breaking news
International
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. డ్రోన్ సెంటర్ ధ్వంసం!
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతటా డజన్ల కొద్దీ పాలన, సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) తీవ్రమైన దాడుల తరంగాన్ని కొనసాగిస్తోంది. ఇటీవలి దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్ ప్రధాన కార్యాలయంపై బాంబులు వేశాయి.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు ప్రయోగిస్తారు. "ఇరాన్ ఉగ్రవాద పాలన ఈ ప్రధాన కార్యాలయం నుంచి ఇజ్రాయెల్ వైపు డ్రోన్లను ప్రయోగించింది. అలాగే, ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అదనపు డ్రోన్లను అక్కడ నిల్వ చేసింది" అని ఐడీఎఫ్ తెలిపింది.ఈ దాడి ఇరాన్లోని వివిధ సైనిక స్థావరాలు, మిసైల్ ఉత్పత్తి యూనిట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఏరోస్పేస్ సదుపాయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో భాగమే. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్లోని ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ కమాండ్ సెంటర్ను కూడా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తోంది. ఈ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. రెండు వైపులా దాడులు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. -
అమెరికాలో ఆకలికేకలు... ఆపన్న హస్తంగా భారతీయ హిందువు
ఓ వైపు అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణించుకుంటూ ఉన్న అమెరికాలో ప్రస్తుతం ఆహార అభద్రత అత్యంత ఆందోళన కలిగించే అంశాలలో ఒకటిగా మారింది. మాట వినని వారిపై కయ్యాలకు కాలు దువ్వుతూ ఇతర దేశాలపై ఆంక్షల కొరడా ఝులిపిస్తూ ఏ అంతర్గత సమస్యలూ లేనట్టు పైకి కనిపిస్తున్న ఆ దేశంలో కనీసపాటి నాణ్యమైన భోజనం పొందలేకపోతున్నవారి సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విషయాన్ని ఫుడ్ రీసెర్చ్ – యాక్షన్ సెంటర్ అందించిన 2024 డేటా నిర్ధారించింది.ఈ అధ్యయనం ప్రకారం ఆ దేశంలోని ఏడు ఇళ్లలో కనీసం ఒక ఇల్లు ఆహార అభద్రతను ఎదుర్కుంటోంది. అంటే దాదాపుగా 47.9% మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని అంచనా. దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం దేశవ్యాప్తంగా ఇళ్లలో తృప్తికరమైన భోజనాలు ఆస్వాదించడాన్ని కష్టతరం గా మార్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలువురు వ్యక్తులు సంస్థలు అవసరార్ధులకు రుచికరమైన, ఉచిత భోజనాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. అలాంటి వారిలో జన్మతః భారతీయుడైన గోవింద దత్తా కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలోని లాస్ ఏంజిల్స్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృష్ణ లంచ్ అనే సంస్థ ఒక ఫుడ్ ట్రక్ను నిర్వహిస్తోంది. ఇది వెస్ట్వుడ్లోని లే కాంటే అవెన్యూలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వెలుపల కొలువుదీరిన ఓ ఫుడ్ ట్రక్. ఈ కృషగోవింద దత్తా... ఆధ్వర్యంలో ఈ ట్రక్ విద్యార్ధులు, కార్మికులకు నామమాత్రపు ధరకే శాఖాహార భోజనాలను అందిస్తోంది.‘ ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో ఇక్కడి సమాజానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం‘ అని దత్తా మీడియాతో అంటున్నారు. ఆయన శృకృష్ణుని ఆదర్శాల వ్యాప్తికి వెలసిన హిందూ భక్తి ఉద్యమం ఇస్కాన్లోని హరేకృష్ణ కు దీర్ఘకాల సభ్యుడు, కర్మ సిద్ధాంతాన్ని బలంగా విశ్వసిస్తాను అంటున్న ఆయన భగవద్గీతను వ్యాప్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నానంటారు.అతి తక్కువగా, చిన్న పాటి విరాళానికి (షుమారు 5 డాలర్లు) ప్రతిగా స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని ఈ ట్రక్ అందిస్తుంది. అయితే, ఆ కనీస విరాళం మొత్తాన్ని ఇవ్వలేని వారు కూడా ఇక్కడ భోజనానికి అర్హులే. తమ ట్రక్ లో వడ్డించే వంటకాల కోసం రూపొందిన మెనూ ఆయుర్వేద పురాతన వంట శైలులపై ఆధారంగా ఉందని ఆయన వెల్లడించారు, ‘కూరగాయలు, ధాన్యాలు, బీ¯Œ ్స‘ కలయిక గా ఈ ఆహారపదార్ధాలు రూపొందుతాయి.ఆయన తో పాటు మరొక స్వచ్ఛంద సేవకుడు శాంతాత్మ ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు మేల్కొంటారు.. అక్కడ నుంచి తమ ట్రక్ పనులను చూసుకుని సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంటారు. వారానికి ఐదు రోజుల పాటు ఈ ప్రాజెక్టును అందించగలుగుతారు. ఈ ఫుడ్ ట్రక్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్థిరమైన మెనూ షెడ్యూల్ను అనుసరిస్తుంది.‘ఆహారం ఒక బహుమతి, అదే మా ప్రేరణ‘ అని దత్తా అంటున్నారు. దేశంలో 20% మంది విద్యార్థులు డబ్బు కారణంగా ఆహార స్వీకరణను వాయిదా వేస్తున్నారని, మొత్తంగా 42% మంది ఆహార అభద్రతతో ఉన్నారని అంటున్న వీరు తమ వంతుగా ఈ సమస్య పరిష్కారంలో భాగం అవుతున్న తీరు హర్షణీయం. -
‘కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’.. ట్రంప్ పరువు తీసిన ఇరాన్
టెహ్రాన్: ‘ట్రంప్ కళ్లు పెద్దవిగా చేసుకుని చూడు’ అంటూ ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో ఇటీవల అమెరికా మిసైల్ దాడిలో మరణించిన ఇరాన్ మినాబ్ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల ఫొటోలు ప్రచురించి, ప్రపంచ దేశాల ఎదుట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువు తీసింది.‘ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు’ అంటూ ఆ ఫొటోలతో పాటు ఇరాన్పై జరుగుతున్న సైనిక దాడులపై ట్రంప్ చేసిన ప్రకటనలు బాధ్యతారహితంగా, తప్పుడు వాదనలు, దౌత్య పరిష్కారాలను ధిక్కరించేవిగా ఉన్నాయని పేర్కొంది. స్కూల్పై దాడి ఘటనపై ట్రంప్ మాట్లాడుతూ, “ఆ స్కూల్పై ఇరాన్ దాడి చేసింది. వారి ఆయుధాలకు ఖచ్చితత్వం ఉండదు” అంటూ ఇనాబ్ స్కూల్ విషాదాన్ని ఇరాన్పై నెట్టే ప్రయత్నం చేశాడు.ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇరాన్ తన సొంత మీడియా పత్రిక ఫ్రంట్ పేజీలో ఇనాబ్ స్కూల్లో ప్రాణాలు కోల్పోయిన పసిపిల్లల ఫొటోలు అచ్చు వేసింది. ఇక అటు ట్రంప్, ఇటు ఇరాన్ వాదనలు–ప్రతివాదనలు కొనసాగుతుండగా, ప్రముఖ అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ విచారణలో మినాబ్లోని పాఠశాలపై దాడి చేసింది అమెరికా సైన్యమేనని తేలింది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరగగా, స్కూల్లో 150 మంది చనిపోయారని, వారిలో అధిక శాతం విద్యార్థులేనని నివేదికలో పేర్కొంది. స్కూల్లో జరిగిన మారణహోమానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనని న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది.గత ఫిబ్రవరి 28న ఇరాన్లోని ఇనాబ్ ప్రాంతంలో అమెరికా–ఇజ్రాయెల్ మిసైళ్లతో దాడి జరిపాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అభివృద్ధి చేసిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ దాడి జరిగినట్లు యుద్ధాలు, ఘర్షణలు, వాటి ప్రభావాలను అధ్యయనం చేసే రీసెర్చర్ ట్రెవర్ బాల్ తెలిపారు.అంతేకాదు, తొలిసారి ఐఆర్జీసీ కేంద్రాలపై అమెరికానే ఈ దాడి జరిపిందని, అందులో ఇజ్రాయెల్ ప్రమేయం లేదని చెప్పారు. ఇనాబ్ స్కూల్ గోడలోకి దూసుకెళ్లిన అమెరికాకు చెందిన టొమాహాక్ క్రూయిజ్ మిసైల్ అని నిర్ధారించేందుకు ఫుటేజీలను కూడా బయటపెట్టారు. -
బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్ లక్ష్యంగా ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. బహ్రెయిన్లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ‘అల్-మామీర్’పై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో బహ్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ‘బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ’ (బాప్కో) తన చమురు రవాణాపై ‘ఫోర్స్ మేజర్’(అదుపు చేయలేని అసాధారణ పరిస్థితులు) ప్రకటించింది.బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ అధికారిక సమాచారం ప్రకారం.. అల్-మామీర్ చమురు సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడిలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం భారీగానే జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రక్షణ దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.‘ఫోర్స్ మేజర్’ అంటే ఏమిటి?చమురు వ్యాపార ఒప్పందాల్లో ఫోర్స్ మేజర్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లేదా నియంత్రించలేని అసాధారణ పరిస్థితులు సంభవించినప్పుడు.. ఒక కంపెనీ తన క్లయింట్లకు ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వస్తువులను (చమురు) సరఫరా చేయలేకపోతే ఈ నిబంధనను వాడుకుంటుంది. దీనివల్ల డెలివరీలో జాప్యం జరిగినా లేదా సరఫరా ఆగిపోయినా కంపెనీ(బాప్కో)పై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు పడే అవకాశం ఉండదు.అంతర్జాతీయ సరఫరాలకు అంతరాయం కలిగినప్పటికీ బహ్రెయిన్ అంతర్గత మార్కెట్కు ఇంధన కొరత లేకుండా అత్యవసర ప్రణాళికల ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.స్తంభించిన హార్ముజ్ జలసంధి..ఈ దాడి ప్రభావం కేవలం బహ్రెయిన్పైనే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో ఐదో వంతు రవాణా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ట్యాంకర్లు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగింది. ఇది ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి ధరల కంటే 60 శాతం అధికం కావడం గమనార్హం.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం! -
న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటిపై దాడి
వాషింగ్టన్: న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ (34)ఇంటిపై దాడి జరిగింది. అగంతకులు మమ్దానీ ఇంటిపై పేలుడు పదార్ధాలు విసిరారు.అయితే, పేలుడు పరికరాన్ని వెలిగించినప్పటికీ ఫ్యూజ్ సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రమాదం తప్పింది.ఒకవేళ పేలి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. మమ్దానీ ఇంటిపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు ఎమీర్ బాలాట్ (18), ఇబ్రహీం కయూమి(19)ని అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసుకుని ఎఫ్బీఐకి చెందిన జాయింట్ టెర్రరిజం టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తును ఉగ్రవాద కోణంలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్నకు కోపం తెప్పించే పని చేసిన పుతిన్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీకి వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మొజ్తబా ఖమేనీకి మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించారు. అలీ ఖమేనీ కుమారుడే మొజ్తబా ఖమేనీ.మొజ్తబాకు పుతిన్ ఓ సందేశం పంపారు. “ఇరాన్కు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇరాన్లోని మిత్రులతో ఐక్యంగా ఉంటాం. ఇరాన్కు రష్యా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుంది. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో మీ పదవీకాలంలో మీకు చాలా ధైర్యం, అంకితభావం అవసరం” అని తెలిపారు.తాజాగా, డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లకు పుతిన్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ఉండడం తనకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇరాన్లో సామరస్యం, శాంతిని తీసుకువచ్చే నేత కావాలని చెప్పారు. తమ ఆమోదం లేకపోతే అతను ఎక్కువ కాలం నిలవడని అన్నారు. అలాగే, ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించడం గమనార్హం. యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు..కాగా, ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ అంతగా రారు. తన 56 సంవత్సరాల జీవితంలో అదే తీరును అవలంభించారు. అయితే, ఇరాన్లో చెలరేగిన నిరసనలను అణచివేయడంలో మొజ్తబా పాత్ర ఉంది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. సోమవారం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై మళ్లీ దాడులు ప్రారంభించింది. బీరూట్లో హిజ్బుల్లా మౌలిక వసతులపై కూడా దాడి చేసింది.దీనికి ముందు రోజు టెహ్రాన్ చమురు నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ప్రతిగా ఇజ్రాయెల్పై, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో ఒక ఆయుధం పడటంతో ఒక భారతీయుడు సహా ఇద్దరు విదేశీయులు మరణించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తబా తండ్రి అలీ ఖమేనీతో పాటు తల్లి, కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం.. మొజ్తబా భార్య పేరు జహ్రా హద్దాద్-అదెల్, ఆయన కుమారుల్లో ఒకరు దాడుల్లో మరణించారు. మొజ్తబాకు ఒక కుమార్తె కూడా ఉంది. మొత్తం ముగ్గురు పిల్లలు. -
హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్
బీరూట్: లెబనాన్లో రాజకీయ, భద్రతా సంక్షోభం నెలకొంది. మే నెలలో జరగాల్సిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ లెబనాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్,హిజ్బుల్లా మధ్య యుద్ధం వల్ల అస్థిరత నెలకొంది. హిజ్బుల్లా పట్ల దేశంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంలోని రాజకీయ మిత్రుల మద్దతు కోల్పోయింది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడంతో లెబనాన్లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిజ్బుల్లా ఈ యుద్ధంలో కలగజేసుకోవడం లెబనాన్ ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఆర్థిక సంక్షోభం, భద్రతా సమస్యలతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేసింది. పార్లమెంటరీ స్పీకర్ నబీహ్ బెర్రీ ఆధ్వర్యంలో జరిగిన ఓటింగ్లో 128 మంది సభ్యుల్లో 76 మంది ఎన్నికలను రెండేళ్ల పాటు వాయిదా వేయాలని మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల వాయిదాకు హిజ్బుల్లా ఎంపీలు కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం.చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్హిజ్బొల్లా దాడితో రగిలిపోతున్న ఇజ్రాయెల్ లెబానాన్పై విరుచుకుపడింది. గతవారం జరిపిన దాడుల్లో 83మంది పిల్లలు మృతి చెందగా 200మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల రక్షణ, ఆరోగ్యం, విద్య, పోషణ కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూనిసెఫ్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో చిగురుటాకులా వణికిపోతున్న లెబనాన్ను ఆపన్న హస్తం అందించేందుకు ఫ్రాన్స్ ముందుకు వచ్చింది. 6.9బిలియన్ డాలర్లు అత్యవసర ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పడింది. -
నేపాల్కు కాబోయే ప్రధాని.. అప్పట్లో బెంగళూరులో..
కాఠ్మాండు: నేపాల్తో పాటు ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలెన్ షా (బాలేంద్ర షా). ర్యాపర్గా కెరీర్ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేపాల్లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) తరఫున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు.ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. మరో స్థానంలో ముందంజలో ఉంది. యూఎంఎల్ ఎనిమిది స్థానాలు గెలిచింది. ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎన్సీపీ కేవలం ఏడు స్థానాలు మాత్రమే గెలిచింది. ఆర్పీపీ ఒక స్థానంలో గెలిచింది. శ్రామ్ సంస్కృతి పార్టీ మూడు స్థానాలు గెలిచింది. మయాగ్డి నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.నేపాల్లో 165 స్థానాలకు నేరుగా (ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్), మరో 110 స్థానాల్లో నైష్పక్షిక విధానం (ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్) కింద ఎన్నికలు జరిగాయి. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ కింద జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 162 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ (నైష్పక్షిక విధానం) కింద ఉన్న 110 స్థానాల్లో 68 స్థానాల లెక్కింపు పూర్తైంది. ప్రోపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతానికి అనుగుణంగా స్థానాలు కేటాయించే ఎన్నికల విధానం. బెంగళూరులో బాలేంద్ర షా ఎంటెక్ బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో చదివారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో విద్యనభ్యసించారు.తాజాగా, నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని తెలిపారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు.రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా.. నేపాలీ రాప్ మ్యూజిక్లో బాగా పాపులర్ అయ్యారు. అయినా క్యాంపస్లో ఉన్న సమయంలో ఆయన రాప్ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. ఆయన మ్యూజిక్, పాటలు అధికంగా నేపాలి భాషలోనే ఉండేవి.బాలేంద్ర షాకు నేపాల్ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్లు భావిస్తున్నారు. ర్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిని బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్కి అతిథిగా వస్తే ఘనస్వాగతం పలకాలని నిట్టె మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తోంది. బాలేంద్ర షా ఝాపా-5 నియోజకవర్గం పార్లమెంటు ఎన్నికలో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, మాజీ నేపాలి ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది. -
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ దేశ పౌరులకు వార్నింగ్ ఇచ్చింది. శత్రుదేశాలకు మద్దతు ఇస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. దేశంలోని వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని హెచ్చరించింది.ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం సోమవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ఇరాన్ ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఐఆర్ఐబీ వార్తా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపింది. విదేశాల్లో నివసిస్తూ సొంత దేశానికి శత్రువుల్లా పనిచేస్తున్న వారి ఆస్తులు స్వాధీనం చేయాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందని ఇరాన్ న్యాయ వ్యవస్థ సైతం స్పష్టం చేసింది.ఈ ప్రకటన న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ వార్తా సంస్థలో కూడా ప్రచురితమైంది. విదేశాల్లో ఇజ్రాయెల్ లేదా అమెరికా ప్రభుత్వాల కోసం జరిగే ఏదైనా ఇంటెలిజెన్స్ లేదా ఎస్పియోనాజ్ కార్యకలాపాలు జరిగితే ఆయా పౌరుల ఆస్తులు స్వాధీనం చేయడం పాటు మరణదండన కూడా విధించవచ్చని హెచ్చరించింది. ఇరాన్కు వ్యతిరేకంగా తప్పులు చేసినట్లు నిర్ధారణ అయితే వదిలేది లేదని ఇరాన్ చెప్పింది. గత అక్టోబర్లో అమలు చేసిన చట్టం గురించి ప్రస్తావించింది. ఆ చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్, అమెరికా లేదా ఇతర శత్రు దేశాలు లేదా సంస్థలకు అనుకూలంగా తమ పౌరులు పనిచేస్తే చేస్తే ఆస్తుల స్వాధీనంతో పాటు ఇస్లామిక్ పీనల్ కోడ్ ప్రకారం ఇతర చట్టపర శిక్షలు వర్తిస్తాయని తెలిపింది.పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ నగరాలపై సైనిక దాడులు ప్రారంభించాయి. అప్పటి నుంచి.. విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులపై కూడా ఇరాన్ దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా 1,200 మందికి పైగా ప్రజలు మరణించారు. 10,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. -
బలూచ్ ప్రజలపై పాక్ సర్కార్ దౌర్జన్యం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం బలూచ్ ప్రజల అణచివేతకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బలూచ్ ప్రజల జీవనాధారంపై సర్కార్ దెబ్బకొట్టింది. వారి జీవనాధారమైన ఇంధనాన్ని కాల్చివేసింది. దీంతో, ఈ ఘటనను బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో పాక్ ప్రభుత్వ చర్యను ఖండించింది.బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక, సామాజిక అణచివేతను ఎదుర్కొంటున్నారు. గ్వాదర్, మక్రాన్ వంటి ప్రాంతాల్లో బలూచ్ ప్రజలు.. సరిహద్దు వ్యాపారం, ఇంధన విక్రయం వంటి చిన్నచిన్న జీవనాధారాలపై ఆధారపడుతున్నారు. కానీ, పాకిస్తాన్ సంస్థలు వీటిని తరచుగా నేరంగా పరిగణించి అణచివేస్తున్నాయి. తాజాగా గ్వాదర్లోని మోచెన్ కపర్, కుంటాని ప్రాంతంలో అక్కడి ప్రజల జీవనాధారమైన ఇంధనాన్ని సర్కార్కు చెందిన కొన్ని సంస్థలు కాల్చివేసింది. దీంతో, బలూచ్ యక్జెహ్తీ కమిటీ స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా కేవలం ప్రకటనలు కాకుండా, మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ను బాధ్యత వహించేలా ప్రాయోగిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బలూచ్ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు, ఆర్థిక అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రతీ చిన్న జీవన ప్రయత్నాన్ని కూడా నేరంగా పరిగణించడం, బలూచ్ ప్రజలను వలస పాలనలో ఉన్నట్టుగా ప్రభుత్వం చూపిస్తోంది అంటూ షహబాజ్ సర్కార్పై మండిపడింది. అలాగే, బలూచ్ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నారు. ఇంధనాన్ని కాల్చివేయడం వంటి చర్యలు, వారి ఆర్థిక హక్కులను మాత్రమే కాకుండా, మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఈ సంఘటన బలూచ్ ప్రజలపై జరుగుతున్న దీర్ఘకాలిక అణచివేతకు మరో ఉదాహరణగా నిలిచింది అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.𝗧𝗵𝗲 𝗕𝗮𝗹𝗼𝗰𝗵 𝗬𝗮𝗸𝗷𝗲𝗵𝘁𝗶 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗲 𝘀𝘁𝗿𝗼𝗻𝗴𝗹𝘆 𝗰𝗼𝗻𝗱𝗲𝗺𝗻𝘀 𝘁𝗵𝗲 𝗯𝘂𝗿𝗻𝗶𝗻𝗴 𝗼𝗳 𝗳𝘂𝗲𝗹 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗠𝗼𝗰𝗵𝗲𝗻 𝗸𝗮𝗽𝗮𝗿, 𝗞𝘂𝗻𝘁𝗮𝗻𝗶 𝗮𝗿𝗲𝗮 𝗼𝗳 𝗚𝘄𝗮𝗱𝗮𝗿.On 8th March, in Mochen kapar, Kuntani, a remote area of Gwadar, many… pic.twitter.com/yaoYnXrWzH— Baloch Yakjehti Committee (@BalochYakjehtiC) March 9, 2026 -
చమురు నిల్వలపై IEA .. G-7 కీలక సమావేశం
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ( సోమవారం) కీలక భేటీ జరగబోతుంది. G-7 దేశాలు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సంయుక్తంగా భేటీ నిర్వహించనున్నాయి. ప్రస్తుతం నెలకొన్న చమురు సంక్షోభం నేపథ్యంలో అత్యవసర సమయంలో విడుదల చేయాల్సిన చమురు నిల్వలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయు. గల్ఫ్ దేశాలతో పాటు ప్రధానంగా ఆయిల్ సరఫరా దేశాలకు ఆటంకం తలెత్తడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో G-7 దేశాల ప్రతినిధులు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరపనున్నాయి.ప్రస్తుతం చమురు సంక్షోభం తలెత్తడంతో అత్యవసర సమయంలో విడుదల చేయాల్సిన చమురు నిల్వలపై IEA కు చెందిన 32 సభ్య దేశాలు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిల్వలు మొత్తంగా సుమారు 1.2 బిలియన్ బ్యారెళ్లుగా ఉండగా వాటిలో 300 మిలియన్ నుండి 400 మిలియన్ బ్యారెళ్ల వరకు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుత యుద్ధానికి .. అమెరికా అధ్యక్షుడు ప్రధాన కారణం కావడంతో ట్రంప్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో అమెరికా సైతం ఈ విషయంపై సానుకూలంగా ఉంది. అంతే కాకుండా అక్కడ గత వారంలో 2.98 డాలర్లు పలికిన గాలన్ ధర వారం రోజుల్లోనే 3.45 డాలర్లకు చేరుకుంది. ఆర్థిక నిపుణులు ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం తలెత్తి చమురు సంక్షోభం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతి దారులైన చైనా, ఇండియా, సౌత్ కొరియా, జపాన్, జర్మనీతో పాటు మరికొన్ని దేశాలలో క్రూడాయిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది.అంతర్జాతీయంగా ప్రమాణమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర.. ఆసియా ట్రేడింగ్లో సోమవారం ఒక దశలో 24% పెరిగి బ్యారెల్కు $116.71కు చేరింది. తరువాత కొంత తగ్గి $110.85కి చేరుకుంది. మొత్తంగా గల్ఫ్ యుద్ధం ప్రభావంతో ప్రపంచ చమురు మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి G7 దేశాలతో పాటు IEA తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. -
అమెరికా-ఇజ్రాయిల్ల మధ్య భిన్న స్వరం
ఇప్పటివరకూ ఇరాన్పై సంయుక్తంగా దాడి చేస్తూ వస్తున్న అమెరికా- ఇజ్రాయెల్లు ఓ విషయంలో మాత్రం రెండుగా చీలిపోయాయి. చమురు నిల్వల అంశంలో అమెరికా-ఇజ్రాయెల్ వైఖరి భిన్నంగా ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేసిన నేప థ్యంలో ట్రంప్ హుకుం జారీ చేశారు. ఆ చమురు నిల్వలపై దాడి చేయొద్దంటూ ఇజ్రాయిల్ను ఆదేశించారు. దీంతో అమెరికా- ఇజ్రాయెల్ మధ్య కాస్త ఏరుపాటు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఒక్కసారిగా ట్రంప్ ఆదేశాలకు నెతాన్యాహూ అలిగారట. -
ఇరాన్ వార్ యూటర్న్.. గల్ఫ్లో నీటి యుద్ధం మొదలైందా?
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమే అని పలువురు నిపుణులు చాలాకాలంగా చెబుతున్న క్రమంలో అది వాస్తవమే అనే విధంగా ఇరాన్ యుద్ధం టర్న్ తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైంది. రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.గల్ఫ్ దేశాల బలం చమురు అయితే.. బలహీనత నీరు. ఇరాన్-అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ దుర్భలత్వాన్ని బయటపెట్టింది. ఎడారి వాతావరణం ఉన్న గల్ఫ్ దేశాల్లో నీటికొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటిశుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. తమ నీటి శుద్ధి ప్లాంట్పై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా, తమ ప్లాంట్పై ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆత్రుతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగు నీటి అంశం అతిపెద్ద సమస్యగా ఉద్భవించింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నీటి శుద్ది ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది.పశ్చిమాసియాలోనే అధికం..గల్ఫ్ దేశాల్లో తాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో మంచినీటి కొరత కారణంగా ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేందుకు నీటి శుద్ధి ప్లాంట్లను (డీసాలినేషన్ ప్లాంట్స్.. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే యంత్రాలు) ఆయా దేశాలు విస్తృతంగా ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ప్రపంచంలోని 60 శాతం నీటి శుద్ధి యూనిట్లు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర అరబ్ దేశాల వారు అత్యధికంగా వీటిపైనే ఆధారపడటంతో శత్రు దేశానికి ఇప్పుడు అవే అత్యంత విలువైన లక్ష్యాలుగా మారాయి. అలాగే ఇరాన్లోని ప్లాంట్లను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా, ఒక పెద్ద ప్లాంట్ దెబ్బతింటే కొన్ని రోజుల్లోనే రాజధానులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అమెరికాకు చెందిన కొన్ని రహస్య నివేదికలు హెచ్చరించాయి.గల్ఫ్ దేశాలు ఆధారపడే స్థితి ఇలా.. కువైట్: 90% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరుయుఏఈ: 90% నీరు డీసాలినేషన్ ద్వారా తాగునీరు ఒమాన్: 86% నీరు డీసాలినేషన్ ద్వారా మంచి నీరు దొరుకుతుంది.బహ్రెయిన్: 80 శాతం.. అత్యధికంగా డీసాలినేషన్ మీద ఆధారపడుతోంది. సౌదీ అరేబియా: 70% నీరు డీసాలినేషన్ ద్వారా తాగు నీరు ఖతార్: 70 శాతం చిన్న దేశం కావడంతో నిల్వలు తక్కువ, ప్లాంట్లపై అధికంగా ఆధారపడే పరిస్థితి.నీటిపై యుద్ధ ప్రభావం.. యుద్ధం నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే, ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80–90% ఆహారాన్ని దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతోంది.ఇరాన్కు నష్టం తక్కువే.. ఇరాన్ తాగునీటి కోసం ప్రధానంగా డ్యామ్లు, భూగర్భ జలాలు మీద ఆధారపడుతుంది. అందువల్ల తీరప్రాంత డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా, ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. కానీ గల్ఫ్ దేశాలకు ఇది ప్రాణాంతక సమస్యగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు నీటి భద్రతను జాతీయ భద్రత స్థాయిలో చూడాల్సిన సమయం వచ్చింది. -
ట్రంప్నకు హైబీపీ తెప్పించిన ఇరాన్!
ఇరాన్ అధికారికంగా మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్గా ప్రకటించింది. ఆయన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. తీవ్ర తర్జన భర్జనల తర్వాత (మార్చి 8–9, 2026) ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆయన వారసుడిగా మోజ్తాబానే ఎన్నుకుంది.ఇరాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఆ దేశ అత్యున్నత మతపరమైన మండలి తమ కొత్త నాయకుడిగా ఖమేనీ తనయుడు సయ్యద్ మోజ్తాబాను (అలీ ఖమేనీ రెండవ కుమారుడు)ని ఎన్నుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి సుప్రీం లీడర్ పదవి తండ్రి నుండి కుమారుడికి వారసత్వంగా వెళ్లడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగ్గ విషయం.అయితే ఇరాన్లో సాధారణంగా సుప్రీం లీడర్ను మతపరమైన మండలి ఎన్నుకుంటుంది. కానీ ఈసారి తండ్రి నుండి కుమారుడికి పదవి రావడం హెరిడిటరీ సక్సెషన్ (వంశపారంపర్య వారసత్వం)పై విమర్శలు వెల్లువెత్తవచ్చని అంతా భావించారు. దీనికి తోడు.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మోజ్తాబా ఎంపిక అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్లో వారసత్వ ఎంపిక ఏ రకంగానూ చెల్లదని, మోజ్తాబా ఒక మూర్ఖుడు అని, ఆ పదవికి అనర్హుడని, ఇరాన్ కొత్త నాయకుడిని ఆ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జరపాలని, ఆ ఎంపికలో తమ దేశ ప్రమేయం(తనకు అనుకూలంగా ఉండాలనే..) ఉంటుందని ప్రకటించారు. వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఇరాన్ గద్దెపై ఎవరు కూర్చున్నా, వారు ఎక్కువ కాలం నిలబడలేరని ఆయన హెచ్చరించారు.🚨 BREAKING: The Islamic regime of Iran just named Ali Khamenei's SON as the NEW SUPREME LEADER — Mojtaba KhameneiPresident Trump has already said he is an "UNACCEPTABLE" successor to Ali Khamenei"Everybody that seems to want to be a leader, they end up DEAD!"How long will… pic.twitter.com/2MiCYtXrxT— Eric Daugherty (@EricLDaugh) March 8, 2026కాగా, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ చాలా తేలికగా తీసుకుంది. ప్రాంతీయ యుద్ధ పరిస్థితుల్లో.. మోజ్తాబా ఎంపికే సరైందని భావించింది. అయితే ఆ ప్రకటన తర్వాత ఇరాన్ అంతటా అనూహ్య పరిస్థితులు కనిపించాయి. వ్యతిరేకతకు బదులు.. ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), సైనిక ప్రధాన సిబ్బంది మోజ్తాబాకు మద్దతు ప్రకటించారు. ఇది అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ ఏమాత్రం ఊహించిన ఉండకపోవచ్చు!.56 ఏళ్ల వయసున్న మోజ్తాబా ఖమేనీ గతంలో ఎన్నికైన పదవులు చేపట్టకపోయినా, తన తండ్రి కార్యాలయం ద్వారా సైనిక, భద్రతా వ్యవస్థలపై ప్రభావం చూపుతూ వచ్చారు. అలాగే హెజ్బొల్లా లాంటి అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేక గుంపులతోనూ ఆయన సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే మోజ్తాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధం తీవ్ర ప్రతిస్పందనలతో నిండింది. మోజ్తాబాపై పలు రాజకీయ(ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి సంబంధిత) విమర్శలు ఉన్నా.. కరడుగట్టిన ట్రంప్ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మోజ్తాబా నియామకమే సరైందని భావించి.. అమెరికాకు ప్రత్యక్ష సవాలు విసిరింది ఇరాన్.మొత్తంగా.. మోజ్తాబా నియామకంతో ఇరాన్ మతపరమైన నాయకత్వం “సమరాన్ని ఎంచుకుంది, రాజీని కాదు” అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ మోజ్తాబాను “అంగీకరించలేని నాయకుడు” అని చెబుతున్నారు. కాబట్టి తాజా నిర్ణయం ఆయనకు మరింత మంట పుట్టించి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేయించే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో ఉద్రిక్తతలకు ధీటుగానే స్పందించాలనే ధోరణిని మోజ్తాబా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్లో జరిగిన నాయకత్వ మార్పు .. మధ్య ప్రాచ్యంలో(మిడిల్ఈస్ట్లో) ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. -
సౌదీ అరేబియాపై దాడి.. భారత్ స్పందన
పశ్చిమాసియాలో యుద్ధం నానాటికీ తీవ్రతరమవుతుంది. ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు జనావాసాలపై సైతం దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో జరిగిన దాడి ఘటనపై అక్కడి భారత ఎంబసీ స్పందించింది. ఆ ఘటనలో భారతీయులెవరూ మృతిచెందలేదని ప్రకటించింది.ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేయడం భారత్కు తీవ్ర ఆందోళనకరంగా మారింది. మన దేశం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఆ దేశాలలోకి జీవనోపాధి కోసం వలస వెళుతుంటారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశమై ఇది వరకే భారత ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్లో సంభాషించారు. అక్కడి ఇండియా ఎంబసీలు సైతం తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియాలోని భారత్ రాయబార కార్యాలయం స్పందించింది." నిన్న సాయంత్రం ఆల్ఖర్జ్లో జరిగిన ప్రమాదంలో భారతీయులెవరూ మరణించలేదు. ఇది ఉపశమనం కలిగించే అంశం. ఈ ప్రమాదంలో మన దేశానికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డారు. అతనిని కౌన్సిలర్ షబీర్ కలిశారు. ఇది చాలా ప్రమాదకర మైన ఘటన" అని ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే నిన్న ఇరాన్ జరిపిన దాడుల్లో ఒక భారతీయుడితో పాటు బంగ్లాదేశ్ దేశస్థుడు మృతి చెందినట్లు సౌదీ అరేబియా పేర్కొనగా తాజాగా భారత్ దానిని ఖండించింది. -
ఇరాన్ ఎఫెక్ట్.. పాకిస్తాన్కు కొత్త కష్టాలు
లాహోర్: పాకిస్తాన్లో ఇంధన కొరత భయంతో పెట్రోల్ బంకుల వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన కాల్పుల్లో ఒక్కరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్లోని సియాల్కోట్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల మేరకు.. శనివారం సియాల్కోట్లోని దాస్కా రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ పంప్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ కారులో పెట్రోల్ పోయించుకున్నారు. వెంట తెచ్చుకున్న మరో రెండు క్యాన్లలోనూ పెట్రోల్ నింపాలంటూ వాదులాటకు దిగారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఒప్పుకోవని సిబ్బంది తెలపడంతో తీవ్ర హెచ్చరికలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.🇵🇰⛽📈🔫A man was shot dead as tensions rose over rising petrol prices in Haji Pura area, Sialkot, Punjab, #Pakistan during a clash. pic.twitter.com/7CT9OicpMm— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) March 7, 2026కొద్దిసేపటి తర్వాత తుపాకులతో బంక్ వద్దకు చేరుకుని సిబ్బందిపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 55 రూపాయల మేర భారీగా పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే పలు ప్రాంతాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. 🚨 BREAKING: Pakistan is facing a major fuel crisis after the government raised petrol and diesel prices by PKR 55 per litre, citing rising global oil prices amid escalating Middle East tensions. #Pakistan #FuelCrisis #OilPrices #BreakingNews pic.twitter.com/41wp2xmkWm— News (@NewsSportzz) March 6, 2026 -
ఇరాన్ సుప్రీం లీడర్గా ఆయనే.. అధికారిక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయింది. దేశ తదుపరి సుప్రీంగా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు 56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ (Ayatollah Ali Khamenei)ఎన్నికైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ముజ్తబాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)తో బలమైన సంబంధాలు ఉన్నాయి.ముజ్తాబా గాయం? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోయారు. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంతమైన సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
ఇరాన్ సుప్రీం నేత ఖరారు?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఆయన వారసుని ఎంపిక పూర్తయినట్లు వార్తలొస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పేరును ఇప్పుడే బహిర్గతం చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త సుప్రీం నేతకు కూడా ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ‘కొత్త నేతను ఎన్నుకున్నాం’ అని కమిటీ సభ్యుడు అయతొల్లా మొహమ్మద్ మెహ్దీ మిర్బాఖేరీ చెప్పారు. ‘‘అయితే ఇంకొన్ని అవరోధాలున్నాయి. వాటిని పరిష్కరించాకే ఆయన పేరు వెల్లడిస్తాం’’ అన్నారు.సుప్రీంనేత ఎంపిక కోసం జరిపే సమావేశంపై సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దాడుల వేళ భద్రతా కారణాల రీత్యా సమావేశం అక్కర్లేదని, ఎవరికి మద్దతు పలికేదీ సూచిస్తే చాలని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డట్టు అయతొల్లా మొహ్సీన్ హైదరీ అలేకాసిర్ చెప్పారు. మరికొందరేమో ఏదేమైనా కమిటీ భేటీ కావాల్సిందేనని పట్టుబట్టారు. ‘‘సుప్రీంనేత ఎంపిక పూర్తయింది. పేరును అసెంబ్లీ సెక్రటరీ అయతొల్లా హషీం హొస్సేనీ బుషేరీ వెల్లడిస్తారు’’ అని మరో సభ్యుడు అహ్మద్ అలామొల్హొదా చెప్పారు. దివంగత ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల ముజ్తాబా ఖమేనీనే సుప్రీం నేతగా ఎన్నుకుని ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ముజ్తాబా గాయపడ్డారా? తండ్రి ఖమేనీని పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ముజ్తాబా సైతం గాయాలపాలైనట్టు తాజాగా కథనాలు వెలువడ్డాయి. ఆ దాడిలో ఖమేనీతోపాటు పలువురు అగ్ర నేతలు, సైనిక జనరల్స్ చనిపోవడం తెల్సిందే. ఆ భేటీలో ముజ్తాబా సైతం ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన భార్య జహ్రా హద్దద్ అదెల్ కూడా ఆ దాడిలో చనిపోయారు. ముజ్తాబా గాయపడ్డారన్న వార్తలను ఇరాన్ వర్గాలు ఖండించాయి. ఆ రోజు ఆయన టెహ్రాన్ నగరంలోనే లేరని పేర్కొన్నాయి. శక్తివంత∙సాయుధ విభాగం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)పై ముజ్తాబాకు పట్టుంది. ఆ పలుకుబడితో సుప్రీం నేతగా తననే ఎన్నుకునేలా ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ మెజారిటీ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టు వార్తలొచ్చాయి. -
యురేనియం నిల్వల కోసం భూతల దాడులు?
వాషింగ్టన్: ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అక్కడినుంచి ఎలాగైనా తరలించాలని అమెరికా భావిస్తోంది. అక్కడి అణుకేంద్రాలపై అమెరికా వాయుసేన కన్నేసింది. అందుకోసం సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఇజ్రాయెల్ సాయంతో భూతల దాడులకు దిగాలని ట్రంప్ సర్కారు యోచిస్తోంది. ఎన్బీసీ న్యూస్ వార్తాసంస్థ ఈ మేరకు ఒక కథనంలో పేర్కొంది. అణు కేంద్రాలపై భారీ స్థాయిలో బాంబులు వేసే బదులు ప్రత్యేక సైనిక బృందాన్ని రహస్యంగా తరలించి యురేనియం నిల్వలను ఎత్తుకొచ్చే అవకాశాలను ట్రంప్ సర్కార్ పరిశీలిస్తోందని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేతలు ఆదివారం వెల్లడించారు. ఇటీవల అమెరికా ఉభయ చట్టసభల సభ్యులకు యుద్ధ వివరాలను నివేదిస్తూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో పరోక్షంగా ఈ మేరకు వెల్లడించారు.‘కొందరు వెళ్లి అక్కడున్న వాటిని పట్టుకొస్తారు’ అని అన్నారు. యురేనియం నిల్వలకు సంబంధించి అమెరికా రెండు ప్రణాళికలను సిద్ధంచేసుకుంది. నిల్వలను జాగ్రత్తగా ఎత్తుకొచ్చేయడం. లేదంటే శుద్ద యురేనియంను ఇతర మలినాలతో కలిపేసి దాని గాఢత తగ్గించి పరీక్షలకు శాశ్వతంగా పనికి రాకుండా చేయడం. అయితే యురేనియాన్ని నిరుపయోగం చేయడం సాధారణ సైనికుల వల్ల కాదు.కనుక అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)లోని అణు శాస్త్రవేత్తలు, సహాయక సిబ్బందిని కూడా సైనికులతో పాటు ఇరాన్ భూగర్భ అణుకేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి వారితో పని పూర్తి చేయించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తోందని తెలుస్తోంది. అమెరికా సైనికులను ఇరాన్ గడ్డ మీదకు పంపుతారా అని ట్రంప్ను మీడియా ప్రశ్నించగా ‘‘వాళ్లను భూతల దాడులకు పంపించే యోచన లేదు. వాళ్లు వెళ్తేనే పని అవుతుందన్న సందర్భంలో మాత్రమే రంగంలోకి దింపుతా. లేదంటే వాయుసేన, డ్రోన్లతోనే ఇరాన్ కథ ముగిస్తా’’ అని బదులిచ్చారు. -
ఏఐ ఆఫీసర్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్–కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్మానవ శ్రమను భర్తీ చేయలేదుకొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 1980ల్లో స్ప్రెడ్షీట్స్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్కీపింగ్ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. ఏఐ నిపుణుల కొరత.. మ్యాన్పవర్ గ్రూప్ నిర్వహించిన గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ సర్వే ప్రకారం.. భారత్లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్–4లో భారత్ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. ఏఐ లిటరసీ, ఏఐ మోడల్ డెవలప్మెంట్ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో.. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రిసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలంటే.. ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్ స్థాయి ’చీఫ్ ఏఐ ఆఫీసర్స్’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్ పెరగనుంది. వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్ అనలిస్ట్ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, స్మార్ట్ గ్రిడ్ అనలిస్ట్ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్ టూల్స్ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది. -
టీనేజర్పై ట్రంప్ లైంగిక వేధింపులు!
