breaking news
International
-
షేక్ హసీనాకు జైలు శిక్ష తప్పదు..! బంగ్లాదేశ్ సర్కార్ హెచ్చరిక
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నిషేధిత అవామీ లీగ్ పార్టీ నాయకురాలు షేక్ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లిపోతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వస్తే ఆమెను నేరుగా జైలుకు పంపుతామని ఆయన అన్నారు.కాగా 78 ఏళ్ల షేక్ హసీనా, 2024 ఆగస్టులో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా తన పదవిని కోల్పోయారు. ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె ఢాకా నుంచి పారిపోయి భారత్లో ఆశ్రయం పొందారు. అయితే నిరసనల సమయంలో హసీనా ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఢాకాలోని ప్రత్యేక అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును, తనపై వచ్చిన ఆరోపణలను షేక్ హసీనా పూర్తిగా "రాజకీయ ప్రేరేపితమైనవి" గా తోసిపుచ్చారు.హసీనా లొంగిపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. హసీనాను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు గత మధ్యంతర ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన అవామీ లీగ్ నాయకుల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకే ఆమె విదేశాల నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అని షామా ఒబేద్ ఇస్లాం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
ఇరాన్ మాజీ అధ్యక్షుడితో 'మొసాద్' రహస్య డీల్!
ఇరాన్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుత పాలకులను గద్దె దించి ఆ స్ధానంలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహ్మూద్ అహ్మదినీజాద్ను కొత్త నాయకుడిగా కూర్చోబెట్టేందుకు మొసాద్ కొన్నేళ్లుగా రహస్య ఆపరేషన్ నడిపినట్లు 'న్యూయార్క్ టైమ్స్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ప్లాన్ చివరి నిమిషంలో విఫలమైందని ఎన్టీ తమ కథనంలో పేర్కొంది.కాగా తొలిసారిగా 2024లో హంగేరీ వేదికగా జరిగిన ఒక సదస్సులో అప్పటి మొసాద్ చీఫ్ డేవిడ్ బార్నియా అహ్మదినీజాద్తో కలిపి చర్చలు జరిపినట్లు సమాచారం. అహ్మదినీజాద్ విదేశీ ప్రయాణాలకు, నివాసాలకు సంబంధించిన ఖర్చుల కోసం ఇజ్రాయెల్ భారీగా ఆర్థిక సహాయం అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తమకు అహ్మదీనెజాద్తో పరిచయం ఏర్పడిందనే విషయాన్ని మొసాద్ అమెరికా గూఢచారి సంస్థ సిఐఎ (CIA)కి తెలియజేసిందంట.అదేవిధంగా 2025 జూన్లో బుడాపెస్ట్లో కూడా మరోసారి ఆయన మొసాద్ ఏజెంట్లను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటనలో అహ్మదినీజాద్ తన బాడీగార్డులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కళ్ళు గప్పి మరి మొసాద్ ఏజెంట్లతో సమావేశమైనట్లు ఇరాన్ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి.సేఫ్ హౌస్ నుండి ఎస్కేప్!ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇరాన్పై ప్రారంభమైనప్పుడు ఈ ఆపరేషన్ చివరి దశకు చేరింది. అహ్మదీనెజాద్ ఉంటున్న కాంపౌండ్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అహ్మదీనెజాద్ చనిపోయాడని ప్రపంచమంతా భావించింది. కానీ, అసలు ట్విస్ట్ ఏంటంటే... మొసాద్ ఏజెంట్లు ఆయనను అక్కడి నుంచి రక్షించి, ఇరాన్ లోపలే ఉన్న ఒక రహస్య 'సేఫ్ హౌస్'కు తరలించారు.అయితే ఇజ్రాయెల్ ప్లాన్ పట్ల అహ్మదీనెజాద్కు నమ్మకం కుదరకపోవడంతో, ఆయన కొన్ని రోజులకే ఆ సేఫ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో ఇరాన్ వర్గాలు షాక్కు గురయ్యాయి. ఇజ్రాయెల్తో ఆయనకు ఉన్న సంబంధాల గురించిన పూర్తి వివరాలను ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా కనిపెట్టాయి. దీంతో అహ్మదీనెజాద్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
భారత్ సహా ప్రపంచానికి ట్రంప్ షాక్.. 20% భరించాల్సిందే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకుపై అమెరికా 20% ఛార్జీ వసూలు చేస్తుందని ప్రకటించారు. "ఇప్పటి నుంచి అమెరికాను 'హార్మూజ్ జలసంధి సంరక్షక దేశం'గా పిలుస్తారు. ఈ అత్యంత ఉద్రిక్త ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించే పనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సరుకులపై 20% రేటుతో తిరిగి వసూలు చేస్తాం. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది" అని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు.హార్మూజ్ జలసంధి తెరిచే ఉందని, అలాగే కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకలు దేశంలోకి రావడం, బయటకు వెళ్లడం అడ్డుకునే దిగ్బంధాన్ని అమెరికా మళ్లీ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. "హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్ ఉన్నా లేకపోయినా అలాగే ఉంటుంది. ఇరాన్ నౌకలు, ఆ దేశ వినియోగదారుల నౌకల రాకపోకలను మాత్రమే అడ్డుకునే దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేస్తున్నాం. మిగతా అన్ని దేశాల నౌకలకు హార్మూజ్ జలసంధి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు" అని ట్రంప్ తెలిపారు. ఈ పోస్టుకు కొన్ని గంటల ముందు ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. "ఆ జలసంధిని మేమే నియంత్రిస్తాం. దాన్ని నిర్వహించే బాధ్యత కూడా మాదే కావచ్చు. ఆ జలసంధికి సంరక్షకులమవుతాం. దానికి అయ్యే ఖర్చు మాకు తిరిగి రావాలి" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ ఘాటు హెచ్చరికట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సైనిక కమాండ్ ప్రతినిధి వీడియో సందేశం ద్వారా స్పందించారు. హార్మూజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ జలమార్గం విషయంలో అమెరికాతో సహకరించే గల్ఫ్ దేశాల చర్యను యుద్ధ చర్యగానే పరిగణిస్తామని హెచ్చరించారు.అమెరికా, ఇరాన్ వరుసగా రెండో రోజు పరస్పర దాడులు జరుపుకుంటున్న వేళ ఈ హెచ్చరిక వచ్చింది. హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉందని రెండు దేశాలూ చెబుతున్నాయి. -
సముద్రం లోతుల్లో చైనా సీక్రెట్ టెస్ట్.. భారత్కు భారీ ముప్పు
చైనా గత వారం (జులై 6) సముద్రం నుంచి ప్రయోగించే దీర్ఘ శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని పరీక్షించింది. అంతర్జాతీయ జలాల్లో జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణికి ఇదే తొలి పరీక్ష. ఇంకో కీలక విషయం ఏమిటంటే, 1980 తర్వాత అంతర్జాతీయ జలాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చేపట్టిన రెండో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ఇదే. 2024 సెప్టెంబర్ 21న డాంగ్ ఫెంగ్ లేదా డీఎఫ్-31 వ్యవస్థతో భూమి నుంచి ప్రయోగించే ఐసీబీఎం పరీక్షను చైనా నిర్వహించింది.తాజా పరీక్షలో పీఎల్ఏ నౌకాదళానికి చెందిన జిన్-తరగతి టైప్ 094 జలాంతర్గామి నుంచి క్షిపణిని ప్రయోగించినట్టు సమాచారం. అది నకిలీ వార్హెడ్ను మోసుకెళ్లింది. 7,300 కి.మీ. దూరం ప్రయాణించిన ఆ వార్హెడ్ ఫిలిప్పీన్స్పైగా వెళ్లి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడినట్టు తెలుస్తోంది. నౌరు, కిరిబాటి, టువాలు దేశాల ప్రత్యేక ఆర్థిక మండలాలపైగా ప్రయాణించిన ఆ వార్హెడ్, రరోటోంగా ఒప్పందం పరిధిలోని దక్షిణ పసిఫిక్ అణు ఆయుధ రహిత ప్రాంతంలో పడింది. అక్కడ అణు పేలుడు పరికరాల పరీక్షలు, మోహరింపు నిషేధం అమల్లో ఉంది.ఈ క్షిపణి పరీక్ష గురించి ఏమి తెలుసు?ఈ క్షిపణి జు లాంగ్ 2 (జేఎల్-2)నా లేదా తాజా జు లాంగ్ 3 (జేఎల్-3)నా అన్నది కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. జేఎల్-2, జేఎల్-3 రెండూ జలాంతర్గామి నుంచి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే. వీటిని వరుసగా డీఎఫ్-31, డీఎఫ్-41 వ్యవస్థలతో కలిపి అభివృద్ధి చేశారు. సాధారణంగా ఐసీబీఎంల పరిధి కనీసం 5,000 కి.మీ. ఉంటుంది. జేఎల్-2 8,000-9,000 కి.మీ. దూరం వెళ్లగలదు. జేఎల్-3 పరిధి 9,000 కి.మీ.కుపైగా ఉంటుందని సమాచారం.ప్రస్తుతం చైనా వినియోగిస్తున్న టైప్ 094 ఎస్ఎస్బీఎన్ జలాంతర్గాములతో ఈ రెండు వ్యవస్థలను అమర్చవచ్చు. ప్రయాణించిన దూరాన్ని బట్టి ఏ వ్యవస్థ వాడారో స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే చైనా రెండు సార్లు పరీక్షించి ఉండవచ్చు లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఇతర దేశాల మాదిరిగానే క్షిపణి పరీక్షలు లేదా సైనిక విన్యాసాలకు ముందు చైనా నావిగేషన్ హెచ్చరిక జారీ చేస్తుంది. ఈసారి ఇచ్చిన హెచ్చరిక ప్రకారం రెండు మార్గాలను పరిశీలించింది. ఒకటి దక్షిణ చైనా సముద్రం నుంచి దక్షిణ పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రయోగించడం. రెండోది ఈశాన్య ప్రాంతంలోని బొహాయ్ సముద్రం నుంచి జపాన్పైగా పసిఫిక్ వైపు ప్రయోగించడం. రెండో మార్గం ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉండటంతో, తొలి మార్గాన్నే చైనా ఎంచుకున్నట్టు అంచనా.బీజింగ్ ఇప్పుడు ఎందుకు పరీక్షిస్తోంది?ఈ దశాబ్దం ఆరంభం నుంచి, ముఖ్యంగా గత రెండేళ్లలో, తన అణు సామర్థ్యాలు పెరుగుతున్నాయని బీజింగ్ బహిరంగంగానే ప్రపంచానికి చూపిస్తోంది. అమెరికా ఉపగ్రహాలు గుర్తిస్తాయని తెలిసినా దాచిపెట్టకుండా అనేక క్షిపణి సైలోలను నిర్మించింది. 2025 సైనిక పరేడ్లో కొత్త అణు ఆయుధ రవాణా వ్యవస్థలను ప్రదర్శించింది. 2024లో పసిఫిక్ మహాసముద్రంలో భూమి నుంచి ఐసీబీఎం పరీక్ష కూడా చేపట్టింది.ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, తన అణు సామర్థ్యాల పెరుగుదలను గుర్తించాలని చైనా కోరుకుంటోంది. భూమి, సముద్రం, గగనం నుంచి అణు ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యంతో అణు త్రయం నిర్మాణాన్ని ప్రదర్శించాలన్న ప్రయత్నం కూడా ఇందులో భాగం. తొలి దాడి చేయబోమన్న అణు విధానాన్ని ప్రకటించిన దేశాలు భారత్, చైనా మాత్రమే. అందువల్ల ప్రతిదాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యం కూడా ఇందులో ఉండవచ్చు. ఇవే కాదు. అణు రక్షణ కవచాన్ని నిర్మించడం, మహాశక్తి హోదా సాధించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ స్థాయి అణు ఆధిపత్యాన్ని పెంచుకోవడం వంటి లక్ష్యాలు కూడా ఈ చర్యల వెనుక ఉండవచ్చు.చైనా అణు వ్యూహం మారిందా?లేదు.. చైనా ప్రకటించిన అణు వ్యూహంలో ప్రధాన అంశాలు ఇవి. మొదటిది తొలి అణు దాడి చేయబోమన్న విధానం. రెండోది దాడికి ప్రతిదాడి తప్పకుండా చేస్తామన్న హామీ. మూడోది అణు ఆయుధాలు లేని దేశాలపై, అణు ఆయుధ రహిత ప్రాంతాలపై అణు ఆయుధాలను వినియోగించబోమని లేదా బెదిరించబోమని ప్రకటించడం.ఈ అంశాల్లో మార్పు లేదు. అయితే చైనా కనీస అణు నిరోధక విధానాన్ని కూడా అనుసరిస్తోంది. ఇటీవల అణు సామర్థ్యం, వైవిధ్యం, కచ్చితత్వం, సన్నద్ధత పెరిగిన తీరు చూస్తే ఆ విధానం నుంచి దూరమవుతున్నట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి. 2030 నాటికి చైనా వద్ద సుమారు 1,000 అణు వార్హెడ్లు ఉండే అవకాశం ఉంది. దాడి హెచ్చరిక అందగానే లక్ష్యాలు తాకకముందే ప్రతిదాడి ప్రారంభించే "లాంచ్ ఆన్ వార్నింగ్" సన్నద్ధత వైపు తన బలగాల్లో కొంత భాగాన్ని మార్చుతోంది. దీనిని బీజింగ్ "ఎర్లీ వార్నింగ్ కౌంటర్ స్ట్రైక్" (యుజింగ్ ఫాంజి)గా పిలుస్తోంది.అణు కమాండ్, నియంత్రణ, సమాచార వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. 10 కిలోటన్నుల కంటే తక్కువ శక్తి ఉన్న యుద్ధ వినియోగ అణు వ్యవస్థలను అభివృద్ధి చేస్తుండవచ్చు. బలమైన అణు త్రయంతో ప్రకటించిన సిద్ధాంతం, వాస్తవ అణు సామర్థ్యం మధ్య తేడా పెరుగుతోంది.భారత్పై ప్రభావం ఏంటి?మనదేశం దృష్టిలో ఈ పరీక్షతో భారత్, చైనా అణు ఆయుధ నిల్వలు, ప్రయోగ సామర్థ్యాల మధ్య వ్యూహాత్మక అంతరం మరింత స్పష్టమైంది. అరిహంత్ తరగతి ఎస్ఎస్బీఎన్ జలాంతర్గాములతో భారత్ అణు త్రయాన్ని అమల్లోకి తెచ్చింది. అయినా ప్రస్తుతం వినియోగిస్తున్న జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల పరిధి తక్కువే.చైనా ప్రదర్శనతో భారత్ దీర్ఘ శ్రేణి కే-5, కే-6 క్షిపణులను త్వరగా మోహరించాల్సిన అవసరం పెరిగింది. అప్పుడు మాత్రమే ప్రతిదాడి సామర్థ్యంలో సమతుల్యత సాధిస్తుంది. చైనా అణు ఆధునికీకరణను చూస్తే దక్షిణాసియాలో అణు ఆయుధ పోటీ మరింత వేగం అందుకుంటుంది.దక్షిణ చైనా సముద్రంలోని రక్షిత ప్రాంతం నుంచి జేఎల్ క్షిపణిని ప్రయోగించడం వల్ల చైనా జలాంతర్గాములను గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల భారతదేశం జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు, సముద్ర అడుగు ప్రాంతాల పర్యవేక్షణను కనీసం హిందూ మహాసముద్ర ప్రాంతంలో విస్తరించాలి.అమెరికా, మిగతా ప్రపంచం దృష్టిలో ఈ ప్రయోగం చైనా అణు త్రయం పరిపక్వ స్థాయికి చేరిందనే విషయాన్ని, అణు నిరోధక సామర్థ్యం పెరిగిందనే విషయాన్ని స్పష్టంగా చూపించింది. చైనా అణు ఆధునికీకరణ గురించి అమెరికాకు ఇప్పటికే అవగాహన ఉన్నా, ఈ పరీక్ష క్షిపణి రక్షణ ప్రణాళికలను మరింత క్లిష్టం చేస్తుంది. పశ్చిమాసియా నుంచి తూర్పు ఆసియాపై దృష్టి, వనరులను మళ్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. చైనా తీర ప్రాంతాలు, దక్షిణ చైనా సముద్రానికి సమీపంలో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు, నిఘా వ్యవస్థలను మరింత పెంచాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.చైనా సామర్థ్యాలు పెరగడం వల్ల తన ప్రభావ పరిధిలో ఏ సంక్షోభం తలెత్తినా బయటి దేశాలు జోక్యం చేసుకోవడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతుందని ప్రాంతీయ దేశాలు కూడా గుర్తిస్తాయి. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా సైనిక సాయంపై అనిశ్చితి పెరిగిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
టెహ్రాన్: ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఆదివారం నాడు ఇరాన్లోని తమ మిలటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి Tu-214PU 'డూమ్స్డే' (ప్రళయ) విమానాన్ని టెహ్రాన్కు పంపింది. ఈ చర్య ద్వారా ఇరాన్కు మాస్కో బహిరంగంగానే తమ అండను ప్రకటించినట్లయింది.పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ముగింపుకు రాలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించే లోపే, పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్న ఈ తరుణంలో, రష్యా ఇరాన్కు ఒక అత్యాధునిక విమానాన్ని పంపడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా ఉపయోగంఇరాన్కు అమెరికా నుంచి దాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతోంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకొస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ముందే అప్రమత్తం చేస్తోంది.ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం ఇప్పుడు ఇరాన్కు చేరుకోవడం హాట్టాఫిక్గా మారింది. దీని రాకతో ఇరాన్కు రక్షణ పరంగా మరింత బలం చేకూరిందనేది వాస్తవం.Tu-214PU ప్రత్యేకతలుఇది సాధారణ విమానం కాదు. ఇందులో అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్, కంట్రోల్ నెట్వర్క్లు, ప్రత్యేక డేటా లింక్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సదుపాయాల వల్ల సంక్షోభ సమయాల్లో విమానంలో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే దీనిని రష్యా "ప్రళయ విమానం" అని పిలుస్తుంది.భూమిపై అణు దాడులు సంభవించినప్పుడు దేశ అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఈ విమానంలోకి ఎక్కి ఆకాశం నుంచే యుద్ధ వ్యూహాలను రచించవచ్చు. కాక్పిట్ మినహా ఈ విమానానికి ఎలాంటి కిటికీలు ఉండవు. ఇది అణు విస్ఫోటనం వల్ల వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల నుండి లోపల ఉన్నవారిని రక్షిస్తుంది. అలాగే ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల, వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ప్రయాణించగలదు.అయితే, ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. -
14 దేశాల దెబ్బకు డ్రాగన్ మైండ్ బ్లాక్!
న్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్రంపై బీజింగ్ ప్రాంతీయ సార్వభౌమాధికార వాదనలను జపాన్ సహా 14 దేశాలు తోసిపుచ్చడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 నాటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (పీసీఏ)తీర్పును సమర్థిస్తూ ఆయా దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం దౌత్యపరమైన ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో, చైనా తన నిరసనను వ్యక్తం చేస్తూ, బీజింగ్లోని జపాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్కు సమన్లు జారీ చేసింది. జపాన్ వైఖరి ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది.అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫిలిప్పీన్స్ సహా 14 దేశాలు ఈ వివాదాస్పద తీర్పు 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (యూఎన్సీఎల్ఓఎస్)ప్రకారం చైనా విస్తరణ వాదనలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశాయి. 27 దేశాల యూరోపియన్ యూనియన్ సైతం ఈ తీర్పును మైలురాయిగా అభివర్ణించింది. అయితే, చైనా విదేశాంగ శాఖ ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తూ, జపాన్ ఈ సముద్ర తీర ప్రాంతంలో భాగస్వామి కాదని, తమ సార్వభౌమాధికారంపై మాట్లాడే హక్కు దానికి లేదని పేర్కొంది. చైనా తన వాదనను సమర్థించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను కూడా పంచుకుంది.వ్యూహాత్మక రవాణా మార్గంగా, 17.7 బిలియన్ టన్నుల చమురు, సహజ వాయువు నిక్షేపాలు కలిగిన దక్షిణ చైనా సముద్రంపై చైనా చారిత్రక హక్కులను క్లెయిమ్ చేస్తూ, కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. చైనా సైనిక చర్యలు, గస్తీలు అమెరికా కూటమి నౌకాదళ పర్యటనల మధ్య ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ముప్పు ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: రౌడీషీటర్ బర్త్డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి -
షుగర్ సూదులు, మందులు వద్దంటూ వైరల్ డైట్!
"మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది.. ఇక ఇన్సులిన్, మందులు అవసరం లేదు!" అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ డైట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ డైట్ను నమ్మి వేలాది మంది షుగర్ పేషెంట్లు వైద్యులు సూచించిన మందులు ఆపేయడంతో.. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొందరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండటంతో వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'ఎల్-తయ్యిబాత్' డైట్.. ఆ పదానికి అరబిక్లో "మంచివి" అనే అర్థం. ఈ డైట్ను ఈజిప్టుకు చెందిన మాజీ వైద్యుడు దియా ఎల్-అవాడీ (Diaa El-Awadi) విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆయన ప్రకారం.. తినే తిండిలో కొన్నింటిని దూరంగా పెడితే చాలూ.. డయాబెటిస్ దానంతట అదే తగ్గిపోతుందట!. మధుమేహానికి అసలు కారణం కొన్ని ఆహార పదార్థాలేనని, వాటిని పూర్తిగా మానేస్తే షుగర్ మందులు, ఇన్సులిన్ అవసరమే ఉండదని దియా ఎల్ అవాడీ చెప్పేవాడు. ఆ డైట్లో.. ఆకుకూరలు, గుడ్లు, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు బంద్ చేయాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్ కావడంతో.. గుడ్డిగా ఆ మాటలు నమ్మి లక్షలాది మంది ఈ డైట్ను అనుసరించడం ప్రారంభించారు.మందులు ఆపేసి... ప్రాణాల మీదకుఎల్-తయ్యిబాత్ డైట్ను నమ్మి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు. యెమెన్లో ఈ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోంది. 67 ఏళ్ల మురాద్ అల్-అదిమి అనే మధుమేహి కూడా ఇదే డైట్ను నమ్మాడు. 15 ఏళ్లుగా షుగర్ మందులు వాడుతున్న ఆయన.. ఈ డైట్ పాటిస్తే మందులు అవసరం లేదని తెలిసి వాటిని ఆపేశాడు. మొదటి కొన్ని రోజులు బాగానే అనిపించడంతో స్నేహితులకు కూడా ఇదే డైట్ను సూచించాడు. కానీ పదో రోజుకే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న ఆయన.."మందుల ఖర్చు తగ్గుతుందని అనుకున్నా.. ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడూ మందులు ఆపొద్దు" అని హెచ్చరిస్తున్నాడు.క్యూ కడుతున్న షుగర్ పేషెంట్లుయెమెన్లోని తైజ్ రిపబ్లికన్ ఆస్పత్రి వైద్యుల ప్రకారం.. గత కొన్ని నెలలుగా అత్యవసర విభాగానికి వస్తున్న మధుమేహుల్లో చాలా మంది ఈ డైట్ను అనుసరించి మందులు మానేసినవారే. చాలామంది తీవ్రమైన షుగర్, డీహైడ్రేషన్, డయాబెటిక్ కీటోఅసిడోసిస్ వంటి ప్రమాదకర పరిస్థితులతో ఆస్పత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలోని పలుదేశాల్లోనూ ఈ తరహా డైట్ పాటించి పలువురు ఆస్పత్రి పాలవుతున్నారనే నివేదికలు వెలువడుతున్నాయి.ఈ డాక్టర్ ఎవరంటే..దియా ఎల్-అవాడీ ఒకప్పుడు ఈజిప్టులో వైద్యుడిగా పనిచేశారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేని వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలతో ఈజిప్ట్ వైద్య మండలి ఆయన వైద్య అనుమతిని రద్దు చేసింది. ఆయన నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను కూడా 2026 మార్చిలో మూసివేసింది. అనంతరం యూఏఈలో ఉన్న సమయంలో 2026 ఏప్రిల్లో ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు. యూఏఈ వైద్య నివేదిక ప్రకారం ఆయన మరణం సహజ కారణాలతోనే జరిగిందని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని ఈజిప్ట్ విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వైరల్ కావడంతో.. ఆయన ప్రచారం చేసిన ‘ఎల్-తయ్యిబాత్’ (El-Tayyebat) డైట్కు మరింత ప్రచారం లభించింది.ధరలు కూడా కుప్పకూలాయి!ఈ డైట్ ప్రభావం అరబ్ దేశాల్లోని మార్కెట్పైనా పడింది. గుడ్లు, చికెన్, ఆ డైట్లో ఉన్న కూరగాయలు కొనేవారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. తైజ్లో గుడ్ల ట్రే ధర 3.5 డాలర్ల నుంచి 1.6 డాలర్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రోజుకు 20 కోళ్లు అమ్మే దుకాణాల్లో ఇప్పుడు ఐదు కూడా అమ్ముడవడం లేదని వారు వాపోతున్నారు.వైద్యులు ఏమంటున్నారు?వైద్యులు, పోషకాహార నిపుణులు మాత్రం ఈ డైట్కు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఆకుకూరలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పండ్లు వంటి ఆహారాల్లో శరీరానికి అవసరమైన.. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని పూర్తిగా మానేయడం వల్ల పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు, డైటీషియన్లు సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.సోషల్ మీడియా సలహాలొద్దు"సోషల్ మీడియాలో కనిపించే ప్రతి డైట్ అందరికీ సరిపోదు. కొందరికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. అదే అందరికీ చికిత్స కాదు. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధుల్లో డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపేయడం ప్రాణాలకు ప్రమాదం" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్క వైరల్ వీడియోను నమ్మి మందులు మానేస్తే.. షుగర్ తగ్గకపోగా ప్రాణాలే ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.గమనిక: మన దేశంలోనూ సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్లో వైరల్ అయ్యే "షుగర్కు అద్భుత చికిత్స" వంటి వీడియోలను చూసి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేయడం ప్రాణాపాయానికి దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. టెహ్రాన్ మున్సిపాలిటీకి చెందిన 'హమ్షాహ్రీ' (Hamshahri) పత్రిక వివాదాస్పద ప్రచురణలో 13 మంది కీలక నేతలతో కూడిన రివెంజ్ లిస్ట్ను ప్రకటించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పలువురు యూరోపియన్ నాయకులతో సహా 13 మంది విదేశీ నేతలతో కూడిన ప్రతీకార జాబితాను ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు 'ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ'.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రాఫిక్ వెలుగులోకి రావడం గమనార్హం. తన తండ్రి మరణానికి ప్రతీకారం తప్పదని, ఇందుకు బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మొజ్తాబా ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని కచ్చితంగా నెర వేరుస్తానని కూడా అన్నారు.శాంతియుత మరణం ఉండదు - మోజ్తబా ఖమేనీఈ వారం ప్రారంభంలో జరిగిన తన తండ్రి అంత్యక్రియల తర్వాత మోజ్తబా ఖమేనీ శనివారం తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేస్తూ, ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ప్రతీకారం తమ దేశ సంకల్పం, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నేరస్థులకు కంటిమీద కునుకు ఉండదు. వారికి ప్రశాంత మరణం ఉండదని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సుప్రీం లీడర్ పేర్కొన్నప్పటికీ, ఆయన ఎవరి పేర్లను ప్రత్యక్షంగా వెల్లడించలేదు. అలాగే, హమ్షాహ్రీ పత్రిక ప్రచురించిన ఈ జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!ఆన్లైన్లో విడుదల చేసిన ఈ ఇన్ఫోగ్రాఫిక్లో మోజ్తబా ఖమేనీ ప్రకటనతో పాటు 13 మంది విదేశీ నాయకుల ఫోటోలను ప్రదర్శించారు. వారిలో ముఖ్యులు:డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని)మార్కో రూబియో (అమెరికా విదేశాంగ మంత్రి)పీట్ హెగ్సెత్ (అమెరికా రక్షణ మంత్రి)ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని)ఫ్రీడ్రిచ్ మెర్జ్ (జర్మనీ ఛాన్సలర్)ఈ గ్రాఫిక్ ఆన్లైన్లో మాత్రమే పబ్లిష్ అయింది. ఆదివారం నాటి ప్రింట్ ఎడిషన్లో దీనిని ప్రచురించలేదు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? The Islamic Republic of Iran has published a list of its "revenge targets" in the daily newspaper Hamshahri and calls for the murder of the following individuals pic.twitter.com/fYxQYJpuOm— Afshin Ismaeli (@Afshin_Ismaeli) July 12, 2026 -
చాట్జీపీటీతో పరీక్ష రాసి దొరికిపోయారిలా..
వాషింగ్టన్: అమెరికాలోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి అక్రమంగా పరీక్షలు రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వెల్ఫేర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఛాయిస్ థియరీ కోర్సు ప్రొఫెసర్ రాబర్టో సెరానో ఇటీవల క్యాంపస్లో జరిగిన ఒక కాల్పుల ఘటనను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు మిడ్టర్మ్ పరీక్షలను ఇంటి నుంచే రాసేందుకు అనుమతించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరీక్షలో విద్యార్థులు ఏకంగా 96 శాతం సగటు మార్కులు సాధించడం ప్రొఫెసర్కు అనుమానం కలిగించింది. గతంలో ఈ కోర్సు సగటు మార్కులు 65 నుంచి 80 శాతం లోపు మాత్రమే ఉండేవి.విద్యార్థుల సమాధానాల శైలి సంక్లిష్టంగా ఉండటం, చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడినట్లు అనిపించడంతో ఆయన అప్రమత్తమయ్యారు. దీనిపై విద్యార్థులను హెచ్చరిస్తూ, ఫైనల్ పరీక్షలను తరగతి గదిలోనే నిర్వహిస్తామని, మిడ్టర్మ్ మార్కులకు దగ్గరగా వస్తేనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో భయపడిన 18 మంది విద్యార్థులు కోర్సు నుండి తప్పుకోగా, మరో తొమ్మిది మంది పరీక్షకు హాజరుకాలేదు. మిగిలిన 59 మంది విద్యార్థులకు క్లాస్రూమ్లో ఫైనల్ పరీక్ష నిర్వహించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందులో ముగ్గురు విద్యార్థులకు సున్నా మార్కులు రాగా, కేవలం ఇద్దరు మాత్రమే మిడ్టర్మ్ మార్కులకు దరిదాపుల్లో స్కోరు చేయగలిగారు. విద్యార్థులు ఇలా మోసాలకు పాల్పడటం వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోందని ప్రొఫెసర్ సెరానో విచారం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అర నిమిషంలో 195 ముద్దులు.. క్రేజీ లవర్స్ రికార్డ్! -
భీకర దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్లో మళ్లీ మంటలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్ ఎటాక్కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్, ఒమన్ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకారం.. బహ్రెయిన్లోని షేక్ ఇసా వైమానిక స్థావరంపై దాడి చేసింది. అక్కడి అమెరికా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా డ్రోన్ ఫ్లీట్లో కీలక భాగాన్ని ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ రాలేదు.ఆ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, జోర్డాన్లలోనూ తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. కువైట్లోని అలీ అల్ సేలెం, అహ్మద్ అల్ జాబర్ సైనిక స్థావరాలు, జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, అలాగే ఖతార్, ఒమన్లోని అమెరికా మద్దతు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలోని ఇంధన నిల్వలు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే జోర్డాన్ మాత్రం.. ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, యూఏఈ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖతార్లో ఇరాన్ దాడుల సమయంలో శకలాలు పడి ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కువైట్లోని ఓ చమురు డ్రిల్లింగ్ ప్లాట్ఫామ్పై జరిగిన దాడిలో ఓ కార్మికుడు గాయపడినట్లు సమాచారం. ఒమన్లోనూ డ్రోన్ దాడుల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలే లక్ష్యం: అమెరికామరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM).. ఇరాన్పై చేపట్టిన తాజా దాడులను సమర్థించుకుంది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు. ‘‘మేము వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.హర్ముజ్ మూసివేశామన్న ఇరాన్తాజా ఘర్షణలకు ప్రధాన కారణంగా మారింది హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ‘‘హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు నియంత్రణ లేదు. అంతర్జాతీయ నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.షిప్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం.. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. అయితే పూర్తిగా నిలిచిపోలేదని సమాచారం. కొన్ని చమురు ట్యాంకర్లు మాత్రం ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలుస్తోంది.నౌకలపై దాడులే అసలు కారణంహర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్పై తాజా దాడులు ప్రారంభించింది. అమెరికా ఆరోపణ ప్రకారం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఓ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిగా అమెరికా దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఇరాన్ మాత్రం.. అనుమతి లేకుండా ప్రయాణించిన ఓ నౌకపై హెచ్చరిక కాల్పులు మాత్రమే జరిపామని పేర్కొంది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.చమురు ధరలకు సెగహర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ ధర సుమారు 79 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడితే.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మళ్లీ యుద్ధ భయాలుఅమెరికా-ఇరాన్ మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం భవిష్యత్తుపైనా తాజా పరిణామాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించి ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరస్పర దాడులతో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగిస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఈ పోరు.. ప్రపంచ ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. -
అర నిమిషంలో 195 ముద్దులు.. క్రేజీ లవర్స్ రికార్డ్!
బ్రెసిలియా: బ్రెజిల్కు చెందిన ఒక జంట తమ ప్రేమను ప్రపంచ రికార్డుగా మలచుకున్నారు. కేవలం 30 సెకన్లలో అత్యధిక ముద్దులు పెట్టుకున్న జంటగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పారు. అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం (జులై 6) జరిగిన కొద్దిరోజులకే ఈ ఘనత నమోదు కావడం విశేషం. బ్రెజిల్కు చెందిన రెనాటో అల్వెస్, అతని గర్ల్ఫ్రెండ్ నైయారా రాబర్టా రిబీరో డి మారిన్స్ కేవలం అర నిమిషంలో ఏకంగా 195 ముద్దులు పెట్టుకుని రికార్డు సృష్టించారు.తాము ప్రపంచంలోనే అత్యుత్తమ జంట అని నమ్ముతున్నందున, తామిద్దరం కలిసి ఈ సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. 32 ఏళ్ల రెనాటోకు రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. గతంలో ఆయన అత్యంత వేగంగా 10 పుస్తకాలను అమర్చి పడేయడం (6.68 సెకన్లు), అత్యధికంగా పాదాలను తిప్పడం (210.66 డిగ్రీలు) వంటి పలు గిన్నిస్ రికార్డులను సాధించారు. తద్వారా బ్రెజిల్లో అత్యధిక ప్రపంచ రికార్డులు కలిగిన వ్యక్తిగా నిలిచారు.ఈ రికార్డుల వెనుక ఒక సామాజిక సందేశం కూడా ఉందని రెనాటో పేర్కొన్నారు. తాను అస్తిమజ్జ (బోన్ మ్యారో) దాతనని, అలాగే తనకు ఏడీహెచ్డీ సమస్య ఉందని వెల్లడించారు. ఏడీహెచ్డీ ఉన్నవారు కూడా అనుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ జంట జపాన్కు చెందిన చెర్రీ యోషిటేక్, కుమికో శిరతోరి పేరిట ఉన్న ఒక నిమిషంలో 277 ముద్దుల రికార్డును బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
ట్రంప్ ‘ట్రంప్కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది. -
మెక్సికో రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి, పది మందికి గాయాలు
జలిస్కో: మెక్సికోలోని జలిస్కో రాష్ట్ర హైవేపై ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాడలజారా, టెపిక్ నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్-ట్రైలర్ నియంత్రణ కోల్పోయి పలు వాహనాలను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 🚨🚒 Choque múltiple en la autopista Guadalajara–Tepic dejó un saldo preliminar de 16 muertos y 6 heridos, luego de que un tráiler embistiera a trabajadores de mantenimiento. La circulación hacia Nayarit permanece cerrada; el operador fue retenido. pic.twitter.com/cUqHqvZAqu— LuisCardenasMX (@LuisCardenasMx) July 12, 2026ప్రమాదం వెంటనే పలు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, హైవే అంతటా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ప్రమాద తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రులలో నలుగురు అమెరికా పౌరులతో పాటు ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది కూడా ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన నేషనల్ గార్డ్ సభ్యులను గ్వాడలజారాలోని మాగ్డలీనా ఆసుపత్రికి తరలించారు.🚨 Trágico accidente en la autopista Guadalajara–Tepic. Un tractocamión embistió a trabajadores de mantenimiento cerca de la caseta Plan de Barrancas. El saldo preliminar es de 10 muertos, 6 heridos, 3 desaparecidos y 8 vehículos involucrados. pic.twitter.com/PWQSdc7GDo— LuisCardenasMX (@LuisCardenasMx) July 12, 2026ఈ ప్రమాదంపై జలిస్కో సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వల్పంగా గాయపడిన నలుగురు అమెరికా పౌరులను ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా గ్వాడలజారాలోని అర్బోలెడాస్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. స్థానిక రెస్క్యూ టీమ్స్, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
వియత్నాం విషాదం: హైదరాబాద్ చేరుకున్న బాధితులు
న్యూఢిల్లీ: వియత్నాంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరనున్నాయి. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు పర్యాటకులు ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్) చేరుకున్నారు. కాగా హోచి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్లైన్స్ (VN979) విమానంలో 15 మంది భారతీయుల మృతదేహాలను ముంబయికి తరలిస్తున్నట్లు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరే ఈ విమానం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:35 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా వెల్లడించింది.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాయబార కార్యాలయం వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ముంబయి చేరుకున్న తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వీలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించామని, బాధిత కుటుంబాలతో సమన్వయం చేసుకోవాలని కోరినట్లు పేర్కొంది. మృతుల్లో 10 మంది తమిళనాడుకు చెందినవారు కాగా.. ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కేరళ వాసులు ఉన్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.వియత్నాం పత్రిక 'విఎన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఫు క్వాక్ ద్వీపకల్పం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ‘ఓషన్ పెర్ల్ ఐలాండ్’ సంస్థకు చెందిన ఓ స్పీడ్బోట్ 36 మంది ప్రయాణికులతో ‘హాన్ మే రట్’ దీవి నుంచి ‘అన్ థోయ్’ రేవుకు వెళ్తుండగా ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. -
కాఠ్మాండు రణరంగం: అటు వరద ముంపు.. ఇటు అణచివేత!
కాఠ్మాండు: నిలువ నీడ లేని నిరుపేదలను పునరావాసం కల్పించకుండానే బలవంతంగా వారిన ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, సామాజిక కార్యకర్తలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నేపాల్లో వందలాది మంది యువతీ యువకులు మళ్లీ రోడ్లపైకి వచ్చారు. కాఠ్మాండులో నివాసాల ఖాళీ ప్రక్రియను నిరసిస్తూ, బాధిత నిరుపేదలకు న్యాయం చేయాలని, గృహ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కార్యాలయం వెలుపల భారీ ఎత్తున బైఠాయించారు.‘జాయింట్ నేషనల్ స్క్వాటర్స్ ఫ్రంట్’ ఆధ్వర్యంలో కాఠ్మాండులోని సింహదర్బార్ సెక్రటేరియట్ సమీపంలో ఉన్న మైతీఘర్ మండలా వద్ద ఈ నిరసన ప్రదర్శన జరిగింది. పేద కుటుంబాలను వేధించడం ఆపాలని, మానవ హక్కులను గౌరవించాలని, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని, నిరాశ్రయులైన నిరుపేదలకు శాశ్వత గృహ వసతి కల్పించాలని నిరసనకారులు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.పోలీసుల చర్యలతో పెరిగిన ఉద్రిక్తతలుశుక్రవారం రాత్రి కాఠ్మాండులోని కీర్తీపూర్ లో ఉన్న ఒక ప్రభుత్వ తాత్కాలిక పునరావాస కేంద్రం వరద ముంపునకు గురైంది. అక్కడ సుమారు 150 మంది నిరుపేదలు ఆశ్రయం పొందుతున్నారు. భద్రతా సిబ్బంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, మరుసటి రోజు పరిస్థితిని సమీక్షించడానికి వెళ్లిన ‘జెన్ జీ’యువ సామాజిక కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ లాఠీఛార్జ్లో ఒక నిరసనకారుడి ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు.పోలీసుల చర్యలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు గగన్ కుమార్ థాపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను ఖండిస్తూ, అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం నాడు కోశి ప్రాంతంలోని మోరంగ్ జిల్లా పోలీసు కార్యాలయం వెలుపల శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివాదానికి ప్రధాన కారణం ఇదే..ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నివాసాల ఖాళీ ప్రక్రియే ప్రస్తుత వివాదానికి కారణం. ఏప్రిల్ నెలలో కాఠ్మాండు లోయతో పాటు నేపాల్లోని ఇతర ప్రాంతాలలో ఉన్న పేదల బస్తీలను అధికారులు ఖాళీ చేయించారు. దీనివల్ల సుమారు 2,600 కుటుంబాలకు చెందిన 15,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో వందలాది మందిని తాత్కాలిక కేంద్రాలకు తరలించిన ప్రభుత్వం, జూలై 6 లోగా వాటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశించింది. అయితే, శాశ్వత పునరావాస ప్రణాళిక ఏదీ లేకపోవడంతో డజన్ల కొద్దీ కుటుంబాలు ఇప్పటికీ ఆ తాత్కాలిక కేంద్రాల్లోనే మగ్గుతున్నాయి. -
మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. హర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం సాయంత్రం నుంచి తాజా వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చర్యలు కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ దాడులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రకటించింది.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన యుద్ధరంగంగా మారింది. "వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం" అని సెంట్కామ్(CENTCOM) ప్రకటించింది. మరోవైపు అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్లో రాకపోకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రబిందువైంది.ఓవైపు దాడులు, మరోవైపు..అమెరికా తాజా దాడులు హర్మొజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్గాన్, ఖుజెస్టాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖొండాబ్లోని హెవీ వాటర్ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం.దీనికి ప్రతిగా హర్ముజ్ గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణి, ఒక ఆత్మాహుతి డ్రోన్ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.నీటి పంపింగ్ కేంద్రంపై దాడి.. ఒకరు మృతిఖుజెస్టాన్ ప్రావిన్స్లోని మహ్షహర్ ప్రాంతంలో వ్యవసాయ నీటి పంపింగ్ స్టేషన్పై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.ఐదో విడత దాడులుకాల్పుల విరమణ ప్రకటించి మూడు వారాలు కూడా గడవకముందే అమెరికా ఐదో విడత వైమానిక దాడులు చేపట్టింది. శనివారం ఒక్కరోజే ఇరాన్లో 140కి పైగా లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా.. తాజా దాడులతో మరింత ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, జోర్డాన్లోని అమెరికా ప్రయోజనాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.క్షీణించిన నౌకల రాకపోకలుయుద్ధ ప్రభావం సముద్ర రవాణాపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 79 డాలర్ల వద్దకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరిగింది.భారత్కూ ప్రభావంఒమన్ తీరంలో దాడికి గురైన జీఎఫ్ఎస్ గెలాక్సీ GFS Galaxy కంటైనర్ నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో 23 మందిని రక్షించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మరో నావికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్ముజ్లో పరిస్థితులు మరింత దిగజారితే భారత చమురు దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ముందు ఏం జరుగుతుంది?హర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా-ఇరాన్ ఎవరూ వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులతో ఒత్తిడి పెంచుతుంటే.. మరోవైపు ఇరాన్ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ఉక్రెయిన్ ప్రధాని యూలియా రాజీనామా
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన ప్రభుత్వంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా ప్రధాని యూలియా స్విరిడెంకో ఆదివారం రాజీనామా చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతుండటంతో పదవీ కాలం ముగిసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో యూలియా అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఒప్పందం తర్వాత ఆమె 2025 జూలైలో తన 39వ ఏట ప్రధానిగా నియమితులయ్యారు. తనకు మరింత కీలకమైన పదవిని ఇస్తానంటూ జెలెన్స్కీ వాగ్దానం చేసినట్లు రాజీనామా అనంతరం యూలియా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఆ పదవి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందంటూ యూలియా స్విరిడెంకో రాజీనామా నేపథ్యంలో జెలెన్స్కీ ప్రకటించడం గమనార్హం. ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామి దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో ఆమెకు అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లోనూ భారీగా మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంధన మంత్రి డెనిస్ ష్మిహాల్, అంతర్గత శాఖ మంత్రి ఇహోర్ క్లిమెంకో, రక్షణ మంత్రి మైఖెయిలో ఫెదొరొవ్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత నాలుగేళ్లలో ఇది నాలుగో కీలక ప్రక్షాళన కానుంది. -
బ్రహ్మపుత్ర మెగా డ్యామ్కు ముప్పు!
