Anantapur District News
-
ఐచర్ ఢీకొని యువకుడి మృతి
రాప్తాడు రూరల్: మండల పరిధిలోని రామినేపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కనగానపల్లికి చెందిన పూజరి ఉజ్జినప్ప కుమారుడు రంజిత్ (25) బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా వివాహం కాలేదు. వ్యవసాయ పంట పొలాలకు అవసరమైన మందుల కోసం స్నేహితుడు ప్రసాద్తో కలిసి అనంతపురం వచ్చారు. అనంతరం ఇద్దరూ బైకుపై స్వగ్రామానికి బయలుదేరారు. రామినేపల్లి వద్ద జాతీయ రహదారి నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డుకు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన ఐచర్ వాహనం అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడగా, ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యాశాఖలో ఇన్చార్జ్ల పాలన
నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్–సుఖీభవ సొమ్ము అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిసాయం కింద శనివారం సొమ్ము విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి తెలిపారు. పీఎం కిసాన్ కింద 2,542,269 మంది రైతులకు రూ.2 వేల ప్రకారం రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్ల్లు అందజేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.7 వేల ప్రకారం రూ.188.67 కోట్లు విడుదల కానున్నట్లు తెలిపారు. కౌలు రైతులు, దేవదాయ, అటవీభూమి సాగుదారులకు కిసాన్–సుఖీభవ సొమ్ము అందే పరిస్థితి లేదు. అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలోనే కీలక పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉన్నవారికే రెండు, మూడు బాధ్యతలు అప్పగించడం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన అత్యంత కీలక సమయంలో మొత్తం ‘ఇన్చార్జ్ పాలన’లో నడుస్తుండటంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురి పని ఒక్కరికే జిల్లాలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు పూర్తిస్థాయి అధికారులతో కాకుండా ఇన్చార్జ్లతో నడుస్తున్నాయి. డీఈఓగా కొనసాగుతున్న శ్రీనివాసరావు ఒకేసారి డీఈఓ, అనంతపురం డిప్యూటీ డీఈఓ, విడపనకల్లు ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కణేకల్లు ఎంఈఓ కృష్ణయ్య గుత్తి డిప్యూటీ డీఈఓ బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఒకే అధికారి రెండు నుంచి మూడు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుండటంతో ఏ పోస్టుకూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది. కాగితాలపైనే పర్యవేక్షణ పెద్దపప్పూరు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కుందుర్పి, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కంబదూరు, రాయదుర్గం వంటి మండలాల్లో పూర్తిస్థాయి ఎంఈఓలు లేరు. యాడికి, గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల్లో ఎంఈఓ–2 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండల విద్యా పరిపాలన, పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల జీతాల బిల్లులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలు అన్నీ ఇన్చార్జ్ల భుజాలపై పడటంతో వ్యవస్థ స్తబ్దుగా మారింది. స్కూల్ అసిస్టెంట్లే ఎంఈఓలు బెళుగుప్ప, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కంబదూరు, కుందుర్పి మండలాల్లో స్కూల్ అసిస్టెంట్లనే ఇన్చార్జ్ ఎంఈఓలుగా నియమించారు. దీంతో వారు పనిచేస్తున్న పాఠశాలల్లో ఆయా సబ్జెక్టల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. హెచ్ఎంలపై రెట్టింపు భారం కొన్ని మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జ్ ఎంఈఓలుగా పనిచేస్తున్నారు. ఒకవైపు తమ పాఠశాల నిర్వహణ, మరోవైపు మండలంలోని అన్ని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. రెండు వేర్వేరు వ్యవస్థలను ఒకేసారి పర్యవేక్షించడం ఆచరణలో అసాధ్యమని విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అడ్మిషన్లు, కిట్లు, పథకాల అమలుపై ప్రభావం విద్యా సంవత్సరం ప్రారంభ దశలో అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు, విద్యా కిట్లు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల పరిశీలన వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఖాళీ పోస్టులు, అదనపు బాధ్యతల కారణంగా ఈ కార్యక్రమాల అమలులో జాప్యం చోటుచేసుకుంటోందని సమాచారం. ‘ఆంధ్ర మోడల్’నా.. ‘ఫెయిల్యూర్ మోడల్’నా? విద్యారంగంలో సంస్కరణలు, నాణ్యమైన విద్య అంటూ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అని గొప్పులు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘ఫెయిల్యూర్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అన్న చందంగా తయారైందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కీలక పోస్టులన్నీ ఖాళీ ఇన్చార్జ్ల అధీనంలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు 8 మండలాల్లో లేని ఎంఈఓలు మరో 3 మండలాల్లో ఎంఈఓ–2 పోస్టుల ఖాళీ పర్యవేక్షణ లేక పరిపాలన గందరగోళం -
‘ రాష్ట్రంలో దళితులపై దమనకాండ’
అనంతపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దమన కాండ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్బుక్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అండదండలతో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని విమర్శించారు. దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళితుల హత్యలు జరుగుతుంటే కనీసం ఖండించలేని స్థితిలో ఉన్న హోం మంత్రి వంగలపూడి అనితకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చిన్న సంఘటన జరిగినా వీధులకెక్కి గొంతులు చించుకున్న టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు దళితులపై ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దళితుల హత్యలు, దాడుల ఘటనలపై తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు, నాయకులు ప్రభుదాస్, నారాయణ స్వామి, విజయ్ కుమార్, సురేష్, సాకే అనిల్కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐఆర్ హామీ అమలు చేయండి అనంతపురం అర్బన్: ఉద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి. అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఎన్.దివాకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను నగరంలోని ఆయన స్వగృహంలో నాయకులు శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. మూడేళ్లు గడుస్తున్నా పీఆర్సీ కమిషనర్ను నియమించకపోవడంతో ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రకటిస్తామని చెప్పిన ఐఆర్ హామీ అమలు కాలేదన్నారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణం పీఆర్సీ కమిషన్ వేయాలని కోరారు. పీఆర్, ఐఆర్, డీఏ, తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాఽధికారి వి.పునీత్బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.ప్రసాద్, ఏపీ జేసీ అమరావతి మహిళ విభాగం జిల్లా చైర్పర్సన్ బి.సురేఖరావు, ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి, 14వ బెటాలియన్ జిల్లా అధ్యక్షుడు టి.పెద్దయ్య, ఎస్ఎల్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.శివానందరెడ్డి, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, వాణిజ్య పన్నులశాఖ హరి, వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓబుళేసు, తదితరులు పాల్గొన్నారు. కుక్కల దాడిలో జింకకు గాయాలునార్పల: మండల పరిధిలోని తుంపెర గ్రామ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి జింకపై కుక్కలు దాడి చేశాయి. ఆ సమయంలో రైతు సంజీవరాయుడు అప్రమత్తమై కుక్కల బారి నుండి జింకను కాపాడి అటవీశాఖ అధికారులుకు సమాచారం ఇచ్చారు. గాయపడిన జింకను అటవీశాఖ అధికారులు ఉషారాణి, తేజేశ్వర్రెడ్డి చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. డాక్టర్ సాయి సుప్రజ పర్యవేక్షణలో రాజారెడ్డి, ధనమ్మ, గురుప్రసాద్ చికిత్స చేశారు. -
పక్కాగా రీసర్వే పనులు
పెద్దవడుగూరు: మండలంలోని రీసర్వే పనులను వేగంగా, పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అప్పేచర్ల, క్రిష్టిపాడు గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేసే సమయంలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దవడుగూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పట్టాదారు పాసుపుస్తకం అందించడంలో అధికారుల తీరుపై రైతులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉషారాణి, సర్వేయర్ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
బెళుగుప్ప: మండల పరిధిలోని నక్కలపల్లికి చెందిన ఈశ్వర్రెడ్డి (55) విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నక్కలపల్లికి చెందిన జి.ఈశ్వర్రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మోటార్ను ఆన్ చేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే విద్యుత్ తీగలు కొంత తెగిపోయి ఉండటాన్ని గమనించకుండా ఎడమచేతితో పట్టుకుని ఆన్చేయగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన బెళుగుప్ప పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఈశ్వర్రెడ్డి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ వన్నూరస్వామి తెలిపారు. కుటుంబ యజమాని ఉన్న ఫలంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
నమ్మితే నట్టేట మునిగినట్టే !
గ్లోబల్ షేర్ మార్కెట్పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం. ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు ప్రాథమిక అంశాలపై కనీస అవగాహన కలిగి ఉండాలి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఫేక్ వీడియో చూసిన పలువురు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వీరి సంఖ్య రోజూ వందల్లో ఉండడం బాధాకరం. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే రూ. లక్షలు ఎలా అవుతాయో ముందుగా తెలుసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అసత్య ప్రచారాలను నమ్మొద్దు. నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. – అక్కిరెడ్డి, సెబీ సర్టిఫైడ్ అనలిస్ట్, అనంతపురం ప్రచార హోరు... మోసాల జోరు గ్లోబల్ షేర్ మార్కెట్ పేరుతో వల తక్కువ సమయంలోనే రూ.లక్షల్లో లాభం అంటూ ప్రచారం ప్రముఖుల ఫేక్ వీడియోలతో నయవంచన -
నేడు నేమకల్లు అంజన్న ప్రతిష్టాపన
బొమ్మనహాళ్: నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో బాలాలయంలో శనివారం స్వామివారి ప్రతిష్టాపన జరగనుంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా బాలాలయంలో స్వామిని ప్రతిష్టిస్తున్నట్లు ఆలయ ఈఓ నరసింహారెడ్డి, ప్రధాన అర్చకులు అనిల్కుమార్ చార్యులు, ధర్మకర్త శ్రీనాథ్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని భోజనశాలలో శనివారం ఉదయం 7.37 గంటల నుంచి 11.17 గంటలకు బాలాలయాన్ని ఏర్పాటు చేసి, స్వామివారిని ప్రతిష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడే నిత్య పూజలు, అర్చనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నుట్లు తెలియజేశారు. ఆలయ జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు భక్తులకు బాలాలయంలోనే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నం పెద్దపప్పూరు: అప్పుల వాళ్ల బెదిరింపులు తాళలేక పురుగుల మందుతాగి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన పెద్దపప్పూరు మండలంలోని పసలూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గురునాథ్, రాజేశ్వరి దంపతులు. గురువారం సాయంత్రం ఓ కేసు విషయంపై మాట్లాడేందుకు గురునాథ్ పోలీసుస్టేషన్కు వెళ్లాడు. అయితే పురుగుల మందు తాగి రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న రాజేశ్వరిని కొందరు గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు చికిత్స నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల వాళ్లు బెదిరింపులకు దిగడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితురాలు తెలిపింది. -
ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
గుత్తి: పట్టణంలోని కోట నేసే వీధిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని అఫ్రీన్ (19) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాలమేరకు.. అఫ్రీన్ తల్లి ఖైరూన్బీతో కలిసి కోట నేసే వీధిలో నివస్తోంది. ఆమె తండ్రి హైదరాబాద్లో పనికోసమని ఆర్నెళ్ల క్రితం వెళ్లాడు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా.. మొదటి కుమార్తెకు వివాహమైంది. అఫ్రీన్ గుంతకల్లులోని ఓ డిగ్రీ కాలేజీలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఫ్రీన్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లి ఖైరూన్బీ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ అమీర్ఖాన్ పరిశీలించారు. అయితే ఉరి వేసుకున్న ప్రాంతంలో అఫ్రీన్ కాళ్లు ఫ్లోర్కు ఉన్న బండలకు ఆనుకుని ఉన్నాయి. దీంతో ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల చేతిలో సూసైడ్ నోట్ పోలీసులకు అఫ్రీన్ రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తండ్రి సరిగా చూసుకోవడం లేదని, ఒంటరిగా ఉండాల్సి వస్తోందని, తల్లికి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నానని నోట్ రాసింది. ఇక జీవించడం తనకు ఇష్టం లేదని, చనిపోతున్నానని రాసినట్లు పోలీసులు తెలిపారు. అయితే సూసైడ్ నోట్ను పోలీసులు బయటకు పెట్టలేదు. -
పడిగాపులు.. పడరాని పాట్లు
అనంతపురం సిటీ: జిల్లా సర్వజనాస్పత్రిలో నెలకొన్న అధ్వాన పరిస్థితులు రోగులు, వారి సహాయకులను చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రధానంగా స్కానింగ్కు రెఫర్ చేసినప్పుడు పరిస్థితి దారుణంగా తయారై ఘర్షణ పడాల్సి వస్తోంది. ఇది ప్రతి రోజూ కొనసాగుతూ వస్తున్నా సంబంధిత అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇరుకై న గదుల్లో స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తుండడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కొన్నేళ్లుగా ఒకే గదిలో 2డీ ఎకో, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నారు. గదిలో ఇద్దరు, ముగ్గురుకంటే ఎక్కువ మంది ఉండలేని పరిస్థితి. ఒకేసారి ముగ్గురు రోగులను లోపలికి అనుమతించడంతో పాటు వారి సహాయకులు కూడా వెంట ఉండాల్సి వస్తోంది. దీంతో గందగోళం నెలకొని స్కానింగ్ ఆలస్యమవుతోంది. ఈ క్రమంలోనే గది బయట వేచి ఉండే రోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే ఏ ఒక్కరికీ టోకన్లు ఇవ్వకుండా అందరినీ వేచి ఉండాలని చెప్పడం తప్ప స్కానింగ్ వేగవంతం చేసే చర్యలు ఏవీ చేపట్టకపోవడంతో రోగులు, వారి సహాయకుల్లో అసహనం రేకెత్తుతోంది. గది బయట స్కానింగ్ రోగులు కిక్కిరిసి ఉండడంతో ఇతర వార్డులకు వెళ్లే వారికీ తిప్పలు తప్పడం లేదు. వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత స్కానింగ్ కోసం గంటల తరబడి వేచి ఉన్న తమను కాదని వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత నిస్తున్నారంటూ తరచూ రోగుల సహాయకులు వాగ్వాదానికి దిగుతున్నారు. అత్యవసరమంటూ కొందరు.... ఆస్పత్రి సిబ్బంది సిఫారసులతో వెనకొచ్చిన మరికొందరు దర్జాగా గదిలోకి చొరబడి స్కానింగ్ చేయించుకుని వెళుతుంటే తాము మాత్రం మూడు గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. టోకన్లు అందజేసి, ఆ మేరకు స్కానింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు. సర్వజనాస్పత్రిలో స్కానింగ్ కష్టాలు రోగులకు తప్పని అవస్థలు సిఫారసులకు తలొగ్గి వెనకొచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న సిబ్బంది -
రేపు రీ–నీట్
అనంతపురం అర్బన్: వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) రీ ఎగ్జామ్ను ఈ నెల 21న నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పరీక్ష నిర్వహణ, పర్యవేక్షణకు స్థానిక అధికారులకు కాకుండా ప్రత్యేకంగా తన అధికారులను ఎన్టీఏ నియమించుకుంది. చివరకు బందోబస్తులోనూ కేంద్ర బలగాలను ఏర్పాటు చేసుకుంది. కేంద్రాల్లో ఎన్టీఏ ముద్ర ఉన్న గోడ గడియారాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మాదిరిగా స్థానిక అధికారులకు ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు. అంతా ఎన్టీఏ కంట్రోల్లో రీ–ఎగ్జామినేన్ జరగనుందని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ‘రీ–నీట్’ కంట్రోల్ రూమ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రీ– ఎగ్జామినేషన్ నిర్వహణ కోసం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సందేహాల నివృత్తి, అత్యవసర సహాయం కోసం అభ్యర్థులు, తల్లిదండ్రులు, సంబంధిత సిబ్బంది టోల్ ఫ్రీ నంబర్ 85002 92992లో సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ 20వ తేదీ ఉదయం 10 నుంచి 21వ తేదీ రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘సర్’ పర్యవేక్షక అధికారుల నియామకం అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. అన్ని జిల్లాలకూ పర్యవేక్షక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం జారీ చేశారు. అనంతపురం జిల్లా పర్యవేక్షక అధికారిగా మిషన్ ఫర్ క్లీన్ కృష్ణ, గోదావరి కెనాళ్ల మేనేజింగ్ డైరెక్టర్ జి.క్రిస్ట్ కిషోర్కుమార్ను నియమించారు. అదనపు ఎస్పీ బాధ్యతల స్వీకరణ అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఎస్పీ జగదీష్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 1991 బ్యాచ్కు చెందిన ఆయన సుదీర్ఘకాలం పాటు కర్నూలు, కడప జిల్లాల్లో ఎస్ఐగా, సీఐ, డీఎస్పీగా ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, అవినీతి నిరోధక శాఖ విభాగాల్లో పనిచేశారు. ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతిపై అనంతపురానికి నియమితులయ్యారు. విజిలెన్స్ ఏఎస్పీగా స్నేహిత అనంతపురం సెంట్రల్: రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ఏఎస్పీగా స్నేహిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో వెయిటింగ్లో ఉన్న ఆమెను ఇటీవల జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెకు పలువురు విజిలెన్స్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. -
అరాచకాలు, హత్యలు తప్ప ఏం చేశారు?
● చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం ఉరవకొండ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన అరాచకాలు, హత్యలు, దోపిడీలతోనే సాగిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల విజయోత్సవ సభలు నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ‘చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ కార్యక్రమం దిగ్విజయం అయిందన్నారు. దీంతో చంద్రబాబు సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిందన్నారు. సభలకు వచ్చిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పకోలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో పూర్తి మద్దతిచ్చిన ఉద్యోగులు, అమరావతి రైతులు సైతం చంద్రబాబు పాలన అధ్వానంగా ఉందనడం చంద్రబాబు నికృష్ట పాలనకు నిదర్శనమన్నారు. మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఉద్యోగాల నియామకాల్లో ప్రభుత్వం అభాసుపాలైందన్నారు.రైతులకు అందించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, అన్నదాత సుఖీభవ, రైతు ఆత్మహత్యల పరిహారాల చెల్లింపులు విషయాన్ని ప్రభుత్వం గాలికొదిలేయడంతో రైతాంగం నిరాశలో ఉన్నారన్నారు. మద్దతు ధర కల్పించడంలో పయ్యావుల విఫలం ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల ఉరవకొండ ప్రాంతంలో అధికంగా సాగయ్యే పప్పుశనగకు మద్దతు ధర కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కనీసం సబ్సిడీ విత్తనాలు ఇప్పించలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కంది రైతులు పంటను వందల కి.మీ వెళ్లి అమ్ముకోవాల్సిన దీనస్థితి నెలకొందని చెప్పారు. 16 లక్షల మంది కౌలు రైతులకు వరుసగా మూడోసారి సబ్సిడీ ఎరువులు అందజేయకుండా మొండి చేయి చూపారని మండిపడ్డారు. సాగునీటి అభివృద్ధి నిధులను చంద్రబాబు ప్రభుత్వం వేలాది కోట్లు వృథా చేసిందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న ‘సర్’లో వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సహకారం అందించకూడదని వీఆర్ఓలకు కూటమి నేతలు ఆదేశాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి మాటలకు సహకరించి నిజమైన ఓటర్లను తొలగిస్తే వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అధికార ప్రతినిధి కేవీ.రమణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తలూరి అశోక్, మండల సమన్వయకర్త ములగిరిపల్లి ఓబన్న, వాణిజ్య విభాగం మండల అధ్యక్షుడు గందోడి మారేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ పారదర్శకతపై సందేహాలు
అనంతపురం: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల పారదర్శక ఓటరు జాబితాపై సందేహాలు తలెత్తుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును అర్హులు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వీరు కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ ఆనంద్ను కలిసి.. ‘సర్’పై అభ్యంతరాలను తెలియజేశారు. అనంతరం అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి చెందిన బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్)లు తమకు తెలియకుండా ఏమీ చేయకూడదని బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)లపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. శింగనమలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఐదు రోజులుగా వెలుగుచూసిన ఘటనలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. బీఎల్ఓలు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరామని చెప్పారు. చాలా చోట్ల బీఎల్ఓలు, ఈఆర్ఓలకు ‘సర్’ ప్రక్రియపై ఇప్పటికీ అవగాహన లేకపోవడం కూడా ఇబ్బందిగా మారుతోందని అన్నారు. డబుల్, డెత్ ఓటర్లతో పాటు వలస వెళ్లిన వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అడిగామని తెలిపారు. అనంతపురం నగరంలో డెత్, వలస ఓట్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాలు ఎలా రాయాలో తెలియని వారి కోసం ఎన్నికల సంఘం నుంచే ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని కోరారు. అధికార పార్టీ బీఎల్ఏలు రాకపోతే కొన్నిచోట్ల ‘సర్’ ప్రక్రియను వాయిదా వేస్తున్నారని తెలియజేశారు. ‘సర్’ ముగిశాక కూడా ఇంకా డెత్, వలస ఓట్లు అలాగే ఉంటే ఎన్నికల సంఘం లక్ష్యం నెరవేరనట్టేనని స్పష్టం చేశారు. దీంతో రెండ్రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అర్హుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం శింగనమల నియోజకవర్గంలో బీఎల్ఏలు కాని వ్యక్తులు ‘సర్’ ప్రక్రియలో పాల్గొని తమకు అనుకూలం కాని వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులలో ఏ ఒక్క ఓటు తొలగించినా ఉపేక్షించేది లేదన్నారు. బీఎల్ఏ కాని వ్యక్తి ‘సర్’ ప్రక్రియలో పాల్గొని ఓటర్లను బెదిరించిన ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను కలెక్టర్కు అందించామని చెప్పారు. అధికార పార్టీకి చెందిన బీఎల్ఏలు.. బీఎల్ఓలతో పాటు ఓటర్లపై పెత్తనం చేస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలను కలెక్టర్కు అందించినట్లు తెలిపారు. ‘సర్’ ప్రక్రియలో అధికార పార్టీ ప్రమేయం లేకుండా చూడాలని కోరామని, అదే సమయంలో తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక ఓటరుకు రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉండడానికి వీల్లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో తప్పులు జరిగితే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటు తొలగించకుండా చూడాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో సాకే రుత్విక్, వైఎస్సార్సీపీ బూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్ నాథ్రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం శింగనమల నియోజకవర్గంలో ఓటర్లకు బెదిరింపులు డబుల్ ఓట్లు, మైగ్రేట్, చనిపోయిన వారి ఓట్ల కొనసాగింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయానికి ఈసారి గడ్డు పరిస్థితులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోతే ఆ ప్రభావం ఆయకట్
అనంతపురం సెంట్రల్: జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర హైలెవెల్ కెనాల్ (హెచ్చెల్సీ). దశాబ్దాలుగా సాగు– తాగునీటి అవసరాలు తీరుస్తున్న అతిపెద్ద వనరు. కర్ణాటక రాష్ట్రం హొస్పేటలోని తుంగభద్ర జలాశయం నుంచి గ్రావిటీ (హెచ్చెల్సీ) ద్వారా జిల్లాకు నీరందుతోంది. ఏటా సగటున దాదాపు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు తాగునీటిని కూడా అందిస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి 32 టీఎంసీల నికర జలాల వాటా ఉంది. ఏటా జలాశయంలోకి వచ్చే నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి దామాషా ప్రకారం కేటాయింపులు చేస్తారు. 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోనూ మిగిలిన నీటిని ఆయకట్టుకు అందిస్తున్నారు. ఈ నీటితో దాదాపు 40వేల ఎకరాల్లో వరి, 80 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా పీఏబీఆర్ కుడి కాలువ కింద 48 చెరువులు, హెచ్చెల్సీ కింద లోకలైజేషన్ చెరువులకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీని వల్ల భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగి రైతులకు, ప్రజలకు సాగు–తాగు నీటికి ఇబ్బందులు రాకుండా తుంగభద్ర జలాశయం ఆదుకుంటోంది. ఎల్–నినోతో తీవ్ర వర్షాభావం ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగానే ఉంటాయని శాస్త్రవేత్తలు ముందే వెల్లడించారు. కర్ణాటకలో తుంగభద్ర నదీపరివాహక ప్రాంతాల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు రాలేదు. అనంతపురం జిల్లాలోనే కాస్తోకూస్తో ఇప్పటి వరకూ వర్షాలు పడ్డాయి. కర్ణాటకలో ఆ పరిస్థితి కూడా లేనట్లు కనిపిస్తోంది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నేటికీ అరకొర నీటితోనే దర్శనమిస్తోంది. ఏటా మే, జూన్ నెలల నుంచే వర్షాలు ప్రారంభమవుతాయి. దీంతో ప్రతి జూన్ మొదటి వారంలో తుంగభద్ర బోర్డు సమావేశం నిర్వహించి జలాశయానికి నీటి లభ్యత, కేటాయింపులు, నీటి విడుదల తేదీలను నిర్ణయిస్తారు. కానీ ఈసారి జరిగిన బోర్డు సమావేశంలో అలాంటి నిర్ణయాలేవీ లేకుండానే ముగించారు. కారణం జలాశయానికి ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడమే. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలతో తుంగభద్ర జలాశయం గేటు ఒకటి కొట్టుకుపోయింది. ఈ ఏడాది దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నూతన గేటు ఏర్పాటు చేశారు. ఈ పనులు చేపట్టేందు కోసం జలాశయంలోని నీటిని మొత్తం ఖాళీ చేశారు. ప్రస్తుతం 480 క్యూసెక్కుల కనిష్ట ఇన్ఫ్లోతో జలాశయంలో 9.741 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 51,261 క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లోతో 38.608 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. ఆయకట్టుపై తీవ్ర ప్రభావం ఈసారి వర్షాలు పెద్దగా లేకపోవడంతో హెచ్చెల్సీ ఆయకట్టు తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలో రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉంది. తుంగభద్ర జలాలపై ఆధారపడే ఈ ప్రాంత రైతులు పంటలు సాగు చేస్తారు. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై తొలుత అధికారుల్లోనే ఆందోళన మొదలైంది. ఇక రైతుల పరిస్థితి భవిష్యత్లో కురిసే వర్షాలను బట్టి తెలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొందరపడి నార్లు పోసుకోవద్దు తుంగభద్ర జలాశయానికి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్ఫ్లో లేదు. దీని వల్ల ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నా... మరికొద్దిరోజులు వేచిచూస్తే తప్ప అంచనాలు వేయలేం. అదృష్టవశాత్తు పెద్ద వర్షాలు వస్తే తుంగభద్ర జలాశయంలో 40 టీఎంసీలకు చేరుకున్న తర్వాత నీటిని విడుదల చేస్తారు. హెచ్చెల్సీ (కాలువ) ఆధునికీకరణ పనులు, షట్టర్ల ఏర్పాటు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తొందరపడి నార్లు పోసుకోవడం లాంటివి చేయవద్దు. నీటి లభ్యతను బట్టి తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చెల్సీకి కేటాయింపులు, నీటి విడుదల తేదీలను ప్రకటిస్తారు. – సుధాకర్రావు, ఎస్ఈ, హెచ్చెల్సీ ఎల్–నినో ఎఫెక్ట్.. నేటికీ కనిష్టస్థాయిలోనే నీటి మట్టం ప్రస్తుతం 480 క్యూసెక్కుల ఇన్ఫ్లో 9.741 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ గతేడాది 38.608 టీఎంసీల నీటి నిల్వ జిల్లాలో హెచ్చెల్సీ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం -
యోగాతో
ఆనందకర జీవితం తాడిపత్రి టౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తాడిపత్రి పట్టణంలోని పురాతన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులతో పాటు విద్యార్థులు హాజరై యోగాసనాలు వేశారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ యోగాతోనే ఆనందకర జీవితం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన అవసరమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికారి ఓబుళమ్మ, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● 17 మందికి గాయాలు గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లిలో గురువారం లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు 45 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి ధర్మవరానికి బయలుదేరింది. మార్గమధ్యంలో బసినేపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ను లారీ దాటుతుండగా, వెనుక నుంచి ఢీకొంది. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలకు చెందిన కవిత, ఐజకు చెందిన జయమ్మ, గోపాల్, ఫిలిప్, కీర్తన, కవిత, అశ్విని, అంకిత, సింధుజా, అనంతపురం నగరానికి చెందిన ఇమామ్బీ, షాజహాన్, సానియా, షబానా, సావిత్రి, గుత్తికి చెందిన సుజాత, ఎమ్మిగనూరుకు చెందిన నాగవేణి, పత్తికొండ మండలం హోసూరుకు చెందిన వంశీకృష్ణ గాయపడ్డారు. వారిని 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన కవిత, జయమ్మ, నాగవేణి, వంశీకృష్ణను అనంతపురం, కర్నూలుకు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని గుత్తి ఆర్టీసీ డిపో అధికారులు పరిశీలించారు. బస్సు ఢీకొన్నా లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నాగవేణి,వంశీకృష్ణ -
గనుల, భూగర్భశాఖ నిర్ణయం తీసుకోవాలి
మన్నీల సర్వే నంబరు 26లోని ప్రభుత్వ భూమిలో మైనింగ్ అనుమతుల కోసం సదరు కంపెనీ వారు దరఖాస్తు చేసుకున్నారు. దానిపై గతంలో ఉన్న అధికారులు నివేదిక ఇచ్చారు. గ్రామస్తులు, రైతుల ఫిర్యాదు మేరకు అక్కడికి వెళ్లి పరిశీలించాం. మైనింగ్ అనుమతులపై గనుల భూగర్భ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెద్ద భవనం నిర్మించడం, కుంటను పూడ్చేయడం, చుట్టూ ఫెన్సింగ్ వేయడంపై గనుల భూగర్భ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారేమో కనుక్కోవాలి. – ఉదయ్భాస్కర్, తహసీల్దారు, అనంతపురం రూరల్ -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఆ ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు ● రాసిన పరీక్షనే మళ్లీ రాయించడంపై ఎస్కేయూ వీసీ ఆగ్రహం ● 9 మంది విద్యార్థులకు నేడు అదే కేంద్రంలో పరీక్ష అనంతపురం: రాసిన పరీక్షనే విద్యార్థులతో మళ్లీ రాయించిన ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం నగరంలోని శ్రీశ్రీనివాస డిగ్రీ కళాశాలలో సోమవారం జరిగిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరీక్షను మంగళవారం మళ్లీ నిర్వహించారు. తప్పును గుర్తించిన ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు 15 నిమిషాల అనంతరం ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రశ్నపత్రాన్ని మెయిల్ ద్వారా పంపినా సదరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆదినారాయణ రెడ్డి నిర్లక్ష్యం వహించారు. బలవంతంగా 9 మంది విద్యార్థులతో పరీక్ష రాయించారు. విద్యార్థులు బతిమలాడినా కనికరించలేదు. ఈ అంశంపై ‘సాక్షి’లో గురువారం కథనం వెలువడడంతో ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ స్పందించారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు ఆయా విద్యార్థులకు శుక్రవారం అదే కేంద్రంలో మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల విభాగం అధికారులపై చర్యలేవీ..? షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన ప్రశ్నపత్రాన్ని ఆయా కళాశాలలకు పంపాల్సిన బాధ్యత ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులపై ఉంటుంది. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక సబ్జెక్టుకు బదులు మరొక సబ్జెక్టు ప్రశ్నపత్రం పంపి వర్సిటీ ప్రతిష్టను మసకబార్చారు. దీనిపై ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు చేసిన తప్పును తేలికగా తీసుకుని, కేవలం ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వారం తర్వాత అతడిని విధుల్లోకి తీసుకున్నా ఎవరూ ప్రశ్నించలేరు. కానీ, ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే చర్చనీయాంశంగా మారింది. ఖాళీల భర్తీకి చర్యలు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా టీచర్ల ఖాళీల భర్తీకి తొలి అడుగు వేసింది. ఈ నెలాఖరులోగా ఎంటీఎస్ టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి చేసి, అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్షారియా ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఎంటీఎస్ టీచర్లకే అవకాశం గురువారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీలను ముందుగా గుర్తించి, వాటికి ఎంటీఎస్ టీచర్ల నుంచి ఆప్షన్లు స్వీకరించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించడం ద్వారా విద్యార్థులకు బోధనలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. బదిలీలు, సర్దుబాట్ల తర్వాత కూడా ఉపాధ్యాయుల కొరత కొనసాగితే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 550 మంది.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1998, 2008 డీఎస్సీ ద్వారా నియమితులైన ఎంటీఎస్ టీచర్లు 665 మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం సుమారు 100 మంది పదవీ విరమణ చేశారు. 550 మంది ఎంటీఎస్ టీచర్లు వివిధ పాఠశాలల్లో సేవలందిస్తున్నారు. -
అధికారులే అండగా నిలుస్తున్నారు
సర్వే నంబరు 26లో ఎలాంటి అనుమతులు లేకుండానే కంకర మిషన్ యాజమాన్యం రెండంతస్తుల భవనం నిర్మించింది. 30 అడుగుల ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. నీటి కుంటను పూడ్చివేసి, మైనింగ్ నుంచి వచ్చిన వేస్ట్ మట్టిని డంపింగ్ చేశారు. దీనిపై అన్ని శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి రైతులు, ప్రజా నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేయించారు. – టి.రామాంజనేయులు, సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి, మన్నీల -
టీచర్ల విభజన కసరత్తు వేగవంతం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లా విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఉపాధ్యాయులను అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు విభజించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని కేడర్ల ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తోంది. డివిజన్ల వారీగా.. మొదటి రోజు అనంతపురం విద్యా డివిజన్ పరిధిలోని వివరాలను పరిశీలించిన అధికారులు, రెండో రోజు గురువారం గుత్తి డివిజన్కు చెందిన ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో అనంతపురం సైన్స్ సెంటర్లో సమావేశం నిర్వహించారు. సీనియార్టీ జాబితాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు ప్రతి పేరును పరిశీలిస్తూ ధ్రువీకరణ ప్రక్రియ చేపట్టారు. ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు, గుత్తి డీవైఈఓ లక్ష్మన్న, డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఐటీ విభాగం అధికారులు పాల్గొని సీనియార్టీ జాబితాల పరిశీలన చేపట్టారు. శుక్రవారం, శనివారం శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ఎంఈఓలు, హెచ్ఎంలతో సమావేశాలు నిర్వహించి సీనియార్టీ జాబితాలు, ఖాళీల వివరాలను ఖరారు చేయనున్నారు. కేడర్లో చేరిన తేదీనే ప్రాతిపదిక ప్రస్తుతం ఉపాధ్యాయుడు ఉన్న కేటగిరీలో సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు చేపట్టను న్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను యూనిట్గా తీసుకుని ప్రక్రియ చేపడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు సంబంధించి వారు ఇక్కడ విధుల్లో చేరిన తేదీ నుంచే సీనియార్టీ లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ఉపాధ్యాయుల స్థానాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. సస్పెన్షన్లో ఉన్నవారు, అనధికారంగా గైర్హాజరైన ఉపాధ్యాయుల పేర్లను కూడా సీనియార్టీ జాబితాల్లో చేర్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విభజన ప్రక్రియలో ముందుగా వారిని ఏదో ఒక జిల్లాకు కేటాయించి, అనంతరం క్రమశిక్షణ చర్యలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. 100 శాతం ఆప్షన్లు తప్పనిసరి జిల్లా విభజన ప్రక్రియలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఆప్షన్లు ఇవ్వాల్సిందేనని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆప్షన్లు, సీనియార్టీ, ఖాళీల ఆధారంగా తుది కేటాయింపులు చేపట్టే అవ కాశం ఉంది. జిల్లా విభజనతో తమ సేవా ప్రాంతం మారుతుందా.. సీనియార్టీపై ప్రభావం ఉంటుందా? అనే అంశాలపై ఉపాధ్యాయుల్లో ఆసక్తి నెలకొంది. -
‘ఫస్ట్’లో 34 శాతం, సెకండ్లో 51 శాతం
● ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 147 కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ప్రథమ సంవత్సరంలో కేవలం 34 శాతం, ద్వితీయ సంవత్సరంలో 51 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కొన్ని యాజమాన్యాలు ఆశించిన ఫలితాలు సాధించగా, మరికొన్ని జిల్లా సగటును కూడా అందుకోలేకపోయాయి. జిల్లాలో 23 ప్రభుత్వ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరంలో 1,265 మంది పరీక్షలకు హాజరుకాగా 450 మంది (35.57 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,042 మందిలో 540 మంది (51.82 శాతం )ఉత్తీర్ణత సాధించారు. రెండు ఎయిడెడ్ కళాశాలల ఫలితాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.ప్రథమ సంవత్సరంలో 398 మంది హాజరుకాగా కేవలం 88 మంది మాత్రమే 22.11 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 50.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 48.64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69.56 శాతం ఉత్తీర్ణత, 15 ఏపీ మోడల్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 31.89 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 53.79 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక 32 కేజీబీవీల్లో ప్రథమ సంవత్సరంలో 53.28 శాతం, ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. 66 ప్రైవేట్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం 34.07 శాతం, ద్వితీయ సంవత్సరంలో 50.69 శాతం ఉత్తీర్ణత సాధించారు. పట్టపగలే కొల్లగొట్టారు! యాడికి: మండలంలోని చందన గ్రామంలో గురువారం దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఇంట్లోకి చొరబడి కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి. చందన గ్రామానికి చెందిన తంగసాని పెద్ద యల్లారెడ్డి గురువారం ఉదయం తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని తాడిపత్రికి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగొచ్చిన వారికి తాళం పగుల గొట్టి ఉండటం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా, బీరువాలోని 36 తులాల బంగారు, రూ.4 లక్షల నగదు కనిపించలేదు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు ఘటనాస్థలిని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్తో వివరాలు సేకరించారు. బాధితుడు పెద్ద యల్లారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచినట్లు సీఐ తెలిపారు. -
వేలం పెడతారు..పాడుకోండప్పో!
