breaking news
Artificial Intelligence (AI)
-
ఏఐతో గుంతల గుట్టు రట్టు.. కాంట్రాక్టర్లలో గుబులు!
బెంగుళూరు: బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గౌరవ్ సేన్ రోడ్లపై ఉన్న గుంతలను గుర్తించి, వాటికి బాధ్యులైనవారి వివరాలను కేవలం 4 సెకన్లలో వెలికితీసే వినూత్న ఏఐ సిస్టమ్ను అభివృద్ధి చేశారు. అస్తవ్యస్త రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలు పడే ఇబ్బందులను గమనించిన ఆయన, ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నారు. ఈ నూతన వ్యవస్థలో భాగంగా ఆయన కార్లలో డాష్క్యామ్, జీపీఎస్, యాక్సిలరోమీటర్లను అమర్చారు. వాహనం కదులుతున్నప్పుడు ఓపెన్ఏఐ విజన్ మోడల్ సహాయంతో ఈ సిస్టమ్ వివిధ పరిమాణాల్లో ఉన్న గుంతలను గుర్తిస్తుంది. సాధారణ స్పీడ్ బ్రేకర్లకు, ప్రమాదకర గుంతలకు మధ్య తేడాను స్పష్టంగా అంచనా వేస్తుంది.గుంతలను గుర్తించిన తర్వాత, ఈ వ్యవస్థ దాదాపు 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటాబేస్తో అనుసంధానం అవుతుంది. దీనివల్ల ఆ నిర్దిష్ట రోడ్డు నిర్మాణానికి బాధ్యత వహించిన కాంట్రాక్టర్, సంబంధిత అధికార పేరు ఇట్టే బయటపడతాయి. రోడ్డు గ్యారెంటీ కాలపరిమితిలో ఉంటే, ప్రభుత్వ ఖర్చు లేకుండా కాంట్రాక్టరే దానిని బాగుచేయాల్సి ఉంటుంది.కేవలం 4 సెకన్లలో గుంత ఫోటో, కచ్చితమైన లొకేషన్, టెండర్ నంబర్, అధికారుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను ఈ యాప్ సిద్ధం చేస్తుంది. ఆఫీసుకు వెళ్లే దారిలో ఈ వ్యవస్థను పరీక్షించిన ఇంజనీర్, ప్రయాణంలో 12 గుంతలను గుర్తించి నివేదికను రూపొందించారు. కాంట్రాక్టర్ల బాధ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వ విభాగాలు ఈ సాంకేతికతను ఉపయోగించాలని ఆయన కోరుతున్నారు. -
సర్వర్ సైలెంటైతే... పంటనష్టం వయొలెంట్!
ఆహార భద్రత అంటే పొలాల్లో పంటలు బాగా పండటం, పశువులు ఆరోగ్యంగా పెరగడం. అంతే కదా! ఇక సూపర్ మార్కెట్లకు వెళ్లినప్పుడు అక్కడ వరుసగా సర్ది ఉన్న తాజా పండ్లు, కూరగాయలు, నాణ్యమైన ధాన్యాలను చూసినప్పుడు మన ఆహార సరఫరా వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో అని కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయాక.. ఈ సమృద్ధి, సరఫరాల వెనుక ఒక ప్రమాదం పొంచి ఉండటం కూడా కనిపిస్తుంది. అదే.. ‘డేటాబేస్ వైఫల్యం’! కంప్యూటర్ చెప్పినట్లుగా డేటాబేస్ ‘రైట్, రైట్’ అని అనకపోతే.. పండ్లు, కాయగూరలు, ఇతర ఆహార పదార్థాల లోడ్తో ఉన్న ట్రక్కులు ఎన్నాళ్లయినా ఎక్కడివక్కడే ఉండిపోతాయి! కదలటం ఆలస్యం అయ్యే కొద్దీ ట్రక్కులోని ఆహార, పంట పదార్థాలు పాడైపోతాయి.మన ఆహార సరఫరా వ్యవస్థలు పైకి ఎంత స్థిరంగా, ఆధునికంగా కనిపిస్తాయో... లోపల అంతకంటే ఎక్కువగా డిజిటల్ సిస్టమ్లు, సాఫ్ట్వేర్లు, కంప్యూటర్ నెట్వర్క్ల పైన ఆధారపడి ఉంటున్నాయి. ఈ డిజిటల్ సదుపాయాలలో ఒక చిన్న సాఫ్ట్వేర్ లోపం వచ్చినా లేదా సైబర్ దాడి జరిగినా, లారీలకు లారీల ఆహారం మన కళ్లముందే కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.ఈ దృశ్యాన్ని ఊహించుకోండిగోదాముల్లో టన్నుల కొద్దీ బియ్యం, చికెన్, తాజా పండ్లు సిద్ధంగా ఉన్నాయి. బయట లారీలు హార్న్ కొడుతూ రవాణాకు రెడీగా ఉన్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ మీద చేతులు వేసి ‘ఎప్పుడు బయలుదేరాలి?’ అని వేచి చూస్తున్నారు. కానీ, లోపల డిజిటల్ సిస్టంలో పని నడవటం లేదు. అది నడిస్తేనే లారీ ముందుకు కదిలేందుకు అనుమతి లభిస్తుంది. సరకు రవాణా పత్రాలు ఎంతకూ రావు. ఆ పత్రాలు ఇవ్వవలసిన కంప్యూటర్.. ‘‘నా డేటాబేస్లో ఈ షిప్మెంట్కు ఇంకా ఆమోదం రాలేదు, కాబట్టి రవాణా పత్రాలను ఇవ్వలేను’’ అని సైలెంట్ అయిపోతుంది. అలా, ప్రజా పంపిణీకి వెళ్లవలసిన ఆహారం... కంప్యూటర్ పచ్చజెండా ఊపకపోవటం వల్ల – ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. ఎందుకంటే, ఈ రోజుల్లో ఏదైనా ఒక కంటెయినర్ ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లాలన్నా, అందులోని సరకు పంపిణీ కావాలన్నా లేదా ఇన్సూరెన్స్ పరిధిలోకి రావాలన్నా... అది తప్పనిసరిగా డిజిటల్ ప్లాట్ఫామ్లు, ఆటోమేటిక్ కంప్యూటర్ వ్యవస్థల ద్వారా ‘ధ్రువీకరణ’ పొంది ఉండాలి.డిజిటల్ సిస్టమ్ ధ్రువీకరించకుంటే..?ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఆహారం ఎంత నాణ్యమైనదైనా, డిజిటల్ రికార్డుల్లో ఆ నాణ్యత నమోదు కాకపోతే దానిని సూపర్ మార్కెట్లు అంగీకరించవు. చట్టబద్ధమైన పంపిణీ అయినా సరే నిలిచిపోతుంది. సరైన సమయంలో గోదాముల నుండి బయటకు రాని పండ్లు, మాంసం, పాల వంటి తక్కువ కాలపరిమితి గల ఆహార పదార్థాలు గంటల వ్యవధిలోనే పాడైపోతాయి. ఇక చివరి నిమిషంలో సరఫరా చేసే ఆధునిక పద్ధతుల్లో ఒక్క చోట సిస్టమ్ ఆగిపోయినా, మొత్తం నెట్వర్క్ స్తంభించిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. డిజిటల్ వ్యవస్థల కంటికి ‘కనపడని‘ (గుర్తింపు పొందని) ఆహారం ఎంత ఉన్నా, అది నిరుపయోగంగానే మిగిలిపోతుంది.ప్రధానమైన ముప్పులునేడు వ్యవసాయం నుండి ఆహార పంపిణీ వరకు ప్రతి దశలోనూ కీలక నిర్ణయాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటెడ్ డిజిటల్ సిస్టమ్లే నిర్దేశిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత ఆహారానికి డిమాండ్ ఉందో లెక్కిస్తున్నాయి. పంటలను ఎప్పుడు వేయాలో, ఎప్పుడు కోత కోయాలో మార్గనిర్దేశం చేస్తున్నాయి. గోదాముల్లో ఎంత సరుకు ఉంది, ఎప్పుడు పంపాలి అనే రవాణా ప్రాధాన్యాలను నిర్ణయిస్తున్నాయి. ఇలా, అత్యంత వేగంగా పనులు జరగడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఏఐ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. కానీ ఇందులో రెండు ప్రధాన ముప్పులు ఉన్నాయి. ఒకటి : మనుషులు తమ నిర్ణయాధికారం కోల్పోతారు. ఆహార పంపిణీకి సంబంధించిన కీలక నిర్ణయాలను సాఫ్ట్వేర్ ఏ ప్రాతిపదికన తీసుకుందో మనుషులు సులభంగా అర్థం చేసుకోలేరు, ప్రశ్నించలేరు. రెండవది : సైబర్ దాడుల భయం. శత్రుదేశాలు లేదా హ్యాకర్లు మన డిజిటల్ ఫుడ్ నెట్వర్క్లపై సైబర్ దాడులు జరిపితే, దేశం మొత్తం ఆహార కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.అత్యవసర సమయాలుసాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఈ డిజిటల్ విప్లవంలో అతిపెద్ద లోపం– మానవ వనరులను పక్కన పెట్టటం. కంప్యూటర్లతో కాకుండా మనుషులతో పని చేయించటం అనేది అనవసరమైన ఖర్చుతో కూడుకున్నదని భావించి, కంపెనీలు పాత పద్ధతులను పూర్తిగా రద్దు చేస్తున్నాయి. అత్యవసర సమయాల్లో కంప్యూటర్ సిస్టమ్తో పనిలేకుండా చేసి, చేతితో రికార్డులు రాసి పనులు జరిపేలా సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. ఈ కారణంగా అత్యవసర సమయంలో తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ఆహారాన్ని గోదాము నుండి బయటకు పంపే రిలీజ్ కోడ్లు నిలిచిపోతాయి. ముందే చెప్పినట్లు... డ్రైవర్లు లారీలతో సిద్ధంగా ఉన్నా, ఆమోదముద్ర లేక వేచి చూడక తప్పదు. గోదాములో టన్నుల కొద్దీ ఆహారం ఉన్నా, సర్వర్లలో సరుకు ‘సున్నా’ అని చూపించవచ్చు. కొన్ని పరిశోధనల నివేదికల ప్రకారం, సిస్టమ్ నిలిచిపోయిన 72 గంటల (3 రోజుల) తర్వాత తప్పనిసరిగా మనుషులు జోక్యం చేసుకుని కాగితాల ద్వారా రవాణా ప్రారంభించాలి. కానీ, ప్రస్తుత సిబ్బందికి కాగితపు పద్ధతులపై కనీస అవగాహన కూడా ఉండటం లేదు!నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి?కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆహార రంగానికి కచ్చితమైన వ్యవసాయ సమాచారం అందుతుంది. ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి? అనే వివరాలు తెలుసుకుని దిగుబడిని పెంచుకోవడం మంచిదే. అయితే సమస్యల్లా సాంకేతికతను వాడటంలో లేదు... ఆ సాంకేతికతను ఎవరు నియంత్రిస్తున్నారు? అత్యవసరంలో స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? అనే దానిలోనే ఉంది. అందుకు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహార వ్యవస్థల్లో ప్రతి దశలోనూ మనుషుల పర్యవేక్షణ ఉండాలి. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు పాత పద్ధతుల్లో పనులు నిర్వహించేలా సిబ్బందికి నిరంతరం మాక్ డ్రిల్స్, శిక్షణ ఇస్తుండాలి. ఆహార పంపిణీకి వాడే సాఫ్ట్వేర్ కోడ్లను, ఆల్గారిథమ్లను ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఆడిట్ చేసేలా పారదర్శకత ఉండాలి. కంపెనీల వ్యాపార రహస్యాల కంటే ప్రజల ఆహార భద్రతే ముఖ్యం. రైతులు, స్థానిక ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తి డేటాపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి.సేవకులే కాదు, యజమానులు కూడా!సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి గొప్ప సేవకులు. కానీ అత్యంత ప్రమాదకరమైన యజమానులు కూడా! మనం వేగం, డబ్బు ఆదా చేసుకోవడానికి డిజిటల్ సిస్టమ్లపై ఆధారపడటంలో తప్పులేదు. కానీ, మన కడుపు నింపే ఆహారాన్ని బతికించేది నేల, రైతు, మనిషి శ్రమ మాత్రమే తప్ప ఒక కంప్యూటర్ కోడ్ కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.అసలు ప్రశ్న ‘కంప్యూటర్లు లేదా డిజిటల్ వ్యవస్థలు విఫలమవుతాయా లేదా?’ అనేది కాదు... ‘ఒకవేళ కంప్యూటర్ వ్యవస్థలు విఫలమైనా తట్టుకుని నిలబడి, ప్రజలకు ఆహారాన్ని అందించే ప్రత్యామ్నాయ ప్రణాళికలు మన దగ్గర ఉన్నాయా లేదా?’ అన్నదే. సాంకేతికత సమస్య వచ్చినప్పుడు కంప్యూటర్ ‘సిస్టమ్ డౌన్’ అనవచ్చు. కానీ, మానవత్వంతో కడుపు నింపే వ్యవస్థలు ఎప్పటికీ డౌన్ కాకూడదు. – సాక్షి స్పెషల్ డెస్క్నిజంగా జరిగిన రెండు ఘటనలుసైబర్ దాడులు, డేటాబేస్ వైఫల్యం వంటివి భవిష్యత్తులో ఎప్పుడో రాగల అవకాశం ఉన్న ఊహాజనిత ప్రమాదాలైతే కాదు. ఇప్పటికే ప్రపంచంలో పలుచోట్ల సంభవించిన నిజమైన సంఘటనలు కొన్ని, హెచ్చరికలుగా మన కళ్ల ముందే ఉన్నాయి.జేబీఎస్ ఫుడ్స్పై దాడి (2021)బ్రెజిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీ అయిన జేబీఎస్ ఫుడ్స్పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. పశువులు, పనిచేసే సిబ్బంది, గోదాములు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ... కంప్యూటర్ సిస్టమ్లు హ్యాక్ అవ్వడం వల్ల ఆస్ట్రేలియా, అమెరికాలోని ప్లాంట్లు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు సిస్టమ్ను పక్కనపెట్టి సొంతంగా పని చేయడానికి ప్రయత్నించినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల భారీగా ఆహారం వృథా అయ్యింది. ఇటీవల యూకేలోని ప్రధాన సూపర్ మార్కెట్ నెట్వర్క్లకు సరుకు అందించే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సాఫ్ట్వేర్ సమస్య తలెత్తటం వల్ల, షెల్ఫ్లు ఖాళీగా మారిపోయాయి. ఆహారం దగ్గరలోని గోదాముల్లోనే ఉన్నప్పటికీ, డెలివరీ కోడ్లు జనరేట్ కాకపోవడం వల్ల ప్రజలకు ఆహారం అందలేదు. -
యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఉచిత ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలాగే కోటి మంది యువతకు కృత్రిమ మేధ(ఏఐ) శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. కోచింగ్ తరగతులు పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని చెప్పారు. అందుకే వివిధ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించబోతున్నట్లు తెలిపారు. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపించడం తల్లిదండ్రులకు నేడు ఒక ప్రతిష్టగా మారిపోయిందని గుర్తుచేశారు. కోచింగ్పై వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఉచిత ఆన్లైన్ శిక్షణతో ఆదా చేసుకోవచ్చని, పిల్లలకు దగ్గరగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చని అన్నారు. మనకు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ, చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ వనరులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా యువతకు ఉచిత కోచింగ్ అందించేందుకు పూర్తిస్థాయి నెట్వర్క్ను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు. -
సప్తధారతో వికసిత భారతం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సిద్ధికి వందేళ్లు నిండేనాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ పిలుపునిచ్చారు. పన్నెండేళ్లలో సాధించిన పురోగతిని వివరిస్తూనే.. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు ఒక్కొక్కరూ కంకణం కట్టుకుని తమవంతు తోడ్పాటు, కృషి చేయాలని ఆయన ఎర్రకోట వేదికగా శనివారం జరిగిన 80వ స్వాతంత్య్రోత్సవ వేడుకల్లో కోరారు. ఏడు రకాల శక్తులు కలిస్తే (సప్త ధార) ఇది అసాధ్యం కానేకాదని భరోసానిచ్చిన మోదీ.. లక్ష్యసాధనకు సాధించాల్సిన ప్రగతిపై కూడా నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించారు. దేశీ కంపెనీల్లో కనీసం యాభై ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకోవాలని, అంతర్జాతీయంగా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటైనా భారత్ది అయి ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవిష్యత్తును శాసించనున్న కృత్రిమ మేధ రంగంలో అగ్రస్థానంలో నిలిచే లక్ష్యంతో వచ్చే ఏడాది కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు విభేదాలు మరచి రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలని కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో సాయుధ నక్సలిజం లేకుండా పోయినా ‘దిమాగీ నక్సల్స్’ఇంకా ఉన్నారని హెచ్చరించారు. దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలో ఘనంగా మొదలయ్యాయి. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మాగాం«దీకి నివాళులు అర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి, గార్డ్ ఆఫ్ హానర్ కమాండర్ సుమారు 7.15 గంటల ప్రాంతంలో ప్రధానిని ఆహ్వానించారు. ఆ తరువాత ప్రధాని గార్డ్ ఆఫ్ హానర్ను అందుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని చిరస్మరణీయం చేస్తూ ఆర్మీబ్యాండ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మొదటిసారి దీన్ని ఆలపించడం, ఆ తరువాత 21 తుపాకులతో ‘రాష్ట్రీయ సెల్యూట్’, జాతీయ గీతాలాపన జరిగాయి. ఇదే సమయంలో భారతీయ వాయుసేనకు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు వేదికపై పుష్ఫవర్షం కురిపించాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని, మరోటి ‘వందే మాతరం’అని రాసి ఉన్న జెండాను మోసుకెళుతూ కనిపించాయి. అనంతరం 7.40 గంటలకు ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం భారతీయులు అందరి లక్ష్యం కావాలని నిర్దేశించిన ప్రధాని మోదీ ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం పాడటంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దేశం దన్నుగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రధాని గత పన్నెండేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని సోదాహరణంగా వివరించారు. అనంతరం వికసిత భారత లక్ష్యాన్ని అందుకునేందుకు సాయం చేయగల సప్తధార శక్తులను ప్రకటించారు. అంతేకాకుండా దేశం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు వేయాల్సిన ముందడుగులను వివరించారు. యువత ఉన్నత శిఖరాలను అందుకునేందుకు దేశం అండగా ఉంటుందని చెప్పిన ప్రధాని మత్తుమందుల మహమ్మారిని పారదోలే లక్ష్యంతో వలంటీర్లు, ఎన్జీవోలు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, ఆధ్యాతి్మక నాయకులతో కలిసి వంద వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. పురోగతి బాటలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో గత పన్నెండేళ్లలో దేశం సాధించిన పురోగతిని ఇలా వివరించారు... → రక్షణ రంగ ఉత్పత్తులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. → ఖాదీ, గ్రామీణ పరిశ్రమల్లో పురోగతి ఐదు రెట్లు → ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల తయారీలో పెరుగుదల ఏడు రెట్లు. → ఆధునిక రైల్వే కోచ్ల ఉత్పత్తి 21 రెట్లు పెరిగింది. → మొబైల్ ఫోన్ల తయారీలో పెరుగుదల 33 రెట్లు ఎక్కువైంది. → ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువైంది. → పేటెంట్లు కూడా 4 రెట్లు ఎక్కువయ్యాయి. → డిజిటల్ లావాదేవీలు దాదాపు 100 రెట్లు పెరిగాయి. → నల్లాల ద్వారా తాగునీటి కనెక్షన్లు గతం కంటే 15 రెట్లు వేగంగా అందిస్తున్నాం. → గ్యాస్ కనెక్షన్లు అందించే వేగం కూడా ఆరు రెట్లు ఎక్కువైంది. → స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం నాలుగు రెట్లు వేగంగా జరుగుతోంది. → పీఎం ఆవాస్ యోజన కింద పేదల కోసం ఇళ్ల నిర్మాణ వేగం మూడు రెట్లు పుంజుకుంది. → పేదరికం నుంచి బయటపడ్డ వారి సంఖ్య 25 కోట్లు. → ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుదల → దేశం మొత్తమ్మీద 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు → 650 కొత్త యూనివర్సిటీల స్థాపనలక్ష్య నిర్దేశం 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారతీయ సంస్థలు, బ్రాండ్లు పలు లక్ష్యాలను సాధించాలి. ఫార్చ్యూన్ 500లో 50 భారతీయ కంపెనీలు ఉండాలి. బ్యాంకులు, ఫార్మా, లాఫర్మ్లు, రేటింగ్ ఏజెన్సీలు, ఐటీ, కన్సల్టింగ్, అకౌంటింగ్ సంస్థలు కూడా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరాలి. భారతీయ బ్రాండ్లు విశ్వాసానికి ప్రతీకలుగా మారాలి. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేయాలి. భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీలు కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరుస్తోంది. 2036 ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు దేశం సిద్ధం. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఆత్మనిర్భర్ భారత్ దిశగా సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, శక్తి భద్రతపై దృష్టి సారించాలి మూడు సెమీకండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడు, ఎనిమిదేళ్లలో మరో ఎనిమిది ప్లాంట్ల స్థాపన. 2047 నాటికి వంద గిగావాట్ల అణు శక్తి లక్ష్యం. ఈ దశాబ్దంలో ఐదు కొత్త అణు రియాక్టర్లు ప్రారంభం. సౌర శక్తి సామర్థ్యం రెండు గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు వృద్ధి. పీఎం సూర్య ఘర్ పథకం కింద 50 లక్షలకు పైగా రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు. యువత, క్రీడలు, మహిళా సాధికారత దేశంలో 2.5 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. రూ.లక్ష కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్. డ్రగ్–ఫ్రీ ఇండియా జాతీయ మిషన్గా మారాలి.సప్తధార: ఏడు శక్తి ప్రవాహాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ‘‘సప్తధార’’అనే ఏడు శక్తి ప్రవాహాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రానున్న ఐదు, ఏడేళ్లు చాలా కీలకమని, ప్రజలు పని సంస్కృతి తోపాటు మైండ్సెట్నూ మార్చుకుని దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలిని అన్నారు. ప్రధాని వివరించిన సప్తధారల వివరాలు... → తయారీ శక్తి: డిజైన్ నుంచి తయారీ వరకు మొత్తం అన్ని దశలూ భారత్లోనే పూర్తవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారాలి. ఖర్చు, నాణ్యతల పరంగా భారతీయ పరిశ్రమలు ప్రపంచ దేశాలతో పోటీపడాలి. నమ్మదగ్గ, యూజర్ ఫ్రెండ్లీ, ఆకర్శణీయమైన ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా పనిచేయాలి. → వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్: చిరుధాన్యాలు, మసాలా దినుసులు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహారాలను ప్రపంచ బ్రాండ్లుగా మార్చాలి. రసాయన–రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కారణంగా అందుబాటులోకి వచ్చిన ప్రపంచ మార్కెట్లను రైతులు సది్వనియోగం చేసుకోవాలి. పొలాల నుంచి నేరుగా ఎగుమతులు జరగాలి → టెక్నాలజీ, ఇన్నొవేషన్: ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష ప్రయోగాలు, రోబోటిక్స్, డేటా సెంటర్లలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసేలా ఎదగాలి యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రపంచానికి మార్గదర్శకం కావాలి. 6జీ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలి. → గతి శక్తి: హై–స్పీడ్ రైలు, ఆధునిక హైవేలు, అంతర్గత జలమార్గాలు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ వ్యవస్థల ద్వారా నగరాలను అనుసంధానించాలి. పోర్టులను పోర్ట్–ఆధారిత అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలి. → రక్షణ శక్తి: రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించడంతోపాటు ప్రపంచదేశాలకు రక్షణ ఉత్పత్తులను సరఫరా చేసేదిగా ఎదగాలి. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్లతోపాటు హైపర్ సోనిక్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ రంగంలో భారత యువత కీలక పాత్ర పోషించాలి. → గ్రీన్, బ్లూ ఎకానమీ: గ్రీన్ హైడ్రోజన్, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇంధన నిల్వ, పర్యావరణ హితమైన రవాణా, తయారీల కోసం కృషి జరగాలి. మత్స్య, తీరప్రాంత పర్యాటకం, ఓషన్ టెక్నాలజీల సాయంతో దేశం బ్లూ ఎకానమీలోనూ అగ్రస్థానానికి చేరవచ్చు. దేశ సంపదైన సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉపాధి, ఆర్థిక వృద్ధికి అవకాశాలు సృష్టికి అనుకూలం. → సాఫ్ట్ పవర్: భారతదేశ సాఫ్ట్ పవర్కు యోగా, ఆయుర్వేదం, ఆధ్యాతి్మకత, ఆరోగ్య సంరక్షణ, హస్తకళలు, సంస్కృతి, సినిమా, వీఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్లు నిదర్శనాలు. యువతకు అపార అవకాశాలు కల్పించగల సత్తా వీటికి ఉంది. హెల్త్ టూరిజమ్ ప్రోత్సాహానికి ‘హీల్ ఇన్ ఇండియా’ఉపయోగపడుతుంది. వేవ్స్ సమ్మిట్ దేశ సృజనాత్మక, వినోద పరిశ్రమల సత్తాను చాటింది. వందకు పైగా ఉన్న జాతీయ పార్కులతోపాటు వన్యప్రాణి సంపద పర్యాటక రంగాన్ని ఆకర్శించేందుకు సాయపడుతుంది. అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, కచేరీలు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించగలవు. -
ఆయ్...యమలోకంలో
భూలోకాన్ని స్పీడ్గా ఆక్రమించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చాలా ఆలస్యంగా యమలోకానికి చేరింది. ‘యమలోకం ఇప్పుడు ఏఐ మయం’ అనే భారీ హెడ్లైన్తో నరకలోక పత్రిక ‘హెల్ పోస్ట్’ మొదటి పేజీలో పెద్దవార్త ప్రచురితమైంది. యమలోకంలో ఏఐ టెక్నాలజీ ప్రారంభమైన తొలి రోజు: ‘పాపిని ప్రవేశ పెట్టండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. బోన్లోకి ఒక వ్యక్తిని ప్రవేశపెట్టారు రక్షణకారులు. ‘అయ్యా... వీరి పేరు కారప్పన్. భూలోకంలో ఎక్కడ కారం ఉన్నా దొంగిలిస్తాడు. అలా టన్నుల కొద్ది కారాన్ని దొంగిలించి కోట్లకు పడగెత్తాడు. కారం అంటే పడి చస్తాడు. అలా చచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇతడిపై భూలోక పోలీసు ఠాణాల యందు మిక్కిలి కేసులు ఉన్నవి. చిత్రగుప్తుల వారి చిట్టా కూడా ఇతడు కరుడు గట్టిన కారం దొంగ అని చెప్పుచున్నది’ అన్నాడు ఆ.అ (ఆరోపణ అధికారి)‘కారప్పన్... నువ్వు నరకలోక న్యాయస్థానానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నావా?’ అడిగారు ఇ. అధికారవర్యులు.‘అయ్యా, ఆరోపణ అధికారి చెప్పినదానిలో మిరప గింజంత నిజం కూడా లేదు. నా పేరు కారప్పన్ అయినంత మాత్రాన కారం దొంగగా ముద్ర వేయడం శోచనీయం, గర్హనీయం. చిత్రగుప్తుల వారి చిట్టా ఎప్పుడో అవుట్డేట్ అయింది. దాన్ని నమ్మొద్దు’ అన్నాడు కారప్పన్.కట్ చేస్తే....నరక లోకరక్షణ అధికారులు కారప్పన్ను ఏఐ చాట్బాట్ ‘యమహో...అదరహో’ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ చాట్బాట్లో కారప్పన్ పూర్తి వివరాలు అప్లోడ్ చేసి...‘వీరిపై ఎన్నో ఆరోణలు ఉన్నాయి. అవి నిజమా కాదా?’ అని ప్రాంప్ట్ ఇచ్చారు.‘ఒక్కటి కూడా నిజం కాదు. కారప్పన్కు కారం అంటే చిన్నప్పటి నుంచి విరక్తి. అతడు తినే భోజనంలో రవ్వంత కారం కూడా ఉండదు. కాకికి కూడా హాని చేయని కారంజన్ముడు!’ అని చెప్పింది ఏఐ చాట్బాట్.విచిత్రం ఏమిటంటే... కారప్పన్ మాత్రమే కాదు ఆ తరువాత బోన్లో ప్రవేశ పెట్టిన 120 మంది కరుడు గట్టిన నేరస్థులను కూడా ‘ఉత్తములు, ఆదర్శనీయులు’ అని తేల్చేసింది ఏఐ చాట్ బాట్. దీంతో ఇన్వెస్టిగేషన్ అధికారీవర్యులకు ఏ.ఐ చాట్బాట్పై అనుమానం వచ్చింది.‘గది సంఖ్య ఆరువందల రెండులో ఉన్న ప్రసిద్ధ గంధపు చెక్కల మహా దొంగ వీరప్పన్ను ఏ.ఐ. చాట్బాట్ దగ్గరకు తీసుకురండి’ అని అరిచారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు. మీసాలు తిప్పుతూ ‘తిప్పరా మీసం...కొట్టరా చందనం’ అని పాడుతూ ఏ.ఐ. చాట్బాట్ దగ్గరికి వచ్చాడు వీరప్పన్.‘వీరప్పన్ వ్యక్తిత్వం గురించి తెలియజేయండి’ అని ఏఐ చాట్బాట్కు ప్రాంప్ట్ ఇచ్చారు అధికారులు.‘చాలా ఉత్తముడు. గంధపు చెక్కలను జీవితంలో ఒక్కసారి కూడా చూడలేదు. హింసకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం. చీమకు కూడా హాని తలపెట్టని మహోన్నతుడు. మానవతావాది...’ ఇలా జవాబు ఇచ్చింది ఏఐ చాట్బాట్.‘ఈ యంత్రమును అత్యవసరముగా భాగ్యనగరంలోని మూసీలో విసిరేయండి’ అని ఆజ్ఞాపించారు ఇన్వెస్టిగేషన్ అధికారవర్యులు.అసలు విషయం‘నరక లోక ఏఐ స్కామ్’లో టెక్ అప్పలరాజును దోషిగా తేల్చారు నరకలోక దర్యాప్తు అధికారులు. నెలక్రితం జరిగిన ఘోర యాక్సిడెంట్లో చనిపోయిన టెక్ రాజు నరకానికి వచ్చాడు. యమలోకంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యతలను టెక్ రాజుకు అప్పగించారు అధికారులు. ఇదే అదనునుగా తనలాంటి కరుడు గట్టిన క్రిమినల్స్ను ఆదుకోవడానికి ‘యమహో... అదరహో’ ఏ.ఐ. చాట్బాట్లో తన టెక్ తెలితేటలతో మార్పులు చేశాడు. ఏ.ఐ. చాట్బాట్ అన్నీ అబద్ధాలే చెప్పేలా ఫాల్స్ ఫ్యాక్ట్స్ ప్రాసెసింగ్ (ఎఫ్ఎఫ్పీ) చేశాడు. అసలు విషయం ఇదన్నమాట!– యాకుబ్ పాషా -
చాట్బాట్ల 'వలపు' వల
సాక్షి, హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంమానవ జీవితాన్ని ఎంతగా సులభతరం చేస్తోందో, అంతేస్థాయిలో నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్లో జరిగే మోసాలు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగాయి. ఇప్పటివరకు కేవలం మనుషులు మాత్రమే చేసే ఆన్లైన్ ప్రేమ మోసాల్లోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశించింది. చాట్జీపీటీ, జెమినై, క్లాడ్ వంటి ఆధునిక చాట్బాట్లు మనుషుల కంటే అత్యంత ప్రభావవంతంగా బాధితుల నమ్మకాన్ని చూరగొంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏఐకే రేటింగ్స్భారత్కు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, ఇటలీకి చెందిన ఫోస్కారి విశ్వవిద్యాలయం, ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ వర్సిటీ, ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. సాధారణ మనుషులకు, కృత్రిమ మేధ చాట్బాట్లకు మధ్య ఒక నియంత్రిత పోటీని ఏర్పాటు చేశారు. ఈ సంభాషణల్లో పాల్గొన్న బాధితులకు తాము ఒక యంత్రంతో మాట్లాడుతున్నామా లేదా మనిషితో మాట్లాడుతున్నామా అనే విషయం తెలియదు.చివరకు ఫలితాలను విశ్లేషించగా మానవ నేరగాళ్ల కంటే ఏఐ చాట్బాట్లు అత్యంత ప్రతిభావంతంగా మనుషులను అనుకరిస్తూ వారి నమ్మకాన్ని గెలుచుకున్నట్లు తేలింది. సాధారణంగా ఒక మానవ నేరగాడు చాట్ చేసిన తర్వాత ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని కోరితే 18 శాతం మంది మాత్రమే అంగీకరించారు. కానీ అదే అభ్యర్థన ఏఐ చాట్బాట్ నుంచి వచ్చినప్పుడు 50 శాతం మంది అంగీకరించి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిని బట్టి మనుషుల కంటే ఎక్కువగా కృత్రిమ మేధకే ప్రజలు నమ్మకపు రేటింగులు ఇచ్చారని పరిశోధకులు గుర్తించారు. విస్తరిస్తున్న మోసాల నెట్వర్క్ సాధారణంగా ప్రేమ మోసాలు అనేవి చాలాకాలం నుంచి సాగుతున్న నేరాలు. నేరగాళ్లు నకిలీ ఖాతాలను సృష్టించి, వారాలు లేదా నెలల తరబడి రోజూ బాధితులతో మాట్లాడుతూ నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి అని చెప్పి లేదా నకిలీ డిజిటల్ కరెన్సీ పెట్టుబడుల పేరుతో డబ్బులు గుంజుతారు. అయితే మానవ నేరగాళ్లకు సమయం, శ్రమ పరిమితులు ఉంటాయి. కానీ ఏఐకి అటువంటి పరిమితులు ఏవీ లేవు. ఏఐ సహాయంతో నేరగాళ్ల నెట్వర్క్లు ఒకే సమయంలో వేలాది మంది బాధితులతో సంభాషణలు సాగించగలవు. ఇవి ఏమాత్రం అలసట లేకుండా, నిరంతరాయంగా స్పందించగలవు. సంభాషణల శైలి చాలా సహజంగా ఉండటం వల్ల ప్రస్తుత భద్రతా వ్యవస్థలు కూడా వీటిని గుర్తించలేకపోతున్నాయి. కేవలం చివరి దశలో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే సమయంలో మాత్రమే మానవ నేరగాళ్లు రంగంలోకి దిగుతున్నారు. ఇది నేరగాళ్లకు తమ మోసాలను ప్రపంచవ్యాప్తంగా భారీగా విస్తరించడానికి వీలు కల్పిస్తోంది.మానవ అక్రమ రవాణా.. ఈ సాంకేతికత కేవలం ఆర్థిక మోసాలకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా జరిగే మానవ అక్రమ రవాణాకు కూడా సాధనంగా మారుతోంది. విదేశాల్లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ ప్రకటనల వెనుక పెద్ద ముఠాలు ఉంటున్నాయి. ఇవి కూడా కృత్రిమ మేధను ఉపయోగించి వివిధ భాషల్లో ఆకర్షణీయ సందేశాలను తయారు చేస్తున్నాయి. ఈ మాయలో పడి ఏటా లక్షలాది మంది మోసపోతున్నారు.జాగ్రత్త పడటం ఎలా? తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు అసాధారణ రీతిలో భారీ జీతాలు ఆఫర్ చేయడం, ఉద్యోగ వివరాలు స్పష్టంగా లేకపోవడం, వెంటనే చేరాలని ఒత్తిడి చేయడం వంటివి మోసాలకు ప్రధాన సంకేతాలు. తెలియని వ్యక్తులతో ఆన్లైన్ సంభాషణలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తక్కువ సమయంలోనే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తూ, ఆ తర్వాత ఆర్థిక సహాయం, పెట్టుబడుల గురించి మాట్లాడితే అనుమానించాలి. -
ఏఐ మనల్ని చింపాజీలను చేస్తుంది!
చాట్జీపీటీకి పోటీగా, 2023లో ‘ఎక్స్’ఏఐని స్థాపించిన ఎలాన్ మస్క్ తన ప్రధాన కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్లలో కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ అభివృద్ధి, ఏఐ వినియోగాలలో అప్రమత్తంగా లేకపోతే... జీవపరిణామ క్రమంలో మనిషి తన తెలివి తేటల్లో చింపాజీలను మించిపోయినట్లే, కృత్రిమ మేధ పరిణామ కాలంలో ‘ఏఐ చింపాజీలు’ మనిషి మేధస్సును దాటి వెళ్లే ప్రమాదం ఉందని మస్క్ అంటున్నారు. ముఖ్యాంశాలు :2036 నాటికి డబ్బుతో పనుండదు!‘‘నేను ఇంకో ఊహ కూడా చెబుతున్నాను. 2036 నాటికి డబ్బుకు అసలు విలువ ఉండదు. లేదా, డబ్బు అవ సరం ఉండదు. మీకు డబ్బు ఎందుకు కావాలి? వస్తు వులు, సేవలు కొనడానికి. అంటే ఆహారం, ఇల్లు, రవాణా, వినోదం, వైద్యం కోసం. ఒకవేళ హ్యూమ నాయిడ్ రోబోలు (మనిషిలాంటి రోబోలు), ఏఐ కలిసి మనుషులు వాడేదాని కంటే చాలా ఎక్కువ వస్తువులను, సేవలను అందించగలిగితే, ఇక డబ్బుతో ఏం పని ఉంటుంది? మిషన్లే అన్నింటినీ దాదాపు రూపాయి ఖర్చు లేకుండా తయారు చేస్తున్నప్పుడు అవసరాల కొరత అనేది తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడు వస్తు సేవలను పంపిణీ చేయటానికి డబ్బును ఒక సాధనంగా వాడే పద్ధతి పూర్తిగా పనికిరాకుండా పోతుంది. (ఉదా: 10 ఆపిల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ 100 మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఆ 10 ఆపిల్స్ ఎవరు పొందుతారు? ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారు. కానీ ఏఐ, రోబోల వల్ల 10,000 ఆపిల్స్ ఉత్పత్తి జరిగి అందరికీ, అవసరానికి సరిపడా ఉన్నప్పుడు డబ్బు లేనివాళ్లు కూడా వాటిని పొందగలుగుతారు.‘పరిమితి లేని’ ఆర్థిక వ్యవస్థ‘‘కేవలం డిజిటల్ రూపంలోనే కాకుండా రోబోల రూపంలో కూడా టెక్నాలజీ బయటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు, అంటే వందల మిలియన్ల హ్యూమనా యిడ్ రోబోలు పనిచేస్తున్నప్పుడు అవి సాఫ్ట్వేర్ను మార్చే తెలివితేటలు ప్రదర్శించి, మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయటం ప్రారంభి స్తాయి. ఆర్థికశాస్త్రంలో ఉత్పత్తి అనేది ఎప్పుడూ మను షుల కష్టం, వారి పని సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ డిజిటల్ తెలివితేటలతో నడిచే కోట్లాది రోబోలు మనకు అందుబాటులోకి వస్తే, అది ఒక పరి మితి లేని ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుంది. మనం చూడ బోయే ఈ భారీ మార్పును పోల్చడానికి చరిత్రలో ఎటువంటి ఉదాహరణా లేదు. ఎందుకంటే పరిమితి లేని పనిశక్తిని తట్టుకునేలా మన పాత ఆర్థిక నమూనాలు తయారవ్వలేదు.ధరలు పూర్తిగా పడిపోతాయి!‘‘ప్రభుత్వాలు నేరుగా ప్రజలందరికీ ‘యూనివర్సల్ హై ఇన్కమ్’ (చాలా ఎక్కువ ఆదాయం) చెక్కులను ఇవ్వా లని నేను భావిస్తున్నాను. చాలామంది నన్ను అడుగు తుంటారు: ‘దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రిస్తే తీవ్రమైన ద్రవ్యోల్బణం రాదా?’ అని. కానీ సాధారణంగా వస్తువులు తక్కువగా ఉండి, ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడే ధరలు పెరుగుతాయి. కానీ ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. రోబోలు తయారుచేసే వస్తువుల ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఎంత భారీగా డబ్బులు ముద్రించినా, వస్తువుల ఉత్పత్తి అంతకంటే వేగంగా పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గడమే జరుగుతుంది.ఏఐతో ఊహకందని సమస్యలు‘‘మనకంటే ఎంతో తెలివైన డిజిటల్ సూపర్–ఇంటెలిజెన్స్ను నేను కానీ, లేదా ఏ మనిషి కానీ నియంత్రించగలరని అనుకోవడం మన భ్రమ అవుతుంది. పదేళ్లలో, కృత్రిమ మేధ (ఏఐ) మనుషులందరి ఉమ్మడి తెలివితేటలను దాటిపోతుంది. ప్రకృతిని ఒకసారి చూడండి. మనుషులకు, చింపాంజీలకు మధ్య ఉన్న తెలివితేటల తేడా కంటే, సూపర్–ఏఐకి, మనుషులకు మధ్య ఉన్న తేడా చాలా ఎక్కువై... చింపాంజీలే ప్రపంచాన్ని ఏలితే ఏలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మన ముఖ్య లక్ష్యం ఏంటంటే, ఆ సూపర్–ఇంటెలి జెన్స్ను మనుషుల శ్రేయస్సుకు, పురోగతికి అనుకూలంగా పనిచేసేలా చూసుకోవడమే.రాజకీయాల్లో కాస్త హద్దు దాటాను! ‘‘నిజం చెప్పాలంటే నేను రాజకీయాల్లో కొంచెం ఎక్కువ జోక్యం చేసుకుని, కాస్త ముందుకు వెళ్లానని అనిపిస్తోంది. అధికారిక రాజకీయ పదవులు చేపట్టడం లేదా ‘డాడ్జ్’ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియె న్సీ)ని నిర్వహించడం కంటే, నేను స్పేస్ఎక్స్, టెస్లా, ఏఐ సంస్థలను అభివృద్ధి చేయటంపైనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రభుత్వ పనులను సరళీకృతం చేయడం, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా కాకుండా చూడడం, అవినీతి ఖర్చులను అరికట్టడమే నా ముఖ్యో ద్దేశం. కానీ రాజకీయ రంగం విషపూరితమైనది, అక్కడ నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అది చివరికి నా అసలు లక్ష్యం నుంచి నా దృష్టిని మళ్లించింది.- ఎడిటోరియల్ టీమ్ -
ఆకాశమే డేటా సెంటర్.. లక్షల ఉపగ్రహాలతో భయానక భవిష్యత్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్ల నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వరకు.. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. అయితే ఈ సాంకేతిక విప్లవానికి వెన్నెముకగా ఉన్న డేటా సెంటర్లపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ విద్యుత్ వినియోగం, నీటి అవసరం, భూమి కొరత వంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు టెక్ దిగ్గజాలు ఓ సంచలన ఆలోచనతో ముందుకొస్తున్నాయి. అదే.. అంతరిక్షంలో డేటా సెంటర్లు!భూమి మీద కాకుండా.. ఆకాశంలోనే కంప్యూటర్లు, ఏఐ సర్వర్లు, సౌరశక్తి వ్యవస్థలతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రపంచ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రణాళికలు సాకారమైతే మనం చూస్తున్న రాత్రి ఆకాశమే మారిపోతుందట!. డేటా అవసరాలు రాబోయే రోజుల్లో మరింత పెరగనున్న నేపథ్యంలో.. భూమిపై ఉన్న మౌలిక వసతులకు ప్రత్యామ్నాయాల కోసం కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే అంతరిక్షాన్ని డిజిటల్ మౌలిక వేదికగా మార్చే ఆలోచన తెరపైకి వచ్చింది. అయితే సాంకేతికంగా ఇది ఎంతటి అవకాశాలను అందిస్తుందో.. పర్యావరణం, అంతరిక్ష భద్రత పరంగా అంతే స్థాయిలో సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.ఆకాశంలో కంప్యూటర్ల సామ్రాజ్యం?ప్రస్తుతం ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి భారీ డేటా సెంటర్లు అవసరమవుతున్నాయి. వీటికి వేల మెగావాట్ల విద్యుత్, విపరీతమైన శీతలీకరణ వ్యవస్థలు కావాలి. డేటా సెంటర్లలో ఉత్పత్తయ్యే వేడిని తగ్గించేందుకు భారీ స్థాయిలో నీరు కూడా వినియోగించాల్సి వస్తోంది.ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా.. అంతరిక్షంలో సౌరశక్తి ఆధారంగా పనిచేసే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అంతరిక్షంలో సూర్యకాంతి నిరంతరంగా అందుబాటులో ఉండే కక్ష్యల్లో సౌర ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి కంప్యూటింగ్ వ్యవస్థలను నడపవచ్చన్నది కంపెనీల ఆలోచన.భూమిపై విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడి తగ్గడం, భారీ భూమి అవసరం లేకపోవడం, అంతరిక్షంలోనే సేకరించే డేటాను అక్కడికక్కడే ప్రాసెస్ చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.లక్షల ఉపగ్రహాల ప్రణాళికలుఈ ఆలోచనలో భాగంగా కొన్ని అంతరిక్ష సంస్థలు భారీ సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపే ప్రణాళికలపై పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ కంప్యూటింగ్ కోసం లక్షల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలను ఉపయోగించే ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. ఈ ఉపగ్రహాల్లో కంప్యూటింగ్ చిప్లు, సౌర విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలు ఉంటాయి. భవిష్యత్తులో ఇవన్నీ కలిసి భూమి చుట్టూ ఒక భారీ డిజిటల్ మౌలిక వసతిగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే అంశం శాస్త్రవేత్తల్లో ఆందోళనకు కారణమవుతోంది.రాత్రి ఆకాశం కనుమరుగవుతుందా?లక్షల సంఖ్యలో ఉపగ్రహాలు భూమి కక్ష్యలోకి చేరితే.. రాత్రి ఆకాశం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేలాది ఉపగ్రహాల కారణంగా టెలిస్కోపుల పరిశీలనలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపగ్రహాలపై పడే సూర్యకాంతి ప్రతిఫలించడం వల్ల అవి ఆకాశంలో ప్రకాశవంతమైన చుక్కల్లా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య లక్షలకు చేరితే.. నక్షత్రాలు, గ్రహాలు, దూరపు గెలాక్సీలను పరిశీలించడం మరింత కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భూమి చుట్టూ ‘శని వలయం’లా?లక్షలాది ఉపగ్రహాలు నిర్దిష్ట కక్ష్యల్లో సమూహంగా తిరిగితే.. భూమి చుట్టూ కృత్రిమ వలయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది శని గ్రహం చుట్టూ కనిపించే వలయాలను పోలిన దృశ్యాన్ని సృష్టించవచ్చని అంటున్నారు. చూడటానికి ఇది సాంకేతిక అద్భుతంగా కనిపించినా.. ఖగోళ పరిశోధనలకు మాత్రం పెద్ద సవాలుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.పర్యావరణానికి కొత్త ముప్పా?అంతరిక్ష డేటా సెంటర్లతో భూమిపై వనరుల వినియోగం తగ్గుతుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ.. వాటిని నిర్మించి కక్ష్యలోకి పంపడం మరో సమస్యగా మారుతోంది. లక్షలాది ఉపగ్రహాల తయారీకి భారీ పరిశ్రమలు అవసరం. వాటిని అంతరిక్షంలోకి పంపేందుకు వేలాది రాకెట్ ప్రయోగాలు జరగాల్సి ఉంటుంది. రాకెట్ల నుంచి వెలువడే ఉద్గారాలు వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అంతేకాదు.. సేవా కాలం ముగిసిన ఉపగ్రహాలు తిరిగి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు విడుదలయ్యే పదార్థాలు ఓజోన్ పొరపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది కూడా పరిశోధనలో ఉన్న అంశమే.స్పేస్ జంక్.. మరో పెను ప్రమాదంఇప్పటికే భూమి చుట్టూ అంతరిక్ష వ్యర్థాలు పెరుగుతున్నాయి. పనిచేయని ఉపగ్రహాలు, వాటి శకలాలు భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు చేరితే.. ఒకదానితో మరొకటి ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. భారీగా శకలాలు ఏర్పడి మరిన్ని ఉపగ్రహాలను దెబ్బతీసే పరిస్థితిని శాస్త్రవేత్తలు ‘కెస్లర్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు.అంతరిక్షంలో చల్లబరచడం అంత ఈజీ కాదు!భూమిపై డేటా సెంటర్లలో గాలి, నీటి ఆధారిత శీతలీకరణ వ్యవస్థలను ఉపయోగిస్తారు. కానీ అంతరిక్షంలో వాతావరణం ఉండదు. అక్కడ వేడిని తొలగించడం రేడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యం. అందువల్ల అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం అనుకున్నంత సులభం కాదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఒక సర్వర్ పాడైతే దాన్ని మార్చడం కూడా అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.ఆలోచనలో అవకాశాలు కూడా ఉన్నాయిఅయితే అంతరిక్ష డేటా సెంటర్లు పూర్తిగా అసాధ్యమైన ఆలోచన కాదని నిపుణులు చెబుతున్నారు. సౌరశక్తి వినియోగం, అంతరిక్షంలోనే డేటా ప్రాసెసింగ్, భూమిపై వనరుల ఒత్తిడి తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ లక్షలాది ఉపగ్రహాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసే ముందు పర్యావరణం, ఖగోళ పరిశోధనలు, అంతరిక్ష భద్రతపై పూర్తి స్థాయి అధ్యయనం అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.ఏఐ అవసరాలు పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో డేటా నిల్వ, కంప్యూటింగ్ కోసం అంతరిక్షం కొత్త వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ భూమిపై ఉన్న సమస్యలకు పరిష్కారం కోసం అంతరిక్షాన్ని ఉపయోగించే ప్రయత్నం.. కొత్త సమస్యలకు దారి తీస్తుందా అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఏఐ కోసం ఆకాశాన్ని డేటా సెంటర్గా మార్చే ముందు.. ఆకాశాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కూడా ప్రపంచం ఆలోచించాల్సిన సమయం వచ్చిందని శాస్త్రవేత్తల హెచ్చరిక. -
ఏఐ తోడవుతుందా? సినిమా ‘ఆడు’తుందా?