బీజింగ్: టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఒక క్రియాశీల ఫాల్ట్ లైన్ ఆ ప్రాజెక్టు నిర్మాణ స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలదని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో విపత్తులను నివారించడంలో తోడ్పడుతుందని చైనా చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దుకు సమీపంలోనే ఉంది. తూర్పు హిమాలయ ప్రాంతంలోని ఎర్త్ క్రస్ట్లో ఏర్పడిన పగులు ఈ భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల నిర్మాణ సమగ్రతను గణనీయంగా ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు చెప్పినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఈ పగులు జలాశయ ప్రాంతంతో పాటు ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి సమీప నిర్మాణాలు, వాటి స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైంటిస్టులు అంచనాకొచ్చారు. దీర్ఘకాలిక భూకంప పగుళ్ల కారణంగా చుట్టుపక్కల ఉన్న శిలా నిర్మాణాలు పగిలి, బలహీనపడ్డాయి. దీనివల్ల సమీపంలోని ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పునాదులు, నిర్మాణ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. చైనా గత జూలైలో టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై 167.8 బిలియన్ డాలర్ల వ్యయంతో ఆనకట్ట నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇక్కడ ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్కు పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారని అంచనా. -
మళ్లీ భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఒమన్ తీరంలో హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ‘జీఎఫ్ఎస్ గెలాక్సీ’పై ఇరాన్ సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారిలో 10 మందిని రక్షించగా, ఒకరు గల్లంతయ్యారు. అతడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో మొత్తంగా 23 మందిని కాపాడారు. వాణిజ్య నౌకపై ఇరాన్ దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గల్లంతైన నావికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మస్కట్లోని ఒమన్ అధికారులతో కలిసి ఇండియన్ ఎంబసీ గాలింపు చర్యలను సమీక్షిస్తోంది. ఇరాన్ దాడిలో నౌక వెంటనే మంటల్లో చిక్కుకుంది. హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ప్రకటించడానికి కొద్దిసేపటి ముందు హెచ్చరికగా జరిపిన దాడికి ఇరాన్ అభివర్ణించింది. ఈ దాడిలో సైప్రస్ జెండా కలిగిన జీఎఫ్ఎస్ గెలాక్సీ నౌక అగి్నకి ఆహూతయ్యింది. హార్మూజ్లో అది అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తోందని ఇరాన్ పేర్కొంది. ఈ ఘటన పట్ల ఎవరైనా ప్రతీకార చర్యకు దిగితే తమ ప్రతిస్పందన తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు జీఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడిని కారణంగా చూపుతూ అమెరికా సైన్యం ఇరాన్పై మరో విడత దాడులు చేపట్టింది. ఈ వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఇది మూడోది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని సుమారు 140 సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులుచేసింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీరప్రాంత నిఘా కేంద్రాలపై దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వెల్లడించింది. ఇరాన్లోని అత్యంత కీలకమైన ఖెష్మ్ దీవిపై ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుస దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ అధికార వార్తా సంస్థ ఈ విషయం ప్రకటించింది. దీవిలోని సైనిక లక్ష్యాలపై కనీసం డజను దాడులు జరిగినట్లు తెలిపింది. ఇరాన్ ప్రతిదాడులు అమెరికా తాజా దాడుల పట్ల ఇరాన్ వెంటనే ప్రతిచర్యకు దిగింది. ఆదివారం ఉదయం బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, ఒమన్లపై వైమానిక దాడులకు దిగింది. అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు ఖతార్ సైన్యం ప్రకటించింది. పొరుగున ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతర్లో ఇరాన్ దాడులను అడ్డుకునే క్రమంలో పడిన గగనతల రక్షణ వ్యవస్థ శకలాల కారణంగా ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే ధ్వంసం చేశామని కువైట్ వెల్లడించింది. అమెరికా దూకుడుపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నౌకలు అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆరోపించింది. వాటిలో ఒకనౌకపై ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. హార్మూజ్ను మూసేశామని పేర్కొంది. అయితే హార్మూజ్ తెరచే ఉందని అమెరికా పేర్కొంది. వచ్చేవారం జనం ముందుకు మొజ్తబా! ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వచ్చేవారం ప్రజల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ సభను వచ్చేవారం నిర్వహించబోతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల దాకా ఈ సభ జరుగనుంది. అయితే, ఈ కార్యక్రమానికి మొజ్తబా హాజరవుతారా? లేదా? అనే దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.నౌకలపై ఎలాంటి ఆంక్షలు వద్దు: భారత్ హార్మూజ్లో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతుండటంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనేలా దౌత్యపరమైన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలను విజయవంతంగా ముగించాలని విన్నవించింది. హార్మూజ్లో నౌకలపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టంచేసింది. వాణిజ్య నౌకాయానం, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుతమైన. నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరింది. -
ఖతార్లో నాలుగు రోజులు సెలవులు
దోహా: ఖతార్ మాజీ అమీర్ (ఫాదర్ అమీర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంతో ఆ దేశం నాలుగు రోజుల అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. జూలై 12 నుంచి సంతాప దినాలు అమల్లోకి వచ్చాయని ఖతార్ అమిరీ దివాన్ వెల్లడించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ పతాకాలను అవనత స్థితిలో ఎగురవేయనున్నారు. అలాగే జూలై 13 నుంచి మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులు జూలై 19న తిరిగి విధుల్లో చేరనున్నారు.1995 నుంచి 2013 వరకు ఖతార్ను పాలించిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీని ఆధునిక ఖతార్ రూపశిల్పిగా వ్యవహరిస్తారు. సహజ వాయువు (LNG) వనరులను సమర్థంగా వినియోగించి ఖతార్ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ఆయన హయాంలోనే ‘అల్ జజీరా’ మీడియా నెట్వర్క్ స్థాపించబడింది. 2022 ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు సాధించడం, ఖతార్ను అంతర్జాతీయ దౌత్య, పెట్టుబడులు, క్రీడా రంగాల్లో కీలక కేంద్రంగా నిలబెట్టడం ఆయన నాయకత్వంలోని ప్రధాన విజయాలుగా భావిస్తారు.2013లో అరుదైన నిర్ణయం తీసుకుంటూ స్వచ్ఛందంగా అధికారాన్ని తన కుమారుడు, ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి అప్పగించారు. ఆ తర్వాత కూడా దేశ అభివృద్ధికి మార్గదర్శకుడిగా కొనసాగారు. ఆయన మృతిపై ప్రపంచ దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేస్తుండగా, భారత ప్రభుత్వం కూడా ఒక రోజు జాతీయ సంతాపాన్ని ప్రకటించి జాతీయ పతాకాన్ని అవనత స్థితిలో ఎగురవేయాలని నిర్ణయించింది. -
బ్యాంకాక్లో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఒక ప్రముఖ పబ్లో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించి 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు.బ్యాంకాక్ చటుచాక్ జిల్లాలోని ‘రోంగ్ బీర్ నా లాడ్ప్రాయో’ పబ్లో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.ఉక్కిరిబిక్కిరి చేసిన దట్టమైన పొగఅధికారుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పబ్ ప్రవేశ ద్వారం వద్ద మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న కస్టమర్లు బయటకు రావడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే భవనం మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసిన పలువురు కస్టమర్లు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మృతదేహాలు పబ్లోని రెస్ట్రూమ్లలో లభ్యమవడం అక్కడి భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.ఘటనా స్థలానికి చేరుకున్న ప్రధానిప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు స్టేషన్ల నుండి వాహనాలతో తరలివచ్చి దాదాపు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. థాయ్లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో 27 మంది మరణించినట్లు ఆయన అధికారికంగా ధ్రువీకరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పబ్లో సరైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.గతాన్ని గుర్తుచేస్తున్న విషాదంఈ ప్రమాదం థాయ్లాండ్లో గతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదాలను గుర్తుకు తెస్తోంది. 2022లో తూర్పు థాయ్లాండ్లోని ఒక మ్యూజిక్ పబ్లో జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. అంతకుముందు 2009లో బ్యాంకాక్లోని శాంతికా నైట్క్లబ్లో న్యూ ఇయర్ వేడుకల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏకంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు. 🚨 SENSITIVE FOOTAGE: Distressing footage shows survivors scrambling to escape a deadly fire at a restaurant in Bangkok’s Chatuchak district.Reports say 27 people have died and many others were injured as authorities investigate.#Bangkok #Thailand #Fire #BreakingNews #Emergency https://t.co/jR3BdURx96 pic.twitter.com/iuM3Z9rQX2— Rosa News Official (@Mirha1206) July 12, 2026 -
హార్మూజ్ ఉద్రిక్తతలు.. ఖతార్ కీలక నిర్ణయం
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి, హార్మూజ్ జలసంధి పరిసరాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రత దృష్ట్యా దేశంలోని సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విహార పడవలు, ఫిషింగ్ బోట్లు, జెట్స్కీలు తదితర చిన్న సముద్ర వాహనాల యజమానులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఈ నిర్ణయం భద్రతా సంస్థలతో సంప్రదింపుల అనంతరం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్య అని ప్రభుత్వం స్పష్టం చేసింది.అయితే అంతర్జాతీయ సముద్ర నిబంధనల ప్రకారం నడిచే వాణిజ్య నౌకలు, అంతర్జాతీయ షిప్పింగ్ సేవలకు ఈ ఆంక్షలు వర్తించవని ఖతార్ ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు ప్రకటించినప్పటికీ, దక్షిణ సముద్ర మార్గంలో పరిమిత స్థాయిలో వాణిజ్య నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ సముద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే భద్రతా ముప్పు ఇంకా కొనసాగుతుండటంతో ప్రపంచ ఇంధన సరఫరాపై ఈ పరిణామాల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఖతార్ మాజీ రూలర్ షేక్ హమద్ కన్నుమూత
దోహా: ఖతార్ మాజీ అమీర్, ఆధునిక ఖతార్ నిర్మాణ శిల్పిగా గుర్తింపు పొందిన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఆదివారం (జూలై 12) 74 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఖతార్ అమిరి దివాన్ (రాజ కార్యాలయం) అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన మరణానికి గల కారణాన్ని వెల్లడించలేదు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఖతార్ ఎదగడంలో, అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన రంగం, పెట్టుబడులు, మీడియా రంగాల్లో దేశ ప్రభావాన్ని విస్తరించడంలో షేక్ హమద్ కీలక పాత్ర పోషించారు.గ్యాస్ సంపదతో ఖతార్కు కొత్త గుర్తింపు1995లో రక్తపాతం లేని ప్యాలెస్ తిరుగుబాటు ద్వారా తన తండ్రి షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ నుంచి అధికారాన్ని స్వీకరించిన షేక్ హమద్ దాదాపు 18 ఏళ్ల పాటు ఖతార్ను పాలించారు. ఆయన నాయకత్వంలో దేశం ఉత్తర గ్యాస్ క్షేత్రాల అభివృద్ధిపై భారీగా దృష్టి సారించి, ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఎగుమతిదారుల్లో ఒకటిగా ఎదిగింది. ఈ ఆర్థిక విప్లవమే ఖతార్ను ప్రపంచ వేదికపై ప్రధాన ఆర్థిక శక్తిగా నిలిపింది.మీడియా, క్రీడలు, దౌత్యంలో ప్రపంచ గుర్తింపుషేక్ హమద్ పాలనలోనే 1996లో అల్ జజీరా మీడియా నెట్వర్క్ ప్రారంభమైంది. అలాగే ఖతార్కు 2022 ఫిఫా ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు దక్కేలా చేసిన వ్యూహాత్మక ప్రయత్నాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మధ్యప్రాచ్య దౌత్యంలో మధ్యవర్తి దేశంగా ఖతార్కు ప్రత్యేక గుర్తింపు రావడం కూడా ఆయన హయాంలోనే జరిగింది.అరుదైన అధికార బదిలీగల్ఫ్ రాజ్యాల్లో అరుదుగా కనిపించే విధంగా, 2013లో షేక్ హమద్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుని తన కుమారుడు, ప్రస్తుత అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి అధికారాన్ని అప్పగించారు. ఈ శాంతియుత అధికార మార్పిడి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది.అపార సంపద.. ప్రపంచవ్యాప్త పెట్టుబడులుషేక్ హమద్ వ్యక్తిగత సంపద సుమారు 2 నుంచి 2.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని పలు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఆయన హయాంలో స్థాపించిన ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (QIA) ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటిగా ఎదిగి, బ్రిటన్లోని హారోడ్స్, ది షార్డ్, హీత్రూ విమానాశ్రయం వంటి ప్రముఖ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రభుత్వ పెట్టుబడులు ఆయన వ్యక్తిగత ఆస్తులకు వేరు.రాజ కుటుంబం.. 24 మంది సంతానంషేక్ హమద్ మూడు వివాహాలు చేసుకున్నారు. షేఖా మరియం, షేఖా మోజా బింట్ నాసర్, షేఖా నూరా ఆయన భార్యలు. వీరిలో షేఖా మోజా విద్య, మహిళా సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. షేక్ హమద్కు మొత్తం 24 మంది సంతానం ఉండగా, అందులో 11 మంది కుమారులు, 13 మంది కుమార్తెలు ఉన్నారు.'ఫ్లోటింగ్ ప్యాలెస్'గా పేరొందిన సూపర్ యాచ్షేక్ హమద్ విలాసవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచింది ఆయన సూపర్ యాచ్ అల్ మిర్కాబ్. సుమారు 300 మిలియన్ డాలర్ల విలువైన ఈ నౌకలో హెలిప్యాడ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్, జాకుజీ, అత్యాధునిక లగ్జరీ సూట్లు వంటి సదుపాయాలు ఉండటంతో దీనిని "ఫ్లోటింగ్ ప్యాలెస్"గా అభివర్ణిస్తారు.ఖతార్ను చిన్న గల్ఫ్ దేశం నుంచి ప్రపంచ రాజకీయాలు, ఇంధన మార్కెట్, అంతర్జాతీయ పెట్టుబడులు, క్రీడా రంగాల్లో ప్రభావశీల దేశంగా మార్చిన నాయకుడిగా షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ చరిత్రలో నిలిచిపోతారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
నేపాల్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్
ఖాట్మండు: నేపాల్ మరోసారి అట్టుడుకుతుంది. ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్లతో యువత పెద్దఎత్తున రోడ్లెక్కారు. దేశంలో నిరుద్యోగం పెద్దఎత్తున పెరిగిపోయిందని నిరసనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యకు యత్నించగా వారిలో ఇద్దరు మరణించారు.నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ఎన్నిక కావడానికి ప్రధాన కారణం అక్కడి జెన్జీ ఉద్యమం.. సెప్టెంబర్ 2025లో నాటి కె.పి. శర్మ ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం, అవినీతికి పాల్పడటంపై నేపాల్ యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. ఈ ప్రజాస్వామ్య ఉద్యమానికి బాలేంద్ర షా వెన్నుదన్నుగా నిలిచారు. ఆ నిరసనల వేడి పాత ప్రభుత్వాన్ని కూల్చేయడమే కాకుండా, యువత అంతా ఆయన వెనుక సమీకృతమమయ్యారు. దీంతో బాలేంద్రషా నేతృత్వంలోని నేపాల్ పార్లమెంట్లో ఉన్న మొత్తం 275 స్థానాల్లో ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఏకంగా 182 సీట్లు గెలుచుకుంది. ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.అయితే ప్రధానిగా బాలేంద్ర ఆరు నెలలైనా కాకముందే నేపాల్లో యువత ఆయనపై పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ పెద్దఎత్తున యువత రోడ్లెక్కారు. ఆయన రాజీమామా చేయాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్య యత్నం చేయగా అందులో ఇద్దరు మరణించారు.దీంతో ప్రధానమంత్రి ప్రజావ్యతిరేకంగా, నిరంకుశంగా పరిపాలిస్తున్నారని జెన్-జి నేపాల్ సంస్థ ఆరోపించింది. యువత ఉపాధి, ఆదాయాన్ని పెంచేందుకు బడ్జెట్, విధానాలు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని యువతలో ఆశ, విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఆరోపించింది. -
అలీ ఖమేనీ అంత్యక్రియల్లో కనిపించిన మిస్టరీ వ్యక్తి ఎవరు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో నల్ల ముసుగు ధరించిన ఓ వ్యక్తి కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ముందు వరుసలో నిలబడి ప్రార్థనల్లో పాల్గొన్న ఆ వ్యక్తిని చూసిన చాలామంది మొజ్తబా ఖమేనీ తొలిసారి బహిరంగంగా కనిపించారని ఊహించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే కొద్ది గంటల్లోనే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ముసుగు వెనుక ఉన్న వ్యక్తి మొజ్తబా ఖమేనీ కాదని, అలీ ఖమేనీ పెద్ద మనవడు మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలు కావడం వల్లే ఆయన ముఖాన్ని ముసుగుతో కప్పుకున్నట్టు సమాచారం. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది.ఆ ముసుగు మనిషి ముందు వరుసలో నిలబడి అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆయన బేస్బాల్ టోపీ ధరించి, ముఖాన్ని నల్ల ముసుగుతో కప్పుకున్నారు. అయితే, ఆయన మొహమ్మద్ జవాద్ ఖమేనీ అని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించడంతో ఆయన ఎవరో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.జవాద్ ఖమేనీకి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆ దాడుల్లోనే అలీ ఖమేనీ మరణించారు. మొజ్తబా ఖమేనీ ముఖం కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టు అమెరికా నిఘా నివేదికలు తెలిపాయి.మొహమ్మద్ జవాద్ ఖమేనీ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు మొస్తఫా ఖమేనీ. మొస్తఫా కుమారుడే మొహమ్మద్ జవాద్ ఖమేనీ. మొస్తఫా ఖమేనీ సుమారు 1965లో జన్మించినట్టు అక్కడి మీడియా తెలిపింది. అలీ ఖమేనీ అంత్యక్రియలు గురువారం జరిగాయి. 6 రోజుల పాటు సాగిన కార్యక్రమంలో 43 మిలియన్ల మంది పాల్గొన్నట్టు ప్రభుత్వ మీడియా తెలిపింది. కాగా, మొజ్తబా ఖమేనీ శనివారం టెలిగ్రామ్లో లిఖితపూర్వక సందేశం విడుదల చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని అందులో పేర్కొన్నారు. -
అజ్ఞాతం వీడనున్న మొజ్తబా ఖమేనీ.. త్వరలో తొలి బహిరంగ సభ
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బహిరంగంగా ఎక్కడా కనిపించని మొజ్తబా ఖమేనీ వచ్చే వారంలో తొలిసారి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకునిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు.తాజాగా తన తండ్రి అయాతొల్లా అలీ ఖమేనీ జ్ఞాపకార్థం జూలై 23న సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు టెహ్రాన్లో మొజ్తబా ఖమేనీ స్మారక సభను నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటనలో దివంగత నేతను ‘అమర ముజాహిద్ ఇమామ్’గా అభివర్ణించారు.తండ్రి అంత్యక్రియలకు దూరంఇటీవల జరిగిన అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హాజరుకాలేదు. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ గ్రాండ్ మొసల్లాలో వేలాది మంది సమక్షంలో జరిగిన ఈ సభలో మొజ్తబా సోదరులు ముగ్గురు (మొస్తఫా, మేసమ్, మసౌద్ ఖమేనీ) మాత్రమే ప్రార్థనలు జరిపారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికలను ఈ అంత్యక్రియల్లో పక్కపక్కనే ఉంచారు. దేశంలోనే అత్యున్నత పదవిని చేపట్టినప్పటికీ, ఈ అంత్యక్రియల్లో మొజ్తబా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో బిగ్ తగిలింది. హాసీనాకు సంబంధించిన వార్తల ప్రసారంపై బంగ్లా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హసీనా చేసిన ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ప్రసంగాలు లేదా ఆమెకు సంబంధించిన ఇతర వ్యాఖ్యలను ప్రచురించవద్దని అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆన్లైన్ మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నదని ప్రభుత్వం వెల్లడించింది.ఈ సందర్భంగా బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ సలహాదారు డాక్టర్ జాహెద్ ఉర్ రహ్మాన్ మాట్లాడుతూ.. కొందరు మీడియా సంస్థలు కోర్టు నిషేధాన్ని పాటించడం లేదని గుర్తించినట్లు తెలిపారు. అందువల్ల అన్ని మీడియా సంస్థలు న్యాయస్థానం ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. కాగా, ఇటీవల షేక్ హసీనా వార్తా సంస్థ రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూను కొన్ని బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రచురించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ప్రభుత్వం మీడియాకు తాజా ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉండగా.. 2024లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయి దేశం విడిచిన సంగతి తెలిసిందే. అనంతరం, ఆమె భారత్లో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్లో పలు కేసులు నమోదై ఉండగా, ఆమెను "పరారీలో ఉన్న మాజీ ప్రధాని"గా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇటీవల హసీనా ఈ ఏడాది డిసెంబరులో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి అధికారుల ఎదుట లొంగిపోతానని ప్రకటించారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వాతంత్ర్యంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం మాత్రం ఇది కోర్టు ఆదేశాల అమలులో భాగమేనని చెబుతుండగా, విమర్శకులు ఈ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. -
హార్ముజ్లో నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
ఒమన్ తీరంలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్ ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడులు జరిపింది. దాడి తర్వాత ఓ భారతీయడు గల్లంతయ్యాడు. దాడులు కారణంగా 'జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌకలో మంటలు చెలరేగాయి. నౌకలో ఉన్న మొత్తం 11 మంది భారతీయులలో 10 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించగా.. మరొకరు గల్లంతయినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది.ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. శనివారం అర్ధరాత్రి ఇరాన్పై మూడో విడతగా యూఎస్ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల్లో ఇరాన్, డ్రోన్, క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ ఒక్కవారంలోనే అమెరికా జరిపిన 3 విడతల దాడుల్లో ఇరాన్కు చెందిన 300కు పైగా వ్యూహాత్మక సైనిక కేంద్రాలు తగలబడ్డాయి. -
భారత సంతతి గూగుల్ లీడ్ ఇంజినీర్ దారుణ హత్య
అట్లాంటా: అమెరికాలో భారతీయ సంతతి మహిళ గృహ హింసకు బలయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో వారి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. భర్త ఆవేశంలో తుపాకితో కాల్పులు జరపగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన కుమారుడ్ని కూడా చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కిర్క్ బి. వ్రజెసిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జియాలోని స్మిర్నా సిటీలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ముందు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు 57 ఏళ్ల శీతల్ వ్రజెసిన్ ఇంట్లో బుల్లెట్ గాయాలతో పడి ఉండటం కనిపించింది. తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూశారు.గాయపడిన కుమారుడు జేసన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన శీతల్ వ్రజెసిన్ గూగుల్లో ఇంజనీరింగ్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో ఆమెకు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గూగుల్లో చేరడానికి ముందు, ఆమె హోమ్ డిపోలో మొబైల్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్ట్లకు నాయకత్వం వహించారు. కంపెనీ డిజిటల్ హోమ్ డెకర్, ఫర్నిషింగ్స్ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఇంగ్లాండ్, భారత్, ఘనా దేశాలలో పెరిగిన శీతల్.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ప్రతిష్టాత్మక 'జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'కి వెళ్లారు. ఆమె అట్లాంటాలో తన భర్త మరియు ఇద్దరు పిల్లలు (జేసన్, జెస్సికా)లతో కలిసి నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ పేటెంట్లలో ఆమె రెండు పేటెంట్లకు ఇన్వెంటర్గా గుర్తింపు పొందారు. -
చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్ దెబ్బకు అతలాకుతలం
చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి (Typhoon Bavi) తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి.TyphoonBavi.. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.#China evacuated more than 1 million people & issued high alerts as eastern China braced for #TyphoonBavi, which brought strong winds and rain to #Japan's southern islands and #Taiwan. #floods #Phillipines #typhoon #Bavi #Beijing #heavyrain pic.twitter.com/hjSWM5y1kQ— Salar News (@EnglishSalar) July 11, 2026టైఫూన్ దెబ్బకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విమాన సర్వీసులు రద్దయ్యాయి, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాంఘైలోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. చైనాతో పాటు తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా టైఫూన్ ప్రభావం చూపింది. తైవాన్లో బలమైన గాలులు, వర్షాల కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వాతావరణ నిపుణులు మరో హెచ్చరిక జారీ చేశారు. తుపాను బలహీనపడినప్పటికీ తూర్పు చైనా ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి, ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ప్రకృతి ప్రకోపం నుంచి కోట్లాది మంది ప్రజలను రక్షించేందుకు భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.🇹🇼 Typhoon Bavi is battering Taiwan, forcing more than 14,000 people to evacuate. Keelung is being lashed by fierce winds and heavy rain, while over 27,000 households are already without power. 🌪️⚠️ #TyphoonBavi #Taiwan #Breaking pic.twitter.com/VU1Nrd0AkB— 呀婷 (Ya-Ting) (@YaTing542311) July 11, 2026Nature returning the trash with gigantic waves during the arrival of Typhoon Bavi in Taizhou, Zhejiang Province, China 🇨🇳 , on July 11, 2026.#TyphoonBavi pic.twitter.com/aX9ulp23gN— 🄲🄾🄻🄾🄽🄴🄻 🄱🄾🄶🄴🅈 (@alfadelta0108) July 11, 2026 -
టొరంటోలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
టొరంటో: కెనడాలోని టొరంటోలో స్ట్రీట్ ఫెస్టివల్ జరుగుతుండగా కాల్పుల కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత అక్కడ యాక్టివ్ షూటర్ ఉన్నట్లు హెచ్చరించిన పోలీసులు, ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని ప్రకటించారు. సెయింట్ క్లేర్ ఎవెన్యూ వెస్ట్, అర్లింగ్టన్ ఎవెన్యూ సమీపంలో 'సాల్సా ఆన్ సెయింట్ క్లేర్' ఉత్సవం జరుగుతుండగా ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని, మొత్తం ఆరుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని టొరంటో పోలీసులు వెల్లడించారు.పరారీలో నిందితులుకాల్పులు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ, కాల్పులకు తెగబడిన నిందితుడు లేదా నిందితులు ఇంకా పట్టుబడలేదని పోలీసులు తెలిపారు. లాటినో సంస్కృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ 'సాల్సా' ఉత్సవ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. Toronto, Canada | An incident of mass shooting reported at a street festival on St Clair Ave W & Arlington Ave, resulting in two deaths and injuring 6 others. The suspect is still at large. Heavy police force deployed at the scene. Public has been asked to avoid the area: Toronto… pic.twitter.com/37cPvePepe— ANI (@ANI) July 12, 2026ప్రత్యక్ష సాక్షుల కథనంఈ ఉత్సవంలో స్టాల్ నడుపుతున్న ప్యాట్సీ గుటిరెజ్ అనే మహిళ మాట్లాడుతూ.. తాను కస్టమర్లకు వస్తువులు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జనం భయంతో పరుగులు తీయడం చూశానని తెలిపారు. దీంతో తాము వ్యాపారాన్ని నిలిపివేశామని, ఇలాంటి ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రత్యక్ష సాక్షి వాలెరీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. శనివారం రాత్రి తాను ఒక రెస్టారెంట్ సమీపంలో కూర్చుని ఉన్నప్పుడు జనం కేకలు వేస్తూ పరుగులు తీశారని చెప్పారు. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో అందరం నేలపై పడుకున్నామని ఆమె వివరించారు.ఈ హింసాత్మక ఘటనపై అంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్ ఫెస్టివల్లో జరిగిన ఈ దారుణ హింస నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇద్దరు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.ఘనంగా ‘సాల్సా ఆన్ సెయింట్ క్లేర్’అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. లాటినో సంస్కృతి ప్రతిబింబించేలా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో లైవ్ లాటిన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ ఆహార స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఏడాది ఈ ఉత్సవం 22వ సారి జరుగుతోంది. టొరంటో నగర నడిబొడ్డున ఉన్న వాణిజ్య ప్రాంతంలో జరిగే ఈ వేడుకకు వేలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. అలాంటి రద్దీ ప్రాంతంలో ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా టొరంటోకు పేరుంది. కెనడాలోనే అతిపెద్ద నగరమైన ఇక్కడ, ఇలాంటి బహిరంగ ప్రదేశాల్లో కాల్పులు జరగడం చాలా అరుదు. -
ఇరాన్-అమెరికా మధ్య పతాక స్థాయికి క్షిపణి పోరు
ఇరాన్-అమెరికా మధ్య క్షిపణి పోరు పతాక స్థాయికి చేరింది. నిన్న అర్ధరాత్రి ఇరాన్పై మూడో విడతగా యూఎస్ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల్లో ఇరాన్, డ్రోన్, క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ ఒక్కవారంలోనే అమెరికా జరిపిన 3 విడతల దాడుల్లో ఇరాన్కు చెందిన 300కు పైగా వ్యూహాత్మక సైనిక కేంద్రాలు తగలబడ్డాయి.అమెరికా దాడులకు వ్యతిరేకంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ విరుచుకుపడుతోంది. జోర్డాన్లోని యూఎస్ సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. కమాండ్ కంట్రోల్ సెంటర్, కీలక డ్రోన్ హ్యాంగర్లు ధ్వంసమయ్యాయి. కువైట్, బహ్రెయిన్లో అమెరికా పేట్రియాట్ రక్షణ వ్యవస్థల రాడర్ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఖతార్, యూఏఈ దేశాలపైకి దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులను గాల్లోనే రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. దోహా భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఖతార్ సర్కార్.. భద్రతా అలర్ట్ జారీ చేసింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నామని యూఏఈ ప్రకటించింది. అమెరికా ఇరాన్పై దాడులు చేసిన అనంతరం మొత్తం మధ్యప్రాచ్యంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలమైన ప్రతిదాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో.. ప్రభుత్వం పౌరుల మొబైల్ ఫోన్లకు అత్యవసర భద్రతా హెచ్చరిక పంపింది.దేశంలో భద్రతా ముప్పు స్థాయి గణనీయంగా పెరిగినట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దోహాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పౌరులంతా తమ ఇళ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని.. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఏవిధమైన వైమానిక ముప్పు నుంచైనా రక్షణ పొందేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని పౌరులు, వలస కార్మికులకు సూచించారు. దోహాలో తీవ్రమైన పేలుళ్ల శబ్దాలు.. అలాగే ఇరాన్.. అమెరికా స్థావరాలపై చేపట్టిన ప్రతిదాడుల అనంతరం కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలో కూడా పేలుళ్లు సంభవించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదిలా ఉండగా, తమ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వినిపించిన భారీ పేలుళ్ల శబ్దాలు వాస్తవానికి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఫలితమేనని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు దాడిచేసే డ్రోన్లను గగనతలంలోనే విజయవంతంగా అడ్డగించి ధ్వంసం చేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది.ఫార్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. అమెరికా స్థావరాలపై ఇరాన్ సైన్యం చేపట్టిన ప్రతిదాడుల అనంతరం గల్ఫ్ ప్రాంతంలోని ఇతర ప్రధాన దేశాల్లో కూడా కలకలం రేగింది. యూఏఈ, ఖతార్లతో పాటు కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన గల్ఫ్ ప్రాంత దేశాలన్నీ తమ భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకుంటూ, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తంగా చూస్తే, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణ ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా, మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. అంతర్జాతీయ చమురు, గ్యాస్ సరఫరాపై కూడా ఈ ఉద్రిక్తతలు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ప్రపంచానికి డేంజర్ బెల్.. ఇరాన్ సీక్రెట్ మిషన్ లీక్?
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ మౌనంగా మరో మిషన్ మొదలుపెట్టిందా? అంతర్జాతీయంగా ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని కీలక సైనిక, న్యూక్లియర్ సంబంధిత కేంద్రాల్లో మళ్లీ కదలికలు మొదలైనట్లు సూచిస్తున్నాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనపై అనుమానాలు మరింత పెరిగాయి.మధ్యప్రాచ్యం ఇప్పటికే ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. అమెరికా ఇరాన్ స్థావరాలపై దాడులు చేయడం, ఆ తర్వాత హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ సమయంలోనే ఇరాన్ తన దెబ్బతిన్న సదుపాయాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాలు చూపిస్తున్నాయని సమాచారం. కాగా, అత్యంత ఆసక్తిని రేపుతున్న ప్రాంతం ఇరాన్లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్. పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ఈ ప్రాంతాన్ని గతంలోనే న్యూక్లియర్ ఆయుధాల అభివృద్ధికి సంబంధించిన పరిశోధనలతో అనుసంధానం చేశాయి. తాజాగా అక్కడ భారీ స్థాయిలో కదలికలు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు, నేలను సరిచేసే పనులు, నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.కేవలం పార్చిన్ మాత్రమే కాదు.. తబ్రీజ్, కెర్మాన్షా సమీపంలోని కొన్ని క్షిపణి స్థావరాలు, వైమానిక స్థావరాల్లో కూడా పునరుద్ధరణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భూగర్భ సదుపాయాల వద్ద వాహనాల రాకపోకలు పెరగడం కూడా నిఘా వర్గాల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు పెద్దఎత్తున పునర్నిర్మాణ కార్యకలాపాలకు స్పష్టమైన ఆధారాలు బయటపడలేదని సమాచారం.CNN reports that newly released satellite imagery suggests #Iran may be rebuilding suspected #nuclear #facilities following recent U.S. strikes, raising fresh questions about the extent of the damage and Tehran's ongoing nuclear activities. pic.twitter.com/4YvsbIs97X— The Kabul Tribune (@TheKabultribun) July 11, 2026ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య గతంలో కుదిరిన అవగాహన ప్రకారం, ఇరాన్ తన పరమాణు కార్యక్రమాన్ని నియంత్రించాలని, ఆయుధాల తయారీ దిశగా వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ఆ ఒప్పంద భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు అమెరికా, పశ్చిమ దేశాల భద్రతా నిపుణులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఉపగ్రహ ఆధారాలు మరింత బలపడితే, ఇరాన్పై కొత్త ఆంక్షలు లేదా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు దౌత్య చర్చలు.. మరోవైపు రహస్య కదలికల అనుమానాలు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. -
‘కళ్లముందే నా స్నేహితుడిని కోల్పోయా’.. వియాత్నం బోటు ప్రమాద బాధితుడు
వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు సహా మొత్తం 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరి స్నేహితుడు ప్రమాద సమయంలో చోటుచేసుకున్న భయానక పరిస్థితులను వివరించాడు.అతను తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వెంటనే నీటిలోకి దూకి ప్రాణాలు కాపాడుకోగా, మరికొందరు బోటులోనే చిక్కుకుపోయారు. తన స్నేహితుడు బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ బోటులో ఇరుక్కుపోయాడని, అతడిని రక్షించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాడు.ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందగా, పలువురు గాయాలతో బయటపడ్డారు. ఘటనపై వియత్నాం అధికారులు దర్యాప్తు చేపట్టారు. అలాగే, భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. -
దాడితో మొదలైన విధ్వంసం.. ఇంతలో దౌత్య చర్చలు!
వాషింగ్టన్: హార్ముజ్ జలసంధిలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న ‘ఎమ్/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ’ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) దాడికి పాల్పడింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అమెరికా, ఇరాన్పై శనివారం మూడో విడత సైనిక దాడులకు దిగింది. ఐఆర్జీసీ దాడి వల్ల నౌక ఇంజన్ గది తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో మంటలు చెలరేగడంతో ప్రయాణానికి వీలులేకుండా పోయిందని, ఒక సిబ్బంది గల్లంతయ్యారని యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు సెంట్కామ్ పేర్కొంది.‘ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తోంది’ అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. మరోవైపు, పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హార్ముజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు దిగింది. తమపై మరిన్ని దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఖతార్, ఒమన్ దేశాలు ఇరాన్తో ముమ్మర దౌత్య చర్చలు జరుపుతున్నాయి. -
హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నాం : ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్–అమెరికా పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో గుర్తింపు లేని, అనధికారిక నౌకల రాకపోకలకు అనుమతి లేదని ఇరాన్ ముందునుంచే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా అనధికారికంగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. అనంతరం హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.ఈ పరిణామాల మధ్య, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. మూడో దఫా తమ భూభాగంపై అమెరికా దాడులకు పాల్పడిందని పేర్కొంటూ, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ, ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని వెల్లడించింది.యుద్ధాన్ని ముగించేందుకు గత నెలలో కుదిరిన ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే చర్చలు హర్మూజ్ జలసంధి భద్రత లేకుండా ముందుకు సాగలేవని అమెరికా ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరాన్ కూడా స్పష్టమైన బహిరంగ ప్రకటన చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఓ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపామని, హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నామని వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు, వాటికి అమెరికా ప్రతిస్పందనల నేపథ్యంలో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. ఈ పరిస్థితులపై చర్చించేందుకు ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు శనివారం సమావేశమైన అనంతరం ఈ ప్రకటనలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా, తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తూ, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందించిన ట్రంప్, తనపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
కొత్త ఏఐ టూల్ను నిలిపేసిన మెటా
శాన్ఫ్రాన్సిస్కో: పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ(ఏఐ) టూల్లోని ఒక ఫీచర్ను ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ల మాతృసంస్థ ‘మెటా’ నిలిపివేసింది. ఏఐతో చిత్రాలను సృష్టించడానికి ప్రజల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒక ముడిసరుకుగా వాడుకుంటోందని ఆ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఉపయోగకరమైన ఒక సృజనాత్మక సాధనాన్ని అందించడం, అలాగే వారి పబ్లిక్ కంటెంట్ను ఈ విధంగా వాడుకోవచ్చా లేదా అనే దానిపై అందరికీ అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం రావడంతో దీనిని ఇకపై అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. మెటా సంస్థ వారం రోజుల క్రితం ‘మ్యూజ్ ఇమేజ్’ పేరిట కొత్త ఏఐ టూల్ను తీసుకొచ్చింది. చిత్రాలను రూపొందించే సామర్థ్యం ఉన్న ఇతర ఏఐ యాప్ల మాదిరిగానే మ్యూజ్ ఇమేజ్ వినియోగదారుల సూచనల ఆధారంగా చిత్రాలను సృష్టిస్తుంది. కొత్త చిత్రాలను సృష్టించేటప్పుడు రిఫరెన్స్గా ఉపయోగపడటానికి అన్ని పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలను ఈ టూల్ స్వయంచాలకంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. -
పునర్వినియోగ రాకెట్... జపాన్ తొలి పరీక్ష సక్సెస్
టోక్యో: ఆసియా దేశాలు పునర్వినియోగ రాకెట్లను పోటాపోటీగా అభివృద్ధి చేస్తున్నాయి. చైనా ఈ దిశగా ఒక ప్రయోగాన్ని విజయవంతం చేసి 24 గంటలు కూడా గడవక ముందే జపాన్ కూడా తొలి పరీక్షలో సక్సెస్ నమోదు చేసింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు ఈ రంగంలో స్పేస్ ఎక్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకూ పునర్వినియోగ రాకెట్లు ఉపయోగపడతాయని జపాన్ అంచనా. ఆర్వీ–ఎక్స్ పేరుతో జపాన్ అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్ శనివారం ఒకే ఒక్క నిమిషం పాటు గాల్లోకి ఎగిరి కొంత పక్కకు జరిగి ల్యాండైంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించిన నోషిరో టెస్టింగ్ సెంటర్లో జరిగిన ఈ ప్రయోగాన్ని ఎన్వీఎస్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేయడం గమనార్హం. జపాన్ అంతరిక్ష ప్రయోగాలకు చాలా కాలంగా ఒకేసారి వాడగలిగే హెచ్–3 శ్రేణి రాకెట్లను వాడుతున్న విషయం తెలిసిందే. అంతకంటే మునుపు వాడిన హెచ్2ఏ శ్రేణి రాకెట్ల కంటే ఇది చౌక అయినప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల మార్కెట్లో పోటీకి ఖర్చులు మరింత తగ్గాల్సి ఉంటుంది. జాతీయ భద్రతకు ఇది అత్యవసరమని జపాన్ భావిస్తోంది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా, మిత్సుబుషి హెవీ ఇండస్ట్రీస్లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ఆర్వీ–ఎక్స్ రాకెట్ సుమారు 23.9 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వ్యాసం కలిగి ఉంది. అత్యాధునిక ఇంజిన్లు, నాలుగు షాక్ అబ్జార్బర్లతో కూడిన ల్యాండింగ్ గేర్ దీని ప్రత్యేకతలు. పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో జాక్సా ఫ్రాన్స్, జర్మనీల సాయం కూడా తీసుకుంటోంది. -
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకుకోర్టు నోటీసులు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ కొత్త విమానం గురించి వార్త రాసినందుకు అమెరికా వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఖతర్ బహుమతిగా ఇచ్చిన విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానంగా మార్చిన సంగతి, వారం రోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చిన విషయమూ తెలిసిందే. అయితే ఈ కొత్త విమానంలో భద్రతా వ్యవస్థలను ప్రశ్నిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లు వార్తలు ప్రచురించారు. దీనిపై శుక్రవారం తమ రిపోర్టర్లు జూలియన్ ఈ. బార్న్స్, ఎరిక్ లిప్టన్, టైలర్ పేజర్, ఎరిక్ ష్మిట్లకు నోటీసులు జారీ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. రానున్న బుధవారం మాన్హాటన్లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ముందు సాక్ష్యం ఇవ్వాలన్నది ఈ నోటీసుల సారాంశం. ఫెడరల్ ఏజెంట్లు కొంతమంది జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదీ నేపథ్యం...డొనాల్డ్ ట్రంప్ గత వారం కొత్త ఎయిర్ ఎయిర్ ఫోర్స్వన్లో టర్కీలో జరిగిన నాటో సదస్సుకు వెళ్లారు. అయితే బుధవారం మాత్రం పాత ఎయిర్ ఫోర్స్–వన్లో ఇంగ్లాండ్లోని మిల్డెన్హాల్లో ఉన్న రాయల్ ఎయిర్ఫోర్స్ కేంద్రానికి వెళ్లారు. ఆసక్తికరంగా కొత్త విమానమూ అక్కడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ట్రంప్ కొత్త విమానంలో తిరిగి వచ్చారు. అమెరికా – ఇరాన్ల మధ్య కాల్పుల ఒప్పందం విఫలమైన సందర్భంలోనే విమానాల మార్పు జరిగింది. అమెరికా ఇరాన్పై దాడులు చేయగా ఇరాన్ మూడు గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణులు ప్రయోగించింది. ఈ నేపథ్యంలో 40 కోట్ల డాలర్ల ఖర్చుతో మార్పులుచేర్పులు చేసిన కొత్త ఎయిర్ఫోర్స్ వన్లో ఆధునిక భద్రత వ్యవస్థలు లేవేమో అన్న అనుమానంతో న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. భద్రతా దళాల సూచనల మేరకు అధ్యక్షుడు పాత విమానంలో వెళ్లారని తెలిపింది. అయితే ట్రంప్ వాటిని ఖండించారు. సైనికులకు కొత్త ఎయిర్ఫోర్స్వన్ను చూపేందుకే మిల్డెన్హాల్లో ఆగినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. వైట్ హౌస్ కొత్త విమానంలో భద్రతా లోపాలు లేవని స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు నోటీసులు జారీ చేసిన విషయంపై శనివారం వరకూ వైట్హౌస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. -
నన్ను చంపితే ఇరాన్ భూస్థాపితం
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్ భూతలంపై అమెరికా.. అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ బాంబులేస్తూ పశ్చిమాసియాలో రణజ్వాలల్ని కొనసాగిస్తుండగా శనివారం మాత్రం పరస్పర హెచ్చరికల పర్వానికి తెరలేపారు. తండ్రి మరణానికి కారణమైన ట్రంప్ను అంతమొందిస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞచేసిన కొన్ని గంటలకే ట్రంప్ సైతం దీటైన హెచ్చరిక చేశారు. తనను చంపితే ప్రపంచపటంలో ఇరాన్ లేకుండా చేస్తామని, దారుణ వినాశనం సృష్టించేలా 1,000 క్షిపణులు దాడికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇరాన్ ప్రభుత్వం గనక నన్ను చంపితే మరుక్షణమే ఇరాన్ను భూస్థాపితం చేసేందుకు 1,000 క్షిపణులు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. అవి వినాశనం సృష్టించాక మిగతా భూమిని మరుభూమిగా మార్చేందుకు వేలాదిగా మిస్సైళ్లు వరసబెట్టి విరుచుకుపడతాయి. ఒకవేళ నన్ను చంపితే ఇరాన్పై ఎంతటి స్థాయిలో దాడిచేయాలో మా సైన్యానికి సమగ్రస్థాయిలో ఆదేశాలు ఇప్పటికే ఇచ్చేశా. ఇరాన్లో అంగుళం స్థలం కూడా వదలకుండా ఏడాది పొడవునా దాడులు చేయాలని గతంలోనే తగు ఆజ్ఞలు జారీచేశా’’అని ట్రంప్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటాం: మొజ్తాబా అంతకుముందు శుక్రవారం దివంగత ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ అధికార వార్తఛానల్లో మొజ్తాబా ఖమేనీ సందేశాన్ని ప్రసారంచేశారు. ‘‘ట్రంప్ను చంపాలనేది మా దేశ సంకల్పం. ఈ సంకల్పాన్ని సాధించి తీరతాం. అమరత్వం పొందిన మా నేత రక్తాన్ని చిందేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ఘోరాలకు పాల్పడిన వాళ్లను వదలిపెట్టం. రెండు యుద్దాల్లో మా వాళ్లు అమరులయ్యేలా చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. నేరాలు చేసిన హంతకుల అంతుచూస్తాం’’అని మొజ్తాబా అన్నారు. హార్మూజ్ను తమ గుప్పిట పట్టామని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా సీనియర్ ఉన్నతాధికారి తప్పుబట్టారు. ఇరాన్ తక్షణం హార్మూజ్ను తెరచి ఉంచామని ప్రకటన చేయాలని హెచ్చరించారు. హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు ఎలాంటి హానీ తలపెట్టొద్దని డిమాండ్చేశారు. గత రెండ్రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్లో 17 మంది చనిపోయారు. 115 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్పూర్ తెలిపారు. మరోవైపు మధ్యవర్తి ఒమన్ దేశంతో చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్అరాఘ్చీ సిద్ధమయ్యారు. తమ క్రూడ్, ఫ్యూయల్ను విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధించడం సబబుగా లేదు అని అరాఘ్చీ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
సర్జరీ లేకుండా పేస్మేకర్
గుండె సమస్యలకు చెక్ పెట్టి అది సక్రమంగా కొట్టుకునేలా చేసేందుకు వాడే పేస్మేకర్ అమర్చేందుకు ఇక శస్త్రచికిత్స అవసరం లేదు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అల్ట్రాసౌండ్తోనే పనిచేసే పేస్మేకర్ ఒకదాన్ని అభివృద్ధి చేయడం ఇందుకు కారణం. సూక్ష్మస్థాయి అల్ట్రాసౌండ్ ట్రాన్స్డ్యూసర్లు కలిగి ఉండే ఈ సరికొత్త పేస్మేకర్ను ఛాతీపై ఎడమవైపు రొమ్ము కింది భాగంలో అతికించుకుంటే చాలు గుండె ఎలక్ట్రికల్ సిగ్నళ్ల సమస్యలు, కొట్టుకునే పద్ధతిలో తేడాలను సరిచేయవచ్చు. అయితే ఈ పేస్మేకర్ విడుదల చేసే అ్రల్టాసౌండ్ సంకేతాలను గుర్తించేందుకు గుండె కణాలు కొన్నింటిని ప్రత్యేకంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ‘ఎంఎస్సీఎల్జీ22ఎస్’పేరున్న అయాన్ ఛానల్తో గుండె కణాల్లో మార్పులు చేసి రక్తం లేదా నేరుగా గుండె కండరాలకు అందజేస్తారు. ఈ కణాలు అ్రల్టాసౌండ్ సంకేతాలకు స్పందించి గుండె ఒక క్రమ పద్ధతిలో కొట్టుకునేలా చేస్తుంది. శబ్ధం(అ్రల్టాసౌండ్), జెనిటిక్స్(కణాల్లో మార్పులకు) రెండింటినీ ఉపయోగిస్తున్నందున ఈ పద్ధతికి సోనోజెనిటిక్స్ అని పేరు. ఇంకోలా చెప్పాలంటే గుండె కణాలు శబ్దాన్ని వినేలా చేస్తారు. ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించి సత్ఫలితాలు సాధించారు. అ్రల్టాసౌండ్ శబ్ధాలకు గుండె కణాలు ఒక క్రమ పద్ధతిలో కొట్టుకున్నాయి. జంతువుల్లోనూ గుండె పనితీరు మెరుగైనట్లు గుర్తించారు. ఎలుకలు, పంది గుండెలకు అమర్చిన ఈ సరికొత్త పేస్మేకర్లు ఎనిమిది నెలలపాటు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేశాయి. మరిన్ని పరీక్షల ద్వారా ఫలితాలను నిర్ధారించుకుంటే మరికొన్నేళ్లలోనే పేస్మేకర్ అమర్చేందుకు శస్త్ర చికిత్స చేయాల్సిన శ్రమ తప్పిపోనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం
అక్లాండ్: భారత్–న్యూజిలాండ్ స్నేహం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రూ.35,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. సముద్ర భద్రత విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. న్యూజిలాండ్లోని అక్లాండ్లో శనివారం భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సమావేశమయ్యారు. రెండుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. శాంతియుత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని తీర్మానించారు. ఇరువురు నేతల భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా 18 అంశాలపై అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడానికి నాలుగేళ్ల రోడ్మ్యాప్, హైడ్రోగ్రాఫిక్ డేటా షేరింగ్ను ప్రోత్సహించడం, పరస్పర నావికాదళ లాజిస్టిక్స్ను సులభతరం చేయడం, ఇండో–పసిఫిక్లో మెరుగైన సముద్ర సంబంధాలను రూపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే 15 ఏళ్లలో భారత్లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అంశంపై చర్చ జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్టీఏ) త్వరగా అమలు చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. చర్చల కోసం గవర్నమెంట్ హౌస్కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం స్వేచ్ఛాయుత, బహిరంగ, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ పట్ల ఉమ్మడి నిబద్ధతను మోదీ, లక్సన్ పునరుద్ఘాటించారని ఇరుదేశాలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. సార్వ¿ౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారని తెలిపాయి. ఇండో–పసిఫిక్లో చైనా ప్రాబల్యం పెరుగుతుండడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అందుకే శాంతియుత ఇండో–పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని భారత్, న్యూజిలాండ్ సంకల్పించాయి. ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంచుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం, సముద్ర భద్రత కోసం చర్యలు చేపట్టడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. క్రీడలపై భారత్–న్యూజిలాండ్ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. హార్మూజ్లో నౌకలపై ఆంక్షలు వద్దు పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని సూచించారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించకూడదని ఇరు నేతలు కోరారు.మాతో భాగస్వాములుగా మారండి న్యూజిలాండ్ పెట్టుబడిదారులకు మోదీ పిలుపు చరిత్రాత్మక భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని మోదీ అన్నారు. ఆయన శనివారం న్యూజిలాండ్ కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో ఆయన సమావేశమయ్యారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, సుస్థిర అభివృద్ధి పట్ల నిబద్ధత అనేవి దూరదృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పటిష్టమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. భారత్, న్యూజిలాండ్ల బలమైన ఆర్థిక భాగస్వామ్యం వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. భారత్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర విమానయానం, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, పట్టణ రవాణా, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో భాగస్వాములుగా చేరాలని న్యూజిలాండ్ పెట్టుబడిదారులను, వ్యాపార సంస్థలను మోదీ ఆహ్వానించారు. భారత అభివృద్ధి వేగం అపూర్వం: ‘కియా ఓరా మోదీ’లో ప్రధానిఅక్లాండ్: అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశ అభివృద్ధి వేగం అపూర్వమైనదని ప్రధాని మోదీ అన్నారు. మన దేశం ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాలను అందిస్తోందని చెప్పారు. ఆయన శనివారం అక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో కలిసి ‘కియా ఓరా మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించిన ప్రసంగించారు. భారత్, న్యూజిలాండ్ సంబంధం మధురమైన జ్ఞాపకాలు, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, పరస్పర నిబద్ధతపై నిర్మితమైందని వివరించారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో భారత్ వేగంగా పరుగులు తీస్తోందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. ఉమ్మడి ప్రయాణానికి ‘వాకా’: ‘కియా ఓరా మోదీ’లో ప్రధాని మోదీ ఓ మఫ్లర్ను ప్రజలకు చూపించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్లో పర్యటించినప్పుడు ఇది తనకు బహుమతిగా లభించిందని తెలిపారు. దీంతోపాటు ఒక టోపీ కూడా గిఫ్ట్గా వచ్చిందని చెప్పారు. అప్పటి తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించలేదని వెల్లడించారు. న్యూజిలాండ్ సంస్కృతికి చెందిన ‘వాకా’అనే పదం గురించి మోదీ ప్రస్తావించారు. ఈ అందమైన పదం భారత్, న్యూజిలాండ్ సంబంధాల సారాంశాన్ని తెలియజేస్తుందని అన్నారు. శతాబ్దాలుగా ఈ పదం ప్రజలను ఏకం చేయడానికి ప్రతీకగా నిలుస్తోందని వివరించారు. వాకా కేవలం ఒక పడవ కాదని, ఉమ్మడి ప్రయాణానికి అదొక చిహ్నమని తెలిపారు. ఈ రోజు భారత్–న్యూజిలాండ్ వాకా కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.బైబై న్యూజిలాండ్ ప్రధాని మోదీ న్యూజిలాండ్లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి బయలుదేరారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఎయిర్పోర్టులో మోదీకి వీడ్కోలు పలికారు. -
రాత్రి సూర్యుళ్లు వచ్చేస్తున్నారు!
