breaking news
Guest Columns
-
ఎదగడానికి నాలుగు ట్రిక్కులు!
వృత్తిపరమైన ఐంద్రజాలికులు వాస్తవంగా ఉన్నవి నాలుగు రకాల ట్రిక్కులేనని చెబుతారు. అవి: ఒక రూపాన్ని మన కళ్ళకు కట్టించడం; దేన్నయినా అదృశ్యం చేయడం; రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం; చివరగా ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం. ఈ నాలుగింటినీ జీవితానికి అన్వయించుకుంటే మనమూ ఎదుటివారిని ఆశ్చర్యచకితులను చేయగలం. ఎలాగంటారా... మొదటి ట్రిక్కు: మన ఉనికిని చాటుకోవడమంటే, భౌతికంగా ఆకర్షణీయంగా కనిపించడమే కాదు; మనల్ని మనం అత్యుత్తమమైన రీతిలో ప్రదర్శించుకోవడం! మనం ఊసరవెల్లి లాంటివాళ్ళం. తల్లితండ్రుల ముందు ఒకలా, స్నేహితుల వద్ద మరోలా ప్రవర్తిస్తాం. కానీ, ఈ బాహ్యమైన నేను కాకుండా ‘లోపల మరో నేను’ ఉంటాడు. మన అసలు స్వరూపం అదే! మనకు ఇష్టమైన వ్యాపకంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరింపజేసేది వాడే! మనం అరమరికలు లేకుండా ఎవరి వద్ద వ్యవహరించగలమో, ఎవరు మన ‘లోపలి మనిషి’ని అభినందించగలుగుతారో అలాంటి వాళ్ళ వద్దనే ఆ ‘లోపలి మనిషి’ బయటపడతాడు. మిషిగన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, బోస్టన్లో మొదటి ఉద్యోగంలో చేరాను. అక్కడి బాస్ నన్ను తీర్చిదిద్దుతానన్నాడు. నేనెంతో సంతోషపడ్డాను. తీరా, నేను ఉద్యోగంలో చేరేందుకు వెళ్ళేటప్పటికి, ఆయన కాస్తా ఉద్యోగం వదలి వెళ్ళిపోయారు. నా పని అయిపోయింది అనుకున్నాను.తిరస్కరణతో... జీవితం తలకిందులవదు!‘‘ఈ ఏడాది ఏం చేయబోతున్నానో ‘నాకు లోపల’ తెలిసి పోతోంది. నా కష్టాలు, కన్నీళ్ళతోనే ఓ నవల రాస్తా’’నని నా స్నేహి తురాలితో చెప్పాను. అందుకామె నవ్వలేదు. ‘బ్రహ్మాండం. అదే పనిలో ఉండు’ అంది. ఆమె నా లోపలి మనిషిని గుర్తించి అతడి సత్తాపై నమ్మకం ఉంచిందన్నమాట. అలా వెన్ను తట్టేవారు మన అమ్మ, నాన్న, తాత, బామ్మ ఎవరైనా కావచ్చు. అటువంటి బేషరతు మద్దతు లభించినపుడు మనలోని నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. అందుకని, ఇపుడు మీ స్నేహితులను అంటిపెట్టుకుని ఉండండి. వారి ప్రేమ, నమ్మకం ముందుకు నడిపిస్తాయి. నేనా పుస్తకాన్ని పూర్తి చేసి, ప్రచురణకు అభ్యర్థిస్తూ పంపిస్తే, ప్రచురించలేమంటూ 24 ఉత్తరాలొచ్చాయి. ప్రచురణకర్తలు ఉన్నది 20 మందే! అంటే, కొందరు రెండుసార్లు తిరస్కరించారన్నమాట. వాళ్లకు ఆ పుస్తకం నచ్చకపోతే మరో పుస్తకం రాస్తానని అను కున్నాను. అదీ నచ్చకపోతే ఇంకోటి రాస్తానని ధైర్యం చెప్పు కున్నాను. ఆ తదుపరి పుస్తకం ప్రచురణకు నోచుకుంది. భయాన్ని బలంగా మలచుకోండి!మనం అదృశ్యం చేయాల్సింది భయాన్ని! ఇదే రెండో ట్రిక్కు. హైస్కూలులో ఉండగా, ఓ చోట ఐస్క్రీమ్ అందించే ఉద్యోగం చేశాను. ఒకావిడ వచ్చి ఐస్క్రీమ్ ఆర్డరు చేసింది. ఒక్క క్షణంలో ఇస్తానన్నాను. ఈ క్షణంలోనే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కానీ నేను బెదిరిపోలేదు. దాంతో ఈ దిక్కుమాలిన షాపులో జీవితాంతం గడుపుతావంటూ తిట్టిపోసింది. నిజం ఒప్పుకొని తీరాలి. నేను కలవరపడిన మాట వాస్తవం. కానీ, ఆ మహిళ నాలో రేకెత్తించిన భయం నాలో కసిని పెంచింది. కనుక, భయాన్ని పారదోలండి. భయం ఏదో చెరుపు చేస్తుందని కాదు. భయాన్ని ప్రేరణగా తీసుకుని ప్రయోజనం పొందే ప్రయత్నం చేయండి. ఒకరు తక్కువ అంచనా వేసినంత మాత్రాన కుంగిపోనవసరం లేదు. నిశ్శబ్దంగానే మీ విషయంలో వారి అంచనాలు తప్పు అని నిరూపించండి. దయాగుణంతో విప్లవం తేవచ్చు!