వాషింగ్టన్: అమాయక టీనేజర్లు, యువతులను సంపన్నులు, రాజకుటుంబీకులు, ఉన్నతాధికారుల లైంగిక అవసరాల కోసం ఎరవేసిన అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ఉదంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నేరాలకు పాల్పడ్డాడని బాధిత యువతి సంచలన విషయం బయటపెట్టింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన తాజా పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. టీనేజర్గా ఉన్నకాలంలో తనను ట్రంప్కు ఎప్స్టీన్ పరిచయం చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఒక ఇంటర్వ్యూల్లో ఆరోపించింది.2019 ఏడాదిలో జరిగిన పలు ఇంటర్వ్యూల తాలూకు మూడు భాగాలను ఎఫ్బీఐ తన నివేదికలో పొందుపరిచింది. 2019 ఆగస్ట్ ఏడో తేదీ నాటి ఇంటర్వ్యూలో ‘‘13–15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నన్ను ట్రంప్కు ఎప్స్టీన్ పరిచయం చేశాడు. సరిగా గుర్తులేదుగానీ అప్పుడు న్యూయార్క్ లేదా న్యూజెర్సీ నగరంలో వాళ్లను కలిశా. ఎప్స్టీన్, ట్రంప్ ఇద్దరూ నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు. లైంగిక దాడి వేళ తప్పించుకునేందుకు ట్రంప్ను కొరికేశా. దాంతో కోపంతో ట్రంప్ నన్ను కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నాకు, నా ఆప్తులకు బెదిరింపులు ఫోన్కాల్ వచ్చాయి’ అని ఆమె చెప్పారు. ఇవి తప్పుడు ఆరోపణలని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కొట్టిపారేశారు. -
మౌలిక వ్యవస్థలపై భారీ దాడులు
టెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ పోరాటం ఆదివారం తొమ్మిదో రోజుకు చేరింది. ఇరాక్ రాజధాని టెహ్రాన్తో పాటు అల్బోర్జ్లోని చమురు లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. నాలుగు చమురు నిల్వ కేంద్రాలతో పాటు ఉత్పత్తి, బదిలీ కేంద్రంపైనా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు ట్యాంకర్ డ్రైవర్లు మరణించారు. టెహ్రాన్ వీధుల్లో చమురు ఏరులై ప్రవహించింది. చమురుకు మంటలంటుకొని అగి్నధారలను తలపించాయి. యాజ్డ్, టెహ్రాన్, ఇస్పహాన్ నగరాలపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడింది.భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇస్పహాన్లో వర్క్షాపులను, హార్స్రైడింగ్ క్లబ్ను బాంబులు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. ఇస్పహాన్ ఎయిర్పోర్టులో ఇరాన్కు చెందిన ఎఫ్–14 విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునియలు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. టెహ్రాన్లో ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశామని పేర్కొంది.ఈ కార్యాలయాన్ని ఉగ్ర కార్యకలాపాలతో పాటు ఇజ్రాయెల్పై నిఘా కోసం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) వాడుకుంటోందని ఆరోపించింది. ఐఆర్జీసీ ఇంటర్నల్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్, 50 ఆయుధ బంకర్లు, గ్రౌండ్ ఫోర్స్ కాంపౌండ్ను నామరూపాల్లేకుండా చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు, మరొక బంగ్లావాసి మరణించినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. 12 మంది బంగ్లాదేశీలు గాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికా రాడార్లు నేలమట్టం కువైట్పై ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది. అల్–అదిరీ ఎయిర్బేస్పై మిస్సైల్, డ్రోన్ను ప్రయోగించింది. అమెరికా హెలికాప్టర్ మరమ్మతు కేంద్రాన్ని, ఇంధన ట్యాంకులను, కమాండ్ పోస్టు ధ్వంసం చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. యూఎస్ థాడ్ క్షిపణిరక్షణ వ్యవస్థకు సంబంధించిన నాలుగు రాడార్లను గత 24 గంటల్లో నేలమట్టం చేశామని వెల్లడించింది. ప్రెసిషన్–గైడెడ్ మిస్సైళ్లతో ఈ దాడికి దిగినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. బహ్రెయిన్లోని నీటి శుద్ధి కేంద్రంపైనా ఇరాన్ సైన్యం దాడికి దిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ యుద్ధంలో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. తొలుత అమెరికా–ఇజ్రాయెల్ సైన్యమే తమ డిశాలినేషన్ ప్లాంట్పై వైమానిక దాడులకు పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు. ఎడారి ప్రాంతమైన గల్ఫ్లో తాగునీటికి డిశాలినేషన్ ప్లాంట్లే ప్రాణాధారం. స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో∙నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి పయనమవుతున్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటికే 32,000 మందికిపైగా పౌరులు అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మిగతావారి కోసం ప్రత్యేకంగా విమానాలు సమకూర్చినట్లు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. మంటల్లో కువైట్ విమానాశ్రయం, ప్రభుత్వ భవనాలుఇరాన్ సైన్యం కువైట్ సిటీపై డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో బహుళ అంతస్థుల భవనం మంటల్లో చిక్కుకుంది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. నగరమంతా సైరన్ల మోత వినిపించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నేలకూలి్చంది. కానీ, ఆకాశం నుంచి వేగంగా దూసుకొచి్చన శకలాల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.ఇరాన్ దాడుల్లో ఇద్దరు కువైట్ బోర్డర్ సెక్యూరిటీ జవాన్లు మృతిచెందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)పైనా ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ సైన్యం 16 బాలిస్టిక్ క్షిపణులు, 117 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ పేర్కొంది. తోటి ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సరికొత్త హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై దాడులకు ఆయా దేశాల భూభాగాలను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తే ధీటుగా బదులిస్తామని, తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని స్పష్టంచేశారు. -
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం.. ఏం జరగబోతుంది?
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి దాదాపు తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఈ యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. దాడులను మరింత విస్తరిస్తామని.. చాలా బలంగా దెబ్బతీస్తామంటూ ఇరాన్కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారి సమాధుల్లోనే కలిసిపోతుందంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఘాటుగానే స్పందించారు.కాగా, రెండు, మూడు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది. యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.హార్మూజ్ గుండా భారత్కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు. -
ఇరాన్ కొత్త నాయకుడి ప్రకటనపై అందుకే జాప్యం..
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని.. కొత్త నాయకుడిని ఎన్నుకున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాయకుడిని అసెంబ్లీ సెక్రటేరియట్ అధిపతి ప్రకటించనున్నారు. అధికారికంగా పేరుబయట పెట్టకపోయినప్పటికీ ఖమేనీ కుమారుడు మజ్తబానే కొత్తనాయకుడంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది.వారసత్వ నాయకత్వంపై అసెంబ్లీలో కొంతమంది సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కొత్త నాయకుడి ప్రకటన జాప్యం అవుతుందని సమాచారం. కొత్త నాయకుడిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున.. కొత్త నాయకుడి పేరు ప్రకటించే లోపు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరు? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. -
అందుకే భారత్కు మినహాయింపు ఇచ్చా: ట్రంప్
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “కొంత ఒత్తిడిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. మా దేశంలో భారీగా చమురు ఉంది. బయటి దేశాల్లో కూడా చాలా చమురు ఉంది. చమురు సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది” అని ట్రంప్ తెలిపారు.కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై అమెరికా-భారత్ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేయిస్తున్న యుద్ధానికి భారత్ చమురు కొనుగోలు ద్వారా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీని ద్వారా దెబ్బతింటున్నాయని విమర్శించింది.ఇదీ చదవండి: నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి మరోవైపు, అమెరికాలోని ప్రజలు, వ్యాపారాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు, మోసాలు, దోపిడీదారులపై విస్తృతంగా చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంతకం చేశారు.ఆ ఆదేశం ప్రకారం అమెరికా విదేశాంగ కార్యదర్శి విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి భూభాగాల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరాల్సి ఉంటుంది. -
నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి
సాధారణంగా అంత్యక్రియలు అనగానే మనకు ఖననం చేయడం, దహన సంస్కారాలు నిర్వహించడం మాత్రమే గుర్తుకొస్తాయి. అంత్యక్రియలు అనేవి మతపరమైన, సామాజిక, కుటుంబపరమైన విలువలతో కూడి ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతడి మృతదేహాన్ని ఎంతో గౌరవంగా సాగనంపాలని భావిస్తాం. ఇప్పటివరకైతే ఖననం, దహన సంస్కారాలు వంటివాటినే పాటిస్తున్నాం. యుగయుగాలుగా ఉన్న ఈ సంప్రదాయాలకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పద్ధతులు వస్తున్నాయని మీకు తెలుసా? నీటి ద్వారా అంతిమ సంస్కారాలు (వాటర్ క్రిమేషన్) నిర్వహించుకునే పద్ధతి కూడా ఉంది. తాజాగా, వాటర్ క్రిమేషన్కు స్కాట్లాండ్ చట్టబద్ధ అనుమతి ఇచ్చింది. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఇటువంటి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, నీటిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల అవుతాయని స్కాట్లాండ్ భావిస్తోంది. ఈ నిర్ణయం స్కాట్లాండ్లోని అంత్యక్రియల చట్టాల్లో 100 సంవత్సరాలకు పైగా కాలంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ. ఈ పద్ధతిలో ఎలా చేస్తారు?వాటర్ క్రిమేషన్ కోసం స్కాట్లాండ్ పార్లమెంట్ ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అనే విధానానికి ఆమోదముద్ర వేసింది. ఈ విధానాన్ని సాధారణంగా వాటర్ క్రిమేషన్ లేదా ఆక్వమేషన్ అని పిలుస్తారు. ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే నీరు, ఆల్కలైన్ రసాయనాల సాయంతో శరీర కణజాలాన్ని వేగంగా సహజ విచ్ఛిన్నం చేసే శాస్త్రీయ ప్రక్రియ.ఈ విధానంలో ఒత్తిడి తట్టుకునే స్టెయిన్లెస్ స్టీల్ ఛాంబర్లో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ ఛాంబర్లో 95 శాతం నీరు, 5 శాతం ఆల్కలైన్ రసాయనాల ద్రావణం నింపుతారు. ద్రావణాన్ని సుమారు 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు. 3 నుంచి 4 గంటల సమయంలో మృదు కణజాలం పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. చివరగా ఎముక ముక్కలు మాత్రమే మిగులుతాయి. వాటిని ఎండబెట్టి సాంప్రదాయ దహనంలో వచ్చే బూడిదలా తెల్లటి పొడిగా తయారు చేస్తారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియలో నేరుగా ఉద్గారాలు విడుదల కావు. సాధారణ దహనం కంటే చాలా తక్కువ శక్తి వినియోగం జరుగుతుంది. కార్బన్ ఫుట్ప్రింట్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ ఫుట్ప్రింట్ అంటే ఒక చర్య వల్ల వాతావరణంలో విడుదలయ్యే మొత్తం గ్రీన్హౌస్ గ్యాసెస్ పరిమాణం.ప్రజల ఇష్టానికి ప్రాధాన్యంఆరోగ్య మంత్రి జెన్నీ మింటో తెలిపిన వివరాల ప్రకారం.. అంతిమ సంస్కారాలు వంటి నిర్ణయాలు చాలా వ్యక్తిగతమైనవి. సంస్కృతి, పర్యావరణ అవగాహన, కుటుంబ విలువలు వంటి అంశాలు వాటిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు వాటర్ క్రిమేషన్ను కూడా తీసుకురావడంతో మృతుల కుటుంబాలకు కొత్త ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. 2023లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 84 శాతం మంది ఈ విధానం ప్రవేశపెట్టడానికి సమర్థించారు.ఈ సేవలు ఎప్పటి నుంచి షురూ? చట్టబద్ధ అనుమతి వచ్చినప్పటికీ వాటర్ క్రిమేషన్ సేవలు వెంటనే ప్రారంభం కావు. ఈ కేంద్రాలు ప్రారంభం కావాలంటే మరిన్ని అనుమతులు అవసరం. అధికారుల అంచనా ప్రకారం.. మొదటి వాటర్ క్రిమేషన్ కేంద్రం 9 నెలల్లో ప్రారంభం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణవాటర్ క్రిమేషన్ ఇప్పటికే కెనడా, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో అమలులో ఉంది. వాటర్ క్రిమేషన్ ద్వారా పర్యావరణ ప్రయోజనాలు ఉండడంతో అనేక కుటుంబాలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. పర్యావరణ సంస్థలు స్కాట్లాండ్ నిర్ణయాన్ని ప్రశంసించాయి. భవిష్యత్తులో ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి చట్టాలు రావచ్చు. -
పశ్చిమాసియాలో నిప్పుల వాన.. ఇజ్రాయెల్ ట్రెండింగ్లో యాప్
అహ యేమి హాయిలే హలా.. అంటూ హాయిగా స్నానం చేసే భాగ్యం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇరాన్ దాడుల వేళ నచ్చినప్పుడు బాంబ్ షెల్టర్ల నుంచి బయటికొచ్చి ఇంట్లో కిటికీల సమీపంలో స్నానం చేసే ఆస్కారం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాంబులు పడితే ఇక అంతే. అందుకే ఇప్పుడు ఇజ్రాయెలీల స్నానభయాలను పోగొట్టేందుకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. రోజులో ఏ సమయంలో క్షిపణులు తక్కువ పడే అవకాశం ఉందో అంచనావేసి యూజర్లకు సూచిస్తుంది. అవసరం.. ఆవిష్కరణకు తల్లిలాంటిది అంటారు.అలా ఇజ్రాయెలీల పలు రకాల అవసరాలకు తగ్గట్లు వినూత్న యాప్లు ఇప్పుడు ఆ దేశంలో హల్చల్ చేస్తున్నాయి. రాకెట్లు తక్కువగా పడే సమయాన్ని దాదాపు ఖచ్చితంగా అంచనావేసి చెప్పే ‘కెన్ ఐ షవర్?(నేనిప్పుడు స్నానం చేయొచ్చా?’అనే యాప్ ఇప్పుడు అక్కడ తెగ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అంకురసంస్థల దేశంగా పేరొందిన ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ యాప్కు ట్రెండింగ్లో ఉంది. యాప్ను ఉపయోగించే యూజర్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? బాంబు షెల్టర్ నుంచి అతని స్నానాల గది ఎంత దూరంలో ఉంది? అతను ఎంతసేపు స్నానంచేస్తాడు?స్నానంచేశాక తిరిగి బాంబుషెల్టర్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను యాప్కు అందజేస్తే ఆయా వ్యక్తులు స్నానంచేసే వేగం, షెల్టర్ దూరం, క్షిపణులు పడే అవకాశాలను గణించి ఆయా వ్యక్తులకు తగ్గట్లుగా ‘స్నానం సమయం’ను యాప్ సూచిస్తుంది. రోజులో ఎన్ని గంటలకు బాత్రూమ్కు వెళ్లాలో చెబుతుంది. రాకెట్లు పడిన సమయాలు, ఎంతసేపు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎంత సేపు ప్రభుత్వం అలర్ట్లు, సైరన్లు ఇచ్చిందనే డేటాను విశ్లేషించి ఆరోజుకు ‘సురక్షిత స్నాన సమయం’ను యాప్ సూచిస్తుంది. ‘హోం ఫ్రంట్ కమాండ్’, ‘రెడ్ అలర్ట్’వంటి యాప్లు సైతం వార్నింగ్ సందేశాలను పంపిస్తూ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.యుద్ధంలోనూ ప్రేమ.. యుద్ధజ్వాలల్లోనూ ప్రేమాగ్నిలో కరిగిపోయే జంటలు, యువత కోసం విభిన్నమైన యాప్లు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బయటికొచ్చాక సైరన్లు మోగగానే సమీప బంకర్ వైపు పరుగెడతారు. అప్పటికే ఆ బంకర్లో మనకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? మనతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఎవరైనా ఆసక్తిచూపిస్తున్నారా? అని తెల్సుకునేందుకు కొన్నియాప్లు రంగంలోకి దూకాయి. బంకర్ ముఖద్వారాల వద్ద క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెచ్చా రు. ఆ కోడ్ను స్కాన్చేస్తే ఆ బంకర్లో ఉన్న వాళ్ల సోషల్మీడియా ప్రొఫైళ్లు ప్రత్యక్షమవుతాయి. కావాలంటే వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం లేదా చాటింగ్ మొదలెట్టవచ్చు. ఏకాకులుగా ఉండిపోయిన సింగిల్స్తో మాట్లాడించే డేటింగ్ యాప్లూ బాంబర్ల వద్ద క్యూఆర్ కోడ్రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. సురక్షిత మార్గాలనూ చూపుతూ.. ఇప్పటిదాకా క్షిపణులు పడని ప్రాంతాలను గుర్తించి స్థానికులకు ఆయా సమాచారాన్ని కొన్ని యాప్లు చేరవేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ఇతరులు ఆ డేటా ప్రకారమే సురక్షిత రోడ్లు మార్గాల్లోనే ప్రయాణించేందుకు అవకాశం చిక్కుతోంది. వేరే ప్రాంతాలకు వచ్చినప్పుడు సమీపంలోని షెల్టర్ లొకేషన్ను సూచించే యాప్లు వచ్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్.. డీజిల్!
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్ పెంపు విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 55 పాకిస్తాన్ రూపాయలు పెంచి 321.17 రూపాయలకు నిర్ణయించింది. అలాగే డీజిల్ ధరను లీటరుకు 335.86 రూపాయలకు పెంచింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇది అతిపెద్ద ధర సర్దుబాట్లలో ఒకటిగా భావిస్తున్నారు.ద్రవ్యోల్బణంపై ప్రభావంఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం సాధారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలుధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.ప్రభుత్వం హెచ్చరికఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్య పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియకపోవడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాలు ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
ట్రంప్ నిన్ను వదలం.. ఖమేనీ సన్నిహితుడి వార్నింగ్
ఇరాన్ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు."మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.వెనెజువెలా మాదిరి ఇరాన్లో కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు. గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు. -
Women's Day: 20, 30, 40, 50ల్లో ఇవి తప్పనిసరి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నారీ శక్తి గురించి చర్చలు జరుగుతున్నాయి. వయసు మారుతున్న కొద్దీ మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ‘ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్’ కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసులో ఏయే పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.20 ఏళ్ల ప్రాయంలో వ్యాక్సినేషన్జీవితంలో అత్యంత చురుగ్గా ఉండే 20 ఏళ్ల వయసులో మహిళలు తమ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. ఈ దశలో ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాప్ స్మియర్ పరీక్షతో పాటు, హెచ్ పీవీ (HPV) వ్యాక్సినేషన్ తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు రక్తహీనతను గుర్తించే హిమోగ్లోబిన్ పరీక్ష, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. నెలసరిలో ఏవైనా అసాధారణ మార్పులు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం తప్పనిసరి.30 ఏళ్లలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ముప్పై ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత సంతానోత్పత్తి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు మెటబాలిక్ సమస్యలపై మహిళలు దృష్టి పెట్టాలి. ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పాప్ స్మియర్ పరీక్షను కొనసాగించాలి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు, విటమిన్ లోపాలను గుర్తించే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే, ముందస్తుగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మేలు.40 ఏళ్లలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్నలభై ఏళ్లు దాటిన మహిళల్లో 'పెరీ మెనోపాజ్' (మెనోపాజ్ ముందు దశ) లక్షణాలు మొదలవుతాయి. ఈ వయసులో ప్రతి రెండేళ్లకోసారి మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. రక్తపోటు, థైరాయిడ్, హార్మోన్ల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే ఎముక సాంద్రతను తెలిపే 'బోన్ డెన్సిటీ' పరీక్షను కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.50 ఏళ్లలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీయాభై ఏళ్ల వయసులో మెనోపాజ్ కారణంగా ఎముకలు బలహీనపడటం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దశలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, కార్డియాక్ రిస్క్ అసెస్మెంట్, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి తదితర సమస్యలు తీవ్రంగా ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT)పై వైద్యుల సలహా తీసుకోవాలి.60 ఏళ్ల పైబడిన తర్వాత..అరవై ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ (RFT), లివర్ (LFT) ఫంక్షన్ టెస్టులతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన 'కాగ్నిటివ్ హెల్త్' పరీక్షలు చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం లేదా పొత్తికడుపులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును కలవాలి.ముందస్తుగా చేయించుకునే ఇటువంటి ఆరోగ్య పరీక్షలు ప్రాణాంతక వ్యాధులను ప్రారంభంలోనే అడ్డుకునేందుకు సహకరిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం వల్ల చికిత్స ఖర్చు తగ్గడమే కాకుండా, ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ -
న్యూయార్క్ మేయర్ మమ్దాని ఇంటి వద్ద కలకలం
వాషింగ్టన్: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని ఇంటి వద్ద కలకలం చెలరేగింది. మామ్దానికి చెందిన గ్రేసీ మాన్షన్ ఇంటి ముందు ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరాడు. ఫార్ రైట్ ఇన్ప్లుయెన్సర్ జేక్ లాంగ్.. గ్రేసీ మాన్షన్ ముందు "ఇస్లామీకరణ"కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్లో ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు నిలిపివేయాలని జేక్ లాంగ్ డిమాండ్ చేశారు.న్యూయార్క్ పోలీస్ శాఖ కమిషనర్ జెసికా టిష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనకారుడు విసిరిన పరికరంలో నట్స్, బోల్ట్స్, స్క్రూలు, ఫ్యూస్ ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు, ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధానికి సంబంధం లేదని అధికారులు చెప్పారు. ముస్లిం మేయర్ అయిన మమ్దానిపై “ఇస్లామీకరణ” ఆరోపణలు చేస్తూ ఈ నిరసన తెలిపారని అన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సుమారు 20 మంది నిరసనలో పాల్గొన్నారు. నలుపు రంగు హుడ్ స్వెట్షర్ట్, బేజ్ కార్గో ప్యాంట్ ధరించిన వ్యక్తికి మరొక కార్యకర్త టేప్ చుట్టిన, పొగ వస్తున్న పరికరం ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీసుల దగ్గర ఆ పరికరం వదిలి, వెంటనే అక్కడి బారికేడ్ను దాటి వెళ్లాడు.అదే వ్యక్తి లాంగ్ చుట్టూ నిలిచిన నిరసనకారుల దగ్గర ఇలాంటి మరొక పరికరం విసిరాడు. “ఆ పరికరం నుంచి మంటలు, పొగ వచ్చాయి. అది పోలీసుల దగ్గర కొన్ని అడుగుల దూరంలో ఉన్న బారికేడ్ను కూడా తాకింది” అని అధికారులు తెలిపారు. అనుమానితుడు 18 ఏళ్ల అమీర్ బాలట్ అని అన్నారు. నిరసన జరిగిన ప్రదేశంలో భారీగా మోహరించిన పోలీసులు వెంటనే నిందితుడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.“బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. ప్రాథమిక పరీక్షలు, ఎక్స్రే పరిశీలన తర్వాత ఆ పరికరాలు ఫుట్బాల్ కంటే కొద్దిగా చిన్న పరిమాణంలో ఉన్న సీసాల్లా కనిపించాయి. వాటిపై నల్ల టేప్ చుట్టి, లోపల నట్స్, బోల్ట్స్, స్క్రూలు, హాబీ ఫ్యూస్ అమర్చారు” అని అధికారులు చెప్పారు. ఆ పరికరాల్లో నిజంగా పేలుడు పదార్థం ఉందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. జేక్ లాంగ్ టీమ్ నుంచి ఒక నిరసనకారుడు పెప్పర్ స్ప్రే వాడాడని, ఆ ఘటనలో పోలీసులు అతనిని కూడా అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు. -
" ప్రెసిడెంట్ మీ పని మీరు చూసుకొండి "
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రెండు సౌర్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాది రాయన్నారు. అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకోవాలని హెచ్చరించారు.ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగిక విషయాలు పలు మార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు చమురు కోనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్రంప్కు లేఖ రాశారు. " ప్రియమైన ప్రెసిడెంట్ భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి" అన్నారు. సౌర్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు శాంతి, సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.అంతకు మందు స్కాట్ బెసెంట్ " ఇండియన్స్ మంచి యాక్టర్స్, వారికి మేము రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని కోరాం. వారు అలానే చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆజ్ఞలకు తాత్కాలిక విరమింపు ఇచ్చాం. వారికి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చాం" అని అన్నారు. దీంతో బీసెంట్ వ్యాఖ్యలపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ToThe President of the United States of America @POTUSDear Mr. President, We, the people of India, belong to a free and sovereign nation. We no longer take orders from distant foreign shores.Please mind your own business to the best of your abilities.Mutual respect…— Kamal Haasan (@ikamalhaasan) March 7, 2026 -
రష్యాలో ఆఫ్రికన్ యువత మృత్యు ఘోష
డర్బన్: విదేశాల్లో భారీ జీతంతో కూడిన ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. ఇవీ అక్కడి యువతకు చూపిన ఆశలు. కానీ కట్ చేస్తే, చేతిలో తుపాకీ.. కళ్లెదుట మృత్యుఘోష. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికా లోని పేద యువతను ఎలా బలిపీఠం ఎక్కిస్తోందో చాటిచెప్పే హృదయవిదారక ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రష్యా తరఫున ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి పంపిన దక్షిణాఫ్రికా యువకులు చావును తప్పించుకుని స్వదేశానికి చేరుకున్నారు.ఈ భారీ కుంభకోణం వెనుక దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కుమార్తె, దుదుజైల్ జుమా-సంబుడ్లా ఉన్నట్లు ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. వీఐపీలకు భద్రతా సిబ్బందిగా శిక్షణ ఇస్తామని నమ్మించి, ఎంపిక చేసిన యువకులను నేరుగా ఉక్రెయిన్లోని డాన్బాస్ రణక్షేత్రానికి తరలించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో దుదుజైల్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా, ప్రస్తుతం ఆమెపై పోలీసు విచారణ కొనసాగుతోంది.స్వదేశానికి చేరుకున్న సిపో ద్లామిని అనే బాధితుడు తన చేదు అనుభవాలను పంచుకుంటూ.. ‘మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లగానే మా దుస్తులు, పత్రాలు, కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా అన్నింటినీ తగలబెట్టించారు. కనీస శిక్షణ కూడా లేకుండానే తుపాకులు ఇచ్చి, యుద్ధ భూమికి పంపారు. అక్కడ ఆఫ్రికన్ల పరిస్థితి అత్యంత దారుణం. రష్యా సైనికులు మమ్మల్ని జాతి వివక్షతో దూషించేవారు. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలకు మమ్మల్ని ఎరగా పంపేవారు’ అని వాపోయాడు. డ్రోన్ దాడుల్లో కొందరు తమ అవయవాలను కోల్పోగా, మరికొందరు ప్రాణాలు విడిచినట్లు బాధితులు వెల్లడించారు.దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిపిన చర్చల ఫలితంగా ఇప్పటివరకు 15 మంది యువకులు స్వదేశానికి చేరుకున్నారు. యుద్ధ భూమిలో ప్రాణాలు పోగొట్టుకున్న తోటి మిత్రుల జ్ఞాపకాలు వెంటాడుతుండగా, మరోవైపు విదేశీ యుద్ధాల్లో పాల్గొనడాన్ని నిషేధించే దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం వీరిపై విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘హాక్స్’ (Hawks) దర్యాప్తు సంస్థ ఈ అక్రమ రవాణాపై విచారణ జరుపుతోంది. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని, వారిని కిరాయి సైనికులుగా మారుస్తున్న అంతర్జాతీయ ముఠాల ఆగడాలకు ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: కారును 150లో పోనిస్తూ.. యూట్యూబర్ ఆత్మహత్యాయత్నం -
బంగ్లాదేశ్లో అలా.. నేపాల్లో ఇలా
కాఠ్మాండు: బంగ్లాదేశ్, నేపాల్లో జెన్ జీ ఉద్యమాల వల్ల అప్పట్లో ఆ రెండు దేశాల ప్రభుత్వాలు కుప్పకూలాయి. అయితే, ఆ ఉద్యమాల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో మాత్రం ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. అంటే నేపాల్లో జెన్ జీ ఉద్యమం ద్వారా పేరు తెచ్చుకున్న బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. బంగ్లాదేశ్లో మాత్రం 1978లో స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విజయం సాధించి, విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీ ఓడిపోయింది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జరిగిన నిరసనల లక్ష్యం ఒక్కటే.. అదే ప్రస్తుత వ్యవస్థను మార్చడం. ఇప్పుడు నేపాల్లో జెన్ జీల అభిమాన నేత బాలేంద్ర షా విజయం సాధిస్తే, బంగ్లాదేశ్లో జెన్ జీల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పార్టీ వైఫల్యం చెందింది. బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలోనే విప్లవం వచ్చింది. ఆ జెన్ జీ ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చినా, విద్యార్థుల నేతృత్వంలోని ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.బంగ్లాదేశ్లో నిరసనలు ఛత్ర శిబిర్ వంటి శక్తుల ద్వారా ప్రారంభమయ్యాయి. అది బంగ్లాదేశ్లోని ఒక ప్రధాన ఇస్లామిక్ విద్యార్థి సంఘం పేరు. దీని పూర్తి పేరు బంగ్లాదేశ్ ఇస్లామీ విద్యార్థి శిబిర్. దీన్ని 1977లో స్థాపించారు. బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమానికి హసీనా ప్రభుత్వాన్ని తొలగించడం అనే స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది.నేపాల్లో నిరసనలు సహజంగా ఉద్భవించాయి. ప్రధాన దృష్టి మొత్తం పాత వ్యవస్థను కూల్చడం. దీంతో 35 ఏళ్ల బాలేంద్ర షా వంటి నాయకులు పాత రాజకీయ పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయాలుగా ఎదగగలిగారు.బంగ్లాదేశ్ విద్యార్థుల ఉద్యమం దేశ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని సృష్టించలేకపోయింది. ఆ ఉద్యమం ప్రధానంగా అప్పటి ప్రధానమంత్రి హసీనాను తొలగించడం మీదే కేంద్రీకృతమైంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపలేకపోయింది. మరోవైపు, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు హసీనా ప్రభుత్వం కూలిన తరువాత త్వరగా వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు తాత్కాలిక ప్రభుత్వంలో పదవులు కూడా స్వీకరించారు. దీంతో వారు మార్పును కాకుండా అధికారాన్ని కోరుకుంటున్నారని అనేక మంది భావించారు. ఈ విధంగా బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు తమ ప్రతిష్ఠను దెబ్బతీసుకున్నారు. జమాత్ పార్టీతో చేతులు కలపడం వల్ల వారు ఇతర రాజకీయ శక్తితో కలిసినట్టు కనిపించింది. బంగ్లాలో తారిక్ రహ్మాన్ ప్రభావం ఇలా..హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిక్ రహ్మాన్ నమ్మకమైన నేతగా ఎదిగారు. అప్పటికే బంగ్లాలో ఉన్న రాజకీయ వ్యవస్థ నుంచే వచ్చిన నాయకుడు అయినా, 17 సంవత్సరాలు వేరే దేశంలో నివసించారు. తారిక్ రహ్మాన్ కొత్త ఆలోచనలు, కొత్త విధానం, ముఖ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి స్పష్టమైన విజన్ను చూపించారు. ఆయన “ఐ హావ్ ఏ ప్లాన్” ప్రసంగం ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుందో చెప్పింది. ఈ విధానం ఫలించింది. నేపాల్లో బాలేంద్ర షా ఇలా..గత సంవత్సరం సెప్టెంబరులో నేపాల్లో జెన్ జీ నిరసనలు చెలరేగాయి. కారణం సామాజిక మాధ్యమాల నిషేధం. తర్వాత ప్రభుత్వం ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ అవినీతిపై జెన్ జీ పోరాడింది.బాలేంద్ర షా మొదట “బలెన్” అనే పేరుతో రాపర్గా ప్రసిద్ధి చెందారు. ఆయన పాటలు సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతిని విమర్శించేలా ఉండేవి. యువతను ఆకర్షించాయి. తర్వాత ఆయన కాఠ్మాండు మేయర్గా ఎన్నికయ్యారు. నిరసనల సమయంలో ప్రధానమంత్రి పదవిని చేపడతారా అని అడిగినప్పుడు ఆయన తిరస్కరించారు.కాఠ్మాండు మేయర్గా బలెన్ షా పనిచేసిన అనుభవం ఆయనకు సాయపడింది. ముఖ్యంగా సాధారణ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడం, ప్రజా భూములపై ఆక్రమణలు తొలగించడం, దీర్ఘకాల చెత్త నిర్వహణ సమస్య పరిష్కారం వంటి అంశాలపై పని చేశారు.ప్రచార సమయంలో ఆయన సభలకు భారీ జనసందోహం వచ్చేది. ఆయన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా సాయపడ్డారు. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. -
లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్
పశ్చిమాసియా మెుత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ బలగాలు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నాయి. 1986 యుద్ధంలో మృతిచెందిన ఓ సైనికుడి మృతదేహం కోసం అర్థరాత్రి వేళ గాలింపులు జరిపాయి.ప్రస్తుతం లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకెళ్లింది. ఆ దేశంలోకి చొరబడి హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కడ టెల్ అవీవ్ ఒక ఆసక్తికర ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 1986లో లెబనాన్తో యుద్ధం సమయంలో రాన్ అరాద్ అనే ఇజ్రాయెల్ ఫైలట్ మరణించాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్పై దాడిచేయగా అది తూర్పు లెబనాన్లోని బెక్కా లోయ సమీపంలో నబిట్ అనే గ్రామం వద్ద కూలిపోయింది.అయితే ఆరోజు జరిగిన దాడిలో ఫైలట్ అరాద్ మరణించినట్టు ఇజ్రాయెల్ అప్పుడే నిర్ధారించింది. ఆయన మృతదేహాన్ని వెనక్కితీసుకురావడానికి ప్రయత్నాలు జరుపగా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం దానికి సరైన సమయం అని భావించిన ఇజ్రాయెల్ ప్రత్యేక కమెండోలను రంగంలోకి దించింది. నాలుగు సైనిక హెలికాప్టర్లతో శుక్రవారం రాత్రి వేళ నబిట్ ప్రాంతానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.తాజాగా ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని పంచుకున్నారు. "ఇజ్రాయెల్ సైనికులు నాలుగు హెలికాప్టర్లలో వచ్చారు. ఆ లోయ ప్రాంతంలో ఆ సైనికుడి మృత దేహం కోసం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అయితే అతని డెడ్బాడీ కోసం మరోసారి వెతుకతామని వారు తెలిపారు" అని గ్రామస్థులు పేర్కొన్నారు.అయితే అరాద్ అవశేషాలు దొరికే దాకా గాలింపు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ తమ దేశ సైనికులకు ఎంత గౌరవం ఇస్తుందా అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అరాద్ను ఎక్కడ పూడ్చిందీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. హెజ్బొల్లా దళాలను విచారించి ఆ ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం. -
ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ
ఓ వైపు తమ పరిసర దేశాలపై దాడులు చేయమని ప్రకటించిన ఇరాన్... మరోవైపు అటాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దుబాయిపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకపడినట్లు యూఏఈ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందగా 112 మంది గాయపడ్డట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లోని యుఎస్ఏ మిలిటరీ స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిన్న (శనివారం) స్పందించారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరిపినందుకు క్షమాపణలని ఇకపై దాడులు జరపమన్నారు. అయితే వారి దేశం నుంచి అమెరికా దాడులు చేయకుండా చూసుకోవాలని కోరారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యుఏఈపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందియుఏఈ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేస్తూ "7 వతేదీ శనివారం రోజు యుఏఈ పై ఇరాన్ 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో 15 క్షిపణులు, 119 డ్రోన్లు గాలిలోనే కూల్చివేయబడ్డాయి. ఇప్పటివరకూ మెుత్తంగా 221 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడగా 205 క్షిపణులను గాలిలోనే కూల్చివేశాము. 14 సముద్రంలో పడ్డాయి. 2 క్షిపణులు మాత్రం యూఏఈ భూభాగాన్ని తాకాయి. అదేవిధంగా 1,305 డ్రోన్లను ప్రయోగించగా 1,229 కూల్చివేశాము. 76 డ్రోన్లు భూభాగాన్ని తాకాయి." అని తెలిపిందికాగా ఇప్పటి వరకూ ఈ దాడులలో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందారని వారు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులను పేర్కొంది. అయితే ఇరాన్ జరిపిన అటాక్స్ వల్ల 112 మందికి స్వల్ప గాయాలయ్యాయాయని అందులో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నారని యుఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. -
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తి..!
పశ్చిమాసియాలో కురుస్తున్న నిప్పుల వాటనఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్న అమెరికా,ఇజ్రాయెల్వెనక్కి తగ్గని ఇరాన్ -
దుబాయ్: మెరీనా టవర్పై ‘బాలిస్టిక్’ శకలాలు.. యూఏఈ అప్రమత్తం
దుబాయ్: గల్ఫ్ తీరంలో యుద్ధ మేఘాలు విస్తరిస్తున్న తరుణంలో దుబాయ్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకున్నప్పటికీ, ఆ క్షిపణి శకలాలు దుబాయ్ మెరీనాలోని ఒక ఎత్తైన భవనంపై పడటంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనలో భవనం పైభాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటాన్ని అధికారులు గుర్తించారు.గల్ఫ్ రీజియన్లో ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన గగనతల భద్రతను మరింత పటిష్టం చేసింది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లను యూఏఈ రక్షణ విభాగం గుర్తించింది. వీటిలో 15 క్షిపణులను, 119 డ్రోన్లను గాలిలోనే కూల్చివేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూల్చివేసిన ఒక క్షిపణి శకలాలు దుబాయ్ మెరినాలోని ఒక టవర్ ఫాసాడ్పై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని దుబాయ్ ప్రభుత్వ మీడియా విభాగం తెలిపింది.యుద్ధ సంక్షోభం మొదలైన తర్వాత మొదటిసారిగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబి టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మనం ఇప్పుడు యుద్ధ సమయంలో ఉన్నాం. ఈ గడ్డుకాలాన్ని ఎదుర్కొని మరింత శక్తివంతంగా మారుతాం’ అని ఆయన దేశప్రజల్లో ధైర్యాన్ని నింపారు. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ పొరుగు దేశాలపై జరుగుతున్న దాడులపై విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో పొరుగు దేశాలకు కలిగిన ఇబ్బందులకు ఆయన క్షమాపణలు తెలిపారు.తమపై దాడులు జరిగితే తప్ప, తాము ఏ పొరుగు దేశంపైకి క్షిపణులను ప్రయోగించబోమని ఇరాన్ స్టేట్ టీవీ వేదికగా ప్రకటించారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేసిన 'బేషరతు లొంగుబాటు'ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇరాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్ అణు కార్యకలాపాలకు నిరసనగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో ఇరాన్పై భారీ దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ♦️ התקפת כטב"ם על מגדל רב הקומות בעיר דובאי pic.twitter.com/swNhyNGk4z— Asslan Khalil (@KhalilAsslan) March 7, 2026 -
పూటకో మాట!
