రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని అశోక్ నగర్ జిల్లాలో విషాదకర ఉదంతం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్యకు పాల్పడగా, అందులో యువ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని మిహిర్గా పోలీసులు గుర్తించారు. కోల్కతాలో సీఏ పూర్తి చేసిన మిహిర్, ఇటీవలే రాంచీలోని తమ ఇంటికి తిరిగి వచ్చాడు.
పోలీసుల కథనం ప్రకారం మిహిర్ తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పొరుగువారితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతడు మృతి చెందాడు. మిహిర్ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే, అతని తల్లి స్నేహ అఖౌరీ, 14 ఏళ్ల చెల్లెలు కూడా విషం తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. స్నేహ అఖౌరీ జార్ఖండ్ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వారిద్దరినీ రాంచీలోని గురునానక్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే ఇంట్లో కుమారుడు ఉరివేసుకోవడం, వెనువెంటనే తల్లి, కుమార్తె విషం సేవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు మిహిర్ కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని సమాచారం. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. వీరి కుటుంబంపై ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒత్తిళ్లు బయటకు కనిపించకపోవడంతో, ఈ ఆత్మహత్యాయత్నాల వెనుక ఉన్న కారణాలు అంతుచిక్కడం లేదు.
పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఆధారాలు సేకరించాయి. ఈ సామూహిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె స్పృహలోకి వస్తేనే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘సింధు’ వివాదం: ‘హేగ్’ఆదేశాలపై భారత్ ఆగ్రహం


