కాఠ్మాండు: బంగ్లాదేశ్, నేపాల్లో జెన్ జీ ఉద్యమాల వల్ల అప్పట్లో ఆ రెండు దేశాల ప్రభుత్వాలు కుప్పకూలాయి. అయితే, ఆ ఉద్యమాల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో మాత్రం ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. అంటే నేపాల్లో జెన్ జీ ఉద్యమం ద్వారా పేరు తెచ్చుకున్న బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళుతోంది. బంగ్లాదేశ్లో మాత్రం 1978లో స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) విజయం సాధించి, విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీ ఓడిపోయింది.
బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో జరిగిన నిరసనల లక్ష్యం ఒక్కటే.. అదే ప్రస్తుత వ్యవస్థను మార్చడం. ఇప్పుడు నేపాల్లో జెన్ జీల అభిమాన నేత బాలేంద్ర షా విజయం సాధిస్తే, బంగ్లాదేశ్లో జెన్ జీల ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పార్టీ వైఫల్యం చెందింది. బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలోనే విప్లవం వచ్చింది. ఆ జెన్ జీ ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చినా, విద్యార్థుల నేతృత్వంలోని ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
బంగ్లాదేశ్లో నిరసనలు ఛత్ర శిబిర్ వంటి శక్తుల ద్వారా ప్రారంభమయ్యాయి. అది బంగ్లాదేశ్లోని ఒక ప్రధాన ఇస్లామిక్ విద్యార్థి సంఘం పేరు. దీని పూర్తి పేరు బంగ్లాదేశ్ ఇస్లామీ విద్యార్థి శిబిర్. దీన్ని 1977లో స్థాపించారు. బంగ్లాదేశ్లో జరిగిన ఉద్యమానికి హసీనా ప్రభుత్వాన్ని తొలగించడం అనే స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది.
నేపాల్లో నిరసనలు సహజంగా ఉద్భవించాయి. ప్రధాన దృష్టి మొత్తం పాత వ్యవస్థను కూల్చడం. దీంతో 35 ఏళ్ల బాలేంద్ర షా వంటి నాయకులు పాత రాజకీయ పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయాలుగా ఎదగగలిగారు.
బంగ్లాదేశ్ విద్యార్థుల ఉద్యమం దేశ ప్రజలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని సృష్టించలేకపోయింది. ఆ ఉద్యమం ప్రధానంగా అప్పటి ప్రధానమంత్రి హసీనాను తొలగించడం మీదే కేంద్రీకృతమైంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపలేకపోయింది. మరోవైపు, బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు హసీనా ప్రభుత్వం కూలిన తరువాత త్వరగా వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు తాత్కాలిక ప్రభుత్వంలో పదవులు కూడా స్వీకరించారు. దీంతో వారు మార్పును కాకుండా అధికారాన్ని కోరుకుంటున్నారని అనేక మంది భావించారు. ఈ విధంగా బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు తమ ప్రతిష్ఠను దెబ్బతీసుకున్నారు. జమాత్ పార్టీతో చేతులు కలపడం వల్ల వారు ఇతర రాజకీయ శక్తితో కలిసినట్టు కనిపించింది.
బంగ్లాలో తారిక్ రహ్మాన్ ప్రభావం ఇలా..
హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా కుమారుడు తారిక్ రహ్మాన్ నమ్మకమైన నేతగా ఎదిగారు. అప్పటికే బంగ్లాలో ఉన్న రాజకీయ వ్యవస్థ నుంచే వచ్చిన నాయకుడు అయినా, 17 సంవత్సరాలు వేరే దేశంలో నివసించారు. తారిక్ రహ్మాన్ కొత్త ఆలోచనలు, కొత్త విధానం, ముఖ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి స్పష్టమైన విజన్ను చూపించారు. ఆయన “ఐ హావ్ ఏ ప్లాన్” ప్రసంగం ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుందో చెప్పింది. ఈ విధానం ఫలించింది.
నేపాల్లో బాలేంద్ర షా ఇలా..
గత సంవత్సరం సెప్టెంబరులో నేపాల్లో జెన్ జీ నిరసనలు చెలరేగాయి. కారణం సామాజిక మాధ్యమాల నిషేధం. తర్వాత ప్రభుత్వం ఆ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ అవినీతిపై జెన్ జీ పోరాడింది.
బాలేంద్ర షా మొదట “బలెన్” అనే పేరుతో రాపర్గా ప్రసిద్ధి చెందారు. ఆయన పాటలు సామాజిక సమస్యలు, రాజకీయ అవినీతిని విమర్శించేలా ఉండేవి. యువతను ఆకర్షించాయి. తర్వాత ఆయన కాఠ్మాండు మేయర్గా ఎన్నికయ్యారు. నిరసనల సమయంలో ప్రధానమంత్రి పదవిని చేపడతారా అని అడిగినప్పుడు ఆయన తిరస్కరించారు.
కాఠ్మాండు మేయర్గా బలెన్ షా పనిచేసిన అనుభవం ఆయనకు సాయపడింది. ముఖ్యంగా సాధారణ ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై దృష్టి పెట్టారు. ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడం, ప్రజా భూములపై ఆక్రమణలు తొలగించడం, దీర్ఘకాల చెత్త నిర్వహణ సమస్య పరిష్కారం వంటి అంశాలపై పని చేశారు.
ప్రచార సమయంలో ఆయన సభలకు భారీ జనసందోహం వచ్చేది. ఆయన తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా సాయపడ్డారు. ఆ ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.