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఊరూరా మద్యం బెల్టుషాపులు వెలిశాయి. వీటి కోసం ‘తమ్ముళ్ల’ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇష్టారాజ్యంగా మద్యం అమ్ముకునే వెసులుబాటు ఉండడంతో మంచి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో బెల్టుషాపుల నిర్వహణకు టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో వేలం పాట నిర్వహించి మరీ బెల్టుషాపులు అప్పగిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో బెల్టు షాపుల ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు గురువారం రాత్రి వేలం పాట నిర్వహణకు సిద్ధమయ్యారు. అంతకుముందు గ్రామంలో దండోరా వేయించారు. వేలంలో పాల్గొనేవారికి స్థానికంగా ఓటు హక్కు ఉండాలని, ఆధార్, పాసుపోర్టు సైజ్ ఫొటోలు కలిగి ఉండాలని, వారి వివరాలు నమోదు చేసుకుని వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారని చాటింపు వేయడం గమనార్హం. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధి సూచన మేరకు వేలంపాట నిర్ణయాన్ని ‘తమ్ముళ్లు’ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు గ్రామాల్లో బెల్టుషాపులు పెడితే తాట తీస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తుండగా..మరోవైపు ఆయన పార్టీ వారే పల్లెల్లో దండోరా వేయించి మరీ బెల్టు షాపులకు వేలం నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మైనార్టీలపై బండ బూతులు ● రెచ్చిపోయిన మంత్రి పయ్యావుల అనుచరుడు ! సాక్షిటాస్క్ఫోర్స్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరుడు, ఉరవకొండ మండల టీడీపీ నాయకుడు రవి మద్యం మత్తులో బుధవారం రాత్రి వీరంగం సృష్టించాడు. ఉరవకొండలోని అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి వద్ద ఉన్న ఓ ధాబా వద్ద మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే అక్కడే ఉన్న కొందరు మైనార్టీలను ఇష్టారాజ్యంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని, ముస్లింలు ఏం పీక్కోలేరని రెచ్చిపోయినట్లు సమాచారం. ఈ ఘటన ఉరవకొండ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
బీఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం
ఎన్యుమరేషన్ విషయంలో బీఎల్ఓలపై వస్తున్న ఫిర్యాదులపై ఈఆర్ఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాం. బీఎల్ఓ లకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని చెప్పాం. 2002లో ఓటరు ఎక్కడ ఉన్నారనే వివరం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తనకు ఓటు లేకపోతే వారి నాన్న లేదా తాత ఓటు ఎక్కడ ఉండేదనే విషయం చెప్పినా సరిపోతుంది. కచ్చితంగా ఈ వివరాలే ఇవ్వాలని, లేదంటే మీ ఓటు ఉండదు అంటూ ఓటర్లను బీఎల్ఓలు ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా హెచ్చరించాం. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాలి. – ఎ.మలోల, జిల్లా రెవెన్యూ అధికారి -
ప్రకృతి సాగుతో దేశానికే ఆదర్శంగా నిలవాలి
అనంతపురం న్యూటౌన్: ప్రకృతి వ్యవసాయంతో మేలైన పంట దిగుబడులు సాధించి జిల్లా రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎడారీకరణ, కరువు నివారణ దినోత్సవం సందర్భంగా యాక్షన్ఫ్రాటెర్నా –ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రస్తుతం జిల్లాలో 85 వేల ఎకరాల్లో సాగుతున్న ప్రకృతి వ్యవసాయం వచ్చే ఏడాదికి 2 లక్షల ఎకరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ను 2 లక్షల ఎకరాల్లో అమలు చేయడమే లక్ష్యమన్నారు. యాక్షన్ ఫ్రాటెర్నా–ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి. మల్లారెడ్డి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము జిల్లాలోని 12 గ్రామాల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ శాఖ సంరక్షకురాలు ఆర్. యశోదాబాయి మాట్లాడుతూ రైతులు సాధ్యమైనంత ఎక్కువగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. జూలై 1 నుంచి నాటేందుకు అటవీ శాఖ 10 లక్షల మొక్కలు సిద్ధం చేసిందన్నారు. ముందుగా కలెక్టర్ ఆనంద్ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పంట విధానాల ప్రదర్శన, వ్యవసాయ నమూనాల స్టాళ్లను సందర్శించారు. నిజవల్లి గ్రామానికి చెందిన బాలవర్ధన్, పి.యాలేరు గ్రామానికి చెందిన శ్రీలత, అపిలేపల్లికి చెందిన అతాఉల్లా వంటి సహజ వ్యవసాయ రైతులు తమ అనుభవాలు, విజయగాథలను సదస్సులో వివరించారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురుప్రభాకర్, డ్వామా పీడీ సలీం బాషా, జిల్లా వ్యవసాయాధికారి ఎన్. సాలు రెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. రఘునాథ రెడ్డి, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త విజయశంకర్ బాబు, నాబార్డ్ డీడీఎం కె.అనూరాధ, సీటీవో లక్ష్మానాయక్, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం మిల్లెట్స్ శాస్త్రవేత్త నర్సింహులు, వైఎస్సార్ సీపీ రాయలసీమ అధికార ప్రతినిధి కె.వి. రమణ, పర్యావరణ ప్రేమికులు భాషా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్ పిలుపు -
‘సర్’ కుట్రలను తిప్పికొట్టాలి
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో చేస్తున్న ఓటు తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన బుధవారం పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఎస్ఐఆర్పై నిర్వహించిన సదస్సుకు రాంభూపాల్తో పాటు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్, సీపీఎం సీనియర్ నాయకుడు జి.ఓబుళు, రాష్ట్ర ముతవల్లిల అధ్యక్షుడు షకిల్ షఫీ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మొదటి విడతలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘ఎస్ఐఆర్’ నిర్వహించి 5.50 కోట్ల ఓట్లను తొలగించారన్నారు. ఇందులో 50 శాతం ముస్లిం మైనారిటీలవే ఉన్నాయన్నారు. రెండో దశలో 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహించి మరో 10 కోట్ల ముస్లిం, క్రిస్టియన్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓట్ల తొలగింపు జరిగితే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలనూ తొలగించే ప్రమాదం ఉందన్నారు. మునుముందు పౌరసత్వాన్ని కోల్పోయే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల మోదీ పరిపాలనలో చెప్పుకోదగ్గ ఒక్క మంచిపనీ లేదన్నారు. మన ఓట్లను మనమే కాపాడుకోవాలన్నారు. ఇంటి వద్దకు బీఎల్ఓలు వచ్చినప్పుడు ప్రజలు తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు ఇమామ్, వలి, ప్రకాష్, ముత్తుజ, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలి
అనంతపురం అర్బన్: ఈ ఏడాది ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు ఆరుతడిపంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు వచ్చినప్పటికీ ఎల్నినో ప్రభావం కారణంగా రాబోయే నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, అనుబంధ శాఖలు కరువు ప్రణాళికలు, ఉపశమన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల వరకు పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) అమలు చేయాలని చెప్పారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరిసాగు స్థానంలో ఆరుతడి పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చీనీ సాగునూ తగ్గించి ఇతర పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అలాగే ఖరీఫ్ సబ్సిడీ విత్తన వేరుశనగ కాయల పంపిణీ పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, పశుసంవర్ధకశాఖ జేడీ ప్రేమ్చంద్, అధికారులు పాల్గొన్నారు. లక్ష్యాలు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ డీఆర్డీఏ, మెప్మా అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూణాలు పొందిన పీఎంఎఫ్ఎంఈ యూనిట్లు గ్రౌండింగ్ కావాలని చెప్పారు. మండలానికి ఐదు యూనిట్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా పరిధిలో రుణాల మంజూరు లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఎఫ్పీఓలు, సమీకృత ఫార్మింగ్ క్లస్టర్ల సర్వే, కస్టమ్హైరింగ్ సెంటర్లు, తదితర అంశాలపై సమీక్షించారు. సీ్త్రనిధి పారామీటర్లకు సంబంధించి ఏపీఎంలతో రోజూ సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఏ, మెప్మా అధికారులు పాల్గొన్నారు. ‘సర్’లో 3.53 లక్షల ఫారాల పంపిణీ అనంతపురం అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 17 వరకు ఓటర్లకు 3,53,890 ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలు పంపిణీ చేశారని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉనారన్నారు. 2,226 మంది బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి, వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ ఆనంద్ ఆరుతడి పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి కరువు ప్రణాళికలు, ఉపశమన చర్యలు చేపట్టాలి కలెక్టర్ ఆనంద్ -
పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తూ పరలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం తాడిపత్రి రూరల్: మండలంలోని పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గంగాదేవిపల్లికి చెందిన సతీష్ (25), నాగేంద్ర ద్విచక్రవాహనంలో మంగళవారం రాత్రి తాడిపత్రిలో నిర్వహించిన తమ స్నేహితుడు సతీష్ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల అనంతరం తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా పులిప్రొద్దుటూరు గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. సతీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్కు ఆస్పత్రిలో చికిత్సలందించారు. ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మృతుడు సతీష్కు భార్య పుష్పతో పాటు రెండు నెలల చిన్నారి ఉన్నట్లు తెలిసింది. పశుగ్రాసం కోసం ప్రోత్సాహం అనంతపురం అగ్రికల్చర్: ‘హరిత గోపాలం’ పేరుతో ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్ తెలిపారు. అందుకు సంబంధించి పోస్టర్లను బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేయించారు. పశు, జీవ సంపద పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఎదురుచూపులు ఇంకెన్నాళ్లు..?
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి వాసులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూపకల్పనకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక కృషి చేశారు. 2021లో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీడిపల్లివాసుల సమస్యను విన్నవించి వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కు ఆమోదం పొందారు. అదే యేడాది అక్టోబర్ 14న గ్రామసభ ఏర్పాటు చేయించి యూనిట్కు రూ.10 లక్షల చొప్పున గ్రామస్తులతో ఆమోద ముద్ర వేయించారు. మొత్తంగా 657 యూనిట్లకు సంబంధించి రూ.131.20 కోట్ల మేర ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపించారు. అయితే, ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో నిధులు మంజూరు కాలేదు. అభివృద్ధి గగనం,పథకాలు దూరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించి గెజిట్ ఉండడంతో జీడిపల్లి గ్రామంలో అబివృద్ధి పనులు జరగడం లేదు. సీసీ రోడ్ల నిర్మాణం ఊసేలేకుండా పోయింది. గ్రామానికి ఆర్టీసీ బస్సు రాక 20 సంవత్సరాలు గడిచింది. హౌసింగ్ స్కీమ్కు కూడా జీడిపల్లివాసులు దూరమయ్యారు. గ్రామంలో ఊట నీటితో విష పురుగుల బెడద ఎక్కువైంది. అధిక తేమ శాతం కారణంగా తరచూ విద్యుత్ అర్త్ అవుతుండడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు విద్యుదాఘాతంతో మరణించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హుల జాబి తాలోని పది మంది వరకూ కాలం చేయడం గమనార్హం. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కారణంగా ఉంటామో లేదో తెలియకపోవడంతో గ్రామంలో కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక.. రైతుల కష్టాలు చెప్పనలవిగా మారాయి. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. తమ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా మొర ఆలకించడం లేదని జీడిపల్లివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నిధులను విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. వివరాలు ప్రభుత్వానికి పంపాం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల గ్రామంలో వివరాలు సేకరించాం. ఓటీఎస్ జాబితాలో 657 మందిని చేర్చాం. వివరాలను రెవెన్యూశాఖ ద్వారా ప్రభుత్వానికి పంపాం. – వసంతబాబు, కళ్యాణదుర్గం ఆర్డీఓ పునరావాసం కల్పించాలి జీడిపల్లి వాసులు దశాబ్ద కాలంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పటికై నా డబ్బును వారి ఖాతాలకు జమ చేయాలి. ఊటనీటి బాధలను అధిగమించడానికి నివేశ స్థలాలు, ఇళ్లకు ప్యాకేజీ వర్తింపచేసి పునరావాసం కల్పించాలి. – చిన్న మచ్చన్న, వైఎస్సార్సీపీ బెళుగుప్ప మండల కన్వీనర్ పయ్యావుల కేశవ్ చొరవ చూపాలి జీడిపల్లి గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందకపోవడం పాలకుల నిర్లక్ష్యమే. ఈ విషయంపై ఆర్థికశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి. నిధులను విడుదల చేసి స్థానికులను ఆదుకోవాలి. – బీ.హనుమంతరాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఎంతకు తెగించార్రా....
● బీకేఎస్లో దోపిడీ దొంగల బీభత్సం ● ఎస్బీఐ ఏటీఎం అపహరణ ● పొలాల్లో ధ్వంసం చేసి రూ.15.84 లక్షల దోపిడీ బుక్కరాయసముద్రం: బుక్కరాయసముద్రంలో దోపిడీ దొంగలు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఏకంగా ఎస్బీఐ ఏటీఎంను వాహనంలో ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే.. బీకేఎస్లోని అనంతపురం– తాడిపత్రి ప్రధాన రహదారి పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఇక్కడ పగలు చాలా రద్దీగా ఉంటుంది. దీనికి వంద మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. రహదారిపై బ్రిడ్జి పనులు జరుగుతుండడంతో వాహనాలు కూడా ఏటీఎం ఎదుట నిదానంగా వెళ్లాల్సి ఉంటుంది. ఐదు నిమిషాల్లోనే దోపిడీ రద్దీ ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎంను దుండగులు కేవలం ఐదు నిమిషాల్లోనే దోపిడీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాహనం వెనుక భాగాన ముందుగానే తాడు కట్టుకుని అక్కడికి చేరుకున్నారు. వాహనం నుంచి ఒకరు దిగి ఏటీఎం సెంటర్ గ్లాస్ డోర్లను పగలగొట్టాడు. ఏటీఎంకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు తొలగించాడు. తర్వాత వాహనాన్ని రివర్స్ చేశారు. అందులో నుంచి మరొక వ్యక్తి దిగి వాహనంలోని తాడును ఏటీఎంకు కట్టాడు. ఇదే సమయంలో అంబులెన్స్, టూరిస్ట్ వాహనం, ఆటోలు, ద్విచక్ర వాహనాలు సదరు వాహనం ముందు నుంచే వెళ్తున్నా దోపిడీ తీరును గుర్తించకపోవడం గమనార్హం. దుండగులు ఏటీఎంకు తాడు కట్టిన తర్వాత వాహనంతో లాగారు. ఏటీఎం గది నుంచి బయట పడడంతో వెంటనే వాహనంలోకి ఎత్తారు. ఈ పనంతా ఐదు నిమిషాల్లోనే చేశారు. తర్వాత స్థానిక తేరుబజార్, కొట్టాలపల్లి, గోవిందపల్లి, రేగడి కొత్తూరు మీదుగా శింగనమల మండల పరిధిలోని ఆకులేడు గ్రామ సమీప పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఏటీఎం ధ్వంసం చేసి.. అందులోని రూ.15.84 లక్షల నగదు దోచుకున్నారు. మిషన్పై పెట్రోలు పోసి తగులబెట్టారు. తర్వాత అదే వాహనంలో పారిపోయారు. ఏటీఎం దోపిడీ దృశ్యాలు ఇటీవల పెద్దమ్మ జాతర సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల ముఖాలు, వాహనం నంబరు సరిగా కనిపించలేదు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, బీకేఎస్ సీఐ సుబ్బ రాయుడు, సీసీఎస్ సీఐ జయపాల్రెడ్డి, ఎస్ఐలు రాం ప్రసాద్, రాజశేఖర్రెడ్డి సిబ్బందితో కలసి పరిశీలించారు. ఏటీఎం చోరీ ఘటనలను త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ తెలిపారు. వాహనం సాయంతో ఏటీఎం చోరీకి పాల్పడుతున్న దొంగలు (సీసీ కెమెరా దృశ్యం) దుండగులు ధ్వంసం చేసిన ఎస్బీఐ ఏటీఎంనగదు తీసుకున్న తర్వాత ఏటీఎం మిషన్ను తగులబెట్టిన దృశ్యం -
వరుస ఘటనలు.. పోలీసులకు సవాళ్లు
● బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఎస్బీఐ ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్)ను దొంగలు అపహరించారు. పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంతో పాటు తాడిపత్రి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ మెషీన్ను బొలెరో సాయంలో పెకలించుకొని వెళ్లి శింగనమల మండలం ఆకులేడు గ్రామ సమీప పొలాల్లో పడేసి నిప్పు పెట్టారు. దాదాపు రూ.10 లక్షల నగదు పోయి ఉంటుందని భావిస్తున్నారు. ● ఈ నెల 13న గుంతకల్లులో రద్దీగా ఉండే ట్రావెల్స్ బంగ్లా సర్కిల్లో ఎస్బీఐ ఏటీఎం మిషన్ చోరీకి విఫలయత్నం జరిగింది. అర్దరాత్రి సమయంలో బొలెరో వాహనం సహాయంతో మిషన్ను లాగడంతో పెద్దగా శబ్దం వచ్చింది. దీంతో సమీపంలో ఓ వ్యక్తి లేచి గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. అనంతపురం సెంట్రల్: నగదుతో కూడిన బ్యాంకు ఏటీఎంలను కొల్లగొట్టే నార్త్ గ్యాంగ్ (ఉత్తరాది ముఠా)లు జిల్లాలో తిష్ట వేశాయి. పోలీసుల నిఘా లేని ప్రదేశాలను ఎంచుకుని పలు చోట్ల ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నాయి. గుంతకల్లు, బుక్కరాయసముద్రం, తాడిపత్రితో పాటు శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ ఈ తరహా దొంగతనాలు జరిగాయి. ఈ ఘటనలన్నీ ఒకటే గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాజస్తాన్, బిహార్ రాష్ట్రాలకు చెందిన దొంగలే ఈ తరహా నేరాలకు పాల్పడతారని భావిస్తున్నారు. నిఘా వైఫల్యంతోనే .. జిల్లాలో రాత్రి సమయాల్లో పోలీసుల నిఘా ఏ మాత్రం ఉండడం లేదు. నేరాలు జరిగినప్పుడు హడావుడి తప్ప.. తక్కిన సమయంలో ఎలాంటి తనిఖీలు చేసే పరిస్థితి లేదు. కనీసం తీవ్రమైన నేరం జరిగినప్పుడు కూడా మేల్కోవడం లేదు. తొలి ఏటీఎం కేంద్రంపై దొంగతనానికి యత్నించినప్పుడు నిఘా వ్యవస్థలను పటిష్టం చేస్తే పునరావృతం కాకుండా ఉంటాయి. ఆ స్థాయిలో దృష్టి సారించకపోవడం వలన వరుస ఏటీఎం దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. కేవలం పోలీసు అధికారులు స్టేషన్లలో తిష్ట వేసి పంచాయితీలకే పరిమితమవుతున్నారు. లేదంటే రోడ్లపైకి వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మందుబాబులు తాగింది దిగేలా రూ.10వేల చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. అంతే తప్ప నేరాల కట్టడిపై పోలీసులు దృష్టి సారించడం లేదు. ఇదే దొంగలకు కలిసి వస్తోంది. పక్కా స్కెచ్తోనే రంగంలోకి దిగుతున్నారు. ముందు రోజు ప్లాన్ రెడీ చేసుకోవడం.. తర్వాత అమలు చేయడం జరిగిపోతోంది. మొత్తం ఈ టీం సభ్యులు ఐదుగురులోపే ఉంటారని తెలుస్తోంది. ఒక బొలెరో సాయంతోనే ఏటీఎం దొంగతనాలు చాకచక్యంగా చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి తొలుత లోపలికి వెళ్లి సైరన్ మోగే వైర్లను కట్ చేస్తారు. తర్వాత బొలెరో వాహనం సాహయంతో ఏటీఎం కేంద్రాన్ని పెకలించేస్తారు. దర్జాగా బొలెరో వాహనంలో తీసుకుపోయి అందిన కాడికి దోచుకుంటున్నారు. భద్రతపై నిర్లక్ష్యం బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, బంగారు దుకాణాలు తదితర ప్రాంతాల చోట సీసీ కెమెరా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఇటీవల కాలంలో సాధారణ ప్రజల ఇళ్లకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ రూ.లక్షలు, కోట్లు విలువైన డబ్బు, ఇతరత్ర వస్తువులు ఉన్న ప్రదేశాల్లో పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇందుకు నిదర్శనమే బుక్కరాయసముద్రం ఎస్బీఐ ఏటీఎం దొంగతనం. సదరు కేంద్రంలో ఎలాంటి సీసీ కెమెరా, అలారం వ్యవస్థ లేకపోవడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ప్రతి ఏటీఎం కేంద్రానికీ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునేవారు. ఇటీవల కాలంలో ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను తొలగించారు. కనీసం సీసీ కెమెరా, అలారం వ్యవస్థ అయిన పటిష్టంగా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. దొంగలను పట్టుకుంటాం : ఎస్పీ బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం దొంగతనం జరిగిన ఘటనా స్థలాన్ని ఎస్పీ జగదీష్ పరిశీలించారు. జిల్లాలో కొద్దిరోజులుగా ఇదే తరహా ఏటీఎం దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ దొంగతనాలను చాలెంజింగ్ తీసుకొని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని మీడియాకు వెల్లడించారు. జిల్లాలో నార్త్ గ్యాంగ్ తిష్ట! ఏటీఎంలే లక్ష్యంగా చోరీలు గుంతకల్లులో దొంగతనాన్ని ఛేదించే పనిలో ప్రత్యేకబృందం అంతలోనే బుక్కరాయసముద్రంలో మరో దొంగతనం -
ఉద్యానశాఖ ఏడీ దేవానందకుమార్ బదిలీ
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీహెచ్) ఆర్.దేవానందకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ఏపీఎంఐపీ ఏపీడీగా బదిలీ అయ్యారు. అక్కడ ఏపీఎంఐపీ పీడీగా ఉన్న సుదర్శన్ గత నెలలో ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో డిప్యుటేషన్ కింద దేవానంద్కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 రోజులుగా శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ పీడీగా ఏపీఎంఐపీ ఏపీడీ బీసీ ధనుంజయ పనిచేస్తున్నారు. కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణంగుమ్మఘట్ట: రాయదుర్గం మండలంలోని జుంజురాంపల్లి గ్రామానికి చెందిన ఆశ (25) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన వన్నూరుస్వామికి కర్ణాటకలోని చిన్న ఓబనహళ్లి గ్రామానికి చెందిన ఆశతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. వన్నూరుస్వామి మంగవారం రాత్రి మద్యం మత్తులో వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. రోజూ మద్యం తాగి వచ్చి గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఆశ ఇంట్లో ఉరివేసుకుంది. ఇంటి బయట నిద్రించిన వన్నూరుస్వామి బుధవారం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించిన భార్యను చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్యపుట్లూరు: మండలకేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన మల్లేశ్వరి (40) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ సురేంద్రబాబు తెలిపిన మేరకు.. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మల్లేశ్వరి జీవితంపై విరక్తి చెందింది. మంగళవారం వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీనిపై బుధవారం మృతురాలి కుమారుడు నాగశివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డబ్బుల కోసం యూట్యూబర్ వేధింపులు ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ గుంతకల్లు: డబ్బుల కోసం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్న యూట్యూబర్ మంజునాథనాయుడుపై బుధవారం గుంతకల్లు సబ్ రిజిస్ట్రార్ షామీర్బాషా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. మంజునాథనాయుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించి బ్లాక్మెయిల్ చేయడంతోపాటు విధులకు అడ్డు తగులుతున్నాడని షామీర్బాషా పేర్కొన్నారు. అడిగినంత ఇవ్వని పక్షంలో లేనిపోని ఆరోపణలతో వీడియోలు చేసి సోషియల్ మీడియా ద్వారా వైరల్ చేస్తానని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని వాపోయారు. 2023లో కూడా ఇదే విధంగా బెదిరించగా, జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో అప్పటి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మంజునాథనాయుడుపై కేసు నమోదు చేయాలని కోరారు. స్పందించిన ఎస్పీ జగదీష్ విచారణ చేపట్టాలని టూటౌన్ సీఐ వంశీకృష్ణను ఆదేశించారు -
ఆశల దీపం.. అయ్యో పాపం
చిన్నారి చికిత్స కోసం సాయం చేయదలిస్తే .. ● అకౌంట్ నంబర్ 30830783425 ● ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 001125కు డబ్బు పంపవచ్చు తాడిపత్రిటౌన్: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయని, రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయ్యింది. అంత డబ్బులేక, కళ్ల ముందే అచేతనంగా పడుకున్న బిడ్డను చూస్తూ వారు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. వివరాలు.. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లికి చెందిన నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం నెలలోనే ఆవిరవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఊయల్లో పడుకొని కాళ్లు ఆడించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా వైద్యులకు చూపించారు. హైదరాబాద్కు వెళ్లమని చెప్పడంతో అక్కడి రెయిన్బో ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు ఎస్ఎమ్ఏ టైప్–1 జబ్బు సోకినట్లు చెప్పారు. మొదట కాళ్లు, చేతులకు తర్వాత శరీరంలోని వివిధ అవయవాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని చెప్పడంతో నవీన్కుమార్రెడ్డి, ఇందుప్రియలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆశల దీపాన్ని ఎలా రక్షించు కోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. చిరుజీవులలైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల ఆపన్నహస్తం కోసం దీనంగా అర్థిస్తున్నారు. రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు చచ్చుబడిన కాళ్లు, చేతులు ఆలస్యం చేస్తే శరీరమంతటికీ సోకుతుందని డాక్టర్ల హెచ్చరికలు రూ. 17 కోట్ల ఇంజక్షన్ చేస్తే నయమవుతుందని సూచన ఆపన్నహస్తం కోసం బాధిత తల్లిదండ్రుల ఎదురుచూపు -
10 రోజుల్లో మీ వాదన సమర్పించండి
● డీఆర్ఓ మలోలకు ప్రభుత్వం ఆదేశం అనంతపురం అర్బన్: ‘సీరియస్ మీటింగ్లో రమ్మీ’ అడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై డీఆర్ఓ మలోల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. 10 రోజుల్లోగా లిఖితపూర్వక వాదన పత్రాన్ని సమర్పించాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జనవరి 20న ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లాకు విచ్చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించడంతో పాటు ఎస్సీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్ఓ మలోల తన మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని దుష్ప్రవర్తనగా ప్రభుత్వం పరిగణిస్తూ వివరణ కోరింది. అంగీకరించబడని అభియోగ అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతుందని ఉత్తర్వులో పేర్కొంది. కాబట్టి ప్రతి అభియోగ అంశాన్నీ ప్రత్యేకంగా అంగీకరించాలి లేదా తిరస్కరించాలని ఆదేశించింది. నిర్దేశించిన వ్యవధిలో లిఖితపూర్వక వాదన సమర్పించని పక్షంలో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
స.హ చట్టం పక్కాగా అమలు కావాలి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలవ్వాలని డీఆర్ఓ ఎ.మలోల సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సమాచార హక్కు చట్టంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా కార్యాలయాల వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అపిలేటివ్, అసిస్టెంట్ అపిలేటివ్ అధికారులు సక్రమంగా ఇవ్వాలన్నారు. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సభ్యులు రాయల కొండయ్య, లాల్యనాయక్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఓ నగరాజునాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు.. సమాచార హక్కు చట్టం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటైంది. జిల్లా సమన్వయ అధికారిగా కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా ఎస్పీ, నోడల్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి, సభ్యులుగా జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, డీఈఓ, సమాచార హక్కు చైతన్య వేదిక రాయలకొండయ్య, సమాచార హక్కు ఐక్యవేదిక అధ్యక్షుడు లాల్యనాయక్ వ్యవహరిస్తారు. -
పారదర్శకమైన, సమగ్రమైన ఓటరు జాబితాలు రూపొందించాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–‘సర్’) ప్రక్రియ ఈ నెల 15న మొదలైంది. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి ఓటరు ఉన్నారా.. లేదా.. విచారించ
సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘సర్’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ‘సర్’ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అధికారపక్షం కనుసన్నల్లో నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ‘ఎస్ఐఆర్ (సర్)’ జరుగుతున్న తీరుపై అనేక సందేహాలు ఉన్నాయి. 24 ఏళ్ల తర్వాత జరిగే ఈ ప్రక్రియలో చనిపోయినవారు, వలసలు, డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి. ప్రతీ ఇల్లూ తిరిగి వారికి రెండుచొప్పున ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తే.. వాటిని పూర్తి చేసిన తర్వాత జూలై 14లోపు తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. ఆపై మాత్రమే మ్యాపింగ్ చేయాలి. సెప్టెంబర్ 22న తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. అయితే ఈ నెల 14వ తేదీకే అనంతపురం జిల్లాలో 77.55 శాతం మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. బీఎల్ఓలు ఏంటికి వెళ్లారు.. ఎవరిని విచారించారు.. అనేది జిల్లాలో ఏ ఒక్క ఓటరుకూ తెలీదు. మీడియాకు సమాచారమూ లేదు. అలాంటప్పుడు జూన్ 15 కంటే ముందుగానే మ్యాపింగ్ను బీఎల్ఓలు ఎలా చేశారు.. అందులో పారదర్శకత ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడితోనే హడావుడి మ్యాపింగ్ ఓ జిల్లా అధికారి ఒత్తిడితోనే ఓటరు మ్యాపింగ్ను హడావుడిగా చేసినట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులే స్వయంగా చెబుతున్నారు. ‘ఏం చే స్తాం సార్. మాపై అలాగే ఒత్తిడి ఉంది. అందుకే 2002 ఓటరు జాబితాను పెట్టుకుని మ్యాపింగ్ చేశాం’ అని చెబుతున్నారు. ఇప్పటికే 77.55 శాతం పూర్తయింది. అంటే మిగిలింది 22.45 శాతం మాత్రమే. రాయదుర్గంలో 82.73, ఉరవకొండలో 73.18, తాడిపత్రిలో 76.94, శింగనమల 79.80, కళ్యాణదుర్గం 78.11, రాప్తాడు (అనంతపురం జిల్లాలోని పరిధి) 73.29 శాతం మ్యాపింగ్ పూర్తయింది. ఇళ్లు తిరగకుండా మ్యాపింగ్ చేసిన అధికారులు ఎన్యుమరేషన్ ఫారాల తర్వాత కూడా ఓటర్ల గుర్తింపు, తొలగింపులో ఏ మాత్రం పారదర్శకత పాటిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మ్యాపింగ్లో కుట్రకోణం మ్యాపింగ్ ముందుగా చేయడంలో కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. మొదట ఓట్లు మ్యాపింగ్ చేస్తే ఆపై రాజకీయపార్టీల పరిధిలోని బీఎల్ఏలు అభ్యంతరాలు ఉంటే లేవనెత్తుతారు. అప్పుడు ఓట్లు తొలగిద్దామనే ఆలోచనను అధికారులు చేసినట్లు తెలిసింది. ఈ లెక్కన అధికారపార్టీ బీఎల్ఏలు ఇచ్చిన జాబితా ప్రకారం ఓట్లు తొలగిస్తే.. విపక్షపార్టీల ఓట్లు మాత్రమే గల్లంతయ్యే అవకాశం ఉంది. పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం ఒక పోలింగ్ బూత్ పరిధిలోని ఓటరు మరో బూత్ పరిధిలోకి ఇల్లు మారి ఉంటారు. వీరి ఓటు బదిలీ చేసి మ్యాప్ చేయాలి. చనిపోయిన వారి ఓట్లు మ్యాపింగ్ చేయకూడదు. పూర్తిగా తొలగించాలి. జిల్లా వాసుల ఓట్లు పల్లెలు, పట్టణాలతో పాటు హైదరాబాద్, బెంగళూరులో కూడా ఉన్నాయి. అంతర్రాష్ట్రాల పరిధిలోని ఓట్లను కో రిలేషన్ చేసి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా గుర్తిస్తారు. డబుల్ ఓట్లు తేలితే అప్పుడు ఫాం–ఏ, బీ ఇచ్చి.. ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించాలి. సెప్టెంబర్ 22న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటన తర్వాత ఫారం–6 ఇస్తారు. అప్పుడు కొత్త ఓట్లు చేరుస్తారు. ఫారం–6 ఇప్పుడు కూడా ఓటరు అడిగితే ఇవ్వాలి. ఫారం–6 అనేది నిరంతర ప్రక్రియ. ఇవన్నీ కూడా పారదర్శకంగా చేస్తేనే ప్రయోజనం. అప్పుడు డబుల్ ఓట్లు తగ్గుతాయి. కచ్చితమైన ఓటరు జాబితా తేలుతుంది. పొలింగ్శాతం పెరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు కూర్చుని మ్యాపింగ్ చేసినట్లు చేస్తే ‘సర్’ చేసినా ప్రయోజనం ఉండదు. అనంతపురం నియోజకవర్గంలో 2002లో ఉన్న ఓట్లు 1,86,925. ఈ ఓట్లు 2025కు 2,82,463కు పెరిగాయి. ప్రస్తుతం మ్యాపింగ్ చేసిన ఓట్లు 1,86,214. ఇక మ్యాపింగ్ చేయాల్సింది 96 వేలపై చిలుకు ఓట్లు. ఇక్కడ 65.93 శాతం మ్యాపింగ్ పూర్తయ్యింది. 2002లో రాప్తాడు.. అనంతపురం నియోజకవర్గంలోనే ఉండేది. అప్పటికీ ఇప్పటికీ నగర జనాభా పెరిగింది. కొత్త ఓటర్లు భారీగా చేరారు. రాప్తాడు పూర్తిగా దూరమైంది. ఉద్యోగులు, బదిలీలతో పాతవారు వెళ్లడం, కొత్తవారు చేరడం ఇక్కడ అధికం. అయినప్పటికీ దాదాపు 66 శాతం మ్యాపింగ్ చేశారు. ఇది నమ్మశక్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. ‘సర్’ సర్వేపై రాజకీయపార్టీల్లో సందేహాలు ఈ నెల 15 నుంచి ఇంటింటికీ తిరుగుతున్న బీఎల్ఓలు, బీఎల్ఏలు 14వ తేదీకే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 77.55 శాతం పూర్తి చేసిన అధికారులు రాష్ట్రంలో మరే జిల్లాలో కూడా ఈ స్థాయిలో మ్యాపింగ్ కాని వైనం ఓ జిల్లా అధికారి ఒత్తిడితో ఓటరు జాబితాలు పెట్టుకుని ఇంటిపేరు పోలితే చాలు మ్యాపింగ్ -
రైతాంగాన్ని ఆదుకోవాలి
జిల్లాలో కరువు కారణంగా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు సంక్షోభంలో ఉన్నారు. భూసారం, తేమ, పచ్చదనం క్షీణించి, జీవ వైవిధ్యం వేగంగా నశించి, ఎడారీకరణ జరుగుతోంది. సుస్థిర వ్యవసాయ విధానమే ఇందుకు పరిష్కారం. ప్రకృతిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రకృతి వ్యవసాయంతో పాటు రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెనుముప్పు నుంచి కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. – డాక్టర్ వై.వీ.మల్లా రెడ్డి, డైరెక్టర్, ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ -
మెరుగైన వైద్య సేవలందించండి
కళ్యాణదుర్గం రూరల్: వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే సురేంద్రబాబుతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, మహిళల వార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యుల హాజరు పట్టికను పరిశీలించారు. సమయపాలతో రోగులకు వైద్య సేవలు అందజేయాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఆవసరం ఉందని వైద్యులు తెలపడంతో.. త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. అనంతరం పట్టణ సమీపంలోని ఉన్న నగర వనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎరువుల అమ్మకాలపై కాల్సెంటర్ అనంతపురం అగ్రికల్చర్: ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, డీలర్లు, ఆర్ఎస్కే అసిస్టెంట్లకు ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తికి వ్యవసాయశాఖ కార్యాలయంలో కాల్సెంటర్ ఏర్పాటు చేసినట్లు జేడీఏ సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కాల్సెంటర్ నంబర్ 83310 57714లో సిబ్బంది జి.ఆదినారాయణ, జి.రాఘవేంద్రరెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకుని యూరియా, డీఏపీ అమ్మకాలు సాఫీగా జరిగేలా సహకరించాలని కోరారు.వ్యక్తిపై పోక్సో కేసు గుత్తి రూరల్: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మంగళవారం గుత్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు వ్యక్తిని గతంలోనే తీవ్రస్థాయిలో మందలించారు. అయితే వారం రోజుల నుంచి తిరిగి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం శ్రీనివాసులుపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. మాతాశిశు మరణాలు నివారిద్దాం అనంతపురం సిటీ: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తి స్థాయిలో నివారిద్ధామంటూ సంబంధిత వైద్యాధికారులకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఆరు శిశు మరణాలపై మంగళవారం తన చాంబర్లో సంబంధిత వైద్యాధికారులతో ఆమె సమీక్షించారు. శిశు మరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భస్థ ప్రారంభ దశ నుంచే నాణ్యమైన ప్రసూతి పూర్వ సేవలు అందించడం ద్వారా మాతాశిశు మరణాలను నివారించవచ్చన్నారు. అలాగే హైరిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా గర్భిణుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సీఏఎస్ పోస్టుల భర్తీకి చర్యలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) చైర్మన్, కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులు 16, సీఏఎస్ జనరల్ పోస్టులు 10 చొప్పున మొత్తం 26 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ఆసక్తి, తగిన అర్హత ఉన్న వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు http://ananthapuramu. ap. gov. in వెబ్సైట్ను పరిశీలించవచ్చు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత కొనసాగుతోంది. గంటలకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది.
ఈ–స్టాంప్ కేసు హైకోర్టులో నేడు విచారణ కళ్యాణదుర్గం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళ్యాణదుర్గం ఈ– స్టాంప్ కుంభకోణం కేసు బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ఈ– స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో 2025 నవంబర్ 17న ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ కేసు అడ్మిషన్ స్టేజ్లో ఉంది. కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ధీరజ్సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్ విచారించనున్నారు. పిటిషనర్ డాక్టర్ తలారి రంగయ్య ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు, హోం శాఖ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ది సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను చేర్చారు. ఈ కేసు 2025 నవంబర్ 19న, 2026 ఫిబ్రవరి 18న, 2026 మార్చి 11న విచారణకు వచ్చింది. తాజాగా మరోమారు విచారణకు రావడంతో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో గుబులు పుడుతోంది. కాగా పిటిషనర్ తరఫున సీనియర్ కౌన్సిల్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించనున్నారు. అయితే ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన న్యాయవాదులతో కేసును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. అదనపు ఎస్పీగా నాగభూషణం అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీగా నాగభూషణం నియమితులయ్యారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనకు ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తాజాగా అనంతపురం అదనపు ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
రైల్లో దోపిడీ షోలాపూర్ గ్యాంగ్ పనేనా?
