breaking news
Anantapur Latest News
-
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
అనంతపురం అర్బన్: జిల్లాలో ఎక్కడా డ్రగ్స్ మహమ్మారి కనిపించకూడదని, డ్రగ్స్రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ జగదీష్తో కలిసి కలెక్టర్ నార్కోటిక్ కో–ఆర్డినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే దుష్ప్రభావాలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బుక్కరాయసముద్రం చెరువు కట్ట దిగువన ఉన్న పార్కును వినియోగంలోకి తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా పోలీసు శాఖ, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు పాఠశాల యాజమాన్యం పూర్తి సహకారం అందించాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వలిబాషా, ఈగల్ నోడల్ అధికారి జయపాల్రెడ్డి, ఎస్ఐ హనుమంతు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఇళ్లకు వెళ్తే నిలదీస్తారు’ రాయదుర్గం రూరల్: ‘మనం ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ఇప్పటికే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటింటికీ వెళితే కచ్చితంగా నిలదీస్తారు’ అంటూ ఏకంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సభలోనే ఆ పార్టీ నాయకుడు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని 74 ఉడేగోళం మద్దానేశ్వర స్వామి కల్యాణమండపంలో శనివారం కాలవ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఇంటినీ సందర్శించి అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలోనే రాయదుర్గం మండలం బీఎన్ హళ్లికి చెందిన టీడీపీ నాయకుడు కాటా వెంకటేశులు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ.1,500, అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రైతులకు పంటల బీమా బకాయిలు, వితంతు పింఛన్, తల్లికి వందనం తదితర విషయాలపై బాధితులు నిలదీస్తారని అనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ చిన్నచిన్న సమస్యలపై ప్రశ్నిస్తే పరిష్కరిస్తామని సమాధానం చెప్పాలనడం గమనార్హం. లోకేష్ రాజీనామా ఎప్పుడు? అనంతపురం: ‘నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇదే తరహాలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగం నాయకులు ప్రశ్నించారు. విద్యార్థి, నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలన్న డిమాండ్లతో పాటు ‘నీట్’ అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లుట్ల మారుతీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
వైద్యం అందక వృద్ధుడు మృతి
అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ వృద్ధుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నార్పలకు చెందిన లక్ష్మీనారాయణ (60) కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. వాహనం దిగి నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డులోకి చేరుకున్న లక్ష్మీనారాయణకు చికిత్స చేయండని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. అయితే కొంతసేపటి తర్వాత వైద్యులు ఈసీజీకి రెఫర్ చేశారు. ఈలోపు పరిస్థితి విషమించింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఆక్సిజన్ అందజేస్తూ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు చూస్తుండగానే ప్రాణం విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే తమ ఇంటి పెద్దదిక్కును కోల్పోవాల్సి వచ్చిందంటూ ఏఎంసీ వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి 9 గంటల వరకు ఉద్రిక్తత నెలకొంది. చివరకు అవుట్పోస్టు ఎస్ఐ రవి, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
నిరుద్యోగులతో చంద్రబాబు చెలగాటం
● ఘోరంగా డీఎస్సీ నిర్వహణ ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ వజ్రకరూరు: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష నిర్వహణ అత్యంత ఘోరంగా జరిగిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. శనివారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. డీఎస్సీ పేపర్ తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్షలు రాయించి అక్రమాలకు తెరతీశారని, దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలు, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 28న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, నిరుద్యోగ యువత, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులపై అణచివేత చర్యలు దుర్మార్గం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై అణచివేత చర్యలు చేపట్టడం దుర్మార్గమని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అణచివేయాలని భావించడం సరికాదన్నారు. దేశంలో విద్యావ్యవస్థ పనితీరు అధ్వానంగా మారిందని విమర్శించారు. నీట్–యూజీ పేపర్ లీక్పై చేపట్టిన పోరాటానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొన్నారన్నారు. 10 సంవత్సరాల్లో దాదాపు 150 సార్లు నీట్తోపాటు వివిధ పరీక్షల పేపర్లు లీక్ కావడం ఆందోళన కలిగిస్తోందని, కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోవేదన మిగులుతోందని వాపోయారు. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే అప్రమత్తమై రాజీనామా చేసి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేదే కాదని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ.వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, వజ్రకరూరు మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉస్మాన్, జిల్లా నాయకులు రాకెట్లబాబు, రఘుపతి తదితరులు ఉన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడు రూరల్: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్కేయూతో పాటు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు, యువతతో శనివారం అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో ‘టీ టైమ్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, విద్యా సమస్యలు, నిరుద్యోగ యువత ఇబ్బందులు, ఉపాధి అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్య, పోటీ పరీక్షలు తదితర అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 28న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, నీట్ పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగ భృతి అమలు, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగుల సుధీర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, రాప్తాడు వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, ఎస్కేయూ లింగారెడ్డి, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల కన్వీనర్లు గోవిందరెడ్డి, సాకే వెంకటేశు, ఎంపీటీసీలు సోమశేఖర్రెడ్డి, సునిల్దత్తరెడ్డి, మాజీ సర్పంచ్లు ఆనంద్, గురుప్రసాద్, నాయకులు నారాయణస్వామి, మన్నల చిరంజీవి, రమేష్, పెరవళి జయచంద్రారెడ్డి, పూలకుంట భాస్కర్రెడ్డి, మన్నీల శేషు, ఎస్సీ సెల్ నల్లప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రీమియం చెల్లింపునకు తంటాలు
● బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్ల వద్ద రైతుల పడిగాపులు అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద సాగు చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. మీసేవ కేంద్రాల్లో అలాంటి సదుపాయం లేకపోవడం, కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ) ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో రైతులు తికమక పడుతున్నారు. అక్కడక్కడ పని చేస్తున్నా సర్వర్లు సతాయింపుతో నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు ప్రీమియం చెల్లింపు కోసం గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా వ్యాప్తంగా 50 వేల హెక్టార్ల వరకు కంది పంట వేశారు. 20 వేల హెక్టార్లలో పత్తి, 15 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగతాది ఆముదం, మొక్కజొన్న సాగు చేశారు. దీంతో ఇప్పుడు కంది, పత్తి, ఆముదం పంటకు బదులు పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొత్తగా సాగు చేసిన పంటకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తే బీమా పథకాలు వర్తించనున్నాయి. ఫసల్బీమా కింద వరి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, మిరప పంటలు ఉండగా.. వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, బత్తాయి, అరటి, టమాట పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెలాఖరులోపు ప్రీమియం చెల్లించాలని గడువు ఉంది. అసలే ఎల్–నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. పంట మార్పిడి ధ్రువీకరణకు అవస్థలు ఖరీఫ్లో దాదాపు వేరుశనగ పేరుతో బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడం ఇప్పుడు రైతులకు సమస్యగా మారింది. సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదైన పంటకే ప్రీమియం చెల్లించినట్లుగా ఉండాలనే నిబంధన ఉండటంతో పంట మార్పిడి ధ్రువీకరణ కోసం ఇప్పుడు బ్యాంకులకు పరుగులు తీసి అవస్థలు పడాల్సి వస్తోంది. సీఎస్సీ నోడల్ ఆఫీసర్ పాండురంగయ్య (7989690495), ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధి సిద్దేశ్వర్ (8431377472), వంశీకృష్ణ–టెక్నికల్ ఏఓ (8331057724)లను రైతులు సంప్రదించినా ప్రీమియం కట్టడానికి వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. -
●ఘనంగా తొలి ఏకాదశి పూజలు
బొమ్మనహాళ్: ఆంధ్ర పండరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లు రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పాండురంగస్వామికి తెల్లవారుజామున వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం నిర్వహించారు. పుష్పాలకరణ, ఆకుపూజ, ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, మహామంగహారతి వంటి ప్రత్యేక పూజలు చేపట్టారు. విఠల విఠల... రుక్మిణీ పాండురంగ విఠల అంటూ భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. -
ఆరుతడి పంటలే సాగు చేసుకోండి
అనంతపురం అర్బన్: ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరు తడి పంటలు మాత్రమే సాగు చేసేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్–నినో ప్రభావం కారణంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు అవకాశం ఉందన్నారు. దీంతో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు వరికి బదులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కంది, ఉలవ, పెసర, మినుము, కొర్ర వంటివి సాగు చేసేలా చూడాలన్నారు. ఈ నెల 31లోగా రైతులు పంటల బీమా చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. పాడిపశువులకు గ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యాన పంటల్లో పీఎండీఎస్ విధానాన్ని అనుసరించేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో పట్టు పరిశ్రమ విస్తీర్ణం పెంచేలా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి ప్రేమ్చంద్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● సర్వజనాస్పత్రి వైద్యులను హెచ్చరించిన కలెక్టర్ అనంతపురం సిటీ: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులను కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సెమినార్ హాలులో శుక్రవారం సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిటీ ఉపాధ్యక్షుడు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలు ప్రగతి, ప్రస్తుతం అవసరమైన సౌకర్యాల కల్పన ప్రతిపాదనలపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గత సమావేశంలో తీర్మానించిన పనులు పెండింగ్లో ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు సిబ్బందిని పెంచని సెక్యూరిటీ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. వ్యక్తిగత విద్వేషాలను పక్కన పెట్టి రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలన్నారు. ఆస్పత్రి క్యాంటీన్ అనుమతి ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపడాలని, తాగునీటి సమస్య రాకుండా చూడాలని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం జరుగుతున్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ బెనడిక్ట్, డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ నవీన్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు, ఈఈ రామ్మోహన్, హెచ్డీఎస్ కమిటీ సభ్యులు విశా ఫెర్రర్, ఓ.రత్నమయ్య, మిద్దెల నరసింహులు, కొప్పల వెంకటరమణయ్య, వివిధ విభాగాధిపతులు, వైద్యులు పాల్గొన్నారు. -
బీజేపీకి వత్తాసు పలుకుతారా?
అనంతపురం ఎడ్యుకేషన్: ‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ విద్యా సంస్థల బంద్ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాల్సింది పోయి బీజేపీకి వత్తాసు పలుకుతారా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం’ అని విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఏ, పీఎస్ఎఫ్, ఏఐఎస్బీ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, ఐద్వా తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద శాంతియుతంగా బంద్ నిర్వహించేందుకు వెళ్లిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బలవంతంగా అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుత నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును కూడా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపగా, ప్రభుత్వ విద్యాసంస్థల వద్ద పోలీసులను మోహరించి బంద్ను అడ్డుకోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పృథ్వీ, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్, పీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు అబ్దుల్ అలం, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి ఓబులేసు, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ నాయకుడు దుర్గాప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాయదుర్గంలో ఉద్రిక్తత రాయదుర్గంటౌన్: నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై దాడులకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్లతో విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్ శుక్రవారం రాయదుర్గంలో ఉద్రిక్తతకు దారి చేసింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం)లు నిర్వహిస్తుండడంతో బంద్ చేయించేందుకు వచ్చిన ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కొట్రేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ, పీడీఎస్యూ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించారు. స్టేషన్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలియజేశారు. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు అనంతపురంలో కేఎస్ఆర్ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు స్థానిక ఎన్నికల్లో ‘కూటమి’కి బుద్ధి చెబుతాం నీట్ లీకేజీపై విద్యార్థి నాయకుల ఆగ్రహం విద్యా సంస్థల బంద్ విజయవంతం -
పిల్లలతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా?
● మెగా పీటీఎంలోవిద్యార్థుల తల్లిదండ్రుల నిరసన గుత్తి రూరల్: పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే వారితో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను నిలదీశారు. శుక్రవారం గుత్తి మండలం రజాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థినుల తల్లిదండ్రులు హాజరయ్యారు. గురుకులంలో నెలకొన్న సమస్యలపై తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ నాగజ్యోతితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని గురుకుల పాఠశాలలో చేర్పిస్తే.. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులతో మరుగుదొడ్లు, స్నానపు గదులు, పరిసరాలు ఎలా శుభ్రం చేయిస్తారు.. మీ పిల్లలైతే ఇలా చేయిస్తారా.. పేద పిల్లలంటే అంత చులకనగా కనపడుతున్నారా అంటూ నిలదీశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జీతాలు రాలేదని పారిశుధ్య సిబ్బంది పని మానేస్తే.. వారి పనిని మా పిల్లలతో చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. భోజనం కూడా నాణ్యతగా ఉండటం లేదని, నీళ్ల పప్పు, చారు వడ్డిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే విద్యార్థినులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ సురేష్బాబు, అమీర్ ఖాన్ సిబ్బందితో కలిసి వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులను శాంతింపజేశారు. నాసికరం భోజనంపై అసంతృప్తి డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): మండల కేంద్రమైన డీ.హీరేహాళ్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు అందించిన మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి విద్యార్ధులు, తల్లిదండ్రుల కార్యక్రమానికి వచ్చారు. వడ్డించిన అన్నం ముద్దగా ఉండటంతో పాటు సాంబార్ నాణ్యత లేకపోవడంతో చాలామంది భోజనం చేయకుండా వెళ్లిపోయారు. లక్ష్యం ఎంచుకుని చదవండి గార్లదిన్నె: విద్యార్థులు తమ లక్ష్యం ఏమిటో ఎంచుకుని అందుకు తగ్గట్టు చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం గార్లదిన్నెలోని జెడ్పీ హైస్కూల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) నిర్వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. హిందీ ఉపాధ్యాయుల కొరత, ప్రహరీ, క్రీడా మైదానం సమస్యలను ఉపాధ్యాయులు విన్నవించారు. పీటీఎం విజయవంతం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 1,752 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) విజయవంతంగా ముగిసిందని డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. 1,69,102 మంది విద్యార్థులు, 1,47,525 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, 22,240 మంది పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, 1,334 మంది పూర్వ విద్యార్థులు, 767 మంది దాతలు, 1,428 మంది ప్రజాప్రతినిధులు, 32,299 మంది ఇతరులు పాల్గొన్నారు. -
31న ఉరవకొండలో మహాధర్నా
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేతల దౌర్జన్యకాండను నిరసిస్తూ ఈనెల 31న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కౌడిగి గోవిందు అల్లుడు జయకుమార్ వేల్పుమడుగు పొలం సర్వే నం.141లోని 21 ఎకరాల పొలం కొనుగోలు చేస్తే , ఆపొలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని టీడీపీ నేతలు మంత్రి కేశవ్ డైరెక్షన్తో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ రైతును పొలంలోకి వెళ్లకుండా చేస్తున్న అధికారులపైనా చట్టపరమైనచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొలంపై జయకుమార్కు సర్వహక్కులున్నాయని, జిల్లా కోర్టు, హైకోర్టు, సివిల్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. దీనిపై అనేక మార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలను కలిసి విన్నవించినట్లు తెలిపారు. రైతు తన పొలంలో వేసిన మూడు బోర్లు, పైప్లు టీడీపీ నేతలు ధ్వంసం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు డిష్ సురేష్, కౌడిగి గోవిందు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్పై వేటు అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న జూనియర్ అసిస్టెంట్ రమణారెడ్డిపై కలెక్టర్ ఆనంద్ సస్పెన్షన్ వేటు వేశారు. రమణారెడ్డిని తక్షణం సస్పెండ్ చేస్తూనే ఆయన వివరణ తీసుకుని, తదుపరి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని జేడీఏ ఎన్.సాలురెడ్డిని ఆదేశించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రొఫెసర్లను విచారించిన సీబీ సీఐడీ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను సీబీ సీఐడీ అధికారులు శుక్రవారం విచారణ చేశారు. గతంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి మూల్యాంకనం చేసిన ప్రొఫెసర్ల వివరాలను ఆరా తీసి, జవాబు పత్రాల్లో పెట్టిన సంతకం.. తాజాగా నమోదు చేస్తున్న సంతకాన్ని పోల్చి చూశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్ల సంతకాలను సరిపోల్చి చూస్తున్నట్లు తెలిసింది. ఇక జేసీ ఆగడాలు సాగనివ్వంపెద్దవడుగూరు: ‘నా ఊపిరి ఉన్నంత వరకూ జేసీ ప్రభాకర్రెడ్డి ఆగడాలు సాగనివ్వను’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మేడిమాకులపల్లిలో వైస్సార్సీపీ నేత చితంబరరెడ్డిని కలిసి మాట్లాడారు. ఇటీవల జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో కలిసి చితంబరరెడ్డి ఇంటి వద్ద హల్చల్ చేసిన విషయం విదితమే. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి అండతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రౌడీలను, గూండాలను ఉసిగొల్పి గ్రామాల్లో కక్షలు ప్రేరేపిస్తున్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇటీవల మదన్మోహన్రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం, అధికార పార్టీ వాళ్లకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం సరికాదన్నారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలను పిలిపించి బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎద్దుల శరభారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్రెడ్డి, సూర్యప్రభాకర్రెడ్డి, కొట్టాలపల్లి హరినాథరెడ్డి, గుత్తి అనంతపురం గోవర్ధన్రెడ్డి, మోహన్రెడ్డి, మహేష్రెడ్డి, చింతలచెరువు భాస్కర్రెడ్డి, శేఖర్, రాజాకొండయ్య, రంగేశ్వరెడ్డి, సజ్జలదిన్నె రాజు, కొండారెడ్డి పాల్గొన్నారు. -
‘సర్’లో మీ పేరుందా?
● ఒక్క ఎస్ఎంఎస్తో వెంటనే వివరాలు ● నేటితో ముగియనున్న సర్ గడువు రాయదుర్గం టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు తమ వివరాలు తెలుసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదిస్తున్నారు. కొందరైతే బీఎల్ఓలు నమోదు చేశారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. సందేహాలన్నింటికి చాలా సులభమైన పరిష్కారాన్ని ఎన్నికల సంఘం చూపించింది. మొబైల్ ఫోన్తోనే ఇంటి నుంచే కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఓటు వివరాలు సర్లో నమోదు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్ఫోన్ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్తో కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే... ఎస్ఐఆర్లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఎస్ఐఆర్ పూర్తయిందా.. లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎస్ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ తర్వాత ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్కు మెస్సేజ్ పంపించాలి. మెస్సేజ్ పంపగానే సెకన్లలోనే ఈసీ నుంచి మెస్సేజ్ వస్తుంది. అందులో మీ పేరు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పార్ట్ నంబర్, నియోజకవర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే పేరు ఎస్ఐఆర్లో నమోదైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మెస్సేజ్లో వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెస్సేజ్ రాకపోయినా బూత్ లెవర్ ఆఫీస్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. -
‘పెద్ద సారు’ లేక.. శాంతిభద్రతలు పడక!
తాడిపత్రి రూరల్: జిల్లాలో అత్యంత సమస్యాత్మకమైన తాడిపత్రి పోలీసు సబ్ డివిజన్కు డీఎస్పీని నియమించడంలో పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ రోహిత్కుమార్ బదిలీపై పల్నాడుకు వెళ్లి 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ఆ స్థానంలో మరొకరిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ ప్రభావితనియోజకవర్గంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఉహకందని పరిస్థితి. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఏళ్ల తరబడిగా పోలీసు పికెటింగ్ కొనసాగుతున్నా తరచూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండడమే ఇందుకు నిదర్శనం. తాడిపత్రి మండలంలోని వీరాపురంగ్రామంలో 2019లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భాస్కర్రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చడంతో ప్రతీకార దాడులు జరగకుండా ఏర్పాటు చేసిన పికెటింగ్ నేటికీ కొనసాగుతోంది. ఆలూరు గ్రామంలో సైతం 2024 నుంచి పోలీసు పికెటింగ్ ఉంది. బ్రహ్మణపల్లిలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా కొన్నిరోజుల క్రితం ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడం, అతని బైక్ను ప్రత్యర్థులు కాల్చి వేయడం గమనార్హం. ఊరుచింతల గ్రామంలో అయితే జంట హత్యలు జరిగాయి. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలందేవుని ఉప్పలపాడు, యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు, పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామంలో కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వంద కిలోమీటర్ల దూరంలో ఇన్చార్జ్ డీఎస్పీ.. రోహిత్కుమార్ బదిలీపై వెళ్లాక గుంతకల్లు డీఎస్పీకి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాడిపత్రి పట్టణానికి గుంతకల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అత్యవసరమైతే తప్ప ఇన్చార్జ్ డీఎస్పీ ఇక్కడికి రాని పరిస్థితి. ఇదే అదనుగా కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్నింటినీ ‘క్యాష్’ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట, మట్కారాయుళ్లతో కొందరు పోలీసులు ప్రతి నెలా పెద్ద మొత్తంలో పుచ్చుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సీఐ, ఎస్ఐలు అధికార పార్టీ నేత చెప్పిందల్లా చేస్తుండడం, అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతుండడంతో శాంతిభద్రతలు గాల్లో దీపంలా మారాయి. అక్రమ పంచాయితీలు, పేకాట, మట్కా, ఇసుక, మట్టి తవ్వకాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సబ్డివిజన్ ప్రజలు కోరుతున్నారు. తాడిపత్రి ఏఎస్పీ బదిలీపై వెళ్లి 15 రోజులు గుంతకల్లు డీఎస్పీకి ఇన్చార్జ్ ఇచ్చి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో క్షణక్షణం భయాందోళనగా పరిస్థితి -
‘ఉపాధి’ కూలీల వేతన వెతలు
● రూ. 73.23 కోట్ల మేర బకాయిలు ● ఆవేదన చెందుతున్న గ్రామీణులు అనంతపురం న్యూటౌన్: రెండు దశాబ్దాల పాటు గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) చట్టం ఇటీవల ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్’ (వీబీజీ–రాంజీ)గా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30 కంటే ముందు మంజూరైన పనులన్నీ ఆటోమేటిక్గా కొత్త చట్టంలోకి మారాయి. అయితే పాత చట్టంలో భాగంగా చేసిన పనులకు సంబంధించి ఇప్పటికీ వేతనాలు విడుదల కాకపోవడం గమనార్హం. జూన్ 8 వరకూ మాత్రమే కూలి డబ్బులు అందాయని, ఆ తర్వాత ఖాతాల్లో జమ కాలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ. 73,23,82,790 మేర బకాయిలున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా శింగనమల మండలానికి చెందిన కూలీలకు రూ. 5,33,01,578 మేర బకాయిలున్నాయి. రెండు, మూడు స్థానాల్లో బుక్కరాయసముద్రం, గుంతకల్లు మండలాలు ఉన్నాయి. వేతనాలు అందకపోవడంతో చేసేదిలేక వందలాది పేద కుటుంబాలు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ తదితర నగరాలకు వలస బాట పట్టాయి. వృద్ధులు, పిల్లలను వదలి సుదూర ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళుతున్నా ప్రభుత్వాలకు కనికరం లేకుండా పోయిందని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. -
పంట దిగుబడి ఆధారంగా ఫసల్బీమా
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.సాలురెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాతావరణ, ఫసల్ బీమా పంటల బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి రైతులకు సూచించారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఎల్డీఎం మారుతీ శ్రీనివాసులుతో కలిసి జేడీఏ విలేకరుల సమావేశం నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ పంట దిగుబడులు ఆధారంగా ఫసల్ బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కంది రైతులు ఎకరాకు 80, వరి రైతులు రూ.164, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదంకు రూ.80, మిరపకు రూ.576 ప్రకారం రైతులు తమ వాటా కింద ఈనెల 31లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉందన్నారు. జెనరాలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫసల్బీమా అమలవుతుందన్నారు. ఇక వాతావరణం ఆధారంగా అమలు చేస్తున్న వాతావరణ బీమా కింద వేరుశనగ ఎకరాకు 640, పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, అరటికి రూ.3 వేలు, టమాటాకు రూ.1,600 ప్రకారం రైతులు తమ వాటా కింద ఈనెల 31లోపు ప్రీమియం చెల్లించి బీమా పథకంలో చేరాలన్నారు. ఏఐసీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలు.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇండియా (ఏఐసీ) ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలవుతున్నట్లు డీఏఓ సాలురెడ్డి తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు వేరే పంట సాగు చేసివుంటే మార్పు చేసుకోవాలన్నారు. పంట మార్పు చేసినట్లు సెల్ప్ డిక్లరేషన్ బ్యాంకుల్లో సమర్పించి... కొత్తగా సాగు చేసిన పంటకు ప్రీమియం చెల్లించాలని తెలిపారు. పంటల బీమా వద్దనుకునే రైతులు ప్రీమియం గడువుకు రెండు మూడు రోజులు ముందే బ్యాంకుల్లో దరఖాస్తు ఇవ్వాలన్నారు. పంట రుణాలు తీసుకోని (నాన్లోనీ) రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ)కు వెళ్లి ప్రీమియం కట్టి బీమా పరిధిలోకి రావాలన్నారు. -
బీఎల్ఏ నాగేష్ హత్య కేసులో 9 మంది అరెస్టు
కనగానపల్లి: రెండు రోజుల క్రితం జరిగిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నాగేష్ హత్య కేసులో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. రామగిరి సీఐ ఎస్ మహమ్మద్ అలీ తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన అంకె నాగేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కనగానపల్లి సమీంలోని మారెమ్మగుడి వద్ద 9 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో వడ్ల దస్తగిరి బాబు, నితీష్కుమార్, వన్నూరప్ప, అంకె మురళీ, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, లక్ష్మిదేవి ఉన్నారు. అనంతరం వారిని ధర్మవరం కోర్టుకు తరలించారు. జోడు లింగాల ఆలయంలో చోరీ కూడేరు: ప్రసిద్ధి చెందిన కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాలు.. గురువారం ఉదయం 6 గంటలకు అర్చకుడు శివ ఆలయానికి వచ్చారు. అప్పటికే గర్భగుడి ముందు మందిరంలో నుంచి కోతులు బయటకు రావడంతో వాచ్మెన్ తలుపులు తీశాడనుకున్నారు. లోపలికి వెళ్లగా శాశ్వత హుండీ తలుపులు తెరిచి ఉండటం, మరో హుండీ బీగం పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్బాబుకు సమాచారమిచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవదాయశాఖ ఏసీ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీఐ రాజు, పోలీసు సిబ్బంది, కూ్ల్స్ టీం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాచ్మెన్ను ప్రశ్నిస్తే తాను ఆలయం బయట నిద్రించినట్లు చెప్పాడు. తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ నెల 3న హుండీల్లోని నగదును లెక్కించామని ఈఓ తెలిపారు. సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకూ నగదును ఎత్తికెళ్లి ఉండొచ్చని ఈఓ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య గుంతకల్లుటౌన్: పట్టణంలోని హనుమేష్నగర్కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది.వన్టౌన్ సీఐ మనోహర్ వివరాల మేరకు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న రవి, మేరీలకు ముగ్గురు పిల్లలున్నారు. మొదటి కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సమీప బంధువు భాగ్యనగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ అనిల్కుమార్ బాలికను వేధింపులకు గురిచేశాడు. మనస్తాపంతో మంగళవారం సదరు బాలిక ఇంట్లోని బెడ్రూమ్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి రవి బుధవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన అనిల్కుమార్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే బాలిక తల్లితో సదరు అనిల్ సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయడంతో ఇరు కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. దీంతోనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. హాస్టల్ ఆవరణలో క్షుద్రపూజలు ఉరవకొండ: పట్టణ పోలీస్స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న గాంధీ హరిజనోద్ధరణ హాస్టల్ ఆవరణలో బుధవారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొందరు క్షుద్ర పూజల కోసం రెండు రాళ్లను పేర్చి దానిపై బండ పరిచి రాళ్ల మధ్యలో దీపాన్ని వెలిగించి జంతువు పుర్రె, ఎముకలు ఉంచి ఆ ప్రాంతంలో రక్తం, పసుపు, కుంకమ చల్లి పూజలు నిర్వహించినట్లు అక్కడి వస్తువులను బట్టి తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి అర్ధరాత్రి పూజలు చేసినట్లు గుర్తించారు. కోట్లాది రూపాయాలు విలువ చేస్తే హరిజనోద్దరణ హస్టల్ స్థలం కోసం చాలా కాలంగా వివాదం నడుస్తోంది. స్థలం రికార్డులను కొందరు స్వార్థపరులు తారుమారు చేసి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సదరు స్థలంలో ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహించడం చర్చనీయంశంగా మారింది. -
మెగా పీటీఎం.. బంద్ టెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్’ (పీటీఎం)కు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న వేళ, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం పీటీఎంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశిస్తుండగా, మరోవైపు బంద్ నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లాలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్బీ, ఏఐఎస్ఏ, పీఎస్యూ, పీఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ తదితర విద్యార్థి సంఘాలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరాయి. అధికారుల స్పష్టమైన ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా 1,752 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్కు, పీటీఎంకు సంబంధం లేదని, నిర్ణయించిన ప్రకారమే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు హెచ్ఎంలు, టీచర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అడ్డుకుని తీరుతామని విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నారు. నిధులు తక్కువ.. ఖర్చులు ఎక్కువ మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవడం లేదని హెచ్ఎంలు, టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 251 నుంచి 1,000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.6,750లు, 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.9,000 మాత్రమే కేటాయించారని, ఈ మొత్తంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించడం సాధ్యం కాదంటూ పెదవి విరుస్తున్నారు. ఖాతాల్లోకి చేరని నిధులు కేటాయించిన నిధులు ఎంఈఓల ఖాతాల్లో జమ చేశామని అధికారులు చెబుతున్నా గురువారం రాత్రి వరకు అనేక మంది హెచ్ఎంల ఖాతాలకు బదిలీ కాలేదు. దీంతో కార్యక్రమ నిర్వహణ కోసం సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎంను నిర్వహించాలని ఒత్తిడి చేస్తుండగా, మరోవైపు బంద్ ప్రభావం, నిధుల కొరత, నిర్వహణ భారంతో క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నేడు పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలని సర్కారు ఆదేశాలు విద్యార్థి సంఘాల దేశవ్యాప్త బంద్ పిలుపుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నిధులు నామమాత్రంగా ఉన్నా పండుగలా చేపట్టాలని ఆదేశించడంపై పెదవివిరుపు -
టెక్సాస్ తెలుగు సదస్సుకు రాచపాలెం
అనంతపురం సెంట్రల్: ఉత్తర టెక్సాస్లో ఈనెల 26న జరగనున్న అంతర్జాల సాహిత్య సదస్సుకు జిల్లాకు చెందిన ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి హాజరుకానున్నారు. ‘తెలుగు సాహిత్య విమర్శ నాడు–నేడు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నట్లు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు మాధవి లోకిరెడ్డి, సమన్వయకర్త దయాకర్మాడ తెలిపారు. ప్రతినెలా తెలుగు వెన్నెల పేరుతో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వెబ్నార్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. -
చదవలేక.. చావుకోరి
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. మడకశిర: హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు. రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్కు వచ్చిన చంద్రేగౌడ్..రాత్రి వేళ హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మడకశిరలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చదవడం ఇష్టంలేక హాస్టల్లోనే ఉరివేసుకున్న వైనం -
ట్రాక్టర్ ట్రాలీ కింద పడి వృద్ధురాలి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని ఆలూరుకు చెందిన లక్ష్మీదేవి (60)పై ట్రాక్టర్ ట్రాలీ టైరు వెళ్లడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ట్రాక్టర్ ట్రాలీ కింద ఉన్న నీడలో లక్ష్మీదేవి పడుకొని ఉండగా అదే గ్రామానికి చెందిన రామనాథ్రెడ్డి ట్రాక్టర్ను నడపగా ఆమైపె టైరు ఎక్కింది. ఆమె కేకలు విన్న రామనాథ్ ట్రాక్టర్ నిలిపి వెనక్కి వచ్చి చూడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి కనపడింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి బలవన్మరణం కూడేరు: మండల పరిధిలోని జయపురానికి చెందిన బోయ సూర్య (50) గురువారం తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. బోయ సూర్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఓ రైతుకు చెందిన 4 ఎకరాల భూమిని నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని అందులో బ్యాడిగి మిర్చి, వేరుశనగ పంటలు సాగు చేస్తూ వచ్చాడు. పంటలు సరిగా పండక అప్పులయ్యాయి. మరో పక్క కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాలేదు. సాయంత్రం సమీపంలోని చెట్టుకు సూర్య వేలాడు కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిక్సర్లతో చెలరేగిన దత్తారెడ్డి అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో జరుగుతున్న అండర్ – 23 ఇంటర్నల్స్ క్రికెట్ టోర్నీలో జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి సిక్సర్లతో చెలరేగాడు. గురువారం అనంతపురం, ప్రకాశం జిల్లా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అనంత జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించింది. ఓపెనర్ మచ్చా దత్తారెడ్డి 45 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ మనోజ్కుమార్ 32 పరుగులు, ప్రదీప్రెడ్డి 22, రేహన్ 28, మల్లికార్జున 12 పరుగులు చేశారు. -
పుట్టింది రైతు కుటుంబంలో అయినా పట్టుదల, క్రమ శిక్షణతో కూడిన విద్య ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విక్రమ్ –1 రాకెట్ విజయంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన మారక సుష్మ విజయగాథపై ‘
అనంతపురం ఎడ్యుకేషన్: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇటీవల విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగ విజయంలో రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లికి చెందిన యువ ఇంజినీర్ మారక సుష్మ కీలక పాత్ర పోషించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శభాష్.. సుష్మ అంటూ జిల్లా వాసులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్లో కీలక బాధ్యతలు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్ అండ్ ల్యాబ్వ్యూ ఇంజినీర్గా పని చేస్తున్న మారక సుష్మ, రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక పరీక్షలు, గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్, ల్యాబ్వ్యూ సాఫ్ట్వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. విక్రమ్–1 ప్రయోగ బృందంలో సభ్యురాలిగా శ్రీహరికోటలో జరిగిన ప్రయోగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రైతు కుటుంబం నుంచి... మారక సుష్మ వయస్సు 26 సంవత్సరాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన రైతు మారక సుబ్బారెడ్డి, మారక సుజాత దంపతుల కుమార్తె. రైతు కుటుంబంలో జన్మించిన సుష్మ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచి క్రమశిక్షణతో ముందుకు సాగారు. వారి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటోంది. అభినందనల వెల్లువ రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామ్యం కావడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత సుష్మను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సుష్మ నిరూపించిందంటున్నారు. దేశానికి సేవ చేయడమే లక్ష్యం : సుష్మ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన విక్రమ్–1 ప్రయోగంలో భాగస్వామ్యం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని సుష్మ తెలిపారు. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని విజయవంతమైన ప్రయోగాల్లో పాల్గొని దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర రైతు కుటుంబంలో పుట్టి జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన వైనం యువతకు స్ఫూర్తిగా నిలిచిన సుష్మ దేశానికి మరిన్ని సేవలు అందిస్తానంటున్న యువ శాస్త్రవేత్త -
టీబీ డ్యాంకు పెరిగిన ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో భారీగా వస్తోంది. తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న గాజునూరు జలాశయం (అప్పర్ తుంగా ప్రాజెక్ట్)లో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరడంతో అక్కడి అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఆ నీరంతా పరుగున వచ్చితుంగభద్ర డ్యాంలో చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 28 టీఎంసీల నీరు ఉంది. తాగునీటి అవసరాల నిమిత్తం వివిధ కాలువలకు 3,035 క్యూసెక్కులు వదులు తున్నారు. ఇన్నాళ్లూ నిరాశ పరిచిన వరద ఒక్కసారిగా పెరగడంతో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరుణుడి కరుణ కొనసాగి జలాశయం త్వరగా నిండాలని ఆకాంక్షిస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.64 అడుగులతో 78.60 టీఎంసీల నీరు నిల్వ ఉండి 29,546 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 38,557 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. రైతులకు 2024 ఫసల్ బీమా పరిహారం! అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2024కు సంబంధించి ఫసల్బీమా పథకం కింద రైతులకు పరిహారం విడుదలైనట్లు తెలుస్తోంది. ఏయే పంటలకు వర్తింపజేశారు, ఎంత మంది రైతులున్నారు, ఎంత మొత్తం విడుదలైంది, వాతావరణ బీమా కింద ఏమైనా పరిహారం వచ్చిందా అనే వివరాలు తమకు ఇంకా అందలేదని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతుల మొబైల్కు గురువారం మెసేజ్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో 2024 ఖరీఫ్ ఫసల్బీమా కింద పాక్షికంగా పరిహారం విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. దీనిపై బీమా కంపెనీలను సంప్రదించి స్పష్టత తీసుకుంటామని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎకరాకూ బీమా వర్తించాలి అనంతపురం అర్బన్: సాగు చేసిన ప్రతి ఎకరాకూ బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ, క్రాప్ ఇన్సూరెన్స్ (డీఎల్ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంటల బీమాకు ఈనెల 31 వరకు అవకాశం ఉందన్నారు. రైతులందరూ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద ఇప్పటి వరకు 38,416 హెక్టార్లకు సంబంధించి 25,621 మంది,దిగుబడి ఆధారిత బీమా కింద 32,514 హెక్టార్లకు 19,908 మంది రైతులు నమోదు చేసుకున్నారన్నారు. ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు.. ఎంత మంది బీమా నమోదు చేసుకున్నారు.. వేరుశనగ నుంచి ఇతర పంటలకు మారిన రైతులు ఎంత మంది తదితర వివరాలతో నివేదిక అందించాలని ఎల్డీఎంను ఆదేశించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఎల్డీఎం మారుతి శ్రీనివాసులు, ఏడీఏలు, బ్యాంకర్లు, బీమా ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కిరాని ఈఎఫ్లు 2.40 లక్షలు అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పొడిగించిన షెడ్యూల్ ప్రకారం తొలి అంకమైన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 20,38,523 మంది ఓటర్లు ఉండగా, వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. పది రోజులు గడువు పొడిగించిన తరువాత కొనసాగిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో రోజురోజుకూ ఈఎఫ్ల డిజిటలైజేషన్ సంఖ్య తగ్గుతుండగా... అదే క్రమంలో వెనక్కిరాని (అన్ కలెక్టబుల్) ఈఎఫ్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. బుధవారం నాటికి ఈఎఫ్ల డిజిటలైజేషన్ 18,07,239 ఉండగా గురువారం నాటికి 8,978 మేర తగ్గి 17,98,261కు చేరింది.అన్కలెక్టబుల్ ఈఎఫ్లు బుధవారం నాటికి 2,31,284 ఉండగా గురువారానికి మరో 8,978 పెరిగి 2,40,262కు చేరాయి. ప్రక్రియ ముగియనున్న చివరి రోజు శుక్రవారం నాటికి ఈఎఫ్ల డిజిటలైజేషన్ మరికొంత తగ్గి, అన్కలెక్టబుల్ ఈఎఫ్ల సంఖ్య మరికొంత పెరగవచ్చని అధికావర్గాలు చెబుతున్నాయి. -
‘బడుగు, బలహీన వర్గాలపై కక్ష సాధింపు’
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలపై కక్ష సాధింపు అధికమైందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ ధ్వజమెత్తారు. వైఎస్సారీసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 2023లో వైఎస్సార్సీపీకి చెందిన బీసీ నాయకుడు గోవిందు అల్లుడు జయకుమార్ కొనుగోలు చేసిన 21 ఎకరాల భూమిలో వేసిన బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారన్నారు. ఆ భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పలుమార్లు అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుందన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందన్నారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి మాట్లాడుతూ జయకుమార్కు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే అధికారులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనాల హరికృష్ణ, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాలపాటి శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడికి గోవిందు, జిల్లా కార్యదర్శి మల్లెల జగదీష్, ఉరవకొండ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు జి.సురేష్, మున్సిపల్ విభాగం జిల్లా కార్యదర్శి వడ్డే రామచంద్ర, నాయకులు నిమ్మల నాగరాజు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
●ఆశల పంట.. ఆవేదనే రైతు ఇంట
పంపనూరు వద్ద రోడ్డు పక్కన పడేసిన టమాటాలు ఒక్క కోత కూడా కోయకుండానే ట్రాక్టర్తో టమాట పంటను దున్నేస్తున్న దృశ్యంమంచి ధరలు వస్తాయన్న ఆశతో అప్పు చేసి మరీ పంట సాగు చేస్తే చివరికి ఆవేదనే మిగిలింది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని దుస్థితి దాపురించింది. దీంతో చేసేదిలేక ఒక్క కోత కూడా కోయకుండానే పంటను నిలువునా దున్నేస్తున్నారు. కొందరు రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన రైతు పుల్లారెడ్డి రెండు ఎకరాల్లో టమాట పంట పెట్టాడు. మొత్తం రూ.1.20 లక్షల ఖర్చయింది. పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్లో ధరలు లేకపోవడం శాపంగా పరిణమించింది. ఒక్క కోత కూడా కోయకుండానే గురువారం ట్రాక్టర్తో రెండు ఎకరాల్లోని పంటను ధ్వంసం చేయాల్సి వచ్చింది. – ఆత్మకూరు -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు ?
