హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్ప స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. న్యూ కేటగిరి విభాగంలో నిర్వహించిన ఈ పోటీలకు మొత్తం 12 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఫరీద్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా పీఆర్పల్లికి రైతు రాజు యాదవ్ వృషభాలు, అదే జిల్లా చెన్నకానల గ్రామ రైతు చెన్నారెడ్డి వృషభాలు తృతీయ స్థానం, గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు.
రామాలయంలో చోరీ
శింగనమల: మండలంలోని లోలూరు పంచాయతీ రఘునాథపురంలో వెలసిన రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలో చొరబడిన దుండగులు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, 3.5 కిలోల వెండి ఆభరణాలు, అర తులం బంగారును అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి గుర్తించి గ్రామస్తుల ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పట్టపగలే రెండిళ్లలో...
గుత్తి: స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో సోమవారం పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. కారు డ్రైవర్ ప్రవీణ్ ఇంట్లో చొరబడిన దుండగులు బీరువాలోని ఒక తులం బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలతో పాటు రూ. 18 వేలు నగదు అపహరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంట్లో చొరబడి బీరువాలో దాచిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 3,500 నగదు అపహరించారు. ఇంటి యజమానాలు పనిపై బయటకు వెళుతూ ఇళ్లకు తాళం వేసి ఉన్న సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్ఐ సురేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసులు నమోదు చేశారు.


