Anantapur District News
-
కష్టాల్లో అరటి రైతులు
● భారీగా అరటి ధరల పతనం ● ఈదురుగాలులకు నేలవాలిన చెట్లు ● రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు సర్కారు అనంతపురం అగ్రికల్చర్: అరటి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు ధరల్లేక దిక్కులు చూస్తుంటే.. మరోవైపు ఈదురుగాలులకు తోటలు నేలవాలుతుండటంతో నష్టాలు రెట్టింపవుతున్నాయి. కోతకు వచ్చిన నాణ్యమైన మొదటి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. టన్ను రూ.20 వేలకు పైగా ఉండాల్సిన ధర ఒక్కసారిగా నేలచూపు చూడటంతో టన్ను రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్యనే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ● గత నవంబర్లోనే రెండో పంటను అమ్ముకోలేక ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది మొదటి పంటకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నాలుగు రోజులుగా 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలు మండలాల్లో అరటి తోటలు నేలవాలాయి. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 33 శాతం దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తున్న పరిస్థితి. ఇలా పది మండలాల్లో 120 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.4.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. అరటి తోటలకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.ఒక కోటి, మొక్కజొన్న, వరి పంటల నష్టం రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అరటి తోటల రైతులకు ఈ ఏడాదీ కలిసిరాక పెట్టుబడులు కూడా దక్కించులేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అరటి రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోయింది. ఉద్యానశాఖ మాత్రం మొక్కుబడిగా నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. -
అంగరంగ వైభవం.. అంజన్న రథోత్సవం
●భక్తులతో పోటెత్తిన మురడిడి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం వైభవంగా సాగింది. దివ్య స్వరూపుడి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. రథం వద్ద మహిళలు పొర్లుదండాలతో మొక్కు తీర్చుకున్నారు. యువకుల నందికోలు నాట్యం, కోలాటం, చెక్కభజన వంటివి ఆకట్టుకున్నాయి. స్వామివారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద లంకా దహనం నిర్వహించనున్నారు. –డి.హీరేహాళ్(రాయదుర్గం): -
నేత్రపర్వం... లంకా దహనం
● కసాపురంలో ముగిసిన ఉగాది ఉత్సవాలు... గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ తీసుకెళ్లారు. అక్కడ ఈఓ ఎం.విజయరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణానికి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లంకాదహనం వేడుకను ప్రారంభించారు. తిరిగి అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుని అక్కడ లంకాదహనం వేడుకలను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకను చూసేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. లంకా దహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఆలయ సిబ్బంది ఒంటె వాహనంపై కొలువు దీరిన నెట్టికంటి ఆంజనేయస్వామి -
అరటి రైతుల కష్టాలు కనిపించలేదా?
అనంతపురం అర్బన్: ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరటి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని రైతులు నిలదీశారు. అరటి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అరటి గెలలు, బోదెలతో శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో అరటి పంట ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. దీంతో ధర పతనమై రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.22 వేల నుంచి రూ.25 వేలు ధర పలికిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర ఐదారు వేల రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, ధరలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గొప్పలు చెప్పారన్నారు. క్షేత్రస్థాయిలో అరటి రైతులు నష్టపోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టన్ను రూ.25 వేలతో అరటి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, మామిడి, తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, వెంకటరాముడు, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు. నేడు ‘కడపటి యుద్ధం’ ఆవిష్కరణ అనంతపురం కల్చరల్: విలక్షణ రచయిత బండి నారాయణస్వామి కలం నుంచి జాలు వారిన ‘కడపటి యుద్ధం’ నవల ఆదివారం ఆవిష్కరణ కానుంది. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ వేదికగా జరిగే ఈ కార్యక్రజుమానికి ప్రజాకవి గోరేటి వెంకన్న, భూమన్, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి హాజరు కానున్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
కూడేరు: ఉగాది పండుగ నేపథ్యంలో కూడేరు మండలం కొర్రకోడులో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీకి రైతులు తీసుకువచ్చారు. బొమ్మనహళ్ మండలం గోవిందవాడ గ్రామ రైతు గురుస్వామి వృషభాలు ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన రైతు నరసింహులు వృషభాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన రైతు భీమలింగ వృషభాలు, నాల్గో స్థానంలో బొమ్మనహళ్ మండలం లింగాదహళ్కు చెందిన వృషభాలు, ఐదో స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతు మస్తానయ్య వృషభాలు, ఆరో స్థానంలో పత్తికొండ మండలం పులికొండ గ్రామ రైతు మాధవరాజులు వృషభాలు, ఏడో స్థానంలో వజ్రకరూరు మండలం ధర్మపురికి చెందిన రైతు అజిత్కుమార్ వృషభాలు, ఎనిమిదో స్థానంలో బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్కు చెందిన బసన్న వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
పది మంది భక్తులకు అస్వస్థత
గుంతకల్లు రూరల్: కలుషితాహారం తినడం వల్ల పది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా అశోక సిద్ధాపురం గ్రామానికి చెందిన దాదాపు 45 మంది భక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 19న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో వసతి గదులు దొరక్క పోవడం, బయట అద్దె గదుల ధర భారీగా ఉండటంతో దిక్కుతోచని భక్తులు ఆలయం వెలుపలే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండురోజులుగా వారు ఆలయ కేసరి సదనం ముందు భాగంలో సొంతంగా వంట వండుకొని తింటూ, రాత్రి ఆరుబయటే బస చేస్తున్నారు. శుక్రవారం పాయసంతోపాటు, అన్నం, సాంబర్, వంకాయ కూర వండుకున్నారు. రాత్రికి అన్నం మాత్రమే వండుకొని ఉదయం చేసిన కూరలతో తిన్నారు. అర్ధరాత్రి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనాలు ఒకరి తరువాత మరొకరికి మొదలయ్యాయి. కొద్దిసేపటి వ్యవధిలోనే అస్వస్థతకు గురికావడంతో దాదాపు 10 మందిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు కూడా ఆస్పత్రికి చేరుకొని చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని బలిగొన్న ఈత సరదా వజ్రకరూరు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన చిన్న మాదుల రాజేష్, సోమావతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు అరుణ్తేజ్ (13) స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో మరో నలుగురు విద్యార్థులతో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న సొంత పొలానికి అరుణ్తేజ్ వెళ్లాడు. కాసేపు ఆడుకున్న తర్వాత స్నేహితులతో కలిసి బావిలో ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి వెళ్లిన అరుణ్తేజ్ ఎంత సేపటికీ పైకి రాలేదు. దీంతో కంగారు పడిన స్నేహితుల కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలో దూకి గాలింపు చేపట్టారు. నీటి అడుగున పూడికలో ఇరుక్కుపోయిన అరుణ్తేజ్ను వెలికి తీసి ఆగమేఘాలపై ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్తేజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రాజ్కుమార్, ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
కళ్యాణదుర్గం రూరల్: టీడీపీ సీనియర్ నేత, కళ్యాణదుర్గం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం ఎర్రంపల్లిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరారెడ్డి తదితరులు ఎరరంపల్లికి చేరుకుని ఉన్నం హనుమంతరాయచౌదరి పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉన్నం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
ఆర్డీటీ కోసం ఊపందుకున్న ఉద్యమం
● 20 వేల పోస్టుకార్డులు వితరణ చేసిన డాక్టర్ వసంత్ కళ్యాణదుర్గం: ఆర్డీటీని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి పలువురు తమ వంతు సాయంగా చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఆర్ఎంపీ వసంత్ 20 వేల పోస్టుకార్డులను డాక్టర్ తలారి రంగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ... ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆర్డీటీ ఆవశ్యకతను వివరించినట్లు గుర్తు చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం చేపట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖరరెడ్డి, ఎంఎస్ హనుమంతరాయుడు, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, వికలాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పాతలింగ, ఎనుములదొడ్డి సర్పంచ్ విజయ్, నాయకులు మల్లాపురం మల్లి, హుళికల్లు మల్లి, నాగిరెడ్డిపల్లి మారుతి, మాకొడికి నాగేంద్రతో పాటు పలువురు సానుభూతిపరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన
యాడికి: ఉగాది పండుగ సందర్భంగా యాడికి మండలం రాయలచెరువులోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకట సుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్పల్లి రైతు నాగయ్య వృషభాలు, తృతీయ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా అక్కంపేట గ్రామ రైతు ఆదిల్ వృషబాలు, నాల్గో స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకటసుబ్బారెడ్డి రెండో జత వృషబాలు, ఐదో స్థానంలో గార్లదిన్నె మండలానికి చెందిన రైతు రామాంజనేయులు వృషభాలు, ఆరో స్థానంలో తాడిపత్రిలోని గన్నేవారిపల్లి రైతు రమేష్బాబుయాదవ్ వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో కొండుపల్లి చిలమకూరు జయప్రకాష్, ముత్తలూరు నరేష్ చౌదరి, న్యూ వికాష్ స్కూల్ రామకృష్ణ, జొన్నల వ్యాపారి పెద్దన్న, రాజ పుల్లయ్య, రంగస్వామి, నాగరంగయ్య, మదమంచి శివప్రసాదనాయుడు సత్యరించారు. నిరుద్యోగ యువతకు దగా అనంతపురం అర్బన్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో కేవలం 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలను చూపించడం యువతను మభ్యపెట్టే మరో ప్రయత్నమేనని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా తక్కువ సంఖ్యలో పోస్టులను ప్రకటించడం దారుణమన్నారు. మొక్కుబడిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన హామీని రెండేళ్లవుతున్నా అమలు చేయలేదని విమర్శించారు. సమగ్ర నియామక ప్రణాళికతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
కనుల పండువగా సిరిమాను ఉత్సవం
యల్లనూరు: మండలంలోని కొడవండ్లపల్లిలో వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ శుక్రవారం పెద్దమ్మ సిరిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మంపల్లి తిమ్మమ్మ గుడి నుంచి పెద్దమ్మ గుడి వరకూ ఎద్దుల బండిపై సిరిమానును ఊరేగింపుగా తీసుకువచ్చారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, రమాదేవి దంపతులు, కుమారుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ సిరిమాను ఉత్సవాన్ని పెద్దారెడ్డి ప్రారంభించారు. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. కొడవండ్లపల్లి పెద్దమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసింది. తిమ్మంపల్లి తిమ్మమ్మగుడి వద్ద, కొడవండ్లపల్లి పెద్దమ్మ గుడి వద్ద హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. చింతకాయమందలో పెద్దమ్మ, అంకాలమ్మ, యల్లనూరులో పెద్దమ్మ, చిలమకూరులో యల్లమ్మ ఆలయాల వద్దనూ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో వేడుక పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
దెబ్బతిన్న పంటల పరిశీలన
శెట్టూరు: అకాల వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం కేవీకే కో–ఆర్డినేటర్ చెన్నరాయుడుతో పాటు శాస్త్రవేత్తలు, వ్యసాయ అధికారులు పరిశీలించారు. శెట్టూరు, అయ్యగార్లపల్లి, కనుకూరు గ్రామాల్లో గాలీవానకు దెబ్బతిన్న మొక్కజొన్న, బీర, మామిడి తోటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. అనంతరం మామిడిలో చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలను రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు మల్లికార్జున, శిరీష వివరించారు. మామిడిలో పూత, పిందె రాలిపోతున్న సమస్య నివారణకు ప్లానోఫిక్స్, 19:19:19 ను పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వాసుకీరాణి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ముదిగల్లు సమీపంలో చిరుత కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ సమీపంలోని కంకర మిషన్ వద్ద ఉన్న ఓ గుట్టపై శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచారించాయి. గుట్టకు ఆనుకుని పలువురు నివాసం ఉంటున్నారు. చిరుతను గమనించిన వారందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరుతల సంచారంపై పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించినా వాటిని బంధించే చర్యలు చేపట్టలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి చిరుతలను బంధించాలని కోరుతున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
గుత్తి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన రమేష్ (40) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ప్రాధేయపడడంతో ఇటీవల మద్యం తాగడాన్ని పూర్తిగా మానేశాడు. అయితే స్వీయ నియంత్రణ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబసభ్యులు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటపడిన రమేష్ నేరుగా తురకపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని అప్పటికే పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. -
తప్పని గ్యాస్ తిప్పలు
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026వినియోగదారులు ఆందోళన చెందొద్దు : కలెక్టర్ అనంతపురం ఎడ్యుకేషన్: గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెంద వద్దని, సరిపడు గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం రూరల్ మండలం ఆలమూరు వద్దనున్న ఉమా భారతి ఇండేన్ గ్యాస్ గోడౌన్, నగరంలోని ఏిపీహెచ్బీ కాలనీలోని పావన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, ఓటీపీ ద్వారా డెలివరీ చేస్తారని చెప్పారు. ఏజెన్సీల వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవ్వరూ ఏజెన్సీల వద్దకు రావద్దని స్పష్టం చేశారు. ఇంటి వద్దనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తారన్నారు. రాయదుర్గంటౌన్/ కూడేరు: వినియోగదారులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా మందగించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వంటింటి కష్టాలు మొదలయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ ముప్పుతిప్పలు పెడుతోంది. శుక్రవారం రాయదుర్గంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రీఫిల్ కోసం క్యూలో పడిగాపులు కాసినా ప్రయోజనం లేకపోయింది. స్టాక్ లేదంటూ బోర్డు పెట్టారు. ఆదివారం స్టాక్ వస్తుందని తెలపడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇక కూడేరులోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వినియోగదారులు పోటెత్తారు. ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టి గంటల తరబడి ఎండలోనే నిల్చున్నారు. కొందరికి మాత్రమే సిలిండర్లు అందడంతో మిగిలిన వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. రంజాన్కు సర్వం సిద్ధం అనంతపురం కల్చరల్: సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాసాలతో పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో శనివారం పండుగ జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లా అంతటా రంజాన్ వేడుకలకు మసీదులు, ఈద్గాలలో ఏర్పాట్లు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల్లో చివరిరోజు శుక్రవారం ఇఫ్తార్ వేళ మసీదులన్నీ ముస్లింలతో రద్దీగా మారాయి. ● ముస్లింలకు కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ కృపాకటాక్షాలతో పాడిపంటలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, అందరి ఇళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లింలకు ‘అనంత’ రంజాన్ శుభాకాంక్షలు అనంతపురం: ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనలు, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ అని తెలిపారు. -
నేటి ‘పది’ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్ష (13ఈ, 14ఈ)ను ప్రభుత్వ వాయిదా వేసిందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షకులు పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకుని పరీక్ష సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. నేటి ఓపెన్ స్కూల్ పరీక్షలు 30కు వాయిదా ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం 211–గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు ఈనెల 30కు వాయిదా వేసినట్లు డీఈఓ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు. -
యువకుడిపై టీడీపీ నేతల దాడి
ఉరవకొండ రూరల్: మండలంలోని రేణుమాకులపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సర్ది చెప్పేందుకు వెళ్లిన యువకుడిపై దాడి చేసి తమ పైశాచాకాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... చిన్నపాటి విషయానికి రేణుమాకులపల్లికి చెందిన దివ్యాంగులతో శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలు గొడవపడ్డారు. ఏకపక్షంగా దివ్యాంగులపై సాగుతున్న దౌర్జన్యాన్ని గమనించిన ఆ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ మద్దతుదారుడు బోయ రామాంజనేయులు కుమారుడు మణి వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయి మణిపై కట్టెలతో దాడి చేశారు. తలకు బలమైన గాయాలు కావడంతో మణిని కుటుంబసభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. -
నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. ఆంజనేయ రక్షమాం.. పవన పుత్ర పాహిమాం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. శుక్రవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో అలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి ఆలయ పురవీధుల్లో భక్తులు లాగారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పర్యవేక్షించారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● మాజీ మంత్రి శైలజానాథ్ శింగనమల: అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. పంటలు చేతికి అందే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్ర నష్టాలను చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఉదారంగా స్పందించి రైతులకు మంచి జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించాలన్నారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, ఉద్యానపంటలు చేతికి అందే సమయంలో పూర్తిగా దెబ్బతిన్నట్లు వివరించారు. కనీసం పంట కోత ఖర్చులు కూడా చేతికి అందే పరిస్థితి లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను శాసీ్త్రయంగా రూపొందించాలని అధికారులను కోరారు. పంటను బట్టి ఎకరాకు కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు తక్షణ సాయం అందించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతుల పాత రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు తదుపరి పంట సాగుకు వడ్డీలేని కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు పరిహారం అందేలా చూడాలని, లేకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
ఏయ్.. అందరినీ లోపలేస్తా..
కళ్యాణదుర్గం: ‘ఏయ్... ఇక్కడ ప్రోగ్రాం ఎవడు పెట్టమన్నాడు.. అనుమతి ఉందా.. మీ నాయకుడికి కూడా నోటీసు ఇస్తాం.. తమాషాగా ఉందా.. ఈరోజే మీరు ప్రోగ్రాం పెట్టాలా..? చలానా కట్టారా.. ముందు ఇక్కడి నుంచి వెళ్లకపోతే అందరినీ లోపలేస్తా..’ అంటూ కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ వైఎస్సార్సీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం అక్కమాంబ జాతర సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ విషయంపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అక్కమాంబ ఆలయం ఎదురుగా టెంటు వేసుకుని సంతకాల సేకరణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ హరినాథ్, రూరల్ సీఐ గణేష్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ‘సంతకాల సేకరణ కార్యక్రమానికి అనుమతి లేదం’టూ నానా యాగీ చేశారు. ఇది పేద ప్రజల కోసం, కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడిన ఆర్డీటీ సంస్థను కాపాడుకునేందుకు అంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. జాతరకు వచ్చే ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వస్తుందన్న భయంతో టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు ప్రజా కార్యక్రమాన్ని అడ్డుకోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. కాగా జాతరకు ఆటంకం కలిగిస్తున్నారన్న నెపంతో వైఎస్సార్సీపీ నాయకులు రామాంజినేయులు, భట్టువానిపల్లి అంజి, మల్లాపురం మల్లికార్జునలను పోలీసు స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అడ్వకేట్ హనుమంతరెడ్డి, సీనియర్ నాయకులు గోపారం శ్రీనివాసులు, తిరుమల వెంకటేశులు, మండల కన్వీనర్లు గోళ్ళ సూరి, గొల్ల హనుమంతరాయుడు, నాయకులు రామాంజినేయులు, మల్లాపురం మల్లి, పాతలింగ, భాస్కర్, చరణ్, రామిరెడ్డి, దేవ, పాండు, జానీ, మల్లికార్జున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసుల నానాయాగీ ఆర్డీటీ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ అని చెప్పినా వినకుండా అడ్డంకులు -
●అపరిమిత దాహం.. అమిలినేనికి పట్టని వైనం
కుందుర్పి: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. అపరిమిత దాహంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే కుందుర్పి మండలం జంబుగుంపల, కదరంపల్లి గ్రామాల్లో 20 రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య జఠిలమైనట్లు గ్రామస్తులు ఆంజనేయులు, మారెన్న, తిప్పేస్వామి, గోవిందు తదితరులు వాపోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అమిలినేని దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ ఉండడంతో గురువారం జంబుగుంపల పంచాయతీ అధికారులు రెండు రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. అవి ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. -
●కాలవ.. తాగునీటి కష్టాలు కనవా!
రాయదుర్గం టౌన్: దాదాపు 75 వేలకు పైగా జనాభా ఉన్న రాయదుర్గంలో ఐదు రోజులుగా దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మొత్తం 32 వార్డుల్లో బోర్లు పనిచేయడం లేదు. కేవలం రెండు ట్యాంకర్ల ద్వారా మాత్రమే మున్సిపాలిటీ అధికారులు అందజేస్తున్న నీరు ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటిని సరఫరా చేయడం లాంటి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. అరకొర నీటితోనే ఉగాది పండుగను జరుపుకున్న ప్రజలు... రానున్న రంజాన్, శ్రీరామనవమి పండుగలు ఎలా చేయాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ప్రజల తాగునీటి కష్టాలు స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పట్టించుకోక పోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
●తల్లడిల్లిన కన్నప్రేమ..
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు రాయదుర్గంటౌన్: రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గంలోని ముత్తరాసి ఇందిరమ్మ కాలనీ సమీపంలో నివాసముంటున్న రాముడు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి పట్టాలు దాటి వస్తున్న సమయంలో గూడ్స్ రైలు ఢీకొంది. ఘటనలో పట్టాల పక్కకు ఎగిరి పడిన రాముడుకు రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుర్తించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్లారు. కాగా, రాముడు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతి పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన ఆయన 1990లో ఏఆర్ విభాగంలో చేరారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆర్ఐ వలి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకుమార్, అడహక్ కమిటీ సభ్యుడు త్రిలోక్నాథ్, సిబ్బంది షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి కూడేరు: విద్యుత్ షాక్కు గురై ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... కూడేరు మండలం ఉదిరిపికొండకు చెందిన రామాంజనమ్మ(40)కు ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్త ముత్యాలప్ప మృతి చెందాడు. వ్యవసాయ కూలి పనులతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హరి పదో తరగతి పూర్తి చేసుకుని బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వేణు 8వ తరగతి చదువుతున్నాడు. ఉగాది సందర్భంగా గురువారం ఉదయం రామాంజనమ్మ స్నానానికని బాత్రూమ్లోకి వెళ్లింది. బకెట్లో నుంచి హీటర్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్కు గురైంది. ఎంత సేపటికి తల్లి బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవంతో కుమారులు వెళ్లి పిలిచారు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లారు. చేతిపై, కడుపుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తల్లిని గమనించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించాడంతో కుమారుల వేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎల్లుట్లలో ఆగిన చెన్నకేశవస్వామి ఉత్సవం పుట్లూరు: మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో ఏటా ఉగాది సందర్భంగా నిర్వహించే చెన్నకేశవస్వామి ఊరేగింపు ఈ సారి నిలిచిపోయింది. గురువారం నాడు ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇందు కోసం గ్రామస్తులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా పల్లకీ మోసే వారితో పాటు డప్పు వాయిద్య కళాకారులకు భోజనం పెట్టే ఆనవాయితీని దేవదాయశాఖ అధికారులు ఆక్షేపించారు. దీంతో వివాదం నెలకొని ఉత్సవం ఆగిపోయింది. చెన్నకేశవస్వామి ఆలయానికి 28 ఎకరాల మాన్యం భూముల ద్వారా ఆదాయం ఉన్నా... దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమైనట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. హోరాహోరీగా ఎడ్ల బండి పోటీలు విడపనకల్లు: ఉగాది సందర్భంగా విడపనకల్లు మండలం హంచన్హాళ్ గ్రామంలో గురువారం నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో దాదాపు 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ముస్తూరు లింగన్నకు చెందిన ఎద్దులు, ద్వితీయ స్థానంలో నాగేపల్లి రామచంద్రకు చెందిన ఎద్దులు, తృతీయ స్థానంలో నాగేపల్లి ఆంజనేయులు, నాల్గో స్థానంలో సురేష్, ఐదో స్థానంలో నాగేపల్లి శ్రీకాంత్ ఎద్దులు నిలిచాయి. విజేత ఎద్దుల యజమానుల ను అభినందిస్తూ నగదు పురస్కారాలతో సర్పంచ్ నాగేపల్లి కేశన్న, రాకెట్ల రమేష్, రాకెట్ల వన్నూరుస్వామి, గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు భీంరావు, వన్నూరుస్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కర్రసాము పోటీలు గార్లదిన్నె: ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని పాత కల్లూరులో కర్రసాము, ఇరుసు పైకి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఏటా గ్రామంలో యువకులకు గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కర్రసాము, ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. కర్రసాము పోటీల్లో ఆరుగురు పాల్గొనగా వారిలో వెంకటనరసింహ, శ్రీకర్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా వారికి రూ.4 వేలు, రూ.3 వేల నగదు బహుమతి అందజేశారు. ఇరుసు పైకెత్తే పోటీల్లో ఆరుగురు పాల్గొనగా ఉప్పరపల్లి నారాయణ, నాగిరెడ్డిపల్లి రామానంద ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి రూ.6వేలు, రూ.3 వేల నగదు బహుమతి అంద జేశారు. జనం అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు. నేడు కొటిపి చౌడేశ్వరీ దేవి రథోత్సవం హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వీరీదేవి అమ్మవారి రథోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు గురువారం వెల్లడించారు. ఏటా ఉగాది పండుగ సందర్భంగా మూలవిరాట్కు ప్రత్యేకపూజలు, ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 20న రథోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను గ్రామస్తులు పూర్తి చేశారు. ఉరవకొండ: తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. ప్రమాదంలో గాయపడిన తన బిడ్డను చూసి తల్లడిల్లుతూ కన్నీరు పెట్టిన ఓ గోమాత అందరినీ ఆశ్చర్య పరచింది. తన బిడ్డను ముద్దాడుతూ, కంటతడి పెడుతూ అక్కడే నిలిచిపోయింది. బిడ్డను వదల్లేక పోయింది. లేగదూడ చుట్టూ తిరుగుతూ విలపించిన తీరు చూసిన వారి హృదయాలు ద్రవించి పోయాయి. ఈ ఘటనతో కన్నపేగు బంధం మనుషులకే కాదు, జంతువులకూ అంతే బలంగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది. మానవ సంబంధాలు స్వార్థంతో నిండిపోతున్న ప్రస్తుత రోజుల్లో మూగజీవి ప్రేమ అచంచలమైనది అనే ఈ హృదయ విదారక దృశ్యం ఉరవకొండలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం స్థానిక ఇందిరా నగర్లో రోడ్డు పక్కన ఉన్న ఓ దూడపై కారు దూసుకెళ్లింది. రెండు కాళ్ల మీద టైర్లు పోవడంతో దూడ తల్లడిల్లి పోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడికి సమీపంలోనే ఉన్న తల్లి ఆవు వెంటనే పరుగెత్తుకుంటూ దూడను సమీపించి పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా దూడ పైకి లేవలేకపోవడంతో కన్నీరు పెట్టింది. గమనించిన మరికొన్ని ఆవులు సైతం అక్కడకు చేరుకుని దూడను పైకి లేపేందుకు చేసిన ప్రయత్నాలు చూసిన స్థానికులు ఒక్కసారిగా చలించిపోయారు. దూడకు నీళ్లు తాపించే ప్రయత్నం చేశారు. పశువైద్య సిబ్బందిని రప్పించి దూడకు చికిత్స చేయించారు. -
రెండు దశల్లో జన గణన
● మొదటి దశలో గృహ గణన ● ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ సేకరణ ● రెండో దశలో జనాభా గణన అనంతపురం అర్బన్: జన గణన (2027)లో భాగంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో గృహ గణన ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ దీన్ని నిర్వహించనున్నారు. తర్వాత రెండో దశలో జనాభా గణన నిర్వహిస్తారు. జన గణన నిర్వహణలో భాగంగా మొదటి విడత గృహ గణనలో సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నమోదు చేయడంపై ఇప్పటికే 200 మందికి శిక్షణ ఇచ్చారు. ఇదే క్రమంలో మండల, సచివాలయ స్థాయి సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేశారు. జన గణన ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయస్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన చేస్తారు. గృహ గణనలో... మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (హెచ్ఎల్ఓ) చేపడతారు. గృహగణన ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇళ్లకు సంబంధించి డేటా సేకరిస్తారు. ఇంటి కట్టడం నిర్మాణం మొదలు ప్రతి వివరాన్ని నమోదు చేస్తారు. ● గుర్తించిన గృహానికి ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. ఇంటిలో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. ● గృహ గణనలో భాగంగా మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు నమోదు చేస్తారు. ● ఫొన్లు, ఇంటర్నెట్, వాహనాలు నమోదు చేస్తారు. ● ఇంటి కట్టడం తీరు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుదొడ్ల వాడకం నమోదు చేస్తారు. ● విద్యుత్ వినియోగం, నెలవారీ బిల్లు, విద్యుత్తో పనిచేసే పరికరాలు (ఏసీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు, గీజర్, తదితర వివరాలను నమోదు చేస్తారు. ● సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటేనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎంఎస్) ద్వారా నమోదు చేస్తారు. సెన్సెస్ నిర్వహణకు... జిల్లాస్థాయిలో కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అదనపు సెన్సెస్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉంటారు. జిల్లా సెన్సెస్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారు. నగర పాలక సంస్థ, మునిసిపాలిటీల్లో కమిషనర్లు ముఖ్య సెన్సెస్ అధికారిగా ఉంటారు. మండలస్థాయిలో తహసీల్దార్లు సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో సెన్సెస్ వివరాలను సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు సేకరిస్తారు. -
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుక
ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి చెంత గురువారం ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరాన్ని మామిడి తోరణాలు, వేప చిగుర్లు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభించగా.. డాక్టర్ వేదాంతం రాజగోపాలచక్రవర్తి పంచాంగ శ్రవణం గావించారు. పరాభవ నామ సంవత్సర విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వేదాంతం రాజగోపాల చక్రవర్తిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సభ్యుడు చక్రవర్తి ఘనంగా సత్కరించారు. అనంతరం సంగీత కచేరీతో సత్యసాయి యూత్ సభ్యులు అలరించారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కొల్లూరు వందన బృందం సంగీత కచేరీ ఆకట్టుకుంది. -
కసాపురంలో ఉగాది ఉత్సవాలు
● భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ముందు భాగంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. కసాపురం గ్రామస్తులు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ వేద పండితులు వారికి పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఆలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులకు సేవా పురస్కారాలు, మెమొంటోలను అందజేశారు. తర్వాత ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పుర వీధుల్లో స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. -
మంచి సంకల్పంతోనే విజయం
● ఉగాది వేడుకల్లో కలెక్టర్ ఆనంద్ అనంతపురం కల్చరల్: మంచి సంకల్పంతో చేసే పనులతోనే విజయం సాధించగలమని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిపించేందుకు అందరం శ్రమిద్దామని కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది ఉత్సవాలు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగాయి. కలెక్టర్ ఆనంద్తో పాటు పలు శాఖల అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కవులు జూటూరు తులసీదాసు, సీతారామప్రసాద్, నర్సిరెడ్డి, నాగవేణి, రాఘవేంద్ర తదితరులు కవి సమ్మేళనంలో కవితా గానంతో తెలుగుదనాన్ని చాటారు. విద్యార్థుల భక్తిగీతాలాపన, శాసీ్త్రయ నృత్యాలు, జానపద నాట్యాలు అలరించాయి. వేదపండితులు సీతరామమోహన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాలకు చెందిన అర్చక పురోహితులు ప్రసాద్, జగన్నాథమయ్య, మడకశిర పద్మనాభ భట్టార్, చాగంటి లక్ష్మణాచార్యులను నగదు బహుమతితో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బల్లా పల్లవి, నాయి బ్రాహ్మణ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్, రజక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆదినారాయణ, కొండన్న, డీఆర్వో మలోల, ఎస్డీసీ ఆనంద్, టూరిజంశాఖ అధికారి జయకుమార్, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆన్సెట్ శ్రీనివాసులు, డ్వామా పీడీ సలీం బాషా, డీఆర్డీఏ పీడీ శైలజ, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అకాల వర్షం దెబ్బ
అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలు రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గాలి వాన బీభత్సానికి కోతకు వచ్చిన అరటి తోటలు నిలువునా కూలాయి. అలాగే తీగజాతి కూరగాయ పంటలు, వరి, మొక్కజొన్న పంటలకు కూడా తీరని నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే అక్కడక్కడా వడగళ్లతో కూడిన వర్షాలు నమోదు కావడంతో భారీగా పంట నష్టం జరిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలు మండలాల్లో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నార్పలలో 46.6 మి.మీ, రాప్తాడు 36.2, బుక్కరాయసముద్రం 29, బెళుగుప్ప 28.6, గుంతకల్లు 16.2, పామిడి 15.3, కణేకల్లు 13, ఆత్మకూరు 12.2, గార్లదిన్నె 11.4, యల్లనూరు 11.2 మి.మీ వర్షం కురిసింది. 24 మండలాల పరిధిలో 8.6 మి.మీ సగటున అకాల వర్షం కురిసింది. రెండు రోజుల్లోనే జిల్లా రైతులకు రూ.5 కోట్లకు వరకు పంటనష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ● రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి వద్ద గాలివానకు దాదాపు 150 ఎకరాల్లోని అరటి తోటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ● కణేకల్లు మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కణేకల్లు క్రాస్, ఆలూరు, గోపులాపురం గ్రామాల్లో అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. ● అకాల వర్షాలతో శింగనమల, నార్పల మండలాల్లో అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కూడేరు: మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ముద్దలాపురంలో కారు మనిషి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట, కడదరకుంటలో సరోజమ్మకి చెందిన నాలుగు ఎకరాల్లోని అరటి పంట నేలకొరిగింది. అలాగే చోళసముద్రం, మరుట్ల, గొటుకూరు, జల్లిపల్లి, కలగళ్ల తదితర గ్రామాల్లో కూడా అరటికి నష్టం వాటిల్లింది. అరటి, వరి, మొక్కజొన్న పంటలకు తీరని నష్టం దాదాపు రూ.5 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా -
ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం క్రైం: దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఏపీఐఐసీ చల్లా లక్ష్మీప్రసాద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, డీసీసీబీ చైర్మన్ ఎం.కేశవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరి, కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ... 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందాలంటే బస్సు పాస్ గుర్తింపు కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలన్నారు. అలాగే అర్హులైన సహాయకులకు 50 శాతం రాయితీతో టికెట్లు జారీ చేస్తారన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, సౌకర్యవంతమైన బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం శ్రీలక్ష్మి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, దివ్యాంగులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మురడిలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలుడి హీరేహాళ్ (రాయదుర్గం): ప్రసిద్దిగాంచిన డి.హీరేహాళ్ మండలం మురడిలోని ఆంజనేయస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహారెడ్డి, అర్చకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గురువారం విశేష పూజలు, పంచాగ శ్రవణం ఉంటాయి. 20న రాత్రి 7 గంటలకు ముత్యాల పల్లకీ ఉత్సవం, 21న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, 22న లంకా దహనం కార్యక్రమంతో ఉత్సవాలు ముగించనున్నారు. వ్యక్తిపై కొడవలితో దాడియల్లనూరు: పొలానికి నీళ్లు పెట్టే విషయంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరుకు చెందిన గురుభాస్కర్, పుటకాల లోకేష్ ఇద్దరూ బావబామ్మర్దులు. బుధవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ సమయంలో గురుభాస్కర్పై పుటకాల గంగయ్య, లోకేష్ వేటకొడవలితో దాడి చేశారు. ఘటనలో గురుభాస్కర్కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. టీచర్ల సీనియార్టీ జాబితా సిద్ధంఅనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ని ప్రభుత్వ, జెడ్పీ, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు (సబ్జెక్టుల వారీగా), ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు సిద్ధమయ్యాయి. ‘టిస్’ ఆధారంగా జాబితాలు రూపొందించి, www. deoananatapur. blogspot. com లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఈ జాబితాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 24 తేదీలోపు (పనిదినాల్లో) డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. అభ్యంతరం వ్యక్తంచేసే ఉపాధ్యాయుడి పూర్తిపేరు, హోదా, మొబైల్ నంబరు, ట్రెజరీ ఐడీ వివరాలతో పాటు సీనియార్టీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని కోరారు. గడువు మీరిన తర్వాత అందే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలను ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు అప్లోడ్ చేసిన టిస్ వివరాల కాపీని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత డీవైఈఓ, ఎంఈఓ, హెచ్ఎంలకు మూడుసెట్లు ధ్రువీకరించి అందజేయాలని డీఈఓ సూచించారు. -
కేశవా.. దాహం తీరేదెలా?
ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. రోజుల తరబడి తాగునీరు అందకపోవడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత 15 రోజులుగా తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్న వ్యాసాపురం గ్రామస్తుల కష్టాలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామానికి ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్ మరమ్మతులకు లోనవడంతో సమస్య ఉత్పన్నమైందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పొలాల్లోని బోరు బావుల నుంచి నీటిని సేకరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని వ్యాసాపురం గ్రామస్తులు కోరుతున్నారు. -
హామీలను అమలు చేయాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలంటూ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు, రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాటమయ్య మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల ప్రయోజనాలు కౌలు రైతులకూ అందించాలని, రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు సీసీఆర్సీ కార్డు లేకపోయినా పంచనామా నివేదిక ఆధారంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. కౌలు రైతుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వీటీ రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వర్కింగ్ అధ్యక్షుడు రాము, నాయకులు రామాంజనేయులు, హనుమంతరెడ్డి, గోపాల్, ఈశ్వరయ్య, కె.హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య డిమాండ్ -
ఒత్తిళ్లు తాళలేక యువతి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లికాలనీకి చెందిన నాగసుబ్బరాయుడు కుమార్తె లక్ష్మీప్రసన్న(30) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ విధానం కింద ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న లక్ష్మీప్రసన్న కొంత కాలంగా మానసిక ఒత్తిళ్లతో సతమవుతోంది. ఈ క్రమంలో రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత నెల కర్ణాటకలోని కోలార్కు చెందిన విజయ్తో వివాహమైంది. ఇటీవల భర్తతో కలసి పుట్టింటికి వచ్చిన ఆమె బుధవారం కోలార్కు బయలుదేరాల్సి ఉండగా తెల్లవారుజామునే ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ అంపైర్లకు ముగిసిన శిక్షణఅనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ అంపైర్లకు ఆర్డీటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఏప్రిల్లో జరగనున్న ఏసీఏ ప్యానెల్ పరీక్షకు అర్హత సాధించేందుకు వీలుగా పలువురికి శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి ఏడీసీఏ కోశాధికారి జె.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. అంపైరింగ్ చట్టాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీసీఏ కార్యదర్శి యుగంధర్ రెడ్డి (యోగి), సంయుక్త కార్యదర్శి ఎన్.సర్దార్, కౌన్సిలర్ హెచ్.అన్సార్ ఖాన్, అంప్లెర్ల సంఘం అధ్యక్షుడు జోసెఫ్, ఏడీసీఏ మాజీ కార్యదర్శి కె.మధు ఆచారి, సీనియర్ అంపైర్లు బాల సుబ్రమణియన్, కె.మహేష్, జి. అక్కులన్న తదితరులు పాల్గొన్నారు. కారు ఢీ – ద్విచక్ర వాహనదారుడి మృతికూడేరు: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం అరవకూరు గ్రామానికి చెందిన సదాశివారెడ్డి (38)కి భార్య భార్గవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న సదాశివారెడ్డి బుధవారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో కూడేరుకు వచ్చాడు. స్థానిక పోలీస్స్టేషన్ వైపుగా వెళుతుండగా అదే సమయంలో అనంతపురం నుంచి బళ్లారికి వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సదాశివారెడ్డిని స్థానికులు వెంటనే అంబులెన్స్లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికి ఆయన మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి అదృశ్యంగుత్తి: స్థానిక ఆర్ఎస్లోని హోరబ్ చర్చి ప్రాంతంలో నివాసముంటున్న రంగాదేవి, రాజేష్ కుమార్ దంపతుల కుమారుడు రోహిత్ కుమార్ కనిపించకుండా పోయాడు. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రోహిత్కుమార్ను మంగళవారం చిన్నపాటి విషయంలో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
వృద్ధురాలి దుర్మరణం
గార్లదిన్నె: లారీని ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం తరిమెలకు చెందిన హుస్సేన్బీ(64) స్థానికంగానే ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఎదుట తోపుడు బండిపై వివిధ రకాల పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసేందుకని బుధవారం తెల్లవారుజామున ఆటోలో అనంతపురంలోని మార్కెట్కు బయలుదేరింది. గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు దింపుతుండగా ఆటో డ్రైవర్ గమనించకుండా నేరుగా వెళ్లి వెనుక నుంచి ఢీకొన్నాడు. ఆటోలో ఉన్న హుస్సేన్బీ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ ముత్యాలు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, హుస్సేన్బీకి భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చివరి రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులు 16,409 మందికి గాను 16,162 మంది హాజరయ్యారు. 247 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనరు, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ నాలుగు కేంద్రాలను పరిశీలించారు. అలాగే డీవీఈఓ ఎస్వీఎస్ గురువయ్యశెట్టి మూడు, కమిటీ సభ్యులు 9, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 6, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 10 కేంద్రాలను తనిఖీలు చేశారు. రేకుల షెడ్డులో పరీక్షలు.. : అనంతపురం నగర శివారు గుత్తిరోడ్డులోని నలంద జూనియర్ కళాశాల కేంద్రంలో రేకుల షెడ్డులో విద్యార్థులకు పరీక్షలు రాయించడంతో వేడిసెగకు అల్లాడిపోయారు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పబ్లిక్ పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ రేకుల షెడ్లలో నిర్వహించరాదు. పక్కా భవనాల్లోనే నిర్వహించాలి. ఆనందంతో ఊళ్లకు.. : నగరంలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, ప్రైవేట్ హాస్టళ్లు, అద్దె గదులు, బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు చివరి రోజు పరీక్ష ముగియగానే లగేజీ సర్దుకుని ఆనందంగా సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. -
ఉగాది సందడి
అనంతపురంలోని తాడిపత్రి బస్టాండ్లో పండుగ సరుకుల కొనుగోలుదారులతో కిక్కిరిసిన దృశ్యం అరటి, మామిడి ఆకులు, వేపపూత కొంటున్న ప్రజలుఅనంతపురం కల్చరల్ : జిల్లా అంతటా ఉగాది సందడి నెలకొంది. విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ‘పరాభవ’కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సంవత్సరాది తొలి పంటలతో మమేకమై షడ్రుచుల సమ్మేళనంగా పలకరించనుంది. మామిడి, అరటి ఆకులు, వేపపూత, పూలు, పండ్లు, కూరగాయలు, వస్త్ర కొనుగోళ్లతో అనంతపురంలోని దుకాణాలు కిటకిటలాడాయి. పండుగ వేళ ఆలయాలు శోభాయమానంగా ముస్తామయ్యాయి. ప్రత్యేక పూజలు– కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేశారు. -
రైతు కష్టం బుగ్గిపాలు
బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లులో దుండగుల అరాచకానికి ఓ రైతు కష్టం బూడిదైంది. ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహూతైంది. స్థానికులు తెలిపిన మేరకు... ఉంతకల్లులోని ఆర్డీటీ కాలనీకి చెందిన రైతు హెచ్.పరశురామ్ తనకున్న 6 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల దిగుబడులు సాధించాడు. కోతల అనంతరం కంకులను పొలంలోనే రాసిగా నిల్వ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొక్కజొన్న కంకులన్నీ కాలి బూడిదయ్యాయి. మార్కెట్లో క్వింటా ధర రూ.2 వేలు ఉండటంతో దాదాపు రూ.3.60 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ఘటనపై బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. -
జవాన్ ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
గుత్తి రూరల్: ఈత సరదా ఓ జవాన్ ప్రాణాలను బలిగొంది. గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మండలంలోని శ్రీపురం గ్రామానికి చెందిన వేపనింటి వెంకటేష్, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు ఆంజనేయులు(24) అగ్నివీర్లో భాగంగా ఆర్మీలో ఉద్యోగం సాధించి గత మూడేళ్లుగా ఉత్తర్ప్రదేశ్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఉగాది పండుగకు సెలవుపై సోమవారం మధ్యాహ్నం వచ్చిన ఆయన.. మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితులు హరీష్, సోమాంజనేయులుతో కలిసి రజాపురం శివారున జాతీయ రహదారి నిర్మాణం కోసం తవ్విన గుంతల్లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ఈత అంతంత మాత్రమే వచ్చిన ఆంజనేయులు గుంత మధ్య వరకూ వెళ్లి తిరిగి గట్టుకు చేరుకోలేక నీట మునిగి గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న ఇద్దరు స్నేహితులు ఆంజనేయులును కాపాడేందుకు చేసిన ప్రయత్రాలు ఫలించలేదు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లను ఎస్ఐ సురేష్ రప్పించి ఆంజనేయులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గుంతకల్లు నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. వారు పెద్ద వల వేయడంతో ఆంజనేయులు మృతదేహం అందులో చిక్కుకుని బయటపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కారు ఢీకొని వృద్ధుడి మృతి
రాప్తాడు రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డికి చెందిన దాసరి రామకృష్ణ (65), నారాయణస్వామి మంగళవారం ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై పామురాయికి వెళుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. బైక్పై వెనుక కూర్చొన్న రామకృష్ణ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం తాడిపత్రి టౌన్: మండలంలోని చుక్కలూరు వద్ద ఎకై ్సజ్ అధికారులు మంగళవారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో గోవా నుంచి మద్యం బాటిళ్లతో వస్తున్న కారు పట్టుబడింది. వాహనాన్ని అధికారులు సీజ్ చేసి, 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న యాడికి మండలం రామరాజుపల్లికి చెందిన పైలా కొండారెడ్డి పరారీ కాగా, రఫీ వలి పట్టుబడ్డాడు. పరారీలో వున్న కొండారెడ్డి కోసం గాలిస్తున్న అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు గడ్డం నాయుడు, జయనాథరెడ్డి పాల్గొన్నారు. -
నూతన వీసీకి సవాళ్ల స్వాగతం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వీసీ ఎన్వీఆర్ జ్యోతికుమార్కు సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బాధ్యతలతో కూడిన వీసీగా ఇటీవల జ్యోతికుమార్ నియామకమయ్యారు. గత 20 నెలలుగా ఇన్చార్జి వీసీ పాలనలోనే ఎస్కేయూ కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి. దీంతో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడంతో.. కేవలం సాధారణ పాలనా వ్యవహారాలు మాత్రమే ఇన్చార్జ్ వీసీ నిర్వహిస్తూ వచ్చారు. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. వాస్తవానికి మూడు నెలల్లోపే వీసీ వస్తారని ఇన్చార్జి వీసీని నియామకం చేశారు. 20 నెలలు జాప్యం చేస్తూ రావడంతో వర్సిటీ అభివృద్ధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. కనీసం స్నాతకోత్సవం నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డిగ్రీ పట్టాలు తీసుకోలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఇన్అడ్వాన్సెడ్ కింద ఐదు రెట్లు అదనపు ఫీజు చెల్లించి స్నాతకోత్సవ డిగ్రీ తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కొత్త వీసీ వెంటనే స్నాతకోత్సవాన్ని నిర్వహించి డిగ్రీలు ప్రదానం చేయాల్సి ఉంది. పదవుల మార్పు అనివార్యమేనా ఎస్కేయూలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రిజిస్ట్రార్, రెక్టార్ హోదాలో కొనసాగుతున్నారు. తాజాగా వీసీ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు ఉన్నత స్థాయిలో హోదాల్లో ఉండడం కష్టసాధ్యం. దీంతో సామాజిక వర్గాల సమీకరణలో రిజిస్ట్రార్, రెక్టార్పై వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరిని తొలగించే నిర్ణయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది వీసీకి అతిపెద్ద సవాలుగా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు సీనియర్ ప్రొఫెసర్ కావడంతో రెక్టార్గా అవకాశం కల్పించారు. రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా ఉన్న డాక్టర్ రమేష్బాబును రిజిస్ట్రార్గా నియామకం చేశారు. సామాన్య ఉద్యోగికి ఏకంగా రిజిస్ట్రార్ పదవిని కట్టబెట్టడంపై కొంత మంది ప్రొఫెసర్లు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇటీవల రూ.43 లక్షల అరియర్స్ బెనిఫిట్స్ రావాలని ఏకంగా ఆడిటింగ్కు బిల్లులు పెట్టి వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. యూజీసీలో లేని పోస్టు అయిన రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు అరియర్స్ ఇవ్వాలని రిజిస్ట్రార్ హోదాలో కోరడం వివాదాస్పదమైంది. పీజీ అడ్మిషన్లు లేని పరిస్థితి రాయలసీమలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మనుగడ చంద్రబాబు ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకమైంది. 2,500 పీజీ సీట్లు ఉంటే తాజాగా 300 మంది విద్యార్థులు కూడా అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు లేనట్లయితే ఎస్కేయూ ఇప్పటికే మూసివేసే పరిస్థితి ఉండేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీజీ కోర్సుల్లో సున్నా అడ్మిషన్లు పొందిన విభాగాలు 8 ఉన్నాయి. ఈ విభాగాలను బలోపేతం చేయడం, లేకపోతే. కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకరావడం కొత్త వీసీకి అతి పెద్ద సవాలుగా మారనుంది. జాప్యాన్ని అరికట్టాలి డిగ్రీ సర్టిఫికెట్లు సకాలంలో జారీ చేయని పరిస్థితి కూడా నూతన వీసీకి పెను సవాల్ కానుంది. నెలల తరబడి విద్యార్థులు తిరిగినా సర్టిఫికెట్లు జారీ చేయని తీరు ఎస్కేయూ అధికారులకే చెల్లు. ఇప్పటికీ మ్యానువల్ వ్యవస్థనే ఎస్కేయూలో నడుస్తోంది. దీంతో సర్టిఫికెట్ జారీ చేయాలంటే కనీసం నాలుగు, ఐదు సెక్షన్లలో ఫైలు తిరగాలి. ఎక్కడో ఒక చోట ఆ ఫైల్ ఆగడం జాప్యానికి ప్రధాన కారణమవుతోంది. డిగ్రీ సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని అరికట్టాలంటే ఆటోమేషన్ విధానం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మురిగిపోనున్న పీఎం ఉష నిధులు ఎస్కేయూకు న్యాక్ బీ గ్రేడ్ రావడంతో ఐదేళ్ల కాలానికి రూ.20 కోట్ల మేర పీఎం ఉష నిధులు అందాయి. వాస్తవానికి ఏ గ్రేడ్ ఉంటే రూ.100 కోట్ల నిధులు అందేవి. ఆరేళ్ల క్రితం కూడా అందిన రూ.20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. మూడేళ్ల క్రితం మరో రూ.20 కోట్ల నిధులు అందాయి. వీటిని ఈ నెలాఖరులోపు ఖర్చు పెట్టాల్సి ఉంది. ఈ నిధులు వెచ్చించే స్వీయ నిర్ణయం ఇన్చార్జ్ వీసీకి లేకపోవడంతో పూర్తి స్థాయి బాధ్యతలతో కూడిన వీసీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే నెలలు గడుస్తున్నా నియామకం కాకపోవడంతో రెండు నెలల క్రితం హడావుడిగా పనులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నిధులు ఖర్చు పెట్టడానికి ఏడాదిపైగా సమయం పడుతుంది. దీంతో నూతనంగా వీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుగా పీఎం ఉష నిధుల వెచ్చింపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నిధులు ఖర్చు పెట్టడానికి ఏడాది పాటు గడువు పొడిగించాలని కోరాల్సి ఉంది. అనుమతి వస్తే రూ.20 కోట్ల నిధులు మురిగిపోకుండా ఉంటాయి. ఎస్కేయూ నూతన వీసీ జ్యోతికుమార్ ముందు ఎన్నో సవాళ్లు 20 నెలలుగా కొత్త ప్రాజెక్ట్లు లేవు నయా పైసా యూజీసీ నిధులు లేవు మొత్తం 3 వేల పీజీ సీట్లకు గాను.. కేవలం 280 అడ్మిషన్లు 10 పీజీ కోర్సుల్లో సున్నా అడ్మిషన్లు రూ.20 కోట్ల రూసా నిధులు ఖర్చు పెట్టలేని పరిస్థితి -
జగన్ సంకల్పం.. అభివృద్ధికి రాచమార్గం
పామురాయి వద్ద 544డీ జాతీయ రహదారి ప్రవేశ మార్గం శింగనమల సమీపంలో ఫ్లై ఓవర్పై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు సి.బండమీదపల్లి వద్ద దూసుకెళుతున్న వాహనాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చొరవ కారణంగా 544డీ జాతీయ రహదారి మంజూరై, నిర్మాణ పనులు జోరుగా సాగాయి. అనంతపురం నుంచి హైదరాబాద్ మార్గంలోని 44వ జాతీయ రహదారికి అనుసంధానిస్తూ పామురాయి వద్ద నుంచి విజయవాడ వరకు నాలుగు లైన్ల రహదారి ప్రస్తుతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొన్ని చోట్ల సాగుతున్న పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే తాడిపత్రి నుంచి అనంతపురం వరకూ 544డీ జాతీయ రహదారిపై వాహనాలు దూసుకెళుతున్నాయి. నాడు వైఎస్ జగన్ తీసుకున్న చొరవ కారణంగానే ఈ రహదారి అద్భుతంగా తయారైదంటూ వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
పిచ్చికుక్క దాడి... 15 మందికి గాయాలు
రాయదుర్గంటౌన్: స్థానిక లక్ష్మీబజార్లోని కణేకల్లు మార్గంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. మంగళవారం మధ్యాహ్నం రుచి హోటల్ వద్ద నుంచి బాలాజీ టీ పాయింట్ వరకూ ఎదురు పడిన దాదాపు 15 మందిపై దాడి చేసి కరిచింది. బాధితుల్లో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. కాళ్లు, చేతులపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిలో పట్టణానికి చెందిన వారితోపాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది ఇళ్లకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్రయాదవ్ వెంటనే స్పందించి పిచ్చికుక్కను బంధించేందుకు సిబ్బందిని పంపించారు. గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం రాప్తాడు రూరల్: రోజురోజుకూ పెంచుతున్న వంట గ్యాస్ ధరలు తగ్గించి, బుకింగ్ చేసి ప్రతి ఒక్కరికీ సకాలంలో సిలిండర్లు సరఫరా చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం రాప్తాడులో మహిళు ఆందోళన చేపట్టారు. ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి గౌని శారద మాట్లాడుతూ.. వంటగ్యాస్ మహిళల నిత్య జీవితంలో అత్యంత అవసరమైందన్నారు. గ్యాస్ లేకుండా రోజువారీ జీవనం కష్టమవుతోందన్నారు. సిలిండర్ బుకింగ్ సమయంలో సర్వర్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బుకింగ్ చేసిన తర్వాత కూడా సిలిండర్ రావడానికి 3–4 రోజులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డెలివరీ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గ్యాస్ ధరలను తగ్గించి, సకాలంలో సరఫరా చేయాలని, అదనపు డబ్బు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు శేషమ్మ, తులసమ్మ, ప్రశాంతి, రసూల్బీ, సుజాత, ఓబులమ్మ, చిట్టెమ్మ, రమీజా, కుళ్లాయమ్మ, మాధవి, ముత్యాలమ్మ, రేష్మ, రామాంజనమ్మ, భాగ్యమ్మ, ఆచారమ్మ పాల్గొన్నారు. 18 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం పామిడి: మండలంలోని ఎద్దులపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 18 వంట గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామంలోని బసవరాజు కుమారుడు వీరభద్రప్ప తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 18 గ్యాస్ సిలిండర్లను గుర్తించి, సీజ్ చేశారు. వీరభద్రప్పపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సీఎస్డీటీ కంబక్క, వీఆర్వో భాగ్య పాల్గొన్నారు. జీజీహెచ్లో ఇరువర్గాల ఘర్షణ అనంతపురం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని పరస్పరం దాడులు చోటు చేసుకున్నాయి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొనడంతో మంగళవారం అక్కడ దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన అనసూయ గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ ఉన్న మరో వర్గానికి చెందిన వారు ఆమైపె మరోసారి దాడికి పాల్బడ్డారు. ఆ సమయంలో ఇరు వర్గాల వారు రెచ్చిపోయి పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
కసాపురంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా తరలి రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, గుంతకల్లు మున్సిపాలిటీ నుంచి తాగునీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తుల కాలక్షేపం కోసం రోజూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. 19న గ్రామోత్సవం ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న గ్రామోత్సవం ఉంటుంది. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయం వద్ద నుంచి శమీ వృక్షం వరకూ ఊరేగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మంటపం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం ఉంటుంది. 20న రథోత్సవం ఈ నెల 20న స్వామి వారి రథోత్సవం ఉంటుంది. ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాంగ హోమం, సంప్రోక్షణ, బలిహరణ తదితర పూజల అనంతరం విశేష పుష్పాలంకరణలో తీర్చిదిద్దిన సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చి పురవీధుల్లో భక్తులు లాగనున్నారు. 21న లంకాదహనం ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న లంకాదహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ సమీపంలోని కాశీవిశ్వేశ్వరాలయం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంజనేయస్వామి చేతుల మీదుగా లంకాదహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ఎదుట పోలీస్ ఔట్ పోస్టు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు రెండు గంటల పాటు జరిగే లంకాదహనం కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగుతుంది. -
డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాట
● వైఎస్సార్టీఏ నాయకులు అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్టీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో అధికారులకు వినతిపత్రాల సమర్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డీఆర్వో మలోలను నాయకులు కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పీఆర్సీ ప్రకటించకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, నాలుగు డీఏలను పెండింగ్లో ఉంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని నిరసించారు. ఆర్థిక సమస్యలతో పాటు యాప్స్ పేరుతో ఉపాధ్యాయులపై అదనపు భారం మోపుతూ బోధనకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే విజయవాడ ధర్నా చౌక్ వద్ద భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. డీఆర్వోను కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్గౌడ్, రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, వెంకటరమణ, జిల్లా నాయకులు ఓబిరెడ్డి, ప్రసాద్, కృష్ణానాయక్, వెంకటరెడ్డి ఉన్నారు. -
ప్రయాణికుల భద్రతే లక్ష్యం
● రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ గుంతకల్లు: ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు. మంగళవారం భద్రతా తనిఖీల్లో భాగంగా గుంతకల్లు రైల్వే డివిజన్లోని గుంతకల్లు–బళ్లారి సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాతో కలిసి ప్రత్యేక రైలులో రియర్ విండో ద్వారా రైలు మార్గాన్ని పరిశీలించారు. ఈ సెక్షన్లోని రైల్వే ట్రాక్ ఒంపులు, లెవల్ క్రాసింగ్లు, సిగ్నల్ వ్యవస్థతోపాటు రైల్వే బ్రిడ్జిలు పరిశీలించి భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సెక్షన్ ఎక్కవగా రద్దీగా ఉండటంతో రైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఆరా తీశారు. రైళ్లు సమయ పాలనను పాటించేలా ఇంజినీరింగ్, సిగ్నల్, ఆపరేషన్ విభాగం సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఈ సెక్షన్లోని కీలకమైన, సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెంచడంతోపాటు ట్రాక్ పట్టిషం చేయడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న ప్రణాళికపై నిశితంగా అధికారులకు తెలియజేశారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా విభాగాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇలా అయితే పండుగ ఎలా..?
గార్లదిన్నెలో గ్యాస్ ఆటో వద్ద సిలిండర్లు తీసుకుంటున్న దృశ్యం పెద్దవడుగూరులో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ పెద్దవడుగూరు/ యాడికి/ గార్లదిన్నె : తెలుగు సంవత్సరాది ఉగాదితో పాటు రంజాన్ పండుగ వేళ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇరాన్, అమెరికా– ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నెమ్మదించింది. మూడు వారాలవుతున్నా యుద్ధం ఆగకపోవడంతో గ్యాస్ సరఫరాలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయినా అధికారులు గ్యాస్ కొరత లేదని ప్రకటిస్తున్నారు. కానీ గ్యాస్ బుకింగ్ కావడం లేదు. సర్వర్ సమస్య కారణంగా ఆన్లైన్లో రీఫిల్ బుకింగ్ కాకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ల వద్దకు క్యూ కడుతున్నారు. మంగళవారం పెద్దవడుగూరు, యాడికి, గార్లదిన్నె మండల కేంద్రాల్లోని ఇండేన్, భారత్ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగదారులు ఖాళీ సిలిండర్లను తీసుకొచ్చి బారులుదీరారు. అయినా తగినన్ని సిలిండర్లు లేకపోవడంతో చాలామంది వెనుదిరిగారు. పండుగ ఎలా చేసుకోవాలోనని ఆందోళన చెందుతున్నారు. -
మాతాశిశు మరణాలు అరికట్టాలి
అనంతపురం: మాతాశిశు మరణాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మాతాశిశు సేవలపై శ్రద్ధ వహించాలని కోరారు. భవిష్యత్తులో మాతాశిశు మరణాలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ప్రతి ఇంటినీ సందర్శించి గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు తగిన పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రమాదకరమైన లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత వైద్యాధికారి వద్దకు తీసుకువెళ్లి పరీక్షలు చేయించాలని కోరారు. గ్రామస్థాయిలో ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం చేపట్టినప్పుడు పిల్లలు, వారి వయస్సు తగ్గ బరువు చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ నాగ శశిభూషణ్రెడ్డి, డీసీహెచ్ఎస్ డేవిడ్ సెల్వరాజ్, అనస్తీషియన్ డాక్టర్ సోమశేఖర్, చిన్నపిల్లల వైద్యులు దినకర్, శ్రీనివాసులురెడ్డి, బి.విష్ణుమూర్తి, పి.ప్రమీలాదేవి, హేమలత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కడప డీఆర్ఓగా మల్లికార్జునుడు అనంతపురం అర్బన్: అనంతపురం హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న కె.మల్లికార్జునుడును వైఎస్సార్ కడప జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ)గా నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగ్ అనంతపురం అర్బన్: జిల్లాలో ముగ్గురు ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్లకు (పీడీసీ) పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో జి.వెంకటరమాకాంత్రెడ్డిని అనంతపురం హెచ్పీసీల్ సీఏగా, దేవరకొండ అఖిలను కేఆర్ఆర్సీ (కోనేరు రంగారావు కమిటీ) ఎస్డీసీగా, ఇ.కిరణ్మయిని హెచ్ఎన్ఎస్ఎస్ (ల్యాండ్ అక్విజేషన్) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు రాగల నాలుగు రోజులు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారంతో పాటు 19వ తేదీన 3.2 మి.మీ, 20న 8 మి.మీ, 21న 3 మి.మీ, 22న ఒక మి.మీ సగటు వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పగలు 37.6 నుంచి 38.9 డిగ్రీలు, రాత్రిళ్లు 23.3 నుంచి 24.9 డిగ్రీల మేర ఉండవచ్చని తెలిపారు. ఐఐటీ మద్రాస్తో జేఎన్టీయూ(ఏ) ఎంఓయూ అనంతపురం: జేఎన్టీయూ అనంతపురంతో ఐఐటీ మద్రాస్ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఐసీఎస్ఆర్ స్వయం ప్లస్ వేదికపై అందించే పరిశ్రమ అనుసంధానిత కోర్సులు, ఉపాధి కల్పన ఆధారిత నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఆధునిక సాంకేతిక విద్యా అవకాశాలు బలోపేతం చేసే దిశగా ఎంఓయూ దోహదపడుతుందని జేఎన్టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. ఐఐటీ మద్రాస్లో జేఎన్టీయూ (ఏ) తరఫున వీసీ సుదర్శనరావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వి.కామకోటి పరస్పరం అవగాహన ఒప్పందాలను మార్పు చేసుకున్నారు. -
వార్షిక రుణ ప్రణాళిక రూ.19,934 కోట్లు
అనంతపురం అర్బన్: జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక (పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్– పీఎల్పీ) అంచనాలు రూ.19,934 కోట్లు అని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, రైతుల ఆదాయవృద్ధిని దృష్టలో ఉంచుకుని వార్షిక రుణ ప్రణాళిక రూపొందించామన్నారు. బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో రుణ లక్ష్యాలను సాధించాలని సూచించారు. జిల్లాలో వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గృహ నిర్మాణం, విద్య, పునరుత్పాదక శక్తి వంటి రంగాలకు గణనీయమైన రుణాలు అందించేలా వార్షిక రుణ ప్రణాళిక రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం నరేష్రెడ్డి, ఆర్బీఐ మేనేజర్ రోహిత్ అగర్వాల్, నాబర్డ్ ఏజీఎం అనురాధ, డీఐపీఆర్ఓ బాలకొండయ్య పాల్గొన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేటాయించిన రుణ లక్ష్యాలను బ్యాంకర్లు కచ్చితంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు రుణ మంజూరులో నిర్లక్ష్యంవహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానమంత్రి ‘ముద్ర’ రుణాలు 2025–26లో రూ.863.6 కోట్లు రుణాలు మంజూరు చేయల్సి ఉండగా 62.90 శాతం చేశారన్నారు. రుణాల మంజూరులో పురోగతి సాధించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే వివిధ శాఖల్లో ఉన్న డిపాజిట్లను ఉపసంహరిస్తామని చెప్పారు. డీఆర్డీఏ, మెప్మా, పరిశ్రమలు, ఉద్యాన శాఖల అధికారులు వారి పరిధిలో పథకాలకు బ్యాంకుల వారీగా పంపిన వివరాలను పూర్తిస్థాయిలో అందించాలన్నారు. సమావేశంలో బ్యాంకర్లు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
శ్మశానాల కోసం పోరాటమా?
శ్మశాన వాటిక కోసం ఎస్సీలు పోరాడాల్సిన దౌర్భగ్య స్థితిని ప్రస్తుత పాలకులు కల్పించడం సిగ్గుచేటంటూ ఏస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ధ్వజమెత్తారు. ఎస్సీ కాలనీలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలంటూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దళితులు చనిపోతే వారిని పూడ్చేందుకు ఆరు అడుగుల స్థలం లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతి గ్రామంలోనూ ఎస్సీ కాలనీలకు శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. నాయకులు కుంటిమద్ది ఓబులేసు, సుగమంచి శ్రీనివాసులు, శివిజాల అంజి, టీవీరెడ్డి, ఎంసీ కుళ్లాయప్ప, ఆలూరు గంగాధర్, పూసల హనుమంతు, వసంతకుమార్ పాల్గొన్నారు. -
ఆహార భద్రత కరువు
చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు ఆహార భద్రత కరువైందని ఏపీ మహిళ సమాఖ్య నాయకురాళ్లు మండిపడ్డారు. చౌక ధరల దుకాణాల ద్వారా 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిత్యావసర సరుకులతో ధర్నా చేశారు. సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతీప్రసాద్, పద్మావతి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలోని ఈ రెండేళ్లలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. పేదలకు బియ్యంతో పాటు 18 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని, లేకపోతే ప్రజాసంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకురాళ్లు కమ్మక్క, సారంబి రమీజా, జానకి, ఆజాబీ, శివమ్మ, కుళ్లాయమ్మ, హసీనా, సాయిలీలా, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ విద్యార్థులకు రవాణా కష్టాలు
బొమ్మనహాళ్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రవాణా కష్టాలు తప్ప డం లేదు. బస్సులు తిరగని రూట్లోని విద్యార్థులపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణం. మండలంలోని 18 పాఠశాలల పరిధిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 1,003 మంది ఉన్నారు. వీరికి మండల కేంద్రమైన బొమ్మనహాళ్లో మూడు, ఉద్దేహాళ్ హైస్కూల్లో ఒకటి చొప్పు న మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ● బళ్లారి – కళ్యాణదుర్గం మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఆయా గ్రామాల విద్యార్థులు వస్తున్నారు. అయితే నేమకల్లు, ఉంతకల్లు, చంద్రగిరి గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. దేవగిరి, గోవిందవాడ, దర్గాహొన్నూరు, కల్లుహోళ, శ్రీధరఘట్ట, సింగానహళ్లి గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్నా.. అది పరీక్షల సమయానికి లేవు. చంద్రగిరి పాఠశాలలో టెన్త్ విద్యార్ధులకు జిందాల్ ఫ్యాక్టరీ యజమాన్యం బస్సు ఏర్పాటు చేసింది. మిగిలిన గ్రామాల విద్యార్ధులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ లగేజీ ఆటోల్లో సాహసం చేస్తూ ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు పనులు మానుకొని ద్విచక్ర వాహనాలపై విద్యార్ధులను ఎక్కించుకొని పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. పరీక్ష అనంతరం మధ్యాహ్నం ఎండలో ఆటోల్లో వెళ్లలేక విద్యార్ధులు అవస్ధలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పదో తరగతి విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. పరీక్ష అయిపోయాక బొలెరో వాహనంలో స్వగ్రామాలకు వెళ్తున్న టెన్త్ విద్యార్థులు -
క్యాల్షియం, విటమిన్డీ3 తీసుకోవాలి
మోకాళ్ల నొప్పులు ప్రధానంగా కీళ్ల క్షీణత (ఆర్థరైటిస్), అధిక బరువు, గాయాలు, బలహీనమైన కండరాలు, విటమిన్ డీ3 లోపం వల్ల వస్తాయి. బరువు తగ్గడం, క్రమబద్ధమైన వ్యాయామం, పౌషకాహారం తీసుకోవడం వల్ల నొప్పులను నివారించవచ్చు. క్యాల్షియం, విటమిన్ డీ3 పుష్కలంగా ఉండే ఆహారం స్వీకరించాలి. రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, అన్ని రకాల పండ్లు చేర్చుకోవాలి. ఒమేగా–3 అధికంగా, కొవ్వు తక్కువ ఉండే చేపలు, అవిసె, ఆక్రోట్ గింజలు బాగా తినాలి. – డాక్టర్ బి. మహమ్మద్ గౌస్, ఆర్థోసర్జన్, అనంతపురం -
●గుండె పనితీరుపై ప్రభావం..
● అనంతపురం నగరంలోని రాంనగర్కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. దాదాపు ఐదేళ్లుగా ఈ సమస్య ఉంది. ఇతరత్రా జీవనశైలి జబ్బులు కూడా ఉన్నాయి. మార్నింగ్ వాక్ చేయాలంటే మోకాళ్ల నొప్పులతో సాధ్యపడడం లేదు. ఎందరో వైద్యులకు చూపించాడు. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత నివారణ దొరకలేదు. ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. రేపోమాపో ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ● హిందూపురంలోని ఓ ప్రైవేటు హోటల్ నిర్వాహకుడి వయసు 42 ఏళ్లు. ఐదేళ్లుగా మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాడు. ఆర్థో డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. అయితే రోజులో గంటల తరబడి నిల్చొని ఉండటంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఏడాదిగా నొప్పి తీవ్రతరం కావడంతో ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. దీంతో బెంగళూరులోని ఆస్పత్రులను సందర్శిస్తున్నాడు. అనంతపురం /సాక్షి, పుట్టపర్తి నిల్చోవాలన్నా..కూర్చోవాలన్నా.. చివరకు కదలాలన్నా.. మోకాళ్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి మోకాళ్లు ఇటీవల కాలంలో మొరాయిస్తున్నాయి. జీవన శైలిలో మార్పులు, ఫాస్ట్ఫుడ్ పేరుతో తినే తిండి, మినరల్ వాటర్ పేరుతో తాగే నీరు సైతం రసాయనాలతో కూడి ఉండటంతో పాటు వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో 40 ఏళ్లకే చాలా మంది మోకాలి నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ 40 ఏళ్లకే మోకాళ్ల నొప్పితో బాధపడేవారు ఉన్నారు. ఏ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో చూసినా సగటున రోజుకు 50 మంది రోగులు వెళ్తున్నారు. అందులో సగానికి పైగా 40 ఏళ్ల వయసు వారే ఉండటం గమనార్హం. మోకాళ్ల నొప్పి, ఎముకల అరుగుదల, జాయింట్ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. కుటుంబ బాధ్యతలు మోసే వయసులోనే మోకాళ్ల నొప్పితో నడవలేని స్థితికి చేరుకుంటున్నారు. ఫలితంగా శారీరకంగా కోలుకోలేక కుటుంబ భారం మోయలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ● జీవన శైలిలో మార్పుల కారణంగా మోకాళ్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది. ● ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు. వ్యాయామం లేకపోవడం ● ఫాస్ట్ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఊబకాయం ● సూర్యరశ్మి లోపంతో విటమిన్–డి కొరత, కాల్షియం లోపం ● రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు ● వయసు పెరిగే కొద్దీ శరీరంలో క్యాల్షియం స్థాయి తగ్గిపోవడం కూడా మోకాళ్ల అరుగుదలకు దారి తీస్తుంది. అందుబాటులో ఆధునిక వైద్యం.. మోకాళ్ల సమస్యలకు ప్రస్తుతం అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశలోనే ఫిజియోథెరపీ, ఇంజక్షన్లు వంటి చికిత్సలతో నొప్పిని నియంత్రించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు వైద్యులు సూచిస్తారు. రోబోటిక్ సర్జరీ.. ఇటీవల కాలంలో రోబోటిక్ ‘నీ రీప్లేస్మెంట్’ సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రక్త స్రావం, నొప్పి తక్కువగా ఉండటంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మొరాయిస్తున్న మోకాళ్లు నాలుగు పదులకే అరుగుతున్న కీళ్లు కూర్చోలేక... నడక లేక అల్లాడిపోతున్న బాధితులు ఒకేచోట కూర్చొని ఉండటంతో ఇతర అవయవాలకూ ముప్పు సర్జరీలకు జంకుతున్న బాధితులు మోకాళ్ల నొప్పిని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నొప్పుల కారణంగా కాలినడక (వాకింగ్) మానేస్తున్నారు. దీంతో శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు. రోజుల వ్యవధిలోనే మెదడు చురుకుదనం తగ్గి గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. కదల్లేని వారు నీరు కూడా తక్కువ తీసుకోవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కారణాలెన్నెన్నో.. -
మా మొర ఆలకించండి
అనంతపురం అర్బన్: తమ మొర ఆలకించి.. సమస్యలు పరిష్కరించండంటూ అర్జీదారులు అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్రెడ్డి, మల్లికార్జునరెడ్డి వివిధ సమస్యలపై 405 అర్జీలు స్వీకరించారు. ఇందులో 298 అర్జీలు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఇతర సమస్యలపైన 107 వినతులు అందాయి. అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. గుత్తి కోట ఉత్సవాలను విజయవంతం చేశారంటూ అధికారులను కలెక్టర్ ఆనంద్ అభినందించారు. అప్పగించిన బాధ్యతలను అందరూ సక్రమంగా నిర్వర్తించారన్నారు. వినతుల్లో మచ్చుకు కొన్ని.. ఇంటి నిర్మాణం పూర్తయినా పూర్తి బిల్లు మంజూరు కాలేదని పామిడి మండలం కల్లూరుకు చెందిన నరసింహులు అధికారులకు అర్జీ అందజేశాడు. గత ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తే నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తి చేశామని చెప్పాడు. రూ.1.80 లక్షలకు గానూ రూ.90 వేలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.90 వేలు మంజూరు చేయించాలని విన్నవించాడు. ● రోడ్డు స్థలం ఆక్రమించి షెడ్డు నిర్మించి రస్తా లేకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారని రాయదుర్గం పట్టణం ఎరుకల విధికి చెందిన శివన్న ఫిర్యాదు చేశారు. షెడ్డును తొలగించాలని మునిసిపాలిటీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని తెలిపాడు. పరిష్కార వేదికలోనూ గతంలో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఇకనైనా రస్తా సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. ‘పరిష్కార వేదిక’లో ప్రజల వినతి వివిధ సమస్యలపై 405 అర్జీలు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశంఈ రైతు పేరు మిడతల నాగన్న. బుక్కరాయసముద్రం చెన్నంపల్లి గ్రామం. భూ సమస్యను పరిష్కరించాలని ఐదేళ్ల నుంచి అర్జీ ఇస్తున్నా అధికారులు స్పందించలేదు. ఈ రైతుకు సర్వే నంబరు 371–2ఏలో 4.44 ఎకరాలు పిత్రార్జితంగా సంక్రమించిన పట్టా భూమి ఉంది. ఇందులో నాలుగు ఎకరాలను వేరొక వ్యక్తి ఐదేళ్ల క్రితం ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడని నాగన్న తెలిపాడు. తమ పొలం కింది భాగాన భూమి కొనుగోలు చేసి... ఆ భూమిని కాకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో తమ భూమిని ఆన్లైన్లో ఎక్కించుకున్నాడని ఆరోపించాడు. సమస్య పరిష్కరించాలని ఐదేళ్లగా తహసీల్దారు కార్యాలయం, కలెక్టరేట్లో అర్జీలు ఇస్తున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. -
పాపం.. ఆజాద్ వలి!
గార్లదిన్నె: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం బధిర విద్యార్థి పట్ల శాపంగా మారింది. ఫీజు చెల్లించని కారణంగా పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. తాటిచెర్ల గ్రామానికి చెందిన ఆజాద్వలికి పుట్టుకతోనే మూగచెవుడు. బధిరుడైన ఇతడికి తల్లి లేదు. తండ్రి సంరక్షణలో ఉంటున్నాడు. గ్రామంలోని ఉన్నతపాఠశాలలో చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించే విషయంలో పాఠశాల హెచ్ఎం–ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. తండ్రికి తెలిపి ఫీజు కట్టించుకోవడంలో తాత్సారం చేశారు. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులు పరీక్ష కోసం గార్లదిన్నె జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలోని పరీక్ష కేంద్రానికి వెళ్లారు. తాను కూడా పరీక్ష రాయాలన్న తపనతో ఆజాద్వలి రెడీ అయ్యి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. అక్కడ సిబ్బంది, ఇన్విజిలేటర్లు హాల్టికెట్ అడగ్గా బిత్తర చూపులు చూశాడు. తోటి పిల్లలు గదుల్లోకి వెళ్తుంటే దీనంగా ఉండిపోయాడు. చివరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇదంతా చూసిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ‘అయ్యో పాపం’ అంటూ నిట్టూర్చారు. పరీక్ష ఫీజు కట్టించే విషయంలో ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టి ఉంటే ఆ విద్యార్థికి విద్యా సంవత్సరం వృథా అయ్యుండేది కాదు. -
ఏటీఎం దొంగ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో ఉన్న ఇండియన్ బ్యాంకు ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేసిన యువకుడిని అనంతపురం మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ శరత్ చంద్ర సోమవారం వెల్లడించారు. పామిడి మండలం పాల్యం తండాకు చెందిన పాల్తే సాయికుమార్నాయక్ ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తాగుడు, జూదాలకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నెల 10న రాత్రి ఇండియన బ్యాంక్ ఏటీఎం గదిలోకి చొరబడి యంత్రం తలుపులు తీయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో సైరన్ మోగడంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సోమవారం ఉదయం ఆర్టీసీ బస్టాండు సమీపంలో తచ్చాడుతున్న సాయికుమార్ నాయక్ను గుర్తించి అరెస్ట్ చేశారు. వేతనాలు చెల్లించకపోతే సమ్మె తప్పదు ● సత్యసాయి తాగునీటి పథకం కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఓబులు అనంతపురం టవర్క్లాక్: వేతన బకాయిలు చెల్లించకుంటే సమ్మెలోకి వెళతామంటూ సత్యసాయి తాగునీటి పథకం కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు ఓబులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఓ ఆనంద్ను కలిసి సమ్మె నోటీసు అందజేసి, మాట్లాడారు. ఏప్రిల్ 1 నాటికి 5 నెలల బకాయిలు పేరుకుపోతాయని తెలిపారు. దాదాపు 28 సంవత్సరాలుగా సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా 900 గ్రామాల్లో 560 మంది కార్మికులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. సకాలంలో వేతనాలు చెల్లించకపోవంతో కార్మిక కుటుంబాలు దుర్భర జీవనం సాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్మికులు శ్రీరాములు, వన్నూరప్ప, హరిప్రసాద్, వెంకటేష్ పాల్గొన్నారు. బైక్పై నుంచి పడి మహిళ మృతి మరొకరికి తీవ్రగాయాలు గుంతకల్లు రూరల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని అనంతపురం రోడ్డులో నివాసముంటున్న అక్బర్బీ (45) కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పత్రికలు పంచేందుకని సోమవారం తన మేనల్లుడు మహబూబ్ బాషాతో కలసి ద్విచక్ర వాహనంపై గుంతకల్లుకు వచ్చింది. పని ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు మార్గ మధ్యంలో నక్కనదొడ్డి వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పి ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో అక్బర్బీ మృతి చెందింది. ఘటనపై గుంతకల్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ‘ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలి’ అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీధర్ గౌడ్ తెలిపారు. 12వ పే రివిజన్ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, సరెండర్ లీవులను వెంటనే చెల్లించడంతో పాటు ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల బకాయిలను త్వరితగతిన చెల్లించాలనే డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా సబ్ కమిటీ సభ్యులు, నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. -
పశువులకు గాలికుంటు టీకాలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదకర గాలికుంటు వ్యాధి బారిన పశువులు పడకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని రైతులకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రెవెన్యూభవన్లో పశుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పోస్టర్లను విడుదల చేసి, మాట్లాడారు. 2030 నాటికి గాలి కుంటు వ్యాధిని సమూలంగా నివారించే కార్యక్రమంలో భాగంగా జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమం (ఎన్ఏడీసీపీ) కింద కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఏప్రిల్ 29 వరకు 45 రోజుల పాటు అన్ని రకాల పశువులు, ఎద్దులు, గేదెలు, దూడలకు ఉచితంగా టీకాలు అందజేస్తున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల పశువులకు టీకాలు వేయాలనే లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ గ్రామాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
అనంతపురం: టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గం కడదరకుంట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు పుష్పలత అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సోమవారం ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. వ్యవసాయ అభివృద్ధికి చర్యలు బుక్కరాయసముద్రం: వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం సాయంత్రం కొట్టాలపల్లిలో ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు కొత్త పంటలు సాగు చేయాలన్నారు. నీటి ఆదా కోసం డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగించాలన్నారు. ప్రభుత్వాలు అందించే పథకాలు, కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవి, సర్పంచ్ పార్వతి, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యాం సుందర్రెడ్డి, ఎంపీడీఓ సాల్మన్ రాజు, హౌసింగ్ డీఈ రామ్మూర్తి, డీటీ నాగరాజు, సొసైటీ చైర్మన్ కేశన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు. పోలీసు సేవా పతకాలకు ఎంపిక ● త్వరలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డుల ప్రదానం అనంతపురం సెంట్రల్: ఉగాది పండుగను పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసు, అగ్నిమాపక, విజిలెన్స్ అధికారులు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తమ సేవా పతకానికి ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ఆర్ఎస్ఐలు రాంబాబు, మునిరత్నం, సేవా పతకానికి టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ క్రాంతికుమార్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏఎస్ఐ రాజకుళ్లాయప్ప, స్పెషల్ బ్రాంచ్ హెడ్కానిస్టేబుల్ గోపీ, బొమ్మనహాళ్ కానిస్టేబుల్ జగదీష్, 14వ బెటాలియన్ ఆర్ఎస్ఐ స్వామిదాస్, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు, గోపీనాథ్, అగ్నిమాపకశాఖలో లీడింగ్ ఫైర్మెన్లు మదన్మోహన్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, డ్రైవర్ అక్కులప్ప ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ శాఖలో భాస్కర్నాయుడు, ఏపీ పోలీసు సేవా పతకానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ శాఖలో శ్రీనివాసులు ఎంపికయ్యారు. త్వరలో వీరికి ఆయా శాఖల రాష్ట్ర ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. 28న హ్యాకథాన్ అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసుశాఖ,ఇన్కక్స్ఏఐ సంస్థ సహకారంతో ఈ నెల 28న అనంతపురంలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం ఆయన చాంబర్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. -
పరిష్కార వేదికకు 114 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 114 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్య తీవ్రత తెలుసుకున్నారు. చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రొబేటషనరీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, డీఎస్పీ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు సర్వేయర్ల సస్పెన్షన్ ● పాపంపేట భూవ్యవహారం.. అనంతపురం అర్బన్: పాపంపేట భూ వ్యవహారంలో మండల సర్వేయర్లు ప్రతాపరెడ్డి, రఘునాథ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సర్వే భూ రికార్డుల శాఖ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ ఈనెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. పాపంపేట భూముల వ్యవహారంలో సర్వేకు సంబంధించి అవతకవలపై డీఐఓఎస్ (డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే) ద్వారా సమగ్ర విచారణ జరిపించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 300 ఎకరాల సర్వేకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు విచారణ నివేదిక వచ్చిందన్నారు. ప్రస్తుతం బుక్కరాయసముద్రం మండల సర్వేయర్గా ఉన్న వి.ప్రతాపరెడ్డి, అనంతపురం రూరల్ మండల సర్వేయర్ బి.రఘునాథ్ అవకతకవలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు అనంతపురం ఆర్డీఓ సిఫారసు చేశారన్నారు. ఈ మేరకు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో డైరెక్టర్ పేర్కొన్నారు. అదే క్రమంలో వారిద్దరూ ముందస్తు అనుమతి లేనిదే జిల్లా కేంద్రం విడిచి వెళ్ల కూడదని అందులో పేర్కొన్నారు. ఖాళీ బిందెలతో నిరసన రాయదుర్గం టౌన్: స్థానిక కణేకల్లు మార్గంలోని ఎంసీఏ ఇందిరమ్మ లే అవుట్ వాసులు తాగునీటి కోసం సోమవారం నిరసన తెలిపారు. ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టారు. కాలనీలో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయని, బోర్లన్నీ పనిచేయకపోవడంతో తాగునీరు లభ్యం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అధికారులు పంపిస్తున్న రెండు ట్యాంకర్ల నీరు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. తమకు పైప్లైన్ ఏర్పాటు చేసి కొళాయిలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున మద్దతు తెలిపారు. సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. -
పార్లమెంట్ వద్ద సేవ్ ఆర్డీటీ నినాదాలు
అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా ఉన్న ఆర్డీటీని పరిరక్షించాలంటూ వైఎస్సార్సీపీ సాగిస్తున్న పోరాటం ఢిల్లీని తాకింది. సోమవారం పార్లమెంట్ వద్ద సేవ్ ఆర్డీటీ అంటూ వెఎస్సార్సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నినాదాలు చేశారు. సేవ్ ఆర్డీటీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీటీ లేకపోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బడుగు బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల శ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేస్తూ విదేశీ నిధులు అందేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, గురుమూర్తి, మాజీ ఎంపీలు వెవీ సుబ్బారెడ్డి తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వడగాల్పులపై జాగ్రత్తలు పాటించాలి
అనంతపురం అర్బన్: వేసవి వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో వేసవి వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక–2026పై అధికారులతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీలు, మునిసిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 534 చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా తాగునీరు, మజ్జిగ సరఫరా చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్మికుల పనివేళల్లో మార్పు ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలు, పారిశుధ్య కార్మికుల పనివేళల్లో మార్పుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉదయం 10 లోపు, సాయంత్రం 3 గంటల తరువాత పని చేయించాలన్నారు. పశువుల కోసం తొట్టెలు ఏర్పాటు చేసి నీటిని నింపాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంతవరకు చల్లని ప్రదేశాల్లో ఉండాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో గొడుగు లేదా టోపీ ధరించాలని చెప్పారు. తెల్లని నూలు దుస్తులు ధరించాలన్నారు. నేరుగా ఎండలో తిరగడం, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య శారీక శ్రమతో కూడిన పనులు చేయవద్దని సూచించారు. తగిన నీరు, మజ్జిగ, గ్లూకోజ్నీరు తీసుకుంటూ ఉండాలన్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని ప్రదేశానికి చేర్చి వైద్యసహాయం అందించాలన్నారు. -
సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం
● జాతీయ సమ్మేళనంలో మేయర్ వసీంఅనంతపురం క్రైం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. ‘అభివృద్ధి చెందిన ఢిల్లీ – 2047’ అంశంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సమ్మేళనంలో మేయర్ వసీం పాల్గొని ‘పట్టణాల అభివృద్ధి – దీర్ఘకాలిక ఫలితాలు’ అంశంపై మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను నేరుగా అందించేందుకు ఏర్పాటైన సచివాలయ వ్యవస్థపై ఇతర దేశాల ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాల సేవలను వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచారన్నారు. అలాగే డిజిటల్ బోధన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి విద్యా ప్రమాణాలను పెంచే దిశగా చర్యలు చేపట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమ్మేళనంలో భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మేయర్లతో పాటు దక్షిణాఫ్రికా, రష్యా, నెదర్లాండ్స్, ఇథియోపియా, టర్కీ, బ్రెజిల్ దేశాలకు చెందిన మేయర్లు, ప్రతినిధులు హాజరయ్యారు. -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 143 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు కలిపి 32,289 మందికి గాను 31,929 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరయ్యారు. అనంతపురంలోని రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా పరిశీలకులు సుబ్బారావు తొమ్మిది కేంద్రాలు, డీఈఓ ప్రసాద్బాబు ఆరు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ రెండు కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 54 కేంద్రాలను తనిఖీలు చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 130 మంది గైర్హాజరు ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన తెలుగు, ఉర్దూ పరీక్షలకు 130 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 720 మంది విద్యార్థులకు గాను 590 మంది హాజరయ్యారు. -
●కొబ్బరిచెట్టుపై పిడుగు
బెళుగుప్ప: శీర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో ఏకాంబరప్ప ఇంటి వెనుక ఉన్న కొబ్బరిచెట్టుపై సోమవారం రాత్రి పిడుగుపడింది. చిరుజల్లులు పడే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో కాలనీవాసులు ఉలిక్కిపడి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అప్పటికే కొబ్బరి చెట్టు కాలుతూ కనిపించింది. అప్రమత్తమైన కాలనీవాసులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి.. కొబ్బరిచెట్టును మొత్తం యంత్రంతో కోసి వేయించారు. పిడుగు పడిన సమయం రాత్రి కావడంతో కాలనీలోని వారంతా ఇళ్లల్లో ఉన్నారు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చర్చించుకున్నారు. -
వంట గ్యాస్ కష్టాలు తొలగించాలి
వంట గ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాంటూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని వంట గ్యాస్ కష్టాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేంద్రకుమార్, రామిరెడ్డి, రామాంజనేయులు, వెంకటనారాయణ, ముత్తూజ, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
●మోయలేనంటూ.. మొరాయింపు
కణేకల్లు: సీ్త్ర శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన చంద్రబాబు సర్కార్... తెర వెనుక మాత్రం బస్సుల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో అధిక సామర్థ్యంతో ప్రయాణికులను మోయలేక బస్సులు ఎక్కడికక్కడ మొరాయిస్తున్నాయి. రాయదుర్గం–ఉరవకొండ మార్గంలో రోజూ ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు లోనవుతూ ఆగిపోవడం పరిపాటిగా మారింది. రాయదుర్గం–ఉరవకొండ కణేకల్లు మీదుగా రాయదుర్గం డిపోకు చెందిన 5 బస్సులు, ఉరవకొండ డిపోకు చెందిన 4 బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులన్నీ పూర్తి పాతవి. మరమ్మతులకు లోనై ప్రతిసారీ సరి చేయడం మళ్లీ రూటుకు పంపడం అధికారులకు పరిపాటిగా మారింది. నిర్వహణ లోపం కారణంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు అవి కాస్త మొరాయిస్తున్నాయి. తాజాగా సోమవారం కణేకల్లు శివారున వేదవతి హగరిలో రాయదుర్గం డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వెళుతూ జాయింట్ రాడ్ కట్ కావడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో మండుటెండలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
రైతులపై అక్రమ కేసులు
● ఎస్ఆర్సీ సిబ్బంది నిర్వాకం శింగనమల: బ్లాస్టింగ్ సమయంలో సమీప పొలాల్లోకి ఎగిరిపడ్డ రాళ్లను తొలగించాలని కోరిన రైతులపై ఎస్ఆర్సీ సిబ్బంది అక్రమ కేసులు పెట్టారు. అనంతపురం నుంచి తాడిపత్రి వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎస్ఆర్సీ సంస్థ రోడ్డు పనులు చేపడుతోంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన కంకర కోసం శింగనమల మండలం సి.బండమీదపల్లి పరిసర కొండల్లో బ్లాస్టింగ్ చేస్తోంది. బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో పెద్దపెద్ద రాళ్లు సమీపంలోని రైతుల పొలాల్లోకి ఎగిరిపడుతున్నాయి. పంట సాగుకు ఇబ్బందికరంగా మారడంతో రైతులు ఎస్ఆర్సీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. రాళ్లను పొలాల్లోంచి తొలగించాలని కోరారు. అయితే సిబ్బంది రాళ్లను తొలగించకుండా రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లాస్టింగ్ ప్రక్రియ ముందుకు సాగకుండా రైతులు అడ్డుకుంటున్నారని అందులో ఆరోపించారు. దీంతో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సుధాకర్, గోపీ అనే రైతులను పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రైతులు విలేకరులతో మాట్లాడారు. బ్లాస్టింగ్ చేసిన తర్వాత రాళ్లు తమ పొలంలోకి వచ్చి పడ్డాయని, వాటిని తొలగించండని కోరితే తమపైనే అక్రమ కేసులు పెట్టి.. పోలీసుల ద్వారా భయపెడుతున్నారని వాపోయారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. -
ఒత్తిళ్లు.. ఉద్యోగుల బెంబేలు
అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న భారీ లక్ష్యాలు పంచాయతీ అధికారుల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి రాత్రిదాకా ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కొందరు ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. రెండు రోజుల కిందట గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీఓ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన పన్నుల వసూళ్ల ఒత్తిడితోనే జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో చంద్రశేఖర్ ఫొటో పెట్టి...‘పన్నుల వసూళ్లకు డిప్యూటీ ఎంపీడీఓ బలయ్యాడు’ అంటూ పోస్టులు పెట్టారు. ఇలాంటి ఒత్తిడి ఎన్నడూ చూడలేదు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విలేజ్ డెవలప్మెంట్ అధికారి పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ విస్త్తృతంగా ఫార్వర్డ్ అవుతోంది. ఆ వాయిస్ మెసేజ్లో ఏముందంటే... ‘రోజుకు రూ.10 లక్షల పన్నుల వసూళ్ల లక్ష్యం విధించారు. నా వయసు 57 ఏళ్లు. 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్నా. అయినా ఇంతటి ఒత్తిడి ఎప్పుడూ చూడలేదు. పన్నుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మానసిక టెన్షన్ ఎదుర్కొంటున్నా. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజీనామా చేయాల్సి వస్తుంది. రోజుకు రూ.10 లక్షలు వసూలు చేయాలంటున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వచ్చినా అంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాదు. కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు అంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాకు కుటుంబాలు లేవా? రెండో శనివారం, ఆదివారం కూడా ఇదే పని చేయాలా? ఒత్తిళ్లు కొనసాగితే తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకు ఈఓఆర్డీ, ఎంపీడీఓ, డీపీఓ, కమిషనర్ బాధ్యులవుతారు’ అని మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ పంచాయతీ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం పునరాలోచించాలి.. జిల్లాలో పని చేస్తున్న గ్రామ అభివృద్ధి అధికారు(వీడీఓ)లు తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాలు మార్చుకోకపోతే తాము అతి తొందరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘మాకూ కుటుంబాలు ఉన్నాయి.. చిన్నవయసులోనే ఆరోగ్యాలు దెబ్బతింటే మా కుటుంబాలు ఏమి కావాలని’ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడో కూర్చుని సంస్కరణల పేరుతో హోదాలు మార్చడం కాదని, ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలని మండిపడుతున్నారు. జిల్లా అధికారులు కూడా ఈ విషయంలో వైఖరి మార్చుకోవాలని కోరుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ల నాయకులకూ చురకలంటిస్తున్నారు. ‘పనికిరాని ఇన్ని యూనియన్లు ఉండడం వల్లే ప్రతి ఒక్కరూ మనల్ని పురుగులు చూసినట్టు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో పంచాయతీ ఉద్యోగుల తీవ్ర ఆవేదన గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీఓ గుండెపోటుతో మృతి చెందాడంటున్న వీడీఓలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీకాకుళం జిల్లా వీడీఓ వాయిస్ మెసేజ్ -
‘హద్దు’మీరిన మట్టి దోపిడీ
విడపనకల్లు: సంపాదన కోసం ‘పచ్చ’ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ భూముల్లోని సహజ వనరులను దోపిడీ చేసేస్తున్నారు. జేసీబీలను పెట్టి కొండలు, గుట్టలు కరిగించి జేబులు నింపుకుంటున్నారు. దోపిడీ పర్వం చేస్తున్న వారు అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతి నిధులు కావడంతో అడ్డుకట్ట వేసేందుకు ఏ అధికారీ సాహసించడం లేదు. విడపనకల్లు మండల పరిధిలోని ఆంధ్రసరిహద్దులో ఉన్న ఎర్రితాత గుట్ట వెనకభాగంలో ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ఉన్నాయి. వీటిపై కళ్యాణదుర్గం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధికి చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కన్ను పడింది. దీంతో స్థానిక టీడీపీ నాయకులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని అక్రమ తవ్వకాలతో మట్టి మాఫియాకు తెరలేపారు. తెల్లవార్లూ అక్రమ రవాణా.. అధికార టీడీపీ నేతలు మట్టి దోపిడీ అంతా ఒక పథకం ప్రకారం సాగిస్తున్నారు. ఎర్రితాత గుట్ట వెనుక జేసీబీల సాయంతో మట్టి తవ్వి ఎస్ఆర్సీ కంపెనీకి చెందిన టిప్పర్లలో నింపుతున్నారు. రోజూ రాత్రి ఏడు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు టిప్పర్లలో మట్టిని జాతీయ రహదారి మీదుగా ఎకై ్సజ్ చెక్పోస్టును దాటించి కర్ణాటకలో విక్రయిస్తున్నారు. వందలాది ట్రిప్పుల మట్టిని టిప్పర్లు రవాణా చేసే క్రమంలో విపరీతమైన దుమ్ము లేవకుండా ఉండేందుకు రోజూ నీటితో ఆ మార్గం తడుపుతున్నారు. ఏకంగా విడపనకల్లు సత్యసాయి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి తాగునీటిని తీసుకొచ్చి ఇలా వదులుతున్నారు. ఎర్రితాత గుట్ట ప్రాంతంలో మట్టి తవ్వకాల నేపథ్యంలో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. పెద్దోళ్ల జోలికెళ్లరెందుకో..? ఎవరైనా పేదలు ఇల్లు నిర్మించుకునే సమయంలో ఒక ట్రాక్టర్ మట్టిని తరలిస్తే చాలు పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు వచ్చి వాలిపోతుంటారు. ట్రాక్టర్ను సీజ్ చేసి కేసులు నమోదు చేసి హడావుడి చేస్తారు. అయితే పెద్దోళ్లు పబ్లిక్గా మట్టి దోపిడీ చేస్తున్నా ప్రేక్షకపాత్ర పోషించడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు కూడా మామూళ్లు స్వీకరించి.. తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో మట్టి దోపిడీ పరాకాష్టకు చేరింది. స్థానిక టీడీపీ నేతల సహకారంతో పక్క నియోజకవర్గం కళ్యాణదుర్గం ముఖ్య ప్రజాప్రతినిధికి చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ చెలరేగిపోతోంది. రోజూ వందలాది టిప్పర్ల మట్టిని కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటోంది. ఆంధ్ర సరిహద్దు నుంచి కర్ణాటకకు యథేచ్ఛగా రవాణా ‘పచ్చ’ నేతలతో ఎస్ఆర్సీ సంస్థ చీకటి ఒప్పందం కళ్లెదుటే తరలిపోతున్నా పట్టించుకోని అధికార గణం మట్టి మాఫియాకు అధికారుల సహకారం విడపనకల్లు మండల సరిహద్దులోఎర్రితాత గుట్ట వెనక, మోడల్ స్కూల్ సమీపంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం రోజూ రాత్రి పూట మట్టి తవ్వకాలు చేపట్టి టిప్పర్లలో వందలాది ట్రిప్పులు కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. మట్టిలోడుతో టిప్పర్లు 42వ జాతీయ రహదారి మీదుగా ఎకై ్సజ్ చెక్ పోస్టును దాటి వెళ్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? – చెండ్రాయుడు, సీపీఐ ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి -
నేటి నుంచి పశువులకు ‘గాలికుంటు’ టీకాలు
● ఏప్రిల్ 29 వరకు 3.20 లక్షల డోసులు వేయాలని లక్ష్యం అనంతపురం అగ్రికల్చర్: జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి వచ్చే నెల (ఏప్రిల్) 29 వరకు జిల్లా వ్యాప్తంగా పశువులకు ‘గాలికుంటు’ టీకాలు ఉచితంగా వేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనంతపురంలోని పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డిసీజెస్ డయోగ్నసి్ట్క్ ల్యాబ్) ఏడీ డాక్టర్ జి.రవిబాబు మీడియాకు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన పశువులు, ఎద్దులు, గేదెలు, దూడలకు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా కాగా, అందులో అనంతపురం డివిజన్కు 1.53 లక్షలు, ఉరవకొండ డివిజన్కు 1.67 లక్షల డోసులు సరఫరా చేశామన్నారు. పశువుల్లో వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకరమైన వ్యాధుల్లో గాలికుంటు ఉందని తెలిపారు. జ్వరం, నోరు, నాలుకపై పుండ్లు, కాలు గిట్టెలపై పుండ్లు, చొంగ కారడం, సరిగా నడవలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. పాల ఉత్పత్తి తగ్గిపోవడం, అబార్షన్ కావడం, అలాగే ఎద్దుల పనిచేసే సామర్థ్యం కోల్పోతాయని, నిర్లక్ష్యం చేస్తే మరణాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. రైతులు ముందుకు వచ్చి తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. అలాగే పశువుకు కేటాయించిన 12 అంకెల ట్యాగ్ నంబరును భారత్ పశుధాన్ యాప్లో నమోదు చేయడానికి పశుశాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇదే సందర్భంగా పశుశాఖ సిబ్బంది కూడా టీకాలు వేయకమునుపు, టీకాలు వేసిన 21 నుంచి 28 రోజుల తర్వాత రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపాలని సూచించారు. 18 నుంచి అధికారుల చేతుల్లోకి పుర పాలన రాయదుర్గం: నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 17న ముగియనుంది. ఈ నెల 16న చివరిసారిగా సమావేశాలు జరగనున్నాయి. 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 2021 మార్చి 18న 10 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 9 మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాన్ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోయాయి. సంపూర్ణ ఆధిక్యంతో వైఎస్సార్సీపీ మేయర్, చైర్మన్లు, వైస్ చైర్మన్లు కొలువుదీరారు. ఐదేళ్లు సమర్థవంతంగా పదవీ కాలం పూర్తిచేశారు. పట్టణాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. ఖజానాలో నిధుల్లేక అభివృద్ధి అటకెక్కింది. దీనికితోడు అడుగడుగునా ‘తమ్ముళ్లు’ అడ్డుపడడంతో గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు కూడా ఆగిపోయాయి. జీఓ వచ్చేసింది.. మున్సిపాలిటీ, నగర కార్పొరేషన్లలో పాలకపక్షాల గడువు ఈ నెల 17న ముగుస్తుంది. పాలనా బాధ్యతలు ప్రత్యేకాధికారులు చేపడతారు. ఇప్పటికే ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. – నాగరాజు, మున్సిపల్ ఆర్డీ, అనంతపురం -