రాయదుర్గం–తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణ పనులు దశాబ్ద కాలానికిపైగా కొనసాగుతూనే ఉన్నాయి. 206.52 కి.మీలో ఇప్పటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గంటౌన్: రాయదుర్గం – తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అనంతపురం జిల్లాతో పాటు దక్షిణ కర్ణాటక ప్రజల రవాణా అవసరాలతో పాటు గార్మెంట్స్, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, రైల్వే వ్యవస్థ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని 2007–08లో ఈ రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. 206.53 కి.మీ రైలుమార్గం నిర్మాణానికి రూ.1714.50 కోట్ల అంచనాతో 2012లో శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, కంబదూరు, దొడ్డహళ్లి, మడకశిర, కోతాళం, పావగడ, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి మీదుగా కర్ణాటకలోని తుమకూరు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. 2016లో కళ్యాణదుర్గం వరకు, 2017లో కదిరిదేవరపల్లి వరకు రైలుమార్గం పూర్తికావడంతో తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు సర్వీసును ప్రారంభించారు. ప్రస్తుతం ఇటీవల కంబదూరు, దొడ్డహళ్లి, పావగడ వరకు (99 కి.మీ), అటు వైపు నుంచి తుమకూరు–ఉరుకెర వరకు 10 కి.మీ మేర మొత్తం 109 కిలోమీటర్ల వరకు రైలుమార్గ నిర్మాణం పూర్తయింది. మరో 97 కిలోమీటర్ల మేర కర్ణాటక రాష్ట్రంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం పనుల్లో తీవ్ర జాప్యం, ఇతరాత్ర కారణాలు, దీర్ఘకాలంగా సాగుతుండడంతో నిర్మాణ అంచనా వ్యయం అమాంతం రూ.4 వేల కోట్లు దాటినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. ఇంకా కోతాళం, మడకశిర, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి, కొరటగెరె మార్గంలో భూ సేకరణతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు, అండర్పాస్ నిర్మించేందుకు దీర్ఘకాలం పట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వేసహాయ మంత్రి సోమన్న 2027 డిసెంబర్ నాటికి రైలు మార్గం నిర్మాణాన్ని పూర్తచేస్తామంటున్నా అది అసాధ్యమని రైల్వే అధికారులే చెబుతున్నారు. తగినన్ని నిధులు బడ్జెట్లో విడుదల చేస్తే తప్ప రైల్వేమార్గం నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎలాంటి జాప్యం లేకుండా, నిధుల విడుదలతో పాటు అన్ని పనులు సక్రమంగా జరిగితే 2031 నాటికి రైలుమార్గం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 14 ఏళ్లుగా నిర్మాణ దశలోనే రాయదుర్గం – తుమకూరు రైలుమార్గం 206.52 కి.మీలో నేటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి నిర్మాణ పనుల్లో జాప్యంపై అన్ని వర్గాల ప్రజల అసంతృప్తి -
చెదిరిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కల
● అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన జేఎన్టీయూ ఉన్నతాధికారులు ● వేరే యూనివర్సిటీల్లో అర్హులుగా గుర్తించినా ఇక్కడ మాత్రం తిరస్కరణఅనంతపురం: యూనివర్సిటీలో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలనే వారి కల చెదిరిపోయింది. ఆవేదన చెందడం మినహా చేసేదేమీ లేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో 79 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 12,892 దరఖాస్తులు అందాయి. ఇందులో 11,676 దరఖాస్తులకు ఆమోదం తెలిపిన అధికారులు మిగిలిని వాటిని తిరస్కరించారు. వీటిల్లో సింహభాగం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులవే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో జేఎన్టీయూ(ఏ) అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పే స్లిప్పులు లేవంటూ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ బోధనానుభవాన్ని ధ్రువీకరించే పత్రాలతో పాటు వేతనాలకు సంబంధించిన పే స్లిప్పులను సమర్పించాలనే నిబంధన విధించారు. అయితే, కన్సాలిడేటేడ్ ప్రాతిపదికన పనిచేస్తున్న పలువురు అధ్యాపకులకు వర్సిటీల నుంచి సాధారణ ఉద్యోగుల తరహాలో పే స్లిప్పులు జారీ చేయలేదు. తాజాగా పే స్లిప్ లేదనే సాకుతో దరఖాస్తులు తిరస్కరించడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలే తమను నియామకం చేసి, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదంటూ బాధితులు వాపోతున్నారు. వారిపై అమితప్రేమ.. గతంలో వివాదాస్పదంగా చేపట్టిన పోస్టులను తాజాగా రెగ్యులరైజ్ చేసేందుకు కసరత్తు చేస్తుండడంపైనా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జేఎన్టీయూ (ఏ) పరిధిలో 2017లో 9 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసిన అధికారులు.. 2019 జనవరి మొదటి వారంలో హడావుడిగా నియామక పత్రాలు అందజేశారు. పాలిమర్ సైన్సెస్లో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టు ఇవ్వడం, నోటిఫికేషన్ సమయానికి పీహెచ్డీ పూర్తి కాని వారికి సైతం పోస్టు కట్టబెట్టడం తదితర వింత ఘటనలు చోటుచేసుకోవడంతో అప్పట్లో పోస్టుల భర్తీ వివాదాస్పదమైంది. ఈ క్రమంలో 2019 జూన్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించగా.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని తిరిగి విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. తాజాగా ఈ 9 ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులరైజ్ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వింత వైఖరి అవలంబిస్తూ అర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తున్న వర్సిటీ అధికారులు.. మరోవైపు అనర్హులైన ఉద్యోగులపై అమిత ప్రేమ కనబరుస్తూ పోస్టులను క్రమబద్ధీకరించేందుకు ఆసక్తి కనబరుస్తుండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జేఎన్టీయూ (ఏ)లోని ఈసీఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అజయ్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ప్రైవేట్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల అధ్యాపక అనుభవం ఉంది. అనుభవ ధ్రువీకరణ పత్రంతో పాటు పేస్లిప్పులు కూడా అందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అన్ని అర్హతలు ఉన్న అతని దరఖాస్తును జేఎన్టీయూ అధికారులు తిరస్కరించారు. కాకినాడ జేఎన్టీయూలో అజయ్ దరఖాస్తు చేసుకోగా, అక్కడ ఆమోదించడం గమనార్హం. అజయ్ ఒక్కరిదే కాదు.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏకంగా ఇలాంటి 351 దరఖాస్తులు తిరస్కరించారు. -
నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
అనంతపురం అర్బన్: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పయనం పతనం దిశగా సాగుతోందని సీపీఐ నాయకులు విమర్శించారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసుల చేత కూర్రంగా దాడి చేయించడమే ఇందుకు నిదర్శమన్నారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక క్లాక్టవర్ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి మాట్లాడారు. విద్యార్థులు, యువతపై లాఠీచార్జీ అమానుష చర్య మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య హక్కుపై దాడి చేయడమే అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు మస్తాన్, సాయికుమార్, రామకృష్ణ, నారాయణస్వామి, రమణయ్య, కృష్ణుడు, లింగమయ్య, చిరంజీవి, నరేషన్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రాయదుర్గంటౌన్: కర్ణాటకలోని గుడేకోట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి ఆర్టీసీ డ్రైవర్ ఎం.కరిబసప్ప (54) దుర్మరణం పాలయ్యారు. బంధువుల వివరాల మేరకు ... కరిబసప్ప దాదాపు 17 ఏళ్లుగా రాయదుర్గం ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తిరుపతి సర్వీస్ డ్యూటీ ముగించుకుని వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం సాయంత్రం కర్ణాటకలోని గుడేకోటలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. గుడేకోట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొన్నాడు. ఘటనలో కరిబసప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మొలకాల్మూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరిబసప్ప మృతిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు, ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో టిప్పర్కు మంటలు గుమ్మఘట్ట: మండలంలోని సిరిగెదొడ్డి సమీపంలో ఓ టిప్పర్కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల వివరాల మేరకు పట్టణంలోని మున్సిపాలిటికీ చెందిన చెత్తను డంపింగ్ యార్డు నుంచి వేరు చేసిన వ్యర్థపదార్థాలను తీసుకుని టిప్పర్ సిరిగెదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న గోపాల్ పొలంలోని పాడుబడ్డ బావి వద్దకు వెళ్లింది. పైన వున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను డ్రైవర్ గమనించకపోవడంతో టిప్పర్ను అన్లోడ్ చేసేందుకు యత్నించాడు. పైన ఉన్న విద్యుత్ తీగలకు టిప్పర్పై భాగం తగలడంతో విద్యుదాఘానికి గురికావడంతో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని బయటపడ్డాడు. ఘటనలో టిప్పర్ టైర్లు కాలిపోయాయి. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోని తీసుకువచ్చారు. అరటి ఎగుమతికి రూ.1.03 కోట్లు మంజూరు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ఈ ఏడాది అరటి ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.03 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీడీ ఉమాదేవి, ఏడీ ధనుంజయ తెలిపారు. ప్రధానంగా తాడిపత్రి నుంచి ముంబైకి రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా రవాణాకు చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
● పోలీసుల అదుపులో కేటుగాళ్లు అనంతపురం సెంట్రల్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ పుల్లయ్య బుధవారం మీడియాకు ఆ వివరాలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం చెంచుగారిపల్లికి(ప్రస్తుతం దేవహనహళ్లి, బెంగళూరులో ఉంటున్నాడు) చెందిన కొర్రా విజయనాయక్, అనంతపురంలోని రహమత్నగర్కు చెందిన షేక్ ముజీమ్ మిల్, తాడిపత్రికి చెందిన పల్లా నారాయణస్వామి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఎన్ఏఆర్ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే రిజర్వ్బ్యాంకులో తమకు రూ.కోట్ల డబ్బు ఉందని, విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, తొలుత డబ్బులు ఇస్తే తిరిగి ఎక్కువ ఇస్తామని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా నగరంలోని అరవింద్నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఎన్ఏఆర్ఎల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలు, రిజర్వ్ బ్యాంకులో డబ్బులు డ్రా చేయడ కోసమంటూ రూ. 6 లక్షలు చొప్పున మొత్తం రూ. 20 లక్షలు తీసుకొని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఆదర్శనగర్ సమీపంలో నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో కొర్రా విజయ్కుమార్, షేక్ ముజీమ్ మిల్ను అరెస్ట్ చేశారు. పల్లా నారాయణస్వామి అలియాస్ బన్ని పరారీలో ఉన్నట్లు సీఐ పుల్లయ్య పేర్కొన్నారు. -
రెండేళ్లు ఓపిక పట్టా.. ఇక ప్రజల్లోకే
● పోలీసుల ఏకపక్ష వైఖరితోనే గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య ● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిటౌన్: ‘టీడీపీ నాయకుల ప్రోగ్రాం ఉందంటూ పోలీసులే నన్ను బయట తిరగకుండా చేశారు. రెండేళ్లు ఓపిక పట్టా. ఇక గ్రామాల్లో తిరుగుతాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. బుధవారం యాడికిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల విఘాతానికి కారణమవుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేసి స్టేషన్లకు పిలిపించడం, తిట్టడం, కొట్టడం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ పార్టీ నాయకులు గ్రామాల్లో లేకుండా చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏ అధికారం ఉందని జేసీ ప్రభాకర్రెడ్డి 50 వాహనాల్లో విచ్చలవిడిగా గ్రామాల్లో తిరుగుతున్నాడని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు అక్రమాలు, అన్యాయాలు చేశారంటూ బురద చల్లడం అలవాటుగా మార్చుకున్నాడన్నారు. తిట్లు తిట్టడంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి కూడా తండ్రి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివాడని విమర్శించారు. పెద్దపొలమడ ఫీల్డ్ అసిస్టెంట్పై అస్మిత్రెడ్డి చేయి చేసుకోవడం చూస్తుంటే తండ్రికి ఏ మాత్రమూ తీసిపోడనిపిస్తోందన్నారు. తాడిపత్రి పట్టణంలో పోలీసుల వైఖరి మరీ అధ్వానంగా మారిందని, గంజాయి, మట్కా, పేకాట ఆదాయాల కోసం జేసీ చెప్పిందే వేదంలా ముందుకెళ్తున్నారని విమర్శించారు. దీనికి బదులు పోలీసులే మట్కా, పేకాట కేంద్రాలు నిర్వహించి గంజాయి అమ్మకాలు చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇకపై బైండోవర్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను అణచివేయాలని ప్రయత్నిస్తే పోలీస్స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
పావగడకు రైలొచ్చేదెన్నడో?
ఇటీవల దొడ్డహళ్లి–పావడగ వరకు రైలు మార్గం తనిఖీ కూడా పూర్తి చేశారు. దాదాపు రెండు నెలల గడిచిపోతున్నా నేటి వరకు పావగడ వరకు రైలు నడపడం లేదు. ప్రస్తుతం కదిరిదేవరపల్లి వరకు తిరుపతి రైలును నడపుతున్నారు. రాయదుర్గం మీదుగా రైలుమార్గం పూర్తయిన దొడ్డహళ్లి, పావడగ వరకూ కొత్త రైలు నడిపితే రైలు మార్గం దెబ్బతినకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కర్ణాటక లేదా ఆంధ్రాలోని ముఖ్యమైన నగరాల నుంచి మరొక రైలు నడిపితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఆ దిశగా నేటికీ ప్రజాప్రతినిధులుగాని, రైల్వేశాఖ ఉన్నతాధికారులు గాని ఏమాత్రం ఆలోచించడం లేదు. -
‘మెగా పీటీఎం’ నిర్వహణకు రూ.52.11 లక్షల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న (శుక్రవారం) నిర్వహించనున్న మెగా పీటీఎం–4.0 కార్యక్రమం కోసం ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా అనంతపురం జిల్లాలోని 1,752 ప్రభుత్వ పాఠశాలలకు రూ.52,11,450 విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి బుధవారం ఆయా మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) నిధులు విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ టి. శైలజ తెలిపారు. గంజాయి కేసులో నిందితుడి అరెస్టు రాప్తాడు రూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రాప్తాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాప్తాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నం.62/2026 కేసులో పరారీలో ఉన్న అనంతపురం రూరల్ తపోవనంకు చెందిన అరుణ్ జాకబ్ అలియాస్ అరుణ్ రాస్తాను రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. వివరాలను సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్తో పాటు ఇతర మత్తు పదార్థాలు, హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు. -
కూలి ఖర్చులూ రాకపాయె
● పాతాళానికి పడిపోయిన టమాట ధరలు ● కుదేలవుతున్న రైతన్నలు కళ్యాణదుర్గం/ అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్లో టమాట ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. కనీసం కాయలు కోసే కూలీల ఖర్చులు, మార్కెట్కు తరలించే రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి, లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగాలు చెందుతు న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈసారి రైతులు టమాట పంట సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో పంట సాగులోకి వచ్చినట్లు గణాంకాలు వెల్లడిన్నాయి. భూమి దున్నడం, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులతో పాటు కూలీ ఖర్చుల కోసం ఎకరానికి రూ. లక్షకు పైగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతికి వచ్చి మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు మార్కెట్లో ధరలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం మార్కెట్లో 15 కిలోల బాక్సు మొదటి రకం రూ.150 నుంచి రూ.200, రెండో రకం రూ.120–రూ.140, మూడో రకం రూ.30–రూ.100 లోపే పలుకుతుండడంతో ఆవేదనలో కూరుకుపోయారు. చిన్న సైజు కాయలు, తేమ ఉన్నవి, మచ్చ వచ్చిన కాయలు కొనడానికి వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటివి బాక్సు రూ.50 కూడా పలకడం లేదు. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100–రూ.150 పలుకుతుండంతో పెట్టుబడులు కూడా రావడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. చాలా మంది పంటను కోయకుండానే పొలాల్లో వదిలేస్తుండడం గమనార్హం. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఏటా టమాట రైతులకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పండించే టమాటలను బెంగుళూరు, చైన్నె, హైదరాబాద్, మహారాష్ట్ర, కోలార్ వంటి ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా చోట్ల మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించాలని, మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
కుందుర్పి: ప్రకృతి వ్యవసాయం ద్వారానే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని రాయలసీమ అటవీశాఖ అధికారి యశోద బెన్ తెలిపారు. బుధవారం మండలంలోని అప్పిలేపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన వివిధ రకాల పంటలను ఆయనతో పాటు జిల్లా అటవీశాఖ అధికారుల బృందం పరిశీలించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కుందుర్పి మండలంలో 10 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించడం గర్వకారణమన్నారు. కుందుర్పి మండల రైతులను ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలను సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు ప్రభాకర్, రేంజ్ అధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
గుమ్మఘట్ట: మండలంలోని వేపులపర్తి క్రాస్ సమీపంలో ఉన్న వేదావతి హగరి నుంచి రాయదుర్గం పట్టణానికి ఇసుకను తరలిస్తున్న 7 ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకుని స్టేషన్కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ , రిజిస్ట్రేషన్ లేకపోవడంతో పాటు ఇసుకపై టార్పాలిన్ లేకుండా వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ చిన్నరాయుడు తెలిపారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేలు అపరాధ రుసుం వేశామన్నారు. అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): అప్పుల భారం తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన డీ.హీరేహాళ్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్ (27) సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నాడు. ఆన్లైన్ గేమింగ్, ట్రేడింగ్లకు అలవాటు పడిన గౌరీశంకర్ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి అందులో డబ్బు పెట్టాడు. తీవ్ర నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన ఇంటి బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. లక్ష్మీకి ఇద్దరు కుమారులు ఉండగా గౌరీశంకర్ చిన్న కుమారుడని, ఇంకా వివాహం కాలేదన్నారు. జెడ్పీ ప్రగతికి పాటుపడతాం అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జి. కృష్ణమూర్తి బుధవారం బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగా పనిచేద్దాం.. జిల్లా పరిషత్ ప్రగతికి పాటుపడుదామంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న మల్లికార్జున, ఏఓలు భాస్కర్ రెడ్డి, లెక్కల శ్రీనివాసులు, షేక్ నియాజ్ పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేఎస్ఎన్’ డిగ్రీ కళాశాల సెమిస్టర్ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల (మహిళలు)లో ఈ ఏడాది మే 4 నుంచి 19వ తేదీ వరకూ నిర్వహించిన 2, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లక్ష్మయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరామ్ నాయక్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రగతి, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బీవీ రమణనాయుడు, అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి.రామలింగారెడ్డి, నాగభూషణంతో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. దొంగ అరెస్ట్ ● రూ. 7 లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు పాల్పడుతున్న దొంగను అనంతపురం ఫోర్త్టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో వివరాలను నాల్గవ పట్టణ సీఐ మస్తాన్, సీసీఎస్ సీఐ జయపాల్రెడ్డి, ఎస్ఐ గోపి వివరించారు. కక్కలపల్లి కాలనీకి చెందిన సాయికిరణ్ మద్యం, జూదం వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పగటి పూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది జూన్ నెల నుంచి నగర పరిసరాల్లో మూడు చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాలపై నిఘా పెట్టి నిందితున్ని నగర శివారులో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 7 లక్షలు విలువజేసే 3.14 తులాల బంగారం, 203. 5 గ్రాములు వెండి , రూ. 8 వేలు నగదు, టీవీ, గ్యాస్ సిలిండర్, నాలుగు చేతి గడియారాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
రైటర్ల పెన్డౌన్ .. రిజిస్ట్రేషన్లు ఢమాల్
● జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్య దాటని వైనం ● తగ్గిపోయిన రిజిస్ట్రేషన్శాఖ ఆదాయంఅనంతపురం టౌన్: ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది.. అయితే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జీఓ 396 విడుదల చేసింది. దీంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి.. రిజిస్ట్రేషన్శాఖ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది.. దీంతో పాటు డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్కు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రోజూ 500లకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. అయితే ఆ సంఖ్య కాస్తా 40కి పడిపోయింది. డాక్యుమెంట్ రైటర్ల స్థానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, వారి ద్వారా వినియోగదారులకు సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులిచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు సేవా కేంద్రాలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే డాక్యుమెంట్ రైటర్ల మనుగడ కష్టతరంగా మారనుంది. దీంతో వారు పెన్డౌన్ చేస్తూ సమ్మెకు దిగారు. తగ్గిన రిజిస్ట్రేషన్లు రైటర్ల పెన్డౌన్తో జిల్లా వ్యాప్తంగా స్తిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అనంతపురం రామ్నగర్ ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజువారీగా 78 స్లాట్లు ఉంటే మంగళ, బుధవారాల్లో కేవలం నాలుగైదు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రుద్రంపేటలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, గుంతకల్లు, గుత్తి, కణేకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి సైతం పెద్ద ఎత్తున గండి పడుతోంది. రోజులవారీగా జిల్లా వ్యాప్తంగా రూ.2 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చేది. గత రెండు రోజులుగా రూ.5 లక్షలు కూడా దాటలేదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు డాక్యుమెంట్ రైటర్ల అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. -
సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం
అనంతపురం అర్బన్: వ్యవసాయశాఖ పరిధిలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారులుగా 12 ఏళ్లగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఏపీ ఎంపీఈఓల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనకు ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో నాగరాజు మాట్లాడారు. 12 ఏళ్లగా పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఇప్పటికీ రూ.12 వేలు వేతనం, రూ.3 వేలు ఇన్సెంటివ్ ఇస్తున్నారన్నారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ 12 ఏళ్లుగా విన్నవిస్తున్నా నేటికీ తమ సమస్యకు పరిష్కారం చూపలేదని వాపోయారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టామన్నారు. సమాన పనికి సమాన వేతనం కింద రూ.35 వేలు ఇవ్వాలన్నారు. ఎంపీఈలోకు ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గంగారాజు, నరసింహులు, శివ, మనోహర్నాయుడు, ఉమాదేవి, ఎంపీఈఓలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే జయరాం సోదరుడి డ్రైవర్ వీరంగం
● బాలింతతో పాటు మరో ఇద్దరిపై దాడి ● 15 మంది దాడికి రావడంతో స్థానికుల బెంబేలుగుంతకల్లు: ఎమ్మెల్యే జయరాం సోదరుడి డ్రైవర్ పట్టణంలో వీరంగం సృష్టించాడు. క్రికెట్ ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదంతో ఓ కుటుంబంపై దాడికి దిగారు. దీంతో బాలింతతో పాటు మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి వద్ద డ్రైవర్ కమ్ అసిస్టెంట్గా అబ్బాస్ అనే టీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు. పట్టణంలోని ఫక్కీరప్ప కాలనీలో క్రికెట్ ఆటలో అబ్బాస్ బంధువుల పిల్లలు, బాషా పిల్లలకు మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ – బాషా మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి అబ్బాస్ 15 మంది అనుచరులతో కలసి వచ్చి ఫుల్గా మద్యం సేవించి బాషా ఇంటిపైకి దాడికి పాల్పడ్డారు. బాషా ఇంటిపై దాడి సమయంలో కేవలం అతని చెల్లెల్లు కరీమున్నీ (బాలింత) మాత్రమే ఉంది. బాలింత అని కూడా చూడకుండా అబ్బాస్, అతని అనుచరులు ఆమైపె రాడ్లు, కట్టెలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాషా అతని తమ్ముడు రహంతుల్లా ఇంటి వద్దకు చేరుకోగానే వారిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏకంగా 15 మంది దాడిలో పాల్గొనడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఘటనపై కసాపురం పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. బుధవారం అబ్బాస్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
టీబీ డ్యాంకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. బుధవారానికి డ్యాంలో నీటి నిల్వ 26.45 టీఎంసీలకు చేరింది. జలాశయం ఎగువన ఉన్న శివమొగ్గ, తీర్ధనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు అడపాదడపా కురుస్తుండటంతో డ్యాంకు వరద చేరుతోందని టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 1,633 అడుగులకు గాను 1,603.54 అడుగల మేర నీరు నిలిచింది. 105.788 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 26.45 టీంఎసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 10,938 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,184 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.88 అడుగులతో 79.40 టీఎంసీల నీరు నిల్వ ఉండి 36,539 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 39,457 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండింది. రేపు విద్యాసంస్థల బంద్ అనంతపురం ఎడ్యుకేషన్: నీట్ పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్, ఏఐఎస్బీ అధ్యక్షుడు పృథ్వి, పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతిభాభారతి, పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని ఖండించారు. 24న నిర్వహించే విద్యాసంస్థల బంద్కు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత, ఎన్ఎస్యూఐ వినోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, అరుణ్ రషీద్, గణేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘పోలీస్ కేసు పెట్టిస్తా.. జీవితాన్ని నాశనం చేస్తా’ తాడిపత్రిటౌన్: మట్టి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న ఓ యువకుడిపై టీడీపీ నాయకుడు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి సమీపంలో కొన్ని నెలలుగా కొట్టాలపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రఘునాథనాయుడు మట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. పశు సంపదకు ఉపయోగపడుతున్న కొండను కరిగించేస్తున్నాడు. అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్తులు విన్నవించినా పెడచెవిన పెట్టాడు. దీంతో బుధవారం వీఆర్ఏ రాఘవేంద్ర, గ్రామస్తులు మట్టి టిప్పర్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. ఎవరూ స్పందించక పోవడంతో కలెక్టరేట్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆర్ఐ ఉదయ్, వీఆర్ఓ నాగేంద్ర అక్కడికి వెళ్లగా గ్రామస్తులు రెండు టిప్పర్లను వారికి అప్పగించారు. వాటిని రెవెన్యూ కార్యాలయానికి తరలిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని ఒక టిప్పర్ మార్గమధ్యంలోనే కనబడకుండా పోయింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో అక్రమ మట్టి తవ్వకాల వద్ద నిరసనకు దిగగా, ఇటాచీ వాహనాన్ని అక్రమార్కులు వదిలేసి పారిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇటాచీని పోలీస్స్టేషన్కు తరలించారు. మట్టి తవ్వకాలు అడ్డుకున్న తనపై ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించి, జీవితాన్ని నాశనం చేస్తానంటూ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు వీఆర్ఏ రాఘవేంద్ర ‘సాక్షి’తో వాపోయాడు. -
ఇంకెన్నాళ్లీ దుశ్శాసన పర్వం..?
● మహిళలపై వరుస దాడులకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలి ● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ధ్వజంఅనంతపురం: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దుశ్శాసన పర్వం నడుస్తోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు మండిపడ్డారు. విభాగం జిల్లా అధ్యక్షురాలు బి. శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ నగర వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీదేవి మాట్లాడుతూ గుంటూరులో మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేయడం, బద్వేలులో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు ఓ వృద్ధ మహిళపై కిరాతకంగా దాడి చేసిన ఘటనలను చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంటోందన్నారు. హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి, గల్లా మాధవి వీటిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్కు ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రత అంశంలో పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి అవమానించినా, ఆడబిడ్డలు అదృశ్యమవుతున్నా స్పందించడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మహిళలపై నేరాలకు పాల్పడాలంటే నేరస్తులు భయపడేలా చట్టాలు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారన్నారు. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో దుశ్శాసన పర్వం నడుస్తోందని విమర్శించారు. గుంటూరులో ఒక బీసీ మహిళను వివస్త్రను చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ లేవన్నారు. రెడ్బుక్ స్టార్ నారా లోకేష్ కనుసన్నల్లోనే అరాచకాలు జరుగుతున్నాయని ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. మాజీ మేయర్ వసీం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను చూసి మహిళలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, మొఘల్ సైఫుల్లా భేగ్, మల్లెమీద నరసింహులు, రాధా యాదవ్, పేరం స్వర్ణలత, వసంత, మౌలీశ్వరి, బోయ సుశీలమ్మ, నాగలక్ష్మి, పార్వతి, ఉషారాణి, ఎద్దుల అమర్నాథ రెడ్డి, జానీ, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, నాగార్జున రెడ్డి, కైలాష్, సంపంగి రామాంజినేయులు, అనిల్ కుమార్ గౌడ్, ఇషాక్, సాకే కుళ్లాయిస్వామి, సతీష్, శ్రీనివాసులు, గుణశేఖర్ బాబు, శ్రీనివాస రెడ్డి, షేక్ ఖాజా, రమణా రెడ్డి, లబ్బే రాఘవ, థామస్, సాకే అశోక్ కుమార్, కిషోర్, మహిళా విభాగం నాయకురాళ్లు దేశాయి భారతి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, పార్వతి, చంద్రలేఖ, ఉషా, అంజలి, సుశీల, పద్మావతి, జాహ్నవి, దేవి, సుజాత, సుహాసిని, శోభారాణి, పద్మావతి, పార్వతి, అంజలి, ప్రసన్న, చంద్రకళ, మహేశ్వరి, అనూరాధ, లీల, హజరాబీ తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లడిగితే దాడి చేసి ప్రాణం తీస్తారా?
