Ananthapur
-
రక్తదానంతో మరొకరికి పునర్జన్మ
ఎస్ఆర్ఐటీ కళాశాల చైర్పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి బుక్కరాయసముద్రం: రక్తదానం చేస్తే ఆపదలో ఉన్నవారికి పునర్జన్మను ఇచ్చినట్లు అవుతుందని ఎస్ఆర్ఐటీ కళాశాల చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి తల్లి ఆలూరి నారాయణమ్మ 18వ వర్ధంతి సందర్భంగా మంగళవారం బీకేఎస్ మండలం రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అనంతపురం జీజీహెచ్, మానవతా స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకు ముందు ఆలూరి నారాయణమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందికి నూతన దుస్తులను జొన్నలగడ్డ పద్మావతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రక్తదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. అనంతరం కళాశాలలో సేకరించిన 102 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, టీపీఓ రంజిత్రెడ్డి, మానవతా బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ తరిమెల అమర్నాథ్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
15 మంది దాడి చేశారు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన కోనా మురళీ సతీమణి శ్రీలత గుత్తి: టీడీపీ అల్లరి మూకలు మొత్తం 15 మంది తమ ఇంటిపై దాడి చేశారని మాజీ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు కోనా మురళీధర్రెడ్డి సతీమణి కోనా శ్రీలత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి తాను ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి తమ ఇంటిపై రాళ్లతో విరుచుకుపడ్డారన్నారు. తనకు స్వల్పగాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ప్రతాప్, ఓం ప్రకాష్, రమేష్, గోవర్దన్తో పాటు మరో 11 మంది దాడుల్లో పాల్గొన్నారని, ఇంటితో పాటు కారునూ ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వ్యక్తి దుర్మరణం కూడేరు: మండలంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన మదమంచి రఘు (35)కు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న కుమార్తెను వదిలేందుకు మంగళవారం అనంతపురానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యానికి తావివ్వొద్దు : జేసీఅనంతపురం అర్బన్: ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులను జాయింట్ కలెక్టర్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన అంశాలపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగింత, రీసర్వే, రెవెన్యూ సేవలు, పీజీఆర్ఎస్, తదితర అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రీ–సర్వే ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలన్నారు. భూ సమస్యలు లేకుండా ఎల్పీఎంలు ఇవ్వాలన్నారు. జాతీయ రహదారి ‘544డి’కి సంబంధించి భూసేకరణ, భూమి అప్పగింత ప్రక్రియపై ఆరా తీశారు. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బైండోవర్ కేసుల్లో జరిమానా అధికంగా వేసి నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేయాలన్నారు. సమీక్షలో కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘పరిటాల’ అండతోనే భూ వివాదం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘పరిటాల కుటుంబం అండతోనే ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో 26 సెంట్ల భూ వివాదంలోకి కొత్తపల్లి మాజీ సర్పంచ్ మోహన్రెడ్డి జోక్యం చేసుకుని రూ. 60 లక్షలు డిమాండ్ చేశాడు. అంతమాత్రాన అతనిపై దాడి చేయడం కరెక్ట్ కాదు. తనది కాని భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకుని అందులోకి వెళ్లడం ఆయనదీ కరెక్ట్ కాదు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం కొత్తపల్లి మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో అరైస్టెన చింతపంటి సుధాకరరెడ్డి, దివాకర్రెడ్డి పోలీసు విచారణలో భూ వివాదమే ఇందుకు కారణంగా స్పష్టం చేశారన్నారు. గతంలో చింతపంటి సుధాకర్రెడ్డి, దివాకర్రెడ్డి ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో 26 సెంట్ల భూమిని కొనుగోలు చేశారన్నారు. శాశ్వత విక్రయఖరారు నామా రాయించుకున్నారని గుర్తు చేశారు. ఇదే భూమిని ఇటీవల మరో వ్యక్తికి అప్పట్లో శాశ్వత విక్రయఖరారు నామా చేసిన వారి వారసులు రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని, చట్టరీత్యా అది చెల్లుబాటు కూడా కాదన్నారు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా భూ వివాదంలోకి కొత్తపల్లి మోహన్రెడ్డి ప్రవేశించాడన్నారు. ఇందుకు సంబంధించి ఘటన జరిగిన మరుసటి రోజు వేకువజామునే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు. అయితే వాస్తవాలు గుర్తించకుండా మోహన్రెడ్డిపై దాడి వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతున్నారని, తాను ఫోన్ చేసే వరకూ ఎస్పీ, డీఎస్పీ పట్టించుకోలేదని ఆరోపణలు చేస్తుండడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. కేవలం పరిటాల సునీత అండ చూసుకునే మోహన్రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడన్నారు. వంద మంది రెడ్లను చంపిన చరిత్ర కమ్మోల్లు, కాపోల్లు కలసిమెలసి ఉంటూ మామా.. చిన్నాన్న అంటూ సంబంధాలను కలుపుకుని పోయే మనస్తత్వం కొత్తపల్లి గ్రామ ప్రజలదని ప్రకాష్రెడ్డి అన్నారు. అలాంటి గ్రామంలో రెడ్లను రెండు గుంపులుగా చేసి తన స్వార్థానికి వారి మధ్య వర్గ కక్షలకు సునీత ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. సునీత భర్త పరిటాల రవీంద్ర నియోజకవర్గంలోని వంద మంది రెడ్లను చంపిస్తే.. అదే నియోజకవర్గంలో రెడ్ల మధ్య ప్రస్తుతం ఫ్యాక్షన్ చిచ్చును సునీత రాజేస్తోందని ధ్వజమెత్తారు. రాప్తాడులో ప్రసాదరెడ్డి హత్య వెనుక సూత్రధారి సునీతనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతకు, ఆమె కుటుంబానికి కబ్జాల చరిత్ర ఉందని, పదిమందికి సాయం చేసే మనస్తత్వం ప్రకాష్రెడ్డిదని గుర్తించాలన్నారు. ఇప్పటి వరకూ కేవలం మహిళ అని గౌరవించి మాట్లాడుతున్నానన్నారు. ఆమె మాదిరిగా వ్యక్తిగత దూషణలకు తాను పోలేదని, అలా మొదలుపెడితే ఆమె కంటే బాగా తిట్టగలనన్నారు. సమావేశంలో రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, యూత్ మాజీ కన్వీనర్ చిట్రెడ్డి సత్యానారాయణరెడ్డి, కొత్తపల్లి గ్రామస్తులు బాలకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, వెకంటరామిరెడ్డి, తాతిరెడ్డి పాల్గొన్నారు. అంతమాత్రాన కొత్తపల్లి మోహన్రెడ్డిపై దాడి చేయడం సబబు కాదు పది మందికి సాయం చేసే మనసు ప్రకాష్రెడ్డిది ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఫైర్ -
ఆస్తి కోసం కుమారుడి కర్కశం
రాయదుర్గం: ఆస్తి కోసం ఓ కుమారుడు బరితెగించాడు. వేటకొడవలితో కన్న తండ్రిపై దాడి చేసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన వాల్మీకి సుంకప్ప (68), గంగమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. దేవుడి మహిమతో పుట్టాడని కుమారుడికి వన్నూర్స్వామిగా పేరుపెట్టారు. అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. పూర్వీకులు సంపాదించిన 2 ఎకరాల ఆస్తి సుంకప్ప పేరుపైనే ఉంది. దీంతో ఆస్తిని తన పేరున బదలాయించాలంటూ కొంత కాలంగా తండ్రిని కుమారుడు వేధిస్తూ వచ్చాడు. అయితే ఇందుకు తండ్రి అంగీకరించకపోవడంతో భార్యతో కలసి వేరు కాపురం పెట్టాడు. మంగళవారం తన తండ్రి ఇంటికి చేరుకున్న వన్నూర్స్వామి ఆస్తి కోసం గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. విచక్షణ కోల్పోయిన వన్నూర్స్వామి అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న వేటకొడవలి తీసి తండ్రిపై దాడి చేశాడు. ఘటనలో సుంకప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని తన తండ్రిని హత్య చేసినట్లుగా వన్నూర్ స్వామి అంగీకరిస్తూ లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ జయానాయక్ పరిశీలించి కేసు నమోదు చేశారు. కన్న తండ్రిపై వేట కొడవలితో దాడి అక్కడికక్కడే మృతి చెందిన సుంకప్ప -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం: అంతర్జిల్లా దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.16 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. అనంతపురంలోని భవానీనగర్లో నివాసముంటున్న వనరస జితేంద్ర అలియాస్ సిద్ధు, షేక్ తౌహిద్ అలియాస్ సోనూ, ఇందిరానగర్కు చెందిన మైనర్ బాలుడు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామానికి చెందిన నల్లనాచప్పగారి గణేష్, ముత్యాలచెరువు గ్రామానికి చెందిన నూర్ మహమ్మద్ వ్యసనాలకు బానిసలుగా మారి, తమ జల్సాలు తీర్చుకునేందుకు మూడు బృందాలుగా ఏర్పడి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించేవారు. వీరిలో జితేంద్రపై అనంతపురం రెండు, మూడు, రూరల్, గుత్తి పీఎస్ పరిధిలో మొత్తం 8 కేసులున్నాయి. ఇది వరకే సాగించిన దొంగతనాలకు సంబంధించి 2 కేసులున్నాయి. కార్పెంటర్గా పనిచేస్తున్న తౌహిద్, తన స్నేహితుడు (మైనర్)తో కలసి ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలను అపహరించేవాడు. వీరిపై అనంతపురం వన్టౌన్, ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చెరో 6 కేసులున్నాయి. మైనర్పై రెండు బైక్ చోరీ కేసులున్నాయి. బేల్దారి నల్లనాచప్పగారి గణేష్, బైక్ మెకానిక్ నూర్ మహమ్మద్ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచి స్నేహితులయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించేవారు. వీరిపై మొత్తం ఆరు కేసులుండగా ఇందులో వైఎస్సార్ జిల్లా లో ఐదు, అనంతపురం జిల్లాలో ఒకటి ఉన్నాయి. నిందితులు మంగళవారం అనంతపురంలోని ఎస్జేఆర్ ఫంక్షన్ హాలు వద్ద తచ్చాడుతుండగా అనంతపురం వన్టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, త్రీ టౌన్ సీఐ శాంతిలాల్, సీసీఎస్ సీఐలు ఇస్మాయిల్, జైపాల్రెడ్డి గుర్తించి అరెస్ట్ చేశారు. మైనర్ను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచారు. మిగిలిన వారిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం
అనంతపురం అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై పోరాటాలు సాగిస్తామని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వాలు సాగిస్తున్న కుట్రను అడ్డుకుని పథకాన్ని కాపాడాకుంటామన్నారు. అనంతపురంలోని నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల వ్యకాసం అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆవుల శేఖర్తో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల్లో మతత్వాన్ని పెంచిపోషిస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. బడ్జెట్లో రూ.4.60 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటే రూ.86 వేల కోట్లు మాత్రమే కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవసాయ, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళల హక్కులను నిర్వీర్యం చేయడంతోపాటు పేదలు పోరాడి సాధించుకున్న చట్టాలను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. పథకాలు ఎగొట్టేందుకు సీఎం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు పీ4 విధానమంటూ సంక్షేమ పథకాలను ఎగొట్టేందుకు పథకం వేశారని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా దాటవేస్తున్నారన్నారు. భూ సమస్యలు, ఉపాధి హమీ, ఇళ్ల స్థలాల సమస్యల సాధనకు పోరాటాలు తప్ప మరో మార్గం లేదని, ఇందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యకాసం రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు తోపు కిష్టప్ప, రాయలసీమ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు రంగయ్య, పెద్దయ్య, నబీరసూల్, భూపేష్, రాధాకృష్ణ, పండుగోలమని, కదిరప్ప, బాలస్వామి, చెన్నరాయుడు, దేవేంద్ర, వెంకట్రామిరెడ్డి, సుందరం, సత్యనారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉపాఽధి చట్టాన్ని కాపాడుకుంటాం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ -
సీఎం కాన్ఫరెన్స్లో కలెక్టర్
అనంతపురం అర్బన్: విజయవాడలోని సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలను ఈ సందర్భంగా సీఎంకు కలెక్టర్ వివరించనున్నట్లు సమాచారం. రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు తప్పనిసరి గార్లదిన్నె: రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఏపీఎఫ్ఆర్) నమోదు తప్పనిసరి అని రైతులకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ సూచించారు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల, మర్తాడు, గార్లదిన్నె రైతు సేవా కేంద్రాల్లో చేపట్టిన ఏపీఎఫ్ఆర్ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఆమె పరిశీలించి, మాట్లాడారు. మండల వ్యాప్తంగా 11 వేల మంది రైతులు ఇప్పటి వరకూ ఏపీఎఫ్ఆర్ నమోదు చేసుకున్నారన్నారు. ఈ విశిష్ట సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటుందన్నారు. ఏపీఎఫ్ఆర్ నమోదు చేసుకోని రైతులు ఆయా గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, రైతులు పాల్గొన్నారు. డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం రూరల్: ఆన్లైన్ ద్వారా అందించే డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు సుమన జయంతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెట్లో అర్హత సాధించిన జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. టెట్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు 08554 275575లో సంప్రదించవచ్చు. -
●బార్ కాదిది.. బస్టాండే!
అధికారుల ఉదాసీనత కారణంగా బుక్కరాయసముద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులకు అందుబాటులో లేకుండా పోయింది. బస్టాండ్ ముందు భాగాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న కొందరు వివిధ రకాల వ్యాపారాలను ఏర్పాటు చేశారు. వీటి మాటున రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. బస్టాండ్లోనే మందు బాబులు తిష్టవేసి మద్యం సేవించిన అనంతరం ఖాళీ బాటిళ్లను అక్కడే వదిలేసి వెళుతున్నారు. మరికొందరు వాహనదారులు తమ ద్విచక్ర వాహనాలను బస్టాండ్లోపల ఉంచి వెళుతున్నారు. ఇవన్నీ ఓ ఎత్తయితే... మరోవైపు ప్రచార ఆర్భాటంతో స్థానిక టీడీపీ నేత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో కుండలు లేక బోసిపోయింది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు మేల్కోంటారో లేదో చూడాలి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
తాడిపత్రిలో అర్ధరాత్రి పోలీసుల అత్యుత్సాహం
తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుట్టుచప్పుడు కాకుండా వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు ఫయాజ్బాషాను అనంతపురం తరలించారు. ఇటీవల ఫయాజ్బాషా తన నూతన గృహంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్రెడ్డి పోలీసులను ఉసిగొల్పారు. ఇదే అదునుగా ఫయాజ్ ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు రాళ్లదాడి చేశాయి. అయినా, దాదాపు 17 మంది వైఎస్సార్సీపీ నాయకులపైనే పోలీసులు కేసులు నమోదు చేసి స్వామి భక్తిని ప్రదర్శించారు. తాజాగా ఆయన్ను పండుగ పూట కూడా ఇంట్లో ఉండకుండా చేయడం గమనార్హం. దాదాపు 60 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఫయాజ్ బాషా ఇంటిని చుట్టుముట్టి తమ జీపులోనే అనంతపురం తరలించారు. 10 రోజుల పాటు తాడిపత్రికి రావొద్దంటూ హుకుం జారీ చేశారు.రంజాన్ వేళ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తారన్న నెపంతో తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని 9 నెలలుగా తాడిపత్రికి రాకుండా చేసిన పోలీసులు..ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఫయాజ్బాషాను పట్టణం నుంచి తరలించి జేసీ ఆగడాలకు రూట్క్లియర్ చేస్తున్నారంటూ పట్టణ వాసులు మండిపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఫయాజ్బాషాను అనంతపురం తరలింపు ఖాకీల తీరుపై పట్టణవాసుల మండిపాటు -
ఎస్బీఐ ఏటీఎం సెంటరులో అగ్ని ప్రమాదం
● ఏసీ సిలిండర్లు, బ్యాటరీలు పేలడంతో ఘటన ● పూర్తిగా దగ్ధమైన ఏటీఎం సెంటరు రాయదుర్గంటౌన్: పట్టణంలోని బళ్లారి రోడ్డు సోమా పాండు కాంప్లెక్స్లోని ఎస్బీఐ ఏటీఎం సెంటరులో జరి గిన అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఘటన సమయంలో ఏటీఎం సెంటరు సెక్యూరిటీ గార్డు శ్రీనివాసులు పెద్ద శబ్దం విని లోపల వెళ్లేందుకు ప్రయత్నించాడు. క్షణంలోనే మరో భారీ శబ్దంతో ఏసీ పేలి మంటలు శరవేగంగా వ్యాపించాయి. విషయాన్ని వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు, అక్కడే పై అంతస్తులో నివాసం ఉంటున్న భవన యజమానికి చేరవేశాడు. హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఏటీఎం సెంటర్ పూర్తిగా కాలిపోయింది. అదే కాంప్లెక్స్లో పార్కింగ్లో ఉంచిన నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు ఒక సైకిల్ దగ్ధమయ్యాయి. ఏటీఎం సెంటరుకు ఆనుకుని ఉన్న రూముల్లో మంటల వ్యాప్తితో నష్టం వాటిల్లింది. సుమ ఎంటర్ప్రైజెస్లో ఎలక్ట్రిక్ వస్తువులు దెబ్బతిన్నట్లు యజమానులు గోపి, విజయ్ తెలిపారు. దుస్తుల షాపులో రెడీమేడ్ దుస్తులు కాలిపోయినట్లు బాధితుడు పవన్కుమార్ వాపోయాడు. ఏటీఎం వెనుక భాగంలోని ఫొటో స్టూడియోలోనూ నష్టం వాటిల్లినట్లు బాధితుడు శ్రీనివాసులు తెలిపాడు. కాగా.. ఏటీఎంలో డబ్బులు కాలిపోయాయా, లేదా అనే విషయం తెలియరాలేదు. ఈ విషయమై ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మృత్యుంజయతో ఆరా తీయగా.. ఏటీఎం లాక్ తెరిచి పరిశీలించాల్సి ఉందని, నిపుణులకు సమాచారం అందజేశామని చెప్పారు. మొత్తమ్మీద ఈ ఘటనలో రూ.20 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. నష్టంపై యజమానులతో వివరాలు సేకరిస్తున్నట్లు లీడింగ్ ఫైర్మెన్ మల్లారెడ్డి తెలిపారు. -
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
● చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు ● జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో ఈ నెల 27న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.వెంకటసుబ్బయ్య ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సీఈఓ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రొద్దం, గాండ్లపెంట, రామగిరి, కణేకల్లు, కంబ దూరు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు,ఉరవ కొండ, పెద్దపప్పూరు, యల్లనూరు, రాయదుర్గం మండలాల్లో వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే ఎన్నుకునే హక్కు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల కో–ఆప్షన్ సభ్యులకు ఓటింగ్ ఉండదన్నారు. మెజారిటీ సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపిన వారే ఎంపీపీ, వైస్ ఎంపీపీగా ఎన్నికవుతారన్నారు. ఎన్నికల రోజున బందోబస్తు కూడా ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందనే విషయాన్ని ముందుగా చాటింపు వేయించాలని ఆదేశించారు. ప్రిసైడింగ్ అధికారులు ఖుష్బూ కొఠారి(ఉరవకొండ), జి,భార్గవ్(కణేకల్లు), మద్దిలేటి(కంబదూరు), రఘునాథరెడ్డి(యల్లనూరు), ప్రభాకర్రెడ్డి(పెద్దపప్పూరు), శ్రీనివాసయాదవ్ (రాయదుర్గం), సుదర్శన్(గాండ్లపెంట),విజయప్రసాద్ (రొద్దం), సంజీవయ్య(రామగిరి), ఎన్నికల విభాగం అధికారులు ధనుంజయ, ఖలందర్ పాల్గొన్నారు. -
ఈ గ్రామాల్లో బోరుబావులు నిషేధం
అనంతపురం అగ్రికల్చర్: ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, వృక్షముల చట్టం–వాల్టా (ఏపీ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీ యాక్ట్–2002) ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 64 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో అత్యధిక నీటి వినియోగం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితోనే తాగునీటి అవసరాల కోసం బోరుబావుల తవ్వకం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధిత జాబితాలోని గ్రామాలిలా...●● పుట్లూరు మండలం కోమటికుంట్ల, మడుగుపల్లి, తాడిపత్రి మండలం బోడాయిపల్లి, బొందలదిన్నె, హుస్సేనాపురం, సజ్జలదిన్నె, తాడిపత్రి రూరల్ పంచాయతీ, యల్లనూరు మండలం అరవేడు, బొప్పేపల్లి, మేడికుర్తి, పెద్దమల్లేపల్లి, తిరుమలాపురం, వేములపల్లె గ్రామ పంచాయతీ. ● శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో అత్యధికంగా 51 గ్రామాలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి, ఇనగలూరు, మధూడి, నరసంబూడి, పి.బ్యాడిగేరె, రావుడి, అమడగూరు మండలం కరిణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, అమరాపురం మండలం తమ్మిడేహళ్లి, చిలమత్తూరు మండలం ధేమకేతేపల్లి, హుస్సేనా పురం, గాండ్లపెంట మండలం చామచాయన బైలు, చామలగొంది, గాండ్లపెంట, జీనుగులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుపల్లి, గుడిబండ మండలం జి.మోరుబాగల్, కేకాతి, ఎస్.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె, గోళ్లాపురం, కిరికెర, కొటిపి, కొట్నూరు, మలుగూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్, లేపాక్షి మండలం చోళసముద్రం, ఎన్పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, గౌకనపల్లి, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి, కాకి, ఎం.రాయాపురం, రొళ్ల, తాడిమర్రి మండలం దాడితోట, తలుపుల మండలం పులిగుండ్లపల్లె, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం, బొంతలపల్లె, చీకటిమానిపల్లి,దిగువమందల పల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుంలు ఉన్నాయి. రాష్ట్రంలో 300 పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల పరిధిలో 300 గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 94 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకాకుళం– 76, శ్రీ సత్యసాయి–51, వైఎస్సార్ కడప– 32, చిత్తూరు– 18, పల్నాడు– 16, అనంతపురం –13, అన్నమయ్య జిల్లాలో ఒక గ్రామం... ఇలా మొత్తం 300 గ్రామాల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు భూగర్భజలశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.తిప్పేస్వామి తెలిపారు. -
పేదలపై సీఎం చంద్రబాబు కక్ష కట్టారు. అదిగో ఇదిగో అంటూ ఇప్పటికే సంక్షేమ పథకాల అమలును వాయిదా వేస్తున్నారు. కొత్తవి సంగతి దేవుడెరుగు గతంలో పేదల కోసం అమలు చేసిన పథకాలకూ మంగళం పాడుతున్నారు. గత ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ప్రవేశ పెట్టిన ‘విదేశీ విద్యా దీవెన’ పథకం
అనంతపురం: పేద పిల్లలకూ విదేశాల్లో ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేసింది. 2022–23, 2023–24 విద్యా సంవ త్సరంలో మొత్తం రూ.1.47 కోట్లను జిల్లాకు చెందిన విద్యార్థులకు అందజేసింది. అయితే, గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజు మొత్తాన్ని అందించాల్సిన తరుణంలో కూటమి సర్కారు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. పైసా విదల్చలేదు.. అధికారం చేపట్టి 9 నెలలు అయినప్పటికీ పైసా విదల్చకుండా కూటమి సర్కారు లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సాయానికి గతేడాది జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరికి ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందన్న ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా సాయం అందించే విషయంపై స్పష్టత రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాలు అందించినా ఫలితం కానరాకపోవడం గమనార్హం. గతంలోనూ ఇంతే.. గతంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలోనూ అగ్రవర్ణ పేదలను విస్మరించారు. మిగిలిన వారికి కూడా కేవలం రూ.15 లక్షల చొప్పున సాయం అందించి చేతులు దులుపుకున్నారు. అదే జగన్ సర్కార్ ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.1.25 కోట్ల వరకు సాయం అందించింది. అగ్రవర్ణ పేదలతో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీలకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు. ప్రపంచంలో టాప్–50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల (సెమిస్టర్)లో ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించింది. పీజీ,పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోర్టల్ తెరుచుకోవడం లేదు ప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞానభూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. సాయం అందించకపోతే అబ్బాయి చదువు కోసం అప్పులు చేసి అవస్థలు పడక తప్పదు. – విజయభాస్కర్, చిరుద్యోగి, అనంతపురం ఇస్తారో లేదో చెప్పాలి? మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు. విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగి స్తుందా.. లేదా.. అనే అంశంపై స్పష్టత లేదు. అసలు సాయం అందిస్తారో లేదో చెబితే.. మా తిప్పలు మేం పడతాం. – ఓబుళ రెడ్డి, మాజీ ఆర్మీ ఉద్యోగి, శ్రీ సత్యసాయి జిల్లా పైసా విదల్చని కూటమి సర్కారు పేద బిడ్డల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్న వైనం ఇప్పటికే విదేశాలకు వెళ్లిన వారికీ చెల్లింపులు బంద్ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన ఎన్నికల ముందు వచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలే? -
బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక రైలు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 28, 29వ తేదీల్లో బెంగళూరు–కలబురిగి మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్కు రైలు చేరుతుందన్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగళూరు జంక్షన్ చేరుకుంటుందని తెలిపారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాదగిరి, షాహాబాద్ రైల్వేస్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలిగొంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఈరన్న, రేణుకమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఇటీవల ఈరన్న ఇంటి సమీపంలో విద్యుత్ తీగ కిందకు వాలింది. ఈ విషయంపై పలు మార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. మంగళవారం బలంగా వీచిన గాలులకు తీగ పూర్తిగా తెగి కింద పడడంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా అయింది. అదే సమయంలో అక్కడికి ఆడుకుంటూ వెళ్లిన ఈరన్న కుమార్తె అభినయశ్రీ (6) షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని కళ్యాణదుర్గం సీహెచ్సీకి తరలించగా... పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ‘నవోదయ’ ఫలితాల విడుదల లేపాక్షి: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షకు 7,987 మంది దరఖాస్తు చేసుకోగా, 5,492 మంది పరీక్ష రాశారు. అందులో 80 మంది అర్హత సాఽధించారని పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం విద్యాలయ వెబ్సైట్ చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల లేపాక్షిలోని జవహర్ నవోదయ విద్యాలయలో 9వ తరగతి ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. -
మాటలొద్దు.. చేతలు కావాలి బాబూ
అనంతపురం కార్పొరేషన్: మాటలు చెప్పకుండా ఎకరాకు రూ.లక్ష ప్రకారం రైతులకు ఇచ్చి సీఎం చంద్రబాబు చేతల్లో చూపాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న నీర్జాంపల్లికి చెందిన రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్పలను ఆయన పరామర్శించారు. అధైర్య పడరాదని బాధిత కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా రైతులకు చేయూతనందించారన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, రైతు భరోసాతో ఆదుకున్నారన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
పంటల్ని చూస్తే గుండె తరుక్కుపోతోంది
యల్లనూరు/పుట్లూరు: ‘ప్రకృతి వైపరీత్యాలతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అన్నదాతల జీవితాలు అతలాకుతలమయ్యాయి. బాధిత రైతులను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉంది’ అంటూ మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. మంగళవారం వారు యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పర్యటించారు. కూచివారిపల్లి,బుక్కాపురం,తిమ్మంపల్లి,చింతకాయమంద, గొడ్డుమర్రి, దంతలపల్లి, నీర్జాంపల్లి, ఎల్లుట్ల, జంగంరెడ్డిపేట, మడ్డిపల్లి, కుమ్మనమల గ్రామాల్లో ఇటీవల ఈదురుగాలులకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి పండ్ల తోటలు, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఆర్తనాదాలు పెడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను తొలగించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. రూ. లక్షలు పెట్టుబడి పెట్టిన అరటి పంటలు దెబ్బతింటే ఎకరాకు కేవలం రూ.14 వేలు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. అది కూడా తోట మొత్తం దెబ్బతిని ఉంటేనే పరిహారం ఇస్తామనడం అన్యాయమని, ఎకరాకు 1,300 అరటి చెట్లు సాగు చేస్తే గాలులకు 1,000 చెట్ల దాకా నేలకొరిగాయని, ఇంకా 300 చెట్లున్నాయంటూ పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే నీర్జాంపల్లికి చెందిన రైతులు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. త్వరలో తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి రైతులను ఆదుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. విజయవాడ కమిషనరేట్లో డిల్లీరావుతో ప్రత్యేకంగా సమావేశమై న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ మండల కన్వీనరు వెంకటేష్నాయుడు, సర్పంచులు నారాయణస్వామి, ప్రభాకర్రెడ్డి, జమాల్, పెద్దనాగరాజు, నాయకులు మహేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, శింగనమల ప్రసాద్, సూర్యనారాయణరెడ్డి, శేఖర్, ఈశ్వరరెడ్డి, విష్ణు నారాయణ, సుబ్బయ్య, సూరీ, పురుషోత్తంనాయుడు, కిరణ్, శంకర్రెడ్డి, రవి, జనార్దన్, బాలవెంకటరెడ్డి, రాజకుళ్లాయిరెడ్డి, రమణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు తీరుతో అన్నదాతల జీవితాలు అతలాకుతలం వైఎస్సార్ సీపీ నేతలు శైలజానాథ్, కేతిరెడ్డి పెద్దారెడ్డి యల్లనూరు, పుట్లూరు మండలాల్లో దెబ్బతిన్న పంటల పరిశీలన -
సత్యసాయిజిల్లా: కదిరి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. చామలగొంది ఎంపీటీసీ లక్ష్మీదేవిని కిడ్నాప్ చేశారంటూ ఎఫఐఆర్ నమోదు చేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఇప్పటికే ఎంపీటీసీ లక్ష్మీదేవి ఓ సెల్ఫీ విడియో విడుదల చేశారు. టీడీపీ నేతల డైరెక్షన్లో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఎంపీటీసీ లక్ష్మీదేవి దూరపు బంధువు నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 27న గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్రలకు తెరతీసింది.గుత్తిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలుకాగా, అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ కోన మురళీధర్రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్ధాలు, వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. -
అంతులేని ఆవేదనలో అన్నదాతలు
అనంతపురం కార్పొరేషన్: వడగండ్ల వాన, ఈదురు గాలులతో పంటలు దెబ్బతిని ఉద్యాన రైతులు అంతులేని ఆవేదనలో మునిగిపోయారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో అరటి, మొక్కజొన్న, దానిమ్మ, బొప్పాయి తదితర ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.35 కోట్లకుపైగా నష్టం జరిగిందన్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తే చేతికందాల్సిన పంట నేలనంటడంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదన్నారు. ఫిబ్రవరిలో అరటి టన్ను రూ.25,000 వరకు ఉంటే ప్రస్తుతం ధరలు పడిపోయాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో పెట్టుబడులు కూడా దక్కే సూచనలు కన్పించడం లేదన్నారు. అధికార యంత్రాంగం సమగ్రంగా నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. యల్లనూరు మండలం నీర్జాంపల్లికి చెందిన అరటి రైతులు లక్ష్మీనారా యణ, చిన్న వెంగప్ప ఆత్మహత్యకు యత్నించడం బాధాకరమని, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయంగా రూ.20,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పెట్టుబడి సాయం కూడా అందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అమలు చేసిన ఉచిత పంట బీమా పథకం రైతాంగాన్ని ఆదుకుందని, అలాంటి పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించారు. -
తేలికపాటి ఆహారం మంచిది
● ఏప్రిల్ 23 వరకూ ఒంటి పూట బడులు ● మధ్యాహ్నం 12:30 గంటలకే ఇంటికి చేరుతున్న విద్యార్థులు ● సరదాల మాటున పొంచి ఉన్న ప్రమాదాలు ● కనిపెట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదురాయదుర్గం: ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించింది. ఏప్రిల్ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ నిబంధన పాటించేలా మార్గదర్శకాలు జారీచేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. త్వరగా నిద్ర లేచి ఉరుకులు పరుగులతో బడికి వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు చేరుకోగానే ఆటపాటలకు ప్రాధాన్యమివ్వడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఈతకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆటలు, ఈత శారీరక వ్యాయామంగా మంచిదే అయినా... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సరదా మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణ తాపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలని చెబుతున్నారు. 4 లక్షలకు పైగా విద్యార్థులు మండుటెండలోనే.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5,036 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,03,094 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 54,402 మంది మినహా మిగిలిన వారంతా ఒంటిపూట బడులకు హాజరవుతున్నారు. అలాగే 4,72,860 మందికి పైగా విద్యార్థులు ఇతర గ్రామాలకు, పట్టణాల్లో ఉండే ప్రైవేటు పాఠశాలలకు వాహనాలు, కాలినడకన వెళ్లి వస్తుంటారు. వీరంతా మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత పాఠశాల నుంచి మండుటెండలో ప్రయాణం చేయాల్సి ఉంటోంది. ఇలాంటి తరుణంలో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకునేలా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులూ చొరవ చూపాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ ధరించడం లేదా, తల.. ముఖ భాగం పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రం కట్టుకుంటే మరీ మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్ర సూర్యరశ్మితో ప్రమాదం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు నిటారుగా భూమిపై పడుతుంటాయి. ఈ సమయంలో ఎక్కువగా బయట తిరిగితే అతినీలలోహిత కిరణాలు నేరుగా శరీరాన్ని తాకడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదుముంది. మరోవైపు అంతర్గతంగా కూడా ఈ కిరణాల ప్రభావం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బడి ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న పిల్లలను తప్పనిసరి అయితే తప్పా బయటకు పంపకూడదని సూచిస్తున్నారు. ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనంపై పిల్లలను ముందు భాగంలో కూర్చోబెట్టుకుంటే వడగాలుల తీవ్రతకు వడదెబ్బ సోకే ప్రమాదం ఉందంటున్నారు. బోర్ అనిపించకుండా.. ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉంటే చాలా బోర్గా ఫీలవుతారు. దీంతో సెల్ఫోన్లకు అలవాటు పడితే మరింత ప్రమాదం. పిల్లలు బోర్ ఫీల్ కాకుండా ఉండేందుకు నీడ పట్టున వారికి కొత్త ఆటలు గాని, విజ్ఞానాన్ని పంచే అంశాలపై ఆసక్తి పెంపొందించాలి. వీలైనంత మేర తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. పాఠశాలల్లో ఇచ్చిన హోమ్వర్క్ మధ్యాహ్నం చేసుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఆడుకునే వెసులుబాటు కలుగుతుంది. వేసవి తాపం కారణంగా పిల్లలు తొందరగా అలసిపోతారు కావున, మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ఉదయం పరీక్ష రాసి... రాప్తాడురూరల్: స్నేహితులతో కలసి సరదాగా ఈతకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి శివారులోని చెక్డ్యాంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని మబ్బుకొట్టాలుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఎర్రిస్వామికి ఇద్దరు కుమారులు కాగా...చిన్నకుమారుడు విశ్వతేజ (16) నేతాజీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం గణితం పరీక్ష రాసి ఇంటికి చేరుకున్న విశ్వతేజ... మధ్యాహ్నం తన స్నేహితులు పిల్లిగుండ్లకాలనీకి చెందిన ఎన్.శశాంక్, టీవీ ప్రభాస్, అజయ్ఘోష్కాలనీకి చెందిన వీర శంకరాచారితో కలిసి రాచానపల్లి అక్కమ్మ ఆలయ సమీపంలోని చెక్డ్యాంలో ఈతకోసం వెళ్లారు. శశాంక్, వీరశంకరాచారి ఒడ్డున ఈత కొడుతుండగా కాస్తా ఈత వచ్చిన ప్రభాస్, విశ్వతేజ చెక్డ్యాం మధ్యలోకి వెళ్లి పైనుంచి దూకారు. అనంతరం ఒడ్డుకు చేరుకునే ప్రయత్నంలో విశ్వతేజ నీట మునిగిపోవడంతో ఒడ్డున ఉన్న స్నేహితులు కేకలు వేశారు. దీంతో సమీపంలో ఉన్న కొందరు అక్కడకు చేరుకుని నీట మునిగిన విశ్వతేజను వెలికి తీసేలోపు ఊపిరి ఆడక మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వేసవిలో పిల్లలకు తేలికపాటి ఆహారం చాలా మంచిది. త్వరగా జీర్ణమయ్యే ఉప్మా, ఇడ్లీ వంటివి అల్పాహారంగా ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత తేలికగా ఉండే ఆహారం ఇవ్వాలి. వేపుళ్లు, మాంసాహారం వంటి వాటికి వేసవి పూర్తయ్యే వరకూ స్వస్తి చెప్పడం మేలు. రాత్రి పూట త్వరగా నిద్రించేలా అలవాటు చేయాలి. నిద్రలేచిన తర్వాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ, మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, రాయదుర్గం -
టెండర్ల వాయిదాతో ఉద్రిక్తత
ఉరవకొండ: స్థానిక మేజర్ పంచాయతీ ఆదాయ వనరులపై సుంకం వసూలు చేసేందుకు నిర్వహించిన టెండర్ల పరిశీలన ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... ఉరవకొండ బస్టాండ్, దినసరి మార్కెట్, కబేళా, మటన్ మార్కెట్, జీవాల సంత, పాయిఖానా తదితరాలపై సుంకం వసూలు చేసే హక్కుకు సోమవారం సీల్డ్ టెండర్లను అధికారులు ఆహ్వానించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈఓఆర్డీ సతీష్ సమక్షంలో సీల్డ్ కవర్లను పంచాయతీ కార్యదర్శి గౌస్సాహెబ్ స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత టెండర్లను తెరిచి ఎక్కువ కోట్ చేసిన వారికి హక్కులు కేటాయించాల్సి ఉంది. అయితే 3 గంటల తర్వాత చాలా మంది డిపాజిట్ చెల్లించి రశీదులు తీసుకోని సీల్డ్ టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చారు. దీంతో అధికారులు టెండర్ల పరిశీలనను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనల మేరకు మధ్యాహ్నం 2 గంటల వరకు వేసిన టెండర్లను కాదని 3 గంటల తర్వాత టెండర్లను ఎలా స్వీకరిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. నిర్దేశించిన సమయంలో లోపు ఎన్ని టెండర్లు పడ్డాయో వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశీలించి, హక్కులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో సీఐ మహనంది, ఎస్ఐ జనార్థన్నాయుడు, సిబ్బంది అక్కడకు చేరుకుని టెండరుదారులను సముదాయించి ఈ నెల 26న తిరిగి టెండర్లలో పాల్గొనాలని సూచించారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి విడపనకల్లు: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన హరిజన సుంకన్న (22) సోమవారం ఉదయం తాగునీటి కుళాయికి విద్యుత్ మోటార్ను అమర్చుతుండగా విద్యుత్ ప్రసారం జరిగి షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుంకన్న మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఆయనకు ఏడాది క్రితమే వివాహమైంది. కవల పిల్లలు (మగ) ఉన్నారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వినతులను సకాలంలో పరిష్కరించాలి : ఎస్పీ అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. ఎస్పీ పి.జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా విభాగం డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా పాల్గొన్నారు. తాడిపత్రిలో మారణాయుధాలతో దాడులు తాడిపత్రిటౌన్: స్థానిక చేపల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న చంద్ర, కన్నా వర్గీయులు సోమవారం మారణాయుధాలతో పరస్పర దాడులకు తెగబడ్డారు. కొంత కాలంగా చంద్ర, కన్నా మధ్య ఆస్తి వివాదం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయి కొంత కాలంగా తరచూ గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం వేటకొడవళ్లు, కత్తులు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుంటుండగా గొడవ పడుతున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