దంపెట్లలో 800 ఏళ్ల నాటి శాసనం గుర్తింపు
బత్తలపల్లి: మండలంలోని దంపెట్ల గ్రామ సమీపంలోని చిత్రావతి నది ఒడ్డున వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో 800 ఏళ్లనాటి ప్రాచీన కన్నడ శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. ఆదివారం బత్తలపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బత్తలపల్లి మండలం దంపెట్ల గ్రామ శివారులో లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఉందన్నారు. ఈ ఆలయంలో 800 ఏళ్లనాటి ప్రాచీన కన్నడ శాసనాన్ని దేవగిరి యాదవరాజు సింహళదేవుడు క్రీశ 1225వ సంవత్సరం జనవరి 21న రాయించారని తెలిపారు. దాని ప్రకారం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో అప్పట్లో మధురాపురం అనే గ్రామం ఉండేదని, ఆలయ సేవలకు చేసిన గుర్తింపుగా ఆ గ్రామ ప్రముఖులకు రాజు సర్వమాన్య భూములను దానంగా ఇచ్చినట్లు వివరించారు. భారత పురావస్తుశాఖ సహకారంతో గత అక్టోబర్లో ధర్మవరం మండలం కునుతూరు గ్రామంలోని ప్రాచీన చంద్రమౌళేశ్వర ఆలయంలో ఇదే రాజు వేయించిన శాసనాన్ని తాను కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రాచీన దేవాలయాల మీద తాను చేస్తున్న పరిశోధనలో భాగంగా ఈ శాసనాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. దంపెట్ల, కునుతూరు గ్రామాల్లో లభ్యమైన యాదవరాజుల శాసనాలను బట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా చాలా కాలం పాటు ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవగిరిని రాజధానిగా పాలించిన యాదవరాజుల ఏలుబడిలో ఉన్నట్లు గోపి వివరించారు. -
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పట్టివేత
గుత్తి రూరల్: మండలంలోని అబ్బేదొడ్డిలో అక్రమంగా నిల్వ ఉంచిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు పట్టుకున్నారు. అబ్బేదొడ్డిలో అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచారని సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆదివారం దాడులు చేశారు. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 10 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో తాడిపత్రి, పెద్దపప్పూరు సీఎస్డీటీలు మల్లేష్, రాజ, వీఆర్ఓ అబూబకర్ పాల్గొన్నారు. అనంతపురం సెంట్రల్: గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసుకొని ఎక్కువ ధరలకు విక్రయించడం, చిన్న సిలిండర్లలలోకి నింపడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారి ప్రసాద్ హెచ్చరించారు. ఆదివారం నగరంలో కోవూరునగర్లో చిత్ర విజయ్కుమార్ అనే వ్యక్తి ఇంట్లో 25 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే డీ.హీరేహాళ్ మండలం పులకుర్తిలో కాల్వ నారాయణరెడ్డి ఇంట్లో 14 సిలిండర్లను పట్టుకున్నామన్నారు. వారిపై ఈసీ యాక్టు 1955 మేరకు కేసులు నమోదు చేశామన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
బుక్కరాయసముద్రం: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అల్లాను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం ముస్లింలతో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్జీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైపుల్లా బేగ్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహ్మద్, పొలిటికల్ అడ్వయిజర్ కమిటీ నెంబర్ (పీఎస్ సభ్యులు) ఎండీ కదిరి ఇస్మాయిల్, వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మన శ్రీరామిరెడ్డి, నార్పల రఘునాథ్రెడ్డి, నరేంద్రరెడ్డి, ప్రదీప్రెడ్డి, వీరాంజినేయులు, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, అధికార ప్రతినిధి మారుతీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప, లలితా కళ్యాణి, రాధా మనోహర్రెడ్డి, భోగాతి నాగేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నితిన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి -
అరటిని టన్ను రూ.15 వేలతో కొనుగోలు చేయాలి
అనంతపురం అర్బన్: ‘అరటి ధర పతనమైన తరుణంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అరటి టన్ను రూ.15 వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి’ అని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా తలపెట్టామని చెప్పారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి శివారెడ్డి, రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బీహెచ్ రాయుడు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. జిల్లాలో 18,600 హెక్టార్లలో అరటి సాగైందన్నారు. ఎకరాకు రూ.లక్ష వరకు రైతు పెట్టుబడి పెట్టారన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.23 వేలు ఉండేదన్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్దేశాలకు అరటి ఎగుమతి నిలిచిపోయిందన్నారు. దీంతో అరటి టన్ను రూ.8 వేలకు మించి పలకడం లేదని పేర్కొన్నారు. ధర పతనమవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళ చెందుతున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వమే టన్ను అరటి రూ.15 వేలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అరటి తోటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించాలన్నారు. -
అన్ని చెరువులకు నీరివ్వాలి
అనంతపురం టవర్ క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు హంద్రీనీవా ద్వారా నీరు ఇవ్వాలని ఓపీటీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్కుమార్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో జలసాధన సమితి ఆధ్వర్యంలో హంద్రీనీవా ప్రాజెక్టు భవిష్యత్ ఏమిటి.. లక్ష్యం ఇంకెన్నేళ్లకు నెరవేరుతుంది అన్న అంశాలపై చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా ఉమ్మడి అనంత జిల్లాల్లో 3,45,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నారు. హంద్రీనీవా ద్వారా 120 వరద రోజుల్లో 100 టీఎంసీలు నీటిని ఎత్తిపోసుకునే వీలుగా ప్రస్తుత కాలువకు అదనంగా సమాంతర కాలువ వెడల్పు చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులను అనుసంధానం చేయాలన్నారు. హెచ్ఎల్సీ నుంచి వచ్చే నీటిని నిలువ చేసేందుకు ఉంతకల్లు, పెరవలి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. హెచ్ఎల్సీ కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్రెడ్డి, మల్లికార్జున, శ్రీనివాసులు, ఉపేంద్ర కుమార్, ప్రకాష్, రాజశేఖర్రెడ్డి, అప్పిరెడ్డి, హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’ అనంతపురం సెంట్రల్: ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు, ఆ తర్వాత 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా వ్యవసాయాధికారి రవి తెలిపారు. గ్రామస్థాయి అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తారన్నారు. అలాగే ఏపీ ఎయిమ్స్ యాప్ వినియోగించడం ద్వారా రైతులకు కలిగే ఉపయోగాల గురించి తెలియజేస్తారని తెలిపారు. గ్రామస్థాయి అధికారుల బృందం రోజూ 90 ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు. బాలికకు తీవ్ర గాయాలు గాండ్లపెంట: మండల పరిధిలోని రెక్కమాను గ్రామంలో ఓ బాలిక కాలిపై ఆర్టీసీ అద్దె బస్సు చక్రం ఎక్కడంతో తీవ్రంగా గాయపడింది. వివరాలు.. గ్రామానికి చెందిన హఫీఫా వైఎస్సార్ జిల్లా వేంపల్లిలోని మైనార్టీ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్లేందుకు తన అవ్వతో కలసి ఆదివారం ఉదయం రాయచోటి ఆర్టీసీ డిపో అద్దె బస్సు ఎక్కింది. ఫుట్బోర్డు వద్ద నిలిచి ఉన్న బాలిక... బస్సు కదలడంతో అదుపు తప్పి కిందపడింది. అదే సమయంలో బస్సు వెనుక చక్రం బాలిక కాలిపై వెళ్లింది. దీంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే ఆమెను 108 వాహనం ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో రిటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సులో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ అనంతరం వందశాతం ఉద్యోగ సహకారం అందిస్తామన్నారు. మార్చి 23 నుంచి నూతన బ్యాచ్ను ప్రారంభిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7780752418 ను సంప్రదించాలన్నారు. -
పురాతన నాణేల ప్రదర్శన
గుత్తి: గుత్తి కోట ఉత్సవాల్లో భాగంగా ఎంఎస్ ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఆదివారం రాయలసీమ నాణేల సేకరణ సంఘం ఆధ్వర్యంలో పురాతన నాణేల ప్రదర్శన శాల ప్రారంభమైంది. ఈ ప్రదర్శన శాలను గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్, ప్రముఖ సినిమా యాక్టర్ గుత్తి మధు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పురాతన నాణేల సేకరణ కర్తలు విష్ణు భగవాన్, నాగరాజారావులను అభినందించారు. క్రీ.శ.1వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వివిధ రాజుల కాలం నాటి నాణేలను ప్రదర్శించారు. నాణేల ప్రదర్శన శాలను వందలాది మంది సందర్శించారు. లారీ కింద పడి చత్తీస్ఘడ్ వాసి మృతి కుందుర్పి: చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన సంతురామ్ (34) కుందుర్పి మండలం కదరంపల్లిలో ఆదివారం ప్రమాదవశాత్తూ బోరులారీ కింద పడి మృతి చెందాడు. కుందుర్పి పోలీసుల వివరాల మేరకు.. సంతురామ్ చత్తీస్ఘఢ్లోని దంతేవాడ జిల్లాకు చెందినవాడని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం బోర్వెల్ పనుల నిమిత్తం ఓ లారీ యజమాని కింద పనులు చేస్తూ కుందుర్పి మండలానికి వచ్చాడన్నారు. కదరంపల్లిలో బోరుబావి తవ్వుతుండగా శ్రీశైలం అజాగ్రత్త కారణంగా లారీని మలుపుతిప్పే ప్రయత్నంలో భాగంగా మృతుడు సంతురామ్పై లారీ ఎక్కించుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఘటనపై కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎరువులు వేసి అస్వస్థతకు గురై ఫీల్డ్ అసిస్టెంట్ మృతి బొమ్మనహాళ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కమ్మరి సురేష్ (34) ఆదివారం మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆదివారం సెలవు కావడంతో సురేష్ ఉదయం పొలంలో పత్తి పంటకు రసాయన ఎరువులు వేయడానికి వెళ్లాడు. మధ్యాహ్నం వరకు తండ్రి తిప్పేస్వామితో కలిసి ఎరువు వేశారు. తండ్రి మధ్యాహ్న ఇంటికి రాగా, సురేష్ పొలంలోనే మిగతా ఎరువు వేసి వస్తాను అని చెప్పి పొలంలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం ఎండలో పనిచేసి ఓ చెట్టు కింద పడుకున్నాడు. చుట్టూ పక్కన పొలానికి చెందిన రైతులు సురేష్ను పలకరించిన ఎలాంటి స్పందన లేకపోడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో బళ్లారి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు సురేష్కు భార్య పవిత్రతో పాటు ముగ్గురు కుమారైలు ఉన్నారు. తిప్పేస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బొమ్మనహాళ్ పోలీసులు తెలిపారు. జూదరుల అరెస్ట్ గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్న 8 మంది జూదరులను ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్ఐ బాలముణి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,21,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామ శివారుల్లో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశామన్నారు. అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు పుట్టపర్తి: గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో బుక్కపట్నం సమీపంలోని రైతులకు చెందిన మామిడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం బుక్కపట్నం గ్రామానికి చెందిన అవుటాల రవీంద్రరెడ్డికి చెందిన వంద మామిడి చెట్లు కాలిపోగా, పక్కనే ఉన్న మరో రైతు చెన్నకృష్ణకు చెందిన 25 చెట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. కాపుకు వచ్చిన చెట్లు కాలి పోవడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండలకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సందడిగా గుత్తి కోట ఉత్సవాలు
గుత్తి: చారిత్రక సంపద, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్ఓ మలోల అన్నారు. రెండు రోజులుగా గుత్తిలో అత్యంత వైభవంగా గుత్తి కోట ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆదివారం కోట సంబరాలు అంబరాన్నింటాయి. హెరిటేజ్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. స్థానిక ఎంఎస్ ఫుట్ బాల్ క్రీడామైదానం వద్ద జెండా ఊపి డీఆర్ఓ హెరిటేజ్ వాక్ను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, గుత్తి కోట సంరక్షణ సమితి, పురావస్తు, పర్యాటక శాఖలు, రైల్వే డీజిల్షెడ్, వాకర్స్ అసోసియేషన్, ఐసీడీఎస్, మెప్మా, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. కోట ప్రాముఖ్యతను వివరిస్తూ కళాకారులు ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, అంగన్వాడీ టీచర్లతో కలిసి వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. డీఆర్ఓ మలోల అల్లూరి సీతారామరాజు, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయ భాస్కర్ అలియా రాయల్, వెంకటరామిరెడ్డి వీర నరసింహం రాయల్, నాయుడు శ్రీకృష్ణ దేవరాయలు, హేమలత రాణి రుద్రమ దేవి వేష ధారణలతో ఆకట్టుకున్నారు. గురవయ్యల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ మలోల మాట్లాడుతూ గుత్తి కోటకు ఎంతో చరిత్ర ఉందన్నారు. కళలు, చరిత్ర, సంస్కృతి, చారిత్రక కట్టడాలను పరిరక్షించడం మనందరి బాధ్యతన్నారు. చారిత్రక ప్రదేశాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు. గుత్తి కోట అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ప్రపంచ పటంలో గుత్తి కోటకు స్థానం కలిగే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, పురావస్తుశాఖ అధికారి స్వామి నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, మెప్మా విశ్వజ్యోతి, ఏఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎఫ్ మాజీ హెడ్ కానిస్టేబుల్ అరెస్టు
పుట్లూరు: మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ఓ బీఎస్ఎఫ్ మాజీ హెడ్ కానిస్టేబుల్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుట్లూరు మండ లంలోని ఎస్. కొండేపల్లికి చెందిన మాజీ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బోనాల వెంకట శ్రీనివాసులు కొన్నిరోజులుగా అక్రమంగా మద్యం విక్రయాలు చేపడుతున్నాడు. విశ్వసనీయ సమాచారంతో శనివారం పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. కింగ్ఫిషర్ బీర్ ప్రీమియం బాటిళ్లు 24, కింగ్ఫిషర్ స్ట్రాంగ్ బాటిళ్లు 52, ఇతర మద్యం బాటిళ్లు 27 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేంద్ర బాబు తెలిపారు. -
అందరూ చెల్లించాల్సిందే
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటి పన్ను వసూళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఓవైపు పన్ను చెల్లించాలంటూ పేదలను పిండేస్తున్న అధికారులు... పెద్దలను మాత్రం వదిలేస్తున్నారు. రూ. 4 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు బకాయిలున్న పెద్దల గురించి ఏమాత్రమూ ఆలోచించలేదు. కేవలం వారికి నోటీసులతో సరిపెడుతున్నారు. అదే రూ.200, రూ.300, రూ.400 పన్ను చెల్లించాల్సిన పేద, మధ్య తరగతి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. వారికి ఏమాత్రం గడువు ఇవ్వకుండా నోటీసు ఇవ్వడం.. ఆ వెంటనే కట్టి తీరాల్చిందేనంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 22 కోట్ల పన్నుల వసూలు లక్ష్యం కాగా.. ఇప్పటిదాకా రూ. 14 కోట్లు అంటే 67 శాతం వసూలైంది. దీనివెనుక విలేజ్ డెవలప్మెంట్ అధికారుల (వీడీఓ) కఠోరశ్రమ చాలా ఉంది. వసూళ్లయిన మొత్తంలో పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లించిన పన్నులే అధికంగా ఉన్నాయని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. పంచాయతీ అధికారుల మెడపై కత్తి పన్నుల వసూళ్ల విషయంలో ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ అధికారుల మెడపై కత్తి పెట్టి పనిచేయిస్తోంది. ‘ఏమి చేసుకుంటారో ఏమో మీ పంచాయతీ పరిధిలో వందశాతం పన్ను వసూళ్లు చేయాల్సిందేనంటూ’ హుకుం జారీ చేస్తోంది. డిప్యూటీ ఎంపీడీఓ, ఎంపీడీఓ, డీపీఓ ఇలా ఎవరిస్థాయిలో వారు ఒత్తిళ్లు చేస్తుండడంతో వీడీఓలు తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. వ్యక్తిగత పనులను కూడా చూసుకోలేనంత స్థాయిలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారంటూ వీడీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా వదిలిపెట్టడం లేదంటున్నారు. గడువు ఇవ్వకుండా వసూలు సహజంగా ప్రతి ఏటా మార్చి 31 వరకు పన్నులు చెల్లించేందుకు గడువు ఉంటుంది. ఆలోగా కనీసం 15 రోజుల గడువుతో పన్నుల చెల్లింపుదారులకు నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత పన్నులు కట్టించుకోవాలి. తొలిసారి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పన్నులు వసూళ్లు చేస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి గడువుల మీద గడువులు పెడుతూ వస్తున్నారు. చివరకు అద్దెకు ఉన్న వారిని కూడా బెదిరింపులకు దిగుతున్నారు. ‘పన్ను మీరు చెల్లించి అద్దెలో పట్టుకోండి’ అంటూ సలహాలు ఇస్తున్నారు. మరోవైపు పింఛన్లకు, ఇంటిపన్నుకు ముడిపెడుతున్నారు. ఇంటిపన్ను చెల్లించినట్లు రశీదులు చూపితేనే పింఛను ఇస్తామనే షరతు పెడుతున్నారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లకాలనీలో ఇదే తరహాలో పన్నులు వసూళ్లు చేయడం దుమారం రేపింది. పెద్దలపై ఎక్కడాలేని ఉదారత ఇంటి పన్ను వసూళ్లపై చంద్రబాబు సర్కార్ తీరు.. 2025–26లోజిల్లా లక్ష్యం రూ. 22 కోట్లు వంద శాతం వసూలు కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు -
మృత్యు మలుపు..
● బళ్లారి రోడ్డులో కొత్త యూటర్న్ వద్ద మరో ప్రాణం బలి రాప్తాడురూరల్: అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థం కోసం లేనిచోట కొత్తగా తీయించిన ‘యూటర్న్’ వద్ద మరో నిండుప్రాణం బలైంది. నెల తిగరకుండానే అదే స్పాట్లో మరో వ్యక్తి మృతి చెందడం కలచివేస్తోంది. నగర శివారు బళ్లారి రోడ్డు ఎంవైఆర్ ఫంక్షన్ హాలు దాటిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన యూటర్న్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మరిమాకులపల్లికి చెందిన కృష్ణమనాయుడు (60) స్థానికంగా వాచ్మన్గా పని చేస్తున్నాడు. పనిమీద బైకుపై నగరానికి వచ్చి తిరిగి సిండికేట్నగర్కు వెళ్తూ... యూటర్న్ వద్ద తిప్పుకుంటుండగా వెనుక వైపు నుంచి వచ్చిన బుల్లెట్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కృష్ణమనాయుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బుల్లెట్ నడుపుతున్న యువకుడు గార్లదిన్నె మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పీఎస్ ఎస్ఐ కొమ్మినేని రాంబాబు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. తరచూ ప్రమాదాలు కొత్తగా ఏర్పాటు చేసిన యూటర్న్ చాలామంది వాహనదారులకు తెలీదు. ఇక్కడ సరైన హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూటర్న్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్నూ తొలగించడం కొసమెరుపు. ఈ క్రమంలో వేగంగా వచ్చే వాహనాలు యూటర్న్ తీసుకునే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నాయి. గతనెల 15న ఇదే యూటర్న్ వద్ద కారు మలుపు తిరుగుతుండగా బైకుపై వేగంగా వచ్చిన నరసనాయనికుంటకు చెందిన హరిజన నరేష్ కారును బలంగా ఢీకొని స్పాట్లోనే మృతి చెందాడు. అదే స్థలంలో తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో యూటర్న్ను తొలగించడం లేదా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బుల్లెట్ బైకు మృతి చెందిన కృష్ణమనాయుడు -
రోగులకు కాలం చెల్లిన మాత్రలు
ఉరవకొండ: స్థానిక 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కాలం చెల్లిన మందులు పంపిణీ చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. దీనిపై రోగులు, వారి బంధువుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో అబ్దుల్ అనే వ్యక్తి (ఓపీ చీటీ నం. 18265) వైద్యుడికి చూపించుకున్న అనంతరం మాత్రల గది వద్ద మాత్రలు తీసుకున్నాడు. మాత్రల గడువు ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసినట్లు షీట్పై ఉండటంతో, ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నించాడు. వారేమో నిర్లక్ష్యంగా ఒకటో రెండో ఇలాంటివి వచ్చి ఉంటాయిలే అంటూ సమాధానమిచ్చారని అబ్దుల్ వాపోయాడు. జ్వరం, విరేచనాల బాధిత రోగులకు కూడా కాలం చెల్లిన మాత్రలు పంపిణీ చేసినట్లు సమాచారం. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే వైద్య సేవలు నామమాత్రంగా మారాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఆస్పత్రి వైద్యాధికారులు, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని రోగులు కోరుతున్నారు. -
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ సీజ్
బొమ్మనహాళ్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. మండలంలోని కల్లుహోళ గ్రామ సమీపంలోని వేదావతి హగరి నదిలో శనివారం జేసీబీతో ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు దాడులు నిర్వహించి ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ బోయ మల్లికార్జున, ఉరవకొండ మండలం బుడిదగవ్వి గ్రామానికి చెందిన వడ్డే రాంబాబు, ఉండబండ గ్రామానికి చెందిన బంగి చందు, కల్లుహోళ గ్రామానికి చెందిన కాకుల వన్నూరుస్వామి, కుమ్మరి నాగేంద్ర, బోయ వన్నూరుస్వామిని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఇసుక కావాల్సిన వారు తహసీల్దార్ వద్ద అనుమతి తీసుకోవాలని, అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రీడా పోటీలతో మానసిక ఉల్లాసం ● ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం సంపత్కుమార్ అనంతపురం టౌన్: విద్యుత్ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం సంపత్కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ సర్కిల్ డేను పురస్కరించుకుని విద్యుత్ ఉద్యోగులకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా పోటీలను జేఎన్టీయూ కళాశాల సమీపంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంపత్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపేందుకు ఏటా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి సీఎండీ శివశంకర్ లోతేటి వస్తున్నట్లు చెప్పారు. ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఎస్ఈలు శేషాద్రి శేఖర్, మోసెస్తోపాటు ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. చదువు భారమని యువకుడి బలవన్మరణం పెద్దవడుగూరు: చదువు భారమని భావించిన యువకుడు బలవన్మరణం పొందిన ఘటన మండల పరిధిలోని విరుపాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. విరుపాపురానికి చెందిన మార్నె నరసింహులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరి పెద్ద కుమారుడు మార్నె కల్యాణ్ (20) ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. ఫెయిలైన సబ్జెక్టులకు ఫీజు కట్టి పరీక్షలు రాయమని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన కల్యాణ్ శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చీకటి పడినా తిరిగి రాలేదు. కొత్తపల్లి బస్టాండ్ సమీపంలోని కాశేపల్లి చెన్నారెడ్డి తోట వద్ద ఎప్పుడూ ఉండేవాడని తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెళ్లి గాలించారు. అక్కడ చెట్టుకు ఉరి వేసుకున్నట్లుగా గుర్తించారు. కిందికి దింపి పామిడి ఆసుపత్రికి తరలించగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజినేయులు తెలిపారు. గుంతలో పడి వృద్ధురాలు మృతి కళ్యాణదుర్గం రూరల్: గుంతలో పడి తిప్పమ్మ (83) అనే వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కుర్లపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. కుర్లపల్లిలో ఒంటరిగా జీవిస్తున్న తిప్పమ్మ శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని గుంతలో ప్రమాదపుశాత్తు పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గమనించి తిప్పమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే అప్పటికే తిప్పమ్మ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మట్టి టిప్పర్ ఢీకొని ఇద్దరికి గాయాలు
యాడికి: మట్టి టిప్పర్ ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని చందన–రాయలచెరువు మార్గంలో జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు... యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామ సమీపంలోని చెరువు నుంచి ఇటీవల విచ్చలవిడిగా టిప్పర్లలో మట్టి తరలిస్తున్నారు.శనివారం సాయంత్రం మట్టి తరలిస్తున్న టిప్పర్ చందన–రాయలచెరువు మార్గంలో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలానికి చెందిన వారని తెలిసింది. స్థానికులు వారిని అనంతపురం తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయంపై పోలీసులను వివ రణ కోరగా తమకు సమాచారం అందలేదని తెలిపారు. -
విద్యుత్ షాక్తో ఆపరేటర్కు తీవ్ర గాయాలు
అనంతపురం టౌన్: విద్యుత్ షాక్తో ఆపరేటర్కు తీవ్ర గాయాలైన ఘటన డీ4 సెక్షన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక జేఎన్టీయూ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద నూతన సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. అందులో ట్రైనింగ్ షిఫ్ట్ ఆపరేటర్గా ఉన్న రమేష్ నాయక్ శనివారం 33కేవీ విద్యుత్ స్తంభంపైకెక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. చేతులు, కడుపు భాగం మొత్తం కాలిపోయింది. విద్యుత్ స్తంభంపై నుంచి కిందపడడంతో తలకు సైతం గాయాలయ్యాయి. తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్ నాయక్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. షిఫ్ట్ ఆపరేటర్తో మరమ్మతులా..? లైన్ మరమ్మతులను విద్యుత్ అధికారులతో చేపట్టకుండా శిక్షణలో ఉన్న ఆపరేటర్తో చేయించడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలి సింది. ఏ లైన్లో విద్యుత్ సరఫరా ఉంటుందో.. ఎందులో ఉండదో వారికి కనీస అవగాహన ఉండదు. అయినా, పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగింది. ఈ విషయంపై విచారణ చేపట్టి షిఫ్ట్ ఆపరేటర్తో మరమ్మతులు చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గుత్తి కోటను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
గుత్తి: పర్యాటక కేంద్రంగా గుత్తి కోటను తీర్చిద్దేందుకు కృషి చేస్తామని కలెక్టర్, ప్రజాప్రతినిధులు అన్నారు. శనివారం పట్టణంలోని ఎంఎస్ ఫుట్బాల్ క్రీడా మైదానంలో గుత్తి కోట ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాళక్యులు, మరాఠీలు, విజయనగర రాజులు పాలించిన గుత్తి కోట ప్రాశస్త్యం గురించి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తెలియజేస్తున్నారన్నారు. చారిత్రక గుత్తికోటను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. గుత్తి కోటకు త్వరలో అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భరతనాట్యం, కూచిపూడి నాట్యంతో కళాకారులు అలరించారు. డీఆర్వో మలోల సైతం పాట పాడి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఎంఎస్ ఫుట్ బాల్ క్రీడా మైదానం వద్ద నుంచి కోట వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు ఫుట్ బాల్ క్రీడా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ ఫేం శాంతికుమార్, రైజింగ్ రాజు, మోహన్ కామెడీ స్కిట్లు ప్రదర్శించనున్నారన్నారు. పాటల పోటీలు కూడా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, తాడిపత్రి, గుత్తి మున్సిపల్ చైర్పర్సన్లు జేసీ ప్రభాకర్రెడ్డి, వన్నూర్బీ, వైస్ చైర్పర్సన్ బిందె వరలక్ష్మి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయ భాస్కర్, ఆర్కియాలజీ అధికారులతో పాటు కౌన్సిలర్ వాల్మీకి శివ, వెంకటశివుడు యాదవ్, నారాయణ స్వామి, స్వప్న, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని ముంటిమడుగు క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. శనివారం పెద్దవడుగూరు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ సుబ్బరాయుడు (53) మరో ఏడుగురితో కలిసి మిషన్తో మొక్కజొన్న ఆడించే పనికి గార్లదిన్నె మండలం తిమ్మంపేట గ్రామానికి వచ్చాడు. పని ముగిసిన అనంతరం మిషన్ను ట్రాక్టర్కు కట్టుకుని అందరూ తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ముంటిమడుగు క్రాస్ వద్ద మొక్కజొన్న మిషన్ స్టాండ్ బోల్టు ఊడి పోయింది. ఈ క్రమంలో స్టాండ్ మీద కూర్చున్న సుబ్బరాయుడితో పాటు మరో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. సుబ్బరాయుడిపై నుంచి మొక్కజొన్న మిషన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనోహర్ రెడ్డి, రామకృష్ణ, లక్ష్మికి గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుబ్బరాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. కాగా మృతుడు సుబ్బరాయుడుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
డిప్యూటీ ఎంపీడీఓ ఆకస్మిక మృతి
గుమ్మఘట్ట: డిప్యూటీ ఎంపీడీఓ చంద్రశేఖర్ (48) ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన గుండెపోటుతో ప్రాణం విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరుకు చెందిన చంద్రశేఖర్ కొనకొండ్ల గ్రేడ్–1 పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది జనవరిలో డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొంది.. గుమ్మఘట్టకు బదిలీపై వచ్చారు. శుక్రవారం డ్యూటీకి సెలవు పెట్టిన ఆయన.. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ లాడ్జిలో బస చేశారు. శనివారం ఉదయం రూమ్బాయ్ వచ్చి తలుపు కొట్టగా లోపలి నుంచి ఉలుకుపలుకూ లేదు. లాడ్జి యజమానులకు తెలపగా.. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ మరణవార్త తెలియగానే కార్యాలయ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపు ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై అర్జీలను రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. చంద్రశేఖర్ (ఫైల్) -
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం
● యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు కోటేశ్వరప్ప, ఈశ్వరయ్య అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్య దర్శులు కోటేశ్వరప్ప, ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ రమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందన్నారు. జిల్లాలో ఉరవకొండ, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమంపై దృష్టి పెట్టి యాక్షన్ ప్లాన్ తయారు చేశామన్నారు. రాబోయే రోజులలో రోజూ సాయంత్రం గ్రామాలలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామన్నారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. సమావేశంలో యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, సహాధ్యక్షులు సరళ, జిల్లా కార్యదర్శి అర్జున్, సంజీవులు, రవికుమార్ చంద్రమోహన్, రామాంజనేయులు పాల్గొన్నారు. -
సిలిండర్ల అక్రమ వినియోగంపై దాడులు
అనంతపురం సెంట్రల్: సిలిండర్ల అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. శనివారం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గుంతకల్లులో హనుమాన్ జంక్షన్ దగ్గర బాలాజీ కేఫ్లో 4 సిలిండర్లు సీజ్ చేసి నిర్వాహకుడు అనుముల సురేంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే గుత్తి గాంధీ సర్కిల్లో గ్యాస్ స్టౌవ్ రిపేరీ దుకాణంలో 12 సిలిండర్లు, గ్యాస్ ఫిలింగ్ పైపు సీజ్ చేసి నిర్వాహకుడు చిన్న మహమ్మద్పై కేసు నమోదు చేశారు. కదిరి పట్టణంలో ఓ ఇంట్లో 46 సిలిండర్లు సీజ్ చేసి డెలివరీ బాయ్పై కేసు కట్టారు.చట్ట విరుద్ధంగా విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐ గోపాలుడు, ఏఈఈ రవీంద్ర నాథ్, రాజశేఖర్, సీఎస్డీటీ భాగ్యలక్ష్మి, ఆర్ఐ రవికుమార్, కదిరి వీఆర్వో ఆదినారాయణమ్మ, హరీష్కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి కళ్యాణదుర్గం రూరల్: మున్సిపాలిటీ పరిధి లోని ముదిగల్లు గ్రామంలో విద్యుత్ షాక్తో రాము (24)అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... ముదిగల్లుకు చెందిన రాము, లక్ష్మి దంపతులు. ఉగాది పండుగ నేపథ్యంలో శనివారం రాము ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఈ సమయంలోనే విద్యుత్ మోటర్ పట్టుకోవడంతో షాక్ కొట్టింది. స్పృహ తప్పి కిందపడిన రామును వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక సీహెచ్సీకీ తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుడు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం లక్ష్మి ఐదు నెలల గర్భిణి కావడం గమనార్హం. పండుగ దగ్గర పడుతున్న సమయంలో కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు సర్కారు మౌనం..