పగలంతా సూర్యకాంతి.. రాత్రయితే చీకటి. ఇదీ ప్రకృతి ధర్మం. అయితే దీన్ని మార్చేస్తా అంటోంది రిఫ్లెక్ట్ ఆర్బిటల్. రాత్రిళ్లు కూడా సూర్యుళ్లను వెలిగిస్తాను అంటోంది. రాత్రిపూట సూర్యుడేంటి అని ఆశ్చర్యపోవద్దు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రతిపాదిస్తున్నది నేరుగా సూర్యుడిని రాత్రిపూట వెలిగే చేస్తానని కాదు. భూమి చుట్టూ భారీ అద్దాలు అమర్చి ఎక్కడ కావాలంటే అక్కడ సూర్యుడి వెలుగు ప్రతిఫలించేలా చేస్తానూ అని. నిజానికి ఏడాది క్రితం ఇదే ఐడియాతో కంపెనీ ఏర్పాటైంది కానీ తాజాగా అమెరికా సమాచార, ప్రసార విభాగం ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పచ్చజెండా ఊపడంతో కంపెనీ ఆలోచన మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఈ కంపెనీ ప్రణాళిక ఏమిటి? లాభాలున్నాయా? అల్యూమినియం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ లోహాన్ని ఫుడ్ ప్యాకేజింగ్ మొదలు చాలాచోట్ల వాడుతూంటారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కూడా అత్యంత పలుచటి అల్యూమినియం పొరలనే అద్దాలుగా మార్చి భూమి చుట్టూ పెడతానని చెబుతోంది. కాకపోతే ఒక్కో అద్దం అరవై అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉంటుంది. భూమికి సుమారు 680 కిలోమీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్లాన్. ముందుగా ఎరిన్డిల్–1 పేరుతో తయారు చేసిన ఒక ఉపగ్రహం ద్వారా ఒక్క అద్దాన్ని అక్కడి వరకూ పంపించి పరీక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తరువాత 2035 నాటికల్లా దశలవారీగా భూమి చుట్టూ కనీసం 50 వేల అద్దాలు ఏర్పాటు తిరిగేలా చేస్తారు. ఒక్కో అద్దం భూమివైపునకు మళ్లితే ఐదు చదరపు కిలోమీటర్ల మేర వెలుగులు నిండుతాయి. పోలిక కావాలంటే... హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ దాదాపు 2,300 ఎకరాలు ఉంటుంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అద్దం ఒకటి దీంట్లో సగం ప్రాంతాన్ని వెలుగుతో నింపేయగలదు. ఉపయోగాలేమిటి? కంపెనీ చెబుతున్నదాని ప్రకారం బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యుడి వెలుగు రాత్రిళ్లు కూడా అందుబాటులోకి వస్తే పంటలు డబుల్ స్పీడ్తో ఎదుగుతాయి. భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న చోట జనరేటర్ల అవసరం లేకుండా రాత్రిళ్లూ పనులు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టవచ్చు. విలువైన ప్రాణాలు కాపాడవచ్చు. ఏ అద్దాన్ని ఎటు మళ్లిస్తే ఎక్కడ వెలుగులు పడతాయో లెక్కేసేందుకు కంప్యూటర్లు సరిపోతాయి. ఐడియా బాగానే ఉంది కానీ దీనిపై ఇప్పటికే బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. 1990లలో రష్యా జన్మయా పేరుతో ఇలాంటి ప్రాజెక్టే ఒకటి చేపట్టి విఫలమైంది. అల్యూమినియం పొరలు అంతరిక్షంలో సర్రున చిరిగిపోయాయట. పైగా విశాల విశ్వాన్ని, అంతరిక్షాన్ని మధించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలకు ఈ ప్రకాశాలు పెద్ద అడ్డంకి. గాల్లో ఎగురుతూండగా అకస్మాత్తుగా వచ్చిపడే ప్రకాశం వల్ల తాము గందరగోళానికి గురవుతామని విమానాల పైలెట్లు కూడా హెచ్చరిస్తున్నారు. పక్షులు, ఇతర జీవజాతుల పరిస్థితి ఏమిటన్నది పర్యావరణవేత్తల ఆందోళన. అద్దాలను ఎటు కావాలంటే అటు తిప్పేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ సమస్యలే కావన్నది కంపెనీ వాదన. చూద్దాం ఏమవుతుందో?! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐరన్ లంగ్ జీవితం ముగిసింది!
ఒక్లహోమా సిటీ: అమెరికాలో పోలియో మహమ్మారి చిట్టచివరి బాధితురాలు మార్థా అన్ లిలార్డ్ (78) ప్రశాంతంగా కళ్లు మూసింది. ఐదేళ్ల వయసులోనే వ్యాధికి గురై ఇరవై ఏళ్ల మించి బతకదని వైద్యులు పెదవి విరిచేసినా... లిలార్డ్ ఉక్కు ఊపిరితిత్తుల తో జీవితం మొత్తాన్ని గడిపేసిన వ్యక్తిగా మిగిలిపోయింది. పోలియో కారణంగా ఊపిరితిత్తుల కండరాలు పని చేయకపోవడంతో చిన్నప్పటి నుంచి భారీ యంత్రం (ఐరన్ లంగ్) సాయంతోనే ఊపిరి తీసుకునేది. కుడి చేయి పక్షవాతం బారిన పడినా, ఎడమ చేయిని నడుము వద్ద కొద్దిగా మాత్రమే కదిలించగలిగిన లిలార్డ్లో ఉత్సాహానికి మాత్రం కొదవ ఉండేది కాదని, సొంతంగా వంట చేసుకోవడమే కాకుండా... నెట్ బ్రౌజింగ్ చేసేదని, కవితలు రాయడమే కాకుండా.. తన మరణం తాలూకూ వార్తను కూడా ముందుగానే రాసి వెబ్సైట్లో పోస్ట్ చేసిందని చెల్లి సిండీ మెక్ వీ తెలిపారు. రెండు సార్లు కోవిడ్–19 బారిన పడటంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా తగ్గిపోయి ఐదేళ్లుగా ఇంటికే పరిమితమైంది. రెండేళ్లుగా రోజు మొత్తం ఐరన్ లంగ్లోనే గడిపిన లిలార్డ్ ఆఖరకు అమెరికాలోని ఓక్లహోమా సిటీలో జూన్ 26న తుదిశ్వాస విడిచారు. దీంతో ఐరన్ లంగ్తో జీవించిన చిట్టచివరి వ్యక్తిగా లిలార్డ్ మిగిలిపోయారు. రెండేళ్ల క్రితమే పాల్ అలెగ్జాండర్ అనే మరో పోలియో పీడితుడు కూడా మరణించడంతో చిట్టచివరి బాధితురాలిగా లిలార్డ్ మిగిలిపోయారు.‘‘లిల్లార్డ్ 20 ఏళ్ల వయసు దాటదని డాక్టర్లు చెప్పారు. కానీ... బతకాలన్న తపన, ఆమె జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు.. ఆస్వాదించేలా చేసింది.’’అని లిలార్డ్ చెల్లి సిండీ మెక్వీ తెలిపారు. ఐరన్ లంగ్ అనేది ఓ భారీ పరికరం. సిలిండర్ ఆకారంలో ఉంటుంది. మనిషి దాంట్లో పడుకుని ఉంటే తల మాత్రం బయటకు వచ్చి ఉంటుంది. ఇలాంటి ఏర్పాటుతోనే లిలార్డ్ తన జీవితం మొత్తం గడిపింది. చిన్నప్పుడు రెండు గంటలపాటు పాఠశాలకు వెళ్లేదని, మిగిలిన సమయంలో ట్యూటర్లు ఇంటికొచ్చి పాఠాలు చెప్పేవారని సోదరి వివరించారు. ఫోన్ల ద్వారానే షానీ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసినట్లు తెలిపారు. విహారయాత్రలకు వెళ్లాలంటే ప్రత్యేకమైన వాహనం వాడేవారని ఐరన్ లంగ్ యంత్రం పట్టేంత తలుపులు ఉన్నాయా? లేదా? అని విచారించుకున్న తరువాతే తండ్రి బయటకు తీసుకెళ్లే వారని వివరించింది. లిలార్డ్ కొంతకా>లం డ్రైవింగ్ కూడా చేయడం ఆమెలోని పట్టుదలకు ప్రతీకలుగా చెప్పవచ్చు.ఇంటర్నెట్ ప్రపంచంలో...లిలార్డ్కు ఆరోగ్య సమస్యలు ఎన్ని ఉన్నా... జీవితంలో కుతూహలాన్ని మాత్రం కోల్పోలేదు. అందుకే పోలియో గురించి మాత్రమే కాకుండా.. ప్రపంచ సంగతులను కూడా ఆమె ఇంటరెŠన్ట్ ద్వారా తెలుసుకునే వారు. 2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత లిలార్డ్ కాబోయే భర్త బహాసల్హ్ కూడా ఇంటర్నెట్ చాట్రూమ్లోనే పరిచయమయ్యారు. ఇరవై ఏళ్లకు పైగా ఆన్లైన్లో నడిచిన ప్రేమ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లితో సంపూర్ణమైంది. ఈజిప్టుకు చెందిన బహాసల్హ్ అమెరికా వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వీరిద్దరి ప్రేమ ఆన్లైన్కే పరిమితమైంది. ఆమె కవితలు రాసింది, పాటలు రాసింది. తన చావు వార్తను కూడా కూడా ముందుగానే రాసి, ఫ్యూనరల్ హోమ్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. పోలియో వ్యాధి ఒక్క అమెరికాను మాత్రమే కాదు... ప్రపంచాన్ని వణికించిన మహా వ్యాధి ఏటా లక్షల మంది పిల్లల్ని పక్షవాతం బారిన పడేసేది. 1955లో టీకా అందుబాటులోకి రావడంతో ఇది క్రమేపీ తగ్గుముఖం పట్టింది. పోలియోతో కొందరి కాళ్లు చచ్చుబడితే మరికొందరికి ఇతర శరీర భాగాలు పని చేయకుండా పోతాయన్నది తెలిసిన విషయమే. -
రూ.6 కోట్ల ఇల్లు.. ఇది నిజంగా మధ్యతరగతి ఇల్లేనా?
భారతదేశంలోని మెట్రో నగరాల్లో రూ.5–6 కోట్లతో లగ్జరీ అపార్ట్మెంట్ మాత్రమే దొరికే పరిస్థితి ఉండగా, అమెరికాలో అదే మొత్తానికి ఎకరానికి పైగా స్థలంతో కూడిన ఇండిపెండెంట్ ఇల్లు కొనుగోలు చేయవచ్చనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ మహిళ తన ఇంటి వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ అంశంపై విస్తృత చర్చ మొదలైంది.అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో నివసిస్తున్న సోనాల్ చౌదరి అనే భారతీయ మహిళ ఇన్స్టాగ్రామ్లో "అమెరికాలో మధ్యతరగతి కుటుంబం ఇల్లు ఎలా ఉంటుంది?" అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు. తమ కుటుంబం 2023లో ఈ ఇంటిని 4.4 లక్షల డాలర్ల (సుమారు రూ.3.7–3.8 కోట్లు, అప్పటి మారకం విలువ ప్రకారం)కు కొనుగోలు చేసిందని, ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు 6.5–7 లక్షల డాలర్లకు (సుమారు రూ.5.5–6 కోట్లు) చేరిందని ఆమె వివరించారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు గత కొన్నేళ్లుగా పెరగడంతో ఈ ఇంటి విలువ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.వీడియోలో ఇంటి ముందు విశాలమైన యార్డ్, గ్యారేజ్, ఒక ఎకరానికి పైగా విస్తరించిన స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెరడు, డెక్, సన్రూమ్, హోమ్ జిమ్, ఫైర్ప్లేస్ వంటి సౌకర్యాలను చూపించారు. ముఖ్యంగా పొరుగింటి మధ్య ఉండే విస్తృత ఖాళీ స్థలం, ప్రశాంతమైన వాతావరణం భారతీయ నెటిజన్లను ఆకట్టుకుంది.ఇళ్ల నిర్మాణంపై కూడా సోనాల్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అమెరికాలోని చాలా సబర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు ప్రధానంగా కలప (వుడ్ ఫ్రేమ్)తో నిర్మిస్తారని, భూకంప నిరోధకత, నిర్మాణ వ్యయం, శీతల వాతావరణానికి అనుకూలత వంటి కారణాల వల్ల అక్కడ ఈ విధానం విస్తృతంగా అమల్లో ఉందని చెప్పారు.ఈ వీడియోకు వేలాది మంది స్పందిస్తూ భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ధరలతో పోలికలు గీశారు. "ముంబైలో రూ.6 కోట్లకు 2BHK మాత్రమే వస్తుంది", "హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి", "భారత్లో భూమి కొరత, జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో ధరలు భారీగా పెరిగాయి" అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు "అమెరికాలో ఇది నిజంగానే మధ్యతరగతి ఇల్లేనా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.👉ఇది చదివారా? బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులుఅయితే నిపుణులు ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అమెరికాలో ఇంటి కొనుగోలు ధరతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్, హోమ్ ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు, హీటింగ్-కూలింగ్ వ్యయాలు కూడా గణనీయంగా ఉంటాయి. అందువల్ల కేవలం ఇంటి ధర ఆధారంగా రెండు దేశాల జీవన వ్యయాలను నేరుగా పోల్చడం సరైన విధానం కాదని వారు సూచిస్తున్నారు. అయినప్పటికీ, అదే బడ్జెట్తో అమెరికాలో లభించే స్థలం, భారత నగరాల్లో దొరికే నివాస విస్తీర్ణం మధ్య ఉన్న తేడా సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by The Ultimate Trolls | Memes • Media • India • News (@the_ultimate_trolls_) -
యూఏఈ టాపర్లకు భారీ కానుక.. ఒక్కొక్కరికి లక్ష దిర్హమ్లు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన సెకండరీ (హైస్కూల్) పరీక్షల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన అగ్రశ్రేణి విద్యార్థులకు ఒక్కొక్కరికి 100,000 దిర్హమ్లు (సుమారు రూ.23 లక్షలు) నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తూ వారి ప్రతిభను గౌరవించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిన ప్రత్యేక సందేశంలో షేక్ మొహమ్మద్, "మీ అద్భుత విజయానికి అభినందనలు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ గర్వకారణమైన క్షణాన్ని మేమూ పంచుకుంటున్నాం. మీ విజయాలు దేశ భవిష్యత్తు నిర్మాణానికి మరో బలమైన పునాది" అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.విద్యార్థులకు అందించిన గిఫ్ట్ బాక్స్లో "మేము మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం... మేము మీపై విశ్వాసం ఉంచుతున్నాం" అనే సందేశం కూడా ఉండటం విశేషం. ఈ మాటలు తమకు జీవితాంతం స్ఫూర్తినిస్తాయని, నగదు బహుమతి కంటే నాయకత్వం నుంచి లభించిన ఈ గుర్తింపే అత్యంత విలువైనదని పలువురు టాపర్లు భావోద్వేగంగా వెల్లడించారు.విద్యా రంగంలో ప్రతిభను ప్రోత్సహించడం, యువతను ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడం యూఏఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షేక్ మొహమ్మద్ మరోసారి స్పష్టం చేశారు. దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అవార్డు గ్రహీతలు ప్రతిజ్ఞ చేశారు.هدية الشيخ محمد بن راشد آل مكتوملأوائل الثانوية العامة في الدولة 🇦🇪 pic.twitter.com/3fIOjZ8vTI— 𝐌𝐨𝐡𝐚𝐦𝐦𝐞𝐝 𝐑𝐚𝐬𝐡𝐢𝐝 (@M___R1212) July 11, 2026 -
తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను: ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. అల్ జజీరా కథనం ప్రకారం.. "నా తండ్రి రక్తం చిందేలా చేశారు.. నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మా దేశం కోరిక కూడా" అని చెప్పారు.అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మందికి మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం శత్రువుకు గట్టి దెబ్బగా అని, అది చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1,000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులను కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు.ఇరాన్పై ట్రంప్నకు వైరం ఎప్పుడు మొదలైంది?ఈ వివాదం మూలాలు 2020 జనవరిలో ఉన్నాయి. అప్పట్లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ ఖాసిం సోలేమానీ మరణించారు.ఆ సమయంలో సోలేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత అమెరికా సంస్థలు, ట్రంప్ను, ఆయన మాజీ అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చని పలుసార్లు ప్రకటించాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ట్రంప్ను ఇరాన్ చంపేసే ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? టెహ్రాన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోస్తఫా ఖోష్చెష్మ్ మీడియాతో మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి ఎప్పటి నుంచో ఇరాన్ నియంత్రణలోనే ఉందని, యుద్ధం తర్వాత దానిపై నియంత్రణ వదులుకోవడాన్ని ఇరాన్ ప్రజలు అంగీకరించరని చెప్పారు.యుద్ధం సమయంలో హార్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయని, అది ఇరాన్ చేతిలో అత్యంత శక్తిమంతమైన ఒత్తిడి సాధనంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దేశీయంగా ఒత్తిడి పెరిగిందని, సైనిక బలాన్ని ఉపయోగించినా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవలేకపోయారని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఇరాన్కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, పైగా ఇంకా ఎక్కువ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు. -
వియత్నాంలో టూరిస్టు బోటు బోల్తా.. 18 మందికి పైగా మృతి
అప్డేట్స్:వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల టూరిస్టులు కూడా ఉన్నారు. భారత్ నుంచి వియత్నాంకు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు వెళ్లారు. మొత్తం 250 మందిని సెల్ఫోన్ కంపెనీ వియత్నాం తీసుకెళ్లింది. వారిలో ఏపీ నుంచి 35, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నారు. మోదీ సంతాపం👉 మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం👉 క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష👉 భారత రాయబార కార్యాలయం ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడి21 మంది సేఫ్👉 పడవ ప్రమాదంలో 18 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం👉 21 మంది పర్యాటకులను రక్షించిన కోస్ట్ గార్డ్ 👉 ప్రమాద సమయంలో స్పీడ్బోట్లో మొత్తం 32 మంది భారతీయులు ఉన్నట్లు ధ్రువీకరించిన వియత్నాం అధికారులు 👉 సముద్రంలో ముమ్మరంగా సాగుతున్న గాలింపు చర్యలు 👉 సముద్రం నుంచి మృతదేహాలు వెలికితీత👉 ఫు క్వాక్ ద్వీప సమూహంలోని 'హాన్ మే రట్ న్గోయ్' సమీపంలో బోల్తా పడిన టూరిస్ట్ బోట్. 👉 అత్యవసర సమాచారం కోసం రంగంలోకి దిగిన భారత ఎంబసీ.. హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు: +84 91 308 9165, +84 36 281 7930. బోటులో వెళ్లిన 32 మంది వీళ్లే..👉మచిలీపట్నానికి చెందిన జయ మృతి చెందారు. ఆమె భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో కడపకు చెందిన శ్రీధర్ మృతి చెందారు. అంతేగాక, ఏపీకి చెందిన మరో ముగ్గురు గల్లంతయ్యారు. 👉 బాధితుల సమాచారం కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు👉 హెల్ప్ లైన్లు : +8436 281 7930, 8491 552 3714, 8433 452👉ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. “కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నాం” అని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది.👉ఓషన్ పియర్ ఐలాండ్ కంపెనీ నిర్వహిస్తున్న స్పీడ్బోట్ హోన్ మే రుట్ నుంచి ఫు క్వాక్ విమానాశ్రయానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆన్ థోయ్ పోర్టుకు పర్యాటకులను తీసుకెళ్తుండగా ఆ బోటు బోల్తా పడింది. ఫు క్వాక్ ప్రత్యేక ఆర్థిక మండలి అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. హోన్ మే రుట్ న్గోయ్ తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరగడంతో పడవలో ఉన్న వారంతా సముద్రంలో పడిపోయినట్లు తెలుస్తోంది.👉పడవ బోల్తా పడినట్టు గమనించిన వెంటనే అక్కడి సమీపంలోని ఇతర పర్యాటక పడవలు వెంటనే సహాయక చర్యలకు వెళ్లాయి. రక్షణ చర్యల్లో పాల్గొన్న ఓ పడవ యజమాని మాట్లాడుతూ.. తమ పడవ సుమారు 5 నిమిషాల్లో ఘటన స్థలికి చేరుకుందని చెప్పారు. అయితే బోల్తా పడిన పడవ లోపల చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోవడంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు.Boat capsizes in Phu Quoc, 18 dead. Most of tourits are Indian pic.twitter.com/VmwDdha0Hn— Linh (@holinh87) July 11, 2026 In a tragic incident, a boat carrying several Indian tourists has capsized near Phu Quoc Island in Vietnam a few hours ago. Exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing. In order to provide information…— India in Vietnam (@AmbHanoi) July 11, 2026 -
రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్ నిఘా?
భూమిపై గ్రహాంతరవాసులు (ఏలియన్స్) నిఘా పెట్టాయా? వారి అంతరిక్ష నౌకలే (యూఎఫ్వోలు) మన ఆకాశంలో సంచరిస్తున్నాయా?? దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ ప్రశ్నలకు మరోసారి ఊతమిచ్చేలా అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా విడుదల చేసిన ఫైల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. "నేను 28 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నా. కానీ, ఎన్నడూ ఇలాంటి వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు’’ అని ఓ మాజీ సైనిక పైలట్ పేర్కొనడం, అణు ఆయుధ కేంద్రం వద్ద రహస్య వస్తువు సంచరించిన ఘటన, చైనా సమీపంలో తాజాగా నమోదైన వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మేరకు.. తాజాగా పెంటగాన్ మొత్తం 40 రికార్డులను బహిర్గతం చేసింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియో ఫైల్స్, మూడు చిత్రాలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్బీఐ, ఇంధన శాఖ వంటి కీలక అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించింది. విడుదలైన వీడియోల్లో పశ్చిమ పసిఫిక్, అట్లాంటిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో అమెరికా సైనిక కెమెరాలు రికార్డు చేసిన దృశ్యాలు ఉన్నాయి.The Creepiest UFO Video Ever Released By The White House 👽🛸🇺🇸What is that thing? Is it an ALIEN? 😱DOW-UAP-PR116, Unresolved UAP Report, Atlantic Ocean, 2020 pic.twitter.com/vOabmCyBb6— Interstellar (@InterstellarUAP) July 10, 2026ఈ ఫైల్స్లో అత్యంత ఆసక్తికరమైనది 2019లో నమోదైన ఒక ఘటన. అమెరికా తూర్పు ప్రాంతంలో శిక్షణ విమానయానం నిర్వహిస్తున్న ఓ సైనిక పైలట్, మరో నలుగురు సిబ్బంది తమ విమానం కిందుగా అత్యంత వేగంగా కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గమనించారు. దాదాపు 10 నుంచి 15 సెకన్ల పాటు దానిని కెమెరాతో ట్రాక్ చేశారు. జూమ్ చేసి స్పష్టంగా చిత్రీకరించేలోపే ఆ వస్తువు క్షణాల్లో కెమెరా పరిధి దాటి అదృశ్యమైంది. తర్వాత వీడియోను పరిశీలించగా అది దీర్ఘచతురస్రాకారంలో (Rectangular) ఉన్నట్లు గుర్తించారు.దీనిపై సదరు పైలట్ తన నివేదికలో.. "ఎయిర్ఫోర్స్, నేవీలో 28 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఇలాంటి విమాన లక్షణాలున్న వస్తువును నేను ఎప్పుడూ చూడలేదు" అని పేర్కొనడం విశేషం.దెబ్బకు అణ్వాయుధ కేంద్రంలో లాక్డౌన్!మరో ఫైల్లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని పాంటెక్స్ అణు ఆయుధ కేంద్రం వద్ద 2015లో చోటుచేసుకున్న ఘటనను వెల్లడించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది.. ఎలాంటి శబ్దం లేకుండా, ఇంజిన్కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా గాల్లో కదులుతున్న ఓ గుర్తుతెలియని వస్తువును గుర్తించారు. దాంతో మొత్తం అణు కేంద్రాన్ని వెంటనే లాక్డౌన్ చేసి, బైనాక్యులర్లతో ఆ వస్తువును వెంబడించారు. అయితే అది ఏమిటో ఇప్పటికీ గుర్తించలేకపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.చైనా సమీపంలో తాజా కదలికలుఈసారి విడుదలైన ఫైల్స్లో అత్యంత తాజా సమాచారం 2025లో చైనా సమీప సముద్ర ప్రాంతాల్లో నమోదైన ఘటనలకు సంబంధించినది. అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్కు చెందిన సెన్సార్లు ఎల్లో సీ ప్రాంతంలో ఆరు కోణాల నక్షత్రం ఆకారంలో కనిపించిన ఓ విచిత్ర వస్తువును గుర్తించాయి. మరో వీడియోలో తూర్పు చైనా సముద్రం (ఈస్ట్ చైనా సీ) ప్రాంతంలో నిమిషాల పాటు కదులుతున్న మరో గుర్తుతెలియని వస్తువు రికార్డైంది.అలాగే 2023లో చిత్రీకరించిన మరో వీడియోలో.. ఓ రహస్య వస్తువు అమెరికా సైనిక విమానంలోని ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల పనితీరును ప్రభావితం చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏలియన్స్ ఉన్నాయా?పెంటగాన్ విడుదల చేసిన ఫైల్స్లో.. ఈ వస్తువులు గ్రహాంతరవాసులకు చెందినవే అని ఎక్కడా నిర్ధారించలేదు. అదే సమయంలో అవి ఏమిటో కూడా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అందుకే వీటిని అధికారికంగా యూఏపీ (Unidentified Anomalous Phenomena)గా పేర్కొంది.మిస్టరీ మరింత ముదిరిందిగత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం యూఎఫ్వోలకు సంబంధించిన పలు రహస్య పత్రాలను దశలవారీగా బయటపెడుతోంది. అయితే తాజా ఫైల్స్లో మాజీ సైనిక పైలట్ వాంగ్మూలం, అణు ఆయుధ కేంద్రంలో గుర్తుతెలియని వస్తువు సంచారం, చైనా సమీపంలో నమోదైన తాజా వీడియోలు ఉండటంతో.. "భూమిపై నిజంగానే ఏలియన్స్ నిఘా ఉందా? లేదంటే మనకు ఇంకా తెలియని అత్యాధునిక సాంకేతికతేనా?" అన్న ప్రశ్నలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఈ రహస్యం మాత్రం ఇంకా వీడలేదు. -
కుప్పకూలిన విమానం, 10 మంది దుర్మరణం
Bahamas plane crash బహామాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో బహామాస్ ప్రభుత్వం 'ఫ్లెమింగో ఎయిర్' (Flamingo Air) విమానాల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.ద్వీపసమూహ దేశమైన బహామాస్ రాజధాని నసావుకు పశ్చిమంగా జలాల్లో ఉన్న నార్త్ ఆండ్రోస్ (North Andros) ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. నసావు నుంచి శాన్ ఆండ్రోస్ వెళ్తుండగా ఈ ట్విన్-ఇంజిన్ (సెస్నా 402) విమానం ప్రమాదానికి గురైంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న నాసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్లోని అటవీ ప్రాంతంలో, విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.A plane crashed in the Bahamas,Nassau on Friday, the country's Independence Day, killing all ten people on board.This horrific accident occurred at a time when the entire country was celebrating the Bahamas' 53rd Independence Day.#Bahamas #PlaneCrash pic.twitter.com/aYHDoQYgMs— Sumit (@SumitHansd) July 11, 2026ప్రమాదం జరిగిన సమయంలో ఒకరు ప్రాణాలతో బయటపడినట్లు బహామాస్ ప్రధాన మంత్రి ఫిలిప్ బ్రేవ్ డేవిస్ మొదట తెలిపినప్పటికీ, ఆ తర్వాత సదరు వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు నిర్ధారించారు. బహామాస్ 53వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఆ దేశంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!ఇదీ చదవండి: ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..! -
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ కీలక నేతలు హెచ్చరించారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడి జరిగితే దానికి తగిన సమాధానం ఇస్తామని, ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులు, ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తర్వాత కూడా వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా వైపు నుంచి కొత్త హెచ్చరికలు రావడం, ఇరాన్ నుంచి ప్రతీకార చర్యల ప్రకటనలు రావడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హార్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు హామీలు కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.మరోవైపు దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్ చర్చలు కొనసాగించేందుకు ఇరాన్తో అంగీకారం కుదిరిందని చెబుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా, మధ్యప్రాచ్య భద్రత, ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారాయి. -
ఇరాన్పైకి వెయ్యి క్షిపణులు.. నాన్స్టాప్గా ఏడాదిపాటు దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బ్యాక్ టు బ్యాక్ వార్నింగులుట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.సోలేమానీ హత్యతో మొదలైన వైరం2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.శాంతి చర్చలపైనా కఠిన వైఖరిఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తెరపైకి మళ్లీ H-1B వీసా వివాదం!
అమెరికాలో హెచ్1బీ వీసా అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ వీసా విధానంపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ భారీ లేఆఫ్ కొత్త వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఎక్స్బాక్స్ విభాగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో సంస్థ అమెరికన్ల ఉద్యోగాలను, విదేశీయులతో భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎక్స్బాక్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు సుమారు 3,200 మంది ఉన్నారు. గత కొన్నేళ్లుగా గేమింగ్ వ్యాపారంలో భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ.. ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్స్బాక్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆశా శర్మ కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పునర్వ్యవస్థీకరణ అవసరమని ఉద్యోగులకు వివరించారు.అమెరికన్ ఉద్యోగుల స్థానంలో విదేశీయులా?అయితే.. ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్కు ఈ ఏడాది 2,273 హెచ్1బీ వీసా ఉద్యోగుల నియామకాలకు అనుమతి లభించిందనే వార్తలు వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ అమెరికన్ ఉద్యోగులను తొలగించి, తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారని ఆరోపణలు మరింత బలపడ్డాయి.ఈ అంశంపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన రైలీ మూర్ తీవ్రంగా స్పందించారు. పెద్ద టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసి, అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులకు ఇస్తున్నాయని ఆరోపించారు. అందుకే హెచ్1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్బాక్స్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత విదేశీ ఉద్యోగుల కోసం వీసాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు.సోషల్ మీడియాలో చర్చసోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అమెరికా ఉద్యోగాలు క్రమంగా విదేశీయులకు వెళ్లిపోతున్నాయని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఎక్స్బాక్స్ సీఈఓ ఆశా శర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు.మైక్రోసాఫ్ట్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఉద్యోగుల తొలగింపులు పూర్తిగా వ్యాపార అవసరాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమని, హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ లేఆఫ్లలో ప్రభావితమయ్యారని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఉద్యోగుల వీసా హోదాతో ఈ నిర్ణయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్! -
ప్రకృతితో ప్రమాదకర ఆట.. చైనా మెగా కలకు ముప్పు?
భారత్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుపై తాజాగా భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం నేరుగా క్రియాశీల భూకంప విరామ రేఖ (యాక్టివ్ ఫాల్ట్ లైన్)పై ఉందని చైనాకే చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు భూకంపాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదానికి అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉండటంతో దీని భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.యార్లుంగ్ సాంగ్పోగా పిలిచే బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. సుమారు 147 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిలో త్రీ గార్జెస్ డ్యామ్ను కూడా అధిగమిస్తుందని చైనా భావిస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రాంతం కిందుగా విస్తరించిన పైజెన్ ఫాల్ట్ గత హిమయుగం నుంచి ఇప్పటికీ చురుకుగా ఉన్న భూకంప విరామ రేఖ అని చైనా ప్రభుత్వానికి చెందిన భూగర్భ సర్వే పరిశోధకులే గుర్తించారు.ఈ ఫాల్ట్ లైన్ కారణంగా ప్రాజెక్టు పునాదుల స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడటం, భూకంపాల ప్రభావంతో ఆనకట్ట నిర్మాణం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతంలోని శిలలు బలహీనంగా ఉండటంతో అదనపు రక్షణ చర్యలు, కొండచరియలు పడిపోకుండా ప్రత్యేక ఇంజినీరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, ఇప్పటికే భౌగోళిక ప్రమాదాలపై చైనా శాస్త్రవేత్తలే హెచ్చరికలు జారీ చేయడం ఈ మెగా ప్రాజెక్టుపై కొత్త చర్చకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుగా ప్రచారం పొందుతున్న ఈ నిర్మాణం భూకంప ముప్పును ఎలా ఎదుర్కొంటుందన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.భారత్ ఆందోళన.. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మెడోగ్ మెగా జలవిద్యుత్ ప్రాజెక్టు భారత్కు వ్యూహాత్మకంగానే కాకుండా పర్యావరణపరంగానూ ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో యార్లుంగ్ సాంగ్పో పేరుతో ప్రవహించి, అరుణాచల్ ప్రదేశ్లోకి సియాంగ్గా, అసోంలో బ్రహ్మపుత్రగా మారి చివరకు బంగ్లాదేశ్లో జమునా పేరుతో ప్రవహిస్తుంది. దీంతో ఎగువన చైనా చేపట్టే ఏ భారీ నిర్మాణమైనా దిగువన ఉన్న భారత్, బంగ్లాదేశ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టు వల్ల నది సహజ ప్రవాహంలో మార్పులు వస్తే అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని వ్యవసాయం, తాగునీటి వనరులు, మత్స్య సంపద, నదీ పర్యావరణంపై ప్రభావం పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో అకస్మాత్తుగా భారీగా నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాల్లో వరదలు సంభవించే ప్రమాదం ఉంది. అదే ఎండాకాలంలో నీటి నిల్వలు పెంచితే భారత్కు వచ్చే నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉందనే ఆందోళన కూడా ఉంది. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం క్రియాశీల భూకంప విరామ రేఖపై ఉండటమే. ఒకవేళ భారీ భూకంపం సంభవించి ఆనకట్టకు నష్టం జరిగితే లేదా నిర్మాణంలో ఏదైనా పెద్ద ప్రమాదం చోటుచేసుకుంటే దిగువ ప్రాంతాలకు భారీ స్థాయిలో వరదలు వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని భూగర్భ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని నదీ పరివాహక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు ప్రధానంగా జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమేనని, బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని ఇతర ప్రాంతాలకు మళ్లించే ఉద్దేశం లేదని చెబుతోంది. అయినప్పటికీ సరిహద్దు దాటి ప్రవహించే నదిపై ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటంతో భారత్ నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నది ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా పంచుకోవాలని, దిగువ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని చైనాను భారత్ కోరుతోంది. -
ఖమేనీకి ఎదురుదెబ్బ.. అమెరికా షాక్ ట్రీట్మెంట్!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ టార్గెట్గా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్న ఆర్థిక నెట్వర్క్పై అమెరికా భారీ ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో దుబాయ్కు చెందిన ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త, బ్యాంకర్ అలి అన్సారితో పాటు మొత్తం 14 మంది వ్యక్తులు, సంస్థలు అమెరికా ఆంక్షల జాబితాలో చేరాయి.కాగా, అలి అన్సారి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థల నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు. ఈ వ్యవస్థ ద్వారా ఇరాన్ ప్రభుత్వ నిధులను విదేశాలకు మళ్లించి, రియల్ ఎస్టేట్, హోటళ్లు, వాణిజ్య భవనాలు తదితర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మొజ్తబా ఖమేనీకి అనుబంధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు, అలాగే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్లు పేర్కొంది.తాజా ఆంక్షల పరిధిలో ఇరాన్కు చెందిన మూడు కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్లో నమోదైన పలు ఫ్రంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీలు నిర్వహిస్తూ అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు ఈ నెట్వర్క్ పనిచేస్తోందని అమెరికా ఆరోపించింది. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.లావాదేవీలు కట్.. అయితే, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచి, దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తాజా ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఆంక్షల కారణంగా జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలకు అమెరికాలో ఉన్న ఆస్తులు స్తంభించి పోనున్నాయి. అమెరికా పౌరులు, సంస్థలు వారితో ఎలాంటి ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. అలాగే ఇతర దేశాల బ్యాంకులు లేదా కంపెనీలు వీరితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే ద్వితీయ స్థాయి ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది.ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక, దౌత్య విభేదాల నేపథ్యంలో తాజా ఆంక్షలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ గతంలో పలుమార్లు ఖండించింది. తమపై విధిస్తున్న ఆంక్షలు రాజకీయ ఒత్తిడి కోసం చేస్తున్న చర్యలేనని, అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ వాదిస్తోంది. తాజా ఆంక్షలపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
నన్ను ఏమైనా చేస్తే.. ట్రంప్ షాకింగ్ కామెంట్లు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను హత్య చేయాలనే కుట్రలు పన్నుతోందని చాలాకాలంగా ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ప్రస్తావించాయి కూడా . ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం విజయవంతమైతే.. ఇరాన్పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో దాడులు చేయాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ అంటున్నారు. అమెరికా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "నేను చాలా కాలంగా ఇరాన్ లక్ష్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే.. వాళ్లు ఇప్పటివరకు చూడని స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చాను" అని అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ నుంచి తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించిన హెచ్చరికలు వచ్చాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "కొత్తగా ఏమీ లేదు. చాలా ఏళ్లుగా వాళ్ల హిట్ లిస్ట్లో నేనే మొదటి లక్ష్యం" అని చెప్పారు."అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది" అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక 2020లో జరిగిన ఖాసెం సోలేమానీ హత్య ఘటన కీలకంగా నిలిచింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నేతలు పరోక్షంగా హెచ్చరిస్తూ వచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్(మాజీ) అయతొల్లా ఖమేనీని యుద్ధంలో హతమార్చడంతో ఆ దేశం పగతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో అగ్రస్థానంలో ఉన్నానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు.ఇటీవల నాటో సమావేశం సందర్భంగా కూడా ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. "ఇరాన్లో ఒక నాయకత్వం వెళ్లింది.. ఇంకో నాయకత్వం వచ్చింది.. అది కూడా మారింది. నేను కూడా ఎప్పుడు ఉంటానో తెలియదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన లక్ష్యం నేనే" అంటూ వ్యాఖ్యానించారు. "ఇప్పటివరకు అదృష్టం కలిసి వచ్చింది. కానీ అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పలేం" అని కూడా పేర్కొన్నారు.ఇదే సమయంలో ఇరాన్తో శాంతి చర్చలపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ప్రక్రియ ముగిసిపోయిందని, ఇక ఆ దేశ చర్చల బృందంపై తనకు ఎలాంటి విశ్వాసం లేదని అన్నారు. "వాళ్లతో చాలా సమయం వృథా చేశాం. వాళ్లు హింసను నమ్మే వ్యక్తులు. అధికారులు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు.. కానీ దాంతో పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం" అని వ్యాఖ్యానించారు.ఇటీవల అమెరికా ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై దాడులు జరిపిన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్న వేళ ట్రంప్ తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మేం మంచివాళ్లం గనుక ఇరాన్కు వారం సెలవు ఇచ్చాం(ఖమేనీ వారం సంతాపదినాలను ఉద్దేశించి..) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలోనే ఖమేనీ అంతిమయాత్రలో.. ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా పూర్తిగా చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతీకార స్వరాల నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులు మళ్లీ ఏ మలుపు తిరుగుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. -
రెస్టారెంట్లలోకి పెట్ డాగ్స్!