ఏప్రిల్ 6 నుంచి తాగునీటి పథకం కార్మికుల సమ్మె
అనంతపురం అర్బన్: వేతన బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో ఏప్రిల్ 6వ తేదీ అర్ధరాత్రి నుంచి శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకంలో పనిచేస్తున్న కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు నీలకంఠాపురం శ్రీరామరెడ్డి నీటి సరఫరా స్కీమ్ కార్మిక సంఘం గౌరాధ్యక్షుడు ఓబుళు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మను ఓబుళు, సంఘం నాయకులు కలసి సమ్మె నోటీసు అందజేశారు. కార్మికులకు ఆరునెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబపోషణ భారమై అప్పుల పాలవుతున్నారన్నారు. సకాలంలో కంతులు చెల్లించలేకపోవడంతో కొత్తగా అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. దసరా, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకూ కార్మికులు పస్తులుండాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 3వ తేదీలోపు వేతన బకాయిలు చెల్లిస్తామని ఫిబ్రవరి 2న సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్పష్టమైన హామీని ఇచ్చారన్నారు. అయినా నేటికీ బకాయిలు చెల్లించని కారణంగా సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. కార్మికులకు సంబంధించి ప్రధానమైన 12 డిమాండ్లను ఏప్రిల్ 6వ తేదీలోపు పరిష్కరించకుంటే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్రకుమార్, సంఘం కార్యదర్శి రాము, కోశాధికారి వన్నూరుస్వామి, నాయుడు ఎర్రిస్వామి ఉన్నారు. -
నారాయణస్వామికి ‘ఐసీఏఆర్’ డాక్టరేట్
అనంతపురం అగ్రికల్చర్: వంకాయ పంటలో ఆశించే నులిపురుగులు (నెమటోడ్స్) మీద జన్యు, మాలుక్యూలర్ పరిశోధనలకు గానూ రాప్తాడు మండలం పెసరకుంట గ్రామానికి చెందిన రైతు శివయ్య కుమారుడు గుజ్జల నారాయణస్వామికి ప్రతిష్టాత్మక ‘ఇండియన్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఇన్స్స్టిట్యూట్ (ఐసీఏఆర్)’డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ 63వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉద్యాన విభాగంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ అందుకున్న నారాయణస్వామిని గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు. విద్యార్థిని అదృశ్యం బత్తలపల్లి: సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలోని పీవీకేకేలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సెలవుల నేపథ్యంలో గత వారం రోజులుగా ఇంటి పట్టునే ఉన్న ఆమె శనివారం తన ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుని, సర్టిఫికెట్లు జిరాక్స్ చేయించుకుని వస్తానంటూ కుటుంబసభ్యులకు తెలిపి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కళాశాలలో సైతం విచారించినా ఫలితం లేకపోయింది. దీంతో తన కుమార్తె కనిపించడం లేదంటూ బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఘర్షణ – నలుగురికి తీవ్ర గాయాలు గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో నలుగురు యువకులు గాయపడ్డారు. వివరాలు.. గుత్తికి చెందిన రాము, యోగి మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని కత్తులు, కట్టెలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఘటనలో రాము, ఆంజనేయులు అలియాస్ అదుర్స్, గణేష్ అలియాస్ ఘని, ఆంజనేయులు గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న రాము, ఆంజనేయులును అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల నిరసన
అనంతపురం అర్బన్: డిమాండ్ల సాధనకు విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన బాట పట్టారు. స్మార్ట్ మీటర్ల పేరుతో తమను రోడ్డున పడేయడం సరైంది కాదని, ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ... విద్యుత్ శాఖను నమ్ముకుని మీటర్ రీడర్లు కొన్నేళ్లుగా పనిచేస్తున్నాన్నారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయదలిస్తే మీటర్ రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్శాఖలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, మీటర్ రీడర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి రమేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభీమప్ప, నాయకులు, సలీంబాషా, రామకృష్ణ, విజయ్, భరత్, మీటర్ రీడర్లు పాల్గొన్నారు. పారా గేమ్స్లో ప్రతిభ అనంతపురం: న్యూఢిల్లీలో జరుగుతున్న ఖేలో ఇండియా పారా గేమ్స్లో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించారు. షాట్ఫుట్ (ఎఫ్–56) విభాగంలో కందుకూరుకు చెందిన సాకే బాబు సిల్వర్ మెడల్ దక్కించుకోగా, పామిడి మండలం ఎద్దులపల్లికి చెందిన నీలం పల్లవి షాట్పుట్ (ఎఫ్–11) విభాగంలో కాంస్య పతకం కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా వారిని పారా అసోసియేషన్ అనంతపురం జిల్లా సెక్రెటరీ ఎన్.శ్రీనివాసులు అభినందించారు. లారీల ఢీ – డ్రైవర్ దుర్మరణం కనగానపల్లి: మండలంలోని పర్వతదేవరపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్నాయి. ఘటనలో నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పెదరాజుపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ ప్రసాద్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... సోమవారం తెల్లవారుజామున అనంతపురం వైపు నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న లారీ డ్రైవర్ పర్వతదేవరపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. దీంతో వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్ గమనించి వేగాన్ని నియంత్రించుకునే సమయం కూడా లేకపోవడంతో నేరుగా వెళ్లి ముందున్న లారీని ఢీకొన్నాడు. ఘటనలో వెనుక ఉన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. క్యాబిన్లోనే డ్రైవర్ ప్రసాద్ చిక్కుకున్నాడు. స్థానికులు గమనించి అతి కష్టంపై ఆయనను వెలికి తీశారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆయన మృతి చెందాడు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ నేత అత్యాశ
కళ్యాణదుర్గం: ఈజీ మనీ కోసం అత్యాశ పడిన ఓ టీడీపీ నేత పెద్ద మొత్తంలో నగదును మాయగాళ్ల చేతికిచ్చి మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వివరాలు... వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నివాసముంటున్న ఓ టీడీపీ నేత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పెట్టుబడులకు డబ్బు అవసరం కావడంతో ఈజీ మనీ కోసం ఆరా తీస్తూ వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు ఆయనను సంప్రదించారు. రూ.500 ఇస్తే రూ.వెయ్యి చెల్లిస్తామంటూ నమ్మబలికారు. వారి మాయలో చిక్కుకున్న సదరు టీడీపీ నేత తొలుత రూ.25వేలు ఇవ్వడంతో రూ.50 వేలు ఇచ్చారు. మరికొన్ని రోజులకు రూ.50వేలు ఇవ్వడంతో రూ.లక్షను వారు చెల్లించారు. ఇలా కొద్దికొద్దిగా ఇస్తే ఎప్పటికీ కష్టాలు తీరవని పెద్ద మొత్తంలో ఏమైనా ఇస్తే మంచి ఫలితం ఉంటుందని అవతలి వ్యక్తులు నమ్మబలకడంతో ఈసారి ఏకంగా సదరు టీడీపీ నేతకు రూ.15 లక్షలు సిద్ధం చేశాడు. కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గానికి వచ్చిన కర్ణాటక వ్యక్తులు పట్టణ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో టీడీపీ నేతతో సమావేశమయ్యారు. అనంతరం రూ.15 లక్షలు తీసుకుని రూ.30 లక్షలు ఉన్నాయంటూ ఓ పార్శిల్ను అప్పగించారు. ఇంటికెళ్లి పార్శిల్ ఓపెన్ చేయగానే అందులో నోట్ల కట్టల పరిమాణంలోనే బ్లాక్ అండ్ వైట్ పేపర్లను చూసి టీడీపీ నేత కంగారు పడ్డాడు. ఇదేమిటని కర్ణాటక వ్యక్తులను ఫోన్లో ప్రశ్నిస్తే ‘నీవు ఇచ్చినవన్నీ నకిలీ నోట్లు, నీ పై కర్ణాటకలో పోలీసు కేసు పెడతాం’ అని బెదిరించినట్లు సమాచారం. దీంతో జరిగిన ఘటనను బయటకు చెప్పుకోలేక సదరు టీడీపీ నేత లోలోన మదన పడుతున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై కళ్యాణదుర్గం సీఐ యువరాజు మాట్లాడుతూ.. నకిలీ నోట్ల మార్పిడి వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై బాధితులతో విచారించినట్లుగా తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు. అయినా కర్ణాటక ప్రాంత వ్యక్తుల మోసంపై ఆరా తీస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈజీ మనీ కోసం మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న వైనం -
ప్రతి రైతునూ ఆదుకుంటాం
యల్లనూరు: అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి సవిత అన్నారు. సోమవారం నీర్జాంపల్లి, గొడ్డుమర్రి గ్రామాల్లో ఈదురుగాలులకు పడిపోయిన అరటి చెట్లను మంత్రి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్ట అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని, పరిహారం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. అంతకుముందు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్పను మంత్రి పరామ ర్శించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా ఉద్యాన అధికారి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన మిల్లెట్ మేళా
అనంతపురం అగ్రికల్చర్: ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అనే ప్రధాన అంశంతో స్థానిక పోలీసు వెల్ఫేర్ కాంప్లెక్స్లో ప్రభుత్వ సంస్థలు, 18 ఎన్జీఓలు సంయుక్తంగా ‘అనంత సుస్థిర వ్యవసాయ వేదిక’ పేరుతో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ‘మిల్లెట్మేళా’ సోమవారం ముగిసింది. మూడవ రోజు సోమవారం ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డితో పాటు విశ్రాంత వైస్ ఛాన్స్లర్ బండి వెంకటేశ్వర్లు, ప్రకృతి వనం ప్రతినిధి ప్రసాద్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, నాబార్డు డీడీఎం అనురాధ, జెడ్బీఎన్ఎఫ్ డీపీఎం లక్ష్మానాయక్ తదితరులు హాజరై వివిధ అంశాలపై రైతులు, ఎన్జీఓ సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడివున్నా... ఇటీవల కాలంలో వాటిని వేర్వేరుగా చూడటంతో అటు రైతులు ఇటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. దీని వల్ల మార్కెటింగ్, గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టపోతుండగా, రకరకాల అనారోగ్య సమస్యలతో సంపాదన మొత్తం వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందన్నారు. చిరుధాన్యపు పంటలను ప్రోత్సహించడంతో పాటు వాటితో తయారు చేసే ఆహారోత్పత్తుల వాడకం పెరిగితే పర్యావరణ పరిరక్షణ, ప్రజార్యోగం మెరుగుపడటమే కాకుండా రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నారు. ప్రధానంగా రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, ఆరికలు, ఊదర్లు, అండుకొర్రలు లాంటి సంప్రదాయ, పాతతరం చిరుధాన్యపు ఉత్పత్తులు తినడంపై ప్రజలు దృష్టి సారించాలని సూచించారు. ఏఎఫ్ ఎకాలజీ, ఆర్డీటీ, వాసన్, ఏపీ మాస్, కార్డు, సీఎస్ఏ, రెడ్స్, టింబక్టు, రిడ్స్, స్వచ్ఛ కాడ్యమ్, ఎంపవరింగ్ భారత్, అనంత నాచురల్స్, మిల్లెట్ మ్యాజిక్, పాస్, జన జాగృతి, ఐఐఎంఆర్ తదితర ఎన్జీఓ ప్రతినిదులతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డు, ఉద్యానశాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. -
కబ్జాకోరులకు న్యాయ దేవత చెంపదెబ్బ
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట 106–1 సర్వే నంబరు విద్యారణ్యనగర్లోని 68 సెంట్లలో పేదల ఇళ్ల కూల్చివేత కేసులో స్టేటస్ కో ఇచ్చి కబ్జాకోరులకు న్యాయ దేవత చెంపదెబ్బ కొట్టిందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 68 సెంట్లలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని, లావాదేవీలు, ఆన్లైన్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరగకూడదని, రిజిస్ట్రేషన్లు చేయకూడదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టానికి సంబంధించి షెడ్యూలు మునిసిపల్ పరిధిలో ఉందని, అలాంటి షెడ్యూల్ ప్రాపర్టీని నారాయణపురం పంచాయతీలో ఉందని మార్చడానికి తహసీల్దార్ ఎవరు? అని జడ్జి ప్రశ్నించినట్లు తెలిపారు. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారులతో కుట్ర చేసి కోర్టును తప్పుదోవపట్టించి 40 ఏళ్లుగా కాపురాలు ఉంటున్న ఇళ్లను కూల్చివేయడం అనేది ఘోర సంఘటన అన్నారు. అవినీతిపరురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే ఎలాంటి నేరాలు, ఘోరాలు చేయొచ్చో ఈరోజు అందరూ గమనిస్తున్నారన్నారు. పరిటాల రవీంద్ర హయాంలోనే... పరిటాల రవీంద్ర హయాంలో 1995–96 ప్రాంతంలో నగరంలో మేదరవాండ్ల కొట్టాలును కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని నిర్మించుకున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆర్యవైశ్యులను బెదిరించి తక్కువ ధరకు భూమి కొని ఇల్లు కట్టుకున్నారన్నారు. శాంతి థియేటర్ పక్కన కృష్ణాభవన్ ఆస్తి అన్నదమ్ముల పంచాయితీలో ఉండగా, అందులో తలదూర్చి నామమాత్రపు ధరకి భూమి కొట్టేసి పెద్ద ఎత్తున కాంప్లెక్స్ కట్టుకున్నారన్నారు. అదే పరిటాల కుటుంబం ఈరోజు 68 సెంట్ల ఆక్రమించాలని చూస్తున్నారని ఆరోపించారు. శోత్రియందారులకు నామమాత్రపు ధర చెల్లించి పేదల ఇళ్లను కూల్చి వేయించాలని చూశారన్నారు. అక్కడ పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్, ప్రైవేట్ నర్సింగ్హోం నిర్మించాలని చూస్తున్నారన్నారు. పరిటాల సునీత ఆక్రమణదారు, ఒక కబ్జాకోరు అని మండిపడ్డారు. ఆమె కన్ను ఈ ప్రాంతంపై పడింది కాబట్టే 180 ఎకరాల శోత్రియం భూములను బంధువులు, అనుచరులు జీపీఏ చేయించుకున్నారన్నారు. 450 మందికి నోటీసులు ఇప్పించారన్నారు. ‘ఇక్కడ ఇళ్లు కూల్చి వేయించాం... ఇక మీదే’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. 2016–17 ప్రాంతంలోనూ విద్యారణ్యనగర్లో 400 ఇళ్లకు సంబంధించిన భూమి తాము కొనుగోలు చేశామంటూ దాదాపు రూ. 10 కోట్లు పేదల నుంచి వసూళ్లు చేశారన్నారు. ఇంత డబ్బు వసూలు చేసికూడా పరిటాల రవీంద్రనగర్ అని బోర్డు పెట్టించారని దుయ్యబట్టారు. అధికారులను దోషులుగా నిలబెడతాం 68 సెంట్ల స్థలాలపై తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ హైకోర్టు ఇదే తీర్పు ఇచ్చిందన్నారు. పేదలకు అండగా ఉంటానని ఇచ్చిన మాట ప్రకారం అప్పటి కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడి కౌంటర్ దాఖలు చేయగలిగామన్నారు. ఆధారాలతో కోర్టులో వాదనలు వినిపించేసరికి వారు పలాయన మంత్రం పఠించారన్నారు. పేదలకు వైఎస్సార్ కాంగెస్ పార్టీ గతంలో అండగా నిలిచిందని, ఇప్పుడూ ఉంటుందని, భవిష్యత్తులోనూ నిలబడుతుందన్నారు. ఈ దుర్మార్గానికి కారకులైన అధికారులు తప్పనిసరిగా సమాధానం చెపాల్సిన రోజు వస్తుందన్నారు. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామని ప్రకాష్రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో రూరల్ ఎంపీపీ వరలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, కన్వీ నర్ పవన్, మాజీ కన్వీనర్ గోపాల్రెడ్డి, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు, సందీప్యాదవ్, పాపంపేట నాయకులు ఆకుల మునిశంకరయ్య, మాదన్న, కుమ్మెత గోపాల్రెడ్డి, గోపి, ఎర్రిస్వామి, అంజనరెడ్డి, రమేష్, రాజమ్మ, ప్రమీల పాల్గొన్నారు. విద్యారణ్యనగర్లోని 68 సెంట్ల స్థలంపై కోర్టు స్టేటస్ కో నిర్మాణాలు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలు అధికారులు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
కోమాలోకి వెళ్లేలా చితకబాదారు
● వ్యక్తిపై పెద్దపప్పూరు ఎస్ఐ దాష్టీకం తాడిపత్రిటౌన్: ఓ వ్యక్తిపై పెద్దపప్పూరు ఎస్ఐ దాష్టీకం ప్రదర్శించారు. స్టేషన్కు రప్పించి విచక్షణా రహితంగా కర్రలతో చితకబాదారు. దీంతో బాధితుడు స్పృహ తప్పి కోమాలోకి వెళ్లాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. పెద్దపప్పూరు మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, జగన్నాథరెడ్డిలు ఇంటి వద్ద రహదారి విషయమై వారం రోజులుగా వాదులాడుకున్నారు. జగన్నాథరెడ్డి ఫిర్యాదు మేరకు ఆదివారం నారాయణరెడ్డితో పాటు అతని సోదరుడు రామేశ్వరెడ్డిని పెద్దపప్పూరు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ స్టేషన్కు పిలిపించారు. ఇద్దరినీ చితకబాదారు. ఎస్ఐ దెబ్బలకు తట్టుకోలేక నారాయణరెడ్డి స్పృహ తప్పి కూలిపోయాడు. అయినా, సాయంత్రం వరకు ఇద్దరినీ స్టేషన్లోనే ఉంచుకుని రాత్రి ఇంటికి పంపించారు.ఇంటికి చేరుకున్న నారాయణరెడ్డి ఉలుకుపలుకూ లేకుండా పడిపోవడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరామర్శ.. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటనపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. బాధితునికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని హామీ ఇచ్చారు. పండ్ల పక్వానికి కార్బైడ్ వాడకుండా చూడండి ● జేసీ శివ్నారాయణ్ శర్మ అనంతపురం సెంట్రల్: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్బైడ్ను పండ్ల పక్వానికి వాడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మ ఆదేశించారు.సోమవారం రెవెన్యూభవన్లోని ప్రత్యేక చాంబర్లో వైద్య, ఆరోగ్య, మార్కెటింగ్, రవాణా, వ్యవసాయశాఖ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. కాల్షియం కార్బైడ్, ఇతరత్రా హానికరమైన రసాయనాల వాడకం నిషేధించినట్లు తెలిపారు. వీటి వాడకం వలన కలిగే దుష్ప్రభావాలపై వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ విషయంపై పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, మెడికల్ అండ్ హెల్త్, ఆహార భద్రత, జిల్లా పంచాయతీ అధికారి, ఉద్యానశాఖ, రవాణాశాఖ అధికారులతో ప్రత్యేకంగా జిల్లా కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వేసవి సీజన్లో మార్చి నుంచి జూలై వరకూ పండ్లు మార్కెటింగ్కు వస్తాయని, కాల్షియం కార్బైడ్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపరవాణా కమిషనర్ వీర్రాజు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణచక్రవర్తి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డీపీఓ నాగరాజనాయుడు, ఫుడ్ సేఫ్టీ అధికారి తస్లీమా, వ్యవసాయ, ఉద్యాన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పరిష్కార వేదిక కిటకిట
● ఇతని పేరు టి.గోవిందప్ప. కుందుర్పి మండలం మహంతపురం గ్రామం. 2017 సంవత్సరంలో కుందుర్పి కెనరా బ్యాంక్లో రూ.12 వేల పంట రుణం తీసుకున్నాడు. 2020లో రుణం మొత్తం వడ్డీతో కలిపి చెల్లించాడు. కానీ, ఐదేళ్లవుతున్నా ఇప్పటికీ పాసుపుస్తకం ఇవ్వలేదు. ఇదేమని ప్రశ్నిస్తే... ‘నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో ఇవ్వను’ అంటూ మేనేజర్ దురుసుగా మాట్లాడుతున్నాడు. దీంతో సమస్యను కలెక్టర్కు చెప్పుకునేందుకు గోవిందప్ప సోమవారం కలెక్టరేట్కు వచ్చాడు. అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రజల నుంచి జేసీ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి,ఆనంద్,రమేష్రెడ్డి,తిప్పేనాయక్లు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 419 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి నివేదికలు త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని.. ● వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రెండేళ్లవుతున్నా ట్రాన్స్ఫార్మర్ వైరు ఇవ్వలేదని గుంతకల్లు మండలం కొంగనపల్లికి చెందిన పి.రంగన్న ఫిర్యాదు చేశాడు. పరిష్కారం చూపాలని కోరాడు. ● పింఛను మంజూరు చేయాలంటూ కళ్యాణదుర్గం మారెంపల్లి కాలనీకి చెందిన షేక్ చాంద్బీబీ విన్నవించింది. ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారని, పనిచేయడానికి కూడా ఆరోగ్యం సహకరించని తనకు పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కోరింది. ● తమకు చెందాల్సిన భూమిని వేరొకరి పేరున పాసుపుస్తకాలు ఇచ్చారని అనంతపురం రామ్నగర్కు చెందిన పి.రామచంద్ర ఫిర్యాదు చేశాడు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామ పొలం సర్వే నంబరు 116లో 1.03 ఎకరాల భూమి తండ్రి ద్వారా తమకు చెందాల్సి ఉన్నా.. ఇతరుల పేరున పాసు పుస్తకాలు ఇచ్చారన్నాడు. న్యాయం చేయాలని కోరాడు. -
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. -
సమస్యల పరిష్కారానికి కృషి
అనంతపురం అర్బన్: శాఖా పరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డెఫ్ కమ్యూనిటీ ఉమెన్ ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్రావు భరోసానిచ్చారు. ఆదివారం అనంతపురంలోని కృష్ణకళామందిర్లో ఉమెన్ డెఫ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. డెఫ్ కమ్యూనిటీ ఉమెన్ టీమ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దివాకర్రావుతో పాటు విశ్రాంత తహసీల్దారు పగడాల మల్లికార్జున ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యాలయాల్లో అభద్రతాభావం లేకుండా పనిచేయాలన్నారు. ఉద్యోగపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. వీరి ప్రసంగాన్ని డెఫ్ మహిళలకు ఇంటర్ర్పెటర్ యు.రామకృష్ణ సైగల ద్వారా వివరించారు. కార్యక్రమంలో డెఫ్ కమ్యూనిటీ టీమ్ హేమలత, మేరీఎవన్స్, రంగమ్మ, లావణ్య, మౌనిక, తిప్పమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ దివాకర్రావు -
దేశంలో మతోన్మాద పాలన
అనంతపురం అర్బన్: ‘కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం మతోన్మాద పాలన సాగిస్తోంది. దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ పాలన వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాల ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ అధ్యక్షతన జరిగిన సభకు రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ... దేశ స్వాతంత్రం కోసం పోరాడని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేడు అధికారం చేపట్టి మతోన్మాద పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీని కించపరిచేలా... ఆయనను చంపిన గాడ్సేని గొప్పవాడిగా బీజేపీ చూస్తోందన్నారు. నాడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే దేశం కోసం పోరాటాలు సాగించారన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ను పార్లమెంట్లోనే అవమానపరిచిన చరిత్ర బీజేపీదన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు రగలిస్తున్నారన్నారు. బీజేపీ వల్ల దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాదిన సీట్లు పెంచుకుని తమ పార్టీ బలం పెంచుకునేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభాప్రాతిపదికన సీట్లు తగ్గించే కుటిలత్వాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మతోన్మాద పాలన, దేశ ఆర్థికాన్ని కొల్లగొట్టే చర్యలకు వ్యతరేకంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ ప్రజా చైతన్య కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. సభలో జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి, కేశవరెడ్డి, శ్రీరాములు, పద్మావతి, సీపీఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం -
మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటసత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘ఆపస్’ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకటసత్యనారాయణ మాట్లాడుతూ... 2023లోనే వేతన సవరణ చేయాల్సి ఉన్నా నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని దాదాపు 9 నెలలు వేచి ఉన్నా... కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వెంటనే అమలు చేయాలని, మోడల్ పాఠశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రాథమిక పాఠశాల మూసివేతకు కారణం కాకూడదని, 2022 నుంచి చెల్లించాల్సిన జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్, సరెండర్ లీవ్, సీపీఎస్కు సంబంధించిన 90 శాతం డీఏ అరియర్స్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ‘ఆపస్’ రాష్ట్ర గౌరవ సలహాదారు వెంకటేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు హర్షవర్ధన్, పీఎస్వీ నాయుడు, జిల్లా కార్యదర్శి ఆదిశేషు, రమేష్, చిక్కీరప్ప, వరదరాజులు పాల్గొన్నారు. -
పాఠశాల వ్యవస్థ రద్దు చేసేలా సంస్కరణలు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రాథమికోన్నత పాఠశాల వ్యవస్థను రద్దు చేసే దిశగా విద్యారంగ సంస్కరణలు ఉన్నాయని, ఫలితంగా విద్యకు బాలికలు దూరమవుతారని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడారు. ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు సమాజమూ తీసుకోవాలన్నారు. విద్యారంగ సంస్కరణల పేరుతో జీఓ 117 రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో జీఓ తేవడానికి రాష్ట్రం ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోందన్నారు. ఈ సంస్కరణలతో 1, 2 తరగతులు మాత్రమే ఉన్న ఫౌండేషన్ పాఠశాలలు 20వేలకు పైగా పెరుగుతాయన్నారు. భవిష్యత్తులో ఈ పాఠశాలలు మూత పడతాయన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను మ్యాపింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పాఠశాలల విలీనానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా బలవంతంగా తీర్మానాలు చేయించడం సరికాదన్నారు. పాఠశాలలను తగ్గించడం కాకుండా పిల్లల అభివృద్ధి కోణంలో సంస్కరణలు ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి గ్రామపంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియం, ప్లస్ టు పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు రమణయ్య, సహాధ్యక్షులు రామప్ప, సరళ, జిల్లా కార్యదర్శులు సంజీవ్ కుమార్, శేఖర్, సుబ్బరాయుడు, ఆడిట్ కమిటీ కన్వీనర్ చంద్రమోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ పాల్గొన్నారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి
అనంతపురం అగ్రికల్చర్/శింగనమల/యల్లనూరు/ పుట్లూరు: ఈదురుగాలులు ఉద్యాన రైతులకు శోకం మిగిల్చాయి. శనివారం సాయంత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి తదితర మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.ఎల్లుట్ల, మడ్డిపల్లి, కుమ్మనమల, దోసలేడు, నిదనవాడ, దిమ్మగుడి చెర్లోపల్లి, ఎస్.కొత్తపల్లి, మేడికుర్తి, చింతకాయమండ, అరవేడు, వెన్నపూసపల్లి, నీర్జాంపల్లి, తిమ్మంపల్లి, కూచివారిపల్లి, కొడవాండ్లపల్లి, గొడ్డుమర్రి, శింగవరం, బొప్పేపల్లి, బుక్కాపురం, లక్ష్ముంపల్లి, చందన తదితర గ్రామాల్లో 560 హెక్టార్లలో అరటి తోటలు నేలవాలాయి. శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామానికి చెందిన శంకర్రెడ్డి తోటలో మామిడి కాయలు నేలరాలాయి. కృష్ణారెడ్డి, పరంధామ రెడ్డిల దానిమ్మ తోటల్లో చెట్లు నేలకొరిగాయి. లక్ష్మీనారాయణరెడ్డి, చిన్న శివారెడ్డి సాగు చేసిన మునగ పంటతో పాటు శ్రీనివాసులు రెడ్డికి చెందిన సపోట పంట తీవ్రంగా దెబ్బతింది. ఎల్లుట్లలో రైతు మారుతీనాయుడుకు చెందిన 1,000 అరటిచెట్లు విరిగిపోయాయి. 7 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట నేలవాలింది. దిగుబడి చేతకందే తరుణంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. రూ.35.22 కోట్ల నష్టం.. దెబ్బతిన్న పంట పొలాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు పరిశీలించారు. 406 మంది ఉద్యాన రైతులకు రూ.34.91 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు నరసింహారావు తెలిపారు. అలాగే, 47 మందికి చెందిన 35 హెక్టార్ల మొక్కజొన్న దెబ్బతినడంతో రూ.31 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. పుట్లూరు మండలం జంగంరెడ్డిపేటలో దెబ్బతిన్న అరటి తోటను చూపుతున్న రైతు మహేశ్వరరెడ్డివర్ష సూచన.. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా రాగల రెండు రోజులు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తులో విస్తరించిన ఉపరితల ద్రోణి వల్ల ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతంలో నైరుతి, దక్షిణ దిశగా గాలులు వీస్తున్నట్లు తెలిపారు. దీంతో ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడొచ్చన్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే సూచన ఉందన్నారు. గాలీవానకు తోటలో దానిమ్మ చెట్లు ఒరిగిపో యాయి. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. మా గ్రామంలో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే అన్నదాతలు అప్పులపాలవడం ఖాయం. – పరంధామ రెడ్డి, ఉల్లికల్లు, శింగనమల మండలం -
సీమకు తీరని అన్యాయం
అనంతపురం సెంట్రల్: రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని సాగునీటి ఉద్యమ, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. అమరావతి ప్రయోజనమే రాష్ట్ర ప్రయోజనమనే విధంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన అనంతపురం జిల్లా ప్రయోజనాల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని, ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘జిల్లా ప్రాజెక్టులు– విభజన హామీలు’ అంశంపై అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న బీజీఆర్ ఫంక్షన్ హాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ అధ్యక్షతన ఆదివారం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సాగునీటి ఉద్యమ నాయకులు ఏమన్నారో... వారి మాటల్లోనే... అమరావతి ప్రయోజనమే రాష్ట్ర ప్రయోజనాలుగా భావిస్తున్న సీఎం చంద్రబాబు రాయలసీమ హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలి రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ, ప్రజా సంఘాల, సాగునీటి ఉద్యమ నాయకుల పిలుపు -
కాకరేపుతున్న ‘కొల్లేరు’
అనంతపురం: ఐపీఎల్ తరహాలో సాగుతున్న ఏపీ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టు కాకరేపుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏపీ సూపర్ కప్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి 8 జోన్లుగా, 8 క్లబ్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టులో ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ కం నాకౌట్ పద్థతిలో సాగుతున్న ఈ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ల్లో అన్నింటా విజయం సాధించి కొల్లేరు క్లబ్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో నల్లమల క్లబ్ జట్టుపై తలపడిన విశాఖ క్లబ్... 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో తుంగభద్ర క్లబ్పై ఏకంగా ఐదు గోల్స్ సాధించి గోదావరి క్లబ్ జట్టు (5–0) విజయం కై వసం చేసుకుంది. కొల్లేరు–కోరమాండల్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్లో 2–0 గోల్స్ తేడాతో కొల్లేరు క్లబ్ విజయకేతనం ఎగురవేసింది. ఆయుష్ జిల్లా కమిటీ ఎన్నిక అనంతపురం మెడికల్: రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతపురంలోని గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఆయుష్ దక్షిణాది రాష్ట్రాల కో ఆర్డినేటర్ డాక్టర్ వీరబోయిని నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోగుల కుమారయ్య, రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ శాంతిప్రియ, డాక్టర్ వీఎన్ రజితయాదవ్ ఆధ్వర్యంలో ఆయుష్ జిల్లా కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. జిల్లా కమిటీ గౌరవాధ్యక్షుడిగా డాక్టర్ బి.కేదార్నాథ్, అధ్యక్షుడిగా డాక్టర్ ఎస్.శ్రీనివాసనాయక్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్.చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఎస్.గౌరీశంకర్, కోశాధికారిగా డాక్టర్ టి.మురళీకృష్ణ, సహాయ కార్యదర్శిగా డాక్టర్ బి.రఘుభూపాల్ రెడ్డి, డాక్టర్ టి.రియాజ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్ మల్లికార్జున గౌడ్, డాక్టర్ రామాంజినేయులు, డాక్టర్ ఎన్.షెక్షావలి, డాక్టర్ జీవీ నీలేష్, డాక్టర్ ఎస్.మహమ్మద్ రఫిక్, డాక్టర్ నరసింగరావు ఎన్నికయ్యారు. -
17 మందిపై కేసు నమోదు
తాడిపత్రి టౌన్: ఈ నెల 21న తాడిపత్రిలో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి ఓ వర్గానికి చెందిన 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ సాయిప్రసాద్ ఆదివారం వెల్లడించారు. కాగా, రంజాన్ వేళ స్థానిక వైఎస్సార్సీపీ మైనారిటీ నాయకుడు ఫయాజ్బాషా ఈ నెల 21న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పెద్దఎత్తున తన అనుచరులను ఉసిగొల్పి పోలీసుల సమక్షంలోనే ఫయాజ్ ఇంటిపై దాడి చేయించిన వైనం సంచలనం రేకెత్తించింది. ఆ సమయంలో టీడీపీ వర్గీయులు జరిపిన రాళ్ల దాడిలో అదే పార్టీకి చెందిన కార్యకర్త వరుణ్ గాయపడ్డాడు. దీంతో వరుణ్ ఫిర్యాదు ఆధారంగా వైఎస్సార్సీపీకి చెందిన 17 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో లారీ దగ్ధం గార్లదిన్నె: మండలంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఓ లారీ దగ్ధమైన ఘటన మరువక ముందే మరో లారీకి మంటలు వ్యాపించాయి. వివరాలు... ఈ నెల 20న రాజస్తాన్లోని కోటా నగరం నుంచి బెంగళూరుకు గోధుముల లోడుతో బయలుదేరిన లారీ ఆదివారం మధ్యాహ్నం గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలోకి చేరుకోగానే 44వ జాతీయ రహదారి పక్కన వాహనాన్ని డ్రైవర్ ఆపి క్లీనర్తో కలసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో లారీ ఇంజన్లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. ఘటనలో దాదాపు రూ.30 లక్షల విలువైన సరుకు కాలిబూడిదైనట్లు డ్రైవర్ తెలిపాడు. ఘటనపై ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తోటలో వ్యభిచారం గార్లదిన్నె: మండల కేంద్రం సమీపంలోని ఓ తోటలో వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకుని ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా వెల్లడించారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రతి ఆదివారం ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు యువతలను రప్పించుకుని తోటలో గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నెల్లూరుకు చెందిన ఓ యువతి పట్టుబడింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రేషన్ బియ్యం స్వాధీనం గార్లదిన్నె: మండలంలోని ముంటిముడుగులో ఆదివారం 32 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ఈరమ్మ తెలిపారు. కల్లూరుకు చెందిన రమేష్ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ముంటిమడుగులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేశాడన్నారు. ఈ నిల్వలను ఆదివారం కర్ణాటకకు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
కనుల పండువగా పుష్పయాగోత్సవం
● ముగిసిన నృసింహుని బ్రహ్మోత్సవాలు కదిరి: పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి పుష్పయాగోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవం కనుల పండువగా, అత్యంత వైభవంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. వారి వారి లోకాలకు సాగనంపేందుకు నిర్వహించేదే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. తీర్థవాది ఉత్సవం ముగియగానే శనివారం సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆదివారం వేకువ జామునే ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ గావించారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులకు ఆలయంలో శ్రీవారి సర్వ దర్శన భాగ్యం కలిగించారు. రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవిల సమేత శ్రీవారిని కర్ణాటక నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. ఉత్సవానికి ఉభయ దారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు బ్రహ్మసముద్రం: నకిలీ విత్తనాలతో రైతులు మరోసారి దగాపడ్డారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల రైతులను లక్ష్యంగా చేసుకుని రైతులను కంపెనీ ప్రతినిధులు నిట్టనిలువునా ముంచేశారు. బాధిత రైతులు తెలిపిన మేరకు.. తమ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తన సీడ్స్ను సాగు చేస్తే అధిక లాభాలు అందజేస్తామని ఇటీవల ప్రముఖ లెవెన్ గ్రీన్ కావేరీ సీడ్స్ కంపెనీ ప్రతినిధులు బ్రహ్మసముద్రం మండలం మామడూరు గ్రామానికి చెందిన పలువురు రైతులను ఊరించారు. దీంత ఒక్కో ఎకరాకు రూ.30 వేలు చొప్పున పెట్టుబడి పెట్టి పలువురు రైతులు 30 ఎకరాల్లో సదరు కంపెనీ విత్తనాలను సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత కోత కోసి చూస్తే అన్ని బోడికంకులే కావడంతో రైతుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఇదే విషయాన్ని బాధిత రైతులు కంపెనీ ఏజెంట్లకు ఫోన్ చేసి తెలిపితే తమకు సంబంధం లేదని వారు చేతులెత్తేశారు. లెవెన్ గ్రీన్ కావేరి సీడ్స్ కంపెనీ ఏజెంట్లు తమను మోసం చేశారని, తమకు న్యాయం చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు. -
సాప్ట్వేర్ ఉద్యోగమంటూ ఘరానా మోసం
గార్లదిన్నె: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన మంజునాథ్రెడ్డి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో సాప్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. నిరుద్యోగిగా ఉన్న సమయంలో శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి చెందిన నరసింహులు అనే యువకుడితో పరియమైంది. ఆ సమయంలో నరసింహులు తాను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కన్సెల్టెన్సీ ఏజెన్సీలు నడుపుతున్నానని, బీటెక్ పూర్తి చేసిన వారికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లుగా నమ్మబలికాడు. రూ.6 లక్షలు చెల్లిస్తే మంచి ఫ్యాకేజీతో ఉన్నత శ్రేణి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో మంజునాథరెడ్డి మిన్నకుండి పోయాడు. అయితే పదేపదే నరసింహులు కలసి హంగామా చేస్తుండడంతో అతని మాయలో మంజునాథరెడ్డి చిక్కుకున్నాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో తన బంధువుల వద్ద రూ. 6 లక్షలు అప్పు చేసి 2024, జూన్లో విడతల వారీగా నరసింహులు ఫోన్ పే, బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. మంజునాథ్రెడ్డి ప్రయత్నాలను గమనించిన అనంతపురానికి చెందిన ఆయన స్నేహితుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందన్న ఆశతో నరసింహులకు రూ.6లక్షలు చెల్లించారు. నగదు బదలాయింపులు జరిగిన తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో పలుమార్లు నరసింహులును అభ్యర్థిస్తూ వచ్చినా ఫలితం లేకపోయింది. ఉద్యోగం ఇప్పించలేక పోతే తమ డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో నరసింహులు ముఖం చాటేశాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మంజునాథరెడ్డికి అనుమానం వచ్చి కొన్ని రోజుల క్రితం చెన్నేకొత్తపల్లికి వెళ్లి నరసింహులు కోసం ఆరా తీశాడు. అక్కడ ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, నరసింహులు కోసం గాలింపు చేపట్టారు. పాము పట్టబోతే కాటేసింది! తాడిపత్రి టౌన్: పామును పడుతూ ఓ యువకుడు కాటుకు గురయ్యాడు. వివరాలు.. తాడిపత్రిలోని స్పాట్లైన్ స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా ఓ పామును గుర్తించి, అకాడమీ నిర్వాహకుడు నరేష్కు తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న శ్రీనివాసపురానికి చెందిన పాములు పట్టే నిపుణుడు సూర్యనారాయణ అక్కడకు చేరుకుని పరిశీలించాడు. అప్పటికే బల్ల కిందకు చేరుకున్న పామును గుర్తించి పట్టుకోబోతుండగా అది కాటేసింది. అదే సమయంలో పామును ఒడిసిపట్టి సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు. అనంతరం సూర్యనారాయణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి అకాడమీ నిర్వాహకులు తీసుకెళ్లారు. వ్యక్తి దుర్మరణంతాడిపత్రి: మండలంలోని వెంకటరెడ్డిపల్లి బస్టాప్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామానికి మురుగేష్ (56) వ్యక్తిగత పనిపై ఆదివారం తాడిపత్రికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం టీవీసీ మోపెడ్పై తిరుగు ప్రయాణమైన ఆయన వెంకటరెడ్డిపల్లి బస్టాఫ్ వద్దకు చేరుకోగానే బుగ్గ వైపు నుంచి బండల లోడ్తో వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో తల ఛిద్రమై మురుగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఆలోచించండి.. ఓ అమ్మానాన్న !