ఒకటే నోరు. కానీ పూటకో మాట. రోజుకోవైఖరి. ఇరాన్ యుద్ధంపై అమెరికా, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి విస్మయం గొలుపుతోంది. సహేతుకమైన కారణమేదీ లేకుండానే ఏకపక్షంగా తెర తీసిన ఈ యుద్ధాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక అగ్ర రాజ్యం కిందా మీదా పడుతోంది. ఫిబ్రవరి 28న శనివారం ఇజ్రాయెల్తో కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరిట ఇరాన్పై అమెరికా భారీ స్థాయి యుద్ధానికి దిగడం తెలిసిందే. ఆ క్రమంలో యుద్ధ కారణాలకు సంబంధించి ట్రంప్ మొదలుకుని ఆయన యంత్రాంగంలోని ఇతర నేతల దాకా పదేపదే మాట మారుస్తూ నవ్వులపాలు అవుతున్నారు.ఇప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క ఆమోదయోగ్యమైన కారణం కూడా చూపలేకపోయారు. ఫలితంగా ట్రంప్ సర్కారు సొంత ప్రజల దృష్టిలోనే పలుచన కావడంతో పాటు స్వదేశంలో శరవేగంగా ఆదరణ కోల్పోతోంది. ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యమని ట్రంప్ తొలుత చెప్పారు. తర్వాత అణు ముప్పును బూచిగా చూపారు. కొన్ని కారణాలైతే పరస్పర విరుద్ధంగా కూడా ఉండటం విశేషం! ఇలా యుద్ధం మొదలైన ఈ 8 రోజుల్లోనే ట్రంప్, ఆయన యంత్రాంగం పదేపదే మాట ఎలా మారుస్తూ వచ్చిందంటే...ఇరాన్ విముక్తి కోసమే!ఇరాన్ మత పాలకుల దశాబ్దాల దమననీతికి బదులిచ్చేందుకు, వారి బారినుంచి ఆ దేశాన్ని విముక్తం చేసేందుకే యుద్ధం మొదలు పెట్టినట్టు ఫిబ్రవరి 28న శనివారం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉంది. దానికి చరమగీతం పాడబోతున్నాం. అలాగే ఇరాన్ క్షిపణి వ్యవస్థను కూడా పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాం’’ అని 8 నిమిషాల వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక, ‘‘ఈ సువర్ణావకాశాన్ని ఇరాన్వాసులు అందిపుచ్చుకోవాలి. దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకునే సాహసం ప్రదర్శించాలి’’ అంటూ పిలుపునిచ్చారు! అనంతరం తొలి బాంబులు ఇరాన్ను తాకిన కాసేపటికి ఆక్సియోస్ న్యూస్ వెబ్సైట్తో ట్రంప్ మాట్లాడారు. ‘‘యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగిస్తా. లేదంటే రెండు మూడు రోజుల్లోనే ముగించేస్తా. మా దాడి నుంచి కోలుకునేందుకు ఇరాన్కు ఎలాగూ ఏళ్లు పడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.స్వీయ రక్షణకే!ఫిబ్రవరి 28న యుద్ధం మొద లైన కాసేపటికే ఐక్యరాజ్య సమితిలో యూఎన్ మిషన్ మరో వైఖరి తీసుకుంది. స్వీయరక్షణ కోసమే ఇరాన్పై దాడికి దిగాల్సి వచ్చిందంటూ భిన్న స్వరం వినిపించింది! ‘‘ఇరాన్ క్షిపణి పాటవం, అణ్వాయుధ ఆకాంక్షలు గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలకు పెను ముప్పుగా మారాయి. అందుకే దానిపై దాడులు తప్పలేదు’’ అని చెప్పుకొచ్చింది. శాంతియుత పరిష్కారం కోసం ఎంతగా సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందంటూ ఐరాసలో అమెరికా రాయబారి వైక్ వాల్జ్ మొసలి కన్నీరు కార్చారు. ‘‘కనుక ఇజ్రాయెల్తో కలిసి దాడులకు దిగక తప్పలేదు. యూఎన్ చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం మా చర్య పూర్తిగా చట్టబద్ధమే’’ అంటూ వాదించారు. తమ చర్యను స్వాగతిస్తూ ఇరాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి మరీ పండుగ చేసుకుంటున్నారని అదేమీ లేదు!ఐరాసలో అమెరికా వినిపించిన స్వరాన్ని పెంటగాన్ వర్గాలు ఆ మర్నాడే ఖండించడం విశేషం! యుద్ధం మొదలైన మర్నాడు మార్చి 1న తాజా పరిస్థితిని అవి కాంగ్రెస్కు నివేదించాయి. ఆ క్రమంలో, ‘‘గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై గానీ, సిబ్బందిపై గానీ తొలుత దాడులకు దిగే ఉద్దేశం ఇరాన్కు ఏమాత్రమూ లేదు. దానిపై ఇజ్రాయెల్ తొలుత దాడి చేస్తే తప్ప ఇరాన్ నాయకత్వం అలాంటి ఆలోచన కూడా చేయబోదు’’ అని స్పష్టం చేశాయి!రూబియోను ఖండించిన ట్రంప్!రూబియో వ్యాఖ్యలను ఆ మర్నాడే ట్రంప్ ఖండించారు. ఇరాన్పై సైనిక చర్యకు దిగాలన్న నిర్ణయం పూర్తిగా తనదేనని మార్చి 3న స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ మమ్మల్ని ఒత్తిడి చేయడమేమిటి? అయితే గియితే మేమే ఇజ్రాయెల్ను ఒత్తిడి చేశామని చెప్పాలి’’ అని కూడా అన్నారు. ఇరాన్ దురుద్దేశాలే సైనిక చర్యకు కారణం తప్ప ఇజ్రాయెల్ కాదన్నారు. దాంతో రూబియో కంగుతిన్నారు. ముందు రోజు తాను చేసిన వ్యాఖ్యలను మీడియానే సందర్భరహితంగా చూపించి దురుద్దేశాలు ఆపాదించిందంటూ నాలిక మడతేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్రూబియో భిన్న స్వరంపెంటగాన్ వర్గాల వ్యాఖ్యలు చేసిన మర్నాడే, అంటే మార్చి 2న అందుకు పూర్తి భిన్నంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఏ క్షణంలోనైనా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడి చేయొచ్చు. ఇరాన్ సైనిక ఫీల్డ్ కమాండర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్పై దాడి యోచనలో ఉన్నట్టు నాకు కచ్చితమైన సమాచారముంది. అప్పుడు మన స్థావరాలకూ ముప్పు తప్పదు. కనుక మనమే ముందస్తు దాడులకు దిగడం తప్ప మరో మార్గం లేదు. లేదంటే భారీగా నష్టపోతాం’’ అని క్యాపిటల్ హిల్ భవనంలో జరిగిన ఉన్నత స్థాయి రహస్య భేటీలో చెప్పుకొచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మాత్రం తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడికి దిగుతుండటంతో తమకూ మరో మార్గం లేకపోయిందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు!ట్రంప్ను చంపాలనుకున్నారు!మార్చి 4న పెంటగాన్ బ్రీఫింగ్లో అమెరికా రక్షణ మంత్రి ఇరాన్పై యుద్ధానికి సరికొత్త కారణాన్ని తెరపైకి తెచ్చారు. ‘‘ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. ఇరాన్ ఐఆర్జీసీ సైనిక యూనిట్ కమాండర్కు ఈ మేరకు బాధ్యతలు కూడా అప్పగించింది. కానీ (ఖమేనీ హత్య ద్వారా) వారిపై ట్రంపే పై చేయి సాధించారు’’ అని చెప్పుకొచ్చారు! -
శత్రు భయంకర క్షిపణి
ఇరాన్పై ఇంతకు మునుపెన్నడూలేనంతగా విచ్చలవిడిగా దాడులు చేస్తున్న అమెరికా బలగాలు తాజాగా తమ అమ్ములపొదిలోని మరో నూతన క్షిపణిని ఇరాన్ మీదకు ప్రయోగించాయి. ప్రపంచంలో ఆయుధాల తయారీరంగ దిగ్గజం లాక్హీడ్ మార్టీన్ ప్రత్యేకంగా అమెరికా బలగాల కోసం అభివృద్ధిచేసి ఇచ్చిన ‘ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్(పీఆర్ఎస్ఎం) సైతం ఇప్పుడు ఇరాన్పై దాడులకు సిద్ధమైంది.యుద్ధంలో పీఆర్ఎస్ఎంను తొలిసారిగా ఉపయోగించినట్లు అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ‘‘చరిత్రలోనే తొలిసారిగా దీర్ఘ శ్రేణి క్షిపణి పీఆర్ఎస్ఎంను ఇరాన్పై మొదలెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఉపయోగించాం. తీవ్రమైన దాడులను విజయవంతంగా పూర్తిచేసింది. క్షిపణుల సాయంతో శత్రుసేనలను ఎటూ పాలుపోకుండా చేస్తున్న మా సాయుధ బలగాల శక్తియుక్తులను చూసి గర్వపడకుండా ఉండలేకపోతున్నా’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో వ్యాఖ్యానించారు. క్షిపణి లాంచర్ అయిన హైమొబిలిటీ ఆర్టీలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ఎం142 నుంచి పీఆర్ఎస్ఎంను ప్రయోగించిన వీడియోను అమెరికా సెంట్రల్ కమాండ్ తన ఖాతాలో షేర్చేశారు. దాడిచేస్తే తప్పించుకోవడం కల్ల.. అమెరికాలోని మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేసే లాక్హీడ్ మార్టీన్ సంస్థ 2023 డిసెంబర్లో ఈ రకం క్షిపణులను అమెరికా బలగాలను అప్పగించింది. కనిష్టంగా 60 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంలో నాశనంచేయడం పీఆర్ఎస్ఎంల ప్రత్యేకత. రాకెట్లను ప్రయోగించే వాహనాలైన మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్(ఎంఆర్ఎల్ఎస్)తోపాటు హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్(హైమార్స్)ల నుంచి క్షిపణిని ప్రయోగించవచ్చు.ముఖ్యంగా ఎంఎల్ఆర్ఎస్ఎం–270, హైమార్స్ఎం–142 వాహనాల మీద నుంచి కొత్త క్షిపణులను ఎంతో సులభంగా ప్రయోగించవచ్చు. దీని దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. క్షిపణిని ఇతర రకాల లాంచర్ల నుంచి సైతం ప్రయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో ఎలాగైనా ఇతర లాంచర్ల నుంచి ప్రయోగించేందుకు వీలుగా ‘ఓపెన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్’విధానంలో దీనిని రూపొందించారు. వేర్వేరు ఇతర కంపెనీల లాంచర్ నుంచి ఎంతో వేగంగా దీనిని ప్రయోగించవచ్చు. అత్యంత సురక్షితం.. యుద్ధక్షేత్రాలకు తరలించే క్రమంలో పొరపాటున పేలిపోయే అవకాశమే ఉండదు. ప్రయోగించకముందే రవాణా సమయంలో పొరపాటున కిందపడినా, అగి్నకి ఆహుతైనా, పదునైన వస్తువులు గుచ్చుకున్నా ఇది పేలదు. కేవలం ప్రయోగించాక ట్రిగ్గర్ను క్రియాశీలంచేశాక మాత్రమే భారీస్థాయిలో పేలిపోయి పెనువినాశనం సృష్టిస్తుంది. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ (ఏటీఏసీఎం)గా పిలిచే దీర్ఘశ్రేణి పాత తరం ఎంజీఎం–140 బాలిస్టిక్ క్షిపణుల స్థానంలో కొత్త పీఆర్ఎస్ఎంలను తీసుకొచ్చారు. ఇవి గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు.పాత క్షిపణుల పరిధి కేవలం 300 కిలోమీటర్లుకాగా కొత్త క్షిపణుల పరిధి 500 కిలోమీటర్లు. దీంతో పాత లాంచర్ల మీద నుంచే మరింత ఎక్కువ దూరాలకు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే వీలు చిక్కిందని అమెరికా ఆర్మీ అధికారులు చెప్పారు. దుబాయ్ సమీపంలోని రస్ అల్ ఖైమా సమీపంలోని మూసండం ద్వీపకల్పం ఇరాన్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతే పరిధితో పనిచేసే పీఆర్ఎస్ఎంలతో ఇరాన్పైకి నిరాటంకంగా దాడిచేయాలని అమెరికా భావిస్తోంది.రష్యాతో 1987లో కుదుర్చుకున్న మధ్య శ్రేణి అణ్వాస్త్రాల నిరోధక చట్టం అమల్లో ఉంటే పీఆర్ఎస్ఎస్ల వినియోగానికి అవరోధాలు ఎదురయ్యేవి. 2019లో ఈ ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడంతో కొత్త క్షిపణుల తయారీ, వినియోగానికి అమెరికా తలుపులు బార్లా తెరిచిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. – సాక్షి,నేషనల్ డెస్క్ -
యుద్ధ కల్లోలం.. విమానాశ్రయాలపై దాడులు
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం నానాటికీ పెరుగుతూనే ఉంది. శనివారం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా కనీవినీ ఎరగని స్థాయిలో దాడులకు దిగాయి. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై భారీగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడ్డాయి. దాంతో విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగానికి చెందిన 16 విమానాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్బొల్లా తదితర గ్రూపుల నుంచి ఆయుధాలు, నిధుల సేకరణకు ఆ విమానాలను ఇరాన్ వినియోగిస్తోందని ఆరోపించింది.విమానాశ్రయ సమీపంలోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సెంటర్ కూడా దాడుల్లో ధ్వంసమైంది. ఇస్ఫహాన్లోని అణు కేంద్రంపైనా బాంబుల వర్షం కురిసింది. ఒక్క రోజులోనే ఇరాన్వ్యాప్తంగా 400కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. వారం రోజుల్లో ఇరాన్లో 3,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశామని అమెరికా వెల్లడించింది. వాటిలో కీలకమైన కమాండ్ సెంటర్లు, సైనిక ప్రధాన కార్యాలయాలు, క్షిపణి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల వంటివి ఉన్నట్టు పేర్కొంది.ఇరాన్లో మృతుల సంఖ్య 1,332కు పెరిగినట్టు ఐరాసలో ఆ దేశంలో రాయబారి ఆమిర్ సయీద్ ఇరవనీ తెలిపారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. దుబాయ్ విమానాశ్రయంపై మరోసారి డ్రోన్ దాడి చేసింది. దాంతో రన్వేకు అతి సమీపంలో పలుచోట్ల పొగ భారీగా పైకెగసిన దృశ్యాలు వైరల్గా మారాయి. బాంబు సైరన్లు మోగడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోని ట్రెయిన్ టన్నెళ్లలోకి పరుగులు తీశారు. విమానాశ్రయం నుంచి విమాన సరీ్వసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.దుబాయ్వ్యాప్తంగా పలుచోట్ల భారీ పేలుళ్లు విని్పంచాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోనూ ఓ సైనిక విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ప్రాంత నగరమైన నబిషిట్, పరిసరాల్లో కనీసం 47 మంది వాటికి బలయ్యారని లెబనాన్ ఆరోగ్య శాఖ పేర్కొంది. 40 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 300 దాటినట్టు వెల్లడించింది. హెజ్బొల్లా దాడుల్లో తమ సైనికులు ఐదుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. ఆ దేశాలపై దాడులు చేయబోం: పెజెష్కియాన్ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులను ఎదుర్కొనే క్రమంలో గల్ఫ్ దేశాలపైనా దాడులకు దిగినందుకు వాటికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు తెలిపారు. తమకసలు వాటిపై దండెత్తే ఉద్దేశమే లేదన్నారు. ‘‘ఆ దేశాల నుంచి తమపై దాడులు జరిగితే తప్ప ఇకనుంచి వాటిపై దాడికి దిగబోం. మా నాయకత్వ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసినట్టుగా ఆ దేశానికి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ మతిలేని దాడులను పూర్తిగా నిలిపేసేదాకా వాటిని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తూనే ఉంటామని ప్రకటించారు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ ఇప్పటికే పూర్తిగా ఓడిపోయిందని చెప్పుకొచ్చారు.పెజెష్కియాన్ ప్రకటనే అందుకు నిదర్శనమన్నారు. ‘‘పశ్చిమాసియాను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలని ప్రయతి్నంచిన ఇరాన్ ఇప్పుడు తానే అతి పెద్ద ఓటమి పాలైంది. మా దాడుల తీవ్రత వల్లే గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పింది. తద్వారా వాటికి లొంగిపోయింది. ఇరాన్ తోటి గల్ఫ్ దేశాల చేతుల్లో ఓడటం వేల ఏళ్లలో ఇదే తొలిసారి.ఇందుకు పశ్చిమాసియా దేశాలన్నీ నాకు ధన్యవాదాలు తెలిపాయి’’అన్నారు. ఇరాన్పై యుద్ధాన్ని పశ్చిమాసియాకే గాక ప్రపంచమంతటికీ అమెరికా చేసిన గొప్ప మేలుగా ట్రంప్ అభివరి్ణంచడం విశేషం. ఇరాన్కు చెందిన 42 యుద్ధ నౌకలను మూడు రోజుల్లోనే ధ్వంసం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఆ దేశ ఎయిర్ డిఫెన్స్తో పాటు సమాచర వ్యవస్థలను పూర్తిగా నేలమట్టం చేశామన్నారు. తాము దాడులు చేయకపోతే ఇరాన్ అతి త్వరలో అణుపాటవం సంతరించుకునేదని తెలిపారు. సైన్యంపై అదుపు తప్పిందా? పెజెష్కియాన్ ప్రకటన తుంగలోకి ఇరాన్ సైన్యంపై ప్రభుత్వానికి పట్టు తప్పిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగడం గమనార్హం! బాలిస్టిక్ క్షిపణులను నియంత్రించే పారామిలిటరీ విభాగమైన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే అధ్యక్షుని ప్రకటనతో నిమిత్తం లేకుండా గల్ఫ్ దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులు నిరి్నరోధంగా కొనసాగాయని చెబుతున్నారు. ఈ గందరగోళానికి తెర పడాలంటే సుప్రీం నేతను ఎన్నిక ప్రక్రియను తక్షణం పూర్తి చేయాల్సిందేనని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’కు ప్రముఖ మత పెద్ద అయతొల్లా నాసర్ మకరం షిరాజీ విజ్ఞప్తి చేశారు. లెబనాన్లో... ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ దద్దరిల్లింది. నబిషిట్ వద్ద నరమేధానికి తోడు జౌతార్ అల్ షర్కియా, అరబ్ సలీం, జిబ్చిట్ తదితర ప్రాంతాలపైనా క్షిపణి, బాంబు దాడులు కొనసాగాయి. అక్కడ ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు కనీసం ఆరుగురు మృత్యువాత పడ్డట్టు సమాచారం...అయినా గల్ఫ్పై దాడులు గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైన్యం వాటిపై భారీగా దాడులకు దిగింది! దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ కూడా దాడులకు గురయ్యాయి. దోహాలోనూ పేలుళ్లు విని్పంచాయి. కనీసం 86 క్షిపణులు, 148 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు బహ్రెయిన్ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సాగే నౌకలకు భద్రత కలి్పస్తామన్న అమెరికా ప్రకటనను ఇరాన్ సైనిక విభాగమైన రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఎద్దేవా చేసింది.‘అక్కడ అమెరికా సేనలను ఎదుర్కొందుకు మేం వెయిటింగ్’అంటూ అగ్ర రాజ్యాన్ని కవ్వించింది. వాటిని ఎక్కడికక్కడ తొక్కిపారేస్తామని ఇరాన్ సైన్యం కూడా ఒక ప్రకటనలో హెచ్చరించింది. ‘‘ఇజ్రాయెల్తో పాటు అబుదాబి, కువైట్ సహా గల్ఫ్వ్యాప్తంగా అమెరికా స్థావరాలపైనా మా నావికా దళం భారీగా లక్షిత దాడులు చేసింది. తద్వారా మా యుద్ధ నౌకను ముంచేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాం’’అని ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో కుర్దు వేర్పాటువాదుల స్థావరాలపైనా దాడులు చేసినట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్పైనా ఇరాన్ దాడుల తీవ్రత కొనసాగింది. జెరూసలేం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. టెల్ అవీవ్లో కూడా రోజంతా బాంబుల శబ్దాలు విన్పిస్తూనే ఉన్నాయి. -
ఇరాన్ యుద్ధం.. ముడిచమురు మంట
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) : పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం.. ఇరాన్ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్లోని అమెరికా రక్షణ స్థావరాలన్నిటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థలాంటి హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించటంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. ఇంధన అవసరాలపై భయాందోళనలతో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల దాడి ఆరంభించే నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా 92.69 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 13 శాతం పెరగటం గమనార్హం. ఈ ధోరణి కొనసాగితే ధర మరింత పెరిగి తక్షణం 100 డాలర్లు దాటేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతులపై భారం... భారత్కు అవసరమైన చమురులో 85–88 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. కాబట్టి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత్ ముడి చమురు దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది.ఈ ఏడాది తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగటంతో పాటు ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలు పెరిగి ఆయా రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చు. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకూ వ్యాపిస్తుంది.దేశీయంగా పలు చర్యలు...ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి భారత్ ఇప్పటికేపలు చర్యలు తీసుకుంటోంది. వ్యూహాత్మకంగా చమురు నిల్వలను పెంచుకోవటంతో పాటు పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని విస్తరించటం.... ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవటం వంటివి ఇప్పటికే చేస్తోంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద ఆదేశాలు జారీ చేస్తూ... ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టంచేసింది. మన దగ్గర 6-8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలున్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికితోడు దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్ నిల్వలూ ఉన్నాయని, సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే సరిపడేంత ఆయిల్ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది. ధరలు పెరిగిందిలా...ఫిబ్రవరి 28 71 డాలర్లు మార్చి 7 92.69 డాలర్లు -
నాయకి..
దేశంలో మహిళా నిపుణులు నాయకత్వ స్థానం కోసం ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు పని ప్రదేశంలో సమానత్వాన్ని సైతం కోరుకుంటున్నారు. నియామకాల్లో వివక్ష, వేతన వ్యత్యాసాలు ఇప్పటికీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ.. వారు తమ హక్కుల కోసం గళం విప్పుతున్నారు. ‘మహిళా నిపుణులు ఏమి కోరుకుంటున్నారు’పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాబ్ పోర్టల్ నౌకరీ.కామ్ తన రెండవ ’వాయిస్ ఃవర్క్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 50కిపైగా పరిశ్రమలకు చెందిన 50,000 మందికిపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను గుర్తించడానికి, వాటిని సరిదిద్దడానికి క్రమబద్ధమైన విశ్లేషణ (ఈక్వల్ పే ఆడిట్) జరగాలని కోరుకుంటున్నారు. అంటే సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్ భారీగా పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే మెన్స్ట్రువల్ లీవ్కు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్టాప్లో హైదరాబాద్..సర్వేలో పాలుపంచుకున్న వారిలో దాదాపు 83% మంది తాము నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. గత ఏడాది జరిపిన సర్వేలో మూడింట రెండొంతుల మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. మహిళా నాయకత్వానికి అత్యధిక స్థాయిలో ప్రోత్సాహాన్ని అందించడంలో హైదరాబాద్ (86%) టాప్లో నిలిచింది. అయితే కార్యాలయాల్లో వివక్ష ఇప్పటికీ ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. దాదాపు ఇద్దరు మహిళల్లో ఒకరు తమ వివాహం లేదా మాతృత్వ ప్రణాళికల గురించి ఉద్యోగ ఇంటర్వ్యూలలో వెల్లడించడానికి సంకోచిస్తున్నారు. వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఇందుకు కారణం. ఫ్రెషర్స్లో 29% మంది, 10–15 ఏళ్ల పని అనుభవం ఉన్న నిపుణులలో 40% మంది ఈ విషయాన్ని వెల్లడించారు. తమ కార్యాలయాల్లో వేతన సమానత్వం లేదని మూడింట ఒక వంతు మంది భావిస్తున్నారు. నియామకాలు, పదోన్నతుల్లో పక్షపాతం చూపిస్తున్నారని 42% మంది తెలిపారు.మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ప్రోత్సాహాన్ని పొందుతున్నారని భావిస్తున్నారా?అవును 83%కాదు 17% -
లండన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లండన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో, ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలపై ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదన్న ట్రంప్.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని.. పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై పొరుగు దేశాలను ఆ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలు అంటించారు.ఇరాన్.. ఓడిపోయింది. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇరాన్ ఇక మధ్యప్రాచ్య రౌడీ కాదు. ఇరాన్ నలిగిపోతోంది. పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ తన పొరుగు దేశాల ముందు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టిన ఇరాన్.. ఇప్పుడు మధ్యప్రాచ్య పరాజితగా మారిందని ట్రంప్ ఎద్దేవా చేశారు.కాగా, ఉద్రిక్తతలను తగ్గించేలా.. పొరుగు దేశాలను తమ సోదరులుగా అభివర్ణించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దాడులు చేసినందుకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప, పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించవద్దని తమ సాయుధ దళాలకు ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్పై ఇవాళ మరింత తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలను కూడా ఈసారి ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దుబాయ్, అబుదాబిలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది. -
కొనసాగుతున్న నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. వార్ వన్ సైడ్
కాఠ్మాండు: నేపాల్ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కౌంటింగ్ శుక్రవారం ఉదయం మొదలైన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 4 గంటల వరకు వెల్లడైన ఫలితాలను బట్టి.. జెన్ జీ అభిమాన నాయకుడు, మాజీ కాఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా (35)కు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) 46 సీట్లలో గెలుపొంది, మరో 73 స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక సీటు గెలుపొంది, మరో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.ఏ విధంగా చూసుకున్నా ఆర్ఎస్పీ గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. 275 మంది సభ్యులు ఉండే ప్రతినిధి సభకు ఈ నెల 5న ఓటింగ్ జరిగింది. 165 స్థానాలకు నేరుగా, మరో 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్ జరిగింది. మాజీ ప్రధానిపై బలేంద్ర షా ఆధిక్యం జాపా-5 నియోజకవర్గంలో బలేంద్ర షా 55,934 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ (నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ) 10,293 ఓట్లు మాత్రమే సాధించారు. శ్రమ్ సంస్కృతి పార్టీకి చెందిన సమీర్ తమాంగ్కు 6,324 ఓట్లు పడ్డాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఆర్ఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.దిగువ సభలో మొత్తం 275 స్థానాలు ఉన్నాయి. వాటిలో 110 స్థానాలు ప్రోపోర్షనల్ రిప్రెజెంటేషన్ విధానం ద్వారా కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 138 స్థానాలు అవసరం. నేపాల్లో మొత్తం 1.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా, సుమారు 60 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీ చేశారు. -
ఇరాన్పై భీకర పోరు : అత్యవసరంగా ఇజ్రాయెల్కు 12 వేల బాంబులు
ఇరాన్తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్కు అత్యవసర ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. అత్యవసర మినహాయింపు ద్వారా (కాంగ్రెస్ ఆమోదం అవసరం లేకుండా) ఇజ్రాయెల్కు 151.8 మిలియన్ల డాలర్ల విలువైన 12,000 బాంబు కేసింగ్స్ను (ఒక్కొక్కటి1,000 పౌండ్ల బరువు) విక్రయించనుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వెంటనే విక్రయించాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్ధించుకున్నారు. తద్వారా ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 36(b)ను మినహాయించినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదిత అమ్మకం ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, దాని రక్షణను బలోపేతం చేస్తుందని అని స్టేట్ డిపార్ట్మెంట్ బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమానిఅత్యవసర మినహాయింపు (Emergency Waiver) అంటే సాధారణంగా ఇలాంటి అమ్మకాలకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. అయితే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో "ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్" కింద తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్తో సంబంధం లేకుండా ఈ విక్రయాన్ని వేగవంతం చేశారు. అమెరికన్ రక్షణ సంస్థలు తమ అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచడానికి అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఆయుధాల సరఫరా వల్ల ఇజ్రాయెల్ తన రక్షణను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ప్రాంతీయ ముప్పులను అడ్డు కోవడానికి సహాయపడుతుందని బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ తెలిపింది.ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్ తప్పదా? వైరల్ వీడియోదీనిపై విమర్శలు ఈ నిర్ణయంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సమీక్షను దాటవేయడం ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు విరుద్ధంగా ఉందని . డెమొక్రాటిక్ నాయకుడు గ్రెగొరీ మీక్స్ విమర్శించారు. ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, ఇలా "అత్యవసర" అధికారాన్ని వాడటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఎమిరేట్స్ కీలక నిర్ణయం
దుబాయ్ విమాన సర్వీసులను ఎమిరేట్స్ తాత్కాలికంగా నిలిపేసింది. ఎయిర్పోర్టుకు రావద్దని ప్రయాణికులకు ఎమిరేట్స్ సూచించింది. దుబాయ్ ఎయిర్పోర్టుపై మరో మిస్సైల్ దాడి జరిగింది. ఎయిర్పోర్టుపై ఇరాన్ భీకర దాడులు చేసింది. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు.. ప్రయాణికులను తరలించారు. మిస్సైల్ దాడితో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.ఇరాన్ క్షిపణుల, డ్రోన్లను యూఏఈ వైమానిక దళం అడ్డుకుంది. భద్రత కారణంగా దుబాయ్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు దుబాయ్ వచ్చే, వెళ్లే అన్ని విమానాలు రద్దయ్యాయి. మరోవైపు, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. ఇరాన్ దాడి చేసిన పొరుగు దేశాలకు నేను క్షమాపణలు కోరుతున్నారు.పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయకూడదని.. నిన్న సమావేశమైన తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ అంగీకరించింది. పొరుగు దేశాలపై ఎటువంటి క్షిపణులను ప్రయోగించం. ఆయా దేశాల ప్రాంతాల నుంచి ఇరాన్పై దాడి జరిగితేనే.. ఇరాన్ తిరిగి ప్రతిదాడి చేస్తుంది. ఈ నిర్ణయాన్ని తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ అంగీకరించింది’’ అని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. -
ఇరాన్ ప్రెసిడెంట్ కీలక ప్రకటన
ఇరాన్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలపై చేసిన దాడులకు క్షమాపణలు చెప్పారు. ఇకపై పక్కదేశాలపై దాడి చేయమన్నారు. "మీరు మా జోలికి రాకుంటే.. మేము మీ జోలికి రామని" తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తి లేదని మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అదే విధంగా మీ దేశాలను అమెరికా స్థావరాలుగా మార్చొద్దని.. అక్కడి నుండి అమెరికా తమపై దాడి చేయకుండా చూసుకోవాలని సూచించారు.ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిదాడులతో ఇరాన్ విరుచుకపడింది. ఈ నేపథ్యంలో దుబాయి, కువైట్, బహ్రెయిన్, యుఏఈలతో పాటు ఇతర గల్ఫ్ దేశాలలోని USA స్థావరాలతో ఇరాన్ దాడులు జరిపింది. అక్కడితో ఆగకుండా ఆ దేశంలోని ఆయిల్ రిఫైనరీలు, విమానాశ్రయాలపై మిస్సైల్స్తో విరుచుకపడింది. దీంతో ఇరాన్ తీరుపై గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. -
‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’
రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా ఆయన ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ప్రసంగం చేశారు.చైనా అనుభవాలే గుణపాఠం‘20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్ విషయంలో చేయం’ అని లాండౌ కుండబద్ధలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అందుకే భారత్తో కుదుర్చుకోబోయే ఏ ఒప్పందమైనా పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ ఇక్కడ సామాజిక సేవ చేయడానికి రాలేదని, అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని వ్యాఖ్యానించారు.ఊగిసలాటలో వాణిజ్య ఒప్పందం?భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశలో ఉందని లాండౌ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఒప్పందాన్ని మరింత జాప్యం చేసే దిశగా ఉన్నాయి. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్లు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దిగుమతులపై 10% నుంచి 15% వరకు అదనపు సర్ఛార్జీని విధించింది. గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% సుంకాన్ని ఒప్పందం ద్వారా 18%కి తగ్గిస్తామని అమెరికా ఆశ చూపేది. కానీ ప్రస్తుతం అందరికీ వర్తించే సుంకం 10%కి తగ్గడంతో అమెరికా ఆఫర్కు ఉన్న ప్రాధాన్యత తగ్గింది. -
ఖమేనీ కుమారులు క్షేమం?.. తాజా ఫొటోలు వైరల్
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఖమేనీ కుమారులలో ఒకరు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలలో ఖమేనీ నలుగురు కుమారులు క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.అయతొల్లా అలీ ఖమేనీకి నలుగురు కుమారులు.. ముస్తాఫా ఖమేనీ, మొజ్తబా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మెయిసమ్ ఖమేనీలు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో వారు క్షేమంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టే వారసుడి కోసం అన్వేషణ ప్రారంభమైన తరుణంలో, ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా పేరొందిన ఖమేనీ తన వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని అత్యంత రహస్యంగా ఉంచేవారు. ఆయన భార్య గానీ, పిల్లలు గానీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు.ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తే బాఘెర్జాదే 1947లో ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964లో ఖమేనీని వివాహం చేసుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం లాంటి క్లిష్ట సమయాల్లోనూ ఆమె ఖమేనీకి అండగా నిలిచారు. ఖమేనీ పిల్లలు అటు రాజకీయాలకు, ఇటు ప్రజా బాహుళ్యానికి దూరంగా ఉంటారని తెలుస్తోంది. కాగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే దానిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఖమేనీ వారసులను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, వారి భద్రతను ఇరాన్ సైన్యం కట్టుదిట్టం చేసింది. ఇది కూడా చదవండి: సౌదీ రక్షణ మంత్రితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ -
"ఆ మూడు పనుల వల్లే అమెరికా-భారత్ దూరం"
డొనాల్ట్ ట్రంప్ ఇంతకాలం పాటు తన విధానాలు చేష్టలతో భారత్ను ఇబ్బంది పెట్టే యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ట్రంప్ తన మాటలతో భారత్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తాజాగా ఈ అంశంపై మాట్లాడారు. ట్రంప్ అనాలోచితంగా చేసిన మూడు పనులు అమెరికాకు భారత్ను దూరం చేశాయన్నారు.ట్రంప్ విదేశాంగ విధానానికి తల ఊపే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. ఆయన చేసిన పనుల వల్ల అమెరికాకు భారత్ దూరం అయ్యిందన్నారు. "మెుదటగా ఆయన పన్నుల విధానం భారత్తో దూరం పెంచింది. అనంతరం పాకిస్థాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధం తన జోక్యంతోనే ముగిసిందని అనడం. తదనంతరం పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్కు వైట్ హౌస్లో అతిథ్యం ఇవ్వడం" భారత్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయన్నారు.పాకిస్థాన్ తరచుగా ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తుందనే భారత్తో ఎన్నో ఏళ్లుగా అనేక వేదికలపై తెలుపుతుందని అయినప్పటికీ ట్రంప్ ఇలా చేయడం భారత్ను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదన్నారు. ఇరాన్లో ప్రభుత్వం మారుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు.కాగా ఇప్పటికే ఇరాన్ దాడుల తీవ్రత గణనీయంగా తగ్గిందని అదే సమయంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడుల తీవ్రత పెరిగిందన్నారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్లు పాలక వ్యవస్థల పైనే దాడి జరుపుతున్నాయని ఇరాన్ ఆర్థిక, సామాజిక మౌలిక వసతులకు హాని కలగకుండా ఆ రెండు దేశాలు జాగ్రత్త పడుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని తెలిపారు. -
సౌదీ రక్షణ మంత్రితో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కీలక భేటీ
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరు ఇప్పుడు పొరుగు దేశాలకు విస్తరిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలీద్ బిన్ సల్మాన్ తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్తో అత్యవసరంగా సమావేశమయ్యారు. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భద్రతా సమీకరణలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ‘ఉమ్మడి వ్యూహాత్మక రక్షణ ఒప్పందం’ ఫ్రేమ్వర్క్ పరిధిలో ఈ చర్చలు సాగాయి.ఈ భేటీ అనంతరం సౌదీ రక్షణ మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా ‘పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్తో సమావేశమయ్యాను. సౌదీపై జరుగుతున్న దాడులు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి. వీటిని అడ్డుకోవడంలో మా ఉమ్మడి రక్షణ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ విజ్ఞతతో వ్యవహరించి, పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.2025 సెప్టెంబరులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య కుదిరిన చారిత్రక రక్షణ ఒప్పందం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి, పరస్పరం సైనిక సహాయం అందించుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో, సౌదీ భూభాగంపై ఇరాన్ దాడులు కొనసాగితే, పాకిస్థాన్ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.కాగా పాక్ సైనిక బృందాలు ఇప్పటికే సౌదీలో శిక్షణ, రక్షణ విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ప్రస్తుతం పాక్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు దేశీయంగా ఉగ్రవాద సవాళ్లతో సతమతమవుతున్న ఇస్లామాబాద్.. ఇరాన్తో దౌత్యపరమైన వైరాన్ని పెంచుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే తన ఇరాన్ సహచరుడికి గట్టి హెచ్చరికలు పంపినట్లు సమాచారం. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లితే, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారని సమాచారం. Met with Pakistan’s Chief of Army Staff and Chief of Defense Forces, Field Marshal Asim Munir. We discussed Iranian attacks on the Kingdom and the measures needed to halt them within the framework of our Joint Strategic Defense Agreement. We stressed that such actions undermine… pic.twitter.com/OuELnf9LU6— Khalid bin Salman خالد بن سلمان (@kbsalsaud) March 7, 2026 -
భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా
వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించిందంటూ అమెరికా ట్రెజరీ శాఖ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కామెంట్లు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఇప్పటికే సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న రష్యా చమురును కొనుగోలు చేయటానికి భారత్కు అనుమతి ఇచ్చినట్టు అమెరికా తెలిపిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా మనకు అనుమతి అనుమతి ఇవ్వడం ఏంటని భారత్లో విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటువంటి సమయంలో స్కౌట్ కీలక వ్యాఖ్యలు చేశారు.“ప్రపంచానికి చమురు సరఫరా బాగానే కొనసాగుతోంది. ఇప్పటికే సముద్ర మార్గంలో ఉన్న రష్యా చమురు కొనుగోలును ప్రారంభించటానికి మా మిత్ర దేశం భారత్కు నిన్న అమెరికా ట్రెజరీ శాఖ అనుమతి ఇచ్చింది” అని స్కాట్ బెసెంట్ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.“భారత్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ముందుగా ఆంక్షలు ఉన్న రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని మేము కోరాం.. భారత్ ఆపింది. దాని స్థానంలో అమెరికా నుంచి చమురు కొనాలని భారత్ నిర్ణయించింది. కానీ, ప్రపంచ చమురు సరఫరాలో ఏర్పడ్డ తాత్కాలిక లోటును తగ్గించటానికి ఇప్పుడు రష్యా చమురును కొనడానికి మేము భారత్కు అనుమతి ఇచ్చాం. రష్యా చమురుపై ఉన్న మరికొన్ని ఆంక్షలను కూడా తొలగించవచ్చు” అని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండడంతో మార్కెట్కు ఉపశమనం ఇవ్వటానికి చర్యలు ప్రకటించే ప్రక్రియ కొనసాగుతుంది” అని తెలిపారు.ట్రంప్ పరిపాలనలోని మరికొంతమంది అధికారులు కూడా రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారత్కు అనుమతి ఇచ్చామని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొన్ని నెలల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చామని అమెరికా అంటోంది.అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తున్న సమయంలో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చేయడం, మార్కెట్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యమని అమెరికా అధికారులు చెప్పారు. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితుల వల్ల చమురు ధరలు పెరుగుతున్నాయి. -
పాకిస్తాన్లో పేలిన ‘పెట్రో’ ధరల బాంబు
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో పెట్రో ధరల బాంబు పేలింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా చైన్లో తలెత్తిన ఆటంకాల నేపథ్యంలో పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ శనివారం అర్ధరాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు ఏకంగా 55 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ చరిత్రలో ఇంతటి భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.తాజా పెంపుతో పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 266.17 నుంచి రూ. 321.17కు చేరింది. అంటే దాదాపు 17 శాతం మేరకు పెరిగింది. ఇక రవాణా రంగానికి కీలకమైన హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 280.86 నుంచి ఏకంగా రూ. 335.86కు (20 శాతం పెంపు) ఎగబాకింది. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్, ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల వల్ల గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని వారు పేర్కొన్నారు. ‘పొరుగు దేశంలో రాజుకున్న నిప్పు ఇప్పడు ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఈ సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర హెచ్చుతగ్గుల దృష్ట్యా, ఇకపై ప్రతి వారం పెట్రో ధరలను సమీక్షించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కాగా పాకిస్తాన్కు వచ్చే చమురు రవాణాలో అధిక భాగం ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధి గుండానే జరుగుతుంటుంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల ఈ మార్గంలో సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు నౌకలను రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు -
పాలు పోసి పెంచితే చివరకు.. ఇరాన్కు భారీ షాక్!
మిడిల్ఈస్ట్ వార్లో ఇరాన్కు సాయం విషయంలో చేదు అనుభవమే ఎదురవుతోంది. చేతులు కలుపుతాయని భావించిన దేశాలతో పాటు పలు గ్రూపులు.. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో పెద్దగా స్పందించడం లేదు. వీటికి తోడు పాలు పోసి పెంచిన పాములు కూడా చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్ చాలా కాలంగా ఇరాక్లోని షియా మిలీషియాలను పెంచుతూ వచ్చింది. కానీ, ప్రస్తుతం అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఈ గుంపులు పెద్దగా స్పందించడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు..ఇరాన్ ‘‘ప్రాక్సీ మిలీషియాలు” అంటే.. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా, ఇతర దేశాల్లోని మిలీషియా గుంపులను ఆయుధాలు, శిక్షణ, డబ్బు ఇచ్చి తన తరఫున పోరాడేలా తయారు చేసిన దళాలు. ఇవి ఇరాక్, లెబనాన్, సిరియా, యెమెన్, పాలస్తీనా వంటి ప్రాంతాల్లో సెటిల్ అయ్యి ఉన్నాయి.ప్రాక్సీ మిలీషియాల అర్థం.. ప్రాక్సీ అంటే ప్రత్యామ్నాయం లేదంటే ప్రతినిధి. ఇరాన్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి, నేరుగా యుద్ధం చేయకుండా దశాబ్దాలుగా ఈ స్థానిక మిలీషియాలను ఉపయోగిస్తుంది. వీరికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC), క్వుడ్స్ ఫోర్స్ ఆయుధాలు, శిక్షణ, డబ్బు అందిస్తాయి.ఇరాక్లోని ప్రధాన ప్రాక్సీ మిలీషియాలుకటాయిబ్ హిజ్బుల్లా (Kataib Hezbollah): ఇరాన్ మద్దతుతో పనిచేసే శక్తివంతమైన షియా మిలీషియా.బద్ర్ ఆర్గనైజేషన్ (Badr Organization): రాజకీయ పార్టీగా కూడా పనిచేస్తుంది. ఇరాక్ పార్లమెంట్లో స్థానాలు కలిగి ఉంది.అసాయిబ్ అహ్ల్ అల్-హక్ (Asaib Ahl al-Haq): ఇరాన్తో బలమైన సంబంధాలు కలిగిన మిలీషియా.హరాకత్ హిజ్బుల్లా అల్-నుజబా (Harakat Hezbollah al-Nujaba): ఇరాన్ ద్వారా శిక్షణ పొందిన మరో మిలీషియా.ఇవి ఏం చేస్తాయంటే.. ఇరాన్కు మద్దతుగా పలు పోరాటాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. గతంలో మోహరించిన ఇరాక్లో అమెరికా సైన్యంపై దాడులు చేశాయి. సిరియా యుద్ధంలో పాల్గొనడంతో పాటు అసాద్ ప్రభుత్వానికి మద్దతుగా పోరాడాయి. ఈ క్రమంలోనే.. ఇరాక్లో కొన్ని మిలీషియాలు రాజకీయ పార్టీలుగా రూపాంతరం సంతరించుకున్నాయి.ప్రస్తుత పరిస్థితి..రాయిటర్స్ నివేదిక ప్రకారం, అమెరికా–ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఇరాక్లోని ఈ మిలీషియాలు పెద్దగా స్పందించడం లేదు. ఇరాన్ ప్రాక్సీలు ఒకప్పుడు అమెరికా దళాలకు పెద్ద సవాలు అయ్యాయి. కానీ ఇప్పుడు, రాజకీయాలు మరియు ఆర్థిక లాభాలపై దృష్టి పెట్టడం వల్ల వారు పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఇది ఇరాన్కు ఒక పెద్ద దెబ్బగా భావించవచ్చు. అందుకు కారణాలు పరిశీలిస్తే..ప్రాంతీయ మిత్ర గుంపుల నాశనం: లెబనాన్, సిరియా, యెమెన్లోని ఇరాన్ మద్దతు గుంపులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.రాజకీయ శక్తి కోసం పోరాటం: ఇరాక్లోని మిలీషియాలు ఇప్పుడు రాజకీయ ప్రభావం, అధికారం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నాయి.ఆర్థిక లాభాలపై దృష్టి: డబ్బు సంపాదన వీరి ప్రధాన లక్ష్యంగా మారింది. కాంట్రాక్టులు, వ్యాపారాలు, స్మగ్లింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాయి.చరిత్ర ఇలా.. ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల చరిత్ర 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రారంభమైంది. అప్పటి నుండి ఇరాన్ తన విప్లవ గార్డ్స్ (IRGC), ప్రత్యేక Qods Force ద్వారా లెబనాన్, ఇరాక్, యెమెన్, సిరియా, గాజా వంటి ప్రాంతాల్లో మిలీషియా గ్రూపులను నిర్మించి, ఆయుధాలు, శిక్షణ, ఆర్థిక సహాయం అందించింది. ఈ గ్రూపుల నాయకత్వం స్థానికంగా ఉన్నప్పటికీ, ఇరాన్తో గాఢమైన సంబంధం కలిగి ఉంది.1979 విప్లవం తర్వాత: ఇరాన్ తన విప్లవ సిద్ధాంతాన్ని విస్తరించడానికి ప్రాక్సీ గ్రూపులను నిర్మించడం ప్రారంభించింది.1980లలో: లెబనాన్లో హిజ్బుల్లా స్థాపన, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రధాన శక్తిగా ఎదగడం.1990–2000లలో: ఇరాక్లో షియా మిలీషియా గ్రూపులు (PMF, కతాయిబ్ హిజ్బుల్లా, ఆసైబ్ అహ్ల్ అల్-హక్) బలపడటం.2010లలో: యెమెన్లో హౌతీలకు మద్దతు, సౌదీపై దాడులు, రెడ్ సీ షిప్పింగ్కి ముప్పు.ప్రస్తుతం (2026): ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాక్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి, కానీ కొన్ని ఇరాక్ గ్రూపులు యుద్ధంలో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్నాయి.నాయకత్వం..హిజ్బుల్లా (లెబనాన్): హసన్ నస్రల్లా – ఇరాన్కి అత్యంత విశ్వసనీయ మిత్రుడు.హమాస్ (గాజా): యహ్యా సిన్వార్, మహ్మద్ దీఫ్ – ఇరాన్ నుండి ఆర్థిక, సైనిక సహాయం పొందుతున్నారు.హౌతీలు (యెమెన్): అబ్దుల్-మాలిక్ అల్-హౌతి – ఇరాన్ డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీతో బలపడిన నాయకుడు.ఇరాక్ మిలీషియా: కతాయిబ్ హిజ్బుల్లా, ఆసైబ్ అహ్ల్ అల్-హక్ వంటి గ్రూపుల నాయకులు IRGCతో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు. -
యుద్ధం వేళ.. ఇరాన్లో మళ్లీ భూకంపం
టెహ్రాన్: ఇరాన్లోని బందర్ అబ్బాస్కు పశ్చిమాన శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. బందర్ అబ్బాస్కు పశ్చిమాన 74 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియా అంతటా యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇరాన్ ప్రతీకార దాడులతో దాదాపు వారం రోజులుగా ఘర్షణలు జరుగుగున్న నేపథ్యంలో ఇవాళ మళ్లీ భూకంపం సంభవించడం గమనార్హం. మరోవైపు, గత మంగళవారం కూడా ఇరాన్ దక్షిణ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇరాన్లోని ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ భాగంలో ఉన్న గెరాష్లో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని యూఎస్జీఎస్ తెలిపింది. కాగా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుంది. తమ మాట వినకపోతే ఇరాన్ సైన్యాన్ని లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.BREAKING 🚨 4.1 earthquake hits IranNuclear test ? pic.twitter.com/nB3DJxgvAm— AsiaWarZone (@AsiaWarZone) March 7, 2026 -
అమెరికాలో పెరిగిన నిరుద్యోగం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న అమెరికా జాబ్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) తాజాగా విడుదల చేసిన తాజా గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్లను విస్మయానికి గురిచేశాయి. ఈ ఏడాది ఆరంభంలో బలంగా కనిపించిన యూఎస్ ఉపాధి రంగంలో ఫిబ్రవరి నెలలో అనూహ్యంగా 92,000 ఉద్యోగాల కోత నమోదైంది. ఈ పరిణామంతో అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పెరిగింది.ఆరోగ్య రంగంపై సమ్మెల ప్రభావంబ్లూమ్బెర్గ్ విశ్లేషణ ప్రకారం, ఇంత భారీగా పేరోల్స్ నమోదు కావాడానికి ప్రధాన కారణం ఆరోగ్య సంరక్షణ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలే. ఆసుపత్రులు, వైద్య సేవల విభాగాల్లో కొనసాగుతున్న సమ్మె వల్ల ఉపాధి గణనీయంగా క్షీణించింది. జనవరిలో భారీ నియామకాలతో జోరు మీద ఉన్న అమెరికా కంపెనీలు ఫిబ్రవరిలో నియామకాలను ఒక్కసారిగా తగ్గించడం ఆశ్చర్యపరిచింది.ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగానా?నిరుద్యోగిత రేటు పెరగడం, నెగటివ్ పేరోల్ గణాంకాలు వెలువడటంతో ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఫిబ్రవరి నివేదికతో నీరుగారిపోయిందని కొందరు భావిస్తున్నారు.ఆరోగ్య సంరక్షణ రంగంలో సమ్మె ఎందుకు?వైద్య రంగంలోని కార్మికులు ప్రధానంగా ‘సేఫ్ స్టాఫింగ్’ (సరైన నిష్పత్తిలో సిబ్బంది ఉండటం) కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో తగినంత మంది నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల ఒక్కో నర్సుపై రోగుల భారం పెరుగుతోంది. ఇది రోగుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని, వైద్య సేవల్లో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత వేతనాలు తమ జీవన వ్యయానికి సరిపోవడం లేదని నర్సులు, ఇతర హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ వాదిస్తున్నారు.కొన్ని సంస్థల్లో కార్మికులు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 25% వేతన పెంపు కావాలని కోరుతున్నారు.పెరుగుతున్న ఇంటి అద్దెలు, నిత్యావసర ధరల నేపథ్యంలో పాత వేతన ఒప్పందాలు సరిపోవని స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష -
Nepal: ‘ఆర్ఎస్పీ’ ప్రభంజనం.. ప్రధానిగా ‘బాలెన్’?
ఖాట్మండు : హిమాలయ దేశం నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని శాసిస్తున్న హేమాహేమీలను కాదని, ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపుతున్నారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, మాజీ రాపర్ బాలేంద్ర షా (బాలెన్) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. తాజా ఫలితాల సరళిని చూస్తే బాలెన్ షా నేపాల్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.గత ఏడాది సెప్టెంబరులో ‘జెన్-జీ’ (Gen Z) యువత చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయగా, పార్లమెంటు రద్దయిన విషయం తెలిసిందే. ఆ అల్లకల్లోలం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్, మావోయిస్టు సెంటర్లపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి వరంగా మారింది. ముఖ్యంగా రాజధాని ఖాట్మండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు ‘గంట (పార్టీ గుర్తు) మోగిస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.మొత్తం 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాల్లో ఆర్ఎస్పీ ఇప్పటికే 20 స్థానాలను కైవసం చేసుకోగా, మరో 98 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వయంగా బాలేంద్ర షా తన ప్రత్యర్థి, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై ఆయన సొంత గడ్డ అయిన ఝాపా-5 నియోజకవర్గంలో 15 వేల ఓట్ల భారీ ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు, ఆర్ఎస్పీ అధ్యక్షుడు రబీ లామిచానే చిత్వాన్-2 స్థానం నుంచి 54,402 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు.నేపాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. సరిహద్దు దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని భారత్ ఆకాంక్షిస్తోంది. న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. నేపాల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.నేపాల్ ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 9వ తేదీ నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. 165 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలతో పాటు, మిగిలిన 110 స్థానాలను దామాషా పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అవినీతి, రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న నేపాల్లో బాలెన్ షా రాకతో ఒక కొత్త శకం మొదలవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన పాటలతో వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిన బాలెన్, ఇప్పుడు దేశ గమనాన్ని ఎలా మారుస్తారనేది వేచి చూడాలి.ఇది కూడా చదవండి: యువకుని హత్యతో రణరంగం.. వాహనాల దహనం, రాస్తారోకో -
ఇరాన్లో విషపూరిత పొగలు.. హెచ్చరికలు జారీ
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఇరాన్పై దాడుల తీవ్రత పెరిగింది.. -
నైజీరియాలో దారుణం.. 300 మంది అపహరణ
నైజీరియాలో దారుణం జరిగింది. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లు తెగబడ్డారు. ఓ గ్రామంపై దాడి చేసి 300 మందికి పైగా ప్రజలను అపహరించారు. అయితే ఈ దాడి ఏ గ్రూపుకు చెందిన టెర్రరిస్టులు చేశారనే సంగతి ఇంకా తెలియలేదు. నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని బార్నో రాష్ట్రంలో శుక్రవారం ఇస్లామిక్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు. నాగోషి ప్రాంతంపై దాడిచేసి మహిళలు, చిన్నపిల్లలతో సహా దాదాపు 300 మందిని కిడ్నాప్ చేశారు. కాగా ఇటీవల టెర్రరిస్ట్ గ్రూపు బొకోహరమ్కు చెందిన తీవ్రవాదులను అక్కడి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిగి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు.అయితే గత వారం రోజులుగా తరచుగా అక్కడి గ్రామాలపై ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని అక్కడి అధికారి తెలిపారు. స్థానికంగా ఉన్న కొండుగ, మార్టే, జకానా, మైనాక్, అనే జాతుల సమూహాలపై మిలీషియా గ్రూపులు దాడులకు తెగబడుతున్నాయన్నారు. వారిని అంతమెుందించడంలో అనేక మంది భద్రతా అధికారులు ప్రాణాలు అర్పించారన్నారు. అయితే నైజీరియాలో ఉగ్రవాదుల దాడులు సర్వ సాధారణంగా మారాయి. అక్కడ మైనింగ్పై అధిపత్యం కోసం అక్కడ స్థానికంగా ఉన్న మిలీషియా గ్రూపుల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. ఈ దాడులలో వందలమంది ప్రాణాలు వదిలారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి అమెరికా తన బలగాలను నైజీరియాలో మోహరించింది -
యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. అమెరికా దాడులకు పుతిన్ చెక్?
