Ananthapur
-
తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో గత 15 రోజులుగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చిందని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. బుధవారం తన స్వగ్రామం కొనకొండ్లలో నెలకొన్న తాగునీటి సమస్యపై కలెక్టర్ ఆనంద్తో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఉరవకొండ, వజ్రకరూరు, బెళుగుప్ప, విడపనకల్లు మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. కొన్ని రోజులుగా ప్రజలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేపడతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారంపై మంత్రి కేశవ్ సైతం దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించి తాగునీటి సరఫరాను పునరుద్దరించాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీకు హమీ ఇచ్చారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి -
పోలీసుల వేధింపులతోనే బాలాంజనేయులు ఆత్మహత్యాయత్నం
అనంతపురం: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. పార్టీ యువజన విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు బాలాంజనేయులుపై పోలీసులు అక్రమంగా కేసు బనాయించడంతో మనస్తాపం చెందిన ఆయన మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం సాయంత్రం అనంతపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాకే చంద్ర మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో బాలాంజనేయులుపై 15కు పైగా కేసులు నమోదు చేశారన్నారు. వేధింపులతోనే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. తక్షణం అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు శ్రీనివాస గురుదత్త, జిల్లా ఉపాధ్యక్షులు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శులు మసూద్, హర్ష, నగర కార్యదర్శులు మైను, నగేష్, రాంభూపాల్ రెడ్డి, నగర కమిటీ సభ్యుడు నరేంద్ర, వార్డు అధ్యక్షుడు సుబ్బారావు, యూత్ వింగ్ సభ్యులు షాషు, ఆనంద్బాబు, సాయికుమార్, విజయ్, ఆర్యవర్దన్, మంజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర ధ్వజం -
తీర్థయాత్రలకు వెళ్లి వస్తూ...
ధర్మవరం అర్బన్: స్థానిక జగ్జీవన్రామ్నగర్కు చెందిన రేషం వ్యాపారి పూజారి రాఘవ(35) ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్ యాత్రకు వెళ్లిన రాఘవ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. నాలుగురోజుల క్రితం రైలు కర్ణాటకకు చేరుకోగానే రాఘవ కనిపించలేదు. రైలు మొత్తం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ధర్మవరానికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలోని రాయచూర్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న రాఘవ కుటుంబ సభ్యులు రాయచూర్కు బయలుదేరి వెళ్లారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఏపీఆర్జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలుతిరుపతి అర్బన్: ఏపీఆర్జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. వి.మోక్షిత్ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి. శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే.పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే.హర్షవర్ధన్ 11వ ర్యాంకు, కే.జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్.హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్ 14వ ర్యాంకు, బి. హర్షిత్ 15వ ర్యాంకు, పి. తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి. పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్ కుమార్, కే. ధోనీష్ 20వ ర్యాంకు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్. విశ్వనాథ్రెడ్డి, విశ్వం అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్రెడ్డి, విశ్వశ్రీ , కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్రెడ్డి అభినందించారు. పోలీసుల అదుపులో కేబుల్ దొంగఅగళి: కేబుల్ అపహరించుకెళుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అగళి మండలం కదిరేపల్లికి చెందిన రైతు గొల్ల సన్న ఈరప్ప తన వ్యవసాయ బోరు బావిలోని మోటారు కాలిపోవడంతో సోమవారం పైకి లాగి మరమ్మతుకు తీసుకెళ్లాడు. కేబుల్ను పొలంలోనే వదిలేశాడు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన గురుమూర్తి, తన స్నేహతుడితో కలిసి మంగళవారం ఉదయం కేబుల్ను సంచిలో వేసుకుని వెళుతుండగా అనుమానం వచ్చి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ సమయంలో గురుమూర్తి సంచిని అక్కడే పడేసి పారిపోయాడు. సంచిలో 300 మీటర్ల పొడవైన కేబుల్ను గుర్తించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైతు ఈరప్ప అక్కడకు చేరుకుని ఆ కేబుల్ తనదేనని ధ్రువీకరించాడు. రైతుల ఫిర్యాదుతో బుదవారం గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. టి.శ్రీదర్శిని (8వ ర్యాంక్) వి.మోక్షిత్ (1వ ర్యాంక్) -
కూలీల సంఖ్య మరింత పెంచండి
యల్లనూరు: ఉపాధి పనుల్లో పాలుపంచుకునే కూలీల సంఖ్య మరింత పెరగాలని సంబంధిత సిబ్బందిని డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. మండలంలోని శింగవరం గ్రామంలో జలధార, జల హారతి పనులను, యల్లనూరులో అమృత్ సరోవర్ పనులు, మేడికుర్తి గ్రామంలో ఫారంపాండ్ పనులను బుధవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పని ప్రాంతంలో కూలీలకు నీడ, తాగునీటి సౌకర్యం కల్పిలంచాలని సిబ్బందికి సూచించారు. వేసవి అలవెన్సులు అందిస్తామని, వేతనం కూడా పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకుంటామని, పనుల్లో పాల్గొనే వారి సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణసాగర్, ఏపీఓ ఓబిరెడ్డి, ఈసీ సత్యమూర్తి, టీఏలు నరేంద్ర, చంద్రశేఖర్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు రామాంజనేయులు, రాజకుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు. డ్వామా పీడీ సలీంబాషా -
పెళ్లి కాలేదని.. యువతి ఆత్మహత్య
కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి కాలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దేవాదులకొండ గ్రామానికి చెందిన ఆనంద్, వసంత దంపతుల కుమార్తె సంగీత (22) ఉన్నత చదువులు అభ్యసించి, రెండు నెలల క్రితం కాంట్రాక్ట్ విధానంలో సైకాలజీ టీచర్గా బెళుగుప్ప మండలంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమై సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్క సంబంధం కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదని నిర్ణయించుకున్న ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్లాట్ఫారంపై వృద్ధుడి మృతదేహంగుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్లోని 7వ ప్లాట్ఫారంపై బుధవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సుమారు 60 ఏళ్లు పైబడి ఉంటాయి. చామనఛాయ రంగులో ఉండి, తెలుపు రంగు పుల్షార్ట్, తెల్లటి పంచ ధరించి ఉన్నాడు. కుడి చిటికెన వేలుపై నల్లటి పుట్టు మచ్చ ఉంది. ఆచూకీ తెలిసిన వారు 90145 86555 కు సమాచారం అందించాలని జీఆర్పీ ఏఎస్ఐ ప్రేమ్కుమార్ కోరారు. గార్మెంట్స్ కార్మికుడి బలవన్మరణం రాయదుర్గం టౌన్: స్థానిక మల్లాపురం ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న గార్మెంట్స్ కార్మికుడు శివకుమార్(55) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన శివకుమార్ అప్పుల పాలయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు మందలించారు. తాగుడు మానుకుని అప్పులు తీర్చాలని హితవు పలికారు. అయితే తాగుడు మానేయడం ఇష్టంలేని ఆయన బుధవారం తెల్లవారుజామున ఇంటి గుమ్మం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జంతులూరు పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ అనంతపురం ఎడ్యుకేషన్: బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రఫీకి జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇచ్చిన మౌఖిక ఫిర్యాదు ఆధారంగా నోటీసు జారీ చేసినట్లు డీపీఓ వెల్లడించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, గ్రామ పంచాయతీ పరిధిలో విధులను సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించారు. కారు ఢీకొని విద్యార్థి మృతిపెద్దవడుగూరు: కారు ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పామిడి మండలం చైతన్య కాలనీకి చెందిన ఓబన్న, లక్ష్మీ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామంలో బుధవారం బంధువుల ఇంట జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి వెళ్లారు. క్రిష్టిపాడు వద్ద 63వ జాతీయ రహదారిపై ఆటో దిగి రోడ్డు దాటుతుండగా రాయలచెరువు వైపు నుంచి శరవేగంగా దూసుకొచ్చిన కారు ఓబన్న కుమారుడు అబిలాష (7)ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రేతల అరెస్ట్గుత్తి: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు గుత్తి సీఐ రామారావు తెలిపారు. గుత్తి పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ సురేష్తో కలిసి వివరాలను ఆయన వెల్లడించారు. గుత్తిలోని అమృత్ సినిమా థియేటర్ వెనుక ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన మాతంగి రాము, నగదాని శివ, కంబగిరి, మరో ముగ్గురితో కలిసి బుధవారం గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీ అయ్యారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 1,100 గ్రాముల గంజాయితో పాటు మట్కా పట్టీలు, బాల్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్న ప్రభుత్వం
గుత్తి: ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడం మానుకోవాలంటూ చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, సాయి శ్రీనివాస్ హితవు పలికారు. గుత్తిలోని పద్మవాణి పాఠశాలలో బుధవారం జరిగిన ఎస్టీయూ సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, పలు పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఇప్పటికై నా ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే పలు ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు, ధర్నాలు చేపట్టినా ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడంతో అందరిలోనూ అసహనం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికై నా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు టెట్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, మండల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణస్వామి, రామాంజనేయులు, సీనియర్ నాయకులు కొలంబస్, పులికొండ, పెద్దిరెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి -
● అధినేతతో భేటీ
శింగనమల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతగా పనిచేద్దాం అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి జిల్లా పరిషత్ ఉద్యోగులందరూ సమన్వయంతో బాధ్యతగా పని చేద్దామని జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి సూచించారు. బుధవారం ఉదయం జెడ్పీ సీఈఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ఆమె శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్ళారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, ఏఓలు లెక్కల్ శ్రీనివాసులు, భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనితీరు మెరుగుపడాలి ● ఐసీడీఎస్ అధికారులకు జేడీ శివజ్యోతి ఆదేశం అనంతపురం సెంట్రల్: పనితీరు మెరుగుపడాలని ఐసీడీఎస్ సిబ్బందిని మహిళాశిశు సంక్షేమశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ శివజ్యోతి ఆదేశించారు. బుధవారం ఆర్డీటీ ఆడిటోరియంలో సూపర్వైజర్లు, సీడీపీఓలతో ఆమె సమావేశమై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అవినీతి, అక్రమాలపై తరుచూ ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకు ముందు ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం శిశుగృహ, బాలసదనం కార్యాలయాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ, పలువురు సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
అయితే ఈ మాటలు పత్రికలకే పరిమితమయ్యాయి. ఈ నెల 4వ తేదీ అర్థరాత్రి నుంచి శ్రీ సత్యసాయి బాబా నీటి సరఫరా పథకం కార్మికులు వేతనాల కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 1000 గ్రామాలకు సత్యసాయి నీటి సరఫరా ఆగిపోయింది. ఈ విషయం కలెక్టర్తో
‘రాష్ట్రంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు సత్యసాయిబాబా రూ.కోట్లు వెచ్చించి తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. ఆ పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయనకు మాటిచ్చాను. పంచాయతీ రాజ్ శాఖ ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.’ ఇవీ ఈ నెల 8వ తేదీన అమరావతిలో కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో ట్యాంకరు వద్ద నీటిని పట్టుకుంటున్న దృశ్యంకళ్యాణదుర్గం: గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికులు వేతనాల కోసం సమ్మెబాట పట్టడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి బిందె రూ.10 నుంచి రూ.12 దాకా వెచ్చించి దాహం తీర్చుకుంటున్నారు. ● ఫ్లోరైడ్ సమస్య, నీటి కొరతతో పల్లె ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన భగవాన్ సత్యసాయిబాబా సేవా కార్యక్రమాల్లో భాగంగా బృహత్తర పథకానికి రూపకల్పన చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా శ్రీసత్యసాయి రక్షిత తాగునీటి పథకం 1995లో ప్రవేశపెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారో అక్కడి వరకు భారీ పైపులైన్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామీణులకు శుద్ధమైన తాగునీరు అందుతోంది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వెయ్యి గ్రామాలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద 550 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పథకం నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. 1996 నుంచి రాష్ట్ర బడ్జెట్లో పథకం నిర్వహణ – కార్మికుల కూలీలకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నారు. సాఫీగా సాగుతున్న పథకానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కష్టాలు మొదలయ్యాయి. 2025–206 ఆర్థిక సంవత్సరంలో పథకానికి రూ.35 కోట్ల నిధులు అవసరమైతే ప్రభుత్వం రూ.13.7 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో కార్మికుల వేతనాలకు ఆటంకాలు మొదలయ్యాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–2027లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు అందలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక చేతిబదులు తెచ్చుకునేవారు కొందరైతే.. వడ్డీకి తెచ్చుకునేవారు మరికొందరు. పిల్లల చదువుల ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యంత్ర సామగ్రి కొనుగోలుకూ కష్టమే తాగునీటి పథకం నిర్వహణలో భాగంగా అవసరమైన యంత్ర సామగ్రి సైతం కార్మికులకు భారంగా మారింది. ముఖ్యంగా యంత్ర సామగ్రి, రవాణా ఖర్చు, క్లోరిన్, బ్లీచింగ్, పౌడర్, పంప్లకు అవసరమయ్యే ఆయిల్స్, గ్రీజ్లు, జాయింట్ బోల్ట్ అండ్ నట్స్ వంటి పలు కన్జూమబుల్ మెటీరియ్కు, రిపేరీ ఖర్చులకు కూడా భారంగా ఉండే పరిస్థతి ఏర్పడింది. రేపు పుట్టపర్తికి చంద్రబాబు రాక పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ నిర్మాణం కోసం భూమి పూజ చేయడానికి ఈ నెల 15న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయిబాబా తాగునీటి పథకం కార్మికుల వేతన బకాయిలకు ఏమైనా మోక్షం లభిస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలు వేసవిలో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం తాగునీటి పథకంపై కరుణిస్తారో లేదో వేచి చూడాల్సిందే. అరెస్టుల పేరుతో భయపెడుతున్నారు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కార్మికులతో చర్చలు జరిపారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు కానీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. కార్మికులను అరెస్టుల పేరుతో భయపెట్టే కుట్రలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు కూడా అరకొర నిధులు ఇవ్వడంతో.. వాటిని వారే వాడుకుంటున్నారు. ప్రజలకు నీళ్లు ఉచితంగా ఇవ్వడంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. విద్యుత్ బిల్లులు కట్టడం లేదని విద్యుత్ శాఖ వాళ్లు అంటారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ నుంచి పంచాయతీలకు నిధులు రావడం లేదు. పంచాయతీలకు నిధులు కేటాయిస్తే ఎలాంటి సమస్యా ఉండదు. – గోవిందు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు, అనంతపురం ‘సత్యసాయి’ కార్మికులకు 5 నెలలుగా అందని వేతనాలు ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపు శూన్యం 1000 గ్రామాలకు వారం రోజులుగా నీటి సరఫరా బంద్ చంద్రబాబు పర్యటనతోనైనా సమస్యకు పరిష్కారం చూపేరా? -
బతుకు బరువు
తెర మరుగు..గతంలో ఓ వెలుగు వెలిగిన సినిమా థియేటర్లు ఓటీటీ దెబ్బకు మూతపడుతున్నాయి. సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్లపైకి అందుబాటులోకి వస్తుండడంతో థియేటర్కు వెళ్లేవారు కరువయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా థియేటర్లు మూత పడుతున్నాయి. ఫలితంగా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. థియేటర్ కాస్త ఓ తియ్యని జ్ఞాపకంగా మిగలనుంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారికి మా కష్టనష్టాలు తెలుస్తాయని భావించాం. కానీ డిప్యూటీ సీఎం వపన్కల్యాణ్ మా గురించి కనీసంగానూ స్పందించడం లేదు. పైరసీపై ప్రభుత్వ నియంత్రణ లేదు. దీంతో సినీ పరిశ్రమ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. వారానికి శ్యాటిలైట్ హక్కుల కోసం రూ.13 వేలు కట్టాలి. కానీ రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా ఉండడం లేదు. – ఎర్రిస్వామి గౌడ్, మేనేజర్, నీలిమా థియేటర్ అనంతపురం కల్చరల్: కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద సందడి అంతా.. ఇంతా కాదు. అలాగే థియేటర్లలో పనిచేసే సిబ్బందికీ అంతే క్రేజ్ ఉండేది. టికెట్ల కోసం అభిమానులు పోటీ పడేవారు. ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. సినిమా విడుదలైన 15 రోజుల్లోనే సెల్ఫోన్లలో ప్రత్యక్షమవుతోంది. దీనికి తోడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బలమైన కథలు, భారీ చిత్రాలూ రావడం లేదు. అరకొర సినిమాలు కాస్త జనాదరణ పొందినా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్లో టికెట్, తినుబండారాల ఖర్చులు సామాన్యుడికి భారం కావడంతో థియేటర్లకు వెళ్లేవారు కరువయ్యారు. దీంతో థియేటర్ల నిర్వాహకులకు విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, థియేటర్ల లీజు భారంగా మారాయి. 15 రోజులుగా తెర లేవలేదు ప్రతి థియేటర్లో కనీసం 300 నుంచి 500 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 థియేటర్లు ఉండగా, ప్రేక్షకాదరణ లేకపోవడంతో చాలా వాటిలో సినిమాలు ఆడడం లేదు. కొన్నింటిని యజమానులు మూతేశారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో కేవలం 50 థియేటర్లు మిగిలుండగా, వీటిల్లోనూ ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమాలు ఆడిస్తున్నారు. అనంతపురంలోని శ్రీకంఠం, రఘువీరా, నీలం, కృష్ణా థియేటర్లు ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోగా రమణ, రమేష్, రాజా, సంఘమేష్ థియేటర్లు కల్యాణమండపాలుగా రూపాంతరం చెందాయి. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. అనంతపురంలో ప్రస్తుతం 11 థియేటర్లు ఉండగా, వాటిలో శాంతి, గౌరి, త్రివేణి, ఎస్వీ థియేటర్లు మినహా మిగతావన్నీ వారాల తరబడి మూతపడే ఉంటున్నాయి. త్రివేణి గ్రూపు థియేటర్లు వీ మెగా వారి ఆధ్వర్యంలో నడుస్తుండగా, శాంతి, గౌరీ కాంప్లెక్సులు సురేష్ ప్రొడక్షన్స్ వారు నడుపుతున్నారు. ఇక ఎస్వీ, నీలిమా (ఎన్ మాక్స్) థియేటర్లు కూడా కదిరికి చెందిన వారి ఆధీనంలో నడుస్తున్నాయి. వీటన్నింటిలో పెద్ద హీరోల చిత్రాలు రెండు వారాలకు మించి ఆడని పరిస్థితి. చిన్న సినిమాలైతే రెండోరోజుకే బంద్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రోడ్డున పడుతున్న కార్మికులు వెండి తెర వెలుగులీనుతున్న రోజుల్లో ఒక్కో థియేటర్లో 15 నుంచి 25 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ లెక్కన అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,110 కు పైగా కార్మిక కుటుంబాలు జీవనం సాగించేవి. ప్రస్తుతం ప్రేక్షకాదరణ లేక థియేటర్లు మూత పడుతుండడంతో కార్మికులు రోడ్డు పడుతున్నారు. ఓటీటీ, పైరసీ కారణంగా ఉపాధికి భద్రత లేక పోవడంతో చాలా మంది కార్మికులు ఆటో డ్రైవర్లుగా, కూరగాయల విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు. ‘పవర్’ చూపని ‘స్టార్’ ప్రేక్షకుల్లో అత్యంత మాస్ ఇమేజ్ కలిగిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఉప ముఖ్యమంత్రి పవర్స్టార్ పవన్కళ్యాణ్తో సినీ పరిశ్రమ రూపరేఖలు మారిపోతాయని పలువురు ఆశించారు. పైరసీని అరికట్టడంతో పాటు రాయితీలతో థియేటర్ల యజమానులకు అండగా నిలుస్తారని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా చలనచిత్ర పరిశ్రమ పరిరక్షణపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో అందరిలోనూ నిరాస నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ చేతకానితనంతో సినిమా విడుదలైన రెండో రోజే హెచ్డీ ప్రింట్లు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తమందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల బాగు కోసం, కార్మికుల సంక్షేమానికి పవర్స్టార్ చేసిందేమీ లేదంటూ పెదవి విరుస్తున్నారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకాదరణ కరువు వారాల తరబడి మూతబడుతున్న థియేటర్లుప్రభుత్వ నియంత్రణ సరిగా లేదు -
వేర్వేరు ప్రాంతాల్లో అన్నదాతల ఆత్మహత్య
అప్పులు తీర్చే మార్గం కానరాక జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక క్రిమి సంహారక మందు తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యాడికి: మండలంలోని లక్షుంపల్లికి చెందిన ఉద్యాన రైతు శ్రీనివాసులురెడ్డి (60)కి భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పండ్ల మొక్కల సాగు, ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్ల కోసమని ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. బోరు బావుల్లో నీరు తగ్గి తోటలో చెట్లు ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన శ్రీనివాసులురెడ్డి మంగళవారం రాత్రి క్రిమి సంహారక మందు తాగాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పామిడి: పామిడి మండలం రామరాజపల్లికి చెందిన రైతు చిన్నప్పరెడ్డి గారి ముత్యాలరెడ్డి (76)కి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేసేవాడు. పంటల పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అయితే వర్షాభావం కారణంగా పంటలు పండక అప్పలకు వడ్డీల భారం పెరుగుతూ దాదాపు రూ.15 లక్షల వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ మదనపడుతుండేవాడు. అప్పులు తీర్చక పోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన ఆయన బుధవారం తన పొలంలో క్రిమి సంహారక మందు తాగి ఇంటికి చేరుకుని వరండాలో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ముత్యాలరెడ్డి మృతి చెందాడు. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నిరుద్యోగ భృతి ఏది బాబూ?
అనంతపురం: ఇంటికో ఉద్యోగం.. లేదా నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దగా చేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో గల వైఎస్సార్సీపీ జిల్లా నూతన కార్యాలయంలో అనంత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో రూ.3.61 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు డీబీటీ ద్వారానే రూ.2.73 లక్షల కోట్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. నాన్ డీబీటీతో కలుపుకుంటే రూ.4.58 లక్షల కోట్లు ప్రజలకు లబ్ధి కలిగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీ సూపర్ సిక్స్లోని నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా దగా చేశారని మండిపడ్డారు. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందకుండా పోయాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి రెడ్బుక్ అమలుతో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా జిల్లాలో రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించడానికి కూడా తీరిక లేకపోయిందన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాలి హంద్రీ–నీవా కాలువను 11 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి అనుగుణంగా వెడల్పు చేయాలని అనంత డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్లో 780 అడుగుల నుంచే రోజుకు 7 టీఎంసీల నీటిని తెలంగాణ తీసుకెళ్తోందన్నారు. 11 వేల క్యూసెక్కులతో హంద్రీ–నీవాను విస్తరిస్తే 40 రోజుల్లో 40 టీఎంసీలను తీసుకెళ్లే అవకాశం ఏపీకి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, జిల్లా కేంద్రం అనంతపురంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి ఓ క్రెడిట్ కార్డు రాష్ట్రంలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన సంపదనంతా ప్రభుత్వం అమరావతికి కేటాయిస్తోందని అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. అమరావతి ప్రాంతం చంద్రబాబుకు క్రెడిట్ కార్డుగా మారిందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు తాత్కాలిక సచివాలయం, హైకోర్టు పేరుతో నిధులు దోపిడీ చేశారని, ఇప్పుడు కూడా అమరావతిలో అభివృద్ధి పేరుతో దోపిడీ కొనసాగుతోందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనంత డిమాండ్ చేశారు. జిల్లాలో ఎండిపోతున్న పంటలకు రక్షక తడులు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 70 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థికసాయం అందించాలనిడిమాండ్ చేశారు. అనంతపురం అభివృద్ధికి సహకారం ఏదీ? వైఎస్సార్సీపీ హయాంలో అనంతపురం నగరంలో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ చేపట్టినట్లు అనంత వెంకటామిరెడ్డి తెలిపారు. ఫ్లై ఓవర్, రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా టవర్ క్లాక్ వద్ద సర్వీస్ రోడ్డు, సప్తగిరి సర్కిల్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.40 కోట్లు మంజూరు అయ్యేలా కృషి చేశామన్నారు. ఎన్నికల తర్వాత సప్తగిరి సర్కిల్ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రెండేళ్లయినా పట్టించుకునే వారే లేరన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మంజూరు చేసిన నిధులు వెనక్కువెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఖరీఫ్ సాగు అంచనా 3,43,399 హెక్టార్లు అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ –2026కు సంబంధించి పంటల సాగు అంచనాలు అధికారికంగా ప్రకటించారు. ‘ముంగారు’ వ్యవసాయం అత్యంత కీలకం. వర్షాధారంగా మెట్ట వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసే పంటలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలతోనే పండటం.. ఎండటం జరుగుతోంది. ఈసారి సూపర్ ‘ఎల్–నినో’ అంటూ భయపెడుతుండటంతో సాగు అంచనాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. గత ఐదేళ్ల ఖరీఫ్లో సాగులోకి వచ్చిన పంటల విస్తీర్ణం ఆధారంగా ప్రణాళికశాఖ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత ఖరీఫ్ పంటల సాగు అంచనాలు సిద్ధం చేశారు. ఈసారి అన్ని రకాల వ్యవసాయ పంటలు 3,43,399 హెక్టార్లు (8,58,497 ఎకరాలు)గా గుర్తించారు. అందులో ప్రధానపంట వేరుశనగ 1,47,382 హెక్టార్లు ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో కంది పంట 78,274 హెక్టార్లు, పత్తి 42,119 హెక్టార్లు, మొక్కజొన్న 21,659 హెక్టార్లు, ఆముదం 17,490 హెక్టార్లుగా అంచనా వేశారు. నీటి వసతి కింద 22,868 హెక్టార్లలో వరి నాట్లు వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలా ఐదు ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, ఉలవ, అలసంద, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు సహా 20 నుంచి 22 రకాల పంటలు 3.43 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. గతేడాది తగ్గిన వేరుశనగ, పత్తి గత ఖరీఫ్–2025లో సకాలంలో విత్తనం ఇవ్వకపోవడం, జూన్, జూలైలో సరైన వర్షాలు పడకపోవడంతో వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లకు గాను 90 వేల హెక్టార్లకే పరిమితమైంది. అలాగే పత్తి కూడా 44 వేల హెక్టార్లకు గాను 29 వేల హెక్టార్లకు తగ్గిపోయింది. వీటి స్థానంలో కంది పంట 55 వేల హెక్టార్లు అంచనా వేయగా.. ఏకంగా 1.34 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. మొక్కజొన్న కూడా 14 వేల హెక్టార్లు అంచనా వేయగా 42 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇలా గతేడాది పంట సాగు అంచనాలు పూర్తీగా తారుమారయ్యాయి. మొత్తం మీద గతేడాది 3.43 లక్షల హెక్టార్లకు గానూ 3.57 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చినట్లు ఈ–క్రాప్ నివేదిక వెల్లడి చేస్తోంది. 30 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా ప్రధానపంట వేరుశనగను అధిగమించి కంది మొదటి స్థానం ఆక్రమించడం గమనార్హం. నైరుతిపై ఆశలు జూన్ ఒకటి నుంచి అధికారికంగా ఖరీఫ్ (ముంగారు) మొదలు కానుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్గా పరిగణిస్తారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో ప్రధానంగా ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాలి. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. సమయం దగ్గర పడుతున్నా ఇటీవల అక్కడక్కడ నాలుగైదు మండలాలు మినహా ఇంకా తొలకర్లు పలకరించడం లేదు. ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. జూన్లో ప్రవేశించే నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షాలను బట్టి పంటల సాగు సరళి తెలుస్తుంది. అయితే ఈసారి సూపర్ ఎల్–నినో వల్ల రుతుపవనాలు బలహీనపడి పెద్దగా వర్షాలు పడకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ● మరోపక్క విత్తన వేరుశనగ, కంది, పెసలు, అలసంద, కొర్ర, రాగులు తదితర రాయితీ విత్తనాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 23 నెలల్లో రూ.3.61 లక్షల కోట్ల అప్పులతో ఏపీ రికార్డు ఆరోగ్యశ్రీని నీరుగార్చారు.. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెట్టారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ప్రధానపంట వేరుశనగ 1.47 లక్షల హెక్టార్లకే పరిమితం 78 వేల హెక్టార్లకు పెరిగిన కంది, 42 వేల హెక్టార్లు పత్తి -
బలిపశువులను చేశారు
డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుని ప్రిపేర్ అయ్యాం. ‘నీట్’ పరీక్ష బాగా రాశాం. కీ ఆధారంగా మంచి స్కోరు వస్తుందని అంచనా వేశాం. సీటు వస్తుందని కలలు కంటున్న వేళ ప్రభుత్వం ‘నీట్’ను రద్దు చేసినట్లు ప్రకటించడం చాలా బాధ కలిగించింది. ఎక్కడో ప్రశ్నపత్రం లీక్ అయిందని దేశ వ్యాప్తంగా ఆ పరీక్ష రద్దు చేయటం మంచిది కాదు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి విద్యార్థులను బలిపశువులను చేశారు. ఇదెక్కడి న్యాయం? – వడుగూరు అర్షియా, పెద్దవడుగూరు -
50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు
అనంతపురం అగ్రికల్చర్: భూసారం పెంపు కోసం జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్మెన్యూర్) ధరలు ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ ఇన్చార్జి జేడీ ఎం. మురళీధర్రెడ్డి, టెక్నికల్ ఏవో రాకేష్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్లో జిల్లాకు 474 క్వింటాళ్ల జనుము, 190 క్వింటాళ్ల జీలుగ, 95 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు కేటాయించారన్నారు. జనుము కిలో పూర్తీ ధర రూ.154 కాగా 50 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద కిలోకు రూ.77 ప్రకారం చెల్లించాలన్నారు. జీలుగ విత్తనాలు కిలో పూర్తీ ధర రూ.160 కాగా రైతులు తమ వాటా కింద రూ.80 ప్రకారం చెల్లించాలన్నారు. అలాగే పిల్లిపెసర కిలో పూర్తీ ధర రూ.196 కాగా రైతులు తమ వాటా కింద రూ.98 ప్రకారం చెల్లించాలని తెలిపారు. ఏపీ సీడ్స్ ద్వారా జిల్లాకు సరఫరా కాగానే ఆర్ఎస్కేల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. బాలుడి మృతదేహం లభ్యం గుమ్మఘట్ట: మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో అదృశ్యమైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.. తాళ్లకెరకు చెందిన మారెన్న, సుమక్క దంపతులకు కుమారుడు ఉమేష్ (14), ముగ్గురు కుమార్తెలున్నారు. వారు గొర్రెలు మేపుకుని జీవనం సాగించేవారు. తండ్రికి తోడుగా ఉమేష్ గొర్రెలు మేపేందుకు సోమవారం గ్రామ సమీపంలోని బీటీపీ రిజర్వాయర్ దగ్గరకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో రిజర్వాయర్లోని ఓ గుంతలోకి ఉమేష్ ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి నీటిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. -
ప్రయాణికులకు సౌకర్యాల కల్పనే ధ్యేయం
గుంతకల్లు: ప్రయాణికులకు సౌకర్యాల కల్పనే ధ్యేయమని డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గుంతకల్లు–మార్కాపురం రోడ్డు ప్యాసింజర్తో పాటు విశాఖపట్నం–కడప మార్గంలో గుంతకల్లు వరకు పొడిగించిన తిరుమల ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళవారం వారు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ అమృత్ రైల్వేస్టేషన్ల కింద అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. గుంతకల్లు–వాడి మధ్య 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీంతో సరుకు రవాణా, రైలు ప్రయాణం మరింత సులభతరమవుతుందన్నారు. ఎంపీ అంబికా మాట్లాడుతూ అయోధ్య వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా బెంగుళూరు–అయోధ్యతోపాటు గుంతకల్లు–బెంగుళూరు ఉదయం పూట మరో రైలును ఏర్పాటు చేయాలని రెల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కరోనా సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించడంతో పాటు బెంగళూరు–అనంతపురం మధ్య నడుస్తున్న ప్యాసింజర్ రైళ్లను గుంతకల్లు వరకు పొడిగించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందు, నాయకులు ఎస్ఎండీ గౌస్ ఎంపీ అంబికాకు వినతి పత్రం అందజేశారు. ఫిట్మెట్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు రైళ్ల కోచ్ మెయింటెనెన్స్ డిపోను గుంతకల్లులో ఏర్పాటు చేసేలా రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శివప్రసాద్, సీనియర్ డీసీఎం మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం
అనంతపురం అర్బన్: సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం డెడికేటెడ్ కమిషన్ ముఖ్య ఉద్దేశమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను శాసీ్త్రయంగా, చట్టబద్ధంగా ఖరారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై అధ్యయనం కోసం వచ్చిన చైర్మన్ ముందుగా కలెక్టర్ ఆనంద్తో కలిసి అధికారులతో సమీక్షించారు. అనంతరం బీసీ సంఘాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతులకు (బీసీ) కేటాయించాల్సిన శాతాన్ని నిర్ణయించేందుకు జిల్లాల పర్యటన చేపట్టామన్నారు. గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యం, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, బీసీ సంక్షేమాధికారి ఖుష్బూకొఠారి, డీపీఓ నాగరాజునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
●తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
గుత్తి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గుత్తిలోని జంగాల కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 20 రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వాటర్ ట్యాక్స్ కడుతున్నా ఎందుకు నీటిని సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. తాగునీటిని డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. వాహనాలు బారులు తీరాయి. సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
●హనుమా.. మముగనుమా
రాయదుర్గం/ బొమ్మనహాళ్/ గుంతకల్లు రూరల్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా వ్యాసరాయలు కాలంలో ప్రతిష్టించిన డీ హీరేహాళ్ మండలం మురడి, గుంతకల్లు మండలం కసాపురం, బొమ్మనహాళ్ మండలం నేమకల్లులోని ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హనుమా.. మము గనుమా.. అంటూ స్వామివారి దర్శనబాగ్యం కోసం క్యూకట్టారు. హనుమాన్ చాలీసా, పారాయణం, భజన కార్యక్రమాల్లో పాల్గొని పునీతులయ్యారు. అన్నదానం, ప్రసాదాలు పంచిపెట్టారు. ఘనంగా ప్రారంభోత్సవాలు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ పరిసరాల్లో నూతనంగా ప్రసాదాల తయారీ శాల, ప్రసాదాల విక్రయకేంద్రం, పరిపాలనా కార్యాలయం, గోశాల, స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించారు. హనుమజ్జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఈ సముదాయాలను ప్రారంభించారు. గర్భాలయం, విమాన గోపురం దాత నవోదయ ఎడుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ సుంకి రాజేందర్రెడ్డి దంపతులు, గోశాల దాత పరమేశ్వరి సంగ్ కుటుంబ సభ్యులు తదితరులు హనుమజ్జయంతి వేడుకలతోపాటు, ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. లక్ష పుష్పార్చనలో అనంతపురంలో పంచముఖ నెట్టికంటుడు ఆంజనేయస్వామిమురడిలో ప్రత్యేక పూజలందుకున్న అంజన్న కసాపురంలో దర్శనానికి బారులుతీరిన భక్తులు అనంతపురంలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తున్న దృశ్యం -
ఇన్చార్జ్ జేడీఏగా మురళీధర్రెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: రెగ్యులర్ జేడీఏగా నియమితులైన బ్లాక్దిల్ సవ్యార్నంద్ డిప్యుటేషన్పై అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతిపై ఇక్కడికి డీడీఏగా వచ్చిన బద్వేలుకు చెందిన ఎం.మురళీధర్రెడ్డి ఇన్చార్జ్ జేడీఏగా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. కాగా మురళీధర్రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. వచ్చే నెల మరో అధికారి జేడీఏగా రానున్నారు. ఇన్చార్జ్ జేడీఏకు పలువురు ఏఓలు, ఏడీఏలు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. డీలర్ల సమక్షంలోనే బియ్యం తూకం అనంతపురం అర్బన్: ఎంఎల్ఎస్ (మండలస్థాయి స్టాక్) పాయింట్లలో డీలర్లు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో బియ్యం తూకం వేసి ఇవ్వాలి. ఈ–పాస్ యంత్రం ద్వారా అథెంటికేషన్ తీసుకుని చౌక దుకాణాలకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేష్రెడ్డి తెలిపారు. ‘పేదల బియ్యంలో బొక్కుడు’ అనే శీర్షికన ఈనెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. సరుకులు 100 శాతం తూకం వేసి, సంచి బరువు మినహాయించి ఇవ్వాలని జిల్లాలోని అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏ తేదీల్లో సరుకులు ఇస్తారనే విషయాన్ని డీలర్లకు ముందస్తుగానే తెలియజేస్తామన్నారు. ఆయా తేదీల్లో డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చి సరుకులు తూకం సరిచూసుకోవాలని కోరారు. అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో నాలుగు టన్నుల సామర్థ్యం ఉన ఎలక్ట్రానిక్ వే స్కేల్ ఉందన్నారు. ఏదైనా పాయింట్లో డీలర్లకు తక్కువ తూకంతో సరుకులు ఇచ్చినట్లు నిర్ధారణ అయితే సంబంధిత పాయింట్ ఇన్చార్జ్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధి కల్పించకుంటే ఇంటికే అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించి, వారికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమ గ్రామ పరిధిలో ఏడాదికి 7,500 పనిదినాలను కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రమే కాంట్రాక్టు పొడిగించాలని ఆదేశించింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామి పథకంలో పని చేస్తున్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఒక నమ్మకం.. ఒక అనుబంధం.. ఒక ఆప్యాయత.. ఒక భరోసా.. అందుకే ఆయన్ను చూసేందుకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పామిడి పెన్నానది తీరాన మండుటెండలోనే గంటల తరబడి వేచి ఉండి తమ అభిమాన నాయకుడిని
అనంతపురం/ పామిడి: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీబీ) మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులు లిఖిత, చైతన్య మిత్రలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. 3 కిలో మీటర్లు.. 35 నిమిషాలు వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కల్లూరులో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పామిడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంది. వైఎస్ జగన్ ఉదయం 11:10గంటలకు హెలికాప్టర్లో హెలిప్యాడ్కు చేరుకున్నారు. 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిసెప్షన్ వేదిక వద్దకు బయల్దేరారు. వైఎస్ జగన్ కారుమీద నిలబడి ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన సందోహం నడుమ కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితితో 35 నిమిషాల సేపు ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తూనే ఉన్నారు. పామిడిలో భవనాలు, మిద్దెలు ఎక్కిన ప్రజలు .. జగన్ను చూసి మురిసిపోయారు. జాతీయ రహదారి–44 జనంతో నిండిపోయింది. అన్ని దారులూ పామిడి వైపే అన్నట్లు.. జన సందోహం వెళ్లింది. ఉదయం 7 గంటలకే హెలిప్యాడ్ వద్దకు జనం చేరుకున్నారు. మండుటెండను లెక్క చేయకుండా జగన్ను చూసేందుకు వేచి ఉన్నారు. అడుగడుగునా నీరాజనం పామిడి వీరాంజనేయులు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోగానే అక్కడి పరిసరాలు జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. వైఎస్ జగన్తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 12.20 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయల్దేరారు. ఆత్మీయ స్వాగతం హెలిప్యాడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎంపీ పీవీ మిథున్రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకరనారాయణ, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, రాప్తాడు, తాడిపత్రి, మడకశిర, రాయదుర్గం సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఈరలక్కప్ప, మెట్టు గోవిందరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా పరిశీలకులు చవ్వా రాజశేఖర్రెడ్డి, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ , ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతీరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ వసీం, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు. పామిడిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం ఏడీసీసీబీ మాజీ చైర్పర్సన్ లిఖిత వివాహ రిసెప్షన్కు హాజరు జగన్ను చూసేందుకు తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు హెలిప్యాడ్ నుంచి పామిడి వీరా ఇంటి వరకు నీరాజనమే అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మాజీ ముఖ్యమంత్రి -
డాక్టర్ కలను చిదిమేశారు
● ‘నీట్’ రద్దుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ నెల మూడో తేదీన నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)ను రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. నీట్లో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష ప్రారంభానికి ముందే లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏళ్ల తరబడి సన్నద్ధమై, కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే ఇప్పుడు రద్దు చేశారన్న వార్త విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆవేదన కలిగించింది. ప్రశ్నలు సులువుగా ఉన్నాయి.. పరీక్ష బాగా రాశాం.. మంచి ర్యాంకు వస్తుంది.. ఎంబీబీఎస్ కల నెరవేరుతుందనే ఆశను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చిదిమేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అయితే.. అక్కడ పరీక్షను రద్దు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,534 మంది నీట్ యూజీ రాశారన్నారు. -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి
కణేకల్లు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర డిప్యూటీ హెల్త్ కమిషనర్ సుజాత డాక్టర్లను ఆదేశించారు. స్థానిక సీహెచ్సీని మంగళవారం డీసీహెచ్ఎస్ సెల్వరాజ్తో కలిసి సుజాత ఆసుపత్రిని సందర్శించారు.ఇన్పేషెంట్ గది, బాలింతల గదిని సందర్శించి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకొన్నారు. స్కానింగ్ సెంటర్ను పరిశీలించిన ఆమె వారంలో ఎంత మంది గర్భవతులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తున్నారని గైనిక్ డాక్టర్లను ప్రశ్నించారు. ఆసుపత్రి క్లీనింగ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన డీసీ మరింత శుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బందితో అన్ని గదులను శుభ్రం చేయించాలన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని, ఓపీ తర్వాత డ్యూటీ డాక్టర్ తప్పనిసరిగా ఆసుపత్రిలో ఉండాలన్నారు. డాక్టర్ లేరనే ఆరోపణలు ప్రజల నుంచి రాకూడదన్నారు. అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్, నర్స్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొంటామన్నారు. ఏబీడీఎం(ఆయుష్మాన్భారత్ డిజిటల్మిషన్)లో ప్రతి పేషెంట్ ఆరోగ్య వివరాలను భద్ర పరిచి వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. భవిష్యత్తులో వారు దేశంలో ఎక్కడికెళ్లినా ఆన్లైన్లో ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని తద్వారా వారికి అవసరమైన మేర సేవలందుతాయన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ షరీఫ్, డాక్టర్లు పాల్గొన్నారు. -
విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాల ప్రవేశాలకు దరఖాస్తు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సహాయ సంచాలకులు అర్చన కోరారు. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న శారీరక, బధిరులు, అంధ విద్యార్థులు 100 మందికి హెచ్ఎల్సీ కాలనీ సమీపంలోని హాస్టల్లో అవకాశం ఉంటుందన్నారు. బాలికల కోసం అరవిందనగర్లోని ఏర్పాటు చేసిన హాస్టల్లో 50 మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 78935 77797, 94927 60438 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వ్యక్తి బలవన్మరణం గుంతకల్లు టౌన్: కుటుంబ కలహాల కారణంగా పట్టణంలోని మోమినాబాద్కు చెందిన కె.రవికుమార్ (36) మున్సిపల్ పాత ఎస్ఎస్ ట్యాంక్లో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మెయిన్రోడ్డు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా తోపుడు బండిని ఏర్పాటు చేసుకుని బొప్పాయికాయలను విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తున్న రవికుమార్కు భార్య సంధ్య, ఐదుగురు పిల్లలున్నారు. 9వ తేదీ (శనివారం) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన రవికుమార్ మంగళవారం ఉదయం పాత రిజర్వాయర్లో శవమై తేలాడు. మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మనోహర్ తెలియజేశారు. రెండో రోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలుఅనంతపురం క్రైం: నగరపాలక సంస్థలో రెండో రోజు మంగళవారం కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోమవారం లంచం తీసుకుంటూ పట్టుబడిన నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్లను విడివిడిగా విచారించారు. మూడు బృందాలుగా విడిపోయి వారి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. నగదు, పలు ఆస్తి పత్రాలు లభించినట్లు సమాచారం. మరోవైపు నగర పాలక సంస్థ కమిషనర్ను కూడా కార్యాలయానికి పిలిపించి ఇన్చార్జ్ ఎంహెచ్ఓకు సంబంధించి వివరాలు సేకరించారు. ఎంహెచ్ విభాగానికి సంబంధించిన పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కొందరు సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య భారీ స్థాయిలో జరిగిన ఫోన్పే లావాదేవీలను కూడా గుర్తించినట్లు సమాచారం. ఎంహెచ్ఓ నరసింహులు ఇంట్లో 15 తులాల బంగారు నగలతో పాటు రూ.లక్ష నగదు, నాలుగు చోట్ల ఆస్తులు కొనుగోలు చేసిన పత్రాలు లభించినట్లు తెలిసింది. పట్టుబడిన ఇద్దరినీ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి తెలిపారు. యానిమేటర్ భర్త ఘరానా మోసం బ్రహ్మసముద్రం: ఓ యానిమేటర్ భర్త ఘరానా మోసానికి పాల్పడిన విషయం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎర్ర కొండాపురం గ్రామంలో 16 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. యానిమేటర్గా గ్రామానికి చెందిన అంజలి ఉన్నా ఆమె భర్త, టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. 8 సంఘాలకు చెందిన రూ.3 లక్షలకుపైగా పొదుపు సొమ్మును తన తల్లి తిమ్మక్క, భార్య అంజలి ఖాతాల్లో వేసుకున్నాడు. మంగళవారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమ సంఘాలకు సంబంధించి లావాదేవీలపై వేపులపర్తి యూనియన్ బ్యాంక్లో ఆరా తీయగా శ్రీకాంత్ బాగోతం వెలుగుచూసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు బ్రహ్మసముద్రం వెలుగు కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. టన్ను మామిడి రూ.44 వేలు అనంతపురం అగ్రికల్చర్: కక్కలపల్లి మార్కెట్లో మంగళవారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.44 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్ కుమార్ తెలిపారు. హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.44 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు, బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.28 వేలు పలికాయని వివరించారు. -
ప్రయాణం.. ప్రాణ సంకటం
గుంతకల్లు: రైలు ప్రయాణం సామాన్యులకు చుక్కలు చూపుతోంది. గుంతకల్లు మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, బెంగళూరు, తిరుపతి తదితర నగరాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రైళ్లలో సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న స్లీపర్ కోచ్లను సైతం కుదించి ఏసీ కోచ్లకే ప్రాధాన్యత ఇస్తుండడంతో అవస్థలు చెప్పనలవిగా మారాయి. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేయగా కరోనా సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించలేదు. బస్సులో కంటే రైళ్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చనే ఉద్దేశంతో సామాన్యులు ఎక్కువగా ఇటువైపే మొగ్గు చూపుతారు. వేసవి సెలవులు కావడంతో రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ వందల్లో దాటిపోతోంది. దీంతో తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ పేరిట వేలాది రూపాయలు చెల్లిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. రైల్వే యాజమాన్యం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి సామాన్యులకు అందుబాటులో ఉన్న రైళ్లు, స్లీపర్ కోచ్లను తీసేస్తూ ప్రయాణం చేయాలంటేనే నరక ప్రాయమనేలా చేస్తోంది. పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దు.. బెళగావి ఎక్స్ప్రెస్ రైళ్లు (07336/35)భద్రాచలం వెళ్లే భక్తులతోపాటు సికింద్రాబాద్కు రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. తొలుత స్పెషల్ రైళ్లు ప్రవేశ పెట్టి రద్దీ పెరిగిన కారణంగా వారంలో నాలుగు సార్లు రాకపోకలు సాగించేలా అనుమతులు ఇచ్చారు. అయితే తరువాత ఈ రైళ్లను ఉన్నపళంగా రద్దీ చేశారు. టాటానగర్–యశ్వంత్పూర్ మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్ప్రెస్ బళ్లారి మీదుగా గుంతకల్లు బైపాస్ నుంచి సికింద్రాబాద్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. డివిజన్ కేంద్రమైన గుంతకల్లు జంక్షన్లోకి ప్రవేశించకుండానే బైపాస్ లైన్ మీదుగా వెళ్తోంది. ఈ రైలును గుంతకల్లు రైల్వేస్టేషన్లోకి మళ్లిస్తే అటు సికింద్రాబాద్, ఇటు విజయవాడ వెళ్లే ప్రయాణికులకు మరో రైలు లభించినట్లవుతుంది. పట్టాలెక్కని పేదోడి రైళ్లు.. కరోనా సమయంలో రద్దయిన బెంగుళూరు– విజయవాడ ప్యాసింజర్ రైళ్లు నేటికీ పట్టాలెక్కలేదు. ఈ రైళ్లు విజయవాడ, బెంగళూరుకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు తక్కువ చార్జీతో అందరికీ సౌకర్యంగా ఉండేవి. 13 బోగీల్లో రెండు రిజర్వేషన్ స్లీపర్ కోచ్లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. అదేవిధంగా గుంతకల్లు–ధర్మవరం మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఈ రైళ్లను మాత్రం నడపడం లేదు. స్లీపర్ బోగీలను కుదించారు.. గుంతకల్లు జంక్షన్ మీదుగా నడుస్తున్న పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్లీపర్ బోగీలను కుదించి ఏసీ బోగీలను పెంచారు. ఏసీ టికెట్ కొనుగోలు చేయలేని సామాన్య ప్రయాణికుడు స్లీపర్ టికెట్ కొన్నప్పటికీ అవి కూడా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్లో ఉండడం, రైలు వచ్చే సమయానికి కూడా సీటు నిర్ధారణ కాకపోవడంతో చుక్కలు కనపడుతున్నాయి. జనరల్ బోగీల్లో ప్రయాణం మరీ దారుణం. ప్రయాణికులు కూర్చున్న సీటు నుంచి కదిలే పరిస్థితి ఉండదు. బెంగళూరు–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ (18464/65), ఎంబీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ (22100), వాస్కోడిగామా నుంచి జాసీదీ జంక్షన్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్ (17321), కేసీఆర్ బెంగుళూరు–న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ (12627), యశ్వంత్పూర్–గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ (12592) రైళ్లకు స్లీపర్ బోగీలు కుదించి ఏసీ బోగీలను పెంచారు. కిక్కిరిసిపోతున్న జనరల్ బోగీలు.. ప్రతి రోజు ఆయా ఎక్స్ప్రెస్ రైళ్లలో రాకపోకలు సాగించడానికి ఒక్క గుంతకల్లు రైల్వేస్టేషన్లోనే దాదాపు 2,000 మంది ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం రెండు జనరల్ బోగీలు ఉండడంతో బాత్రూమ్ కారిడార్ వద్దే పదుల సంఖ్యలో నిలబడి ప్రయాణాలు సాగిస్తుంటారు. బోగీల్లో వృద్ధులు, రోగులు, మహిళలు టాయిలెట్కి వెళ్లాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అయినప్పుటికీ రైల్వే యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కేవలం ఆదాయం ఎలా పెంచుకోవాలనే తాపత్రయం తప్ప సామాన్యులకు సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చి స్లీపర్ బోగీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. సామాన్యులకు చుక్కలు చూపుతున్న రైలు ప్రయాణం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో రద్దయిన ప్యాసింజర్లను పట్టాలెక్కించని వైనం -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది.ఇవాళ (మంగళవారం) పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. వారిని ఆశీర్వదించారు. -
అనంత రైతన్న ఆక్రందన
అనంతపురం: తీవ్ర కరువుబారిన పడిన రైతాంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని అనంతపురం జిల్లా రైతులు పోరుబాట పట్టారు. వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు చీనీ పంటకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం అనంతపురం కలెక్టరేట్ను దిగ్బంధించారు. మొక్కజొన్న, వరి పంటలను, ఎండిన చీనీ చెట్లను తోపుడు బండ్లపై పెట్టుకుని నిరసన తెలిపారు.రైతులను ఆదుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎండిపోయిన చీనీ చెట్లే నిదర్శనమని చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ఆదుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నేడు అనంతపురం జిల్లా పామిడికి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా పామిడిలో పర్యటించనున్నారు. ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్యమిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు. -
ఎండుతున్న చీనీ తోటలను రక్షించండి
● కలెక్టరేట్ ఎదుట రైతులు, రైతు సంఘం ధర్నా అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఏళ్ల తరబడి పెంచి పోషించిన చీనీ తోటలు నిలువునా ఎండుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పండ్లతోటల రైతుల సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. సోమవారం పలువురు చీనీ రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 91 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయని, అన్ని ప్రాంతాల్లోనూ చీనీ తోటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నారు. చీనీ తోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, ట్యాంకర్ల ద్వారా నీళ్ల సరఫరాకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. ఎండిపోయిన చీనీకి ఎకరాకు రూ. లక్ష పరిహారం చెల్లించాలని, పీఏబీఆర్ నుంచి మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో ఉన్న చెరువులను నింపి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రీవెన్స్లో అధికారులకు అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో పండ్లతోటల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీహెచ్ రాయుడు, ఆర్.చంద్రశేఖర్రెడ్డి, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య, నాయకులు చెన్నారెడ్డి, విరూపాక్షి, రామసుబ్బారెడ్డి, రామయ్య, పెద్ద తాతయ్య, వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి, వెంకటేష్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
కంటితుడుపు జీఓలు వద్దు
● న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన ● ధర్నాలో పీఏసీఎస్ ఉద్యోగులు అనంతపురం అగ్రికల్చర్: కంటితుడుపు జీఓలు కాకుండా న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు తేల్చిచెప్పారు. పీఏసీఎస్ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దగ్ధం చేసే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల ఎదుట పీఏసీఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఐటీయూ, రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. స్థానిక డీసీసీబీ ఎదుట జీఓ 322 ప్రతులు దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ... తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు జేఏసీ పిలుపు మేరకు గత ఫిబ్రవరిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టామని గుర్తు చేశారు. ఆ సమయంలో దిగివచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. నేడు కంటితుడుపుగా జీఓ 322 విడుదల చేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ జీఓలో ఎక్కడేగానీ ఉద్యోగులకు న్యాయం చేకూరే అంశం కనిపించడం లేదన్నారు. తమకు న్యాయం జరిగేలా మరో జీఓ విడుదల చేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
నేడు పామిడికి వైఎస్ జగన్
పామిడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పామిడికి విచ్చేయనున్నారు. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజ నేయులు కుమార్తె ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్పర్సన్ ఎం.లిఖిత వివాహ రిసెప్షన్కు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.10 గంటలకు పామిడిలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయల్దేరి 11.35 గంటలకు రిసెప్షన్ వేదిక వద్దకు చేరుకుంటారు. 11.50 గంటల వరకు రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులు ఎం.లిఖిత, ఎ.చైతన్యమిత్రను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పామిడి నుంచి హెలికాప్టర్లో తిరుగుపయనమవుతారు. హెలిప్యాడ్ సిద్ధం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పామిడి – కల్లూరు మార్గంలో ఉన్న పామిడి వీరా ఫంక్షన్ హాలు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, రాష్ట్ర నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు పరిశీలించారు. అలాగే పామిడి వీరాంజనేయులు గృహ సమీపంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదికను కూడా పరిశీలించారు. వారితో పాటు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, పామిడి సీఐ శివశంకర్నాయక్ హెలిప్యాడ్, రిసెప్షన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు కల్పించే అన్ని సౌలభ్యాలు అందించాలని ప్రభుత్వాన్ని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనకు యూటీఎఫ్ జిల్లా శాఖ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కోటేశ్వరప్ప మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఎంటీఎస్ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరి చేయించుకోవడం దుర్మార్గమన్నారు. డీఎస్సీ–1998, డీఎస్సీ–2008లో ఎంపికై న ఉపాధ్యాయులకు అప్పట్లోనే నియామకాలు ఇవ్వకపోవడం నాటి ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ముఖ్యంగా 2008 డీఎస్సీలో 30 శాతం ఎస్జీటీలకు, 70 శాతం బీఎడ్ అభ్యర్థులకు కేటాయింపుల కారణంగా మెరిట్ ఉన్న అనేక మంది నష్టపోయారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే నియామకాలు జరిగి ఉంటే వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం సాగించేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు అన్యాయానికి గురవుతున్నారని, వారిని తక్షణమే రెగ్యులర్ చేసి అన్ని ప్రభుత్వ సౌలభ్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, గౌరవాధ్యక్షుడు వెంకట రామిరెడ్డి, సహాధ్యక్షుడు రామప్ప చౌదరి, కోశాధికారి రాఘవేంద్ర పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు అనంతపురం కల్చరల్ : తిరుపతిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా చేనేత, జౌళీశాఖ అధికారి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిప్లోమా కోర్సు అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశముంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. మరింత సమాచారం కోసం 93999 36872, 90102 43054 లో సంప్రదించవచ్చు. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
అనంతపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై అలసత్వం వహించకుండా త్వరతగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై 494 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లో వస్తున్న అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కారం అయ్యేలా జిల్లా అధికారులు మానిటర్ చేయాలన్నారు. జిల్లాలోని పాజిటివ్ పబ్లిక్ ఫర్ఫెక్షన్కు సంబంధించిన పనితీరు మరింతగా మెరుగుపడాలన్నారు. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లా ఫైర్ అధికారి, ఐసీడీఎస్, సివిల్ సప్లయీస్, పీసీబీ, హౌసింగ్, మైనార్టీ, డీఎంహెచ్ఓ శాఖల పీపీపీ శాతం పడిపోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను పీపీపీ శాతం తక్కువ ఉండడానికి వీలులేదన్నారు. ప్రతి అధికారీ దరఖాస్తుదారు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో నేరుగా వారికే ఫోన్ చేసి తెలపాలన్నారు. పాజిటివ్ శాతం 80–90కి తక్కువ కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమేష్రెడ్డి, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, ఆనంద్తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిష్కార వేదికకు 126 వినతులు అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 126 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్బాషా పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యాయత్నం యాడికి: ఉద్యోగ విరమణ అనంతరం దక్కాల్సిన సౌలభ్యాలను అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ ఓ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన కొండప్ప మండల కేంద్రంలోని సొసైటీ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తూ నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి తనకు అందాల్సిన వేతన బకాయిల కోసం యాడికి సొసైటీ బ్యాంకు సీఈఓ కులశేఖర్ రెడ్డిని అభ్యర్థిస్తూ వస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం మరోసారి సీఈఓ ను కలిసి తన సమస్య విన్నవించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏకరవు పెడుతూ తన వెంట తీసుకెళ్లిన క్రిమి సంహారక మందు తాగాడు. దీంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది కొండప్పను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆగమేఘాలపై తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. యువరైతు ఆత్మహత్య పెద్దవడుగూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు నివాసి నాగేంద్ర (29) తనకున్న ఐదు ఎకరాల పొలంతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశాడు. ఈ క్రమంలో పంటలకు పెట్టుబడి కోసం తోటి రైతుల వద్ద, వివిధ బ్యాంకుల్లో రూ.14 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. మరో వైపు కుటుంబ పోషణ భారమైంది. దీంతో మనస్తాపానికి గురైన నాగేంద్ర ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న నాగేంద్రను గమనించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, నాగేంద్రకు భార్య వెంకటలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
ప్రత్యేక తరగతులకు హాజరైన వారికి ఆర్జిత సెలవులు ఇవ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ‘20 డేస్ యాక్షన్ ప్లాన్’కు హాజరవుతున్న ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఈఓ ఎం.ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీఏ నాయకులు మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న అడ్మిషన్ ప్రక్రియలో పీఎస్ హెచ్ఎంలపై మండల విద్యాశాఖ అధికారులు అధిక ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా పీఎస్ హెచ్ఎంలపై కొన్ని మండలాల్లో తీవ్ర మానసిక ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. డీఈఓను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. జాతీయ కుస్తీ పోటీలకు ఎంపిక అనంతపురం టౌన్: జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లబోతుల వాణి, రాఘవేంద్ర, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాకు చెందిన నవీన్నాయక్ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాండురంగారావు, అనంతపురం డీఎస్డీఓ మంజుల అభినందించారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
● అంబులెన్స్ను మూలనపెడితే ఎలా? ● ఆస్పత్రిలో శానిటేషన్ను మెరుగుపరచండి ● డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిప్యూటీ కమిషనర్ సుజాత గుంతకల్లుటౌన్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు ఉదయం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండి వైద్య సేవలందించడంతో పాటు ఎమర్జెన్సీ కేసులకు సంబంధిత వైద్యనిపుణులు తప్పనిసరిగా హాజరుకావాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుజాత ఆదేశించారు. సోమవారం గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. లేబర్, మెడికల్ వార్డులు, ఎమర్జెన్సీ క్యాజువాలిటీల్లో ఇన్పేషెంట్లను కలిసి వైద్యసేవలపై ఆరాతీశారు. కాన్పుల సమయంలో సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారా అని ఆమె బాలింతలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు అమర్చి కనెక్షన్ ఇవ్వకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ఆస్పత్రికి మంజూరు చేసిన అంబులెన్స్ను మూలనపెట్టడమేంటని వైద్యాధికారులను నిలదీశారు. వెంటనే మరమ్మతేలు చేయించి ఓ డ్రైవర్ను ఏర్పాటు చేయాలని, ఈ విషయమై తనకు ప్రతిపాదనలను పంపాలన్నారు. రోగులను ఓపీ కోసం క్యూలైన్లో నిల్చోబెట్టకుండా (మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్) ద్వారా ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని, దాని ఆధారంగా కేటాయించిన సమయంలో వైద్యసేవలు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సెల్వరాజ్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేయ, ఇన్చార్జ్ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ జయవర్ధన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
14న కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రగతి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ప్రణాళికలో భాగంగా కళాశాల నోడల్ రిసోర్స్ సెంటర్ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న తృతీయ ససంవత్సరం విద్యార్థుల కోసం ఈ ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తృతీయ సంవత్సరం విద్యార్థినులతో పాటు ఇతర నిరుద్యోగ యువతీ యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేకేసీ కోఆర్డినేటర్ బి.అనురాధ తెలిపారు. ఉద్యోగమేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఆసక్తిగల యువతీ యువకులు బయోడేటాతో పాటు, అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94407 98008 నంబరులో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు. గంజాయి విక్రేతలకు పదేళ్ల జైలు గుంతకల్లుటౌన్: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు కొనసాగించిన నలుగురికి పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం అనంతపురం జిల్లా మొదటి సెషన్సు కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుంతకల్లు వన్టౌన్ సీఐ మనోహర్ మీడియాకు వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని షికారి కాలనీకి చెందిన షికారీ నాగు, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాజుమర్రి గ్రామానికి చెందిన బుడగజంగం నరసప్ప, అనంతపురం మండలం తాటిచెర్లకు చెందిన మేకల ప్రసాద్, రాఘవేంద్రకాలనీకి చెందిన ఎస్ఎం.నాసిర్హుసేన్ గంజాయి విక్రయిస్తూ 2024 ఫిబ్రవరి 23న గుంతకల్లు వన్టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై అప్పటి సీఐ రామసుబ్బయ్య ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. దర్యాప్తు తరువాత అనంతపురం మొదటి ఏడీజే కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పై నలుగురు ముద్దాయిలకు రూ.లక్ష జరిమానా, పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ అనంతపురం జిల్లా మొదటి సెషన్సు కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన స్పెషల్ పీపీ లేపాక్షినాయుడు, అప్పటి సీఐ రామసుబ్బయ్య, ప్రస్తుత సీఐ మనోహర్, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ విజయభాస్కర్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ మారెన్న, కోర్టు కానిస్టేబుల్ రజాక్ తదితరులను ఎస్పీ అభినందించారు. ఈదురు గాలుల బీభత్సం యాడికి: మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి లక్షుంపల్లి, కేవవరాయుని పేట గ్రామాలతో పాటు వ్యవసాయ తోటల వద్ద స్తంబాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షుంపల్లిలో సుంకులమ్మ దేవాలయం వద్ద మద్దిలేటి తోటలో సాగు చేసిన 3 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. ఇదే గ్రామాంలో ప్రభాకర్రెడ్డికి చెందిన 20 నిమ్మచెట్లు, నాగేష్కు చెందిన 40 నిమ్మచెట్లు, జి.రంగారెడ్డికి చెందిన 10 నిమ్మ చెట్లు నేలమట్టమయ్యాయి,. కేశవరాయునిపేటలో రైతుల అరటి పంటలు కూడా దెబ్బ తిన్నాయి. దైవాలమడుగులో విద్యుత్ స్తంభాలు కిందపడ్డాయి. వ్యవసాయ తోటల వద్ద అరటి, తదితర పంటలపై విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. చందన గ్రామంలో గంగమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న వేప చెట్టు కొమ్మలు విరిగిపడటంతో సమీప నివాసాల వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలాలకు వెళ్లి మరమ్మతులు చేపట్టారు. మండల వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు జరిగిన పంట నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలిపి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కానరాని ఖరీఫ్ సన్నాహకం
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్–2026 పంటల సాగుకు సంబంధించి ఇప్పటి వరకు సన్నాహక చర్యలే చేపట్టలేదు. రాయితీ విత్తనాలు ఇస్తారా లేదా అనేది కూడా చెప్పే ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాకు 50 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ ఇస్తామని సూత్రప్రాయంగా ప్రకటించినా... దానికి సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టకపోవడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విత్తన సేకరణ ధర ప్రకటించకపోవడం చూస్తే ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు. విత్తన ప్రణాళికే లేదు వ్యవసాయశాఖ ఈసారి విత్తన ప్రణాళిక వెల్లడించలేదు. గతంలో ఫిబ్రవరి, మార్చిలోనే విత్తన ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ఏప్రిల్, మేలో అనుమతులు లభించేవి. ఈసారి 50 వేల క్వింటాళ్ల వేరుశనగ ఇస్తామని చెబుతున్నా... కంది, మొక్కజొన్న, ఆముదం, రాగులు, కొర్రలు, సజ్జలు, పెసలు, అలసంద, మినుము తదితర విత్తనాల గురించి మౌనంగా ఉన్నారు. అలాగే మేలోనే పంపిణీ చేయాల్సిన జనుము, జీలుగు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్స్) గురించి ఇప్పటికీ స్పష్టత లేదు. కేటాయింపులు, ధరలు, సబ్సిడీలు ఇంకా ప్రకటించనేలేదు. ముందస్తు సాగు కష్టమే వర్షాలపై నమ్మకం లేని కొందరు రైతులు ఖరీఫ్లో తొలకరి వర్షాలకే ముందస్తుగా వేరుశనగ, ఇతర పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ముందస్తుకు రెడీగా ఉన్నా.. విత్తన ప్రణాళికపై స్పష్టత లేకపోవడంతో వారు స్వంతంగా విత్తనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మే మొదటి వారంలో విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెడితేనే నాలుగో వారానికల్లా పంపిణీ పూర్తికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఎక్కడా సన్నాహక చర్యలు, ధర ప్రకటించకపోవడం వల్ల విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా, నిల్వ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మరో పక్క 2025 ఖరీఫ్, రబీలో సరఫరా చేసిన విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ బకాయిలు రూ.110 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదని.. ఆ బకాాయిలు చెల్లిస్తే కానీ ఈసారి సరఫరా చేయడం కష్టమని మిల్లర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. మళ్లీ కంటితుడుపు చర్యలేనా..? చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వ్యవసాయశాఖ చేపడుతున్న సన్నాహక చర్యలు గమనిస్తే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రైతులకు కంటితుడుపుగా చివర్లో పంపిణీ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయశాఖ మేల్కొనేలోపు జిల్లాలో రబీలో పండిన నాణ్యమైన వేరుశనగ ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇతర జిల్లాల నుంచి నాసిరకం సేకరించి రైతులకు అంటగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఖరీఫ్లో వేరుశనగ, రబీలో పప్పుశనగ సాగు విస్తీర్ణం బాగా తగ్గడానికి సకాలంలో రాయితీ విత్తనం ఇవ్వకపోవడం కూడా కారణమని వాపోతున్నారు. కనీసం ఈసారైనా నాణ్యమైన విత్తనాలు అందించాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీజన్ సమీపిస్తున్నా విత్తన సేకరణ ధర ప్రకటించని వైనం ఈపాటికి పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వాల్సి ఉన్నా ఆ ఊసేలేదు విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా ఆలస్యమయ్యే పరిస్థితి -
ఏసీబీ వలలో నగర పాలక ఉద్యోగులు
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చులో అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగులు చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఇన్చార్జ్ ఎంహెచ్ఓ బీఎల్ నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్చౌత సోమవారం అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు... అనంతపురంలోని గుత్తి మార్గంలో భారత్ ట్రేడర్స్ పేరుతో రఘుప్రసాదరావు ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతులు కోరుతూ నగరపాలక సంస్థలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే శానిటరీ సర్టిఫికెట్ జారీకి నగర పాలక సంస్థ అధికారులు రూ.30 వేలు డిమాండ్ చేయడంతో అంత మొత్తం తన వల్ల కాదని, చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం రూ.25 వేలు ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ సందీప్చౌతాకు ఫోన్ చేయగా... నగర పాలక సంస్థ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉండాలని తెలిపాడు. ఆ తర్వాత డ్వామా కార్యాలయం వద్దకు రమ్మని తెలిపాడు. దీంతో రఘుప్రసాద్ డ్వామా కార్యాలయం వద్దకెళ్లి అక్కడ వేచి ఉన్న సందీప్కు రూ.25 వేలు ఇస్తుండగా... అప్పటికే అక్కడ కాపుకాసిన అనంతపురం–కర్నూలు ఏసీబీ బృందాలు మెరుపు దాడి చేసి పట్టుకున్నాయి. సందీప్ను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాను లంచం డిమాండ్ చేయలేదని ఇన్చార్జ్ ఎంహెచ్ఓ నరసింహులు సూచన మేరకే డబ్బు తీసుకున్నానని సందీప్ తెలిపాడు. దీంతో ఏసీబీలోని మరో బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇన్చార్జ్ ఎంహెచ్ఓ చాంబర్కు వెళ్లి నరసింహులును అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలోనూ సోదాలు ఇన్చార్జ్ ఎంహెచ్ఓ బీఎల్ఓ నరసింహులు ఫ్లాట్తో పాటు అనంతపురంలోని పాతూరులో ఉన్న సందీప్ చౌతా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు పత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అధికారి, ఉద్యోగికి సంబంధించిన ఫోన్పే నంబర్లు కూడా పరిశీలించారు. వారి ఫోన్పేలకు చాలా మంది కాంట్రాక్టర్లు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు. సార్ కొత్తగా పైళ్లెంది ఏసీబీ అధికారులకు దొరికిపోగానే జూనియర్ అసిస్టెంట్ సందీప్ చౌతా తప్పించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఎక్కడ తన చేతులు కడిగిస్తారోనని పదే పదే చేతులను తన చొక్కాకు, ప్యాంటుకు తుడుచుకున్నాడు. చివరికి ఏసీబీ అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వగానే ఏడుపు మొదలెట్టాడు. ‘సార్...ఈ మధ్యే నాకు పైళ్లెంది. నన్ను అరెస్ట్ చేస్తే నా జీవితం నాశనమవుతుంది సార్’ అంటూ లబోదిబోమన్నాడు. ఇన్చార్జ్ ఎంహెచ్ఓ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నానంటూ గగ్గోలు పెట్టాడు. నేనేమైనా ఉగ్రవాదినా? నేనేమైనా ఉగ్రవాదినా?కాంట్రాక్టర్లు, కొందరు మీడియా ప్రతినిధులు, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ సిబ్బంది అందరూ ఉండగానే నరసింహులు చాంబర్లోకి ఏసీబీ అధికారులు దూసుకెళ్లారు. బీఎల్ నరసింహులు అంటే మీరేనా అంటూ ఆరా తీసి ఏసీబీ అని చెప్పిన అధికారులు అతని సెల్ఫోన్ లాక్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. తీరా సందీప్చౌతా గురించి అడగగానే తెల్లమొహం వేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం శానిటరీ సర్టిఫికెట్ జారీకి రూ.25 వేలు డిమాండ్ -
వైభవంగా శయనోత్సవం
రాయదుర్గంటౌన్: కోటలో కొలువైన కలియుగ దైవం ప్రసన్న వేంకటరమణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. చివరి రోజు ఆదివారం రాత్రి ఆలయంలో స్వామి వారి శయనోత్సవం, సప్తప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అంతకుముందు అర్చకుల ఆధ్వర్యంలో వేంకటరమణస్వామికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి సహకరించిన ప్రజలకు, కులసంఘాల వారికి, దాతలకు ఆలయ ఈఓ నరసింహా రెడ్డి, పాలక మండలి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం
గుమ్మఘట్ట: ప్రియురాలు తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం మండలంలోని టీ.వీరాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. టీ.వీరాపురానికి చెందిన రామాంజినేయులు, శ్రీమతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వ్యవ సాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు శివకుమార్ (19) శనివారం రాత్రి గ్రామంలోని తమ పాత ఇంట్లో నిద్రించేందుకు వెళ్లాడు. ఆదివారం ఉదయం తల్లి శ్రీమతి ఆ ఇంటి వద్దకు వెళ్లి ఎన్నిసార్లు తలుపుతట్టినా గడియ తీయలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిలా ఉరికి వేలాడుతూ కనిపించాడు. శివకుమార్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు శివకుమార్ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఆమె ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను ఆడియో రికార్డింగ్ చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పామిడి: 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పామిడి పోలీసు స్టేషన్ జమేదారు వెంకటేష్నాయక్ తెలిపిన మేరకు.. ఆదివారం స్థానిక టీచర్స్ కాలనీకి చెందిన నాగిరెడ్డి (56) హైవేలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద నుంచి తన ఇంటికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఆ సమయంలో గుత్తి వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ నాగిరెడ్డిని ఢీకొని లాక్కెళ్లింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య నవనీత, కుమారుడు ధీరజ్కుమార్రెడ్డి ఉన్నారు. నాగిరెడ్డి స్థానిక సరస్వతీ ఉన్నత విద్యామందిరంలో ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవలే కుమారుడు ధీరజ్కుమార్రెడ్డికి సాఫ్ట్వేర్ ఉద్యోగం లభించడంతో ఉద్యోగాన్ని మానుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విద్యుత్ షాక్తో వ్యక్తికి తీవ్రగాయాలు రాయదుర్గంటౌన్: పట్టణంలో జెడ్పీ బాలికోన్నత పాఠశాల సమీపంలోని 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బుష్ రాడ్ను తాకడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయలైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కోటమారెమ్మ ఆలయం వద్ద నివాసముంటున్న హమాలీ బసవరాజుకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బసవరాజు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం మద్యం మత్తులో బాలికోన్నత పాఠశాల సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద అదుపు తప్పి బుష్రాడ్ను తాకడంతో షాక్కు గురై అక్కడే ఉన్న డ్రైనేజీలో పడ్డాడు. స్థానికులు అతన్ని సమీపంలో గల ఏరియా ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం చేరవేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బసవ రాజును అనంతపురం తీసుకెళ్లారు. ఈ ఘటనతో పట్టణంలో గంటపాటు కరెంటు సర ఫరాలో అంతరాయం ఏర్పడింది. లైన్మెన్లు సమస్యను పరిష్కరించి పునరుద్ధరించారు. మూగ మహిళపై అత్యాచారయత్నం పుట్లూరు: కూలీ పనులకు వెళ్లిన ఓ మూగ మహిళపై అరటి తోట యజమాని అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ మహిళ ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అరటి తోటలోకి కూలీ పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో మహిళపై గాలి రమణారెడ్డి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్టు యాడికి: మండల కేంద్రంలోని పచ్చారుమేకలపల్లి రహదారిలో ఆదివారం పేకాట స్థావరంపై సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. 9 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న రూ. 24,350 నగదుతో పాటు 50 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఐషర్ను ఢీకొన్న లారీ
మదనపల్లె టౌన్: ఐషర్ను లారీ ఢీకొనడంతో 16 మంది భక్తులకు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 60 మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో బయలుదేరారు. మదనపల్లె బైపాస్లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గర ఆదివారం వేకువజామున ఐషర్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు.. రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి, లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర, అశ్వని, లక్ష్మీదేవి, రమాశ్రీ, అరుణ, పుల్లమ్మ, గంగాధర్, వెంకటరాయుడు, కుల్లాయమ్మ, శివశంకర్, లక్ష్మి, రాజా, లక్ష్మీదేవి, భవ్యశ్రీ మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి, ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు. 16 మంది భక్తులకు గాయాలు -
‘ఉపాధి’ కరువు
అనంతపురం టౌన్: జిల్లాలో 31 మండలాలు 540 గ్రామ పంచాయతీల్లో తూతూ మంత్రంగా ఉపాధి పనులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో 70 పంచాయతీల్లో 100 మందికి కూడా పనులు కల్పించలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూలీలకు పనులు కల్పించిన పాపాన పోలేదు. అనంతపురం రూరల్ మండలంలోని 6 పంచాయతీల్లో ఉపాధి పనులను అసలు ప్రారంభించనే లేదు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో.. జిల్లా వ్యాప్తంగా 3.16 లక్షల జాబ్కార్డులు ఉండగా, 5.38 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 3 లక్షల మందికి పైగా యాక్టివ్ ఉపాధి కూలీలు. కొన్ని గ్రామాల్లో అధికార టీడీపీలో వర్గ పోరు కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదు. గతంలో పనులు చేసిన కూలీల్లోనే ఒకరిని మేట్గా తీసుకొని ఉపాధి పనులు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నా వారిపై ఒత్తిడి తీసుకువచ్చి మేట్లను సైతం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటూ ఉపాధి కూలీల కడుపుకొడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉపాధి సీజన్లో సైతం పనులకు వచ్చే కూలీల సంఖ్యను పరిశీలిస్తే మండలానికి 2 వేల లోపు మాత్రమే ఉంది. ఈ విషయంపై వెంటనే అధికారులు దృష్టి సారించి పనులు ప్రారంభంకాని గ్రామాలతోపాటు జిల్లా వ్యాప్తంగా కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి పనులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ప్రారంభమే కాని ఉపాధి పనులు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిచిన వైనం అధికారులకు కూలీలు విన్నవించుకున్నా ఫలితం శూన్యం చేసేది లేక వలసలు పోతున్న పల్లెజనం అనంతపురం రూరల్ మండలం కొడిమి, నరసనాయనికుంట గ్రామ పంచాయతీల్లో 700కు పైగా జాబ్కార్డులు, 1,500 మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పంచాయతీల్లో ఉపాధి పనులు జరగలేదు. కూలీలకు ఒక్క రోజు పని కల్పించలేదు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనులు కల్పించాలని అధికారులను స్థానికులు వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. యల్లనూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ కూలీలకు పనులు కల్పించిన పాపాన పోలేదు. ఈ పంచాయతీలో 600 మందికి పైగా కూలీలుఉన్నారు. పనులు కల్పించాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక పలువురు పట్టణాలకు వలస వెళ్లారు. ఈ మూడు చోట్లే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ఇలాంటి దుస్థితే నెలకొంది. -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజల ఆరోగ్యశ్రేయస్సు దృష్ట్యా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap. gov.in వెబ్సైట్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 08554– 272943, 9154790350కు ఫోన్ చేసి సమస్యను తెలియజేస్తే సకాలంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల స్థాపనకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం టౌన్: ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల స్థాపన కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన భూమిలో 60శాతం సొంత భూమి కచ్చితంగా ఉండాలన్నారు. మిగిలిన 40 శాతం భూమిని ఏపీఐఐసీ సమకూరుస్తుందన్నారు. ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలు www. apindustries.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్న వివరాలకు 99492 19667, 91542 19850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 13న జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా విజయలక్ష్మి ఈ నెల 13న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఉదయం 9 నుంచి 9:30 గంటల మధ్యలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తరువాత జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేయనున్నారు. ఆ తరువాత కలెక్టరేట్కు చేరుకుని కలెక్టర్ ఆనంద్ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. టన్ను మామిడి రూ.35 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో ఆదివారంం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.35 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 40 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే హిమాయత్ రకం టన్ను గరిష్టంగా రూ.27 వేలు, కనిష్టంగా రూ.9 వేలు, సరాసరిన రూ.18 వేలు, మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు. -
చంద్రబాబు పాలనలో గిరిజనులకు రక్షణ కరువు
● వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ధ్వజం అనంతపురం: చంద్రబాబు పాలనలో గిరిజనులకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామంలో బాలికను ఒక వ్యక్తి మాయ మాటలు చెప్పి తీసుకెళ్తే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటే రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. అదే పోలీస్టేషన్లో ఓ కానిస్టేబుల్ టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుందని చెబుతున్నారంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి జిల్లాలో ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఇదో ఉదాహరణ మాత్రమే అన్నారు. గిరిజన బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గోరంట్ల జెడ్పీటీసీ పాలే జయరాంనాయక్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు గోవింద్నాయక్, ప్రధాన కార్యదర్శి రాజనాయక్, గుజ్జల శివయ్య మట్లాడుతూ గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలాగే పాలన సాగిస్తే ప్రజలే చంద్రబాబును తరిమికొడతారన్నారు. బాలికకు జరిగిన అన్యాయంపై జిల్లాకు చెందిన ఎస్టీ కమిషన్ సభ్యుడు స్పందించాలని డిమాండ్ చేశారు. కుక్కల దాడిలో 52 గొర్రె పిల్లల మృతి బెళుగుప్ప: మండల పరిధి లోని జీడిపల్లి గ్రామంలో ఆదివారం గొర్రెల కాపరి సోలాపురం ఎర్రిస్వామికి చెందిన 52 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృత్యవాత పడ్డాయి. వివరాలు.. ఎర్రిస్వామి ఆదివారం గ్రామ సమీపంలోని ఓ రైతు పొలంలో తన గొర్రెలను మేపునకు తీసుకెళ్లాడు. చెట్టు నీడన కంచె వేసి పిల్లలను మందగా తోలాడు. సాయంత్రం మంద వద్దకు వచ్చి చూడగా 52 గొర్రె పిల్లలను కుక్కలు చంపివేశాయి. రూ.2.5 లక్షల నష్టం చేకూరిందని ఎర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. హనిమిరెడ్డిపల్లి పశువైద్య సహాయకుడు ఎర్రిస్వామి బాధితుడి వద్ద వివరాలను సేకరించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ఐదు గొర్రెలకు చికిత్స చేశారు. -
పేదలు వలస వెళ్తున్నారు..
మా గ్రామంలో 400 మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. గ్రామంలో పనులు చూపక రెండేళ్లవుతోంది. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. పనులు లేకపోవడంతో పేదలు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. – గుజ్జల అశోక్కుమార్, కొడిమి పంచాయతీ, అనంతపురం రూరల్ మండలం అన్ని గ్రామాల్లో పనులు కల్పిస్తాం జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో పనులు కల్పించలేదన్న విషయం నా దృష్టికి రాలేదు. నెల రోజుల డేటా తీసుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తాం. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా ఉన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. కూలీలందరికి పనులు కల్పించడంపై దృష్టి సారిస్తాం. – సలీంబాషా, డ్వామా పీడీ -
‘గిట్టుబాటు’ కోసం పోరుబాట
● నేడు రైతుల సమస్యలను కలెక్టర్కు వివరిద్దాం ● వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ శింగనమల: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా శింగనమల నియోజకవర్గంలోని రైతుల సమస్యలను కలెక్టర్కు వివరించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాత్ తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్కు తరలిరావాలని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శింగనమలలో విలేకరులతో మాట్లాడుతూ వరి, మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలేక రైతులు కల్లాల్లోనే పంట ఉత్పత్తులు ఉంచుకున్నారన్నారు. అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రోజులు గడిచే కొద్దీ ధాన్యం రంగుమారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇక నియోజకవర్గవ్యాప్తంగా వ్యవసాయ బోర్లలో నీరు తగ్గి పండ్ల తోటలు ఎండిపోతున్నాయన్నారు. అధికారులు పండ్ల తోటలను కూడా పరిశీలించలేకపోతున్నారని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలన్నింటినీ కలెక్టరుకు వివరించేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు. -
అనగనగా ‘అనంత’ చెత్త కథ
అనంతపురం క్రైం: అనంతపురం నగరంలో చెత్త నిర్వహణ ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతున్నా డంపింగ్యార్డులో పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. డంపింగ్ యార్డులో సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను శాసీ్త్రయంగా తొలగించేందుకు గతంలో రూ.12 కోట్ల వ్యయంతో జిగ్మా సంస్థకు పనులు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 1,68,285 మెట్రిక్ టన్నుల చెత్తను ఆరు నెలల్లో ప్రాసెసింగ్ చేయాలని నిర్ణయించారు. రోజుకు 4 వేల టన్నుల చెత్తను శుద్ధి చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. నాలుగు వేల టన్నుల లక్ష్యానికి గాను రోజుకు వెయ్యి టన్నుల చొప్పున మాత్రమే పనులు సాగినట్లు సమాచారం. అందుకే ఒప్పంద గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు. నత్తనడకన చెత్త తరలింపు.. డంపింగ్ యార్డులో చెత్త తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెల ఆరో తేదీన విడుదలైన రోజువారీ పురోగతి నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం డంపింగ్ యార్డులో 48,255.19 మెట్రిక్ టన్నుల మిశ్రమ చెత్త, 84,113.92 మెట్రిక్ టన్నుల మట్టి, రాళ్ల వ్యర్థాలు, 12,621.17 మెట్రిక్ టన్నుల ఆర్డీఎఫ్ వ్యర్థాలు మిగిలి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 1,500 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కేవలం 518.660 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు మాత్రమే జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. మట్టి, రాళ్ల తొలగింపులో రోజుకు 1,500 మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టినా, ఒక్క టన్ను కూడా తొలగించలేకపోయారు. ఆర్డీఎఫ్ వ్యర్థాల తొలగింపులో 150 టన్నుల లక్ష్యానికి బదులుగా కేవలం 74.59 టన్నుల మాత్రమే నిర్వహించారు. చెత్త తరలింపు పూర్తి కాకపోవడంతో నగరవాసులకు నరకయాతన తప్పడం లేదు. రూ.30 కోట్ల దోపిడికి మరో ఎత్తుగడ! తాజాగా రాష్ట్ర పరిశుభ్ర ఆంధ్ర సంస్థ ఆధ్వర్యంలో మరో భారీ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. రూ.30,55,50,557 వ్యయంతో తడి–పొడి చెత్త శుద్ధి కేంద్రాల నిర్మాణ బాధ్యతలను తిరుమల నిర్మాణ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో మరో రెండు సంస్థలకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు కింద గుంతకల్లు నుంచి 80 టన్నులు, గుత్తి నుంచి 30 టన్నులు, అనంతపురం నుంచి 170 టన్నులు, తాడిపత్రి నుంచి 50 టన్నులు, రాయదుర్గం నుంచి 30 టన్నులు, కళ్యాణదుర్గం నుంచి వచ్చే 20 టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉంటుంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ కేంద్రాల ద్వారా రోజుకు మొత్తం 380 టన్నుల చెత్తను శాసీ్త్రయంగా శుద్ధి చేస్తారు. ఇందులో 209 టన్నుల తడి చెత్త, 171 టన్నుల పొడి చెత్త ఉంటాయి. అసలు చెత్త అక్కడికి చేరుతుందా? ప్రస్తుతం అనంతపురం నగరంలో చెత్త సేకరణ వ్యవస్థే సరిగా లేకపోవడం ప్రజలను కలవరపెడుతోంది. చెత్త తరలించే వాహనాలు తక్కువగా ఉన్నాయి. ఉన్న వాహనాల్లో డీజిల్ నింపేందుకు కూడా నిధులు లేవు. దీనికి తోడు కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. చెత్తను కేంద్రాలకు తీసుకెళ్లే వ్యవస్థను బలోపేతం చేయకుండా శుద్ధి కేంద్రాలు నిర్మిస్తే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రూ.కోట్లు కొల్లగొడుతున్న ప్రజాప్రతినిధులు నీళ్లప్రాయంగా నిధులు ఖర్చు చేసినా మారని దుస్థితి పాత చెత్తకు దిక్కులేదు.. కొత్తగా రూ.30 కోట్లతో కొత్త ప్రణాళిక ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే దగ్గుపాటి.. బిల్డప్పులిచ్చిన చైర్మన్ పట్టాభి హామీలతో కాలయాపన.. అనంతపురం వాసులకు తప్పని నరకయాతన అనగనగా ‘అనంత’ చెత్త కథ... నేతలు ప్రజాధనాన్ని ఎలా దోచుకు తినాలో.. తింటున్నారో తెలిపే వాస్తవ గాథ. స్థానిక ప్రజా ప్రతినిధి ‘అక్టోబరు 2 నాటికి స్పూన్ చెత్తకూడా అక్కడ ఉండదు.. ఇది నా హామీ’. ‘సంక్రాంతికి ఇక్కడ అద్భుతమైన పచ్చటి వనం ఏర్పాటు చేస్తామ’ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్మన్ పట్టాభి ప్రగల్భాలు... వెరసి జిగ్మా కంపెనీ చేతిలో రూ.12 కోట్ల లెగసీ వేస్ట్ పనులు పెట్టారు. అవి పూర్తికాకనే ఇప్పుడు మరో ప్రణాళికతో రూ.30 కోట్లు దోచుకునేందుకు కొత్తగా వ్యూహం రచించడం విమర్శలకు తావిస్తోంది. -
హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే ప్రత్యేక యాగశాలలో ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో కలశ ప్రతిష్ట, గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ మన్యుసూక్తపారాయణ హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తమలపాకులతో లక్షార్చన చేసిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
●నేస్తమా.. కుశలమా!
ఉరవకొండ: ‘నేస్తమా ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి.. పిల్లలు ఎంతమంది.. ఏం చదువుతున్నారు..’ అంటూ ఆ స్నేహితులు ఆత్మీయ పలకరింపులతో సందడి చేశారు. స్థానిక ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1997–98 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం అట్టహాసంగా సాగింది. చదువుకున్న పాఠశాలలో 28 ఏళ్ల తరువాత ఒకే వేదికపై కలుసుకున్న స్నేహితులు సందడిగా గడిపారు. తమ గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, యాసిన్, బాషా, మార్టిన్, విరుపాక్షి, కృష్నమూర్తి, నారాయణ, నాగరాజు, ప్రమీలా, రాజేశ్వరీ, శివరాజేశ్వరీ, శ్రీపతి, రఫీక్, రాజ్గోపాల్, రామాంజినేయులు తదితరులను శాలువలతో సన్మానించారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ జెడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో.. స్థానిక ప్రభుత్వ జెడ్పీ సెంట్రల్ ఉన్నత పాఠశాలలో 2005–06 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులను పాఠశాల నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగించిన అనంతరం వారిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం పూర్వ విద్యార్థులు సెల్ఫీలు తీసుకుని ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు.కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు బాలమురళీకృష్ణ, సీతారామిరెడ్డి, ఎర్రిస్వామి, కృష్ణమూర్తి, నాగరాజు, శ్రీనివాసులు, శశికళ, రేణుక, రాజేష్, గిరిధర్,నాగరాజులను ఘనంగా సత్కరించారు. -
కరువు చిత్రం
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావుల్లోంచి నీరు పైకి రావడం లేదు. ఎండుతున్న చీనీ తదితర పంటలను చూడలేకపోయిన రైతులు డబ్బు వెచ్చించి ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చి పెడుతున్నారు. మరికొంతమంది రైతులు ఆర్థిక ఇబ్బందులతో పంటను రక్షించుకోలేక ఆశలు వదిలేశారు. దీంతో పలు చోట్ల పంటలు ఎండిపోయాయి. మరోవైపు అటవీ ప్రాంతంలోనూ మేత దొరకడం లేదు. గార్లదిన్నె మండలం కోటంక, మర్తాడు గ్రామాల్లో అయితే గొర్రెలు, మేకలు ఎండిపోయిన పంట పొలాల్లో మేత మేస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ఎండ సలసల.. మీనం విలవిల
మనుషులకే కాదు.. చేపలకూ ఎండదెబ్బ తగులుతోంది. భానుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో నీరు వేడెక్కుతోంది. నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెరువులు, కుంటల్లో నీరు తగ్గి ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. ఫలితంగా చేపలు మృత్యువాత పడుతున్నాయి. రాయదుర్గం: భానుడి భగభగలకు జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోవు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మనుషులతో పాటు పక్షులు, మూగజీవాలు, జలచరాలు సైతం వేసవి దెబ్బకు సలసల కాగిపోతున్నాయి. వేసవితాపం తట్టుకునేందుకు లోతైన ప్రదేశాల్లో గుంపుగా చేరి దాక్కుంటున్నాయి. చిన్న వయసు కలిగిన చేపలు ఎండదెబ్బకు చనిపోతున్నాయి. దిగుబడిపై ప్రభావం.. జిల్లాలోని రాప్తాడు, ఆలమూరు, గుత్తి, వైటీ చెరువు, పీకే చెరువు, తోపుదుర్తి, బుక్కరాయ సముద్రం, శ్రీధరఘట్ట, మదిగుబ్బ, గూల్యం తదితర చెరువుల్లో 2.20 లక్షల చేప పిల్లలను మత్స్యకారులు సొంత ఖర్చుతో వదులుకున్నారు. పీఎంఎంఎస్వై పథకం కింద 40 శాతం రాయితీతో 80 లక్షల చేపపిల్లలు వదిలారు. ఇందులో 50 శాతం దిగుబడి లెక్కించినా 15 లక్షల కిలోల వరకు వలకు చిక్కుతాయి. కిలో రూ.100తో విక్రయించినా రూ.1.50 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. అలాగే 350 మంది మత్స్య సహకార సంఘ సభ్యులు జీవనోపాధి పొందుతున్న బీటీపీ, మిడ్పెన్నార్ రిజర్వాయర్లో వంద శాతం రాయితీతో 24 లక్షల చేపపిల్లలు వదిలారు. 50 శాతం లెక్కిస్తే ఒక్కో రిజర్వాయర్లో 6 లక్షల కిలోల చేపల ఉత్పత్తి ఉంటుంది. రూ.6 కోట్ల ప్రకారం రెండు రిజర్వాయర్ల పరిధిలో రూ.12కోట్ల మేర ఆదాయం ఉంటుంది. అయితే ఎండదెబ్బకు మృత్యువాత పడుతున్న చేపల సంఖ్య పెరుగుతుండడంతో దిగుబడిపై ప్రభావం పడుతోంది. చెరువులు, కుంటలు, జలాశయాల్లో వేడెక్కుతున్న నీరు తట్టుకోలేక మృత్యుఒడికి చేరుతున్న జలపుష్పాలు ఆందోళనలో మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలి గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో చేపల ఉత్పత్తి దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల కదలికలపై నిఘా ఉంచాలి. చేపల ఎదుగుదలను పరిశీలిస్తూ ఉండాలి. లోపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నెలాఖరు వరకూ నీటి వనరుల వద్ద నిఘా ఉంచడం మంచిది. కిలో కంటే పెద్ద సైజులో ఉండే చేపలను పట్టి విక్రయించుకోవడం ఉత్తమం. – లక్ష్మీనారాయణ, ఎఫ్డీఓ, పీఏబీఆర్ -
పేదల బియ్యంలో బొక్కుడు
అనంతపురం అర్బన్: అక్రమ సంపాదన కోసం కొందరు అధికారులు, సిబ్బంది పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారు. మండల లెవల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్– గోదాము)లో ఈ తతంగం సాగుతోంది. 50 కిలోలు ఉండాల్సిన బస్తాను 46 నుంచి 47 కిలోలకే నింపి చౌకధాన్యపు దుకాణాల డీలర్లకు సరఫరా చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా బస్తాల్లో నొక్కిన దాదాపు 50 వేల కిలోల (50 టన్నుల) బియ్యం బ్లాక్మార్కెట్లో కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. తూకం తగ్గినా నోరెత్తరాదు! బియ్యం తూకం తగ్గినా డీలర్లు మాట్లాడకూడదు. మాట్లాడితే మరో రకమైన ఇబ్బందులు తప్పవని కొందరు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌకదుకాణాలకు 50 కిలోల బస్తాలు సరఫరా చేస్తారు. వాస్తవంగా గోనె సంచితో కలిసి 50.500 కిలోలు ఇవ్వాలి. అయితే డీలర్లకు సరఫరా చేస్తున్న బస్తాల్లో బియ్యం 50 కిలోలు కూడా ఉండడం లేదు. బస్తాలో 47 నుంచి 46 కిలోలలోపే ఉంటోంది. డీలర్ ఇండెంట్ ఆధారంగా కోటా మేరకు బియ్యం సరఫరా చేయాలి. అయితే చౌక దుకాణానికి 150 క్వింటాళ్లకు 300 బస్తాలు ఇస్తున్నారు. బస్తాలో తూకం తక్కువ ఉన్నా 50 కిలోలు ఉన్నట్లుగానే నమోదు చేస్తున్నారు. దీంతో డీలరుకు నిర్దేశించిన కోటాలో రెండు నుంచి మూడు క్వింటాళ్ల బియ్యం తక్కువగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. కోత వేసి.. బ్లాక్ మార్కెట్కు తరలించి.. జిల్లాలో 1,645 చౌక ధరల దుకాణాలు, 6.72 లక్షలు బియ్యం కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 12 ఎంఎల్ఎస్ పాయింట్లలో నుంచి డీలర్ల ఇండెంట్ మేరకు చౌక దుకాణాలకు బియ్యం రవాణా చేస్తారు. ప్రతి నెలా కార్డుదారులకు 10.118 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 800 టన్నులు బియ్యం డీలర్లకు సరఫరా అవుతున్నాయి. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలోని అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డీలర్లకు ఇచ్చే బియ్యం బస్తాపై నాలుగు కిలోల మేర కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో నొక్కేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ప్రతి నెలా దాదాపు 50 వేల కిలోల (50 టన్నుల) బియ్యం నొక్కేస్తూ బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులకు బియ్యం కిలో రూ.20తో విక్రయిస్తారని తెలిసింది. ఈ లెక్కన నెలసరి అక్రమార్జన రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. గోదాము నుంచే దర్జాగా... మండలస్థాయి గోదాముల్లో డీలర్లకు సరఫరా చేసే కోటా నుంచి తూకాల రూపంలో నొక్కేస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఉన్నట్లు తెలిసింది. వీరు గోదాము నుంచి సరుకును దర్జాగా వేరే ప్రదేశాలకు తరలిస్తారని, అక్కడ బ్రాండెడ్ పేరున్న సంచుల్లో నింపి కర్ణాటకకు తీసుకెళ్లి విక్రయిస్తారని సమాచారం. కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో నిర్వాకం డీలర్లకు సరఫరా చేసే బియ్యంలో కోత 50 కిలోల బస్తాలో 3 కిలోల వరకు నొక్కుడు ప్రతి నెలా 50 టన్నుల సరుకు బ్లాక్మార్కెట్కు అవును ఫిర్యాదులు వచ్చాయి ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం తూకం తక్కువగా ఇస్తున్నట్లు డీలర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించాం. ఏయే తేదీల్లో ఏయే చౌక దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం సరఫరా చేయాలో ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేశాం. దానిని ఈ నెల నుంచి అమలు చేస్తాం. నిర్దేశించిన తేదీలను డీలర్లకు తెలియజేస్తాం. ఆ ప్రకారం డీలర్లు వచ్చి వారి కోటా మేరకు బియ్యం తూకం వేయించుకుని లారీలో లోడ్ చేయించుకుని వెళ్లాలని చెప్పాం. – విష్ణుచరణ్, జాయింట్ కలెక్టర్ -
మళ్లీ ‘సహకార’ పోరాటం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యారు. సోమవారం అనంతపురంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరుబాట కొనసాగిస్తున్న పీఏసీఎస్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత ఫిబ్రవరి 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. దాదాపు 10 రోజుల పాటు సమ్మెబాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కొన్ని డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విరమించారు. అయితే రెండు రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన జీఓలో ఉద్యోగులకు న్యాయం జరిగేలా ఏమీ లేవని పెదవి విరుస్తున్నారు. దీంతో మరోసారి పోరాటమే శరణ్యమని చెబుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో మళ్లీ ఆందోళన కొనసాగిస్తే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పంట రుణాల పంపిణీ, రెన్యువల్స్, వడ్డీలకు అపరాధ రుసుం చెల్లింపు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, అలాగే పశువుల దాణా పంపిణీకి ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. డిమాండ్లు నెరవేర్చాలి.. జీఓ 36 అమలు చేయాలని, 2019, 2024 పీఆర్సీ ఇవ్వాలని లేదంటే 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రూ.2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రిటైర్డు వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, లాభనష్టాలతో సంబంధం లేకుండా సంఘాల ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, రూ.5 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మరోసారి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు తెలిపారు. నేడు డీసీసీబీ ఎదుట పీఏసీఎస్ ఉద్యోగులు నిరసన -
వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
శింగనమల: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేసుకుందామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శింగనమలలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ పోరాటాలకు పురిటి గడ్డ శింగనమల అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. పథకాలను పక్కాగా అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలకు మేలు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేదని, వ్యవసాయ బోర్లలో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయని, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం పని చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడ చూసినా ఇసుక, మట్టి దోపిడీ పెరిగిపోయిందని విమర్శించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: మాజీ మంత్రి శైలజానాథ్ వైఎస్సార్సీపీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారికి అన్నింటా ప్రాధాన్యత ఇస్తామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయిలోనే ఎండగట్టాలన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడికీ అండగా ఉంటామన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ఐకమత్యంతో ఉండి, వైఎస్ జగన్ను సీఎంను చేసుకుందామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనరు పరంధామ రెడ్డి, నాయకులు సాకే రుత్విక్, వీరాంజినేయులు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులు బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దుద్దేకుంట భాస్కర్రెడ్డి, బెస్త గోపాలు, జిల్లా అధికార ప్రతినిధి ఎన్వీ నారాయణ, నూరు మహమ్మద్, మునేంద్ర, అబ్దుల్లా, నరసింహారెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, వెంకటరమణ, బండి శ్రీనివాసులు, లలిత కళ్యాణి, శివమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యంతో ఉందాం.. ప్రజా సమస్యలపై పోరాడదాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ పిలుపు -
కొండెక్కిన కొత్తిమీర, అల్లం
గుత్తి: కొత్తిమీర, అల్లం ధరలు కొండెక్కాయి. వారం క్రితం కట్ట కొత్తమీర రూ. 15 నుంచి రూ. 20కు విక్రయించారు. అల్లం కిలో రూ. 70కు విక్రయించారు. ఆదివారం అమాంతం ధరలు పెరిగిపోయాయి. కట్ట కొత్తమీర రూ. 40, అల్లం కిలో రూ. 140కు చేరింది. తోపుడుబండ్ల మీద ఇళ్ల వద్దకే కూరగాయలు తెచ్చేవారు అంత ధర పెట్టి అల్లం, కొత్తిమీర కొనలేక వాటికి స్వస్తి చెప్పారు. దీంతో జనం తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ విడిగా కాకుండా కట్టల ప్రకారం కొత్తిమీర విక్రయిస్తుండగా... అవసరం లేకపోయినా రూ.40 వెచ్చించి కొత్తిమీర కొనాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ‘ఆటా’ నవలల పోటీలు అనంతపురం కల్చరల్: ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో నవలల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు వేణు నక్షత్రం, సూర్య రాజ్కుమార్, ప్రకాష్ జయదేవ్, రాజేశ్వరరావు, ఆటా అమెరికా భారతి ఇండియా కో ఆర్డినేటర్ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. నవల నేపథ్యం తెలుగువారిదై ఉండాలన్నారు. నవల అచ్చులో కనీసం 150 పేజీలైనా ఉండాలని సూచించారు. ఆసక్తి కల్గిన వారు హామీ పత్రాలతో atp.abeeditor@gmail.comకు తమ నవలలను జూన్ 30 లోపు పంపాలని కోరారు. -
గ్రామాలకు అందని జలం
బకాయి చిట్టాలో జీతం... ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాకు సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ ఓ వరం. 1995లో ప్రజల దాహార్తిని గుర్తించిన సత్యసాయిబాబా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్కు జీవం పోశారు. 1997లో ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చిత్రావతి, పీఏబీఆర్ నుంచి నీటిని తీసుకుని శుద్ది చేసి ప్రత్యేక పైప్లైన్లు, సంపుల ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 870 గ్రామాలకు నీటిని అందజేస్తున్నారు. మహోన్నత ఆశయంతో నాడు సత్యసాయిబాబా ప్రారంభించిన ఈ పథకం కాస్త.. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో నిర్వీర్యమైంది. సకాలంలో జీతాలు అందక గత రెండేళ్లుగా పలు దఫాలుగా కార్మికులు ఆందోళన బాట పడుతూ వచ్చారు. నిరవధిక సమ్మె చేపట్టిన ప్రతిసారీ ఎంతో కొంత చెల్లించడం... ఆ తర్వాత చేతులెత్తేస్తుండడంతో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు రోజుల క్రితం మరోసారి కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జీతాలు చెల్లించే వరకూ సమ్మె విరమించబోమంటూ భీష్మించారు. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష బకాయి సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్లో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 572 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత ఐదు నెలలుగా కార్మికులు జీతాలు అందడం లేదు. ఈ క్రమంలో కార్మికుడికి రూ.లక్ష వరకూ బకాయి పేరుకుపోయింది. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. కీలకమైన పండుగలు, పర్వదినాల్లోనూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. దీంతో తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వం కనీసంగానూ స్పందించలేదు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోయారు. ఫలితంగా 870 గ్రామాలకు తాగునీరు అందకుండా పోయింది. వేసవిలో ఎందుకింత నిర్లక్ష్యం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వేసవిలో తాగునీటి కోసం తరచూ ఏదోక గ్రామంలో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో సత్యసాయి కార్మికుల దశల వారీ సమ్మెతో దాదాపు పది రోజులుగా గ్రామాల్లో నీరు అందకుండా పోయింది. తాజాగా ఐదు రోజులుగా చుక్క నీరు అందకపోవడంతో గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు బకాయి జీతాలు చెల్లించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. జీతాలు ఇస్తేనే విధుల్లోకిఐదు నెలలుగా మాకు ఎలాంటి జీతాలు అందడంలేదు . చాలా మంది వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. బకాయి జీతాలు చెల్లించడంతో పాటు ప్రతి నెలా సక్రమంగా జీతం చెల్లించాలి. అప్పటి వరకూ విధుల్లోకి చేరేది లేదు. – రమేష్రెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం కార్మికుడు, ఆత్మకూరు కార్మికుల సమస్యలు పట్టవా?ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో దాదాపు వెయ్యి గ్రామాలకు సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ కింద క్రమం తప్పకుండా నీటిని సరఫరా చేస్తున్నాం. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు బకాయిలు పేరుకుపోయాయి. కార్మికుల సమస్యలు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు పట్టడం లేదు. మేమూ మనుషులమే మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు చెల్లించాలి. – శ్రీరాములు, సత్యసాయి తాగునీటి పథకం కార్మికుడు, ఆత్మకూరు ఐదు నెలలుగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు అందని జీతాలు అప్పులతో కుటుంబాల పోషణ ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాల్లో తాగునీటి సరఫరా బంద్ -
తాగునీటి కోసం మహిళల రాస్తారోకో
రాయదుర్గం టౌన్: స్థానిక 19వ వార్డు అంబేడ్కర్ కాలనీవాసులు తాగునీటి కోసం శనివారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. వారం రోజులవుతున్నా నీరు సరఫరా చేయకపోతే అవసరాలు ఎలా తీరుతాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం ట్యాంకర్ ద్వారా కూడా నీరు సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్కెక్కి నిరసన తెలుపడంతో బీటీపీ రహదారిపై అరగంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ●గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కుందుర్పి: మండలంలోని మహంతపురం, జంబుగుంపల, ఎర్రగుంట గ్రామాల్లో 20 రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో శుక్రవారం ఎర్రగుంట గ్రామస్తులు సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. జంబుగుంపల్లో ఉన్న మంచినీటి పథకానికి సంబంధించిన బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య నెలకొందంటున్నారు. 20 రోజులుగా తాగునీరు అందకపోవడంతో అధికారులకు విన్నవించినా ఫలితం దక్కలేదని గ్రామానికి చెందిన మహిళలు మారెక్క, లక్ష్మీదేవి, యల్లక్క, రూప తదితరులు వాపోయారు. అలాగే మహంతపురంలో పక్షం రోజులుగా తాగునీరు అందకపోవడంతో వ్యవసాయ బోరుబావుల వద్ద తెచ్చుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -
వైభవంగా వసంతోత్సవం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీవారి వసంతోత్సవం, మయూర వాహనోత్సవ సేవలను కనులపండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి వసంతోత్సవం, కంకణ విసర్జన, చక్రస్నానం, మహామంగళ హారతి వేడుకగా జరుపుకున్నారు. వసంతోత్సవాన్ని దేవాలయం వద్ద నుంచి లక్ష్మీబజార్ వరకు నిర్వహించారు. రంగుల నీళ్లు భక్తులపై చల్లుతూ వసంతాలు ఆడారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై దేవేరులతో శ్రీవారిని ప్రత్యేక రథంపై ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. చివరి రోజు ఆదివారం సప్తప్రాకారోత్సవం, శయనోత్సవ కార్యక్రమాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి తెలిపారు. ముగిసిన పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిసాయి. ఉదయం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం, అర్చనలు, పూజల నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను కొలుదీర్చారు. అర్చకుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా ఆమిద్యాలలోని పెన్నహోబిలేసుని ఆలయానికి చేర్చారు. యువకుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు గార్లదిన్నె: మండలంలోని కల్లూరు కొండకింద కొట్టాలకు చెందిన యువకుడు రాజుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. వారం రోజుల క్రితం తాను నివాసముంటున్న ప్రాంతంలోని ఓ బాలికను రాజు మాయ మాటలు చెప్పి తన వెంట పిలుచుకెళ్లిపోయాడు. ఘటనపై ఈ నెల 5న తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజు శుక్రవారం బాలికను వారి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు బాలికకు సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం సఖీ సెంటర్కు తరలించారు. ఘటనపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి, రాజు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈతకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
విడపనకల్లు: ఈతకు వెళ్లిన వ్యక్తి మృత్యు ఒడికి చేరుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. విడపనకల్లుకు చెందిన బోయ ఓబులేసు(50) హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం పని ముగించుకుని, గ్రామ శివారులోని గౌరమ్మ బావిలోకి ఈతకు వెళ్లాడు. అప్పటికే పలువురు యువకులు అక్కడ సరదాగా ఈత కొడుతుండగా వారిని చూస్తూ తాను కూడా పై నుంచి బావిలోకి దూకాడు. ఆ సమయంలో నీటమునగడంతో యువకులు వెంటనే వెలికి తీసి, స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఓబులేసు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఓబులేసు మృతి విషయం తెలుసుకున్న కౌలు రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బోయ వెంకటేశులు శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓబులేసు మృతదేహం వద్ద నివాళులర్పించారు. -
‘శ్రీరామరెడ్డి’పై చిన్న చూపు ఎందుకు?
● శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మిక యూనియన్ నేతలు కూడేరు: వేలాది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆ ప్రాజెక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు మండిపడ్డారు. కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోలో వారు మాట్లాడారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. న్యాయబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మునూ పెండింగ్లో ఉంచారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని పలు దఫాలుగా అధికారులను అభ్యర్థించినా కనీసంగానూ స్పందించలేదని, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళితే... మోటార్లు ఆన్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్మిక సంఘం నేతలు కొండారెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసులు రెడ్డి, వన్నూరుస్వామి, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. యువతి ఆత్మహత్య విడపనకల్లు: మండలంలోని పాల్తూరు గ్రామానికి చెందిన వెంకటేశులు కుమార్తె పవిత్ర(18) ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా నయం కాకపోవడంతో క్షణికావేశానికి లోనైన ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, పవిత్ర మృతి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వకర్త వై.విశ్వేశ్వరరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే చిరుప్రాయంలోనే పవిత్ర ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వై.మధుసూదన్రెడ్డి అన్నారు. ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రి మార్చరీలో ఉంచిన పవిత్ర మృతదేహాన్ని ఆయన పరిశీలించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్సీపీ నాయకులు అశోక్కుమార్, లత్తవరం గోవిందు, కడవలకుంట సురేష్, సుంకన్న, చాబాల మాజీ సర్పంచ్ జగదీష్ తదితరులు ఉన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య లిఖిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న పురుషోత్తం శనివారం వేకువజామున గ్రామ శివారున బహిర్భూమికని వెళ్లాడు. అయితే శుక్రవారం రాత్రి వీచిన పెనుగాలులకు విద్యుత్ తీగలు తెగి పడి ఉన్న విషయాన్ని గుర్తించని ఆయన వాటిపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకుల మరణంఅనంతపురం సెంట్రల్: నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా అజాద్నగర్కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్బాషా(20), అనంతపురంలోని రాణినగర్కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖాసీంవలీని కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే మహబూబ్బాషాకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఘటనపై అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 16న శనీశ్వర ఆవిర్భావ దినోత్సవం పావగడ: ఈ నెల 16న పావగడలో శనీశ్వరస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎస్ఎస్కే సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15న విశేష పుష్ప యాగం, దీపాలంకృత ఉత్సవం ఉంటుంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. పురుషోత్తం (ఫైల్) -
మత్స్యకారులకు అందని భరోసా
● పింఛన్ల కోసం ఎదురుచూపు ● పట్టించుకోని చంద్రబాబు సర్కార్ గుమ్మఘట్ట: మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి భరోసా అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ మంజూరు చేసి అండగా నిలిచారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు అవుతున్నా మత్స్యకారులకు ఎలాంటి భరోసాగానీ, భద్రత గానీ కల్పించలేకపోయింది. జిల్లా వ్యాప్తంగా పీఏబీఆర్, మిడ్పెన్నార్ (ఎంపీఆర్), బీటీపీ, చాగల్లు రిజర్వాయర్తో పాటు 150 చెరువులు ఉన్నాయి. ఇందులో 108 మత్సకారుల సహకార సంఘాలు, అందులో 5,120 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 50 సంవత్సరాల వయసు దాటినవారు 1,251 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలూ అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అర్హత ఉండి కూడా పింఛన్కు నోచుకోకపోవడంతో ప్రతి నెలా రూ.4వేల చొప్పున మొత్తం రూ.50,04,000 కోల్పోతున్నారు. పింఛన్ మంజూరు చేయండని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదని వాపోతున్నారు. -
●అల్లుకున్న నిర్లక్ష్యం
అసలే వేసవి. ఎండలు మండుతున్నాయి.. తరచూ విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కరెంటు స్తంభాలు, తీగల నుంచి అగ్గిరవ్వలుపడి, మంటలు ఎగసి.. పంటలు కాలిపోయే అవకాశం ఉంది. గార్లదిన్నె నుంచి పెనకచెర్ల డ్యాంకు వెళ్లే మార్గంలో పొలాలు, పండ్ల తోటల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు అల్లుకున్న తీగలు ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. విద్యుత్ సిబ్బంది, అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న తీగలను తొలగించి, ప్రమాదాలను తప్పించాలని రైతులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
యువకుడి దుర్మరణం
బుక్కరాయసముద్రం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన వడ్డే సాయికుమార్ (25) వడియంపేట వద్ద ఉన్న హెచ్పీ గ్యాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. శనివారం రాత్రి పని ముగించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన సాయికుమార్... అనంతపురం శివారున గుత్తి మార్గంలోని అంబాభవానీ గుడి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొని కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కార్మికుల ఎదుట సాయికుమార్ను ఫ్యాక్టరీ సెక్యూరిటీ సూపర్వైజర్ అవమానకరంగా మాట్లాడడంతో మనస్తాపం చెందిన సాయికుమార్ బైక్పై వెళుతూ కిందపడి మృతి చెందాడంటూ బంధువులు ఆరోపించారు. ఘటనపై బీకేఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాయికుమార్ (ఫైల్) -
అక్రమాలు వెలుగులోకి వచ్చేనా?
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం (జేఎన్టీయూ–ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థి– అధ్యాపక నిష్పత్తి, హాస్టళ్లు తదితర అంశాలను పరిశీలించడానికి నిజ నిర్ధారణ కమిటీ (ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ)లను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నియమించారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆయా కళాశాలను నేరుగా సందర్శించి యూజీసీ నిర్దేశిత అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం యూనివర్సిటీకి నివేదికను సమర్పిస్తారు. ఎఫ్ఎఫ్సీ సిఫార్సల మేరకు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కోత విధించాలా? లేక గరిష్ట సీట్లు అనుమతించాలా? అనే అంశంపై యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ఏపీఈఏపీసెట్ అడ్మిషన్ల కన్వీనర్కు సీట్ల జాబితా పంపుతారు. ఈ మేరకు ఏపీ ఈఏపీసెట్లో అర్హత పొందిన విద్యార్థి ఆప్షన్ ఇచ్చుకుని సీటు పొందుతారు. తనిఖీ నివేదికలన్నీ నామమాత్రమే.. జేఎన్టీయూ (ఏ) పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ 87, ఫార్మసీ 45, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 28 ఉన్నాయి. ఈ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు మదింపు చేయడానికి ఎఫ్ఎఫ్సీల నియామకం చేశారు. ఇప్పటికే కొన్ని కమిటీలు పర్యవేక్షణ పూర్తి చేశాయి. సింహభాగం కళాశాలల్లో సరిపడా బోధనా సిబ్బంది లేరనే అంశాన్ని గుర్తించారు. ప్రతి కళాశాలలోనూ విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిని కచ్చితంగా పరిశీలించాలి. బీటెక్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఎంటెక్లో ప్రతి బ్రాంచ్కూ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ ఒక్కొక్కరు ఉండాలి. ప్రొఫెసర్ లేకపోతే ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు తప్పనిసరి. ప్రొఫెసర్ డాక్టరేట్ పొంది ఉండాలి. మౌలిక సదుపాయాలు (అకడమిక్, నాన్ అకడమిక్, భవనాలు), లేబొరేటరీస్, కంప్యూటర్లు తగినన్ని ఉన్నాయా అనే అంశంపై ఆరా తీయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా లైబ్రరీ, హాస్టళ్లు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం, మెడికల్ ఫెసిలిటీని పరిశీలించాలి. గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూలు ఎంతమంది పొందారు.. ప్రవేశపెట్టిన కోర్సులు.. కొత్త కోర్సులు ఎన్ని ఉన్నాయి.. అనే అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలి. ఇవన్నీ పరిశీలిస్తారు. కానీ ఫ్యాకల్టీ లేకపోయినా.. ఉన్నట్లుగానే నివేదికలో పొందుపరుస్తారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆ కోర్సులకు ప్రొఫెసర్లు ఎక్కడ? ఇంజినీరింగ్ కళాశాలలను పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు కొంతమంది ప్రొఫెసర్లు వెల్లడించారు. డేటా సైన్సెస్కు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు అన్ని కళాశాలల్లోనూ అమలు చేస్తున్నారు. సింహభాగం విద్యార్థులు అడ్మిషన్లు ఈ కోర్సుల్లోనే పొందుతున్నారు. దీంతో ప్రతి కళాశాలలోనూ మూడు, నాలుగు సెక్షన్లు అనుమతి తెచ్చుకుని.. ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అత్యధిక కళాశాలల్లో డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించే అధ్యాపకులు లేరు. కారణం కొత్త కోర్సుల్లో అనుభవం లేకపోవడం.. ఇందులో పీహెచ్డీ చేసిన వారు తక్కువగా ఉండడమే. మల్టీడిసిప్లనరీలో ఇతర కోర్సుల్లో చదివిన వారు సైతం డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టును కొద్ది రోజుల్లోనే నేర్చుకుని పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా సబ్జెక్టుల్లోనూ పీహెచ్డీ పూర్తి చేసిన వారు ఉంటేనే అర్హుల కింద పరిగణించాలి. 20 నుంచి 30 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ సబ్జెక్టులను బోధించేవారే లేరని పరిశీలనలో తేలినట్లు ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు. అద్దె ప్రొఫెసర్లు ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లు లేకపోవడంతో అద్దె ప్రొఫెసర్లను దింపుతున్నట్లు తెలుస్తోంది. నిజనిర్ధారణ కమిటీల ముందు హాజరుపరిచి.. పర్యవేక్షణ పూర్తయ్యాక.. తిరిగి సొంత కళాశాలకు పంపించేస్తున్నారు. వాస్తవానికి ఒక కళాశాలలో పనిచేసే వారిని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్నట్లుగా కమిటీల ముందు హాజరు పరుస్తున్నట్లు సమాచారం. ఆధార్ నంబరు లింక్ చేసి.. వెబ్సైట్లో ప్రొఫెసర్ల పేర్లు పొందుపరిస్తే.. ఇలాంటి మోసాన్ని పసిగట్టవచ్చునని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గతంలో ప్రతి ప్రొఫెసర్కూ యూనివర్సిటీ పరిధిలో ర్యాటిఫికేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. తాజాగా అలాంటి ఇంటర్వ్యూలకు మంగళం పాడేశారు. దీంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించాలని కోరాం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిజనిర్ధారణ కమిటీలను కోరాం. మదింపులో రాజీ పడేది లేదు. కచ్చితమైన డేటా ఇస్తారని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్, జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రొఫెసర్లు లేకున్నా ఉన్నట్లు మాయ ఏఐ, డేటా సైన్సెస్ కోర్సులున్నా బోధన శూన్యం అర్హత గల ప్రొఫెసర్లు లేకపోవడమే కారణం నిజ నిర్ధారణ కమిటీల పరిశీలనలో గుర్తించేరా? -
‘సర్’ పై అప్రమత్తత అవసరం
● మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య కళ్యాణదుర్గం: ఓటర్ల జాబితా రూపొందించడంపై కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన సర్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ రివిజన్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించి టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఉండేలా ఓటర్ల జాబితాను రూపొందించుకుంటున్నారని, ఈ విషయంగా బూత్ స్థాయిలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం జరిగిన ఐటీ, సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ వివిధ అనుబంధ సంఘాల గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలో ఎటు చూసినా కళ్యాణి వైన్స్ పేరుతో మద్యం దుకాణాలు నెలకొల్పి మద్యం ప్రియుల సొమ్ము ఖర్చు పెడుతూ సొంత నిధులు అంటూ డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తుంటే అక్రమ కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. తిరుమలలో లడ్డూ కల్తీ పై ర్యాలీ చేస్తే తనతో పాటు మొత్తం 48 వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ పాదయాత్ర చేపట్టి, విజయోత్సవ ర్యాలీ చేస్తే అక్రమంగా 100 మందిపై కేసులు పెట్టిన ఘనత కళ్యాణదుర్గం పోలీసులకే దక్కిందన్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు, శింగనమల యువ నాయకుడు డాక్టర్ సాకే రుత్విక్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఐటీ వింగ్ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ మంజునాథ్ యాదవ్, సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ సలీంబాబా, ఐటీ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మంజు, తాలూకా అధ్యక్షుడు ప్రదీప్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
అన్నదాత ఆక్రందనలు పట్టవా?
అనంతపురం: అన్నదాతల ఆక్రందనలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టవా అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయని, మామిడి, చీనీ తోటలు కళ్లెదుటే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నా రైతాంగానికి ఒనగూరిందేమీ లేదన్నారు. అనంతపురం జిల్లాలోని 20 మండలాల్లో నీటిమట్టాలు తగ్గిపోయాయని, ఏడు నుంచి ఎనిమిది మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉందని గుర్తు చేశారు. జిల్లాలో హంద్రీ–నీవా ద్వారా 20 టీఎంసీల నీరు వచ్చినప్పుడే చెరువులకు నీరు చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. 60 టీఎంసీల నీరిచ్చామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, అదే నిజమైతే మరి భూగర్భజలాలు ఎందుకు తగ్గాయో వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ లేదు.. బీమానూ లేదు ప్రకృతి వైపరీత్యం, కరువు, తదితర కారణాలతో పంట నష్టం జరిగితే తక్షణమే ఉపశమనం కలిగించేది ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమానేనని అనంత అన్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయలేదన్నారు. ఉచిత పంటల బీమాకూ మంగళం పాడిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఉచిత పంటల బీమాను పకడ్బందీగా అమలు చేశారన్నారు. అయితే ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఏదో చేస్తున్నామని మభ్యపెట్టడానికే సీఎం కలెక్టర్లతో సమీక్షలు అంటూ డ్రామా ఆడుతున్నారన్నారు. బాధితులకు పరిహారమేదీ? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే 70 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, అయితే ఏ ఒక్క బాధిత కుటుంబాన్నీ ఆదుకోలేకపోయారని అనంత ధ్వజమెత్తారు. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన అనంతపురం జిల్లాకు రెగ్యులర్ జేడీని నియమించలేకపోయారన్నారు. ఖరీఫ్ సమీపిస్తున్నా సరైన ప్రణాళిక లేదన్నారు. గిట్టుబాటు ధరల కల్పనలో విఫలం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనంత విమర్శించారు. ఎన్నడూ లేనివిధంగా మామిడి, అరటి, చీనీ ధరలు పతనమయ్యాయన్నారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలు రూ.2,400 ప్రకటించినా అందుకు అనుగుణంగా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. వరిని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, సాంస్కృతిక విభాగం నగర కార్యదర్శి కేశవరెడ్డి, బీసీ సెల్ నాయకుడు రామచంద్ర, విద్యార్థి నాయకుడు కై లాష్ తదితరులు పాల్గొన్నారు. చీనీ, మామిడి చెట్లు ఎండిపోతున్నా కనికరం లేదా.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి -
కసాపురంలో నేటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ, మన్యుసూక్త పారాయణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. రెండో రోజు సోమవారం ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన నిర్వహించి తీర్థప్రసాదాల పంపిణీ చేయనున్నారు. చివరిరోజు మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవమూర్తికి లక్ష పుష్పాలతో అర్చన చేసి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగించనున్నారు. -
పెళ్లి భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
అనంతపురం జిల్లా: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
53 ఏళ్ల రాధ వివాహేతర సంబంధం.. షాకింగ్ నిజాలు!
రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్నగర్లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్కు పంపారు. -
రైతు సమస్యలు చంద్రబాబుకు పట్టవా?
● 11న కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో ఆందోళన ● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ గార్లదిన్నె: చీనీ పంట సాగు చేసిన రైతుల బతుకులు చితికిపోతున్నా సీఎం చంద్రబాబు స్పందించడంలేదని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మండలంలోని మర్తాడులో ఎండిన చీనీ తోటలను వైఎస్సార్సీపీ నాయకులతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించారు. శైలజానాథ్ మాట్లాడుతూ దక్షిణ కాలువకు లైనింగ్ పనులు చేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, రైతులు చీనీపంట కాపాడుకోవడానికి ట్యాంకర్లతో నీరందిస్తున్నారన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో రెండు నెలల్లో గ్రామంలోని చీనీ చెట్లన్నీ ఎండిపోతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు సమస్యలపై నిర్లక్ష్యంగా, బాధ్యతరహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్కడక్కడా పంట దిగుబడి ఉన్నా ఎండల తీవ్రత, నీరు లేక పోవడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారన్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధులను విడుదల చేసి, రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరి, మొక్కజొన్న, చీనీ పంటలను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలపై స్పందించకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. ఈనెల 11న రైతుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, యువ నాయకుడు సాకే రుత్విక్, మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, ఎస్సీ సెల్ శింగనమల నియోజకవర్గ ఇన్చార్జ్ ఆంజనేయులు, తాతిరెడ్డి, యుగంధర్రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ల లబ్ధికే లైనింగ్!
● ఏడాది గడవకనే తేలిన కంకర ● నాసిరకం పనులతో కాంట్రాక్టర్ల జేబుల్లోకి రూ.కోట్లు ఆత్మకూరు: ఏడాది గడవకనే హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల బాగోతం బయట పడింది. సదరు కాంట్రాక్టర్లు పనులను నాసిరకంగా చేయడంతో కాలువలో ఎక్కడికక్కడ కంకర తేలింది. కరువు జిల్లా అయిన అనంతపురం రైతులకు వరంగా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హంద్రీ నీవా కాలువను 40 టీఎంసీల తాగు, సాగు నీరు అందించే ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. వైఎస్సార్ హయాంలోనే చాలా వరకు పనులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పంకు నీరు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో హంద్రీ నీవా కాలువకు సంబంధించిన లైనింగ్ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జీడిపల్లి నుంచి కుప్పంకు దాదాపు రూ.3,850 కోట్లతో హంద్రీ నీవా కాంక్రీట్ లైనింగ్ పనులను ప్రారంభించారు. గత ఏడాది హంద్రీ నీవా కాలువకు వచ్చే నీటిని ఆపించి పనులు చేశారు. కంకర తేలిన లైనింగ్... ప్రస్తుతం హంద్రీ– నీవా కాలువకు సంబంధించి అధికారులు నీటిని ఆపేశారు. అయితే కాంట్రాక్టర్లు వేగంగా, నాసిరకంగా పనులు చేపట్టడంతో ఎక్కడ చూసినా లైనింగ్ దెబ్బతిని కంకర తేలి అధ్వానంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల పూర్తిగా సిమెంట్, కంకర తేలిపోయి మట్టి దిమ్మెలు కనిపిస్తున్నాయి. కేవలం అధికార పార్టీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రమే చంద్రబాబు హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ము దోచి కాంట్రాక్టర్లకు పెడుతున్నారని మండిపడుతున్నారు. కాంట్రాక్టర్దే బాధ్యత పనులు చేసిన తర్వాతి నుంచి రెండేళ్ల వరకూ ఏం జరిగినా కాంట్రాక్టర్లదే బాధ్యత. హంద్రీనీవా కాలువకు లైనింగ్ పోయిన చోట మళ్లీ ఫినిషింగ్ చేయిస్తాం. కొన్నిచోట్ల లైనింగ్ వేయలేదు. వేయిస్తాం. – ఆనంద్, జేఈ, ఇరిగేషన్ -
వేడుకగా ధ్వజ అవరోహణం
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముక్కోటి దేవతలకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం పరిధిలోని రుద్రంపేటకు చెందిన యోగానందరెడ్డి ఉభయదారుగా వ్యవహరించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నృసింహస్వామి శయనోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. ఆమిద్యాల గ్రామానికి చెందిన ఎం.సుగుణవతి, ఓబుళేసు ఉభయదారులుగా వ్యవహరించారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజైన శుక్రవారం కూడా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి పలు అంశాలపైన నివేదికలను వారు సీఎంకు సమర్పించారు. ‘ఇన్స్టా’లో ప్రేమ.. పెళ్లికి నిరాకరణ అనంతపురం సెంట్రల్: ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడిన జంట మధ్య ప్రేమ చిగురించింది. ఒకట్రెండు కాదు మూడేళ్లుగా ప్రేమాయణం సాగించిన యువకుడు... పెళ్లి పేరు ఎత్తగానే ‘నో’ అనేశాడు. దీంతో బెంబేలెత్తిన యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన ఓ యువతికి తెలంగాణలోని కరీంనగర్ నివాసి, డెలివరీ బాయ్గా పనిచేస్తున్న పర్వేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో నువ్వంటే నాకిష్టమంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలు దఫాలు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామంటూ కొన్ని రోజులుగా యువతి అభ్యర్థిస్తూ వచ్చింది. ఈ అభ్యర్థనను సదరు యువకుడు తిరస్కరిస్తూ రావడంతో చివరకు అనంతపురం వన్టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు కరీంనగర్ నుంచి పర్వేజ్ను రప్పించుకుని మాట్లాడారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా ససేమిరా అనడంతో చివరకు కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
లంచం కేసులో పీఆర్ ఏఈకి ఏడేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్: సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంబుక్లను ప్రాసెస్ చేసి బిల్లు మంజూరు చేయడానికి లంచం తీసుకున్న కేసులో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండారు చిన్నపుల్లయ్యకు కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... 2018 సంవత్సరంలో అమడగూరు మండలం సేతిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఎంబుక్లను ప్రాసెస్ చేసి బిల్లుల మంజూరుకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అప్పటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉన్న బండారు చిన్నపుల్లయ్య (ప్రస్తుతం రిటైర్డ్) రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటనారాయణపల్లికి చెందిన లక్ష్మీపతి 2018 అక్టోబర్ 8న అనంతపురం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటుండగా చిన్న పుల్లయ్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కేసు విచారణ అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య తీర్పు వెలువరించారు. చిన్నపుల్లయ్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. జరిమానా డబ్బులు చెల్లించలేకపోతే అదనంగా 6 నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. జరిమానా మొత్తం రూ.2 లక్షలను ఫిర్యాదుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ముద్దాయిని కర్నూలు శివారులోని జిల్లా జైలుకు తరలించారు. -
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నూతన పింఛన్ల మంజూరును మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన వేలాది మంది వ
అనంతపురం టౌన్: నూతన పింఛన్ల మంజూరును చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్ల ఊసే లేదు. ఎప్పుడు మంజూరు చేస్తారో అఽధికారులకు సైతం స్పష్టత లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మంజూరు చేస్తామని ఆదేశాలు జారీ చేస్తే అర్హుల జాబితాను పంపుతాం... అంతవరకూ తామేమీ చేయలేమంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. గతంలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉంటే ఎలాంటి కొర్రీలు లేకుండా పింఛన్లు మంజూరు చేశారు. 2019–24 మధ్య జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా పింఛన్లు అందుకునేవారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు వివిధ రకాల కారణాలు చూపి జిల్లాలో దాదాపు 75 వేల మందికి పైగా పింఛన్లు తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు 2.75 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని పెంచుతామంటూనే అర్హత ఉన్న వారి పింఛన్లను కట్ చేశారు. రీ వెరిఫికేషన్ పేరుతో జిల్లాలో 30 వేల మందికి పైగా దివ్యాంగుల పింఛన్లు తొలగించేశారు. 40 వేల మంది ఎదురుచూపు జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. పింఛన్ల కోసం సచివాలయాల్లోనే 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్లో సైతం దాదాపు 3 వేల మందికి పైగా అర్జీలు ఇచ్చారు. కొత్త పింఛన్ల మంజూరుపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే స్పౌజ్ కోటాలో భార్యకు మాత్రమే పింఛన్ అందజేస్తున్నారు తప్పితే కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయలేదు. పింఛన్కు కావాల్సిన అన్ని రకాల అర్హత ఉన్నా ఇవ్వకపోతే ఎలా అని అర్హులు ప్రశ్నిస్తున్నారు. కొత్త పింఛన్లపై స్పష్టత లేదు కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి జీఓలను విడుదల చేయలేదు. పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్ల మంజూరుపై స్పష్టత వస్తే లబ్ధిదారుల నివేదికలను ప్రభుత్వానికి పంపుతాం. – శైలజ , పీడీ, డీఆర్డీఏ కొత్తవి ఇవ్వకపోగా వివిధ కారణాలతో 75 వేల పింఛన్ల రద్దు జిల్లా వ్యాప్తంగా 40 వేల మందికి పైగా దరఖాస్తు పింఛన్ల కోసం అధికారుల చుట్టూ అర్హుల ప్రదక్షిణ అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
ఆమె దిగే వరకూ బస్సు ముందుకు పోదు!
అనంతపురం జిల్లా: కిక్కిరిసిన బస్సులో ఎక్కిన ప్రయాణికురాలు కిందకు దిగే వరకూ ముందుకు పోనంటూ ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ భీష్మచుకోవడంతో దాదాపు అరగంట పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్న అభ్యర్థులూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి నుంచి అనంతపురానికి శుక్రవారం ఉదయం కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. రెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే ఒకరిద్దరు కిందకు దిగడంతో అక్కడ మరో ప్రయాణికురాలు ఎక్కింది. ఆ సమయంలో బస్సు డోరు వేయడం ఇబ్బందిగా మారడంతో ఆమెను కిందకు దిగి మరో బస్సులో రావాలని కండెక్టర్, డ్రైవర్ సూచించారు. దీంతో ఆమె వాగ్వాదానికి దిగింది. బస్సు డోరు కూడా సక్రమంగా పడడం లేదని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తన కుటుంబం అన్యాయమవుతుందని డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేస్తూ బస్సును ముందుకు పోనిచ్చేది లేదంటూ భీషి్మంచాడు. ప్రయాణికులు సర్దిచెప్పబోతే వారితో కూడా ఆమె వాగ్వాదానికి దిగింది. దీంతో ఎంసీఏ పరీక్షలకు వెళుతున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు సైతం తమకు ఉదయం 8.30 గంటలకు రైలు ఉందని, మరో 15 నిమిషాల్లో రైల్వే స్టేషన్కు చేరుకోకపోతే రైలు వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీఏ అభ్యర్థులు కల్పించుకుని తమ భవిష్యత్తు ఈ పరీక్షతో ముడిపడిఉందని, సహకరించాలని అభ్యరి్థంచడంతో ఆమె శాపనార్థాలు పెడుతూ బస్సు దిగింది. అనంతరం నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా అనంతపురానికి బస్సు చేరుకోవడంతో బెంగళూరు ప్రయాణికులు గత్యంతరం లేక మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన వడ్డె కిష్టప్ప, రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్ (15) ఈతకని వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. గుంతకల్లులోని ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని, వేసవి సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ శివారున ఉన్న బావిలోకి ఈత కొట్టేందుకు వెళ్లాడు. సరదాగా ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి చేరుకున్న ప్రవీణ్ అక్కడే పూడికలో ఇరుక్కుపోయాడు. ఎంత సేపటికీ బయలకు రాకపోవడంతో కంగారు పడిన స్నేహితుల సమాచారంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే బావిలో దిగి బాలుడిని వెలికి తీసి ఆగమేఘాలపై మాజీ ఎంపీపీ రామచంద్ర ద్విచక్ర వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ (ఫైల్) -
ఆమె దిగే వరకూ బస్సు ముందుకు పోదు!
● భీష్మించుకున్న ఆర్డీసీ డ్రైవర్ ● 15 నిమిషాల పాటు నిలిచిపోయిన బస్సు తాడిపత్రి రూరల్: కిక్కిరిసిన బస్సులో ఎక్కిన ప్రయాణికురాలు కిందకు దిగే వరకూ ముందుకు పోనంటూ ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ భీష్మించుకోవడంతో దాదాపు అరగంట పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్న అభ్యర్థులూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి నుంచి అనంతపురానికి శుక్రవారం ఉదయం కిక్కిరిసిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. రెడ్డిపల్లి వద్దకు చేరుకోగానే ఒకరిద్దరు కిందకు దిగడంతో అక్కడ మరో ప్రయాణికురాలు ఎక్కింది. ఆ సమయంలో బస్సు డోరు వేయడం ఇబ్బందిగా మారడంతో ఆమెను కిందకు దిగి మరో బస్సులో రావాలని కండెక్టర్, డ్రైవర్ సూచించారు. దీంతో ఆమె వాగ్వాదానికి దిగింది. బస్సు డోరు కూడా సక్రమంగా పడడం లేదని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తన కుటుంబం అన్యాయమవుతుందని డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేస్తూ బస్సును ముందుకు పోనిచ్చేది లేదంటూ భీష్మించాడు. ప్రయాణికులు సర్దిచెప్పబోతే వారితో కూడా ఆమె వాగ్వాదానికి దిగింది. దీంతో ఎంసీఏ పరీక్షలకు వెళుతున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు సైతం తమకు ఉదయం 8.30 గంటలకు రైలు ఉందని, మరో 15 నిమిషాల్లో రైల్వే స్టేషన్కు చేరుకోకపోతే రైలు వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంసీఏ అభ్యర్థులు కల్పించుకుని తమ భవిష్యత్తు ఈ పరీక్షతో ముడిపడిఉందని, సహకరించాలని అభ్యర్థించడంతో ఆమె శాపనార్థాలు పెడుతూ బస్సు దిగింది. అనంతరం నిర్ణీత సమయానికి కంటే ఆలస్యంగా అనంతపురానికి బస్సు చేరుకోవడంతో బెంగళూరు ప్రయాణికులు గత్యంతరం లేక మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది. -
దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం!