హాంకాంగ్: హాంకాంగ్లోని పెంపుడు కుక్కల యజమానులు, వారు ఇష్టంగా పెంచుకునే శునకాలకు సరికొత్త స్వేచ్ఛ లభించింది. ఈ పెంపుడు జంతువులు తమ యజమానులతో పాటే రెస్టారెంట్లలోకి ప్రవేశించే అవకాశం వచ్చింది. ఇందుకు సంబంధించిన దశాబ్దాలుగా కొనసాగుతున్న చట్టానికి చేపట్టిన సవరణలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలోకి దృష్టి లోపం ఉన్నవారికి సాయపడే కుక్కలు, పోలీసు సిబ్బందికి చట్టపరమైన విధుల్లో సాయపడే కుక్కలకు మాత్రమే అనుమతించే నిబంధనలు 1994 నుంచి అమలవుతున్నాయి. తాజాగా, హాంకాంగ్ యంత్రాంగం పెంపుడు జంతువులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ సంస్కరణల మొదటి దశలో భాగంగా గురువారం నుంచి 900 రెస్టారెంట్లకు తాజా మినహాయింపును వర్తింపజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే మెట్రో రైళ్లు, ప్రయాణికుల నౌకలు నడిచే కొన్ని మార్గాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే జీవిత చరమాంకంలో ఉన్న రోగులు వీటిని తమ వద్దే ఉంచుకునేందుకు అవకాశం కల్పించారు. హాంకాంగ్లోని 2.40 లక్షల గృహస్తులు 4 లక్షలకు పైగా కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తం గృహస్తుల్లో వీరు 9 శాతం వరకు ఉంటారు. శునకాలకు మర్యాదలపై శిక్షణ రెస్టారెంట్లలోకి పెంపుడు శునకాలకు కూడా ప్రభుత్వం అనుమతివ్వడంతో డాగ్ ట్రైనర్లు బిజీగా మారిపోయారు. నిబంధనలకు తగ్గట్గుగా మార్పుకు సిద్ధమవ్వడం కోసం యజమానులు తమ పెంపుడు జంతువులను ’డాగ్ డైనింగ్ వర్క్షాప్స్’కు తీసుకెళ్తున్నారు. ట్రెయినింగ్ సెషన్లో భాగంగా రెస్టారెంట్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి రెండు గంటలపాటు శునకాలకు వీరు శిక్షణ ఇస్తున్నారు. మొదట కుక్కల యజమానులు తమ పెంపుడు జంతువులను రెస్టారెంట్ చుట్టూ తిప్పడంతో ప్రారంభమవుతుంది. ఇతర కుక్కలను చూసినప్పుడు అవి అతిగా ఉద్వేగానికి గురికాకుండా, ప్రశాంతంగా ఉండేలా ప్రోత్సహించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కుక్కలు పద్ధతిగా ప్రవర్తించేలా వాటికి కొన్ని చేతి సంజ్ఞలను అలవాటు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండటం, మనుషుల మధ్య ఎలా వ్యవహరించాలో వాటికి నేర్పుతున్నారు.టేబుళ్లపైకి రానివ్వకూడదు ఆహారం ఇవ్వరాదు ప్రభుత్వ నిబంధన ప్రకారం కుక్కలను 1.5 మీటర్ల కంటే మించని బెల్ట్తో కట్టి ఉంచాలి. ఆ బెల్ట్ను ఒక వ్యక్తి కచ్చితంగా పట్టుకోవాలి లేదా ఒక వస్తువుకు కట్టి ఉంచాలి. అలాగే కుక్కలను టేబుళ్లపైకి రానివ్వకూడదు. మనుషులు మళ్లీ ఉపయోగించే పాత్రల నుంచి అవి నేరుగా ఆహారాన్ని తినకూడదు. ప్రభుత్వం గుర్తించిన కొన్ని పోట్లాడే జాతులకు చెందిన కుక్కలను మాత్రం రెస్టారెంట్ల ప్రాంగణంలోకి అనుమతించరు. రెస్టారెంట్లు కుక్కల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేయరాదు. అయితే, వాటి కోసం ముందే ప్యాక్ చేసిన ఆహారాన్ని మాత్రం అందించవచ్చు. కాగా, ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యాపారం మరింత పుంజుకుంటుందని కొన్ని రెస్టారెంట్ల యజమానులు భావిస్తున్నారు. -
రిటర్న్ గిఫ్ట్గా రివాల్వర్
అంకారా: వేడుక ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. ఈ తీరు ఒక్క సంప్రదాయ వేడుకలు, మన దేశానికే పరిమితం కాలేదనిపిస్తోంది ఈ తాజా ఘటన చూస్తే. ఇటీవల నాటో శిఖరాగ్ర సమావేశానికి తుర్కియే ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి హాజరైన వివిధ దేశాధినేతలకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్. సమావేశం ముగిసి వెళ్లేముందు అసాధారణమైన వీడ్కోలు బహుమతి ఇచ్చాడు. సమావేశం నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోవడం నాయకుల వంతయ్యింది. ఇంతకీ గిఫ్ట్ బ్యాగ్లోని చెక్క పెట్టెలో ఉన్న క్లాసిక్ రివాల్వర్. ఉత్తి తుపాకీ మాత్రమే కాదు.. దాంతోపాటు ఆరు బులెట్లు మెరిసిపోతూ కనిపించాయి. టర్కీ జెండా, నాటో లోగోతో పాటు, టర్కిష్, ఇంగ్లిష్ భాషల్లో ‘గుముసే, మా దేశంలో తయారైన మొట్టమొదటి రివాల్వర్ తరహా హ్యాండ్గన్’అని రాసిన ఫలకాన్ని ఉంచారు. తుర్కియే ఆయుధ తయారీ సంస్థ ఎమ్కేఈ ఉత్పత్తి చేసిన అరుదైన సిక్స్–షూటర్ అయిన గుముసే–357 మ్యాగ్నమ్ రివాల్వర్ అది. దానిపై నాయకుల పేర్లను కూడా చెక్కారు. బెల్జియం ప్రధానమంత్రి, లిథువేనియా అధ్యక్షుడు, స్పానిష్ ప్రధాని సహా పలువురు నాయకుల కార్యాలయాలు ఆయా ఫొటోలను పంచుకున్నాయి. తక్కువ ధరకే ఆధునియక హ్యాండ్గన్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఆయుధాలను తయారుచేస్తున్న దేశాలలో తుర్కియే ఒకటి. తక్కువ ధరకే అంతర్జాతీయ ప్రమాణాలు, అద్భుతమైన పనితీరు కలిగిన ఆధునిక హ్యాండ్గన్ తయారు చేయడంలో ఈ దేశం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ దేశం తొలినాళ్లలో తయారు చేసిన రివాల్వర్ టైప్ హ్యాండ్గన్ ‘గుముసే’అరుదైనది. 2019, 2024 మధ్యకాలంలో అమెరికా, ఇటలీల తర్వాత తుర్కియే ప్రపంచంలో మూడవ అతిపెద్ద చిన్న ఆయుధాల ఎగుమతిదారుగా నిలిచింది. మ్యూజియాలకు చేర్చిన నాయకులు బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్, తన రివాల్వర్ను ఒక సేఫ్లో భద్రపరచడానికి బ్రస్సెల్స్ విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ రివాల్వర్ వార్సా విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఉంది. డచ్, స్వీడిష్ ప్రధానమంత్రుల కార్యాలయాలు తమ రివాల్వర్లను తుర్కియే రాజధాని అంకారాలోని వారి వారి రాయబార కార్యాలయాలకు తీసుకెళ్లాయి. బ్రిటన్కు తుపాకీతో పాటు క్లీనింగ్ కిట్, 500 తూటాలు కూడా వచ్చాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రివాల్వర్ను ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన పలాజో చిగీలో ఇతర ప్రభుత్వ బహుమతులతో పాటు భద్రపరిచారు. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్డెర్ లేయన్, తనకు కానుకగా వచ్చిన తుపాకీని సైనిక మ్యూజియానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రీస్ కానుకను ఏథెన్స్లోని యుద్ధ మ్యూజియంలో ఉంచాలనుకుంటోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, రివాల్వర్ను జాతీయ యుద్ధ మ్యూజియానికి చేర్చారు. -
పామ్బీచ్ ఎయిర్ పోర్టుకు ట్రంప్ పేరు!
వెస్ట్ పామ్ బీచ్: అమెరికాలోని దక్షిణ ఫ్లారిడా ప్రాంతంలోని పామ్బీచ్ విమానాశ్రయం పేరును గురువారం ‘ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్’గా మార్చరు. పాత బోర్డుల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసే పని మొదలైపోయింది. కొద్దికాలంపాటు పాత, కొత్త బోర్డులు రెండూ కనిపిస్తూంటాయని విమానాశ్రయ అధికారులు ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు. కొత్త బోర్డులు, బ్రాండింగ్ తదితర ఏర్పాట్లకు 55 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. విమానాశ్రయానికి తన పేరు పెట్టడంపై అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్లో ఒక పోస్టు చేస్తూ... ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యద్భుతమైన విమానాశ్రయాల్లో ఒకటని వ్యాఖ్యానించారు. దానికి తన పేరు పెట్టడం పెద్ద గౌరవంగా అభివర్ణించారు. -
పునర్వినియోగ బూస్టర్ అభివృద్ధిలో చైనా విజయం
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా అరుదైన ఘనత సాధించింది. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్–ఎక్స్ తరువాత మళ్లీమళ్లీ వాడగల రాకెట్ బూస్టర్లను అభివృద్ధి చేయగలిగింది. చైనా హైనాన్ ప్రావిన్స్ నుంచి శుక్రవారం ఆకాశానికి ఎగిరిన లాంగ్ మార్చ్–10బి నిర్దేశిత కక్ష్యలో పేలోడ్ను చేర్చినట్లు చైనా వార్తా పత్రిక జిన్హువా తెలిపింది. అయితే ఇదే ప్రయోగంలో రాకెట్ మొదటి దశ బూస్టర్ను నియంత్రిత పద్ధతిలో పొందడంలోనూ విజయం సాధించింది. రాకెట్ నుంచి మొదటి, రెండవ దశలు విడిపోయిన తరువాత మొదటి దశ బూస్టర్ సముద్రంపై ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్పై ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థలో సురక్షితంగా వాలింది. మళ్లీ మళ్లీ వాడగల రాకెట్ బూస్టర్ల అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టం. చైనా గత డిసెంబర్లోనూ రెండు పునర్వినియోగ రాకెట్ బూస్టర్లను ప్రయోగించినప్పటికీ అవి స్పేస్ ఎక్స్ రాకెట్ల మాదిరిగా నిట్టనిలువుగా నేలను చేరడంలో విఫలమైనట్లు హాంకాంగ్లోని సౌత్ చైనా మార్నీంగ్ పోస్ట్ తెలిపింది. ఈసారి మాత్రం ప్రయోగం, బూస్టర్ రికవరీ రెండూ విజయవంతంగా పూర్తయ్యాయి. లాంగ్ మార్చ్–10బి రాకెట్ సుమారు 63 మీటర్లు ఎత్తు, ఐదు మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. మోసుకెళ్లగల పేలోడ్ సామర్థ్యం16 టన్నులు. మొదటి దశ బూస్టర్ సముద్ర ప్లాట్ఫామ్పై దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
రోబోలు ఆపరేషన్ చేశాయి!
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హ్యూమనాయిడ్ రోబోలు (మనుషుల్లా వ్యవహరించేవి) ఒకటి కాదు.. రెండు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాన్డియాగో) శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. ఒక ఆపరేషన్లో సర్గీ అనే రోబోను ఒక వైద్యుడు రిమోట్ కంట్రోలర్ సాయంతో పని చేయించి పిత్తాశయాన్ని (గాల్బ్లాడర్) తొలగించగా... రెండు హ్యూమనాయిడ్ రోబోలు తమలో తాము మాట్లాడుకుంటూ రెండో ఆపరేషన్ను పూర్తి చేశాయి. ఈ ప్రయోగం వివరాలు అంతర్జాతీయ ప్రఖ్యాత సైన్స్ జర్నల్ ‘నేచర్’జూలై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోబోలతో శస్త్రచికిత్సలు చేయించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. తరచూ ఇలాంటి వార్తలు చదువుతూనే ఉంటాం. అయితే ఇందులో చాలా పరిమితులున్నాయి. మొదటగా వీటి బరువు ఇంట్యూటివ్ సర్జికల్స్ వారి డావిన్సీ సర్జికల్ సిస్టమ్ 820 కిలోల వరకూ బరువు ఉంటే సీఎంఆర్ సర్జికల్స్కు చెందిన వెరిసియస్ 450 కిలోలు ఉంటుంది. మెడ్ట్రానిక్ కంపెనీ తయారు చేసిన హ్యూగో ఆర్ఏఎస్ సుమారు 540 కిలోల బరువు ఉంటుంది. వీటిని ఆపరేషన్ థియేటర్లలో అమర్చడం పని చేయించడం కష్టమైన వ్యవహారం. ప్రత్యేక నైపుణ్యాలున్న సిబ్బంది అవసరం. పైగా ఒక్కోటి కొన్ని రకాల సర్జరీలు మాత్రమే చేయగలదు.హ్యూమనాయిడ్ రోబోలు ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలవని అంచనా. కాలిఫోర్నీయా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఉపయోగించిన హ్యూమనాయిడ్ రోబో సర్గి ఐదు అడుగుల ఎత్తు, సుమారు 27 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కు నడుచుకుని రాగలదు. సర్జికల్ రోబోలతో పోలిస్తే చౌక. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఇట్టే ఉపయోగించవచ్చు. పేద, మధ్యాదాయ దేశాల్లో, వనరులు, వసతులు తక్కువగా ఉన్నచోట్ల ఈ హ్యూమనాయిడ్ రోబోలు ప్రాణాలు నిలిపే కీలకమైన శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగపడతాయని కాలిఫోర్నీయా వర్సిటీ ఇంజినీర్ మైకెల్ ఇప్ తెలిపారు. సర్జరీకి అవసరమైన కత్తులు, ఇతర పరికరాలను పట్టుకునేందుకు అడాప్టర్లను ప్రత్యేకంగా తయారు చేశామని, వీటితో పనిచేయించడం పెద్ద కష్టమేమీ కాలేదని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న సర్జన్ నికితా తరేజా తెలిపారు. ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఆపరేషన్ థియేటర్లో ఎంత బాగా సర్దుకుపోయాయో చూసి ఆశ్చర్యపోయామన్నారు. తొలి ఆపరేషన్లో సెర్గిని పదే పదే రీకాలిబరేట్ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల కొంత ఎక్కువ సమయం పట్టిందని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్కు భారతీయ సంతతి వ్యోమగామి మీనన్
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానున్నాడు. ఈ నెల 14న కజకిస్తాన్లోని బైకనూర్ కోస్మోడ్రోమ్ నుంచి రోస్కోస్మోస్ సోయుజ్ ఎంఎస్29 వ్యోమనౌకలో రష్యన్ కొస్మోనాట్లు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. అక్కడ ఎనిమిది నెలలపాటు గడపనున్నాడు. దీర్ఘకాలంపాటు అంతరిక్ష ప్రయాణం చేస్తే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మీనన్ ఐఎస్ఎస్లో ప్రయోగాలు నిర్వహించనున్నారు. అతితక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో శరీరంలో రక్త ప్రసరణతోపాటు సిరల నిర్మాణం, రక్తసాంద్రతల్లో వచ్చే మార్పులను పరిశీలిస్తారు. అంతరిక్ష కేంద్రంలోని తాగునీటి వ్యవస్థతో ఐవీఫ్లూయిడ్స్ను తయారు చేసేందుకు సిద్ధం చేసిన టెక్నాలజీలను పరీక్షిస్తారు. ఇలాంటి మిషన్లలో భూమి నుంచి ఎలాంటి వైద్యసాయం అవసరం లేకుండానే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐలతో పనిచేయగల టెక్నాలజీలను పరీక్షిస్తారు. కంప్యూటర్లు, ఏఐ, వైద్య పరికరాలకు అవసరమైన సెమీకండక్టర్ స్ఫటికాల తయారీ పద్ధతులను సమీక్షిస్తారు. కేరళ నుంచి అమెరికా వలస వెళ్లిన శంకరన్, ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోల సంతానమైన అనిల్ మినియాపోలిస్లో జని్మంచారు. -
స్వస్థలంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి
దుబాయ్: ఇరాన్న 37 ఏళ్లపాటు ఎదురులేకుండా పరిపాలించిన దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలమైన మష్హద్ నగరంలో శుక్రవారం ఉదయం ఖమేనీ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించిన సంగతి విదితమే. తర్వాత ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ నూతన సుప్రీంలీడర్గా నియమితులయ్యారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కారణంగా అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేశారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడంతో అంత్యక్రియలు ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతికకాయాన్ని వేర్వేరు నగరాలకు తరలించారు. తమ అభిమాన నేతకు లక్షలాది మంది జనం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన విగతజీవిగా ఉండడం చూసి చలించిపోయారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఖననం పూర్తయ్యింది. మష్హద్ నగరంలో ఖననం జరిగిన ఇరాన్ రెండో పాలకుడు ఖమేనీ మాత్రమే. దాదాపు 11 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత హత్యకు గురైన నాదిర్ షాను 1747లో ఆ నగరంలోనే ఖననం చేశారు. -
ఇరాన్పై అనుమానాస్పద దాడులు
దుబాయ్: ఇరాన్పై వరుసగా వైమానిక దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాము దాడులు పూర్తిస్థాయిలో నిలిపివేశామని అమెరికా ప్రకటించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తాజా అనుమానాస్పద దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ను లక్ష్యంగా చేసుకున్నది ఎవరన్నది అంతుబట్టడం లేదు. దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఖననం చేయడానికి ఇరాన్ సన్నద్ధమవుతున్న తరుణంలోనే గురువారం దక్షిణ ఇరాన్లోని వివిధ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. దీనికి కారణం ఎవరన్న దానిపై ఇరాన్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న ప్రచారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మద్దతు ఇస్తోందంటూ ఇరాన్ చట్టసభ సభ్యుడు ఒకరు ఆరోపించారు. అమెరికాకు సహకరించినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇటీవల అమెరికా చేసిన దాడుల్లో యూఏఈ తెర వెనుక పాత్ర పోషించిందని మండిపడ్డారు. ఇరాన్పై తాజా వైమానిక దాడుల పట్ల గల్ఫ్ దేశాలు కూడా స్పందించలేదు. ఇరాన్ బద్ధశత్రువైన ఇజ్రాయెల్ కూడా మౌనం వహించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు కీలక జలమార్గమైన హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, నౌకల రవాణాకు వీలు కల్పించాలని అమెరికా పట్టుబడుతున్న తరుణంలో ఇరాన్పై వరుసగా దాడులు జరిగాయి. హార్మూజ్ ఇకపై పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలని, నౌకలు రాకపోకలు సాగించాలంటే తమకు రుసుములు చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. నాలుగు దేశాల్లో మిస్సైల్ అలర్ట్ సైరన్లు ఇరాన్లోని బుషెహర్, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్లతోపాటు అహవాజ్, చాబహార్, ఇతర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని, పలుచోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా గురువారం సాయంత్రం వెల్లడించింది. అయితే, గురువారం ఉదయం తర్వాత తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. సాయంత్రం జరిగిన వైమానిక దాడులతో తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చాయి. అయితే, ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్లో పలు లక్ష్యాలపై విరుచుకుపడింది. నాలుగు దేశాల్లో మిస్సైల్ అలర్ట్ సైరన్లు వినిపించాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. కువైట్లో ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇరాన్ దాడికి దిగిన వెంటనే కువైట్ అమీర్(పాలకుడు)తో సమావేశం కావడానికి యూఏఈ నాయకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కువైట్కు వెళ్లారు. ఖతార్ విదేశాంగ మంత్రితో గల్ఫ్ అరబ్ దేశాల నేతలు ఫోన్లో మాట్లాడారు. ఇంతకుముందు యుద్ధ సమయంలో ఇరాన్పై అనేక వైమానిక దాడులు జరిగాయి. తమ ఇంధన కేంద్రాలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా సౌదీ అరేబియా, యూఏఈలు ఇరాన్పై వైమానిక దాడులు చేశాయని అధికారులు తర్వాత తెలిపారు. ఇరాన్పై తాజా దాడులకు ఏదో ఒక గల్ఫ్ దేశం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గురువారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు. గల్ఫ్లో అమెరికా తీసుకుంటున్న చర్యల గురించి ట్రంప్ నెతన్యాహుకు తెలియజేశారు. అవసరమైతే ఇరాన్ను ఎదుర్కోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తేల్చిచెప్పారు. -
ఎతిహాద్ రైల్ గుడ్ న్యూస్.. ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు
యూఏఈలో రైలు ప్రయాణాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఎతిహాద్ రైల్ కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఫుజైరాకు ఎతిహాద్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ చెల్లుబాటు అయ్యే రైలు టికెట్ను చూపిస్తే, ఎంపిక చేసిన ప్రముఖ హోటళ్లలో వసతి, ఆహారం, స్పా సేవలు, వినోద సౌకర్యాలపై 25 శాతం వరకు ప్రత్యేక తగ్గింపులు పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్లను ఎతిహాద్ రైల్ తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించింది.ఈ ఆఫర్లలో డబుల్ట్రీ బై హిల్టన్ ఫుజైరా సిటీ, ఇంటర్కాంటినెంటల్ ఫుజైరా రిసార్ట్, లే మెరిడియన్ అల్ అకా బీచ్ రిసార్ట్, రాడిసన్ బ్లూ రిసార్ట్ ఫుజైరా, ఫెయిర్మాంట్ ఫుజైరా బీచ్ రిసార్ట్, ఫుజైరా రొటానా రిసార్ట్ అండ్ స్పా, రాయల్ ఎం హోటల్ బై గెవాన్, అల్ బహార్ హోటల్ అండ్ రిసార్ట్ తదితర హోటళ్లు పాల్గొంటున్నాయి. హోటల్ను బట్టి గది అద్దె, రెస్టారెంట్ బిల్లులు, స్పా సేవలు, పూల్-బీచ్ యాక్సెస్ వంటి సౌకర్యాలపై ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి.కొన్ని హోటళ్లు ఉచిత రూమ్ అప్గ్రేడ్, ఎర్లీ చెక్-ఇన్, లేట్ చెక్-అవుట్, పిల్లలకు ఉచిత బస, భోజనం, మల్టీ-నైట్ స్టే ప్యాకేజీలు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. అయితే ఇవన్నీ హోటళ్ల నిబంధనలు, గదుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి.ఫుజైరాలోని పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎతిహాద్ రైల్ తెలిపింది. ప్రస్తుతం ప్రకటించిన ఆఫర్లలో చాలా వరకు 2026 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయోజనాలు పొందాలంటే హోటల్లో చెక్-ఇన్ సమయంలో చెల్లుబాటు అయ్యే ఎతిహాద్ రైల్ టికెట్ను తప్పనిసరిగా చూపించాలి.ఇటీవల ప్రారంభమైన ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవల్లో భాగంగా అబుదాబి–ఫుజైరా మార్గంలో ప్రయాణ సమయం సుమారు 1 గంట 45 నిమిషాలకు పరిమితమైంది. ప్రారంభ ఆఫర్లో కంఫర్ట్ క్లాస్ టికెట్లు 55 దిర్హమ్ల నుంచి, ప్రీమియం క్లాస్ టికెట్లు 120 దిర్హమ్ల నుంచి అందుబాటులో ఉండటంతో దేశీయ పర్యాటకానికి ఈ రైలు సేవలు కొత్త ఊపు తీసుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
చెన్నైలో బిగ్ బాష్
మెల్బోర్న్: శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం శుక్రవారం క్రీడా సహకార రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. ఇందులో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బిగ్ బాష్ లీగ్ (టీ–20) ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా జరగనున్న ఆ్రస్టేలియన్ మెన్స్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ప్రారంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ పెర్త్ స్కార్చర్స్ జట్టుతో మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనుంది. తద్వారా భారతదేశంలో ఒక విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి కానుంది. మొదటి మ్యాచ్ చెన్నైలో, మిగిలిన మ్యాచ్లు ఆ్రస్టేలియాలో జరుగుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే బీబీఎల్.. ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన దేశీయ క్రికెట్ టీ–20 లీగ్లలో ఒకటి కావడం విశేషం. ఇది సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు స్టేడియం అంతటా కలియతిరుగుతూ సందడి చేశారు. ఫోన్లో సెల్ఫీలు దిగారు. ఫొటోలకు పోజులిచ్చారు. ప్రజలకు అభివాదంచేస్తూ ఉత్సాహపర్చారు. పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం నాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో మ్యాచ్లు నిర్వహించే ఏ క్రీడా లీగ్ అయినా భారీగా ప్రేక్షకులను ఆకర్శించడం ఖాయం’’అని మోదీ పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్మ్యాప్ను మోదీ, అల్బనీస్ సంయుక్తంగా విడుదల చేశారు. క్రీడా శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ రోడ్మ్యాప్ ఉద్దేశం. రోడ్మ్యాప్లో భాగంగా యువ క్రీడాకారుల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి, క్రీడా సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాలు యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను కూడా నిర్వహించబోతున్నాయి. ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని, ఈ రోడ్మ్యాప్ భారత్, ఆ్రస్టేలియా మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినందుకు ఆ్రస్టేలియాను అభినందించారు. భారత్, ఆస్ట్రేలియాలు అంతర్జాతీయ క్రీడల్లో ఒక ముఖ్యమైన దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాయని పేర్కొ న్నారు. క్రీడల పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి ఆ్రస్టేలియా, భారత్ను ఐక్యం చేశాయని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ వ్యాఖ్యానించారు. విపక్ష నేతతో మోదీ భేటీ ఆ్రస్టేలియా ప్రతిపక్ష నాయకుడు యాంగస్ టేలర్తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. భారత్–ఆ్రస్టేలియా ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీ మూడు రోజుల ఆ్రస్టేలియా పర్యటన శుక్రవారం ముగిసింది -
యూఏఈలో లాంగ్ జర్నీ.. ప్రభుత్వం కీలక సూచనలు
అబుదాబి: యూఏఈలో తీవ్ర వేసవి వేడి కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు, వాహనాల యాంత్రిక లోపాలను నివారించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు కీలక భద్రతా సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ప్రమాద రహిత వేసవి’ రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా, ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది.ముఖ్యంగా ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందో లేదో నిర్ధారించుకోవాలని, రేడియేటర్లో కూలెంట్ లేదా నీటి స్థాయిని పరిశీలించాలని అధికారులు తెలిపారు. అలాగే ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉందో లేదో చెక్ చేయడంతో పాటు, టైర్ల పరిస్థితి, గాలి ఒత్తిడి, బ్రేకుల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. రాత్రి ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల ముందు హెడ్లైట్లు, బ్రేక్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.అంతేకాకుండా వాహనంలో అవసరమైన అత్యవసర భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఎండలో కారులో సులభంగా మంటలు అంటుకునే వస్తువులు, ప్రెషరైజ్డ్ కంటైనర్లు, లైటర్లు లేదా సువాసన స్ప్రేలు వంటి వస్తువులను వదిలివేయొద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు వాహనాన్ని నీడ ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయాలని, స్టీరింగ్ వీల్ అధికంగా వేడిగా ఉంటే వెంటనే ప్రయాణం ప్రారంభించకుండా కొంతసేపు చల్లబడిన తర్వాతే డ్రైవ్ చేయాలని సూచించింది.ఈ ముందుజాగ్రత్తలు పాటించడం వల్ల ఓవర్హీటింగ్, టైర్ పేలిపోవడం, ఆకస్మిక యాంత్రిక వైఫల్యాలు వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు ముందు వాహనం పూర్తిగా రోడ్డుకు అనుకూల స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. -
ఆస్ట్రేలియా వీసా ఫీజు 25 శాతం పెంపు
ఉన్నత చదువులు చదవాలన్నా, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలన్నా నేడు భారతీయుల మొదటి ఛాయిస్ల్లో ఆస్ట్రేలియా ఒకటి. అయితే, తాజాగా ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లాలనుకునే లక్షలాది మంది భారతీయుల ఆశలపై ఆర్థిక భారాన్ని మోపింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక కార్మికుల వీసా దరఖాస్తు రుసుములను 25 శాతం వరకు పెంచుతూ ఆస్ట్రేలియా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గత రెండేళ్లుగా వరుసగా పెరుగుతూ వస్తున్న ఈ వీసా ఫీజు తాజా పెంపుతో అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాను అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా మార్చేసింది. నేషనల్ సెక్యూరిటీ బడ్జెట్ ఖర్చులను భర్తీ చేయడానికే ఈ పెంపు అని అక్కడి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇది అంతర్జాతీయ విద్యార్థులను ఒక ఆదాయ వనరులాగా వాడుకోవడమేనని నిపుణులు మండిపడుతున్నారు.కొత్తగా మారిన వీసా ధరల స్వరూపం (ఆస్ట్రేలియన్ డాలర్లలో)వీసా రకంపాత ఫీజుసవరించిన కొత్త ఫీజుపెంపు శాతంస్టూడెంట్ వీసా (సబ్క్లాస్ 500) (యూనివర్సిటీ, వొకేషనల్)2,0002,500 (సుమారు రూ.1.38 లక్షలు)25%తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసా (సబ్క్లాస్ 485) (వర్క్ పర్మిట్)4,6005,750 (సుమారు రూ.3.17 లక్షలు)25%ఇండిపెండెంట్ ELICOS (ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సులు)2,0002,0502.5%గమనిక: స్టూడెంట్ వీసా ఫీజులు 2024 జులైకి ముందు కేవలం 710 డాలర్లు మాత్రమే ఉండేవి. రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఇది 710 నుంచి 1600, ఆపై 2000 డాలర్లు... ఇప్పుడు ఏకంగా 2,500 డాలర్లకు చేరింది. అంటే దాదాపు 252 శాతం పెంపు నమోదైంది!భారతీయులపై పడే ప్రభావం ఏమిటి?1. రీఫండ్ లేని భారీ రుసుము: ఆస్ట్రేలియా వీసా విధానంలో అత్యంత కఠినమైన నిబంధన ఏంటంటే.. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. లక్షల రూపాయలు పోసి దరఖాస్తు చేసుకున్న తర్వాత వీసా రాకపోతే ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు పెద్ద రిస్క్.2. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ పెంపు నుంచి ఏషియన్(ఆగ్నేయాసియా దేశాల కూటమి) దేశాలకు, పసిఫిక్ దీవుల విద్యార్థులకు మినహాయింపు ఇచ్చి పాత ఫీజులనే వర్తింపజేసింది. కానీ, ఆస్ట్రేలియాకు రెండో అతిపెద్ద విద్యార్థుల వనరుగా ఉన్న భారతదేశానికి ఎలాంటి మినహాయింపు లభించకపోవడం గమనార్హం.3. ఉపాధి వీసాలూ ఖరీదే: చదువు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియాలోనే ఉండి పని చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే ‘తాత్కాలిక గ్రాడ్యుయేట్ వర్క్ వీసా’ ఫీజు ఏకంగా 5,750 డాలర్లకు పెరగడం వల్ల అక్కడ స్థిరపడాలనుకునే యువతపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పడనుంది.అంతర్జాతీయ విద్యారంగం స్పందనఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై ‘యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా’, భారతీయ విద్యా ప్రతినిధుల సంఘం (ఏఏఈఆర్ఐ) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించాలనుకుంటూ ప్రవేశ రుసుములను ఇంతలా పెంచడం ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తుందని హెచ్చరించాయి. వీసా ఫీజును ఒకేసారి కాకుండా అప్రూవల్ అయ్యాక రెండో విడతగా తీసుకునే ‘టూ-స్టేజ్ పేమెంట్’ విధానాన్ని తేవాలని భారతీయ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
వినాశనానికి చేరువలో ప్రపంచం.. చరిత్ర దాచిన నిజం!
ఈ భూమిపై మానవ మేధస్సుకు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా.. కొన్ని ప్రాంతాల పేరు వింటేనే నేటికీ ప్రపంచం వణికిపోతుంది. ఈ కోవలో 'బెర్ముడా ట్రయాంగిల్'ది అగ్రస్థానం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో.. ఫ్లోరిడా, ప్యూర్టో రికో - బెర్ముడా దీవులను కలుపుతూ ఏర్పడే ఒక ఊహాజనిత త్రిభుజాకార ప్రాంతం ఇది. గత వందేళ్ల చరిత్రను తిరగేస్తే, ఈ ఐదు లక్షల చదరపు మైళ్ల పరిధిలో వందల సంఖ్యలో భారీ నౌకలు, విమానాలు ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అసలు ఈ ప్రాంతంలో ఏముంది? ఇది గ్రహాంతరవాసుల స్థావరమా? లేక సముద్ర గర్భంలో ఏదో అతీత శక్తి దాగుందా? లేక అట్లాంటిస్ నగరపు శాపమా? ఇవాళ మనం ఈ పాడ్కాస్ట్లో బెర్ముడా ట్రయాంగిల్ వెనుక ఉన్న అసలు జర్నలిస్టిక్ నిజాలను, దాని వెనుక దాగున్న సైన్స్ను చాలా లోతుగా విశ్లేషిద్దాం. -
షాకింగ్ ఘటన.. కిటికీ నుంచి సగం బయటకొచ్చేశాడు
గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. గాల్లో ఉండగా విమానం కిటికీ పగిలిపోగా.. ఓ ప్రయాణికుడు సగం బయటకొచ్చేశాడు. ర్యాన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానంలో ఘటన చోటు చేసుకుంది. అతను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో.. తోటి ప్రయాణికులు సకాలంలో స్పందించి అతడిని లోపలికి లాగినట్లు ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపారు. బాధిత ప్రయాణికుడు సెర్బియాకు చెందిన పర్యాటకుడు. అతను గ్రీస్లోని థెస్సలొనికి నుండి జర్మనీలోని మెమ్మింగెన్కు ప్రయాణిస్తున్నాడు. విమానం వెలుపలికి లాగినప్పుడు ఈ క్రమంలో చర్మం గీసుకుపోయి గాయపడటంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు.టైరు పేలినట్లు పెద్ద శబ్దం రావడంతో తాము నిద్ర లేచామని.. ఆ వెంటనే కేకలు వినిపించాయని.. అప్పటికే సదరు ప్రయాణికుడి తల, భుజాలు కిటికీ వెలుపల ఉన్నాయని తోటి ప్రయాణికులు చెప్పారు. విమానంలో ప్రెజర్ తగ్గిపోయిందని మాకు వెంటనే అర్థమైంది. అంతటా కేకలు వినిపించాయి. ఎవరో పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచారేమోనని తాను అనుకున్నానని మరో మహిళా ప్రయాణికురాలు పేర్కొన్నారు.ఆక్సిజన్ మాస్క్లు కిందకు పడ్డాయని.. ఒక రకమైన ఘాటైన వాసన వచ్చిందని.. ఓ ప్రయాణికుడి తల, భుజాలు కిటికీ వెలుపల ఉన్నాయి. అదృష్టవశాత్తూ, అతను తన సీట్ బెల్ట్ తీసివేయకపోవడంతో బతికిపోయాడు. ఆ వ్యక్తికి సమీపంలో ఉన్న ఇతర ప్రయాణికులు అతడిని తిరిగి లోపలికి లాగడానికి సహాయం చేశారని ఆమె తెలిపారు.గ్రీక్ మీడియా కథనాల ప్రకారం.. విమాన ఇంజన్ల నుండి ఊడిపోయిన చిన్న ముక్క బలంగా తాకడం వల్లే కిటికీ పగిలిపోయింది. ఈ ప్రమాదం సరిగ్గా ఉత్తర మాసిడోనియా గగనతలంలో ఉన్నప్పుడు జరిగింది. ర్యాన్ ఎయిర్ సంస్థ ఒక ప్రకటనలో స్పందిస్తూ.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక విండో ఊడిపోవడంతో, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం తిరిగి థెస్సలొనికికి మళ్ళించబడింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులను తిరిగి టెర్మినల్కు చేర్చాము" అని తెలిపింది. -
లారెన్స్ బిష్ణోయ్పై అమెరికా ఛార్జ్ షీట్ దాఖలు
వాషింగ్టన్: భారత్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని ఆరుగురు సహచరులపై అమెరికా న్యాయ శాఖ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. అందులో హత్యలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్,మానవ అక్రమ రవాణా వంటి అనేక అంతర్జాతీయ నేరాలకు పాల్పడ్డారనే వివరాలను అధికారులు పొందుపరిచారు.లారెన్స్ బిష్ణోయ్ 2015 నుండి భారత్లో జైలు శిక్షను అనుభవిస్తున్నప్పటికీ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(VoIP) సాంకేతికత ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తన నేర నెట్వర్క్ను నేరుగా నడుపుతున్నట్లు అమెరికా దర్యాప్తులో స్పష్టమైంది.అమెరికా ఛార్జ్షీట్ వివరాల ప్రకారం, లారెన్స్ బిష్ణోయ్ మరియు ఉత్తర అమెరికాలో ఉన్న అతని ప్రధాన అనుచరుడు గోల్డీ బ్రార్ కలిసి 18 జూన్ 2023న కెనడాలోని సర్రేలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ను మే 2022లో పంజాబ్లో దారుణంగా కాల్చి చంపిన ఘటనకు బిష్ణోయ్ గ్యాంగే పూర్తి బాధ్యత వహించినట్లు తెలిపింది.దీంతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను చంపాలనే ఉద్దేశాన్ని బిష్ణోయ్ పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచాడు. ఏప్రిల్ 2024లో ముంబైలోని నటుడి నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు కూడా ఈ సిండికేట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇలా లారెన్స్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని భారత్ నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్ వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలకు విస్తరించాయి.ప్రస్తుతం ఈ గ్యాంగ్లో గోల్డీ బ్రార్ ఉత్తర అమెరికా విభాగాన్ని, రోహిత్ గొదారా యూరప్ విభాగాన్ని, సుఖ్రాజ్ సింగ్ కాంగ్ భారతదేశ కార్యకలాపాలను లీడ్ చేస్తున్నారు. అమెరికా దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్ కారణంగా గ్లోబల్ స్థాయిలో లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్పై చట్టపరమైన నిఘా మరియు చర్యలు మరింత కఠినతరం కానున్నాయి. -
లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన
భారీ ఉద్యోగాల కోతపై జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తీవ్ర విమర్శ లెదుర్కొంటోంది. లక్ష ఉద్యోగాల కోతపై బోర్డు యోచిస్తోందన్న వార్తదావాలనంలా వ్యాపించింది. దీంతో ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి.వోక్స్వ్యాగన్ తన చరిత్రలోనే అతిపెద్ద పునర్నిర్మాణంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్ష వరకు ఉద్యోగాలను తగ్గించడంతో పాటు, జర్మనీలోని నాలుగు ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దీంతో ఉద్యోగల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు మూసివేతలు కొనసాగితే 'భారీ సంఘర్షణ' తప్పదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. వ్యయ ఒత్తిళ్లు, ప్రపంచ పోటీని కారణంగా చూపుతూ కొన్ని జర్మన్ కంపెనీలు తమ కార్యకలాపాలలోని కొన్ని భాగాలను విదేశాలకు తరలిస్తున్నాయి.ఉద్యోగ కోతలపై భారీ నిరసనల మధ్య వోక్స్వ్యాగన్ బోర్డు సమావేశం జరిగింది. హానోవర్, ఎమ్డెన్, జ్వికావ్, మరియు ఆడికి చెందిన నెకార్సుల్మ్ అనే నాలుగు ప్లాంట్లను మూసివేసి, ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో సుమారు 16 శాతానికి సమానమైన లక్ష ఉద్యోగాలను తొలగించే పునర్నిర్మాణ ప్రణాళికపై చర్చించడానికి వోక్స్వ్యాగన్ పర్యవేక్షక బోర్డు వోల్ఫ్స్బర్గ్లో సమావేశమైంది. డజనుకు పైగా సైట్ల వద్ద కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టగా, మూసివేతలు కొనసాగితే 'భారీ సంఘర్షణ' తలెత్తుతుందని ఐజీ మెటల్ హెచ్చరించింది. అధిక ఖర్చులు, తక్కువగా వినియోగమవుతున్న సామర్థ్యం, చైనా, అమెరికా సుంకాల నుండి ఎదురయ్యే పోటీపరమైన ముప్పులను పరిష్కరించడానికి ఈ చర్యలు అవసరమని సీఈఓ ఆలివర్ బ్లూమ్ వాదిస్తున్నారు. -
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.భారత ప్రధాని శనివారం లక్సాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కింద తమ దేశం నుంచి భారత్కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) వినూత్ర ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. పోలాండ్లోని పోజ్నాన్ (Poznań) నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్లో ఒక సరికొత్త, పర్యావరణహితమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అక్కడున్న 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెళ్ల కింద పెరిగే గడ్డిని తొలగించేందుకు సాంప్రదాయ మెకానికల్ యంత్రాలకు (Lawnmowers) బదులుగా 100 గొర్రెల మందను రంగంలోకి దించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ సమస్యలు తగ్గడమే కాకుండా, సౌర ఫలకాల నీడ వల్ల గొర్రెలకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తోంది.ఐరోపాలోనే అతిపెద్ద ఆన్-సైట్ సోలార్ ప్యానల్ వ్యవస్థలలో ఒకటి.పోజ్నాన్ ప్లాంట్లో ఉన్న 18.3 మెగావాట్ (MW) సోలార్ ప్లాంట్ ఇది వోక్స్వ్యాగన్ ఫ్యాక్టరీకి అవసరమైన వార్షిక విద్యుత్తులో 25 శాతం వరకు అందిస్తుంది. ఇక్కడి ప్యానెళ్ల కింద గడ్డి విపరీతంగా పెరగడం వల్ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో యంత్రాల వాడకాన్ని తగ్గించి,సహజంగా గడ్డిని తొలగించేందుకు గొర్రెలతో మేపుతున్నారు. ఇది యంత్రాల వల్ల వచ్చే కర్బన ఉద్గారాలను, ఖర్చులను తగ్గిస్తుంది.గివ్ అండ్ టేక్ పాలసీదీని వల్ల అటు కంపెనీకి లాభం, ఇటు గొర్రెలకు చక్కటి ఆహారం, చల్లదని వస్తుందని భావిస్తోంది. అంటే ఎండ ఎక్కు వున్నపుడు సోలార్ ప్యానెళ్లు గొర్రెలకు చల్లని నీడను ఇస్తూ, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అలాగే ప్యానెళ్ల కింద ఏపుగా పెరిగిన గడ్డిని శుభ్రంగా మేసేయడం వల్ల ఫ్యాక్టరీకి నిర్వహణ భారం తగ్గుతుంది. ఈ వినూత్న ప్రయోగంలో వోక్స్వ్యాగన్ సంస్థ పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్తో చేతులు కలిపింది. జంతు సంరక్షణ, ఆరోగ్యం రక్షణతోపాటు, నేల నాణ్యత, జీవవైవిధ్యం (biodiversity), కీటకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు చెబు తున్నారు. ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!గొర్రెల యజమాని ఏమన్నారంటేగొర్రెల యజమాని జస్టినా నోవాక్-గజెక్ మాట్లాడుతూ.. గొర్రెలు భయపడితే గుంపులుగా ఒకేచోట ఉండి పోతాయని, కానీ ఇక్కడ అవి చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి ప్రశాంతంగా మేస్తున్నాయని చెప్పారు. దీన్ని బట్టి ఆ జంతువులు అక్కడ చాలా సురక్షితంగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పర్యావరణానికి నష్టం రాకుండా, కార్బన్ ఉద్గారాల బెడద లేకుండా ఆధునిక పరిశ్రమలు ప్రకృతితో కలిసి ఎలా ప్రయాణించ వచ్చో చెప్పడానికి ఈ "సోలార్ ప్యానెల్స్ + గొర్రెల పెంపకం" ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
చంపేసినా సరే... నా సొంత గడ్డపైనే ప్రాణాలు విడుస్తా అంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో తనపై మరణశిక్ష పడినప్పటికీ.. భయపడేది లేదని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశ ప్రవాసం ముగించుకుని బంగ్లాదేశ్ తిరిగి వెళ్లనున్నట్లు ఆమె ప్రకటించారు. అక్కడ కోర్టుల ముందే లొంగిపోయి.. తనపై వచ్చినవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని నిరూపిస్తానని రాయిటర్స్ ఇంటర్వ్యూలో హసీనా స్పష్టం చేశారు.హసీనాకు బంగ్లాదేశ్లో కొన్ని కేసుల్లో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో 2024 ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. విద్యార్థుల నిరసనలను అణచివేయడంలో ఆమె పాత్ర ఉందనే ఆరోపణలపై, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నవంబర్ 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది.1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు.ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు. -
మన మట్టిలో పుట్టిన ఆట.. ఊగిపోతున్న స్పెయిన్!