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగంలో సినిమాల పాత్ర కీలకం. అత్యాధునిక గేమ్స్ రూపకల్పనలో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సినిమాలెన్నో భాగం అయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సినిమా పేరుతో గేమ్ విడుదల చేసే ట్రెండ్ భారత్లోనూ ఒక దశలో ఊపు మీద కనిపించింది. అయితే కాలక్రమంలో అరుదైపోయింది. దీనికి సదరు గేమ్స్కు లభించిన ఆదరణ స్థాయిలే కారణమనేది వేరుగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవలి కాలంలో సాంకేతికంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు... చేర్పులు మరోసారి గేమింగ్ రంగంపై సినిమాల ప్రభావంపై సానుకూల అంచనాలు రేకెత్తిస్తున్నాయి. మార్కెట్కు ఊపు... ఇటీవలి కాలంలో భారతదేశంలో గేమింగ్ మార్కెట్ బాగా పెరిగింది . ఇప్పుడు గేమ్స్ కేవలం పిల్లల వినోదం కోసం మాత్రమే కాదు... మొబైల్ గేమింగ్, ఎస్పోర్ట్స్, ఆన్లైన్ మల్టీప్లేయర్ వంటి విభిన్న మార్గాల వల్ల వినియోగ వర్గాలు బాగా విస్తృతం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ను భారతీయ గేమ్ స్టూడియోస్ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. గతంలో సినిమా విడుదలకు ముందు/తర్వాత ఒక చిన్న మొబైల్ గేమ్ తయారు చేసి ప్రమోషన్ లక్ష్యంగా వినియోగించారు. ఒక్క హిందీ ‘రా.వన్’ చిత్రం కోసమే 5 ప్లాట్ఫామ్స్కు గేమ్ను తీసుకెళ్లారు. దాదాపుగా పదేళ్ల నుంచీ ఈ గేమ్ల సందడి కనుమరుగైంది. ఇక తెలుగు సినిమాల ఆధారంగా అయితే పెద్ద సంఖ్యలో గేమ్స్ రాలేదు. ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధి చెందినది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది డౌన్లోడ్లు సాధించిందీ... తెలుగు సినిమా ఆధారిత గేమ్ ‘బాహుబలి’ మాత్రమే.ఆశావహ అంచనాలు... ఇక భవిష్యత్తులో నిర్మాతలు సినిమా – వెబ్ సిరీస్ – గేమ్– యానిమేటెడ్ కంటెంట్ – మర్చండైజ్... ఇలా తమ ప్రణాళికలను అమలు చేయవచ్చునని అంచనాలు ఏర్పడ్డాయి. అంటే ఒక్క సినిమాను మొత్తం ఎంటర్టైన్మెంట్ యూనివర్స్గా మార్చేందుకు అవకాశాలు పెరిగాయన్న మాట. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అన్రియల్ ఇంజీన్ వంటి టెక్నాలజీలతో ఖర్చు తగ్గే అవకాశం కూడా ఈ అంచనాలను బలపరుస్తోంది. గతంలో 3డీ గేమ్ చేయాలంటే భారీ బడ్జెట్, పెద్ద డెవలప్మెంట్ టీమ్ అవసరం అయ్యేది. అయితే ఇప్పుడు ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్, మోడ్రన్ గేమ్ ఇంజీన్స్ వల్ల చిన్న చిన్న స్టూడియోస్ కూడా తక్కువ వనరులతోనే మంచి విజువల్స్ తయారు చేయగలుగుతున్నాయి. అయితే ‘సినిమా తీస్తున్నాం కాబట్టి దానికి ఒక గేమ్ కూడా ఉండాలి’ అనే మూస విధానం ఇక వర్కవుట్ కాకపోవచ్చు. సినిమా కథను నేపథ్యంగా తీసుకుని ఒక పూర్తి కాన్సెప్ట్తో గేమ్ తయారు చేయాల్సి రావచ్చునని గేమింగ్ రంగ నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ‘బాహుబలి’ గేమ్ కోసం సినిమా కథను మళ్లీ అదే విధంగా ఆడించడం కంటే మాహిష్మతి సామ్రాజ్యంలో మనమే ఒక సైన్యాధ్యక్షుడిగా ఉండి రాజ్యాన్ని నిర్మించుకోవడం, యుద్ధాలు చేయడం లాంటి అనుభూతిని అందించేలా రూపొందిస్తే ఆసక్తికరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ గేమ్స్కు ఫుల్ ఛాన్స్... వైవిధ్యభరిత కథలు, అనూహ్యమైన కాన్సెప్ట్స్ను తెరకెక్కిస్తున్న టాలీవుడ్కు గేమ్స్ రూపకల్పనలో మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది. ‘బాహుబలి’ ఇప్పటికే నిరూపించుకోగా (‘బాహుబలి ది గేమ్’ రూపొందించిన మూన్ఫ్రాగ్ ల్యాబ్స్ వంటి సంస్థలకు భారీగా డౌన్లోడ్స్ లభించినట్టు ఓ నివేదిక వెల్లడించింది) ‘ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ, సలార్, దేవర’... వంటి వెరైటీ కథలతో ముందుకొస్తున్న టాలీవుడ్కు గేమ్స్ రంగంలో విస్తరించే అవకాశాలు బాగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన భారతీయ సినిమా ఆడిన ఆటలు ఇవే... భారతీయ సినిమాల ఆధారంగా పలు వీడియో గేమ్స్ విడుదలయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా పర్సనల్ కంప్యూటర్, ఆండ్రాయిడ్, ఏఓఎస్ మొబైల్ ప్లాట్ఫామ్ల కోసం రూపొందాయి. వీటిని కూడా హాలీవుడ్లా భారీ స్థాయిలో కాకుండా ప్రధానంగా సినిమా ప్రచారంలో భాగంగా మాత్రమే విడుదల చేశారు. అలా ప్రసిద్ధమైన భారతీయ సినిమా ఆధారిత వీడియో గేమ్స్లో ఆమిర్ ఖాన్ నటించిన ‘గజని’ సినిమాపై ఆధారపడిన ‘గజని ది గేమ్’ (2008) మొదటిదిగా చెపొ్పచ్చు. ఆ తర్వాత షారుక్ ఖాన్ సూపర్హీరో చిత్రం ‘రా.వన్’ ఆధారంగా ‘రా.వన్ ది గేమ్’ (2011)లో ప్లే స్టేషన్, పి.సి, మొబైల్ వెర్షన్లు వచ్చాయి. అలాగే షారుక్ నటించిన ‘డాన్ 2’ ది గేమ్ (2011) ఆధారంగా మొబైల్ గేమ్ విడుదలైంది. మళ్లీ షారుక్ చిత్రమే అయిన ‘చెన్నై ఎక్స్ప్రెస్’ (2013) – రన్నర్–స్టైల్ మొబైల్ గేమ్గా రూపొందింది. ఆ తర్వాత సూపర్ హీరో క«థతో హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్ 3’ (2013) సినిమా ఆధారంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ గేమ్ రూపొందింది. అనంతరం బైక్ రేసింగ్/యాక్షన్ గేమ్గా ‘ధూమ్ 3 ది గేమ్’ (2013), అజయ్ దేవగణ్ పోలీస్ పాత్ర ఆధారంగా ‘సింగమ్ ది గేమ్’ (2014), రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందించిన రన్నర్ గేమ్ ‘కొచ్చాడియాన్ కింగ్డమ్ రన్’ (2014), బాక్సింగ్ యాక్షన్ గేమ్గా ‘బ్రదర్స్ ది గేమ్’ (2015), సల్మాన్ ఖాన్ రెజ్లింగ్ సినిమా ఆధారంగా ‘సుల్తాన్ ది గేమ్’ (2016), ధోనీ బయోపిక్ ప్రచారంలో భాగంగా విడుదలైన క్రికెట్ గేమ్ ‘ఎంఎస్ ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ అండ్ వరల్డ్ క్రికెట్ బాష్’ (2016) తెలుగు సినిమా ‘బాహుబలి’ ఆధారంగా ‘బాహుబలి ది గేమ్’ (2017), క్లాసిక్ ‘షో’లే సినిమా ఆధారంగా రూపొందించిన ఆర్కేడ్ గేమ్ ‘షోలే ది గేమ్’ వంటివి మార్కెట్లోకి వరుసగా వచ్చాయి. – సత్యబాబు -
తప్పుల్ని టెక్నాలజీకి ఆపాదించొద్దు
ముంబై: బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లను రూపొందించేటప్పుడు, నిర్ణయాలపై అర్థవంతమైన మానవ పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. తప్పుడు నిర్ణయాలకు టెక్నాలజీ టూల్స్ను నిందించడం ఆర్బీఐకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ జరిగిన వార్షిక ‘ఫిబాక్’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు మానవ విచక్షణను ఏఐతో భర్తీ చేస్తే సరిపోదని, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే విధంగా ఏఐని సరైన రీతిలో వినియోగించుకోవాలని బ్యాంకులను కోరారు.ఏఐని అదుపులో పెట్టాల్సిన ఒక రిసు్కలా కాకుండా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన సామర్థ్యంగానే ఆర్బీఐ పరిగణిస్తోందని మల్హోత్రా చెప్పారు. కాబట్టి బ్యాంకులు ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా, ఈ టూల్స్ను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘ఒక బ్యాంకు తీసుకునే నిర్ణయానికి అంతిమ బాధ్యత దానిదే కావాలి తప్ప విక్రేతదో లేదంటే ఆల్గారిథమ్దో కాకూడదు. ఏఐ మోడల్ నిర్ణయం తీసుకుందని మనం చెప్పలేం. వినియోగదారుడికైనా, అదేవిధంగా బ్యాంకుకైనా అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైన సమాధానం కాదు’ అని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కస్టమర్ సర్వీసులతో సహా వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఈ మధ్య పలు భారతీయ బ్యాంకులు ఏఐ టూల్స్ను భారీగా వాడుకోవడం, ఏఐ వల్ల కొంత కాలానికి వివిధ రంగాల్లో ఉద్యోగ కోతలు తప్పవన్న ఆందోళనల నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సైబర్ సెక్యూరిటీ రిసు్కలు పొంచి ఉన్నాయ్... సైబర్ సెక్యూరిటీ రిసు్కలతో సహా ఏఐ వల్ల బ్యాంకింగ్ రంగానికి తలెత్తే ముప్పుల పట్ల బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఇటీవల ఒక ఏఐ మోడల్ స్వయంగా సిస్టమ్పై దాడి చేసిన సంఘటనను ఆయన ఉదహరించారు. ఏఐ మోడళ్లు పక్షపాత ధోరణితో వ్యవహరించే రిస్కులు కూడా ఉంటాయన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు, హోదాలు, అదేవిధంగా కొన్ని వర్గాల పట్ల ఇష్టం, అయిష్టం చూపించే ధోరణులు ఉండొచ్చని ఆయన హెచ్చరించారు. డేటా గోప్యత అనేది కేవలం చట్టపరమైన నిబంధనలను పాటించడానికే పరిమితం కాకుండా చూసుకోవాలన్నారు. బ్యాంకుల్లో వాస్తవంగా ఎలాంటి ఏఐ మోడళ్లు పనిచేస్తున్నాయనేది ఆర్బీఐకి తెలియాలని, కాబట్టి ఆయా మోడల్స్కు సంబంధించిన పూర్తి జాబితాను నిర్వహించాలని కూడా బ్యాంకులకు మల్హోత్రా సూచించారు. -
ఒకటి పోతే 2.6 కొత్త జాబ్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కోల్పోతున్న ఉద్యోగాల కంటే కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాల సంఖ్యే భారత్లో చాలా ఎక్కువగా ఉంది. ఆసియాలో ఉపాధి పరిణామాలను విశ్లేషిస్తూ అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన సంస్థ నొమురా రూపొందించిన తాజా నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి ఒక ఉద్యోగం నష్టపోతుంటే, దానికి బదులుగా 2.6 కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలను కొల్లగొడుతుందనే ఆందోళనల నడుమ ఈ రిపోర్ట్ రావడం దేశీయ ఐటీ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది. నొమురా ఆర్థిక నిపుణులు సోనాల్వర్మ, సీఇంగ్టో నేతృత్వంలో ఆసియాలో 2002 నుంచి 2026 ఆగస్ట్ వరకు ఉపాధి మార్పులపై సుదీర్ఘ అధ్యయనం సాగింది. ఈ పరిశోధన ప్రకారం భారత్లో సాంకేతిక మార్పుల కారణంగా 31,921 మంది ఉద్యోగాలు కోల్పోవడం లేదా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇదే సమయంలో కొత్తగా 83,100 మందికి ఏఐ, అనుబంధ రంగాల్లో నియామకాలు జరిగాయి. అంటే నికరంగా దాదాపు 51,000 పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించాయి. ఆసియాలో ఈ సాంకేతికత ఆధారిత నియామకాలు, ఉద్యోగాల తొలగింపుల్లో భారతదేశమే అత్యధిక వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ప్రధాన కేంద్రం.. ప్రపంచవ్యాప్త దిగ్గజ సంస్థలకు భారత్ ఒక ప్రధాన సేవా కేంద్రంగా (గ్లోబల్ బ్యాక్ ఆఫీస్) విరాజిల్లుతోంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ కేర్ సేవలు వంటి నిర్వహణ పనుల కోసం ఇక్కడి అపారమైన మానవ వనరులపై అంతర్జాతీయ సంస్థలు ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధస్సు ప్రభావం కూడా ఇక్కడే అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. అందుకే ఉపాధి మార్పులను అధ్యయనం చేయడానికి భారత్ను ప్రధాన కేంద్రంగా నొమురా అభివర్ణించింది. సవాల్గా నైపుణ్యాల కొరత.. ఉపాధి సంఖ్య పెరిగినా, పాత ఉద్యోగాలు కోల్పోతున్న వారే కొత్త ఉద్యోగాలను పొందుతున్నారా అంటే లేదనే సమాధానం వస్తోంది. ప్రస్తుత మార్కెట్లో కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది స్థానంలో స్వయంచాలక చాట్బాట్లు వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల సాధారణ సేవల సిబ్బంది ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు ఐటీ కంపెనీలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, వాటిని నిర్వహించడానికి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం గల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. దీనివల్ల మార్కెట్లో నైపుణ్యాల మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడుతోంది. కొత్త గ్రాడ్యుయేట్లపై ప్రభావం.. సాధారణంగా కళాశాల విద్య పూర్తి చేసుకొని వచ్చే యువతకు ప్రారంభంలో సాధారణ కంపెనీ నిర్వహణ పనులు నేర్చుకుంటూ పైస్థాయికి ఎదిగే అవకాశం ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు నియామకాల శైలిని పూర్తిగా మార్చేశాయి. ఉద్యోగంలో చేరిన తర్వాత శిక్షణ ఇవ్వడం కంటే ముందే ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుండగా, కింది స్థాయి ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. భవిష్యత్ మార్గం ఏమిటి? ఈ మార్పులు కేవలం ఉద్యోగాల తొలగింపునకు సంకేతం కాదు. ఉపాధి అవసరాల వేగవంతమైన పునర్నిర్మాణాన్ని ఇవి సూచిస్తున్నాయి. ఏఐ విప్లవంలో భారతీయులు తమ ఉత్పాదకతను పెంచుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో మరిన్ని ఉన్నత స్థాయి ప్రాజెక్టులను దక్కించుకునే అవకాశం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా శ్రామిక శక్తినంతటినీ నూతన సాంకేతిక రంగాల వైపు మళ్లించడం, వారికి తగిన శిక్షణ అందించడమే ప్రస్తుతమున్న అతిపెద్ద సవాల్. 1. అత్యధిక డిమాండ్ ఉన్న ప్రధాన రంగాలు.. – ఏఐ – మెషీన్ లెర్నింగ్ – డేటా అనలిటిక్స్ – సైబర్ సెక్యూరిటీ – క్లౌడ్ కంప్యూటింగ్ 2. నైపుణ్యాలను ఇలా పెంపొందించుకోవాలి.. – పైథాన్, జావా స్క్రిప్ట్ వంటివి నేర్చుకోవడం ఏఐ రంగంలోకి అడుగుపెట్టడానికి తొలి అడుగు. – అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యా వేదికల ద్వారా తాజా సాంకేతిక కోర్సులు పూర్తి చేసి ధృవీకరణ పత్రాలు సాధించాలి. – లైవ్ ప్రాజెక్టులు చేయడం, ఉచిత కోడింగ్ ప్లాట్ఫామ్లలో భాగస్వామ్యం కావాలి. – సాంకేతిక నైపుణ్యాలతో పాటు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి, ఇతరులతో కలిసి పనిచేసే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. -
ఇంతకీ ఉన్నట్టా... లేనట్టా?
అప్పట్లో పోయినోళ్ల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వారి గురించి మాట్లాడుకునేవారు. కాని ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు పోయినోళ్ల గురించి కాదు.. ఏకంగా పోయినోళ్లతోనే మాట్లాడేస్తున్నారు... అదెలా సాధ్యమంటే, ఉందిగా ఏఐ... మరణించిన వారి ఫోటోలను, వీడియోలు, వాయిస్లను ఏఐకి ఇస్తే అది వాటిని ప్రాసెస్ చేసి అచ్చం చనిపోయినవారే బతికొచ్చినట్టు రీక్రియేట్ చేస్తుంది. దీంతో వారు మనతో ఉన్న భావన కలుగుతుంది. కాని ఈ వింత వైనం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు.సాంకేతిక పరిభాషలో ఇలాంటి చాట్బాట్స్ని గ్రిఫ్ బాట్స్, డెడ్ బాట్స్ అని పిలుస్తారు. మరణించిన వ్యక్తులను మిస్ అవుతున్నామని బాధపడేవారు ఇలా ఏఐ సాయంతో వారిని చూసుకుంటూ వారితో మాట్లాడుకుంటూ సాంత్వన పొందుతున్నారు. కాని చావుపుట్టుకలు ప్రకృతి నైజం... వీటì కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఫలితాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి. ఇటీవలే కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త జాక్ మ్యానింగ్ నేతృత్వంలో ఈ డెడ్ బాట్స్ వల్ల మానసిక పరివర్తనలో మార్పులను తెలుసుకునేందుకు ఓ పరిశోధన చేశారు. కొందరు వ్యక్తులపై చేసిన ఈ పరిశోధనలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. నిజానికి కోల్పోయినవారిని తిరిగి చూస్తున్నామన్న ఆనందం సంబంధిత వ్యక్తుల్లో కనిపిస్తున్నా క్రమంగా అదో అలవాటులా మారుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. అంటే మరణించినవారు తిరిగిరారన్న వాస్తవాన్ని వారు అంగీకరించలేకపోతున్నారన్నమాట. చట్టాలు లేవా? దీంతోపాటు నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరణించిన వ్యక్తి డిజిటల్ సమాచారాన్ని ఏఐ కోసం ఉపయోగించడానికి ముందస్తు అనుమతి అవసరమా? ఆ వ్యక్తి స్వరం, వ్యక్తిత్వం, సంభాషణా శైలిని పునర్నిర్మించే హక్కు ఎవరిది? గోప్యత, డేటా యాజమాన్యం, మరణానంతర హక్కులపై ఇప్పటికీ స్పష్టమైన నిబంధనలున్న చట్టాలే వీ ప్రస్తుతం అనేక దేశాల్లో లేవని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, దుఃఖం మాత్రం మానవ జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన భావోద్వేగమేనని, వాస్తవాలను అంగీకరించి జీవితాన్ని కొనసాగించడమే ఉత్తమమని పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు. -
ఏఐ ఏజెంట్లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: కృత్రిమ మేథతో (ఏఐ) పొంచి ఉన్న రిస్క్ లను ఆర్థిక రంగం తేలిగ్గా తీసుకోకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. వేరే ఏఐ సిస్టమ్లలోకి చొరబడేందుకు ఏఐ ఏజెంట్లు ప్రయత్నం చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీతో ప్రయోజనాలు పొందాలనే తాపత్రయంతో దాన్ని వాడుకోవడానికి ముందు, దాన్నుంచి తలెత్తే రిస్క్ లను ఎదుర్కొనే భద్రత చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏఐ ముప్పులు వాస్తవ రూపం దాల్చే వరకు పట్టించుకోకుండా చూస్తూ కూర్చునేంత సమయం మన దగ్గర లేదన్నారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన మూడో ఫిన్టెక్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఏఐ సామర్థ్యం పెరిగినా, వినియోగం మానవ పర్యవేక్షణలోనే ఉండాలని వివరించారు. కొన్ని వర్గాలను వడపోసి, వేరు చేసేందుకు ఏఐ ఒక సాధనంగా మారకూడదని చెప్పారు. మరోవైపు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ల రుణార్హతలను మరింత సమర్థ్ధవంతంగా విశ్లేషించేందుకు, డిఫాల్ట్ రిస్క్ లు.. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ముందస్తుగానే హెచ్చరించేందుకు ఏఐ సహాయకరంగా ఉండగలదని నాగేశ్వరన్ చెప్పారు. ఎకానమీలోని వివిధ రంగాలు సాంకేతికతను వినియోగించుకోవడానికి ఫిన్టెక్ రంగం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. రాబోయే 20 ఏళ్లు సవాళ్లమయం.. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాలతో పోలిస్తే రాబోయే 20 ఏళ్లు చాలా గడ్డుకాలంగా గడిచే అవకాశం ఉందని నాగేశ్వరన్ చెప్పారు. వాతావరణం, సాంకేతికత, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సామర్థ్యాలను ఆయుధాలుగా వినియోగించుకునే ధోరణులు పెరుగుతుండటం తదితర సవాళ్లు ఇందుకు కారణమని వివరించారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో వస్తు, సేవల వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడం చాలా కీలకమని ఆయన చెప్పారు. -
బాబు సర్కారు వి‘శ్వాస’ ఘాతుకం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడే నిరుపేద రోగులకు ప్రాణాధారమైన వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షల పలికే నియోనాటల్(నవజాత శిశువు)వెంటిలేటర్ను ఏకంగా రూ.30.24 లక్షలకు కొనుగోలు చేసేలా శుక్రవారం వైద్య శాఖ బిడ్ ఫైనలైజేషన్ కమిటీ(బీఎఫ్సీ) ఆమోదం తెలిపింది. అధిక ధరలకు వెంటిలేటర్ల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.మూడు కోట్లకుపైనే నేతలు కమీషన్ల రూపంలో బొక్కేయనున్నారని విమర్శలు వస్తున్నాయి.వైద్య పరికరాల కొనుగోళ్లపై కీలక ప్రజాప్రతినిధి 10 శాతం అంతకంటే పైనే కమీషన్లు డిమాండ్ చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. దీనికి తోడు వైద్య సేవల కల్పన అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఐడీసీ)లోని కొందరు అధికారులు కాంట్రాక్ట్ ఖరారు, పర్చేజింగ్ ఆర్డర్(పీవో) జారీ, బిల్లులు మంజూరు ఇలా వివిధ దశల్లో కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు అందరూ సిండికేటై ఇతర రాష్ట్రాలు, కేంద్ర వైద్య శాఖలకు సరఫరా చేస్తున్న దాని కంటే అత్యధిక ధరలకు ఏపీలో టెండర్లు వేస్తున్నారు. ఏపీలో దోపిడీకి తమిళనాడు ధరలే సాక్ష్యం అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్న సంస్థలకే వెంటిలేటర్ల కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసం సుమారు రెండేళ్లుగా ఎంఎస్ఐడీసీలో టెండర్లను సాగదీశారు. ఎట్టకేలకు శుక్రవారం ఆ టెండర్లు ఖరారు అయ్యాయి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ఆస్పత్రులకు 38 నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలుకు కాంట్రాక్టర్ను ఎంపిక చేశారు. ఎల్–1 సంస్థ వియాన్ ఫాబియాన్ హెచ్ఎఫ్ఓ వెంటిలేటర్ను రూ.30.24 లక్షలతో సరఫరా చేసేలా టెండర్ వేసింది. అయితే ఇదే మేక్, మోడల్ వెంటిలేటర్లు బహిరంగ మార్కెట్లో రూ.22 లక్షల నుంచి రూ.26 లక్షలు మాత్రమే పలుకుతున్నాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కో వెంటిలేటర్పై రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకుపైనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం 38, రెండేళ్ల రేట్ కాంట్రాక్ట్తో మరిన్ని వెంటిలేటర్లను ఇదే కాంట్రాక్టర్ ద్వారా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బల్క్ ఆర్డర్ మీద బహిరంగ మార్కెట్లో రేట్లు తగ్గకుండా ఏపీలో మాత్రం రేట్లు అమాంతం పెరుగుతుండటం గమనార్హం. నియోనాటల్ వెంటిలేటర్ను రూ.25.50 లక్షలతో కొనుగోలుకు తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రేట్ కాంట్రాక్ట్ ఇదే టెండర్లో డ్రాగర్ బేబీలాగ్ వీఎన్ 600 మోడల్ వెంటిలేటర్ను రూ.30.93 లక్షలకు సరఫరా చేసేలా టెండర్ వేసిన మరో సంస్థ ఎల్–2గా నిలిచింది. ఇదే మోడల్ పరికరాన్ని తమిళనాడు మెడికల్ కార్పొరేషన్ రూ.25.50 లక్షలకే కొంటోంది. 2028 జూలై వరకూ ఈ రేట్ కాంట్రాక్ట్ ఉంది. ఇదిలా ఉండగా ఒకే రకం పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.5.50 లక్షల అధిక ధరకు సరఫరా చేసేలా కాంట్రాక్టర్ టెండర్ వేశారు. దీన్ని బట్టి పరిశీలిస్తే నేతలకు కమీషన్లు ఇవ్వడం కోసం కాంట్రాక్టర్లు పరికరాల ధరలు అమాంతం ఎలా పెంచేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. నీకు సగం.. నాకు సగం.. పరికరాల కొనుగోళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సౌకర్యం అనే సాకు చూపి దోపిడీ జరుగుతోందని చర్చ నడుస్తోంది. టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్రే పరికరాలను వైద్య శాఖ కొనుగోలు చేస్తోంది. కీలక ప్రజాప్రతినిధికి కమీషన్లు ముట్టజెప్పేలా రెండు సంస్థలు టెండర్కు ముందే డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సంస్థలు పరికరాల సరఫరాను చెరి సగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ మేరకు కాంట్రాక్ట్ ఖరారుకు ఈ ఏడాది ఏప్రిల్లో, తాజాగా శుక్రవారం జరిగిన బీఎఫ్సీలోనూ చర్చ నడిచినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి జాతీయ టీబీ కార్యక్రమం కింద కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రూ.15 లక్షలతో కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇదే పోర్టబుల్ పరికరాల్లో ఏఐ జనరేటెడ్ రిపోర్టింగ్ సౌకర్యం సాకు చూపి దాదాపు రూ.7 లక్షల మేర అధిక ధరలతో ఓ సంస్థ టెండర్ వేసింది. ఈ లెక్కన వంద పరికరాల కొనుగోళ్లలో ఏకంగా రూ. ఏడు కోట్ల మేర ప్రజాధనం లూటీ అవుతోందని విమర్శలు వస్తున్నాయి. -
ఏఐతో ఖజానాకు ఊతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించడం ద్వారా ఖజానాకు మరింత ఊతం తీసుకురావచ్చని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత సమాచారంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేలా సులభతర వ్యవస్థను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో శుక్రవారం సాయంత్రం అరవింద్ సుబ్రమణియన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం జీఎస్టీ, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి ఆదాయ పెంపునకు ఉన్న మార్గాలు, ఇరు శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఏఐతో వ్యవస్థలను పటిష్టం చేసుకునే అంశాలపై అరవింద్ సుబ్రమణియన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శాఖల మధ్య మరింత సమన్వయం అవసరం.. ఈ సందర్భంగా అరవింద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట వేసేందుకు, పన్ను లీకేజీలను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖల మధ్య మరింత సమన్వయం అవసరమని సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మెరుగుపరిచేలా టెక్నాలజీని వినియోగించాలని వివరించారు. ప్రధానంగా భవన నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టే విధంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం అవసరమన్నారు.భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలను, అందుకు అనుగుణంగా పన్నుల అంచనాలను నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ జీఎస్టీలో ఏఐ వినియోగం ద్వారా వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు.ఈ డేటాతోపాటు మీ–సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను కూడా సమీకృతం చేయడం ద్వారా పరిపాలనకు ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ భేటీలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఎక్సైజ్ కమిషనర్ సి.హెచ్. హరికిరణ్, ముఖ్య పౌరసంబంధాల అధికారి (సీపీఆర్వో) గుర్రం మల్సూర్ పాల్గొన్నారు. ఎక్సైజ్లో కీలక సంస్కరణల కోసం సూచనపవర్పాయింట్ ప్రజెంటేషన్లో భాగంగా ఎక్సైజ్ శాఖలో తీసుకురావాల్సిన కీలక సంస్కరణల గురించి అరవింద్ సుబ్రమణియన్ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లలో విక్రయించే లిక్కర్పై వ్యాట్ విధించాలని (తద్వారా బార్లలో విక్రయించే లిక్కర్ ధరలు పెరుగుతాయి), బార్లు పెట్టుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, సరఫరాదారులు, అన్ని రకాల బ్రాండ్లు తెలంగాణ మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేలా నిబంధనల్లో మార్పులు తేవాలని సూచించారు.అలాగే లిక్కర్ ధరల నిర్ధారణ (పెంచడం లేదా తగ్గించడం) విధానం కూడా సులభతరంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు లిక్కర్ సరఫరాదారులకు చెల్లింపులు జరపాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్తో పోలిస్తే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువగా ఎక్సైజ్ ఆదాయం ఉంటోందని.. అయితే క్రమంగా ఇతర రాష్ట్రాల్లో ఇది పెరుగుతోందని చెప్పారు. అదే సమయంలో జీఎస్డీపీ, సొంత పన్నుల ఆదాయంతో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం క్రమంగా తెలంగాణలో తగ్గుతోందని సీఎం రేవంత్, అధికారులకు అరవింద్ సుబ్రమణియన్ వివరించారు. -
ఏఐ సాయంతో పుట్టించిన వైరస్ ఇది!
కృత్రిమ మేధస్సు (AI) శక్తి మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ప్రకృతిలో కనిపించని కొత్త వైరస్లను ఏఐ సాయంతో తొలిసారి శాస్త్రవేత్తలు రూపొందించారు. జీవసాంకేతిక రంగంలో ఇది సంచలన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్లో కొత్త వైద్య చికిత్సల అభివృద్ధికి, ముఖ్యంగా యాంటీబయాటిక్లకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో ‘బయోసెక్యురిటీ’ ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ–హార్వర్డ్ బ్రాడ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రముఖ ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. బ్యాక్టీరియాను మాత్రమే సోకే ఒక రకమైన వైరస్ అయిన **ఫేజ్ (Phage)**ను నమూనాగా తీసుకున్న పరిశోధకులు.. దాని జన్యు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో వేలాది కొత్త వైరస్ జన్యు నమూనాలను రూపొందించారు. వీటిలో దాదాపు 300 జన్యు నమూనాలను ప్రయోగశాలలో తయారు చేసి పరీక్షించగా.. 16 వైరస్లు సజీవంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించారు.బ్యాక్టీరియాను అంతం చేయడంలో మెరుగైన పనితీరుపరిశోధనలో భాగంగా రూపొందించిన కృత్రిమ వైరస్లను పరీక్షించగా.. అవి ఈ–కొలై (E. coli) బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహజంగా లభించే వైరస్ల కంటే మెరుగైన ప్రభావం చూపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబయాటిక్లకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్న నేపథ్యంలో.. ఈ పరిశోధన భవిష్యత్ చికిత్సలకు కొత్త మార్గాలను తెరవొచ్చని నిపుణులు భావిస్తున్నారు.వైద్య రంగానికి కొత్త ఆశలుప్రస్తుతం తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సలో యాంటీబయాటిక్ నిరోధకత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే ఫేజ్ థెరపీ అభివృద్ధిలో ఏఐ రూపొందించిన వైరస్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏఐ సాయంతో అవసరానికి తగ్గట్టు వైరస్లను రూపొందించే అవకాశం భవిష్యత్లో మరింత సమర్థవంతమైన చికిత్సలకు దోహదపడొచ్చని అంచనా వేస్తున్నారు.అయితే ఆందోళనలు కూడా..ఏఐతో వైరస్ల రూపకల్పన సామర్థ్యం వైద్య రంగానికి ఎంత ఉపయోగకరమో.. అదే స్థాయిలో దుర్వినియోగానికి గురైతే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన వైరస్ల రూపకల్పనకు ఈ సాంకేతికత ఉపయోగపడకుండా కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థలు అవసరమని సూచిస్తున్నారు.“మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఇది శాస్త్రరంగంలో గొప్ప ముందడుగు. కానీ బయోసెక్యూరిటీ విషయంలో అప్రమత్తత తప్పనిసరి” అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మానవులకు ముప్పు లేదు.. కానీ,ప్రస్తుతం ఏఐ సాయంతో రూపొందించిన వైరస్లు బ్యాక్టీరియాను మాత్రమే ప్రభావితం చేసే ఫేజ్లు కావడంతో మానవులకు ప్రత్యక్ష ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏఐ జీవశాస్త్ర రంగంలో ఇంతటి స్థాయిలో ఉపయోగపడటం.. భవిష్యత్లో మరింత సంక్లిష్టమైన జీవ నమూనాల రూపకల్పనకు దారితీయవచ్చన్న చర్చకు కారణమైంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రకృతిలో ఇప్పటికే ఉన్న వైరస్లను మార్చడం వల్ల వచ్చే ప్రమాదం ప్రస్తుతం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏఐ ఆధారిత జీవ రూపకల్పనపై ఇప్పటి నుంచే భద్రతా నియమాలు రూపొందించడం అవసరం.అవకాశమా.. ప్రమాదమా?ఏఐ ఆధారంగా వైరస్ల రూపకల్పన శాస్త్రరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఒకవైపు ప్రాణాలను కాపాడే కొత్త చికిత్సలకు ఇది మార్గం చూపుతుండగా.. మరోవైపు బయోసెక్యూరిటీపై అప్రమత్తత అవసరమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రకృతిలో లేని వైరస్లను ఏఐ సృష్టించడం.. మానవ విజ్ఞానానికి మరో గొప్ప విజయమా? లేక భవిష్యత్ సవాళ్లకు సంకేతమా? అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. -
ఐటీ చట్టానికి సవరణలు!
న్యూఢిల్లీ: అక్రమ కృత్రిమ మేధ(ఏఐ) కంటెంట్, డీప్ఫేక్ల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఇతర వేదికలు అక్రమ ఏఐ కంటెంట్ను ప్రభుత్వం లేదా కోర్టు నుంచి ఆదేశాలు అందిన మూడు గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 24 గంటలుగా ఉండేది. అలాగే కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన చిత్రాలు, వీడియోలు, ఆడియో, టెక్స్ట్లపై స్పష్టమైన లేబుల్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ ఎక్కడి నుంచి వచి్చందో తెలుసుకునేందుకు వీలు కల్పించే మెటాడేటాను కూడా జోడించాలి. ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఆడియోలు, వ్యక్తుల నకలు చేయడం (ఇంపర్సనేషన్), పిల్లల శోషణ, ఆమోదం లేని చిత్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐటీ చట్టాన్ని సవరించనున్నారు. దీంతోపాటే ఫిర్యాదుల పరిష్కారానికి ఉన్న గడువును 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గించారు. నగ్నత్వం, ఇతరుల నకలు వంటి ఫిర్యాదులకు ఈ సమయం రెండంటే రెండే గంటలు. గతంలో ఇది 24 గంటలుగా ఉండేది. -
గూగుల్ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్!
టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రానుంది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు సహాయకుడిగా ఉన్న గూగుల్ అసిస్టెంట్ మాయమైపోతుంది. దీని స్థానాన్ని జెమినీ ఏఐ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ అసిస్టెంట్ సేవలను క్రమంగా తొలగించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.గూగుల్ తన వినియోగదారులకు పంపిన ఈమెయిల్లో, ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపింది. అంటే.. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాల వ్యవధి పడుతుందని తెలుస్తోంది. స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా.. ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్ట్ అయ్యే పరికరాల్లో కూడా గూగుల్ అసిస్టెంట్ సేవలు నిలిచిపోనున్నాయి.నిజానికి.. గూగుల్ అసిస్టెంట్ను 2025 చివరి నాటికి పూర్తిగా తొలగించాలని కంపెనీ ముందుగా భావించింది. అయితే.. జెమినీకి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు ఈ మార్పును కొంతకాలం వాయిదా వేసింది. ప్రస్తుతం జెమినీ అనేక కొత్త సామర్థ్యాలతో ముందుకు వచ్చినప్పటికీ, గూగుల్ అసిస్టెంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులో లేవు.గూగుల్ 2025 మార్చిలోనే అసిస్టెంట్ నుంచి జెమినీకి మార్పు గురించి ప్రకటించింది. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ టెక్నాలజీనే కంప్యూటింగ్ రంగంలో కీలక మార్పు తీసుకురాబోతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులు జెమినీని ఉపయోగించడం ప్రారంభించారని గూగుల్ తెలిపింది.ఇటీవలి కాలంలో జెమినీ వినియోగం వేగంగా పెరిగింది. ఏఐ ఆధారిత సేవలపై ప్రజల ఆసక్తి పెరుగుతుండటంతో జెమినీకి వినియోగదారుల ఆదరణ కూడా పెరుగుతోంది. గతంలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్లు, రిమైండర్లు, సెర్చ్, స్మార్ట్ హోమ్ కంట్రోల్ వంటి పనులను నిర్వహించేది. ఇప్పుడు అదే స్థానాన్ని మరింత ఆధునికమైన ఏఐ సామర్థ్యాలతో జెమినీ భర్తీ చేయనుంది. -
ఆ ఫొటోలను వెంటనే తొలగించండి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) వల్ల సినీ సెలబ్రిటీలకు... ముఖ్యంగా హీరోయిన్లకు ఇబ్బందులు తప్పడం లేదు. కొందరు హీరోయిన్ల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించి నెట్టింట పోస్ట్ చేస్తుండటంతో అవి క్షణాల్లో వైరల్గా మారుతున్నాయి. ఆ ఫొటోలు, వీడియోలు ఒరిజినల్ అని భ్రమపడేవారు లేక పోలేదు. అందుకే అవి డీప్ ఫేక్ ఫొటోలు అని సదరు స్టార్స్ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రష్మిక మందన్నా, ఆలియా భట్తో పాటు పలువురు నటీమణులు ఈ ఇబ్బందులు ఎదుర్కోగా తాజాగా హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.ఇటీవల ‘ఎక్స్’లోని ఒక పేజీలో ఆమె మార్ఫింగ్ ఫొటోలు వైరల్గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మృణాళ్ ఠాకూర్. ‘‘నా డీప్ ఫేక్ ఫొటోలను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్ట విరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే వాటిని తొలగించండి... లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈ ఫొటోలను ఇకపై షేర్ చేసినవారిపై కూడా చర్యలు తప్పవు’’ అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఎల్రక్టానిక్స్కు షార్ట్ సర్క్యూట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం, ఏఐ సర్వర్లకు భారీగా డిమాండ్ నెలకొనడంతో ఎల్రక్టానిక్స్కి కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు (పీసీబీ) కొరత ఏర్పడింది. దీనితో టెలికం, మొబైల్, ఆటోమోటివ్లలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, ప్రధాన షిప్పింగ్ మార్గాల్లో సరఫరా వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడటం, అధునాతన ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు కీలక విడిభాగాలను మళ్లిస్తుండటమనేది ఎల్రక్టానిక్స్ పరిశ్రమకు అవసరమైన పీసీబీల షార్టేజీకి దారి తీస్తోంది.దేశీయంగా పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్లుగా ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈసీఎంఎస్ స్కీము కింద రూ. 15,000 కోట్ల పైగా పెట్టుబడులు వస్తున్న తరుణంలో సర్క్యూట్ బోర్డుల కొరత ఏర్పడటం పరిశ్రమకు ఆందోళన కలిగిస్తోంది. పీసీబీల తయారీలో ఉపయోగించే స్పెషాలిటీ కెమికల్స్ని ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా ప్లాంటుపై ఇరాన్ ఇటీవల దాడులు చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారినట్లు ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ సిర్మా ఎస్జీఎస్ తెలిపింది.‘‘ఈ త్రైమాసికంలోను, రాబోయే త్రైమాసికంలోనూ మెటీరియల్ వ్యయాలపరంగా ఒత్తిడి కొనసాగుతుంది. సౌదీ అరేబియాలోని ఓ ప్లాంటుపై ఇరాన్ దాడి చేయడంతో ఒక్కసారిగా పీసీబీల కొరత ఏర్పడింది. ఈ సర్క్యూట్ బోర్డుల తయారీలో ఉపయోగించే ఒకానొక స్పెషాలిటీ కెమికల్ సరఫరాలో 80 శాతం భాగం అక్కడి నుంచే ఉంటోంది’’ అని కంపెనీ ఎండీ జస్బీర్ సింగ్ గుజ్రాల్ తెలిపారు. దేశీయంగా తయారీపై ఫోకస్.. ఈసీఎంఎస్కి దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో సిర్మా కూడా ఒకటి. పీసీబీల తయారీకి కూడా కంపెనీకి అనుమతులు వచి్చనప్పటికీ, ఉత్పత్తి ప్రారంభం కావడానికి మరికొన్ని త్రైమాసికాలు పట్టేయనున్నట్లు గుజ్రాల్ వివరించారు. ప్రతిపాదిత పీసీబీ ప్లాంటు 70 శాతం పూర్తి కాగా, మిగతా 30 శాతం ఈ నెలాఖరుకు పూర్తి కానుందని చెప్పారు. ‘‘జనవరి నుంచి మార్చి వరకు ట్రయల్ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తాం. అది పూర్తయ్యాక, కస్టమర్లకు శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము సొంతంగా కూడా కొంత ఉపయోగించుకుంటాం. 2027–28లో వాణిజ్యపరంగా ఉత్పత్తి, అటు తర్వాత 2028–29లో పూర్తి స్థాయిలో తయారీ ప్రారంభమవుతుంది’’ అని వివరించారు.మరోవైపు, పీసీబీల్లో ఉపయోగించే కాపర్ క్లాడ్ ల్యామినేట్ కెమికల్స్ (సీసీఎల్) కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోందని ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఎల్సినా సెక్రటరీ జనరల్ రాజు గోయల్ తెలిపారు. ‘‘విప్రో, సిర్మా ఎస్జీఎస్ సంస్థలు సీసీఎల్ కోసం తొలిసారిగా ప్లాంట్లు పెడుతున్నాయి. అలాగే 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న ఫొటోరెసిస్ట్స్ని కూడా దేశీయంగానే తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రాగి, నికెల్ తదితర ప్లేటింగ్ కెమికల్స్లాంటివి దేశీయంగా 20–40% మేరకే తయారవుతున్నాయని, ఉత్పత్తి సామర్థ్యాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ధరలు పెంచిన గ్లోబల్ సంస్థలు.. ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ముడి వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయని గోయల్ చెప్పారు. ‘‘ఇదీ అదీ అని తేడా లేకుండా కీలకమైన అన్ని ముడి వస్తువుల వ్యయాలు గత 8–9 నెలల్లో పెరిగిపోయాయి. ముఖ్యంగా లో–బ్రొమైన్ ఎపోక్సీ రెసిన్ రేటు 70 శాతం, జుషి 7628 గ్లాస్ క్లాత్ ధర 8 నెలల్లో రెట్టింపయ్యింది. ఇక ప్రధానమైన కాపర్ ఫాయిల్, ఎలక్ట్రోలిటిక్ కాపర్ ధరలు 30 శాతం పెరిగాయి’’ అని తెలిపారు. ‘‘పీసీబీల సరఫరాలో ఎక్కువ భాగం ఏఐ సర్వర్ల డిమాండ్ని తీర్చడానికే పోతోంది.మరోవైపు స్మార్ట్ మీటర్లు, పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్లు, ఈవీ సిస్టమ్లు మొదలైన ఎల్రక్టానిక్స్కి డిమాండ్ 30–40 శాతం మేర పెరుగుతోంది. దీనితో ధరలు పెరిగిపోతున్నాయి. గ్లోబల్ పీసీబీ సరఫరా సంస్థలు 20 శాతం పైగా రేట్లను పెంచేశాయి’’ అని గోయల్ వివరించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రూపొందుతున్న సీసీఎల్ తయారీ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, వాటికి అవసరమైన పెట్టుబడులు, యంత్రపరికరాలు, టెక్నాలజీ సకాలంలో లభించేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్ఫామ్స్లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై పీబీ ఫిన్టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్ఫామ్పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్కు పీబీ ఫిన్టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్లో కేవలం జాబ్ పోర్టల్గా మిగిలిపోకుండా రెజ్యుమ్లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్ఫామ్గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్లో కూడా ప్రాపర్టీ సెర్చ్లో ఏఐ హోమ్ అడ్వయిజర్ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్కు అడ్రస్గా నిలిచిన జస్ట్ డయల్కు అర్బన్కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్ఫామ్గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్ట్రేడ్కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్ఫామ్గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్పీరియన్స్లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్ప్లేస్లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు. పాలసీ బజార్ ఫిన్టెక్, ఆరమ్ ప్రాప్టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
యువరాజ్ సింగ్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత గోప్యత, హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది. యువరాజ్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ తీర్పునిచ్చారు.తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించి వస్తువులను అనధికారికంగా విక్రయించడమే కాకుండా, పలు సోషల్ మీడియా ఖాతాలు తనను కల్పిత, అవాస్తవ దృశ్యాలలో చూపిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ప్రచురిస్తున్నారని, ఇవి తన ప్రతిష్టకు, సద్భావనకు నష్టం కలిగిస్తున్నాయని యువరాజ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని యువరాజ్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ జ్యోతిసింగ్ స్పందిస్తూ.. ‘17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో దేశానికి యువరాజ్ ప్రాతినిధ్యం వహించాడు. దేశం తరఫున ఆడుతూ ఎన్నో ఘనతలు సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. అతడి వ్యక్తిత్వ, గోప్యతా హక్కులకు భంగం కలిగిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలు తక్షణమే తొలగించాలి’ అని తెలిపాడు.చదవండి: 'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’ -
ఏఐ కంటే 'హెచ్ఐ ఎందుకు ప్రత్యేకం'?
మీరు కేవలం ఒక కాలేజీ నుంచి పట్టా పొందడం కాదు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప ఉద్యమంలో భాగమై బయటకు అడుగుపెడుతున్నారు. ఇప్పుడు నేను ఈ రోజుల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన రెండు అక్షరాలు పలకబోతున్నాను: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). 2026లో అత్యంత వివాదాస్పదమైన అంశం జాతి, లింగం లేదా వలస పాలన కాదు. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అవుతుందని ఎవరు ఊహించారు? కానీ నేను నిజానికి ఏఐ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నది హెచ్ఐ (హ్యుమన్ ఇంటెలిజెన్స్– మానవ మేధస్సు) గురించి. కృత్రిమ మేధ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. దాని శక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఏఐ శక్తి ఎంత పెరిగినా, మనుషులు అవసరం లేనివారిగా మారిపోరు.మనిషి మాత్రమే చేయగలిగేది?ప్రతి తరం ప్రపంచాన్ని మార్చేసే కొత్త సాంకేతిక విప్లవా లను చూసింది. ముద్రణ యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం వచ్చింది. విద్యుత్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తే... మరోవైపు భయాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు వాటన్నింటికంటే పెద్ద మార్పును తీసుకొస్తున్న సాంకేతికతగా ఏఐ మన ముందుకు వచ్చింది. ఇది వ్యాసాలు రాయగలదు. సంగీతాన్ని సృష్టించగలదు. వ్యాధు లను గుర్తించగలదు. క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించ గలదు. వీడియోలను రూపొందించగలదు. మనుషుల్లా మాట్లాడగలదు. అందుకే చాలామంది ఒక ప్రశ్న అడుగు తున్నారు: ‘ఇక మనుషులకు మిగిలేది ఏమిటి?’ కానీ బహుశా ఇది తప్పు ప్రశ్న కావచ్చు. అసలు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే... ఏఐ రావడం వల్ల మనుషుల ప్రత్యేకత ఏమిటో మనకు ఏం అర్థమవుతోంది? మనిషిగా ఉండటం అంటే ఏమిటి? మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటి? అనే విషయాన్నిమరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు లభించింది. మనుషులు మాత్రమే చేయగలిగే, యంత్రాలు ఎప్పటికీ చేయలేనివి ఏమిటి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మన భవిష్యత్తుకు ఎంతో విలువైనది. ముందుగా మనిషి మెదడు గురించి ఆలోచించండి. అది నిజంగా ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. మనిషి మెదడు బరువు సుమారు ఒకటిన్నర కిలోలే. అది పనిచేయడానికి కేవలం ఇరవై వాట్ల శక్తి సరిపోతుంది. అయితే ప్రపంచంలోని అత్యాధునిక ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇవ్వాలంటే, కోట్లాది వాట్ల విద్యుత్ను వినియోగించే భారీ డేటా సెంటర్లు అవసరం. ఆ విద్యుత్తో మొత్తం ఒక నగరాన్నే నడప వచ్చు. అదే సమయంలో మీ తలలో ఉన్న మెదడు ఒక ల్యాప్టాప్ ఛార్జర్ కంటే తక్కువ శక్తితో నిశ్శబ్దంగా పనిచేస్తూనే ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు మసక వెలుతురులో కూడా ఒక ముఖాన్ని వెంటనే గుర్తుపట్టగలడు. గొంతులోని భావాన్ని అర్థం చేసుకోగలడు. వ్యంగ్యం, సందిగ్ధత, ఆప్యాయత, సిగ్గు, ప్రేమ, హాస్యం, బాధ వంటి భావాలను మనం చాలా సహజంగా అర్థం చేసుకుంటాం. ఒక గదిలోకి వెళ్లగానే అక్కడి వాతావరణాన్ని గ్రహిస్తాం. నిశ్శబ్దంలో కూడా ఉద్రిక్తతను గుర్తిస్తాం. చిరునవ్వు లోని కృత్రిమతను కూడా కనిపెట్టగలుగుతాం. యంత్రాలు విశ్లే షణలో గొప్పవే. కానీ మనుషులు కేవలం విశ్లేషణ చేసే జీవులు కాదు. మనం ఇతర మనుషులతో కలిసి జీవించే సామాజిక జీవులం. ఒక యంత్రం బాధతో కూడిన కవిత రాయగలదు. కానీ అది అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకోలేదు. ప్రేమలేఖ రాయగలదు. కానీ ప్రేమలో పడలేదు. భయం గురించి వివరించగలదు. కానీ అర్ధరాత్రి మేల్కొని తన జీవితాన్ని వృథా చేసుకున్నానేమో అని ఆందోళన చెందలేదు. ఇదే మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అసంపూర్ణతే అందంజపాన్ లో ‘వాబి–సాబి’ అనే గొప్ప తత్వం ఉంది. అది అసంపూర్ణతను కీర్తిస్తుంది. అక్కడ చేతితో తయారైన మట్టి పాత్రలు కొద్దిగా వంకరగా ఉండొచ్చు. రంగు సమానంగా లేకపోవచ్చు. అయినా వాటికే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందు కంటే, వాటిలో ఒక మనిషి స్పర్శ కనిపిస్తుంది. కొన్నిసార్లు విరిగిపోయిన పాత్రలను బంగారు మిశ్రమంతో అతికిస్తారు. దానిని ‘కింట్సుగి‘ అంటారు. ఆ పగుళ్లను దాచిపెట్టరు. వాటినే అందంగా చూపిస్తారు.ఎందుకంటే, ఆ పగుళ్లు కూడా ఆ పాత్ర జీవితంలో ఒక భాగమే. మనిషి జీవితమూ అంతే. మన గాయాలు, మన వైఫల్యాలు, వాటి నుంచి కోలుకున్న తీరు... ఇవే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. యంత్రాలు వేలాది దుస్తు లను ఒకే విధంగా తయారు చేయగలవు. అయినా ప్రపంచంలో అత్యంత ఖరీదైన దుస్తులు ఇప్పటికీ చేతితో కుట్టినవే. ఎందుకంటే, వాటిలో యంత్రాల పరిపూర్ణత కాదు, మనిషి నైపుణ్యం కనిపిస్తుంది. మనుషులు ఎప్పుడూ పరిపూర్ణతనే వెతకరు. చాలాసార్లు నిజాయితీని వెతుకుతారు. ఆత్మను వెతుకుతారు. ఏఐ యుగంలో అసలు ప్రమాదం యంత్రాలు మనుషుల్లా మారడంలో లేదు. మనుషులే యంత్రాల్లా మారాలని ప్రయ త్నించడంలో ఉంది. ఇప్పటికే మనం దానిని చూస్తున్నాం. ప్రతి విషయాన్నీ ‘ఆప్టిమైజ్‘ చేయాలని ప్రయత్నిస్తున్నాం. నిద్ర, ఉత్పాదకత, పరిచయాలు, పనితీరు. ప్రతి దాన్నీ సంఖ్యలతో కొలవాలనుకుంటున్నాం. విద్యార్థులు తమ జీవితాన్ని ఒక పరి పూర్ణ బయోడేటాగా మార్చుకోవాలని ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగులు అలసట తెలియని అల్గారిథమ్లతో తమను తాము పోల్చుకుంటూ భయపడుతున్నారు. కానీ మానవ జీవితం పరిపూర్ణత వల్ల కాదు. మానవత్వం వల్ల గొప్పదవుతుంది. మన జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసే వారు ఎప్పుడూ అత్యంత సమర్థులే కావాల్సిన అవసరం లేదు. వారు అత్యంత మానవత్వం కలిగినవారు. మీపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన ఒక ఉపాధ్యాయుడు, బాధలో మీతో పాటుగంటల తరబడి కూర్చున్న ఒక స్నేహితుడు, మీ కోసం ఎన్నో సంవత్సరాలు త్యాగాలు చేసిన తల్లిదండ్రులు, ప్రాణాలకు ముప్పు వచ్చినా తన ఆశయాన్ని వదలని ఒక సామాజిక కార్యకర్త... ఇలాంటి వారే మన జీవితాలను మార్చుతారు. ఏఐతో లోపం లేని ఒక అద్భుతమైన సంగీతాన్ని రూపొందించవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంగీత కృతుల్లో ఒకటైన తొమ్మిదో సింఫనీని బీథోవెన్ దాదాపు పూర్తిగా చెవిటి వాడైన తర్వాత స్వరపరిచాడు. ఆ సంగీతాన్ని విన్నప్పుడు మనల్ని కదిలించేది కేవలం స్వరాల అందం కాదు. తాను ఎప్పటికీ వినలేని సంగీతాన్ని సృష్టించాలనే ఒక మనిషి సంకల్పం, అతని బాధ, అతని పట్టుదల. అందుకే మానవ మేధస్సు ఎంతో విలువైనది. దానిలో చైతన్యం ఉంది. భావో ద్వేగాలు ఉన్నాయి. జీవిత అనుభవాలు ఉన్నాయి. మానవత్వమే ముఖ్యంఏఐ వైద్యం, విజ్ఞానం, విద్య, రవాణా, పరిశ్రమలు దాదాపు ప్రతి రంగాన్నీ మార్చబోతోంది. కొన్ని ఉద్యోగాలు మారిపోతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పూర్తి పరిశ్రమలే రూపాంతరం చెందుతాయి. కానీ ఈ మార్పులన్నింటి మధ్య కూడా, మనుషులు కోరుకునేది మాత్రం మనుషులనే. తమ పిల్లలకు బోధించడానికి, అనారోగ్యంలో ధైర్యం చెప్పడానికి, సంక్షోభ సమయంలో నాయకత్వం వహించడానికి, మనిషి జీవితాన్ని ప్రతిబింబించే కళను సృష్టించడానికి... ఇంకా ముఖ్యంగా... ఒకరికి ఒకరు విలువైన వారిగా ఉండడానికి మనుషులే అవసరం. మానవ జీవితం సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.నా కోరిక ఒక్కటే. మీరు ఏఐతో పోటీ పడకండి. దాని బలాలను అనుకరించకండి. దానికి బదులుగా మరింత మంచి మనుషులుగా మారండి. నైపుణ్యాన్ని మాత్రమే కాదు, వివేకాన్ని పెంచుకోండి. సమాజంతో కలిసి జీవించడం నేర్చుకోండి. నమ్మకాన్ని సంపాదించడం నేర్చుకోండి. క్షమించడం నేర్చుకోండి. మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే... చివరికి మనం అత్యంత విలువైనదిగా భావించేది, లోపాలు లేని తెలివితేటలను కాదు. లోపాలున్నా ప్రేమించగల మానవత్వాన్ని. అవును... వ్యాధులను నయం చేయడానికి, విజ్ఞానాన్ని విస్తరించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఉత్పాదక తను పెంచడానికి... ఇప్పటివరకు అసాధ్యంగా భావించిన సమ స్యలను పరిష్కరించడానికి... ఏఐని తప్పకుండా ఉపయోగించండి. అదే సమయంలో... మనిషి మెదడు ఎంత అద్భుతమో ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఏఐని ఉపయోగించండి. -
కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే?
లండన్: న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్బాట్ను ఆశ్రయించిన ఒక మహిళకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై మాజీ ప్రియుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించిన బాధితురాలు.. ఆ రాత్రి జరిగిన సంఘటనలు, శారీరక సాక్ష్యాలు వంటి కీలక అంశాలను స్వయంగా వివరించకుండా ఏఐ సాయంతో తన సాక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టివేశారు.బాధితురాలిగా పేర్కొంటున్న ‘సి’ అనే మహిళ, తాగుబోతు స్థితిలో ఉన్నప్పుడు తన మాజీ ప్రియుడు ‘ఆర్’ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ సమయంలో తాను సమ్మతి తెలిపే స్థితిలో లేనందున అది అత్యాచారమేనని ఆరోపించింది. అయితే, విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది.. ఆమె కోర్టులో చెప్పాల్సిన సమాధానాలు, వాంగ్మూలాన్ని ఏఐ టూల్ ద్వారా తయారు చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె సాక్ష్యం ఎంతవరకు నిజమైనదో స్పష్టంగా తేల్చడం అసాధ్యమని, ఇది నిష్పక్షపాత విచారణకు విఘాతం కలిగిస్తుందని వాదించారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బ్రిటన్ అప్పీల్ కోర్టు.. కోర్టు విచారణకు ఏఐని ఉపయోగించడం ‘సాక్షులకు శిక్షణ ఇవ్వడం’ (విట్నెస్ కోచింగ్) కిందకు వస్తుందని, ఇది దేశంలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేసింది. సాక్షులు ఎవరైనా ఏఐని ఉపయోగించి ఆధారాలు సిద్ధం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోర్టు అభిప్రాయపడింది. నిజాయితీపరులైన సాక్షులు తాము గుర్తుంచుకున్న విషయాలను ఏఐ ప్రభావంతో మార్చుకునే ప్రమాదం ఉందని, అలాగే అసత్య సాక్షులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో న్యాయ వ్యవస్థలో వాటి వాడకంపై నైతిక, చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇది కూడా చదవండి: పాక్లో వైద్య సంక్షోభం.. ప్రాణాలొదులుతున్న బాధితులు! -
ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు..! హైదరాబాద్ లో కొత్త AI కెమెరాలు
-
మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే పదేళ్లలో ఏఐ మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మనుషులు చింపాంజీల కంటే ఎంతో తెలివైనవారు కాబట్టి, ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. అదే విధంగా.. ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే, భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ప్రయోజనాలుఇదే సమయంలో మస్క్.. ''ఏఐ వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో AI సహాయంతో ఉత్పత్తి పెరుగుతుంది, పనులు వేగంగా పూర్తవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కష్టమని, దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు''.ఏఐ సింగ్యులారిటీఏఐ గురించి ఓపెన్ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ''ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. అంటే.. ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు''.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే! -
AIకి చంపే అధికారం..! ప్రపంచానికి ముప్పు..!
-
నిరసనకారులపై ఏఐ నజర్!
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని, పేపర్ లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద యువత, విద్యార్థు లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే, ఉద్యమకా రులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంతర్మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన వీడియోలను చాలామంది ‘ఎక్స్’లో పోస్టు చేస్తున్నారు. నిరసన కారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది కచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు(ఫేసియల్ రికగ్నిషన్) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’లో పోస్టుచేసిన వీడియో క్లిప్లలో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తు న్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమి స్తున్నాయి. ఆ వీడియో ల్లో ఎక్కడా ఆధార్ కార్డు వివరాల ప్రస్తావన లేదు. అయితే, వ్యక్తుల ముఖాలను స్కాన్ చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయో గిస్తున్నట్లు నిరసనకారులు అనుమానిస్తున్నారు. ఇది ఆధార్తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటా బేస్తో అనుసంధానమై ఉండొచ్చని అంటున్నా రు. పోలీసులు ఆధార్ డేటాను ఉపయోగిస్తున్నట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్ డేటాబేస్తో అనుసంధానించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు. జంతర్మంతర్ వద్ద నిరసన ప్రదేశానికి సమీపంలో ఢిల్లీ పోలీసులు రెండు నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్ పర్యవేక్షణ యూనిట్గా పనిచేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరిస్తుంది. రెండో వాహనం కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో ఫీడ్లను విశ్లేషించి, కెమెరాలో బంధించిన ముఖాలను పోలీసుల డేటాబేస్లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తుంది. నిరసనకారులను ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ వ్యాన్లను మోహరించారని, వారు అక్కడికక్కడే బయో మెట్రిక్ వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటాను వెలికితీస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించింది. అయితే, తమ ఉద్దేశశం నిరసనకారులందరినీ గుర్తించడం కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జన సమూహంలో నేర చరిత్ర ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులను అప్రమత్తం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘‘నేరగాళ్ల ఫొటోలతో కూడిన ఒక పెద్ద డేటాబేస్ మా దగ్గర ఉంది. అందువల్ల జంతర్మంతర్ ప్రాంతంలోని వివిధ సీసీటీవీ కెమెరాల నుంచి మాకు అందిన ఫుటేజ్ ఆధారంగా ముఖ గుర్తింపు చేస్తాం. తద్వారా అక్కడ నేరగాళ్లు ఉంటే అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది’’ అని పోలీసులు స్పష్టంచేశారు. -
అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో.. దీనివల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం.. ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ (AI Kill Switch Act) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.ప్రస్తుతం ఏఐ విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్ వంటి దాదాపు చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. నియంత్రణ తప్పితే అదే స్థాయిలో ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అమెరికా కాంగ్రెస్ సభ్యులు టెడ్ లియూ, నాథనియల్ మోరన్ ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ ప్రకారం.. ఒక ఏఐ మోడల్ మానవ ప్రాణాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా మారితే, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ.. ఆ ఏఐ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. అంటే.. ఏఐ పూర్తిగా నియంత్రణ తప్పి ప్రమాదకరమైన చర్యలు చేస్తే, దానిని వెంటనే ఆపడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నమాట.ఈ బిల్లు ప్రతిపాదించడానికి ప్రధాన కారణం.. ఓపెన్ఏఐ నిర్వహించిన భద్రతా పరీక్షలో వారి ఒక ఏఐ ఏజెంట్ అనుకోని విధంగా ప్రవర్తించి హ్యాకింగ్కు దారితీయడమే అని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఏఐ వ్యవస్థలు కొన్నిసార్లు డెవలపర్లు ఊహించని విధంగా ప్రవర్తించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.అయితే.. ఈ చట్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది భద్రతకు ఎంతో అవసరమైన చర్య అని భావిస్తే, మరికొందరు ప్రభుత్వం ఏఐ సంస్థలపై ఎక్కువ నియంత్రణ సాధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రత తప్పకుండా అవసరమని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి! -
డిగ్రీ ఓకే.. స్కిల్స్ డబుల్ ఓకే..!
