న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ల సరఫరాను పటిష్టం చేసే లక్ష్యంతో అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ‘ప్యాక్స్ సిలికా’ (Pax Silica) కూటమిలో భారత్ చేరనుంది. 2025 డిసెంబర్లో ప్రారంభమైన ఈ కూటమిలో భారత్ అధికారికంగా భాగస్వామి కావడంతో అంతర్జాతీయ సాంకేతిక రంగంలో దేశ ప్రతిష్ట మరింత పెరగనుంది. మిత్రదేశాల మధ్య చిప్స్, ఏఐ సరఫరా వ్యవస్థను సురక్షితం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశ్యం.
ఈ భాగస్వామ్యం ద్వారా సెమీకండక్టర్ల తయారీ, కీలక ఖనిజాల లభ్యత, ఏఐ పరిశోధనల్లో భారత్కు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో బలంగా ఉన్న భారత్, ప్యాక్స్ సిలికాలో చేరడంతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగేందుకు మార్గం సుగమం కానుంది. సుస్థిరమైన సరఫరా గొలుసు (Supply Chain) ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగిన చిప్ తయారీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకోనుంది. గతంలో సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈ ఒప్పందంతో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే దిశగా ఢిల్లీ, వాషింగ్టన్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. సాంకేతికత, రక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాల్లో కలిసి పనిచేయడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ప్యాక్స్ సిలికా కూటమిలో అమెరికా, భారత్తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, యూఏఈ, ఇజ్రాయెల్, సింగపూర్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో చేరడం వల్ల గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ విషయంలో భారత్ కీలక నిర్ణయాధికారిగా మారనుంది. మారుతున్న ప్రపంచ పరిణామాల దృష్ట్యా, సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిలో భారత్ ఇకపై ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేయనుంది.
ఇది కూడా చదవండి: రూ. 20 కోట్ల లాటరీ దక్కింది.. టిక్కెట్ పోయింది!