● గతంలో ఇదే తరహా దోపిడీలు ● తాజా ఘటనతో మళ్లీ చర్చనీయాంశం గుత్తి రూరల్: గుత్తి శివారులో రైలులో దోపిడీకి పాల్పడింది షోలాపూర్ గ్యాంగ్ పనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలోని బాపట్ల వద్ద, గుత్తి శివారులో ఒకే రోజు ఒకే సమయంలో రైలులో ప్రయాణిస్తున్న వారి బంగారు, విలువైన వస్తువులు, సెల్ఫోన్లను అపహరించారు. గుత్తి శివారులో 2025 ఏప్రిల్లో ఇదే తరహాలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి నిలిపి ఉంచిన రైళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అప్పటి నుంచి గుత్తి శివారులోని పెద్ద బ్రిడ్జి వద్ద ప్రతి రోజూ ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను గస్తీకి ఉంచేవారు. ఇటీవల ఎక్కడా గస్తీ లేకపోవడం పసిగట్టిన దొంగలు కార్యాచరణ అమలు చేశారు. గుత్తితో పాటు జాతీయ రహదారిపై హోటళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఈ నెల 14 ఆదివారం రాత్రి నుంచి గుత్తి – తురకపల్లి వైపు వెళ్లిన వాహన వివరాలు ఆరా తీస్తే పోలీసులకు ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికుల ముసుగులో చేరతారు.. ముఠాలోని ఇద్దరు సభ్యులు రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణిస్తూ బందోబస్తు పోలీసులు లేని కోచ్లలోకి ప్రవేశించి, ఎంతమంది మహిళలు బంగారు ధరించారు అనే విషయాలను ముఠా సభ్యులకు చేరవేసి దోపిడీలకు పాల్పడటం వారి నైజం. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ పోలీసులు గస్తీకి వెళ్లి ఉంటే దోపిడీ జరిగేది కాదని పలువురు చెబుతున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో బందోబస్తు ఉన్న పోలీసులు ఏసీ బోగీలోకి వెళ్లి పడుకుంటారని, దీంతో దొంగలకు దోపిడీ సులువవుతోందంటున్నారు. గుత్తి శివారులో రైల్వే ట్రాక్లకు సమాంతరంగా జాతీయ రహదారులు ఉండటంతో సులువుగా ఉడాయిస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుని గుత్తి శివారులో పెద్ద బ్రిడ్జి, తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో, గుత్తి–జక్కలచెరువు మధ్యలో రోజూ రాత్రి సమయాలలో గస్తీ పెంచి దోపిడీలను అరికట్టాలని కోరుతున్నారు. -
శారీరక దృఢత్వంతో ఏ రంగంలోనైనా రాణింపు
కూడేరు: శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చని క్యాంప్ కమాండర్ మేజర్ భూమన్య అరుణ్ సూచించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్సీసీ నగర్లో కర్నూల్ గ్రూప్ వన్ ఆంధ్ర ఆధ్వర్యంలో సీఏటీసీ–5 ఎన్సీసీ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. మంగళవారం ఎన్సీసీ అధికారులు క్యాడెట్లకు డ్రిల్, వ్యాయామంపై శిక్షణ ఇచ్చారు. వ్యాయామం, డ్రిల్తో శరీర దృఢత్వం పెంపొందడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. దీంతో చురుకుదనం పెరిగి మనం ఎంచుకున్న రంగంలో రాణించి లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని క్యాంప్ కమాండర్ మేజర్ భూమన్య అరుణ్ తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ అడ్జుటెంట్ దాసరి సుధీర్, ఎన్సీసీ అధికారులు విజయ కుమార్, వెంకటేశ్వర్లు, అనీల్ కుమార్, కాశీం, రాజ్యలక్ష్మీ, ప్రతాప్, కేపీ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో బంగారు నగల అపహరణ ● 6 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు అనంతపురం సెంట్రల్: ఇంట్లో బంగారు నగ లను అపహరించిన ఘటన నగరంలోని కోవూరునగర్లో జరిగింది. 6 నెలల తర్వాత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. నాల్గో పట్టణ ఎస్ఐ కె.గోపి తెలిపిన మేరకు.. గతేడాది డిసెంబర్లో కోవూరునగర్లో నివాసముంటున్న మహబూబ్బాషా నివాసంలో దొంగతనం జరిగింది. బీరువాలో ఉంచిన 13.5 తులాల బంగారు నగలు కనిపించకుండా పోయాయి. ముగ్గురు వ్యక్తులపై తమకు అనుమానం ఉందని బాధితులు మంగళవారం నాల్గవ పట్టణ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. మహిళ ఆత్మహత్య గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామానికి చెందిన మునగాల ప్రవల్లిక (27) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునగాల ఆదిశంకర్ భార్య మునగాల ప్రవల్లిక కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోంది. గుత్తితో పాటు పలు ఆసుపత్రులతో చికిత్స చేయించినా నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో పిల్లలను బయటకు పంపి తలుపులు మూసుకుని ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుంది. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ప్రవల్లికను కిందకు దింపిన అనంతరం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రవల్లిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కటకటాల్లోకి గంజాయిబ్యాచ్ తాడిపత్రిటౌన్: తాడిపత్రి రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్న బ్యాచ్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రి పట్టణానికి చెందిన కరీమ్, ప్రకాష్నాయుడు, అస్రాబ్, మరో ఇద్దరు రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 5 మందిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు వెల్లడైంది. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, నకిలీ నోట్ల పట్టివేత : ఇద్దరి అరెస్టు గుత్తి: గంజాయితో పాటు నకిలీ నోట్లను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్ తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామా నికి చెందిన సి.గోపాల్, దిమ్మగుడికి చెందిన బద్రి బైక్లో గంజాయి, నకిలీ నోట్లు తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలోనే గుత్తి అనంత పురం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ ఖాన్లు వారిని పట్టుకున్నారు. బైక్లో ఉన్న 20 గ్రాముల గంజాయి, 47 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుత్తికి చెందిన రమేష్కు గంజాయి, నకిలీ నోట్లు ఇచ్చి కేసులో ఇరికించాలని నిందితులు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం వారిని జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. -
విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
ఉరవకొండ: మండల పరిధిలోని వెలిగొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గేట్ పడి తీవ్రంగా గాయపడిన విద్యార్థి చండ్రాయుడుకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు నాయకులు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. డీఎస్సీలో అవినీతి, అక్రమాలకు పాల్పడి పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ బడులు ప్రారంభమైనా పిల్లలకు యూనిఫాం, నోటు పుస్తకాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్పకు నాయకులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సాకే పురుషోత్తం,ఏఐఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు నందు, తరుణ్, భాస్కర్, నరసింహ, నాగరాజు, పవన్, దేవా, రవి, సుధాకర్ పాల్గొన్నారు. జూదరుల అరెస్టు పెద్దపప్పూరు: మండలంలోని తబ్జూలలో మంగళవారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. తబ్జూల, శింగనగుట్టపల్లి గ్రామాలకు చెందిన 14 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.52,650 నగదుతో పాటు ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బరితెగించిన దొంగలు ● బళ్లారి బైపాస్లో పట్టపగలే చోరీ అనంతపురం సెంట్రల్: నగరంలోని బళ్లారి బైపాస్లో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారుజామున బళ్లారి రోడ్డులోని ఎంజీ పెట్రోలియం బంకు పక్కన ఆర్వీ వైన్స్ దుకాణంలో విలువైన వైరింగ్ సామాన్లు, వంట సామగ్రిని ఎత్తుకెళ్లిన విషయం విదితమే. బాధితుడు అశోక్బాబు గమనించి డయల్ 100కు ఫిర్యాదు చేశారు. దీంతో త్రీటౌన్ కానిస్టేబుళ్లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వెళ్లారు. అయితే మరోసారి అదే దుకాణంలో చొరబడ్డారు. అది కూడా మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో చొరబడి దొరికిన సామాన్లు తీసుకెళ్లిపోయారు. ఏకంగా ఆటో తీసుకొచ్చి అందులో వేసుకెళ్లడం గమనార్హం. స్థానికంగా ఉంటున్న కొంతమందే నేరాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాబు పాలనలో సంక్షోభంలో రైతాంగం
● సమస్యలపై 30న చలో విజయవాడ ● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం అర్బన్: ‘‘రెండేళ్ల చంద్రబాబు పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నికల ముందు రంగురంగుల హామీలు గుప్పించి గద్దెనెక్కిన తరువాత అటకెక్కించారు’’ అని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజమెత్తారు. రైతుల సమస్య పరిష్కారానికి ఈనెల 30న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల కాలంలో రైతుల కష్టాలను తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. సిండికేట్ మార్కెట్ మాయాజాలంలో రైతులు నష్టపోతున్నారని, చివరికి అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రూ.2 లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేయాలన్నారు. స్వామినాథన్ సిఫారసు మేరకు సమగ్ర ఉత్పత్తి వ్యవసాయానికి 50 శాతం అదనంగా అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్నారు. పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు లింగమయ్య,రాజేష్గౌడ్,కుళ్లాయిస్వామి, కృష్ణుడు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 23 నుంచి ఉరవకొండలో శిక్షణా శిబిరాలు ఉరవకొండ: స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ఈ నెల 23 నుంచి 25 వరకు సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ–సైద్ధాంతిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. మంగళవారం శిక్షణా శిబిరాల ఏర్పాట్లను జిల్లా కార్యదర్శితో పాటు సీపీఐ ముఖ్యనాయకులు పరిశీలించారు. 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, 23న శిక్షణా తరగతులకు పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తాలుకా కార్యదర్శి చెన్నరాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, నాగేంద్ర, సుల్తాన్, మల్లేష్, బసరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి గూగూడు ఉత్సవాలు
నార్పల : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ రాష్ట్రంలోనే పేరుగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి వార్షిక ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 13 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు ఈ నెల 29వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో (పీర్ల పండుగలో) భాగంగా ఈ నెల 17న గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం ఉంటుంది. 18న స్వామికి నిత్యపూజ నివేదన, 19న అగ్నిగుండం ఏర్పాటు, 20న పీర్లను కొలువుదీర్చడం, 21న నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదవ సరిగెత్తు, 23న నిత్యపూజ నివేదన, 24న ఏడవ సరిగెత్తు, రాత్రికి మెరవణి, 25న నిత్యపూజ నివేదన, విడిదినం, 26న గ్రామోత్సవం, పెద్దపరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. 27న సాయత్రం 4 గంటలకు జలధికి పోవుట, 29న స్వామివారి చివరి దర్శనం ఉంటుంది. అరకొరగానే సదుపాయాలు : గూగూడు కుళ్లాయిస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏటా గణనీయమైన ఆదాయం వస్తున్నా సౌకర్యల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఉత్సవాలకు వచ్చే మహిళలు, వృద్ధులు చిన్నారుల కోసం సరిపడ మరుగుదొడ్లు లేకపోవడం, స్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం తీవ్రమైన లోపంగా మారింది. తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, వసతి గదులు లేకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాథమిక అంశాలపైనా దృష్టి సారించలేదు. మందుబాబులతో జాగ్రత్త! ఉత్సవాల వేళ జూదం, అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో మందుబాబు చేష్టల వల్ల మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బాబ్బాబూ.. యోగా చేద్దాం రండి
అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి స్పందన కరువైంది. నిర్ణీత సమయం సమీపిస్తున్నా ప్రజలు ఎవరూ రాకపోవడంతో సమగ్రశిక్ష ఏపీసీ శైలజ కంగారు పడ్డారు. వెంటనే డీఆర్డీఏ, మెప్మా సిబ్బందిని పిలిచి కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని అభ్యర్థించారు. వారు తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి యోగా కార్యక్రమానికి రావాలని ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో అరగంట ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం
● దంపతులకు గాయాలు కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంప తులు శోభ, తిప్పేస్వామి గాయపడ్డారు. హైదరాబాద్లో నివాసముంటున్న తిప్పేస్వామి వచ్చే నెలలో జరగనున్న తన కుమార్తె చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు కారులో మండలంలోని మాల్యం గ్రామానికి వచ్చాడు. పెళ్లి పత్రి కలు పంచి కారులో బళ్లారికి వెళ్తూ మార్గమధ్యంలోని ఆలూరు వద్ద పైప్లైన్ పనులు చేస్తున్న హైడ్రాలిక్ క్రేన్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. శోభ, తిప్పేస్వామికి గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
నేత్రపర్వంగా కొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవం
బొమ్మనహాళ్: తారకాపురంలో కొల్లాపురి మహాలక్ష్మీ రథోత్సవం మంగళవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గ్రామస్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం గంగా జలంతో అమ్మవారికి అభిషేకించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 101 మంది గొరవయ్యల ప్రదర్శనలతో పాటు నందికోలు, వీరభద్ర కుణిత, మహిళా వీరకాశి నాట్యాల మధ్య రథోత్సవం నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
మేల్కోకపోతే పెనుముప్పే
ప్రపంచం సాంకేతికంగా ఎంత వేగంగా పరుగులు తీస్తుందో.. ప్రకృతి అంతే వేగంగా తన సమతుల్యాన్ని కోల్పోతోంది. విలాసవంతమైన జీవనశైలి, విచక్షణారహిత ప్రకృతి వినియోగం, అడవుల నరికివేత, భూగర్భ జలాల అధిక వినియోగం, రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వంటి కారణాలు పర్యావరణాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ, కరువులకు మారుపేరుగా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాపై మరింత తీవ్రంగా పడుతోంది. ● మానవాళి మనుగడకే పెను ముప్పుగా ‘సాంకేతిక’ జీవనం ● ఉమ్మడి అనంత జిల్లాపై తీవ్ర ప్రభావం అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను పరిశీలిస్తే కరువు ఇక్కడ కొత్త కాదు. దశాబ్దాలుగా ప్రతి రెండో లేదా మూడో ఏడాది అనావృష్టి పరిస్థితులు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. మధ్య మధ్యలో అతివృష్టి రూపంలో కురిసే భారీ వర్షాలు మరింత నష్టాన్ని మిగులుస్తున్నాయి. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడి రైతుల జీవనాధారం ప్రధానంగా వర్షాధార వ్యవసాయమే. వేరుశనగ సాగు జిల్లాకు గుర్తింపుగా నిలిచినా, వాతావరణ మార్పుల కారణంగా రైతులు క్రమంగా చీనీ, దానిమ్మ, అరటి వంటి వాణిజ్య పంటల వైపు మళ్లాల్సి వచ్చింది. అయితే ప్రకృతి అనిశ్చితి పెరుగుతుండడంతో ఆ పంటలూ రైతుకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. భూగర్భ జలాలపై పెరిగిన భారం.. వానలు కురవని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రైతులు భూగర్భ జలాలపై ఆధారపడ్డారు. బోర్లు తవ్వి సాగు సాగించినా, క్రమంగా నీటి మట్టాలు వందల అడుగుల లోతుకు పడిపోయాయి. ఒకప్పుడు కొద్ది అడుగుల్లో లభించిన నీరు నేడు వేల అడుగుల లోతులో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఫలితంగా బోర్లు వట్టిపోతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులు అధికమవుతున్నాయి. చివరకు రైతు జీవితం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ ఆందోళన కలిగించే అంశంగానే మిగిలిపోయాయి. అటకెక్కిన ఎడారీకరణ నివారణా పథకాలు.. అనంతపురాన్ని ఎడారీకరణ నుంచి కాపాడేందుకు గతంలో పలు పథకాలు రూపొందించారు. వాటర్షెడ్ కార్యక్రమాలు, చెక్డ్యాంల నిర్మాణం, భూసార పరిరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అనేక పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తులో వ్యవసాయాన్ని కాపాడాలంటే సాంప్రదాయ పద్ధతుల వైపు మళ్లాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక విత్తనాల వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, సహజ వ్యవసాయం,పంటల వైవిధ్యం, చెట్ల పెంపకం వంటి చర్యలు మాత్రమే స్థిరమైన పరిష్కారాలుగా నిలుస్తాయి. కణేకల్లు మండలంలో ఎడారీకరణ ప్రభావంతో పొలాల్లో ఇసుక మేటలు సందర్భంనేడు ప్రపంచ కరువులు– ఎడారి నివారణా దినోత్సవం -
‘జననేత జగనన్న ప్రజాసంకల్ప పాదయాత్ర’ పుస్తకావిష్కరణ
అనంతపురం: వైఎస్సార్ సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానీషా రచించిన ‘జననేత జగనన్న ప్రజా సంకల్ప పాదయాత్ర’ పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆవిష్కరించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రతో పాటు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన అనేక సంస్కరణలు, సంక్షేమ పథకాల గురించి పుస్తకంలో వివరించినట్లు రచయిత కట్టుబడి తానీషా పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్ సాకే శైలజానాథ్, పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి, డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ టీచర్ పొలమడ రమేష్ బాబు, రవి తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేక బలవన్మరణం
యాడికి: పాఠశాలకు వెళ్లడం ఇష్టంలేని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి ఆసుపత్రి కాలనీలో మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న నేత కార్మికులు శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు కుమారుడు జగదీష్, కుమార్తె పల్లవి ఉన్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తాండా సమీపంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలలో పల్లవి 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 12 నుంచి పాఠశాలకు విద్యార్థులందరూ వెళ్తున్న నేపథ్యంలో నీవెప్పుడు వెళ్తావని పల్లవిని మంగళవారం తల్లి లక్ష్మి అడిగింది. ఆశ్రమ గిరిజన పాఠశాలలో చదవడం తనకు ఇష్టం లేదని పల్లవి చెప్పడంతో ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం శ్రీనివాసులు, లక్ష్మిలు తమ ఇంటి సమీపంలోని షెడ్డులో మగ్గం నేసేందుకు వెళ్లగా, పల్లవి ఇంటి వద్ద చెట్టుకు ఉరి వేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చెట్టుకు వేలాడుతున్న పల్లవిని కిందికి దింపి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నాసిరకం విత్తనం అంటగట్టారు!
● ఇదీ సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ తీరు అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తన వేరుశనగ పంపిణీలో చాలాచోట్ల రైతులకు నాసిరకం అందాయి. పేరు కు 40 శాతం రాయితీ అంటున్నా బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకు ఏమీ తేడా లేదంటున్నారు. క్వింటా పూర్తి ధర రూ.10,200 ఖరారు చేసి, అందులో 40 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద క్వింటా రూ.6,120 ప్రకారం చెల్లిస్తున్నారు. ఒక్కో రైతుకు 30 కిలోల బస్తా రూ.1,816 ప్రకారం గరిష్టంగా మూడు బస్తాలు (90 కిలోలు) పంపిణీ చేస్తున్నా రు. నాణ్యతా ప్రమాణాల విషయానికి వస్తే 9 శాతం లోపు తేమ ఉండాలని, ఫిజికల్ ప్యూరిటీ 96 శాతం, వ్యర్థాలు 4 శాతం లోపు, మొలకశాతం 70 శాతం పైన, ఇతరత్రా విత్తనాలు ఉండకూడదని నిబంధనలు పెట్టారు. ప్రధానంగా అవుటన్ 74 శాతం అంతకన్నా అధికంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాణ్యతకు తిలోదకాలు జిల్లాకు 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించారు. గత ఖరీఫ్, రబీకి సంబంధించి సరఫరాదారులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు చెల్లించకపోవడంతో ప్రస్తుత సీజన్లో విత్తన సమస్య తలెత్తింది. ప్రాసెసింగ్ ప్లాంట్లలో పరిమితంగా నిల్వలు ఉండటంతో వాటిని శుద్ధి చేసి ఆర్ఎస్కేలకు సరఫరా చేశారు. అయితే కేటాయింపుల మేరకు సేకరించాలని బలవంతం చేస్తుండటంతో ఎక్కడపడితే అక్కడి నుంచి నాణ్యత లేని చెనక్కాయలు తెప్పిస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యత ప్రమాణాలు ఉల్లంఘించి నాసిరకం సేకరించారు. దీంతో కొన్ని మండలాలు, ఆర్ఎస్కేల నుంచి కాయలు బాగలేవని వాహనాలు వెనక్కి పంపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో దించుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ మండలానికి వచ్చిన వాటిలో కాయలు బాగలేనందున వాహనాల లోడును వెనక్కు పంపినట్లు ఏఓలు ‘సాక్షి’కి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, అవసరం మేరకు యూరియా, డీఏపీ పంపిణీ విషయంపై జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరుమెదపడం లేదు. చెనక్కాయలు బాగుంటే తమ ఖాతాల్లో వేసుకోవడం, నాసిరకమైతే అధికారులను నిందించడం చేస్తున్నారు. సకాలంలో బకాయిలు చెల్లించి ఉంటే నాణ్యమైన విత్తనాలు సేకరించే పరిస్థితి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ● కాగా జిల్లాకు కేటాయించిన 56 వేల క్వింటాళ్లలో ఆర్ఎస్కేలకు సరఫరా చేసింది 15 వేల క్వింటాళ్లు. అందులో రైతులకు పంపిణీ చేసింది 4 వేల క్వింటాళ్లలోపే కావడం గమనార్హం. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. నైరుతి దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది.
దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం ● మూడు చక్రాల స్కూటర్ ఇవ్వలేదని మనస్తాపం అనంతపురం అర్బన్: మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేయలేదన్న మనస్తాపంతో ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కళ్యాణదుర్గం పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన పి.విరూపాక్షి దివ్యాంగుడు సోమవారం కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ వద్దకు వచ్చాడు. అర్జీల స్వీకరణ కౌంటర్లకు కొద్ది దూరంలో కూర్చుని సంచిలో నుంచి డీజిల్ బాటిల్ బయటకు తీశాడు. అదే సమయంలో విరుపాక్షి చర్యను ఏఎస్ఐ వెంకటేష్ గమనించి వెంటనే వచ్చి బాటిల్ను లాగేసుకున్నాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నిస్తే.. తాను దివ్యాంగుడినని, తన భార్య క్యాన్సర్తో బాధపడుతోందని చెప్పాడు. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే వాహనాలు అద్దెకు తీసుకునే స్థోమత లేదని, తనకు మూడు చక్రాల స్కూటర్ మంజూరు చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందని విరూపాక్షి చెప్పాడు. ఏడాదిన్నర కాలంగా అధికారులకు అర్జీలు ఇస్తూనే ఉన్నానని, అయితే పదో తరగతి సర్టిఫికెట్ లేదని మంజూరుకు ససేమిరా అంటున్నారని తెలిపాడు. సర్టిఫికెట్ లేకపోతే మాలాంటి వారు నేలమీద దోక్కుంటూ వెళ్లాల్సిందేనా అంటూ ఆవేదన చెందాడు. పీజీఆర్ఎస్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. ఆమె ఆదేశాల మేరకు విరూపాక్షిని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. ఆయనకు విరుపాక్షి తన గోడును వినిపించాడు. స్పందించిన జేసీ మూడు చక్రాల స్కూటర్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఖరీఫ్ ఏరువాకకు ఎన్ని కష్టాలో!
● విత్తనాలు, ఎరువులు అందక అన్నదాతల అవస్థలుఅనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ప్రారంభం కావడం, వర్షాలు పడుతుండటంతో సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా విత్తన వేరుశనగ, కందులు, యూరియా, డీఏపీ కోసం అవస్థలు పడుతున్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో మే చివరి వారంలోనే విత్తన వేరుశనగ, కందుల పంపిణీ మొదలు పెట్టేవారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 451 ఆర్బీకేల్లో రైతులకు తగినంత విత్తనం, ఎరువులు అందుబాటులో పెట్టడంతో ఏ సమస్యా లేకుండా ఖరీఫ్ ఏరువాక కొనసాగింది. కానీ చంద్రబాబు ప్రభత్వం వచ్చిన ఈ రెండేళ్లలో రైతులకు సమస్యలు పెరిగిపోయాయి. విత్తన కేటాయింపులు చాలా వరకు తగ్గించారు. ఈసారి అరకొరగా కేటాయించిన 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు కూడా సకాలంలో పంపిణీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. అలాగే 451 ఉన్న ఆర్బీకేల్లో 125 మూసేయడంతో ఇపుడు 326 ఆర్ఎస్కేలు (రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) – రైతు సేవ కేంద్రాలు (ఆర్ఎస్కేలు)గా పేరు మార్చారు) పనిచేస్తున్నాయి. అక్కడ కూడా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టడం లేదు. ప్రస్తుతానికి 159 ఆర్ఎస్కేల్లో మాత్రమే 12 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ నిల్వ చేశారు. తాడిపత్రి డివిజన్ మినహా ఇంకా అనంతపురం, రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్కేలకు ఇంకా విత్తనం చేరలేదు. ఇదిగో అదిగో అంటున్నా మినీకిట్ల కింద కందులు, రాయితీ కింద కందులు కూడా ఇంకా సరఫరా కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక వేరే విత్తనాలు ఏవీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 20 వేల మంది రైతులు 18 వేల క్వింటాళ్ల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నా విత్తన సరఫరా మందకొడిగా చేపడుతున్నారు. విత్తన కొరత కారణంగా మిల్లర్లు పెనుకొండ, పావగడ, చెళ్లకెరె లాంటి ప్రాంతాల నుంచి కల్తీ, నాసిరకం సేకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులు అందేది గగనమే యూరియా, డీఏపీ ఎరువులు అందడం గగనంగా మారింది. కొత్తగా యాప్ను అందుబాటులోకి తేవడంతో ఒక బస్తాకు కూడా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్కేల్లో 1,700 మెట్రిక్ టన్నుల యూరియా, 80 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉండగా పీఏసీఎస్, డీసీఎంఎస్, ఎఫ్పీఓల్లో 400 మెట్రిక్ టన్నుల యూరియా, 400 మెట్రిక్ టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. మళ్లీ పెరగనున్న ఎరువుల ధరలు ఎరువుల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాంప్లెక్స్ ఎరువులు ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారు. డీఏపీ బస్తా రూ.1,350 కాగా.. రూ.1,600 నుంచి రూ.1,800 మధ్య వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇక 20–20–0–13, 10–26–26, 15–15–15, 28–28–0, 24–24–0, 14–35–14, 16–16–16, 16–20–0–13, 12–32–16 తదితర కాంప్లెక్స్ ఎరువుల (ఎన్–పీ–కే) ధరలు కొండెక్కాయి. గతేడాదితో పోల్చితే బస్తా మీద రూ.200 నుంచి రూ.500 వరకు పెంపు చేయడంతో రైతులకు భారంగా పరిణమిస్తోంది. గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా వచ్చే నెల నుంచి కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10–26–26 రకం ఇప్పుడు 2,250 ఉండగా వచ్చే నెలలో రూ.2,400 కావచ్చంటున్నారు. అలాగే 20–20–0–13 రకం గతేడాది రూ.1,550 ఉండగా ఇప్పుడు రూ.2,250కు పెంచారు. వచ్చే నెలకు 2,450కు చేరవచ్చని చెబుతున్నారు. ఇలా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు మరోసారి పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సూపర్ఫాస్పేట్ కూడా ఇప్పు డు రూ.735 ఉండగా వచ్చేనెలకు రూ.1,000 కావచ్చని, పొటాష్ ప్రస్తుతం 1,850 ఉండగా వచ్చే నెల రూ.2 వేలు కావచ్చని చెబుతున్నారు. -
ఆలోచించండి ఓ అమ్మానాన్న!
యాడికి: తండ్రి అందనంత దూరం వెళ్లిపోయాడు. ప్రేమగా చూసుకునే తల్లి జైలు పాలైంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే అడుగంటాయి. తల్లిదండ్రులు దూరమై ప్రేమ కరువై అమాయకంగా చూస్తున్న ఆ నలుగురు పిల్లలను చూసి కన్నీరు పెట్టని వారు లేరు. యాడికి మండలంలోని పెద్దపేట గ్రామంలో ఈ నెల 12న శివప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన శివప్రసాద్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తుండడం, తనను, నలుగురు పిల్లలను సరిగా చూసుకోకపోవడానికి తోడు తాగొచ్చి గొడవకు దిగడంతో క్షణికావేశంలో భార్య హైమావతి రోకలి బండతో అతని తలపై బాదడంతో మరణించాడు. ఈ క్రమంలో నిందితురాలిని సోమవారం పోలీసులు అరెస్టు చేయగా, నలుగురు పిల్లలు అనిత (ఫస్ట్ ఇయర్), నాగవర్దిని (8వ తరగతి), వినిత (6వ తరగతి), కంబగిరి రాముడు (3వ తరగతి) అనాథలయ్యారు. పిల్లల దీన స్థితిని కళ్లారా చూసిన సీఐ శ్రీనివాసులు స్థానిక అగాపే వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడు పసాద్కు పిల్లల బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఆశ్రమం వద్దకు పిల్లలను తీసుకొచ్చి ప్రసాద్ భోజనం వడ్డించగా, బాధను దిగమింగుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నం తింటున్న వారిని చూసి అందరి కళ్లు చెమర్చాయి. కాగా, గతంలో శివప్రసాద్ తన కుటుంబాన్ని బాగానే చూసుకునే వాడని, మద్యానికి బానిసయ్యాక ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడని పలువురు చెప్పడం చూస్తే, ‘మత్తు’ అనేది బతుకులను ఎంతలా చిత్తు చేస్తుందో అర్థమవుతుంది. ప్రస్తుతం వీధివీధినా దొరుకుతున్న మద్యానికి అలవాటు పడి, కుటుంబాలను గాలికి వదిలేస్తున్న మందుబాబుల్లో ఈ దీనగాథను చూశాకైనా మార్పు వస్తుందో లేదో చూడాలి! హైమావతిని అరెస్టు చూపుతున్న సీఐ శ్రీనివాసులు నలుగురు చిన్నారులతో అగాపే వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రసాద్ -
ఖతర్నాక్ యానిమేటర్
● 10 మహిళా సంఘాల నుంచి రూ.లక్షలు మింగిన వైనం శెట్టూరు: మండల పరిధిలోని మాకోడికి గ్రామ యానిమేటర్ విజయ్ కుమార్ చేసిన ఖతర్నాక్ పనులు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సోమవారం మాకోడికి తండాకు చెందిన 10 మహిళా సంఘాల సభ్యులు స్థానిక వెలుగు కార్యాలయం ముట్టడించడంతో బాగోతం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. మాకోడికి తండాలో 10 మహిళా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. సంఘాల లీడర్లకుగాని, సభ్యులకు గాని విషయం తెలపకుండా రుణాలను యానిమేటర్ విజయ్కుమార్ తీసుకున్నాడు. దివ్యా మహిళా సంఘానికి రూ. 4 లక్షలు మంజూరు కాగా, కేవలం రూ. 1.5 లక్షలు ఇచ్చి ఇంతే అని చెప్పా డు. రూ. 1.5 లక్షలు చెల్లించినా పొదుపు ఖాతా నుంచి ప్రతి నెలా కంతు జమవుతూ ఖాతా ఖాళీ కావడంతో అప్రమత్తమైన సభ్యులు బ్యాంక్లో వివరాలు అడి గారు. ఇంకా రూ.3లక్షల అప్పు ఉందని చెప్పడంతో కంగుతిన్నారు. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ చేసిన మరిన్ని ఖతర్నాక్ పనులు వెలుగులోకి వచ్చాయి. ● లక్ష్మీ మహిళా సంఘానికి సంబంధించి సభ్యుల అనుమతి లేకుండా రూ. 5 లక్షల రుణం తీసుకున్నట్లు తెలిసింది. సరస్వతి సంఘంలో సభ్యులకు తెలియకుండా అదనంగా రూ.లక్ష పొందాడు. మరో 7 సంఘాలకు సంబంధించి రూ. లక్ష, రూ. 2 లక్షల చొప్పున కాజేశాడు. ఈ సొమ్మును బ్యాంక్ వారు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడంతో లబ్ధిదారులు సోమవారం లబో దిబోమంటూ శెట్టూరులోని వెలుగు కార్యాలయం వద్దకు చేరుకుని గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, 100 మందికిపైగా మహిళలు వచ్చి ఫిర్యాదు చేస్తే బాధ్యతగా తీసుకోవాల్సిన ఏపీఎం హుసేన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని సభ్యులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే యానిమేటర్ విజయ్కుమార్ మాట్లాడుతూ ‘అంతా మావారే సర్దుకుంటాము’ అంటూ చెప్పడం కొసమెరుపు. -
గేటు పడి విద్యార్థికి గాయాలు
ఉరవకొండ: పాఠశాల గేటుపడి విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. వెలిగొండకు చెందిన చెన్నకేశువులు కుమారుడు చండ్రాయుడు స్థానిక ప్రభుత్వ పాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం విరామ సమయంలో చండ్రాయుడు పాఠశాల గేట్పై నిల్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గేట్ ఊడి చండ్రాయుడిపై పడింది. సమీపంలో చిల్లర కొట్టు యజమాని గమనించి ఉపాధ్యాయులకు సమాచారం చేరవేశాడు. ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థిని ఉరవకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఫీల్డ్ అసిస్టెంట్పై దాడి ఉరవకొండ: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఫీల్డ్ అసిస్టెంట్పై గ్రామస్తులు దాడి చేశారు. లత్తవరం తండాలో ఉపాధి హామీ పథకం కింద ఇటీవల రూ.5 లక్షల వ్యయంతో ఇంకుడు గుంతల పనులు చేపట్టారు. అయితే ఈ పనుల్లో వెండర్తో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడని, కూలి సొమ్ములో తమకూ ఇంకా కొంత రావాల్సి ఉందని కూలీలు రోజూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం తండావాసులు నేరుగా ఉరవకొండలోని ఉపాధి హామీ ఏపీఓ కార్యాలయంలో ఉన్న రవినాయక్ను చితకబాదారు. కార్యాలయం బయటకు వచ్చాక మరోమారు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు దాడిచేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హతమారుస్తామంటూ బెదిరించారు : బీజేపీ నేత విష్ణుఅనంతపురం సిటీ: తనను హతమారుస్తామంటూ ఐదు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని బీజేపీ నేత ఎస్.విష్ణువర్దన్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తనకు కాల్ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడారని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ వారు పట్టించుకోకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆరోపణలు సరికాదు మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించడం సరికాదని విష్ణు అన్నారు. ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదిరిపికొండలో కూడేరు సీఐకు ఓటు హక్కు సాక్షి టాస్క్ఫోర్స్: విధులు ఒక చోట.. నివాసం మరొకచోట.. స్వస్థలం ఇంకో చోట.. ఇవన్నీ కాదని ఓ గ్రామంలో సీఐ ఓటు హక్కు కలిగి ఉండటం చర్చనీయాంశంగా మారింది. కూడేరు సీఐ రాజు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్సార్సీపీ వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన అనంతపురంలో నివాసముంటూ కూడేరులో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయనకు ఓటు హక్కు కూడేరు మండలం ఉదిరిపికొండలోని 2–42 చిరునామా కింద ఓటరు ఐడీ (వైడబ్ల్యూబీ3309457)తో 1245 క్రమ సంఖ్యలో ఉంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎవ్వరూ పోటీలో లేకుండా చేయడంతో పాటు గ్రామంలో టీడీపీ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా చేర్చడంలో సీఐ కీలకంగా వ్యహరించబోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓటు హక్కు విషయమై బీఎల్ఓ రమణను వివరణ కోరగా.. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వే జరుగుతోందని, సీఐకు మరోచోట కూడా ఓటు ఉంటే ఎక్కడైనా ఒక చోట ఉంచి, మరొకటి తొలగిస్తామని చెప్పారు. కరువుపై రేపు సదస్సు అనంతపురం: కరువు, ఎడారీకరణ నివారణ దినం సందర్భంగా ఈ నెల 17న నగరశివారు పంగల్ రోడ్డు వద్ద గల ఆర్డీటీ సమ్మిళిత ఉన్నత పాఠశాలలో సదస్సు నిర్వహించనున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. ‘కరువు, వాతావరణ మార్పులు, ప్రకృతి వ్యవసాయం రైతుల అనుభవాలు’ అనే అంశంపై జరిగే సదస్సుకు కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. -
ఓట్ల గల్లంతుకు కుట్ర
రాప్తాడు రూరల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ఓట్ల గల్లంతుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని, దీనివల్ల వేలాది మంది ఓటర్ల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా మ్యాపింగ్ సగటు 80 శాతం దాటితే, పాపంపేటలో మాత్రం కేవలం 30 శాతం మాత్రమే నమోదవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పాపంపేట నలుగురు బీఎల్ఓలు ఇప్పటివరకు విధులకు హాజరుకాలేదని, వారిస్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆరోపించారు. అందుబాటులో ఉన్న కొందరు బీఎల్ఓలకు కూడా పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్ల ప్రక్రియ మరింత నెమ్మదిగా సాగుతోందన్నారు. ఓటర్లు అప్రమత్తం కావాలి ముఖ్యంగా పాపంపేటలోని 76, 77, 80, 82 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓట్లు కలిగి ఉన్నవారు, అక్కడ నివాసాలు లేదా ఆస్తులు ఉన్నవారు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ‘మీ ఓటు మీ భవిష్యత్తు. మీ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కలిగే నష్టాన్ని అంచనా వేయలేరు. ప్రతి ఒక్కరూ బీఎల్ఓలను కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ దృష్టికి సమస్య వివిధ ప్రాంతాల్లో బీఎల్ఓలు అందుబాటులో లేకపోవడం, ఓటరు జాబితా మ్యాపింగ్ ఆశించినస్థాయిలో జరగకపోవడంపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాపంపేటలోని 76, 77, 80, 82 బూత్లతో పాటు ఆలమూరు 68, ఆకుతోటపల్లి 109, రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి 130, ఆత్మకూరు మండలం బి.యాలేరు 31 పోలింగ్ స్టేషన్లలో మ్యాపింగ్ నెమ్మదిగా సాగుతోందని వివరించారు. మొత్తం 17 పోలింగ్ స్టేషన్లలో 30 శాతం కన్నా తక్కువ స్థాయిలోనే మ్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయమై రాప్తాడు ఈఆర్ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ ఆనంద్, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. పాపంపేటలో 33 శాతం మాత్రమే మ్యాపింగ్ ఓటును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
అన్నదమ్ముల సాహస ప్రదర్శన
తాడిపత్రిటౌన్: గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా తాడిపత్రిలో ఇద్దరు చిన్నారులు సాహస ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తైక్వాండోలో శిక్షణ పొందుతున్న సాయి నరసింహారెడ్డి, గౌతమ్కుమార్రెడ్డి అన్నదమ్ములు. ఆదివారం ఈ పిల్లల స్టంట్ ఈవెంట్ జరిగింది. కృష్ణాపురం జీరో రోడ్డులో జరిగిన ప్రదర్శనకు సీఐ శివగంగాధర్రెడ్డి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కో ఆర్డినేటర్ ఆనంద్ హాజరయ్యారు. గౌతమ్కుమార్రెడ్డి (విక్కీ) తన కడుపుపై నుంచి 4.6 నిమిషాల్లో వంద బైకులు వెళ్లే స్టంట్ చేయగా.. సాయి నరసింహారెడ్డి (లక్కీ) చేతివేళ్లపై 16 నిమిషాల్లో వంద కార్లు పోనిచ్చి భళా అనిపించారు. కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కంది సాగు.. భలే భలే
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కంది సాగు ఊహకందని విధంగా అనూహ్యంగా పెరిగిపోయింది. అంచనాలకు మించి పంట సాగు చేస్తున్నారు. పెరిగిన పంట పెట్టుబడులతో వేరుశనగను బాగా తగ్గించేసి, ఎక్కువ మంది రైతులు కంది సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. 2019–2024 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామం యూనిట్గా కంది పంటకు ఉచితంగా పంటల బీమా అమలు చేసి.. పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వడంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. బీమా చరిత్రలో ఎపుడూ లేని విధంగా ఎకరాకు రూ.10 వేలకు పైగా పరిహారం జమ చేశారు. గత ఏడాది తొలిసారిగా.. గత ఖరీఫ్ (2025)లో కంది సాధారణ సాగు 55 వేల హెక్టార్లుగా అంచనా వేయగా.. సీజన్ ముగిసేసరికి అంచనాకు మించి ఏకంగా 1.37 లక్షల హెక్టార్లకు ఎకబాకింది. 30 యేళ్ల జిల్లా వ్యవసాయ చరిత్రలో తొలిసారిగా వేరుశనగ పంటను వెనక్కినెట్టి కంది పంట అగ్రస్థానంలో నిలిచింది. ఈ సారి కూడా చాలా మంది రైతులు కంది సాగుపై దృష్టి సారించడంతో బహిరంగ మార్కెట్లో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం అందించే పాతకాలపు ఎల్ఆర్జీ రకాలు కాకుండా హైబ్రిడ్ విత్తన రకాలను ఎంచుకొని సాగు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత, చీడపీడలు, మార్కెటింగ్ సమస్యతో వేరుశనగ తగ్గించేసి కందిపై మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కందికి పంట రుణం కింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.30 వేలు ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) గతేడాది క్వింటా రూ.8 వేలు ఉండగా ఈ ఏడాది రూ.8,450కు పెంచారు. కేరాఫ్గా వజ్రకరూరు.. కంది పంటకు కేరాఫ్గా వజ్రకరూరు మండలం నిలిచింది. పోయిన ఖరీఫ్లో మండల వ్యాప్తంగా మొత్తం వర్షాధారిత సాగు భూమి 25 వేల హెక్టార్లు ఉండగా, అందులో 22 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో రైతులు కంది సాగు చేయడం విశేషం. మండలంలో 7,900 హెక్టార్లలో రావచ్చని ముందస్తు అంచనాలను తారుమారు చేసి గ్రామగ్రామానా కంది సాగు చేశారు. గుంతకల్లు మండలంలో కూడా 14 వేల హెక్టార్లు, కళ్యాణదుర్గం మండలంలో 13,500 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో కంది సాగులోకి వచ్చింది. బెళుగుప్ప 7,900 హెక్టార్లు, ఉరవకొండలో 7,700, విడపనకల్లో 7 వేలు, రాయదుర్గంలో 5,800, అనంతపురం రూరల్లో 5,400, గుత్తిలో 4,900, కూడేరులో 4,900, కణేకల్లులో 4,800 హెక్టార్లు, ఆత్మకూరులో 4,200 హెక్టార్లు... ఇలా చాలా మండలాల్లో కంది సాగు బాగా పెరిగింది. చాలా తక్కువగా అంటే అనంతపురం అర్బన్ పరిధిలో 25 హెక్టార్లు, యల్లనూరులో 230 హెక్టార్లు, పెద్దపప్పూరులో 376 హెక్టార్లు, నార్పలలో 615 హెక్టార్లు, పుట్లూరులో 724 హెక్టార్లలో వేశారు. మిగతా మండలాల్లో కూడా 1,200 హెక్టార్ల నుంచి 4 వేల హెక్టార్ల వరకు కంది పంట సాగు చేశారు. ఈ ఖరీఫ్లో 78,274 హెక్టార్లు అంచనా.. ఖరీఫ్లో కంది పంట 78,274 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. గత ఐదేళ్ల పంట సాగు లెక్కల ఆధారంగా ప్రణాళిక, వ్యవసాయశాఖ ఈ మేరకు సాధారణ సాగు కింద గుర్తించారు. ఈ సారి కూడా వజ్రకరూరులో 12 వేల హెక్టార్లు, గుంతకల్లులో 8 వేల హెక్టార్లు, కళ్యాణదుర్గంలో 6,300 హెక్టార్లు, బెళుగుప్పలో 5 వేల హెక్టార్లు...ఇలా అన్ని మండలాల్లో కూడా కంది సాగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. విత్తన వేరుశనగ, ఇతరత్రా విత్తనాలు, ప్రభుత్వం నుంచి సుఖీభవ, ఇతరత్రా సాయం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సారి కూడా కంది విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జూన్, జూలైలో కురిసే వర్షాలను బట్టి పంటల సరళి తెలుస్తుందని చెప్తున్నారు. పెరిగిన పెట్టుబడులతో వేరుశనగ తగ్గించి కందిపై రైతుల ఆసక్తి గత ఖరీఫ్లో 22 వేల హెక్టార్లలో సాగు ఈ ఏడాది 78,274 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వైఎస్ జగన్ హయాంలో పెద్ద మొత్తంలో బీమా -
రైతుల జీవితాలతో ఆటలు!
రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఇప్పటికీ విత్తన వేరుశనగ కాయల పంపిణీ చేపట్టలేదు. జిల్లాలో 436 ఆర్ఎస్కేలు ఉండగా ఇప్పటి వరకూ కేవలం 135 ఆర్ఎస్కేలకు 8,683 క్వింటాళ్ల విత్తనకాయలే సరఫరా చేయడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇష్టారాజ్యంగా విత్తనకాయలు సేకరించి రైతులకు కట్టబెట్టేందుకు ఏజెన్సీలు పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుట్టపర్తి అర్బన్: ప్రస్తుతం వేరుశనగలో కే6తో పాటు కదిరి లేపాక్షి, నారాయణి, కే7, కే9 గోల్డ్, డబుల్ కే6, తిరుపతి రకాలు, గుజరాత్ తదితర రకాలు అందుబాటులో ఉన్నా విత్తన నాణ్యత, ఆయిల్ అధికంగా ఉండడం, తిరిగి విత్తుకునేందుకు వీలుండడం, గిట్టుబాటు ధర తదితర కారణాలతో రైతులు కే6పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ ఖరీఫ్లో పొలాల్లో విత్తుకునేందుకు సింహ భాగం రైతులు కే6 కోసమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 17,500 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇష్టారాజ్యంగా సేకరణ.. గత ఏడాది రైతులకు సబ్సిడీపై సరఫరా చేసిన విత్తన కాయలకు సంబంధించిన బిల్లులను చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో రబీ సీజన్లో పండించిన వేరుశనగ కాయలను ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేయలేదు. అయితే, ఖరీఫ్ ముంచుకు రావడం, రైతులకు పంపిణీ చేసేందుకు ఏపీ సీడ్స్ వద్ద సరిపడా విత్తన కాయలు లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ సేకరిస్తున్నారు. జిల్లాలో ధర్మవరం, కదిరిలో మాత్రమే ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి తదితర చోట్ల ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు.ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా సరిపడా కే6 రకం విత్తనాలు లేకపోవడంతో తక్కువ ధరకు లభించే ఇతర కాయలను కే6 బస్తాల్లో కలుపుతున్నట్లు తెలిసింది. ధరలు పెంచినా.. జిల్లాలో రైతులకు ఏటా కే6తో పాటు టీసీజీఎస్ 1694, కదిరి లేపాక్షి 1812 రకాలను సరఫరా చేస్తున్నారు. అయితే, గత ఏడాదితో పోల్చితే ఈ సారి 30 కేజీల వేరుశనగ విత్తన కాయల బస్తా ధర దాదాపు రూ.120 మేర పెంచారు. అయినా, నాణ్యత గల విత్తన కాయలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. విత్తనకాయలు కల్తీ జరిగితే పంట పూర్తిగా ఎత్తిపోయినట్లేనని నిట్టూరుస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో నిశ్చింత.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా మే నెలలోనే విత్తన కాయల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి జూన్ ఒకటో తేదీ నుంచే రైతులకు పంపిణీ చేసేవారు. దీనికి తోడు సీజన్ ప్రారంభంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారంతో ఆదుకోవడంతో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేది. నిశ్చింతగా పంట సాగు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులకు ఎటూ పాలుపోవడంలేదు. విత్తన ఏజెన్సీ నిర్వాహకుల ఇష్టారాజ్యం విత్తన కాయలను ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తున్న వైనం కే6 బస్తాలో ఇతర కాయలు కలిపి సరఫరా చోద్యం చూస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్న అన్నదాతలు కల్తీ చేస్తే చర్యలు కే6 రకం కాయల్లో ఇతర రకాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం ఆయా ప్రాసెసింగ్ యూనిట్లకు వెళ్లి పరిశీలిస్తా. ఇతర రకాలు పంపిణీ చేస్తే రైతులు వెనక్కు ఇవ్వాలి. కొనుగోలు చేసే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. – నారాయణనాయక్, జిల్లా వ్యవసాయాధికారి -
రెడ్క్రాస్ చరిత్రలో రికార్డు
నార్పల: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చరిత్రలో నార్పల మండలం సరికొత్త రికార్డు సృష్టించింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డికి రాష్ట్రస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గత ఏడాది డిసెంబర్ 21న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నార్పలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగానే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధిక రక్తం సేకరించిన కేంద్రంగా రాష్ట్రంలోనే నార్పల ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. శైలజానాథ్, సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో యువత, వైఎస్సార్సీపీ శ్రేణులు రికార్డుస్థాయిలో 752 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏలూరులో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రస్థాయి అవార్డును మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు అందజేశారు. అలాగే అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాతలు, యువత, పార్టీ శ్రేణులు, వైద్య సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా 756 యూనిట్ల రక్తదానం వైఎస్సార్సీపీ నేతలకు అవార్డులు -
మళ్లీ తెరచుకున్న అక్రమాల ‘కాటా’
కళ్యాణదుర్గం రూరల్: తూకాల్లో అక్రమాలకు పాల్పడుతూ రైతులను మోసం చేసిన మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తి .. నెల తిరక్కుండానే మళ్లీ దుకాణం తెరిచేశాడు. వివరాలు... బ్రహ్మసముద్రం మండలానికి చెందిన వ్యాపారి రామ్మూర్తి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని అక్కమ్మగార్ల దేవాలయం ఎదుట మొక్కజొన్న వ్యాపారంతో పాటు వేబ్రిడ్జి (కాటా)ను నిర్వహిస్తున్నాడు. 20 రోజుల క్రితం సమీప గూబనపల్లికి చెందిన రైతుల చీనీ పంటను కాటాకు తరలించగా తూకాల్లో తేడారావడంతో వేబ్రిడ్జి నిర్వాహకుడిని నిలదీసి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిర్వాహకుడిపై నామమాత్రపు కేసు నమోదు చేసి నిమిషాల వ్యవధిలో స్టేషన్ నుంచి బయటకు పంపారు. ఈ వ్యవహారంలో పోలీసులకు భారీగా ముడుపులు ముట్టాయన్న విమర్శలున్నాయి. వ్యాపారిపై అనేక ఆరోపణలు... ● మూడు నెలల క్రితం చాపిరి గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటను అమ్మేందుకు కాటాకు వచ్చాడు. అయితే తూకాల్లో తేడా రావడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది నిముషాల్లో నామమాత్రం కేసుతో రామ్మూర్తి బయట పడ్డాడు. ● రెండు నెలల క్రితం మల్లికార్జునపల్లికి చెందిన రైతు వేరుశనగ పంటను అమ్మడం కోసం వ్యాపారి వద్దకు వచ్చాడు. తూకాల్లో తేడా రావడంతో ఆగ్రహించిన రైతు వ్యాపారిని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ● మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్టకు చెందిన రైతు మొక్కజొన్న పంట అమ్మకం విషయంలో తూకాల్లో మోసం జరగడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయకుండా పోలీసులే దగ్గరుండి పంచాయితీ చేశారన్న ఆరోపణలున్నాయి. చక్రం తిప్పిన వ్యాపారి రామ్మూర్తి పోలీసులకు మామూళ్లిచ్చి వ్యాపారం ?! సామాన్య ప్రజలకు ఏదైనా సమస్య వస్తే గంటైనా ఘటనా స్థలానికి రాని పోలీసులు.. మొక్కజొన్న వ్యాపారి రామ్మూర్తికి చిన్నపాటి సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కరిస్తారన్న విమర్శలున్నాయి. ఎంతోమంది రామ్మూర్తిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. వివాదం జరిగి నెలగడవకనే రామ్మూర్తి మళ్లీ కాటాను తెరవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తూకాల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఏ ఒక్కరూ నష్టపోకుండా వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాటా తెరవడంపై పట్టణ సీఐ హరినాథ్ని ‘సాక్షి’ వివరణకోరగా ఆయన స్పందించలేదు. పోలీసుల అండ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎన్. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అర్హత సాధించి, ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను తిరిగి టెట్ రాయాలని ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే నియమించి, న్యాయమైన వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఉద్యోగ భద్రత, వేతన స్కేలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ గత బదిలీలలో బదిలీ పొంది రిలీవ్ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని అధికారులను కోరారు. సమస్యల పరిష్కారంలో జాప్యం కొనసాగితే ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, ప్రసాద్, రాజశేఖర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మల్లికార్జున, సురేష్, ఫణిభూషణ్, కృష్ణమోహన్, మల్లికార్జున గౌడ్, రవికుమార్, నాగభూషణ్, సీనియర్ నాయకులు అజయ్ కుమార్, శివయ్యచారి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా ఆఫ్లైన్ విధానంలో టెట్ నిర్వహించాలని యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దేవేంద్రమ్మ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1)లో మార్పులు తీసుకొచ్చేందుకు పార్లమెంట్లో చట్ట సవరణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రస్తుతం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ‘కిట్–5’ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు అందజేయడం, తదుపరి దశలో మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకుని, ఇప్పటికే విడుదల చేసిన టెట్ నోటిఫికేషన్తో పాటు ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సహాధ్యక్షుడు రామప్ప చౌదరి , రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు, జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, కార్యదర్శులు అర్జున్, ప్రమీల, రవికుమార్, శేఖర్, సుబ్బరాయుడు, చంద్రమోహన్, రామాంజనేయులు, ఓబులేసు పాల్గొన్నారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని గన్నెవారిపల్లి కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముగ్గ్గురు మహిళలను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అలివేలమ్మ అనే మహిళ గన్నెవారిపల్లి కాలనీలో గత కొద్ది నెలలుగా అద్దెకు ఇళ్లు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆదివారం స్థానికులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి వ్యభిచార గృహంపై దాడి చేశారు. అలివేలమ్మతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. బురదలోనే పశువుల సంత అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణం చిత్తడి చిత్తడిగా మారింది. అసలే ఆదివారం పశువుల సంత కావడంతో పరిస్థితి ఘోరంగా తయారైంది. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో యార్డు ప్రాంగణం రొచ్చు రొచ్చుగా మారింది. ఎక్కడ చూసినా మోకాళ్ల లోతు గుంతలు చిన్నపాటి చెరువులను తలపించాయి. వర్షపునీరు, డ్రైనేజీ సజావుగా వెళ్లడానికి సరైన సదుపాయం లేకపోవడంతో సంతకు వచ్చిన పశువులు, ఎద్దులు, గేదెలతో పాటు రైతులు, వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్షపునీరుకు పేడ, మూత్రం తోడు కావడంతో ఆ ప్రాంతమంతా కంపు కొట్టింది. ముందు రోజు శనివారం కూడా జీవాల సంతలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంతలో సమస్య లేకుండా చూడాల్సిన మార్కెట్యార్డు పాలకులు, అధికారులు, సిబ్బంది మాత్రం మార్కెట్ రుసుం వసూలు చేసుకుని నింపాదిగా వెళ్లిపోయారు. -
నేటి నుంచి ‘ముంగారు’కు అనుకూలం
అనంతపురం అగ్రికల్చర్: ముంగారు పంటల సాగుకు వేళయింది. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు సోమవారం నుంచి అనుకూలమని అధికారులు, శాస్త్రవేత్తలు తెలిపారు. వర్షాలు కొంచెం ఆలస్యమైనా జూలై ఆఖరు వరకు ఖరీఫ్ ఏరువాకకు మంచి అదనుగా తెలిపారు. ఇప్పుడు నడుస్తున్న మృగశిరతో పాటు ఈ నెల 22న ఆరుద్ర, ఆ తర్వాత వచ్చే పునర్వసు, పుష్యమి కార్తెల్లో పంటల సాగుకు అనుకూలమని చెబుతున్నారు. మూడు రోజులుగా చాలా మండలాల్లో మోస్తరుగా వర్షాలు పడడటంతో సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ ఖరీఫ్లో 3.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేశారు. విత్తుకు వేళయినా... అందని విత్తనం ఈసారి జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా రాయితీ విత్తనం కేటాయించింది. 56 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ, మరో 2 వేల క్వింటాళ్లు కందులు, పెసలు, మినుములు, కొర్రలు, రాగులు కేటాయించింది. అయితే వేరుశనగ పంపిణీ ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలు పెట్టడంతో ఇప్పటికీ రైతులకు విత్తనం అందని పరిస్థితి నెలకొంది. సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా వేరుశనగ విత్తనం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే కందుల పరిస్థితి అలాగే ఉంది. జూలై నెలాఖరు వరకు పంటలు విత్తుకునేందుకు అదను ఈ ఖరీఫ్లో 3.43 లక్షల హెక్టార్లలో పంటల సాగు అంచనా -
రాప్తాడులో కుండపోత
అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులుగా చాలా మండలాల్లో మోస్తరుగా కురిశాయి. ఆదివారం తెల్లవారుజామున 28 మండలాల పరిధిలో 26.7 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడు మండలంలో ఏకంగా 102.2 మి.మీ కుండపోత వర్షం కురిసింది. యాడికి 63.4 మి.మీ, అనంతపురం రూరల్ 62.4, అనంతపురం అర్బన్ 60.2, పామిడి 55.4, తాడిపత్రి 52.4, కూడేరు 52 మి.మీ భారీ వర్షం కురిసింది. గార్లదిన్నె 44.8 మి.మీ, గుంతకల్లు 42.4, విడపనకల్లు 40.2, బుక్కరాయసముద్రం 40.2, పెద్దవడుగూరు 39, ఉరవకొండ 35.2, వజ్రకరూరు 29.2, గుత్తి 26.8, నార్పల 19.6 మి.మీ తోపాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కాగా జూన్ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా ఇప్పటికే 69.1 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చెక్డ్యాంలు, చిన్నపాటి వంకలు ప్రవహిస్తున్నాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం డివిజన్ల పరిధిలో వర్షాలు తక్కువగా నమోదు కాగా మిగతా మండలాల్లో పదను వర్షం కురవడంతో ఖరీఫ్ సాగు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 28 మండలాల్లో 26.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలపై రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. అర్జీలో ఆధార్, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలియజేశారు. టీబీ డ్యాంకు 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర జలాశయానికి ఆదివారం 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. టీబీ డ్యాంలో మొత్తం 9,910 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువన ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో తొలిసారిగా ఆదివారం నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి టీబీ డ్యాంలో 6,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి, జలాశయంలో 26.140 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఈ ఏడాది భారీ వర్షాలు లేకపోవడంతో ఇన్ఫ్లో మందగించింది. సకాలంలో డ్యాంలో నీరు చేరితేనే జూలై ఆఖరిలో హెచ్చెల్సీకి నీరు విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం జలాశయంలో 1,588.61 అడుగల వద్ద 9.910 టీఎంసీల నీరు నిల్వతో 329 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 180 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1603.33 అడుగుల నీటి మట్టంతో 26.410 టీఎంసీల నీరు నిల్వ ఉండి, 6,618 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 128 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేందని బోర్డు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం మడకశిర రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మడకశిర మండలంలోని తడకలపల్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన గంగరాజు కుమారుడు మహేంద్ర (24), అతని బావ, రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన ఆదినారాయణ (28)తో పాటు మరో యువకుడితో కలిసి ఆదివారం కారు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో హిందూపురం బయలుదేరారు. మార్గమధ్యంలో తడకలపల్లి వద్ద 544–ఈ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో తీవ్ర గాయాలైన మహేంద్ర, ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలైన మరో యువకుడిని స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన ఆదినారాయణకు భార్య మమత, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నట్లు తెలిసింది. మడకశిర మండల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అదుపులో గంజాయి సరఫరాదారులు గుత్తి: గుత్తి పోలీసులు ఆదివారం రాత్రి ఇద్దరు గంజాయి సరఫరాదారులను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పట్టణంలోని ఓ షాపులో గంజాయి, నకిలీ నోట్లు దొరికాయి. షాపు నిర్వాహకుడిని విచారించగా.. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన గోపాల్ వాటిని ఇక్కడ ఉంచినట్లు చెప్పాడు. దీంతో గోపాల్తో పాటు దిమ్మగుడికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ లోతుగా విచారణ చేస్తున్నారు. -
లైంగిక వేధింపులు భరించలేకే యువకుడి హత్య
సాక్షి, బళ్లారి: బళ్లారి తాలూకా మోకా సమీపంలో ఎల్ఎల్సీ కాలువ వద్ద ఈనెల 7న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బళ్లారి జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం బొల్లనగుడ్డకు చెందిన బసవన గౌడ బళ్లారిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పని చేస్తున్నాడు. మోకా గ్రామానికి చెందిన సమీప బంధువు అయిన శ్వేతతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్లు పెట్టేవాడు. ఏడాది పాటు లైంగికంగా వేధించినట్లు సమాచారం. బసవన గౌడ చేష్టలతో విసిగిపోయిన శ్వేత.. ఈ విషయాన్ని తన భర్త అయిన దొడ్డ బసవన గౌడ దృష్టికి తీసుకెళ్లింది. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ కలసి బసవన గౌడను చంపేయాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఈనెల 7వ తేదీన రాత్రి మోకా సమీపంలోని ఎల్ఎల్సీ కాలువ వద్దకు బసవన గౌడ (27)ను పిలిపించారు. అక్కడికి రాగానే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకుండా మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పటించి కాల్చి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిందితులు ముగ్గురూ బెంగళూరుకు పారిపోయారు. 8న మోకా పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. కాల్ డేటా ఆధారంగా పోలీసులు హత్య కేసు మిస్టరీని ఛేదించారు. శ్వేత, ఆమె భర్త దొడ్డ బసవనగౌడ, సోదరుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. లైంగికంగా వేధించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. బసవనగౌడ హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురి అరెస్ట్ -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలని కోరారు. -
సర్.. అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అర్బన్/ రాయదుర్గం టౌన్: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సర్వే (సర్) ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. బీఎల్ఓలు జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారు. గతంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ మాదిరిగా కాకుండా ప్రత్యేక సమగ్ర సర్వే (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియలో బీఎల్ఓలు ప్రతి ఓటరునూ కలుస్తారు. 2002 ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలిస్తారు. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం ఇచ్చి వివరాలను సేకరిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 20.38 లక్షల ఓటర్లు ఉంటే అందులో 4.57 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. దీంతో ఈ ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు.. జిల్లాలో ప్రస్తుతం 2,226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 20,38,523 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 10,06,651 మంది, మహిళా ఓటర్లు 10,31,611 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 256 మంది ఉన్నారు. బీఎల్ఓల ఇంటింటి సర్వే ప్రకారం కొత్తగా నమోదైన ఓట్లు, తొలగించిన ఓట్ల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆ తరువాత అందిన క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని సెప్టెంబరు 18వ తేదీలోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. మ్యాపింగ్ కాని ఓటర్లు 4.57 లక్షలు.. జిల్లాలో మొత్తం 20,38,523 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే 15,80,798 మంది ఓటర్లు మ్యాపింగ్ అయ్యారు. మ్యాపింగ్ కాని ఓటర్లు 4,57,725 మంది ఉన్నారు. అత్యధికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 96,249 మంది రాప్తాడులో 67,534 మంది ఓటర్లు, ఉరవకొండ 60,659 మంది, తాడిపత్రిలో 58,081 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. అదే విధంగా రాయదుర్గంలో 46,009 మంది ఓటర్లు, గుంతకల్లులో 27,494 మంది, శింగనమలలో 50,572 మంది, కళ్యాణదుర్గంలో 51,127 మంది ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. మ్యాపింగ్ కాని ఓటర్లు ‘ప్రస్తుతం అందుబాటులో లేరు’ అనే కారణంతో తొలగించే అవకాశం ఉంది. బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.. సర్ ప్రక్రియ నిర్వహణపై రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ)కి సహకరించాలి. తమ బూత్ పరిధిలో మ్యాపింగ్ కాకుండా ఉన్న ఓటర్లను మ్యాపింగ్ చేయించాలి. అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించకుండా చూడాలి. అదే విధంగా వయసు 18 ఏళ్లు నిండిన వారి ఓటు నమోదు చేయించాలి. నేటి నుంచి ‘సర్’ జూలై 14 వరకు ఇంటింటికీ బీఎల్ఓలు జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లు 4.57 లక్షల మంది రాయదుర్గం పట్టణానికి చెందిన నూరుల్లా అనే వ్యక్తి గుంటూరులో వివాహం చేసుకున్నాడు. తన భార్యకు ఇక్కడ ఓటు హక్కు ఉంది. కానీ 2002లో నివాసం ఉన్న గుంటూరులో తల్లిదండ్రుల చిరునామాను (ఓటు సీరియల్ నంబర్ లేదా డోర్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్) ప్రస్తుతం జాబితాకు సరిపోలిస్తే సరిపోతుంది. ఒక వేళ వారు బీఎల్ఓ ఇచ్చిన ఫారంలో ధ్రువీకరణ ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. సర్ అంటే కేవలం మ్యాపింగ్ ప్రక్రియ మాత్రమే కాదు. కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు, చిరునామాల మార్పుపై కూడా జరుగుతుంది. అవగాహన, అప్రమత్తతోనే ఓటు హక్కును పరిరక్షించుకోగలం. -
కష్టకాలంలో స్నేహ హస్తం
రాప్తాడు రూరల్: కష్టకాలంలో స్నేహితుడికి స్నేహ హస్తం అందించారు. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అయ్యాడు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జయకృష్ణ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు సపర్యలు చేసేందుకు భార్య తోడు తప్పనిసరి అయింది. కూలి పనులు మానేసి ఆమెకూడా ఇంటివద్దే ఉంటోంది. ఇటీవల ఆమె కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. వారికి 9వ తరగతి, 7వ తరగతి చదువుతున్న కుమారులున్నారు. ఆ కుటుంబ దుస్థితిపై ఇటీవల ‘సాక్షి’లో ‘కష్టాల సుడిగుండం...కన్నీటి ప్రయాణం’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనానికి మానవతావాదులు స్పందించారు. ఇప్పటికే గ్రామస్తులు, ఇతరులు సుమారు రూ. 1.20 లక్షల దాకా ఆర్థిక చేయూత అందించారు. ఆదివారం జయకృష్ణ చిన్ననాటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకుంటూ రూ.31 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామానికి చేరుకుని జయకృష్ణను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. కట్టకిందపల్లి బుర్రా జయకృష్ణకు రూ.31 వేలు సాయమందించిన స్నేహితులు -
కవ్వించిన టీడీపీ నేతలపై చర్యలకు డిమాండ్
కళ్యాణదుర్గం రూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకుండా వంచించినందుకు నిరసనగా ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నాయకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ హరినాథ్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాకుండా.. తిరిగి వైఎస్సార్సీపీ నేతలే దాడికి యత్నించినట్టుగా సమన్వయకర్త తలారి రంగయ్యతో పాటు పలువురిపై కేసు నమోదు చేయించడం అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అనుమతి తీసుకుని ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టి.. అలజడి సృష్టించాలని ప్రయత్నించిన 15 మంది టీడీపీ నాయకులపై విచారణ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేత దొడగట్ట నారాయణ, కన్వీనర్లు సుధీర్, గోళ్ళ సూరి, యువజన విభాగం నాయకుడు రామాంజినేయులు, మున్సిపల్ విభాగం నాయకులు దొడగట్ట మురళి, చరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకను తన్నుకుపోతున్న ‘పచ్చ’ గద్దలు
శింగనమల: సంపాదన కోసం అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు శింగనమల మండలం ఉల్లికల్లు వద్ద పెన్నానదీ పరివాహక ప్రాంతంలోని వంకలో పది రోజులుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని ఓ ప్రదేశంలోకి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి తాడిపత్రి, అనంతపురం ప్రాంతాలకు చెందిన టిప్పర్ల వారికి టిప్పర్ ఇసుక రూ.5వేల చొప్పున విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన టిప్పర్ నిర్వాహకులు రూ.12 వేల దాకా అమ్ముకుంటున్నారు. రోజుకు 20 నుంచి 30 టిప్పర్ల వరకు ఇసుకను బయటకు పంపుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎవ్వరూ క్షేత్రస్థాయిలో విచారణ చేయడానికి ముందుకు రాలేదు. టీడీపీ నేతలతో అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని.. వారి అక్రమాలకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఉల్లికల్లు వద్ద అక్రమ తవ్వకాలు గ్రామస్తుల ఫిర్యాదులు బుట్టదాఖలు పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు -
‘తమ్ముళ్ల’ బరితెగింపు
● చెరువు మట్టి యథేచ్ఛగా దోపిడీ ● నెల రోజులుగా టిప్పర్లతో రవాణా ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరలేపారు. చెరువు మట్టిపై కన్నేసి తవ్వేస్తున్నారు. టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విడపనకల్లు మండలం డొనేకల్లు గ్రామంలోని చెరువులో సారవంతమైన మట్టి ఉంది. దీన్ని కొందరు టీడీపీ నాయకులు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టిప్పర్ల ద్వారా గడేకల్లు, ఎన్.తిమ్మాపురం, హంచనహాళ్, పొలికి గ్రామాలతో పాటు కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోజుకు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టి లోడులు వెళ్తున్నాయి. నెల రోజులుగా ఇలా చెరువు మట్టిని కొల్లగొడుతున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. దీంతో అక్రమ తవ్వకాలు ఆపి.. చెరువును పరిరక్షించాలని ఈ నెల ఒకటో తేదీన గుంతకల్లు ఆర్డీఓకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది. ఆయన విచారణకు ఆదేశించారు. అయితే కిందిస్థాయి అధికారులు టీడీపీ నాయకులకు అనుకూలంగా ఒక తీర్మానం సృష్టించి, చెరువు మట్టి అక్రమంగా తవ్వడం లేదని నివేదికలో పొందుపరిచి విచారణను ‘మమ’ అనిపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి చెరువు మట్టి దందాకు చెక్పెట్టాలని డొకనేకల్లు గ్రామస్తులు కోరుతున్నారు. -
మాయమాటలతో వంచిస్తున్నారు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. విద్యా వ్యాపారాన్ని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాయమాటలతో విద్యార్థులు, తల్లిదండ్రులను వంచిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలల పేరుతో, భవనాలు నిర్మాణంలో ఉండగానే అడ్మిషన్లు చేస్తున్నారు. పాఠశాల పేరుతో ముద్రించిన పాఠ్యపుస్తకాలు విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు. – ఓతూరు పరమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి, ఎస్ఎఫ్ఐ -
ఖాకీల ‘పచ్చ’పాతం
కళ్యాణదుర్గం: పోలీసుల ఏకపక్ష తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్సీపీ గొంతు నొక్కడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు అక్రమ కేసుల బనాయింపునకు పూనుకున్నారు. పోలీసులు చూపుతున్న ‘పచ్చ’పాతంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచనకు గురిచేసిన తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో కళ్యాణదుర్గంలో ఈ నెల 12న నిరసన ర్యాలీ నిర్వహించారు. అనుమతి తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు అప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ అడ్డు తగిలారు. ఇదే క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాగైనా వైఎస్సార్సీపీ ర్యాలీని భగ్నం చేయడానికి కుట్ర పన్నారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు బైకులపై శబ్దాలు చేస్తూ టీ సర్కిల్లో బాణసంచా పేల్చుతూ రెచ్చ గొట్టేలా ప్రవర్తించారు. ఇదంతా పోలీసులు చూస్తున్నా అడ్డుకోకపోగా.. వైఎస్సార్సీపీ శ్రేణులను అక్కడి నుంచి తరిమివేసేందుకు ప్రయత్నించారు. అంతటితో ఆగలేదు. నిరసన ర్యాలీలో అవతలి పార్టీ వారిని రెచ్చగొడుతున్నారని, ప్రజలకు, వాహనదారులకు ఆటంకం కలిగించారంటూ పట్టణ పోలీసు స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ కేఎస్ లింగరాజుతో ఫిర్యాదు చేయించారు. ఆ ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, మున్సిపల్ కన్వీనర్ ఐ.సుధీర్, పార్టీ అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ గోళ్ల సూరి, బ్రహ్మసముద్రం, కుందుర్పి, శెట్టూరు కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, కురబ హనుమంత రాయుడు, ఎంఎస్ రాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు, కంబదూరు ఎంపీపీ తనయుడు భీమేష్, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులుతో పాటు మరికొంత మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఘర్షణ వాతావరణం నెలకొనేలా రెచ్చగొట్టిన టీడీపీ నాయకులపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనకాడుతున్నారు. గతంలో కూడా తిరుమల లడ్డూపై దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేయించినందుకు, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించినందుకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రోద్బలంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసిన విషయం విదితమే. పథకం ప్రకారం రెచ్చగొట్టిన టీడీపీ నేతలు ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ నేతలపై కేసులు -
గొడవ పడొద్దంటే కొట్టి చంపేశారు..!