మార్చి, ఏప్రిల్, మే, జూన్... ఈ నాలుగు నెలలు వాటిని రక్షించుకోవడం రైతులు, కాపర్లకు సవాల్గా మారింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా... చంద్రబాబు ప్రభుత్వం వేసవి గండం నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టడం లేదు. పశుసంవర్ధకశాఖ కూడా మౌనంగా ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రాయితీతో సైలేజ్ గడ్డి లేదు. దాణామృతం (టీఎంఆర్) ఇవ్వడం లేదు. పశుదాణా (కాన్సట్రేటెడ్ క్యాటిల్ ఫీడ్).ఊసే లేదు. ఎండుగడ్డి పంపిణీ అవకాశమే కనిపించడం లేదు. కనీసం గడ్డి విత్తనాలు ఇస్తామన్న ఆలోచన కూడా చేయకపోవడంపై ‘వేసవి గండం’ నుంచి గటెక్కేదెలా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. పాడి ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. జీవాలు ఇతర ప్రాంతాలకు మేత కోసం వలస వెళ్లే పరిస్థితి నెలకొంది. పరిస్థితి విషమించాక చివర్లో కంటితుడుపు చర్యలు చేపట్టినా ఫలితం ఉండదని రైతులు, కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
ములకలచెరువు : అన్నమయ్య జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులంతా అనంతపురం వాసులు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ములకలచెరువు ఎస్ఐ ప్రతాప్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన ఆదిలక్ష్మి(62) పక్షవాతంతో బాధపడుతోంది. ఈమెకు చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద విరూపాక్షిపురంలో పక్షవాతానికి మందు ఇప్పించేందు కోసం కుటుంబ సభ్యులు మురళి, వనజాక్షి (40) శుక్రవారం తెల్లవారుజామున ఖాదర్వలి కారులో బయల్దేరారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గొడ్డావులకోట వద్దకు రాగానే టమాట క్రేట్లతో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం వీరి కారును వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న ఖాదర్వలి, ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. బొలేరో వాహనం డ్రైవర్ బాలాజీ నాయక్, మురళి, వనజాక్షి(40)లకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్లే ప్రయాణికులు గమనించి అంబులెన్స్కు, పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న 108 అంబులెన్స్లో క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వనజాక్షి పరిస్థితి విషమించి అదేరోజు రాత్రి మృతి చెందింది. -
హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు4భాష్ళఔ్ఛుఽౌఠిౌ
ధర్మవరం: ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ధర్మవరం పట్టణంలోని పలు హోటళ్లపైన శుక్రవారం రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పట్టణంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో డొమెస్టిక్ సిలెండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. ధర్మవరం ఆర్డీఓ రామసుబ్బయ్య, తహసీల్దార్ సురేష్బాబుల ఆదేశాల మేరకు సీఎస్డీటీ రమణబాబు, వీఆర్ఓ రవిల ఆధ్వర్యంలో హోటళ్లలో దాడులు నిర్వహించి 11 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. రెస్టారెంట్లు, హోటళ్లపై కేసులు నమోదు చేస్తున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు. గ్యాస్ గోడౌన్ను కూడా తనిఖీ చేసి రికార్డులు తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ లేదని గుర్తించామన్నారు. పెనుకొండ రూరల్: అక్రమంగా డొమొస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వాణిజ్య కేంద్రాల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంతో పాటు కియా పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. 19 డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కేసులు నమోదు చేసి సిలిండర్లను గోడౌన్ తరలించారు. దాడులలో పౌరసరఫరాల డివిజన్ అధికారి రమేష్, తహసీల్దార్ స్వాతి, సీఎస్డీటీ ప్రభావతి, వీఆర్వో బషీర్ పాల్గొన్నారు. హిందూపురం టౌన్: సివిల్ సప్లయ్స్ అధికారులు శుక్రవారం పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ హారతి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రెవెన్యూ సిబ్బంది పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండటంతో ఆయా హోటళ్ల యజమానులపై కేసులు నమోదు చేయడంతో పాటు 27 సిలిండర్లను సీజ్ చేసినట్లు డీటీ హారతి తెలిపారు. దాడుల్లో డీటీలు లక్ష్మీనరసింహం, సావిత్రి, అనిల్ కుమార్, విజయ నిర్మల, మోహన్ నాయక్, వీఆర్ఓలు పాల్గొన్నారు. భ్ఫీాష్ళఔ్ఛుఽౌఠిౌ -
నేటి నుంచి గుత్తి కోట ఉత్సవాలు ు‘/ష్ళఔ్ఛుఽౌఠిౌ
● రెండు రోజుల పాటు కార్యక్రమాలు )/ష్ళఔ్ఛుఽౌఠిౌగుత్తి: గుత్తి కోట ఉత్సవాలు ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజులు పాటు కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక ఫుట్బాల్ క్రీడా మైదానంలో భారీ స్టేజ్తో పాటు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. 14వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు గుత్తి కోట ఉత్సవాలు ప్రారంభమై రాత్రి పది గంటల వరకు కొనసాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. డాన్స్లు, కోలాటం, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఉంటాయి. మెగా మ్యూజికల్ ఈవెంట్ కూడా ఉంటుంది. కూచిపూడి, భరత నాట్యం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు రానున్నారు. 15న ఉదయం 9 గంటలకు రెవెన్యూ కార్యాలయం వద్ద నుంచి కోట వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి అతిథుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ ఫేం శాంతికుమార్, రైజింగ్ రాజు, మోహన్ కళాకారులచే కామెడీ షోను ప్రదర్శిస్తారు. కోట ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కోట ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ పుష్పావతి పర్యవేక్షించారు. ఏర్పాట్లను పరిశీలించిన జేసీ గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు. స్థానిక ఎంఎస్ ఫుట్బాల్ క్రీడామైదానంలో ఏర్పాటు చేసి భారీ స్టేజ్, స్టాల్స్ను పరిశీలించారు. కోట ఉత్సవాలను ఘనంగా , పకడ్బందీగా నిర్వహించాలని , ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ,9/ÚåLenovo -
అరటి తోట దగ్ధం : రూ.8 లక్షల నష్టం .చీ?ష్ళఔ్ఛుఽౌఠిౌ
తాడిమర్రి: మండలంలోని మద్దులచెర్వు గ్రామంలో రైతు ఉప్పులూరు నాగార్జునరెడ్డికి చెందిన అరటి తోట శుక్రవారం అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లింది. బాధిత రైతు వివరాల మేరకు.. రైతు ఉప్పలూరు నాగార్జునరెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల్లో రెండేళ్ల క్రితం 4,000 అరటి మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో కొయ్య పంటతో తోట గెలలతో కళకళ లాడుతోంది. మరో నెల రోజుల్లో పంటకోత కోయాల్సి ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకతాయిలు బీడీ, సిగరెట్ తాగి పడేయటంతో తోటకు నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న రైతు కుటుంబ సభ్యులు వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అరటి చెట్లు, తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్పు, పైపులు కాలిపోయాయి. వేసవి కాలం కావడంతో ఎండలు అధికమై మంటలను ఆర్పలేక పోయారని వాపోయారు. సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. +ఞ?ష్ళఔ్ఛుఽౌఠిౌ -
జూదరుల అరెస్ట్
● రూ.2,39,900 స్వాధీనం తాడిపత్రి రూరల్: మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి 12 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు.. మండలంలోని చుక్కలూరు గ్రామ సమీపంలోని మామిడితోట పేకాట కేంద్రంపై దాడి చేసి 8 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సురేష్, వెంకటశ్రీకాంత్రెడ్డి, సురేంద్రరెడ్డి, ఓబుళరాజు, మహమ్మద్యుసఫ్, రామాంజినేయులు, అల్లాబకాష్, రామకృష్ణను అరెస్టు చేశామన్నారు. అలాగే మండలంలోని తలారిచెరువు వద్ద గల అదాని సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని కంపచెట్లల్లో పేకాట ఆడుతున్నా అజయ్, రామచంద్ర, వెంకటేష్, రంగస్వామిని అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ.89,900, మూడు మోటర్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. పాత స్తంభాలతో ప్రమాదం ● విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని సిబ్బందికి ఎస్ఈ ఆదేశం గార్లదిన్నె: ప్రమాదకరంగా ఉన్న పాత స్తంభాలను వెంటనే మార్పు చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మర్తాడు విద్యుత్ సబ్స్టేషన్ను ఆయన పరిశీలించారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో పర్యటించారు. అక్కడక్కడా పాత కాలం నాటి ఇనుప విద్యుత్ స్తంభాలు కనిపించాయి. వర్షాలు కురిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటిని వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఇళ్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉన్న 15 కేవీ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 100 కేవీ సామర్థ్యమున్నవి ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్ఈ వెంట ఏడీ రఘు, ఏఈ విజయ్కుమార్, రైతులు తాతిరెడ్డి, ఆవుల క్రిష్టయ్య, వెంకటేష్, ఓబులపతి తదితరులు ఉన్నారు./ాష్ళఔ్ఛుఽౌఠిౌ -
●కమనీయం.. పుష్పయాగోత్సవం
ముగిసిన ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు కదిరి: ఖాద్రీశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పుష్పయాగోత్సవం కమనీయంగా సాగింది. పుష్పయాగోత్సవంతో పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని..సాగనంపడమే పుష్పయాగోత్సవ ఉద్దేశమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. మధ్యాహ్నం తర్వాత దర్శనం తీర్థవాది ఉత్సవం ముగియగానే అర్చకులు గురువారం సాయంత్రం ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కై ంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులను ఆలయంలోకి అనుమతించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. శుక్రవారం రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఈ ఉత్సవానికి ఉభయ దారులుగా విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
అనధికారిక పనులే ఎక్కువ!
● సమగ్రశిక్ష సెక్టోరియల్స్ పనితీరుపై విమర్శలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని పాఠశాలల్లో విద్యాభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ బోధన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన బాధ్యతను సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు విస్మరించారు. అధికారిక బాధ్యతలను పక్కనపెట్టి అనధికారిక పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం, విద్యార్థుల అభ్యసన స్థాయిలపై సమీక్ష వంటి కీలక అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పనులకే ప్రాధాన్యత సమగ్రశిక్షలో ఏఎంఓ వేణుగోపాల్, అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజ్, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ) నారాయణస్వామి, జీసీడీఓ కవిత, అసిస్టెంట్ సీఎంఓ చంద్రశేఖర్, ఏపీఓ నారాయణస్వామి, అసిస్టెంట్ అలెస్కో రామచంద్ర పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా వీరు తరచూ పాఠశాలలను సందర్శిస్తూ బోధన విధానాలను పరిశీలించాలి. అలాగే ప్రభుత్వ విద్యా పథకాల అమలును పర్యవేక్షించాలి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చదవడం, గణిత నైపుణ్యాలను పెంపొందించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా పర్యవేక్షణ బాధ్యత సమగ్ర శిక్ష అధికారులదే. ఇంతటి కీలకమైన జీఎఫ్ఎల్ఎన్ సైతం సెక్టోరియల్ అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలులోనూ పట్టనట్టు వ్యవహరించారని సమాచారం. కార్యాలయానికి సంబంధించిన పనుల కంటే వ్యక్తిగత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సెక్టోరియల్ అధికారులు బిల్లులకు ఇచ్చే ప్రాధాన్యత పర్యవేక్షణకు ఇవ్వడం లేదనే పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంటేటివ్ ఇవ్వరు...టూర్ డైరీ ఉండదు సాధారణంగా సెక్టోరియల్ అధికారులు నెల ప్రారంభంలోనే ఎక్కడికెక్కడ వెళుతున్నారనే అంశాలపై టెంటేటివ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెల పూర్తయిన తర్వాత టూర్ డైరీ నివేదించాలి. దీని ఆధారంగానే సంబంధిత కారుకు బిల్లు పెట్టాలి. ఇక్కడ మూడు కార్లు ఏడుగురు సెక్టోరియల్స్ ఉన్నారు. ఎవరు ఎక్కడికి పోతున్నారో ఎవరికీ తెలీదు. వీరు విధుల్లో చేరినప్పటి నుంచి టెంటేటివ్ ఇవ్వలేదు. టూర్ డైరీ పెట్టలేదు. కన్నడ ఏఎంఓ నారాయణస్వామి రోజూ కార్యాలయానికి రావడం వెళ్లడం తప్పితే ఎలాంటి పని చేయడం లేదనే విమర్శలున్నాయి. మధ్యాహ్నం దాటితే కార్యాలయంలో కనిపించరని ఎక్కడికి పోతున్నాడో ఆయనకు తప్ప ఇతరులకెవరికీ తెలయదని ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సెక్టోరియల్ అధికారులను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు, ఎంఈఓలు, హెచ్ఎంలు కోరుతున్నారు. లేదంటే జిల్లాలో విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రశ్నార్థకంగా మారతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సబ్ రిజిస్ట్రార్గా కవిరాజు
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ అనంతపురం రామ్నగర్ సబ్ రిజి స్ట్రార్గా కవిరాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కవిరాజు ఇటీవలే గ్రూప్–2లో ఉత్తీర్ణత సాధించి సబ్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. రిజిస్ట్రేషన్ అధికారులు శిక్షణలో భాగంగా అనంతపురం సబ్ రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఏడాది పాటు రామ్నగర్ ప్రధాన కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించనున్నారు. పెన్నహోబిలం ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉరవకొండ: మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిళం లక్ష్మీనృసింహస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్గా రాయంపల్లి గ్రామానికి చెందిన రేగాటి నాగరాజుతో పాటు 12 మంది పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఈఓ తిరుమలరెడ్డి సమక్షంలో పాలక మండలి సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెన్నహోబిళం ఆలయ అభివృద్ధికి కృషి చేసి, ఆలయంలో భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు పాలక మండలి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఉరవకొండలో సినిమా షూటింగ్ సందడి ఉరవకొండ: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో పాత తహసీల్దార్ భవనంలో శుక్రవారం నూతన చిత్రం షూటింగ్ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది. చిత్ర డైరెక్టర్ విహారి వివరాలు తెలియజేశారు. భగవంతుడు అనే పేరుతో ప్రారంభమైన ఈ చిత్రంలో హీరోగా తిరువీర్, హీరోయిన్గా జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాతో పాటు మరికొందరు సీనియర్ నటులు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా రవి వ్యవహరిస్తున్నారని, ఉరవకొండ, పెన్నహోబిలం తదితర ప్రాంతాల్లో 20 రోజుల పాటు షూటింగ్ చేస్తున్నామన్నారు. మొల్లమాంబ జీవితం స్ఫూర్తిదాయకం అనంతపురం అర్బన్: కవయిత్రి మొల్లమాంబ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయమని డీఆర్ఓ ఎ.మలోల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో మొల్లమాంబ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్ఓతో పాటు కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వెంకటశివుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు పాల్గొని మాట్లాడారు. కవయిత్రి మొల్లమాంబ ఎలాంటి రాజపోషణ లేకుండా భక్తి, ప్రతిభతో రామయణాన్ని తేట తెలుగులో అందించిన మహనీయురాలని కొనియాడారు. వాల్మీకి రచించిన రామాయణాన్ని కేవలం ఐదు రోజుల్లోనే సంస్కృతం నుంచి సరళంగా అందరికీ అర్థమయ్యేలా తెలుగుభాషలో అనువదించారన్నారు. ఈ రోజు సామాన్యులు సైతం రామాయణాన్ని చదువుతున్నారంటే ఆ ఘనత మొల్లమాంబకే దక్కుతుందన్నారు. అనంతరం నృత్య ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్, ఆరే కటిక సంక్షేమ సంస్థ చైర్మన్ హరికృష్ణరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనరసింహమూర్తి, శాలివాహన ఉద్యోగ సంఘం నాయకుడు ఓబుళపతి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీరమణ, మహిళ నాయకురాలు రామాంజినమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. భి,ష్ళఔ్ఛుఽౌఠిౌ -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం టవర్క్లాక్: రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ కోరారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీ స్థాయీ సంఘం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 16 నుంచి ఒంటిపూట బడులు ● ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే రోజుల్లో తరగతులు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు పెట్టుకోవాలన్నారు. పరీక్షలు లేనిరోజుల్లో మాత్రం సాధారణంగా ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం 7.45లోపు ఇన్–టైమ్, మధ్యాహ్నం 12.30 తర్వాత అవుట్–టైమ్ నమోదు చేయాలని డైరెక్టర్ సూచించారు. ఒంటిపూట బడుల అమలులో ఉన్న సమయంలో హాఫ్ డే క్యాజువల్ లీవ్ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఇక పదో తరగతి పరీక్షల డ్యూటీకి వెళ్లే టీచర్లు అటెండెన్స్ యాప్లో ‘పదో తరగతి డ్యూటీ’గా నమోదు చేయాలని, పరీక్షలు లేని రోజుల్లో తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. -
అన్నదాత సుఖీభవ ఊసేలేదు
సొంత భూమి లేని నేను దోసలుడికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ భూమిలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాను. వర్షాభావం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టాలు వస్తున్న తరుణంలో కౌలు డబ్బులు చెల్లించడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘రైతు భరోసా’ కింద కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంది. అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న చంద్రబాబు.. ఇంత వరకూ ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. రైతుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? – చిప్పగిరి రంగడు, కౌలు రైతు, దోసలుడికి, గుంతకల్లు మండలం -
విత్తనం నుంచి ఎరువులు, పురుగుమందుల వరకు ధరలు పెరిగిపోతున్నాయి. సాగు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులకు కొంత ఊరట కలిగిస్తుంది. అయితే ఈ సాయం అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొర్రీలు వేస్తూ రైతులను అనర్హుల
అనంతపురం అగ్రికల్చర్: గత ప్రభుత్వం కన్నా మిన్నగా రైతులను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదు. ఎన్నో వాయిదాలు, ఎదురుచూపుల తర్వాత మూడో విడత అన్నదాత సుఖీభవ ‘పెట్టుబడి సాయం’ విడుదల చేశారు. అర్హత ఉన్నప్పటికీ ఏదో ఒక కారణం చూపుతూ ‘పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ’ జాబితా నుంచి తప్పించి చాలామందికి మొండిచేయి చూపారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటపై నిలబడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న రూ.20 వేల హామీని రూ.14 వేలకు కుదించారు. అది కూడా తొలి ఏడాది (2024–205) ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు చేయకుండా జిల్లా రైతులకు రూ.400 కోట్లకు పైగా సాయం ఎగ్గొట్టేశారు. ఇక రెండో ఏడాది (2025 –2026) ఎన్నో ఒత్తిళ్లు, విమర్శల నడుమ పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. జూన్లో వేయాల్సిన తొలివిడత సొమ్మును ఆగస్టులో జమ చేశారు. రెండో విడత నవంబరులో వేశారు. జనవరిలో ఇవ్వాల్సిన మూడో విడత సొమ్మును రెండు నెలల ఆలస్యంగా శుక్రవారం విడుదల చేశారు. 30 వేల మందికి అందని సాయం పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ కింద గతంలో ఉన్న రైతుల సంఖ్య రకరకాల నిబంధనల పేరుతో కుదించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పీఎం కిసాన్ కింద 2.85 లక్షల మందికి ఏటా రూ.6 వేలు ఇచ్చారు. అలాగే రైతు భరోసా కింద ఏటా 2.90 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2.58 లక్షల మందికి మాత్రమే ఇస్తూ... మిగతా 30 వేల మంది రైతులకు పంగనామాలు పెట్టింది. అలాగే సుఖీభవ కింద ఇప్పుడు 2.75 లక్షల మందికి ఇస్తూ మిగిలిన 15 వేలమందికి రిక్తహస్తం చూపించింది. ఇక అర్హుల జాబితాలో ఉన్న కొందరు రైతులకు సంబంధించి ఈ – కేవైసీ కాదని, ఎన్పీసీఐ యాక్టివ్గా లేదని, మ్యాపింగ్ చేయించుకోలేదని వ్యవసాయశాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు. కొర్రీలు వేయడం, మరికొన్ని కారణాలతో ఏటా రూ.50 కోట్ల వరకు రైతులు కోల్పోతున్న దుస్థితి కల్పించారు. గతంలో ఠంచనుగా పెట్టుబడిసాయం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ మేరకు పీఎం కిసాన్–రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం ఖరీఫ్కు అనుకూలంగా జూన్, రబీకి అక్టోబర్, పంటకోతలు జరిగే సంక్రాంతికి ఇలా... మూడు విడతల్లో క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. అలాగే ఐదేళ్ల కాలంలో ప్రతి రైతుకూ రూ.67,500 ప్రకారం భరోసా కల్పించారు. అలా ఐదేళ్ల కాలంలో 14.35 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ.1,937 కోట్లు పెట్టుబడిసాయం జమ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కౌలు, దేవదాయ, అటవీభూమి సాగుదారుల కింద 2 వేల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో రూ.13,500 ప్రకారం సాయం చేసింది. బాబు పాలనలో అన్నీ కష్టాలే.. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. వారికి పైసా కూడా సాయం అందించలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయలేదు. దీంతో వారి కష్టాలు మరింత పెరిగిపోయాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు, ఇన్సూరెన్స్ గల్లంతైపోయింది. సబ్సిడీ యంత్ర పరికరాలు లేవు. విత్తనాలు, ఎరువుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా లేదు. పంటలకు మద్దతు ధరల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అటు వ్యవసాయం ఇటు ఉద్యానవనం రెండో సంక్షోభంలో కూరుకుపోతున్నా చంద్రబాబు సర్కారు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పీఎం కిసాన్–సుఖీభవ సొమ్ము విడుదల అర్హుల సంఖ్య కుదింపు పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవలో వేల మందికి అన్యాయం ప్రతి రైతుకూ ఏటా రూ.20వేలు ఇస్తామని రూ.14వేలకు తగ్గించేసిన చంద్రబాబు తొలి ఏడాది పథకం అమలు చేయకుండా జిల్లా రైతులకు రూ.400 కోట్లకు పైగా ఎగనామం రెండో ఏడాదిలో ‘పీఎం కిసాన్’ కింద 30 వేల మంది, ‘సుఖీభవ’ కింద 15 వేల మందికి మొండిచేయి కౌలు రైతులకు పైసా విదల్చని సర్కారు -
ఎస్కేయూ వీసీగా జ్యోతి కుమార్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నూతన వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్/ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్వీఆర్ విజయ్కుమార్ మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 39 సంవత్సరాల బోధనానుభవం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఎస్కేయూకు శాశ్వత వీసీ నియామకం జరిగింది. 18 నెలలుగా ఇన్చార్జ్ వీసీతోనే ఎస్కేయూ కార్యకలాపాలు జరిగాయి. ఎస్కేయూ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ బి.అనిత ఎక్కువ కాలం పనిచేసి రికార్డు సృష్టించారు. -
వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు
● గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయాలి ● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం ● ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్– 85002 92992 అనంతపురం అర్బన్: వంట గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ సమయంలో ఏవైనా సమస్యలు వస్తే వినియోదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ 85002 92992 ఏర్పాటు చేశామన్నారు. డొమెస్టిక్ (గృహావసరాల) గ్యాస్ సిలిండర్ల సరఫరాపై జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు బల్క్ స్టాక్ తెప్పించుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీలు తమ వద్ద సిలిండర్ వివరాలను రోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఒకసారి, తిరిగి సాయంత్రం 4 గంటలకు మరోసారి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. అత్యవసర రంగాలకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆస్పత్రులు, తదితర వాటికి ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందించాలని ఆధికారులను ఆదేశించారు. అవసరం ఉంటే నే బుక్ చేయాలి గ్యాస్ వినియోగదారులు అవసరం ఉంటేనే సిలిండర్ బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ చెప్పారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం సరికాదన్నారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల వ్యవధి, డబుల్ సిలిండర్ ఉన్నవారు 30 రోజుల వ్యవధిలో మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. సిలిండర్ డెలివరీ క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ 85002 92992 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
ఎస్ఐఆర్కు సహకరించండి
అనంతపురం అర్బన్: ‘ఓటరు జాబితాకు సంబంధించి త్వరలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని డీఆర్ఓ ఎ.మలోల అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులో డీఆర్ఓ గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నుంచి షెడ్యూల్ వెలువడిన వెంటనే జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రారంభమవుతుందన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, వివరాల మార్పు ప్రక్రియను బీఎల్ఓలు చేపడతారన్నారు. ఇప్పటి వరకు ఓటరు నమోదు (ఫారం6), ఓటు తొలగింపు (ఫారం7), వివరాల మార్పు (ఫారం8)కు సంబంధించి అందిన క్లెయిమ్లు, పరిష్కారం, ఓటరు మ్యాపింగ్ తదితర వివరాలను తెలియజేశారు. సమావేశంలో పార్టీల ప్రతినిధులు సోమశేఖర్రెడ్డి, ఈశ్వరప్రసాద్, నారాయణస్వామి,బాలరంగయ్య, అంజయ్య, ఇమామ్ వలి, ఎన్నికల డీటీ కనకరాజు, ఎస్ఏ శామ్యూల్ బెంజిమెన్, ఐటీ వింగ్ శివ, తదితరులు పాల్గొన్నారు. -
నా చావు వెనుక ఎవరి ప్రమేయమూ లేదు!
బత్తలపల్లి: ‘నా చావు వెనుక ఎవరి ప్రమేయం లేదు. కేసులు పెట్టుకోవద్దు’ అంటూ ఓ గర్భిణి ఉత్తరం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు... అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన బెల్లపుకొండ శ్రీనివాసులు కుమార్తె శ్రీలక్ష్మి(20)కి బత్తలపల్లికి చెందిన ఆలకుంట శ్రీనివాసులుతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అన్యోన్యంగానే ఉండేవారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి గర్భిణి. గురువారం వైద్య పరీక్షలకు వెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ సమయంలో భర్త శ్రీనివాసులు తన సోదరి కుమార్తెను పాఠశాలలో వదిలేందుకు వెళ్లాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు ఎంత తట్టినా శ్రీలక్ష్మి తలుపు తీయకపోవడంతో బలవంతంగా తెరిచి లోపలకు ప్రవేశించాడు. అప్పటికే ఇంట్లో ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను గమనించి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆమెను కిందకు దించి మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో శ్రీలక్ష్మి బంధువులు బత్తలపల్లికి చేరుకున్నారు. తమ బిడ్డను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు రిమాండ్ ఖైదీగా కడప జైలులో ఉన్నాడని, ఆయన వచ్చి ఫిర్యాదు చేసే వరకూ మృతదేహాన్ని అక్కడి నుంచి కదిలించేది లేదని భీష్మించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ సోమశేఖర్, తహసీల్దార్ స్వర్ణలత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా మృతురాలు తన చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయానని, తండ్రి జైలులో ఉన్నాడని, తాను సంతోషంగా ఉండడం బంధువులకు ఇష్టం లేదని, తన మృతి వెనుక ఎవరి ప్రమేయం లేదని లేఖ రాసి పెట్టింది. కేసులు కూడా పెట్టుకోవద్దని అందులో కోరింది. ఈ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలక్ష్మి తండ్రి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. ఉరి వేసుకుని గర్భిణి ఆత్మహత్య నాలుగు నెలల క్రితం వివాహం అత్తింటి వారే చంపారంటూ బంధువుల ఆరోపణ -
‘ఉపాధి’లో రూ.1.50 కోట్ల అక్రమాలు
● సామాజిక తనిఖీలో బహిర్గతమైన అవినీతి ఉరవకొండ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉరవకొండ మండలంలో చేపట్టిన పనుల్లో రూ.1.50 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగాయని అధికారులు స్పష్టం చేశారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏపీడీ సుధాకర్రెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీనివాసులు, ఎంపీడీఓ రవిప్రసాద్ సమక్షంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో అక్రమాలను సామాజిక తనిఖీ బృందం నివేదించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉరవకొండ మండలంలోని 17 పంచాయతీల పరిధిలో చేసిన 1,394 పనులకు గాను రూ.8.17 కోట్లు వెచ్చించారు. కొందరు ఉపాధి హామీ సిబ్బంది అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ నామమాత్రపు పనులతో రూ.లక్షలు స్వాహా చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో బోగస్ కూలీలను సృష్టించి వారి పేర్లతో సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో రూ.1.50 కోట్ల మేర అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా నిర్ధారణ కావడంతో రూ.1.48 లక్షల రికవరీకి అధికారులు ఆదేశించారు. ఈ అక్రమాలపై మరింత లోతుగా విచారణ కొనసాగించి పూర్తి స్థాయి సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు -
వృథాను అరికట్టడానికే..
