breaking news
Tamil Nadu
-
క్లుప్తంగా
మంజా దారంతో ప్రమాదం తిరువొత్తియూరు: చైన్నె కొరుక్కుపేట ప్రాంతానికి చెందిన ప్రకాష్ జైన్(67) ఇతను గత 6 సంవత్సరాలుగా చైన్నె మాధవరంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం పని ముగించుకుని, మూలక్కాడై ఫ్లైఓవర్ మీదుగా బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు తెగిపడిన మంజా దారం అతని ముఖానికి తగిలి కోసుకుపోయింది. దీంతో ప్రకాష్ జైన్ ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులో పడిపోయాడు. చుట్టుపక్కల వారు రక్షించి, అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రకాష్జైన్ ముఖానికి కుట్లు వేసి, ఇంటెన్సివ్ కేర్లో చికిత్స అందిస్తున్నారు. ఒక వేళ అది మెడకు తగిలి ఉంటే, అతని ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటి చర్యలను పోలీసులు తక్షణమే అడ్డుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొడుంగయ్యూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఫ్లైఓవర్ నుంచి కిందపడిన కారు –యువకుడికి తీవ్రగాయాలు తిరువొత్తియూర్: వంతెన పైనుంచి కారు కిందపడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చైన్నె కోడంబాక్కం, అండవర్ నగర్కు చెందిన సాధిక్బాషా కుమారుడు సల్మాన్ (19). ఇతను రాయపేటలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం తల్లితో చెప్పి అంబత్తూరులోని స్నేహితుడిని కలవడానికి లగ్జరీ కారులో వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో మధురవాయల్ బైపాస్ రోడ్డులో పోరూరు వైపు తిరిగి వెళుతున్నాడు. ఆ సమయంలో కారు అదుపుతప్పి మధురవాయిల్ 30 అడుగల ఫ్లైఓవర్ నుంచి కింద బోల్తాపడింది. ఈఘటనలో సల్మాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అటుగా వెళుతున్న వాహనదారులు తీవ్రంగా గాయపడిన సల్మాన్ను కారులో నుంచి బయటకు తీసి కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. మధురవాయిల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంతృప్తి చెందేలా రథసప్తమి ఏర్పాట్లు –టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల:తిరుమలలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న రథ సప్తమి వేడుకలకు భక్తుల సంతృప్తి చెందేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరచ్రందనం కేసులో ఒకరికి ఐదేళ్ల జైలు తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎరచ్రందనం చెట్లను నరకడానికి ప్రయత్నించిన కేసులో తమిళనాడు, కృష్ణగిరి జిల్లాకు చెందిన మురుగన్కు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషన్న్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక దళం సిబ్బంది 2017లో శేషాచలం, నాగపట్ల ఈస్ట్ బీట్, చామల రేంజ్ అటవీ ప్రాంతంలో తనిఖీలు చేశారు. నిందితుడు మురుగన్ అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశించడాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించి, అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరపరిచారు. మురుగన్పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఊంజల్ సేవలో అమ్మవారు నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పద్మావతీ అమ్మవారు ఊయల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతీ అమ్మవారిని సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై అధిష్టింపజేశారు. -
వైభవంగా తీర్థవారి
–పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తిరువళ్లూరు: ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్య వీరరాఘవుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం తీర్ధవారి నిర్వహించారు. తిరువళ్లూరులో వైద్య వీరరాఘవుడి ఆలయంలో ప్రతి ఏటా తైమాసం బ్రహ్మోత్సవాలను పది రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు గత 15న ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతిరోజూ స్వామి వారు వాహనంపై భక్తులకు దర్శనమివ్వడంతో పాటు మాడ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో తొమ్మిదవ రోజైన శుక్రవారం ఉదయం తీర్థఽవారి నిర్వహించారు. అనంతరం తిరుమంజనం నిర్వహించిన ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామి వారు శ్రీదేవి భూదేవిలతో కలిసి దర్శనమిచ్చారు. రాత్రి విజయకోటి విమాన వాహనసేవను వైభవంగా నిర్వహించారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
వేలూరు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగించడంపై అవగాహన, వివిధ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం, విద్యార్థులతో అవగాహన ర్యాలీ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ కులమతాలు తేడా లేకుండా ఓటు వేసే హక్కు ఉందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి ప్రతి తాలూకాలో అవగాహన కార్యక్రమాలు చేపడుతునట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించడంపై గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఓటరు చేతిలోనే దేశంలోని ప్రధాన మంత్రిని, ముఖ్యమంత్రిని కాని, రాజకీయ నాయకులను ఎంత స్థాయికి చేయాలన్న కీలక ఆయుధం ఓటుతోనే ఉందన్నారు. ఓటు అనే ఆయుధంతో ఎంత స్థాయి రాజకీయ నాయకుడినైనా ఎన్నుకునే అవకాశం ఉంటుందన్నారు. నచ్చిన రాజకీయ నాయకులకు మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి దేశ భవిష్యత్ను కాపాడాల్సిన బాధ్యత యువత చేతిలోనే ఉందన్నారు. అనంతరం అవగాహన ర్యాలీని ప్రారంభించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ ప్రేమలత, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సురక్షితమైన క్యాంపస్ మద్రాస్ ఐఐటీ
కొరుక్కుపేట: ఐఐటీ మద్రాస్ సంతోషకరమైన, సురక్షితమైన క్యాంపస్ అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి అన్నారు. ఐఐటీ మద్రాస్ శ్రీటువార్డ్స్ ఏ హ్యాపీ, సేఫ్ అండ్ సెక్యూర్ క్యాంపస్శ్రీ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది విద్యార్థుల శ్రేయస్సు, భద్రత , సహాయక క్యాంపస్ వాతావరణం పట్ల దాని నిరంతర నిబద్ధతను తెలుపుతూ ఈ కార్యక్రమం సాగింది.కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్లోని స్టూడెంట్ అంబుడ్స్ ,రిటైర్డ్ ఐపీఎస్ జి. తిలగవతి, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ప్రసంగించారు. బాధ్యత, నమ్మకం ఆధారిత వ్యవస్థలు, సానుకూల విద్యార్థి అనుభవాన్ని వివరిస్తూ ఐఐటి మద్రాసు ప్రాముఖ్యతను తెలియజేశారు. తిలగవతి మాట్లాడుతూ ఉపాధి కోరుకునే బదులు, మీరు యజమానులుగా ఉండాలని, మీరు స్వంత సంస్థలను ప్రారంభించి వ్యవస్థాపకులుగా మారాలని ఆయన విద్యార్థులకు సూచించారు. -
డీఎంకేలోకి మాణిక్కరాజా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఆపార్టీ నేత టీటీవీ సన్నిహితుడు మాణిక్కరాజా డీఎంకేలో చేరారు. శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకేను మళ్లీ ఏకం చేద్దామన్న నినాదంతో ముందుకెళ్తూ వచ్చిన టీటీవీ తాజాగా మళ్లీ ఎన్డీఏ పక్షాన చేరడంలో ఆపార్టీలో వ్యతిరేకత బయలుదేరింది. అనేక మంది నేతలు టీటీవీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీటీవి సన్నిహితుడైన డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మాణిక్క రాజా పార్టీని వీడేందుకు నిర్ణయించారు. మంత్రి గీతా జీవన్, ఎంపీ కనిమొళితో కలసి డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంకు వచ్చారు. అక్కడ స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. తూత్తుకుడి జిల్లాలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు కీలంగా ఉన్న మాణిక్కరాజా బయటకు వెళ్లడం ఆ పార్టీకి గట్టి దెబ్బగా మారింది. ఈ విషయంగా మాణిక్కరాజా మాట్లాడుతూ టీటీవీ దినకరన్ సైతం పళణిస్వామిలా నియంతంగా మారి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావాలన్న నినాదంతో ముందుకు సాగి, ఇప్పుడు స్వలాభం కోసం ఎన్డీఏతో చేతులు కలిపారని మండిపడ్డారు. మరెందరో ఆ పార్టీని వీడి డీఎంకేలో చేరబోతున్నట్టు ప్రకటించారు. -
వేపంబట్టు బ్రిడ్జి ప్రారంభం
తిరువళ్లూరు: తిరువళ్లూరులో సమీపంలో నూతనంగా రూ.44.55కోట్లతో నిర్మించిన వేపంబట్టు బ్రిడ్జిని రాష్ట్ర రహదారుల శాఖమంత్రి వేలు ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు వద్ద బ్రిడ్జి నిర్మాణానాకి 15 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర కాలంలో పనులు పూర్తి చేయాల్సి క్రమంలో కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల కోర్టు బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత ఏడాది పనులను పునఃప్రారంబించారు. పనులు పూర్తయిన క్రమంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి వేలు ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. మంత్రి మాట్లాడుతూ 2009వ సంంవత్సరంలో 29.5 కోట్ల వ్యయంతో బ్రిడ్జి ప్రారంబించినట్టు తెలిపారు. అయితే కోర్టు కేసు కారణంగా నిర్మాణం ఆలస్యమైనట్టు తెలిపారు. అయితే కోర్టు కేసుల కారణంగా రూ.24.18 కోట్లు నిధులు అదనంగా అవసరం ఏర్పడిందన్న ఆయన, ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణంతో 20 గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలకు సౌకర్యంగా మారిందన్నారు. పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, కలెక్టర్ ప్రతాప్పాల్గొన్నారు. -
రూ.3కోట్లతో మెట్రోపార్కు
– ప్రారంభించిన ఉదయనిధి సాక్షి, చైన్నె: మెట్రో రైలు ప్రధాన కార్యాలయం ఆవరణలో రూ.3 కోట్లతో మెట్రో పార్కును ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. చైన్నె నందనంలో మెట్రో రైలు ప్రధాన కార్యాలయం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ 3750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3.50 కోట్ల వ్యయంతో మెట్రో పార్కు క్రీడా ప్రాంగణం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్రజలు పార్కులో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పార్కును, క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో ఈ పార్కును డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రారంభించారు. అలాగే క్రీడా ప్రాంగణంలోని ఏర్పాట్లను పరిశీలించారు. కాసేపు ఆయన అక్కడి సిబ్బందితో కలిసి క్రీడలలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ ప్రియ, మెట్రో రైలు డైరెక్టర్ సిద్ధిక్, గ్రేటర్ చైన్నె కమిషనర్ కుమర గురుబరన్ తదితరులు పాల్గొన్నారు. మెట్రో రైలుకు సంబంధించి రైల్వే స్టేషన్, పరిసరాలలో ఖాళీగా స్థలం ఉంటే అక్కడ పార్కు రూపకల్పన దిశగా కార్పొరేషన్ వర్గాలు చర్యలు విస్తృతం చేయడానికి నిర్ణయించారు. -
చాంపియన్ ఆఫ్ హ్యూమానిటీ అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: హిందూస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (హెచ్సీసీ) 80వ చాంబర్ దినోత్సవం సందర్భంగా వ్యాపార శ్రేష్ఠతకు, సమాజానికి విశేష కృషిచేసినందుకు పలువురికి చాంపియన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డులు ప్రదానం చేశారు. హెచ్సీసీ అధ్యక్షుడు టి. రమేష్ దుగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి టి. మనో తంగరాజ్, ఎం ఆసియా ఇంజినీరింగ్ చైర్మన్ సహ వ్యవస్థాపకులు మహీందర్ కె జైన్,రామరాజ్ కాటన్ వ్యవస్థాపక చైర్మన్ కేఆర్ నాగరాజన్ హాజరయ్యారు. రామరాజ్కాటన్న్ను వారి వ్యాపార నైపుణ్యానికి, అమర్ సేవా సంఘ సమాజ సేవకు చాంపియన్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు ప్రకటించారు. రామరాజ్కాటన్ తరఫున ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నాగరాజన్ ఈ అవార్డును స్వీకరించారు. అమర్ సేవా సంఘం తరఫున దాని వ్యవస్థాపక చైర్మన్ ఎస్. రామకృష్ణన్, సహ వ్యవస్థాపక కార్యదర్శి శంకరరామన్ అవార్డును అందుకున్నారు. -
శ్రీకారం
చైన్నెలో ఏడు దశాబ్దాల సినీ చరిత్ర కలిగిన సంస్థ ప్రసాద్ స్టూడియో. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కలిగిన ఈ సంస్థ కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ డిజిటల్ కాలంలోనూ తన ప్రాముఖ్యతను చాటుకుంటోంది. సినీ సాంకేతిక పరిజ్ఞానంలో గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తోంది. తాజాగా సౌదీ అరేబియాలో తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో వరల్డ్ సౌండ్ అండ్ విజన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. – తమిళసినిమా: -
ఫుట్బాల్ ఆడుతూ విద్యార్థిని మృతి
సేలం: సేలం జిల్లాలోని ఆత్తూర్ సమీపంలోని అరింజ్ఞర్ అన్నా ప్రభుత్వ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియదర్శిని(17) హోసూర్లోని తెప్పకుళం ప్రాంతంలో నివశిస్తున్నారు. గత సంవత్సరం కౌన్సెలింగ్లో అరింజ్ఞర్ అన్నా కళాశాల నుండి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పొందిన తర్వాత, ఆమె కళాశాల హాస్టల్లో చదువుతోంది. ఈ పరిస్థితిలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆట స్థలంలో తోటి విద్యార్థులతో ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు, ఆమె బంతిని కొట్టిన తర్వాత అకస్మాత్తుగా పడిపోయింది. ఆ సమయంలో ఆమె అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను చూసిన తోటి విద్యార్థులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు విద్యార్థిని అప్పటికే మరణించిందని ప్రకటించారు. చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఆమె మరణించింది. ఆ తర్వాత శవ పరీక్ష కోసం అత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న ఆతూర్ గ్రామీణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవపరీక్ష కోసం ఆతూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆతూర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు తోటి విద్యార్థులు గుమిగూడారు. ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేకపోవడంతో శవపరీక్ష కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీని తరువాత అత్తూర్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి, వారి తోటి విద్యార్థులతో కలిసి కళాశాల విద్యార్థిని మరణంపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గాంధీ పేరు కొనసాగించాల్సిందే!
సాక్షి, చైన్నె:ఉపాధి హామీ పథకానికి మహాత్మ గాంధీ పేరును తొలగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలను అసెంబ్లీలో తీవ్రంగా ఖండించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికామిషన్–గ్రామీణ(వీబీ–జీరామ్జీ)తో రాష్ట్రాల నెత్తిన ఆర్థిక భారం, నిధుల పిడుగు పడ్డట్టేనని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని తీర్మానం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నాలుగో రోజు శుక్రవారం జమ్ములో జరిగిన ప్రమాదంలో మరణించిన ఆర్మీ వీరులకు సభ్యులు సంతాపం తెలియజేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి శివశంకర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సులు లాభాలతోనే నడుస్తున్నాయని వివరించారు. కన్యాకుమారిలోనూ పర్యాటక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ విద్యా నాణ్యత మెరుగు, కళాశాలలో మౌలిక వసతుల విస్తృతానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. మేట్టూరులోని జ్ఞాన దండపాణి ఆలయంలో రూ.2.38 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టామని మంత్రి శేఖర్బాబు ప్రకటించారు. కుమ్మర్ల జీవనోపాధి కల్పన దిశగా బంక మట్టి తవ్వకాలకు అనుమతి ఇస్తూ మంత్రి రాజకన్నప్పన్ వ్యాఖ్యలు చేశారు. మైలాడుతురైలో సామా జిక న్యాయ కళాశాలల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మెయ్యనాథన్ తెలిపా రు. తిరువణ్ణామలైలో మినీ విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు. పల్లావరం–పంబల్–కుండ్రత్తూరు మధ్య ఫోర్ వే పనులకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కరుణానిధి కోరారు. ఆరోగ్యశాఖా మంత్రి ఎం సుబ్రమణియన్ స్పందిస్తూ పేరావూరని ఆస్పత్రిలో రూ.5 కోట్లతో అదనపు వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని ప్రకటించారు. 2002లో ఆర్సీహెచ్ ఉద్యోగులకు రూ.500 జీతం ఇస్తుండగా, తాజాగా రూ.27 వేల వరకు జీతం పొందుతున్నారని పేర్కొన్నారు. ఐదేళ్లలో 2 వేల కొత్త వైద్య భవనాలను ప్రారంభించామని వివరించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ మినీ స్టేడియంలను మరింత విస్తతం చేయనున్నామని ప్రకటించారు. గాంధీ పేరుకు మద్దతుగా తీర్మానం ప్రశ్నోత్తరాల అనంతరం సభలో సీఎం స్టాలిన్ ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పేద, వెనుకబడిన, అణగారిన ప్రజలకు సామాజిక భద్రతగా ఉన్న ఈ పథకాన్ని కేంద్రం ప్రణాళిక బద్ధంగా నిర్వీర్యం చేయడానికి సన్నద్ధమైందని ధ్వజమెత్తారు. ప్రఽతి పక్ష నేత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తాజాగా వెళ్లారని గుర్తు చేస్తూ, ఈసందర్భంగా ఆయన ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నాన ని వివరించారు. ఈ ప్రశ్నలన్నింటికి ప్రధాని నరేంద్రమోదీ ద్వారా సమాధానం ఇప్పిస్తారా అని సవా ల్ చేశారు. అనంతరం తమిళనాడు శాసనసభలో ఉపాధి హామీ చట్టం నిబద్ధత ప్రణాళికకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించింది, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ పథకానికి పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ, మహాత్మా గాంధీ పేరు కొనసాగించాల్సిందేనని తీర్మానం చేసి ఆమోదించారు. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగానే ఈ పథకానికి పేరు మార్చిందని ధ్వజమెత్తారు. జీరామ్జీతో రాష్ట్ర ప్రభుత్వాలకు నిధుల విడుదల వెంటనే జరగదని, ఉద్దేశ పూర్వకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రాల నెత్తిన ఆర్థిక, నిధుల భారం మోపేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. అనంతరం సభలో మంత్రి రాజేంద్రన్ ఓ ముసాయిదాను దాఖలు చేశారు. మహాబలిపురం, కన్యాకుమారి ప్రగతి లక్ష్యంగా ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే బ్రాయిలర్ కోళ్ల పెంపకందారులకు సంబంధించి ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. వారి ప్రయోజనాలే లక్ష్యంగా ఇందులో ముఖ్య అంశాలు పేర్కొన్నారు. అసెంబ్లీలో అన్బుమణి మద్దతు పీ ఎంకే ఎమ్మెల్యే సదాశివం, రాందాసు మద్దతు పీఎంకే ఎమ్మెల్యే జీకే మణి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ ఇద్దరికి క్లాస్ తీసుకున్నారు. -
సురేందర్తో ఐసరి గణేశ్ చిత్రం
తమిళసినిమా: నూతన కళాకారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ముందుండే డా.ఐసరిగణేశ్ తాజాగా మరో వర్ధమాన దర్శకుడికి అవకాశం కల్పిస్తున్నారు. అలా నటుడు ఆర్జే బాలాజీ నుంచి ప్రస్తుతం మెగాఫోన్ పట్టిన యూట్యూబర్ వీజే.సిద్ధు వరకు పలువురు నూతన దర్శకులకు అవకాశాలను కల్పించి ప్రోత్సహిస్తున్నారు. వీజే.సిద్ధు దర్శకత్వంలో దయంకరం అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఐసరి గణేశ్ తాజాగా కేజే.సుంరేందర్కు తమ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని కల్పించారు. నూతన నటీనటులతో మాయాబింబం అనే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దర్శకుడు సురేందర్. నలుగురు మిత్రుల మధ్య జరిగే ఇతి వృత్తంతో సాగే ఈ చిత్రంలో అందులో వైద్య విద్య చదువుతున్న ఒక యువకుడికి ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం చేసే యువతికి మద్య కలిగే ప్రేమను చాలా కొత్తగా, ఆలోచింపజేసే విధంగా తెరపై ఆవిష్కరింపజేశారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం చూసిన డా.ఐసరిగణేశ్ చాలా బాగుందని ప్రశంసించడంతో పాటు ఈ చిత్ర దర్శకుడికి తమ సంస్థలో దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించారు. దీని గురించి ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మాయాబింబం చూడగానే నచ్చేసిందన్నారు. చిత్ర దర్శకుడు సురేందర్కు తమ సంస్థలో చిత్రం చేసే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అందుకుగానూ ఒప్పందం చేసినట్లు ఐసరి గణేశ్ పేర్కొన్నారు. -
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ 13వ చిత్రం
తమిళసినిమా: ఇంతకుముందు పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్. ఇటీవల ఈ సంస్థ నిర్మాత ఎస్ఎస్.లలిత్కుమార్ నిర్మించిన చిత్రం సిరై అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఇద్దరు హీరోలతో ఒకరిగా పరిచయమైన అక్షయ్కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న రెండవ చిత్రం ఇది. జాఫర్ సాధిక్, నోబల్ కే.జేమ్స్, అరుణాచలేశ్వరన్ .పీఏ, షారిక్ హాసన్, డ్యూడ్ చిత్రం పేమ్ ఐశ్వర్యశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్.లలిత్కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్ వడివేల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లియోన్ బ్రిటో చాయాగ్రహణం, జన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఫన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. ఏకే.విష్ణుకుమార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నట్లు, చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. కాగా ఇంకా టైటిల్ను నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
అధిక సీట్లు అడుగుదామా?
సాక్షి, చైన్నె: డీఎంకే నుంచి ఈసారి అధిక సీట్లు ఆశిద్దామా వద్దా అన్న దిశగా జిల్లాల కార్యదర్శుల అభిప్రాయ సేకరణలో ఎండీఎంకే నేత వైగో శుక్రవారం నిమగ్నమయ్యారు. ఎగ్మూర్లోని పార్టీ కార్యాలయంలో జిల్లాల కార్యదర్శుల సమావేశాన్ని వైగో నిర్వహించారు. ఇందులో పార్టీ ఎంపీ దురై వైగోతోపాటుగా ముఖ్య నేతలు పాల్గొన్నారు. 2021 ఎన్నికలలో ఎండీఎంకే ఆరు స్థానాలలో డీఎంకే కూటమిలో పోటీ చేసింది. ఇందులో రెండింట్లో మాత్రమే గెలిచారు. దీంతో పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు అన్నది కరువైంది. ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో డీఎంకే కూటమి నుంచి తిరుచ్చిలో దురై వైగో గెలవడం ఆపార్టీకి కాస్త ఊరట కలిగినట్టైంది. ఈ సారి ఎన్నికల కమిషన్ గుర్తింపు పదిలం చేసుకోవడం లక్ష్యంగా ప్రత్యేక చిహ్నంలో పోటీ చేసే దిశగా వ్యూహాలకు వైగో పదును పెట్టారు. ఇందులో భాగంగా గత రెండు వారాలకు పైగా తిరుచ్చి నుంచి మదురై వరకు పాదయాత్రను సైతం నిర్వహించారు. తిరుచ్చి, పుదుకోట్టై, శివగంగై, మదురై జిల్లాలను గురి పెట్టి వైగో పర్యటన జరగడంతో అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలపై ఆ పార్టీ గురి పెట్టిందన్నది స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితులలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో ప్రత్యేక చిహ్నంతో పోటీ చేయడంపై చర్చించారు. డీఎంకేను ఈ సారి అధిక సీట్లు కోరాలని మెజారిటీ శాతం మంది నేతలు వైగోకు సూచించినట్టు సమాచారం. అయితే గత ఎన్నికలలో ఆరు స్థానాలలో రెండింట మాత్రమే గెలిచిన నేపథ్యంలో ఆశించిన సీట్లు డీఎంకే ఇచ్చేనా అన్న డైలమాలో వైగో ఉన్నట్టు సమాచారం. అయినా పార్టీ జిల్లాల కార్యదర్శుల సూచన మేరకు ఈ సారి రెండంకెల మేరకు సీట్లను డీఎంకే నుంచి ఆశించేందుకు సన్నద్ధమవుతూ ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఎండీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
కొందరు అలా నటించలేరు!
తమిళసినిమా: బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న మలయాళ భామ మాళవిక మోహన్. మాతృభాషతో పాటు, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తున్న ఈమె తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించి గర్తుంపు పొందారు. ఈ మధ్య విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ చిత్రంలో ప్రతినాయకిగా విలక్షణ నటనను ప్రదర్శించారు. ఇకపోతే తెలుగులో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన రాజాసాబ్ చిత్రంతోఎంట్రీ ఇచ్చారు. మలయాళంలో మోహన్లాల్ సరసన నటించిన హృదయపూర్వం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళంలో కార్తీకి జంటగా సర్ధార్–2లో నటిస్తున్నారు. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే మాళవికమోహన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కొందరు నటీమణులు వాచకం విషయంలో అసలు శ్రద్ధ పెట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు శోకం సన్నివేశాల్లో ముఖభావాలనే వ్యక్తం చేస్తున్నారని, సంభాషణలు చెప్పకుండా ఒన్, టూ, త్రీ అని చెబుతున్నారని విమర్శించారు. మరి కొందరైతే బాధ ముఖంతో ఏబీసీడీలు చెబుతున్నారని అన్నారు. అలా చెప్పిన వాటిని డబ్బింగ్లో అనువాద కళాకారులు సరి చేస్తున్నారని చెప్పారు. కొందరు నటీమణులైతే కెరీర్ మొత్తం ఇదే పని చేస్తున్నారని విమర్శించారు. ఇలా ఈమె ఏ నటిని దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆరా తీస్తున్నారు. మరి కొందరు అయితే నయనతారనే అలా విమర్శిస్తున్నట్లు పేర్కొంటున్నారు. కారణం ఇంతకుముందు కూడా ఈమె నయనతారపై విమర్శలు చేశారన్నది గమనార్హం. ఈ విషయంలో ఏ నటి ఎలా స్పందిస్తారో చూడాలి -
అఽధికార మార్పు తథ్యం
తమిళనాడులో అధికార మార్పు తథ్యం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డీఎంకే పాలనకు కౌంట్డౌన్ ప్రారంభ మైందన్నారు. మాదక ద్రవ్యాల మాఫియా గుప్పెట్లో ఉన్న తమిళనాడు, తమిళ యువతను రక్షించి తీరుతామన్నారు. స్టాలిన్ను గద్దె దించడం లక్ష్యంగా సమష్టిగా పనిచేయనున్నామని ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. సాక్షి, చైన్నె: చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో బీజేపీ నేతృత్వంలో బ్రహ్మాండ బహిరంగ సభ శుక్రవారం జరిగింది. ఈ సభ నిమిత్తం తిరువనంతపురం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చైన్నెకి వచ్చారు. విమానాశ్రయంలో గవర్నర్ రవి, మంత్రి అన్బరసన్ ప్రధాని నరేంద్రమోదికి ఆహ్వానం పలికారు. ఇక్కడి హెలికాప్టర్లో బహిరంగ సభ వేదిక మధురాంతకంకు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్డీఏ కూటమి పార్టీల నేతలందరూ చేతులు కలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కారదర్శి పళణిస్వామి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, పీఎంకే నేత అన్బుమణి రాందాసు, పుదియ నీది కట్చి నేత ఏసీ షణ్ముగంతో పాటు ఇతర కూటమి పార్టీల నేతలు జాన్పాండియన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ అరవింద్ మీనన్, కో–ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్లతో పాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్టాలిన్ను గద్దె దించుతాం ఈ బహిరంగ సభలో పళనిస్వామి మాట్లాడుతూ ఒక్క కుటుంబం కోసం తమిళనాడులో 8 కోట్ల మంది ప్రజలు దోచుకోబడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న స్టాలిన్ కుటుంబానికి ఇక చరమ గీతం తథ్యమన్నారు. దినకరన్ మాట్లాడుతూ డీఎంకే పాలనకు కాలం చెల్లిందన్నారు. అన్నాడీఎంకేతో తమకు అభిప్రాయ బేధాలు ఉన్నా, అవన్నీ ఇప్పుడు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. తామంతా అమ్మ జయలలిత పెంచిన బిడ్డలమని, అందరం కలసి ఒక్కటిగా ముందుకెళ్తామన్నారు. తమ పై ఎలాంటి ఒత్తిడి లేదని, అమ్మ సుపరిపాలన మళ్లీ సాధించడం లక్ష్యంగా, ఒక కుటుంబం అవినీతి పాలనకు గద్దె దించే విధంగా సమష్టిగా పనిచేస్తామని ప్రకటించారు. తమ ఐక్యతకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణం అని వ్యాఖ్యానించారు. అన్బుమణి స్పందిస్తూ, పళణిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం తమిళనాట ఏర్పాటు కావడం తథ్యమని, స్టాలిన్కు మున్ముందు గడ్డుకాలమేనని హెచ్చరించారు. నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రాకతో సూర్యుడు అస్తమించాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో డీఎంకేను ఉదయ సూర్యుడి చిహ్నంను టార్గెట్ చేసి స్టాలిన్పై నైనార్ విరుచుకుపడ్డారు. స్తంభించిన రహదారి చైన్నె–తిరుచ్చి జాతీయ రహదారి శుక్రవారం ఉదయం నుంచే స్తంభించింది. ప్రధాని నరేంద్రమోదీ జాతీయ రహదారి సమీపంలోని మధురాంతకంలో జరిగిన బహిరంగ సభకు రావడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రహదారిలో కంటైనర్లు, ఇతర భారీ వాహనాలు, లారీలను అనుమతించలేదు. దీంతో చైన్నె ఎక్స్ప్రెస్ వేట, బైపాస్ రోడ్డులు కిలోమీటర్ల కొద్ది వాహనాలతో బారులు తీరాయి. జాతీయ రహదారి వెంబడి అక్కడక్కడ వాహనాలు నిలుపుదల చేయడంతో రహదారి స్తంభించినట్లైంది. చెంగల్పట్టు నుంచి మధురాంతకం వైపు కేవలం బీజేపీ, అన్నాడీఎంకే, ఇతర కూటమి పార్టీల వాహనాలను మాత్రమే అనుమతించారు. ఆ తర్వాత ట్రాఫిక్ను క్లియర్ చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. తమిళనాట సీఎంసీ పాలన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తమిళనాడులో సీఎంసీ పాలన సాగుతోందన్నారు. సీ అంటే కరెప్షన్, ఎం అంటే మాఫియా, సీ అంటే క్రైం అంటూ ఈ సీఎంసీ పాలకుల నుంచి తమిళనాడును రక్షించేందుకు సన్నద్ధమయ్యామని వ్యాఖ్యానించారు. మత్తు అనే మాఫియా ఊబిలో తమిళనాడు యువతను ముంచేశారని, తన సోదరీమణులు, ఆడ బిడ్డలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్పు రాదా అనే ఆశతో తమిళనాడు మహిళా లోకం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడులో అధికార మార్పు తథ్యమని, డీఎంకే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. తమిళనాడుకు తాము రూ.3లక్షల కోట్లు అందజేశామని గుర్తు చేస్తూ, వీటన్నింటిని దాచి పెట్టి అసత్యాలను స్టాలిన్ వళ్లిస్తున్నాడని ధ్వజమెత్తారు. తమిళనాడు అభివృద్ధి వెనక్కి వెళ్లిందని, ఈ అవినీతి పరుల నుంచి తమిళనాడు, తమిళ ప్రజలను, సంస్కృతిని పరిరక్షించే విధంగా ఎన్డీఏ కూటమి నేతలు సమష్టిగా ముందుకెళ్తారన్నారు. తిరుప్పరకుండ్రం వ్యవహారాన్ని డీఎంకే ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చేసిందని, ఇందులో హిందువులకు అనుకూలంగా బీజేపీ వెన్నంటి నిలబడిందన్నారు. తమిళనాడుకు డబుల్ ఇంజిన్ పాలన అవశ్యమని, ఆ దిశగా పయనం సాగుతుందని ప్రకటించారు. డీఎంకేను గద్దె దించుతామని, అవినీతి సొమ్మును కక్కిస్తామని స్పష్టం చేశారు. -
అడ్వాన్స్డ్ ట్రామాకేర్ ప్రారంభం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న నమ్మై కాక్కుమ్ 48 వైద్య సేవలలో భాగంగా అత్యవసర చికిత్సల కోసం ఆశ్రయించే వారి కోసం ఎస్ఆర్ఎంలో అడ్వాన్స్డ్ ట్రామా అండ్ ఎమర్జన్సీ వార్డును అత్యాధునిక సేవలతో ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే వరలక్ష్మి ప్రారంభించారు. అలాగే నమ్మైకాక్కుం 48 పథకం 5,00,000వ లబ్ధిదారుడిని సత్కరించారు. అత్యవసర ట్రామా కేర్ ఫ్రేమ్ వర్క్కు మద్దతుగా ఇవ్వడం, మొదటి 48 గంటలలో ప్రాణాంతక పరిస్థితులతో వచ్చే వారికి వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఈ సెంటర్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం ఆస్పత్రి అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ టి.మైథిలి, ప్రో వైస్ చాన్సలర్ నితిన్ నాగర్కర్, సలహాదారుడు, డీన్ డాక్టర్ వి.పి.చంద్రశేఖరన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు. జల్లికట్టుకు మరింత సడలింపు సాక్షి, చైన్నె : జల్లికట్టుకు మరింత సడలింపు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళుల సంప్రదాయ, సాహస క్రీడ జల్లికట్టు గురించి తెలిసిందే. జంతు ప్రేమికుల రూపంలో ఎదురైన సమస్యతో నిషేధం విధించిన ఈ క్రీడను మహోద్యమం ద్వారా తమిళులు మళ్లీ సాధించుకున్నారు. అప్పటి నుంచి అనేక కట్టుబాట్లు, ఆంక్షల నడుమ జల్లికట్టు నిర్వహణ జరుగుతుంది. ఈ పరిస్థితులలో మరింత సడలింపు నిబంధనలలో ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సంక్రాంతి రోజైన అవనీయాపురంలో, కనుమ రోజున పాలమేడులో, కానుం పొంగల్ రోజున అలంగానల్లూరులో జరిగిన జల్లికట్టు గురించి ప్రస్తావించారు. కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్ తన ప్రసంగంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు, జల్లికట్టు ఎద్దుల కోసం మెరుగైన వైద్య చికిత్స కేంద్రం నిర్మాణం గురించి, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల కల్పనను గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడానికి చర్యలు తీసుకుందన్నారు. ఆమేరకు స్థానిక ఎద్దులు, క్రీడాకారులు పాల్గొనేందుకు మార్గం సుగమం చేస్తూ, ఆన్న్లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మార్చారు. జిల్లా కలెక్టరేట్ ద్వారా ఈప్రక్రియ చేపట్టనున్నారు. అలాగే, పోటీల సమయంలో మరణించే క్రీడాకారులకు జీవిత బీమా తప్పనిసరి అన్న నిబంధనను సడలించారు. ఇప్పటివరకు జల్లికట్టు పోటీల నిర్వాహకులు స్టాంప్ పేపర్పై ప్రమాణ పత్రం సమర్పించే విధానాన్ని రద్దు చేశారు. జల్లికట్టు తమిళనాడు వారసత్వాన్ని కాపాడడానికి సహకారం అందించేందుకు, ఈ క్రీడలను ప్రోత్సహించడం, కొనసాగించడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నామని ప్రకటించారు. శ్రీపెరంబదూరులో రూ.150 కోట్ల ఏరో స్పేస్ సాక్షి, చైన్నె: శ్రీపెరంబదూరు పారిశ్రామిక వాడలో ట్రస్టెడ్ ఏరో స్పేస్ ఇంజినీరింగ్ (టీఏఎస్ఈ గ్లోబల్) సంస్థ తన కొత్త అత్యాధునిక తయారీ కేంద్రాన్ని నెలకొల్పింది. రూ.150 కోట్లతో ఏరో స్ట్రక్చర్ భాగాలపై దృష్టి పెట్టారు. రానున్న మూడు సంవత్సరాలలో రూ.300 కోట్ల రాబడి దిశగా ముందుకెళ్లనున్నారు. జపాన్లోని డీఎంజీ మోరి అధ్యక్షుడు డాక్టర్ ఇంజినీర్ ముసాహికోమోరి ఈ పరిశ్రమను ప్రారంభించారు. -
ఘనంగా ఆలయ మహాకుంభాభిషేకం
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి గాంధీనగర్లోని ప్రభుత్వ సహకార శిక్షణ కేంద్రంలో కొత్తగా నిర్మించిన వాలంపురి వినాయకుడి ఆలయ మహాకుంభాభిషేకం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. తమిళనాడు సహకార సంఘం అదనపు రిజిస్ట్రార్, ఎండీ రవిచంద్రన్ సలహా మేరకు వేలూరు జోనల్ డైరెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో నూతనంగా వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. ఇందులో వేద మండితులు ప్రత్యేక యాగశాల, కలశ, గోపూజ, గజ పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఉంచిన కలశ నీటిని శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయ రాజగోపురంపైకి తీసుకెళ్లి మహాకుంభాభిషేకం చేసి కలశ నీటిని భక్తులపై చల్లారు. అనంతరం అన్నదానం చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జాయింట్ రిజిస్ట్రార్ రామదాస్, వేలూరు సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ పళనిస్వామి, సహకార శాఖ రిజిస్ట్రార్ వేల్మురుగన్, విక్రయ జాయింట్ రిజిస్ట్రార్ ప్రభు, గుడియాత్తం సిటీ బ్యాంకు జాయింట్ రిజిస్ట్రార్ లక్ష్మణ్, హౌసింగ్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ జాయింట్ రిజిస్ట్రార్ అన్బరసి, శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ ఏలుమలై, సహకార బ్యాంకు సిబ్బంది, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే రిహార్సల్స్
సాక్షి, చైన్నె: మళ్లీ మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో చైన్నెలో ఉన్నవాళ్లు వారి స్వస్థలాలకు శుక్రవారం బయల్దేరారు. దీంతో ప్రత్యేక బస్సులు అనేక మార్గాలలో నడపాల్సి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా సుమారు ఐదారు రోజులు సెలవులు రావడంతో చైన్నె నుంచి సుమారు పది లక్షల మందికిపైగా స్వస్థలాకు వెళ్లారు. తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్లీ వరుస సెలవులు రావడం అనేక మందికి కలిసి వచ్చినట్టైంది. శని, ఆది, సోమవారాలు సెలవులు రావడంతో చైన్నె నుంచి స్వస్థలాలకు వెళ్లి తమ కుటుంబాలతో గడిపేందుకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు ఉరకలు తీశారు. దీంతో చైన్నె నుంచి పలు మార్గాలలో అదనంగా 2 వేల ప్రత్యేక బస్సులను రోడ్డెక్కిస్తూ రవాణా సంస్థ చర్యలు తీసుకుంది. ఇక రిపబ్లిక్ డే వేడుకల కసరత్తులో భాగంగా కామరాజర్ సాలైలో చివరి విడతగా త్రివర్ణ దళాలు, ఎన్సీసీ కేడర్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థుల రిహార్సల్స్ ప్రదర్శన అదరహో అనిపించే విధంగా జరిగాయి. ఈ సారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు అనుమతి ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల విద్యార్థులు రిహార్సల్స్కు తరలివచ్చారు. ఈ రిహార్సల్స్ కారణంగా కామరాజర్ సాలైలో ఓ వైపు మార్గాన్ని మూసి వేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు బారులు తీరారు. శని, ఆదివారాలలో ఈ మార్గంలో గణతంత్ర వేడుకల నిమ్తితం ప్రత్యేక ఏర్పాట్లు విస్తృతం కానున్నాయి. -
ధనుష్ @55
తమిళసినిమా: పాన్ వరల్డ్ కథానాయకుడిగా వెలిగిపోతున్న నటుడు ధనుష్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన కుబేర, ఇడ్లీకడై, హిందీ చిత్రం తేరేఇష్క్మే చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి కర అనే టైటిల్ను ఖారారు చేశారు. ఐసరిగణేశ్ తమ వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా ధనుష్ తన కొత్త చిత్రానికి సిద్ధమైపోయారు. ఇంతకుముందు అమరన్ వంటి సంచలన విజయాన్ని సాదించిన చిత్రం ధర్శకుడు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతకుముందు గోపురం ఫిలింస్ సంస్థ నిర్మించడానికి సన్నాహలు చేసింది. అయితే కారణాలు ఏమైనా ఈ చిత్రం నుంచి ఆ సంస్థ వైదొలగింది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ధనుష్ నిర్మించడానికి ముందుకొచ్చారు. తన వండర్బార్ ఫిలింస్ సంస్థ ఆర్టెక్స్ స్డూడియోస్ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ధనుష్ 55వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఇది భారీ బడ్జెట్లో రూపొందనున్నట్లు సమాచారం. -
మద్రాసు వర్సిటీ నుంచి పీహెచ్డీ
కొరుక్కుపేట: మద్రాసు వర్సిటీ తెలుగు శాఖ పరిశోధక విద్యార్థిని ఎస్. శశికళ మద్రాస్లోని తెలుగు రచయిత్రుల ఆధునిక సాహిత్యం పరీశీలన (2000–2020) అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి శుక్రవారం మౌఖిక పరీక్ష నిర్వహించి పీహెచ్డీ ప్రకటించారు. ఈ సిద్ధాంత వ్యాసానికి పర్యవేక్షకులుగా ఆచార్య విస్తాలి శంకరరావు ఉండగా, మౌఖిక పరీక్ష నిర్వహణకు మద్రాసు క్రైస్తవ కళాశాల, తెలుగుశాఖ అధ్యక్షుడు డా.శ్రీపురం జయశేఖర్ నిర్వహించారు. ఆచార్య విస్తాలి శంకరరావు పరిశోధనాంశాన్ని పరిచయం చేశారు. తర్వాత ఎస్.శశికళ తన పరిశోధనాంశాన్ని సంక్షిప్తంగా నభకు పరిచయం చేశారు. చివరగా వారు పీహెచ్డీ సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్ పట్టాను అందించవలసిందిగా వర్సిటీ అధికారులకు తెలియజేశారు. డా.ఎల్బీ శంకరరావు దంపతులు, డా. కాసల నాగభూషణం, డా.కె.వెంకటకృష్ణశాస్త్రి, డా.ఎం. మురళి, తమ్మినేని బాబు, గుడిమెట్ల చెన్నయ్య, రచయిత్రులు జ్యోషులు ఉమ, డా. తిరుమల ఆముక్తమాల్యద, కొవ్విడి రమాదేవి, అరుణ పాల్గొన్నారు. -
తమిళనాడులో అరాచక పాలన
మధురాంతకం(తమిళనాడు): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎంసీ(కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కార్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. అవినీతి, మాఫియా, నేరాలకు డీఎంకే పర్యాయ పదంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు గట్టిగా బుద్ధి చెప్పాలని తమిళనాడు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. సీఎంసీని ఎవరూ సహించబోరని అన్నారు. ప్రధాని మోదీ శుక్రవారం తమిళనాడులోని మధురాంతకంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రజలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అన్నా డీఎంకే అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, అమ్మ మక్కల్ కట్చి కళగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, టీఎంసీ–ఎం నేత జీకే వాసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని పేర్కొన్నారు. అరాచక పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సుపరిపాలన కోసం వారంతా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తిరుప్పరకుండ్రంలో ఇటీవల జరిగిన కార్తీక దీప వివాదాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను కూడా డీఎంకే లెక్కచేయడం లేదని ఆక్షేపించారు. భక్తుల హక్కుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. డీఎంకేలో ఎవరైనా పైకి ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలపై వేధింపుల్లో ప్రమేయం ఉండాలని ఎద్దేవా చేశారు. మన సంస్కృతిని అవమానించేవారికి ఆ పార్టీలో పెద్దపీట వేస్తుంటారని విమర్శించారు. డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇష్టం ఉండదని చెప్పారు. కేవలం ఒక్క కుటుంబం కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో ఎంత అవినీతి జరిగిందో, ఎవరికి జేబుల్లోకి ఎంత సొమ్ము వెళ్లిందో చిన్నపిల్లలకు కూడా తెలుసని పేర్కొన్నారు. డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి మనమంతా ఒక్కటి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సూచించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రంతో భుజం భుజం కలిపి పనిచేసే ప్రభుత్వం కావాలన్నారు. డీఎంకే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. డ్రగ్స్, నేరాలు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదన్నారు. యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకున్నారని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు నేరాలను కట్టడి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం డీఎంకే పాలనలో ప్రజలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. -
డీఎంకే పార్టీకి కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
చెన్నై: డీఎంకే పార్టీకి కౌంట్డౌన్ మొదలైందని.. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై సమీపంలోని మదురాంతకం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళనాడులో ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు.డీఎంకేను సీఎంసీ ప్రభుత్వం(అవినీతి, మాఫియా, క్రైమ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ప్రజలు ఈ పార్టీని వేరులతో సహా పెకిలించి మార్పు కోసం ఓటు వేయాలని నిర్ణయించుకున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలపై మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం కేవలం ఒకే కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శించారు. 2014 కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నిధుల కంటే, తమ ప్రభుత్వం తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ గుర్తుచేశారు. స్టాలిన్ ప్రభుత్వంలో డ్రగ్స్, మద్యం మాఫియాలు పెరిగిపోయాయంటూ ఆరోపించారు.ఎన్డీయేకు వేసే ప్రతి ఓటు తమిళనాడును మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేస్తుందంటూ మోదీ చెప్పుకొచ్చారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలో ఉంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) పెట్టుబడులను ఆకర్షించడం సులభమవుతుందన్నారు. దివంగత నేత జయలలిత హయాంలో శాంతిభద్రతలు, మహిళా రక్షణ బాగుండేదని.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. -