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సున్నితమైన అంశాలే భార్యాభర్తల మధ్య అగాథాలు సృష్టిస్తున్నాయి. గోటితో పోయేవి గొడ్డలి వరకూ వస్తున్నాయి. క్షణికావేశంలో వీరు తీసుకుంటున్న నిర్ణయాలు బిడ్డలకు శాపంగా పరిణమిస్తున్నాయి. మనసు విప్పి పది నిముషాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య అహంభావంతో ఇంకా జఠిలమవుతోంది. మరొకరికి చెప్పుకుంటే.. సమస్యలను ఎవరికీ చెప్పుకోక పోవడం, డాక్టరు వద్దకు వెళ్లామంటే నామోషీగా భావిస్తుండటం వల్లే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల మానసిక రుగ్మతలే ‘తీవ్ర’ నిర్ణయానికి దారితీస్తున్నట్టు పేర్కొంటున్నారు. సమస్య తలెత్తినప్పుడు భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయని సూచిస్తున్నారు. కౌన్సెలింగ్తో పరిష్కారం భార్యాభర్తల మధ్య అవగాహన లేకనే సమస్యలు తలెత్తుతున్నాయి. మా దగ్గరికి నెలకు 150 నుంచి 200 కేసులు వస్తున్నాయి. ప్రేమించే సమయంలో ఎక్కువ ప్రేమ చూపించారని ఇప్పుడు చూపించడం లేదని ఒకరు, తమను బయటకు తీసుకెళ్లడం లేదని, వివాహేతర సంబంధాలని ఇలా రకరకాల కేసులు ఉంటున్నాయి. మేం కేసులు కట్టేది 10 శాతం మాత్రమే. 90 శాతం కేసుల్ని కౌన్సెలింగ్ ద్వారానే పరిష్కరిస్తున్నాం. – మహబూబ్ బాషా, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ ఇగోలు వీడాలి.. భార్యాభర్తల మధ్య కేవలం ఇగోల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని ఒకరమైన మానసిక రుగ్మతగానే పరిగణించాలి. చావు దేనికీ పరిష్కారం కాదనే విషయం గ్రహించాలి. డాక్టరు వద్దకు రావడానికి నామోషీ అయితే.. బంధువులు, స్నేహితులు, సన్నిహితుల దగ్గరైనా సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుంది. – డా.ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మానసిక రుగ్మతల బాధితులు చిన్న సమస్యలకే దూరం పెంచుకుంటున్న దంపతులు రోజు రోజుకూ పెరుగుతున్న బలవన్మరణాలు తనువు చాలించి పిల్లలను ఏకాకుల్ని చేస్తున్న వైనం కౌన్సెలింగ్తో 90 శాతం జంటల్లో సానుకూల మార్పులు -
నష్ట పరిహారం అందించాలి
● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అనంతపురం కార్పొరేషన్: అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు ప్రాంతాల్లో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. పరిహారంతో పాటు మొక్కలను అందించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
కాలవ ఇలాకాలో జోరుగా ఇసుక దందా
కణేకల్లు: రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో టీడీపీ నేతలు బరి తెగించారు. పట్టపగలే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. కణేకల్లు మండలంలోని రచ్చుమర్రి ఇసుక రీచ్ కేంద్రంగా వీరు సాగిస్తున్న దందా.. పోలీసుల దాడులతో బట్టబయలైంది. వివరాలు.. ఆదివారం రచ్చుమర్రి రీచ్ నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే గ్రామస్తుల సమాచారంతో ఎస్ఐ నాగమధు సిబ్బందితో రీచ్ వద్దకు బయలుదేరారు. వీరికి కె.కొత్తపల్లి వద్ద టిప్పర్లు తారసపడ్డాయి. పోలీ సులు వాటిని నిలిపి తనిఖీ చేయగా.. పర్మిట్లు లేవని తెలిసింది. దీంతో పోలీసుస్టేషన్కు తరలించాలని డ్రైవర్లను ఎస్ఐ ఆదేశించారు. ఈ క్రమంలోనే రెండు వాహనాల డ్రైవర్లు తప్పించు కునేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి ఒక టిప్పర్ను పట్టుకున్నారు. మొత్తం 6 టిప్పర్లను స్టేషన్కు తరలించారు. రచ్చుమర్రి రీచ్లో ఇసుక కోసం మొత్తం 12 టిప్పర్లు వెళ్లగా.. పోలీసులు చేరుకొనే లోపే ఐదు టిప్పర్లు వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. టెండర్ గడువు ముగిసినా.. రచ్చుమర్రి రీచ్ నుంచి ఇసుక సరఫరా చేసేందుకు శ్రీహరి కన్స్ట్రక్షన్ అనే కంపెనీ దక్కించుకున్న టెండర్ ఈ నెల 13నే ముగిసింది. అయినా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగించారు. అయితే, పేరుకే శ్రీహరి కన్స్ట్రక్షన్ అయినా... తెర వెనుక టీడీపీ నేతల వ్యవహారంపై విమర్శలు సర్వత్రా వినిపిస్తు న్నాయి. కణేకల్లుకు అయితే టిప్పర్ ఇసుక రూ. 6 వేలు, ఉరవకొండకు రూ. 9 వేలు, గుంతకల్లుకు రూ. 17 వేల నుంచి 18 వేల వరకు విక్రయించినట్లు సమాచారం. ఉచిత ఇసుక అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్ర ఫొటోలున్న ఫ్లెక్సీలను టిప్పర్లకు కట్టి మరీ ఇసుకాసురులు దందా చేయడం చర్చనీయాంశంగా మారింది. దందా సాగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కణేకల్లు: రచ్చుమర్రి రీచ్ నుంచి యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆలేరి రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మారెంపల్లి మారెన్న, కోశాధికారి పాటిల్ నాగిరెడ్డి, కన్వీనర్ పాటిల్ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి కణేకల్లు పోలీసుస్టేషన్కు ‘మెట్టు’ వెళ్లారు. ఎఫ్ఐఆర్ కడుతున్నామని పోలీసులు సమాధానమివ్వడంపై ఆయన మండిపడ్డారు. ఉదయం 8 గంటలకు టిప్పర్లు పట్టుబడినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... టీడీపీ నేతల ఇసుక దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఇసుకాసురులను తప్పించాలని చూస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పైనేటి తిమ్మప్పచౌదరి, వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు వేమన, మాజీ కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ తదితరులు పాల్గొన్నారు. 6 ఇసుక టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు -
అకాల వర్షం.. అపార నష్టం.. నేడు పరిశీలించనున్న వైఎస్ జగన్
ఇది నిన్నటి దృశ్యం.పచ్చటి అరటి తోటలు.. బారెడు గెలలతో కోతకు సిద్ధమయ్యాయి.. తమ ఆశలు పండించేలా ఉన్న తోటల్ని చూసి రైతు కళ్లల్లో ఆనందం తాండవించింది. ఇక అప్పులన్నీ తీరతాయని ధైర్యం వచ్చింది. ఇది నేటి పరిస్థితి.ఎటు చూసినా విరిగిన అరటి చెట్లు.. నేలవాలిన తోటలు. చేతికందే దశలో పంట నేలపాలై కంట నీరు పెట్టుకుంటున్న రైతులు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని దీనస్థితి. అమరావతి/లింగాల/అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలకు వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి. పెద్దకుడాల గ్రామానికి చెందిన రామాంజనేయరెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. 3 ఎకరాల్లో యాలకి (సుగంధాలు) అరటి సాగు చేయగా.. పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. గోరుచుట్టుపై రోకలి పోటులా.. గోరుచుట్టుపై రోకలి పోటులా అకాల వర్షం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లోని అరటి రైతులను దెబ్బతీసింది. గత నెలలో టన్ను అరటి ధర రూ.23 వేల నుంచి రూ.25 వేలు ఉండేది. ఇప్పుడు ధరలు పడిపోవడంతో పెట్టుబడులు దక్కుతాయో లేదోనని అరటి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పులు చేసి పంటల్ని సాగుచేస్తే చేతికందాల్సిన పంట నేలనంటిందని వాపోతున్నారు. పురుగు మందులు, ఎరువుల ధరలు ఏటా పెరుగుతుంటే.. పంట సాగుచేసిన తమకు గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటల్ని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల్ని ఆదుకుంటాం: సీఎం అకాల వర్షాలు ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లికి చెందిన ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆ ఇద్దరు రైతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ప్రభుత్వం ఆదుకోవాలికోటి ఆశలతో అప్పులు చేసి అరటి పంటను సాగు చేస్తే అకాల వర్షం, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ వర్షానికి తీవ్రంగా నష్టపోయాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. – శ్రీనివాసులరెడ్డి, అరటి రైతు, ఎగువపల్లెఈ స్థితి వస్తుందనుకోలేదుఏటా ఏప్రిల్, మే నెలల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసేవి. ఆలోగా రైతులు అరటి పంట దిగుబడి చేతికందేది. ఈ ఏడాది ముందుగానే భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – రామాంజనేయరెడ్డి, అరటి రైతు, పెద్దకుడాలనేడు వైఎస్ జగన్ పర్యటన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వినర్ బాబురెడ్డి తెలిపారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె గ్రామాల్లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిన అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారన్నారు. -
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్ అధికారి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు. -
కేతిరెడ్డి ఇంటిని కూల్చేస్తా.. జేసీ ప్రభాకర్ బరితెగింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్కు దిగారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తానని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. తాడిపత్రిలో వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు నేతల ఇళ్లను స్వయంగా తానే కూల్చివేస్తానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. స్వయంగా ఆర్డీవో కేశవ్ నాయుడు ఎదుటే జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాను అంటూ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో, జేసీ వ్యాఖ్యలు, ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతా జరిగినా పోలీసులు స్పందించకపోవడం విశేషం. -
ఫారంపాండ్లతో భూగర్భజలాల పెంపు
కూడేరు: వ్యవసాయ పొలాల్లో ఫారంపాండ్లు తవ్వించుకుంటే వర్షపు నీరు అందులోకి చేరి భూగర్భ జలాలు పెంపొందుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రపంచ జల దినోత్సవం’లో భాగంగా శనివారం కూడేరు మండలం జయపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద తవ్వనున్న ఫారంపాండ్ల పనులను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఫారంపాండ్ను తవ్వించుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సాగుతూ విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మండలానికి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీం బాషా, సర్పంచ్ రమావేవి, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, రైతులు పాల్గొన్నారు. న్యూస్రీల్ -
నూతన విద్యా విధానానికి అనుగుణంగా సిలబస్
అనంతపురం: నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా బీటెక్ కోర్సు సిలబస్ రూపకల్పన చేసినట్లు జేఎన్టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. బీటెక్ మూడు, నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పాఠ్యాంశాలను రూపకల్పన చేయడానికి శనివారం యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు వీసీ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగంలోనూ మైనర్, హానర్ డిగ్రీ ప్రోగ్రాంను ప్రతిపాదించారు. విద్యార్థి 18 క్రెడిట్లు అదనంగా చదివితే ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు మైనర్, హానర్స్ డిగ్రీ ఇస్తారు. క్వాంటం కంప్యూటింగ్లో మైనర్ డిగ్రీ చేయడానికి అనుమతి ఉంటుంది. 40 శాతం క్రెడిట్స్ ఆన్లైన్లో చదువుకోవచ్చు. దీనితో పాటు కచ్చితంగా ఐదు రోజుల వర్క్షాపు, ప్రతి సెమిస్టర్లోనూ ఎక్స్పర్ట్ లెక్చర్, క్రెడిట్ డిపాజిట్ కోసం ఆమోదం తెలిపారు. ప్రతి విద్యార్థి ఫైనలియర్ రెండో సెమిస్టర్లో ఇంటర్న్షిప్, మూడో సెమిస్టర్ సమ్మర్ బ్రేక్లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సిలబస్ను 2025–26 విద్యా సంవత్సరానికి మూడో సంవత్సరం చదువబోయే విద్యార్థులకు అమలు చేస్తారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ దేవన్న, ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. -
ఎస్సీలపై పచ్చ నాయకుడి పైశాచికం
తాడిపత్రి: ఎస్సీ వర్గానికి చెందిన తల్లి, కుమార్తె మృతదేహాలను శ్మశానంలో ఖననం చేయకుండా అడ్డుకుని టీడీపీ నాయకుడు పైశాచికం ప్రదర్శించాడు. పైగా అధికారులు, పోలీసులు కూడా అతనికే వత్తాసు పలకడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వివరాలు.. తాడిపత్రి మండలంలోని ఇగుడూరు గ్రామానికి చెందిన తల్లీకుమార్తెలు పుల్లమ్మ, సువార్తమ్మలు అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ క్రమంలో శనివారం మృతదేహాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికకు తీసుకెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నరిసిరెడ్డి అడ్డుకున్నాడు. రెవెన్యూ, పోలీసు అధికారులను సైతం పిలిపించి, ఖననానికి శ్మశానంలో స్థలం లేదని చెప్పించారు. ఈ క్రమంలో అధికారులు, పోలీసులతో మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక ఎస్సీలు గొడవకు దిగారు. తల్లి, కుమార్తె మృతదేహాలను ఖననం చేశారు. కాగా, ఇగుడూరు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు 55 ఉన్నాయి. వీరి కోసం శ్మశాన స్థలాన్ని కేటాయించాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఎస్సీలు వాపోయారు. ఈ విషయంపై తాడిపత్రి తహసీల్దార్ రజాక్వలి మాట్లాడుతూ గతంలో ఎస్సీలకు కేటాయించిన శ్మశానవాటిక స్థలాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఇది వరకే ఆదేశించారన్నారు. కానీ గ్రామంలో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పారు. ప్రయివేట్ స్థలం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపామని, అనుమతులు లభించగానే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెప్పారు. తల్లి, కుమార్తె మృతదేహాలు ఖననం చేయకుండా అడ్డగింత అధికారులు, పోలీసులూ వత్తాసు పలకడంపై సర్వత్రా విమర్శలు -
ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రకృతి సిద్ధంగా సహజ వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తే వ్యవసాయం లాభసాటిగా మారడమే కాకుండా ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుందని వక్తలు తెలిపారు. శనివారం స్థానిక పోలీసు కాంప్లెక్స్లో ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలతో ఏర్పాటైన ‘అనంత సుస్థిర వ్యవసాయ వేదిక’ ఆధ్వర్యంలో మూడు రోజుల ‘మిల్లెట్ మేళా’ ప్రారంభమైంది. విశ్రాంత ఐఏఎస్, జిల్లా మాజీ కలెక్టర్ బి.జనార్ధన్రెడ్డి, విశ్రాంత ఐఏఎస్, ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్ల్యూఆర్ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్, జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్రెడ్డి, ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి, ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిష్యులు విజయరామ్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని స్థానిక వంగడాలను ప్రోత్సహించాలన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటేనే సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా గట్టెక్కుతారని తెలిపారు. ‘మన వ్యవసాయం, మన పంటలు, మన వంటలు, మన ఆరోగ్యం’ అనే నాలుగు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాతతరం పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు లాంటి చిరుధాన్యాలను, అనుములు, కందులు, అలసంద, పెసలు, నూగులు లాంటి పప్పుధాన్యపు పంటలు పెద్ద ఎత్తున సాగులోకి వచ్చేలా రైతులకు చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 80 శాతం వ్యవసాయం వర్షాలపై ఆధారపడి ఉన్నందున ఈ పంటల సాగుకు అనువుగా ఉంటుందన్నారు. ఈ పంటల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, పశువులు, జీవాలకు మేతగానూ ఉపయోగపడతాయన్నారు. నేల ఆరోగ్యంతో పాటు జీవ వైవిధ్యం, గ్రామీణ జీవనోపాధులు మెరుగుపడతాయన్నారు. కాగా, మిల్లెట్ మేళా సందర్భంగా పోలీసు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, చిరుధాన్యాలతో వేసిన స్వాగతం పలికే ముగ్గు ఆకట్టుకుంది. మేళాలో తొలిరోజు ప్రధానంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వాటి లాభాల గురించి విజయరామ్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఉద్యానశాఖ డీడీ నరసింహారావు, ఏపీడీ ఫిరోజ్ఖాన్, నాబార్డు అధికారి మోహనయ్య, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిరుధాన్యాలు సాగు చేసేలా ప్రోత్సహించాలి తద్వారా ప్రజారోగ్యం మెరుగుపడుతుంది ‘మిల్లెట్ మేళా’లో వక్తలు -
మూసా ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
రాయదుర్గంటౌన్: పట్టణంలోని బళ్లారి రోడ్డులో ఉన్న మూసా ఆర్ఎంపీ క్లినిక్ను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఆర్ఎంపీ నిర్వాకంతో గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి అనుశ్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై స్పందించిన డీఎంహెచ్ఓ ఈబీ దేవి శనివారం రాయదుర్గం చేరుకుని విచారణ చేపట్టారు. క్లినిక్ను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిలో బాధిత తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఎం, విద్యార్థి సంఘాల నేతలు డీఎంహెచ్ఓను కలిసి చిన్నారి మృతికి కారణమైన ఆర్ఎంపీపై చర్యలు చేపట్టడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
అనంతపురం: నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం 1959–2024కు సంబంధించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు వెయ్యిమంది పూర్వ విద్యార్థులు హాజరై అప్పటి గురువులను ఘనంగా సత్కరించారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అధ్యక్షుడు వివేకానందరెడ్డి, జనరల్ సెక్రెటరీ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ పెద్దయ్య చౌదరి, ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ సి.కేశవచంద్రరావు, డాక్టర్ ఎం.రామకృష్ణారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు పూర్వ విద్యార్థి అపెక్స్ కన్స్ట్రక్షన్ అధినేత బి.తిరుపాల్ నగదు బహుమతి అందజేశారు. సాయి ఆదిత్య కన్స్ట్రక్షన్ అధినేత పురుషోత్తమ మురళీకృష్ణ, నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్, పుట్టినిల్లు ఆశ్రమం చైర్పర్సన్ నిర్మలా మురళి అప్పటి గురువులను ఘనంగా సత్కరించారు. -
రెండు నెలల క్రితం..
