పావగడ( కర్ణాటక): మహిళ మృతదేహానికి అంత్యక్రియల విషయంలో తాలూకాలోని భూపూరు తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాలూకాలోని భూపూరు తండా గ్రామానికి చెందిన రాజునాయక సరోజబాయి దంపతుల కుమార్తె శృతి (20)కి ఏడాది క్రితం తన సమీప బంధువు పవన్ కళ్యాణ్తో వివాహం జరిగింది. పవన్ కళ్యాణ్ బెంగుళూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తుండటంతో యలహంకలో కాపురం పెట్టారు.
అయితే ఏమైందో ఏమో తెలియదు కాని గత శనివారం మధ్యాహ్నం శృతి తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు భర్త కారణమని మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈక్రమంలో మంగళవారం శృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఆమె మృతదేహాన్ని భర్త నూతనంగా నిర్మించిన ఇంటి ఎదుట ఖననం చేశారు. విషయం తెలుసుకున్న తిరుమణి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి మరో చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను తిరుమణి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది.


