క్లుప్తంగా
తిరువొత్తియూరు: చైన్నె నుంగంబాక్కంలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరిగిన ఘర్షణలో ప్రత్యేక దళాల పోలీసుపై దాడి చేసిన కేసులో బీజేపీ, డీఎంకేకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు..చైన్నె నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో సలీం ప్రత్యేక దళాల పోలీసుగా పనిచేస్తున్నాడు. గత వారం అతను రోడ్డుపై వెళ్తునప్పుడు ఐదుగురు వ్యక్తుల ముఠా గొడవ చేసి అతనిపై దాడి చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసు సలీం నుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో కుండ్రత్తూర్ ప్రాంతానికి చెందిన జగన్నాథన్, అనగాపుత్తూర్ ప్రాంతానికి చెందిన మహాదేవన్, శరవణన్, పుస్తక దుకాణం యజమాని ధనశేఖరన్, రవి దాడి చేసినట్లు తేలడంతో వారిని అరెస్టు చేసి ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.
కొరుక్కుపేట: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ వాసవీ క్లబ్ చెన్నపట్నా, వనిత చైన్నెపట్న సంయుక్త ఆధ్వర్యంలో రుద్రాభిషేకం పూజలను వైభవంగా నిర్వహించారు. చైన్నె మాధవంలో ఆదివారం నిర్వహించిన రుద్రాభిషేకంలో ఆయా క్లబ్ల సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శివలింగానికి పాలు, పెరుగు పంచామృతం, గంధం, పన్నీరుతో అభిషేకాన్ని మాధవరం కర్పగాంభీక సమేత కై లాసనాథర్ ఆలయ అర్చకులు బృందం శాస్త్రోక్తంగా చేపట్టారు. ఇందులో క్లబ్ అధ్యక్షులు జీఆర్ అశోక్ కుమార్, ఏ.జనని, కార్యదర్శులు జీవీ రాధాకృష్ణన్, గీతాలక్ష్మీ , ట్రెజరర్లు డాక్టర్ ఎం.చంద్ర గుప్తా, తనూజ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఖరారు చేసిన మధురై ధర్మాసనం
అన్నానగర్: బిడ్డకు విషం ఇచ్చి చంపిన తల్లిదండ్రులకు యావజ్జీవ శిక్ష విధించాలన్న దిగువ కోర్టు నిర్ణయం సరైనదేనని హైకోర్టు మధురై శాఖ తీర్పునిచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపం మల్లి ప్రాంతానికి చెందిన మునీశ్వరన్. ఇతని భార్య రేవతి. ఈమె కళాశాల ప్రొఫెసర్. వీరికి సాధన అనే కుమార్తె ఉంది. ఆ బిడ్డ పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. బిడ్డను చూసుకోవడానికి రేవతి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే, బిడ్డను నిరంతరం చూసుకోవడం, మానసిక ఒత్తిడి కారణంగా, 2018లో వారు శీతల పానీయంలో విషం కలిపి తమ బిడ్డకు ఇచ్చారు. మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఆ బిడ్డ 6.10.2018 న మరణించింది. దీనికి సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, మల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవిల్లిపుత్తూరు మహిళా కోర్టు కేసును విచారించింది. కాగా బిడ్డ విష ప్రయోగం ద్వారా మరణించినట్లు తేలడంతో ఆ బిడ్డ తల్లిదండ్రులకీ జీవిత ఖైదు విధించారు. దీనికి వ్యతిరేకంగా దంపతులు హైకోర్టు మధురై శాఖకు అప్పీల్ చేసుకున్నారు. అయితే ఈ కేసును న్యాయమూర్తులు జి.కె. ఇళంధిరైన్, ఆర్. పూర్ణిమ విచారించి శిక్షను ఖరారు చేశారు.
తిరువొత్తియూరు: సేలం, ఈరోడ్, తిరుప్పూర్ , పోతనూర్ మీదుగా వెళ్లే బెంగళూరు – తిరువనంతపురం నార్త్ స్పెషల్ రైలును మరో నెల పొడిగించారు. గళూరు నుంచి తమిళనాడు మీదుగా కేరళకు వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రయాణికుల రద్దీని నివారించడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. దీని ప్రకారం, బెంగళూరు నుండి సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోతనూర్, పాలక్కాడ్ మీదుగా తిరువనంతపురానికి వారపు ప్రత్యేక రైలు నడుస్తోంది. దీని గడువు కాలం ప్రస్తుత నెల (ఫిబ్రవరి, 2026) చివరితో ముగియనుండగా, మరో నెల పాటు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. దీని ప్రకారం, బెంగళూరు–తిరువనంతపురం నార్త్ వీక్లీ స్పెషల్ రైలు (06523), మార్చి 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతి సోమవారం (5 రోజులు సేవలు) పొడిగించనున్నారు. ఇది బెంగళూరులో రాత్రి 7.25 గంటలకు బయలుదేరి, కృష్ణరాజపురం, బంగారుపేట మీదుగా అర్ధరాత్రి 12.05 గంటలకు సేలం చేరుకుంటుంది. తర్వాత 10 నిమిషాల్లో బయలుదేరి, తెల్లవారుజామున 1.05 గంటలకు ఈరోడ్, తెల్లవారుజామున 1.50 గంటలకు తిరుప్పూర్ చేరుకుని, పోతనూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, కొట్టాయం, ఎర్నాకుళం, కొల్లం మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు తిరువనంతపురం నార్త్ చేరుకుంటుంది. ఈనేపథ్యంలో తిరువనంతపురం నార్త్–బెంగళూరు వీక్లీ స్పెషల్ రైలు (06524), మార్చి 3వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రతి మంగళవారం (5 సేవలు) పొడిగించనున్నారు. తిరువనంతపురం నార్త్ స్టేషన్లో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, పాలక్కాడ్ మీదుగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.05 గంటలకు సేలం చేరుకుంటుంది. తర్వాత బంగారుపేట, కృష్ణరాజపురం మీదుగా ఉదయం 8.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ రైలు సేవను ఉపయోగించుకోవాలి అని దక్షిణ రైల్వే పరిపాలన కోరింది.


