుండా వ్యాయామం, జాగింగ్,యోగా చేయాలి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇతర అభిరుచులను అలవరుచుకుంటేఆందోళన తగ్గుతుంది. » రోజూ మంచి నిద్ర (7–8 గంటలు) అవసరం. » ఏడాదికోసారి రక్తపోటు, కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలు, ఈసీజీ లాంటి పరీక్షలు చేయించుకుంటే సమస్యలను ముందుగానేగుర్తించే అవకాశం ఉంటుంది. -
ఈవీలకు ‘చార్జింగ్’ పెంచాలి!
2025–26 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశంలో 91,726 విద్యుత్ వాహనాలు (ఈవీ) అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైనవి 44,172 మాత్రమే. కానీ ఇందుకు తగ్గట్టుగా చార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలోని పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 30లు. ఇందులో పనిచేస్తున్నవి 14,450. దేశంలో ఈవీలు పెరుగుతున్నంత వేగంగా చార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) గణాంకాల ప్రకారం.. 2024–25లో మొత్తంగా అమ్ముడైన ఈవీలు 1.1 లక్షలు. అదే, ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లోనే అమ్మకాలు 90 వేల మార్కును దాటేశాయి. 2014–15లో మొత్తం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా కేవలం 0.01 శాతం. అదే 2024–25లో 7.31 శాతం. కానీ ఇందుకు తగ్గట్టుగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు పెరగడం లేదు. 2021–22లో దేశంలో ఉన్న స్టేషన్లు 1,800. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఇవి 30 వేలకు పెరిగాయి. ఇందులో 15,550 పనిచేయడం లేదు. ప్రతి 50 కి.మీ.కి ఒకటి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని 91 శాతం జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు కనీసం ఒక ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ ఉంది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోలిస్తే మనదేశంలో చార్జింగ్ స్టేషన్లు, అందులోనూ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య తక్కువే. చైనాలో ప్రతి 100 కిలోమీటర్లకు 100 స్టేషన్లు ఉన్నాయి. అమెరికాలో ఈ సంఖ్య 70. అత్యధికంగా నార్వేలో 100 కి.మీ.కి 180 ఉన్నాయి. చైనాలోని ప్రతి 1,000 స్టేషన్లలో 45 శాతం ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు. ఈ సంఖ్య నార్వేలో అత్యధికంగా 70 శాతం. స్టేషన్లు – సమస్యలు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఈవీ చార్జర్లు చార్జింగ్కు పనికిరావడం లేదు. ఆయా కంపెనీల కార్లకు సంబంధించిన యాప్స్, చెల్లింపు వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం ఈవీల చార్జింగ్ ఇంటి దగ్గర లేదా పనిచేసే ప్రదేశాల్లోనే జరుగుతోంది. మెట్రో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉండే చార్జింగ్ స్టేషన్ల వినియోగం తక్కువగా ఉంటోందని, అందువల్ల తాము పెట్టిన పెట్టుబడులు కూడా గిట్టుబాటు కావడం లేదని కంపెనీలు అంటున్నాయి. 72,300 స్టేషన్ల లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహించడానికి ఫేమ్ 2 కింద ఇప్పటికే 7,400 స్టేషన్ల ఏర్పాటులో తోడ్పాటు అందించింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 72,300 స్టేషన్లు ఏర్పాటుచేయాలన్నది కేంద్రం లక్ష్యం. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ నివేదిక ప్రకారం.. 2030 నాటికి దేశంలో 1.32 లక్షల స్టేషన్లు అవసరమవుతాయి. సగటున ప్రతి 1,000 ఈవీలకు 45–50 ఉండాలి. మెట్రోల్లోనే 62 శాతం దేశంలోని చార్జింగ్ స్టేషన్లలో సుమారు 62 శాతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే ఉన్నాయి. కానీ, ఈవీల అమ్మకాలు పెరుగుతున్న మెట్రోయేతర నగరాల్లో మాత్రం 38 శాతమే ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాల్లో సగానికిపైగా టాప్ – 20 నగరాల్లో కాకుండా.. బిహార్, ఆంధ్రప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని చిన్న నగరాల్లోనే జరగడం గమనార్హం. -
విలాస వైభోగమే