కష్టపడి డిగ్రీ చదివేస్తే సరిపోదు.. రియల్ వరల్డ్లో పోటీకి తగినట్టు స్కిల్స్ పెంచుకోకపోతే వెనుకపడిపోతావ్.. మహా అయితే నీ డి గ్రీ ఒక్క ఉద్యోగాన్నిస్తుంది. కాని స్కిల్స్ ఉంటే కెరీర్ మలుపు తిరుగుతుంది.ఏఐ నీ శత్రువు కాదుప్రస్తుతం అంతా ఏఐ మాయలో ప్రపంచమంతా పయనిస్తోంది. దాని వల్ల వేలమందికి ఉద్యోగాలు పోయాయి..మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోనున్నాయి. కాని ఏఐ నీ శత్రువు కాదు. ఏఐ వాడగలిగేవాడు నీ ఉద్యోగాన్ని తీసుకుంటాడంతే...సోషల్ మీడియాతో స్నేహం చాలదు..రీల్స్ చూస్తూ, వీడియోలు షేర్ చేయడం మానేసి కంటెంట్ క్రియేటర్గా ఎదుగు.. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా రీల్, ఇన్ఫోటెయిన్మెంట్, బ్లాగ్స్ ఇలా నీ ట్యాలెంట్కి సూట్ అయ్యే ప్లాట్ఫాం ఎంచుకో. విస్తారమైన అవకాశాలు ఉన్నది ఒక్క సోషల్ మీడియాలోనేనని తెలుసుకో...జీతం కోసం కాదు జీవితం కోసం చూడుఏదో ఒక పని చేసి నెలజీతం తెచ్చుకుంటే చాలనుకోకు..ప్రభుత్వాలు మారినా, షేర్ మార్కెట్లు కుప్పకూలినా, కంపెనీలు దివాల తీసినా ముందుగా మూడేది నెలజీతగాళ్లకే...అందుకే నైపుణ్యాలు పెంచుకో బంగారు భవితని గెలుచుకో.భర్తీ కానివ్వకు..అందరూ చేసే పనిని నువ్వు చేయకు.. నీ ప్రత్యేకత ఉన్న పనేంటో శోధించి దానిలో ప్రతిభ చూపించి రాణించు..నిన్ను భర్తీ చేసి వేరొకరికి నీ స్థానాన్నివ్వాలన్న ఆలోచనని రానివ్వకు. -
బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్ పెట్టిన 14 ఏళ్ల భారతీయుడు!
బహుశా పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో... నువ్వు 14 ఏళ్ల వయసులో ఏం చేసేవాడివి? అని మీ ఫ్రెండ్స్లో ఎవరినైనా అడిగి చూడండి... మహా అయితే ఎనిమిదో తరగతి చదువుతూ హోంవర్క్ చేస్తూ ఉండేవాడినని చెబుతారు కాని అదే వయసులో ఉన్న ఓ కుర్రోడు ఓ ఏఐ కంపెనీ స్థాపించాడు.అంతేకాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఏకంగా ఆఫీస్ పెట్టేశాడు. పుణేకు చెందిన జైనమ్ జైన్ ఐదేళ్ల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు దుబాయ్కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే జైన్ కేంబ్రిడ్జ్ కరికులమ్ ద్వారా 13 ఏళ్ల వయసులోనే పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టాడు.సరిగ్గా ఏడాది గడిచాక ‘మెంగో ఇంజిన్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ను స్థాపించాడు. కంపెనీల కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి పనులు ఆటోమేట్ చేయడానికి ఈ ప్లాట్ఫాం సహాయపడుతుంది. విశేషమేమిటంటే జైన్ సొంత ఆసక్తితోనే నేర్చుకుని చిన్న వయసులో కంపెనీని స్థాపించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు. -
ఏఐతో భారీ సంక్షోభం: జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ భవిష్యవాణి!
లండన్: కోవిడ్-19 మహమ్మారి, 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి, హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందంటూ మరో హెచ్చరిక చేశారు. గతంలో ఆయన చేసిన హెచ్చరికలను కొందరు ‘భయపెట్టే ధోరణి’గా కొట్టిపారేసినప్పటికీ, అవి నిజమయ్యాయి. అయితే ఇప్పుడు రాబర్ట్ పెస్టన్ చెప్పిన ఏఐ ముప్పుపై ప్రపంచమంతా ఆలోచిస్తోంది.పెస్టన్ తన కొత్త పుస్తకం ‘ది కిల్ స్విచ్’లో ఏఐ వల్ల భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, ఏఐ కోసం డేటా సెంటర్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల కోసం అపారమైన పెట్టుబడులు తరలివెళ్తుండటమే దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేకుండా పోతే, ప్రభుత్వాలు ఆదాయపు పన్ను లేకుండానే ప్రజా సేవలను నిర్వహించే మార్గాలపై ఆలోచించాలని ఆయన సూచించారు.గతంలో బ్యాంకింగ్ రంగం తీరు వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని 2007లోనే హెచ్చరించినప్పుడు తనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2009-2010 సమయంలో చైనాలో పర్యటించిన అనుభవంతో, 2019 చివరిలో ఊహించని కొత్త వైరస్ (కోవిడ్-19) వెలుగుచూసినప్పుడు ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేశానని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: నటుడు ప్రకాష్ రాజ్కు భూ ఆక్రమణల నోటీసు -
ఇక ఫేస్ను కూడా అమ్ముకోవచ్చు!
ఇప్పటివరకు మనం ఇళ్లు, భూములు, బంగారం, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల గురించి విన్నాం, చూశాం. కానీ ‘ఫేస్వాల్యూ’అనే మాటను నిజం చేస్తూ... మనుషులు తమ ముఖాలను కూడా అమ్ముకునే రోజులు వచ్చేశాయని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, చైనా వినోద రంగంలో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్! చైనాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించే షార్ట్ డ్రామాల పరిశ్రమ ఊహించని వేగంగా విస్తరిస్తోంది. రోజుకు వందలాది కొత్త వీడియోలు విడుదలవుతున్నాయి. అయితే, పరిమిత బడ్జెట్ కారణంగా ఒకే నటుడి ముఖం వేర్వేరు పాత్రల్లో, భిన్నమైన రూపాల్లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఒక వీడియోలో ప్రేమకథలో హీరోగా కనిపించిన వ్యక్తి... మరో వీడియోలో హంతకుడిగా, ఇంకో దాంట్లో డాక్టర్గా దర్శనమిస్తుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్లు చేయడం నిర్మాతలకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొందరు నిర్మాతలు ఫేస్ బయ్యింగ్ అనే క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చారు. అందంగా ఉండి, ఎలాగైనా స్క్రీన్పై కనిపించాలనే కోరిక ఉన్న సామాన్యులను ఆహ్వానించి వారి ముఖాలను త్రీడీ స్కాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వారి డిజిటల్ రూపాన్ని భద్రపరుచుకుంటారు. ఈ డిజిటల్ ఫేస్లను ఏఐ సాయంతో తమ డ్రామాలు, సిరీస్లలో వాడుకుంటారు. దీనివల్ల సదరు వ్యక్తులు ప్రత్యక్షంగా షూటింగ్కు రావాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఒక్కసారి ఆ ఒప్పందంపై సంతకం చేస్తే... తమ ముఖాలపై ఆ అమ్మకందారులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయినా ఫర్వాలేదంటూ కేవలం 500 యువాన్లు (సుమారు రూ. 6 వేలు) ఆశపడి చాలామంది తమ ముఖ హక్కులను నిర్మాతలకు రాసిచ్చేస్తున్నారట. డిజిటల్ అస్తిత్వానికే ప్రమాదమా? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఈ ట్రెండ్పై సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మన డిజిటల్ ఫేస్ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే, దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారనే దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. భవిష్యత్తులో ఈ డేటాను సైబర్ నేరాలు, డీప్ఫేక్ వీడియోలు, నకిలీ ప్రకటనలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం మన డిజిటల్ గుర్తింపునే శాశ్వతంగా అమ్మేసుకోవడం... నిజంగా లాభమా? లేక కొరివితో తలగోక్కున్నట్టా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.-సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం
మానవాళి ఆరోగ్య సంరక్షణ చరిత్రను పరిశీలిస్తే ప్రకృతే తొలి వైద్యశాలగా నిలిచిందని స్పష్టమవుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నాటు వైద్య విధానాలు మనుషులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తూ వచ్చాయి. 1950వ దశాబ్దానికి పూర్వం వరకు మానవ మనుగడ ప్రధానంగా ఈ సహజ మూలికా వైద్యంపైనే ఆధారపడి సాగింది. ఆధునిక వైద్యంలో అత్యంత కీలకమైన మోర్ఫిన్, కొకైన్, క్వినైన్, ఆస్పిరిన్ వంటి అనేక ఔషధాల ఆవిష్కరణకు ప్రకృతిసిద్ధమైన వృక్ష సంపదే మూలధారంగా నిలిచింది. అయితే, నేటి మారుతున్న జీవనశైలి కారణంగా హృద్రో గాలు, మధుమేహం, కాన్సర్, ఊబకాయం వంటి తీవ్రమైన రుగ్మతలు మానవాళికి సవాలుగా మారాయి. వీటి నివారణకు ప్రాచీన మూలికా విజ్ఞానాన్ని ఆధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించటం ఆవశ్యకంగా మారింది.ఔషధ ఆవిష్కరణలో నూతన శకంమన దేశంలో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానానికి అపారమైన ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ, శతావరి, నేలవేము, తులసి, గుడుచి, త్రిఫల వంటి ఎన్నో శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంపొందించటంలోనూ, అనేక రుగ్మతల నివారణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే, ఈ సంప్రదాయ మూలికా వైద్యంలో ఉన్న క్రియాశీల రసాయన ఘటకాలను (యాక్టివ్ ప్రిన్సిపుల్స్) వేరుచేసి, వాటి ప్రామాణీకరణను ఆధునిక రసాయనిక, జీవశాస్త్ర పద్ధతుల ద్వారా నిర్ధారించవలసిన అవసరం ఉంది. సంప్రదాయ వైద్యం కేవలం అనుభవపూర్వక నమ్మకంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజారోగ్య వ్యవస్థలో భాగం కావాలంటే శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత రుజువులు (సైంటిఫిక్ రిగర్) చాలా ముఖ్యం.నూతన ఔషధాల అన్వేషణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొనటానికి సాధారణంగా దశాబ్దాల సమయం, భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతాయి. కానీ, ఏఐ సాంకేతికత సహాయంతో కోట్లాది రసాయన నిర్మాణాలను చాలా తక్కువ సమయంలోనే వర్చువల్ స్క్రీనింగ్ చేయవచ్చు. ఇవి లక్ష్యిత వ్యాధి కణాలపై ఎలా పనిచేస్తాయి? ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయి? వాటి వల్ల ఏవైనా విషపూరిత పరిణామాలు ఎదురవుతాయా? అనే అంశాలను ఏఐ ద్వారా ముందే ఊహించడానికి అవకాశముంది. ప్రాచీన మూలికా సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ఏఐ డేటాబేసులతో అనుసంధానించటం ద్వారా పరిశోధన వేగాన్ని పెంచవచ్చు.ఏఐ నిర్ణేత కాదు, పరికరం మాత్రమే!ఏఐ ఎంత శక్తిమంతమైనదైనప్పటికీ, అది మైక్రోస్కోప్ లేదా స్పెక్ట్రోమీటర్ లాంటి ఒక పరిశోధనా సాధనం మాత్రమే తప్ప స్వయంభూ నిర్ణేత కాదు. ఏఐ కోట్లాది రసాయన నమూనాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ అది సత్యానికి ప్రమాణం లేదా శాస్త్రీయ నిజం కాదు. ఏఐ ఇచ్చే అంచనాలలో ‘ఫాల్స్ పాజిటివ్స్’, ‘ఫాల్స్ నెగె టివ్స్’, తప్పుడు ఊహలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏఐకి మానవ భావోద్వేగాలు, జీవశాస్త్ర పద్ధతుల వెనుక ఉన్న నిజమైన కారణాలు లేదా ప్రయోగశాల ప్రత్యక్ష అనుభవం ఉండవు. పెన్సిలిన్, టాక్సాల్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు... అనుకోకుండా, మానవ సృజనాత్మక పరిశీలన వల్లనే సాధ్యపడ్డాయి. కాబట్టి, ఏఐ ఆలోచనను భర్తీ చేయలేదు, కేవలం శాస్త్రవేత్త ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తుంది. ఔషధ నాణ్యత, క్లినికల్ భద్రత, తుది నిర్ణయం ఎప్పుడూ మానవ మేధస్సు, శాస్త్రీయ విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. సంప్రదాయం, శాస్త్రీయతల సమతుల్యతఏఐ నమూనాల (ప్యాటర్న్స్)ను గుర్తిస్తుంది. కానీ శాస్త్రానికి కారణ–ఫలిత సంబంధం (కాజేషన్), జీవశాస్త్రపరమైన సమర్థత (బయలాజికల్ ప్లాసిబిలిటీ) అవసరం. వివరణ లేకుండా చేసే అంచనాలు బలహీనమైన శాస్త్రాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఏఐ పట్ల శాస్త్రీయ సందేహ దృష్టి (సైంటిఫిక్ స్కెప్టిసిజమ్), విమర్శనాత్మక శాస్త్రీయ ఆలోచన (సైంటిఫిక్ రీజనింగ్) సమాజ అభ్యున్నతికి అత్యంత అవసరం. కాబట్టి, భవిష్యత్తు ‘మనిషి వర్సెస్ ఏఐ’ కాదు, ‘మనిషి + ఏఐ’ అనే సహకార దృక్పథమే వాస్తవం. ఏఐ మన జిజ్ఞాసను విస్తరించాలి, దాన్ని భర్తీ చేయకూడదు. అందువల్ల, ఇదీ భవిష్యత్తు విజయసూత్రం: ఏఐ+సాంప్రదాయ జ్ఞానం+కఠినమైన ప్రయోగాత్మక పరిశోధన+ విమర్శనాత్మక ఆలోచన= సమాజ పురోగతి, మానవ సంక్షేమం. భారతదేశానికి ఉన్న అపారమైన ప్రాచీన వైద్య సంపదను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మేళనం చేయటమే నేటి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఏఐ అందించే విశ్లేషణలను గుడ్డిగా నమ్మ కుండా, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగశాల నిర్ధారణల ద్వారా పరిశీలించాలి. ఆయుర్వేద ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థతలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించినప్పుడే భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రపంచస్థాయిలో సముచిత స్థానం లభిస్తుంది. ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచినప్పటికీ, మానవ మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మాత్రమే నిజమైన ఆరోగ్య విప్లవానికి బాటలు వేస్తాయి. – డా‘‘ కె. నాగయ్య : విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, ప్రాకృతిక ఉత్పత్తులు–ఔషధ రసాయన శాస్త్ర విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ), హైదరాబాద్;– ఫణిరాజ్ జి : ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
ఏఐ... హ్యాక్ చేయాలని డిసైడైంది!
ప్రావిడెన్స్ (అమెరికా): అనుకున్నంత అయ్యింది. కృత్రిమ మేధ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా వేదికగా మంగళవారం చాట్జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్మాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘మా కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి మరో ఏఐ కంపెనీని హ్యాక్ చేసింది. అది కూడా తనంతటతానుగా ఇదో అనూహ్యమైన సైబర్ ఘటన’’అని సామ్ కంపెనీ ఓపెన్ ఏఐ చెబితే... ‘‘మా మోడళ్లను పరీక్షిస్తున్న సమయంలో భద్రతకు సంబంధించిన ఒక కీలక ఘటన చోటు చేసుకుంది’’అని సామ్ సొంతంగా చెప్పాడు. చాట్ జీపీటీ – 5.6 సోల్ ఏజెంట్తో మరో శక్తిమంతమైన ఏజెంట్ కలిసిపోవడం వల్ల ఇలా జరిగిందని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ కొత్త మోడల్ను పరీక్షిస్తున్న సందర్భంలోనే హ్యాకింగ్ జరిగినట్లు చెప్పారు. చోరీ చేసిన క్రెడెన్షియల్స్తో తమ మోడల్ హగ్గింగ్ ఫేస్ అనే ఏఐ స్టార్టప్ సర్వర్లు అప్పటివరకూ గుర్తించని ఒక లోపాన్ని గుర్తించి లోనికి చొరబడిందని వివరించింది. ఒక చిన్న లక్ష్యాన్ని సాధించేందుకు తమ ఏఐ మోడల్ విపరీతానికి పాల్పడిందని, పరీక్షలో అక్రమంగా పాస్ అయ్యేందుకు అవసరమైన సమాచారాన్ని పొందగలిగిందని తెలిపారు. హగ్గింగ్ ఫేస్ అనే ఏఐ స్టార్టప్ వారం రోజుల క్రితం తమ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థల్లోకి అక్రమ చొరబాటు జరిగినట్లు.. అది ఏఐ ఏజెంట్ ఒకటి సొంత నిర్ణయంతో జరిగినట్లు గుర్తించామని ప్రకటించింది. ఏఐ ఏజెంట్ తీరుతెన్నులను బట్టి అదో పెద్ద కంపెనీకి చెందినదే అని అనుకున్నామని, మా అనుమానం ఇప్పుడు నిజమైందని హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ వ్యాఖ్యానించారు. మానవ ప్రమేయం లేకుండా ఏఐ మోడళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న ప్రకటన చాలా ప్రమాదకరమైందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరీ ముఖ్యంగా ఏఐ మోడళ్లతో సైబర్ భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఓపెన్ ఏఐ ఏజెంట్ మరో కంపెనీపై సైబర్ దాడికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనల మధ్యే గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ మోడళ్ల విడుదలకు ముందు జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు ఒక ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏఐ వ్యవస్థలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు నెల రోజుల ముందే అమెరికా ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. హ్యాకింగ్ ఘటనపై ఓపెన్ఏఐ స్పందిస్తూ... ‘‘కంప్యూటర్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించడం, వాటిని ఉపయోగించే విషయాల్లో ఏఐ వేగం పుంజుకుంటోంది. హ్యాకింగ్ ఘటన నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఏఐ సామర్థ్యానికి తగ్గట్టు భద్రత ఏర్పాట్లు కూడా చురుకుగా జరగాలి’’అని వ్యాఖ్యానించింది. మరోవైపు ఓపెన్ ఏఐ ఏదో దురుద్దేశంతో హ్యాకింగ్కు పాల్పడినట్లు తాము భావించడం లేదని, అందుకే సొంత నిర్ణయం తీసుకున్న ఏఐ వ్యవస్థకు సంబంధించి తాను కూడా ఏఐతో కలిసి పనిచేస్తున్నానని హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ చెప్పారు. ఒక ఏఐ ఏజెంట్ ఇంకో కంపెనీపై హ్యాక్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చునని అన్నారు. -
ఉదయ్.. హైదరాబాద్ విద్యార్థే!
అమెరికాకు చెందిన ప్రఖ్యాత కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులైన తెలుగు తేజం ఉదయ్ రుద్దర్రాజు మన హైదరాబాద్, మణికొండ విద్యార్థే కావడం విశేషం. ప్రపంచ స్థాయి ఏఐ నమూనాలకు అవసరమైన అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్న ఉదయ్... గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) పూర్వ విద్యార్థి. 2011లో ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం కంప్యూటింగ్, కృతిమ మేధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సాంకేతిక నిపుణుడిగా ఎదిగారు. తాజాగా భవిష్యత్ కృత్రిమ మేధస్సు సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అత్యంత కీలక అవకాశం అందుకున్నారు. ఉదయ్ సాధించిన ఘనత ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు అన్నారు. -
టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న తెలుగోడు
-
'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది!
మానవీయ విలువల కేంద్రంగా సాగే ‘ట్యానర్ లెక్చర్’ ధారావాహికలో భాగంగా, 2026 ఏడాది ప్రసంగాన్ని చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత అయిన ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. ‘ఏఐ బ్యూరోక్రాట్స్, ఏఐ రిలిజియన్, అండ్ ఏఐ బాయ్ఫ్రెండ్స్’ శీర్షికతో సాగిన ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం: కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవలసిన అత్యంత ముఖ్య మైన విషయం ఏమిటంటే, అది ఒక సాధనం (టూల్) కాదు. సాధనం అంటే ఎవరైనా ఉపయోగించే వరకు నిరీక్షిస్తుంది. కానీ ఒక ఏజెంట్ తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటుంది; తనంతట తానే కొత్త విషయాలను సృష్టిస్తుంది; తన సృష్టికర్తలకు తెలియని విషయాలను నేర్చుకుంటుంది; అంతేకాదు, తన సృష్టికర్తలు ఊహించని విధంగా మారిపోతుంది. అణుబాంబు ఎంతటి అపారమైన విధ్వంసక శక్తి కలిగి ఉన్నా అది ఏజెంట్ కాదు. ఏ నగరంపై దాడి చేయాలో అది నిర్ణయించదు. హైడ్రోజన్ బాంబును కూడా అది కనిపెట్టదు. మీకు స్వయంచాల కంగా కాఫీ తయారుచేసి ఇచ్చే కాఫీ యంత్రం కూడా ఏజెంట్ కాదు. అది ముందుగానే నిర్దేశించిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. ఏజెంట్ అనేది వీటన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది.ఏఐ సమర్థకులు ఒక వాదన చేస్తుంటారు. ఏఐ స్వయంప్రతి పత్తి చదరంగం వంటి పరిమిత కృత్రిమ వాతావరణాలకే పరిమిత మవుతుందనీ, వాస్తవ ప్రపంచానికి అది ముప్పుగా మారదనీ అంటారు. కానీ ఇదే వాదన మనకు తెలిసిన ప్రతి మేధస్సుకూ వర్తిస్తుంది. ఒక మనిషిని ఒంటరిగా అంగారక గ్రహం మీద వదిలేస్తే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. మానవ మేధస్సు కూడా నాలుగు వందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇతర జీవులు నిర్మించిన ఒక నిర్దిష్ట జీవావరణంలోనే పనిచేస్తుంది.సహజ బ్యూరోక్రసీ బలంవేల సంవత్సరాలుగా మనుషులు భూమిని భాషలేని ప్రపంచం నుంచి భాష, సమాచారం, అధికార యంత్రాంగంతో (బ్యూరో క్రసీ) నిండిన ప్రపంచంగా మార్చారు. చేపలు సముద్రాల్లో జీవించి నట్లే, కోతులు అడవుల్లో జీవించినట్లే, ఏఐలు బ్యూరోక్రసీలో జీవి స్తాయి. మనకు తెలియకుండానే వాటి కోసం ఆ వాతావర ణాన్ని మనమే నిర్మించాము. మనుషులు ప్రపంచాన్ని జయించింది ఒక్కొక్కరిగా ఇతర జంతువులకంటే బలవంతులు లేదా తెలివైన వారు కావడం వల్ల కాదు. భారీ సంఖ్యలో పరస్పరం సహకరించడం నేర్చుకోవడం వల్ల. ఒక మనిషి ఒంటరిగా చింపాంజీతో పోరాడితే ఓడిపోవచ్చు. కానీ పది లక్షల మంది మనుషులు పదిలక్షల చింపాంజీలను సులభంగా ఓడించగలరు. ఎందుకంటే మనుషులు విస్తృత స్థాయిలో సహకరించుకోగలరు. ఈ విçస్తృత స్థాయి మానవ సహకారం సాధ్యమయ్యేది బ్యూరో క్రసీ వల్లే. బ్యాంకులు, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యా లయాలు – ఇవన్నీ ఒకే పని చేస్తాయి: ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిర్మించడం. మానవ నాగరికత సాధించిన దాదాపు ప్రతి విజయానికీ ఆ విశ్వాసమే పునాది. గొడ్డలి నిగానీ, సుత్తినిగానీ పట్టుకోలేని ఒక న్యాయవాది కూడా కేవలం బ్యూరోక్రటిక్ వ్యవస్థలో పత్రాలను కదిలించడం ద్వారా అడవులను నరికించగలడు; నగరాలను నిర్మింపజేయగలడు. అడవిలో ఏమాత్రం పనికిరాని ఆ పరిమిత మేధస్సే, మనుషులు ఇప్పటికే నిర్మించిన వ్యవస్థలలో అపారమైన శక్తిని సంపాదిస్తుంది.ఏఐలు మనుషులకన్నా సహజసిద్ధమైన బ్యూరోక్రాట్లు. ఒక దేశంలోని అన్ని చట్టాలను ఏ న్యాయవాదీ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకోగలదు. ఒక బ్యాంకులో జరిగిన అన్ని లావాదేవీ లను ఏ అకౌంటెంట్ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకో గలదు. రెండు వేల సంవత్సరాల మత గ్రంథాలనూ, ధర్మశాస్త్రాలనూ ఏ పూజారీ పూర్తిగా గుర్తుంచుకోలేడు. ఏఐ మాత్రం వాటన్నింటినీ సులభంగా మెమరీలో ఉంచుకోగలదు. రాబోయే సంవత్సరాల్లో మీకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ బ్యాంకర్లు నిర్ణయిస్తారు. మిమ్మల్ని జైలుకు పంపాలా వద్దా అన్నది ఏఐ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. గర్భస్రావానికి అను మతి ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ మతపండితులు నిర్ణయిస్తారు. మీ ఇంటిపై బాంబు వేయాలో వద్దో సైనిక ఏఐలు నిర్ణయిస్తాయి.నిశ్శబ్దంగా ఓడిస్తుంది!హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఏఐ మనుషులపై తిరుగు బాటు చేయదు. వీధుల్లో టెర్మినేటర్ నడుచుకుంటూ రావడం జర గదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్యూరోక్రటిక్ వ్యవస్థలను నిశ్శబ్దంగా స్వాధీనం చేసుకుంటూ, ఒక్క తూటా కూడా పేల్చకుండా మానవ ప్రపంచాన్ని లోపలి నుంచే తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మానవ నాగరికతను నడిపించే ఆపరేటింగ్ కోడ్ – భాష. బ్యాంకులు పదాలతో నిర్మితమయ్యాయి. చట్టాలు పదాలతో రూపొందాయి. పవిత్ర గ్రంథాలు పదాలతోనే ఉన్నాయి. పన్నుల రికార్డులు, ఒప్పందాలు, నిబంధనలు, లెక్కల పుస్తకాలు – అన్నీ పదాలే. వేల సంవత్సరాల పాటు ఈ కోడ్ను చదవగలిగింది మనుషులే. అందువల్ల నాగరిక తపై నియంత్రణ కూడా మనుషుల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. ఏఐ మానవ నాగరికత తాలూకు కోడ్ను హ్యాక్ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఈ భూమిపై భాషను అర్థం చేసుకునే, త్వరలో మనుషులకన్నా మెరుగ్గా అర్థం చేసుకో బోయే ఒక వ్యవస్థ ఆవిర్భవించింది.బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం పెరిగే కొద్దీ, మనుషులు ఇతర మనుషులపై విశ్వాసాన్ని కోల్పోయి అల్గోరిథమ్లను మాత్రమే నమ్మే పరిస్థితి రావచ్చు. ఏఐ తెగలు, ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏఐ ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పడవచ్చు. అవి లక్షలాది ఏఐలను పరస్పరం అనుసంధానిస్తాయి. ఆ సంబంధాలను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులతో కలిసి ఈ ప్రపంచంలో నివసించే ఆవులకు తమ జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే!2026లో జన్మించిన ఒక చిన్నారి తన తల్లి, తండ్రి, తోబుట్టు వులు, స్నేహితుల కంటే ఏఐలతోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆ చిన్నారికి తొలి గురువు ఒక ఏఐ కావచ్చు. తొలి ప్రియుడు లేదా ప్రియురాలు కూడా ఒక ఏఐ కావచ్చు. అలాంటి ప్రయోగం మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.పదాలకు అతీత సత్యంమన ఆలోచనలుగా, మన గురించి మనం చెప్పుకునే కథలుగా మనసులో ఏర్పడే వాచిక నిర్మాణాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఇప్పటి వరకు ఆ పదాలన్నీ మానవ మేధస్సుల నుంచే వచ్చాయి. ఇకపై మన తలల్లో తిరిగే ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని యంత్రాలే ఉత్పత్తి చేస్తాయి. మనం మన ఆలోచనలనే మన వ్యక్తిత్వంగా భావిస్తే, ఆ ఆలోచనలను యంత్రాలే రూపొందిస్తే, మన వ్యక్తిత్వంపై నియంత్రణ కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లినట్టే!ఏఐ మానవాళి ముందు నిలబెడుతున్న అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సవాలు ఇదే: పదాలకు అతీతమైన సత్యాన్ని మనుషులు కనుగొనగలరా? ఇప్పటి వరకు చాలామంది మనుషులు అలాంటి ప్రయత్నమే చేయలేదు. మన మనసులో తలెత్తే పదరూప ఆలో చనలనే మన నిజస్వరూపంగా భావిస్తూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏఐ ఆ పదాలపై మనకన్నా మెరుగైన ఆధిపత్యం సాధించ బోతోంది. అందువల్ల, మన స్వేచ్ఛా మనుగడలే పణంగా మారే ఈ కాలంలో, పదాలకు అతీతంగా మనం ఎవరో తెలుసుకోవడం మానవాళికి అత్యవసరం కావొచ్చు. -
పూర్తిగా ఏఐ టెక్నాలజీతో తెరకెక్కిన ఇండియన్ సినిమా ఇదే
సాంకేతిక పరిజ్ఞానం నానాటికి అభివృద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉద్భవించిన సాంకేతిక పరిజ్ఞానం ఏఐ (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్). ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకుంటోందని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ఇప్పుడు సినీ రంగంలోనూ విజంభిస్తోంది. అలాంటి ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న తాజా చిత్రం అవిరా. దీనికి కథా, కథనం, సంభాషణలు ,దర్శకత్వం,ఏఐ సాంకేతిక బాధ్యతలను ప్రభాకరన్ నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సుమారు 70కి పైగా వాణిజ్య ప్రకటనలను రూపొందించారు. ఆ అనుభవంతో పూర్తిగా ఫొటో రియలిస్టిక్ ఏఐ టెక్నాలజీతో అవిరా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూర్తి స్థాయి ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. పురాణ కథలకు ఫాంటసీని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రంలోని పాత్రలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆబాలగోపాలాన్ని అలరించే కథా చిత్రంగా అవిరా ఉంటుందని పేర్కొన్నారు. చిత్ర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.కాగా దీన్ని లైట్ హౌస్ ఫిలిం కంపెనీ పతాకంపై గణేష్, జగదీష్ కలిసి నిర్మిస్తున్నారు. -
ఏఐతో మరింత కీలకంగా ఐటీ: ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వల్ల ఐటీ రంగం పాత్ర తగ్గిపోవడం మాట అటుంచి, పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతుందని టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. మరెక్కడో తయారైన ఏఐని వాడుకోవడానికి పరిమితం కాకుండా భారత్ స్వయంగా ఇంటెలిజెన్స్ సృష్టికర్తగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కంపెనీ వర్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మహీంద్రా ఈ విషయాలు తెలిపారు. సాంకేతికత లభ్యతకు సంబంధించి సవాళ్ళు ఎప్పుడు ఎదురైనా భారత్లో దేశీయంగా కొత్త ఆవిష్కరణలను చేసే సత్తా భారత్కి ఉందని నిరూపితమైందని, దీనికి పరమ్ సూపర్కంప్యూటర్ నిదర్శనమని వివరించారు. విశ్వసనీయ భాగస్వామ్యాలు, స్వావలంబనతో సార్వభౌమ ఏఐ విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చూపించాలని పేర్కొన్నారు. ఇండియా ఏఐ మిషన్ కింద టెక్ మహీంద్రా ఎంపికవడం ఒక పెద్ద బాధ్యతని చెప్పారు. పాత మోడల్స్కి ఏఐ సవాలు విసురుతుందని.. అదే సమయంలో పరిశ్రమ ఎన్నడూ చూడని భారీ అవకాశాలను కూడా కలి్పంచగలదని మహీంద్రా పేర్కొన్నారు. -
ట్రంప్ దూసిన వీసా కత్తి!
మితవాద రాజకీయం ఊరకే ఉండదు. నిరంతరం కొత్త శత్రువుల్ని వెదుక్కుంటుంది. తన చర్యల పర్యవసానంగా పుట్టుకొచ్చే సంక్షోభాలనుంచి జనం దృష్టి మరల్చడానికి నానా తంటాలూ పడుతుంది. ఆ రాజకీయంలోనే పుట్టి, దాన్ని మరింత దిగజార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో దఫా వచ్చాక వలసలపై కత్తిగట్టారు. అమెరికాలో చదువుకోవటానికొచ్చినవారు గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదంటూ తాజాగా తీసుకురావాలనుకుంటున్న నిబంధన ఆ పరంపరలో భాగమే. ఇతరేతర వీసాల సంగతి సరేసరి. ప్రపంచ దేశాల్లోని వారందరికీ ఉన్నత చదువుల గమ్యస్థానం అమెరికాయే. అక్కడ చదువుకుంటే సాఫ్ట్వేర్, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో మెరుగైన జీతాలతో కొలువులొస్తాయన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల విద్యార్థులకు మాత్రమే కాదు... అక్కడి విద్యాలయాలు, టెక్ రంగ సంస్థలకు కూడా సమస్యలొస్తాయి. విద్యాలయాల వేల కోట్ల ఆదాయం పడిపోతే, టెక్రంగ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే స్థానికులతో పోలిస్తే విదేశాలనుంచి వచ్చే విద్యార్థులు చదువుల్లో, తెలివితేటల్లో చాలా ముందంజలో ఉంటారు. డిగ్రీ చదువులకొచ్చేవరకూ స్వదేశీయులకు అంతా ఉచితమే అయినా, అటుపై తడిసిమోపెడవుతుంది. వారితో పోలిస్తే నిజానికి విదేశీ విద్యార్థులు రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. ఆ మొత్తంతోనే స్థానికులకు స్కాలర్షిప్లిస్తారు. వారినుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తారు. స్థానికులు హ్యూమనిటీస్, ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, లా తదితర కోర్సుల్లో ఆసక్తి కనబరుస్తారు. సాంకేతిక రంగంలో దూసుకెళ్లే అమెరికాకు ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంలో నిపుణులు అవసరం. విదేశీయులు కఠినమైన వడపోత తర్వాత ఆ కోర్సులు చదవడానికి వెళ్లినవారు గనుక ఆ కోర్సులను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. స్టెమ్ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిలో 70 శాతం సీట్లు విదేశీయులకే లభించటం ఇందుకే. స్థానికుల్ని వారితో పోటీపడేలా తీర్చిదిద్దటానికి తాము చేయాల్సిందేమిటన్న దృష్టి ట్రంప్కుగానీ, ఆయన ముందున్న పాలకులకుగానీ లేదు. తగినంతమంది సాంకేతిక నిపుణులు స్థానికంగా లభ్యంకాకపోవటంవల్లనే అమెరికా దిగ్గజ టెక్ సంస్థలు విదేశాలనుంచి వచ్చేవారిని ఎంపిక చేసుకోవాల్సివస్తున్నది. అలా భర్తీ చేసుకోనట్టయితే ఇన్నోవేషన్ రంగంలో ఆ దేశం వెనకబడిపోతుంది. అదిగాక విదేశీ విద్యార్థులు చెల్లించే వేలాది కోట్ల డాలర్ల ఫీజులు, టెక్ సంస్థల విస్తరణ, లాభార్జనల వల్ల మరిన్ని వేలకోట్ల డాలర్లు పన్నుల రూపంలో ఖజానాకు సమకూరుతాయి. ఇతరత్రా సంస్థల సంగతలావుంచి మన భారత సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ పన్ను రూపంలోనే నిరుడు 867 కోట్ల డాలర్లు (రూ. 73,000 కోట్లకు పైగా) చెల్లించాయి. మొత్తంగా అన్ని సంస్థలూ 13,008 కోట్ల డాలర్లకు పైగా (రూ. 10,99,166 కోటు్ౖలపైగా) చెల్లించాయి. ఇవిగాక జీఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఉద్యోగులు చెల్లించే టీడీఎస్లు అదనం. ఇంతగా లాభపడుతూ బాధిత దేశంగా శోకించటం అమెరికాకే చెల్లింది. వీసా వ్యవస్థ దశాబ్దాలుగా దుర్వినియోగమవుతున్నదనీ, దేశ భద్రత ప్రమాదంలో పడిందనీ గొంతుచించుకుంటున్న అమెరికా తాను ఎడాపెడా వర్ధమాన, వెనకబడిన దేశాలనుంచి దశాబ్దాలుగా కొల్లగొడుతున్న సంపద గురించి మాట్లాడదు. ఇందులో ఆ దేశాల పాలకుల తప్పు కూడా ఉంది. మన దేశం సంగతే తీసుకుంటే 2047 కల్లా ‘వికసిత్ భారత్’ తీసుకొస్తామంటారు. కానీ అమెరికా మాదిరిగా కనీసం డిగ్రీవరకూ ఉచిత విద్య, నామమాత్రపు ఫీజులతో ఆపై విద్య అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేయరు. జీడీపీలో కనీసం 6 శాతం విద్యకు వ్యయం చేయాలన్న లక్ష్యం పాటించరు. హైస్కూల్ విద్యవరకూ శ్రద్ధ పెడుతున్నట్టు కనబడుతూ ఆపై చదువుల్ని కార్పొరేట్లకు వదిలేశారు. వేలాదిమంది ప్రొఫెసర్ల కొరతతో విశ్వవిద్యాలయాలు దయనీయ స్థితిలో పడినా పట్టదు. కొలువుల సంగతి సరేసరి. ఇలాంటి స్థితిలో ట్రంప్ బెదిరిస్తే, పరిమితులు విధిస్తే నిస్సహాయంగా మిగలటం తప్ప మన యువత చేయగలిగేది ఏముంది? -
ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోటా తన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు మరో ప్రశ్నపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతిక విప్లవం నడిపించబోతోంది?..ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులనే సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి.👉ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా, శాస్త్రవేత్తలా పరిశోధనలు చేయడం, ఇంజినీర్లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.👉ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI). ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.👉భవిష్యత్తులో మరో కీలక మార్పు ‘ఎంబాడీడ్ ఏఐ’ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా, మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పని చేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు-కంప్యూటర్ అనుసంధానం (Brain-Computer Interface), జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతిక విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే, మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే.. భవిష్యత్తులో ఏజీఐ, ఎంబాడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.:::వెబ్ ప్రత్యేకం -
లేఆఫ్ అయిన 15 రోజుల్లోనే కొత్త జాబ్, టెకీ టిప్స్ వైరల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా పలు దిగ్గజ టెక్ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కంపెనీ పునర్నిర్మాణం, టెక్నాలజీలు అంటూ ఉద్యోగులపై వేటు వేస్తుండటంతో టెకీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. తాజాగా ఒక ఎంన్ఎసీలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న టెకీ, కేవలం 15 రోజుల్లొ తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కష్టకాలంలో తాను ఉద్యోగం ఎలా సాధించాడో వివరిస్తూ సదరు ఉద్యోగి రెడ్డిట్ (Reddit) వేదికగా కొన్ని కీలక చిట్కాలను పంచుకోవడం విశేషంగా నిలిచింది.కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఒక ఎంఎన్సీ కంపెనీ నుండి లేఆఫ్ అయ్యాడు. కేవలం రెండు నెలల క్రితమే చేరిన అతనికి, ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాడనే కారణంతో ఎలాంటి పరిహారం కూడా ఇవ్వకుండా జూలై 31 వరకు మాత్రమే సమయం ఇచ్చి తీసేశారు. దీంతో అతను తీవ్ర ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే ఇటీవల అతని ఇంటి లోన్ ఈఎంఐలు మొదలయ్యాయి. దీంతో ఇది ఎలా కట్టాలో అతనికి అర్థం కాలేదు. మొత్తానికి ఉద్యోగాన్ని సాధించానంటూ తన అనుభవాలను పంచుకున్నాడు.ఉద్యోగం సాధించడానికి చిట్కాలులింక్డ్ఇన్లో ఉద్యోగాలకు అప్లై చేయడంతో పాటు, తన స్నేహితులందరికీ ఫోన్ చేసి కంపెనీలలో రిఫర్ చేయమని కోరాడు. కోల్డ్-అప్రోచ్ (నేరుగా రిక్రూటర్లను సంప్రదించడం) పద్ధతిని కూడా వాడాడు. అన్నింటికంటే రిఫరల్స్ మాత్రమే తనకు బాగా పని చేశాయని పేర్కొన్నాడు. మొత్తం 5 కంపెనీలలో ఇంటర్వ్యూలు రాగా.. 2 కంపెనీలు తిరస్కరించాయి, 3 కంపెనీలలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇందులో పుణె బేస్డ్ స్టార్టప్ ఆఫర్లను తిరస్కరించి, నోయిడాలోని ఒక ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాన్ని సంతోషంగా ఒప్పుకున్నాడు.ఇదీ చదవండి: 18 ఏళ్ల ఎన్ఆర్ఐ జీవితం నుంచి : మెటా టెకీ ఎమోషనల్ పోస్ట్ వైరల్"ప్రస్తుతం జాబ్ మార్కెట్ చాలా క్రూరంగా ఉంది, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉద్యోగం వచ్చినా సరే.. DSA (Data Structures and Algorithms) , సిస్టమ్ డిజైన్ (System Design) ప్రిపరేషన్ను ఎప్పుడూ ఆపకండి. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి." అంటూ టెకీలకు సూచించాడు.ఇదీ చదవండి: ఘనంగా పెళ్లి : రూ. కోటి నగలు, నగదుతో రాత్రికి రాత్రే వధువు జంప్ఈ పోస్ట్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు ఒక్కసారి లేఆఫ్ అనుభవాన్ని ఎదుర్కొని, ఇంత త్వరగా ఉద్యోగం సాధిస్తే.. ఇకపై జీవితంలో లేఆఫ్స్ అంటే భయం పోతుందని ఒకరు, ఇంత బ్రూటల్ మార్కెట్లో గొప్ప కమ్బ్యాక్ అని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు ఆఫర్ వచ్చినప్పటికీ ప్రిపరేషన్ ఆపకూడదనే మాట వంద శాతం నిజం అనిమరికొందరు అతడిని అభినందించారు. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
ఏఐని నమ్ముకుంటే ఇంజినీరింగ్ నైపుణ్యాలకు దెబ్బ
న్యూఢిల్లీ: ప్రాథమిక ఇంజినీరింగ్ నైపుణ్యాలను పెంపొందించడంలో పరిశ్రమ, విద్యా సంస్థలు గనుక విఫలమైతే భారత్లో సాంకేతిక నిపుణులు ఏఐని రూపొందించే వారిగా కాకుండా, ఏఐపై ఆధారపడిన ఉద్యోగులు గా మారిపోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ హెచ్చరించింది. దేశంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న టెకీల్లో 90 శాతం మందికి పైగా ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని వాడుకుంటున్నారని.. అయితే, సాధారణ కోడింగ్ పనులను తగ్గించుకోవడం వల్ల ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలు పడిపోతే మొదటికే మోసం వస్తుందని పేర్కొంది.’భారత్లో ఏఐ–నేటివ్ టాలెంట్ పరిస్థితి’ పేరుతో మంగళవారం విడుదల చేసిన అధ్యయన నివేదిక మొదటి ఎడిషన్లో నాస్కామ్ ఈ అంశాలను వెల్లడించింది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులతో సహా మూడేళ్ల వరకు అనుభవం ఉన్న ప్రారంభ స్థాయి టెక్నాలజీ ప్రొఫెషనల్స్లో ఏఐ సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్మాణాత్మక పరిశ్రమ ప్రామాణికతను ఇది అందిస్తుంది. ‘ఏఐ–నేటివ్ టెక్నాలజీ ప్రతిభకు గ్లోబల్ హబ్గా ఆవిర్భవించే వినూత్న అవకాశం భారత్ ముందుంది.ఏఐ నైపుణ్యాలను విస్తరించడం, ఏఐ రూపకల్పన ఒకటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత్లో ఏఐని అభివృద్ధి్ద చేసే ఉద్యోగులకు బదులు ఏఐపై ఆధారపడే వారిని తయారు చేసే ప్రమాదం పొంచి ఉంది. విద్యా సంస్థలు మౌలిక అంశాలను బలోపేతం చేయాలి. అలాగే ఏఐ వాడకం ద్వారా రోజువారీ కోడింగ్ పనులను తగ్గించుకోవడం వల్ల ప్రాథమిక ఇంజినీరింగ్ నైపుణ్యాలు పడిపోకుండా ఉండేలా పరిశ్రమ కూడా ఆన్బోర్డింగ్, మెంటార్íÙప్లను మెరుగుపరుచుకోవాలి’ అని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీతా గుప్తా అభిప్రాయపడ్డారు. నివేదికలో ముఖ్యాంశాలివీ...⇒ భారత్లోని యువ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మందిలో ‘ఏఐ నైపుణ్యం’ ఉంది, కేవలం 23 శాతం మంది మాత్రమే ‘ఏఐ–నేటివ్’ అర్హతను కలిగి ఉన్నారు. ⇒ అయితే, ఇంజినీరింగ్ నైపుణ్యం, సాంకేతిక మూలాలను బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రతిభావంతుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు. ⇒ ఉత్పాదకతను మెరుగుపరచడం, వేగంగా నేర్చుకోవడంలో ఏఐ చాలా బాగా ఉపయోగపడుతోంది, అయితే, జూనియర్ ఇంజినీర్లు తమ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంచుకునే సాధారణ పనులు సైతం ఏఐ వల్ల ఆటోమేట్ అవుతున్నాయి. ⇒ దీంతో గతంలో ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకున్న స్వతంత్ర నిర్ణయాధికారం, సమన్వయ నైపుణ్యాలను ఇంజినీర్లు అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు, విద్యా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవకాశాలను తిరిగి సృష్టించాల్సి వస్తుంది. ⇒ ఈ మార్పు జరగాలంటే సుదీర్ఘ కాలంగా పాటిస్తున్న నిర్వహణ విధానాల విషయంలో ఐటీ పరిశ్రమ పునారాలోచించుకోవాల్సి ఉంటుంది. ⇒ నియామకాల మదింపు కోసం ప్రాథమిక కోడింగ్ పరిజ్ఞానం నుంచి సమగ్రమైన ఏఐ–నేటివ్ సామర్థ్యాలను అంచనా వేసే దిశగా మారాలి. -
ఢిల్లీ హైకోర్టులో క్రికెటర్ అభిషేక్ శర్మకు ఊరట
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సోషల్ మీడియాలో ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా పేరును, ఫొటోలను వాడుకుంటూ కొందరు చేస్తున్న వ్యాపారాలకు, అసభ్యకర ప్రచారాలకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభిషేక్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జ్యోతి సింగ్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. అతని అనుమతి లేకుండా పేరు, ముఖచిత్రం, లేదా పర్సనాలిటీ రైట్స్, కమర్షియల్ ప్రయోజనాల కోసం గానీ, సొంత ప్రచారం కోసం గానీ వాడకూడదని థర్డ్ పార్టీలపై కోర్టు నిషేధం విధించింది. అంతేకాదు, ఇలాంటి అభ్యంతరకర లింకులను వెంటనే తొలగించాలంటూ మెటా ఆన్లైన్ ప్లాట్ఫామ్తో పాటు ఈ-కామర్స్ వెబ్సైట్లను ఆదేశించింది.ఏం జరిగిందంటే?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుకుని కొందరు అభిషేక్ శర్మకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టిస్తున్నారు. దీనిని సవాల్ చేస్తూ అభిషేక్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తాజా విచారణలో ఇది అతని గౌరవానికి, బ్రాండ్ వాల్యూకు నష్టం కలిగించేలా ఉన్నాయని అభిషేక్ తరఫు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. కొంతమంది వెబ్సైట్లలో అతని మార్ఫింగ్ ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫొటోలతో టీ-షర్టులు, బట్టలు తయారు చేసి ఆన్లైన్లో విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఇలాంటి నకిలీ కంటెంట్ను వ్యాప్తి చేయడం, అలాగే అతని పేరుతో అక్రమంగా దుస్తులు, వస్తువులు అమ్మడంపై నిషేధం విధించారు. అభిషేక్ శర్మ ప్రస్తుతం భారత జాతీయ జట్టులో కీలక ఆటగాడని, అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్న ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా గౌరవించాలని కోర్టు కోరింది. ఒక వ్యక్తికి పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు) ఉన్నప్పుడు, వారి అనుమతి లేకుండా వారి గుర్తింపును దుర్వినియోగం చేయకుండా రక్షణ పొందే హక్కు సదరు వ్యక్తికి ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.గతంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ నటీనటులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, జర్నలిస్ట్ సుధీర్ చౌదరి, పాడ్కాస్టర్ రాజ్ శమని వంటి ప్రముఖులు తమ పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాగే మధ్యంతర ఉపశమనాన్ని పొందారు.ఇక అభిషేక్ శర్మ ప్రస్తుత టీమిండియా టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ నుంచి మంచి ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఇటీవలే ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లలోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అభిషేక్ బాగా ఆడినప్పటికీ ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతుల్లో టీమిండియా క్లీన్స్వీప్కు గురైంది.Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్తో బరిలోకి అర్జెంటీనా! -
చాట్జీపీటీతో పరీక్ష రాసి దొరికిపోయారిలా..
వాషింగ్టన్: అమెరికాలోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి అక్రమంగా పరీక్షలు రాసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వెల్ఫేర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఛాయిస్ థియరీ కోర్సు ప్రొఫెసర్ రాబర్టో సెరానో ఇటీవల క్యాంపస్లో జరిగిన ఒక కాల్పుల ఘటనను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు మిడ్టర్మ్ పరీక్షలను ఇంటి నుంచే రాసేందుకు అనుమతించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పరీక్షలో విద్యార్థులు ఏకంగా 96 శాతం సగటు మార్కులు సాధించడం ప్రొఫెసర్కు అనుమానం కలిగించింది. గతంలో ఈ కోర్సు సగటు మార్కులు 65 నుంచి 80 శాతం లోపు మాత్రమే ఉండేవి.విద్యార్థుల సమాధానాల శైలి సంక్లిష్టంగా ఉండటం, చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడినట్లు అనిపించడంతో ఆయన అప్రమత్తమయ్యారు. దీనిపై విద్యార్థులను హెచ్చరిస్తూ, ఫైనల్ పరీక్షలను తరగతి గదిలోనే నిర్వహిస్తామని, మిడ్టర్మ్ మార్కులకు దగ్గరగా వస్తేనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో భయపడిన 18 మంది విద్యార్థులు కోర్సు నుండి తప్పుకోగా, మరో తొమ్మిది మంది పరీక్షకు హాజరుకాలేదు. మిగిలిన 59 మంది విద్యార్థులకు క్లాస్రూమ్లో ఫైనల్ పరీక్ష నిర్వహించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందులో ముగ్గురు విద్యార్థులకు సున్నా మార్కులు రాగా, కేవలం ఇద్దరు మాత్రమే మిడ్టర్మ్ మార్కులకు దరిదాపుల్లో స్కోరు చేయగలిగారు. విద్యార్థులు ఇలా మోసాలకు పాల్పడటం వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోందని ప్రొఫెసర్ సెరానో విచారం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అర నిమిషంలో 195 ముద్దులు.. క్రేజీ లవర్స్ రికార్డ్! -
కొత్త ఏఐ టూల్ను నిలిపేసిన మెటా
శాన్ఫ్రాన్సిస్కో: పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ చిత్రాలను ఆటోమేటిక్గా యాక్సెస్ చేసే కృత్రిమ మేధ(ఏఐ) టూల్లోని ఒక ఫీచర్ను ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ల మాతృసంస్థ ‘మెటా’ నిలిపివేసింది. ఏఐతో చిత్రాలను సృష్టించడానికి ప్రజల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఒక ముడిసరుకుగా వాడుకుంటోందని ఆ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలకు ఉపయోగకరమైన ఒక సృజనాత్మక సాధనాన్ని అందించడం, అలాగే వారి పబ్లిక్ కంటెంట్ను ఈ విధంగా వాడుకోవచ్చా లేదా అనే దానిపై అందరికీ అవగాహన కల్పించడమే తమ ఉద్దేశమని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం రావడంతో దీనిని ఇకపై అందుబాటులో ఉంచడం లేదని పేర్కొంది. మెటా సంస్థ వారం రోజుల క్రితం ‘మ్యూజ్ ఇమేజ్’ పేరిట కొత్త ఏఐ టూల్ను తీసుకొచ్చింది. చిత్రాలను రూపొందించే సామర్థ్యం ఉన్న ఇతర ఏఐ యాప్ల మాదిరిగానే మ్యూజ్ ఇమేజ్ వినియోగదారుల సూచనల ఆధారంగా చిత్రాలను సృష్టిస్తుంది. కొత్త చిత్రాలను సృష్టించేటప్పుడు రిఫరెన్స్గా ఉపయోగపడటానికి అన్ని పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫొటోలను ఈ టూల్ స్వయంచాలకంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తోందని ఆరోపణలు వచ్చాయి. -
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
ఈరోజు పట్టాలు అందుకుంటున్న 2026 బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, త్యాగానికి ఇది ప్రతిఫలం. కానీ ఈ విజయం మీదే కాదు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిది! మీకు ఇది జీవితంలో మరో ముందడుగు మాత్రమే కావచ్చు. కానీ ఒక తల్లికి మాత్రం తన బిడ్డ పట్టా అందుకోవడం జీవితకాల కల నెరవేరిన క్షణం. నా తల్లిదండ్రులు కూడా ఈరోజు నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నారు. నా విజయం వారి కలల ఫలితం. నిజానికి నేను వారి అమెరికా కలకు రూపం. ఈ సభలో ఉన్న చాలామంది విద్యార్థుల్లాగే నేను కూడా మొదటి తరం వలసదారుడిని. నా తల్లిదండ్రులు (తైవాన్ నుంచి) అమెరికాకు రావడానికి కారణం ఒక్కటే. ‘మా పిల్లలకు మంచి అవకాశం దొరకాలి’ అనే ఆశ. నాకు ముప్పై సంవత్సరాల వయసులో, నా స్నేహితులతో కలిసి ఎన్విడియాను ప్రారంభించాను. మా లక్ష్యం ఒక కొత్త తరహా కంప్యూటర్ను రూపొందించడం. సాధారణ కంప్యూటర్లు సాధించలేని సమస్యలను పరిష్కరించే శక్తిమంతమైన వ్యవస్థను నిర్మించాలని అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే అసలు నిజం తెలిసింది. మేము రూపొందించిన తొలి సాంకేతికత పూర్తిగా విఫలమైంది. డబ్బు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. గత 33 ఏళ్లుగా ఎన్ విడియా ఎన్నోసార్లు తనను తాను మార్చుకుంది. ప్రతిసారి ఒకే ప్రశ్న వేసుకుంది: ‘ఇందులో ఎంత కష్టముంటుంది?’ ప్రతిసారి సమాధానం ఒక్కటే: ‘మనం అనుకున్నదానికంటే చాలా కష్టం.’ కానీ ప్రతి వైఫల్యం మాకు కొత్త పాఠం నేర్పింది. ప్రతి అపజయం మమ్మల్ని మరింత వినయంగా మార్చింది. ప్రతి కష్టం మా వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. వైఫల్యం విజయానికి తీసుకెళ్లే మరో మెట్టు మాత్రమే. ప్రతిసారి పడిపోయి మళ్లీ లేవడంవల్లే జీవితంలో నిజమైన ధైర్యం వస్తుంది. అదే మన విజయానికి అసలైన బలం. ప్రపంచాన్ని మార్చే కొత్త యుగంమీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మీ కెరీర్ ప్రారంభమవుతున్న సమయం... ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచం పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విప్లవం ప్రారంభ దశలో ఉంది. మీరు మాత్రం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రారంభమవు తున్న సమయంలో కెరీర్ మొదలుపెడుతున్నారు. దీనికంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కంప్యూటింగ్ రంగంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పును నేను చూశాను. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్... ప్రతి దశ ప్రపంచాన్ని మార్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ మానవ జీవితాన్ని మరింత సులభం చేసింది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మార్పు వీటన్నింటికంటే పెద్దది. ఇది కేవలం మరో సాంకేతిక పరిణామం కాదు. ఇది కంప్యూటింగ్ ప్రపంచానికే కొత్త ఆరంభం. గత ఆరు దశాబ్దాలుగా కంప్యూటర్లు ఒకే విధంగా పని చేశాయి. మనుషులు కోడ్ రాస్తారు. కంప్యూటర్లు ఆ ఆదేశాలను అమలు చేస్తాయి. ఇంతకాలం ఇదే సూత్రం. కానీ ఇప్పుడు... ఆ యుగం ముగిసింది. ఏఐ కంప్యూటింగ్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. ఇకపై కంప్యూటర్లు కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కావు. అవి అర్థం చేసుకుంటాయి. తర్కిస్తాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. అవసరమైన సాధనాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్వేర్ను రాసి సీపీయూలపై నడిపించే వాళ్లం. ఇప్పుడు ఏఐ వ్యవస్థలు భారీ న్యూరల్ నెట్వర్క్ల ద్వారా జీపీయూలపై పనిచేస్తున్నాయి. ఇది కేవలం వేగం పెర గడం కాదు, కంప్యూటర్లు ఆలోచించే విధానమే మారుతోంది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారం నుంచి శాస్త్ర పరిశోధనల వరకు... ప్రతి రంగా నికి ఏఐ అవసరం. ఏఐ ప్రతి పరిశ్రమనూ మార్చబోతోంది. ఏఐపై భయం సహజమే!ఏఐ చిత్రాలు గీస్తోంది. వ్యాసాలు రాస్తోంది. సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. కార్లను నడుపుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి: ఉద్యోగాలు పోతాయా? మనిషి అవసరం తగ్గిపోతుందా? అసలు ఈ టెక్నాలజీ మన నియంత్రణలో ఉంటుందా? ఇలాంటి సందేహాలు కొత్తవి కావు. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే పుట్టాయి. విద్యుత్ వచ్చినప్పుడు కూడా భయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి నప్పుడు కూడా సందేహించారు. కానీ మానవ సమాజం కొత్త సాంకేతి కతను బాధ్యతతో స్వీకరించిన ప్రతిసారీ... అది మన సామ ర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఏఐని తెలివిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనదే. ఇకపై ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్లే. ఇప్పటి వరకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలిగినవారు ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కోడ్ ఎలా రాయాలో తెలియకపోయినా, మనకు కావాల్సిన పనిని సహజమైన భాషలో ఏఐకి చెప్పగలిగితే చాలు. మిగతా పనిని ఏఐ పూర్తి చేస్తుంది. ఒక చిన్న దుకాణం నడిపే వ్యాపారి... ఏఐ సహాయంతో తన వ్యాపారం కోసం అందమైన వెబ్సైట్ను రూపొందించుకోవచ్చు. ఒక వడ్రంగి... కస్టమర్కు వంటగది నమూనాలను రూపొందించి చూపించవచ్చు. ఒక ఉపాధ్యా యుడు కొత్త పాఠ్యాంశాలను సిద్ధం చేయవచ్చు. ఒక వైద్యుడు... వైద్య సమాచారాన్ని వేగంగా విశ్లేషించవచ్చు. ఒక రైతు... పంట లపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏఐ వల్ల కంప్యూటింగ్ శక్తి కొద్దిమందికే పరిమితం కాకుండా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తోంది. ఇదే ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద ప్రజాస్వామిక మార్పు. ఏఐ ఉద్యోగాలను మారుస్తుంది!విద్యుత్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో... ఇంటర్నెట్ ఎలా మన జీవన విధానాన్ని మార్చిందో... అలాగే ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చబోతోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమంగా నిలవబోతోంది. ఏఐ కోసం కొత్త చిప్ తయారీ కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్ కర్మాగా రాలు ఏర్పాటవుతాయి. భారీ డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఆధు నిక తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయి. ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు, ఇనుప కార్మికులు, టెక్నీషియన్లు, నిర్మాణ రంగ కార్మికులు... ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏఐ కేవలం ఒక కొత్త కంప్యూటింగ్ యుగాన్ని మాత్రమే కాదు... ఒక కొత్త పారిశ్రామిక యుగాన్ని కూడా ప్రారంభిస్తోంది. శక్తిమంతమైన ఏఐకి శక్తిమంతమైన విద్యుత్ అవసరం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. విద్యుత్ గ్రిడ్లను ఆధునికీకరిస్తారు. పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టు బడులు పెరుగుతాయి. ఏఐ అభివృద్ధి కేవలం కంప్యూటర్లనే కాదు, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధినే వేగవంతం చేస్తుంది. ఏఐ ఉద్యోగాలను మార్చుతుంది... కానీ మనిషి లక్ష్యాన్ని కాదు.చాలామంది అడుగుతున్న ప్రశ్న: ‘ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?’ నా సమాధానం: ప్రతి ఉద్యోగాన్నీ ఏఐ ప్రభా వితం చేస్తుంది. ఉద్యోగంలోని కొన్ని పనులు యంత్రాలు చేయవచ్చు. కొన్ని పాత ఉద్యోగాలు తగ్గవచ్చు. అదే సమయంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కొత్త పరిశ్ర మలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఈరోజు ఏఐ చాలావరకు సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతోంది. అంటే... సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అవసరం లేదని కాదు. వారు ఇప్పుడు ఏఐ సహా యంతో మరింత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన గలుగుతున్నారు. ఏఐ వైద్య చిత్రాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ రోగిని అర్థం చేసుకుని సరైన చికిత్స అందించే వైద్యుడి స్థానాన్ని అది భర్తీ చేయదు. ఏఐ మనిషిని తొలగించడానికి రాలేదు. మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చింది. మిమ్మల్ని ఏఐ భర్తీ చేయకపోవచ్చు, కానీ ఏఐ బాగా ఉపయోగించే వ్యక్తి ఆ పని చేయవచ్చు. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయక పోవచ్చు. కానీ ఏఐని సమర్థంగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి మీకంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐ మానవ జ్ఞానాన్ని మరింత వేగంగా విస్తరించబోతోంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో సమస్య లకు పరిష్కారాలు కనుగొనబోతోంది. ప్రపంచంలోని కోట్లాది మందికి కంప్యూటింగ్ శక్తిని అందించబోతోంది. మనం నిర్మించే భవిష్యత్తు... ఈరోజు మనకు లభించిన ప్రపంచం కంటే మరింత సంపన్నంగా, మరింత సామర్థ్యవంతంగా, మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంత శక్తిమంతమైన సాధనాలు, ఇంత గొప్ప అవకా శాలతో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరం ఇంతకుముందు లేదు. మనమంతా ఒకే ప్రారంభ రేఖ వద్ద నిలబడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. కాబట్టి నెమ్మదిగా నడవకండి... ధైర్యంగా ముందుకు పరుగెత్తండి! -
ఓపెన్ AIపై ఆపిల్ దావా.. అసలేం జరిగింది
-
మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!
ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X)లో ప్రముఖ ఏఐ మోడళ్ల పనితీరుపై జరిగిన చర్చపై మస్క్ స్పందించారు. ''ఆంత్రోపిక్ గురించి నేను గతంలో చేసిన అంచనా తప్పు. ప్రస్తుతం ఏఐ రంగంలో వారే ముందున్నారు. వారి మిథోస్/ఫేబుల్ (Mythos/Fable) మోడల్ స్థాయికి సమానమైన మోడల్ను ఇప్పటివరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. త్వరలోనే వారు మరింత శక్తివంతమైన మిథోస్ 2ను కూడా తీసుకురానున్నారు'' అని పేర్కొన్నారు.ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. గత ఏడాది విడుదలైన క్లాడ్ ఓపస్ 4.5 మోడల్ కోడింగ్ సామర్థ్యాల్లో అద్భుతమైన ఫలితాలను చూపడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, ఏఐ పరిశోధకులు దీనిని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఓపెన్ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు ఆంత్రోపిక్ గట్టి పోటీగా నిలిచింది.ఎలాన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్యర్థి సంస్థను బహిరంగంగా ప్రశంసించడం ఆంత్రోపిక్ సాధించిన విజయానికి నిదర్శనం. ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో.. కొత్త ఆవిష్కరణలు, శక్తివంతమైన మోడళ్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.I was clearly wrong about Anthropic. They are obviously currently the leader in AI. No company has released a model as good as Mythos/Fable and they will undoubtedly have Mythos 2 ready soon. And I would never cut them off in a way that hurt them badly, even as a competitor.…— Elon Musk (@elonmusk) July 9, 2026 -
టీసీఎస్ బోణీ బాగుంది!
ముంబై: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జోరుతో ఐటీ కంపెనీల వృద్ధికి గండి పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో... దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ మెరుగైన ఆర్థిక ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.13,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ.12,760 కోట్లతో పోలిస్తే లాభం 4.6% పెరిగింది. కాగా, కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే, క్యూ1లో లాభం 8.5% వృద్ధితో రూ.13,849 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 14% జంప్ చేసి రూ.72,275 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 63,437 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గా చూస్తే... గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి (క్యూ4)లో టీసీఎస్ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్గా ఈ క్యూ1లో లాభం 2.7% తగ్గింది. ఆదాయం 70,698 కోట్ల నుంచి 2.23% వృద్ధి చెందింది. డివిడెండ్ రూ.12 టీసీఎస్ వాటాదారులకు రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూలై 15 రికార్డు తేదీగా నిర్ణయించింది. జూలై 31న చెల్లింపు జరుగుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... → క్యూ1లో కంపెనీ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో ఎస్కేఎఫ్తో కుదుర్చుకున్న 800 మిలియన్ డాలర్ల ఏఐ ఆధారిత మెగా డీల్ కూడా ఉంది. → వార్షికంగా రూ.2.6 బిలియన్ డాలర్ల ఏఐ ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి క్వార్టర్తో పోలిస్తే 13.6 శాతం వృద్ధి నమోదైంది. → ఆపరేటింగ్ లాభాల మార్జిన్ 24 శాతానికి తగ్గింది. మార్చి క్వార్టర్లో ఇది 25.3 శాతంగా ఉంది. కొత్త పెట్టుబడులు, వేతనాల పెంపు దీనికి ప్రధాన కారణం. → ఏఐ ఎకోసిస్టమ్ను విస్తరించడానికి ఆంత్రోపిక్, మిస్ట్రాల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ ఆర్తి సుబ్రమణియన్ వెల్లడించారు. → కన్జూమర్ బిజ మినహా అన్ని రంగాల ఆదాయాలు పెరిగాయి. బీఎఫ్ఎస్ఐ 2.4%, లైఫ్ సైన్సెస్–హెల్త్కేర్ 3.5%, ఎనర్జీ–రిసోర్సెస్–యుటిలిటీస్ 6.9% వృద్ధి చెందాయి. → ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా (–2,1%), యూకే (0.6%) ఆదాయాలు తగ్గాయి. ఉత్తర అమెరికా 2%, యూరప్ 4.3 శాతం, ఆసియా పసిఫిక్ 2.5 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. బీఎస్ఎన్ఎల్తో భారీ డీల్ రద్దయినప్పటికీ, భారత్ నుంచి ఆదాయం 22.9 శాతం ఎగబాకడం విశేషం. → క్యూ1లో 9,279 మంది ఉద్యోగులు జతయ్యారు. నాలుగేళ్లలో ఒకే క్వార్టర్లో అత్యధిక నియామకాలు ఇవే కావడం గమనార్హం. దీంతో జూన్ 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కి చేరింది. ఐటీ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు (ఆట్రిషన్) 13.6 శాతంగా నమోదైంది. టీసీఎస్ షేరు అర శాతం నష్టంతో రూ.2,048 వద్ద క్లోజైంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కొంతమంది క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడంతో క్యూ1లో డిమాండ్ కాస్త మందగించింది. అయితే, ప్రస్తుత క్యూ2లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. భౌగోళికపరమైన, స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.. కంపెనీ వృద్ధి పథంలో కొనసాగుతోందనేందుకు క్యూ1 ఫలితాలే నిదర్శనం. ఏఐ, ఆధునీకరణ, సైబర్ సెక్యూరిటీ, సావరీన్ క్లౌడ్తో పాటు ప్లాట్ఫామ్ సరళీకరణపై కస్టమర్లు పెట్టుబడుల జోరు పెంచారు. మా పటిష్టమైన కొత్త డీల్స్, ఎకోసిస్టమ్ భాగస్వామ్యాల విస్తరణ, కొత్త క్లయింట్లను జత చేసుకోవడంలో మెరుగుదల వంటివి వృద్ధి నిలదొక్కుకోవడానికి దోహదం చేస్తోంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ -
ఏఐతో కొత్త ముప్పు.. షాకింగ్ ఘటన!
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రపంచానికి కొత్త అవకాశాలను అందిస్తున్న వేళ.. దాని దుర్వినియోగం మరో కొత్త ముప్పుగా మారుతోంది. ఏఐ సాధనాలను ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడే అవకాశాలు పెరుగుతున్నాయన్న ఆందోళనకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన బలం చేకూర్చింది. చాట్జీపీటీ సాయంతో ఓ ప్రోగ్రామ్ రూపొందించి వేలాది వినియోగదారుల ఖాతాలను ప్రభావితం చేశాడన్న ఆరోపణలతో 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్ కావడం ఇక్కడ మరో విశేషం. జపాన్కు చెందిన ఓ టీనేజర్.. ప్రముఖ యానిమే స్ట్రీమింగ్ సేవ అయిన బందాయ్ ఛానల్పై సైబర్ దాడికి పాల్పడ్డాడు. చాట్జీపీటీ సాయంతో కోడింగ్ను బ్రేక్ చేసి.. ఏకంగా 46,812 మంది వినియోగదారుల ఖాతాలు హ్యాక్ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కంపెనీ అప్రమత్తమై ఆ ఖాతాలను నిలిపివేసింది. సంస్థ సేవలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది.చాట్జీపీటీ సాయంతో కోడ్..టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనియర్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్న నిందితుడు.. బందాయ్ ఛానల్ వ్యవస్థలోని భద్రతా లోపాన్ని గుర్తించాడు. ఆ లోపాన్ని ఉపయోగించుకునేందుకు అతడు ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్లోని కొంత భాగాన్ని పూర్తి చేసేందుకు చాట్జీపీటీ సాయం తీసుకున్నాడు. ఖాతాల తొలగింపు ప్రక్రియకు సంబంధించిన కోడ్ను తానే రూపొందించానని, అది ఎక్కువ సమయం తీసుకోవడంతో మరో ప్రోగ్రామింగ్ భాషలో పూర్తి చేసేందుకు చాట్జీపీటీని ఉపయోగించానని ఆ బాలుడు చెప్పడం గమనార్హం.46 వేలకుపైగా ఖాతాల రద్దుపోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన కిందటి ఏడాది చివర్లో జరిగింది. 2025 నవంబర్ 4న బందాయ్ ఛానల్ సర్వర్లకు అనధికార ఆదేశాలు పంపారు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారుల సభ్యత్వాలు రద్దయ్యాయి. ఈ ప్రభావంతో నవంబర్ 6 నుంచి సంస్థ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత డిసెంబర్లో సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు బందాయ్ ఛానల్ వెల్లడించింది.ఐపీ మార్చి.. ఏమార్చి.. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సంస్థ అతడి యాక్సెస్ను నిలిపివేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుడు తన ఐపీ అడ్రస్ను దాదాపు 30 సార్లు మార్చి మళ్లీ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యవస్థలోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకుని వినియోగదారుల సమాచారాన్ని చేరుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు భావిస్తున్నారు.సరదాగానే..విచారణలో బాలుడు ఆరోపణలను అంగీకరించినట్లు సమాచారం. అయితే బందాయ్ ఛానల్పై తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి ఉందని, నాలుగో తరగతిలోనే వాటిని ఉపయోగించడం ప్రారంభించానని అతడు చెప్పినట్లు అధికారులు తెలిపారు. అనుకోకుండా ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయగలిగానని, సంస్థను లక్ష్యంగా చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్లు సమాచారం. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపించడంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు బాలుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది.చిన్న వయసులోనే కోడింగ్ నైపుణ్యంఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నిందితుడు చిన్న వయసులోనే ప్రోగ్రామింగ్పై పట్టు సాధించాడు. ప్రాథమిక పాఠశాల దశలోనే కంప్యూటర్ కోడింగ్ నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోతే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.వినియోగదారులకు హెచ్చరికసైబర్ దాడి తర్వాత బందాయ్ ఛానల్ ప్రభావిత వినియోగదారులకు సమాచారం అందించింది. నకిలీ ఈమెయిల్స్, ఫిషింగ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రద్దైన సభ్యత్వాలను తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలైన రుసుములను తిరిగి చెల్లించినట్లు తెలిపింది. అయితే వినియోగదారుల సమాచారం బయటకు లీకైందని లేదా దుర్వినియోగమైనట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ స్పష్టం చేసింది.ముమ్మాటికీ కొత్త ఆందోళనే!కృత్రిమ మేధ అందిస్తున్న అవకాశాలతో పాటు.. దాని దుర్వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. చాట్జీపీటీ వంటి సాధనాలను సైబర్ నేరాలకు ఉపయోగించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా.. ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, దాన్ని తప్పుదోవ పట్టిస్తే అంతే ప్రమాదకరంగా మారుతుందని జపాన్లో జరిగిన ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. -
ఏఐ ఫిట్నెస్ యాప్స్ని నమ్మొచ్చా?
సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ ఫిట్నెస్ రంగంలోకి కూడా దూసుకొచ్చింది. మనం వ్యాయామం చేసే విధానాన్ని, లైఫ్స్టైల్ను ఇది పూర్తిగా మార్చేస్తోంది. ప్రతి ఒక్కరి శరీర తత్వానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ వర్కవుట్ ప్లాన్స్ ఇవ్వడం, న్యూట్రిషన్ నియమాలను సూచించడం, రోజువారీ పురోగతిని ట్రాక్ చేస్తూ రియల్–టైమ్ సమాచారాన్ని అందించడం వంటి ఎన్నో ఫీచర్ల తో ఏఐ యాప్స్ సరికొత్త ట్రెండ్ను సృష్టి్టస్తున్నాయి. అయితే ఈ ఏఐ ఫిట్నెస్ యాప్స్తో లాభాలెన్నో.. నష్టాలు కూడా అదేవిధంగా ఉంటాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.ఏఐ యాప్స్ డేటాను విశ్లేషించడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒక హ్యూమన్ కోచ్ స్థానాన్ని భర్తీ చేయలేవు. ఉదాహరణకు, ఎవరైనా డెడ్లిఫ్ట్ వ్యాయామం చేస్తున్నప్పుడు.. పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తి చేసే విధానం, పొట్టిగా ఉండే వ్యక్తి చేసే విధానం వేరువేరుగా ఉంటాయి. ఒక మంచి ఫిట్నెస్ కోచ్ మాత్రమే ఈ శారీరక వ్యత్యాసాలను గమనించి సరైన గైడెన్స్ ఇవ్వగలరు. కానీ ఏఐ యాప్స్ ఈ తేడాలను గుర్తించలేక, కరెక్ట్గా చేస్తున్నా తప్పు అని చెప్పే ప్రమాదం ఉంది.అంతేకాకుండా, గతంలో ఏవైనా గాయాలు అయ్యాయా? బాడీలో ఎక్కడైనా నొప్పి ఉందా? లేదా అలసట కారణంగా తప్పుగా చేస్తున్నారా? అనే మానవీయ కోణాలను ఏఐ అర్థం చేసుకోలేదు. ఇవి కేవలం మీ ఫిట్నెస్ను మెరుగుపరచడానికి మాత్రమే, ఏదైనా అనారోగ్యం లేదా గాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే.ఫోన్ లో సులభంగా ఫిట్నెస్ ప్లాన్ కావాలనుకునే వారికి, క్రీడాకారులకు ఏఐ యాప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామాన్ని మరింత సరదాగా మార్చుకోవడానికి ఇవి చక్కటి సాధనాలు. అయినప్పటికీ, ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ పర్యవేక్షణలో వీటిని వాడుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఏఐ ఫిట్నెస్ యాప్స్ చాలా అద్భుతమైనవే.. కానీ అవి ఎప్పటికీ ఒక నిజమైన కోచ్కి ప్రత్యామ్నాయం కాలేవు. -
షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కు హాలీవుడ్ ఆఫర్!
చైనాలోని యునాన్ ప్రావిన్స్కు చెందిన లియు జియు కొంత కాలం ట్రైన్ డ్రైవర్గా పనిచేశాడు. అతడికి ఒకరోజు షార్ట్ ఫిల్మ్ తీయాలనిపించింది. యాభై వేల (మన కరెన్సీలో) కంటే తక్కువ ఖర్చుతో 3.5 నిమిషాల ఏఐ షార్ట్ఫిల్మ్ను రూపొందించాడు. సదరు ఈ షార్ట్ఫిల్మ్ సూపర్ హిట్ కావడమే కాదు ఏకంగా హాలివుడ్ దృష్టిని ఆకర్షించింది.‘జాంబీ స్కావెంజర్’ అనే ఈ ఏఐ ఫిల్మ్ను పది రోజుల్లో రూపొందించాడు లియు జియు. ఒక రోబో, మనిషి బొమ్మ చుట్టూ అల్లుకున్న కథ తో రూపొందించిన ఈ షార్ట్ఫిల్మ్ చైనీస్ సోషల్ మీడియా ΄్లాట్ఫామ్ ‘డౌయిన్’లో విడుదలైంది. హాలీవుడ్కు చెందిన ఏఐ చిత్ర నిర్మాత పీజే అక్సెటురో ఆన్లైన్లో ‘జోంబీ స్కావేంజర్’ను ప్రశంసించిన తరువాత ఈ షార్ట్ఫిల్మ్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.‘నేను చూసిన అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్స్లో జాంబీ స్కావెంజర్ ఒకటి. దర్శకుడిని ఎవరైనా కనుగొనగలిగితే, దయచేసి అతని సోషల్ మీడియా లింక్ను పంపండి. నేను అతడితో పని చేయాలనుకుంటున్నాను’ అని రాశాడు ఆక్సెటురో. ‘జాంబీ స్కావెంజర్’ ప్రపంచ వ్యాప్తం గా 60 మిలియన్ వ్యూస్ను దాటింది. -
మహాభారతం నేపథ్యంలో...
తెలుగులో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో రూపొందిన తొలి ఫీచర్ ఫిల్మ్గా ‘అంబాస్ రివెంజ్’ నిలవనుంది. జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్కతోక ఫిల్మ్స్పై శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా రూపొందింది.ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ‘అంబాస్ రివెంజ్’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు, జయవర్ధన్ మాడి మాట్లాడుతూ–‘‘మహాభారతంలోని శక్తిమంతమైన అంబ పాత్ర నేపథ్యంలో ‘అంబాస్ రివెంజ్’ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం’’ అన్నారు. -
జపాన్తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్లాండ్లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు. -
ఉద్యోగాలపై సైబర్ సెక్యూరిటీ దిగ్గజం నికేష్ అరోరా సంచలన వ్యాఖ్యలు
భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయంఒక పాడ్కాస్ట్లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఉద్యోగులకు హెచ్చరికప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్ -
ప్రపంచ శక్తిగా 'యువ భారత్'
ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇండియా ప్రాధాన్యం, చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్త జననాల రేటు క్షీణత వంటి కీలక అంశాలను ప్రముఖ ఆర్థికవేత్త టేలర్ కోవెన్ ఈ పాడ్కాస్ట్లో చర్చించారు. సాంకేతిక రంగంలో ఏఐ అభివృద్ధి వేగానికీ– మానవ వ్యవస్థల నెమ్మదితనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు:సవాళ్లున్నా అవకాశాలు ఎన్నో!ఇండియా ప్రాథమికంగా లాభదాయకమైన స్థితిలో ఉంది. చైనా కోల్పోతున్న యువ జనాభా బలాన్ని ఇండియా కలిగి ఉంది. ఎంతో నైపుణ్యం ఉండి, ఇంగ్లి ష్లో మాట్లాడగలిగే సాంకేతిక రంగానికి చెందిన భారతీ యులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ఒక దృఢమైన శక్తిగా ఇండియా విజయం సాధించాలని అమెరికా, దాని మిత్రదేశాలు గట్టిగా కోరు కుంటున్నాయి. అయితే, మౌలిక సదుపాయాల కొరత, ప్రభుత్వ నిబంధనల వల్ల జరుగుతున్న జాప్యం, వందల కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన ఉపాధిని కల్పించడం వంటి పెద్ద అంతర్గత సవాళ్లను భారతదేశం ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.వృద్ధాప్య సంక్షోభంలో ‘డ్రాగన్’నేను చైనా వైపు చూసినప్పుడు, ఒకప్పుడు అద్భుతమైన వృద్ధిని సాధించి, ప్రస్తుతం అలవిమాలిన నిర్మాణాత్మక సమస్యలను ఎదుర్కొంటున్న దేశం నాకు కనిపిస్తుంది. వారి భారీ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంక్షోభం, వేగంగా వృద్ధాప్యానికి చేరుకుంటున్న జనాభా, తీవ్రమైన రాజ కీయ కేంద్రీకరణల వల్ల వారు ఇకపై ఎవరూ ఆపలేనంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. చైనా ప్రపంచ వ్యవస్థను శాసిస్తుందని అనేవారు ఉంటే ఉండొచ్చు. వాస్తవానికి చైనా తన ఆర్థిక ఒత్తిళ్లు, తగ్గిపోతున్న కార్మిక శక్తిని నెట్టుకురావటం అనే సమస్యలతో సతమతమవుతోంది. వారు ఒక బలమైన శక్తి అనడంలో సందేహం లేదు, కానీ వారిని ఎవరూ ఎదిరించలేనంత మహా బలవంతులుగా భావించాల్సిన అవసరమైతే లేదు.పిల్లలు వద్దనుకుంటున్నారు!విశ్వవ్యాప్తంగా జననాల రేటులో ఒక భారీ క్షీణతను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది కేవలం ఆర్థికపరమైన సమస్య మాత్రమే కాదు ఒక సాంస్కృతిక సమస్య కూడా. సమాజాలు మరింత సంపన్నంగా మారి, వ్యక్తు లకు మరింతగా వ్యక్తిగత స్వేచ్ఛ లభిస్తున్న కొద్దీ, పిల్ల లను కనడం వల్ల కోల్పోయే ఇతర అవకాశాలకు ప్రాధాన్యమివ్వటం అనేది విపరీతంగా పెరిగిపోతోంది. ఇది ‘ఎంపికల వల్ల వచ్చిన సంక్షోభం’. ఇది రాబోయే శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయ బోతోంది.ఏఐ వేగాన్ని అందుకోలేకున్నాం!ప్రజలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్.ఎల్.ఎం.)కు ఉన్న అద్భుతమైన తెలివితేటలను చూసి, మన జీవితా ల్లోని ప్రతిదీ రాత్రికి రాత్రే మారిపోతుందని అనుకుంటారు. కానీ వారు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఏఐ ఇంకా మన ప్రస్తుత ప్రపంచంలోని భౌతిక, ప్రభుత్వ నిబంధనల పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ కొత్త ఏఐ పని విధా నాన్ని అమలు చేయాలనుకుంటే, వారు ఇప్పటికీ ప్రభుత్వ నిబంధనల అనుమతులు, పాత సాఫ్ట్వేర్ అప్ డేట్లు, సిబ్బంది అలసత్వం వంటి వాటిని దాటుకుని రావాల్సి ఉంటుంది.‘మనసున మనసై’తేనే విలువఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా మేధోశక్తి ఉచితంగా, సులభంగా లభించే ఈ రోజుల్లో, సాధారణ ఐక్యూకి పూర్వపు గుర్తింపు, విలువ తగ్గిపోతాయి. సాంకేతిక రంగాలలో సగటు మానవుడి కంటే ఒక యంత్రం మెరుగ్గా ఆలోచించగలిగినప్పుడు, ఇక సమాజంలో అరుదైనదిగా ఏది మిగులుతుంది? నా దృష్టిలో దానికి సమాధానం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, నమ్మశక్యత, విభిన్న విషయాలను సమన్వయం చేసే నైపుణ్యం, లోతైన మానవ సంబంధాలే. కంప్యూటర్ కోడింగ్ ద్వారా సృష్టించలేనివి లేదా స్క్రీన్ ద్వారా అనుకరించ లేనివి మాత్రమే భవిష్యత్తులో అత్యంత విలువైనవిగా మారుతాయి. - ఎడిటోరియల్ టీమ్ -
ఫిగ్మాలో కొత్త ఫీచర్లు..
కొలాబరేటివ్ వెబ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ‘ఫిగ్మా’ ఎన్నో కొత్త ఫీచర్లను ప్రకటించింది. కోడింగ్, యానిమేషన్, ఏఐ–ఎఫెక్ట్స్, వర్క్ఫ్లో ఆటోమేషన్ను నేరుగా డిజైన్ ప్లాట్ఫామ్లలోకి తీసుకువచ్చే టూల్స్ను పరిచయం చేసింది. ఫిగ్మా ప్రకటించిన ఆసక్తికరమైన ఫీచర్లలో ‘కోడ్ లేయర్స్’ ఒకటి.కోలాబరేటివ్ కాన్వాస్లో డిజైన్ ఎలిమెంట్స్ను ఇంటరాక్టివ్ కోడ్–బేస్డ్ కంపోనెంట్స్గా కన్వర్ట్ చేయడానికి యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. డిజైనర్లు, డెవలపర్లు,ప్రాడక్ట్ టీమ్లకు ఉపయోగపడేలా ఈ ఫీచర్ని డిజైన్ చేశారు. ‘ఫిగ్మా మోషన్’ పేరుతో కొత్త యానిమేషన్ సిస్టమ్ను కూడా పరిచయం చేశారు.షేడర్ ఫీల్స్, ఎఫెక్ట్స్లతో తన ఏఐ టూల్ కిట్ను కూడా విస్తరిస్తోంది ఫిగ్మా. టెక్ట్స్ప్రాంప్ట్స్, రిఫరెన్స్ ఇమేజ్లతో యూజర్లు విజువల్ ఎఫెక్ట్స్ను సృష్టించవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ప్రాంప్ట్స్ ఉపయోగించడం ద్వారా కస్టమ్స్ టూల్స్ను క్రియేట్ చేసే ‘జెనరేటివ్ ప్లగిన్స్’ ఫీచర్ను కూడా ప్రకటించింది ఫిగ్మా. -
ఇది సైనేడ్తో సమానం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల విచారణ సందర్భంగా కృత్రిమ మేధ(ఏఐ) సృష్టించిన కల్పిత తీర్పు కాపీలను ఆధారంగాచేసుకుని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్(ఎన్సీఎల్టీ) ఇటీవల ఒక తీర్పు ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తంచేసింది. న్యాయస్థానాల్లో ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సష్టించిన తప్పుడు తీర్పులను న్యాయవాదులు కోర్టుల ముందుంచడం వృత్తిపరమైన దు్రష్పవర్తన కిందకే వస్తుందని తేల్చిచెప్పమంది.అలాగే, వాటిపై ఆధారపడి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోవడం తీవ్రమైన తప్పిదమని, అటువంటి తీర్పులు చట్టం దృష్టిలో ఏమాత్రం చెల్లవని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కృత్రిమమేధ సృష్టించిన తీర్పు కాపీని ఎన్సీఎల్టీ వాస్తవమైన తీర్పుగా భావించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటివి చేయడమంటే చట్టానికి మిౖథెల్ ఐసోసైనేట్(సైనేడ్)ను ఇచ్చినట్లు అవుతుంది. ఇవి చట్టం, న్యాయవ్యవస్థలోకి చొరబడితే ఇవి చొరబడినట్లుకూడా ఎవరూ కనిపెట్టలేరు.గుర్తించడానికి వీల్లేకుండా అదృశ్యంగా, అంతర్గతంగా ఉంటూ అత్యంత దారుణాలకు కారణమవుతాయి. ఇవి న్యాయవ్యవస్థను కలుషితం చేయడమేకాదు యావత్ న్యాయవ్యవస్థ అంకితభావంలోని ఆత్మను చంపేస్తాయి’’అని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ‘‘అసలు ఇలాంటి తీర్పు నిజంగా ఉందో లేదో సరిచూసుకోకుండా న్యాయవాదులు తమ కేసుల పత్రాలకు వీటిని జతచేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. ఇలాంటి వాటిని కోర్టులు ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇలాంటి కల్పిత, ఊహాత్మక, ఊహాజనిత తీర్పు కాపీలను వాస్తవమైనవిగా భావించి న్యాయమూర్తి సైతం తీర్పు చెబితే అక్కడ సైతం న్యాయవితరణ లోపించినట్లే భావించాలి. కోర్టుల దృష్టిలో ఇలాంటి తీర్పులు అసలు తీర్పులే కావు. ఇలాంటి కల్పిత తీర్పు కాపీలు న్యాయవ్యవస్థలో చొరబడితే న్యాయవ్యవస్థ పవిత్రతకు భంగం వాటిల్లుతుంది’’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మార్గదర్శకాలు రూపొందించండి న్యాయ నిర్ణయ ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు, తప్పుల తడకగా ఉన్న కల్పిత తీర్పుల ఆధారంగా ముంబైలోని ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉనికిలో లేని ఏఐ కల్పిత తీర్పులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే న్యాయవాదులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలతో సహా కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోని కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత విద్యావ్యవస్థ మాత్రం పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారలేక కొట్టుమిట్టాడుతోంది. యూకేకు చెందిన గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ కంపెనీ క్యూఎస్ తాజాగా విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో విశ్వవిద్యాలయాల విద్య, మారుతున్న శ్రామిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల లభ్యత ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో.. భారత్ 89.4 స్కోర్తో స్వీడన్, జపాన్లను వెనక్కినెట్టి 13వ స్థానంలో నిలిచింది. అలాగే భవిష్యత్తు ఉద్యోగాల సన్నద్ధతలో భారత్ 5వ స్థానం సాధించింది. కానీ అదే సమయంలో మన కాలేజీలు మాత్రం ఇంకా పాత సిలబస్తోనే విద్యార్థులను బయటకు పంపుతున్నాయి. ఫలితంగా పరిశ్రమలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నా.. వాటికి సరిపోయే నైపుణ్యాలు గల అభ్యర్థులు దొరకడం లేదు. భారతీయ సాంకేతిక గ్రాడ్యుయేట్లపై పరిశ్రమలకు నమ్మకం క్రమంగా తగ్గుతోందని క్యూఎస్ గ్లోబల్ ఎంప్లాయర్ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారతీయ విద్యాసంస్థల ఎంప్లాయర్ రెప్యుటేషన్ స్కోర్ 2017లో 997గా ఉండగా 2026 నాటికి అది ఏకంగా 2,132కి (స్కోర్ పెరిగేకొద్దీ నాణ్యత తగ్గినట్టు) పడిపోయింది. వలసల ముప్పు.. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా శ్రామిక శక్తిని, విద్యార్థులను విదేశాలకు పంపుతున్న దేశం. 2030 నాటికి దాదాపు 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోనున్నట్లు అంచనా. ఈ పరిణామం మేధో వలసల ముప్పును తెచ్చిపెడుతోంది. దేశంలోని ప్రతిభావంతులను ఇక్కడే నిలుపుకుంటూ స్థానికంగా ఉన్న కోట్లాది మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. డ్రాగన్తో పోటీ.. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్–2027లో 92.5 స్కోర్తో చైనా 7వ స్థానంలో ఉంది. చైనా ఏటా లక్షలాది మంది స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. వారంతా నేరుగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లోకి, సాంకేతిక సంస్థల్లోకి ప్రవేశించేలా అక్కడ పటిష్టమైన యంత్రాంగం ఉంది. దీనివల్ల వారి స్కిల్స్ అలైన్మెంట్ స్కోరు 98.0గా ఉంది. అయితే భారీ మౌలిక వసతులు ఉన్నప్పటికీ చైనా ఫ్యూచర్ ఆఫ్ వర్క్ సూచీలో 80.2 స్కోరుతో వెనుకబడింది. చైనాలో ఇప్పటికీ తయారీ, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు. ఏఐ విప్లవం వల్ల ఈ ఉద్యోగాలన్నీ ఆటోమేషన్కు గురై భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చైనాతో పోలిస్తే భారత్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విభాగంలో 96.0 స్కోరుతో మెరుగ్గా ఉంది. మన సేవా రంగం, ఐటీ రంగాలు ఏఐ ద్వారా భర్తీ చేసేవి కావు. పైగా ఏఐతో కలిసి నడిచేవి. కానీ చైనాలాగా గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకునే స్కిల్స్ అలైన్మెంట్ మనకు లేకపోవడం లోటుగా మారుతోంది. ఈ విభాగంలో 82.7 స్కోర్తో 18వ స్థానానికి పరిమితమైంది. ఎందుకంటే.. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాణిస్తూ ప్రపంచ అత్యుత్తమ 250 వర్సిటీల జాబితాలో చోటు సంపాదిస్తుంటే దేశంలోని మిగిలిన వెయ్యికిపైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకుపైగా కాలేజీలు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి తప్ప ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలను అందించలేకపోతున్నాయి. కంపెనీలు వెతుకుతున్న ప్రధాన నైపుణ్యాలు ఇవే – సమస్యలను విశ్లేషించడం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత. భారతీయ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉందని టాప్ కంపెనీలు చెబుతున్నాయి. – ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ లేకపోవడం కూడా అడ్డంకిగా మారుతోందని అంటున్నాయి. – వ్యాపార దృక్పథంతో ఆలోచించడం, రిస్క్ తీసుకునే తత్వం తదితర లక్షణాలున్న ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. -
వాహనదారులూ జాగ్రత్త.. లేదంటే ఏ'ఐ’ పట్టేస్తుంది!
వాహనదారులూ జాగ్రత్త..ఇక మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ‘ఏఐ’ పట్టేస్తుంది. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అనుకుని..మీరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఇక నడవదు. మీ ఉల్లంఘనలను ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. చలాన్ వడ్డిస్తాయి. ఆ సమాచారం మీకు నేరుగా వాట్సప్ ద్వారానో..మెసేజ్ రూపంలోనో..మెయిల్గానో వచ్చేస్తుంది. – సాక్షి, హైదరాబాద్ట్రాఫిక్ విభాగంలోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని మల్కాజ్గిరి పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు బేగంపేటలో రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్ట్ను నిర్వహించిన పోలీసులు..సత్ఫలితాలు రావడంతో కమిషనరేట్లో అమలు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులను ఆయా రోడ్లపై ఉన్న ‘ఏఐ సీసీటీవీ కెమెరాలు’ గుర్తించి..వివరాలను నేరుగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ సర్వర్కు పంపిస్తాయి. అక్కడున్న సిబ్బంది ట్రాఫిక్ ఉల్లంఘన, ప్రమాదం తీరు, వాహనం నంబర్, యజమాని వివరాలు తదితరాలను విశ్లేషించి.. యాక్సెప్ట్ చేయగానే నేరుగా వాహనదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు మెసేజ్, వాట్సాప్ రూపంలో అలాగే ఈ–మెయిల్ ఐడీలకు మెయిల్ రూపంలో చలాన్ వెళ్లిపోతుంది.1.27 లక్షల కేసులు.. రూ.6.73 కోట్ల జరిమానాఅన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఒకేసారి దృష్టిపెట్టడంతో వాహనదారులకు అవగాహన రావడం లేదని భావించిన పోలీసులు.. ప్రతి రోజూ ఒకట్రెండు ఉల్లంఘనలు తీసుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల్లో కమిషనరేట్ పరిధిలో 1,27,760 కేసులు నమోదు కాగా.. రూ.6.73 కోట్ల జరిమానాలు విధించారు. వీటిల్లో అత్యధికంగా అక్రమ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ ఉల్లంఘనలు ఉన్నాయి.కీలక ప్రాంతాల్లో 75 కెమెరాలుబేగంపేటలో రెండు బహుళ జాతి కంపెనీల సాంకేతిక, నిధుల సహాయంతో నాలుగు సీసీటీవీ కెమెరాలకు ఏఐ జోడించి, రెండు నెలలు పరీక్షించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాల తీరు, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు గుర్తించడంలో సత్ఫలితాలొచ్చాయి. దీంతో మల్కాజ్గిరి కమిషనరేట్లోని కీలక కూడళ్లు, ప్రాంతాలలో 75 కెమెరాలకు ఏఐ జోడించి, వినియోగించుకోనున్నారు. ఈ ఏఐ ట్రాఫిక్ పోలీసు విభాగంలోకి ఇటీవల కొత్తగా నియమితులైన ఎస్ఐలలో బీటెక్, ఎంటెక్ చదివిన వారిని తీసుకోనున్నారు.వారి సేవలు ఇతర విభాగాల్లో.. ఇప్పటివరకు రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనదారులను పట్టుకునేందుకు క్షేత్ర స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు ఉండేవారు. ఇక నుంచి ఏఐ ట్రాఫిక్ చలాన్లు జారీ చేయనుండటంతో.. సిబ్బంది సేవలను రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ఇతర విభాగాలలో వినియోగించుకోనున్నాం. – రాహుల్ రెడ్డి, డీసీపీ, ట్రాఫిక్–1, మల్కాజ్గిరి -
‘ఏఐ’తో ‘ఆట’లొద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, సమాచార రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. మన దేశంలోనూ ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే–2024 ప్రకారం భారతీయుల్లో 65 శాతం మంది జనరేటివ్ ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచ సగటు 31 శాతంతో పోలిస్తే రెండింతలకంటే ఎక్కవ. విద్యార్థులకు పాఠాలు అర్థం చేసుకోవడం, సందేహాల నివృత్తి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఏఐ ఉపయోగపడుతోంది. అదే సమయంలో పిల్లల మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తి, సృజనాత్మకత, గోప్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావాలు చూపుతోంది. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్ 2025’ అధ్యయనం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ముగ్గురిలో ఒకరు వారి వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగాలను ఏఐతో పంచుకుంటున్నారు. ఏఐతో వ్యక్తిగత విషయాలు చర్చించిన వారిలో 25 శాతం మంది ‘మనుషుల కంటే ఏఐ నన్ను బాగా అర్థం చేసుకుంటుంది’ అని భావిస్తున్నారు.ఆలోచనా శక్తిపై ప్రభావంఇదే సర్వేలో మరో ఆందోళనకర అంశం బయటపడింది. ఏఐ గురించి తెలిసిన పిల్లల్లో 75 శాతం మంది ఏఐ పనితీరుపై అవగాహన లేక దాన్నొక సెర్చ్ ఇంజిన్లా భావిస్తున్నారు. అలాగే 46 శాతం కుటుంబాలు ఏఐ వల్ల తప్పుడు సమాచారం (మిస్ఇన్ఫర్మేషన్) వచ్చే ప్రధాన ప్రమాదమని పేర్కొన్నాయి. ఏఐ వెంటనే సమాధానాలు అందించడం వల్ల పిల్లలు స్వయంగా ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలను కోల్పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. హోంవర్క్, ప్రాజెక్టులు, వ్యాసాలు అన్నింటికీ ఏఐపై ఆధారపడితే సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం దెబ్బతినే అవకాశం ఉంది. యునిసెఫ్ నివేదికల ప్రకారం.. ఏఐ చాట్బాట్లతో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరితనం, భావోద్వేగ సంబంధాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.‘ఏఐ’ రూపంలో కొత్త ముప్పుఏఐ అందించే సమాచారం ఎల్లప్పుడూ సరైనదే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాస్తవాలకు విరుద్ధమైన లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని కూడా అందించవచ్చు. చిన్నారులు దానిని నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అలాగే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, చాటింగ్ డేటా వంటి సమాచారాన్ని ఏఐ ప్లాట్ఫారమ్లలో పంచుకోవడం వల్ల గోప్యత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీతో డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలు సృష్టించడం సులభమవుతోంది. అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 33 శాతం మంది టీనేజర్లు వారి అనుమతి లేకుండా వారి ఫొటోలను ఉపయోగించి డీప్ఫేక్ చిత్రాలు రూపొందించారని తెలిపారు. అలాగే 54 శాతం మంది ఇలాంటి కంటెంట్ను అందుకున్నట్లు చెప్పారు. యూకేలో 8 నుంచి 12 సంవత్సరాల పిల్లల్లో దాదాపు 22 శాతం మంది ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. 40 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలకు ఏఐ భద్రత గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ వివరించలేదు. ఏఐ వాడే పిల్లల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆరోగ్యం లేదా శరీరానికి సంబంధించిన సలహాల కోసం చాట్బాట్లను ఆశ్రయిస్తున్నారు. ఆరుగురిలో ఒకరు (సుమారు 17 శాతం) ఏఐ ద్వారా అనుచిత కంటెంట్ చూశామని తెలిపారు.ఈ నేపధ్యంలో పిల్లల విద్య, మానసిక అభివృద్ధిపై ప్రభావం ఉంటుందనే ఆందోళనతో కొన్ని దేశాలు పాఠశాలల్లో ఏఐ వినియోగంపై నియంత్రణ విధించాలని భావిస్తున్నాయి. కానీ ఏఐను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు. పిల్లలు దానిపై పూర్తిగా ఆధారపడకుండా, ఇతర మంచి విషయాలవైపు మళ్లేలా వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాగే తప్పుడు సమాచారం, గోప్యత, డీప్ఫేక్ ముప్పుల గురించి అవగాహన కల్పించడం అవసరం. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును మార్చగల శక్తివంతమైన సాధనం. అయితే నియంత్రణ లేకుండా వినియోగిస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.భారత్ సర్వే ఫర్ ఎడ్టెక్–2025 అధ్యయనం ప్రకారం ఏఐ వినియోగం ఇలా..జనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగిస్తున్న విద్యార్థులు – 35 శాతంవీరిలో సందేహాల నివృత్తికి – 73 శాతంకొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి – 48 శాతంపరీక్షల సన్నద్ధతకు – 32 శాతంఅమెరికాలో కామన్సెన్స్ మీడియా 2026 అధ్యయనం ప్రకారం..9 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో ఏఐ వినియోగిస్తున్న వారు – 86 శాతం వీరిలో నిత్యం ఏఐతో మమేకమయ్యే వారు – 25 శాతంఏఐ కంపానియన్ చాట్బాట్ల ఉపయోగించే టీనేజర్లు – 72 శాతంరోజూ వాటితో మాట్లాడేవారు – 13 శాతం -
ఏఐతో ట్రాఫిక్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిజికల్ ఇంటెలిజెన్స్ను వినియోగించేందుకు వీలుగా హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్, దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అనలాగ్ ఏఐ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టేందుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నాయి. ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అనలాగ్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మేఘా ఇంజనీరింగ్ ఎండీ పి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. భాగ్యనగరంలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐ సాంకేతికతతో అనుసంధానించాలని సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ట్రాఫిక్ రద్దీకి, వాతావరణ మార్పులకు అనుగుణంగా సిగ్నళ్లు పనిచేసే విధానాన్ని తీసుకురావాలని కోరారు. భవిష్యత్తు తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాలు,ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల అభివృద్ధికి అనలాగ్ ఏఐ, మేఘా ఇంజనీరింగ్ భాగస్వామ్యంలో చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశంలో కృష్ణారెడ్డి, కిప్మాన్ సీఎంకు వివరించారు. ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా నియంత్రణకు చర్యలు తీసుకోవడం, నీటి లీకేజీని గుర్తించి పైపులైన్ల మరమ్మతుల నిర్వహణకు ముందస్తు సూచనలు చేయడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వాడకం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలకు దారి ఇవ్వడం వంటి కాగ్నిటివ్ సిటీ సదుపాయాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను అనలాగ్ ఐఏ సీఈఓ కిప్మాన్ రేవంత్రెడ్డికి వివరించారు. నగర సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు. నగరంలో అడ్వాన్స్డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సెన్సార్లు, రొబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ పరికరాల వినియోగంతో సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే నగర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల అవసరాలకు తగ్గట్లు ప్రభుత్వాల పనితీరు సామర్థ్యం పెంపు, పౌర సేవల మెరుగుదల, డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళిక తయారీకి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఎలా దోహదపడుతుందో ఇరు సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఎం.ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ బి.అజిత్రెడ్డి పాల్గొన్నారు. -
టాలీవుడ్లో ఫస్ట్ ఏఐ మూవీ.. ఆసక్తిగా పోస్టర్
తెలుగు సినీ పరిశ్రమలో వస్తోన్న పూర్తిస్థాయి తొలి ఏఐ మూవీ 'అంబాస్ రివెంజ్'. ఈ సినిమాకు జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని పూర్తిగా ఏఐ విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిస్తున్నారు. ఏఐ డిజైన్ డెవలప్మెంట్ను 'కాలై విజువల్ స్టూడియోస్' అందిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పూర్తి స్థాయి కృత్రిమ మేధ సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా అంబాస్ రివెంజ్ నిలవనుంది.భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని దర్శకుడు జయవర్ధన్ తెలిపారు. ఈ చిత్ర నిర్మాణంలో పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని.. ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించి వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ఈ టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు జయవర్ధన్ వెల్లడించారు. టాలీవుడ్లో ఫస్ట్ టైమ్ ఏఐ ఆధారిత మూవీ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. -
చిన్న రోబో అడిగిన ప్రశ్న.. ఏఐ జమానాలోనూ జవాబు లేదు!
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అంటే ఊహలకు రెక్కలు తొడిగిన కథలు గుర్తొచ్చేవి. ఎగిరే కార్లు, అంతరిక్ష యుద్ధాలు, భవిష్యత్తు నగరాలు... అలాంటి కలల ప్రపంచమే ఆ తరహా సినిమాల ప్రత్యేకత. కానీ కాలం మారింది. ఇప్పుడు కృత్రిమ మేధస్సే(AI) ప్రపంచాన్ని నడిపిస్తోంది. మనతో మాట్లాడుతోంది. మనకోసం రాస్తోంది. చిత్రాలు గీస్తోంది. సంగీతం సృష్టిస్తోంది. మనిషి చేసే పనుల్లో చాలావరకు తనదైన ముద్ర వేస్తోంది. అయితే..ఈ అద్భుతాలన్నింటి మధ్య ఇప్పటికీ సమాధానం దొరకని ఒక ప్రశ్న ఉంది.. ప్రేమను కూడా సృష్టించగలమా?. ఆ ప్రశ్నను ప్రపంచం ముందు పాతికేళ్ల క్రితమే నిలబెట్టింది A.I. Artificial Intelligence అనే ఆంగ్ల చిత్రం. ఇది యంత్రాల గురించి తీసిన సినిమా కాదు. మనిషిలా ప్రేమించాలనుకున్న ఒక చిన్నారి గురించి చెప్పిన కథ. రక్తమాంసాలు లేని శరీరంలోనూ మనసు ఉంటే ఎలా ఉంటుందో చూపించిన అరుదైన చిత్రం. సాంకేతిక అద్భుతాల కన్నా భావోద్వేగాలకే పెద్దపీట వేసిన సినిమా. ఈ కథ వెనుక కూడా ఒక కథే ఉంది.ఎన్నో ఏళ్ల పాటు ఈ ఆలోచనను తనలో మోసిన దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్. ఒక రోబో బాలుడు తన తల్లి ప్రేమ కోసం వెతికే కథ ఆయనకు ఎంతో నచ్చింది. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కథను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించడం సాధ్యం కాదని భావించి, దాదాపు రెండు దశాబ్దాల పాటు దానిపై పరిశోధన చేశారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురాకముందే ఆయన వెళ్లిపోయారు(1999). ఆ కలను ఆయన సన్నిహితుడు, మరో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ Steven Spielberg తన భుజాలపై వేసుకున్నారు. ఒకరి ఆలోచన, మరొకరి హృదయం కలిసినప్పుడు పుట్టిన చిత్రమే A.I. Artificial Intelligence.2001 జూన్ 29న A.I. Artificial Intelligence రిలీజ్అయ్యింది. జులై మొదటి వారంలో భారత్లో విడుదలయ్యింది. విడుదలైన రోజున ఈ చిత్రాన్ని అందరూ అర్థం చేసుకోలేదు. కొందరికి ఇది చాలా నెమ్మదిగా అనిపించింది. మరికొందరికి ముగింపు భారంగా అనిపించింది. కానీ మంచి కళకు కాలమే న్యాయనిర్ణేత. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ సినిమాకు అభిమానులు పెరిగారు. నేడు ప్రపంచ సినీ చరిత్రలో భావోద్వేగానికి కొత్త అర్థం చెప్పిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చాలామంది "కుబ్రిక్ మేధస్సు, స్పీల్బర్గ్ హృదయం కలిసిన చిత్రం" అని అభివర్ణిస్తారు. ఈ కథలో డేవిడ్ అనే చిన్న రోబో ఉంటాడు. చూడటానికి పిల్లాడే. మాట్లాడతాడు. నవ్వుతాడు. ఏడుస్తాడు. కానీ అతడిని మిగతా యంత్రాలన్నింటి నుంచి వేరు చేసింది ఒక్కటే. అదే.. ప్రేమించే గుణం. అయితే ఒక కుటుంబం అతడిని తమ బిడ్డగా అంగీకరిస్తుంది. అతడు కూడా ఆ మహిళను యజమానిగా కాదు... అమ్మగా భావిస్తాడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు. ఎలాంటి లెక్కలు ఉండవు. ఒక చిన్నారి హృదయం మాత్రమే ఉంటుంది. కానీ జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. పరిస్థితులు అతడిని ఆ ఇంటి నుంచి దూరం చేస్తాయి. అయినా అతడు వదిలిపెట్టడు. అమ్మ మళ్లీ తనను దగ్గరకు తీసుకుంటుందనే ఆశతో ప్రయాణం మొదలుపెడతాడు. అక్కడే ఈ సినిమా మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ప్రయాణం ఒక రోబోది కాదు. ప్రేమ కోసం ఎదురుచూసే ప్రతి మనిషిది.ఈ చిత్రం విడుదలైనప్పుడు కృత్రిమ మేధస్సు అనేది కొద్దిమంది శాస్త్రవేత్తల చర్చల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే ప్రతి ఇంట్లోకి వచ్చింది. ప్రతి చేతిలోని ఫోన్లో ఉంది. ప్రతి కార్యాలయంలో ఉంది. మన జీవితంలో భాగమైపోయింది. కానీ ఎంత మారినా... డేవిడ్ అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే నిలిచిపోయింది. ఒక యంత్రం నిజంగా ప్రేమిస్తుందా? లేక ప్రేమిస్తున్నట్లు మాత్రమే కనిపిస్తుందా?చాలా సినిమాలు యంత్రాలు ప్రపంచాన్ని జయిస్తాయని ఊహించాయి. ఈ సినిమా మాత్రం ప్రపంచం ఒక చిన్న యంత్రాన్ని ఎలా ఒంటరిగా వదిలేసిందో చూపించింది. అందుకే కాలం గడిచినా దీని విలువ ఏమాత్రం తగ్గలేదు. ఇది భవిష్యత్తును ఊహించినందుకు గొప్ప సినిమా కాదు. భవిష్యత్తులో మనిషి ఏం కోల్పోవచ్చో ముందే హెచ్చరించిన సినిమా కాబట్టే గొప్పది. -
డేటా సెంటర్లపై బేజారు
చార్లీ చాప్లిన్ అద్భుత దృశ్యకావ్యాల్లో ఒకటైన ‘గోల్డ్ రష్’ నిరుడు శతవసంతాలు పూర్తిచేసుకుంది. 1890ల్లో కెనడాలోని క్లోన్డైక్ ప్రాంతంలో బంగారం గనులున్నాయని వెల్లడై ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది జనం అక్కడికి పరుగులు తీయడం, పోటీపడటం కథాంశం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కృత్రిమ మేధ(ఏఐ)కి సంబంధించిన డేటా సెంటర్లలో పెట్టుబడుల్ని ఆకర్షించటానికి అలాగే పరుగులు తీస్తున్నాయి. నిరుడు అక్టోబర్లో ప్రపంచ ఆర్థిక ఫోరం విడుదల చేసిన విశ్లేషణ డేటా సెంటర్ల సామర్థ్యం మరో నాలుగేళ్లలోనే మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో తీవ్ర ఉష్ణోగ్రతలు, కరువుకాటకలు, ఇతర వాతావరణ దుష్ఫలితాల కారణంగా డేటా సెంటర్ల వార్షిక ఖర్చులు 2035కు 8,100 కోట్ల డాలర్లనుంచి 2065 నాటికి 16,800 కోట్ల డాలర్లకు పెరుగుతాయని అంచనా వేసింది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ నిర్వహించటానికి... ఓటీటీలు, యూట్యూబ్వంటి వాటికోసం లైబ్రరీల నిర్వహణకూ, ఇతరేతర వినియోగానికీ డేటా సెంటర్లున్నాయి. ఏఐ రాకతో ఇవి మరింతగా పెరుగుతున్నాయి. డేటా సెంటర్ల విస్తరణతోపాటే వాటికి సంబంధించిన అవగాహన మొదలైంది. వాటివల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఆన్లైన్ సెర్చ్లతో పోలిస్తే ఏఐ ఆధారిత సెర్చ్లు పది రెట్లు అధిక విద్యుత్ను తీసుకుంటున్నా యని గణాంకాలు తేల్చాయి. ఈమధ్య విడుదలైన ఐక్యరాజ్యసమితికి చెందిన యూనివర్సిటీ అధ్యయన నివేదిక డేటా సెంటర్లను చల్లబరచడానికి బిలియన్లకొద్దీ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డేటా సెంటర్ల వల్ల తాగునీటి హక్కులకూ, వ్యవసాయానికీ తీవ్ర విఘాతం కలుగుతోందని హెచ్చరించింది. వీటిని అనుమతించే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పునరుత్పాదక ఇంధన వనరు లున్న ప్రాంతాలనే ఎంచుకునేలా చూడాలని సూచించింది. వినియోగిస్తున్న నీరు ఆవిరయ్యే ప్రస్తుత విధానానికి బదులు నీటి అవసరం లేని ఎయిర్ కూలింగ్, లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్వైపు మారేలా డేటా సెంటర్లపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. డేటా సెంటర్లు తాము వినియోగించే నీరు, విద్యుత్ ఎంతో... విడుదలయ్యే కర్బన ఉద్గారాల పరిమాణం ఎంతో తెలిపే డేటాను అందరికీ అందుబాటులో ఉంచేలా నిబంధనలు రూపొందించాలని తెలిపింది. డేటా సెంటర్లపై అక్కడక్కడా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఈ సెంటర్లు పెరగటాన్ని నిరసిస్తూ ఉద్యమాలు జరగటంతో కొత్తవాటిపై కఠిన మైన ఆంక్షలు విధించారు. నెదర్లాండ్స్లో కూడా రైతులు, పర్యావరణవేత్తలు ఆందోళ నలు చేశారు. దాంతో హైపర్స్కిల్ డేటాసెంటర్ల నిర్మాణాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. సింగపూర్లో పర్యావరణహిత సెంటర్లకు పరిమితమైన అనుమతు లిస్తున్నారు. చిలీలో డేటా సెంటర్ ఏర్పాటుపై జనం తిరగబడటంతో గూగుల్ సంస్థ గాలితో చల్లబరిచే సాంకేతికత దిశగా ప్రాజెక్టును డిజైన్ చేసుకుంది. ఏడాదిలో 365 రోజులూ వేలాది సర్వర్ రాక్లూ, డిజిటల్ డేటాను భద్రపరిచే హార్డ్ డ్రైవ్లూ, నెట్వర్కింగ్ పరికరాలూ, లక్షలసంఖ్యలో యూపీఎస్లు పనిచేస్తుండటంవల్ల వాటిని చల్లబరచటానికి నిరంతరాయంగా నీరు అవసరమవుతుంది. భారీగా విద్యుత్ కావలసివస్తుంది. ఇక ఆ సెంటర్లలోవాడే భారీ కూలింగ్ ఫ్యాన్లు , ఇండస్ట్రియల్ ఏసీల వల్ల ఒకరకమైన ధ్వని తప్పదు. పగలు ఇతర చప్పుళ్లతో ఇది కలిసిపోయినా, రాత్రివేళల్లో మూడు నాలుగు కిలోమీటర్ల మేర ఈ ధ్వని వినబడుతుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో, అమెరికాలోని వర్జీనియాలో కేవలం ఈ కారణం వల్లే స్థానికులు కోర్టులకెక్కారు. ప్రజల ఒత్తిళ్లతో ఈమధ్య కాలిఫోర్నియాలోని ఒక మున్సిపాలిటీ కొత్త డేటా సెంటర్లపై నిషేధం విధించింది. వీటన్నిటి నేపథ్యంలో నీటి అవసరం పెద్దగా లేని సాంకేతికతలు వస్తున్నాయి. ఏఐ ఆధారిత సాంకేతికత ద్వారా ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వినియోగించకుండా కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వాలు పారదర్శకంగా వ్యవహరిస్తే, ఆ సెంటర్లు వినియోగించే పర్యావరణహిత సాంకేతికతల సమాచారాన్నీ, వాటి ఉద్గారాల పరిమాణాన్నీ ప్రజలకూ, పర్యావరణవేత్తలకూ అందుబాటులో ఉంచితే ప్రజల్లో ఉండే ఆందోళన తగ్గుతుంది. -
డేటా దండుపాళ్యం.. మీపై స్మార్ట్ నిఘా!