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా? అంటే, అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్టు వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది.‘యుద్ధం మొదలైన ఒకట్రెండు రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలింది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ కచ్చితత్వంతో దాడులు చేయగలిగింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం సుస్పష్టం’ అని సదరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాపైనా ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదముంది.ఇరాన్కు కావాల్సింది.. ఓ మంచి నాయకుడు: ట్రంప్ మరోవైపు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’ అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశాం: అమెరికా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో కూడిన ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ షహీద్ బఘేరీని ముంచేసినట్టు అమెరికా ప్రకటించింది. అది మంటల్లో తగలబడిపోతున్న ఫుటేజీని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఇరాన్ సైన్యం మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. 180 మీటర్ల పొడవైన షహీద్ నిజానికి రవాణా నౌక. యుద్ధ అవసరాల రీత్యా ఇరాన్ దాన్ని తాత్కాలికంగా డ్రోన్ క్యారియర్గా మార్చినట్టు సమాచారం. ఇది రీ ఫ్యూయలింగ్ కోసం ఆగకుండా ఏకబిగిన 22 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు!. -
ఇంజనీర్, ర్యాపర్, మేయర్.. బాలేన్
ఆయన పాటలు జెన్ జెడ్ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కఠ్మాండు మాజీ మేయర్ కూడా అయిన ఆయన ఇప్పుడు ప్రధాని అయి నేపాల్ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అతడే బాలేంద్ర షా..నేపాలీలు ముద్దుగా పిల్చుకునే బాలేన్..!మార్చి 4వ తేదీ. మరో రెండు రోజుల్లో జరిగే సాధారణ ఎన్నికలకు దేశం సమాయత్తమవుతుండగా ఝాపా జిల్లా వాసులు బాలేన్తో సెల్ఫీ కోసం క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారం కోసం వచి్చన బాలేన్తో ఫొటో దిగేందుకు పోటీలు పడ్డారు. దీంతో, కార్యకర్తలు వారిని నియంత్రించే పనిలో బిజీ అయిపోయారు. బాలేన్తో సెల్ఫీ దిగాలని ముచ్చటపడే వారిని క్యూలో నిల్చోబెట్టి, ఒక్కొక్కరికి 10 సెకన్ల చొప్పున సమయమిచ్చారు. ఆ జనం మధ్యలో బాలెన్ నిలబడి ఉన్నారు. నల్లటి బ్లేజర్, నీటుగా ట్రిమ్ చేసిన గడ్డం, తనదైన స్టయిల్లో దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఆయన వారిని బాలేన్, ఒక కరచాలనం, ఒక చిరునవ్వు, ఒక సెలీ్ఫతో సంతోషపెడుతున్నారు. బాలేన్ ధరించే దీర్ఘచతురస్రాకారపు కళ్లద్దాలు ఇప్పటికీ ఆన్లైన్లో బాలేన్ షా గ్లాసెస్ పేరుతో జనం కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇంతటి జనాదరణ కలిగిన 36 ఏళ్ల బాలేన్..అదే బాలేంద్ర షా కఠ్మాండుకు చెందిన ఆయుర్వేద వైద్యుడు రామ్ నారాయణ్ షా నలుగురు కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షతో మెలిగిన ఇతడికి కవితలు రాయడమంటే తెగపిచి్చ. నేపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర, భారత్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చదివాడు. 2013లో నేపాల్లో బాగా పేరున్న ర్యాబార్జ్ పోటీలో గెలుపొందాడు. అందులో బాలేన్ అవినీతి, రాజకీయ స్తబ్ధత, వారసత్వ పాలన వంటి వాటిపై స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్టయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని విమర్శకులు అంటున్నారు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తుంటారని, సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెబుతున్నారు. అమెరికా, చైనాతోపాటు భారత్నూ వదల్లేదు..!గతేడాది సెప్టెంబర్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలేన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ, ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్లను తిట్టిపోసిన బాలేన్..వీరితో ఏపనీ కాదంటూ ఫేస్బుక్లో షాకిచ్చే పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాలేన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ 16 వేల సార్లు ప్రస్తావనకు వచి్చనట్లు అంచనా. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కికి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. రెండు నెలల అనంతరం మేయర్ పదవికి రాజీనామా చేసిన రా్రïÙ్టయ స్వతంత్ర రాష్ట్ర పార్టీలో చేరారు. మేయర్గా దూకుడు... 2022లో బాలేన్ కఠ్మాండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యరి్థగా పోటీకి దిగి ఏకంగా 61 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. ఎప్పటి నుంచో అధికారంలో కొనసాగుతున్న పారీ్టలను షాక్ తినిపించారు. పాలనలోనూ అదే దూకుడు కనబరిచారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. కఠ్మాండులోని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూలగొట్టించారు. నగరంలో చెత్తాచెదారాన్ని శుభ్రం చేసే యంత్రాంగమే లేదని నిరసనగా చెత్తను ప్రధాని కార్యాలయం ఆవరణలో పారబోయించారు. 2025 సెప్టెంబర్లో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జెన్జెడ్ ఆందోళనలు నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముందుంది ‘యుద్ధ గండం’.. ట్రంప్నకు భారీ షాక్?
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి వారం రోజులవుతోంది. ఈ యుద్ధం పశ్చిమాసియాలో తొమ్మిది దేశాలకు విస్తరించింది. ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సైన్యం ఎక్కడా తగ్గకుండా శక్తిమేరకు పోరాడుతోంది. ఇజ్రాయెల్తోపాటు పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలకే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సొంతదేశంలో అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తోంది. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘర్షణను త్వరగా ముగించకపోతే మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని, చివరకు ట్రంప్కు పదవీ గండం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ను ఎలాగైనా లొంగదీసుకోవడానికి అమెరికా సైన్యం వనరుల సమకూర్చుకుంటోంది. తమ సైన్యాన్ని, ఆయుధాలను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ యుద్ధం మరో ఆరు నెలలకుపైగానే.. అంటే సెపె్టంబర్ దాకా కొనసాగే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణిస్తే యుద్ధం ముగిసిపోతుందని, ఇరాన్ తలవంచడం ఖాయమని, అక్కడ ప్రభుత్వం మారిపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భావించాయి. కానీ, క్షేత్రస్థాయిలో జరుగున్నది మరొకటి. ఖమేనీ హత్యపట్ల ఇరాన్ ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా వారంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేని యుద్ధం సుదీర్ఘ యుద్ధానికి ఇజ్రాయెల్తోపాటు అమెరికా సైతం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఇరాన్లో నిఘా కార్యకలాపాలు ముమ్మరం చేస్తోంది. అదనంగా మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులను ఫ్లోరిడాలోని తమ ప్రధాన కార్యాలయానికి పంపించాలని పెంటగాన్కు యూఎస్ సెంట్రల్ కమాండ్ విజ్ఞప్తి చేసింది. మరోవైపు రష్యా నుంచి 30 రోజులపాటు చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్కు అమెరికా తాత్కాలికంగా మినహాయింపు ఇచి్చంది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాలా రోజులు పడుతుందని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళికతో జరిగే యుద్ధాలు కొన్ని నెలలపాటు కొనసాగుతుంటాయి. ఇరాన్లో యుద్ధానికి అప్పటికప్పుడు ప్రణాళిక తయారుచేశారు. ముందస్తు సన్నద్ధత అంటూ ఏదీ లేదు. అందుకే ఇది ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్కు నష్టమెందుకు? అమెరికాలో నవంబర్లో మిడ్టర్మ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ట్రంప్ రెండేళ్ల పాలన పూర్తి కావడానికి ముందు ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇరాన్ యుద్ధం ఈ ఎన్నికలపై గట్టి ప్రభావం చూపడం తథ్యమని అంటున్నారు. ట్రంప్ అనవసరంగా ఈ యుద్ధం తెచి్చపెట్టారన్న అభిప్రాయం అమెరికాలో వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని అంటున్నారు. వీరిలో ట్రంప్ సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు. రిపబ్లికన్ పారీ్టలో చీలిక కనిపిస్తోంది. ట్రంప్ను వ్యతిరేకించేవారు ఎక్కువవుతున్నారు. తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ అండతోనే ఇరాన్పై దాడులు ఆరంభించామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. తద్వారా ట్రంప్ పోద్బలంతోనే ఇరాన్లో నిప్పుల కుంపటి రగించారని అమెరికన్లు నిర్ణయానికొచ్చారు. అసలు ఖమేనీని హత్య చేయడం వెనుక ఔచిత్యం ఏమిటని ప్రశి్నస్తున్నారు. గత అమెరికన్ అధ్యక్షులు ఇరాన్పై యుద్ధానికి ఇష్టపడలేదు. ఆ పని మొదట తానే చేశానని ట్రంప్ గొప్పగా చెప్పుకోవడం ప్రజలకు రుచించడం లేదు. యుద్ధ ప్రభావం ఇప్పటికే మొదలైంది. ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నాయి. ఇవన్నీ ట్రంప్కు సవాలుగా మారుతున్నాయి. మిడ్టర్మ్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు లభిస్తే అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తప్పుకోవాలన్న డిమాండ్లు సొంత పారీ్టలోనే ఊపందుకోవచ్చు. అది ప్రజా ఉద్యమంగా మారితే ట్రంప్ మధ్యలోనే దిగిపోక తప్పదని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్. -
భీకరపోరుకు 7 రోజులు
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి ఏడు రోజులు పూర్తయ్యాయి. తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో వారం రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ దద్దరిల్లిపోతున్నాయి. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ ఇరాన్ లక్ష్యం చేసుకోవడంతో పశ్చిమాసియాలోని పలు ఇతర దేశాలు కూడా దాడుల బారిన పడుతున్నాయి. హార్మూజ్ జలసంధి గుండా సరుకు రవాణా పడకేయడంతో చమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇప్పటిదాకా ఇరాన్లో కనీసం 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్లో పదుల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇరాన్పై దాడులను కనీసం మరో రెండు వారాలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్, నాలుగైదు వారాలు పట్టొచ్చని అమెరికా చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక హెజ్బొల్లా గ్రూపు వంటివాటి రంగప్రవేశంతో రోజులు గడుస్తున్న కొద్దీ యుద్ధం మరింతగా విస్తరిస్తూ వస్తోంది. పశ్చిమాసియా కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. దీని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా దీర్ఘకాలం పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వారం రోజుల పాటు యుద్ధం ఎలా సాగిందో చూస్తే... ఒకటో రోజు ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్, ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా ఫిబ్రవరి 28న శనివారం ఇరాన్పై భారీ స్థాయి యుద్ధానికి దిగాయి. బరిలోకి దిగుతూనే ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేయడం ద్వారా ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాయి! ఆయన నివాస, కార్యాలయ ప్రాంగణంలో అత్యున్నత స్థాయి రక్షణ భేటీ జరుగుతుండగా పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఏకంగా 30కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఖమేనీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవద్దనే ఉద్దేశంతో అత్యంత శక్తిమంతమైన బ్లూ స్పారో క్షిపణిని కూడా ప్రయోగించినట్టు తాజాగా తేలింది! ఖమేనీ భార్య, కోడలుతో పాటు కనీసం 40 మందికి పైగా ఉన్నత స్థాయి నేతలు, సైనిక కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారు. ఆ వెంటనే ఇరాన్ అణు, సైనిక, క్షిపణి లంచ్ ప్యాడ్ వ్యవస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా 100కు పైగా యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ భవనాలు, అధ్యక్ష భవనంతో పాటు రాజధాని టెహ్రాన్వ్యాప్తంగా క్షిపణుల వర్షం కురిసింది. ఓ స్కూలుపై జరిగిన దాడిలో 165 మందికి పైగా విద్యారి్థనులు దుర్మరణం పాలయ్యారు. అనూహ్య దాడి నుంచి తేరుకుని ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై భారీగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతి దాడికి దిగింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యం చేసుకుంటూ యూఏఈ మొదలుకుని దోహా దాకా పలు దేశాలపై దాడులు చేయడంతో పశ్చిమాసియా నిప్పుల కుంపటిగా మారింది. రెండో రోజు ఇరాన్కు చెందిన తొమ్మిది యుద్ధ నౌకలను అమెరికా ముంచేయడంతో యుద్ధం మరింతగా విస్తరించింది. అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దాడులు నేలమట్టం చేశాయి. ఇరాన్వ్యాప్తంగా 100కు పైగా నగరాలపైకి దాడులు విస్తరించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం నమోదయ్యాయి. ఇరాన్ దాడుల్లో అమెరికాకు కూడా గట్టి ఎదురుదెబ్బే తగిలింది. కువైట్లోని సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు. ఇజ్రాయెల్లోని బేట్ షెమెష్ నగరంలోనూ 9 మంది మృత్యువాత పడ్డారు. మూడో రోజు హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దులపైకి క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం లెబనాన్కు కూడా విస్తరించింది. అక్కడి హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ నిల్వలే లక్ష్యంగా సోమవారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దాంతో ఒక్క బీరూట్లోనే 31 మందికి పైగా మరణించారు. దేశమంతటా మృతుల సంఖ్య 50 దాటింది. గల్ఫ్లోని చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది! డ్రోన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీపై స్వల్పంగా దెబ్బ తింది. దాంతో ఆ క్షేత్రాన్ని సౌదీ మూసేసింది. కువైట్ ఫైటర్ జెట్ జరిపిన ‘ఫ్రెండ్లీ ఫైర్’లో అమెరికా ఏకంగా మూడు యుద్ధవిమానాలను కోల్పోయింది! వాటిలోని పైలట్లు మాత్రం సురక్షితంగా తప్పించుకున్నారు. వాటిని కూలి్చంది తమ యుద్ధ విమానాలేనని ఇరాన్ చెప్పుకొచ్చింది. నాలుగో రోజు ఇరాన్పై దాడులను అమెరికా తీవ్రతరం చేసింది. సైనిక స్థావరాలు, అణు కేంద్రాలపై బీ–2 బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతి దాడులను తీవ్రతరం చేసింది. కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించింది. దానిగుండా ప్రయాణించే నౌకలకు నిప్పు పెడతానని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా సౌదీ రాజధాని రియాద్తో పాటు కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో వాటిని మూసేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. దోహా, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్పై కూడా ఇరాన్ పెద్దపెట్టున దాడులు జరిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల పోరుకు దిగింది! 80 సరిహద్దు గ్రామాల వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది.ఐదో రోజు యుద్ధం టర్కీ దాకా విస్తరించింది. ఆ దేశంపైకి ఇరాన్ ఏకంగా ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. భారత్తో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్కు చెందిన భారీ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాపై శ్రీలంక తీర సమీపంలో అమెరికా దాడి చేసింది. మార్క్–48 టోర్పెడో ప్రయోగించి దాన్ని ముంచేసింది. నౌకలోని 120 మందిలో 87 మంది మరణించారు. గల్ఫ్లోని తమ స్థావరాలను కాపాడుకునేందుకు పలు యూరప్ దేశాలు కూడా ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. ఆరో రోజు టెహ్రాన్ గగనతలంలో ఇరాన్ సుఖోయ్–35 యుద్ధ విమానాన్ని ఇజ్రాయెలీ ఎఫ్–35 ఫైటర్ జెట్ నేలకూల్చింది. ఇరాన్లో 170కి పైగా నగరాలు దాడులకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,230 దాటింది. తమ యుద్ధ నౌకను ముంచేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై డ్రోన్లు, బోట్లతో దాడికి దిగింది. కువైట్, ఇరాక్ల్లో కూడా మరో రెండు చమురు నౌకలను నష్టపరిచింది. దాడులు అజర్బైజాన్కు కూడా విస్తరించాయి. ఇరాన్ డ్రోన్ల దాడిలో అక్కడి నఖ్చివాన్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ఏడో రోజు ఇరాన్పై క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగాయి. దక్షిణ ఇరాన్ను అమెరికా, మధ్య, పశ్చిమ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేశాయి. లెబనాన్పై కూడా దాడులను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. టెల్ అవీవ్పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. పశ్చిమాసియా, పరసర ప్రాంతాల్లో ఇప్పటికే 14 దేశాలు యుద్ధంతో ప్రభావితమవుతున్నాయి.ఎన్నెన్ని సమస్యలో! యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. హార్మూజ్ గుండా భారత్కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు. ఏం జరగనుంది? యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది. అయితే రెండు రోజులుగా ఇరాన్ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షపుటంచు నుంచి...
నిత్యం కట్టుదిట్టమైన భద్రత మధ్య అప్రమత్తంగా ఉండే ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యం అత్యంత కచి్చతత్వంతో కూడిన దాడికి పాల్పడి హత్య చేసింది. 37 ఏళ్లపాటు ఇరాన్ను ఒంటిచేత్తో ఏలిన ఖమేనీ కథ చివరకు విషాదంగా ముగిసింది. గత 28న రాజధాని టెహ్రాన్లో నడి»ొడ్డున అత్యున్నత స్థాయి సమావేశంలో ఉండగా జరిగిన దాడిలో మరణించారు. అసలీ దాడి ఎలా జరిగింది, ఖమేనీ అంతం చూసేందుకు ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధం ఏమిటనేవి చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్ సైన్యం ‘బ్లూ స్పారో’ అనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించి లక్ష్యం సాధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మిసైల్ను ‘రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్’ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది అత్యంత ప్రాణాంతక ఆయుధమని చెప్పుకోవచ్చు. ఒక్కసారి లక్ష్యం వైపు దూసుకెళ్లిందంటే దాన్ని మధ్యలో అడ్డుకోవడమే అసాధ్యమే. గురి తప్పే ప్రసక్తే లేదు. శత్రువు నేల కూలాల్సిందే! అసలేమిటి నీలి పిచ్చుక? మూడు బాలిస్టిక్ టార్గెట్ క్షిపుణుల కుటుంబంలో బ్లూ స్పారో కూడా ఒకటి. ఇందులో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో కూడా ఉన్నాయి. మరో ఖండంలో సుదూరంలోని లక్ష్యాలను ఛేదించడానికి బాలిస్టిక్ క్షిపణులను ఫైటర్ జెట్ లేదా రాకెట్కు అమర్చి ప్రయోగిస్తారు. గాల్లోకి లేచిన క్షిపణి తర్వాత ఫైటర్ జెట్ నుంచి విడిపోయి భూ వాతావరణపు అంచుల దాకా వెళ్తుంది. తర్వాత గురుత్వాకర్షణ శక్తితో భూమి దిశగా ప్రయాణించి లక్ష్యాన్ని తాకి పేలిపోతుంది. ఇది ఒక బంతిని గాల్లోకి విసరడం లాంటిదే. పైకి వెళ్లిన బంతి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మళ్లీ భూమిని తాకుతుంది. అందుకే దీన్ని ‘అంతరిక్ష క్షిపణి’గా కూడా పిలుస్తుంటారు. నిజానికి బ్లూ స్పారో, బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారో క్షిపణులను ఇజ్రాయెల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్లో భాగంగా ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేశారు. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను ముందే గుర్తించి, నేలమట్టం చేయడం ఈ డిఫెన్స్ సిస్టమ్ విధి. ఇక్కడ శత్రుదేశాల క్షిపణుల స్థానంలో స్పారో మిస్సైళ్లను డమ్మీగా ఉపయోగించి, ప్రాక్టీస్ చేస్తుంటారు. యుద్ధ రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. బ్లూ స్పారో పొడవు 6.51 మీటర్లు. బరువు 1,900 కిలోలు. సింగిల్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్లెంట్ రాకెట్ ఉంటుంది. జీపీఎస్తోపాటు ఐఎన్ఎస్ నావిగేషన్ సిస్టమ్తో ముందుకెళ్తుంది. బయటి నుంచి అందే సిగ్నల్తో పనిలేకుండా తన కదలికలు నిర్దేశించుకోగలదు. బ్లూ స్పారో మిస్సైల్ లండన్ బస్సు పరిమాణంలో ఉంటుంది. బ్లూ స్పారో స్ఫూర్తితో ‘రాక్స్’ ఇతర దేశాల అత్యాధునిక క్షిపణులకు దీటుగా బ్లూ స్పారోను డిజైన్ చేశారు. భూవాతావరణాన్ని దాటి ముందుకెళ్లి, మళ్లీ భూవాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని తాకడం ఈ నీలి పిచ్చుక ప్రత్యేకత. ఫైటర్ జెట్కు అమర్చిన బ్లూ స్పారో ఆకాశంలో భూవాతావరణం పరిధి వరకూ వెళ్లి విడిపోతుంది. అలాగే పైకి దూసుకెళ్లి భూవాతావరణం అంచును దాటేస్తుంది. పేలుడు పదార్థాలు కూర్చిన క్షిపణి ముందుభాగం వెనుక భాగం నుంచి విడిపోయి భూమి దిశగా వేగంగా ప్రయాణిస్తుంది. అలా కిందికి వచ్చే భాగాన్ని రీ–ఎంట్రీ వెహికల్ అంటారు. ఇందులో వార్హెడ్తోపాటు చిన్నపాటి థ్రస్టర్లు ఉంటాయి. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేని రీతిలో నిట్టనిలువుగా కిందికి వచ్చి అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’లో భాగంగా ఫిబ్రవరి 28న ఉదయం టెహ్రాన్లో ఖమేనీ నివాసాన్ని బ్లూ స్పారో ఇదే తరహాలో ధ్వంసం చేసింది. ప్రాక్టీస్ కోసం అభివృద్ధి చేసిన ఒక మిస్సైల్ ఇరాన్ సుప్రీంలీడర్ను బలి తీసుకుంది. రఫేల్ సంస్థ బ్లూ స్పారో డెవలప్మెంట్తోనే ఆగిపోలేదు. సరిగ్గా ఇదే టెక్నాలజీతో ‘రాక్స్’ను అభివృద్ధి చేసింది. ప్రతికూల వాతావరణంలో సైతం అసాధారణమైన కచి్చతత్వంతో లక్ష్యాలను ఛేదించడం రాక్స్ క్షిపణుల ప్రత్యేకత. శత్రుదేశాలు జీపీఎస్ సిగ్నల్స్ను జామ్ చేసినా సరే ఈ క్షిపణులు సరిగ్గా పనిచేస్తాయి. భూఉపరితలంతోపాటు అంతర్భాగంలోని లక్ష్యాన్ని తాకుతాయి. 500 కిలోల వార్హెడ్ను మోసుకెళ్లగలదు. బ్లూ స్పారో ఒక స్కెచ్(చిత్తుప్రతి) అనుకుంటే రాక్స్ అనేది పూర్తిగా సిద్ధమైన ఆయుధం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖమేనీ బంకర్ ధ్వంసం
దుబాయ్/బీరూట్: పశ్చిమాసియాలో కల్లోల తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఏడో రోజైన శుక్రవారం కూడా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగించాయి. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ప్రధానంగా లక్ష్యం చేసుకున్నాయి. ఇరాన్వ్యాప్తంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. దాడుల తీవ్రతను ఇకపై మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరికలు చేశారు. ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలూ, చర్చలూ ఉండబోవని స్పష్టం చేశారు. ‘‘బేషరతుగా లొంగిపోవాలి. వారి ముందున్న మార్గం అదొక్కటే’’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ మాత్రం ఏ మాత్రమూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పేర్కొంది. భూతల దాడులకు కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. రాజధాని టెహ్రాన్ నడి»ొడ్డున దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీకి చెందిన రహస్య భూగర్భ బంకర్ను బాంబు దాడులతో తుత్తునియలు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ‘‘రహస్య భేటీలతో పాటు యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయం, పర్యవేక్షణ తదితరాల కోసం ఖమేనీ ఈ బంకర్ను ఏర్పాటు చేసుకున్నారు. 50 యుద్ధ విమానాలతో దానిపై విరుచుకుపడ్డాం. నామరూపాల్లేకుండా ధ్వంసం చేసేశాం’’అని ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ పేర్కొంది. ఖమేనీ హత్యానంతరం ఆ బంకర్ సీనియర్ కమాండర్లకు బేస్గా ఉపయోగపడుతున్నట్టు సమాచారం. గురువారం రాత్రంతా గుక్కతిప్పుకోకుండా జరిగిన దాడులతో టెహ్రాన్ అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా భారీగా దుమ్ము, పొగ ఆకాశాన్నంటుతూ కని్పస్తున్నాయి. కీలకమైన క్షిపణి నిల్వ కేంద్రాలున్న కెర్మెన్షాపైనా తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. శుక్రవారం తెల్లవారుజామున అమెరికా బీ–2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఒక్కోటీ 2,000 పౌండ్ల బరువుండే పెనెట్రేటర్ బాంబులను డజన్ల కొద్దీ జారవిడిచాయి! అనంతరం ఉదయం వేళ టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్లు వణికించాయి. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,300 దాటినట్టు ప్రభుత్వం పేర్కొంది. జీసీసీ భవనంపై ఇరాన్ దాడి ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడులను ఇరాన్ ముమ్మరంగా కొనసాగించింది. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖతర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, అజర్బైజాన్ తదితర దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో పశి్చమాసియా దేశాల నుంచి ఇప్పటిదాకా 20 వేల మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకున్నారు. యూఏఈలోని అల్ దాఫ్రా, కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దోహాలోని గల్ఫ్ సహకార సమాఖ్య (జీసీసీ) తాలూకు యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ భవనంపైనా దాడికి దిగింది! ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 109 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్లో అమెరికాకు చెందిన ఒక చమురు క్షేత్రంపైనా ఇరాన్ దాడి చేసింది. దాంతో అక్కడ ఉత్పత్తి నిలిచిపోయింది. కుర్దు తెగ ఇజ్రాయెల్, అమెరికాలకు దన్నుగా యుద్ధానికి దిగితే ఇరాక్లోని కుర్దిస్తాన్పై భారీ స్థాయిలో విరుచుకుపడతానని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్పై తీవ్ర దాడులు లెబనాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం దాడుల తీవ్రతను బాగా పెంచింది. దేశంలో ఇప్పటిదాకా మరణించినవారి సంఖ్య 123కు చేరినట్టు సమాచారం. రాజధాని బీరూట్, శివారు ప్రాంతాలను గాజా తరహాలో నేలమట్టం చేసేస్తామని ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ హెచ్చరించారు. దాంతో ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా 83 వేల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే సరిహద్దులు దాటి లెబనాన్లోకి చొచ్చుకెళ్లింది. అంతర్జాతీయ సమాజం తమను ఆదుకోవాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం విజ్ఞప్తి చేశారు. ఖతర్, దోహ తదితర గల్ఫ్ దేశాలు కూడా తమపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.ఇరాన్కు కావాల్సింది... ఓ మంచి నాయకుడు: ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ఒక మంచి నాయకుడు కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలువురు నేతల పేర్లు తమ దృష్టిలో ఉన్నట్టు చెప్పారు. ‘‘ఇరాన్కు మంచి భవిష్యత్తుంటుంది. ఇతర దేశాల సాయంతో ఆ దేశాన్ని సంక్షోభం నుంచి బయట పడేస్తాం. ఆర్థికంగా అత్యంత బలోపేతం చేస్తాం’’అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)’తరహాలో ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’అంటూ అధ్యక్షుడు ముక్తాయించడం విశేషం! మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధానికి తెర దించేందుకు పలు దేశాలు ప్రయతి్నస్తున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.వైట్హౌస్ నుంచి... హాలీవుడ్ తరహా ట్రైలర్! ఇరాన్ ఆయుధాగారం ఖాళీ అయిందని వెల్లడి ఇరాన్ ఆయుధ నిల్వలు దాదాపుగా నిండుకుంటున్నాయని అమెరికా అభిప్రాయపడింది. అందుకే రెండు రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు బాగా తగ్గుముఖం పట్టినట్టు చెప్పుకొచి్చంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గాయని వైట్హౌస్ పేర్కొంది. ఇందుకు సంబంధించి అసాధారణ రీతిలో హాలీవుడ్ తరహా ట్రైలర్ను విడుదల చేయడం విశేషం! యుద్ధ ఫుటేజీని హాలీవుడ్ యాక్షన్ సినిమాల క్లిప్పింగులతో కలగలిపి దాన్ని రూపొందించారు.హార్మూజ్లో నౌకపై దాడి! ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో మూతబడ్డ హార్మూజ్ జలసంధి వద్ద ఓ నౌకపై శుక్రవారం దాడి జరిగినట్టు సమాచారం. బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం ఈ మేరకు వెల్లడించింది. అయితే నౌక వివరాలు, దాడి తీవ్రత వంటి వివరాలేవీ తెలియరాలేదు. ఈ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయతి్నంచే ప్రతి నౌకకూ నిప్పు పెడతామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. -
రూపాయి, ఇంధన రేట్లపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదికలో హెచ్చరించింది. పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంలాంటి అంశాలు కూడా దీనికి తోడైతే రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చని ఫిబ్రవరికి సంబంధించిన నెలవారీ ఆర్థిక సమీక్షలో తెలిపింది. అయితే, క్రూడాయిల్ కోసం దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్నప్పటికీ భారత్ వద్ద తగినంత స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు తక్కువ స్థాయిలో కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం మొదలైన సానుకూలాంశాలు, పెరిగే చమురు ధరల ప్రతికూల ప్రభావం నుంచి రక్షణ కల్పించగలవని ఆర్థిక శాఖ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ పటిష్టమైన వృద్ధి బాటలోనే ముందుకు సాగిందని పేర్కొంది. -
మళ్లీ మనకి రష్యా క్రూడ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుమతి మేరకు, రష్యా నుంచి మళ్లీ క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకు భారత్కి అవకాశం లభించింది. ఇందుకు సంబంధించి 30 రోజుల పాటు భారత్కి వెసులుబాటునిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.‘‘అధ్యక్షుడు ట్రంప్ ఎజెండాతో చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో చమురును అందుబాటులో ఉంచే దిశగా రష్యా ఆయిల్ని భారత రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపునిస్తున్నాం. ఇంధనాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. కీలక భాగస్వామి అయిన భారత్, ఈ వ్యవధి ముగిసిన తర్వాత మా దగ్గర్నుంచే మరింతగా ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్ ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోళ్లకు అనుమతించినందున, ఈ తాత్కాలిక వెసులుబాటుతో రష్యాకి భారీగా ఆర్థిక ప్రయోజనాలేమీ చేకూరవని బెసెంట్ తెలిపారు. సముద్ర జలాల్లో 130 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ఆంక్షలు వర్తించని సంస్థల నుంచి దేశీ రిఫైనింగ్ సంస్థలు ఇప్పటికే దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, అమెరికా మినహాయింపునివ్వడానికి ముందే, పశ్చిమాసియా నుంచి సరఫరా దెబ్బతిన్నప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి కొనుగోళ్లకు కూడా మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్తో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతంలో రష్యన్ ట్యాంకర్లు నిల్చి ఉండగా, మరో 7 మిలియన్ బ్యారెళ్ల ట్యాంకర్లు సింగపూర్ దగ్గర్లో ఉన్నాయి. వీటికి తోడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారత్కి చేరుకునేంత దూరంలో, సింగపూర్ సమీపంలో మరో ఎనిమిది ట్యాంకర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెల రోజుల వ్యవధిలో భారత్కి రాగలిగేలా మధ్యధరా సముద్రం, సూయెజ్ కెనాల్లో మరిన్ని నౌకలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దాదాపు 50 శాతం క్రూడ్ దిగుమతుల కోసం హార్మూజ్ జలసంధిపై ఆధారపడటంతో సరఫరా సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్కి 30 రోజుల వెసులుబాటు భారీ ఊరటనిచ్చే విషయమని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ’కెప్లర్’ అనలిస్ట్ సుమీత్ రితోలియా తెలిపారు. ప్రస్తుతం 130 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ క్రూడ్, సముద్ర జలాల్లో ఉందని, సరైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది దేశీ పోర్టులకు మళ్లడానికి వీలవుతుందని వివరించారు. దేశీ రిఫైనర్లు ఇప్పుడు రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ కొంటున్నాయని, తాజాగా దాన్ని మరింతగా పెంచేందుకు వీలు చిక్కిందని వివరించారు. అయితే, అదే ఆయిల్ కోసం చైనా కూడా పోటీపడుతున్నందున డిస్కౌంట్లపరంగా భారత్కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చని పేర్కొన్నారు. 25 రోజులకు సరిపడా నిల్వలు...ఉక్రెయిన్ మీద దాడికి శిక్షగా పాశ్చాత్య దేశాలు రష్యాపై 2022లో ఆంక్షలు విధించడం, అటుపైన ఆ దేశం భారత్కి భారీ డిస్కౌంటుపై చమురును ఆఫర్ చేయడం తెలిసిందే. దీనితో మిగతా దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించుకున్న భారత్ 2023 మేలో రోజుకు ఏకంగా 2.15 మిలియన్ బ్యారెళ్ల స్థాయిలో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసింది. కానీ అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచి్చంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 25 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు తీవ్రమై.. క్రూడ్ రేట్లు కొండెక్కుతున్న నేపథ్యంలోనే అమెరికా మినహాయింపునివ్వడం కొంత ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు తెలిపారు. -
ఖమేనీ కోసం.. అంతరిక్షం నుంచి మిస్సైల్?
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ ఇజ్రాయెల్ జరిపిన దాడులలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఖమేనీ మరణంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగింది. అయితే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్పై అటాక్ కోసం ఇజ్రాయెల్ అత్యాధునిక బ్లూస్పారో క్షిపణిని ప్రయోగించినట్లు పత్రికా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఖమేనీని అంతంచేయడం కోసం ఈ క్షిపణి అంతరిక్షం నుంచి దూసుకొచ్చి లక్షాన్ని భేదించింది.ఇరాన్ సుప్రీం లీడర్ హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఒక దేశాధినేతను అతని దేశంలోనే అటాక్ చేసి చంపడం ప్రపంచాన్ని నోరెళ్లబెట్టాలా చేసింది. అయితే ఈ దాడికి సంబంధించిన ప్లాన్ గతేడాది నవంబర్లోనే జరిగిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఆయనపై ఈ 2026 మధ్యలో దాడి చేయాలని ప్లాన్ చేసినప్పటికీ ఇరాన్లోని నిరసనల కారణంగా ప్లాన్ ముందుకు జరిగిందని తెలిపారు. అయితే ఖమేనీపై అటాక్ చేయడానికి ఇజ్రాయెల్ వాడిని క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా తెలుస్తోంది.బ్లూస్పారో ప్రత్యేకతబ్లూస్పారోగా పిలిచే ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు 2 వేల కిలోమీటర్లు. దీని పొడవు 6.5 మీటర్లు కాగా బరువు 1.9 టన్నులు శత్రు రాడార్లకు చిక్కకుండా ఖచ్చితంగా లక్షాన్ని భేదించడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. అయితే వేగవంతంగా లక్షాన్ని చేధించడానికి ఇవి తొలుత అంతరిక్షానికి ఎగిరి అక్కడి నుంచి టార్గెట్ను ధ్వంసం చేస్తాయి. బ్లూస్పారో రాకను గమనించేలోగే విధ్వంసం చేసేయడం ఈ మిస్సైల్ ప్రత్యేకత స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.అయితే దీనిని ఇజ్రాయెల్ ‘అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణి’గా అభివర్ణిస్తుంది. ఎందుకంటే దీనిని ప్రయోగించేటప్పుడు మెుదటగా ఆకాశం అంచుల వరకూ ఎగురుతుంది అనంతరం తరువాత భూమిపై ఉన్న లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. భీకర వేగంతో అత్యంత కచ్చితత్వంతో టార్గెట్స్ను ఛేదించడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. ఇక ఇరాన్ సుప్రీం ఖమేనీని ఈ క్షిపణి వాడే ఇజ్రాయెల్ అంతం చేసింది. -
ఇజ్రాయెల్ భారీ అటాక్.. 50 ఫైటర్ జెట్స్తో ధ్వంసం
ఇజ్రాయెల్ మరో భారీ అటాక్ చేసింది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న అత్యంత రహస్యమైన బంకర్ను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ కోసం 50కి ఫైగా ఫైటర్ జెట్ వాడినట్లు తెలిపింది. అయితే ఈ బంకర్ మాజీ సుప్రీం ఆయుతుల్లా ఖమేనీ తలదాచుకోవడానికి ఏర్పాటు చేశారు. ఆయన మృతితో ప్రస్తుతం ఇతర అధికారులు ఈ బంకర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రహస్య స్థావరం నుంచే ఇరాన్ ప్రభుత్వం ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఈ బంకర్లో ప్రవేశానికి అనేక వీధుల గుండా మార్గాలున్నాయని లోపల ఎన్నో గదులున్నాయంది. దీనిని గుర్తించడానికి ప్రత్యేక నిఘా పెట్టామని పక్కా సమాచారంతోనే దానిపై దాడి చేసినట్లు తెలిపింది. తాజాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేసింది.కాగా ప్రస్తుతం ఇరాన్తో యుద్ధ కార్యకలాపాలు నిర్వహించడానికి ఆ బంకర్నే ప్రధానంగా వాడుతున్నారని సమాచారం.. ఇప్పుడు దానిని ధ్వంసం చేయడంతో ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం యుద్ధం భీకరంగా సాగుతోంది. గల్ఫ్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సైతం ఇరాన్పైకి పెద్దఎత్తున దాడులు జరుపుతున్నాయి. 🎥 WATCH: ~50 Israeli Air Force fighter jets dismantled Ali Khamenei’s underground military bunker beneath the Iranian regime’s leadership compound in Tehran. pic.twitter.com/Nw0tvvQMRX— Israel Defense Forces (@IDF) March 6, 2026 -
బంగారంపై భారీ డిస్కౌంట్.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు
మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్కు, అమెరికా-ఇజ్రాయెల్కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. -
బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని
బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే. చైనాకు చెందిన ఒక కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. తాము పెంచుకున్న బాతును విందుకోసం వధించారు. అనూహ్యంగా దాని పొట్టలో బంగారాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అంచనా. మెయిన్ల్యాండ్ మీడియా అవుట్లెట్ జిన్వెన్ఫాంగ్ నివేదించిన ప్రకారం, ఆ ముక్కలు మొత్తం 10 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. వాటి అంచనా విలువ దాదాపు 12,000 యువాన్లు, అంటే దాదాపు రూ. 1.6 లక్షలు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరిలో హునాన్ ప్రావిన్స్లోని లాంగ్హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే గ్రామస్థుడు, బాతును వధించిన తర్వాత దానిని శుభ్రం చేస్తున్నప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కల్ని గమనించాడు. దీంతో ఇది నిజంగా బంగారమేనా అని నిర్ధారించుకునేందుకు, ఇంట్లోనే బర్నింగ్ టెస్ట్ నిర్వహించాడు. నిజమైన బంగారమే అని తెలిసి సంతోషంగా ఉబ్బితబ్బిబ్బైనాడు. రాబోయే అదృష్టానికి సంకేతంగా లియు తండ్రి అభిప్రాయపడగా, ఇది కొత్తేమీ కాదనీ, ఇంత పెద్ద మొత్తంలో లభించడం మాత్రం ఇదే తొలిసారని కొడుకు లియూ చెప్పాడు.(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్)అయితే బాతులు, ఇతర పక్షులు ఆహారం తీసుకునేటప్పుడు చిన్న రాళ్ళు, ఇసుక లేదా గ్రిట్ మింగడం చాలా కామన్. అలా ఒకప్పుడు బంగారు తవ్వకాలతో ముడిపడి ఉన్న నది దగ్గర ఆహారం తీసుకుంటుండగా ఈ బాతు పొట్టలోకి బంగారం చేరి ఉంటుందని విశ్వసిస్తున్నారు.అ యితే ప్రస్తుతం బాతు పొట్టలో దొరికిన బంగారం ఎవరిది అని నిర్ణయించడం కష్టమంటున్నారు అధికారులు. 1970-1990ల మధ్య కాలంలో, ఈ నది దగ్గర బంగారం కోసం వేట చాలా జోరుగా సాగేది. అయితే, తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రైవేట్ బంగారు తవ్వకాలను నిషేధించింది.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య -
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్న దుబాయ్లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్ -
ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
ఇరాన్పై భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగింది. ట్రంప్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.తాజాగా విడుదలలైన ఈ పత్రాలు ప్రకారం ఎప్స్టీన్ ద్వారా ట్రంప్కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్స్టీన్ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్కు పరిచయం చేశాడు. ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆమె ఆరోపించింది.రాజకీయ దుమారంఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్స్టీన్ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్స్టీన్ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే! -
రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశానికి అమెరికా నుంచి ఊరట లభించింది. రష్యన్ ముడి చమురును సేకరించడానికి భారతీయ రిఫైనరీలకు అమెరికా ట్రెజరీ విభాగం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు మంజూరు చేసింది.గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో భారత్ తక్కువ ధరకే రష్యా చమురును పొందింది. ఫిబ్రవరి 28 నాటి గణాంకాల ప్రకారం, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు బ్యారెల్కు 13 డాలర్ల భారీ తగ్గింపుతో చమురును కొనుగోలు చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ ప్రారంభంలో భారత నౌకాశ్రయాలకు చేరబోయే రష్యన్ చమురుపై వ్యాపారులు ఇప్పుడు బ్రెంటు క్రూడ్ ధర కంటే బ్యారెల్కు 4 నుంచి 5 డాలర్ల ప్రీమియం వసూలు చేస్తున్నారు. మిడిల్ఈస్ట్ ప్రాంతంలో సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల రష్యా చమురుకు డిమాండ్ విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.యుద్ధ సంక్షోభం.. భారత్ వ్యూహంభారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ప్రధానంగా హార్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. ఇరాన్ వివాదం కారణంగా ఈ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో భారత రిఫైనర్లు రష్యా వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్లో ధర కంటే కూడా చమురు లభ్యత అత్యంత కీలకంగా మారింది. ఇంధన భద్రత దృష్ట్యా భారత రిఫైనర్లు తిరిగి రష్యా మార్కెట్లోకి ప్రవేశించాయి’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇప్పటికే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం , హిందుస్థాన్ పెట్రోలియం, ఎంఆర్పీఎల్ సంస్థలు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది.అమెరికా మినహాయింపు ఎందుకు?ప్రపంచ చమురు ధరల నియంత్రణను దృష్టిలో ఉంచుకొని భారత్ వంటి భారీ వినియోగదారు రష్యా చమురును ఒక్కసారిగా నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. ఇది అమెరికాలో కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా రష్యా చమురు అందుబాటులో ఉండటం ప్రపంచ ఇంధన భద్రతకు అవసరం.యూఎస్ను సంప్రదించకుండా నేరుగా కొనుగోలు చేస్తే..ఒకవేళ భారత్ అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యాతో నేరుగా లావాదేవీలు జరిపితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందో చూద్దాం.అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా డాలర్లలో జరుగుతుంది. అమెరికా అనుమతి లేకపోతే రష్యాకు డబ్బు చెల్లించే భారతీయ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. దీనివల్ల ఆ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతోనూ లావాదేవీలు జరపలేవు (స్విఫ్ట్ వ్యవస్థ నుంచి తొలగించడం వంటివి).చమురు మోసుకొచ్చే నౌకలకు అంతర్జాతీయంగా బీమా అందించే సంస్థలు ఎక్కువగా పాశ్చాత్య దేశాలవే. అమెరికా ఆగ్రహిస్తే రష్యా చమురు తెచ్చే నౌకలకు బీమా లభించదు. ఏదైనా ప్రమాదం జరిగితే అది భారీ నష్టానికి దారితీస్తుంది.రష్యాతో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలను అమెరికా తన బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. దీనివల్ల ఆ కంపెనీలు అమెరికాలో వ్యాపారం చేయలేవు, అమెరికా సాంకేతికతను పొందలేవు. ఉదాహరణకు, రిలయన్స్ లేదా నయారా వంటి సంస్థలు తమ ఎగుమతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.క్వాడ్ (QUAD) వంటి కూటముల్లో భారత్ ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. రక్షణ రంగంలో అమెరికా నుంచి అందుతున్న కీలక సాంకేతికత (డ్రోన్లు, జెట్ ఇంజిన్లు) నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.భారత్ ప్రస్తుతం వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. అంటే రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే అమెరికా ఆంక్షల పరిధి దాటకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే నేరుగా ఘర్షణకు వెళ్లకుండా ఇలాంటి మినహాయింపుల ద్వారా తన అవసరాలను తీర్చుకుంటోంది.ఇదీ చదవండి: కక్కలేక.. మింగలేక.. -
ఇరాన్ యుద్ధం వేళ.. ట్రంప్నకు బిగ్ ఝలక్!