విజయ్కు విజిల్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్కు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కామన్ చిహ్నం కేటాయించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు అందరూ విజిల్ చిహ్నంలో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నారు. 2026 ఎన్నికల్లో తన బలాన్ని చాటే విధంగా విజయ్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. కరూర్ విషాద ఘటనతో మీట్ ది పీపుల్ పర్యటనకు కాస్త బ్రేక్ పడినా, మళ్లీ పుంజుకునే విధంగా కార్యక్రమాల విస్తృతానికి విజయ్ కార్యాచరణలో ఉన్నారు. మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి సిద్ధమైనా, ఆంక్షలు, అడ్డంకులు తప్పడం లేదు. అలాగే, ఆయన చివరి చిత్రం జననాయకన్ సైతం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఓ వైపు కరూర్ విషాద ఘటనకు సంబంధించి సీబీఐ విచారణను, మరో వైపు సెన్సార్ బోర్డు రూపంలో జననాయకన్ విడుదల సమస్యను విజయ్ ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు మందగించినట్టుగా పరిస్థితి నెలకొన్నప్పటికీ, ఇతర నేతలు మ్యానిపెస్టో రూపకల్పన, ప్రచార షెడ్యూల్ రూట్ మ్యాప్ సిద్ధం చేయడంలో బిజీగా ఉంటున్నారు. అదేసమయంలో తన నేతృత్వంలోనే కూటమి అని స్పష్టం చేసిన విజయ్ తాజాగా ఎన్నికలకు సమాయత్తం అవుతూ తమకు 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఒకే చిహ్నం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఇటీవల లేఖ పంపించారు. ఇందులో విజిల్కు తొలి ప్రాధాన్యత, మలి ప్రాధాన్యతగా ఆటోను ఎంపిక చేశారు. వీటితో పాటు మరో పది చిహ్నాలను సూచించినా, తమకు విజల్ లేదా ఆటోలో ఏదో ఒకటి ఎన్నికల చిహ్నంగా దక్కుతుందన్న ఆశాభావంలో తమిళగ వెట్రి కళగం వర్గాలు ఉంటూ వచ్చాయి. కమల్కు మళ్లీ టార్చ్లైట్ మక్కల్ నీది మయ్యం నేత కమల్కు గతంలో కేటాయించిన టార్చ్లైట్ చిహ్నం మళ్లీ దక్కింది. గత ఎన్నికల్లో ఒక లోక్సభ, ఒక అసెంబ్లీ ఎన్నికలలో ఇదే చిహ్నంతో ప్రజల్లోకి కమల్ వెళ్లారు. అయితే, 2024 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండడంతో బ్యాటరీ టార్చ్ లైట్ మళ్లీ దక్కేనా అన్న ప్రశ్న నెలకొంది. అయితే, అదే చిహ్నం ఆ పార్టీకి దక్కింది. ఎట్టకేలకు విజిల్ డిసెంబర్లోనే తమకు చిహ్నం వస్తుందన్న ఎదురు చూపులల్లో ఉన్నప్పటికీ, చివరకు తాజాగా కామన్ చిహ్నం దక్కింది. విజయ్ ఆశించినట్టుగానే విజిల్ చిహ్నం టీవీకేకు దక్కింది. గురువారం ఎన్నికల కమిషన్ విజిల్ను కేటాయించింది. ఈ చిహ్నం ఆధారంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో టీవీకే అభ్యర్థులు పోటీలో ఉండబోతున్నారు. తాము ఆశించిన చిహ్నం దక్కడం ఆనందంగా ఉందని విజయ్ పార్టీ కీలక నేత నిర్మల్కుమార్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో విజయ్ నటించిన బిగిల్(విజిల్)చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టి ఉన్న నేపథ్యంలో తాజాగా తమకు అదే చిహ్నం దక్కడంతో కేడర్, అభిమానులు మంచి జోష్ మీదున్నారు. తమకు చిక్కిన విజిల్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీవీకే వర్గాలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా నెల రోజుల తర్వాత పార్టీ వర్గాలతో కీలక సమావేశానికి విజయ్ నిర్ణయించారు. ఈనెల 25వ తేదీన మహాబలిపురంలో ఈ సమావేశం జరగనుంది. -
నకిలీ రూ.200నోట్లు స్వాధీనం
అన్నానగర్: తిరుచ్చి సమీపంలో కారులో తరలిస్తున్న రూ.8.5 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి జిల్లా దువాక్కుడిలోని బ్లాక్ టెంపుల్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి విదేశీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న కారు పెట్రోల్ పట్టుకోవడానికి ఆగింది. పెట్రోలు పట్టుకొని కారులో వచ్చిన వారు రూ.2,600 చెల్లించారు. అందులో నకిలీ రూ.200 నోట్లు ఉన్నాయని గుర్తించిన పెట్రోల్ బంక్ ఉద్యోగి వెంటనే దువాక్కుడి పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే కారు అక్కడి నుంచి బయలుదేరి తిరుచ్చి వైపు వెళుతోంది. పోలీసులు కారును వెంబడించారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేయాలని చెక్పోస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు కారును ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో 2 బస్తాల నకిలీ రూ.200 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. రూ.8 లక్షల 37 వేల 800 విలువైన నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నకిలీ నోట్లను, కారును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణలో వారు మహారాష్ట్రకు చెందిన రమేష్ బాబరో బహిర్ (54), నారాయణ రామ్ (34) గా గుర్తించారు. -
చెత్తకుప్పలో నగదు
అన్నానగర్: చైన్నె సమీపం వేలచ్చేరిలోని అన్నా వీధిలోని నెహ్రూ నగర్లో రోడ్డు పక్కన చెత్త సంచులను వేస్తున్నారు. గురువారం ఒక పారిశుధ్య కార్మికుడు చెత్తను సేకరించడానికి వచ్చినప్పుడు, అక్కడ 2 సంచులు ఉన్నాయి. అతను వాటి తెరిచి చూసేసరికి, వాటిలో రూ. 2000, రూ.500 నోట్లు కట్టకట్టలుగా ఉండడం చూసి దిగ్బ్రాంతి చెందాడు. ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. వెంటనే వేలచ్చేరి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి నోట్లు ఉన్న బ్యాగులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. ఆ బ్యాగుల్లో ఉన్న రూ.2000, రూ.500 నోట్లు మంచి నోట్లా లేక నకిలీ నోట్లా అని వారు విచారించారు. దర్యాప్తులో అవి సినిమా ఘాటింగ్ లకు ఉపయోగించే నకిలీ నోట్లు అని తేలింది. అయితే, ఆ డబ్బును చెత్తలో ఎవరు విసిరారోనని పోలీసులు విచారిస్తున్నారు. -
శాంతి టాకీస్ షూటింగ్ ప్రారంభం
తమిళసినిమా: మంచి కంటెంట్తో కూడిన చిత్రాలనం నిర్మిస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్న నిర్మాత అరుణ్ విశ్వ. ఈయన ఇటీవల శాంతి టాకీస్ పతాకంపై మావీరన్, 3 బీహెచ్కే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. ప్రస్తుతం విక్రమ్ 63వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా తమ సంస్థలో నాల్గవ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వర్ధమాన నటుడు భరత్ హీరోగా నటిస్తున్నారు. ఈయనకు జంటగా శాన్వీమేఘ్నా నటిస్తున్నారు.ఈ చిత్రానికి హరిహరసుధన్ అళగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. చిత్ర షూటింగ్ను పట్టికోటై పరిసర ప్రాంతాలలో 45 నుంచి 50 రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికను రచించినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. నటుడు ఫాలొ శరవణన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తేనీ ఈశ్వర్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఇతర నటీనటులు సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
గత పాలనలో థర్మాకోల్... నేడు దోమ తెర
సాక్షి, చైన్నె : గత అన్నాడీఎంకే హయాంలో రిజర్వాయర్లోని నీరు ఆవిరి కాకుండా థర్మాకోల్ పరిచే ప్రయత్నం చేసి ఓ మంత్రి అభాసుపాలయ్యారు. తాజాగా అదే బాటలో దోమల వ్యాప్తిని కట్టడి చేయడానికి దోమ తెరలను కాలువల వద్ద కప్పే ప్రయత్నం చేపట్టడం అందర్నీ విస్మయంలో పడేస్తున్నది. అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉన్న సెల్లూరురాజు ఎండ దెబ్బకు నీటి ఆవిరిని కట్టడి చేయడానికి ఽరిజర్వాయర్లో థర్మాకోల్ పరిచి, అభాసు పాలు కావడమే కాకుండా, థర్మాకోల్ మంత్రిగా నేటికి ఆయన వ్యంగ్యాస్త్రాలతో పిలవబడుతున్నారు. ఈ పరిస్థితులలో తాజాగా చైన్నె కార్పొరేషన్ వర్గాలు సైతం తామేమి తక్కువ తిన్నామా అన్నట్టుగా వినూత్న ప్రయోగానికి సన్నద్ధమయ్యారు. దోమ తెరతో.. చైన్నెలో వర్షపు నీటి కాలువల నిర్మాణాలు జరిగిన విషయం తెలిసిందే. అనేక మార్గాలలో రోడ్లలో చేరే నీరు క్షణాల్లో కాలువల ద్వారా వెళ్లేందుకు వీలుగా అక్కడక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇనుప గేట్ల తరహాలో కాలువల ముఖ ద్వారా వద్ద జరిగిన ఈ ఏర్పాట్లు వర్షపు నీరు తొలగేందుకు ఎంతో ప్రయోజకరంగా మారింది. ప్రస్తుతం ఇదే గేట్లు కాస్త విమర్శల పాలు కావడానికి పరిస్థితి తీసుకొచ్చింది, చైన్నె నగరంలోనే కాదు శివార్లలో ఇటీవల వైరల్ జ్వరాలు, చికున్ గున్యా, డెంగీ వంటి జ్వరాలు పెరుగుతూ వస్తున్నాయి. దోమల స్వైర విహారం పెరిగింది. దోమల కట్టడిలో చైన్నె కార్పొరేషన్ విఫలమైందన్న ఆరోపణలు బయలు దేరాయి. ఈ వ్యవహారం గురువారం అసెంబ్లీకి సైతం చేరింది. ఈ పరిస్థితుల్లో దోమల కట్టడికి దోమ తెర ఆయుధం అన్నట్టుగా అధికారులు వ్యవహరించడం విమర్శలకు దారి తీసింది. తిరువొత్తియూరు, తిరువీకానగర్ మండలాల పరిధిలతోపాటు మరికొన్ని చోట్ల ఈ గేట్లకు దోమతెరను కట్టి, కాలువల్లో ఉన్న దోమలు బయటకు రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా సిబ్బంది ముందుకెళ్తున్న వీడియో కాస్త వైరల్ కావడం గమనార్హం. దోమల కట్టడికి దోమ తెరే ఆయుధం అన్నట్టుగా కార్పొరేషన్ వర్గాల పనితీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే వారు పెరిగారు. -
గుండె మార్పిడిలో కొత్త మైలురాయి
సాక్షి, చైన్నె : గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సల్లో సరికొత్త మైలురాయిని సాధించామని అపోలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్రాజ గోపాల్ తెలిపారు. 600లకు పైగా జరిగిన గుండెమార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, 1000కి పైగా ఎక్మో కేసులతో అధునాతన క్రిటికెల్ కేర్లో సాధించిన మైలురాయి గురించి గురువారం స్థానికంగా ప్రకటించారు. స్థిరమైన, అధిక సర్వైవల్ ఫలితాలు చైన్నెలోని అపోలో ఆస్పత్రి అధునాతన గుండె, ఊపిరితిత్తుల వైఫల్య నిర్వహణలో అగ్రగామిగా మారిందని వివరించారు. తాజాగా అత్యవసర డబుల్ లండ్ మార్పిడి చేయించుకునేందుకు ముందు 48 రోజుల పాటు ఎక్మో మద్దతుతో క్లిష్టమైన దశలో బయట పడిన రాజా శివగురునాథన్(59), బి.శరవణన్(45), రాధే శ్యామ్ రఘువంశి(72)లకు తాము అందించిన అధునాతన డబుల్ లండ్ మార్పిడి గురించి ప్రస్తావించారు. ఊపిరితిత్తుల మార్పిడి విభాగాధిపతి డాక్టర్ కుముద్ కుమార్ దితల్ మాట్లాడుతూ, గుండె, ఊపిరి చిత్తుల వైఫల్యంతో బాధ పడుతున్న రోగులకు వైద్య చికిత్స పెరుగుతున్న కొద్ది జీవన నాణ్యత క్షీణిస్తున్నందన, ముందుగానే మార్పిడి ఎంపికల గురించి తెలుసుకోవాల్సిన అవశ్యం ఉందని వివరించారు. అపోలో చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్క లియమూర్తి పాల్గొన్నారు. -
● స్టార్ 3.ఓతో 18 సేవలు ● శ్రీకారం చుట్టిన సీఎం స్టాలిన్ ● తూత్తుకుడిలో నిర్లవణీకరణ పనులకు పునాది ● మందవెలిలో బస్ టెర్మినల్తో మాల్
సాక్షి, చైన్నె: రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి ఇక ఆ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం అమల్లోకి తీసుకొచ్చింది. స్టార్ 3.ఓ పేరిట 18 రకాల సేవలను రిజిస్ట్రేషన్ల శాఖలో గురువారం ఆవిష్కరించారు. ఈ సేవలకు సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టారు. అలాగే, తూత్తుకుడి నిర్లవణీకరణ ప్రాజెక్టు పనులకు పునాది వేశారు. మందవెలిలో మాల్తో కూడిన బస్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. తూత్తుకుడి ప్రగతి పథంలో దూసుకెళుతోంది. విదేశీ సంస్థలు పెట్టుబడులను పెట్టేందుకు తూత్తుకుడి వైపుగా పరుగులు తీస్తున్నాయి. ఇక్కడి కులశేఖరపట్నంలో ఇస్రో లాంచ్ పాడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే, విమాన శిక్షణ కేంద్రానికి కసరత్తులు వేగవంతం చేశారు. మదురై – తూత్తుకుడి కారిడార్కు అపూర్వ స్పందన వస్తుండడంతో తొలి అడుగుగా తూత్తుకుడి జిల్లా ముల్లక్కాడు గ్రామంలో రోజుకు 60 మిలియన్ లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో నీటిని అందించడానికి నిర్లవణీకరణప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రూ.2,292.38 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులకు వీడియో కాన్పరెన్స్ ద్వారా చైన్నె నుంచి సీఎం స్టాలిన్ పునాది వేశారు. మంత్రులు గీతా జీవన్, అనిత ఆర్.రాధాకృష్ణన్, టీఆర్బీ రాజా, ఎంపీ కనిమొళి, సీఎస్ మురుగానందం, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరుణ్రాయ్ ఎండీ కె సెంథిల్ రాజ్ హాజరయ్యారు. మంద వెలిలో టెర్మినల్ చైన్నె మెట్రో అసెట్ మేనేజ్మెంట్ నేతృత్వంలో మందవెలిలో రూ.167.09 కోట్లతో మాల్తో కూడిన బస్ టెర్మినల్కు చర్యలు తీసుకున్నారు. ఈ పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే, చైన్నె మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.60 కోట్లతో కొత్తగా నిర్మించిన నాలుగు లేన్ల రోడ్డుతో కూడిన వంతెన మార్గాన్ని ప్రారంభించారు. మంత్రి శివశంకర్, స్పెషల్ ఇన్సియేటివ్స్ విభాగం ప్రధాన కార్యదర్శి కె గోపాల్, రవాణా శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చున్సోంగం జాతక సిరు, మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎం.ఎ. సిద్ధిక్, మున్సిపల్ ట్రాన్న్స్పోర్ట్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ టి.ప్రభు శంకర్ హాజరయ్యారు. పశుసంవర్థక శాఖ నిర్మించిన భవనాలను సీఎం వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, 118.42 కోట్లతో చేపట్టనున్న కొత్త భవనాల పనులకు శంకుస్థాపన చేశారు. 126 జూనియర్ అసిస్టెంట్ , 96 టైపిస్ట్ పోస్టులకు ఎంపికై న వారికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. మంత్రి అనితా రాధాకృష్ణన్, పశు సంవర్థక శాఖ కార్యదర్శి సుబ్బరాయన్, వెటర్నరీ కేర్ అండ్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ ఎస్పీ అమృత్ హాజరయ్యారు. ముందుగా విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి ఎంపికై న 10 మంది మైనారిటీ విద్యార్థులకు రూ. 3.60 కోట్ల స్కాలర్ షిప్లను సీఎం అందజేశారు. అలాగే, 2 పురాతన చర్చ్లు పునఃనిర్మాణానికి రూ.1.81 కోట్లను కేటాయిస్తూ చెక్కులను అందజేశారు. మంత్రి నాజర్, ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్, మైనారిటీ శాఖ కార్యదర్శి శరవణ వేల్రాజ్, మైనారిటీ సంక్షేమ కమిషనర్ ఎం.ఆసియా మరియం హాజరయ్యారు. స్టార్ 3.ఓ ఆవిష్కరణ రిజిస్ట్రేషన్ల శాఖను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. తాజాగా రిజిస్ట్రీ స్టార్ 3.ఓ సాఫ్ట్వేర్ను పరిచయం చేశారు. దీనిని సచివాలయంలో సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. దీని ఆధారంగా 18 కొత్త సేవలను ఇంటి నుంచే పొందేందుకు వీలు కల్పించారు. ఆస్తులు కొనుగోలు, అమ్మకాల ప్రక్రియలన్నీ వెబ్ వేదికగా, ఎలక్ట్రానిక్ పత్రంగా సమర్పించే రీతిలో ఆన్లైన్ ద్వారా అన్ని రకాల అపార్ట్మెంట్, బహుళ అంతస్తుల భవనాలలో ఫ్లాట్ల కొనుగోళ్లకు రుసుము చెల్లించే అవకాశం కల్పించారు. వివాహ నమోదు, కాగిత రహిత డాక్యుమెంట్ రికార్డింగ్, ఆటోమేటిక్ బాండ్ రూపకల్పన, పునఃవిక్రయం, ఆస్తి సంబంధిత లావాదేవీలు వంటి 18 రకాల సేవలను ఇంటి నుంచి పొందేందుకు అవకాశం కల్పించారు. మంత్రి పి మూర్తి, సీఎస్ మురుగానందం, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శి శిల్పా ప్రభాకర్ సతీష్, విభాగాధిపతి దినేష్ పొన్రాజ్ పాల్గొన్నారు. -
పరిశోధన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
వేలూరు: విద్యార్థులు మేధాశక్తితో పరిశోధన విద్య కు అఽధిక ప్రాధాన్యత ఇవ్వాలని పాఠశాల చైర్మన్ దిలీప్కుమార్ జైన్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని బీఎండీ జైన్ పాఠశాలలో విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమం పాఠశాల కార్యదర్శి రాజేష్కుమార్జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమ శిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంతో పాటు తల్లి దండ్రులపై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివే విధంగా అలవాటు చేయాలే తప్ప కఠినంగా శిక్షించి ప్రతి నిమిషం చదువుపైనే ధ్యాస పెట్టే విధంగా చేయరాదన్నారు. పాఠశాల, ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వారు క్రమ శిక్షణ గల విద్యార్థులుగా ఉండగలరన్నారు. విద్యార్థులు ప్రతి రోజూ యోగా చేయడం అవసరమన్నారు. ఇటీవల సెల్ఫోన్లకు చిన్న వయస్సు నుంచి పెద్ద వారు వరకు బానిసగా మారారని వాటిని నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ మాలతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
బయోప్రోస్థటిక్ వాల్వ్ రఫ్రాక్చర్కు ఆధునిక చికిత్స
సాక్షి, చైన్నె: బయోప్రోస్థటిక్ వాల్వ్ ఫ్రాక్చర్, డ్యూయల్ సెబ్రల్ ప్రొటెక్షన్తో సంక్లిష్ట టీఏవీఆర్ ఇన్ టీవీఆర్ ఇన్ ఎస్ఏవీఆర్ ప్రక్రియను చైన్నె వైద్యులు విజయంతం చేశారు. ఆళ్వార్పేటలోని కావేరి ఆస్పత్రిలో జరిగిన ఈ ఆధునిక విధానంపై డాక్టర్ రాజారామ్ అనంతరామన్ మాట్లాడుతూ 78 సంవత్సరాల వ్యక్తికి తీవ్రమైన బృహద్ధమని స్టెనోసిస్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. 2005లో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఉండడం, 2019లో ట్రాన్స్ కాథెటర్ వాల్వ్ ఇన్ వాల్వ్ రీ ప్లేస్ మెంట్ జరిగి ఉండడంతో తాజాగా పరిస్థితి సంక్లిష్టంగా మారిందన్నారు. అధునాతన 3డీ ఎకోకార్డియోగ్రఫీ, సీటీ ఇమేజింగ్ ఉపయోగించి టీఏవీఆర్ ఇన్ టీఏవీఆర్ ఇన్ ఎస్ఏవీఆర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించామని వివరించారు. శస్త్ర చికిత్స వాల్వ్ లోపల గతంలో అమర్చిన ట్రాన్స్ కాథెటర్ వాల్వ్ లోపల కొత్త ట్రాన్స్ కాథెటర్ వాల్వ్ను ఈ ప్రక్రియ ద్వారా విజయవంతంగా పొందు పరిచినట్టు తెలిపారు. కావేరి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అరవిందన్ సెల్వరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మోదీ సభతో మార్పు తథ్యం
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ అధికార మార్పునకు వేదిక కానున్నట్టు కేంద్ర మంత్రి, బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగే బహిరంగ సభ ద్వారా కూటమి నేతలందరూ ఒకే వేదిక పైకి రానున్నారని ప్రకటించారు. చైన్నెలో తిష్ట వేసి పీయూష్ గోయల్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చారు. తాజాగా గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో విస్తృతంగా చర్చల్లో మునిగారు. సీట్ల పందేరం, నియోజకవర్గాల ఎంపిక కసరత్తులు ఇందులో జరిగినట్టు సమాచారం. బీజేపీ 30 స్థానాలు , ఇతర చిన్న పార్టీలు తలా ఓ స్థానం, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం తొమ్మిది, జీకే వాసన్ టీఎంసీ ఆరు లేదా ఏడు స్థానాలలో, అన్బుమణి పీఎంకే 15లోపు స్థానాలలో పోటీ చేసే దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను కూటమిలోకి ఆహ్వానించే విధంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి, సీనియర్ బీజేపీ నేత హెచ్ రాజా, పొన్ రాధాకృష్ణన్, అన్నాడీఎంకే నేతలు ఎస్పీ వేలుమణి, దిండుగల్ శ్రీనివాసన్, కేపీ మును స్వామి ఉన్నారు. పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేను ఓడిస్తాం. అధికారం చేజిక్కించుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్లో తమిళనాట అధికార మార్పు తథ్యం అన్నారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో ఉందని గుర్తు చేస్తూ, తమిళనాడులో పళణిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని వ్యాఖ్యలు చేశారు. పళణిస్వామి మాట్లాడుతూ శుక్రవారం జరిగే మోదీ బహిరంగ సభ తమిళనాడు రాజకీయాల్లో మార్పునకు వేదిక కానున్నదన్నారు. ఈ సభ 5లక్షల మందితో జరగనున్నట్టు వివరించారు. అనంతరం పీయూష్ గోయల్తో జీకే వాసన్, పుదియ నీది కట్చి నేత ఏసీ షణ్ముగం వేర్వేరుగా భేటీ అయ్యారు. అదే సమయంలో టీటీవీ దినకరన్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై మంతనాలలో మునగడం గమనార్హం. మాజీ సీఎం పన్నీరుసెల్వంను ఎన్డీఏ వైపు లాగేందుకే ఈ చర్చ జరిగినట్టు తెలిసింది. బ్రహ్మాండ ఏర్పాట్లు ప్రధాని నరేంద్రమోదీ సభకు చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో బ్రహ్మాండ ఏర్పాట్లు చేశారు. అన్నాడీఎంకే – బీజేపీ కూటమి నేతలందరూ ఒకే వేదికపైకి రానున్నారు. తమ కూటమిని మోదీ ఈ వేదికపై ప్రకటించనున్నారు. తిరువనంతపురం పర్యటనను ముగించుకుని చైన్నెకు వచ్చే మోదీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధురాంతకం వెళ్లనున్నారు. ఆయన రాకతో చెంగల్పట్టు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఈ బహిరంగ సభ వేదికపై ఎంజీఆర్, జయలలిత చిత్రాల్లోని పాటలు, ప్రసంగాలను హోరెత్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఉండడం విశేషం. -
క్లుప్తంగా
5 గంటల విద్యుత్ కోత తిరువొత్తియూరు: మాధవరం సమీపం వడపెంరుంబాక్కం వి.ఎస్.మణి నగర్ ప్రాంతంలో సుమారు 500కు పైగా కుటుంబాల వారు నివశిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రాంతంలో ఆకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కట్ అయ్యింది. విద్యుత్ కేబుల్లో ఏర్పడిన లోపం కారణంగా ఆ ప్రాంతం మొత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీనిపై స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విద్యు త్ ఉద్యోగులు మరమ్మతు అయిన విద్యుత్ వైర్లను సరిచేసి పనిలో నిమగ్నమయ్యారు. అయితే చాలా సమయం గడిచినా పని పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు నిద్రపోలేక చీకట్లో ఇబ్బంది పడ్డారు. తరువాత సుమారు 5 గంటల తర్వాత, అర్ధరాత్రి ఒంటి గంటకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది. దీని తర్వాత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి తిరువళ్లూరు: ద్విచక్ర వాహనాన్ని డీకొట్టిన సంఘటనలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూరు జిల్లా పూండి గ్రామానికి చెందిన దేవరాజ్(55). ఇతను ఊత్తుకోట డిపోలో ప్రభుత్వ బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం సూళ్లూరుపేట నుంచి తిరువళ్లూరు వైపు వెళ్లే బస్సులో విధులు నిర్వహించి రాత్రి ఇంటికి ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణమయ్యాడు. తిరువళ్లూరు డిపో నుంచి పూండికి వెళ్తున్న సమయంలో ఊత్తుకోట వైపు వెళ్ళుతున్న సిమెంట్ లారీ దేవరాజ్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దేవరాజ్ను స్థానికులు చికిత్స నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవరాజ్ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పుకార్లను ఖండించిన పోలీసులు తిరువొత్తియూరు: కస్టమర్ సర్వీస్ సెంటర్ నుండి 6 అంకెల నంబర్ నుండి వచ్చే కాల్స్ స్వీకరిస్తే సెల్ఫోన్ పేలిపోతుందని వాట్సాప్ ఆడియో వ్యాప్తి చెందుతున్న విషయంపై తూత్తుకుడి జిల్లా పోలీసులు ఖండించారు. ప్రస్తుతం వాట్సాప్లో హలో నేను తూత్తుకుడి నుండి మాట్లాడున్నాను, కస్టమర్ కాల్లో 5 లేదా 6 నంబర్ల కాల్ వస్తుంది, దానిని ఎవరూ తీసుకోకండి, అలా తీసుకుంటే సెల్ పోన్ పేలిపోతుంది. ఇలా చేయడం వల్ల తూత్తుకుడిలో 27 మంది మరణించారు. కాబట్టి దీన్ని అందరూ షేర్ చేయండి అని వాట్సాప్లో ఒక ఆడియో వ్యాప్తి చెందుతోంది. దీనిపై తూత్తుకుడి జిల్లా పోలీసులు విచారణ చేపట్టగా, అలాంటి అవాంఛనీయ సంఘటన ఏదీ జరగలేదని తేలింది. దీనిపై జిల్లా పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నదేమిటంటే ఇది పాత వాట్సాప్ ఆడియో, ఇప్పుడు మళ్లీ తప్పుగా ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. కాబట్టి భయపడకండి, అలాగే ఈ వాట్సాప్ ఆడియోను ఎవరికి షేర్ చేయవద్దు ఈ విధంగా ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వాట్సాప్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. నదరు ఆడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా అందులో పేర్కొన్నారు. బ్రాడ్వేలో పునరుద్ధరణ పనులు కొరుక్కుపేట: బ్రాడ్వే బస్ స్టేషన్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున, అక్కడి నుండి నడిచే బస్సులను శనివారం (జనవరి 24) నుండి రాయపురం, ఐల్యాండ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ టెర్మినల్స్ నుండి నడుపుతామని చైన్నె మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న బ్రాడ్వే బస్టాండ్లో పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి. అందువల్ల శనివారం (జనవరి 24) నుండి బ్రాడ్వే బస్టాండ్ నుండి నడిచే బస్సులను రాయపురం, ఐల్యాండ్ గ్రౌండ్ నుంచి నడపనున్నారు. ఈ బస్సులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ టెర్మినల్స్ నుంచి నడుస్తాయని ప్రయాణికులు గమనించాలని కోరారు. గుండెపోటుతో ప్రయాణికుడి మృతి అన్నానగర్: కోయంబత్తూరులోని వాడవల్లి నుండి ఒండిపుదూరుకు 15వ తేదీ మధ్యాహ్నం వెళ్తున్నా ప్రభుత్వ బస్సులో 45 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. దీని తర్వాత బస్సు కండక్టర్ ఈ ప్రయాణికుడిని ఆర్.ఎస్.పురం వద్ద రోడ్డుపై దింపి వెళ్లాడు. ఇది వివాదానికి దారితీసింది. రక్తం వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కొందరు రక్షించి 108 అంబులెన్స్లో కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కి పంపారు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. అతను ఎవరు, ఏ ఊరు, వివరాలు వెంటనే తెలియలేదు. ఈ విషయంలో ముందుగా ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఈసన్, కండక్టర్ శరవణన్లను సస్పెండ్ చేయడం గమనార్హం. -
చైన్నె వర్సిటీలో స్నాతకోత్సవం
● బహిష్కరించిన విద్యామంత్రి ● గవర్నర్ హాజరు సాక్షి, చైన్నె : చైన్నె వర్సిటీ స్నాతకోత్సవాన్ని ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవి చెలియన్ బహిష్కరించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొని విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థ చైన్నె వర్సిటీ 167వ స్నాతకోత్సవానికి చర్యలు గురువారం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షత వహించారు. విద్యా శాఖ కార్యదర్శి శంకర్ స్వాగతోపన్యాసం చేశారు. శాస్త్ర వేత్త పద్మశ్రీ శివథాను పిల్లై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవి చెలియన్ హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను బహిష్కరిస్తున్నట్టు కార్యక్రమానికి ముందుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంలో గవర్నర్ తీరును ఖండిస్తూ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. గవర్నర్ రవి చేతుల మీదుగా 1,323 మంది విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. ఇందులో 41 మందికి డాక్టరేట్లను ప్రదానం చేశారు. ముగ్గురికి స్కాలర్ అవార్డును అందజేశారు. ఇక, ట్రాన్స్ జెండర్ జసిందాకు డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవం ద్వారా చైన్నె వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలలలో చదువుకున్న 93 వేల మంది విద్యార్థులందరికి డిగ్రీలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే యూటర్న్ సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే హఠాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పెరంబలూరు జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత, కున్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆర్టీ రామచంద్రన్ డీఎంకేలో చేరుతున్నట్టు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ను కలవనున్నట్టుగా ప్రకటించారు. అయితే, రాత్రికి రాత్రే నిర్ణయం మార్చేసుకుని ఏకంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు గురువారం వీడియో విడుదల చేశారు. తన కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా మందలించారని, అందుకే డీఎంకేలో చేరడం లేదని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం గమనార్హం. 28,29 తేదీల్లో సమ్మిట్ సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం, నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ సహకారంతో, టిడ్కో మద్దతుతో ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026కు చర్యలు తీసుకున్నారు. ఈనెల 28, 29 తేదీల్లో కలైవానర్ అరంగం వేదికగా రెండు రోజుల పాటు శిఖరాగ్ర సమావేశం జరగనుంది. సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, విద్యామంత్రులు కోవి చెలియన్, అన్బిల్మహేశ్, పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా, విద్యా వేత్తలు, నిపుణులు, హాజరు కానున్నారు. విద్య, విజ్ఞానం వంటి అంశాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, బిటూబీ ఎక్స్ పో, ఉన్నత విద్య నైపుణ్యం, పరిశోధనలు, ఆవిష్కరణల గురించి కీలక సమీక్షలు జరగనున్నాయి. రష్యాలో ఉద్యోగాల పేరిట దగా సాక్షి, చైన్నె: రష్యాలో ఉద్యోగం పేరిట 250 మంది వద్ద ఓ ప్రైవేటు సంస్థ మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రూ.4 లక్షలు వసూళ్లు చేసినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మదురైలో ఎస్ఎస్ కాలనీలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగం పేరిట ఇచ్చిన ప్రకటనలకు మదురై, తిరునల్వేలి, కన్యాకుమారిలతో పాటు కేరళకు చెందిన నిరుద్యోగులు విదేశీ ఉద్యోగం మోజుతో ఆ సంస్థను ఆశ్రయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.4 లక్షలు వసూళ్లు చేసిన ఈ సంస్థ నిర్వాహకులు పత్తాలేకుండా పోయారు. తమ పాస్పోర్టులు, తమ సర్టిఫికెట్లతో సైతం ఈ నిర్వాహకులు కనిపించడం లేదంటూ బాధితులు గురువారం మదురై కలెక్టర్ను ఆశ్రయించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో తక్షణం పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు. రైలు ఢీకొని జింకలు మృతి అన్నానగర్: రైలు ఢీకొని ఐదు జింకలు మృతిచెందాయి. ఈ ఘటన కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలో చోటుచేసుకుంది. కుప్పనాథం ప్రాంతంలో గురువారం ఉదయం రైల్వే పట్టాల వద్ద ఐదు జింకలు మృతిచెంది ఉన్నాయి. సమాచారం అందుకున్న విరుదాచలం రైల్వే పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మృతిచెందిన జింకలను పరిశీలించి, దర్యాప్తు చేశారు. ఆహారం కోసం ఆ ప్రాంతంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకలు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుండగా కడలూరు నుంచి విరుదాచలం వైపు వెళుతున్న రైలు ఢీకొట్టినట్లు విచారణలో తెలిసింది. -
డిమాండ్లన్నీ నెరవేరుస్తాం
సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ, పౌష్టికాహార సిబ్బంది ఇలా అందరి డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వం విస్తృతంగా కసరత్తులు చేస్తున్నట్టు అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ గురువారం ప్రకటించారు. పాత పెన్షన్ ప్రయోజనాలతో కొత్త పథకం అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగుల 23 ఏళ్ల కలను సాకారం చేశామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మూడవ రోజు గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానం ఇచ్చారు. ఆ మేరకు ఊత్తుకోట పట్టణ పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చెంబరంబాక్కం రిజర్వాయర్ నీటిని ఆ పరిసర ప్రాంతాలకు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. చైన్నె, కోయంబత్తూరు, మదురైలలో రూ. 200 కోట్లతో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించామన్నారు. మంత్రి స్వామినాథన్ మాట్లాడుతూ, నగరాలు, పట్టణాల పేర్లు ఇక తమిళంలో ఉచ్చరించేలా, ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి తమ ప్రభుత్వం ఇంటి పట్టాలను మంజూరు చేసినట్లు మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ ప్రకటించారు. తమిళనాడులో 115 పర్యాటక హోటళ్లు ఉన్నట్టు మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో 21,558 మంది ఖైదీలు ఉన్నట్టు మంత్రి రఘుపతి వివరించారు. అన్నీ పరిష్కరిస్తున్నాం సభలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పోరాడటం వారి హక్కు అని పేర్కొంటూ, పార్ట్ టైం ఉపాధ్యాయులతో పలు మార్లు ప్రభుత్వం చర్చించిందని, సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎలా ఇచ్చేవారో ఓ మారు ప్రతి పక్షం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, పౌష్టికాహార సిబ్బంది అందరి సమస్యలు, డిమాండ్లు, కోరికలను పరిష్కరించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. శుక్రవారం అసెంబ్లీలో గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రభుత్వం కీలక తీర్మానం ప్రవేశ పెట్టనున్నట్టు తెలిసింది. -
ఆలోచింపజేసే లక్ష్మీకాంత్ కొలై వళక్కు
, ప్రగిడ, చిత్ర యూనిట్ ఆలోచింపజేసేలక్ష్మీకాంత్ కొలై వళ్లక్కుతమిళసినిమా: ఇంతకుముందు కొండ్రాల్ పావం, మారుతీనగర్ కావల్ నిలయం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దయాల్ పద్మనాభన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం లక్ష్మీకాంత్ కొలై వళ్లక్కు. 2 ఎం సినిమాస్ పతాకంపై కె.వి.శబరిస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు దయాల్ పద్మనాభన్ సహ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. వెట్రి, రంగరాజన్ పాండే, నటి బ్రిగిడ, లిస్సీ ఆంటోని, శరవణన్, కవిత భారతి, లొల్లు సభ మారన్, ఇళవరసు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఎస్.వీరపాండియన్ కీలకపాత్రను పోషిస్తున్నారు. దీనికి కథనం, సంభాషణలను కవిత భారతి, దర్శకుడు దయాల్ పద్మనాభన్ కలసి రాశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల దర్శకుడు వెట్రిమారన్ విడుదల చేసి చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసి చాలా బాగున్నాయంటూ ప్రశంసించినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా చిత్ర షూటింగ్ పూర్తి అయినట్లు దర్శకుడు మీడియా ద్వారా ప్రకటించారు. ఇది ప్రగాఢమైన నమ్మకం నుంచి పుట్టిన కథా చిత్రం అని ఆయన తెలిపారు. చిత్ర యూనిట్ నిజాయితీగా, నమ్మకంతో పని చేశారని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆలోచింపజేసే కథా చిత్రంగా ఉంటుందని ఆయన చెప్పారు ఈ చిత్రానికి పన్నీర్సెల్వం చాయాగ్రహణం, దర్బూగాశివ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బస్టాండ్ నిర్మాణ పనుల పరిశీలన
తిరువళ్లూరు: పట్టణంలో రూ.33 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్టాండు నిర్మాణ పనులను కలెక్టర్ ప్రతాప్ అధికారులతో కలసి గురువారం ఉదయం పరిశలించారు. తిరువళ్లూరులో నడిబొడ్డన పాత బస్టాండు వుంది. అయితే బస్టాండు చిన్న ప్రాంతం కావడంతోపాటు రద్దీ సమయంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగాలనే ఉద్దేశంతో ఐదెకరాల విస్తీర్ణంతో నూతన బస్టాండు నిర్మాణ పనులను గత సంవత్సరం ప్రారంభించారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఎన్నికలకు ముందుగానే ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పనులను కలెక్టర్ ప్రతాప్ గురువారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. పనులను శరవేగంగా పూర్తి చేసి నెలరోజుల్లో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. -
లయన్స్ సేవలను విస్తరించాలి
వేలూరు: లయన్స్ సంఘం సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని టీకే పురం సర్పంచ్ రాజేస్ కన్నన్ తెలిపారు. వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తండల క్రిష్ణాపురం గ్రామంలో వేలూరు సీఎంసీ కంటి ఆస్పత్రి, లయన్స్ సంఘం, జిల్లా దృష్టి నివారణ సంఘం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులతోపాటు నిరుపేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి శిబిరాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి అనేక మంది పేదలకు సాయం చేయాలన్నారు. ప్రస్తుతం కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొత్తం 120 మందికి వైద్య పరీక్షలు చేసి 31 మందికి ఉచిత శస్త్ర చికిత్సకు సిఫారస్సు చేసినట్లు తెలిపారు. కొంత మందికి ఉచిత కంటి అద్దాలను అందజేశారు. ఉపాధ్యక్షులు గీత, లయన్స్ సంఘం డాక్టర్ పొన్నంబలం, లయన్స్ సంఘం అధ్యక్షుడు సెల్వకుమార్, కార్యదర్శి నరసింహన్, కోశాధికారి కామరాజ్, సీఎంసీ క్యాంప్ కోఆర్డినేటర్ లయన్ సతీస్కుమార్ పాల్గొన్నారు. -
రథసప్తమికి సర్వం సిద్ధం
తిరుమల: రథ సప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రథ సప్తమి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లను చైర్మన్ వివరించారు. సమావేశంలోని ముఖ్యాంశాలివీ.. ● ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం ● 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం ● 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం ● మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం ● మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం ● సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం ● సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం ● రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు. ● ఈ నెల 25వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ● తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు. ● రథ సప్తమి రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెనూ తయారీ. గ్యాలరీల్లోని భక్తులందరికీ 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా అన్న ప్రసాదాలు వితరణ. ● సుమారు 3700 మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు ● గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ 1900 ట్రిప్పులను నడపగా, ఈ ఏడాది 2300 ట్రిప్పులు నడిపేందుకు చర్యలు. ఈ సమావేశంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈఓ లోకనాథం, రాజేంద్ర పాల్గొన్నారు. -
తిరుప్పూరులో మానసిక రోగి వీరంగం
సేలం : తిరుప్పూర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో సినిమా పాటల రచయిత వైరముత్తును న్యాయవాదులు స్వాగతిస్తున్న సమయంలో జనంపైకి బూటు విసరడంతో గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం తిరుప్పూర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో 50 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా రోడ్డుపై కూర్చుని ఆందోళన చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఆ సమయంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ఆ మహిళను అక్కడి నుంచి తరలించారు. విచారణలో, ఆ మహిళ పేరు జయ అని, ఆమె మానసిక రోగి అని, ఏ ప్రభుత్వం కూడా ఆమె డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఆమె తరచూ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతోందని తెలిసింది. ఈ పరిస్థితిలో, కవి, పాటల రచయిత వైరముత్తు కొంగు కలై సాహిత్య సాంసృతిక వేదిక ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి తిరుప్పూర్ వచ్చారు. కలెక్టర్ సమీపంలో న్యాయవాదుల సంఘం ఆయనకు పూలమాల వేసి స్వాగతం పలికింది. ఆ సమయంలో ఆందోళన చేస్తున్న మానసిక రోగి అయిన మహిళ అకస్మాత్తుగా తాను ధరించిన బూటును తీసి వైరముత్తును స్వాగతిస్తున్న జనంపై విసిరింది. న్యాయవాదులు వైరముత్తును సురక్షితంగా వేదిక వద్దకు తీసుకెళ్లారు. -
తమన్నాకు పురుషన్గా విశాల్
తమిళసినిమా: స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా మకుడం చిత్రాన్ని తెరకెక్కించడంలో బిజీగా ఉన్న నటుడు విశాల్. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించి, నటించనున్న తుప్పరివాలన్–2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల దశలో ఉంది. కాగా తాజాగా విశాల్ మరో నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సుందర్. సి కథా దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత ఏసీఎస్ అరుణ్కుమార్తో కలసి నటి కుష్బూ తన అవ్నీ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా నాయకిగా నటిస్తున్నారు. హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పురుషన్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రం త్వరలో సెట్పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన టీజర్ను గురువారం విడుదల చేశారు. విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబోలో రూపొందుతున్న నాల్గవ చిత్రం ఇది. ఇంతకుముందు ఆంబళ, యాక్షన్, మదగజరాజా చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. అదేవిధంగా విశాల్, తమన్నా కాంబోలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం ఇది. పురుషన్ చిత్ర టీజర్లో తమన్నా దర్జాగా కూర్చుని టీవీ చూస్తూ విశాల్కు వంట పని అప్పజెబుతుంది. ఆ సమయంలో యోగిబాబు వచ్చి తమన్నాతో ముచ్చట్లు చెబుతుంటాడు. ఆ సమయంలో విశాల్ వంటింట్లో చొరబడ్డ రౌడీలను రప్ఫాడిస్తూనే వంట పని చేస్తారు. ఈ టీజర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పురుషన్ చిత్రాన్ని దర్శకుడు సుందర్.సి తనదైన బాణీలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. -
క్లుప్తంగా