● తాడిపత్రి యువకుడిపై పలువురి దాడి ● ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచిన బాధితుడుమైదుకూరు: హైవే రోడ్డు నిర్మాణంలో ఏర్పడే తుక్కు కొనుగోలు విషయంలో వ్యాపారుల మధ్య జరిగిన గొడవల్లో తాడిపత్రికి చెందిన ఇస్మాయిల్ వివేకా నంద (35) అనే యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఉలందకొండకు చెందిన రోషన్ తుల్లా అనే బిడ్డర్,కమిషన్ ఏజెంట్ బెంగళూరు–విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్ప్రెస్ హైవే నిర్మాణ కంపెనీ మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద ఉన్న తుక్కును కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో బిడ్ వేశాడు. దానికోసం 1. 50 కోట్లు డిపాజిట్ చెల్లించాడు. నెల్లూరుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి సూచనతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూరిబాబు, పోతురాజు అనేవారికి తుక్కును అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు. వారి వద్ద నుంచి రూ.1.10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అగ్రిమెంటు రాసుకునేందుకు రూ .10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారు ఆ మొత్తం ఇవ్వకుండా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తిని పిలిపించి తుక్కును అమ్మాలని చూశారు. అయితే హైదరాబాద్కు చెందిన వ్యక్తి రోషన్ తుల్లా తోనే డీల్ చేసుకొని 21 టన్నుల తుక్కును రూ.6. 67 లక్షలకు కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. ఇంకా కొంత తుక్కు ఉందని దానిని అమ్మేందుకు తాడిపత్రి భగత్ సింగ్ కాలనీకి చెందిన వివేకానంద, హైదరాబాద్లోని మల్కాజ్ గిరిలో ఉంటున్న కమలాపురం నివాసి ఇల్లూరు సురేష్ బాబు అనే వారిని పిలిపించాడు. ఇదిలావుండగా తామిచ్చిన రూ 1. 10 లక్షలు అడ్వాన్స్ను తిరిగి ఇవ్వాలని సూరిబాబు, పోతురాజు రోషన్ తుల్లాను అడిగారు. అతను వాయిదాలు వేస్తుండడంతో తమకు తెలిసిన బ్రహ్మంగారిమఠం మండలం టి. రామాపురం గ్రామానికి చెందిన బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని పిలిపించారు. బ్రహ్మనాయుడు అడ్వాన్స్ డబ్బు కోసం రోషన్ తుల్లాను నిలదీయగా రూ. 40 వేలు ఫోన్ పే చేశాడు. మిగిలిన రూ.70 వేలు శుక్రవారం రాత్రి ఇస్తానని చెప్పాడు. వీరంతా శుక్రవారం రాత్రి మైదుకూరులోని ఓ లాడ్జీలో కలిశారు. రూ .70 వేలు ఇవ్వాలని బ్రహ్మనాయుడు, సూరిబాబు, పోతురాజు రోషన్ తుల్లాను బెదిరిస్తూ దాడికి దిగారు. అక్కడే ఉన్న సురేష్ బాబు, ఇస్మాయిల్ వివేకానంద కలగజేసుకోవడంతో వారు వివేకానందను తీవ్రంగా కొట్టారు. అతన్ని సురేష్ బాబు లాడ్జీ నుంచి కారులో మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు తెలిపారు. వివేకానంద సోదరుడు రవి ప్రతాప్ మైదుకూరు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఒకటో తరగతికే రూ.లక్ష ఫీజు
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నాయి. ఫీజు నియంత్ర చట్టాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు. ట్యూషన్, బస్, పుస్తకాలు, యూనిఫామ్, స్నాక్స్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక బ్రాంచ్కు అనుమతి తీసుకుని నాలుగైదు బ్రాంచులు నడుపుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. ఒకటో తరగతికి రూ.లక్ష ఫీజు వసూలు చేస్తున్నారు. – కుళ్లాయిస్వామి, జిల్లా ప్రధానకార్యదర్శి, ఏఐఎస్ఎఫ్ -
పామిడిలో భారీ వర్షం
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావం మొదలైనట్లు చెబుతున్నా నైరుతి రుతుపవనాల వల్ల జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 24 మండలాల పరిధిలో 16.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పామిడిలో 84.6 మి.మీ భారీ వర్షం కురిసింది. కొబ్బరిచెట్టుపై పడిన పిడుగు ఆత్మకూరు: పి.యాలేరులో శుక్రవారం అర్ధరాత్రి వర్షం పడుతున్న వేళ గురుస్వామి అనే వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. భారీ శబ్దానికి చుట్టుపక్కల వారు బయటకు రాగా.. కొబ్బరిచెట్టుపై మంటలు చెలరేగడం కనిపించింది. 1న రాష్ట్రపతి ముర్ము రాక అనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై ఒకటో తేదీన బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీని సందర్శించనున్నారు. విజిటర్ హోదాలో ‘జ్ఞాన సీమ’ ప్రాంగణంలో జరగనున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. 2020లో ఉత్తీర్ణులైన తొలి బ్యాచ్ నుంచి 2026 బ్యాచ్ వరకు మొత్తం 1,200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అలాగే 61 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు హాజరు కానున్నారు. అభ్యర్థులు https:// cuap.ac.inలో వివరాలు తెలుసుకోవచ్చు. నెలాఖరుకు ‘ఉపాధి’ సొమ్ము రికవరీ అనంతపురం న్యూటౌన్: ఉపాధి హామీ పనుల్లో దుర్వినియోగమైన నిధులను బాధ్యుల నుంచి ఈ నెలాఖరులోగా రికవరీ చేస్తామని జిల్లా విజిలెన్స్ అధికారి (డీవీఓ) శ్రీనివాసులు వెల్లడించారు. ‘రూ.3.61 కోట్లు హాంఫట్ ’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని 31 మండలాల్లో ‘ఉపాధి’ అవకతవకలు, దానిపై వేసిన జరిమానా (ఫైన్) మొత్తం రూ.61,40,285 ఉందన్నారు. ఇందులో రికవరీ రూపంలో రూ.31,94,120 ఉండగా, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై రూ.29,46,165 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005 స్థానంలో ‘వికసిత్ భారత్–రోజ్గార్ అజీవికా మిషన్(గ్రామీణ) (వీబీ–జీ రామ్ జీ)–2025’ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుందన్నారు. ఆ లోపే ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన 1,233 మందిని వ్యక్తిగతంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న కళ్యాణదుర్గం, 18న తాడిపత్రి, 19, 23 తేదీల్లో రాయదుర్గం, 25న అనంతపురంలో గ్రామసభలు నిర్వహించి, నిధులను రాబడతామని చెప్పారు. -
కరువు రైతు కన్నీటి వ్యథ
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకుపోవడం కోసం హంద్రీ–నీవా కాలువకు చేపట్టిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు శాపంగా మారింది. సిమెంటుతో లైనింగ్ వేస్తే పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయని, బోర్లలో నీళ్లు తగ్గిపోతాయని ఆనాడే రైతులు భయాందోళన చెందారు. రైతులతో పాటు రైతుసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళనబాట పట్టారు. అయినా ప్రభుత్వం మొండిగా సిమెంట్ లైనింగ్ చేపట్టింది. ఫలితంగా కాలువ పరిసర ప్రాంతాల వ్యవసాయ బోర్లలో నీరు తగ్గిపోయింది. నీరందక పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ● హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ ● అడుగంటిన భూగర్భజలాలు.. బోర్లల్లో తగ్గిన నీరు ● నీరందక ఎండుముఖం పట్టిన ఉద్యాన పంటలు కూడేరు: హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. కళ్లెదుటే నీరు పారుతున్నా బోర్లల్లో నీరు లేని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే కుప్పంకు కృష్ణాజలాలు తీసుకెళ్లింది. ఇందుకోసం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా నీరు తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులు చేపట్టారు. హంద్రీనీవా 216వ కిలోమీటరు (జీడిపల్లి వద్ద) నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి సమీపంలోని పట్నం (400వ కి.మీ) వరకు లైనింగ్ పనులు చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ –నీవా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. అయితే సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ చేయడం వల్ల కాలువలో నీరు వేగంగా ముందుకెళ్లిపోయింది. మట్టికాలువ అయితే నీరు సమీపంలోకి ఇంకి సహజసిద్ధంగా భూగర్భజలాలు పెరిగి బోర్లు రీచార్జ్ అయ్యేవి. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో బోర్లలో నీరు తగ్గిపోయి రైతుల కళ్లెదుటే చీనీ, దానిమ్మ, మామిడి, అరటి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయి. -
విద్యను వ్యాపారంగా మార్చారు
కరువు జిల్లా అనంతపురంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థపై సరైన నియంత్రణ లేకపోవడంతో అధిక ఫీజులు, విద్యార్థులు–తల్లిదండ్రులపై ఆర్థిక భారం ఆందోళనకరంగా మారింది. నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును లాభార్జనకు బలి చేయకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి. – చంద్రశేఖర్యాదవ్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
సందర్భం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
అది 1999 సంవత్సరం. నార్పల మండలానికి చెందిన ఓ నిండు గర్భిణి ప్రసవం కాక ఇబ్బంది పడుతుంటే కుటుంబసభ్యులు ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పేదరికం కారణంగా సరైన పౌష్టికాహారం లేక రక్తహీనతతో బాధపడుతున్న ఆమెకు వెంటనే రక్తం ఇవ్వాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మానవత రక్తదాతల సంఘం కో–కన్వీనర్ సలీం మాలిక్ వెంటనే స్పందించారు. రాత్రికి రాత్రి ఆమెకు రక్తాన్ని దానంగా ఇచ్చారు. అయినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో గంట వ్యవధిలో మరోసారి ఆయన తన రక్తాన్ని దానంగా ఇవ్వడంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. తెల్లవారిన తర్వాత రక్తదాతలు అందుబాటులోకి రావడంతో మరో ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేశారు. దీంతో ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. రక్తదానంతో ప్రాణం పోసిన దాతలను ఇప్పటికీ ఆ పేద కుటుంబం తలచుకుంటూనే ఉంటుంది. ... మానవత్వానికి అద్దం పట్టే ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రక్తదాతలు సహకరించడం గమనార్హం. అనంతపురం సిటీ: మానవత్వం అనేది కేవలం ఒక చుక్కలా కనిపించవచ్చు. కానీ ఆ చిన్న చుక్కల కలయికే విశాలమైన సముద్రమై.. ఆపదలో ఓ ఉన్న నిండు ప్రాణాన్ని కాపాడు తుంది. తోటివారి కష్టాన్ని చూసి చలించిపోయి స్వార్థాన్ని పక్కన పెట్టి సాయం చేసే మానవతావాదులు చేతల్లో చూపించే గొప్పదనమే రక్తదానం. అలాంటి వారి సేవలకు గుర్తుగా ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రయోజనాలు ఎన్నో.. రక్తదానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అనంతపురంలోని సర్వజనాస్పత్రి రక్తనిధి మెడికల్ ఆఫీసర్, అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.లక్ష్మి అంటున్నారు. రక్తదానం వల్ల ఐరన్ నిల్వలు తగ్గి ధమనుల పనితీరు మెరుగు పడుతుందని, దీంతో గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు. అలాగే క్యాన్సర్ కారకాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. తరచూ రక్తదానం చేస్తుండడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశముంటుందన్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న రక్త దానాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. సమృద్ధిగా నిల్వలు.. జిల్లా సర్వజనాస్పత్రిలోని రక్తనిధిలో అవసరమైన మేరకు రక్త నిల్వలు ఉన్నాయి. శనివారం నాటికి అన్ని గ్రూపులకు సంబంధించి 320 యూనిట్ల రక్తం నిల్వలు ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అత్యధికంగా ‘ఓ’ పాజిటివ్, ‘బీ’ పాజిటివ్ రక్తం అవసరమవుతుంటుందని రక్తనిధి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. తలసేమియా బాధితులకు అండగా... జీజీహెచ్లోని రక్తనిధికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో స్టోరేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుత్తితో పాటు శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి. అలాగే తలసేమియా బాధితులకు అండగా జీజీహెచ్లోని రక్తనిధి నిలుస్తోంది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు పూర్తి ఉచితంగా అవసరమైన రక్తాన్ని అందజేస్తున్నారు. ప్రతి నెలా 60 నుంచి 70 మంది తలసేమియా బాధితులకు రక్తాన్ని అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడుతున్నారు. జీజీహెచ్లో రక్తదానం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శనివారం సర్వజనాస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల (జీఎంసీ) ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ హాజరై, ప్రారంభించారు. పాథలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ శివశంకర్నాయక్, రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రావణి, డాక్టర్ దివ్య, మైక్రోబయాలజీ విభాగం ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు. పలువురు మెడికోలు, యువకులు స్వచ్ఛందంగా తరలి వచ్చి రక్తదానం చేశారు. 70 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆదర్శంగా నిలుస్తున్న పలువురు రక్తదాతలు విపత్కర సమయంలో మేమున్నామంటూ ముందుకు రక్తదానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహణ -
అనంతపురంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో సెమీ రెసిడెన్షియల్ విధానంలో ఒకటో తరగతి విద్యార్థికి మెస్ ఫీజు రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట రూ.30 వేలుగా ఉన్న ఈ మొత్తం, గత ఏడాది రూ.35 వేలకు పెరిగి, ఇప్పుడు రూ.40 వేల మార్కును చేరుకుంది. విద
అనంతపురం ఎడ్యుకేషన్: విద్య వ్యాపారమయంగా మారింది. ఎంత కష్టమైనా సరే పిల్లల భవిష్యత్తుకు బంగారుబాటలు వేయాలనుకున్న తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఐదో తరగతి విద్యార్థికే రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు 460, కార్పొరేట్ విద్యాసంస్థలు 45 ఉన్నాయి. ఐఐటీ, నీట్ ఫౌండేషన్, సీబీఎస్ఈ, టెక్నో, ఐకాన్, సీ–బ్యాచ్, ఐపీఎల్, ఎస్.బ్యాచ్, ఒలింపియాడ్, పీఓ, కోస్పార్క్, ఇస్రో, డిజిటల్ క్లాస్రూమ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వంటి ఆకర్షణీయ పేర్లతో తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నాయి. అయితే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని కోర్సులు? కొన్ని విద్యాసంస్థలు ఐసీఎస్ఈ, అంతర్జాతీయ సిలబస్, విదేశీ ప్రమాణాల విద్య అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఆసలు ఆయా కోర్సులకు సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లోని ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు చెబుతున్నారంటూ ప్రచారం చేస్తూ భారీ ఫీజులు వసూలు చేస్తున్నా, వాటిపై అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అప్పులపాలవుతున్న తల్లిదండ్రులు కరువు పరిస్థితులతో సతమతమవుతున్న జిల్లాలో కూలి పనులు, వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలే అధికం. అయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చాలామంది కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న పరిస్థితి నెలకొంది. విద్య ఒక అవసరంగా ఉండాల్సిన సమయంలో, అది కుటుంబాలపై ఆర్థిక భారం అవుతోందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ ఎక్కడ? ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ.. వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు ఫీజుల నిర్మాణం, అదనపు వసూళ్లు, మెస్ చార్జీలు, ప్రత్యేక కోర్సుల పేరుతో జరుగుతున్న దోపిడీపై సమగ్రంగా పరిశీలించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్య హక్కు అయినప్పుడు, అది కొందరి వ్యాపార సాధనంగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించడం, మెస్ ఫీజులు, ఇతర అదనపు వసూళ్లపై పారదర్శకత తీసుకురావడం, అనుమతులు లేని కోర్సులపై చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే తల్లిదండ్రులకు ఉపశమనం లభిస్తుంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు ౖపైపెకి పేద, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం -
బోర్లలో నీరు తగ్గిపోయింది
నాకు హంద్రీ– నీవా కాలువ సమీపాన ఐదు ఎకరాల పొలం ఉంది. ఎనిమిదేళ్ల క్రితం మూడు ఎకరాల్లో చీనీ చెట్లు పెట్టా. రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. హంద్రీ–నీవా కాలువ గుండా మూడు నుంచి నాలుగు నెలల పాటు నీరు ప్రవహిస్తే భూగర్భ జలాలు బాగా పెరిగేవి. బోరు కేసింగ్ పైపు నుంచి నీరు ఉబికి వచ్చేది. కానీ హంద్రీ–నీవా కాలువకు సిమెంట్తో లైనింగ్ చేపట్టడంతో భూమిలోకి నీరు ఇంకలేదు. రెండు బోర్లలోనూ నీరు తగ్గిపోయింది. చీనీ చెట్లకు నీటి తడులు ఎలా అందించాలో దిక్కుతోచడం లేదు. – కొల్లన్న ,రైతు, పి,నారాయణపురం,కూడేరు మండలం ఇక పంటలు సాగు చేయలేం హంద్రీ– నీవా కాలువకు కొంతదూరంలో నాకు పది ఎకరాల పొలం ఉంది. కాలువ గుండా నీరు ప్రవహిస్తుండడంతో రెండు బోర్లలో నీరు బాగా వచ్చేది. ధైర్యంగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసేవాడిని. కానీ కాలువకు సిమెంట్తో లైనింగ్ చేయడంతో బోర్లలో నీరు బాగా తగ్గిపోయింది. ఐదు ఎకరాల్లో వేరుశనగ, టమాట పంటలను సాగు చేశా. అరకొరగా వచ్చే నీరు పంటలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. భవిష్యత్లో నీటి కొరతతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. – పెద్ద అక్కులన్న, రైతు, ఎంఎంహళ్లి, కూడేరు మండలం -
‘ఆ టీచర్లకు టెట్ మినహాయించాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: 2010కు ముందు చట్టబద్ధంగా నియమితులైన ఉపాధ్యాయుల సేవా హక్కులు, సీనియారిటీ, పదోన్నతులు, ఇతర చట్టబద్ధ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇటీవల వైఎస్సార్టీఏలో చేరిన ఏపీటీఎఫ్–1938 నాయకులు విశ్వనాథరెడ్డి, మునిరెడ్డి, రమణారెడ్డి, రమేష్, రామసుబ్బారెడ్డి, చింతలరెడ్డి, నరేంద్రారెడ్డి, ఓబుళప్ప, ఓబిలేసు, బాలనాయక్, అంజనరెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితరులకు శనివారం సభ్యత్వాలను అందజేశారు. స్థానిక ఉపాధ్యాయ భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010 ఆగస్టు 23న జారీ చేసిన టెట్ నోటిఫికేషన్, 2026 మే 29న గౌరవ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు. 2010కు ముందు అప్పటి నిబంధనలు, అర్హతలు, ఎంపిక విధానాల ప్రకారం నియమితులైన ఉపాధ్యాయులకు తర్వాత అమల్లోకి వచ్చిన టెట్ అర్హతను వర్తింపజేయడం సహజ న్యాయం, సమానత్వం, న్యాయనిశ్చితి సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. గోవిందరెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు గోపాల్, సిద్ధ ప్రసాద్, రామకృష్ణ, కృష్ణానాయక్, కృష్ణ, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన మద్యం భూతం
యాడికి: మద్యం భూతం ఓ ప్రాణం తీసింది. మండల కేంద్రంలోని పెద్దపేటలో శుక్రవారం రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త మృతి చెందాడు.సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు.. పెద్దపేటకు చెందిన నేత కార్మికుడు ప్రసాద్, హైమావతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల ప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. మగ్గం పనులు చేయకుండా జులాయిగా తిరిగేవాడు. దీంతో హైమావతి తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. మద్యం తాగేందుకు తెలిసిన వారి వద్ద అప్పులు చేయటమే కాకుండా ద్విచక్ర వాహనాన్ని సైతం ప్రసాద్ తాకట్టు పెట్టడంతో వారం క్రితం హైమావతి తన పుట్టింట్లో డబ్బు తీసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని విడిపించి ఇచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన ప్రసాద్ ఇంకా మద్యం తాగేందుకు ఇంట్లోని సిలిండర్ను వేరే వారికి విక్రయించేందుకు పూనుకున్నాడు. దీంతో హైమావతి అతనితో గొడవకు దిగింది. ‘పిల్లల పాఠశాలలు తెరుస్తారు.. వాళ్లకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి. మద్యం కోసం ఇలా ఇంట్లో వస్తువులు అమ్ముకుంటే ఎలా బతకాలి’ అంటూ వాపోయింది. అయినా, ప్రసాద్ వినకపోవడంతో ఆగ్రహానికి గురై భర్తను తోసేసింది. అనంతరం బాధతో ముగ్గురు కుమార్తెలు, కుమారుడిని వెంట బెట్టుకొని తన పుట్టింటికి వెళ్లి పోయినది. శనివారం ఉదయం ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న ప్రసాద్ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైమావతి తోయడంతోనే గాయాలై ప్రసాద్ మృతి చెందాడని అతని బంధువు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హైమావతిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, తండ్రి మృతి చెందటం, తల్లిని పోలీసులు అరెస్టు చేయటంతో వారి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అనాథలుగా మారారు. ఇక తమకు దిక్కెవరంటూ విలపిస్తున్న వారిని చూసి గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. నిత్యం తాగొస్తున్నాడని భర్తతో భార్య గొడవ ఆవేశంలో భార్య తోయడంతో కిందపడి భర్త మృతి తండ్రి మృతి, తల్లి జైలు పాలవడంతో అనాథలైన ముగ్గురు పిల్లలు -
అలవికాని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయకుండా వంచన చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ తదితర హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయకుండా అరాచక పాలన సాగించడంపై జనం మండిపడ్డారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు
అనంతపురం: అనంతపురంలో అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. చంద్రబాబు మోసాలకు నిరసనగా లలిత కళాపరిషత్ వద్ద వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో కలిసి అనంత నల్లబెలూన్లు ఎగురవేశారు. సూపర్ సిక్స్ హామీలను విస్మరించి ప్రజలను దగా చేసిన చంద్రబాబు తీరును ఎండగట్టారు. మండుటెండలోనే భారీ ర్యాలీ చేపట్టారు. సప్తగిరి సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి టవర్క్లాక్ వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆంక్షలు విధిస్తూ దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండేళ్లుగా సీఎం చంద్రబాబు చేసిన మోసాలను అనంత వెంకటరామిరెడ్డి ఎండగట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయన్నారు. రెండేళ్లు గడిచినా హామీల అమలులో విఫలమయ్యాయని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తొలి సంతకం చేసిన డీఎస్సీని అక్రమాలకు నిలయంగా మార్చాన్నారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసులతో పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. అనంతపురంలో ప్రజాప్రతినిధులే అక్రమాలకు పాల్పడుతున్నారని, నకిలీ రిజిస్ట్రేషన్లు, భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్ కుమార్రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు బోయ తిప్పేస్వామి, అనంత చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్, ఎస్ఈసీ సభ్యులు కోగటం విజయభాస్కర్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య తదితరులు పాల్గొన్నారు. ఎగిసిపడిన నిరసన కెరటం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ మహా నిరసన కెరటంలా ఎగసిపడింది. అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డులోని నరిగమ్మ ఆలయం నుంచి జాతీయ రహదారి–44 వరకు వేలాదిమందితో ర్యాలీ సాగింది. రోడ్డు పొడవునా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన వంచనను వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చివరకు డ్వాక్రా సంఘాలే లేకుండా చేస్తున్నారని చంద్రబాబుపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. నయవంచనపై నిరసనాగ్రహం రాయదుర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన ర్యాలీ విజయవంతమైంది. కార్యక్రమానికి వేలాది మంది పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. లక్ష్మీ బజార్ నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వినాయక సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు, సూపర్ సిక్స్ హామీల అమలు అటకెక్కించడంపై మెట్టు గోవిందరెడ్డి మండిపడ్డారు. అసత్యానికి ప్రతీక చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యానికి ప్రతీక అని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడు శివశంకర్రెడ్డి అన్నారు. గుంతకల్లులో ‘చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హనుమేష్ నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్, పొట్టి శ్రీరాములు సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’పై తిరుగుబాటు జిల్లా వ్యాప్తంగా వైఎసార్సీపీ ఆధ్వర్యంలో కదం తొక్కిన ప్రజలు నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబుపై భగ్గుమన్న యువత, మహిళలు మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారంటూ మండిపాటు -
ప్రభుత్వ భూములను పరిరక్షించండి
అనంతపురం అర్బన్: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డీఆర్ఓ మలోలకు ప్రజాబలం సంఘం నాయకులు విన్నవించారు. డీఆర్ఓని శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్గఫూర్, ఇతర నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గార్లదిన్నె మండలం పెనకచర్లలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అక్కడి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూమి పంపిణీ చేయాలన్నారు. ఆక్రమణదారులపై చట్టరపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మేఘన, వీరతేజ, మహబూబ్బాషా, పవన్, పాల్గొన్నారు. -
ఇరువర్గాల ఘర్షణలో 11 మందికి గాయాలు
విడపనకల్లు: మండలంలోని పాల్తూరులో ఇరువర్గాల ఘర్షణలో శుక్రవారం 11 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. పాల్తూరుకు చెందిన సునీల్, మహేశ్, నాగలక్ష్మి, పెన్నయ్య, రవి, వన్నూరుస్వామి, ముత్తక్క కలిసి చీకలగురికికి చెందిన గంగమ్మ, రాజు, సుంకమ్మ,చంద్ర ఘర్షణపడ్డారు. ఈదాడిలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పాల్తూరు పోలీసులు విచారణ చేపట్టారు. 21న ప్రతిభా పురస్కారాలు అనంతపురం: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ఈ నెల 21న లలిత కళాపరిషత్లో ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 580 మార్కులపైగా సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రం, ఇంగ్లిష్ డిక్షనరీ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17లోపు సెల్: 9502097181లో వివరాలు తెలియజేయాలని కోరారు. మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీగా గీతాబాయి కడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) రీజినల్ డైరెక్టర్గా డాక్టర్ గీతాబాయి నియమితులయ్యారు. ఆమె పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతిపై ఇక్కడికి రానున్నారు. ఇక్కడ పని చేస్తున్న రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో డాక్టర్ గీతాబాయి రానున్నారు. -
యూనిఫాం లేదు.. బ్యాగులూ ఇవ్వలేదు
అనంతపురం ఎడ్యుకేషన్: నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ప్రకటించిన ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల సాదాసీదాగా జరిగింది. స్వాగత తోరణాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ప్రజాప్రతినిధుల హాజరు వంటివి అనేక పాఠశాలల్లో కనిపించలేదు. ● కొత్త బ్యాగులు, యూనిఫాంలు, బెల్టులు, షూ–సాక్సులు, నోట్బుక్కులు అందుతాయన్న ఆశతో బడులకు వచ్చిన విద్యార్థులకు ఏవీ అందలేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఏ ఒక్క పాఠశాలలోనూ పంపిణీ కాలేదు. జిల్లాకు బ్యాగులే చేరకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. కొన్ని మండలాలకు యూనిఫాం క్లాత్ చేరినా విద్యార్థులకు అందించలేదు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,93,223 మంది విద్యార్థులు ఉన్నారు. తొలిరోజే పాఠ్యపుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, చాలా పాఠశాలల్లో పంపిణీ పూర్తికాలేదు. జిల్లాకు అవసరమైన 10,16,544 పుస్తకాలలో 9,92,672 టైటిల్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మండలాల నుంచి ఆన్లైన్లో నమోదైన వివరాలను పరిశీలిస్తే విద్యార్థులకు అందిన పుస్తకాల శాతం 50కి కూడా చేరలేదు. ● ‘మనబడి–మన పండుగ’ కార్యక్రమానికి విద్యార్థుల హాజరు కూడా ఆశించిన స్థాయిలో లేదు. జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ, చాలా చోట్ల అలాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఇక మనబడి నాడు–నేడు రెండో విడత పనులు చేపట్టిన పాఠశాలల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. భవనాల మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల పను లు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్లుగా నిలిచిపోయిన పనులను ప్రభుత్వం పట్టించుకోలేదని హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలకాల్సిన పాఠశాలలు కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులను ఆహ్వానించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడులకొచ్చిన విద్యార్థులకు నిరాశే స్వాగతం జిల్లాలో సాదాసీదాగా ‘మనబడి–మన పండుగ’ తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలతో తప్పని ఇబ్బందులు -
ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
తాడిమర్రి:మండలంలోని చిత్రావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కృష్ణవేణి శుక్రవారం తెలిపారు. దాడితోట, నాయనపల్లి పరిధిలోని చిత్రావతి నది నుంచి ఇసుక తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులకు అప్పగించగా, ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేలు జరి మానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. 15 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం రొద్దం: పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లను పరిగి ఇన్చార్జ్ ఎస్ఐ రవికుమార్ శుక్రవారం తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. పెద్దమంతూరు, పి.రొప్పాల గ్రామాలకు చెందిన 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత
తాడిపత్రిటౌన్: వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి కోరుతూ ఎస్పీకి మెయిల్ చేశామని పెద్దారెడ్డి చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా జీపులోకి ఎక్కించి, నియోజకవర్గం దాటించి పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట వద్ద వదిలేశారు. కాగా గురువారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను ర్యాలీకి రావద్దంటూ పోలీసులు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసేశారు. శుక్రవారం తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరింపజేసి కార్యక్రమం జరగకుండా నిలువరించారు. -
చీనీ టన్ను రూ.33 వేలు
అనంతపురం మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.33 వేలు, కనిష్టం రూ.10 వేలు, సరాసరి రూ.20 వేలు పలికాయి. బాధ్యులెవరు.. బాధితులెవరు..?అనంతపురం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అమ్మకానికి పెట్టిన బాగోతం చర్చనీయాంశంగా మారింది.కళ్యాణదుర్గంలో రెచ్చగొట్టిన టీడీపీ కార్యకర్తలుశనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026అనంతపురం రూరల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహా నిరసన శింగనమలలో మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ -
ఇక విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు
అనంతపురం టౌన్: ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రీపెయిడ్ రీచార్జ్ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. మొబైల్ ఫోన్కు రీచార్జ్ చేసుకుంటేనే వ్యాలిడిటీ పెరిగి ఫోన్ మాట్లాడుకునేందుకు ఎలా వీలవుతుందో.. అదే తరహాలోనే రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ వృథాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా స్మార్టు మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జూన్ 1 నుంచి 24 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విధానం అమలులోకి వచ్చింది. ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ప్రతి నెలా రీచార్జ్ చేస్తేనే విద్యుత్ సరఫరా అవుతుంది. 12 నెలల విద్యుత్ బిల్లును ర్యాండమ్గా తీసుకొని నెల వారీగా విద్యుత్ ఖర్చు (యూనిట్లు) ఏమాత్రం ఉంటుందో అంఛనా వేసి, అందుకనుగుణంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజులు ముందుగానే వినియోగదారునికి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇలా మొబైల్కు మెసేజ్ వచ్చిన వెంటనే వినియోగదారుడు ఎంత మేర విద్యుత్ వినియోగించారు.. అందు కోసం పెట్టిన ఖర్చు మిగిలిన బ్యాలెన్స్ వివరాల సమాచారం మొత్తం వినియోగదారునికి మొబైల్లో సందేశాన్ని పంపుతారు. అలా మెసేజ్ వచ్చిన వెంటనే విద్యుత్ వినియోగించడం తగ్గించుకోవడమో..లేదంటే రీచార్జ్ చేసుకోవడమో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. ఒక వేళ రీచార్జ్ చేసుకునేందుకు ఆలస్యమైతే గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేసుకుంటే కొన్ని నిమిషాల్లోనే విద్యుత్ పునరుద్ధరిస్తారు. ఇందు కోసం స్మార్ట్ మీటర్ల కంపెనీ ఒక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, తమ సిబ్బంది చేత మానటరింగ్ చేస్తారు. 200 యూనిట్లు వాడే వినియోగదారులకు.. అనంతపురం జిల్లాలో 14 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 10 వేల కార్యాలయాలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రీపెయిడ్ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్ స్మార్టు మీటర్ల పనితీరు ఎలా ఉంది? అనే వివరాలు జూలై మొదటి వారంలో తెలియనుంది. ఈ విధానంపై ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షలకు పైగా సర్వీసులకు స్మార్టు మీటర్లను ఏర్పాటు చేశారు. అందులో జూన్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంపై అన్ని శాఖల ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి, స్మార్టు మీటర్ల విధానం బాగుదంటే మలివిడతలో 200 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 17 లక్షలకు పైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 200 యూనిట్లు విద్యుత్ వినియోగం ఉన్న సర్వీసులు 2.50 లక్షలకు పైగానే ఉన్నాయి. వాటికి సైతం ప్రీపెయిడ్ స్మార్టు మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ వృథా అరికట్టడంలో కీలకం.. విద్యుత్ వృథా ఖర్చు, దుర్వినియోగాన్ని ప్రీ పెయిడ్ స్మార్టు మీటర్లతో పూర్తి స్థాయిలో అరికట్టడంలో కీలకంగా పనిచేస్తాయి. వీధి దీపాలు ప్రతి రోజు పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూనే ఉంటాయి. స్మార్టు మీటర్లకు వీధి దీపాలను అనుసంధానం చేయడంతో సాయంత్రం 6 గంటలకు వెలుగునిచ్చి ఉదయం 6 గంటలకు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. దీంతో విద్యుత్ ఖర్చు సైతం అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రీపెయిడ్ స్మార్టు మీటర్ల విధానం అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యుత్ వినియోగం సైతం పొదుపుగా వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేస్తున్నాం. వచ్చే నెల 1 నుంచి 200 యూనిట్ల విద్యుత్ వినియోగించే సర్వీసులకు అమలు చేయనున్నాం. స్మార్టు మీటర్ల ఏర్పాటుకు వినియోగదారులు సహకరించాలి. – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం ఉమ్మడి అనంత జిల్లాలో 2 లక్షల కనెక్షన్ల ఏర్పాటు మలి విడతలో 200 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారులకు -
కూడేరు బీసీ బాలికల హాస్టల్ మూసివేత
కూడేరు: బాలికలు తక్కువ సంఖ్యలో ఉన్నారని కూడేరులో బీసీ బాలికల వసతి గృహాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వసతి గృహం అధికారులు కలెక్టర్ ఉత్తర్వుల కాగితాన్ని వసతి గృహం వద్ద శుక్రవారం అతికించారు. ఏటా వసతి గృహంలో బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. గత విద్యా సంవత్సరంలో హాస్టల్లో 12 మంది బాలికలు ఉన్నారు. అందులో నలుగురు కేజీబీవీలో సీటు రావడంతో వెళ్లి పోయారు. అనంతపురానికి చెందిన ఇద్దరు బాలికలు ఉండగా, వారు వెనక్కి వెళ్లారు. దీంతో కేవలం ఆరుగురు బాలికలే మిగిలారు. ఆరుగురికి వార్డెన్, వంట మనిషి, అటెండర్ పెట్టి హాస్టల్ నిర్వహించడం భారమవుతుందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా హాస్టల్ మూసి వేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్న ఆరు మంది బాలికల తల్లిదండ్రుల అంగీకారంతో విడపనకల్లు హాస్టల్లో చేర్పిస్తున్నట్లు వార్డెన్ మాధవీలత తెలిపారు. డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు వేగవంతం అనంతపురం అగ్రికల్చర్: రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకునేందుకు వీలుగా దరఖాస్తు చేసుకున్న వారికి డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని ఏపీఎంఐపీ ఓఎస్డీ చేరెడ్డి పుల్లారెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఏపీఎంఐపీ కార్యాలయంలో ఏపీడీ ధనుంజయతో కలిసి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న డ్రిప్ కంపెనీ డీసీవోలు, ఎంఐ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మార్చితో ముగిసిన 2025–26కు సంబంధించి మంజూరు చేసి ఇంకా మెటీరియల్ సరఫరా చేయకపోవడం, చేసి ఉంటే పొలాల్లో బిగింపు పూర్తి కానివాటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నెలాఖరులోపు వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ప్రస్తుత 2026–27కు సంబంధించి మంజూరు ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ ఇవ్వాలన్నారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రాథమిక తనిఖీ చేయాలన్నారు. వెంటనే బీవోక్యూ, బీఎంఎస్ పూర్తి చేసి రైతు వాటా డిజిటల్ పద్ధతిలో కట్టించాలని ఆదేశించారు. తమ వాటా చెల్లించిన రైతులకు ఆలస్యం చేయకుండా పరికరాలు పంపిణీ చేయాలన్నారు. పరికరాల నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్కు పదోన్నతి అనంతపురం సెంట్రల్: జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అడిషనల్ ఎస్పీ వై.బి.పి.టి.ఎ.ప్రసాద్కు ఎస్పీ (నాన్ కేడర్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం పలువురు విజిలెన్స్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. ఘనంగా సత్కరించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి
బెళుగుప్ప: ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. శుక్రవారం వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో కాలువపల్లి జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఎన్రోల్మెంట్ను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, విద్యార్థి కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. గుత్తి డివిజన్ ఎడ్యుకేషన్ అధికారి లక్ష్మన్న, ఎంఈఓలు గోవిందరాజులు, హరికృష్ణ, హెచ్ఎం సుధామణి, డీటీ గురుబ్రహ్మ పాల్గొన్నారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చుదిద్దుతాం గుమ్మఘట్ట: రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శుక్రవారం రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం ఆర్డీటీ ఫీల్డ్ ఆఫీస్లో నిర్వహించిన ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు సందర్శనల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి 48 వినతులు ప్వీకరించారు. మొదటి వారంలో 36, రెండో వారంలో 28,మూడో వారంలో 23, నాల్గో వారంలో 61 వినతులు స్వీకరించారు. మొత్తం 135 వినతుల్లో ఇప్పటికే 67 వినతులకు పరిష్కరించినట్లు తహసీల్దార్ సూర్యప్రతాప్ తెలిపారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, అధికారులు పాల్గొన్నారు. -
బాధ్యులెవరు.. బాధితులెవరు?
అనంతపురం క్రైం: నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల విక్రయాల విషయం చర్చనీయాంశమైంది. వరుసగా కథనాలు వెలువడినా.. బాధితుల నుంచి ఫిర్యాదులు అందినా.. బాధ్యులెవరు.. బాధితులెవరు అనే విషయాలు వెల్లడించకుండా అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అమ్మకాల బాగోతం చాలాకాలంగా సాగుతోంది. ఈనెల 10న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల అమ్మకాల వ్యవహారం మరోమారు వెలుగుచూసింది. తన తల్లి మరణ ధువ్రీకరణ పత్రం జారీ కోసం రూ.1800 డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేశారని నగరంలోని మారుతీనగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో బాగోతం మరోమారు వెలుగుచూసింది. మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారంపై వరుసగా ఆరోపణలు, ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2025 నవంబర్ 26న మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సంబంధిత ఆధారాలు, పత్రాలు బయటకు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపడతామని అధికారులు చెప్పినా.. ఇప్పటికీ పట్టించుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జారీ చేయాల్సిన మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మధ్యవర్తుల ద్వారా రూ.1,800 వసూలు చేసినట్లు డిజిటల్ చెల్లింపు ఆధారాలతో సహా ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. చెల్లింపులకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఒకటి కాదు... రెండు కాదు... వరుసగా ఒకే విభాగంపై ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందాయి. అయినా బాధ్యులు ఎవరు?, వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? విచారణ ఎక్కడ ఆగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం లభించడం లేదు. ఉన్నతాధికారులు ఈ అక్రమార్కులను, లంచావతారులను ప్రోత్సహిస్తున్నారా? లేక ఈ తీగ లాగితే ఎవరి డొంక ఎక్కడ కదులుతుందోనని మౌనంగా ఉన్నారో తెలియాల్సి ఉంది. డిజిటల్ చెల్లింపులు చేశారు తాజాగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి ఉద్యోగులు, సిబ్బంది ఏ ఒక్కరూ డబ్బు డిమాండ్ చేయలేదు. మహేష్ అనే వ్యక్తి తనకు ఎక్స్ట్రా కాఫీలు కావాలని అడిగితే వాటికి సంబంధించి మీ సేవ సెంటర్లో తీసుకోవాలని చెప్పారని తెలిసింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. వాస్తవాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం. ప్రజలు ఎవరు లంచం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి. – సునీత, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ ‘అమ్మకానికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఫిర్యాదులందినా నగరపాలక సంస్థ అధికారుల మౌనం -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: పట్టణంలోని డీఎల్ఆర్ కాలనీ సమీపంలో రైలు కిందపడి టీడీపీ కార్యకర్త, స్టోర్ డీలర్ గుద్దిటి అనిల్కుమార్ (36) శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం రైల్వే హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన మేరకు.. ధర్మవరం పీఆర్టీ వీధికి చెందిన గుద్దిటి నాగార్జున, వరలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు గుద్దిటి అనిల్కుమార్. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. డీఎల్ఆర్ కాలనీ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో హిందూపురం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధా రాలు లేకపోవడంతో శవాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడు అనిల్కుమార్గా గుర్తించారు. అప్పులు ఎక్కువగా చేయడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దివ్యాంగురాలి ఆత్మహత్య ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దివ్యాంగురాలు రాజ్యలక్ష్మి(21) ఉరివేసుకొని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. టూ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన మేరకు..పట్టణంలో ఇందిరమ్మ కాలనీకి చెందిన రామంజనేయులు, అవేట పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు రాజ్యలక్ష్మి ఉన్నారు. కూతురు పుట్టుకతోనే చెవుడు, మూగ. ఈమె జీవితంపై విరక్తి చెంది ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
స్ప్రింక్లర్ల దొంగలను పట్టించిన రైతులు
గుంతకల్లు రూరల్: పొలాల్లో స్ప్రింక్లర్లు, పైపులు ఎత్తుకెళ్లే దొంగలు, వాటిని కొనుగోలు చేసే మరో వ్యక్తిని రూరల్ పోలీసులకు రైతులు శుక్రవారం పట్టించారు. రైతులు, రూరల్ ఎస్ఐ బాలముని తెలిపిన మేరకు.. నక్కనదొడ్డి, తిమ్మాపురం, నల్లదాసరపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లో ఐదారునెలలుగా స్ప్రింక్లర్లు, పైపులు చోరీకి గురవుతున్నాయి. అప్పలనాయుడు అనే వ్యక్తి రాజమండ్రి నుంచి వలస వచ్చి తిమ్మాపురం సమీపంలో నర్సరీ, భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. స్ప్రింక్లర్లు, పైపులు కొనుగోలు చేసి, వాటిని తన పొలానికి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఆరాతీయగా.. తిమ్మాపురానికి చెందిన వినోద్, మరికొందరితో కలిసి రైతుల పొలాల్లో స్ప్రింక్లర్లు, పైపులను చోరీ చేసి, వాటిని అప్పలనాయుడుకు విక్రయించేవారు. వాటిని గుర్తించిన రైతులు సుమారు 50 మందికి పైగా శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వినోద్, అప్పలనాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆటో డ్రైవర్పై వేటకొడవళ్లతో దాడి బుక్కరాయసముద్రం: చెన్నంపల్లికి చెందిన మణికంఠ అనే ఆటో డ్రైవర్పై బొమ్మలాటపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో శుక్రవారం రాత్రి దాడి చేశౠరు. పోలీసులు తెలిపిన మేరకు..గ్రామానికి చెందిన మణికంఠ అనంతపురం – నార్పల రూట్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మణికంఠ శుక్రవారం రాత్రి నార్పల నుంచి చెన్నంపల్లికి ఆటోలో వెళ్తుండగా.. బొమ్మలాటపల్లి సమీపంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోను అటకాయించి, మణికంఠపై వేట కొడళ్లతో దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు 108 వాహనం ద్వారా చికిత్ర నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.20 కోసం హత్య.. ట్యాక్సీ డ్రైవర్ మృతి!
