త్రిస్సూర్: కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘సురేష్ గోపి ఎఫెక్ట్’ రెండేళ్లకే కనుమరుగైంది. 2024లో త్రిస్సూర్లో బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఆ స్టార్ డమ్, 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా రెండు లక్షల ఓట్ల పతనానికి దారితీసింది. 2024 సాధారణ ఎన్నికల్లో త్రిస్సూర్లో బీజేపీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అంతకు ముందు యూడీఎఫ్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్కు ఉన్న 93 వేల ఓట్ల మెజారిటీని తలకిందులు చేసి, ఏకంగా 74 వేల పైచిలుకు మెజారిటీతో సురేష్ గోపి విజయం సాధించారు.
రాష్ట్రంలో బీజేపీకి ఎదురైన ఎన్నో ఓటముల తర్వాత తన ఇమేజ్తో కేరళ రాజకీయాల్లో సురేష్ గోపి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకుని, ఎన్డీఏకు ఘన విజయాన్ని అందించారు. కానీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ‘మంచి రోజులు’ ఎంతో కాలం నిలవలేదు. పదవిలోకి వచ్చిన కొద్ది కాలానికే సురేష్ గోపి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఆయన నోటి దురుసు, ప్రజలతో వ్యవహరించే తీరు ఓటర్లతో పాటు సొంత పార్టీ వర్గాలను కూడా తీవ్రంగా నిరాశపరిచాయనే ఆరోపణలున్నాయి.
గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేపట్టిన ‘కాలుంక్ డిబేట్’లో సహాయం కోసం వచ్చిన ఓ వృద్ధుడిని ఆయన అవమానించారనే ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం చేశాయి. అలాగే మధ్యతరగతి విద్యావంతులను ఆకర్షించేందుకు తెచ్చిన ‘ఎస్జీ కాఫీ టైమ్స్’ కార్యక్రమం కూడా పూర్తిగా విఫలమై, ప్రతిపక్షాల విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. తాజా ఎన్నికల గణాంకాలు ఎన్డీఏ పతనానికి అద్దం పడుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో 5,55,007 ఓట్లు (37.8%) సాధించి శిఖరాగ్రాన నిలిచిన బీజేపీ, 2025 స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 3,96,808 ఓట్లకు పడిపోయింది. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలు ముగిసే సరికి ఆ ఓట్ బ్యాంక్ 3,55,757 కి దిగజారింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలో ఏకంగా రెండు లక్షల ఓట్లు గల్లంతయ్యాయి.
ఇది కూడా చదవండి: బాంబు పేలుళ్లు.. దద్దరిల్లిన జలంధర్, అమృత్సర్


