2 గంటలకో స్కామ్‌ మెసేజ్‌ | Cybercrimes with deepfake voice and QR codes | Sakshi
Sakshi News home page

2 గంటలకో స్కామ్‌ మెసేజ్‌

Feb 8 2026 5:08 AM | Updated on Feb 8 2026 5:08 AM

Cybercrimes with deepfake voice and QR codes

సందేశం, మెయిల్, సోషల్‌ మీడియా రూపంలో రాక 

లింక్‌ లేకుండా మెసేజ్‌లతో వల వేస్తున్న నేరగాళ్లు 

బాధితులను మళ్లీ లక్ష్యంగా చేసుకుంటున్న స్కామర్స్‌

ఆన్‌లైన్‌ వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో డిజిటల్‌ మోసాలు ఆందోళనకర స్థాయిలో అధికమవుతున్నాయి. నమ్మదగిన సందేశాలు, డీప్‌ఫేక్‌ వాయిస్, క్యూఆర్‌ కోడ్స్‌తో సైబర్‌ నేరగాళ్లు వల వేస్తున్నారు. తమను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకున్న విషయం అత్యధికులు గ్రహించడం లేదు. నష్టం జరిగాకే తాము మోసపోయినట్టు గుర్తిస్తున్నారు. కొత్త నంబర్లు, మెసేజ్‌ల ద్వారా మొబైల్‌కు వచ్చే లింక్స్‌ను తెరవకూడదని ఆర్‌బీఐ, బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు హెచ్చరిస్తున్నా, నేరాల సంఖ్య తగ్గడం లేదు.

రోజుకు సగటున 13 మెసేజ్‌లు..: సందేశం, ఈ–మెయిల్‌ రూపంలో, సోషల్‌ మీడియా యాప్స్‌లో సగటున రోజుకు 13 మోసపూరిత (స్కామ్‌) మెసేజ్‌లను భారతీయులు అందుకుంటున్నారు. అంటే రెండు గంటలకో స్కామ్‌ సందేశం వస్తోందన్న మాట. ఆన్‌లైన్‌లో ఏది నిజమైనదో, ఏది నకిలీదో తెలుసుకోవడానికి సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 102 గంటలు సమయం వెచ్చిస్తున్నారని ఆన్‌లైన్‌ ప్రొటెక్షన్‌ సేవలు అందిస్తున్న అంతర్జాతీయ దిగ్గజం మ్యాకఫీ ‘2026 స్టేట్‌ ఆఫ్‌ ద స్కామివర్స్‌’నివేదిక వెల్లడించింది. స్కామర్స్‌ కేవలం 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే స్కామ్‌ పూర్తి చేస్తున్నారని తెలిపింది. బాధితులు సగటున రూ.93,915 నష్టపోయినట్టు వెల్లడించింది.  

లింక్‌ లేకుండానే.. 
డెలివరీ నోటీసులు, సబ్‌స్క్రిప్షన్‌ పునరుద్ధరణ, బ్యాంక్‌ అలర్ట్‌ వంటి సందేశాలు కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి సైబర్‌ నేరగాళ్లు ఉపయోగించే సాధారణ వ్యూహాలుగా మారాయి. కొత్త ఎత్తుగడ ఏమంటే అనుమానాస్పద సోషల్‌ మీడియా సందేశాలలో 20% ఎటువంటి లింక్‌ లేకుండా వస్తున్నాయి. 66% మంది వినియోగదారులు ఈ లింక్‌ రహిత సందేశాలకు స్పందించారు. స్కామర్ల ఉచ్చులో పడడానికి ఈ అంశం కూడా కారణమైంది. రోజుకు కనీసం నాలుగు డీప్‌ఫేక్‌ వీడియోలు తమకు ఎదురవుతున్నట్టు వినియోగదారులు చెబుతున్నారు. డీప్‌ఫేక్‌ వీడియోల్లో 65% ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఐదుగురిలో ఒకరు వాయిస్‌–క్లోన్‌ స్కామ్‌ను ఎదుర్కొన్నారు. వాయిస్‌–క్లోన్‌ అంటే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బ్యాంక్‌ లేదా ప్రభుత్వ అధికారుల గొంతును అనుకరిస్తూ చేసే వాయిస్‌ మెసేజ్‌ అన్నమాట.  

అధునాతన వ్యూహాలతో.. 
సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70% మంది గత సంవత్సరం తమ సోషల్‌ మీడియా ఖాతాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను తెరవడంలో ఏడాది క్రితం కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉన్నామని 82% మంది చెప్పారు. అయినా, స్కామర్లు అధునాతన వ్యూహాల ద్వారా ఇటువంటి వినియోగదారులను కూడా బోల్తా కొట్టిస్తున్నారు. నెటిజన్లను నమ్మించేందుకు సైబర్‌ నేరగాళ్లు ఏఐ, అధునాతన డిజిటల్‌ సాధనాలను ఉపయోగిస్తూ ఆర్‌బీఐ, బ్యాంకులు, ట్రాయ్, ఆధార్, ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లతో సందేశాలను పంపడంతోపాటు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు.  

సర్వే గురించి.. 
నివేదిక పేరు: మ్యాకఫీ 2026 స్టేట్‌ ఆఫ్‌ ద స్కామివర్స్‌ 
ఎందుకు: ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించి నేరగాళ్ల వైఖరి, ప్రవర్తన, బాధితుల అనుభవాలను తెలుసుకోవడానికి 
 ఏఏ దేశాలు: భారత్, యూఎస్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌ 
ఎప్పుడు: 2025 నవంబర్‌లో సర్వే నిర్వహణ 
ఎవరెవరు: 18 ఏళ్లు పైబడిన 7,592 మందిపై 
విధానం: ఆన్‌లైన్‌ వేదికగా  

సర్వేలో పాల్గొన్న 87% మంది భారతీయులు తాము వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌ స్కామ్‌ను అనుభవించామని చెబుతున్నారు.
సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఆర్థికంగా నష్టపోయినట్టు 51% మంది వెల్లడించారు.  

ఒక స్కామర్‌ తన లక్ష్యాన్ని మోసం చేసి డబ్బు లేదా సమాచారాన్ని దొంగిలించడానికి పట్టిన సమయం కేవలం 5 నిమిషాలే.
ఒక సంవత్సరం క్రితం కంటే నేడు తమ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉందని 63% మంది నమ్ముతున్నారు.

స్కామ్‌ బాధితుల్లో 24% మందిని ఏడాదిలోపే సైబర్‌ నేరగాళ్లు మళ్లీ లక్ష్యంగా చేసుకున్నారు.  
90% మంది మోసపూరిత క్యూఆర్‌ కోడ్‌ అందుకున్నారు. స్కాన్‌ చేయగానే ప్రమాదకర స్థాయికి  38% మంది చేరుకున్నారు.
డీప్‌ఫేక్‌ స్కామ్‌ను గుర్తిస్తామన్న నమ్మకం లేదని, తమను తాము రక్షించుకోలేమని మూడింట ఒక వంతుకుపైగా మంది తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement