పీఆర్సీ సాధనకు చలో విజయవాడ
● యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్
ఉరవకొండ: పీఆర్సీ సాధనకు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ పిలుపునిచ్చారు. యూటీఎఫ్ తలపెట్టిన రణభేరి 2.0 కార్యక్రమంపై చేపట్టిన ప్రచార జాతా ఉరవకొండలోని ఆ శాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్కుమార్తో పాటు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు, నూతన పీఆర్సీ నియాకంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఐఆర్ను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ సభ్యులు రమణయ్య, సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోటీశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, నాయకులు రాఘవ, సంజీవ, శేఖర్, సుబ్బరాయుడు, చంద్రమోహన్, రామాంజనేయులు, బండయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు గోవిందరాజులు, లింగమయ్య, తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం: ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని నార్త్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం జీపు జాత పోస్టర్లను యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