వచ్చే పదేళ్లలో మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు.. తమకు నచ్చిన వాటిని కొనే స్థోమతతో, అత్యధికంగా ఖర్చు చేయగలిగే స్థితిలో ఉంటారు. అంటే ఒకప్పుడు అవసరాల కోసమే ఖర్చు చేసినవారు.. విలాసవంతమైన, లైఫ్స్టైల్ వస్తువులు, ఖరీదైన సేవలు, ప్రీమియం బ్రాండ్లు కొనేస్థాయికి ఎదుగుతారు. మొత్తం వ్యయంలో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న ఈ ఖర్చు వచ్చే ఐదేళ్లలో 43 శాతానికి పెరుగుతుందట. 2010లో 1,360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం.. 2031 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 5,242 డాలర్లకు చేరనుంది. బియాండ్ నెసెస్సిటీస్ @ ఇండియాస్ ఎఫ్లుయెంట్ డ్రివెన్ గ్రోత్’ పేరిట ప్రముఖ పెట్టుబడుల నిర్వహణ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.ప్రీమియం ఉత్పత్తులు, లైఫ్స్టైల్ వస్తువుల వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు హోటళ్లలో భోజనాలు, వినోదాలు, విహార యాత్రలు, అవసరం లేకపోయినా ఇంటికి విలాసవంతమైన వస్తువులు.. ఇలాంటి వాటికి అధిక వ్యయం చేస్తున్నారట. భారతదేశ వృద్ధి చిత్రం మారుతోందంటూ ‘బియాండ్ నెసెస్సిటీస్ @ ఇండియాస్ ఎఫ్లుయెంట్ డ్రివెన్ గ్రోత్’ పేరిట ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ ఆసక్తికర అంశాలను తెలిపింది. ఈక్విటీల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్లో వృద్ధి, బంగారం ధర అనూహ్యంగా పెరగడం.. ఇలాంటి అనేక అంశాలు ఇందుకు కారణం కానున్నాయని పేర్కొంది.ప్రజలు నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. బ్రాండ్ల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే, 2023–24లో చవకైన, ఎక్కువగా దొరికే (మాస్ మార్కెట్) వస్తువుల కంటే.. ఖరీదైన, విలాసవంతమైన వస్తువులకు గిరాకీ పెరిగింది. ప్రీమియం డిటర్జెంట్ల అమ్మకాలు 26 శాతం పెరిగితే.. మాస్ మార్కెట్ వస్తువుల అమ్మకాల్లో 7 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. సాధారణ టీ వినియోగం 10 శాతం పెరిగితే.. గ్రీన్ టీ వాడకం 25 శాతం పెరిగింది. స్పోర్ట్స్ ఫుట్వేర్ అమ్మకాలు 13 శాతానికిపైగా పెరిగితే, సాధారణ ఫుట్వేర్ అమ్మకాలు 8 శాతమే పెరిగాయి. విలాసాలు, ఖరీదైన వాటి కోసం దేశ ప్రజలు 2000లో చేసింది.. మొత్తం వ్యయంలో 25 శాతానికిపైనే ఉంది. ప్రస్తుతం 36 శాతంగా ఉన్న ఆ ఖర్చు 2030 నాటికి 43 శాతానికి పెరుగుతుందట. ఫ్యాక్టరీలు కాదు.. ఇళ్లు!ఎఫ్ఎమ్సీజీ అమ్మకాల పెరుగుదల రోజువారీ అలవాట్లలో మార్పును సూచిస్తే.. గృహోపకరణాల అమ్మకాలు భారతీయ గృహాలు ఎలా మారాయో చెబుతాయి. 2024లో దేశ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ రూ.6.45 లక్షల కోట్లు కాగా.. ఇది 2029 నాటికి రెట్టింపై రూ.12.9 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. అలాగే దేశంలోని కుటుంబాల పొదుపు మొత్తం 2023–24లో రూ.54 లక్షల కోట్లు కాగా.. 2030 నాటికి ఇది రూ.82 లక్షల కోట్లకు పెరుగుతుంది. అందుకే, ‘భారతదేశ అభివృద్ధి గాథను.. దేశంలోని ఫ్యాక్టరీలు కాదు, గృహాలు రచిస్తున్నాయి’ అని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. రిస్కులూ ఉన్నాయిఅధికాదాయ, మధ్య తరగతి వర్గాల అధిక వ్యయాలతో నడిచే ఈ ఆర్థిక ప్రగతికి రెండు ప్రధాన అడ్డంకులూ ఉన్నాయని నివేదిక తెలిపింది. అందులో మొదటిది ఉద్యోగ నాణ్యత. అంటే.. స్థిరమైన ఉద్యోగం ఉంటేనే మంచి సంపాదన ఉంటుంది. అప్పుడే ఖర్చులూ ఎక్కువగా చేయగలరు. యంత్రాలూ, ఏఐ వంటి వాటి వల్ల కోల్పోయే ఉద్యోగాల వల్ల ఈ అభివృద్ధికి విఘాతం ఏర్పడవచ్చు. అలాగే ఈక్విటీల్లో తగ్గుదలలు, బంగారం ధర పడిపోవడం వంటివి కూడా ఈ పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు.ఎగువ మధ్య తరగతి, శ్రీమంతులు!2010లో 1,360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2024 నాటికి రెట్టింపై 2,729 డాలర్లకు చేరిందని అంచనా. ఇది 2031 నాటికి 5,242 డాలర్లకు చేరుతుందట. 2010 నాటికి దేశ జనాభాలో సుమారు 68 శాతంగా ఉన్న పేద, నిరుపేద వర్గాల వారు.. 2015 నాటికి 58 శాతానికి తగ్గిపోయారు. 2035 నాటికి ఇది సుమారు 48 శాతానికి తగ్గిపోతుందని అంచనా. ఎగువ మధ్య తరగతి, శ్రీమంతుల శాతం 2035 నాటికి 24 శాతానికి చేరనుంది.