● వైఎస్సార్ సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గంటౌన్: నీళ్లడిగిన పాపానికి దాడి చేసి ప్రాణం తీస్తారా? అంటూ వైఎస్సార్ సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య, ఆమె భర్త మారుతిప్రసాద్లను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆంజనేయులు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో తన ఇంటి కొళాయికి సరిగా నీరు రావడం లేదని ఆంజనేయులు ఆవేదన చెందారన్నారు. పింఛన్ డబ్బు కట్ చేసినా కొళాయికి నీరు రాకపోవడంతో అడిగేందుకు టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్ ఇంటికి వెళ్లాడన్నారు. ఈ క్రమంలోనే ఇంటి వద్దకు వచ్చి ప్రశ్నిస్తావా అంటూ మారుతీప్రసాద్, అతని భార్య లావణ్యలు అధికార మదంతో ఆంజనేయులు పొలం వద్దకు వెళ్లి వృద్ధుడిని కూడా చూడకుండా చెప్పులతో కొట్టి కాళ్లతో తన్ని అమానుషంగా చితకబాదారన్నారు. నలుగురి ముందు జరిగిన ఈ అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఆంజనేయులు మృత్యువుతో వారం రోజులు పోరాడి మృతి చెందా డని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులుది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ అధికార మదంతో చేసిన హత్య అని మండిపడ్డారు. వృద్ధుడిపై దాడికి పాల్పడిన మారుతితోపాటు అతని భార్యపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పింఛన్ డబ్బు కట్ చేసి కొళాయి పన్నుకు కట్టిన గ్రామ కార్యదర్శిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండదండలతో టీడీపీ నాయకుల ఆగడాలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, కణేకల్లు మండల కన్వీనర్ బ్రహ్మానందారెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు మారెన్న, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి హళ్లి, నాగరాజు, మక్కబుల్భాష తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ–నీవా లైనింగ్లో లూటీ
● కోతల రాయుడు పయ్యావుల కేశవ్ జిల్లాకు చేసిన మేలు ఏమిటో? ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ధ్వజం అనంతపురం: ‘ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో వందలాది కోట్లు లూటీ చేశారు. ఈ అంశంపై పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ఉలుకెందుకు?’ అని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తే కేసులు పెడుతానంటూ బెదిరిస్తావా అంటూ కేశవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేపట్టిన హంద్రీ–నీవా యాత్రకు అనూహ్య స్పందన రావడం చూసి భయంతో వెంటనే ఆయన కాలువ వద్దకు వెళ్లారన్నారు. తాను ఎక్కడా కేశవ్ను వ్యక్తిగతంగా విమర్శించకపోయినా టార్గెట్ చేశారని మండిపడ్డారు. నెల్లూరు మీటింగ్లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి వారి అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ అవి నీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానిస్తే ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ‘సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై చంద్ర బాబుకు మంచి అభిప్రాయం లేదని చాలా సార్లు చెప్పా. నెల్లూరు సమావేశంలో ఏం మాట్లాడానని నాకు తెలుసు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు’ అన్నారు. ఆత్మసాక్షి లేనిది కేశవ్కే అని ఘాటుగా స్పందించారు. ‘గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో చెప్పమంటావా’ అంటూ నిలదీశారు. లక్ష్మీపార్వతి కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకుని మళ్లీ చంద్రబాబు పంచన చేరిన విలువలు లేని నాయకుడు కేశవ్ అంటూ విరుచుకుపడ్డారు. నమ్మే వారు ఉంటే ఉరవకొండలో ఉన్న కొండను, అనంతపురం టవర్క్లాక్ను కూడా కట్టానంటారని ఎద్దేవా చేశారు. ఆర్థిక శాఖను అవినీతి శాఖగా మార్చేశాడని, కమిషన్లు లేకుండా ఏ పనీ జరగదన్న ముద్ర పడిందన్నారు. బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. జగన్కు పేరొస్తుందనే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, అలాంటి ప్రాజెక్టుకు టీడీపీ వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందన్నారు. జగన్కు పేరు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో అడ్డుకున్నారన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, దీనిపై టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అనుమతులు లేకున్నా అప్పర్ పెన్నా పనులు చేస్తున్నారన్నారు. తుంగభద్ర కేటాయింపుల కంటే ఎక్కువ వాడుకుంటున్నా కనీసం చంద్రబాబు ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. గోబెల్స్ ప్రచారం తప్ప ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. హంద్రీ–నీవా అంటే దివంగత నేత వైఎస్సార్ గుర్తుకు వస్తారని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. కేశవ్ చెప్పేవన్నీ అబద్దాలేనని, గతంలో రెండు సార్లు భూమిపూజ చేయడం తప్ప హంద్రీ–నీవాకు చేసిందేమీ లేదని ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. కౌకుంట్ల పంచాయతీ విభజనకు ఎందుకు సమ్మతించలేదో దమ్ముంటే బహిరంగ పరచాలని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఒప్పుకోలేదని దుయ్యబట్టారు. -
ఎకరాకు రూ.19 లక్షల పరిహారం
యాడికి: చింతలాయపల్లి, కుందనకోట వద్ద 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు భూమి ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.19 లక్షల పరిహారం నిర్ణయించినట్లు జేసీ విష్ణుచరణ్ తెలిపారు. మంగళవారం కమలపాడు సమీపంలోని కొండల్లో ఉన్న చింతల వెంకటరాయుడు స్వామి ఆలయ ఆవరణలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ చింతలాయపల్లి, కుందనకోట వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చింతలాయపల్లిలో 223 మంది రైతులకు చెందిన 321.79 ఎకరాలు, కుందనకోటలోని 38 మంది రైతులకు చెందిన 76.5 ఎకరాల పట్టా భూమిని సేకరించినట్లు తెలిపారు. ఎకరా పొలం రూ.19 లక్షలతో ఏపీ జెన్కో కంపెనీ సంస్థ ప్రటించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ప్రతాప్రెడ్డి, ఏపీ జెన్కో ఇంజినీర్లు ఆదినారాయణ రెడ్డి, డీటీ శ్రీనివాసులు, ఆర్ఐ కిష్టప్ప, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆకతాయి చేష్టలపై కేసు తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆకతాయిల చేష్టలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాల్లో నలుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకొని రెండు గాజు సీసాలు కేతిరెడ్డి ఇంటి కాంపౌండ్ గోడకు విసిరి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గౌస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. 20 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 22.2 మి.మీ, బ్రహ్మసముద్రం 21.2, యల్లనూరు 21, గుమ్మఘట్ట 18.8, కళ్యాణదుర్గం 14.6, శింగనమల 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు, నార్పల, ఆత్మకూరు, కూడేరు, అనంతపురం, శెట్టూరు, యాడికి, బుక్కరాయసముద్రం, పుట్లూరు, కణేకల్లు, గార్లదిన్నె తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 68.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 14.7 మి.మీ నమోదైంది. ఓవరాల్గా జూన్ ఒకటి నుంచి ఈ సీజన్లో 106.8 మి.మీ గానూ 22 శాతం తక్కువగా 83.1 మి.మీ వర్షం కురసింది. మరోసారి తెరపైకి ఈ స్టాంప్ కుంభకోణం కళ్యాణదుర్గం: రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ– స్టాంప్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణ నిమిత్తం మంగళవారం కర్నూలు సీఐడీ రీజినల్ ఆఫీస్ నుంచి ఎస్ఐ శివశంకర్ నాయక్ కళ్యాణదుర్గం రావడం చర్చనీయాంశమైంది. పట్టణ పోలీసు స్టేషన్లో స్థానిక సీఐ హరినాథ్తో కేసు విషయమై చర్చించినట్లు సమాచారం. మీ సేవ సెంటర్లో నాన్ జ్యుడీషియల్ ఈ–స్టాంపుల విక్రయానికి సంబంధించి జరిగిన మోసాలపై అప్పట్లో కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో నమో దైన కేసులపై ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో పాటు నిందితుల బ్యాంకు లావాదేవీల ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాబు మీ సేవ నుంచి ఈ–స్టాంపులు కొనుగోలు చేసిన వారు తమ ఉద్ద ఉన్న స్టాంపులు నిజమైనవో కాదో ఆన్లైన్లో ధ్రువీకరించుకోవాలని సీఐడీ అధికారులు ప్రజలకు సూచించారు. అనుమానాలుంటే వెంటనే తమను సంప్రదించాలన్నారు. ఈ–స్టాంప్లు, సంబంధిత రసీదులు అందజేస్తే కేసు దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే సీఐడీ సీఐ జి.ప్రియతమ్ రెడ్డి (9000099309), ఎస్ఐ శివశంకర్ నాయక్ (9247598089), పీసీలు ధనుంజయ, షఫి (9030976992)ను సంప్రదించాలన్నారు. ఈ–స్టాంప్ కేసుపై సీఐడీ అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు కళ్యాణదుర్గం రావడంతో నిందితుల్లో ఆందోళన మొదలైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
‘తమ్ముళ్ల’ పైశాచికం
విడపనకల్లు: ‘పచ్చ’ మూకలు పైశాచికం ప్రద ర్శించారు. వ్యవసాయ పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా మూడు బోర్లు ధ్వంసం చేశారు. బాధితుడి వివరాల మేరకు.. విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామ సర్వే నంబర్ 141లో 21.50 ఎకరాల భూమిని వైఎస్సార్ సీపీ నాయకుడు కురుబ గోవిందు అల్లుడు జయకుమార్ 2023 జూన్లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదే ఏడాది రూ.5 లక్షలు ఖర్చు చేసి పొలంలో ఐదు బోర్లు వేయించగా.. మూడు బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. పొలంలోకి ఈ నెల 19న ఆదివారం జనార్దనపల్లికి చెందిన టీడీపీ నాయకులు సుధాకర్ నాయుడు, ముప్పారపు పాండురంగ నాయుడు, మాజీ సర్పంచు రాయంటి జనార్దన నాయుడు అక్రమంగా ప్రవేశించి మూడు బోర్లను ధ్వంసం చేశారు. కేసింగ్ పైపులు ఎత్తుకెళ్లారు. పైశాచికంగా బోర్లలోకి పెద్ద పెద్ద రాళ్లు వేశారు. బాధితులు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు విడపనకల్లు పోలీసుస్టేషన్కు వెళ్లగా ఎస్ఐ ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో మంగళవారం ఉరవకొండ రూరల్ సీఐ మహానందిని ఆశ్రయించారు. స్థానికంగా తమకు న్యాయం జరగకపోతే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని గోవిందు తెలిపారు. -
ఎరక్కపోయి ఇరుకున పడి
బొమ్మనహాళ్:ఎరక్కపోయి వచ్చిన ఓ ఎలుగుబంటి ఇరుక్కుపోయిన ఘటన మండలంలోని నేమకల్లు వద్ద జరిగింది. ఆహారం కోసం గ్రామ శివారులోని కొండపైకి ఎక్కిన ఎలుగుబంటి తిరిగి దిగే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోయింది. మంగళవారం కొండ వద్ద క్వారీలో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి ముందు భయాందోళన చెందారు. కొంతసేపటి తర్వాత ఎటూ కదల్లేని స్థితిలో ఉందని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రమణ్యం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి భయాందోళనకు గురి కాకుండా కొండ ప్రాంతంలోని క్వారీల్లో కంకర తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఎలుగుబంటికి ఎలాంటి హాని కలగకుండా సహజ ఆవాసంలోకి వెళ్లేలా చూస్తామన్నారు. ఒకవేళ భల్లూకం వెళ్లకుండా అక్కడే ఉంటే బుధవారం రోప్వే ద్వారా బోనులో బంధిస్తామని చెప్పారు. -
తప్పుడు కేసుతో వేధింపు
వేధింపులు, అరాచకాలు తాళలేక వరుసగా బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా టీడీపీ నేతలు ఏ మాత్రమూ తగ్గడం లేదు. ‘మాకు పై నుంచి ప్రెజర్ ఉంద’ని చెబుతూ పోలీసులు పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు చెబితే చాలు ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరులోని జగనన్న లేఔట్లో మోటార్లను దొంగతనం చేశాడన్న తప్పుడు ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ నాయకుడు అంకే నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను తప్పు చేయకపోయినా స్థానిక టీడీపీ నేత సూర్యనారాయణ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో చెబుతూ నరేంద్ర క్రిమి సంహారక ద్రావణాన్ని తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితుణ్ని బెంగళూరుకు తరలించారు. ఇలా టీడీపీ నేతలు వరుస వేధింపులకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. బాధితులపైనే కేసులు పెడుతూ ‘పచ్చ’ నాయకులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన విమర్శలకు కౌంటర్గా తాను సమాధానమిస్తే మూడు రోజుల పాటు పోలీసులు చిత్రహింసలకు పాల్పడ్డారని పటాస్ శ్రీకాంత్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఉనికి కోసం ఉలికిపాటు ఎందుకు?
అనంతపురం సిటీ: రోజుకో అబద్ధంతో వంచక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ఈ నేపథ్యంలో ఉనికి కోసం టీడీపీ నేతలు ఉలికి పడుతూ... దానిని వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కూడేరు మండలాధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హంద్రీనీవా పనులు రైతులకు కాకుండా టీడీపీ నేతలు, కాంట్రాక్టర్కు లాభదాయకంగా మారాయన్నారు. గత ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాకు 60 టీఎంసీలు నీటిని తీసుకొచ్చినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెబుతుండడం హాస్యాస్పందంగా ఉందన్నారు. జిల్లాకు చేరింది కేవలం 50 టీఎంసీలు మాత్రమేనని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. సాగు నీటి కథ పక్కన పెడితే కనీసం తాగునీటికీ ప్రజలు ఇక్కట్లు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. రెండో దశ లైనింగ్ పనుల విషయంలోనూ టీడీపీ నేతలు ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నారన్నారు. మొదటి దశ కాలువలో 3,850 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేస్తే, ఆ డీపీఆర్ ప్రకారం రెండో దశ కాలవలో కనీసం 1,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా పనులు చేయాల్సి ఉందన్నారు. అలాంటిది జీడిపల్లి నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వరకు 750 క్యూసెక్కులు, ఆ తర్వాత 350 క్యూసెక్కులకు పరిమితం చేసి, హంద్రీనీవా ప్రాజెక్ట్ను డ్రైనేజీగా మార్చేసి లైనింగ్ పనులు చేయడంతో రైతులకు నష్టం చేశారన్నారు.ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్లో చోటు చేసుకున్న అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాని, రైతాంగానికి లబ్ధి చేకూరేలా చేయాలని హితవు పలికారు. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాయలసీమ వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
మహిళలపైనా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా?
అనంతపురం: మహిళలపై విచక్షణా రహిత దాడులు, వివస్త్రను చేసి పాశవికంగా అకృత్యాలకు పాల్పడుతున్నా పట్టించుకోని పరిస్థితిలో పాలకులు ఉన్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బి.శ్రీదేవి విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ.. వైఎస్సార్సీపీ నాయకులకే రెడ్ బుక్ రాజ్యాంగంలో చోటు కల్పించారని అనుకున్నామని, అయితే పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తున్న మహిళలపైనా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, బద్వేలు, నెల్లూరు ఘటనలు దుశ్శాసన పర్వంగా అభివర్ణించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఏడుగుర్రాలపల్లి ఘటన దగ్గర నుండి గుంటూరు వరకు ఎక్కడా మహిళలకు రక్షణ లేదన్నారు. వీటిన్నింటిలోనూ టీడీపీ నాయకుల ప్రమేయం ఉన్నప్పటికీ, సీఎం చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు ప్రశ్నిస్తానన్న పవన్కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. బద్వేలులో మహిళపై దాడి చేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలన్నారు. ఇందుకు కారణమైన మాధవిరెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో పసుపులేటి పద్మావతి, అంజలి, మాజీ సర్పంచ్ పార్వతి, చంద్రలేఖ, ప్రసన్న , పార్వతి, మహేశ్వరి, భానుమతి, చంద్రకళ, కుళ్లాయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
● రూ. 5 లక్షల విలువైన బంగారు గొలుసు,బైక్ స్వాధీనం బుక్కరాయసముద్రం: మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఇద్దరు అంతరాష్ట్ర చైన్స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాలమేరకు.. గత నెల 23న బుక్కరాయసముద్రంలో ప్రభావతి అనే మహిళ గ్రామ శివారులో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు ఆమె అడ్డుకొని మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాయన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అనంతపురము రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసులు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో బెంగళూరుకు చెందిన గణేష్, సూర్యలే దొంగతనం చేసినట్లు గుర్తించి శనివారం అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల బంగారు గొలుసు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం జిల్లా కోర్టులో హాజరు పర్చగా జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు. కేసును చేధించిన సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
యాత్రను విజయవంతం చేసినందుకు ఽకృతజ్ఞతలు
● మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కూడేరు: వైఎస్సార్సీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కూడేరు మండలం చోళసముద్రం దగ్గర నిర్వహించిన హంద్రీ నీవా ప్రాజెక్ట్ పరిరక్షణ పోరుబాటను విజయవంతం చేసినందుకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పోరుబాటకు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. అలాగే వైఎస్సార్సీపీ అన్ని విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజక, మండల నేతలు అదిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. పోరుబాట వైఎస్సార్సీపీ స్వప్రయోజనం కోసం కాదని, హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేపట్టడంతో రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపామన్నారు. లైనింగ్పై రాజకీయం చేయడం లేదని, లైనింగ్ పనులు చేపట్టే సమయంలోనే అధికార పార్టీకి చెందిన రైతులే లైనింగ్ పనులు ఆపాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సీపీఐ నుంచి ముగ్గురి సస్పెండ్అనంతపురం అర్బన్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించిన ముగ్గురిని సస్పెండ్ చేశామని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో సహాయ కార్యదర్శి రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, ఇతర నాయకులతో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటించామన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.కుళ్లాయిస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జాన్సన్బాబు, జిల్లా ఆటో డ్రైవర్ల సంఘం కార్యదర్శి ఎస్.రమణయ్యను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. ఎంపీఈఓల పెన్డౌన్ ● ఉమ్మడి అనంత జిల్లాలో 334 మంది నిరసన అనంతపురం అగ్రికల్చర్: సమస్యల పరిష్కరించాలంటూ ఎంపీఈఓలు పెన్డౌన్కు దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 334 మంది సోమవారం నుంచి ఐదు రోజుల పాటు పెన్డౌన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఎక్కడిక్కడ మండల, డివిజన్, జిల్లా గ్రీవెన్స్లో, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ పరిధిలో, ఆర్బీకేలకు అనుబంధంగా అనంతపురం జిల్లాలో 189 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 145 మంది... వెరసి 334 మంది ఎంపీఈఓలు సరైన వేతనం లేక, ఎలాంటి ఉద్యోగ భద్రత, ఇతరత్రా సదుపాయాలు లేక అతికష్టమ్మీద జీవితాలను నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటిి ప్రోత్సాహం లేకపోవడంతో 334 మంది ఎంపీఈఓలు నిరసనకు దిగారు. మద్యం షాపు తొలగించండి రాయదుర్గంటౌన్: పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించి వేరే చోటికి మార్చాలని 16వ వార్డు మహిళలు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో మొరపెట్టుకున్నారు. సోమవారం సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజకు విచ్చేసిన ఎమ్మెల్యేతో మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాకపోకలకు సాగించే రహదారిలో మద్యం షాపు ఉండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మరో మూడు నెలల వరకే మద్యం షాపులకు అనుమతి ఉందని, ఆ తర్వాత అక్కడ షాపు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతాం
అనంతపురం న్యూటౌన్: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. నగరంలోని జేఎన్టీయూలో ఉన్న ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ‘షైనింగ్ స్టార్స్– 2026’ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి విద్యార్థులు 192 మంది, ఇంటర్ విద్యార్థులు 38 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున నగదు, సర్టిఫికెట్, మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు సహకరిస్తే తప్ప బయటపడలేం భగవంతుడు సహకరిస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడలేమని, ‘ఎల్–నినో’ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ మాట్లాడుతూ హెచ్ఎల్సీ పరిధిలో అధికారులు విధులకు గైర్హాజరు కాకూడదన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ.ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల కన్నీళ్లు !
కళ్లెదుటే నీళ్లు .. తాడిపత్రిటౌన్: నాయకుల నిర్లక్ష్యం... అధికారుల అలసత్వంతో చాగల్లు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు సాగునీటి అవస్థలు తప్పడం లేదు. దాదాపు 6 వేల ఎకరాలకు నీరందించాలని నిర్మించిన ప్రాజెక్ట్ నీటి కుండను తలపిస్తున్నా... పిల్ల కాలువలు పూర్తి కాకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలకు చుక్కనీరు అందని దుస్థితి నెలకొంది. వైఎస్సార్ హయాంలో నిర్మాణం తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని పెన్నానది పై చాగల్లు ప్రాజెక్ట్ను 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా దాదాపు రూ.244 కోట్లతో నిర్మించారు. 1.5 టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టు ెకుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా మండలంలోని ఆయా గ్రామాలకు దాదాపు 6 వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి దశాబ్ద కాలం పూర్తవుతున్నా ప్రధాన కాలువలు పూర్తిచేశారు తప్ప ఆయకట్టు భూములకు నీరందించే పిల్ల కాలువలను నిర్మించలేదు. ఎండుతున్న పంటలు దాదాపు 10 కిలో మీటర్లు పొడవున్న కుడి కాలువ ద్వారా పెద్దపప్పూరు మండలంలోని షేక్పల్లి, ధర్మాపురం, సోమనపల్లి, చింతలపల్లి, చిన్నపప్పూరు, జూటూరు గ్రామాలకు చెందిన దాదాపు 4,500 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. అలాగే 11 కిలో మీటర్లు పొడవున్న ఎడమ కాలువ ద్వారా పసలూరు, కమ్మవారిపల్లి, సుంకేసులపల్లి, అత్తిరాలదిన్నె గ్రామాలకు చెందిన దాదాపు 1500 ఎకరాల భూములకు నీరు ఇవ్వాల్సి ఉంది. అలాగే ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ ద్వారా మండలంలోని పెండేకల్లు నిర్మించిన పెండేకల్లు ప్రాజెక్ట్కు నీరు చేరుతుంది. ప్రాజెక్ట్లో 262 మీటర్లకు నీరు చేరితే కాలువలకు నీరు పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం చాగళ్లు ప్రాజెక్ట్ నీటితో కళకళలాడుతున్నా పక్క ఆయా గ్రామాల్లో సాగు నీరు లేక పంటలు ఎండుతున్నాయి. మండలంలో వర్షాలు రాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి రైతులు పంటలను రక్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. వందల అడుగులు బోరుబావులు తవ్వి లక్షలాది రూపాయలు ఖర్చుచేసుకుంటూ అప్పులపాలు అవుతున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు చాగల్లు ఆయకట్టు రైతుల కష్టాలను గుర్తించి పంటలను కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు. నీటితో కళకళలాడుతున్న చాగల్లు ప్రాజెక్టు పిల్ల కాలువలు లేకపోవడంతో అన్నదాతలకు సాగునీటి కష్టాలు ఆయకట్టు రైతుల గోడు పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
వెనక్కిరాని ఈఎఫ్లు 2.21 లక్షలు:కలెక్టర్
అనంతపురం అర్బన్: ‘‘జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 18,16,652 ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్లు) డిజిటలైజేషన్ చేశారు. వెనక్కిరాని ఈఎఫ్లు 2,21,871 ఉన్నాయి. 16,35,329 మ్యాపింగ్ చేశారు. ఇంకా 1,81,204 మ్యాపింగ్ కానివి ఉన్నాయి’’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ఏఎస్డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్) ఓట్లు 31,916 ఉన్నామన్నారు. వీటిల్లో వాస్తవంగా ఉండి తదుపరి చర్య అవసరం లేని ఓట్లు 7,233 ఉన్నట్లు గుర్తించామని, మిగిలిన 24,666 అన్కలెక్టబుల్గా నిర్ధరించామన్నారు. ఈనెల 24 వరకు బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యాపింగ్ చేస్తారని, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, వైఎస్సార్సీపీ ప్రతినిధులు సోమశేఖర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, టీడీపీ నారాయస్వామి, బీజేపీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
యాడికి: విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన యాడికిలో సోమవారం జరిగింది. మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన రంగస్వామి వీబీజీ–రామ్జీ పథకంలో ఎఫ్ఏగా పనిచేస్తున్నాడు. అతనికి ఎలాంటి విధులు అప్పగించకపోవడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఉదయం ఉన్నతాధికారులు నీ ఉద్యోగం తొలగించారని ఏపీఓ తెలిపారు. దీంతో మనోవేదనకు గురైన రంగస్వామి ఎంపీడీఓ వీర్రాజు, ఏపీఓ మద్దిలేటిలతో మాట్లాడినా తాము ఏమీ చేయలేమని చెప్పారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. ఏఎస్ఐ వెంకటేష్ అతడిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగస్వామి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని ఆరా తీశారు. ఘటనపై వారు మండలాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ, ఏపీఓపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి సెపక్తక్రా పోటీలు
ఉరవకొండ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ జిల్లా స్థాయి బాలికల సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో నిర్వహించిన సెపక్తక్రా పోటీలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్థానిక జిల్లా పరిషత్ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 15 జట్లు పాల్గొన్నాయి. సబ్ జూనియర్స్ విభాగంలో కరకముక్కల జడ్పీ స్కూల్ ప్రథమ స్థానాన్ని, కొట్టాలపల్లి జడ్పీ స్కూల్ ద్వితీయస్థానాన్ని, నింబగల్లు జడ్పీ హైస్కూల్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే జూనియర్స్ విభాగంలో కేజీబీవీ తట్రకల్లు ప్రథమస్థానంలో, ఉరవకొండ బాలికల జట్టు ద్వితీయ స్థానంలో, కొట్టాలపల్లి బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు పాఠశాల ప్రథానోపాధ్యాయులు ఖాదర్బాషా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, పరిశీలకులు కార్తికేయన్, జిల్లా క్రీడా సంఘం అధ్యక్షుడు షాహిన్, సీనియర్ మారుతీప్రసాద్ల చేతుల మీదుగా బహుమతులు అందించారు. -
జూటూరుకు అరుదైన గౌరవం
● మహారాష్ట్ర నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశంలో తులసీదాసు కథకు చోటు అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జూటూరు తులసీదాసుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రచించిన ‘సంఘీభావం’ కథను మహారాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన నాలుగో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. జూటూరు తులసీదాసు బాలసాహిత్య రంగంలో ఖ్యాతి గడించారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మనోభావాలకు అనుగుణంగా, వారికి సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో అనేక కథలు, గేయాలు రచించి పుస్తకాల రూపంలో అందించారు. ఆయన రచనలు విద్యార్థుల్లో విలువలు, మానవీయత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా ఉంటాయని సాహితీవేత్తలు పేర్కొంటున్నారు. విద్యా, సాహిత్య రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా జూటూరు తులసీదాసుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. తాజాగా ఆయన రచన మహారాష్ట్ర పాఠ్యాంశంలో చోటు దక్కించుకోవడం పట్ల సాహితీవేత్తలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ‘టెట్’ మినహాయించాలి అనంతపురం అర్బన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని వైఎస్సార్టీఏ నాయకులు డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్కు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గోవిందరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధరరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. టెట్ అమలులోకి రాకముందే చట్టబద్ధంగా పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి నియమితులైన ఉపాధ్యాయులు ప్రస్తుత టెట్ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికి అమలులో ఉన్న ప్రభుత్వ నియామక విధానాలు, అర్హతల మేరకు వారు విద్యాసేవలు అందిస్తున్నారని చెప్పారు. చట్టబద్ధ నియామకాలపై కొత్త నిబంధనలను ప్రతికూలంగా వర్తింపజేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా టెట్ అమలుకు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు. టెట్తో సంబంధం లేకుండా సీనియర్ ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతి కల్పించాలన్నారు. చట్ట సవరణ జరిగే వరకు సంబంధిత ఉపాధ్యాయులు ఎటువంటి ప్రయోజనాలు కోల్పోకుండా, ఎలాంటి ప్రతికూల పరిపాలనా నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. టీబీ డ్యాంలో 25.77 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 25.77 టీఎంసీల నీరు ఉంది. ఇటీవల బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు నారుమళ్లు, ఎండుమిర్చి, పత్తి పంటలు విత్తుకున్నారు. టీబీ జలాశయం నుంచి నీరు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే, మొన్నటి వరకు ఊరించిన వరద ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 79.90 టీఎంసీల నీరు నిల్వ ఉండి 38,079 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 39,009 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదు కావడం గమనార్హం. -
ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపే
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో గతంలో జరిగిన భారీ దొంగతనాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాజాగా మోటారు రిపేరీ వ్యవహారంలో మాత్రం వైఎస్సార్సీపీ కార్యకర్త అంకె నరేంద్రపై అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. జగనన్న కాలనీల్లోని నిర్మాణ సామగ్రి, మోటర్లు సహా అన్ని వస్తువులు ఇప్పటికీ కాంట్రాక్టర్ ఆధీనంలోనే ఉన్నాయని, ప్రభుత్వం ఇంకా వాటిని స్వాధీనం చేసుకోలేదన్నారు. తుది కొలతలు పూర్తి చేసి, ఫైనల్ బిల్లులు చెల్లించిన తర్వాతే అవి ప్రభుత్వ ఆస్తిగా మారతాయని, ప్రస్తుతం కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ‘కాంట్రాక్టర్ అనుమతితోనే మోటారును రిపేరీ కోసం తీసుకెళ్లారు. తోటలో టెస్టింగ్ చేసి మళ్లీ అదే చోట బిగించారు. అనంతరం పోలీసులు వచ్చి నరేంద్ర సమక్షంలో మోటారును బయటకు తీసి స్టేషన్కు తరలించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చూపిస్తూ దొంగతనం కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు’ అని ఆయన విమర్శించారు. ‘కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న ఆస్తిపై ఇతరులు ఎలా ఫిర్యాదు చేస్తారు? అలాంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారు?‘ అని ప్రశ్నించారు. గతంలో ఆలమూరు, కొడిమి జగనన్న కాలనీల్లో హౌసింగ్, కాంట్రాక్టర్కు చెందిన ఐరన్, సిమెంట్, ఇసుక, కంకర, డస్ట్, సెంట్రింగ్ సామగ్రి, ఐరన్ కుర్చీలు తదితర వస్తువులను లోడ్ల కొద్దీ తరలించారని ప్రకాష్రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన నిర్మాణ సామగ్రి తరలిపోయిందని, కొందరు బహిరంగంగానే గుజరీలకు విక్రయించారని తెలిపారు. ఈ ఘటనలపై పలు సందర్భాల్లో ఫొటో ఆధారాలతో పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయని, స్వయంగా పోలీసులు, హౌసింగ్ అధికారులు కొన్ని సందర్భాల్లో పట్టుకున్నప్పటికీ రూరల్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేయలేదని, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆలమూరు జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య 20 నుంచి 30 అడుగుల లోతులో గుంతలు తవ్వి ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకున్న వారిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. నరసనాయనికుంట లోని పలువురు టీడీపీ నాయకుల ఇళ్లలో ఇప్పటికీ జగనన్న కాలనీకి చెందిన నిర్మాణ సామగ్రి కనిపిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ఘటనల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోయినా, కాంట్రాక్టర్ అనుమతితో మోటారును రిపేరీ చేయించి టెస్టింగ్ చేసిన నరేంద్రపై దొంగతనం కేసు నమోదు చేయడం వెనుక రాజకీయ కక్షసాధింపు తప్ప మరొకటి లేదన్నారు. అక్రమ కేసు పెట్టడంతో నరేంద్ర తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించారని ఆయన తెలిపారు. జగనన్నకాలనీల్లో కోట్ల రూపాయల సామగ్రి తరలిపోయినా కేసుల్లేవ్ మోటారు రిపేరీ వ్యవహారంలో అంకె నరేంద్రపై అక్రమ కేసు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపాటు -
రాయదుర్గంలో చోరీ
రాయదుర్గంటౌన్: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రహంతుల్లా, హసీనా దంపతుల ఇంట్లో బీరువాలో దాచిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.1.80 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హసీనా అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి వారి అమ్మవారి ఇంటికెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. సోమవారం ఉదయం ఇంటికొచ్చి చూసేసరికి దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇంటి డోర్తో పాటు బెడ్రూమ్ డోర్కు ఉన్న తాళాలు సైతం పెకిలించారన్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారు, వెండి, నగదును దోచుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పామిడిలోనూ... పామిడి: పట్టణ టీచర్స్కాలనీలోని కుళ్లాయప్ప ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కుళ్లాయప్ప, అతని కుటుంబ సభ్యులు పని మీద ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రెండున్నర తులాల బంగారు నగలు, 40 తులాల వెండి అపహరించారు. సోమవారం ఇంటికి చేరిన వారు ఇంటి తాళం ధ్వంసం చేసి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అనంతపురం క్లూస్టీమ్ ఆ ఇంటిని పరిశీలించి వ్రేలిముద్రలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడి ఆత్మహత్య పుట్లూరు: మండలంలోని గాండ్లపాడు సమీపంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని నబీ రసూల్ (63) అనే వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. యల్లనూరు మండలం గిరమ్మబావికి చెందిన నబీరసూల్ 30 ఏళ్ల క్రితం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట గ్రామానికి వెళ్లి స్థిరపడ్డాడు. ఆదివారం తన సోదరులను కలవడానికి గిరమ్మబావికి వచ్చి తిరిగి తాడిపత్రి మీదుగా ఎర్రగుంటకు వెళ్లడానికి బయలుదేరాడు. అయితే సోమవారం ఉదయం గాండ్లపాడు గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తికి నబీరసూల్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య దస్తగిరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నార్పలలో మరొకరు... నార్పల: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాలమేరకు... కొత్త బస్టాండ్ సమీపంలో ఖాజాబాషా స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు నూర్ మహమ్మద్ (23) సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అవివాహితుడైన నూర్ మహమ్మద్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతిగా మద్యం సేవించి యువకుడి మృతినార్పల: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేసేపల్లిలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల మేరకు ..కేసేపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మీసాల రామకృష్ణ , పెద్దక్కకు ముగ్గురు కుమారులు. వీరిలో రెండో కుమారుడు భాస్కర్ (30) వారం రోజుల క్రితం బైక్పై నుంచి కింద పడి గాయలయ్యాయి. అయినప్పటికీ అలాగే మద్యం సేవించేవాడు. ఈ విషయంపై రెండు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకి వెళ్లి అక్కడే పడుకున్నాడు. ఉదయం స్థానికులు అతన్ని లేపేందుకు ప్రయత్నించినా లేవలేదు. పోలీసులకు సమాచారం అందించడంతో భాస్కర్ చనిపోయినట్లు గుర్తించారు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోవడంతో భాస్కర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరుణుడి దోబూచులాట