రెండు వస్తువుల ప్రదేశాలను తారుమారు చేయడం ఇంద్ర జాలంలో మూడవ ట్రిక్కు అనుకున్నాం కదా! ఇక్కడ సహానుభూతి గురించి చెప్పుకోవాలి. ఇతరుల కష్టాలను వారి దృక్కోణం నుంచి చూడటం అలవరచుకోవాలి. నాకు 13 ఏళ్ళపుడు మా నాన్న ఉద్యోగం పోయింది. దాంతో మేం బ్రూక్లిన్ నుంచి మయామీకి మకాం మార్చాం. అక్కడ మా తాత, నాయనమ్మ ఉన్నారు. అమ్మ, నాన్న, చెల్లి, నేను, ఆ పెద్దవాళ్ళు కలిసి మొత్తం ఆరుగురం కొన్ని నెలలపాటు సింగిల్ బెడ్రూమ్ అపార్టుమెంట్లోనే తలదాచు కున్నాం. ఇంతమంది ఏమిటంటూ కొందరు గొడవకు దిగారు. పొరుగునే ఉన్న మరో వాటా ఆవిడ తాను అపార్టుమెంటును ఖాళీ చేస్తున్నాననీ, పెద్దవాళ్ళు ఇద్దరూ అందులో ఉండ వచ్చనీ చెప్పి అనునయించింది. కాకతాళీయంగా ఆవిడ పేరు మెర్సీ. ఔను! పేరుకు తగ్గట్లు దయచూపిన మహాత్మురాలు. ఈ నిరాశావాద ప్రపంచంలో సిసలైన దయాగుణం గాయాలను మాన్పుతుంది. క్రూరంగా వ్యవహరించడం, విషం కక్కడం, అభిప్రా యాలతో ఏకీభవించనివారి పట్ల కరకుగా ప్రవర్తించడం మన సంస్కృతిలో భాగాలైపోయాయి. కానీ, క్రూరత్వం బలానికి రుజువు కాదు. బాధపడుతున్నవారి స్థానంలోకి మనం వెళ్ళ గలిగితే అది బలం అనిపించుకుంటుంది. ఇక్కడున్నవారిలో కొందరికి రకరకాల కష్టాలు ఉండ వచ్చు. నేటి గ్రాడ్యుయేట్లలో మా అబ్బాయి కూడా ఉన్నాడు. మా అమ్మ, నాన్న ఉండి ఉంటే, ఈ కార్యక్రమాన్ని చూసి ఎంత సంతోషించేవారో అని నాకూ అనిపిస్తోంది. జీవితంలో మున్ముందు మీకెదురయ్యే ప్రతి వ్యక్తీ మీకు పైకి కనిపించని సమస్యతో సతమత మవుతూ ఉండవచ్చు. వారి స్థానంలోకి వెళ్లి వారి గురించి ఆలోచించండి. ప్రపంచానికి మరింత సహానుభూతి, మరింత వినయ విధేయతలు, ముఖ్యంగా మానవ మర్యాదలను కనబరచడం అవసరం. మీరు నిజంగా ప్రపచాన్ని నివ్వెరపరచదలచుకుంటే, మీలోని దయా గుణాన్ని బయటకు తీయండి. మార్పు చెందుతూనే ఉండాలి!ఇంద్రజాలంలో చివరి ట్రిక్కు– ఒక వస్తువును మరో వస్తువుగా మార్చడం! అన్ని ట్రిక్కుల కన్నా ఇదే కష్టమైనది. రూపాంతరం చెందడం. చిన్నప్పుడు మనం రకరకాల రూపాలను ఇష్టపడినా, పెద్ద యిన తర్వాత, ఒక మూసలో ఒదిగిపోయేందుకు మొగ్గు చూపుతాం. ప్రపంచం పట్ల, మీపట్ల మీకొక స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. కానీ, మారకపోతే మకిలిపట్టిపోతాం. ఆశలు, ఆశయాలను సమయానుకూలంగా సవరించుకోవడంలో తప్పు లేదు. మనల్ని మించినవారు లేరనుకుంటే పప్పులో కాలేసినట్లే. తమ ఆలోచనా ధోరణిని తామే ప్రశ్నించుకుని, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని భావించే లక్షణాన్ని నేను కొందరు అత్యంత ప్రజ్ఞావంతులలో గమనించాను. నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. మారాలి. అన్నీ తెలిసిపోయాయని ఎన్నడూ అనుకోకండి. అవకాశాలు అనంతంగా ఉంటాయి. వాటిని అందుకునేందుకు సిద్ధ పడాలి అంతే! ఎక్కడెక్కడ మీ ప్రతిభా నైపుణ్యాలను కనబరచడానికి అవకాశం ఉందో వాటన్నింటినీ అన్వేషించండి. ఒకటే మార్గంలో పయనించాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న ఒక్కొక్క నైపుణ్యాన్ని ఒక్కొక్కచోట ఉపయోగించుకోవచ్చు. -
దిద్దుబాటుకు 'ఇస్రో' ఉపక్రమించాలి!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఈ ఏడాది ఆదిలోనే హంస పాదు ఎదురైంది. శ్రీహరికోట నుంచి జనవరి 12న ప్రయోగించిన పోలార్ ఉప గ్రహ వాహక నౌక (పీఎస్ఎల్వీ) విఫలమైంది. ఈ వాహక నౌక వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలతోపాటు, మన దేశానికి చెందిన ఒక వ్యూహాత్మక ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టవలసి ఉంది. మిగిలిన అంతరిక్ష పరిశోధనా సంస్థల మాదిరిగానే ఇస్రో కూడా గతంలో కొన్ని వైఫల్యాలను చవి చూసింది. కానీ, కొన్ని సందర్భాల్లో అంతరిక్ష ప్రయోగాలు ఆందోళనను రేకెత్తిస్తాయి. లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన, నిశితంగా సమీక్షించుకోవలసిన అవసరాన్ని చాటుతాయి. తాజా వైఫల్యం పలు కారణాల రీత్యా ఆ కోవకు చెందినదే!పరుగెత్తని పంచకల్యాణిపీఎస్ఎల్వీకి 63 సార్లు విజయం సాధించిన ఘన చరిత్ర ఉంది. చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయాలు దాని ఖాతాలోకే వస్తాయి. దాన్ని తమ పంచకల్యాణి గుర్రంగా ఇస్రో చెప్పుకొంటుంది. ఒకటి రెండు వైఫల్యాలు లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేనివిగానే కనిపించవచ్చు. కానీ, పీఎస్ఎల్వీకి ఇది వరుసగా రెండో వైఫల్యం. గతేడాది మే 18న ప్రయోగించిన దానికి కూడా ఇదే గతి పట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ రాకెట్ మూడవ దశలోనే లోపం తలెత్తింది. గత (2025) ప్రహసనం ఆధారంగా ఈసారి ఏమైనా మార్పులు చేసిందీ లేనిదీ ఇస్రో వెల్లడించలేదు. వైఫల్యాలను కూలంకషంగా విశ్లేషించుకునే బలమైన వ్యవస్థ ఇస్రోకు ఉంది. దీనికి 2021లో జియో ఉపగ్రహ వాహక నౌక (జీఎస్ఎల్వీ) వైఫల్యంపై వెల్లడైన నివేదికే ఉదాహరణ. క్రయోజనిక్ దశ జ్వలన సమయంలో దిగువ లిక్విడ్ హైడ్రోజన్ ట్యాంకులో పీడనం, ఫ్యూయల్ బూస్టర్ టర్బో పంప్ సక్రమంగా పనిచేయక పోవడానికి కారణమైందనీ, ఫలితంగా మొత్తం మిషన్ విఫలమైందనీ ఆ ఉదంతంలో తేల్చారు. కానీ, 2025 మే నాటి వైఫల్యం గురించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. పారదర్శకంగా వ్యవహరించడంలో ఇస్రోకు మంచి చరిత్రే ఉంది. అది ఆ బాట నుంచి వైదొలగుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలకమైన ఉపగ్రహాలకే ఎదురుదెబ్బవరుసగా రెండు పీఎస్ఎల్వీ వైఫల్యాలతోపాటు, గతేడాది కాలంలో, ఇస్రో మరో వైఫల్యపు అపఖ్యాతిని కూడా మూట గట్టుకుంది. కానీ, అది రాకెట్ వైఫల్యం కాదు. ఉపగ్రహ వైఫల్యం! ఇస్రో 2025 జనవరి 29న చేపట్టిన జీఎస్ఎల్వీ ప్రయోగంతో శ్రీహరికోట నుంచి వంద సార్లు ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డును సృష్టించింది. ఆ వాహక నౌక ప్రయోగానంతరం, అది ఎన్విఎస్–02 నావిగేషన్ ఉపగ్రహాన్ని దానికి ఉద్దేశించిన ట్రాన్స్ఫర్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిందని ప్రకటించింది. అయితే, ఆన్బోర్డ్ థ్రస్టర్లను జ్వలింప జేసేందుకు ఆక్సిడైజర్కు వీలు కల్పించే కవాటాలు తెరుచుకోని కారణంగా, నిర్ణయించిన స్లాట్లో ఉపగ్రహం కుదురుకోలేక పోయిందని చెప్పింది. ఏడాది కాలంలో మూడు వైఫల్యాలు ఎదురవడం అటు ఇస్రోకు గానీ, ఇటు దాని దేశ, విదేశీ కస్టమర్లకు గానీ తీవ్ర పర్యవసానాలనే కలుగ జేస్తోంది. పైగా, ఈ వైఫల్యాల కారణంగా కోల్పోయిన మూడు భారతీయ ఉపగ్రహాలు కీలకమైన సైనిక ఉపగ్రహాలు. ఆశించిన కక్ష్యలో కుదురు కోలేకపోయిన ఎన్విఎస్–02 ఒక నేవి గేషన్ ఉపగ్రహం. అది స్టాండర్డ్ పొజి షనింగ్ సర్వీసులతో పాటు, ‘రిస్ట్రిక్ టెడ్ సర్వీసులను’ కూడా సమకూరు స్తుంది. గతేడాది వైఫల్యంతో ఇఓఎస్– 09 ఉపగ్రహాన్ని