‘ప్రభుత్వం మాది. ఇక్కడ మేము ఏమి చేసినా చెల్లుతుంది. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి.. చూద్దాం’ అంటూ అధికారులకే సవాల్ విసురుతున్నారు కొందరు టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు సాగిస్తున్న ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సహజ వనరులపై కన్నేసిన వారు చెరువులు, వాగులు, వంకలతో పాటు చివరకు ప్రభుత్వ భూముల్లోని ఎర్రమట్టినీ వదలడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలో సహజ వనరుల దోపిడీ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో చియ్యేడు, పూలకుంట, మన్నీల, కృష్ణమరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి భారీగా గ్రావెల్, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోలేకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ఆస్తిగా భావించాల్సిన సహజ వనరులను చేజిక్కించుకున్న కొందరు.. వాటిని రూ.కోట్ల విలువైన అక్రమ వ్యాపారంగా మార్చేశారు. స్థానికుల ఫిర్యాదులు బుట్టదాఖలు గతం నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ నేతలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ కిమ్మనకుండా ఉండిపోయారని, తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదులు కాస్త బుట్టదాఖలవుతున్నాయని అంటున్నారు. రేయింబవళ్లు టిప్పర్లతో గ్రావెల్, ఎర్రమట్టిని తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో చిన్నపాటి జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమినీ వదలని వైనం తాజాగా రెండు రోజుల క్రితం కృష్ణమరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 90/3 లో జగనన్న కాలనీకి కేటాయించిన స్థలంలో అక్రమంగా మట్టిని తవ్వడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో మట్టిని తవ్వి, ఇటుకలపల్లి సమీపంలో డంప్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలోని ప్రధాన సూత్రధారులు తమ వెనుక రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు ఉన్నారంటూ వారి పేర్లు చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు కూడా బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మట్టితరలింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు, విజిలెన్స్, భూగర్భ గనుల శాఖ అధికారుల నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్, ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణమరెడ్డిపల్లిలోని జగనన్న కాలనీ స్థలంలో మట్టిని తవ్వేస్తున్న దృశ్యం ఇటుకలపల్లి సమీపంలోని ఓ వెంచర్లో డంప్ చేసిన మట్టి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యథేచ్చగా సహజ వనరుల దోపిడీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అటుగా కన్నెత్తి చూడని అధికారులు ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన సమయంలో నామమాత్రపు చర్యలు -
మొదటి హత్యను బయటపెట్టిన రెండో హత్య
● దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలనాలు రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్నగర్లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెకు ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్కు పంపారు. -
పింఛన్ తొలగించారు
దివ్యాంగ పింఛన్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి పరిశీలించకుండానే డోర్లాక్ అని రాసేసుకొని పింఛన్ నిలిపివేశారు. జిల్లా కలెక్టర్కు విన్నవించుకుంటే ఫిబ్రవరి నుంచి పింఛన్ వచ్చే విధంగా చూస్తామన్నారు. మూడు నెలలు కావస్తున్నా పింఛన్ మాత్రం ఇవ్వలేదు. నన్ను చూస్తేనే కదా వికలాంగుడా? కాదా? అన్న విషయం తెలుస్తుంది. కేవలం పింఛన్పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న నా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. – రమేష్, అరవింద్నగర్, అనంతపురం -
పెళ్లి ప్రయత్నాలు వద్దని.. చదువుకుంటానంటూ
● ఈ నెల 6న ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూ మృతిగార్లదిన్నె: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
‘యువతను మోసగించిన ప్రభుత్వం’
అనంతపురం అర్బన్: టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ సీఎంను చేస్తేనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటూ ఎన్నికల సమయంలో మభ్యపెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా యువతను దగా చేశారంటూ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్కుమార్ ధ్వజమెత్తారు. అనంతపురంలోని నీలం రాజశేఖరరెడ్డి భవన్లో శుక్రవారం జరిగిన ఏఐవైఎఫ్ నగర కమిటీ స్వరసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వ పెద్దలు తగిన మూల్యం చెల్లించుకునేలా ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు శ్రీరాములు, లింగమయ్య, గాదిలింగప్ప, తదితరులు పాల్గొన్నారు. నగర నూతన కమిటీ ఎన్నిక ఏఐవైఎఫ్ నగర కమిటీ అధ్యక్షుడిగా ఆనంద్బాబు, రియాజ్ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బండారు తేజ, కోశాధికారిగా సి.రాంబాబును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బి.మన్సూర్, నాసిర్, నాగేష్, యువతేజ, ఉదయ, సహాయ కార్యద్శులుగా లిఖిల్, రాజశేఖర్, మన్సూర్, గణేష్తో పాటు మరో 19 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే బాలల సంఘం నగర అధ్యక్షుడిగా కె.సంతోష్, 67 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు. వీఆర్వో సస్పెన్షన్ తాడిపత్రి రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సజ్జలదిన్నె వీఆర్వో రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఉత్తర్వులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ నెల 2న జారీ చేసినట్లు తహసీల్దార్ కార్యాలయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఓ రైతుకు చెందిన భూమిని ఆన్లైన్లో ఎక్కించేందుకు గత నెల 29న వీఆర్వో రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. చైన్ స్నాచర్ అరెస్ట్ శింగనమల(నార్పల): ఈ నెల 5న నార్పలలోని సుల్తాన్పేటలో చైన్స్నాచింగ్కు పాల్పడిన బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన రాయల తరేష్ని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు నార్పల పీఎస్ ఎస్ఐ సాగర్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళలకు కత్తి చూపి బెదిరించి, వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న సుల్తాన్పేటలో ఒంటరిగా వెళుతున్న నంద్యాల నరసమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.హోంగార్డులపై వేటుకు రంగం సిద్ధం గుత్తి: స్థానిక పీఎస్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు హోంగార్డులపై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని అనంతపురం హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యభిచార నిర్వాహకులతో సన్నితంగా ఉంటూ అవినీతి, అక్రమాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో హెడ్ క్వార్టర్స్ను నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. -
టన్ను మామిడి రూ.52 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.52 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 420 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.52 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.35 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి కాయలు టన్ను గరిష్టంగా రూ.48 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు పలికాయని తెలిపారు. ఇక హిమాయత్ రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ వెల్లడించారు. యూకే కౌన్సిలర్గా గుత్తి పూర్వ విద్యార్థి గుత్తి: పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థి నవీన్ యూనైటెట్ కింగ్డమ్ నార్త్ చీమ్లో జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారు. అనంతపురానికి చెందిన నవీన్ 15 ఏళ్ల క్రితం గుత్తి ఎస్కేడీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. అనంతరం యూకేకు వెళ్లి అక్కడ స్థిర పడ్డారు. ఈ క్రమంలో అక్కడ గురువారం జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలుపొందారు. నవీన్ 1800 పై చిలుకు ఓట్లతో కౌన్సిలర్గా విజయం సాధించారు. నవీన్ అక్కా బావలు స్వరూప, రాఘవేంద్ర(చిన్ని) ప్రస్తుతం గుత్తిలో నివాసముంటున్నారు. నవీన్ యూకే ఎన్నికల్లో విజయం సాధించడంతో అనంత, గుత్తి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అశ్వవాహనంపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి పార్వేట ఉత్సవం, అశ్వవాహనోత్సవం కనులపండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వేంకటరమణస్వామి దర్శనమిచ్చారు. రాయదుర్గం రెడ్డి సంక్షేమ సంఘం, ఆరెకటిక, నాయీబ్రాహ్మణ, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సాగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, సాయంత్రం మయూర వాహన సేవలు ఉంటాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. -
‘ఉద్యాన పాలిటెక్నిక్’ ప్రవేశాలకు నోటిఫికేషన్
మడకశిర రూరల్: డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉద్యాన, ల్యాండ్ స్కేపింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఉద్యాన పాలిటెక్నిక్లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బయ్యన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ (శుక్రవారం) నుంచి 23వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు https:// drysrhu.ap.gov.in వెబ్సైట్ చూడాలన్నారు. మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలకు ప్రభుత్వం 60 సీట్లు కేటాయించిందన్నారు. వూర్తి వివరాల కోసం 7382633687,9182677322, 9492328008 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మహోజ్వల శక్తి.. అల్లూరి : డీఆర్వో
అనంతపురం అర్బన్: భారత స్వాతంత్య్ర చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఓ మహోజ్వల శక్తిగా ఖ్యాతిగాంచారని డీఆర్వో ఎ.మలోల అన్నారు. నాడు అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి డీఆర్వో, తదితరులు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం వస్తుందని తాను నమ్మిన దిశగానే ప్రయాణిస్తూ ప్రాణాలను అర్పించిన మహోయోధుడు అల్లూరి సీతారామారాజు అని కొనియాడారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసులు, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, హెచ్డబ్ల్యూఓ చంద్రశేఖర్బాబు, గిరిజన సంఘం నాయకులు పోలా వీరాంజనేయులు, సాకే చిరంజీవి పాల్గొన్నారు. ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి బెళుగుప్ప: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామానికి చంఎదిన మహిళా కూలీలు గురువారం ఉదయం వెంకటాద్రిపల్లిలో ఓ రైతు పొలంలో టమాట మొక్కలు నాటేందుకు కూలి పనికి సిద్ధమై ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో రాధాకృష్ణ తోట వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రధాన రహదారిపై ఆటో బోల్తాపడింది. తలకు తీవ్ర గాయమైన కూలీ హరిజన గంగమ్మ (67) అక్కడికక్కడే మృతి చెందింది. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి కుమారుడు లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆటో డ్రైవర్ పాతన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శివ తెలిపారు. ‘పది’ విద్యార్థులకు పతిభా పురస్కారాలు అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏపీఎస్ఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర ప్రకటించారు. గురువారం స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో 550 ఆపై మార్కులు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 13వ తేదీలోపు మార్కుల జాబితా, ఆధార్ కార్డు, టీసీ లేదా స్టడీ సర్టిఫికెట్, రెండు ఫొటోలతో కూడిన దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు 88850 12181, 99850 12181, 77308 14646 నంబర్లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో ఇన్స్పైర్ కన్వీనర్ జిలాన్ బాషా, కో కన్వీనర్ రాము, కేఏటీడబ్ల్యూఏ టీచర్ యూనియన్ జిల్లా కార్యదర్శి మహేష్, లెక్చరర్ చంద్రశేఖర్, ఏపీవైఎఫ్ గోపాలరెడ్డి, ఏపీఎస్ఎఫ్ జిల్లా నాయకులు గురు సాయి, శివ, నదీమ్, దీక్షిత్, తదితరులు పాల్గొన్నారు. అశ్వ వాహనంపై శ్రీవారు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవేరులతో కలిసి అశ్వ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున సాగాయి. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువు దీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి ఉరవకొండకు చెందిన అంగదాల నారాయణస్వామి, అంగదాల ఆంజనేయులు, అంగదాల అభినయ్, గాజుల నాగరాజు ఉభయదాతలుగా వ్యవహరించారు. -
టీడీపీ నేత ఇంట పేకాట
● 14 మంది జూదరుల అరెస్ట్ ● రూ.3.85 లక్షల నగదు, కారు స్వాధీనం గార్లదిన్నె: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు ప్రతి దానినీ ఆదాయవనరుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో యథేచ్ఛగా జూదాలనూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గార్లదిన్నెలో ఓ టీడీపీ నేత తన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి పెద్ద ఎత్తున జూదాన్ని నిర్వహిస్తుండడం కలకలం రేపింది. విషయం పసిగట్టిన పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టడంతో గుట్టు కాస్త రట్టయింది. అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కోటి బళ్లారి వెంకటేష్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తూ ఫోన్ ద్వారా ముందస్తుగానే జూదరులకు సమాచారం ఇచ్చి, ఆయా ప్రాంతాలకు రప్పించుకునేవాడు. ఈ క్రమంలో ముదిగుబ్బ, బత్తలపల్లి, అనంతపురము మూడో పట్టణ పీఎస్ పరిధిలోనూ పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజులుగా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నేత ఖాసీం నాయుడుతో కుమ్మకై స్థానిక కెనరాబ్యాంక్ సమీపంలో ఉన్న ఆయన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి జూదరులకు అన్ని సౌకర్యాలు కల్పించి పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికుల ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. గురువారం తనిఖీలు చేపట్టడంతో ఖాసీం నాయుడు ఇంట్లో సాగుతున్న పేకాట వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మొత్తం 14 మంది జూదరులను అరెస్ట్ చేసి, వీరి నుంచి 14 సెల్ఫోన్లు, రూ.3.85 లక్షల నగదు, ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నిషేధిత పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
● వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ కళ్యాణకుమార్ అనంతపురం అగ్రికల్చర్: నిషేధిత పత్తి విత్తనాలు రైతులకు అంటగడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన విక్రయ దుకాణదారులను వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన ఏడీఏ కళ్యాణ్కుమార్ హెచ్చరించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఇన్చార్జ్ ఏడీఏ ఎ.వెంకటకుమార్, ఏఓలు రాకేష్నాయక్, శ్రీనాథ్రెడ్డితో కలిసి గురువారం అనంతపురంలోని పలు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో అనుమతి లేని కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు అమ్మడానికి వీలులేదన్నారు. ఈ సందర్భంగా విత్తన దుకాణాల్లో నిల్వ చేసిన పత్తి విత్తనాలను పరిశీలించి... పురుగు మందులను తట్టుకునే అంశంపై పరీక్షలు నిర్వహించారు. కొన్ని విత్తన నమూనాలు సేకరించారు. గుర్తింపు పొందిన విత్తన దుకాణాల్లోనే పత్తి విత్తనాలు తీసుకోవాలని, తప్పనిసరిగా రసీదు పొందాలని రైతులకు సూచించారు. రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. -
కొత్త జేడీఏ రాక వాయిదా
● అర్ధంతరంగా వెనుదిరిగినట్లు సమాచారం అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)గా నియమితులైన బ్లాక్థిల్ సవ్యార్నంద్ గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఆయన మార్గం మధ్యలో నుంచే వెనుదిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా, ఇక్కడ ఖాళీగా ఉన్న జేడీఏ స్థానానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలో డీడీఏగా ఉన్న బ్లాక్థిల్కు అనంతపురం జేడీఏగా పదోన్నతి కల్పించి ఈ నెల 29న ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన గురువారం విధుల్లో చేరి మరుసటి రోజున డిప్యుటేషన్పై తిరిగి అల్లూరు సీతారామరాజు జిల్లా జేడీఏగా వెళతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడ ఆయన రెగ్యులర్గా జేడీఏగానే కొనసాగుతూ అల్లూరు జిల్లాలోనూ పనిచేస్తారని తెలిపారు. డిప్యుటేషన్పై వెళ్లే ముందు ఇక్కడ జేడీఏ బాధ్యతలను ఇటీవల ఏడీఏ నుంచి డీడీఏగా పదోన్నతిపై విధుల్లో చేరిన మురళీధర్రెడ్డికి అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఇక్కడ ఇన్చార్జ్ జేడీఏగా ఉన్న ముదిగల్లు రవి కొత్త జేడీఏ బ్లాక్థిల్కు బాధ్యతలు ఇవ్వాలి. తర్వాత డీడీఏ మురళీధర్రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పి వెళ్లాలి. రవి తన పాత స్థానం తాడిపత్రి డివిజన్ ఏడీఏగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొత్త జేడీఏ బ్లాక్థిల్ బుధవారం అల్లూరు జిల్లా నుంచి అనంతపురం బయలుదేరి విజయవాడకు చేరుకున్న తర్వాత కమిషనరేట్ నుంచి ఫోన్లు రావడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగినట్లు చెబుతున్నారు. రెండు రోజులు ఆగండి... అన్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని ఇరువురు ఇన్చార్జ్ జేడీఏలు ముదిగల్లు రవి, మురళీధర్రెడ్డి గురువారం ఉదయం నుంచి కొత్త జేడీఏ రాక కోసం ఎదురు చూస్తూ కార్యాయంలోనే ఉండిపోయారు. కాగా, మురళీధర్రెడ్డి ఇన్చార్జి జేడీఏగా బాధ్యతలు చేపట్టినా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో కొత్తగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. -
తక్కువ ధరకే పశువుల దాణా
● పశుశాఖ జేడీ ప్రేమ్చంద్ అనంతపురం అగ్రికల్చర్: బహిరంగ మార్కెట్లో కన్నా తక్కువ ధరకే అనంత పాలదాణా పథకం కింద పశువుల దాణాను అందజేస్తున్నట్లు పశు శాఖ జేడీ ప్రేమ్చంద్ తెలిపారు. పశువుల దాణాను పశుపోషకులు వినియోగించుకునేలా గ్రామాల్లో ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పశుదాణా పంపిణీపై గురువారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయ హాలులో అనంతపురం డివిజన్ డీడీ వై.రమేష్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జేడీ మాట్లాడారు. దాణా తయారీ కంపెనీలతో మాట్లాడి తొలుత ఏడు మండలాల పరిధిలో 50 కిలోల దాణాను రూ.1,125 చొప్పున రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)ల ద్వారా పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. రైతుల నుంచి మంచి స్పందన రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ దాణా పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. లింగనిర్ధారణ వీర్యం (ఎస్ఎస్ఎస్) పథకం కింద పెద్ద ఎత్తున కృత్రిమ గర్భోత్పత్తి కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్ కింద పశుగ్రాసం పెంపు లక్ష్యంగా ఇప్పటికే ఆర్ఎస్కేలో రాయితీతో పంపిణీ చేయడానికి గడ్డి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పీఎంఎఫ్ఎంఈ కింద పాలు, మాంసం అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్లకు 35 శాతం సబ్సిడీ, బ్యాంకు రుణ సదుపాయం ఉన్నందున ఔత్సాహికులను ప్రోత్సహించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీలు రవిబాబు, రత్నకుమార్, సురేష్, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. జేసీబీ, ట్రాక్టర్ సీజ్ తాడిపత్రి రూరల్: మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న జేసీబీ, ట్రాక్టర్ను గురువారం సీజ్ చేశామని అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. గంగాదేవిపల్లికి చెందిన జేసీబీ డ్రైవర్ లక్ష్మినారాయణ, యుగుడూరుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజును అరెస్టు చేశామని సీఐ తెలిపారు. -
రైతుల వేదన పట్టని ప్రభుత్వం
శింగనమల: రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. వరి, మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంటను కొనుగోలు చేసేవారు లేక ధాన్యాన్ని పొలాల్లోనే పెట్టుకున్నామని, మొక్కజొన్న పంటను కోత కూడా కోయకుండా వదిలేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజాధనం దోపిడీ సాకే శశైలజానాథ్ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్నను కోత కూడా కోయకుండా రైతులు వదిలేస్తున్నారన్నారు. తక్షణమే ధరల స్థిరీకరణ నిధులు కేటాయించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల పంటల దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై 11న కలెక్టర్కు వినతి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 11న కలెక్టర్ను కలిసి విన్నవించనున్నట్లు శైలజానాథ్ తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పరంధామరెడ్డి, నాయకులు కొండయ్య, మధు, భాస్కర్రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఆది, కాటమయ్య, మంత్రి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ధరల స్థిరీకరణకు వెంటనే నిధులు కేటాయించాలి పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ -
జిల్లాలో విలువైన ఖనిజంతో పాటు మట్టిని సైతం వదలకుండా కూటమి పార్టీ నాయకులు దోచేస్తున్నారు. గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కొండ గుట్టలను కరిగించేస్తున్నారు. ఈ అక్రమ దందా వాస్తవమని తెలిసినా రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు దారితప్పి పూర్తిగా సహకర
నేమకల్లులో రోడ్డు మెటల్ క్వారీలో సాగుతున్న తవ్వకాలు శెట్టూరు మండలం యాటకల్లులో సీజ్ చేసిన క్వారీ జిల్లాలో వెలుగు చూస్తున్న అక్రమాలు పర్మిట్లు లేకుండా విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న వైనం లీజు పేరిట ప్రభుత్వ భూముల ఆక్రమణ అక్రమార్కులకు ప్రజాప్రతినిధుల అండ చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న అధికారులు అనంతపురం టౌన్: జిల్లాలోనే అత్యధికంగా రోడ్డు మెటల్ క్వారీలున్న రాయదుర్గం నియోజకవర్గంలో అక్రమ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. కూటమి పార్టీల నేతల అండ చూసుకుని కొందరు క్వారీ నిర్వాహకులు ఎలాంటి పర్మిట్లు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలోని క్వారీ నుంచి రోడ్డు మెటల్ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న తవ్వకాలను గుర్తించిన విజిలెన్స్ అధికారులు 2021లో సదరు క్వారీ నిర్వాహకులకు రూ.కోట్ల మేర జరిమానాలు విధించారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజం అక్రమ రవాణా ఊపందుకుంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో క్వారీ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు సాగిస్తూ రోడ్డు మెటల్ను అక్రమంగా తరలించేస్తున్నారు. అలాగే అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల సమీపంలో ఉన్న ఎర్రమట్టి కొండ గుట్టలు కాస్త కరిగిపోతున్నాయి. మట్టి తరలింపునకు ఎలాంటి లీజు అనుమతులు తీసుకోకుండానే పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నారు. ఫలితంగా ఏటా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కాగా, ఈ అక్రమాలపై గనుల శాఖ ఇన్చార్జ్ ఏడీ అమీర్బాషాను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మచ్చుకు కొన్ని... రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం నేమకల్లు సమీపంలో రోడ్డు మెటల్ క్వారీలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచి రోడ్డు మెటల్ను కర్ణాటక ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలిస్తారు. కూటమి పార్టీలకు చెందిన కొందరు క్వారీ నిర్వాహకులు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే రోడ్డు మెటల్ను తవ్వేసి అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఖనిజాన్ని తరలించాలంటే గనులశాఖ అధికారుల నుంచి ఆన్లైన్ పర్మిట్లు తీసుకోవాల్సి ఉంది. ఈ అక్రమ తవ్వకాల వెనుక స్థానిక ప్రజాప్రతినిధి అండ ఉండడంతో అధికారులు సైతం అటు వైపుగా కన్నెత్తి చూడడం లేదు. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామ సర్వే నంబర్ 26లో దాదాపు 13ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూమిని ఓ క్వారీ నిర్వాహకుడు ఆక్రమించుకున్నాడు. ఈ ప్రభుత్వ భూమి పక్కనే రోడ్డు మెటల్ క్వారీకి అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమిలోని కుంటలను సైతం పూడ్చి వేసి శాశ్వత భవనాలు, క్రషర్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయంపై రెవెన్యూ, గనులశాఖ అధికారులకు స్థానిక ప్రజలు, రైతులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్వారీ నిర్వాహకుడు కూటమి పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అక్రమాలను అధికారులు సైతం నిలువరించలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. క్వారీ మాటున ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నా చోద్యం చూడడం మినహా తామేమీ చేయలేకపోతున్నామంటూ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే క్వారీ వైపుగా ఎవరూ కాలు పెట్టేందుకు వీలు లేకుండా ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకెళ్లిన నిర్వాహకుడు ప్రభుత్వ భూమి చుట్టూ పటిష్టమైన ప్రహరీని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం యాటకల్లు సమీపంలో సర్వే నంబర్ 185లో 1.70హెక్టార్లలో రోడ్డు మెటల్ క్వారీకి అనుమతులు ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు చేసి రోడ్డుమెటల్ను తరలించారు. దాదాపు 7వేల క్యూబిక్ మీటర్లకు పైగా అక్రమంగా తవ్వకాలు సాగినట్లుగా అధికారులు సైతం గుర్తించారు. దీంతో క్వారీ నిర్వాహకుడికి రూ.43లక్షల మేర జరిమానా విధిస్తూ 2024 మే నెలలో నోటీసులను జారీ చేశారు. అయితే ప్రభుత్వానికి పైసా కూడా చెల్లించకుండానే ప్రస్తుతం అదే క్వారీలో అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రాత్రికి రాత్రే రోడ్డు మెటల్ను తరలించేస్తున్నారు. నిత్యం ఇదే తంతు కొనసాగుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారు. ఈ క్వారీ నిర్వాహకుడికి స్థానిక ప్రజాప్రతినిధి అండ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
మొదటి వారమే అట్టర్ఫ్లాప్!
● ప్రజల దరి చేరని ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనలు.. ● స్పష్టంగా కనిపించిన సమాచార లోపం అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ‘ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ కార్యక్రమం మొదటి వారమే అట్టర్ఫ్లాప్ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం జిల్లాలోని 32 గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల సంఖ్య కేవలం 238 ఉండడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. 10 గ్రామాల్లో మాత్రమే తొమ్మిది నుంచి 20 వరకూ ఫిర్యాదులు అందాయి. మిగిలిన 12 గ్రామాల్లో నాలుగు నుంచి ఆరు ఫిర్యాదులు ఉన్నాయి. ఇక ఓబుళాపురం, కరకముక్కల, అబ్బేదొడ్డి, ఎస్.మల్లాపురం గ్రామాల్లో కేవలం ఒకటి చొప్పున, రాజీవ్కాలనీ, అక్కజంపల్లి గ్రామాల్లో రెండు చొప్పున, ఎంఎంహళ్లి, దుర్గం, 85–నిట్టూరు, రాగులపాడు గ్రామాల్లో మూడు చొప్పున ఫిర్యాదులు అందడం గమనార్హం. సమాచార లోపంతోనే.. ముందస్తు సమాచారం లేని కారణంగానే ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కనీసం రెండు,మూడు రోజులు ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వాలి. పలానా రోజున గ్రామంలో జరుగుతుందనే విషయాన్ని ఎంపిక చేసిన గ్రామంలో టముకూ లేదా రెవెన్యూ సిబ్బంది ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే ‘ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనల’ కార్యక్రమంలో ఇలాంటివేవీ కనిపించలేదు. -
మామిడి టన్ను రూ.37 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో గురువారం మామిడి టన్ను గరిష్ట ధర రూ.37 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 230 టన్నులు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టం రూ.37 వేలు, కనిష్టం రూ.20 వేలు, సరాసరి రూ.29 వేల ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. మల్లికా రకం టన్ను గరిష్టం రూ.35 వేలు, కనిష్టం రూ.20 వేలు, సరాసరి రూ.30 వేలు కాగా హిమాయత్ రకం టన్ను గరిష్టం రూ.20 వేలు, కనిష్టం రూ.15 వేలు, సరాసరి రూ.17 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు తెలిపారు. -
●గోవిందా.. గోవింద
రాయదుర్గంలో ఘనంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం రాయదుర్గం: పట్టణంలో ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మ రథోత్సవం గురువారం ఘనంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఉదయం 11 గంటలకు మడుగుతేరు నిర్వహించారు. విశేష పూజలు చేపట్టిన అనంతరం సాయంత్రం 5 గంటలకు బ్రహ్మరథంపై కొలువుదీర్చారు. స్వర్ణాభరణాలు ధరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆశీనులైన స్వామివారు అభయ ప్రదానం చేయగా.. వేలాది మంది భక్తజనం మధ్య దివ్యచక్రాలు ముందుకు కదిలాయి. గోవిందా.. గోవిందా, ఆపద మొక్కులవాడా అనాథ రక్షకా అంటూ భక్తులు రథాన్ని లాగి పరవశించిపోయారు. రథంపైకి అరటిపండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం సందర్భంగా రాయదుర్గం జన సంద్రంలా మారింది. రథం ముందు మహిళల నృత్యాలు, బొమ్మల ప్రదర్శన, యువకుల నాట్యం, కోలాటం, చెక్కభజనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
సీఎం కాన్ఫరెన్స్లో కలెక్టర్
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. శుక్రవారం కూడా కాన్ఫరెన్స్ జరగనుంది. జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. 12న డెడికేటెడ్ కమిషన్ రాక అనంతపురం ఎడ్యుకేషన్: బీసీల స్థితిగతులు, రిజర్వేషన్ల అమలును సమీక్షించడానికి విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ డీడీ కుస్బూ కొఠారి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు సమగ్ర అనుభవాధారిత అంచనా చేపడతారన్నారు. అవకాశాన్ని వెనుకబడిన తరగతుల ప్రతినిధులు, కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17 నుంచి ఖాద్రీశుని కల్యాణోత్సవాలు కదిరి టౌన్: ఖాద్రీశుని ఆర్జిత కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగమండపంలో ఈనెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభుని కల్యా ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కల్యాణోత్సవ సేవ టిక్కెట్లు రోజూ 5 మాత్రమే జారీ చేస్తామన్నారు. ఒక్కో టిక్కెట్ ధర రూ.6,500గా నిర్ణయించామని, ఒక టిక్కెట్పై ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఈనెల 17, 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 31వ తేదీల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్లో ప్రవేశాలకు లాటరీ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1)సీ మేరకు 2026–27 విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కేటాయించే 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి రెండోవిడత లాటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 5 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 377 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డీఈఓ ఎం. ప్రసాద్బాబు, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్లు పంపామన్నారు. అలాగే అధికారిక వెబ్సైట్ cse.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆధార్కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డుతో ఈనెల 16లోపు ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు టోల్ఫ్రీ నంబరు 18004258599ను సంప్రదించవచ్చన్నారు. కాగా సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి వెంటనే అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు. సరైన కారణం లేకుండా ప్రవేశాలను నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. పాఠశాలల యాజమాన్యాలకు ఏవైనా సందేహాలుంటే ఎంఈఓలను సంప్రదించాలని సూచించారు. మార్కెట్కు 10 టన్నుల టమాట అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మండీకి గురువారం 10 టన్నుల టమాట అమ్మకానికి వచ్చింది. మార్కెట్ నిర్వాహకులు వాటిని వేలం వేశారు. కిలో టమాట గరిష్ట ధర రూ.22 పలికింది. కనిష్టం రూ.8, సరాసరిన రూ.16 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి. -
దడ పుట్టిస్తున్న జల గండం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. చాలా మండలాల్లో నీటిమట్టం తగ్గిపోతున్నట్లు వెల్లడి కావడం జిల్లావాసులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ సారి ‘సూపర్ ఎల్–నినో’ సంభవించనుందంటూ అధికారులు హెచ్చరిస్తుండటం ప్రజలను మరింతగా దడ పుట్టిస్తోంది. 2019 తర్వాత ఇప్పుడే.. గతేడాది జూన్లో మొదలై ఈ నెలాఖరుతో ముగిసే వర్షపాత సంవత్సరంలో నాలుగైదు మండలాలు మినహా ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఏడాది పొడవునా 478 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైంది. 44 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. అది కూడా ‘అకాలం’లోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జలశాఖ తాజాగా సేకరించిన లెక్కల ప్రకారం జిల్లా సగటు నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదైంది. గత నెల 12.14 మీటర్లుగా నమోదు కాగా గతేడాది ఇదే సమయంలో 11.85 మీటర్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే 2019 తర్వాత ఇప్పుడు నమోదైన నీటిమట్టమే గరిష్టం కావడం గమనార్హం. 20 మండలాల్లో తగ్గుదల.. వాగులు, వంకలు పొంగిపొర్లేలా వర్షాలు కురవకపోవడంతో ఈ ఏడాది 20 మండలాల పరిధిలో భూగర్భజలాలు తగ్గుతూ వస్తున్నాయి. అందు లోనూ నీటి వినియోగం అధికంగా ఉండటం వల్ల కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి, శెట్టూరు, పుట్లూరు మండలాలను డేంజర్ జోన్లోకి చేర్చారు. శెట్టూరు మండలం చెర్లోపల్లిలో ఉన్న ఫిజోమీటర్ లో నీటిమట్టం ఏకంగా 59.65 మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అలాగే యాడికి మండలం నగరూరులో 53..75 మీటర్లు, పుట్లూరులో 37.75 మీటర్లలో నీటిచెమ్మ కనిపిస్తుండటం విశేషం. ఈ ఐదు మండలాలను ఇప్పటికే డేంజర్ జోన్లో ఉంచగా, మరో 20 మండలాలు నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తించారు. అందులో అనంతపురం, గుత్తి, శింగనమల, బొమ్మనహాళ్, యల్లనూరు, కూడేరు, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, బెళుగుప్ప, కంబదూరు, రాయదుర్గం, తాడిపత్రి, పామిడి, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాలు ఉన్నాయి. మిగతా 12 మండలాలు సేఫ్జోన్లో ఉన్నట్లు వెల్లడైంది. వర్షపు నీరు వృథా.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినా ఎక్కడిక్కడ భూగర్భంలో ఇంకిపోయింది చాలా తక్కువే. ఈ ఏడాది 488 మి.మీ వర్షపాతం నమోదు కాగా ప్రవాహం రూపంలో 175.51 టీఎంసీలుగా గుర్తించారు. అందులో 21.06 టీఎంసీలు మాత్రమే భూగర్భజలాలుగా మారినట్లు చెబుతున్నారు. ఇలా వర్షపు నీరు చాలా వరకు వృథా అయినట్లు గుర్తించారు. దీంతో పాతాళగంగ పతనమవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. జూన్లో వచ్చే ‘నైరుతి’ రుతుపవనాలపై సూపర్ ఎల్–నినో ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వర్షాలు తక్కువగా నమోదు కావడం ఒకెత్తయితే.. అవి కూడా గతి తప్పే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే నిజమైతే భవిష్యత్తులో భూగర్భజలాలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే చీనీ తోటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఇతర ఉద్యాన పంటలకు కూడా ముప్పు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. హంద్రీ–నీవాకు లైనింగ్ వేయడం, కోటా మేరకు చెరువులు నింపకపోవడం కూడా భూగర్భ జలాల తగ్గుదలకు కారణమని చెబుతున్నారు. జిల్లాలో తాజా సగటు నీటి మట్టం 13.41 మీటర్లుగా నమోదు 20 మండలాల్లో భూగర్భజలాలు తగ్గుతున్నట్లు గుర్తింపు డేంజర్ జోన్లో ఐదు మండలాలు సూపర్ ఎల్నినో హెచ్చరికతో సర్వత్రా భయాందోళనలు -
చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతకు మద్దతు కరువవుతోంది. ఆరుగాలం శ్రమించి దేశానికే అన్నం పెట్టే రైతుకు చివరికి అప్పులే మిగులుతున్నాయి. ఒకవైపు చీడ పీడలు, ధరలు దెబ్బతీస్తుండగా, మరోవైపు సర్కారు చేయూత కూడా కరువవడంతో పంటకు పెట్టిన పెట్టుబడులు సైతం అందక రైతులు కుదేల
బొమ్మనహాళ్: జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. హెచ్చెల్సీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులకు శాపంగా మారింది.ఏ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్ రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ రూ.2,369 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకోవడం గమనార్హం. రంగంలోకి దళారులు రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న అలసత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తక్కువ ధరకు సేకరిస్తారంటూ మాయమాటలు చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా రేటు కూడా తక్కువగా ఉందని, ఒక వేళ ఆ రేటుకే కొనుగోలు చేసినా డబ్బు ఎప్పుడో జమ చేస్తారని ప్రచారం సాగిస్తుండడంతో దిక్కుతోచని రైతులు వారికే ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. వ్యయం అధికం.. మిగిలేది శూన్యం జిల్లా మొత్తంగా 26,100 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. అందులో కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్ మండలాల్లోనే 10,692 ఎకరాల్లో సాగైంది. అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చినా ఇటీవల పంటలో ఆశించిన దిగుబడి రావడం లేదు. సాధారణంగా ఎకరా పొలంలో నారు పోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరే వరకూ రైతులకు రూ. 50,400 ఖర్చవుతోంది. ఈ క్రమంలో ఎకరాకు 40 నుంచి 50 బస్తాల ధాన్యం పండితే గిట్టుబాటవుతుంది. కానీ, 22 నుంచి 25 బస్తాలలోపే దిగుబడి ఉంటుండడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో పొలాల్లో పంట పెట్టడం కంటే బీడు పెట్టుకోవడమే మేలనే మాట రైతుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధరను రూ. 2,500– రూ. 2,700కు పెంచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా మద్దతు ధర ప్రకటించి చేతులెత్తేసిన వైనం దళారుల పాలవుతున్న రైతు కష్టం -
నీళ్ల మాటున నిధుల స్వాహా
కళ్యాణదుర్గం: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల కాసుల కక్కుర్తి తారస్థాయికి చేరింది. ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ‘పచ్చ’ నాయకులు చివరకు పేద ప్రజలకు అందించే నీళ్లనూ ‘క్యాష్’ చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతం అంతటా చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కళ్యాణదుర్గంలోని 24 వార్డుల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఈ విషయంపై టీడీపీకి చెందిన ఓ మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ల కన్ను పడింది. ఉన్నతాధికారితో కుమ్మకై ్క సరఫరా చేసిన నీటి కంటే ఎక్కువగా బోగస్ రికార్డులు సృష్టించారు. 10 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తే వాటికి అదనంగా 80 ట్యాంకర్ల నీటిని పంపిణీ చేసినట్లు తప్పుడు లెక్కలు చూపారు. నీటి సరఫరానే కాకుండా పైపులైన్ల ఏర్పాటు, కొత్త మోటర్ల బిగింపు, మరమ్మతులు ఇలా తాగునీటి పథకంలో తమకు అనుకూలంగా ఉన్న వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల కళ్యాణదుర్గంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.80 లక్షల నగదు డ్రా చేసి జేబుల్లో వేసుకున్నారు. మందలించిన ఎమ్మెల్యే! నిధుల స్వాహా అంశం ‘దుర్గం’లో చర్చనీయాంశం కావడం.. ఆ నోటా ఈ నోటా పడి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెవిన పడడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మున్సిపల్ కమిషనర్, టీడీపీ నేతలను తన వద్దకు పిలిపించుకుని మందలించినట్లు సమాచారం. పేదలకు తాగునీటిని అందించే విషయంలో కూడా తలదూర్చి నిధులను పక్కదారి పట్టించడం ఏంటని మండిపడినట్లు తెలిసింది. కాగా, ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ, నిధుల అంశంపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏమీ తెలియనట్లుగా ఉండాలని, మీడియాకు వివరాలు చెప్పకూడదని అధికారులు మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని హెచ్చరించినట్లు తెలిసింది. ఏది ఏమైనా ‘దుర్గం’ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అవినీతి చేశానని అనడం సరికాదు నేను అవినీతి చేశానని అనడం సరికాదు. నాపై లేని పోని అభాండాలు వేస్తున్నారు. మేము ఎప్పుడూ ప్రైవేట్ బ్యాంకులో నగదు డ్రా చేయలేదు. మున్సిపాలిటీ అమౌంట్ ప్రైవేట్ బ్యాంకులలో జమ చేసి తీసుకునే అధికారం కమిషనర్కు ఉండదు. ఏదైనా తప్పు జరిగి ఉంటే ఉన్నతాధికారులు విచారణ చేస్తారు. – వంశీకృష్ణ భార్గవ్, మున్సిపల్ కమిషనర్, కళ్యాణదుర్గం తారస్థాయికి ‘పచ్చ’ నేతల కాసుల కక్కుర్తి తప్పుడు లెక్కలతో రూ.80 లక్షలకు పైగా మింగేసిన వైనం ‘దుర్గం’ మున్సిపల్ ఉన్నతాధికారి హస్తంపై గుప్పుమన్న ఆరోపణలు -
ఉపాధి పనులు విస్తృతం చేయాలి
● డ్వామా పీడీ సలీంబాషా అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులను విస్తృతం చేయాలని సిబ్బందిని డ్వామా పీడీ సలీంబాషా ఆదేశించారు. బుధవారం ఏపీఓలతో టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మండలం యూనిట్గా 5 వేల మంది కూలీలకు తగ్గకుండా పనులు కల్పించాలన్నారు. మే నెలలో వ్యవసాయ పనులు ఉండవని, ఇలాంటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లోని జాబ్కార్డు ఉన్న ప్రతి కూలీకి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలతో సమావేశాలు నిర్వహిస్తూ పనులపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలకు సమీపంలోనే పనులు కల్పించేలన్నారు. ఇచ్చిన లక్ష్యానికి చేరువయ్యేలా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. వచ్చే నెలలో ఉపాధి హామి నూతన చట్టం వీబీ జీ రామ్ జీ చట్టం అమల్లోకి రానుందని, నూతన లేబర్ బడ్జెట్ అమల్లోకి వస్తే అందుకు అనుగుణంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మడకశిర రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మడకశిర ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సరోజినిదేవి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదోతరగతి లేదా, సమాన విద్యార్హత కలిగిన వారు ఈ నెల 21వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారానికి www.angran.ac.in వెబ్సైట్ను పరిశీలించవచ్చు. మరిన్ని వివరాల కోసం 77023 66113, 79895 71408లో సంప్రదించవచ్చు. కొడుకు మందలింపు.. తండ్రి ఆత్మహత్య తాడిపత్రి రూరల్: కన్న కొడుకు మందలింపుతో క్షణికావేశానికి లోనై ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని కృష్ణాపురం జీరో రోడ్డులో నివాసముంటున్న రామకృష్ణ (66)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఇటీవల రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుంటుండడంతో మంగళవారం చిన్న కుమారుడు భాస్కర్ మందలించాడు. అనంతరం తల్లి, సోదరుడితో కలిసి నంద్యాల జిల్లా జమ్మలమడుగులోని బంధువుల ఇంట జరిగే ఫంక్షన్కు భాస్కర్ వెళ్లిపోయాడు. రాత్రికి తిరిగి వచ్చారు. ఇంటికి తండ్రి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తాడిపత్రి – చల్లవారిపల్లి రైలు మార్గంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్న లోకో కో–పైలెట్ సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతుడిని రామకృష్ణగా నిర్ధారించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి గురువారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. బుధవారం రెవెన్యూ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో రీ–సర్వే చేసిన ఒక గ్రామాన్ని, రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్న గ్రామాన్ని తహసీల్దార్లు ఎంపిక చేయాలన్నారు. నెలలో ప్రతి గురువారం సంబంఽధిత అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించాలన్నారు. గురువారం సెలవు దినమైతే మరుసటి రోజు వెళ్లాలని, తహసీల్దారు, ఎంపీడీఓ, ఏఆర్ఐ, సర్వేయర్, దేవదాయ భూములుంటే ఆ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. మొదటి గురువారం ప్రజల నుంచి అసైన్డ్ భూములు, 22ఏ, చెరువు పోరంబోకు,సర్వే సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని, సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. మిగిలినవి పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. రెండో గురువారంలో మొదటి వారం స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల పరిశీలన నిర్వహించాలన్నారు. మూడో గురువారం విచారణ పూర్తయిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని, మ్యుటేషన్, ఆర్ఓఆర్ సవరణ తదితర రెవెన్యూ అంశాలపై ఆదేశాలు జారీ చేయాలన్నారు. నాల్గో గురువారం గ్రామసభ నిర్వహించి పరిష్కరించిన సమస్యల జాబితాను ప్రకటించాలన్నారు. కోర్టు కేసులు మినహా మిగిలిన అన్ని ఫిర్యాదులు పరిష్కరించాలని, గ్రామాలను జీరో పెండెన్సీగా తీర్చిదిద్దాలని జేసీ పిలుపునిచ్చారు. జేసీ విష్ణుచరణ్ -
కేసుల భారాన్ని తగ్గించేందుకే అదనపు కోర్టులు
● జిల్లా జడ్జి భీమారావు రాయదుర్గంటౌన్/కళ్యాణదుర్గం: కేసుల భారాన్ని తగ్గించేందుకే అదనపు కోర్టులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. కళ్యాణదుర్గంలో రెండు, రాయదుర్గంలో ఒకటి మొత్తంగా మూడు కోర్టు భవనాలను బుధవారం వర్చువల్ విధానంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ లాంఛనంగా ప్రారంభించారు. రాయదుర్గంలో మధ్యాహ్నం జిల్లా జడ్జి భీమారావు రిబ్బన్ కట్ చేసి కోర్టు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కక్షిదారులకు సులభంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. రాయదుర్గం అదనపు సివిల్ కోర్టులో ఎఫ్ఏసీగా జూనియర్ సివిల్ జడ్జి రమ్య బాధ్యతలు చేపడతారన్నారు. త్వరలో కోర్టు సముదాయ భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు అదనపు కోర్టులు దోహదపడతాయన్నారు. న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్నారు. అనంతరం జిల్లా జడ్జిని రాయదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరెడ్డి, పృథ్వి రాజ్, సభ్యులు, సీనియర్ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. విజయవాడ వెళ్లిన కలెక్టర్ అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ బుధ వారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. సీఎం చంద్రబాబు కలెక్టర్లతో గురు, శుక్రవారం కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆనంద్ పాల్గొననున్నారు. ఆయన శనివారం తిరిగి వస్తారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో విధులకు సోమవారం హాజరవుతారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. గుంతకల్లు–మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లు గుంతకల్లు: గుంతకల్లు–మార్కాపురం రోడ్డు మార్గంలో ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లావాసులతో పాటు శ్రీశైలం వెళ్లే భక్తులకు రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. గుంతకల్లు–మర్కాపురం రోడ్డు (57407) రైలు మే 14 నుంచి పట్టాలెక్కుతుందన్నారు. ఈ రైలు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11.30కు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్కి చేరుకుంటుందన్నారు. మార్కాపురం రోడ్డు–గుంతకల్లు (57408) ప్యాసింజర్ రైలు మే 13 నుంచి ప్రారంభమవుతుందని, రైలు ప్రతి రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 10.30 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరుకుంటుందన్నారు. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమదేవపల్లి, కృష్ణపురం, కంభం, తర్లపాడు మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ప్రారంభోత్సవ రైలును మాత్రం ఈ నెల 12న గుంతకల్లు జంక్షన్లో ముఖ్య అతిథుల చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గుంతకల్లు జంక్షన్లో రైలు బయలుదేరి సాయంత్రం 7.30కు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్కు చేరుతుందన్నారు. -
ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి
అనంతపురం కల్చరల్: ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) అంతర్జాతీయ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ హనోక్ అన్నారు. ఏఐసీసీ జిల్లా సమావేశం, నూతన కార్యవర్గ ఎంపిక బుధవారం అనంతపురంలోని వాల్మీకి భవన్ వేదికగా సాగింది. ఏఐసీసీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు డాక్టర్ విజయకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ హనోక్, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎలియాజర్ తదితరులు మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సమస్యలపై గళమెత్తి వాటిని పరిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎంపిక చేశారు. ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడిగా యేషయ, ఉపాధ్యక్షుడిగా మనుష్యే, గౌరవాధ్యక్షులుగా నెహమ్యా నాగరాజు, అనిల్ మోజెస్, డాక్టర్ ఐజయ్య, రాయలసీమ వర్కింగ్ ప్రెసిడెంటుగా రెవరెండ్ వైపీ బాబు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెవరెండ్ రెడ్డివారి నెహమ్యా నాగరాజు, సంఘం నాయకులు జాన్వెస్లీ, కమల్, ప్రకాష్, జానీ, స్వామిదాసు, చల్లా కిషోర్, జేమ్స్ పాల్నాయక్, బాలాస్వామి, వినోద్, అరుణగ్రేస్, రవికుమార్, జాషువా, జహంగీర్, మార్కు, విజయసింహ, థామస్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హనోక్ -
రమణీయం.. నృసింహుడి రథోత్సవం
అశేష భక్త జనం మధ్య సాగుతున్న శ్రీవారి రథోత్సవం పెన్నహోబిలం క్షేత్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నమో నారసింహ నామం మార్మోగింది. రథోత్సవం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి మహారథంలో కొలువు దీర్చిన అనంతరం ఉత్సవాన్ని ప్రారంభించారు. అశేష భక్తజనం నడుమ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో నిండి పోయాయి. రథోత్సవంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్ పట్టువస్త్రాలను సమర్పించారు. – ఉరవకొండ/ఉరవకొండ రూరల్: -
రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక
గుంతకల్లు: ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగే అండర్–11 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులను బుధవారం గుంతకల్లులోని పెంగ్విన్ మాంటిస్సోరి స్కూల్లో ఎంపిక చేశారు. బాలుర విభాగంలో సాకేత్ (అనంతపురం), రత్నతేజ్ (తాడిపత్రి), బాలికల విభాగంలో షరోన్బ్లేస్సీ (అనంతపురం), హారిక చౌదరి (తాడిపత్రి) ఎంపికయ్యారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను ఆంధ్ర చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నాగార్జున కర్టాటకం అభినందించారు. భక్తి శ్రద్ధలతో ఈశ్వరమ్మ ఆరాధనోత్సవం ఉరవకొండ: స్థానిక భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరాంబ ఆరాధనోత్సవాన్ని (బాలవికాస్ దినోత్సవం) అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబా అవతార ప్రకటన దివ్య క్షేత్రంలోని సత్యసాయి విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. పల్లకీ ఉత్సవంలో బాలవికాస్ విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం బాల వికాస్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బైక్ మెకానిజమ్పై ఉచిత నైపుణ్య శిక్షణ అనంతపురం: ద్విచక్ర వాహనాల మరమ్మతుపై ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బైక్ రిపేరీ, సర్వీసింగ్, ఇంజిన్ రిపేరీ, నైపుణ్యాభివృద్ధితో పాటు కస్టమర్ రిలేషన్, ఇంగ్లిష్ నైపుణ్యం, కమ్యూనికేషన్స్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న వారు, 5వ తరగతి నుంచి 10వ తరగతి పాస్/ ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్, ఇంటర్మీడియట్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. శిక్షణా కాలంలో మధ్యాహ్న భోజనం ఉచితం. శిక్షణ అనంతరం ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ అందజేయడంతో పాటు 100 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 99594 22884, 99487 71362లో సంప్రదించవచ్చు. రజక విద్యార్థులకు పురస్కారాలు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు రజక ఉద్యోగ విద్యావంతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.ఎర్రిస్వామి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతిలో 400 పైన, ఇంటర్లో 700 పైన మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు సి.ఎర్రిస్వామి, 1–1–284, ఆర్కే నగర్, అనంతపురం చిరునామాకు పంపాలి. పూర్తి వివరాలకు 98668 76190, 98851 12180, 90001 14624, 83412 44333 నంబర్లలో సంప్రదించవచ్చు. మామిడి టన్ను రూ.60 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో బుధవారం టన్ను మామిడి గరిష్ట ధర రూ.60 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. బేనీషా రకం టన్ను గరిష్టం రూ.60 వేలు, కనిష్టం రూ.20 వేలు, హిమాయత్ రకం టన్ను గరిష్టం రూ.40 వేలు, కనిష్టం రూ.15 వేలు, మల్లికా రకం టన్ను గరిష్టం రూ.37 వేలు, కనిష్టం రూ.18 వేలతో క్రయ విక్రయాలు సాగినట్లు తెలిపారు. వ్యక్తి దుర్మరణం పామిడి: కారు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పామిడిలోని బ్రాహ్మణవీధిలో నివాసముంటున్న బోయ ఎస్ మురళి అలియాస్ మోషే (55)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కట్టెలమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. గత నెల 9న అనారోగ్యంతో భార్య మృతి చెందింది. ఈ క్రమంలో బుధవరం కట్టెల కోసమని ఆటోలో కల్లూరు వైపుగా వెళుతుండగా పెన్నానది వంతెనపై అనంతపురం వైపుగా శరవేగంగా వెళుతున్న కారు వెనుక నుంచి ఢీకొంది. ఘటనలో మోషే అక్కడికక్కడే మృతి చెందాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆటో డ్రైవర్ కల్లూరు ఆగ్రహారానికి చెందిన పుష్పరాజ్ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని జీజీహెచ్కు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
హనీట్రాప్ దందా జిల్లాకు మాయని మచ్చ
అనంతపురం ఎడ్యుకేషన్: హనీట్రాప్ దందా జిల్లాకు ఒక మాయని మచ్చ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హనీముఠాను బీజేపీ, టీడీపీలు పెంచి పోషించాయన్నారు. వారిలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఒక వర్గం వారు పోలీసులు, మీడియాకు ఉప్పందించారన్నారు. నిజాయితీగా పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది చాలామందే ఉన్నారని, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు కొమ్ముకాస్తున్నారన్నారు. ఎక్కువ రోజులు దర్యాప్తు జరిగితే జిల్లా ప్రతిష్ట మసకబారుతుందనే భయంతో దర్యాప్తు ఆపేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అనేక మందికి ఫోన్లు వచ్చాయని, ఎవరెవరికి ఫోన్లు వచ్చాయి, ఎవరి నుంచి వచ్చాయి అనేది పోలీసులే తేల్చాల్సి ఉందన్నారు. మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే పంపించి దర్యాప్తునకు సహకరించాలని తనకు నోటీసు అందజేశారని, సమాధానం ఇస్తానని, పిలిచినప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారు. హనీట్రాప్పై ప్రశ్నించే వారి గొంతు నొక్కొద్దని కోరారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న చీకటి దందాలన్నింటిపైనా కేసులు కట్టి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నేడు పట్టించుకోకపోయినా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హనీట్రాప్ దందాపై సీబీఐతో విచారణ చేయిస్తామన్నారు. సూత్రధారులను విచారించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత హేయమైన ఈ దందాపై వెనువెంటనే చర్యలు తీసుకున్న డీఐజీ, ఎస్పీకి మరోసారి అభినందనలు తెలిపారు. ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు? కొడిమి, ఆలమూరు జగనన్న కాలనీల్లో కంకర, బ్రిక్స్, ఇసుక, సెంట్రింగ్ సామాన్లు, పెల్లలు, ఐరన్ స్టూళ్లు ఎత్తుకెళ్లారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు ప్రకాష్ రెడ్డి తెలిపారు. నరసనాయనికుంటలో దాదాపు ప్రతి టీడీపీ నాయకుడి ఇంటిలోనూ జగనన్న కాలనీ వస్తువులు కనిపిస్తాయన్నారు. ఆలమూరులో ఒక ఆటో, ఒక బొలెరో వాహనాన్ని పట్టించామన్నారు. రెండు బైకుల నంబర్లు, ఫొటోలు అందించామని, చివరకు దొంగలను కూడా పట్టించిన క్రమంలో ఏమి చర్యలు తీసుకున్నారో డీఎస్పీ చెప్పాలన్నారు. పెన్నా నదిలో రోజూ 500 ట్రాక్టర్ల ఇసుకను ఎత్తుకెళ్తున్నారని, పోలీసులకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఒక్కో క్రషర్ యజమాని నెలకు రూ. లక్షలు పరిటాల శ్రీరామ్కు చెల్లించాలన్నారు. టమాట మండీ నుంచి రోజు రూ. 5–6 లక్షలు శ్రీరామ్కు టోల్ కట్టాలన్నారు. రిటైర్మెంట్కు ముందు ఆర్డీఓ దందాలు చేస్తున్నాడంటూ పేపర్లలో కథనాలు వస్తున్నాయని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ధర్మవరం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసూళ్లు చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా.. జైలుకు పంపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంకు వరుసగా మూడేళ్లు నీళ్లు తీసుకొచ్చి రైతులను బతికించిన చరిత్ర తమదన్నారు. అదే రైతులను ఎండబెట్టి ఊళ్లు విడిపిస్తున్న చరిత్ర పరిటాల కుటుంబానిది అంటూ దుయ్యబట్టారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, నాయకులు బండి పవన్ కుమార్, సాకే వెంకటేష్, బిల్లే మంజునాథ్ పాల్గొన్నారు రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న దందాలన్నింటిపైనా కేసులు కట్టాలి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఏపీటీఎఫ్ 1938 జిల్లా నూతన కమిటీ ఎంపిక
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. రవీంద్ర, ప్రధాన కార్యదర్శిగా బి.హనుమప్ప, గౌరవాధ్యక్షుడిగా అశోక్ నాయక్, అసోసియేట్ అధ్యక్షుడిగా హనుమంతు నాయక్, అదనపు కార్యదర్శిగా పోతులయ్య, ఉపాధ్యక్షులుగా వజీర్ బాషా, బహేశ్వర, నాగరాజు, సాయినాథరెడ్డి, కార్యదర్శులుగా హనుమంతు, దామోదర్, రామాంజనేయులు, మల్లినాథ్, ఫకృద్దీన్, కాంతిరాజ్తో పాటు 24 మంది రాష్ట్ర కౌన్సిలర్లను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాధవ స్వామి, పరిశీలకులుగా కడప జిల్లా ప్రధానకార్యదర్శి అబ్దుల్లా వ్యవహరించారు. సమావేశంలో రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.కులశేఖరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, ఐఫియా కమిటీ సభ్యులు సత్యప్రసాద్, మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు, సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా జనభా గణన: జేసీ
శెట్టూరు: జనాభా గణనను పాదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. బుధవారం శెట్టూరు మండలం కై రేవు గ్రామంలో చేపట్టిన జనగణనను ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈశ్వరమ్మ, సచివాలయ ఉద్యోగులు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. రీ సర్వేలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ప్రస్తుతం చేపట్టిన రీ సర్వే పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత అధికారులను జేసీ హెచ్చరించారు. బుధవారం కై రేవు, లక్ష్మంపల్లి గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. రీ సర్వే పనుల తీరుపై ఆరా తీశారు. అనంతరం కై రేవు లోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని పరిశీలించారు. లక్ష్మంపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
● గజేంద్రుడిపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం దేవేరులతో కలిసి గజ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య, శ్రీవైష్ణవ, వీర శైవలింగాయత సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన గజ వాహన సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. జీజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్స అనంతపురం: సర్వజనాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ బాలుడు నడిచేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన 14 ఏళ్ల లోకేష్ ఒబెసిటీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అధిక బరువుకు కాళ్లు వంకర పోయి నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఒకవేళా నడిచినా కొంత దూరం మాత్రమే. దీంతో తల్లిదండ్రులు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం దక్కలేదు. చివరకు అనంతపురంలోని జీజీహెచ్లో ఆర్థో వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచనతో పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్థోపెడిక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ గౌస్ నేతృత్వంలో వైద్యులు శస్త్రచికిత్స చేపట్టి వంకర కాలును సరి చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బుధవారం లోకేష్ డిశ్చార్జ్ చేశారు. దీంతో లోకేష్ తల్లి పల్లవి హర్షం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనంతపురం ఎడ్యుకేషన్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలెట్, గ్రూప్–డీ, ఏపీ హైకోర్టు–2026 పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఖుస్బూ కొఠారి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయ రూ. లక్షలోపు ఉండాలి. మొత్తం 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరిలో బీసీలు 66 శాతం, ఎస్సీలు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం సీట్లు కేటాయిస్తారు. శిక్షణ సమయంలో స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ ఇస్తారు. డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ మేరకు ఎంపిక చేస్తారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అనంతరం హార్డ్ కాపీలను కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 97042 04905, 95502 50770, 83090 06875 లో సంప్రదించవచ్చు. -
చినుకు రాలదు.. అరక సాగదు
అనంతపురం అగ్రికల్చర్: బీడువారిన పొలాలను దుక్కి చేయాలంటే సరైన వర్షం పడాలి. గత ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంట అవశేషాలు తొలగించి లోతుగా దుక్కి దున్ని జూన్లో కురిసే వర్షాలకు కొత్తగా పంటలు సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొన్న ఐదారు మండలాల్లో చిన్నపాటి వర్షం మినహా ఎక్కడా పదునయ్యే వర్షం నమోదు కాలేదు. మెట్ట పొలాలు అధికంగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం లాభసాటి కావాలంటే ప్రస్తుత వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, నేల, నీటి సంరక్షణకు వాన నీటిని ఎక్కడిక్కడ ఇంకేలా ‘కాంటూరి’ వ్యవసాయ పనులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు, అధికారులు సూచనలు చేస్తున్నారు. 75 శాతం వర్షాధారం.. ఉమ్మడి జిల్లాలో 75 శాతం పొలాలు కేవలం వర్షాలపై (మెట్ట సేద్యం) ఆధారపడి పంటలు సాగవుతున్నాయి. ఎక్కువగా ఎర్ర, చల్కా నేలలు ఉన్నాయి. నైరుతీ ప్రభావంతో కురిసే వర్షాలపై ఉమ్మడి జిల్లా పరిధిలో 7 లక్షల నుంచి 8 లక్షల హెక్టార్ల ఖరీఫ్ ఆధారపడి ఉంది. రుతుపవనాలు నిర్ణీత సమయం కన్నా ముందుగా లేదా ఆలస్యం కావడం, త్వరగా నిష్క్రమించడం, తక్కువ వర్షాలు కురవడం, అనిశ్చితి వర్షాలు, పంట కాలంలో దీర్ఘకాలం బెట్ట పరిస్థితులు ఏర్పడటం, ఒక్కోసారి విరామం లేకుండా అతివృష్టి సంభవించడం లాంటివి వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎంత వర్షం కురిసినా అందులో 10 నుంచి 20 శాతం మాత్రమే నీరు భూమిలోకి ఇంకిపోయి మిగతాది ప్రవాహం రూపంలో వృథా అవుతుంటాయి. ఇలా ప్రవాహ రూపంలో వెళ్లే వర్షపునీటితో పాటు భూమిపై సారవంతమైన పొర కొట్టుకుపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడి క్రమంగా భూమి ఉత్పాదకశక్తి కోల్పోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. లోదుక్కులతో అనేక ప్రయోజనాలు.. వేసవిలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని పొలాల్లో వాలుకు అడ్డంగా ఎర్రనేలలో ఒక మీటరు, నల్లరేగళ్లలో రెండు మీటర్లు లోతుగా దుక్కులు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనినే కాంటూరు సేద్యం అంటారు. భూమిలో గట్టిపొరను కదలించడం ద్వారా కోశస్థ దశలో ఉన్న పంటలకు కీడు చేసే పురుగులు చాలా వరకూ నశిస్తాయి. పంట కాలంలో చీడపీడలు, తెగుళ్ల ఉధృతి బాగా తగ్గుతుంది. నేల ఎండుతూ ఆరుతూ ఉంటే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే వర్షపు నీరు ఎక్కడిక్కడ ఇంకిపోయి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. బెట్ట ఏర్పడకుండా పంటను కాపాడుకోవచ్చు. సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. కలుపు సమస్య బాగా తగ్గిపోతుంది. అంతేకాక గాలిలో నైట్రేట్ రూపంలో ఉన్న నత్రజని వర్షపు నీటితో పాటు నేలకు అందడం ద్వారా భూసారం పెరుగుతుంది. ఇలా విత్తనం వేయడానికి ముందుగా రెండు సార్లు నేలను బాగా దుక్కి చేసుకుంటే పంట దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ ఈ సారి వరుణుడు ఇంకా కరుణించడం లేదు. అందులోనూ ‘ఎల్–నినో’ ప్రభావం ఉంటుందని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ఖరీఫ్ వ్యవసాయంపై రైతుల్లో అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది తొలకరి సాగుకు వాతావరణం అనుకూలంగా కనిపించడం లేదు. జూన్ ఒకటి నుంచి ఖరీఫ్–2026 మొదలు కానుండడంతో ముంగారు సేద్యానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో పొలాలు దుక్కి చేసుకోవాల్సివుంది. అయితే మండే ఎండల కారణంగా పొలాల్లో తేమ శాతం తగ్గిపోయి భూమిలోకి మడకలు దిగనంటూ మొరాయిస్తున్నాయి. దీంతో వేసవి దుక్కులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సమీపిస్తున్నా ఇంకా మండుతున్న ఎండలు తేమ శాతం తగ్గి గట్టిపడిన పొలాలు భూమిలోకి మడక దిగకపోవడంతో దుక్కి చేయలేకపోతున్న రైతులు -
తరుముకొస్తున్న కరువు
● సూపర్ ఎల్నీనో ఎఫెక్ట్ కారణంగా ముఖం చాటేయనున్న వర్షాలు రాయదుర్గం: గత ఐదేళ్లు సమృద్ధిగా కురిసిన వానలు ఈ ఏడాది ముఖం చాటేయనున్నాయి. సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలో రైతు పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. ఇప్పటి వరకూ వేసవి దుక్కులు సైతం ఊపందుకోలేని పరిస్థితి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తే కరువు కరాళనృత్యం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఖరీప్లో జిల్లాలో 16,54,080 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో వేరుశగన, కంది, ఆముదం, పత్తి మెజార్టీ పంటలు. జూన్ నుంచి సెఫ్టెంబర్ వరకు ఎల్నినో ముప్పు పొంచి ఉండవచ్చునని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది. రుతుపవనాలు ముందే వచ్చినా? నైరుతి రుతుపవనాలు జాన్ మొదటి వారంలోనే జిల్లాలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసినా ఎల్నినో దెబ్బకు ఆ తర్వాత పెద్ద విరామం ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆలోచించి అడుగేయాల్సి వస్తోంది. జిల్లాలో సాధారణంగా ఖరీప్లో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, సజ్జ, ఉలువ లాంటి పంటలు సాగుచేస్తారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సారి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే ప్రయోజనంగా ఉంటుంది. అలాగే తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉండడంతో బోరుబావుల కింద వరి కాకుండా ఇతర ఆరుతడుల పంటలు సాగు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి ఎల్నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై ఇటీవల ఓ సమావేశం కూడా జరిగింది. సరైన స్పష్టత వెలువడాల్సి ఉంది. అలాంటిదేదైనా ఉంటే రైతులు ఆలోచించి అడుగేయాలి. తక్కువ వర్షాపాతానికి తట్టుకునే పంటల సాగుపై దృష్టిసారించడం మంచిది. – మల్లికార్జున, సేద్యం విభాగపు శాస్త్రవేత్త, కళ్యాణదుర్గం -
●కల్యాణం.. కమనీయం
రాయదుర్గం: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశిష్ట సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించారు. పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీనివాసుడి కల్యాణం జరిపితే, ఆ బాలికకు సకల గుణ సంపన్నుడు భర్తగా వస్తాడని భక్తుల నమ్మకం. అందులో భాగంగా ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కానాహొసళ్లికి చెందిన అరవ నగేష్, పావని దంపతుల కుమార్తె పద్మావతిని వధువుగా నిర్ణయించారు. ముందుగా పట్టణంలోని అరవ తెగ కులదైవం భక్త మార్కండేయుని ఆలయం వద్ద వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహం ఎదుట కులపెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అభిజిత్ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడితో బాలిక మెడలో ఆమె తల్లి పావని చేత పసుపుతాడు కట్టించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా.. గోవింద నామస్మరణతో ఆలయాన్ని మార్మోగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంచి పెట్టడంతో పాటు అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్ర రెడ్డి, బీఎన్టీ, కేకేటీ కుటుంబాల ఆధ్వర్యంలో 4,500 లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. ● ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గురువారం (రేపు) ఉదయం 11 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు. బాలికతో శాస్త్రోక్తంగా శ్రీవారి వివాహం వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం -
ఉరవకొండలో సైకో వీరంగం
● ఇద్దరిపై కత్తితో దాడి ● రెండు ద్విచక్ర వాహనాల ధ్వంసం ● పోలీసు స్టేషన్లోనూ హల్చల్ ● అతికష్టం మీద తాళ్లతో బంధించిన స్థానికులు ఉరవకొండ: స్థానిక హమాలీ కాలనీలో నివాసముంటున్న సైకో శేఖర్ మంగళవారం రెచ్చిపోయాడు. తెల్లవారుజామున చేతిలో కత్తి పట్టుకుని ఇందిరానగర్, హమాలీ కాలనీ, శివరాంరెడ్డి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఇందిరానగర్లో నివాసముంటున్న హనుమంతప్ప ఇంటి తలుపు తట్టడడంతో ఆయన ఎవరో వచ్చారని తలుపు తీయగానే వెంటనే కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. బస్టాండ్ ప్రాంతంలో బస్సు కోసం వేచి ఉన్న వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన నరసింహులుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. హమాలీ కాలనీలో ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న రెండు బైక్లను కట్టెలు, రాళ్లతో బాది ధ్వంసం చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో చొరబడి నానా హంగామా సృష్టించి, అక్కడ ఇనుంచి బయటపడి హమాలీ కాలనీకు చేరుకున్నాడు. ఆ సమయంలో కాలనీవాసులు ధైర్యం చేసి సైకోను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. సైకో చేతిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. గతంలో కూడా సైకో శేఖర్ ఉరవకొండ కోర్టు భవనం ఎక్కి ఎక్కి గొంతు కోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. విద్యుదాఘాతం... విద్యార్థి మృతి ● చదువుకుంటూ...పనికి వెళ్తున్న విద్యార్థి రాప్తాడు రూరల్: ఓవైపు చదువుకుంటూ మరోవైపు కుటుంబానికి అండగా ఉంటున్న విద్యార్థిని కరెంటు రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన మంగళవారం రాప్తాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురం రూరల్ జాకీర్కొట్టాలుకు చెందిన రితేష్ఖాన్ కుమారుడు అజాంఖాన్ (20) ప్రభుత్వ ఐటీఐలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీ సమయంలో టైల్స్ పనికి వెళ్లేవాడు. మంగళవారం రాప్తాడు మండలం కళాకారుల కాలనీలో టైల్స్ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటున్న అజాంఖాన్ దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిశోరి వికాసంతో ఉజ్వల భవిత
● కలెక్టర్ ఓ.ఆనంద్ ● గుత్తిలో శిక్షణ కార్యక్రమం పరిశీలన గుత్తి రూరల్: కిశోరి వికాసం కార్యక్రమం మహిళలు, బాలికల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో ఉన్న హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న కిశోరి వికాసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘కిశోరి వికాసం’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను ఇతర బాలికలకు, తల్లిదండ్రులకు తెలియజేసి చైతన్యవంతుల్ని చేయాలన్నారు. అనంతరం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లమ్మ, డీసీపీఓ మంజునాథ్, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్నాయక్, కమిషనర్ జబ్బార్మియా, వైద్యాధికారిణి ఆసియా అంజుమ్, హాండ్స్ సీఈఓ నారాయణస్వామి, సూపర్ వైజర్లు రాజేశ్వరి, గౌరి, దస్తగిరమ్మ తదితరులు పాల్గొన్నారు. గుత్తిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన గుత్తి: గుత్తిలో మంగళవారం కలెక్టర్ ఆనంద్ సుడిగాలి పర్యటన చేశారు. మొదట కోట ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న పునశ్చరణ తరగతులను పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. విద్యార్థులందరూ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని, మళ్లీ ఫెయిల్ అయితే బాధ్యత వహించాల్సి వస్తుందని టీచర్లను హెచ్చరించారు. అనంతరం స్థానికంగా ఓ ఇంటి వద్ద ఎన్యూమరేటర్లు చేస్తున్న జనగణనను పరిశీలించారు. బస్టాండ్ ఎదురుగా స్ట్రీట్ వెండర్స్తో మాట్లాడారు. లోన్లు బాగా వస్తున్నాయా అంటూ ఆరా తీశారు.అర్ధంతరంగా ఆగిపోయిన మెప్మా భవనాన్ని పూర్తి చేయించాలని ఆర్పీలు కోరగా.. సానుకూలంగా స్పందించారు. రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులనూ కలెక్టర్ పరిశీలించారు. -
ఆక్సిటోసిన్తో రోగాలపాలు
అనంతపురం: యూరియా, డిటర్జెంట్, రసాయనాలతో తయారు చేస్తున్న పాల గురించి విన్నాం. కొన్నిసార్లు చూశాం కూడా. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గేదెలు, ఆవులు ఎక్కువగా పాలు ఇచ్చేందుకు వాటికి డ్రగ్స్ ఇస్తున్నారు. తమ స్వలాభం కోసం నిషేధాన్ని ఉల్లంఘిస్తూ వీటిని ఉమ్మడి జిల్లాలోని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాడి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు మెడికల్ స్టోర్ల నిర్వాహకులు అక్రమ దందాకు తెరలేపారు. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని నమ్మిస్తూ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను కట్టబెడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఆక్సిటోసిన్ అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అయితే ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ వీటి విక్రయాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పాడి సంపద ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లోని మెడికల్ స్టోర్లలో ఆక్సిటోసిన్ విక్రయాలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గోపాల మిత్రల ద్వారా ఈ విక్రయాలను మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనర్థాలు మెండు.. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ఇంజక్షన్ను వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరమే అయినా, మెడికల్ స్టోర్ల నిర్వాహకులు మాత్రం వాటిని పాడి రైతులను ప్రలోభాలకు గురి చేస్తూ అంటగడుతున్నట్లుగా సమాచారం. వీటి వినియోగం వల్ల ఆవులు, గేదెలు చాలా తక్కువ కాలంలోనే వట్టిపోతాయి. వాటి పాలను తాగితే మనుషుల్లోనూ చాలా రకాల దుష్ట్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలురల్లో హార్మోన్ల అసమతుల్యత, బాలికల్లో రజస్వల అయ్యే వయసు తగ్గిపోవడం, చిన్న పిల్లల్లో కంటి చూపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. చిన్నారులకు పచ్చకామెర్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో అసౌకర్యం, నొప్పితో పాటు మెదడులోని కణాలు క్షీణించి మతిమరుపు సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. గర్భం ధరించిన వారు ఈ పాలు తాగితే గర్భస్రావం అవుతుందని, ఒకవేళ బిడ్డ పుట్టినా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, బిడ్డ పుట్టిన తర్వాత బాలింతల్లో హెమరేజ్ రిస్క్ కూడా అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధాన్ని ధిక్కరించి మెడికల్ స్టోర్లలో స్టెరాయిడ్స్ విక్రయం అధిక పాల ఉత్పత్తి కోసం పాడిపశువులకు వేస్తున్న వైనం పాలు తాగిన వారిపై తీవ్ర దుష్ప్రరిణాలు -
హనీట్రాప్ వ్యవహారం ‘అనంత’ టీడీపీలో చిచ్చు రేపింది. బీజేపీ నేతలపై ఆ పార్టీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతల ప్రమేయంపై రాష్ట్ర పార్టీ ఆరా తీసింది. టీడీపీ నేతల ప్రమేయంపై రాష్ట్ర పార్టీకి జిల్లా నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రాష్ట్ర పార్టీ దృష్టికి వా
సాక్షిప్రతినిధి, అనంతపురం : హనీట్రాప్ వ్యవహారంలో ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తీవ్ర చర్చ నడుస్తోంది. బాధితుల నుంచి నిందితులు ప్రామిసరీ నోటు బాండ్లు సేకరించిన తర్వాత పోలీసులతో చెప్పి నిందితులకు అనుకూలంగా పంచాయితీలు చేసిన వారిలో టీడీపీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పలు పత్రికలు, టీవీల్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ‘హనీట్రాప్ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం’ వివరాలు రాష్ట్రపార్టీకి చెప్పాలి కదా..’ అని సునీల్ ఆరా తీస్తే హనీట్రాప్ వ్యవహారంలో తనకు తెలిసిన అంశాలను సునీల్కు నాగరాజు వివరించారు. అలాగే తన అసంతృప్తిని కూడా వెళ్లగక్కారని తెలుస్తోంది. కాలవతో పూల నాగరాజుకు ఇక్కట్లు.. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు అదే నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజుకు మధ్య వైరం నడుస్తోంది. పూల నాగరాజు దుర్గానికి స్థానికుడు కావడంతో వాల్మీకి కోటాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ‘దుర్గం’ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. చివరకు కాలవ టిక్కెట్ దక్కించు కుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, ఎప్పటికై నా నాగరాజుతో ప్రమాదమని భావించి, పథకం ప్రకారం నాగరాజును అణగదొక్కే చర్యలను కాలవ ముమ్మరం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాలవ పూజలు నిర్వహించారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని పిలిపించారు. గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, సత్యకుమార్ విచ్చేశారు. వీరితో పాటు టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరిని కూడా ఆహ్వానించారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజును మాత్రం ఆహ్వానించలేదు. ‘దుర్గం’లో నిర్వహించిన కార్యక్రమానికి సాటి సామాజికవర్గం నేత, పైగా జిల్లా అధ్యక్షుడిని విస్మరించడం చూస్తే కావాలనే దూరం పెడుతున్నారనేది స్పష్టమవుతోంది.దీన్ని నాగరాజు కూడా తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ చేపట్టిన బీసీ గళం సదస్సు దిగ్విజయమైంది. ఈ క్రమంలో కాలవ, ఎంపీ బీకే ప్రెస్మీట్ నిర్వహించారు. బీసీ అంశం మాట్లాడే క్రమంలో బీసీ నేతగా ఉన్న జిల్లా అధ్యక్షుడిని కాలవ ఆహ్వానించలేదు. అలాగే చాలా సందర్భాల్లో పార్టీ వ్యవహారాలపై ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో కాలవ ప్రెస్మీట్ నిర్వహిస్తే, మళ్లీ అధ్యక్షుడిగా పార్టీ ఆఫీసులో నాగరాజు రెండోసారి అదే అంశంపై ప్రెస్మీట్ నిర్వహిస్తున్నారు. ఇది వీరిమధ్య విభేదాలను స్పష్టం చేస్తోంది. చివరకు ఇద్దరూ రైలు ప్రయాణం చేసే సమయంలో కాలవ ఎదురుగా సీట్లో నాగరాజు కూర్చుంటే ‘ఇక్కడ వద్దు పక్కకు వెళ్లి కూర్చోపో’ అని చెప్పారంటే నాగరాజుపై ఏస్థాయిలో కాలవ విద్వేషం పెంచుకున్నారో స్పష్టం అవుతోంది. దీన్నిబట్టి జిల్లా అధ్యక్షుడిని కాలవ ఎలా అవమానిస్తున్నారో అర్థమవుతోంది. నాగరాజు, అంబికా, గుమ్మనూరుతో పాటు చాలామంది వాల్మీకి నేతలు కాలవ ధోరణిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మినహా వాల్మీకుల్లో ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగకూడదనే ధోరణిలో కాలవ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఒకే జిల్లాలో తనతో పాటు అంబికా, గుమ్మనూరు రూపంలో బలమైన పోటీ కూడా నెలకొంది. దీంతో తన రాజకీయ ప్రయాణానికి అడ్డు తొలగించుకునే క్రమంలోనే కాలవ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే ‘దుర్గం’లో అక్రమ మైనింగ్, ఇసుక, కల్తీకల్లు తదితర అంశాల్లో కాలవ శ్రీనివాసులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న వివరాలను కూడా కొందరు నేతలు సునీల్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఏకమయ్యారా..? వాల్మీకి కార్డుతోనే కాలవ రాజకీయాల్లో చెలామణీ అవుతున్నారు. తమపై కాలవ అనుసరిస్తోన్న వైఖరితో గుమ్మనూరు జయరాం, అంబికా, నాగరాజు ఏకమైనట్లు తెలుస్తోంది. పైగా గుమ్మనూరు జయరాం కుమార్తెను పూల నాగరాజు కుమారుడికి ఇచ్చి వియ్యం కలుపుకుంటున్నారు. ఇలా బంధువులుగా మారి తర్వాత రాజకీయంగానూ ఏకం కానున్నారు. మరో వాల్మీకి నేత అంబికా వీరితోనే చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ముగ్గురు వాల్మీకి నేతలు ఏకమైతే పార్టీ అధిష్టానం వద్ద బలంగా తమ వాణీ విన్పించొచ్చని, తద్వారా కాలవకు చెక్ పెట్టొచ్చనేది వీరి భావనగా ఉన్నట్లు సమాచారం. టీడపీ కీలకంగా ఉన్న లోకేశ్తోనూ సన్నిహితంగా ఉంటూ కాలవ ఎత్తులకు పై ఎత్తులు వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా హనీట్రాప్ చిచ్చు టీడీపీలోని వర్గ విభేదాలను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లేలా చేసిన విషయం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంగా మారింది. వాల్మీకీ నేతల మధ్య తారస్థాయిలో విభేదాలు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును అవమానించేలా కాలవ ప్రవర్తన అంబికా, గుమ్మనూరు, నాగరాజులను నిరోధించేలా చర్యలు కాలవకు చెక్ పెట్టేందుకు ఏకమైన ముగ్గురు వాల్మీకీ నేతలు టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ సునీల్కు ఫిర్యాదు -
వివాహిత అదృశ్యం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డు కట్టకిందపల్లి క్రాస్ సమీపంలో నివాసముంటున్న వివాహిత అరుణకుమారి కనిపించడం లేదు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన అరుణకుమారికి మూడేళ్ల క్రితం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డితో వివాహమైంది. ఇద్దరూ కట్టకిందపల్లి క్రాస్ కొండారెడ్డి కాంప్లెక్స్లో నివాసముంటూ సమీపంలోని ఓ కళాశాలలో పని చేస్తున్నారు. గత నెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అరుణకుమారి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనపై శ్రీకాంత్రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 93469 17102, 94404 10117 కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
రైతుల బాగోగులు పట్టని చంద్రబాబు
● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి టౌన్: రాష్ట్రంలో రైతుల బాగోగులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. మంగళవారం తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో ఆయన పర్యటించి, మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు అతి తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ 2,400 ప్రకటించిందని, కొనుగోలు కేంద్రాలు లేక కేవలం రూ.1,800తో దళారులు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కెఫెడ్ ద్వారా రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, క్రాప్ఇన్సూరెన్స్, ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలు, పంట కొనుగోలు కేంద్రాలు, రైతు బరోసా అందజేసారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా సక్రమంగా అందించలేకపోయిందని మండిపడ్డారు. తీవ్రమైన ఎండలు, వర్షాభావం కారణంగా భూగర్భజలాలు అడుగంటి ఉద్యాన పంటలు ఎండుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రోజూ రూ.వేల ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా ఉద్యాన పంటలకు సాగునీరందించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
హనీట్రాప్ కేసు ముగిసింది
● దర్యాప్తు కొనసాగుతోంది ● ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: హనీట్రాప్ కేసు క్లోజ్ అయ్యిందని, దర్యాప్తు మాత్రం కొనసాగుతోందని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని, తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అపోహలు సృష్టించే వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసులో ఏ–1 నిందితురాలికి చెందిన ఓ ప్లాటును సీజ్ చేసినట్లు తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గంజాయి బ్యాచ్ను గుర్తించేందుకు మెడికల్ కిట్లు.. గంజాయి వినియోగించే వారిని డ్రంకన్ డ్రైవ్ తరహాలో మెడికల్ టెస్ట్ కిట్ల ద్వారా గుర్తించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. నూతన సాంకేతికతతో గంజాయి సరఫరా మార్గాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తామన్నారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే 1972, 112 టోల్ఫ్రీకి సమాచారం ఇవ్వాలని కోరారు. మామిడి టన్ను రూ.45 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో మంగళవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.45 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 344 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.45 వేలు, కనిష్టంగా రూ.25 వేలు, సరాసరిన రూ.33 వేల ప్రకారం ధర పలికిందన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.30 వేలు, సరాసరిన రూ.35 వేలు పలికిందని వివరించారు. అలాగే హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెల్లడించారు. ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ విడపనకల్లు: అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ను వైద్య ఆరోగ్య శాఖాధికారులు మంగళవారం సీజ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గడేకల్లు గ్రామంలో రెండు ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా దస్తగిరి అనే ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ను సీజ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆర్ఎంపీ క్లినిక్ నిర్వహించడం చట్ట రీత్యా నేరమన్నారు. పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఆర్ఎంపీలు అనధికారికంగా క్లినిక్లు నిర్వహిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి, కొట్టాలపల్లి పీహెచ్సీ డాక్టర్ సంజీవ్, ఆరోగ్య విస్తరణ అధికారి తిరుపాల్ నాయక్, మాస్ మీడియా అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్లో సత్తా అనంతపురం: పాలిసెట్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాలో 9,070 మంది పరీక్షకు హాజరుకాగా.. 8,120 (89.53%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 87.67, బాలికలు 92.44% శాతంగా నమోదైంది. జిల్లా స్థాయిలో నున్నా కృష్ణ తనయ ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. రెండో స్థానంలో డి ప్రహాస్య, మూడో స్థానంలో ఎస్.ఎం. నయీం సాదియా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త సి. జయచంద్రా రెడ్డి అభినందించారు. -
ఆ పాలతో అనర్థాలు
ఆక్సిటోసిన్ అనే మందును వైద్య రంగంలో ప్రసవ సమయంలో గర్భాశయ కుదుపులను సులభతరం చేయడానికి కానీ, కొన్ని ప్రత్యేక హార్మోన్ అసమతుల్యత సమస్యల పరిష్కారానికి మాత్రమే ఉపయోగిస్తారు. వైద్యుల సిఫారసు లేనిదే ఈ ఇంజక్షన్ను విక్రయించరాదు. అయితే పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో దీనిని వాడటం సరికాదు, అలాగే నేరం కూడా. ఆక్సిటోసిన్ వాడిన పశువుల పాలు తాగిన చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ను ఇవ్వడం మానుకోవాలి. – డాక్టర్ హేమలత, ఆర్ఎంఓ, జీజీహెచ్, అనంతపురం -
రైలు కింద పడి యువకుడి మృతి
గుంతకల్లుటౌన్: స్థానిక హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ కుమారుడు కె.బాలచంద్ర (34)గా గుర్తించారు. గుంతకల్లులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఆర్డీటీ బిల్డింగ్స్లో అద్దెకుంటున్నాడు. అవివాహితుడు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో క్లీనర్గా దినసరి కూలి పనితో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం వేకువజామున రైలుకింద పడి మృతి చెందాడు. కాగా, మద్యం మత్తులో రైలు కిందపడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పీడీఓ, డిజిటల్ అసిస్టెంట్ల ఎస్ఆర్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీ సెక్రటరీలను స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3గా పునర్విభజన చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ), డిజిటల్ అసిస్టెంట్ల ఎస్ఆర్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఆర్సీ భవనంలో డీపీఓ నాగరాజనాయుడు ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన చేస్తున్నారు. ఎంపీడీఓలు, వారి ఆఫీసు సిబ్బంది, ఉమ్మడి జిల్లా ట్రెజరీ అధికారులు, ఆడిట్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశీలన చేస్తున్నారు. అర్ధరాత్రి దొంగల బీభత్సం ● ఇంటి తాళం బద్ధలుగొట్టి 15 తులాల బంగారు నగల అపహరణ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిఽధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిద్దిలో నివాసముంటున్న దంపతులు రామాంజనేయులు, గీతమ్మ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రామాంజనేయులు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటి ఆవరణలో నిద్రించేవారు. సోమవారం బంధువుల ఇంటి వద్దకు దంపతులు వెళ్లిన సమయంలో ఇంటి తాళాన్ని దుండగులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 15తులాల బంగారు నగలు, రూ.6వేల నగదు అపహరించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రామాంజనేయులు దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరినాథ్ తెలిపారు. స్టాక్ పాయింట్లో ఆరు గదులు ఉండాలి ● విద్యార్థి మిత్ర కిట్ల రాష్ట్ర పరిశీలకులు అనురాధ అనంతపురం ఎడ్యుకేషన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను భద్రపరిచేందుకు స్టాక్పాయింట్లలో ఆరు గదులు ఉండేలా చూడాలని రాష్ట్ర పరిశీలకులు అనురాధ సూచించారు. మంగళవారం ఆమె కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఆత్మకూరు, అనంతపురం మండలాల్లో ‘విద్యార్థి మిత్ర’ స్టాక్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర అధికారులు ఇచ్చిన మ్యాపు ప్రకారమే వచ్చిన కిట్లను భద్రపరచాలన్నారు. స్టాక్ పాయింట్లలో తగినంత వెలుతురు ఉండేలా చూడాలన్నారు. గదుల్లోకి వర్షపు నీరు రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. కిట్లు తెచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా తగినంత స్థలం ఉండాలన్నారు. స్టాక్పాయింట్లకు కిట్లు చేరిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట సీఎంఓ చంద్రశేఖర్, ఆయా మండలాల ఎంఈఓలు, సీఆర్ఎంటీలు ఉన్నారు. పెద్దొడ్డిలో ఇరువర్గాల ఘర్షణ గుత్తి రూరల్: మండలంలోని పెద్దొడ్డి గ్రామంలో మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన రాజు, అశోక్కు సమీప బంధువైన నరేష్తో కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నరేష్ తన ఇంట్లో నుంచి రోకలిబండ తీసుకెళ్లి రాజు, అశోక్పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన మేనత్తలు పార్వతి, లక్ష్మీదేవిపై కూడా దాడి చేశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన రాజును వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచర్కు దేహశుద్ధి శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయిస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నార్పలలోని సుల్తాన్పేటలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో స్థానికులు అప్రమత్తమై దుండగుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేబుల్ చోరీ బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామ శివారులో తాగునీటి మోటార్ కేబుల్ సోమవారం రాత్రి చోరీ అయినట్లు పంచాయతీ కార్యదర్శి శివన్న తెలిపారు. తాగునీటి పథకం మోటారు నుంచి మొయిన్ బోర్డు వరకు ఉండే 30 మీటర్ల కేబుల్ ఎత్తుకెళ్లారు. కేబుల్ ఎత్తుకెళ్లడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, కొత్త కేబుల్ ఏర్పాటు చేసిన్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. -
సిబ్బందిని నియమిస్తాం
అనంతపురం టౌన్: జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సరిపడా సిబ్బంది లేరు. 50 మంది దాకా సిబ్బంది కొరత ఉంది. ఈ క్రమంలో వినియోగదారులకు సకాలంలో సేవలు అందడం లేదు. స్థిరాస్తుల విక్రయాలు, కొనుగోలు సమయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాంటి రికార్డులను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొందేందుకు రోజులు కాదు నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. స్పందించండి సారూ.. గతంలో ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని మాన్యువల్ ఈసీ, ఆర్హెచ్ పేజీలతో పాటు నకలు డాక్యుమెంట్లను అందించేవారు. ప్రస్తుతం వారు కార్యాలయాలకు రాకపోవడంతో సమస్య తలెత్తింది. వారి స్థానాల్లో కొత్తగా సిబ్బందిని నియమించాల్సిన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో నిత్యం వేలాది మంది రికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే భర్తీ చేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. – బి. శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత రికార్డుల కోసం నెలల తరబడి ప్రజల ప్రదక్షిణలు పట్టించుకోని ఉన్నతాధికారులు -
●ఇల్లే.. వ్యవసాయ క్షేత్రం
తాడిపత్రి టౌన్: ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా పచ్చదనాన్ని కోరుకుంటారు. గ్రీనరీ అంటే ఎవరికై నా ఇష్టం.. చెట్లు, పూల మొక్కలు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్లో ఇంటికే స్థలం సరిపోవట్లేదు... ఇక మొక్కలు పెట్టేందుకు స్థలమెక్కడిది? అయితే ఓ ఫర్టిలైజర్ షాపు యజమాని తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. వివిధ రకాల ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు పండిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఈ నందన వనాన్ని చూడాలనుకుంటే తాడిపత్రిని సందర్శించాల్సిందే. పట్టణంలోని సంజీవనగర్కు చెందిన రాజేష్, శ్రీలత దంపతులు తమ ఇంటి ఆవరణతో పాటు మిద్దైపె కూడా డ్రమ్ములు, బ్యాగ్లలో మట్టి నింపి 25 రకాల మందార మొక్కలు, నాలుగు రకాల మల్లె మొక్కలతో పాటు వివిధ రకాల పూలు, ఆకుకూరలు, మామిడి, జామ, నిమ్మ చెట్లను పెంచుతున్నారు. తన తండ్రి వెంకటరమణారావు మొక్కలపై మమకారంతో ఇంట్లో పచ్చని చెట్లను పెంచారని, ఆయన మరణాంతరం తండ్రి జ్ఞాపకాలను మొక్కల్లో చూసుకుంటూ మొక్కలను సంరక్షించుకుంటున్నట్లు రాజేష్ తెలిపారు. -
చాపట్లలో కౌలు రైతు ఆత్మహత్య
రాప్తాడు రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కణేకల్లు ప్రాంతానికి చెందిన తలారి నరసింహులు (41) రాప్తాడు మండలం చాపట్లలో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది టమాట, వేరుశనగ పంటలు సాగు చేసినా... ఆశించిన దిగుబడి రాకపోవడం కుదేలయ్యాడు. పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండగా తీర్చే మార్గం కానరాక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన పొలం వద్దే పంటకు వినియోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న నరసింహులు మరణించడం వారిని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతుడి బంధువులు రాత్రి రాప్తాడు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. -
నారసింహా.. నమోస్తుతే
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహస్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. ఉభయదారులుగా అనంతపురం అంబేడ్కర్నగర్కు చెందిన ఎం. నారాయణ స్వామి కుమారులు వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారు ఐరావత వాహనంపై విహరించారు. కార్యక్రమానికి పెద్దముష్టూరు గ్రామానికి చెందిన నెట్టెం జయచంద్ర, నెట్టెం ఎర్రిస్వామి సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు, కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు పాల్గొన్నారు. నేడు నూతన కోర్టుల ప్రారంభం కళ్యాణదుర్గం/అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులను బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ లీసా గిల్ వర్చువల్గా కోర్టులను ప్రారంభిస్తారని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ.భీమా రావు తెలిపారు. కళ్యాణదుర్గంలో 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, రాయదుర్గంలో అదనపు సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
●గరుడ వాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో సోమవారం లక్ష్మీ నృసింహస్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి గరుడవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి బొల్లినేని జయసింహ, బొల్లినేని కృష్ణవేణి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నరసింహస్వామి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, అర్చకులు పాల్గొన్నారు. -
టాపర్లకు కలెక్టర్ అభినందనలు
అనంతపురం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఇతర విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చదువుతో పాటు సమాజం, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టాపర్లను కలెక్టర్ సన్మానించి ప్రశంసాపత్రం, మెమొంటో అందజేశారు. ఎస్సీ విభాగంలో జిల్లాస్థాయిలో టాపర్గా నిలిచిన తాడిపత్రి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని లాస్యకు కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయుడు బి.నాగేంద్ర రూ.5 వేల ఆర్థిక సహాయన్ని అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, డీఈఓ ప్రసాద్బాబు, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వీడకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్రావు హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఆప్టా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కాకి ప్రకాష్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగుల సహకారంతోనే విజయం సాధించామని, ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు గడిచినా కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. పైగా ‘మమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వండి’ అనే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేక భావాలు మొదలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతన పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి మాట్లాడుతూ సరెండర్ లీవ్ బిల్లులు నాలుగేళ్లుగా పెండింగ్ ఉన్నాయన్నారు. ప్రధానకార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఆప్టా జిల్లా ఆర్థిక కార్యదర్శి బీఏ శంకరమూర్తి, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి చల్లా శివానంద, నాయకులు వలి, నారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి అనంతపురం అర్బన్: ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు సజావుగా జరగాలన్నారు. ఆరో తేదీ రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట్ల బారికేడ్ల ఏర్పాటు, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల వేళ తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించాలని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్కు సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, పెన్నహోబిలం దేవస్థానం ఈఓ రమేష్బాబు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో రహస్య బదిలీలు
అనంతపురం ఎడ్యుకేషన్: అధికారిక ఉత్తర్వులు లేకుండా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలను రహస్యంగా బదిలీలు చేసేందుకు సమగ్ర శిక్ష అధికారులు పూనుకున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సైన్స్ సెంటర్లో సోమవారం బదిలీల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని పలువురు స్పెషలాఫీసర్లు, సీఆర్టీలు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వు లు, మార్గదర్శకాలు లేకుండా నోటిమాటతో ఎలా బదిలీలు చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ జరగనీయకుండా అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డీఈఓ ప్రసాద్బాబు ఎంత నచ్చజెప్పేప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరికి ఎస్టీయూ నాయకులు హరిప్రసాద్రెడ్డి, రామాంజులయాదవ్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్, ఏఐటీయూసీ చిరంజీవి, రాజు, ఏఐఎస్ఎఫ్ కుళ్లాయిస్వామి, అంజి, ఏఐవైఎఫ్ తేజు, రియాజ్బాషా తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాంగ్ స్టాండింగ్ పేరుతో ఐదేళ్లు పూర్తయిన ప్రిన్సిపాళ్లు, 8 ఏళ్లు పూర్తయిన సీఆర్టీలను బలవంతంగా బదిలీలు చేస్తున్నారన్నారు. ఓవైపు చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక కొట్టుమిట్టాడుతున్న కేజీబీవీ ఉద్యోగులను బెదిరింపు ధోరణిలో బదిలీలు చేయడం సమంజసం కాదన్నారు. వారికి మినిమం టైం స్కేలు వర్తింపజేసి ఉద్యోగభద్రత కల్పించిన తర్వాతనే ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను అనుసరించి బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు కౌన్సెలింగ్ జరగకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్లో కౌన్సెలింగ్ పూర్తి కౌన్సెలింగ్ ప్రక్రియను మధ్యాహ్నం తర్వాత సైన్స్ సెంటర్ నుంచి కలెక్టరేట్లోని ఎన్ఐసీ కార్యాలయానికి మార్చారు. డీఆర్ఓ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా పీజీటీలు, తర్వాత ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కాగా పలువురు విల్లింగ్ ఇవ్వలేదు. వారి స్థానాలకు విల్లింగ్ ఇచ్చిన వారిని బదిలీ చేశారు. విల్లింగ్ ఇవ్వని వారి స్థానాలకు బదిలీ అయిన వారు జాయిన్ అవుతారా లేదా? అనేది చూడాలి. మరోవైపు పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. స్టే రాకముందే కౌన్సెలింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద పూర్తి చేశారు. -
రూ.కోట్లు.. హాంఫట్!
● కళ్యాణదుర్గం మునిపాలిటీలో అవినీతి అక్రమాలు ● సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైనం కళ్యాణదుర్గం: అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. తద్వారా బాగా డబ్బు వెనకేసుకున్నారు. పనులు పర్యవేక్షించి.. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు, దీనిపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తమకు అనుకూలంగా ఉన్న కమిషనర్ను అధికార టీడీపీ నాయకులు కళ్యాణదుర్గానికి వేయించుకున్నారు. ఆ తర్వాత గతంలో పెండింగ్ పడిన పనులకు ఆగమేఘాలపై అనుమతులు తెప్పించుకున్నారు. వెనువెంటనే కాంట్రాక్ట్ పనులను టీడీపీ నాయకులు దక్కించుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, డివైడర్లు, కంపోస్టుయార్డు శుద్ధీకరణ పనులను హడావుడిగా ప్రారంభించారు. అయితే ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత ప్రమాణాలు కనిపించలేదు. అంతేకాదు ఆయా పనులు పూర్తికాకపోయినా రూ.30 కోట్ల దాకా బిల్లులు మంజూరు చేసినట్లు కమిషనర్పై ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ పాత్రపై విచారణ! అవినీతి అక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ పాత్ర ఉందంటూ గతంలో దళిత జనజాగృతి వ్యవస్థాపకుడు ఆర్కే రాజు ఏకంగా మున్సిపల్ కమిషనరేట్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై మరికొన్ని ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు గుట్టుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు అవాస్తవం మున్సిపాలిటీ పరిధిలో రూ.కోట్ల అవినీతి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. అయినా సోషల్ మీడియాలో వచ్చే వాటికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవినీతి జరిగి ఉంటే విచారణలో బయట పడుతుంది. నాపై ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. – వంశీకృష్ణ భార్గవ్, మున్సిపల్ కమిషనర్, కళ్యాణదుర్గం -
రాష్ట్రాన్ని కుదిపేసిన ‘అనంత’ హనీట్రాప్ ఉదంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిని పోలీసులు రిమాండ్కు పంపారు. తమ శాఖలోని అధికారులపై వేటు వేశారు. అలాగే బీజేపీ కూడా రిమాండ్కు వెళ్లిన ముగ్గురు మహిళా మోర్చా నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. వీరి
సాక్షిప్రతినిధి అనంతపురం: ‘హనీట్రాప్’ బీజం బీజేపీలో పడి టీడీపీలో విషవృక్షంగా ఎదిగి ‘అనంత’ వాసులను వేధించింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరికొంత మందిపై చర్యలు తీసుకునే దిశగా కేసును విచారిస్తున్నారు. రిమాండ్కు వెళ్లిన ముగ్గురు బీజేపీ మహిళా మోర్చా నేతలు చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆ పార్టీకి సంబంధించి మరో ఇద్దరు నేతల ప్రమేయంపైనా చర్చ నడిచింది. ఇద్దరిలో ఒకరి బ్యాంకు ఖాతాలోకి రంగమ్మ ఖాతా నుంచి రూ.15 లక్షల నగదు బదిలీ జరిగింది. అలాగే రంగమ్మను ప్రోత్సహించిన మరో మాజీ జిల్లా అధ్యక్షుడి ప్రమేయం కూడా హనీట్రాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మంత్రి సత్యకుమార్ కీలక అనుచరుడు కావడంతో పోలీసుస్టేషన్లలో ఆర్థిక వ్యవహారాలలో పంచాయితీలు కూడా చేశారు. రంగమ్మ బీజేపీలో ఉన్నప్పుడు ఆమెను, ప్రస్తుతం చంద్రకళను ప్రోత్సహించారు. చంద్రకళ మహిళా మోర్చా రాయలసీమ జోనల్ అధ్యక్షురాలిగా పని చేస్తూ హనీట్రాప్ కేసులో రిమాండ్కు వెళ్లారు. చంద్రకళకు జమ్మలమడుగులో ఇసుక క్వారీ ఇప్పించి ఆర్థికంగా స్థితిమంతురాలిని చేసే చర్యలు చేపట్టారు. ఇదంతా మంత్రి సత్యకుమార్ సహకారంతోనే జరిగిందనేది బీజేపీ నేతలే చెబుతున్న మాట! దీన్నిబట్టే చంద్రకళ వ్యవహారాలలో మంత్రి అనుచరుడికి ఏ మేరకు ప్రమేయం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చునని వారు అంటున్నారు. ఆయనపై హనీట్రాప్ ఆరోపణలు రావడంతో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన ప్రమేయం లేదని చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆరోపణలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దాన్ని పార్టీకి ఆపాదించడమేంటని, ప్రెస్మీట్ వద్దని రాష్ట్ర నేతలు అడ్డుచెప్పారు. దీంతో ప్రెస్మీట్ చివరి నిమిషంలో ఆపారు. బీజేపీ చీఫ్కు జిల్లా నేతల ఫిర్యాదు హనీట్రాప్ ఉదంతం, పార్టీ నేతల ప్రమేయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్కు జిల్లా నేతలు వివరించారు. ఈ వ్యవహారంతో ‘అనంత’ బీజేపీ పరువు బజారున పడిందని ఇద్దరు కీలక నేతలు గట్టిగా ఫిర్యాదు చేశారు. ‘నగదు బదిలీ’ అయిన నేతపై వెంటనే చర్యలు తీసుకుందామని మాధవ్ చెప్పినట్లు సమాచారం. అలాగే మరో నేతపై చర్యలకు మంత్రి సత్యకుమార్ అడ్డుపడే అవకాశం ఉన్నందున అదను చూసి వేటు వేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఓ నేతపై ఏ క్షణమైనా వేటు పడొచ్చు! మరో నేతపై ఆలస్యంగా చర్యలు తీసుకోవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో దబ్బర రాజేష్ (ఫైల్)రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో రంగమ్మ (ఫైల్) హనీట్రాప్లో ప్రమేయం ఉన్నవారిపై వేటుకు బీజేపీ నిర్ణయం రంగమ్మ ఖాతా నుంచి నగదు బదిలీ అయిన నేతను బహిష్కరించే యోచన రంగమ్మను ప్రోత్సహించిన మాజీ జిల్లా అధ్యక్షుడి అంశంలో ఆచితూచి నిర్ణయం మంత్రి సత్యకుమార్ అడ్డుపడతారనే కారణంతో ఆయనపై ఆలస్యంగా చర్యలు ! జిల్లా నేతలకు సూచించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇప్పటికే ముగ్గురు మహిళా మోర్చా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ బీజేపీ తరహాలో టీడీపీ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు హనీట్రాప్ ఉదంతంలో బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలూ ఉన్నారు. ఉరవకొండ నియోజకవర్గ నేతలు ఇద్దరు ఉన్నట్లు తేలింది. వీరిలో ఒకరు జిల్లా కమిటీలో అత్యంత ‘ప్రధానంగా’ ఉన్నారు. మరొకరు స్థానిక నేత! జిల్లా కమిటీలోని ‘ప్రధాన’ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు పిలిపించి విచారించారని తెలుస్తోంది. ఈ ఇద్దరి పాత్రను తేల్చి, వీరిని కూడా టీడీపీ నుంచి తప్పించాల్సిన బాధ్యతను జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తీసుకోవాలన్న చర్చ జనంలో నడుస్తోంది. అలాగే లేడీడాన్ రంగమ్మ మెడలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా ఆమెను సస్పెండ్ చేయించే బాధ్యత తీసుకోలేదు. దీంతో విమర్శలు వస్తున్నాయి. అనంతపురానికి చెందిన రాజేశ్ ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నాడు. ఒకవైపు బీజేపీ అధిష్టానం విడతల వారీగా చర్యలు తీసుకుంటుంటే... టీడీపీ మాత్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందనేది తేలాల్సి ఉంది. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే వారు బయటకు వచ్చి దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయల’ పేర్లు చెబుతారనే భయం ఆవహించిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
ప్రయాసే..పరిష్కారమేదీ?
అనంతపురం అర్బన్: వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్కు వచ్చి గోడు వెల్లబోసుకుంటున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని పలువురు దివ్యాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్తో పాటు జేసీ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్రెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు ప్రజల నుంచి 405 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలపై 197, ఇతర సమస్యలపై 208 అర్జీలు ఉన్నాయి. సమస్యలపై అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కాకపోవడంతో మళ్లీమళ్లీ కలెక్టరేట్కు రావాల్సి వస్తోందన్నారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారం పై అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో మచ్చుకు కొన్ని... ● శింగనమల మండలం చక్రాయపేట రామాలయం వద్ద హైవే మీదుగా ఉన్న దారిని మూసివేయడంతో పంటపొలాలకు వెళ్లేందుకు, డెయిరీ పాలు పోసేందుకు వెళ్లడానికి కిలోమీటరు దూరం చుట్టుకుని రావాల్సి వస్తోందని గ్రామస్తులు అర్జీ అందజేశారు. ● తమ వ్యవసాయ పొలంలోకి వెళ్లేందుకు రస్తా ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని కుందుర్పి మండలం అప్పిలేపల్లికి చెందిన జయమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువైందని తెలిపింది. -
సమ్మెలోకి ‘సత్యసాయి తాగునీటి’ కార్మికులు
● ఉమ్మడి జిల్లాలో వెయ్యి గ్రామాలకు నీరు బంద్ కళ్యాణదుర్గం రూరల్/ కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్లో పని చేస్తున్న కార్మికులు జీతాల కోసం సోమవారం రాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. మూడు యూనియన్ల పరిధిలోని 570 మంది కార్మికులు జేఏసీగా ఏర్పడి సమ్మెలోభాగంగా కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులో మోటర్లు పని చేయకుండా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దాదాపు 1000 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్ కానుంది. సత్యసాయి నీటి సరఫరా జేఏసీ నాయకులు వన్నూరప్ప, రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు కార్మికుల సమస్యలకు నేటికీ శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్లో తాగునీటి కార్మికులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అసలు సత్యసాయి నీటి ప్రాజెక్టును కొనసాగించాలనే ఉద్దేశం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని, పీఎఫ్ జమ చేయాలని, సత్యసాయి ప్రాజెక్టును పరిరక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు. నకిలీ పట్టాలను నమ్మొద్దు అనంతపురం ఎడ్యుకేషన్: ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద జిల్లాలో 549 అటవీ హక్కుల పాసుపుస్తకాలను జిల్లాస్థాయి కమిటీ ఆమోదించిందని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనవాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పుస్తకాల్లో మంజూరు చేసినంత భూమి మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త అటవీ హక్కు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కొందరు బ్రోకర్లు రంగప్రవేశం చేసి నకిలీ పట్టాలు, ఉన్న పట్టాల్లో దిద్దుబాటు చేస్తున్నారని తెలిసిందన్నారు. లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వెంకటాంపల్లి చిన్నతండా, ఎన్ఎన్పీ తండా, పందికుంట తండా, పులగుట్టపల్లి తండా, బెళుగుప్పతండాలో గ్రామ సభలు నిర్వహించామన్నారు. -
కేబుల్ గుంతలో పడి బైకర్ మృతి
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆలూరురోడ్ విద్యానగర్–1 క్రాస్ దగ్గర కేబుల్ పనుల కోసం తవ్విన గోతి వద్ద బైక్ అదుపు తప్పి రామిరెడ్డి కాలనీకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఉప్పర ప్రసాద్ (52) ఆదివారం మృతి చెందాడు. వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు.. ఆయిల్ ట్యాంకర్ను నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రసాద్.. బర్మాశాలలో మృతి చెందిన తన స్నేహితుడి మృతదేహాన్ని సందర్శించి బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో తిరిగి తన బైక్పై ఇంటికి బయల్దేరాడు. విద్యానగర్ క్రాస్–1 వద్ద ఓఎఫ్సీ కేబుల్ కోసం తవ్విన గుంత దగ్గర మట్టి, కంకర అడ్డుగా వేయడంతో అదుపుతప్పి గోతిలో పడ్డాడు. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసాద్ ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య మంజుల, ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు
గుంతకల్లు: వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని నెలగొండ, చింతలాంపల్లి, నల్లదాసరపల్లి, పాతకొత్తచెరువు, ఇమాంపురం గ్రామాల మాజీ సర్పంచులు పాటిల్ భాగ్యమ్మ, పద్మావతి, ఎర్రలింగమ్మ, మల్లికార్జున, రంగన్న మాట్లాడారు. తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని, అయితే తమకు న్యాయ స్థానాలపై నమ్మకం ఉందన్నారు. అందుకే త్వరగా బెయిల్ మంజూరైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా వేధించారన్నారు. గ్రామాల్లో నీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రజల వినతుల మేరకు..రూ.లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. అయితే మండల అధికారులు బిల్లులు చేయలేదని జిల్లా ఉన్నాతాధికారు దృష్టికి తీసుకెళ్లినా ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. తాము ఎక్కడా కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణలపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. -
అత్యాశకు పోయి.. దొంగగా మారి
కదిరి: ట్రాన్స్కో ఉద్యోగి దొంగలా మారడం.. పోలీసులకు పట్టుబడి జైలులో ఊచలు లెక్కపెడుతున్న విషయం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అసలు రూ.లక్ష జీతం ఉన్న ఉద్యోగి దొంగలా ఎందుకు మారాడు? అన్న విషయంపై ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. వివరాలు.. స్థానిక ట్రాన్స్కో కార్యాలయంలో సీనియర్ అసి స్టెంట్గా పనిచేస్తున్న బుక్యా రమేష్నాయక్ ఒకప్పుడు కుటాగుళ్లలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. తనకు పరిచయం లేకపోయినా ఏదైనా పనిమీద ట్రాన్స్కో కార్యాలయానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, అక్కడున్న అధికారులకు చెప్పి వారి సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందేవాడు. రెండేళ్ల క్రితం కదిరి పట్టణంలోని మారుతీనగర్లో రూ.50 లక్షలు విలువ చేసే సొంతింట్లోకి వెళ్లి తల్లిదండ్రులతో పాటు పిల్లనిచ్చిన అత్తమామల ప్రశంసలు అందుకున్నాడు. కొంప ముంచిన తోటి ఉద్యోగి సలహా.. రమేష్నాయక్ పనిచేసే కార్యాలయంలో ఓ ఉద్యోగికి షేర్ మార్కెట్ పిచ్చి. తనకు అందులో రూ.లక్షల్లో లాభాలు వస్తున్నాయని తోటి ఉద్యోగులతో చెప్పేవాడు. ఆ మాటలకు ఆకర్షితుడైన రమేష్ నాయక్ షేర్లపై దృష్టి సారించాడు. యూట్యూబ్ ద్వారా కొంత తెలుసుకొని ఆ ఊబిలోకి దిగాడు. అనతి కాలంలోనే లక్ష కాదు..రెండు లక్షలు కాదు..రూ.80 లక్షలు నష్టపోయాడు. బ్యాంకుల్లోనే కాకుండా కొంత మంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి ఏమి చేయాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ విషయంలో తరచూ భార్యతో గొడవ పడుతుండే వాడు. ఆమె పుట్టింటి వారికి విషయం తెలిసి అల్లుడు చెప్పిన రూ.40 లక్షల అప్పులు తీర్చి, ఇక షేర్ మార్కెట్ జోలికి వెళ్లొద్దని సలహా ఇచ్చారు. రమేష్ను ఈ ఊబిలోకి దింపిన ఉద్యోగి కూడా షేర్ మార్కెట్లో రూ.20 లక్షలు నష్టం రావడంతో తేరుకొని షేర్లకు స్వస్తి పలికాడు. మళ్లీ అదే ఊబిలోకి .. భార్యతో పాటు అత్తమామలకు తెలియకుండా చేసిన మరో రూ.40 లక్షల అప్పులు తీర్చేందుకు రమేష్ షేర్ మార్కెట్ను వదల్లేకపోయాడు. భార్యకు అనుమానం వచ్చి ‘నువ్వు ఇంక మారవా..?’ అని చెప్పి 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పులోళ్ల బాధలు తట్టుకోలేక మరింత మానసిక వేదనకు గురయ్యాడు. ఏమి చేయాలో దిక్కు తెలియక నిద్రలేని రాత్రులు గడిపాడు. దొంగగా మారి... రమేష్ ఇంట్లో ఒక్కడే ఉంటూ టీవీ ఆన్ చేశాడు. సీరియల్ వస్తోంది. అందులో ఓ యువకుడు ఓ మహిళ మెడలో బంగారు చైను లాక్కెళ్లి గోల్డ్షాప్లో అమ్మి సొమ్ము చేసుకోవడం చూశాడు. ఆ దృశ్యం ఇతని మనసులో నాటుకుపోయింది. మరుసటి దినం (ఏప్రిల్ 28న) రమేష్ కదిరి – హిందూపూర్ రోడ్లో టీ తాగేందుకు తన స్కూటీపై వెళ్తుంటే ఇళ్లలో పని చేసుకునే శాంతి ఆయన కంట పడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైను లాక్కొని అక్కడి నుంచి జారుకున్నాడు. పోలీసులకు పట్టుబడింది ఇలా... బాధిత మహిళ శాంతి ఫిర్యాదు మేరకు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఈ కేసును పట్టణ సీఐ నారాయణరెడ్డికి అప్పగించారు. ముందుగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ మహిళ మెడలో చైను లాక్కెళ్లిన వ్యక్తి వాడిన స్కూటీ బ్లూ కలర్ (నంబర్ ఏపీ 39హెచ్ వీ.3804) అని పోలీసులు గుర్తించారు. ఈ నెల 2న ఉదయాన్నే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోలీసులు రమేష్నాయక్ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.2 లక్షలు విలువ చేసే బంగారు చైనుతో పాటు స్కూటీని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. విలపించిన కుటుంబ సభ్యులు.. విషయం తెలిసి ఆయన భార్యతో పాటు అత్తమామలు ఇంటికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. షేర్ మార్కెట్ వ్యసనం నుంచి ఎలా బయట పడేయాలో తెలియక తాము బాధపడుతుంటే మళ్లీ ఈ దొంగ కేసేంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘దయచేసి ఎవరూ ఇలాంటి షేర్మార్కెట్ల జోలికెళ్లి.. తప్పుడు మార్గాన్ని ఎంచుకోకండి’ అని విన్నవించారు. మిత్రుడి సలహాతో షేర్ల ఊబిలోకి దిగిన ట్రాన్స్కో ఉద్యోగి అప్పులపాలై చోరీల బాట -
సాక్షి తోడు... పదింతల ఫలితం
అనంతపురం ఎడ్యుకేషన్: నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేయించిన ‘సాక్షి’ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు అండగా నిలిచింది. బాగా కష్టమని భావించే గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ‘సాక్షి’ యాజమాన్యం తొలిసారి మెటీరియల్ తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో తాము మంచి మార్కులు సాధించడం వెనుక ఈ మెటీరియల్ దోహదపడినట్లుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు సగర్వంగా చెబుతున్నారు. ముఖ్యంగా గణితంలో సమస్యలను పరిష్కరించే విధానం, సైన్స్లో ముఖ్యమైన ప్రశ్నలపై స్పష్టమైన సమాధానాలివ్వడంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నట్లు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ మెటీరియల్ను ప్రశంసిస్తూ, విద్యార్థుల అభ్యాసంలో ఇది కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. సమయానికి సరైన మార్గదర్శకం లభించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ‘సాక్షి’ అందజేసిన ప్రత్యేక మెటీరియల్పై పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే. ‘సాక్షి’కి రుణపడ్డాం చాలామంది పేద విద్యార్థులు మెటీరియల్ కొని చదివే పరిస్థితిలో లేరు. అయితే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా విద్యార్థులందరికీ మెటీరియల్ అందజేసి అండగా నిలిచిన ‘సాక్షి’కి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ‘సాక్షి’ యాజమాన్యం అందజేసిన మెటీరియల్ చదువుకోవడం వల్ల మొత్తం 560 మార్కులు వచ్చాయి. – ఎస్.మానస, జెడ్పీహెచ్ఎస్, ఆత్మకూరు చాలా ఉపయోగపడింది నేను రాప్తాడు కేజీబీవీలో చదువుకున్నా. ‘సాక్షి’ అందజేసిన గణితం, సైన్స్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ ప్రశ్నలు చదువుకున్నా. అత్యధికంగా ప్రశ్నలు అందులోనివే వచ్చాయి. దీంతో సైన్స్లో 81, గణితంలో 80 మార్కులు వచ్చాయి. మొత్తం 482 మార్కులు సాధించాను. అమ్మానాన్న ఇద్దరూ కూలి పనులకు వెళుతుంటారు. – సుప్రజ, గొందిరెడ్డిపల్లి 70 శాతం ప్రశ్నలు అందులోవే అమ్మ కూలి పని చేస్తుండగా, నాన్న వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. ‘సాక్షి’ అందజేసిన మెటీరియల్లోని ప్రశ్నలు 70 శాతం వరకు వచ్చాయి. ఆ మెటీరియల్ చదువుకుని నేను గణితంలో 79, సైన్స్లో 96 మార్కులు సాధించాను. మొత్తంగా 523 మార్కులతో రాప్తాడు కేజీబీవీలో టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – ఉమాదేవి గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం ‘సాక్షి’ మెటీరియల్ చాలా ఉపయోగపడిందంటున్న విద్యార్థులు -
ఆగిపోతూ.. అవస్థలు పెడుతూ
కూడేరు: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రోజురోజుకూ ఆర్టీసీ సేవలు దిగజారిపోతున్నాయి. కండీషన్ లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రజలకు నరకం చూపుతోంది. ఎక్కడబడితే అక్కడ మొరాయించి ఆగిపోతుండడంతో చుక్కలు కనబడుతున్నాయి. ఆదివారం రాత్రి అనంతపురం నుంచి ఉరవకొండకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కూడేరు సమీపంలో గిపోయింది. ఇంజిన్ వద్ద ఫ్యాన్ బెల్టు తెగిపోవడంతో ఇలా జరిగినట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 40 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఆగిపోవడంతో వారంతా ఇబ్బంది పడ్డారు. చాలా సమయం తర్వాత మరో బస్సు రాగా అందులో ఎక్కి వెళ్లారు. ప్రభుత్వం స్పందించి కండీషన్ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
● గుమ్మనూరు గమ్మున.. అంబులెన్స్ మూలన
గుంతకల్లు టౌన్: వేలాది మంద్రి ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూలనపడింది. గత ప్రభుత్వం సమకూర్చిందనే అక్కసుతోనే ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా సమయంలో అప్పటి ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి అభ్యర్థన మేరకు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ సహకారంతో ఎంపీ కోటా నిధుల కింద అత్యాధునిక అంబులెన్స్ను గుంతకల్లుకు సమకూర్చారు. ఆ సమయంలో వేలాది మంది కరోనా బాధితులను ఈ అంబులెన్స్ కాపాడింది. అనంతరం కాలంలోనూ విశిష్ట సేవలను అందిస్తూ వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహణ లోపం కారణంగా ఈ అంబులెన్స్ను మూలన పెట్టేశారు. దీంతో అత్యవసర రోగులను గోల్డెన్ అవర్లో కర్నూలు, అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు చేరవేయడం గగనమైంది. గతంలో పనిచేసిన కలెక్టర్ వినోద్కుమార్ సైతం ఈ అంబులెన్స్ కండీషన్ బాగున్నట్లుగా తెలుసుకుని వెంటనే ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలూ లేవు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గమ్మునుండడంతోనే అంబులెన్స్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికై నా అంబులెన్స్ను ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
విశిష్ట సంప్రదాయం.. శ్రీవారి కల్యాణం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం విశిష్ట సంప్రదాయంగా అనాదిగా కొనసాగుతోంది. ఈ నెల 10 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 5న జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తరాలుగా కొనసాగుతున్న వివాహ ఆచారానికి మంగళవారం ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం వేదిక కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల ఓ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం ఇక్కడ ఆచారం. నిశ్చితార్థం మొదలుకొని కల్యాణం వరకూ అన్ని బ్రహ్మణ పండితులు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే వివాహ తంతు, బాలికతో శ్రీవారికి వివాహం జరిపించాలనే ఆలోచన, ఆచారం దాదాపు వందేళ్ల క్రితం నుంచి పద్మశాలీయ వంశస్తుల ద్వారా కొనసాగుతూ వస్తోంది. ఏటా శ్రీవారితో పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపించడం ఆనవాయితీ. 5న బాలికతో శ్రీవారి కల్యాణ ఘట్టం.. ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5న ఉదయం 11.30 గంటలకు అభిజిన్ లగ్నంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏడాది పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన అరవా నాగేష్, పావని దంపతుల కుమార్తె శ్రీఽస్వర జాహ్నవి అనే బాలికతో శ్రీవారి వివాహం జరిపించనున్నారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (జాహ్నవి)ను ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కూతురిని అలంకరించి, కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకొచ్చి పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహం జరిపిస్తారు. తొమ్మిదేళ్ల బాలికతో రేపు శ్రీవారి వివాహ ఘట్టం కల్యాణోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు -
కందిపప్పు కోతకు ఏడాది
తాడిపత్రి రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు చౌకధాన్యపు డిపోల ద్వారా కంది పప్పు అందకుండా పోయింది. 2025 మే నుంచి పూర్తిస్థాయిలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు కోటాను ఎత్తివేసింది. అంతకు ముందు ఒక కోటా ఇవ్వకపోయినా మరో కోటా ఇచ్చేవారు. ఏడాది కాలంగా కందిపప్పుపై టెండర్లు పూర్తి కాలేదని, కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు కోటనే ఎత్తేసి లబ్ధిదారులకు పంగనామం పెట్టింది. 2014–19 టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ జరగలేదు. ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ఓట్లు కొల్లగొట్టేందుకు రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేపట్టింది. నెలకు రూ.4.80 కోట్లకు పైగా భారం.. గతంలో ప్రతి నెల 667టన్నుల కందిపప్పు లబ్ధిదారులకు పంపిణీ జరిగేది. ప్రస్తుతం కేవలం రూ.67కే కిలో కందిపప్పును రేషన్ లబ్ధిదారులకు అందజేసేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కందిపప్పు ధరలు పెరిగినా రేషన్ దుకాణాల్లో మాత్రం నిర్ణీత ధరకే పేదలకు అందజేస్తూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కందిపప్పును దశల వారీగా తగ్గిస్తూ చివరకు కోటానే ఎత్తేశారు. ఫలితంగా జిల్లాలోని 6.67 లక్షల రేషన్కార్డుల లబ్ధిదారులపై నెలకు రూ.4.80కోట్లకు పైగా భారం పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో కందిపప్పు నాణ్యతను బట్టి రూ.140 ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేసి ఉంటే కిలోకు రూ.73కు పైగా అదా అయ్యేది. ఏడాది కాలంగా రూ.50 కోట్ల వరకు కందిపప్పు కొనుగోలు ద్వారా ప్రజలు నష్టపోతున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెలకు రూ.4.80 కోట్లకు పైగా నష్టపోతున్న లబ్ధిదారులు -
ఉపాధి కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్కుమార్ అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతోష్కుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక నవయుగ కాలనీలో ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంతోష్కుమార్తో పాటు ఏఐవైఎఫ్ జిల్లా మాజీ నాయకుడు చిరుతల మల్లికార్జున హాజరై, సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ థాపర్, అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వీరులు నేటి యువతకు మార్గదర్శకమన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ఒప్పంద ఉద్యోగాలపై ఆధారపడుతూ యువత భవిష్యత్తు అస్థిరతలోకి నెట్టబడుతోందన్నారు. వైద్యరంగాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను దూరం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేసిందన్నారు. యువతకు గౌరవప్రదమైన ఉపాఽధి కల్పన, నిరుద్యోగ భృతి అమలు, ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆందోళలు, పోరాటాలు సాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రాంబాబు, నిఖిల్, తేజ, రియాజ్, అశోక్, గణేష్ర నానీ పాల్గొన్నారు. తరిమెల అమరనాథరెడ్డి కథలు విలక్షణం అనంతపురం కల్చరల్: తరిమెల అమరనాథరెడ్డి రచనలు విలక్షణంగా ఉంటాయని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం అమరనాథరెడ్డి రచించిన ‘చేదు నిజాలు’ పుస్తకాన్ని స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆవిష్కరించారు. నిర్వాహకులు మానవత కోకన్వీనర్ సలీంమాలిక్ పరిచయ కార్యక్రమంతో ప్రారంభమైన సమావేశానికి సీనియర్ కవి తూముచర్ల రాజారామ్ అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన వీకే అరుణమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృతి స్వీకర్త జిడ్డు కృష్ణమూర్తి ట్రస్టు జాతీయ కార్యదర్శి ఎల్లూరి విశ్వనాథ్, కవులు మహాబోధి కృష్ణమూర్తి, మురళీకృష్ణ, గేట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ డైరెక్టర్ పద్మావతి తదితరులు కమ్యూనిస్టుల త్యాగనిరతితో కూడిన కుటుంబాలపై, తరిమెల నాగిరెడ్డి త్యాగమయ జీవితం గురించి మాట్లాడారు. అదే నేపథ్యమున్న అమరనాథరెడ్డి కథలలో ఎక్కడా కాల్పనికత ఉండదని నేటి సమాజంలో జరుగుతున్న అవకతవకలు అవలక్షణాలు, వాస్తవాలకు ప్రతిరూపంగా చేదు నిజాలున్నాయని కొనియాడారు. శివశంకరనాయుడు రాసిన గీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, సంపాదకులు తోట నాగరాజు, నరిసిరెడ్డి, మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ఎం బాషా, రియాజుద్దీన్, గోవిందరాజులు, నవీన్కుమార్, కవయిత్రి డాక్టర్ అనంత మాలతి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు చేరిన 627 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్
అనంతపురం అగ్రికల్చర్: కోరమాండల్ కంపెనీ నుంచి 627 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువు ఆదివారం జిల్లాకు చేరినట్లు ఇన్చార్జ్ ఏడీఏ, రేక్ ఆఫీసర్ వెంకటకుమార్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ రేక్ పాయింట్లో వ్యాగన్లలో వచ్చిన ఎరువులను ఆయన పరిశీలించారు. 20–20–0–13 రకం 239 మెట్రిక్ టన్నులు, 14–35–14 రకం 239 మెట్రిక్ టన్నులు, 15–15–15 రకం 29 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ఆధారంగా ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సనాతన బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకుందాం అనంతపురం కల్చరల్: సనాతన బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకుందామని ప్రముఖ వేదపండితులు సతీష్శర్మ అన్నారు. నగరంలో వందలేళ్లనాటి శ్రీగురుదత్తాత్రేయ మందిరంలో ఆదివారం శ్రీగాయత్రి సమేత గణపతి, నవగ్రహ హోమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రీ శంకర విజయపరంపర వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి, గోపూజలు, రుద్ర సమేత గాయత్రి హోమం, కలశస్థాపన జరిగాయి. అనంతరం వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించి, మహాపూర్ణాహుతి జరిపించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సతీష్శర్మ, ఆలయ నిర్వాహకులు మాట్లాడారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, నారాయణ సేవ చేశారు. రోడ్డు ప్రమాద రూపంలో ‘కూలి’న జీవితం రాప్తాడురూరల్: దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రమేష్ (49) జీవితం రోడ్డు ప్రమాదంలో విషాదంగా ముగిసింది. రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదం కూలీల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన కూలీలు రోజులాగే పని కోసం అనంతపురం శివారు ప్రాంతానికి ఆటోలో బయల్దేరారు. రామినేపల్లి దాటి కాస్తా దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో ఆటో అదుపుతప్పి కిందపడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురయ్యారు. వారిలో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు, ఆటోను స్టేషన్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలుబత్తలపల్లి: మండలంలోని పోట్లమర్రి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోట్లమర్రి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య, నాగమ్మ దంపతులు ధర్మవరం సమీపంలోని చిన్నూరు వద్ద ఇల్లు నిర్మాణం చేపట్టారు. రోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఆదివారం కూడా ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, పోట్లమర్రి సమీపంలోని పెట్రోలు బంకులోకి వెళ్తుండగా, ఇదే సమయంలో బత్తలపల్లి వైపు నుంచి ధర్మవరం వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోతలయ్యకు ఎడమ కాలు విరిగింది. నాగమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వారిని ఆర్డీటీ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. క్షతగాత్రుల కుమారుడు సాకే చిన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు కింద పడేందుకు మతిస్థిమితం లేని వ్యక్తి యత్నం తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని పుట్లూరు రోడ్డు రైల్వేగేట్ వద్ద ఆదివారం సాయంత్రం గూడ్స్రైలు కింద పడబోతున్న అంజి అనే మతిస్థిమితంలేని వ్యక్తిని స్థానికులు రక్షించారు. అప్గేడ్ర్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు..చుక్కలూరు క్రాస్కు చెందిన అంజి.. పుట్లూరు రోడ్డులోని రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడబోతుండగా స్థానికులు కాపాడారు. వెంటనే సమాచారం అందించగా, ఘటనాస్థలికి వెళ్లి విచారించామని సీఐ తెలిపారు. -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసే రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించ వచ్చని తెలియజేశారు. హనుమ వాహనంపై నృసింహుడు ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి హనుమంత వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహ స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమిద్యాల గ్రామానికి చెందిన గుర్రం సుధాకర్, గుర్రం రవీంద్రనాఽథ్ సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ‘నిజాయితీకి’ న్యాయం! ● డీఈఓ చేరికకు అనుమతులిచ్చిన ఉన్నతాధికారులు ● ఎట్టకేలకు బాధ్యతలు తీసుకున్న ఎం.ప్రసాద్బాబు అనంతపురం ఎడ్యుకేషన్: నిజాయితీ అధికారికి న్యాయం జరిగింది. జిల్లాలో విద్యాశాఖను గాడిలో పెట్టి అందరి మన్ననలు అందుకున్న డీఈఓ ఎం.ప్రసాద్బాబు తీవ్ర పని ఒత్తిడితో అనారోగ్యం బారినపడి గుండెకు స్టంట్ వేయించుకన్న సంగతి తెలిసిందే. 15 రోజుల విశ్రాంతి అనంతరం వైద్యులు ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆధారంగా విధుల్లో చేరేందుకని వస్తే ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకుండా అవమానపరిచారు. గత నెల 24న విధుల్లో చేరాల్సి ఉన్నా...అనుమతులు రాకపోవడంతో ఎదురు చూశారు. ఈ క్రమంలో ‘సాక్షి’లో శనివారం ‘నిజాయితీకి న్యాయం ఎక్కడ?’ శీర్షికతో ప్రత్యేక కథనం వెలువడింది. ప్రసాద్ బాబు డీఈఓగా బాధ్యతలు చేపట్టకముందు జిల్లాలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. కలెక్టర్, ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతో పూర్తిగా చక్కదిద్దారు.ముఖ్యంగా సామాన్య టీచర్లు, చిరుద్యోగులు సైతం నేరుగా వచ్చి తమ సమస్యను చెప్పుకునేలా కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చిన వైనంపై ప్రచురితమైన కథనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లింది. కమిషనర్ కార్యాలయ అధికారులు వెంటనే స్పందించారు. కమిషనర్ ఆదేశాలతో ఆర్జేడీ శామ్యూల్, ప్రసాద్బాబుకు ఫోన్ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లాకు వచ్చిన ఎం.ప్రసాద్బాబు, కలెక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనుమతి ఇవ్వడంతో ఎట్టకేలకు సాయంత్రం తన చాంబరులో బాధ్యతలు తీసుకున్నారు. ఏది ఏమైతేనేం మంచి అధికారికి న్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
హనీట్రాప్ కుదిపేసినా.. మారని తీరు
అనంతపురం సెంట్రల్: హనీట్రాప్.. జిల్లాలోనూ, పోలీస్శాఖను కుదిపేసిన ఘటన.. అక్రమ సంపాదన కోసం కొందరు ఖాకీలు అడ్డదారులు తొక్కి పోలీసు శాఖకు మాయని మచ్చ తెచ్చారు. అవినీతికి పాల్పడిన ఓ సీఐ, ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో ఇద్దరు సీఐలు వీఆర్కు, ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు వేయడంతో పోలీసు శాఖ చరిత్రలో ఏనాడూ జరగలేదు. ఈ ఘటనతోనైనా అవినీతి పోలీసు అధికారులకు కనువిప్పు కలుగుతుందనే భావన వ్యక్తమైంది. అయితే కొందరిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇందుకు తాజాగా ఓ అవినీతి ఉదంతం బయటకు వచ్చింది. రిమాండ్ ఖైదీ నుంచి ఏకంగా డబ్బు వసూలు చేసిన విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు.. పోలీసుశాఖలోని ఏఆర్ విభాగం కానిస్టేబుల్ అవినీతి ఉదంతమిది. రిమాండ్ ఖైదీలకు కోర్టు వాయిదా బందోబస్తు నిమిత్తం వెళ్లిన సదరు కానిస్టేబుల్ ఏకంగా నిందితుడితోనే డీల్ కుదుర్చుకున్నాడు. ఓ దొంగతనం కేసులో సదరు నిందితుడు పట్టుబడినట్లు సమాచారం. రెడ్డిపల్లి సబ్జైలు నుంచి పలుమార్లు రాయదుర్గం కోర్టుకు సదరు నిందితుడిని వాయిదాలకు తీసుకుపోయేవారు. ఎస్కార్ట్ వాహనంలో నిందితులకు బందోబస్తుగా సదరు కానిస్టేబుల్ వెళ్లేవాడు. ఇలా పలుమార్లు సదరు నిందితుడితో చర్చలు జరిపాడు. ఈ కేసులో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను..బెయిల్ రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని సదరు కానిస్టేబుల్ నమ్మబలికాడు. నిందితుడి బంధువుల నుంచి రూ.65 వేలు ఒకేసారి ఫోన్ఫే ద్వారా తన బ్యాంకు ఖాతాకు వేయించుకున్నాడు. బెయిల్ రావడానికి కావాల్సిన ష్యూరిటీలు ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ చేతులెత్తేశాడు. దీంతో నిందితుడు, వారి బంధువులు డబ్బులు తీసుకొని పనిచేయలేదు.. డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా ఘటన బయటకు పొక్కింది. గుట్టుగా విచారణ.. ఏఆర్ కానిస్టేబుల్ అవినీతి ఉదంతంపై గుట్టుగా పోలీసులు విచారిస్తున్నారు. డబ్బు తీసుకున్న మాట వాస్తమని విచారణలో కానిస్టేబుల్ అంగీకరించినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీకి.. కానిస్టేబుల్కు మధ్య ఓ లాయర్ రాయభారం నడిపినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై రెండు, మూడు రోజుల్లో సదరు కానిస్టేబుల్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా పోలీసుశాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. ఓ ఖైదీ నుంచి ఏఆర్ కానిస్టేబుల్ డబ్బు వసూలు రూ.65 వేలు ఫోన్ పే ద్వారా వసూలు -
సజావుగా నీట్
అనంతపురం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్నీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో సజావుగా జరిగింది. పరీక్షకు విద్యార్థుల హాజరు 96.62 శాతం నమోదైంది. అనంతపురం నగర పరిధిలోని ఆరు కేంద్రాల్లో, గుత్తి పట్టణ పరిధి లోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం కల్పించారు. విద్యార్థులు ఉక్కపోతకు గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 3,494 మంది హాజరయ్యారు. 122 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నీట్ నోడల్ అధికారి, డీఆర్ఓ ఎ.మలోల సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అధికారులను అడిగారు. హాజరు 96.62 శాతం నమోదు -
ఆవుకు సీమంతం.. దూడకు పుట్టిన రోజు!
ఆత్మకూరు: మండల కేంద్రంలో ఓ రైతు కుటుంబం ఆవుకు సీమంతం.. చేసి, ఆ ఆవు దూడకు పుట్టిన రోజు జరిపిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆత్మకూరుకు చెందిన గూలి పెద్దిరెడ్డి, ఆయన కుమారులు గూలి కొండారెడ్డి, గూలి వెంకటరెడ్డి తమ ఇంట్లో ఆవు జన్మించడంతో ఆడపడుచులా చూసుకున్నారు. ఆ ఆవుకు జన్మించిన దూడకు శనివారం పుట్టిన రోజు కావడంతో వేడుకలు నిర్వహించారు. తమ కాలనీలోని వారందరినీ పిలిచి దూడ ముందు కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. అదే విధంగా ఆ దూడ తల్లి ప్రస్తుతం గర్భం దాల్చడంతో దానికి కూడా సీమంతం చేశారు. ముత్తయిదువులచేత హారతి ఇచ్చి, నుదుటిన బొట్టు పెట్టారు. పూలు వేసి.. పసుపు, కుంకుమ చల్లి చీర పెట్టి సీమంతం చేశారు. ఈ సందర్భంగా అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను తోటి రైతులతో పాటు మహిళలు మెచ్చుకున్నారు. మనుషులకే శుభకార్యాలు చేయని ఈ రోజుల్లో మూగ జీవాలను తమ ఇంట్లో మనుషులుగా భావించి వేడుకలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
రేషన్ సరుకుల పంపిణీలో కోతలు
అనంతపురం అర్బన్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ సరుకుల్లో చంద్రబాబు ప్రభుత్వం కోతలు పెడుతూనే ఉంది. కందిపప్పు పంపిణీకి మంగళం పాడిన ప్రభుత్వం నిత్యావసర సరుకుల్లో ఒక్కొక్కటిగా తగ్గించేస్తోంది. ఈ నెల జొన్నలు, రాగులు కోటా ఇవ్వని కారణంగా పంపిణీ నిలిచింది. ఆర్భాటంగా ప్రకటించిన గోధుమపిండి పంపిణీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. చౌకధరల దుకాణాల్లో ప్రస్తుతం బియ్యం, చక్కెర మాత్రమే అందిస్తున్నారు. స్టోర్లకు చేరని బియ్యం కోటా జిల్లా వ్యాప్తంగా 1,645 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా రేషన్ ఒకటో తేదీ నుంచి 15 వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ముందు నెల చివరినాటికి స్టోర్లకు బియ్యం, సరుకులు సరఫరా కావాలి. అయితే ఈ నెల బియ్యం కోటా చాలా స్టోర్లకు రెండో తేదీ అయినా సరఫరా కాలేదు. కేటాయింపులు ఇలా... జిల్లాలో 6,72,623 బియ్యం కార్డులు ఉన్నాయి. వీటిలో 20,70,917 యూనిట్లు (సభ్యులు) ఉన్నాయి. కోటా విషయానికి వస్తే జిల్లాకు ప్రతి నెలా 10,118 టన్నుల బియ్యం, 673 టన్నుల చక్కెర, 650 టన్నుల జొన్నలు, 630 టన్నుల రాగులు, 669 టన్నుల గోధుమపిండి కేటాయింపు ఉంది. అయితే ఈ నెల రాగులు, జొన్నల కోటా సరఫరాకాలేదు. దీంతో కార్డుదారులకు ఆ సరుకులు అందని పరిస్థితి. ఇక గోధుమపిండి కూడా కోటా మేరకు సరఫరా కాని కారణంగా మొక్కుబడిగా కొన్ని ప్రాంతాల్లోనే పంపిణీ చేస్తున్నారు. బియ్యం సరఫరా అవుతున్నాయి ప్రతినెలా 31లోగా బియ్యం, సరుకులు స్టోర్లకు సరఫరా అవుతాయి. అయితే ఈసారి సాంకేతిక కారణాల వల్ల కొన్ని చౌక దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. ఒకట్రెండు రోజుల్లో అన్ని దుకాణాలకూ బియ్యం చేరుతాయి. ఇక రాగులు, జొన్నలు స్టాక్ అయిపోయింది. వాటి సేకరణ చేపట్టాం. గోధుమపిండి కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. – రమేష్రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
రెసిడెన్షియల్ శిక్షణ అట్టర్ఫ్లాప్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రెసిడెన్షియల్ శిక్షణ’ కార్యక్రమం జిల్లాలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మొత్తం 409 మంది విద్యార్థులను ఈ శిక్షణకు ఎంపిక చేయగా.. వారిలో 143 మంది (34.96 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 266 మంది (65.04 శాతం) విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం, క్షేత్రస్థాయిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో చివరికి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆలోచన మంచిదే... అమలే అధ్వానం ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ఒకేచోట ఉంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని కేజీబీవీలు, ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేసే విధానంలో అనేక లోపాలు బయటపడ్డాయి. గైడ్లైన్స్ లేకుండా దూకుడుగా.. కార్యక్రమం అమలుకు ముందుగా స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జిల్లాల అధికారులకు సరైన దిశానిర్దేశం లేకుండా బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రతి చోటా వేర్వేరు విధానాలు అనుసరించాల్సి వచ్చింది. హాస్టళ్లలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు టీచర్లను నియమించాలి. అలా ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం చెప్పింది కదా అని జిల్లాస్థాయి అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలపై బలవంతం చేశారు. టీచర్లు లేక... పర్యవేక్షణ గాలికి.. విద్యార్థులను హాస్టళ్లకు తరలించినప్పటికీ, అక్కడ అవసరమైన టీచర్లను నియమించకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లల చదువులో క్రమశిక్షణ తగ్గి, చదువు గాడి తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు పరిచయం ఉన్న పాఠశాల వాతావరణం నుంచి అకస్మాత్తుగా హాస్టళ్లకు మారడం కూడా విద్యార్థులపై ప్రభావం చూపింది. సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. ప్రణాళికా దశలో క్షేత్రస్థాయి వాస్తవాలపై పరిశీలన లేకపోవడమే ఈ కార్యక్రమం అట్టర్ఫ్లాప్ కావడానికి కారణమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ‘రెసిడెన్షియల్ శిక్షణ’ కార్యక్రమం, సరైన అమలు లేకపోతే ఎలా విఫలమవుతుందో ఈ కార్యక్రమమే ఉదాహరణ అని స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకోసం ప్రతిష్టాత్మకంగా అమలు గైడ్లైన్స్ లేకుండా జిల్లాలపై భారంగా మారిన ప్రోగ్రాం పర్యవేక్షణ లోపంతో ఫలితాల్లో పల్టీ జిల్లాలో 409 మంది విద్యార్థులకు 143 మంది ఉత్తీర్ణత -
కాలవ ఇలాకాలో తాగునీటి కష్టాలు
రాయదుర్గం టౌన్/గుమ్మఘట్ట: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సొంత నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. గత సోమవారం రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డు ప్రధాన రహదారిపై తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై బైటాయించగా, తాజాగా మరోసారి శనివారం మధుటాకీస్ ప్రాంతంతో పాటు గుమ్మఘట్ట మండలం కోనాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. రాయదుర్గంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం వద్దకు మున్సిపల్ డీఈ సురేష్, పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని, అప్పటి వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. ఇక గుమ్మఘట్ట మండలం కోనాపురంలో చేపట్టిన ధర్నాపై అధికారులు కనీసంగానూ స్పందించలేదు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుకు అడ్డంగా ఖాళీబిందెలు, ముళ్లకంపలు వేసి ఆందోళన వ్యక్తం చేసినా గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇలాంటి తరుణంలో పట్టణ ప్రాంతంతో పాటు గ్రామాల్లోనూ గతంలో మాదిరి చేతి పంపులు ఏర్పాటు చేస్తే తమ ఇబ్బందులు కాస్తేనా తీరుతాయని పలువురు పేర్కొంటున్నారు. -
క్షణికావేశం తీసింది ప్రాణం
● మనస్తాపంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య అనంతపురం ఎడ్యుకేషన్/యాడికి: క్షణికావేశం టెన్త్ విద్యార్థిని ప్రాణం తీసింది. ఒక్క మార్కుతో ఫెయిల్ అవడాన్ని సున్నిత మనస్కురాలైన ఆ విద్యార్థిని జీర్ణించుకోలేకపోయింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... యాడికి మండలం నిట్టూరుకు చెందిన వెంకటరమణ, అనూష దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె జింకల అపర్ణ (15) ఇటీవల రాసిన పదో తరగతి పరీక్షల్లో 410 మార్కులు సాధించింది. తెలుగులో 73, హిందీలో 81, ఇంగ్ల్లిష్లో 70, గణితంలో 67, సోషల్లో 85 మార్కులు తెచ్చుకుంది. అయితే సైన్స్లో 34 మార్కులే వచ్చాయి. ఒక్క మార్కు తేడాతో ఫెయిలైంది. దీన్ని అపర్ణ జీర్ణించుకోలేకపోయింది. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వారు పాస్ కావడం, తాను ఫెయిల్ కావడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యవసాయానికి వినియోగించే విషద్రావకం తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వంటి అవకాశాలు ఉన్నప్పటికీ, అవగాహన లేక క్షణికావేశంతో విలువైన జీవితం ఆగిపోయింది. పరీక్ష ఫలితాలే జీవితం కాదు అని, కేవలం ఒక దశ మాత్రమే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా తిరిగి ప్రయత్నించే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయంటున్నారు. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో ఫెయిల్ కాదని చెబుతున్నారు. మార్కులు కంటే ప్రాణం విలువైనదని, ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందని అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
బీ ఫార్మసీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15), (ఆర్–23) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ శారద, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. ‘నీట్’కు సర్వం సిద్ధం ● ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ అనంతపురం అర్బన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన శనివారం వెల్లడించారు. ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేస్తారని, ఆ తరువాత ఎవరినీ కేంద్రాల్లో అనుమతించబోరని అన్నారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి ఆత్మకూరు: పని ప్రదేశంలో వడదెబ్బకు గురైన ఉపాధి హామీ కూలీ ఇంటికి వచ్చాక మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు... వడ్డుపల్లికి చెందిన బొజ్జన్న (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చాక నీరసంగా ఉందని పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య దేవి నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఉలుకూపలుకు లేదు. దీంతో గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను పిలిచి పరిశీలించగా.. బొజ్జన్న అప్పటికే మృతి చెందాడు. బొజ్జన్నకు ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. హంస వాహనంపై శ్రీవారుఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో శనివారం లక్ష్మీ నృసింహసామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలతో అలంకరించి హంస వాహనంపై కొలువు దీర్చారు. అనంతరం పల్లకీని ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి వేలూరు నారమ్మ మనువడు రంగయ్య ఆమిద్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు. 65 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు అనంతపురం: జిల్లా వ్యాప్తంగా 65 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) మంజుల తెలిపారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, ఖో–ఖో, కరాటే, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, సెపక్త్రా, స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, వ్రెస్టింగ్, తైక్వాండో, సాఫ్ట్బాల్, కర్రసాము క్రీడల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు అనంతపురం అశోక్నగర్ ఇండోర్ స్టేడియంలోని డీఎస్డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