అనంతపురం టౌన్: కరెంటు కావాలంటే ఇకమీదట రీచార్జ్ చేసుకోవాల్సిందే. అవును ఇది నిజం. మొబైల్ – డీటీహెచ్కు ఎలా అయితే చేస్తారో కరెంటు కోసం కూడా అలానే రీచార్జ్ చేయాలి. విద్యుత్ వృథా ఖర్చును ఆరికట్టడం కోసమే చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ విధానాన్ని చాలాప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తొలుతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ రీచార్జ్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రీచార్జ్ మొత్తం ఇలా... ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ప్రతి నెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లును ర్యాండమ్గా తీసుకొని నెల వారీ ఖర్చు (యూనిట్లు)ను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే వినియోగదారునికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే వినియోగదారు ఎంతమేర విద్యుత్ వినియోగించారు.. అందు కోసం పెట్టిన ఖర్చు.. మిగిలిన బ్యాలెన్స్ వివరాలు మెసేజీలో తెలియజేస్తారు. తద్వారా వినియోగంపై స్పష్టత వస్తుంది. రీచార్జ్ చేసుకోవడం ఆలస్యమైతే ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మళ్లి రీచార్జ్ చేసుకుంటే నిమిషాల్లోనే విద్యుత్ పునరుద్దరిస్తారు. ఇందు కోసం స్మార్ట్ మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, తమ సిబ్బందితో మానిటరింగ్ చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో చకచకా స్మార్ట్ మీటర్లు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 14 వేల కార్యాలయాల్లో ఇప్పటికే 11 వేల కార్యాలయాల్లో స్మార్టు మీటర్లు ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల కార్యాలయాలకు గాను 7వేల కార్యాలయాల్లో ఇప్పటికే మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కార్యాలయాల్లో సైతం మరో 10 రోజుల్లో 100 శాతం ప్రీ పెయిడ్ స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు అనంతపురం నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని వీధి దీపాలకు సైతం స్మార్టు మీటర్లు అనుసంధానం చేయనున్నారు. ప్రీపెయిడ్ స్మార్టు విద్యుత్ మీటర్ ఇక స్మార్ట్ మీటర్ల ద్వారానే విద్యుత్ సరఫరా ఉమ్మడి జిల్లాలో 24 వేల కనెక్షన్లు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు విద్యుత్ వృథా ఖర్చు, దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు కీలకంగా వ్యవహరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీధి దీపాలు రాత్రి, పగలు తేడా లేకుండా వెలుగుతూనే ఉంటాయి. స్మార్ట్ మీటర్లకు వీధి దీపాలను అనుసంధానం చేస్తే సాయంత్రం 6 గంటల నుంచి వెలుగుతాయి. తిరిగి మరుసటిరోజు ఉదయం ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. దీంతో విద్యుత్ ఖర్చు సైతం అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది. -
రాయల్ మధుపై చర్యలు తీసుకోవాల్సిందే
● టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును డిమాండ్ చేసిన మైనార్టీలు అనంతపురం టౌన్: టీడీపీ మైనార్టీ నాయకుడు నూర్ మహమ్మద్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన అదే పార్టీకి చెందిన రాయల్ మధుపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహంలో మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. పూల నాగరాజుతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఇఫ్తారు విందు ఏర్పాటు చేస్తే చంపేస్తారా? మీ పార్టీ వైఖరి ఇదేనా? అంటూ పూల నాగరాజును నిలదీశారు. మైనార్టీల పట్ల టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకీ నగరంలో మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. మైనార్టీలకు పార్టీ వ్యతిరేకమా? అనుకూలమా? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మైనార్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాయల్ మధును పార్టీ నుంచి సస్పెండ్ చేయించడంతో పాటు కేసు నమోదు చేయించాలన్నారు. నూర్ మహమ్మద్ను ఆత్మహత్యకు ప్రేరేపించేలా వ్యవహరించిన రాయల్ మధు, ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేకపోతే శుక్రవారం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తనకు రెండు రోజులు గడువు ఇవ్వాలని మైనార్టీ నాయకులను పూల నాగారాజు అభ్యర్థించారు. అయినా నాయకులు వినలేదు. రాయల్ మధు, ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్పై కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షకీల్ షఫీ, దాదా గాంధీ, మున్సిపల్ మాజీ చైర్మన్ నూర్ మహమ్మద్తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. టీచర్లకు ‘పది’ ఇన్విజిలేషన్ ఉత్తర్వులు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ఇన్విజిలేటర్ల నియామక ఉత్తర్వులు గురువారం సాయంత్రం నుంచి జనరేట్ కానున్నాయి. సంబంధిత ఉపాధ్యాయులకు లీప్ యాప్ లాగిన్లలో పంపారు. కేంద్రం పేరు, ఏరోజు డ్యూటీ ఉంటుందనే వివరాలను అందులో పొందుపరిచారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి లాంగ్వేజ్ పరీక్షలకు నాన్ లాంగ్వేజ్ టీచర్లను, నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు లాంగ్వేజ్ టీచర్లను నియమించారు. డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ లాగిన్లలో జాబితాను ప్రదర్శించినట్లు రాష్ట్ర అధికారులు ఇక్కడి అధికారులకు సమాచారం అందించారు. డ్యూటీకి నియమించిన టీచర్లకు వెంటనే సమాచారం అందించాలని సూచనలిచ్చారు. అయితే రాత్రిదాకా తమకు ఎలాంటి సమాచారం అందలేదని డీఈఓ కార్యాలయ ఏఎస్ఓ శ్రీనివాసులు తెలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. ఎవరికి ఆర్డరు వచ్చిందో...ఏ సెంటర్కు వేశారు, ఎవరికి రాలేదు, అనర్హులకు డ్యూటీలను వేశారా? అనే వివరాలు తెలియక చాలామంది టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఏదిఏమైనా శుక్రవారం ఉదయానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు అనంతపురం టవర్క్లాక్: ఈ నెల 17న ఉమ్మడి అనంతపురం జిల్లా జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిరంతరాయంగా కంప్యూటర్లపై విధులు నిర్వర్తిస్తున్న కారణంగా జర్నలిస్టులు కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న అనంతపురంలోని ప్రెస్క్లబ్లో కంటి వైద్య శిబిరాన్ని కేవలం జర్నలిస్టుల కుటుంబాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలను ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98491 52149, 73869 58666, 80745 86699, 94900 62555 లో సంప్రదించాలన్నారు. -
ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్గా శ్రీనివాసులు
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) జిల్లా మేనేజర్గా పి.శ్రీనివాసులు గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కె.సుబ్బయ్య బదిలీపై కాకినాడకు వెళ్లారు. ఆయన స్థానంలో విజయవాడ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న పి.శ్రీనివాసులును నియమించడంతో స్థానిక ఏపీ సీడ్స్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ నేతల కోడి రాజకీయం ● కోడిని సాకుగా చూపి వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడి ● బాధితులపైనే కేసు నమోదు ● కుట్రలు ఎల్లకాలం సాగవన్న వైఎస్సార్సీపీ నేత కళ్యాణదుర్గం రూరల్: వైఎస్సార్సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కళ్యాణదుర్గం మండలం కడదరకుంటలో టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారంటూ వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు అశోక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిని ఎరగా వేసి దాడికి పూనుకోవడమే కాకుండా బాధితులపై అక్రమంగా కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపడం దారుణమన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పాత కక్షల నేపథ్యంలో రెండు రోజుల క్రితం కడదరకుంటకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు రామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, వారి కుటుంబసభ్యులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎర్రపరెడ్డి, సంజీవరెడ్డి, మంజులమ్మ దాడి చేశారని గుర్తు చేశారు. అయితే ఈ అంశంలో ఓ కోడిని వారు ఎరగా చూపారన్నారు. కోడిని దొంగలించారంటూ దాడికి పాల్పడడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు గుర్తింపు కోసం వెంటనే ఆస్పత్రిలో చేరి సానుభూతి పొందారన్నారు. వాస్తవాలు ఏమాత్రం పట్టని ఎమ్మెల్యే సైతం పోలీసులను ఉసిగొల్పి సూర్యనారాయణరెడ్డి, రామిరెడ్డిపై అక్రమ కేసు బనాయించి, వారిని రిమాండ్కు పంపడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. గతంలోనూ ఈ రెండు వర్గాల మధ్య పలుమార్లు డీలర్ నియమాకం విషయంలో గొడవలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కోడి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రలు ఎల్లకాలం సాగవని గుర్తించాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేసి అసలు దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ జగదీష్ బదిలీ అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని నాల్గో పట్టణ సీఐ జగదీష్ బదిలీ అయ్యారు. తిరుపతిలోని పీటీసీకి ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో గురువారం ఆయన రిలీవ్ అయ్యారు. దీంతో త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్కు నాల్గో పట్టణ సీఐగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వృద్ధుడి ఆత్మహత్య అనంతపురం సెంట్రల్: తాగుడు అలవాటు మానుకోలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసనాయక్ (60) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తాగుడు మానేయాలంటూ కుటుంబసభ్యులు పలుమార్లు నచ్చచెబుతూ వచ్చారు. తనకు కూడా తాగుడు మానేయాలని ఉందని, అయితే మద్యం తాగకపోతే తనకు ఏదోలా ఉంటుందని, అభద్రతా భావంతో నలగాల్సి వస్తోందని బాధపడేవాడు. ఈ క్రమంలోనే తాగుడు అలవాటు మానుకోలేక జీవితంపై విరక్తితో గురువారం విషపు ద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ రాజేంద్రనాథ్యాదవ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తండ్రి జ్ఞాపకాలు మరువలేక బాలిక... తండ్రి పంచిన ప్రేమాభిమానాలు మరువలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న మదనగోపాల్, కోమల దంపతులకు కుమార్తె గౌతమి (15) ఉంది. జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మదనగోపాల్ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఇంటి బాగోగులను కోమల చూసుకుంటూ వస్తున్నారు. మదన్గోపాల్ చనిపోయి శుక్రవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తండ్రిని గుర్తు చేసుకుని మనోవేదనకు లోనైన కుమార్తె గౌతమి గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పలు రైల్వేస్టేషన్లలో స్టాపింగ్కు అనుమతి గుంతకల్లు: తిరుపతి–కదిరిదేరపల్లి ప్యాసింజర్ రైళ్లకు పలు రైల్వేస్టేషన్లలో స్టాపింగ్కు అనుమతులు ఇచ్చినట్లు డివిజన్ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు–బళ్లారి సెక్షన్లోని బేవనహాలు–వీరపూర్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న టీ.సాకేబండ రైల్వేస్టేషన్లో, తిరుపతి–చంద్రగిరి సెక్షన్లోని తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్లో స్టాపింగ్కు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. -
అత్తారింటి ఎదుట వివాహిత నిరసన
ఉరవకొండ: తనకు తెలియకుండా తన భర్త రెండో వివాహం చేసుకుని అన్యాయం చేశాడంటూ ఓ వివాహిత తన అత్తారింటి ఎదుట గురువారం నిరసన చేపట్టింది. ఈ బాధితురాలు మలిగిలి రిజ్వానా విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లుకు చెందిన రిజ్వానాకు ఉరవకొండలోని బళ్లారి మార్గంలో నివాసముంటున్న మలిగిలి నూర్బాషా, ముష్కిన్ దంపతుల మొదటి కుమారుడు మలిగిలి షాబాజ్తో 2014లో వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె సుమేరా, ఎనిమిదేళ్ల కుమారుడు హరీష్ జైన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం రిజ్వానాను భర్తతో పాటు అత్తామామలు వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కరోనా సమయంలో గుట్టుచప్పుడు కాకుండా కణేకల్లుకు చెందిన యువతితో 2021లో షాబాజ్కు అత్తామామలు రెండో పెళ్లి చేశారు. ఈ విషయం తెలుసుకున్న రిజ్వానా.. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని నిలదీసింది. దీంతో అత్తింటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని బెదిరించి కాళ్లూచేతులు కట్టేసి ఇంట్లోనే నిర్బంధించారు. అయితే ఇదే విషయాన్ని తన తల్లికి, బంధువులకు తెలియజేయడంతో వారు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయం కోరుతూ రిజ్వానా కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆగ్రహించిన అత్తింటి వారు కొన్ని రోజులుగా తనను ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని, ఇంటికి తాళం వేసి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు వాపోయింది. ప్రస్తుతం తన పిల్లలకు తిండి కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. రిజ్వానా విలేకరులతో మాట్లాడుతుండగానే అత్తింటి వారు ఆమె కుటుంబసభ్యులతో గొడవకు దిగారు. ఒకానొక సమయంలో పరిస్థితి చెయ్యి దాటి పరస్పరం కొట్టుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని పీఎస్కు తరలించారు. రిజ్వానా అత్త ముస్కిన్, మామ నూర్బాషా మాట్లాడుతూ.. తమ కోడలు తమ పైనే తప్పుడు కేసులు పెట్టి హింసిస్తోందని, పెద్ద మనుషుల సమక్షంలోనే ఇల్లు ఇచ్చి, ప్రతి నెలా డబ్బు కూడా చెల్లిస్తున్నా దౌర్జన్యం చేస్తోందని విలేకరుల ఎదుట వాపోయారు. కాగా, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తనకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఆవేదన తనను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తున్నారని ఇద్దరు పిల్లలతో కలసి నిరసన ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ – ఉద్రిక్తత -
సిలిండర్ర్
● ఆన్లైన్లో బుకింగ్ తీసుకోని వైనం ● ఆందోళనలో వినియోగదారులు అనంతపురం అర్బన్: ‘డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లకు సిలిండర్ల కొరత లేదు.. యథావిధిగా సరఫరా అవుతున్నాయి.. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ అని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సిలిండర్ అందే విషయం అటుంచితే అసలు బుకింగే కావడం లేదు. పలుమార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. కాల్ కట్.. గ్యాస్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు తమ సెల్ ఫోన్ ద్వారా ప్రయత్నిస్తే కాల్ కట్ అవుతోంది. మరికొందరికి కొద్దిసేపు ఆగి ప్రయత్నించండంటూ వాయిస్ వస్తోంది. తర్వాత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ కాకపోతే పరిస్థితి ఏమిటంటూ మండిపడుతున్నారు. సర్వర్ సమస్య ఉందంటున్నారు గ్యాస్ బుకింగ్ కావడం లేదనే విషయం మా దృష్టికి వచ్చింది. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడాం. సర్వర్లో సాంకేతిక సమస్య ఉంది అని చెప్పారు. పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. – వెంకటేశ్వర్లు, జిల్లా సరఫరాల అధికారి -
కసాపురంలో 19 నుంచి ఉగాది ఉత్సవాలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉగాది ఉత్సవాలు ఈ నెల19న ప్రారంభం కానున్నాయి. గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు ఉగాది ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈవో మేడేపల్లి విజయరాజు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న గ్రామోత్సవం, పంచాంగ శ్రవణం, 20వ తేదీన స్వామివారి రథోత్సవం, 21న లంకాదహనం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఉత్సవాలు జరగనున్న మూడు రోజులూ భక్తుల కాలక్షేపం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు ● జిల్లా కోర్టు సంచలన తీర్పు కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం: బాలుడి హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధించింది. కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠేశ్వర తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శెట్టూరు మండలం తిప్పనపల్లికి చెందిన గొల్ల ఈరన్న కుమారులు సన్న ఈరన్న, చిత్తప్పలకు భూమి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి. సన్న ఈరన్న కుమారుడు విష్ణువర్దన్ (11) తన చిన్నాన్న చిత్తప్ప తోటలోకి నీరు తాగడానికి వెళ్లి అక్కడ ఒక మామిడిపండు, వేరుశనగ కాయలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే విష్ణువర్ధన్ను అడ్డగించిన చిత్తప్ప, బాలుడి తాత ఈరన్న, మామ మురుకుందప్పలు ఎందుకు తోటలోకి వచ్చావని ప్రశ్నించారు. తోటలో తనకు కూడా హక్కు ఉందని విష్ణువర్ధన్ అనడంతో కోపోద్రిక్తులైన ముగ్గురూ బాలుడిని కొట్టి, తాడును అతడి మెడకు బిగించడంతో మరణించాడు. అనంతరం అక్కడే ఉన్న టార్ఫాలిన్ పట్టలో చుట్టి గడ్డివాములో దాచిపెట్టి ముగ్గురూ వెళ్లిపోయారు. 2022 సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై బాలుడి తండ్రి సన్న ఈరన్న ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ యువరాజ్ కేసు నమోదు చేయగా.. కళ్యాణదుర్గం సీఐ శ్రీనివాసులు సమగ్ర దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసులో తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది. ముద్దాయిలపై అభియోగాలు రుజువు కావడంతో ముగ్గురికీ జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భీమారావు గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ఏ1 గొల్ల చిత్తప్పకు రూ.25 వేలు, ఏ2 గొల్ల ఈరన్నకు రూ.50 వేలు, ఏ3 మురుకుందప్పకు రూ.10 వేలు జరిమానా విధించారు. జరి మానా కట్టని పక్షంలో మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కేసులో ముద్దాయిలకు శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు మానిటరింగ్ సిస్టం లైజన్ ఆఫీసర్ మారెన్న (ఏఎస్ఐ), కోర్టు లైజన్ ఆఫీసర్ మల్లారెడ్డి (ఏఎస్ఐ), కానిస్టేబుళ్లు కృష్ణమోహన్, రామమోహన్, కుళ్లాయిస్వామిని ఎస్పీ జగదీష్, కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు అభినందించారు. -
తాడిపత్రి సీఐ ఆరోహణరావు ఓవరాక్షన్
● వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనకూడదంటూ నేతలకు హుకుం ● నాయకులపై బూతులతో రెచ్చిపోయిన వైనం తాడిపత్రిటౌన్: తాడిపత్రి సీఐ ఆరోహణరావు ఓవరాక్షన్ చేశారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఆయన వ్యవహ రించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనకూడదంటూ పార్టీ తాడిపత్రి పట్టణ కన్వీనర్ రాబర్ట్, రూరల్ కన్వీనర్ విజయ్కాంత్రెడ్డి, మాజీ మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ ఓబులరెడ్డికి సీఐ ఆరోహణరావు హుకుం జారీ చేశారు. బుధవారం రాత్రి పోలీసులు వారికి ఫోన్లు చేసి హెచ్చరికలు చేశారు. ఆ ముగ్గురు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్దకు రాకుండా గురువారం ఉదయం నుంచే పోలీస్ బలగాలతో సీఐ కాపు కాశారు. అయితే వారు అంతకు ముందే పార్టీ కార్యాలయానికి చేరుకున్నా రని తెలుసుకున్న ఆయన.. అనంతరం నేతలు స్థానిక వైఎస్సార్ సర్కిల్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోగా.. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందంటూ సీఐ ఆరోహణరావు రెచ్చిపోయారు. కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులను దుర్భాషలాడారు.‘ముందుకు వెళ్లండిరా రేయ్’ అంటూ నాయకులను దూరంగా పంపించివేశారు. వైఎస్సార్సీపీ నాయకుల పట్ల సీఐ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
● నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి శ్రీవారి దర్శనం ● పుష్పయాగోత్సవంతో నేడు బ్రహ్మోత్సవాలకు ముగింపుకదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం(తీర్థవాది) గురువారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భృగుతీర్థం(కోనేరు)లో పుణ్యస్నానాలు ఆచరించారు. పక్షం రోజుల పాటు సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖ శాంతులతో ఉండేందుకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తామని అర్చక పండితులు వివరించారు. చక్రస్నానంలో భాగంగా శ్రీవారి సుదర్శన చక్రానికి భృగుతీర్థంలో స్నానం నిర్వహించే ముందు శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడికి స్నపన తిరుమంజనం గావించారు. తర్వాత పుష్కరిణిలో ముంచి స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శ కోసం భక్త జనులు పుష్కరిణి జలంతో స్నానమాచరించారు. తీర్థవాది ఉత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఆలయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, పోలీసులతో పాటు పాల్గొన్న భక్తులందరూ రంగులు చల్లుకొని ఆనందోత్సాహాలతో గడిపారు. చక్రస్నానంతో యజ్ఞఫలం ‘బ్రహ్మోత్సవాలు నిర్వహించిన వారికి.. ఇందుకు సహకరించిన వారికి ..ఉత్సవాల్లో శ్రీవారిని దర్శించుకున్న వారికి ఇలా..అందరికీ శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది’ అని అర్చక పండితులు ఈ సందర్భంగా తెలిపారు. చక్రస్నానానికి ముందు స్వామివారికి పలు రకాల పూజలు నిర్వహించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం చేశారు. ధ్వజావరోహణం ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వా నిస్తూ గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసిన అర్చకులు..శ్రీవారి చక్రస్నానం అనంతరం దాన్ని ఽఅవరోహణం చేశారు. దీన్నే కదిరి ప్రాంతంలో కంకణాలు విప్పడం అంటారు. ధ్వజావరోహణంతో ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లయిందని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు. ఆలయం మూత బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణం నాటి నుంచి తీర్థవాది వరకూ స్వామి వారు యాగశాలలోనే గడిపారు. తీర్థవాది ముగించుకొని గురువారం స్వామివారు తిరిగి ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం ఆలయ శుద్ధితో పాటు సంప్రోక్షణ చేసిన తర్వాత స్వామివారిని మేల్కొల్పుతారు. అలంకరణ అనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అర్చక పండితులు తెలిపారు. నేడు పుష్పయాగోత్సవం బ్రహ్మోత్సవాల ముగింపునకు నిదర్శనంగా శుక్రవారం (నేడు) ఆలయ ప్రాంగణంలో పుష్పయాగోత్సవం నిర్వహిస్తారు. వివిధ రకాల పుష్పాలతో అలంకృతుడైన శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుడు భక్తులను ఆశీర్వదిస్తారు. బ్రహ్మోత్సవాలకు నలుదిక్కుల నుంచి విచ్చేసిన ఇంద్రాది అష్ట దిక్పాలకులకు, ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలతో చందన, పుష్ప, తాంబూలాలు సమర్పించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. -
●నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అలుకోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామి వారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలమని, కలియుగాంతంలో తాను అశ్వ వాహనంపై వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని చాటి చెప్పడం కోసమే శ్రీవారు అశ్వవాహనంపై ఊరేగుతారని వేద పండితులు వివరించారు. అంతకుముందు యాగశాలలో నిత్యహోమం చేశారు. అనంతరం శ్రీవారిని విశేషంగా అలంకరించి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న భక్తులు ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ కీర్తించారు. ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు బ్రహ్మోత్సవాలతో పాటు అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. అన్ని ఉత్సవాలకు ఉభయదారులుగా భక్తులు వ్యవహరిస్తే ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవానికి ఆలయ సహాయ కమిషనర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నేడు తీర్థవాది ఉత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తీర్థవాది ఉత్సవం గురువారం భృగుతీర్థం(కోనేరు)లో భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరగనుంది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాడు ఆలయం ముందున్న ప్రధాన ధ్వజ స్తంభానికి కట్టిన కంకణాలు గురువారం మధ్యాహ్నం విప్పేస్తారు. అంటే ధ్వజావరోహణం చేస్తారు. దీంతో తీర్థవాది ఉత్సవం ముగుస్తుంది. అనంతరం స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి నారసింహుడు యాగశాలలోనే గడిపారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆలయం తలుపులు మూసివేస్తారు. తిరిగి శుక్రవారం ఉదయం నుండి స్వామివారు ఆలయంలో యథావిధిగా భక్తులకు దర్శనమిస్తారు. -
పేదలకు అండ.. వైఎస్సార్సీపీ జెండా
● ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం ● నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినం ● జిల్లా అంతటా సంబరాలు అనంతపురం: వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. విలువలు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. తిరుగులేని శక్తిగా అవతరించింది. ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా జనహితమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోంది. ‘నేనున్నానంటూ’ భరోసా.. వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమయ్యాక.. అప్పటి రాజకీయ పరిస్థితులు వైఎస్ జగన్ను ప్రజలకు దగ్గర చేశాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భవించాక... వైఎస్ జగన్ మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. 14 నెలల పాటు 3,648 కి.మీ దూరం మేర సాగిన ఈ పాదయాత్రలో పేదల కష్టాలను ఆయన కళ్లారా చూశారు. లక్షలాది మందికి ‘నేనున్నానంటూ’ అభయమిచ్చారు. వేలాది మందికి అప్పటికప్పుడే ఆపన్నహస్తం అందించారు. ఫలితంగా 2019లో జరిగిన ఎన్నికల్లో జనం చంద్రబాబు దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకలించారు. వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50 శాతానికి పైగా ఓట్లు, 151 శాసనసభ (87 శాతం), 22 లోక్సభ(88 శాతం) స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజల ముంగిటకే పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టాక జనరంజక పాలన సాగించారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే తీసుకెళ్లారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లోకి నేరుగా ఆర్థికసాయం జమ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపి పెద్దకొడుకుగా నిలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయినా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడింది. జిల్లా ప్రజలకు ఎంతో లబ్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన (2019–2024)లో జిల్లా ప్రజలు కుల, మతాలు, పార్టీలకతీతంగా లబ్ధి పొందారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 5 లక్షల మంది రైతులకు రూ.1767.09 కోట్లు, సున్నా వడ్డీ, పంట రుణాల ద్వారా రూ.900 కోట్లు, ఉచిత పంటల బీమా కింద రూ.918.57 కోట్లు అందింది. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా 3 లక్షల మందికి రూ.4,500 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద రూ.10 వేల కోట్లు, వైఎస్సార్ బీమా కింద రూ.90 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 150 కోట్లు, జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ1200.49 కోట్ల మేర లబ్ధి అందింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 43,301 మందికి రూ162.38 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.414..91 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. నేడు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారం నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగిడుతోంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాపంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. అన్ని నియోజక వర్గాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతో పాటు రక్తదానం, అన్నదానం, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీకి సిద్ధమయ్యారు. రెండేళ్లకే తారుమారు రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరి రెండేళ్లవుతున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా పన్నుల మోతతో జనానికి వాతలు పెట్టారు. నాటి సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. చివరకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా అందని పరిస్థితుల్లో యువత భవిత ప్రశ్నార్థకమైంది. బీమా, ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడిన చంద్రబాబు కనీసం విత్తనాలు, ఎరువు కూడా ఇవ్వకపోవడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిత్యావసర ధరలను నియంత్రించకపోవడంతో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు మళ్లీ అందరూ వైఎస్సార్సీపీవైపు చూస్తున్నారు. జగన్ పాలన కోసం జై కొడుతూ బాబు ప్రభుత్వంపై తిరుగు‘బావుటా’ ఎగురవేస్తున్నారు. -
రేపు చివరి విడత ‘పీఎం కిసాన్– సుఖీభవ’ సొమ్ము
అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ కింద ఈ ఏడాదికి సంబంధించి చివరి (మూడో) విడతగా శుక్రవారం రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ కానుందని వ్యవసాయశాఖ జేడీ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2న మొదటి విడతగా రూ.7 వేలు, రెండో విడతగా నవంబర్లో రూ.7 వేలు ప్రకారం జమ చేశారు. ఇప్పుడు మూడో విడత కింద కేంద్రం నుంచి రూ.2 వేలు, రాష్ట్రం వాటా కింద రూ.4 వేల ప్రకారం మొత్తం రూ.6వేలు జమ చేస్తారన్నారు. జిల్లాకు సంబంధించి సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్ కింద 2.58 లక్షల మంది రైతులకు రూ.53.01 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గానికి రూ.28.32 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలకు రూ.13.46 కోట్లు, శింగనమలకు రూ.31.52 కోట్లు, గుంతకల్లుకు రూ.16.31 కోట్లు, కళ్యాణదుర్గానికి రూ.30.27 కోట్లు, రాయదుర్గానికి రూ.25.01 కోట్లు, తాడిపత్రికి రూ.18.16 కోట్లు, అనంతపురం అర్బన్ పరిధిలో రైతులకు రూ.21 లక్షలు మేర నిధులు విడుదల అవుతున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు బుధవారం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ‘స్క్రైబ్’ కష్టాలు అనంతపురం ఎడ్యుకేషన్: కొందరు హెచ్ఎంల నిర్లక్ష్యం కారణంగా దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్ కష్టాలు వచ్చి పడ్డాయి. నిబంధనల ప్రకారం స్క్రైబ్ కోసం దరఖాస్తు ప్రక్రియను పాఠశాల హెడ్మాస్టర్ ద్వారా పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే ఈ నిబంధనను కొందరు హెచ్ఎంలు విస్మరించి, విద్యార్థులను నేరుగా డీఈఓ కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్ఎంల సూచనతో పుట్లూరు విద్యార్థులు వరుణ్, దీక్షిత, పుట్లూరు మండలం కొండేపల్లి విద్యార్థి సంధాని బుధవారం డీఈఓ కార్యాలయానికి తల్లిదండ్రులతో కలసి వచ్చాకు. వైకల్యంతో బాధపడుతున్న వారు ఎండల్లో అష్ట కష్టాలు పడి డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. వారి ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు లేకపోవడంతో పిల్లలను పిలుచుకుని తల్లిదండ్రులు పుట్లూరు నుంచి తాడిపత్రికి ఆటోలో వచ్చి అక్కడి నుంచి అనంతపురానికి బస్సులో ప్రయాణించారు. పాఠశాల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యను హెడ్మాస్టర్ల నిర్లక్ష్యం కారణంగా పెద్ద సమస్యగా మారింది. ‘పిల్లాడు సరిగ్గా నడవలేడు పరీక్ష రాయడానికి స్క్రైబ్ కావాలి. హెచ్ఎంలు చేయాల్సిన పనికి మమ్మల్ని జిల్లా కార్యాలయానికి పంపించారు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘దూకుడు’కు ముకుతాడు!