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో వాతావ‘రణం’ మధ్య వరుణుడు దోబూచులాడుతున్నాడు. నాలుగు రోజులుగా మేఘాలు కమ్ముకుంటున్నా తేలికపాటితో సరిపెడుతున్న పరిస్థితి నెలకొంది. కల్లోలంగా మారిన ఖరీఫ్ కాసింత కుదుటపడాలంటే జూలై వర్షాలు కీలకమైనా కరుణించే పరిస్థితి కనిపించడం లేదు. జూలై నెలలో 68.4 మి.మీ సాధారణం కాగా సోమవారం నాటికి 43 మి.మీ నమోదు కావాలి. అయితే కేవలం 8.7 మి.మీ తేలికపాటికే పరిమితమైంది. జూలై 19న మాత్రమే 5.1 మి.మీ సగటుతో ఒకే ఒక్క రోజు వర్షపు దినం (రెయినీడే) నమోదు కావడం చూస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో వరుణదేవా కరుణించు అంటూ ఆకాశం వైపు చూస్తూ రైతులు వేడుకుంటున్నారు. గాడిదలు, కప్పలకు పెళ్లిళ్లు చేస్తూ గ్రామాల్లో ఊరేగిస్తూ పూజలు చేస్తున్నారు. రామభజనలు, విరాటపర్వం, వరుణయాగం, గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. 32 మండలాల్లోనూ వర్షాభావం.. జూన్లో సాధారణ వర్షపాతం నమోదైనా జూలైలో వరుణుడి జాడ లేకపోవడంతో 32 మండలాల్లోనూ బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని మండలాల్లోనూ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. మూడు నాలుగు రోజులుగా భారీ వర్షం కురిసేలా మేఘాలు ఆవరించినా 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న బలమైన గాలులకు చెదిరిపోతున్నాయి. ఉరవకొండ, శింగనమల, గార్లదిన్నె, పామిడి, యాడికి మండలాల్లో మోస్తరుగానూ పెద్దవడుగూరు, తాడిపత్రి, కూడేరు, యల్లనూరు, అనంతపురం, బుక్కరాయసముద్రం, గుంతకల్లు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మిగతా మండలాల్లో గాలిచినుకులు పడ్డాయి. కుందుర్పి, కంబదూరు, ఆత్మకూరు తదితర ఐదారు మండలాలను జూలైలో వరుణుడు పలకరించకపోవడం గమనార్హం. జూన్ 7, 13, 14, 26 తేదీల్లో కురిసిన వర్షాలకు లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. నెల రోజులుగా వర్షం లేకపోవడంతో దాదాపు ఎండుముఖం పట్టాయి. ఓవరాల్గా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 104.2 మి.మీ గానూ 26 శాతం లోటుతో 77.1 మి.మీ వర్షపాతం నమోదైంది. అందులో జూన్ 15 వరకు 65 మి.మీ నమోదు కాగా, ఆ తర్వాత గత 35 రోజుల్లో కేవలం 12 మి.మీ వర్షం కురిసింది. గుత్తి, తాడిపత్రి, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, పుట్లూరు, యల్లనూరు మండలాలు ఖరీఫ్ ఆరంభం నుంచి తీవ్ర వర్షాభావ జాబితాలో కొనసాగుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో రైతు ఇంట తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడెనిమిది మండలాల్లో తేలికపాటి వర్షం కీలకమైన జూలైలో 19న ఒక్కటే రెయినీడే నమోదు వర్షం కోసం గాడిదల పెళ్లిళ్లు, వరుణయాగం చేస్తున్న రైతులు -
అటకెక్కిన అరటి పరిశోధన కేంద్రం
తాడిపత్రి రూరల్: తాడిపత్రి మండలంలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు అంశం అటకెక్కింది. గత ఏడాది జూన్లో మండలంలోని తలారిచెరువు, భోగసముద్రం గ్రామాల పరిధిలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి కలెక్టర్ వినోద్కుమార్, ఆ తర్వాత జూలై 2న కేంద్ర ప్రభుత్వ సంస్థ బీబీఎస్ఎస్ఐకి చెందిన ప్రతినిధులు పరిశీలించారు. భూమి శ్యాంపిల్స్, నీటి పరీక్షల నివేదికలను తీసుకెళ్లిన వారు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు భూములు అనువుగా లేవని,వేరే చోట పరిశీలించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ఆనంద్ తాడిపత్రి మండలంలోని బుగ్గ, తలారిచెరువు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూములు దొరకడమే కష్టంగా మారిన ప్రస్తుత తరుణంలో అనువైన భూముల పేరుతో కాలయాపన చేయడం చూస్తుంటే అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటయ్యేనా అనే సందేహం కలుగుతోంది. ఎన్నో ఆశలు.. తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అరటి పంటను సాగు చేస్తున్నారు. 12 వేలకు పైగా హెక్టార్లలో అరటి సాగులో ఉంది. ఏడాదికేడాదికీ అరటి సాగు పెరుగుతోంది. నాణ్యమైన అరటి పిలకలు దొరక్కపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటైతే నాణ్యమైన పిలకలు లభిస్తాయని, రవాణా ఖర్చులు తగ్గుతాయని ఆశలు పెంచుకున్న రైతులు.. ఏడాది దాటినా పనులు ముందుకు సాగకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భూములు పరిశీలిస్తున్నాం తాడిపత్రి మండలంలో అరటి పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తున్నాం. భోగ సముద్రం, తలారిచెరువు గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిని కలెక్టర్, కమిటీ సభ్యులు పరిశీలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మరి కొన్ని భూములు పరిశీలనలో ఉన్నాయి. – ఉమాదేవి, ఉద్యాన శాఖ అధికారి -
డాక్యుమెంట్ రైటర్ల పొట్ట కొట్టొద్దు
అనంతపురం టౌన్: డాక్యుమెంట్ రైటర్ల పొట్టకొట్టే జీఓ396ను వెంటనే రద్దు చేయాలని ఏపీ డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యా లయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్లకు తీవ్ర నష్టం చేసే విధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అన్యాయమ న్నారు. ఇకపై తమ కుటుంబ జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు వర్దిరెడ్డి నాగార్జున రెడ్డి, సుధాకర్, వేణుగోపాల్, హరినాథ్బాబు, చంద్రశేఖర్, జగదీశ్వరప్రసాద్ పాల్గొన్నారు. బెట్టింగ్ అప్పు తీర్చలేక కృష్ణా నదిలో దూకాడు విజయవాడ: పరీక్షలు, ఫీజులు, పుస్తకాలంటూ తల్లిదండ్రుల నుంచి తీసుకున్న మొత్తాన్నీ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఈసారైనా వస్తుందన్న ఆశతో అప్పులు చేశాడు. చివరకు వాటిని తీర్చే మార్గం కనిపించక సోమవారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మనోహర్ అనే యువకుడు అమలాపురంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ చదువుతు న్నాడు. ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడి అప్పుల పాల య్యాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో వాటిని తీర్చే మార్గం కనిపించక జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం అమలాపురం నుంచి విజయవాడకు వచ్చాడు. నేరుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి కృష్ణానది ఎగువ ప్రాంతంలోని నీటిలోకి దూకాడు. ప్రాణభయంతో కృష్ణానది లాకులు పట్టుకుని ‘రక్షించండి’ అంటూ కేకలు వేశాడు. గమనించిన స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి మనోహర్ను రక్షించారు. -
టూవీలర్ రాపిడో రద్దు చేయండి
అనంతపురం అర్బన్: ‘‘టూ వీలర్ రాపిడో కారణంగా మేము ఉపాధి కోల్పోతున్నాం. వెంటనే దాన్ని రద్దు చేసి మా జీవనోపాధిని కాపాడండి.’’ అంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు సోమవారం ఆటోలతో సహా వచ్చి కలెక్టరేట్ను ముట్టడించారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ రోడ్డుకు ఇరువైపులా ఆటోలను నిలిపివేశారు. నాయకులు, ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ధర్నాలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ (న్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేంద్రకుమార్, రాజేష్గౌడ్, చంద్రశేఖర్ మాట్లాడారు. ఆటో కార్మికుల జీవనోపాధి కాపాడాలంటే టూ వీలర్ ర్యాపిడోను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తడంలో పోలీసులు పరిస్థితిని అధికారులకు తెలియజేశారు. దీంతో రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీర్రాజు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు నాయకులు వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. సమస్యలపై డీటీసీ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుని ఆటోడ్రైవర్ల ఉపాధిని కాపాడుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు ముత్తుజ, గోపాల్, చిరంజీవి, కృష్ణుడు, శ్రీనివాసులు, నాగరాజు, రాజు, కృష్ణానాయక్, హాజీ, తదితరులు పాల్గొన్నారు. -
‘యంత్ర’ సాయం..ఎడతెగని జాప్యం
అనంతపురం అగ్రికల్చర్: దరఖాస్తు చేసుకున్న పది రోజులకే ట్రాక్టర్లు, ఇతరత్రా యంత్ర పరికరాలు అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పింది. దరఖాస్తులు ఎక్కువైతే సిఫారసులకు తావులేకుండా జాయింట్ కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా యంత్ర సాయం చేస్తామని డాంబికాలు పలికింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా రైతులకు ఎలాంటి పరికరాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్న పరిస్థితి నెలకొంది. గతేడాదికి సంబంధించి అంటే 2025–26 కింద సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం రూ.9.27 కోట్ల బడ్జెట్తో యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నట్లు గత మే నెల మొదటి వారంలో ప్రకటించారు. అదే నెలాఖరులో రైతులకు యంత్రసాయం చేస్తామని ప్రకటించి దరఖాస్తులు ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు.. ఆర్ఎస్కేల్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు యాంత్రీకరణ పథకం కింద మే నెలాఖరులోపు 40 హెచ్పీ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, రోటావీటర్లు, హార్వెస్టర్లు, విత్తన గొర్లు, తవ్వే యంత్రాలు, గుంటకలు, పవర్టిల్లర్లు, స్పేయర్లు ఇలా అన్ని రకాల పనిముట్లు వ్యక్తిగతంగా అందిస్తామని ప్రకటించారు. ఐదెకరాల్లోపున్న చిన్న,సన్నకారు రైతులకు 50 శాతం, మిగతా రైతులకు 40 శాతం రాయితీ వర్తింపజేశారు. పరికరాలు అందుకున్న వెంటనే రైతుల ఖాతాల్లోకి రాయితీ జమ చేస్తామని తెలిపారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.9.27 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. మే 19లోపు దరఖాస్తు గడువు విధించి మిగతా ప్రక్రియ, పంపిణీ నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల కోసం ఆర్ఎస్కేలు, ఆన్లైన్ పోర్టల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం యాంత్రీకరణ పథకం అమలు చేయడానికి వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఉన్నఫలంగా షెడ్యూల్ కాస్త జూన్ నెలకు మార్పు చేశారు. మళ్లీ నేడు జూలైకు పొడిగించినా ఇప్పటికీ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. రూ.9 కోట్ల బడ్జెట్కు రూ.90 కోట్ల విలువ చేసే దరఖాస్తులు పారదర్శకత, లాటరీ అంటూ ‘బాబు’ సర్కారు గొప్పలు ‘తమ్ముళ్ల’ మధ్య పోటీతో ఆగిపోయిన యాంత్రీకరణ పథకం రైతుల పెదవి విరుపు రూ.9.27 కోట్లు బడ్జెట్ ఉండగా రూ.90 కోట్ల విలువ చేసే పరికరాలు, ట్రాక్టర్ల కోసం రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు, తమ్ముళ్ల మధ్యనే పెద్ద ఎత్తున పోటీ ఉండటంతో ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడటంతో తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు చెబుతున్నారు. ‘తమ్ముళ్ల’కే న్యాయం చేసే పరిస్థితి లేనందున నిబంధనలు మార్పు చేయడం, వ్యక్తిగతంగా కాకుండా గ్రూపుల కింద ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026–27 ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా గతేడాదికి సంబంధించిన బడ్జెట్నే ఖర్చు చేయకుండా జాప్యం చేస్తుండటంపై రైతులు పెదవి విరుస్తున్నారు. -
వరుణుడి కరుణ కోసం గాడిదలకు పెళ్లి
ఆత్మకూరు: మండలంలోని సిద్దరాంపురంలో గాడిదలకు పెళ్లి చేసి గ్రామంలో ఊరేగించారు. వాసుదేవుడిగా భావించే ప్రజలు.. రెండు గాడిదలకు సంప్రదాయబద్ధంగా పూలమాలలు వేసి పెళ్లి తంతు జరిపించారు. గత నెలలో కురిసిన వర్షాలకు పొలాల్లో విత్తనాలు వేసి రైతులు ఎదురుచూస్తున్నారు. వారాలు గడుస్తున్నా ఇంత వరకూ సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. గాడిదలకు పెళ్లి జరిపిస్తే వర్షాలు కురుస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీఅనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ: అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఏఈఈ పోస్టులకు నేటిలోపు దరఖాస్తు చేసుకోండిఅనంతపురం టౌన్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టుల దరఖాస్తుకు సోమవారం ఆఖరు రోజు అని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్పీడీసీఎల్ సంస్థలో ఏఈ పోస్టులు 56, టెలికాం 1, సివిల్ ఇంజినీర్లు 3, మొత్తం కలిపి 60 పోస్టుల నియామకానికి సంస్థ శ్రీకారం చుట్టిందన్నారు. పోస్టుల భర్తీ పక్రియ షెడ్యూల్ మేరకే జరుగుతుందన్నారు. ఈనెల 20వతేదీ సాయంత్రంలోపు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 22 నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త నిబంధనలు ఉపసంహరించాలి అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ పాఠశాలలకు అమలు చేస్తున్న కొత్త నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఉమ్మడి జిల్లా ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. వక్తలు మాట్లాడుతూ కొత్త నిబంధనలతో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా షెడ్లలో నిర్వహిస్తున్న పాఠశాలలు, గతంలో నిర్మించిన భవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకనుగుణంగా లేవన్న కారణంతో గుర్తింపు పునరుద్ధరణ (రెన్యూవల్) నిరాకరించడం సరికాదన్నారు. గదుల పరిమాణాన్ని ప్రస్తుత ప్రమాణాల ప్రకారం చూపుతూ రెన్యూవల్ నిలిపివేయడంతో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా సీఆర్ఓ కోటిరెడ్డి రవిచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, సింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పలవల అనిల్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయి గీత, కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. గంజాయి రవాణాదారుల అరెస్టు ఎర్రగుంట్ల: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఆయన విలేకరులకు వివరాలు తెలియజేశారు. ఎస్పీ నచికేత్ విశ్వనాఽథ్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు పట్టుబడ్డారు. వారిలో పొద్దుటూరుకు చెందిన ఎస్.జహీర్, గుంతకల్లుకు చెందిన షేక్ మహ్మద్ తాహీర్, షేక్ ఆసిఫ్ ఉన్నారు. వీరు గుంతకల్లు షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా చేసే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో భూ సమస్యలపై అర్జీలను అక్కడి అధికారులకు అందజేయాలన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekoram.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. స్పందన తెలియజేయండి అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనితీరుపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ కోరారు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉచామని చెప్పారు. పరిష్కార వేదికను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు జవాబుదారీతనం పెంచి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపి అర్జీదారుల సంతృప్తిని మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. క్యూఆర్ కోడ్ను అన్ని మండల, డివిజన్, జిల్లాస్థాయి కార్యాలయాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. లాకప్ నుంచి తప్పించుకున్న నిందితుడు కదిరి టౌన్: ఓ చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు పోలీసులనే బురిడీ కొట్టించాడు.ఏకంగా పోలీసుస్టేషన్లోని లాకప్ నుంచి పరారయ్యాడు. కదిరి పట్టణ పోలీసుస్టేషన్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఈ మధ్యనే పట్టణంలోని శివాలయంలో హుండీ పగలకొట్టి నగదు చోరీ చేసిన ఘటనలో మేకల నరసింహులు అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పట్టణ పోలీసుస్టేషన్లోని లాకప్లో ఉంచారు. అయితే పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మేకల నరసింహులు లాకప్ నుంచి పరారయ్యాడు. లాకప్కు తాళాలు వేయకపోవడంతో శనివారం మధ్యాహ్నం సమయంలో నిందితుడు సులువుగా తప్పించుకున్నాడని తెలుస్తోంది. విధుల్లో ఉన్న సిబ్బంది ఆ సమయంలో అసలు పోలీసుస్టేషన్లో ఉన్నారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం
వజ్రకరూరు: వెంకటాంపల్లిపెద్దతండా (రూపానాయక్తండా) సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనం అదుపుతప్పి కొర్రా ఉమ్లానాయక్ (39) మృతిచెందాడు. వజ్రకరూరు పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటాంపల్లిపెద్ద తండాకు చెందిన కొర్రా ఉమ్లానాయక్ మరో వ్యక్తి చిక్కేనాయక్తో కలిసి ద్విచక్ర వాహనంపై ఉరవకొండకు వెళ్లి సొంతూరుకు తిరిగి వెళ్తుండగా, మార్గంమధ్యలో అదుపుతప్పి కిందపడిపోయారు. ఈప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుకవైపున కూర్చున్న ఉమ్లానాయక్ బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రామ్స్వప్నబాయి, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఉమ్లానాయక్ మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామ్స్వప్నబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చెన్నబసవ రాజేంద్రస్వామికి కన్నీటి వీడ్కోలు
ఉరవకొండ: గవిమఠం సంస్థానం 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామికి భక్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. స్వామి వారి పార్థివ దేహన్ని దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. గవిమఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, కల్యాణస్వామి, సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారి పార్థివ దేహాన్ని విశేష పుష్పాలతో అలంకరించిన అనంతరం వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఓం నమఃశివాయ నామస్మరణ చేస్తూ ముందుకు కదిలారు. పార్థివదేహంపై పూలు చల్లి భక్తిభావాన్ని చాటుకున్నారు. క్లాక్టవర్ మీదుగా పాత గాంధీబజారు నుంచి వెలిగొండ రోడ్డులోని స్వామి వారి విడిది మంటపం వరకు వెళ్లి తిరిగి గవిమఠానికి తీసుకొచ్చారు. మూడేళ్ల క్రితమే సమాధి నిర్మాణానికి భూమి పూజ.. గవిమఠంలోని పూర్వ పీఠాధిపతుల సమాధులు ఉన్న సముదాయం ఆవరణలోనే తన అంతిమ సంస్కారాలు నిర్వహించేలా మూడేళ్ల క్రితమే జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి నిర్ణయించారు. అంతే కాకుండా తన సమాధికి భూమి పూజ కూడా చేయడం గమనార్హం. పూర్వ పీఠాధిపతుల వారి గద్దెల ప్రదేశంలోనే స్వామి పార్థివదేహాన్ని ఉంచి సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి వారి అంతిమ సంస్కారాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైఎస్సార్ సీపీ యువ నాయకుడు వై.భీమిరెడ్డితో పాటు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలోని వివిధ మఠాల నుంచి 48 మంది పీఠాధిపతులు హాజరయ్యారు. కర్ణాటకకు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వామి పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. -
ఏపీఓఎస్ఈఏ జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్నాయుడు
అనంతపురం అర్బన్: ఏపీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి అసోసియేషన్ (ఏపీజేఏసీ అమరావతి అనుబంధం) జిల్లా నూతన కమిటీని 12 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కృష్ణకళామందిర్లోని రెవెన్యూ హోమ్లో ఏర్పాటు చేసిన సంఘం సమావేశానికి ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్రావు, ఓఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సతీష్కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. సెర్ఫ్, మెప్మా ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. జిల్లా నూతన కమిటీ : సమావేశం అనంతరం ఏపీ ఓఎస్ఈఏ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఈరన్న, కోశాధికారిగా ప్రశాంత్ను ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షుడిగా అశోక్కుమార్, ఉపాధ్యక్షులుగా ఖాజా, రాజేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శులు భరత్, నరసింహారెడ్డి, కార్యదర్శులుగా సుచిత్ర, లోకేష్, ఈసీ సభ్యులుగా పద్మావతి, దిల్షాద్ను ఎన్నుకున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. డిగ్రీ ప్రవేశం ఆలస్యం
మడకశిర: విద్యారంగంలో సంస్కరణలంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏటికేడు పరిస్థితి దిగజారుతోంది. ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత విద్యారంగాన్ని సర్వనాశనం చేసిన పాలకులు తాజాగా ఉన్నతవిద్య ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా.. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు ప్రభుత్వం నేటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు కూడా ఈ విషయంపై స్పష్టత లేదు. త్వరలోనే అడ్మిషన్ల నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారేగానీ... ఎప్పుడు వస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అయోమయంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర, పెనుకొండ, ధర్మవరం, బుక్కపట్నం, కదిరి, హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్లులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వేలాది మంది విద్యార్థులు ఏటా బీకాం, బీఏ, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ తదితర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లను ప్రారంభించడంలో విఫలమవుతోంది. గత ఏడాది కూడా జాప్యం గత ఏడాది (2025–26 విద్యా సంవత్సరం) కూడా ప్రభుత్వం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో డిగ్రీ కోర్సుల్లో చాలా ఆలస్యంగా చేరాల్సి వచ్చింది. డిగ్రీ తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సిలబస్ను పూర్తి చేయడానికి అధ్యాపకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కొన్ని కళాశాలల్లో సిలబస్ పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం ఈసారైనా ప్రభుత్వం సకాలంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. నేటికీ విడుదల కాని నోటిఫికేషన్ ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు -
అనంతలో అత్యాధునిక ఆర్థోపెడిక్ చికిత్సలు
● ఇండస్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో వక్తలు అనంతపురం: ఆర్థోపెడిక్ సమస్యల చికిత్సల కోసం ఇకపై బెంగుళూరు, హైదరాబాద్, ఇతర మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, అనంతపురంలోని బళ్లారి బైపాస్ మార్గంలో నూతనంగా ప్రారంభించిన ఇండస్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ మదన్కుమార్ రెడ్డి, స్నేహ రెడ్డి తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, తదితరులు హాజరై ఇండస్ ఆస్పత్రిని ఆదివారం ప్రారంభించారు. డాక్టర్ మదన్కుమార్ రెడ్డి మాట్లాడారు. ఫ్రాక్చర్ చికిత్స నుంచి కీళ్ల మార్పిడి , మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు, ఆర్థోపెడిక్ చికిత్సలు, ట్రామా కేర్ సేవలను అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ ● ఐదుగురికి గాయాలు ముద్దనూరు: ముద్దనూరు– తాడిపత్రి జాతీయ రహదారిలో చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయదుర్గం నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు..వైఎస్సార్ కడప జిల్లా చెన్నారెడ్డిపల్లె వద్దకు వెళ్లగానే ముందువైపు గొర్రెలు అడ్డు రావడంతో బస్సును డ్రైవర్ స్లో చేశాడు. ఇంతలో వెనుక వస్తున్న లారీ.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతినింది. బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకొని వెళ్లిపోయారు. కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు. లారీ డ్రైవరుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు పెనుకొండ రూరల్: అమ్మవారిపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కియా పోలీసులు తెలిపిన వివరాలు... కళ్యాణదుర్గానికి చెందిన రమేష్ గుట్టూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కియా అనుబంధ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఈక్రమంలో బైక్పై వస్తుండగా అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని స్థానికులు 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళ్లారు. -
ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పేకాట
రామగిరి: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ప్రసిద్ధిగాంచిన నసనకోట ముత్యాలమ్మ ఆలయ సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. 18 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,030 నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మహమ్మద్ అలీ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.ముత్యాలమ్మ ఆలయ సమీపంలో కొన్ని నెలలుగా భారీస్థాయిలో పేకాట జరుగుతోంది. ఈ ఆలయం ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ అత్యంత ప్రసిద్ధి గాంచడంతో ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇదే అదనుగా అక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు రావడంతో ఆదివారం దాడి చేశారు. జూదరులను అరెస్టు చేసి.. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రజాధనాన్ని కొల్లగొట్టారు
పోరాడి సాధించుకుందాం అనంతపురం: రాయలసీమకు సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై రైతులు కదం తొక్కారు.తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పేరుతో రూ.3,500 కోట్ల ఖర్చు చూపించి వందలాది కోట్లను చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ కాంట్రాక్టర్లు దోపిడీ చేశారని దుయ్యబట్టారు. గ్రేటర్ రాయలసీమ సాగునీటి హక్కుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న పార్టీ నిర్ణయం మేరకు ఆదివారం వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హంద్రీ–నీవా ప్రాజెక్ట్ పరిరక్షణ పోరుబాట విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, రైతులు ఉత్సాహంగా తరలివచ్చారు. ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు కూడేరు మండలం చోళసముద్రం సమీపంలో హంద్రీ–నీవా కాలువలో రెండు కిలోమీటర్ల మేర రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి లైనింగ్ను పరిశీలించారు. పార్టీ అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్, పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, టాస్క్ఫోర్స్ కమిటీ జిల్లా కో ఆర్డినేటర్ నార్పల సత్యనారాయణరెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, సీఈసీ సభ్యులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, కోగటం విజయభాస్కర్ రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్, చిత్తూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రగా వెళ్తున్న మాజీ ఎంపీ రంగయ్యకాలువను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వ‘హంద్రీ–నీవా’ లైనింగ్ మాటున ప్రజాధనాన్ని చంద్రబాబు, లోకేష్ లూటీ చేశారు కుప్పానికి నీరు తరలించడానికి జిల్లా రైతులకు శాశ్వత సమాధి కట్టారు నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కాలువ వెడల్పు చేస్తామని స్పష్టీకరణ వైఎస్సార్ సీపీ పిలుపుతో కదం తొక్కిన అన్నదాతలు గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల టాస్క్ఫోర్స్ కమిటీ కాలువ పరిశీలన పాదయాత్ర విజయవంతంఉద్యమాన్ని తీవ్రం చేస్తాం జిల్లాకు గతంలో తుంగభద్ర జలాలు కీలకంగా ఉండేవి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చాయి. గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం వైఎస్సార్ సీపీ టాస్క్ఫోర్స్ కమిటీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. రైతులకు అండగా నిలవడమే ఈ కమిటీ లక్ష్యం. చంద్రబాబు ప్రజాకంటక పాలన సాగిస్తున్నారు. రానున్న రోజుల్లో రాయలసీమ వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమిస్తాం. –నార్పల సత్యనారాయణరెడ్డి, గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్పట్టుకుంటే ఊడిపోయే లైనింగ్ పట్టుకుంటే కూడా ఊడిపోయే స్థితిలో హంద్రీ–నీవా లైనింగ్ ఉంది. వేల కోట్లు ఖర్చు చేశామని, 200 రోజులు నీరు వచ్చిందని చెబుతున్నా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి. డబ్బు మూటలన్నీ అమరావతికి తీసుకెళ్తున్నారు. హంద్రీ–నీవా లైనింగ్తో రైతన్న బాగుపడలేదు కానీ కాంట్రాక్టర్లకు మాత్రం రూ. వందల కోట్లు దోచిపెట్టారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ ముసుగులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. – సాకే శైలజనాథ్, మాజీ మంత్రి, గ్రేటర్ రాయలసీమ నీటి ప్రాజెక్టుల సాధన టాస్క్ఫోర్స్ కమిటీ కన్వీనర్ రైతులకు సమాధి కట్టారు కరవు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీ–నీవా ప్రాజెక్టు చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్కు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. గాలేరి, నగరి కాలువను పటిష్టం చేశారు. చంద్రబాబు కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తరలించేందుకు రైతుల ఆశలను అడియాసలు చేశారు. ఈ ప్రాంత రైతులకు శాశ్వత సమాధి కట్టారు. హంద్రీ–నీవా లైనింగ్ వల్ల ఈ ప్రాంతంలో బోర్లు వట్టిపోయి చీనీ, మామిడి చెట్లు ఎండిపోయాయి. – వై. విశ్వేశ్వర రెడ్డి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడుహంద్రీ–నీవా కాలువ వెడల్పు, లైనింగ్ పనులను అత్యంత నాసిరకంగా చేశారు. రూ.3,800 కోట్లు విలువ చేసే పనుల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎలా దోపిడీ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. కుప్పానికి నీరు తీసుకెళ్లే క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అన్నదాతలకు శాశ్వత సమాధి కట్టారు. సక్రమంగా పనులు జరిగి ఉంటే అనంతపురం జిల్లాకు 80 టీఎంసీల నీరు వచ్చేవి, మరి ఆ మేరకు నీళ్లు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్లే హంద్రీ–నీవా ప్రాజెక్టు సాధ్యమైంది. కరువు ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలన్న ఉద్దేశంతో పనులు శరవేగంగా చేపట్టారు. చంద్రబాబు హంద్రీ–నీవా ప్రాజెక్టును 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించి తీరని ద్రోహం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటే ఈ సారి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టెండర్లు రద్దు చేసి మళ్లీ 3,850 క్యూసెక్కులకే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే హంద్రీ–నీవాను 11,500 క్యూసెక్కులకు విస్తరిస్తాం. జిల్లా రైతులు ధైర్యంగా ఉండాలి. –అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుసీఎం చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి రాజధాని హైదరాబాద్ను వదిలేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపడం లేదు. హంద్రీ–నీవా ప్రాజెక్టు పనులను నాసిరకంగా చేపట్టి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. దోచుకోవడం.. దాచుకోవడమే చంద్రబాబు సిద్ధాంతం. రాయలసీమకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోం. మన ప్రాంత పరిరక్షణకు ఏకమవుదాం. ఒకరికొకరు సహకరించుకుని పోరాడి సాధించుకుందాం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు -
ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే..అక్రమ కేసులా?
గుంతకల్లుటౌన్: రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించిన 15,049 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమంగా కేసులు బనాయించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కొందరిపై దేశద్రోహం కేసులు పెట్టడమేంటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడితప్పి శాంతిభద్రతలను గాలికొదిలేసిందని ఆయన నిప్పులు చెరిగారు. రాప్తాడు వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ను పోలీసులు చిత్రహింసలు పెట్టి వేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో 6.5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయన్నారు. అన్నదాతలకు పంటనష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 5న జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబును కలిసి హంద్రీ–నీవా కెనాల్ ద్వారా పంటపొలాలకు నీరివ్వాలని కోరతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఆగస్టు 1 నుంచి 6 వరకు అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ప్రచారం, 6 నుంచి 15 వరకు జిల్లాలో జీపుజాతా, 17న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు ఎండీ.గౌస్, రాము, నాయకులు వీరభద్రస్వామి, మహేష్, ఈశ్వరయ్య, రామాంజినేయులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ -
రివర్ట్ టీచర్లకు ‘ సీనియార్టీ’ షాక్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాల విభజన నేపథ్యంలో విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాలు పలువురు ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పదోన్నతి పొంది వ్యక్తిగత కారణాలతో తిరిగి పాత కేడర్కు (రివర్ట్) వచ్చిన ఉపాధ్యాయుల దశాబ్దాల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా సీనియార్టీ జాబితాల చివరన చేర్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల విభజన ప్రక్రియలో విద్యాశాఖ విడుదల చేసిన సీనియార్టీ జాబితాల్లో రివర్ట్ అయిన ఉపాధ్యాయుల సుదీర్ఘ సేవను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరిస్థితులు లేదా ఇతర కారణాలతో పదోన్నతిని వదులుకుని తిరిగి పాత కేడర్కు వచ్చిన ఉపాధ్యాయుల సీనియార్టీని శ్రీసున్నాశ్రీగా పరిగణిస్తూ వారిని జాబితాల్లో చివరన ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫలితంగా వందలోపు సీనియార్టీ ఉన్న కొందరు టీచర్లు ప్రస్తుతం 6 వేలకుపైగా స్థానాలకు వెళ్లిపోయారు. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది అనంతరం తిరిగి ఎస్జీటీలుగా వచ్చిన ఉపాధ్యాయులే ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలు ఏమంటున్నాయి? ఉపాధ్యాయ సంఘాల వాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లోని రూల్ 33(ఏ) ప్రకారం ఉద్యోగి సీనియార్టీ మొదటి రెగ్యులర్ నియామక తేదీ ఆధారంగానే నిర్ణయించాలి. పదోన్నతి పొంది తిరిగి ఫీడర్ కేడర్కు వచ్చిన ఉద్యోగి గతంలో సంపాదించుకున్న సీనియార్టీని రద్దు చేసే నిబంధన ఎక్కడా లేదని వారు చెప్తున్నారు. అలాగే రూల్ 35(బీ) ప్రకారం సొంత అభ్యర్థనపై ఒక జిల్లా లేదా యూనిట్ నుంచి మరో జిల్లాకు బదిలీ అయిన ఉద్యోగికే బాటమ్ సీనియార్టీ వర్తిస్తుందని, ఒకే జిల్లాలో రివర్ట్ అయిన ఉపాధ్యాయులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంటున్నారు. రూల్ 28 ప్రకారం పదోన్నతిని తిరస్కరించినా లేదా పదోన్నతి అనంతరం తిరిగి పాత పోస్టుకు వచ్చినా, ఆ ఉద్యోగి కేవలం ఆ ప్యానెల్ ఏడాదికి మాత్రమే పదోన్నతి అవకాశాన్ని కోల్పోతాడని, ఫీడర్ కేడర్లోని అసలు సీనియా ర్టీపై ప్రభావం ఉండదని సంఘాలు గుర్తు చేస్తున్నాయి. రివర్ట్ అయిన ఉపాధ్యాయులకు బాటమ్ సీనియార్టీ వర్తిస్తోందని అధికారులు చెబుతున్నప్పటికీ, అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు లేదా స్పష్టమైన సర్వీస్ రూల్స్ను చూపించడం లేదని సంఘాలు ఆరోపిస్తున్నాయి. రివర్ట్ టీచర్ల సీనియార్టీ జాబితాల తయారీలో కొందరు డీఈఓ కార్యాలయ ఉద్యోగులు ద్వంద్వ వైఖరి అవలంబించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా తమ సీనియార్టీని తొలగించారని ఆరోపిస్తున్న బాధిత ఉపాధ్యాయులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. దశాబ్దాల సేవ.. ఒక్క జాబితాతో తుడిచిపెట్టిన వైనం 29 ఏళ్ల కష్టానికి జాబితాలో చివరన చోటు ఉమ్మడి జిల్లాలో 50 మందికి పైగా బాధితులు బోయ కూరగాయల ముత్యాలప్ప ధర్మవరం మండలం గొట్లూరు ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పని చేస్తున్నారు. గతంలో ఈయన స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతి పొంది ఐదు నెలలు పని చేశారు. అనారోగ్య సమస్యలకు తోడు, కుటుంబ ఇబ్బందుల కారణంగా పదోన్నతి వదులుకొని రివర్ట్ వచ్చారు. 29 ఏళ్ల సీనియార్టీ ఉంది. ఎస్జీటీ సీనియార్టీ జాబితాలో వందలోపే ఉంటారు. కానీ జాబితాలో అట్టడుగున చివరి పేరు 6133 నంబరులో ఉంచారు. శెట్టిపల్లి వెంకటరంగారెడ్డి కనగానపల్లి ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పని చేస్తున్నారు. ఈయన సోషల్ టీచరుగా పదోన్నతి పొంది వ్యక్తిగత కారాణాలతో మూడు నెలల్లోపు వెనక్కు (రివర్ట్) వచ్చారు. ఈయన సర్వీసు 27 ఏళ్లు. ఎస్జీటీల జాబితాలో 135 నంబరులో ఉండాల్సిన వెంకటరంగారెడ్డిని 6,075కు పంపారు. వీరిద్దరే కాదు...ఉమ్మడి జిల్లాలో ఇలాంటి వారు 50 మందికి పైగా ఉన్నారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ సీమకు అన్యాయమే జరుగుతోంది. దివంగత నేత వైఎస్సార్ పోతిరెడ్డిపాడును 88 వేల క్యూసెక్కుల స్థాయికి పెంచితే చంద్రబాబు అడ్డుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 శాతం పూర్తి చేస్తే ఆ పనులకూ అడ్డు తగిలారు. చంద్రబాబుతో మాట్లాడి ఈ ప్రాజెక్టు పనులను ఆపేయించానని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినా ఖండించ లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం పోరాటం ఉధృతం చేస్తాం. –కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
ఏం జరుగుతోంది ‘సర్’!