కర్రా బిల్లా (గిల్లి-దండ) ఆట పరిచయం అక్కర్లేని పేరు. భారత్లో తాతల కాలం నుంచే ఈ ఆట మనకు సుప్రసిద్ధం. భారతీయ చరిత్రలో పురాతన ఆటల్లో ఒకటిగా ఉన్న కర్రా బిల్లా ఇవాళ ఒక దేశంలో పాపులర్ ఆటగా మారిపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం. స్పెయిన్లో ఇప్పుడు మన కర్రా బిల్లా ఆట 'బిల్లార్డా' పేరుతో మోస్ట్ పాపులర్ గేమ్గా మారిపోయింది. ఫుట్బాల్కు విపరీతమైన ఆదరణ ఉండే స్పెయిన్లో బిల్లార్డా (కర్రా బిల్లా) రూపంలో అక్కడి యువతకు ఇష్టమైన ఆటగా మారిందంటే అదంతా మన భారత్ చలువే అని చెప్పొచ్చు.కర్రా బిల్లా అంటే?భారత్లో తాతల కాలం నుంచే ప్రాచుర్యంలో ఉన్న కర్రా బిల్లా ఆటకు చాలా పేర్లే ఉన్నాయి. గోణి బిల్లా, గూటి బిల్లా, బిల్లా కర్ర, చిల్లంగోడు, కోడింబిల్లా, చిల్లగాల, బిల్లంగోడు పేర్లతో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర ముక్క, రెండు అడుగులు పొడవుగల కర్ర ఒకటి ఈ ఆటకు ఉపయోగిస్తారు. వీటిలో చిన్న దానిని ‘బిల్లా' అని, పెద్దదాన్ని ‘కర్ర’ అని పిలుస్తారు. అందుకే ఈ ఆటకు ‘కర్ర బిల్లా' అని పేరు వచ్చింది. నేలమీద చిన్న ‘కంచా‘ (గుంట) తవ్వి ఈ కంచా మీద ‘బిల్ల‘ను ఉంచి కర్రతో కొట్టే ప్రయత్నం చేస్తారు. దీనిని ‘గూటుట‘ అని పిలుస్తారు. సాధారణంగా ఈ ఆటను ఇద్దరు లేక నలుగురు ఏకకాలంలో ఆడవచ్చు. ఇక తాజాగా స్పెయిన్లో బిల్లార్డా గేమ్ ఆడుతున్న విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు ఈ గేమ్ను ఒలింపిక్స్లో ప్రవేశపెడితే మనమంతా ఒక జట్టుగా ఏర్పడి భారత్కు పతకాలు తేవొచ్చు అని కామెంట్లు పట్టడం ఆసక్తి కలిగించింది. Olympics lo pedithe manam kooda podama oka team form chesukoni 😂🏃🏃@LiberatedManasu @nagakishore981 @cartick94 @chanti185627865 @atheisttindiann @ThisIsRagh @crea__ture2 @wasteyavvaralu pic.twitter.com/3dMsXrW8Ev— Bhiku Mhatrey (@BhikuMhatrey) July 9, 2026 -
పశ్చిమాసియాలో ఆగిన యుద్ధం.. మళ్లీ చర్చల బాట!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు భీకర దాడులు కొనసాగాయి. అయితే.. ఆ శాంతి చర్చలను మళ్లీ పట్టాలెక్కించేందుకు మధ్యవర్తి దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిందని సమాచారం.అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడులతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు అల్జజీరా ఓ కథనం ఇచ్చింది. అందులో.. వాషింగ్టన్ ఇప్పటికీ ఇరాన్తో చర్చలకు కట్టుబడి ఉందని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు గుర్తు చేశారాయన.ఇవాళ.. కొత్తగా దాడులేం జరగలేదు. అంతకు ముందు బుషెహర్ సైనిక స్థావరం వద్ద బాంబుల మోత మోగింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి.ఖతార్ చొరవతో..అమెరికా-ఇరాన్ ఘర్షణను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నం చేస్తోంది. ఘర్షణలకు పరిష్కారం కేవలం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాశ్వత భద్రత, స్థిరత్వం కోసం సంభాషణలు, దౌత్య మార్గాలకే తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. లండన్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో..అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితి చాలా చల్లబడ్డప్పటికీ.. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. చెత్తను తరలిస్తున్న ఓ వాహనంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. షుకిన్, కఫర్ దజ్జల్ ప్రాంతాల సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో మార్చి 2 నుంచి ఇప్పటివరకు 4,321 మంది మరణించగా.. 12,203 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దళాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ.. తాజా దాడి ఆందోళన కలిగిస్తోంది.చర్చలే కీలకంఅమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు తాత్కాలిక శాంతి సంకేతాలను ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి కాల్పుల విరమణ, దీర్ఘకాలిక ఒప్పందంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, పరస్పర నమ్మకం వంటి అంశాలపై చర్చలు కీలకంగా మారనున్నాయి. రెండు రోజుల దాడుల తర్వాత ఇప్పుడు తుపాకులు మౌనంగా ఉన్నా.. శాంతి శాశ్వతమవుతుందా? అన్నది రాబోయే దౌత్య చర్చలపైనే ఆధారపడి ఉంది. -
ట్రంప్ ICE దూకుడు.. మెక్సికో సంచలన ప్రకటన
అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగుతున్న వేళ.. మెక్సికో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అమెరికా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో తమ పౌరులు మరణించడంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.అమెరికా వలస, కస్టమ్స్ అమలు సంస్థ (ICE) అక్రమ వలసదారుల్ని అదుపు తీసుకునే చర్యల్లో భాగంగా.. పలువురిని చంపింది. అదే సమయంలో.. అదుపులోకి తీసుకునే క్రమంలో మరికొందరు ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే అలా మరణించిన మెక్సికన్ పౌరుల కేసుల్లో అమెరికా కోర్టుల్లో నేరపూరిత ఫిర్యాదులు (Criminal Complaints) దాఖలు చేయనున్నట్లు క్లాడియా ప్రభుత్వం ప్రకటించింది.షీన్బామ్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. తమ పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం దౌత్యపరమైన నిరసనలతో సరిపెట్టకుండా, నేర విచారణలు జరగాలని అమెరికా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామని చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ మరణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఇటీవల టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన కాల్పుల ఘటన నిలిచింది. 52 ఏళ్ల మెక్సికన్ పౌరుడు లోరెన్సో సాల్గాడో అరౌజోను ఐస్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ సందర్భంగా కాల్చి చంపారు. అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) ప్రకారం.. అతను తన వాహనాన్ని అధికారులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు తెలిపింది. అయితే ఈ వాదనను మృతుడి కుటుంబం, మెక్సికో ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. అతను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని భావించి భయంతో వాహనం నడిపాడని అంటున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.మరో వైపు.. ఈ కేసుల్లో అమెరికా రాష్ట్రాల ప్రాసిక్యూటర్లతో పాటు ఫెడరల్ న్యాయ శాఖను కూడా ఆశ్రయించనున్నట్లు మెక్సికో విదేశాంగ ఉపమంత్రి రొబర్టో వెలాస్కో వెల్లడించారు. అంతేకాదు, వలస నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలపై పౌర నష్టపరిహార (Civil) కేసులు కూడా వేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దౌత్య మార్గాన ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇప్పుడు నేరుగా న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ఆయన వివరించారు.మెక్సికో విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు ఐస్ కస్టడీలో 14 మంది మెక్సికన్ పౌరులు మరణించారు. అదుపులోకి తీసుకునే క్రమంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు సాధారణ సంఘటనలు కావని, మానవ హక్కుల ఉల్లంఘనల కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందని మెక్సికో అభిప్రాయపడుతోంది.ఇదిలా ఉండగా, అమెరికా అంతర్గత భద్రతా శాఖ మాత్రం మెక్సికో ఆరోపణలను తోసిపుచ్చింది. ఐస్ కస్టడీలో మరణాల సంఖ్య పెరిగిందన్న వాదన సరికాదని, అదుపులో ఉన్న వారికి అవసరమైన వైద్యసేవలు, చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నామని తెలిపింది. హ్యూస్టన్ ఘటనలో కూడా అధికారి ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై అమెరికా న్యాయ శాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు చేపడుతున్న కఠిన చర్యలు, పెరుగుతున్న నిర్బంధాలు, కాల్పుల ఘటనలపై ఇప్పటికే మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు మెక్సికో ప్రభుత్వం నేరుగా అమెరికా కోర్టుల్లో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయాలని నిర్ణయించడం రెండు దేశాల మధ్య వలస విధానాలపై మరో పెద్ద దౌత్య, న్యాయ వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పాముల రాజ్యం.. కోట్ల వ్యాపారం.. ఒక్క దెబ్బతో తారుమారు!
పాములు అంటే భయంతో మనం ఆమడ దూరం పరుగులు పెడతాం. కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో పాములే ఒక పెద్ద వ్యాపారం. ముఖ్యంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పాములను ప్రత్యేకంగా పెంచే స్నేక్ ఫారాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఔషధ పరిశ్రమ, శాస్త్రీయ పరిశోధనలు, పాము విషం సేకరణ, చర్మ ఉత్పత్తులు వంటి అవసరాల కోసం వేల సంఖ్యలో పాములను పెంచుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే..చైనా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల ధాటికి ఓ పాముల పెంపక కేంద్రం దెబ్బతింది. రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో 900కు పైగా పాములు బయటకు వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బయటకు వచ్చిన వాటిలో కొన్ని విషపూరిత జాతులకు చెందిన పాములు ఉండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, పాములు కనిపిస్తే వాటిని పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇక, వరద నీటిలో పాములు కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.“స్నేక్ విలేజ్”..అయితే, చైనాలో పాముల పెంపకం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా జెజియాంగ్ ప్రావిన్స్లోని జిసికియావో (Zisiqiao) ప్రాంతం పాముల పెంపకానికి ప్రసిద్ధి చెందింది. దీనిని చాలా మంది “స్నేక్ విలేజ్”గా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు తరతరాలుగా పాములను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు. కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు రకాల సర్పాలను ప్రత్యేక ఫారాల్లో ఉంచుతారు. జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది.దక్షిణ చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతం కూడా పాముల పెంపకానికి మరో ముఖ్య కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న పాముల ఫారాల్లో విషసర్పాలను పెంచి వాటి నుంచి వివిధ ఉత్పత్తులను సేకరిస్తారు. ఇటీవల వరదల కారణంగా పాములు బయటకు వచ్చిన ఘటన కూడా ఈ ప్రాంతంలోని ఓ ఫారం నుంచే జరిగినట్లు సమాచారం. కాగా, పాముల పెంపకం వెనుక ప్రధానంగా ఔషధ పరిశ్రమ, పరిశోధన రంగాల అవసరాలు ఉన్నాయి. పాము విషాన్ని శాస్త్రీయ పరిశోధనలు, యాంటీ వెనం మందుల తయారీ కోసం ఉపయోగిస్తారు. విషం సేకరించే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం ఉంటుంది.Amd Chinese have startto catch these snakes.Food is important https://t.co/7DmN6tKr7c pic.twitter.com/RX24yp0ipi— GeoPanda (@Geotactix) July 8, 2026భద్రతపై టెన్షన్..అలాగే కొన్ని ప్రాంతాల్లో పాము చర్మానికి కూడా డిమాండ్ ఉంటుంది. పాము చర్మంతో కొన్ని రకాల లెదర్ ఉత్పత్తులు తయారు చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పాములను ఆహారంగా కూడా వినియోగించే సంప్రదాయం ఉంది. దీంతో పాముల పెంపకం ఒక ప్రత్యేక మార్కెట్గా అభివృద్ధి చెందింది. అయితే విషసర్పాలను పెద్ద సంఖ్యలో ఒకే చోట పెంచడం ఎప్పుడూ ప్రమాదకరమే. భారీ వర్షాలు, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఫారాల భద్రతా వ్యవస్థలు దెబ్బతింటే పరిస్థితి అదుపు తప్పుతుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.పాముల పెంపక కేంద్రాల్లో బలమైన రక్షణ గోడలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, యాంటీ వెనం నిల్వలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం తప్పనిసరి. లేకపోతే వ్యాపారం కోసం పెంచిన విషసర్పాలే ప్రజలకు ప్రాణాంతక ముప్పుగా మారే అవకాశం ఉంది. వరదలతో బయటపడిన వందలాది పాముల ఘటన కేవలం ఓ ప్రమాదం మాత్రమే కాదు.. పాముల పెంపకం వెనుక ఉన్న భారీ వ్యాపారం, దాని వల్ల వచ్చే భద్రతా సవాళ్లను మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది.When floods become a haven for predators! 🛑 The terrifying side of the recent heavy rains in China... Snakes leaving their burrows and swimming through the floodwaters! 🐍🌊 pic.twitter.com/AbjbZYwjSg— Nature (@NNaturalanimals) July 10, 2026పాముల పెంపకాలు ఇక్కడే.. 1. జిసికియావో (Zisiqiao) – జెజియాంగ్ ప్రావిన్స్చైనాలో అత్యంత ప్రసిద్ధ ‘స్నేక్ విలేజ్’గా పేరు పొందిన ప్రాంతం ఇది.ఇది జెజియాంగ్ ప్రావిన్స్లోని డెక్వింగ్ కౌంటీ, జిన్షి టౌన్ (Xinshi Town) పరిధిలో ఉంది.ఇక్కడ దశాబ్దాలుగా గ్రామస్తులు పాముల పెంపకాన్ని వృత్తిగా కొనసాగిస్తున్నారు.కోబ్రాలు, వైపర్లు, పైథాన్లు వంటి పలు జాతులను పెంచుతారు.పాము విషం, పాము చర్మం, ఎండబెట్టిన పాము ఉత్పత్తులు, సంప్రదాయ ఔషధాల కోసం ఈ వ్యాపారం కొనసాగుతోంది.2. హెన్జౌ (Hengzhou).. గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ఇటీవల వందల సంఖ్యలో పాములు బయటకు వచ్చిన ఘటనతో వార్తల్లో నిలిచిన ప్రాంతం ఇదే.గ్వాంగ్సీలోని హెన్జౌ ప్రాంతంలో పాముల పెంపక కేంద్రాలు ఉన్నాయి.భారీ వరదల కారణంగా పాముల ఫారం దెబ్బతిని సుమారు 900 వరకు పాములు బయటకు వచ్చినట్లు సమాచారం.బయటకు వచ్చిన వాటిలో కోబ్రాలు, క్రైట్లు వంటి విషసర్పాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.3. గ్వాంగ్డాంగ్ (Guangdong) ప్రాంతంచైనాలో సంప్రదాయ ఔషధ పరిశ్రమకు ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి.పాము ఉత్పత్తులు, ఔషధ వినియోగాలకు సంబంధించిన వ్యాపారానికి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి.4. గ్వాంగ్సీ (Guangxi) ప్రాంతంవేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా కొన్ని రకాల సర్పాల పెంపకానికి అనుకూలంగా భావిస్తారు.పాముల పెంపకం, సంప్రదాయ వైద్య మార్కెట్లతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది.పాముల పెంపకంలో సాధారణంగా పెంచే జాతులుకోబ్రా (Cobra)క్రైట్ (Krait)వైపర్ (Viper)పైథాన్ (Python)రాట్ స్నేక్ (Rat snake) -
భూకంపం మిగిల్చిన విషాదం..3,889 మంది మృతి
రెండు వారాల క్రితం వెనిజువెలాలో సంభివించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విధ్వంసం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 3,889కు చేరుకుంది. దాదాపు 17 వేల మందికి పైగా గాయాలయ్యాయి.భూకంపం వల్ల అతలాకుతలమైన వెనిజువెలా పునరుద్ధరణకు ఐక్యరాజ్య సమితి నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.జూన్ 24న సంభవించిన జంటనగరాలలో 7.2 మరియు 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించింది. నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్జ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన నివేదిక ప్రకారం..ఈ జంట భూకంపాల వల్ల దాదాపు 17,000 మంది గాయపడగా, మరో 18,000 మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశాల్లో స్తంభింపజేసిన వెనిజులా నిధులను విడుదల చేయాలని తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగ్జ్ కోరారు.అంతర్జాతీయ సహాయం, నష్టం వివరాలుఐక్యరాజ్యసమితి నిధుల సేకరణతో పాటు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద నిలిచిపోయిన తమ ఆర్థిక ఆస్తులను పునరుద్ధరించుకోవడానికి చర్చలు జరుపుతోందని IMF ప్రతినిధి జూలీ కోజాక్ తెలిపారు. ఈ భూకంపం వల్ల అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న తీరప్రాంతం 'లా గుయైరా'లో 800 కంటే ఎక్కువ భవనాలు దెబ్బతినగా, 190 భవనాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి.శకలాల కింద ఆశల వేటవిపత్తు జరిగి 15 రోజులు కావస్తుండటంతో రెస్క్యూ టీమ్లు ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతకడం ఆపేస్తున్నప్పటికీ, కొందరు కుటుంబ సభ్యులు మాత్రం తమ వారి కోసం ఆశలను వదులుకోలేదు. లా గుయైరా నగరంలోని 'ప్లాయా గ్రాండే'లో ఉన్న భారీ శకలాల కుప్పల కింద తన ఇద్దరు టీనేజ్ కుమారులు సమాధి అయి ఉన్న స్థలాన్ని తాను గుర్తించానని సిరో ఒక్యాండో అనే ఒక వ్యక్తి తెలిపారు. ఈ దశలో వారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసినప్పటికీ తన 13, 18ఏళ్ల కుమారుల మృతదేహాలనైనా తీసుకోవాలని తపనపడుతున్నట్లు పేర్కొన్నారు."నేను సరైన స్థలంలోనే వెతుకుతున్నాను, కానీ ఇక్కడ శకలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి" అని సొంతంగా చేతి పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ ఆయన మీడియాతో కన్నీటీ పర్యంతమవుతూ తెలిపారు. తన కుమారుల మృతదేహాల కోసం తండ్రి వెతకడం పలువురిని కంటతడికి గురి చేసింది. -
ఇజ్రాయెల్ నిఘా అస్త్రం.. మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహు!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకున్న సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధి పరిణామాలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మట్టుపెట్టేందుకు ఇరాన్ స్కెచ్ వేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించడం.. నాటో సదస్సు ప్రయాణంలో భద్రతా కారణాలతో విమానం మార్చుకోవడం.. వరుసగా చర్చనీయాంశాలయ్యాయి. అయితే ఈ మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ నిఘా సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది.తన నిఘా వ్యవస్థ ద్వారా ఈ సమాచారాన్ని అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ట్రంప్కు ముప్పుపై కీలక వివరాలను అమెరికాకు అత్యవసరంగా చేరవేసిందని.. ఈ హెచ్చరికతో అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇరాన్తో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణమైందా? అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రక్రియపై దీని ప్రభావం పడనుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇజ్రాయెల్ హెచ్చరిక.. అమెరికా దూకుడు?అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి ట్రంప్కు ముప్పు ఉందన్న సంకేతాలను అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. అయితే, ఒక నిర్దిష్ట హత్యా ప్రణాళికకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖకు అందించినట్లు తెలుస్తోంది.ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా పూర్తిస్థాయిలో ధ్రువీకరించలేదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో.. ఇరాన్పై మరింత కఠిన వైఖరి అవలంబించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని ఉపయోగించిందా? అన్న చర్చ కూడా అమెరికా వర్గాల్లో సాగుతోంది. అయితే భద్రతా అంశంగా ఈ హెచ్చరికను అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు.. ఇరాన్ కదలికలపై నిఘాను పెంచినట్లు సమాచారం.మరోవైపు, ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా ఘర్షణకు వెళ్లకుండా పరిష్కారం కోరుతున్న ట్రంప్ వైఖరిలో ఈ హెచ్చరిక మార్పు తీసుకొస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహుఇరాన్ విషయంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇరాన్పై ఒత్తిడిని కొనసాగించాలని నెతన్యాహు భావించగా.. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై పడే ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ దౌత్య పరిష్కారం వైపు మొగ్గు చూపారు.ఈ క్రమంలో లెబనాన్ పరిణామాలు, శాంతి ఒప్పందం ఆలస్యం వంటి అంశాలపై ట్రంప్ ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో నెతన్యాహును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, తాజాగా ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపడుతున్న చర్యలు, భద్రతా పరిస్థితులపై ట్రంప్, నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.ఇరాన్ ముప్పు నేపథ్యంలో గత విభేదాలను పక్కన పెట్టి.. రెండు దేశాలు మళ్లీ వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి పెడుతున్నాయా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.కొత్తేం కాకపోయినా..ట్రంప్కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న ఆరోపణలు కొత్తవేమీ కాదు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కీలక కమాండర్ ఖాసిం సోలైమనీ మరణించారు. ఆ ఘటన తర్వాత ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్లోని కొన్ని వర్గాలు బహిరంగంగా హెచ్చరించాయి.ఆ తర్వాత కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఇరాన్లోని కొన్ని వర్గాల నుంచి హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్లో జరిగిన సంతాప కార్యక్రమాల్లోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు వినిపించినట్లు సమాచారం. అయితే ఇరాన్ నిజంగానే ఇలాంటి కుట్రకు పాల్పడుతోందా? లేక దౌత్య, వ్యూహాత్మక పోరాటంలో భాగంగానే ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ హత్యా కుట్ర ఆరోపణలు, ఇజ్రాయెల్ నిఘా సమాచారం, అమెరికా భద్రతా చర్యలు, ఇరాన్ ప్రతిస్పందనలు.. మరోసారి పశ్చిమాసియా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.శాంతి దిశగా సాగాల్సిన చర్చలకు తాజా పరిణామాలు మరో పరీక్షగా మారాయి. ట్రంప్-ఇరాన్ ఘర్షణలో తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
స్పెయిన్లో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
దక్షిణ స్పెయిన్లోని అల్మేరియాలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 12 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మరో ఆరుగురి మృతదేహాలు లభించడంతో మరణాల సంఖ్య పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.కాగా దీనివల్ల జరిగిన ఆస్తి నష్టం వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదుకాగా "లోస్ గల్లార్డోస్" ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కారణాలు ఇంకా తెలియలేదు. ఆ దేశంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాటివల్లే అడవికి నిప్పు అంటుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. . -
హెచ్1-బీ పై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్ డీసీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ హెచ్-1బీ వీసా నిబంధనల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉన్న ఉద్యోగాలు అమెరికన్లకేనేగాని విదేశీ మోసగాళ్లకు కాదన్నారు. అయితే కొంతమంది విదేశీ కార్పోరేషన్లు అమెరికాలోని కార్మికుల వేతనాలను తగ్గించడానికి ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దానికి అడ్డకట్ట వేస్తున్నామని వాన్స్ ఉద్ఘాటించారు.ట్రంప్ అమెరికాలోని విదేశీయుల పట్ల ఎంత కఠినంగా వ్యవహారిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రెండోసారి అధికారం లోకి వచ్చాక ఆ దూకుడు మరింత పెంచారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల నుంచి హెచ్-1బీ నిబంధనలు మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. దానిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో జేడీ వాన్స్ స్పందించారు.జేడీవాన్స్ మాట్లాడుతూ" హెచ్-1బీ వీసా కార్యక్రమం ఒక ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణుడు, లేదా ఒక ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త, లేదా ఒక ప్రతిభావంతుడైన వైద్యుడు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి కానీ.. ఆ ఉద్దేశ్యాన్ని మార్చారు. మీకు తెలుసా, విదేశాల్లోని పెద్ద కార్పొరేషన్లు మోసగాళ్లు అమెరికన్ కార్మికుల వేతనాలను తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా వాడుకుంటున్నారు. కాబట్టి, ట్రంప్ పరిపాలనలో మేం ఏం చేస్తున్నామో మీకు తెలుసా? ఇకపై కుదరదని మేం చెబుతున్నాం. మీరు ఆ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తుంటే, అటువంటి వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు," అని ఆయన అన్నారు.నేను మీకు ఒకటి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి కానీ విదేశీ మోసగాళ్లకు కాదు దానికోసం అమెరికా కార్మికశాఖ పోరాడుతుంది అని వాన్స్ నొక్కి చెప్పారు.వీసా నిబంధనల్లో మార్పులు?అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు.యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు.అమెరికన్లు చేయలేని పని హెచ్1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. -
పుతిన్ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా యుద్ధాన్ని ముగించే దిశగా చర్చల కంటే.. మరింత తీవ్రతరం చేసే వ్యూహాలపైనే మాస్కో దృష్టి పెట్టినట్లు సమాచారం. క్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు రాయిటర్స్కు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న నెలల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఇటీవల పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో వేర్వేరుగా ఫోన్ సంభాషణలు జరిపారు. యుద్ధానికి పరిష్కారం అనుకున్నదానికంటే దగ్గరలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పుతిన్ మాత్రం ప్రస్తుత యుద్ధ లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి.డాన్బాస్పై పట్టు కోసం..రష్యా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమేనని సమాచారం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తేనే యుద్ధంలో విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నారని పుతిన్కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. కాల్పుల విరమణతో ప్రస్తుత యుద్ధ రేఖలను కొనసాగించే ప్రతిపాదనలను పుతిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డాన్బాస్లో మిగిలిన ప్రాంతాలను కూడా త్వరలోనే తమ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని రష్యా అధ్యక్షుడు నమ్ముతున్నారని సమాచారం.చమురు కేంద్రాలపై దాడులతో ఒత్తిళ్లుఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, పోర్టులు, నిల్వ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పుతిన్ను మరింత ఆగ్రహానికి గురిచేశాయని, ప్రతిగా ఉక్రెయిన్పై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇటీవల రష్యా కీవ్తో పాటు పలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు చేసింది. ఇందులో పలువురు పౌరులు మృతి చెందారు.డాన్బాస్ దాటి కొత్త భూభాగాలపై కన్ను?ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ ఇటీవల రష్యా సైనిక అధికారులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వీటిని భద్రతా ప్రాంతాలుగా మార్చాలన్నది రష్యా ఉద్దేశమని ఆయన సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ మాత్రం తమ నిఘా నివేదికల ప్రకారం పుతిన్ శాంతి కోసం కాకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు కొత్త ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తోంది. అవసరమైతే ఉక్రెయిన్ వెలుపల ఉన్న యూరప్ దేశాలపై కూడా రష్యా దృష్టి పెట్టే అవకాశం ఉందని కీవ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.నాటోతో ప్రత్యక్ష ఘర్షణకు అవకాశంరష్యా సైనిక వర్గాల్లో ఇటీవల యుద్ధాన్ని మరింత విస్తరించే అంశంపై చర్చలు పెరిగాయి. ముఖ్యంగా బాల్టిక్ దేశాల్లోని నాటో స్థావరాలపై దాడుల అవకాశాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాంటి చర్యలు జరిగితే అమెరికా నేతృత్వంలోని నాటో కూటమితో రష్యాకు ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే రష్యా నేరుగా నాటోతో యుద్ధం కోరుకోకపోయినా.. కూటమిలో విభేదాలు సృష్టించే లక్ష్యంతో చిన్నచిన్న దాడులకు పాల్పడే అవకాశం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.యుద్ధానికి పెరుగుతున్న మూల్యం2022లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది సైనికులు మృతి చెందడం, గాయపడటం లేదా కనిపించకుండా పోవడం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రష్యా దళాలు డాన్బాస్ ప్రాంతంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల వినియోగం రష్యా సంఖ్యాబలానికి సవాల్గా మారింది. దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవైన యుద్ధ రేఖపై పురోగతి సాధించేందుకు రష్యా భారీగా శ్రమిస్తోంది.పుతిన్కు విజయం అవసరంక్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న వర్గాల ప్రకారం.. పుతిన్ ఈ యుద్ధంలో ఏదో ఒక స్పష్టమైన విజయాన్ని చూపించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డాన్బాస్పై పూర్తి ఆధిపత్యం సాధించడం ఆయన రాజకీయంగా కీలక విజయంగా చూస్తున్నట్లు సమాచారం. అందుకే అమెరికా శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రష్యా ఇప్పట్లో యుద్ధం నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మౌలిక వసతులపై భీకర దాడులు
దుబాయ్: చర్చలతో తేలదని, బాంబులతోనే తేల్చుకుంటామని ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపించి పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధాగ్నిని ప్రజ్వరిల్లజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో రెండోరోజూ ఇరాన్పై అగ్రరాజ్యసేనలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాగారాలు, ఎయిర్పోర్ట్ రన్వేలతోపాటు ఈసారి మౌలిక వసతులపై అమెరికా గురిపెట్టింది. దీంతో ఇరాన్లోని రైల్వేలైన్లు, వంతెనలు, నౌకాశ్రయాలు దాడుల బారిన పడ్డాయి. గత 48 గంటల్లో ఇరాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణి స్థావరాలు, సైనిక స్పీడ్ బోట్లు, మౌలికవసతులు ఇలా మొత్తంగా కీలకమైన 170 లక్ష్యాలపై దాడులు చేశామని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ గురువారం ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సరకు రవాణా నౌకల స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీసే లక్ష్యంతోనే దాడులు చేస్తున్నామని సెంట్రల్ కమాండ్ స్పష్టంచేసింది. తొలిసారిగా చాబహార్ నౌకాశ్రయం మీదా దాడి చేసింది. నౌకల రాకపోకలను నియంత్రించే షాహీద్ బెహెప్తి మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సైతం ధ్వంసమైంది. చాబహార్లోని ఇరాన్ నేవీకి చెందిన ఇమామ్ అలీ స్థావరంపైనా అమెరికా యుద్ధవిమానాలు బాంబులు జారవిడిచాయి. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలో ఎనిమిది పేలుళ్లు జరిగాయి. అబూ మూసా ద్వీపంపైనా అమెరికా దాడిచేసింది. బుషెహర్లోని అణు విద్యుత్కేంద్రం సమీపంలో గురువారం మధ్యాహ్నం బాంబుల శకలాలు పడ్డాయని ఇరాన్ ప్రకటించింది. అయితే దాడిలో న్యూక్లియర్ ప్లాంట్కు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు. దాడుల కారణంగా ఆ ప్రాంతంలో రేడియోధార్మికత పెరిగినట్లు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. గతంలోనూ ఈ ప్రాంతంలో అమెరికా బాంబులేసింది. ఇరాన్లో రష్యా సాంకేతికనిపుణుల సాయంతో నడుస్తున్న ఏకైక అణువిద్యుత్కేంద్రం ఇదొక్కటే. గురువారం నైరుతి ఇరాన్లోని ఖుజెస్తాన్లో జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్షెహర్ ఎయిర్పోర్ట్లో దాడిలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. గత 48 గంటల్లో అమెరికా దాడులతో ఇరాన్లో మరణాల సంఖ్య ముగ్గురు ఐఆర్జీసీ సభ్యులతో కలిపి 14కు పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్పూర్ తెలిపారు. తాజాగా దాడులు మొదలయ్యాక మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈశాన్య ఇరాన్లోని గోలెస్తాన్ ప్రావిన్స్లో అఖాలా పరిధిలో అగ్ తెఖెన్ఖాన్ రైల్వే వంతెనను అమెరికా క్షిపణిదాడులతో పేల్చేసింది. మష్హాద్ నగరంలో ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ఖననప్రక్రియను చూసేందుకు దేశరాజధాని టెహ్రాన్ నుంచి తరలివచ్చే జనం ఈ కీలక రైల్వేమార్గంలోనే వస్తారు. కార్యక్రమానికి భారీస్థాయిలో జనం హాజరుకాకుండా అడ్డుకునేందుకే రైల్వేలైన్ను అమెరికా పేల్చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఉత్తర ఇరాన్ను చైనా, రష్యా, తుర్క్మెనిస్తాన్లతో అనుసంధానించే ఓగ్టే ఖాన్ రైల్వే వంతెననూ అమెరికా పేల్చేసింది. మౌలిక వసతులపై దాడిచేసి అమెరికా ఘోరమైన యుద్ధనేరాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీటుగా బదులిచ్చిన ఇరాన్.. మెరుపుదాడులకు ఇరాన్ సైతం దీటుగా బదులిచ్చింది. అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నావికాదళ 5వ ఫ్లీట్కు ప్రధాన కార్యాలయమైన బహ్రెయిన్లోని ప్రధాన స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. కువైట్, ఖతర్ల మీదా ఇరాన్ దాడులుచేసింది. అమెరికా సైన్యం, యుద్ధవిమానాలకు స్థావరంగా మారిన జోర్డాన్ మీదా ఇరాన్ తన ప్రతాపం చూపించింది. అజ్రాక్లోని మువాఫాక్ సాల్తీ అమెరికా విమానస్థావరంపై 10 క్షిపణులు పడ్డాయి. దీంతో జనం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తూ పలు మార్లు సైరన్లు మోగాయి. దీంతో దాడుల భయంతో జనం పరుగులుతీశారు. గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు కన్పించడంతో అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని జోర్డాన్లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఎనిమిది ఇరాన్ క్షిపణులను నేలమట్టంచేశామని జోర్డాన్ ప్రకటించింది. అయితే దాడులు కొనసాగితే పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఏ ఒక్క స్థావరం కూడా సురక్షితంగా ఉండబోదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) గురువారం హెచ్చరించింది. హార్మూజ్ గుండా తగ్గిన నౌకల రవాణా.. తాజా దాడులతో హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలుకాకముందు ఈ మార్గంలో ప్రతి 24 గంటల్లో ఏకంగా 130 నౌకలు వెళ్లేవి. గత వారం సైతం రోజుకు 70 నౌకలు వెళ్లేవి. గురువారం ఆ సంఖ్య పదిలోపునకు పడిపోయిందని ఇంటర్ట్యాంకో సంస్థ మెరైన్ డైరెక్టర్ ఫిల్ బెల్షెర్ చెప్పారు. -
భారత్ కలలు ఆశయాలకు ప్రజలే పునాది
మెల్బోర్న్: ‘ఎక్కువగా కష్టపడడం, మరింత ఎక్కువగా సాధించడం’అనే దార్శనికతతో అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశం గొప్ప కలలు, ఉన్నత ఆశయాలకు ప్రజలే పునాది అని స్పష్టంచేశారు. గురువారం ఆ్రస్టేలియాలో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఆ్రస్టేలియా మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ కృషి చేస్తోందన్నారు. నాగరిక్ దేవోభవ(పౌరుడే దైవం) అనే మంత్రం తమ పాలనకు మార్గదర్శక సూత్రంగా మారిందని ప్రకటించారు. తమ ప్రభుత్వ విధానాలు పౌరుల సంక్షేమమే కేంద్రంగానే ఉంటాయన్నారు. భారత్ నేడు చిప్స్ నుంచి షిప్ల వరకు ఒక నూతన తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి మోదీ ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూసిందన్నారు. ముష్కర మూకల స్థావరాల వద్ద పేలుళ్లు జరిగితే వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా మార్మోగిందని వ్యాఖ్యానించారు. మిత్రులు, భాగస్వాములతో కలిసి.. భారత్లో స్టార్టప్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని మోదీ వెల్లడించారు. దేశంలో 2 లక్షలకుపైగా నమోదిత స్టార్టప్లు ఉన్నాయని, ప్రతినెలా 4 వేలకుపైగా కొత్త స్టార్టప్లు నమోదవుతున్నాయని చెప్పారు. రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో వందలాది స్టార్టప్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇండియా విధానం కేవలం సొంత పురోగతిపై దృష్టి సారించడం మాత్రమే కాదని.. మిత్రులు, భాగస్వాములతో కలిసి అడుగులు వేయడమని నొక్కిచెప్పారు. ప్రవాస భారతీయులే ‘జీవన వారధి’ వెనెజువెలాలో ఇటీవల భూకంపాలు సంభవిస్తే భారత్ వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టిందని, త్వరగా తోడ్పాటు అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. వెనెజువెలా బాధను భారత్ తన సొంత బాధగా భావించిందని అన్నారు. సహాయం చేసేటప్పుడు పాస్పోర్ట్లను గానీ, వాటి రంగును గానీ భారత్ చూడదని ఉద్ఘాటించారు. అందుకే ప్రపంచం భారత్పై అపారమైన నమ్మకాన్ని పెట్టుకుందని చెప్పారు. భారత్–ఆ్రస్టేలియా సంబంధాలు బలపడడం వెనుక ప్రవాస భారతీయులదే కీలక పాత్ర అని మోదీ ప్రశంసించారు. వారిని రెండు దేశాల మధ్య ‘జీవన వారధి’గా అభివరి్ణంచారు. ఇంట్లో ఉపయోగించే పాలు ఆస్ట్రేలియన్ కావొచ్చు గానీ తయారుచేసే టీ మాత్రం భారతీయమైనదని చెప్పారు. పప్పులు, కూరగాయలు ఆ్రస్టేలియాలవే అయినా వాటికి అసలైన భారతీయ మసాలాలతో తాలింపు పెడతారని వెల్లడించారు. మెల్బోర్న్ సిటీని మినీ ఇండియాగా అభివరి్ణంచారు. టీ20 మ్యాచ్లా.. టెస్ట్ మ్యాచ్లా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి క్రీడల రంగం కూడా ఉందని మోదీ అన్నారు. ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్బోర్న్లో ఉంటూ క్రీడల గురించి మాట్లాడకపోవడం అనేది టాస్ వేసిన తర్వాత క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించకపోవడంతో సమానమని సరదాగా వ్యాఖ్యానించారు. మన నిర్ణయాలు టీ20 మ్యాచ్లా వేగంగా, భాగస్వామ్యం మాత్రం టెస్ట్ మ్యాచ్లా సుదీర్ఘంగా, లోతుగా ఉండాలని అన్నారు. భారత్–ఆస్ట్రేలియా దేశాల అజెండా ఒక వన్డే మ్యాచ్లా లక్ష్యంపైనే దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
57 శాతం ఉత్పత్తులపై సున్నా సుంకాలు!
వెల్లింగ్టన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కింద తమ దేశం నుంచి భారత్కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్లో పోస్టుచేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11న న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. భారత ప్రధాని న్యూజిలాండ్కు వెళ్తుండడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్తో వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రధాని మోదీ దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. -
భారత్–పాక్ యుద్ధాన్ని నేనే ఆపేశా
వాషింగ్టన్: గత ఏడాది భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే స్వయంగా జోక్యం చేసుకొని నిలిపివేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఆయన బుధవారం తుర్కియే నుంచి తిరిగివస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడారు. భారత్–పాక్ యుద్ధంలో 11 ఫైటర్ జెట్లు నేలకూలాయని చెప్పారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. భారత్–పాక్ యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను తాను ఆపేశానని అన్నారు. ఈ ఘనత సాధించినందుకు నోబెల్ శాంతి బహుమ తికి తాను అన్నివిధాల అర్హుడినని స్పష్టంచేశారు. తనకంటే అర్హులు ఇంకెవరున్నారని ప్రశ్నించారు. ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే భారత్–పాక్ ఘర్షణ అణు యుద్ధంగా మారేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడం ద్వారా 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను ప్రశంసించారని ట్రంప్ గుర్తుచేశారు. అణు యుద్ధమే జరిగితే అంతకంటే ఎక్కువగానే ప్రాణనష్టం వాటిల్లి ఉండేదన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ముష్కర మూకల స్థావరాలపై గత ఏడాది మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
బలపడిన అణు బంధం
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ‘అణు’బంధం మరింత బలపడింది. భారత అణు విద్యుత్ ప్రాజెక్టులకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సహా సముద్ర భద్రత, అరుదైన ఖనిజాల రంగాలకు సంబంధించి పలు చరిత్రాత్మక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ గురువారం మెల్బోర్న్లో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతలు, సప్లై చైన్లు, రక్షణ, భద్రతా సహకారం, సముద్ర భద్రతా సహకార రోడ్మ్యాప్, ఇంధన భద్రత తదితర అంశాల్లో మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరగడం విశేషం. వీటిలో భారత తీర రక్షక దళం(ఐసీజీ), ఆ్రస్టేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్(ఎంబీసీ) మధ్య జరిగిన ఒప్పందం కూడా ఉంది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన, సముద్ర సరిహద్దుల రక్షణ వంటి అంశాలలో పరస్పర సహకారానికి దోహదపడుతుంది. ఇంధన భద్రతను బలోపేతం చేసుకుందాం ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించాయి. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసికట్టుగా పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. భారత్, ఆ్రస్టేలియాలు చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన 12 ఏళ్ల తర్వాత పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. ఇంధన భద్రతా ఫ్రేమ్వర్క్ నిబంధనల ప్రకారం.. బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల స్థిరమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. 2028–29 సంవత్సరానికి గాను ఆ్రస్టేలియన్ డిఫెన్స్ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని నిర్ణయించారు. మరోవైపు భారత్లోని గురుగ్రామ్లో విక్టోరియా విశ్వవిద్యాలయం తన క్యాంపస్ను నిర్వహించుకోవడానికి ఆ్రస్టేలియా పక్షానికి ఆమోద పత్రం అందజేశారు. బెంగళూరులో ఫ్లిండర్స్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం మోదీ, అల్బానీస్ ప్రకటన విడుదల చేశారు. భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బానీస్తో అద్భుతమైన చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ఫలితాలను ‘అసాధారణమైనవి’గా అభివర్ణించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి రంగాలపై చర్చించామని తెలిపారు. ఈరోజు అణు శక్తి రంగంలో ఒక కీలక ఒప్పందంపై సంతకం జరిగాయని అన్నారు. ఇది ఆ్రస్టేలియా నుంచి భారత్కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేయడంతోపాటు భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తిని ఇస్తుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని భారత్, ఆస్ట్రేలియాలు గుర్తించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం సాగిస్తామన్నారు. తమ సంకల్పం అచంచలమైనదని, సహకారం మరింత బలపడుతూనే ఉందని వెల్లడించారు. ఇండియాతో ఆ్రస్టేలియాకు ఉన్న సంబంధం నేడు ఉన్నంత కీలకమైనదిగా గతంలో ఎప్పుడూ లేదని ప్రధాని ఆంథోనీ అల్బానీస్ పేర్కొన్నారు. పౌర అణుశక్తికి సంబంధించిన ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం ఆ్రస్టేలియా నుంచి భారత్కు యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుందని వివరించారు. శిలాజ రహిత ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటాను పెంచడానికి భారత్కు యురేనియం సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆ్రస్టేలియన్ వనరుల రంగానికి అదనపు మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. తమ భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలంగా ఉందని తేల్చిచెప్పారు. రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన ‘ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని’మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భద్రతా భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు అల్బానీస్ ప్రకటించారు. భారత్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ప్రతిపాదిత భారత్–ఆ్రస్టేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుతుందని పేర్కొన్నారు. గురువారం ఆ్రస్టేలియా–ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. భారత్లో విమానయానం, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార శుద్ధి వంటి రంగాల్లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆ్రస్టేలియా పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు పిలుపునిచ్చారు. ఇండియాలో 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ‘ఆ్రస్టేలియన్ సూపర్’కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ ష్రోడర్ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. -
ఎరక్కపోయి ఎక్కారు.. ఇరుక్కుపోయారు!
