సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ రాష్ట్ర పోలీసు శాఖపై పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేవంత్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావుకు సర్కార్ ఝలక్ ఇచ్చింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీవీఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు... ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలా సార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు.. విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.