విద్యుత్ అవసరాలే లక్ష్యంగా స్వెలెట్ సాక్షి, చైన్నె: గృహాలకు పెరుగుతున్న విద్యుత్ అవసరాల పరిష్కారం లక్ష్యంగా స్వెలెట్ క్లీన్ ఎనర్జీపై దృష్టి పెడుతూ కొత్త ఆవిష్కరణ చైన్నెలో చేశారు. స్వెలెట్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు ఆర్ చెల్లప్పన్, ఎండీ అరుల్కుమార్ షణ్ముగ సుందరం బాధ్యతాయుతమైన ఉత్పత్తి పోర్టు పోలియో, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ శ్రేణిని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త కార్పొరేట్ లోగో, బ్రాండ్ ట్యాగ్ లైన్గా పవరింగ్ ది వరల్డ్ రెస్పాన్స్బులిటీని ఆవిష్కరించామన్నారు. రౌండ్ ది క్లాక్ పవర్ కోసం పెరుగుతున్న అవసరాన్ని పరిష్కరించడానికి రూపొందించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, గృహ శక్తి అవసరాల పరిష్కారాల సమగ్ర శ్రేణిలు కొత్త బ్రాండ్ గుర్తింపుతో ముందుకు సాగనున్నాయని ప్రకటించారు. హిందీలో ఏఐ ఫర్ ఆల్ కోర్సులు ఐఐటీ మద్రాసు శ్రీకారం సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు స్వయం ప్లస్ హిందీలో ఏఐ ఫర్ ఆల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. గురువారం ఈ వివరాలను ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ఐఐటీ మద్రాసు డీన్ ప్రొఫెసర్ ఆర్ సారథి పేర్కొంటూ ఉచిత ఏఐ కోర్సులలో అధ్యాపకుల కోసం ఏఐ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అకౌంటింగ్, ఏఐతో క్రికెట్ అనలిటిక్స్ల గురించి వివరించారు. హిందీ వెర్షన్లో ఆరు ఏఐ ఫర్ ఆల్ కోర్సులు ఇప్పుడు విస్తృతం చేశామన్నారు. కళలు, సైన్స్, వాణిజ్యం, అనుబంధ విభాగాల నుంచి విద్యార్థులు, నిపుణులు భాషా అడ్డంకులను తొలగించడానికి, అవగాహనను పెంపొందించేందుకు ఈ చొరవ రూపొందించినట్టు వివరించారు. ప్రతి కోర్సు 25 నుంచి 45 గంటల వ్యవధి కలిగి ఉంటుందని దీనిని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని పేర్కొంటూ, స్వయం ప్లస్లో ఈనెల 26వ తేదీలోపు ఆసక్తిగల వారు పేరు నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. కల్యాణ మండపాల పనుల పరిశీలన కొరుక్కుపేట: పెరంబూరులోని చంద్రయోగి సమాధి రోడ్డులో కొత్తగా నిర్మించిన కల్యాణ మండపం చివరి దశలను హిందూ ధర్మాదాయ శాఖా మంత్రి పి.కె. శేఖర్బాబు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తైపూసం పండుగ కోసం హిందూ, దేవదాయ శాఖ వివిధ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని ఆయన అన్నారు. నార్త్ చైన్నె డెవలప్మెంట్ ప్రాజెక్టు క్రింద, రోజువారీ వేతనాలు పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులు వంటి ఆర్థికంగా వెనుకబడిన వారు ఇంటి పనులకు అధిక రుసుములు వసూలు చేస్తున్నందున వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించి కల్యాణ మండపాలను నిర్మిస్తున్నామని చెప్పారు. మొదటి దశలో గత నెల 18న కొలత్తూరులోని జి.కె.ఎం, కాలనీలో అన్నా వివాహ మందిరాన్ని సీఎం స్టాలిన్న్ ప్రారంభించారన్నారు. చైన్నెలో కొత్తగా నిర్మిస్తున్న 8 కల్యాణ మండపాలను ఫిబ్రవరి 28 తేదీ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. పెరంబూరులోని చంద్రయోగి సమాధి రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న అంబేడ్కర్ కల్యాణ మండపం చివరి దశ నిర్మాణ పనులు పీఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. మేయర్ ప్రియా, పీఎండీఏ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, సెంట్రల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్.ఆర్. కౌశిక్ పాల్గొన్నారు. ప్రాణం తీసిన బైక్ అన్నానగర్: బైక్లో కూర్చుని ఆడుకుంటుండగా అదుపుతప్పి బావిలో పడడంతో ఓ బాలిక మృతిచెందింది. మదురై జిల్లాలోని ఉసిలంపట్టి సమీపంలోని సర్ధిపట్టికి చెందిన పాండి కుమార్తె హాసిని(14). ఈమె బుధవారం సాయంత్రం, తన సోదరుడు కబిలన్తో కలసి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్పై ఆడుకుంటోంది. బాలిక హఠాత్తుగా బైక్ను స్టార్ట్ చేయడంతో అదుపుతప్ని బైక్ సహా ఇద్దరు సమీపంలోని బావిలో పడ్డారు. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హాసిని చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులుకేసు దర్యాప్తు చేస్తున్నారు. జాలరికి యావజ్జీవ శిక్ష తిరువొత్తియూరు: నగదు ఇచ్చి పుచ్చుకోవడంలో ఏర్పడిన వివాదంలో జాలరిని మునగ చెట్టు కొమ్మతో కొట్టి హత్య చేసిన స్నేహితుడికి చైన్నె సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చైన్నె , కాసిమేడు ప్రాంతంలో ఫిషింగ్ బోట్ రోజూవారీ కూలీలుగా పనిచేసే స్నేహితులు సతీష్కుమార్ సురేష్, వీరి మధ్య నగదు లావాదేవీలపై తరుచుచూ గొడవలు జరిగేవి. ఫిబ్రవరి 2015లో, వారి మధ్య ఏర్పడిన గొడవలో సతీష్కుమార్ మునగ చెట్టు కొమ్మతో సురేష్పై దాడి చేశాడు. దాడిలో సురేష్ మృతి చెందాడు. అతని తల్లి తైలమ్మాళ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కాసిమేడు పోలీసులు సతీష్కుమార్పై హత్యకేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. చైన్నె జిల్లా 3వ అదనపు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి కె. గీతారాణి ఎదుట ఈ కేసు విచాణకు వచ్చింది. ప్రభుత్వ క్రిమినల్ న్యాయవాది టి. సురేష్ హాజరై పోలీసుల తరఫున వాదించారు. వాదనలు విన్న తర్వాత, న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ నేరం రుజువైందని పేర్కొంటూ, సతీష్కుమార్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఉదయనిధికి అన్నామలై కౌంటర్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీజేపీ నాయకుడు కె. అన్నామలై డిమాండ్ చేశారు. తన పదవికి ఉదయనిధి రాజీనామా చేయాలన్నారు. తమ పార్టీ నాయకుడు అమిత్ మాలవీయపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై గౌరవం లేదని విమర్శించారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను స్టాలిన్ సర్కారు అమలు చేయడం లేదని ఆరోపించారు."అమిత్ మాలవీయకు సంబంధించిన కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి 48 గంటల క్రితం ఇచ్చిన తీర్పులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మత విశ్వాసాలపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు జాతి నిర్మూలనకు దారితీసేలా ఉన్నాయన్నారు. తమిళనాడు పోలీసులు కనీసం ఇప్పుడైనా ఉప ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలి. ఇది నిజంగా చట్టబద్ధమైన ప్రభుత్వం అయితే, ఆయన నుంచి రాజీనామా లేఖ తీసుకోవాల''ని అన్నామలై అన్నారు.చెన్నైలో మూడేళ్ల క్రితం ఈ సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మలేరియా, డెంగ్యూ వ్యాధుల్లా.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు. దీన్ని మారణహోమానికి పిలుపుగా అమిత్ మాలవీయ (Amit Malviya) వర్ణించారు. దీంతో తమిళనాడు పోలీసులు ఆయనపై అప్పట్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది.కోర్టు తీర్పులను లెక్కచేయడం లేదుకోర్టు తీర్పులను స్టాలిన్ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదని అన్నామలై తాజాగా ఆరోపించారు. తిరుప్పరంకుండ్రం కేసుతో సహా అనేక వివాదాల్లో కోర్టు ఆదేశాలు అమలు కాలేదని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని అన్నారు. మరో 50 రోజుల పాటు ప్రజలు డీఎంకే ప్రభుత్వ దారుణాలను భరించాల్సి ఉంటుందని చెప్పారు. ''డీఎంకే, వామపక్ష పార్టీలు ఏ తీర్పును ఆమోదించవు. న్యాయమూర్తి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకపోతే.. వారు కులం, మతం ఉపయోగించి దుర్భాషలాడేందుకు ప్రయత్నిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీలు పేదల కోసం పోరాడతాయని పేరుండేది. కానీ డీఎంకేతో చేతులు కలిపిన తర్వాత తోక పార్టీలుగా మారిపోయాయ''ని ధ్వజమెత్తారు.చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేత -
విజయ్ టీవీకే పార్టీకి కొత్త కష్టాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలలు కూడా లేవు. అక్కడి రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార, ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు.. వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా.. ఈ ఎన్నికల్లో మూడో పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ ‘తమిళగ వెట్రి కగళం’ పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. అయితే.. కరూర్ ఘటన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు.నెల రోజులు(డిసెంబర్ 18 నుంచి) గడుస్తున్నా విజయ్ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. డీఎంకే సర్కార్పై రెగ్యులర్ తరహా విమర్శలు సహా తిరుపరంకుండ్రం తీర్పులాంటి అంశంపై కూడా స్పందించలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా ఆయనలో చలనం లేదు.(ఆ సంగతి నిర్మాతలే చూసుకుంటారని ఆయన అన్నట్లు వినికిడి). అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు సెన్సార్బోర్డు తీరును ఎండగడుతున్నా.. టీవీకే మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా ఈ మధ్యలో విజయ్ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ సైలెన్స్ ఏంటి అన్నా? అంటూ అభిమానులే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సైలెన్స్లోనే..అయితే ఆయన తన పనిని తాను సైలెంట్గా పని చేసుకుపోతున్నారంటూ విశ్లేషణ నడుస్తోందక్కడ. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం.మరోవైపు.. పొంగల్ తర్వాత మొన్నీమధ్యే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకంలో తేడాలు వస్తుండడంతో డీఎంకేకు కాంగ్రెస్ దూరం కావొచ్చని.. విజయ్తో చేతులు కలిపే అవకాశం ఉందని గత కొంతరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ ఘటన, జన నాయగన్ సెన్సార్ విషయంలో రాహుల్ గాంధీ నేరుగా టీవీకేకు, విజయ్కు మద్దతు ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే టీవీకే కీలక నేతలు మాత్రం పొత్తులపై ఎక్కడా నోరు జారడం లేదు. కొత్త కష్టం.. టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఎన్నికల సంఘం (ECI) వద్ద ఒకే గుర్తు (common symbol) కోసం దరఖాస్తు చేసింది. అయితే కామన్ సింబల్ దక్కకపోవచ్చనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.‘‘మాకు ఒకే గుర్తు తప్పనిసరి. లేకపోతే ఎన్నికల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేం ఇప్పటికే ఒక గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. త్వరలో దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ టీవీకే నేత ఒకరు చెబుతున్నారు.ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. ఆర్యూపీపీ పార్టీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల అడిట్(Annual Audit Report), కాంట్రిబ్యూషన్ రిపోర్టు(Contribution Report)లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే టీవీకే మాత్రం ఒక్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను సమర్పించింది. అంటే.. రెండు సంవత్సరాల నివేదికలు అవసరం. అయితే..కొన్ని పరిమితుల ప్రకారం టీవీకేకు కామన్ సింబల్ దక్కవచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీలు తాజా ఆర్థిక సంవత్సరపు నివేదికలు సమర్పిస్తే కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాంటి పార్టీలు సాధారణంగా లిస్ట్లో ఉన్న కామన్ సింబల్లలో ఒకటి పొందుతాయి. అయితే అది ఎప్పుడు, ఏది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే దరఖాస్తును ఈసీ త్వరలో పరిశీలించనుంది. నిర్ణయం ఏదనేది ఈ పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. -
ఇరుగు పొరుగు
రథ సప్తమి విజయవంతం చేయండి– టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన స్ఫూర్తితో ఈ నెల 25వ తేదీన జరగనున్న రథసప్తమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం ఆయన టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరితో కలసి జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి రోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయట ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలని, టీటీడీ భద్రత విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని సూచించారు. రథ సప్తమి రోజున భక్తులకు అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచుకోవాలన్నారు. పుష్కరిణి పరిశీలించి చక్రస్నానం సందర్భంగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రథసప్తమి రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతోపాటు అన్ని సేవలు రద్దు చేశామన్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాల్లో శ్రీవారు ఊరేగనున్నట్లు తెలిపారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, తిరుపతి కమిషనర్ మౌర్య, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
పశువుల లారీలు స్వాధీనం
పలమనేరు: పుంగనూరు వైపు నుంచి తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చి కబేళాకు అక్రమంగా తరలుతున్న పశువుల లారీలను బుధవారం పలమనేరు, గంగవరం వద్ద భజరంగ్దళ్, బీజేపీ, టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. పశువులను నాలుగైదు వాహనాల్లో తమిళనాడుకు తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో వారు రోడ్డుపై కాపుకాశారు. రెండు వాహనాలను పట్టుకోగా ఒక వాహనం తప్పించుకున్నట్టు సమాచారం. మరో వాహనాన్ని గంగవరం పోలీసులకు అప్పగించారు. ఇందులోని 32 ఎద్దులను కిందకు దింపి పశుసంరక్షణ కేంద్రానికి పంపే ఏర్పాట్లు చేశారు. మరికొన్ని వాహనాలు వెనక్కి వెళ్లినట్టు భజరంగ్దళ్ నాయకులు తెలిపారు. దీనిపై తిరుపతికి చెందిన భజరంగ్దల్ నేత విష్ణు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పశువుల అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనేది కనిపెట్టాలని స్థానిక నాయకులు సత్యప్రకాష్, సిద్ధయ్య, శరవణ కోరారు. వితరణగా వంట పాత్రలు తిరుపతి అన్నమయ్యసర్కిల్ : శ్రీగోవిందరాజస్వామి ఆలయానికి నగరానికి చెందిన దాత మురళి బుధవారం రూ.18 లక్షల విలువైన వంట పాత్రలను వితరణగా అందించారు. ప్రసాదాల తయారీ నిమిత్తం సోలా, అర సోలా, పోటు వంట సామన్లను ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతికి అందజేశారు. ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ పద్మప్రియ పాల్గొన్నారు. -
శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డు
సాక్షి, చైన్నె : చిన్నారులకు శ్రవణనాడి చికిత్సలో సరికొత్త రికార్డును మద్రాస్ ఈఎన్టి రీసెర్చ్ ఫౌండేషన్ సృష్టించింది. బుధవారం మద్రాసు ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ కామేశ్వరన్ ఈ వివరాలను ప్రకటించారు. 2004లో మొదటిసారిగా 13 ఏళ్ల బాలికకు ఆడిటరీ ట్రెయిన్ ప్రైమ్ ఇంప్లాంట్ (ఏబీఐ) చికిత్సను నిర్వహించి వినికిడిని పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత 2009లో పసికందు కూడా చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 100 వరకు ఆ రకమైన చికిత్స విజయవంతంగా చేసి, కొత్త మైలురాయికి చేరామని వెల్లడించారు. సమావేశంలో వీహెచ్ఎస్ హాస్పిటల్ చీఫ్ న్యూరో సరైన్ డాక్టర్ ఎంసీ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. -
మృతులకు సంతాపంతో సరి!
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజున బుధవారం సంతాప తీర్మానాలతో సరి పెట్టారు. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖులకు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు. 2026 కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజున గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం వ్యవహారం ప్రతి ఏటా వలే ఈ సారి కూడా వివాదాలమయంగానే మారింది. రెండవ రోజున ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ అప్పావు సంతాప తీర్మానాలను ప్రవేశ పెట్టారు. ఇటీవల మృతిచెందిన సెంతామంగళం ఎమ్మెల్యే పొన్నుస్వామికి సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన రాజకీయ ప్రయాణం, ప్రజాసేవను ఈసందర్భంగా స్పీకర్ అప్పావు గుర్తు చేశారు. అనంతరం నిర్మాత ఏవీఎం శరవణన్, మురుగప్ప గ్రూప్ మాజీ చైర్మన్ అరుణాచలం వెల్లయన్, ప్రముఖ కవి తమిళన్బన్లకు అసెంబ్లీ నివాళులర్పించింది. మాజీ ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వం, ఎల్ గణేషన్, మాజీ లోక్సభ స్పీకర్ శివరాజ్పాటిల్తోపాటు మరి కొందరు ప్రముఖుల మృతికి అసెంబ్లీలో నివాళులర్పించారు. అనంతరం సభను స్పీకర్ అప్పావు గురువారానికి వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరగనుంది. -
మహిళల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
కొరుక్కుపేట: చైన్నె పోలీస్ కమిషనరేట్లో బుధవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల శిబిరానికి పోలీస్ కమిషనర్ అరుణ్ హాజరయ్యారు. మహిళల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. చైన్నె వేపేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రతి బుధవారం సాధారణ ప్రజల కోసం ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఆమేరకు బుధవారం జరిగిన ఫిర్యాదుల పరిష్కార వేదికలో వృద్ధులు, మహిళలు సహా అనేక మంది పాల్గొన్నారు. ఈ వేదికలో పోలీస్ కమిషనర్ అరుణ్ పాల్గొన్నారు. శిబిరంలో మహిళలు, వృద్ధుల నుంచి విడివిడిగా ఫిర్యాదులను స్వీకరించిన ఆయన, ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆరోగ్యం హాజరయ్యారు. అదేవిధంగా, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ రేంజ్లోని 12 మంది డిప్యూటీ కమిషనర్లు వారి కార్యాలయాలలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. -
ఫిర్యాదులపై విచారణ జరిపించాలి
వేలూరు: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అదనపు ఎస్పీ భాస్కరన్ ఆదేశించారు. వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మయిల్వాగనన్ అధ్యక్షతన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను సమర్పించారు. ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ జిల్లాలోని ఆయా పోలీస్స్టేషన్ సీఐలకు అందజేసి వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే 15 రోజుల్లో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. వీటిపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఎక్కువగా చీటీల పేరుతో పలువురు మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వీటిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అనంతరం నేడు వచ్చిన మొత్తం 30 ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులను పంపారు. డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
ఫలించిన పీయూష్ తంత్రం
సాక్షి, చైన్నె: కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ ఎన్నిక ల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ రాజకీయ వ్యూహాల తంత్రం ఫలించింది. అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చారు. తమిళనాట అధికారం ఎన్డీఏ కూటమిదే అని టీటీవీ స్పష్టం చేయగా, అందరం కుటుంబ సభ్యులవలే కలసి పనిచేసి మంచి నాయకత్వంతో, సుపరిపాలనను తమిళనాట తీసుకొస్తామని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. టీటీవీ రాకను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఆహ్వానించారు. అన్నాడీఎంకే నుంచి చీలికతో దివంగత సీఎం జయలలిత పేరిట అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. తొలుత పార్టీకి ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ప్రకటించారు. అయితే, అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా సాగిస్తున్న న్యాయపోరాటం నేపథ్యంలో ఆమె పేరును తప్పించి, చివరకు తానే ప్రధాన కార్యదర్శి అని టీటీవీ దినకరన్ ప్రకటించుకున్నారు. దక్షిణ తమిళనాడులోనే కాదు, కొంగు మండలంలోని ముక్కళ్లత్తార్ సామాజిక వర్గం మెజారిటీ శాతం టీటీవీ వెన్నంటి ఉంటూ రావడం తాజా ఎన్నికల నేపథ్యంలో ఆయనకు డిమాండ్ పెరిగింది. అంతకు ముందు లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమితో కలసి ఎన్నికల్లోకి వెళ్లిన సమయంలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంలో టీటీవీ పాత్ర ఉందని చెప్పవచ్చు. ఎన్నికల అనంతరం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన దినకరన్ విజయ్ తమిళగ వెట్రి కళగంతో కలిసి ఎన్నికలలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. దినకరన్ను ఎన్డీఏ కూటమిలోకి మళ్లీ తీసుకొచ్చే దిశగా బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్ గత రెండు రోజులుగా వ్యూహాలకు పదును పెట్టారు. చివరకు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షా అభయాన్ని సైతం దినకరన్ స్వీకరించినట్టు సమాచారం. ఎట్టకేలకు ఎన్డీఏలోకి టీటీవీ పీయూష్ గోయల్ వ్యూహాలు బుధవారం ఫలించా యి. అమిత్షా ఇచ్చిన అభయంతో దినకరన్ ఎన్డీఏలోకి మళ్లీ చేరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పీయూష్ గోయల్, సహాయ మంత్రి ఎల్ మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో ఎన్డీఏ కూటమితో టీటీవీ చే తులు కలిపారు. ఆయన మీడియా మాట్లాడుతూ త మిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో అమ్మ మక్కల్మున్నేట్ర కళగం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి సీఎం అభ్యర్థిగా పళణిస్వామిని అంగీకరిస్తారా అని ప్రశ్నించగా, కూటమి సీఎం అభ్యర్థి ఎవరో మీడియాకు ఇప్పటికే తెలుసునని, అలాంటప్పుడు ఈ ప్రశ్న అవసరయా అని దాట వేశారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ, 2026 ఎన్నికలలో పళణి స్వామి, అన్బుమణి, వాసన్, దినకరన్ కుటుంబ సభ్యుల్లా కలసి పనిచేస్తామన్నారు. ఎన్డీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత పాలన మళ్లీ తమిళనాట తీసుకొస్తామన్నారు. నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ శశికళ తమకు మద్దతు ఇస్తే మంచిదని, ఆనందంగా ఆమె మద్దతును స్వీకరిస్తామని వ్యాఖ్యలు చేశారు. దినకరన్ ఎన్డీఏ కూటమిలోకి రావడాన్ని పళణిస్వామి ఆహ్వానించారు. అందరం కలిసి పనిచేస్తామని, అధికారం చేజిక్కించుకుంద్దామని వ్యాఖ్యలు చేశారు. ఇక, ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సైతం ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నట్టుగా సమాచారం. అయితే, తమను ఎవ్వరూ సంప్రదించ లేదని, ఎలాంటి చర్చలు జరగలేదని ప్రేమలత ఖండించారు. మధురాంతకంలో ఏర్పాట్ల పరిశీలన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో బహిరంగ సభకు ఏర్పాట్లు విస్తృతమైన విషయం తెలిసిందే. ఈ వేదికపై నుంచి కూటమి పార్టీల నేతలందర్నీ మోదీ పరిచయం చేసి ఎన్డీఏ కూటమిని ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పీయూష్ గోయల్, ఎల్ మురుగన్, నైనార్ నాగేంద్రన్, బీజేపీ వర్గాలు సాయంత్రం పరిశీలించారు. భారీ జన సమీకరణ దిశగా కసరత్తులు చేపట్టారు. ఎన్డీఏలోనే ఐజేకే ఎన్డీఏ కూటమిలో ఐజేకే అని ఆ పార్టీ వ్యవస్థాపకుడు టీఆర్ పారివేందర్, అధ్యక్షుడు రవి పచ్చముత్తు ప్రకటించారు. బుధవారం సాయంత్రం కాటాన్ కొళత్తూరులో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ పీయూష్ గోయల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్లతో ఐజేకే నేతల భేటీ జరిగింది. పారివేందర్ మాట్లాడుతూ, ఐజేకేకు పీఎం మోదీ ఆదర్శమని, తాము ఎన్డీఏ కూటమితోనే ఎన్నికల్లోకి వెళ్లనున్నామని ప్రకటించారు. అయితే, పార్టీ గుర్తింపు దక్కించుకునేందు కోసం ప్రత్యేక చిహ్నంలో ఈసారి పోటీ చేయనున్నామన్నారు. కూటమిలోకి టీటీవీని ఆహ్వానిస్తున్న గోయల్ పీయూష్ గోయల్తో టీటీవీ దినకరన్ కరచాలనం -
క్లుప్తంగా
రేబిస్తో విద్యార్థి మృతి అన్నానగర్: రేబిస్తో బాధపడుతూ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు..వాలాజాబాద్ సమీపం చిన్నివాక్కంకు చెందిన భాస్కర్ కుమారుడు శబరివాసాన్ (15) 9వ తరగతి చదువుతున్నాడు. మూడు నెలల క్రితం, శబరివాసన్ తన ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటుండగా, అదే ప్రాంతంలో ఒక కుక్క అత డిని కరిచింది. తండ్రికి ఈ విషయం చెప్పలేదు. చివరకు ఆలస్యంగా ఆస్పత్రికి చికిత్స పొందాడు. అయితే అప్పటికే అతడికి రేబిస్ సోకింది. ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో తొలుత చికిత్స నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి, ఆ తర్వాత చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ, చికిత్స పొందుతూ శబరివాసన్ బుధవారం మరణించాడు. కుక్క కరిచిన 3 నెలల తర్వాత విద్యార్థి మరణించిన సంఘటన చర్చనీయాంశమైంది. పసికందు విక్రయం అన్నానగర్: కన్నబిడ్డను విక్రయించిన ఓ తల్లిని, దీనికి సహకరించిన మరో నలుగురు మహిళలను కాసిమేడు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కాశిమేడు, పవర్ కుప్పం 2వ బ్లాక్కు చెందిన సహాయరాజ్కు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మా యి సంతానం. అతడి భార్య తిలగవతి మళ్లీ గర్భం దాల్చి గత నెల 4న ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమె తన బిడ్డను ఎవరికై నా విక్రయిస్తానని తండయార్ పైట్టెకి చెందిన ప్రదీపకు చెప్పింది. ఆ తర్వాత ప్రదీప, కాసిమేడుకు చెందిన వెన్నిల పుదువన్నరాపేట్టైకి చెందిన కౌసల్య ఈరోడ్కు చెందిన పిల్లలు లేని ఓ మహిళకు రూ.3.80లక్షలకు విక్రయించారు. సమాచారం అందుకున్న కాసిమేడు పోలీసులు తిలగవతితో సహా అమ్మకానికి సహకరించిన మహిళలను అరెస్ట్ చేశారు. శిశువును రాయపురంలోని శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. నిందితులు గతంలో ఎక్కడైనా శిశువులను విక్రయించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చైన్నెలో ఈ ఘటన కలకలం సృష్టించింది. మద్యం మత్తులో దాడి యువకుడి మృతి తిరువొత్తియూరు: చైన్నె గూడువాంచేరి సమీపంలోని ఊరపాక్కం, చెల్లియమ్మన్ కోయిల్ వీధికి చెందిన కార్తీక్ (40) గత 17వ తేదీ రాత్రి కానుం పొంగల్ (సంక్రాంతి)పండుగను జరుపుకోవడానికి ఐదుగురు స్నేహితులతో కోవలం బీచ్కు వచ్చాడు. అక్కడ అందరూ మద్యం తాగారు. అనంతరం మద్యం మత్తులో సర్ఫింగ్ సెంటర్ (అలల పలక ) మీదుగా బీచ్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కణ్ణన్ వారిని ప్రశ్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరింది. అప్పుడు ఆ ప్రాంతానికి చెందిన అజీస్ (27), కార్తీ (25) అనే మరో ఇద్దరు యువకులు వచ్చారు. అనంతరం ఇరువర్గాల పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని స్నేహితులు అతడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం అతడు మరణించాడు. కేళంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి, కార్తీక్పై దాడి చేసిన కోవలం, భజన కోయిల్ వీధికి చెందిన కణ్ణన్ (38), చైన్నె ట్రిప్లికేన్, నడుకుప్పంకు చెందిన అజీస్, మామల్లాపురం జలార్లు ప్రాంతానికి చెందిన కార్తీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. భారత్ బోధన్ ఏఐ కాన్ క్లేవ్ సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసు నేతృత్వంలో భారత్ బోధన్ ఏఐ కాన్ క్లేవ్ 2026లో పాల్గొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యా భవిష్యత్తును రూపొందించడానికి , పరిశోధన ఆధారిత ఏఐ పరిష్కారాల కోసం ఈ కాన్ క్లేవ్ నిర్వహించనున్నారు. దీనిలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 29 వరకు తమ పేర్లను బోధన్ ఏఐ కాన్ క్లేవ్ వెబ్ సైట్లో నమోదు చేసుకోవచ్చని ఐఐఐటీ మద్రాసు బుధవారం ప్రకటించింది. నేడు రిజిస్ట్రేషన్ వెబ్సైట్ పనిచేయదు తిరువొత్తియూరు: నేడు రిజిస్ట్రేషన్ పని చేయదని పత్రాల నమోదు శాఖ డైరెక్టర్ దినేష్ పొన్రాజ్ ఆలివర్ ఒక ప్రకటన విడుదల చేశా రు. అందులో వివరాలు ఇలా.. పత్రాల నమో దు శాఖ వెబ్సైట్ httpr://tnrefinet.gov.inనిర్వహణ స్టార్ 3.0 ప్రాజెక్ట్ కోసం అప్గ్రేడ్ చేస్తున్నందన, నేడు బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువా రం ఉదయం 11 గంటల వరకు నమోదు శాఖ వె బ్సైట్ పనిచేయదు. అయినప్పటికీ, పైన పేర్కొ న్న 2 రోజుల్లో అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల లో నమోదు పనులు యథావిధిగా జరుగుతాయి. నేడు పత్రాలు నమోదు చేసుకోవాలనుకునే ప్రజ లు, వెబ్సైట్ నిర్దిష్ట సమయంలో పనిచేయదని దృష్టిలో ఉంచుకుని, బుధవారం రాత్రి 7 గంటలలోపు టోకెన్లు తీసుకోవడం, ఆన్లైన్ చెల్లింపులు చేయడం, ఈసీ , సర్టిఫైడ్ డాక్యుమెంట్ కాపీలను పొందడం వంటి నమోదు శాఖ వెబ్సైట్ సేవలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని సూచించడమైనదని పేర్కొన్నారు. వరసిద్ధునికి విరాళం కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని నిత్యాన్నదానం, గోసంరక్షణ ట్రస్టుకు శ్రీరంగరాజుపురానికి చెందిన నాగభూషణమ్మ, చెంగారెడ్డి చెరో రూ.50వేల చొప్పున విరాళం అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఏఈవో రవీంద్రబాబు, సిబ్బంది వాసు, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ ట్యాంకర్–లారీ ఢీ: డ్రైవర్కు గాయాలు
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ గాయపడ్డాడు. పోలీసుల కథనం.. పలమనేరు నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ను మొగిలి ఘాట్ వద్ద వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరణి పట్టణం సూర్యకులుకి చెందిన లారీ డ్రైవర్ కన్నన్ కాలుకి తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన డ్రైవర్ను హైవే అంబులెన్సులో బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. లారీకి బ్రేక్ కంట్రోల్ కాకపోవడం కారణంగా ముందు వెళ్తున్న ట్యాంకర్ను ఢీకొందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ట్యాంకర్ను ఢీకొనడంతో దెబ్బతిన్న లారీ ముందు భాగం,గాయపడిన లారీ డ్రైవర్ కన్నన్ -
డీఎంకేలోకి వైద్య లింగం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ సీఎం పన్నీరుసెల్వం మద్దతుదారుడు ఆర్ వైద్య లింగం డీఎంకేలో చేరారు. బుధవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. డెల్టాలో కీలకంగా ఉన్న తంజావూరు జిల్లాలో పలుకుబడి కలిగిన నేతగా అన్నాడీఎంకేలో ఆర్ వైద్యలింగం ఉంటూ వచ్చారు. 2001, 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఒరత్తనాడు నుంచి గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2016లో ఆయన్ను రాజ్యసభకు పంపించారు. 2021 ఎన్నికలలో మళ్లీ ఒరత్తనాడు నియోజకవర్గం నుంచి గెలిచారు. అన్నాడీఎంకేలో వివాదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి చేరిన ఎమ్మెల్యేలలో ఆర్ వైద్య లింగం కూడా ఉన్నారు. ఆలంకులం నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మనోజ్ పాండియన్ సైతం వైద్యలింగంతో కలసి మాజీ సీఎం పన్నీరుసెల్వం శిబిరంలో కీలకంగా ఉంటూ వచ్చారు. గత నాలుగేళ్లుగా పన్నీరుసెల్వం శిబిరంలో ఉంటూ అన్నాడీఎంకేను కై వశం చేసుకునే వ్యూహాలకు పదును పెడుతూ వచ్చారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. రెండు నెలల క్రితం మనోజ్పాండియన్ డీఎంకే గూటికి చేరారు. అదే సమయంలో ఆర్ వైద్యలింగం సైతం డీఎంకేలోకి చేరడం ఖాయం అనే ప్రచారం జరిగింది. అయితే, తన మద్దతు దారులతో కొన్ని నెలల పాటు చర్చలు జరుపుతూ వచ్చిన వైద్యలింగం ఎట్టకేలకు డీఎంకేలో చేరడానికి సిద్ధమయ్యారు. స్టాలిన్ సమక్షంలో చేరిక... మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో కలసి చైన్నె తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో బుధవారం అడుగుపెట్టారు. సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు నెహ్రూ, కోవిచెలియన్, ఏవీవేలు, టీకేఎస్ ఇలంగోవన్, ఆర్ఎస్ భారతీ, ఎంపీ దయానిధి మారన్ వైద్యలింగంను ఆహ్వానించి అభినందనలు తెలియజేశారు. మీడియాతో వైద్యలింగం మాట్లాడుతూ పన్నీరుసెల్వం త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు వ్యాఖ్యలు అందుకున్నారు. తాను మాతృ సంస్థలోకి వచ్చానని, ఇందులో తప్పేమి లేదన్నారు. అన్నాడీఎంకేలో నియంత వలే సర్వాధికారంతో పళణిస్వామి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాతృ సంస్థల అభ్యున్నతికి , మళ్లీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ముందుగా పెరంబలూరు జిల్లాకు చెందిన అన్నాడీఎంకే నేత, కున్నం మాజీ ఎమ్మెల్యే ఆర్టీ రామచంద్రన్ సైతం డీఎంకేలో చేరారు. కాగా, అన్నాడీఎంకేలో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి వెల్లమండి నటరాజన్ సైతం డీఎంకేలో చేరతారన్న ప్రచారం జరిగినా, ఆయన చివరి క్షణంలో యూటర్న్ తీసుకున్నట్టు చర్చ. తాను పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేలోనే కొనసాగుతానని వెల్లమండి నటరాజన్ స్పష్టం చేశారు. పన్నీరు దారెటో..? మాజీ సీఎం పన్నీరు శిబిరంలోని ముఖ్య నేతలందరూ డీఎంకేలోకి వెళ్తుండడంతో అక్కడున్న ద్వితీయ శ్రేణి నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు దిశగా ప్రత్యామ్నాయంగా దృష్టి కేంద్రీకరించే పనిలో పడ్డారు. ఈ దృష్ట్యా, త్వరలో పన్నీరు శిబిరం ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువే. ఈపరిణామాల నేపథ్యంలో పన్నీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఎదురుచూపులు రాజకీయవర్గాల్లో పెరిగాయి. -
జేబు దొంగ అరెస్టు
తిరుమల: శ్రీవారి భక్తుల్ని మోసగించి జేబుల్లోని వస్తువులను చోరీ చేస్తున్న వ్యక్తిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, చలపతి తెలిపారు. ఎస్ఐల కథనం మేరకు.. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం కంపార్ట్మెంట్ 19లో ఓ మహిళ భక్తురాలి జేబులో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై వారి కుటుంబసభ్యుడు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రెడ్డెప్ప ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 21వ తేదీన ఆస్థాన మండపం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. తమిళనాడుకు చెందిన శివయ్య అలియాస్ శివ(55)గా గుర్తించామని ఎస్ఐలు తెలిపారు. క్యూలోని భక్తుల జేబుల్లో చోరీకి పాల్పడినట్లుగా విచారణలో తేలిందని పేర్కొన్నారు. అతని వద్ద నుంచి 56 గ్రాముల బంగారం, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకుని, నిందితుని రిమాండ్కు తరలించామన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,988 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,449 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.65 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. -
ఎల్లవేళలా అండగా ఉంటా!
సాక్షి,చైన్నె: ఎల్ల వేళలా అండగా ఉంటానని ప్రత్యేక ప్రతిభావంతులకు, వారి కోసం శ్రమిస్తున్న సంఘాలు, సంస్థలు, ఆశ్రమాలకు సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. చైన్నెలోని వినికిడి లోపం, ఇతర ప్రత్యేక రుగ్మతలతో బాధపడే విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న లిటిల్ ఫ్లవర్ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు బుధవారం జరిగాయి. ఇందులో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ విద్యాలయానికి తాను మొదటి సారిగా కాదు, గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం నడిచే ఈ విద్యా సంస్థకు వంద సంవత్సరాలు అన్నది తమిళనాడుకే గర్వకారణంగా పేర్కొన్నారు. ఆసియా స్థాయిలో ఇలాంటి ఘనత సాధించగలిగిన విద్యా సంస్థలను వేళ్లపై లెక్కించ వచ్చన్నారు. లిటిల్ ఫ్లవర్ విద్యాలయంలో తనకు చాలా సుదీర్ఘ సంబంధం ఉందని, తనను ఆహ్వానించకుండా ఉండి ఉన్నా, పూర్తి అధికారంతో వచ్చి పాల్గొని ఉండే వాడినని వివరించారు. ఇక్కడికి ఎమ్మెల్యేగా, మేయర్గా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా వచ్చానన్నారు. సీఎం అయ్యాక ప్రతి ఏడాది ఇక్కడికి తప్పకుండా వస్తున్నానని గుర్తు చేశారు. ఇక్కడికి మళ్లీ మళ్లీ వస్తుంటానని వ్యాఖ్యానించారు. తన కుటుంబంతోపాటు ఇక్కడికి వచ్చి పిల్లలతో అనందంగా గడిపిన మధుర క్షణాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని అని వివరిస్తూ, నిరంతరం ప్రత్యేక ప్రతిభావంతులు, దివ్యాంగుల సంక్షేమం కోసం తాను ఆలోచిస్తూ ఉంటానని తెలిపారు. అందుకే పారా ఒలింపిక్స్లో రాణిస్తున్న, రాణించేందుకు సిద్ధంగా ఉన్న వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందించి భుజం తట్టి మరీ పంపిస్తున్నానని, వారు పతకాలతో తిరిగి వచ్చి వాటిని తనకు చూపించే క్షణాలు మరెంతో ఆనందాన్ని కలిగిస్తాయన్నారు. సమాజానికి గొప్ప ప్రయోజనాలను ఇలాంటి స్వచ్ఛంద సేవ ద్వారా కనిపిస్తాయని, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు తాను ఒక్కటే చెబుతున్నానని, నమ్మకంగా, దృఢ సంకల్పంతో చదువుకోవాలని, ఉన్నత విద్యను అభ్యషించాలని వివరిస్తూ, ప్రతి విద్యార్థికి తాను అండగా ఉన్నానని భరోసా ఇచ్చారు. చదువే కీలకం, ప్రత్యేక ప్రతిభావంతులకు ఎల్ల వేళలా ఈ ద్రావిడ మోడల్ ప్రభుత్వమే కాదు, తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఎంపీ దయానిధి మారన్, ఎమ్మెల్యే ఎలిళన్ పాల్గొన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ పిల్లలతో స్టాలిన్ ఆధునిక భవనం అనంతరం సీఎం స్టాలిన్ ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రణాళిక కింద చైన్నె మహానగర అభివృద్ధి సంస్థ సెవన్ వెల్స్లో రూ.147కోట్లతో నిర్మించిన అత్యాధునిక వసతులతో కూడిన భవనాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ భవనంలో 776 ఫ్లాట్లు ఉన్నాయి. అలాగే, వాల్డాక్స్ రోడ్డు, వాటర్ ట్యాంక్ వీధిలో రూ.31 కోట్లతో నిర్మించిన 144 ఫ్లాట్ను కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రులు ఏవీ వేలు, అన్బరసన్, ఎం సుబ్రమణియన్, శేఖర్బాబు, మేయర్ ఆర్ ప్రియ, ఎంపీలు దయానిధిమారన్, కళానిధి వీరాస్వామి పాల్గొన్నారు. అనంతరం తమిళ జాలర్లను శ్రీలంక నౌకాదళం బందీగా పట్టుకెళ్లడాన్ని పరిగణించి, వారిని విడుదల చేయించేందుకు చర్యలు త్వరితగతిన చేపట్టాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్కు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. -
చివరి షెడ్యూల్ కోసం కేరళకు..
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందులో కన్నడ నటులు శివరాజ్కుమార్, ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు జాకీష్రాప్, తెలుగు నటుడు సునిల్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. తమన్నా ప్రత్యేక పాటలో నటించి ఆ చిత్ర విజయానికి కారణంగా మారారు. తాజాగా ఈచిత్రానికి సీక్వెల్గా జైలర్–2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మింస్తున్న ఈ చిత్రంలోనూ శివకుమార్ నటిస్తున్నారు. ఎస్జే.సూర్య, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. జైలర్ 2 చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుని చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ చివరి షెడ్యూల్ను కేరళాలో చిత్రీకిస్తు న్నారు. ఇందుకోసం రజనీకాంత్ కేరళకు బలుదేరారు. ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. అది చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్ర విజయం రజనీకాంత్కు చాలా అవసరం. ఎందుకంటే జైలర్ తరువాత ఇప్పటి వరకు ఆయన నటించిన ఏ చిత్రమూ సక్సెస్ కాలేదు. జైలర్–2 చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 12న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈచిత్రం పూర్తి చేసిన తరువాత సిబి చక్రవర్తి దర్శకత్వంలో నటించడానికి రజనీ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్కమల్ ఇంటర్నేషనల్ పిలిం పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లే అవకాశం ఉంది. జైలర్–2లో రజనీకాంత్ -
మైలార్డ్ అంటున్న శశికుమార్
తమిళసినిమా: ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటుడు శశికుమార్ తాజాగా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మైలార్డ్. నటి చైత్ర జే.అసార్ నాయకిగా నటిస్తున్న ఇందులో గురుసోమసుందరం, ఆషా శరత్, గోపి నయినార్, వసుమిత్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత రాజు మురుగన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని అంబేద్కుమార్ సమర్పణలో ఓలింపియా మూవీస్ పతాకంపై జయంతి అంబేద్కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదలు చేశారు. అందులో న్యాయమూర్తిగా నటిస్తున్న శశికుమార్ బడుగువర్గాల పక్షాన మాట్లాడే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఇది రాజకీయ అధికారంలో చిక్కుకునే బడుగు వర్గాల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. భావోద్రేకాలతో కూడిన పలు సన్నివేశాలు ఇందులో చోటుచేసుకుంటాయని చెప్పారు. చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. శశికుమార్, దర్శకుడు రాజుమురుగన్ కాంబోలో రూపొందుతున్న తొలి చిత్రం కావడంతో మైలార్డ్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ఈ చిత్రానికి నీరవ్షా చాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
20 డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి, చైన్నె : చైన్నెలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలను విస్తృతం చేయడానికి ఎంటీసీ చర్యలు తీసుకుంది. ఏసీ సౌకర్యంతో కూడిన 20 బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. 1970 నుంచి 2007 వరకు చైన్నెలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలు విస్తృతంగా ఉండేవి. ఆతర్వాత చైన్నె నగరంలో వంతెనల సంఖ్య పెరగడంతో డబుల్ డెక్కర్ స్థానంలో డీలక్స్ బస్సులు వచ్చాయి. ఎంటీసీ నేతృత్వంలో డీలక్స్ బస్సులు ఓ వైపు, ఎలక్ట్రిక్ బస్సులు మరో వైపు విస్తృతంగా వివిధ మార్గాలలో సేవలను అందిస్తున్నాయి. ఈ పరిస్థితులలో చైన్నెలో జరిగిన ప్రవాస తమిళుల దినోత్సవంలో ఓ డబుల్ డెక్కర్ బస్సును ప్రభుత్వానికి అందజేశారు. ఈనెల 12న ఈ బస్సుకు సీఎ స్టాలిన్ జెండా ఊపారు. తొలి విడతగా పర్యాటక ప్రాంతాలను కలిపే విధంగా ఈ బస్సుల సేవలను అందిస్తున్నారు. ఇందుకు అమిత స్పందన వస్తున్నది. రిప్పన్ బిల్డింగ్, లైట్హౌస్, జల్లికట్టు ఎద్దుతో పాటు తమిళ సంస్కృతిని చాటే పెయింటింగ్స్తో తమిళం వర్ధిల్లాలి అన్న నినాదంతో ఉన్న ఈ బస్సుకు వస్తున్న స్పందనతో మరో 20 బస్సులను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. అశోక్ లేలాండ్తో కుదిరిన ఒప్పందం మేరకు 20 బస్సులను సిద్ధం చేయించే పనిలో పడ్డారు. ఈ బస్సులను మార్చి నెలాఖరులోపు చైన్నెలో పలు పర్యాటక మార్గాలను అనుసంధానించే విధంగా రోడ్డెక్కించే విధంగా రవాణా సంస్థ అధికారులు ముందుకెళ్తున్నారు. -
చైన్నెలో కేరళ పర్యాటక రోడ్ షో
సాక్షి, చైన్నె: చైన్నెలో కేరళ ప్రభుత్వ పర్యాటక రంగ విశిష్టతను చాటేవిధంగా రోడ్ షో జరిగింది. ఈసందర్భంగా అక్కడి సంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరించాయి. రానున్న వేసవి సెలవుల సీజన్లో కేరళ వైపు పర్యాటకులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో రోడ్షో నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. చైన్నెలో జరిగిన రోడ్షోకు విశేష స్పందన వచ్చిందని బుధవారం ఆ రాష్ట్ర మంత్రి పీఏ మహ్మద్రియాజ్ తెలిపారు. 22వ తేదీన బెంగళూరులో, రానున్న రెండు నెలల్లో హైదరాబాద్, కోల్కతా, లక్నో, ఇండోర్లలో కూడా రోడ్షోలు, బీ2బీ సమావేశాలు నిర్వహించనున్నామని వివరించారు. కేరళలోని వారసత్వ, చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ప్రాంతాల గురించి ఈసందర్భంగా విశదీకరించారు. కోలికోడ్, వయనాడ్, మూనార్, వంటి పర్యాటక కేంద్రాల గురించి, సర్పింగ్, సైక్లింగ్, పారా గ్లైడింగ్, మౌంటైన్ బైకింగ్, ఆయుర్వేదం అంశాలను గుర్తు చేశారు. -
సంగీతం కోసం పీఎస్ఆర్–ఐ సిరీస్
సాక్షి, చైన్నె : సంగీతకారులు, అభ్యాసకులు, ప్రదర్శకులు అంటూ భారతీయ సంగీత ప్రపంచం కోసం యమహా మ్యూజిక్ ఇండియా కొత్త పీఎస్ఆర్–ఐ సిరీస్ను పరిచయం చేసింది. చైన్నె వేదికగా బ్రహ్మాండ సంగీత మహోత్సవ వేదికగా పీఎస్ఆర్–ఐ, పీఎస్ఆర్–ఐ 610, పీఎస్ఆర్–ఐ 510 పేరిట వైవిధ్యమైన సంగీత సంస్కృతిని పెంపొందించే విధంగా పోర్టబుల్ కీ బోర్డులను నవతరానికి అనుగుణంగా విడుదల చేశారు. భారతీయ శాసీ్త్రయ శిక్షణ, సమకాలీన ప్రదర్శన, హైబ్రిడ్ భారతీయ– పాశ్చాత్య సంగీత శైలిలకు మద్దతుగా వీటిని తీర్చిదిద్దారు. భారతీయ స్వరాలు, శైలులు, అధిక నాణ్యత సంగీత సృష్టిని అందుబాటులోకి కొత్త సృజనాత్మక అంశాలతో పరిచయం చేశారు. యమహా మ్యూజిక్ ఇండియా యూనిట్ హెడ్ రియోజి మారుయమా, డీజీపీఎం రెహ్మాన్ సిద్ధిఖి, మేనేజర్ కజుకి వటనాబే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఇండియన్ కంపోజర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, సౌండ్ ఇంజినీర్ గుల్రాజ్ సింగ్, మ్యూజిక్ ఎడ్యుకేటర్, ప్రొఫెషనల్ కీ బోర్డిస్టు అలన్ ప్రీతం మ్యూజిక్ అండ్ కంపోజింగ్ ప్రదర్శన అదరహో అనిపించే విధంగా జరిగింది. ఈసందర్భంగా ఈ ఇద్దరిని యమహా ప్రతినిధులు సత్కరించారు. -
చిన్నమ్మ ఆవేదన!