రాయదుర్గం: పదో తరగతి కూడా పూర్తి చేసి ఉండరు. కొన్ని రోజులు ఏదో ఒక ఆస్పత్రిలో డాక్టరు దగ్గర ఇంజెక్షన్లు, మందులు అందజేసే సహాయకుడిగా పని చేసి ఉంటారు. బయటకొచ్చాక తామేదో ఎంబీబీఎస్, ఎంఎస్ చదివినట్లు భావించి క్లినిక్లు ప్రారంభించేస్తున్నారు. బెడ్లు ఏర్పాట్లు చేసుకుని సైలెన్లు ఎక్కించేస్తున్నారు. యూట్యూబ్లలో వీడియోలు చూసి చికిత్సలు చేస్తూ ప్రాణాలు కూడా బలికోరుతున్నారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా క్లినిక్లు ఏర్పాటు చేసుకున్న కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్టెరాయిడ్లు, గర్భస్రావ, నిద్ర మాత్రలు కూడా రాస్తున్న ఈ ‘శంకర్దాదాలు’ అమాయకుల ఉసురు తీసేస్తున్నారు. గత 3 నెలల వ్యవధిలోనే జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గమైన రాయదుర్గం ప్రాంతంలో మూడు ప్రాణాలు బలిగొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కాదు.. ప్రతి నెలా జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి .. తర్వాత ‘మామూలు’గా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతి లేక ఆశ్రయిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్కారు వైద్య సేవలు ఘోరంగా తయారయ్యాయి. మెరుగైన వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక వైద్య శాలల్లో సేవలు సరిగా అందడం లేదు. రాయదుర్గంలో పేరుకే వంద పడకల ఆస్పత్రి అయినా సగానికి పైగా వైద్యుల సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే నిలదీస్తున్నా సర్కారులో చలనం లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేయగా, ‘కూటమి’ కొలువుదీరాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో పేదలు ఆర్ఎంపీల క్లినిక్లను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ నెల 21న ఈ నెల 2న తలనొప్పితో బాధపడుతున్న బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన వివాహిత జ్యోతిబాయి... గుమ్మఘట్ట మండలం భూపముద్రం గ్రామానికి వచ్చి ఆర్ఎంపీతో ఇంజెక్షన్ వేయించుకుంది. కాసేపటికే తలనొప్పి మరింత తీవ్రం కావడంతో కుటుంబీకులు ఆమెను కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రి, అక్కడి నుంచి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడం వల్లే జ్యోతిబాయి మృతి చెందిందని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. రాయదుర్గం పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ భర్త, పీఎంపీ చన్నవీర క్లినిక్లో వైద్య చికిత్సలు అందుకున్న తాపీమేసీ్త్ర విజయ్ ప్రాణాలు వదిలాడు. తన కుమారుడి మృతికి పీఎంపీ వైద్యమే కారణమని విజయ్ తల్లి లక్ష్మీదేవి ఆరోపించింది. చన్నవీర టీడీపీ నాయకుడు కావడంతో కేసు నమోదుకు అధికారులు, పోలీసులు వెనుకంజ వేశారు. బాధిత కుటుంబీకులతో దుప్పటి పంచాయితీ నిర్వహించి, యువకుడి ప్రాణానికి రూ.3 లక్షలు వెలకట్టారు. గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన వన్నూర్స్వామి, లక్ష్మీ దంప తుల కుమార్తె అనుశ్రీకి తీవ్ర జ్వరం సోకింది. రాయదుర్గం పట్టణంలోని మూస క్లినిక్లో ఆర్ఎంపీ హఫీజ్తో వైద్యం చేయించారు. చిన్నారికి టైఫాయిడ్ ఉన్నట్టు నిర్ధారించిన హఫీజ్.. క్లినిక్లో ఆమెకు సైలెన్ ఎక్కించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యం వికటించడం వల్లే బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఆర్ఎంపీలు, పీఎంపీలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతాం. క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. రాయదుర్గంలో వరుస మరణాలపై విచారణకు ఆదేశించాం. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. – ఈబీ దేవి, డీఎంహెచ్ఓ -
మత్స్య సంపద పెంచాలి
కూడేరు: మత్స్య సంపద పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి శనివారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 2024–25 సంవత్సరానికి గాను ఐదు లక్షల చేప పిల్లలను కలెక్టర్ వదిలారు. మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మత్స్యకారులు మాట్లాడుతూ డ్యాంలో నీరు పుష్కలంగా ఉందని, అదనంగా మరో 10 లక్షల చేప పిల్లలు సరఫరా చేయాలని, కొర్రకోడులో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పే నాయక్, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఫిషరీస్ డీడీ శ్రీనివాసనాయక్, ఎఫ్ట్టీఎఫ్లు ఆసిఫ్, బాబునాయక్, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి పాల్గొన్నారు. గ్యాస్ లీకై వృద్ధురాలి మృతి అనంతపురం: వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రెవెన్యూ కాలనీ (షిర్డీ కాలనీ)లో నివాసం ఉంటున్న విశ్రాంత ఏఎన్ఎం మంగళ లక్ష్మీదేవి (75), ఎం.రంగన్న దంపతులు. 2004లో భర్త చనిపోయాడు. సంతానం లేకపోవడంతో లక్ష్మీదేవి ఒంటరిగా ఉంటోంది. శనివారం ఇంట్లో వంట చేస్తుండగా.. గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఆ మంటల నుంచి బయటకు రాలేక లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. సోదరుడు కనుముక్కల ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు. -
అంగన్వాడీ స్థలం ఆక్రమణ
రాప్తాడురూరల్: కూటమి ప్రభుత్వంలో ‘తమ్ముళ్ల’ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములను కబ్జా చేసేస్తున్నారు. అధికారులు నోటీసులిస్తున్నా లెక్కచేయడం లేదు. అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి పంచాయతీ సంతోష్నగర్లో అంగన్వాడీ కేంద్రం కోసం కేటాయించిన స్థలాన్ని ఓ టీడీపీ చోటా నాయకుడు దురాక్రమణ చేయడమే ఇందుకు నిదర్శనం. వివరాలు.. సంతోష్నగర్ ఆంజనేయస్వామి గుడి వద్ద దాదాపు 6 సెంట్ల స్థలాన్ని ప్రజా ప్రయోజనార్థం వదిలిపెట్టారు. ఈ స్థలంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి 2020 అక్టోబరు 18న పంచాయతీ తీర్మానం చేసింది. ఇక్కడ ప్రైవేట్ భూమి సెంటు రూ.9 లక్షలు పలుకుతోంది. ‘కూటమి’ ప్రభుత్వం వచ్చాక చిన్నంపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ స్థలంపై కన్నేశాడు. రెండు సెంట్ల స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించాడు. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి వెళ్లి నోటీసులు ఇవ్వగా.. ఏమాత్రం లెక్క చేయలేదు. ఎంపీడీఓ, కలెక్టర్తో మాట్లాడుకుంటానంటూ కార్యదర్శితో వాదించాడు. ఇటీవల కొందరు కాలనీవాసులు కలెక్టర్ వినోద్కుమార్ను కలిసి ఫిర్యాదు చేయగా.. కలెక్టర్ ఆదేశాలతో ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి వెళ్లి నోటీసులు ఇచ్చాడు. అయితే తనకు తహసీల్దార్ మంజూరు చేశారంటూ నకిలీ పట్టా చూపించడం గమనార్హం. దీనిపై ఎంపీడీఓ దివాకర్ను వివరణ కోరగా... ‘సంతోష్నగర్లో ఓపెన్ స్థలంలో ఓ వ్యక్తి ఇల్లు నిర్మిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. అక్కడ అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మాణానికి పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు
కుందుర్పి: కొలిమిపాళ్యం సమీపంలోని సర్కారు చింతతోపు సర్వేనంబర్ 70–1, 70–2లో గల స్థలంలో టీడీపీ నాయకులు గుడిసెలు వేయించారు. ఎంపీపీ కమలమ్మ, సర్పంచ్ గంగాధర తదితరులు అడ్డగించే ప్రయత్నం చేయగా ‘మా ప్రభుత్వం.. మా ఇష్టం’ అంటూ 12 మంది టీడీపీకి చెందిన వారు స్థలాలు ఆక్రమించారు. మొదట గుడిసెలు వేసి తమవశం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఎంపీపీ, సర్పంచ్ తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ గుడిసెలు వేసిన ప్రభుత్వ స్థలాన్ని శనివారం పరిశీలించామని, గ్రామంలో ఇరు వర్గాలవారు గుడిసెలు వేశారని, వారితో మాట్లాడామని చెప్పారు. స్వచ్ఛందంగా తీసేయకపోతే, తాము సోమవారం తొలగిస్తామని స్పష్టం చేశారు. -
తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు
తాడిపత్రిటౌన్: వైఎస్సార్సీపీ నేత, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్బాషా ఇంటిపై టీడీపీ నాయకులు రాళ్ల దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు శుక్రవారం తాడిపత్రిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద, ప్రధాన కూడళ్లలో ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులను మోహరించారు. అదే రోజు అర్ధరాత్రి డీఐజీ షిమోషి సంఘటన స్థలాలను పరిశీలించారు. ఎస్పీ జగదీష్ తాడిపత్రిలోనే ఉంటూ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం గార్లదిన్నె: భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన కల్లూరుకు చెందిన అబ్దుల్ షఫీ (47) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మద్యానికి బానిసైన అబ్దుల్ షఫీ రోజూ భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవ జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన భార్య గుంతకల్లులోని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన అబ్దుల్ షఫీ అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
విజయవాడకు కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్ వినోద్కుమార్ శనివారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆదివారం అక్కడ సివిల్ సర్వీసెస్ అధికారులకు జరగనున్న క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారు. అటు తరువాత ఈనెల 25, 26 తేదీల్లో విజయవాడలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించనున్న కాన్ఫరెన్స్కు హాజరవుతారు. 27న తిరిగి విధులకు హాజరవుతారని కార్యాలయ అధికార వర్గాలు వెల్లడించాయి. చిలమకూరులో వడగండ్ల వాన యల్లనూరు: మండలంలోని చిలమకూరు గ్రామంలో శనివారం వడగండ్ల వాన కురిసింది. సాయంత్రం దాదాపు 20 నిమిషాల పాటు వడగండ్లు పడ్డాయి. అకాల వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో టమాట, మొక్కజొన్న, తదితర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పారా గేమ్స్లో సత్తా అనంతపురం: భారత ప్రభుత్వం న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా పారా గేమ్స్లో జిల్లాకు చెందిన సాకే బాబు సత్తా చాటాడు. మెన్స్ ఎఫ్–56 విభాగం షాట్పుట్లో అత్యుత్తమ ప్రతిభతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా సాకే బాబును అథ్లెటిక్స్ కోచ్ ఎస్ఎం మంజుల, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. నాగరాజు, ఎన్. శ్రీనివాసులు అభినందించారు. -
కౌలు రైతులకూ డ్రిప్ పరికరాలు ఇవ్వండి
అనంతపురం సిటీ: కౌలు రైతులకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసి ఆదుకోవాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం చేయొద్దని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/వ్యవసాయం/విద్య, వైద్య/పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖలు/ ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రం, గోరంట్ల, కణేకల్లు,నార్పల జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్,జయరాం, పద్మావతి, వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ.. వేసవికి ముందే ఎక్కడెక్కడ తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందో గుర్తించి, అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించడంలో ఎందుకు వైఫల్యం చెందారంటూ రెండు జిల్లాల ఎస్ఈలను నిలదీశారు. తాగునీటి పథకాల నిర్వహణకు కోట్లాది రూపాయలు జెడ్పీ నుంచి నిధులు ఇస్తున్నా వాటర్ సీనరైజ్ చార్జెస్ను మున్సిపాలిటీల నుంచి వసూలు చేసుకొని వాడుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో ఫిల్టర్ బెడ్స్ మార్చాలని ఆదేశించారు. దళితవాడలు, గిరిజన తండాల్లో రహదారులు, తాగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు కోరారు. పాఠశాలలను తరచూ తనిఖీలు చేస్తే ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుందని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ అన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని గిరిజమ్మ సూచించారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన రైతు భరోసా కేంద్రాల భవనాలను కొన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్లకు కేటాయించడంపై అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగల కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని కోరారు. ఐసీడీఎస్ను బ్రోకర్లు శాసిస్తారా? శ్రీసత్యసాయి జిల్లాలో ఐసీడీఎస్ జిల్లా కార్యాలయాన్ని ఓ బ్రోకర్ శాసిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాం నాయక్ తెలిపారు. సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోనూ కొందరు సీడీపీఓలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అంగన్వాడీ కేంద్రాలను గాలికొదిలేశారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ ఆరోపించారు. ఈ అంశంపై ఐసీడీఎస్ శ్రీసత్యసాయి జిల్లా పీడీ భారతి స్పందిస్తూ.. తాను కొత్తగా వచ్చానని, పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతపురం అర్బన్లోని బుడ్డప్పనగర్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త భాగ్యమ్మ పదేళ్లుగా విధులకు డుమ్మాకొట్టి, ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నట్లు గత సమావేశాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, ఆమైపె ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఐసీడీఎస్ పీడీ నాగమణిని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పీడీ నాగమణి స్పందిస్తూ.. ఈ రోజే తొలగింపు ఉత్తర్వులు భాగ్యమ్మకు అందించామని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ ఆదేశం -
నెలాఖరు కల్లా హెచ్చెల్సీ పనుల ప్రారంభం
కణేకల్లు/బొమ్మనహళ్: హెచ్చెల్సీ సిస్టమ్లో అత్యవసర పనులను ఈ నెలాఖరు కల్లా ప్రారంభించనున్నట్లు హెచ్చెల్సీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటరమణరెడ్డి తెలిపారు. కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల పరిధిలోని హెచ్చెల్సీపై కణేకల్లు హెచ్చెల్సీ సబ్డివిజన్ డీఈఈ మద్దిలేటితో కలసి శుక్రవారం ఆయన పర్యటించారు. 155 కి.మీ., 165 కి.మీ., 169 కి.మీ. వద్ద అర్థాంతరంగా ఆగిన బ్రిడ్జి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు రూ.33.89 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయన్నారు. 155, 165, 169 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరైనట్లు వివరించారు. అలాగే కణేకల్లు చెరువు పరిధిలో 3 స్లూయిస్లను రూ.22 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 147 కిలోమీటర్ వద్ద అవుట్ ఫాల్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ. 4.20 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. పీఏబీఆర్ రెగ్యులేటర్ను రూ.4.06 కోట్లు, ఎంపీఆర్ రెగ్యులేటర్ను రూ.4.07 కోట్లతో నిర్మిస్తున్నట్లు వివరించారు. మొత్తం రూ.33.89 కోట్ల పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ నిర్వహించి కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లను పొందినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈఈలు అల్తాఫ్, నరేంద్రమారుతీ తదితరులు పాల్గొన్నారు. హెచ్చెల్సీ ఈఈ వెంకటరమణరెడ్డి -
పోలీస్ శాఖలో పలువురికి ఉగాది సేవా పతకాలు
అనంతపురం: పోలీస్ శాఖలోని పలువురికి ఉగాది ఉత్తమ సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జిల్లా స్పెషల్బ్రాంచ్ ఎస్ఐ జి.లోక్నాథ్ చౌదరి ఉగాది ఉత్తమ సేవా పతకం దక్కింది. 1990లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన ఆయనకు 2011లో హెడ్కానిస్టేబుల్గా, 2024లో ఎస్ఐగా పదోన్నతి దక్కింది. 2015లో సేవా పురస్కారం పొందారు. 2017లో ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. తాజాగా ఉగాది ఉత్తమ సేవా పురస్కారానికి ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. అలాగే 14వ బెటాలియన్కు చెందిన ఏఆర్ ఎస్ఐ వీసీఎస్ మహారాజు హెడ్ కానిస్టేబుల్ వి.నారాయణ స్వామికు ఉత్తమ సేవా పతకం దక్కింది. స్పెషల్ బ్రాంచ్ సీఐగా ఉన్న జె.ధరణికిషోర్, ఇటుకలపల్లి సీఐ జె.హేమంత్కుమార్, ఏఆర్ ఎస్ఐ సీహెచ్ నాగేశ్వర రావు, పుట్లూరు, ఏఎస్ఐ పి.రాజశేఖర్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ ఎ.నాగరాజు, కళ్యాణదుర్గం పీఎస్ హెడ్కానిస్టేబుల్ ఎం. హరినాథ బాబు, అనంతపురం రూరల్ పీఎస్ కానిస్టేబుల్ ఎస్.టిప్పుసుల్తాన్, ఉరవకొండ పీఎస్ కానిస్టేబుల్ ఎం.చంద్రశేఖర్, ఏపీఆర్సీ సి.రాముడు, స్పెషల్బ్రాంచ్ కానిస్టేబుల్ ఎ.ప్రసన్న కుమార్కు సేవా పతకాలు దక్కాయి. -
ఎండ తీవ్రతకు గురి కావొద్దు
అనంతపురం అర్బన్: వేసవిలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. ముఖ్యంగా వడదెబ్బకు గురైతే తలనొప్పి, తల తిరగడం, తీవ్ర జ్వరం, మత్తునిద్ర, కలవరింతలు, ఫిట్స్, పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వడదెబ్బకు గురికాకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ సూచనలు పాటించాలన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. వడదెబ్బకు గురవుతే... ● వడదెబ్బకు గురైన వారిని నీడగా ఉన్న చల్లటి ప్రదేశానికి చేర్చాలి. తడివస్త్రంతో శరీరం తుడవాలి. ఫ్యాన్ కింద ఉంచాలి. ● శరీర ఉష్ణోగ్రత 101 డ్రిగీల కంటే తక్కువకు వచ్చే వరకూ ఐస్ వాటర్ వస్త్రంతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ● సాధారణ స్థితికి రాకపోతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. వైద్య చికిత్స అందించాలి. తీవ్రమైన ఎండలో చేయకూడనివి... ● సూర్య కిరణాలకు, వేడి గాలికి గురికాకూడదు. గొడుగు లేకుండా తిరగరాదు. ● మధ్యాహ్నం తరువాత (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయకూడదు. ● ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. ● శీతల పానీయాలు, ఐసు ముక్కలు తీసుకోవడం ద్వారా గొంతు సంబంధిత అనారోగ్యం ఏర్పడుతుంది. తీవ్ర ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపు రంగులోని పలుచటి కాటన్ వస్తాలను ధరించాలి. తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలి. ఓరల్ రీ హైడ్రేషన్ నీటినీ తాగొచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. అలాగే వీలైనని సార్లు నీరు తాగుతూ ఉండాలి. ఎండలోంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం కానీ కొబ్బరినీరు లేదా చల్లని (మట్టికుండాలోని) నీరు తాగాలి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు తలతిరగడం, తదితర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించి ప్రాథమిక చికిత్స పొంది వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవచ్చు. కలెక్టర్ వినోద్కుమార్ సూచన -
మందుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
అనంతపురం: ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా విజిలెన్స్ అధికారులు, ‘ఈగల్’ అధికారులు తదితరులు సంయుక్తంగా శుక్రవారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏడు మెడికల్ షాపులపై దాడులు చేశారు. హిందూపురంలో ఒక మెడికల్ షాపులో కాలం చెల్లిన ఔషదాలను గుర్తించారు. నాలుగు షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే (ఎన్ఆర్ఎక్స్) మందుల కొనుగోలు, అమ్మకాలలో వ్యత్యాసాలు గుర్తించినట్లు అనంతపురం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వైబీపీటీఏ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ ఎం.నాగభూషణం, సీఐలు జమాల్బాషా, సద్గురుడు, ఏఓ వాసుప్రకాష్, డీసీటీఓ సురేష్కుమార్, ఔషధ నియంత్రణ అధికారి రమేష్రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న తదితరులు పాల్గొన్నారు. ఏపీ అగ్రోస్ జిల్లా మేనేజర్గా ఓబుళపతి అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఏపీ ఆగ్రికల్చర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్– ఏపీ అగ్రోస్) జిల్లా మేనేజర్గా సి.ఓబుళపతి నియమితులయ్యారు. శుక్రవారం స్థానిక అగ్రోస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి వద్ద ఉన్న భూసార సంరక్షణ విభాగం (సాయిల్ కన్సర్వేషన్) ఏడీగా ఆయన పనిచేశారు. గతంలో అగ్రోస్ జిల్లా మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉన్నందున తిరిగి ఆయనకే బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల వ్యవసాయశాఖ ద్వారా యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకురావడమే కాక, నోడల్ ఏజెన్సీగా అగ్రోస్ను గుర్తించడంతో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టును ఓబుళపతితో భర్తీ చేయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయశాఖను సమన్వయం చేసుకుని రూ.2.87 కోట్ల బడ్జెట్తో రైతులకు వివిధ రకాల స్ప్రేయర్లు, రోటా వీటర్లు, పవర్ టిల్లర్లు, పవర్వీడర్లు, బ్రష్ కట్టర్స్ తదితర 1,661 యంత్ర పరికరాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువకుడి ఆత్మహత్య డి.హీరేహాళ్ (రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలంలోని లింగమనహళ్లి గ్రామానికి చెందిన బసవరాజు (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న బసవరాజుకు తల్లి భాగ్యమ్మతో పాటు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. అవసరాల నిమిత్తం రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు భూమి విక్రయిద్దామనుకుంటే అది కాస్త కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి జీవితంపై విరక్తితో శుక్రవారం పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి కురుబ భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చిన్న బల్లలపై పరీక్షలు ఎలా రాస్తారు?
● విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం అనంతపురం ఎడ్యుకేషన్: ఇంత చిన్న బల్లలపై పదో తరగతి విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు.. చీఫ్ సూపరింటెండెంట్ ఏమి చేస్తున్నారు.. చూసుకోకపోతే ఎలా.. పరీక్షల నిర్వహణలో ఇంత అలసత్వంగా ఉంటే ఎలా? అంటూ కలెక్టర్ వినోద్కుమార్ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. నగరంలోని గుడ్ చిల్డ్రన్ స్కూల్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్న పిల్లలు కూర్చునే బల్లలపై పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన బల్లలు (డెస్కులు) చాలా చిన్నవిగా ఉన్నాయని, వాటిని మార్చాలని ఆదేశించారు. వెలుతురు సరిగా లేని రూములలో లైట్లు వేయాలని, పరీక్షలు నిర్వహించే ముందు విద్యాశాఖ అధికారులు ప్రతి పరీక్ష కేంద్రాలలోని వసతులను పరిశీలించాలి కదా? అని మండిపడ్డారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 31,009 మందికి గాను 30,213 మంది హాజరయ్యారు. జిల్లాస్థాయి పరిశీలకులు ఆరు కేంద్రాలు, జిల్లా విద్యాశాఖ అధికారి ఒక కేంద్రాన్ని, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఒక కేంద్రం, ఫ్లయింగ్ స్క్వాడ్ 37 కేంద్రాలను పరిశీలించారు. -
నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అలుకోత్సవం భక్తి శ్రద్ధలతో నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి విశేషాలంకరణ చేసి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవం ఉభయదారులుగా వ్యవహరించిన ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు
అనంతపురం: పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం స్పెషల్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఎనుమలవారిపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు వీరానిపల్లి చిరంజీవి (22) ఓ బాలికను ఇంటి వద్ద వదిలిపెడతానని తన ఆటోలో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్ స్టేషన్లో 2019 మార్చి 22న కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి సీఐ బి.వెంకట చలపతి కేసు దర్యాప్తు చేశారు. అనంతరం సీఐ టి.మధు జిల్లా సెషన్స్ కోర్టులో నిందితుడు వీరానిపల్లి చిరంజీవి అలియాస్ చిరుపై చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసును అనంతపురం ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. గురువారం ఈ కేసును ట్రయిల్ చేసి మొత్తం 14 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి వీరానపల్లి చిరంజీవి అలియాస్ చిరుకు 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక న్యాయ స్థానం (పోక్సో కోర్టు) శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.3లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ, విద్యాపతి వాదించారు. -
ఇళ్ల కూల్చివేతలో గూడుపుఠాణి
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట సర్వే నంబరు 106–1 పరిధిలోని విద్యారణ్యనగర్లో ఇళ్ల కూల్చివేత వెనుక ఏదో గూడుపుఠాణి జరిగిందని విశ్రాంత జిల్లా జడ్జి కిష్టప్ప ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు. ఇళ్లను కూల్చాలని, పోలీసు ప్రొటెక్షన్ తీసుకోవాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వనే లేదన్నారు. జాయింట్ కలెక్టర్ కూడా ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు కూడా ఎక్కడా ఇళ్లను తొలగించాలని కానీ, పోలీసులను పిలుచుకెళ్లండని కానీ చెప్పలేదని వివరించారు. ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎవరు చేయమన్నారు? వీరి వెనుక ఉన్న ఆ పెద్ద శక్తి ఎవరు? అని కిష్టప్ప ప్రశ్నించారు. ఇళ్లను కూల్చడానికి డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్లే ధైర్యం చేయలేరన్నారు. ఇళ్లను కూల్చే విషయానికి సంబంధించి సుప్రీం కోర్టు ఓ కేసులో 95 పేజీల తీర్పు ఇచ్చిందన్నారు. ఆ ప్రకారం చాలా పెద్ద ప్రొసీజర్ ఉందన్నారు. ప్రొసీజర్ ఇక్కడ అటువంటిదేదీ ఫాలో కాలేదన్నారు. వాస్తవానికి కోర్టు ఉత్తర్వుల్లో మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నంబరులో స్థలాన్ని స్వాధీనం చేయాలని స్పష్టంగా ఉందని తెలిపారు. కానీ వీరు మాత్రం నారాయణపురం పంచాయతీ పరిధిలోని భూమిని స్వాధీనం చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక ఉన్న కుట్ర బయటకు రావాలన్నారు. ప్రజలంతా ఏకం కావాలన్నారు. ఘటనపై అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలన్నారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలూ స్పందించాలి బాధితులకు అండగా నిలవాలి రిటైర్డు జడ్జి కిష్టప్ప -
‘హరి–హర’ క్షేత్రానికి అడుగులు
● భారీ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేసిన సనాతన ధర్మపరిరక్షణ వేదిక ●రూ.1,200 కోట్ల వ్యయంతో బృహత్ క్షేత్ర నిర్మాణం ●సమావేశంలో వెల్లడించిన స్తపతులు అనంతపురం కల్చరల్: ప్రపంచంలోనే ఎత్తైన 216 అడుగుల రామానుజల విగ్రహం, ఓంకారేశ్వరంలోని 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహం, తెలంగాణాలో సుప్రసిద్ధి చెందిన యాదాద్రి గుట్టపై ఉన్న స్వర్ణగిరి మందిరాన్ని మించిన మరో అరుదైన ఆలయానికి ‘అనంత’ వేదికగా మారనుంది. సనాతన ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్మాణమయ్యే అపురూపమైన ఈ కట్టడ నమూనాలను అనంత ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం అనంతపురంలోని గీతామందిరంలో ధర్మప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఇస్కాన్ ఇన్చార్జి దామోదర గౌరంగదాసు నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలు, కట్టడాలను నిర్మించిన ప్రముఖ శిల్పులు డీఎన్వీ ప్రసాద్ స్తపతి, రాజమండ్రికి చెందిన శ్రీనివాస స్తపతి, తిరుమల గోవింద పీఠం పీఠాధిపతి శ్రీరామప్రియ యతీంద్ర స్వామీజీ తదితరులు మాట్లాడారు. వైదిక ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మరోసారి ఆధ్యాత్మికంగా స్వర్ణయుగం రానున్న నేపథ్యంలో చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ధార్మిక మండళ్ల ప్రతినిధులు పరాంకుశం కృష్ణశర్మ, ఆచార్య మనోరంజనరెడ్డి, చిదంబరం, శ్రీధర్, చంద్రశేఖర్, రంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. కోటి మంది హిందువులను భాగస్వాములను చేస్తూ దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో అనంత వేదికగా బృహత్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నాయనిపల్లి క్రాస్ వద్ద ప్రాచీన విశేషాలతో కూడిన ‘హరి–హర క్షేత్రం’ నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన 300 అడుగుల కోటి లింగాల అపురూప మహాశివలింగం, దాని కిందనే దివ్య స్పటిక శ్రీచక్ర మేరువు, చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల ఆలయాల ప్రతిష్టాపన జరుగుతాయన్నారు. దీనికి పక్కనే 108 అడుగుల శ్రీమన్నారాయణ విశ్వరూప దర్శన కాంస్య విగ్రహంతో పాటు, అదే పీఠంపై దశావతారాల విగ్రహాలు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. వీటికి ఎదురుగా 54 అడుగుల ఎత్తుతో నంది, గరుడ విగ్రహాలు, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యదేవ విగ్రహం, త్రిమతాచార్యులైన ఆది శంకరులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల విగ్రహలను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నింటి కంటే ప్రధానంగా ఈ విశాలమైన ప్రదేశంలో వైదిక ధర్మాన్ని నేర్పే సంస్కృత పాఠశాల, వేద విజ్ఞానాన్ని అందించే పుస్తక భాండాగారం, రిషి విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ, ప్రాచీన ఆయుర్వేదాలయం, రామాయణ, భగవద్గీతల విశిష్టతలను తెలియజేసే కళాఖండాలూ నిర్మిస్తామన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన హిందువులు వచ్చి దర్శించుకునేందుకు వీలుగా పర్యాటకంగా ఈ ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రత్యేక కమిటీగా ఏర్పడిన ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ఈ అపురూప కట్టడం గోదావరి తీరంలో కట్టాలని సంకల్పించినా ఇక్కడి ఆధ్యాత్మికవేత్తల చొరవతో అనంతకు మార్చారన్నారు. ఈ ఏడాది ఆగస్టులో భూమి పూజ ఉంటుందని, అప్పటి నుంచి ఐదేళ్ల లోపు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పడిపోయింది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో పాటు కూటమి పార్టీల నేతల భూ ఆక్రమణలు, బెదిరింపుల నేపథ్యంలో స్థిరాస్తుల క్రయ విక్రయాలు మందగించాయని తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. బాగా అభివృద్ధి చెందిన రెండు మహా నగరాలకు మధ్యలో ఉండటం ఒకెత్తయితే.. జాతీయ రహదారి అనంతపురం మీదుగా వెళుతుంది కాబట్టి స్థిరాస్తి రంగం అంచలంచెలుగా ఎదుగుతూ ఉండేది. బెంగళూరుకు చేరుకోవాలంటే రెండు గంటల్లో వెళ్లే పరిస్థితి. హైదరాబాద్కు కూడా నాలుగైదు గంటల్లో వెళ్లే అవకాశం ఉంది. మంచి రోడ్డు సౌకర్యంతోపాటు బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు రెండు గంటల్లో వెళ్లే అవకాశం ఉండటం వల్ల అనంతపురం అభివృద్ధి బాగా ఉండేది. కానీ ఇది గత చరిత్ర. కూటమి సర్కారు వచ్చాక స్థిరాస్తి రంగం కుదేలైంది. నిత్యం దందాలు, భూ ఆక్రమణలు, గొడవలు లాంటి పరిస్థితుల ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై తీవ్రంగా పడింది. ఒక్క వెంచర్ వచ్చి ఉంటే ఒట్టు అనంతపురం – బెంగళూరు జాతీయ రహదారి వెంట రియల్ ఎస్టేట్ బాగా ఉండేది. కానీ సర్కారు నిర్ణయాలు, పరిస్థితుల కారణంగా గడిచిన 9 నెలల్లో ఒక్క కొత్త వెంచర్ కూడా రాలేదు. భూములు కొని ప్లాట్లు వేద్దామన్న ఇన్వెస్టర్లే లేరు. అంతెందుకూ గతంలో వెంచర్లు వేసి కట్టిన ఇళ్ల కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి. అనంతపురం నగర పరిధిలో ఏటా అపార్ట్మెంట్లలో వెయ్యి ఫ్లాట్ల వరకు అమ్మకాలు జరిగేవి. కానీ గడిచిన తొమ్మిది నెలల్లో 200 ఫ్లాట్లు కూడా అమ్ముడుపోలేదు. తాడిపత్రి ప్రాంతంలోనూ స్థిరాస్తి క్రయవిక్రయాలు మరింత దిగజారినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పతనం జిల్లాలో మొత్తం 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో అనంతపురం అర్బన్, రూరల్ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. అలాంటిది ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం పదిరోజుల్లో ముగుస్తున్నా ఇప్పటివరకూ 69 శాతానికి కూడా మించలేదు. గుంతకల్లు, ఉరవకొండ, యాడికి, కణేకల్లు వంటి ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికితోడు ఇటీవల భూముల విలువ పెంచడంతో రిజిస్ట్రేషన్ల చార్జీలు భారీగా పెరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే వెంచర్లు లేదా బిల్డింగ్ యజమానులను కూటమి నేతలు బెదిరిస్తుండటంతో ఎవరూ ముందుకు రావడం లేదు. కూటమి పాలనలో స్థిరాస్తి రంగం కుదేలు తొమ్మిది నెలల్లో ఒక్క వెంచర్ కూడా ఏర్పాటు కాలేదు కొత్త అపార్ట్మెంట్లు లేవు.. పాతవి అమ్ముడుపోలేదు భూముల విలువ పెంపు.. సర్కారు చార్జీల బాదుడు జిల్లాలో భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం -
23న రౌండ్టేబుల్ సమావేశం
అనంతపురం టవర్క్లాక్: వెనకబడిన ప్రాంతాల అబివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 23న నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షుడు కేవీ రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ప్రాజెక్టులపై చర్చించి, చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రకటించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతూ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే ఔత్సాహికులు, మేధావులు ఈ నెల 23న ఆదివారం ఉదయం 10 గంటలకు బీజీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే రౌండ్టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశంలో శ్రీనివాసులు, గంటల నారాయణ రెడ్డి, కుళ్లాయప్ప, వెంకటేశులు, ఫృథ్వీ, నరేంద్ర పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానం కార్మికుల హక్కు ● ఎంప్లాయీస్ సంఘ్ డిమాండ్ గుంతకల్లు: కార్మికుల హక్కుగా ఉన్న పాత పెన్షన్ విధానాన్ని సాధించుకుని తీరుతామంటూ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ అన్నారు. డిమాండ్ సాధనలో భాగంగా శుక్రవారం స్థానిక డీఆర్ఎం కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలు మార్లు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చే వరకూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు మల్లికార్జున, బాలకృష్ణ, ప్రకాష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల అధికారుల నియామకం ● ఉత్తర్వులు జారీ చేసిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో ఐదు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులను నియమించారు. ఈ మేరకు ఉభయ జిల్లాల ఎన్నికల అధికారులు డాక్టర్ వి.వినోద్కుమార్, టీఎస్ చేతన్ ఉత్తర్వులు జారీ చేశారు. కణేకల్లు మండలానికి జిల్లా రిజిస్ట్రార్ జి.భార్గవ్, కంబదూరు మండలానికి ఆత్మ పీడీ మద్దిలేటి, ఉరవకొండకు బీసీ వెల్ఫేర్ అధికారి ఖుష్బూ కొఠారి, యల్లనూరుకు జిల్లా ఉద్యానాధికారి పి.రఘునాథరెడ్డి, పెద్దపప్పూరుకు డెయిరీ శాఖ డీడీ ఎం.ప్రభాకరరెడ్డి, రాయదుర్గానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్ను ఎన్నికల అధికారులుగా నియమించారు. బ్యాంకుల బంద్ వాయిదా అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 24, 25న తలపెట్టిన బ్యాంకుల బంద్ వాయిదా పడింది. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. జాతీయ కమిటీ, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన వ్యక్తమైన నేపథ్యంలో సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జాతీయ కమిటీ నుంచి సమాచారం అందిందన్నారు. వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ హిందూపురం అర్బన్: అడ్డదారులు తొక్కి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఓ కానిస్టేబుల్ ఏకంగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఇటీవలే మడకశిర స్టేషన్కు బదిలీ అయ్యాడు. హిందూపురంలోని మోడల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పట్టణంలోని బోయ పేటకు చెందిన ఓ మహిళతో కలిసి ఆ ఇంట్లో వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేవారు. కానిస్టేబుల్ వ్యవహారశైలిని గమనించిన చుట్టుపక్కల ఇళ్ల వారు పలుమార్లు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం, సిబ్బంది ఈ నెల 18న రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి కానిస్టేబుల్తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూడటంతో శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసి..రిమాండుకు తరలించారు. ఇదే కేసులో మేళాపురానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కాగా.. కానిస్టేబుల్ పురుషోత్తం గుడిబండ స్టేషన్లో పనిచేసిన సమయంలోనూ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. మరో ఇద్దరు అరెస్టు ● హిందూపురం పట్టణంలోని సీపీఐ కాలనీలో ఎస్.బాబా, అతని భార్య వ్యభిచారం నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం దాడి చేసి వారితో పాటు మరొక మహిళను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృతి
రాయదుర్గంటౌన్: ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృత్యువాత పడింది. వివరాలిలా ఉన్నాయి. గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన వన్నూరుస్వామి, లక్ష్మీ దంపతుల కుమార్తె అనుశ్రీ (4) రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. గురువారం నుంచి రాయదుర్గంలోని మూస క్లినిక్లో ఆర్ఎంపీతో చూపించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం సాయంత్రం మరోమారు క్లినిక్కు తీసుకొచ్చారు. ఆర్ఎంపీ హఫీజ్ రక్త పరీక్షలు చేయించి.. టైఫాయిడ్ ఉన్నట్లు నిర్ధారించాడు. అనంతరం అక్కడే సైలెన్ బాటిల్ ఎక్కించాడు. అయితే కొద్దిసేపటికే చిన్నారిలో తేడా కనిపించడంతో ఆందోళనకు గురైన ఆర్ఎంపీ.. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అనుశ్రీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బంధువులు మృతదేహాన్ని తీసుకుని క్లినిక్ వద్దకు వచ్చి ఆర్ఎంపీని నిలదీసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సీపీఎం, విద్యార్థి సంఘం, ఎంఆర్పీఎస్ నాయకులు అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి, ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ జయానాయక్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
ఈ–కేవైసీ చేయించుకోండి
● రేషన్ కార్డుదారులకు జేసీ సూచన అనంతపురం అర్బన్: రేషన్ కార్డులోని సభ్యులందరూ ఈనెల 31వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఇందుకు సంబంధించి వివరాలను గురువారం తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా 2,65,450 మంది సభ్యులు ఇప్పటికీ ఈ–కేవైసీ చేసుకోలేదన్నారు. ఈ–కేవైసీ చేయించుకున్నవారికి మాత్రమే ఏప్రిల్లో నిత్యావసర సరుకులు అందుతాయన్నారు. ఈ–కేవైసీ నమోదు కాని వారి జాబితా సంబంధిత ప్రాంత చౌకధరల దుకాణపు డీలరు, గ్రామ రెవెన్యూ అధికారి, సీఎస్డీటీ వద్ద ఉంటుందన్నారు. వారిని సంప్రదించి ఈ–పాసు యంత్రంలో వేలిముద్ర వేయాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయం.. ఎమ్మెల్యే తనయుడి దర్పంపామిడి: కూటమి సర్కారులో వింత పోకడలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల కుటుంబీకులు, బంధువులు కూడా అనధికార ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అధికారులు కూడా స్వామి భక్తి ప్రదర్శిస్తూ జీ హుజూర్ అంటున్నారు. వివరాలు.. పామిడి పట్టణ ఎంపీడీఓ కార్యాలయానికి గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం తనయుడు ఈశ్వర్ వచ్చారు. ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో చలి వేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ డీఓ కార్యాలయంలోకి ప్రవేశించిన ఆయన.. అక్కడ ఎంపీడీఓ సీటులో ఆసీనులై దర్పం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ తేజోత్స్న, తహసీల్దార్ శ్రీధర్మూర్తి కనబరిచిన స్వామి భక్తి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. -
పార్టీల ప్రతినిధులతో ప్రతి నెలా సమావేశం
అనంతపురం అర్బన్: ‘ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇకపై ప్రతినెలా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. సలహాలు, సూచనలు స్వీకరిస్తాం’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి వారంలో సమావేశం ఉంటుందన్నారు. ఓటరు జాబితా సవరణ, తదితర అంశాలపై చర్చించి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. చర్చించిన అంశాలపై నివేదికలను 20వ తేదీలోపు ప్రధాన ఎన్నికల అధికారికి పంపుతామన్నారు. ఓటరుగా నమోదు, జాబితాలో ఓటు తొలగింపు, వివరాల మార్పు నిరంతర ప్రక్రియ అని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులపై ఎప్పటికప్పుడు విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు. పార్లమెంటరీ ఓటర్ల జాబితా, ఎలక్టోరల్ రోల్స్ తయారీ, ఎన్నికల చట్టాలు, నియమాల్లో సవరణలు, ఎన్నికల సేవల ఫారాల్లో సవరణలు, ఓటర్ల నమోదు నియమాలు, 1960 కింద సూచించిన ఫాంలు, బల్క్ అప్లికేషన్ సూచనల సమర్పణ, డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు (డీఎస్ఈ), బీఎల్ఏల నియామకం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర వివరాలతో కూడిన నివేదికలను ఇస్తామన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రక్రియ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం తహసీల్దారు యుగేశ్వరిదేవి, డీటీ కనకరాజు, ఐటీ అసిస్టెంట్ శివ, పార్టీల ప్రతినిధులు సోమశేఖర్రెడ్డి, ఇమాంవలి, నారాయణస్వామి, కిరణ్కుమార్, బాలరంగయ్య, రామాంజినేయులు, అంజయ్య, మసూద్ఆలీ, తదితరులు పాల్గొన్నారు. ఓటరు జాబితాపై చర్చించి సలహాలు స్వీకరిస్తాం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుదాం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్కుమార్ -
గుడిలో ఇంటి దొంగలు
ఉరవకొండ: ఓ సినిమాలో అమాయకుల నుంచి బంగారు మూటను కమెడియన్ కొట్టేస్తారు. తన సహచరులతో కలిసి నగల పంపకాలకు కూర్చుంటారు. ‘నీకు... నాకు..’ అంటూ అందరూ పంచుకుంటుండగా.. హీరో ఎంట్రీ ఇచ్చి అందరి పని పడతాడు. అచ్చం ఇలాగే.. పెన్నహోబిలం పుణ్యక్షేత్రంలో ఓ ఘటన జరిగింది. అయితే, ఇక్కడ మాత్రం ఇంటి దొంగలే దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. లక్షలాది మంది ఇలవేల్పుగా కొలుచుకునే సాక్షాత్తూ నారసింహుడి ఆలయంలోనే చోటుచేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాలు.. ఉరవకొండ మండల పరిధి లోని ఆమిద్యాల గ్రామానికి చెందిన వేలూరు రంగయ్య, వనజాక్షి దంపతులు ఈనెల 7న పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కు మేరకు వనజాక్షి తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ మూటకట్టి హుండీ ద్వారా స్వామి వారికి సమర్పించింది. ఆమె ఆభరణాలు హుండీలో వేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ అర్చకుడితో పాటు ఆలయ సిబ్బంది గమనించారు. ఈనెల 18న ఆలయ ఈఓ సాకే రమేష్బాబు ఆధ్వర్యంలో స్వామి వారి శాశ్వత హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా... నగల మూటను చాకచక్యంగా మాయం చేశారు. హుండీ లెక్కింపు పూర్తయ్యాక పంచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ఓ గదిలో కూర్చుని పంపకాలు చేసుకుంటుండగా వారిలో వారికే తేడాలు వచ్చాయి. విషయం బయటకు పొక్కడంతో ఆలయ ఈఓ అర్చకులు, సిబ్బంది సమక్షంలో తిరిగి నగల మూటను హుండీలో వేసినట్లు తెలుస్తోంది. ఆభరణాలు మాయం! వేలూరు రంగయ్య దంపతులు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలను మాయం చేసిన ఘటనపై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) ఆదిశేషనాయుడు విచారణ చేపట్టారు. అయితే బంగారు మూటలో రూ.5 లక్షలకుపైగా విలువ చేసే ఆభరణాలు ఉండగా, ఇందులో ముక్కుపుడక, బంగారు పట్టీలు మాయమైనట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టి 15 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని, బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏసీ తెలిపారు. పెన్నహోబిలం ఆలయ హుండీలోని బంగారు మూట మాయం ఆలయ సిబ్బంది చేతివాటం పంపకాల్లో తేడాలతో బహిర్గతం -
మ్యూజియం సందర్శనకు విద్యార్థులు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘సైన్స్ ఎక్స్పోజర్’లో భాగంగా జిల్లా నుంచి పలువురు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు బెంగళూరు నగరంలోని విశ్వేశ్వరయ్య మ్యూజియం సందర్శనకు బయలుదేరారు. జిల్లాస్థాయి సైన్స్ఫేర్తో పాటు వివిధ జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటిన 8,9 తరగతుల బాలికలు 84 మంది, బాలురు 39 మంది వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులను గురువారం సాయంత్రం జిల్లా కేంద్రానికి పిలిపించారు. రాత్రి భోజన సదుపాయం కల్పించారు. బాలికలకు రుద్రంపేట సర్కిల్లోని వాల్మీకి కల్యాణమంటపం, బాలురకు ఉపాధ్యాయ భవనంలో వసతి కల్పించారు. సైన్స్ టూర్ వెళ్లేందుకు మొత్తం మూడు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి తిరిగి శనివారం ఉదయానికి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లా సైన్స్ అధికారి బాలమురళీకృష్ణ నేతృత్వంలో 18 మంది పురుష, మహిళా టీచర్లు ఎస్కార్ట్గా వెళ్తున్నారు. పిల్లలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ట్రైనీ కలెక్టర్ వినూత్న, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు సూచించారు. -
వైభవంగా లక్ష్మీనారసింహుడి బ్రహ్మ రథోత్సవం
కదిరి ఆధ్యాత్మిక కడలిని తలపించింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనతరంగం ఉప్పెనలా ఎగసింది. ‘నమో నారసింహ... గోవిందా’ నామస్మరణ ప్రతిధ్వనించింది. భక్తిభావం ముందు భగభగ మండే భానుడే వెలవెలబోగా..ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం వేళ చిన్నా,కదిరి: ఖాద్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మ రథోత్సవం గురువారం అశేష భక్తజనం మధ్య అత్యంత వైభవంగా జరిగింది.‘శ్రీలక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవిందా, ప్రహ్లాద వరద గోవిందా..గోవిందా, జయ జయ సింహా..జయ నరసింహా’’ అంటూ భక్తులు కీర్తించగా.. గోవింద నామ స్మరణతో కదిరి మార్మోగింది. బ్రహ్మ రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మ దేవుడే రథాన్ని నడిపి శ్రీవారు తిరువీధుల్లో విహరించేందుకు సహకరించి భక్తులంతా స్వామిని దర్శించుకునేలా చూస్తారని భక్తుల నమ్మకం.మూడు గంటల ఆలస్యం..ఉదయం సరిగ్గా 8.15 గంటలకు బ్రహ్మరథం ముందుకు కదిలింది. తిరువీధుల్లోని చౌక్ సర్కిల్లో ఒక సారి, హిందూపూర్ సర్కిల్లో మరోసారి.. ఇలా రెండు సార్లు తేరు మోకులు తెగిపోవడంతో గంటన్నర చొప్పున మూడు గంటలు ఆలస్యమైంది. సరిగ్గా సాయంత్రం 3.53 గంటలకు బ్రహ్మరథం యథాస్థానం చేరు కుంది. రథం యథాస్థానం చేరుకోవడానికి గతంలో ఎన్నడూ ఇంత ఆలస్యం కాలేదు.బలిహరణం, ఆస్థాన పూజలతో మొదలు..ఉదయాన్నే ఆలయ అర్చక బృందం తేరు ముందు బలిహరణం, ఆస్థాన పూజలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు రథం వద్ద జరిగిన తొలి పూజల్లో పాల్గొని, తర్వాత రథంపై శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రథాన్ని కాసేపు లాగి తమ భక్తిని చాటుకున్నారు. తిరు వీధుల ఆక్రమణల కారణంగా బ్రహ్మరథం లాగేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. ఓ వైపు ఎండలు మండుతున్నా భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకొని రథంపైకి దవనం, మిరియాలు చల్లేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఆయన కుమారుడు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియజేశారు. -
దగాకోరుపై దండెత్తిన అన్నదాతలు
కణేకల్లు: కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులకు డబ్బు కట్టకుండా అలసత్వం వహించిన ఓ దగాకోరుపై అన్నదాతలు దండెత్తారు. వివరాలు.. మండలంలోని పెనకలపాడు గ్రామానికి చెందిన వ్యాపారి క్రిష్ణారెడ్డి రైతుల నుంచి శనగలను కొనుగోలు చేసి రూ.4 కోట్లకు పైగా శఠగోపం పెట్టాడు. బాధిత రైతులు జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకోగా.. క్రిష్ణారెడ్డి దారికొచ్చాడు. దశలవారీగా డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఈనెల 9న రూ. కోటి మేర రైతులకివ్వాల్సి ఉంది. అయితే, డబ్బు కోసం ఆ రోజు నుంచి రైతులు అతని చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గురువారం దాటవేసేలా మాట్లాడటంతో బాధిత రైతులకు కడుపు మండిపోయింది. క్రిష్ణారెడ్డి, అతని కుమారుడు సోమశేఖర్ను గ్రామంలో ఉన్న రాములోరి ఆలయం వద్దకు పిలుచుకొచ్చి కట్టపై కూర్చోబెట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ వదల్లేదు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ నాగమధు.. ఏఎస్ఐ ఈశ్వరయ్య, పోలీసులను గ్రామానికి పంపించారు. గొడవల్లేకుండా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే తండ్రీకొడుకులు మాట్లాడుతూ... శ్రీరామనవమి తర్వాత కొంత డబ్బిస్తానని చెప్పడంతో రైతులు వారిని వదిలిపెట్టారు. -
పోషణతో కూడిన విద్యనందించాలి
అనంతపురం సెంట్రల్: అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులకు పోషణతో కూడిన విద్యనందించాలని కార్యకర్తలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగమణి ఆదేశించారు. అనంతపురంలోని చిన్మయానగర్లో ఉన్న ప్రాంగణంలో అనంతపురం అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ‘పోషణ్ బీ– పడాయి బీ’ కార్యక్రమంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పీడీ నాగమణి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్య కూడా ముఖ్యమన్నారు. ఇది కూడా సాధారణంగా కాకుండా చిన్నారులకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. సెల్ఫోన్లకు బానిసలు కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో తల్లిదండ్రులనూ భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ లలిత, సూపర్వైజర్లు కొండమ్మ, విష్ణువర్దిని, విజయ, హేమలత తదితరులు పాల్గొన్నారు. సర్వేయర్లకు మెమోల జారీ శింగనమల: విధులపై నిర్లక్ష్యం కనబరిచిన శింగనమల మండలం సోదనపల్లి సచివాలయ విలేజ్ సర్వేయర్ శివానంద, వెస్ట్ నరసాపురం సచివాలయ విలేజ్ సర్వేయర్ డి.వాణికు అధికారులు మెమోలు జారీ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ భాస్కర్ గురువారం వెల్లడించారు. తనిఖీకి వెళ్లిన సమయంలో వారు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. మూడు రోజుల్లోపు వారు వివరణ ఇవ్వకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మట్కా బీటర్ల అరెస్ట్ తాడిపత్రి టౌన్: స్థానిక శాంతి నగర్ ఆర్చ్ వద్ద ఖాళీ ప్రదేశంలో మట్కా రాస్తున్న ముకుందర్ మున్నీర్ బాషా, బద్వేల్బాషా మొహిద్దీన్, పల్లెల గోవర్థన్, వెన్నపూస లక్ష్మీనారాయణ, నడిపి వెంకటనారాయణను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారంతో ఎస్ఐ గౌస్బాషా, సిబ్బంది అక్కడకు చేరుకుంటుండగా గమనించిన మరో బీటర్ ముకుందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా పరారయ్యాడన్నారు. మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసి రూ.1.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
వృద్ధురాలిపై దాడి
గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మారెమ్మపై అదే గ్రామానికి చెందిన ఐదుగురు గురువారం దాడి చేసి గాయపరిచారు. గ్రామంలోని జంగాల కాలనీకి చెందిన మారెమ్మ కుటుంబ సభ్యులతో పొరుగింటి వారికి విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తడంతో మాటామాటా పెరిగి మారెమ్మపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన మారెమ్మను కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎం యోగా అవార్డుకు దరఖాస్తులు అనంతపురం కల్చరల్: ప్రధానమంత్రి యోగా అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. యోగా ప్రచారం, అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న వారు అర్హులన్నారు. కనీసం 40 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు httpsIIin nvateindia.mygov.inIpm-yoga-aw ards-25వెబ్సైట్ చూడాలని సూచించారు. హిందీ అమలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ● డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా గుంతకల్లు: రాజభాష హిందీని అమలు చేయడం బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా పిలుపునిచ్చారు. రాజభాష అమలుల్లో ప్రతిభ కనబరిచిన దాదపు 51 మంది ఉద్యోగులకు గురువారం ఆయన ప్రశంసా ప్రతాలను అందజేసి, అభినందించారు. రాజభాషా నియమాలను అనుసరించి ఉద్యోగులు తమ కార్యాలయాల్లో విధి నిర్వహణలో తప్పనిసరిగా హిందీ మాట్లాడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ, డివిజన్ రాజభాష అధికారి ఆశా మహేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ అరకొర... సీఎస్లు విలవిల
●పరీక్షల నిర్వహణకు అరకొర నిధులు కేటాయించిన ప్రభుత్వం ●చేతి నుంచి అదనంగా ఖర్చు పెడుతున్న సీఎస్లు తాడిపత్రి రూరల్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు గాను కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎందుకూ సరిపోవడం లేదు. అదనపు నిధుల కోసం ఉపాధ్యాయ సంఘాలు చేసిన వినతిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దీంతో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్) జేబులకు చిల్లు పడుతోంది. వైఎస్ జగన్ చొరవతో.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జీ కింద రూ.5.50లు మాత్రమే ప్రభుత్వం చెల్లించేది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెరిగిన ధరలను అప్పటి సీఎం వైఎస్ జగన్ దృష్టిలో ఉంచుకుని కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ 2020, 2021, 2023లో కంటింజెంట్ చార్జీ రూ.5.50 నుంచి రూ.8కు పెంచారు. 2024లో రూ.10కు పెంచారు. ప్రస్తుతం అదే చార్జీలనే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు ఈ నిధులు సరిపోక అదనపు మొత్తాన్ని సీఎస్లే భరిస్తున్నారు. అరకొర నిధులతో సతమతం పోలీసు స్టేషన్లల్లో భద్రపరిచిన ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు, పరీక్షల అనంతరం జవాబు పత్రాలను తపాలా కార్యాలయానికి తరలించేందుకు రవాణా ఖర్చులు, కొవ్వొత్తులు, దారం, లక్క, స్టాప్లర్లు, స్కెచ్ పెన్నులు, గమ్, వైట్నర్ తదితర స్టేషనరీ కొనుగోలు తడిసి మోపెడవుతోంది. తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం, ఉర్దూ మీడియంల జవాబు పత్రాల కోసం వేర్వేరు సంచులను వాడుతున్నారు. ఒక్కో సంచి కోసం రెండు నుంచి మూడు మీటర్ల వరకు వస్త్రాన్ని వాడాల్సి వస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణకు సంబంధించి కంటింజెంట్ చార్జీలను పెంచాలని కూటమి ప్రభుత్వానికి పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. సాధారణంగా ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే ప్రస్తుతం పరీక్ష నిర్వహణ కింద ఇస్తున్న ఒక్కొ విద్యార్థికి రూ.10 చొప్పున 100 మందికి సంబంధించి కేవలం రూ.వెయ్యి మాత్రమే అందుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చుకుంటే అన్ని ఖర్చులు కలిపితే రూ.5వేలకు పైగా అవుతుంది. దీంతో ప్రభుత్వం చెల్లించిన రూ.వెయ్యి పోను మిగిలిన రూ.4 వేలను సీఎస్లే భరించాల్సి వస్తోంది. సీఎస్, డీఓలకు అరకొర భృతి ప్రతి పరీక్ష కేంద్రానికి ఓ సీఎస్, డీఓను నియమించారు. 240మంది విద్యార్థులకు మించి ఉన్న కేంద్రానికి అదనంగా డీఓలు ఉంటున్నారు. సీఎస్లు, డీఓలు, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లకు రూ.150 నుంచి రూ.200ల భృతి కేటాయించాలన్న డిమాండ్ను సైతం ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణకు పెద్దగా తేడా లేకపోయినప్పటికి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఇన్విజిలేటర్లకు రూ.150 చెల్లిస్తుండగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్లకు కేవలం రూ.33 మాత్రమే చెల్లిస్తున్నారు. వాటర్ బాయ్కి రూ.17లు, అటెండర్కు రూ.20లు చొప్పున భృతి చెల్లిస్తున్నారు. అరకొర భృతి చెల్లింపులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భృతి పెంచాలి ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ ఖర్చులు, భృతిని ప్రభుత్వం పెంచాలి. సీఎస్లు, ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ ఆధికారులకు రోజుకు రూ.150 నుంచి రూ.200 భృతి చెల్లించాలి. కంటిజెన్సీ నిధులనూ పెంచాలి. – శివశంకరయ్య, ఉద్యోగ, ఉపాధ్యాయ సేవా సంఘం కన్వీనర్, తాడిపత్రి -
‘నారాయణ స్కూల్ను సీజ్ చేయాలి’
రాయదురంటౌన్: ముందస్తు అడ్మిషన్లతో పాటు విద్యా సంవత్సరం పూర్తి కాకనే 9వ తరగతి విద్యార్థులకు టెన్త్ సిలబస్ బోధిస్తున్న నారాయణ విద్యా సంస్థను తక్షణమే సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఈఓ నాగమణికి ఫిర్యాదు చేయడంతో గురువారం ఆమె క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఆమె వెంట విద్యార్థి సంఘాల నాయకులు బంగి శివ, ఆంజనేయులు, కార్తీక్, వలి, నవీన్, మహబూబ్బాషా ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులతో ఎంఈఓ మాట్లాడారు. నిబంధనలు ఉల్లఘించి పుస్తకాలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. పుస్తకాలు నిల్వ ఉంచిన గదిని సీజ్ చేశారు. జిల్లాలోని నారాయణ విద్యా సంస్థలు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నా, ఆ కళాశాల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో ఎంత మాత్రం చలనం లేదని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నారాయణ విద్యాసంస్థలను మూసేయాలని డిమాండ్ చేశారు. యువకుడి ఆత్మహత్య అనంతపురం సిటీ: జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని అశోక్నగర్ రెండో క్రాస్లో నివాసముంటున్న అమ్మినేని వెంకటనాయుడు, రమాదేవి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు తరుణ్కుమార్(28) ఉన్నారు. కుమార్తె సాఫ్ట్వేర్ ఇంజినీర్గా అహమ్మదాబాద్లో పనిచేస్తున్నారు. తరుణ్కుమార్ ఎంబీఏ చదువుతూ మధ్యలోనే ఆపేసి, ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో పలు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన అవకాశాలు దక్కలేదు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. చివరకు మద్యం కొనుగోలుకు డబ్బు కావాలంటూ తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి మద్యానికి అవసరమైన డబ్బు కోసం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినా తరుణ్కుమార్... నేరుగా మారుతీనగర్ సమీపంలోని రైలు పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంకటనాయుడు, రమాదేవి అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతుడిని తరుణ్కుమార్గా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
దళిత ఉద్యోగిపై టీడీపీ నేత జులం
శింగనమల: దళితురాలైన ఓ మహిళా ఉద్యోగిపై టీడీపీ నేత తన దూకుడు ప్రదర్శించాడు. చెప్పుతో కొట్టమంటూ భార్యను రెచ్చగొట్టి వివాదానికి తెర దీశాడు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాలు... శింగనమల వెలుగు కార్యాలయంలో దళితురాలైన సరస్వతి సీసీగా పనిచేస్తోంది. శింగనమలలోని చితంబరస్వామి మహిళా సంఘం సభ్యురాలు వెంకటలక్ష్మి తన గ్రూపులోని సభ్యురాలు భారతి పేరుపై ఇప్పటికే రూ.50 వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో పొదుపులో నుంచి మరో రూ.10 వేలు తీసుకునేందుకు వెంకటలక్ష్మి సిద్ధమైంది. దీంతో గురువారం సీసీని కలసి సంప్రదించింది. ఇప్పటికే మహిళా సంఘాల్లో అక్రమాలు బయటపడుతున్నాయని, ఒకరి పేరు మీద మరొకరు రుణం తీసుకోవడం సరికాదని సీసీ తెలిపింది. తీసుకునే రుణమేదో వ్యక్తిగత పేరుపైనే తీసుకోవాలని సూచించింది. దీంతో తన ఖాతా హోల్డ్లో ఉండడంతో బంధువైన భారతి పేరుపై తీసుకుంటున్నట్లు వెంకటలక్ష్మి సర్దిచెప్పింది. దీంతో భారతి పేరుపై పొదుపు రుణాన్ని తాను తీసుకుంటున్నట్లు తీర్మానంలో రాసుకుని వస్తే పని పూర్తి చేస్తానని సీసీ తెలపడంతో వెంకటలక్ష్మి ఇంటికి వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత తన భర్త ఆదినారాయణ (రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్)ను వెంటబెట్టుకుని కార్యాలయానికి వచ్చిన వెంకటలక్ష్మి... తీర్మానం కాపీపై సీసీతో సంతకం చేయించుకుని తిరుగు ప్రయాణమైంది. అయితే అప్పటికే కార్యాలయం బయట వేచి ఉన్న ఆదినారాయణ... సీసీని బయటకు రమ్మంటూ కేకలు వేయడంతో ఆయనకు సర్దిచెప్పి పిలుచుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినా ఆయన గట్టిగా దుర్భాషలాడుతూ కేకలు వేస్తుండడంతో సీసీ సరస్వతి కార్యాలయం బయటకు వచ్చింది. ఆమెను చూడగానే తన భార్యను చూస్తూ ‘చెప్పు తీసుకుని దాన్ని కొట్టు’ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వారు వారించబోతే ‘చెప్పుతో కొడతా.. మెట్టుతో కొడతా.. నన్నేవరూ ఏమీ చేసుకోలేరు’ అంటూ .. మరింత రెచ్చిపోయాడు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చెప్పుతో కొట్టమంటూ భార్యను రెచ్చగొట్టిన వైనం -
●రోడ్డెక్కిన గాంధీ
నోటుపై గాంధీ.. నడిరోడ్డుపై ఏందీ? ఆకలి దప్పులు.. రోజూ తిప్పలు పచ్చడి మెతుకుల కోసం.. తప్పని జీవన సమరం దేహానికి రంగులు.. దేహీ అంటు వేడుకోలు సమాజమా.. సిగ్గనిపిస్తోందా అయ్యో అనక... శాశ్వత పరిష్కారం చూపు ... గురువారం ఖాద్రీశుడి రథోత్సవంలో కనిపించిన ఈ చిన్నారి గాంధీను చూసి కొందరు అయ్యో అంటే.. మరికొందరు ఆహా అంటూ ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
అట్టహాసంగా ఫుట్బాల్ టోర్నీ ప్రారంభం
అనంతపురం: ఏపీఎల్ క్రికెట్ తరహాలోనే ఫుట్బాల్లో ఏపీ సూపర్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీ గురువారం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను 8 జోన్లుగా విభజించి 8 క్లబ్బులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో వంశధార ఫుట్బాల్ క్లబ్ (శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలు), విశాఖపట్నం ఫుట్బాల్ క్లబ్ (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలు), గోదావరి ఫుట్బాల్ క్లబ్ ( తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు), కొల్లేరు ఫుట్బాల్ క్లబ్ (ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు), నల్లమల ఫుట్బాల్ క్లబ్ (గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలు), కోరమాండల్ పుట్బాల్ క్లబ్ (నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు), పెన్నా ఫుట్బాల్ క్లబ్ (కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు), తుంగభద్ర క్రికెట్ క్లబ్ (అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలు) ఉన్నాయన్నారు. ఒక్కో క్లబ్ నుంచి స్థానిక 11 మంది ఫుట్బాల్ క్రీడాకారులు, మరో 11 మంది ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు ప్రాతినిథ్యం కల్పించినట్లు వివరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీని విజయవంతం చేయాలని కోరారు. ● తొలి రోజు జరిగిన ఉత్కంఠ పోరులో పెన్నా, కోరమండల్, కొల్లేరు, వంశధార జట్టు గెలుపొందాయి. తొలి మ్యాచ్లో తుంగభద్ర ఫుట్బాల్ క్లబ్తో తలపడిన పెన్నా ఫుట్బాల్ క్లబ్ జట్టు 2–4 గోల్స్ తేడాతో విజయాన్ని కై వసం చేసుకుంది. రెండో మ్యాచ్లో నల్లమల క్లబ్తో తలపడిన కోరమాండల్ క్లబ్ జట్టు ఆటలో ఆధిపత్యం కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో గోదావరి క్లబ్ జట్టుపై కొల్లేరు క్లబ్ జట్టు మూడు గోల్స్ సాధించి ఘన విజయం సాధించింది. అలాగే విశాఖ జట్టుపై తలపడిన వంశధార క్లబ్ జట్టు వరుసగా మూడు గోల్స్ సాధించి విజయకేతనం ఎగురవేసింది. -
ఊర పిచ్చుక.. ఊరికే అందం
ఒక ఊరిలో పిచ్చుక కనిపిస్తే ఆ ఊరు పచ్చగా ఉన్నట్లు గ్రామీణులు ఓ అంచనా వేస్తుంటారు. పిచ్చుకలు కనిపిస్తున్నాయంటే ఆ ఊరిలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నట్లు.. పంటలు బాగా పండుతున్నట్లు భావిస్తారు. పంట చేలల్లో రైతులను ఇబ్బంది పెట్టే క్రిమికీటకాలను తింటూ ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి వాటిబారి నుంచి మనల్ని కాపాడతాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉండే పిచ్చుకల సంఖ్య నేడు గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పిచ్చుకల జాతి పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా 2010 నుంచి ఏటా మార్చి 20న ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ నిర్వహిస్తూ వాటి మనుగడ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అనంతపురం కల్చరల్: ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు కనిపించేవి. మిగతా పక్షులకు భిన్నంగా ఊర పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా కలిసి పోయేవారు. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుండే పిచ్చుకలు నేడు వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేడియేషన్, శబ్ద కాలుష్యాల దెబ్బకు ఎక్కడికక్కడ రాలిపోతున్నాయి. దీంతో పర్యావరణాన్ని కాపాడే పిచ్చుకల జాతి సంరక్షణకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరించిపోతున్న సంప్రదాయం ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే శుభం జరుగుతుందని పూర్వీకులు భావించి, వాటిని మురిపెంగా పిలుస్తూ ధాన్యాలను వెదజల్లేవారు. ఇళ్లు, ప్రార్థనా మందిరాల్లో పావురాలు, పిచ్చుకలు యథేచ్ఛగా సంచరించేవి. ఇప్పుడవన్నీ భూతద్దం పెట్టి వెతికినా కానరావు. రోజురోజుకూ పెరిగిపోతున్న మానవుడి స్వార్థం కారణంగా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం కనుమరుగవుతోంది. జిల్లాలో పంటల సాగులో రసాయనిక మందుల వినియోగం పెరిగిపోవడం కూడా పక్షి జాతి అంతరించేందుకు కారణమవుతోంది. ముఖ్యంగా సెల్ఫోన్ల వాడకం పెరిగిపోయే కొద్దీ పిచ్చుకల జాతి క్రమంగా అంతరించిపోతూ వస్తోంది. నానాటికీ తగ్గుతున్న పర్యావరణ సమతుల్యత పక్షి జాతిని నేటి తరానికి దూరం చేస్తోంది. ఇలాంటి తరుణంలో పిచ్చుకల సంరక్షణకు మేము సైతం అంటూ పలువురు ముందుకొస్తున్నారు. కృత్రిమ గూళ్లను ఉచితంగా అందిస్తున్నారు. మలమల మాడ్చేస్తున్న వేసవి నుంచి కాపాడుకునేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు చోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఊరంతా పిచ్చుక గూళ్లు ఊర పిచ్చుకలకు మిగిలిన పక్షులకు చాలా తేడా ఉంటుంది. ఊర పిచ్చుకలు మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. దీంతో ఒకప్పుడు ఊరంతా పిచ్చుక గూళ్లు కనిపించేవి. ఆహారం కోసం, నివాసం కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి. పొలాల్లో ఎగురుతూ పంట నష్టాలకు కారణమైన క్రిమికీటకాలను ఆరగిస్తాయి. పిచ్చుక చిన్నదే అయినా దాని ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం పిచ్చుకల మనుగడకు ప్రతిబంధకం కారాదని పక్షి ప్రేమికులు అంటున్నారు. పిచ్చుకల సంరక్షణకు అనంతపురానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త ఏజే అనిల్కుమార్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 1.40 లక్షల కృత్రిమ గూళ్లను ఇంటింటికి అందించి, పిచ్చుకల పునరుత్పత్తికి దోహదపడేలా చర్యలు తీసుకున్నారు. పిచ్చుకల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో అనంత ఖ్యాతిని పతాక స్థాయిలో మెరిసేలా చేసింది. పర్యావరణానికి దోహదపడే పిచ్చుకలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఆ దిశగా అందరూ ప్రయాణం సాగించాలని అనిల్కుమార్రెడ్డి పిలుపునిస్తున్నారు. సందర్భంనేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
తల్లి అంత్యక్రియలకు వెళితే.. ఇల్లు దోచేశారు
తాడిపత్రి: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన కుమార్తె ఇంటిని దుండగులు దోచేశారు. తాడిపత్రి మండలం బందార్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన రసూల్బీ అనంతపురంలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద విషయం తెలియగానే ఆమె కుమార్తె షేక్ హనీఫా ఇంటికి తాళం వేసి తన భర్తతో కలసి మంగళవారం రాత్రి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకుంది. బుధవారం తల్లి మృతదేహాన్ని తాడిపత్రికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కుమార్తె హనీఫా తన స్వగ్రామం బందార్లపల్లికి చేరుకుంది. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ఆమె ఆందోళనతో లోపలకు వెళ్లి పరిశీలించింది. బీరువాలోని బంగారు నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. భాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘పీఎస్హెచ్ఎంల సమస్యలు పరిష్కరించండి’
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (పీఎస్హెచ్ఎం) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పీఎస్హెచ్ఎం అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబును బుధవారం కలసి వినతిపత్రం అందజేశారు. పంచాయతీ ఆదర్శ పాఠశాలల్లో పీఎస్హెచ్ఎం పోస్టును కేటాయించాలని కోరారు. 117 జీఓ అమలుతో ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు విలీనమై, తప్పని పరిస్థితుల్లో ఇతర పాఠశాలలకు బదిలీ అయిన పీఎస్హెచ్ఎంలకు ఈ ఏడాది జరిగే బదిలీల్లో పాత స్టేషన్ నుంచి గరిష్టంగా 8 ఏళ్ల సర్వీస్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పీఎస్హెచ్ఎం ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షులు గోసల నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి రమణ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు పి. వెంకటరమణ, మర్రిస్వామి, ఆర్థిక కార్యదర్శి ఎ.ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు కమతం ఈశ్వరయ్య, మురళీ ప్రసాద్, జనార్ధన రెడ్డి, రాజేంద్ర, గంగరాజు ఉన్నారు. -
లైనింగ్ పనులు ఆపకపోతే పోరుబాట తప్పదు
ఆత్మకూరు: రైతులకు నష్టం చేకూర్చే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపకపోతే పోరుబాట తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఆత్మకూరు మండలం పంపరూరు తండా వద్ద హంద్రీ–నీవా కాలువను బుధవారం ఆయన పరిశీలించారు. యంత్రాల సాయంతో సాగుతున్న పనులను గమనించి అక్కడి కాంట్రాక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసే పనులతో పాటు పంట కాలువల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అలా కాదని రైతులకు నష్టం చేకూర్చేలా లైనింగ్ పనులు చేస్తామంటే కుదరదన్నారు. లైనింగ్ పనులు అడ్డుకునేందుకు ఎంతకై నా సిద్ధమని, అవసరమైతే యంత్రాలను పగులగొడతామని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల్లోని దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. వెంటనే లైనింగ్ టెండర్లను రద్దు చేసి, కాలువను పదివేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి వెడల్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు చంద్రిక, రామాంజినమ్మ, శివశంకర్ పాల్గొన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి -
కళింగరతో జాగ్రత్త
అనంతపురం అగ్రికల్చర్: ‘‘మండు టెండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎర్రగా కనిపిస్తూ నిగనిగలాడుతున్న కళింగర (పుచ్చకాయ), కర్భూజాలాంటివి తింటున్నారా? అయితే ముందు మీ ఆరోగ్యగం గురించి కూడా కొంచెం ఆలోచించండి’ అంటూ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు (95812 75717) ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటీవల కల్తీ, నాసిరకంతో పాటు విషపూరితమైన రసాయన మందులతో మాగబెట్టిన పండ్లు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారు. ఇందులో కళింగర కూడా ఉందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి దాహాన్ని తీర్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్న కళింగర కాయ సహజమైన రంగా లేదంటే కృత్రిమ రసాయనాలు కలిపిన పండా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ● పక్వానికి రాని కళింగరలను, ఎర్ర రంగు రాని వాటికి సిరంజిల ద్వారా కృత్రిమ రసాయనాలను ఎక్కిస్తున్నారు. రసాయనాలు ఎక్కించిన కాయ లోపలి భాగం మామూలు కన్నా మరీ ఎర్రగా ఉంటుందన్నారు. లేదంటే నిర్ధిష్ట గడువు కంటే ముందుగానే మాగడం జరిగి ఉంటుందన్నారు. దీని వల్ల సహజంగా లభించే పోషకాలు అందక, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. ● సహజంగా పండిన కాయలో మృదువైన ఎరుపు లేదా గులాబీరంగు ఉంటుంది. అదే రసాయనాలు కలిపిన వాటిలో డార్క్ రెడ్, బ్లడ్ రెడ్ రంగులో ఉంటాయి. అంతేకాక ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కళింగర కాయ కోసి ముక్కలు నీటిలో వేస్తే నీరు ఎరుపు రంగులోకి మారితే రసాయనాలు కలిపినట్లుగా నిర్ధారించుకోవచ్చు. అలాగే కాయ తిన్న తర్వాత చేతులకు ఎరుపు రంగు అంటి, అది తుడిచినా అలాగే ఉంటే రసాయనాలు కలిపినట్లు గుర్తించాలి. సహజంగా పండిన పుచ్చకాయ తీపిగా తేలికగా ఉంటుంది. కృత్రిమ రంగు వేసినది కొంచెం చేదు రుచి వస్తుంది. ● పుచ్చకాయ పైభాగం పచ్చగా ఉండాలి, మెరుస్తూ ఉండకూడదు. తక్కువ గ్రీన్ కలర్ ఉన్నదే మంచిదని గుర్తించాలి. కాయ నేలపై ఉండే భాగం పసుపు రంగులో ఉండాలి. అలాగే ఆకారంలో గుండ్రంగానూ, సమంగానూ ఉంటే మంచిది. ఎడమొడిగా ఉంటే బాగా లేదని అర్థం. కండ పట్టిన భాగం పచ్చగా ఉంటే ఇంకా పక్వానికి రాలేదని గుర్తు. పొడిగా, గోధుమ రంగులో ఉంటే పండిందని తెలుసుకోవాలి. కట్ చేసిన కాయ గాఢ ఎరువు రంగులో ఉండకూడదు. ● రసాయనాలు కలిపిన పుచ్చకాయను తినడం వల్ల అలర్జీ, డయేరియా బారిన పడటమే కాకుండా దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీల సమస్య తలెత్తవచ్చు. క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. రసాయనాలు వాడి ఎర్రగా ఆకర్షణీయంగా మార్చేస్తున్న దుస్థితి -