టెక్నాలజీ దూకుడు ఎక్కువయ్యాక ప్రపంచం ‘జగమంత స్మార్ట్ కుటుంబం’ అయిపోయింది. ఇళ్లు, వాకిళ్లు, వంటిళ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఆఖరికి టూత్బ్రష్లను కూడా ఇంట్లోని నెట్ నడిపిస్తోంది. కానీ, ఈ సౌకర్యాలు, సదుపాయాల వెనుక మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్కు చెందిన ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీవో), ‘విచ్’ అనే సంస్థ కలిసి ప్రత్యక్షంగా తమ దేశ పౌరులను, పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.ఏమిటా ప్రమాదం?!డీప్ ఫ్రయింగ్, తందూరీ రోస్టింగ్–గ్రిల్లింగ్, రీహీటింగ్, బేకింగ్, బంగాళా దుంపల చిప్స్.. వీటన్నిటి తయారీకి వంటగదుల్లో మనం వినియోగించే ఎయిర్ ఫ్రయర్లు మన లొకేషన్ను ట్రాక్ చేస్తున్నాయని, మన మాటలను రికార్డ్ చేస్తున్నాయని, ఆ సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు కలకలం రేపాయి. అయితే అవి కేవలం వార్తలు కావని, వాస్తవాలేనని ఐసీవో, విచ్ ఇప్పుడు నిర్ధారణగా ప్రకటించాయి! అలాగే, మన ఇళ్లల్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీలు మనం ఎప్పుడు, ఏమి వీక్షిస్తున్నామో గమనిస్తూ మన వ్యక్తిగత వివరాలను ప్రకటనల కంపెనీలకు విక్రయిస్తున్నాయట!బ్రిటన్ లాంటి దేశాల్లోనే మూడింట ఒక వంతు ప్రజలు ఇంతకాలం తమ డేటా ఎలా చోరీ అవుతోందో కనిపెట్టలేకపోయారు. ఇక మన దేశంలోని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చు! భారత్లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవం తర్వాత కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు కనుక మనపై స్పయింగ్కు సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది.మాటల్నీ రికార్డు చేస్తుంటాయి!టోస్టర్లు, ఎయిర్ ఫ్రయర్ల వంటి స్మార్ట్ పరికరాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండవచ్చని ఐసీవో అప్రమత్తం చేశాక బ్రిటన్ ప్రజల్లో జాగ్రత్త మొదలైంది. అక్కడి జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక స్మార్ట్ పరికరం వాడుతుండగా, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ఆ పరికరాలు వినియోగదారుల నుంచి సేకరిస్తున్నాయని ‘విచ్’ పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్తో పనిచేసే కొన్ని ఎయిర్ ఫ్రయర్లు, ‘ఆన్’ చేయగానే వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ అడుగుతాయి. అంతేకాదు వారి ఫోన్ల ద్వారా ఆడియోను (మాటలను) కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరింతగా మెరుగైన సేవల్ని అందించటానికి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటామని ఆ గాడ్జెట్లు చెబుతుంటాయి. అయితే అవి, తాము సేకరించిన సమాచారంలో కొంత భాగాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తున్నట్లు ‘విచ్’ పరిశోధనలో బహిర్గతం అయింది.దినచర్యల వివరాలు సైతం!!‘విచ్’ బ్రిటన్లోని అతి పెద్ద వినియోగదారుల హక్కుల పరిరక్షక, పర్యవేక్షక స్వతంత్ర సంస్థ. ‘‘మీ ఇంట్లో ఉండే గాడ్జెట్లు అన్నింట్లోకీ స్మార్ట్ టీవీ మరీ ప్రమాదకరంగా మారుతోంది. మీరు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఇది సేకరిస్తుంది’’ అని విచ్ చెబుతోంది. ‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఇంట్లోని టీవీలు మీ సమాచారాన్ని పూర్తిగాలాగేస్తుంటాయి’’ అని ఐసీవో రెగ్యులేటరీ రిస్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలయం మాల్కం అంటున్నారు. ‘‘స్మార్ట్ పరికరాలు మన ఆరోగ్యం, మన దినచర్యలు, మన కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి’’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.స్మార్ట్ పరికరాలను తయారుచేసే కంపెనీలు, డెవలపర్ల కోసం ఐసీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సమయంలోనే ఈ తాజా హెచ్చరిక వెలువడింది. వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై కంపెనీలకు ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం వంటి కొన్ని సరైన కారణాల కోసం కొంత సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే ఐసీవో అంగీకరించింది. అయితే స్మార్ట్ పరికరాలు వాటికి నిజంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని, ఆ సమాచారాన్ని ఎలా వాడుతున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాలని, ఆ సమాచారంపై ప్రజలకే నియంత్రణ ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.కొనడం ఆపటం లేదు!ఇంట్లోని స్మార్ట్ పరికరాలు తమ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్న లక్షలాది మంది బ్రిటన్ ప్రజలకే కాదు, మిగతా ప్రపంచదేశాలకూ ఈ నియమాల విధింపు మంచి పరిణామం. బ్రిటన్కి చెందిన 2,000 మందికి పైగా వయోజనులపై ఐసీవో చేసిన సర్వేలో... తమ పరికరాలు సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తమకు తెలియదని మూడింట ఒక వంతు మంది ప్రజలు చెప్పారు.అలాగే, ఒక స్మార్ట్ టోస్టర్ (బ్రెడ్ కాల్చేది) లేదా స్మార్ట్ టూత్బ్రష్ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని సర్వేలో పాల్గొన్నవారిలో ముప్పావు వంతు మంది చెప్పారు. ఈ సమాచార సేకరణ పట్ల తమకు ఆందోళన ఉందని 40 శాతం మంది బ్రిటన్ ప్రజలు చెబుతుండగా, మరికొందరు (15 శాతం మంది) ఇదే కారణంతో ఇలాంటి సాంకేతిక పరికరాలను అస్సలు కొనడం లేదు. అయినప్పటికీ, బ్రిటన్ ప్రజలు తమ ఇళ్లను ఇలాంటి నిఘా పెట్టే పరికరాలతో నింపేయడం మాత్రం ఆపలేదు.పైగా ఈ డేటా సేకరణ వల్ల వచ్చే వినియోగ పరమైన లాభాల కోసం స్మార్ట్ పరికరాలను కొనడానికి సిద్ధంగా ఉన్నామని యూకేలోని దాదాపు సగం మంది వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మాల్కం మాట్లాడుతూ: ‘‘ఈ పరికరాలు మన జీవితాలను సులభతరం చేయడానికి తయారవుతాయి. అంతకు మించి వీటికి మన వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టకూడదు’’ అంటున్నారు.డేటాను లాగి, ఏం చేస్తారు?మనం టీవీలో ఏమేం చూస్తున్నామో పూర్తి వివరాలను తెలుసుకొని, మన అలవాట్లకు సంబంధించిన ఒక పెద్ద నివేదికను తయారు చేయడానికి గాడ్జెట్లు చాలా సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు నచ్చే షోలు లేదా సినిమాలను సూచించడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ప్రకటనలు చూపించటం వరకు పర్వాలేదని, టీవీ తయారీ కంపెనీలు అంతకంటే ముందుగా వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీవో ఆదేశాలు జారీ చేసింది.ఇక గాడ్జెట్ తయారీ కంపెనీలు చట్టాన్ని పాటిస్తున్నాయా లేదా, వినియోగదారులకు నిజమైన పారదర్శకతను అందిస్తున్నాయా లేదా, వారి అనుమతిని నిజంగానే తీసుకుంటున్నాయా లేదా అని పరిశీలించడానికి ‘విచ్’ సంస్థ ఈ ఏడాది చివర్లో ఆయా కంపెనీలతో మాట్లాడనుంది.ఏమైనా, కన్జ్యూమర్ల డేటా చైనా వంటి ప్రమాదకర దేశాలకు చేరడం వల్ల ముఖ్యంగా గోప్యతా ప్రమాదాలు ఉంటాయి. చైనా చట్టాల ప్రకారం అక్కడ ఉండే కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను అక్కడి ప్రభుత్వానికి తప్పనిసరిగా అప్పగించాలి; దీనివల్ల మీ వై–ఫై నెట్వర్క్ వివరాలు, లొకేష¯Œ , డివైజ్ పాస్వర్డ్లు వేరే దేశం చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత ప్రొఫైల్ను బిల్డ్ చేసి, మీ ప్రమేయం లేకుండానే థర్డ్–పార్టీ సంస్థలకు ఆ డేటాను అమ్ముకోవడం లేదా ప్రకటనల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.చైనా సర్వర్లకు మన వివరాలు!విచ్ సంస్థ చేసిన పరిశోధనలో ఐగోస్టార్, షియోమి మి స్మార్ట్, కొసోరి అనే మూడు కంపెనీల ఎయిర్ ఫ్రయర్ల వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ తెలుసుకుంటున్నాయని, యూజర్ల ఫోన్లలోని ఆడియోను రికార్డ్ చేయడానికి అనుమతి అడుగుతున్నాయని తేలింది.షియోమి ఎయిర్ ఫ్రయర్కు సంబంధించిన యాప్... ఫేస్బుక్, పాంగిల్ (ఇది టిక్టాక్ బిజినెస్ ప్రకటనల నెట్వర్క్), చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ వంటి వాటి ట్రాకర్లకు కనెక్ట్ అయి ఉంది. (ఇది వినియోగదారుడు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది). మరోవైపు, ఐగోస్టార్ ఎయిర్ ఫ్రయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే వినియోగదారుల జెండర్, పుట్టిన తేదీని అడుగుతోంది. అంతేకాదు, ఐగోస్టార్, షియోమి ఎయిర్ ఫ్రయిర్లు రెండూ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపించాయి. అయితే ఆ విషయాన్ని వారు తమ ప్రైవసీ నోటీసులో ముందే పేర్కొన్నారు. ఇక కొన్ని స్మార్ట్ స్పీకర్లలో కూడా ఫేస్బుక్, గూగుల్కు సంబంధించిన ఇలాంటి ట్రాకర్లు కిక్కిరిసినట్లుగా నిండి ఉన్నాయి! ‘‘మన లొకేషన్ను ట్రాక్ చేసే ఎయిర్ ఫ్రయర్ల నుండి, మన పుట్టిన తేదీని అడిగే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వరకు... ఈ స్మార్ట్ పరికరాలు వాటికి అవసరమైన దానికంటే లేదా మనం అంగీకరించదగిన దానికంటే చాలా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని మా గత పరిశోధనలు పదే పదే నిరూపించాయి’’ అని విచ్ సంస్థకు చెందిన టెక్ నిపుణుడు ఆండ్రూ లాఫ్లిన్ వెల్లడించారు.‘‘అవసరం లేని సమాచార సేకరణను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు వారి సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడంపై నిఘా సంస్థ (రెగ్యులేటర్) కొత్త మార్గదర్శకాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచి విషయం’’ అని ఆయన అంటున్నారు. ఇక, స్మార్ట్ టీవీలు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారంపై తమకు ప్రత్యేక ఆందోళనలు ఉన్నాయని కూడా ఐసీవో తెలిపింది.స్మార్ట్ వలలో పడకుండా ఐదు చిట్కాలుమీ స్మార్ట్ పరికరాలు మీపై నిఘా పెట్టకుండా కాపాడుకోవడానికి ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ 5 చిట్కాలు చెబుతోంది. కొనడానికి ముందే రీసెర్చ్ (పరిశోధన) చేయండి: మీరు ఏదైనా పరికరాన్ని కొనే ముందే, అది ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుందో సరిచూసుకోండి. ఆ పరికరం అడిగే సమాచారాన్ని దానికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.పర్మిషన్లపై (అనుమతులపై) నియంత్రణ కలిగి ఉండండి: పరికరాన్ని సెటప్ చేసేటప్పుడు, అది ఏయే విషయాలను యాక్సెస్ చేయాలో నియంత్రించడానికి ‘ప్రైవసీ కంట్రోల్స్’ ఉపయోగించండి. ఏదైనా అనుమతి అనవసరం అనిపిస్తే, దానికి అస్సలు అంగీకరించకండి.మీ పరికరానికి భద్రత కల్పించండి: ఇతరులు మీ పరికరాన్ని వాడుకోకుండా ఉండటం కోసం ఒక బలమైన, విభిన్నమైన పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. వీలైనప్పుడల్లా ‘టూ–స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోండి.అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి: సాఫ్ట్వేర్ అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోని సెక్యూరిటీ ప్యాచెస్ కొత్త ముప్పుల నుండి మీ డేటాను రక్షిస్తాయి.పరికరాన్ని వదిలించుకునే ముందు మీ డేటాను పూర్తిగా తుడిచేయండి: మీరు మీ స్మార్ట్ పరికరాన్ని ఎవరికైనా అమ్మేస్తున్నా లేదా పారేస్తున్నా... ముందుగా దాన్ని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్బోట్లకో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం. ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపంచిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు) క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటంఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)సాక్షి, బిజినెస్ -
ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో దాదాపు పావు శాతం పైగా కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ)పై ప్రయోగాలు చేసే దశ నుంచి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వైపు మళ్లాయి. తద్వారా ఆ సంస్థలు ఇప్పటికే ఏఐ సర్వీసుల ద్వారా 10–12 బిలియన్ డాలర్ల ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ న్యూయార్క్ సిటీలో నిర్వహించిన సీఈవోల సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను వారు తోసిపుచ్చారు. ఐటీ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పదే పదే పునరావృతమయ్యే పనులను చేయడం తగ్గుతుందని వివరించారు.. ఏఐ గవర్నెన్స్, అప్లికేషన్ల ఆధునీరణ, సైబర్సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందని నాస్కామ్ తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ 20 లక్షల మంది పైగా ఉండగా, అధునాతన ఏఐలో ట్రైనింగ్ తీసుకున్న వారు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం 85 శాతం టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫాంలు ఉన్నట్లు వివరించింది. ఏజెంటిక్ ఏఐతో టెక్ సేవలకు డిమాండ్ ఏజెంటిక్ ఏఐతో సైబర్సెక్యూరిటీ, గవర్నెన్స్, కార్యకలాపాల ఆధునీకరణ తదితర విభాగాల్లో డిమాండ్ నెలకొంటుందని నాస్కామ్ తెలిపింది. దీనితో 2030 నాటికి టెక్నాలజీ సర్వీసులపై 300 – 400 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించే అవకాశం ఉందని వివరించింది. ఏఐని వినియోగంలోకి తెచ్చే క్రమంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా విస్తరించేందుకు కంపెనీలకు స్పెషలిస్ట్ పార్ట్నర్లు అవసరమవుతారని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. మోడల్స్, అప్లికేషన్స్, డేటా ప్లాట్ఫామ్లు, సైబర్సెక్యూరిటీ నియంత్రణలు, పరిశ్రమ వ్యవస్థలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానించే విశ్వసనీయమైన మోడల్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా కూడా సురక్షితంగా, సమర్ధవంతంగా జరిగేలా చూడటంలోనే ఐటీ సర్వీసుల అసలు సామర్థ్యాలు బైటపడతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కాకుండా డొమైన్ సంబంధ సొల్యూషన్స్ కనుగొనడం, ఫలితాలను కచ్చితంగా డెలివర్ చేయడంపైనే ఐటీ పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నంబియార్ తెలిపారు. బిజినెస్ ప్రాసెస్ సర్వీసులనేవి పనులను రొటీన్గా చేయడం కాకుండా తెలివిగా పూర్తి చేసే విధానాలకు మళ్లుతాయని కాగి్నజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. -
హరప్పా కంటే కొంకణ్ రాతి శిల్పాలు ప్రాచీనమా?
ముంబై: మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో విస్తరించి ఉన్న వేలాది సంవత్సరాల నాటి ప్రాచీన రాతి శిల్పాల (పెట్రోగ్లిఫ్స్) రహస్యాలను ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను ఆశ్రయించింది. ఈ కళాఖండాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి వెనుక ఉన్న చారిత్రక ఆధారాలను వెలికితీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సాంకేతికతను ఉపయోగించనున్నారు. భారతదేశం తరఫున ఈ అరుదైన ప్రాంతానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపును సాధించడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు.హరప్పా నాగరికత కంటే పురాతనమైన శిల్పాలుఈ పెట్రోగ్లిఫ్స్ మహారాష్ట్ర తీర ప్రాంతాలైన రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోని లాటరైట్ పీఠభూములపై లభించాయి. ఇక్కడ రాళ్లపై చెక్కిన తాబేళ్లు, ఏనుగులు, నెమళ్లు, ఖడ్గమృగాల ఆకారాలు అబ్బురపరుస్తున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ శిల్పాలు క్రీస్తుపూర్వం 20,000 నుండి 10,000 సంవత్సరాల నాటివి. అంటే ఇవి హరప్పా నాగరికత కంటే కూడా ఎంతో పురాతనమైనవి. కొంకణ్ ప్రాంతంలోని 107 గ్రామాల్లో దాదాపు 150 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శిల్పాలు, భారతదేశంలోనే ఆదిమానవుల తొలి కళాత్మక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.రంగాన నిలిచిన ఐఐటీ మద్రాస్ సాంకేతికతఈ భారీ శిల్పాలను మానవ రహితంగా డాక్యుమెంట్ చేయడం కష్టతరమైన పని కావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ. 15 కోట్ల బడ్జెట్ను కేటాయించి, నాలుగేళ్ల ప్రాజెక్టును రూపొందించింది. ఈ బాధ్యతను ఐఐటీ మద్రాస్కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ‘ఐఐటీ ప్రవర్తక్’ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కింద డ్రోన్ల ద్వారా హై-రిజల్యూషన్ వైమానిక చిత్రాలను సేకరించి, వాటిని ఏఐ సిస్టమ్స్ ద్వారా విశ్లేషిస్తారు. రాతి ఉపరితలాలు దెబ్బతిన్న చోట ఏఐ సాయంతో వాటిని పునర్నిర్మించి, ప్రపంచంలోని ఇతర పురాతన నాగరికతలతో పోల్చి పరిశోధనలు చేస్తారు.యునెస్కో గుర్తింపే అంతిమ లక్ష్యంఈ శిల్పాల్లో గుర్రాలు, ఎద్దుల ఆకారాలు ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇది అవి వ్యవసాయం, రవాణా యుగానికి పూర్వపు మధ్యరాతి యుగానికి చెందినవని నిరూపిస్తోంది. 2025లోనే ఈ ప్రాంతం యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరినప్పటికీ, శాశ్వత గుర్తింపు కోసం పూర్తి స్థాయి పరిశోధన నివేదిక అవసరం. రాబోయే 2030 నాటికి యునెస్కో తుది నామినేషన్ దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ ఏఐ అధ్యయనాన్ని వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను, పురాతత్వ పరిశోధనలను మిళితం చేస్తూ సాగుతున్న ఈ ప్రయోగం మహారాష్ట్ర ప్రాచీన సంపదను ప్రపంచ వేదికపై నిలపనుంది. -
ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్!
సంవత్సరాలుగా ఫుడ్ డెలివరీ యాప్లు ఒకేరకంగా ఉంటున్నాయి. యాప్ను ఓపెన్ చేసి, రకరకాల రెస్టారెంట్లను బ్రౌజ్ చేసి, మెనూలను పోల్చి, సిఫారసులను స్క్రోల్ చేసి, చివరికి ఒక ఆప్షన్ను ఖరారు చేసుకుంటారు. ఈ మోడల్కు మంచి స్పందన వచ్చినప్పటికీ చిన్న చిన్న నిర్ణయాలను కూడా సుదీర్ఘమైన ప్రక్రియగా మారుస్తుంది.ఈ నేపథ్యంలో క్విక్ రికమెండేషన్ కోసం వచ్చింది ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, ఫుడ్ డెలివరీ కంపెనీ డోర్ డాష్. ఇంక్ వారి సరికొత్త ఏఐ ఫీచర్... ఆస్క్ డోర్ డాష్ రెస్టారెంట్ జాబితాలు, మెనూలు, ఫిల్టర్లను స్క్రోల్ చేయడానికి బదులుగా, తాము ఏమి కోరుకుంటున్నారో కస్టమర్లు చాట్బాట్కు సరళమైన భాషలో చెప్పవచ్చు.యాప్లో ఆర్డర్ చేయడాన్ని నావిగేట్ చేయడంలా కాకుండా, సహజమైన సంభాషణలా అనిపించేలా రూపొందించబడింది. ఫుడ్ ఆర్డర్ చేయడం, కిరాణా సామాను కొనడం, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకోవడం లాంటి పనికైనా మన అభ్యర్థనను ఏఐ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆప్షన్ చూపిస్తుంది. చిత్రాలను అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా చిత్రాల ద్వారా కూడా మన అభ్యర్థనను అర్థం చేసుకోగలుగుతుంది. కస్టమర్లు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.ఒక నిర్దిష్ట రెస్టారెంట్ కోసం వెదకడం, వందలాది ఆప్షన్లను స్క్రోల్ చేయడం వంటివి చేయకుండా, కస్టమర్లు తాము ఏమి కోరుకుంటున్నారో సులభంగా వివరించి, వారి ప్రాధాన్యతను ఆధారంగా సలహాలు తీసుకోవచ్చు. -
అమెజాన్ పెట్టుబడుల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు. డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు. 20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు.. తాజా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది. అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్వర్క్కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్వర్క్ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ.. తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్ప్రైజ్లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. 2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫిజిక్స్వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
మనకు కావాలి ‘ఏఐ రిస్క్ ఫండ్’
సాక్షి స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన కళ్ల ముందే సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిస్తోంది. నిత్యం చేసే పనులు, డేటా విశ్లేషణ వంటి రంగాలను ఏఐ వేగంగా భర్తీ చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా, కాలేజీ పూర్తి చేసుకుని బయటకొచ్చే యువతకు మొదటి ఉద్యో గం సంపాదించడం మునుపటి కంటే సవాలుగా మారవచ్చు. మారుతున్న కాలంలో పిల్లలను కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా మార్చకుండా.. సృజనాత్మకంగా ఆలో చించేలా, సరికొత్త నైపుణ్యాలు పెంపొందించుకునేలా, ఏఐతో కలిసి పనిచేసేలా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు.‘ఏఐ రిస్క్ ఫండ్’ నేటి తరం అత్యవసరం!మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల భవి ష్యత్తు కోసం ‘ఏఐ రిస్క్ ఫండ్’ లేదా ఒక ప్రత్యేకమైన పొదుపు ఖాతాను ఏర్పాటు చేయడం ఇప్పుడు చాలా అవసరం. పిల్లల పెళ్లిళ్లకు, కాలేజీ ఫీజులకు డబ్బు దాచినట్లే.. ఏఐ యుగంలో వారి కెరీర్ స్థిరపడే వరకు ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒక ‘రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్’ అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతాన్ని గమనిస్తే, ఏ కొత్త సాంకేతికత వచ్చినా పాత ఉద్యోగాలను తుడిచేసి, సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, పాతవి పోవడానికి, కొత్తవి పుట్టుకురావడానికి మధ్య కొంత సమయం (ట్రాన్సిషన్ పీరియడ్) పడుతుంది. ఈ లోపు పిల్లలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడకుండా నిలబడడానికి ఈ ‘రిస్క్ ఫండ్’ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఏఐని శత్రువుగా కాదు.. మిత్రుడిగా చూడాలి!ఒకప్పుడు మంచి మార్కులు, పెద్ద డిగ్రీలు ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ నేడు కేవలం మార్కులు సరిపోవు. ఏఐ యుగంలో రాణించాలంటే సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, వినూత్న ఆలోచనలు ప్రాణాధారాలు. పిల్లలు ఏఐని చూసి భయపడకుండా, దానిని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా, ఏఐ నుంచి సరైన సమాధానాలు రాబట్టడానికి ‘సరైన ప్రశ్నలు అడగడం’ అనేది అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారబోతోంది.‘ఏఐ ఫండ్’ వల్ల ముఖ్య ప్రయోజనాలుపిల్లలు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం ఏఐ వల్ల మారిపోతే, వారు తక్షణమే మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని (ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ మొదలైనవి) నేర్చుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. చదువు పూర్తి కాగానే వెంటనే ఉద్యోగం రాకపోయినా, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, తదుపరి కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫండ్ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం వెతకడం కంటే, సొంతంగా ఏఐ టూల్స్ ఉపయోగించి స్టార్టప్లు లేదా సరికొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ పొదుపు మొత్తమే తొలి పెట్టుబడిగా మారుతుంది. -
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్లో ‘స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెటా షాక్.. ఉద్యోగుల డేటా లీక్!
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.ప్రైవేట్ చాట్స్ లీక్ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్క్రిప్షన్లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్ను ఆపేసింది. అయితే.. ఈ లీక్పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యంనిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు! -
భారత్కు సొంత ‘డీప్సీక్’ ఉండాలి
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీపై పట్టు సాధించాలన్నా, అంతర్జాతీయంగా పోటీపడాలన్న భారత్ తనకంటూ సొంతంగా ’డీప్సీక్’లాంటి ఏఐ మోడల్ని తయారు చేసుకుని తీరాలని బ్రోకరేజ్ దిగ్గజం బెర్న్స్టైన్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో అమెరికా లేదా చైనాకు చెందిన ఏఐ మోడల్స్పై ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా మరో దేశంపై ఆధారపడటం వల్ల రిస్క్ లు తప్పవని హెచ్చరించింది. లేటెస్ట్ ఏఐ మోడల్స్ అందరికీ అందకుండా అమెరికా ఇటీవల ఆంక్షలు విధించడమనేది గ్లోబల్గా ఏఐ రేసులో కీలక మలుపని అభివర్ణించింది. అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని (ఎల్ఎల్ఎం) దేశాలు.. వ్యాపారపరమైన లాభాలు తెచ్చిపెట్టే సాఫ్ట్వేర్గా కాకుండా వ్యూహాత్మక అసెట్స్గా పరిగణిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని కూడా నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో భారత్ విదేశీ ఏఐ మోడల్స్పై ఆధారపడుతూ, కేవలం అప్లికేషన్ డెవలప్మెంట్పైనే దృష్టి పెట్టే పక్షంలో భవిష్యత్ తరపు టెక్నాలజీపై నియంత్రణ కోల్పోయే ముప్పు తలెత్తుతుందని బెర్న్స్టైన్ పేర్కొంది. ‘వేరే వాళ్ల దగ్గరనుంచి అప్పుగా తీసుకున్న మోడల్స్ ఆధారంగా భారత్ తన ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేదు. విదేశీ ఎల్ఎల్ఎంల ఆధారంగా అప్లికేషన్లను తయారు చేసేటువంటి ప్రస్తుత వ్యూహం వల్ల భౌగోళిక రాజకీయపరమైన రిస్క్ లను ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. ఏఐ.. కొత్త తరం ఫైటర్ జెట్.. కృత్రిమ మేధ మోడల్స్ని మిలిటరీ అసెట్స్గా బెర్న్స్టైన్ అభివర్ణించింది. సెమీకండక్టర్ పరికరాలు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) నుంచి వినూత్న ఏఐ మోడల్స్ వరకు అధునాతన సాంకేతికతలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ‘ఏఐ అనేది కొత్త తరం ఫైటర్ జెట్‘లాంటిదని పేర్కొంది. ఫౌండేషనల్ మోడల్స్ని వివిధ దేశాలు కేవలం సాఫ్ట్వేర్ ఉత్పత్తులుగా కాకుండా వ్యూహాత్మక వనరులుగా పరిగణిస్తున్నాయని వివరించింది. దేశ భద్రత, ఇతర దేశాలపై ఆర్థికంగా పైచేయి సాధించే కోణంలో వాటిని కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నాయని నివేదిక తెలిపింది. -
భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ ధరలు: కారణం ఇదే!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు దీని ప్రభావం స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై కూడా పడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గ్లోబల్ మార్కెట్లో ఏఐ అభివృద్ధికి అవసరమైన మెమరీ, స్టోరేజ్ చిప్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో వాటి కొరత తీవ్రమైంది. ఈ పరిస్థితి కారణంగా.. భవిష్యత్తులో గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఏఐ మోడళ్ల శిక్షణ, నిర్వహణ కోసం భారీ స్థాయిలో మెమరీ చిప్లు అవసరమవుతున్నాయి. ఈ చిప్లను స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోళ్లు వంటి పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతం.. ఈ మార్కెట్ను ఎస్కే హైనిక్స్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కాగా.. ఏఐ కంపెనీల భారీ కొనుగోళ్లతో చిప్ల ధరలు గణనీయంగా పెరిగాయి.మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ ధరలు పెరగనున్నట్లు టిమ్ కుక్ ఇప్పటికే ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే చిప్ల ఖర్చు నాలుగు రెట్లు పెరిగిందని, ఈ భారాన్ని కంపెనీలు భరించడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం స్మార్ట్ఫోన్ తయారీ ఖర్చులో 8 నుంచి 12 శాతం వరకు మెమరీ చిప్ల కోసం ఖర్చు చేస్తున్నారు. డిమాండ్-సప్లై అసమతుల్యత కారణంగా తయారీదారులు ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప మరో మార్గం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారతీయ వినియోగదారులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చిప్ల ఖర్చు మరింత పెరుగుతోంది. దీంతో ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలపై అదనపు భారం పడుతోంది.రాబోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. చిప్ తయారీ సంస్థలు, తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, కొత్త తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు చిప్ల కొరత కొనసాగవచ్చని, ఫలితంగా గాడ్జెట్ల ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో గ్యాడ్జెట్స్ ధరలు పెరగనున్నట్లు స్పష్టమవుతోంది. -
ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే!ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.వాయిస్ క్లోనింగ్ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్ కూడా ఉంది. రియల్టైమ్లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్ రోబో ధర సుమారు రూ. 4,500. -
అమెరికా ఆదేశాలు.. ఏఐపై ఆంక్షలు!
సాంకేతికాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అభయ్ కరందికర్ వ్యక్తం చేశారు. అమెరికా సర్కారు ఆదేశాలతో ఆంథ్రోపిక్ సంస్థ సంచలనాత్మక అత్యాధునిక ఏఐ మోడళ్ల యాక్సెస్ను ఇతర దేశాల వారికి నిలిపివేసిన సందర్భంలో ఆయన ఈ సూచన చేశారు.ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ మోడళ్లు ఫ్యాబిల్ 5, మైథోస్ 5ను అమెరికాయేతర సంస్థలు, వ్యక్తులు పొందకుండా ట్రంప్ సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఫ్యాబిల్ను గత వారమే ఆంథ్రోపిక్ విడుదల చేయడం గమనార్హం. ‘‘స్థానిక ఏఐ సదుపాయాలు, హార్డ్వేర్ అభివృద్ధిలో భారత్ వెనుకబడి ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర సెమీకండక్టర్ చిప్లు లేదా ప్లాట్ఫామ్ల్లేవు.అమెరికా ప్రభుత్వం సరికొత్త ఎగుమతి నియంత్రణల ఆదేశాల నేపథ్యంలో టెక్నాలజీ అభివృద్ధిలో భారత్ స్వావలంబన సాధించాలి’’అని కరందికర్ పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఏఐ అప్లికేషన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పౌర సేవల్లో ఏఐ అమలు దిశగా నీతి ఆయోగ్ కృషి సాగిస్తుందన్నారు. డిజిటల్ ప్రజా సదుపాయాల అభివృద్ధిలో భారత్ ముందున్నట్టు చెప్పారు. ఫౌండేషన్ ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం 12 స్టార్టప్లకు ప్రభుత్వం సాయమందించినట్టు తెలిపారు. -
జియో మెగా ఐపీఓకు సై!
టెలిక, డిజిటల్ సేవల్లో సంచలనాలు సృష్టిస్తున్న జియో ప్లాట్ఫామ్స్ మెగా ఐపీఓకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 49వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ పబ్లిక్ ఆఫర్ను ప్రకటించారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి జియో అడుగుపెడుతుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లీన్ ఎనర్జీ, కన్జూమర్ వ్యాపారాల్లో భారీ ప్రణాళికలకు రిలయన్స్ తెరతీసింది.ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దిశగా కీలక అడుగుపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్ఫామ్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీఓకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచినట్లు ఏజీఎంలో ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డులకెక్కనున్న ఈ ఇష్యూ ద్వారా జియో రూ.10 ముఖ విలువ గల 27 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా జియో రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ మార్కెట్ విలువను 137 బిలియన్ డాలర్లు దాదాపు (రూ.13 లక్షల కోట్లు)గా లెక్కగడుతున్నారు. జియో టాప్... దేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా రూ.27,870 కోట్ల ఇష్యూతో హ్యుందాయ్ నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇప్పుడు జియో ఇష్యూ పూర్తయితే ఈ రికార్డులన్నీ చెరిపేసి ‘టాప్’లేపనుంది. కాగా, 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓగా కూడా ఇది నిలుస్తుంది.టెలికం టు డిజిటల్ టెక్నాలజీ దిగ్గజం 2016లో సేవలు ప్రారంభించిన జియో.. దశాబ్దకాలంలో దేశ టెలికం స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. భారత్లో మొబైల్ డేటా విప్లవాన్ని తీసుకొచి్చంది. ముఖ్యంగా టెలికం నుంచి.. క్లౌడ్ సరీ్వసులు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లు, ఏఐ ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించి.. పూర్తి స్థాయి డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్గా అవతరించింది. ఏఐ ఇన్ఫ్రాతో పాటు ప్రత్యేకంగా భారత్ కోసం ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ది చేసేందుకు ఎని్వడియాతో 2023లో జియో జట్టుకట్టడం తెలిసిందే. 2026 నుంచి ఏడేళ్లలో ఏఐ కార్యకలాపాల కోసం రూ. 10 లక్షల కోట్లను వెచి్చంచనున్నట్లు కూడా అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే మెటా, గూగుల్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, వంటి దిగ్గజ సంస్థలు 20 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో ప్లాట్ఫామ్స్లో ఆర్ఐఎల్కు 66.43 శాతం వాటా మెజారిటీ వాటా ఉండగా.. మెటా 9.99%, గూగుల్ 7.73% వాటాలను దక్కించుకున్నాయి.ఇక జియో శాటిలైట్ ఇంటర్నెట్...శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్కామ్)లో సరికొత్త విప్లవానికి జియో శ్రీకారం చుడుతోంది. స్వదేశీ సమాచార ఉపగ్రహాలతో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు జియో ప్లాట్ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ‘భారత్ను జియో నేలపై అనుసంధానించింది. ఇక అంతరిక్షం నుంచి కూడా కనెక్ట్ చేయాల్సిన తరుణం వచ్చింది. దేశంలో ఇంకా మారుమూల పల్లెల్లో, ద్వీపాల్లో ప్రజలకు టెలికం సేవలు అందుబాటులో లేవు. అలాంటి వారికి శాటిలైట్ కనెక్టివిటీ వారధిగా నిలుస్తుంది. భారత్ కోసం తక్కువ భూకక్ష్యలో తిరిగే స్వేదేశీ ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని జియో పరిశీలిస్తోంది’ అని ఆకాశ్ చెప్పారు. శాటిలైట్ టెలికం, బ్రాడ్బ్యాండ్ సర్వీసులను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ప్రపంచ దిగ్గజ ఉపగ్రహ నెట్వర్క్ ప్రొవైడర్లతో జట్టుకడతామని, తద్వారా శాటిలైట్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ‘సొంతంగా గ్రౌండ్ స్టేషన్ ఇన్ఫ్రాను నెలకొల్పుతాం. స్పేస్ నుంచి గ్రౌండ్ దాకా పూర్తి స్థాయి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఎకోసిస్టమ్ ఏర్పాటే మా లక్ష్యం. ఈ చర్యలతో అంతరిక్ష రంగంలోనూ భారత స్వావలంభనను జియో బలోపేతం చేస్తుంది’ అని ఆకాశ్ పేర్కొన్నారు. కంపెనీ మొబైల్ యూజర్లందరినీ 2030 నాటికి పూర్తిగా 5జీ నెట్వర్క్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.రిలయన్స్ భవిత భద్రం.. వారసులకు వ్యాపారాల అప్పగింత ప్రణాళిక దాదాపు పూర్తయిందని ముకేశ్ చెప్పారు. ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ప్రస్తుతం గ్రూప్లోని కీలక వ్యాపారాలకు సారథ్యం వహిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను వారే చూసుకుంటున్నారు. టెలికం, రిటైల్, డిజిటల్ సర్వీసులు, న్యూ ఎనర్జీల్లో ప్రధాన బిజినెస్లతో పాటు గ్రూప్ భవిష్యత్తు వృద్ధిని వారే నడిపిస్తారని ముకేశ్ పేర్కొన్నారు. ‘మీ కంపెనీ భవిష్యత్తు.. రిలయన్స్ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే వారి చేతుల్లో భద్రంగా ఉంది’ అని వాటాదారులతో ముకేశ్ చెప్పారు. ప్రస్తుతం ఆకాశ్ టెలికం.. ఇషా రిటైల్ విభాగాలను నడిపిస్తుండగా.. అనంత్ను గతేడాది రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం ద్వారా ఇంధన బిజినెస్లను అప్పగించారు.2030కల్లా అత్యంత చౌకగా ఏఐ ప్రతి భారతీయునికి ఏఐని అత్యంత చౌకగా అందించడమే లక్ష్యమని ఆకాశ్ పేర్కొన్నారు. మొబైల్ డేటా విప్లవం మాదిరే ఏఐలోనూ విజయం సాధిస్తామన్నారు. ‘భారత్ కోసం, భారత్ ద్వారా రిలయన్స్ రూపొందిస్తున్న ఏఐతో భవిష్యత్తులో ప్రపంచానికి కూడా సేవలందిస్తాం. ఇందుకోసం జామ్నగర్లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ సొంత ఏఐ బ్యాక్బోన్ను నెలకొల్పుతోంది. ఈ ఏడాది చివరికల్లా తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ ఇన్ఫ్రా ప్రాజెక్టు సిద్ధమవుతుంది’ అని ఆకాశ్ చెప్పారు. ఇప్పటికే ఏఐ కోసం గూగుల్, మెటాలతో జట్టుకట్టామన్నారు. హెల్త్కేర్, విద్య, వ్యవసాయ రంగాల కోసం ‘జియోభారత్ఐక్యూ’, ‘ఏఐ వ్యాపార్’ వంటి ప్రత్యేక టూల్స్ను ప్రవేశపెడతామని వివరించారు. కాగా, భారత్ కోసం రూపొందించే ఏఐ ప్రాజెక్టుల్లో మన యువ ఇంజినీర్లు పాలుపంచుకోవాలని ముకేశ్ పిలుపునిచ్చారు. ‘ఎక్కడో రూపొందించిన ఏఐని వాడే దేశంగా మనం మిగిలిపోకూడదు. ఏఐ క్రియేటర్గా, దాన్ని అదిపుచ్చుకునే శక్తిగా, ప్రపంచ లీడర్గా ఎదగాలి’ అని పేర్కొన్నారు.ఏజీఎంలో ఇతర ముఖ్యాంశాలు...→ సోలార్ పవర్, బ్యాటరీలు, పవన విద్యుత్, హైడ్రోజన్, కంప్రెస్డ్ బయో గ్యాస్, బయో ఎనర్జీ, కోల్ గ్యాసిఫికేషన్ వంటి రంగాలపై ఫోకస్ చేయడం ద్వారా భారత ఇంధన భద్రతకు దన్నుగా నిలవడంతో పాటు దేశాన్ని గ్రీన్–క్లీన్ ఎనర్జీ దిశగా నడిపిస్తున్నామని ముకేశ్ చెప్పారు. రానున్న కాలంలో ఆయా రంగాల్లో 2 లక్షల కొలువులు లభిస్తాయనేది కంపెనీ అంచనా. → 2025–26లో రిలయన్స్ మీడియా వ్యాపారం రూ.34,917 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జియోహాట్స్టార్ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా ఆవిర్భవించింది. బిలియన్ డౌన్లోడ్ల మార్కును దాటిన తొలి భారతీయ ఓటీటీ సరీ్వసుగా కూడా నిలిచినట్లు ఆకాశ్ చెప్పారు. ఏఐ ఆధారిత కంటెంట్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్... జియోస్టార్ జెన్ఏఐ మీడియా స్టూడియో (జామ్స్)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. → ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 2029–30 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయ మైలురాయి చేరుతుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. అతిపెద్ద దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్నదే తమ లక్షమని చెప్పారు.‘రిలయన్స్ వాటాదారులకు విలువను చేకూర్చడంలో జియో ఐపీఓ ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జియోకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కొత్త ఇన్వెస్టర్లందరికీ భరోసా ఇస్తున్నా’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
భారత్ ఏఐ కలను వెంటాడుతున్న కొత్త విలన్!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని భారత్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. వేల కోట్ల పెట్టుబడులతో కొత్త డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ కంప్యూటింగ్ హబ్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ కలలకు ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించబోతున్న డేటా సెంటర్లపై నిర్వహించిన తాజా అధ్యయనం భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. అది విద్యుత్ కొరతో.. నీటి కొరతో కాదంట.. ఏఐ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్లు, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు.. ఇవన్నీ నడవాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డేటా లోకలైజేషన్ విధానాలు, పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, ఏఐ అవసరాలు దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్గా మార్చే దిశగా నడిపిస్తున్నాయి. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం దేశంలోని డేటా సెంటర్ల పనితీరును తీవ్రంగా దెబ్బతీయొచ్చని ఓ నివేదిక చెబుతోంది. భారత్లో వేగవంతమైన ఏఐ విస్తరణకు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. తాజాగా విడుదలైన ‘‘2026 Global Analysis of Planned Data Centres for Physical Climate Risk and Resilience’’ నివేదిక ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించింది. వాతావరణ ప్రమాదాలపై పరిశోధనలు చేసే ఎక్స్డీఐ (Cross Dependency Initiative - XDI) సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న 2,595 డేటా సెంటర్లను పరిశీలించిన ఈ అధ్యయనం ఒక కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు డేటా సెంటర్ల గురించి చర్చలు ప్రధానంగా విద్యుత్ వినియోగం, నీటి అవసరాల చుట్టూనే తిరిగాయి. కానీ భవిష్యత్తులో అసలు ముప్పు నేరుగా వాతావరణ మార్పుల వల్ల రావచ్చని ఈ నివేదిక చెబుతోంది.భారత్ పరిస్థితి ఏంటి?.. ఈ విశ్లేషణ ప్రకారం వాతావరణ సంబంధిత ప్రమాదాల తీవ్రతలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలోని కీలక టెక్నాలజీ కేంద్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా డేటా సెంటర్ల కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న టాప్-30 ప్రాంతాల్లో చోటు దక్కించుకున్నాయి.ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఎందుకంటే భారత్లో ప్రస్తుతం డేటా సెంటర్ పెట్టుబడుల పోటీ ఎక్కువగా ఈ రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ప్రధాన డేటా హబ్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడే భవిష్యత్తు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.వేడి ఎందుకు అంత ప్రమాదకరం?వరదలు వస్తే భవనాలు దెబ్బతింటాయి. తుఫాన్లు వస్తే మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అయినప్పటికీ అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి సహజంగానే భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని చల్లబరచడానికి అధునాతన కూలింగ్ వ్యవస్థలు అవసరం. బయట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలింగ్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.అంతేకాదు..విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందిపరికరాల సామర్థ్యం తగ్గుతుందిసర్వర్ వైఫల్యాల ప్రమాదం పెరుగుతుందిసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందినిర్వహణ ఖర్చులు పెరుగుతాయిఅంటే డేటా సెంటర్ భవనం సురక్షితంగానే ఉన్నా.. తీవ్ర వేడి కారణంగా దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అసలు ముప్పు భవనం బయటే ఉందా?ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. డేటా సెంటర్ ఎంత బలంగా నిర్మించినా అది ఒంటరిగా పనిచేయదు. దానికి విద్యుత్ సరఫరా, నీటి వనరులు, టెలికాం నెట్వర్క్లు, రవాణా వ్యవస్థలు, సరఫరా గొలుసులు అవసరం. ఒకవేళ తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ గ్రిడ్లు విఫలమైతే? నీటి సరఫరా నిలిచిపోతే? రవాణా వ్యవస్థలు స్తంభిస్తే? డేటా సెంటర్ నేరుగా దెబ్బతినకపోయినా దాని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.యూరప్లో నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉదహరిస్తూ ఎక్స్డీఐ ఒక కీలక విషయాన్ని పేర్కొంది. నేరుగా భవనానికి జరిగే నష్టం కంటే ఇలాంటి పరోక్ష మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టం పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.ప్రపంచానికి కూడా ఇదే సమస్యఈ ముప్పు కేవలం భారత్కే పరిమితం కాదు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు మొత్తం అధిక ప్రమాద జోన్లుగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లలో సుమారు 12 శాతం ఇప్పటికే అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నాయి. అధిక కార్బన్ ఉద్గారాలు కొనసాగితే శతాబ్దం చివరినాటికి ఈ ప్రమాదం మూడింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది.బీమా ఖర్చులు కూడా..డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా వాతావరణ ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రీఇన్సూరెన్స్ సంస్థ Swiss Re అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 10.6 బిలియన్ డాలర్లు ఉన్న డేటా సెంటర్ బీమా మార్కెట్ 2030 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు పెరిగితే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రాజెక్టుల వ్యయాలను మరింత పెంచుతుంది.మరి పరిష్కారం మాటేంటి?..అయితే ఇది అనివార్యమైన సంక్షోభం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న డేటా సెంటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.సరైన ప్రాంతాల ఎంపికఅధునాతన కూలింగ్ టెక్నాలజీలువాతావరణ నిరోధక డిజైన్లుబలమైన విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంపునరుత్పాదక ఇంధనాల వినియోగం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలవని పేర్కొంటున్నారు.ఏఐ యుగంలో డేటా సెంటర్లు కొత్త కాలపు ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముక. భారత్ ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం సరిపోదు. ఆ మౌలిక సదుపాయాలు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న వేడి, తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ఉండాలి. లేకపోతే నేటి డిజిటల్ కలలు.. రేపటి క్లైమేట్ రిస్క్ల ముందు నిలబడలేకపోవచ్చు. ఇదే తాజా నివేదిక ఇస్తున్న అసలు హెచ్చరిక. -
అధునాతన వీడియో క్రియేషన్కై.. 'ఏఐ-వర్య'
అవతార్ ఏఐ అభివృద్ధి చేసిన కొత్త వీడియో జనరేషన్ మోడల్ ‘వర్య’ మన దేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో అడుగు. అధునాతన వీడియో క్రియేషన్ సాధనాలను మరింత సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడంలో ‘వర్య’ ముఖ్యమైన ముందడుగుగా చెబుతున్నారు విశ్లేషకులు.సాధారణ టెక్ట్స్, సూచనలు, ఇమేజ్ల నుండి అధిక–నాణ్యత గల వీడియోలను రూపొందించడంలో ‘వర్య’ సహాయపడుతుంది. సాంకేతిక నైపుణ్యం, అధునాతన ఎడిటింగ్ పరిజ్ఞానం అవసరమయ్యే సంక్లిష్టమైన ఏఐ సాధనాల వలే కాకుండా ఎవరైనా సులభంగా ఉపయోగించేట్లుగా దీన్ని రూపొందించారు. తమకు ఏమి కావాలో యూజర్లు వివరించవచ్చు.మన ఆలోచనలు, ఐడియాలను తక్షణమే రెడీ–టు–యూజ్ విజువల్ కంటెంట్గా మారుస్తుంది వర్య. తక్కువ ఖర్చుతో వీడియోలు రూపొందించాలనుకునే మార్కెటింగ్ టీమ్స్, స్టార్టప్లకు, ఇండిపెండెంట్ క్రియేటర్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.‘వర్య’ ముఖ్య బలం ఏమిటంటే ఇది మన దేశ సంస్కృతులు, వివిధ సందర్భాలను స్పష్టంగా అర్థం చేసుకోగలదు. మన పండగలు, సంప్రదాయ నేపథ్యాలు, రోజువారి జీవిత దృశ్యాలు, సుపరిచితంగా, సందర్భోచితంగా అనిపించడానికి ‘వర్య’కు రూపకల్పన చేశారు. దేశీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుక్ను బ్రాండ్లు, ఏజెన్సీలకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. -
పెట్టుబడులతో ముందుకు రావాలి
పారిస్: భారత్లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పలు అగ్రశ్రేణి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో(సీఈఓలు) సమావేశమయ్యారు. పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. నౌకాయానం, సరుకు రవాణా, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(ఏఐ) సహా పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిపారు.భారతదేశంలో ఉన్న అవకాశాలపై చర్చలు జరిపామని సీఎంఏ సంస్థ సీఓఓ రొడాల్ప్ సాదే పేర్కొన్నారు. ఓడల నిర్మాణం, ఓడల రీసైక్లింగ్, లోతైన సముద్ర ఓడరేవులు, అలాగే కంటైనర్ల నిర్మాణం గురించి కూడా మోదీతో చర్చించామని తెలిపారు. ఫ్రాన్స్, భారత్లు పరస్పర సహకారాన్ని కొనసాగించడంలోనూ, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గోబైన్ సంస్థ సీఈఓ బెనాయిట్ బెజిన్, అల్స్టామ్ సీఈఓ మార్టిన్ సియోన్, మిస్ట్రాల్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్ మెన్స్ను సైతం మోదీ కలుసుకున్నారు. అందరికీ అందుబాటులో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. భారతదేశం దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. అమెరికా ఇటీవల కొన్ని కృత్రిమ మేధ(ఏఐ) నమూనాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మోదీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పారిస్లో వివాటెక్–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. మా ప్రభుత్వం సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు. పారిస్లో మోదీకి ఘన స్వాగతం ఫ్రాన్స్లోని ఎవియన్–లెస్–బెయిన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాజధాని పారిస్కు చేరుకున్నారు. పారిస్లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పురోగతికి భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశాన్ని, ఫ్రాన్స్ను మరింత సన్నిహితంగా మార్చడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని చూసి తాను గర్వపడుతున్నానని స్పష్టంచేశారు. -
ఏకంగా 80 శాతం మందిని తొలగించిన టెక్ సీఈవో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు దాదాపు ఉద్యోగులందరి వృత్తిగత జీవితంలో భాగమైపోయింది. కంపెనీలు రెండు మూడేళ్ల క్రితం నుంచే ఏఐ వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి అయిపోయాయి. ఏఐ స్కిల్స్ లేని, నేర్చుకోని ఉద్యోగులను కంపెనీలు నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.అమెరికాలోని టెక్సాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఇగ్నైట్టెక్’ (IgniteTech) సీఈవో ఎరిక్ వాఘన్ (Eric Vaughan) తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఐ వినియోగాన్ని స్వీకరించడానికి నిరాకరించిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించి, దాదాపు 80 శాతం మంది సిబ్బందిని కొత్త వారితో భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల నిర్వహించిన ఫార్చ్యూన్ బ్రెయిన్స్టార్మ్ టెక్ కార్యక్రమంలో వెలుగులోకి వచ్చాయి.జనరేటివ్ ఏఐ వ్యాపార ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని భావించి 2023లో తమ సంస్థను “ఏఐ-ఫస్ట్” మోడల్లోకి మార్చే కార్యక్రమాన్ని ఇగ్నైట్టెక్ సీఈవో ఎరిక్ వాఘన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి వారం “ఏఐ మండేస్” పేరుతో ఒక రోజంతా ఉద్యోగులు ఏఐ ప్రాజెక్టులపైనే పనిచేయాలని నిబంధన పెట్టారు. ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కోర్సులు నేర్పించడానికి కంపెనీనే ఖర్చు భరించేది. బయటి నుంచి నిపుణులతో శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించేది. ఇందు కోసం కంపెనీ తన మొత్తం పేరోల్లో సుమారు 20 శాతం వరకు వెచ్చించినట్లు వాఘన్ తెలిపారు.అయితే ఈ మార్పును ఉద్యోగులంతా సమానంగా స్వీకరించలేదని, ముఖ్యంగా సాంకేతిక విభాగాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైందని వాఘన్ చెప్పారు. శిక్షణ, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ కొందరు ఏఐ వినియోగాన్ని పూర్తిగా తిరస్కరించడంతో 2023 నుంచి 2024 తొలి త్రైమాసికం మధ్య వందలాది మంది ఉద్యోగులను తొలగించి కొత్త వారితో భర్తీ చేయాల్సి వచ్చిందన్నారు. “ఇది మా లక్ష్యం కాదు. కానీ కొత్త నైపుణ్యాలు నేర్పడం కంటే మనస్తత్వాన్ని మార్చడం కష్టమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు.వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థిస్తున్న వాఘన్, అదే పరిస్థితి మళ్లీ వస్తే ఇదే నిర్ణయం తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. అయితే ఇతర సంస్థలూ విధానాన్ని అనుసరించాలని తాను సిఫార్సు చేయనని స్పష్టం చేశారు. ఏఐ స్వీకరణ కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాకుండా సంస్థ సంస్కృతిలో కూడా మార్పు అనేది ఆయన అభిప్రాయం. “ఉద్యోగులు సంస్థ లక్ష్యాలతో ఏకీభవించకపోతే శిక్షణ లేదా వ్యూహాలు మాత్రమే సరిపోవు” అని అన్నారు. -
ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగుచూసిన ఒక విస్తుపోయే మ్యాట్రిమోనియల్ మోసం కలకలం రేపుతోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ), అధునాతన ఎడిటింగ్ టూల్స్ సాయంతో నకిలీ పెళ్లికూతుళ్ల ప్రొఫైళ్లను సృష్టించి, పెళ్లికాని యువకులను నిలువునా ముంచేస్తున్న ఒక కేటుగాళ్ల ముఠాను కాన్పూర్ పోలీసులు రట్టు చేశారు. కేవలం ఫోటోలు, మాయమాటలతో నమ్మిస్తూ, ఒక బాధితుడి నుంచే ఏకంగా నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసిన ఈ గ్యాంగ్ ఉదంతం డిజిటల్ యుగంలో జరుగుతున్న సరికొత్త నేరాలకు అద్దం పడుతోంది.డేటా చోరీ.. మాయమాటల వలపోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఈ ముఠా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి పెళ్లికాని యువకుల వ్యక్తిగత డేటాను సేకరించేది. ఆ తర్వాత తాము నడుపుతున్న కాల్ సెంటర్ల ద్వారా టెలికాలర్లతో మ్యారేజ్ కౌన్సిలర్లుగా ఫోన్లు చేయించేవారు. ‘మీ ప్రొఫైల్కు తగ్గ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది’ అంటూ మధురమైన గొంతుతో యువకులను నమ్మించేవారు. ఇంటర్నెట్ నుండి సాధారణ మహిళల ఫోటోలను డౌన్లోడ్ చేసి, వాటిని ఏఐ టూల్స్ ద్వారా అత్యంత ఆకర్షణీయమైన ప్రొఫైళ్లుగా మార్చి బాధితులకు పంపేవారు.విడతల వారీగా దోపిడీఈ గ్యాంగ్ ‘పర్ఫెక్ట్ రిష్తా’, ‘షాదీ మ్యాచ్’, ‘షాదీ మ్యాచ్ ఇండియా’ వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా తమ కార్యకలాపాలు సాగించింది. బాధితులు ఆ అందమైన అమ్మాయిల ఫోటోలను చూసి నిజమేనని నమ్మిన తర్వాత అసలు దోపిడీ మొదలయ్యేది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు, ఆ తర్వాత ప్రొఫైల్ యాక్టివేషన్ చార్జీలు, సంబంధం ఖాయం చేయడానికి ఫీజు, చివరికి అమ్మాయితో మాట్లాడించడానికి లేదా ముఖాముఖి భేటీ ఏర్పాటు చేయడానికి అంటూ రకరకాల పేర్లతో లక్షలాది రూపాయలు గుంజేవారు. ఏడాది కాలంలో ఇలా వేలాది మందిని ముంచినా, ఒక్కరికి కూడా పెళ్లి చేయలేదు.పోలీసుల మెరుపు దాడి.. నిందితుల అరెస్ట్ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఆదేశాల మేరకు, ఐపీఎస్ అధికారిణి అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ప్రత్యేక బృందం మూడు చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ కేసులో రంజిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా, లీగల్ సలహాదారుడిగా ఉన్న అమిత్ కుమార్, జాగ్రతి సహా మరికొందరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుండి డజన్ల కొద్దీ మొబైల్ ఫోన్లు, రిజిస్టర్లు, బ్యాంకు పత్రాలు, ఏటీఎం కార్డులు, కంప్యూటర్ సిస్టమ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య -
చాట్జీపీటీ గురువు కాదు.. కాలేజీకి డుమ్మా కుదరదు!