● రోజురోజుకూ అంకెలు మార్చి చూపడంపై సర్వత్రా విమర్శలు అనంతపురం అర్బన్: ఆరోగ్యవంతమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో ఏం జరుగుతోందో అంతు పట్టకుండా ఉంది. ఇదిగో వందశాతం పూర్తయ్యిందంటూ ఒకవైపు చెబుతూనే... మరోవైపు రోజురోజుకూ అంకెలు మారుస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ జరిగాయంటూ ఒకసారి ప్రకటించిన సంఖ్యలో మరుసటి రోజుకు తగ్గడం... అదే క్రమంలో వెనక్కిరాని (అన్కలెక్టబుల్) ఈఎఫ్ల సంఖ్య పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. తగ్గుతున్న డిజిటలైజేషన్ ఈఎఫ్లు ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేసిన తరువాత అప్పటి వరకు జరిగిన సంఖ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. కానీ, జిల్లా ‘సర్’ అధికారులు మాత్రం అది సాధ్యమేనని అంకెలతో సహా చూపిస్తున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సర్ నివేదికలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 14 తేదీ వరకు డిజిటలైజేషన్ అయిన ఈఎఫ్ల సంఖ్య 18,29,706గా ప్రకటించారు. ఇక 18వ తేదీనాటికి డిజిటలైజేషన్ చేసిన ఈఎఎఫ్లు 18,23,293గా నివేదికలో స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ ఈఎఫ్ల సంఖ్య 6,413 తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి డిజిటలైజేషన్ చేసిన తరువాత ఆ సంఖ్య ఎలా తగ్గింది అనేది అధికారులకే తెలియాలి. ● మరోవైపు అన్కలెక్టబుల్ (వెనక్కి తీసుకోని) ఈఎఫ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 14వ తేదీన ప్రకటించిన నివేదిక ప్రకారం అన్కలెక్టబుల్ ఈఎఫ్లు 2,08,791 ఉన్నాయి. 18వ తేదీన ప్రకటించిన నివేదిక ప్రకారం అన్కలెక్టబుల్ ఈఎఫ్లు 2,15,230 ఉండడం గమనార్హం. ఇక్కడ 14వ తేదీ నుంచి 18వ తేదీ నాటికి 6,439 పెరిగాయి. ఎలా పెరిగాయనేది కూడా అఽధికారులకే తెలియాలి. ఈ విషయంపై కలెక్టర్ ఓ.ఆనంద్ స్పందించారు. ఎన్యుమరేషన్ ఫారం ఒకసారి డిజిటలైజేషన్ చేసిన తరువాత మార్పు చేయవచ్చా లేదా అనేది పరిశీలిస్తానన్నారు. అదే విధంగా అన్కలెక్టబుల్ ఈఎఫ్ల అంశాన్ని కూడా చూస్తానని చెప్పారు. -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గాలివేగం పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రెండు ఆటోలు ఢీ ● 3వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు ● స్వల్పగాయాలతో బయటపడిన మరో 8 మంది చిన్నారులు రాయదుర్గం రూరల్: రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా, మరో 8 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాలు.. శనివారం సాయంత్రం రాయదుర్గం నుంచి 74 ఉడేగోళం గ్రామానికి విద్యార్థులతో ఆటో బయలుదేరింది. ఇదే క్రమంలో రాయదుర్గం వైపు వస్తున్న ఓ ఆటోను 74 ఉడేగోళం వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో రాయదుర్గంలోని స్టోన్ వ్యాలీ ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఇన్ఫ్యాట్ జీసేస్ స్కూల్కు చెందిన 3వ తరగతి విద్యార్థులు జశ్వంత్, సంయోగన్ తీవ్రంగా గాయపడ్డారు. తలకు ఐదు కుట్లు చొప్పున పడ్డాయి. వీరితో పాటు తన్మయ్, వర్షిత, దీపిక, మరో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పిల్లలను స్థానికులు వెంటనే రాయదుర్గం ప్రభుత్వానికి తరలించి వైద్య చికిత్సలందించారు. ఈ ఘటనపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపటి నుంచి ఎంపీఈఓల పెన్డౌన్ ఆత్మకూరు: ఉద్యోగ భద్రతతో పాటు జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంపీఈఓలు ఈ నెల 20 నుంచి 25 వరకు పెన్డౌన్ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 329 మంది ఎంపీఈఓలు ఉండగా, వీరిలో 65 శాతం పైగా మహిళలే ఉండడం గమనార్హం. రెండు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ అధికారిని కలిసిన వారు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం సమర్పించారు. ఎంపీఈఓలు పెన్డౌన్కు దిగితే క్షేత్రస్థాయిలో రైతులకు కష్టాలు తప్పవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?
● మాజీ మంత్రి శైలజనాథ్ ధ్వజం అనంతపురం: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 20 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్కు శనివారం మాజీ మంత్రి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల తరబడి కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే, ప్రశ్నపత్రాల లీకేజీల, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక సార్లు ప్రశ్నపత్రాలు లీకేజీ కావడాన్ని ప్రజలు గమనించాలన్నారు. విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని కోరారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘చేతన’తో ట్రాన్స్జెండర్ల సాధికారత అనంతపురం సెంట్రల్: సమాజంలో వివక్షతకు గురవుతున్న ట్రాన్స్జెండర్లలో మార్పు తెచ్చేందుకు ఎస్పీ జగదీష్ ‘చేతన’కు శ్రీకారం చుట్టారు. ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లు, అసభ్య ప్రవర్తనకు స్వస్తి పలికి ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన వైపు నడిపించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో జిల్లాలోని ట్రాన్స్జెండర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సత్వర సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ కోర్సులు, టైలరింగ్, హస్తకళలు, ఇతర రంగాల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. -
భూమిని బీడు పెట్టా
నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. హంద్రీ –నీవా కాలువలో కాంక్రీట్ లైనింగ్ పనులు చేపట్టడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. ఇటీవల కొత్తగా మూడు బోర్లు వేయించినా నీరు లభించలేదు. రూ. 1.2 లక్షల వరకు ఖర్చయింది. సాగు చేసిన బ్యాడిగ మిర్చి, మొక్కజొన్న పంటలకు పక్క రైతు బోరు నుంచి నీరు పెట్టుకొని నూర్పిడి చేసుకున్నా. పంటలకు నీరు సరిగా అందక దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. ఇకపై భూమి బీడు పెట్టాల్సిందే. – పవన్ కుమార్, రైతు, ముద్దలాపురం -
రేపు షైనింగ్ స్టార్ అవార్డుల పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్: పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘షైనింగ్ స్టార్ అవార్డ్స్–2026’ కార్యక్రమాన్ని ఈ నెల 20న నిర్వహించనున్నారు. జిల్లాలో 192 మంది పదో తరగతి విద్యార్థులు, 38 మంది ఇంటర్ విద్యార్థులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. 20న ఉదయం 8 గంటలకు జేఎన్టీయూ కళాశాల ఆవరణలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో కలెక్టర్ ఓ. ఆనంద్ ఆధ్వర్యంలో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డులకు ఎంపికై న ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో కలిసి నిర్ణీత సమయానికి హాజరుకావాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం, మెడల్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గుంతకల్లు చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం గచ్చిబౌలి(హైదరాబాద్): గుంతకల్లుకు చెందిన ఓ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంత మైంది. శనివారం హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ డాక్టర్ రమేష్ వివరాలను వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన వీధి వ్యాపారి గోవిందమ్మ తన మూడేళ్ల కుమార్తె పుష్పరాణితో కలిసి ఈ నెల 15న రాత్రి హైదరాబాద్లోని లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగింది. స్థానిక 6వ నంబర్ ప్లాట్ఫాంపై నిద్రకు ఉపక్రమించింది. కొద్దిసేపటి తర్వాత లేచి చూసిన గోవిందమ్మకు కూతురు కనిపించలేదు. సమీప ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో చందానగర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. వికారాబాద్, పరిగికి చెందిన కొత్తి శ్రీనివాస్, బండ్లగూడ కాళీమందిర్కు చెందిన దోమ రామకృష్ణలు రైల్వేస్టేషన్ చేరుకుని రాత్రి 2 గంటల సమయంలో చిన్నారి పుష్పరాణిని కిడ్నాప్ చేసి మహబూబ్నగర్కు తరలించినట్లు గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. మహబూబ్నగర్ పట్టణంలోని ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్లో టెక్నీషియన్గా పని చేస్తున్న నవనీత కిడ్నాప్ చేయించినట్లు గుర్తించి ఆమెను కూడా అరెస్టు చేశారు. వ్యవసాయశాఖలో 87 ఖాళీలు అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రపత్తి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖలో 87 ఖాళీలు ఉన్నట్లు వెల్లడైంది. రెండు జిల్లాల పరిధిలో మొత్తంగా 571 మంది ఉండాలి. ప్రస్తుతం 484 మంది పనిచేస్తుండగా, 87 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. అందులో అనంతపురం జిల్లా పరిధిలో 59 ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో 28 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎక్కువగా వాచ్మెన్ పోస్టులు 26, మెసెంజర్ పోస్టులు 14, ఏఈఓ పోస్టులు 12 ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ చర్యలను ఎండగడదాం
అనంతపురం న్యూటౌన్: ‘చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా ప్రతినిధులను వేధిస్తోంది. జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ పోస్టర్లను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు మధ్య అనుసంధానంగా ఉండాలనే సదుద్దేశంతో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఏర్పాటు చేశారన్నారు. పార్టీ శ్రేణులందరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తలకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో సూపర్ యాప్ ఆవిష్కరణతో మరోసారి అందరికీ తెలిసిందన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, నగరాధ్యక్షుడు చింతా సోమ శేఖర్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైపుల్లా బేగ్, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.ఓబిరెడ్డి, ఎద్దుల అమర్నాథ్ రెడ్డి, సంపంగి రామాంజనేయులు, దేవీ, భారతి, హజరాంబీ, లీలా, భారతి రెడ్డి, కుళ్ళయప్ప, సాకే కుళ్లాయి స్వామి, కమల్ భూషణ్, గుణ శేఖర్ బాబు, దామోదర్ రెడ్డి, మల్లెల వేణు గోపాల్, భారతి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులకు వేధింపులు జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి పిలుపు -
జిల్లాలో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా ?
కళ్యాణదుర్గం: ఆసియా ఖండంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ ప్రాంతం. అందులోనూ అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రజలు కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి జిల్లాలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఎకరానికై నా సాగునీరిచ్చారా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల సమన్వయకర్త, రాయలసీమ ఎత్తిపోతల పథకం టాస్క్ఫోర్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శైలజనాథ్ సూటిగా ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ సమన్వయకర్త, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు డాక్టర్ తలారి రంగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెపుకుంటున్న వారు ఎక్కడ ప్రాజెక్టులు పూర్తి చేశారు..ఎక్కడ కాలువలు పూర్తి చేశారో చెప్పాలని నిలదీశారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జీఓ, డీపీఆర్ ఇవ్వడం, టెండరు పిలవడం అగ్రిమెంట్లు కూడా జరిగాయన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని 3,800 క్యూసెక్కులకు కుదిస్తూ ఉత్తర్వులు తీసుకొచ్చి జిల్లా ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్ జగన్ గతంలోనే ప్రారంభించిన కుప్పం ప్రాజెక్టును మరోసారి ప్రారంభించి కళ్యాణి డ్యాం వరకు హంద్రీనీవా నీటిని తీసుకెళ్తామని కూటమి నేతలు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 3800 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువకు కేవలం 2700 క్యూసెక్కుల నీటిని తీసుకురావడంలోనూ అధికారులు, పాలకులు విఫలమయ్యారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో హంద్రీనీవా, హెచ్ ఎల్సీ పనుల ఎస్టిమేషన్ రేట్ల కంటే రెండుమూడింతలు పెంచుకుని రూ.కోట్లను కొట్టేశారన్నారు. ఈనెల 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించడంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన బాధ్యత ఉంటే టీడీపీ, కూటమి నేతలు కూడా రావచ్చని సూచించారు. ప్రజల కోసమే వైఎస్సార్సీపీ ఉద్యమాలు ఈ ప్రాంత అభివృద్ధికి తామెప్పుడు అడ్డంకి కాదని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రజా పోరాటాలను చేస్తుంటే ఓర్వలేక టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని గుర్తు చేశారు. గతంలో ఆర్డీటీ కోసం పాదయాత్ర చేస్తే అన్ని చోట్ల అడ్డుకున్నారన్నారు. విజయోత్సవ ర్యాలీ చేస్తే వంద మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాము ప్రజల ప్రయోజనం కోసమే పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో బీటీపీ కాలువ తవ్వుతానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నీళ్ల అంశం చిన్న విషయం కాదన్నారు. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలతో పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం గంగాధర, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు సుధీర్, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, వెంకటప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్కుమార్, సీనియర్ నాయకులు తిరుమల వెంకటేశులు, వన్నూర్రెడ్డి, సోమనాథ్రెడ్డి, శివ శంకర్ నాయక్, భీమేష్, ఆంజినేయులు, హనుమంతరెడ్డి పాల్గొన్నారు. హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,800 క్యూసెక్కులకు కుదించింది ఎవరు? 19న చోళ సముద్రంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రేటర్ రాయలసీమ సమస్యలపై సమావేశం అధిక సంఖ్యలో తరలిరావాలని మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ రంగయ్య పిలుపు -
పంటల బీమాను సద్వినియోగం చేసుకోండి
అనంతపురం అగ్రికల్చర్: ఈనెలాఖరులోపు ప్రీమియం చెల్లించి వాతావరణ, ఫసల్ బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పంట సాగు చేసినట్లు ఈ–క్రాప్లో తప్పకుండా నమోదు కావాలన్నారు. సాగు చేసిన పంటకే ప్రీమియం కట్టాలన్నారు. వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, అరటి, టమాట, కంది, జొన్న, ఆముదం, మొక్కజొన్న, ఎండుమిరప రైతులకు బీమా పథకాలు వర్తిస్తాయన్నారు. వరి రైతులు ఆగస్టు 15 లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. వెనక్కి రాని ఈఎఫ్లు 2.10 లక్షలు అనంతపురం అర్బన్: వెనక్కిరాని ఈఎఫ్ల సంఖ్య 2,10, 933కు చేరింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) గడువు 10 రోజులు పొడిగించారు. దీంతో పెండింగ్లో ఉన్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను బీఎల్ఓలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వెనక్కిరాని ఈఎఫ్ల సంఖ్య పెరుగుతోంది. ఈనెల 14 నాటికి వెనక్కిరాని ఈఎఫ్ల సంఖ్య 2,08,791 ఉండింది. 15 నాటికి 351 పెరిగి వాటి సంఖ్య 2,09,151కి చేరింది. ఇక శుక్రవారం నాటికి వెనక్కిరాని ఈఎఫ్ల మరో 1,782 పెరిగి 2,10,933కు చేరింది. వీరందరికీ ఓటు హక్కు ఉండదు. -
నీట్లో ‘అనంత’ విద్యార్థుల ప్రతిభ
అనంతపురం ఎడ్యుకేషన్: నీట్–2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 690 మార్కులతో అఖిల భారత స్థాయిలో 36వ ర్యాంకు సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచింది. ఆమె తండ్రి డాక్టర్ ఎన్. ప్రవీణ్ దీన్ కుమార్ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)లో శిశురోగ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా, తల్లి డాక్టర్ బి. ప్రవీణ కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల (కేఎంసీ)లో మైక్రోబయాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రేరణ విజయవాడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గాయత్రి వేదవ్యాస్ శాఖలో విద్యాభ్యాసం చేసి ఈ ఘనత సాధించింది. తొలి ప్రయత్నంలోనే జషన్ దీప్ విజయం అనంతపురం నగరానికి చెందిన సంగటి జషన్ దీప్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే నీట్లో 618 మార్కులు సాధించి అఖిల భారత స్థాయిలో 5,496వ ర్యాంకు, తన కేటగిరీలో 2,483వ ర్యాంకు సాధించాడు.ఆయన తండ్రి సంగటి నిరంజన్ రెడ్డి బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు జెడ్పీహెచ్ఎస్లో ఫిజికల్ డైరెక్టర్గా, తల్లి చర్లపల్లి రమాదేవి ఉరవకొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. బెళుగుప్ప: మండల కేంద్రంలోని బెళుగుప్ప తండా వాసి, కేజీబీవీలో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగిని కవిత , చిన్న కుళ్లాయి దంపతుల కుమారుడు గణేష్నాయక్ నీట్లో సత్తాచాటాడు. 515 మార్కులతో ఎస్టీ కేటగిరిలో 616వ ర్యాంక్ సాధించాడు. ఆల్ ఇండియా స్థాయిలో 71,038వ ర్యాంక్తో నిలిచాడు. నామాల ప్రేరణ, జషన్ దీప్ రెడ్డి, గణేష్ నాయక్ -
భూ సమస్యలను పరిష్కరించండి
కూడేరు: కలెక్టర్ సారూ.. కొన్నేళ్లుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. మీరు చొరవ చూపి భూసమస్యలకు పరిష్కారం చూపండని పలువురు రైతులు వేడుకున్నారు. శుక్రవారం కూడేరు మండలం ఉదిరిపికొండలో ‘ఒక గ్రామం–ఒక నెల–నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని తహసీల్దార్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. భూసమస్యలపై అనేక మార్లు అర్జీలిచ్చినా పరిష్కారం కాలేదని పలవురు రైతులు కలెక్టర్తో వాపోయారు. భూ, ఇతర సమస్యలపై ప్రజల నుంచి 176 అర్జీలు వచ్చాయి. భూసమస్యలు పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు.ఉదిరిపికొండలో తాగునీటి సమస్య వేధిస్తోందని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన కలెక్టర్... ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, ఆర్డబ్ల్యూఎస్జేఈ నాగదివ్యను పిలిచి వెంటనే అదనంగా బోరు వేసి నీటి సమస్యను తీర్చాలని ఆదేశించారు. మండల పరిధిలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు , మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
న్యాయం కోసం భర్త ఇంటి వద్ద నిరసన
గుంతకల్లు:న్యాయం కోసం ఓ మహిళ తన భర్త ఇంటి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. వివరాలు.. పట్టణంలోని తిలక్నగర్లోని మదీనా మసీద్ సమీపంలో నివాస ముంటున్న షామీర్ బాషా అనంతపురానికి చెందిన శీరీన్తో 2011లో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ అయిన షామీర్ బాషా నుంచి తనకు నెలనెలా ఇవ్వాల్సిన రూ.35వేలు, ఇద్దరు పిల్లలకు ఇవ్వాల్సిన రూ.7.50 లక్షలు కోసం పిల్లలతో కలిసి రోడ్డు బైఠాయించి, నిరసన తెలిపింది. అయితే ఇంట్లో షామీర్ బాషా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులతో శీరీన్తో గొడవపడ్డారు. టూటౌన్ పోలీసులు శీరీన్ను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ఇరువర్గాలను స్టేషన్ పిలిపించి పోలీసులు విచారణ చేస్తున్నారు. వర్షం కోసం ముస్లింల ప్రార్థన శెట్టూరు: మండల కేంద్రంలోని చెరువులో వర్షం కురవాలని ముస్లింలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రానికి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకొని ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక రైతులు సకాలంలో విత్తనాలు వేయలేపోయారని, బోరుబావులు ఇంకిపోయి, పంటలు ఎండిపోతున్నాయని, మూగజీవులకు కనీసం మేత దొరక్క అల్లాడుతున్నారని.. మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఈకార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఉరవకొండలో ప్రథమ చికిత్స కేంద్రం సీజ్ ఉరవకొండ: స్థానిక మూగబసవన్న కట్ట వద్ద ఉన్న ఆఫ్రీన్ ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని శుక్రవారం ట్త్రెనీ కలెక్టర్ షియాజ్కుమార్ డీఎంహెచ్ఓ ఈబీ దేవి సమక్షంలో సీజ్ చేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అఫ్రీన్ పథ్రమ చికిత్స కేంద్రంలో రోగులకు నిషేధిత మందులు, ఇంజెక్షన్లు రోగులకు వేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక ఫిర్యాదులు రావడంతో ప్రథమచికిత్స కేంద్రాన్ని సీజ్ చేసి, ఆర్ఎంపీ వైద్యుడు రోషన్కు నోటీసులు ఇచ్చామన్నారు. జిల్లా మాస్ మీడియా అధికారి నాగరాజు, స్థానిక వైద్యాధికారిణి వినీత, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం రూరల్: పట్టణంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మూడు డయాగ్నస్టిక్ (రక్త పరీక్షలు) సెంటర్లను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. శుక్రవారం పట్టణంలో అసిస్టెంట్ కలెక్టర్ సుయాజ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ లక్ష్మీనారాయణ ఆకస్మికంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఆదర్శ గురువు
గుత్తి రూరల్: నెల నెలా వేతనం వస్తే చాలు.. పిల్లల భవిష్యత్ ఏమైతేనేం అనే గురువులు ఉండొచ్చు.. ప్రభుత్వ నిధులు మంజూరైతే పాఠశాలను అభివృద్ధి చేద్దామనే ఉపాధ్యాయులు ఉండొచ్చు.. కానీ కె.ఊబిచెర్ల ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఓబిలేసు నిధులు లేకపోయినా సొంత డబ్బులు వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తానే సొంతంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారు. మండలంలోని కె.ఊబిచెర్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాలు, పరిసరాలు అధ్వానంగా ఉండేవి. పాఠశాల పరిస్థితి చూసి చలించిన హెచ్ఎం పాఠశాలను ఎలాగైనా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొందరు దాతలను అడిగినా ఫలితం లేదు. దీంతో హెచ్ఎం ఓబులేసు సొంత డబ్బులు రూ.64,300 ఖర్చు చేసి పాఠశాలలో సమస్యలను పరిష్కరించారు. పాఠశాల చుట్టూ ఉన్న అపరిశుభ్రత తొలగించారు. విద్యుత్ తీగలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రార్థన స్టేజీ నిర్మించారు. నీటి వసతి కోసం నూతన పైపు లైన్లు ఏర్పాటు చేశారు. పాఠశాల కళావిహీనంగా ఉండటంతో రంగులు వేయించారు. పాఠశాల విద్యార్థులకు శుద్ధ నీటిని అందించే ఫిల్టర్, మోటార్కు మరమ్మతు చేయించారు. కిటికీలకు కడ్డీలు లేక పోవడంతో వెల్డింగ్ చేయించారు. పాఠశాలలో మొక్కలు నాటించి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. పాఠశాల అనతి కాలంలోనే అభివృద్ధి చెందడం, విద్యార్థుల వేష, భాషలు, చదువుల్లో మార్పు రావడం, డిజిటల్ బోధన, మౌలిక వసతులు చూసిన తల్లితండ్రులు పిల్లలను గ్రామంలోని పాఠశాలలో చేర్పించడంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 53కు చేరింది. గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేసిన హెచ్ఎంను గ్రామస్తులు, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు అభినందించారు. హెచ్ఎం చొరవతో రూపుదిద్దుకున్న కె.ఊబిచెర్ల పాఠశాల పాఠశాల భవనానికి రంగులు వేయిస్తున్న ఉపాధ్యాయుడు ఓబులేసు కె.ఊబిచెర్ల పాఠశాల అభివృద్ధికి నడుంబిగించిన హెచ్ఎం సొంత డబ్బు వెచ్చించిన వైనం -
యువకుడి మృతి
అనంతపురం సెంట్రల్: నగరంలో తపోవనం సర్కిల్లో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో మం జునాథ్ (27) మృతిచెందాడు. సీఐ వెంకటేష్నాయక్ తెలిపిన మేరకు.. కుందుర్పికి చెందిన మంజునాథ్ శుక్రవారం నారాయణపురం వైపు నుంచి అనంతపురంలోకి వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొనింది. తీవ్రంగా గాయపడిన అత న్ని బెంగుళూరుకు తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తండ్రి మేథప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చెక్ బౌన్స్ కేసులపై నేడు ప్రత్యేక లోక్ అదాలత్ అనంతపురం: చెక్ బౌన్స్కు సంబంధించి నమోదైన కేసులపై ఈ నెల 18 ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెక్ బౌన్స్ కేసులపై ఉమ్మడి జిల్లాలలోని ప్రతి కోర్టు ఆవరణలోనూ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
24న మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్
అనంతపురం అర్బన్: మెగా పేరెంట్– టీచర్ మీట్ (పీటీఎం) ఈనెల 24న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. 1,724 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. పీటీఎంకు విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది మాదిరిగా ఈ సారి కూడా పీటీఎం పండుగ వాతావరణంలో జరుపుతామన్నారు. 10,499 మంది ఉపాధ్యాయులు, 1,67,434 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు 1,28,644 మంది పాల్గొంటారన్నారు. మీట్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ముఖాముఖి మాట్లాడి పిల్లలు ఏవిధంగా చదువుతున్నారు. తదితర వివరాలపై చర్చిస్తారన్నారు. ఈ ఏడాది మరో రెండు కార్యక్రమాలు అదనంగా చేపట్టనున్నామన్నారు. పాఠశాలకు ఏ సదుపాయాలు అవసరం అనే వివరాలతో దాతల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో వేదిక ఏర్పాటు చేశామన్నారు. దాతలు ఈ వేదిక ద్వారా వాటిని సమకూర్చవచ్చన్నారు. వారి సహకారంతో పాఠశాలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చుతామన్నారు. ఇక లీప్ యాప్ కూడా అమలు చేయనున్నామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన విద్యావిషయాలు, హాజరు, మార్కులు, పిల్లలతో తల్లిదండ్రులు ఏవిధంగా మాట్లాడాలి వంటి వివరాలను తెలియజేస్తామన్నారు. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు కళ్యాణదుర్గం రూరల్: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల, కమ్మనచెట్ల కాలనీ మహిళలు శుక్రవారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సమస్య పరిష్కరించేవరకూ కదిలేది లేదన్నారు. స్థానిక అధికార పార్టీ నేతలకు తెలిపిన ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. మున్సిపల్ అఽధికారులు, పోలీసులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో 5 బెల్టు షాపులు నిర్వహించి మద్యం సరఫరా చేయిస్తున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు తాగునీటి సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
ఎస్కేయూ అకడమిక్ క్యాలెండర్కు ఆమోదం
అనంతపురం: ఎస్కేయూ పరిధిలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అకడమిక్ క్యాలెండర్కు సభ్యులు ఆమోదం తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై వర్సిటీ డీన్ చాంబర్లో వీసీ జ్యోతికుమార్ అధ్యక్షతన కళాశాల అభివృద్ధి మండలి సలహా సంఘం సమావేశం శుక్రవారం జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా పాల్గొని, పలు సూచనలు చేశారు. సమావేశంలో కళాశాల అభివద్ధి మండలి డీన్ ప్రొఫెసర్ డి.ప్రభాకర్, పరీక్షల సంచాలకులు ఎంవీ లక్ష్మయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా. పి. పద్మశ్రీ, డా. ఎం.నాగ శశికళ, డా. పి. హర్షలత, డా. సహదేవుడు, డా. శైలజారాణి, డా. విజయలక్ష్మి పాల్గొన్నారు. ‘పొలంబడి’ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జేడీఏ ఎన్.సాలురెడ్డి, కమిషనరేట్ ఏఓ కె.లక్ష్మిరెడ్డి, ఏపీ సీడ్స్ సర్టిఫికేషన్ అధికారి ఎం.ప్రతాపరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అనంతపురం, సత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏడీఏలకు పొలంబడి కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (జీఏపీ) కింద చేపడుతున్న పొలంబడుల ద్వారా మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఒక్కో జిల్లాలో 15 వరకు పొలంబడులు ఉన్నాయన్నారు. అందులో వేరుశనగ, కొర్ర, మరికొన్ని పంటల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పాముకాటుతో వృద్ధుడి మృతి రాయదుర్గం రూరల్: కెంచానపల్లి ఎస్సీ కాలనీకి చెందిన హరిజన వన్నూరప్ప (80) పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వన్నూరప్పను పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వన్నూరప్పను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి భార్య కూడా ఇటీవల మృతి చెందింది. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు. అప్పు ఇచ్చిన వ్యక్తికే టోకరా తాడిపత్రి రూరల్ : ఇంటి వద్దకు వస్తే అప్పు చెల్లిస్తానని నమ్మబలికి అప్పు ఇచ్చిన వ్యక్తి సెల్ఫోన్ బలవంతంగా లాక్కోని రూ.1.60 లక్షలు ఫోన్పే ద్వారా తన ఖాతాకు బదిలీ చేయించుకున్న నిందితుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు అప్గ్రేడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని నవరంగ్ టాకీస్ వద్ద నివాసం ఉంటున్నా పప్పుల మిల్లు యజమాని హరిప్రసాద్ ఇంటీరియల్ డెకరేషన్ పనులు చేసే లక్ష్మీనారాయణకు రూ.8 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగి స్తానని హరిప్రసాద్ను తన ఇంటివద్దకు రావా లని తెలిపాడు. అతని సెల్ఫోన్ లాక్కొని ఫోన్పే ద్వారా రెండు అకౌంట్ల నుంచి రూ.1.60 లక్ష తన అక్కౌంట్కు బదిలీ చేయించు కున్నాడు. బాధితుడు అప్గ్రేడ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ప్రారంభం కాని పనులన్నీ రద్దు చేయండి
● ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్పర్స్న్ గిరిజమ్మ అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత మూడేళ్ల కాలంలో మంజూరై ప్రారంభం కాని పనులన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశించారు. శుక్రవారం జెడ్పీలోని తన చాంబర్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో చైర్పర్సన్ సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ కే మల్లికార్జునతో కలిసి నిర్వహించిన సమావేశంలో గిరిజమ్మ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో 63 మండలాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో బాధపడుతున్నారన్నారు. పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ ఆదేశాలతో జిల్లాలో మూడేళ్ల కాలంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల ఆధునికీకరణ, అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాల నిర్మాణం లాంటి పనులకు రూ.కోట్లు మంజూరు చేశామని చైర్పర్సన్ గుర్తు చేశారు. ప్రారంభం కాని పనులను గుర్తించి శనివారం సాయంత్రంలోపు జెడ్పీ కార్యాలయానికి పంపాలని సీఈఓ విజయలక్ష్మి, ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం, జెడ్పీ సాధారణ నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఈలు సి. సుబ్బరాయుడు (అనంతపురం), మురళి (శ్రీసత్యసాయి), ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు శ్రీనివాసులు (అనంతపురం), మురళీధర్ (శ్రీసత్యసాయి), పీఆర్ఐ ఈఈ రాజన్న (అనంతపురం), పెనుకొండ ఈఈ మురళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు శ్రీనివాసులు, మురళీధర్లు, జెడ్పీ ఏఓలు శ్రీనివాసులు, నందకిశోర్, ఇతర సిబ్బంది హాజరయ్యారు. ‘దాహం..దాహం’ కథనంతో కదలిన యంత్రాంగం జిల్లాలోని మంత్రి కేశవ్, విప్ శ్రీనివాసులు నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిపై ‘ దాహం..దాహం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘ గొంతు ఎండి పోతోంది.. గుక్కెడు నీరివ్వండి’ అంటూ జిల్లాలోని ఉదిరిపికొండ, కొనకొండ్ల, విడపనకల్లు, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మహిళలు రోడ్డు ఎక్కి నిరసన తెలియజేశారు. ఈక్రమంలోనే కమిషనర్ ఆదేశాలకనుగుణంగా జెడ్పీ అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఇప్పటికే రెండు విడతలుగా సమీక్షలు నిర్వహించి, తాగునీటి సమస్య అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించారు. -
నేరాల నియంత్రణపై దృష్టి
అనంతపురం సెంట్రల్: నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్హాలులో అర్ద వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో స్నేహభావంతో మెలిగినప్పుడే పోలీసులపై సదాభిప్రాయం కలుగుతుందని సూచించారు. ప్రజలను పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుకోరాదని ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని, బ్లాక్స్పాట్స్ను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. అనంతరం పెండింగ్లో ఉన్న కేసులను పోలీసు స్టేషన్ల వారీగా సమీక్షించారు. అనంతరం జిల్లాలో ప్రతిభ చూపిన 161 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మహబూబ్బాషా, నాగభూషణం, డీఎస్పీలు రవిబాబు, శ్రీనివాస్, సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
నేడు భాషేతర టీచర్లకు డివిజనల్ స్థాయి శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల సెకండరీ స్థాయిలో భాషేతర (గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సాంఘిక శాస్త్రం) సబ్జెక్టు ఉపాధ్యాయులకు శనివారం డివిజనల్ స్థాయి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (టీపీడీ) ఒకరోజు శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శ్రీనివాసరావు, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అకడమిక్ క్యాలెండర్, టీచర్స్ హ్యాండ్బుక్, స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్, కరిక్యులం సంస్కరణలు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, లీప్ యాప్ తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ కోసం నియమించిన ఎస్ఆర్పీలు, డీఆర్పీలు తప్పనిసరిగా హాజరుకావాలని, అర్హులైన ఉపాధ్యాయులు శిక్షణకు హాజరయ్యేలా హెచ్ఎంలు, ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడు గైర్హాజరైనా సంబంధిత ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మూడు డివిజన్లలో శిక్షణ కేంద్రాలు అనంతపురం డివిజన్: నేతాజీ మున్సిపల్ స్కూల్, పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్, కొత్తూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం నగరం, అనంతపురం రూరల్, ఆత్మకూరు, బీకేఎస్, గార్లదిన్నె, కూడేరు, నార్పల, పెద్దపప్పూరు, పుట్లూరు, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, యల్లనూరు మండలాల ఉపాధ్యాయులు హాజరుకావాల్సి ఉంటుంది. గుంతకల్లు డివిజన్: ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్ఆర్కే మున్సిపల్ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో గుంతకల్లు, గుత్తి, పామిడి, పెద్దవడుగూరు, వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, యాడికి మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది. కళ్యాణదుర్గం డివిజన్: కేసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జ్ఞానభారతి పాఠశాల, జెడ్పీహెచ్ఎస్ నార్త్, ఏపీ మోడల్ స్కూల్లలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెళుగుప్ప, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, రాయదుర్గం, శెట్టూరు మండలాల ఉపాధ్యాయులు హాజరుకావాలని అధికారులు సూచించారు. యువకుడిపై కత్తితో దాడి తాడిపత్రిటౌన్: స్థానిక పెన్నానదిలో ఇసుక తవ్వకాల కోసం తలెత్తిన ఘర్షణలో ఓ యువకుడు గాయపడ్డాడు. పట్టణంలోని నందలపాడుకు చెందిన రవికుమార్కు సంజీవనగర్లో ఉండే భరత్కు మధ్య పదిరోజుల క్రితం పెన్నానదిలో ఇసుక తవ్వకాల విషయంలో ఘర్షణ జరిగింది. శుక్రవారం సంజీవనగర్ పార్కు వద్ద ఒంటరిగా ఉన్న రవికుమార్పై భరత్, అతని కుమారుడు సన్ని పదునైన కత్తితో రవికుమార్పై దాడి చేశారు. స్థానికులు రవికుమార్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మా స్థానం సం‘క్షేమం’.. మేమొదలం!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లా సాంఘిక సంక్షేమశాఖలో అవసరానికి మించి సూపరింటెండెంట్లు కొనసాగుతుండడం విమర్శలకు తావిస్తోంది. రెండు సూపరింటెండెంట్ పోస్టులకు నలుగురు సూపరింటెండెంట్లు అదనపు పోస్టుల పేరుతో అదే స్థానంలో కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో 126 హాస్టళ్లకు ఇద్దరే సూపరిటెండెంట్లు ఉండగా, ప్రస్తుతం 50 హాస్టళ్లకు నలుగురు సూపరింటెండెంట్లు పైరవీలతో అక్కడే తిష్ట వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మూతపడిన ఎన్జీపీసీ పోస్టు కూడా కార్యాలయానికి మళ్లించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో గతంలో 126 హాస్టళ్లకు ఇద్దరు సూపరింటెండెంట్లతోనే సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం సమర్థంగా పని చేసింది. ప్రస్తుతం జిల్లా విభజన తర్వాత హాస్టళ్ల సంఖ్య 50, కార్యాలయ సిబ్బంది సంఖ్య 37 నుంచి 19కు తగ్గినా, సూపరింటెండెంట్ల సంఖ్య మాత్రం నలుగురికి చేరడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. శాఖలో మంజూరైన సూపరింటెండెంట్ పోస్టులు రెండే ఉన్నప్పటికీ ప్రస్తుతం నలుగురు ఆ హోదాలో పని చేస్తున్నారు. అదనంగా ఉన్న ఇద్దరు ఏఎస్ఓ, ఇన్స్ట్రక్టర్ అగైనెస్ట్ పోస్టులపై విధులు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలం ఈ కార్యాలయంలో క్లర్కులుగా పనిచేసిన వారు పదోన్నతులు పొంది ఇతర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత పైరవీల ద్వారా తిరిగి ఇదే కార్యాలయానికి వచ్చి కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు 37 మంది ఉద్యోగులతో కళకళలాడిన ఈ కార్యాలయంలో ప్రస్తుతం కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. వారిలో క్లర్కులు ముగ్గురు మాత్రమే ఉండగా, సూపరింటెండెంట్లు నలుగురు ఉండడం అవసరానికి మించిన సిబ్బంది కేటాయింపుగా ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఎన్జీపీసీ పోస్టు కూడా మళ్లించే ప్రయత్నం మూతబడిన న్యూ గార్మెంట్స్ ప్రొడెక్షన్ సెంటర్ (ఎన్జీపీసీ)లోనూ ఓ సూపరింటెండెంట్ పోస్ట్ ఉంది. బయట పని చేస్తున్న ఓ సూపరింటెండెంట్ ఇటీవల అక్కడికి వచ్చారు. మూతపడిన ఎన్జీపీసీలో ఎలాంటి పని ఉండదు. ఆ సూపరింటెండెంట్ కూడా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ సూపరింటెండెంట్ కూడా ఇక్కడికి వస్తే మొత్తం ఐదుగురు సూపరింటెండెంట్లు అవుతారు. జోనల్ పరిధిలో అవసరమైన చోట్లకు బదిలీ చేయకుండా ఒకేచోట కొనసాగించడం వెనుక పైరవీలు పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు అంటున్నారు. పెన్నార్ భవనంలో కొనసాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సిబ్బంది వినియోగంపై సమీక్ష నిర్వహించాలని పలువురు ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో అవసరానికి మించి సూపరింటెండెంట్లు పదోన్నతులొచ్చినా... అదే కార్యాలయంలో మకాం! -
కోరలు చాస్తున్న కరువు
అనంతపురం అగ్రికల్చర్: కరువు రక్కసి కోరలు చాస్తోంది. వర్షాకాలంలోనూ వేసవి ఛాయలు అలముకోవడం, కరుణించడానికి వరుణుడు వెనుకాడుతుండడం వెరసి ప్రజలకు దిక్కుతోచడం లేదు. సూపర్ ఎల్–నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కదలకపోవడంతో నెలల తరబడి బెట్ట పరిస్థితులు ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఫలితంగా ఆశల ఖరీఫ్ కల్లోలంగా మారుతుండటంతో అన్నదాత ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో మున్ముందు రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నెల రోజులుగా రాలని చినుకు ఆశల నైరుతి జూన్ 6న పలకరించగా మొదట్లో మోస్తరుగా వర్షాలు పడడంతో రైతు సేద్యానికి దిగాడు. నైరుతి రాకమునుపు కూడా జూన్ మొదటి వారంలో అంతో ఇంతో వర్షం కురిసింది. చంద్రబాబు ప్రభుత్వం రాయితీ విత్తన వేరుశనగ ఇవ్వడానికి వెనుకాడినా రైతులు సొంతంగా విత్తనాలు సమకూర్చుకుని వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశారు. జూన్ 1న 3.6 మి.మీ, 3న 5.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు కాగా... నైరుతి వచ్చాక జూన్ 7న 10.1 మి.మీ, 9న 4.9 మి.మీ, 13న 12.3 మి.మీ, 14న అత్యధికంగా 19.1 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడంతో ముంగారు పంటలు సాగు చేశారు. జూన్ 14 వరకు మంచి వర్షాలు కురిశాయి. 15 నుంచి వరుణుడు మొహం చాటేశాడు. వారం కాదు, పది రోజులు కాదు ఏకంగా నెల రోజులు పూర్తవుతున్నా చినుకులు పడటం లేదు. కణేకల్లు, బొమ్మనహాళ్, విడపనకల్లు, గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, గుమ్మఘట్ట,బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, కూడేరు, గార్లదిన్నె, అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, రాప్తాడు, అనంతపురం అర్బన్, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు తదితర 18 మండలాల్లో జూన్ 15 నుంచి జూలై 16 వరకు నెల రోజులైనా కనీసం తుంపర్లు పడకపోవడం గమనార్హం. 22 మండలాల్లో డ్రైస్పెల్స్.. ఖరీఫ్ ఆరంభంలో కీలకమైన జూన్ 15 నుంచి జూలై 15 మధ్య కాలంలో 22 మండలాల్లో వరుసగా 21 రోజుల పాటు చినుకులు పడకపోవడంతో వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదయ్యాయి. మరో రెండు, మూడు రోజులు గడిస్తే తాడిపత్రి, పెద్దపప్పూరు, వజ్రకరూరు, యల్లనూరు, నార్పల మండలాలు కూడా ఈ జాబితాలోకి చేరిపోతాయి. ఇంకో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే 32 మండలాలూ డ్రైస్పెల్స్ జాబితాలో ఉంటాయి. సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదయ్యాయంటే కరువు పరిస్థితులు దాపురించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. అన్నీ గాలి చినుకులే.. నాలుగైదు రోజులుగా చాలా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాయంత్రం 6 గంటలైనా వేసవిలో మాదిరి ఉక్కపోత నెలకొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 24 నుంచి 27 డిగ్రీల మధ్య ఉంటున్నాయి. మరోపక్క 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అడపాదడపా మేఘాలు ఆవరిస్తున్నా వర్షించడం లేదు. గాలిచినుకులు మినహా కనీసం 5 మి.మీ తేలికపాటి కూడా నమోదు కావడం లేదు. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ మొదటి పక్షం రోజుల్లో కురిసిన వర్షానికి 61.2 మి.మీ గానూ 11 శాతం అధికంగా 68.8 మి.మీ నమోదైంది. జూలైలో చినుకు పడకపోవడంతో 64.3 మి.మీ గానూ ఇప్పటి వరకు కేవలం 1.3 మి.మీ నమోదైంది. ఓవరాల్గా జూన్ 1 నుంచి జూలై 16 వరకు 95.6 మి.మీ గానూ 27.1 శాతం లోటుతో 69.7 మి.మీ వర్షం కురిసింది. పుట్లూరు, యల్లనూరు, గుత్తి, తాడిపత్రి, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం తదితర మండలాల్లో సాధారణం కన్నా 70 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మొహం చాటేస్తున్న వరుణుడు వర్షాకాలంలోనూ వేసవి ఛాయలు 18 మండలాల్లో నెల రోజులు పూర్తయినా రాలని చినుకు ఆందోళనలో జిల్లా ప్రజానీకం -
సీమను కనుమరుగు చేయాలనుకుంటున్నారా?
● సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం ● 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీ–నీవా కాలువ పరిశీలన అనంతపురం న్యూటౌన్: రాయలసీమను కనుమరుగు చేయాలనుకుంటున్నారా? అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరించారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ‘అనంత’తో పాటు మాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అదనపు జలాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధనకు టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 19న కూడేరు మండలం చోళసముద్రం వద్ద హంద్రీ–నీవా కాలువను పరిశీలించనున్నట్లు చెప్పారు. హంద్రీ–నీవా ద్వారా 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల జనాభాకు తాగునీరు అందాల్సి ఉందన్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని చంద్రబాబు 1999లో 5 టీఎంసీలకు కుదించారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక ఆ జీఓ రద్దు చేసి 40 టీఎంసీల సామర్థ్యంతో పనులు శరవేగంగా చేపట్టారని, దాని ఫలితంగానే 2012లో కృష్ణా జలాలు హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లికి వచ్చాయని వివరించారు. బాబు నిర్లక్ష్యం కారణంగానే మిగులు జలాలపై ఆధారపడాల్సిన దుస్థితి పట్టిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,850 కోట్లతో పనులు చేశామని చెబుతున్నా అనుకున్న మేర నీళ్లు రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీళ్లు తరలిస్తుండడంతో రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్ జగన్ హయాంలో హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేసే పనులకు శ్రీకారం చుట్టి టెండర్లు కూడా పూర్తి చేశారని, ప్రభుత్వం మారడంతో మళ్లీ చంద్రబాబు 3,850 క్యూసెక్కులకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. హంద్రీ–నీవా లైనింగ్ పనుల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయన్నారు. అప్పుడే రాయలసీమకు మేలు.. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకువస్తేనే రాయలసీమకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే రాయలసీమలో తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. అనంతపురం, గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి కోసం ఉద్యమిస్తామని, అందరూ కలసి రావాలని కోరారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఉరవకొండ సమన్వయకర్త వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఆల్మట్టి, అప్పర్ భద్ర, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల కారణంగా రాయలసీమలో నీటి ప్రాజెక్టులకు ప్రమాదం ఏర్పడిందన్నారు. కేవలం కుప్పం ప్రజల మెప్పు కోసమే చంద్రబాబు హంద్రీ–నీవా పనులను కొనసాగిస్తున్నారని చెప్పారు. చోళసముద్రం వద్ద హంద్రీ–నీవా కాలువను పరి శీలించి ఆ ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. -
లైనింగ్ లో‘గుట్టు’ను బహిర్గతం చేస్తాం
కూడేరు/బెళుగుప్ప: సీఎం చంద్రబాబు కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల కడుపు కొట్టి హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ చేపట్టి నీటిని కుప్పానికి తీసుకెళ్లడంలో ఉన్న లో‘గుట్టు’ను బహిర్గతం చేస్తామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విఽశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఆయన కూడేరులో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. అలాగే బెళుగుప్ప మండల పరిధిలోని బూదిగుమ్మ రామసాగరంలో పార్టీ మండల కన్వీనర్ చిన్న మచ్చన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ తదితరులతో సమావేశమయ్యారు. విశ్వ మాట్లాడుతూ ఈ నెల 19న ఉదయం 9:30 గంటలకు కూడేరు మండలం చోళసముద్రం వద్ద ఉన్న హంద్రీ నీవా కాలువ బ్రిడ్జ్ నుంచి కరుట్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జ్ వరకు రాయలసీమ ప్రాజెక్టులె టాస్క్ఫోర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రకు ఆ కమిటీ రాష్ట్ర నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీఓని చంద్రబాబు రద్దు చేసి , హంద్రీ నీవా కాలువ వెడల్పు చేయకుండా కాంక్రీట్తో లైనింగ్ పనులకు ఎక్కువ మొత్తంతో టెండర్లను ఆహ్వానించి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ చేపట్టడం ద్వారా కరువు ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రూ. వేల కోట్లతో కేవలం 100 రోజుల్లో లైనింగ్ పని చేపట్టి కుప్పానికి నీరు తీసుకెళ్లారన్నారు. దీంతో పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. చంద్రబాబు కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూడేరు. బెళుగుప్ప, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి రమణ, ఎంపీపీ నారాయణరెడ్డి, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, మండల పరిశీలకులు త్రిలోక్ రెడ్డి, నేతలు రామ్మోహన్, గంగాధర్, రంగారెడ్డి, ధనుంజయ్య, విజయ భాస్కర్రెడ్డి, శిద్దారెడ్డి, అక్కులన్న, దేవేంద్ర, అశోక్, హరినాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. 19న కూడేరు మండలంలో హంద్రీనీవా కాలువపై పాదయాత్ర ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి -
టీబీ డ్యాంలో 25 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: అనంతపురం జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయంలో 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులు కాగా, గురువారం నాటికి 1,603.12 అడుగులకు నీరు చేరింది. 105.788 టీఎంసీలకు గాను 25.82 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 4,814 క్యూసెక్కులు ఉండగా, 522 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోౖదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండి 40,117 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 29,607 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండింది. పెండింగ్ ఈఎఫ్లను త్వరితగతిన పూర్తి చేస్తాం ● సీఈఓకు తెలిపిన కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: పెండింగ్ ఈఎఫ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ‘ఎస్ఐఆర్’పై సీఈఓ వివేక్ యాదవ్ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల పాల్గొన్నారు. జిల్లాలో ఎస్ఐఆర్ గురించి సీఈఓకు ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ‘ఏఎస్డీడీ’ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్) జాబితాలకు సంబంధించి 31,914 ఎన్యుమరేషన్ ఫారాలు వచ్చాయని, వీటిలో 7,274 ఈఎఫ్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కొత్తగా 330 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నో మ్యాపింగ్కు సంబంధించి అనంతపురం అర్బన్లో 91,170 ఉన్నాయని, వాటిని మరోసారి పరిశీలిస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 330 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్ పాల్గొన్నారు. వైద్యుల నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలి ● అనంతపురం జీజీహెచ్లో దారుణం ● మంత్రి సత్యకుమార్ ఇలాకాలో రోజుకో ఘటన అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రి (జీజీహెచ్) ఏఎంసీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాన్ని బలిగొంది. బుధవారం సకాలంలో స్ట్రెచ్చర్ సమకూర్చకపోవడంతో రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన దేవీబాయి (55) ఆటోలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సొంత ఇలాకాలోనే రోజుకో దారుణం జరుగుతోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన నాగన్న (48) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండడంతో ఈ నెల 11న కుటుంబసభ్యులు జీజీహెచ్కి తీసుకువచ్చారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఊపిరి తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతుండడంతో ఏఎంసీలో చేర్చుకుని చికిత్స మొదలు పెట్టారు. అతడి పరిస్థితి విషమిస్తుండడంతో గురువారం ఉదయం రోగిని వెంటిలేటర్పైకి చేర్చారు. ఈ లోపు డ్యూటీ డాక్టర్ వచ్చి రోగి చనిపోయాడని నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నాగన్న మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఏఎంసీలో ఆక్సిజన్ కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారనే ఆరోపణలున్నాయి. భిన్న వాదనలతో చంపేశారు.. భిన్న వాదనలతో తన తండ్రి ప్రాణాలు పోయేందుకు వైద్యులే కారణమయ్యారంటూ మృతుడు నాగన్న కుమార్తె ధరణి ఆరోపించారు. మానిటర్లో హార్ట్బీట్ చూపిస్తున్నా డాక్టర్ వచ్చి పేషెంట్ చనిపోయాడని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నైతిక విలువలు లేనివారే ఆస్ప త్రిలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇప్పటికై నా డాక్టర్లు కొంచైమెనా ఆలోచించాలి’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
కోడి పందేల కేసులో 30 మంది అరెస్ట్
పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి సమీపంలో ఈ నెల 12న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేసి 39 ద్విచక్ర వాహనాలు, మూడు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం 30 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యబాబు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.45 వేలు స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన 9 మందిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పేకాట, మట్కా, కోడి పందెలు తదితర జూదాలను ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్ కింద పడి హమాలీ మృతి గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాక్టర్ కింద పడి దూదేకుల మౌలాలి (45) మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల వివరాలమేరకు.. పెద్దవడుగూరు మండలం గుత్తి వెంకటాంపల్లికి చెందిన దూదేకుల మౌలాలి ట్రాక్టర్కు హమాలిగా వెళ్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో గుత్తి శివారులో ట్రాక్టర్లో ఎర్ర మట్టి లోడ్ చేసుకుని జి.వెంకటాంపల్లికి వెళ్తున్నారు. అయితే కొత్తపేట శివారులోని బైపాస్ బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ వెళ్తుండగా కుదుపులకు ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చున్న మౌలాలి చేయి పట్టు జారి వెనుక చక్రం కింద పడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ అతడిపై నుంచి ఎక్కి వెళ్లడంతో మౌలాలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లాలుబీ, కుమార్తె రేష్మా, కుమారుడు మహమ్మద్ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 10 ఎకరాల్లో అరటి తోట దగ్ధం కూడేరు: ఓ రైతు తన పొలంలో చెత్తాచెదారానికి నిప్పు పెట్టడంతో ఆ మంటలు గాలికి పక్కనే ఉన్న ముగ్గురు రైతులకు చెందిన అరటి తోటకు వ్యాపించాయి. అరటి చెట్లు, డ్రిప్ పైపులు, పరికరాలు కాలి బూడిదయ్యాయి. వివరాలు.. కూడేరు మండలం కడదరకుంటలో వెంకటనాయుడు రెండున్నర ఎకరాల్లో , శ్రీలత 6 ఎకరాల్లో, నరేంద్ర ఒకటిన్నర ఎకరాల్లో అరటి తోట సాగు చేశారు. ప్రస్తుతం ఏడాదిన్నర చెట్లు. పక్క రైతు పొలంలో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మంటలు చెలరేగాయి. గమనించిన రైతులు వెంటనే ఫైరింజన్కు సమాచారమిచ్చారు. ఫైరింజన్ వచ్చే లోపు మంటలకు అరటి చెట్లు , డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.10 లక్షలు వరకూ నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. పోలీసుల అదుపులో చైన్ స్నాచర్స్ తాడిపత్రిటౌన్: పట్టణంలో రెండు రోజుల క్రితం గాంధీకట్ట వద్ద ఇద్దరు చైన్స్నాచర్స్ మహిళ మెడలో గొలుసులాక్కోని వెళ్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ ఇద్దరు గతంలో ఎక్కడెక్కడ చైన్స్నాచింగ్కు పాల్పడారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీఐ ఆరోహణరావును వివరణ కోరగా పూర్తీ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. కడదరకుంటలో పూర్తిగా కాలిపోయిన అరటి తోట -
చీకటి పడగానే కొల్లగొట్టుడే
● యథేచ్ఛగా బీటీపీ కాలువ మట్టి అక్రమ రవాణా ● నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు కళ్యాణదుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్ట్ (బీటీపీ) కాలువ పనుల్లో భాగంగా పలు చోట్ల తవ్విన మట్టి అక్రమంగా తరలిపోతోంది. కొంతమంది స్వార్థపరులు చీకటి పడగానే గుట్టుచప్పుడు కాకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. రాత్రయిందంటే చాలు బీటీపీ కాలువ సమీపంలో టిప్పర్ల హడావుడి మొదలవుతోంది. కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లి, ఒంటిమిద్ది, ముదిగల్లు, నారాయణపురం, ఉప్పొంక వద్ద జరుగుతున్న కాలువ పనుల్లో మట్టి అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ పనుల కోసమే మట్టిని వినియోగిస్తున్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా మట్టిని కొల్లగొడుతున్నా పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారా.. లేక వారి వెనుక ఉన్న టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి ప్రకృతి సంపదను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పట్టపగలే యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలించిన మట్టికి తిరిగి కాంట్రాక్టర్లు బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తవ్విన మట్టి ఎక్కడికి తరలించారో కూడా గుర్తించాలి. – గోపారం శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కళ్యాణదుర్గం -
జనగణనకు గౌరవం ఏదీ?
జిల్లాలో గృహగణన నిర్వహించిన ఎన్యుమరేటర్లు అనంతపురం అర్బన్: జనగణన–2027లో భాగంగా గృహగణన కార్యక్రమం జిల్లాలో మే 1వ నుంచి 30వ తేదీ వరకు జరిగింది. జిల్లాలోని రూరల్, పట్టణ ప్రాంతాల్లో నెల రోజుల పాటు 3,425 మంది ఎన్యుమరేటర్లు, 583 మంది సూపర్వైజర్లు, నగర పాలక సంస్థ పరిధిలో 436 మంది ఎన్యుమరేటర్లు, 70 మంది సూపర్వైజర్లు మొత్తం 4,514 మంది గృహగణన ప్రక్రియ నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి గౌరవ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలో జనగణన విధులను సిబ్బందితో గౌరవంగా చేయించుకున్న అధికారులు వారికి గౌరవంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదు. గృహగణన ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు. రూ.4.60 కోట్లు ఇవ్వాలి గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఒకొక్కరికీ రూ.9 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. అదే విధంగా శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం 4,514 మంది ఎన్యురేటర్లు గౌరవ వేతనం రూ.4,06,26,000 చెల్లించాల్సి ఉంది. శిక్షణ హాజరైనందుకు రూ.54,16,800 ఇవ్వాలి. మొత్తం రూ.4,60,42,800 చెల్లించాల్సి ఉంది. కలెక్టర్ పద్దుకు నిధులు జనగణన కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం మే నెల 12న జారీ చేసింది. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన ప్రక్రియ పూర్తయితే వెంటనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు గౌరవ వేతనం చెల్లించాలని పేర్కొంది. ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు. ఎందుకయ్యా అంటే గృహగణనలో నమోదైన ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లకు సంబంఽధించి ఎందుచేత ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను యాప్లో చేయాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు సంబంఽధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున గౌరవ వేతనం చెల్లించలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు గౌరవ వేతనం చెల్లించాల్సిన అంశాన్ని ఇప్పటికీ కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లపోవడం ఇందులో కొసమెరుపు. 653 మంది 4,514 మంది 10,2004.60 కోట్లు 3,861 మంది విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపరవైజర్లు నెలన్నర దాటినా అందని గౌరవ వేతనం కలెక్టర్ పద్దులోనే రూ.4.60 కోట్ల నిధులు -
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గాలివేగం పెరిగింది. ఉక్కపోత కొనసాగింది.
‘ప్రాణహాని ఉందని స్టేషన్కు వెళ్తే ఎస్ఐ దుర్భాషలాడారు’ సాక్షి టాస్క్ఫోర్స్: తమకు ప్రాణహాని ఉందని పోలీసు స్టేషన్కు వెళ్తే ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ దుర్భాషలాడి కొట్టారంటూ కంబదూరు మండలం చెన్నంపల్లికి చెందిన వెట్టి శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. చెన్నంపల్లికి చెందిన రోడ్డు గణేష్, రోహిత్, పి.ఆంజనేయులు,ఎం.వన్నూరుస్వామి, బొమ్మశంకర్ లు కొంతకాలంగా శ్యామల కుటుంబసభ్యులపై మారణాయుధాలతో దాడికి యత్నిస్తున్నారు. ప్రాణ రక్షణ కల్పించాలంటూ బాధితులు కంబదూరు ఎస్ఐ లోకేష్ చుట్టూ తిరిగినా కనికరం చూపలేదు. ఈ నెల 15న రాత్రి మళ్లీ పి.ఆంజనేయులు కత్తితో శ్యామల కుటుంబీకులపై దాడి చేసేందుకు యత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితులు వెంటనే కంబదూరు పోలీసుస్టేషన్కు వెళ్లగా.. కానిస్టేబుల్ రాజు నాయక్ వారిపై రెచ్చిపోయాడు. నానా దుర్భాషలాడాడు. బాధితులు స్టేషన్ బయట కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన ఎస్ఐ లోకేష్ మహిళలని కూడా చూడకుండా బూతులు తిట్టారు. శ్యామల సోదరుడిని బూటు కాలితో తన్నారు. శ్యామల తల్లి ఎట్టి నాగమ్మను పోలీసులు బలవంతంగా లాగడంతో ఆమె గాయపడింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన శ్యామల గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అనంతపురంలో ఎస్పీ జగదీష్ను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించింది. స్పందించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు శ్యామల తెలిపింది. శ్యామల కుటుంబీకులకు న్యాయం చేయకపోతే సోమవారం కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు తెలిసింది. -
విషవాయువు పీల్చి ఉద్యోగి మృతి
భూదాన్పోచంపల్లి: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని హెజిలో లేబోరేటరీస్లో గురువారం రియాక్టర్ను శుభ్రం చేస్తుండగా వెలువడిన రసాయన వాయువు పీల్చి కెమిస్ట్రీ మృతి చెందాడు. అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన పాలమూరు కృష్ణారెడ్డి (43) హెజిలో లేబోరేటరీస్లో కొంత కాలంగా కెమిస్ట్రీగా పనిచేస్తున్నాడు. గురువారం కొత్త మందుల బ్యాచ్ తయారీకిగాను రియాక్టర్ను శుద్ధి చేస్తుండగా అందులోంచి విడుదలైన విషవాయువు పీల్చడంతో స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు హయత్నగర్లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సామాజిక శంఖారావం అనంతపురం అర్బన్: కుల వివక్షత లేని సమాజం కోసం కేవీపీఎస్ (కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం) ఆధ్వర్యంలో సెప్టెంబరు 15 వరకు జిల్లాలో సామాజిక శంఖారావం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప చెప్పారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో సామాజిక శంఖారావం కార్యక్రమాల కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా దళిత కాలనీల్లో అధ్యయన యాత్రలు నిర్వహిహించి వారు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మత, ప్రాంత, లింగ, వివక్షత, అంటరానితనం, శ్మశాన స్థలాలు, తదితర సమస్యలను పరిశీలిస్తామన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి దళితులకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకుంటామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శులు కృష్ణమూర్తి, బాలరంగయ్య, పుల్లన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు గిరి, శివ, తదితరులు పాల్గొన్నారు. -
తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలి
రాప్తాడు రూరల్: వర్షాభావంలో రైతులు తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. సాలురెడ్డి సూచించారు. గురువారం మండలంలోని అయ్యవారిపల్లిలో పర్యటించి వర్షాధారిత వేరుశనగ, కంది పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీసుకోవాల్సిన పంట సంరక్షణ చర్యలపై వారికి సూచనలు చేశారు. కంది పంటలో తల్లి సాలు పక్కనే మడక సాలు దున్నడం వల్ల వర్షం కురిసినప్పుడు నీరు భూమిలోకి బాగా ఇంకి, ఎక్కువ రోజులు పంటకు తేమ అందుబాటులో ఉండి నీటి ఎద్దడి ప్రభావం తగ్గుతుందని రైతులకు వివరించారు. అలాగే పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. పంటలు సాగు చేసిన ప్రతి రైతు సంబంధిత బ్యాంకుల్లో పంటల బీమా చేయించుకోవాలని, పంట రుణం లేని రైతులు సీఎస్సీ కేంద్రాల ద్వారా బీమా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ–పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–పంట నమో దు చేయించుకుని, ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. ఆయన వెంట అనంతపురం ఏడీఏ ఏ. వెంకట్కుమార్, మండల వ్యవసాయ అధికారి ఎస్. కృష్ణచైతన్య, ఏఈఓలు సుజిత, రంజిత, ఆర్ఎస్కే సిబ్బంది లక్ష్మి, సోనియా, భార్గవ్, రైతులు ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రానికి తాళం.. ప్రజల ఆందోళన
● ఆయా – వర్కర్ మధ్య కోల్డ్వార్తో విసిగిపోయిన జనం కణేకల్లు: మండల కేంద్రంలోని 12వ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్ లత, ఆయా సలీమ మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య గత ఐదారు నెలల నుంచి కోల్డ్ వార్ జరుగుతోంది. నిత్యం గొడవలకు దిగుతుండటంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థలతో తమ పిల్లలు ఆటపాటలు, చదువులకు దూరమవుతున్నారంటూ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు అంగన్వాడీకి సైతం పంపడం లేదు. రోజూ 5 నుంచి 10 మంది లోపే చిన్నారులు వెళుతున్నారు. ఆయాపై కోపంగా ఉంటున్న వర్కర్ గత 20 రోజుల నుంచి ఆయాను కేంద్రంలోకి రానివ్వకుండా లోపల తాళం వేసుకొని కూర్చునేది. ఈ విషయమై ఆయా బయటి నుంచి ప్రశ్నిస్తూ గొడవపడి బయటే ఉంటూ డ్యూటీ ముగించుకొని ఇంటికెళ్లేది. విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో వర్కర్పై తీవ్ర కోపంగా ఉన్న ఆయా ప్రతీకారంగా గురువారం అంగన్వాడీ కేంద్రానికి బయట నుంచి తాళం వేసి ఆందోళనకు దిగింది. పరస్పర దూషణలతో అంగన్వాడీ కేంద్రం రణరంగంగా మారింది. స్థానికులు అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరుకొని ఆందోళనలు చేశారు. ఆలస్యంగా అక్కడికి చేరుకొన్న సూపర్వైజర్ ఈశ్వరమ్మ ఇద్దరిని మందలించి తాళాలు తీయించింది. 12వ అంగన్వాడీ కేంద్రంలో సిబ్బంది మధ్య వార్ జరుగుతున్నా సీడీపీఓ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంపై చిన్నారుల తల్లీదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదారు నెలల నుండి వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొని అంగన్వాడీ కేంద్ర నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా సీడీపీఓ, సూపర్వైజర్లు ప్రేక్షకపాత్ర వహించడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. -
దగ్గుపాటి మామకు పట్టాభిషేకం
● కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ చైర్పర్సన్గా శ్రీనివాసులు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకారశాఖకు అనుబంధంగా స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న అనంతపురం కో ఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ చైర్పర్సన్గా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు కుమార్తెను ఇచ్చిన మామ బి.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు సీనియర్ ఇన్స్పెక్టర్ దౌలా పర్సన్ ఇన్చార్జిగా కొనసాగుతుండగా... ఈనెల 10న రాష్ట్ర ప్రభుత్వం నాన్ అఫీషియల్ కింద ముగ్గురు సభ్యులతో కూడిన త్రీమెన్ కమిటీని నియమించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి మామ, కూడేరు మండలం కరుట్లపల్లికి చెందిన బి.శ్రీనివాసులును చైర్పర్సన్గా, అదే గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మీనారాయణ, జెర్రిపోతుల ముత్యాలన్నను కమిటీ సభ్యులుగా నియమించారు. దీంతో గురువారం స్థానిక సెంట్రల్ స్టోర్స్ కార్యాలయంలో చైర్పర్సన్, ఇద్దరు సభ్యులు ప్రమాణాస్వీకారం చేసి అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకులు చాలా మంది పదవుల కోసం ఎదురుచూస్తుండగా ఇలాంటి చిన్నపాటి పదవులను కూడా ఎమ్మెల్యే తన మామకు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమానికి అర్బన్ టీడీపీ నాయకులు పెద్దగా హాజరు కాకపోవడం విశేషం. -
బెల్టుషాపులపై చర్యలు తీసుకోండి
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్ శింగనమల: నియోజకవర్గంలోని మద్యం బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి , వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ ఎకై ్సజ్ ఎస్ఐని కోరారు. ఈ మేరకు గురువారం బుక్కరాయసముద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయానికి వెళ్లి ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో మద్యం బెల్టు షాపులు విచ్చలవిడిగా వెలసినా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో యువత, కూలీలు, పేద కుటుంబాలు అక్రమ మద్యం విక్రయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వీటిపై ప్రత్యేక చర్యలు తీసుకొని బెల్టు షాపులను మూసి వేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఎకై ్సజ్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కల్తీ మద్యం కారణంగా ఎంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. శింగనమలలో ఉదయం ఐదు గంటలకే మద్యం బెల్టు షాపుల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. మొన్ననే శింగనమలలో ఒక కుటుంబం కుటుంబ పెద్దను కోల్పోయిందని, ఆడ బిడ్డలు అనాథలుగా మారారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శులుగా వన్నూరప్ప, నబీసాబ్
అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన కురుబ వన్నూరప్పను, మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శిగా అదే నియోజకవర్గానికి చెందిన ఎస్.నబీసాబ్ను నియమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ బలోపేతం, సంస్థాగత వ్యవహారాల సమన్వయం, ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళా సాధికారతే లక్ష్యంప్రశాంతి నిలయం: ‘మహిళా సాధికారతే లక్ష్యంగా సత్యసాయి పలు కార్యక్రమాలు చేపట్టారని అందులో భాగంగానే మహిళా విద్యను ప్రోత్సహిస్తూ అనంతపురంలో ప్రత్యేకంగా సత్యసాయి మహిళా క్యాంపస్ను ప్రారంభించారు. ఆయన మార్గంలోనే నేడు ట్రస్ట్ సైతం చక్కటి వసతులతో నూతన వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది’ అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. గురువారం రత్నాకర్ రాజు నిర్మాణ పనులను ప్రారంభించారు. 1500 మంది విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలతో వసతి కల్పించేందుకు ఈ వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు. క్యాంపస్లో ఏర్పాటు చేసిన సత్యసాయి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రారంభోత్సవం చేశారు. -
‘తాగునీటి’ ప్రతిపాదనలను వెంటనే పంపండి
● ఎంపీడీఓలను కోరిన జెడ్పీ సీఈఓ అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురంలోని 63 మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణ కోసం వెంటనే ప్రతిపాదనలను పంపాలని, వాటికి మాత్రమే ఆమోదం లభిస్తుందని జిల్లా పరిషత్ సీఈఓ పి.విజయలక్ష్మి అన్నారు. నగరంలోని జెడ్పీ ప్రాంగణంలోని సమావేశ భవనంలో గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన ఎంపీడీఓల మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో మంజూరై ఇంకా ప్రారంభం కాని, ప్రాధాన్యత లేని పనులను రద్దు చేసి, వాటి స్థానంలో పూర్తి నిధులను కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీడీఓలందరూ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశాల మేరకు కేవలం తాగునీటి పనులను మాత్రమే ప్రతిపాదించాన్నారు. ఒకవేళ ఎవరైనా గడిచిన మూడేళ్ల కాలంలో ప్రారంభం కాని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, భవనాల నిర్మాణం పనులను రద్దు చేయకపోతే మాత్రం ఎంపీడీఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, జెడ్పీ సాధారణ నిధుల వినియోగం, సాసా కార్యక్రమాల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ మల్లికార్జున, అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు, జెడ్పీ ఏఓలు, ఉమ్మడి జిల్లా ఎంపీడీఓలు హజరయ్యారు. -
‘దాహాన్ని’ తీర్చేందుకు నివేదికలతో రండి
● నేడు జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు జిల్లా పరిషత్లో బుధవారం ఎంపీడీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యను మంగళవారం ‘దాహం..దాహం’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మంది ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామాల జాబితాను సిద్ధం చేసి ప్రత్యేక నివేదికలతో సమావేశానికి హాజరు కావాలన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు తుది అవకాశం అనంతపురం: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి 19వ తేదీలోపు తుది అవకాశం కల్పిస్తున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి తెలిపారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ప్రాసెసింగ్ ఫీజును ఈ నెల 18లోపు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్లో ఆప్షన్స్ నమోదు, 21న ఆప్షన్ల మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. 24న అలాట్మెంట్స్ ప్రకటిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 68055 10654లో సంప్రదించవచ్చన్నారు. సీనియారిటీ జాబితా సిద్ధం చేయండి: డీఆర్ఓఅనంతపురం అర్బన్: అన్ని ప్రభుత్వ శాఖల్లో కేడర్ల వారీగా సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని డీఆర్ఓ ఎ.మలోల సంబంధిత శాఖల అధిపతులను ఆదేశించారు. డీఆర్ఓ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి అమలు కమిటీ (డీఎల్ఐసీ) సమావేశం నిర్వహించారు. కేడర్ల వారీగా ముసాయిదా సీనియారిటీ జాబితా, పోస్టులు, వివరాల పరిశీలన తదితర అంశాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. సమావేశంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, పశు సంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకోఠారి, హౌసింగ్ పీడీ శైలజ, డీసీఓ అరుణకుమారి, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రమణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధునిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కణేకల్లు: మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో వృద్ధునిపై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు చేసిన అవమానంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన వృద్ధుడు మోకా ఆంజనేయులును బుధవారం ‘అనంత’ పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న ఆంజనేయులును అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మారుతిప్రసాద్, అతని భార్య, మాజీ సర్పంచు లావణ్యలు చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్నడంతో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆయన పురుగుల మందు తాగిన విషయం విదితమే. బాధిత కుటుంబ సభ్యులు ఆయనను అనంతపురం జీజీహెచ్కు తరలించి వైద్య చికిత్సలందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత కణేకల్లు మండల వైఎస్సార్సీపీ నేతలతో కలిసి బాధితుడిని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో ‘అనంత’ మాట్లాడారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుడని కూడా చూడకుండా కొట్టి అవమానపరచడం హేయమన్నారు. కార్యక్రమంలో కణేకల్లు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ పాటిల్ బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మారెంపల్లి మారెన్న, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేమన, నాయకులు గోపాల్, లాలుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
దగ్గుపాటి వర్సెస్ పూల
అనంతపురం టౌన్: టీడీపీలో అంతర్గత పోరు రగులుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడికి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకు మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడిపై ఎమ్మెల్యే వర్గీయులు బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని, జిల్లా అధ్యక్షుని ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అనంతపురం అర్బన్లో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇటీవల పలువురి పేర్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుకు సిఫార్సు చేశారు. నియోజకవర్గంలోని 50 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి ముఖ్య అనుచరులను సైతం వెంటనే సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాత్రం దీన్ని అంతగా పట్టించుకోలేదు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తున్న వారిని వెనకేసుకురావడంతోపాటు పార్టీ కార్యాలయంలో పక్కనే పెట్టుకొని ప్రెస్మీట్లు నిర్వహించడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి రగిలిపోయినట్లు తెలిసింది. స్వయంగా తానే సిఫార్సు చేసినా పెడచెవిన పెట్టడంతో పాటు తనపై విమర్శలు చేస్తున్న వారిని పూల నాగరాజు పక్కన పెట్టుకుని తిరుగుతుండడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులు బహిరంగంగానే పూల నాగరాజుపై తీవ్ర విమర్శలకు దిగడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇలాగే కొనసాగితే పార్టీ కార్యాలయంలోకి సైతం అడుగు పెట్టనివ్వబోమంటూ ప్రెస్మీట్లు పెట్టి మరీ హెచ్చరించడం సంచలనంగా మారింది. బీసీ నేతల ఆగ్రహం.. పూల నాగరాజు బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే ఎమ్మెల్యేతోపాటు ఆయన వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అదే పనిగా రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీకే చెందిన బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బోయ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే అర్బన్ ఎమ్మెల్యేకు రుచించడం లేదని, అందుకే మైనార్టీ నేతతో మీడియా సమావేశాలు పెట్టి తిట్టిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఎమ్మెల్యే సిఫార్సులతో సస్పెండ్ చేసుకుంటూ పోతే అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు సైతం ఎవరూ మిగలరని ఆ పార్టీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నిరంకుశత్వంపై అంతా ఏకమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిపై అర్బన్ ఎమ్మెల్యే గుర్రు పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టనివ్వబోమంటూ ఎమ్మెల్యే వర్గం బహిరంగంగానే హెచ్చరికలు దగ్గుపాటి వర్గీయుల తీరుపై టీడీపీ బీసీ నేతల మండిపాటు -
బీమా గడువు పొడిగింపు
అనంతపురం అగ్రికల్చర్: పంటల బీమా పథకాలకు ప్రీమియం చెల్లింపు గడువును నెలాఖరు వరకు పొడిగించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతులే స్వచ్ఛందంగా ప్రీమియం కట్టి బీమా పథకాలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 15వ తేదీ మధ్య బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులు ఆటోమేటిక్గా బీమా పరిధిలోకి వస్తారని, ఈ–క్రాప్లో నమోదు చేసిన పంటకు మాత్రమే రుణం పొంది ఉండాలన్నారు. బ్యాంకును సంప్రదించి పంట పేరు మార్పు చేసుకోవాలన్నారు.ఫసల్బీమా కింద కంది,ఆముదం, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప రైతులు ఈనెల 31లోపు, వరి రైతులు ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. ప్రీమియం గడువుకు రెండు రోజుల ముందుగా బ్యాంకుల్లో పంట మార్పిడి లేదా బీమా వద్దనుకుంటే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు. యాడికి తహసీల్దార్ ‘పచ్చ’ భక్తి తాడిపత్రిటౌన్: యాడికి తహసీల్దార్ ప్రతాప్రెడ్డి చూపిన ‘పచ్చ’ భక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం తన కార్యాలయంలోనే అధికార టీడీపీకి చెందిన బీఎల్ఏలను సన్మానించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎంతో శ్రమకు ఓర్చుకుని ‘ఎస్ఆర్ఐ’ ప్రక్రియను పూర్తి చేసిన తమను పట్టించుకోకుండా ఓ పార్టీకి చెందిన బీఎల్ఏలను సన్మానించడంపై బీఎల్ఓలు అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. వీఆర్ఓలు శాలువలు, పూలమాలలు సిద్ధం చేయడంతో సన్మానించానని చెప్పడం గమనార్హం. -
‘ముద్రగడ’ పోరాటం స్ఫూర్తిదాయకం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి అనంతపరం న్యూటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చూపిన పోరాట పటిమ భావితరాలకు స్ఫూర్తిదాయకమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముద్రగడ రాజకీయ నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి మరువలేనిదన్నారు. శాసన సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై చేయని కుట్ర లేదని, అయినా తలొగ్గకుండా ప్రజా నాయకుడిగా పేరు గడించారన్నారు. ముద్రగడ మరణం కాపు ఉద్యమానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. మాజీ మంత్రి డాక్టర్ శైలజానాఽథ్ మాట్లాడుతూ ముద్రగడతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకు న్నారు. కాపులనే కాకుండా బడుగు వర్గాలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ముద్రగడ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్, మాజీ మేయర్ వసీం, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రాష్ట్ర కార్యదర్శి వీరా రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజరి వెంకటేష్, నాయకులు వెంకటరాముడు, చింతకుంట అమర్నాథ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమ శేఖర్ రెడ్డి,అనుబంధ సంఘాల అధ్యక్షులు మొఘల్ సైపుల్లా బేగ్, గాజుల ఉమాపతి, చంద్ర శేఖర్ యాదవ్, శ్రీదేవి, మాలపాటి శ్రీనివాసులు, దాదాఖలందర్, టీవీ చంద్రమోహన్ రెడ్డి, కమల్ భూషణ్, కేశవరెడ్డి, గుణ శేఖర్, సాకే అశోక్ కుమార్, భారతి, మహేశ్వరి, దేవి, పార్వతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో వైఎస్సార్సీపీ నేత!