ఆర్థిక ఇబ్బందులతో మాజీ వలంటీర్ ఆత్మహత్య
గుత్తి: తల్లి ఆపరేషన్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక గ్రామ సచివాలయ మాజీ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరిమానుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు, మణెమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామ సచివాలయ వలంటీర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే తన తల్లికి శస్త్రచికిత్స అవసరం కావడంతో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈలోపు రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వలంటీర్ వ్యవస్థను సీఎం చంద్రబాబు రద్దు చేయడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న పెన్నా సిమెంట్స్ పరిశ్రమలో పనిలోకి చేరాడు. ఈ క్రమంలోనే తమ అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో దిక్కుతోచని మహేంద్ర (26) నాలుగు రోజుల క్రితం ఫ్యాక్టరీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బుధవారం ఉదయం గుత్తి రైల్వేస్టేషన్కు చేరుకున్న మహేంద్ర...జీఆర్పీ స్టేషన్ ఎదుట అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి ఆచూకీని గుర్తించిన జీఆర్పీ ఎస్ఐ నాగప్ప సమాచారంతో మహేంద్ర తల్లిదండ్రులు గుత్తికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆర్థిక సమస్యలతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రెండో విడత 62 గ్రామాల్లో రీ–సర్వే
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత ప్రభుత్వం చేపట్టిన రీ–సర్వే ప్రక్రియను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా తొలి దశలో పైలెట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం చొప్పున 31 మండలాల పరిధిలో 31 గ్రామాల్లో రీ–సర్వే చేపట్టారు. ఇదే క్రమంలో రెండో దశ కింద 62 గ్రామాల్లో రీ–సర్వేకు చర్యలు ప్రారంభించినట్లు సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్ తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 32 మండలాల్లో ఉన్న 503 గ్రామాలకు సంబంధించి 25,17,658.52 ఎకరాల రీ సర్వేకు గత ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. గ్రామాల్లో డ్రోన్లతో ఓఆర్ఐ (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) చిత్రాలను తీశారు. 499 గ్రామాలకు సంబంఽధించి ఓఆర్ఐలు సిద్ధంగా ఉన్నాయి. అదే క్రమంలో 198 గ్రామాల్లోని 5,88,615.626 ఎకరాలు సర్వే పూర్తి చేశారు. మిగిలిన 305 గ్రామాల్లో రీ–సర్వే చేయనున్నారు. అంతా పక్కాగా : గత ప్రభుత్వంలో భూముల రీ–సర్వే ప్రక్రియ పక్కాగా జరిగింది. 503 గ్రామాలకు గాను 198 గ్రామాల పరిధిలోని 1,83,353 భూ కమతాలకు సంబంధించి 5,88,615.626 ఎకరాలు సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో అధికారులు సభలను నిర్వహించగా, 1,83,353 భూ కమతాలకు గానూ 5,421 ఫిర్యాదులు (0.03 శాతం) మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే సర్వే పక్కాగా జరిగిందని అర్థమవుతోంది. గ్రామసభలు..: గత ప్రభుత్వం సర్వం సిద్ధం చేయడంతో పాటు 198 గ్రామాల్లో సర్వే కూడా పూర్తి చేసింది. దీంతో ప్రస్తుతం రీ–సర్వే సజావుగా జరగనుంది. ఆయా గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. సర్వే, భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్ -
22న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 22న నిర్వహించనున్నారు. అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని ప్రధాన, అదనపు సమావేశ భవనాల్లో సమావేశాలుంటాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/ఇంజినీరింగ్ విభాగాలు/గ్రామీణాభివృద్ధి/ విద్య, వైద్యం) సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా చైర్పర్సన్ల అధ్యక్షతన డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య నేతృత్వంలో జరుగుతాయి. స్కూళ్లలో లాంగ్వేజ్ ఫెస్టివల్స్, సైన్స్, మ్యాథ్స్ క్లబ్స్ అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో లాంగ్వేజ్ ఫెస్టివల్స్, సైన్స్, మ్యాథ్స్ క్లబ్స్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 364 సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో లాంగ్వేజ్ ఫెస్టివల్స్, 198 సెకండరీ, 325 ఎలిమెంటరీ పాఠశాలల్లో సైన్స్ అండ్ మాథ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. లాంగ్వేజ్ ఫెస్టివల్స్ కోసం ఒక్కో పాఠశాలకు రూ. 500 చొప్పున రూ.1.82 లక్షలు, సైన్స్, మాథ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయడానికి ఒక్కో పాఠశాలకు రూ. వెయ్యి చొప్పున రూ. 1.98 లక్షలు జమ చేశామన్నారు. సైన్స్, మ్యాథ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయడానికి ఒక్కో పాఠశాలకు రూ. వెయ్యి చొప్పున రూ. 3.25 లక్షలు మండల విద్యాధికారులకు విడుదల చేసినట్లు వెల్లడించారు. మండల విద్యాధికారులు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని, ప్రధానోపాధ్యాయులు లాంగ్వేజ్ ఫెస్టివల్స్ నిర్వహించి, సైన్స్ అండ్ మాథ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఆరు నెలల జైలు అనంతపురం: మహిళను అవమానపరచడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొండమ్మను అదే గ్రామానికి చెందిన ఓబుళరాజు 2019 మే 23న బహిరంగ ప్రదేశంలో అవమానించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్కు పంపారు. కేసులో సాక్షులను బుధవారం అనంతపురం మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ సుజిన్ కుమార్ విచారించారు. నేరం నిరూపణ కావడంతో ముద్దాయి ఓబుళ రాజుకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 4 వేల జరిమానా విధించారు. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి. శ్రీనివాసులు, సీఐ ఎం. కరుణాకర్, కోర్టు కానిస్టేబుల్ రమణను ఎస్పీ పి. జగదీష్ అభినందించారు. -
రెవెన్యూ పనితీరు బాగుండాలి
అనంతపురం అర్బన్: ‘క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖ పనితీరు బాగుండాలి. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీలు, ఇతర సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ‘సాక్షి’లో ఈనెల 18న ‘‘ప్రజా ప్రదక్షిణ వేదిక’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి ఆర్డీఓలు, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఎస్ఆర్ఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సేవా సర్వీసెస్కు సంబంధించి పెండింగ్ ఉన్న అంశాలను పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్ ఫర్ కరెక్షన్, ట్రాన్సాక్షన్లు, ఏపీ డాటెడ్ ల్యాండ్ దరఖాస్తులు, రీవోక్ సర్టిఫికెట్లు, ఈ–పాస్ బుక్ సర్వీసెస్, మొబైల్ నెంబర్, పట్టాదార్ ఆధార్ సీడింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలన్నారు. చుక్కల భూములకు సంబంధించి ఈనెల 29న కూడేరు మండలం, ఏప్రిల్ 5న బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 12న రాప్తాడు తదితర మండలాల పరిధిలోని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దారు కార్యాయాల్లో మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రహరీ, గేటు, నీటి సదుపాయం, మహిళలు, పురుషులకు మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఎస్డీసీ తిప్పేనాయక్, సర్వేశాఖ ఏడీ రూప్లానాయక్, తదితరులు పాల్గొన్నారు. ‘పది’ కేంద్రాల్లో సమస్యలు తలెత్తకూడదు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఏ చిన్న సమస్య తలెత్తకూడదని కలెక్టర్ వినోద్కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం నగరంలోని శ్రీచైతన్య పాఠశాలలోని కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష నిర్వాహణకు 135 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 30 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 07 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 1,403 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు, అనంతపురం అర్బన్ తహశీల్దార్ హరిబాబు ఉన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ -
అర్చకుల వేదమంత్రాలు.. లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాలు... బ్రహ్మదేవుడే సారథిగా మారి రథాన్ని నడిపే తీరు... ప్రహ్లాద సమేత కాటమరాయుడి వైభవం కనిన భాగ్యము. ఈ అపురూప ఘట్టానికి అంతా సిద్ధమైంది. కదిరిలో ఆధ్యాత్మిక భక్తజన తరంగం పోటెత్తుతోంది. బ్రహ్మాండనాయకుడైన ఖ
● నేడు ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి బ్రహ్మ రథోత్సవం ● దేశంలోనే మూడవది, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రథం ● లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా ఐరావత వాహనంపై వసంత వల్లభుడు వసంత వల్లభుడిగా పేరు గాంచిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఐరావతం (గజవాహనం)పై దర్శనమిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఐరావతంపై కాటమరాయుడి కమనీయ రూపాన్ని చూసి తరించారు. అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లి పూజలందుకున్నారు. కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7.45 నుంచి 8.20 గంటల మధ్య అనూరాధా నక్షత్రంలో మేష లగ్న పుష్కరాంశంలో తేరును ప్రారంభించేందుకు ఆలయ అర్చక పండితులు శుభ ముహూర్తంగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. తేరుపై కాటమరాయుడి వైభవాన్ని కనులారా చూసేందుకు భక్తులు లక్షలాదిగా ఇప్పటికే కదిరికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల్లోని భవనాలన్నీ భక్తులతో కిటకిటలాడి పోతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు కూడా చోటు లేదు. బ్రహ్మదేవుడే రథసారథి.. బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. శ్రీవారి రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు. దేశంలోనే మూడవ పెద్ద తేరు.. తమిళనాడు అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతి పెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బ్రహ్మ రథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో పాటు 8 అడుగుల డయామీటర్తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళా కృతులను టేకుతో అందంగా చెక్కారు. -
జిల్లాలో ఇలా.. మద్యం షాపులు 136 బార్లు 19 బెల్టుషాపులు 1,155 పర్మిట్ రూములు 70
● ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం ఇప్పేరులో 1,100 ఓట్లు ఉంటాయి. ఇలాంటి చిన్న ఊర్లోనే 3 బెల్టుషాపులు నడుస్తున్నాయి. 24 గంటలూ మద్యం లభిస్తోంది. ● తాడిపత్రి నియోజకవర్గం పుట్లూరు మండల పరిధిలో ఎల్లుట్ల గ్రామం ఉంది. తక్కువ జనాభా ఉన్నా 2 బెల్టుషాపులు నిరంతరం నడుస్తూనే ఉంటున్నాయి. ● రాప్తాడు నియోజకవర్గం బండమీదపల్లెలో సుమారు 10 బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతగ్రామం ఇది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో గ్రామాలు మద్యం మత్తులో మునిగి తేలుతున్నాయి. ప్రతి పల్లెలోనూ రెండు లేదా మూడు బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. వేళాపాళా లేకుండా 24 గంటలూ బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. దీంతో 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకూ మద్యం మత్తులోనే జోగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో బెల్టుషాపులు లేకపోవడం, మద్యం షాపులకు కచ్చితమైన వేళలుండటం వల్ల మద్యం పూర్తిగా నియంత్రణలో ఉండేది. ఇప్పుడు మద్యం షాపులకు పట్టపగ్గాలు లేవు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలవే మద్యం షాపులు కావడం, బెల్టుషాపులు టీడీపీ కార్యకర్తలకే ఇవ్వడంతో ప్రశ్నించే అధికారి లేకుండా పోయారు. అర్బన్లో పర్మిట్ రూములు.. పల్లెలన్నీ బెల్టుషాపుల కారణంగా మత్తులో జోగుతుంటే పట్టణాలు పర్మిట్ రూములతో తూగుతున్నాయి. వైన్షాపు ఉన్న ప్రతిచోటా పర్మిట్ రూము ఏర్పాటు చేసి అక్కడే తాగిస్తున్నారు. అనంతపురంలో జిల్లా ఎస్పీ ఇంటికి కూతవేటు దూరంలోనే పర్మిట్ రూము నడుస్తున్నా అడిగేవారు లేరు. అనంతపురం అర్బన్లో 30 వైన్ షాపులకు పైగా ఉంటే అన్నింటా పర్మిట్ రూములు ఏర్పాటయ్యా యి. ప్రతి రూమూ బార్ను తలపిస్తోంది. అర్ధరాత్రి తలుపు తట్టినా అనంతపురంలో ఓ నాయకుడి వైన్షాపు నుంచి మద్యం లభిస్తోంది. అంతేకాదు ఉదయం 10 గంటలకు తెరవాల్సిన మద్యం షాపులు రాప్తాడు, తాడిపత్రి లాంటి నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకే తెరుస్తున్నారు. భారీగా మద్యం వినియోగం.. జిల్లాలోనే అనంతపురం అర్బన్లో ఎక్కువ మద్యం వినియోగమవుతున్నట్టు తేలింది. తాజా మద్యం అమ్మకాలు పరిశీలిస్తే 33 శాతం అమ్మకాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే జరిగాయి. జిల్లాలో గత ఆరు నెలల్లో రూ.444.86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఒక్క అనంతపురం టౌన్లోనే రూ.150.46 కోట్ల వ్యాపారం జరిగింది. దీన్నిబట్టి ఇక్కడ పర్మిట్రూముల ప్రభావం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. మద్యం మత్తులో గ్రామాలు ప్రతి పల్లెలో రెండు లేదా మూడు బెల్టుషాపులు నియోజకవర్గ కేంద్రాల్లో వైన్షాపులకు అనుబంధంగా పర్మిట్రూములు మెజారిటీ షాపులు అధికార పార్టీ ఎమ్మెల్యేలవే.. అనంతపురం అర్బన్లో బార్లను తలపిస్తున్న రూములు ఆరు మాసాల్లో జిల్లాలో రూ.444 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు -
పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే!
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు. అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి. దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది. మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం :::సిమ్మాదిరప్పన్న -
టీడీపీ నేతల హల్చల్.. బ్రహ్మోత్సవాల్లో అసభ్యకరంగా నృత్యాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో పచ్చ నేతల బరితెగింపు పీక్ స్టేజ్కు చేరుకుంది. లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అసభ్యకర నృత్యాలు చేస్తూ టీడీపీ నేతలు హల్చల్ చేశారు.వివరాల ప్రకారం.. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం సోమగట్ట గ్రామం శ్రీ మధుగిరి లక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సందర్బంగా టీడీపీ నేతలు హల్చల్ చేశారు. బ్రహ్మోత్సవాల్లో టీడీపీ నేతలు అసభ్యకరంగా నృత్యాలు చేశారు. రికార్డింగ్ డాన్సర్లతో కలిసి టీడీపీ నేత తిప్పారెడ్డి స్టెప్పులు వేశారు. దీంతో, టీడీపీ నేత తీరుపై భక్తులు మండిపడుతున్నారు. దేవుడి బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల ఓవరాక్షన్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
పేదల బియ్యంపై పందికొక్కులు!
12అనంతపురం అర్బన్: పేదల బియ్యాన్ని కొందరు అధికారులు, సిబ్బంది పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు. యథేచ్ఛగా నొక్కుడు వ్యవహారం సాగిస్తున్నారు. నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాలు.. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్ల ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యం రవాణా చేస్తారు. జిల్లాలోని 6.60 లక్షల కార్డుదారులకు 9,800 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 800 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల అధికారులు, సిబ్బంది దందాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం సంచి బరువు (టెయిర్ వెయిట్) కింద ఒక కిలో, తరుగు కింద మరో కిలో, అదనంగా క్వింటాలుకు మరో కిలో దోచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నల్లబజారుకు... ఎంఎల్ఎస్ పాయింట్లలో నెలసరి మిగుల్చుకుంటున్న దాదాపు 20 వేల కిలోల (20 టన్నులు) బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కోటాలో కోత గురించి మాట్లా డితే అధికారుల నుంచి తలనొప్పులు వస్తాయంటూ కొందరు డీలర్లు మిన్నకుండిపోతున్నారు. మరికొందరు ఈ విషయంపై మాట్లాడేందుకు కూడా జంకుతున్నారు. అయితే, బియాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే క్రమంలో ‘సర్దుబాటు’ చేసుకుంటున్నామని ఓ డీలర్ చెప్పడం గమనార్హం. సంచి తూకం ఇవ్వాల్సి ఉన్నా.. డీలర్లకు బియ్యం సరఫరా చేసే క్రమంలో కోటా ప్రకారం క్వింటాలు టెయిర్ వెయిట్(సంచితూకం) కాకుండా నికరంగా 100 కేజీలు ఇవ్వాలి. క్వింటాలుకు రెండు 50 కిలోల బస్తాలు (గోనె సంచులు) వస్తాయి. ఒక్కొక్క సంచి తూకం 550 గ్రాములుగా రెండు సంచులు 1,100 గ్రాములు ఉంటాయి. ఈ లెక్కన డీలర్లకు క్వింటాలు బియ్యం సంచి తూకంతో కలిసి 101.100 కిలోలు ఇవ్వాలి. అయితే అలా ఇవ్వడం లేదని తెలిసింది. ప్రత్యేకంగా వ్యాపారులు.. గోదాముల్లో డీలర్లకు సరఫరా చేసే కోటా నుంచి నొక్కేస్తున్న బియ్యం నల్లబజారుకు తరలించేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఉన్నట్లు తెలిసింది. గోదాము నుంచి వీరు సరుకును వేరే ప్రదేశాలకు తరలించి, వాటికి కొంత మెరుగుపెట్టి (పాలిష్) బ్రాండెడ్ పేరు ఉన్న సంచుల్లో నింపుతారని సమాచారం. అనంతరం కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చౌక ధరల దుకాణాలు1,645బియ్యం కార్డులు6,60,330జిల్లాలో మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లు పలు ఎంఎల్ఎస్ పాయింట్లలో దందా అధికారులు, సిబ్బంది చేతివాటం క్వింటాలుకు రెండు నుంచి మూడు కిలోల మేర కోత నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం ప్రతి నెలా 20 టన్నుల బియ్యం పక్కదారి! ఫిర్యాదు చేస్తే చర్యలు డీలర్లు తమ కోటా బియ్యాన్ని దగ్గరుండి తూకం వేయించుకుని తీసుకెళ్లాలి. సంచి తూకం తీసివేయించి నికరంగా కోటా బియ్యం తీసుకోవాలి. తక్కువగా ఇస్తున్నట్లు గుర్తిస్తే ఈపాస్లో వేలిముద్ర వేయకూడదు. సంచి తూకం తీసివేయకపోయినా.... కోటాలో తగ్గించి ఇస్తున్నా... నాకు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. – రమేష్రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
ప్రణాళికతో పనిచేస్తేనే ఫలితాలు
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే క్షేత్రస్థాయిలో కచ్చితమైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ వి. వినోద్కుమార్ అన్నారు. లక్ష్యాలను అధిగమించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి పదో తరగతి పరీక్షలు, ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ క్యాంపెయిన్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, డీఎల్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ దారా సమీక్షించారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలను ప్రతి నెలా మూడో శనివారం కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫారం 6, 7 8 పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. వెనుకబడిన తరగతుల గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం గురించి తెలియజేయాలన్నారు. ‘పీఎం జన ఆరోగ్య యోజన’ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. సర్వే అంశాలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్ఓ ఎ.మలోల, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పునర్ వ్యవస్థీకరణ పక్కాగా జరగాలి విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాయదుర్గం నియోజకవర్గ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పాఠశాలల యాజమాన్య కమిటీల ఆమోదంతో ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు. -
గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం రాత్రి ఖాద్రీశుడు మరోసారి గరుడారూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని తరించారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిని నారసింహునికి వాహనంగా పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ..మలి గరుడసేవ అని కూడా అంటారు. -
హెచ్చెల్సీ మరమ్మతులకు రూ.33.89 కోట్లు
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలో మరమ్మతు పనులకు రూ.33.89 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కణేకల్లు చెరువు 3వ స్లూయిస్ నిర్మాణానికి రూ. 22 లక్షలు, హెచ్ఎల్ఎంసీ 147 కిలోమీటరు వద్ద ఔట్ఫాల్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ. 4.20 లక్షలు, 137 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్ మరమ్మతులకు రూ. 1.52 లక్షలు, 169 కిలోమీటరు వద్ద డీఎల్ఆర్బీ నిర్మాణానికి రూ. 1.90 లక్షలు కేటాయించారు. అలాగే, పీఏబీఆర్ రెగ్యులేటర్ నిర్మాణానికి రూ. 4.06 కోట్లు, ఎంపీఆర్ రెగ్యులేటర్కు రూ. 4.07 కోట్లు, 155 కిలోమీటరు వద్ద డీఎల్ఆర్బీ నిర్మాణానికి రూ. 1.47 కోట్లతో పాటు మరో మూడు డీఎల్ఆర్బీ పనులకు మొత్తం రూ. 33.89 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ వివరించారు. కోర్టు ఉత్తర్వుల మేరకే నిర్మాణాల తొలగింపు ● ఆర్డీఓ కేశవనాయుడు రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట 106–1 సర్వే నంబరు పరిధిలోని విద్యారణ్యనగర్లో నిర్మాణాలు కోర్టు ఉత్తర్వుల మేరకే తొలగించామని ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాపంపేట సర్వే నంబరు 106–1లో 68 సెంట్లు, 106–2లో 16 సెంట్లు, 119 సర్వే నంబరులో 1.05 ఎకరాల శోత్రియం భూమిని ఆక్రమించారని, వారి నుంచి విడిపించాలని కోరుతూ 1983లో జీఎల్ కాంతారావు, జి.లక్ష్మీనరసయ్యలు పట్నం చంద్రమౌళేశ్వరరావుతో పాటు 27 మందిపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ (జిల్లా న్యాయ స్థానం, అనంతపురం)లో 120/83 పిటీషన్ దాఖలు చేశారన్నారు. ఈ క్రమంలోనే 1990లో ఏడుగురు ప్రతివాదులను షెడ్యూల్లో కనబరిచిన భూమి నుంచి ఖాళీ చేయించి పిటీషనర్లకు అప్పగించాలని అనంతపురం ఆర్డీఓను 1990 ఏప్రిల్ 16న కోర్టు ఆదేశించిందన్నారు. అప్పట్లోనే ఆర్డీఓ, తహసీల్దార్ పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆక్రమణదారులు భూమిని వదల్లేదన్నారు. 2021లో ప్రిన్సిపల్ కార్యదర్శి, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్పై పిటీషనర్ల వారసులు జి.హరిప్రసాద్, జి.నాగేంద్రబాబు, జీఎల్ఎన్ శ్రావణ్కుమార్ కేసు వేశారన్నారు. విచారించిన హైకోర్టు.. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ 2021 ఏప్రిల్ 28న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆ ఆదేశాల అమలు ఆలస్యం కావడంతో పిటీషనర్లు కంటెమ్ట్ (కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన) కేసు వేశారన్నారు. దీనిపై అప్పటి కలెక్టర్ కౌంటరు దాఖలు చేయగా.. 2024 డిసెంబరు 5న హైకోర్టు తుది తీర్పు ఇచ్చిందన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకున్నామని ఆర్డీఓ స్పష్టం చేశారు. -
హంద్రీ–నీవాకు సమాధి కట్టొద్దు
అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సమాధి కట్టే పనులను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలంటూ జలసాధన సమితి నాయకులు మండిపడ్డారు. మంగళవారం స్థానిక కోర్టు రోడ్డులోని పప్పూరు రామాచార్యుల విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ రామ్కుమార్ మాట్లాడుతూ.. హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలో 6 లక్షల ఎకరాలు, ఉమ్మడి జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాల్సి ఉన్నా నెరవేరడం లేదన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 6,300 క్యూసెక్కులకు కాలువ వెడల్పు చేయాలని నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారన్నారు. అయితే ఆ జీఓను రద్దు చేస్తూ జీడిపల్లి నుంచి కుప్పం వరకూ నీటిని తీసుకుపోవడానికి చంద్రబాబు ప్రభుత్వం లైనింగ్ పనులకు తెరతీసిందన్నారు. పనులను రద్దు చేయాలని ప్రజా, రైతు సంఘాలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు మూలకు పడేశారని విమర్శించారు. 40 టీఎంసీల ‘హంద్రీ–నీవా’ను కుదించి కేవలం రూ. 25 కోట్ల లోపే నిధులు ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అయినా, ప్రాజెక్టులన్నీ తానే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకుంటుండటం సిగ్గుచేటన్నారు. 15 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులకు ఎంత మేర నిధులు ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లైనింగ్ పనులను వెంటనే రద్దు చేయాలని, హంద్రీ–నీవా ప్రయోజనాలకు సమాధి కట్టే 404, 405 జీఓలను వెనక్కు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి వరకూ కాలువను 6 వేల క్యూసెక్కులకు వెడల్పు చేయాలన్నారు. ఓపీడీఆర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, అడ్వొకేట్ అబ్దుల్ రజాక్, కార్యదర్శి ఉపేంద్రకుమార్, అడ్వొకేట్ ప్రకాష్, రైతు కూలీ, ఐఎఫ్టీయూ, పట్టణ పేదల సంఘం నాయకులు నాగరాజు, కృష్ణ, యేసురత్నం, వీరనారప్ప తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుపై జలసాధన సమితి నాయకుల మండిపాటులైనింగ్ పనులు వద్దే వద్దు ఆత్మకూరు: మండలంలోని పంపనూరు సమీపంలో హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులను మంగళ వారం రైతులు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా తరలివచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాలువ లైనింగ్ జరిగితే బోర్లలో నీరు తగ్గి పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంకు నీరు తీసుకెళ్లాలన్న యోచనతో స్థానిక రైతులకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదన్నారు. -
వైఎస్సార్ సీపీకే పూర్తి బలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మేయర్ పీఠం కోసం టీడీపీ దొడ్డిదారి ఎంచుకుంది. కార్పొరేషన్లో ఆ పార్టీకి సంఖ్యాబలం లేదు. అయినా, మేయర్ గిరీని దక్కించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ ఎమ్మెల్సీ ఓటును కొనుగోలు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఓటుకు నోటు’ పద్ధతిని ఎంచుకున్నట్లుగానే.. అనంతపురం ‘పచ్చ’ పార్టీ నేతలు తమ అధినేత దారిలో నడుస్తూ కార్పొరేటర్లకు డబ్బుతో ఎర వేస్తున్నట్లు సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రెండు రోజులుగా పలువురు కార్పొరేటర్లను పిలిచి మాట్లాడుతున్నట్టు తెలిసింది. కార్పొరేషన్లో తమ దందా సరిగా జరగడం లేదని భావించి కుతంత్రాలకు తెరతీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దగ్గుపాటిని నమ్మితే అంతే...! దగ్గుపాటి ప్రసాద్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అధిష్టానం వద్ద అనతి కాలంలోనే చెడ్డపేరు తెచ్చుకున్నారు. నగరాన్ని మద్యంలో ముంచెత్తు తున్నారు. టౌన్లో మెజారిటీ మద్యం షాపులు ఆయనవే. దీనికి తోడు జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా దగ్గుపాటికి పెద్దగా సఖ్యత లేదు. పది నెలల్లోనే రకరకాల వ్యాపారాలు, వసూళ్లకు తెరలేపారనే విమర్శలున్నాయి. ఇక.. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి ఏమైనా జరిగిందీ అంటే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే. కూటమి సర్కారు ఏర్పడిన పది నెలల్లోనే కార్పొరేషన్ను మురుగు మయంగా, అవినీతికి నిలయంగా మార్చారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దగ్గుపాటి మాటలు నమ్మి పార్టీ మారితే ‘కుక్కతోక పట్టుకుని గోదారి ఈదిన’ చందంగా ఉంటుందని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక.. ‘సూపర్ సిక్స్’తో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తక్కువ కాలంలోనే తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. ఈ క్రమంలో నాలుగైదు లక్షల రూపాయల కోసం పార్టీ మారితే తమను నమ్మి ఓటేసిన ప్రజల ఎదుట తల కూడా ఎత్తుకోలేమని పలువురు చెబుతున్నారు. మరోవైపు అనంతపురం నగర పాలక వర్గం గడువు మరో ఏడాదిలో ముగుస్తుంది. ఈ క్రమంలో పార్టీ మారి ఎందుకు చెడ్డపేరు తెచ్చుకోవాలనే భావనలో కొందరు ఉన్నట్లు తెలిసింది.అనంతపురం కార్పొరేషన్లో మొత్తం 50 కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. ఎన్నికల్లో 48 సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. రెండు చోట్ల ఇండిపెండెంట్లు గెలుపొందారు. టీడీపీకి ఒక్క స్థానమూ దక్కలేదు. అయితే, ఆ తర్వాతి క్రమంలో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రస్తుతం ఆ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. వీరందరినీ కలిపినా ఐదు సీట్లు కూడా దాటవు. అయినా, భారీగా డబ్బు ఆశ చూపి కార్పొరేటర్లను లాక్కుని మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ కుట్రలు చేస్తుండటం గమనార్హం. సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ బరి తెగింపు రెండు రోజులుగా కార్పొరేటర్లతో మంతనాలు ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు ఇస్తామంటూ బేరాలు ఎమ్మెల్యే దగ్గుపాటి ఓపెన్ ఆఫర్ పెట్టినట్టు విమర్శలు -
చేయని పనుల బిల్లుల కోసం సర్పంచ్ దౌర్జన్యం
● సచివాలయ కార్యాలయానికి తాళం వేసి నిరసన పేరుతో హైడ్రామా గుంతకల్లు రూరల్: మండలంలోని నక్కనదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ (టీడీపీ మద్దతు) వరలక్ష్మి హైడ్రామాకు తెరలేపారు. చేయని పనులకు బిల్లులు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకెళ్లడమే కాక సచివాలయానికి మంగళవారం తాళం వేసి భర్త బొజ్జానాయక్, తన వర్గీయులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి వైఖరితో పంచాయతీ పరిధిలో అభివృద్ధి కుంటు పడుతోందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. గ్రామంలో రోడ్లు, కాలువలు, స్ట్రీట్ లైట్లు, పారిశుద్ధ్యం తదితర అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సుమలతకు పలుమార్లు చెప్పినా ఆమె పట్టించుకోవడం లేదన్నారు. పైగా గ్రామ పంచాయతీ నిధులు రూ.75 లక్షలు కాజేసినట్లు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి జరిగినట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. ఈ విషయంపై ఈఓఆర్డీ నాగభూషణం, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుమలత మాట్లాడుతూ... గ్రామంలో పూర్తి చేసిన ప్రతి అభివృద్ధి పనికీ ఇప్పటి వరకూ బిల్లులు చేశామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వాటర్మెన్, పారిశుధ్య కార్మికుల బిల్లులు కూడా పెట్టామన్నారు. అయితే చేయని పనులకు బిల్లులు పెట్టమని సర్పంచ్, ఆమె భర్త డిమాండ్ చేస్తున్నారని, ఇలా బిల్లులు పెట్టడం కుదరదని చెప్పినందుకు అక్కసుతో హైడ్రామాకు తెరలేపారని వివరించారు. పాలకుల తీరుతో ఉద్యోగులు అభద్రతా భావంతో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీలో పదోన్నతులకు సన్నాహాలు అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జెడ్పీలోని ప్రత్యేక బృందం సీనియారిటీ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తొలుత సీనియారిటీ, రోస్టర్ ప్రకారం ముసాయిదా జాబితా తయారు చేసి సీఈఓ పరిశీలన అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేవనిపిస్తే.. తుది జాబితాను సిద్ధం చేసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆమోదంతో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇస్తారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
పెద్దవడుగూరు (యాడికి): మండల కేంద్రమైన యాడికి నుంచి రాయలచెరువుకు వెళ్లే మార్గంలోని బలరామ్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని యాడికి తహసీల్దార్ ప్రతాప్రెడ్డి సీజ్ చేశారు. ఒక్కొక్కటి 50 కిలోల చొప్పున 1,175 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఉదయం ఓ కంటైనర్లో తరలించేందుకు లోడ్ చేస్తుండగా సీఎస్డీటీ మారుతీప్రసాద్, ఆర్ఐ కిట్టప్ప, వీఆర్ఓలు అనిల్, శ్రావణ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా గుర్తించి నిందితులపై కేసు నమోదు చేశారు. కంటైనర్ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. -
రాయలసీమ ‘లిఫ్ట్’ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమ ప్రజల నీటి అవసరాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని, ప్రభుత్వ తీరు మారకపోతే అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామంటూ మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంపై ముందు నుంచి సీఎం చంద్రబాబుకు చిన్నచూపన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల వ్యవధిలోనే ప్రాజెక్ట్ను పూర్తిగా మరుగున వేశారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ఎలాంటి పనులు చేయకూడదంటూ పేర్కొన్న ఎక్స్పర్ట్ సర్ర్పైజర్ కమిటీ డీపీఆర్పై గ్రీన్ ట్రిబ్యూనల్ ఎదుట సరైన వాదనలు విన్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగని ఈ ప్రాజెక్ట్ కేవలం తాగునీటి అవసరాల కోసమేనన్న వాదనను సమర్థవంతంగా ప్రభుత్వం వినిపించి ఉంటే ఆశించిన ఫలితం దక్కి ఉండేదన్నారు. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే ప్రాజెక్ట్ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఫలితంగా రాబోవు రోజుల్లో రాయలసీమ ప్రాజెక్ట్లకు నీరు అందడం ప్రశ్నార్థకమవుతుందన్నారు. కృష్ణా నది పరివాహక పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీకి ట్రిబ్యునల్ కేటాయించిన 2 వేల టీఎంసీల నీటిని వాడుకున్న తర్వాతే మిగులు జలాలను ప్రాజెక్ట్కు వాడుతామని పేర్కొనడం వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్కు నీరు సమకూర్చడం గగనమవుతుందన్నారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీటి మట్టం చేరే వరకూ నీటిని వాడుకోరాదని, శ్రీశైలం డ్యాంను ఆంధ్ర, నాగార్జున సాగర్ను తెలంగాణ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయని వివరించారు. అయితే శ్రీశైలం ఎడమగట్టు తెలంగాణ పరిధిలో ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి పేరుతో నిబంధనలు ఉల్లంఘించి 798 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే నీటిని తెలంగాణ ప్రభుత్వం తోడేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించక తప్పదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నరేష్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి -
ఆటో బోల్తా – మహిళా కూలీ మృతి
తాడిపత్రి: మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన 14 మంది మహిళా కూలీలు మంగళవారం ఉదయం నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలం పేరుసోమల గ్రామానికి మిరప పంట కోతకు వెళ్లారు. సాయంత్రం పనులు ముగించుకుని ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు వెంకటరెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే టైర్ పగలడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది మహిళలూ గాయపడ్డారు. వీరిలో శారద, లక్ష్మీదేవి, రమణమ్మ, రసూల్బీ, మాబ్బి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని అనంతపురానికి రెఫర్ చేశారు. చికిత్సకు స్పందించక రసూల్బీ (52) మృతి చెందింది. ఆమెకు భర్త మహబూబ్బాషా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందాల్లో రైతుకు భద్రత కల్పించే చర్యలు లేవు