కోల్పోయాం. ఆపరేషనల్ అప్లికేషన్లలో ఉన్న ఏజన్సీలకు రిమోట్ సెన్సింగ్ డేటాను అందించేట్లుగా దాన్ని డిజైన్ చేశారు. దానిలో సింథటిక్ అపెర్చర్ రాడార్ ఉంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఇమేజ్లను సమకూర్చగల సామర్థ్యం ఆ పేలోడ్కు ఉంది. రక్షణ పరిశోధన ఏజన్సీలు అభివృద్ధి చేసిన ఇఓఎస్ –ఎన్1 (అన్వేషగా పిలుస్తున్నారు) భూ పరిశీలనా ఉపగ్రహాన్ని ఈ జనవరిలో ప్రయోగించిన పోలార్ వాహక నౌకలో అమర్చారు. అంతరిక్షం నుంచి సైన్యానికి ఉపయోగపడగలిగిన మూడు వ్యూహాత్మక ఆస్తులను కోల్పోవడం అంతరిక్ష, రక్షణ ఏజన్సీలకు మేలుకొలుపు కావాలి. అంతరిక్షం నుంచి సైన్యం ప్రయోజనాలను తీర్చగలిగిన దాదాపు 52 ఉపగ్రహాలను వచ్చే ఐదేళ్ళలో ప్రయోగించాలని బెంగళూరులోని డిఫెన్స్ స్పేస్ ఏజన్సీ ప్రణాళికలతో ఉంది. అంతరిక్ష ఆధారిత నిఘా (ఎస్బిఎస్) ప్రాజెక్టు 3వ దశ కింద వాటిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఉపగ్రహాలను తయారు చేసినా, ప్రైవేటు కంపెనీల ద్వారా పొందినా, వాటిని అంతరిక్షంలోకి చేర్చవలసిన బాధ్యత ఇస్రోపైనే ఉంటుంది. వాణిజ్య నష్టం అపారంఈ నెలలో వెళ్ళిన వాహక నౌక ఇఓఎస్–ఎన్1తో పాటు దేశ, విదేశీ కస్ట మర్లకు చెందిన 15 ఉపగ్రహాలను మోసు కెళ్ళింది. వాటిలో ‘ధ్రువ స్పేస్’కు చెందిన ఐదు ఉపగ్రహాలున్నాయి. ఆ ఐదింటిలో నేపాల్ది ఒకటి. బ్రెజిల్కు చెందిన ఆల్టో స్పేస్కు చెందిన మరో ఐదు ఉపగ్రహాలున్నాయి. బ్రిటన్–థాయి లాండ్ సంయుక్త ఉపగ్రహంతోపాటు, భారతీయ కస్టమర్లకు చెందిన మరో రెండు చిన్న ఇతర ఉపగ్రహాలు, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ చేయూతతో స్పెయిన్ కంపెనీ తయారు చేసిన ‘కిడ్’ ఉపగ్రహం కూడా ఉంది. ధ్రువతోపాటు ఇతర భారతీయ అంకుర సంస్థలు పీఎస్ఎల్వీ పైనే ఆశ పెట్టుకున్నాయి. అవి పెద్ద మొత్తంలో నగదుతోపాటు విలువైన కాలాన్ని, అవ కాశాన్ని కూడా కోల్పోయినట్లు లెక్క. ఉప గ్రహాల సైజును బట్టి వాటిని తయారు చేసేందుకు కంపెనీలకు కొద్ది నెలల నుంచి కొద్ది ఏళ్ళు పట్టవచ్చు. కోల్పో యినవాటి స్థానంలో అవి కొత్త వాటిని వేగంగా తయారు చేసుకున్నా, పీఎస్ ఎల్వీలో చోటు కోసం అవి చాలాకాలం ఎదురుచూడక తప్పదు. దీనికితోడు, రాకెట్ విశ్వసనీయత దెబ్బ తినడం వల్ల బీమా ఖర్చులు పెరుగుతాయి. అది తిరిగి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుంది. వరుసగా రెండు వైఫల్యాల నేపథ్యంలో, భవిష్యత్ పీఎస్ఎల్వీ ప్రయోగాలను సమీక్షించుకోవడం ఇస్రోకు తక్షణ కర్తవ్యంగా మారు తోంది. ఈ ఏడాది మరికొన్ని ఇతర ప్రయోగాలు నిర్వహించవలసి ఉంది. ముఖ్యంగా గగన్యాన్ కార్యక్రమం కింద సిబ్బంది లేకుండా ఒక అంతరిక్ష నౌకను కక్ష్యలో తిప్పనున్నారు. మానవ సహిత అంతరిక్ష నౌకను పంపడంపై జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పడంపై దృష్టి పెట్టాం. ఈ స్థితిలో ఇస్రోపై బృహత్తర బాధ్యత పడుతోంది. అది టెక్నికల్, క్వాలిటీ, మేనేజీరియల్ ప్రక్రియలను పూర్తి స్థాయిలో సమీక్షించుకోవాలి. విశ్వసనీయమైనదని ఉన్న పేరును కాపాడుకునేందుకు అదొక్కటే మార్గం! దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