– తన దారి ఐక్యతే అని స్పష్టం సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేకు చెందిన నేతలు డీఎంకే బాట పడుతుండడం, తన ప్రతినిధి టీటీవీ దినకరన్ ఏన్డీఏ కూటమిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ శశికళ తీవ్ర ఆవేదనతో బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకేలో కొందరి కారణంగా జరుగుతున్న పరిణామాల వేదన కలిగిస్తున్నాయన్నారు. ఒకప్పుడు అమ్మ జయలలిత ప్రసన్నం కోసం జాతీయ స్థాయి నేతలు పడిగాపులు కాసేవారు అని, ఇప్పుడు జాతీయ నేతల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత జీవించి ఉన్న కాలంలో అన్నాడీఎంకేలో చేరేందుకు డీఎంకేతోపాటు ఇతర పార్టీల నుంచి కేడర్ క్యూకట్టేవారు అని వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా అన్నాడీఎంకే నుంచి డీఎంకే వైపుగా వెళ్లేవారి సంఖ్య పెరగడం ఆవేదన కలిగిస్తున్నదన్నారు. ఇది స్టాలిన్కు బలాన్ని కలిగిస్తుందని, అన్నాడీఎంకేకు నష్టాన్ని చేకూరుస్తుందని హెచ్చరించారు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా, ఎవరు ఏ కూటమిలోకి వెళ్లినా తన దారిలో మాత్రం మార్పు లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకేలో అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన ప్రయాణమని, ఇది కొనసాగుతుందన్నారు. డీఎంకేను అంతమొందించడం లక్ష్యమని, ఇదే అమ్మ ఆశయం అని, ఈ ప్రయాణంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రూ.3 వేల మనియార్డర్ సాక్షి, చైన్నె: సంక్రాంతి కానుక రూ.3 వేలను ప్రభుత్వానికి ఓ సామాజిక కార్యకర్త మనియార్డరు రూపంలో వెనక్కి అందజేశాడు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ రేషన్ కార్డుదారులకు రూ.3 వేల నగదు కానుకను ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. అయితే, తిరునల్వేలికి చెందిన సామాజిక కార్యకర్త క్రిస్టోఫర్ తనకు అందజేసిన రూ.3 వేలను ప్రభుత్వానికి వెనక్కి పంపించారు. సచివాలయం చిరునామాతో చైన్నెకి అంబాసముద్రం పోస్టాఫీసు నుంచి బుధవారం మనీయార్డర్ చేయడం గమనార్హం. ప్రభుత్వ ఖజానాపై ఇప్పటికే భారం ఎక్కువగా ఉందని, అందుకే తాను వెనక్కి ఇచ్చినట్టు క్రిష్టోఫర్ పేర్కొన్నారు. 25న టైంక్యాట్–2026 ప్రతిభా పరీక్ష సాక్షి, చైన్నె: క్యాట్ 2026 విద్యార్థుల కోసం టైమ్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో స్కాలర్ షిప్, టైమ్ టాలెంట్ సెర్జ్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఈ వివరాలను బుధవారం టైమ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. రెండు శ్లాట్లలో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఈ ప్రతిభా పరీక్ష జరుగుతుందని వివరించారు. జనవరి 25న జరిగే ఈ పరీక్షకు తమ వెబ్సైట్లో పేర్లను విద్యార్థులు నమోదుచేసుకోవచ్చు అని సూచించారు. టైమ్ టాలెంట్ సెర్జ్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్, లాజికల్, వెర్బల్ ఎబిలిటీకి సంబంధించిన బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయని వివరించారు. గంట వ్యవధిలో ఆన్లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఉంటుందని, ఈ పరీక్ష క్యాట్ 2026కు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్స్టి ట్యూట్ ప్రకటించింది. -
మంత్ర పూజలు చేశారని ఫిర్యాదు
వేలూరు: పాత కక్షల నేపథ్యంలో తమ ఇంటి వాకిలి ముందు మూడు చోట్ల కోడి గుడ్లు పెట్టి మాంత్రీకం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని పాండియన్ నగర్లోని పిల్లయార్ ఆలయ వీధికి చెందిన ఒక కుటుంబానికి పొరుగింటి వారితో పాతకక్షలు ఉండేవి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మంత్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉండడంతో ఆందోళన చెందారు. ఇంటి ముందు ఉన్న సీసీ టీవీ కెమెరాను పరిశీలించగా, పొరుగింటి వారే అర్ధరాత్రి పూట ఇలా చేశారని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు. -
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి ఘన స్వాగతం
తిరుత్తణి: కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన శశికుమార్కు తిరుత్తణి పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికలు పురష్కరించుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. తిరువళ్లూరు పడమర జిల్లా అధ్యక్షుడిగా న్యాయవాది శశికుమార్ను నియమించారు. ఇతను బుధవారం తిరుత్తణిలో పార్టీ శ్రేణులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయలన పార్టీ పట్టణ కార్యకర్తలను పరిచయం చేశారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషిచేయాలని నూతన జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలకు సూచించారు. పళ్లిపట్టు, పొదటూరుపేట, ఆర్కేపేట సహా పలు ప్రాంతాలకు వెళ్లి మండల, పట్టణ పార్టీ శ్రేణులను కలుసుకుని పరిచయం చేసుకున్నారు. -
సికిందర్ ఫ్లాప్లో నా బాధ్యత లేదు
తమిళసినిమా: హాట్స్పాట్ చిత్రానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. ముఖ్యంగా హీరోయిన్ హీరో మెడలో తాళి కట్టిన సన్నివేశానికి సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దాని గురించి వివరించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకుని సెన్సార్ సమస్యలు తలెత్తకుండా ఏదీ 2 మచ్గా చేయగలమో, దాన్ని హాట్ స్పాట్ 2మచ్ చిత్రంలో చేశాం అని ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ పేర్కొన్నారు. హాట్స్పాట్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈయన దానికి సీక్వెల్గా తెరకెక్కించిన తాజా చిత్రం హాట్ స్పాట్ 2మచ్. కేజేబీ టాకీస్, యాంట్స్ టూ ఎలిఫెంట్ అండ్ కో సంస్థల అధినేతలు కేజే.బాలమణి మార్బన్, అనిల్ కే.రెడ్డి కలసి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, బిగిడా, అశ్విన్, రక్షన్, ఆదిత్య భాస్కర్, విఘ్నేష్ కార్తీక్, కేజే.బాలమణిమార్బన్, భవాని శ్రీ, సంజనా తివారి, తంబి రామయ్య, ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జగదీష్ రవి, జోసఫ్పాల్లో ద్వయం చాయాగ్రహణం, సతీష్ రఘునాథన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ మాట్లాడుతూ మూడు కథలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. విష్ణు విశాల్ సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ సెంథిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్లు చెప్పారు. రేపు తెరపైకి హాట్స్పాట్ 2మచ్ -
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమ్మమక్కల్ మున్నేట్రకళగం (AMMK) అధినేత టీటీవీ దినకరన్ మళ్లీ ఎన్డీయేలో చేరారు. పళనిస్వామితో విభేదాలు కారణంగా గతంలో ఎన్డీయే నుంచి దినకరన్ వైదొలిగారు. బుధవారం ఆయన బీజేపీ తమిళనాడు ఇంఛార్జ్ పీయూష్గోయెల్ను కలిశారు. డీఎంకే ఓడించగల శక్తి ఎన్డీయేకి మాత్రమే ఉందని దినకరన్ అంటున్నారు. అమ్మమక్కల్ మున్నేట్రకళగం ఎన్డీయే కూటమిలో చేరికపై డీఎంకే నేతలు స్పందిస్తూ.. తమ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.గతంలో కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దినకరన్.. గత కొంతకాలంగా నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను పొగుడుతూ వచ్చారు. విజయ్ పార్టీతో పొత్తుకు వెళ్లవచ్చనే చర్చ జోరుగా సాగింది. టీవీకేతో చర్చలు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఇంతలోనే విజయ్ పార్టీకి దినకరన్ షాక్ ఇచ్చినట్లయ్యింది.కాగా, బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ఎన్డీయే కూటమి సీట్ల పంపకాల లెక్కను తేల్చేదిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఇవాళ (జనవరి 12 బుధవారం) ఆయా పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ చేరిన విషయం తెలిసిందే. ఇక ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. బీజేపీరాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్, కో ఇన్చార్జ్లుగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్చార్జ్గా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రాం మెహా్వల్, సివిల్ ఏవియేషన్ కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహుల్ ఇప్పటికే రంగంలోకి దిగారు. అన్నాడీఎంకేతో సంప్రదింపు ముగించారు.ఇక కూటమిలోకి వచ్చే పార్టీలతో సంప్రదింపును విస్తృతం చేశారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమిలోకి ఇప్పటికే అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే అధికారికంగా చేరింది. ఇక జీకే వాసన్ తమిళమానిల కాంగ్రెస్, ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చి, రవి పచ్చ ముత్త ఐజేకే వంటి పార్టీలతో చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పార్టీల తాజాగా ఎన్డీఏలో ఉన్నప్పటికీ సీట్ల పందేరం విషయంగా చర్చలలో మునిగి ఉన్నాయి.అదే సమయంలో అమ్మమక్కల్ మున్నేట్రకళగం (AMMK) టీటీవీ దినకరన్ను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునే దిశగా పీయూష్ గోయల్ ప్రయత్నాలు ఫలించాయి. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్రకళగం ఎన్డీయేలో చేరింది.ఈనెల 23వ తేదీన మధురాంతకం వేదికగా జరిగే సభలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే చోట చేర్చే విధంగా, ఎన్డీఏ కూటమి బలాన్ని ప్రకటించే విధంగా కసరత్తు వేగవంతం చేశారు. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు అవుతుండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మదురాంతకంకు పీఎం వెళ్లనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. మోదీ సమక్షంలో ఎన్డీఏ కూటమిని ప్రకటించేందుకు తగ్గట్టుగా పీయూష్ గోయల్ స్థానికంగా తిష్ట వేసి రచిస్తున్న వ్యూహాలన్నీ ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయో శుక్రవారం తేలనున్నది. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళని స్వామితో పోన్ ద్వారా ఎప్పటికప్పుడు పీయూష్ చర్చలు జరుపుతూ వస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
రెండవ భార్య కుమార్తెపై హత్యాచారం
తమిళనాడు: రెండవ భార్య కుమార్తెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన వ్యవహరంలో తాపీ మేస్త్రీకి మూడు జీవితఖైదులతో పాటూ 45 వేల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. దీంతో పాటూ భాదితుడిౖపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును సైతం నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కడలూరు జిల్లాకు చెందిన రాజేంద్రన్. ఇతను కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన హంసవల్లితో వివాహమైంది. వీరికి సంగీత(18) సహా ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ నేపథ్యంలో హంసవల్లికి భర్తతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయారు. అనంతరం హంసవల్లి విల్లుపురం జిల్లా ఉలుందూరుపేటలోని బందువుల ఇంటికి వచ్చి కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగించడం ప్రారంబించింది. ఈ సమయంలోనే ఉలుందూరుపేటకు చెందిన తాపీమేస్త్రీ రాజూమణి(40)తో ఏర్పడిన పరిచయం రెండవ పెళ్లికి దారితీసింది. దీంతో ఇద్దరు కలిసి 2022లో వివాహం చేసుకున్న తరువాత తన కుమార్తె సంగీతను తనతో పాటూ వుంచుకున్నారు. ఆరు నెలల తరువాత తాపీమేస్త్రీ రాజామణి వరుసకు కుమార్తె అయిన సంగీతపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పరారైయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి హంసవల్లి పూందమల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేసు విచారణలో తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడు రాజామణికి మూడు జీవితఖైదు శిక్షతో పాటూ 45 వేల రూపాయల అపరాధం విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి జూలియట్ పుష్ప తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించిన న్యాయమూర్తి, బాధితులు ఎస్సీ కులాలనికి చెందిన వారు కావడంతో నిందితుడిపై అట్రాసిటీ కేసును సైతం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా జైలు శిక్ష పడ్డ అనంతరం నిందితుడ్ని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
ఎల్ఐసీ ఆఫీసులో ‘నమ్మకానికి’ నిప్పు..
తమిళనాడు: మదురెలోని మెల్వేలి వీధిలోని ఎల్ఐసీ కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం కొత్త ఎల్ఐసీ పాలసీ పరిచయ సమావేశం జరిగింది. సీనియర్ మేనేజర్ కల్యాణి నంబి. అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణన్ ఉద్యోగులు ఏజెంట్లు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత, అందరూ వెళ్లిపోయిన తర్వాత కల్యాణి నంబి, రామకృష్ణన్ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, గది మొత్తం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఆఫీసులో రామకృష్ణన్ కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ కనిపించాడు. ప్రజలు అతన్ని రక్షించి అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కల్యాణి నంబి ఆఫీసు లోపల కుర్చీ కింద సజీవ దహనమై కనిపించారు.పోలీసులు ప్రాథమిక దర్యాప్తు జరిపి, అగ్నిప్రమాదం కేసుగా నమోదు చేశారు. ఈ స్థితిలో కల్యాణి నంబి మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 17 రాత్రి జరిగిన ఎల్ఐసీ సమావేశంలో పాల్గొన్న వారిని పోలీసులు విడివిడిగా విచారించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణన్ను కూడా ప్రశ్నించారు. ఆ సమయంలో, అతను దర్యాప్తునకు సరిగ్గా సహకరించలేదు. ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు, పరస్పర విరుద్ధంగా మాట్లాడాడు. దీంతో పోలీసులకు అతనిపై అనుమానం వచ్చింది. వైద్య చికిత్స పొందుతున్న రామకృష్ణన్ను పోలీసులు విచారిస్తున్న క్రమంలో దిగ్భ్రాంతికరమైన సమాచారం బయటపడింది. మహిళా మేనేజర్పై రామకృష్ణన్ పెట్రోల్ పోసి నిప్పంటించాడని వెల్లడైంది. బీమా సొమ్ము చెల్లింపులో అవకతవకలే కారణం..? ప్రమాద సంబంధిత బీమా పథకం బాధితులకు చెల్లించాల్సిన మొత్తంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కల్యాణి నంబికి ఫిర్యాదు అందింది. అక్కడ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న రామకృష్ణ ఈ స్కామ్లో పాల్గొన్నట్లు కూడా వెల్లడైంది. ఈ విషయంలో రామకృష్ణ కల్యాణి నంబి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక సమయంలో, రామకృష్ణన్ కల్యాణి నంబిపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించాడు. అయితే కల్యాణి నంబి అతనితో అపహరించిన మొత్తాన్ని వెంటనే కార్యాలయ ఖాతాలో చెల్లించమని కఠినంగా చెప్పింది.ఏదైనా ఆలస్యం జరిగితే, అపహరణకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో రామకృష్ణన్ మేనేజర్ కల్యాణి నంబిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఘటన జరిగిన రోజు సమావేశం ముగిసిన తర్వాత మరోసారి గొడవ పడ్డారు. ఈ ఘర్షణతో ఆగ్రహించిన రామకష్ణన్, జనరేటర్ కోసం ఉపయోగిస్తున్న పెట్రోల్ను ఆఫీసు గదిలో ఉన్న కళ్యాణి నంబిపై పోసి, నిప్పంటించి, ఆఫీసు గదికి తాళం వేశాడు. దీంతో శరీరం అంతటా తీవ్ర గాయాలపాలైన కల్యాణి నంబి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయంలో తనపై ఎలాంటి అనుమానాలు రాకుండా ఉండడానికి, అతను గది వెలుపల ఉన్న ఇతర ప్రాంతాలపై గ్యాసోలిన్ పోసి నిప్పంటించాడు, దీనితో ఆఫీసులో అగ్ని ప్రమాదం జరిగిందని అందరూ నమ్మారు. అప్పుడు, ఊహించని విధంగా, రామకృష్ణన్ కూడా మంటల్లో చిక్కుకున్నాడు. దట్టమైన పొగ కారణంగా అతను ఆఫీసు తలుపు దగ్గర అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రజలు అతన్ని రక్షించారు. కానీ కల్యాణి నంబి ఆఫీసు లోపల ఉండడం, మంటలు వ్యాపించి నల్లటి పొగ కమ్ముకోవడం వల్ల అగ్నిమాపక సిబ్బంది ఆమెను గుర్తించలేకపోయారు. దీంతో ఆమె మంటల్లో కాలిపోయి మృతిచెందింది. ఈ కేసులో పోలీసులు అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణన్ను తాజాగా అరెస్టు చేశారు. -
క్లుప్తంగా
వేణుగోపాలస్వామి అలంకరణలో వీరరాఘవుడు తిరువళ్లూరు: వీరరాఘవుడి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన మంగళవారం ఉదయం స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత వైద్య వీరరాఘవుడు వేణుగోపాలస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వైద్య వీరరాఘవుడి ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారు వేణగోపాల స్వామి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఏడవ రోజు బుధవారం ఉదయం స్వామి వారి రథోత్సవం జరగనుంది. ఆటో మోటివ్లోకి శిల్పకళ సాక్షి, చైన్నె : కోచర్ పెన్సిబిలిటీలను ఆటోమోటివ్ రంగంలోకి తీసుకొస్తూ, కోచర్, శిల్పం, సమకాలీ న చేతి వృత్తిని ప్రోత్సహించేందుకు గౌరవ్ గుప్తా తో ఎంజీ సెలక్ట్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంజీ సైబర్ స్టర్ ఏకై క కళాత్మక వివర ణను తద్వారా ముందుకు స్థానికంగా మంగళవా రం తీసుకొచ్చారు. డిజైనర్, ఫ్యాషన్, కళ, ఆటోమోటివ్ డిజైన్ను కలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సహకారం ప్రధానంగా ఎంజీ సైబర్ స్టర్కు కొత్త రూపంగా మలిచారు. ఆరు నెలల పా టుగా సృజనాత్మక తత్వ శాస్త్రం, శిల్ప కళా వస్తువు గా మార్చేందుకు హస్త కళ, పారిశ్రామిక ఆవిష్కరణలు, ఆర్ట్ నోయివేలైన్స్ ద్వారా వేగంగా ప్రేరణ పొందిన రూపంగా, కదిలా కళాకృతిగా తీర్చిదిద్దారు.గౌరవ్ గుప్తా జీవంపోసిన ఈ కారు కళాకృతి, సిగ్నేచర్ విజువల్ ఐడెంటిటీని, ఎంబ్రాయి డరీ ప్రత్యేక ఆకర్షనగా ప్రకటించారు. ఈ విష యంగా డిజైనర్ గౌరవ్ గుప్తా, ఎంజీ సెలక్ట్ తా త్కాలిక అధ్యక్షుడు మిలింద్ షాలు పేర్కొంటూ, ఆటో మోటివ్ ఇంజనీరింగ్, సమకాలీన జీవన శైలి మధ్య వారధిగా ఈ భాగస్వామ్యం మారిందన్నారు. సాంప్రదాయ భారతీయ ఎంబ్రాయిడరీ , అలకరణల అంశంగా, అధునాతన సాంకేతికతతో విలీనం చేశామని వివరించారు. లారీని ఢీకొన్న బైక్ –ఇద్దరు యువకుల దుర్మరణం తిరువొత్తియూరు: లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. కాంచీపురం జిల్లా తిరుపెరుంబుదూర్ సమీపంలోని పన్రుట్టి గ్రామం తోపు వీధికి చెందిన మహేంద్రన్ (19), బాలమురుగన్ (19) ఓరగడంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం యథావిధిగా పనికి వెళ్లారు. పనిముగించుకుని రాత్రి 8 గంటలకు బైక్లో పన్రుట్టి వైపు వెళ్తున్నారు. అదేసమయంలో ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన లారీ రోడ్డు దాటుతుండగా అదుపుతప్పిన బైక్ లారీని ఢీకొంది. ఈప్రమాదంలో ఇద్దరు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలిసి ఓరగడం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపెరుంబుదూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నేడు విద్యుత్ అంతరాయం ఉండే ప్రాంతాలు తిరువొత్తియూరు: చైన్నెలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వి ద్యుత్ శాఖ నిర్వహణ పనుల కారణంగా కొన్ని ప్రా ంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రాంతాల వివరాలు.. లక్ష్మీనగర్ ప్రాంతం: ఎస్బీఐ కాలనీ 3వ జయంతి నగర్, ఉళ్ళగరం, ఆళ్వార్ నగర్, మాక్మిల్లన్ కాలనీ, పెరుమాళ్ నగర్, ఎస్బీఐ కాలనీ, కన్నయ్య వీధి, కుళక్కరై వీధి, కపిలర్ వీధి, కాలేజ్ రోడ్ 4వ ప్రధాన వీధి, హిందూ కాలనీ, జోసెఫ్ వీధి, కుప్పుసామి వీధి, గోవిందసామి వీధి, గాంధీ రోడ్, ఎల్లైముత్తమ్మన్ కోయిల్ వీధి, కుమరన్ వీధి, చర్చ్ వీధి, కృష్ణసామి వీధి, మూవరసంపేట్టై, పల్లవన్ తాంగల్. నంగనల్లూర్: పీవీ నగర్, ఎంజీఆర్ రోడ్, కనకం కాలనీ, పాల్ విశ్వనాథపురం, హిందూ కాలనీ, ఎన్జీఓ కాలనీ, కేకే నగర్, టీచర్స్ కాలనీ, ఎస్బీఐ కాలనీ విస్తరణ, ఎస్బీఐ కాలనీ ప్రధాన రోడ్, ఏజీఎస్ కాలనీ, దురైసామి గార్డెన్, 100 అడుగుల రోడ్ ప్రాంతం, సివిల్ ఏవియేషన్ కాలనీ, వోల్టాస్ కాలనీ, అయ్యప్ప నగర్, కన్నికా కాలనీ, నెహ్రూ కాలనీ, కాలేజ్ రోడ్, వేంపులి అమ్మన్ వీధి, గాంధీ రోడ్. చైన్నె శివారులోని ఇతర ప్రాంతాలు: దక్షిణ టెలిఫోన్ కాలనీ, ఏవీఎం నగర్, వసంతం అవెన్యూ, జేజే నగర్, కష్ణ నగర్, ఈశ్వరి నగర్, ఎంసీఆర్ నగర్, తిరుమురుగన్ నగర్, దివేలన్ వీధి, తెలుగు కాలనీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉండనున్నాయి. 300 పాఠశాలల్లో కూల్ రూఫ్ల ఏర్పాటుకు చర్యలు – చైన్నెలో మంత్రి తంగం తెన్నరసు కొరుక్కుపేట: వేసవిలో ఎండవేడిమిని తట్టుకునేందుకు తమిళనాడు అంతటా 300 గ్రీన్ పాఠశాలల్లో కూల్ రూఫ్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ వేడి ఒత్తిడి వల్ల చదువులో ఏకాగ్రత దెబ్బతింటుందని, వేసవిలో కాంక్రీట్ పైకప్పులతో కూడిన ఉన్నత పాఠశాలల్లో ఇండోర్ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకుంటాయన్నారు. ఇది విద్యార్థుల ఏకాగ్రత పని తీరును ప్రభావితం చేస్తుందని అధ్యయనాల ద్వారా వెల్లడైందని తెలిపారు. ఈ నేపథ్యంలో 2025–26లో ప్రభుత్వం కింద తమిళనాడు వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కూల్రూఫ్లను ఏర్పాటు చేసే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. దీనిని అంబత్తూర్ హైస్కూల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. రూఫ్ను ఏర్పాటు చేసిన తర్వాత, ఇండోర్ ఉష్ణోగ్రత సగటున భారీగా తగ్గిందన్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్ల అవసరం కూడా తగ్గిందన్నారు. దీంతో 300 పాఠశాలల్లో ఈ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
ఇంటింటికీ వెళ్దాం!
– డీఎంకే కార్యదర్శుల భేటీలో తీర్మానం సాక్షి, చైన్నె: మళ్లీ అధికారమే లక్ష్యంగా ఇంటింటా ప్రజలలోకి వెళ్లేందుకు డీఎంకే సిద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన డీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ అధ్యక్షతన జిల్లాల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇందులో నాలుగు తీర్మానాలు చేశారు. ఇంటింటి ప్రచారంలోకి వెళ్దామని, మహిళల మద్దతును కూడగట్టేందుకు పిలుపు నిస్తూ తీర్మానం చేశారు. తమిళ మహిళల ఆదరణతో గెలుద్దాం మళ్లీ నినాదంతో ఇంటింటా కార్యక్రమాలు చేపట్టనున్నారు. స్టాలిన్ నేతృత్వంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా శ్రమించేందుకు నిర్ణయించారు. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలో గత నెల జరిగిన మహిళా మహానాడు గురించి ప్రస్తావిస్తూ, ఈనెల 26వ తేదిన డెల్టా జిల్లాలలోని మహిళా లోకాన్ని ఏకం చేస్తూ తంజావూరులో మరో మహానాడుకు నిర్ణయించారు. అలాగే ఫిబ్రవరి 1న ప్రారంభమై మార్చి 8వ తేది వరకు ప్రతి పోలింగ్ స్టేషన్కు 10 మంది మహిళలను ఎంపిక చేసి, ఇంటింటా ప్రచారం విస్తృతం చేయడానికి తీర్మానించారు. ఇక తమిళనాడు ఎవ్వరికి తల వంచదు నినాదంతో ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు స్టార్ క్యాంపెయినర్ల ద్వారా జిల్లాలో విస్తృతంగా సమావేశాలు, బహిరంగ సభల నిర్వహనకు నిర్ణయించారు. నా పోలింగ్ కేంద్రం విజయవంతమైన పోలింగ్ కేంద్రం నినాదంతో ఉత్తర జోన్ యువజ మహోత్సవం ఫిబ్రవరి 7వ తేదిన విరుదునగర్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. స్టాలిన్ కొనసాగాలి...తమిళనాడు గెలవాలి నినాదంతో మార్చి 8న తిరుచ్చిలో పది లక్షల మందితో బ్రహ్మాండ సభకు నిర్ణయించారు. -
మర్యాదపూర్వక కలయిక
సాక్షి, చైన్నె: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై న నితిన్ నబిన్తో మంగళవారం బీజేపీ రాష్ట్రవ్యవహారాల కో– ఇన్చార్జ్ పి సుధాకర్రెడ్డి బేటీ అయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినానంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తులు, సీట్ల కసరత్తుల గురించిన వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యూట్యూబర్ను అరెస్టు చేయాలి కొరుక్కుపేట: దివంగత ముఖ్యమంత్రి కామరాజర్ అమలు చేసిన పథకాల గురించి తప్పుగా మాట్లాడిన యూట్యూబర్ ముక్తార్ అహ్మద్ను అరెస్ట్ చేయాలని ఆందోళనకు నాడార్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. తమిళనాడు నాడార్ ఫెడరేషన్ తరఫున చంద్రన్ జయపాల్ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం మంగళవారం జరిగింది. వారు ఆందోళన చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డగించడంతో, వారు రోడ్డు మధ్యలో బైఠాయించి గొడవకు దిగారు.ఆందోళనలో ఇండియన్ నాడార్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ వి.టి. పద్మనాభన్, తమిళ విప్లవానికి కలాం వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టివాకం ఎ. మురుగన్, తమిళనాడు క్షత్రియ నాడార్ మూమెంట్ వైస్ ప్రెసిడెంట్ కె.సి.రాజా, ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రన్ జయపాల్, తమిళనాడు నాడార్ అసోసియేషన్న్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిన్నల్ హెచ్. స్టీఫెన్, తమిళనాడు నాడార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. ముత్తు రమేష్ ఆందోళనలో పాల్గొన్నారు.పోలీసులు నాడార్ ఫెడరేషన్ సభ్యులను అరెస్టు చేశారు -
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభం
సాక్షి, చైన్నె: టీఎన్సీసీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించి పార్టీ వర్గాలతో ఏఐసీసీ కమిటీ మంగళవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, రాహుల్తో రెండు రోజుల పాటుగా తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గిరిష్ చోదన్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్ ఆళ్వాలు, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్కుమార్తో కూడిన కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ తదుపరి 71 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించారు. ఈ పరిస్థితులలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈ కమిటీ మంగళవారం సత్యమూర్తి భవన్లో ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన వారితో సమావేశమైంది. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చోదన్కర్ వివరించారు. కూటమి విషయంగా సీట్ల పందేరం, తదితర అంశాలగురించిబహిరంగా వ్యాఖ్యలు చేయవద్దు అని హెచ్చరించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో అన్న కసరత్తులు మొదలయ్యాయని, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశారు. -
రెండవ భార్య కుమార్తైపె హత్యాచారం
– తాపీ మేస్త్రికి మూడు జీవిత ఖైదులు తిరువళ్లూరు: రెండవ భార్య కుమార్తెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన వ్యవహరంలో తాపీ మేసీ్త్రకి మూడు జీవితఖైదులతో పాటూ 45 వేల జరిమానా విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పును వెలువరించారు. దీంతో పాటూ భాదితుడిౖపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును సైతం నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కడలూరు జిల్లాకు చెందిన రాజేంద్రన్. ఇతను కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన హంసవల్లితో వివాహమైంది. వీరికి సంగీత(18) సహా ఇద్దరు పిల్లలు వున్నారు. ఈ నేపథ్యంలో హంసవల్లికి భర్తతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయారు. అనంతరం హంసవల్లి విల్లుపురం జిల్లా ఉలుందూరుపేటలోని బందువుల ఇంటికి వచ్చి కూలీ పనులు చేసూకుంటూ జీవనం సాగించడం ప్రారంబించింది. ఈ సమయంలోనే ఉలుందూరుపేటకు చెందిన తాపీమేసీ్త్ర రాజూమణి(40)తో ఏర్పడిన పరిచయం రెండవ పెళ్లికి దారితీసింది. దీంతో ఇద్దరు కలిసి 2022లో వివాహం చేసుకున్న తరువాత తన కుమార్తె సంగీతను తనతో పాటూ వుంచుకున్నారు. ఆరు నెలల తరువాత తాపీమేసీ్త్ర రాజామణి వరుసకు కుమార్తె అయిన సంగీతపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి పరారైయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి హంసవల్లి పూందమల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేసు విచారణలో తిరువళ్లూరు కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో నిందితుడు రాజామణికి మూడు జీవితఖైదు శిక్షతో పాటూ 45 వేల రూపాయల అపరాధం విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి జూలియట్ పుష్ప తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించిన న్యాయమూర్తి, బాధితులు ఎస్సీ కులాలనికి చెందిన వారు కావడంతో నిందితుడిపై అట్రాసిటీ కేసును సైతం నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా జైలు శిక్ష పడ్డ అనంతరం నిందితుడ్ని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
తిరుత్తణి: మాదక ద్రవ్యాల నిర్మూలనపై తిరుత్తణిలో విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. తిరుత్తణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల సంయుక్తంగా మంగళవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణ నుంచి ప్రారంభమైన విద్యార్థుల సైకిల్ ర్యాలీని పాఠశాల హెచ్ఎం బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. కళాశాల, పాఠశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు వంద మంది పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపూ అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువకుల చేతికి మాదక ద్రవ్యాలు చేరకుండా నిర్మూలనపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. గాంధీ రోడ్డు, బైపాస్, చిత్తూరు రోడ్డు సహా ప్రదాన మార్గాల్లో ర్యాలీగా వెళ్లి చివరగా కమల కూడలి వద్ద ర్యాలీ ముగించారు. -
వార్షికోత్సవం
శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నేతృత్వంలో కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ 20వ వార్షికోత్సవ వేడుకను మంగళవారం నిర్వహించారు. బెంగళూరులోని ఇండియన్ మాంటిస్సోరి సెంటర్ అధ్యక్షురాలు ఉమా శంకర్ ఈసందర్భంగా శస్త్ర చికిత్స చేయించుకున్న పిల్లలతో ముచ్చటించారు. ఆ విద్యా సంస్థ వీసీ ఉమా శేఖర్, డీన్ కె బాలాజీ సింగ్, ఆ సర్జరి విభాగం అధిపతి ఎస్ ప్రసన్నకుమార్, ఆడియాలజీ , స్పీచ్ ల్యాంగ్వేజ్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకాశ్ భూమినాథన్, స్పెసల్ ఆఫీసర్ రూప నాగరాజన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. – సాక్షి, చైన్నె -
భక్తిశ్రద్ధలతో వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవం
కొరుక్కుపేట: చైన్నె జార్జిటౌన్లోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా మంగళవారం ఉదయం 8:55 గంటలకు వాసవాంబ అమ్మవారికి పూజ, హోమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం శ్రీ వాసవాంబాకు క్షీరాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే శ్రీ వాసవాంబను విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలను ఆలయ అర్చకులు భాస్కర్ పంతులు బందం వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి దీపారాధన నేత్రపర్వంగా నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ వేడుకలలో ఆలయ పాలకమండలి సభ్యులు, మాజీ సభ్యులు పాల్గొని అమ్మవారి సేవలో తరించారు.శ్రీ వాసవాంబ ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఆత్మార్పణ దినోత్సవంలో ఆలయ పాలకమండలి సభ్యులు ఆలయంలో హోమ పూజలు -
30 ఏళ్ల నిరీక్షణకు దక్కిన ఫలితం
తిరుత్తణి: శ్మశానానికి రోడ్డు ఏర్పాటు చేయాలన్న 30 ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కడంతో అరుంధతీ కాలనీ వాసులు ఆర్డీఓను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని కుమారకుప్పం అరుంధతీ కాలనీలో 60 కుటుంబీకులు నివాశముంటున్నారు. శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో పంట పొలాలపై శవాలను తీసుకెళ్లడంలో ఇబ్బందులు పడేవారు. శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలని 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే పంట పొలాలు వుండడంతో దారి ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అరుంధతీ కాలనీ ప్రజల శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలన్న వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది 30 అడుగుల వెడల్పు గల దారి చూపారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి జేసీబీ సాయంతో తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేవారు. త్వరలో నిధులు సమకూర్చి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో హర్షం వ్యక్తం చేసి అరుంధతీ కాలనీ వాసులు మంగళవారం తమ కుటుంబాలతో వీసీకే జిల్లా కార్యదర్శి దండపాణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కనిమొళిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. -
అవినీతిపై విచారణ జరిపించాలి
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఉదయేంద్రం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని తమిళనాడు ప్రభుత్వ అన్ని శాఖల ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజవేలు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలో తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి అదే పంచాయతీలో 25 చెక్కుల ద్వారా ఈనెల 9వ తేదీన రూ.కోటి నగదును మార్చుకున్నారని వీటిని పొన్నేరి సమీపంలోని మండల వాడి గ్రామంలో కొత్త భవనాల నిర్మాణం కోసం ఉపయోగించినట్లు రికార్డులు సృష్టించారన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను దుర్వినియోగం చేయడంతో వీటిపై విచారణ జరిపించాలని గ్రామ పంచాయతీల జిల్లా అధికారికి, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులకు వీటిపై ఫిర్యాదు చేశామన్నారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు విచారణ జరిపించకుంటే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. ఆయనతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
పౌష్టికాహార కార్మికుల రాస్తారోకో
వేలూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తమిళనాడు పౌష్టికాహార కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏలుమలై అధ్యక్షత వహించగా తమిళనాడు ప్రభుత్వ రిటైర్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి జనార్దన్ మాట్లాడుతూ పౌష్టికాహార కార్మికులకు గత 2021వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్టికల్ 313లో పేర్కొన్న విధంగా తమకు సాధారణ వేతనాలు, కటుంబ భద్రతతో కూడిన పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.5 లక్షలు గ్రాట్యుటీ, వంట సహాయకులకు రూ.3 లక్షలు ఇప్పించాలనే డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు పోరాటాలను కొనసాగిస్తామని విధులకు హాజరు కామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేయకుండా కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేయడంతో పోలీసులు 700 మంది కార్మికులను అరెస్ట్ చేసి ప్రయివేటు కల్యాణ మండపంలో ఉంచారు. రాస్తారోకోలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుక్మణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్ణమూర్తి, కార్మికులు మరగదం, తమిల్సెల్వి, మహేశ్వరి, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరువళ్లూరులో.. తిరువళ్లూరు: పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. పౌష్టికాహార ఉద్యోగులకు క్రమబద్ధీకరించిన వేతనాలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. అయితే ఇంతవరకు వారి సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలోనే పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించి రాస్తారోకో చేశారు. ఆందోళనకు నేతృత్వం వహించిన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇళంగోవన్ మాట్లాడుతూ పౌష్టికాహార ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిషరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల అరెస్టు చేస్తున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న ఉద్యోగులు -
అసెంబ్లీ నుంచి మరోమారు గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె : అందరూ ఊహించినట్టే అసెంబ్లీలో గవర్నర్ తన వివాదాస్పద ధోరణిని మరో మారు చాటుకున్నారు. 2023లో తొలిసారి ప్రభుత్వ ప్రసంగాన్ని పక్కన పెట్టిన గవర్నర్, 2024లో ప్రసంగంలోని తొలి, చివరి పేజీని చదవి మమా అనిపించారు. 2025లో జాతీయ గీతం ముందుగా ఆలపించాలని పట్టుబడుతూ ప్రసంగాన్ని పక్కన పెట్టి సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఈ సారి కూడా ఆయన అదే ధోరణితో ముందుకు సాగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. 2026 కొత్త సంవత్సరంలో తొలి అసెంబ్లీ మంగళవారం సమావేశమైంది. ప్రభుత్వ ప్రసంగం పాఠాన్ని ఈసారి కూడా గవర్నర్ పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా వెలువడ్డే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. ఈక్రమంలో ఉదయం 9.30 గంటలకు ఆయన సభకు రాగానే, స్పీకర్ అప్పావు ఆహ్వానించారు. తమ దివంగత నేత కరుణానిధి జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. సభలోకి గవర్నర్ వెళ్లగానే, ప్రత్యక్ష ప్రసారాలు, మీడియాకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులోకి వచ్చేశాయి. ఇందుకు కారణం గతంలో సభలో చోటు చేసుకున్న పరిణామాలే. దీంతో గవర్నర్ అటు సభలోకి వెళ్లి, ఇటు బయటకు వచ్చేశారు. లోక్భవన్.. 13 కారణాలతో ప్రకటన గవర్నర్ సభలో ప్రసంగం పాఠం పక్కన పెట్టడానికి 13 కారణాలను లోక్ భవన్ ప్రకటన రూపంలో వివరించింది. గవర్నర్ మైక్రోఫోన్(మైక్) పదే పదే ఆగి పోయిందని, ప్రసంగంలో అనేక తప్పుడు సమాచారాలు, నిరాధారమైన వాదనలు ఉన్నట్టు, తమిళనాడులోకి రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిందన్న సమాచారం పూర్తిగా అసత్యం అని ప్రకటించారు. రాష్ట్రంలో లైంగిక వేదింపు కేసులు, హత్యలు, దోపిడీ వంటి నేరాలు పెరిగాయని, మహిళలకు భద్రత కరువైందని, విద్యార్థులు, అన్ని వర్గాలు మత్తుకు బానిసయ్యే పరిస్థితి ఉందని ఆరోపించారు. భక్తుల మనో భావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు, రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ వ్యవహారాలు సాగుతున్నట్టు, నిరుద్యోగం పెరిగినట్టు పేర్కొంటూ, మళ్లీ జాతీయ గీతాన్ని అవమానించారని అందులో వివరించారు. గవర్నర్కు వ్యతిరేకంగా తీర్మానం శాసన సభలో గవర్నర్కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ తీర్మానం తీసుకొచ్చారు. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించి సభ నుంచి ఆయన వాకౌట్ చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని, దీనిని గవర్నర్ ఆమోదిస్తారని పేర్కొంటూ, ఈ ప్రసంగం తప్పక చదవాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. అయితే, గవర్నర్ తన సొంత అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారని మండిపడుతూ, దివంగత నేత అన్నాదురై వ్యాఖ్యలను ఈసందర్భంగా ఉటంకిస్తూ తమిళ ప్రజల సంక్షేమం, మనో భావాలను వివరించారు. గవర్నర్ తీరు ఆమోద యోగ్యం కాదని, శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న అసెంబ్లీ ఖ్యాతిని పరిరక్షించేందుకు ఈ తీర్మానం అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత విధానాలను అనుసరించి, తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి అసెంబ్లీకి పంపిందని, దీనిని గవర్నర్ విస్మరించడాన్ని ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగంలోని ఆంగ్ల పాఠం సభ్యుల డెస్క్పై ఉన్న మినీ డెస్క్ టాప్ స్కీన్లో అప్లోడ్ చేసినట్టు పేర్కొన్నారు. దీని తమిళ ప్రసంగాన్ని గవర్నర్ సభకు వినిపిస్తారని పేర్కొంటూ, ఇది సభా పద్దులలో నమోదు కావాలని విన్నవించారు. దీంతో స్పీకర్ అనుమతితో మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఈ తీర్మానంకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో నాలుగో సారి కూడా ఆయన ప్రభుత్వం అందించన ప్రసంగాన్ని పక్కన పెట్టారు. మంగళవారం సభ నుంచి ఆ వెంటనే వాకౌట్ చేసి బయటకు వెళ్లడమే కాకుండా, అసెంబ్లీలో జాతీయ గీతాన్ని అవమానించారని, తనను మాట్లాడ నివ్వకుండా మైక్ కట్ చేశారని లోక్ భవన్ ద్వారా ప్రకటనను విడుదల చేయించారు. ఇక గవర్నర్కు వ్యతిరేకంగా మరోమారు సీఎం స్టాలిన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. గవర్నర్ తీరును డీఎంకే కూటమి పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇక, గవర్నర్కు మద్దతుగా అన్నాడీఎంకే, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి. గవర్నర్ ప్రసంగలోని ముఖ్యాంశాలు..అన్నాడీఎంకే, బీజేపీ వాకౌట్ గవర్నర్ ప్రసంగాన్ని సభకు తమిళంలో స్పీకర్ అప్పావు వినిపించేందుకు సిద్ధం కాగా, అన్నాడీఎంకే, బీజేపీ, అన్బుమణి మద్దతు పీఎంకే ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు స్పీకర్ తీవ్ర ఆక్షేపణీయంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు సభలో నినాదాలు హోరెత్తాయి. అనంతరం సభ నుంచి అన్నాడీఎంకే, బీజేపీ, అన్బుమణి పీఎంకే మద్దతు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళణిస్వామి తదితరులు గవర్నర్కు మద్దతుగా వ్యాఖ్య లు చేస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆ ప్రసంగంలోని అన్ని అంశాలు అసత్యాల పుట్టగా నేతలు ఆరోపించారు. ఇక, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగైతో పాటూ సీపీఎం, సీపీఐ సహా ఇతర మిత్ర పక్ష పార్టీలన్నీ గవర్నర్ తీరును ఖండిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. కాగా అసెంబ్లీ తొలి రోజు సమావేశం ముగియగానే సభా వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సభను 24వ తేదీ వరకు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈసందర్భంగా మంత్రి రఘుపతి మీడియాతో మాట్లాడుతూ, సభలో మైక్ పనిచేయలేదన్న గవర్నర్ ఆరోపణలు నిరాధారం అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగం పాఠంలోని అంశాలను స్పీకర్ అప్పావు వివరించారు. అందులో.. -
పార్టీ మూడ్లో..
తమిళసినిమా: అగ్ర కథానాయికులుగా వెలిగిపోతున్న నయనతార, త్రిష మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు తరచూ కలిసి ట్రిప్లకు సైతం ప్లాన్ చేస్తుంటారు. ఇక నయనతార అయితే దర్శకుడు విఘ్నేష్ శివన్తో పెళ్లికి ముందు, ఆ తరువాత కూడా పండుగలు, పుట్టినరోజులు అంటూ విదేశీయానం చేస్తూంది లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు సరోగసీ విధానం ద్వారా కలిగిన ఇద్దరు కవల పిల్లలతో మమతానురాగాలను పొందుతున్నారు. ఇక త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమెకు మిత్ర బృందం ఎక్కువ. వారితో ఎక్కువగా పార్టీల్లో మునిగి తేలుతుంటారు. ఈ భామ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అన్నది తెలిసిందే. కాగా నాలుగు పదుల వయసు పై బడిన నయనతార, త్రిష రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. కాగా వృత్తి పరంగా వీరి మధ్య పోటీ తత్వం ఉండవచ్చు. వ్యక్తిగతంగా మంచి స్నేహితులే. ఇందుకు తాజా ఉదాహరణ ఈ బ్యూటీ లిద్దరూ ఇటీవల దుబాయిలో పార్టీని జరుపుకోవడమే. నటి నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ ఇటీవల దుబాయిలోనే ఉంటున్నారు. వారితో నటి త్రిష జాయిన్ అయ్యారు. ఇటీవల వీరు దుబాయ్లోని సమీర్ తీరప్రాంతంలో ఓ బోట్ లో సన్షైన్ను ఎంజాయ్ చేస్తూ, పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా త్రిష, నయనతార కలిసి పార్టీ మూడ్ లో తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. వాటిని చూసిన వారు ఇదికదా లైఫ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నయనతార, త్రిష నయనతార, త్రిష -
బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవాల దానం
వేలూరు: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. వివరాలు.. వేలూరు సమీపంలోని సేన్బాక్కం నేతాజీ వీధికి చెందిన జగదీశ్వర్ భార్య సింధు(32) దంపతులు ఇద్దరూ కలిసి ఈనెల 18వ తేదిన బైకులో వెలుతుండగా రత్నగిరి సమీపంలో ఆమె శాలువా బైకు చక్రాల్లో చిక్కుకోవడంతో అదుపు తప్పి ఆమె రోడ్డుపై పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం వేలూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. చికత్స పొందుతూ ఈనెల 19వ తేది రాత్రి 10 గంటల సమయంలో బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో సిందు భర్త జగదీశ్వరన్ ఆమె కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీలోని డాక్టర్లు కాలేయం, మూత్ర పిండాలను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి, కిడ్నీలు చైన్నెలోని అపోలో ఆసుపత్రికి, కల్లు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు సీఎంసీ ఆసుపత్రి పీఆర్ఓ దురై జాస్పర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
సూరరై పోట్రు కాంబో రిపీట్?
తమిళసినిమా: సూరరై పోట్రు చిత్రం నేరుగా థియోటర్లలో విడుదల కాకపోయినా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి విశేష ప్రేక్షకాదరణతో పాటూ, జాతీయ అవార్డులను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరో సూర్య, దర్శకులు సుధా కొంగర. కాగా ఈ చిత్రం తరువాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య ఇంతకు ముందే రెడీ అయ్యారు. దాని పేరు పురనానూరు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం చిత్రీకరణను కూడా జరుపుకుంది. ఆ తరువాత అనివార్య కారణాల వల్ల సూర్య ఆ చిత్రం నుంచి వైదొలగారు. ఆ తరువాత అదే కథతో నటుడు శివకార్తికేయన్ హీరోగా పరాశక్తి పేరుతో సుధా కొంగర తెరకెక్కించారు. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీంతో దర్శకులు సుధా కొంగర తదుపరి చిత్రం ఏమిటన్న చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. కాగా తాజాగా మరోసారి సూర్య, దర్శకులు సుధా కొంగర కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే నటుడు సూర్య ప్రస్తుతం తన 46, 47 చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 46వ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ, 47వ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి పాండిరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సుధా కొంగర దర్శకత్వంలో చిత్రం ఎప్పుడు అన్నది ఆసక్తిగా మారింది. -
టీవీ తిరువాసకం పాటకు ప్రధాని ప్రశంస
తమిళసినిమా: సంగీత దర్శకుడుగా జీవీ. ప్రకాష్ కుమార్ శతకాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో నటుడుగానూ రాణిస్తున్న ఈయన తాజాగా తిరువాసకానికి సంబంధించిన ఓ భక్తిరస గీతానికి సంగీతాన్ని సమకూర్చారు. కాగా ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి మురుగన్ స్వగృహంలో పొంగల్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు జీవీ. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చిన తిరువాసకంలోని ఒక భక్తిరస గీతాన్ని ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ భక్తి గీతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భక్తి పారవశ్యం పొంది జీవీ. ప్రకాష్ కుమార్ను ఎంతగానో ప్రశంసించారు. దీని గురించి జీవీ. ప్రకాష్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తిరువాసకంలో ఒక భాగానికి సంబంధించిన భక్తి రస గీతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందన్నారు. తిరువాసకాన్న పూర్తిగా వీడియో ఆల్బమ్ రూపంలో రూపొందించాలన్నది తన చిరకాల కోరిక అని పేర్కొన్నారు. దాన్ని సంప్రదాయ సంగీతంతో రూపొందించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నది తన లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా తొలి ప్రయత్నంగా తీరువాసకంలోని ఒక భాగాన్ని సాంప్రదాయ సంగీతంతో భక్తి రస గీతాన్ని సమకూర్చినట్లు, ఈ పాట తో కూడిన వీడియోను ఈనెల 22వ తేదీన తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇకపై వరుసగా తిరువాసకం భక్తి పాటలతో కూడిన వీడియోలను విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు. తిరువాసగం గీతాన్ని ఆలపిస్తున్న జీవీ ప్రకాష్కుమార్ -
30న తెరపైకి కరుప్పు పల్సర్
తమిళసినిమా: నటుడు గెత్తు దినేష్ ద్వపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కరుప్పు పల్సర్. యశో ఎంటర్టైన్మెంట్ పతాకంపై డాక్టర్ సత్య మురళీకృష్ణన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మురళి క్రిష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎం.రాజేష్ శిష్యుడు కావడం గమనార్హం. నటుడు గెట్ టు దినేష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నటి రేష్మ వెంకట్, మదునిక హీరోయిన్గా నటించారు. ప్రిన్స్ విజయ్ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో మన్సూర్ అలీ ఖాన్ ,శరవణన్ సుబ్బయ్య కలైయరసన్ ,కన్ను స్వామి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కరుప్పు పల్సర్ చిత్రం ఈనెల 30న తెరపైకి రానుంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మధురై నేపథ్యంలో సాగే కమర్షియల్ అంశాలతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో నటుడు గెత్తు దినేష్ మధురైకి చెందిన నలుపు గిత్తతో తిరుగుతుంటారని మరో పాత్రలో సిటీకి చెందిన యువకుడిగా నటిస్తున్నట్లు, ఈ పాత్రలో ఆయన పల్సర్ మోటార్ బైక్ లో తిరుగుతుంటారని చెప్పారు. అలాంటిది వీరిద్దరూ ఒకచోట కలుసుకోవడంతో వారి జీవితాల్లో ఏర్పడే సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. దీనికి భాస్కర్ ఆరు ముఖం ఛాయాగ్రహణంను, ఇన్బా పాటలు, సంగీతాన్ని అందించినట్లు పేర్కొన్నారు. కరుప్పు పల్సర్ చిత్ర యూనిట్ -
● సీట్ల పంచాయితీపై కుస్తీ ● ప్రధాన పార్టీలతో నేడు సమావేశం?
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో బీజేపి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. బీజేపీరాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్, కో ఇన్చార్జ్లుగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్చార్జ్గా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రాం మెహ్వాల్, సివిల్ ఏవియేషన్ కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహుల్ ఇప్పటికే రంగంలోకి దిగారు. అన్నాడీఎంకేతో సంప్రదింపు ముగించారు. ఇక కూటమిలోకి వచ్చే పార్టీలతో సంప్రదింపును విస్తృతం చేశారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమిలోకి ఇప్పటికే అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే అధికారికంగా చేరింది. ఇక జీకే వాసన్ తమిళమానిల కాంగ్రెస్, ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చి, రవి పచ్చ ముత్త ఐజేకే వంటి పార్టీలతో చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పార్టీల తాజాగా ఎన్డీఏలో ఉన్నప్పటికీ సీట్ల పందేరం విషయంగా చర్చలలో మునిగి ఉన్నాయి. అదే సమయంలో అమ్మమక్కల్ మున్నేట్రకళగం టీటీవీ దినకరన్ను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునే దిశగా వ్యూహాలకు పీయూష్ గోయల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ వర్గాలతో సంప్రదింపు ముగించి, బుధవారం టీటీవీ దినకరన్ను కలిసేందుకు సైతం కసరత్తులలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొటున్నాయి. ప్రధాని సభకు ముమ్మర ఏర్పాట్లు ఈనెల 23వ తేదీన మధురాంతకం వేదికగా జరిగే సభలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే చోట చేర్చే విధంగా, ఎన్డీఏ కూటమి బలాన్ని ప్రకటించే విధంగా కసరత్తు వేగవంతం చేశారు. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు అవుతుండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చైన్నె విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో మదురాంతకంకు పీఎం వెళ్లనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. మోదీ సమక్షంలో ఎన్డీఏ కూటమిని ప్రకటించేందుకు తగ్గట్టుగా పీయూష్ గోయల్ స్థానికంగా తిష్ట వేసి రచిస్తున్న వ్యూహాలన్నీ ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయో శుక్రవారం తేలనున్నది. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళని స్వామితో పోన్ ద్వారా ఎప్పటికప్పుడు పీయూష్ చర్చలు జరుపుతూ వస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
రైల్వే స్టేషన్కు.. బస్ స్టేషన్ అనుసంధానం
– కీలంబాక్కంలో హైలెవల్ ఫుట్బ్రిడ్జి పనులు త్వరలో పూర్తి కొరుక్కుపేట: చైన్నె నగరంలోని వండలూర్లోని కీలంబాక్కం నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు కొత్తగా ఏర్పాటు చేసిన బస్సు స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. అలాగే కీలంబాక్కం బస్ స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. ఇక ప్రయాణికులు సులభంగా చేరుకోవడానికి కొత్త రైల్వే స్టేషన్ కూడా నిర్మించారు. ప్లాట్ఫామ్ నిర్మాణంతో సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం త్వరలో జరుగుతోంది. అయితే, ప్రయాణికులు స్టేషన్ చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి జీఎస్టీ రోడ్డు దాటవలసి వస్తోంది. ఈనేపథ్యంలో రైల్వే స్టేషన్ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.79 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు పనులు పూర్తయినప్పటికీ, 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఫుట్బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజల వినియోగానికి తీసుకువస్తామని తాజాగా అధికారులు తెలిపారు. ఎన్నూర్లో లిక్విడ్ అమ్మోనియా లీక్పై విచారణ ముమ్మరం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాసు హైకోర్టు నోటీసులు కొరుక్కుపేట:చైన్నెలోని ఎన్నూర్లో ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సీఐఎల్) అమ్మోనియా ప్లాంట్ను సీజ్ చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందించాలని మద్రాస్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వివరాలు.. చైన్నెలోని ఎన్నూర్లోని కోరమండల్ ప్లాంట్ ఉంది. ఓడరేవు నుండి ద్రవ అమ్మోనియాను రవాణా చేయడానికి ఓడరేవు వద్ద ఏర్పాటు చేసిన పైప్లైన్ డిసెంబర్ 26, 2023న దెబ్బతింది. దీంతో అమ్మోనియా లీక్ అయింది. ఈ క్రమంలో 52 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం రూ.92 కోట్ల పరిహారం అందించడానికి అంగీకరించింది. కాగా భోపాల్ గ్యాస్ విషాదం లాగే విష వాయువును లీక్ చేస్తున్న అమ్మోనియా ప్లాంట్ను మూసివేయాలని ఆదేశించాలని కోరుతూ తిరువొత్తియూర్ మాజీ ఎమ్మెల్యే కె. కుప్పన్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్లో, ఆ ప్లాంట్లో అమ్మోనియా మార్పిడి, నిల్వ, సంబంధిత ప్రమాదకర కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. 2023లో అమ్మోనియా గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైన వారికి వెంటనే పూర్తి పరిహారం అందించాలని చైన్నె, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని కూడా ఆయన అభ్యర్థించారు. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎం. శ్రీవాస్తవ, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ లతో కూడిన ధర్మాసనం, ఈ పిటిషన్ పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. గిండిలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టు టెర్మినల్ సాక్షి, చైన్నె: గిండిలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టు టెర్మినల్కు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకోసం 3.48 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. వివరాలు..చైన్నె నగరంలో గిండి కీలక ప్రాంతం. వేళచ్చేరి, తాంబరం, పూందమల్లి, కోయంబేడు, ఓఎంఆర్, ఈసీఆర్ల వైపుగా వెళ్లే రవాణా మార్గాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రాంతం ఉంటున్నది. ఇక్కడే ఎంటీసీ బస్సులు, మెట్రో రైలు, ఎలక్ట్రిక్ రైలు సేవలు కలుస్తుంటాయి. దీని ఆధారంగా గిండిలో మల్టీ మోడల్ రవాణా కేంద్రం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్టు టెర్మినల్కు కసరత్తు చేపట్టారు. ఈ రైల్వే సేషన్ తదుపరి వచ్చే సెయింట్ థామస్ మౌంట్వ ద్ద ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్, మెట్రో రైలు సేవలు మూడు మరి కొన్ని నెలలో అనుసంధానించనున్నారు. వీటన్నింటినీ పరిగణించి గిండి కేంద్రంగా రవాణా కేంద్రం రూపకల్పన కసరత్తులు మొదలయ్యాయి. ఇందుకోసం ఇంటి గ్రేటెడ్ హబ్గా రైలు, మెట్రో, ఎంటీసీ సేవలు ప్రయాణీకులకు అందించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మెట్రో, ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్ సమీపంలో 3.48 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడే అన్నింటిని అనుసంధానించే విధంగా ప్రణాళికను అఽధికారులు సిద్ధం చేసి ఉన్నారు. ప్రస్తుతం ఎంటీసీ బస్సుల కోసం సబ్ వే ఆధారంగా రోడ్డు దాటాల్సి ఉంది. ఈ దృష్ట్యా, ఈ హబ్ ఏర్పాటుతో ఆ ప్రయత్నం ప్రయాణీకులు చేయాల్సిన అవసరం లేదు. మూడు రకాల రవాణా సేవ ఒకే వేదికగా అందించేందుకు సంబంధించిన విస్తృత కార్యచరణను అధికారులు వేగవంతం చేశారు. ఇందు కోసం అయ్యే అంచనా వ్యయం గురించి పరిశీలిస్తున్నారు. -
తుది మెరుగులు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పార్టీ తరపున మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వారం రోజులలో విజయ్కు ఈ మ్యానిఫెస్టో అందజేయనున్నట్టు సంబంధిత కమిటీ మంగళవారం ప్రకటించింది. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈప్రయాణంలో ఆయనకు ఎదురవుతున్న ఒడి దొడుగులు మరీ ఎక్కువే. మీట్ దిపీపుల్ అంటూ ప్రజలలోకి వెళ్తున్న సమయంలో కరూర్ విషాద ఘటన ఆయనకు బ్రేక్ వేసింది. ఆతదుపరి ఈ ప్రయాణం అన్నది ముందుకు సాగడం లేదు. అదే సమయంలో తన చివరి చిత్రంగా పేర్కొంటున్న జననాయకన్ విడుదల వివాదంలో మునిగింది. ఈ పరిస్థితులో ఎన్నికల ప్రచార వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు ముందు జాగ్రత్తగా కమిటీని రంగంలోకి దించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రచార కార్యదర్శి ఆదవ్ అర్జునన్, వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్త పాటూ పార్తీబన్, రాజ్కుమార్, విజయ్ దాము, ఎస్పీ సెల్వం, కె. పిచాయ్ రత్నం, తదితరులతో 10 మందిని నియమించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలలలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి అన్ని వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షణలో జరిపే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనకు మరో కమిటీని నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలోని ఈ కమిటీలో అరుణ్ రాజ్, జేసిటీ ప్రభాకర్, ఎన్. ఆనంద్, రాజ్ మోహన్, తదితరులు ఉన్నారు. ఈ కమిటీ అన్ని రకాల పరిశీలనలు, సమగ్ర అధ్యయనంతో నివేదికను సిద్ధం చేసింది. దీనిపై తుది కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం పనయూరులోని పార్టీ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. అన్ని కోణాలలో సాగిన అధ్యయనం, పరిశీలన మేరకు సిద్ధం చేసిన నివేదికలలోని అంశాలను ఇందులో చర్చించారు. దీనిని సమగ్రంగా మ్యానిఫెస్టో రూపంలో సిద్ధం చేసి వారం రోజులలో విజయ్కు సమర్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఈనెల 25లోపు తుది మెరుగులు పూర్తి చేసి, మ్యానిఫెస్టోను సమగ్ర అంశాలతో అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
తెన్పొన్నై నదిలో అన్నామలైయార్కు తీర్థవారి
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అన్నామలైయార్కు తెన్పొన్నై నదిలో తీర్థవారి మంగళవారం నిర్వహించారు. తమిళ తైమాసంలో ప్రతి సంవత్సరం అన్నామలైయార్కు సొంతమైన 180 ఎకరాల వ్యవసాయ భూమిని చూసే వైభవం నిర్వహించడం ఆనవాయితీ. ఈక్రమంలో విల్లుపురం జిల్లా నుంచి వచ్చే నది తెన్పొన్నై నది, సెయ్యారు నుంచి వచ్చే గౌతమి నది, మన్నార్పేటలో మూడు నదులు కలిసే ప్రాంతంలో అన్నామలైయార్కు తీర్థవారి నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉదయం చంద్రశేఖరుడిని తిరువడియాగ అన్నామలైయార్ను ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేసి భక్తుల దర్శనార్థం తిరువణ్ణామలై ఆలయం నుంచి కళశపాక్కం సెయ్యారు నది వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వార్లుకు హరోం హరా నామస్మరణాల మధ్య కర్పూర హారతులు పట్టడంతో పాటూ శాలువలు, చీరలను అందజేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ తీర్థవారిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అన్నామలైయార్కు హరోంహారా అంటూ పూజలు నిర్వహించారు. స్వామి వార్లు ఊరేగింపు సమయంలో భారీగా భక్త జనం పాల్గొన్నారు. తీర్థవారి అనంతరం స్వామివారు వివిధ గ్రామాలను చుట్టి రాత్రికి ఆలయానికి చేరుకుంటుందని ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ తెలిపారు. -
గవర్నర్ల కోసం ప్రత్యేక చట్టాలేవి లేవు: స్టాలిన్
తమిళనాడు గవర్నర్ RN రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య మరోసారి వైరం ముదిరిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తనను అవమానించారని అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. గవర్నర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని అన్నారు. స్టాలిన్ మాట్లాడుతూ " సభనుంచి గవర్నర్ వాకౌట్ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించడమే. గవర్నర్ తన అభిప్రాయాలను పంచుకునేలా, ఎదైనా చెప్పేలా ఉండే చట్టాలేవి లేవు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా గవర్నర్ మద్దతు ప్రకటించాలి కాని RNరవి అలా చేయడం లేదు" అని స్టాలిన్ అన్నారు.రాష్ట్ర గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తిస్తుని ఇటువంటి చర్యలు చేయడం వల్ల సభను అవమానపరుస్తున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఉదయం సభను వాకౌట్ చేసిన గవర్నర్ అనంతరం అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. జతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని తాను చదవాల్సిన ప్రసంగంలో అనేక తప్పులున్నాయని, తన మైక్ ఆప్ చేశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.అయితే గతంలోనూ తమిళనాడు గవర్నర్ RN రవి తీరు వివాదాస్పదమైంది. ప్రభుత్వం రూపొందించన ప్రసంగం కాకుండా తన స్వంత ప్రసంగాన్ని చదివారు. ఈ వివాదం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశంమైంది. -
ప్రేమ వివాహం చేసుకున్నాడని గ్రామ బహిష్కరణ
తమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో నాలుగేళ్లుగా గ్రామానికి రానివ్వకుండా బహిష్కరించి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకా ఓబులాపురం గ్రామానికి చెందిన ప్రేమ్(27). ఇతను ఎంబీసీ కులానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన భానుమతి(24)ని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలు ప్రేమ్తోపాటు అతడి కుటుంబ సభ్యులను గ్రామ బహిష్కరణ చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు గ్రామంలోకి ప్రవేశించకూడదని, ఆలయంలోని గుడికి రాకూడదు, గ్రామంలో వెళ్లకూడదు, శుభ కార్యంలో పాల్గొన కూడదని నిబంధన విధించారు. దీంతో పాటు గత రెండు రోజుల క్రితం తన ఇంటిని సైతం ధ్వంసం చేశారని, ఇదే విషయంపై ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు. తమను గ్రామ బహిష్కరణ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోడంతోపాటు తమకు భద్రత కలి్పంచాలని కోరుతూ బాధితుడు తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఆందోళన నిర్వహించాడు. -
మహిళా పోలీసుల టాయిలెట్లో రహస్య వీడియోలు
చెన్నై: రామనాథపురం జిల్లా పరమకుడిలో శనివారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అమరవీరుడు ఇమాన్యుయేల్ శేఖరన్ మణి మండపాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఆయన భద్రతా విధుల కోసం రామనాథపురం, శివగంగై, విరుదునగర్, నెల్లై, తూత్తుకుడి, తంజావూరు వంటి వివిధ జిల్లాల నుంచి పురుష, మహిళా పోలీసు అధికారులు అక్కడికి వచ్చారు.ఈ స్థితిలో, తంజావూరు నుంచి మహిళా పోలీసు అధికారులను పరమకుడిలోని మణినగర్ ప్రాంతంలోని అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద మోహరించారు. పరమకుడి నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండిని కూడా భద్రతా పనుల కోసం నియమించారు. ఈ అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఓ టాయిలెట్ ఉంది. భద్రతా విధుల్లో ఉన్న తంజావూరుకు చెందిన మహిళా పోలీసులకు ఈ టాయిలెట్ను కేటాయించారు. అందులోకి వెళ్లిన సమయంలో కొంతమంది మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లో దాచిన సెల్ఫో¯న్ను చూసి అనుమానం వ్యక్తం చేశారు. తరువాత, వారు దానిని బయటకు తీసినప్పుడు, అది వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లోకి ప్రవేశించే దృశ్యాలు అందులో ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారు సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకుని పరమకుడి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. అది స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండి సెల్ ఫోన్ అని తేలింది. దర్యాప్తులో, స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండి ఎవరూ లేని సమయంలో టాయిలెట్లోకి వెళ్లాడని, ఆపై తన సెల్ ఫో¯న్లో వీడియోను ఆన్ చేసి ఎవరికీ తెలియకుండా ఒక ప్రదేశంలో దాచాడని తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండిని ఆదివారం అరెస్టు చేసి రామనాథపురం జైలుకు తరలించారు. -
గ్రీవెన్స్డేకు 333 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన గ్రీవెన్స్డేకు 333 వినతులు వచ్చాయి. వాటిని తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతాప్ ఆయాశాఖలకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల నుంచి మద్యాహ్నం రెండు గంటల వరకు గ్రీవెన్స్డేను నిర్వహించారు. గ్రీవెన్స్డేలో అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరు కాగా, కలెక్టర్ ప్రతాప్ వివిద ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పక్కా గృహాల కోసం 51 వినతులు, సాంఘిక భద్రత పథకాన్ని వర్తింప చేయాలని 70 వినతులు, మౌలిక వసతులు కల్పించాలని 78 వినతులతోపాటు 333 వినతులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేశారు. అనంతరం వికలాంగుల సంక్షేమశాఖ ఆద్వర్యంలో ఆరు మందికి 3.36 లక్షలు విలువ చేసే ల్యాప్టాప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ సురేష్, పీఏజీ వెంకట్రామన్, స్పెషల్ కలెక్టర్ బాలమురుగన్, డిప్యూటీ కమిషనర్ గణేషన్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
71 జిల్లాలకు కాంగ్రెస్ కొత్త అధ్యక్షులు
సాక్షి,చైన్నె: టీఎన్సీసీలో జిల్లాల అధ్యక్షులు, ఇతర కమిటీ నియమాక కసరత్తుల జాబితా వెలు వడింది. తొలుత 71 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ఆమోద ముద్ర వేసింది. తమిళనాడు కాంగ్రెస్లో పార్టీ పరంగా 77 జిల్లాల ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 10 జిల్లాలకు అధ్యక్షులు లేరు. మిగిలిన జిల్లాలకు పది నుంచి 15 సంవత్సరాల పాటుగా పాతుకు పోయిన వారే ఉంటూ వచ్చారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న నినాదం గత కొంత కాలంగా మిన్నంటుతూ వచ్చింది. ఈనేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సెల్వ పెరుంతొగై పగ్గాలు చేపట్టినానంతరం జిల్లా కమిటీలలో మార్పునకు సంబంధించిన కసరత్తు చేపట్టారు. అయితే, ఏఐసీసీ ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న గ్రూపుల దృష్ట్యా, ఆయా గ్రూపుల నుంచి ప్రతినిధులతో జిల్లా కమిటీల ఎంపికకు ఓ కమిటిని ఏఐసీసీ నియమించింది. మొత్తం 35 మంది తోకూడిన ఈ కమిటీ జిల్లాల కమిటీ నిర్వాహకుల ఎంపికపై దృష్టి పెట్టింది. నాలుగు వారాల పాటూ ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. జిల్లాల వారీగా పదవుల ఎంపిక జాబితాను సిద్ధం చేసింది. అయితే, అనేక కీలక జిల్లాలలో పదువులకు నోట్ల భేరం సాగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా పలుజిల్లాలోని నేతలు స్పందించడం మొదలెట్టారు. పదువులకు లక్షలలో భేరం అంటూ కొన్ని జిల్లాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు సామాజిక మాధ్యమాలలో విమర్శించడం వివాదానికి దారి తీసింది. ఈపరిస్థితులలో 6 వేల మంది పేర్లతో ఈ కమిటీ జాబితాను సిద్ధం చేసి ఢిల్లీకి తీసుకెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశం వద్దకు జాబితా చేరింది. దీంతో పార్టీ పరంగా ఉన్న జిల్లాలో 71 జిల్లాలకు అధ్యక్షుల జాబితాను సోమవారం ప్రకటించారు. ఇందులో గతంలో పనిచేసిన వారిలో 8 మందికి మాత్రమే మళ్లీ అవకాశం ఇచ్చారు. మిగిలిన వారంతా కొత్త వాళ్లు. అలాగే, నాలుగు జిల్లాలకు మహిళలను అధ్యక్షులుగా నియమించడం విశేషం. మరో ఆరు జిల్లాలకు అధ్యక్షుల నియమాకాన్ని పెండింగ్లో పెట్టారు. -
మహిళల కబడ్డీ పోటీలు
పళ్లిపట్టు: సంక్రాంతి పురస్కరించుకుని మహిళలకు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో విజేతలకు డీఎంకే మండల కార్యదర్శి బహుమతులతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా పళ్ళిపట్టు సెంట్రల్ మండల డీఎంకే కార్యదర్శి బిడి. చంద్రన్ ఆధ్వర్యంలో మహిళల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండలంలోని పలు గ్రామాల నుంచి పది జట్లు పాల్గొన్నాయి. మూడు రోజుల పాటూ నిర్వహించిన కబడ్డీ పోటీలకు అత్తిమాంజేరిపేట ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానం వేదికై ంది. రసవత్తరంగా సాగిన కబడ్డీ పోటీల్లో విజేత జట్టుకు బహుమతులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో తొలి స్థానం సాధించిన జట్టుకు రూ. 15 వేలతో పాటు ట్రోపీ అందజేసి సత్కరించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలుసాధించిన జట్లుకు రూ. పది వేలు, ఐదువేల బహుమతులతో జ్ఞాపిక అందజేసి సత్కరించారు. -
నాసిరకం వస్తువుల విక్రయం
తిరువళ్లూరు: నాసిరకం వస్తువులను విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పుడ్సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి వంద కిలోల పిండి, 20 కిలోల ఖర్జూరపు పండ్లును స్వాధీనం చేసుకుని సంబంధిత దుకాణానికి నోటీసులు జారీ చేశారు. తిరువళ్లూరు పట్టణంలోని ఆయిల్మిల్ వద్ద కోవై పండ్లు, నిత్యావసర వస్తువుల దుకాణం పేరిట షాపును నిర్వహిస్తున్నారు. ఈ షాపులో నిత్యావసర వస్తువులు, పండ్లును విక్రయిస్తున్నారు. అయితే దుకాణంలో కొనుగోలు చేసిన వస్తువులు నాసిరకంగా ఉన్నట్టు కొందరు తిరువళ్లూరు పుడ్సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేశారు. గోధుమ, రాగి తదితర పిండిలో పురుగులు వస్తున్నాయని, ఖర్జూరపు పండ్లు సైతం నాసిరకంగా ఉన్నట్టు ఫొటోలతో సహా పిర్యాదు చే శారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గోధుమ, రాగితో పాటు పలు పిండి వస్తువులలో పురుగులు వున్నాయని, పండ్లులోనూ నాసిరకం వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుకాణానికి వివరణ కోరుతూ నోటీసులు సైతం జారీ చేశారు. -
ఉపాధ్యాయుల ఆందోళన
మూడు వేల మంది అరెస్టు తిరువొత్తియూరు: చైన్నెలో (మాధ్యమిక) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒక నెలగా శిబిరాల్లో వుంటూ పోరు బాట సాగిస్తున్నారు. అర్ధ సంవత్సర పరీక్షల సెలవుల్లో పోరాటం ప్రారంభించిన వారు ఇప్పుడు సంక్రాంతి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పోరాటాన్ని కొన సాగిస్తున్నారు. వేతన వ్యత్యాసాలను సరిదిద్ది సమాన వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ చైన్నెలో వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నందున సోమవారం ఉపాధ్యాయులు పోరాటాన్ని తీవ్రతరం చేశారు. కోట రైల్వే స్టేషన్ సమీపంలోని పూల దుకాణం ప్రాంతంలో అకస్మాత్తుగా రోడ్డుపై కూర్చుని నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఏలగిరి పర్యటనలో పారిశ్రామిక వేత్త మృతి తిరువొత్తియూరు: చైన్నెలోని పోరూర్ ప్రాంతానికి చెందిన మహేష్(47) పారిశ్రామిక వేత్త. ఇతనికి ఇద్దరు కుమారులున్నారు. అతను పొంగల్(సంక్రాంతి పండుగ) సెలవుల కోసం 2 రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి తిరుపత్తూరు జిల్లాలోని ఏలగిరి కొండకు పర్యటనకు వచ్చారు. ఈ పరిస్థితిలో సోమవారం పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా, సోమవారం ఉదయం అకస్మాత్తుగా మహేష్కు గుండెపోటు వచ్చింది. ఇది చూసిన అతని కుటుంబ సభ్యులు అతన్ని రక్షించి చికిత్స కోసం తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఐఐటీలో జీడీసీ సదస్సు
కొరుక్కుపేట: భారతదేశంలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రజాస్వామ్యీకరించడంపై దృష్టిసారించే దిశగా ఐఐటీ మద్రాసులో జీడీసీ సదస్సు జరిగింది. ఇందులో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, ఏఎన్ఆర్ఎఫ్ డాక్టర్ శివకుమార్ కే, ఎన్ఐటీఐ ఆయోగ్ డాక్టర్ శశాంక్ షా, ఐఐటి –మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, ఫాస్ట్ ఇండియా వరుణ్ అగర్వాల్, ప్రముఖ పూర్వవిద్యార్థులు, ఇతర కార్పొరేట్ నాయకులు, విద్యా వేత్తలు, అలాగే డాక్టర్ గురురాజ్ దేశ్పాండే, క్రిష్ గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొని ఆవిష్కరణలపై కీలక ప్రసంగాలు చేశారు. ఐఐటీ మద్రాసులోని గోపాల కృష్ణన్–దేశ్ పాండే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ (జిడిసి) వార్షిక సదస్సు భారతదేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రజాస్వామ్యీకరించడం అనే అంశంపై జరిగింది. పాల్గొన్న వక్తలు భారతదేశంలో టైర్ –2 నగరాల నుంచి స్టార్టప్లు వేగంగా పెరుగుతున్న తరుణంలో మహిళా వ్యవస్థాపకుల భాగస్వామం పెరగడం, డిజిటల్ ప్లాట్ఫారంల అందుబాటులోకి రావడం ముదావహమని వ్యాఖ్యానించారు. ముందుగా ప్రొఫెసర్ కామకోటి మాట్లాడుతూ ఐఐటీ మద్రాసులో విద్య , వ్యవస్థాపకత పెద్ద ఎత్తున జరుగుతుందని అన్నారు. ఆన్లైన్ బీఎస్ ప్రోగ్రామ్ దాదాపు 50 వేల మంది విద్యార్థులకు, వారిలో చాలా మంది ఆర్థికంగా బలహీనమైన కుంటుంబాలకు చెందిన వారికి ఉత్తమ విద్యను పొందేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఐఐటీ మద్రాసు భారతదేశం అంతటా ఉన్న స్టార్టప్లు, వ్యవస్థాకులకు జీడీసీలోని దాని ల్యాబ్లు, ఇంక్యుబేటర్లు, ఫ్యాకల్టీ, ప్రోగ్రామ్ల నుంచి నేర్చుకోవడానికి వీలు కల్పిస్తోందని తెలిపారు . -
పౌల్టీర రైతుల ధర్నా
పళ్లిపట్టు: తమిళగ రైతుల సంఘం బాయిలర్ కోళ్లఫారం రైతులు ఆధ్వర్యంలో 11 అంశాలతో డిమాండ్ల పరిష్కారం కోసం పొదటూరుపేట బస్టాండులో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సంఘం చైన్నె మండల కోఆర్డినేటర్ దేవరాజ్ అధ్యక్షత వహించారు. బాలసుబ్రహ్మణ్యం నాయుడు స్వాగతం పలికారు. ఇందులో తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాలకు చెందిన బాయిలర్ కోళ్ల పారం రైతులు 30 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిపిల్లలు సరఫరా చేసే సంస్థల ప్రతినిధులపై బాయిలర్ కోళ్ల పెంపకం రైతులు దాడిచేసినట్లు తప్పుడు ఫిర్యాదుతో తమ సంఘం అధ్యక్షుడు ఈశన్ మురుగస్వామి సహా 9 మంది అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని, బాయిలర్ కోళ్ల పెంపకంకు కేజీ ధర రూ. 6.50 పెంచి రూ. 20 అందజేయాలని నినాదాలు చేశారు. -
వీనుల విందుగా విష్ణు సహస్రనామం
కొరుక్కుపేట: 500మందితో నిర్వహించిన విష్ణు సహస్రనామ పారాయణం వీనులవిందుగా సాగింది. శ్రీ కళారంజని చారిటబుల్ ట్రస్ట్, శ్రీ కళారంజని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె టినగర్ శ్రీరామకృష్ణ పాఠశాల ఆవరణలో ఉన్న ఇన్పోసిస్ హాలు వేదికగా దశ సహస్రగళార్చనలోభాగంగా ప్రత్యేక సంగీత కార్యక్రమం, భక్తిరంజని ఆథ్యాత్మిక ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు . ట్రస్ట్ నిర్వాహకులు , సంగీత దర్శకులు డాక్టర్ జే . శ్రీనిబాబు అధ్యక్షతన జరిగింది. ఇందులో ముందుగా యుఎస్ఏ కి చెందిన కెవిన్ వేల్ మురుగన్ కచ్చేరి అందరినీ వీనుల విందు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలైమామణి డాక్టర్ జే బాలసుబ్రమణియన్ , ప్రత్యేక అతిథులుగా భక్తిరత్న పివి కృష్ణారావు, గానసరస్వతి శాంతి సురేష్, సేవా రత్న శోభారాజా పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. ముందుగా 500మందితో శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం వీనుల విందు చేసింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజలక్ష్మీ, గాయనీగాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చెంప చెళ్లుమనిపించా...
తమిళసినిమా: కథానాయికలకు వేధింపుల కథలు చాలానే ఉంటాయి. వాటి గురించి వెంటనే చెప్పకపోయినా, ఏదో ఒక సమయంలో బయట పెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. నటి తమన్నా నుంచి చాలా మంది తాము జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి నటి పూజా హెగ్డే చేరారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తమిళంలో విజయ్కు జంటగా జననాయకన్ చిత్రంలో నటించారు. పొంగల్కు తెరపైకి రావాల్సిన ఈ చిత్రం దురదృష్టవశాత్తు వాయిదా పడింది. ఆ మధ్య తెలుగులో వరుస విజయాలతో క్రేజీ నాయకిగా వెలిగిన పూజాహెగ్డేకు అక్కడ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం హిందీలో హై జవానీ, ఇష్క్ హోనా హై చిత్రంతోపాటు తమిళంలో కాంచన 4, తెలుగులో దుల్కర్ సల్మాన్కు జంటగా ఒక చిత్రంలో నటిస్తున్నారు. జననాయకన్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న ఈ 35 ఏళ్ల ముంబయి భామ కథానాయకిగా పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇటీవల ఒక సమావేశంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పేర్కొంటూ కొన్నేళ్ల క్రితం ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించానని చెప్పారు. అప్పుడు ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా తన క్యారవాన్లోకి ప్రవేశించడమే కాకుండా అనాగరికంగా ప్రవర్తిస్తూ తనను టచ్ చేయబోయారన్నారు. దీంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని చెప్పారు. ఆ సంఘటన తరువాత ఆ హీరో తనతో కలిసి నటించలేదని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
కోర్టును ఆశ్రయించిన రామన్న!
సాక్షి, చైన్నె: పీఎంకేను నకిలీ రికార్డులతో అన్బుమణి హైజాక్ చేస్తున్నారన్న ఆవేదనతో కోర్టును ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ఆశ్రయించారు. సోమవారం ఆయన తరపున సివిల్ పిటిషన్ దాఖలైంది. పీఎంకేలో రాందాసు, అన్బుమణి రాందాసు మధ్య సాగుతున్న వివాదం గురించి తెలిసిందే. అన్బుమణిని పార్టీ నుంచి రాందాసు తొలగించారు. తానే అధ్యక్షుడ్ని అంటూ ఓ వైపు అన్బుమణి నేతృత్వంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించి కేంద్ర ఎన్నికల కమిషన్కు తీర్మానాలు పంపించారు. కాగా పార్టీకి తానే వ్యవస్థాపక అధ్యక్షుడ్ని అంటూ రాందాసు నేతృత్వంలో ప్రత్యేక సర్వ సభ్య సమావేశం నిర్వహించి తీర్మానాలను ఎన్నికల కమిషన్కు పంపించారు. అలాగే, అన్బుమణి స్థానంలో తన కుమార్తె శ్రీగాంధీని వర్కింగ్ ప్రెసిడెంట్గా రాందాసు నియమించారు. అదే సమయంలో అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటన చర్చకు దారి తీసింది. ఇక పీఎంకే తన గుప్పెట్లో అని అన్బుమణి ప్రకటించుకున్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టును రాందాసు ఆశ్రయించినా ఫలితం శూన్యం. అదే సమయంలో రానున్న ఎన్నికలలో అన్నాడీఎంకేతో తమ కూటమి అని అన్బుమణి ప్రకటించడాన్ని రాందాసు జీర్ణించుకోలేక పోయారు. తీవ్ర ఆగ్రహంతో ఉంటూ వస్తున్న ఆయన తాజాగా అన్బుమణికి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు సమాచారాలు, నకిలీ రికార్డుల ఆధారంగా పీఎంకేను అన్బుమణి హైజాక్ చేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీని రక్షించి తనకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టును రాందాసు పిటిషన్ ద్వారా విన్నవించారు. కాగా రాందాసు నేతృత్వంలో ఎన్నికలలో పోటీ చేయడానికి ఇచ్చిన పిలుపు మేరకు ఆశావహులు 4,109 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈసందర్భంగా రాందాసు మీడియాతో మాట్లాడుతూ, అన్బుమణి కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని, కోర్టే ఆయనపై చర్యలు తీసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నట్టు వ్యాఖ్యానించారు. -
క్లుప్తంగా
కారు ఢీకొని గర్భవతి మృతి భర్తకు తీవ్రగాయాలు వేలూరు: వేలూరు జిల్లా పల్లిగొండ సమీపంలోని వినాయకుడి గుడి వీధికి చెందిన దినగరన్ గత ఏడు నెలల క్రితం వానియంబాడికి చెందిన దీపిక(22)ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భం దాల్చడంతో వైద్య పరీక్షలు నిర్వహిచేందుకు దీపికను బైకులో వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని తిరిగి సమయంలో వేలూరు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో దీపిక అక్కడిక్కడే మృతి చెందింది. దినగరన్కు తీవ్ర గాయాలు కావడంతో వేలూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గర్భవతి అయిన దీపిక మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు పల్లిగొండ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. బావిలో పడిన జింక సేలం: నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్లోని ఓడువంపాలయం ప్రాంతంలో, కై లాసంపాలయం పక్కన, ఆడిటర్ సుబ్రమణ్యం యాజమాన్యంలోని వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ చాలా కాలంగా ఉపయోగంలో లేని బావి ఉంది. సోమవారం ఉదయం, అక్కడ శబ్దం విన్న ఈశ్వరి, బావిలోకి చూడగా, బావి లోపల చుక్కల జింక పడిపోయి ఉందని గుర్తించారు. గ్రామస్తులు ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా, సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక అధికారి కరికాలన్ బావి వద్దకు చేరుకుని జింకను సురక్షితంగా రక్షించి కుప్పండంపలయం పాఠశాల ఆవరణలో ఉంచి చికిత్స అందించారు. భవిష్యత్ కార్యాచరణకు రూ. 175 కోట్ల సేకరణ సాక్షి, చైన్నె : అసిస్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్ భవిష్యత్ నిర్మించేందుకు రూ. 175 కోట్లను సేకరించామని అసెట్ ప్లస్ సహ వ్యవస్థాపకులు విశ్రాంత్ సురేష్, అవనీష్ రాజ్లు తెలిపారు. డిజిటల్– సహాయక సంపద నిర్వహణ వేదికగా ఉన్న అసెట్ ప్లస్ , నెక్సస్ వెంచర్ భాగస్వామ్యంగా సేకరించిన నిధులు, భవిష్యత్ కార్యాచరణ వివరాలను సోమవారం స్థానికంగా వారుప్రకటలించారు. తమకు జెరోధా ద్వారా ఎయిట్ రోడ్స్ వెంచర్స్, రెయిన్ మాటర్ వంటి పెట్టుబడిదారులు కూడా మద్దతు ఇచ్చారన్నారు. మానవ సలహాలను సాంకేతికత ఆధారిత స్కేల్తో కలిపే విధంగా , నిర్వహణ మౌళిక సదుపాయాలను విస్తృతం చేసే దిశగా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. టెక్నాలజీ స్టాక్ను మరింత పెంచేందుకు , ఉత్పత్తి విస్తరణ, సమగ్ర నిర్వహణ, ఆరోగ్యం, టర్మ్ ఫ్లాన్లను కవర్ చేయడం వంటి అంశాలతోపాటుగా పంపిణి దారులను ఒకే వేదిక మీదకు తెచ్చి ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. తల్లిదండ్రుల సెల్ఫోన్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య అన్నానగర్: కడలూరు సమీపంలోని సత్తాంకుప్పం వి. కాట్టుపాళయంకు చెందిన సుకుమార్ కుమారుడు నవీన్ కుమార్ (16). ఇతను ప్లస్–1 చదువుతున్నాడు. ఆడుకోవడానికి సెల్ ఫోన్ కోసం నవీన్ కుమార్ చాలా సేపుగా తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. కానీ అతని తల్లిదండ్రులు అతనికి సెల్ఫోన్ ఇవ్వలేదు. దీనితో నిరాశ చెందిన నవీన్ కుమార్ 7వ తేదీన విషం తాగి స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబీకులు అతనిని రక్షించి చైన్నెలోని స్టాన్లీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో ఆదివారం రాత్రి నవీన్ కుమార్ మరణించాడు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చైన్నెలో శాటిలైట్ టెర్మినల్ సేవ సాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయంలో శాటిలైట్ ఆధారిత టెర్మినల్ సేవలు, హై లెవల్ ఫ్లై ఓవర్ పనులకు ఎయిర్పోర్టు అథారిటీ నిర్ణయించినట్టు సమాచారం. విమానాల టేకాఫ్, ల్యాండింగ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ వంటి అన్నిరకాల వ్యవహారాలను శాటి లైట్ ఆధారితంగా పర్యవేక్షించే దిశగా ప్రత్యేక కార్యచరణతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.కనెక్టివిటీని విస్తృతం చేయడానికే ఈ శాటిలైట్ టెర్మినల్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టుగా విమానాశ్రయవర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కొత్తగా నిర్మించబోతున్న విమానాశ్రయ టెర్మినల్కు దోహదకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, భారీ వంతెన మార్గం కూడా అడయార్ నదీ తీరం వైపుగా తిర్చిదిద్ది, అత్యవసర సమయాలలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్కు దోహద పడే విధంగా కార్యాచరణతో వెళ్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. డ్రైవర్, కండక్టర్ సస్పెన్షన్ అన్నానగర్: కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ప్రయాణికుడు ప్రభుత్వ బస్సు(1ఇ)లో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చి కొద్దిసేపటికే మూర్ఛపోయాడు. ఆ తర్వాత కండక్టర్ ఆ ప్రయాణికుడిని మధ్యలో దింపి రోడ్డు పక్కన పడుకోబెట్టాడని తెలుస్తుంది. రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు ఈ విషయంపై కండక్టర్ శరవణన్, డ్రైవర్ ఈసన్లతో విచారణ నిర్వహించారు. దీని తరువాత, రవాణా సంస్థ అధికారులు బస్సు డ్రైవర్, కండక్టర్ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నారు. -
కాన్సిటీ ఫస్ట్లుక్ పోస్టర్
తమిళసినిమా: తమిళంలో ఇప్పుడు వైవిధ్యభరిత కథాంశాలతో కూడిన చిన్న చిత్రాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. మంచి కంటెంట్తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా తాజాగా రూపొందుతున్న చిత్రం కాన్సిటీ. నటుడు అర్జున్దాస్, ప్రముఖ మలయాళ నటి అన్నాబెన్ జంటగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, వడివుక్కరసి, బాల నటుడు అఖిలన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవర్హౌస్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హరీష్ దురైరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది మద్య తరగతి కుటుంబం నేపధ్యంలో సాగే ఎమోషనల్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని, మంచి వినోదం కూడా చోటు చేసుకుంటుందని దర్శకుడు చెప్పారు. చిత్ర షూటింగ్ 80 శాతం పూర్తి అయ్యిందని, చైన్నె, బెంగుళూరు, ముంబయి ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. నగరం నేపఽథ్యంలో సాగే ఈ చిత్రం కచ్చితంగా జనరంజకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆఫీస్ బ్యాగ్తో నటుడు అర్జున్దాస్, ఆయనతో పాటు హ్యాండ్ బ్యాగ్తో నటి అన్నాబెన్, సూట్కేస్తో నటుడు యోగిబాబు, నటి వడివుక్కరసి, కప్పు పట్టుకుని వీల్చైర్లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న మాస్టర్ అఖిలన్ ఫొటోలతో కూడిన ఫస్ట్లుక్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ ఛాయగ్రహణం, శ్యాన్ లోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మెజెంతా చిత్రంలో నటుడు శాంతను భాగ్యరాజ్ కాన్సిటీ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ -
రూ. 850 కోట్లు తాగేశారు!