ఇరాన్ టార్గెట్గా ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. యూఎస్ డ్రోన్లు, క్షిపణులు.. ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు, దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మెరుపు దాడులు చేస్తోంది. పరస్పర దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు మృతి చెందగా.. భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడులతో కొన్ని గల్ఫ్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్పై కొన్ని గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ప్రారంభించిన తర్వాత.. ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్ సహా ఐదు గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి డ్రోన్లు, క్షిపణి దాడులు జరిపింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్, అబుదాబి), అలాగే సౌదీ అరేబియా లక్ష్యంగా మారాయి. ఈ దాడులు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగాయి. గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్.. కనీసం 380 క్షిపణులు, 1,480 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. ఆ దేశాలలో కనీసం 13 మంది మరణించారని అధికారిక ప్రకటనల ప్రకారం తెలిసింది. ఆదివారం కువైట్లో ఇరాన్ డ్రోన్ దాడి ప్రధాన ఆర్మీ స్థావరం నుండి 10 మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఒక పౌర ఓడరేవులోని ఆపరేషన్ సెంటర్ను తాకింది. ఈ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించారు.మరోవైపు.. ఇరాన్ దాడులు గల్ప్ ప్రాంతాన్ని అస్థిరం చేస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న దేశాలు నేరుగా లక్ష్యంగా మారాయి. ఇది చమురు సరఫరా, అంతర్జాతీయ భద్రతపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై గల్ఫ్ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్పై దాడులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నాయి. దాడులపై తమకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ సన్నద్ధతకు తమకు తగినంత సమయం అమెరికా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం, దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్లాన్ ప్రకారం ఎంతో భద్రతతో ఉందని ఆరోపిస్తున్నాయి. అమెరికా సైన్యం కూడా తమకు రక్షణ ఇవ్వలేదని చెబుతున్నాయి.కాగా, గల్ఫ్ దేశాల అసహనంపై తాజాగా వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ స్పందించారు. ఈ సందర్బంగా కెల్లీ..‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ఆయుధాలను ప్రయోగించే లేదా ఉత్పత్తి దేశాలను అణచివేస్తుంది. ఈ కార్యక్రమం వల్లే ఇరాన్ ప్రతీకార బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం తగ్గాయి. అధ్యక్షుడు ట్రంప్ మా ప్రాంతీయ భాగస్వాములందరితో సన్నిహిత సంబంధంలో ఉన్నారు. ఉగ్రవాద ఇరాన్ పాలన, పొరుగు దేశాలపై చేసిన దాడులను అధ్యక్షుడు ట్రంప్ పర్యవేక్షిస్తున్నారు. మా మిత్రదేశాలకు ఈ ముప్పును తొలగించడం ఎంత అవసరమో అని చర్యలు తీసుకుంటున్నారు’ అని క్లారిటీ ఇచ్చారు. -
ఓటమిని అంగీకరించిన నేపాలీ కాంగ్రెస్ : చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా
నేపాల్ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్చారిత్రాత్మక విజయం దిశగా బాలెన్ షా. రాపర్ నుంచి వ్యాపారవేత్తగా అవతరించిన బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రి అయ్యేందుకు సన్నద్ధం.110 స్థానాల్లో ఆధిక్యంతో అఖండ విజయాన్ని అందుకోనున్నబాలెన్షాబాలెన్ షా పార్టీ 107 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఒకసీటును గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తోంది: నేపాలీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బిశ్వ ప్రకాష్ శర్మ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు నేపాల్ను ప్రశంసించిన చైనామాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని బీజింగ్ అనుకూల సిపిఎన్-యుఎంఎల్ ఓటమి దిశగా సాగుతోంది.నాలుగుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఓలి, తన సొంత పార్లమెంటు స్థానంలో బాలెన్ షా కంటే చాలా వెనుకబడి ఉన్నారు.క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న ఆర్ఎస్పీనేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి యోగేష్ గౌచన్ తకాలి ముస్తాంగ్ నుండి CPN-UML ఇంద్రధర బిస్టాపై 3,307 ఓట్లతో విజయంఆర్ఎస్పీ 102 నియోజకవర్గాల్లో ముందంజఆర్ఎస్పీ 102 నియోజకవర్గాల్లో ముందంజలో ఉందిఆర్ఎస్పీ అభ్యర్థి రంజు న్యూవానే కాఠ్మాండు-1 నుంచి పార్లమెంట్ సీటు గెలిచారు275 మంది సభ్యులు ఉన్న ప్రతినిధి సభకు గురువారం ఓటింగ్ జరిగింది165 స్థానాలకు నేరుగా, 110 సీట్లకు నైష్పక్షిక విధానంలో ఓటింగ్ జరిగిందిఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఆధిక్యం?రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ప్రస్తుతం 77 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉందినేపాలి కాంగ్రెస్ ఇప్పటికే ఒక స్థానాన్ని గెలుచుకుంది, 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉందిసీపీఎన్-యూఎంఎల్ పార్టీ 7 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉందినేపాలి కమ్యూనిస్ట్ పార్టీ 6 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉందిరాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉందిశ్రమ్ సంస్కృతి పార్టీ ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉందినేపాల్లో వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది72 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీరాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 72 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చిందిట్రెండ్స్ చూస్తుంటే ఆర్ఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కనపడుతోంది.60 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీ కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ ఆర్ఎస్పీకి పెరుగుతున్న ఆధిక్యం 60 స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం? 55 స్థానాల్లో ఆధిక్యంలో బాలేంద్ర షా పార్టీ ‘ఆర్ఎస్పీ’ కేపీ శర్మ ఓలీ ‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‘ 8 స్థానాల్లో ఆధిక్యం కేపీ శర్మ పార్టీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితయ్యేలా ఉన్న ట్రెండ్స్దూసుకెళ్తున్న పీఎం అభ్యర్థి బాలేంద్ర కొనసాగుతోన్న నేపాల్ ఎన్నికల కౌంటింగ్ ఝాపా నియోజక వర్గంలో దూసుకెళ్తున్న బాలేంద్ర షా (35) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై బాలేంద్ర షా ఆధిక్యంఆర్ఎస్పీ నుంచి ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా మూడు సీట్లలో ఆర్ఎస్పీ గెలుపు, 45కి పైగా సీట్లలో ముందంజ -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పొరుగు అరబ్ దేశాలకు ఎటువంటి నష్టం కలగలేదన్నారు.ఇరాన్ చేపట్టిన సైనిక దాడులు చాలా జాగ్రత్తగా.. కేవలం అమెరికా లక్ష్యాలను మాత్రమే గురిచూసి చేసినవని ఆయన తెలిపారు. ఈ దాడుల వల్ల పొరుగున ఉన్న ఏ ఒక్క అరబ్ దేశానికి కూడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్లో ప్రసంగిస్తూ.. ఇరాన్ చర్యలను సమర్థించుకున్నారు.అలాగే, ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చివరి బుల్లెట్ వరకు ప్రతిఘటించడం తప్ప.. మరో మార్గం లేదన్నారు. ఇరాన్ ప్రస్తుతం పూర్తి యుద్ధ స్థితిని ఎదుర్కొంటోందని ఖతీబ్జాదే నొక్కి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడికి, దురాక్రమణకు మేము గురవుతున్నాము. వారు ఇరాన్కు భారీ నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నా తోటి పౌరులు అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న కార్పెట్ బాంబింగ్లతో నిరంతరం దాడులకు గురవుతున్నారు. టెహ్రాన్ నిరంతర దాడుల నీడలో ఉంది.ఇది ఇరాన్ పౌరుల వీరోచిత యుద్ధం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. అలాగే, ఒక దేశాధినేతను అమెరికా హత్య చేసిందని ఆరోపిస్తూ, ఇది ప్రపంచ దౌత్య సంబంధాలకు ముప్పు అంటూ ఆయన హెచ్చరించారు. -
నేపాల్ ఎన్నికల కౌంటింగ్లో దూసుకుపోతున్న బాలేంద్ర షా ‘ఆర్ఎస్పీ’
కాఠ్మాండు: నేపాల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆ దేశంలో గత ఏడాది జెన్ జీ నిరసనలతో కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఇవాళ ఉదయం ఉన్న ట్రెండ్స్ను బట్టి చూస్తే ఝాపా నియోజక వర్గంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ(74)పై జెన్ జీ అభిమాన నాయకుడు కాఠ్మాండు మాజీ మేయర్, ర్యాపర్ బాలేంద్ర షా (35) ఆధిక్యంలో ఉన్నారు.ఈ ఎన్నికల ముందు నిర్వహించిన సభల్లో బాలేంద్ర షా పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించారు. ఆయన సభలకు అధికంగా యువత హాజరైంది. బాలేంద్ర షాను బలెన్గానూ పిలుస్తుంటారు. ఆయన గత డిసెంబర్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరారు. ఆ పార్టీకి మాజీ టీవీ హోస్ట్ రబి లామిచ్ఛానే అధ్యక్షుడు. అయితే, తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా బాలేంద్ర షా పేరును ఆర్ఎస్పీ ప్రకటించింది.రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఇవాళ ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో మూడు సీట్లలో గెలుపు సాధించగా, 45కి పైగా సీట్లలో ముందంజలో ఉంది. కేపీ శర్మ ఒలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) పార్టీ, గగన్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ పార్టీలు తలో 3 సీట్లలో మాత్రమే ముందంజలో ఉన్నాయి.మూడు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన పుష్ప కమల్ దహాల్ నేతృత్వంలోని నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ రుకుమ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ముందంజలో ఉంది. నేపాల్లో 17 సంవత్సరాల్లో 14 ప్రభుత్వాలు మారాయి. రాజకీయ అస్థిరత ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. నేపాల్లో 1.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 60 శాతం మంది గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 65 పార్టీల నుంచి 3,400కి పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు.నేపాల్ ఎన్నికల ఫలితాలపై భారత్ దృష్టి నేపాల్ ఎన్నికల ఫలితాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఇటీవల నేపాల్లో శాంతి, పురోగతి, స్థిరత్వానికి భారత్ నిరంతరం మద్దతు ఇస్తోందని తెలిపారు. సత్సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా నేపాల్ కొత్త ప్రభుత్వంతో పని చేయాలని ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు. నేపాల్ ఎన్నికలకు భారత్ లాజిస్టిక్ సరఫరాలు కూడా చేసింది. -
ఖమేనీ హత్యకు ఇలా ప్లాన్.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
టెలీ అవీవ్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి హత్య ప్లాన్కు సంబంధించిన కీలక వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్లోనే నిర్ణయించుకున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించాము. మొదట ఆ ఆపరేషన్ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యూహాన్ని అమెరికాకు కూడా వెల్లడించాం’ అని తెలిపారు.అలాగే.. ఇరాన్లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. -
ఇరాన్తో యుద్ధం.. ఇజ్రాయెల్కు వారానికి ఎంత నష్టమంటే..!
జెరూసలేం: జనాలను, జలవనరులను నాశనంచేసే యుద్ధం కారణంగా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు రూ.27 వేల కోట్లు నష్టపోతోందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనావేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని లేదంటే ఆర్థికఊబిలో కూరుకుపోతామని ఆర్థికశాఖ హెచ్చరించింది.ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షెయీ క్లాపర్కు ఆర్థికశాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ ఒక లేఖ రాశారు. భద్రతకోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమేగానీ ఆర్థిక స్వావలంభన పైనా దృష్టిసారించాలని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యాసంస్థలు, వ్యాపారసముదాయాలు, పని ప్రదేశాలను మూసేయడంతో వ్యాపారం తగ్గిపోయి ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోంది. ఇకనైనా కఠిన ఆంక్షలను పాక్షికంగా సడలించాలి. రెడ్ లెవల్ అలర్ట్ను ఆరెంజ్ స్థాయికి తగ్గించాలి’’ అని ఆయన లేఖలో సూచించారుకాగా, ఇరాన్పై దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6,900 కోట్లు) ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది. -
ఇరాన్ కొత్త నాయకుడికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపికలో అగ్రరాజ్యం పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అయతొల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంగా ఎంపిక అయ్యారనే ప్రచారంపైనా ట్రంప్ తీవ్రంగా స్పందించారు.ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా మోజ్తబాను చూడటం దాదాపుగా అసాధ్యం అని ట్రంప్ తేల్చేశారు. రాయిటర్స్ మీడియాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్ భవిష్యత్తు కోసం జరిగే నాయకత్వ ఎంపికలో మేము (అమెరికా) భాగం కావాలి. అప్పుడే ఎంపికలో పారదర్శకత ఉంటుంది. ప్రతీ ఐదు సంవత్సరాలకొకసారి మళ్లీ ఇదే చేయాల్సిన అవసరం ఉండదు. ఇరాన్కు, ఆ దేశ ప్రజలకు గొప్ప సేవ అందించే నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మోజ్తబాను తదుపరి నాయకుడిగా పరిగణించడం అసాధ్యమనే రీతిలో ఆయన మాట్లాడినట్లు సదరు మీడియా సంస్థ కథనం ఇచ్చింది.మరోవైపు.. ఇరాన్ మాజీ రాజకుమారుడు రెజా పహ్లవికి ఆ అవకాశం ఉండొచ్చా? అని రాయిటర్స్ ప్రతినిధి వేసిన ప్రశ్నకు.. ఎంపికలో ఎంతో మంది పేర్లను పరిశీలించవచ్చు. అది ఇప్పుడే చెప్పలేం అని ట్రంప్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో అమెరికా ప్రమేయం ఉండాల్సిందేనన్న ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా మధ్య ప్రాచ్యంలో మిడిల్ ఈస్ట్లో అమెరికా ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ వ్యాఖ్యలు ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనకు, రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న(2026)అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో అయతొల్లా ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించారు. ఆయన మరణాంతరం గార్డియన్ కౌన్సిల్కు చెందిన అయతొల్లా అలిరెజా ఆరఫీని (ఖమేనీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కూడా) తాత్కాలిక సుప్రీం లీడర్గా నియమించారు. ఆపై మార్చి 4న ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఖమేనీ తనయుడు మోజ్తబాను అధికారికంగా ఎన్నుకుంది. అయితే ఈ ఎంపిక సజావుగా జరగలేదని, ఇందులో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి ఉందని పలు కథనాలు చెబుతున్నాయి. -
మరో దేశంపై యుద్ధం ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచమంతా యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్దం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో, మరో యుద్ధం తప్పదని ట్రంప్ పరోక్షంగా చెప్పుకొచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధం జరుగుతోంది. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబా సంగతి తేలుస్తాం. అమెరికాతో డీల్ చేసుకునేందుకు క్యూబా ఎంతో ఉత్సాహంగా ఉంది. క్యూబా అమెరికా మాట వినకపోతే ఇలాంటి పరిస్థితే ఉంటుంది అంటూ హెచ్చరించారు. చివరకు స్నేహ పూర్వకంగా క్యూబాను దక్కించుకునే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. మరి ఇరాన్ యుద్ధం అయిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. CAN ANYONE STOP THIS LUNATIC⁉️Trump says that America will go to war with Cuba after the war in Iran is "finished." pic.twitter.com/DlOuWd8dFo— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 6, 2026అంతకుముందు కూడా క్యూబా లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి రావచ్చు అంటూ కామెంట్ చేశారు. -
ఇరాన్ దాడులు.. దుబాయిలో హైఅలర్ట్ బంకర్లలోకి ప్రజలు?
ఇరాన్పై అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది.. మరోవైపు.. ఇరాన్ సైతం.. -
డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పరిధిలో లేని 1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ)ను అడ్డుపెట్టుకుని విదేశాలపై విధించిన అధిక టారిఫ్ల మాటున వసూలుచేసిన 130 బిలియన్ డాలర్లను తిరిగి ఆయా కంపెనీలకే చెల్లించాలని మాన్హట్టన్ నగరంలోని ‘యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో జడ్జి రిచర్డ్ ఈటన్ తీర్పు చెప్పారు.టెన్నిస్సీ రాష్ట్రంలోని నాష్విల్లే నగరంలోని అట్మాస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ వేసిన పిటిషన్ను విచారిస్తూ జడ్జి ఈ తీర్పు వెలువర్చారు. ప్రపంచదేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమంటూ ఫిబ్రవరి 20వ తేదీన అమెరికా దేశ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. కానీ ఆయా దేశాల కంపెనీలు చెల్లించిన అధిక టారిఫ్లను తిరిగి వాళ్లకే రీఫండ్ చేయాలని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదు. అయితే గురువారం ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో రీఫండ్ విషయంలో స్పష్టత వచి్చనట్లయింది. -
ఇరాన్, రష్యా స్నేహం.. యుద్ధం వేళ కీలక ప్రకటన
మాస్కో: ఇజ్రాయెల్, అమెరికాలతో పోరాడుతున్నప్పటికీ ఇరాన్ తమను సైనిక సాయం అడగలేదని రష్యా ప్రకటించింది. మిత్రదేశానికి సాయపడబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ గురువారం స్పందించారు. ‘‘ఇరాన్ నుంచి ఇంతవరకు ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇరాన్తో మా మిత్రత్వం ఎప్పటి లాగానే కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 2025 జనవరిలో ఇరాన్తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. కానీ ఆ ఒప్పందంలో ఆపత్కాలంలో ఇలాంటి సైనిక సాయం అంశం లేదు’’ అని పెస్కోవ్ స్పష్టంచేశారు.చైనా ఆఫర్..గతవారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలకు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. పోరాటాన్ని ముగించడానికి తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని, సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. అలాగే, జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఇస్తుందని, దౌత్యం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేలా ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మద్దతు ఇస్తుందని వాంగ్ యీ అన్నారు. ‘‘యుద్ధం వల్ల ప్రజలు మాత్రమే నష్టపోతారు.. శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుంది’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది.భారత్ కీలక ప్రకటన..మరోవైపు, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాలని ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్లకు భారత్ పిలుపునిచ్చింది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత్ చట్టాలను గౌరవిస్తుంది.. సైనిక ఘర్షణలతోనే ఏ సమస్య పరిష్కారం కాదు.. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా’’ అని అన్నారు. -
ఎన్నికల్లో నా పాత్ర ఉండాల్సిందే.. ఇరాన్పై ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఎన్నిక ప్రక్రియలో తనను కచ్చితంగా భాగస్వామిని చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ పదవికి దివంగత నేత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదన్నారు. గురువారం డిజిటల్ మీడియా సంస్థ ‘ఆక్సియోస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అధ్యక్షుడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు (ఇరాన్) సమయం వృథా చేస్తున్నారు. వెనెజువెలాలో డెల్సీ రోడ్రిగ్స్ అధ్యక్షురాలయ్యేందుకు సహకరించాను. అలాగే ఇరాన్ సుప్రీం నేత ఎన్నికలోనూ నా పాత్ర ఉండి తీరాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు.సుప్రీం లీడర్ను ఇంకా ఎన్నుకోలేదు..ఇరాన్ తన సుప్రీం నేతను ఇంకా అధికారికంగా ఎన్నుకోలేదని ఆ దేశ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. భారత్లో ఇరాన్ సుప్రీం నేత అధికారిక ప్రతినిధి అయతొల్లా అబ్దుల్ మజీద్ హకీం ఎలాహీ గురువారం ఈ మేరకు పేర్కొన్నారు. సుప్రీం నేత ఎన్నిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. గత శనివారం ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసునిగా రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బుధవారం ఎన్నుకున్నట్టు వార్తలొచ్చాయి. అవి నిజం కాదని ఎలాహీ చెప్పుకొచ్చారు.‘‘సుప్రీం నేత పదవికి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మొజ్తబా పేరు కూడా వాటిలో ఒకటి. మొజ్తబా అర్హతల దృష్ట్యా బహుశా ఆయనను సుప్రీం నేత పదవికి కమిటీ పరిశీలించవచ్చేమో’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీం నేతగా ఎన్నికయ్యేవారిని వెంటనే మట్టుబెడతామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అయినా ఆయన ఎన్నికను గోప్యంగా ఉంచబోమని ఎలాహీ స్పష్టం చేశారు. తమ నాయకున్ని ఎలా కాపాడుకోవాలో ఇరాన్కు తెలుసన్నారు. -
పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదరకుండా తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సైనికపరమైన జోక్యం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని ఆయన చెప్పారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన విభాగం భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫిన్లాండ్ గట్టి మద్దతు దారుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు స్టబ్ తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ, పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం మారిన భౌగోళిక పరిణామాలను ప్రతిఫలించేలా ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని స్టబ్ కోరారు. రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చర్చల సందర్భంగా ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ‘చట్టాలు, దౌత్యం, చర్చలపై భారత్, ఫిన్లాండ్లకు విశ్వాసముంది. సైనికపరంగా తలపడటం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం కనుగొనలేమనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాం’అని ప్రధాని మోదీ అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలకు తక్షణమే ముగింపు పలకాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. భారత్–యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో ఎంతగానో మెరుగుపడ్డాయని తెలిపిన ప్రధాని మోదీ.. ఇది ప్రపంచ స్థిరతకు, అభివృద్ధికి దారితీస్తుందన్నారు. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్, ఫిన్లాండ్ల మధ్య సంబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఫిన్లాండ్కు చెందిన టెలికం దిగ్గజ సంస్థ నోకియా భారత్లో చేపట్టిన వివిధ భారీ ప్రాజెక్టులను ఆయన మెచ్చుకున్నారు. -
మార్క్ 48.. నిశ్శబ్ద మృత్యువు
అమెరికా నావికాదళం అమ్ములపొదిలోని మరో సముద్రగర్భ అస్త్రం విశేషాలు తాజాగా ఇరాన్ యుద్ధనౌకపై దాడి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దాని పేరు మార్క్48. జలాంతర్గామి నుంచి ప్రయోగించి ఈ టోర్పెడోకు అమెరికా నావికాదళం ‘మార్క్ 48’అనే పేరుపెట్టింది. ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ దేనా’యుద్ధనౌకను కూల్చడం ద్వారా రెండో ప్రపంచయుద్ధం తర్వాత తొలిసారిగా ఒక శత్రునౌకను టోర్పెడోతో జలసమాధి చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించడంతో ఇప్పుడు మార్క్48పై చర్చ మొదలైంది. దశాబ్దాలుగా నిశ్శబ్ద సేవ.. → అమెరికా నేవీ అ«దీనంలో సేవలందించే జలాంతర్గాముల్లో ప్రస్తుతం మార్క్ 48 టోర్పెడోలను ఉపయోగిస్తున్నారు. తొలిసారిగా 1972లో దీనిని తయారుచేశారు. తర్వాత పలుమార్లు నవీకరించారు. → ఇప్పుడు మార్క్48 ఏడీక్యాప్(అడ్వాన్స్డ్ కేపబిలిటీ) వేరియంట్ను వాడుతున్నారు. ఇందులో ఆధునీకరించిన ఎల్రక్టానిక్, గైడెడ్, ప్రొపల్షన్ వ్యవస్థలు ఉన్నాయి. → ఒక్కో టోర్పెడో 21 అడుగుల చుట్టుకొలతతో 19 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు ఏకంగా 1,700 కేజీలు. యాక్టివ్, పాసివ్ సోనార్లతో ఇది పనిచేస్తుంది. → ఆగి ఉన్న యుద్ధనౌకతోపాటు వేగంగా వెళ్తున్న యుద్ధనౌకలను ఇది లక్ష్యంగా చేసుకుని గురిచూసి పేల్చేయగలదు. → గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఎలాంటి శబ్దం లేకుండా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. ఒక్కో టోర్పెడో తయారీకి రూ.38.48 కోట్లు ఖర్చవుతుంది. → శత్రువుల నౌకలను ఎదురుగా ‘హల్’భాగాన్ని ఢీకొట్టకుండా అడుగు భాగానికి వెళ్లి ఢీకొట్టి పేలిపోతుంది. దీంతో నౌకఅడుగుకు భారీ రంధ్రం పడుతుంది లేదా ముక్కలు చెక్కలు అవుతుంది. దీంతో నౌక వేగంగా సముద్రజలాల్లో మునిగిపోతుంది. భారీ మందుగుండు పేలడంతో నౌక అడుగున ఒక పెద్ద గాలిబుడగ ఏర్పడుతుంది. దీంతో నౌక మరింత వేగంగా మునిగిపోతుంది. ఒకవేళ పాక్షికంగా దెబ్బతిన్నా కీలక వ్యవస్థలు విఫలంకావడంతో ఎదురుదాడి చేయలేక చేతులెత్తేస్తుంది.. → గైడెన్స్ వైర్తో ఇది అనుసంధానమై ముందుకు దూసుకుపోతుంది. ఒకవేళ వైర్ తెగిపోయినా ఆటోమోడ్లో పనిచేస్తూ పని చక్కబెడుతుంది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, అల్గారిథమ్లతో ఇది పనిచేస్తుంది. అత్యంత లోతైన, సంక్లిష్టమైన సముద్ర జలాల్లోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది → అమెరికా నావికాదళంలోని లాస్ ఏంజెలెస్, సీఊల్ఫ్, ఒహాయో, వర్జీనియా తరగతి బాలిస్టిక్ మిస్సైల్ జలాంతర్గాముల్లోనూ ఈ టోర్పెడోలను అమర్చారు → యుద్ధనౌకలతోపాటు శత్రుదేశ జలాంతర్గాములను వెంటాడి దాడిచేయగలదు → ‘శ్రీలంక సమీప సముద్రజలాల్లో ఉన్న ఇరాన్ యుద్ధనౌకపైకి కేవలం ఒక్క టోర్పెడోనే ప్రయోగించాం. భారీ యుద్ధనౌకను జలసమాధి చేయడానికి ఇలాంటి నిశ్శబ్ద మృత్యువు ఇదొక్కటి చాలు’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేన్ కెయిన్ వ్యాఖ్యానించారంటే దీని సామర్థ్యం ఏమిటో ఇట్టే తెల్సిపోతుంది → ముఖ్యంగా అణుఇంధనంతో నడిచే జలాంతర్గాములను నాశనం చేసేందుకు ఈ టోర్పెడోను డిజైన్చేశారు. → సోవియట్ రష్యా సాంకేతికతకు దీటుగా ఎంకే37, ఎంకే14, ఎంకే16 టోర్పెడోలను రిప్లేస్ చేస్తూ ‘ప్రాజెక్ట్ నోబాస్కా’లో భాగంగా దీనిని రూపొందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అణ్వస్త్ర రాశులు!
ఇరాన్తో అమెరికా అణు చర్చలు చెప్పుకోదగ్గ పురోగతి సాధిస్తున్నా లెక్కచేయకుండా అధ్యక్షుడు ట్రంప్ దానిపై ఉన్నట్టుండి యుద్ధానికి తెర తీశారు. ఆ దేశం ఎన్నటికీ అణ్వ్రస్తాలను తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇజ్రాయెల్తో కలిసి ఉన్నపళంగా ఇరాన్పై అంత స్వేచ్చగా దాడికి దిగగలిగారంటే దానివద్ద అణు బాంబులు లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై మాత్రం ట్రంప్ ఎంతగా కత్తులు నూరినా, నాలుగేళ్లుగా కఠిన ఆంక్షలు తదితర చర్యలకే పరిమితమయ్యారే తప్ప ఎన్నడూ యుద్ధానికి దిగే సాహసం చేయలేదు. ఆ దేశం వద్ద అపారంగా పోగుపడ్డ అణ్వాయుధ నిల్వలే అందుకు ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అణుపాటవమున్న దేశాలెన్ని, వాటి వద్ద ఎన్ని అణ్వాయుధాలున్నాయి అన్నది ఓసారి చూస్తే... అణ్వస్త్ర దేశాల జాబితాలో అగ్రాసనం అమెరికా, రష్యాలదే. ప్రపంచంలోని మొత్తం అణుబాంబుల్లో 90 శాతానికి పైగా ఈ రెండు దేశాల వద్దే పోగుపడ్డాయి! ఆ రెండింట్లో సంఖ్యాబలం రీత్యా రష్యాదే పైచేయి. అమెరికా వద్ద 5,277 అణు బాంబులుంటే రష్యా వద్ద ఏకంగా 5,459 దాకా పోగుపడ్డాయి! అమెరికా తన అణ్వాయుధాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో కూడా మోహరించి ఉంచడం విశేషం! రష్యా కూడా తన అణ్వాస్త్రాల్లో కొన్నింటిని మిత్ర దేశం బెలారస్లో ఉంచింది. ఇతర అణ్వస్త్ర దేశాల్లో ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వద్ద ఉన్న అణుబాంబుల సంఖ్యపై కచి్చతమైన స్పష్టత లేదు. ఇజ్రాయెల్ వద్ద కనీసం 200 అణు బాంబుల తయారీకి అవసరమైన అన్ని వనరులూ ఉన్నట్టు చెబుతారు. ఆ దేశం ఇప్పటికే 90 అణు బాంబులను తయారు చేసిందని అంచనా. ఉత్తర కొరియా కూడా 50 అణు బాంబుల తయారీకి అవసరమైన యురేనియం తదితరాలను పలు మార్గాల సేకరించి ఉంచుకున్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. అణు పాటవమున్న మొత్తం 9 దేశాల వద్దా కలిపి 12,341 అణు బాంబులున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆటమిక్ సైంటిస్ట్స్ 2025 నివేదిక చెబుతోంది. వాటిలో 9,600కు పైగా అణు వార్హెడ్లు ఏ క్షణంలోనైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఆయా దేశాల సైన్యం నియంత్రణలో ఉన్నట్టు సమాచారం. అయితే ప్రచ్ఛన్నయుద్ధ కాలంతో పోలిస్తే ఇది చాలా తక్కువే కావడం విశేషం. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నింటి దగ్గరా కలిపి ఏకంగా 70 వేల పై చిలుకు అణు వార్హెడ్లు పోగుపడ్డాయి!– సాక్షి, నేషనల్ డెస్క్ -
రణరంగంలోకి భీకర బాంబర్
అణుచర్చల విషయంలో ‘దౌత్యం’విఫలమై దిగాలుగా కూర్చున్న వేళ ‘యుద్ధం’ఒళ్లువిరిచి రణక్షేత్రంలో కరాళనృత్యం చేస్తుండగా ఆ నృత్యాన్ని మరింత రక్తికట్టించేందుకు అమెరికా తన అమ్ముల పొదిలోని బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ భారీ విమానాలను రంగంలోకి దింపింది. ఏడు దశాబ్దాలకు పైగా ఈ యుద్ధవిమానాలు అమెరికా వాయుసేనలో కీలకభూమిక పోషిస్తున్నాయి. ఒకేసారి 32,000 కేజీల బరువైన బాంబులను జారవిడిచే సత్తా ఉన్న ఈ విమానాల రాకతో రణరీతులు మారనున్నాయని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్నీ భారీస్థాయిలో.. → 1955 ఫిబ్రవరిలో అమెరికా వాయుసేన కోసం బోయింగ్ సంస్థ ఈ విమానాలను తయారుచేసి ఇచి్చంది. ఆనాటి నుంచి పలు మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ అప్పగించిన పనిని అద్భుతంగా పూర్తిచేశాయి. → ప్రచ్ఛన్నయుద్ధకాలంలో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఎనిమిది ఇంజిన్లతో భారీ బాడీతో అధునాతనంగా దీనిని తయారుచేశారు. → ఏకంగా 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ సువిశాల ప్రాంతంపై తమ పట్టు నిలుపుకుని డేగ కన్నుతో పరిశీలిస్తూ అత్యంత ఖచి్చతత్వంతో బాంబులు జారవిడుస్తాయి. → సెన్సార్లు మొదలు, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్దాకా అన్నిరకాల ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. → ఈ విమానంలో ఒకేసారి 30 భారీ బాంబులను అమర్చవచ్చు. అందుకే దీనిని కింగ్ ఆఫ్ బాంబర్స్ అని కూడా పిలుస్తారు. → ఇంధనం కోసం ఆగకుండా ఏకధాటిగా వేల కిలోమీటర్ల ప్రయాణిస్తాయి. 1991 జనవరిలో ఇరాక్పై దాడి కోసం ఈ విమానాలు అమెరికాలోని లూసియానాలోని బార్క్డేల్ స్థావరం నుంచి బయల్దేరి ఎక్కడా ఆగకుండా ఇరాక్కు వచ్చి బాంబులేసి మళ్లీ అలాగే వెళ్లిపోయాయి. అలా ఏకధాటిగా 35 గంటలపాటు 23,000 కిలోమీటర్ల ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డ్ను సృష్టించాయి. → గగనతలంలో మధ్యస్థాయి వేగంతో ప్రయాణించే ఈ విమానం గగనతలంలో వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దం వినలేనంత కర్ణ కఠోరంగా ఉంటుంది. → గైడెడ్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులు ఇలా వేర్వురు రకాల బాంబులను ఇవి ప్రయోగించగలవు. → 225 కేజీలు, 450 కేజీలు, 900 కేజీలు ఇలా వేర్వేరు బాంబులను వేర్వేరు దిశలో ఒకేసారి ప్రయోగించగలవు. జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునీషన్(జేడ్యామ్) టెక్నాలజీతో ఈ బాంబులు పనిచేస్తాయి. బాంబులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మాదిరి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంపై పడి శత్రువుల స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేస్తాయి. → వేలకిలోల బాంబులతో ప్రయాణించే ఈ విమానాన్ని టేకాఫ్ చేయాలంటే అత్యంత పొడవైన రన్వే అవసరం. ప్రస్తుతం ఇరాన్పై దాడుల కోసం బ్రిటన్లోని గ్లూసిస్టర్షైర్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ ఫెయిర్ఫోర్డ్ వైమానిక స్థావరాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. ఈ స్థావరంలో సువిశాలమైన ఏకంగా 9,993 అడుగుల పొడవైన రన్వే ఉంది. దీంతో రెక్కలకు ఎలాంటివి అడ్డురాకుండా సులువుగా టేకాఫ్ తీసుకోవచ్చు. → ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా ద్వీపంలోని స్థావరం నుంచి ఇవి రణరంగంలోకి ప్రవేశించాయని వార్తలొచ్చాయి. → ఇరాన్ బలగాల కమాండ్, కంట్రోల్ పోస్ట్లపై బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం పెద్ద ఎత్తున దాడులు చేస్తోందని తాజాగా యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. → బీ–52హెచ్ వేరియంట్ విమానం ఏకధాటిగా 15,000 కిలోమీటర్లు ప్రయాణించి 70,000 పౌండ్ల బాంబులను ప్రయోగించగలదు → ప్రస్తుతం అమెరికా అమ్ములపొదిలో ఇలాంటివి 76 విమానాలు ఉన్నాయి. → వియత్నాం యుద్ధం మొదలు గల్ఫ్ యుద్ధం, అఫ్గానిస్తాన్, ఇరాక్ దాకా పలు యుద్ధాల్లో పాల్గొన్న బీ–52 బాంబర్లు ఇప్పుడు ఇరాన్ పనిపట్టేందుకు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి → ఈ విమానాలకు ‘పెద్దగా అందవికారంగా బానపొట్టతో ఉన్న మనిషి(బిగ్ అగ్లీ ఫ్యాట్ ఫెలో–బఫ్)’అనే ముద్దుపేరు కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాకు బుద్ధి చెప్తాం
న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధ నౌక ‘దేనా’ను హిందూమహా సముద్ర జలాల్లో అమెరికా ముంచేయడంపై భారత్లో ఆ దేశ రాయబారి మహ్మద్ ఫతాలీ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడిన చర్య దారుణ హత్యతో సమానమని, ఇరాన్ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. శాంతియుత విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తున్న నిరాయుధంగా వస్తున్న నౌకను ధ్వంసం చేయడాన్ని బట్టి చూస్తే అమెరికా, జియోనిస్టులకు అంతర్జాతీయ చట్టాలను నాశనం చేయాలనే దుర్భుద్ధి ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మా ప్రజలు, ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్న మా దేశం ఈ చర్యకు తీవ్రమైన రీతిలో సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్, భారత్ల మధ్య బలమైన సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలు, బలమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నాయన్నారు.హెచ్చరిక లేకుండానే దాడియుద్ధ నౌక దేనాపై అమెరికా సబ్మెరీన్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా టార్పెడో దాడి చేసిందని ముంబైలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ సయీద్ రెజా అన్నారు. నౌకా విన్యాసాల నుంచి తిరిగి వెళ్లే యుద్ధ నౌకల్లో సాధారణంగా ఎటువంటి మందుగుండు సామగ్రి ఉందన్నారు. ఒకవేళ ఉన్నా దానిని విన్యాసాల సమయంలో ఉపయోగించే అవకాశం తక్కువని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిగేట్ దేనాను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఈ ఘటనలో 100 మంది వరకు నౌకా సిబ్బంది, సైనికులు వీరమరణం పొందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను రోడ్డు మార్గంలో స్వదేశానికి తరలించేందుకు నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అన్వేషణలో శ్రీలంకకు తోడుగా..అమెరికా టార్పెడో దాడిలో హిందూ మహా సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధ నౌక వద్ద అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో శ్రీలంకకు భారత్ తోడైంది. లాంగ్ రేంజ్ పెట్రోల్ విమానం సాయంతో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు నేవీ తెలిపింది. ఆ ప్రాంతంలోనే మోహరించి ఉన్న ఐఎన్ఎస్ తరంగిణి కూడా అన్వేషణలో పాల్గొంటోందని పేర్కొంది. ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా కొచ్చినుంచి బయలుదేరిందని వివరించింది. -
ధరల మోత.. వంటనూనెలు మొదలు ఔషధాల దాకా
ఇరాన్పై అమెరికా దాడిచేస్తే బదులుగా ఇరాన్.. సౌదీ, బహ్రెయిన్, ఖతార్ సహా పలు గల్ఫ్ దేశాలపై బాంబులేస్తోంది. సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చన్న విశ్లేషణలు ఇప్పుడు సగటు భారతీయుని గుండెల్లో భయాందోళనలను పెంచేస్తున్నాయి. సముద్రమార్గంలో చమురు కూడలిగా పేరొందిన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడిచమురు మొదలు పలురకాల వస్తూత్పత్తుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారముంది. తొలుత చమురు మంటలు యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడిచమురు, చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవరూప సహజవాయువు(ఎల్ఎన్జీ) సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20 శాతం పెరిగాయి. హార్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని ‘కేప్ ఆఫ్ గుడ్హోప్’ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకుని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. వంటనూనె మరింత ధర.. భారత్ వంటనూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేసియా, మలేసియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, ఉక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హార్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని ‘సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా చెప్పారు. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడం ఆరంభమైంది. కేంద్రప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం మార్చి రెండో తేదీ ధరలతో పోలిస్తే మార్చి మూడో తేదీన సన్ఫ్లవర్, సోయా, పామాయిల్ నూనెల రిటైల్ ధరలు ఒకటి నుంచి మూడు రూపాయలు పెరిగాయి. పప్పులూ మరింత ప్రియం.. పప్పుల ధరలు పెరిగే వీలుందని ‘ఆల్ ఇండియా దాల్ మిల్ అసొసియేషన్’అధ్యక్షుడు సురేశ్ అగర్వాల్ చెప్పారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు, మినుములు సహా పలు రకాల పప్పులను దిగుమతిచేసుకుంటోంది. ‘‘ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ అత్తిపండు, బాదం, పిస్తా, ఖర్జూరా, ఎండు ద్రాక్ష, కుంకుమ పువ్వు, అప్రికాట్లను దిగుమతి చేసుకుంటోంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, అఫ్గాన్ల నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్రమార్గంలో వస్తోంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్రమార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే వీలుంది’’అని ‘ముంబై డ్రై ఫ్రూట్, డేట్ మర్చంట్స్ అసోసియేషన్’అధ్యక్షుడు విజయ్ భూటా చెప్పారు. ఎరువులు, సాగు ఉత్పత్తుల రాక సైతం తగ్గిపోయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాల రాకపోకలు తగ్గడంతో కార్గో రవాణా పరిమాణం కుచించుకుపోయింది. ఇతర దేశాల మీదుగా విమానాలు తిరిగి రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు టికెట్ అధిక చార్జీల మోత మోగుతోంది. ప్లాస్టిక్ సైతం.. ముడిచమురు నుంచే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ను తయారుచేస్తారు. ముడిచమురు సరఫరా తగ్గడంతో గత రెండు రోజుల్లోనే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ధర 12 శాతం ఎగసింది. దీంతో ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తుల ధరలు సైతం పైపైకి పోవడం ఖాయంగా కని్పస్తోంది. ఔషధాలదీ అదే బాట... ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్(ఏపీఐ) కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. కానీ అత్యంత ఖరీదైన కీ స్టారి్టంగ్ మెటీరియల్స్(కేఎస్ఎం) కోసం ఎక్కువగా ఐరోపా దేశాలపై ఆధారపడుతోంది. యూరప్ నుంచి కేఎస్ఎం సరుకు హార్మూజ్ ద్వారానే రావాల్సి ఉంది. ఇవి తగ్గిపోవడంతో భారత్లో సంక్లిష్ట జనరిక్ మందులతోపాటు సైడ్ ఎఫెక్ట్లను తగ్గించే ‘విలువ జోడింపు ఔషధా(వీఏఎం)’ల తయారీ ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. వీటికితోడు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి మారకం విలువ పతనమవుతుండటంతో పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు మరింత ప్రియంకానున్నాయి. ఇవన్నీ కలసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధ బీభత్సం
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం నానాటికీ పెరుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ గురువారం ఆరో రోజు ఇరాన్ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై పలు దఫాలుగా తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగించింది. పలు గల్ఫ్ దేశాలపైనా మరిన్ని డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇరు పక్షాలూ నౌకలు, నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా చమురు నౌకపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. దానికి నిప్పంటుకుని భారీగా మంటలు ఎగసిపడుతున్నట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) తెలిపింది. బుధవారం శ్రీలంక తీర సమీపంలో తమ యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసినందుకు ప్రతీకారంగా ఈ చర్యకు దిగినట్టు వెల్లడించింది. తమ యుద్ధ నౌకను ముంచేసినందుకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. ఆ దేశ నౌకలను ఆ స్థాయిలో లక్ష్యం చేసుకుంటామని ప్రకటించిన కాసేపటికే ఐఆర్జీసీ నుంచి దాడి వార్త వెలువడింది. అమెరికా మాత్రం తమ చమురు నౌకపై దాడి జరిగినట్టు ధ్రువీకరించలేదు. అంతేగాక దక్షిణ ఇరాన్లోని కీలకమైన బందర్ అబ్బాస్ నౌకాశ్రయంపై అమెరికా యుద్ధ విమానాలు భారీస్థాయిలో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. అక్కడ చాలాసేపటిదాకా భారీ స్థాయిలో పేలుళ్లు వినిపించినట్టు స్థానికులను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. కీలకమైన హార్మూజ్ జలసంధికి బందర్ అబ్బాస్ అతి సమీపంలో ఉంటుంది. హార్మూజ్ను ఇరాన్ ఇక్కడినుంచే నియంత్రిస్తూ ఉంటుంది. మరోవైపు కువైట్లో కూడా ఒక చమురు నౌకపై దాడి జరిగింది. దాంతో అందులోని చమురు సముద్రంలోకి ఒలికిపోతున్నట్టు సమాచారం. ఇది కూడా ఇరాన్ పనేనని భావిస్తున్నారు! ఇరాక్లోని ఖోర్ అలా జుబెయిర్ నౌకాశ్రయం వద్ద బహమాస్కు చెందిన మరో చమురు నౌకపైనా ఇరాన్కు చెందిన బోటు ఆత్మాహుతి దాడికి దిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గల్ఫ్ ప్రాంతంలో దాడుల బారిన పడ్డ చమురు నౌకల సంఖ్య 9కి చేరింది. గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ డ్రోన్లు! అమెరికా తమ యుద్ధ నౌకను ముంచేసిన కాసేపటికే ఇరాన్ రెచ్చిపోయింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై బుధవారం అర్ధరాత్రి నుంచే దాడులను తీవ్రతరం చేసింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో జనం వేలాదిగా బంకర్లలో తలదాచుకుంటున్నారు. పదులకొద్దీ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుని నేల కూలి్చనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. యూఏఈ, ఖతర్తో పాటు దోహాలోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ ఎడాపెడా డ్రోన్ దాడులకు దిగింది. ఆరు ఖండాంతర క్షిపణులతో పాటు 125 డ్రోన్లను అడ్డుకుని కూల్చేసినట్టు యూఏఈ ప్రకటించింది. అబుదాబిలో డ్రోన్ శకలాలు పడి ఆరుగురు గాయపడ్డారు. దాడుల నేపథ్యంలో దోహాలోని అమెరికా రాయబార కార్యాలయం సమీప ప్రాంతాలను ఖతర్ ఖాళీ చేయించింది. దాడుల తీవ్రత దృష్ట్యా దుబాయ్లోని ఎమర్జెన్సీ లాజిస్టిక్స్ హబ్లో కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గళం విప్పకపోతే యూరప్ దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది! అంతేగాక తన దాడులను అజర్బైజాన్కూ విస్తరించడం కలకలం రేపుతోంది. నఖి్చవాన్లో విమానాశ్రయంతో పాటు ఓ స్కూలు వద్దా పేలుళ్లు సంభవించాయి. దాంతో ఇరాన్ సరిహద్దుల సమీపంలో గగనతలాన్ని అజర్బైజాన్ మూసేసింది. తమపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు జరిగాయంటూ మండిపడింది. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా ఎఫ్–15ఈ యుద్ధ విమానం ఇరాన్లో కుప్పకూలినట్టు వార్తలొచ్చాయి. వాటిని యూఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం ఖండించింది.మెరుగైన విమాన సర్వీసులు పశ్చిమాసియా దేశాల నుంచి ఐదు రోజులుగా దాదాపుగా పడకేసిన విమాన సరీ్వసులు గురువారం పాక్షికంగా కొనసాగాయి. ఒమన్, ఖతర్ తదితర దేశాలు పలు సరీ్వసులను నడిపాయి. దాంతో ఆయా దేశాల్లో చిక్కుబడ్డ యూరప్ తదితర దేశాలకు చెందిన వేలాదిమంది తిరుగు ప్రయాణమయ్యారు. ట్రంప్ రక్తం కళ్లజూస్తాం ఇరాన్ మత నేత అమోలీ యుద్ధ కల్లోలం ఇప్పటికే ఆందోళనలు రేకెత్తిస్తున్న వేళ ఇరాన్ ఉద్రిక్తతలను మరింతగా పెంచే ప్రకటనలకు దిగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇజ్రాయెలీల రక్తం కూడా కళ్లజూడాలంటూ ఇరాన్ మత పెద్ద అయతొల్లా అబ్దొల్లా జావేదీ అమోలీ ఏకంగా ప్రభుత్వ వార్తా చానల్లోనే దేశవాసులకు పిలుపునిచ్చారు! షియా ముస్లిం మత పెద్దల్లో అత్యున్నతమైన అయతొల్లా స్థాయి నేత నోట ఇలాంటి మాటలు రావడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.లంక వైపు మరో ఇరాన్ యుద్ధ నౌక కొలంబో: ఇరాన్కు చెందిన మరో యుద్ధ నౌక ఐఆర్ఐఎన్ఎస్ బుషెర్ గురువారం శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఇంజన్ వైఫల్యం కారణంగా లంకను అత్యవసర సాయం కోరి ట్రింకోమలి రేవులో లంగరు వేసింది. నౌకను తమ రేవులోకి అనుమతించి అందులోని 208 మంది సిబ్బందిని ఖాళీ చేయించినట్టు లంక తెలిపింది. ఇరాన్కు చెందిన భారీ యుద్ధనౌక ఐఆర్ఐఎస్ దేనాను బుధవారం లంక తీరానికి సమీపంలో అమెరికా ముంచేయడం తెలిసిందే. అణు కార్యక్రమానికి స్వస్తి! ఇరాన్ కీలక ప్రకటన ?యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణు కార్యక్రమానికి స్వస్తి పలికేందుకు సంసిద్ధత వెలిబుచ్చింది! ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ను ఉటంకిస్తూ అరబిక్ న్యూస్ వార్తా సంస్థ ఈ మేరకు పేర్కొంది. అయితే అణు కార్యక్రమానికి బదులు తమకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని సూచించాలని అమెరికాకు షరతు విధించినట్టు సమాచారం. కానీ తఖ్త్ వ్యాఖ్యలు గతంలో చేసినవేనని ఇరాన్ అధికార వార్తా సంస్థ చెప్పుకొచ్చింది.రంగంలోకి కుర్దు గ్రూపులు! ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లోని కుర్దిష్ గ్రూపులు కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించే సూచనలు కని్పస్తున్నాయి. అమెరికాకు దన్నుగా ఇరాన్పై దాడులకు దిగుతామని పలు గ్రూపులు గురువారం ప్రకటించాయి. అమెరికా అధికారులు కూడా వాటి నేతలు మసూద్ బర్జానీ, బఫేల్ తలాబానీ, ముస్తఫా హిజ్రీ తదితరులతో ఇప్పటికే చర్చలు జరిపారని, దాడులకు కావాల్సిన సాయుధ సంపత్తిని అందజేస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ఇరాన్, ఇరాక్ల్లోని కుర్దు సమూహాలు తమకు స్వతంత్ర దేశం కావాలని చిరకాలంగా పోరాడుతూ వస్తున్నాయి. అల్లాడిన ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల దెబ్బకు ఇరాన్ అల్లాడిపోతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి టెహ్రాన్ తదితర నగరాలపైకి నిర్విరామంగా బాంబులు, క్షిపణులు వచ్చిపడుతున్నాయి. 300 పై చిలుకు బాలిస్టిక్ మిసైల్ లాంచర్లను నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటిదాకా ఇరాన్పై 5,000కు పైగా భారీ బాంబులు, వెయ్యికి పైగా క్షిపణులు ప్రయోగించినట్టు తెలిపింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి లాంచర్లను అమెరికా; మధ్య, పశ్చిమ ఇరాన్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నట్టు సమాచారం. దాడులు 175 నగరాలకు విస్తరించినట్టు ఇరాన్ ధ్రువీకరించింది. పౌర సముదాయాలపై కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారంటూ మండిపడింది. ఇరాన్ సరిహద్దుల్లోని సనందాజ్, సఖెజ్,బుకాన్ తదితర కుర్దు ప్రాబల్య నగరాలపైనా తాజాగా దాడులు జరిగాయి. టెహ్రాన్లోని సైనిక, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు, స్థావరాలపై క్షిపణుల వర్షం కురిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా 1,230 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ వెల్లడించింది. లెబనాన్పైనా దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. బీరూట్తో పాటు పలుచోట్ల హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధాగారాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ట్రిపోలీలోని శరణార్థుల శిబిరంపై జరిగిన దాడుల్లో ఇద్దరు మరణించారు. దాంతో లెబనాన్లో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 70 దాటింది. బీరూట్ దక్షిణ శివార్ల ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. హమాస్ కమాండర్ వసీం అతల్లా అలీని దాడుల్లో మట్టుబెట్టినట్టు ప్రకటించింది. -
అణ్వాయుధ ప్రోగ్రామ్.. అమెరికాకు ఇరాన్ కండీషన్..!