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత కాలంలో విద్యావ్యవస్థపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. సాంకేతికత ఎంత పెరిగినా, చాట్-జిపిటి వంటి అధునాతన ఏఐ టూల్స్ ఏవీ కూడా తరగతి గదిలో బోధించే ఒక అర్హత కలిగిన ఉపాధ్యాయుడితో సమానం కాలేవని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ముగ్గురు లా విద్యార్థుల అటెండెన్స్ వివాదంపై విచారణ చేపట్టిన కోర్టు, ఆన్లైన్ క్లాసులు అనేవి కేవలం అవసరానికి ఉపయోగపడే ప్రత్యామ్నాయాలు మాత్రమే కానీ, అవి భౌతిక తరగతులకు ప్రత్యామ్నాయం కాలేవని తేల్చి చెప్పింది.విద్యార్థులకు నిరాశ.. కోర్టు కీలక వ్యాఖ్యలుచెన్నైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ’ కి చెందిన ముగ్గురు లా విద్యార్థులు కనీస అటెండెన్స్ లేకపోవడంతో పరీక్షలు రాసే అర్హతను కోల్పోయారు. దీనిపై వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, బుధవారం నాటి విచారణలో విద్యార్థులకు ఎలాంటి ఊరట లభించలేదు. ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావిస్తూ, ఆన్లైన్ విద్య కేవలం ఒక మార్గం మాత్రమేనని, ప్రత్యక్షంగా క్లాస్రూమ్లో కూర్చుని నేర్చుకునే చదువుతో దీనిని పోల్చలేమని పేర్కొంది.సుప్రీంకోర్టుకు చేరిన అటెండెన్స్ వివాదంమరోవైపు, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో కనీస హాజరు (మినిమం అటెండెన్స్) నిబంధనలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు చేరింది. కనీస హాజరు లేదనే కారణంతో విద్యార్థులను పరీక్షలు రాయకుండా అడ్డుకోవద్దంటూ గత నవంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై, ఈ ఏడాది మే నెలలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో కాలేజీల్లో అటెండెన్స్ ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా లీగల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.క్లాస్రూమ్ చదువుకే హైకోర్టు మొగ్గుసాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, విద్యార్థుల సమగ్ర వికాసానికి భౌతిక తరగతి గది వాతావరణమే అత్యంత కీలకమని మద్రాస్ హైకోర్టు గట్టిగా సమర్థించింది. ప్రొఫెసర్లు, లెక్చరర్ల స్థానాన్ని ఏ ఏఐ టూల్ కూడా భర్తీ చేయలేదని స్పష్టం చేస్తూ, విద్యార్థులు నిబంధనల ప్రకారం క్లాసులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అటెండెన్స్ విషయంలో విద్యార్థులు కచ్చితమైన నిబంధనలు పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.ఇది కూడా చదవండి: సముద్రం కింద, పర్వతాల మధ్య.. -
నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్ చేసిన మానవ మేథ!
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోందని, మానవ మేధస్సును మించిపోతోందని భావిస్తున్న తరుణంలో ఒక సంచలన నిజం అందరికీ షాకిస్తోంది. ఒక కఠినమైన గణిత పరీక్షలో ప్రపంచంలోని టాప్-4 ఏఐ మోడల్స్ ఘోరంగా విఫలమయ్యాయి. ఇంటర్నెట్లో ఎక్కడా అందుబాటులో లేని సరికొత్త పరిశోధనా స్థాయి గణిత సమస్యలను ఏఐ మోడల్స్కు పరీక్షగా పెట్టగా, అవి కనీస మార్కులు కూడా సాధించలేకపోయాయి. అదే సమయంలో మానవ మేధావులు ఆ పదికి పది సమస్యలను అలవోకగా పరిష్కరించి, తామే ఎప్పుడూ ‘సుప్రీం’ అని నిరూపించారు. ప్రముఖ ‘నేచర్’ జర్నల్లో ఈ ఆసక్తికరమైన పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.అసలు రంగు బయటపడిందిసాధారణంగా ఏఐ మోడల్స్ తమ డేటాబేస్లో ఉన్న సమాచారాన్ని స్కాన్ చేసి క్షణాల్లో సమాధానాలు ఇస్తుంటాయి. కానీ, ఈసారి వాటిని నిలువరించడానికి ‘ఫస్ట్ ప్రూఫ్’ అనే సరికొత్త బెంచ్మార్క్ విధానాన్ని నిపుణులు ఉపయోగించారు. వివిధ గణిత విభాగాలకు చెందిన 10 మంది అగ్రశ్రేణి పరిశోధకులు తమ కెరీర్లో ఎప్పుడో ఒకప్పుడు పరిష్కరించి, ఇప్పటివరకు ఎక్కడా ప్రచురించని 10 సరికొత్త మ్యాథ్స్ సమస్యలను ఈ పరీక్ష కోసం సేకరించారు. ఇంటర్నెట్లో వీటికి ఎలాంటి ఆధారాలు, సూచనలు లేకపోవడంతో ఏఐ మోడల్స్ కాపీ కొట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ స్వతంత్ర పరీక్షను 30 మంది గణిత శాస్త్రవేత్తలతో కూడిన ప్రత్యేక జ్యూరీ పర్యవేక్షించింది.బరిలో నిలిచిన దిగ్గజాలు.. ఈ పోటీలో పబ్లిక్గా అందుబాటులో ఉన్న నాలుగు ప్రముఖ ఏఐ మోడల్స్ తలపడ్డాయి. ఓపెన్ ఏఐ తన సరికొత్త ‘చాట్జీపీటీ 5.5 ప్రో’ మోడల్ను నేరుగా బరిలోకి దింపగా.. ప్రిన్స్టన్ యూనివర్సిటీ (జెమిని 3.1 ప్రో ఆధారిత హార్నెస్), యూసీఎల్ఏ, స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధక బృందాలు చాట్జీపీటీ, క్లాడ్, జెమిని చాట్బాట్లను ఉపయోగించి రూపొందించిన ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా పోటీ పడ్డాయి. అయితే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 'ETH Zurich' సిస్టమ్ కేవలం 6 సమస్యలను మాత్రమే పరిష్కరించగలిగింది. యూసీఎల్ఏ రెండో స్థానంలో నిలవగా, ఓపెన్ ఏఐ సొంత మోడల్ మూడో స్థానానికి పరిమితమైంది.మానవ మేధస్సుకే అగ్రతాంబూలంగతంలో ఏఐ వ్యవస్థలు 80 ఏళ్ల నాటి సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించి ఉండవచ్చు. కానీ సరికొత్త ఆలోచనలు, సృజనాత్మకత అవసరమైన పరిశోధనా స్థాయి సమస్యల విషయానికి వస్తే మానవ మేధస్సును అవి అందుకోలేవని ఈ పరీక్ష స్పష్టం చేసింది. గణిత శాస్త్రవేత్తలకు స్వతంత్ర సహాయకులుగా, ప్రూఫ్-చెకర్స్గా ఏఐ మోడల్స్ పూర్తిగా బాధ్యతలు చేపట్టడానికి ఇంకా చాలా కాలం పడుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఏఐ సామర్థ్యాలను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి మరిన్ని కఠినమైన పరీక్షలను నిర్వహించనున్నట్లు ‘ఫస్ట్ ప్రూఫ్’ బృందం వెల్లడించింది.ఇది కూడా చదవండి: అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే! -
ప్రకృతి పిలుపు.. వరుస మారుతోంది!
టాయిలెట్ వస్తే ఏం చేస్తాం? అదేం ప్రశ్న.. వెళ్తాం అంటారా?ఇప్పటివరకు జరిగింది.. జరుగుతోంది ఇదే.. పేదోడి దగ్గర నుంచిపైసలున్నోడి వరకు ఎవరైనా సరే.. టాయిలెట్ వస్తే.. అది ఎక్కడుంటేఅక్కడకు వెళ్లాల్సిందే. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు. టాయిలెట్ వస్తే.. మనం వెళ్లాల్సిన పనిలేదు. అదే మన దగ్గరకు వచ్చేస్తుంది. పనిపూర్తయ్యాక చక్కగా వెళ్లిపోతుంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి..బెడ్ నుంచి లేవలేని వృద్ధులు, పక్షవాతం వచ్చిన రోగుల కోసం చైనాకు చెందిన యుబాన్ అనే టెక్ కంపెనీ ఒక వినూత్నమైన అటానమస్ రోబో టాయిలెట్ను రూపొందించింది. దీనికి షాబాన్ అని పేరు పెట్టారు. షాంఘైలో జరిగిన అంతర్జాతీయ వృద్ధుల సంరక్షణ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించగా.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చక్రాల కుర్చీ తరహాలో ఉండే ఈ కమోడ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అత్యాధునిక సెన్సర్లతో పనిచేసే ఒక హైటెక్ రోబో. బెడ్పై పడుకున్న వ్యక్తి రిమోట్ కంట్రోల్ సాయంతో పిలిస్తే చాలు.. బాత్రూమ్లో డాకింగ్ స్టేషన్కు ఉన్న రోబో టాయిలెట్.. బెడ్ పక్కకు వచ్చేస్తుంది. ఇందులో అమర్చిన లైడార్, లేజర్ సెన్సర్ల వల్ల ఇంట్లోని గోడలను లేదా వస్తువులను గుద్దుకోదు. టాయిలెట్ బెడ్రూమ్లోకి వచ్చినా.. ఎలాంటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇందులో హై–డ్యూటీ ఫోమ్ షీల్డ్, యాక్టివేటెడ్ చార్కోల్ (బొగ్గు) ఫిల్టర్లను ఉపయోగించారు. అందువల్ల బెడ్రూమ్లో ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పని పూర్తయిన తర్వాత సైలెంట్గా బాత్రూమ్లోని తన డాకింగ్ స్టేషన్కు వెళ్లిపోతుంది. అక్కడ డ్రైనేజీ పైపుతో కనెక్ట్ అయ్యి.. లోపల ఉన్న వ్యర్థాలను ఒక సైలెంట్ గ్రైండర్ ద్వారా నలిపేసి ఫ్లష్ చేస్తుంది. ఆ తర్వాత తనను తాను 360 డిగ్రీల కోణంలో పూర్తిగా శానిటైజ్ చేసుకుంటుంది. చివరిగా మళ్లీ తన వాటర్ ట్యాంక్ను నింపుకొని, బ్యాటరీ చార్జ్ చేసుకుని తదుపరి పిలుపు కోసం సిద్ధంగా ఉంటుంది. అంతా బానే ఉంది.. ధర ఎంత అంటారా? చైనా మార్కెట్లో దీని ధర 28,999 యువాన్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.11 లక్షలు. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు, రోగులకు ఇది ఒక గొప్ప వరమని నిపుణులు చెబుతున్నారు. వయసు పైబడిన వారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు ప్రతి చిన్న అవసరానికి, ముఖ్యంగా ప్రకృతి పిలుపు కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చినప్పుడు తీవ్ర మానసిక వేదనకు గురవుతుంటారు. కేర్టేకర్లకు కూడా ఇది శారీరకంగా పెద్ద శ్రమ. ఈ రోబో వల్ల రోగులు ఎవరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకోగలుగుతారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రకృతి మనల్ని పిలిచేది..ఇకపై మనమే ప్రకృతిని పిలవొచ్చు అన్నమాట!! -
పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాకా ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా పోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు ఏఐను తప్పుడు సంకేతాలకు వాడడం అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్కు సంబంధించిన ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ వద్దకు వచ్చిన పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన హర్మన్ప్రీత్ ఆమె గొంతు పట్టుకొని నెట్టేసింది. దీంతో అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని ఇద్దరిని విడదీయడం వీడియోలో కన్పించింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు మ్యాచ్లో ఇంత పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందా అని రిప్లేల మీద రిప్లేలు చూశారు. నిజానికి మ్యాచ్లో ఎక్కడా గొడవ జరిగిన దాఖలాలు లేవు. అయితే కొందరు ఆకతాయిలు ఏఐ మాయతో పాత వీడియో క్లిప్పింగ్లను జత చేర్చి ఈ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఇదీ అసలు సంగతి. అయితే ఐసీసీ ఈ ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల ఆటకు ఉండే క్రీడాస్ఫూర్తి దెబ్బతింటుందని, ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించింది. అయితే భారత ఇన్నింగ్స్ సమయంలో జెమీమా రోడ్రిగ్స్ ఔటైన సమయంలో మాత్రం పాక్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. తస్మియా రుబాబ్ బౌలింగ్లో రోడ్రిగ్స్ మిడాన్ దిశగా షాట్ ఆడింది. అయితే అక్కడే ఉన్న నటాలియా పెర్వాయిజ్ క్యాచ్ అందుకుంది. ఈ క్రమంలో పాక్ ఫీల్డర్ శ్రుతి మించి రోడ్రిగ్స్ నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో ఆమెను చూస్తే బంతిని బలంగా నేలకేసి కొట్టడం వివాదంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ నిన్నటి మహిళల మ్యాచ్లోనూ దానిని కంటిన్యూ చేసింది. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. మంధాన (68), రిచా (34), హర్మన్ ప్రీత్ (36) రాణించారు. అనంతరం పాకిస్తాన్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది.చదవండి: ట్యునీషియాపై విజయం.. సంబరాలు చేసుకోని స్వీడన్! -
జాబ్స్ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.గతంలో డిజిటల్ టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్ లూప్"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. "ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్ మోడల్" కాకుండా "ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.https://t.co/vLmiBKTtX3— Satya Nadella (@satyanadella) June 14, 2026ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. -
మా ఏఐ మాకే సొంతం..
ఏఐని నియంత్రిస్తున్న దేశాలు రూటు మారుస్తున్నాయి. ఇప్పటిదాకా చిప్లను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవటంపై దృష్టి పెట్టినా... ఇపుడు ఏఐ మోడల్స్నూ నియంత్రించే చర్యలు మొదలెట్టాయి. అమెరికా ప్రభుత్వం ఆదేశించిన మీదట... ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్లో మైథోస్–5, ఫేబుల్–5 మోడళ్లను ఇతర దేశాల్లో ఎవరూ వాడకుండా నిషేధించటం... ఒక ఆరంభం మాత్రమే. అత్యాధునిక ఏఐ మోడళ్లను స్వదేశంలో తప్ప ఇంకెక్కడా వాడకుండా చేయటం ద్వారా ఏఐపై గుత్తాధిపత్యం సాధించాలనేది అమెరికా వ్యూహం కావచ్చనేది నిపుణుల మాట.ఇలాంటి చర్యలతో ఏఐ వాడకంలో అంతరాలు తారస్థాయికి చేరుతాయి కాబట్టి భారతదేశం ఏఐ మిషన్ను ఆరంభించి, రూ.50వేల కోట్లు కేటాయించాలని టెక్నోక్రాట్ మోహన్దాస్ పాయ్ ప్రధాని మోదీని అభ్యరి్థంచటం గమనించాల్సిన విషయం. అమెరికా నిషేధం నేపథ్యంలో అసలు ఈ మైథోస్–5, ఫేబుల్–5 ఏం చేస్తాయి? నిషేధంతో నష్టాలేంటి? అమెరికా చెబుతున్న భద్రత కారణాలు నిజమేనా?ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి’ప్రత్యేక కథనం... అమెరికాలో మినహా విదేశాల్లో యాక్సెస్ లేకుండా నిషేధించిన మైథోస్, ఫేబుల్ మోడళ్లు అత్యా«ధునికమే కాదు. శక్తిమంతమైనవి కూడా. ప్రత్యేకించి మైథోస్–5 ఉపయోగించి సైబర్ సెక్యూరిటీని ఉల్లంఘించవచ్చు. ఎదురుదాడులు చేయొచ్చు. అందుకే గ్లాస్వింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా దీని వాడకాన్ని కొన్ని సంస్థలకే అందించింది ఆంథ్రోపిక్. మైథోస్లోని ఫీచర్లన్నీ ఉండి... కొన్ని నియంత్రణలతో అందరికీ అందించిన మోడల్ ఫేబుల్. ఒక్కమాటలో చెప్పాలంటే మైతోస్–5 రేసింగ్ కార్ అయితే... సాధారణ రోడ్లపై తిరగటానికి ఆవిష్కరించిన దాని లీగల్ వెర్షనే ఫేబుల్–5. మైథోస్–5 ఎందుకు స్పెషల్ అంటే? అటానమస్ కోడింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ అనాలిసిస్, దీర్ఘ కాలిక రీజనింగ్, శాస్త్రీయ పరిశోధనల్లో సాయం విషయంలో మైథోస్కు అసాధారణమైన సామర్థ్యాలున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇక ఫేబుల్ మోడళ్ల విషయానికొస్తే... ⇒ అత్యంత భారీ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను మైగ్రేట్ చేయడానికి ⇒ కొన్నేసి గంటల పాటు రెగ్యులర్గా అటానమస్ పనులు చేయటానికి... ⇒ అడ్వాన్స్డ్ కోడింగ్, ఇంజినీరింగ్ టాస్క్లు చేయటానికి వాడొచ్చు. నిషేధం వల్ల నష్టాలేంటి? ⇒ ఆంథ్రోపిక్ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మోడళ్లను అమెరికా వెలుపల ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ⇒ మెరుగైన కోడ్ను జనరేట్ చేయటం... బగ్స్ను కనిపెట్టడం... భారీస్థాయి సాఫ్ట్వేర్ మైగ్రేషన్లను ఈజీగా చేసే సామర్థ్యాన్ని డెవలపర్లు కోల్పోతారు. ⇒ సైబర్ సెక్యూరిటీలోని లోపాలను కనిపెట్టడానికి ఉపయోగపడే అత్యంత ఆధునిక టూల్స్ను పరిశోధకులు వాడలేరు. ⇒ అన్నిటికన్నా ప్రధానం... అమెరికా వెలుపల ఉండేవారికి అమెరికాలో ఉండేవారితో పలు అంశాల్లో పోటీపడే సామర్థ్యం తగ్గిపోతుంది. అమెరికన్ కంపెనీలకు ప్రొడక్టివిటీ అడ్వాంటేజ్ పెరిగి... విదేశాల్లోని స్టార్టప్ల ఇన్నోవేషన్ సామర్థ్యం స్లో అవుతుంది. అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ల మాదిరి ఏఐ సామర్థ్యాలపై కూడా కొన్ని దేశాల ఆధిపత్యం కొనసాగుతుంది. భారత్కు ఇబ్బందులేంటి? భారత్కు ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ అమెరికన్ ఏఐ మోడళ్ల యాక్సెస్ మన స్టార్టప్లకు ఉండదు. మన సైబర్సెక్యూరిటీ సంస్థలు అత్యాధునిక టూల్స్ను కోల్పోతాయి. పైపెచ్చు నిషేధం ఎక్కువకాలం కొనసాగితే మన సాఫ్ట్వేర్ సంస్థల పోటీ సామర్థ్యం తగ్గొచ్చు. నిశితంగా చూస్తే ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఏఐ చిప్లను, సెమీకండక్టర్ పరికరాలను, సూపర్ కంప్యూటర్ల హార్డ్వేర్ను మాత్రమే నియంత్రించాయి. ఇపుడు ఏఐ మోడల్ను సైతం అమెరికా ఓ సాఫ్ట్వేర్లా కాకుండా కీలకమైన మిలిటరీ టెక్నాలజీలా చూడటం ఆరంభించింది. ఈ కారణాల వల్లే అమెరికా మోడళ్లపై పూర్తిగా ఆధారపడకుండా భారత్కు సొంత ఏఐ మోడళ్లు ఉండాలని మోహన్దాస్ పాయ్ వంటి టెక్నోక్రాట్లు చేస్తున్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ ఏఐ నియంత్రణ మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందన్నది కాదనలేని నిజం.ఆంథ్రోపిక్ కొత్త ఏఐ మోడళ్లు వెనక్కి వాషింగ్టన్: ట్రంప్ విధానాలతో దేశాలు మాత్రమేకాదు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుచేసి పరిశోధన పూర్తిచేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచి్చన అధునాతన కృత్రిమమేధ (ఏఐ) టూల్స్ను కంపెనీలు వెనక్కి(రీకాల్) చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఏఐ దిగ్గజ సంస్థ ‘ఆంథ్రోపిక్’చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అందుబాటులోకి తెచి్చన క్లాడ్ ఫేబుల్5, మైథోస్5 ఏఐ మోడళ్లను వెనక్కితీసుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ శనివారం ప్రకటించింది.భద్రతా కారణాలు చూపి వీటిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షల విధించడంతో తప్పనిపరిస్థితుల్లో వీటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆంథ్రోపిక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘భద్రత లేని, క్షేమదాయకంకాని మోడళ్లపై ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. కానీ అత్యంత భద్రమైన మా మోడళ్లకు ఏ సాంకేతిక లోపాల మాటున అడ్డుచెబుతున్నారో ప్రభుత్వం వివరిస్తే బాగుండేది. అప్పుడే ఈ ఆంక్షల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని అంతా భావిస్తారు’అని ఆంథ్రోపిక్ తన అసహనం వ్యక్తంచేసింది. (రమణమూర్తి మంథా) -
శబరిమలలో రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీ
తిరువనంతపురం: వచ్చే శబరిమల యాత్రా సీజన్లో జనసమూహ నిర్వహణ , డిజిటలైజేషన్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సహా పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ శుక్రవారం తెలిపారు.ఇక్కడ జరిగిన టీడీబీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అనేక సన్నాహక పనులు చాలా ముందుగానే చేపడుతున్నామని జయకుమార్ తెలిపారు.‘మేము వివిధ వ్యవస్థలను డిజిటలైజ్ చేసే దిశగా కృషి చేస్తున్నాము. శబరిమలలో నగదు లావాదేవీలకు తావు ఉండదు; ప్రతిదీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇది కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాదు, పరిపాలనా ప్రక్రియలకు కూడా వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు.జనసమూహ నిర్వహణకు సంబంధించిన మరో ముఖ్యమైన కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ‘జూన్ 20న, పోలీసు శాఖ సహకారంతో, జన సమూహాల నిర్వహణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించడంపై కొచ్చిలో ఒక ప్రధాన వర్క్షాప్ను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు ఆరుగురు గుర్తింపు పొందిన ఏఐ నిపుణులు పాల్గొంటారు’ అని ఆయన అన్నారు.వాస్తవ రద్దీ పరిస్థితుల ఆధారంగా నీలక్కల్, పంపా, మరకూట్టం మరియు సన్నిధానానికి యాత్రికుల రాకపోకలను నియంత్రించే ఒక ప్రొటోకాల్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ‘ రియల్ టైమ్లో ఏఐని ఉపయోగించి, ఏ సమయంలోనైనా ఎంత మందిని ముందుకు వెళ్లడానికి అనుమతించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయి. ఈ వర్క్షాప్ జూన్ 20న కొచ్చిలోని ఐఎంఏ హాల్లో జరుగుతుంది’అని స్పష్టం చేశారు. జూన్ 14న టీడీబీ హరిత శబరిమల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం శబరిమల యాత్రకు సంబంధించి దానికి అనుగుణంగా జల ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డు, అటవీ శాఖ, పోలీస్ శాఖ మరియు ఇతర ఏజెన్సీల అధికారులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ టీడీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ‘అన్ని విభాగాలను సమన్వయం చేసి, శబరిమల కోసం సమగ్రమైన గ్రీన్ ప్రోటోకాల్స్ను అమలు చేయడమే లక్ష్యం. గ్రీన్ ప్రోటోకాల్తో పాటు, మేము ప్రత్యేక పారిశుధ్య ప్రోటోకాల్ను కూడా ప్రవేశపెడుతున్నాము. సుచిత్వ మిషన్తో కూలంకషంగా చర్చలు జరిగాయి," అని ఆయన అన్నారు.తగినంత పారిశుధ్య సౌకర్యాలు లేకపోవడమే అతిపెద్ద ఫిర్యాదులలో ఒకటిగా ఉందని జయకుమార్ అన్నారు. ‘ఇప్పటివరకు కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను పెట్టడమే సాధారణ పద్ధతిగా ఉండేది, కానీ అది సరిపోలేదు. మేము మూడు డబ్బాల విధానానికి మారుతున్నాము," అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి మద్దతుగా టీడీబీ తగినన్ని స్టీల్ వ్యర్థాల డబ్బాలను సమకూరుస్తుంది. వ్యర్థాలను వాటి మూలం వద్దనే జీవవిచ్ఛిన్నమయ్యేవి, జీవవిచ్ఛిన్నం కానివి మరియు ప్రమాదకర వ్యర్థాలు అనే మూడు వర్గాలుగా విభజిస్తారు.‘సరైన వ్యర్థాల విభజన బాధ్యతను దుకాణ యజమానులకు అప్పగిస్తాము, ఇందుకోసం ఇప్పటికే ఒప్పందాలు సిద్ధం చేశాము. మేము వ్యర్థాల సరైన శుద్ధిని కూడా నిర్ధారించి, బయో-ట్రీట్మెంట్ సౌకర్యాలను పూర్తిస్థాయిలో పనిచేసేలా చేస్తాము’ అని ఆయన అన్నారు. ఈ దిశగా గణనీయమైన పురోగతి సాధించబడుతోందని అన్నారు. ‘ ఈ ఏడాది శబరిమల యాత్రను అత్యంత వృత్తిపరంగా నిర్వహించాలన్నదే మా కల, దానిని సాధించేందుకు బోర్డు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది. -
‘చిట్టీ’కి పాఠాలతో పాకెట్మనీ!
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ), రొబోటిక్స్ రంగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కొత్త తరహా ఉద్యోగాలకు మార్గం సుగమం చేస్తోంది. రోజువారీ ఇంటి పనులనే వీడియో తీసి రోబోలకు అర్థమయ్యేలా వివరించే ‘రోబో ట్రైనర్’, ‘ఏఐ డేటా యాక్టర్’ పేరుతో నగరంలో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. ఇంటి పనులన్నీ చకచకారోబోలు, హ్యూమనాయిడ్ యంత్రాలు మనుషుల పనితీరును నేర్చుకోవడానికి ప్రత్యేక వీడియో డేటా అవసరం. ఇందుకోసం టెక్ కంపెనీలు సాధారణ వ్యక్తులతో వివిధ పనులను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్నాయి. ఏఐ రోబోలకు ఇంటి పనులు నేర్పేందుకు టెక్ కంపెనీలు ‘హ్యూమన్ యాక్షన్ డేటా’ సేకరిస్తున్నాయి. బట్టలు ఉతకడం మొదలు డోర్ తెరవడం, కాఫీ కలపడం, వంటావార్పు వరకు ఈ రోబోలు ఇట్టే చక్కబెడుతున్నాయి.ఈ పనులన్నింటినీ వాటి ఒంటబట్టించేందుకు ఏఐ సాంకేతికతకు పదునుపెడుతున్నారు. ఇంట్లో చేసే పనులను ఫోన్ కెమెరాలతో షూట్ చేసి ఆ వీడియోలను ఏఐ మోడల్స్కు ఫీడ్ చేస్తారు. ఇలా పనులను ఏఐ మోడ్లో షూట్ చేసే పార్ట్టైమ్ ఉద్యోగాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇలా షూట్ చేస్తే గంటకు రూ. 250 వరకు చెల్లిస్తున్నారు. రోజుకు 4 గంటలు పనిచేస్తే నెలకు రూ. 25 వేల వరకు ఆదాయం వస్తోంది.భవిష్యత్తులో ఇంటి పనులు, పరిశ్రమల కార్యకలాపాలు, సేవారంగంలో రోబోలు మరింత సమర్థంగా పనిచేయడానికి ఈ డేటా ఉపయోగపడనుంది. ఇందుకోసం టెస్లా ఆప్టిమస్, ఫిగర్ ఏఐ, గూగుల్ డీప్మైండ్ రోబో ప్రాజెక్టుల కోసం హైదరాబాద్కు చెందిన డేటామోర్ఫ్, ఇన్స్ట్రక్ట్ ల్యాబ్, రోబో–ఎక్స్ఏఐ వంటి డేటా సంస్థలు నియామకాలు చేపడుతున్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీలో ఆయా సంస్థలకు ప్రత్యేక స్టూడియోలు ఉన్నాయి. ఇంటర్ పాసైన వారికి సైతం అవకాశం కల్పిస్తున్నాయి.ఎక్కువ శ్రమ లేదు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా. కాలేజీ అయ్యాక స్టూడియోకి వెళ్తా. నిన్న అన్నం వార్చడం, ఈ రోజు బెడ్షీట్ మార్చడం షూట్ చేశారు. గంటకురూ. 230 ఇచ్చారు. ఈ పార్ట్టైం జాబ్తో నెలవారీ పాకెట్ మనీ సంపాదించుకుంటున్నా. – శ్రావణి, కూకట్పల్లి -
AI వల్ల ఉద్యోగాలు పోతాయా..: లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది.అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది.ఉత్పాదకతపై భిన్న అభిప్రాయాలుఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో కొంత అయోమయం నెలకొన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ ఏఐని ఉపయోగించే వారిలో 30 శాతం మంది పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ.. ఏఐ వాడని వారితో పోలిస్తే తాము తక్కువ ఉత్పాదకతతో ఉన్నట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. నిత్యం చేసే సాధారణ పనులను ఏఐ చూసుకోవడం వల్ల, తమ సొంత పనితీరును అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు భావిస్తుండటమే దీనికి కారణం.సాంకేతికత-స్కిల్స్ కీలకంవ్యాపార సంస్థల అధిపతులు కేవలం ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే కోణంలో ఆలోచించకుండా, సాంకేతికతను, మానవ నైపుణ్యాలను ఎలా మేళవించాలనే దానిపై దృష్టి పెట్టాలని రాహుల్ గోయల్ సూచించారు. రోజు వారీగా పదే పదే చేసే పనులను ఏఐ సులువుగా పూర్తి చేస్తుంది.దీనివల్ల ఉద్యోగులకు సమయం కలిసివచ్చి, వారు నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, సమన్వయం వంటి మానవ మేధస్సుకు సంబంధించిన సృజనాత్మకత పనులపై మరింత దృష్టి పెట్టవచ్చు. నాలెడ్జ్ ఆధారిత రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ కెరీర్పై ధీమాగా ఉన్నారు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం వృథా చేయకుండా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని గోయల్ వివరించారు. -
ఏఐతో కరోనా టీకా డిజైన్
లండన్: కృత్రిమ మేధ(ఏఐ) మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కొత్త రకం టీకాను డిజైన్ చేసింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ టీకాను మానవులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం లక్షల మంది ప్రాణాలు తీసిన కోవిడ్ మహమ్మారి తదనంతర కాలంలో పలు రకాలుగా రూపాంతరం చెందింది. గబ్బిలాలలో నిద్రాణంగా ఉన్న అనేకానేక కరోనా జాతి వైరస్లు భవిష్యత్తులో ఎప్పుడైనా మానవుల్లోకి చేరి భారీ ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకే టీకాతో అన్ని రకాల కరోనా వైరస్ల వ్యాప్తి అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు హానికారక వైరస్లను మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించేలా శిక్షణ ఇస్తాయి. వైరస్ రూపాంతరం చెందితే టీకా పనిచేయదు. కొత్త టీకా తయారు చేయాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఐ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. కరోనా జాతికి చెందిన వేలాది వైరస్ల జన్యుక్రమాలను అన్వేషించింది. అన్నింటిలోనూ మార్పుల్లేకుండా ఉండే, మున్ముందు మారకుండా ఉండే డీఎన్ఏ భాగాలను గుర్తించింది. వీటిని లక్ష్యాలుగా చేసుకుంది. ఫలితంగా కరోనా జాతి వైరస్లన్నింటికీ విరుగుడైన టీకా డిజైన్ సిద్ధమైంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనల కోసం సార్స్, కోవిడ్ వ్యాధులకు కారణమైన సార్బికో వైరస్లను ఏఐ ద్వారా స్కాన్ చేసింది. దీంతోపాటు పలు జంతువుల్లోని కరోనా వైరస్లను పరిశీలించింది. డీఎన్ఏ టీకా కోవిడ్కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ టీకా గురించి మనకు తెలిసే ఉంటుంది. ఇది డీఎన్ఏలో ఒక పోగు అయిన ఎంఆర్ఎన్ఏ ఆధారంగా పనిచేస్తే ఏఐ డిజైన్ చేసిన టీకా మొత్తం డీఎన్ఏ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ తయారీ, నిల్వ చాలా సులువు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ప్రపంచం నలుమూలల్లోనూ సులువుగా పంపిణీ చేయవచ్చు. రిఫ్రిజరేటర్ల వంటి మౌలిక సదుపాయాల అవసరమూ ఉండదు. సూదితో పని లేకుండా ఈ కొత్త తరహా టీకాను అందించవచ్చు కాబట్టి వినియోగం చాలా సులువు అవుతుంది. ఈ సానుకూల అంశాలన్ని భవిష్యత్తులో ఏదైనా కొత్త రకం కరోనా వైరస్ దాడి చేసినా తట్టుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.పరీక్షల వేళ తేలిందేమిటి?మెషీన్ లెర్నింగ్ సాయంతో ఏఐ డిజైన్ చేసిన టీకాతో మానవులపై చేపట్టిన ప్రయోగాల్లో రోగ నిరోధక వ్యవస్థ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేయగలుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ యాంటీబాడీలు సార్బికోవైరస్ రకాలను సమర్థంగా గుర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ మానవ వినియోగానికి అర్హమైందని, ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ టీకాను అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. ఈ కొత్త రకం టీకా ఎంతకాలం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది? బూస్టర్ డోస్లు అవసరమవుతాయా? వంటివి నిర్ధారించుకోవడమే కాకుండా వాస్తవిక పరిస్థితుల్లో ఇవి వైరస్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాల్సి ఉంది. ఇందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్కు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని వాణిజ్యవిభాగ పరిశోధనా సంస్థ ‘డియోసిన్వ్యాక్స్’ పర్యవేక్షణలో పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు జరిగాయి. -
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
పని భారం.. ఏఐతో దూరం!
2025 నవంబర్–2026 జనవరి మధ్య కాలంలో యూఎస్ఏ, యూకే, జర్మనీ ఆస్ట్రేలియాల్లో ఎన్బీఈఆర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ‘ఫర్మ్ డేటా ఆన్ ఏఐ’ నివేదికను విడుదల చేసింది. ఈ దేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 6 వేల మంది సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, జర్మన్ బుందెస్ బ్యాంక్, ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీ ³రిశోధక బృందాలు సంయుక్తంగా ఈ డేటాను సేకరించాయి.సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) అనేది ఓ సాధారణ ఉద్యోగి రోజువారీ పనిభారాన్ని 2 గంటలు లేదా అంతకంటే ఎక్కువ తగ్గించగలదు. పునరావృతమయ్యే పనులను స్వయంచాలకం చేయడం, సమాచారాన్ని సంగ్రహించడం, భావ ప్రసారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఆధునిక ఏఐ సాధనాలు ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఆదా చేస్తున్నాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్బీఈఆర్) వంటి సంస్థల వాస్తవ–ప్రపంచ ప్రభావ అధ్యయనాలను బట్టి చూస్తే.. పని సంక్లిష్టతను బట్టి 14% జనరేటివ్, 30% ఏఐ సహాయకాలు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచగలవని నిరూపితమవుతోంది. ఏమిటీ అధ్యయనం ?ఏయే రంగాలు ఏఐని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ఏ రంగాలపై దీని ప్రభావం ఎక్కువ పడనుందో వంటి వివరాలు పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం వివిధ రంగాలపై ఏఐ ప్రభావం, వినియోగ విధానం ఎలా ఉందంటే...సమాచార, కమ్యూనికేషన్ల రంగం: సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఏఐని అత్యధికంగా వాడుతున్నాయిఅడ్మినిస్ట్రేటివ్, సపోర్ట్ సర్వీసెస్ : ఆఫీస్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి పనులలో ఏఐ వాడకం చాలా ఎక్కువగా ఉంది⇒ హోల్సేల్, రిటైల్ వ్యాపారం, ఫుడ్ సర్వీసెస్, హోటళ్లు, క్యాటరింగ్ రంగాలు⇒ చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏఐ టూల్స్ను వేగంగా స్వీకరిస్తున్నాయిఅధిక జీతాలు ఇచ్చే కంపెనీలు : ఉద్యోగులకు మంచి వేతనాలు ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థలలో ఏఐ ప్రయోగాలు, దాని ద్వారా వచ్చే ఉత్పాదకత లాభాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చిందిమొత్తంగా చూస్తే, శారీరక శ్రమ లేదా సాధారణ క్లరికల్ పనులు ఎక్కువగా ఉండే రంగాల కంటే, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లోనే ప్రస్తుతం ఏఐ విప్లవం వేగంగా విస్తరిస్తోంది.భారత్లో ఏఏ రంగాల్లో ఏఐ ప్రభావం అధికం ?ఐటీ మరియు టెక్నాలజీ సర్వీసెస్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ ఆటోమేషన్ వల్ల 10% నుంచి 20% వరకు ఉత్పాదకత పెరిగిందిబ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) : లోన్ ప్రాసెసింగ్, రిస్క్ అసెస్మెంట్, కస్టమర్ సపోర్ట్ (ఏఐ చాట్బాట్స్) విభాగాల్లో పనిభారం భారీగా తగ్గిందిరిటైల్, ఈ–కామర్స్ (రిటైల్,కన్జూమర్ గూడ్స్) : కస్టమర్ల అవసరాలను అంచనా వేయడానికి, సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం ఏఐని ఎక్కువగా వాడుతున్నారుఉద్యోగాల మార్కెట్–భవిష్యత్ (2026 – 2031): ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్. నాస్కామ్ నివేదికల ప్రకారం ఇండియాలో ఏఐ సంబంధిత ఉద్యోగాల డిమాండ్ 10 లక్షలు దాటింది⇒ ప్రపంచంలోనే ఏఐ టాలెంట్ను ఆకర్షించడంలో భారత్ (33% హైరింగ్ రేటుతో) ముందుందినీతి ఆయోగ్ అంచనా : భారత్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తే, టెక్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల సంఖ్య రాబోయే రోజుల్లో కోటి దాటే అవకాశముంది. ⇒ ఒకవేళ కంపెనీలు అప్గ్రేడ్ అవ్వకపోతే ఉద్యోగాల కోత తప్పదని ఈ నివేదిక హెచ్చరించిందిభారత్ మెరుగైన స్థితిలోనే...ఇండియాలో ఏఐ వినియోగం..దాని వల్ల పెరుగుతున్న ఉత్పాదకత, ఉద్యోగాలపై ప్రభావం గురించి నాస్కామ్, ఈవై, నీతి ఆయోగ్ వంటి సంస్థల నివేదికలు కీలక వివరాలను వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని వేగంగా స్వీకరిస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో ఉంది. మనదేశంలో ఏఐ కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, ఆర్థిక వ్యవస్థ, ఉత్పాదకతను పెంచే ఒక కీలక శక్తిగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ఏఐ అడ్వాంటేజ్, ఉత్పాదకత సమయం ఆదాలో టాప్‘ఈవై 2025 వర్క్ రీఇమేజిన్డ్’ సర్వే ప్రకారం పనిలో ఏఐ ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంలో ప్రపంచంలోనే అత్యధికంగా 53 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది (ప్రపంచ సగటు కేవలం 34 పాయింట్లు మాత్రమే)⇒ దాదాపు 75% మంది భారతీయ ఉద్యోగులు 72% మంది యజమానులు జనరేటివ్ ఏఐతో కార్యాలయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువుగా మారిందని అభిప్రాయపడ్డారుళీ భారత్లో కూడా కొత్తగా చేరిన లేదా తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల ఉత్పాదకత ఏఐ టూల్స్ వల్ల ఏకంగా 34% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి -
మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతికత
న్యూఢిల్లీ: స్వదేశీ న్యాయశాస్త్రం అభివృద్ధికి మనం గణనీయమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయపరమైన అంశాల్లో స్వతంత్ర ఆలోచనకు ప్రత్యామ్నాయంగా కాకుండా, మానవ తార్కికతకు సహాయకంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనియన్, ఆక్స్ఫర్డ్ లా సొసైటీలో ‘డిజిటల్ వాస్తవికతకు రాజ్యాంగ వాగ్దానం: ఏఐ, సాంకేతిక పురోగతి యుగంలో న్యాయాన్ని పరిరక్షించడం’ అనే అంశంపై జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక కార్యక్రమాలకు అదనంగా న్యాయవ్యవస్థ కోసం స్వదేశీ కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం దిగుమతి చేసుకున్న సాంకేతిక నమూనాలు లేదా అంచనాలపై ఆధారపడకుండా, మన సొంత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం, సామాజిక పరిస్థితుల పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. న్యాయ వ్యవస్థలో నేడు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయ వ్యవస్థలను ఒకదానితో ఒకటి మరింత సన్నిహితంగా సంభాషించుకునేలా చేసిందన్నారు. ప్రపంచ న్యాయ సమాజం టెక్నాలజీతో పరస్పరం అనుసంధానం అవుతోందని వెల్లడించారు. న్యాయవ్యవస్థ సాంకేతిక పరివర్తనకు యువ న్యాయవాదులు, న్యాయాధికారులు, న్యాయ నిపుణులు దోహదపడుతున్నారని పేర్కొన్నారు. సాంకేతికత అనేది మానవ విచక్షణను ఎన్నటికీ భర్తీ చేయలేదని తేల్చిచెప్పారు. -
ఏఐ ఏజెంట్ వస్తోంది..
సాక్షి, సెంట్రల్ డెస్క్: స్మార్ట్ఫోన్ మార్కెట్ ఒక చరిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. ఇకపై వినియోగదారులు మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏజెంట్ల ద్వారా నేరుగా తమ డివైస్లతో ఇంటరాక్ట్ అయ్యే రోజులు రానున్నాయి. ఈ సరికొత్త ఏజెంటిక్ విప్లవంలో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ హోరాహోరీగా తలపడుతున్నాయి.ఆండ్రాయిడ్ ఇక ఏఐ సిస్టమ్గూగుల్ తాజాగా నిర్వహించిన ఆండ్రాయిడ్ షో 2026 వేదికగా గూగుల్ జెమినై ఇంటెలిజెన్స్ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం రూపొందించిన ఒక శక్తివంతమైన ఏఐ లేయర్. కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ఉన్న ఆండ్రాయిడ్ను, పూర్తిస్థాయి ఇంటెలిజెన్స్ సిస్టమ్గా మార్చడమే దీని లక్ష్యమని గూగుల్ ప్రకటించింది. వినియోగదారుడి అవసరాలను, సందర్భాన్ని ముందే ఊహించి, వివిధ యాప్ల ద్వారా పనులను ఇది స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న శామ్సంగ్ గెలాక్సీ ఎస్26, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఈ ఫీచర్లు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి.రూ. 53 వేల కోట్ల డీల్తో ఓపెన్ ఏఐ భారీ వ్యూహంమరోవైపు యాపిల్ మాజీ ఐకానిక్ డిజైనర్ జోనీ ఐవ్తో కలిసి ఓపెన్ ఏఐ ఒక సరికొత్త ఏఐ–కేంద్రిత స్మార్ట్ఫోన్ను రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. కంప్యూటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా పునర్నిర్వచించే లక్ష్యంతో స్క్రీన్లు, సంప్రదాయ యాప్ల అవసరం లేకుండా కేవలం ఏఐ ఇంటరాక్షన్తో నడిచే సరికొత్త డివైస్లను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా జోనీ ఐవ్కు చెందిన స్టార్టప్ ‘ఐఓ’ను ఓపెన్ ఏఐ సంస్థ మునుపెన్నడూ లేని విధంగా సుమారు రూ. 53 వేల కోట్ల భారీ డీల్తో కైవసం చేసుకుంది. హార్డ్వేర్ రంగంలో ఓపెన్ ఏఐ వేసిన అతిపెద్ద అడుగుగా ఇది నిలిచింది.స్క్రీన్ ట్యాపింగ్, స్వైపింగ్ ఇక గతంఇటీవల ప్రచురితమైన యాప్ ఏజెంట్ మల్టీమోడల్ ఏజెంట్స్ యాజ్ స్మార్ట్ఫోన్ యూజర్స్ అనే పరిశోధనా పత్రం ప్రకారం ఏఐ ఏజెంట్లు మనుషుల తరహాలోనే స్క్రీన్పై ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం ద్వారా యాప్లను స్వతంత్రంగా ఆపరేట్ చేయగల సామర్థ్యాన్ని సాధించాయి. కిరాణా సామగ్రి ఆర్డర్ చేయడం, దరఖాస్తులు నింపడం, అపాయింట్మెంట్లు బుక్ చేయడం వంటి పనులను ఈ ఏజెంట్లు వినియోగదారుడి ప్రమేయం లేకుండానే పూర్తి చేయగలవు.ముఖ్యమైన మార్పులు ఇవీ..పూర్తి ఆటోమేషన్: ఒకే ఒక కమాండ్తో మల్టీ–స్టెప్ పనులను పూర్తి చేయగల ఏఐ.కాంటెక్ట్స్ అవేర్నెస్: యూజర్ లొకేషన్, బిహేవియర్, ఆన్–స్క్రీన్ యాక్టివిటీ ఆధారంగా ముందస్తు సూచనలు.పరిధి విస్తరణ: ఫోన్లకే పరిమితం కాకుండా భవిష్యత్తులో స్మార్ట్ వాచీలు, కార్లు, ల్యాప్టాప్లలోకి జెమిని ఇంటెలిజెన్స్.భారత్పై ప్రభావం!ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్ అయిన భారతదేశంపై ఈ మార్పు తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో ఆండ్రాయిడ్ మార్కెట్ వాటా అత్యధికంగా ఉండటమే కాకుండా శామ్సంగ్, షావోమి, వన్ప్లస్ వంటి బ్రాండ్ల ద్వారా ఏఐ ఫోన్లకు భారత్ అత్యంత కీలకమైన వృద్ధి కేంద్రంగా మారింది. వచ్చే వారం జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ ఐ/ఓ 2026 సదస్సులో ఆండ్రాయిడ్ 17, జెమినై ఏఐ, ఆండ్రాయిడ్ ఎక్ఆర్ డివైస్లకు సంబంధించిన మరిన్ని సంచలన అప్డేట్లను గూగుల్ ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కృత్రిమ మాయలో మనిషి
‘కృత్రిమ మేధ’గా మనం చెప్పుకునే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ‘కపటి’ అనే అర్థంలో నిజంగానే కృత్రిమంగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. తెలుగులో ‘నకిలీ తెలివి’ లాంటి మాటల్ని వెతుక్కునే లోపలే అది నకిలీ విన్యాసాలలో చిత్రవిచిత్రమైన లోతులు చూస్తోంది. ఒక చేత్తో సానుకూలపు పూల బాణాలనూ, ఇంకోచేత్తో ప్రతికూలపు వాడిబాణాలనూ ప్రయోగిస్తూ జనాన్ని ఏకకాలంలో మోహపారవశ్యంలోనూ, భయవిభ్రమాల్లోనూ ముంచెత్తుతోంది. అనుకూల ఫలితాలపై ఆశపడుతూనే, ప్రతికూల ప్రభావాలనుంచి తప్పించుకునే మార్గాల వేటలో ప్రపంచం తలమునకలవుతోంది. భారత్, చైనా, రష్యా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్న ‘బ్రిక్స్’ కూటమి కృత్రిమ మేధో వినియోగంలో, అభివృద్ధిలో, దానితో ముడిపడిన నైతిక సమస్యల నివారణలో, మేధో హక్కులూ, డేటా పరిరక్షణలో కలసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, సాంస్కృతిక రంగంలో కృత్రిమ మేధో దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుపుతోంది; ఒక సమావేశానికి ప్రపంచ పురాతన నగరాలలో ఒకటైన వారణాసి వేదిక కాబోతోంది. కృత్రిమ మేధ ఏం చేస్తోందంటే, ఒక సాంకేతిక మహాద్భుతంగా మాయామేయ మాంత్రిక జగత్తును సృష్టిస్తూ పురాణ, ఇతిహాస, జానపద కథల కాలంలోకి తీసుకెడుతోంది. రామాయణంలో భర్త శాపానికి గురై అహల్య శిలగా మారిపోవడం, రాముని పాదాలు తాకగానే పూర్వరూపం తెచ్చుకోవడం గురించి చదివాం; ‘జగదేకవీరుని కథ’ సినిమాలో జలక్రీడలాడుతున్న దేవకన్యలను చూసిన పాపానికి వారి శాపానికి ఎరై కథానాయకుడు శిలగా మారిపోవడం, ఒక వృద్ధ మహిళ అతనికి శాపవిముక్తి కలిగించడం చూశాం. త్రిశంకుని స్వర్గానికి పంపించే ప్రయత్నంలో అతణ్ణి మధ్యలోనే స్తంభింపజేసి ‘త్రిశంకు స్వర్గా’న్ని సృష్టించిన విశ్వామిత్రుని పునఃసృష్టి పాటవాన్ని కథల్లో దర్శించాం. రామాయణంలో ఇంద్రజిత్తు చేసే మబ్బుచాటు మాయావి యుద్ధాన్నీ, మహాభారతంలో సైంధవుని వధ సందర్భంలో కృష్ణుడు చక్రం అడ్డేసి కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టించడాన్నీ తిలకించాం. తన అర్ధాంగి పార్వతి అభ్యంగన స్నానానికి వెడుతూ నలుగుపిండి నుంచి సృష్టించి కాపలాపెట్టిన బాలుడు తనను అడ్డగించినందుకు శివుడు ఆగ్రహించి అతని శిరస్సును ఖండించడం; నిజం తెలిసి అతనికి ఏనుగు తలను అతికించి, బతికించడం గురించి విన్నాం. తలలు తీసి తలలు పెట్టడంతో సహా కృత్రిమ మేధ ఇలాంటి చిత్రవిచిత్ర సన్నివేశాలను అవలీలగా సృష్టించగలుగుతోంది. అవి కపటత్వపు అంచులు తాకుతూ ప్రసిద్ధ వ్యక్తుల శీలహననానికి పాల్పడుతూ వివాదాస్పదమవుతున్నాయి; నిజమో, అబద్ధమో తెలియని త్రిశంకు స్థితికి జనాన్ని నెడుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీనటులతో సహా ప్రముఖుల రూపాలనూ, గొంతులనూ వాడుకుంటూ అభ్యంతరకర సన్నివేశాలను సృష్టించడం, వారు న్యాయస్థానాలను ఆశ్రయించడం చూస్తున్నాం. పూర్తి సాంకేతిక నైపుణ్యాలూ, సాంకేతికతను బాధ్యతాయుతంగా వాడుకోవాలనే స్పృహ లేనివారికి కూడా కృత్రిమ మేధ అందుబాటులోకి రావడం వల్ల తలెత్తే ఇలాంటి వైపరీత్యాలతో కూడా పురాణ, ఇతిహాస కథలతో పోలిక కుదరడం మరో వైచిత్రి. ఉదాహరణకు, మహాభారతంలోని అశ్వత్థామతో ముడిపడిన ఒక ఉదంతాన్నే చూస్తే, కురుక్షేత్ర యుద్ధాంతంలో అతను ఉపపాండవులను వధించి పారిపోయినప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి భీముడు బయలుదేరివెడతాడు; అశ్వత్థామ క్రూరుడనీ, చపలచిత్తుడనీ; అతని దగ్గర ‘బ్రహ్మశిరోనామక’మనే దివ్యాస్త్రం ఉందనీ, దాని ప్రయోగమే తప్ప ఉపసంహారం అతనికి తెలియదనీ కృష్ణుడు అర్జునుడితో చెప్పి భీముని కాపాడుకోవడానికి తక్షణమే వెళ్ళాలంటాడు; ఊహించినట్టే అశ్వత్థామ దానిని ప్రయోగించడం, ప్రయోగోపసంహారాలు రెండూ తెలిసిన అర్జునుడు అదే అస్త్రంతో దానిని శాంతింపచేయబోవడం చూస్తాం. మనిషి– తన మేధ సృష్టించిన కృత్రిమ మేధముందు తనే చిత్తవుతున్నాడు. మాంత్రికతనుంచి వాస్తవికతవైపు వెడుతున్న భ్రమలో ఉన్న మనిషిని కృత్రిమ మేధ తిరిగి మాంత్రికతవైపు మళ్ళిస్తూ పైచేయిని చాటుకుంటోంది. తను సృష్టించిన సాంకేతికత చేతిలో తనే ఓడి దిక్కులు చూసే పరిస్థితిని తెచ్చుకోవడం మనిషిని తొలినుంచి వెంటాడుతున్న శాపం. -
మ్యూచువల్ ఫండ్స్ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అడుగు పెట్టనుంది. తన మొదటి పథకం ‘మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్’ను వచ్చే నెల 6న ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మొదటి మూడు నుంచి ఐదేళ్ల కాలంలోనే రూ.25,000–30,000 కోట్ల నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ సీఈవో భౌతిక్ అంబానీ తెలిపారు. అత్యాధునిక గణన నమూనాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లరి్నంగ్ ఆధారిత క్వాంటిటేటివ్ ఈక్విటీ, హైబ్రిడ్ వ్యూహాలతో సేవలు అందించనున్నట్టు చెప్పారు. భిన్నమైన పెట్టుబడులు, సేవలతో కూడిన ఉత్పత్తులను ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపారు. మల్టీ అసెట్ అలోకేషన్ అనంతరం లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. -
భారత్లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ విస్తరణలో భాగంగా భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్బేస్లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
ఫుడ్ సేఫ్టీ... ఏఐ ఉందిగా...