అప్పులే ఆధారమా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 2026 –27 బడ్జెట్లో రెవెన్యూ – వ్యయం మధ్య అధిక వ్యత్యాసం, మూలధన కల్పన తక్కువగా ఉండటం; ఆరోగ్యం, సామాజిక సేవలకు వనరుల కేటా యింపు తక్కువగా ఉండటం; రుణాలు, కేంద్ర సహాయంపై అధి కంగా ఆధారపడటం; సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమయిన చర్యలు లోపించడం కారణంగా సంతులనం లోపించింది. రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడిలో వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, మరోవైపు రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు కారణంగా ప్రాధాన్యతా రంగా లపై పెట్టుబడి తగ్గుతుంది. తద్వారా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి క్షీణించడంతో పాటు ప్రభుత్వానికి రుణ భారం పెరిగి అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయం తగ్గుతుంది. కొరవడిన ఆర్థిక క్రమశిక్షణ2024 జూన్ తర్వాతి కాలంలో ప్రభుత్వం రుణాలపై అధికంగా ఆధార పడటం, రెవెన్యూ సమీకరణలో నిర్మాణా త్మక బలహీనతలు, వ్యయ యాజమాన్యంలో విఫలమవ డాన్ని సూచిస్తున్నది. పన్నేతర రాబడిలో తగ్గుదల, మూలధన వ్యయం తగ్గుదల, కమిటెడ్ వ్యయం (వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు)లో పెరుగుదలను ఇటీవలి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టపరుస్తున్నది. కాగ్ గణాంకాల ప్రకారం, 2025 –26 ఆర్థిక సంవత్సరంలో 2025 నవంబర్ నాటికి రెవెన్యూ లోటు రూ. 54,355 కోట్లకు చేరు కుంది. 2026–27 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ. 3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, ఈ మొత్తంలో రెవెన్యూ వ్యయం 77.1 శాతం కాగా, మూలధన వ్యయం 16.2 శాతం. మూలధన వ్యయాన్ని 2025–26 బడ్జెట్లో రూ. 40,636 కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుత 2026–27 బడ్జె ట్లో రూ. 53,915 కోట్లుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా రుణా లపై ఆధారపడినట్లయితే భవిష్యత్తు బడ్జెట్లలో అధిక మొత్తాన్ని వడ్డీ చెల్లింపులపై వెచ్చించవలసి ఉంటుంది. తద్వారా నూతన మూలధన ప్రాజెక్టులు, సంక్షేమంపై వ్యయం తగ్గుతుంది. రాష్ట్ర మొత్తం రుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 మధ్య కాలంలో రూ. 2,61,302 కోట్ల నుండి రూ. 4,85,491 కోట్లకు చేరు కోగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలల కాలం నాటికి (మార్చి 2025) ఈ మొత్తం రూ. 6,62,557 కోట్లకు చేరుకుందని ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు పార్ల మెంటులో ప్రస్తావనకు రావడం జరిగింది. 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సగటున రూ. 31,000 కోట్లను మూల ధన వ్యయానికి కేటాయించింది. కోవిడ్–19 సమయంలో రెవెన్యూ రాబడి తగ్గినప్పటికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచు కొని ఒకవైపు సంక్షేమంపై వ్యయాన్ని పెంచుతూ మరోవైపు దీర్ఘకాల ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకొని మూలధన పెట్టు బడులను పెంచగలిగి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడాన్ని గమనించాలి. మానవాభివృద్ధి, రైతుల సంక్షేమం, హౌసింగ్, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాలకు 2019–24లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిన క్రమంలో జీఎస్ డీపీ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది.మరోవైపు రుణాలవృద్ధిలోనూ తగ్గుదలను గమనించవచ్చు. వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమంలో పేదరిక స్థాయి 2015–16లో 11.77 శాతం నుండి 2023 నాటికి 4.2 శాతానికి తగ్గింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంతో పోల్చినప్పుడు 2026 –27లో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటులో తగ్గుదలను ప్రతిపాదించినప్పటికీ రెవెన్యూ రాబడిలో తగ్గుదల కారణంగా తిరిగి బడ్జెట్ లోటులు పెరిగే అవకాశం ఉంది. రుణాలపై, కేంద్ర గ్రాంట్లపై అధికంగా ఆధారపడటం వలన స్వయం నిరంతర ఆదాయ వృద్ధి ప్రశార్థకంగా కన్పిస్తున్నది.ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, వివిధ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ, ‘ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం’ నియమావళిని పాటిస్తూ, పన్నేతర రాబడిని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాల అమలు లక్ష్యాన్ని సాధించడం, తప్పనిసరి వ్యయానికి సంబంధించి కాలానుగుణంగా సమీక్ష, అధిక వడ్డీతో కూడిన స్వల్పకాల రుణాల తగ్గింపు ద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు కృషి చేయాలి.-వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి), ఇక్ఫాయ్ -ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
సభ్యుల మధ్య లోపిస్తున్న సమాచారం
లోక్సభలో బడ్జెట్పై చర్చను అడ్డుకున్న వ్యవహారం సద్దుమణగింది. కానీ, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాపై ప్రతిపక్షాలు అవి శ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో పాలక, ప్రతిపక్షాల మధ్య మరో ఘర్షణాయుత అంకానికి తెర లేచింది. సభా వ్యవహారాలలో తమకు తగినంత సమయం ఇవ్వలేదని ప్రస్తుత సమావేశాల పొడవునా ప్రతిపక్షాలు స్పీకర్ బిర్లాపై ఆగ్రహంగా ఉన్నాయి. మాజీ ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలను చర్చకు పెట్టాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. ఈ పుస్తకం ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాలేదు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రచురణకు ఇంకా ఆమోదం తెలుపవలసి ఉంది. ప్రచురణకర్తలు అనుమతి కోరుతూ పుస్తక ప్రతిని రక్షణ శాఖకు పంపినట్లు జనరల్ నరవణె వెల్లడించారు. రాహుల్ ఆ పుస్తకం హార్డ్ కాపీని పార్లమెంట్ ఆవరణలో చూపించారు. పుస్తకం సాఫ్ట్ కాపీలు ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవు తున్నాయి. ప్రచురణకు ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తున్న పుస్తకం ఇంటర్నెట్లో ఎలా అందుబాటులోకి వచ్చిందంటూ దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఎంతవరకు రాయొచ్చు?ప్రచురణకు అనుమతి పొందని పుస్తకంలోని అంశాలను ఎలా లేవనెత్తుతారన్న వైఖరిని ప్రభుత్వం తీసుకుంది. అది సాంకేతికంగా సరైనదే కావచ్చు. కానీ, 2020లో తూర్పు లద్దాఖ్లో భారత–చైనా సైనికుల మధ్య ఘర్షణలకు సంబంధించి నరవణె ఏం రాసిఉంటారో ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ప్రభుత్వం పెదవి విప్పక పోవడం వల్ల ఈ అంశంపై దాని అభిప్రాయం ఏమిటో తెలుసు కోకుండానే, సర్క్యులేషన్లో ఉన్న అంశాలను ఆధారం చేసుకుని చాలా మంది ఒక నిర్ధారణకు వచ్చేసే ప్రమాదం ఉంది. జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చేటపుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఒకటుంది. సీనియర్ పదవులను నిర్వహించిన సైనిక, పౌర అధికారులు రహస్య విషయాలను బయటకు పొక్కించే ఉబలా టాన్ని వదులుకోవడం మంచిది. తాము సర్వీసులో ఉన్నపుడు రాజ కీయ నాయకత్వంతో జరిపిన మాటామంతీ నమ్మకం పునాదిగా సాగి ఉంటుందనే సంగతిని వారు గుర్తెరగాలి. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని భావించినపుడు ఆ చర్చల వివరాలను రాయకపోవడం వారికి గౌరవ ప్రదమే కాదు, పాటించవలసిన విధి కూడా. సర్వీసులో ఉన్నపుడు, రిటైరైన తర్వాత కూడా ఏది ఎంత వరకు చెప్పాలో అంతవరకు చెప్పడమే విధాయకం. నాయకులు పొరపాటు చేశారని లేదా తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఈ అధి కారులు భావించినా, ఆ నమ్మకానికి గండి కొట్టే విధంగా వ్యవహరించే లగ్జరీ లేదా స్వేచ్ఛ (రిటైరైన తర్వాత కూడా) వారికి ఉండదు. సీనియర్ సైనిక, పౌర అధికారులు తమకు అప్పగించిన పను లకు తమ బాధ్యతల పరిధి లోపలే వారు భాష్యం చెప్పాల్సిఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని తమ విచక్షణకు విడిచిపెట్టినపుడు తమ సైనిక బాధ్యతలకు పరిమితమై మాత్రమే వారు వాటికి భాష్యం చెప్పాలి తప్ప, వాటిని దౌత్య, రాజకీయపరమైన పరిధి వరకు తీసుకెళ్ళకూడదు. రాజకీయ నాయకత్వం దేశ ప్రయోజనా లను దృష్టిలో పెట్టుకుని, దౌత్య, రాజకీయ పరమైన అంశాలను పరి గణనలోకి తీసుకుని, అటువంటి సందర్భాలలో తమకు ఆ విచక్ష ణాధి కారాలు కల్పించిందని సైనిక నాయకులు గ్రహించాలి. కొరవడిన సంభాషణభిన్న రాజకీయ పార్టీల మధ్య తగినంత కమ్యూనికేషన్ లోపించిన వెలితిని లోక్ సభలో ఇటీవలి ప్రతిష్టంభన, తదనంతరం ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వెల్లడిస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. జాతీయ ప్రాధాన్యంగల అంశాలపై పాలక, ప్రతిపక్ష నాయకులు ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునే వారని మాజీ సివిల్ సర్వెంట్ల అనుభవాలను చదివితే తెలుస్తుంది. దౌత్యపరంగా ఏదైనా ఒక పెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్న పుడు లేదా దేశం హఠాత్తుగా ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్పుడు ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష నాయకులకు పరిస్థితిని వివరించిన సందర్భాలు దౌత్యవేత్తగా గడిపిన వృత్తి జీవితంలో నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతమాత్రాన ఆ యా అంశాలపై ఆ యా పార్టీల వైఖ రులు కానీ, రాజకీయ గతులు కానీ మారిపోవు. కానీ, ఆ యాఅంశాలపై ఎదురవుతున్న సవాళ్ళు, అవకాశాలకు సంబంధించి రాజకీయంలోని అన్ని వర్గాలవారికి ఒక అవగాహన కల్పించినట్లు అయ్యేది. భిన్న స్రవంతులకు చెందిననాయకులు కొన్ని సందర్భా లలో నేరుగా మాట్లాడుకునేవారు. ఒక్కోసారి వారు నమ్మినబంట్ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకునేవారు.నేడు పాలక, ప్రతిపక్ష నాయకులు వైషమ్యాలు, కోపతాపాలు, దూషణలతో కూడిన దాడులకు దిగడం చూస్తూంటే, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ నెరపుకునే ఆ సంప్రదాయం లోపించిందని లేదాఉండవలసినంతగా లేదని తేటతెల్లమవుతోంది. గోప్యంగా వివరించొచ్చు!