సాక్షి, చైన్నె : సంక్రాంతి సంబరాలలో రూ. 850 కోట్లు విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. కుటుంబ కార్డు దారులకు పండుగ ఖర్చుగా రూ. 3 వేలు ప్రభుత్వం ఇవ్వడంతో సమత్తువ పొంగల్ సంబరాలు జోరుగానే సాగాయి. అదే సమయంలో టాస్మాక్ మద్యం దుకాణాల ద్వారా మందుబాబులకు కావాల్సిన బ్రాండ్లను కొలువుదీర్చారు. 14వ తేదీ భోగి, 15న సంక్రాంతి రోజున పెద్దఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో 16వ తేదీన తిరువళ్లువర్ డే కావడంతో టాస్మాక్లకు సెలవు ఇచ్చేశారు. 17,18 తేదీలలోనూ మద్యం అమ్మకాలు బాగానే సాగాయి. కాగా ఈ నాలుగు రోజులలో రూ. 850 కోట్లకు మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. గత ఏడాది కంటే ఈసారి 140 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగినట్టు టాస్మాక్ వర్గాలు పేర్కొన్నాయి. -
ప్రజల గుండెల్లో ఎంజీఆర్ చిరస్మరణీయం
వేలూరు: Ð]l*i Ð]l¬QÅÐ]l$…{† G…i Æ>Ð]l$-^èl…-{§ýl¯ŒS {ç³gê çÜ…„óSÐ]l$… MøçÜ… Æ>f-MîSĶæ*-ÌSMýS$ Ð]l_a _Æý‡-Ýë¦Æ‡$$ MîSÇ¢° çÜ…´ë-¨…^èl$-MýS$-¯é²Æý‡° ÒIsîæ ^鯌SÞÌSÆŠ‡ ÑÔèæÓ-¯é£ýl¯ŒS A¯é²Æý‡$. ÐólË*Æý‡$ ÒIsîæ Ä¶æÊ°Ð]lÇÞsîæ BÐ]l-Æý‡-׿ÌZ Ð]l*i Ð]l¬QÅ-Ð]l$…{† G…i-BÆŠ‡ fĶæ$…† Ðólyýl$MýSË$ ÝùÐ]l$ÐéÆý‡… fÇ-W…-¨. D çÜ…§ýlÆý‡Â…V> ^鯌SÞ-ÌSÆŠ‡ Ð]l*sêÏyýl$™èl* D ÒIsîæ Ä¶æÊ°-Ð]l-ÇÞsîæ G…i-BÆŠ‡ §éÓÆ>¯ól ™èl¯]lMýS$ Ð]l_a…§ýl-¯é²Æý‡$. 1980Ð]l çÜ…Ð]l-™èlÞÆý‡…ÌZ ™é¯]l$ ´ëÆý‡ÏÐðl$…sŒæ çÜ¿¶æ$Å-°V> E…yýl-yýl…, A¯]l-MýSr$t °Äñæ*-fMýS Ð]lÆý‡Y…ÌZ GÐðl$Ã-ÌôæÅV> VðSË$-´÷…-§ýl-yé-°MìS G…i-BÆŠ‡ Ð]l*{™èlÐól$ M>Æý‡-׿-Ð]l$¯é²Æý‡$. ÒIsîæ° Ððl¬§ýl-rV> 180 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦-ÌS™ø {´ëÆý‡…-À…_ {ç³çÜ$¢™èl… ¿Z-ే´ëÌŒæ M>Å…ç³-‹Ü™ø ´ër* Ððl¬™èl¢… 73 §ólÔ>-ÌSMýS$ ^ðl…¨¯]l ѧéÅ-Æý‡$¦Ë$ ÒI-sîæÌZ ѧýlů]l$ A¿ýæÅíÜ-çÜ$¢-¯é²-Æý‡¯é²Æý‡$. ™èlÑ$-âýæ-¯é-yýl$ÌZ Ò«§ýl$-ÌSMýS$ MýS$ÌêÌS õ³Æý‡$Ï ™öÌSW…^èl-yýl…™ø ´ër*.. ´ûíÙt-M>-àÆý‡ ç³£ýl-M>°² {´ëÆý‡…-À…-_¯]l Ð]lÅMìS¢ BĶæ$¯ól A¯é²Æý‡$. ©…™ø¯ól ™é¯]l$ G¯]l²-sìæMîS G…iBÆŠ‡ AÀ-Ð]l*-°V>¯ól Ñ$WÍ ´ùĶæ*-¯]l-¯é²Æý‡$. BĶæ$¯]l {糿¶æ$-™èlÓ…ÌZ Æ>fMîS-Ķæ*Ë$ ÐólÆý‡$, çÜ…„óSÐ]l$ ç³£ýl-M>Ë$ ÐólÆý‡$V> E…yól-Ð]l¯é²Æý‡$. {ç³fÌS MøçÜ… A¯ólMýS ç³£ýl-M>-ÌS¯]l$ ¡çÜ$Mö-_a¯]l çœ$¯]l™èl BĶæ$-¯]lMóS §ýlMìSP…§ýl-¯é²Æý‡$. ѧýlÅ §éÓÆ>¯ól Æ>[Úët-À-Ð]l–¨® Ýë«§ýlÅÐ]l$° ™ðlË$çÜ$-MýS$¯]l² BĶæ$¯]l ѧýlÅMýS$ A«¨MýS {´ë§é¯]lÅ™èl C^éa-Æý‡-¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… ç³Ë$-Ð]l#Æý‡$ Æý‡^èl-Ƈ$$-™èlË$ G…i-BÆŠ‡ iÑ™èl ^èlÇ-{™èlOò³ {ç³çÜ…-W…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> G…i-BÆŠ‡ iÑ™èl ^èlÇ{™èl VýS$Ç…_ Æý‡_…-_¯]l ç³#çÜ¢-M>°² AÑ-çÙP-Ç…-^éÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ÒIsîæ E´ë-«§ýlÅ-„ýS$Ë$ Ôèæ…MýSÆŠ‡ ÑÔèæÓ-¯é-£ýl-¯Œl, ÔóæQÆŠ‡ ÑÔèæÓ-¯é-£ýl-¯Œl, iÒ òÜÌSÓ…, Ð]l*i Ð]l$…{™èl$Ë$ A{W MýS–çÙ~-Ð]lÊÇ¢, MóSïÜ ÒÆý‡-Ð]l$×ìæ, õÜÐ]lNÆý‡$ Æ>Ð]l$-^èl…-{§ýl-¯Œl, Ððl*çßæ¯Œl, ´ë…yýl$-Æý‡…-VýS-¯Œl, Æý‡^èl-Ƈ$$™èl Æ>Ð]l$-Í…-VýS…, A¯é²yîlG…MóS Ð]l*i GÐðl$Ã-ÌôæÅË$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
ప్రజల్లోకి డీఎంకే కమిటీ
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నిల ద్వారా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు డీఎంకే వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజల వద్దకు డీఎంకే కమిటీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కృష్ణగిరి జిల్లా హోసూరులో ప్రజల అభిప్రాయాలను, సూచనలను డీఎంకే కమిటీ ఆలకించింది. ఎన్నికలలోకి వెళ్లే రాజకీయ పార్టీలకు మేనిఫెస్టో అన్నది కీలకం అన్న విషయం తెలిసిందే. వారు ఇచ్చే వాగ్దానాలే ఓటర్లకు కీలకంగా చెప్పవచ్చు. తాజాగా మళ్లీ అధికారం కోసం డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా మళ్లీ అధికారం లక్ష్యంగా ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వం అన్న నినాదాన్ని సీఎం స్టాలిన్ అందుకున్నారు. దీనికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టారు. ఇందు కోసం పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి నేతృత్వంలో మంత్రులు కోవి చెలియన్, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, టీఆర్బీ రాజ, అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, మైనారిటీ నేత ఎంఎం అబ్దుల్లా, అనుబంధ విభాగాలకు చెందిన నేతలు రవీంద్రన్, ఎలిళన్ నాగనాథన్, కార్తికేయ శివ సేనాధిపతి, తమిళరసి రవికుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంతానం, వ్యాపార రంగానికి చెందిన దురై సంబంధంతో కూడిన కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ విస్తృత కార్యాచరణలో దూసుకెళున్నది. అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సామాజిక మాధ్యమాలలోని అనేక రకాల వెబ్ సైట్లను ఉపయోగించి సైతం అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాల సేకరణకు శ్రీకారం చుట్టారు. హోసూరులో జరిగిన అభిప్రాయ సేకరణలో రైతులు, వివిధ వర్గాల ప్రజలు, వివిధ రంగాలకుచెందిన వారు తమ సూచనలు, సలహాలు ఇచ్చిరు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు లఖిత పూర్వకంగా సైతం సూచనలు, మరి కొందరు స్థానిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు సైతం సిఫారసు చేయడం విశేషం. ఈ ప్రజాభిప్రాయ సేకరణ పర్యటన విస్తృతం కానుందని, మరిన్ని జిల్లాలలు, నగరాలలో కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కనిమొళి పేర్కొన్నారు. -
నేటి నుంచి సభా పర్వం
సాక్షి, చైన్నె: 2026 సంవత్సరంలో తొలి అసెంబ్లీ సమావేశం మంగళవారం ప్రారంభం కానుంది. తొలి రోజున ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి సభలో చదివి వినిపిస్తారా? అన్న చర్చ ఊపందుకుంది. ఏటా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలుప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్గా ఆర్ఎన్ రవి కొనసాగుతుండడంతో ఏటా డీఎంకే ప్రభుత్వంతో సమరం తప్పడం లేదు. ప్రభుత్వ ప్రసంగాన్ని ఆయన పక్కన పెట్టడం వంటి చర్యలకు పాల్పడటం జరుగుతోంది. గవర్నర్, ప్రభుత్వం మధ్య అసెంబ్లీ వేదికగా ఏటా వివాదాలు తప్పడం లేదు. తాజాగా కొత్త సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వేళ జరగబోతున్న తొలి సమావేశంలో గవర్నర్ ఎలా వ్యవహరించ నున్నారో అన్న చర్చ మొదలైంది. ఇందుకు కారణం సోమవారం అసెంబ్లీని సమావేశ పరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే. ఉదయం 9.30 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఇప్పటికే స్పీకర్ అప్పావు ప్రకటించారు. కేబినెట్ భేటీలో సైతం గవర్నర్ ప్రసంగానికి ఆమోద ముద్రను వేశారు. అయితే ప్రభుత్వం సిద్ధం చేయించి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని సభకు గవర్నర్ చదివి వినిపించేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఆయన సభను గౌరవిస్తారని భావిస్తున్నట్టు ఇప్పటికే స్పీకర్ అప్పావు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రసంగం తదుపరి అసెంబ్లీ వ్యవహారాలకమిటీ సమావేశమై, సభను ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయించనుంది. అసెంబ్లీ ఎన్నికల నగారా ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చిలో మోగే అవకాశాల నేపథ్యంలో ఈ సమావేశాలలోనే తాత్కాలిక బడ్జెట్ను దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో సభను నాలుగు లేదా ఐదు రోజులు నడిపించే అవకాశాలు ఉన్నాయి. -
పుదుచ్చేరి అసెంబ్లీలో గందరగోళం
కొరుక్కుపేట: మంత్రి కార్యాలయం ముందు స్వతంత్ర ఎమ్మెల్యే ఆకస్మిక ధర్నాతో పుదుచ్చేరి అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పుదుచ్చేరి నగరంలోని ఉరులాయన్ పేట నియోజక వర్గంలోని ఇళ్లకు అపరిశుభ్రమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేయడం, ఉప్పనార్లో మురుగునీరు కలవకుండా చేయడంలో వైఫల్యం వంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని నియోజక వర్గ ఎమ్మెల్యే ఎ. నెహ్రూ ప్రజా పనుల శాఖను కోరారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోవటంతో మంత్రి కార్యాలయం ద్వారం వద్ద ధర్నా చేశారు. దీంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ఈక్రమంలో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న మంత్రి తనను కలవాలని ఎమ్మెల్యే నెహ్రూను కోరారు. అలాగే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఎమ్మెల్యే నిరసన విరమించారు. డిజిటల్ మెడికల్ బస్సు సాక్షి, చైన్నె : గ్రామీణ ప్రజలకు 24 గంటల మెరుగైన వైద్య సేవలు లక్ష్యంగా డిజిటల్ మెడికల్ బస్సును సిమ్స్ ఆస్పత్రి సిద్ధం చేసింది. హలో డాక్టర్ హెల్త్ ఆన్ వీల్స్ మొబైల్ యూనిట్గా ప్రత్యేక వైద్య బృందాలతో కూడిన ఈ బస్సుకు ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ సోమవారం జెండా ఊపారు. ఈ బస్సులో కన్సల్టేషన్, డయాగ్నస్టిక్స్, రిఫరల్స్, ఫాలో అప్లతో సహా సజావుగా కాగిత రహిత ంగా ఎండ్ టు ఎండ్ పేషెంట్ కేర్కు చర్యలు తీసుకున్నారు. పూర్తిగా డిజిటల్ సౌకర్యంతో కూడిన ఈబస్సు ద్వారా ప్రత్యేక వైద్య బృందాలు గ్రామాలలోకి వెళ్లనున్నారు. అలాగే, పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలకు సైతం వెళ్లి వైద్య పరీక్షలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈసందర్భంగా మంత్రి ఎం సుబ్రమణియన్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడ్పాటుగా, ప్రజా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే విధంగా ఈ బస్సు ద్వారా పూర్తిగా కాగిత రహితంగా డిజిటల్ సౌకర్యంతో చర్యలు తీసుకోవడాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, ఎస్ఆర్ఎం గ్రూప్ చైర్మన్ డాక్టర్ రవి పచ్చ ముత్తు, విరుగంబాక్కం ఎమ్మెల్యే ఏఎంవీ రాజా, వైద్య నిపుణులు పాల్గొన్నారు. అన్నాడీఎంకేలోకి ‘కొంగు ఇలంజర్ పేరవై’ సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే కూటమిలోకి కొంగు ఇలంజర్ పేరవై చేరబోతున్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ నేత తనియరసు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో సోమవారం భేటీ అయ్యారు. ఈనెల 23న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేపట్టిన విషయం తెలిసిందే. అంతలోపు మరిన్ని పార్టీలతో చర్చలు జరిపి, అందర్నీ ఒకే వేదికపైకి తెచ్చే విధంగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకు అనుగుణంగా బీజేపీ ఎన్డీఏ కూటమి తరపున అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరాలతో చర్చలు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో ప్రేమలత విజయకాంత్ డీఎండీకేను ఆహ్వానించే కసరత్తు మొదలైనట్టు చర్చ ఊపందుకుంది. కీలక సమావేశం 2011, 2016 ఎన్నికలలో అన్నాడీఎంకేతో కలిసి కొంగు ఇలంజర్ పేరవై పనిచేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో విభేదాలతో తనియరసు బయటకు వచ్చారు. గత ఏడాది సీఎం స్టాలిన్ను కలిశారు. డీఎంకే కూటమిలో ఆ పార్టీ చేరనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, డీఎంకే తలుపులు తెరచుకోకపోవడంతో మళ్లీ పళణిస్వామిని ప్రసన్నం చేసుకోవడం గమనార్హం. సోమవారం పళణిస్వామితో తనియరసు భేటీ సాగింది. ఈనేపథ్యంలో అన్నాడీఎంకే కూటమితో ఎన్నికలలోకి వెళ్లేందుకు తనియరసు సన్నద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీఐ చెల్లింపునకు మరింత తోడ్పాటు సాక్షి, చైన్నె: యూపీఐ చెల్లింపునకు మరింత తోడ్పాటు ఇవ్వడానికి కెనరా బ్యాంక్తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఎన్బీఎస్ఎల్ ఎండీ లలిత నటరాజ్ తెలిపారు. సోమవారం కోయంబత్తూరులో ఈ విషయంగా ఆమె మాట్లాడుతూ, యూపీఐ సేవల బలోపేతం చేయడానికి ఉమ్మడి ప్రయత్నం ప్రతిబింబిస్తుందన్నారు. ఎన్పీసీఐ బీహెచ్ఐఎం సర్వీసెస్, కెనరా బ్యాంక్ మధ్య భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. యూపిఐ ఫీచర్లను వేగంగా స్వీకరించేందుకు ఈ సహకారం మరింత మద్దతుగా ఉంటుందన్నారు. -
తెరి నిర్మాతకు ధన్యవాదాలు
తమిళసినిమా: నటుడు విజయ్ చిత్రం విడుదలవుతోందంటే దాని ప్రభావం ఆయన అభిమానుల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ చాలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఆయన గతంలో నటించిన చిత్రం రీ రిలీజ్, ఇతర చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజాగా రుజువైంది. నటుడు విజయ్ హీరోగా వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను ఇంతకు ముందు నిర్మించిన చిత్రం తెరి. నటి సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. దీంతోపాటు అజిత్ హీరోగా నటించిన మంగాత్తా చిత్రం కూడా అదే తేదీన రీ రిలీజ్ కానుంది. అయితే అదే తేదీన కొత్త చిత్రాలైన ద్రౌపది–2, హాట్స్పాట్–2 చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో విజయ్ నటించిన తెరి చిత్రం రీ రిలీజ్ కానుండడంతో ఈ చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో హట్స్పాట్–2 చిత్ర ధర్శకుడు విఘ్నేశ్ కార్తీక్ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో తెరి చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిందిగా నిర్మాత కలైపులి ఎస్.థానుకు విజ్ఞప్తి చేశారు. తెరి చిత్రం విడుదల కారణంగా తమ చిత్రానికి థియేటర్ల సమస్య వస్తోందని అందులో పేర్కొన్నారు. ఇదే అభిప్రాయాన్ని ద్రౌపది–2 ,చిత్ర దర్శక, నిర్మాతలు ఎక్స్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. దీంతో చిన్న చిత్రాలను కాపాడేవిధంగా నిర్మాత కలైపులి ఎస్.థాను తెరి చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ద్రౌపది–2 చిత్ర దర్శక నిర్మాతలకు కాస్త రిలీఫ్ వచ్చినట్లు అయ్యింది. వెంటనే ఆ చిత్ర దర్శకుడు మోహన్.జీ, నిర్మాత చోళ చక్రవర్తి సోమవారం నిర్మాత కలైపులి ఎస్.థానును కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
కాంగ్రెస్ వేలూరు జిల్లా అధ్యక్షుడిగా వాహీద్బాషా
వేలూరు: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వేలూరు జిల్లా అధ్యక్షులుగా వాహీద్బాషా నియామకంపై పలువురు పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను మార్పు చేస్తూ రాష్ట్ర అధిష్టానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వేలూరు జిల్లా అద్యక్షులుగా వాహీద్బాషా పేరును ప్రకటించడంతో వేలూరు అన్నా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు మేళ తాలాల నడుమ టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా కాట్పాడి యూనియన్ అద్యక్షులు సీకేజే గణేష్ అధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తలు ఇళంగోవన్, సుకుమారన్, చార్లెస్, ఇలయనల్లూరు పంచాయితి బూత్ కమిటీ అధ్యక్షులు డేవిడ్, ఆరుముగం, చంద్రబాబు, వెంకటాపురం బాలాజీ తదితరులు అభినందించారు. కొత్త కమిటీ అద్యక్షులను నియామకం చేయడంతో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తలతో నిండి పోయింది. అదే విధంగా తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై వంటి జిల్లాలకు చెందిన అద్యక్షలను నూతనంగా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లోని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఒక పక్క సంబరాలు చేసుకోగా మరో పక్క అసమ్మతి వర్గాలకు చెందిన కార్యకర్తలు కార్యాలయం వైపు రాకపోవడం గమనార్హం. -
● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్ శంకు స్థాపన ● కలైంజ్ఞర్ సెంటర్ పనుల పరిశీలన
సాక్షి, చైన్నె: చైన్నె మహానగరానికి పుళల్, పూండి, చోళవరం, సెంబరబాక్కం, తేర్వాయి కండ్రిగ రిజర్వాయర్లు, కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోవిల్లోని వీరాణం చెరువు నీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రా నుంచి వచ్చే కృష్ణ జలాలు ఆదుకుంటున్నాయి. ఇక నిర్లవణీకరణ పథకం ద్వారా సముద్రపు నీటిని శుద్ధీకరించి సరఫరా చేస్తున్నారు. సరాసరిగా రోజుకు చైన్నె నగర అవసరాలకు 70 కోట్ల లీటర్ల మేరకు నీటిని అందిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చైన్నె తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏటా ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తూ వస్తున్నాయిది. దీనిని పరిగణించి పూండి, పుళల్ రిజర్వాయర్ల ఉబరి నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా కుశస్థలి తీరంలోని సడయకుప్పం వద్ద అతి పెద్ద రిజర్వాయర్ నిర్మాణం అవసరమని వాటర్ బోర్డు వర్గాలు గుర్తించాయి. ఈ పనులలో జాప్యంతో పాటూ ఆక్రమణల తొలగింపు తదితర కొన్ని సమస్యలు ఎదురు అవుతాయని కూడా భావించారు. దీంతో సడయకుప్పంను పక్కన పెట్టి, ముందుగా పూండి రిజర్వాయర్ ఉబరి నీటిని మాత్రం సద్వినియోగం చేసుకునే విధంగా సమీపంలోని రామంజేరిలో ఓ రిజర్వాయర్కు నివేదిక సిద్ధం చేశారు. ఇక్కడ 1.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టేద దిశగా కార్యాచరణపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఓఎంఆర్ మార్గంలో సైతం ఓ రిజర్వాయర్కు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యతగా ఈ పనులపై దృష్టి పెట్టారు. మామల్లన్ పేరుతో.. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్, తిరుక్కళి కుండ్రం సర్కిల్లలోని ఈస్ట్ కోస్టు రోడ్డు, ఓల్డ్మహాబలిపురం రోడ్డు, కోవళం రాజీవ్ గాంధీ రోడ్డు పరిసరాలను కలుపుతూ ఈ కొత్త రిజర్వాయర్ నిర్మాణం జరగనుందని వివరించారు. ఈ రిజర్వాయర్కు 69 చెరువులను ంచి విడుదలయ్యే మిగులు జలాలలను మళ్లించనున్నామన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్తున్న నీటిని ఉపయోగించుకునేందుకే ఈ రిజర్వాయర్కు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రిజర్వాయర్ కోసం తిరువిడంతై నుంచి కోకిలమేడు వరకు 5,161 ఎకరాలు స్థలం ఎంపిక చేశామన్నారు. మొత్తం 1.65 టీఎంసీల సామర్థ్యంతో మొత్తంగా 34 కిలోమీటర్ల పొడవుతో ఈ రిజర్వాయర్ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా, రోజుకు 170 మిలియన్ లీటర్ల తాగు నీటిని అందించేందుకు వీలుందన్నారు. చైన్నె శివారులలో శర వేగంగా దూసుకెళ్తున్న షోళింగనల్లూరు, మేడవాక్కం, పళ్లికరణై, సిరుచ్చేరి, కేలంబాక్కం, తిరుపోరూర్, మహాబలి పురం పరిసరాలలో నివసించే 1.3 మిలియన్ల మందిప్రజలకు తాగునీటిని అందించే వర ప్రదాయినిగా ఈ రిజర్వాయర్ అవతరిస్తుందన్నారు. కాంచీపురం రాజధానిగా ఉన్న తొండై ప్రాంతంలో మూడవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు పల్లవులు పాలించారని గుర్తు చేస్తూ, అందుకే ఈ రిజర్వాయర్కు పల్లవులలో ’మామల్లన్’ గా గౌరవించబడే మొదటి రాజు పేరును నామకరణం చేస్తున్నామని ప్రకటించారు.ఈ సందర్భంగా ’ఉత్తమ నీటి సంరక్షణ’ అవార్డును స్వచ్చంద సంస్థకు సీఎం ప్రదానం చేశారు. కలైంజ్ఞర్ అంతర్జాతీయ కేంద్రం చెంగల్పట్టు జిల్లా ముట్టుకాడులో రూ. 525 కోట్ల వ్యయంతో కలైంజ్ఞర్ ఇంటర్నేషనల్ కాన్పరెన్స్ సెంటర్ నిర్మాణ పనులు జరుగుతన్న విషయం తెలిసిందే. ఈసీఆర్ మార్గంలో 37.99 ఎకరాలలో పనులు జరుగుతున్నాయి. కలైంజ్ఞర్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్గా రూపుదిద్దుకుంటున్న ఇక్కడి పనులను సీఎం పరిశీలించారు. చైన్నెలో ఒక కొత్త ప్రపంచ స్థాయి అంతర్జాతీయ వేదిక తీర్చిదిద్దే రీతిలో నిర్మాణాలు జరగాలని అధికారులను ఆదేశించారు. పనులలో నాణ్యత పెరగాలని, త్వరితగతిన వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా పనుల వేగం పెంచాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాల కోసం.. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, గాలి, నీరు అవసరం గురించి ప్రస్తావిస్తూ, వ్యవసాయానికి తాము ఇస్తున్న ప్రాధాన్యత, జలవనరుల అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణను వివరించారు. జల వనరుల పునరుద్ధరణే కాదు, గత ఐదు సంవత్సరాలుగా మేట్టూరు జలాశయం పూర్తిగా నిండుతూ వస్తున్నట్టు తెలిపారు. 2021–25 కాలంలో రూ. 459 కోట్లతో 24 వేల 833 కి.మీ దూరం పూడిక తీత పనులు జరిగాయని రాష్ట్రవ్యాప్తంగా 121 కొత్త చెక్ డ్యామ్ల నిర్మించామని ప్రస్తావించారు. తామర భరణి – కారుమేనియారు – నంబియారు అనుసంధాన కెనాల్ ప్రాజెక్ట్ గత ఏడాది ఉపయోగంలోకి వచ్చిందన్నారు. చైన్నె మహానగరం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నదని గుర్తు చేస్తూ, ఇందులో ద్రావిడ మోడల్ ప్రభుత్వ పాత్ర గురించి పేర్కొన్నారు. పెరుగుతున్న తాగునీటి అవసరాలను పరిగణించి రూ.342 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నామని ప్రకటించారు. కోవళంలో రిజర్వాయర్ కోవళం, నెమ్మెలి, తిరుప్పోరూర్ పరిసరాలలోని చిత్తడి నెలలను అభివృద్ధి పరిచేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. అన్ని రకాల అనుమతులు దక్కడంతో జల వనరుల శాఖ నేతృత్వంలో పనులకు శ్రీకారం చుట్టే విధంగా సోమవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రులు ఏవి వేలు, అన్బరసన్, ఎంపీలు సెల్వం, కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు రాజా, కరుణానిధి బాలాజీ, వరలక్ష్మి, సీఎస్ మురుగానందం , చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ టి. స్నేహ హాజరయ్యారు. చెంగల్పట్టు జిల్లా నెమ్మెలి, కోవలం పరిసరాలను కలుపుతూ జలవనరుల శాఖ నేతృత్వంలో ఓఎంఆర్లో కొత్త తాగునీటి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్కు మామల్లన్ అని నామకరణం చేస్తూ పనులకు సీఎం స్టాలిన్ సోమవారం శంకు స్థాపన చేశారు. -
అ‘పూర్వ’ కలయిక
వేలూరు: చదివిన పాఠశాలను, తల్లిదండ్రులను ఎప్పుడూ మరవరాదని పూర్వ విద్యార్థులు తెలిపారు. వేలూరు జిల్లా లత్తేరి ప్రభుత్వ పాఠశాలలో 1986–87వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు, టీచర్ల కలయిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా 40 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులు కలుసుకోవడంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని పలకరించుకున్నారు. ఈ సందర్భంగా తాము చదివిన పాఠశాల అభివృద్దికి సహకరించడంతో పాటు గుర్తింపుగా ఏదైనా వస్తువు కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే తరహాలోనే ప్రతి సంవత్సరం కలుసుకోవాలని తీర్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అప్పటి టీచర్లను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. -
మెజెంతా చిత్ర టీజర్ విడుదల
తమిళసినిమా: బ్రాండ్ బ్లిట్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డా.లీలారామ్, రాజు.కే, శరవణన్ బీ, రేఖా ఎల్ కలిసి నిర్మిస్తున్న చిత్రం మెజెంతా. నవీన్రాజ్.కేఎస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నటుడు శాంతను భాగ్యరాజ్, అంజలి నాయర్ జంటగా నటిస్తున్నారు. అర్చన రవిచంద్రన్, ఆర్జే.ఆనంద్, బడవా గోపి, శరత్ రవి, సౌందర్య ప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి భరత్ మోహన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఇగ్లూ అనే వైవిధ్యభరిత కథా చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. చిత్ర టీజర్ను విడుదల చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు శాంతను భాగ్యరాజ్ ఇంతకు ముందు నటించిన చిత్రాల కంటే మెజెంతా చిత్రంలో వైవిధ్యభరిత కథా పాత్రను పోషిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్రంలో ఆయన గెటప్ కొత్తగా ఉంటుందన్నారు. నటి అంజలినాయర్ పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. చిత్ర టీజర్ను విడుదల చేయగా విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. దీంతో చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంటోందని అన్నారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ,చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ధరణ్కుమార్ సంగీతాన్ని, బల్లు ఛాయాగ్రహణంను అందిస్తున్నారు.నటి అంజలి నాయర్ -
రిహార్సల్స్ అదరహో..!
మెరీనా తీరం వద్ద రిపబ్లిక్ డే రిహార్సల్స్ సాక్షి, చైన్నె: మెరీనా తీరంలో రిపబ్లిక్ డే వేడుకల కసరత్తు మొదలయ్యాయి. కామరాజర్ సాలైలో సోమవారం నుంచి రిహార్సల్స్ మొదలయ్యాయి. తొలి విడతగా అదరహో అనిపించారు. త్రివిధ దళాలు, ఎన్సీసీ కేడెట్లు, పోలీసు శాఖ, వివిధ కళాశాలల విద్యార్థులు రిహార్సల్స్ రూపంలో ఉదయాన్నే తమ ప్రదర్శనలతో ముందుకు సాగారు. పోలీసులు, త్రివిధ దళాల కవాతులు అబ్బుర పరిచాయి. విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సారి వేడుకలలో పలు రాష్ట్రాల సంస్కృతులను చాటే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఈ రిహార్సల్స్ జరిగే సమయాలలో కామరాజర్ సాలై , పరిసరాలలో ఉదయాన్నే ట్రాఫిక్ మార్పులు జరిగాయి. మలి విడతగా బుధ, శుక్రవారాలలో రిహార్సల్స్కు చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలలో ప్రత్యేకంగా కర్ణాటక, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనకు చర్యలు తీసుకున్నారు. -
మరోసారి స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్..