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అనంతపురం అర్బన్: ‘‘రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతో వేల ఎకరాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాల్లో రైతుకు భద్రత లేకపోగా నష్టం చేకూర్చేలా, వినియోగాదారునిపై భారం మోపేలా ఉన్నాయి. కాబట్టి ఈ ఒప్పందాలను పునఃసమీక్షించాలి’’ అని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తలపెట్టామన్నారు. మంగళవారం అనంతపురం విచ్చేసిన ఆయన స్థానిక గణేనాయక్ భవన్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్పతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఒప్పందాల్లో భాగంగా రైతుల నుంచి సంస్థలు తీసుకున్న భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణం తీసుకుని ఎగ్గొడితే.. ఆ నష్టాన్ని రైతులు భరించాల్సి వస్తోందన్నారు. కౌలు కార్డు ఇచ్చే క్రమంలో 11 నెలలకు మాత్రమే గడువు ఇస్తూ యజమానికి భద్రతనిచ్చే ప్రభుత్వం.. కంపెనీల విషయంలో ఇందుకు విరుద్ధంగా ఏకంగా 25 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు అంగీకరించడం ఏమిటని ప్రశ్నించారు. ఎకరా భూమిపై నెలకు రూ.5 లక్షలకు మించి సంపాదించుకునే కంపెనీలు రైతులకు మాత్రం ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్తిస్తామనడం సరైంది కాదన్నారు. రైతులకు ఎకరాకు నెలకు రూ.30 వేలు లీజు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగైదేళ్లలో కంపెనీలకు వాటి పెట్టుబడులు తిరిగొస్తాయన్నారు. అధిక ధరలకు ఒప్పందాలు చేసుకుని అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్న అదానీ ఒప్పందంపై మంత్రి కేశవ్ స్పందించాలన్నారు. ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో కేసు వేసిన ఆయన ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులు కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ఫోర్త్జోన్ పరిధిలో మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉండగా 48 మంది హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో ఎస్ఐలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ నుంచి ఇటీవల జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రూప్–2 పోస్టులే అయినా అడ్హాక్ పద్ధతిలో పదోన్నతికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన పూర్తి కావడంతో ఈ నెల 20, 21 తేదీల్లో క్లర్కులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులకు డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. సీమ జిల్లాల్లో 12 మంది క్లర్కులకు వైద్యపరీక్షల అనంతరం ఎస్ఐలుగా పదోన్నతి కల్పించనున్నారు. -
కసాపురంలో 30 నుంచి ఉగాది ఉత్సవాలు
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజవంతం చేద్దామంటూ ఆర్డీఓ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ కె.వాణితో కలసి ఆలయ సమీపంలోని రామదూత నిలయంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. 30న గ్రామోత్సవం, 31న రథోత్సవం, ఏప్రిల్ 1న లంకాదహనం ఉత్సవాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో మద్యం అమ్మకాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అనంతరం అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ సిబ్బందితో కలసి ఉగాది ఉత్సవాల పోస్టర్లను ఆర్డీఓ ఆవిష్కరించారు. గూడ్స్ ఆటోలకు జరిమానా బొమ్మనహాళ్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ కూలీలను తరలిస్తున్న గూడ్స్ వాహన డ్రైవర్లకు జరిమానాలు విధించిన్నట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. సోమవారం ప్యాసింజర్లను, వ్యవసాయ కూలీలను ఎక్కించుని ప్రయాణం చేస్తున్న 5 గూడ్స్ వాహనాలను సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించామన్నారు. రికార్డుల పరిశీలన అనంతరం కేఏ34సి1536 వాహన యజమానికి రూ.16,860, కేఏ34బి2519 వాహన యజమానికి 13,860, కేఏ34సి5230 వాహనదారుడికి రూ.7,010, కేఏ34సి5464 వాహన యజమానికి రూ.23,940లు, కేఏ34డి1862 వాహనదారుడికి రూ.18,840 జరిమానా విధించారన్నారు. -
ప్రభుత్వ కార్యాలయం అంటేనే ప్రజల ఆస్తి. ఇక్కడ ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఎన్నో విలువైన రికార్డులు ఉంటాయి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భద్రత ప్రస్తుత రోజుల్లో గాలిలో దీపమైంది. ముఖ్యంగా రూ.కోట్లు విలువ చేసే సీజ్డ్ వాహనాలను భద్రపరిచిన జిల్లా రోడ్డ
● కార్యాలయ ఆవరణలో ఇటీవల ఇద్దరు యువతుల ఆత్మహత్యాయత్నం ● సెక్యూరిటీ కొరత వల్ల పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ● భద్రత పెంచాలని కోరుతున్న వాహనదారులు అనంతపురం సెంట్రల్: జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలన్నింటిలోకి రోడ్డు రవాణా శాఖకు చెందిన ఉపరవాణా కమిషనరు(డీటీసీ) కార్యాలయం అతి పెద్దది. మొత్తం ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో డ్రైవింగ్ లైసెన్స్ టెస్టింగ్, వాహనాల ఫిట్నెస్ ట్రాక్లతో పాటు సువిశాలమైన కార్యాలయాన్ని నిర్మించారు. అలాగే వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసి ఇక్కడే డంప్ చేస్తుంటారు. దీంతో రోజులో 24 గంటలూ కార్యాలయానికి భద్రత అత్యంత అవసరమైంది. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఘటన కార్యాలయ భద్రతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఓ యువకుడిని ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించిన ఇద్దరు యువతులు (స్నేహితులు) తాము మోసపోయామని గ్రహించి కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన పక్కన పెడితే సెలవు రోజున, అది కూడా ఆర్టీఏ కార్యాలయ ఆవరణలోనే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వేధిస్తున్న సెక్యూరిటీ కొరత రవాణా శాఖ కార్యాలయానికి కట్టుదిట్టమైన భద్రత, నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గతంలో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది పనిచేసేవారు. ఇటీవల సక్రమంగా వేతనాలు అందకపోవడం, అది కూడా అరకొర వేతనం కావడంతో జీవనం దుర్భరమై ఇద్దరు వదిలేశారు. ఉన్న ఇద్దరు రోజుకొకరు చొప్పున ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు 24 గంటలు చొప్పున విధులు నిర్వర్తించడం భారంగా మారింది. దీంతో శారీరక, మాససిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి సెలవు రోజు ఇద్దరు యువతులు కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించి విషపూరిత ద్రావకం తాగారు. అంతేకాక కార్యాలయ ఆవరణలో పరుచుకున్న పచ్చదనం కింద సేద తీరేందుకు పలువురు అనధికారికంగా చొరబడుతున్నారు. వీరిలో కొందరు అక్కడే మద్యం తాగి పడిపోతుంటారు. రూ. కోట్లు విలువజేసే వాహనాలు వివిధ కేసులు, నేరాల్లో పట్టుబడిన రూ.కోట్లు విలువ చేసే వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేయడం సర్వసాధారణం. ఇటీవల దాదాపు వంద వాహనాల వరకూ వేలం వేశారు. ఇంకా వందల్లో వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు పోలీసులకు డ్రంక్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వాహనాలు ఎప్పటికప్పుడు ఆర్టీఏ కార్యాలయ ఆవరణకు చేరుతుంటాయి. వీటికి సంబంధించి అధికారులు విధించిన జరిమానాను చెల్లించి వాహనదారులు విడిపించుకుని వెళుతుంటారు. అప్పటి వరకూ ఆ వాహనాలలో ఏ చిన్న బోల్టు పోయినా కార్యాలయ అధికారులదే బాధ్యత అవుతుంది. ఇంతటి కీలకమైన అంశాన్ని ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యంగా పక్కన పెట్టేశారు. దీంతో తమ వాహనాల భద్రతపై యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండిన పిచ్చి మొక్కలు, గడ్డికి నిప్పు రాజుకుని అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంటే అప్రమత్తం చేసే సెక్యూరిటీ సిబ్బందికి కూడా అక్కడ గతి లేకుండా పోయింది. దీంతో కార్యాలయ ఆవరణలో నిలిపిన వందలాది వాహనాలతో పాటు ఆఫీసులోని రికార్డుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. -
ప్రమాదంలో యువకుడి మృతి
బెళుగుప్ప: మండలంలోని బి.రామసాగరం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్పకు చెందిన బోయ చంద్రన్న కుమారుడు సతీష్కుమార్ (19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవల ఇంటికి వచ్చాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుకున్న స్నేహితుడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామానికి చెందిన పవన్కుమార్తో కలసి సోమవారం ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఎర్రితాత రథోత్సవానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు బి.రామసాగరం క్రాస్ వద్దకుచేరుకోగానే అదుపు తప్పి కిందపడ్డారు. చీకటిలో అటుగా వచ్చిన కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలిసి, 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే సతీష్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్కు చికిత్సలు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవు అనంతపురం: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలని, అయితే పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకుని పరిమితికి మించి ఆటోల్లో తరలించరాదన్నారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాద బీమా కలిగి ఉండాలన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదన్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు, దించేటప్పుడు రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలన్నారు. -
బస్టాండ్లో బంగారు నగల అపహరణ
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్లోని బంగారు నగలను దుండగులు అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి పట్టణానికి చెందిన శ్రావణి, మధుమోహన్ దంపతులు ఆదివారం యాడికిలో జరుగుతున్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. రాత్రికి తిరుగు ప్రయాణమై గుత్తి బస్టాండ్లో బస్సు దిగారు. ఆ సమయంలో శ్రావణి బ్యాగులోని 10 తులాల బంగారు నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలను దుండుగులు అపహరించారు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బాధిత దంపతులు చుట్టుపక్కల ఆరా తీసినా ఫలితం లేకపోయింది. సోమవారం ఉదయం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, బస్టాండ్లోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఆర్షియా తాడిపత్రి టౌన్: జాతీయ స్థాయి కబడీ పోటీలకు తాడిపత్రిలోని సాయిచైతన్య స్కూల్ విద్యార్థి ఆర్షియా ఎంపికై ంది. ఈ మేరకు ఆ పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసింహ సోమవారం తెలిపారు. ఈ నెల 16న పులివెందులలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఆర్షియ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా ఆర్షియను పాఠశాల ఉపాధ్యాయులు, విధ్యార్థులు అభినందించారు. కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ఇటీవల జరిగిన హార్టికల్చర్ కాంక్లేవ్లో చేసుకున్న ఎంఓయూలకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ఎంఓయూల అంశంపై సోమవారం కలెక్టరేట్ నుంచి ఉద్యాన శాఖ అధికారులు, కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. కాంక్లేవ్లో ఏడు ఎంఓయూలు జరిగాయన్నారు. వీటికి సంబంధించి రాబోయే మూడు నెలలకు కార్యాచరణ ప్రణాళికను ఆయా కంపెనీల ప్రతినిధులు వారంలోపు అందజేయాలన్నారు. కాన్ఫరెన్స్లో ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, టెక్నికల్ అధికారి పల్లవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
● తొలిరోజు 638 మంది విద్యార్థుల గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 31,169 మంది విద్యార్థులకు గాను 30,531 మంది హాజరయ్యారు. 638 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 30 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. డీఈఓ ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డీవైఈఓ శ్రీనివాసరావు వివిధ కేంద్రాలను పరిశీలించారు. వసతుల్లేక ఇబ్బందులు.. అనంతపురం నగరంలోని నంబర్–1 ఉన్నత పాఠశాల కేంద్రంలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా గదులు కనీసం శుభ్రం చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. జిల్లాలో పరీక్షల నిర్వహణపై ఆర్జేడీ శామ్యూల్ ప్రత్యేక దృష్టి సారించడంతో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లలో గుబులు పట్టుకుంది. దీనికితోడు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏ కేంద్రాలకు వెళ్లాలనేది ఆర్జేడీ పర్యవేక్షణలో జరుగుతోంది. ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ విధుల్లో ఉన్న టీచర్ల నుంచి వ్యక్తమవుతోంది. పటిష్ట బందోబస్తు.. అనంతపురం: పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాల్లో డ్రోన్లతో పర్యవేక్షించారు. 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలు పెట్రోలింగ్ చేపట్టాయి. పరీక్షలు ముగిసేంత వరకు జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్లు మూసివేయించారు. విద్యార్థులు, పరీక్షల నిర్వహణ అధికారులు, ఆయా పాఠశాల సిబ్బంది మినహా ఎవరినీ పరిసర ప్రాంతాల్లోకి రానీయలేదు. విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి తీసుకెళ్ల కుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. చిన్న పొరపాటుకూ తావివ్వొద్దు గార్లదిన్నె: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటుకూ తావివ్వొద్దని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ పేర్కొన్నారు. పరీక్షల అధికారులతో సోమవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్ నుంచి సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష పేపర్లను సకాలంలో జాగ్రత్తగా కేంద్రాలకు తరలించాలన్నారు. పరీక్ష ముగిసిన తరువాత పక్కాగా భద్రపరచాలన్నారు. పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాల్సిందే
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువను 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో వెడల్పు చేసి తీరాల్సిందేనని ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. అలాగే పంట కాలువలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. ఉరవకొండ మండలం ఇంద్రావతి, ముష్టూరు గ్రామాల్లో హంద్రీ–నీవా కాలువను సోమవారం సీపీఎం నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ అభివృద్ధికి సాగునీటి వనరులే కీలకమన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు ప్రారంభించే ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు పది వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి కాలువను వెడల్పు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత డిజైన్ 3,850 క్యూసెక్కుల కంటే తక్కువకు కుదించి లైనింగ్ పనులు చేపడితే అది రైతులకు మరణశాసనమవుతుందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చడంతో పాటు హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టును స్థిరీకరించాలన్నారు. ఈ విషయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి, మధుసూదన్, శ్రీనివాసులు, కౌలు రైతు సంఘం నాయకులు పెద్దముష్టూరు వెంకటేష్, మురళి, రామాంజినేయులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ -
సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: తమ ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యమిత్రలు విధులు బహిష్కరించి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అద్యక్షుడు నాగార్జునరెడ్డి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు, సీసీ డీఈఓలుగా పనిచేస్తున్న వారికి 17 ఏళ్లుగా క్యాడర్ అమలు చేయకపోవడంతో ఎంటీఎస్ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా గుర్తింపు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యసేవ ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబాలకు సాధారణ వ్యక్తికి చెల్లించినట్లే ఎక్స్గేషియాతో సరిపెడుతూ ఇతర ఎలాంటి ప్రయోజనాలు అందివ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్లు లేవన్నారు. ప్రభుత్వ సైట్లో ప్రభుత్వ ఉద్యోగిగా చూపిస్తుండడంతో సంక్షేమ పథకాలు కూడా అందడం లేదన్నారు. తమ ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, నాయకులు అరుణ, రామాంజినేయలు, తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యమిత్రల నిరసన -
ప్లాస్టిక్ సంచుల కలకలం
చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రానికి సమీపంలోని నిర్జన ప్రదేశాల్లో ప్లాస్టిక్ బస్తా నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విషయం తెలుసుకున్న సీకేపల్లి సివిల్, హిందూపురం రైల్వే పోలీసులు ఉరుకుల పరుగులతో గాలింపు చేపట్టారు. అయితే ఒకటి కాదు... రెండు కాదు... అర కిలోమీటరుకు ఒకటి చొప్పున పడేసిన మూడు ప్లాస్టిక్ బస్తాల్లో నుంచి కుళ్లిన దుర్వాసన వెలువడుతుండడంతో పోలీసులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ఏడు గంటల పాటు ఉత్కంఠ చెన్నేకొత్తపల్లి సమీపంలో ఉన్న యర్రంపల్లి రైల్వే వంతన కింద ప్లాస్టిక్ సంచి నుంచి దుర్వాసన వస్తున్న విషయాన్ని పసిగట్టిన స్థానికుల సమాచారంతో ధర్మవరం రైల్వే సీఐ అశోక్కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ, హిందూపురం రైల్వే ఎస్ఐ సాయినాథ్రెడ్డి, ఐడబ్ల్యూ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి, కానిస్టేబుల్ రమేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. అదే సమయంలో అక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరో బస్తా నుంచి దుర్వాసన వస్తోందని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఆందోళనతో అక్కడకు పరుగు తీశారు. కేబుల్ వైర్ కోసం తీసిన గుంతలో ప్లాస్టిక్ బస్తాను గుర్తించి వెలికి తీశారు. ఈ లోపు అక్కడికి అర కిలోమీటర్ దూరంలో మరో బస్తా నుంచి దుర్వాసన వస్తోందని తెలుసుకుని అక్కడకూ ఆగమేఘాలపై చేరుకున్నారు. బస్తాల పరిమాణాన్ని బట్టి ముగ్గురు వ్యక్తులను హతమార్చి ప్లాస్టిక్ సంచుల్లో కూరి పడేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాదాపు ఏడు గంటల పాటు యర్రంపల్లి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాత ఒక్కో బస్తాను తెరిచి చూసిన పోలీసులు అవాక్కయ్యారు. అందులో అందరూ ఊహించినట్లుగా వ్యక్తుల మృతదేహాలు కాకుండా మేక పిల్లల కళేబరాలు బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలా ఎందుకు చేశారు? ఎవరు చేశారు? అనేది తేలాల్సి ఉంది. అర కిలోమీటరు దూరంతో మూడు సంచులు రైల్వే, సివిల్ పోలీసుల పరుగులు బస్తాల్లో బయటపడిన మేక పిల్లల కళేబరాలు -
సూపర్ స్పెషాలిటీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీకి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని మార్చామన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ, మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. చిన్నారుల్లో హెర్నియా, మూత్రనాళం, మలనాళం, అపెండీసైటీస్ తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఫైళ్ల దగ్ధంపై ఉన్నతాధికారుల విచారణ ● క్లూస్ టీంతో పోలీసుల దర్యాప్తు ఉరవకొండ: స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సోమవారం ఏడీఏ కార్యాలయంలో క్లూస్ టీంతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఘటనపై వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ విలేకర్లతో మాట్లాడారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో ప్రమాదం సంభవించిందని ఏఈఓ భరత్ ద్వారా సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశామన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో కార్యాలయానికి చేరుకుని ఫైళ్లు పరిశీలించినట్లు తెలిపారు. డిసెంబర్ 2021 వరకు డిపార్ట్మెంట్ ఆడిట్ జరిగిందని, ఆ ఫైల్స్ మొత్తం భద్రంగా ఉన్నాయన్నారు. 2013 తరువాత ఫైళ్లు కొన్ని కాలిపోయినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం కాలిపోయిన వాటిలో ఎక్కువ శాతం రైతులకు అవగాహన కల్పించే కరపత్రాలు, బుక్లెట్లు ఉన్నాయన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. నిలకడగా చింత పండు ధరలు హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1991.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు.ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 30 వేలు, కనిష్టంగా రూ.8,200, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ. 4,500, సగటు రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగాయి. పదో తరగతి విద్యార్థులకు గాయాలు బొమ్మనహాళ్: పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు బొమ్మనహాళ్, ఉద్దేహాళ్లోని పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దీంతో సోమవారం ప్రారంభమైన తొలి పరీక్షకు విద్యార్థులు రంజిత్, సురేష్తో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణమైన వారు గోవిందవాడ గ్రామం వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పడంతో కిందపడ్డారు. ఘటనలో రంజిత్, సురేష్కు బలమైన గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పరీక్షల వేళ సకాలంలో బస్సులను నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని, ఫలితంగా పిల్లలు ద్విచక్రవాహనంపై పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
దౌర్జన్యంగా బండలు నాటారు
రెండేళ్ల క్రితం మా గ్రామంలోని జగనన్న కాలనీలో (సర్వే నంబర్ 483/4) నా భార్య గొల్ల కవిత పేరున ప్లాట్ నంబరు 15 మంజూరు చేస్తూ పట్టా (ఏఎన్ఏ01934178) ఇచ్చారు. అయితే, ఆ ప్లాట్లో వేరొకరు దౌర్జన్యంగా బండలు నాటుకున్నారు. సమస్యను గ్రామ సర్పంచుకు చెప్పినా.. సచివాలయంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. – గొల్ల తిరుపాలు, బొమ్మలాటపల్లి, బుక్కరాయసముద్రం మండలం పట్టించుకోవడం లేదు యర్రగుంట పొలం సర్వే నంబరు 380–7 లో ఎకరా, 380–6లో 36 సెంట్లు మొత్తం 1.36 ఎకరాలు సాగు చేసుకుంటున్నా. ఈ భూమికి ప్రభుత్వం 2004లో డి.పట్టా, పాసుపుస్తకం మంజూరు చేసింది. భూమిలో బోరు వేసుకుని పంట సాగు చేసుకుంటున్నా. అయితే వెబ్ల్యాండ్లో మిగులు భూమిగా నమోదు చేశారు. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలు సమర్పించి నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. – జి.ప్రసాద్, బండమీదపల్లి, రాప్తాడు మండలం -
తాగునీటి ఎద్దడి తలెత్తనీయొద్దు
అనంతపురం అర్బన్: ‘వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది. ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధర్తీ అబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏ–జేజీయూఏ)’ పకడ్బందీగా అమలు చేయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పైప్లైన్ల మరమ్మతు చేయాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్లు, ఆస్పత్రులు, రైతు బజార్లు, దేవాలయాలు, మీ సేవ, ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గ్రామాలను బాగుచేయాలి.. ‘ధర్తీ అబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్’ కింద గిరిజనుల గ్రామాలను బాగు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పథకం కింద జిల్లాలో గుండాల తండా, వెంకటంపల్లి చిన్న తండా, వెంకటంపల్లి పెద్దతండా, చిన్నవరం, నాగులగుడ్డం, నాగులగుడ్డం తండా గ్రామాలను ఎంపిక చేశామన్నారు. వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం సంపూర్ణ స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీఎంఏవై 2.0’ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ బాధ్యతలను డీఆర్ఓ నిర్వర్తించాలన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ వినోద్కుమార్ -
ప్రకృతి వ్యవసాయంపై 22 నుంచి సదస్సు
అనంతపురం అర్బన్: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అంశంతో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ వినోద్కుమార్ విడుదల చేసి, మాట్లాడారు. 22న పకృతి వ్యవసాయంపై, 23న పంటలు, వంటలు, ఆరోగ్యంపై, 24న మారుతున్న వాతావరణ పరిస్థితులు– వ్యవసాయంపై సదస్సులు ఉంటాయన్నారు. రోజూ వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరై ప్రకృతి వ్యవసాయంపై కొత్త విషయాలను వివరిస్తారని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలసి నిర్వహిస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. -
పదో తరగతి విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంట గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బెళుగుప్పలోని పరీక్ష కేంద్రానికి గ్రామం నుంచి ఆటోలో బయలుదేరిన విద్యార్థులు... అంకంపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ తప్పించబోవడంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి దూసుకెళ్లింది. ఘటనలో స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. ఆటోను తిరిగి రోడ్డుపైకి చేర్చి విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రానికి చేర్చారు. కాగా, విషయం తెలుసుకున్న డీఎస్పీ అష్రఫ్ అలీ, ఎస్ఐ శివ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సమావేశమై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచారు. కాగా, బస్సులను ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలం కావడంతోనే పిల్లలను ఆటోల ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపాల్సి వస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ‘అనంత’ ప్రతిభ గుంతకల్లు: వైఎస్సార్ జిల్లా పులివెందుల వేదికగా జరిగిన 34వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనంతపురం జిల్లా బాలికల జట్టు రన్నరప్ను దక్కించుకుంది. ఈ మేరకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ బాలికల కబడ్డీ పోటీలు జరిగాయి. ఫైనల్లో శ్రీకాకుళం జట్టుతో తలపడిన అనంత జట్టు ఒక్క పాయింట్ తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. కాగా, రన్నర్స్ ట్రోఫీని దక్కించుకున్న జిల్లా జట్టును కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించండి
ధర్మవరం: మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలని ఏపీ మీటర్ రీడర్స్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రమశెట్టి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మీటర్ రీడర్లు ప్రతి నెలా వచ్చే కమీషన్ల ద్వారా పూట గడవడం దుర్భరంగా మారుతోందన్నారు. ఉద్యోగభద్రత కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించక పోగా రీచార్జ్ మీటర్లు ఏర్పాటు చేసి మీటర్ రీడర్ల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. మీటర్ రీడర్ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18న డీఈ కార్యాలయాన్ని, 20న ఎస్ఈ కార్యాలయాన్ని, 27న సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు దస్తగిరి, రాజు, జగదీష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రహ్లాద సమేత నారసింహుడు ఇక్కడే..
కదిరి: నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి అర్చక పండితులు చెబుతున్నారు. సైన్స్కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన అనంతరం మూలవిరాట్ నుంచి స్వేద బిందువులు బయటకు వస్తుంటాయి. వస్త్రంతో ఆ స్వేదాన్ని తుడిచినా మళ్లీ వస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పడానికే ఇలా స్వేద బిందువులు వస్తుంటాయని భక్తుల నమ్మకం. -
●మోహన మూర్తీ.. భక్త జన దీప్తి
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వయ్యారాలు ఒలకబోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో కనిపించిన శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ధగధగ మెరిసే పట్టు చీర ధరించి, గుభాళించే కదిరి మల్లెల అలంకరణలో కనిపించిన ఖాద్రీశుని వైభవాన్ని చూస్తే తప్ప చెప్పటం సాధ్యంకాదు. శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడగా, అమృతాన్ని పంచడానికి శ్రీమహావిష్ణువే మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలకృష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తుల వద్దకే వసంతవల్లభుడు తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిస్తారు. మంగళవారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి బ్రహ్మ రథోత్సవం ఈ నెల 20న జరగనుంది. ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
‘రాజా’కు ఘన వీడ్కోలు
గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్నగర్లోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పోలీసు జీపుపై జాగిలాన్ని కూర్చోబెట్టి పూలమాల, శాలువాతో సత్కరించారు. పూలు చల్లుకుంటూ వీధుల్లో ఊరేగించారు. ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ వింగ్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ... రైళ్లల్లో దొంగలను పట్టించడంతో పాటు అనేక కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో జాగిలం రాజా విశేష ప్రతిభ కనబరిచేదన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య, ఏఎస్ఐ అబ్రహామ్, డాగ్ హ్యాండ్లర్స్ టి.శంకర్, డి.రఘు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జాగిలాన్ని నాంధేడ్లోని అనిమల్ సొసైటీలో అప్పగించనున్నట్లు తెలిసింది. -
బాధితులకు అండగా ఉంటాం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘అనంతపురం రూరల్ పాపంపేట పొలం 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి భవనాలను చట్ట విరుద్ధంగా, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఎలాంటి సర్వే లేకుండా, నోటీసులు ఇవ్వ కుండా కూల్చి వేశారు. 150 మంది పోలీసులను తీసుకొచ్చి, ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి దుర్మార్గంగా పేదల నివాసాలపై దాడులు చేశారు. బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడతాం’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ జడ్జి కిష్టప్ప అక్కడికి వెళ్తే పక్కకు నెట్టేశారని, జడ్జిగా పని చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పేదల ఆర్తనాదాల మధ్య పరిటాల కుటుంబం జయకేతనాలు ఎగుర వేస్తోందన్నారు. ‘ఏ కోర్టు ద్వారా భవనాలను కొట్టించారో అదే కోర్టు ద్వారా బాధితులకు స్థలాలు ఇప్పిస్తాం’ అని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు మునిసిపాలిటీ పరిధిలోని భూమిని స్వాధీనం చేయాల్సి ఉండగా పాపంపేట పొలంలోని భూమిని స్వాధీనం చేశారన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ 1990లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనంతపురం నగరంలో 106 సర్వే నంబరులో 68 సెంట్లు శోత్రియందారులకు స్వాధీనం చేయమని హైకోర్టు సూచించిందన్నారు. ప్రభుత్వ ప్లీడరు, అడ్వొకేట్ జనరల్, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ కలిసి పాపంపేట పొలంలోని భూమిని స్వాధీనం చేశారన్నారు. ఒక 420 వెధవ తనకు సంబంధం లేని ఆస్తులపై కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. 8 మంది బాధితులు సివిల్ కోర్టులో ఫైల్ చేసిన కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. సహదేవనాయుడు అనే వ్యక్తికి 2023లో కోర్టు పర్మినెంట్ ఇంజెంక్షన్ ఇచ్చిందన్నారు. వీరి స్థలాల జోలికి వెళ్లొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ధిక్కరించి తొలగించారని చెప్పారు. రూ. 2 వేల కోట్ల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో కట్టడాలను కూల్చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఆ చుట్టుపక్కల శోత్రియం భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు భయంతో తమను సంప్రదిస్తున్నారన్నారు. ‘డబ్బు చెల్లించాలి, లేదంటే ఇళ్లు కూల్చేస్తాం, భూములను ఖాళీ చేయిస్తాం’ అనే మెసేజ్ను వారందరికీ పరిటాల కుటుంబం పంపిందని ఆరోపించారు. ఇందుకు ఎమ్మెల్యే సునీత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అప్పట్లోనే కలెక్టర్కు విన్నవించా.. అనంతపురం రూరల్ తహసీల్దార్ మోహన్కుమార్కు ఈ కేసులో లొసుగులన్నీ తెలుసని, అందుకే ఏరికోరి ఆయనను ఇక్కడికి తెచ్చుకున్నారని ప్రకాష్ రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాధితుల తరఫున అప్పటి కలెక్టర్ను కలిసి వివరించగా, అప్పట్లో తహసీల్దార్ మోహన్కుమార్ మొత్తం రికార్డులు కలెక్టర్ ముందు ఉంచారన్నారు. మునిసిపాలిటీ పరిధి 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లను స్వాధీనం చేయాలని కోర్టు తీర్పునిచ్చిందని, శ్రావణ్కుమార్ అడుగుతోంది పాపంపేట 106–1 సర్వే నంబరు భూమి అని, దీనికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ అప్పట్లో అధికారులు హైకోర్టుకు తెలిపారన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు మునిసిపాలిటీ భూములకు మాత్రమే వర్తిస్తుందనే విషయం తెలిసీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కచ్చితంగా ఆర్డీఓ, తహసీల్దార్ను కోర్టుకు లాగుతామన్నారు. కలెక్టర్కు తెలిసి చేశారా.. తెలీక చేశారా.. ఫలితం మాత్రం అనుభవిస్తారన్నారు. 68 సెంట్ల స్థలాన్ని పరిటాల కుటుంబం స్వాధీనం చేసుకుని కాంప్లెక్స్ కడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. సమా వేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఎంపీపీ వరలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు కురుబ వెంకటేశ్వర్లు, సందీప్యాదవ్, నాయకులు బండి పవన్, గోవిందరెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, గోపాల్రెడ్డి,అంజనరెడ్డి, ఎర్రిస్వామి, నిఖిల్యాదవ్ పాల్గొన్నారు. పేదల ఆర్తనాదాల మధ్య పరిటాల కుటుంబం జయకేతనాలు హైకోర్టు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా కూల్చివేతలు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కామాంధుడి బారి నుంచి తనను తాను కాపాడుకునే క్రమంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా... అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు, జీవితంపై విరక్తితో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ● నార్పల: లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నార్పలలోని సుల్తాన్పేట కాలనీకి చెందిన కవిత(26), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్న వెంకటశివ శనివారం రాత్రి గ్రామ శివారులో విడిచిన గొర్రెల వద్దకు కాపలాకు వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన అదే కాలనీకి చెందిన యువకుడు బండి లక్ష్మీనారాయణ... ఇంట్లోకి చొరబడి కవితాపై అత్యాచార యత్నం చేశాడు. ఆ సమయంలో కేకలు వేస్తూ అతని బారి నుంచి బయటపడిన ఆమె... లోపలి గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అదే సమయంలో తలుపులు బద్ధలుగొట్టేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించడంతో దిక్కుతోచని స్థితిలో కవిత ఉరి వేసుకుంది. ఇంతలో శబ్ధాలకు చుట్టుపక్కల వారు.నిద్ర లేచి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి లక్ష్మీనారాయణ పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించిన స్థానికులు అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కవితను గమనించి సమాచారం ఇవ్వడంతో వెంకటశివ అక్కడకు చేరుకుని బోరున విలపించాడు. రెండేళ్లుగా కవితను బండి లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే కవితను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడంటూ తల్లి నాగసుబ్బమ్మ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ కౌలుట్లయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● పెద్దవడుగూరు: మండలంలోని గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన రైతు తలారి రాము(43) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న రాము... మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులకు వడ్డీల భారం పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతున్న రాము... ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● కూడేరు: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం కలగళ్లకు చెందిన అమర్నాథ్(28) మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లోకి చేరుకుని తలుపులు వేసుకుని నిద్రించాడు. ఇంటి బయట నిద్రించిన తండ్రి కొండయ్య ఆదివారం ఉదయం లేచి తలుపులు తీయాలని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, అమర్నాథ్కు భార్య ఉంది. సంతానం లేరు. -
మీ మార్కులు మీరే వేసుకోండి!