రాప్తాడు రూరల్: రూ.20 కోసం గొడవ.. ఒకరి హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు విచక్షణారహితంగా దాడి చేయడంతో ట్యాక్సీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పాపంపేట జుడియో షోరూం పక్కన శేఖర్ అనే వ్యక్తి కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. బిల్లు రూ.120 అయ్యింది. రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 వెనక్కు ఇచ్చాడు. అయితే ఇంకా రూ.20 వెనక్కు ఇవ్వాలని ఆ ఇద్దరు యువకులు అడిగారు. ఇందుకు వ్యాపారి ఇవ్వలేదు. మాటామాటా పెరిగి శేఖర్పై దాడి చేశారు.సర్దిచెప్పేందుకు వస్తే ప్రాణం తీసేశారుకూరగాయల దుకాణం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అక్కడే ఉన్న పాపంపేటకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర (55) జోక్యం చేసుకున్నాడు. ఇద్దరినీ సముదాయించి గొడవను ఆపాలని ప్రయత్నించాడు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకులు విచక్షణ కోల్పోయి ముఖం, ఛాతీపై పిడిగుద్దులు గుద్దడంతో చంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. రూ.20 చిల్లర విషయంలో మొదలైన వాగ్వాదం చివరకు ఒక కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. సమాచారం అందుకున్న చంద్ర భార్య, పిల్లలు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘గొడవ ఆపడానికి వెళ్లిన మా మనిషిని ఇలా పొట్టన పెట్టుకున్నారు‘ అంటూ భార్య రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.నిందితుల కోసం గాలింపుఅనంతపురం రూరల్ సీఐ శ్రీకాంత్యాదవ్, ఎస్ఐ ధరణిబాబు సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కూరగాయల వ్యాపారితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికే అక్కడి నుంచి పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి ఆనవాళ్లు గుర్తించినట్లు తెలిసింది. -
16న దివ్యాంగులతో థీమాటిక్ యోగా
అనంతపురం అర్బన్: యోగాంధ్రలో భాగంగా ఈ నెల 16న దివ్యాంగుల కోసం జిల్లాస్థాయి థీమాటిక్ యోగా ప్రదర్శన పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ప్రతి జిల్లాకూ ఒక థీమ్ ఇచ్చారన్నారు. ఈ క్రమంలో జిల్లాకు దివ్యాంగుల యోగా ఇచ్చారన్నారు. మంగళవారం అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో దివ్యాంగుల కోసం థిమాటిక్ యోగా ప్రదర్శనకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు దివ్యాంగులకు సహకరించేలా చూడాలని ఎన్సీసీ కమాండెంట్, జిల్లా కో–ఆర్డినేటర్ను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించి రవాణా, వసతి, భద్రత, వైద్యసదుపాయం, తదితర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. 18న తాడిపత్రి శ్రీబుగ్గ లింగేశ్వరస్వామి ఆలయంలో, 20న గుత్తికోట ప్రాంతంలో ప్రత్యేక పర్యాటక డెస్టినేషన్ యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆయుష్ వైద్యాధికారులు లాల్యానాయక్, తిరుపతినాయుడు, ఆర్టీఏ సురేష్నాయుడు, ఆస్పత్రి పరిపాలనాధికారి మల్లికార్జునరెడ్డి, ఆర్ఐఓ వెంకటరమణ, డీఎస్డీఓ మంజుల, ఏపీఎంఎస్ఐ డీసీ రామ్మెహన్, ఐఅండ్పీఆర్ ఏపీఆర్ఓ ఫకృద్ధీన్, తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులిచ్చాం.. రికవరీ చేస్తాం
జిల్లాలోని అన్ని మండలాల్లో గత ఏడాది సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ సభలు నిర్వహించాం. రికవరీ కావాల్సిన మొత్తానికి సంబంధించి ఇప్పటికే కొందరు బాధ్యులకు నోటీసులిచ్చాం. రికవరీ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. ఆ మేరకు ఆయా మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి నిధుల రికవరీ కోసం చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, జిల్లా విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేపట్టాలి ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటు చేసుకోవడం దారుణం. అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి దుర్వినియోగమైన నిదులను అక్రమార్కుల నుంచి రాబట్టాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం -
నేడు మోగనున్న బడిగంట
అనంతపురం ఎడ్యుకేషన్/ రాయదుర్గం టౌన్/ కూడేరు: వేసవి సెలవులు ముగిశాయి. రెండు నెలలుగా ఆటపాటలతో గడిపిన విద్యార్థులు శుక్రవారం నుంచి మళ్లీ బడిబాట పట్టనున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యలు, అసంపూర్తి కిట్లు, తాగునీటి ఇబ్బందులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 1,95,223 మంది విద్యార్థులకు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నప్పటికీ, పలు సమస్యలు వారికి స్వాగతం పలకనున్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు ఈసారి తొలి రోజున విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందే పరిస్థితి కనిపించడం లేదు. కిట్లలో ఉండే తొమ్మిది రకాల వస్తువుల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. మూడు జతల యూనిఫాం, బెల్టులు, బ్యాగులు, షూ–సాక్సులు, డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్ తదితర సామగ్రి సరఫరా ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అధికారుల సమాచారం ప్రకారం కొన్ని మండలాలకు మాత్రమే బెల్టులు, షూ–సాక్సులు, వర్క్బుక్స్ చేరాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా పూర్తికాలేదు. మిగిలిన సామగ్రి మరో పది రోజుల వ్యవధిలో విద్యార్థులకు అందే అవకాశం ఉందని చెబుతున్నారు. పాఠశాలల్లో తాగునీటి సమస్య ఆర్ఓ ప్లాంట్లు నిర్వహణ లోపాలతో పని చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు రెండో దశ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో అనేక పాఠశాలల్లో తరగతి గదుల కొరత కొనసాగుతోంది. కొన్ని చోట్ల 90 శాతం నిర్మాణ పనులు పూర్తయినా మిగిలిన చిన్నపాటి పనులు పూర్తి కాకపోవడంతో భవనాలు వినియోగంలోకి రావడం లేదు. వేసవి సెలవుల సమయంలోనే ఈ పనులు పూర్తి చేసి ఉంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు. రాయదుర్గంలోని పాఠశాలలో ఆగిన అభివృద్ధి పనులు కూడేరు హైస్కూల్లో బాలికల టాయిలెట్ల తలుపుల దుస్థితి మౌలిక వసతులు కల్పించాలి కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు, విద్యా బోధన ఉందని ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో బడులను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. సమస్యలతో పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి పాఠశాలల్లో అత్యవసరమైన మరుగుదొడ్లు, మంచినీరు వంటి మౌలిక వసతులను కల్పించాలి. – మంజునాథ్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సమస్యల మధ్యే విద్యార్థులకు స్వాగతం పూర్తిస్థాయిలో అందని విద్యార్థి మిత్ర కిట్లు చాలా పాఠశాలల్లో పనిచేయని ఆర్ఓ ప్లాంట్లు అసంపూర్తిగా నిలిచిన ‘నాడు–నేడు’ భవనాలు -
చెరువులో నీటమునిగి బాలుడి మృతి
గుంతకల్లు రూరల్: సరదాగా తెప్ప ఎక్కి.. ప్రమాదవశాత్తూ చెరువులోకి పడిపోయిన బాలుడు నీటమునిగి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. వై.టి.చెరువు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో గురువారం గ్రామంలోని చెరువులో చేపలు పడుతుండటంతో లక్ష్మీనారాయణ తన కొడుకు పవన్(9)తో కలిసి చేపలు కొనేందుకు వెళ్లాడు. చేపలు ఇంకా పడుతుండటంతో ఆలస్యం అవుతుందని లక్ష్మీనారాయణ ఓ చెట్టుకింద కూర్చున్నాడు. కుమారుడు పవన్ ఇతర పిల్లలతో కలిసి చెరువు మేరలో నీటిపై నిలిపి ఉంచిన తెప్పలో దిగి అడుకుంటున్నాడు. పట్టుతప్పిన పవన్ తెప్పలోనుంచి నీటిలో పడి మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రి తెప్ప దగ్గరకు వెళ్లి పిల్లలను అడిగాడు. వాళ్లు తమకు తెలియదు అని చెప్పడంతో చెరువు బయట, చుట్టుపక్కల గాలించాడు. అయినప్పటికీ ఆచూకీ కనిపించకపోవడంతో నీటిలో పడిపోయాడేమో అన్న అనుమానంతో స్థానికులు తెప్ప పక్కనే ఉన్న గుంతలో గాలించి పవన్ను బయటకు తీశాడు. అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సమస్యలపై దృష్టి పెట్టండి
అనంతపురం న్యూటౌన్: జిల్లా పరిషత్ పరిధిలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం జిల్లాపరిషత్ మీటింగ్ హాలులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పరిపాలనాధికారుల(ఏఓ) సమావేశం నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ–ఆఫీసు వ్యవస్థ సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏఓలదేనని స్పష్టం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. అందుకు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాల్సిన అవసరముందన్నారు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా విభజన సమాచారంతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఏఓలకు సూచించారు. అనంతరం ఏఓలు.. జెడ్పీ సీఈఓను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మంత్రి వచ్చాకే వేరుశనగ పంపిణీ అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్లో తొలకరి వర్షాలు పడుతున్నాయి. రైతులు సేద్యపు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే విత్తన వేరుశనగ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లాకు వచ్చాకే విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెడతామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఆయన ఎప్పుడు తీరిక చేసుకుని వస్తారో.. విత్తనకాయలు ఎప్పుడు ఇస్తారో అని రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్లో అనంతపురం జిల్లాలో 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 72 వేల క్వింటాళ్ల వేరుశనగ పంపిణీకి ప్రణాళిక రచించారు. ఇప్పటి వరకు 17,365 మంది రైతులు 15,285 క్వింటాళ్ల విత్తన వేరుశనగకాయల కోసం ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే మండలాలకు 10 వేల క్వింటాళ్ల వరకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ గుంతకల్లు: బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఆలూరు రోడ్డు ద్వారక నగర్లో నివాసముంటున్న షమీవుల్లా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బంగారు షాపు నిర్వహిస్తున్నాడు. పిల్లలను విజయవాడలో స్కూల్లో చేర్చడానికి భార్య ఫర్హానతో కలిసి వారం రోజుల కిత్రం వెళ్లాడు. అక్కడ పిల్లలను స్కూల్లో చేర్పించిన తరువాత భార్య పుట్టినిల్లు అయిన బళ్లారికి పంపించి.. షమీవుల్లా విజయవాడలోనే ఉండిపోయాడు. ద్వారకానగర్లో షమీవుల్లా పై అంతస్తులో ఉంటూ కింద రెండు దుకాణాలను బాడుగుకు ఇచ్చాడు. ఒక షాపులో కరెంట్ లేకపోవడంతో అద్దెకున్నవారు ఓనర్ షమీవుల్లాకు ఫోన్లో తెలియజేశారు. దీంతో ఆయన తన భార్య ఫర్హానకు చెప్పడంతో గురువారం సాయంత్రం బళ్లారి నుంచి గుంతకల్లు వచ్చింది. ఇంటి వేసిన తాళం పగలుగొట్టి ఉండటం చూసి కంగుతుంది. బెడ్రూమ్లోకి వెళ్లి చూస్తే బీరువాను తెరిచి.. బట్టలు మొత్తం చిందరవందరగా పడి ఉండటంతో భర్తకు ఫోన్ ద్వారా సమాచారమందించింది. 18 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు కనిపించలేదని తెలిపింది. దీంతో షమీవుల్లా వన్టౌన్ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆర్టీసీ బస్సు కీ అపహరణ ● అరగంట పాటు ఆగిన బస్సు గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో గురువారం ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు పుట్టపర్తి నుంచి మంత్రాలయం వెళ్లే ఆర్టీసీ బస్సు కీని అపహరించాడు. దీంతో బస్సు అరగంట పాటు ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ బస్టాండ్లో బస్సును ఆపి టీ తాగడానికి వెళ్లాడు. తిరిగి వచ్చాక బస్సు తాళం చెవి కనిపించలేదు. కంగారు పడి అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులకు చెప్పాడు. పోలీసులు మైక్లో తాళాల విషయంపై అనౌన్స్ చేశారు. కీ తీసుకున్న వారు ఇచ్చేయాలని, లేకుంటే సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కీ తీసుకెళ్లిన ప్రయాణికుడు వాటిని పోలీసులకు అప్పగించాడు. ఆకతాయి చేష్టలు చేసినందుకు సదరు వ్యక్తికి పోలీసులు దేహశుద్ధి చేశారు. అరగంట తర్వాత బస్సు మంత్రాలయం బయలుదేరి వెళ్లింది. -
రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక మేటలతో ఎడారి ఛాయలు కనిపించే వ్యవసాయ భూముల్లో రైతులు ఆశల సేద్యానికి సిద్ధమయ్యారు. ప్రతి ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగు చేస్తారు. గాలి తీవ్రతకు ఇసుక రేణువులు పంటపైకి రాకుండా చూడగలిగితే మంచి దిగుబడులు వస్తాయి. ఇందు కోసం రైతులు అధిక పె
నాగేపల్లి వద్ద ఇసుక భూముల్లో విత్తనం విత్తుతున్న రైతులు కణేకల్లు: కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని మాల్యం, తుంబిగనూరు, నాగేపల్లి, గరుడచేడు, మీన్లహళ్లి, దర్గాహోన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం తదితర గ్రామాలు వేదవతి హగరి నది ఒడ్డున ఉన్నాయి. ఇక్కడ సుమారు 15వేల ఎకరా పట్టా భూముల్లో ఇసుక మేటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి రైతులకు వ్యవసాయమే జీవనాధారం. ఆ ఇసుకమేట వేసిన భూముల్లోనే ప్రతి ఏటా ఖరీఫ్లో వేరుశనగ సాగు చేస్తూ వస్తున్నారు. దుక్కుల నుంచి విత్తు, కోతలు.. పంట దిగుబడులు ఇంటికి చేర్చే వరకు గాలికి లేచే ఇసుకతో రైతులకు ఇబ్బందులు తప్పవు. వేరుశనగ విత్తు ఆరంభం ఖరీప్ సీజన్ ప్రారంభమైంది. రెండు వారాలుగా ముందస్తు వర్షాలు కురుస్తుండటంతో మాల్యం, తుంబిగనూరు, గరుడచేడు, మీన్లహళ్లి, బిదరకుంతం, దర్గాహొన్నూరు, గోవిందవాడ తదితర గ్రామాల్లో రైతులు భూములను చదును చేసి.. ఎద్దులతో గొర్రు వేసి వేరుశనగ విత్తనాలను విత్తి ఆశల పంటకు శ్రీకారం చుడుతున్నారు. విత్తనాల విత్తే పనిలో ఈ ప్రాంత రైతులు బిజీ అయిపోయారు. ఎగిసిపడే ఇసుకతోనే ముప్పు ఆషాఢ గాలుల తరహాలో ప్రస్తుతం గాలులు బలంగా వీస్తుండటంతో ఇసుక మేటల ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలికి ఎగిసిపడే ఇసుక రేణువులతో వేరుశనగ పంట మొలకలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పంటను రక్షించుకోవాలంటే చుట్టూ పత్తి కట్టె, పాత చీరలతో కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పంట రక్షణ ఇలా.. వాస్తవానికి విత్తనం విత్తిన రోజే కంచెలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే విత్తనం విత్తి అలసిపోయి ఉంటామని మరుసటి రోజు ఎన్ని పనులున్నా... మానుకొని కంచెలు వేసేస్తుంటారు. పత్తి కట్టి దొరక్కపోతే ఇళ్లలో ఉన్న పాత చీరలతో కంచె వేస్తుంటారు. కంచె వేసే విషయంలో రెండు, మూడ్రోజులు ఆలస్యం చేస్తే గాలికి ఎగిసిపడే ఇసుక రేణువుల వల్ల విత్తిన విత్తనం కొట్టుకోపోతుంది. ఖరీఫ్ వేరుశనగ సాగుకు రైతుల సన్నద్ధం గాలికి ఎగిసి పడుతున్న ఇసుక రేణువులు పాతచీరలు.. పత్తి కట్టెలే రక్షణ కవచాలు -
రూ. 3.61 కోట్లు హాంఫట్!
● ‘ఉపాధి’ నిధులు మింగిన ఘనులు ● రికవరీ వేటలో అధికారులు అనంతపురం న్యూటౌన్: ఉపాధి హామీ పథకంలో దొంగలు పడ్డారు. అక్రమార్కులంతా ఒకటయ్యారు. కూలీల ఉపాధి ఊపిరి తీశారు. రూ. 3.61 కోట్ల మేర వివిధ రూపాల్లో అవకతవకలకు పాల్పడి కూలీల పొట్ట కొట్టారు. దుర్వినియోగమైన నిధుల రికవరీ వేటలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదీ స్థూలంగా జిల్లాలో ఉపాధి హామీ కింద గత ఏడాది జరిగిన గోల్మాల్ చిట్టా వివరాలు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పనులు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. 31 మండలాల పరిధిలో గత ఏడాది సామాజిక తనిఖీ నిమిత్తం ఆయా మండల కేంద్రాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కూలీలకు ఉపాధి కల్పించే పనుల్లోనూ, కార్యాలయ ఖర్చుల వివరాల నమోదు తదితర అంశాల్లో పారదర్శకత కల్పించడమే సామాజిక తనిఖీల ముఖ్యోద్దేశం. చేయని పనులకు బిల్లులు చెల్లించడం, మస్టర్లో బినామీ, తప్పుడు పేర్లు నమోదు చేయడం, పనికి రాకున్నా మరొకరి పేర్లతో కూలి వేతనాలు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి నిధుల వినియోగం లాంటి అనేక రూపాల్లో నిధుల దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అదేవిధంగా చేసిన పనుల్లో కొలతలు తేడాలుండడాన్ని జిల్లా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కొన్ని మండలాల్లో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణా లోపాన్ని కనుగొన్నారు. మరి కొన్ని మండలాల్లో ఒకే పనికి రెండు దఫాలుగా బిల్లులకు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. రికవరీ కోసం వేట గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో జిల్లాలోని 31 మండలాల్లో రూ.3,61,80,678 నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు అక్రమాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. వీరి నుంచి రికవరీ కోసం విజిలెన్స్ అధికారులు గురువారం నుంచి వేట ప్రారంభించారు. పలు మండలాల్లో సదరు సిబ్బందిని పిలిపించి విచారణ చేసి.. రికవరీకి చర్యలు చేపట్టారు. -
అదనపు బాధ్యతల నుంచి తప్పుకున్న ఖుష్బూకొఠారి
● సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎఫ్ఏసీగా శ్రీనివాసరావుకు బాధ్యతలు అనంతపురం ఎడ్యుకేషన్: ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకురాలు (డీడీ) ఎఫ్ఏసీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన బీసీ సంక్షేమశాఖ జిల్లా ఉపసంచాలకురాలు ఖుష్బూ కొఠారి అభ్యర్థనకు కలెక్టర్ ఆనంద్ ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ ఎఫ్ఏసీ బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుకు అప్పగించారు. ఖుష్బూ కొఠారి గత ఏడాది జూలై నుంచి అదనంగా సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఎఫ్ఏసీ) బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అటు బీసీ సంక్షేమ శాఖ, ఇటు సాంఘిక సంక్షేమ శాఖ రెండు కీలక బాధ్యతలతో పాటు జిల్లాలోని వందకు పైగా హాస్టళ్ల పర్యవేక్షణ చేయాల్సి రావడం ఆమైపె తీవ్ర పని భారాన్ని మోపింది. ఇదిలా ఉండగా.. సంక్షేమ హాస్టళ్లలో తరచూ తలెత్తుతున్న వివిధ సమస్యలు, వివాదాలు, పరిపాలనా అంశాలు అదనపు ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ఈ బాధ్యతలను కొనసాగించడం కష్టసాధ్యంగా మారిందని సమాచారం. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఎఫ్ఏసీ బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ఆమె ఉన్నతాధికారులను కోరుతూ వచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఆమె విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూల నిర్ణయం తీసుకుని బాధ్యతల మార్పునకు ఆమోదం తెలిపారు. దీంతో సాంఘిక సంక్షేమశాఖ డీడీ (ఎఫ్ఏసీ) బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుకు అప్పగించారు. బుధవారం ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. -
వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచకాలు
రాప్తాడు రూరల్: రాష్ట్రంలో వ్యవస్థలను శాసించే స్థాయిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇలాంటి అరాచక పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బుధవారం ఆయన అనంతపురంలో తోపుదుర్తి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. విశ్రాంత జిల్లా జడ్జి కృష్ణప్పతో కలిసి ఆయన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నవోలు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ... వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన మహేశ్వరరెడ్డి ఆత్మహత్య ఘటనను అప్పటి నుంచి హత్యగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేశారన్నారు. ఆ ఘటనను సాకుగా తీసుకుని తోపుదుర్తి కుటుంబంపై నిందలు మోపి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించారని అన్నారు. ప్రజల్లో ఆ కుటుంబాన్ని చులకన చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించారని పేర్కొన్నారు. చివరకు దర్యాప్తులో మహేశ్వరరెడ్డి మృతిని ఆత్మహత్యగా నిర్ధారించారన్నారు. అయితే మృతుడి తండ్రి ఫిర్యాదులో ఆత్మహత్యకు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి బెదిరింపు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారని గుర్తు చేశారు. అదే ఫిర్యాదులో తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కూడా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏ తప్పూ చేయని తోపుదుర్తి కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించిందన్నారు. ఎలాంటి ఆరోపణలు నిరూపించలేకపోవడంతో చివరకు అక్రమ కేసు బనాయించారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదలకు విస్తృత స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా పూర్తి రక్షణ, గౌరవం కల్పించారని పొన్నవోలు గుర్తు చేశారు. పోలీసులు కూడా పూర్తి స్వతంత్రంగా వ్యవహరించారన్నారు. శాంతిభద్రతల విషయంలో అప్పట్లో ఎస్పీలు ఎమ్మెల్యేల మాటలు కూడా వినే పరిస్థితి ఉండేది కాదన్నారు. చివరకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్లకు కూడా తగిన రక్షణ కల్పించారన్నారు. నేడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డికి భద్రతను తొలగించడం సమంజసం కాదని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి తోపుదుర్తి కుటుంబానికి పరామర్శ -
ఇంజినీరింగ్లో కోర్ బ్రాంచులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. ఐదేళ్ల క్రితం ఈ బ్రాంచ్ల్లోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు.. గత విద్యా సంవత్సరంలోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు మధ్
అనంతపురం: కంప్యూటర్ సైన్సెస్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించిన వారు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ‘సాఫ్ట్వేర్’ కొలువులు దక్కక చతికిలపడుతున్నారు. ఏపీఈఏపీ సెట్లో అర్హత సాధించిన వారిలో 80 శాతం మంది సీఎస్ఈ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర కోర్ బ్రాంచుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈసీఈ మినహా మిగిలిన కోర్ బ్రాంచ్ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. 8 శాతమే స్కిల్డ్ ఉద్యోగాలు ఇంజినీరింగ్లో ప్రతి 100 సీట్లలో 80 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్సెస్ వాటి అనుబంధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కొలువులు తగ్గుముఖం పట్టడంతో 8 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన వారు కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే కొలువులు దక్కుతున్నా.. గణనీయమైన ప్యాకేజీ కావాలన్న ఆశతో అవకాశాలను వదులుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోడింగ్ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై సాధికారిత లేకపోవడంతో ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయి. ● బీటెక్ అనంతరం మూడు, నాలుగు సంవత్సరాల సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అనంతరం ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే.. ఈమధ్య కాలానికి ఉద్యోగం చేసినట్లు సర్వీస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉందని చెబితే.. అందుకు తగ్గట్టు నైపుణ్యాలు లేనందున రెండు, మూడు నెలలకే ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్ కోర్సుల్లో బీటెక్ పూర్తి చేసినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నైపుణ్యం కలిగిన అధ్యాపకులేరీ? బీటెక్ 2, 3, 4 సంవత్సరాల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరి. కంప్యూటర్ సైన్సెస్, ఐటీ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం గల అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ వంటి ఐటీ ఆధారిత కోర్సులకు ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేసిన అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ మాత్రం ‘స్వయం’ (ఆన్లైన్) 20 కోర్సులు పూర్తి చేసిన వారు సీఎస్ఈ, వాటి ఆధారిత కోర్సుల్లో అధ్యాపకులుగా ఉండొచ్చని నిర్దేశించింది. ఈ కోర్సులు చేసి అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారు. ఫలితంగా ఈ కోర్సుల విద్యార్థులకు తగిన శిక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికంగా కంప్యూటర్ సైన్సెస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నా.. అందుకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో నైపుణ్యాల కొరత వేధిస్తోంది. సాఫ్ట్వేర్ కొలువులకు వెళ్లే అభ్యర్థులను నిమిషాల వ్యవధిలోనే కొత్త కోడ్ రాయాలని బహుళ జాతి కంపెనీలు నిర్దేశించి.. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు అభ్యర్థులు నైపుణ్యాల లేమి కారణంగా ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు. 80 శాతం మంది కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్సెస్ వైపు మొగ్గు ఆ కోర్సులు బోధించే అధ్యాపకుల్లో వెంటాడుతున్న నైపుణ్యాల కొరత సాఫ్ట్వేర్ కొలువులు దక్కకనిరాశానిస్పృహలు ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న కోర్ బ్రాంచుల వైపు ఆసక్తి చూపనివిద్యార్థులు -
జీడిపల్లి రిజర్వాయర్ పరిశీలన
బెళుగుప్ప/ఆత్మకూరు: మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ను అసిస్టెంట్ కలెక్టర్లు శర్వాన్కుమార్రెడ్డి, హరిఓం పాండియా, ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజ, ప్రియ, సుయాస్ కుమార్, వెంకటేశ్ బన్నాలు బుధవారం పరిశీలించారు. జీడిపల్లి పంపు హౌస్ వద్ద అసిస్టెంట్ కలెక్టర్లకు తహసీల్దార్ అనిల్కుమార్ స్వాగతం పలికారు. రిజర్వాయర్ స్థితిగతులను వివరించారు. అనంతరం హంద్రీ–నీవా చీఫ్ ఇంజినీర్ నాగరాజ,హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ శ్రీనివాసులు,రెవెన్యూశాఖలఅధికారులతో అసిస్టెంట్ కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలతో కృష్ణాజలాలు జీడిపల్లికి చేరుకుంటాయని హంద్రీ–నీవా ఉన్నతాధికారులు వివరించగా, రిజర్వాయర్ పరిసరాలు, పంటల సాగుపై మండల రెవెన్యూ అధికారులు వివరించారు. అంతకుముందు ఆత్మకూరు, సిద్దరాంపురం గ్రామ పొలాల్లో రైతులు సాగు చేసిన టమాట, మామిడి పంటలను పరిశీలించారు. మార్కెట్ పరిస్థితిపై రైతులతో ఆరా తీశారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఆర్ఐ నగేష్బాబు, హెచ్ఎన్ఎస్ఎస్ డీఈ రామసుబ్బయ్య, రిజర్వాయర్ ఏఈలు పృధ్వి, దాదాఖలందర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ ● 12 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరణగుంతకల్లు: కాశీ యాత్రకు వెళ్లిన ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడి 12 తులాల బంగారం ఆభరణాలతోపాటు 50 తులాల వెండి, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక డీజిల్ షెడ్లో పని చేసే జే. తిమ్మరాజు పాత గుంతకల్లులోని అంకాలమ్మగుడి సమీపంలోని సచివాలయం వద్ద నివాసముంటున్నారు. మంగళవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిమ్మరాజు కాశీ యాత్రకు వెళ్లారు. ఇదే అదునుగా దొంగలు మంగళవారం అర్ధరాత్రి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న విలువైన వస్తువులతోపాటు నగదు అపహరించి పరారయ్యరు. ఇంటి తాళం తెరిచి ఉండటం గమనించిన స్థానికులు తిమ్మరాజుకు ఫోన్లో సమాచారం చేరవేశారు. టూటౌన్ పోలీసులకు తిమ్మరాజు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే ఇంటి వద్దకు చేరుకుని పరిశీలించారు. క్లూజ్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. టూటౌన్ సీఐ వంశీకృష్ణ మాట్లాడుతూ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. టపాసుల నిల్వ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలిఅనంతపురం సెంట్రల్: టపాసుల నిల్వ కేంద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. నగర శివారులోని ఫెడ్కాన్ క్రాకర్స్ నిల్వ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో భద్రపరిచిన నిల్వల వివరాలు చెక్లిస్ట్ ప్రకారం పరిశీలించారు. రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల సమన్వయంతో సమస్యలు లేకుండా ఫెడ్కాన్ క్రాకర్స్ కేంద్రంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయభాస్కర్, ఆర్ఐ సందీప్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యూనియన్ లోన్ విభాగం ప్రారంభం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే అన్ని వర్గాల అభ్యున్నతికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం స్థానిక సంగమేష్నగర్ యూనియన్ బ్యాంకులో కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ, రీటైల్ లోన్ విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వివిధ సబ్సిడీ రుణాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్స్, రైతులు, మహిళలు, ఎఫ్పీవోలు, నిరుద్యోగ యువతకు అందించి వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. వినియోగదారులు సంతృప్తి చెందేలా బ్యాంకుల సేవలు పెంచాలని తెలిపారు. విద్య, వాహన, గృహ, ఫుడ్ప్రాసెసింగ్ రుణాలు కూడా పెంచాలన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలకు విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజక వర్గ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు తిరుపతి జోనల్ జనరల్ మేనేజర్ శ్రీపతిశ్రీనివాసన్, రీజనల్ హెడ్ వంశీక్రిష్ణ, ఆర్ఎల్పీ విభాగం అధికారి కొసిగి వెంకటేశ్వర్లు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. విరివిగా రుణాలివ్వాలని కలెక్టర్ సూచన -
సాయం కోసం ఎదురుచూపు
అనంతపురం అగ్రికల్చర్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఏడాది రూ.400 కోట్ల మేర ‘అన్నదాత సుఖీభవ’ సొమ్ము ఇవ్వకుండా ఎగ్గొట్టేసిన ప్రభుత్వం... రెండో ఏడాది మాత్రం అతికష్టమ్మీద అందించారు. అందులోనూ 25 వేల మంది వరకు రైతులకు జాబితాలో చోటు కల్పించలేదు. ఇక ఈ ఏడాది సుఖీభవ కింద మొదటి విడత ఎప్పుడిస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే జిల్లాలో ఖరీఫ్ మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దక్కులు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతరత్రా పంట పెట్టుబడులకు ఇబ్బంది పడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పథకాల అమలు అస్తవ్యస్తం ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు, అలాగే 2024 రబీ, 2025 ఖరీఫ్లో కరువు మండలాల రైతులకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) గురించి చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. గత రెండేళ్లకు సంబంధించి రూ.120 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో పెట్టేశారు. ఇక వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా లాంటి పంటల బీమా పథకాలను అస్తవ్యస్తం చేయడంతో రైతులకు పరిహారం రాకుండా పోతోంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉచితంగా అమలు చేసిన పంటలబీమాను చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలని భారం మోపడంతో పాటు నిబంధనల మేరకు పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తుండటంతో రైతులు మండిపడుతున్నారు. ● రబీ–2024, ఖరీఫ్–2025లో జిల్లా రైతులు తమ వాటా కింద రూ.కోట్లలో ప్రీమియం చెల్లించారు. ఐదు వ్యవసాయ సీజన్లకు సంబంధించి ఇన్సూరెన్స్ ఏమైందో పాలకులు చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి తమ వాటా ప్రీమియం కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. పంటలు పండక అప్పులపాలై ఈ రెండేళ్లలో దాదాపు 100 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క బాధిత కుటుంబానికి కూడా ఎక్స్ గ్రేషియా చెల్లించకుండా మభ్యపెడుతున్నారు. ఉత్తుత్తి పంట రుణాలు రైతులకు మేలు జరిగేలా బ్యాంకుల ద్వారా పంట రుణాలు చురుగ్గా కొనసాగుతున్నట్లు చెబుతున్నా.. వాస్తవంగా రైతుల చేతికి పైసా వచ్చే పరిస్థితి ఉండదు. రైతులే బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లించి గతంలో తీసుకున్న పంట రుణాన్ని నవీకరణ (రెన్యూవల్) చేసుకుంటున్నారు. పంట రుణం కింద బ్యాంకులు ఒకసారి మాత్రమే భూవిస్తీర్ణం ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు రుణం ఇస్తుంది. ఇక ప్రతి ఏటా ఖరీఫ్లో రైతులు ఆ మొత్తానికి వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకుంటారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఇతరత్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనం వస్తుందనే ఆలోచనతో బ్యాంకుల్లో తీసుకున్న రుణాన్ని రెన్యూవల్ చేసుకుంటారు. ఎరువు.. బరువు ● ఎరువుల ధరలు బస్తాపై రూ.250 నుంచి రూ.350 వరకు పెంచేశారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో రైతులకు ఎరువు ‘బరువు’ పెరిగిపోయింది. కరువు రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. రెండేళ్లు పూర్తయినా ఇన్పుట్, ఇన్సూరెన్స్ మాటెత్తని సర్కార్ తొలిఏడాది ఎగ్గొట్టి.. రెండో ఏడాది అరకొర ‘సుఖీభవ’ సాయం మూడో ఏడాది కింద ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వని చంద్రబాబు ఖరీఫ్ పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న అన్నదాతలు -
జీజీహెచ్లో కిడ్నాప్ కలకలం
అనంతపురం సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో రోజుకో సంచలన ఘటన చోటుచేసుకుంటూనే ఉంది. తాజాగా బుధవారం పదేళ్ల బాలికను ఓ యువకుడు అపహరించేందుకు యత్నించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన బాబ్జాన్, తస్మియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడో సారి గర్భం దాల్చిన తస్మియాను కాన్పు కోసం కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం సర్వజనాస్పత్రిలో చేర్పించారు. మంగళవారం రాత్రి పండంటి ఆడబిడ్డకు తస్మియా జన్మనిచ్చింది. మనస్థిమితం లేక.. మంగళవారం రాత్రి నుంచి బాబ్జాన్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ ఆస్పత్రి ఆవరణలో సంచరించసాగాడు. కుటుంబసభ్యులు సముదాయించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎమర్జెన్సీ వార్డు వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఉన్న ఓ బాలికను తన కుమార్తెగా భావించిన బాబ్జాన్ వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. అజ్ఞాత వ్యక్తి ఒక్కసారిగా తనను ఎత్తుకోవడంతో భయపడిన బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో అక్కడే ఉన్న బాలిక కుటుంబసభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై బాబ్జాన్ను ఔట్పోస్టు పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని బాబ్జాన్ను స్టేషన్కు తరలించి, విచారణ చేపట్టారు. -
కోర్ కోర్సులతో భవిత పదిలం
సాఫ్ట్వేర్ రంగం ట్రెండ్ మారొచ్చు. ఎంత టెక్నాలజీ మారినా భౌతిక నిర్మాణాలు, యంత్రాలు, విద్యుత్ వ్యవస్థలు ఎప్పటికీ అవసరమే. బుల్లెట్ రైళ్లు, స్మార్ట్ నగరాలు, మెగా ప్రాజెక్ట్ల నిర్మాణం కోర్ ఇంజినీర్ల ద్వారానే సాధ్యమవుతాయి. పవర్ గ్రిడ్ నిర్వహణ, ఎలక్ట్రికల్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయి. కోర్ బ్రాంచ్ కోర్సులు పూర్తి చేస్తే తొలుత తక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వేతనాలు అందుకుంటారు. –ప్రొఫెసర్ బి. దుర్గాప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ఆడిట్, జేఎన్టీయూ అనంతపురం -
చెనిక్కాయ ఇవ్వలేక.. కంది కథ
● రైతులకు అధికారుల సలహా అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం రాయితీపై విత్తన వేరుశనగ కాయల(చెనిక్కాయల)ను పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే దానిస్థానంలో కంది వేసుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. గతేడాది సాగులోకి వచ్చిన విస్తీర్ణం కన్నా అదనంగా కంది పంట వేసేలా రైతులకు నచ్చజెప్పాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. గత ఖరీఫ్లో కంది ఏకంగా 1.35 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా చరిత్రలో తొలిసారిగా వేరుశనగ పంటను అధిగమించి కంది అత్యధిక విస్తీర్ణంతో మొదటి స్థానం ఆక్రమించింది. ఈ ఏడాది 1.50 లక్షల హెక్టార్లు దాటించేలా చూడాలని చెబుతున్నారు. కందితో పాటు మొక్కజొన్న, ఆముదం లాంటి పంటలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దీనికి కారణం రాయితీ విత్తన వేరుశనగ సకాలంలో తగినంత ఇవ్వలేకపోవడమే. సవాల్గా మారిన విత్తన సేకరణ ఈ ఖరీఫ్లో అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్లు రాయితీ విత్తన వేరుశనగ అందివ్వాలని కేటాయింపులు చేశారు. అయితే గత ఖరీఫ్, రబీలో రైతులకు పంపిణీ చేసిన వేరుశనగకు సంబంధించి సరఫరా చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్లు, మిల్లర్లకు రాష్ట్ర ప్రభు త్వం రూ.90 కోట్ల మేర బకాయిలు చెల్లించకపోవడంతో ఈసారి విత్తన కొరత ఏర్పడింది. జిల్లాలో గత రబీలో రైతులు పండించిన వేరుశనగను జిల్లాకు చెందిన మిల్లర్లు కొనలేకపోయారు. బకాయిలు ఇంకొంత చెల్లించడంతో పాటు రైతులు చెల్లించే నాన్సబ్సిడీ మొత్తం తమకు అందిస్తే మరికొంత విత్తనం సరఫరా చేస్తామని మంగళవారం అనంతపురం కలెక్టర్ ఆనంద్ సమక్షంలో జరిగిన సమావేశంలో మిల్లర్లు విన్నవించుకున్నారు. -
యాప్తో విక్రయించకుంటే లైసెన్సులు రద్దు
ఆత్మకూరు: ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు (యూరియా, డీఏపీ) విక్రయించకపోతే ఎరువుల దుకాణాల లైసెన్స్లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి సూచించారు. బుధవారం ఆత్మకూరులోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎంత సరుకు విక్రయించారు? ఎంత మేరకు రికార్డుల్లో నమోదు చేశారు? అన్న విషయాలను తెలుసుకున్నారు. విక్రయాలకు సంబంధించిన రికార్డులు పక్కాగా లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని తమ దృష్ఠికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన వేరుశనగ కోసం రైతులు రైతు సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకట్కుమార్, ఏఓ జ్యోతి విజయ్కుమార్ పాల్గొన్నారు. ప్రాధేయపడినా ఒక్కరూ చేరలేదు గుమ్మఘట్ట: తాళ్లకెరలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో 2026–2027 విద్యాసంవత్సరానికి గాను ఒకటో తరగతి అడ్మిషన్ ఒక్కటీ కాలేదు. గ్రామంలో 75 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతిలో చేరడానికి అర్హత ఉన్న పిల్లలు నలుగురు ఉన్నారు. ఉపాధ్యాయులు అడ్మిషన్ కోసం ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ద్వారా అందే ఉచిత విద్య, సౌకర్యాల గురించి వివరించారు. ఎంత ప్రాధేయపడినా పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఒకటో తరగతికి ఒక్క విద్యార్థీ లేకుండా పోయారు. ఇక్కడ రెండో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 45 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని కృష్ణాపురం, కోనాపురం, గొల్లలదొడ్డి గ్రామాలలో అయితే ఒక్కొక్కరు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం పొందడం గమనార్హం. ఎంపీఆర్ను పర్యాటకంగా తీర్చిదిద్దుతాం గార్లదిన్నె: పెనకచెర్లలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్)ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఎంపీఆర్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న డ్యాం గేట్ల మరమ్మతును పరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఎంపీఆర్ (డ్యాం) వద్ద వసతుల కల్పన, రోడ్డు నిర్మాణం, బోటింగ్ సౌకర్యం, వసతి సముదాయాలకు మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో రిసార్ట్ హోటల్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న భవన సముదాయ గెస్ట్ హౌస్లను పునరుద్దరిస్తామని చెప్పారు. డ్యాం అందాలను, బ్యాక్ వాటర్ను సురక్షితంగా ప్రజలు వీక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్, టూరిజం, రోడ్డు భవననాలు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, అటవీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో డ్యాం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్రావు, జిల్లా పర్యాటక అధికారి ఓబులమ్మ, తహసీల్దార్ ఈరమ్మ, ఇన్చార్జ్ ఎంపీడీఓ గోపాల్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు శాపం!
