న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన 9వ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తన వయసు, పదవీ విరమణపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని.. గత ఏడాది సెప్టెంబర్లో తాను 75వ ఏట అడుగుపెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. తన పుట్టినరోజున ఒక నేత తనకు ఫోన్ చేసి ‘మీకు 75 ఏళ్లు నిండాయి కదా’.. అని అన్నారని, దానికి తాను స్పందిస్తూ ‘75 ఏళ్లు పూర్తి కాలేదు, ఇంకా 25 ఏళ్లు మిగిలే ఉన్నాయి’ అని బదులిచ్చినట్లు ప్రధాని తెలిపారు. గడిచిన కాలం కంటే, దేశం కోసం ఇంకా చేయాల్సిన పనులనే తాను లెక్కిస్తానని ప్రధాని మోదీ అన్నారు.
బీజేపీలో 75 ఏళ్లు నిండిన నేతలు క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలనే అప్రకటిత నిబంధన గతంలో చర్చనీయాంశమైంది. ఇదే క్రమంలో మోదీ వయసుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో చేసిన వ్యాఖ్యలను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ప్రస్తావిస్తూ, గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లను ఇదే వయస్సు సాకుతో పక్కన పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత నాయకత్వానికి ఈ నిబంధన వర్తిస్తుందో లేదో చూడాలని ఆయన సవాల్ విసిరారు.
ప్రధాని మోదీ నాయకత్వంపై బీజేపీ అగ్రనేతలు పూర్తి భరోసా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా 75 ఏళ్లకు రిటైర్ కావాలనే నిబంధన లేదని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తరఫున మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని వారు చెప్పారు. అటు మోహన్ భగవత్ సైతం తన వ్యాఖ్యలను వివరణ ఇస్తూ, తాను ఎవరినీ రిటైర్ కావాలని సూచించలేదని, కేవలం ఒక సందర్భాన్ని మాత్రమే ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి (2047), దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తన ఏకైక లక్ష్యమని ప్రధాని మోదీ గతంలో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ


