టీ20 వరల్డ్కప్ 2026 నుంచి పాక్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. నిన్న (ఫిబ్రవరి 28) తమ చివరి సూపర్-8 మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, న్యూజిలాండ్తో పోలిస్తే మెరుగైన రన్రేట్ లేని కారణంగా సెమీస్కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్ బెర్త్ సాధించగా.. పాక్ శ్రీలంకపై గెలిచినా, మెరుగైన రన్రేట్ సాధించలేకపోవడంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
మరోవైపు గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్కు చేరుకోగా.. రెండో బెర్త్ కోసం భారత్, వెస్టిండీస్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 1) రాత్రి జరుగబోయే మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఆ జట్టు సెమీస్కు చేరకుంటుంది. సెమీస్లో గ్రూప్-1 టాపర్గా ఉన్న సౌతాఫ్రికా గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా.. వెస్టిండీస్, భారత్ మ్యాచ్లో విజేత గ్రూప్-2 టాపర్ ఇంగ్లండ్తో సెమీస్లో తలపడుతుంది.
ఇదిలా ఉంటే, పాక్ టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన గంటల వ్యవధిలో ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు, పాక్ మాజీ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024 అక్టోబర్లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ఆయన, ఇప్పుడు మళ్లీ అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఉస్మాన్ ఖాదిర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పాకిస్తాన్ క్రికెట్లో సంచలనంగా మారింది.
32 ఏళ్ల ఉస్మాన్ ఖాదిర్.. అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ లాంటి వారు జట్టులోకి రాక ముందు పాక్ టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నారు. అయితే యువ స్పిన్నర్ల రాకతో అతనికి అవకాశాలు కరువయ్యాయి. దీంతో 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి వైదొలిగాక ఉస్మాన్ ఖాదిర్ తన మనసు మార్చుకున్నాడు.
రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి కారణాలు
ఉస్మాన్ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు 41 వికెట్లు తీశాడు. అలాగే స్థానిక లీగ్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో రాణించాడు. ఇంటాబయటా మంచి స్పందన రావడంతో ఉస్మాన్కు అంతర్జాతీయ వేదికపై తిరిగి రాణించగలనన్న నమ్మకం కలిగింది.
కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత, తన తండ్రి అబ్దుల్ ఖాదిర్ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఎక్స్ వేదికగా.. “నా ప్రయాణం ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ క్రికెట్ కోసం మళ్లీ సిద్ధంగా ఉన్నాను” అని ప్రకటించాడు.
తండ్రి తరహాలోనే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన ఉస్మాన్ ఖాదిర్ పాక్ తరఫున 25 వన్డేల్లో 31 వికెట్లు.. ఒక వన్డే ఓ వికెట్ తీశాడు. 2020లో జింబాబ్వేపై టీ20తో పాక్ తరఫున అరంగేట్రం చేసిన ఉస్మాన్.. 2023 ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్పై తన చివరి మ్యాచ్ ఆడాడు.