కోలీవుడ్లో కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి కథానాయకులుగా రాణిస్తున్న నటులు విజయ్, అజిత్. వీరిద్దరి మధ్య మంచి మిత్రభావం ఉంది. అయితే వీరి అభిమానులు మధ్య మాత్రం ఎప్పటినుంచో పోటీ తత్వం నెలకొంది. ముఖ్యంగా అజిత్, విజయ్ నటించిన చిత్రాలు ఒకేరోజు విడుదలైతే ఆ సమయాల్లో వారి అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు.30 ఏళ్లుగా..రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి విజయం సాధించినా మరో హీరోపై విమర్శల దాడి జరుగుతుంటుంది. అలా గత 30 ఏళ్లకు పైగా విజయ్, అజిత్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటూ వస్తోంది. ఇకపోతే విజయ్ నటించిన చివరి మూవీ జననాయకన్ ఈ నెల 9వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ఇతర చిత్రాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. రీరిలీజ్అదేవిధంగా గతంలో విడుదలైన కొన్ని చిత్రాలు ఇప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయి. అలాంటి వాటిలో నటుడు విజయ్ నటించిన తెరి, అజిత్ నటించిన మంగాత్తా చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. గతంలో మంచి విజయాలను సాధించిన ఈ రెండు చిత్రాలు ఈ నెల 23వ తేదీన రీరిలీజ్ కావడం మరో విశేషం. దీంతో ఈ చిత్రాలు సాధించే వసూళ్లపై ఆసక్తి నెలకొంది.1996 సంక్రాంతికి మొదలుఇకపోతే విజయ్, అజిత్ గతంలో నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలను పరిశీలిస్తే 1996 సంక్రాంతి సమయంలో విజయ్ నటించిన కోయంబత్తూర్ మాప్పిళై, అజిత్ నటించిన వాన్మతి చిత్రాలు రిలీజయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ నటించిన పూవే ఉనకాగా, అజిత్ నటించిన కల్లూరి వాసన్ చిత్రాలు మూడు రోజుల గ్యాప్తో విడుదలయ్యాయి. 1997లో విజయ్ నటించిన కాలమేల్లామ్ కార్తిరుప్పేన్ , అజిత్ నటించిన నేశం చిత్రాలు, అదే ఏడాది విజయ్ నటించిన కాదలుక్కు మర్యాదై, అజిత్ నటించిన రైట్టె జెండాపై వయసు చిత్రాలు వచ్చాయి.స్టార్ హీరోల సినిమాలు రిలీజ్1999లో విజయ్ నటించిన తుల్లాద మనం తుళ్ళుమ్ ,అజిత్ నటించిన ఉన్నైతేడి చిత్రాలు, 2000వ సంవత్సరంలో అజిత్ నటించిన ఉన్నై కొడు ఎన్నై తరువేన్ విజయ్ నటించిన ఖుషి చిత్రాలు, 2001లో విజయ్ నటించిన ఫ్రెండ్స్, అజిత్ నటించిన దీనా చిత్రాలు, 2002లో విజయ్ నటించిన భగవతి, అజిత్ నటించిన విలన్ చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇప్పుడు మరోసారి..2003లో విజయ్ నటించిన తిరుమలై , అజిత్ నటించిన ఆంజనేయ చిత్రాలు, 2006లో విజయ్ నటించిన ఆది ,అజిత్ నటించిన పరమశివం.., 2007లో విజయ్ నటించిన పోకిరి , అజిత్ నటించిన ఆల్వార్ .., 2014లో విజయం నటించిన జిల్లా, అజిత్ నటించిన వీరం చిత్రాలు, 2023లో అజిత్ నటించిన తుణివు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు ఒకేసారి రిలీజయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ స్టార్ హీరోల తేరి, మంగాత్తా సినిమాలు ఒకేసారి రీ రిలీజ్ అవుతున్నాయి. -
6 గంటలకుపైగా విజయ్ను ప్రశ్నించిన సీబీఐ
సాక్షి, చెన్నై: తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్ 27న 41 మంది ప్రాణాలను బలిగొన్న కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్ను ఇరికించే కుట్ర జరుగుతోందన్న వార్త ఇప్పుడు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇసకేస్తే రాలనంత జనం వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని వెంటనే ముగించి జనాన్ని పంపేయకుండా సుదీర్ఘ ప్రసంగాలు చేశారని, అందుకే జనం అక్కడే ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్న కోణంలో నేరాభియోగాలు మోపాలని, ఆ చార్జ్షీట్లో విజయ్ పేరును చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. విజయ్తోపాటు అదనపు డీజీపీ, మరో తమిళనాడు సీనియర్ పోలీస్ అధికారి పేర్లనూ చార్జ్షీట్లో చేర్చాలని సీబీఐ భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణలో భాగంగా సోమవారం సైతం విజయ్పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏకధాటిగా ఆరు గంటలకుపైగా ఆయనను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు విజయ్ ఢిల్లీ లోథీ రోడ్లోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి సోమవారం ఉదయం 10.20 గంటలకువచ్చారు. ర్యాలీని ఏ తరహాలో చేయాలని ప్రణాళిక వేశారు?. షెడ్యూల్ సమయం కంటే చాలా ఆలస్యంగా ఎందుకు ర్యాలీకి రావాల్సి వచ్చింది? జనం విపరీతంగా వచ్చారని తెల్సి కూడా ప్రసంగాన్ని ఎందుకు కొనసాగించారు?. జనం అదుపుతప్పుకున్నారని అర్థమయ్యాక కూడా జనాన్ని కట్టడిచేసే చర్యలను మీ పార్టీ శ్రేణులు ఎందుకు తీసుకోలేదు? వంటి పలు రకాల ప్రశ్నలకు విజయ్ నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే కొన్నింటికి సమాధానం చెప్పిన విజయ్ మరికొన్నింటికి వివరణ ఇచ్చేందుకు గడువు కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విచారణ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ను నుంచి బయటకు వచ్చి తాను బసచేస్తున్న హోటల్కు వెళ్లిపోయారు. ఈ కేసులో ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ తన తొలి నేరాభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించనుంది. -
నిఘానీడలో.. విమానాశ్రయాలు
సాక్షి, చైన్నె: గణతంత్ర వేడుకల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన ఆదేశాలతో చైన్నెలోని మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు అంచెల భద్రతతో నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ప్రయాణీకుడ్ని, విమానాల్ని తనిఖీ చేసినానంతరం టేకాఫ్కు అనుమతి ఇస్తున్నారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నె తీవ్ర వాదుల హిట్లిస్ట్లో ఉన్న దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారాలతో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంగా రాష్ట్రంలో వెలుగు చూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలను ఎన్ఐఏ గుర్తిస్తూ రావడంతో కలవరం తప్పడం లేదు. ఈ పరిస్థితులలో గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా భద్రత కట్టుదిట్టం చేసే విధంగా కేంద్రనిఘా వర్గాల నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి. భద్రత కట్టుదిట్టం.. రాష్ట్రంలోని చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం అతిపెద్దది. ఇటీవలే సరికొత్త హంగులతో ఈ విమానాశ్రయం రూపు రేఖల్ని మార్చారు. జాతీయ, అంతర్జాతీయ విమానాలకు వేదికగా ఉన్న ఇక్కడ భద్రత ఎప్పుడు కట్టుదిట్టంగానే ఉంటూ వస్తున్నది. అయితే, కేంద్రం నుంచి ఏదేని హెచ్చరికలు వచ్చిన పక్షంలో మాత్రం నిఘాను మరింత పెంచుతుంటారు. ఆ దిశగా విమానాశ్రయం పరిసరాల్ని ఆదివారం నుంచి నిఘా నీడలోకి తెచ్చారు. అక్కడి నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూంల నుంచి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అలాగే, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు తనిఖీల్లో నిమగ్నం అయ్యాయి. ప్రతి విమానాన్ని, ప్రయాణీకుల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలకు ఆంక్షలు విధించారు. తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. ఇక, సందర్శకుల అనుమతికి ఈనెలాఖరు వరకు బ్రేక్ వేశారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో చైన్నెలో జరిగే గణతంత్ర వేడుకల రిహార్సల్స్కు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 21,23 తేదీలలో కామరాజర్ సాలైలలో రిహార్సల్స్ జరగనున్నాయి. ఈ దృష్ట్యా, ఆపరిసర మార్గాలలో ట్రాఫిక్ మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నారు. -
కూవంలో 46 విగ్రహాల వెలికితీత
– రెవెన్యూ, పోలీసు శాఖ విచారణ తిరువళ్లూరు: కూవం నదిలో 46 రాతి విగ్రహాలు బయట పడడం చర్చినీయాంశంగా మారింది. నదిలోకి విగ్రహాలు ఎలా వచ్చాయన్న కోణంలో రెవెన్యూ శాఖ, కడంబత్తూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ పింజివాక్కం గ్రామానికి సమీపంలో కూవం నది ప్రవహిస్తుంది. ఇక్కడ పింజివాక్కం నుంచి కడంబత్తూరు పేరంబాక్కం ప్రాంతాలకు వెళ్లడానికి నిర్మించిన బ్రిడ్జి వుంది. ఆదివారం ఉదయం పింజివాక్కం గ్రామానికి చెందిన ఏలుమలై అనే వ్యక్తి కూవం నది వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఏలుమలైకి నీటిలో రాత్రి విగ్రహాలు కనబడడంతో స్థానికులకు సమాచారాన్ని ఇచ్చాడు. సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు, గ్రామానికి చెందిన యువకులు నీటిలో వున్న వినాయకుడు, అయ్యప్ప, మురుగన్, అమ్మవారు, నాగపాము, నాగదేవత, గరుడర్ సహా 46 విగ్రహాలను గుర్తించి వాటిని నీటి నుంచి వెలికి తీశారు. విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. కొంతమంది విగ్రహాలకు పూజలు చేశారు. కడంబత్తూరు పోలీసులకు, తిరువళ్లూరు తహసీల్దార్కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, అధికారులు రాతి విగ్రహాలను స్వాధీనం చేసుకునే అంశంపై స్థానికులతో చర్చలు జరుపుతున్నారు. -
క్లుప్తంగా
హొసూర్ విమానాశ్రయ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేం– కేంద్రం స్పష్టీకరణ కొరుక్కుపేట: హొసూర్ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి గగనతల అనుమతి ఇవ్వలేమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కృష్ణగిరి జిల్లాలోని హొసూర్ నగరం పారిశ్రామిక అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ విషయంలో చేసిన ప్రకటన నుండి కొంగు ప్రాంతంలో భారీ అంచనాలు ఉన్నాయి. స్థల ఎంపిక, భారత విమానాశ్రయ క్షేత్రస్థాయి సర్వే, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సమస్య పరిష్కార ప్రాంతం, కేంద్ర పౌర విమానయానం తమిళనాడు ప్రభుత్వం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందడం సహా వివిధ దశల కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హోసూర్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు గగనతల అనుమతి ఇవ్వలేమని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. హొసూర్ చుట్టూ ఉన్న గగనతలం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నియంత్రణలో ఉందని, సైనిక , ప్రయోగాత్మక విమానాలకు అక్కడ ఎగురుతున్న నేపథ్యంలో ప్రయాణికుల విమానాలకు అనుమతి ఇవ్వలేమని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ లేఖలో పేర్కొంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం తర్వాత దశను పరిశీలిస్తున్నట్లు సమాచారం. చోరీ కేసులో నలుగురి అరెస్ట్ అన్నానగర్: రూ.60లక్షలు విలువ చేసే విగ్గులను చోరీ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నె, మనలిలోని విచూర్ గ్రామంలో ఒక ప్రైవేట్ కంపెనీ మనిషి వెంట్రుకలను ఉపయోగించి విగ్గులు, టోపాలు, సౌందర్య సాధనాలను తయారు చేసి విదేశాలకు పంపిస్తుంటుంది. ఈనెల 5వ తేదీన కంపెనీ షట్టర్ను పగులగొట్టి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉంచిన జౌరి వెంట్రుకలతో చేసిన సౌందర్య సాధనాలను దుండగులు చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు మనలి న్యూ టౌన్ పోలీసులు కంపెనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో చోరీకి పాల్పడిన చైన్నె రెడ్ హీల్స్ ఎం.జీ.ఆర్ నగర్కు చెందిన పృథ్వీరాజ్ (38), సురేందర్ (35), గుమ్మిడిపూండి శ్రీలంక శరణార్థి శిబిరానికి చెందిన ఆండ్రో సెల్వకుమార్ (40), రాజ్కుమార్ (37)లను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. రెడ్హీల్స్ ప్రాంతంలోని ఒక ఇంట్లో జౌరివెంట్రుకలతో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న యజమానికి విక్రయించేందుకు చోరీ చేసి వారు దాచిపెట్టినట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి వెళ్లి జౌరి వెంట్రుకలను, ఒక లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. బైక్లో మద్యం బాటిళ్లు –ఒకరి అరెస్ట్ తిరుత్తణి: బైకులో మద్యం బాటిళ్లు తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కనకమ్మసత్రం సమీపం చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఆర్కేపేట మద్యపాన నిషేధిత విభాగ పోలీసులు ఆదివారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైకులో తిరువళ్లూరు వైపు వెళుతున్న బైకును ఆపి అందులో తనిఖీ చేశారు. తనిఖీల్లో బైకులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గుర్తించి బైకును స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో పూండి మండలంలోని మేట్టుపాళ్యం గ్రామానికి చెందిన సతీష్(45) అనే వ్యక్తి కనకమ్మసత్రం టాస్మాక్ మద్యం దకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలించి ఇంట్లో వుంచి అదనపు ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు గుర్తించి సతీష్ను అరెస్టు చేసారు. తల్లీకూతురు ఆత్మహత్య తిరువొత్తియూరు: తిరుకలుకుండ్రం ఈచ్చంకరనై గ్రామానికి చెందిన గీత(37). గీతకు వాలాజాబాద్, అగరం ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి కుమార్తె శుభశ్రీ (8) 3వ తరగతి చదువుతోంది. దంపతుల మధ్య విభేదాల కారణంగా విడిపోయారు. గీత కుమార్తెతో కలసి ఈచ్చంకరనైలోని పుట్టింట్లో వుంటున్నారు. గీత చైన్నె నుంగంబాక్కంలో గది అద్దెకు తీసుకుని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. వారాంతంలో తండ్రి, కుమార్తెను కలవడానికి ఈచ్చంకరనై గ్రామానికి వచ్చి వెళుతుంటుంది. పొంగల్ సెలవులు రావడంతో గీత ఈచ్చంకరనై గ్రామానికి వచ్చి కుమార్తె, తండ్రితో ఉంది. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న గీత, ఆమె కుమార్తె శుభశ్రీ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం ఇంటికి సమీపంలోని బావిలో గీత, శుభశ్రీ మృతదేహాలు కనిపించాయి. స్థానికులు తిరుకలుకుండ్రం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాలను బావిలో నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ గేట్లకు తాళంతో కలకలం పళ్లిపట్టు: నొచ్చిలిలోని గంగాధరేశ్వరర్ ఆలయ ఉత్సవర్లు గ్రామ వీధుల్లో ఊరేగింపు సందర్భంగా కొందరు ఆలయ ప్రధాన ద్వారం గేట్లు మూసి తాళం వేయడంతో కలకలం రేపింది. ఓ వర్గం ఉండే ప్రాంతంలోకి మొదట తీసుకెళ్లడంతో మరో వర్గం ఈ చర్యకు పాల్పడింది. దీనిపై కొందరు తిరుత్తణి ఏఎస్పీ కార్యాలయంలో దివారం ఫిర్యాదు చేశారు. -
ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదినం
సేలం : నామక్కల్లోని తిరుచెంగోడ్ సమీపంలో ఓ బామ్మ తన 100వ పుట్టినరోజును తన ప్రజలు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన తల్లి తాగిన తల్లిపాలే తనకు 100 సంవత్సరాల ఆయుష్షును ఇచ్చాయని అమ్మమ్మ చెబుతుంది. వివరాలు.. నామక్కల్ జిల్లాలోని తిరుచెంగోడ్ సమీపంలోని ఉలగప్పంపాలయం ప్రాంతంలో నివసిస్తున్న కుడుమ అనే వృద్ధురాలు జనవరి 18, 1926న కర్ణాటకలోని తంగా వియల్లోని కోలార్ ప్రాంతంలో జన్మించింది. ఈరోజు ఆమె 100వ పుట్టినరోజు, దీనిని ఆమె కుటుంబం ఘనంగా జరుపుకుంది. తిరుచెంగోడ్లోని ఉలగప్ప పాళయం ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో కుడుమ కేక్ కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన కుమారుడు, మనవడు, మనవరాలు, మునిమనవరాలు, అనేక మంది బంధువులు ఆయనకు కేక్ తినిపించి బహుమతులు ఇచ్చి, ఆయన ఆశీస్సులు పొందారు. కాగా కుడుమ మాట్లాడుతూ తనకు ఏడు సంవత్సరాలు నా తల్లి పాలిచ్చింది. ఆ సమయంలో, ఒక ఆంగ్లేయుడు తనను పెంచుకునేందుకు బలవంతంగా తీసుకెళ్లాడని తెలిపారు. అయితే తనను కాపాడటానికి తన కుటుంబ సభ్యులు సంవత్సరం పాటూ పోరాడారని, నాన్న, తాత, మామగారు అందరూ పోలీసు అధికారులుగా పనిచేశారని పేర్కొన్నారు. నేటి కాలం మహిళలు తమ పిల్లలకు ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వాలని, అప్పుడే వారి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆమె సూచించారు. -
తై అమావాస్య రద్దీ
తిరువొత్తియూరు: తై అమావాస్యను పురస్కరించుకుని ప్రజలు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల వద్ద ఆదివారం ప్రజలు పవిత్ర స్నానాలు చేసి తమ పూర్వీకులకు తర్పణాలిచ్చారు. వివరాలు.. తై, ఆడి, పురటాసి వంటి మాసాలలో వచ్చే అమావాస్య రోజుల్లో ప్రజలు తమ పూర్వీకులకు నీళ్లలో తర్పణం ఇవ్వడం ఆచారం. దీనివల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని జనం నమ్మకం. కాగా ఈ సంవత్సరం తొలి తై అమావాస్య ఆదివారం 18వ తేదీ ఆదివారం వచ్చింది. అర్ధరాత్రి 2.31 వరకు అమావాస్య గడియలు కొనసాగాయని పండితులు తెలిపారు. రామేశ్వరంలో.. తై అమావాస్య సందర్భంగా రామేశ్వరంలో భక్తులు కిక్కిరిసిపోయారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి ఆలయం వద్ద ఈ రోజు తై అమావాస్య కావడంతో లక్షలాది మంది భక్తులు అగ్ని తీర్థం సముద్రంలో స్నానం చేసి, తమ పూర్వీకులకు తిథి తర్పణాలు ఇచ్చి, ఆవులకు , యాచకులకు అన్నదానం చేశారు. ఆలయం లోపల ఉన్న 22 పవిత్రమైన తీర్థాలలో స్నానం చేసి, ఆ తర్వాత చాలా సేపు క్యూలో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ భద్రత కోసం 900 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించారు. తిరుచెందూర్లో.. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో భక్తులు తమ పూర్వీకులకు తర్పణాలు సమర్పించారు. అమావాస్య కావడంతో తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని తెల్లవారుజామున మార్తాండ అభిషేకం నిర్వహించారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర తీరానికి చేరుకున్నారు. తమ పూర్వీకులకు పిండాలు పెట్టి, నువ్వుల నీరు వదిలి తర్పణం ఇచ్చి, సముద్రంలో పవిత్ర స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుచ్చి, తిరువరంగంలో.. తిరుచ్చి తిరువరంగం అమ్మామండపంలో పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. వారు తమ వంశం అభివద్ధి చెందాలని, పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని తర్పణం ఇచ్చి నదిలో పిండాలు కలిపి పూజలు చేశారు. దీని కోసం, తిరువరంగం అమ్మ మండపంలో 100 మందికి పైగా శివాచార్యులు, పురోహితులు తర్పణం ఇచ్చేవారందరినీ మండపపు ఒడ్డున కూర్చో బెట్టి తర్పణాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. అలాగే తిరుచ్చి పడితురై, ఓడతురై, తిల్లైనాయకం పడితురై, ముక్కొంబుతో సహా పలు ఇతర ప్రదేశాలలో కూడా తై అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం తర్పణం ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరువరంగం రంగనాథర్ కోవెల, తిరువానైక్కావల్ జంబుకేశ్వరర్ అఖిలాండేశ్వరి కోవెల, సమయపురం మారియమ్మన్ కోవెలకు వెళ్లి స్వామివార్లను దర్శించుకున్నారు. వీరరాఘవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు తిరువళ్లూరు: తై అమావాస్య పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ వైద్యవీరరాఘవుని ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. ఆదివారం తై అమావాస్య కావడంతో శనివారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని వీరరాఘవుని ఆలయం ప్రాంగణం వద్ద జాగారం చేశారు. అనంతరం ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడంతోపాటు పుష్కరిణిలో పాలు, బెల్లం చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రత్నాంగి సేవలో శ్రీదేవి భూదేవిలతో కలసి దర్శనమిచ్చిన స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. ఐదు గంటల పాటు క్యూలో వేచిన భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వేలాది మంది భక్తులు రావడంతో రద్దీగా మారింది. భక్తుల రద్దీతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలో రోటరీ సంఘం సహా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానంతో పాటు వైద్యశిబిరాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
మద్యం మత్తులో వీరంగం
–ఐదుగురి అరెస్ట్ తిరుత్తణి: మద్యం మత్తులో అర్ధరాత్రి గ్రామంలోని ఇళ్లలోకి ప్రవేశించి వీరంగం సృష్టించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువలంగాడు యూనియన్లోని తాళవేడు గ్రామ పంచాయతీలోని ఇరుళర్ కాలనీలో 30 కుటుంబీకులు నివాశముంటున్నారు. ఆ గ్రామంలో శనివారం మద్యం మత్తులో చొరబడ్డ ఆరుగురు వ్యక్తులు ఇళ్లలో ప్రవేశించి వస్తువులు ధ్వంసం చేయడంతో పాటు ప్రశ్నించిన కుటుంబీకులపై దాడి చేశారు. ఇందులో రామస్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లీసంఘటన ఇరుళ కాలనీ వాసులకు భయాందోళనకు గురిచేసింది. సంఘటనపై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి మురుక్కంపట్టుకు చెందిన శరవణన్(25), ఎగువ తిరుత్తణికి చెందిన కార్తిక్(19) సహా ముగ్గురు మైనర్లు సహా ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. కాగా మద్యం మత్తులో యువకులు గ్రామంలోని ఇళ్లలో ప్రవేశించి వీరంగం సృష్టించడంతో ఆందోళన చెందిన కుటుంబీకులను తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ఆదివారం కనేరుగా వెళ్లి పరామర్శించారు. గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి తనవంతు ఆఽర్థికసాయం అందజేసి గ్రామంలో విద్యుద్దీపాలు, తాగునీటి ఏర్పాట్లు చేస్తామని హా మీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట డీఎంకే యూనియన్ కార్యదర్శి విజయ్, అధికారులు పాల్గొన్నారు. -
వైభవం..పార్వేట ఉత్సవం
తిరువళ్లూరు: ప్రతి ఏటా కనుమ పండుగ రోజు పేరంబాక్కంలో జరిగే పార్వేట ఉత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. పేరంబాక్కంలో బస్టాండు వద్ద ఐదు గ్రామాలకు చెందిన 10 ఉత్సవమూర్తులు ఒకే ప్రాంతంలో కొలువదీరి భక్తులకు దర్శనమివ్వడంతో వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కంలో కనుమ పండుగలో భాగంగా శనివారం రాత్రి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాలకు పేరంబాక్కం నుంచి కామాక్షి సమేత సోలీశ్వరుడు, బాలమురుగన్, కళాంబాక్కం నుంచి మరగదవల్లి అమ్మవారు, తిరునాగేశ్వరర్, నర్సింగాపురం నుంచి వళ్లి సమేత మురుగన్, శివపురం నుంచి వినాయకుడు, వళ్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, మారిమంగళం నుంచి శివమారి నారాయణి ఉత్సవ మూర్తులు పేరంబాక్కం బస్టాండు వద్ద ఒకే చోట దర్శనమిచ్చారు. ఒకే ప్రాంతంలో 10 ఉత్సవమూర్తులు దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వార్లను దర్శించుకున్నారు. ఉత్సవం అనంతరం ఉత్సవమూర్తులను గ్రామాలకు ఊరేగింపుగా తిరిగి వెళ్లారు. -
కవిన్తో చేయి కలిపిన శాండీ మాస్టర్
తమిళసినిమా: నటుడు కవిన్, నటి ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న నూతన చిత్రాన్ని థింక్ స్టూడియోస్ పతాకంపై స్వరూప్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో శాండీ మాస్టర్ వచ్చి చేరారు. కవిన్, శాండీ మాస్టర్ ఇంతకుముందు బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని అలరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వీరిద్దరు కలిసి సినిమాలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి కెన్ రాయ్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో శాండీ మాస్టర్ నటిస్తున విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను యూనిట్ వర్గాలు విడుదల చేశారు. అందులో చిందరవందరగా ఉన్న ఒక ఆఫీస్ గదిలో కెమెరా స్లోగా మూవ్ అవుతూ నటి ప్రియాంక మోహన్పై జూమ్ అవుతుంది. ఆ తరువాత మోడరన్ దుస్తులు ధరించి ఉన్న నటుడు కవిన్, శాండీ మాస్టర్ కనిపించే విధంగా చిత్రీకరించిన ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటుడు కవిన్, నటి ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది అన్నది గమనార్హం. ఫాంటసి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ కథా చిత్రానికి ఓఫ్రో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
గప్.. చుప్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలే గానీ, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయ వద్దని టీఎన్సీసీ నేతలు ఏఐసీసీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. డీఎంకేతో మిత్ర బంధం కొనసాగాలే గానీ, ఎవరికి వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్న హెచ్చరికలను చేసినట్టు చర్చ ఊపందుకుంది. డీఎంకే, కాంగ్రెస్ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. అయితే, కాంగ్రెస్ నేతలు ఇటీవల కాలంగా ఎవరికి వారు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు డీఎంకేలో ఆగ్రహాన్ని రేపుతూ వస్తున్నాయి. కొందరు నేతలు అయితే, అధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని బహిరంగంగా స్పందిస్తూ రావడం, దీనికి దీటుగా డీఎంకే నేతలు ఒకరిద్దరు పరోక్షంగా స్పందించడం జరుగుతూ వస్తోంది. అదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు ప్రయత్నాలలో సైతం కాంగ్రెస్ ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారాలు డీఎంకేకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. కాంగ్రెస్ బయటకు వెళ్లినా తమకు ఢోకా లేదన్నట్టుగా ఓ మంత్రి సైతం స్పందించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథయలో టీఎన్సీసీ నేతలు,ఎన్నికల ఇన్చార్జ్ నేతృత్వంలోని కమిటీని ఢిల్లీకి ఏఐసీసీ పిలిపించింది. బహిరంగ వ్యాఖ్యలు వద్దుఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర నేతలు, ఎన్నికల వ్యవహారాల కమిటీ నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో శని, ఆదివారాలలో భేటీ అయ్యారు. తమిళనాడులో డీఎంకే బలం, ప్రధానంగా సీఎం స్టాలిన్తో ఉన్న స్నేహ బంధం గురించి రాష్ట్ర నేతలుకు జాతీయ నేతలు క్లాస్ తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకేతో సీట్ల పందేరం అన్నది సజావుగా సాగాలే గానీ, ఇష్టానుసారంగా, బహిరంగంగా వ్యాఖ్యలుచేసే వరకు వెళ్ల కూడదని నేతలకు ఏఐసీసీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు సమాచారం. డీఎంకే ఇచ్చే సీట్లను సర్దుకోవాలని, అధికారంలో వాటా అన్న నినాదం ఇక తెర మీదకు రాకూడదన్న హెచ్చరికలు చేసినట్టు సమాచారం. మరికొన్ని తీవ్ర హెచ్చరికలు చేస్తూనే, తమిళనాడులోమళ్లీ డీఎంకే అధికారంలోకి రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని, ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలను రాహుల్ ప్రత్యేకంగా చేసినట్టు సమాచారం వెలువడింది. రెండు రోజుల క్రితం నీలగిరి పర్యటనకు వచ్చిన రాహుల్తో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎ. రాజ భేటీ కావడం, ఆ తదుపరి పరిణామాలతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. -
నిజాయితీకి ఘన సన్మానం
– దొరికిన నగలను అప్పగించిన పారిశుధ్య కార్మికురాలికి ఘన సత్కారం తిరువొత్తియూరు: తమిళనాడులో వారం క్రితం రోడ్డుపై తనకు దొరికిన 45 సవర్లు నగలను పోలీసులకు అప్పగించిన మహిళా పారిశుధ్య కార్మికురాలిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. వివరాలు.. చైన్నె నగర కార్పొరేషన్ పారిశుధ్య కార్మికురాలు పద్మావతి త్యాగరాయనగర్లో రోడ్డుపై పడి ఉన్న 45 సవర్ల బంగారు నగలను పోలీసులకు అప్పగించారు. కాగా ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఆమె నిజాయితీని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ రూ. లక్ష బహుమతి అందజేసి అభినందించారు. అలాగే లలితా జ్యువెలరీ యజమాని కిరణ్కుమార్, పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని తన ఇంటికి పిలిపించి బహుమతి ఇచ్చి సత్కరించారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తులు కొందరు చైన్నె అన్నా నగర్ టవర్ క్లబ్లో జరిగిన పొంగల్ వేడుకకు పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని కుటుంబంతో సహా ప్రత్యేక అతిథిగా పిలిచి సత్కరించారు. ఆమెకు క్లబ్ తరపున రూ. 1.25 లక్షల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇబ్రహీం ఖలీలుల్లా, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బాషా, క్లబ్ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు పి. రంగనాథన్ (తమిళనాడు వేర్ హౌసింగ్ ప్రెసిడెంట్) అందజేసి గౌరవించారు. -
మోదీ సభకు ఏర్పాట్లు ముమ్మరం
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం 5 లక్షల మందిని సమీకరించేందుకు బీజేపీ వర్గాలు ఏర్పాట్లు మొదలెట్టాయి. చెంగల్పట్టు తదుపరి ఉన్న మదురాంతకంను వేదికగా జరగనున్న బహిరంగ సభ కూటమి పార్టీల పరిచయ సభగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పొత్తులు, సీట్ల ఖరారు దిశగా అన్నాడీఎంకేతో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. వివరాలు.. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. అన్బుమణి పీఎంకే సైతం ఇటీవల కూటమిలో చేరింది. మరిన్ని పార్టీలు కూటమిలోకి వస్తాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో శనివారం ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో తొలి జాబితాను సైతం పళణి స్వామి ప్రకటించారు. ఈ పరిస్థితులలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బహిరంగ సభకు బీజేపీ వర్గాలు కసరత్తు చేపట్టాయి. ఈనెల 23వ తేదీన ప్రధాని తమిళనాడు పర్యటనకు వస్తుండటంతో చెంగల్పట్టు తదుపరి మధురాంతకంలో బ్రహ్మాండ వేదికను ఎంపిక చేశారు. ఇక్కడ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు 5 లక్షల మందిని సమీకరించే విధంగా బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. ఈ వేదిక కూటమి పార్టీల పరిచయ బహిరంగ సభ కావడంతో అంతలోపు అన్నాడీఎంకే కూటమిలో పొత్తుల కసరత్తు, సీట్ల పందేరాన్ని కొలిక్కి తెచ్చే విధంగా కసరత్తులు మొదలయ్యాయి. మోదీ పొత్తులపై చర్చ పీఎంకేకు 15 లేదా 20 లోపు సీట్లను అన్నాడీఎంకే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. అలాగే తమిళ మానిల కాంగ్రెస్ పదికి పైగా సీట్లను ఆశిస్తోంది. ఇక ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టారు. ఐజీకే, పుదియనిధి, పుదియ తమిళగం వంటి చిన్న పార్టీలను కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక, సమస్య అంతా, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని శిబిరం, అమ్మమక్కల్మున్నేట్ర కళగం దినకరన్ రూపంలోనే నెలకొని ఉంది. ఈ ఇద్దర్నీ కూటమిలోకి తెచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అన్నాడీఎంకే నిరాకరిస్తుండటం విస్మయంలో పడేసి ఉంది. బీజేపీ ఎన్నికల కమిటీలోని త్రిమూర్తులుగా ఉన్న కేంద్రమంత్రులు ఆదివారం కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో ఈ వ్యవహారం గురించి ఢిల్లీ నుంచి చర్చించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. దినకరన్ను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునేందుకు మొగ్గు చూపినా, బీజేపీకి సీట్ల వ్యవహారంలో కోత విధిస్తామంటూ అన్నడీఎంకే మెళిక పెట్టిన ట్లు తెలిసింది. కాగా మోదీ సభ రోజున అన్ని పార్టీల నేతలూ ఒకే వేదికపై కనిపిస్తారా..? అనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. -
కోలాహలం ముక్కనుమ వేడుకలు
పళ్లిపట్టు: ముక్కనుమ సందర్భంగా శనివారం సాయంత్రం కల్యాణ రామర్ స్వామి పట్టణ వీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. పళ్లిపట్టు ఆంజనేయనగర్లోని కల్యాణరామర్, వీరమంగళ ఆంజనేయర్ ఆలయంలో ముక్కనుమ సందర్భంగా శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కల్యాణరాముడికి ప్రత్యేక అలంకరణ చేసి పట్టణ వీధుల్లో వాహనంలో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో స్వామికి కర్పూర హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు డీఎంకే నేత పద్మనాభం, వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి అన్నదానం చేశారు. ఉత్సవర్ల ఊరేగింపు ఉభయదారులుగా వెంకటాచలపతి, హేమాద్రి, గుణశీలన్ కుటుంబీకులు వ్యవహరించారు. చీరకు నిప్పు అంటుకుని వృద్ధురాలు మృతి అన్నానగర్: కోడంబాక్కంలోని భారతీశ్వర ఆలయంలో దీపం వెలిగిస్తున్నప్పుడు చీరకు మంటలు అంటుకుని ఓ వృద్ధురాలు మరణించారు. వివరాలు.. చైన్నెలోని కోడంబాక్కం భారతీశ్వరర్ 5వ వీధికి చెందిన శాంతి (70). ఆమె తన కుటుంబంతో కలిసి నివసించే వారు. శాంతి సాధారణంగా తన ఇంటికి సమీపంలోని భారతీశ్వరర్ శివాలయంలో దీపాలు వెలిగిస్తుంది. దాని ప్రకారం, శనివారం ఆమె తన బంధువు జయంతితో కలిసి ఆలయానికి వచ్చి దీపం వెలిగించింది. అప్పుడు ఊహించని విధంగా, శాంతి చీరకు మంటలు అంటుకుని మరణించారు. వడపళని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ గోడౌన్ సిబ్బంది నిరసన తిరుత్తణి: రేషన్ గోడౌన్ సిబ్బంది తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. తిరుత్తణిలోని రేషన్ గోడౌన్లో 40 మంది రేషన్ బస్తాలు మోసే సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత, పదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి గ్రీన్ కార్డులు ఇవ్వాలని, తమ సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కూలీ పెంచాలనే గోడౌన్ ముందు రేషన్ బస్తాలు మోసే సిబ్బంది నిరసన తెలిపారు. పెట్రోల్ బాంబు దాడి – ఐదుగురికి తీవ్రగాయాలు అన్నానగర్: పొంగల్ క్రీడా ఉత్సవంలో విసిరిన పెట్రో బాంబ్ దాడి ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యర్ సమీపం పెరుంపాలై గ్రామంలో శనివారం పొంగల్ పండుగ సందర్భంగా పిల్లలకు క్రీడా పోటీలు జరిగాయి. పోటీల్లో తెన్ తండలం తిరువళ్లువర్ వీధికి చెందిన బాలాజి (28), అక్కడే ఉన్న హరికష్ణన్, అలాడియన్లతో వాగ్వాదానికి దిగాడు. అక్కడ ఉన్న వారు బాలాజీని మందలించి పంపించేశారు. ఈవిషయాన్ని గ్రామస్తులు బాలాజీ తండ్రి కార్తికేయన్ వద్దకు వెళ్లి, బాలాజీపై ఫిర్యాదు చేశారు. ఇది చూసి ఆగ్రహించిన బాలాజీ ఫిర్యాదు చేసిన వ్యక్తులపై పెట్రో బాంబు విసిరాడు. పెట్రో బాంబ్ పేలి శరవణన్ (28), వసంత (60), ప్రవీణ్ కుమార్ (27), విజయకుమార్ (24), శరత్ కుమార్ (24) మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు మంటలను ఆర్పారు. ఘటనలో గాయపడిన వారిని సెయ్యార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చారు. పోలీసులు బాలాజీని అరెస్టు చేశారు. కొబ్బరి వ్యాపారి దారుణ హత్య తిరువొత్తియూరు: సెంజి సమీపంలో తలపై రాయి వేసి కొబ్బరి వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.. దీనికి సంబంధించి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సెంజి తిరువణ్ణామలై రోడ్డులో వళుక్కాంపారైకు చెందిన శక్తివేల్ (25) కొబ్బరి వ్యాపారి. శనివారం కనుమ పొంగల్ కావడంతో స్నేహితులతో కలసి అదే ప్రాంతంలోని కొండపై మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన స్నేహితులు శక్తివేల్ తలపై రాయి వేసి పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న శక్తివేల్ను చూసిన బంధువు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి శక్తివేల్ను సెంజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. ఆప్రాంతానికి చెందిన తిరుమలై (25)ను పోలీసులు అరెస్టు చేశారు. -
కామెడీ నేపథ్యంలో మరకత వాణయం–2
తమిళసినిమా: నటుడు ఆది కథానాయకుడిగా నటించిన ఫాంటసీ కామెడీ కథా చిత్రం మరకత నాణయం. 2017లో విడుదలైనా ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా ఆ చిత్రానికి సీక్వెల్గా ఇప్పుడు మరకత నాణయం –2 తెరకెక్కుతోంది. ఏఆర్ కే.శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్,డంగల్ టీవీ, ఆర్ డీసీ మీడియా, యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ, గుడ్ షో సంస్థల అధినేతలు సుధన్ సుందరమ్, మనీష్ సింగాల్,దుర్గా రామ్ చౌదరి, దేవ్, కేవీ.దురై కలిసి నిర్మిస్తున్నారు. నటుడు ఆది పినిశెట్టి, నటి ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, నటి నిక్కీ గల్రాణి పినిశెట్టి, మునీష్ కాంత్, ఆనంద్ రాజ్,డేనీ అరుణ్ రాజ్ కామరాజ్,మురుగానంద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దిపు నినన్ థామస్ సంగీతాన్ని, పీవీ.శంకర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం గ్లింప్సెస్ను విడుదల చేశారు. మరకత నాణయం చిత్రానికి సీక్వెల్ వస్తోందనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పుడు అద్భుతమైన విజువల్స్ తో కూడిన గ్లింప్స్ విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి అంటున్నారు. చిత్ర నిర్మాతలో ఒకరైన సుధన్ సుందరమ్ పేర్కొన్నారు. ఈయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మరకత నాణయం చిత్రానికి తాను అభిమానిని అన్నారు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మొదటి చిత్రానికి అంటే ఇందులో విజువల్స్ మరింత అద్భుతంగా ఉంటారన్నారు. ఫాంటసీ , కామెడీతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
తెలుగు, తమిళం , కన్నడం, మలయాళం, ఒడియా, బెంగాళీ, మరాఠీ భాషలలో ప్రచురించే ఉత్తమ రచనలకు తమిళనాడు ప్రభుత్వం తరపున ఇకపై జాతీయ స్థాయిలో సాహితీ పురస్కారం ప్రదానం చేయనున్నామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. సెమ్మోళి (ప్రాచీన భాష) పురస్కారంగా దీనిని అందజేస్తామన్నారు.
సాక్షి, చైన్నె: చైన్నె కలైవానర్ అరంగం వేదికగా అంతర్జాతీయ పుస్తక ఉత్సవం ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. తమిళనాడు విద్యాశాఖ, పాఠ్యపుస్తకాల విభాగం, విద్యా సేవల కార్పొరేషన్ నేతృత్వంలో 44 పుస్తకాలు, పబ్లిక్ లైబ్రరీ డిపార్ట్మెంట్ నుంచి మరో 40 పుస్తకాలు సహా మొత్తం 84 పుస్తకాలు ఈ సందర్భంగా ప్రచురించారు. వీటిని సీఎం స్టాలిన్ విడుదల చేశారు. నాలుగో సంవత్సరంగా మూడు రోజుల పాటూ జరిగిన ఈ ఉత్సవానికి దేశ విదేశాలకు చెందిన పలు పబ్లిషర్లు, రచయితలు తమ ఆవిష్కరణలను కొలువు దీర్చారు. ఈ ఏడాది ఫ్రెంచ్, టర్కీ సాహిత్యాలు సైతం ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం, రచనలకు ప్రాముఖ్యత కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో చర్చలు, సమీక్షలు వంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో మొత్తం 84 పుస్తకాలను అనువదించారు. వీటిని సీఎం స్టాలిన్ ముగింపు వేడుకలో ఆవిష్కరించారు. సాంస్కృతిక, సాహిత్య, పుస్తక ఉత్సవాలు, నిరంతర భాగస్వామ్యాన్ని ధృవీకరించే విధంగా టర్కీ, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్తో తమిళనాడు ప్రభుత్వం సీఎం స్టాలిన్ సమక్షంలో అనువాదన , అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా జరిగిన అంతర్జాతీయ పుస్తక ఉత్సవం 2026లో 102 దేశాలతో 1,830 కి పైగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. తమిళం నుండి ఇతర భాషలకు 1273 అవగాహన ఒప్పందాలు, ఇతర భాషల నుండి తమిళంకు 260 , ఇతర భాషలకు 297 అవగాహన ఒప్పందాలు జరిగాయి. ప్రపంచానికి తమిళం, ఒక్కటే కాదు, భారతీయ భాషలను తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ఈ ఒప్పందాలు జరిగాయి. సాహిత్య మార్పిడి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికతల మధ్య సంభాషణ అనే ఉన్నత స్థాయి కార్యక్రమం లక్ష్యం నెరవేర్చే దిశగా ముందడుగు వేశారు. కార్యక్రమంలో మంత్రులు శేఖర్బాబు, అన్బిల్ మహేశ్, మేయర్ ప్రియ, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ రచనలు, ఉత్తమ సాహితీ వేత్తలను అవార్డులతో సీఎం స్టాలిన్ సత్కరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు.. తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉండడమే కాకుండా, తమిళ సంస్కృతి ,సంప్రదాయాలకు నెలవుగా ఉందని వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ రచనలను తమిళంలోకి తీసుకు రావడం ద్వారా మానవత్వం , సామాజిక న్యాయం ద్రావిడ సిద్ధాంత సాహిత్యం విజయం సాధించిందని గర్వంగా చెబుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు. భాష విభజన గోడ కాదు, అది ప్రపంచ ప్రజలను కలుపుతుందన్నారు. ఇది ఒక అనుసంధాన వంతెన అని వ్యాఖ్యానిస్తూ, పుస్తకాలు కేవలం కాగితం కాదు.. అవి ఒక తరం అనేది ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే మేధో సంపత్తి అని వివరించారు. నేటి తరం ఒక పుస్తకాలు చదవడం మొదలెడితే, అందులోని ప్రతి పేజీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ఒక తెలివైన సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ప్రపంచం తమిళం కోసమే, తమిళం మన కోసమే అన్న భావన కలిగిస్తుందన్నారు. సాహితీ అకాడమీ అవార్డుల గురించి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఇందులో కూడా రాజకీయాల జోక్యం ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే, ఇక తమిళనాడు నేతృత్వంలో ఏటా సాహితీ పురస్కారాలను జాతీయ స్థాయిలో అందించడం జరుగుతుందని ప్రకటించారు.తొలి విడతగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా, బెంగాలీ ,మరాఠీ భాషలలో ప్రచురించబడిన ఉత్తమ రచనలకు సెమ్మోళి అవార్డుగా ఈ పురస్కారం అందించనున్నామన్నారు. ఈ అవార్డుతో పాటుగా రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. రచనల సాహిత్య నాణ్యత, పారదర్శక ఎంపిక వ్యవస్థను నిర్ధారించే మార్గంగా ప్రసిద్ధ రచయితలు, ప్రతి భాషకు అవార్డు గ్రహీతల ప్రత్యేక ప్యానెల్ నియమించనున్నామని ప్రకటించారు. ఇది రాబోయే ద్రావిడ మోడల్ 2. ఓ పాలనలో అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా, అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈరోడ్లో మహారాజు కళింగరాయన్ విగ్రహం, స్మారక మందిరాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సాహితీ పురస్కారంఈ వేడుకలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషలలో ప్రచురించే ఉత్తమ రచనలకు ఇకపై జాతీయ స్థాయిలో పురస్కారాన్ని తమిళనాడు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. సెమ్మోళి(ప్రాచీన భాష) పురస్కారంతో పాటూ రూ. 5 లక్షలు నగదు బహుమతిని అందజేయడం జరుగుతుందన్నారు. చైన్నెలోనే కాదు, తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లాలో పుస్తక ప్రదర్శనలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వస్తున్నట్టు వివరించారు.తాజాగా జరిగిన అంతర్జాతీయ పుస్తక ఉత్సవంలో 102 దేశాల భాగస్వామ్యం మరెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ పుస్తక ఉత్సవంలో – అనువాదాలు, కాపీరైట్ బదిలీ తదితర వాటికి చాలా ప్రాముఖ్యత ఇచ్చామని గుర్తు చేస్తూ, ద్రావి డ ఉద్యమం అన్నది తమిళనాడును నాగరికతను తెర మీదకు తెచ్చిందన్నారు. ఈ పుస్తక ఉత్సవంలో అనేక మంది మేధావులు, రచయితలు, సాహితీ వేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారని గుర్తుచేస్తూ, ‘పుస్తకాల భవిష్యత్తు, విజన్, అనువాద సంబంధిత సవాళ్లపై దృష్టి పెట్టాలన్నారు. ఇది రీల్స్యుగం అని పేర్కొంటూ, అన్ని రకాల సంభాషణలు, అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో షేర్చేయడం విస్తృతమైందన్నారు. సాహిత్యానికి సరిహద్దులు లేవు అని పేర్కొంటూ, ప్రపంచ స్థాయి శాసీ్త్రయ , సాహిత్యం గ్రామీణ విద్యార్థులకు సరళమైన తమిళ రచనల ద్వారా అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తమ తమిళ రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ తదితర భాషలలోకి అనువధించ బడ్డాయని, ఇందుకు తమ ప్రభుత్వం మరింత విస్తృతంగా నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఉత్తమ రచనలకు ఇకపై జాతీయ పురస్కారాలు -
తిరుగు ప్రయాణం రద్దీ
సాక్షి, చైన్నె: సంక్రాంతి పండుగను ముగించుకుని స్వస్థలాల నుంచి జనం చైన్నె వైపుగా తిరుగు పయనం అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లోని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఏ రోడ్డు చూసినా వాహనాలతో కిట కిటలాడటంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. వివరాలు.. చైన్నెలో ఉద్యోగ, వివిధ పనులు నిమిత్తం నివాసం ఉంటున్న వాళ్లందరూ, ఇక్కడి విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువత సంక్రాంతి పర్వదినాన్ని తమ కుటుంబాలతో జరుపుకునేందుకు స్వస్థలాలు, స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా పండుగకు సెలవులు మరీ ఎక్కువే. అధికారికంగా నాలుగు రోజులే సెలవులైనప్పటికీ, ముందు, వెనుక వచ్చిన శని, ఆదివారాలు కలిసి రావడంతో ఇంటిళ్లిపాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు స్వ స్థలాలకు వెళ్లారు. చైన్నె నుంచి సుమారు 10 లక్షలమందికి పైగా స్వస్థలాలకు వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి,. బస్సులు, సొంత వాహనాలు, రైళ్లల్లో వెళ్లిన వారే అధికం. వీరంతా పండుగను ముగించుకుని మళ్లీ చైన్నె వైపుగా తిరుగు పయనం అయ్యేపనిలో పడ్డారు. దీంతో కన్యాకుమారి – మదురై– తిరుచ్చి – విల్లుపురం – చైన్నె జాతీయ రహదారి, విల్లుపురం– కడలూరు– తంజావూరు రహదారి, దిండివనం – సేలం – కోయంబత్తూరు రహదారి అంటూ, అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. ప్రైవేటు వాహనాలతో టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. చైన్నె శివార్లలో.. ఇక అర్ధరాత్రి నుంచే చైన్నె శివారులలోని మార్గాలలో ట్రాఫిక్ రద్దీమరి ఎక్కువ అయింది. ఇక, సోమవారం విధులకు వెళ్లాల్సి ఉండడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి చైన్నె వైపుగా ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కదిలాయి. అన్ని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులుదీరాయి. దక్షిణ తమిళనాడు, కొంగు మండలంలోని జిల్లాల వైపుగా ఉన్న మార్గాలలో ఎటు చూసినా బస్సులు, సొంత వాహనాలు, ద్విచక్ర వాహనాల రద్దీ అధికంగా ఉండటం గమనార్హం. ఈ వాహనాలన్ని సోమవారం వేకువ జాము నుంచి చైన్నెలోకి ప్రవేశించాయి. చెంగల్పట్టు సమీపంలోని పరనూరు టోల్ గేట్ వద్ద వాహన రద్దీని కట్టడి చేసే విధంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను కిలాంబాక్కంకు పరిమితం చేశారు. ఇక్కడి నుంచి జనం తమ తమప్రాంతాలకు ఎలక్ట్రిక్ రైళ్లను ఆశ్రయించి వెళ్లేందుకు వీలుగా చెంగల్పట్టు, కాటన్ కొళత్తూరు, గుడువాంజేరిల నుంచి తాంబరం వైపుగా సోమవారం వేకువ జాము నుంచే అదనపు రైళ్ల సేవలకు చర్యలు తీసుకున్నారు కిలాంబాక్కం బస్టాండ్ పరిసరాలు వాహనాలో నిండాయి. కోయంబేడు,మాధవరం వైపుగా వెళ్లాల్సిన బస్సులను, సొంత వాహనాలను పెరుంగళత్తూరు బైపాస్ మీదుగా అనుమతించారు. ఈ మార్గాలో కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీ కంటైనర్, ఇతర లారీ వంటి వాహనాలను చైన్నె వైపుగా ఆదివారం అర్ధరాత్రి నుంచే అనుమతించలేదు. ఇక చైన్నె వైపుగా వచ్చే అన్ని రైళ్లు కిటకిటలాడాయి. ఈ రద్దీ ప్రభావం సోమవారం ఉదయం చైన్నె నగరం మీద పడకుండా ముందు జాగ్రత్తలతో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. -
సీఎం స్టాలిన్ హాజరు..