కాలిఫోర్నీయా: పాపం కుర్రాళ్లు...కారెక్కారు... ఇద్దరూ చీర్స్ చెప్పుకుని చిల్ అవుతున్నారు! కిటికిలోంచి వాటర్ గన్స్ ఎక్కుపెట్టి... సరదాగా నీటి బుల్లెట్లు ఫైర్ చేస్తున్నారు. అంతా బాగుంది కానీ.. వాళ్లు చేసిన తప్పల్లా ఒక్కటే... సెల్ఫ్ డ్రైవింగ్ వేమో సర్వీసును ఎంచుకోవడం! అమెరికాలోని కాలిఫోర్నీయా నగరంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేమో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాన్ని ఎక్కిన ఇద్దరు టీనేజర్లను ఆ కారే పోలీసులకు పట్టించింది. ఎందుకని చూస్తే.. కారులో వాళ్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని వేమో పోలీసులకు సమాచారం ఇచ్చిందట. ఏంటా అనుమానాస్పద చర్యలు అని విచారిస్తే... మద్యం తాగుతున్నట్టుగా అనిపించిందని, చేతిలో వాటర్గన్స్ను తుపాకులుగా భావించిందని స్పష్టమైంది. కారులో ఉన్న కెమెరాలు, మైక్రోఫోన్స్తో ఆ ఇద్దరు టీనేజర్ల చర్యలన్నీ గమనించిన వేమో అటానమస్ డ్రైవింగ్ వ్యవస్థ దగ్గరలో ఉన్న పార్కింగ్ లాట్లో కారు నిలిపేసింది. లోపలివారు బయటకు వెళ్లకుండా అన్నిపక్కలా లాక్లు వేసేసింది. పోలీసులకు కాల్ చేసింది. దీంతో ఐదుగురు అధికారలు ఒక పోలీసు కుక్క ఆ కారును చుట్టుముట్టాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. చివరకు పోలీసులు కుర్రాళ్ల చేతుల్లో ఉన్నది వాటర్గన్లు అని నిర్ధారించుకున్నారు. అయినప్పటికీ వాటిని కిటికీల్లోంచి ఎక్కుపెట్టడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశముందని, స్పీడ్గా షూట్ చేస్తే వాటర్గన్ల ద్వారా కూడా తీవ్ర గాయాలవుతాయని చెబుతూ వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఇప్పుడు రెండు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు పాపం కుర్రాళ్లు.. పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూంటే... ఇంకొందరు మాత్రం వేమో మంచి పని చేసిందని మెచ్చుకుంటున్నారు. డ్రైవర్ల అవసరం లేని కార్లతో వచ్చే చిక్కుల్లో ఇదీ ఒకటన్నమాట! -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దుబాయ్: వెడ్డింగ్ హాల్స్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
దుబాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ (CDA), యూఏఈ తొలి పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్వర్క్ సంస్థ UAEV (Emarat EV Charging Stations Company) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా దుబాయ్లోని మజ్లిస్లు, కమ్యూనిటీ కౌన్సిల్స్, వెడ్డింగ్ హాల్స్ వంటి ప్రజా సదుపాయాల వద్ద దశలవారీగా ఆధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో నివాసితులు, సందర్శకులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత సులభతరం కానుంది.ఈ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే ప్రారంభమైంది. అల్ రషీదియా మజ్లిస్, అల్ బర్షా మజ్లిస్, నాద్ అల్ షెబా మజ్లిస్లలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 2026లో అల్ ఖవానీజ్ మజ్లిస్, అల్ వార్కా మజ్లిస్, అల్ బర్షా వెడ్డింగ్ హాల్లకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. అనంతరం 2027లో అల్ త్వార్ వెడ్డింగ్ హాల్, అల్ అవిర్ మజ్లిస్, హట్టా మజ్లిస్ల వరకు ఈ నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారు.ఈ ప్రాజెక్టు యూఏఈ నెట్ జీరో 2050 వ్యూహం, దుబాయ్ సోషల్ అజెండా 33 లక్ష్యాలకు అనుగుణంగా అమలు కానుంది. అలాగే 2030 నాటికి దేశవ్యాప్తంగా 1,000కిపైగా హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్న యూఏఈవీ లక్ష్యానికి కూడా ఇది బలాన్నిస్తుంది. ఇటీవల మసీదుల పార్కింగ్ ప్రాంగణాల్లో కూడా ఇదే తరహా ఛార్జింగ్ మౌలిక వసతుల ఏర్పాటుకు యూఏఈవీ ఒప్పందాలు కుదుర్చుకోవడం, దుబాయ్లో గ్రీన్ మొబిలిటీ విస్తరణ వేగంగా సాగుతోందనే సంకేతాలను ఇస్తోంది. -
అమెరికా వెళ్లడం మరింత కఠినం
అమెరికా కలలకు మరిన్ని సంకెళ్లు పడుతున్నాయి! హెచ్1–బీతోపాటు గ్రీన్కార్డులు, స్టూడెంట్ వీసాలు పొందడమూ చాలా చాలా కష్టం కానుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరిక ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూండటం దీనికి కారణం. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే కానీ.. ఓకే అయితే మాత్రం అమెరికన్ వీసా కావాలంటే కొండలు కరగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఖర్చుతోపాటు విపరీతమైన స్క్రూటినీ, దస్తావేజులు అవసరమవుతాయని, భారతీయ ఐటీ ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వివరాలు... ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’స్లోగన్తో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలస దారులను తరిమేస్తామని తరచూ హూంకరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) విభాగం అక్రమ వలసదారుల ఏరివేతను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూడా. అంతేకాకుండా... ఇతర దేశస్తులు అమెరికాలో పని చేయడంపై కూడా ఆయన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తొలిసారి గద్దెనెక్కినప్పుడు కూడా అమెరికన్ ఉత్పత్తులే కొనాలని, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని ప్రతిపాదించిన ఆయన విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1–బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేయాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)తోపాటు ఐస్ కూడా వీసాల జారీ, అక్రమ వలసదారుల ఏరివేత విషయంలో ఎన్నో మార్పులు చేశారు కూడా. తాజాగా హెచ్1–బీ వీసాల జారీ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం డీహెచ్ఎస్, కార్మీక, విదేశీ వ్యవహారాల శాఖల ఉమ్మడి అజెండాలో ప్రచురితమైంది. ప్రజాభిప్రాయ సేకరణ (టెక్ కంపెనీలు, యూనివర్శిటీలు, వలస కార్మీకుల హక్కుల పరిరక్షణ సంఘాలు) తరువాత అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తరువాత అమల్లోకి వస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రతిపాదనలు వచ్చే నెల నుంచే అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఓపీటీపైనా ఫోకస్అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందేందుకు వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమంలోనూ పలు మార్పులను ప్రతిపాదించారు. 2024 –25లో భారత్ నుంచి సుమారు 3.6 లక్షల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లగా ప్రస్తుతం వారు కోర్సుకు తగ్గట్టుగా ఎంతకాలమైనా అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం మాత్రం ఇలా కుదరదు. నిర్దిష్ట సమయం మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత పొడింపునకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటే వచ్చే ఏడాది ఫ్రిబరి నుంచి ప్రాక్టికల్ ట్రెయినింగ్ నిబంధనలను సమీక్షించనున్నారు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసన్ రంగాల్లో చదివేవారికి ఇచ్చే రెండేళ్ల పొడిగింపుపై ఫోకస్ పెట్టారు. .వీటితోపాటే కొంతమంది విదేశీయులు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశమిచ్చే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (ఈఏడీ) విషయంలోనూ మార్పులు రానున్నాయి. తుది నిబంధనలు ఈ నెలలోనే రానున్నాయి. ఫలితంగా ఈఏడీల ఆటోమెటిక్ పొడిగింపునకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా హెచ్1–బీ వీసాదారుల భార్య/భర్తలే ఎక్కువగా ఈ ఈఏడీల ఆధారంగా ఉద్యోగాలు చేస్తూంటారు. ఈఏడీల పొడిగింపు ఆలస్యమైతే వారు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా పోతుంది. ఇవీ మార్పులుముందుగా వీసా నిబంధనల్లో రాగల మార్పులు చూద్దాం. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశముంది. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు. యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు. అమెరికన్లు చేయలేని పని హెచ1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. ఇంకోలా చెప్పాలంటే కంపెనీలు హెచ్1–బీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలు పెరుగుతాయి. వీసాల పొడిగింపునకూ ఫీజులు వసూలు చేయాని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. పెర్మ్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను కూడా మార్చనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. -
చైనాలో ఊహించని విపత్తు.. తప్పించుకున్న 900 పాములు
బీజింగ్: చైనాపై ప్రకృతి పగబట్టింది. తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దేశంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, గ్వాంగ్జీ (Guangxi) ప్రాంతంలో ఒక వింతైన, భయంకరమైన పరిస్థితి తలెత్తింది. వరద నీటి ఉధృతికి స్థానిక పెంపకం కేంద్రాల నుంచి వందలాది పాములు తప్పించుకుని ఊళ్లపై పడటంతో అధికారులు, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాల ప్రకారం.. గ్వాంగ్జీ ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో దాదాపు 900కు పైగా పాములు పెంచే కేంద్రాల నుంచి బయటకు వచ్చాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు వంటి విషసర్పాలు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. లోతైన వరద నీటిలో పాములు ఈదుకుంటూ వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.గ్వాంగ్జీ పరిధిలోని హెంగ్జౌ నగరంలో వరద నీరు,రోడ్లు బ్లాక్ అవ్వడం వల్ల ఒక విషాదం చోటుచేసుకుంది. వరదల్లో కొట్టుకువచ్చిన పాము కాటుకు గురైన ఒక మహిళ, సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో, పాము కాటు బాధితులకు తక్షణ చికిత్స అందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక వైద్య క్లినిక్లను ఏర్పాటు చేసింది.అలాగే తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. చైనాలోనే సాంప్రదాయ వైద్యం, తోలు ఉత్పత్తులు మాంసం కోసం వాడే వాణిజ్య పాముల పెంపకానికి గ్వాంగ్జీ అతిపెద్ద కేంద్రం. ఇక్కడ సుమారు 3 కోట్లకు పైగా సర్పాలను పెంచుతుంటారు. హెంగ్జౌ పరిసరాల్లోని పలు గ్రామాలు నీట మునగడంతో ఈ పాములన్నీ వరద నీటిలోకి చేరాయని ప్రాంతీయ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విపత్తులు, విషసర్పాల ప్రమాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అత్యవసర సహాయక చర్యలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. 📌 Hengzhou, #China 🇨🇳 July 6 /2026After days of heavy rain 🌧️ and flooding across China, around 900 snakes 🐍 escaped from a breeding farm in Hengzhou. Reports say the reptiles included venomous cobras, with villagers attempting to catch them in the floodwaters. pic.twitter.com/cTcgAZ4nZd— CAUGHTIN4KHQ (@CaughtIn4KHQ) July 9, 2026 -
ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ పార్థివదేహం
టెహ్రాన్: ఇరాన్ మజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘట్టం తుదిదశకు చేరుకుంది. మష్హాద్లోని ఇమామ్ రెజా పవిత్రక్షేత్రంలో పార్థివదేహం ఖననం చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు లక్షల సంఖ్యలో జనం మష్హాద్ బాట పట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఆ నగర వీధులన్నీ జనసముద్రంగా మారాయి.ఈ రోజు ఉదయం ఇరాక్లోని నజాప్ విమానాశ్రయం నుంచి ఖమేనీ భౌతికకాయం ఉన్న విమానం మష్హాద్ నగరానికి బయిలుదేరింది. ఈ అంత్యక్రియల విమాన ప్రయాణానికి అత్యంత భారీ భద్రత,అధికారిక ప్రోటోకాల్ను కేటాయించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్వయంగా ఆ విమానంలో ఖమేనీ భౌతికకాయంతో పాటు ప్రయాణించి ఎస్కార్ట్గా నిలిచారు.ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భౌతిక కాయం తరలిస్తున్న విమానానికి అత్యంత పటిష్ట భద్రత కల్పించారు. వాయుతలంలో ఆ విమానానికి ఇరు దేశాల వైమానికి దళాలు ఫైటర్ జెట్స్తో భద్రత కల్పించాయి. మష్హాద్ చేరుకున్న అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ల ద్వారా కర్బలాకు తరలించే సమయంలో కూడా భారీ సైనిక ఎస్కార్ట్ మధ్యే శవపేటికను తరలించారు.కాగా ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్సులో ఉన్న రైల్వే వంతెనపై దాడులు చేసింది. దీంతో టెహ్రాన్- మష్హాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.Iranian Fighter Jets escorted the plane carrying the caskets of Ayatollah Khamenei and his familyThis explains reports of the jet activity I was reading. https://t.co/7TxUPwnwD4 pic.twitter.com/gfTXLUwe21— Ryan Rozbiani (@RyanRozbiani) July 9, 2026 -
అంత్యక్రియల వేళ.. ఇరాన్కు గుండెకోత
టెహ్రాన్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగింపు వేళ ఇరాన్ కీలక వీడియో విడుదల చేసింది. ఆయన నివాసంపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను తొలిసారిగా అధికారికంగా పంచుకుంది. ఇంతవరకూ కేవలం శాటిలైట్ చిత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా అధికారికంగా వీడియోను విడుదల చేసింది.ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో దాడులలో భవనం పూర్తిగా శిథిలమైన చిత్రాలు క్షిపణుల దాడులు భవనం కుప్పకూలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని అంత్యక్రియలు ముగింపువేళ ఈ చిత్రాలు ఇరానీయలను తీవ్రమైన బాధకు గురి చేస్తున్నాయి.కాగా ఈ దాడిలో ఖమేనీ ఆయన కుటుంబసభ్యులతో సహా 14 నెలల మనవరాలు 40 మంది అధికారులు సైతం మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ భవనంపై ఏకకాలంలో 35 క్షిపణులను ప్రయోగించాయి. అయితే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయనను మషద్లో ఖననం చేయనున్నారు.కాగా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న అమెరికా దాడులకు తెగబడింది. చైనా, రష్యా, ఇరాన్లకు భూమర్గం ద్వారా జరిగే వస్తురవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వేబ్రిడ్జిపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఆందోళన నెలకొంది.Iran released footage of leader Khamanei's residence after the US attack that martyred him and his family, including 14-month old Zahra pic.twitter.com/dpSEJWKeGP— COMBATE |🇵🇷 (@upholdreality) July 8, 2026 -
రైల్వే బ్రిడ్జిపై అమెరికా దాడులు.. లబోదిబోమంటున్న మూడు దేశాలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తామని, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ క్రమంలో ఇరాన్, చైనా, రష్యా దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వే బ్రిడ్జిని అమెరికా వైమానిక దళం క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా- తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్లో అత్యంత కీలకమైన భాగం. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ సముద్ర రేవులపై ఉన్న పరిమితుల కారణంగా ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ ప్రత్యామ్నాయ రైలుమార్గాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ఆర్థిక, సైనిక సహకారాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతోనే అమెరికా ఈ కీలక మౌలిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు పాల్పడినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందనఈ దాడిని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దెబ్బతిన్న రైలుమార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా జరిపిన ఈ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన 'యుద్ధ నేరం' అని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో ఎయిర్రైడ్ సైరన్లు మోగాయి.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇరాన్ మాపై చేసే ప్రతి దాడికి 20 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తాం’ అని హెచ్చరించారు. వరుస పరిణామాలతో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లతో పాటు క్రిప్టోకరెన్సీ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. -
ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తి.. ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంస
మెల్బోర్న్ తనకు అద్భుతమైన స్వాగతం పలికిందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత్కు మంచి మిత్రుడని కొనియాడారు. ఈ రోజు గురువారం మెల్బోర్న్ మీట్ కార్యక్రమంలో మోదీతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని పాల్గొన్నారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 30 వేల మంది ప్రవాస భారతీయులతో కలసి మెల్బోర్న్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.ఆల్బనీస్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడని మెల్బోర్న్ వాసులతో గడపాడనికే ఆస్ట్రేలియా వచ్చానని ప్రధాని అన్నారు. 2014లో తొలిసారి 2023లో రెండోసారి ప్రస్తుతం మూడోసారి ఆస్ట్రేలియా వచ్చానని తెలిపారు. అహ్మాదాబాద్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదని అదే విధంగా మెల్బోర్న్ స్టేడియం క్రికెట్కు ఐకానిక్గా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. మెల్బోర్న్ను మినీ ఇండియాగా పిలుస్తారని భారతీయుల పండుగలను ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.ఒక కల పూర్తవగానే మరో కల నిర్ధేశించుకోవాలని ఆస్ట్రేలియాతో పాటు భారత అభివృద్ధితో సైతం భాగస్వామ్యం కావాలని అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారుఅంతకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మాట్లాడుతూ.. "ప్రపంచ దేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్పూర్తి మోదీ నాయకత్వంలో భారత్ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది" అని భారత ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడారు. కాగా ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొన్నారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాలలో దాదాపు 18 ముఖ్యమైన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. -
సౌరవ్యవస్థ కీలక సమాచారం చిక్కనుందా..?
‘న్యూ హొరైజన్స్’… అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2006లో గ్రహాంతర అన్వేషణ కోసం ప్రయోగించిన వ్యోమనౌక. ప్రస్తుతం భూమికి 950 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లూటో ఆవల దాదాపు ఏడాదిగా సుప్తావస్థలో ఉన్న ఈ ప్రోబ్ తాజాగా జాగృతమైంది. విశ్వంలో సుదూర ప్రయాణం చేసే ఇలాంటి వ్యోమనౌకలను అప్పుడప్పుడు నిద్రావస్థలోకి పంపుతుంటారు శాస్త్రవేత్తలు. వ్యోమనౌకలోని కొన్ని వ్యవస్థలు, పరికరాలను పనిచేయించడం నిలిపివేసి పవర్ ఆదా చేయడమే దీని ఉద్దేశం.వ్యోమనౌక సుప్తావస్థలో ఉన్నప్పటికీ అందులోని కీలక పరికరాలు యథావిధిగా సమాచార సేకరణ కొనసాగిస్తూ, అధ్యయనం జరుపుతూనే ఉంటాయి. గత ఏడాది ఆగస్టులో నిద్రలోకి జారుకున్న ‘న్యూ హొరైజన్స్’, ప్రస్తుతం ‘మంచి ఆరోగ్యంతో’ మేల్కొన్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక నుంచి భూమికి రేడియో సంకేతాలు అందడానికి 9 గంటలు పడుతోంది. నిద్ర మత్తు వదిలించుకున్న ‘న్యూ హొరైజన్స్’… గత 321 రోజులుగా తాను సేకరించిన డేటాను ఇక భూమికి ప్రసారం చేయనుంది. ప్లూటో, దాని చంద్రుళ్ల అధ్యయనం కోసం ప్రయోగించిన తొలి, ఏకైక మిషన్ ‘న్యూ హొరైజన్స్’. ఈ నౌక 2015లో ప్లూటోకు 12 వేల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లి పరిశోధించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2019 జనవరి 1న ప్లూటోకు 160 కోట్ల కిలోమీటర్ల ఆవల ఉన్నప్పుడు... సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ‘క్యూపర్ బెల్ట్’లో ‘మంచు మనిషి’ ఆకారంలో ఉన్న గ్రహశకలం ‘అరాకోట్’ (2014MU69/అల్టిమా థూలే) చెంతకు వెళ్లి అధ్యయనం చేసింది. ఈ నౌక ప్రస్తుతం భూమి నుంచి ఏడాదికి 48 కోట్ల కిలోమీటర్ల వంతున దూరంగా వెళుతోంది.బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై గురి!‘న్యూ హొరైజన్స్’ వ్యోమనౌక మరో మూడు వారాల్లో సూర్యుడి ‘బాహ్య హీలియోస్ఫియర్’లోని హైడ్రోజన్ గురించి పరిశోధన నిర్వహించనుంది. సూర్యుడి నుంచి నిరంతరం అంతరిక్షంలోకి విడుదలయ్యే అత్యంత శక్తిమంతమైన ఆవేశపూరిత కణాల ప్రవాహాన్ని ‘సౌర గాలి’ (సోలార్ విండ్) అంటారు. ఈ సౌర పవనం- మన సౌరవ్యవస్థలోని గ్రహాలను కూడా దాటి అంతరిక్షంలో ఓ భారీ ప్లాస్మా బుడగ ఆకృతిలో ‘హీలియోస్ఫియర్’ను ఏర్పరుస్తుంది. సాగదీసిన అశ్రుబిందువులా కనిపించే హీలియోస్ఫియర్... హానికర కాస్మిక్ రేడియేషన్, నక్షత్రాంతర ధూళి నుంచి మన సౌరవ్యవస్థను ఓ రక్షణ కవచంలా కాపాడుతుంది. సౌరవ్యవస్థ అంచుల్లో బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై ‘న్యూ హొరైజన్స్’ చేపట్టబోయేది ఓ కొత్త తరహా పరిశోధన. బాహ్య సౌరవ్యవస్థకు, నక్షత్రాంతర రోదసి (ఇంటర్స్టెల్లార్ స్పేస్)కి సరిహద్దుగా ఉండే ప్రాంతాన్ని ‘టెర్మినేషన్ షాక్’ అంటారు. మన సూర్యుడి మాదిరిగానే పాలపుంతలోని ఇతర నక్షత్రాల నుంచి దూసుకొచ్చే ఆవేశిత కణాలను గెలాక్టిక్ రేడియేషన్ అంటారు.ఈ ఆవేశిత కణాలతో కూడిన నక్షత్రాంతర మాధ్యమం (ఇంటర్స్టెల్లార్ మీడియం)ను సూర్యుడి బాహ్యవ్యవస్థ నిలువరించే సరిహద్దు ప్రాంతమే ‘టెర్మినేషన్ షాక్’. సూర్యుడి నుంచి గంటకు 30 లక్షల కిలోమీటర్ల ప్రచండ వేగంతో దూసుకొచ్చే సౌర గాలి ఈ ‘టెర్మినేషన్ షాక్’ హద్దును చేరుకోగానే నక్షత్రాంతర మాధ్యమ పీడనాన్ని ఎదుర్కొని వేగం కోల్పోతుంది. నక్షత్రాంతర మాధ్యమాన్ని ఢీకొని చివరికి ధ్వని వేగం కంటే కూడా తక్కువకు సౌర గాలి వేగం పడిపోతుంది. ‘టెర్మినేషన్ షాక్’ హద్దు వద్ద ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇకపై శాస్త్రవేత్తలకు అవకాశం లభించనుంది. 11 ఏళ్ల పాటు కొనసాగే సౌరచక్రంలో సౌర గరిష్ఠం, సౌర కనిష్ఠం దశల సందర్భంగా ఉండే సూర్యుడి స్థితి ఆధారంగా పై హద్దులు వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ మారుతుంటాయి. నాసా ప్రయోగించిన వోయేజర్-1, వోయేజర్-2 జంట వ్యోమనౌకలు 2012, 2018 సంవత్సరాల్లో హీలియోస్ఫియర్ దాటి ముందుకెళ్లాయి.అయితే బాహ్య సౌరవ్యవస్థ అన్వేషణార్థం ప్రస్తుతం ‘న్యూ హొరైజన్స్’లో ఉన్న అధునాతన శాస్త్రీయ పరికరాలు వాటిలో లేవు. ‘న్యూ హొరైజన్స్’ 2029-2040 సంవత్సరాల మధ్య కాలంలో ‘టెర్మినేషన్ షాక్’ ప్రాంతాన్ని చేరుతుందని భావిస్తున్నారు. అది అందించే డేటా కోసం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షరంగ భౌతిక శాస్త్రవేత్తలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. జంట వోయేజర్స్ తర్వాత విశ్వంలో సౌరవ్యవస్థను దాటి ప్రయాణించబోతున్న మూడో మానవ నిర్మిత వస్తువు ‘న్యూ హొరైజన్స్’!జమ్ముల శ్రీకాంత్ -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్కు ఎండ అవసరం. పవన విద్యుత్కు గాలి అవసరం. జలవిద్యుత్కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
ఫోర్స్డ్ లేబర్ విధానంపై యూఎస్ ద్వంద్వ నీతి
ప్రపంచ సరఫరా గొలుసు (గ్లోబల్ సప్లై చైన్) నుంచి బలవంతపు శ్రమను (ఫోర్స్డ్ లేబర్) నిర్మూలించాలనే నెపంతో అమెరికా ప్రతిపాదిస్తున్న నూతన సుంకాల విధానంలోని లోపాలను, ద్వంద్వ ప్రమాణాలను భారతదేశం అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేసింది. తమ దేశీయ అవసరాల కోసం ఏకంగా 1,600 వస్తువులకు మినహాయింపులు ఇచ్చుకుంటూ ఇతర దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించాలనుకోవడం అమెరికా అస్థిర వైఖరికి అద్దం పడుతోందని భారత్ ఘాటుగా విమర్శించింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) ప్రతిపాదించిన సుంకాలపై జరిగిన బహిరంగ విచారణలో భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా యూఎస్టీఆర్ ప్యానెల్ ముందు కీలక సాక్ష్యాలుంచారు.అమెరికా విధానం హేతుబద్ధం కాదుఅమెరికా తన దేశంలో ఉత్పత్తి చేయలేని 1,600 వస్తువులను బలవంతపు కార్మికుల(ఫోర్స్డ్ లేబర్) పరిశీలన పరిధి నుంచి ఏకపక్షంగా మినహాయించుకుందని జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా ఎత్తి చూపారు. ‘యూఎస్టీఆర్ ప్రకటించిన ఈ మినహాయింపులు అంతర్జాతీయ సరఫరా గొలుసులో బలవంతపు శ్రమ ప్రభావాన్ని పరిష్కరించాలనే అమెరికా విధాన హేతుబద్ధతను పూర్తిగా బలహీనపరుస్తున్నాయి. అంతేకాకుండా, లూప్హోల్స్ (సర్కమ్వెన్షన్ పద్ధతులు) ద్వారా జరిగే దుష్ప్రభావాన్ని నివారించడంలో ఈ విధానం విఫలమైంది’ అని బ్రిజ్ మోహన్ మిశ్రా తెలిపారు.టెక్స్టైల్ రంగంలో అమెరికా అనుసరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు. అమెరికాకు చెందిన పత్తి, ఇతర వస్త్ర ముడిసరుకులను ఉపయోగించి తయారుచేసే వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులపై యూఎస్ సుంకం రేట్లను తగ్గించడాన్ని ఆయన హైలైట్ చేశారు. ఇది విదేశీ తయారీదారులు తమ నిర్ణయాలను మార్చుకునేలా బలవంతం చేసే ఏకపక్ష చర్యే తప్ప బలవంతపు శ్రమ సమస్యకు నిజమైన పరిష్కారం కాదని స్పష్టం చేశారు.ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని 'సెక్షన్ 301' దర్యాప్తు వంటి ఏకపక్ష పద్ధతుల్లో కాకుండా, భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య చర్చల చట్రంలోనే పరిష్కరించుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందని మిశ్రా పునరుద్ఘాటించారు.అమెరికన్ వినియోగదారులకే నష్టం60 ఆర్థిక వ్యవస్థల నుంచి వచ్చే దిగుమతులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలనే అమెరికా ప్రతిపాదనను భారత పరిశ్రమల సమాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించాయి. యూఎస్టీఆర్ ప్యానెల్ ముందు ఫిక్కీ ప్రతినిధి పూర్ణిమా షెనాయ్ సాక్ష్యమిస్తూ ఈ అదనపు సుంకాల భారం అంతిమంగా అమెరికా పైనే పడుతుందని హెచ్చరించారు. ‘ఈ నిర్ణయం వల్ల భారతీయ ఎగుమతిదారులతోపాటు అమెరికా తయారీదారులు, దిగుమతిదారులు, రిటైలర్లు, చివరికి అమెరికన్ వినియోగదారులకు కూడా ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఎన్నో అమెరికా పరిశ్రమలు భారతీయ సరఫరాదారుల నాణ్యత, విశ్వసనీయత, అంతర్జాతీయ ప్రమాణాల సమ్మతిని నమ్మి దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
ఇరాన్ అంటే అంత భయమా?.. ట్రంప్ గగన ప్రయాణంలో ట్విస్ట్
ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఖతార్ నుంచి అందుకున్న వేల కోట్ల విలువైన కొత్త ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఉండగానే.. తిరుగు ప్రయాణంలో ఆయన పాత విమానాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న వేళ ట్రంప్ విమానం మార్చడం వెనుక భద్రతా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ట్రంప్ కోసం ఖతార్ ప్రభుత్వం సుమారు 400 మిలియన్ డాలర్లు (దాదాపు ₹3,400 కోట్లు) విలువైన బోయింగ్ 747-8 లగ్జరీ జెట్ను బహుమతిగా ఇచ్చింది. ఖతార్ రాజ కుటుంబం ఉపయోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. అమెరికా రక్షణ సంస్థ ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్ ఈ విమానంలో భద్రతా వ్యవస్థలు, రహస్య కమ్యూనికేషన్ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చింది. బోయింగ్ సంస్థ కొత్త ఎయిర్ఫోర్స్ వన్ విమానాల తయారీలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈ విమానాన్ని తాత్కాలికంగా ‘బ్రిడ్జ్ ఎయిర్ఫోర్స్ వన్’గా ఉపయోగిస్తున్నారు.ఈ విమానం గురించి ట్రంప్ ‘‘అద్భుతం (truly magnificent)’’ అంటూ ప్రశంసించారు. యూరప్లోని పలు అమెరికా సైనిక స్థావరాలకు తీసుకెళ్లి అక్కడి సైనికులకు చూపించాలని కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా బ్రిటన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ మిల్డెన్హాల్ స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందికి ఈ విమానాన్ని చూపించారు.కొత్త విమానం ఉండగా.. పాతదానిలో ప్రయాణంనాటో సదస్సు సమావేశం కోసం ట్రంప్ ఈ కొత్త ఎయిర్ఫోర్స్ వన్లో టర్కీకి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం అనూహ్యంగా పాత ఎయిర్ఫోర్స్ వన్ను ఎంచుకున్నారు. అంకారా నుంచి బ్రిటన్లోని రాయల్ ఎయిర్ఫోర్స్ మిల్డెన్హాల్ (RAF Mildenhall) స్థావరం వరకు పాత విమానంలో ప్రయాణించిన ట్రంప్.. అక్కడ కొత్త విమానాన్ని ఎక్కి అమెరికాకు తిరిగి వెళ్లారు.ఇరాన్ ముప్పు కారణమా?కొత్త విమానాన్ని వదిలి పాతదానిలో ఎందుకు ప్రయాణించారన్న ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ హిట్ లిస్ట్లో నేనే నంబర్ వన్’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచాయి. అధ్యక్షుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ సర్వీస్ అధికారులు పాత విమానాన్ని ఎంచుకోవాలని సూచించినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అయితే ట్రంప్ పేషీ మాత్రం విమానం మార్పు భద్రతా కారణాలతో కాదని తెలిపారు.కొత్త విమానం భద్రతపై సందేహాలు?కొత్త ఎయిర్ఫోర్స్ వన్లో అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణి రక్షణ సదుపాయాలు వంటి మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ సమయంలోనే మార్పులు పూర్తి చేయడంతో భద్రతా ప్రమాణాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఎయిర్ఫోర్స్ వన్ విమానాలు ఎన్నో ఏళ్లుగా పరీక్షించబడ్డ రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.విమానం బహుమతిపై వివాదంవిదేశీ ప్రభుత్వం నుంచి ఇంత విలువైన విమానాన్ని స్వీకరించడంపై అమెరికాలో రాజకీయ, నైతిక విమర్శలు కూడా వచ్చాయి. విమానం బహుమతిగా వచ్చినప్పటికీ.. భద్రతా మార్పులు, సాంకేతిక అప్గ్రేడ్ల కోసం అమెరికా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విమాన యాజమాన్యాన్ని డొనాల్డ్ జే. ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్కు బదిలీ చేసే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.మొత్తంగా.. ‘అద్భుతం’ అని ట్రంప్ మెచ్చిన విమానాన్నే తిరుగు ప్రయాణంలో పక్కన పెట్టడం.. ఇరాన్ ఉద్రిక్తతల వేళ కొత్త చర్చకు దారితీసింది. -
ఏఐతో కొత్త ముప్పు.. షాకింగ్ ఘటన!
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రపంచానికి కొత్త అవకాశాలను అందిస్తున్న వేళ.. దాని దుర్వినియోగం మరో కొత్త ముప్పుగా మారుతోంది. ఏఐ సాధనాలను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన బలం చేకూర్చింది. చాట్జీపీటీ సాయంతో ఓ ప్రోగ్రామ్ రూపొందించి వేలాది వినియోగదారుల ఖాతాలను ప్రభావితం చేశాడన్న ఆరోపణలతో 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్ కావడం ఇక్కడ మరో విశేషం. జపాన్కు చెందిన ఓ టీనేజర్.. ప్రముఖ యానిమే స్ట్రీమింగ్ సేవ అయిన బందాయ్ ఛానల్పై సైబర్ దాడికి పాల్పడ్డాడు. చాట్జీపీటీ సాయంతో కోడింగ్ను బ్రేక్ చేసి.. ఏకంగా 46,812 మంది వినియోగదారుల ఖాతాలు హ్యాక్ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కంపెనీ అప్రమత్తమై ఆ ఖాతాలను నిలిపివేసింది. సంస్థ సేవలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది.చాట్జీపీటీ సాయంతో కోడ్..టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న నిందితుడు.. బందాయ్ ఛానల్ వ్యవస్థలోని భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని ఉపయోగించుకునేందుకు అతడు ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్లోని కొంత భాగాన్ని పూర్తి చేసేందుకు చాట్జీపీటీ సాయం తీసుకున్నాడు. ఖాతాల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన కోడ్ను తానే రూపొందించానని, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో మరో ప్రోగ్రామింగ్ భాషలో పూర్తి చేసేందుకు చాట్జీపీటీని ఉపయోగించానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం.46 వేలకుపైగా ఖాతాల రద్దుపోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన కిందటి ఏడాది చివర్లో జరిగింది. 2025 నవంబర్ 4న బందాయ్ ఛానల్ సర్వర్లకు అనధికార ఆదేశాలు పంపారు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారుల సభ్యత్వాలు రద్దయ్యాయి. ఈ ప్రభావంతో నవంబర్ 6 నుంచి సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత డిసెంబర్లో సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు బందాయ్ ఛానల్ వెల్లడించింది.ఐపీ మార్చి.. ఏమార్చి.. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ అతడి యాక్సెస్ను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుడు తన ఐపీ అడ్రస్ను దాదాపు 30 సార్లు మార్చి మళ్లీ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యవస్థలోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల సమాచారాన్ని చేరుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నారు.సరదాగానే..విచారణలో బాలుడు ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అయితే బందాయ్ ఛానల్పై తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి ఉందని, నాలుగో తరగతిలోనే వాటిని ఉపయోగించడం ప్రారంభించానని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగానని, సంస్థను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపించడంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు బాలుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.చిన్న వయసులోనే కోడింగ్ నైపుణ్యంఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిందితుడు చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్పై పట్టు సాధించాడు. ప్రాథమిక పాఠశాల దశలోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.వినియోగదారులకు హెచ్చరికసైబర్ దాడి తర్వాత బందాయ్ ఛానల్ ప్రభావిత వినియోగదారులకు సమాచారం అందించింది. నకిలీ ఈమెయిల్స్, ఫిషింగ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దైన సభ్యత్వాలను తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలైన రుసుములను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే వినియోగదారుల సమాచారం బయటకు లీకైందని లేదా దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.ముమ్మాటికీ కొత్త ఆందోళనే!కృత్రిమ మేధ అందిస్తున్న అవకాశాలతో పాటు.. దాని దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. చాట్జీపీటీ వంటి సాధనాలను సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, దాన్ని తప్పుదోవ పట్టిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని జపాన్లో జరిగిన ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. -
మోదీ ఆస్ట్రేలియా మిషన్.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి!
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెల్బోర్న్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయనకు అధికారిక గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు.మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలు, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.వ్యాపార దిగ్గజాలతో మోదీ భేటీమెల్బోర్న్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం, ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులకే పరిమితం కాకుండా.. రాష్ట్రాలు, నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల స్థాయిలోనూ విస్తరించాలని మోదీ సూచించారు. రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాలను గుర్తించి కొత్త అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు.ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఆహ్వానంఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్ను భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆ దేశ పెన్షన్ ఫండ్స్ నిర్వహిస్తున్న భారీ నిధులు సురక్షితమైన, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి భారత్లో అవకాశాలను పొందగలవని చెప్పారు. భారత్లో మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.గ్రీన్ ఎనర్జీపై దృష్టిభారత్ స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. హరిత హైడ్రోజన్, సౌర విద్యుత్, వాయు విద్యుత్, జల విద్యుత్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.అల్బనీస్తో కీలక భేటీ.. సెల్ఫీ వైరల్ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తోనూ మోదీ సమావేశమయ్యారు.భారత ప్రవాసులతో..మెల్బోర్న్లో భారతీయ ప్రవాసులతో మోదీ సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.మొత్తంగా.. మోదీ ఆస్ట్రేలియా పర్యటన భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. రక్షణ నుంచి వాణిజ్యం వరకు పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఒక్క దెబ్బ కొడితే.. 20 రెట్లు బలంగా కొడతాం
వాషింగ్టన్: ఇరాన్పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తమపై లేదంటే తమ మిత్రదేశాలపై ఇరాన్ ఎలాంటి దాడికి పాల్పడినా.. దానికి 20 రెట్లు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.అమెరికా దళాలు ఇరాన్పై వరుసగా రెండో రోజు దాడులు కొనసాగించాయి. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని ఇరాన్షహర్ ఎయిర్బేస్పై దాడి చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు, చిత్రాలను విడుదల చేశారు. ఈ స్థావరాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) వినియోగిస్తున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ తీర ప్రాంతంలోని బుషెర్, చాబహార్, కొనారక్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. బుషెర్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ‘‘చూస్తూ ఊరుకోం’’: ట్రంప్ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడినైనా తిప్పికొడతామని ట్రంప్ తెలిపారు. ‘‘వాళ్లు మమ్మల్ని ఒక్కసారి కొడితే.. మేము 20 రెట్లు బలంగా సమాధానం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని గతంలో ప్రకటించిన ట్రంప్.. చర్చలకు మాత్రం అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తుందా? అన్నదే ప్రధాన సందేహమని అన్నారు. అందుకే ఎలాంటి ఒప్పందం విషయంలోనూ తొందరపడబోమని స్పష్టం చేశారు. ఇది సాధారణ యుద్ధం కోసం చేస్తున్న చర్య కాదని.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.ఇజ్రాయెల్ మౌనం వెనుక వ్యూహమేంటి?అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్ను ప్రధాన భద్రతా ముప్పుగా చూస్తున్న ఇజ్రాయెల్.. తాజా పరిణామాలపై నిశితంగా గమనిస్తోంది. అయితే ఈ దశలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మౌనం పాటిస్తోంది. అమెరికా చర్యలకు మద్దతు ఇస్తూనే.. పరిస్థితులు ఏ దిశగా వెళ్తాయో అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రతీకార చర్యలకు దిగిన ఇరాన్అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టంపై వెంటనే స్పష్టత రాలేదు. కువైట్ సైన్యం మాత్రం డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.హర్ముజ్పై ఇరాన్ పట్టుహర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ‘‘మీరు దాడి చేస్తే.. మిమ్మల్ని కూడా దాడి చేస్తాం’’ అంటూ హెచ్చరించారు. హర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు ఇరాన్ నిబంధనల ప్రకారమే సాగుతాయని తెలిపారు.చర్చలకు బ్రేక్?ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తాజా పరిణామాలు అడ్డంకిగా మారాయి. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. బెదిరింపులు బలానికి సంకేతం కాదని, అమెరికా విధానాల వైఫల్యాన్ని చూపిస్తున్నాయని విమర్శించింది.పెరిగిన చమురు ధరలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్పై పడింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చమురు ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్..
దుబాయ్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల అనంతరం అమెరికా ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులు చేపట్టింది. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతమంతా హై అలర్ట్లోకి వెళ్లింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలుచోట్ల సైరన్లు మోగాయి.తాజా పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాల్లో హెచ్చరిక సైరన్లు మోగించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమాన్ దేశాలు కూడా తమ వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తి అప్రమత్త స్థితిలో ఉంచాయి.ఇదిలా ఉండగా అమెరికా దాడుల్లో ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, చాబహార్, జాస్క్, సిరిక్, అబూ మూసా దీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఆగ్నేయ ఇరాన్లోని ఇరాన్షహర్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఓ అగ్నిమాపక సిబ్బంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) వెల్లడించింది. ఈ ఘటనలో విమానాశ్రయ భవనాలు దెబ్బతిన్నాయి.BREAKING:🚨🇮🇷 🇺🇸Gulf states hosting United States military bases—namely the UAE, Kuwait, Qatar, and Bahrain—have been attacked by Iran because Trump violated a ceasefire during Khamenei's funeral procession. pic.twitter.com/0YsQb5XZAg— Mr. Hass 💛 (@Lassegaf_1) July 8, 2026ఇక, ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఖాలెద్ ఖాదేరీ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇక అమల్లో లేదని ప్రకటించారు. ఇరాన్పై భీకర దాడులతో అమెరికా సైన్యం విరుచుకుపడుతోంది.WATCH 🔴Footage captures a massive U.S. strike hitting Iran’s Chabahar Port, Iran pic.twitter.com/zmYAro1P3u— Open Source Intel (@Osint613) July 8, 2026 -
ఇరాన్ హిట్ లిస్ట్లో నేనే నంబర్ వన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇరాన్ టార్గెట్ చేసిన హిట్ లిస్ట్లో (కిల్ లిస్ట్)లో మొదటి స్థానంలో ఉన్నానని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసే ఇరాన్ ప్లాన్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇరాన్ దాడి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు.నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటీవల ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక దాడులను సమర్థించారు. ఇరాన్ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే అమెరికా బలంగా వ్యవహరించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే వెంటనే స్పందిస్తామని తెలిపారు.కాగా, 2020లో ఇరాన్ సైనిక అధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నాయకులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్పై హత్యాయత్నాలకు సంబంధించిన కుట్రలను అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా వెలుగులోకి తెచ్చాయి. అయితే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి స్థానంలో ఉన్నానన్న ట్రంప్ వ్యాఖ్యకు సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి, నాటో సభ్యదేశాలు, మధ్యప్రాచ్య దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ ఉద్రిక్తతల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ యుద్ధం!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్, బందర్ అబ్బాస్, కొనారక్, ఇరాన్షహర్ సహా దక్షిణ ఇరాన్లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ప్రకటనలో, హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని వెల్లడించింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్ను బాధ్యుడిగా నిలబెడుతున్నామని స్పష్టం చేసింది.హెచ్చరిక తర్వాతే దాడులుమంగళవారం హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు సరకు నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. "నిన్న నౌకలపై జరిగిన దాడికి ఇదే సమాధానం. మళ్లీ అలాంటి దాడులు జరిగితే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.టర్కీలో జరిగిన నాటో సదస్సులో మాట్లాడుతూ, "ఇరాన్తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు.మరింత తీవ్రంగా అమెరికా దాడులురాయిటర్స్ కథనం ప్రకారం.. బుధవారం జరిగిన దాడులు మంగళవారం కంటే మరింత విస్తృతంగా సాగాయి. ఇరాన్ దక్షిణ తీరంలోని కీలక సైనిక, నౌకాదళ మౌలిక సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్న బందర్ అబ్బాస్, నౌకాదళ స్థావరాలు ఉన్న కొనారక్, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్లో సముద్ర రవాణా నియంత్రణ టవర్కు నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్ల అనంతరం అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్షహర్లో కూడా వరుస పేలుళ్లు నమోదయ్యాయి.అమెరికా స్థావరాలే లక్ష్యంగా..అమెరికా దాడులకు ముందు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా తాజా దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై "భారీ దాడి"కి సిద్ధమవుతున్నామని ఇరాన్ భద్రతా వర్గాలకు చెందిన నూర్ న్యూస్ వెల్లడించింది.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రబిందువుప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా చర్చల్లో పైచేయి సాధించాలనే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా హర్ముజ్లో ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.శాంతి చర్చలకు మరోసారి దెబ్బజూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించినప్పటికీ, తాజా దాడులతో ఆ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు చేయడం, ఎర్ర సముద్రానికి కీలక ద్వారమైన బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని మూసివేయడం వంటి ప్రతీకార చర్యలను కూడా ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లలో కలకలంతాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక దశలో సుమారు 7 శాతం వరకు ఎగసిపడగా, తర్వాత బ్యారెల్కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
మళ్లీ రణరంగం!