అణు కార్యక్రమాన్ని వదులుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ స్పందించింది. తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇస్తేనే.. అణ్వాయుధ ప్రోగ్రామ్ను ఆపేస్తామంటూ అమెరికాకు ఇరాన్ షరతు విధించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మజిద్ తఖ్త్-రవాంచి ఈ ప్రకటన చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ (IRNA) వార్తా సంస్థ వెల్లడించింది.ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు హెచ్చరికను మరోసారి పునరావృతం చేశారు. ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయంటూ మండిపడ్డారు. ఇరాన్పై ఇంకా ఆపరేషన్ ముగియలేదన్నారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా నిప్పుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్లో ఇప్పటివరకు 1230 మంది మృతి చెందారు. ఇవాళ(మార్చి 5, గురువారం) ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి చేసింది. ఇద్దరు భారతీయులు అశిష్కుమార్, దిలీప్ సింగ్ మృతిచెందారు.ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. -
'100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' : అమెరికా సంచలన ఫుటేజ్
ఇరాన్పై అమెరికా - ఇజ్రాయెల్ భీకర యుద్ధం 6వ రోజుకు చేరుకుంటుండగా, గురువారం అమెరికా '100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో మొదటి 100 గంటలకు సంబంధించిన యుద్ధ దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం విడుదల చేసింది.ఇరాన్లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభమై, భారీ దాడులను కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్తో సమన్వయంతో ఇరాన్పై తన దాడులకు అమెరికా సైన్యం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది.అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ : అమెరికా-ఇజ్రాయెల్ ద్వయం ఇరాన్లోని టెహ్రాన్ తదితర నగరాల్లో భారీ దాడులు చేపట్టింది. దాడులు మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీని మట్టు బెట్టినట్టు సమాచారం. ఇవి చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత సంక్లిష్టమైన ,అత్యంత ఖచ్చితమైన వైమానిక ఆపరేషన్గా అమెరికా అభివర్ణించింది.గత అర్థ శతాబ్ద కాలంగా అమెరికన్లకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సామర్థ్యాన్ని తుడిచిపెట్టడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్యఈ ఆపరేషన్లో, అమెరికన్ దళాలు అనేక అధునాతన విమానాలు, ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని వాడింది. వీటిల్లో B-2 స్టెల్త్ బాంబర్లు & F-35 ఫైటర్లు ఉన్నాయి. ఇవి శత్రు రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయి దాడి చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించి నాశనం చేయడానికి రూపొందించిన అధునాతన అమెరికన్ యాంటీ-బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) కూడా అమెరికన్ దళాలు ఉపయోగించాయి. ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్అంతేకాదు ఈ యుద్ధంలో మొదటిసారిగా LUCAS (Low-cost Unmanned Combat Attack System) అనే సరికొత్త డ్రోన్లను అమెరికా ప్రయోగించింది. ఇవి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వాడిన ఇరాన్ 'షాహెద్ 136' డ్రోన్ల నమూనాలో రూపొందించినవి.నిఘా ,ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి MQ-9 రీపర్ డ్రోన్లను వినియోగించింది. ఈ ఆపరేషన్కు సంబంధించి విడుదలైన వీడియోలో "మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు... కానీ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో మేము దీనిని ముగిస్తున్నాము" అని ఒక స్వరం, అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన దూకుడును సూచిస్తోంది. "100 Hours" of Operation Epic Fury. pic.twitter.com/XW5ZnRAJJL— U.S. Central Command (@CENTCOM) March 4, 2026 -
Strait of Hormuz: ఆ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ హక్కు మాదేనంటూ ఇరాన్ తేల్చి చెప్పింది.హర్మూజ్ జలసంధి విషయంలో కీలక ప్రకటన చేసిన ఇరాన్.. జలసంధిని నియంత్రించే అధికారం మాకుందని పేర్కొంది. మరోవైపు, అన్ని దేశాలకు చమురు నిలిపివేయడం లేదన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది. దీంతో ఇరాన్ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించినట్లైంది.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారత నౌకలు పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్తోపాటు పరిసర సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హొర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిలో కొన్ని నౌకల్లో ముడి చమురు, సహజ వాయువు ఉన్నాయి. అవి భారత ఓడరేవులకు చేరుకోవాల్సి ఉంది.మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేయడానికి గల్ఫ్ దేశాలకు ప్రయణిస్తుండగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. భారత ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్’గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నౌకల్లో చిక్కుకుపోయిన భారతీయ సిబ్బందికి సహాయం అందించడానికి కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. -
మూడోసారి.. ప్రయోగించిన 69 సెకన్లకే పేలిపోయిన జపాన్ రాకెట్
టోక్యో: జపాన్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ వన్ మరోసారి ఘోరంగా విఫలమైంది. ఆ సంస్థకు చెందిన కైరోస్ నం.3 రాకెట్ ప్రయోగించిన 69 సెకన్ల తర్వాత గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం వరుసగా మూడోసారి. ప్రైవేటు రంగంలో అంతరిక్ష రంగాన్ని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న జపాన్కు ఇది గట్టి ఎదురుదెబ్బ.కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పని చేస్తుంది. దాని ఎత్తు 18 మీటర్లు. పశ్చిమ జపాన్లోని స్పేస్పోర్ట్ కీ అనే ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఇవాళ ఉదయం 7:40 గంటలకు జరిపారు.రాకెట్ నిర్వహణ బాధ్యత జపాన్ సంస్థ స్పేస్ వన్ది. ఇందులో 5 ప్రయోగాత్మక ఉపగ్రహాలు ఉన్నాయి. టోక్యోకు చెందిన ఆర్క్ ఎడ్జ్ స్పేస్ సంస్థ తయారు చేసిన పరికరాలు, తైవాన్ అంతరిక్ష సంస్థ ఉపగ్రహాలు కూడా ఇందులో ఉన్నాయి. రాకెట్ విజయవంతంగా ఎగిరినప్పటికీ కొద్ది సమయంలోనే పేలిపోయింది. అందువల్ల కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. ప్రయోగం ప్రారంభమైన కొద్దిసేపటికే రాకెట్ అస్థిర మార్గంలో వెళ్లినట్లు కనిపించింది. అనంతరం పసిఫిక్ మహాసముద్రం పైభాగంలో 29 కిలోమీటర్ల ఎత్తులో దాని ప్రయాణం ఆటోమేటిక్గా ముగిసింది.స్పేస్ వన్ ఉపాధ్యక్షుడు నోబుహిరో సెకినో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయోగం ప్రారంభించిన సమయంలో, రాకెట్ పరికరాల్లో తమకేమీ లోపాలు కనిపించలేదని తెలిపారు. అయితే, ఆటోనొమస్ టెర్మినేషన్ సిస్టమ్ వ్యవస్థలో లోపం జరిగి ఉండవచ్చని చెప్పారు.వరుసగా మూడో వైఫల్యంస్పేస్ వన్ కైరోస్ రాకెట్కు ఇది వరుసగా మూడో వైఫల్యం. ఇదే రాకెట్ 2024లో జరిగిన రెండు ప్రయోగాల్లో కూడా విఫలమైంది. స్పేస్ వన్ సంస్థ జపాన్ కంపెనీల సంయుక్త ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. ఆప్టికల్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ కానన్, ఏరోస్పేస్ సంస్థ ఐహెచ్ఐ, నిర్మాణ సంస్థ షిమిజు వంటి కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.గత ఏడాది జపాన్ మొత్తం 3 రాకెట్ ప్రయోగాలు మాత్రమే చేసింది. 2030 నుంచి ప్రతి సంవత్సరం 30 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే, ఆ దిశగా విజయాలు సాధించడం లేదు.రక్షణ అవసరాలు పెరుగుతున్న పరిస్థితి, చైనా అంతరిక్ష ప్రోగ్రాం వేగంగా విస్తరించటం కారణంగా జపాన్పై ఒత్తిడి పెరిగింది. దేశీయంగా రాకెట్లు అభివృద్ధి చేసి అమెరికా రాకెట్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని జపాన్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే స్పేస్ వన్ సహా దేశీయ రాకెట్ స్టార్టప్ సంస్థలకు మిలియన్ డాలర్ల సబ్సిడీలు ఇచ్చింది. ఇప్పటివరకు జపాన్లో ఏ ప్రైవేట్ సంస్థ కూడా వాణిజ్య రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా చేయలేకపోయింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు జరుగుతుందో స్పేస్ వన్ ఇంకా ప్రకటించలేదు. 🚨BREAKING! Japan's SpaceOne KAIROS Rocket Launch Ends In Failure🚨Space One’s KAIROS No. 3 rocket suffered an anomaly during first stage flight following liftoff on March 5, 2026 at 11:10 a.m. local time from the Kii Spaceport in Japan.According to the company, the vehicle… pic.twitter.com/UFrYMJ0rhg— The Launch Pad (@TLPN_Official) March 5, 2026🚨🇯🇵JAPANESE STARTUP SPACE ONE FACES SECOND ROCKET FAILURESpace One's Kairos No. 2 rocket failed midflight, marking its second consecutive setback. After a successful first-stage separation, the rocket was "discontinued" 20 minutes post-launch. The payload included satellites… pic.twitter.com/M0dsKNHMbm— Info Room (@InfoR00M) December 18, 2024 -
‘ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఓటమి ఖాయం’.. కారణాలివే..
బీజింగ్: ప్రముఖ చైనీస్-కెనడియన్ విద్యావేత్త, జియోపాలిటికల్ విశ్లేషకుడు షూఏచిన్ జియాంగ్ (Xueqin Jiang) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై కొనసాగుతున్నప్పటికీ, ఈ యుద్ధంలో అమెరికా ఓటమి తప్పదని అంచనా వేశారు.జియాంగ్ ‘ప్రిడిక్టివ్ హిస్టరీ’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తూ, గేమ్ థియరీ ఆధారంగా జియోపాలిటికల్ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ప్రాచీన గ్రీకు చరిత్రలోని అథెన్స్ సిసిలీ యాత్రతో పోల్చారు. ఆయన అభిప్రాయం ప్రకారం, అధిక ఖర్చులు, వ్యూహపరమైన తప్పిదాలు కారణంగా అమెరికా ఈ యుద్ధంలో ఓడిపోతుందని చెప్పారు.1976లో చైనాలో జన్మించిన జియాంగ్, యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం బీజింగ్లోని మూన్షాట్ అకాడమీలో చరిత్ర, తత్వశాస్త్రం బోధిస్తున్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన సంస్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించే ప్రయత్నాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2024లో ఆయన ఇచ్చిన ఒక లెక్చర్లో, అమెరికా-ఇరాన్ యుద్ధం తప్పనిసరిగా జరుగుతుందని, అది అథెన్స్ సిసిలీ యాత్ర లాంటి ఘోర పరాజయానికి దారితీస్తుందని చెప్పారు. ఆయన అంచనాలు ఇప్పటివరకు నిజమవుతున్నందున, ప్రపంచవ్యాప్తంగా ఆయనను చైనాకు చెందిన నోస్ట్రాడమస్గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, జియాంగ్ చేసిన విశ్లేషణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చరిత్ర ఆధారంగా భవిష్యత్తు అంచనా వేసే ఆయన విధానం, గేమ్ థియరీ వినియోగం, జియోపాలిటికల్ విశ్లేషణలు అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, షూఏచిన్ జియాంగ్ ఒక విద్యావేత్త మాత్రమే కాకుండా, చరిత్రను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు అంచనా వేసే విశ్లేషకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. -
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారడంతో అనేక ఆస్తి కొనుగోలు ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.భారతీయ పెట్టుబడిదారుల ‘బ్రేక్’దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తున్నారు. కొన్ని విలాసవంతమైన బీచ్ఫ్రంట్ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిపివేసినట్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.భద్రమైన పెట్టుబడి కేంద్రం… ఇప్పుడు సందేహాలుఇప్పటివరకు దుబాయ్ పెట్టుబడిదారులకు ‘సేఫ్ హేవన్’ అనే భావన ఉండేది. కానీ తాజా సైనిక ఉద్రిక్తతలు, మిస్సైల్ దాడుల భయం, ఎయిర్స్పేస్ పరిమితులు వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ మూలధనంపై ఆధారపడిన ఈ మార్కెట్లో కొనుగోళ్ల వేగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.దుబాయ్ గతంలో కూడా 1990 గల్ఫ్ వార్, 9/11, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ సందర్భాల్లో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి బలంగా లేచింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, ఇది కేవలం సెంటిమెంట్ ఆధారిత 'బ్లిప్' మాత్రమేనని డనుబే గ్రూప్ వంటి డెవలపర్లు అంటున్నారు.దుబాయ్కి ప్రత్యామ్నాయం ఏది? ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ వైరల్ అయింది. దుబాయ్ బదులు ముంబై, బెంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి భారతీయ నగరాలను ప్రత్యామ్నాయాలుగా సూచించారు. దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరు భారత్లోని ఏ నగరమూ దుబాయ్ స్థాయికి చేరదని, ట్యాక్స్ లాభాలు, లగ్జరీ ఇన్ఫ్రా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ దుబాయ్కే ఉన్నాయని వాదిస్తున్నారు. మరికొందరు గిఫ్ట్ సిటీ (అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య)ను భవిష్యత్ పోటీదారుగా చూస్తున్నారు.డీల్స్ ఆగినా… పూర్తిగా కుదేలుకాదుదుబాయ్లో ప్రస్తుతం కొన్ని ప్రాపర్టీ ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచినా పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే త్రైమాసికంలో నిలిచిపోయిన డీల్స్లో 60%–80% వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందని అంచనా.క్లిక్ చేయండి 👉 దుబాయ్ దాటని బంగారం.. ధరలపై ప్రభావం?కొనుగోళ్లు మందగిస్తే వచ్చే కొన్ని నెలల్లో ధరలపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో భారీగా కొత్త గృహ ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. -
యుద్ధం ఎఫెక్ట్.. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్పై దెబ్బ!
న్యూయార్క్: హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో ముడి చమురు మాత్రమే కాకుండా ఇతర వస్తూత్పత్తుల సరఫరా సైతం స్తంభించిపోయింది. సముద్రమార్గంలో నౌకలతోపాటు గగనతలంలో కార్గో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఇతర వస్తువుల సరఫరా గొలుసులు తెగిపోయి పలు దేశాల్లో ఆయా వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది.భారత్లో తయారైన ఫార్మాసూటికల్స్, ఆసియా దేశాల్లో తయారైన సెమీకండక్టర్లు, బ్యాటరీలు, పశ్చిమాసియా దేశాల్లో తయారైన రసాయనాల వంటి చమురు ఉత్పత్తులు హర్మూజ్ జలసంధి గుండానే ఇతర దేశాలకు సరఫరా చేయాల్సి ఉంది. జలసంధి గుండా వెళ్లే నౌకలను తగలబెడతామని ఇరాన్ అల్టిమేటమ్ జారీచేయడంతో సరకు రవాణా గొలుసు తెగినట్లయింది. హార్మూజ్ దాకా రాలేక 3,200 నౌకలు పర్షియన్ గల్ఫ్లోనే ఆగిపోయాయి. యూఏఈ, ఒమన్ వద్ద మ రో 500 నౌకలు వేచిచూస్తున్నాయి. ఇంకొన్ని సుదీర్ఘ మార్గమైన ఆఫ్రికా దక్షిణ కొన గుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి.‘ఆఫ్రికా చుట్టూ తిరిగిరావడం వల్ల ప్రయాణ ఖర్చులు ఎక్కువై చివరకు ఆయా దేశాల్లో సరకుల ధరలు ప్రియమవుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో అదే జలసంధి గుండా నౌకలు వెళ్లాలంటే.. యుద్ధానికి తెరతీసిన అమెరికానే స్వయంగా తన యుద్ధ విమానాలను రక్షణగా పంపించి జాగ్రత్తగా నౌకలను ఆవలి వైపునకు దాటించాలి’ అని సియాకస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్యాట్రిక్ పెన్ఫీల్డ్ విశ్లేషించారు. ‘మొత్తం ప్రపంచ వాయుమార్గ రవాణాలో పశ్చిమాసియాలో రవాణా కేవలం ఒక శాతమే ఉంటుంది. కానీ విలువ పరంగా చూస్తే యావత్ ప్రపంచ వాణిజ్యంలో 35 శాతం ఉంటుంది. ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల రవాణా ఎక్కువ’ అని ఆయన అన్నారు. -
పశ్చిమాసియాలో యుద్ధం.. ‘బ్లడ్ చిట్’ చూశారా? అంటే ఏంటంటే?
న్యూఢిల్లీ: అమెరికా వైమానిక దళానికి చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు మార్చి 1న రాత్రి 11.03 గంటలకు కువైట్ గగనతలంలో కుప్పకూలాయి. ఈ ఘటన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి సంబంధించిన యుద్ధ చర్యల సమయంలో జరిగింది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇరాన్ యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు దాడులు చేస్తున్న సమయంలో కువైట్ గగనతలరక్షణ వ్యవస్థలే పొరపాటుగా అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ ఘటన తర్వాత ‘బ్లడ్ చిట్’ అనే చిన్న నోటీసుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాల పైలట్లే ‘బ్లడ్ చిట్’ను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.వైరల్ అవుతున్న బ్లడ్ చిట్లో ఏముంది?అమెరికన్ పైలట్లు తమ జాకెట్ల లోపల ఈ బ్లడ్ చిట్ను కుట్టుకుని మరీ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్, అరబిక్, టర్కిష్, పర్షియన్, కుర్దిష్ భాషలలో అందులో సందేశం ఉంది. "నేను అమెరికన్ని. నాకు మీ భాష రాదు. నేను మీకు ఎటువంటి హాని చేయను. దయచేసి నాకు ఆహారం, నీరు, ఆశ్రయం, దుస్తులు అందించి వైద్య సాయం అందేలా చేయండి. అమెరికన్ లేదా మా మిత్ర దేశాల దళాల వద్దకు చేరుకోవడానికి నాకు సాయం చేయండి. మీరు నా పేరు, ఈ నంబర్ను అమెరికా అధికారులకు అందిస్తే, మీకు బహుమతి లభిస్తుంది" అని బ్లడ్ చిట్లో ఉంది. అయితే, ఈ బ్లడ్ చిట్ నిజంగా అమెరికా దళాలకు చెందిందేనా? అన్న విషయంపై అధికారికంగా ఎటువంటి నిర్థారణ లేదు. అయినప్పటికీ బ్లడ్ చిట్లు పెట్టుకెళ్లడం అమెరికా దళాలకు అలవాటే.బ్లడ్ చిట్ అంటే ఏంటి?బ్లడ్ చిట్ అనేది చిన్న నోటీసు. యుద్ధ సిబ్బంది, ముఖ్యంగా వైమానిక దళ సిబ్బంది తమ వద్ద దీన్ని పెట్టుకుంటారు. సాధారణ పౌరులను ఉద్దేశించి దీన్ని రాసిపెట్టుకుంటారు. తనకు సాయం అందించాలని అభ్యర్థిస్తూ ఓ సందేశాన్ని అందులో రాస్తారు. యుద్ధ విమానం కూలిపోతే లేదా ఏదైనా ప్రాంతంలో చిక్కుకుపోతే అక్కడి సాధారణ ప్రజలకు దీన్ని చూపిస్తారు. సైనికుడికి అక్కడి భాష రాకపోవచ్చు.దీంతో బ్లడ్ చిట్ను సాధారణంగా అనేక భాషల్లో ముద్రిస్తారు. దాన్ని చూపిస్తున్న వ్యక్తి మిత్ర దేశానికి చెందిన సైనికుడని అందులో ఉంటుంది. ఆ వ్యక్తికి ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్య సాయం అందించాలని అందులోనే ముందుగానే రాసి పెట్టుకుంటారు. తనకు సాయం చేసి సురక్షితంగా తిరిగి పంపితే తమ దేశ ప్రభుత్వం ప్రతిఫలం ఇస్తుందన్న హామీ కూడా అందులో రాసి ఉంటుంది. “బ్లడ్ చిట్” అనే పదం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ సమయంలో చైనా, బర్మా సహా ఆసియా ప్రాంతాల్లో అమెరికా వైమానిక సిబ్బంది తమ జాకెట్ వెనుక భాగంలో బ్లడ్ చిట్ కుట్టించుకునేవారు. అమెరికా జెండా ముద్రించి, స్థానిక భాషల్లో సందేశం రాసి బ్లడ్ చిట్ ఉండేది.American pilots shot down over Kuwait had a “blood chit” in English, Arabic, Turkish, Persian & Kurdish: asking locals for food, water, shelter, medical help, and to contact U.S. authorities for a reward. pic.twitter.com/NRSB73XW9X— Zar Hemi 🇬🇧 (@ZerdashtHami) March 3, 2026 -
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! -
UAE: స్కూళ్లు బంద్.. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
దుబాయ్: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు ముందస్తుగా ‘స్ప్రింగ్ బ్రేక్’ (వసంతకాల సెలవులు) ప్రకటించడమే కాకుండా, విద్యా సంవత్సరం రెండో విడత (టర్మ్-2) గ్రేడింగ్ విధానంలోనూ సమూల మార్పులు చేసింది.విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఆదేశాల ప్రకారం షెడ్యూల్ కంటే ఒక వారం ముందుగానే, అంటే మార్చి 9వ తేదీ నుండి మార్చి 22 వరకు విద్యా సంస్థలన్నీ మూతపడనున్నాయి. సాధారణంగా మార్చి 16 నుండి ప్రారంభం కావాల్సిన ఈ సెలవులను, ప్రస్తుతం నెలకొన్న క్షిపణి, డ్రోన్ దాడుల ముప్పులను దృష్టిలో ఉంచుకుని మార్చి 9వ తేదీకి మార్చారు. ఈ నిర్ణయం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు, బోధన, బోధనేతర సిబ్బందికి కూడా వర్తిస్తుంది.ఈ ఆకస్మిక మార్పుల నేపథ్యంలో విద్యార్థుల విద్యా ఫలితాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు టర్మ్-2 మూల్యాంకన విధానాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మార్కులను ప్రస్తుత సెమిస్టర్లో వారు పూర్తి చేసిన ప్రాజెక్టులు, అసైన్మెంట్ల ఆధారంగా నిర్ణయించనున్నారు. ప్రైవేటు పాఠశాలల విషయానికొస్తే, ఆయా విద్యా సంస్థలు తమ సొంత విద్యా విధానాలకు అనుగుణంగా మూల్యాంకన పద్ధతులను ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఉద్రిక్తతల నేపధ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇప్పటికే మార్చి 5, 6 తేదీల్లో మిడిల్ ఈస్ట్లో జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. యూఏఈతో పాటు సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్, కువైట్, బహ్రెయిన్, ఇరాన్ దేశాల్లోని విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఇది కూడా చదవండి: నార్కో గ్యాంగ్లకు ట్రంప్ వార్నింగ్: ఈక్వెడార్లో వేట షురూ! -
వచ్చేస్తోంది ‘డూమ్స్ డే’ క్షిపణి
ఇరాన్పై యుద్ధం నానాటికీ భీకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యకు దిగింది. ‘డూమ్స్డే’మిసైల్గా పేరొందిన మినట్మ్యాన్–3 ఖండాంతర క్షిపణిని పరీక్షించింది! అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి అమెరికా వైమానిక దళ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. అది ఏకంగా 4,200 మైళ్లకు పైగా దూరం ప్రయాణించి పశ్చిమ మధ్య పసిఫిక్లోని మార్షల్ దీవుల సమీపంలో రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ సైట్ వద్ద లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్టు అమెరికా ప్రకటించింది. జీటీ 255గా పేర్కొంటున్న ఈ క్షిపణి ప్రయోగానికి ఇరాన్పై యుద్ధంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. క్షిపణి వ్యవస్థ తాలూకు విడి భాగాల పనితీరు తదితరాలను పూర్తిస్థాయిలో మదింపు వేసేందుకే పరీక్ష జరిపినట్టు 576వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ క్యారీ రే తెలిపారు. దీర్ఘకాలిక అవసరాల రీత్యా అమెరికా అణుపాటవం నిత్యం యుద్ధ సన్నద్ధంగా ఉండేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.రేంజ్ 6,000 కి.మీ. పైనేమినట్మ్యాన్–3 క్షిపణి సామర్థ్యం అంతా ఇంతా కాదు. అమెరికా వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థకు ఇది గుండెకాయ వంటిదంటే అతిశయోక్తి కాదు! అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన దీని రేంజ్ ఏకంగా 6,000 కి.మీ. పై చిలుకే! గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోషిమాపై పడ్డ అణుబాంబు కంటే ఏకంగా 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్హెడ్లను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు! ఖండాలకు ఆవల ఉన్న లక్ష్యాలను కూడా నిమిషాల వ్యవధిలో తుత్తునియలు చేయగలదు. అమెరికా ఇప్పటికే దీన్ని పలుమార్లు పరీక్షించి చూసింది. చివరిసారి గత నవంబర్లో దీన్ని పరీక్షించింది. ఈ క్షిపణుల తయారీని 1979లో మొదలు పెట్టారు.ఆ పేరెందుకు?అమెరికా అణ్వాయుధ సంపత్తిలో అత్యంత వినాశనకరమైన అస్త్రం మినట్మ్యాన్–3యే. అణుయుద్ధం అంటూ వస్తే ఇది సృష్టించే విధ్వంసం అంచనాలకు కూడా అందదు. అక్షరాలా ప్రళయం సృష్టిస్తుందనే అర్థంలో దీనికి డూమ్స్ డే అనే ముద్దుపేరు వచ్చింది. మినట్మ్యాన్–3 రేంజ్ 6,000 కి.మీ. అని అమెరికా చెబుతున్నా వాస్తవానికి అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నది రక్షణ నిపుణుల మాట. భూమిపై ఏ లక్ష్యాన్నయినా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని చెబుతారు. పైగా ఈ క్షిపణి ఘన ఇంధనంతో నడుస్తుంది. దాంతో నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. సమస్య తలెత్తితే క్షణాల వ్యవధిలో సిద్ధమై శత్రువు పని పట్టగలదు. పైగా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీ ఎంట్రీ వెహికిల్స్ (ఎంఐఆర్వీ)లను మోహరించే సామర్థ్యం కూడా మినట్మ్యాన్–3 సొంతం. కనుక ఒకే ప్రయోగంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను అలవోకగా ఛేదించగలదు. అమెరికా వద్ద ప్రస్తుతం ఈ క్షిపణులు 400కు పైగా ఉన్నట్టు అంచనా. వీటిని అమెరికా పశ్చిమ ప్రాంతంలో అత్యంత గోప్యంగా భూగర్భ కేంద్రంలో మోహరించి ఉంచారు. అండర్గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ దానితో సంబంధం తెగిపోయినా ప్రత్యేకంగా రూపొందించిన ఈ–6బీ లాంచ్ కంట్రోల్ విమానం నుంచి ఈ క్షిపణులను ఆపరేట్ చేసే సౌలభ్యం కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నార్కో గ్యాంగ్లకు ట్రంప్ వార్నింగ్: ఈక్వెడార్లో వేట షురూ!
వాషింగ్టన్: దక్షిణ అమెరికాలో వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల ముఠాలు, ఉగ్రవాద నెట్వర్క్లను అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈక్వెడార్ ప్రభుత్వంతో చేతులు కలిపి ఆ దేశ భూభాగంపై 'నార్కో-టెర్రరిస్టుల'ను ఏరివేసేందుకు అమెరికా సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలను ప్రారంభించింది. మార్చి 3వ తేదీన ఉమ్మడి బలగాలు ఈ ఆపరేషన్ను మొదలుపెట్టినట్లు అమెరికా సదరన్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హింసను అరికట్టేందుకు భాగస్వామ్య దేశాల నిబద్ధతకు ఈ చర్య ఒక నిదర్శనమని సదరన్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ డోనోవన్ అన్నారు. ఈ ఆపరేషన్కు సంబంధించి హెలికాప్టర్లు గగనతలానికి ఎగురుతున్న దృశ్యాలను, నిఘా నీడలో ఉన్న ఉగ్రవాద స్థావరాల వీడియోలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది.రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డ్రగ్ కార్టెల్స్ను 'విదేశీ ఉగ్రవాద సంస్థలు'గా పరిగణిస్తున్న ట్రంప్ యంత్రాంగం, ప్రస్తుతం తన సైనిక వ్యూహానికి మరింత పదును పెట్టింది. తాజా ఆపరేషన్లో భాగంగా అమెరికా దళాలు నేరుగా యుద్ధరంగంలోకి దిగకుండా, ఈక్వెడార్ సైన్యానికి అవసరమైన నిఘా సమాచారాన్ని, అత్యాధునిక లాజిస్టిక్స్ సదుపాయాలను అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముఠాలపై రాజీలేని పోరాటం చేస్తామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఉద్ఘాటించారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం డ్రగ్ ట్రాఫికింగ్ అనేది నేరమే తప్ప యుద్ధం కాదని, అమెరికా చేపడుతున్న వైమానిక దాడులు చట్టవిరుద్ధమైన హత్యల కిందకు వస్తాయని కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరేబియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో జరిగిన 44 వైమానిక దాడుల్లో సుమారు 150 మంది మరణించగా, వారిలో కొందరు సాధారణ కార్మికులు కూడా ఉన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.2020 కరోనా మహమ్మారి తర్వాత ఈక్వెడార్లో నేరాల రేటు గణనీయంగా పెరగడం, నిరుద్యోగం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ దేశం డ్రగ్ రవాణాకు అడ్డాగా మారడంతో నోబోవా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మార్చి 1 నుండి కొలంబియా దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధిస్తూ ఈక్వెడార్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో వెనిజులా భూభాగంపై దాడులు చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తరహాలోనే, ఇప్పుడు ఈక్వెడార్ వేదికగా డ్రగ్ మాఫియాపై మరో యుద్ధాన్ని అమెరికా ప్రకటించింది. అక్రమ గనుల తవ్వకం, డ్రగ్స్ మాఫియాను తుదముట్టించేందుకు ఇది ఒక ప్రయత్నమని ఈక్వెడార్ అధ్యక్షుడు తెలిపారు. -
ఇజ్రాయెల్లోని అణు కేంద్రంపై దాడి చేస్తాం: ఇరాన్ సంచలనం
టెహ్రాన్: ఇజ్రాయెల్లోని డిమోనా అణు కేంద్రంపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు టెహ్రాన్ గ్రాండ్ మోసల్లాలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఇరాన్ ప్రభుత్వ మీడియా పలు వివరాలు తెలిపింది.సుప్రీం లీడర్కు తుది వీడ్కోలు తెలపడంలో భాగంగా 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది సంతాపం తెలిపేందుకు మోసల్లా వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత సాధారణంగా “వీడ్కోలు కార్యక్రమం”, ఆ తర్వాత “అంతిమ యాత్ర” నిర్వహించడం అక్కడి ఆచారం.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రిపబ్లిక్ను కూల్చే ప్రయత్నం జరిగితే ఇజ్రాయెల్లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని గురువారం ఇరాన్ హెచ్చరించింది.ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ వస్తే అతడిని కూడా టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిమోనా అణు కేంద్రాన్ని టార్గెట్ చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించడం గమనార్హం. ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలు, జెరూసలేం పరిసరాలు, పశ్చిమ తీర ప్రాంతం భాగాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ప్రారంభించామని ఇరాన్ పేర్కొంది.అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన 7కు పైగా ఆధునిక రాడార్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఈ దాడులతో ఆ దేశాల నిఘా వ్యవస్థలు పనిచేయకుండా చేశామని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థను ఛేదించి మరీ దూసుకెళ్లి పలుచోట్ల తాకినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ భవనాల సముదాయం, బెన్ గురియన్ విమానాశ్రయం కూడా లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపింది.ఈ థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థ అమెరికాకు చెందింది. గగనతలంలో శత్రుదేశాల క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఇది. వాటిని దాటుకుని మరీ తమ క్షిపణులు దూసుకెళ్లాయని ఇరాన్ అంటోంది. ఐఆర్జీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ కొనసాగిస్తున్న క్షిపణి-డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్లోఏని అనేక ప్రాంతాల్లో గంటల తరబడి సైరన్లు మోగాయి. ప్రజలు చాలాసేపు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. -
ఇరాన్పై దాడులు.. భారత్ నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందా?
ఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నావల్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత అమెరికా భారత్ నావల్ బేస్లను వినియోగిస్తోందంటూ అమెరికా మీడియా విస్తృత ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది.భారత్ స్పష్టంగా తెలిపింది: అమెరికా మీడియా ప్రసారం చేస్తున్న కథనాలు అసత్యమని, భారత నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కథనాలను నిరాధారమైనవిగా, కల్పితమైనవిగా పేర్కొంది.ఇటీవల ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన నేపథ్యంలో, అమెరికా ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్ ఒక అమెరికా మీడియా సంస్థ నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా అన్ని బేస్లు ధ్వంసం అయ్యాయి. మా నౌకాశ్రయ (Harbour) సదుపాయాలు కూడా నాశనం అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం భారత్, భారత పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన పరిష్కారం కాదు, కానీ పరిస్థితుల వల్ల తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది’ అని అన్నారు. అయితే, అమెరికా మీడియా సంస్థ OAN ప్రసారం చేసిన ఈ కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.అమెరికా నేవీ భారత్ పోర్టులను వినియోగిస్తున్నట్లు అమెరికా మీడియా చేస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.Claim: On a US-based channel, One America News Network (@OANN), former U.S. Army Colonel Douglas Macgregor made a statement suggesting that the United States is using Indian naval bases to attack Iran, amidst the ongoing Iran-US conflict.#PIBFactCheck: ❌This claim is #FAKE… pic.twitter.com/nzcXCi7yT9— PIB Fact Check (@PIBFactCheck) March 4, 2026 Fake News Alert!Claims being made on OAN, a US based channel that Indian ports are being used by the US Navy are fake and false. We caution you against such baseless and fabricated comments. pic.twitter.com/xiFWnkoXBk— MEA FactCheck (@MEAFactCheck) March 4, 2026 -
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
రియాద్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం సౌదీపై కనిపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం స్థానిక ప్రజలకు శుభవార్త చెప్పింది. పవిత్ర రంజాన్ మాసం ముగింపును పురస్కరించుకుని జరుపుకునే ఈద్ అల్ ఫితర్ (రంజాన్) పండుగ వేళ సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రైవేట్, స్వచ్ఛంద రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ, అక్కడి మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.కార్మిక నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ షెడ్యూల్ ప్రకారం.. మార్చి 18వ తేదీ (బుధవారం) పనిదినం ముగిసిన తర్వాత నుంచి ఈ సెలవులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మార్చి 18 సాయంత్రం నుంచి మార్చి 21 (శనివారం) వరకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తిరిగి మార్చి 22వ తేదీన ఆయా కంపెనీల పని వేళల ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన సెలవుల వివరాలను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా వెల్లడించనుంది.పండుగకు ముందుగానే ఈ ప్రకటన చేయడం వల్ల పలు కుటుంబాలు తమ ప్రయాణాలను, వేడుకలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్ కూడా ఇప్పటికే ఇలాంటి ప్రకటనలే చేయడంతో ఈ ప్రాంతమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈద్ అల్ ఫితర్ పండుగ తేదీ నిర్ణయం నెలవంక దర్శనంపైనే ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం రంజాన్ నెల 29 రోజులు పూర్తయి, నెలవంక కనిపిస్తే మార్చి 19న ఈద్ జరుపుకుంటారు. ఒకవేళ నెలవంక కనిపించని పక్షంలో, రంజాన్ 30 రోజులు పూర్తయ్యాక మార్చి 20వ తేదీన పండుగ నిర్వహిస్తారు. దీనిని సౌదీలోని మూన్ సైటింగ్ కమిటీలు అధికారికంగా ధృవీకరించనున్నాయి. పండుగ రోజున సూర్యోదయం తర్వాత ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు మొదలై, పేదలకు చేసే ‘జకాత్ అల్ ఫితర్’ దానధర్మాలతో కొనసాగుతాయి. ఇది కూడా చదవండి: హోలీలో విషాదం: మనవడిపై నాన్నమ్మ పైశాచికం -
కువైట్ తీరంలో పేలిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్.. అమెరికా పనేనా
కువైట్ సిటీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధంలో తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. కువైట్ తీరానికి సమీపంలో ఇరాన్కు చెందిన ఓ పెద్ద ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో సముద్రంలో భారీగా చమురు లీక్ అవుతూ, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడిందని యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (UKMTO) ఈ సంఘటనను ధృవీకరించింది. ఆ ట్యాంకర్ను పేల్చింది అమెరికానేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కువైట్ సముద్ర తీరంలో కూలిన ఆ ట్యాంకర్ ఇరాన్కు చెందినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తర్వాత మంటలు చెలరేగి, సముద్రంలో చమురు వ్యాపించడంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. కువైట్, యుఎఇ, శ్రీలంక తీరప్రాంతాలకు ఈ చమురు లీక్ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం, ఇరాన్ మిలిటరీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ పేలుడు ఆ యుద్ధానికి సంబంధించి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యూఏఈ, కువైట్ అధికారులు అత్యవసర చర్యలు ప్రారంభించారు. సముద్రంలో చమురు వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దించారు. ఈ లీక్ వల్ల సముద్ర జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమెరికా రక్షణ శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఇరాన్ మిలిటరీ ఈ పేలుడులో తమ ప్రమేయం లేదని ప్రకటించింది. అయితే, యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మరింత ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. UKMTO WARNING INCIDENT 014-026 Click here to view the full warning ⤵️ https://t.co/ygKSBOCLZi#MaritimeSecurity #MarSec pic.twitter.com/RPZXtz6RU7— UKMTO Operations Centre (@UK_MTO) March 5, 2026 -
అంత పెద్ద క్షిపణీ... చిన్నబోయిన వేళ!
ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. ఆ చిన్నారి బాలుని గుండె ధైర్యం ముందు అంత పెద్ద క్షిపణి కూడా చిన్నబోయి నేలచూపులు చూస్తున్నట్టుగా ఉంది కదూ! ఇది పేలని క్షిపణి. ఇజ్రాయెల్–అమెరికాపై యుద్ధంలో భాగంగా బుధవారం ఇరాన్ ప్రయోగించగా తూర్పు సిరియాలోని ఖమిష్లీ శివార్లలో ఇలా బహిరంగ ప్రదేశంలో పడిపోయింది. పశువుల కాపరి అయిన ఆ బాలుడు ఒక చేత్తో టోపీని నింపాదిగా సర్దుకుంటూ, మరో చేతిలో కర్రతో ఆ క్షిపణి పక్కనుంచే ఇదుగో, ఇలా నిబ్బరంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు.తగ్గుతున్న అమెరికా క్షిపణి నిల్వలువాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వద్ద క్షిపణి నిల్వలు శరవేగంగా తగ్గుతున్నట్టు సమాచారం. ఇంటర్సెప్టర్లు, గైడెడ్ మిసైళ్ల సంఖ్య బాగా తగ్గుతున్నట్టు పెంటగాన్ ఆందోళన వెలిబుచి్చంది. ఇరాన్పై దాడులు ఇంకో వారం పది రోజులు కొనసాగితే క్షిపణి నిల్వలు మరీ క్షీణించవచ్చని పేర్కొంటూ అది రూపొందించిన తాజా నివేదిక ఒకటి లీకైంది. అమెరికా వద్ద అపారమైన ఆయుధ నిల్వలున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితమే ప్రకటించడం తెలిసిందే. అత్యాధునిక క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. -
ఆపరేషన్ ముగియలేదు.. ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా సైన్యం పనితీరుకు అసాధారణ రేటింగ్ ఇచ్చారు. అమెరికా ఇప్పుడు కమాండింగ్ స్థానంలో ఉందన్నారు. యుద్ధ రంగంలో అమెరికా సైన్యం పైచేయి సాధించిందని.. బాగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ట్రంప్.. 15/10 రేటింగ్ ఇచ్చారు.వైట్ హౌస్లో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్లతో ట్రంప్ మాట్లాడుతూ..‘అమెరికా, మిత్రదేశాలు.. ఇరాన్పై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. వారం కంటే తక్కువ సమయంలోనే వేగంగా పురోగతి సాధించాం. మేము యుద్ధ రంగంలో బాగానే ఉన్నాము. ఈజీగా చెప్పాలంటే. 10 స్కేల్లో 15 రేటింగ్తో ముందంజలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాం. ఇరాన్ నాయకత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఇరాన్కు నాయకుడిగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చనిపోతారు. ఇరాన్ నాయకత్వ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదే సమయంలో ట్రంప్ అణు హెచ్చరికను పునరావృతం చేశారు. ఇరాన్పై దాడి చేయాలనే నిర్ణయాన్ని అమెరికా నాయకుడు మళ్ళీ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించడానికి దగ్గరగా ఉందని వాదించారు. పిచ్చివాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు, ఇలాంటి చెడు విషయాలు జరుగుతాయి అని మండిపడ్డారు. ఇరాన్పై ఇంకా ఆపరేషన్ ముగియలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ఆయుధశాల వేగంగా తుడిచిపెట్టబడుతోందన్నారు. చివరగా.. వాషింగ్టన్ చివరికి టెహ్రాన్లో పాలన మార్పును కోరుకుంటుందో లేదో వైట్ హౌస్ నిర్ధారించకుండా ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
కొనసాగుతున్న అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధంయుద్ధం దృష్ట్యా ఖమేనీ అంత్యక్రియలు వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పెను విపత్తులో పాక్?
న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్తాన్ను సైతం చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్కు చెందిన ఆత్మాహుతి డ్రోన్ సౌదీ అరేబియాపై దాడి చేసిన దరిమిలా పాకిస్తాన్ ఈ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025 సెప్టెంబరులో సౌదీ అరేబియా, పాకిస్తాన్ల మధ్య కుదిరిన ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్’ (SMDA) ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా, అది ఇద్దరిపై జరిగిన దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరాన్ గనుక సౌదీపై దాడులను ఉధృతం చేస్తే, ఆ దేశ రక్షణ కోసం పాకిస్తాన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ తన వైఖరిని స్పష్టం చేస్తూ, ఇరాన్కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. తమ మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇరాన్ విదేశాంగ మంత్రిని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ బహిరంగంగానే తన రక్షణ ఒప్పందాన్ని ప్రస్తావించింది. అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్, సంపన్న దేశమైన సౌదీకి అణు రక్షణ కల్పించేలా ఈ ఒప్పందం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందాలకు (ఎన్పీటీ) ఇది విరుద్ధమని ఐక్యరాజ్యసమితి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.2025లో ఇజ్రాయెల్.. దోహా, ఖతార్లపై వైమానిక దాడులు చేసిన సమయం నుండి గల్ఫ్ దేశాల్లో అభద్రతా భావం పెరిగింది. అమెరికా తమను కాపాడుతుందన్న నమ్మకం సన్నగిల్లడంతోనే సౌదీ అరేబియా ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్తో ఈ రక్షణ ఒప్పందం చేసుకుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్ తన బలగాలను యుద్ధ భూమికి పంపకపోయినప్పటికీ, సౌదీకి మద్దతుగా దౌత్యపరమైన, వ్యూహాత్మకమైన బలాన్ని చేకూర్చడం ఖాయమనే విధంగా కనిపిస్తోంది. -
తాలిబన్లకు భారీ షాక్..
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్లోని బగ్రాం ఎయిర్ బేస్పై పాకిస్తాన్ భారీ వైమానిక దాడులు చేపట్టింది. పాక్ ప్రభుత్వ టీవీ బుధవారం ఈ విషయం వెల్లడించింది. అఫ్గాన్ తాలిబన్లు పాకిస్తాన్తో 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని 53 ప్రాంతాల్లో దాడులకు తెగబడటంతో పాక్ ఆర్మీ ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి ఘజబ్ లిల్ హక్ పేరుతో భారీ ఆపరేషన్ ప్రారంభించింది.అందులో భాగంగానే బగ్రాం వైమానిక స్థావరంపై తీవ్ర దాడులు జరిగాయని, అఫ్గాన్ తాలిబన్ల దురాక్రమణ చర్యలకు తగు బుద్ధి చెప్పామని పాక్ టీవీ పేర్కొంది. ఎయిర్బేస్కు తీవ్ర నష్టం వాటిల్లిందని, అందులోని ఓ హంగార్, రెండు గిడ్డంగులు ధ్వంసమయ్యాయంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఉటంకించింది. వారం రోజుల వ్యవధిలో అఫ్గానిస్తాన్లోని సైనిక లక్ష్యాలపై 50కి పైగా వైమానిక దాడులు జరిగాయని తెలిపింది. తాలిబన్లపై ఇలాంటి దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని హెచ్చరించింది.#BREAKING: Intense fighting between Afghan and Pakistani forces has resumed after nearly 30 hours of relative calm.Pakistan’s Air Force has conducted airstrikes in Kandahar, Afghanistan, with multiple explosions reported across the city.Afghan forces say they have struck… pic.twitter.com/JMydVuupLR— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 4, 2026టీటీఏ కమాండర్ హతంపెషావర్: సరిహద్దులోని తోర్ఖామ్ వద్ద పాకిస్తాన్ సైన్యం జరిపిన కీలక ఆపరేషన్లో ఆఫ్ఘన్ తాలిబన్ కమాండర్ (టీటీఏ) కహ్రామాన్ హతమయ్యారు. ఈ ఘటనలో కమాండర్తో పాటు అతని అనుచరులు కూడా మరణించారు. తోర్ఖామ్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్. పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నుతున్న తాలిబన్లు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పాక్ ప్రభుత్వం తెలిపింది. సరిహద్దును చేరుకోవడానికి వారు ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని, భద్రతా దళాలు చేసిన దాడిలో ఖహ్రామాన్, అతని సహచరులు అనేక మంది మరణించారని వెల్లడించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రధాన ఆపరేషన్లో మొత్తం 67 మంది ఆఫ్ఘన్ తాలిబన్లను చంపినట్లు పాకిస్తాన్ భద్రతా దళాలు పేర్కొన్నాయి. -
పోలీసు అధికారిని చంపిన వ్యక్తికి మరణ శిక్ష
స్టార్క్(యూఎస్ఏ): ఓ పోలీస్ అధికారిని అతడి సొంత సర్వీస్ రివాల్వర్తో ఏకంగా 14సార్లు కాల్చి మరణానికి కారకుడైన వ్యక్తికి మంగళవారం సాయంత్రం ఫ్లోరిడా జైలులో మరణ శిక్ష అమలు చేశారు. స్టార్క్ సమీపంలోని ఫ్లోరిడా స్టేట్ ప్రిజన్లో సాయంత్రం 6 గంటలకు దోషి అయిన బిల్లీ లియోన్ కీర్స్(53)కు మూడు ఇంజెక్షన్ల ద్వారా ఈ శిక్షను అమలు చేశారు. చివరి కోరిక తెలపాలని జైలు వార్డెన్ కోరగా..‘మృతుడు డానీ పారిష్ కుటుంబం నుంచి క్షమాపణలు మాత్రమే కోరుతున్నాను. ఇంతకు మించి వారికి తిరిగి ఏమీ ఇవ్వలేను’అని పేర్కొన్నాడు. ఆ సమయంలో మరణ శిక్ష అమలును చూసేందుకు కుటుంబీకులు, అధికారులు కలిపి అక్కడ 15 మంది వరకు ఉన్నారు. బిల్లీ లియోన్ కీర్స్ 1991 జనవరిలో ఓ రోజు కారులో వెళ్తుండగా ఫోర్ట్ పియర్స్ పోలీసు అధికారి డానీ పారిష్ అతడిని ఆపారు. ఆ సమయంలో అతడు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. పైపెచ్చు అతడి వద్ద డ్రైవింగ్ లైసెన్సు లేదు. దీంతో, అతడికి బయటకు రప్పించి, చేతులకు బేడీలు వేసేందుకు యత్నించగా పెనుగులాట జరిగింది. అదను చూసుకుని పారిష్ వద్ద ఉన్న సర్వీసు రివాల్వర్ను కీర్స్ లాక్కున్నాడు. అతడిపైకి 14సార్లు కాల్చాడు. దీంతో, అక్కడికక్కడే పారిష్ చనిపోయారు. పోలీసులు అనంతరం కీర్స్ను ఇంట్లోనే అరెస్ట్ చేశారు. 1991లోనే కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఫ్లోరిడా సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. 1997లో తిరిగి విచారణ జరిపిన కోర్టు కూడా అతడికి మరణశిక్షనే విధించింది. గత వారం ఫ్లోరిడా సుప్రీంకోర్టు కీర్స్ అప్పీల్ను తిరస్కరించింది. మరణ శిక్ష అమలుకు కొద్ది గంటల ముందు కీర్స్ చేసిన తుది అప్పీల్ను అమెరికా సుప్రీంకోర్టు సైతం ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా కొట్టివేసింది. -
నేడు ప్రధానితో ఫిన్లాండ్ అధ్యక్షుడి భేటీ
న్యూఢిల్లీ: భారత్లో నాలుగు రోజుల పర్యటనకు గాను ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానా శ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి కృతి వర్థన్సింగ్ స్వాగతం పలికారు. స్టబ్ గురువారం ప్రధాని మోదీతో సమావేశ మవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. గురువారం సాయంత్రం ప్రారంభమయ్యే రైజినా డైలాగ్ సదస్సులో స్టబ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసమిస్తారు. స్టబ్ వెంట మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార వేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వచ్చింది. అలెగ్జాండర్ స్టబ్ రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్లతోనూ భేటీ అవుతారు. శుక్రవారం ముంబైలో వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శనివారం తిరిగి స్వదేశానికి పయనమవుతారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పో పాల్గొనడం తెల్సిందే. కొన్ని వారాల వ్యవధిలోనే ఆ దేశాధ్యక్షుడు కూడా భారత్ రావడం గమనార్హం. -
ఇరాన్ నూతన సారథి మొజ్తబా!
దుబాయ్: ఇరాన్ నూతన సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీ నియుక్తులైనట్టు తెలుస్తోంది. 88 మంది మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) మంగళవారం ఆయనను ఎన్నుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ బుధవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే. 56 ఏళ్ల మొజ్తబా ఆయన రెండో కుమారుడు. ఆయనకు పాలనానుభవమేదీ లేదు. ఇప్పటిదాకా తెర వెనకే తండ్రి తరఫున వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. వారసత్వ రాజకీయాలకు ప్రస్తుత ఇరాన్ పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో మొజ్తబా ఎన్నికపై కమిటీలో పలువురు అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్లో సర్వశక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్ర ఒత్తిడితో చివరికి ఆయన నియామకానికి పచ్చజెండా ఊపినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఐఆర్జీసీపై మొజ్తబాకు పూర్తిస్థాయిలో పట్టుంది. దాని వ్యవహారాలను చాలా ఏళ్లుగా పూర్తిగా ఆయనే చూసుకుంటున్నట్టు చెబుతారు. వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాచరికాన్ని కూలదోసిన 1979 నాటి ఇస్లామిక విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వారసత్వంగా పాలన పగ్గాలు చేపట్టడాన్ని ఇరాన్ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. ఇరాన్లో అధ్యక్షునిగా ఎవరున్నా సర్వం సహా అధికారాలు మాత్రం సుప్రీం నేత చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైన్యంతో పాటు అత్యంత శక్తిమంతమైన ఐఆర్జీసీ కూడా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తుంది. శనివారం నాటి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు మొజ్తబా భార్య జహ్రా హదద్ ఆదెల్, ఆయన చిన్న కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కని్పంచలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉంటూ ఇరాన్ ప్రతి దాడులను పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. తెర వెనక ‘సుప్రీం’మొజ్తబా. అయతొల్లా ఖమేనీ రెండో కుమారునిగానే తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే తెర వెనక మాత్రం దశాబ్దాలుగా ఆయన పూర్తిస్థాయి అధికారాలు చలాయిస్తూ వస్తున్నట్టు చెబుతారు. ఒకరకంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలన్నింటినీ శాసించారంటారు. ఆ క్రమంలో ఖమేనీ వారసునిగా చాలా ఏళ్లుగా మొజ్తబా పేరే వినిపిస్తోంది. ఆయన్ను సుప్రీం నేతగా నియమిస్తున్నట్టు ఏడాది క్రితమే వార్తలొచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇరాన్ రాజకీయ వ్యవహారాల్లో మొజ్తబా ‘అదృశ్య శక్తి’గానే ఉంటూ వస్తున్నారు. ఆయన 1969లో మషాద్ నగరంలో జని్మంచారు. నాటి పాలకుడు మహమ్మద్ రెజా పహ్లావీ పాలనపై తన తండ్రి ఖమేనీ తిరుగుబాటును చూస్తూ పెరిగారు. కోమ్ నగరంలో షియా మత విద్య అభ్యసించినా క్లెరికల్ హోదాతో సరిపెట్టుకున్నారు. కీలకమైన ఆయతుల్లా హోదాకు చేరలేకపోయారు. పహ్లవీ పాలన అంతమయ్యాక తన తండ్రి ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే మొజ్తబా సైన్యంలో చేరారు. ఇరాక్పై పోరులో ఐఆర్జీసీ విభాగమైన హబీబ్ ఇబ్న్ మజాహిర్ బెటాలియన్కు సారథ్యం వహించారు. అక్కణ్నుంచీ ఐఆర్జీసీతో ఆయన బంధం బలంగా పెనవేసుకుంటూ వచ్చింది. 1989లో ఖమేనీ సుప్రీం లీడర్ అయ్యాక మొజ్తబా ప్రాధాన్యం విస్తరిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ వ్యాపార వ్యవహారాలను పూర్తిగా ఆయనే నియంత్రిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇంటా బయటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు కూడబెట్టారంటారు. 2000 నాటి వికీలీక్స్ కూడా మొజ్తబానే ఇరాన్లో నిజమైన అధికార శక్తిగా పేర్కొంది. 2019లో ట్రంప్ తొలి హయాంలో మొజ్తబాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. 2005లో తనకు అనుకూలుడైన మతవాది అహ్మదీ నెజాద్ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేలా మొజ్తబా పావులు కదిపినట్టు చెబుతారు.సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా అంతం చేసేస్తాం: ఇజ్రాయెల్ జెరూసలేం: ఇరాన్ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా తక్షణమే అంతం చేసేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే పూర్తిస్థాయి ఆదేశాలిచ్చినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ బుధవారం తెలిపారు. తమ అంతమే లక్ష్యంగా పని చేసే అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని పేర్కొన్నారు. -
ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి
కొలంబో: పశ్చిమాసియా యుద్ధజ్వాలలను అమెరికా దక్షిణాసియాకూ వ్యాపింపజేసింది. విశాఖపట్నంలో గత నెలలో అంతర్జాతీయ నావికా విన్యాసాల్లో పాల్గొని స్వదేశానికి బయల్దేరిన ఇరాన్కు చెందిన యుద్ధనౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’పై అమెరికా దాడిచేసింది. అమెరికా జలాంతర్గామి నుంచి దూసుకొచ్చిన టోర్పెడో ధాటికి ‘ఐఆర్ఐఎస్ దేనా’యుద్ధనౌక మంగళవారం రాత్రి ముక్కలుచెక్కలై శ్రీలంక సమీప సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈ ఘటనలో కనీసం 87 మంది నావికాసిబ్బంది జలసమాధి అయ్యారు. పలువురు నావికుల జాడ గల్లంతైంది. నౌక మునిగిపోయాక లైఫ్జాకెట్లతో సముద్రజలాలపై ఈదుతున్న 32 మందిని సమీపంలోని శ్రీలంక నావికాదళాలు రక్షించాయి. గాయపడిన వారిని సమీప నగర ఆస్పత్రిలో చేరి్పంచారు. నౌకపై దాడి చేసింది తామేనని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. దాడి వివరాలను పెంటగాన్లోని రక్షణశాఖ కార్యాలయంలో మీడియాకు మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. ‘‘యుద్ధం వేళ హిందూ మహాసముద్ర జలాల్లో శత్రుదేశ యుద్ధనౌక జాడ కనిపెట్టాం. అందుకే టోర్పెడోతో దానిని నాశనంచేశాం. రెండో ప్రపంచయుద్దం తర్వాత శత్రువుల నౌకను జలాంతర్గామితో ధ్వంసంచేయడం ఇదే తొలిసారి’’అని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక నైరుతి దిశలో గల్లే నగర సముద్ర తీరం నుంచి 75 కి.మీ.ల దూరంలో సముద్రజలాల్లో నౌక మునిగిపోతోందని, కాపాడాలని శ్రీలంక తీరగస్తీ దళాలకు బుధవారం ఉదయం 5.08 గంటలకు అత్యయిక సందేశం రాగానే వెంటనే శ్రీలంక తమ నావికాదళ నౌకలు, వాయుసేన విమానాలను ఘటనాస్థలికి పంపించింది. యుద్ధనౌకకు చెందిన కొందరు సిబ్బంది లైఫ్ జాకెట్లతో సముద్రజలాలపై కన్పించారు. గాయపడిన వారిని తొలుత శ్రీలంక నేవీ సదరన్ కమాండ్ ప్రధానకార్యాలయంలో చేర్పించారు. తర్వాత గాలె నగరంలోని కరపితియా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. సముద్రజలాల నుంచి 87 మృతదేహాలను లంక నేవీ స్వా«దీనంచేసుకుంది. ‘‘మేం రక్షించిన 32 మందిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో ఏడుగురిని ఐసీయూలో చేర్పించాం. ఇతరులకు చిన్నపాటి గాయాలయ్యాయి’’అని శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి ఎయిర్ వైస్మార్షల్ సంపథ్ థుయకొంతా చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ వివరాలను శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్ పార్లమెంట్లో వెల్లడించారు. ‘‘ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 180 మంది ఉన్నారు. మన బలగాలు అక్కడికి చేరుకునేలోపే నౌక మునిగిపోయింది. గాయపడి ఈదుతున్న నావికులను బలగాలు కాపాడాయి’’అని మంత్రి చెప్పారు. ‘‘ఘటనాస్థలి వాస్తవానికి మా సముద్రజలాల పరిధిలో లేదు. కానీ గాలింపు, సహాయక చర్యలు చేపట్టే దూరం మాత్రం మా పరిధిలోనే ఉంది. అందుకే మేం స్పందించాం’’అని శ్రీలంక నావికాదళ అధికార ప్రతినిధి బుద్ధిక సంపత్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఫిబ్రవరి మూడోవారంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 వైమానిక విన్యాసాల్లో ఇరాన్కు చెందిన ఈ మౌడ్జ్ తరగతి స్వదేశీ, వేగంగా వెళ్లే తేలికపాటి యుద్ధనౌక సైతం పాల్గొంది. ఐఆర్ఐఎస్ దేనా నౌకలో భారీ స్థాయిలో గన్లతోపాటు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, యాంటీ–íÙప్ మిస్సైళ్లు, టోర్పెడోలు ఉన్నాయి. దీని మీద హెలికాప్టర్ను ల్యాండ్చేయొచ్చు. దీనికి తోడుగా ఐఆర్ఐఎస్ మక్రాన్ అనే మరో చిన్న నౌక అంతర్జాతీయ జలాల్లో పెట్రోలింగ్ బాధ్యతలు నిర్వర్తించేది. అయితే ఉక్రెయిన్లో జనావాసాలపై దాడులకు ఉపయోగించిన మారణాయుధాలను ఈ నౌకల్లోనే రష్యాకు సరఫరాచేశారన్న ఆరోపణలపై వీటిపై అమెరికా ఆర్థికశాఖ 2023 ఫిబ్రవరిలో ఆంక్షలు విధించింది. ఇరాన్ నౌకలను నాశనంచేయడమే తమ లక్ష్యమని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ సారథి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వ్యాఖ్యానించారు. -
ఇరాన్పై నిప్పుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్తో పాటు లెబనాన్పైనా ఇజ్రాయెల్ బుధవారం ఐదో రోజు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్తో పాటు కోమ్, ఉరి్మయా, కెర్మన్షా తదితర నగరాలపై కూడా రోజంతా పలు దఫాలుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్లోని క్షిపణి నిల్వల కేంద్రంపై క్షిపణుల వర్షం కురిపించింది.టెహ్రాన్ సమీపంలోని నూతన అణు ప్రాజెక్టు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్కు చెందిన వైఏకే–130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో కూల్చేసినట్టు సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ఇరాన్ వాయిదా వేసుకుంది! ఇప్పటిదాకా ఇరాన్కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1,045 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. దాంతో దాడుల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. బుధవారం ఇరాన్ కూడా దీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతర్తో పాటు పలు గల్ఫ్ దేశాలపై కూడా దాడులను నిరి్నరోధంగా కొనసాగించింది. దుబాయ్లోని యూఎస్ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అక్కడి రస్ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. బహ్రెయిన్లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ వ్యవస్థపైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టరీ్కకి కూడా విస్తరించింది! ఇరాన్ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్టు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధం అవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది! లెబనాన్లో... లెబనాన్పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచి్చపడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియత్ తదితర నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. బలైనట్టు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామవాసులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్బెక్లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు, సాదియత్లో ఆరుగురు మరణించినట్టు లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. -
లొంగే ప్రసక్తే లేదు
మాడ్రిడ్: ఇరాన్పై దాడుల కోసం మీ వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతించాలని లేదంటే వాణిజ్య బంధం తెంచుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాన్చెజ్ బేఖాతరు చేశారు. బెదిరింపులకు లొంగే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు. అర్ధంలేని యుద్ధంలో భాగస్వాములం కాబోమని స్పష్టంచేశారు. వాణిజ్య బంధాన్ని వదులుకుంటామని ట్రంప్ చేసిన హెచ్చరికలపై పెడ్రో దీటుగా స్పందించారు. బుధవారం టెలివిజన్లో దేశ ప్రజలనుద్దేశించి పెడ్రో ప్రసంగించారు. ‘‘ప్ర పంచానికి అశుభంగా దాపురించిన పశ్చి మాసియా యుద్ధంలోకి మేం దిగదల్చు కోలేదు. ఈ సమరం అనేది మా దేశ విలు వలు, స్వ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. ట్రంప్ హెచ్చరికలకు బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరిక్కడ. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు చేస్తున్నాయి. ఇతర దేశాల వ్యవహారల్లోకి సైనిక జోక్యం చేసుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. ఇరాన్పై దాడులతో పశ్చిమాసియాలో అత్యంత భీకరమైన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే పెను ప్రమాదం పొంచి ఉంది’’అని ఆయన అన్నారు.బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో తెలీదు..‘‘ఇరాక్, అఫ్గానిస్తాన్ విషయాల్లో అమెరికా జోక్యం చేసుకున్నప్పుడూ ప్రపంచం దారుణ విపరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధంలో భాగస్వాములుకావడం అంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే. రివాల్వర్లో ఒక బుల్లెట్ పెట్టి బుల్లెట్ చాంబర్ గిరగిరా తిప్పి కాల్చడం లాంటిది. బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఏ దారుణ దిశగా వెళ్తుందో, ఎలాంటి విషాదాలను మిగుల్చుతుందో ఎవరూ ఊహించలేరు. తాజా పరిణామాలపై స్పెయిన్ ప్రభుత్వ వైఖరిని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే మేం యుద్ధం అస్సలు చేయదల్చుకోలేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. దక్షిణ స్పెయిన్లోని రోటా, మొరాన్ స్థావరాలను ఎప్పుడంటే అప్పుడు మేం వినియోగించుకోగలమని మంగళవారం ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘ ఈ స్థావరాలను ఉపయోగించకూడదు అని మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’’ అని ట్రంప్ అన్నారు. యుద్ధంలో భాగస్వాములు కాకపోతే అత్యధిక టారిఫ్ల మోత, పరస్పర వాణిజ్యంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించడం తెల్సిందే. ట్రంప్ వ్యాఖ్యలపై స్పెయిన్ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూయెర్పో స్పందించారు. ‘‘ ప్రశాంతంగా ఉండాలని ట్రంప్కు సందేశం పంపిస్తా. ట్రంప్ బెదిరింపులకు దిగుతారుగానీ ఆచరణలో ఏమీ ఉండదు’’ అని కార్లోస్ ఎద్దేవాచేశారు. అమెరికాతో స్పెయిన్ ఎగుమతి, దిగుమతుల విలువ దేశ జీడీపీలో కేవలం 4.4 శాతానికి సమానం. స్పెయిన్కు ఆరో అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా అమెరికా కొనసాగుతోంది. నాటో దేశాలు తమ జీడీపీలో 5 శాతానికి సమానమైన నిధులను రక్షణ బడ్జెట్ కోసం కేటాయించాలంటూ గతంలో అమెరికా చేసిన ప్రతిపాదననూ స్పెయిన్ ఆనాడే తీవ్రంగా తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు ఏ మేరకు ఉండాలనేది తమ సొంత విషయమని తెగేసి చెప్పింది. దీంతో అధిక టారిఫ్లు విధిస్తానని ట్రంప్ ఆనాడే స్పెయిన్ను బెదిరించారు. -
నేపాల్లో నేడే పోలింగ్
కఠ్మాండు: నేపాల్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలతో గతేడాది కేపీ శర్మ ఓలి సార థ్యంలోని ప్రభుత్వం పడిపోయాక జరుగుతు న్న మొదటి ఎన్నికలివి. నేపాల్ పార్లమెంట్ ప్రతినిధుల సభలోని 275 స్థానాలకు గాను అర్హులైన 1.89 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. బరిలో 3,406 మంది అభ్యర్థులుండగా 165 సీట్లకు ప్రత్యక్ష ఓటింగ్, మిగతా 110 సీట్లకు నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఈ నెల 2వ తేదీ సోమవారం అర్ధరాత్రితో ప్రచార పర్వం ముగిసింది. గురువారం ఉదయం 7 మొదలుకానున్న పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. తాత్కాలిక ఎన్నికల ప్రధాన కమిషనర్ రాంప్రసాద్ భండారీ మీడియాతో మాట్లాడుతూ..ఓటింగ్ శాతం ఈ దఫా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా, తాము చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో చెల్లని ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు సహకారం అందించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆపద్దర్మ ప్రభుత్వంలోని హోం మంత్రి ఓం ప్రకాశ్ ఆర్యల్ కోరారు. 3.41 లక్షల భద్రతా సిబ్బందిపోలింగ్ సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10,967 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల్లో మొత్తం 65 రాజకీయ పార్టీలు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా పోటీ పడుతుండగా, ఇందులో 63 పార్టీలు నైష్పత్తిక ఓటింగ్ పద్ధతిలో పోటీ చేస్తున్నాయి. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 80 వేల మంది ఆర్మీ సిబ్బంది, మరో 76 వేల మంది పోలీసులు, సాయుధ పోలీసులు 34 వేల మందిని వినియోగిస్తున్నారు. వీరుకాకుండా, తాత్కాలిక ఎన్నికల పోలీసులు 1.50 లక్షల మందిని రంగంలోకి దించుతున్నారు. ఎన్ని కల కోసం మొత్తం 3.41 లక్షల మంది సేవలను వాడుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.జెన్ జెడ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుఆశ్రిత పక్షపాతం, అవినీతికి వ్యతిరేకంగా రా జకీయ నాయకత్వంలో మార్పులు కోరుతూ గతేడాది సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో యువత సారథ్యంలో జరిగిన తీవ్ర నిరసనల ధాటికి కేపీ శర్మ ఓలి ప్రభుత్వం గద్దె దిగిపోవాల్సి వచ్చింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సారథ్యంలోని కమ్యూనిస్ట్పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మా ర్క్సిస్ట్ లెనినిస్ట్) సీపీఎన్–యూఎంఎల్, నేపా లీ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి అప్పట్లో పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజా రిటీ ఉంది. ఓలి దిగిపోవడంతో అధ్యక్షుడు పౌడెల్ పార్లమెంట్ను రద్దు చేసి, సుశీలా కర్కిను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు. యువత కోరిన విధంగా తాము అనేక మార్పు లను చేపట్టినట్లు పుష్ప కుమార్ దహల్ ‘ప్ర చండ’ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే, పార్టీ నాయకత్వాన్ని మాత్రం మార్చలేదు. కేపీ శర్మ ఓలికి చెందిన సీపీఎన్–యూఎంఎల్ మాత్రం ఎలాంటి చర్య లను తీసుకోలేదు. మరోవైపు, రవి లామిచానే నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ ఎస్పీ), సీనియర్ నేత బాలేంద్ర షా, గగన్ థాపా నేతృత్వంలోని సంస్కరణలు కోరుకునే నేపాలీ కాంగ్రెస్ జెన్ జీ ఆకాంక్షలకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. ఇంకా, కుల్మాన్ ఘీసింగ్ నేతృత్వంలోని ఉజ్యాలో నేపాల్ పార్టీ, మాజీ ధరణ్ మేయర్ హర్క సంపంగ్ నేతృత్వంలోని శ్రమ శక్తి పార్టీల ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంది. తాజా పరిస్థితుల్లో నేపాల్ రాజకీయాలు.. యథాతధ విధానాలను కొనసాగించాల నుకునే సంప్రదాయ పార్టీలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా మార్పును కోరుకునే పార్టీలనే రెండు వర్గాలుగా విడిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ప్రజలు సంప్రదాయ పార్టీలతో తీరుతో విసుగెత్తి పోయారని, మార్పును కోరుకుంటున్నారని చెబుతున్నారు.ఓలి, బాలేంద్ర షా ఢీ అంటే ఢీఆర్ఎస్పీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా కఠ్మాండు మాజీ మేయర్ బాలేంద్ర షా(35)ను ప్రకటించగా నేపాలీ కాంగ్రెస్ గగన్ థాపాను బలపర్చింది. సీపీఎన్–యూఎంఎల్ మాత్రం 75 ఏళ్ల కేపీ శర్మ ఓలీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఎంచుకుంది. బాలేంద్ర షా, కేపీ శర్మ ఓలీలు కఠ్మాండులోని ఝాపా–5 నియోజకవర్గం నుంచి ముఖాముఖి తలపడుతున్నారు. ఈ సీటును ఓలి గతంలో ఆరుసార్లు గెలుచుకున్నారు. గట్టి పోటీ ఉండటంతో ఓలి దేశంలోని మిగతా ప్రాంతాల్లో ప్రచారానికి సైతం వెళ్లకుండా, నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అదే సమయంలో, కఠ్మాండుకు చెందిన నేపాలీ కాంగ్రెస్ నేత గగన్ థాపా ఈసారి మాథేస్ ప్రావిన్స్లోని థనుషా–4 సీటు నుంచి బరిలోకి దిగారు. గగన్ థాపా, బాలేంద్ర షాలు దేశంలోని మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాదిన జరిగిన ఎన్నికల ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. వీరి ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెబుతున్నారు.24 గంటల తర్వాతే ఫలితాలుదేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఒక చోటికి తరలించేందుకు కనీసం ఒక రోజు పడుతుందని, ఆ తర్వాత 24 గంటల్లోగా 165 స్థానాల ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మిగతా 110 సీట్లకు నైష్పత్తిక ప్రాతినిథ్య విధానంలో ఓట్ల లెక్కింపునకు మరో రెండు మూడు రోజులు పట్టవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాం ప్రసాద్ భండారి చెప్పారు. -
యుద్ధ దేవతలు
దశాబ్దాలుగా, పశ్చిమాసియాలోని ఆరోగ్య వ్యవస్థకు భారతీయ నర్సులు వెన్నెముకలా నిలుస్తున్నారు. ‘ఏంజెల్స్ ఇన్ వైట్’గా మన్ననలు పొందుతున్నారు. 1990ల నాటి కువైట్ యుద్ధం నుండి తాజా ఇరాన్ యుద్ధం వరకు.. వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలు అందించటంలో మన నర్సులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్నర్సులదీ ‘పోరాటమే’!ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఇరాన్ యుద్ధం’లో భారతీయ నర్సులు స్థిరచిత్తంతో నిర్భయంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు సైనికుల్లా పోరాడుతున్నారు. అక్కడ వారు చేస్తున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గొప్ప మానవతా సేవ కూడా.కేరళ నర్సులే ఎక్కువపశ్చిమ ఆసియాలో నర్సులుగా పనిచేస్తున్న భారతీయ మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందినవారే.యుద్ధంలోనూ సంసిద్ధంతాజా యుద్ధంలో భారతీయ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతో ధైర్యంగా, నిలకడగా గాయపడినవారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి నేరుగా సంబంధం లేని దేశాలలో సైతం ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులలో కూడా మన నర్సులు ఆరోగ్య సేవలకు సంసిద్ధమై ఉన్నారు.దృఢ సంకల్పానికి నిదర్శనంసంక్షోభ సమయాలలో ఎవరి దేశానికి వాళ్లు వెళ్లిపోయేందుకు తొందరపడుతున్నా భారతీయ నర్సులకు మాత్రం అక్కడేఉండి సేవలు అందించినఘన చరిత్ర ఉంది. పశ్చిమ ఆసియాలో గతంలో సంభవించిన ఎన్నో ప్రధాన సంక్షోభాల సమయంలో వారి ఉనికి ఎంతో కీలకంగా నిలిచింది.ప్రాణాలకు తెగించి సేవలుకువైట్, ఇరాక్ వంటి యుద్ధ క్షేత్రాలలో బాంబు దాడులు, క్షిపణి ముప్పులు పొంచి ఉన్నప్పటికీ, భారతీయ నర్సులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన మహోన్నత చరిత్ర ఉంది.వైద్య వ్యవస్థకు వెన్నెముకయుద్ధం కారణంగా స్థానిక వైద్యులు, సిబ్బంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, భారతీయ నర్సులు అక్కడే ఉండి ఆసుపత్రులు మూతపడకుండావైద్య వ్యవస్థను నిలబెట్టారు.అంతర్జాతీయ గుర్తింపుఅత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పనిచేసే ‘ఫ్రంట్లైన్ వారియర్స్’ గా భారతీయ నర్సులు (ముఖ్యంగా కేరళకు చెందిన వారు) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.మానవతా దృక్పథంరాజకీయ అశాంతి, అంతర్యుద్ధాల సమయంలో పౌరులకు, గాయపడిన సైనికులకు ఎటువంటి వివక్ష లేకుండా నిరంతరాయంగా చికిత్స అందించడంలో మనవాళ్లు కీలక పాత్ర పోషించారు.సంక్షోభ నిర్వహణపరిమిత వనరులు, మందుల కొరత ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో భారతీయ నర్సులు అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. -
గ్యాస్కు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్ యుద్ధం, భారత్కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్ లఫాన్ ప్లాంటుపై ఇరాన్ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్కి ఎల్ఎన్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఖతర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్ ఎనర్జీ, పెట్రోనెట్ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్ మెజూర్ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్ తెలిపింది. దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్ మార్కెట్లో యూనిట్ (ఎంబీటీయూ) ఎల్ఎన్జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి. సగం అవసరాలకు దిగుమతులే ఆధారం.. దేశీయంగా గ్యాస్ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్కి ఏటా వచ్చే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఖతర్తో పెట్రోనెట్కి ఒప్పందం ఉంది. స్పాట్ మార్కెట్లో కూడా పెట్రోనెట్ కొనుగోలు చేస్తోంది. ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే క్రూడాయిల్ మొదలైన వాటికి కూడా హర్మూజ్ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మన డ్రైవింగ్ లైసెన్స్తోనే విదేశాల్లో డ్రైవ్ చేయవచ్చు
ఇండియాలో ఉన్నప్పుడు సరే... కానీ కుటుంబ సభ్యులతో కలిసి కారు నడుపుతూ విదేశాల్లో తిరగడం అంటే ఆ అనుభూతి వేరే లెవెల్... ఆ అనుభూతి మన స్వంతం కావాలన్నా, విదేశాల్లో వ్యక్తిగత వాహనం నడపాలన్నా... మళ్లీ అక్కడ లైసెన్స్ తీసుకోక తప్పదు.. ఈ ఆలోచనతోనే చాలా మంది విదేశాల్లో ఉన్నప్పుడు తమకు డ్రైవింగ్ వచ్చిన సంగతి మర్చిపోతారు. అయితే భారతీయులు భారతీయ లైసెన్స్ తోనే డ్రైవ్ చేయడానికి అనుమతించే 21 దేశాలు ఉన్నాయి తెలుసా?ఆస్ట్రేలియా: నార్తర్న్ టెరిటరీ, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా మినహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలలో డ్రైవ్ చేయడానికి ఆస్ట్రేలియా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమచేతి డ్రైవింగ్ ఓకే.భూటాన్: భారతీయ లైసెన్స్ పొందిన డ్రైవర్లు తమ స్వంత వాహనాలతో ఒక సంవత్సరం వరకు భూటాన్ లో డ్రైవ్ చేయడానికి అనుమతిస్తారు. అయితే మన కరెన్సీలో రూ.4490 చెల్లింపుతో పాటు. వాహన పత్రాలు వారి చెక్ పోస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్లో రిజిస్ట్రేషన్ వంటి అన్ని అవసరమైన నిబంధనలను పాటించాలి, ప్రమాదకరమైన పర్వత రోడ్ల కారణంగా భూటాన్ లో స్థానిక గైడ్ లేదా లైసెన్స్ పొందిన డ్రైవర్ లేకుండా భూటాన్ లో కారు అద్దెకు తీసుకోవడం నిషేధం అనే విషయం గమనించడం ముఖ్యం. ఎడమ చేతివైపే డ్రైవ్.కెనడా: ఈ దేశంలో మన లైసెన్స్ను డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తుంది కానీ ఇది అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండే కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు, ఒంటారియోలో బస మూడు నెలల కన్నా తక్కువ ఉంటే, స్వంత లైసెన్స్ తప్ప మరే ఇతర పత్రాలు అవసరం లేదు. అయితే, అంతకన్నా ఎక్కువగా ఉంటే, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కూడా అవసరం. ఈ దేశంలో కుడి చేతివైపు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.ఫ్రాన్స్, మొనాకో: ఫ్రాన్స్ , మొనాకోలు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ పై లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్తో ఆరు నెలల వరకు డ్రైవ్ చేయడానికి అనుమతిస్తాయి. ఇక్కడ కుడి చేతి డ్రైవ్ ఉంటుంది.ఫిన్లాండ్: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ను ఫిన్లాండ్ ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇక్కడ కూడా కుడి చేతి డ్రైవ్ చేయాలి.జర్మనీ: జర్మనీలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆరు నెలల వరకు మన లైసెన్స్తో డ్రైవ్ చేయడానికి అనుమతిస్తారు. ఇక్కడా కుడి చేతి డ్రైవ్.హాంకాంగ్: భారతీయ లైసెన్స్ పై డ్రైవ్ చేయడానికి 12 నెలల వరకు అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్ ఉంటుంది.ఐస్లాండ్: ఐస్లాండ్ మన లైసెన్స్ పై ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఇక్కడ కుడి చేతి డ్రైవ్ చేయాలి.ఇటలీ: భారతీయ లైసెన్స్ పై రెండు సంవత్సరాల వరకు డ్రైవ్ చేయడానికి ఇటలీలో, అనుమతి ఉంది, దానితో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కూడా ఇక్కడ పనికొస్తుంది. ఇక్కడ కుడి చేతి డ్రైవ్ ఉంటుంది.మలేషియా: ఇటీవలి కాలంలో మన దేశ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్న మలేషియా భారతీయ లైసెన్స్ పై మూడు నెలల వరకు డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.నేపాల్: భారతీయ లైసెన్స్ పొందిన డ్రైవర్లు దేశంలో డ్రైవింగ్ చేయవచ్చు. గరిష్టంగా ఒక నెల వరకు అందుబాటులో ఉండే పర్మిట్ను పొందడం ద్వారా స్వంత వాహనాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్..న్యూజిలాండ్: భారతీయ లైసెన్స్ పై న్యూజిలాండ్లో 18 నెలలు డ్రైవ్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఎల్లప్పుడూ లైసెన్స్ అనువాద కాపీ లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కలిగి ఉండాలి. ఇక్కడ ఎడమ చేతి డ్రైవ్ ఉంటుంది.నార్వే: నార్వే దేశంలో డ్రైవ్ చేయడానికి, ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ పై మూడు నెలల వరకు డ్రైవ్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ అవసరం కావచ్చు. ఇక్కడ కుడివైపు డ్రైవ్ చేయాలి.సౌదీ అరేబియా: మన డ్రైవింగ్ లైసెన్స్ తో ఒక సంవత్సరం వరకు డ్రైవింగ్ చేయడానికి సౌదీ అరేబియా అనుమతిస్తుంది. అయితే, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ కూడా కలిగి ఉండటం మంచిది. ఇక్కడ కుడివైపు డ్రైవ్...సింగపూర్: 12 నెలల వరకు సింగపూర్ లో తిరగడానికి, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లేదా మన లైసెన్స్ కొన్ని చట్టపరమైన నిబంధనలతో చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ ఎడమవైపు డ్రైవ్ ఉంటుంది.స్పెయిన్: చట్టపరమైన అనువాద పత్రం లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ చూపిస్తే స్పెయిన్ విదేశీ లైసెన్స్ పై ఆరు నెలల వరకు డ్రైవింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ దేశంలో కుడివైపు డ్రైవ్ ఉంటుంది.స్వీడన్: ఈ దేశంలో..కారు అద్దెకు తీసుకోవడానికి నడపడానికి, ఆంగ్లంలో అనువదించిన డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) ఉండాలి. విదేశీ లైసెన్స్ డ్రైవింగ్ చేయడానికి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు అనుమతి ఉంది. ఇక్కడ కుడివైపు డ్రైవ్ చేయాలి.స్విట్జర్లాండ్: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో స్విట్జర్లాండ్ లో ఒక సంవత్సరం వరకు డ్రైవ్ చేయవచ్చు. ఆంగ్లంలోని డ్రైవింగ్ లైసెన్స్ కాపీతో ఈ దేశంలో వాహనాన్ని లీజుకు తీసుకోవచ్చు. కుడివైపు డ్రైవ్ ఉంటుంది.యునైటెడ్ కింగ్డమ్: ఇంగ్లాండ్, స్కాట్లాండ్ వేల్స్తో సహా యునైటెడ్ కింగ్డమ్ మనల్ని 12 నెలల వరకు డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ లో పేర్కొన్న వాహనాలని మాత్రమే నడపగలరని గమనించడం ముఖ్యం. ఇక్కడ ఎడమవైపు డ్రైవ్ చేయాలి.అమెరికా: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతీయ లైసెన్స్ లో ఉన్న అదే రకం కార్లను ఒక సంవత్సరం వరకు అద్దెకు తీసుకుని నడపడానికి అనుమతిస్తుంది. ఇక్కడ కుడివైపు డ్రైవ్ ఉంటుంది.యుఎఇ: ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి పర్యాటకులు భారతీయ లైసెన్స్ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇక్కడ కుడివైపు డ్రైవ్ ఉంటుంది. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (Driving Permit) అవసరం.. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో డ్రైవ్ చేయడానికి మనల్ని అనుమతించే దేశంలో కూడా, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ను దగ్గర ఉంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇది పొందడానికి ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే పర్మిట్ ప్రాసెస్ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది. ఇది జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. -
యూఏఈపై డ్రోన్ల దాడి.. పదుల సంఖ్యలో గాయాలు
UAEపై గడిచిన కొద్ది గంటల్లో 129 డ్రోన్ అటాక్స్ జరిగినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు ప్రకటించాయి. వాటితో పాటు నాలుగు బాలిస్టిక్ మిసైల్స్ దాడి జరిగినట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ దాడులలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని 78 మందికి గాయాలైనట్లు తెలిపింది. అమెరికాపై కోపంతో ఇరాన్ రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలపై విరుచుకపడుతుంది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా దాడులు చేస్తుంది. అయితే దాడులలో రక్షణ స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాలపైనా దాడులు జరుపుతుంది. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై గడిచిన కొన్ని గంటల్లో 129 డ్రోన్ అటాక్స్ జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. అయితే ఆ డ్రోన్లను చాలా మాట్టుకు గాలిలోనే కూల్చివేశామని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. ఈ దాడులలో 78 మంది ప్రజలు గాయపడ్డారని వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది. క్షతగాత్రులలో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నట్లు సమాచారం. వారిలో భారతీయులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ దాడుల నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు యుఎఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రజలెవ్వలరూ ఇండ్లనుంచి బయిటకి రావొద్దని కిటీకిల నుంచి దూరంగా ఉండాలని సూచించింది. -
పశ్చిమాసియా యుద్ధంలోకి పాకిస్థాన్!