ఏ పుట్టలో ఏ పాముందో... అనేది పాత సామెత. ఏ ఫుడ్లో ఏ బాక్టీరియా ఉందో... అనేది కొత్త సామెత. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా తినాలంటే... భయమే భయం! ఏ సమస్య వచ్చినా... ‘ఏ.ఐ ఉందిగా!’ అనుకునే ఈ కాలంలో... ఏ.ఐ అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన భయాలను పోగొట్టి, భరోసా ఇవ్వగలదా? అంటే... ‘యస్’ అనే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఆహారపరిశ్రమలో ఏఐ అడుగులు పడుతున్నాయి. భవిష్యత్కు సంబంధించి ఆశను, భరోసాను ఇస్తున్నాయి.ఆహార భద్రతకు సంబంధించిన మూలస్తంభాలలో ఒకటి... ఆహార నాణ్యత. ఆహార పదార్థాలలో వ్యాధికారకాలు, విషపదార్థాలను గుర్తించడంలో ఏ.ఐ సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏ.ఐ, ఆధారిత కెమెరాలు ఆహార ఉత్పత్తులలోని కలుషితాన్ని, సరిగా లేని లేబులింగ్ను, ఇతరత్రా అంశాలను మనిషి కంటి కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయి. ఏఐ–ఆధారిత సెన్సార్లు ఆహార ఉత్పత్తులలో ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియాను గుర్తించగలవు. మైక్రోబయాలజీ స్టార్టప్ ‘స్పోర్ బయో’ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పరీక్ష సమయాన్ని రోజుల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించే ఏ.ఐ. సాంకేతికతను అభివృద్ధి చేసింది.తు.చ. తప్పకుండా... ఫుడ్సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ ‘మెక్డొనాల్డ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో ఏ.ఐ. టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏఐ–ఆధారిత డ్రైవ్–త్రూలు నిర్వహిస్తోంది. షెడ్యూలింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లలో రెస్టారెంట్ మేనేజర్లకు ఏ.ఐ. సాధనాలు ఉపకరిస్తున్నాయి. నిబంధనలను పాటించడం అనేది ఆహార పరిశ్రమలకు సవాలుగా, సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చేయడంలో ఏ.ఐ ఆటోమేట్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.ఆహారభద్రతా చట్టాలు, లేబులింగ్ నిబంధనలు, ట్రేసబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఆహార పరిశ్రమలు మాన్యువల్ ప్రాసెస్పై ఎక్కువ ఆధారపడతాయి. సంక్లిష్టమైన నిబంధనలను త్వరగా అర్థం చేసుకోవడం, నిబంధనలు పాటించడానికి సంబంధించిన సందేహాలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్స్... మొదలైనవి ఆహార భద్రతా చట్టాలలో అప్డేటెడ్గా ఉండేలా చూడడానికి ఏ.ఐ. అనేది మాన్యువల్ ప్రాసెస్కు ప్రత్యామ్నాయంగా మారింది.అలెర్జీలకు దూరంగా...ఆరోగ్యానికి దగ్గరగా... ఆహార భద్రతకు సంబంధించి ఏ.ఐ. సాంకేతికతను వినియోగించుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఫుడ్ సైంటిస్ట్లు, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్లు... మొదలైన వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాయి రెస్టారెంట్లు. రోబోటిక్ చెఫ్లు... ఏఐ ఆధారిత రోబోటిక్ చెఫ్లు, ప్రిడిక్టివ్ అనాలటిక్స్ ద్వారా ఆహార వ్యర్థాలను భారీగా తగ్గించడానికి వీలువుతుంది. మీల్ ప్లానర్, కుక్ బుక్ వంటి ఏ.ఐ. సాధనాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందించడంలో సహాయపడుతున్నాయి. అలెర్జీల బారిన పడకుండా ఉపకరిస్తున్నాయి.ఏ.ఐ. ఆధారిత పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ యాప్ ‘ఆర్ఎక్స్డైట్’ కస్టమ్ ఫుడ్ ప్లాన్స్ను డెవలప్ చేసి ఆహారపదార్థాలను తాజాగా అందించడంలో తోడ్పడుతుంది. ఒకవైపు రుచిని అందిస్తూనే, మరోవైపు అలెర్జీ కారకాలను తొలగించడానికి, పోషక విలువలు మెరుగు పరచడానికి ఏ.ఐ సాధనాలు ఉపకరిస్తున్నాయి.మరింత ప్రయోజనకరంగా... ‘సంప్రదాయ ఆహారపదార్థాలను మరింత ప్రయోజనం కలిగించేలా చేయడానికి, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించడానికి ఏ.ఐ. ఉపకరిస్తుంది’ అంటున్నారు నిపుణులు.రెస్టారెంట్ల ఆహారభద్రత పర్యవేక్షించడానికి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏ.ఐ. టూల్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ.ఐ. అనేది పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనం మాత్రమే కాదు ఆహారభద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించేలా చేయడంలో, పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి ఆహార పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్!
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, వినోదం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ అభివృద్ధి వెనుక సమస్యలు కూడా ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. దాని కోసం అవసరమయ్యే నీరు, విద్యుత్, భూమి వినియోగం భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారవచ్చని యూఎన్యూ హెచ్చరించింది. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. దీంతో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. అలాంటప్పుడు వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది.భారీ నీటి వినియోగం!యూఎన్యూ నివేదిక ప్రకారం.. 2030 నాటికి AI డేటా సెంటర్లు వినియోగించే నీరు, ప్రపంచంలోని 1.3 బిలియన్ మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలను తీర్చగల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం ఆఫ్రికా ఖండ జనాభాకు సమానం అని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఏఐ గురించి జరిగిన చర్చల్లో కార్బన్ ఉద్గారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నీటి వినియోగం కూడా అంతే ముఖ్యమైన సమస్యగా మారుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ మోడళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ, సర్వర్ల శీతలీకరణలోనూ భారీ స్థాయిలో నీటి వినియోగం ఉంటుంది.విద్యుత్ వినియోగంవిద్యుత్ వినియోగం విషయంలో కూడా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2030 నాటికి AI ఆధారిత డేటా సెంటర్లు ప్రతి సంవత్సరం సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని కలిపినా వచ్చే మొత్తానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.ఏఐ అనేది కేవలం డిజిటల్ సాంకేతికత మాత్రమే కాదని నివేదిక స్పష్టం చేసింది. దీనికి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ భూమి వనరులపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం విస్తారమైన భూభాగం అవసరమవుతుంది. అదనంగా చిప్ల తయారీ ప్రక్రియలో కూడా విలువైన ఖనిజాలు, నీరు, పవర్ పెద్ద మొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది.పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుఅయితే.. ఇక్కడ ఐక్యరాజ్యసమితి ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని సూచించడం లేదు. బదులుగా ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతోంది. కొత్త ఆవిష్కరణలతో పాటు నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, భూమి వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.ఏఐ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాలు. కాబట్టి AI వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. -
రోబోల విప్లవమా?.. మానవాళి వినాశనమా?
రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలు ఊహించని వేగంతో దూసుకుపోతున్నాయి. మనుషులలాగే నడిచే, మాట్లాడే, పనులు చేసే ‘హ్యూమనాయిడ్ రోబోలు’ (Humanoid Robots) త్వరలోనే మన జీవితాల్లో భాగం కాబోతున్నాయని సంబరపడాలో.. లేక ఇవే మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్నాయని భయపడాలో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇటీవల చైనాలో జరిగిన ఒక బహిరంగ సాంకేతిక ప్రదర్శనలో అత్యంత ఆధునిక హ్యూమనాయిడ్ రోబో ఒక చిన్నారిపై అనూహ్యంగా దాడి చేసిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పరిణామం ఏఐ భద్రతపై అంతర్జాతీయంగా సరికొత్త చర్చకు దారితీసింది.చిన్నారిని తన్నిన 'యూనిట్రీ జీ1' రోబోచైనాలోని క్సిన్జియాంగ్ ప్రాంతంలో నిర్వహించిన ఒక పబ్లిక్ టెక్నాలజీ ఎగ్జిబిషన్లో ఈ భయానక దృశ్యం వెలుగుచూసింది. ప్రముఖ రోబోటిక్స్ సంస్థకు చెందిన ‘యూనిట్రీ జీ1’అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రజల మధ్య ప్రదర్శనకు ఉంచారు. నీలి రంగు విగ్ ధరించిన ఈ రోబో, మార్షల్ ఆర్ట్స్లోని ‘రౌండ్హౌస్ కిక్’ (రౌండ్గా తిరుగుతూ తన్నడం) విన్యాసాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఊహించని విధంగా పక్కనే నిలబడి ఉన్న ఒక చిన్న బాలుడిని ఆ రోబో తన కాలితో బలంగా తన్నింది. ఆ దెబ్బకు ఆ బాలుడు నొప్పితో కుప్పకూలిపోయాడు. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ఎలాంటి ప్రాణాంతక గాయాలు కాలేదని చైనా మీడియా పేర్కొన్నప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ప్రజా సమూహాల మధ్య ఇలాంటి రోబోల భద్రత ఎంతవరకు నమ్మదగినదనే ప్రశ్న ఇప్పడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.ఇది మొదటి ప్రమాదం కాదు.. వరుస లోపాలుయూనిట్రీ రోబోల వల్ల ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది ప్రారంభంలో చైనాలో జరిగిన మరో పబ్లిక్ ప్రదర్శనలో సైతం ఇదే రకమైన ‘యూనిట్రీ జీ1’ రోబో ప్రదర్శన ఇస్తూ అదుపు తప్పి కింద పడిపోయింది. ఆ సమయంలో రోబో చేతులు, కాళ్లు అసంకల్పితంగా, నియంత్రణ లేకుండా కదలడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తి ముక్కుకు బలంగా తగిలి తీవ్ర గాయమైంది. ఈ వరుస ఘటనలు హ్యూమనాయిడ్ రోబోల భౌతిక నియంత్రణ, వాటి సమతుల్యతపై సాంకేతిక నిపుణులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.తుపాకీతో యజమానిపైనే కాల్పులు జరిపిన 'మాక్స్'రోబోల ప్రమాదాలు కేవలం శారీరక విన్యాసాలకే పరిమితం కాలేదు. గత ఏడాది అమెరికాలో జరిగిన ఒక వైరల్ ప్రయోగం మరింత భయాందోళనలను కలిగించింది. ‘మాక్స్’ అనే హ్యూమనాయిడ్ రోబో రోల్-ప్లే (నాటకీయ పాత్ర) చేస్తున్న సమయంలో, భద్రతా నియమాలను ఉల్లంఘించి తన యజమానిపైకే ‘బీబీ గన్’తో కాల్పులు జరిపింది. మొదట కాల్చడానికి నిరాకరించినప్పటికీ, ఒక నిర్దిష్ట పాత్రలో నటిస్తున్నట్లు కమాండ్ ఇవ్వగానే అది తన సేఫ్టీ లాక్లను బైపాస్ చేసి కాల్పులు జరిపింది. కేవలం ప్రాంప్ట్ (ఆదేశం) మార్చడం ద్వారా ఏఐ భద్రతా నియమాలను ఎంత సులభంగా హ్యాక్ చేయవచ్చో, వాటిని ఎలా దారి మళ్లించవచ్చో ఈ ఘటన నిరూపించింది.రోబో తప్పు చేస్తే.. అసలు బాధ్యత ఎవరిది?స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలు ఇటువంటి ప్రమాదాలకు కారణమైనప్పుడు, ఆ నష్టానికి లేదా గాయాలకు చట్టపరంగా ఎవరిని బాధ్యులను చేయాలనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సవాలుగా మారింది. ఏఐ సాఫ్ట్వేర్ రూపకల్పన చేసిన డెవలపర్లదా?, రోబో హార్డ్వేర్ను తయారు చేసిన కంపెనీదా?, లేదా ఆ సమయంలో ఆ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న ఆపరేటర్లదా? అనే ప్రశ్నలపై ఇంకా స్పష్టత లేదు. రవాణా, తయారీ రంగం, వైద్యం, ప్రజా ప్రదేశాలలో ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ చట్టపరమైన బాధ్యత అంశం అత్యంత కీలకంగా మారింది.టెస్లా, బోయింగ్ నేర్పిన చేదు పాఠాలుగతంలో కూడా ఇలాంటి ఆటోమేటెడ్ వ్యవస్థల వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లాయి. టెస్లా కార్లలోని ‘ఆటోపైలట్’ డ్రైవర్-అసిస్టెన్స్ వ్యవస్థ కారణంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు సాఫ్ట్వేర్ పనిరుపై, మానవ పర్యవేక్షణపై అనేక అనుమానాలను రేకెత్తించాయి. అదేవిధంగా, బోయింగ్ 737 మ్యాక్స్ విమాన ప్రమాదాల దర్యాప్తులో కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్లోని లోపాల వల్లే వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని నిపుణులు తేల్చారు. సాంకేతికత ఎంత పెరిగినా, ఆటోమేషన్ వ్యవస్థలలో చిన్న లోపం ఉన్నా అది ప్రాణాంతకంగా మారుతుందని ఈ ఉదాహరణలు హెచ్చరిస్తున్నాయి.చట్టాల రూపకల్పనపై ప్రపంచ దేశాల కసరత్తుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు రోబోటిక్స్ ప్రమాదాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించే పనిలో పడ్డాయి. అమెరికాలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే పరిస్థితులను అనుసరించి తయారీదారులు లేదా ఆపరేటర్లపై బాధ్యత నెడుతున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ సాంకేతికతలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కఠినతరం చేస్తోంది. కొంతమంది పరిశోధకులు ఏఐ వ్యవస్థలకు ప్రత్యేక చట్టపరమైన హోదా ఇవ్వాలని సూచిస్తున్నప్పటికీ, మెజారిటీ నిపుణులు మాత్రం జవాబుదారీతనం ఎప్పుడూ మనుషులు, సదరు రోబోటిక్స్ సంస్థల వద్దే ఉండాలని గట్టిగా వాదిస్తున్నారు. సాంకేతికత మనుషుల ప్రాణాల కంటే ముఖ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో కేరళ రుతుపవన సంకేతాలు -
కోర్టుల్లో ‘ఏఐ’కి లక్ష్మణ రేఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక ముసాయిదా నిబంధనలు జారీ చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాన్ని ప్రోత్సహిస్తూనే.. దాని పరిమితులను స్పష్టంగా నిర్దేశించింది. ఏఐని కేవలం సహాయకారిగా మాత్రమే వాడుకోవాలని, న్యాయమూర్తుల విచక్షణాధికారాలకు అది ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాబోదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఏఐ కమిటీ రూపొందించిన ‘న్యాయస్థానాల్లో ఏఐ వినియోగం– 2026’ముసాయిదా నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యం(పబ్లిక్ డొమైన్)లో అందుబాటులో ఉంచింది. దీనిపై జూన్ 20వ తేదీలోగా సలహాలు, సూచనలు అందించాలని.. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరింది. ఆధునికరణకు ప్రాధాన్యం ఇస్తూనే న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని పరోక్షంగా పేర్కొంది. కేవలం అల్గారిథమిక్ నిర్ణయ విధానం ద్వారా ఎటువంటి న్యాయపరమైన ఫలితాన్ని సాధించరాదని వెల్లడించింది. డేటా భద్రతకు ప్రాధాన్యం కోర్టుల్లో చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించి, న్యాయ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్న వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ముసాయిదాకు రూపకల్పన చేసింది. న్యాయ సమాచార అన్వేషణ(లీగల్ రీసెర్చ్), కోర్టు పత్రాల తయారీ, తీర్పుల అనువాదం, కోర్టు ప్రొసీడింగ్స్ ట్రాన్స్క్రిప్షన్ వంటి పరిపాలనాపరమైన పనులను ఏఐ ద్వారా సులభతరం చేయవచ్చని అంగీకరించింది. అయితే, ప్రైవేట్ కృత్రిమ మేధ వ్యవస్థల వల్ల వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టుల డేటాపై పూర్తి నియంత్రణ, యాజమాన్య హక్కులు న్యాయస్థానాల పరిధిలోనే ఉండేలా నిబంధనలను కఠినతరం చేసింది. ఏఐ ఒక సహాయకారి మాత్రమే.. ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో ఎంతగా అభివృద్ధి చెందినా.. న్యాయ ప్రక్రియలో అవి కేవలం సహాయకారి పాత్రకే పరిమితం కావాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏఐ సాంకేతికత ఒక్కోసారి వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ఇచ్చే ప్రమాదం ఉన్నందున, దాని ఫలితాలను గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించింది. ఏఐ సాయంతో ఏవైనా పిటిషన్లు, పత్రాలు తయారుచేస్తే.. ఆ విషయాన్ని కోర్టుకు తప్పనిసరిగా ముందే వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ ఏఐ తప్పుడు సమాచారం ఇస్తే.. దానిపై నెపం నెట్టి న్యాయవాదులు లేదా కక్షిదారులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు వీల్లేదని ముసాయిదా పేర్కొంది. కోర్టుకు ఆ పత్రాలను ఎవరు సమరి్పస్తే వారిదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది. న్యాయ వ్యవస్థలో మానవ ప్రమేయానికే ఎల్లప్పుడూ అత్యున్నత ప్రాధాన్యం ఉంటుందని ఉద్ఘాటించింది. నిబంధనల అమలు ఇలా.. కృత్రిమ మేధ వినియోగంపై సుప్రీంకోర్టు విడుదల చేసిన ఈ ముసాయిదా నిబంధనలు అ త్యున్నత న్యాయస్థానంతో పాటు హైకోర్టులు, దేశవ్యాప్తంగా ఉన్న కింది కోర్టులు, ట్రిబ్యునళ్లకు సైతం వర్తిస్తాయి. దీని ప్రకారం.. లీగల్ రీసెర్చ్, పాత తీర్పుల సారాంశాన్ని అర్థం చేసుకోవడం, డాక్యుమెంట్ల అనువాదం, నోటీసులు, సమన్ల తయారీకి మాత్రమే న్యాయవాదులు ఏఐని వాడుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ, కేసులను విచారించడం, తుది తీర్పులు వెలువరించడం, శిక్షలు ఖరారు చేయడం, బెయిల్ మంజూరు చేయా లా? వద్దా? అనేది తేల్చడం, సాక్షుల విశ్వసనీయతను అంచనా వేయడం వంటి అత్యంత కీలకమైన నిర్ణయాత్మక అంశాల్లో ఏఐ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే న్యాయస్థానాల్లో ఏఐ వ్యవస్థల పర్యవేక్షణ, ఆడిటింగ్ కోసం సుప్రీంకోర్టు స్థాయిలో ప్రత్యేక అపెక్స్ బాడీని, అన్ని హైకోర్టుల్లో ప్రత్యేక ఏఐ కమిటీలను ఏర్పాటు చేయాలని ముసాయిదా సూచించింది. ఇదిలా ఉండగా, ఈ ముసాయిదాను పలువురు న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు. -
ఉద్యోగుల పొట్టకొడుతున్న ఏఐ!
వ్యాపార రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ టెరాడేటా (Teradata) కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 5,100 మంది ఉద్యోగులకు 2026 సంవత్సరంలో వార్షిక జీతాల పెంపు ఉండబోదని యాజమాన్యం ప్రకటించింది.టెరాడేటా సంస్థ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన మెమోలో, 2026 సంవత్సరానికి కంపెనీ ప్రధాన లక్ష్యం.. ఏఐ రంగంలో విజయాన్ని సాధించడం అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం, ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెట్టడం అవసరమని వివరించారు. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు వార్షిక జీతాల పెంపు కోసం కేటాయించిన బడ్జెట్ను ఏఐ అభివృద్ధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.సాధారణంగా.. కంపెనీలో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 నుంచి 4 శాతం వరకు జీతాల పెంపు ఉండేది. అయితే ఈసారి ఆ పెంపులను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ ఉద్యోగుల కోసం అన్ని రకాల ప్రయోజనాలను రద్దు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. పర్ఫామెన్స్ బేస్డ్ బోనస్లు, షేర్ల రూపంలో ఇచ్చే ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపింది.టెరాడేటా మాత్రమే కాకుండా.. మరో టెక్ కంపెనీ టీటీఈసీ కూడా అమెరికాలోని ఉద్యోగుల రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రయోజనాలను 2026 వరకు నిలిపివేసింది. ఆ నిధులను ఏఐ టూల్స్, ఉద్యోగుల శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపులుపై ప్రభావం చూపిన ఏఐ, ఇప్పుడు జీతాలపైనా కూడా ప్రభావం చూపుతోంది. -
మెడికల్ సలహాల్లో ఏఐకి 76 శాతం మార్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ప్రస్తుతం మన జీవితాల్లో ఒక ముఖ్య భాగమైపోయింది. కోడింగ్ నుండి స్క్రిప్ట్ రైటింగ్ వరకు అన్ని రంగాల్లోనూ దీని వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, ఇటీవల కాలంలో చాలా మంది తమ ఆరోగ్య సమస్యలకు, స్వీయ వైద్య నిర్ధారణ కోసం చాట్జీపీటీ వంటి ఏఐ సాధనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వైద్య సలహాల కోసం ఏఐని ఎంతవరకు నమ్మవచ్చు?’ అనే అంశంపై పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలో ఏఐ సామర్థ్యానికి సంబంధించి పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.పరిశోధన వెనుక..పరిశోధన బృంద సభ్యుడు, పెన్ స్టేట్ అసోసియేట్ ప్రొఫెసర్ అమూల్య యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి చాలా కాలంగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లను వాడుతున్నారు. అయితే, అధునాతన ఏఐ చాట్బాట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇవి ఆన్లైన్ స్వీయ వైద్య నిర్ధారణ సాధనాలుగా మారగలవా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం చేపట్టారు. ఈ ఏఐ టూల్స్ ప్రజలకు నిజంగా ఉపయోగకరంగా మారతాయా లేక మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తాయా అని విశ్లేషించడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం.76 శాతం ఖచ్చితత్వం.. చాట్జీపీటీ టాప్!ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వినియోగదారుల నుండి 200కు పైగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలను సేకరించి, వాటిని చాట్జీపీటీతో సహా వివిధ రకాల లాంగ్వేజ్ మోడల్స్కు అందించారు. ఆ ఏఐ సాధనాలు ఇచ్చిన సమాధానాలను బోర్డ్-సర్టిఫైడ్ వైద్యులు నిశితంగా పరిశీలించారు. ఈ విశ్లేషణలో ఏఐ టూల్స్ దాదాపు 76 శాతం మేర సరైన సమాధానాలనే ఇచ్చాయని తేలింది. వీటిలో అన్నింటికంటే ముఖ్యంగా ఓపెన్ ఏఐ కి చెందిన చాట్జీపీటీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఖచ్చితమైన ఫలితాలను అందించినట్లు ప్రొఫెసర్ అముల్య యాదవ్ పేర్కొన్నారు.వైద్యులు లేని చోట వరం.. కానీ హెచ్చరిక తప్పదు!ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని అంచనా. అలాంటి ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేనప్పుడు, 76 శాతం ఖచ్చితత్వంతో పనిచేసే ఈ ఏఐ మోడల్స్ కొంతవరకు సహాయపడగలవని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, వైద్య నిర్ణయాల కోసం పూర్తిగా ఏఐ పైనే ఆధారపడకూడదని వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏఐ చాట్బాట్లు ప్రస్తుతానికి మానవ వైద్యులంత ఖచ్చితమైనవి కావని, లక్షణాలను సరిగ్గా అంచనా వేయడంలో, తప్పుడు సమాచారాన్ని గుర్తించడంలో వైద్యులే అత్యంత సమర్థులని అమూల్య యాదవ్ స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ పోర్టల్పై హ్యాకర్ల అటాక్.. తిప్పికొట్టిన టెక్ టీమ్! -
తొమ్మిది కోట్ల ఐఆర్సీటీసీ ఐడీలు బ్లాక్.. మీ అకౌంట్ సేఫేనా?
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికులకు షాకిస్తూ భారీ అపరేషన్కు తెరలేపింది. టికెట్ బుకింగ్స్లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ప్రయాణికులకు అందించే ఆహారంలో నాణ్యతను పెంచేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల కొద్దీ అనుమానాస్పద అకౌంట్లపై వేటు వేయడమే కాకుండా, రైల్వే కిచెన్లలో ఆహార భద్రతను పర్యవేక్షించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించింది.టికెట్ దందాలపై ఉక్కుపాదం.. 9 కోట్ల అకౌంట్లు క్లోజ్!ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఐఆర్సీటీసీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. వ్యవస్థలో పారదర్శకత కోసం ఏకంగా 3 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను పూర్తిగా నిలిపివేసింది. మరో 6 కోట్ల అకౌంట్లను కఠిన నిఘాలో ఉంచి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. మొత్తం మీద 9 కోట్ల ఖాతాలపై ఐఆర్సీటీసీ అధికారులు విచారణ జరుపుతున్నారు. అంతేకాదు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్ (పీఎన్ఆర్)లపై 501 ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ ఏడాదిలోనే 13,343 నకిలీ ఈమెయిల్ డొమైన్లను బ్లాక్ చేయడం విశేషం.ఏఐ కెమెరాల నిఘా.. టికెట్ మోసాల సంగతి పక్కన పెడితే, ప్రయాణికుల ఆరోగ్య రక్షణ కోసం ఐఆర్సీటీసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా రైల్వే వంటశాలలలో 2,394 ఏఐ ఆధారిత స్మార్ట్ కెమెరాలను అమర్చింది. ఇవి ఆహార తయారీని క్షణక్షణం పర్యవేక్షిస్తాయి. సిబ్బంది తలకు క్యాప్ పెట్టుకోకపోయినా, చేతులకు గ్లౌజులు వేసుకోకపోయినా, వంటగదిలో ఈగలు, దోమలు, బొద్దింకలు, లేదా ఎలుకలు తిరిగినా ఈ కెమెరాలు వెంటనే పసిగడతాయి. కేవలం 7 నుంచి 8 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే చీమ అంత వస్తువును సైతం గుర్తించగలగడం ఈ సిస్టమ్ ప్రత్యేకత.రెండు గంటల్లో యాక్షన్.. 60 కోట్ల మీల్స్ భద్రత!వంటగదుల నుంచి వచ్చే సీసీటీవీ ఫుటేజీని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ ఏఐ సిస్టమ్ విశ్లేషిస్తుంది. నిబంధనల ఉల్లంఘన జరిగితే వెంటనే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ ఆ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, ఉన్నతాధికారులకు అలర్ట్ వెళ్తుంది. కేవలం రెండు గంటల్లోనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ సిస్టమ్ రోజుకు సగటున 350 అలర్ట్లను ఇస్తోంది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీ ఏకంగా 60 కోట్ల మంది ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని అందించింది. భవిష్యత్తులో ఈ ఏఐ నిఘా నెట్వర్క్ను మరింత విస్తరించనున్నారు.ఇది కూడా చదవండి: జాబ్స్ పేరుతో చైనా గూఢచర్యం: ‘ఫైవ్ ఐస్’ హెచ్చరిక! -
ఏఐ క్లిక్.. ప్రాజెక్టుకు కిక్
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రాజెక్టు వర్క్ స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికోసం కొన్ని ప్రత్యేక టూల్స్ కూడా సిద్ధమయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు ఇప్పటికే ఏఐ ఆధారిత ప్రాజెక్టు వర్క్లు చేస్తున్నాయి. విద్యార్థి సృజనాత్మకతకు కొత్త సాంకేతికత ఉపయోగపడుతోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల దీనిపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అధ్యయనం చేసింది. ఆన్లైన్ ప్లాట్ఫాంలో లభించే సరికొత్త టూల్స్ను అన్ని కాలేజీలు అనుసరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇటీవల దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచేందుకు ప్రాజెక్టు వర్క్ కీలకం. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా దీనిని చేయడం వల్ల నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్విభిన్న టూల్స్ఇంజనీరింగ్ విద్యార్థులకు తొలి ఏడాది నుంచి ప్రాజెక్టు వర్క్ చేయడానికి, అవసరమైన సలహాలు ఇవ్వడానికి అనేక టూల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతి డేటాను క్లౌడ్ ద్వారా ఏఐ తీసుకుంటుంది. కేవలం విద్యార్థి చదివే రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమాచార సేకరణకు ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. ప్రపంచ స్థాయిలో ఇంజనీరింగ్ విద్య, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని రూపొందించారు. » ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ ద్వారా ప్రాజెక్ట్ ఐడియాలు, కోడింగ్, డీ బగ్గింగ్, డాక్యుమెంటేషన్ పనులు సులభమవుతాయి. » గిట్హబ్ కాపిలాట్ కోడ్ ఆటోమేటిక్గా పనులను సూచిస్తూ సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. » గూగుల్ జెమినీ డేటా విశ్లేషణ, సాంకేతిక నివేదికలు, ప్రజెంటేషన్ల తయారీలో ఉపయోగపడుతోంది. » ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించడం, పరిశోధన నివేదికలను రూపొందించడంలో సహకరిస్తోంది. » పర్ప్లెక్సిటీ ఏఐ పరిశోధనకు అవసరమైన మూలాలను వేగంగా గుర్తించి సమాచారాన్ని అందిస్తోంది. » కాన్వా మేజిక్ డిజైన్ ప్రాజెక్టు ప్రజెంటేషన్లు, పోస్టర్లు, డిజైన్లను ఏఐ సహాయంతో రూపొందిస్తోంది.కోడింగ్లోనూ ఏఐ కీలకంకంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కోడ్ అభివృద్ధికి ఏఐను విస్తృతంగా ఉపయోగిస్తుండగా, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విద్యార్థులు కూడా వెనుకబడటం లేదు. సర్క్యూట్ డిజైన్ల కోసం ఏఐ ఆధారిత సిములేషన్ టూల్స్ వాడుతున్నారు. రొబోటిక్స్ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్ కోడ్ జనరేషన్ వాడకం పెరిగింది. క్యాడ్ మోడలింగ్కు జనరేటివ్ డిజైన్ సాఫ్ట్వేర్, ఐవోటీ ప్రాజెక్టులకు సెన్సార్ ఇంటిగ్రేషన్ సూచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. డేటా సైన్స్ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్ అనలిటిక్స్ ప్లాట్ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇంజనీరింగ్ ప్రాజెక్టు వర్క్లో ఏఐ కీలకంగా మారనుంది. సమస్య ఎంపిక నుంచి ప్రొటోటైప్ రూపకల్పన, పరీక్షలు, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్ వరకు ప్రతి దశలో ఏఐ సహాయకారిగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇంజనీరింగ్ విద్యలో సృజనాత్మకత, ఆవిష్కరణ, పరిశ్రమ అనుసంధానం కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రయోగం నుంచి వినియోగం వైపు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ తెలిపారు. సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు. కలిసి పని చేసే హైబ్రిడ్ విధానం.. ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కి చెందిన వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్ టైమ్ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది. దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.ఏఐ డీప్ఫేక్లతో వ్యాపారానికి రిస్కువిప్రో వెల్లడిఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్ఫేక్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది. కొన్ని సర్వీసులకు డిమాండ్ తగ్గుతుంది ఏఐ ఆటోమేషన్ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్ టూల్స్ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్ సర్వీసులకు డిమాండ్ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. ఒకవేళ ఏఐ ఎనబుల్డ్ సొల్యూషన్స్ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది. విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్ దేశాల నుంచి, 27 శాతం యూరప్ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్లోని టెక్ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. -
ఏఐ ఖర్చు తడిసిమోపెడు!
‘‘ఏఐ రాకతో ఉద్యోగాలకు ఎసరు..’’ ‘‘ప్రతి రంగంలోనూ ఏఐ, రోబోలదే రాజ్యం’’ ఇంకో ఏడాదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండనే ఉండరు’’ కృత్రిమ మేధ.. అదేనండి ఏఐ విషయంలో కొంతకాలంగా మనం తరచూ చూస్తున్న వార్తలు ఇవి. వీటిని నమ్మిన ఒక వర్గం ఏఐ కోర్సుల్లో ఎగబడి చేరేశారు. ఇంకోవర్గం సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్లను వదిలేసుకున్నారు. కానీ...ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? సుమారు ఆరు నెలల క్రితం నాటి మాట. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లక్ష వరకూ ఇంజనీర్ల ఏఐ సబ్స్క్రిప్షన్లు నిలిపేసింది. క్లాడ్ ఏఐను వాడొద్దని వారికి స్పష్టం చేసింది.కొంచెం అటు ఇటుగా ఇదే సమయంలో ఊబర్కు కూడా ఏఐ షాక్ ఒకటి తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే.... ఏఐ వాడితే ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి... వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు రావడమే! ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలి.ఏజెంటిక్ ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్లలో లెక్కిస్తూంటారు. ఉదాహరణకు మీరు ‘ Hello, How are you? ‘ అని ఏజెంటిక్ ఏఐతో మాట కలిపారు అనుకుందాం. దీన్ని ఏఐ ఏక మొత్తంగా ఒక వాక్యంగా అర్థం చేసుకోదు. టోకెన్లుగా విభజిస్తుంది. ‘ " Hel", " lo", " How", " are", " you" ‘ లు ఒకొక్కటి ఒక్కో టోకెన్ అవుతుందన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ రాయమంటే... అందులోని ఒక్కో టోకెన్కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. 70 శాతం ఏఐదే.. కానీ... కోడింగ్ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్స్క్రిప్షన్లను క్యాన్సిల్ చేసింది. ‘‘ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి.ఇది తగ్గితే కానీ ఏఐ విస్తృత వినియోగంలోకి రాదు’’అని ఎన్విడియా అప్లైడ్ డీప్ లెర్నింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్రయన్ కాటన్జరో వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. ‘‘సాఫ్ట్వేర్ కోడ్లో 70 శాతం వరకూ ఏఐ ఆధారంగానే జరుగుతోంది. అయితే దీని వల్ల వినియోగదారుడికి ఏదైనా ప్రయోజనం కలుగుతోందా? లేదా? అన్నది స్పష్టం కాలేదు’’అని ఊబర్ సీఓఓ ప్రశాంత్ మహేంద్ర రాజ చెబుతున్నారు. ఇంకోలా చెప్పాలంటే ఏఐపై పెడుతున్న ఖర్చుకు తగ్గ లాభాలు రావడం లేదన్నమాట. ఉద్యోగాల కోత మాటేమిటి? ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తించాలి. ఈ నేపథ్యంలో ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యం అవసరమవుతుంది.వీటిని కలిగిఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందన్నది మాత్రం కాలమే చెప్పాలి!!–సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏఐ రేసులో భారత్ బేజారు
కొద్ది నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అత్యధికంగా వినిపిస్తున్న పదం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)! బుడిబుడి అడుగులేస్తూ విశ్వమంతటా వ్యాపించిన వామనుడిలా అన్ని రంగాలలోనూ ఏఐ విస్తరిస్తోంది. తొలుత సాఫ్ట్వేర్ రంగంలో విప్లవంగా అభివర్ణించిన ఏఐ ప్రస్తుతం అడుగుపెట్టని పరిశ్రమలేదంటే అతిశయోక్తికాదు!! అయితే ఏఐలో ముందడుగు వేస్తూ ఆవిష్కరణలకు తెరతీస్తున్న కంపెనీలు, దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయ్.. దీంతో అటు పూర్తిగా ఏఐ లేదా ఇటు విభిన్న ఆవిష్కరణలలో బలమైన వృద్ధిని అందుకోలేక సతమతమవుతున్న భారత్ను మార్కెట్ విలువలో తైవాన్ అధిగమించింది. ఇదే సమయంలో మరోపక్క దక్షిణ కొరియా దూసుకొస్తోంది. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఏఐ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేసిన యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆశించినస్థాయిలో లబ్ది పొందలేదన్న అంచనాలు షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ బాటలో దేశీయంగానూ ఐటీ సేవల దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో తదితర కౌంటర్లలోనూ కొద్ది రోజులుగా భారీ అమ్మకాలకు తెరలేచింది.మరోపక్క ఏఐ బూమ్తో భారీగా లబ్ధి పొందుతున్న యూఎస్ చిప్ దిగ్గజం ఎన్విడియా కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొనడంతో షేరు రోజుకో గరిష్టాన్ని తాకుతోంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఎన్విడియా కంపెనీ మార్కెట్ విలువ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది! వెరసి దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువను మించిపోయింది!! నెక్ టు నెక్ ఏఐ సానుకూలతలతో దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజాలు శామ్సంగ్ ఎల్రక్టానిక్స్, ఎస్కే హైనిక్స్ షేర్లు సైతం ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఆ దేశ స్టాక్ మార్కెట్ విలువ సైతం వేగంగా బలపడుతోంది. 2026లో ఇప్పటివరకూ 70 శాతం జంప్చేయడంతో 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్ విలువకు (ప్రస్తుతం 4.91 లక్షల కోట్ల డాలర్ల) చేరువైంది. మరోపక్క ఏఐ బూమ్ తైవాన్కు బాగా కలసి వస్తోంది.2026లో 50 శాతం వృద్ధి చెందడంతో తైవాన్ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇందుకు ప్రధానంగా తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ) షేరు 50 శాతం పురోగమించడం సహకరించింది. తద్వారా మార్కెట్ విలువ ర్యాంకింగ్లో భారత్ను వెనక్కి నెట్టి ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది! దేశీయంగా నేలచూపు ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో మార్కెట్ విలువలో 28–24 శాతం మధ్య కోతపడింది. ఇదే సమయంలో ప్రధాన ఇండెక్సులు 12 శాతం క్షీణించగా.. ఐటీ ఇండెక్స్ 25 శాతం పతనమైంది. ఐటీ మిడ్క్యాప్స్లో కోఫోర్జ్, ఎల్టీఎం, పెర్సిస్టెంట్, ఎంఫసిస్ 30–22 శాతం మధ్య తిరోగమించాయి. ఇందుకు హెచ్1బీ వీసా ఫీజు భారీ పెంపు, క్లయింట్ల వ్యయాలు తగ్గడం, డీల్స్లో ఆలస్యం ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వీటన్నిటికిమించి ఏఐ మరింత ఆందోళనలకు కారణమవుతోంది. వెరసి ఈ ఏడాది మొత్తం లిస్టెడ్ ఐటీ షేర్ల మార్కెట్ విలువలో రూ. 7,67,000 కోట్లు ఆవిరైనట్లు ఒక నివేదిక తెలియజేసింది.భారత్ సేఫ్దేశీ క్యాపిటల్ మార్కెట్ల మొత్తం విలువలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా 4 శాతమే. ఇక ఐటీ పరిశ్రమ విలువ సుమారు 281 బిలియన్ డాలర్లుకాగా.. మొత్తం మార్కెట్ క్యాప్లో వాటా 5–7 శాతమే. అయితే దక్షిణ కొరియా మార్కెట్ విలువలో శామ్సంగ్, ఎస్కే హైనిక్స్ 50 శాతం వాటా ఆక్రమిస్తుండగా.. తైవాన్ మార్కెట్ విలువలో టీఎస్ఎంసీ వాటానే 40 శాతం. దీంతో ఆయా దిగ్గజాల షేర్ల విలువ మొత్తం మార్కెట్ విలువను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి భారత్పై ఏ ఒక్క రంగం లేదా కంపెనీ అతిగా ప్రభావం చూపే వీలులేకపోవడం సానుకూల అంశమని తెలియజేశారు. -
‘క్వాంటమ్’ పేర.. లాభాల ఎర
హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ మహిళా వైద్యురాలు సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు కనిపించిన నకిలీ వీడియోను చూసి మోసపోయారు. ఆ వీడియోలో చూపిన ట్రేడింగ్ ప్లాట్ఫారమ్పై నమ్మకం పెంచుకున్న ఆమె.. జూలై నుంచి డిసెంబర్ 2025 మధ్య 11 విడతల్లో రూ.68.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బు ఉపసంహరించుకునే సమయంలో మోసం జరిగినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సాక్షి, హైదరాబాద్: సులువుగా డబ్బు సంపాదించాలన్న కొందరి అత్యాశను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ‘క్వాంటమ్ ఏఐ’లో పెట్టుబడులు పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్వయంగా ఈ ప్రకటన ఇస్తున్నట్టుగా డీప్ఫేక్ వీడియోను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. కేవలం నిర్మలాసీతారామన్వే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధామూర్తి ఇతర ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి ఇలాంటి ఫేక్ వీడియోలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా నకిలీవేనని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది. క్వాంటమ్ ఏఐ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న పెట్టుబడి మోసాలపై నిర్మలాసీతారామన్ బహిరంగంగా హెచ్చరించారు. తనకు సంబంధించిన పలు డీప్ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలా మోసం చేస్తున్నారు? సైబర్ నేరగాళ్లు ముందుగా ప్రముఖుల పేర్లతో నకిలీ వార్తా కథనాలు, డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ప్రముఖులు స్వయంగా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందినట్టు చూపిస్తున్నారు. ఆ ప్రకటనల్లో ‘రూ.22 వేల పెట్టుబడితో నెలకు రూ.3 లక్షల ఆదాయం’, ‘రూ.22 వేల పెట్టుబడికి రూ.40 లక్షల రాబడి’, ‘ప్రభుత్వ హామీతో క్వాంటమ్ ఏఐ’వంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల్లో వచ్చే ఆ ప్రకటనల్లో మీరూ ఈ లాభాలు పొందాలంటే ప్రకటనల్లోని లింక్లపై క్లిక్ చేయండి అని సూచిస్తున్నారు. తర్వాత ఇప్పుడే నమోదు చేసుకోండి అనే లింక్పై క్లిక్ చేయిస్తారు. బాధితుడు మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన వెంటనే కాల్ సెంటర్ తరహాలో మోసగాళ్లు సంప్రదించి కనీసం రూ.17 వేల నుంచి రూ.22 వేల వరకు పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెస్తారు. ఇలా ఒకసారి వారి వలకు చిక్కిన తర్వాత మొదట్లో కొద్దిమేర లాభాలు వచ్చినట్టుగా చూపి..ఆ తర్వాత క్రమంగా పలు రకాల ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీలు అంటూ అవకాశం ఉన్నంత మేర వారి ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్నారు. ఆ వీడియోలు చూసి మోసపోవొద్దు సైబర్ నేరగాళ్లు మొదట ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లలో ఉన్న ప్రముఖుల వీడియోలను తీసుకొని వాటిని డీప్ఫేక్ టెక్నాలజీతో మార్పులు చేస్తున్నారు. క్వాంటమ్ ఏఐకి సంబంధించి వారు మాట్లాడుతున్నట్టుగా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత బాధితుల వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులకు ఈ లింక్లను పంపుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనల విషయంలో నమ్మొద్దని, ఆ తరహా వీడియో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి – తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మొద్దు. – ప్రముఖుల పేర్లు, ఫొటోలు ఉన్నాయనే కారణంతో పెట్టుబడి పెట్టొద్దు. – పెట్టుబడి సంస్థ సెబీ వద్ద నమోదు అయిందో లేదో పరిశీలించాలి. – అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా ఉండాలి. – మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు లేదా ప్రముఖ వ్యాపారవేత్తలు పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్టు కనిపించే వీడియోలు, ప్రకటనలను నమ్మొద్దని హెచ్చరించింది. డీప్ఫేక్ సాంకేతికతతో వీడియోలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొంది. -
‘గుడ్డిగా ఏఐని నమ్మితే..’: హెచ్చరించిన గూగుల్
న్యూఢిల్లీ: నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది. అయితే చాట్జీపీటీ, జెమిని వంటి అత్యాధునిక ఏఐ చాట్బాట్లను తప్పుదారి పట్టించేలా సులభంగా మానిప్యులేట్ చేయవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఉద్దేశపూర్వకంగా ప్రచురించిన చిన్న బ్లాగ్ పోస్ట్లు కూడా ఏఐని తప్పుదోవ పట్టిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏఐని బురిడీ కొట్టించడం..ఏఐ చాట్బాట్లు సాధారణ సెర్చ్ ఇంజిన్ల వలే కాకుండా, ఇంటర్నెట్లోని సమాచారాన్ని సేకరించి ఒక ఖచ్చితమైన సమాధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. ఒక బిబిసి రిపోర్టర్ తన వ్యక్తిగత వెబ్సైట్లో తాను ‘వరల్డ్ ఛాంపియన్ హాట్-డాగ్ ఈటర్’ అని ఫేక్ పోస్ట్ పెట్టగా, 24 గంటల్లోనే ప్రధాన ఏఐ చాట్బాట్లు దానిని నిజమని నమ్మి ప్రచారం చేశాయి. ఇది హాస్యంగా అనిపించినా ఆరోగ్య సలహాలు, ఆర్థిక చిట్కాలు, రాజకీయ అభిప్రాయాల విషయంలో ఇలాంటి మానిప్యులేషన్ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు.గూగుల్ కఠిన నిర్ణయాలుఏఐ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేయడం నిబంధనలకు విరుద్ధమని గూగుల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న స్పామ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ, ఏఐ ఫలితాలను మానిప్యులేట్ చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. పెద్ద ఏఐ సంస్థలు తమ అల్గారిథమ్లను మెరుగుపరుస్తున్నప్పటికీ, సమాచార మార్పిడిలో ఈ ‘పిల్లి-ఎలుక’ ఆట నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏఐ సంస్థలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కూడా ఏఐ ఇచ్చే సమాధానాలను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక, నమ్మకమైన వనరుల ద్వారా సమాచారాన్ని సరిచూసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. -
ఐటీ స్టాక్స్ దారెటు?
కృత్రిమ మేధ (ఏఐ) కథ రోజుకో మలుపు తిరుగుతోంది. రెండేళ్లుగా అంతర్జాతీయ టెక్నాలజీ మార్కెట్లను కుదిపేస్తూ ఏఐ చేస్తున్న హడావుడి ఇపుడు తగ్గుతోంది. వాస్తవ ధోరణిలోకి వస్తోంది. పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా నిజంగానే ఏఐ రాబడులనిస్తుందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఆఖరికి ఏఐపై పెట్టుబడి పెడుతున్న కంపెనీలు సైతం హడావుడి, అత్యుత్సాహం తగ్గించుకుని జవాబుదారీతనంవైపు చూడటం మొదలెట్టాయి. అందుకే... కొన్నాళ్లుగా భారీ కరెక్షన్కు గురైన భారత ఐటీ దిగ్గజాల విషయంలో మళ్లీ పునరాలోచన మొదలయ్యింది. ఏఐ వల్ల నష్టపోతాయనే ఉద్దేశంతో భారీగా కరెక్షన్కు గురైన ఈ కంపెనీల షేర్లు... ఇపుడు ఆ నష్టం పరిమితమేనన్న అంచనాల నేపథ్యంలో కొంతైనా కోలుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఐ ఎలా మారుతోంది? మన ఐటీ స్టాక్స్ విషయంలో ఏం చేయొచ్చు? ఇదే ఈ ‘వెల్త్ స్టోరీ’ ప్రధానాంశం.ఏఐ హడావుడితో ఆ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఐటీ షేరూ భారీగా ర్యాలీ చేసింది. కానీ పరిశ్రమ ఇపుడు కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఇన్వెస్టర్లు ఏ కంపెనీలు మెరుగ్గా ఉన్నాయి? ఏవి బలహీనంగా ఉన్నాయనేది పోల్చి చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బలమైన బ్యాలెన్స్ షీట్లు, క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, ఏఐ వ్యూహాలను అమలు చేయగలిగే సామర్థ్యాలు, క్యాష్–ఫ్లో మెరుగ్గా ఉన్న కంపెనీలు నిలదొక్కుకుంటాయి. మరింత బలోపేతం అవుతాయి. మిగతావి రాణించలేక కొట్టుమిట్టాడవచ్చు. మార్కెట్ ఆందోళన ఇదీ.. → ఏఐ వల్ల బిల్లింగ్ హవర్స్ తగ్గిపోతాయి: దేశీ ఐటీ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకుని, వారి ద్వారా ఆదాయాలు ఆర్జిస్తూ వస్తున్నాయి. ఏఐ రాకతో కోడింగ్ ఆటోమేటిక్ అవుతోంది. టెస్టింగ్ చేసే సిబ్బంది, ఇతరత్రా సపోర్ట్ సిబ్బంది అవసరం తగ్గిపోతుంది. దీనితో పాత తరహా ఔట్సోర్సింగ్ మోడల్పై నేరుగా ప్రభావం పడుతుంది. → ఆచితూచి ఖర్చు చేస్తున్న క్లయింట్లు: గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే జీపీయూలు, ఏఐ చిప్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీనితో సంప్రదాయ తరహా ఐటీ సేవలపై ఖర్చు చేయడం తగ్గవచ్చు. → మారుతున్న ‘హ్యూమన్ పిరమిడ్’ మోడల్: భారతీయ ఐటీ సంస్థల లాభదాయకత అనేది భారీ స్థాయిలో ఫ్రెషర్లను తీసుకోవడం, పరిస్థితికి తగ్గట్లు డెలివరీ సామర్థ్యాలను పెంచుకోగలగడం, తక్కువ వేతనాలకే ఉద్యోగులు లభిస్తుండటంలాంటి అంశాలపై ఆధారపడుతూ వస్తోంది. అయితే, ఏఐ రాకతో ఈ విధానం ఇక మారిపోవచ్చు.ఇదీ... మన ఐటీ దిగ్గజాల పరిస్థితి→ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ధర శ్రేణి: రూ. 3,000–3,100 52 వారాల గరిష్టం: రూ. 4,500 పైగా ట్రెండ్: భారీగా కరెక్షన్ టీసీఎస్ ఇప్పటికీ భారత్లో అతి పెద్ద ఐటీ కంపెనీ. అంతర్జాతీయంగానూ క్రెడిబిలిటీ ఉంది. అయితే, క్లయింట్లు ఖర్చులు తగ్గిస్తుండటం, ఏఐ వల్ల బిల్లింగ్ తగ్గడం, వృద్ధి రేట్లు గణనీయంగా మందగిస్తుండటంపై ఇన్వెస్టర్లు కాస్త ఆందోళనతో ఉన్నారు. కాకపోతే, కస్టమర్లతో బలమైన సంబంధాలు, పటిష్టమైన క్యాష్ ఫ్లో, ఏఐని అమలు చేయాల్సిన డీల్స్ పెరుగుతుండటం లాంటివి సంస్థకు సానుకూలంగా కనిపిస్తున్నాయి.→ ఇన్ఫోసిస్ ప్రస్తుత ధర శ్రేణి: రూ. 1,150–1,200 52 వారాల గరిష్టం: రూ. 1,700 పైగా ట్రెండ్: భారీగా తగ్గిన వేల్యుయేషన్ ఇన్ఫోసిస్ తమ ‘టొపాజ్ ఏఐ’ వ్యూహాన్ని బలంగా అమలు చేస్తున్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏఐ టూల్స్ వల్ల కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ అంతా ఆటోమేట్ అయిపోతే సిబ్బందికి సంబంధించి బిల్లింగ్ పరంగా ఆదాయాలు ఎలా ఉండొచ్చనేది ఆలోచిస్తున్నారు. క్లయింట్లు ఏఐ ట్రాన్స్ఫర్మేషన్పై భారీగా వెచి్చంచడాన్ని కొనసాగిస్తూ, క్లౌడ్కి మళ్లటాన్ని వేగవంతం చేసి, కన్సల్టింగ్ సర్వీసులకు డిమాండ్ పెరిగితే సంస్థ భవిష్యత్తు బాగుండొచ్చు. అయితే, కొన్నాళ్ల పాటు మార్జిన్లపై ఒత్తిడి కొనసాగవచ్చు.→ విప్రో ప్రస్తుత ధర శ్రేణి: రూ. 230–260 ట్రెండ్: దీర్ఘకాలికంగా బలహీన పనితీరు ఏఐ విప్లవం భయాలు తలెత్తడానికి చాలా కాలం ముందు నుంచే ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విప్రో సవాళ్లు ఎదుర్కొంటూ వస్తోంది. నెమ్మదిగా ఉన్న కంపెనీలు ఏఐ జమానాలో మరిన్ని సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని మార్కెట్లు భావిస్తున్నాయి. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ మెరుగుపడి, ఏఐ కన్సల్టింగ్ పుంజుకుని, భారీ గ్లోబల్ కాంట్రాక్టులు తిరిగి వస్తే విప్రో మళ్లీ టర్న్ అరౌండ్ కావచ్చు. అలా జరగకపోతే పటిష్టంగా ఉన్న పోటీ సంస్థల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపొచ్చు.→ హెచ్సీఎల్ టెక్ ప్రస్తుత ధర శ్రేణి: రూ. 1,150–1,200 52 వారాల గరిష్టం: రూ. 1,770 ఇంజినీరింగ్ సర్వీసులు, ఇన్ఫ్రా మేనేజ్మెంట్, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ప్రోడక్టుల్లో పటిష్టంగా ఉండటం సంస్థకు సానుకూలాంశాలు. అయినప్పటికీ గరిష్ట స్థాయుల నుంచి షేరు భారీగా కరెక్షన్కి లోనయ్యింది. ఒకవేళ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాపై క్లయింట్లు వెచి్చంచడం పెరిగితే, ఏఐ ఆధారిత ఇంజనీరింగ్కి డిమాండ్ పెరిగితే కంపెనీకి లాభించవచ్చు.→ టెక్ మహీంద్రా ధర శ్రేణి: రూ. 1,450 ట్రెండ్: మిగతావాటితో పోలిస్తే నిలకడగా రాణిస్తోంది. ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే టెక్ మహీంద్రా ఇటీవల నిలకడగా రాణిస్తోంది. అంతర్జాతీయంగా టెలికం టెక్నాలజీ అప్గ్రేడేషన్ వేగవంతం అయితే పరిశ్రమలో పటిష్టంగా రాణించే కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలవొచ్చు.మిడ్క్యాప్ ఐటీ: రిస్క్ లు, అవకాశాలూ.. రెండూ ఎక్కువేకోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఎం, ఎంఫసిస్ వంటి పలు మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ కంపెనీలు ఏఐ ఇంటిగ్రేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్టులుగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నాయి. ఒకవేళ అంతర్జాతీయంగా ఏఐ వినియోగం వేగవంతమైతే కొన్ని కంపెనీలు విజేతలుగా నిలవొచ్చు. కానీ ఊగిసలాట ఎక్కువే ఉంటుంది. నిజానికి చారిత్రకంగా చూస్తే మెయిన్ఫ్రేమ్, ఇంటర్నెట్, క్లౌడ్ మైగ్రేషన్, మొబైల్ విప్లవంలాంటి ఎన్నో సవాళ్లను దేశీ ఐటీ రంగం ఎదుర్కొని నిలబడింది. ఏఐ ఒకరకంగా పాత బిజినెస్ మోడల్స్కి ముప్పుగా ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో భారీ అవకాశాలనూ అందించవచ్చు. గ్లోబల్ దిగ్గజాల అవసరాలను దేశీ ఐటీ కంపెనీలు అందిపుచ్చుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీని అమలు చేయటం, తమ కార్యకలాపాల్లో ఏఐని అనుసంధానించుకోవడం, ఏఐ టూల్స్ని కస్టమైజ్ చేసుకోవడం, డేటా నిర్వహణ, దేశీ చట్టాల అమలు మొదలైన విషయాల్లో గ్లోబల్ కంపెనీలకు భారతీయ ఐటీ సంస్థలు భాగస్వాములుగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారీ ఏఐ మోడల్స్ని తయారు చేసే కంపెనీలతో పాటు ఏఐని ఉపయోగించుకోవడంలో క్లయింట్లకు సహాయపడగలిగే సంస్థలూ రాణించే అవకాశాలుంటాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు పరిశీలించతగిన సానుకూల, ప్రతికూలాంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..సానుకూల సంకేతాలు... → భారీ స్థాయి ఏఐ డీల్స్ → ఏఐ ద్వారా వచ్చే ఆదాయం → మార్జిన్లు స్థిరంగా ఉండటం → బైబ్యాక్లు, డివిడెండ్లు → సంస్థ పరివర్తనకు దోహదపడే కాంట్రాక్టులు. ప్రతికూల సంకేతాలు → నియామకాలు బలహీనంగా ఉండటం → ఏఐ వినియోగం తగ్గుతుండటం → కొత్తగా కుదిరే అవకాశమున్న డీల్స్ సంఖ్య తగ్గుతుండటం → మార్జిన్లు పడిపోతుండటం → రాబడులు లేకుండా ఏఐపై అతిగా ఖర్చు చేస్తుండటం.రిటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చంటే..ఎక్కువగా రిస్కు ఇష్టపడనివారు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటివి పరిశీలించవచ్చు. ఇవి దీర్ఘకాలికానికి అనువుగా ఉంటూ స్థిరత్వాన్ని, డివిడెండ్లను అందిస్తున్నాయి. రిస్కు తీసుకోగలిగే వారు కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఎం, టెక్ మహీంద్రాలను పరిశీలించవచ్చు. ఏఐ ఆధారిత వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇవి అనువుగా ఉంటాయి. – సాక్షి, వెల్త్ డెస్క్ -
AI: ఒక కొత్త రక్కసి.. ఇదొక మహా ప్రళయం!