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సైన్యం బుధవారం తెల్లవారుజామున బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగింది. హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేసిందంటూ అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షలు విధించింది. లైసెన్స్ను రద్దు చేసింది. రాత్రిపూట ఇరాన్పై వైమానిక దాడులకు పాల్పడింది. హార్మూజ్లో సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేసి, వాటికి నష్టం కలిగించినందుకు అమెరికా దళాలు ఇరాన్పై దాడులు చేశాయని యూఎస్ మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్లు, పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఉపయోగించే 80కి పైగా చిన్న పడవలతో సహా పలు లక్ష్యాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో అమెరికా స్థావరాలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది తెలియరాలేదు. బహ్రెయిన్ తన క్షిపణి హెచ్చరిక సైరన్ను మోగించింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. మరోవైపు అమెరికా దుందుడుకు చర్యపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బెదిరింపులు, బలవంతపు వసూళ్ల శకం ముగిసింది’’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా దాడులకు, ఒత్తిల్లకు తలవంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. -
రష్యా అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు ఫ్రంట్లో రష్యాకు చెందిన అత్యాధునిక Su-35 మల్టీరోల్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. "ఈ రోజు మరో రష్యన్ వైమానిక ఉగ్రవాదిని నేలకూల్చాం" అంటూ టెలిగ్రామ్లో వెల్లడించిన ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్, ఘటన జరిగిన ప్రాంతాన్ని మాత్రమే వెల్లడించగా.. దాడి ఎలా నిర్వహించారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటనపై రష్యా అధికారికంగా స్పందించలేదు. స్వతంత్ర వర్గాలు కూడా ఈ ఘటనను పూర్తిగా ధ్రువీకరించలేదు.Su-35 (నాటో కోడ్నేమ్ Flanker-E) రష్యా వైమానిక దళంలోని అత్యంత శక్తివంతమైన నాలుగో తరం మల్టీరోల్ యుద్ధ విమానాల్లో ఒకటి. గగనతల ఆధిపత్యం సాధించడం, దీర్ఘదూర క్షిపణి దాడులు, భూ లక్ష్యాలపై బాంబుదాడులు వంటి కీలక ఆపరేషన్లలో ఈ విమానాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధునాతన రాడార్, శక్తివంతమైన ఇంజిన్లు, దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలు దీనికి ప్రత్యేకత.ఇటీవలే జూన్ 26న రష్యా ఆక్రమిత క్రిమియాలోని బెల్బెక్ ఎయిర్బేస్పై నిర్వహించిన దాడిలో రష్యా మిగ్-29 యుద్ధ విమానం ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ సైనిక గూఢచారి సంస్థ (HUR) వెల్లడించింది. ఆ ఘటనతో రష్యాకు కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ అంచనా వేసింది.ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఇప్పటివరకు 436 యుద్ధ విమానాలు, 353 హెలికాప్టర్లను కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఈ గణాంకాలను రష్యా అంగీకరించలేదు. స్వతంత్రంగా కూడా నిర్ధారణ కాలేదు. -
సూర్యుడి ‘సర్వ’ దర్శనం!
సరిగ్గా... జూలై ఎనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం 4.40 నిమిషాలకు ఏం జరిగిందో తెలుసా? ఒక అరుదైన ఘట్టం నమోదైంది. ప్రపంచ జనాభాలో 99 శాతం మంది సూర్యుడిని చూడగలిగారు. అది కూడా ఒకే ఒక్క నిమిషం మాత్రమే. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఆగ్నేయాసియా దేశాలు కొన్ని, అంటార్కిటికాలు మాత్రమే చీకట్లో ఉండిపోయాయి! ఇలా ఎందుకంటే సూర్యుడి చుట్టూ తిరిగే భూమి ఒకపక్కకు వాలి ఉంటుందని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. జూన్, జూలైలో ఈ వాలు సూర్యాభిముఖంగా ఉంటుంది. ఫలితంగా కొన్నిసార్లు భూమి ఒక ప్రత్యేక స్థానంలోకి వచ్చి చేరుతుంది. సూర్యుడి వెలుగు భూమ్మీద అత్యధిక ప్రాంతంపై పడుతూ ఉంటుందన్నమాట. ఈ ఏడాది జూలై ఎనిమిదవ తేదీ కూడా ఒకటి. ఈ రోజు గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ ప్రకారం ఉదయం 11.10 గంటలకు మొత్తం 820 కోట్ల మంది ప్రజలకు సూర్యుడి వెలుతురును పొందగలిగారు. అలాగని అన్ని చోట్లా పట్టపగల్లాంటి ప్రకాశం లేదులెండి. ఈ భాగ్యం 690 కోట్లమందికి దక్కితే... దీపాల అవసరం లేనంత వెలుగును ఇంకో 58 కోట్ల మంది అనుభవించారు. ఆకాశం నల్లబడి.. దిగంతం ప్రకాశవంతంగా ఉన్న పరిస్థితి ఇంకో 49 కోట్ల మందికి లభించింది. చీకటిపడే ముందు లీలగా కనిపించే వెలుతురును 24.9 కోట్ల మంది చూశారు. సుమారు 8.3 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో ఒక్క శాతం మంది మాత్రమే నిశిరాత్రిలో ఉండిపోయారు. ప్రపంచ జనాభాలో 90 శాతం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుందన్నది ఒక విశేషమైతే.. 99 శాతం మందికి ఒకే ఒక్క నిమిషం సూర్యుడి దర్శనం లభించడం ఇంకో విశేషం అన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ్రస్టేలియాలో మోదీకి ఘన స్వాగతం
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటన పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ్రస్టేలియాకు చేరుకున్నారు. ఇప్పుడే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టానని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పర్యటన భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఉత్తేజాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఆ్రస్టేలియా నేతలతో జరపబోయే చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో మోదీకి ఆ్రస్టేలియా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్తో మోదీ సమావేశం కాబోతున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చిస్తారు. అలాగే ప్రవాస భారతీయులను సైతం మోదీ కలుసుకుంటారు. అల్బానీస్తో కలిసి 3వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. కీలకర రంగాల్లో భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సంప్రదింపులు జరుపుతారు. మెల్బోర్న్లోని హోటల్కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. వందేమాతరం, మోదీ–మోదీ అని నినదించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనతో ఆలరించారు. మెల్బోర్న్లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ భారతీయుల ఆతీ్మయ స్వాగతం మాత్రం నిజంగా చిరస్మరణీయమని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి అనురాగం, భారతదేశంతో వారికి ఉన్న దృఢమైన అనుబంధం ఎప్పటికీ ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. -
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం
యోగ్యకార్తా: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంతో కూడా ఉన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఈ ఆలయాన్ని ఉమ్మడిగా పరిరక్షించే ప్రాజెక్టును ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఇండోనేసియాల మధ్య చిరకాల నాగరికతా బంధాలకు ఒక అద్భుతమైన నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తున్న ఉమ్మడి వారసత్వానికి ఇదొక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత్ సహాయంతో ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ తరపున ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కీలకంగా వ్యవహరించే ఈ ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టు.. అలాగే ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ, సుబియంతో కలిసి సందర్శించడం వంటి పరిణామాలు భారత్–ఇండోనేసియా బంధానికి తిరుగులేని ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రదేశంలో ఏఎస్ఐ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని వారిద్దరూ ఆవిష్కరించారు. ఇది దైవత్వ భావనతో నిండిన క్షణం తొలుత ప్రంబనన్ ఆలయానికి చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ ఇక్కడి విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ చరిత్రను వివరించారు. మోదీ, సుబియంతో పరస్పరం కరచాలనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఆలయ సముదాయానికి సంబంధించిన ఉమ్మడి పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు. మిత్రుడు, అధ్యక్షుడు సుబియంతోతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఈ సందర్భం తనకు మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఇండోనేసియా ప్రజలు ఈ గొప్ప వారసత్వాన్ని భక్తిభావంతో సంరక్షిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఇండోనేసియా ప్రజలకు, ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన పాలకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన క్షణం దైవత్వ భావనతో నిండిన క్షణం అని వ్యాఖ్యానించారు. భారత్–ఇండోనేసియా స్నేహాన్ని బలోపేతం చేయడం, ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, శీఘ్ర అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించానని మోదీ తెలిపారు. ప్రంబనన్ ఆలయ సముదాయంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో, భారతీయ పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్లినా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూడవచ్చు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి సంబంధించిన అతిపెద్ద గుర్తింపుల్లో ఆ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. నేడు ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’అని మోదీ వివరించారు. కాలాతీత చిహ్నం ఇండోనేసియా అధ్యక్షుడితో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్భుతమైన ప్రంబనన్ దేవాలయం మన సాంస్కృతిక, ఆధ్యాతి్మక అనుబంధాలకు కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. ఇటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే తరతరాలకు స్ఫూర్తినిచ్చే సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రయత్నంలో ఇండోనేసియాతో భాగస్వామి కావడం భారత్కు దక్కిన అదృష్టం. గాఢమైన సాంస్కృతిక సంబంధాలున్న దేశాలుగా భారత్, ఇండోనేయాలు ఉమ్మడి గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి’’అని మోదీ పేర్కొన్నారు. ప్రంబనన్ గుడి యోగ్యకార్తా నగరానికి ఈశాన్యంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా పరిగణిస్తారు. 9వ శతాబ్దంలో నిర్మించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు అంకితం చేశారు. ఈ ఆలయ సముదాయం భారతదేశం, ఇండోనేసియాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
ఇక చర్చలు టైమ్ వేస్ట్!
అంకారా: పశ్చిమాసియాలో సంఘర్షణను ముగించడానికి ఇరాన్తో కుదుర్చుకున్న మధ్యంతర శాంతి ఒప్పందం.. తద్వారా కాల్పులు విరమణ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. బుధవారం తుర్కియేలోని అంకారాలో నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్ నాయకులను ‘నీచులు, రోగులు’గా అభివర్ణించారు. ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవడానికి తాను ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. ఇరాన్తో మూడు వారాల క్రితం సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ముగిసిందని పేర్కొన్నారు. ఇకపై వాళ్లతో(ఇరాన్) ఒప్పందాలు చేసుకోవాలని ఎంతమాత్రం అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ, ఇరాన్కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటన వెంటనే ప్రభావం చూపింది. చమురు ధరలు 5 శాతానికిపైగా పెరిగాయి. యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అమెరికా, ఇరాన్లు తమ కాల్పుల విరమణను కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నాయి. హార్మూజ్ జలసంధిపై పూర్తిస్థాయిలో పట్టు బిగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండగా, అమెరికా అందుకు అంగీకరించడం లేదు. బహుశా ఈ రాత్రి కూడా దాడులు! ఇరాన్ నేతలపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వారు ముమ్మాటికీ నీచులు, రోగగ్రస్తులు, దుర్మార్గులు, హింసాత్మక మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగిస్తారు’’అని ఆక్షేపించారు. అయితే, అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలను కొనసాగించవచ్చని ట్రంప్ సూచించారు. కానీ, ఆ చర్చల్లో ఒరిగేదేమీ ఉండదని, టైమ్ వేస్ట్ అంటూ కొట్టిపారేశారు. పిచ్చివాళ్లతో చర్చలు జరపడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అబద్ధాలకోరులతో చర్చించడం అంటే సమయం వృథా చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదన్నారు. ఇరాన్పై మళ్లీ దాడులకు అమెరికా సన్నద్ధమవుతోందని ట్రంప్ తెలిపారు. నిన్న రాత్రి వారిపై తీవ్రమైన దాడి చేశామని, బహుశా ఈ రాత్రి కూడా గట్టిగా దాడి చేస్తామని స్పష్టంచేశారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తమ దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ చాలా దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. హార్మూజ్లో నౌకలపై డ్రోన్లు, క్షిపణిని ప్రయోగించిందని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్రస్థాయిలోదాడులకు దిగుతామని ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలు ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకుంటామని అన్నారు. అవసరమైతే ఇరాన్కు చెందిన విద్యుత్ కేంద్రాలను, నీటి శుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ చెప్పారు. మంగళవారం ఖర్గ్ ద్వీపంపై దాడులు ఉన్నప్పటికీ అక్కడి చమురు కేంద్రాలపై మాత్రం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘బహుశా మేము ఖర్గ్ ఐలాండ్ను స్వా«దీనం చేసుకోవచ్చు. దాన్ని మేము స్వా«దీనం చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి ఇరాన్ చేయగలిగేది ఏమీ ఉండదు’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. మరోవైపు దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ చమురు అమ్మకాలపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ల మధ్య ఘర్షణ ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చడం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. -
Breaking: మళ్లీ ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దాడులపై హెచ్చరించిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్పై తాజా వైమానిక దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా తెలిపింది.ఇరాన్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక నౌకాశ్రయ నగరాలైన చాబహార్, బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వినియోగించే సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా అమెరికా దాడులు సాగించినట్లు సమాచారం."హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపర్చడమే ఈ దాడుల ఉద్దేశం" అని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటిస్తూ, అవసరమైతే ఇరాన్పై మరింత కఠిన చర్యలకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆయన ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులు చేయడం గమనార్హం.At the direction of the Commander in Chief, U.S. Central Command forces have started conducting additional strikes against Iran to further degrade their ability to threaten freedom of navigation in the Strait of Hormuz. The United States is holding Iran accountable for recent…— U.S. Central Command (@CENTCOM) July 8, 2026JUST IN: 🇮🇷🇺🇸 Smoke rises in Iran following US strikes. pic.twitter.com/HdCsYaiiXC— BRICS News (@BRICSinfo) July 8, 2026 -
నేను అమెరికా డైట్ మాత్రమే తింటా
న్యూఢిల్లీ: జైలు గదిలోకి వెళ్లాక చిప్పకూడు తప్పదు అని పెద్దలంటారు. కానీ అగ్రరాజ్యంలో పుట్టి పలు దేశాల్లో సాయుధ ముఠాలకు శిక్షణనిచ్చిన సైనిక నిపుణుడు, భారత్లో అక్రమంగా చొరబడి సాయుధ ముఠాలకు డ్రోన్లను ఆపరేట్ చేయడంలో శిక్షణ ఇచ్చేందుకు తెగించిన మాథ్యూ ఆరోన్ వ్యాన్ డైక్ మాత్రం తనకు అమెరికా డైట్ మాత్రమే కావాలని మొండిపట్టుపట్టాడు. నిరాహార దీక్ష చేస్తూ గత 50 రోజులుగా కేవలం సోయామిల్క్ మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడని అతని తరఫు లాయర్లు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలని గతంలో ఇతడిని అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి ప్రశాంత్ శర్మ గతవారం ఆదేశించారు. అయితే ఈ విషయమై మాథ్యూ లాయర్లు బుధవారం మాట్లాడారు. ఎన్ఐఏకు బదులుగా తిహార్ జైలు అధికారులు ఈ విషయంలో స్పందన తెలపబోతున్నారని వెల్ల డించారు. ‘‘మాథ్యూ అమెరికా తరహా ఆహారం మాత్రమే తింటాడు. భారతీయ కారాగారాల్లో విచారణ ఖైదీలు, దోషులకు అందించే ఆహారం మహా ఘాటుగా, కారంగా ఉంటుంది. అది ఈయన తినలేడు. మసాలా దట్టించి నూనెలో ముంచి తీసిన, నూనెలో బాగా వేయించిన భారతీయ వంటకాలు మాథ్యూకు పడవు. అందుకే అమెరికన్ స్టైల్లో ఆహారం అందించాలని న్యాయస్థానాన్ని కోరాం. అతనికి రోజూ సోయామిల్క్ను అందుబాటులో ఉంచాలని జడ్జిని అభ్యర్థించాం’’ అని వాళ్లు వెల్లడించారు. ఈ కేసు విచారణను జడ్జి జూలై 21వ తేదీకి వాయిదావేశారు. -
రూ.70 కోట్ల లాటరీ.. ఆ అదృష్టవంతుడు భారతీయుడే!
అబుదాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు సునీల్ కుమార్ సదాశివన్ (52) యూఏఈ లాటరీలో ఏకంగా 30 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ.70 కోట్లు) గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరుడయ్యాడు. జూలై 1న జరిగిన 'లక్కీ డే' డ్రాలో ప్రకటించిన ఏడు విజేత సంఖ్యలను సరిగ్గా సరిపోల్చడంతో ఈ భారీ జాక్పాట్ అతని సొంతమైంది. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.విజయం గురించి స్పందించిన సునీల్ కుమార్.. తొలిసారి ఫలితాలు చూసినప్పుడు సంఖ్యలను తప్పుగా చదివానేమో అనిపించిందని, మరోసారి టికెట్ను పరిశీలించిన తర్వాతే తాను నిజంగానే గెలిచానని అర్థమైందన్నారు. "మొదట నమ్మలేకపోయాను. మళ్లీ చూసిన తర్వాతే ఇది నిజమని గ్రహించాను" అని ఆయన పేర్కొన్నారు.యూఏఈ లాటరీలో గత ఐదు వారాల వ్యవధిలో ప్రకటించిన రెండో 30 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్ విజేత సునీల్ కుమారే. అంతకుముందు మే నెలలో నేపాల్కు చెందిన టయాబ్ ఖాన్ తన స్నేహితులతో కలిసి ఇదే జాక్పాట్ను గెలుచుకున్నాడు. అలాగే 2025లో ప్రవాస భారతీయుడు అనిల్కుమార్ బొల్లా 100 మిలియన్ దిర్హామ్ల తొలి గ్రాండ్ ప్రైజ్ను దక్కించుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం యూఏఈ లాటరీ ప్రతి బుధవారం, శనివారం 'లక్కీ డే' డ్రాలను నిర్వహిస్తోంది. ప్రతి డ్రాలో 30 మిలియన్ దిర్హామ్ల గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హామ్ల రెండో బహుమతి, అలాగే ముగ్గురు అదృష్టవంతులకు 50 వేల దిర్హామ్ల చొప్పున 'లక్కీ ఛాన్స్' నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఈ డ్రాలో పాల్గొనడానికి టికెట్ ధర 50 దిర్హామ్లు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై తాజా దాడుల నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వానికి ఈ పరిణామాలు ముప్పుగా మారే ప్రమాదం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) హెచ్చరించింది. అన్ని పక్షాలు సంయమనం పాటించి, ఉద్రిక్తతలను వెంటనే తగ్గించడంతో పాటు చర్చలు, దౌత్య మార్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.హోర్ముజ్ జలసంధిలో ఇటీవల పలు వాణిజ్య ట్యాంకర్లపై జరిగిన దాడుల అనంతరం అమెరికా ఇరాన్కు చెందిన 80కి పైగా సైనిక లక్ష్యాలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, తీర రాడార్ వ్యవస్థలు, నౌకా వ్యతిరేక క్షిపణి సామర్థ్యాలు, ఐఆర్జీసీకి చెందిన నౌకా వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఈ పరిణామాలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.ఇక అమెరికా దాడులకు ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది. అయితే ఈ దాడుల తీవ్రత, నష్టం వంటి అంశాలపై స్వతంత్ర ధ్రువీకరణ ఇంకా పూర్తిగా వెలువడలేదు. ఈ పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో తాజా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. భద్రతా ఆందోళనల కారణంగా పలు చమురు, గ్యాస్ ట్యాంకర్లు తమ ప్రయాణాలను మార్చుకోవడం లేదా వెనక్కి మళ్లడం ప్రారంభించాయి. భారత్కు ఇంధన దిగుమతుల్లో గల్ఫ్ దేశాల వాటా అధికంగా ఉండటంతో ఈ పరిస్థితులను న్యూఢిల్లీ అత్యంత నిశితంగా గమనిస్తోంది.భారత్ తన ప్రకటనలో మరోసారి శాంతియుత పరిష్కారానికే మద్దతు ప్రకటించింది. పౌరుల ప్రాణ భద్రత, సముద్ర రవాణా స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. వివాదాలకు సైనిక చర్యలు కాకుండా చర్చలు, దౌత్యమే శాశ్వత పరిష్కార మార్గమని పునరుద్ఘాటించింది. -
ఖతార్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
దోహ: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77 వ జయంతిని ఖతార్ రాజధాని దోహాలో ఘనంగా నిర్వహించారు. పితాని శ్రీను, అబ్దుల్ అలీమ్ ఆధ్వర్యంలో అక్కడే స్థానికంగా ఉన్న అమృత రెస్టారెంట్లో కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమంలో గల్ప్ కో కన్వినర్ శశికిరణ్, ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్. అబ్దుల్ హలీం గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మండ వర్జిల్బాబు ,గల్ఫ్ ప్రతినిధులు నేతల జయరాజు ,నల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఖతార్ వైఎస్సాఆర్సీపీ కో కన్వీనర్లు కర్రీ లక్ష్మయ్య ,ఆరోన్ మనీష్, నాయకులు వర్ధనపు ప్రకాష్ ,గడ్డం చంటి శివ కుడిపూడి ,షైక్ దర్బార్ బాషా, హేమంత్ నరీం ,వసంతప్ప షోహు అహ్మద్ ,బాబు సీకోలు , హరినాధ్ రెడ్డి, నల్లి కిశోర్ ,గోసంగి రాజు , రాపాక సూర్య , వైఎస్సాఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. -
"ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం"
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే ఇకపై ఇరాన్తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్ నగరంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు. -
మళ్లీ యుద్ధమా? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ ప్రకటించారు. మరొకవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో, టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్కు చెందిన అత్యంత ప్రమాద కరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు దుర్మార్గులు, మానసిక రోగులంటూ దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఇరాన్ను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా (Denuclearisation) మారుస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?ఇది ఇలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సుమారు 1,506 పాయింట్లు, అంటే 1.93శాతం పతనమై, 76,673.86 వద్దకు చేరగా, నిఫ్టీ 50 కూడా 461 పాయింట్లు 1.89శాతం నష్టపోయి 23,937.65దిగువకు పడిపోయింది. ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి.చమురుపై ప్రభావంఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశంవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 5.3 శాతం ఎగిసి 78.09 డాలర్ల స్థాయిని అధిగమించగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 5.4 శాతం పెరిగి 74.23 డాలర్ల వద్దకి చేరుకుంది.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!స్పెయిన్పై ట్రంప్ ఆగ్రహం.. నాటోపై అసంతృప్తిఇరాన్పై సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను, వైమానిక మార్గాన్ని ఉపయోగించు కోవడానికి స్పెయిన్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. స్పెయిన్ను నాటోలో ఒక దారుణ మైన భాగస్వామిగా అభివర్ణిస్తూ, ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ను ఆదేశించారు. ఉగ్రవాదానికి పెద్ద పీట వేసే ఇరాన్ విషయంలో నాటో కూటమి తమకు మద్దతుగా నిలబడటం లేదని, గ్రీన్లాండ్ విషయంలో కూడా నాటో ప్రవర్తన తనకు నచ్చలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి? -
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్.. ఈయూ కీలక నిర్ణయం
ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సేఫ్టీ ఏజెన్సీ ఈ రోజు (బుధవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇరాక్, లెబనాన్ గగనతలంలో తమ దేశానికి చెందిన విమానాల ప్రయాణంపై నిషేదం విధించింది. ఆగస్టు 31 వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపేమో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపేమా అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇరాన్తో ఇక చర్చలు ఉండవని భేటీల పేరుతో తమను మోసం చేస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలకు చెందిన పౌర, వాణిజ్య విమానాలేవీ ఇరాన్, ఇరాక్, లెబనాన్ దేశాల గగనతలం (Airspace) లోకి ప్రవేశించవద్దని ఈసా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిషేధాజ్ఞలు ప్రస్తుతానికి ఆగస్టు 31, 2026 వరకు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.అయితే అదేవిధంగా బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఖతార్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా గగనతలంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు విమానయాన సంస్థలు జాగ్రత్త వహించాలని కోరిన తమ మునుపటి అడ్వైజరీని ఉపసంహరించుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.కాగా అమెరికా చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్ లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ క్షిపణి దాడుల వల్ల పౌర విమానాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈయూ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఆదేశాల వల్ల యూరప్ నుండి ఆసియా దేశాలకు (భారత్తో సహా) ప్రయాణించే విమానాలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇరాన్, ఇరాక్ గగనతలాలను దాటకుండా వేరే రూట్లలో ప్రయాణించడం వల్ల విమాన ప్రయాణ సమయం మరియు ఇంధన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. -
ఇకపై ఇరాన్తో చర్చలు ఉండవు: ట్రంప్
ఇకపై ఇరాన్తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని తెలిపారు. చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని అన్నారు. ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. దీంతో యుద్ధం మరింత భీకరంగా కొనసాగే ముప్పు ఉందని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానీయులను "అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది."వాళ్లు తమ సొంత ప్రజలకు హాని చేశారు. నిరసనల్లో పాల్గొన్న 54,000 మందిని చంపారు. గత రాత్రి ఇరాన్కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై మేము చాలా శక్తిమంతంగా దాడి చేశాం. వాళ్లలో ఏదో సమస్య ఉంది" ట్రంప్ అన్నారు.ఈ ఘర్షణ లక్ష్యం ఇదే..ఇరాన్ను "దుష్ట దేశం"గా పేర్కొన్న ట్రంప్.. ఈ ఘర్షణ లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని లేకుండా చేయడమేనని, అమెరికా ఇరాన్ను "డి-న్యూక్" చేస్తుందని మరోసారి చెప్పారు."గత రాత్రి మేము ఇరాన్పై చాలా తీవ్రంగా దాడి చేశాం. మీరు దాడి చేసిన ప్రతిసారీ మేమూ దాడి చేస్తామని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు నీచంగా వ్యవహరిస్తారు. అందరి వెంట పడతారు. బహుశా నా వెంట కూడా పడవచ్చు. వాళ్లు మాకు నచ్చరు. నాకు వాళ్లు నచ్చరు. వాళ్లు దుష్టులు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తొలగించడమే మా లక్ష్యం. మేము దాన్ని డి-న్యూక్ చేస్తాం" అని ట్రంప్ చెప్పారు. -
మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్లోని ఒక అపార్ట్మెంట్ బాత్రూమ్లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్టౌన్లోని ఉడ్ల్యాండ్ కామన్స్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న బాత్రూమ్లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్మెంట్కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్మెంట్లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు. -
‘ఇదే.. ప్రంబనన్ ఆలయ వైభవం’ : ప్రధాని మోదీ
జోగ్జకర్తా (ఇండోనేషియా): ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడిక్కడ దాదాపు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రక ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను (ఏరియల్ వ్యూ) షేర్ చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాన్ని చూసి, ‘అద్భుతమైన ప్రంబనన్ ఆలయం!’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు.భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక సహాయంతో ఈ ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ఈ వైమానిక ప్రయాణం సాగింది. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా ఇరు దేశాల సాంస్కృతిక దౌత్యంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. మంగళవారం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ను పరస్పరం మార్చుకున్నారు. The majestic Prambanan Temple! pic.twitter.com/pRS2S9X5gm— Narendra Modi (@narendramodi) July 8, 2026జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఆగ్నేయాసియాలో కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. 9వ శతాబ్దంలో హిందూ మాతారామ్ రాజవంశానికి చెందిన రాజు రాకై పికాతన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ఇక్కడి శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలలో 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత విశిష్టమైనది. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ గాథ శిల్పాలు భారత్-ఇండోనేషియాల ప్రాచీన నాగరికత బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
ఇరాక్లో ఖమేనీ అంతిమయాత్ర.. పోటెత్తిన జనం
కర్బలా: ఇరాన్ దివంగత సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్కు చేరుకుంది. షియా ముస్లింల పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. శనివారం ఇరాన్లో ప్రారంభమైన ఆరు రోజుల జాతీయ సంతాప దినాల్లో భాగంగా, ఇరు దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ సంబంధాలకు ప్రతీకగా ఒక రోజు అంతిమయాత్రను ఇరాక్లో నిర్వహించారు.ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇరాక్ ఉన్నతాధికారులు నజాఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గౌరవపూర్వకంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరాక్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. నజాఫ్లోని పవిత్ర ఇమామ్ అలీ దర్గా వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగింది. ఆపై కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ దర్గాకు భౌతికకాయాన్ని తరలించారు. అమెరికా, ఇజ్రాయెల్లను ఎదిరించిన నేతకు నివాళులర్పించేందుకు ఇరాక్ నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గురువారం ఇరాన్లోని ఖమేనీ స్వస్థలమైన మషద్ నగరంలో అంత్యక్రియలు పూర్తికానున్నాయి. -
కార్గో విమానం అదృశ్యం : సముద్రంలో కూలిపోయిందనే ఆందోళన
షార్జా నుండి కరాచీ వెళ్తున్న కె2 ఎయిర్వేస్ (K2 Airways) కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం (KTA1732) అదృశ్యమైంది. అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా కరాచీ సమీపంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. నావిగేషన్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ సమాచారం ఇచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఫ్లైట్రాడార్24 భావిస్తోంది. అయితే పాకిస్తాన్ అధికారులు దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) తీర ప్రాంతంలో గాలింపు , రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది.ఏమి జరిగింది?పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:18 గంటలకు విమానంలోని నావిగేషన్ సిస్టమ్లో సమస్య ఉన్నట్లు పైలట్ నివేదించారు. ఆ తర్వాత రాత్రి 9:21 గంటల సమయంలో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోతూ, వేగంగా దిశ మార్చుకున్నట్లు రాడార్లో కనిపించింది. కరాచీకి పశ్చిమంగా 155 నాటికల్ మైళ్ల దూరంలో విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.భయంకరమైన వేగంతో కిందకు పడిపోయింది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ఫ్లైట్రాడార్24 (Flightradar24) డేటా ప్రకారం, విమానం నుండి చివరి సిగ్నల్ వచ్చేసరికి అది సముద్ర మట్టానికి కేవలం 1,100 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, అది నిమిషానికి 22,400 అడుగుల అత్యంత వేగంతో కిందకు దూసుకుయింది. అదృశ్యమైన ఈ బోయింగ్ 737-400 విమానం 1999 నాటిది. మొదట ప్రయాణీకుల విమానంగా పనిచేసి, 2012లో కార్గో విమానంగా మారింది. 2024లోనే ఇది కె2 ఎయిర్వేస్ సంస్థలో చేరింది.ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
హర్మూజ్ జలసంధిలో కలకలం.. భారత్ నౌకలపై దాడులు
టెహ్రాన్: గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కతర్ నుంచి చమురు లోడ్తో భారత్కు వస్తున్న భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఓడపై అనుమానాస్పద డ్రోన్ దాడి జరిగింది. ఈ వైమానిక దాడి కారణంగా ఓడ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, దాని ఇంజిన్ రూమ్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.ఎల్ఎన్జీసీ అల్ రేకయ్యాత్ అనే ఈ భారీ నౌక కతర్లోని రాస్ లఫ్ఫాన్ పోర్ట్ నుండి ఎన్ఎన్జీలోడ్తో గుజరాత్లోని దహేజ్ ఓడరేవు వైపు బయలుదేరింది. ఈ క్రమంలో జూలై 7న అరబ్ సాగరం, ఒమన్ అఖాతం కలిసే ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా మిసైల్ ఓడ ఎడమ భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఓడలో మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయ నావికులు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. అయితే, ఈ భీకర దాడి జరిగినప్పటికీ ప్రాణనష్టం ఏమీ జరగకపోవడం, సముద్రంలో ఎలాంటి చమురు లేదా గ్యాస్ లీకేజీలు జరగలేదు. ప్రస్తుతం ఈ ఓడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భారత్ వైపు వస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్కు సమాచారం అందింది. -
ట్రంప్ కొత్త రూల్స్.. భారత ఉద్యోగుల్లో వణుకు!
వాషింగ్టన్: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలు, ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్లు, అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలపరిమితి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్లలో కీలక మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నూతన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ నిపుణులు, విద్యార్థులపై అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది.హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, లేబర్, స్టేట్ డిపార్ట్మెంట్లు విడుదల చేసిన తాజా నిబంధనల ప్రకారం, థర్డ్-పార్టీ క్లయింట్ సైట్లలో పనిచేసే హెచ్-1బీ ఉద్యోగుల అర్హతలను మరింత కఠినతరం చేయనున్నారు. ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు గట్టి నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న పెద్ద కంపెనీలకు వీసా పొడిగింపుల (ఎక్స్టెన్షన్స్) సమయంలో అదనపు బయోమెట్రిక్ ఫీజులను విధించనున్నారు.మరోవైపు, గ్రీన్ కార్డ్ ప్రక్రియకు కీలకమైన 'పెర్మ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్' విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. విద్యార్థుల విషయానికొస్తే, ఇప్పటివరకు ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానాన్ని రద్దు చేసి, గరిష్టంగా నాలుగేళ్ల నిర్ణీత కాలపరిమితిని (ఫిక్స్డ్ టెన్యూర్) ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రతిసారీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ను నిలిపివేయనున్నారు. దీనివల్ల దాదాపు లక్ష మంది భారతీయులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. -
బంగారం కాదు..ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ‘చిన్న వస్తువు’ ఏంటో తెలుసా?
ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది, అత్యంత పవర్ఫుల్ వస్తువు ఏది? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది బంగారం, ప్లాటినం లేదా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) అని చెప్తారు. కానీ, ఒక జర్నలిస్ట్గా ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తే అసలు నిజం వేరే ఉందని అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. అగ్రరాజ్యాలను శాసిస్తున్నది బంగారం కాదు.. ఒక చిన్న ఇసుక రేణువుతో తయారయ్యే 'మైక్రోచిప్'.. దాన్నే సెమీకండక్టర్ అంటారు!అవును.. మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ మొదలు.. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ వరకు.. మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ నుంచి.. యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు, రాడార్ వ్యవస్థల వరకు.. ఈ చిన్న చిప్ లేకపోతే ఏదీ నడవదు.. కదలదు.. అంతా డెడ్! కేవలం మన గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్స్ కోసం.. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య ఒక నిశ్శబ్ద, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అదే 'గ్లోబల్ సెమీకండక్టర్ వార్'.ఇది బుల్లెట్లతో, సైన్యంతో జరిగే యుద్ధం కాదు.. గ్లోబల్ టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక మైండ్ గేమ్! ఈ డిజిటల్ యుగంలో.. ఈ 'చిప్ వార్' లో గెలిచినవాడే రేపటి ప్రపంచానికి ఏకఛత్రాధిపతి.. వాడే అసలైన గ్లోబల్ డాన్! దాని కథాకమామిషు ఏంటో ఇవాళ్టి ‘సాక్షి డిజిటల్’ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. వివరాలకు కింది వీడియోను క్లిక్ చేయండి.. -
నిజ్జర్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా?
వాషింగ్టన్: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సహచరుడు గోల్డీ బ్రార్లపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేశారు. ‘ఆపరేషన్ హార్డ్బాల్’ పేరుతో అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆపరేషన్లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.లాస్ ఎంజెల్స్ ఫెడరల్ కోర్టులో సమర్పించిన అభియోగపత్రం ప్రకారం.. ప్రస్తుతం భారత జైల్లో ఉన్న బిష్ణోయ్, కెనడాలోని సర్రేలో ఉన్న సిక్కు ఆలయం వెలుపల 2023 జూన్ 18న జరిగిన నిజ్జర్ హత్యకు వ్యూహం రచించినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. భారత్ కేంద్రంగా నడుస్తున్న మూడు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ దర్యాప్తు సాగింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో 11 మందితో సహా మొత్తం 24 మందిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి.ఈ ముఠాలు అంతర్జాతీయ సరిహద్దుల గుండా హత్యలు, వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఎఫ్బీఐ అధికారి పాట్రిక్ గ్రాండీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 37 మందిపై అభియోగాలు మోపారు. కాగా, నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో చేసిన ఆరోపణలను న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిష్ణోయ్ జైల్లో ఉండగా, పరారీలో ఉన్న బ్రార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
‘ఆంక్షలను తొలగించబోతున్నా.. మీకు సంతోషమేనా?’
అంకారా: రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను గతంలో తుర్కియేపై విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఆ దేశం అమెరికా నుంచి ఎఫ్–35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.అంకారాలో మంగళవారం తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్తో జరిగిన సమావేశంలో ట్రంప్.. ‘ఆంక్షలను తొలగించబోతున్నా, మీకు సంతోషమేనా?’అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై తమ అధికారులు తగు చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. అమెరికాఎఫ్–35 యుద్ధ విమానాల ప్రోగ్రామ్లోకి తుర్కియే తిరిగి ప్రవేశించడానికి ఇంకా అడ్డంకులు అనేకం ఉన్నప్పటికీ ’కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్’ (కాట్సా) కింద విధించిన ఆంక్షలను తొలగించడంతో ఆ విమానాలను దక్కించుకోవడానికి తుర్కియేకు మార్గం సులువు కానుంది. -
ఇరాన్పై మరోసారి అమెరికా దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. వాణిజ్య రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినందుకు భారీ మూల్యం చెల్లించేలా ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.ఇరాన్ ముడిచమురు విక్రయాల లైసెన్స్ను కూడా అమెరికా రద్దు చేసేసింది. ఇరాన్ మిలిటరీ స్థావరాలు, పోర్టులపై దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించింది. నౌకలపై దాడులు శాంతి ఒప్పందాని ఉల్లంఘించడమేని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. 60 రోజుల్లో జరగాల్సిన శాంతి ఒప్పంద చర్చలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇరాన్ దురాక్రమణ సమర్థించలేనిది. ప్రమాదకరమైందని.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అమెరికా మీడియా సంస్థ 'అక్సియోస్' కథనం ప్రకారం.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, నౌకా వ్యతిరేక క్రూయిజ్ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ సైట్లు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాలు, కేశ్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.దీంతో తాజా దాడుల పరంపర గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించాయని పరస్పరం అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ ఆరోపించుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై క్షిపణి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులకు దిగింది.ఈ దాడుల అనంతరం, ఇరాన్ చమురు విక్రయాలకు అనుమతించే లైసెన్స్ను అమెరికా రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య పోరాటాన్ని ముగించడానికి ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంలో ఈ లైసెన్స్ ఒక భాగం కావడం గమనార్హం. చమురు ఆంక్షల మినహాయింపును రద్దు చేయాలనే వాషింగ్టన్ నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందంలోని ఆర్టికల్ 10ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. -
ఇండోనేసియా చేతికి బ్రహ్మోస్!
జకార్తా: భారత అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇకపై మిత్రదేశం ఇండోనేసియా సైనిక పాటవాన్ని సైతం ద్విగుణీకృతంచేయనుంది. ఇరుదేశాల రక్షణ బంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరాచేసేందుకు భారత్ మంగళవారం సమ్మతి తెలుపుతూ ఒప్పందం కుదుర్చుకుంది. గగనతలం నుంచి ప్రయోగించి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని సైతం ఇండోనేసియాకు సరఫరాచేయనున్నారు.ఇండోనేసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియంతోతో విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్కు సరఫరా మొదలు, సముద్రప్రాంత భద్రత, ఔషధాలు, విద్య, అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణలు, టెలీకమ్యూనికేషన్స్, ఆహార భద్రత, అత్యంత అరుదైన లోహాలు, భూఅయస్కాంతాల వంటి ప్రధాన రంగాల్లో 14 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత సంయుక్త ప్రకటనలో మోదీ మాట్లాడారు. ఇకపై ఇరుదేశాల బంధంలో సువర్ణాధ్యాయం ఆరంభంకానుందని వ్యాఖ్యానించారు.బ్రహ్మోస్, అస్త్ర ఇలా రెండు రక్షణ రంగ కీలక ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి దాదాపు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందాలు ప్రధాని మోదీ సమక్షంలో కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్ సైన్యాన్ని బెంబేలెత్తించిన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల సత్తా చూశాక వీటి కొనుగోలుకు ఇండోనేసియా ఆసక్తి చూపడంతో వీటిని సరఫరాచేసేందుకు భారత్ తన సమ్మతి తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా తన భల్లూకం పట్టుబిగిస్తున్న నేపథ్యంలో ఆగ్నేయాసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు దాని సమీప దేశాల సైనికసామర్థ్యాలను భారత్ ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఇండోనేసియాకు భారత్ తన బ్రహ్మోస్ వంటి కీలక ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చింది.‘‘ఇండో–పసిఫిక్లో భద్రతకు మా సమష్టి శక్తియుక్తులు ఎంతో అవసరం. ఆసియా దేశాలకు భారత్ సదా సముచిత స్థానం, గౌరవం ఇస్తుంది. హిందూసముద్రప్రాంతంలోని భారత ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్లోకి ఇండోనేసియా లియేసన్ ఆఫీసర్ను ఇకపై పంపవచ్చు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం అనేది రక్షణ, భద్రత, సముద్రయానంలో సహకారాన్ని బలోపేతంచేస్తోంది. ఇకపై విపత్తు నిర్వహణ, పారిశ్రామికసహకారం సహా ఎన్నో రంగాల్లో మరింతగా సహకరించుకోబోతున్నాం. మలక్కా జలసంధి ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సబాంగ్ నౌకాశ్రయాన్ని ఇరుదేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి’’అని మోదీ ప్రకటించారు. ఈ పోర్ట్ భారత గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్కు కేవలం 100 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. భారీస్థాయిలో పెట్టుబడులు... ‘‘ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి సంబంధించిన ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్ పెట్టుబడుల వరద పారిస్తాం. నేటి ప్రపంచంలో ఉత్పత్తుల సరఫరా గొలుసు పటిష్టంగా ఉండటమనేది కీలకంగా తయారైంది. అందుకే ఇండోనేసియాలో అరుదైన మూలకాలు, స్టీల్ సరఫరా గొలుసు బలోపేతానికి కృషిచేస్తాం. దీనికితోడు ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) అనుసంధానమై అక్కడి పౌరులకు సేవలు అందిస్తాం. 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతిపొందిన ఇరుదేశాల బంధం ఇప్పుడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.సహకార రంగంతోపాటు అభివృద్ధి, భద్రత, సాంకేతిక, సాంస్కృతిక, విద్యరంగాల్లోనూ సువర్ణాధ్యాయం మొదలుకాబోతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు శాఖను ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్లోని సింఘసారీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ఆరంభించబోతున్నాం’’అని మోదీ తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణలో భారత్ సాధించిన అపార అనుభవం ఇండోనేసియాకు అక్కరకురానుంది. ఎన్నికల నిర్వహణతోపాటు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహనఒప్పందం కుదిరింది. మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారంఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికిగాను ఇండోనేసియా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’తో సత్కరించింది. సుబియంతో స్వయంగా దీనిని మోదీకి ప్రదానంచేశారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘అవార్డ్ పొందటం ఎంతో గర్వంగా ఉంది. పురస్కారం గౌరవం కోట్లాదిమంది భారతీయులకు దక్కుతుంది’’అని అన్నారు.నేడు ప్రాంభనన్ ఆలయ సందర్శనమంగళవారం మోదీ యోగ్యకర్త నగరంలోని అతిపెద్ద శివాలయం ప్రాంభనన్ను దర్శించుకోనున్నారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలిచిన వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయ కాంప్లెక్స్ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్లో భారత్ సైతం పాలుపంచుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఆరంభించేందుకు ఆసక్తి పత్రాలను ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు.సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు⇒ ఇదే మంత్రంతో భారత్ దూసుకెళ్తోంది⇒ ఇండోనేసియాలో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగంజకార్తా: సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రం జపిస్తూ భారత్ ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేసియాలోని జకార్తా నగరంలో పర్యటిస్తున్న మోదీ మంగళవారం అక్కడి భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత్ జపిస్తున్న స్వావలంభన మంత్రం ఒక్క ఇండోనేసియాకేకాదు యావత్ ఆసియాన్ దేశాలు ఆచరించాలి. భారత్ ఒక్కో సంస్కరణను అమలుచేస్తూ వస్తోంది. ఇప్పుడు భారత్ పెనుమార్పులకు నిలయంగా మారింది. భారత ప్రగతి వేగాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 140 కోట్ల స్ఫూర్తికణికలు ప్రజ్వరిల్లుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థ మాత్రమేకాదు ఇది వంద కోట్ల కలల పయనం. ఇంధనం, అనుసంధానం, చిప్ల తయారీ ఇలా ప్రతి రంగంలోనూ భారత్ ముందడుగేస్తోంది. భారత్ సొంత కలలనేకాదు సోదర దేశాల కలలనూ తీర్చేందుకు తహతహలాడుతోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రాన్నీ మేం పఠిస్తాం. భారత్ తన నౌకాశ్రయాలను ఆధునీకరిస్తోంది. నూతన సముద్రమార్గాలను అన్వేíÙస్తోంది. ఈ పయనంలో ఇండోనేసియా మాకు మంచి మిత్రునిగా వెంట నడుస్తోంది’’ అని అన్నారు. నాలో ఇండియా డీఎన్ఏ: సుబియంతో మోదీ ప్రసంగం వేళ అక్కడే ఉన్న ఇండోనేసియా అధ్యక్షుడు సుబియంతో మాట్లాడారు. ‘‘అధికార పగ్గాలు చేపట్టిన 3 నెలలకే భారత్ ఆహా్వనించింది. గత ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నా. ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భారత్కు నా కృతజ్ఞతలు. 1950లో భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. ఇలా 2 దేశాలు దశాబ్దాలుగా మిత్రులుగా మెలుగుతున్నాయి. గత ఏడాది భారతపర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ పరీక్ష చేయించుకున్నా. డీఎన్ఏ టెస్ట్ పూర్తయింది. నాలో భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకే అనుకుంటా.. ఎప్పుడు భారతీయ సంగీతం విన్నాసరే నా శరీరం ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. నా కేబినెట్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ కూడా డాన్స్ ఇష్టపడతారు. పాడటమూ ఇష్టమే. ఒకవేళ వాళ్లలోనూ చాలా మందిలో భారత డీఎన్ఏ ఉందేమో’’ అని సుబియంతో అనగానే అక్కడి వాళ్లంతా ఫక్కున నవ్వారు. మోదీ పథకాలు కాపీ కొట్టా.. మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో సుబియంతో మాట్లాడారు. మోదీనుద్దేశిస్తూ.. ‘‘భారత్లో మీరు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నేను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంటా. ఎన్నో పథకాలను కాపీ చేశా. ఇది బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించను’’ అని అన్నారు.విస్తరణవాదానికి దూరంగా ప్రగతిపథానికి దగ్గరగా ఇదే భారత్ పంథా: మోదీ జకార్తా: భారత్ ఎల్లవేళలా అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని, ఏనాడూ విస్తరణవాదం వైపు మొగ్గుచూపలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియా పార్లమెంట్లో అక్కడి చట్టసభ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ఇరుదేశాల మైత్రి మరింతగా విస్తరించాలి. 140 ఏళ్ల భారతీయులు, 29 కోట్ల ఇండోనేసియన్ల ఉమ్మడి శ్రేయస్సు కోసం ముందడుగువేద్దాం. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం భారత్ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది. ఇండో–పసిఫిక్లో స్వేచ్ఛావాణిజ్యాన్ని భారత్ కోరుకుంటోంది. భారత్ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు’’అంటూ దక్షిణచైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. -
ఓ సముద్రజీవి.. ఐదేళ్ల ఉపవాసం!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒక్క రోజు ఉపవాసం ఉండటమే మనకు కష్టమనిపిస్తుంది. కానీ ఆహారం తినకుండా ఐదేళ్లపాటు జీవించగల ఒక వింత జీవి ఉన్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ జీవి పేరు సూపర్జైంట్ ఐసోపాడ్ (supergiant isopod). సముద్రగర్భంలో నివసించే ఈ జీవి మనుగడ రహస్యాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు ఛేదించారు. ఈ పరిశోధన వివరాలు సెల్ అనే జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి.సముద్ర గర్భంలో చీకటి, తీవ్రమైన ఆహార కొరత, అతిశీతల పరిస్థితుల మధ్య ఈ భారీ ఐసోపాడ్లు నివసిస్తాయి. చనిపోయిన తిమింగలాలు, చేపల కళేబరాలను తిని బతుకుతాయి. దొరికినప్పుడు కడుపు పగిలేలా కదల్లేనంతగా తింటాయి. మళ్లీ ఐదేళ్ల వరకు ఏమీ దొరక్కపోయినా బతకగలగటం వాటి ప్రత్యేకత. విలక్షణమైన శరీర అమరిక, ప్రత్యేక జన్యువులే ఈ సుదీర్ఘ, అద్భుత మనుగడ సామర్థ్యానికి కారణమని పరిశోధకులు గుర్తించారు.పెద్ద జీర్ణాశయం.. ప్రత్యేక జన్యువు.. 20 అంగుళాల సైజు వరకు పెరిగే ఈ ఐసోపాడ్లలో జీర్ణాశయం చాలా పెద్దది. మొత్తం శరీరంలో దాదాపు మూడింట రెండు వంతులు వాటి పొట్టే ఆక్రమిస్తుంది. ఆహారం దొరికినప్పుడు భారీ మొత్తంలో నిల్వ చేసుకోగలవు. ఒక ప్రత్యేక జన్యువు ఏళ్ల తరబడి ఉపవాసానికి దోహదపడుతోందట. అదే ‘ఎన్డీ1’. ఇది స్వతహాగా వాటిది కాదు. ఒక బ్యాక్టీరియా నుంచి గ్రహించిన జన్యువు కావడం విశేషం.తీవ్రమైన చలి వాతావరణంలో ఈ జన్యువు ఒక స్విచ్లా పనిచేసి, ప్రాథమిక జీవక్రియ రేటు (బీఎంఆర్)ను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలో నిల్వ ఉన్న శక్తి చాలా నెమ్మదిగా ఖర్చవుతుంది. వాటికి గల వినూత్న శారీరక, జన్యుపరమైన రక్షణ విధానం వల్లే సుదీర్ఘకాలం ఉపవాసం ఉంటూ ప్రాణాలు నిలుపుకోగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన చలి వాతావరణంలో ఆకలిని తట్టుకునే సామర్థ్యాన్ని ఈ జన్యువు 37% మేర పెంచుతోందని పరిశోధనల్లో తేలింది.చదవండి: బ్యాటరీ రీచార్జ్.. భిక్షాందేహీ...!ఈ జీవి జీర్ణాశయంలో ఉండే క్లామిడియా అనే బ్యాక్టీరియా కొవ్వును సమర్థంగా నిల్వ చేయడానికి సహాయపడుతోందట. వ్యోమగాములు, అతిశీతల ప్రదేశాల్లో సైనికుల ఆహార అవసరాలు తీర్చే పరిశోధనలకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేనా..? మనుషుల్లో ఊబకాయాన్ని తగ్గించే ఔషధాల తయారీకీ భవిష్యత్తులో ఉపయోగపడొచ్చేమో! -
బ్యాటరీ రీచార్జ్.. భిక్షాందేహీ...!