ప్రణాళికా లోపం..అనంతపురం క్రైం: ఆర్టీసీ అధికారులు ముందుచూపు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయాణికులకు శాపంగా పరిణమించేలా ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు సర్కారు ఆధునికీకరణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సర్కారు ఏం చెప్పిందో... ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఎలక్ట్రిక్ బస్స్టేషన్ నిర్మాణపు పనుల్లో అధికారుల ప్రణాళికా రాహిత్యం కొత్త సమస్యలకు దారితీస్తోంది. అనంతపురం ఆర్టీసీ బస్టాండులో అవసరాలకు మించి స్థలం ఉన్నప్పటికి అధికారులు మాత్రం డిపోలోని గ్యారేజీ ప్రాంతాన్ని నూతన స్టేషన్కు వినియోగిస్తున్నారు. ఇప్పటికే నడుస్తున్న సేవలకు ఆటంకం కలిగే విధంగా ప్రత్యేక స్టేషన్, గ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టడంపై ఉద్యోగులు, కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు తప్పవా..? అనంతపురం ఆర్టీసీ డిపో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. రోజువారీగా వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఈ డిపోలో బస్సుల పార్కింగ్, మరమ్మతులు, సాంకేతిక విభాగాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ బస్సుల కోసం చేపడుతున్న నిర్మాణాలతో ప్రస్తుతం ఉన్న సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. డిపో పరిధిలో బస్సుల స్టాపింగ్, మరమ్మతుల కోసం ఉపయోగిస్తున్న ప్రాంతాలను తగ్గించడం వల్ల భవిష్యత్తులో సాధారణ సర్వీసుల నిర్వహణ కష్టమయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాకముందే ప్రస్తుతం నడుస్తున్న బస్సులను ఇతర డిపోలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకిలా..? అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే డిపో వెలుపల లేదా అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాల్లో ఎలక్ట్రిక్ బస్సుల స్టేషన్ను ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.అలా చేసి ఉంటే స్థల సమస్యలు,సర్వీ సులపై ప్రభావం, సిబ్బంది బదిలీల వంటి అంశాలు తలెత్తేవి కావని అంటున్నారు. సరైన ప్రణాళిక లేకపోతే ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికై నా ఉన్న సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంపై ఇన్చార్జ్ ఆర్ఎం శ్రీలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ‘అనంత’ డిపోలోని గ్యారేజీ ప్రాంతంలో ఎలక్ట్రిక్ బస్స్టేషన్ నిర్మాణ పనులు ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్న వైనంవిద్యుత్ బస్సులను సంస్థ ద్వారా నడిపాలి. అనంతపురంలో ఉన్న సర్వీసులను రద్దు చేసి స్థానికంగా సిబ్బందిని ఇతర డిపోలకు సాగనంపడాన్ని యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రయాణికుల డిమాండ్ తగ్గట్టుగా సీ్త్రశక్తి పథకానికి బస్సుల సంఖ్య పెంచాలి. ఖాళీ స్థలాన్ని వినియోగించుకోకుండా డిపోలో కొత్త స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో భవిష్యత్లో ప్రయాణికులకు, బస్సులను భద్రపరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరో 20 ఏళ్ల ప్రణాళికతో పనులు చేపట్టి ఉంటే బాగుండేది. – వి. సూరిబాబు, ఏపీపీటీడీ జిల్లా చైర్మన్ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
●కొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకు పడిన టీడీపీ కార్యకర్తలు బ్రహ్మసముద్రం : రాయలప్పదొడ్డిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో హత్యాయత్నం చేశారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. బాధితుల కథనం మేరకు... ఇంటి స్థలం విషయంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. బుధవారం రాత్రి ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాఘవేంద్ర, ప్రసాద్, తిప్పేస్వామి, సురేంద్ర వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు హరిజన హరికృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురిపై విచక్షణారహితంగా నరకడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగక కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. గాయపడిన హరి కృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురిని కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన హరికృష్ణ, మల్లేశప్ప, కొల్లాపురి -
‘పీఎం సూర్యఘర్’ పనులు వేగవంతం చేయండి
అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పనులు వేగవంతం చేయాలని ఇంధన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. బుధవారం విద్యుత్ శాఖ ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ రూప్టాప్ ప్రక్రియ పనులు ఆగస్టు ఆఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 17,500 యూనిట్ల మంజూరులో 4,700 ఇళ్లపై మాత్రమే ఇప్పటి వరకు సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. వచ్చే రెండు నెలల్లో 100 శాతం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్యకూడేరు: కూడేరు మండల పరిధిలోని కొర్రకోడుకు చెందిన గొల్ల రామకృష్ణప్ప (63) బుధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతనిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రికి 7.30 గంటల సమయంలో మృతి చెందాడు. మృతునికి భార్య అంజనమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆరోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. పశుసంపదతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఉరవకొండ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశుసంపద కీలకమని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమచంద్ తెలిపారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలకు చెందిన పశుసంవర్ధక శాఖ సిబ్బందికి జంతు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ విధానంపై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ హాజరై మాట్లాడుతూ రైతులకు సుస్థిర ఆదాయం అందించే విధంగా పాడి పరిశ్రమను పోత్సహించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశుసంపద పెంపుతో గ్రామసంపద పెంపు అనే కార్యక్రమంలో పశువు ప్రత్యుత్పత్తి ఉత్పాదకతపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ పశు కేంద్రీకృత విధానం ద్వారా పశువులను చూడి కట్టించే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గర్భధారణ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. పశువులు చూడి కట్టడం ఒక నెల ఆలస్యమైయితే రైతు రూ.6 వేలు నష్టపోతాడ న్నారు. కార్యక్రమంలో ఉరవకొండ ఏడీ డాక్టర్ ఉమామహేశ్వర్, నాగమల్లేశ్వరావు, డీడీ డాక్టర్ పెద్దన్న, రీసోర్స్ పర్సన్ కిరణ్రెడ్డి పాల్గొన్నారు. ‘టెట్’ టెన్షన్ తొలగించండిఅనంతపురం ఎడ్యుకేషన్: విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)– 2009కు సవరణలు చేసి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఉపాధ్యాయ భవన్లో జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గౌని పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి మాట్లాడుతూ టెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీఈ–2009 చట్టానికి తగిన సవరణలు చేయాలని కోరారు. ఒకవేళ టెట్ నుంచి మినహాయింపు సాధ్యం కాకపోతే, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించి అర్హత మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీకి చైర్మన్ను నియమించాలని, ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర జీఓల కమిటీ సభ్యుడు గురురాజ, రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యుడు గోపాల్నాయక్, జిల్లా గౌరవాధ్యక్షుడు దేశాయ్ నాగరాజు, సబ్ కమిటీ సభ్యులు రామకృష్ణ, సూర్యనారాయణ, ఓబన్న, రంగనాయకులు, రవి, తూమాటి రమేష్బాబు, రాష్ట్ర కౌన్సిలర్లు శివారెడ్డి, జె.వెంకటేశులు, పుల్లయ్య, సూర్యనారాయణ, అనిల్కుమార్, లక్ష్మీప్రసాద్, మదన్మోహన్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని వివిధ యాజమాన్య పాఠశాలల్లో 2012కు ముందు నుంచి విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను టెట్ పరీక్షల నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రమణారెడ్డి మాట్లాడారు. 2012కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో, రాష్ట్ర సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ టెట్ నుంచి మినహాయింపు సాధ్యం కాకపోతే, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించి అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ తరఫున పలు సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుని అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేలా కృషి చేయాలని కోరారు. -
శుభకార్యానికి వచ్చి తిరిగిరాని లోకాలకు
రాప్తాడు రూరల్: బంధువుల ఇంట్లో పెళ్లి సందడి. ఇంటి నిండా నవ్వులు, సరదా మాటలు. ఇంకొద్ది సేపట్లో అందరూ కలుసుకుని ఆనందంగా గడపాలని ఎదురుచూస్తున్న ఓ కుటుంబాన్ని విధి ఒక్క క్షణంలో ఛిద్రం చేసింది. పెళ్లి ఇంటికి చేరుకునేలోపే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు ప్రాణాలు కోల్పోగా, తల్లి తీవ్రంగా గాయపడింది. ఈ విషాద ఘటన రాప్తాడు మండలం లింగనపల్లి క్రాస్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... రామగిరి మండలం గంగంపల్లికి చెందిన దూదేకుల బాబు (43), భార్య కులుసుంబీ, ఇద్దరు కుమార్తెలు మౌజు, తాసీంభాను (5)తో కలిసి బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు. లింగనపల్లి గ్రామానికి చెందిన బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో కుటుంబమంతా ఆనందంగా సన్నాహాలు చేసుకుంది. తండ్రి, పెద్ద కుమార్తె ముందుగానే పెళ్లి ఇంటికి చేరుకున్నారు. భార్య కులుసుంబీ, చిన్నారి తాసీంభాను కొంత ఆలస్యంగా బస్సులో బయలుదేరి రాప్తాడుకు చేరుకున్నారు. బస్సు దిగిన తర్వాత భర్తకు ఫోన్ చేయడంతో, వారిని తీసుకువెళ్లేందుకు బాబు లింగనపల్లి నుంచి బైకుపై వచ్చాడు. భార్య, చిన్న కుమార్తెను బైకుపై ఎక్కించుకుని తిరిగి పెళ్లి ఇంటి వైపు బయలుదేరాడు. లింగనపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా బెంగళూరు వైపు నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం బైకును ఢీకొంది. ఢీకొన్న వేగానికి బైకుపై ఉన్న ముగ్గురూ దూరంగా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బాబు, ఐదేళ్ల చిన్నారి తాసీంభాను అక్కడికక్కడే మృతి చెందారు. భార్య కులుసుంబీ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందు తోంది. రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటతడి పెట్టించిన రోదనలు అప్పటిదాకా పెళ్లి వేడుకలతో సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ‘అయ్యో దేవుడా... ఎంత పని చేశావయ్యా’ అంటూ బంధువులు గుండెలవిసేలా విలపించిన దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. పెళ్లి ఇంటికి చేరాల్సిన తండ్రీ కూతుళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న కుటుంబం చిన్నాభిన్నం దూదేకుల బాబు పేరూరు గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య, ఇద్దరు కుమార్తెలతో నిరాడంబరమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. చిన్నారుల భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం క్షణాల్లో చిన్నాభిన్నం చేసింది. పెళ్లి వేడుకకు బయలుదేరిన కుటుంబానికి ఎదురైన ఈ విషాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాప్తాడు మండలం లింగనపల్లి క్రాస్లో ఘోర రోడ్డు ప్రమాదం తండ్రి, కుమార్తె దుర్మరణం -
సీఎస్ఈ వైపు వెళ్లడం మంచిది కాదు
కోర్ బ్రాంచ్ల వైపు వెళ్తే రెండు విధాలుగా అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ వైపు వెళ్లొచ్చు. లేదా మౌలిక సదుపాయాల రంగాల్లో ఉద్యోగాలు దక్కుతాయి. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. 100కు 80 మంది కంప్యూటర్ సైన్సెస్ చదువుతున్నారు. ఏఐ రావడంతో ఉపాధిపై దెబ్బ పడుతోంది. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) వైపు వెళ్లడం లేదు. అంకితభావంతో కృషి చేస్తే సర్వీసెస్లో కొలువు సాధించవచ్చు. – డాక్టర్ బి.రమేష్ బాబు, ప్రిన్సిపాల్, పీవీకేకే కళాశాల -
నీటి ఎద్దడిపై నిరసనాగ్రహం
● సచివాలయానికి తాళం వేసిన తూమకుంట గ్రామస్తులు కుందుర్పి: తాగునీటి ఎద్దడి తీవ్రమైనా పట్టించుకునేవారు లేకపోవడంతో విసుగెత్తిపోయిన తూమకుంట గ్రామస్తులు మంగళవారం ఖాళీ బిందెలతో వెళ్లి గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన తెలియజేశారు. సమస్య పరిష్కరించేదాకా తాళం తీసేది లేదని మహిళలు భీష్మించారు. 1,600 మంది జనాభా కలిగిన తూమకుంటకు రెండు గ్రామపంచాయతీ బోర్ల ద్వారా కుళాయిలకు నీటిని సరఫరా చేసేవారు. అయితే రెండు నెలల క్రితం బోర్లల్లో నీళ్లు అడుగంటాయి. కుళాయిలకు నీరు బంద్ అయ్యింది. ప్రారంభంలోనే గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అప్పట్లో పంచాయతీ సెక్రటరీ సమస్య పరిష్కరిస్తామని ఫోన్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత పట్టించుకున్నది లేదు. గ్రామస్తులు సుదూరంలో ఉన్న వ్యవసాయ పొలాలబాట పట్టారు. సైకిళ్లు, మోటారు బైకులు, ట్రాక్టర్లు, ఎద్దులబండ్లల్లో వెళ్లి నీటిని తెచ్చుకుని వాడుకునేవారు. కొంతమంది గ్రామంలోకి వచ్చే ఆటోల్లో తీసుకొచ్చే ఫిల్టర్ వాటర్ను బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. రోజురోజుకూ నీటి సమస్య పెరిగిపోతుండటంతో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకునేందుకు వెళ్తే ఎంపీడీఓ లక్ష్మీశంకర్ అందుబాటులో ఉండటం లేదు. అధికారుల తీరును నిరసిస్తూ సచివాలయానికి చేరుకుని, సిబ్బందిని బయటకు పంపి తలుపులకు తాళం వేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రెండు గంటల తర్వాత ఎంపీడీఓ ఫోన్ ద్వారా గ్రామస్తులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
పరిమళించిన మానవత్వం
● బుర్రా జయకృష్ణ కుటుంబానికి గ్రామస్తుల అండ ● రూ.1.15 లక్షల ఆర్థిక సాయం రాప్తాడు రూరల్: మానవత్వం పరిమళించింది. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలవాలని చేసిన పిలుపునకు గొప్పగా స్పందించింది. కరువుతో పోరాడే అనంతపురం నేలలో మానవత్వం మాత్రం ఎప్పుడూ పచ్చగా ఉంటుందని మరోసారి నిరూపించింది. అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన బుర్రా జయకృష్ణ కుటుంబ దయనీయ పరిస్థితిపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ప్రత్యేక కథనం పలువురు దాతల హృదయాలను కదిలించింది. కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమైన జయకృష్ణ కుటుంబానికి ఆయన భార్యే ప్రధాన ఆసరా. ఆమె కూడా ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం భారంగా మారింది. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘కష్టాల సుడిగుండం.. కన్నీటి ప్రయాణం’ శీర్షికతో ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. ముఖ్యంగా కట్టకిందపల్లి గ్రామస్తులు పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామస్తులంతా స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ. లక్ష అందించారు. అదేవిధంగా జయకృష్ణ భార్య కుమారి ఫోన్పే ఖాతాకు వివిధ ప్రాంతాల నుంచి రూ.15 వేల మేర విరాళాలు అందాయి. ఆపద సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జయకృష్ణ, ఆయన భార్య కుమారి, పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విడపనకల్లు: మండల పరిధిలోని మాళాపురం గ్రామంలో మంగళవారం ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మాళాపురానికి చెందిన బోయ పక్కీరప్ప భార్య పాల్తూరు సుంకమ్మ (58) ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలోనే ఉరవకొండ వైపు నుంచి విడపనకల్లు వైపు ద్విచక్రవాహనంలో వెళ్తున్న యువకుడు బలంగా ఆమెను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సుంకమ్మను 108లో ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని పాడి గేదె.. : కారు ఢీకొని పాడి గేదె మృతి చెందిన ఘటన పెద్ద కొట్టాలపల్లి సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన రామకృష్ణ తన పాడి గేదెను మేపునకు తీసుకెళ్తుండగా, బళ్లారి వైపు నుంచి ఉరవకొండ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. రూ.80 వేల విలువ చేసే పాడె గేదె మృతితో రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. నకిలీ ఎస్ఐ అరెస్టు కళ్యాణదుర్గం: తాను పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అంటూ నమ్మబలికి ఓ వ్యక్తి వద్ద నుంచి కారు ఎత్తుకెళ్లిన వ్యక్తిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ గణేష్ తెలిపిన మేరకు... శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చల్లాపల్లి ఎస్సీ కాలనీకి చెందిన గంటప్ప గారి అనిల్ కుమార్ ఇటీవల జస్ట్ డయల్ యాప్ ద్వారా కారు యజమాని జి.మనోహర్ను సంప్రదించాడు. పోలీస్ యూనిఫాంలో ఉన్న ఫొటోను వాట్సాప్ ద్వారా పంపి తాను పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే మారుతి సుజుకి డిజైర్ కారు (ఏపీ 39 ఎన్టీ 8616)ను రోజువారీ అద్దెకు తీసుకున్నాడు. కారును తిరిగి ఇవ్వకుండా వివిధ ప్రాంతాల్లో మోసాలు చేసేందుకు వినియోగించాడు. అనంతపురం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇలా మోసం చేసినట్లు వెల్లడైంది. నిందితుడు మంగళవారం బోరంపల్లి గ్రామ బస్స్టాప్ వద్ద ఉండగా, రూరల్ సీఐ గణేష్ వెంటనే అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కారును, పోలీస్ యూనిఫాంను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసిన సీఐ గణేష్, సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు. 7 విద్యుత్ సబ్స్టేషన్ల మంజూరు అనంతపురం టౌన్: జిల్లాలో కొత్తగా ఏడు సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బసాపురం, రాయదుర్గం నియోజకవర్గంలోని యర్రగుంట్ల, వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి, రాప్తాడు మండలం బండమీదపల్లి, శింగనమల నియోజకవర్గంలోని బొందలవాడ, గుంతకల్లు నియోజకవర్గం ఖాదర్పేటలో 33 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఇక అనంతపురం అర్టీసీ బస్టాండ్లో సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. -
చంద్రబాబుకు వెన్నుపోటు అలవాటే
అనంతపురం: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ, జనసేన వెన్నుపోటు పార్టీలని అభివర్ణించారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజలతో ఓట్లు వేయించుకుని... అధికారంలోకి వచ్చాక వారికే వెన్నుపోటు పొడిచాయని మండిపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండేళ్ల పాలనపై అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. హంద్రీ–నీవా ద్వారా 240 రోజుల్లో 51 టీఎంసీలు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసి తీవ్ర అన్యాయం చేసిన మాటేమిటని నిలదీశారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే తెలంగాణ నీటిని తోడేస్తున్నా ప్రశ్నించలేని పరిస్థితి ఉందన్నారు. హంద్రీ–నీవా విస్తరణతో పాటు రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. తన స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం సీమ హక్కులను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి చంద్రబాబు తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీల అమలులోనూ వైఫల్యం చెందారని, యువత, విద్యార్థి, మహిళలు, రైతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకూ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. రెండేళ్లుగా అనంతపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలిచి చేసిన పోరాటాలను గుర్తు చేసేలా ఫొటో ఎగ్జిబిషన్ ఆలోచింపజేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్ బేగ్, ఎద్దుల అమరనాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, గౌని నాగన్న, పూజారి రాజశేఖర్ యాదవ్, కాగజ్ఘర్ రిజ్వాన్, డాక్టర్ శంకరయ్య, కట్టుబడి తానీషా, మల్లెమీద నరసింహులు, కొర్రపాడు హుస్సేన్ పీరా, గువ్వల రాజేష్రెడ్డి, ఫయాజ్, చింతకుంట మధు, బాకే హబీబుల్లా, వీరా రామకృష్ణా రెడ్డి, గుజ్జల నగేష్, ఆసిఫ్, వెన్నపూస రామచంద్రారెడ్డి, సంపంగి రామాంజినేయులు, మలెల్ల వేణుగోపాల్, సాకే కుళ్లాయిస్వామి, సాకే అశోక్, మాలపాటి శ్రీనివాసులు, చిలకల థామస్, దత్త, జాహ్నవి, భానుమతి, వరలక్ష్మి, శశికళ, హజరాంబీ, రాధా యాదవ్, పద్మ, శోభాబాయి, శోభారాణి, ఉష, అంజలి, ప్రసన్న పాల్గొన్నారు. అనంతపురంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’పై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి, హాజరైన నేతలుమహిళలను దగా చేశారు చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ విమర్శించారు. హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసే రీతిలో పాలన సాగుతోందన్నారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి.. ఆడబిడ్డ నిధి తదితర పథకాలు అమలు చేయకుండా మహిళలను దగా చేశారని మండిపడ్డారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న అనంతపురంలో నిర్వహించే ర్యాలీ, మానవహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ప్రదాత జగన్ సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి కొనియాడారు. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల సంక్షేమానికి పాటుపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు రెండేళ్ల పాలన వెన్నుపోటుకు చిరునామాగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ప్రజల తరఫున నోరెత్తకుండా కేసుల నమోదుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన, చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడాను వివరించారు. చంద్రబాబు అడుగడుగునా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పథకాల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు ‘రెండేళ్ల వెన్నుపోటు’ పాలనపై రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెన్నుపోటుల్లో దిట్ట చంద్రబాబు వెన్నుపోట్లు పొడవడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. మామ ఎన్టీఆర్, బామ్మర్ది బాలకృష్ణకు వెన్నుపోటు పొడిచినట్లే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న, నదీం అహమ్మద్, ఎస్ఈసీ సభ్యులు లింగాల శివశంకర్రెడ్డి, కోగటం విజయభాస్కర్రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, మాజీ మేయర్ వసీం సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, మొఘల్ సైఫుల్లా బేగ్, రిలాక్స్ నాగరాజు, కొండ్రెడ్డి ఓబిరెడ్డి, శ్రీదేవి, చంద్రశేఖర్ యాదవ్, ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, సాకే చంద్రలేఖ, దాసరి వాసంతి సాహిత్య, కృష్ణవేణి, భారతి తదితరులు ‘చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు’ గురించి వివరించారు. -
విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపే లక్ష్యం
● డీఈఓ శ్రీనివాసరావు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో 1.2 తరగతుల విద్యార్థులకు పునాది స్థాయిలో భాషా, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడమే ‘జ్ఞాన ప్రకాశ్ ఇయర్–3’ శిక్షణ లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అనంతపురం, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లో ఆరు రోజులుగా జరుగుతున్న శిక్షణ మంగళవారం ముగిసింది. జాతీయ విద్యా విధానం–2020 (ఎన్ఈపీ), జాతీయ పాఠ్యాచరణ చట్రం (ఎన్సీఎఫ్), నిపుణ్ భారత్ లక్ష్యాల సాధన దిశగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో శిక్షణ చేపట్టారు. పాఠ్య సంస్కరణలు, అభ్యసన ఫలితాల ఆధారిత బోధన, రెడీనెస్ కార్యక్రమాలు, తరగతి గది అంచనా విధానాలు, గణిత ఆటల ద్వారా బోధన, టీఎల్ఎం వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బుక్కరాయసముద్రం విజయభారతి కళాశాలలో జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పునాది నైపుణ్యాల అభివృద్ధే శిక్షణ ప్రధాన లక్ష్యమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు. గుత్తి డివిజన్ డిప్యూటీ డీఈఓ లక్ష్మన్న మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాలని, తమ బోధన ద్వారా పిల్లల జీవితాలపై శాశ్వత ప్రభావం చూపగల సామర్థ్యం ఉపాధ్యాయులకే ఉంటుందని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ శిక్షణలో 1,458 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. రాప్తాడు మోడల్ స్కూల్లో నిర్వహించిన ముగింపు సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి భాషా, గణిత అంశాల్లో ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్రమాల్లో అసిస్టెంట్ ఏఎంఓలు ఫణిరాజ్, నారాయణస్వామి, కేఆర్పీలు, డీఆర్పీలు పాల్గొన్నారు. -
గంజాయి విక్రేత అరెస్ట్
గుంతకల్లుటౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న షికారీ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శివసాగర్ మంగళ వారం తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారం ప్రకారం హనుమాన్ సర్కిల్లో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు. అనారోగ్యంతో కానిస్టేబుల్ కన్నుమూత తాడిపత్రి రూరల్: తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మదన్రాజ్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. యాడికి మండల కేంద్రానికి చెందిన మదన్రాజ్ 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లిలో నివాసానికి తీసుకురాగా, ఏఎస్పీ రోహిత్ కుమార్, సీఐ శివగంగాధర్రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్నాథ్, లక్ష్మినారాయణ, శివారెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ భార్య అరుణకు ఎస్పీ జగదీష్ ఏఎస్పీ రోహిత్కుమార్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్ని విధాల కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు. గవిమఠం స్థలాలు అన్యాక్రాంతం కానివ్వం ఉరవకొండ: గవిమఠంకు చెందిన భవనాలు, స్థలాలను అన్యాక్రాంతం కానివ్వబోమని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ అన్నారు. కర్ణాటకలోని చేళ్లగురికిలో ఉన్న గవిమఠం స్థలాలు ఆక్రమణకు గురయ్యాయన్న విషయం తెలుసుకున్న కమిషనర్ మంగళవారం అక్కడికి వెళ్లారు. స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మఠం భూములు, ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. త్వరలోనే భూములకు బహిరంగ వేలం నిర్వహించి లీజుకిస్తామన్నారు. కార్యక్రమంలో మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా ఎరువుల పంపిణీ కుదరదు
అనంతపురం అగ్రికల్చర్: కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ఎలా ఉందనే దానిపై కలెక్టర్ ఆనంద్ అనంతపురంలో, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బుక్కరాయసముద్రం మండలంలో దుకాణాలకు వెళ్లి పరిశీలించారు. జేడీఏ సాలురెడ్డి, ఏడీఏ వెంకటకుమార్, ఏఓ శ్యాంసుందర్రెడ్డి తదితరులను వెంట బెట్టుకుని ఎరువుల దుకాణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పంపిణీ గురించి తెలుసుకున్నారు. యాప్ పనితీరు గురించి అధికారులు, డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ఇష్టారాజ్యంగా యూరియా, డీఏపీ అమ్మడానికి వీలులేదన్నారు. సాగు చేసిన పంటల విస్తీర్ణం బట్టి రైతులకు ఎంత మేర అవసరమో ఆ మేరకు ఎరువులు ఇవ్వాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుల కొరత రానివ్వొద్దు అనంతపురం సిటీ: జిల్లాలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, సర్వజనాస్పత్రిలో మందుల కొరత తలెత్తకుండా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ మందులు సక్రమంగా సరఫరా కావడం లేదంటూ పీహెచ్సీల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. నిల్వ ఉన్న మేరకు అన్ని ఆస్పత్రులకూ మందులు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రామ్మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 30లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్లను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 27వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అలాంటి ఇళ్ల నిర్మాణాలు 100 శాతం పూర్తి చేసుకుంటేనే బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. సెప్టెంబర్ ఆఖరులోగా పూర్తయిన వాటికే బిల్లులు వస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన ఇళ్లకు బిల్లులు విడుదలను కేంద్ర ప్రభుత్వం ఆపివేయనున్నట్లు తెలిపారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలిపుట్లూరు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పి.జగదీష్ అన్నారు. మంగళవారం ఆయన మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో శక్తి యాప్, సీ్త్రరక్ష పోర్టల్ సేవలు, మహిళా రక్షణ చట్టాలు తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ధైర్యంగా వెంటనే పోలీసులను సంప్రదించాలని తద్వారా చట్టం వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తుందన్నారు. మహిళల భద్రతకు కుటుంబ, సామాజిక స్థాయిలో అందరూ బాధ్యత వహించాలన్నారు. ప్రయాణాల్లో ఉన్న సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా వేధింపులు, అసభ్య ప్రవర్తన ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అదనపు ఎస్పీ మహబూబ్బాషా, సీఐ సత్యబాబు, ఎస్ఐలు రామాంజనేయరెడ్డి, సురేంద్రబాబు పాల్గొన్నారు. ఖరీఫ్ ఈ–క్రాప్ మొదలైంది అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ఈ–క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ ఒకటి నుంచి పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఖరీఫ్ కింద సాగు చేసిన అన్ని రకాల పంటలను సెప్టెంబర్ 15లోపు ఈ–క్రాప్తో పాటు ఆధార్ బేస్డ్ కింద ఈ–కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు ఆర్ఎస్కే స్థాయిలో సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) నిర్వహించి తుది జాబితా సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. -
22 మండలాల్లో వర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● ఉరవకొండలో దంచికొట్టిన వానఅనంతపురం అగ్రికల్చర్: నైరుతి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలోని 22 మండలాల పరిధిలో వర్షం కురిసింది. 5.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బెళుగుప్ప మండలంలో 25.4 మి.మీ, కణేకల్లు మండలంలో 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక రాయదుర్గం మండలంలో 20.6 మి.మీ, బ్రహ్మసముద్రం 14.4, గార్లదిన్నె 12.6, శెట్టూరు 10.8, యాడికి మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జూన్ సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా, ప్రస్తుతానికి 28.7 మి.మీ నమోదైంది. ఈనెలలో 4 వర్షపు రోజులు నమోదైనా... ఇంకా చాలా మండలాల్లో పదునైన వర్షం కురవలేదు. వజ్రకరూరు, గుత్తి, తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో సాధారణం కన్నా 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఉరవకొండలో భారీ వర్షం ఉరవకొండ: ఉరవకొండలో మంగళవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వర్షంతో క్లాక్టవర్ వద్ద మోకాలు లోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద ఆకుకూరలు, కూరగాయలు విక్రయించే వ్యాపారులు అవస్థలు పడ్డారు. అయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా వర్షం కురవకపోవడం గమనార్హం. -
ప్రజావ్యతిరేక పాలనకు మూల్యం తప్పదు
అనంతపురం అర్బన్: ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని వామపక్ష పార్టీల నాయకులు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యాసవర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం వామపక్షపార్టీల నాయకులు, కార్యకర్తలు జిల్లావ్యాప్తంగా రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల నాయకులు నగరంలో ర్యాలీ నిర్వహించి క్లాక్టవర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, ఎస్యూసీఐ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఓ.నల్లప, కిషోర్బాబు, రాఘవేంద్ర, నాగరాజు, వేమన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తోందని దుమ్మెత్తిపోశారు. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు, వంటగ్యాస్ ధరలు రెండుసార్లు పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పెరిగిన ధరలతో పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయాయని ఆందో ళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేరుతో ఢిల్లీ వేదికగా తిరగబడ్డారని, ఇప్పటికై నా ప్రభుత్వాలు ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వామపక్షపార్టీల నాయకులు శ్రీరాములు, రామిరెడ్డి, పద్మావతి, పార్వతీప్రసాద్, లింగమయ్య, రమణ, వలి, ప్రకాష్, పరమేష్, కుళ్లాయిస్వామి, కృష్ణ, వీరనారప్ప, చంద్రశేఖర్, మల్లీశ్వరి, రాధమ్మ, తబ్రేజ్ పాల్గొన్నారు. -
‘అక్షరాంధ్ర’ రిజిస్ట్రేషన్ గడువులోగా పూర్తి చేయాలి
రాప్తాడు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి వలంటీర్ టీచర్లు – నిరక్షరాస్య అభ్యాసకుల జతపరిచే నమోదు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మంగళవారం రాప్తాడులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ‘ఉల్లాస్ – అక్షరాంధ్ర’ కార్యక్రమం నమోదు ప్రక్రియను పరిశీలించారు. వెల్ఫేర్ అసిస్టెంట్లతో మాట్లాడి అభ్యాసకుల నమోదు పురోగతిపై ఆరా తీశారు. రాప్తాడు మండలంలో మొదటి విడతలో అక్షరాస్యత సాధించిన అభ్యాసకుల వివరాలు, రెండోదశ కార్యక్రమానికి గుర్తించిన అభ్యాసకుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట వయోజన విద్య ఉపసంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయలక్ష్మి, పర్యవేక్షకులు జీవీ రమణ, డీఆర్డీఏ ఏపీఎం సునీత, ఉపాధి హామీ పథకం ఏపీఓ సావిత్రి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కంటైనర్ ఎక్కిన రైలింజన్ గార్లదిన్నె: సాధారణంగా గూడ్సురైలులో లారీలు ఇతర వాహనాలను తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే రైలు ఇంజిన్ను కంటైనర్ లారీలో తీసుకెళ్లడం ప్రజలు వింతగా తిలకించారు. మంగళవారం బెంగళూరు నుంచి ఒడిశాకు రైలింజన్ను తీసుకెళ్తున్న లారీ కంటైనర్ గార్లదిన్నె మండలం ఎగువపల్లి జాతీయరహదారి వద్ద కాసేపు ఆగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు రైలింజన్ను ఎంతో ఆసక్తిగా చూశారు. -
నమ్మించి.. నట్టేట ముంచి..
● ఈజీగా స్టాక్ మార్కెట్ మోసాలు ● అప్రమత్తంగా లేకపోతే మోసపోవడం ఖాయం ● ఆర్థికంగా చితికిపోతున్న బాధితులు అనంతపురం సిటీ: డబ్బు మీద అత్యాశ కొంప ముంచుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నేడు సన్నగిల్లింది. దాని స్థానంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఊపందుకుంది. ధనిక వర్గాల వారికే పరిమితమైన స్టాక్ మార్కెట్ వ్యాపారం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామాన్య, మధ్య తరగతి వర్గాలకూ విస్తరించింది. ఈ క్రమంలో ప్రతి వంద మందిలో 15 మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో చాలామంది మోసపోతున్నారు. సంపాదించి పొదుపు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, అయితే అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ప్రపంచ వ్యాప్తంగా ఏది జరిగినా కంపెనీలపై ప్రభావం పడి నష్టాలపాలు కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాలే లక్ష్యంగా.. పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు కొన్ని కంపెనీలు వూహ్యాత్మకంగా అడుగులేస్తున్నాయి. పెట్టుబడిదారులు అప్రమత్తంగా లేకపోతే మోసపోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఏదైనా ఓ కంపెనీ నష్టాల బాటలో ఉన్నప్పుడే షేర్లను అమ్మకానికి పెడుతుందనే విషయాన్ని మరవరాదని అంటున్నారు. ఈ క్రమంలో షేర్ల విలువను పెంచుకునేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మాధ్యమాల కేంద్రంగా మోసాలకు తెరతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ముందుగా తమ కంపెనీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని నమ్మిస్తారు. దీంతో నమ్మి డీమాట్ ఖాతా తెరిచి యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే ఐపీఓ అలాట్ అయినట్లు, మంచి లాభాలు వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అయితే స్టాక్స్ అమ్మి డబ్బు విత్డ్రా చేయాలనుకుంటే సాధ్యం కాదు. చివరకు డబ్బులు విత్ డ్రా చేయాలన్నా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది. మాయలో చిక్కుకున్న మేధావి వర్గం షేర్ మార్కెట్ వలలో సామాన్యులే కాదు మేధావి వర్గాలు సైతం చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఇటీవల వెలుగుచూసిన మోసాలు పలువురిని బెంబేలెత్తించాయి. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి రూ.2.58 కోట్లు నష్టపోయినట్లు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అలాగే ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.72 లక్షలు మోసపోవడం గమనార్హం. అలాగే అనంతపురంలోని బళ్లారి బైపాస్లో నివాసముంటున్న ప్రధానోపాధ్యాయుడు భాస్కర్బాబు సైతం తెలిసిన వారి నుంచి కొంత, లోన్ యాప్ల ద్వారా మరికొంత అప్పులు చేసి రూ.60 లక్షల వరకు ‘ఆరిజన్ కంపెనీ’లో పెట్టుబడులు పెట్టి నిండా మోసపోయారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించలేని స్థితిలో ఒత్తిళ్లు తాళలేక సూసైడ్నోట్ రాసి కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని ఓ వెంచర్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నరేష్కుమార్రెడ్డి అనంతపురంలోని సాయినగర్లో ఆరిజన్ సొల్యూషన్స్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించాడు. సదరు కంపెనీలో పెట్టుబడులు పెడితే పదింతల లాభం ఉంటుందని పలువురిని నమ్మించాడు. కంపెనీ సిబ్బందితో పాటు బంధువులు, స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు పెట్టుబడిపై రూ.5, రూ.10 వడ్డీ చొప్పున లాభాల రూపంలో చెల్లిస్తూ వచ్చాడు. దీంతో నమ్మకం పెరిగిన వారు మరికొందరిని ప్రమోట్ చేశారు. అలా ఒక్కొక్కరు రూ.4 లక్షలు మొదలుకుని రూ.90 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే నెలలు తిరగక ముందే రూ.25 కోట్లకు పైగా వసూలు చేసుకుని ఓ రోజు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి నరేష్కుమార్రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సదరు కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారందరూ సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆత్మకూరు మండలానికి చెందిన ఓ విద్యావంతురాలు కొన్ని నెలల క్రితం అనంతపురంలో ఆరిజన్ కంపెనీ నిర్వహిస్తున్న షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజులు లాభాలు సక్రమంగా చెల్లించడంతో నమ్మకం ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉన్న బంగారు నగలు మొత్తం తాకట్టు పెట్టి రూ.90 లక్షల వరకు పెట్టుబడిన తర్వాత కంపెనీ నిర్వాహకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చివరకు తాను మోసపోయినట్లుగా తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ పరిస్థితి ఈమె ఒక్కరిదే కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎందరో బాధితులు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ మాయలో చిక్కుకుని ఆర్థిక నష్టాలతో కుదేలవుతున్నారు. -
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
●వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య కళ్యాణదుర్గం: జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు సీఎంను చేసుకుందామని వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు అధికారం కోసం అలవికాని హామీలను గుప్పించి రాష్ట్రంలోని మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, రైతులను ప్రతి ఒక్కరినీ నిలువునా మోసం చేశారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కనీసం రైతులకు ఎరువులు అందించలేని పరిస్థితిని రాష్ట్రానికి తీసుకువచ్చారని విమర్శించారు. -
రెండేళ్ల పాలనంతా మోసమే..