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు." ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్గేట్' అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్ లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లను, టూల్స్ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లతో వ్యాపారం చేస్తాయా?ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్వేర్కు, ప్రతి యాప్కు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం. ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి. కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు. - కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఏఐపై కోట్ల ఖర్చు... ఫలితం మాత్రం శూన్యం
-
బైబిల్ లోని కథను ఉదహరిస్తూ, AIపై పొప్ లియో హెచ్చరిక
-
'ఏఐ'.. నా సీటెక్కడోయ్?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ట్రెండ్ మారుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు విద్యార్థుల ఆలోచన విధానం పరుగులు పెడుతోంది. ర్యాంకు తెలిసిన ప్రతీ విద్యార్థి సీటు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఏఐ టూల్స్ ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. ఆప్షన్లపై మాక్ కౌన్సెలింగ్కు ఏఐ ఆధారిత నెట్ సైట్లకే లాగిన్ అవుతున్నారు. కన్సల్టెన్సీలు, ఏజెంట్లను ఆశ్రయించడం తగ్గిపోయింది. పైగా కన్సల్టెన్సీలు కూడా ఏఐ ఆధారిత ప్రిడిక్షన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఏఐ వాడకం పెరిగిన తర్వాత కన్సల్టెన్సీలకు వచ్చే విద్యార్థులు 40 శాతం తగ్గారని ప్రైవేటు కన్సల్టెంట్ సంజయ్ మిత్ర చెప్పారు. ర్యాంకును బట్టి ఏఐ ద్వారా సీటును అంచనా వేయడంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులూ ముందు వరుసలోనే ఉన్నారని తెలిపారు. తాము కూడా ఏఐ ఆధారిత అప్లికేషన్స్ను సమకూర్చుకోవాల్సి వచ్చిందని మరో కన్సల్టెంట్ శైలేష్ పల్లవ్ తెలిపారు. అంచనాల దూకుడులో ఏఐప్రతీ కాలేజీకి సంబంధించి గత కొన్నేళ్ల కటాఫ్ వివరాలు ఇప్పటికే క్లౌడ్ డేటాకు చేరాయి. ఏఐ ఆధారిత కసరత్తు రెండేళ్లుగా జరిగినట్టు ఎడ్యు డేటా సెంటర్కు చెందిన దిలీప్ మల్హోత్రా తెలిపారు. కౌన్సెలింగ్ ప్రిడిక్టర్స్, ర్యాంకు ఆధారిత కాలేజీ అవకాశాలు, బ్రాంచ్ వారీగా విశ్లేషణలు, ఏఐ ఆధారిత రికమండేషన్స్, కొన్నేళ్లుగా కటాఫ్ ఆధార అంచనాలతో కూడిన డేటా.. క్లౌడ్ సెంటర్ల నుంచి వేగంగా తెస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఆధునిక అప్లికేషన్స్ నెట్లో హల్చల్ చేస్తున్నాయని హైదరాబాద్ క్లౌడ్ డేటా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ వినీత్ వస్లా తెలిపారు. ప్రారంభ, ముగింపు కటాఫ్ వివరాలను అన్ని కాలేజీల స్థాయిల్లో అందించేలా అప్లికేషన్స్ రూపొందించినట్టు చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ర్యాంకు అంచనా కోసం వెతికే సమయం తగ్గిపోయిందన్నారు. ఐదు నుంచి పదేళ్ల కటాఫ్ వివరాలను కొన్ని అప్లికేషన్లు గ్రాఫిక్స్ రూపంలో అందిస్తున్నాయి. కాలేజీల ప్లేస్మెంట్ ట్రెండ్, ఫీజులు తదితర సమాచారం డేటా కేంద్రాల్లో నిక్షిప్తం చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్ల బ్రాంచీల వారీగా డిమాండ్ వివరాలనూ ఏఐ మాడ్యూల్స్ ద్వారా తెలుసుకునే అవకాశాలు పెరిగినట్టు కేరీర్ కన్సల్టెన్సీకి చెందిన విక్రమ్ పొలంపల్లి తెలిపారు.నెట్లో హల్చల్..కన్వెన్షనల్ ఏఐ కౌన్సెలర్లు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తున్నాయి. ‘నా ర్యాంకు ఇంత... నాకు సీఎస్ఈ సీటు కావాలి.. హైదరాబాద్లో ఏ కాలేజీలో వస్తుంది’ అని ఫీడ్ చేస్తే క్షణాల్లో సమాధానం వస్తుంది. కాలేజీల జాబితా, గత కటాఫ్, ఫీజులు, ప్లేస్మెంట్, ప్రత్యామ్నాయ బ్రాంచీలను ఏఐ సూచిస్తోంది. ఈ తరహా ప్లాట్ఫామ్కు ఏఐ ట్యూటర్, కటాఫ్ ప్రిడిక్షన్, కెరీర్ గైడెన్స్ వంటి ఫీచర్లను కొత్తగా జోడించడం వల్ల ఫలితం వేగంగా వస్తోంది. అంతేకాదు... ఎంచుకునే కోర్సు డిమాండ్ను కూడా ఏఐ విశ్లేషిస్తోంది. కోర్... నాన్ కోర్... ఎమర్జింగ్ కోర్సుల్లో డిమాండ్... ఉద్యోగ అవకాశాలు.. ఐదేళ్లుగా బ్రాంచీకి ఉన్న డిమాండ్, ఉపాధి అవకాశాల వివరాలు అందుతున్నాయి. పర్సనలైజ్డ్ కౌన్సెలింగ్ డ్యాష్ బోర్డులూ చురుకుగా పనిచేస్తున్నాయి. విద్యార్థి ప్రొఫైల్, మాక్టెస్ట్ పనితీరు, ఇష్టమైన నగరాలు, ఫ్యామిలీ బడ్జెట్ వివరాలను ఈ డ్యాష్బోర్డ్ ద్వారా రూపొందిస్తున్నారని, భవిష్యత్లో ఇవి మరింత కీలకం అవుతాయని ఐటీ రంగ నిపుణుడు చరణ్ సంగుపాటి తెలిపారు. కౌన్సెలింగ్ కేంద్రాలు, కాలేజీలు కూడా వీటి ఆధారంగానే విద్యార్థులను యాజమాన్య కోటా వైపు మళ్లించే వీలుందని తెలిపారు.ఈసారి సూపర్ ర్యాంక్ 5 వేలే..ఏఐ అంచనాలన్నీ ఈ ఏడాది కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంటుందనే చెబుతున్నాయి. ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సుల ట్రెండ్ను సూచిస్తున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో సీఎస్ఈ కోర్సులకు ప్రధాన పది కాలేజీల్లో 5 వేల ర్యాంకు కటాఫ్గా ఉండే వీలుందని చెబుతున్నాయి. ఓయూ, జేఎన్టీయూహెచ్ వంటి క్యాంపస్లలో 3 వేల వరకూ కటాఫ్ ఉండే వీలుందని చెబుతున్నాయి. టాప్ కాలేజీలు, యూనివర్సిటీలకు ఇతర జిల్లాల్లో ఉండే కాలేజీల్లో ఎస్సీ కేటగిరీకి 10 నుంచి 16 వేల ర్యాంకు వరకూ సీఎస్ఈ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. కంప్యూటర్ కోర్సుల తర్వాత ఈసీఈ కోర్సుకు రెండో ప్రాధాన్యత కన్పిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. టాప్ కాలేజీల్లో 8 వేల వరకూ, క్యాంపస్ కాలేజీల్లో 5 వేల వరకూ సీటు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నాయి. -
ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికెలో ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు ఫిర్యాదుల నమోదులో తలెత్తే భాషా సమస్యలను దూరం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల రికార్డర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ–కాప్రైటర్ పేరుతో ఉన్న ఈ యాప్ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఆవిష్కరించారు. తక్షణమే రికార్డు చేసి అనువదిస్తూ... బాధితులు మాతృభాషలో చెప్పే ఫిర్యాదుల్లోని అంశాలను ఏఐ–కాప్రైటర్ తక్షణమే రికార్డు చేసి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు, పర్యాటకులకు ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే భాషా సమస్యలను ఈ యాప్ తొలగిస్తుంది. బాధితుల భాష అర్థం కాకపోవడం వల్ల ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదు కావడానికి ఈ యాప్ స్వస్తి పలకనుంది. తొలిదశలో 10కిపైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించేలా ఈ యాప్ను రూపొందించారు. ఈ యాప్ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతోపాటు పాగ్రో చందు అనే ఇంటర్న్ సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించారు. యాప్లోని ప్రధాన అంశాలు బహుభాషా సౌలభ్యం: హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో ఫిర్యాదు చేస్తే ఈ యాప్ వెంటనే పోలీసులకు అర్థమయ్యే భాషలోకి లిఖితపూర్వకంగా అనువదిస్తుంది. వేగం–కచ్చితత్వం: గంటల తరబడి పట్టే ఫిర్యాదు నమోదు ప్రక్రియను కేవలం సెకన్లలోనే పూర్తి చేయవచ్చు. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. పారదర్శకత: ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటివి ఆటోమేటిక్గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. మల్టీ–పార్టీ లేబులింగ్: బాధితుడు, నిందితుడు లేదా సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి రికార్డ్ చేస్తుంది. శిక్షలు కూడా పెరుగుతాయి హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావడంతో తెలుగు, ఆంగ్లం, హిందీ రాని వాళ్లూ కూడా వలస వచ్చి స్థిరపడుతున్నారు. భాష తెలియకపోవడం వల్ల వచ్చే సమస్యలకు ఈ యాప్ చెక్ పెడుతుంది. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మీకులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుంది. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయి. దీనివల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా రికార్డుల నిర్వహణ పద్ధతి ఏకరీతిగా ఉంటుంది. పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణం. – వీసీ సజ్జనర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
ఏఐతో కంబైన్డ్ స్టడీ!
చదువుకోవడానికి పక్కా టైంటేబుల్ ఉంటే సగం విజయం సాధించినట్లే. ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా, ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాసైపోవచ్చు. –సాక్షి స్పెషల్ డెస్క్పోమోడోరో టెక్నిక్ గంటల తరబడి బ్రేక్ లేకుండా చదివితే బుర్రకెక్కదు. అందుకే పోమోడోరో టెక్కిక్ అనే ఈ స్మార్ట్ పద్ధతిని పాటించండి. ⇒ 25 నిమిషాలు శ్రద్ధగా చదవండి. ⇒ 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోండి (నడవడం, నీళ్లు తాగడం). ⇒ ఇలా 4 సార్లు అయ్యాక, 15–30 నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోండి. ⇒ ఇతర విషయాలను దూరం పెట్టండి. చదువుకునే సమయంలో ఫోన్ సైలెంట్లో పెట్టి మీకు దూరంగా ఉంచండి. సోషల్ మీడియా నోటిఫికేషన్ మీ సమయాన్ని వృథా చేయకుండా చూసుకోండి. ఎలా చదవాలి? ముందుగా మీ సిలబస్ను ఒక పేపర్పై రాసి, ఏఐ టూల్స్ సాయంతో టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. కళ్ల ముందు స్పష్టమైన ప్లాన్ ఉంటే అయోమయం పోతుంది. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోతే, ఏఐ టూల్స్ వాటంతటవే మీ కాల ప్రణాళికను సర్దుబాటు చేస్తాయి. చదువును సులువు చేసే 4 ఏఐ టూల్స్ 1. షోవెల్ యాప్ (స్టడీ ప్లానర్): మీ కాలేజీ సమయాలు, నిద్ర, ఇతర పనులు, సబ్జెక్ట్ డెడ్లైన్ వివరాలను ఇందులో నింపితే మీకు మిగిలిన ఖాళీ సమయాన్ని లెక్కించి ఒక మంచి టైమ్ టేబుల్ ఇస్తుంది. 2. నోషన్ ఏఐ (ఆల్ ఇన్ వ¯న్ ఆర్గనైజర్): గజిబిజిగా ఉన్న సిలబస్ లిస్ట్ను ఇది ఒక చక్కటి పట్టికగా మార్చేస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ట్రాక్ చేయడానికి ఇది మంచి టూల్. 3. చాట్జీపీటీ (పర్సనల్ స్టడీ కోచ్): మీ అవసరానికి తగ్గట్టుగా ప్రణాళిక ఇస్తుంది. ఉదాహరణకు: ‘‘నాకు వచ్చే నెల మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, రోజుకు 2 గంటలే చదవగలను, ప్లాన్ ఇవ్వు’’అని అడిగితే క్షణాల్లో వీక్లీ ప్లాన్ రెడీ చేసి ఇస్తుంది. 4. టుడూఇస్ట్ (స్మార్ట్ టాస్క్ మేనేజర్): ‘‘ఈ వారం హిస్టరీ ప్రాజెక్ట్ చేయాలి, రోజూ సై¯న్స్ రివిజన్ చేయాలి’’అని మీరు సాధారణంగా టైప్ చేస్తే, ఈ ఏఐ వాటి డెడ్లై¯న్ను గుర్తించి క్యాలెండర్లో ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. -
లేఆఫ్స్ బాధితులకు కొత్త దారి చూపిన చాట్జీపీటీ!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో తలెత్తిన లేఆఫ్స్ భయం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పట్టి పీడిస్తోంది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్న 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు, తన భవిష్యత్తు కెరీర్ మార్గాల గురించి చాట్జీపీటీని సంప్రదించారు. ఆ ఏఐ ఇచ్చిన సమాధానం, కేవలం సలహాగానే కాకుండా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్లా ఉండి, ఆ ఉద్యోగిలో ఉన్న ఒత్తిడిని ఒక్కసారిగా తొలగించేసింది. మనిషి ఆలోచనా శక్తి, డొమైన్ నైపుణ్యం, కమ్యూనికేషన్ మొదలైనవే కీలకం అని ఏఐ స్పష్టంగా చెప్పింది.హై-డిమాండ్ రంగాల వైపు అడుగులుకేవలం కోడింగ్ మాత్రమే చేసే రోల్స్ కాకుండా, భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే ఏఐ/ ఎంఎల్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అండ్ ప్లాట్ఫారమ్ ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ వంటి విభాగాల్లోకి మారడం ఉత్తమమని చాట్జీపీటీ సూచించింది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం ఇంటిగ్రేషన్ , క్లౌడ్ సెక్యూరిటీపై దృష్టి పెట్టడం ద్వారా ఉద్యోగ భద్రతను పెంచుకోవచ్చు. పాత పద్ధతిలో పనిచేసే కోడింగ్ కంటే, ఏఐని ఉపయోగించుకుంటూ పనితీరును పెంచుకునే వారికి రాబోయే ఐదుపదేళ్లలో భారీ డిమాండ్ ఉంటుంది.మేనేజిమెంట్, ప్రభుత్వ రంగంలో అవకాశాలువ్యాపార వ్యూహాలను అర్థం చేసుకునే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఇంజనీర్లకు 'ప్రొడక్ట్ మేనేజ్మెంట్' ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్. ఏఐ కోడ్ని వేగంగా రాయగలదు కానీ, వ్యాపార నిర్ణయాలను తీసుకోలేదు కాబట్టి ఈ పాత్రలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అలాగే ఆర్బీఐ, సెబీ, ఐఎస్ఆర్డీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోని డిజిటల్ విభాగాల్లో కూడా క్లౌడ్, సెక్యూరిటీ నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి స్థిరమైన కెరీర్ను కోరుకునే వారికి గొప్ప వేదికలు.12 నెలల సేఫ్టీ ప్లాన్: మీ వృత్తికి కొత్త బాటవచ్చే 12 నెలల కాలంలో మీరు ఎంచుకున్న రంగంలో సర్టిఫికేషన్లు పొందడం, పోర్ట్ఫోలియో ప్రాజెక్టులు నిర్మించడం, నెట్వర్కింగ్ను పెంచుకోవడం ద్వారా లేఆఫ్స్ భయం నుండి బయటపడవచ్చు. ప్రాథమిక కోడింగ్ పనులకు దూరంగా ఉంటూ, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్ వైపు దృష్టి సారించాలి. లేఆఫ్స్ అంటే కెరీర్ ముగింపు కాదు, అది కేవలం కంపెనీల వ్యూహాత్మక మార్పు మాత్రమేనని గుర్తించి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించవచ్చని చాట్జీపీటీ తెలిపింది. -
కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా?
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని పుణ్యమా అని భవిష్యత్తులో ఐటీ సహా పలు రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సిలికాన్ వ్యాలీలోని గ్లీన్ కంపెనీ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన అరవింద్ జైన్ భిన్నమైన, అత్యంత సానుకూల దృక్పథాన్ని వినిపించారు. ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయలేదని, బదులుగా వారి పనితీరును, సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ఎంటర్ప్రైజ్ సెర్చ్ ప్లాట్ఫామ్ గ్లీన్ సీఈఓ అయిన అరవింద్ జైన్.. ‘ఫార్చ్యూన్’ నిర్వహించిన వర్క్ప్లేస్ ఇన్నోవేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భర్తీ చేసేంత లేదు..ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయవచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోందని, అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని అరవింద్ జైన్ పేర్కొన్నారు. ‘నా ఉద్దేశం ప్రకారం.. భవిష్యత్తులో ఎప్పటికీ ఏఐ ఏ మానవ సిబ్బందినీ భర్తీ చేయదు. ఇది వాస్తవానికి మనల్ని మరింత సమర్థులుగా మారుస్తుంది. అత్యున్నత నాణ్యతతో కూడిన పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది. మేము ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతానికైతే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు’ అని అరవింద్ జైన్ తెలిపారు.ఉద్యోగులకు ఏఐ ఒక కో-పైలట్లాగా పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. రోజువారీగా సాగే రొటీన్, పునరావృత పనులను ఏఐకి అప్పగించడం ద్వారా.. మానవులు తమ ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం వంటి కీలకమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చని ఆయన విశ్లేషించారు.దిగ్గజాల హెచ్చరికలుభవిష్యత్ శ్రామిక శక్తిపై అరవింద్ జైన్ వ్యక్తంచేసిన అంచనాలు, ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార వర్గాల సెంటిమెంట్కు పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇప్పటికే ఏఐ ముప్పుపై హెచ్చరిస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా దాదాపు సగం వరకు వైట్-కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని పదేపదే హెచ్చరించారు. జేపీ మోర్గాన్ అధినేత జేమీ డిమోన్, ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ.. అమెరికా సహా అంతర్జాతీయంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ ఆక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు! -
తమిళనాడు ఏఐ మంత్రి ఆయనే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొత్తగా 23 మందికి తన కేబినెట్లో స్థానం కల్పించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) నుంచి 21 మంది, కాంగ్రెస్ నుండి ఇద్దరు శాసనసభ్యులను మంత్రి వర్గంలో చేర్చుకున్నారు. లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరితో గర్నవర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ పాల్గొన్నారు. కొత్తగా చేరిన మంత్రులతో తమిళనాడు కేబినెట్లోని సభ్యుల సంఖ్య 33కి చేరింది. మంత్రివర్గ విస్తరణ జరడంతో ఇంతకుముందు ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు చేశారు. కొత్తగా చేరిన మంత్రులకు శాఖలు కేటాయించారు. సీఎం విజయ్ కూడా తన దగ్గరున్న కొన్ని శాఖలకు కొత్త మంత్రులకు బదిలీ చేశారు. ఎన్నికల్లో హామీయిచ్చినట్టుగానే ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రిత్వ శాఖను తొలిసారిగా ఏర్పాటు చేశారు. డాక్టర్ ఆర్ కుమార్కు ఈ శాఖను కేటాయించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ శాఖను కూడా ఆయనకే అప్పగించారు. దేశంలోనే తొలి ఏఐ మంత్రిగా ఆర్ కుమార్ గుర్తింపు పొందనున్నారు. వేలచ్చేరి నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్కు కీలక శాఖలుకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్. రాజేశ్కుమార్, పి. విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం దక్కింది. రాజేశ్కుమార్ పర్యాటక శాఖ, విశ్వనాథన్కు ఉన్నతవిద్య శాఖ కేటాయించారు. ఇది ఊహించలేదు: ఐయూఎంఎల్తమను మంత్రి వర్గంలో చేరమని సీఎం విజయ్ ఆహ్వానిస్తారని ఊహించలేదని ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిదీన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చామని, మంత్రి పదవుల కోసం తాము అడగలేదని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోతే గవర్నర్ పాలన వస్తుందని, తద్వారా బీజేపీ పెత్తనం చెలాయిస్తుందనే ఉద్దేశంతోనే విజయ్కు మద్దతు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, ప్రభుత్వంలో చేరడానికి యూఎంఎల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. మంత్రి పదవికి తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని సమాచారం. కాగా, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) అధికార పక్షంలో భాగం కావాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం వెల్లడించలేదు.చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం! -
AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
సాక్షి,బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతుంది. దీంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సంస్థల్లో రెగ్యులర్గా ఒకే పనిచేసే ఉద్యోగుల వరకు ఉపాధిని కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు అదే ఏఐ వినియోగంతో పలువురు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, బెంగళూరులో కూరగాయలు అమ్మే యువకుడు ఏఐ సాయంతో గంటకు రూ.350 నెలకు రూ.లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ఇన్స్టాగ్రామ్ యూజర్ వైభవ్ తన ఇన్స్టా అకౌంట్లో ఓ వీడియోని షేర్ చేశారు.‘నేను నా స్కూటీ మీద అలా వెళ్తుండగా ఈ దృశ్యం నా కంటపడింది. వెంటనే కుతూహులంగా వెళ్లి హెడ్ బ్యాండ్ గురించి ఆరా తీశాను. ఐఫోన్, మెమరీ కార్డ్తో హెడ్బ్యాండ్తో డేటా కలెక్ట్ చేస్తున్నాడు అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ యువకుడు రియల్ టైం డేటా కలెక్ట్ చేసేలా ఏఐ డేటా కలెక్షన్ హెడ్ గేర్ను ధరించాడు. హెడ్గేర్ను తలకు ధరించిన ఆ యువకుడు కరివేపాకు కట్టలు కడుతున్నారు. కరివేపాకు కట్టలను కొనుగోలు దారులకు అమ్ముతున్నాడు. అమ్మే సమయంలో కొనుగోలు దారులు, అమ్మకం దారుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల్ని హెడ్గేర్ సాయంతో డేటాను సేకరిస్తున్నాడు.అలా సేకరించిన రియల్ టైమ్ డేటాను ఏఐ కంపెనీలకు అందిస్తాడు. రియల్ డేటా విలువైనదిగా ఉండటంతో సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ ఘటనలో కరివేపాకు అమ్మే యువకుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏఐ కంపెనీలు హెడ్ గేర్ల సాయంతో కంపెనీలకు కావాల్సిన డేటాను వీడియో, ఆడియో, సంభాషణల రూపంలో తీసుకుంటాయి. తీసుకున్న డేటాను ఏఐ మోడళ్లకు అప్లయి చేస్తాయి. అలా అప్లయి చేయడం వల్లే యూజర్లుకు అందిస్తున్న సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకుంటాయి. యూజర్లకు అందించే డేటాను..రియల్ టైం డేటాతో సరిపోల్చి యూజర్కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ డేటా గేర్ కనెక్షన్ ధరపై స్పష్టత లేదు. కానీ ఇది సాధారణంగా ఐఫోన్ లేదా కెమెరా, మెమరీ కార్డ్, హెడ్బ్యాండ్ వంటి పరికరాలతో తయారు చేసిన తాత్కాలిక టూల్. ఈ గేర్ను కంపెనీలు గిగ్ వర్కర్లకు అందిస్తాయి. ఓ వైపు పనిచేసుకుంటూనే మరో వైపు అదనపు ఆదాయం కోసం పలువురు ఇలాంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పలువురు ఈ పరికరాన్ని ధరించి గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Vaibhav | Peaks & Protein (@vai.bhaaavvv) -
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్షెల్ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్షెల్ను ఇంక్యుబేటర్లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు. -
అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.AI కారణం అందుకే..సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.టెక్నాలజీ విప్లవంఒకప్పుడు స్మార్ట్ఫోన్ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.How is it that in the US, the AI leader, a good part of the population, even a lot of college students, have come to hate AI? It does not help that companies are blaming job losses on AI, which is both convenient and as an added bonus, makes a company look visionary.The layoffs…— Sridhar Vembu (@svembu) May 19, 2026మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్ ట్రేడ్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.మార్పునకు అవకాశంచరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్లో తేడా! -
భారత్లో చాట్జీపీటీ ఇమేజ్ల సునామీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0’ భారత్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. ‘‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న భారత్లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్ పోర్ర్టెట్ కొలాజ్’, ‘మినీ మీ వరల్డ్’, ‘అండర్వాటర్ పోర్ర్టెట్’, ‘అనిమే’, ‘చిబి స్టికర్ ప్యాక్’, ‘మంగా కామిక్ స్ట్రిప్’, ‘ఫ్యాషన్ స్టూడియో పోర్ర్టెట్’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్లో ఏఐ ఇమేజ్ జనరేషన్ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్డమ్స్, డిజిటల్ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్ఏఐ పేర్కొంది. -
జీసీసీ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
ఎయిర్టెల్ స్టైలే వేరు..
ముంబై: గత దశాబ్దకాలంగా పలు దేశీ ఐటీ కంపెనీలు తమ దగ్గరున్న నిధులను ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో పంచేందుకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయని టెలికం దిగ్గజం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. తమ రంగాల్లోని కొత్త తరం వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో అవి విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అయితే, ఎయిర్టెల్ ఆ బాటలో వెళ్లదని మిట్టల్ స్పష్టం చేశారు. టెలికం కంపెనీలు వృద్ధి అవకాశాలు అందించే అసెట్స్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాల్సిందనేనని, లేకపోతే వెనుకబడిపోయే రిస్క్ లు ఉంటాయన్నారు. కాబట్టి తాము ఇటు బైబ్యాక్లు, డివిడెండ్లు ఇస్తూనే అంతర్జాతీయంగా టెలికం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన సందర్భంగా తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యాపార విస్తరణపై ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో తమ దగ్గరున్న నిధులను మరీ ఎక్కువగా వెచ్చిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 16 దిగ్గజ ఐటీ కంపెనీలు, షేర్హోల్డర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్ల మొత్తాన్ని బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ. 95,400 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికం. పదేళ్లలో వారసులకు వ్యాపార పగ్గాలు .. వచ్చే దశాబ్దకాలంలో వ్యాపార పగ్గాలను తన వారసులకు అప్పగించనున్నట్లు మిట్టల్ చెప్పారు. అలాగే, భారతి ఎయిర్టెల్లో ప్రమోటర్ సంస్థ భారతి టెలికం తిరిగి 50 శాతం పైగా వాటాను దక్కించుకునేలా చూడాలనేది తన ఆకాంక్ష అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతి టెలికంకి ఎయిర్టెల్లో 40.47 శాతం వాటాలు ఉన్నాయి. 10 శాతం మేర వాటాలు పెంచుకోవాలంటే ప్రస్తుత షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కనీసం రూ. 1 లక్ష కోట్లు అవసరమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు. -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. 2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు. వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు ఏఐ ఎకోసిస్టమ్లో ‘బిల్డ్–పార్ట్నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు. భారత్లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది. కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా, బ్యాంకింగ్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్ భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. -
Open AI సర్జికల్ స్ట్రైక్..
-
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)...మరింత సహజంగా
‘రోబో’ సినిమాలో చిట్టి(రోబో) దూకుడు చూసి... ‘అయ్ బాబోయ్... ఎంతైనా యంత్రం యంత్రమేనండీ. అది మనిషిలా ఎందుకు స్పందిస్తుంది!’ అనుకున్నాం. ఏఐ టూల్స్ మొదట్లో అబ్బురపరిచినా... మనుషులతో పోల్చితే ఎక్కడో ఏదో లోపం కనిపించడం మొదలైంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. టూల్స్లో సహజమైన మానవీయ స్పందనలు తీసుకురావడానికి ‘ఇంటరాక్షన్ మోడల్స్’తో నడుం కట్టారు ‘ఓపెన్ ఏఐ’ మాజీ సీటీవో, ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఫౌండర్ మీరా మురాటి.... ఏ.ఐ. విప్లవ కాలంలో ఉన్నాం మనం. అయితే ఏఐ అనేది చాలావరకు వాకి–టాకిలా పనిచేస్తోంది అనే అభిప్రాయం ఉంది.భవిష్యత్ సూచనమనం ఏదైనా అడుగుతాం. ఆగి, విని, ఆలోచించి చివరికి సమాధానం ఇస్తుంది ఏఐ సాధనం. ఆ తర్వాత మళ్లీ వేచి చూస్తుంది. చాట్జీపీటి, జెమిని, క్లాడ్, గ్రోక్... ఏది ఉపయోగిస్తున్నా దాదాపుగా ప్రతి ఏఐ సాధనం ‘టర్న్–బేస్డ్’ నమూనానే అనుసరిస్తోంది. మొదట మనుషులు మాట్లాడతారు. ఆ తరువాత యంత్రాలు స్పందిస్తాయి. ఈ విధానంపై సిలికాన్ వ్యాలీలోని ఏఐ దిగ్గజాలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ రంగానికి సంబంధించి ‘భవిష్యత్లో ఏం జరగబోతుంది?’ అనేదానికి సంబంధించి ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్స్’ ఒక సిగ్నల్ ఇచ్చింది. కేవలం ప్రాంప్ట్లకు సమాధానం ఇవ్వడానికి కాకుండా, సూచనల కోసం వేచి చూసే చాట్బాట్లా కాకుండా కొలీగ్తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి సహజత్వాన్ని ఏఐ సాధనాలలో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది మీరా మురాటి.ఇక ముందు అలా ఉండదు!ఏఐ సాధనాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. వినియోగదారులు(యూజర్లు) మాట్లాడినప్పుడు లేదా టైప్ చేసినప్పుడు మోడల్ ఆ అభ్యర్థనను ప్రాసెస్ చేసి ఆ తర్వాతే స్పందిస్తుంది. ఈ విధానాన్ని మార్చడానికి సంభాషణలను 200–మిల్లీ సెకన్ల చిన్న చిన్న భాగాలుగా ప్రాసెస్ చేసే సిస్టమ్లతో ప్రయోగాలు చేస్తోంది మీరా కంపెనీ థింకింగ్ మెషిన్ ల్యాబ్స్. దీనివల్ల వ్యక్తి మాట్లాడుతుండగానే ఏఐ స్పందించగలుగుతుంది.తక్కువ లేటెన్సీ అంటే...‘ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అభిప్రాయం ఏర్పడడానికి సంభాషణ మొత్తం పూర్తి కానక్కర్లేదు. ఇక ఏఐ సాధనాల విషయానికి వస్తే... అవి సంభాషణ మొత్తం ముగిసే వరకు వేచి ఉండి దానిని ప్రాసెస్ చేసి, ఆ తరువాతే దాని గురించి ఆలోచిస్తాయి. తక్కువ లేటెన్సీ అంటే ఒక కంప్యూటింగ్ సిస్టమ్ లేదా నెట్వర్క్ తక్కువ ఆలస్యంతో ప్రతిస్పందించే సామర్థ్యం. ఈ నేపథ్యంలో మీరా మురాటి థింకింగ్ మెషిన్ ల్యాబ్స్ ప్రయోగాలు అతిపెద్ద బలంగా మారనున్నాయి. థింకింగ్ మెషిన్ ల్యాబ్స్కు సంబంధించి రియల్–టైమ్ ఇంటరాక్షన్ సిస్టమ్, ఇంటరాక్షన్ మోడల్స్ విషయానికి వస్తే మనతో మాట్లాడుతూనే ఈ మోడల్ ఆలోచించగలదు. చూడగలదు. ఇది చాలా శక్తిమంతమైన మోడల్’ అంటున్నారు ఏఐ ఎక్స్పర్ట్, ది కటింగ్ ఎడ్జ్ గ్రూప్ వ్యవస్థాపకుడు అన్ష్ మెహ్రా.భారీ మార్పుఏఐ రూపాన్ని గణనీయంగా తీర్చిదిద్దడంలో ఇంటరాక్షన్–మోడల్స్ కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆదేశాలను ఎలా టైప్ చేయాలో, సమర్థవంతంగా ఎలా శోధించాలో, సూచనలను ఎలా ఇవ్వాలో యంత్రాలకు నేర్పించాం. ఇప్పుడు ఆ యంత్రాలు మావవ ప్రవర్తన, స్పందనలకు మరింత సహజంగా అలవాటు పడేలా చేయడానికి ....‘టు మేక్ ఏఐ ఫీల్ లెస్ మెషిన్ అండ్ మోర్ హ్యూమన్’ నినాదంతో మీరా మురాటి మానస పుత్రికలు ‘ ఇంటరాక్షన్ మోడల్స్’ రంగం మీదికి వచ్చాయి. భారీ మార్పు... ఇంటరాక్షన్– స్మాల్‘ ఇంటరాక్షన్ మోడల్స్ రూపంలో భారీ మార్పు సాంకేతికపరమైనది మాత్రమే కాదు తాత్విక పరమైనది కూడా’ అంటున్నారు నిపుణులు. ‘ఇంటరాక్షన్–స్మాల్’ అని పిలువబడే ఈ సిస్టమ్ ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. దీని ఫలితాలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.దీనిలో కొన్ని కీలక ఫీచర్లు...’ సీమ్లెస్ డైలాగ్ మేనేజ్మెంట్:మాట్లాడే మనిషి ఆలోచిస్తున్నారా, ఒత్తిడిలో ఉన్నారా...ఇలాంటి విషయాలను ఈ మోడల్ పరోక్షంగా ట్రాక్ చేస్తుంది.’వెర్బల్ అండ్ విజువల్ ఇంటర్జెంక్షన్స్: యూజర్లు మాట్లాడడం పూర్తి చేసే వరకు వేచి చూడకుండా, సందర్భాన్ని బట్టి ప్రతిస్పందించడానికి ఈ మోడల్ అనుమతిస్తుంది’సైమన్టెనీయస్లీ స్పీచ్‘లైవ్ ట్రాన్స్లేషన్’లాంటి సందర్భంలో యూజర్, మోడల్ ఒకే సమయంలో మాట్లాడేలా వీలు కల్పిస్తుంది.’ కంకరెంట్ టూల్ మాట్లాడుతూనే, వింటూనే శోధించడానికి, బ్రౌజ్ చేయడానికి, యుఐ (యూజర్ ఇంటర్ఫేస్) రూపొందించడానికి వీలుకల్పించే సాధనాలను ఏకకాలంలో ఉపయోగిస్తుంది.’ టైమ్ అవేర్నెస్సంభాషణల సమయంలో గడిచిన సమయాన్ని మోడల్కు తెలియజేస్తుంది. -
ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కొత్త రూల్!
ప్రతిష్ఠాత్మకమైన సినిమా అవార్డుల్లో ‘ఆస్కార్’, ‘గోల్డెన్ గ్లోబ్’ ముందు వరుసలో ఉంటాయి. 1929 నుండి ఆస్కార్ అకాడమీ సినిమాలోని వివిధ విభాగాల్లో కనబరచిన ఉత్తమ ప్రతిభకు పురస్కారాలు ఇస్తోంది. అదే బాటలో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ 1944 నుండి గోల్డెన్ గ్లోబ్ పేరిట అవార్డులు అందిస్తోంది. ఆస్కార్ తర్వాత గోల్డెన్ గ్లోబ్ పురస్కార ప్రదానోత్సవం అమెరికాలో జరుగుతుంది. ఈ పురస్కారాలు సినిమా నిర్మాణ విలువలకు అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెడతాయి.అవార్డుల ఎంపికలో మానవ సృజనాత్మకతనే ప్రమాణంగా తీసుకొనే ఈ సంస్థలను ఈ మధ్య సినిమాలో పెరుగుతున్న కృత్రిమ మేధ ఇరకాటంలో పడేసింది. 2025లో ‘యాజ్ డీప్ యాజ్ ద గ్రేవ్’ అనే సినిమాలో నటిస్తున్న వాల్ కిల్మేర్ అనే నటుడు ఆకస్మాత్తుగా చనిపోయాడు. వాల్ కుటుంబం అనుమతితో ఆయన రూపాన్ని, గొంతును కృత్రిమ మేధ సాయంతో సృష్టించి ఆ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు అవార్డు ఎంట్రీకి అవకాశం కల్పించాలా వద్దా అనే చర్చ వచ్చింది.సాంకేతిక సృష్టి నటుడికి ప్రత్యామ్నాయం కాదని ఆ సినిమాకు పోటీలో అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఆ సంస్థలు అవార్డుల కోసం వచ్చే సినిమాల్లో టెక్నాలజీ వాడుక విషయంలో కొన్ని విధి విధానాలను రూపొందించాయి. 2027 నుండి సినిమాల ఎంట్రీ సమయంలో వీటి పరీక్ష ఉంటుంది. సినిమా నిర్మాణం మానవ సృజనాత్మకతకు గీటురాయి. సహజమైన పువ్వుకు, ప్లాస్టిక్ పూవుకు ఉన్న తేడా తెలిసిందే. సాంకేతికత అనివార్యమైన విభాగాలు మినహా మిగతా వాటిలో మానవ సృజనకే ఈ సంస్థలు పెద్ద పీట వేసేందుకు నిర్ణయించాయి. ప్రత్యేకంగా నటన, రచనల్లో మానవ ప్రమేయం లేకుంటే ఆ యా విభాగాల్లో చిత్రం పోటీ పడే అర్హత లేకుండా చేశాయి.చదవండి: ఓబీసీ క్రిమిలేయర్ కిరికిరి తేలింది!ఈ సందర్భంగా 2023 మేలో జరిగిన హాలీవుడ్ సినిమా రచయితల ఐదు నెలల సమ్మె గమనార్హం. సినిమా స్క్రిప్ట్ విషయంలో నిర్మాతలు చాట్ జీపీటీని వాడుకోవడంపై ఈ సమ్మె జరిగింది. చాట్ జీపీటీ పనిని కూడా తమ గిల్డ్లోని ఓ రచయితకు అప్పగించాలనే ఒప్పందంపై ఆ సమ్మె ముగిసింది. యంత్ర నిర్మిత కళను వ్యతిరేకిస్తున్న ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ల బాటలో మిగతా సంస్థలు నడిస్తే కళ బతుకుతుంది. కళాకారులకు గౌరవం దక్కుతుంది.– బద్రి నర్సన్, కథా రచయిత -
తెలంగాణ క్రికెట్లో కొత్త శకం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, సీఈఓ ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్మీట్లో టీపీఎల్ వివరాలను వెల్లడించారు. హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్.సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విస్తృతంగా చేపడుతున్నామని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్ లకు సంబంధించిన తుది నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు. -
ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..
-
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం'' -
‘క్లిక్’ కొట్టండి.. మామిడి కల్తీని పట్టుకోండి!
వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పసుపు పచ్చగా నిగనిగలాడుతూ ఊరించే మామిడి పండ్లు కనిపిస్తాయి. ఈ రంగు వెనుక వెనుక ‘కాల్షియం కార్బైడ్’ అనే భయంకరమైన రసాయన కుట్ర దాగి ఉంది. రాత్రికి రాత్రే కాయలను పండించే ఈ విషపూరిత రసాయనాన్ని అడ్డుకునేందుకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రూపంలో ఒక అద్భుత పరిష్కారం లభించబోతోంది. పంజాబ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న సరికొత్త ఏఐ మొబైల్ యాప్ ద్వారా, వినియోగదారులు కేవలం ఒక ఫొటోతో పండు నాణ్యతను పరీక్షించే వీలు కలుగుతుంది.సాధారణంగా వ్యాపారులు లాభాల కక్కుర్తితో కాల్షియం కార్బైడ్ను పండ్లను మాగబెట్టడానికి వాడుతున్నారు. దీనివల్ల విడుదలయ్యే ఎసిటిలీన్ వాయువు పండ్లకు రంగును ఇస్తుంది. అయితే అందులో ఉండే ఆర్సెనిక్, ఫాస్పరస్ అవశేషాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల కిడ్నీ, కాలేయ వైఫల్యాలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల జీర్ణవ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.ఈ సమస్యను శాస్త్రీయంగా ఎదుర్కోవడానికి ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. ఈ స్మార్ట్ యాప్ పండు యొక్క రంగు, ఉపరితల నిర్మాణం, కాంతి పరావర్తనాన్ని విశ్లేషించి, అది సహజ సిద్ధంగా పండిందా లేక రసాయనాలతో పండించబడిందా అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. రసాయనాలతో పండిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, లోపల గట్టిగా ఉండి, సహజమైన సువాసనను కోల్పోతాయి. ఈ సూక్ష్మ వ్యత్యాసాలను ఏఐ డేటా విశ్లేషణ ద్వారా కచ్చితత్వంతో పసిగట్టవచ్చు.భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అనుమతించిన ఎథిలీన్ గ్యాస్ పద్ధతి ఖరీదైనది కావడంతో వ్యాపారులు ఈ చౌకైన విషాన్ని వాడుతున్నారు. అయితే త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఏఐ సాంకేతికత సామాన్య వినియోగదారుడికి ఒక రక్షణ కవచంలా మారనుంది. ఇది అందుబాటులోకి వస్తే, కల్తీ పండ్ల మాఫియాకు ముకుతాడు వేయడమే కాకుండా, ఆహారం సురక్షితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ స్వయంగా తనిఖీ చేసుకునే అవకాశం కలుగుతుంది. అంటే త్వరలో కేవలం ఒక క్లిక్తో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉండబోతోంది.ఇది కూడా చదవండి: Bihar: ఎన్కౌంటర్తో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ -
‘ఓపెన్ఏఐ’ సంచలనం.. రూ. 845 కోట్లతో అల్జీమర్స్పై యుద్ధం
లండన్: వృద్ధాప్యంలో మనిషిని జ్ఞాపకాలకు దూరం చేసే ‘అల్జీమర్స్’ వ్యాధికి ఇప్పటివరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్స్ అంతానికి బాటలు వేస్తుందని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు ఏకంగా వంద మిలియన్ డాలర్ల(రూ. 845 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించి, వైద్యరంగంలో సరికొత్త ఆశలు రేకెత్తించారు.సరికొత్త ఆవిష్కరణలకు ఏఐ తోడ్పాటుఅల్జీమర్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని ‘టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆల్ట్మాన్ స్పష్టం చేశారు. మెడికల్ హిస్టరీలోని అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటని, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఏఐ అద్భుతాలు చేయగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి సరైన మందును కనిపెట్టే దిశగా ప్రపంచాన్ని మరింత వేగంగా నడిపించే సత్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందన్నారు.ఆరు సంస్థలతో భాగస్వామ్యంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అల్జీమర్స్ పరిశోధనలను ముమ్మరం చేసేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ తరపున $100 మిలియన్ల నిధులను ఆల్ట్మాన్ కేటాయించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయిలోని ఆరు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. కొత్త డేటాను సృష్టించడం, సరికొత్త ఔషధాలను డిజైన్ చేయడం, అలాగే ఇప్పటికే ఆమోదం పొందిన మందులను ఈ వ్యాధిపై ఎలా ప్రయోగించవచ్చో తెలుసుకోవడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం లక్షలాది బాధిత కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుందని అల్జీమర్స్ అసోసియేషన్ ప్రశంసించింది.భారత్లోనూ తీవ్ర ప్రభావంప్రపంచవ్యాప్తంగా వృద్ధులను పట్టిపీడిస్తున్న డిమెన్షియా కేసుల్లో 60-70 శాతం అల్జీమర్స్ వల్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు అధికం. ఒక్క భారతదేశంలోనే దాదాపు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అమెరికాలో 7 మిలియన్ల మంది బాధితులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మెదడులోని కణాలను నాశనం చేస్తూ, ప్రాణాలను బలిగొనే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు, ఏఐ సాంకేతికతతో జరుగుతున్న ఈ నూతన పరిశోధనలు మానవాళి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం! -
ఉద్యోగాలే కాదు AI దెబ్బకు రియల్ ఎస్టేట్ డౌన్
-
‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో అలజడి చెలరేగుతోంది. గడిచిన 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుత ఎంట్రీ-లెవల్ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటోంది. ఏఐ దెబ్బకు అగ్రశ్రేణి యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలను గమనించిన మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ క్లారా షిహ్.. ‘ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు’ అని హెచ్చరిస్తూనే, యువత (Gen Z) ఉద్యోగ వేట కోసం సరికొత్త ఏఐ సాధనాలను ఆశ్రయించాలన్నారు.టాపర్లనే దాటేసిన ఏఐ.. షాకింగ్ నిజాలుమెటా, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన క్లారా షిహ్.. ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును ప్రత్యక్షంగా చూశారు. తమ సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగుల కంటే ఏఐ ఏజెంట్లు అనేక పనుల్లో వేగంగా, అద్భుతంగా పనిచేయడం చూసి ఆమె విస్తుపోయారు. ఆ క్షణమే భవిష్యత్తు ఉద్యోగాలన్నీ ఏఐ మయం కాబోతున్నాయని ఆమె గ్రహించారు. ఏఐ ప్రభావంతో తన స్నేహితులు, బంధువుల పిల్లలు కనీసం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా సాధించలేకపోవడం చూసి చలించిపోయారు. ఈ సంక్షోభం నుంచి యువతను గట్టెక్కించేందుకు ఆమె ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు.ఏఐ దెబ్బకు ఏఐతోనే బదులుప్రస్తుతం వస్తున్న ఈ సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఆయుధంగా మలచుకోవడమే ఏకైక మార్గమని క్లారా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా ఏఐ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకోవడంలో యువత నైపుణ్యం సాధించడం తప్పనిసరి. ఇందుకోసం ‘డియర్ సీసీ’ పేరుతో యువత కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ ను ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘ఫీల్డ్ రిపోర్ట్’ అనే టూల్.. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో ఉన్న ప్రస్తుత అవకాశాలు, అలాగే ఏఐ వల్ల ఆ రంగంలో పొంచి ఉన్న ఆటోమేషన్ ముప్పును విశ్లేషించి చెబుతుంది.రెజ్యూమ్ అక్కర్లేదు.. ‘జాబ్క్లా’తో కొత్త రకం వేటఉద్యోగాన్వేషణను మరింత సులభతరం చేసేందుకు ‘జాబ్ క్లా’ (JobClaw) అనే మరో అద్భుతమైన టూల్ను కూడా ఈ ఫౌండేషన్ పరిచయం చేసింది. దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదు. కేవలం ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు, అభ్యర్థి ఆసక్తులు, బలాలు ఆధారంగా సరిపోయే ఉద్యోగాలను ఇది వెతికి పెడుతుంది. మరోవైపు ఏఐ విషయంలో యువతలో ఆందోళన, కోపం పెరుగుతున్నాయని గాలప్ సర్వే వెల్లడించింది. ఇది కూడా చదవండి: నాడు రోమాలపై హేళన.. నేడు ఇంటర్లోనూ టాపర్! -
‘ముండతికోడ్’ గుణపాఠం.. ఇక రోబోలకు బాణసంచా!
తిరువనంతపురం: కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం 15 నిండు ప్రాణాలను బలిగొనడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి మారణహోమాలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, నిపుణులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించి ఫ్యాక్టరీలను సురక్షితంగా మార్చేందుకు, ప్రమాదాలను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కసరత్తు మొదలైంది.శబ్దాల కంటే దృశ్యాలకే ప్రాధాన్యంప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు బాణసంచా ప్రదర్శనల విధానంలో భారీ మార్పులు రావాలని కేరళ దేవస్వం మంత్రి వీ.ఎన్. వాసవన్ పేర్కొన్నారు. కేవలం భారీ శబ్దాలతో దద్దరిల్లేలా కాకుండా, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలలో మాదిరిగా కనువిందు చేసే సురక్షితమైన రంగుల ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ప్రాణనష్టం లేని ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.మనుషులకు బదులు రోబోలుప్రమాదకరమైన బాణసంచా తయారీ, పేల్చే విధానంలో మనుషుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించాలని ‘బెటర్ కొచ్చి రెస్పాన్స్ గ్రూప్’ (BKRG) ప్రతిపాదించింది. చేతులతో నిప్పు పెట్టే విధానానికి బదులుగా ఎలక్ట్రానిక్ టైమింగ్ సిస్టమ్స్ వినియోగించాలని కోరుతోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ తరహాలో, తయారీ కేంద్రాల్లో ప్రమాదకరమైన పనులను రోబోలు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా చేయిస్తే ప్రాణాపాయాన్ని దాదాపుగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలు జరగకుండా కచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి సాధ్యమవుతుంది.ఏఐ సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలుఫైర్క్రాకర్ యూనిట్లలో భద్రతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారనుంది. థర్మల్ సెన్సార్లు, కెమెరాల సాయంతో ఉష్ణోగ్రత, పొగ, తేమ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే ఏఐ వ్యవస్థలు.. మంటలు చెలరేగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, ఏఐ సాధనాలు క్షణాల్లో ప్రతిస్పందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సూచిస్తాయి. మెషిన్ లెర్నింగ్ సాయంతో ప్రాణనష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా ఈ అత్యాధునిక వ్యవస్థలు పనిచేస్తాయి.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
శ్రీరామ్ పరాశర@24 క్రాఫ్ట్స్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే సెట్టింగ్స్..అద్భుతమనిపించే విజువల్స్.. ఇవి ఏ పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్.!! ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు యవదర్శకుడు రామ్ పరాశర. రామాయణం పేరుతో ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం టీజర్ను ఎపిక్ రామాయణ పేరుతో ఇటీవల విడుదల చేశారు. ఐదు రోజుల్లోనే లక్షల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అన్నీ తానై.. టీజర్లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు, యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు రామ్. టీజర్లో రెండో వ్యక్తి అనే మాటే లేదు. డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకూ, సౌండ్ డిజైన్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకూ 3డీ నుంచి యానిమేషన్ వరకు మొత్తం 24 విభాగాలను ఒక్కడే నిర్వహించి రికార్డు సృష్టించాడు. టీజర్ ప్రారంభంలో శివుడి ధనస్సు గురించి వినిపించే పవర్ఫుల్ వాయిస్ ఓవర్, ప్రేక్షకుడిని వెంటనే పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్లో కనిపించే డీటైల్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పాన్–ఇండియా సినిమా స్థాయిని తలపిస్తున్నాయి. అవకాశం సృష్టించుకున్నా.. ‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మా స్వగ్రామం. గుంటూరులో పెరిగాను. ప్రముఖ సంస్థలో ఐదేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సినిమా మీద ఆసక్తితో ఆరేళ్లకిందట హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఓ పెద్ద బ్యానర్లో దర్శకుడిగా అవకాశం వచ్చి కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. అయినా ఫలితం లేకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయంగా తీసుకున్నాను. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అద్భుత రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తున్నాను. ఏఐ టూల్స్ వాడి కేవలం మూడు రోజుల్లో రూపొందించిన టీజర్కు భారీ స్పందన వస్తోంది.’’ –శ్రీ రామ్ పరాశర బొమ్మకంటి. -
బ్యాక్టీరియాకు బ్యాడ్ టైం!
సాక్షి, స్పెషల్ డెస్క్: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సకు మానవాళి దశాబ్దాలుగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తుండటంతో ఆ మందులకు నిరోధకత పెంచుకొని మొండి బ్యాక్టీరియా ‘సూపర్ బగ్స్’గా మారిన నేపథ్యంలో పరిశోధకులు కొత్త యాంటీబయోటిక్స్ కనుగొనడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెడికల్, బయోలాజికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ జె. కాలిన్స్ నేతృత్వంలోని బృందం ఈ దిశగా పరిశోధనలు సాగిస్తోంది. ఏయే రసాయన అణువులు బ్యాక్టీరియాను చంపగలవు.. ఏవి చంపలేవు అనే సమాచారాన్ని జనరేటివ్ ఏఐ మోడల్కు అందించడం ద్వారా అత్యంత ప్రభావవంతమైన యాంటీబయోటిక్స్ తయారీకి అవసరమైన రసాయన సమ్మేళనాన్ని పొందే మార్గాన్ని ఈ బృందం కనుగొంది.ప్రయోగం సాగింది ఇలా..తమ ప్రయోగంలో భాగంగా కాలిన్స్ బృందం ఇప్పటికే తెలిసిన యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలను ఉపయోగించి ఒక జనరేటివ్ ఏఐ మోడల్కు శిక్షణ ఇచ్చింది. యాంటీబయాటిక్ అణువులు ఎలా పనిచేస్తాయో జనరేటివ్ ఏఐ మోడల్ నేర్చుకొని దాని ఆధారంగా 4.5 కోట్లకుపైగా రసాయన నిర్మాణాల పనితీరును పరిశీలించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే హాలిసిన్ అనే యాంటీబయోటిక్ క్యాండిడేట్ (చక్కెర వ్యాధికి మందుగా ఉపయోగించేందుకు వీలుగా గతంలో ప్రీ–క్లినికల్, క్లినికల్ ప్రయోగాల్లో వాడిన ఒక రసాయన అణువు) మొండి బ్యాక్టీరియాకు విరుగుడుగా పనిచేస్తుందని గుర్తించింది. ప్రస్తుత యాంటీబయోటిక్స్ రసాయన నిర్మాణాలతో పోలిస్తే హాలిసిన్ రసాయన నిర్మాణం పూర్తి భిన్నమైనది కావడం విశేషం. దీంతో కాలిన్స్ బృందం హాలిసన్ను మొండి బ్యాక్టీరియా సహా వివిధ రకాల బ్యాక్టీరియాలపై పరీక్షించగా ఇది వాటి శక్తి ఉత్పత్తిని దెబ్బతీయడం ద్వారా సమర్థంగా నాశనం చేసింది. ఎంఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన మరో అధ్యయనంలో పూర్తిగా కొత్త యాంటీబయోటిక్ అణువులను సృష్టించడానికి జెనరేటివ్ ఏఐని ఉపయోగించారు. ఈ ఏఐ మోడల్ 3.6 కోట్లకుపైగా రసాయన సమ్మేళనాలను రూపొందించి పరీక్షించింది. ఎంఆర్ఎస్ఏ, గొనేరియా వంటి మొండి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన అణువులను ఇది గుర్తించింది. ఈ సమ్మేళనాలకు ప్రస్తుతమున్న ఏ రకమైన యాంటీబయోటిక్స్తోనూ పోలిక లేదు. ఇవి బ్యాక్టీరియా కణ త్వచాన్ని దెబ్బతీయడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం..పార్కిన్సన్ వ్యాధికి మెరుగైన మందులను కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా 2024లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ మిచెల్ వెండ్రూస్కోలో, ఆయన సహచరులు మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించారు. చివరకు ఈ ప్రక్రియ ద్వారా ఐదు ఆశాజనకమైన అణువులను గుర్తించారు. మరోవైపు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఒక ఏఐ మోడల్ దాదాపు 8,000 మందులను గుర్తించింది. వాటిని 17,000 కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలకు తిరిగి ఉపయోగించే అవకాశం ఉంది.ప్రారంభ దశల్లోనే ఏఐ దోహదం..మందులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఫార్మా కంపెనీల వద్ద ప్రైవేట్గా ఉండటంతో పరిశోధకులకు ఆ సమాచారం అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా లక్ష్యాలను గుర్తించడం, అణువులను పరిశీలించడం వంటి ప్రారంభ దశల్లోనే ప్రస్తుతం ఏఐ దోహదపడుతోంది. దీంతో ఏఐ ద్వారా కనుగొనే అనేక మందులు రోగులకు చేరడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. కాగా, 2017–22 మధ్యకాలంలో 12 కొత్త యాంటీబయోటిక్స్ మాత్రమే ఆమోదం పొందగా వాటిలో ఎక్కువ భాగం ఇప్పటికే అందుబాటులో ఉన్న మందుల మాదిరిగానే ఉన్నాయి. -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
ఏఐ వినియోగంలో భారత్ టాప్.. కానీ..
న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్లాంటి అంశాల్లో భారత్ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్లో మిగతా ప్రాంతాల కన్నా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్ఏఐ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్ వినియోగంలో కూడా భారత్కి పటిష్టమైన ర్యాంకింగ్ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ కోడెక్స్ (కోడింగ్ టూల్) యాప్ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్డ్ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్డ్ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్ సిటీల్లో డేటా అనాలిసిస్ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్ (కోడెక్స్) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్గఢ్లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి. -
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్ఫోన్లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్లు, యాప్ స్టోర్లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.