ఉదయం 7 గంటల సమయంలో వాడివాసల్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి మూర్తి నేతృత్వంలో క్రీడాకారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎద్దులను హింసించబోమని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జల్లికట్టును విజయవంతంచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఈ పోటీలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలలో ఒక్కో రౌండ్కు సీఎం స్టాలిన్ , మంత్రి ఉదయనిధి స్టాలిన్ ముఖ చిత్రాలతో కూడిన పలు వర్ణాలతో కూడిన డ్రెస్ కోడ్(జెర్సీ) నెంబర్లతో క్రీడాకారులు వాడి వాసల్ వైపుగా దూసుకొచ్చారు. ఈ పోటీలను వీక్షించేందుకు చైన్నె నుంచి సీఎం స్టాలిన్ ఉదయాన్నేమదురైకు చేరుకున్నారు. ప్రత్యేక గ్యాలరీ నుంచి పోటీలను వీక్షించారు. ఎద్దులను నిలువరించిన క్రీడాకారులకు బంగారు ఉంగరాలను అందజేశారు. -
పర్యాటక ప్రాంతాల్లో కనుమ సందడి
తిరువళ్లూరు: సంక్రాంతి పండుగలో చివరి రోజైన కనుమను పురస్కరించుకుని తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వున్న పర్యాటక ప్రాంతాలు రద్దీగా మారాయి. పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్, పట్టణంలోని విజ్ఞాన్ పార్కు, పళవేర్కాడు, నేమం, కన్నన్కోటై రిజర్వాయర్ల వద్ద జనం కిటకిటలాడారు. ఉదయం నుంచే ప్రజలు రావడంతో సందడి నెలకొంది. పూండీ రిజర్వాయర్ వద్ద జనం రద్దీగా మారిన క్రమంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రిజర్వాయర్లో స్నానం చేయడానికి అనుమతించలేదు. రిజర్వాయర్ వద్దకు వెళ్లే వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతించారు. కనుమ రోజు గ్రామాల్లో ఉట్టి కొట్టడం, యువతకు వేర్వేరు పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. రాత్రి రికార్డింగ్ డాన్స్లు, వీధినాటకాలు సైతం నిర్వహించారు. -
వెట్టి చాకిరి నుంచి 24 మందికి విముక్తి
తిరువళ్లూరు: ఇటుక బట్టీలో వెట్టిచాకిరి చేస్తున్న 24 మందికి అధికారులు విముక్తి కలిగించారు. అధికారులు వారిని సొంత గ్రామాలకు పంపడానికి ఏర్పాట్లును చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కల్లంబేడు గ్రామంలో ప్రయిటు ఇటుక బట్టీ వుంది. ఇక్కడ చత్తీష్గడ్ రాష్ట్రానికి చెందిన 12 మంది పురుషులు, 12 మంది సీ్త్రలు బట్టీలో పనిచేస్తున్నారు. కార్మికులకు బట్టీ యజమాని సరైన మౌలిక వసతులు కార్మికులకు కల్పించలేదని తెలిసింది. దీంతో పాటు కార్మికులకు సరైన వేతనం ఇవ్వకపోగా, సంక్రాంతికి ఇంటికి పంపడానికి సైతం నిరాకరించడంతో ఆర్డీఓకు పిర్యాదులు అందాయి. ఆర్డీఓ రవిచంద్రన్, న్యాయమూర్తి నళినీదేవి, తహసీల్దార్ బాలాజి సంఘటన స్థలానికి వెళ్లి బట్టీలో వెట్టి చాకిరి చేస్తున్న 24 మందికి విముక్తి కల్పించి వారిని సొంత గ్రామాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. -
పట్టుదలతో ఉన్నత లక్ష్యాల సాధన
తిరువళ్లూరు: యువత పట్టుదలతో చదివి ఆశయాలను నెరవేర్చుకోవాలని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జైన్ నగర్లో రూ.2 కోట్ల వ్యయంతో నాలెడ్జ్ స్టడీ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పనులు పూర్తయిన క్రమంలో స్టడీ సెంటర్ను 2024లో ఏర్పాటు చేసి సుమారు మూడువేలకు పైగా వేర్వేరు ప్రభుత్వ పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందులో ఉంచారు. ఈ నేపథ్యంలో స్టడీ సెంటర్కు నిత్యం వందలాది మంది వచ్చి పోటీ పరిక్షలకు ప్రీపేర్ అవుతున్నారు. ఇటీవల నిర్వహించిన వేర్వేరు పోటీ పరీక్షల్లో 12 మంది, పోలీసులుగా 10 మంది, సీఏ పరిక్షల్లో ముగ్గురి సహా 37 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో స్టడీ సెంటర్ను ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 37 మందితో ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శనివారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టడీ సెంటర్ను ప్రభుత్వం ప్రయోగాత్మంగా ఏర్పాటు చేసింది. ఈ స్టడీ సెంటర్ను ఉపయోగించుకుని వేర్వేరు పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు 37 మంది ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. సంబందిత స్టడీ సెంటర్లో మరో 50 వేల రూపాయల విలువ చేసే పుస్తకాలను సైతం తన సొంత నిధులతో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దామోధరన్, మున్సిపల్ చైర్పర్సన్ ఉదయమలర్, వైస్ ఛైర్మన్ రవిచంద్రన్, కౌన్సిలర్లు అరుణజైకృష్ణ, జాన్, తిరువేళాంగాడు యూనియన్ కార్యదర్శి గూలూరు రాజేంద్రన్, ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్, స్టడీ సెంటర్ ఇన్చార్జ్ జ్యోతి పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా చిరుత మృతి
సేలం: ధర్మపురి జిల్లా హొగ్నెకల్ వద్ద మగ చిరుత అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని అటవీ అధికారులు శనివారం గుర్తించారు. హొగ్నెకల్ అటవీ ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తదితర జంతువులు ఉన్నాయి. ఇక్కడి పెన్నగరం పరిధిలో ఓ చిరుత మరణించి ఉండటాన్ని స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు అధికారి శివకుమార్ నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టింది. 10 సంవత్సరాల మగ చిరుతగా గుర్తించారు. శరీరంపై ఎలాంటి గాయం అన్నది లేనప్పటికీ, అనుమానాస్పదంగా మరణించి ఉండటంతో కేసు నమోదు చేసి విచారణచేపట్టారు. పోస్టుమార్టానికి చిరుత కేళేబరాన్ని తరలించారు. -
ఘనంగా మరువూడల్ ఉత్సవం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మరువూడల్ ఉత్సవం శనివారం ఉదయం అతి వైభవంగా జరిగింది. తమిళ తైమాసం మూడవ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలోని స్వామి వారిని రాజగోపురం దారిలో రెండవ ప్రాకారం వద్దకు తీసుకొచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం స్వామి వార్లను భక్తుల దర్శనార్థం మాడ వీధులతో పాటూ గిరివలయం రోడ్డులో పుష్పాలంకరణ మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో గిరివలయం రోడ్డుకు చేరుకొని స్వామి వారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వహకులు, భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగతో పాటు సెలవు రోజులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో అరుణాచలేశ్వరాలయంలో భక్తులతో కిటకిటలాడింది. -
క్లుప్తంగా
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం అన్నానగర్: వివాహేతర సంబంధం వద్దన్నా తల్లి కొనసాగిస్తుండడంతో కన్న కొడుకు ఆమెను కడతేర్చాడు. సేలం జిల్లా ఎడపాడి సమీపం ఇరుప్పాలి ప్రాంతానికి చెందిన తవసియప్పన్ కూలీ. ఇతని భార్య కనకవల్లి (36). వీరికి కుమార్తె శ్వేత (20), కుమారుడు కార్తీ (18) ఉన్నారు. ఈ స్థితిలో కనగవల్లి అట్టాలిలోని ఒక మగ్గంలో పనికి వెళ్లేది. ఆ సమయంలో అక్కడ పనిచేసే సెంథిల్ (35)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి భర్త, కార్తీక్ ఆమెను మందలించారు. కానీ ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించి సెంథిల్తో కలిసి వెళ్లిపోయింది. తరువాత కనకవల్లిని భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. విరక్తి చెందిన కార్తీ సేలం కొండప్ప నాయక్కన్పట్టిలోని అరియంగడు ప్రాంతంలో అమ్మమ్మ రాజాత్తి ఇంట్లో ఉంటూ, ఆమె కుమారుడు మణికంఠన్ తో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. ఈక్రమంలో కనకవల్లి 14వ తేదీన పొంగల్ పండుగ కోసం రాజాత్తి ఇంటికి వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉంది. 15వ తేదీన, వివాహేతర సంబంధం విషయమై కార్తీ తల్లి కనకవల్లిని మందలించాడు. వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహించిన కార్తీ కత్తితో కనగవల్లి మెడను నరికి చంపాడు. ఆ తర్వాత తండ్రి, స్నేహితులతో కలసి మృతదేహానికి నిప్పంటించి తర్వాత ఆ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం మద్యం మత్తులో కార్తీ ఆప్రాంత వాసులకు చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్యకు సంబంధించి కార్తీ, మణికంఠన్, విజయన్, సురేష్, తవాసియప్పన్లను అరెస్టు చేశారు. రెండు బైక్లు ఢీ తిరువొత్తియూరు: రెండు బైక్లు ఢీకొని ఓ రిటైర్డ్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన తిరువైన్నెనల్లూర్లో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా, తిరువైన్నెనల్లూర్, హనుమాన్ ఆలయ వీధికి చెందిన కృష్ణమూర్తి (62). ఇతను తిరువైన్నెనల్లూర్లోని పంచాయతీ యూనియన్ కార్యాలయంలో సహాయకుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. శుక్రవారం రాత్రి బైక్ తీసుకుని బజారుకు వెళ్లాడు. మారియమ్మన్ గుడి వద్ద వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన సురేష్ కుమారుడు కార్తీక్ (20) నడుపుతున్న కొత్త బైక్, కృష్ణమూర్తి బైక్ను ఢీకొంది. ఈప్రమాదంలో కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1000 మందికి అన్నదానం కొరుక్కుపేట: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ 109వ జయంతి సందర్భంగా, అన్నాడీఎంకే యువజన విభాగం జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీల్.వి నాయకత్వంలో, దక్షిణ చైన్నె నార్త్ వెస్ట్ జిల్లాలోని 135వ సర్కిల్లోని హరేయమ్మన్ కోవిల్ స్ట్రీట్లో 1,000 మందికి చికెన్ బిర్యానీ, సంక్షేమ సహాయకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ టి. నగర్ 135వ (కె) సర్కిల్ కార్యదర్శి పి. పద్మనాభన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునిల్ వి మాట్లాడుతూ 2026 ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయం సాధిస్తుందని, మళ్లీ పళని స్వామి సీఎం పీఠం అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఇందులో పార్టీ కార్యనిర్వాహకులు కె. జయపాల్, కె. సూర్యకళ, గోర్డాన్ వి. సురేష్కుమార్. కరాటే ఎస్. శేఖర్, వి. హరిబాబు, ఎస్.ఎం.ఎస్. జాకీర్ హుస్సేన్, ఎం. లోగనాథన్, ఆర్.సి.ఎ. ప్రభాకరన్, ఎం.చందనలక్ష్మి, ఇ.మోహనకృష్ణన్ పాల్గొన్నారు . అభివృద్ధి పనుల పరిశీలన కొళత్తూరులో తిరువొత్తియూరు: కొళత్తూరులో కపాలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కొత్త భవనం, సీనియర్ సిటిజన్ల రెసిడెన్సీని మంత్రి పి.కె. శేఖర్బాబు శనివారం పరిశీలించారు. వివరాలు.. మైలాపూర్, కపాలీశ్వరర్ – ఆలయం తరపున – కొళత్తూరులో నడుస్తున్న కపాలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి రూ.25 కోట్ల అంచనాతో కొత్త భవనం నిర్మించడానికి 2024 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. దాని తర్వాత వచ్చే ఫిబ్రవరి నుండి కాలేజీ క్లాసులు కొత్త భవనంలో జరిగేలా నిర్మాణ పనులు పూర్తి వేగంతో జరుగుతున్నాయి. అదేవిధంగా కొళత్తూరు, రాజాజీ నగర్లో వృద్ధాశ్రమ భవనం నిర్మిస్తున్నారు. ఈ రెసిడెన్సీలో కుటుంబంలో చూసుకునే వీలులేని 100 మంది వృద్ధులు ఉండేలా వసతి గదులు, వంటగది, భోజనశాల, అంబులెనన్స్తో కూడిన వైద్య కేంద్రం, నడక మార్గంతో కూడిన చిన్న పార్క్, యోగా , ధ్యాన మందిరం వంటి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పి.కె. శేఖర్బాబు కొళత్తూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు, ఇంజినీర్లకు సూచించారు. -
నా జీవితం అంతా అపజయాలే..!
తమిళసినిమా: భారతీయ సినిమా గర్వపడే ఛాయాగ్రహకులలో పీసీ.శ్రీరామ్ ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తమిళుడు కావడం గర్వకారణం. దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకున్న పీసీ శ్రీరామ్ ఫిలిం ఇన్స్ట్యూట్లో ఛాయాగ్రహణం శాఖలో శిక్షణ పొందారు. ఈయన లైటింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా షాడో లైట్స్తో ప్రయోగాలు చేసిన ఛాయాగ్రహకుడు ఈయన. పీసీ. శ్రీరామ్ పెట్టే ప్రేమ్లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మణిరత్నం వంటి ప్రముఖ దర్శకుడు చిత్రాలకు ఎక్కువగా పని చేసిన ఈయన నాయకన్ చిత్రానికి గాను 1988లో ఉత్తమ ఛాయాగ్రహకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా నటుడు కమలహాసన్, అర్జున్ కలిసి నటించిన కురుదిపుణల్ చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. సాధారణంగా సినీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈయన ఆసక్తి చూపరు. ఒక వేళ పాల్గొన్నా ముక్తసరిగా మాట్లాడతారు. అలాంటిది ఇటీవల తమిళ్ సినీ పాత్రికేయుల సంఘం చైన్నెలో నిర్వహించిన పొంగల్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈయనతో పాటు ఈయన శిష్యుడు, ఛాయాగ్రాహకుడు వైడ్ యాంగిల్ రవి, వర్ధమాన నటుడు, సిరై చిత్ర కథానాయకుడు ఎల్ కే. అక్షయ్ కుమార్ అతిథులుగా హాజరయ్యారు. సంఘం అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ముఖ్యంగా తన మనోభావాలను విస్పష్టంగా వివరించారు. ‘‘నా జీవితం అంతా అపజయాల మయమే. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఈసారి అయినా పాస్ మార్కులు తెచ్చుకోరా? అని అమ్మ చెప్పేది. నేను మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉండేవాడిని. నా ఛాయాగ్రహణంలో డార్క్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయంటారు. చీకటిది ప్రత్యేక ప్రపంచం. థియేటర్లలో ప్రేక్షకులకు అది వేరే అనుభవాన్నిస్తుంది. దీంతో నేను ఏం అనుకుంటానో అదే చేస్తాను. మళ్లీ దర్శకత్వం వహించడానికి నేను రెడీ. అయితే ప్రస్తుత పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. కొందరు నా జీవిత చరిత్రను తెరకెక్కిస్తారా ?అని అడుగుతున్నారు. అలాంటి పని నేను చేయను.ఎందుకంటే జీవిత చరిత్ర అనేది పెద్ద అబద్ధం. అసత్యాన్ని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ గురించి చెప్పాలంటే బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏదీ నిరంతరం కాదు. ఇదీ గడించి పోతుంది ‘‘ అని పీసీ.శ్రీరామ్ పేర్కొన్నారు. -
క్లుప్తంగా
తుపాకీ గురిపెట్టి రౌడీ అరెస్ట్ తిరువొత్తియూరు: ప్రముఖ రౌడీని పోలీసులు తుపాకీ గురి పెట్టి అరెస్ట్ చేశారు. వివరాలు.. చైన్నె చూలైమేడుకు చెందిన వ్యక్తి కనగు అలియాస్ కనగరాజ్. అతనిపై హత్య, తుపాకీ కలిగి ఉండటం వంటి పలు కేసులు ఉన్నాయి. ఈనేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి తెన్కాసి జిల్లా కుట్రాలంలో వేడుకల్లో పాల్గొనేందుకు అతను వచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న చైన్నె పోలీసులు, అతనిని అరెస్టు చేయడానికి కుట్రాలంలో మకాం వేశారు. ఆ సమయంలో, ప్రైవేట్ హోటల్లో బస చేసిన రౌడీ కనగరాజ్ను, అతనితో పాటూ ఉన్న కార్తీక్, సాబిన్, ప్రకాష్ సహా నలుగురు సహచరులను తుపాకీ గురి పెట్టి పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పట్టుకున్న వెంటనే చైన్నెకి తరలించారు. ఈ నేపథ్యంలో, రౌడీ కనగు భార్య మేఘల, తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని చైన్నె పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం గమనార్హం. వండలూరు సమీపంలో ఆటో బోల్తా తిరువొత్తియూరు: మధురై, అరసరడి, పొన్నగరం ప్రాంతానికి చెందిన శేఖర్ (43) చైన్నె, కుండ్రత్తూరులో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. గురువారం అతను తన స్వగ్రామానికి వెళ్లేందుకు కుండ్రత్తూరు నుంచి షేర్ ఆటోలో కీలాంబాక్కం వైపు వెళ్తున్నాడు. అదే ఆటోలో సంగిలి(23), వసంతి (35), వైష్ణవి (15), హాసిన్ (9), సతీష్ కుమార్ (57), వసంత (32), అయ్యనార్ (37) సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వేంగడమంగళంకు చెందిన మదన్ రాజ్ (35) ఆటో నడుపుతున్నాడు. మణివాక్కం తర్వాతి ఔటర్ రింగ్ రోడ్డులో వస్తుండగా ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న శేఖర్ ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గమనించిన స్థానికులు ప్రైవేట్ అంబులెనన్స్ ద్వారా పొత్తేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే శేఖర్ వెళ్లే మార్గంలో మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా వారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. తాంబరం ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆటో డ్రైవర్ మదన్ రాజ్ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 100 మేకలు, 50 కోళ్లతో బిర్యానీ అన్నదానం కొరుక్కుపేట: తిరుమంగళం సమీపంలోని ఎస్.గోపాలపురం గ్రామంలో ప్రసిద్ధి చెందిన మునియాండి స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఏటా కనుమ పండుగ రోజున ప్రజలకు మాంసాహార అన్నదాన ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం, గోపాలపురం మునియాండి స్వామి ఆలయంలో ఈనెల 9 నుంచి వేడుకలను ప్రారంభించారు. ఈక్రమంలో శుక్రవారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వచ్చి మునియాండి స్వామికి అభిషేకం చేశారు. తదనంతరం, భక్తులు శుభ ప్రసాదంగా ఇచ్చిన 100 మేకలు ,150 కోళ్లను ఉపయోగించి మాంసాహార భోజనం తయారు చేసి, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు పండుగకు వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం, మొదటిసారిగా, బిర్యానీ వండి అన్నదానంగా పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి 10,000 మందికి పైగా పాల్గొని అన్నదానం స్వీకరించారు. పాప్కార్న్ దినోత్సవంసాక్షి, చైన్నె: జాతీయ పాప్ కార్న్ దినోత్సవాన్నిపురస్కరించుకుని ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పాప్ కార్న్ హ్యాపీ అవర్కు చర్యలు తీసుకున్నామని సినీ పోలిస్ ఇండియా సంస్థ ప్రకటించింది. ప్రతి 6 సెకన్లకు ఒక పాప్ కార్న్ టబ్ను విక్రయించే విధంగా సినీ థియేటర్లలో చర్యలు తీసుకున్నామని వివరించారు. గత ఏడాది 5 మిలియన్ పాప్ కార్న్ డబ్లు, 12 వేల టన్నుల పాప్కార్న్ అమ్మకాలు జరిగిందని,ఈ సారి రెట్టింపు శాతం విక్రయాలకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆ మేరకు ఈనెల 19వ తేదిన పాప్కార్న్ దినోత్సవం అని, ఇందులో భాగంగాసినీ పోలిస్ నేతృత్వంలో పాప్ కార్న్ హ్యాపీ అవర్ను ప్రత్యేకంగా అందించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ఎండీ దేవాంగ్ సంపత్ వివరించారు. తమ్మంపట్టిలో అనధికార జల్లికట్టు సేలం: సేలం తమ్మం పట్టిలో అనధికారికంగా నిర్వహించిన జల్లికట్టు పోటీలో ఎద్దుల దాడిలో ఇద్దరు మరణించారు. గతంలో ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో జల్లికట్టు నిర్వహణకు నిషేధం విధించి ఉన్నారు. అయితే గ్రామస్తులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి నాగియం పట్టి, ఉలిపురం, సెంతార పట్టి, కొండయం పల్లి, తమ్మం పట్టిలలో అనుమతి లేకుండా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. వీటిని చూసేందుకు వచ్చిన శక్తివేల్ (32) క్రీడాకారుడు ఎద్దు దాడిలో మృతి చెందారు. అలాగే, కొండయం పల్లిలో జరిగిన జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన వినిత(30) కూడా ఎద్దు పొడవడంతో మరణించారు. ఈ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. -
కారైకాల్లో కార్నివాల్ ఉత్సవం ప్రారంభం
తిరువొత్తియూరు: పుదుచ్చేరి రాష్ట్రం కారైకాల్లో పొంగల్ (సంక్రాంతి)పండుగ సందర్భంగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, కళలు , సాంస్కృతిక శాఖ సహా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్నివాల్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కార్నివాల్ ఉత్సవం శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం వరకు 3 రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. శుక్రవారం మొదటి రోజు కారైకాల్ భారతియార్ రోడ్డులోని ఏలై మారియమ్మన్ ఆలయం దగ్గర రోడ్డు పక్కన కళా ప్రదర్శన జరిగింది. ఈ కళా ప్రదర్శనలో 40కి పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక శకటాలు, కారైకాల్ జిల్లాకు చెందిన కళాకారుల బొమ్మలాటం, విల్లుపాట్టు, కరగాట్టం, తప్పాట్టం, మయిలాట్టం, పోలీసుల బ్యాండ్ వాయిద్యాలు ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పాఠశాల విద్యార్థులు భారతియార్, అవ్వయ్యార్, తిరువళ్లువర్, గిరిజనుల వేషధారణలో ఊరేగింపుగా వెళ్లారు. ఆ తర్వాత ఊరేగింపు కార్నివాల్ జరిగే క్రీడా మైదానంలో ముగిసింది. అనంతరం వీఓసీ బైపాస్ రోడ్డులోని క్రీడా మైదానంలో పూల ప్రదర్శన ప్రారంభమైంది. రెండో రోజు శనివారం రాత్రి సంగీత కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం కుక్కలు, పిల్లుల ప్రదర్శన నిర్వహించనున్నారు. రాత్రి నృత్య ప్రదర్శనలతో ఉత్సవం ముగుస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. -
అదరహో
అలంగానల్లూరు..వాడివాసల్ నుంచి దూసుకొస్తున్న ఎద్దుసాక్షి, చైన్నె: తమిళుల వీరత్వాన్ని, సాహసాన్ని చాటే క్రీడ జల్లికట్టుకు మదురై జిల్లా ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. సంక్రాంతి వేళ ఇక్కడి అవనియాపురంలో, కనుమ వేళ పాలమేడులో జల్లికట్టు ఉత్కంఠగా జరిగింది. కానం పొంగళ్ వేల ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అలంగానల్లూరులో జల్లికట్టు హోరెత్తింది. ఉదయం అలంగానల్లూరులోని మునియాండి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఎద్దులతో కలిసి వాడివాసల్ మైదానం వైపుగా గ్రామ పెద్దలు, నిర్వాహకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తరలి వచ్చారు. అప్పటికే ప్రేక్షకుల గ్యాలరీలో జల్లికట్టును వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా కొలువు దీరారు. బుసలు కొట్టిన బసవన్నలు మదురై జిల్లా అలంగానల్లూరు జల్లి కట్టు కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షలు , నిఘా నీడలో జరిగింది. తేని, దిండుగల్, మదురై, శివగంౖగై, విరుదు నగర్, తిరుచ్చి, రామనాథపురం, తూత్తుకుడి, తంజావూరు, పుదుకోట్టై జిల్లాల నుంచి పేరు మోసిన రైతులు, ప్రజా ప్రతినిధులకు చెందిన కొమ్ములు తిరిగిన 1,137 ఎద్దులు కదనరంగంలో వాడివాసల్ నుంచి బయటకు దూసుకొచ్చాయి. తొలుత మునియాండి స్వామి ఆలయ ఎద్దును వదలగా దానిని పట్టుకునేందుకు 900 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అనంతరం ఒక దాని తర్వాత మరొకటి చొప్పున వచ్చిన ఎద్దులు దూకుడుగా ముందుకు సాగాయి. తామేమీ తక్కువ తిన్నామా...? అన్నట్టు క్రీడాకారులు వాటిని పట్టుకునేందుకు దూసుకొచ్చారు. అనేక మంది విజయ కేతనం ఎగుర వేయగా, మరి కొందరు గాయాల పాలయ్యారు. కొన్ని ఎద్దులు తమ పౌరుషాన్ని చాటుకుంటూ క్రీడా కారుల చేతికి చిక్కకుండా ఉడాయించి అదర గొట్టాయి. ఇంకొన్ని క్రీడాకారులతో తలబడే విధంగా ఢీకొట్టి బహుమతుల్ని తన్నుకెళ్లాయి. ఒక ఎద్దును తలదన్నే రీతిలో మరో ఎద్దు అన్నట్టుగా బుసలు కొడుతూ బసవన్నలు పోటీలో దూసుకు రావడంతో అలంగానల్లూరు ఉత్కంఠ భరితంగా జల్లికట్టు జరిగింది. కొన్ని ఎద్దులు క్రీడా కారుల్ని బెంబెళెత్తించే రీతిలో వారి వైపుగా దూసుకెళ్లడం వంటి ఉత్కంఠ ఘట్టాల్ని విదేశీయులు సైతం ఆసక్తిగా తిలకించారు. బంగారు ఉంగరాలు, నాణేలు, వెండి వస్తువులు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు, బిందెలు, వాషింగ్ మిషన్లు, బీరువాలు, మంచాలు, ఎల్ఈడీ టీవీలు, ఏసీ, ఫ్యాన్లు, సైకిళ్లు, వంటి ఆకర్షణీయమైన బహుమతుల్ని విజేతలకు అందజేశారు. తమ పెంపుడు ఎద్దులతో వచ్చిన కొందరు యువతులు, బాలికలు విజయ కేతనం ఎగుర వేసి బహుమతులను పట్టుకెళ్లారు. ఈ పర్యాయం కూడా ఎక్కువగా క్రీడాకారులతో పాటూ బసవన్నలు బహుమతుల్ని తన్నుకెళ్లాయి. బసులు కొట్టే బసవన్నలు కొన్నింటిని క్రీడాకారులు పట్టుకోగా, మరికొన్ని వారి చేతికి చిక్కకుండా బహుమతుల్ని దక్కించుకున్నాయి. ఉదయం నుంచి నువ్వా..నేనా అన్నట్టుగా జరిగిన అలంగానల్లూరు జల్లికట్టు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. చివర్లో ఆల్రౌండర్ ప్రతిభ కనబరిచిన కార్తీక్ అనే క్రీడాకారుడికి కారును, ఎద్దు యజమాని పుదుకోట్టైకి చెందిన ఏవీఎం బాబుకి ట్రాక్టర్ను బహుమతిగా అందజేశారు. ఇక, శివగంగ జిల్లా కారైక్కుడి సమీపంలోని సిరువాయిల్ గ్రామంలో మంజువిరాట్ హోరెత్తింది. అలాగే తిరుచ్చి జిల్లామనప్పారైలోనూ జల్లి కట్టు లో ఎద్దులు బసులు కొట్టగా, క్రీడాకారులు పౌరుషాన్ని చాటారు. ఉద్యోగాల్లో ప్రాధాన్యత అలంగానల్లూరులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఇక్కడ నిర్మిస్తున్న బ్రహ్మాండ జల్లికట్టు స్టేడియం గురించి ప్రస్తావించారు. ఇందుకోసం రూ.62 కోట్లు కేటాయించామని వివరించారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, జల్లికుట్ట వీరత్వాన్ని గుర్తు చేస్తూ, రెండు ప్రకటనలు చేశారు. ఇందులో ఒకటి జల్లికట్టులో రాణించే క్రీడాకారులకు పశుసంవర్థక శాఖ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. మరొకటి అలంగానల్లూరులో జల్లికట్టు ఎద్దులకు శిక్షణతో పాటూ మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా రూ. 2 కోట్లతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు నెహ్రూ, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసను, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, రాజకన్నప్పన్, ఎంపీలు తంగ తమిళ్ సెల్వన్, ఎస్ వెంకటేష్, ఎమ్మెల్యేలు దళపతి, వెంకటేషన్ భూమినాథన్, మదురై జిల్లా కలెక్టర్ కెజే ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామనాథపురం జిల్లా పరమకుడిలో రూ. 3 కోట్లతో స్వాతంత్య్ర సమరయోధుడు ఇమాన్యుయేల్ శేఖరన్కు నిర్మించిన స్మారక మందిరాన్నిప్రారంభించి, ఆయన విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. -
ఎంజీఆర్ జయంతి వేళ.. తొలి ప్రకటన
సాక్షి, చైన్నె: విప్లవ నాయకుడు, అందరివాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ 109వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఎన్నికల మేనిఫెస్టోను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి విడుదల చేశారు. ఇందులో ఐదు వాగ్దానాలు ప్రకటించారు. ఇక ఎంజీఆర్ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు అన్నాడీఎంకే నేతృత్వంలో పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగాయి. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంజీఆర్ విగ్రహానికి ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అంజలి ఘటించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎంజీఆర్ చిత్ర పటాలను కొలువు దీర్చి మాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు సంక్షేమ పథకాల్ని అందించారు. ఇక ఎంజీఆర్ జయంతి సందర్భంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తొలి జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి శనివారం ప్రకటించారు. కుల విలక్కు(ఇంటికి దీపం) పథకం అమలుకు నిర్ణయించారు. ఆ మేరకు కుటుంబ కార్డు ఆధారంగా నెలకు రూ. 2 వేలు చొప్పున కుటుంబ పెద్ద బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. రెండవ వాగ్దానంగా సీ్త్రలకు ప్రస్తుతం ఉన్నట్టుగా , ఇక పురుషులకు సైతం నగర ర వాణా బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు. మూడో వాగ్దానంగా అందరికి సొంతింటి కల సాకారం దిశగా అమ్మ గృహం పథకం, నాలుగో వాగ్దానంగా 100 రోజలుగా ఉన్న గ్రామీణ ఉపాధి పథకాన్ని 150 రోజులకు పెంచడానికి నిర్ణయించారు. ఐదో వాగ్దానంగా అమ్మ ద్విచక్ర వాహనం పథకం అమలు. ఈ మేరకు రూ.25 వేలు వాహనదారులకు రాయితీ కల్పించే విధంగా 5 లక్షల మంది మహిళలకు స్కూటీలు అందించనున్నారు. ఈ మేనిఫెస్టో కేవలం ట్రైలర్ అని, మున్ముందు మరిన్ని పథకాలతో ఆకర్షణనీయ మేనిఫెస్టో విడుదల అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంజీఆర్కు నివాళి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున గిండిలోని తమిళనాడు డాక్టర్ఎంజీఆర్ వైద్య వర్సిటీ ఆవరణలో అధికారిక కార్యక్రమంగా వేడుకలు జరిగాయి. ఇక్కడి ఎంజీఆర్ విగ్రహానికి నిలువెత్తు పూల మాలను మంత్రి నాజర్, మేయర్ప్రియతో పాటూ అధికారులు అంజలి ఘటించారు. అలాగే, చైన్నెలో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎంజీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అమ్మ మక్కల్మున్నేట్ర కళగం నేతృత్వంలోనూ జయంతి వేడుకలు జరిగాయి. ఆ కళగం నేత టీటీవీ దినకరన్ ఎంజీఆర్కు నివాళులర్పించారు. అలాగే దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ నేతృత్వంలో టీ నగర్లో కార్యక్రమం జరిగింది. ఎంజీఆర్ చిత్ర పటానికి ఆమె నివాళులర్పించారు. డీఎండీకే కార్యాలయంలో ఎంజీఆర్చిత్ర పటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అంజలి ఘటించారు. టీవీకే నేత విజయ్ సైతం ఎంజీఆర్కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. పీఎం మోదీ సైతం ఎంజీఆర్ సేవలను గుర్తు చేస్తూ ఎక్స్ పేజిలో నివాళులర్పించారు.అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో.. చైన్నె రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. పార్టీ జెండాను ఎగుర వేసినానంతరం ఎంజీఆర్ విగ్రహానికి పళని స్వామితో పాటూ ఇతర నేతలు నివాళులర్పించారు. అలాగే, పక్కనే ఉన్న దివంగత అమ్మ జయలలిత విగ్రహానికి సైతం పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అలాగే, అన్నదాన కార్యక్రమం జరిగింది. పురట్చి తలైవర్ ఎంజీఆర్ జయంతి సావనీర్ను ఈసందర్భంగా ఆవిష్కరించారు. అతి పెద్ద కేక్ను పళణి స్వామి కట్ చేసి అందరికీ స్వయంగా పంచి పెట్టారు. పేదరికంతో కష్టాలుపడుతున్న పార్టీ కేడర్కు సహాయకాలను అందజేశారు. పార్టీ నాయకులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, దిండుగల్ శ్రీనివాసన్, కేపి మునుస్వామి, తంగమణి, నత్తంవిశ్వనాథన్, తదితరులు, మహిళా నేతలు వలర్మతి, గోకుల ఇందిర తదితరులు పాల్గొన్నారు. మెరీనా తీరంలోని ఎంజీఆర్ సమాధి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు.ఇక్కడకు పెద్ద సంఖ్యలో కేడర్ తరలి వచ్చి అంజలి ఘటించారు. -
కానుంపొంగల్.. కోలాహలం
సాక్షి, చైన్నె: రాష్ట్రవ్యాప్తంగా కానుం పొంగల్ పర్వదిన కోలాహలం శనివారం మిన్నంటింది. తమ తమ ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలకు ప్రజలు తరలివెళ్లారు. కుటుంబం, బంధు మిత్రులతో కలసి ఆనందంతో ఈ పర్వదినాన్ని గడిపారు. జన సందోహం పెద్దఎత్తున తరలి రావడంతో ఇసుక వేసే రాలనంతగా పర్యాటక, వినోద కేంద్రాలు కిట కిటలాడాయి. వివరాలు.. అందరి నోట పెద్ద పండుగ పిలవబడే సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరికీ ఆనందమే. భోగి మంటలు, సంక్రాంతి పొంగళ్లు, కనుమ సందడితో పాటూ కానుం పొంగల్ పర్వదినం మహాదానందమే. మూడు రోజుల పాటూ పూజాది కార్యక్రమాలతో పండగను జరుపుకున్న జనం కానుం పొంగల్ పర్వదినాన్ని విహర యాత్రతో గడపడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటిళ్లి పాది, కుటుంబీకులు, ఆప్తులు, బంధు మిత్రులు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ వస్తున్నారు. ఆ మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా నగరాలు, ప్రాంతాల్లోని ప్రజలు కుటుంబాల సమేతంగా ఈ ఒక్క రోజును మహాదానందంతో గడిపారు. రాష్ట్రంలోని ఏ పర్యాటక ప్రాంతాన్ని చూసినా, వినోద కేంద్రాల్ని చూసినా జనంతో కిక్కిరిశాయి. సినిమాలకు వెళ్లే వాళ్లు కొందరు అయితే, వినోద కేంద్రాలకు, పర్యాటక కేంద్రాలకు వెళ్లే వాళ్లు మరెందరో. రోజంతా కుటుంబంతో కలిసి ఆటా, పాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. చైన్నెలో జనహోరు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నె లోని రోడ్లు గత రెండు రోజులుగా నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే, శనివారం ఉదయం నుంచే రోడ్లపై రద్దీ పెరిగింది. నగర శివారుల నుంచి ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు పెద్దఎత్తున జనం ఉదయాన్నే తరలివచ్చారు. వీరికోసం చైన్నె నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్ని సైతం ఆయా మార్గాల గుండా నడిచాయి. జనం అత్యధికంగా తరలి రావడంతో మెరీనా, బీసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివారులోని నీలంకరై, కోవలం, మహాబలిపురం బీచ్లలోనూ జనం రద్దీ పెరిగింది. సముద్రంలోకి ఎవర్నీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షించారు. బారికేడ్ల వద్ద నుంచే సముద్రంలో అలల తాకిడిని, ఆహ్లాద కరవాతావరణాన్ని జనం తిలకించాల్సి వచ్చింది. సముద్ర తీర భద్రతా విభాగం వర్గాలు, కోస్ట్ గార్డు వర్గాలు బోట్లు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ భద్రతను పర్యవేక్షించడం, చూపురులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందర్శకుల భద్రత నిమిత్తం పోలీసులు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంది. పిల్లలు తప్పిపోకుండా వారి చేతులకు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో కూడిన ప్రత్యేక బ్యాడ్జీలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక హెల్ప్లైన్లను ఏర్పాటు చేయడంతో పాటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, ఎత్తయిన ప్రదేశం నుంచి భద్రతను పర్యవేక్షించారు. ఇక జేబు దొంగలు, చైన్ స్నాచర్ల భరతం పట్టేం విధంగా ప్రత్యేక బృందాలు మఫ్టిలో డేగ కళ్లతో ప్రజలకు భద్రతను కల్పించాయి. నగరంలోని అన్ని పార్కులు, వినోద కేంద్రాలు జనంతో కిట కిటలాడాయి. ఇక,పండుగ సందడి ముగిసింది. సెలవులు సమాప్తమయ్యాయి. ఆదివారం నుంచి జనం స్వస్థలాల నుంచి చైన్నెతో పాటూ తాము పనిచేస్తున్న వివిధ నగరాలకు తిరుగు పయనం కానున్నారు. వీరి కోసం ఆయా మార్గాలలో ప్రత్యేక బస్సులను నడిపేందుకు రవాణా సంస్థ చర్యలు తీసుకుంది. చైన్నె వైపుగా 3,570 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, టాస్మాక్ మద్యం దుకాణాల ద్వారా సుమారు 1,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఇద్దరు ముద్దుగుమ్మలతో..!
తమిళసినిమా: ఒకే సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించటం కొత్తమే కాదు. కథ డిమాండ్ చేస్తే ముగ్గురి కంటే ఎక్కువ మంది కూడా నటిస్తారు. అలా యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నారీ నారీ నడుమ మురారిగా మారబోతున్నట్లు తాజా సమాచారం. ముందు దర్శకుడిగా అవతారం ఎత్తి రవి మోహన్ హీరోగా కోమాలి చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన ప్రదీప్ రంగనాథన్ ఆ వెంటనే లవ్ టుడే చిత్రంతో హీరోగా అవతారం ఎత్తి స్వీయ దర్శకత్వం వహించి మరో హిట్ కొట్టారు. ఆ తరువాత ఈయన నటించిన డ్రాగన్ చిత్రం సంచలన విజయం సాధించింది. అందులో ఆయనతో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. కాగా తాజాగా డ్యూడ్ అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టొరీలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్తో జత కట్టిన హీరోయిన్లు క్రేజీ ఆఫర్స్ అందుకోవడం విశేషం. కాగా ఈ యువ నటుడు, దర్శకుడు తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని ఇంతకు ముందు లవ్ టుడే, డ్రాగన్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు తెలిసింది. అందులో ఒకరు ఇటివల పరాశక్తి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీల అనీ, మరోకరు లక్కీ భాస్కర్ చిత్రం ఫేమ్ మీనాక్షి చౌదరి అని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే హీరోయిన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్ మాత్రం త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఇకపొతే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం ఫిబ్రవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. నటీ మీనాక్షి చౌదరి -
వైభవంగా వీరరాఘవుని గరుడసేవ
● గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు తిరువళ్లూరు: వైద్య వీరరాఘవుడి ఆలయంలో జరుగుతున్న తైమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం గరుడసేవ అంగరంగ వైభవంగా జరిగింది. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయం వుంది. ఇక్కడ ఏటా తైమాసంలో బ్రహ్మోత్సవాలను పది రోజుల పాటూ నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో శనివారం ఉదయం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు అందుకుని మాడవీధుల్లో ఊరేగారు. గరుడసేవ ముగిసిన తరువాత మూడుగంటలకు స్వామి వారికి తిరుమంజనం నిర్వహించి రాత్రి 8 గంటలకు హనుమంత వాహన సేవను నిర్వహించారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కాగా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాధాలను అందజేశారు. ఢిల్లీకి టీఎన్సీసీ నేతలు సాక్షి, చైన్నె : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, లోక్సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ నిమిత్తం టీఎన్సీసీ నేతలు ఢిల్లీకి శనివారం బయలుదేరి వెళ్లారు. డీఎంకేతో పొత్తు, సీట్ల పందేరం విషయంగా చర్చించేందుకు ఈ భేటీ ఢిల్లీలో జరుగనుంది. టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్కుమార్తో పాటూ ముఖ్య నేతలు, ఎన్నికల వ్యవహారాల కమిటీ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లారు. మల్లికార్జున కార్గే, రాహుల్ గాంధీ ఇచ్చే సూచనలు, సలహాల మేరకు తదుపరి డీఎంకేతో సీట్ల పందేరం గురించి చర్చించనున్నారు. మట్టి చరియలు విరిగిపడి.. సాక్షి, చైన్నె: బావి తవ్వకాల సమయంలో మట్టి చరియలు విరిగి పడటంతో ముగ్గురు కార్మికులు మరణించారు.నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని జగదార్ ప్రాంతంలో ఓ ప్రైవేటు స్థలంలో బావి తవ్వకాల పనులు జరుగుతున్నాయి. శనివారం సుమారు 10 మందికి పైగా కార్మికులు ఇక్కడి తవ్వకాల పనులలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం సమయంలో హఠాత్తుగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులలో ఆందోళన నెలకొంది. కొందరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మరి కొందరు అతి కష్టంమీద బయటపట్టారు.అయితే, పదిలోపు అడుగుల లోతులో ఉన్న ముగ్గురిపై మట్టి చరియలుపడ్డాయి. వీరిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి వారి మృత దేహాలను బయటకు తీశాయి. మృతులు రెహ్మాన్(25), నజీర్(39), ఉస్మాన్(40)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన కున్నూరు పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. 3 అమృత్ భారత్ రైళ్లు సాక్షి, చైన్నె : తమిళనాడులోని పలు నగరాల నుంచి ఉత్తరాదిలోని అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అమృత్ భారత్ రైలు సేవలకు శ్రీకారం చుట్టారు. అసోంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కొత్త రైలు సేవలకు జెండా ఊపారు. ఈ మేరకు చైన్నె తాంబరం నుంచి చంద్రకాశి, తిరుచ్చి – జల్పై గురి, నాగర్కోయిల్ – జల్పైగురి మధ్య ఈ అమృత్భారత్ రైలు సేవలకు చర్యలు తీసుకున్నారు. కమనీయం.. సుబ్రహ్మణ్య స్వామి విహారం పళ్ళిపట్టు: ముక్కనుమ సందర్భంగా, తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పట్టణ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. సంక్రాంతి వేడుకల్లో చివరి రోజైన ముక్కనుమ సందర్భంగా ఏటా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవర్లు పట్టణ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం పరిపాటి. ఆ ప్రకారం ముక్కనుమ సందర్భంగా శనివారం ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత ఉత్సవర్లు శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి పల్లకి మోసే కార్మికుల ఆధ్వర్యంలో స్వామికి ఎండుద్రాక్ష, ముంతమామిడి పప్పు, కర్జూర పండ్లు, ఏలకలు సహా నవ మూలికలతో విశేష అలంకరణ చేపట్టి మెట్ల మార్గంలో స్వామి కొండ దిగివచ్చారు. సన్నిధి వీధిల్లో వాహన సేవలో కొలువు దీరిన స్వామిని పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్త జనం కర్పూర హారతులిచ్చి స్వామి దర్శనం చేసారు. రాత్రి షణ్ముగ తీర్ధగుంట వద్ద అభిషేక పూజతో అలంకరించి దర్శించుకున్నారు. రాత్రి స్వామి కొండ ఆలయానికి చేరుకున్నారు. -
ఎంజీఆర్కు ఘన నివాళి
వేలూరు: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి వేడుకలను వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. వేలూరులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ఆర్కే అప్పు అధ్యక్షతన వేలూరు, కాట్పాడి, సత్వచ్చారి ప్రాంతాల్లోని ఎంజీఆర్ విగ్రహాలు, చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళి అర్పించడంతో పాటు అన్నదానం చేశారు. నిరుపేదలకు పంచె, చీరలను పంచి పెట్టారు. అనంతరం అన్నదానం చేశారు. అదేవిధంగా వేలూరు బీడీఓ కార్యాలయం ఎదుట అన్నాడీఎంకే ఐటీ విభాగం రీజనల్ కార్యదర్శి జననీ సతీష్కుమార్ అధ్యక్షతన కోశాధికారి మూర్తి, కార్యకర్తలు చిత్ర పటానికి పూలమాల వేసి స్వీట్లు పంచి పెట్టారు. అదే విధంగా వేలపాడిలో ఎంజీఆర్ చిత్ర పటాన్ని ఉంచి అన్నాడీఎంకే కార్పొరేషన్ ప్రతినిధి కుప్పుస్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వీట్లు పంచి పెట్టి నిరుపేదలుకు పంచె, చీరలను అందజేశారు. పాత కార్పోరేషన్ కార్యాలయంలో ఉన్న ఎంజీఆర్ విగ్రహానికి అన్నాడీఎంకే నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించి స్వీట్లు పంచి పెట్టారు. 35 ప్రధాన రైళ్లకు అదనపు స్టాప్లు కొరుక్కుపేట: అదనపు స్టాప్ల కోసం ఎంతో కాలంగా ప్రయాణికులు చేసిన అభ్యర్థనలు ఎట్టకేలకు నెరవేరాయి. 35 ప్రదాన రైళ్లకు అదనపు స్టాపులు భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైన్నె–విజయవాడ పినాకీని ఎక్స్ప్రెస్, విజయవాడ జన్ చత్రపతి శివాజీ ఎక్స్ప్రెస్, పాపి కొండలకు మెట్రోరైలు కనెక్టివిటీ కల్పించడం వలన సెంట్రల్ రైల్వేస్టేషన్న్లో రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా, చైన్నె– కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, చైన్నె –బెంగళూరు ఎక్స్ప్రెస్ తిరువళ్లూరు స్టేషన్న్లో ఆగుతాయి. చైన్నె, జోలార్పేటకు స్టాప్ ఇచ్చారు కానీ, ఎక్స్ప్రెస్ ఇప్పుడు అదే సమయంలో అంబత్తూరులో ఆగుతుంది. చైన్నె ఎగ్మూర్ చత్రపతి శివాజీ మహరాజ్ టోమీవర్ ఎక్స్ప్రెస్ రైలుకు అరక్కోణంలో స్టాప్ ఇచ్చారు. దీనికి రైల్వే బోర్డు ప్రకటన జారీ చేసిందని, ఈ కొత్త స్టాప్ల అమలు తేదీని త్వరలో ప్రకటిస్తామని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మహిళపై యువకుడి దాడి తిరువొత్తియూరు: ఇంట్లోకి చొరబడి ఓ యువకుడు మహిలపై దాడి చేశాడు. చైన్నె, కోడంబాక్కం, శివాలయం వీధికి చెందిన షర్మిల (24) భర్త కార్తీక్తో ఉంటోంది. కార్తీక్ కు, అతని చిన్ననాటి స్నేహితుడు అరుణ్ల మధ్య కొద్ది రోజుల క్రితం మనస్పర్థలు వచ్చాయి. ఈక్రమంలో షర్మిలా గత 13వ తేదీ మధ్యాహ్నం చూలైమేడు, శ్రీరామపురం మెయిన్ రోడ్లోని పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో భర్త స్నేహితుడు అరుణ్ షర్మిలా తల్లి ఇంట్లోకి చొరబడ్డాడు. షర్మిలను, ఆమె తల్లిని అసభ్య పదజాలంతో దూషించి, దాడి చేసి, చంపేస్తానని బెదిరించాడు. దీనిపై షర్మిలా చూలైమేడు పోలీస్ స్టేషన్న్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అరుణ్ను అరెస్టు చేశారు. విచారణలో, కార్తీక్ అరుణ్ ప్రియురాలి వద్ద అతని గురించి తప్పుగా చెప్పినట్లు తెలిసింది. అందువల్ల, ఆమె అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, దీనికి కారణమైన కార్తీక్పై పగ తీర్చుకోవడానికి అరుణ్ ఈ సంఘటనకు పాల్పడినట్లు వెల్లడైంది.