● ప్రజలను చంద్రబాబు దగా చేశారు ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన అవినీతి, అరాచకాలతో నిండిపోయిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక దేవాంగ కల్యాణ మండపంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో భాగంగా చర్చావేదిక (రౌండ్టేబుల్ సమావేశం) నిర్వహించారు. పార్టీ పంచాయతీ రాజ్ విభాగం నాయకుడు బసవరాజు అధ్యక్షతన జరిగిన చర్చావేదికలో ‘విశ్వ’ మాట్లాడారు. చంద్రబాబు జీవితమంతా మోసాలు, అబద్దాలేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు దీన్ని గుర్తించారన్నారు. రెండేళ్లలోనే ప్రజలను వంచించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి హింసారాజకీయాలు ప్రోత్సహిస్తున్నారన్నారు. గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. తన హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేస్తే, అందులో రూ.2.80 లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో వేశారన్నారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. గొప్ప మానవతా వాదిగా జగన్ పాలన సాగించారన్నారు. చంద్రబాబు నేడు మహిళలు, రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకూ మోసం చేశారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేసిన ఘనత తమదేనని తెలిపారు. రాయలసీమ జిల్లాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కె.వి. రమణ మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో కనీసం 50 శాతం అయినా నెరవేర్చలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. ప్రజలను మోసగించి అధికారంలోకి రావాలన్న తపన తప్ప హామీల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా మేధావి వర్గాల సంఘం ప్రతినిధి కొండారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, మోసాలేనని, అధికారం కోసం ఎంతకై నా దిగజారతారని విమర్శించారు. బాబును నమ్మి ఓట్లు వేస్తే అందరినీ నట్టేట ముంచుతారన్నారు. చర్చావేదికలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాకే పురుషోత్తం, వికలాంగుల సంఘం అధ్యక్షుడు వడ్డే ఆంజినేయులు, పంచాయతీరాజ్ విభాగం నాయకులు యోగేంద్రరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, మాజీ ఎంపీపీ ఏసీ ఎర్రిస్వామి, మాజీ జెడ్పీటీసీ తిప్పయ్య, పార్టీ మండల, రూరల్ సమన్వయకర్తలు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, ప్రజా, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి, చర్చావేదికలో పాల్గొన్న ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
రాప్తాడు రూరల్: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రజల వద్ద ఎండగట్టాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ రాప్తాడు నియోజకవర్గ సదస్సు మంగళవారం అనంతపురం రూరల్ కళ్యాణదుర్గం రోడ్డు బీజీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలు, అక్రమ వసూళ్లు పెరిగిపోయాయని ఆరోపించారు. రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు, వంచన, విద్రోహం, వినాశనాన్ని మాత్రమే మిగిల్చిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో పాపంపేట ప్రాంతంలో ఇళ్లను కూల్చివేయడం, బినామీల పేరుతో ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. నియోజకవర్గంలో పరిటాల సునీత కుటుంబం ఆధ్వర్యంలో భూకబ్జాలు, సెటిల్మెంట్ రాజకీయాలు సాగుతున్నా యని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మహిళలకు ప్రకటించిన నగదు సాయం, రైతులకు హామీ ఇచ్చిన పథకాలు, నిరుద్యోగ భృతి అమలు కాలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో అమలైన ఆసరా, చేయూత, సున్నావడ్డీ వంటి సంక్షేమ పథకాలను నిలిపివేశారన్నారు. పేరూరు డ్యాంకు వైఎస్సార్సీపీ హయాంలో నీళ్లు తీసుకొచ్చి రైతులకు మేలు చేశామన్నారు. పరిటాల సునీత వచ్చిన తర్వాత డ్యాంలో నీళ్లు లేక రైతులకు అన్యాయం చేశారన్నారు. హంద్రీ–నీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ కారణంగా వేలాది బోర్లు ఎండిపోయాయన్నారు. ఇందుకు పరిటాల సునీత, అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలన్నారు. జగన్ ప్రభుత్వం ప్రారంభించిన గృహ నిర్మాణ కార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ 50 వేల నిరుపేద కుటుంబాలకు మరణశాసనం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెచ్చిన పీఏబీఆర్ తాగునీటి పథకం పైప్లైన్ పనులను కూడా రాజకీయ కారణాలతో అడ్డుకున్నారని ఆరోపించారు. తన గురించి మాట్లాడే అర్హత సునీతకు లేదన్నారు. అధికారాన్ని పరిటాల కుటుంబం దోపిడీకి వాడుకుందన్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం రానివ్వనని భరోసా ఇచ్చారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే ప్రజలు ఇప్పటికే ప్రభుత్వంపై పూర్తిగా విసుగు చెందారన్నారు. భవిష్యత్తులో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, మారుతీప్రసాద్, నాగార్జున, మెట్టు గోవిందరెడ్డి, నాయకులు గంగుల సుధీర్రెడ్డి, మామిళ్లపల్లి అమర్నాథ్రెడ్డి, ఓబుగారి హరినాథరెడ్డి, బండి పవన్, గోవిందరెడ్డి, సాకే వెంకటేశు, మజ్జిగ శంకరయ్య, ఆత్మకూరు చంద్రశేఖర్రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా మండల స్థాయి ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ సదస్సుకు హాజరైన వైఎస్సార్ సీపీ నాయకులు నా గురించి మాట్లాడే అర్హత పరిటాల సునీతకు లేదు రాబోయేది జగన్ ప్రభుత్వమే.. స్థానిక ఎన్నికల్లో విజయం మనదే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఇంటిపై దాడి.. ఏడుగురిపై కేసు
● బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని దాష్టీకంరాప్తాడు రూరల్: కులాంతర ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఓ యువతి కుటుంబ సభ్యులు యువకుడి నాయనమ్మ ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన వరలక్ష్మి, అనంతపురం రూరల్ పాపంపేటకు చెందిన మురళి మనోహర్ ప్రేమించుకుని రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో ఈ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువతి మేజర్ కావడంతో కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరినీ కలిసి జీవించేందుకు అనుమతించారు. వివాహాన్ని అంగీకరించని యువతి కుటుంబ సభ్యులు మనోహర్ను బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రూరల్ మండలం పాపంపేట కాలనీలో ఉన్న మనోహర్ నాయనమ్మ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి కుటుంబానికి చెందిన ఆరుగురు మహిళలతో పాటు ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. -
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. రోజూ కూలి పనులకు వెళ్తూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే దంపతులు. ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని కలలు కన్నారు. అయితే విధి ఒక్కసారిగా వారిపై పగబట్టినట్లు మారింది. ఇ
జయకృష్ణకు అన్నం తినిపిస్తున్న కుమారిరాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కట్టకిందపల్లికి చెందిన బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు చరణ్ ఈసారి 9వ తరగతికి, చిన్నకుమారుడు ప్రభాస్ 7వ తరగతికి వెళ్తున్నారు. జయకృష్ణ బేల్దారి పని చేస్తుండగా, కుమారి కూలి పనులకు వెళ్లేది. కష్టపడి పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేవారు. నాలుగేళ్ల క్రితం తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన జయకృష్ణకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని తేలింది. అప్పటి నుంచి ప్రతివారం డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నాడు. స్వయంగా నడవలేని స్థితికి చేరుకోవడంతో భార్య తోడు తప్పనిసరి అయింది. దీంతో ఆమె కూలి పనులకు వెళ్లడం మానేసింది. పూట గడవడమే భారంగా... ఇద్దరూ పనులకు వెళ్లలేని పరిస్థితి రావడంతో కుటుంబానికి ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఉదయం లేవగానే ఇతర కుటుంబాలు పనులకు వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఈ కుటుంబం మాత్రం పిల్లలకు పాలు ఎలా కొనాలి.. భోజనం ఎలా పెట్టాలి? అనే ఆలోచనలతో గడుపుతోంది. కనీస అవసరాలు తీర్చుకోవడమే భారంగా మారింది. గోరుచుట్టుపై రోకటిపోటులా.. కుటుంబం ఇప్పటికే కష్టాల్లో ఉండగా ఇటీవల భార్య కుమారి కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది. గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోవడంతో రూ.80 వేల వరకు ఖర్చు చేశారు. తినడానికి కూడా ఇబ్బంది పడుతున్న కుటుంబానికి ఆ మొత్తం పెద్ద భారంగా మారింది. అప్పులు చేసి చికిత్స చేయించుకు న్నా ఇప్పటికీ వాటి నుంచి కోలుకోలేకపోతున్నారు. కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం తల్లిదండ్రుల పరిస్థితిని చూసి పెద్ద కుమారుడు చరణ్ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. చదువుకోవాల్సిన వయసులో బడి మానేసి బేల్దారి పనులకు వెళ్లి రోజుకు రూ.300 సంపాదిస్తూ ఇంటికి అండగా నిలిచాడు. పుస్తకాలు పట్టాల్సిన చేతులు మట్టిగంపలు మోశాయి. గ్రామస్తులు, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి బడికి వెళ్లడం ప్రారంభించినా, సెలవులు వస్తే ఇప్పటికీ పనులకు వెళ్లి తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నాడు. వానొస్తే ఇంట్లోకే నీరు.. కుటుంబానికి ఉన్న ఏకై క నివాసం కూడా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే ఇంట్లో నీళ్లు కారుతున్నాయి. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు అప్పులు, ఇంకోవైపు ఆకలి ఇలా ప్రతి రోజు ఆ కుటుంబానికి అగ్నిపరీక్షగా మారింది. శిథిలావస్థకు చేరిన ఇల్లు, ఇద్దరు కుమారులతో బుర్రా జయకృష్ణ, కుమారి దంపతులు మానవతామూర్తులు ఆదుకోవాలి అనారోగ్యం, అప్పులు, ఆకలి, పేదరికం ఒకేసారి దాడి చేయడంతో కుటుంబం సాయంకోసం ఎదురుచూస్తోంది. మానవతావాదులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్న సాయం కూడా ఆ కుటుంబానికి పెద్ద ఊరటనివ్వగలదని చెబుతున్నారు. ఇద్దరు చిన్నారుల చదువులు ఆగిపోకుండా, ఆ కుటుంబం మళ్లీ నిలదొక్కుకునేలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకుంటే ఈ.కుమారి ఫోన్పే నంబరు 63049 15177కు పంపాలని కోరుతున్నారు. పేద కుటుంబంపై పగబట్టిన విధి కిడ్నీలు క్షీణించి మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద దిక్కు అనారోగ్యానికి గురై నిస్సహాయురాలిగా మారిన భార్య కన్నీరు తెప్పించే పెద్ద కుమారుడి త్యాగం 8వ తరగతి చదువుకుంటూ కూలీగా మారిన వైనం మానవతావాదుల చేయూత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని బొమ్మలాటపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..సోమవారం మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నాగభూషణ (37), కుళ్లాయప్ప (42), చాంద్బాషాలు ద్విచక్ర వాహనంలో నార్పలకు బయలుదేరారు. ఇదే సమయంలో నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎస్.అశోక్, ఎం.అశోక్ ద్విచక్ర వాహనంపై అనంతపురం వెళ్తున్నారు.బొమ్మలాటపల్లి సమీపంలో చెన్నంపల్లి క్రాస్ వద్ద ఎదురెదురుగా వీరి ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగభూషణ అక్కడికక్కడే మృతి చెందగా, కుళ్లాయప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఘటనలో చాంద్బాషాకు కూడా తీవ్ర గాయాలు కాగా ఎం. అశోక్, ఎస్. అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి. నాగభూషణకు భార్య నిర్మల, ఓ కుమారుడు, కుమార్తె, కుళ్లాయప్పకు భార్య కృపాదేవి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది. -
సచివాలయ వ్యవస్ధ నాశనమైంది
గత ప్రభుత్వంలో జనానికి ఏ పని కావాలన్నా సచివాలయంలోనే జరిగేవి. ఇప్పుడు సచివాలయ వ్యవస్ధ నాశనమైంది. అక్కడ ప్రభుత్వ సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో సీఎస్సీ, మీ సేవ కేంద్రాలకు వెళ్లి కావాల్సిన సేవలకు డబ్బులు కట్టి చేయించుకోవాలి. అవి కూడా మండల కేంద్రానికి వెళ్లినా అంత సులభంగా జరగవు. ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి కానీ.. ఇలా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. – ఆంజనేయులు, మాజీ సర్పంచ్, సిద్దరాంపురం, బొమ్మనహాళ్ మండలం -
జేసీ అనుచరుల బరితెగింపు
● వైఎస్సార్సీపీ నేత ఇంటిపై దాడికి యత్నం అనంతపురం: టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు బరితెగించారు. తాడిపత్రి నుంచి పెద్దవడుగూరుకు వాహనాల్లో వెళ్లి వైఎస్సార్సీపీ నేత రామచంద్రారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. మూడు రోజుల క్రితం జేసీ ప్రభాకర్రెడ్డి పెద్దవడుగూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ నాయకులు శేషారెడ్డి, శరభారెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, చితంబరరెడ్డిపై బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వైఎస్సార్సీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్ వేస్తారో చూస్తా అంటూ రెచ్చిపోయారు. దీనికి పెద్దవడుగూరు వైఎస్సార్సీపీ నేత రామచంద్రారెడ్డి స్పందించారు. మండలంలో 25 పంచాయతీలకు గాను 24 పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, మరి నామినేషన్ వేయకుండా ఎక్కడ అడ్డుకున్నారు అంటూ జేసీ ప్రభాకర్రెడ్డిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘జగన్మోహన్రెడ్డి తలుచుకొని ఉంటే గెలిచేవాళ్లం కాదు.. జగన్ మోహన్రెడ్డి పుణ్యంతోనే తాడిపత్రి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం’ అన్న జేసీ ప్రభాకర్రెడ్డి మాటలను కూడా ఆ పోస్టులో గుర్తు చేశారు. వీటిని జీర్ణించుకోలేని జేసీ అనుచరులు సోమవారం 50 వాహనాల్లో పెద్దవడుగూరుకు చేరుకుని రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు ముందస్తుగా పలువురు వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రా రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలించి, కుటుంబ సభ్యులను ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఎలాంటి సంఘటనా చోటు చేసుకోలేదు. -
సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటకే అందేవి. ఏ పని కావాలన్నా.. ఏ సర్టిఫికెట్లు కావాలన్నా సొంతూరిలోనే లభించేవి. పారదర్శక పాలన.. సత్వర స్పందనతో ప్రజల మన్ననలు అందుకున్న సచివాలయ వ్యవస్థ నేడు సేవల పరంగా అధమస్థానానికి పడిపోయింది. ఇందుకు కారణం
బొమ్మనహాళ్ మండలం లింగదహాళ్లో ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయంబొమ్మనహాళ్: ప్రభుత్వ సేవలు వేగంగా అందించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలని 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అన్ని రకాల ప్రభుత్వ సేవలనూ సచివాలయం పరిధిలోనే అందుబాటులోకి తెచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,207 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 10,333 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రజలు గతంలె పనుల కోసం వ్యయప్రయాసలకోర్చి మండల, జిల్లా కేంద్రం వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయ సేవలకు అనతికాలంలోనే గుర్తింపు లభించింది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం దీని పేరును మార్చేసింది. గ్రామాల్లోని సచివాలయాలను స్వర్ణ గ్రామం అని, పట్టణాల్లోని వాటిని స్వర్ణ వార్డు అని నామకరణం చేసింది. అయితే పేరు మార్చడంపై ఉన్న శ్రద్ధ సేవలను మెరుగుపరచడంపై లేకపోవడం గమనార్హం. నిత్యం.. ఫీల్డులోనే.. ప్రభుత్వం వివిధ రకాల సర్వేలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు సచివాలయంలో కన్నా ఫీల్డులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. దీంతో పనిమీద సచివాలయాలకు వస్తున్న ప్రజలకు అక్కడ ఖాళీ కుర్చీలే కనిపిస్తుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలోని అనేక సచివాలయాల్లో ఇదే పరిస్ధితి నెలకొంది. కొన్ని చోట్ల ఒకరు, ఇద్దరు మాత్రమే కార్యాలయంలో కనిపిస్తున్నారు. టార్గెట్ల పేరిట వేధింపులు దిగువస్ధాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ తమను టార్గెట్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు మదనపడుతున్నారు. జన గణన, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈ–కేవైసీ, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పనులతో సతమతమవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు చేత పట్టుకుని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే మనమిత్ర కార్యక్రమాలను వార్డుల్లో ప్రచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కొంతమంది అధికారులైతే వింతపోకడలతో ప్రోగ్రెస్ చూపించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పరిపాలన కార్యదర్శులకు గత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కోసం టార్గెట్ విధించారు. ఇలా సచివాలయ ఉద్యోగులపై సొంత విధులతో సంబంధం లేకుండా ఇతర శాఖల పనులన్నింటినీ నెత్తిన రుద్దుతూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. గతంలో వలంటీర్లు చేసే పనులు కూడా ఉద్యోగులతోనే చేయిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ పని చేయిస్తూ తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులం... బానిసలు కాదు అనంతపురం క్రైం/ అనంతపురం టవర్క్లాక్: ప్రభుత్వ ఉద్యోగులమే కానీ అధికారులకు వ్యక్తిగత బానిసలు కాదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతర వేధింపులు, పని ఒత్తిళ్లు, అవమానకరమైన వ్యవహార శైలే కర్నూలు వీఆర్వో హుస్సేన్ ఆత్మహత్యకు కారణమయ్యాయని ధ్వజమెత్తారు. వీఆర్ఓ మృతి నేపథ్యంలో సోమవారం అనంతపురంలో సచివాలయ ఉద్యోగులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా జెడ్పీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి పేరు తీసుకొస్తున్న సచివాలయ ఉద్యోగులకు ప్రశంసలు కాకుండా వేధింపులే బహుమతిగా లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించారు. ‘సర్’ కార్యక్రమంలో 14 శాఖల భాగస్వామ్యం ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, మొత్తం బాధ్యతలను సచివాలయ ఉద్యోగులపైనే మోపి బలిపశువులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టి.. భవిష్యత్తులో ఇటువంటి విషాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థపై బాబు సర్కార్ నిర్లక్ష్యం సర్వేల పేరుతో విపరీతమైన ఒత్తిళ్లు నిత్యం ఫీల్డ్లోనే ఉంటున్న ఉద్యోగులు వెలవెలబోతున్న సచివాలయాలు సకాలంలో సేవలందక ప్రజల పాట్లు -
మద్యానికి డబ్బివ్వలేదని బలవన్మరణం
తాడిపత్రి రూరల్: మద్యం తాగేందుకు డబ్బులివ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడిపత్రి మండలంలోని బుగ్గలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం మర్రిమాకులపల్లికి చెందిన సాంబశివ (42) తన భార్య రత్న, ఇద్దరు పిల్లలతో కలిసి 15 సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం తాడిపత్రికి వలస వచ్చాడు. స్థానికంగా పానీపూరి బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సాంబశివ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం మద్యం తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఇంటి వద్ద బాత్రూంలో కడ్డీకి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి అనంతపురం అర్బన్: మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీపీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు పసులూరి ఓబుళేసు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నాయకులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ఓ.ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, ఓబుళేసు మాట్లాడారు. మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల కారణంగా ఎస్సీ అభ్యర్థులు, పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అర్హులై ఉండి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం జరిగేవరకు వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శోభారాణి, నగర ప్రధాన కార్యదర్శి శోభన్కుమార్, నాయకులు లబ్బేముత్యాలప్ప, సాకే ఓబుళపతి, అంజలి, తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంతకల్లు మండలంలోని కసాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కసాపురం గ్రామంలో సుంకులమ్మ కట్ట వద్ద నారాయణ అనే రైతుకు తోట ఉంది. ఈ తోటలో సోమవారం ఉదయం చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి వద్ద సీ.అనిత అనే పేరుతో ఏటీఎం కార్డు లభించింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు ఆరా తీసి అనితకు ఫోన్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తన భర్త నగేష్ (38) అని, చిన్నపాటి గొడవ జరగడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఆమె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్న అనంతరం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగేష్కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఫుడ్ ఇండియా సదస్సుకు రిజిస్ట్రేషన్లు అనంతపురం అగ్రికల్చర్:కేంద్ర ఫుడ్ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జూలై 9, 10న విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఫుడ్ ఇండియా–2026 సదస్సు ఏర్పాటు చేసినట్లు ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి కలిగిన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, చిన్న,మధ్య తరహా కుటీర పరిశ్రమల్లో తయారు చేసిన తమ ఉత్పత్తులను సదస్సులో ప్రదర్శించడం ద్వారా మార్కెటింగ్ వసతి పెంచుకోవచ్చన్నారు. ఇందుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, ప్రదర్శన శాలలు ఏర్పాటవు తాయన్నారు. మరిన్ని వివరాలకు హార్టికల్చర్ డీడీ (7995086792) లేదా జిల్లా రిసోర్స్ పర్సన్ బి.హరీష్ (9676796974)ను సంప్రదించాలని సూచించారు. -
వ్యక్తిపై తేనెటీగల దాడి
కూడేరు: తేనెటీగలు దాడి చేయడంతో బుక్కరాయసముద్రం మండలం దెయ్యాలకుంట పల్లికి చెందిన రామచంద్రప్ప అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం మండల పరిధిలోని కమ్మూరులో ఓ రైతుకు చెందిన మామిడి పొలంలో కొమ్మలు కత్తిరించేందుకు రామచంద్రప్ప వచ్చాడు. కొమ్మలు కత్తిరిస్తుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కూడేరులోని పీహెచ్సీకి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల 6వ సెమిస్టర్ ఫలితాలను ఎస్కే విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య జ్యోతికుమార్ సోమవారం విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్కేయూ మూల్యాంకన విభాగం డైరెక్టర్ ఆచార్య లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ పద్మశ్రీ, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి తిరుమలేష్లతో కలిసి ఫలితాలను ప్రకటించారు. 6వ సెమిస్టర్ ఇంటర్న్షిప్ పరీక్షలకు 875 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 871 మంది 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఉపకులపతి కళాశాల పరీక్షల విభాగాన్ని సంద ర్శించారు. పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలు, వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న పారదర్శకత, మెరుగైన విధానాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారులు జీఎల్ఎన్ ప్రసాద్, చంద్రశేఖర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏఐ ప్రజావాణి ద్వారా అర్జీల స్వీకరణ అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఏఐ ప్రజావాణిని బాధితులు సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఏఐ ప్రజావాణి ద్వారా 15 మంది వారి సమస్యలను చెప్పుకున్నారు. బాధితుల నుంచి సేకరించిన వివరాలను ఒక ఫార్మాట్లో అర్జీగా తయారు చేసి ఏఐ నేరుగా ఎస్పీ జగదీష్కు పంపింది. మొత్తం 184 అర్జీలను ఎస్పీ స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన త్వరితగతిన పరిష్కరించాల్సిందిగా కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీ మహబూబ్బాషా, డీపీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పిడుగుపాటుకు పాడి ఆవు మృతి బ్రహ్మసముద్రం: పిడుగుపాటుకు పాడి ఆవు మృతి చెందిన సంఘ టన బ్రహ్మసముద్రం మండలంలోని పోలేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పాడి రైతు మహదేవమ్మ మాట్లాడుతూ రూ.50 వేలు ఖర్చుచేసి ఆవును కొనుగోలు చేసినట్లు తెలిపారు. జీవనాధారంగా ఉన్న ఆవు మృతి చెందడంతో బోరున విలపించారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. పాడి ఆవు కళేబరాన్ని సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ లింగన్న పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మట్కా రాస్తున్న అత్త, కోడలి అరెస్టు తాడిపత్రి రూరల్: మట్కా రాస్తున్న అత్త, కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు.. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీకి చెందిన అత్త,కోడలు వాసంతి, అలివేలు తమ ఇంట్లో మట్కా రాసేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు నిర్వహించి ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.50,150 స్వాధీనం చేసుకున్నారు. మహిళా పోలీసు సాయంతో నిందితులిద్దరినీ కోర్టులో హజరుపరిచినట్లు సీఐ తెలిపారు. -
చెట్లు నరక్కుండా చూడాలి
అనంతపురం అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా చెట్లను నరకుండా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మొహర్రం నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని చెట్లను పరిరక్షించాలన్నారు. మొహర్రం పండుగ సందర్భంగా గుండంలో వేసేందుకు వేప, రావి, జువ్వి, మర్రి, జమ్మి, చింత వంటి వృక్షాలను నరకకుండా చూడాలన్నారు. గ్రామాల పొలిమేరల్లో ఉండే సర్కార్ జాలి (కంప చెట్లు) మొద్దులను తీసి అగ్ని గుండంలో వేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, మైనారిటీ సంక్షేమ శాఖ ఏడీ రామసుబ్బారెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, అటవీ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్త యాప్తోనే యూరియా, డీఏపీ అమ్మకాలు అనంతపురం అగ్రికల్చర్: రైతుల అవసరం మేరకు యూరియా, డీఏపీ ఎరువులు ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా అమ్మకాలు చేపట్టాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ఆధార్ సంఖ్య ద్వారా తమ భూ విస్తీర్ణం, సాగు చేసిన పంటలను బట్టి ఎరువులు పంపిణీ ఉంటుందన్నారు. ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం: జేఎన్టీయూ(ఏ) ఎస్కేయూ పరిధిలోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 8న దరఖాస్తు గడువు ముగియగా.. దాన్ని 15 వరకు పొడిగిస్తూ యూనివర్సిటీల రిజిస్ట్రార్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు https://apuniversitiesrecruitment.apcfss.in లో తెలుసుకోవచ్చు. డిగ్రీ ఫలితాల విడుదలకు కసరత్తు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పరిధిలోని డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్ ఫలితాల విడుదలకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. జనవరిలో పరీక్షలు నిర్వహించగా.. ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొనడంపై 13 వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంపై ‘అంతా మా ఇష్టం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ స్పందించారు. సోమవారం పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఆన్లైన్ నిర్వహణ సంస్థతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సక్రమమైన డేటాను అందించే అంశంలో పరీక్షల విభాగం ఉన్నతాధికారులు వైఫల్యం చెందడంతో ఫలితాల విడుదలకు జాప్యమైందని సదరు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. డేటా అందిస్తే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్లు, ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని వీసీ ప్రకటించారు. ‘పరిష్కార వేదిక’లో అర్జీల వెల్లువ అనంతపురం అర్బన్: వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఇన్చార్జ్ డీఆర్ఓ పద్మావతి, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్ ప్రజల నుంచి 643 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీలుదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. -
ఆడబిడ్డని చెప్పారు... మగపిల్లాడని తేలింది!
● గుంతకల్లులో విచిత్ర సంఘటన● డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి వద్ద కుటుంబీకుల ధర్నా గుంతకల్లు: ఆడబిడ్డ పుట్టిందని ఆ డాక్టర్ చెప్పారు. పసిగుడ్డును తల్లి చేతిలో పెట్టారు. ఇంటికి మహాలక్ష్మి వస్తోందని తండ్రి సంతోష పడ్డాడు. అందరికీ చెప్పుకుని మురిసిపోయాడు. అయితే, 39 రోజుల తరువాత.. పుట్టింది ఆడ్డబిడ్డ కాదు, మగ బిడ్డ అని తేలడంతో ఆ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇదే సమయంలో ఆడ శిశువును మాయం చేసి ఎక్కడి నుంచో మగబిడ్డను తెచ్చుకున్నారనే వదంతులు వ్యాపించడంతో అవమానంగా భావించిన ఆ దంపతులు ప్రసవం జరిగిన ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. వివరాలు.. గుంతకల్లు మండలలోని నక్కన దొడ్డికి చెందిన బోయ రవికుమార్ భార్య భార్గవి గత నెల మే3న స్థానిక స్వప్న నర్సింగ్ హోమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆడబిడ్డ పుట్టిందని తల్లిదండ్రులకు డాక్టర్లు చెప్పారు. శిశువు బరువు తక్కువగా ఉండటంతో గుంతకల్లులోని సాయిక్రిష్ణ నర్సింగ్ హోమ్లోని చిన్న పిల్లల వైద్యుడు పవన్ వద్దకు రెఫర్ చేయగా.. అక్కడ 15 రోజుల పాటు శిశువును ఐసీయూలో ఉంచారు. అనంతరం వైద్యుడు పవన్ అందుబాటులో ఉండడని చెప్పి మరో చిన్న పిల్లల వైద్యుడు నీలకంఠరెడ్డి వద్దకు పంపారు. శిశువు గుప్తాంగం వద్ద ఉబ్బి ఉండడంతో అనుమానం వచ్చిన నీలకంఠరెడ్డి కర్నూలులోని మెడికవర్ ఆస్పత్రికి శిశువును తీసుకెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లగా స్కానింగ్ చేసిన డాక్టర్లు.. పుట్టింది మగబిడ్డ అని తేల్చారు. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు సోమవారం గుంతకల్లు వచ్చి సాయిక్రిష్ణ నర్సింగ్ హోమ్ వద్ద సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వైద్యురాలు రమణతో నాయకులు జగ్గలి రమేష్, సురేంద్రబాబు, వైటీ చెరువు రమేష్, రామునాయక్ తదితరులు వాదనకు దిగారు. డాక్టర్ రమణ మాట్లాడుతూ జన్యుపర లోపం కారణంగా శిశువులో ఒక్కోసారి ఆకారం కనబడదని, చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పగా.. అలాంటప్పడు ఆడబిడ్డ అని ఎలా నిర్ధారించారని నాయకులు నిలదీశారు. ఆడబిడ్డ అంటూ ఇప్పటికే మున్సిపాలిటీ వారు బర్త్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పలువురు కలగజేసుకుని బాధిత తల్లిదండ్రులు, నాయకులకు సర్దిచెప్పడంతో అంతా సద్దుమణిగింది. -
ఇది వెన్నుపోటుదారుల ప్రభుత్వం
గార్లదిన్నె/శింగనమల : రాష్ట్రంలో ఉన్నది ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రభుత్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం గార్లదిన్నె మండలం కల్లూరులోని స్టార్ ఫంక్షన్ హాలులో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, యువతతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతతో పాటు మాజీ మంత్రి శైలజానాథ్, శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికీ పాటుపడ్డారన్నారు. కులం, మతం, వర్గం కాకుండా అర్హతే ప్రామాణికంగా తీసుకుని పథకాలు వర్తింపజేశారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో దౌర్జాన్యాలు, దాడులు, అవినీతి, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిన ప్రజాప్రతినిధులు త్వరలో ఇంటింటికీ వస్తారని, అప్పుడు ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లోనూ గెలవడానికి కృషి చేయాలన్నారు. ‘సర్’ కార్యక్రమం నేపత్యంలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ఎం మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యర్శి నార్పల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేయించి కూటమి నేతల జేబులు నింపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యర్శి శ్రీరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వంశీ గోకుల్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శి సుధాకర్రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి బచ్చలన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చామలూరు రాజగోపాల్, ప్రసాద్, నాగేశ్వర్రెడ్డి, సూర్యనారాయణ, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర, పార్టీ మండల కన్వీనర్లు ఎల్లారెడ్డి, పరాంధమ, మహేశ్వర్రెడ్డి, నాయకులు జేసీ నారాయణ, మంజునాథ్, పసల ఆదినారాయణ, మంత్రి ఆంజినేయులు, కాటమయ్య, కేశవయ్య, బృందావన్ రామాంజనేయులు, లక్ష్మిదేవమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో శైలజానాథ్ హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు ఫించన్ ఇస్తామని చెప్పి ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోయినా చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. శింగనమల నియోజకవర్గంలో నీరు లేక పండ్లతోటలు ఎండిపోతుంటే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనలో భాగంగా ఈ నెల 12న శింగనమల నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి -
దాహం కేకలు వినిపించట్లేదా?
కళ్యాణదుర్గం రూరల్: ‘రెండు నెలలుగా మంచి నీరు సరఫరా కావడం లేదు. గ్రామానికి సమీపంలోని బోరు బావుల నుంచి అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నాం. ఎవరికి విన్నవించుకున్నా దాహార్తిని తీర్చేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు’ అంటూ మండలంలోని గోళ్లవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరును నిరసిస్తూ సోమవారం గ్రామ సచివాలయానికి తాళం వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు అర్జీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చి రెండు నెలలు గడిచిపోయిందన్నారు. ఇప్పటికై నా స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోళ్ల గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గోళ్ల పంచాయతీలో ఉన్న పాతచెరువు, శిబాయి గ్రామాల్లో 10 బెల్టుషాపులు ఉన్నాయంటే మద్యం సరఫరా ఏ విధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలకు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాగునీటి సమస్యను పరిష్కరించలేదని సచివాలయానికి తాళం ఎమ్మెల్యే అమిలినేనికి విన్నవించినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన -
తల్లికి వందనం.. ఎగనామం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం క్షేత్రస్థాయిలో మాత్రం వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు వేదనగా మారుతోంది. ‘ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ లబ్ధి’ అని చెప్తున్న ప్రభుత్వం అర్హుల జాబితాను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అనర్హులుగా మారితే కారణమేంటి? ఎవరిని సంప్రదించాలి? సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? అనే కనీస సమాచారం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే డీఈఓ కార్యాలయానికి వెళ్లమంటున్నారు. అక్కడికి వెళ్తే తమ వద్ద వివరాలు లేవంటున్నారు. ఎంఈఓ కార్యాలయాలు, పాఠశాలల హెచ్ఎంలూ చేతులెత్తేస్తున్నారు. చివరకు బాధితులు అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. దాచిపెడితే అనుమానాలు పెరగవా? ఏ ప్రభుత్వ పథకమైనా పారదర్శకంగా అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అర్హులు, అనర్హుల జాబితా లేదు. దీంతో నిజంగా ఎంతమంది లబ్ధి పొందారు? ఎంతమంది నష్టపోయారు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. గతేడాది అనుభవాలతో పాఠాలు నేర్చుకోలేదా? గతేడాది జిల్లాలో వేలాది మంది అర్హులకు పథకం అందలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆధార్, బ్యాంకు ఖాతాల పొరపాట్లు, సాంకేతిక సమస్యలు, అర్హతల గందరగోళంతో చాలామంది కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరిగారు. అయినా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని బాధితులు చెబుతున్నారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిపోయి, మళ్లీ అదే గందరగోళం కనిపిస్తుండడం విచారకరం. ఎవరిని సంప్రదించాలో.. ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి పేరు జాబితాలో లేకపోతే ఆ కుటుంబం ఎవరిని అడగాలి? ఎక్కడ న్యాయం పొందాలి? నాలుగుచక్రాల వాహనం ఉందని, 12(1)–సీ సీటు వచ్చిందని, ఆధార్ వివరాలు సరిపోలలేదని రకరకాల కారణాలు చూపిస్తూ అర్హులను పక్కనపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అనర్హులైతే ఆధారాలు చూపించాలి. అర్హులైతే వెంటనే సరిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఆ రెండు మార్గాలు కూడా కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. జాబితా విడుదల చేయండి.. తల్లికి వందనం పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం వెంటనే జిల్లా వారీగా అర్హులు, అనర్హుల జాబితాలను బహిరంగపరచాలి. అనర్హులుగా చూపిన ప్రతి విద్యార్థికీ కారణం వెల్లడించాలి. అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల పరిష్కారానికి బాధ్యులెవరో స్పష్టంగా ప్రకటించాలి. పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి సందేహాలకు తెరదించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అర్హత ఉన్నా పలువురికి వర్తించని పథకం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు సమాధానం చెప్పేవారు లేరు... సమస్యనూ పరిష్కరించరు.. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ప్రారంభమవుతుందని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి కూడా సమర్పించవచ్చని తెలియజేశారు. వీరభద్రుని సేవలో జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామిని ఆదివారం కర్ణాటక రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ ప్రభాకర్ శాస్త్రి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి ఆధ్వర్యంలో సంప్రదాయం ప్రకారం జస్టిస్ ప్రభాకర్ శాస్త్రిని సత్కరించి శాలువతో సత్కరించారు. 17 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: నైరుతి ప్రవేశంతో జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 12.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కుందుర్పిలో 80.2 మి.మీ, కణేకల్లులో 78 మి.మీ భారీ వర్షం కురిసింది. డి.హిరేహాల్ 56.2 మి.మీ, ఆత్మకూరు 36.4 మి.మీ, కంబదూరు 28.2, గుంతకల్లు 23.4, విడపనకల్లు 22.6, పెద్దవడుగూరు 19.6, శెట్టూరు 13.6, బొమ్మనహాళ్ 10.2, కూడేరు 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఓవరాల్గా ఈ నెల సాధారణ వర్షపాతం 61.2 మి.మీ కాగా ప్రస్తుతానికి 24.3 మి.మీ నమోదైంది. జూన్ మొదటి వారం ముగిసేసరికి 15 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షం కురిసింది. గుమ్మగట్ట, తాడిపత్రి, పెద్దపప్పూరు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. మిగతా మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగుకు రెడీ అవుతున్నారు. విదేశీ అతిథులకు అవస్థల స్వాగతం చిలమత్తూరు: సుదూరంలోని దేశం నుంచి వేల మైళ్లు ఎగిరొస్తాయి. స్థానికులకు కనువిందు కలిగిస్తాయి. అలాంటి విదేశీ అతిథులకు కష్టాలే స్వాగతం పలుకుతుండడం కలచి వేస్తోంది. ఈ సారి మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు కళ తప్పాయి. నీటి కోసం పశువులు, జంతువులు, పక్షులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సంతానోత్పత్తి కోసం వచ్చిన సైబీరియన్ కొంగలపై కూడా ఈ ప్రభావం పడింది. వర్షాభావంతో ఆయా చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో విదేశీ పక్షులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ మొదలు కిందిస్థాయి అధికారులు వీరాపురం వస్తున్నారు కానీ సైబీరియన్ కొంగల పరిరక్షణకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. -
ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ను బ్లాక్లిస్టులో పెట్టాలి
నల్లచెరువు: హంద్రీ–నీవా రెండోదశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో భారీఎత్తున అక్రమాలకు పాల్పడిన కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య, కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వారు కదిరి నియోజకవర్గ పరిధిలో హంద్రీ–నీవా లైనింగ్ పనులను పరిశీలించారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి, తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపాన పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి... విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పనులు అత్యంత నాసిరకంగా చేపడుతున్నారన్నారు. రూ.207 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు చంద్రబాబు ప్రభుత్వం అదనంగా రూ.102 కోట్లు కేటాయించినప్పటికీ పనుల్లో ఏమాత్రమూ నాణ్యత లేదన్నారు. ఇందులో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిందన్నారు. నాసిరకం నిర్మాణ సామగ్రి వాడటంతో నీటి ప్రవాహానికి చాలా చోట్ల లైనింగ్ కొట్టుకుపోయిందన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజల సొమ్మును దోచుకునేందుకే కూటమి నాయకులు లైనింగ్ పనులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపడుతున్న పనులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోతే వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నల్లచెరువు మండల కన్వీనర్ రవికుమార్రెడ్డి, తనకల్లు మండల కన్వీనర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. హంద్రీ–నీవా లైనింగ్లో భారీ అక్రమాలు నాసిరకం పనులు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు లైనింగ్ పనులను పరిశీలించిన మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త మక్బూల్ -
‘అధికార’ దర్పం.. అధికారుల దాసోహం!
శెట్టూరు: రాజకీయ పార్టీ సమావేశాలు, ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత వేడుకలకు ప్రభుత్వ కార్యాలయాలు వేదికలుగా మారిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు ఎలా చెప్తే అధికారులు అలా తలాడిస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇటీవల ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల్లో టీడీపీ మండల కన్వీనర్ బర్త్డే వేడుకలు నిర్వహించడం.. అధికారులు, సిబ్బంది తమ పనిని పక్కనపెట్టి మరీ ‘పచ్చ’ సేవలో తరించడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆదివారం మరోసారి అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ బూత్లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏల) సమావేశం ఏకంగా ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఇక్కడ మండలానికి సంబంధించి కీలకమైన ఫైళ్లు, కంప్యూటర్ తదితర సామగ్రి ఉన్నాయి. సిబ్బంది ఎవ్వరూ లేని సమయంలో బయటి వ్యక్తులు యథేచ్ఛగా లోనికి వచ్చారు. గంటల తరబడి అక్కడే ఉండటంతో పాటు ఆవరణమంతా కలియదిరిగారు. విషయం తెలిసిన జనం, స్థానిక ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో అనధికారిక సమావేశానికి అనుమతి ఉందా.. ఎవరు పర్మిషన్ ఇచ్చారు.. ఇలా ఎవరైనా తమ ప్రైవేట్ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చా.. అని చర్చించుకోవడం కనిపించింది. ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ బీఎల్ఏల సమావేశం మీటింగ్ విషయం తెలీదు ఆదివారం కార్యాలయానికి సెలవు. అయితే టీడీపీ కార్యకర్త ఒకరు మండల పరిషత్ సిబ్బంది వద్దకు వచ్చి యోగా కార్యక్రమం ఉందని చెప్పి తాళం చెవి తీసుకుని వెళ్లాడట. ఆ తర్వాత వారు కార్యాలయంలోనికి వెళ్లడం.. అక్కడే ఆవరణలో టీడీపీ బీఎల్ఏలతో సమావేశం నిర్వహించడం మాకు తెలియదు. – జిలానీ బాషా, ఎంపీడీఓ, శెట్టూరు