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కేశవనాయుడు సెలవుపై వెళ్లారు. ఈ నెల 7 నుంచి 20 దాకా సెలవు పెట్టారు. ఇటీవల కాలంలో ఆయనపై వస్తున్న విపరీతమైన ఆరోపణల నేపథ్యంలో సెలవుపై వెళ్లడం రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పైకి అనారోగ్యం అని చెబుతున్నా... అసలు కారణం వేరేనని కార్యాలయ ఉద్యోగులే చెబుతున్నారు. భూ వివాదాల కేసుల్లో ఆర్డీఓ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు డివిజన్లోనే కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రిటైర్డ్మెంట్ దగ్గర పడడంతో పెద్ద ఎత్తున వసూళ్లకు తెర తీశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతివారం 100కు పైగా ఆర్ఓఆర్ కేసులను విచారణకు పిలుస్తుండడాన్ని రెవెన్యూ ఉద్యోగులు, న్యాయవాదులు తప్పుపడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు ఇస్తూ వివాదాలను మరింత జఠిలం చేస్తున్నారని వాపోతున్నారు. ఈయన ఇచ్చిన చాలా తీర్పులపై హైకోర్టు మొటిక్కాయలు వేస్తూ డిస్మిస్ చేసింది. అక్రమాలపై గుట్టుగా విచారణ పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ‘రెవెన్యూ అధికారి దూకుడు’ శీర్షికతో ‘సాక్షి’లో గతనెలలో వెలువడిన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు ఉద్యోగులు, బాధితులు రాష్ట్రస్థాయి సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో దుమారం రేగింది. చివరకు సీఎంఓ దృష్టికి కూడా వెళ్లింది. ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. కొందరు బాధితులు, తహసీల్దార్లు, మరీ ముఖ్యంగా బాధితులుగా ఉన్న వీఆర్ఓలతో మాట్లాడి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇదే క్రమంలో కలెక్టర్ కూడా గుట్టుగా విచారణ చేయించారు. ఓ జిల్లాస్థాయి అధికారిని నియమించి విచారణ నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలోనే ఓ రైతు స్వయంగా కార్యాలయంలో అధికారిని నిలదీసినట్లు తెలిసింది. తాను ఇచ్చిన డబ్బును వెనక్కు ఇవ్వాలంటూ గట్టిగా కేకలు వేయడంతో ఉద్యోగులంతా బెంబేలెత్తినట్లు సమాచారం. ఎట్టకేలకు అధికారి వ్యవహారం వెలుగులోకి రావడంతోనే దూకుడుకు కూడా కొద్దివరకు స్పీడ్ బ్రేకర్ పడిందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అధికార పార్టీకి బలంగా మద్దతిచ్చే సామాజిక వర్గం వ్యక్తి కావడంతోనే ఆయనపై చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆలోచనలో పడినట్లు తెలిసింది. పైగా ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఈయనకు బహిరంగంగానే మద్దతిస్తున్నారనే అపవాదు ఉంది. అన్నింటికీ అడ్డుపుల్ల వేస్తున్న కీలక అధికారి ఆర్డీఓ కార్యాలయంలో కీలక విధులు నిర్వహిస్తున్న ఓ డీటీ ప్రతి ఫైలుకూ అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలిసింది. ఈయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనంగా కార్యాలయంలో అమలవుతోంది. ఈయన చెప్పినమాటే ఆర్డీఓకు కూడా వేదం అని అంటున్నారు. ఈయన దెబ్బకు వీఆర్ఓలు, బాధిత రైతులు ఆర్డీఓ కార్యాలయానికి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా చుక్కల భూమి, 22ఏ ఫైళ్లకు సంబంధించి ఆర్డీఓ కంటే ముందు ఈయనే కొర్రీలు వేస్తున్నాడు. వీఆర్ఓ, ఆర్ఐ, డీటీ, తహసీల్దారు సంతకాలతో తయారు చేసిన ఫైళ్లను కనీసం చూడకుండా తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. ఒకటికి పదిసార్లు పరిశీలించుకుని పెట్టిన ఫైళ్లను తమకంటే కిందిస్థాయి ఉద్యోగి తిరస్కరించడాన్ని తహసీల్దార్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన దెబ్బకు కొందరు తహసీల్దార్లు ఆయన చాంబరులోకి వెళ్లాలంటే కూడా జంకుతున్నారు. ఇక వీఆర్ఓల పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ పోస్టులో తహసీల్దారు స్థాయి ఉద్యోగిని నియమించాల్సి ఉన్నా.. అనుకూలత కోసం డిప్యూటీ తహసీల్దారును నియమించారనే ఆరోపణలున్నాయి. ప్రతిదీ కిందిస్థాయి ఉద్యోగితో చెప్పించుకోవాల్సి రావడంపై తహసీల్దార్లు రగిలిపోతున్నారు. కలెక్టర్ దృష్టి సారించి ఇక్కడ డీటీ స్థాయి అధికారి సాగిస్తున్న దందాపై విచారణ జరిపించాలని తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు. మరీ ముఖ్యంగా వీఆర్ఓలు విజ్ఞప్తి చేస్తున్నారు. 20 వరకు సెలవు పెట్టిన అనంతపురం ఆర్డీఓ విపరీతమైన ఆరోపణల నేపథ్యంలోనే లీవ్ గుట్టుగా విచారణ చేసిన జిల్లాస్థాయి అధికారులు ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా... ప్రభుత్వానికి నివేదిక -
అరటి ధర పతనంతో అలజడి
అనంతపురం అగ్రికల్చర్: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన అరటి.. కోతకు వచ్చేసరికి ధర పతనమవడం రైతుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న టన్ను రూ.22 వేలు ఉన్న అరటి ధర క్రమంగా తగ్గుతూ ఇపుడు రూ.7 వేలకు చేరింది. రోజురోజుకూ రైతుల పరిస్థితి దీనంగా మారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడం లేదు. ఇక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు కూడా వీరి గురించి పట్టించుకునే తీరిక లేకపోయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అరటి కోతలకు సిద్ధంగా ఉన్నా.. ధర పడిపోవడం, వ్యాపారులు మొగ్గు చూపకపోవడంతో అయినకాటికి అమ్మేసుకునే దుస్థితి నెలకొంది. అరటి ఎగుమతులపై వార్ ఎఫెక్ట్ జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో అరటి సాగైంది. ఈ సీజన్లో మొదటి పంట కింద 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అందులో ఇప్పటికే సగానికి పైగా అమ్ముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయిల్– ఇరాన్ మధ్య యుద్ధం మొదలు కావడంతో అది కాస్తా గల్ఫ్ దేశాలు అంతటా విస్తరించడంతో అరటి ఎగుమతులు పూర్తిగా ఆగిపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఉత్తరాది వ్యాపారులు అరటి కొనుగోలుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. టన్ను రూ. 7 వేలు లేదా రూ.8 వేలకు అమ్ముడుబోయినా పెట్టుబడి తిరిగివచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి
గుత్తి: మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని మహిళ (38) మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న స్థితి, అక్కడి ఆనవాళ్లను బట్టి అత్యాచారం చేసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆమె ఒంటరిగా చెట్నేపల్లి రోడ్డు వైపు వెళుతుండగా గమనించామని చెట్నేపల్లి వాసులు గుర్తు చేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు తెలిపారు. మృతదేహం పక్కన పురుషులకు సంబంధించిన చెప్పులు ఉన్నాయి. శరీరంపై చీర చిందర వందరగా పడి ఉంది. ఆ ప్రాంతంలో పోకిరీలు, గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉంటారని స్థానికులు తెలిపారు. ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లిన మహిళ తెల్లవారేసరికి శవమై తేలడం వెనుక ఆంతర్యమేమిటో తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఏసీబీ సోదాలతో అలజడి
అనంతపురం క్రైం: భవన నిర్మాణాల అనుమతి అంశంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం అనంతపురం నగరపాలక సంస్థలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ ఖాన్ నేతృత్వంలోని 20 మంది సభ్యులతో కూడిన బృందం ఉదయం 10.30 గంటలకు చేరుకుని టౌన్ప్లానింగ్ విభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. నగరంలో అక్రమ కట్టడాలు, సెట్బ్యాక్ నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నివాస గృహాల పేరుతో కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించిన అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. టౌన్ప్లానింగ్ ఆఫీసర్ ల్యాప్టాప్, సిబ్బంది వినియోగించే కంప్యూటర్లలోని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ దరఖాస్తులు... అనుమతులు.. పెండింగ్లో ఉంచడానికి గల కారణాలు.. ప్లానింగ్ మేరకు భవనాలు నిర్మించారా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఏసీబీ రాకతో జారుకున్న అధికారులు ఏసీబీ రాకతో కీలక విభాగాల అధికారులు క్షణాల వ్యవధిలో నగరపాలక సంస్థ ఆవరణం నుంచి జారుకున్నారు. రెవెన్యూ విభాగం, ఇంజినీరింగ్ విభాగం పూర్తిగా ఖాళీ అయ్యింది. ఇదిలా ఉండగా సాయంత్రం 4 గంటల దాకా టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేసిన ఏసీబీ బృందాలు అనంతరం ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీ బిల్లుల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలు చాలా కాలంగా దుమారం రేపుతున్నాయి. సంబంధిత విభాగాల అధిపతులు ఈ ఆరోపణలపై కనీస విచారణ కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారుల వివరాలను ఆరా తీసిన ఏసీబీ అధికారులు కొన్ని ఇంజినీరింగ్ పనుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ‘రెవెన్యూ’లో రాబందులు నగర పాలక సంస్థలోని రెవెన్యూ విభాగంలో రాబందులు చేరాయి. పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నాయి. ఏసీబీ అధికారుల బృందం ఓ వైపు సోదాలు చేస్తుంటే.. మరో వైపు ఆ విభాగంలోని కొంతమంది ఆర్ఓల సూచనల మేరకు కీలక రికార్డులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిసింది. వీటిలో చాలా వరకు నూతన నిర్మాణాల పన్ను విధింపు, పేరు మార్పు, గుత్తల మార్పులు, చేర్పులున్నట్లు తెలిసింది. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్లియర్ చేయకుండా లంచం కోసం చాలా కాలంగా పెండింగ్ ఉంచడం, కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎక్కడ సోదాలు చేస్తారోనని భయపడి గుత్తల వసూళ్ల పేరుతో బయటికెళ్లిపోయారు. ఫిర్యాదులపై సోదాలు.. నగరంలో అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులపై అందిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని సోదాలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రికార్డుల పరిశీలన కొనసాగుతోందన్నారు. బుధవారం క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు, సెట్బ్యాక్ తనిఖీలు చేపడతామన్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతులు జారీ చేసే విధానంలో అవకతవకలు జరిగాయన్న అనుమానాల నేపథ్యంలో కీలక ఫైళ్లు, పత్రాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. నగరపాలక సంస్థలో నిశ్శబ్దం టౌన్ప్లానింగ్లో రికార్డులు, ఫైళ్లు స్వాధీనం ఫిర్యాదులపై నేడు క్షేత్రస్థాయిలో నిర్మాణాల పరిశీలన -
భక్తుల ‘బ్రహ్మ’రథం
కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది దాకా భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ● బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.25 గంటల నుంచి 8.45 గంటల మధ్య ప్రారంభించాల్సి ఉండగా ఉదయం 9.35 గంటలకు ముందుకు కదిలింది. ● గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బాగా ఆలస్యంగా నడిచింది. సరిగ్గా సాయంత్రం 3.08 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది. ● ఆనవాయితీగా వస్తున్న మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తుంటే పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మ రథాన్ని లాగారు. ● తిరు వీధుల ఆక్రమణల కారణంగా బ్రహ్మరథం లాగేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. ● రథోత్సవంలో బీజేపీ నేత విష్ణువర్దన్రెడ్డి పాల్గొన కుండా హౌస్ అరెస్ట్ చేయించడంపై భక్తులు ఎమ్మెల్యే కందికుంటపై ఆగ్రహించారు. కొందరు శాపనార్థాలు పెట్టారు. అయితే, తాము అతన్ని హౌస్ అరెస్ట్ చేయలేదని పోలీసు అధికారులు పత్రికా ప్రకటన విడుదల చేయడం కొసమెరుపు. ● రథం తిరువీధుల గుండా వెళ్తుంటే భక్తులు దవణం, మిరియాలు, అరటి పండ్లు రథంపైకి విసిరి స్వామి వారిని స్మరించుకున్నారు. ● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం. ● జేబు దొంగలు ఈసారి కూడా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. ఎంతో మంది భక్తులు బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు పోగొట్టుకొని లబోదిబోమన్నారు. ● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరి కొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు. ● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి, ఆయన కుమారుడు వంశీకృష్ణ ఎప్పటిలాగానే రథంపై నిల్చొని రథ కదలికలను మైకు ద్వారా తెలియ జేశారు. భక్తులతో గోవింద నామస్మరణలను పలికించి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చారు. ● భక్తుల కోసం పట్టణంలో ఈసారి కూడా అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ● నృసింహాలయంలో భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. ● తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి గుండుకు రూ. 200 వసూలు చేసినట్లు పలువురు ఆరోపించారు. ● తేరు శివాలయం దాటి కాస్త ముందుకు వెళ్లగానే ఒక్కసారిగా భక్తుల తోపులాటతో ఆరుగురు భక్తులు తేరు కుడివైపు ఉన్న ముందు చక్రం కింద పడ్డారు. వారిని బయటకు తీయడానికి 40 నిమిషాలు పట్టింది. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. -
గుత్తి కోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: ఈ నెల 14, 15 తేదీల్లో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ విష్ణుచరణ్ ఆదేశించారు. గుత్తికోట ఉత్సవాల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జేసీ సమీక్షించారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలని, బందోబస్తు పటిష్టంగా ఉండాలని సూచించారు. మొబైల్ టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, క్లిన్ అండ్ శానిటేషన్ అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు.సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, జిల్లా పర్యాటక అఽధికారి జయకుమార్బాబు, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం
● ఆర్డీటీ కోసం పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించిన వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం/కుందుర్పి: విద్య, వైద్యం, వ్యవసాయం, స్వయం ఉపాధి తదితర రంగాల్లో పేదలకు ఇతోధికంగా సాయమందిస్తున్న ఆర్డీటీ సంస్థ పరిరక్షణ కోసం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం కుందుర్పిలో లక్ష పోస్టు కార్డుల కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ,, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, నియోజకవర్గ పరిశీలకుడు మహేందర్రెడ్డి హాజరయ్యారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల ద్వారా లక్ష పోస్టుకార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి పంపనున్నారు. -
యువకుడి ఆత్మహత్య
బొమ్మనహాళ్: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో బేకరీ నిర్వహిసూత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారుడు తిరుమల (21) కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న ఇండో–అమెరికన్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో వదిలేసి ఖాళీగా ఉంటున్నాడు. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు సూచించినా తిరుమలలో మార్పు రాలేదు. ఇదే విషయంగా సోమవారం రాత్రి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో గదిలోకి తలుపు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న తిరుమలను గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆర్డీటీ కోసం ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం
కళ్యాణదుర్గం/కుందుర్పి: కరువు పీడిత అనంతపురం జిల్లా అభివృద్ధికి, పేదల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవడంలో భాగంగా అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ కుందుర్పిలో మంగళవారం కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమం కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, డాక్టర్ తలారి రంగయ్య, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమామహేశ్వరనాయుడు, నియోజకవర్గ పరిశీలకులు మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆర్డీటీలా ఆదుకునే దమ్ముందా? అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ... ఆర్డీటీలా రాజకీయాలకు అతీతంగా, నిస్వార్థంగా పేదలను ఆదుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరో వైపు ఆదాయం కోసం మద్యాన్ని వరదలా ప్రవహింపజేస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు పంటలు ఎండిపోతున్నా హంద్రీ–నీవా ద్వారా నీటి ప్రవాహాన్ని 11 వేల క్యూసెక్కులకు పెంచి అన్ని చెరువులకూ నీళ్లిస్తామనే స్పష్టత కూడా ఇవ్వలేని అసమర్థ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన పాలకులు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. చాలా ప్రభుత్వాలు పట్టించుకోని రోజుల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్డీటీ సైకిళ్లు, ఎద్దులబండ్లు, గుర్రపు బండ్ల ద్వారా నీటిని అందించిందన్నారు. స్నానానికి కూడా మినరల్ వాటర్ వాడే టీడీపీ ప్రభుత్వ పెద్దలకు పేదల కష్టాలు పట్టడం లేదన్నారు. సహజ సిద్ధంగా లభ్యమయ్యే నీటిని సైతం పాలకుల చేతకానితనం వల్ల రూ.5తో కొనుగోలు చేసి తాగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టకపోయి ఉంటే పేదల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. జిల్లా ప్రజలకు మేలు చేస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసే అంశంపై ఏప్రిల్ 2 వరకు వేచి చూస్తామని, అప్పటికీ చేయకపోతే పరిపాలనను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చరించారు. మతం ముద్ర వేసి పేదలకు ఆర్డీటీని దూరం చేసే కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎంత కష్టమొచ్చినా ఆర్డీటీకి అండగా వైఎస్సార్సీపీ ఉంటుందన్నారు. ప్రభుత్వాలు దిగివచ్చేలా పోరాటం మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. తాను కూడేరులోని ఆర్డీటీ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేశానని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆర్డీటీ సేవల్లోని నిబద్ధతను ఏ ప్రభుత్వాల్లోనూ తాను చూడలేదన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో ఓ స్కూల్ నెలకొల్పడమే కాకుండా ప్రత్యేకంగా టీచర్ను నియమించి విద్యాభివృద్ధికి ఆర్డీటీ చేసిన అందించిన సేవల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. వేలాది మంది చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అంశంలో ప్రభుత్వాలు దిగి వచ్చే వరకూ అనంత వెంకట్రామిరెడ్డి, తలారి రంగయ్య నాయకత్వం కింద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు సాగిస్తామని అన్నారు. ఆర్డీటీకి మద్దతుగా మాట్లాడే ధైర్యం టీడీపీ నేతలకు లేదన్నారు. వారే కనుక ప్రశ్నించి ఉంటే ఆర్టీటీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీని కలిసి జిల్లాలో ఆర్డీటీ ఆవశ్యకతను వివరించి, ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించి తీరుతామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో మాంఛో ఫెర్రర్ గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా అభివృద్ధి, పేదల కోసం ఆయన గొంతు విప్పాలని, అవసరమైతే ఆర్డీటీని కాపాడుకునేందుకు 3 వేల గ్రామాల ప్రజానీకం ఆయన వెనుకే నిలుస్తుందని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో పోరాడాలి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి పోరాడాలని పిలుపునిచ్చారు. లక్షలాది మంది జీవన స్థితిగతుల మార్చిన ఫాదర్ ఫెర్రర్కు కళ్యాణదుర్గం ప్రాంతంలో గుడి కట్టారంటే ఆర్డీటీ అందించిన సేవలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చునన్నారు. మతం పేరు చెప్పి ఆర్డీటీని ప్రజలకు దూరం చేయాలనుకోవడం మూర్ఖత్వమవుతుందన్నారు. ఇప్పటికై నా పాలకుల వైఖరి మారి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. 56 ఏళ్లుగా జిల్లాలో పేదల అభ్యున్నతికి ఆర్డీటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వానికి సమాంతరంగా అన్ని రంగాల్లోనూ విస్తృత సేవలు అందిస్తోందన్నారు. క్రీడా రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అనంతపురం జిల్లా పేరు వినిపిస్తోందంటే దానికి ఆర్డీటీనే కారణమన్నారు. ఆర్డీటీ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ● ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ.. కరువు పీడిత అనంతపురం జిల్లాలో రైతుల పక్షాన నిలిచి వ్యవసాయాన్ని సుసంపన్నం చేసింది ఆర్డీటీనే అని అన్నారు. డ్రిప్ పరికరాలు సమకూర్చడంతో పాటు విస్తృతంగా నీటి కుంటలు, చెక్డ్యాంలు నిర్మించి భూగర్భజలాల అభివృద్ధికి ఆర్డీటీ తీసుకున్న చొరవను కొనియాడారు. ఇలాంటి సంస్థను దూరం చేయడం కూటమి నేతలకు సరి కాదన్నారు. ఆర్డీటీ పరిరక్షణకు అందరూ కదలి రావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర కార్యదర్శులు కె.నాగరాజు, ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, టైలర్ వన్నూరుస్వామి, జానీ, రామాంజనేయులు, ఈ.రాము, గుర్రం లింగప్ప, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీలు కమలా నాగరాజు, చంద్రశేఖర్రెడ్డి, సోమనాథ్రెడ్డి, మారుతమ్మ, భీమేష్, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కన్వీనర్లు కురబ హనుమంతరాయుడు, సుధీర్, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, గొల్ల హనుమంతరాయుడు, వెంకటప్ప, ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధ్దిదారులు సమావేశంలో మాట్లాడుతున్న వెఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి (చిత్రంలో) తలారి రంగయ్య, డాక్టర్ శైలజానాథ్, వై.విశ్వేశ్వరరెడ్డి, మాదినేని ఉమా, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మసమయం లేదు.. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గత వెఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఆర్డీటీకి కష్టం రాలేదన్నారు. 66 బోర్లు వేయిస్తే అన్నింటిలో సమృద్ధిగా నీరు పడ్డాయని గుర్తు చేశారు. ఆర్డీటీ పరిరక్షణ అంశంలో ఇక ఉపేక్షించాల్సిన సమయం లేదని, గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా డూ ఆర్ డై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ మరణమా.. శరణమా అంటూ ప్రభుత్వాలను నిలదీయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. పార్టీ తరపున ఈ ప్రాంతం, ఈ ప్రజల కోసం ఆర్డీటీ పరిరక్షణను భుజాలకు ఎత్తుకున్నామన్నారు. మన గొంచిగాడు... మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు జీడిపల్లి నుంచి బీటీపీకి నీళ్లు ఇవ్వలేదు కానీ ఎక్కడో ఉన్న కుప్పానికి మాత్రం నీళ్లు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఉప్పు సత్యాగ్రహంతో బ్రిటీష్ పాలకుల మెడలు వచ్చిన గాంధీజీ పోరాట స్ఫూర్తితో 50 పైసల పోస్టు కార్డు రాసి కేంద్ర ప్రభుత్వంలో కదలిక తెద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ ఉప్పెనలా సాగాలన్నారు. దీనిపై త్వరలో డిజిటలైజేషన్ చేసి, ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బైకు ర్యాలీలు, పాదయాత్రలు చూసి ఆర్డీటీ వచ్చేసిందంటూ హేళనగా మాట్లాడిన ప్రభుత్వ పెద్దలకు కనువిప్పు కలిగేలా పోరాటాన్ని ఉధృతం చేద్దామన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్పై టీడీపీ నేతలకు ప్రశ్నించే ధైర్యం లేదు త్వరలో రాష్ట్రపతి, పీఎంనూ కలుస్తాం ఏప్రిల్ 2న డెడ్లైన్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్, సమన్వయకర్త తలారి రంగయ్య -
విజయవాడ వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొననున్నారు. ఆయన తిరిగి ఈ నెల 13న విధులకు హాజరవుతారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. యూట్యూబర్పై కేసు నమోదు అనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్ను బెదిరించి, పరువుకు భంగం కలిగించిన కేసులో యూట్యూబర్ హనుమంత రెడ్డిపై అనంతపురం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ శ్రీకాంత్యాదవ్ మంగళవారం వెల్లడించారు. గత ఫిబ్రవరిలో అల్తాఫ్ఖాన్ను యూట్యూబర్ హనుమంతరెడ్డి కలిసి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ కథ చూస్తానని బెదిరించాడని తెలిపారు. ఏడీ ఫొటో వాడుకుని యూట్యూబ్ చానల్లో రీల్ వైరల్ చేశాడని వివరించారు. దీంతో తన పరువు, ప్రతిష్టతలను దెబ్బతీశాడంటూ ఫిబ్రవరి 23న పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీంతో యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా యూట్యూబర్ హనుమంతరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన వ్యక్తి మృతి ఉరవకొండ రూరల్: మండల పరిధిలోని హంద్రీ–నీవా కాలువలో గల్లంతైన వడ్డే శ్రీనివాసులు మృతదేహమై తేలాడు. ఇంద్రావతి గ్రామానికి చెందిన శ్రీనివాసులు సోమవారం సాయంత్రం తన పొలం నుంచి ఇంటికెళుతూ మార్గమధ్యంలో స్నానం చేసేందుకు హంద్రీ–నీవా కాలువలో దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు, సమీప బంధువులు పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం మోపిడి గ్రామ సమీపంలో శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కొడిగెనహళ్లి ఏపీఆర్ఎస్లో ప్రవేశానికి దరఖాస్తులు పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాల, జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విద్యాసంస్థల జిల్లా కన్వీనర్, పాఠశాల ప్రిన్సిపాల్ నరేంద్ర తెలిపారు. ఈ నెల 31 లోపు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదివే విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం కోసం, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులన్నారు. ఏప్రిల్ 24న నిర్వహించే ఏపీఆర్ఎస్ క్యాట్, ఏపీఆర్జేసీ సెట్లో వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఏపీఆర్ఎస్ ప్రిన్సిపాల్ (87126 25065), ఏపీఆర్జేసీ ప్రిన్సిపాల్ (87126 25078)ను సంప్రందించాలని కోరారు. వాహన షోరూంలలో అక్రమాలపై డీటీసీ తనిఖీలు అనంతపురం సెంట్రల్: ఆర్టీఏ అధికారుల పేర్లు చెప్పి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని వాహన షోరూం నిర్వాహకులను ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) ఎం. వీర్రాజు హెచ్చరించారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి ఆర్టీఏ అధికారుల పేరు చెప్పి అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంగళవారం డీటీసీతో పాటు ఆర్టీఓ సురేష్నాయుడు, ఆరుగురు ఎంవీఐలు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని ఎనిమిది వాహన షోరూంలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి షోరూంలో ఎక్స్ షో రూం ధర, వాహన పన్ను, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్ సేఫ్టీ సెస్ తదితర వివరాలతో కూడిన ధరల పట్టిక లేకపోవడంతో డీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కున్ హుందాయ్, రిత్విక మోటార్స్, జయలక్ష్మి మారుతీ షోరూంలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదనపు ధర వసూలు చేసినట్లు వాహనదారులు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, సునీత, సునీల్, రాజగోపాల్, రఘునాథ్, లహరి తదితరులు పాల్గొన్నారు. -
చైన్స్నాచర్ అరెస్ట్
బుక్కరాయసముద్రం: మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. గత నెల 14న బీకేఎస్లోని గాంధీనగర్ సమీపంలో ఓ హోటల్లో ఉన్న ముత్యాల శ్రీదేవి తలపై చైన్ స్నాచర్ ఇనుప రాడ్తో దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై బాధివతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బీకేఎస్ సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాంప్రసాద్ మంగళవారం తడకలేరు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో అనుమానస్పదంగా కనిపించిన ఓ యువకుడిని అడ్డుకుని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పీఎస్కు తరలించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో చైన్ స్నాచింగ్కు పాల్పడిన విషయం బహిర్గతమైంది. యువకుడిని ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన చెడిపోతుల మహేష్గా గుర్తించారు. ప్రస్తుతం అనంతపురంలోని ఓబులదేవనగర్లో నివాసముంటున్నాడు. నాలుగు తులాల బంగారు గొలుసు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ఎన్ఐసీ డీఐఓగా భారతి అనంతపురం అర్బన్: కలెక్టరేట్ ఆవరణలోని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారిగా (డీఐఓ)గా టి.భారతి నియమితులయ్యారు. మంగళవారం ఎన్ఐసీలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఐఓగా ఉన్న ఎం.రవిశంకర్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు బదిలీ అయ్యారు. దీంతో ఏడీఐఓగా ఉన్న భారతికి ఇన్చార్జ్ డీఐఓగా బాధ్యతలు అప్పగించారు. రవిశంకర్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలను అందుకున్నారు. -
గుత్తి కోట ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గుత్తి కోట ఉత్సవాలకు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యల పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, పర్యాటక శాఖ అధికారి జయకుమార్బాబు, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకే హెచ్పీవీ టీకా బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్పీవీ టీకా ఎంతో కీలకమని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు దోహదపడే ఈ టీకాను 14 ఏళ్ల వయసున్న బాలికలకు తప్పనిసరిగా వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెచ్పీవీ టీకాపై ప్రజలను చైతన్యపరుస్తూ ముద్రించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 11 నుంచి హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. 9వేల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, డీఆర్ఓ ఎ.మలోల, జీజీహెచ్ పరిపాలనాధికారి మల్లికార్జునరెడ్డి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ గంగాధర్రెడ్డి, డీఐఓ శశిభూషణ్రెడ్డి పాల్గొన్నారు. పరిశ్రమల నిర్వాహకులకూ ‘ఉద్యమ్’ తప్పనిసరిఅనంతపురం టౌన్: ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు సైతం తప్పసరిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పరిశ్రమల శాఖ అసిస్టెండ్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్పై సోమవారం అనంతపురం, గుత్తిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ర్యాంప్ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు నిర్వహిస్తున్న వారు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు పొందేందుకు అర్హులవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐపీఓ రవీంధ్రనాథరెడ్డి, నిషాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలుఅనంతపురం టౌన్: ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి హాజరు కానున్నారు. కబడ్డీ, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్ తో పాటు వివిధ రకాల పోటీలు ఉంటాయి. ఆసక్తి ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తి మృతిఅనంతపురం సెంట్రల్: ఈ నెల 1న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. స్థానిక రుద్రంపేట సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పిస్తాహౌస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 65 ఏళ్ల వయసున్న వ్యక్తి గాయపడడంతో స్థానికులు గుర్తించి, అదే రోజు సర్వజనాస్పత్రిలో చేర్పించారు. సోమవారం పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కోరారు. బీటెక్ విద్యార్థి ఆత్మహత్యఅనంతపురం: ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన కృష్ణయ్య, శారదమ్మ దంపతుల కుమారుడు గొల్ల హరిప్రసాద్ (19).. అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టల్లో ఉంటూ బీటెక్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లి బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్నారు. కారణాలేమిటో గానీ సోమవారం మధ్యాహ్నం హాస్టల్లోని తన గదిలో హరిప్రసాద్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్డీటీపై కక్ష సాధింపు తగదు
● పేదలకందిస్తున్న సేవలను గుర్తించండి ● ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయండి ● మహా ధర్నాలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: పేదలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఇతోధిక సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మతం రంగు పులమకుండా పేదలకు చేస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని సంస్థ సేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆర్డీటీ సేవలు కొనసాగేలా ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, దళిత, ప్రజా సంఘాలతో కలిసి సోమవారం ఉరవకొండలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. తొలుత భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు ఆర్డీటీ ద్వారా అందుతున్న సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ల అసమర్థత వల్లే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాలేదన్నారు. ఏడాది కాలంగా ఆర్డీటీ సంస్థ విషయంలో మభ్యపెట్టి జిల్లా ప్రజలను తీవ్రంగా మోసగిస్తున్నారన్నారు. కరువు పీడిత అనంతపురం జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, విద్య, వైద్యం, మహిళా సాధికారతకు కృషి చేసిన ఆర్డీటీకి విదేశీ నిధులు రాకుండా చేయడంతో సంస్థ మనుగడ కష్టంగా మారిందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఉందని, సంస్థ తమ ఆస్తులు అమ్ముకుని మరో దేశానికి తరలిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వై.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి నిలువునా మోసం చేశారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మత రాజకీయాలను ఆర్డీటీకి అంటగడుతూ విదేశీనిధులు రాకుండా అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.రమణ మాట్లాడుతూ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించే వరకు ఆర్డీటీ ద్వారా పేదలకు అందుతున్న సేవలు కొనసాగేందుకు వెంటనే బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఒకసారి చర్చిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. అనంతరం వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు కృష్ణమూర్తి, దళిత, గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మీనుగ గోపాల్, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మధు, బీహెచ్పీ నేత తిప్పేస్వామి తదితరులు ప్రసంగించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినపతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, సర్పంచ్ లలితమ్మ, మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ సుశీలమ్మ పాల్గొన్నారు. ధర్నాలో ప్రసంగిస్తున్న వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, ధర్నాలో పాల్గొన్న అఖిల పక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు -
పరిష్కారం..అసంతృప్తికరం
● నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘జిల్లా కేంద్రానికి వస్తున్న రెవెన్యూ సమస్యల్లో అత్యధికంగా మండల స్థాయిలో పరిష్కారం కావాల్సినవే. భూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతగా పరిష్కరించాలి’ అని కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్పై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోలతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు తమ పరిధిలో మెరుగైన సేవలు అందించి అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. కోర్టు కేసులు, పరిష్కరించడం సాధ్యం కానివాటి గురించి అర్జీదారులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అప్పుడే రెవెన్యూ క్లినిక్కు వచ్చే ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. మండలస్థాయిలో సమస్య పరిష్కారమైనప్పుడే ప్రజల్లో అధికారులపై నమ్మకం పెరగుతుందన్నారు. సమావేశంలో ఆర్డీఓలు వసంతబాబు, శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, పరిష్కార వేదిక ఇన్చార్జి జయశ్రీ, తహసీల్దార్లు పాల్గొన్నారు. భూ సమస్యలు పరిష్కరించండి కార్యాలయం చుట్టూ తిరిగి అర్జీలు అందజేస్తున్నా భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా సమస్య పరిష్కరించాలంటూ అధికారులకు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు అర్జీలు స్వీకరించారు. పరిష్కార వేదికలో భాగంగా భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ప్రజల నుంచి 463 అర్జీలు అందగా వాటిలో భూ సమస్యలకు సంబంఽధించి 326 అర్జీలు, ఇతర సమస్యలపైన 137 అర్జీలు అందాయి. -
కర్కశంగా చంపి.. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి..