ఆకలేస్తుంది కాస్త అన్నం పెట్టండి.. జాలి చూపి ఓ పది రూపాయలు దానం చేయండి.. ఇవీ రోడ్లపై బిచ్చగాళ్ల వేడుకోళ్లు. చిల్లర లేదు అనే సాకు లేకుండా వీరు కూడా క్యూఆర్ కోడ్ తగిలించుకుని మరీ అడుక్కుంటున్నారనే సంగతి పక్కన పెడితే.. నా బ్యాటరీ అయిపోయింది.. రీచార్జ్కు సాయం చేస్తారా?.. కొంచెం డబ్బులిస్తే కరెంటు బిల్లు కట్టుకుంటా అనడిగే విచిత్ర యాచకులెవరినైనా చూశారా? అయితే పదండి చైనా వీధుల్లోకి.. బీజింగ్, చెంగ్డూ, ఫుజౌ వంటి ప్రముఖ నగరాల్లో మోకాళ్లపై కూర్చుని, చేతులు జోడిస్తున్న భంగిమల్లో క్యూఆర్ కోడ్లు పెట్టి మరీ యువాన్లు దానం చేయాలంటూ ప్రాధేయపడుతున్నది మామూలు మనుషులు కాదు.. హ్యూమనాయిడ్ రొబోట్లు. హాంకాంగ్కు చెందిన హెచ్కే01 అనే న్యూస్ వెబ్సైట్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనాలో పలు చోట్ల ఈ మరమనుషులు కనిపించాయట. దారిన వెళ్లేవాళ్లు ఈ విచిత్రం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.కొందరు నిజంగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపుతుంటే మరికొందరు వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది. అయితే నిజంగానే డబ్బుల కోసమే వీటిని రోడ్డుకెక్కించారా? లేదా భవిష్యత్తులో ఏఐ సృష్టించబోయే సునామీని కళ్లకు కట్టే ప్రతీకాత్మక ప్రదర్శనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే యూనిట్రీ వంటి ప్రముఖ సంస్థలు రూపొందిస్తున్న అత్యంత అధునాతన జీ1, హెచ్2 వంటి హ్యూమనాయిడ్ రొబో మోడళ్లు చాలా ఖరీదు. అలాంటి వాటిని ఈ పనుల కోసం వినియోగించడం ఆర్థికంగా అంత గిట్టుబాటయ్యే విషయమేమీ కాదని, ఇది తప్పకుండా ఒక కొత్త రకమైన మార్కెటింగ్ టెక్నిక్ లేదా పబ్లిసిటీ స్టంట్ అయిఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.చదవండి: హమాస్ సంచలన ప్రకటనఏఐ ఏజెంట్లు, ఏఐ–ఆధారిత రోబోలు జీవితంలో ఓ భాగంగా మారిపోతున్న కాలం ఇది. ఇప్పటిదాకా ఆఫీసులు, ఇళ్లకే పరిమితమైన ఈ హ్యూమనాయిడ్ రోబోలు.. దుఃఖం, జాలి వంటి భావోద్వేగాలనుకూడా భర్తీ చేయడం మొదలుపెడితే.. పరిస్థితులు ఎలా ఉంటాయో కదూ?– సాక్షి సెంట్రల్డెస్క్ -
ఫ్రాన్స్ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్కు పెను ప్రమాదం తప్పింది. సిరియాలో మెక్రాన్ బసచేసిన హోటల్ వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రమాదం నుంచి అధ్యక్షుడు తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సిరియా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా డమాస్కస్లో ఆయన హోటల్లో బసచేశారు. అయితే ఆ హోటల్ సమీపంలో మూడు కారు బాంబులు పేలడంతో తీవ్ర కలకలం రేగింది. పేలుళ్లు జరిగిన సమయంలో, ఆయన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో కలిసి అధ్యక్ష భవనంలో ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ప్రకటన విడుదల చేయలేదు.2024లో అహ్మద్ అల్-షారా నేతృత్వంలోని తిరుగుబాటుదారులు బషర్ అల్-అసద్ పాలనను పడగొట్టిన తర్వాత, సిరియాలో పర్యటించిన మొదటి యూరోపియన్ యూనియన్ (EU) దేశాధినేత మాక్రాన్ మాత్రమే.ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఈ పేలుళ్లు సిరియాలో ఇంకా ఎదురవుతున్న భారీ భద్రతా సవాళ్లను మరోసిరా తేటతెల్లం చేశాయి.The target was a bus for the Ministry of Tourism near the Four Seasons. This is an assassination attempt against Macron pic.twitter.com/CDIVYKdZkm— Munir 🇱🇧🇵🇸 (@JnoubiSyrian) July 7, 2026 -
నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (IWT) పక్కనబెట్టాలన్న భారతదేశం నిర్ణయం పాకిస్తాన్ను ఒక రేంజ్లో వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే సింధూ జలాలను ఆపితే యుద్ధమే అంటూ పాక్ కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌర ప్రభుత్వంతో పాటు అక్కడి సైన్యం కూడా తమ దేశానికి దక్కాల్సిన నీటి వాటా కోసం అవసరమైన అన్ని తీసుకుంటామని ప్రకటించడం కలకలం రేపింది.పాక్ సైనిక దళాల అధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 276వ కోర్ కమాండర్ల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సింధూ జలాల వివాదంపై పాక్ సైన్యం కీలక నిర్ణయాలు ప్రకటించింది. సైనిక కమాండర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 24 నాటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ (NSC) ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని పునరుద్ఘాటించింది .అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ నదీ జలాల వాటాను దక్కించు కునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆర్మీ స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సింధూ జలాల హక్కుల కోసం పోరాడుతామని సైన్యం వెల్లడించింది. గతేడాది 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) భారతదేశం నిలిపివేసింది (Abeyance లో పెట్టింది). దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యం, మంత్రులు భారత్పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు, వార్ వార్నింగ్లివ్వడం శోచనీయం.పాకిస్తాన్ NSC మార్గదర్శకాలు ఏమిటి?నీటిని ఆపడం లేదా మళ్లించడం వంటి ఏ చర్యకైనా పాల్పడితే దానిని "యుద్ధ చర్య" (Act of War)గా పరిగణించాలని పాకిస్తాన్ NSC గతంలోనే నిర్ణయించింది. ఆఫ్ఘన్ తాలిబాన్ పాలనలో ఉన్న భూభాగాన్ని ఉపయోగించుకుని పాకిస్తాన్పై దాడులు చేస్తున్న ఉగ్రవాద సంస్థలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిపై 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' కింద పోరాడుతామని తెలిపింది. అలాగే కాశ్మీరీలకు తమ దౌత్య, రాజకీయ, నైతిక మద్దతు ఎప్పటికీ ఉంటుందని పేర్కొంది.బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరిక వైరల్పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఒక వీడియో వైరల్ అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందంపై రాజీ పడే ప్రసక్తి లేదు. భారత్ ఈ జలాలను ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఇందుకోసం భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే, అన్ని రంగాలలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము."పాకిస్తాన్ శాశ్వతంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంతవరకు ఈ సింధు జలాల ఒప్పందం నిలిపివేతలోనే ఉంటుందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.సరిహద్దుల్లో శత్రుత్వం కొనసాగుతు న్నప్పుడు ద్వైపాక్షిక ఒప్పందాలు మామూలుగా సాగవని, భూమిపై ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ఒప్పందాలు నడుస్తాయని భారత్ స్పష్టం చేసింది.సింధు జలాలు- పాకిస్తాన్ 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్ జలాలు భారత్కు.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ జలాలు పాకిస్తాన్కు దక్కాలి. అయితే సాధారణంగా వర్షాకాలంలో వరద హెచ్చరికల సమాచారాన్ని భారత్ పాకిస్తాన్తో పంచుకునేది. కానీ ఒప్పందం నిలిపివేయడంతో భారత్ ఆ సమాచారాన్ని పంచు కోవాల్సిన అవసరం ఉండదు.భారత్ ప్రాజెక్టులు: సింధు బేసిన్లో సావల్కోట్, రట్లే, బుర్సార్, పకాల్ దుల్, క్వార్, కిరు, కీర్తాయ్ వంటి పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. పాక్ వ్యవసాయం అతలాకుతలం: పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80-90 శాతం ఈ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని ప్రధాన జలాశయాలైన తర్బెలా, మంగ్లా డ్యామ్లలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.దీంతో తమ అత్యంత బలహీనమైన పాయింట్ను భారత్ టార్గెట్ చేయడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడానికి పాక్ రాయబారులను పంపడం, ఐక్యరాజ్యసమితికి లేఖలు రాయడం, చట్టపరమైన చర్యలకు దిగడం వంటి ప్రయత్నాలు చేస్తోంది.ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్ -
ఉజ్బెకిస్తాన్లో కేరళ విద్యార్థిని హత్య: మలప్పురం యువకుడి అరెస్ట్
హరిపాడ్: ఉజ్బెకిస్తాన్లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని సవారియా తోటి విద్యార్థి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఉజ్బెకిస్తాన్లో ఉంటున్న మలప్పురంలోని పెరింతల్మన్నకు చెందిన విద్యార్థి సధారుల్ అనామ్ను ఉజ్బెకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.సవారియా, నిందితుడికి మధ్య నాలుగు రోజుల క్రితం ఒక చిన్న వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన అనామ్.. సవారియా తలపై ల్యాప్టాప్తో బలంగా బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ, అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ సవారియా మృతి చెందింది.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఉజ్బెకిస్తాన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మంగళవారం నాటికి సవారియా మృతదేహం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ నుంచి కొచ్చి మీదుగా ఆమె స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కువైట్లో పనిచేస్తున్న సవారియా తండ్రికి అవసరమైన పత్రాలు లభించకపోవడంతో నేరుగా కేరళకు చేరుకోగా, ఆమె బాబాయ్ ఉజ్బెకిస్తాన్ వెళ్లి మృతదేహాన్ని భారత్కు తీసుకువచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. మృతురాలికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు.ఇది కూడా చదవండి: మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్ -
‘మర్యాదగా ఒప్పందానికైనా రండి.. లేదంటే కథ ముగిస్తాం’
అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజీకి చేరాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "మర్యాదగా మాతో ఒప్పందానికైనా రావాలి.. లేదంటే కథ ముగించేస్తాం అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించగా.. ప్రస్తుతం ఇరాన్లో ఆయన అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌస్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఏ రకంగానైనా విజయం సాధించి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. "మేం ఎలాగైనా గెలవబోతున్నాం. అయితే ఒక ఒప్పందానికి వస్తాం.. లేదా కథ ముగించేస్తాం. ఇరాన్ పని ముగించడం మాకేమీ అంత కష్టం కాదు. కానీ, నేను ఒప్పందానికే మొగ్గు చూపుతాను.. ఎందుకంటే అక్కడ ఉన్న 91 మిలియన్ల (9 కోట్లకు పైగా) ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. మేం అనుకుంటే కేవలం ఒక్క గంటలోనే ఇరాన్లోని వంతెనలన్నింటినీ నేలమట్టం చేయగలం" అని ట్రంప్ హెచ్చరించారు.అలాగే ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మేం ఆ దేశం నుంచి రేడియోధార్మిక పదార్థాలను, సంపన్న యురేనియంను స్వాధీనం చేసుకోబోతున్నాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఉన్న ధరల కంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు మరింత తగ్గాయి. మేం కొన్ని రాయితీలు సాధించాం. వాటిని వారు కొనసాగించాల్సిందే" అని ఆయన పేర్కొన్నారు.గత నెలలోనే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి.. కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. జూలై 3న జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనాయకత్వం, మతాధికారులు భారీగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందేఅమెరికా మీడియా సంస్థ 'ఆక్సియోస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నాయకులంతా అక్కడే గుమికూడారు. ఒక్క దెబ్బతో వారందరినీ మట్టుబెట్టే అవకాశం మాకు వచ్చింది. కానీ మేం అలా చేయలేదు. ఎందుకంటే వారందరినీ చంపేస్తే ఆ తర్వాత మేం ఎవరితో చర్చలు జరపాలి?" అని అన్నారు. ఖమేనీ అంత్యక్రియలకు అంతమంది తరలిరావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. "చాలామంది ఇరాన్ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకమనుకున్నా.. బహుశా అవన్నీ నకిలీ కన్నీళ్లు కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు అసలు నాగరికత, చరిత్రే లేవని ఎద్దేవా చేసింది. "మనుషులను చంపగలరు.. కానీ ఆదర్శాలను కాదు. మీరు ఆయతుల్లా ఖమేనీని చంపి ఉండొచ్చు. కానీ నిజానికి మీరు ఒక సెంట్ల సీసాను పగలగొట్టారు.. దాంతో ఆ సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు... ఎందుకంటే అమెరికాకు అటు నాగరికత లేదు, ఇటు చరిత్ర లేదు, అసలు గౌరవమే లేదు. .ఖమేనీ అంత్యక్రియలకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసైనా అమెరికా వాస్తవాన్ని గ్రహించాలని ఇరాన్ ఈ సందర్భంగా హితవు పలికింది. -
భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. జకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’ వద్ద ప్రధానికి సైనిక వందనంతో ఘన సాంప్రదాయ స్వాగతం లభించింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఒక కీలక అడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పర్యటన పరస్పర నమ్మకాన్ని, స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు.రెండు దేశాల మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. భారతదేశ ఎన్నికల విధానానికి లభించిన గుర్తింపుగా, ఇండోనేషియా కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రూపకల్పన చేయడానికి భారత్ సహకరించనుంది. అలాగే, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో విజయవంతంగా నిరూపితమైన భారత ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సాంకేతికతను చూసి, భారత్ నుండి ‘అస్త్రా’ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపింది. కీలక ఖనిజాల సరఫరాను మెరుగుపరిచేందుకు ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల తయారీకి భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలను పెంచుకునేందుకు ఇండోనేషియాకు భారత్ మరిన్ని మిస్సైల్ బ్యాటరీలను సరఫరా చేయనుంది. వ్యూహాత్మక మలక్కా జలసంధికి సమీపంలో, భారత్ కు చెందిన గ్రేట్ నికోబార్ పోర్టు ప్రాజెక్టుకు కేవలం 100 మైళ్ల దూరంలో ఉన్న 'సబాంగ్' రేవు అభివృద్ధిపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి.ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ మూడు దేశాల అధికారిక పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి సైనిక, సంప్రదాయ స్వాగతం లభించింది. 2018లో ఉభయ దేశాల మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మార్చిన తర్వాత ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి వాయుసేన యుద్ధ విమానాలు ఆయనకు రక్షణగా ఎస్కార్ట్ ఇచ్చాయి. అనంతరం విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు.రక్షణ, సముద్ర తీర భద్రతతో పాటు ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు వంటి కీలక అంశాలు ఇరు దేశాల చర్చల ఎజెండాలో ఉన్నాయి. ‘మహాసాగర్’విధానం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రాంబనన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు.Addressing the joint press meet with President Prabowo Subianto of Indonesia.@prabowo https://t.co/LrvzAuUjzi— Narendra Modi (@narendramodi) July 7, 2026 ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారంప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’ లభించింది. మంగళవారం జకార్తాలోని ఇస్తానా మెర్డెకా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని పీఎం మోదీకి బహూకరించి గౌరవించారు. ఇండోనేషియా దేశ ఐక్యత, నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం విశేష సేవలు అందించిన వ్యక్తులకు 1959 నుంచి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నారు.#WATCH | Jakarta, Indonesia: Prime Minister Narendra Modi recieves a ceremonial welcome in Jakarta. PM Modi will hold bilateral discussions with President Prabowo today. (Source: ANI/DD) pic.twitter.com/I4vccGkNRt— ANI (@ANI) July 7, 2026 -
సరికొత్త హిస్టరీ.. ఎక్కడా ఆగకుండా 22 గంటల నాన్స్టాప్ ఫ్లైట్ జర్నీ!
ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం కదా? ఇక్కడి నుంచి అమెరికాకో, ఆస్ట్రేలియాకో ఒక ఫ్లైట్ ఎక్కితే కొన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. కానీ మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు భారీ ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య.. అంటే ఆస్ట్రేలియా తూర్పు తీరానికి (సిడ్నీ, మెల్బోర్న్), ఐరోపా (లండన్) లేదా అమెరికా తూర్పు తీరానికి (న్యూయార్క్) మధ్య ఇంతవరకు చరిత్రలో ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ కమర్షియల్ ఫ్లైట్ కూడా లేదు!సిడ్నీ, మెల్బోర్న్ లాంటి ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల నుంచి లండన్ లేదా న్యూయార్క్కు వెళ్లాలంటే ప్రయాణికులు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఆగాల్సిందే . కానీ, ఏవియేషన్ హిస్టరీని తిరగరాస్తూ, భూగోళంపై ఉన్న చివరి సరిహద్దును బద్దలు కొట్టడానికి ఒక అద్భుతం సిద్ధమవుతోంది. అసలు ఆస్ట్రేలియా నుంచి లండన్కు డైరెక్ట్ ఫ్లైట్ ఎందుకు లేదు? సమాధానం చాలా సింపుల్.. భౌగోళిక దూరమే ఇందుకు కారణం. ఆస్ట్రేలియాను గ్లోబ్ మీద నుంచి తీసి దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో పెడితే, అది నార్త్ అట్లాంటిక్లో యూరప్, అమెరికాల మధ్యన ఉంటుంది. అంటే, అవి భూమికి రెండు చివర్లలో ఉన్నాయన్నమాట. ఇంత దూరం ప్రయాణించగలిగే సాంకేతికత, అంత బరువు మోయగలిగే ఇంధన సామర్థ్యం ఉన్న విమానాలు ఇప్పటివరకు లేవు. లండన్ - సిడ్నీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ అనేది ఏవియేషన్ ప్రపంచానికి ఒక 'హోలీ గ్రెయిల్' లాంటిది. 1989లోనే బోయింగ్ 747 విమానం లండన్ నుండి సిడ్నీకి నాన్స్టాప్గా వచ్చింది. కానీ అది కేవలం టెస్ట్ ఫ్లైట్. అందులో ప్రయాణికులు లేరు, లగేజీ లేదు. పైగా.. స్పెషల్ ఫ్యూయెల్తో నడిచింది. కానీ, వచ్చే సంవత్సరం.. అవును, 2027లో క్వాంటాస్ ఎయిర్లైన్స్ (Qantas Airlines) ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతోంది. సుమారు 22 గంటల పాటు నిరంతరాయంగా సాగే ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన నాన్స్టాప్ ఫ్లైట్ను ప్రారంభించబోతోంది. 22 గంటలు ఒకే ఫ్లైట్లో కూర్చోవడం నరకంలా అనిపిస్తుందనుకుంటున్నారా..? అయితే ఒక్కసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్దాం. 18వ శతాబ్దంలో బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియాకు ఓడల్లో వెళ్లడానికి 8 నుంచి 12 నెలల సమయం పట్టేది! 1850ల నాటికి వేగవంతమైన క్లిప్పర్ షిప్స్ వచ్చి.. ఆ సమయాన్ని 3-4 నెలలకు తగ్గించాయి. ఆ తర్వాత స్టీమ్ షిప్స్, సూయజ్ కాలువ రావడంతో దూరాభారం కాస్తా 30 నుంచి 50 రోజులకు తగ్గింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక.. అంటే 1919లో 'గ్రేట్ ఎయిర్ రేస్' పేరుతో లండన్ నుంచి ఆస్ట్రేలియాకు మొదటి విమాన ప్రయాణం జరిగింది. రాస్ స్మిత్, కీత్ స్మిత్ అనే ఇద్దరు ఆస్ట్రేలియన్ సోదరులు మోడిఫైడ్ బాంబర్ విమానంలో లండన్ నుంచి బయలుదేరారు. దారిలో విశ్రాంతి కోసం, ఇంధనం కోసం 14 స్టాప్లు ప్లాన్ చేసుకుంటే.. వాతావరణం అనుకూలించక, టెక్నికల్ సమస్యల వల్ల ఏకంగా 23 చోట్ల ఆగాల్సి వచ్చింది. లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని డార్విన్ చేరుకోవడానికి వారికి 27 రోజుల 20 గంటల సమయం పట్టింది! అప్పట్లో అది ఒక మిరాకిల్. ఒక నెల లోపు ప్రయాణం సాధ్యమని వారిద్దరూ నిరూపించారు. 1935లో క్వాంటాస్, ఇంపీరియల్ ఎయిర్వేస్ కలిసి మొదటి కమర్షియల్ రూట్ను ప్రారంభించాయి. లండన్ టు బ్రిస్బేన్. కానీ ప్రయాణం ఎలా ఉండేదో తెలుసా? వారానికి ఒకే ఒక్క ఫ్లైట్. ప్రయాణ సమయం పన్నెండున్నర రోజులు..! దారిలో పారిస్, ఏథెన్స్, బగ్దాద్, కరాచీ, ఢిల్లీ, కోల్కతా, బ్యాంకాక్, సింగపూర్.. ఇలా ఏకంగా 28 స్టాప్లు ఉండేవి..! రాత్రిపూట ప్రయాణికులు హోటళ్లలో స్టే చేయాల్సి వచ్చేది. కేవలం 10 మంది ప్రయాణించే ఆ ఫ్లైట్ టికెట్ ధర అప్పట్లో 195 పౌండ్లు. అంటే, నేటి 2026 నాటి కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అది దాదాపు 50,000 డాలర్లు.. అంటే మన రూపాయిల్లో సుమారు 40 లక్షల రూపాయల పైమాటే! 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో క్వాంటాస్ మరో సాహసం చేసింది. ఐదు కేటాలినా ఎయిర్క్రాఫ్ట్లతో పెర్త్ నుంచి శ్రీలంకకు ఎలాంటి రేడియో సాయం లేకుండా, కేవలం దిక్సూచి, నక్షత్రాల ఆధారంగా రాత్రి వేళల్లో శత్రువుల కళ్లుగప్పి ప్రయాణించింది. 27 నుంచి 33 గంటల పాటు సాగిన ఆ ప్రయాణంలో ప్రయాణికులు రెండు సూర్యోదయాలను చూశారు. అందుకే దీన్ని 'డబుల్ సన్రైజ్ సర్వీస్' అన్నారు. ఈ రూట్నే ఆ తర్వాత క్వాంటాస్ 'కంగారూ రూట్' అని పిలిచింది.. ఎందుకంటే విమానం కంగారూలా గెంతుతూ వెళ్లేది కాబట్టి. 1959లో జెట్ యుగం అంటే.. Boeing 707 శకం వచ్చింది. ప్రయాణ సమయం 38 గంటలకు తగ్గింది. 1971లో బోయింగ్ 747 రావడంతో స్టాప్లు రెండింటికి తగ్గి, మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా విదేశీ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 1988 నాటికి సింగపూర్ ఒక్కటే ఏకైక స్టాప్గా మారి, ప్రయాణ సమయం 25 గంటలకు తగ్గడం గమనార్హం..! ఇక ఇప్పుడు 21వ శతాబ్దం... 2027లో అద్భుతం జరగబోతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం, అంటే 2017లో క్వాంటాస్ ప్రకటించిన 'ప్రాజెక్ట్ సన్రైజ్' కల సాకారం కాబోతోంది. ఎయిర్బస్ సంస్థ క్వాంటాస్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'Airbus A350-1000 ULR' విమానాలు ఈ అద్భుతాన్ని చేయబోతున్నాయి. సాధారణ విమానాల కంటే ఇందులో 20 వేల లీటర్ల ఇంధనం అదనంగా పట్టే ట్యాంక్ ఉంటుంది. బరువు తగ్గించడం కోసం సీట్లను 300 నుండి 238కి తగ్గించారు. లండన్ నుంచి సిడ్నీకి 17,000 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల్లో, ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ విమానం దాటబోతోంది. 2024లో రెగ్యులేటరీ సమస్యలు, ఆ తర్వాత 2026 ప్రారంభంలో సప్లై చైన్ లోపాల వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం ఐరోపాలో పరీక్షలు జరుగుతున్నాయి. 2027 Second halfలో ఈ సర్వీస్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇదే విమానాన్ని సిడ్నీ - న్యూయార్క్ మధ్య కూడా నడపబోతున్నారు. మరి 22 గంటలు ఫ్లైట్లో ఎలా గడపాలి అని కంగారు పడకండి. ఇందులో విశాలమైన ఫస్ట్ క్లాస్ సూట్లు, ప్రైవసీ ఉన్న బిజినెస్ క్లాస్ రూమ్లతో పాటు.. ఎకానమీ క్లాస్లోనూ ఎక్కువ లెగ్రూమ్ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా, ప్రయాణికులు నిలబడి స్ట్రెచింగ్ చేసుకోవడానికి, వ్యాయామం చేయడానికి విమానంలో ప్రత్యేకంగా ఒక Well-being Zoneను ఏర్పాటు చేస్తున్నారు. 1919లో 28 రోజులు పట్టిన ప్రయాణం.. వందేళ్ల నిరంతర సాంకేతిక పరిణామం వల్ల 2027 నాటికి కేవలం ఒకే ఒక్క రోజు లోపలికి వచ్చేస్తోంది. మానవ మేధస్సుకు, సాంకేతిక ప్రగతికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి? ఇది ఈనాటి మన ఏవియేషన్ విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే.. ఈ వీడియోను లైక్ చేయండి.. షేర్ చేయండి.. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లను మిస్సవ్వకుండా ఉండేందుకు మా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. -
బంగ్లాదేశ్లో బాంబు పేలుడు.. ఎన్సీపీ ర్యాలీలో ఘోరం!
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. వేదికపై నుంచి ఒక పార్టీ నేత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ సమీపంలోనే ఈ పేలుడు జరిగింది.దీంతో అక్కడున్న వారంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనపై ఎన్సీపీ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సావర్ థానా స్టాండ్ ఈద్గా మైదానంలో రాత్రి 9:45 గంటల సమయంలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు సమాచారం.మరోవైపు ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే ఢాకా సమీపంలోని కేరానిగంజ్లోని గ్యాస్ లైటర్ల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
హర్ముజ్లో మళ్లీ టెన్షన్.. టెన్షన్..
ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై దాడి జరగడంతో మంటలు చెలరేగినట్లు బ్రిటీష్ నౌకాదళ అధికారులు మంగళవారం తెలిపారు. ట్యాంకర్పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ కూడా హర్ముజ్లో ఉద్రిక్తత నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ట్యాంకర్ ఒమన్లోని లిమా సమీపంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తుండగా.. దాని ఎడమ వైపు (పోర్ట్ సైడ్) భాగంలో ఈ క్షిపణి తాకింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా పర్యావరణ నష్టం జరగలేదని పేర్కొంది. అలాగే ఆ ప్రాంతం గుండా వెళ్లే నౌకలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.దాడులకు ఇరానే కారణమని అమెరికా అధికారుల ఆరోపిస్తున్నారు. యాక్సియోస్ వార్తా సంస్థ కథనం మేరకు సోమవారం రాత్రి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఇరాన్ సైన్యం.. వాణిజ్య నౌకలపై రెండు క్షిపణులను ప్రయోగించింది. రెండు నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఖమేనీ అంత్యక్రియల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఖమేనీ అంత్యక్రియల వేళ.. ఆ దేశంలో మిగిలి ఉన్న కీలక నాయకత్వాన్ని తాము ఒకే ఒక్క షాట్తో అంతమొందించగలమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, అలా చేస్తే భవిష్యత్తులో చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు కాబట్టి తాను ఆ పని చేయడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ఖమేనీ అంత్యక్రియల్లో తీరని ఆవేదనతో కన్నీరు మున్నీరవుతున్న నేతలను ఉద్దేశిస్తూ ట్రంప్ తన నోటికి పని చెప్పారు.కాగా, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒమన్ ప్రభుత్వంతో కలిసి ఇందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఈ చార్జీలు అందరికీ ఒకేలా ఉండవని తెలిపింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మిత్ర దేశాలకు చార్జీల్లో రాయితీలు, మినహాయింపులు ఇస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్లో జరిగిన వరల్డ్ పీస్ ఫోరమ్ కార్యక్రమం వేదికగా ఇరాన్ రాయబారి అబ్దుల్ రజా రహ్మానీ ఫజ్లీ ఈ విషయం వెల్లడించారు. -
హమాస్ సంచలన ప్రకటన
సంచలన పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 20 ఏళ్ల పాలన తర్వాత గాజా పాలక మండలిని హమాస్ రద్దు చేసింది. దాదాపు రెండున్నరేళ్లపాటు కొనసాగిన భీకర దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దారులు పడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా ప్రాంత పాలన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రకటించింది.ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఏర్పాటైన టెక్నికల్ కమిటీకి పాలన బాధ్యతలను అప్పగిస్తామని తెలిపింది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం కేవలం సాంకేతిక, వృత్తి నిపుణులు మాత్రమే విధుల్లో కొనసాగుతారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం జనరల్ డైరెక్టర్ ఇస్మాయిల్ అల్–తవాబ్తా తెలిపారు. అయితే, కీలకమైన నిరాయుధీకరణ, భద్రతా బాధ్యతలను అంతర్జాతీయ దళాలకు అప్పగించడం వంటి అంశాలను మాత్రం ప్రస్తావించలేదు.గత అక్టోబర్లో హమాస్-ఇజ్రాయెల్ మధ్య గాజాలో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుంచి.. పాలన నుంచి తప్పుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ హమాస్ చెబుతున్న సంగతి తెలిసిందే. కాగా, 2007లో గాజాలో హమాస్ పాలన ప్రారంభం కాగా.. తాజా నిర్ణయంతో గాజాలో పౌర పాలనకు మార్గం సుగమమైంది. -
లంక జైల్లో గ్యాంగ్ వార్
కొలంబో (శ్రీలంక): శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఆదివారం మొదలైన గ్యాంగ్ వార్ 26 మంది ప్రాణాలు తీసింది. వందమంది గాయపడ్డారు. మృతుల్లో శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లతోపాటు జైలు గార్డులు కూడా ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. నేరగాళ్ల గుంపులు మొదట ఆదివారం ఒకరితో ఒకరు తలపడటంతో ఈ గ్యాంగ్ వార్ మొదలైంది. అయితే సోమవారం వీరు జైల్లోని తుపాకులు కూడా లాక్కోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. అచ్చం సినిమాల్లో చూపినట్టుగానే మత్తుమందుల రవాణాకు సంబంధించి రెండు వైరి గ్రూపుల మధ్య వివాదంతో ఘర్షణ మొదలైనట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. ఒక వర్గం మత్తుమందుల రవాణాకు పాల్పడతూండగా ఇంకో వర్గం దాన్ని వ్యతిరేకించింది.ఒక వర్గం సమాచారం ప్రత్యర్థి వర్గానికి ఎవరు అందించారన్న విషయమై ఘర్షణ మొదలైనట్లు తెలిసింది. ఆదివారం రెండు వర్గాల వారు కలబడటంతో 20మంది వరకూ మరణించారు. ఆ తరువాత కొందరు మహిళ ఖైదీలు ఆదివారం రాత్రి జైలు పైకప్పుపై నిరసన ప్రదర్శన నిర్వహిస్తూండగా అది పాక్షికంగా కూలిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా జైల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి.తొలి రోజు ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఖైదీలు జైలు ఆయుధాగారంలోకి చొరబడి తుపాకులు స్వా«దీనం చేసుకున్నారు. కాల్పులు జరిపారు. ఫలితంగా నలుగురు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు నెగొంబో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనల్లో సుమారు వంద మంది దాకా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఖైదీలతో పాటు గార్డుల్లో చాలామంది తుపాకీ కాల్పుల కారణంగా గాయపడ్డారని, పలువురు కత్తిగాటు గాయాలతో ఉన్నారని నెగెంబో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిలో కొందరిని కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. -
యుద్ధవిమానాలు తోడ్కొని రాగా..
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు అత్యంత అధునాతన యుద్ధవిమానాలను ఎదుర్కోలుకు పంపింది. సోమవారం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ విమానం ఇండోనేసియా గగనతలంలోకి రాగానే ఆ దేశానికి చెందిన ఎఫ్–16, సుఖోయ్–30 యుద్దవిమానాలు ఎదురొచ్చి మరీ సాదరంగా జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిచూపించాయి. ఫైటర్జెట్లు ఎస్కార్ట్గా వెంట రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేస్తూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు.గగనతలం మొదలు ఎయిర్పోర్ట్ దాకా ఇండోనేసియా ప్రభుత్వం చేసిన సాదర స్వాగత కార్యక్రమం తన మనసును హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఎయిర్పోర్ట్లో దిగగానే ప్రధాని మోదీకి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో సాదరస్వాగతం పలికారు. నలుగురు మంత్రులతో కలిసి వచి్చమరీ ఆయన ప్రధానిని ఆప్యాయంగా హత్తుకుని కుశల ప్రశ్నలువేశారు. మంగళవారం సుబియంతో, మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టతే లక్ష్యంగా కీలక రంగాల్లో సహకారం, వాణిజ్యంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఇరుదేశాల బంధాన్ని 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించాక మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. ‘‘మంగళవారం సుబియంతోతో కలిసి యోగ్యకర్త నగరంలోని దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ప్రభానన్ను దర్శించుకుంటా. ఇది ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించనుంది. భారతీయులతోనూ మాట్లాడబోతున్నా. విదేశంలో భారతీయులు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. విదేశంలో ఉంటూ భారత ప్రగతికి వీళ్లంతా కృషిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. భారతీయ సంగతి తమ ఘన విజయాల ద్వారా భారత బంధాన్ని ప్రపంచ దేశాలతో బలపరుస్తున్నారు’’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. నృత్య ప్రదర్శన, తోలు బొమ్మలాట.. ఎయిర్పోర్ట్ నుంచి తాను బసచేయబోయే హోటల్కు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. వాళ్లతో మోదీ కొద్దిసేపు మాట్లాడి షేక్హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా రామయణ గాథను కళాత్మకంగా వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన ఇండోనేసియా సంప్రదాయక తోలుబొమ్మలాట ‘వయాన్గ్ కులిత్’ను మోదీ తిలకించారు. సమన్వయ గ్రూప్ చేసిన భరతనాట్యం నృత్య ప్రదర్శననూ ప్రధాని ఆసక్తిగా చూశారు.బౌద్ధమతంలోని త్రిరత్న(బుద్ధ, ధామ, సంఘ)ను వివరిస్తూ విహార ధర్మరత్న బృందంచేసిన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని మోదీ ఆ కళాకారులను పొగిడారు. భారత్ యాక్ట్ ఈస్ట్ ఆసియా, మహాసాగర్ విజన్లో భాగంగా మోదీ సోమవారం మూడు దేశాల పర్యటన మొదలెట్టారు. ఇండోనేసియా పర్యటన తర్వాత అటునుంచి మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనిస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత న్యూజిలాండ్కు వెళ్లి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తోనూ చర్చలు జరపనున్నారు. -
థాయ్లాండ్లో 2వేల ఏళ్లనాటి బంగారు ఉంగరాలు
బ్యాంకాక్: పశ్చిమ థాయ్లాండ్లో ఫెట్చాబురీ ప్రావిన్స్లో తాజాగా జరిపిన తవ్వకాల్లో ఏకంగా 2,000 సంవత్సరాల క్రితంనాటి రెండు బంగారపు ఉంగరాలు లభ్యమయ్యాయి. వీటలో ఒకదానిపై బ్రాహ్మీ లిపిలో రాసిన అక్షరాలున్నాయి. దీంతో ఈ అంగుళీకాలు భారత్కు చెందినవని భావిస్తున్నారు. గత వారం బాన్లాట్ జిల్లాలోని డోన్ యీ థాంగ్ పురాతత్వ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఈ ఉంగరాలు బయటపడ్డాయి. ఒక ఉంగరంపై బ్రాహ్మీ లిఫిలో పుషరకిత్సవా అని రాసి ఉన్నట్లు పురాతత్వ శాస్ట్ర నిపుణులు ఒకరు వెల్లడించారు.పుషరకిత్సవా అంటే ఆనాటి భాష ప్రకారం పుష్య పరిరక్షణలో ఉండటం. అంటే భారతీయ రాశిచక్రం ప్రకారం పుష్యమీ నక్షత్రబలం ఉండటం అని అర్థం. భారతీయ ప్రాచీన కుల వ్యవస్థలో వైశ్యులకు సంబంధించిన వ్యాపారికి చెందిన ఉంగరంగా దీనిని భావిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితమే థాయిలాండ్ ప్రాంతవాసులతో భారతీయులు వాణిజ్యం జరిపేవారని, సత్సంబంధాలు కొనసాగించారనడానికి ఇవి మరో ప్రబల నిదర్శనాలు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో లభించిన మానవ అవశేషాల పక్కనే మరో బంగారు ఉంగరాన్నీ గుర్తించారు.దీనిపై ఎలాంటి రాతలు లేవు. బ్యాంకాక్కు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే ఈ పురాతన ప్రాంతముంది. ఈ ఏడాది తొలినాళ్లలో ఇక్కడికి సమీప ప్రాంత వరిపొలంలో పురాతన కంచు డోలును స్థానికుడు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. ఆ డోలు సైతం 2,100 నుంచి 2,700 సంవత్సరాల పురాతనమైదని థాయ్లాండ్ పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనిని జాగ్రత్తగా ప్రభుత్వానికి అప్పగించినందుకు స్థానికుడు ఖేమ్థాయి సిట్టినశ్రీకి థాయ్లాండ్ లలితకళల విభాగ డైరెక్టర్ జనరల్ ఫానోమ్భట్ ఛంతరచోట్ 2,00,00 థాయ్ బాత్ కరెన్సీని బహుమతిగా ఇచ్చారు.ఇనుపయుగంలో థాయ్లాండ్ ప్రాంతంలో ఆధునిక నాగరికులు స్థిరనివాసం ఏర్పర్చుకున్న ప్రాంతంగా దీనికి పేరుంది. గత ఐదు నెలలుగా జరుగుతున్న తవ్వకాల్లో ఇక్కడ ఎనిమిది మానవ అవశేషాలు, ఇత్తడి, బంగారు ఆభరణాలు, మట్టి పాత్రలు, ఇతర అలంకరణ వస్తువులను కనుగొన్నారు. ఆనాటి సమాజంలో ఉన్నతవర్గాలను ఖననం చేసే ప్రాంతం ఇక్కడే ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఛుంఫామ్ ప్రావిన్స్లోని ఖోవ్సామ్ ఖేయీ జిల్లా, క్రాబీ ప్రావిన్స్లోని క్లాంగ్ థోమ్ జిల్లాలోనూ తవ్వకాలు జరిపారు. అక్కడా పురాతన బ్రాహ్మీ లిపి రాసి ఉన్న పురాతన వస్తువులు, అలంకరణ వస్తువులను వెలికితీశారు.మరో నెలరోజులపాటు తవ్వకాలు జరిపి మొత్తంగా లభ్యమైన పురాతన వస్తువులతో వస్తు ప్రదర్శన ఏర్పాటుచేస్తామని లలితకళ విభాగ డైరెక్టర్ జనరల్ ఫానోమ్భట్ ప్రకటించారు. తవ్వకాల్లో లభించిన వస్తువులన్నింటినీ రాట్చభూరి ప్రావిన్స్లోని ఫ్రా నఖూన్ ఖిరీ మ్యూజియానికి తరలించారు. తవ్వకాలు జరిపే చోట భారీ వర్షాలు పడుతుండగా, కొన్ని చోట్ల భూగర్భజలాలు ఉబికివస్తున్నాయి. దీంతో పరిరక్షణ చర్యలు చేపడుతూ జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