అనంతపురం: విశ్వసనీయత, సప్రమాణత అనేవి పరీక్షల మూల్యాంకనం యొక్క కనీస ధర్మం. మార్కుల నమోదు ప్రక్రియ అనేది అత్యంత రహస్యంగా, పకడ్బందీగా నిర్వర్తించాల్సి ఉంటుంది. తద్వారా అందే సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది. అయితే జేన్టీయూ(ఏ) పరీక్షల విభాగం ఉన్నతాధికారులు కనీస నిబంధనలు పాటించకుండా మార్కుల నమోదును నేరుగా ఆయా కళాశాలలకు అప్పగించి వృత్తి ధర్మాన్ని విస్మరించారు. మీకు ఇష్టం వచ్చిన మార్కులు మీరే నమోదు చేసుకోండి అంటూ స్వేచ్ఛను ఇచ్చేశారు. వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘స్వయం ’కోర్సులు తప్పనిసరి.. సాంకేతిక కోర్సులను అభ్యసించే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు వీలుగా స్వయం పేరుతో ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్లో తమకు నచ్చిన కోర్సును పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహిస్తారు. బీటెక్ మూడు, నాల్గో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్లో 100 మార్కులకు చొప్పున ఈ స్వయం కోర్సులను తప్పనిసరి చేశారు. పరీక్షల అనంతరం ఆన్లైన్ విధానంలోనే ఐఐటీ, ఎన్ఐటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించి మార్కులు కేటాయిస్తారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా... ఈ తర్వాతి ప్రక్రియను జేఎన్టీయూ(ఏ) పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన మార్కులను తప్పనిసరిగా వర్సిటీ పరీక్షల విభాగం సిబ్బంది నమోదు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలోనూ ఇదే తరహాలోనే మార్కులు నమోదు చేశారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా నేరుగా ఆయా కళాశాలలకే ఈ బాధ్యత అప్పగించారు. దీంతో వారికి ఇష్టం వచ్చిన రీతిలో మార్కులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. స్వయం కోర్సుల్లో మార్కులు నమోదు చేసే అధికారం ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు అధికారం లేదు. లేని అధికారాన్ని కట్టబెట్టారు. ఇంటర్నల్ మార్కుల తరహాలోనే స్వయం కోర్సుల మార్కులు నమోదు చేయాలని పరీక్షల విభాగం ఉన్నతాధికారులు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. దీంతో తమ కళాశాల విద్యార్థులకు ఎన్ని మార్కులు కావాలంటే అన్ని మార్కులు వేసేస్తూ ఇంజినీరింగ్ కళాశాలల సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. స్వయం కోర్సులు స్వీయ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ప్రవేశపెట్టారు. విద్యా ప్రణాళికలో పేర్కొన్న అంశాలే కాకుండా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు కోర్సులు స్వయంగా నేర్చుకునేందుకు స్వయం కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. వీటికి మార్కులు సైతం కేటాయించారు. క్రెడిట్లు లెక్కిస్తారు. ఇలాంటి కీలకమైన అంశాలను తేలికగా తీసుకోవడమే కాకుండా మార్కుల నమోదును ఏకంగా కళాశాలలకు అప్పగించడం వివాదస్పదమవుతోంది. నియంత్రణ లేని తీరు.. పరీక్షల విభాగంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గైర్హాజరైనా ఫలితాలను విడుదల చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఫలితాలు విడుదల చేసే ముందు అన్ని పరిశీలించి, సర్క్యులర్పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంతకం చేసిన తర్వాతనే ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఈ నెల 5న ఎంటెక్, సప్లిమెంటరీ ఫలితాలను కంట్రోలర్ లేకుండానే ప్రకటించారు. ఫలితాల విడుదల సర్క్యులర్పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం లేకపోవడమే ఇందుకు నిదర్శనం. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టమ్ పాస్వర్డ్ అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి పాస్వర్డ్ అప్పగించి ఫలితాలు ప్రకటించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కేవలం ఎక్సెల్ షీట్లోనే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో పాస్వర్డ్తో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి మార్కులు తారుమారు చేస్తే ఎవరు జవాబుదారీ వ్యవహరిస్తారనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. బీటెక్లో స్వయం ఆన్లైన్ కోర్సులు తప్పనిసరి మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు రెండో సెమిస్టర్లో 100 మార్కులకు చొప్పున పరీక్షలు కోర్సు పూర్తయ్యాక ఆన్లైన్ ద్వారా ఐఐటీ ప్రొఫెసర్లతో మూల్యాంకనం, మార్కుల కేటాయింపు ఈ మార్కుల నమోదుకు నేరుగా ఆయా ఇంజినీరింగ్ కళాశాల సిబ్బందికి స్వేచ్ఛ జేఎన్టీయూ (ఏ) పరీక్షల విభాగం ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు పరిశీలిస్తాం స్వయం కోర్సులకు సంబంధించి మార్కులను ఆయా కళాశాలలే నమోదు చేసినా, ఆ తర్వాత ర్యాండమ్గా వాటిని మేమూ పరిశీలిస్తాం. సీఈ గైర్హాజరైనా ఫలితాలను విడుదల చేశారనడం అవాస్తవం. సర్కులర్పై ఆయన సంతకం లేనంత మాత్రాన ఆయన గైర్హాజరైనట్లు కాదు. – ప్రొఫెసర్ నాగప్రసాద్నాయుడు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, జేఎన్టీయూ (ఏ) -
‘రాజా’కు ఘన వీడ్కోలు
గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్నగర్లోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పోలీసు జీపుపై జాగిలాన్ని కూర్చోబెట్టి పూలమాల, శాలువాతో సత్కరించారు. పూలు చల్లుకుంటూ వీధుల్లో ఊరేగించారు. ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ వింగ్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ... రైళ్లల్లో దొంగలను పట్టించడంతో పాటు అనేక కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో జాగిలం రాజా విశేష ప్రతిభ కనబరిచేదన్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బెన్నయ్య, ఏఎస్ఐ అబ్రహామ్, డాగ్ హ్యాండ్లర్స్ టి.శంకర్, డి.రఘు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జాగిలాన్ని నాంధేడ్లోని అనిమల్ సొసైటీలో అప్పగించనున్నట్లు తెలిసింది. -
నియామకాల్లో నిర్లక్ష్యంపై కొరడా
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కొరడా ఝళిపించారు. ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇన్విజిలేషన్ డ్యూటీల కేటాయింపుల్లో గందరగోళం, అంధులు, పక్షవాత బాధితులు, దివ్యాంగ టీచర్లు, చివరకు రిటైర్డ్ అయిన వారినీ విధులకు కేటాయించిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ‘పది పరీక్షల నిర్వహణలో గందరగోళం’, ‘పదింతల నిర్లక్ష్యం’ కథనాలు విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. సామాజిక మాద్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. ప్రాథమిక విద్య కమిషనర్, కలెక్టర్ కూడా స్పందించారు. ఈ క్రమంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి, సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కారణంగా భావిస్తున్న కీలక అధికారిపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది. ‘టిస్’ ఉన్నా అలసత్వం.. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ద్వారా ఇటీవల ఉపాధ్యాయుల పూర్తి వివరాలు సేకరించారు. ఏ స్కూల్లో ఏ టీచరు పని చేస్తున్నాడు... పేరు, వయసు, పుట్టిన రోజు, పీహెచ్ కేటగిరీ తదితర వివరాలున్నాయి. ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయిన వారి వివరాలు కూడా ఇందులో అప్డేట్ అయ్యాయి. ఈ వివరాలన్నీ డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పక్క గదిలోనే లభిస్తాయి. అయినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే పరీక్షల నిర్వహణ విభాగం అదికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఎంఈఓలు, హెచ్ఎంలకు పంపి ఉంటే... 10–15 రోజుల ముందే ఎంఈఓల ద్వారా ప్రధానోపాధ్యాయులకు జాబితాలు పంపి రిమార్కులు అడిగి ఉంటే కూడా చాలా వరకు తప్పిదాలకు అవకాశం ఉండేదికాదు. అలా చేయకుండా కేవలం పరీక్షల విభాగం ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలు అనేకమంది టీచర్లను ఇక్కట్లు పాలు చేశాయి. ఈ క్రమంలోనే అంధులు, పక్షవాత బాధితులు, చంటిపిల్లల తల్లులు, బాలింతలు, దివ్యాంగ టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, మెడికల్ లీవ్లో ఉన్న వారినీ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఇలాంటి వారే 200 మంది దాకా ఉన్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల చీఫ్లకు అందజేసి చేతులు దులుపుకోవడం వల్ల సమాచార లోపించి ఆర్డర్లు జారీ చేసి రెండు రోజులు దాటినా 40 శాతానికి మందికి పైగా ఉత్తర్వులు అందజేలేదు. ఈ విషయంపైనా ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీల్లో అవకతవకలపై ఆర్జేడీ చర్యలు ఐదుగురికి షోకాజ్ నోటీసులు తీవ్ర చర్చనీయాంశమైన ‘సాక్షి’ వరుస కథనాలు -
ఏడీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
● కొన్ని ఫైళ్లు దగ్ధం ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ఉరవకొండ: ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏడీఏ కార్యాలయం పక్కనే ఉన్న చెత్తకు నిప్పంటుకుని కిటికీలో నుంచి నిప్పు రవ్వలు పడడంతో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైరింజన్ చేరుకుని మంటలు ఆర్పింది. అప్పటికే కొన్ని ఫైళ్లు కాలిపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఆదివారం రాత్రి జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ అనంతపురం: జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాల్లో చురుకుగా ఉండే రౌడీషీటర్లకు ఆయా పీఎస్ల అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం వారి జీవన విధానం, ప్రవర్తనలపై ఆరా తీశారు. నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్పై పోలీసు నిఘా ఉంటుందని, వారి ప్రతి కదలికనూ పోలీసులు పసిగడుతూ ఉంటారని, నేరాలకు పాల్పడితే మీతో పాటు మీ కుటుంబసభ్యులూ సమాజంలో గౌరవంగా జీవించలేని పరిస్థితి ఉంటుందన్నారు. నేరాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చీనీ చెట్ల నరికివేత పుట్లూరు: మండలంలోని గరుగుచింతలపల్లిలో శనివారం రాత్రి రైతు నాగరాజుకు చెందిన 110 చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఉదయాన్నే తోట వద్దకు వెళ్లిన ఆయన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాదిత రైతు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకట నరసింహ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థుల జీవితంలో తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాసే రోజు రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 135 కేంద్రాల్లో 32,803 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలుంటాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యంగా తాగునీరు, ఫర్నీచరు, విద్యుత్ సదుపాయం అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా అధికారులు దృష్టి సారించారు. ఆర్జేడీ ప్రత్యేక ఫోకస్.. పరీక్షల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్న పాఠశాల విద్య ఆర్జేడీ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మూడు రోజులుగా జిల్లాలోనే మకాం వేశారు. పరీక్షల నిర్వహణలో ఏ చిన్నపొరబాటు చేసిన ఉపేక్షించబోనని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. గంట ముందుగానే చేరుకోవాలి.. తొలిరోజు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్టికెట్ నంబరు ఆధారంగా ఏ గది ఎక్కడుందో చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. హాల్టికెట్ చూపిస్తే చాలు ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చే సమయం, వాటిని ఓపెన్ చూసి విద్యార్థులకు అందజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మీడియంను ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత ప్రశ్నపత్రం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం తారుమారైనా విద్యార్థులు నష్టపోతారనే విషయాన్ని ఇన్విజిలేటర్లు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు. పేపర్ లీక్ చేస్తే అడ్డంగా బుక్ అవుతారని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల్లోకి సిబ్బంది కోసం టీ, కాఫీ బయట నుంచి తీసుకురాకూడదు. పొరబాటున ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా అందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారి, ఎంఈఓలను బాధ్యులను చేస్తారు. పటిష్ట బందోబస్తు అనంతపురం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పి. జగదీష్ పేర్కొన్నారు. విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసేంత వరకు కేంద్రాల సమీప ప్రాంతాల్లో జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్లు మూసివేయాలన్నారు. 135 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 32,803 మంది విద్యార్థులు అందరూ సహకరించాలి ప్రతిష్టాత్మకమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలి. కేంద్రాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరి స్థాయిలో వారు బాధ్యతగా పని చేయాలి. ఏ చిన్న పొరబాటుకూ తావివ్వొద్దు. చాలా కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయనే సంగతిని ఎవరూ మరవొద్దు. – ఎం.ప్రసాద్బాబు, డీఈఓ -
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీవారు పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై విహరించారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగి ఉండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం మోహినీ ఉత్సవం నిర్వహించనున్నారు. -
●‘సన్’డే.. మండే..
అనంతపురం అగ్రికల్చర్: ‘సన్’ డే చుక్కలు చూపించింది. ఆదివారం గార్లదిన్నెలో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పామిడి, బెళుగుప్ప, పెద్దవడుగూరు, తాడిపత్రి, పుట్లూరు, యాడికి, శింగనమల తదితర మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, తలుపుల, ఎన్పీ కుంట, కొత్తచెరువు, పెనుకొండ, పుట్టపర్తి తదితర మండలాల్లో 39 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా మడకశిర, శెట్టూరు, బెళుగుప్ప, కనగానపల్లి, రాప్తాడు, గుడిబండ, సోమందేపల్లి తదితర కొన్ని మండలాల్లో మాత్రమే ఉదయం 14 నుంచి 17 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మిగతా ప్రాంతాల్లో 20 డిగ్రీల మేర నమోదవుతూ సెగలు పుట్టిస్తున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఈ సారి ఏప్రిల్, మే నెలలో చాలా మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిపై అనుమానాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వద్దతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ యోజితా సాహో (27) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీకేఎస్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్పూర్ జిల్లా దుర్గ్ గ్రామానికి చెందిన యోజిత సాహో బుక్కరాయసముద్రంలోని తాను నివాసముంటున్న అద్దె గృహంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాయ్పూర్ నుంచి ఆదివారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. అనంతరం ఆమె అద్దెకున్న ఇంటిని పరిశీలించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఈ సందర్భంగా వారు పోలీసులకు తెలిపారు. కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీకేఎస్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఐ ఫోన్, లాప్టాప్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో యోజితా మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలివెళ్లారు. అంగన్వాడీలకు అందని నూనె తాడిపత్రి రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు వంట నూనె ప్యాకెట్లు అందలేదు. సగానికి పైగా కేంద్రాలకు నూనె ప్యాకెట్లు అందక పోవడంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుంది. కానీ ఈ నెల రెండవ వారం దాటుతున్న కొన్ని కేంద్రాలకు పంపిణీ చేయకపోవడం గమనార్హం. గతంలోనూ పలుమార్లు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు, వంట నూనె పంపిణీలో వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దడంలో అధికారులు విఫలమవుతూ వస్తున్నారు. నూనె ప్యాకెట్లు లేకపోవడంతో ఇతర సరుకులు సైతం తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. వీటి కోసం గర్భిణులు, బాలింతలు రోజూ అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశంపై తాడిపత్రి స్టాక్ పాయింట్ ఇన్చార్జ్ శంకరయ్య మాట్లాడుతూ.. రేషన్ డీలర్లకు సంబంధించిన ఈ–పాస్ మిషన్లకు స్టాక్ను అప్డేట్ చేయకపోవడంతో సమస్య తలెత్తినట్లు వివరించారు. డీఎం కార్యాలయంలో అప్డేట్ చేసిన వెంటనే డీలర్ల వద్ద ఉన్న ఈ–పాస్ మిషన్ల ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు. పథకాల అమలులో ప్రభుత్వం విఫలం : సీపీఐ పెద్దవడుగూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి పెద్దలు పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగప్ప, మండల కార్యదర్శి వెంకట్రాముడుయాదవ్ ధ్వజమెత్తారు. పెద్దవడుగూరు సీపీఐ మండల శాఖ మహాసభ ఆదివారం నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలకు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు బీటుపల్లి నారాయణ, తాడిపత్రి సీపీఐ టౌన్ కార్యదర్శి చిరంజీవియాదవ్, గుత్తి మండల కార్యదర్శి రాందాస్, గుత్తి పట్టణ కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు. -
డబ్బా కొట్టుకునేందుకే ఆవిర్భావ వేడుక
ఉరవకొండ: డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తన సొంత డబ్బా కొట్టుకునేందుకే కాకినాడలో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు గురించి ఇందులో ఒక్కమాట కూడా ప్రస్తావించకుండా తన నైజాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవిర్భావ సభ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపరిచారన్నారు. హిందీ– తమిళ్ వివాదం తెరపైకి తెచ్చి మరో వివాదానికి తెరలేపారన్నారు. ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలను తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీశారని, ఇదే తరహాలో సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ సైతం కేంద్రాన్ని నిలదీయకపోగా భాషలు, డిలిమిటేషన్పై మోదీ సర్కార్కు వత్తాసు పలకడం ఆశ్చరాన్ని కలిగిస్తోందన్నారు. జిల్లాకు వరదాయినిగా ఉన్న హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేస్తే అది హంద్రీ–నీవా ఆయకట్టు దారులకు మరణశాసనమే అవుతుందన్నారు. హంద్రీ–నీవా కాలువను భవిష్యత్తులో వెడల్పు చేయకుండా ఉండేందుకే కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. జిల్లాలోని 3.50లక్షల ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలతో పాటు చెరువులను నీటితో నింపి భూగర్భ జలాలు పెంపొదించడమే హంద్రీ–నీవా ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. లైనింగ్ పనులు చేపడితే తాగు, సాగునీరుతో పాటు చెరువులకు కూడా నీరు అందకుండా పోతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే హంద్రీనీవా మొదటి దశ 95శాతం, రెండోదశ 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం రెండో విడతలో హంద్రీనీవా పనులు ఒక్క కిలోమీటరు చేయకుండా కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికి లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమైందని, ఈ నేపథ్యంలోనే హంద్రీ–నీవా పనులను చంద్రబాబు తన ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీవీరన్న, నాయకులు ఈడిగ ప్రసాద్, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని చంద్రబాబు, పవన్ నిలదీయాలి లైనింగ్ పనులతో హంద్రీనీవాకు మరణశాసనమే మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి -
పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు
అనంతపురం అర్బన్: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పొట్టిశ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రోద్యమంలో పొట్టిశ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారన్నారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలంటూ మద్రాసులో 1952 అక్టోబరు 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారం భించి డిసెంబరు 15న అసువులు బాసారన్నారు. ప్రతిఒక్కరూ ఆ మహనీయుడి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, తదితరులు పాల్గొన్నారు. అమ్మూ... ఇక నేను బతకలేనమ్మా! ● బేకరీ షాపు నిర్వాహకుడి ఆత్మహత్య బత్తలపల్లి: బేకరీ వ్యాపారం సరిగా జరగకపోవడంతో కుమార్తె వివాహం, కుమారుడి చదువుకు డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక షాపు నిర్వాహకుడు సతమతమయ్యాడు. రోజూ ఇవే ఆలోచనలు చేసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘అమ్మూ.. ఇక నేను బతకలేనమ్మా’ అంటూ చెప్పి ఉరివేసుకున్నాడు. వివరాలు.. కేరళకు చెందిన పరంబత్ జయప్రకాష్ (55) 35 ఏళ్ల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వలస వచ్చాడు. తొలుత ఓ బేకరీ షాపులో పనిచేశాడు. తర్వాత కదిరి రోడ్డులో సొంతంగా ‘మైసూర్ బేకరీ’ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీకళ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రిన్షా, కుమారుడు రోహన్ ఉన్నారు. రిన్షా ప్రస్తుతం జపాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. రోహన్ బెంగళూరులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా బేకరీ షాపులో వ్యాపారం సరిగా జరగకపోవడంతో జయప్రకాష్ ఆందోళన చెందుతుండేవాడు. దీనికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణం తొలగిస్తారని భయపడేవాడు. ఈ విషయాలను భార్యతో చెప్పుకుని మదనపడుతుండేవాడు. అమ్మూ (రిన్షా) వివాహం ఎలా చేయాలి, అప్పూ (రోహన్) చదువులకు డబ్బు ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదంటూ బాధ పడేవాడు. ఎప్పటికప్పుడు భార్య ధైర్యం చెప్తూ వస్తోంది. బెంగళూరులో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి లక్ష్మీకళ శనివారం వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న జయప్రకాష్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతానమ్మా.. ఇక బతకను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే ఆమె బెంగళూరులో ఉన్న తల్లికి విషయం చెప్పింది. బత్తలపల్లిలోని ఇంటి సమీపంలో ఉన్న సాంబశివుడుకు లక్ష్మీకళ ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. అతడు వెళ్లి చూసేసరికి జయప్రకాష్ బేకరీ షెడ్లో ఉరికివేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బీటెక్ విద్యార్థి అదృశ్యం
నల్లమాడ: ఎద్దులవాండ్లపల్లికి చెందిన లక్ష్మీకాంత్రెడ్డి అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రామ్మోహన్రెడ్డికి ఇద్దరు సంతానం. వీరు కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్రెడ్డి అనంతపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఏడో తేదీన లక్ష్మీకాంత్రెడ్డి బెంగళూరుకు వస్తున్నానని తండ్రికి ఫోన్లె చెప్పి స్వగ్రామం ఎద్దులవాండ్లపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చి అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో గాలించినా కుమారుడి ఆచూకీ కన్పించలేదు. దీంతో రామ్మోహన్రెడ్డి శనివారం నల్లమాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పుట్లూరు: నాయకునిపల్లి సమీపంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో రామమునిరెడ్డి (40) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్శాఖలో సిబ్బంది కొరత కారణంగా కొన్నేళ్లుగా రామమునిరెడ్డి ఆ శాఖ అధికారులకు, సిబ్బందికి సహాయకుడిగా పనిచేసేవాడు. ఈ క్రమంలో పుట్లూరుకు చెందిన ఓబులేసు పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు సరిచేస్తున్న సమయంలో షాక్కు గురై చనిపోయాడు. ఎస్ఐ వెంకటనరసింహ సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామమునిరెడ్డి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎంటెక్, ఎం ఫార్మసీ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో 2024–25 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఎంటెక్, ఎం ఫార్మసీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎంటెక్ నాలుగో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ, ఎం ఫార్మసీ నాలుగో సెమిస్టర్ (ఆర్–21), రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, ఒకటో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–25), రెగ్యులర్ ఒకటో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19, ఆర్–15) సప్లిమెంటరీ, ఫార్మా డి నాలుగు, మూడో, రెండో సంవత్సరం (ఆర్–17) అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు తెలిపారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించండి అనంతపురం అగ్రికల్చర్: అరటికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పండ్లతోటల రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం సంఘం నాయకులు కుళ్లాయప్ప, సంజీవరెడ్డి, శ్రీనివాసులు తదితరులతో కలిసి ఉద్యాన శాఖ కార్యాలయంలో డీడీ బీఎంవీ నరసింహారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా నార్పల, పుట్లూరు, యల్లనూరు, బెళుగుప్ప, యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో 13 వేల మంది వరకు రైతులు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్నారన్నారు. గ్రాండ్–9 రకం అరటి ఏటా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందన్నారు. అరబ్ దేశాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోందన్నారు. అయితే నెల కిందట వరకు టన్ను రూ.26 వేల వరకు పలికిన అరటి ధర ఇపుడు రూ.13 వేలు, రూ.14 వేలకు ధర పడిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీలకు సరఫరా చేసే దళారులు కుమ్మకై ్క రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నట్లు తెలిపారు. టన్ను రూ.26 వేలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రామలింగచౌదరికి అవార్డు అనంతపురం: ఎస్కేయూలోని గ్రామీణాభివృద్ధి శాఖలో అకడమిక్ కన్సెల్టెంట్గా పనిచేస్తున్న డాక్టర్ జి.రామలింగచౌదరికి భారత మానవాభివృద్ధి శాఖ అవార్డు ప్రదానం చేసింది. భారత సామాజిక మండలి శాస్త్ర పరిశోధన సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఎస్కేయూ గ్రామీణాభివృద్ధి విభాగంలో మాజీ రెక్టార్ ప్రొఫెసర్ జి.శ్రీధర్ పర్యవేక్షణలో ‘కరువు ప్రాంతం అయిన అనంతపురం జిల్లాలో వ్యవసాయాభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధి భద్రతను మెరుగుపరచడం’పై పరిశోధనలు చేశారు. అంతేకాకుండా పలు అంతర్జాతీయ సదస్సుల్లో గ్రామీణాభివృద్ధి, సూక్ష్మ నీటి పారుదల సౌకర్యాల ప్రాధాన్యతలను గురించి అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రామలింగచౌదరిని పలువురు అభినందించారు. -
దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్
తాడిపత్రి: చుక్కలూరు పారిశ్రామికవాడలో రెండు రోజుల క్రితం మహిళను బెదిరించి రూ.10 వేలు దోచుకెళ్లిన ఘటనలో రూరల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశార. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివవగంగాధర్రెడ్డి మీడియాకు వెల్లడించారు. పారిశ్రామిక వాడలోని ఓ నల్లబండల పరిశ్రమను వెంకటేశ్వరమ్మ, కళాచారి దంపతులు బాడుగకు తీసుకుని నడుపుతున్నారు. ఈ నెల 14న తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామానికి చెందిన నాగేంద్ర అలియాస్ కొక్లీ, సుబ్బరాయుడులు ద్విచక్రవాహనంపై నల్లబండల పరిశ్రమ వద్దకు వెళ్లారు. అక్కడ కళాచారిని ఒకరు మాటల్లో పెట్టి.. మరొకరు ఇంట్లోకి చొరబడి వెంకటేశ్వరమ్మను గొంతు పిసికి, చంపుతామని, బెదిరించి, ఆమె వద్ద ఉన్న రూ.10 వేల నగదు లాక్కుని బైక్పై ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నాగేంద్ర అలియాస్ కొక్లీ, సుబ్బరాయుడును చుక్కలూరు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపినట్లు రూరల్ సీఐ తెలిపారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన రూరల్ ఎస్ఐ ధరణీబాబు, ఏఎస్ఐ కాటమయ్య, కానిస్టేబుళ్లు అంకన్న, సుధాకర్లను సీఐ అభినందించారు. -
కొడుకు లేని జీవితం వద్దని..
● రైలుకిందపడి తల్లి ఆత్మహత్య తాడిపత్రి: ప్రేమ వివాహానికి తాను అంగీకరించకపోవడం వల్లే తనయుడు ప్రాణం తీసుకున్నాడని మనోవేదనకు గురైన తల్లి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన వివరాలిల ఉన్నాయి. పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన కొండజోగుల శైలజ (40), సురేంద్రబాబు దంపతులకు శ్రీచరణ్ ఏకై క సంతానం. కుమారుడు అనంతపురంలో డిప్లొమా పూర్తి చేశాడు. శ్రీచరణ్ బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు కొద్ది రోజుల క్రితం వీరిద్దరి వివాహం చేసేందుకు ఒప్పుకోవాలని శైలజను కోరారు. ఇందుకు ఆమె నిరాకరించడంతో శ్రీచరణ్ అనంతపురం శివారులోని ప్రసన్నాయపల్లిలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తాడిపత్రిలో అంత్యక్రియలు ముగిశాయి. కుమారుడి చావుకు కారణమయ్యావంటూ బంధువులు, కుటుంబ సభ్యులు విమర్శలు చేయడంతో మానసికంగా కుంగిపోయిన శైలజ శనివారం ఉదయం రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడింది. సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ నాగప్ప తెలిపారు. మగ్గం వర్క్పై ఉచిత శిక్షణ అనంతపురం: రూడ్సెట్ సంస్థలో ఏప్రిల్ 3 నుంచి నెల రోజులపాటు నిరుద్యోగ మహిళలకు జర్దోసి మగ్గం వర్క్పై ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వారై ఉండి, ఆధార్, రేషన్ కార్డు కలిగిన మహిళలు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 94925 83484 నంబరులో సంప్రదించాలన్నారు. -
పాలనలో పారదర్శకత పాటించాలి
అనంతపురం అర్బన్: పాలనలో పారదర్శకత పాటించినప్పుడే విమర్శలకు, ఆరోపణలకు అవకాశం ఉండదని జిల్లా ఇన్చార్జ్ అధికారి, రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి వివిధ అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మండలస్థాయిలో అధికారుల బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింతగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని పారిశ్రామికవేత్తలకు అందించాలని చెప్పారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఏపీఐఐసీ కింద పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని ఆదేశించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అన్ని పంచాయతీల్లో పూర్తి చేయాలన్నారు. డ్వామా కింద కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జున, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం
గుంతకల్లుటౌన్: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్’ కార్యక్రమంపై శనివారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణానికి ప్రమాదమని తెలిసినా ప్లాస్టిక్ వినియోగం మాత్రం తగ్గడం లేదన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మన ప్రవర్తనలో కూడా స్వచ్ఛత ఉండాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్కు స్వస్తి చెప్పాలని కోరారు. స్వచ్ఛభారత్ నిర్మాణానికి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కాగా ప్లాస్టిక్ భూతాల వేషధారణలతో పారిశుధ్య కార్మికులు అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.భవానీ, ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ నయీమ్ అహ్మద్, డీఎల్డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకే గుండాల తండా ఆదర్శం కావాలి.. గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని గుండాల తండా గ్రామం జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శం కావాలని, ఆ విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గుండాల తండాలో నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి కలెక్టర్ వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలను ప్రారంభించారు. మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లుగా గ్రామాన్ని కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలి గుంతకల్లుటౌన్: ‘విలువలతో కూడిన విద్యకు మార్కులతో కొలమానం లేదు. విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ విలువలతో కూడిన విద్యనభ్యసించాలి’ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రారెడ్డి అన్నారు. స్థానిక శ్రీవివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యాసంస్థ ఆధ్వర్యంలో పాఠశాల 24 వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, నైపుణ్యాలను పాఠశాల నుంచే అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు గొప్పగా తయారవుతారని చెప్పారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడు, విద్యాసంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మంజునాథ్, కరస్పాండెంట్ ఓంకారప్ప, తదితరులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్ చూడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి పరార్
● రైల్వే స్టేషన్లో గుర్తించిన పోలీసులు పెనుకొండ: పరీక్షల వేళ సెల్ఫోన్ చూడవద్దని తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఇంటినుంచి పరారయ్యాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నారాయణమ్మ కాలనీ సమీపాన నివాసముంటున్నా లికిరెడ్డి వాయునందన్రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. అయితే శుక్రవారం రాత్రి సెల్ఫోన్ చూస్తుండడంతో తండ్రి నాగార్జునరెడ్డి గమనించి గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వాయునందన్రెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. కుమారుడు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెదికిన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 11 గంటల తర్వాత ఎస్ఐ వెంకటేశ్వర్లును కలసి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ వెంటనే పోలీసు సిబ్బందితో బస్టాండ్, రైల్వేస్టేషన్, జాతీయ రహదారి, పలు హోటళ్ల వద్ద గాలింపు చేపట్టారు. చివరకు రైల్వేస్టేషన్లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, విద్యార్థిని మందలించి చక్కగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. చెట్టుపైనుంచి పడి కూలీ మృతి కుందుర్పి: శ్రీమజ్జనపల్లికి చెందిన వ్యవసాయ కూలీ కెంచయ్య (42) శనివారం చింతచెట్టుపైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కెంచయ్య రోజువారీ కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం చింతకాయలు కోయడానికి సమీపంలోని పుట్రాళ్లపల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ చింతకాయలు కోసే క్రమంలో కాలుజారి చెట్టుపైనుంచి కింద పడ్డాడు. తలకు, మర్మావయవాలకు తీవ్రగాయాలవడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కెంచయ్యకు భార్య నేత్ర, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. -
వైభవంగా శివలక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
పెద్దవడుగూరు(యాడికి): యాడికిలోని శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపించారు. వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంరించిన రథంపై ఉంచి పూజలు నిర్వహించారు. వేలాది భక్తుల చెన్నకేశవస్వామి నామస్మరణతో రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆర్యవైశ్య వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వైఎస్సార్సీపీ నాయకులు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు స్వామి లడ్డూ, చిత్రపటాలను పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాలు, ఆటబొమ్మలు, వివిధ రకాల దుకాణాలు వెలియడంతో యాడికిలో సందడి నెలకొంది. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రతాప్రెడ్డి, ఆలయ ఈఓ దుర్గప్రసాద్, గ్రామపెద్దలు పాల్గొన్నారు. వేలాది మంది భక్తుల నడుమ సాగుతున్న రథోత్సవం -
ఆర్డీటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ: స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి విషద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు..పట్టణానికి చెందిన ఎరుకల మల్లికార్జున స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో అకౌంటెంట్గా పని చేసేవాడు. శుక్రవారం ఉరవకొండ శివారులో విషద్రావకం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు అనంతపురం తీసుకెళ్లారు. బాధితుడి నుంచి పోలీసులు సూసైట్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఇలా.. ‘ఆరేళ్లుగా ఉరవకొండ, గుంతకల్లు ఆర్డీటీ కార్యాలయాల్లో అకౌంటెంట్గా పని చేశా. కొంత కాలం క్రితం ఏటీఎల్ గ్రామస్వరాజ్యనిధి చెక్కును ఇచ్చి విత్డ్రా చేసుకురావాలని ఆదేశించారు. వారు చెప్పిన విధంగా డ్రా చేసి మొత్తం నగదు వారికి అందించా. ఉరవకొండ, గుంతకల్లు నుంచి బదిలీ అయ్యే సమయంలో రికార్డులన్నీ పరిశీలించి, నా నుంచి ఎలాంటి డ్యూస్ లేవని క్లియరెన్స్ చేసి సీనియర్ అకౌంటెంట్ నాకు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే గ్రామ స్వరాజ్య నిధులు తానే స్వాహా చేసినట్లు అధికారులు ఆరోపించి తన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి ఆర్డీటీ ఆఫీసుకు పిలిచి డబ్బు కట్టాలని బెదిరించాడు. డబ్బు మొత్తం ఆర్డీటీ అధికారులకు ఇచ్చా. ఇందులో నా ప్రమేయం లేదు. ఆర్డీటీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ లేఖలో పొందుపరిచాడు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్ -
ఉపాధ్యాయులను విస్మరించిన ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను విస్మరించిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోచంరెడ్డి అశోక్కుమార్రెడ్డి విమర్శించారు. ఏపీ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్కు ప్రభుత్వ గుర్తింపు వచ్చి ఏడాదైన సందర్భంగా శుక్రవారం నగరంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో సక్సెస్ స్కూల్స్ ద్వారా ఇంగ్లిష్ మీడియంను తీసుకొచ్చి 36 వేలమంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. వివిధ డీఎస్సీల ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులు రెండేళ్ల అప్రెంటిస్ పీరియడ్ చేసి సర్వీస్ చేసినందుకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ పక్షపాతిగా వ్యవహరించారన్నారు. తెలుగు, హిందీ, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్గ్రేడ్ చేశారన్నారు. ఈ కారణంగా దాదాపు 30 వేల మంది టీచర్లు ప్రమోషన్లు పొందారన్నారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మార్చారన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల హామీలను తొమ్మిది నెలలు పూర్తవుతున్నా పట్టించుకోలేదన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్స్, ఆర్జిత సెలవుల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్టీఏ గుర్తింపుకు కృషి చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలత రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధీర్కు జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణ, గోపాల్, రామకృష్ణ, జిల్లా నాయకులు ఓబిరెడ్డి, కేశవరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి -
మద్యం మత్తులో యువకుడి మృతి
కంబదూరు: మండల కేంద్రంలో ఓ యువకుడు మద్యం మత్తులో వరి మడిలోకి జారిపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కంబదూరుకు చెందిన రామాంజినేయులు, మణెమ్మ దంపతుల కుమారుడైన అజయ్కుమార్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వరి పంటకు నీళ్లు కట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో వరి మడిలో జారిపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో బురదలో నుంచి పైకి లేవడానికి చేతకాక ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడి మొదటి భార్య వదిలేయడంతో మూడు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. చీనీచెట్లు దగ్ధం ఆత్మకూరు: వడ్డుపల్లిలో రైతు ఓబిరెడ్డికి చెందిన చీనీ చెట్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. బాధితుడి వివరాల మేరకు..రైతు నాలుగేళ్ల క్రితం 4 ఎకరాల్లో 600 చీనీచెట్లు సాగు చేశాడు. ఇందుకోసం దాదాపు రూ.5 లక్షల దాకా ఖర్చు చేశాడు. ఈ ఏడాది కాపు వదలాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగి చీనీచెట్లు, చింతచెట్లు, డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు. బాలుడిపై దాడి గుత్తి రూరల్: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్లో ఓ బాలుడిపై శుక్రవారం ఇంటి పక్కన వారు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి బంధు వులు తెలిపిన వివరాలు.. కల్లూరు ఆర్ఎస్కు చెందిన రామాంజనేయులుకు ఇంటి పక్కన వారితో చిన్నపాటి విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి రామాంజనేయులుపై ఇంటి పక్కన వారు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తన తండ్రిని కొడుతున్నారని బాలుడు యహోషువా వెళ్లి అడ్డుపడ్డాడు. దీంతో వారు అతడిపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడిన బాలుడిని గుత్తిలో ఉన్న బంధువులు వెంటనే కల్లూరు నుంచి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు అనంతపురం రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
వైఎస్సార్సీపీ నేత వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
బ్రహ్మసముద్రం: వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. బాధితులు తెలిపిన వివరాలు..పాలవెంకటాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు నటరాజ్ , ప్రశాంత్ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భీం రాజ్తో కలిసి కర్ణాటకలోని మొలకాల్మూరు కోర్టుకు హాజరై బొలెరో వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. వేపులపర్తి గ్రామంలో మద్యం దుకాణం వద్దకు రాగానే పూటుగా మద్యం సేవించిన టీడీపీ కార్యకర్తలు వినాయక్, గొల్ల శివ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో వాహన అద్దం ధ్వంసమైంది. ఘటనపై బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రిజ్వాన్ ● మరికొందరికి రాష్ట్ర కమిటీలో చోటు అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాగజ్ఘర్ రిజ్వాన్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రిజ్వాన్ గతంలో వక్ఫ్బోర్డు జిల్లా చైర్మన్గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా షేక్ రహ్మంతుల్లా, దాండియా ఖాజామైనుద్దీన్, ఎస్ తబ్రిజ్ షోకత్ హామి, వీ అబుజార్ నదీం అహ్మద్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ అఫ్జల్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా షేక్ నియాజ్ అహ్మద్, రాష్ట్ర ఐటీ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా పీ మంజునాథ్ యాదవ్ నియమితులయ్యారు. పావురం గుడ్ల కోసం వెళ్లి.. ● బావిలో పడి చిన్నారి మృతి రాప్తాడు: పావురం గుడ్ల కోసం వెళ్లిన చిన్నారి బావిలో పడి మృతి చెందిన ఘటన భోగినేపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పామాల లక్ష్మి ఏకై క కుమారుడు పామాల పునీత్కుమార్ (8) శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. హోలీ సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పాడు బడిన బావి వద్దకు వెళ్లారు. బావిలోని రంధ్రాల్లో ఉన్న పావురాల గుడ్ల వెతుకుతుండగా పునీత్కుమార్ కాలుజారి బావిలో పడిపోయాడు. చిన్నారి స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడికి చేరుకుని వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి మృతదేహంపై పడి చిన్నారి తల్లి రోదించిన తీరు పలువురి కంట నీరు తెప్పించింది. ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం చిన్నారి తండ్రి నారాయణస్వామి రైలు ప్రమాదంలో మృతి చెందాడు.