● ధ్రువీకరించకపోవడంపై కుటుంబ సభ్యుల ఆందోళన రాప్తాడు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పటాస్ శ్రీకాంత్ (అలియాస్ కురుబ చిట్ర శ్రీకాంత్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ప్రత్యేక పోలీసు బృందం బెంగ ళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్ అరెస్టును పోలీసులు అధికారికంగా ధ్రువీకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీకాంత్ స్పందిస్తూ, ఎంఎస్ రాజు అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయనను ఎక్కడ ఉంచారు, ఏ పోలీసు స్టేషన్లో ఉన్నారు, ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారనే విషయాలపై అధికారిక సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా కోర్టులో హాజరుపరచాలని, లేనిపక్షంలో చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
టీబీ డ్యాంకు ఇన్ఫ్లో తగ్గుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. కాలువలకు నీటి విడుదల ఆలస్యమైతే వరి నారు ముదిరి నాణ్యత దెబ్బతింటుంది. దీంతో పాటు సాగు పనులన్నీ గందరగోళంగా మారే అవకాశం ఉండడంతో బెంబేలెత్తిపోతున్నారు.
బొమ్మనహాళ్: బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లోని చాలా గ్రామాల్లో వ్యవసాయ బోర్ల కింద ఇటీవల పెద్ద ఎత్తున వరి నారు పోశారు. ఈ నెల మొదటి వారంలో టీబీ డ్యాంకు వరద పెరగడంతో రైతులు ఆశతో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో నారు పెంచారు. సోనామసూరి, ఆర్ఎన్ఆర్, బీపీటీ రకాల నారు ఎక్కువగా పెంచుతున్నారు. కొందరు రైతులు ముందస్తుగానే ఒప్పందం చేసుకుని 30 నుంచి 40 రోజుల పాటు నారు పెంచి అందజేస్తుంటారు. నారును సెంటు లెక్కన రైతులకు విక్రయిస్తారు.ప్రస్తుతం సెంటు నారు రూ.1,300 నుంచి రూ. 1,500 లెక్కన పలుకుతోంది. ఏటా హెచ్చెల్సీ ఆయకట్టు కింద 30 వేల ఎకరాల్లో వరి పంట సాగవుతుండగా... ఆయకట్టు రైతులతో పాటు ఇతర ప్రాంతాలకు ఇక్కడి నారు సరఫరా అవుతుంది. నీరందేది ఎన్నడో...? హెచ్చెల్సీ ఆయకట్టుకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదలయ్యే నీరే ఆధారం. జలాశయంలో ఈ సారి ఆశించిన మేర నీరు చేరకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం డ్యాంలో 25.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఐదు రోజుల క్రితం 48 వేల క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో బుధవారానికి 4,860 క్యూసెక్కులకు పడిపోవడం గమనార్హం. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, తీర్థనహళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిపోయింది. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయాలంటే డ్యాంలో కనీసం 80 టీఎంసీల నీరు నిల్వ ఉండాలని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఆ మేరకు నీరు చేరేదెన్నడు.. హెచ్చెల్సీకి విడుదల చేసేది ఎన్నడో తెలియడం లేదు. వేయికళ్లతో ఎదురుచూపులు.. కాలువలకు సకాలంలో నీరు రాకపోతే పంట సాగు ఆలస్యమవుతుంది. ఈ క్రమంలోనే వరి నారు ముదిరి నాట్లకు పనికిరాకుండా పోతుంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం రైతులు చేసిన ఖర్చంతా వృథా అవుతుంది. దీంతో వరి నారు పెంచుతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించి, డ్యాం నిండాలని కోరుకుంటున్నారు. వర్షం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 80 టీఎంసీలకు చేరితేనే నీటి విడుదలతుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో డ్యాంకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతోంది. డ్యాంలో 80 టీఎంసీల నీరు చేరితేనే హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. డ్యాంకు నీరు వచ్చేంతవరకు రైతులు ఎదురుచూడక తప్పదు. – సుధాకర్రావు, హెచ్చెల్సీ ఎస్ఈ బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో పెద్ద ఎత్తున వరినారు పెంపకం తుంగభద్రకు ఇన్ఫ్లో తగ్గడంతో హెచ్చెల్సీకి నీటి విడుదలపై సందిగ్ధం నారు పెంచుతున్న రైతులు బెంబేలెత్తుతున్న వైనం -
‘పరిష్కార వేదిక’కు 520 వినతులు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 520 అర్జీలు అందాయి. ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు జేసీ సి.విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రమేష్రెడ్డి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలకు సంబంధించి 189 అర్జీలు, ఇతర సమస్యలపై 331 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్కు గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ విన్నవించారు. విద్యార్థులకు సకాలంలో కాస్మోటిక్ చార్జీలు చెల్లించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులపై కౌంటర్ కేసులు ఎత్తివేయాలని కలెక్టర్కు ఎస్సీ, ఎస్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేరిమెట్ల ఎల్లన్న విన్నవించారు. మొహర్రం సందర్భంగా పీసీ కొత్తకోట, అనకానహళ్, ఆకులేడు, నడిమిదొడ్డి తదితర గ్రామాల్లో దళితులపై దాడులు జరిగాయన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు తిరిగి బాధితులపైనే కౌంటర్ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరారు. -
మా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించండి
అనంతపురం అర్బన్: బిడ్డను బతికించుకునేందుకు ఆ కన్నపేగు పడుతున్న ఆరాటం అందరినీ కలచివేస్తోంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బిడ్డతో పాటు కలెక్టరేట్కు వచ్చి ప్రభుత్వ పరంగా సహాయం కోరారు. వివరాలు.. పెద్దవడుగూరు మండలం తగరకుంటపల్లికి చెందిన నవీన్కుమార్రెడ్డి, బిందుప్రియ దంపతులకు మూడు నెలల క్రితం పండంటి మగ బిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించాడనే సంతోషం ఆ తల్లిదండ్రులకు కొన్ని రోజుల్లోనే మాయమైంది. అరుదైన ఎస్ఎంఏ టైప్–1 అనే వ్యాధి సోకిందని తేలడంతో హతాశులయ్యారు. హైదరాబాద్లోని రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్తే బాబుకు ఒక ఇంజక్షన్ ఇస్తే బతుకుతాడని, దాని ఖరీదు రూ.16 కోట్ల నుంచి రూ.17 కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో ఆ దంపతులకు దిక్కుతోచలేదు. వస్తున్న వేతనం పూర్తిగా బాబు వైద్యానికే ఖర్చు చేస్తున్నారు. బుధవారం కలెక్టరేట్కు వచ్చి సాయమందించాలని కలెక్టర్ను కోరారు. సమస్యను డీఎంహెచ్ఓకు కలెక్టర్ సిఫారసు చేశారని, సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే కొంతమేర ఫలితం ఉంటుందని సూచించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. దాతలు స్పందించి సహాయం చేస్తే బిడ్డను బతికించుకుంటామని విజ్ఞప్తి చేశారు. మానవతామూర్తులు దయ చూపాలని పలువురు కోరారు. R. Naveen Kumar Reddy A/c 30830783425 SBIN0011125 RAYALACHERUVU -
● మోసంపై మండిపాటు
అనంతపురం అర్బన్: ‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విద్యార్థుల చేతుల్లో బొచ్చె పెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పి మాట తప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’’ అంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు మంగళవారం కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించారు. పేపర్ ప్లేట్లు చేతిలో పెట్టుకుని అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి, మంత్రి లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతనాయుడు, ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట తప్పారని విమర్శించారు. రెండేళ్లైనా బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పీజీ విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారిన జీఓ 77 రద్దు చేయాలన్నారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, నరసింహయాదవ్, వెంకట్ నాయక్, వంశీ, మంజు, చందు, ఉమామహేష్, నవీన్, పవన్ పాల్గొన్నారు. -
పరీక్షల ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ, బీపీఈడీ ఆరో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ విడుదల చేశారు. బీఈడీ కోర్సులో మొత్తం 727 మంది పరీక్ష రాయగా 688 మంది (94.64 శాతం), బీపీఈడీ కోర్సులో 54 మంది రాయగా 50 (92.59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 30వ తేదీలోపు రీవాల్యుయేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూపురం చేరిన రవితేజ మృతదేహం
హిందూపురం: వియత్నం బోటు ప్రమాదంలో మృతిచెందిన హిందూపురం వాసి, లక్కీ సెల్ పాయింట్ యజమాని రవితేజ మృతదేహాన్ని లావా సంస్థ ప్రతినిధులు బంధువులకు మంగళవారం అప్పగించారు. మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. రవితేజ లావా సంస్థ ప్రతినిధిగా గత పదేళ్లుగా లక్కీ మొబైల్ షాప్ నడుపుతూ లావా సెల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్గా పని చేస్తున్నాడు. లావా సెల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అయిన రవితేజ సెల్ఫోన్లు విక్రయాలు లక్ష్యాన్ని అధిగమించడంతో విదేశీ పర్యటనకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలోని 75 మంది డిస్ట్రిబూటర్లను ఎంపిక చేసి, వియత్నాం దేశానికి తీసుకెళ్లారు. ఈనెల 8న హిందూపురం నుంచి వియత్నాం బయల్దేరి వెళ్లిన రవితేజ 9న వియత్నాం సముద్రం దాటుతూ బోటు బోల్తా పడిన ఘటనలో మృతిచెందాడు. వియత్నాం నుంచి మృతదేహాన్ని ముంబాయి చేరడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో కంపెనీ ప్రతినిధులు, బంధువులు అంబులెన్స్లో హిందూపురంలోని టీచర్స్కాలనీలోని వారి నివాసానికి తీసుకొచ్చారు. మిన్నంటిన రోదనలు.. : అంబులెన్స్ నుంచి శవపేటికను దించగానే రవితేజ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. అందరితో మంచి సఖ్యతగా ఉండే రవితేజ మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. రవితేజకు తల్లితో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లావా సంస్థ రవితేజ కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తండ్రి మృతదేహాన్ని చూడగానే పెద్ద కుమారై సహస్త్ర కన్నీరుమున్నీరవుతూ ‘ నాన్నా..చూడు నేను మంచి పెయింటింగ్ వేశాను.. చూడు నాన్నా’ అంటూ విలపించడం స్థానికులను కలచివేసింది. గుర్తు తెలియని వృద్ధుడి శవం లభ్యం విడపనకల్లు: హంచనహాల్ సమీపంలో మంగళవారం 63వ జాతీయ రహదారి పక్కన జీబీసీ ప్రధాన కెనాల్ వద్ద వృద్ధుడి శవం లభ్యమైంది. రోడ్డు పక్కన గుంతకల్లు బ్రాంచి ప్రధాన కాలువ పక్కన ముళ్ల పొదల మధ్య పడి ఉన్న వృద్ధుడి శవాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. విడపనకల్లు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు శవాన్ని పరిశీలించారు. ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనాథ శవంగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశ్వత్థంలో 20న బహిరంగ వేలం పెద్దపప్పూరు: మండలంలోని అశ్వత్థ నారాయణ క్షేత్రంలో ఈనెల 20న టెంకాయల విక్రయం, కొబ్బరిచిప్పల పోగుచేసుకొను హక్కు కోసం బహిరంగ వేలం పాట ఉంటుందని ఈఓ సుబ్రమణ్యం, పాలకమండలి సభ్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మాఘమాసం మినహా విడి దినాల్లో మాత్రమే ఈ షరతు వర్తిస్తుందన్నారు. వేలంలో పాల్గొనేవారు టెంకాయల విక్రయానికి రూ.50 వేలు, కొబ్బరి చిప్పల పోగు చేసుకునేందుకు రూ.లక్ష డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా హైదరాబాద్: పారిశుధ్య కార్మికుడి మృతి కేసులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులను జీహెచ్ఎంసీ అమలు చేసింది. మృతుడి కుటుంబానికి రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియా అందజేశామని, అర్హతలను బట్టి అతడి కుటుంబ సభ్యులు ఇద్దరికి ఉద్యోగాలిస్తామని జీహెచ్ఎంసీ మంగళవారం కమిషన్కు నివేదిక అందజేసింది. ప్రమాదాలు పునరావృతం కాకుండా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లలో భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. తదుపరి విచారణ అవసరం లేదని కమిషన్ భావించి కేసును కొట్టేసింది. అసలేం జరిగిందంటే..? గుత్తి మండలం ఇస్సరాలపల్లికి చెందిన మీసాల సుధాకర్(40) కొన్నేళ్లుగా కుటుంబంతో కలిసి హైదరాబాద్ హైటెక్ సిటీ కమాన్ వద్ద నివసిస్తూ చెత్త సేకరణతో జీవనం సాగిస్తున్నాడు. జనవరి 24న ఉదయం 5.15 గంటల సమయంలో ఆటోలో సేకరించిన చెత్తను యూసుఫ్గూడలోని జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు తీసుకెళ్లి ప్రమాదవశాత్తూ ర్యాంపులో పడి మృతి చెందాడు. సరైన భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్, సభ్యులు శివాది ప్రవీణ, బి.కిశోర్తో కూడిన బెంచ్ సుమోటోగా కేసును స్వీకరించి విచారణ చేపట్టారు. మృతుడి కుటుంబానికి రూ.15.50 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు కుటుంబ సభ్యులకు రెండు ఉద్యోగాలు కల్పించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. వియత్నాం విహార యాత్రకు వెళ్లి బోటు మునిగి మృతి -
అంతరాష్ట్ర చైన్స్నాచర్ల అరెస్ట్
వజ్రకరూరు: కొనకొండ్ల శివారులో ఇద్దరు అంతరాష్ట్ర చైన్స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు బంగారు తాళిబొట్లు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వజ్రకరూరు పోలీస్స్టేషన్లో ఉరవకొండ సీఐ మహానంది విలేకరులతో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లా చిత్తాలి గ్రామానికి చెందిన అమన్దీపక్రౌత్, కర్ణాటక రాష్ట్రం దార్వాడ్ జిల్లా యారీబూదిహాల్కు చెందిన ఆకాష్షికారి ఇద్దరూ స్నేహితులు. చెడు వ్యసనాలతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఇటీవల ఆంధ్రకు వచ్చి ఒంటరి మహిళల మెడలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లి, వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. రెండు నెలలక్రితం గుంతకల్లులోని ఎన్హెచ్ బ్రిడ్జి సమీపంలోని అమ్మవారి ఆలయం వద్ద ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెల్లారు. ఈనెల 9న కమలపాడుకు చెందిన అనిత మార్గంమధ్యలో గూళ్యపాళ్యం వద్ద ద్విచక్రవాహనాన్ని నిలువరించి, బంగారు గొలుసు లాక్కెల్లారు. మంగళవారం మధ్యాహ్నం కొన కొండ్లలోని ఎన్హెచ్ 67 ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చైన్ స్నాచర్లను అరెస్టు చేసి, వారి నుంచి గుంతకల్లు రూరల్ పీఎస్ పరిధిలోని బంగారు నగలు, ద్విచక్రవాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నగలు విలువ రూ.4.80లక్షలు ఉంటుందని సీఐ వెల్లడించారు. సమావేశంలో వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, వజ్రకరూరు పోలీసులు ఉన్నారు. -
● దగాపై ధర్మాగ్రహం
అనంతపురం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల డిమాండ్లను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఫ్యాప్టో నాయకులు ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ శ్రీనివాసులు నాయక్, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పటికీ కనీసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని, ఐఆర్ ఉసే లేదని మండిపడ్డారు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రత్యేక టెట్లో ఉత్తీర్ణత మార్కులు ఒకే విధంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. కలెక్టర్ పూల్ ద్వారా పోస్టింగ్లు ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించరాదన్నారు. మునిసిపల్ టీచర్ల పీఎఫ్ సమస్య పరిష్కరించాలన్నారు. సమస్యలన్నీ పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. ధర్నాలో ప్రభుత్వ పెన్షన్లీర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పెద్దన్నగౌడ్, శీల జయరామప్ప పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం కో–చైర్మన్లు ఓబుళేసు, తింగ మూర్తి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వెంకటరత్నం, అక్కులప్ప, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర కార్యదర్శులు సూర్యుడు, వెంకటసుబ్బయ్య, పాతిరెడ్డి, రాజశేఖర్, ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు గోపాల్రెడ్డి, రామాంజనేయులు, హనుమప్ప, రవీంద్ర, వెంకటరెడ్డి, లింగమయ్య, నాయకులు కోటేశ్వరప్ప, రమణారెడ్డి, మోహన్రెడ్డి, హబీబూల్ రెహమాన్, ఈశ్వ రయ్య, నరేష్, మంజుల, రమణయ్య, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాతాశిశు మరణాలు నివారిద్దాం
● ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ ప్రసన్న భారతి అనంతపురం సిటీ: జిల్లాలో మాతాశిశు మరణాలు పూర్తి స్థాయిలో నివారించేలా కృషి చేద్దామంటూ వైద్యాధికారులకు ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రసన్న భారతి పిలుపునిచ్చారు. గత నెల రోజుల్లో జిల్లాలో చోటు చేసుకున్న ఒక మాతృ, ఆరు శిశు మరణాలపై సంబంధిత పీహెచ్సీ వైద్యాధికారులతో మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె సమీక్షించారు. మరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరింత శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. గర్భస్థ సమయం నుంచి ప్రసవం వరకూ ఆరోగ్య సేవలు అందేలా చొరవ తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ గంగాధరరెడ్డి, జీజీహెచ్ గైనిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ శంషాద్ బేగం, అనస్థీషియా డాక్టర్ సోమశేఖర్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ నవీన్కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ ఐ.పద్మశ్రీ పాల్గొన్నారు. -
పెచ్చుమీరిన టీడీపీ అరాచకాలు
కణేకల్లు: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు పెచ్చుమీరాయని వైఎస్సార్సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి విమర్శించారు. కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు మోకా ఆంజినేయులుపై చెప్పులతో దాడి చేసిన టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్, భార్య లావణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై సమన్వయకర్త మెట్టు రాయదుర్గం సీఐ వెంకటరమణతో ఫోన్లో మాట్లాడారు. దాడి ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి టీడీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య వివరించేందుకు టీడీపీ నేత ఇంటికెళ్లి మార్గమధ్యంలోనే వెనుదిరిగిన వృద్ధుడిని టీడీపీ నాయకుడు దాడి చేయడం హేయమన్నారు. పొలం పనికెళ్లిన వృద్ధుడిని పనిగట్టుకొని టీడీపీకి చెందిన దంపతులు అక్కడికెళ్లి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. నీళ్లు రాకపోతే అడగాలని అనుకోవడం కూడా తప్పాని మెట్టు ప్రశ్నించారు. ప్రశాంతమైన పల్లెలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలు, దాడులు చేసి ప్రజల్లో భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మోకా ఆంజనేయుల దాడి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్సీపీ తరుపున ఆందోళనలు చేస్తామని మెట్టు హెచ్చరించారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ఎస్బీఐ ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్: సూక్ష్మ, చిన్నతరహా, మధ్యస్థ స్థాయి (మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైసెస్–ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రోత్సహిస్తుందని బ్యాంకు చీఫ్ మేనేజర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం స్థానిక జీసెస్నగర్లో పీఎం విశ్వకర్మ క్రెడిట్ ఆవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎంఎస్ఎంఈ స్టేట్ నోడల్ ఆఫీసర్లు ఏ శీను, డి.వీరయ్య, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఆనంద్, ఎల్డీఎం మారుతీశ్రీనివాస్, ఎస్బీఐ కార్డినేటర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తి అర్హత కలిగిన ఎంటర్ప్రెన్యూర్స్కు వ్యక్తిగతంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రుణాలు అందజేస్తామన్నారు. సొంతంగా ఆర్థిక స్వావలంభన సాధించడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ కింద రుణాలు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 40 మంది లబ్ధిదారులకు రుణవితరణ మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ మారుతి, సుధీర్, సునీత, ఎఫ్ఎల్సీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ప్రయాణం దారిద్య్రం.. నడకే నయం!
బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లికి వెళ్లే రహదారి దుస్థితి రోటరీపురంలో గుంతల్లో నిలిచిన నీళ్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా పల్లెల ప్రగతిని పట్టించుకోవడంలేదు.. ప్రజా సంక్షేమం గాలికొదిలేశారు.. పల్లె ప్రయాణం ‘దారి’ద్య్రంగా ఉంది. అతుకులు,గతుకుల రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా ఉంది. శింగనమల నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నా.. పల్లెల్లో మురుగునీరు పారుతున్నా.. మోకాలు లోతు గుంతలు పడి ప్రయాణం నరకప్రాయంగా ఉన్నా.. కనీసం స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి పల్లెల వైపు కన్నెత్తి చూడడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న నీలారెడ్డిపల్లిలో 400 కుటుంబాలు, 2 వేల మంది వరకు జనాభా ఉన్నారు. గ్రామానికి నిర్మించిన తారు రోడ్లు శిథిలమయ్యాయి. ఈ గ్రామం మీదుగా వెంకటాపురం, చెన్నంపల్లి, నార్పల గ్రామాలకు వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా నియోజకవర్గంలో అనేక గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఎమ్మెల్యే ఇకనైనా ప్రజల కష్టాలను చూసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం భద్రంపల్లి వద్ద గుంతలమయంగా రహదారి కోటంకలో పారుతున్న మురుగునీరు -
‘పెద్దమ్మా.. చైన్ ఇదిగో అంటూ తస్కరించారు’
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ సిండికేట్ నగర్లో 92 ఏళ్ల వృద్ధురాలి బంగారు గొలుసు అనుమానాస్పదంగా మాయమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సిండికేట్ నగర్కు చెందిన రామక్క (92) తన కుమారుల వద్ద నివసిస్తోంది. వృద్ధాప్యం కారణంగా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన గదిలో ఉంటోంది. ఆమె మెడలో సుమారు ఒకటిన్నర తులాల బంగారు చైన్ ఉండేది. రోజూ స్నానం చేసేందుకు వెళ్లే ముందు చైన్ను బాత్రూం బయట ఉన్న కొక్కీకి తగిలించి, స్నానం ముగించుకుని వచ్చాక తిరిగి మెడలో వేసుకునే అలవాటు ఉంది. సోమవారం కూడా అలానే చైన్ను కొక్కీకి తగిలించి స్నానానికి వెళ్లింది. స్నానం చేసిన తర్వాత ఆరు బయట ఉంది. ఈలోపు ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చి, ‘పెద్దమ్మా... చైన్ ఇక్కడే తగిలించావు‘ అని చెప్పగా, ‘తీసుకుంటాలే నాయనా‘ అని ఆమె సమాధానమిచ్చింది. అనంతరం వారిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు పిల్లలు కాంపౌండ్లోకి రావడంతో వారిని మందలించి పంపించారు. ఆ తర్వాత వృద్ధురాలు బయటకు వచ్చి చూడగా కొక్కీకి తగిలించిన చైన్ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె విషయాన్ని కుమారులు, మనవళ్లకు తెలియజేసింది. బాధిత కుటుంబ సభ్యులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ముద్రగడ మరణం బాధాకరం
అనంతపురం: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన ముద్రగడ పద్మనాభం మృతి బాధాకరమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలిపారు. కాపు సామాజికవర్గ హక్కుల పోరాటాల్లో ముద్రగడది కీలకపాత్ర అని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారని.. మంత్రిగానూ తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గంలోనే కాకుండా అన్ని వర్గాల్లో ముద్రగడకు అభిమానులున్నారన్నారు. ఓ మంచి వ్యక్తిని వైఎస్సార్ సీపీ కోల్పోయిందని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిరస్మరణీయ సేవలు.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయసేవలు అందించిన ముద్రగడ పద్మనాభం విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. పదవుల కన్నా ప్రజాసేవే గొప్పగా భావించిన వ్యక్తి అని ప్రశంసించారు. జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారన్నారు. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపమని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. -
31 మండలాల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు
అనంతపురం న్యూటౌన్: జిల్లాలోని 31 మండలాల్లో 83 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎస్డబ్ల్యూ అధికారి జి. నాసర రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని స్వర్ణగ్రామ– స్వర్ణవార్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17వ వరకూ, తిరిగి 21 నుంచి 24 వరకూ ప్రత్యేక ఆధార్ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఇప్పటికే నిర్దేశిత పాఠశాలలు, జూనియర్ కళాశాలలను గుర్తించినట్లు తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యార్థులే అధికంగా ఉన్నారని, వీరంతా తప్పని సరిగా బయోమెట్రిక్ను ప్రత్యేక ఆధార్ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు. యువతే కాకుండా సెల్ నంబర్ మార్పు, ఆధార్ కార్డులో చిరునామా, వయస్సు ఇతరత్రా మార్పులను చేసుకోవచ్చని తెలిపారు. -
గడువు పొడిగించారు ‘సర్’
● 24 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే, ఈఎఫ్ డిజిటలైజేషన్ ● 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) గడువును భారత ఎన్నికల కమిషన్ పది రోజులు పొడిగించింది. తొలి షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీతో బీఎల్ఓల ఇంటింటి సర్వే చేపట్టి ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, వాటి డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ వ్యవధిని మరో 10 రోజుల పాటు పొడిగించారు. ఈనెల 24 తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈఎఫ్లు డిజిటలైజేషన్ చేస్తారు. అదే క్రమంలో ఓటర్ల ముసాయిదా జాబితాను 31వ తేదీన ప్రచురిస్తారు. అదే రోజు నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కొత్తగా ఓటర్ల నమోదు, వివరాల మార్పు, ఓట్ల తొలగింపునకు సంబంధించి క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని సెప్టెంబరు 28వ తేదీలోగా పరిష్కరించి ఓటర్ల తుది జాబితాను అక్టోబరు 3వ తేదీన ప్రచురిస్తారు. డిజిటలైజేషన్ దాదాపు పూర్తి జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా, ఎన్యుమరేషన్ ఫారాలు అందరికీ అందజేశారు. ఇప్పటి వరకు 2,08,791 ఈఎఫ్లు వెనక్కి రాలేదు. ఇక మంగళవారం నాటికి 18,29,706 ఈఎఫ్లు డిజిటలైజేషన్ చేశారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పది రోజుల పాటు గడువు పొడిగించిన నేపథ్యంలో బీఎల్ఓలు షిఫ్టెడ్ ఓట్లకు సంబంధించి ఫారాలు అందితే డిజిటలైజేషన్ చేస్తారు. ముందే చెప్పిన ‘సాక్షి’.. ‘సర్’ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ ద్వారా జిల్లావ్యాప్తంగా 2.26 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని ‘సాక్షి’ ఈనెల 9వ తేదీన ప్రత్యేక కథనం ప్రచురించింది. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లకు ఈఎఫ్లు పంపిణీ చేస్తే 2,08,791 ఈఎఫ్లు వెనక్కి రాలేదు. అంటే ఈ రెండు లక్షల ఓట్లు ముసాయిదా జాబితాలో ఉండవు. ఇక డబుల్ ఓట్లు, మరణించిన, షిప్టెడ్, శాశ్వత వలస వెళ్లిన వారి ఓట్లు మరో 25 వేల వరకు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా 2.25 లక్షల నుంచి 2.50 లక్షల మధ్య ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తున్నారు. -
విషమంగానే ఆంజనేయులు ఆరోగ్యం
కణేకల్లు: టీడీపీ నాయకుడి చేతిలో అవమానానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధుడు ఆస్పత్రిలో చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్నాడు. రెండు రోజుల క్రితం కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు మోకా ఆంజినేయులుపై స్థానిక టీడీపీ నేత మారుతీప్రసాద్, అతని భార్య లావణ్య చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్ని చావబాదిన విషయం తెలిసిందే. తప్పయ్యిందని క్షమించమని కోరినా.. ఏమాత్రమూ కరుణించలేదు. కుమార్తె అంజినమ్మ, మనవడు గోవిందు అక్కడికి చేరుకోగా వారిని కూడా దుర్భాషలాడడంతో అవమానంగా భావించిన ఆంజినేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబసభ్యులు స్థానిక కణేకల్లు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించిన అనంతరం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఆంజినేయులు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే టీడీపీ నేత మారుతిదే బాధ్యత అంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 16 ఏళ్ల నిరీక్షణకు తెర ● 11 మంది 2008 డీఎస్సీ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేత అనంతపురం ఎడ్యుకేషన్: దాదాపు 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత డీఎస్సీ–2008కు ఎంపికై ెన 11 మంది అభ్యర్థులకు మంగళవారం డీఈఓ శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు అందజేశారు. డీఎస్సీ–2008 నోటిఫికేషన్కు సంబంధించి 2010లో నియామకాలు చేపట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల 2011లో కొందరి నియామకాలు రద్దయ్యాయి. దీంతో బాధిత అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో అభ్యర్థులకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో వారిని తిరిగి నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 11 మంది అభ్యర్థులకు మంగళవారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరందరూ ఎస్జీటీ తెలుగు ఉపాధ్యాయులే కావడం గమనార్హం. కోర్టు తీర్పు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి బెళుగుప్ప: రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి సూచించారు. మండలంలోని గ్రామాల్లో ప్రస్తుత ఖరీఫ్లో సాగైన కంది, ఆముదం తదితర పంటలను జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి, ఏడీఏ యల్లప్పతో కలసి మంగళవారం పరిశీలించారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావం పంటలపై ఏవిధంగా ఉందో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలపై ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. రైతులకు సబ్సిడీతో డీఏపీ, యూరియా లాంటివి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతి రైతూ పంటల బీమా, ఈక్రాప్ బుకింగ్లను తప్పకుండా చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ ఫృథ్వీసాగర్, ఏఓ రాజేష్ నాయక్, సహకార సంఘ అధ్యక్షుడు కంచిరాముడు, ఎంపీఈఓలు నాగమణి, శ్రీదేవి, రజిత, వీహెచ్ఏ అనిల్, రైతులు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్ నుంచి ఉడాయించిన మైనర్ గుత్తి: స్థానిక పట్టణ పోలీసు స్టేషన్ నుంచి ఓ మైనర్ మంగళవారం పరారయ్యాడు. ఇటీవల స్థానిక బెంగళూరు బేకరీలో నలుగురు మైనర్లు చోరీకి పాల్పడ్డారు. నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. బేకరీ నిర్వాహకులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ఇద్దరిని పోలీసులకు పట్టించారు. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు సోమవారం రాత్రి స్టేషన్ నుంచి ఉడాయించాడు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన బాలుడిని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వాడు కావడంతో పోలీసులు కడప ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆ బీఎల్ఓకు షోకాజ్
● డిజిటలైజేషన్ వ్యవహారంపై విచారణకు కలెక్టర్ ఆదేశం రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి 130వ పోలింగ్ బూత్లో ఓటర్ల ప్రమేయం లేకుండానే డిజిటలైజేషన్ పూర్తి చేసిన వ్యవహారంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ ఘటనపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని కలెక్టర్ ఓ. ఆనంద్ తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. మంగళవారం సంబంధిత బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ)కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికి తీస్తా మని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. పరిష్కార వేదికలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో భూ సమస్యల అర్జీలను అక్కడి అధికారులకు అందజేయాలన్నారు. ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. -
గురువులకు ‘సర్దుబాటు’ గుబులు
● తాత్కాలిక బదిలీలతో కుటుంబాలకు ఇబ్బందులు ● నగరంలో కొత్త టీచర్లకు చుక్కలు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వం చేపట్టిన తాత్కాలిక ఉపాధ్యాయుల సర్దుబాటు పలువురు ఉపాధ్యాయుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉరవకొండ హిందీ టీచర్ ఎ. వేదావతి తన 27 ఏళ్ల మేధో వైకల్యంతో ఉన్న కుమార్తెను చూసుకోవాల్సిన పరిస్థితిని వివరిస్తూ సోమవారం డీఈఓ శ్రీనివాసరావు ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు 2025 డీఎస్సీ ద్వారా నియమితులైన ఎస్జీటీలు తమను ఏడాది పాటు ఒకచోట పనిచేయించి, ఇప్పుడు దూర ప్రాంతాలకు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుమార్తెను ఎవరు చూసుకుంటారు? ఉరవకొండ పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఎ.వేదావతిని మండలంలోని వెలిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. తన 27 ఏళ్ల మేధో వైకల్యంతో ఉన్న కుమార్తెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలకు ఆమెను వెంట తీసుకెళ్తున్నానని, కొత్త పాఠశాలకు ప్రయాణ సౌకర్యం కూడా లేదని డీఈఓ శ్రీనివాసరావును కలిసి విన్నవించారు. తనను ప్రస్తుత పాఠశాలలోనే కొనసాగించాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన డీఈఓ, ప్రభుత్వ నిబంధనల మేరకే సర్దుబాట్లు జరిగాయని, సమస్యను ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొత్త టీచర్లకు చుక్కలు 2025 డీఎస్సీ ద్వారా ఎంపికై న ఎస్జీటీలను కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఏడాది పాటు బోధనకు వినియోగించుకున్న అధికారులు, ఇప్పుడు తాత్కాలిక సర్దుబాటు పేరిట కదిరి, గోరంట్ల, రాయదుర్గం, శెట్టూరు, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి తదితర ప్రాంతాలకు పంపడం కొత్త టీచర్లలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఖాళీలు లేవని తెలిసినా కార్పొరేషన్ పాఠశాలల్లో ఏడాది పాటు సేవలు వినియోగించుకున్న అధికారులు, ఇప్పుడు అర్హత లేదంటూ ఇతర పాఠశాలలకు పంపడం అన్యాయమని టీచర్లు వాపోతున్నారు. నగరంలోనే 30 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో 6, 7 తరగతుల బోధనకు తమ సేవలను వినియోగించుకోవచ్చంటున్నారు. ర్యాంకు రావడమే శాపమైంది కార్పొరేషన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల నగరంలోనే ఉద్యోగం కొనసాగుతుందనే ఆశతో ఎంపిక చేసుకున్నామని, అప్పుడే వాస్తవ ఖాళీలు చూపించి ఉంటే ఇతర మేనేజ్మెంట్ పాఠశాలల్లో మంచి అవకాశం లభించేదని కొత్త టీచర్లు వాపోతున్నారు. ‘ర్యాంకు రావడమే మా తప్పా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది అన్యాయం -
కష్టాల్లో మత్స్యకారులు
పునరుత్పత్తి దశ కావడంతో చేపల వేటపై జిల్లాలోనూ నిషేధం కొనసాగుతోంది. అయితే రెండు నెలల పాటు ఉపాధిని కోల్పోతుండటంతో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న రోజుల్లో పరిహారం ఇచ్చి ఆదుకోగా... ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిపై కరుణ చూపడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయకపోవడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం: చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో జిల్లాలోని పలు జలాశయాల్లో మత్స్య వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నెల 1 నుంచి ఆగస్టు 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్లలో దిగొద్దని జాలర్లకు మత్స్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు. బీటీపీ, ఎంపీడ్యాంలోకి 24 లక్షల చేపలు జిల్లాలో లైసెన్స్ కలిగిన రిజర్వాయర్లు బీటీపీ, ఎంపీడ్యాంలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీటీపీలో 12 లక్షలు, ఎంపీడ్యాంలో 12 లక్షలు కట్ల, రోహు, మృగ్యాల రకం చేప పిల్లలు వంద శాతం రాయితీతో విడుదల చేశారు. ప్రస్తుతం ఒక్కో చేప కిలో నుంచి ఐదు కిలోల వరకు దిగుబడి వచ్చాయి. ఒక్కో రిజర్వాయర్లో 3 లక్షల కేజీలకు తక్కువ కాకుండా 6 లక్షల దిగుబడి రానుంది. కిలో రూ.100తో లెక్కిస్తే రూ.6 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ రెండు రిజర్వాయర్ల పరిధిలో 350 మంది లైసెన్స్ మత్స్యకార సంఘాలు ఉన్నాయి. వచ్చే ఆదాయాన్ని సమానంగా పంచుకుంటారు. 56 మత్స్య సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా 56 మత్స్య సహకార సంఘాలు, 4,300 సభ్యులు అధికారికంగా, 5,700 మంది అనధికారికంగా ఉంటారు. 99 మైనర్ ఇరిగేషన్ చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. వర్షం నీరు చేరే ఆధారంగా పెంపకం చేపడతారు. గతేడాది సుమారు 22 చెరువుల్లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 2.69 లక్షల చేప పిల్లలు 40 శాతం రాయితీతో విడుదల చేశారు. అక్కడ కూడా రూ.2.69 కోట్లు ఆదాయం రానుంది. వేట నిషేధిత సమయంలో వలలు విసిరితే సంతానోత్పత్తితో పాటు దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అండగా.. చేపల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్రులు రెండు నెలల పాటు ఉపాధి కోల్పోతున్నారు. పైసా ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేట విరామ సమయంలో జాలర్ల కుటుంబాలకు అండగా నిలిచారు. అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి కోస్తా ప్రాంతాల్లో రూ.10 వేల భృతి ఇచ్చారు. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపలు పట్టే వారికి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా ఆర్థిక సహాయం చేశారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు పైసా కూడా ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంతానోత్పత్తి సమయం కావడంతో ఈ నెల 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపలు పట్టడంపై నిషేధం విధించాం. ఈ నిబంధనలను ప్రతి జాలరు పాటించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే లైసెన్స్ మత్స్యకారులకు నోటీసులు జారీ చేశాం. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాం. ఉత్పత్తి పెరిగితే మత్స్యకారులకే ఆదాయం. అందరూ సహకరించాలి. – లక్ష్మీనారాయణ, ఎఫ్డీఓ, ఎంపీడ్యాం చేపల వేటపై కొనసాగుతున్న నిషేధం రెండు నెలలు ఆదాయం ఉండదంటున్న మత్స్యకారులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిహారమిచ్చి అండగా నిలిచిన వైనం వారి బాధలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
మా ఊరి వార్తలు రాస్తే ఇబ్బంది పడతావ్
● ‘సాక్షి’ విలేకరికి గొంచిరెడ్డిపల్లి టీడీపీ నేతల బెదిరింపులు బ్రహ్మసముద్రం: ‘మా గ్రామం వార్తలు రాస్తే ఇబ్బంది పడతావ్... మేం గ్రామంలో 8 మంది టీడీపీ నాయకులు ఉన్నాం. గొంచిరెడ్డిపల్లిలో ఏం జరిగినా మమ్మల్ని అడిగే వార్తలు రాయాలి. లేదంటే మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. మా ఊరి సమస్యలు నీకు అనవసరం. మా గ్రామంలో మేం ఏం చెబితే.. అదే జరుగుతుంది. మా ప్రభుత్వంలో మా ఊరి వార్తలు రాయడం కానీ మా ఊరికి రావడం చేస్తే బాగుండదు’ అంటూ టీడీపీ నేతలు మల్లికార్జున, గంగయ్య ‘సాక్షి’ విలేకరిని సోమవారం ఫోన్లో బెదిరించారు. ‘అమ్ముకుంటాం.. అడిగేవారెవరు’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’ లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లు కనిపించడం లేదన్న కథనం రావడం వారికి మింగుడు పడలేదు. దీంతో బెదిరింపుల పర్వానికి దిగారు. పేలిన ట్రాక్టర్ టైరు ● పెన్నానది బ్రిడ్జిపై తప్పిన పెను ప్రమాదం తాడిపత్రి టౌన్: పట్టణంలోని పెన్నానది బిడ్జిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. కర్నూల్ జిల్లా కొలిమిగుండ్ల మండలం కొండమీదపల్లికి చెందిన ట్రాక్టర్ నాపరాళ్ల బండలతో చుక్కలూరు గ్రామం వైపు నుంచి తాడిపత్రి పట్టణంలోకి వస్తోంది. అయితే పెన్నానది బిడ్జిపై ట్రాక్టర్ టైర్ ఒక్కసారిగా పేలడంతో ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో డ్రైవర్ సూరి ట్రాక్టర్పై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. అయితే ట్రాక్టర్ బ్రిడ్జి సేఫ్టీవాల్ను ధ్వంసం చేసుకుంటూ నది వైపు దూసుకెళ్లింది. ట్రాక్టర్ ట్రాలీలో అధిక లోడు ఉండటంతో ట్రాలీ రోడ్డు పైనే నిలిచిపోగా ట్రాక్టర్ ఇంజన్ బ్రిడ్జి పై నుంచి నదిలో వేలాడింది. ఈ సంఘటనతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రద్దీ రోడ్డు కావడంతో ఆ సమయంలో ఏదైనా వాహనం వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం చోటు చేసుకునేదని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి బొమ్మనహాళ్: మండలంలోని ఉప్పరహాళ్లో బోయ హనుమంతరెడ్డి (52) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ నబీరసూల్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ హనుమంతరెడ్డి, నాగమ్మ దంపతులు. వీరికి నరేష్, రామాంజి అనే ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ వారు జీవనం సాగించేవారు. మృతుడు బోయ హనుమంతరెడ్డి చికెన్ షాక్లో పనిచేసేవాడు. అయితే మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై తరచూ మద్యం కోసం డబ్బులు అడుగుతూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఆదివారం సాయంత్రం మద్యం కోసం డబ్బులు అడిగిన సందర్భంలో భార్య నాగమ్మ, కుమారుడు రామాంజితో వాగ్వాదం జరిగింది. రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన హనుమంతరెడ్డి ఇంటి పక్కనున్న గుడిసెలో తన పంచతో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితి మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ‘ఫాదర్’ పెద్ద కుటుంబాన్నిచ్చి వెళ్లారు ● ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ శెట్టూరు: తన తండ్రి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాలో అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముచ్చర్లపల్లిలో దళితులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ దేశంలోని పేద ప్రజల బాగోగుల కోసం పోరాడారని, అనంతపురం జిల్లాలో పేదలకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అండగా నిలబడ్డారన్నారు. ఇద్దరి విగ్రహాలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు అంబేడ్కర్ యూత్ సంఘం సభ్యులు, అధ్యక్షుడు దేవరాజు, ఉపాధ్యక్షుడు ధర్మశీల, కోశాధికారి బొజ్జప్ప, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎమ్మెస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉదిరిపికొండలోని రెండిళ్లలో చోరీ
● పదుకొండున్నర తులాల బంగారు, రూ.64 వేల నగదు అపహరణ కూడేరు: తాళం వేసిన రెండిళ్లలో దొంగలు చొరబడి పదుకొండున్నర తులాల బంగారం, రూ.64 వేల నగదును ఎత్తుకెళ్లిన ఘటన కూడేరు మండలం ఉదిరిపికొండలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. ఉదిరిపికొండలో శర్మాస్ వలి కుటుంబం శుక్రవారం ఇంటికి తాళం వేసి అనంతపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అలాగే పక్కనే ఉన్న నూర్బాషా కుటుంబం కూడా శనివారం ఇంటికి తాళం వేసి గుంతకల్లులో జరుగుతున్న మస్తానయ్య ఉరుసుకు వెళ్లారు. ఆ ఇళ్లలో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఆదివారం రాత్రి దొంగతనాలకు తెగబడ్డారు. అయితే ముందుగా ఆయా ఇళ్లకు సమీపంలో ఉన్న మూడిళ్లకు చెందిన వారు శబ్ధాలకు బయటకు రాకుండా వారిళ్లకు కూడా ముందు గడియపెట్టారు. ఆ తర్వాత శర్మస్, నూర్బాషా ఇళ్ల తాళాలను కట్టర్తో కట్ చేసి లోపలికి వెళ్లారు. శర్మాస్ వలి ఇంట్లోని బీరువాలో దాచిన 10 తులాల బంగారం, రూ.10 వేలు నగదు, నూర్బాషా ఇంట్లో ఒకటిన్నర తులం బంగారం, రూ.64 వేలు నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాధ్యతగా పని చేయండి
అనంతపురం న్యూటౌన్: విధి నిర్వహణలో బాధ్యతలెరిగి పనిచేసి, ప్రజా మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.విజయలక్ష్మి సూచించారు. జెడ్పీ చాంబర్లో సోమవారం జిల్లాకు కొత్తగా వచ్చిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు (డీడీఓ) గోరంట్ల నాగ శేషాచలారెడ్డి, షేక్ అమానుల్లా .. సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జునను మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త డీడీఓలనుద్దేశించి సీఈఓ మాట్లాడుతూ జిల్లా ప్రజలతో మమేకమై జిల్లా అఽబివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. జీఎన్ఎస్ రెడ్డి గుంతకల్లు డీడీఓగా బాధ్యలు చేపట్టనున్నారు. కళ్యాణదుర్గం డీడీఓగా నియమితులైన షేక్ అమానుల్లా కర్నూల్ జిల్లా గోస్పాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేశారు. డీడీఓగా ప్రమోషన్పై అనంతపురం జిల్లాకు బదలీ అయ్యారు. -
ఇరువర్గాల ఘర్షణ
● ఆరుగురికి గాయాలు శింగనమల: మండలంలోని సీ.బండమీదపల్లిలో టీడీపీకి చెందిన ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో ఆరుగురు గాయపడిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఆదివారం గ్రామంలో జరిగిన పీర్ల పండుగలో ఆదిశేఖర్, శ్రీకాంత్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే సోమవారం ఇరువర్గాలకు చెందిన వారు కట్టెలు, కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆదిశేఖర్, అక్కులప్ప, బయ్యన్న, శ్రీకాంత్, అరుణకుమార్, ఆదినారాయణ తీవ్రంగా గాయపడగా వారిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలతో ఘర్షణపై విచారణ చేపట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పుట్లూరు: మండలంలోని ఏ.కొండాపురం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిరంజన్ (20) మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. పుట్లూరు మండలం అరకటివేములకు చెందిన మీసాల నాగేంద్ర కుమారుడు నిరంజన్ పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె గ్రామానికి వెళ్లి కారులో తిరిగి బయలుదేరారు. అయితే ఏ. కొండాపురం వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిరంజన్ను వెంటనే తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గాలివేగం పెరిగింది. ఉక్కపోత కొనసాగింది.
అనంతలో దారుణం ● తాగుడుకు బానిసైన కుమారుణ్ని కడతేర్చిన తల్లి అనంతపురం సెంట్రల్: అనంతపురంలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసైన కుమారుడితో విసిగి వేజారిన ఓ తల్లి కత్తెరతో పొడిచి చంపింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం అనంతపురం నగరంలోని మొదటిరోడ్డు శివాలయం సమీపంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీత, బ్రహ్మయ్య ఆచారి దంపతులు ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కొంతకాలంగా మొదటిరోడ్డు శివాలయం సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు సురేంద్రచారి(28) ఉన్నాడు. వీరి కుటుంబం కార్పెంటర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తోంది. అయితే.. అవివాహితుడైన సురేంద్రచారి కొన్నేళ్లుగా తాగుడుకు బానిసయ్యాడు. పనికి వెళ్లకుండా మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలంటూ నిత్యం తల్లిదండ్రులపై దాడి చేస్తూ వేధించేవాడు. సోమవారం సాయంత్రం తల్లి సునీతతో గొడవ పెట్టుకున్నాడు. పలు దఫాలు దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సునీత అక్కడే ఉన్న దుస్తులు కత్తిరించే కత్తెరతో పొడిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసుస్టేషన్ ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శరత్చంద్ర, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సురేంద్రచారి, ఘటనాస్థలిలో పోలీసులు -
టీడీపీ మద్దతుదారులా.. అయితే ఓకే!
● ఉరవకొండ నియోజకవర్గంలో బీఎల్ఓలు, టీడీపీ బీఎల్ఏల ఇష్టారాజ్యం ● శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లినా ఓట్లు తొలగించని వైనం ఉరవకొండ: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను అధికార టీడీపీ అపహాస్యం చేస్తోంది. ప్రజాతీర్పును ఎదుర్కొనే ధైర్యం లేక కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఓ వైపు అక్రమంగా తొలగిస్తూనే.. మరో వైపు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి, ఆ ప్రాంతంలోనే ఓటు వేస్తున్న టీడీపీ మద్దతుదారులను మాత్రం తొలగించడం లేదు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇదే తంతు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా స్థానిక సచివాలయం–2 పరిధిలో మ్యాపింగ్ కాని ఎన్యుమరేషన్ పత్రాలకు సంబంధించి ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వీఆర్ఓపై ఒత్తిడి తెచ్చి అవి వైఎస్సార్సీపీ వారివి కావడంతో డిజిటలైజేషన్ చేయరాదనడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు వైఎస్సార్సీపీ బీఎల్ఏల ఫిర్యాదులను ఏమాత్రమూ పరిగణనలోకి తీసుకోకుండా బీఎల్ఓలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలోని కొట్టాలపల్లి, తగ్గుపర్తి, కోనాపురంతో పాటు మంత్రి కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన పలువురు చాలా ఏళ్ల క్రితమే ఇతర దేశాలు, ప్రాంతాలకు వలస వెళ్లినా ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదని తెలిసింది. అర్హులు కాకపోయినా 500కు పైగా టీడీపీ మద్దతుదారుల ఓట్లు ముఖ్యంగా మంత్రి సామాజికవర్గానికి చెందిన వారి ఓట్లను అలానే ఉంచినట్లు సమాచారం. ఈ విషయంపై వైఎస్సార్సీపీ బీఎల్ఏలు ఈఆర్ఓతో పాటు మండల అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకాన్ని కోల్పోవడంతోనే ‘సర్’ మాటున కుతంత్రాలకు పాల్పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మార్కెట్యార్డులో ‘దగ్గుపాటి రాజకీయం’
అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డు చైర్పర్సన్ బల్లా పల్లవిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యే సిఫారసుతోనే చైర్పర్సన్ పదవి దక్కించుకున్న ‘బల్లా’ నెల రోజులు తిరగకనే ఆయనతో విభేదించారు. దీంతో నాలుగు నెలలుగా వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. గత జనవరి 8న చైర్మన్గా బల్లా పల్లవి, వైస్ చైర్మన్గా హర్షదుల్లాతో పాటు మరో 13 మంది డైరెక్టర్లతో పాలకవర్గం కొలువుదీరింది. 13 మంది డైరెక్టర్లలో ఇరువురు జనసేన, ఒకరు బీజేపీ కాగా మిగతావారు టీడీపీకి చెందిన వారున్నారు. చైర్పర్సన్గా బల్లా పల్లవి తీసుకుంటున్న నిర్ణయాలు, వైస్చైర్మన్, డైరెక్టర్లను పట్టించుకోకపోవడంతో పదవి నుంచి ఎలాగైనా దించాలని ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యార్డులో టెండర్లు, వేయింగ్ కాటా,క్యాంటీన్ నిర్వహణ,కమీషన్ల వ్యవహారం, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో చైర్పర్సన్ భర్త బల్లా సురేష్కు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్రస్థాయిలోనే వాదోపవాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నెలన్నర కిందట వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎమ్మెల్యే పిలిపించుకుని చైర్పర్సన్కు వ్యతిరేకంగా సంతకాలు తీసుకుని పార్టీ అధిష్టానానికి పంపారన్న ప్రచారం జరుగుతోంది. సమావేశానికి గైర్హాజరు మార్కెట్ కమిటీ సాధారణ సమావేశాలు మూడు సార్లు కోరం లేక వాయిదా పడితే పాలకవర్గం రద్దుకు సిఫారసు చేయవచ్చని తెలుస్తోంది. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ కె.గోవిందు ప్రకటించారు. సమావేశానికి చైర్పర్సన్ బల్లా పల్లవి మాత్రమే హాజరయ్యారు. గంట పాటు ఎదురుచూసినా వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్లు ఎవరూ రాలేదు. దీంతో కోరం లేక వాయిదా వేస్తున్నామని, త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సెక్రటరీ ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే వచ్చే వారం నిర్వహించే సమావేశానికి కూడా ఎవరూ హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అలా మూడో సమావేశం కూడా వాయిదా పడితే ఏం చేయాలనే దానిపై మార్కెట్ కమిటీ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించే పనిలో పడ్డారు. మరోపక్క చైర్పర్సన్ బల్లా పల్లవి తగ్గేదేలే.. అంటూ తన దూకుడును కొనసాగిస్తున్నారు. సమావేశానికి వైస్చైర్మన్, డైరెక్టర్లు గైర్హాజరైన విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కమిటీ సమావేశానికి చైర్పర్సన్ బల్లా మినహా మిగతావారు గైర్హాజరు కోరం లేక వాయిదా వేసినట్లు సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ గోవిందు వెల్లడి -
ట్రాక్టర్ ప్రత్యక్షం
బ్రహ్మసముద్రం: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మంజూరు చేసిన స్వచ్ఛభారత్ ట్రాక్టర్లను సొంతానికి వాడుకోవడమే కాకుండా అమ్మేసిన తీరుపై ‘అమ్ముకుంటాం అడిగేవారెవరు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం బ్రహ్మసముద్రం మండలంలో చర్చనీయాంశమైంది. టీడీపీ నాయకుల్లో టెన్షన్ పుట్టించింది. ‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్న’ చందంగా పిల్లలపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నేత ట్రాక్టర్ తన ఇంటి వద్దే ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. ఇన్ని రోజులు గ్రామంలో కనిపించకుండా పోయిన ట్రాక్టర్ ఉన్నట్లుండి ప్రత్యక్షం కావడం వెనుక ఆంతర్యం ఏమిటోనంటూ పలువురు ప్రశ్నించారు. సంతేకొండాపురం గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ కూడా వీలైనంత త్వరగా ప్రత్యక్షం కావాలని కోరుకున్నారు. అయినా, గ్రామ సచివాలయం ఆవరణంలో ఉండాల్సిన పంచాయతీ ట్రాక్టర్ను ఇలా ఇళ్ల వద్ద ఉంచుకోవడం తగదని, అధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. 1.57 లక్షల హెక్టార్లలో ‘ప్రత్యామ్నాయం’ ● 24,168 క్వింటాళ్లతో ప్రతిపాదనలు అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ సాగు తగ్గిపోవడంతో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెలాఖరుకు 1.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1.57 లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి 24.168 క్వింటాళ్లు అవసరమని నివేదించారు. అత్యధికంగా ఉలవలు 10,215 క్వింటాళ్లు, కందులు 5,565, పెసలు 2,670, జొన్నలు 2,620, అలసందలు 2,206, ఆముదం 496, కొర్రలు 486 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు. జిల్లా వైద్యాధికారిగా కట్టా వెంకటేశ్వర్లు అనంతపురం సిటీ: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ)గా డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు సీహెచ్సీ వైద్యాధికారిగా ఉన్న ఈయన్ను డీఎంహెచ్ఓగా ఇక్కడికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో పనిచేస్తున్న డాక్టర్ ఈ.భ్రమరాంబదేవి వైఎస్సార్ కడప జిల్లా సూపర్ స్పెషాలిటీ సీఎస్ ఆర్ఎంఓగా బదిలీ అయ్యారు. అలాగే అనంతపురం జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓగా తిరుపతి జిల్లా తడా పీహెచ్సీ డాక్టర్ ఓ. శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. నిరంకుశత్వంపై నిరసన యాడికి: మండలంలోని నిట్టూరు గ్రామంలో వీబీజీ–రామ్జీ పథకం క్షేత్ర సహాయకుడు రంగస్వామి సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు కూలీలకు పనులు కల్పించని ఎంపీడీఓ, ఏపీఓలే తనను నిరంకుశంగా విధుల నుంచి తప్పించారని ఆరోపించాడు. కుట్ర పూరితంగా వ్యవహరించి తన కుటుంబాన్ని రోడ్డున పడేటట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో పత్రాలు, రికార్డులు పట్టుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. తనను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. -
ఓటుండాలంటే త్వరపడాల్సిందే!
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో (ఎస్ఐఆర్) తొలి అంకమైన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 18.13 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్) డిజిటలైజేషన్ చేశారు. ఇంకా ఈఎఫ్ ఇవ్వని వారు వెంటనే వాటిని బీఎల్ఓకి సమర్పించాలి. అలా ఇవ్వని పక్షంలో వారి ఓటు ఈనెల 21న ప్రచురించనున్న ముసాయిదా ఓటరు జాబితాలో ఉండదు. ● ఓటర్లకు ఎన్యుమరేషన్ పారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియ గత నెల 15న ప్రారంభించారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా 20,38,522 (100శాతం) మందికి ఈఎఫ్లు అందజేశారు. సోమవారం నాటికి 18,13,030 ఈఎఫ్లు (88.94 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 2,25,492 ఈఎఫ్లు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. వెనక్కి తీసుకోని ఈఎఫ్లు 1.92 లక్షలు జిల్లావ్యాప్తంగా 20,38,522 మంది ఓటర్లకు ఈఎఫ్లు అందించగా, ఇప్పటి వరకు 1,92,773 ఈఎఫ్లను ఓటర్ల నుంచి వెనక్కి తీసుకోలేదు. ఓటర్లు తమ ఈఎఫ్ను బీఎల్ఓలకు సమర్పించేందుకు, బీఎల్ఓలు వాటిని డిజిటలైజేషన్ చేసేందుకు మంగళవారం చివరి రోజైన నేపథ్యంలో ఓటర్లు త్వరపడాల్సిందే. ఓటరు తనకు సంబంధించిన 2002 నాటి వివరాలు అందించడం తప్పనిసరి కాదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరాలు లేవనే కారణంతో ఈఎఫ్ను ఓటర్లు తమ వద్ద ఉంచుకోకుండా ఉన్న సమా చారం పూరించి బీఎల్ఓకు అందజేయాల్సి ఉంది. -
పేదల ఉపాధిపైకి జేసీబీలు
అనంతపురం క్రైం: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట రోడ్డుకు ఇరువైపులా ఏళ్లుగా నిర్వహించుకుంటున్న చిరు వ్యాపారాలను ట్రాఫిక్ సమస్య పేరిట నగర పాలక సంస్థ అధికారులు సోమవారం తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఒక్కసారిగా షాపులు తొలగించడంతో తమ కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమైందని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా కొందరు చిరు వ్యాపారులు అధికార పార్టీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కావాలనే మా దుకాణాలను ఇక్కడి నుంచి తొలగింపజేశారు. మా కడుపులు కొట్టిన తను మట్టి కొట్టుకుపోతాడు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. ఇక్కడ కొన్నేళ్లుగా చాలామంది తోపుడుబండ్లు, తాత్కాలిక షెడ్లు, వాహనాల్లో హోటళ్లు, ఇతరత్రా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులతో పాటు నగర వాసులకూ ఇవి ఉపయుక్తంగా ఉండేవి. వీటిని నిర్వహిస్తున్న వారిలో చాలామంది పేదలే. 30–40 ఏళ్లుగా వీటిపైనే ఆధారపడి బతుకుతున్న వారూ ఉన్నారు. ఇలాంటి వారి పట్ల ఏమాత్రమూ కరుణ చూపకుండా జేసీబీలను తెచ్చి మొత్తం కూల్చేశారు. బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నా, శాపనార్థాలు పెడుతున్నా లెక్క చేయలేదు. తమ దుకాణాలు తొలగించి అధికార పార్టీ వారు షాపులు ఏర్పాటు చేసుకోవాలన్న కుట్రతోనే ఇలా చేస్తున్నారని, దీని వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. ఎక్కడ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయో అక్కడ తిష్టవేయడం, వ్యాపారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం ఎమ్మెల్యేకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. అనంతపురం సర్వజనాస్పత్రి ఎదుట చిరు వ్యాపారాల తొలగింపు ఎమ్మెల్యే దగ్గుపాటి ఇలా చేయించారంటూ బాధితుల ఆవేదన -
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు
పెద్దవడుగూరు: టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. గార్లదిన్నెలోని ఆయన స్వగృహంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దని .. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. వారి వెంట మండల కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి, వాల్మీకి సజ్జలదిన్నె రాజు తదితరులు పాల్గొన్నారు. -
15న ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారానికి బదులుగా ఈ నెల 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 14 తేదీతో ముగుస్తుందని, ఈ ప్రక్రియలో చివరి దశ 13, 14 తేదీలు చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ రెండు రోజులు అధికారులు, సిబ్బంది పూర్తిగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో 13న నిర్వహించాల్సిన పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ను 15వ తేదీన ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు 89777 16661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ సర్వీస్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని పేర్కొన్నారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. వినియోగదారులు 08554– 272943, 91547 90350 నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. 15 నుంచి క్రీడా వేడుకలు అనంతపురం టౌన్: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి ఆగస్టు 25 వరకు క్రీడా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు క్రీడా ప్రాధికార సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లాస్థాయి పోటీలు, ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా దినోత్సవంలో భాగంగా వివిధ రకాల అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా, బాక్సింగ్ తదితర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు www.sports.ap. gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
అటవీ శాఖ సిబ్బంది దౌర్జన్యం
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం అటవీ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన నగరవనం పార్కును పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ బాధ్యతలను విస్మరించి సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో నగరవనానికి వందలాది మంది సందర్శకులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అయితే నిర్దేశిత సమయం కంటే ముందే అటవీ శాఖ సిబ్బంది టికెట్ కౌంటర్ను మూసేశారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి పిల్లలతో కలిసి వచ్చిన సందర్శకులు తీవ్ర నిరాశ చెందారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం..అధికారులు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వందలాది మంది నగరవనం బయటే పడిగాపులు కాశారు. రోజుకు రెండు వేల టికెట్లు మాత్రమే ఇస్తామని అటవీ శాఖ సిబ్బంది చెప్పడంతో మిగిలినవారు నిరాశతో వెనుదిరిగారు. సందర్శకులపై దూషణలు ముందస్తుగానే టికెట్లు ఎందుకు క్లోజ్ చేశారంటూ ప్రశ్నించిన యువకులపై అటవీ శాఖ సిబ్బంది నోరు పారేసుకున్నారు. బూతు పురాణం అందుకోవడమే కాకుండా ‘వీడియో కాకపోతే ఏమైనా రికార్డు చేసుకో..ఎవ్వరికి పంపుతావో పంపుకో..భయపడేది లేదు..మీకు చేతనైంది చేసుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో బీట్ ఆఫీసర్ నాగే నాయక్ తన ప్యాంట్ బెల్టు ఊడదీసి సందర్శకులను కొట్టేందుకు వెళ్లారు. ఆయన తీరుపై సందర్శకులు మండిపడ్డారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందర్శకులపై దుర్భాషలు వీడియో కాకపోతే చేతనైంది చేసుకోండంటూ యువకులపై దౌర్జన్యం బెల్టు పట్టుకుని సందర్శకులను భయపెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనుమతి లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన వందలాది మంది -
టీబీ డ్యాంలో 23 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం 44,782 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో.. ఆదివారం నాటికి 25,120 క్యూసెక్కులకు తగ్గింది. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1633 అడుగులకు గాను 1601.08 అడుగుల మేర నీటిమట్టం ఉంది. డ్యాం నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను 23 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 25,120 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 381 క్యూసెక్కులుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1625.13 అడుగులతో 76.91 టీఎంసీల నీరు నిల్వ ఉండి.. 46,579 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 36,026 క్యూసక్కుల నీటిని గేట్లు ఎత్తి నదికి వదిలారు. 25,120 క్యూసెక్కుల ఇన్ఫ్లో