ఇస్లామాబాద్: పశ్చిమాసియా యుద్ధంలోకి తాము కూడా దిగే పరిస్థితి రావచ్చని పాకిస్థాన్ సంకేతాలు ఇచ్చింది. సౌదీ అరేబియాతో తమకు ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కారణంగా చూపింది. ఈ ఒప్పందం నాటోను పోలి ఉంటుంది. ప్రతీకార దాడుల్లో ఇరాన్ను లక్ష్యంగా పెట్టుకున్న గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించవద్దని ఇరాన్ను హెచ్చరించినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. సౌదీ అరేబియాతో తమకు రక్షణ ఒప్పందాన్ని ఉన్నట్టు ఇరాన్కు అర్థమయ్యేలా చేశానని దార్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత మొదలైన ఇరాన్ యుద్ధానికి కూడా ఈ రక్షణ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టంగా తెలిపారు.ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఇతర దేశాలనూ తాకిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది.మంగళవారం రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సీఐఏ ప్రధాన కార్యాలయం (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రధాన కేంద్రం)పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఒక రోజు ముందు సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన రాస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగింది. దాంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇరాన్తో పాక్ చర్చలుపాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య ఉన్న రక్షణ ఒప్పందం రియాద్పై ప్రభావం చూపిందని, భారీ దాడులు జరగకుండా చేసిందని దార్ చెప్పారు. ఇతర దేశాల కంటే సౌదీ అరేబియాపై దాడులు తక్కువగా జరిగాయని ఆయన తెలిపారు. దీనికి ప్రతిగా సౌదీ భూభాగాన్ని ఇరాన్పై దాడులకు వినియోగించరాదని హామీ ఇవ్వాలని టెహ్రాన్ కోరిందని దార్ తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్లో సౌదీ-పాక్ మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. బుధవారం సౌదీ అరేబియా స్పందిస్తూ.. ఇరాన్ చేసిన దాడులపై ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన అర్ధరాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.పాకిస్థాన్కు ప్రమాదకరం ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధ విమానాలను మోహరించడం పాకిస్థాన్కు ప్రమాదకరం. ఇరాన్కు మద్దతు ఇచ్చే 4 కోట్ల షియా జనాభా పాకిస్థాన్లో ఉంది. గత వారం అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత పాక్లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ హింసలో దాదాపు 35 మంది మరణించారు.అంతేగాక, అఫ్గానిస్థాన్లోని తాలిబాన్లతో సరిహద్దు ఘర్షణలో పాకిస్థాన్ నిమగ్నమై ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్తో పెట్టుకుంటే పాకిస్థాన్ సమస్యలు మరింత పెరుగుతాయి. -
ఇరాన్ షిప్ను కూల్చేసిన అమెరికా.. 85 మంది జలసమాధి
అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన షిప్పై సబ్ మెరైన్ అటాక్తో అమెరికా కూల్చివేసింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమదాంలో ఇరాన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటి వరకూ శ్రీలంక నావికా దళం 85 మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. మరికొందరి జాడ తెలియాల్సి ఉందని ప్రకటించింది. కాగా నౌక మునిగిపోతుండగా 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్పై యుఎస్, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్కు చెందిన యుద్ధనౌకను శ్రీలంక తీరంలో యుఎస్ కూల్చివేసింది.శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది. గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు. అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు సమాచారం -
ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకున్నారన్న ప్రచారం ఉత్తిదేనా?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తాబా ఖమేనీ (అలీ ఖమేనీ కుమారుడు)ని ఎన్నుకున్నారంటూ ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ద్వారా ఆ దేశ ప్రభుత్వం ఖండించింది.“దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎంపిక చేసిందని మీడియాలో ప్రచారం అవుతున్న నివేదికలకు ఏ ఆధారాలూ లేవు. వాటిని అధికారికంగా ఖండిస్తున్నాం” అని ఎక్స్లో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ తెలిపింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఎవరిని ఎన్నుకున్నా, అతడిని టార్గెట్ చేస్తామంటూ ఇజ్రాయెల్ ఇవాళ ఉదయమే హెచ్చరించిన విషయం తెలిసిందే.కాగా, మొజ్తాబాకు వారసుడిగా అలీ ఖమేనీని ఎన్నుకున్నారని, సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. కొన్ని గంటల్లోనే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తాబా ఖమేనీని వారసుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పింది.మొజ్తాబా తన దివంగత తండ్రి అలీ ఖమేనీ కార్యాలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నత వర్గం, ఖుద్స్ దళంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మొజ్తాబా తన తండ్రి కంటే కఠిన వైఖరితో ఉంటారని తెలిపింది. ఇరాన్లో నిరసనకారులపై జరిగిన హింస, అణచివేతల వెనుక మొజ్తాబా పాత్ర ఉందని వివరించింది. 2019 నవంబర్లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబాపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వంలో ఏ పదవీ లేకపోయినప్పటికీ సుప్రీం నాయకుడి తరఫున అధికారిక ప్రతినిధిగా వ్యవహరించినందుకు అతడిని గుర్తించింది.మరోవైపు, ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరానీయులు దివంగత సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ పార్థివ దేహానికి ఇవాళ రాత్రి టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ ప్రార్థనా మైదానంలో జరిగే కార్యక్రమంలో తుది వీడ్కోలు పలుకనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది, అంతిమయాత్ర తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఇరాన్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ప్రతీకారంతో ఇరాన్పై బాంబులతో దాడి చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఆరోపించారు.వైట్ హౌస్లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చర్యలు చేపట్టకపోతే, అణుయుద్ధం జరిగేది. వారు అనేక దేశాలను నాశనం చేసేవారు. వారి మనస్తత్వం సరిగ్గాలేదు, కోపంతో ఉన్నారు, వారు పిచ్చివాళ్లు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగించేవారు” అని చెప్పారు. Reports circulating on media regarding potential candidates for leadership selected by Iran’s Assembly of Experts have no official source and are officially denied.#Iran#AssemblyOfExperts#FactCheck pic.twitter.com/g9b9znt8j8— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 4, 2026 -
" నేనే ఒత్తిడి చేసి ఉండవచ్చు"
ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్ సైతం తగ్గేదిలేదంటూ పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేస్తోంది. అయితే మారణహోమం ఎలా మెుదలైందనే విషయంపై ట్రంప్ మాట్లాడారు. తమ మిత్రదేశం కోసమే అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వ్యాఖ్యల్ని ఖండించారు. యుద్ధాన్ని తానే ప్రోత్సహించాననే విధంగా సమాధానం ఇచ్చారు.ఇరాన్పై అమెరికా "ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ" పేరుతో దాడులు ప్రారంభించింది. టెహ్రాన్పై విరుచుకపడుతూ ఆ దేశ సుప్రీం నేత ఆయాతుల్లా ఖమేనీ, ఆయన భార్యతో పాటు ఇతర కీలక నేతలను మట్టుబెట్టింది. ఈ దాడులలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చిన్నాభిన్నం అయ్యింది. అయితే ఈ యుద్ధంపై అమెరికా సెక్రటరీ మార్క్ రుబియో స్పందించారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేయబోతుందని తెలిసిన తర్వాతే అమెరికా ఈ దాడులలో పాల్గొందన్నారు.అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీనిపై స్పందించారు." నాకు తెలిసి మెుదటగా ఇరాన్ దాడికి ప్రణాళికలు రచించింది. అయితే నేను అది జరగనివ్వకూడదు అనుకున్నా. అయితే ఈ సందర్భంలో నేను ఇజ్రాయెల్ని కొంత ఒత్తిడి చేసి ఉండవచ్చు" అన్నారు. అమెరికాలోని ఆయన అధ్యక్ష కార్యాలయంలో జర్మన్ ఛాన్సిలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఆ దేశానికి చెందిన నేవీ, ఎయిర్ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఏవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. అదే విధంగా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలు ఈ దాడులలో మృతి చెందారని ప్రకటించారు. అయితే ఇరాన్తో అణుచర్చలు విఫలమైతే ఈ సారి దాడి మరింతగా పెద్దగా ఉంటుందని తొలుత నుంచి ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ గల్ప్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలపై విరుచుకపడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్పైనా బాలిస్టిక్ క్షిపణిలతో దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఇరాన్ దాడుల వెనుక చైనా రహస్య సాయం!
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారని పేర్కొన్న తర్వాత పశ్చిమాసియాలోని లక్ష్యాలపై ఇరాన్ భీకరంగా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడులు కొనసాగిస్తున్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్ దాడులు చేస్తుండడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారం. ఇరాన్ ఇంతగా క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడం వెనుక చైనా ఉందా? డ్రాగన్ దేశం ఆయుధాలు సరఫరా చేసిందా? సాంకేతిక సాయం అందించిందా?ఇరాన్ ఆయుధాలు కేవలం ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులనే కాదు.. యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సహా దాదాపు 10 దేశాల్లోని లక్ష్యాలను తాకాయి. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. షాహీద్ క్లాస్ కమికాజే డ్రోన్లు, ఫత్తాహ్ క్లాస్ హైపర్సోనిక్ క్షిపణులు వంటివి ఇరాన్ భద్రతా వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఈ ఆయుధాగార అభివృద్ధిలో చైనా పాత్ర గురించి బయటకు వివరాలు అంతగా తెలియవు.ఓ అంతర్జాతీయ పత్రిక తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు వివరాలను వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు ఇరాన్కు చైనా ఆయుధాలు అందించిందని వివరించింది. చైనా తయారీ సీఎం302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్-చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి.ఇరాన్ ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ, వాటిలో అనేక సిస్టమ్స్ చైనా పాత మోడళ్ల ఆధారితంగా ఉన్నాయని లేదంటే చైనా తయారీ భాగాలపై ఆధారపడి వాటిని ఇరాన్ తయారు చేసినట్లుందని విశ్లేషకులు చెప్పారు. ఈ విధంగా దశాబ్దాలుగా ఇరాన్ ఆయుధాగార నిర్మాణంలో చైనా పాత్ర ఉంది. చైనా నుంచి పెద్ద ఎత్తున సాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులు అన్నారు.1979 నుంచే ఆయుధాల సరఫరా షురూ..ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో 1979-1989 మధ్య ఇరాన్ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య, 1986లో హై-2, సీ-801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది. స్టాక్హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. ఇరాన్కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలను అందించింది.అయితే, 2005 సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలు ఆపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా అణ్వాయుధాలకు సంబంధించిన సాంకేతిక వస్తువుల ఎగుమతి దిగుమతిపై నిషేధం అమలైంది. అమెరికా ఆంక్షలు చైనా ఆయుధ విక్రయాలను మరింత నియంత్రించాయి. అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు చైనా సాధారణంగా ఆయుధాలు విక్రయించదు.చైనా ఇంకా ఎలా సాయపడింది?ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నిల్వలు, ఫత్తాహ్ బాలిస్టిక్ క్షిపణులు, షాహీద్ కమికాజే డ్రోన్లలో అధిక శాతం ఇరాన్ స్వదేశీ పరిశోధన ఫలితాల ఆధారంగా అభివృద్ధి చేసుకుంది. నూర్, ఖద్ర్, నస్ర్ క్లాసెస్, సీ-802 వంటివి చైనా సిస్టమ్స్ ఆధారంగా ఇరాన్ ఉత్పత్తి చేసుకుంది.అయినా చైనా ప్రత్యక్ష విక్రయాలకన్నా ద్వంద్వ వినియోగ (డ్యూయల్ యూజ్) భాగాలు సరఫరా చేస్తోంది. మైక్రోచిప్స్, ఎలక్ట్రానిక్ భాగాలు, నావిగేషన్ వ్యవస్థలు వంటి పౌర వినియోగ వస్తువులు సైనిక పరికరాల్లో అమర్చవచ్చు. ద్వంద్వ వినియోగ సాంకేతికత అంటే పౌర ప్రయోజనాలకూ, సైనిక ప్రయోజనాలకూ ఉపయోగపడే సాంకేతిక భాగాలు.క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్పై చైనా ప్రోపెల్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు అందించింది. ప్రోపెల్లెంట్ అంటే క్షిపణి నడిపే ఇంధన పదార్థం. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత, భాగాలు, శిక్షణను ఇరాన్కు అందించింది.అలాగే, ఇరాన్కు చైనా సోడియం పెర్క్లోరేట్ సరఫరా చేసింది. ఇది అమోనియం పెర్క్లోరేట్ తయారీలో ఉపయోగపడుతుంది. అమోనియం పెర్క్లోరేట్ అంటే ఘన ఇంధన క్షిపణుల ప్రధాన పదార్థం. 2023 మార్చిలో అమెరికా ఖజానా శాఖ, వేల ఏరోస్పేస్ భాగాలు ఇరాన్ ఎయిర్క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ కంపెనీకి విక్రయించారని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్ కేంద్రంగా ఉన్న 5 కంపెనీలు, ఒక వ్యక్తిని ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ప్రతిగా ఇరాన్ చమురును చైనా విస్తారంగా దిగుమతి చేసుకుంటోంది. -
ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ్కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్ సరఫరాకు బ్రేక్ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలుసౌదీ ఆరామ్కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్కు తెలిపారు.రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్ను తాత్కాలికంగా మూసివేసింది.ఇదీ చదవండి: ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో! -
‘ఆయుధాల్లేవ్’.. ట్రంప్ ఎదుట వాపోయిన అమెరికా సైన్యం?
వాషింగ్టన్: మీరేమో ఇరాన్పై యుద్ధం ఐదారు వారాలు కొనసాగిస్తాం’ అని అంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. పదిరోజుల్లో దాటితే దాడులు చేసేందుకు మన దగ్గర సరిపడ ఆయుధాలు లేవని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట వాపోయినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా సైతం అదే స్థాయిలో దాడుల్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్కు పెంగటాన్ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్పై దాడి చేస్తూ వెళితే 10రోజుల తర్వాత మిసైళ్లు లేవని తెలిపింది. ఇప్పటికే ఇంటర్ సెప్టార్ మిసైళ్ల కొరత ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మనకే ప్రతికూల ప్రభావం పడుతుందని, యుద్ధానికి భారీగా ఖర్చవుతుందంటూ పెంటగాన్ వాపోతుంది’మరి ఆయుధాల కొరతపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు. తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది చర్చాంశనీయంగా మారింది. ఇరాన్పై దాడులు, ఇటీవలి అనేక ఇతర సైనిక ప్రయత్నాల తర్వాత ఆయుధాల కొరత తగ్గించేలా పెంటగాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఆయుధాల ఉత్పత్తిని పెంచేందుకు ట్రంప్ పరిపాలన విభాగం వైట్ హౌస్లో అతిపెద్ద యుఎస్ రక్షణ కాంట్రాక్టర్ల కార్యనిర్వాహకులతో సమావేశం కావాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్భందనం చేసింది. గీత దాటితే నౌకల కింద బాంబులు పెట్టి పేల్చేస్తానమి హెచ్చరిస్తోంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన అంశంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రపంచానికి ఇంధన సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా కల్పిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో ప్రస్తుతం 700నౌకలు ఉన్నాయి. ఆ నౌకలు గమ్య స్థానానికి వెళ్లేలా తమ సైన్యం రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. -
పాక్ సైన్యంపై బలూచ్ గెరిల్లా పంజా.. భారీగా ప్రాణనష్టం?
బలూచిస్తాన్: పాకిస్తాన్ ఆక్రమిత బలూచిస్తాన్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రతరం అయ్యాయి. పాక్ భద్రతా దళాలే లక్ష్యంగా బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) జరిపిన జంట దాడులు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. పంజ్గుర్, తుర్బాత్ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వ్యూహాత్మక దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించగా, భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ దాడులకు తామే బాధ్యులమని బీఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రామ్ బెలూచ్ అధికారికంగా ప్రకటించారు.పంజ్గుర్ జిల్లాలోని చిత్కాన్ ప్రాంతంలో ఉన్న ఫ్రాంటియర్ కోర్ (ఎఫ్సీ) ప్రధాన కార్యాలయంపై బీఎల్ఎఫ్ పోరాట యోధులు విరుచుకుపడ్డారు. కార్యాలయ ఆవరణలోని నిఘా విభాగం లక్ష్యంగా గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడటంతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ దాడిలో నిఘా కార్యాలయాలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా, పలువురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ మెరుపు దాడితో పాక్ రక్షణ దళాలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయాయి.మరోవైపు తుర్బాత్ సమీపంలోని అబ్సర్ ప్రాంతంలో సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఎఫ్ మరో ఘాతుకానికి పాల్పడింది. కోహ్దా యూసఫ్ ప్రాంతం గుండా రెండు వాహనాలు, మోటార్ సైకిళ్లతో వెళ్తున్న పాక్ సైనిక బృందంపై రిమోట్ నియంత్రిత ఐఈడీ (ఐఈడీ) బాంబుతో దాడి చేశారు. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి ఒక సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఆగ్రహంతో ఊగిపోయిన పాక్ దళాలు పరిసర ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ స్థానిక పౌరులను వేధింపులకు గురిచేస్తున్నాయని బీఎల్ఎఫ్ ఆరోపించింది.ఈ దాడుల నేపథ్యంలో ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో పాక్ సైన్యం కఠినమైన కర్ఫ్యూను విధించింది. దీంతో మార్కెట్లు, వ్యాపార సముదాయాలు మూతపడటమే కాకుండా ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో పాలు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న వేళ మానవతా దృక్పథంతో ఆంక్షలు సడలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘రాజ్యసభ’ బరిలో హేమాహేమీలు.. ఖరారు చేసిన బీజేపీ -
ఇరాన్ కొత్త నేతను నియమిస్తే.. వెంటనే లేపేస్తాం.., ఇజ్రాయెల్ వార్నింగ్
జెరూసలేం: అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎంపికయ్యారు. అయితే, మోజ్తాబా ఎన్నికపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ ప్రభుత్వం నియమించిన నాయకుడు ఎవరైనా సరే వెంటనే లేపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ఒత్తిడి మేరకు ఇరాన్ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ దేశానికి కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నుకుంది. ఈ క్రమంలో మోజ్తాబా ఎంపికపై ఇజ్రాయెల్ఈ క్రమంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇరాన్కు హెచ్చరిక జారీ చేశారు. పరోక్షంగా మోజ్తాబా ప్రాణం తీసేందుకు తాను, దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాల(IDF)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ ‘రోర్ ఆఫ్ ది లయన్’లో భాగంగా అంతర్భాగంగా మిషన్ను నిర్వహించడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని, చర్య తీసుకోవాలని ఐడీఎఫ్కు సూచించినట్లు చెప్పారు. כל מנהיג שימונה ע"י משטר הטרור האיראני כדי להמשיך ולהוביל את התוכנית להשמדת ישראל, לאיים על ארה"ב והעולם החופשי ומדינות האזור, ולדכא את העם האירני - יהיה יעד חד משמעי לחיסול.לא חשוב מה שמו והמקום בו יסתתר.רה"מ ואני הנחינו את צה"ל להיערך ולפעול בכל האמצעים למימוש המשימה כחלק…— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) March 4, 2026 -
ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం.. పాకిస్తాన్కు కొత్త భయం!
ఇస్లామాబాద్: ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్న వేళ దాయాది దేశం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ మిత్ర దేశం ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ.. ఇజ్రాయెల్ పట్ల తమకున్న భయాన్ని వెళ్లగక్కారు. ఇదే సమయంలో భారత్ను టార్గెట్ చేసి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరగా.. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందంటూ బాంబు పేల్చారు.ఇరాన్పై దాడుల జరుగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికా-ఇజ్రాయెల్ టెహ్రాన్పై యుద్ధం చేయడానికే సిద్దమయ్యాయి. వ్యూహత్మకంగా దాడులు చేసి సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత మార్చారు. ఇదంతా ఇజ్రాయెల్ ప్లాన్లో భాగంగానే జరిగింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అన్ని సంఘర్షణలలో జియోనిజం (యూదు భావజాలం) ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్ర పోషించింది. ప్రతీ యుద్ధం, ప్రతీ ఘర్షణలో ఇజ్రాయెల్ భాగంగానే ఉంటోంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జియోనిస్టులే నిర్ధేశిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.నెతన్యాహు, మోదీ స్నేహంపై.. ఇదే సమయంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధంపై సరికొత్త కుట్రకు తెరలేపారు. ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి.. ఇరాన్పై యుద్ధం వల్ల పాకిస్థాన్ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ విజయం సాధిస్తే భారత్, ఆప్ఘనిస్తాన్ ఏకమై.. పాక్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ సరిహద్దుల వద్ద ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని వైపుల నుంచి శత్రువులు తమను చుట్టుముట్టడం వల్ల పాక్ సామంత దేశంగా మారే ప్రమాదం ఉందన్నారు. పాక్ను సామంత దేశంగా మార్చేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతోందని.. ఈ కుట్రలో భారత్ భాగస్వామిగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరాన్తో పాక్ సరిహద్దు ఇలా.. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్–ఇరాన్ మధ్య సరిహద్దు మొత్తం పొడవు 909 కిలోమీటర్లు (565 మైళ్లు) ఉంటుంది. ఈ సరిహద్దు ఇరాన్లోని సిస్తాన్ అండ్ బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్తో కలుస్తుంది. ఇది ఉత్తరాన ఆఫ్ఘానిస్తాన్ త్రైజంక్షన్ వద్ద ప్రారంభమై, దక్షిణాన గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వరకు కొనసాగుతుంది. సరిహద్దు భూభాగం ఎక్కువగా ఎడారి, పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది. అందువల్ల రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి కష్టతరంగా మారింది. దక్షిణ చివర గల్ఫ్ ఆఫ్ ఒమాన్.. ఇది సముద్ర వాణిజ్యానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇరాన్–పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టులు, ఇంధన వాణిజ్యం ముఖ్యమైనవిగా ఉన్నాయి. అధికారిక వాణిజ్యంతో పాటు అనధికారిక స్మగ్లింగ్ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఇరాన్–పాకిస్తాన్ సంబంధాలు సరిహద్దు భద్రత, వాణిజ్యం, మరియు ప్రాంతీయ రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా, ఈ సరిహద్దు ప్రాంతం రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధంను బలపరుస్తూ, వాణిజ్య మార్గంగా పనిచేస్తూ, అదే సమయంలో భద్రతా సవాళ్లును కూడా సృష్టిస్తోంది. -
భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల
కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ భీకర పోరు వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడమే కాకుండా, పదుల సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. గత గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఘర్షణలు దారుణమైన సైనిక చర్యలకు దారితీశాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్థాన్లోని పలు ప్రాంతాల నుండి సుమారు 20,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా, 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు సైతం ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఇప్పటికే తీవ్ర పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాల్లో అత్యవసర ఆహార పంపిణీ నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) హెచ్చరించింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా తాము సరిహద్దు వెంబడి దాడులు ప్రారంభించినట్లు అఫ్గాన్ ప్రకటించడంతో ఈ పోరు మరింతగా ముదిరింది. ఇస్లామాబాద్ సైతం వెనక్కి తగ్గకుండా కాబూల్, కందహార్ నగరాలతో పాటు వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది.సరిహద్దులోని కునార్ ప్రాంతంలో క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మోతతో ప్రజలు భీతావహ స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కునార్లోని సిర్కానీ గ్రామంలోని వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వెళ్ళగా, ఆస్తులను కాపాడుకునేందుకు ఇంటికి ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైనిక పరంగా ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. అఫ్గాన్ సైన్యం తమ వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని చెబుతూనే, సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు పేర్కొంది.ఇది కూడా చదవండి: కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం -
టెక్సాస్ ఘటనలో భారత సంతతి విద్యార్థిని మృతి
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన నలుగురిలో సవితా షణ్ముగసుందరం(21) అనే భారత సంతతి విద్యార్థి కూడా ఉన్నారు. దుండగుడి కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, 14 మంది గాయాలపాలయ్యారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. కాగా, సవితా షణ్ముగసుందరం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎకనామిక్స్లో డ్యూయెల్ డిగ్రీ చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి కానుండగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఆస్టిన్లోని పేరున్న బ్యూఫోర్డ్లోని ఓ బార్ వెలుపల మిత్రులతో కలిసి ఉండగా కారులో వచి్చన దుండగుడు వారిపైకి కాల్పులకు దిగాడు. సమాచారం అందుకున్న నిమిషానికే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు. మృతులను సవితా షణ్ముగసుందరం, రైడర్ హారింగ్టన్, జోర్జ్ పెడెర్సన్లుగా, దుండగుడిని సెనెగల్లో జని్మంచిన 53 ఏళ్ల ఎన్డిగా డియాగ్నెగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయ విద్యార్థి కూడా ఉన్నాడు. మొత్తమ్మీద ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇరాన్పై దాడుల నేపథ్యం.. 2000వ సంవత్సరంలో టూరిస్టు వీసాపై వచి్చన ఎన్డిగా డియాగ్నెగా 2006లో అమెరికా పౌరురాలిని వివాహమాడాడు. దీంతో 2013లో ఇతడికి పౌరసత్వం కూడా వచి్చందని హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఇతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఇరాన్ జాతీయ పతాకం, ఇరాన్ నేతల ఫొటోలు కొన్ని లభించాయి. అతడు ధరించిన టీ షర్టుపై ఇరాన్ జెండా డిజైన్, ‘ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్’అని రాసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడటానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఎఫ్బీఐ శాన్ ఆంటోనియో విభాగం అధికారి అలెక్స్ డోరన్ మాత్రం ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉండే అవకాశం ఉన్నట్లు కొన్ని సూచనలు కనిపిస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఎన్డిగా డియయాగ్నా ఈ ఘటనకు ప్రేరేపించిన కారణాలపై ముందుగానే ఒక నిర్ణయానికి రాలేమని ఎఫ్బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అలీ ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారులు మరణించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆమె సూపర్ స్టార్.. సవితా షణ్ముగ సుందరం మృతిపై టెక్సాస్ వర్సిటీ అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమెది కష్టించేతత్వమని, అందరితో కలిసిపోయే విద్యార్థి అని గుర్తు చేసుకుంటున్నారు. మెక్కాంబ్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రుస్ ఫిన్నే ‘ఎక్స్’లో..‘మా సూపర్స్టార్ విద్యార్థుల్లో షణ్ముగసుందరం ఒకరు. ఆమెను కోల్పోవడం నిజంగా బాధాకరం’అని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమె ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగ జీవితం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. సవితా షణ్ముగసుందరం ఇక లేరనే విషయాన్ని తాము ఇప్పటికీ నమ్మలేకున్నామని తోటి విద్యార్థి ఒకరన్నారు. ‘తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమించే కుమార్తె. ఎందరికో మంచి స్నేహితురాలు. ఈ ప్రపంచంలో తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యారి్థని’అంటూ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జిమ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మరణం వార్త తమను ఎంతగానో కలిచి వేసిందని, ఆమెను మర్చిపోలేమని పేర్కొన్నారు. -
రేపే నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు
కఠ్మాండు: నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ అనిశి్చతి, జెన్ జీ యువత పోరాటం వల్ల ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. సుశీల కర్కీ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. నేపాల్ ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం దేశంలో 1.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2022 నవంబర్లో జరిగిన పార్లమెంల్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 10 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా చాలావరకు యువతే కావడం విశేషం. నేపాల్లో 18 ఏళ్ల వయసు రాగానే ఓటు వేసే హక్కు లభిస్తుంది. యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాజకీయ పారీ్టలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అవినీతిని అంతం చేస్తామని, సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో యువతే నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. రాజకీయ అస్థిరతకు మారుపేరు నేపాల్ పార్లమెంట్లో మొత్తం 275 స్థానాలున్నాయి. దిగువ సభ అయిన ‘ప్రతినిధుల సభ’లో 165 స్థానాలుండగా, వీరిని ఎన్నికల ద్వారా ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 110 మంది ఎంపీలను రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమకు లభించిన ఓట్ల శాతం ఆధారంగా నామినేట్ చేస్తాయి. నేపాల్ పార్లమెంట్లో ఏకైక పార్టీ అధికారం చెలాయించిన సందర్భాలు అరుదే. ఎక్కువగా కూటమి ప్రభుత్వాలే ఏర్పాటయ్యాయి. రెండు లేదా మూడు పారీ్టలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రాజకీయ అస్థిరతకు మారుపేరు నేపాల్. గత రెండు దశాబ్దాల్లో 15 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాలేంద్ర షా పారీ్టకి విజయావకాశాలు నేపాల్లో ప్రధానంగా నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్దే ఆధిపత్యం. ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడిన సందర్భాలున్నాయి. ప్రజాగ్రహం వల్ల గత ఏడాది పతనమైన ప్రభుత్వం ఈ రెండు పారీ్టల కలయికతో ఏర్పడినదే. 2022లో స్థాపించిన నేషనల్ ఇండిపెండెంట్ పార్టీకి ఈసారి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ ప్రచార సభలకు జనం పోటెత్తారు. ఖాట్మాండు మాజీ మేయర్, నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ ముఖ్యనేత బాలేంద్ర షా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ విజయం సాధిస్తే బాలేంద్ర షా ప్రధానమంత్రి కావడం తథ్యమని చెబుతున్నారు. -
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై ఎయిర్పోర్ట్లకు చేరుకోగానే పశి్చమాసియాలో తాము అనుభవించిన భయాందోళనలను మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటిదాకా నా మనసు స్థిమితపడలేదు. విమానం ఎక్కాక కూడా అదే ఆందోళన. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాతే కుదుటపడ్డా’’అని సునీల్ గుప్తా అనే ప్రయాణికుడు చెప్పారు. ‘‘బుక్ చేసిన విమానం రద్దవడంతో నాలుగు రోజులు దుబాయ్లోనే ఉండాల్సి వచి్చంది. దూసుకొస్తున్న క్షిపణులను గగనతల రక్షణవ్యవస్థలు పేల్చేయడం కళ్లారాచూశా. దీంతో భయం ఒక్కసారిగా పెరిగింది. హోటల్ ఖర్చుల ఆర్థికభారం పెనుసమస్యగా మారింది’’ అని దుబాయ్ నుంచి వచి్చన నోయిడా వాసి అరవింద్ చెప్పారు. ‘‘ఇరాన్లో చదువుతున్న నా కూతురు హాస్టల్లో ఉంటోంది. వాళ్లకు సమీపంలో క్షిపణి పడటంతో హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది’’ అని కున్వర్ షకీల్ అహ్మద్ చెప్పారు. ‘‘న్యూయార్క్ నుంచి వస్తూ శనివారం దుబాయ్ చేరుకున్నా. మధ్యాహ్నం గగనతలం మూసేశారు. మమ్మల్ని హోటల్కు తరలించారు. బాంబులు, క్షిపణుల మోత చూసి వణికిపోయా’’ అని శుభా అనే మహిళ చెప్పారు. క్యూల్లో వేల మంది.. ‘‘విమానాలు రద్దయ్యాయని తెలియగానే దుబాయ్ ఎయిర్పోర్టులో చిన్నారులు ఏడుపు మొదలెట్టారు. అప్పటికే ఎయిర్పోర్ట్లో వేలాదిమంది పోగుబడ్డారు. క్యూ వరసల్లో దాదాపు 20,000 మంది నిలబడ్డారు. అందర్నీ తర్వాత వేర్వేరు హోటళ్లకు తరలించారు. స్వదేశానికి తిరిగొచ్చామంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చలువే’’ అని తమిళనాడులోని నాగూర్కు చెందిన సయ్యద్ అలీ చెప్పారు. కర్ణాటకలోని బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చేరుకున్న భారతీయుల ముఖాల్లో అమితానందం కని్పంచింది. ‘‘అబూదాబిలో చమురుశుద్ధి కంపెనీలో పనిచేస్తా. భారత్కు వచ్చేందుకు అక్కడి ఎయిర్పోర్టకు రాగానే అలర్ట్ ప్రకటించారు. కిటికీల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. కింద కూర్చోమన్నారు. క్షిపణి దూసుకొస్తోందని చెప్పగానే ప్రాణం పోయినంత పనైంది. మీకు సమీపంలో క్షిపణి వచ్చిందంటే ఎలా ఉంటుంది?’’అని మంగళూరుకు చెందిన సౌరభ్ చెప్పారు. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మోజ్తాబా.ఇరాన్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ 88 మంది సభ్యుల అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ మోజ్తాబాను ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ అంటే భారత్లో లోక్సభ,రాజ్యసభ సభ్యులని అర్ధం. మోజ్తాబా ఎన్నికలు ఐఆర్జీసీ ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు మోజ్తాబాను నియమించినట్లు తెలుస్తోంది. ఖమేనీ రెండో కుమారుడు ఇరాన్ ప్రభుత్వంలో ఇంత వరకు ఎలాంటి అత్యున్నత పదవి చేపట్టలేదు. కానీ ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్ సైన్యంలో సేవలందించారు.ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు ఉన్ మోజ్తబా, ఇరాన్ సంప్రదాయవాద రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ చైర్మన్ ఘోలం-అలీ హద్దాద్-అదెల్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఇటీవల అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో ఇరాన్పై దాడి చేసినప్పుడు మోజ్తబా భార్య జహ్రా హద్దాద్-అదెల్ మరణించారు. -
ఇరాన్తో యుద్ధం.. అమెరికా చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా?
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు పతాక స్థాయికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ యుద్ధ రూపాన్ని మారుస్తూ మరింత ముందుకు కొనసాగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో అమెరికా రోజుకు ఎంత ఖర్చు చేస్తుందనే అంశంపై తెరపైకి వచ్చింది. అమెరికా తొలిరోజు ఇరాన్పై దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో రూ.6,900కోట్లు ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో భాగమైన పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ ఒక భాగం. దీని డైరెక్టర్, అమెరికా ప్రముఖ ఆర్థిక విశ్లేషకులలో ఒకరైన కెన్ స్మార్టర్ అంచనా ప్రకారం అమెరికా ఇరాన్పై దాడికి అక్షరాల రూ.18.87లక్షల కోట్లపైగా అయ్యే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.ఆ మొత్తం ఈ ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన ఇరాన్పై అమెరికా దాడి కోసం చేసే ఖర్చు మాత్రమే కాదు.. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకున్నప్పటి నుండి, అమెరికా ఇజ్రాయెల్కు 21.7 బిలియన్ల సైనిక సహాయాన్ని అందించింది. ఇతర కార్యకలాపాల కోసం కోసం 9.65 బిలియన్ నుండి 12.07 బిలియన్ల వరకు ఖర్చు చేసింది. ఇలా మొత్తంగా కలిపితే..18లక్షల కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలు హైలెట్ చేస్తుండగా.. ఇరాన్పై దాడికి అమెరికా ఎంత ఖర్చు చేస్తుందనే అధికారిక లెక్కలు విడుదల కావాల్సి ఉంది. -
మంటల్లో దౌత్య కార్యాలయాలు.. నిన్న రియాద్.. నేడు దుబాయ్..
దుబాయ్: మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిచర్యగా ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా దుబాయ్ నగరంలోని అమెరికా కాన్సులేట్పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడిలో కాన్సులేట్ భవనంలో భారీగా మంటలు చెలరేగగా, దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. అంతకుముందు రోజు సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దాడులు అమెరికా దౌత్య కార్యాలయాలు మనుగడకు ముప్పు కలిగిస్తున్నాయి.దుబాయ్ కాన్సులేట్ ఘటన గురించి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ అక్కడి సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, డ్రోన్ ప్రధాన భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలాన్ని తాకిందని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ ఆశయాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించిన విషయం విదితమే. ఇరాన్ పాలన అమెరికాకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిందని, వారి క్షిపణి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. గత నాలుగు రోజులుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇరువైపులా సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులేనని, అక్కడ మరణాల సంఖ్య 787కు చేరిందని రెడ్ క్రెసెంట్ సంస్థ వెల్లడించింది. ఇరాన్ వ్యాప్తంగా 153 కౌంటీలలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బాంబు దాడుల తీవ్రత కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బహ్రెయిన్, కువైట్, ఖతార్లలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లోని 14 దేశాలలో ఉన్న అమెరికా పౌరులను వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లిపోవాలని స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దుబాయ్ తదితర నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడం, గగనతలం మూసివేయడంతో వేలాది మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. -
ఇరాన్ నౌకను కూల్చింది మేమే: అమెరికా
ఇరాన్, ఇజ్రాయెల్ -అమెరికా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.. -
చమురు సమస్యకు చాన్స్ లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్కి ఇబ్బందేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దగ్గర 6–8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి. ప్రభుత్వం రోజువారీగా, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తోందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. వారం పది రోజుల్లో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్, ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఒకవేళ సంక్షోభం మరింత కాలం కొనసాగినా దాదాపు అంతే కాలానికి సరిపడేంతగా ఆయిల్ సరఫరా అమెరికా, రష్యా మొదలైన దేశాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. దేశీయంగా వైజాగ్, మంగళూరు, పాదూర్ నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్లు ఉన్నాయి. ధరలు పెరిగితే దిగుమతుల బిల్లులు భారం .. తక్షణమైతే ఇంధనాలకు కొరత ఏర్పడకపోవచ్చు కానీ క్రూడాయిల్ ధరలు, రవాణా.. బీమా వ్యయాలు పెరగడమనేది భారత దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి సుమారు 10 శాతం పెరిగి బ్యారెల్కి 80 డాలర్ల స్థాయిని దాటింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ క్రూడాయిల్ దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతుల కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మరోవైపు, పశ్చిమాసియాలో అనిశ్చితుల వల్ల స్వల్పకాలికంగా తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేలా దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం సమీక్షించేందుకు ఆయిల్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో, రిఫైనింగ్లో నాలుగో స్థానంలో, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉంది. -
హార్మూజ్ హీట్.. ఎగుమతులకు షాక్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులతో భారత వాణిజ్యంపై అనిశ్చితులు నెలకొన్నాయి. దేశ వాణిజ్యం (ఎగుమతులు–దిగుమతులు)పై ఏ మేర కు ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు ఎగుమతిదారులు, లాజిస్టిక్స్ భాగస్వాములతో కేంద్ర వాణిజ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎగుమతిదారులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ (రాడ్టెప్) పథకం కింద.. ఎగుమతిదారుల రవాణా వ్యయాలపై ఇప్పటి వరకు అధిక శాతం రీయింబర్స్మెంట్ సదుపాయం ఉండేది.దీన్ని ఇటీవలే సగానికి తగ్గించడం గమనార్హం. అలా చేయకుండా ఇంతకుముందు మాదిరే అధిక రేట్లను అమలు చేయాలని ఎగుమతిదారులు డిమాండ్ చేశారు. యుద్ధం పేరుతో సరుకు రవాణాపై ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంచకుండా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (ఈసీజీసీ)ను ఆదేశించాలని, మరిన్ని ఉత్పత్తులను బీమా కవరేజీలో చేర్చాలని కోరారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ప్రభావం తగ్గించే చర్యలు అవసరమని సూచించారు.సరుకు రవాణాపై స్పష్టత ఉండాలని, అనవసర జాప్యాన్ని నివారించాలని, డాక్యుమెంటేషన్ ప్రక్రియ సాఫీగా, సజావుగా ఉండాలని ఎగుమతిదారులు కోరారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం, ప్రతిగా ఇరాన్ పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా ఎయిర్బేస్లపై దాడులు చేస్తుండడం తెలిసిందే. అంతేకాదు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 15 శాతం, గ్యాస్ సరఫరాలో 20 శాతం రవాణాకు ఈ మార్గమే ఆధారం. ముడి చమురు ఇప్పటికే బ్యారెల్ 85 డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. పోటీతత్వానికి గండి హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల చమురు వాణిజ్యంపై ప్రభావం పడి ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎగుమతిదారు లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు వ్యయాలు పెరిగిపోతాయని.. దీంతో భారత వస్తువుల పోటీతత్వం తగ్గిపోతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విమాన రాకపోకల అంతరాయం వల్ల ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయిన సరుకుపై అదనపు చార్జీలు రద్దు చేయాలని అప్పారెల్ ఎక్స్పోర్టర్స్ కౌన్సిల్ ఏఈపీసీ కోరింది.ఎగుమతులపై ప్రభావం.. దేశ ఎగుమతుల్లో సుమారు 15 శాతం విమానాల ద్వారానే జరుగుతుంటాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలు గగనతలాలను మూసివేయడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆభరణాల రవాణా భారంగా మారనుంది.ఎంఎస్ఎంఈలకు భరోసా..పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వాణిజ్య శాఖ పేర్కొంది. భారత ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా కొనసాగించేందుకు (సరఫరా వ్యవస్థ).. ఎగమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చంది. కస్టమ్స్ అనుమతులు, చెల్లింపులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశ ఉత్పత్తికి అవసరమైన కీలక దిగుమతులపై ఎలాంటి తీవ్ర ప్రభావం లేదని స్పష్టం చేసింది. త్వరగా పాడయ్యే వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తుల ఎగుమతులు సాఫీగా సాగేందుకు ఉన్న మార్గాలపైనా చర్చించినట్టు తెలిపింది. -
డొనాల్డ్ ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ.. వైట్హౌస్ క్లారిటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెడపై ఉన్న ఎర్రటి మచ్చ కనిపించడంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఊహగానాలు మొదలయ్యాయి. ట్రంప్కు ఏమైనా జరిగిందా అని.. ఆయన ఆరోగ్యంపై యూఎస్ ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్హౌస్ క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చకు గల కారణాన్ని వైట్ హౌస్ వైద్యుడు వైట్ హౌస్ వైద్యుడు వివరించాడు.ఇది సాధారణ చర్మ వ్యాధి చికిత్స వల్లే ఏర్పడిందని అని వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పష్టం చేశాడు. అందువల్లే ఎర్రటిమచ్చ ఏర్పడిందని తెలిపాడు. ఈ మచ్చ తీవ్రమైన అనారోగ్యం వల్ల వచ్చింది కాదని.. సాధారణ చర్మ చికిత్స క్రీమ్ను ఉపయోగించడం వల్ల వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని వెల్లడించారు. కాగా.. సోమవారం మెడల్ ఆఫ్ ఆనర్ వేడుక సందర్భంగా ట్రంప్ చొక్కా కాలర్ పైన ఉన్న ఎర్రటి మచ్చ సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బార్బరా బెల్లా క్లారిటీ ఇచ్చారు.గతేడాది ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్ బార్బరా బెల్లా పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం సాధారణంగా ఉందని .. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైట్ హౌస్ పేర్కొంది. -
అమెరికా అప్రమత్తం.. పశ్చిమాసియాకు మరిన్ని దళాలు..!
పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా మరింత అప్రమత్తమైంది. ఇరాన్ పెద్దఎత్తున దాడులకు దిగడంతో అమెరికా సైతం సైనిక మోహరింపును మరింత పెంచింది. ఈ అత్యవసర చర్య మిత్రదేశాల భద్రత కోసమేనని తెలిపింది. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలు మరియు యుద్ధనౌకలు ఇప్పటికే మోహరించినప్పటికీ.. కొత్త సైనిక బలగాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.ఇరాన్తో పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగడంతో యూఎస్ రక్షణ శాఖ పెద్ద సంఖ్యలో మరిన్ని దళాలను మోహరించాలని ఆదేశించింది. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతం అంతటా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ ఎదురుదాడితో అప్రమత్తమైన అమెరికా సైనిక స్థావరాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసింది. మరోవైపు ప్రస్తుత జరుగుతోన్న యుద్ధంతో ప్రపంచ మార్కెట్లు, చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నా.. రెండు వైపులా ఎవరు కూడా తగ్గకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్- అమెరికా చర్చలు జరిగే పరిస్థతులు ఏ మూలానా కనిపించడం లేదు.