తాడిపత్రి రూరల్/పెద్దపప్పూరు: వివాహేతర సంబంధం ఓ ఇల్లాలి ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భర్తే ఆమెను చంపి, కర్కశంగా మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేశాడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి మండలం గద్దరగుట్టపల్లి గ్రామానికి చెందిన గంగరాజు, రంగమ్మ దంపతులు కొన్నేళ్ల క్రితం తాడిపత్రిలోని జయనగర్ కాలనీలో స్థిరపడ్డారు. గంగరాజు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వీరి కుమార్తె శ్రీలేఖకు 8 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మేడిమాకులపల్లి గ్రామానికి చెందిన సమీప బంధువులు సుంకన్న, రాములమ్మ దంపతుల కుమారుడు ఎరికల సుధాకర్తో వివాహమైంది. పెళ్లి సమయంలో 10 తులాల బంగారు నగలను కట్నంగా శ్రీలేఖ తల్లిదండ్రులు ఇచ్చారు. మేడిమాకులపల్లిలోనే కాపురముండేవారు. వీరికి కుమారులు ఏడేళ్ల వరుణ్సాయి, ఆరేళ్ల దీక్షిత్, ఐదేళ్ల రిత్విక్ ఉన్నారు. ఉపాధి కోసం భర్త దూరంగా.. రెండేళ్ల క్రితం సుధాకర్ తన భార్య వద్ద ఉన్న 8 తులాల బంగారు నగలను అమ్మి ఆ డబ్బు తీసుకుని సంపాదన పేరుతో దుబాయి వెళ్లాడు. దీంతో శ్రీలేఖ పుట్టింటికి చేరుకుని అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి సపర్యలు చేస్తూ జీవనం సాగిస్తూ వచ్చింది. భర్తకు దూరంగా ఉండడంతో మరో వ్యక్తితో శ్రీలేఖ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దుబాయి నుంచి వచ్చిన భర్త.. లారీ డ్రైవర్గా జీవనం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో భార్య వివాహేతర సంబంధం బయటపడడంతో పలు మార్లు నచ్చచెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. గొడవ పెరిగి తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురినీ పోలీసులు మందలించి పంపారు. అనంతరం భర్తను వదిలి వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తితో కలసి శ్రీలేఖ వెళ్లిపోయింది. దీంతో పోలీసులను సుధాకర్ ఆశ్రయించి వారి ద్వారా ఆమెను తిరిగి పిలుచుకుని వచ్చాడు. ఆ తర్వాత కూడా శ్రీలేఖ భర్తకు దూరంగా ఉంటూ తాడిపత్రిలోని యల్లనూరు రోడ్డులో ఉన్న పీజీకి మకాం మార్చింది. ఫిర్యాదుకు నిరాకరణ తనతో కాపురం చేయకుండా మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించుకోలేని సుధాకర్ భార్యను హతమార్చడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పీజీ వద్దకెళ్లిన సుధాకర్ మాయమాటలతో తన భార్యను పిలుచుకుని లారీలో పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలోని మొదటి మలుపు వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీ బిగించి హతమార్చిన అనంతరం కాలికి చున్నీ కట్టి మృతదేహాన్ని లారీలో నుంచి లాగి కిందకు పడేశాడు. కాలికి కట్టిన చున్నీతోనే రోడ్డు పక్కన ఈడ్చుకుంటూ వెళ్లి మోరీ కింద పడేసి నేరుగా పెద్దపప్పూరు పీఎస్కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి, శ్రీలేఖ మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న హతురాలి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. హతమార్చిన అల్లుడు కానీ, అతని కుటుంబసభ్యులు కాని ఆస్పత్రికి వచ్చేవరకూ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వబోమని భీష్మించారు. దీంతో ఆరు గంటల పాటు పోస్టుమార్టం ఆగిపోయింది. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలు పాలు కావడంతో చిన్నారులు అనాథలయ్యారంటూ మార్చురీ వద్ద బంధువులు రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. చివరకు హతురాలి తల్లి రంగమ్మకు పోలీసులు నచ్చచెప్పి ఫిర్యాదు స్వీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇల్లాలిని బలిగొన్న వివాహేతర సంబంధం అనాథలైన ముగ్గురు చిన్నారులు -
‘పచ్చ’ మూకబీభత్సం
బెళుగుప్ప: రోడ్డు ఆక్రమణపై ఫిర్యాదు చేశారని వైఎస్సార్సీపీ మద్దతుదారులపై ‘పచ్చ’ మూక దాడికి తెగబడింది. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి దాడులతో భయానక వాతావరణ సృష్టించింది. బాధితుల కథనం మేరకు... గుండ్లపల్లిలోని శివాలయం వద్ద నివాసాలకు వెళ్లే రోడ్డును టీడీపీ నాయకుడు క్రిష్టప్ప ఆక్రమించి మరుగుదొడ్డి నిర్మాణానికి గుంతలు తవ్వించాడు. రోడ్డును ఆక్రమించి కట్టుకుంటే ఇబ్బంది అవుతుందని గ్రామపెద్దలు అభ్యంతరం తెలిపారు. అయినా లెక్క చేయలేదు. దీంతో ఈ నెల 7న పోలీసులకు, సచివాలయ అధికారులకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోక పోవడంతో క్రిష్టప్ప ఈసారి గుంతల్లోకి రింగులు దించాడు. రోడ్డు పూర్తిస్థాయిలో బంద్ అవుతుండటంతో సోమవారం మరోమారు ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు క్రిష్టప్ప, గోవిందు, కరెప్ప, ఐదుకల్లు క్రిష్ట, భానుప్రసాద్, విరుపాక్షి, బంతి క్రిష్ట ఆగ్రహంతో ఈశ్వరప్ప ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కుటుంబ సభ్యులను బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. అంతు చూస్తాం అంటూ బెదిరించారు. దాడిలో ఈశ్వరప్ప, అతని కుమారుడు మంజునాథ, కుమార్తె నిమిత గాయపడ్డారు. తమకు జరిగిన అవమానం.. అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, రక్షణ కల్పించాలని కోరారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అనంతరం బాధితులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దాడి సరికాదు ఇళ్ల మధ్య దశాబ్దాలుగా ఉన్న దారిని ఆక్రమించి బాత్రూమ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా ఫిర్యాదు చేశారన్న అక్కసుతో ఈశ్వరప్ప కుటుంబంపై టీడీపీ నాయకుడు క్రిష్టప్ప మరికొంతమందితో కలిసి దాడి చేయడాన్ని సర్పంచ్ పురుష్తోతం, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మచ్చన్న ఖండించారు. అమ్మాయని చూడకుండా దాడిచేయడం సరికాదన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టి.. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. గుండ్లపల్లిలో టీడీపీ నేత రోడ్డు ఆక్రమించి బాత్రూమ్ నిర్మాణం పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ మద్దతుదారు కుటుంబంపై ఆగ్రహం ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యులను ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా దాడి -
హంద్రీ–నీవా సీఈగా నాగరాజ మళ్లీ నియామకం
● తొలిసారి విశ్రాంత ఉద్యోగికి అవకాశం అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు సీఈగా నాగరాజ మళ్లీ నియమితులయ్యారు. తొలిసారి విశ్రాంత ఉద్యోగి ఉన్నతాధికారి స్థానంలో కొనసాగనున్నారు. ఈ విషయంపై గత నెల 10న ‘సాక్షి’లో ‘ఆయనే కావాలి’ శీర్షికన కథనం వెలువడింది. అనుకున్న విధంగానే ఏడాదిపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ (కాంట్రాక్టు పద్ధతిలో) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 30న సీఈ నాగరాజ ఉద్యోగ విరమణ పొందారు. అయితే తన సర్వీసును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.వేల కోట్లతో హంద్రీ–నీవా లైనింగ్పనులు చేపట్టారు. దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనే ఉంటే బిల్లుల మంజూరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో కొంతమంది మంత్రి, ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేతల అండదండలు ఉండడంతో తొలిసారిగా ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిని తిరిగి అదే స్థానంలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
యశ్వంత్పూర్–కతిహార్ మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి బిహార్ రాష్ట్రంలోని కతిహార్ జంక్షన్ నుంచి యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్కు ప్రత్యేక వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 31 వరకు మంగళవారాల్లో (4 సర్వీసులు) యశ్వంత్పూర్ జంక్షన్ (06571) నుంచి ఉదయం 7 గంటకు బయలుదేరి మూడవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు కతిహార్ జంక్షన్కు చేరుతుందన్నారు. ఇక తిరుగు ప్రయాణంలో కతిహార్ జంక్షన్ (06572) నుంచి ఈ నెల 13 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రతి శుక్రవారం (4 సర్వీసులు) ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మూడవ రోజు తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంత్పూర్ జంక్షన్కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపూర్రోడ్డు, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఏసీ త్రీటైర్తోపాటు స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సర్వే ఏడీగా విజయసారథి అనంతపురం అర్బన్: సర్వే భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విజయసారథికి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడీగా ఉన్న రూప్లానాయక్ గతనెల 28న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా ఇన్స్పెక్టర్ సర్వేగా ఉన్న విజయసారథిని ఏడీ (ఎఫ్ఏసీ)గా నియమించారు. ఓపెన్ పది హాల్ టికెట్ల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం) ద్వారా ఈ నెల 16 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు హాల్టికెట్లను ఏపీ ఓపెన్స్కూల్ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అలాగే ఏఐ సెంటర్ల నుంచి కూడా పొందవచ్చన్నారు. వాట్సాప్–మనమిత్ర ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. 95523 00009కు ‘ఏజీ’ అని మెసేజ్ పంపాలి. ‘చూస్ సర్వీస్’ లేదా ‘సేవను ఎంచుకోండి’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘ఎడ్యుకేషన్ సర్వీస్’ లేదా ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘ఏపీ ఓపెన్స్కూల్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్, మార్చ్–2026 హాల్ టికెట్స్’ను ఎంచుకోవాలి. తర్వాత విద్యార్థి ‘అడ్మిషన్ నంబరు, పుట్టినతేదీ’ నమోదు చేయాలి. అనంతరం ‘కన్ఫమ్’పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ తెలిపారు. ‘పది’ పరీక్షల నిర్వహణపై నేడు శిక్షణ పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు మంగళవారం ఒక్కరోజు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటలకు నగరంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ప్రారంభమయ్యే శిక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తప్పకుండా రావాలని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ పేర్కొన్నారు. ప్రతి కేజీబీవీలో 6వ తరగతికి 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. 7, 8, 9, 10 తరగతి, ఇంటర్ రెండో సంవత్సరంలో ప్రస్తుతం ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https://apkgbv.apcfss.in వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్లైన్ ద్వారా అందజేసే దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారని పేర్కొన్నారు. 13 నుంచి 17 వరకు సంబంధిత కేజీబీవీల్లో ధ్రువపత్రాలు పరిశీలించి సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. -
మాజీ ఎంపీ తలారి రంగయ్యకు భద్రత కల్పించాలి
అనంతపురం సెంట్రల్: కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ– స్టాంప్ కుంభకోణంపై పోరాడుతున్న మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని, ఆయనకు పోలీసు భద్రత కల్పించాలంటూ ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ – స్టాంప్ కుంభకోణంపై సమగ్ర విచారణ కోరుతూ హైకోర్టులో తలారి రంగయ్య పిల్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఈ కుంభకోణం వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. భారీ కుంభకోణానికి సంబంధించి ఆధారాలు బయట పెడుతుండడంతో ప్రత్యర్థుల నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రంగయ్యకు 2 ప్లస్ 2 గన్మెన్ భద్రత కల్పించాలని పోలీసు అధికారులను కోరినట్లు వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దొడగట్ట నారాయణ, ములకనూరు తిమ్మరాయుడు, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, జెడ్పీటీసీ నాగరాజు, ఎంపీపీలు ఆంజనేయులు, భీమేష్, కన్వీనర్లు చంద్రశేఖరరెడ్డి, సూరి, హనుమంతరాయుడు, నాయకులు మురళి, రామాంజనేయులు యాదవ్, మల్లి, నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ – స్టాంప్ కుంభకోణంపై పోరాడుతుండడంతో ప్రాణహాని ఎస్పీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకుల వినతి -
కదిరి తేరు చూత ము రారండి
● నేడు ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం కదిరి: ఎక్కడెక్కడి నుంచో విచ్చేసిన జనం... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం. బ్రహ్మే రథసారథిగా మారే సందర్భం. ఉగ్రుడైన లక్ష్మీనారసింహుడు శాంతమూర్తిగా రథంపై కొలువుదీరి భక్తులకు కనిపించే కమనీయ దృశ్యం. లక్షలాదిమంది ఒకచోట చేరే ఆధ్యాత్మిక సౌరభం. అదే ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం. మంగళవారం ఉదయం సరిగ్గా 8.45 గంటలకు ప్రారంభం కానుంది. దేశంలోనే మూడో పెద్ద తేరు తమిళనాడు ఆండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతిపెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతిపెద్ద బ్రహ్మరథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో 8 అడుగుల డయామీటర్తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా చెక్కారు. వివిధ భంగిమల్లో చెక్కిన ఈ బొమ్మలు అప్పటి శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. రథ చక్రాలకు ఈ మధ్యే మరమ్మతులు కూడా చేశారు. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఐరావతంపై నారసింహుడుకదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు సోమవారం రాత్రి తెల్లటి ఐరావతం(గజవాహనం)పై భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్య కస్యపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మరోసారి యథారూపంలో ప్రసన్నం కావాలన్న కోరగా... స్వామి వారు వారి కోరిక మేరకు తెల్లటి ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. ఐరావతంపై విహరించే ఖాద్రీశుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆలయ అర్చకులు తొలుత యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేసిన అనంతరం కలశాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. స్వామివారికి నిత్య కై ంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. -
సివిల్స్లో పట్టువదలని విజయం
● నాలుగో ప్రయత్నంలో నెగ్గిన గిరిరాజ్ సాయికృష్ణ తాడిపత్రిటౌన్: సివిల్ సర్వీసెస్ ఆయన కల. మూడు దఫాలు ఆశాభంగమే కలిగింది. అయినా వెనకడుగు వేయలేదు. మరింత ఏకాగ్రత పెంచి నాలుగోసారి విజయం సాధించారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు తాడిపత్రికి చెందిన గిరిరాజ్ సాయికృష్ణ. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 125వ ర్యాంకు సాధించారు. సాయిక్రిష్ణ తండ్రి ఉమా మహేశ్వరావు ఆటోమొబైల్ వర్క్షాపు నిర్వహిస్తుండగా.. తల్లి విజయలక్ష్మి గృహిణి. తాడిపత్రిలో శ్రీవాణి పాఠశాలలో ప్రాథమిక విద్య, హైదరాబాద్ నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. రాజస్తాన్లోని బిట్స్ పిలానిలో ఇంజినీరింగ్ చేసి.. అనంతరం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు. అలా ఐదేళ్లపాటు పనిచేశాక.. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2021లో తొలిసారి సివిల్స్ పరీక్ష రాశారు. 2022లో ఇంటర్వ్యూ వరకు చేరుకున్నారు. 2023లో గ్రూప్– 1 పరీక్షల్లో నెగ్గడంతో ఎంపీడీఓగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో సివిల్స్ రాసినా రాణించలేకపోయారు. అయినా నిరాశ చెందకుండా ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోవాలని ఉద్యోగానికి సెలవు పెట్టి.. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న తన భార్య సుప్రియ వద్దకు వెళ్లారు. ఆమె సహకారం కూడా తోడవడంతో ఈసారి వెనుదిరిగి చూడలేదు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 125వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో 5వ ర్యాంకు సాధించి తన కల నిజం చేసుకున్నారు. సాయికృష్ణ విజయంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
జగన్తోనే మహిళాభ్యున్నతి సాధ్యం
అనంతపురం: వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే మహిళాభ్యున్నతి సాధ్యమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా చేయూతనందించి మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ సమాన అవకాశాలు కల్పించడంతోపాటు విద్య, ఆర్థికంగా చేయూతనందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కిందన్నారు. చట్టసభలు, నామినేటెడ్, పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ తదితర హామీలు అమలు చేయకుండా నిలువునా మోసం చేశారన్నారు. ఎవరైనా హామీలపై నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుండటంతో మత్తులో దాడులకు తెగబడుతున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, గుత్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, సర్పంచ్ భూమా కమలమ్మ, కార్పొరేటర్లు సాకే చంద్రలేఖ, రాజేశ్వరి, హసీనా, పార్టీ నేతలు సుశీలమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత, రాధాయాదవ్, జిల్లా కార్యదర్శి భారతి, అంజలి, పార్వతి, ప్రసన్న, చంద్రకళ, సుగుణమ్మ, జయమ్మ, లక్ష్మీదేవి, లక్ష్మీ, పద్మావతి, లలిత, రుద్రంపేట, లక్ష్మీ, అంజినమ్మ, సువర్ణ, కుళ్లాయమ్మ, సులోచన, రాజేశ్వరి, కమలమ్మ, అనూరాధ, రమీజా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీ.. యువతి దుర్మరణం
పుట్లూరు: టిప్పర్ ఢీకొని యువతి దుర్మరణం చెందింది. ఇదే ప్రమాదంలో ఆమె తాత గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పుట్లూరు మండలం సంజీవపురం గ్రామానికి చెందిన ఈదుల శివారెడ్డి, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె ఈదుల అఖిల (23) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతోంది. సెలవులు రావడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. ఆదివారం తాత పెద్ద కుళ్లాయిరెడ్డితో కలిసి తాడిపత్రికి ద్విచక్రవాహనంపై వెళ్లింది. అక్కడ పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. ఎ.కొండాపురం 544డీ జాతీయ రహదారిపై వీరి ద్విచక్రవాహనాన్ని వేగంగా వస్తున్న ఎస్ఆర్సీ కంపెనీకి చెందిన టిప్పర్ తాకింది. బ్యాగు తగిలించుకున్న అఖిలను టిప్పర్ కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అఖిల మృతి చెందింది. పెద్దకుళ్లాయిరెడ్డి గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువతి మృతితో సంజీవపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. బాబు విధానాలతో రైతుల పరిస్థితి దయనీయం ● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొక్కజొన్నవ, పప్పుశనగ ధరలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న క్వింటాలు మద్దతు ధర రూ.2,400 ఉంటే.. మార్కెట్లో దళారులు రూ.1,600 కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. పప్పుశనగను కూడా మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి, దారుణంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. తక్షణమే మద్దతు ధరతో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేటి నుంచి ‘ఈ–క్రాప్’ సామాజిక తనిఖీ ● తప్పులుంటే 14 లోపు సవరణకు అవకాశం ● 16న ప్రభుత్వానికి తుది ముసాయిదా అనంతపురం అగ్రికల్చర్: రబీ ఈ–క్రాప్ నమోదు పూర్తయినందున సోమవారం నుంచి ఆర్ఎస్కేల్లో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ముదిగల్లు రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ఎస్కేల్లో జాబితాలు ప్రదర్శించడంతో పాటు గ్రామసభలు నిర్వహించి ఈ–క్రాప్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత రికార్డులతో ఫిర్యాదు అందజేసి సవరించుకునే వీలుందని పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు సామాజిక తనిఖీ ఉంటుందని, ఈ నెల 16న రబీ ఈ–క్రాప్ తుది ముసాయిదా ప్రభుత్వానికి పంపుతామని వెల్లడించారు. వివిధ పథకాల వర్తింపునకు ఈ–క్రాప్కు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకపోతే ఈ రబీలో వంద శాతం ఈ–క్రాప్ నమోదు జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,91,938 సర్వే నంబర్లకు సంబంధించి 12,17,464 ఎకరాల్లో పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. అదులో వ్యవసాయ పంటలు 3,63,399 ఎకరాలు, ఉద్యాన పంటలు 30,392 ఎకరాలు, మల్బరీ 167 ఎకరాలతో పాటు 8,23,506 ఎకరాలు బీడుభూములు, ఇతరత్రా వ్యవసాయేతర భూములు ఉన్నట్లు ఈ–క్రాప్లో నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ క్రాప్ పారదర్శకత కోసం వివిధ స్థాయిలో సూపర్చెక్ పూర్తి చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆర్ఎస్కేల్లో వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలను సంప్రదించి సవరించుకోవాలని సూచించారు. -
గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజైన ఆదివారం రాత్రి మరోసారి గరుడారూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహునికి వాహనంగా మరోసారి పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ.. మలి గరుడసేవ అని కూడా అంటారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరు వీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం మళ్లీ రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పు దేవున్ని దర్శించుకున్నారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉత్సవ ఉభయదారులుగా ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ రెడ్డెప్పశెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిరి ప్రదక్షిణ... లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులు ఆదివారం ఉదయాన్నే పెద్ద సంఖ్యలో కదిరి కొండ వద్దకు చేరుకొని ప్రదక్షిణ చేశారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులు గత ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. భవిష్యత్లో గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య బాగా పెరగవచ్చని ఆలయ అధికారులు చెబుతున్నారు. నేడు గజ వాహనం.. ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సోమవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమిస్తారు. -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. భూసమస్యలు ఉన్నవారు రెవెన్యూ క్లినిక్లో తహసీల్దార్లకు అర్జీలు సమర్పించాలని సూచించారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ పంపవచ్చన్నారు. నేడు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 91547 90350, 08554 272943 నంబర్లో సంప్రదించాలన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. స్కూళ్లలో ‘వాటర్ బెల్’ అనంతపురం ఎడ్యుకేషన్: ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి గంటకూ ఒకసారి తాగునీరు అందించే ‘వాటర్ బెల్’ విధానాన్ని అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో శారీరక కార్యకలాపాలు నిర్వహించవద్దని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం సమృద్ధిగా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే గ్రామ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనంతో పాటు మజ్జిగ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన విద్యార్థులను వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108 సేవలకు సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం టౌన్: పరిశ్రమలు నెలకొల్పే ఆసక్తి ఉన్న యువ పారిశ్రామిక వేత్తల నుంచి స్థలాల కేటాయింపు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కావాల్సిన పారిశ్రామిక వేత్తలు తమ డీపీఆర్ ప్రాజెక్టు నివేదికతో ఏపీఐఐజీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెంటనే వాటిని పరిశీలించి సకాలంలో స్థలాలను కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలోని సిరికల్చర్ కార్యాలయ ఆవరణలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇందులో సైతం షాప్లను ఏర్పాటు చేసి పారిశ్రామిక వేత్తలకు అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు భూమి విలువపై 75 శాతం మేర ప్రభుత్వం రాయితీలను అందిస్తోందన్నారు. www.apiic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. మరిన్ని వివరాలకు ఏపీఐఐజీ మేనేజర్ సెల్: 9666330666 ను సంప్రదించాలన్నారు. అప్పు చెల్లించలేదని చెంప కొరికాడు! బొమ్మనహాళ్: అప్పు తిరిగి చెల్లించలేదన్న కోపంతో చెంపపై కొరికి గాయపరిచిన సంఘటన గోవిందవాడలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు... శశిధర్ అనే వ్యక్తి గ్రామానికి చెందిన రాజన్నతో రెండేళ్ల క్రితం రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. డబ్బు తిరిగివ్వాలని రాజన్న శనివారం సాయంత్రం అడిగాడు. ఉగాది తర్వాత ఇస్తానని శశిధర్ చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. రాజన్న కోపంలో శశిధర్ చెంపపై కొరకడంతో తీవ్ర గాయమైంది. బళ్లారి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వచ్చిన శశిధర్ ఆదివారం బొమ్మనహాళ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
జయహో భారత్
ఎగిరి గంతేశారు. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా మోత మోగించారు. ఆదివారం టీ–20 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగితేలారు. అనంతపురంలో టవర్క్లాక్ వద్దకు యువత పెద్ద ఎత్తున చేరుకుని వేడుకలు చేసుకున్నారు. కేక్లు కట్ చేసి సంతోషం పంచుకున్నారు. పలువురు జాతీయ జెండాలు చేతబట్టి ‘జయహో భారత్’ నినాదాలు మార్మోగించారు. – అనంతపురం -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
అనంతపురం: మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాంచాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. జేఎన్టీయూ (ఏ) ఆడిటోరియంలో ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ ఆనంద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, తదితర శాఖలు మహిళలకు జీవనోపాధులు పెంపొందించుకునేందుకు అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారని, వాటిపై విస్తృత అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో 4,250 మంది దాకా చిన్న వయసులో పెళ్లి చేసుకుని టీనేజ్ ప్రెగ్నెన్సీ కలిగిన వారు ఉండడం దురదృష్టకరమన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్, జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ, వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్పర్సన్ స్వప్న, అనంతపురం మార్కెట్ యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీఆర్డీఏ పీడీ శైలజ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఇ.బి.దేవి, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, డీసీఓ అరుణకుమారి, జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, డీఎస్డీఓ మంజుల, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి సుభాషిణితో పాటు స్వయం సహాయక సంఘం సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కరెంట్ కోత
అనంతపురం: ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కరెంటు కోత రోగులను ఇబ్బందులకు గురి చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ రాత్రి విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్లు శనివారం ఉదయం 10 గంటల వరకు రాలేదు. దీంతో ఓపీ చీటీలు ఇవ్వడానికి అవరోధం ఏర్పడింది. ఈ క్రమంలో రోగుల క్యూ భారీగా పెరిగిపోయింది. షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన ఆపరేషన్లను కాస్తా సోమవారానికి వాయిదా వేశారు. వాస్తవానికి ముగ్గురు ఎలక్ట్రీషియన్లు సూపర్ స్పెషాలిటీలో విధులు నిర్వహించాల్సి ఉంది. వీరిలో ఇద్దరు ఆడవారు కావడంతో.. వాచ్మెన్ విధులకే పరిమితయ్యారు. ఉదయం పది తర్వాత కరెంటు పునరుద్ధరించారు. అప్పటి వరకు రోగులు పడిన అవస్థల గురించి కలెక్టర్ ఆనంద్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఇద్దరినీ బదిలీ చేశారు. ఒకరిని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, మరొకరిని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి బదిలీ చేశారు. నైపుణ్యం ఉన్న ఎలక్ట్రీషియన్లనే సూపర్స్పెషాలిటీకి బదిలీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన దివ్య
అనంతపురం సెంట్రల్: యూపీఎస్సీ ఫలితాల్లో అనంతపురానికి చెందిన సోమాసి దివ్య అనే యువతి ఆలిండియా స్థాయిలో 394వ ర్యాంకు సాధించింది. ఈమె తండ్రి రమేష్ కళ్యాణదుర్గం ఆర్టీఓగా పనిచేస్తున్నారు. నంద్యాలలో 6 నుంచి 10వ తరగతి, హైదరాబాద్లో ఇంటర్, ఐఐటీ– బాంబేలో బీటెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియాలో బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశారు. తర్వాత యూపీఎస్సీ కోసం హైదరాబాద్లో శిక్షణ తీసుకుని రాణించారు.సేవా రుసుం మూడింతల పెంపు అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం పేదల జేబుల నుంచి లాక్కుని సంపద సృష్టించే మార్గానికి రాచబాట వేసింది. కొత్త బియ్యం కార్డు, డూప్లికేట్ బియ్యం కార్డు, బియ్యం కార్డులో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు కార్డు విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు రుసుంను ఏకంగా మూడింతలు పెంచింది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న రూ.24 సేవా రుసుం కాస్తా రూ.100కు చేరింది. బియ్యం కార్డు విభజనకు ఇప్పటి వరకు తీసుకుంటున్న రూ.48 సేవా రుసుం రూ.200కు పెంచింది. ఇందుకు సంబంధించి సచివాలయ సిబ్బంది గ్రూపుల్లో సమాచారం పంపించింది. -
కొందరు మనుషులు మృగాల కన్నా హీనంగా మారారు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాలు చేసిన గాయాలతో శరీరం పుండుగా మారింది. అయినా వదల్లేదు. తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గర్భం దాల్చి రోడ్డున అనాథగా సంచరిస్తున్న ఆమెను మానవతావ
అనంతపురం కల్చరల్: మతిస్థిమితం లేని యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసిన ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. అయినా నేటికీ దోషులెవరో బయటపడలేదు. వారు చేసిన పాపం యువతి గర్భంలో పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. అనాథగా రోడ్డుపై సంచరిస్తూ... కొన్ని నెలల క్రితం కళ్యాణదుర్గంలోని రహదారులపై మతిస్థిమితం లేకుండా ఒంటరిగా తిరుగుతున్న యువతిని ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శశికళ గమనించింది. పలకరించే ప్రయత్నం చేయడంతో సమాధానం ఇవ్వలేదు. ఆకలిగా ఉందా? అని ప్రశ్నించినా మౌనమే సమాధానమైంది. దీంతో అప్పటికప్పుడు ఆహారాన్ని కొనుగోలు చేసి యువతి చేతికి ఇవ్వడంతో ఎన్నాళ్లుగా ఆకలితో ఉందో తెలియదు కానీ గబగబా మొత్తం తినేసింది. ఆ సమయంలో యువతి బెదురు చూపులు గమనించిన శశికళ... ఆమె ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించి, విషయాన్ని వెంటనే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సాయంతో యువతిని అనంతపురం రూరల్ పరిధిలోని కాట్నేకాలువలో ఉన్న ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చారు. శరీరమంతా పుండుగా మారి.. మతి స్థిమితం కోల్పోయి బెదురు చూపులతో ఆశ్రమానికి చేరుకున్న యువతిని నిర్వాహకులు కృష్ణారెడ్డి, దేవి దంపతులు అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. 25 ఏళ్ల వయస్సులోనూ ఆరేళ్ల చిన్నారిలా ప్రవర్తిస్తున్న ఆ యువతిని ఎంత ప్రశ్నించినా తన తల్లిదండ్రులెవరో చెప్పలేని స్థితిలో ఉంది. శరీరంపై గాయాలు ఉండడంతో ఆస్పత్రికి పిలుచుకెళ్లి చూపించారు. ఆ సమయంలో గాయాలను పరిశీలించిన వైద్యులు అవి మానవ మృగాలు చేసినవిగా నిర్ధారించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమె గర్భంతో ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఆ సమయంలో అత్యాచారం జరిగిన విషయం గాని తెలియని స్థితిలో యువతి అమాయకంగా చూస్తుండడం గమనించిన వైద్యులు, సిబ్బంది హృదయాలు ద్రవించి పోయాయి. చికిత్స అనంతరం ఆమెను ఆశ్రమానికి చేర్చిన కృష్ణారెడ్డి దంపతులు అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. పుండుగా మారిన శరీరాన్ని రోజూ శుభ్రం చేస్తూ ఆమెకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వచ్చారు. ప్రస్తుతం యువతి నిండు గర్భిణి. రేపో.. మాపో ప్రసవమయ్యే సూచనలు ఉన్నాయి. తలుచుకుంటేనే భయమేస్తోంది మానవత్వమున్న ఉపాధ్యాయురాలు గుర్తించి ఈ యువతిని మా ఆశ్రమానికి చేర్చారు. ఆమె ఆశ్రమానికి వచ్చేనాటికి శరీరం మొత్తం పుండుగా మారి ఉంది. మానవ మృగాలు ఎంత పైశాచికంగా పాడు చేశారో తలుచుకుంటేనే భయమేస్తోంది. కనీసం తన తల్లిదండ్రులెవరు అనే విషయం కానీ, తనపై అత్యాచారం జరిగిందనే విషయం గాని ఆమెకు తెలియదు. ఎంతో అమాయకంగా ఉంది. ఆమె భవిష్యత్తు తలుచుకుంటే భయమేస్తోంది. ఆశ్రమంలో ఎందరో అనాథలు ఉన్నారు. వీరెవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. వీరి దైన్య స్థితిపై అధికారులు స్పందించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మంజూరు చేస్తే ఆదుకునే అనాథాశ్రమాలకు ఎంతో మేలు చేసిన వారవుతారు. – దేవి, ఆశ్రయ అనాథాశ్రమ నిర్వాహకురాలు ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను నేను ప్రస్తుతం ఆత్మకూరు మండలం పంపనూరులోని ఎంపీపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నిరాశ్రయులైన మహిళలెవరైనా కనిపిస్తే అనాథశ్రమాలకు చేరుస్తుంటాను. అలా ఒకసారి కళ్యాణదుర్గంలోని పోలీసుస్టేషన్ సమీపంలో డివైడర్ వద్ద రెండేళ్లుగా దిక్కు లేకుండా కూర్చొని ఉన్న ఓ యువతి కనిపించింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి చూసి చలించిపోయాను. వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారి సహకారంతోనే ఆశ్రయ అనాథాశ్రమానికి చేర్చాను. రోజులు గడుస్తుండగా ఆమె శరీరంలో మార్పులు గమనించి వైద్యులకు చూపిస్తే గర్భిణి అని తెలిసింది. ఈ అమానుషంపై ఎవరూ స్పందించకపోవడం బాధాకరం. – శశికళ, ఉపాధ్యాయురాలు మానవ మృగాలు చేసిన గాయాలతో పుండుగా మారిన శరీరం గర్భం దాల్చి రోడ్డున పడ్డ అనాథ గుర్తించి అనాథాశ్రమానికి చేర్చిన ఉపాధ్యాయురాలు అక్కున చేర్చుకున్న ‘ఆశ్రయ’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కలచి వేస్తున్న అభాగ్యురాలి కన్నీటిగాథ -
రాకెట్లలో రాయల కాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం
ఉరవకొండ: రాయల కాలం నాటి తామ్ర శాసనాలు రాకెట్ల గ్రామంలో లభ్యమయ్యాయి. తూమటి సుధాకర్ ఇంట్లో మూడు తామ్రపత్రాలను పురావస్తు శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్కడి నుంచే మైసూరులోని భారత పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నంకు పంపించారు. తామ్రపత్రాల గురించి చరిత్రకారుడు బుక్కపట్నం గోపి మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయులు రాయించిన శాసనాలుగా శాసనవిభాగం డైరెక్టర్ గుర్తించినట్లు తెలిపారు. వీటిని క్రీ.శ.1527 నవంబర్ 5న కార్తీక సోమవారం రోజున తెలుగు, సంస్కృత భాషల్లో రాయించారని పేర్కొన్నారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల ఘనత, యుద్ధవిజయాలు, నాటి శాసనాలు, ఇచ్చిన కానుకల గురించి వివరిస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు మహభాష్యకారుడు, యజుర్వేద పండితులు చెన్న భట్టార్యులకు కృష్ణదేవరాయలు కడప జిల్లా రాజుపాలెం మండలం దద్దనాల గ్రామాన్ని అగ్రహరంగా ఇచ్చినట్లు శాసనాల్లో లిఖించారని పేర్కొన్నారు. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల శాసనాలు 30 వరకు గుర్తించినట్లు తెలిపారు. తాజాగా రాకెట్లలో వెలుగు చూసిన శాసనాలతో అనంతపురంలో శ్రీకృష్ణదేవారాయల సామ్రాజ్య ప్రభావం ఎంతో కీలకంగా ఉందని స్పష్టం అవుతోందన్నారు. -
బహిరంగ వేలం.. ఏకపక్షం
● చక్రం తిప్పిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు గుంతకల్లుటౌన్: స్థానిక మున్సిపాలిటీ ఆదాయ వనరులపై శనివారం నిర్వహించిన వేలం ప్రక్రియ ఏకపక్షంగా సాగింది. ఏటా కౌన్సిల్ హాల్లో అందరి సమక్షంలో వేలం పాటను నిర్వహించే అధికారులు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి చాంబర్లో ఈ ప్రక్రియను ముగించారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు టీడీపీ మద్దతుదారుడికే అధికారులు నాలుగు కాంట్రాక్ట్లను కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఉదయం 11 గంటలకు వేలంపాటను నిర్వహిస్తామంటూ రెండు రోజుల ముందు ప్రకటించిన అధికారులు నిర్ణీత సమయం కంటే ముందే ఈ ప్రక్రియను ముగించేయడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో అధికారులను కాంట్రాక్టర్లు హుస్సేన్ సాహెబ్, నాసీర్, రామాంజనేయులు నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు వేలంపాటను ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ ఆర్ఐ ఎర్రిస్వామి, సీకే రామాంజనేయులను వారు ప్రశ్నించారు. కార్యాలయంలోనే ఉన్న తమకు కనీస సమాచారం కూడా ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టుగా వేలం ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ చాంబర్లో జరిగిన వేలం పాటలో ఒకే వర్గానికి చెందిన కేవలం నలుగురు కాంట్రాక్టర్లు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో పత్తిపాటి చంద్రశేఖర్ నాయుడుకు నాలుగు కాంట్రాక్టులు దక్కాయి. రూ.46.18 లక్షలతో దినసరి పబ్లిక్ మార్కెట్లో సుంకం వసూలు చేసుకునే హక్కు, రూ.3.23 లక్షలతో మాంసపు9 విక్రయాల సుంకం వసూలు హక్కు, రూ. 2.04 లక్షలతో పశు వధుశాల, విక్రయాలపై సుంకం వసూలు హక్కు, రూ.2.20 లక్షలతో జీవాల వధశాల, మాంసం విక్రయాలపై సుంకం వసూలు హక్కును పొందాడు. అధికారులు ఏకపక్షంగా కాకుండా కాంట్రాక్టర్లందరి సమక్షంలో వేలం పాట నిర్వహించి ఉంటే పోటీ పెరిగి మున్సిపాలిటీకి ఆదాయం మరింత పెరిగేదని పలువురు పేర్కొన్నారు. ఈ మొత్తం అక్రమాలను తెర వెనుక నుంచి మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇద్దరు తిప్పినట్లుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్ చొరవ తీసుకుని వేలం ప్రక్రియను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నేడు జేఎన్టీయూలో జిల్లాస్థాయి మహిళా దినోత్సవం
అనంతపురం అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మహిళా దినోత్సవం నిర్వహణపై ఐసీడీఎస్, డీఆర్డీఏ, మెప్మా అధికారులకు తగిన సూచనలిచ్చారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభించాలన్నారు. మహిళ సాధికారత, లింగ వివక్ష, బాల్య వివాహాల నిర్మూలనతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన వారిని అతిథుల ద్వారా సత్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్ని జయప్రదం చేయాలన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. -
యుద్ధం.. మానవ మనుగడకు ఆటంకం
అనంతపురం: యుద్ధం వల్ల కేవలం రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి పసిపిల్లల మరణాలు మరింత బాధాకరమన్నారు. యుద్ధం అనేది ఎన్నటికీ సమస్యకు పరిష్కారం కాదన్నారు. అంతేకాక ప్రపంచ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయన్నారు. ఈ యుద్ధాల వల్ల మానవ మనుగడకు ఆటంకం కలుగుతుందన్నారు. ఆధిపత్య పోరులో ఆయుధాల వ్యాపారులకు తప్ప ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఆయా దేశాలు గ్రహించాలని కోరారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి ఇరాన్కు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. మెడికల్ షాపుల్లో తనిఖీలు రాయదుర్గం టౌన్: పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా అసిస్టెంట్ డైరక్టర్ వీరకుమార్రెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు మాధవి, కేశవరెడ్డి మూడు బృందాలుగా విడిపోయి బళ్లారి రోడ్డులోని దాదాపు ఐదారు మెడికల్ షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బిల్లులు నిర్వహణ, స్టాక్ రిజిస్టార్లు, రికార్డులు, జీఎస్టీ తగ్గింపు మేరకు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాలతో పాటు నిషేధిత మందుల విక్రయాలు, నిల్వలను పరిశీలించారు. నిబంధనలు పాటించని ఐదు దుకాణాదారులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తనిఖీల విషయం తెలియగానే రాయదుర్గంలోని పలు మెడికల్ షాపులకు తాళం వేసి నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. సాకే శైలజానాథ్ -
మోహినీ అవతారమెత్తిన శ్రీవారు
కదిరి: భక్తుల చేత వసంత వల్లభుడిగా, కాటమరాయుడిగా, ప్రహ్లాద వరదుడిగా కదిరిలో పూజలందుకుంటున్న ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా, అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజైన శనివారం స్వామివారు మోహినీ అవతారమెత్తారు. ఈ అవతారంలోని శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి, అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు మోహినీ అవతారమెత్తారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వయ్యారాలు ఒలకపోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తుంటే చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు. ధగ ధగా మెరిసే పట్టు చీరలో అందరినీ అకట్టుకొనే స్వామి వారిని గుభాళించే కదిరి మల్లెలతో అలంకరించారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలక్రిష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణమంతా ఊరేగనున్న శ్రీవారు తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలోని ప్రతి వీధికి వెళ్లి ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిస్తారు. ఆదివారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై స్వామివారు తన భక్తులకు తిరువీధుల్లో దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి రథోత్సవం ఈ నెల 10న జరగనుంది. -
జాతీయ స్థాయి గుర్తింపుతో అగ్రగామిగా జేఎన్టీయూ
● వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు అనంతపురం: ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించిన ఖ్యాతి జేఎన్టీయూ(ఏ) సొంతమని, నాణ్యమైన విద్యను అందిస్తూ జాతీయ స్థాయి గుర్తింపుతో అగ్రగామిగా నిలిచిందని ఆ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి అధ్యక్షతన శనివారం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమాలకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు.ఆద్యంతం కన్నుల పండుగగా కార్యక్రమాలు జరిగాయి. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను వీసీ ప్రారంభించి, మాట్లాడారు. కళాశాల పూర్వ విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. కళాశాల పురోభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారాన్ని కొనియాడారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, ఓఎస్డీటూవీసీ ఓ.దేవన్న, స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దిలీప్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జోజిరెడ్డి , విద్యార్థుల తరపున కో–ఆర్డినేటర్లు యు.సాయిహేమంత్, కె.అనురాగ్ శ్యాం, డి.సాయి విష్ణు, కె.రోహిత్ పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి వీసీ చేతుల మీదుగా మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు.