నరవణె పుస్తకంలోని అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించి నపుడు, ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకున్న ఎటువంటి చర్చకు తాము అనుమతించలేమని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఆ పుస్తక ప్రచు రణకు అనుమతించకపోవడానికి గల కారణాలను తాము విడిగా వివరించగలమని తెలిపి ఉండాల్సింది. పుస్తకంలో ఉన్నదని చెబు తున్న ఉదంతంతో సహా, తూర్పు లద్దాఖ్ ఘటనల పూర్వాపరాల గురించి గోప్యంగా వివరించి ఉండవచ్చు. రాజకీయ నాయకులందరూ దేశ ప్రయోజనాలకు అంకితమై ఉన్నవారేనన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పవలసి వస్తోంది. వేటిని వెల్లడించవచ్చు వేటిని రహస్యంగా ఉంచాలనే వివేచన వారందరికీ ఉండి ఉంటుంది. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ హయాంలో విదేశీ వ్యవహారాలపై స్థాయీ సంఘం సమావేశంలో జరిగిన ఓ ఘటనను చెబుతాను. వేటిపై చర్చించవచ్చునో, వేటిని చర్చించకూడదో రాజకీయ తర గతికి తెలుసునని ఆ సంఘటన నిరూపించింది.అఫ్గానిస్తాన్లో ‘నార్తర్న్ అలయన్స్’కు భారత్ చేస్తున్న సాయం గురించి అప్పటి విదేశాంగ కార్యదర్శి కె. రఘునాథ్ను లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సూటిగా జవాబివ్వకుండా అరకొర మాటలతో దాట వేస్తు న్నారు. సభ్యులు అసహనానికి లోనవడంతో, గుజ్రాల్ జోక్యం చేసు కుని, విదేశాంగ శాఖ ఏం చేస్తున్నదీ తనకు తెలుసునని, చర్చనుఅంతటితో ముగించారు. ఏ సభ్యుడూ ఇక నిరసన తెలుపలేదు. -వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-వివేక్ కాట్జూ -
చైనాను బెదరగొడితే చాలు!
ప్రపంచం దృష్టి వెనిజులా, గ్రీన్ల్యాండ్, ఇరాన్ పరిణామాలపై కేంద్రీకృతం అయి ఉండటంతో, అమెరికన్లు మళ్లీ మళ్లీ ప్రక టిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహం చర్చకు రావటం లేదు. ఈ వ్యూహంలో భారత దేశాన్ని కూడా భాగంగా చేసి చూపుతున్నందున, మౌలికంగా ఆ వ్యూహం ఏమిటో తెలుసుకోవటం అవసరం. ఆ వ్యూహం ఏమిటో తెలిసేందుకు మూడు డాక్యుమెంట్లను చూడవలసి ఉంటుంది: ఒకటి – 2022 ఫిబ్రవరిలో అప్పటి డెమోక్రటిక్ బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’. రెండు – 2025 నవంబర్లో ప్రస్తుత రిపబ్లికన్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ’. మూడు – ఇదే ప్రభుత్వం 2026 జనవరిలో, అనగా గత నెలలో ప్రకటించిన ‘నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ’. వీటన్నింటిలో ఇండో–పసిఫిక్ గురించిన సారాంశం ఈ విధంగా ఉంది. ప్రపంచ వాణిజ్యానికే అతిపెద్ద, అత్యంత క్రియా శీలమైన మార్కెట్ ప్రాంతం ఇది. కనుక అమెరికా భద్రత, స్వేచ్ఛ, సౌభాగ్యాలపై చాలా ప్రభావం చూపుతుంది.చైనా సవాల్ఈ ప్రకటనతో ఆరంభించిన అమెరికా వ్యూహం, తమ ప్రయోజనాల పరిరక్షణకు అక్కడ ఏమేమి చేయాలన్న విషయమై చాలానే చెప్పింది: పశ్చిమార్ధ భూగోళాన్ని మన్రో, డోన్రో డాక్ట్రిన్లను అనుసరించి పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాము. పశ్చిమాసి యాలో ప్రయోజనాలు ఇజ్రాయెల్ ద్వారా నెరవేరుతున్నాయి. యూరోపియన్ దేశాలు తమ సహచరులే గనుక, వారు తమ రక్షణ వ్యయాన్ని మాత్రం పెంచి తమతో నిలబడితే సరిపోతుంది. ఆర్కిటిక్కు సంబంధించి గ్రీన్ల్యాండ్ను ఏదో ఒక విధంగా అధీనంలోకి తెచ్చుకుంటే ఆ సమస్య తీరుతుంది. ఉక్రెయిన్ యుద్ధం తేలిపోతే రష్యాతో పేచీ ఉండదు. పైగా అది ఒక ప్రాంతీయ శక్తి మాత్రమే. ఆ విధంగా ఇక మిగిలేది ఇండో–పసిఫిక్ ఒక్కటే!ఇండో–పసిఫిక్ మాత్రమే మిగిలి ఉండటం ఎందుకంటే చైనా కారణంగా. మరొక విధంగా చెప్పాలంటే, మొత్తం ప్రపంచపు భౌగోళిక వ్యూహంలోనే అమెరికాకు మిగిలి ఉండగల సమస్య చైనా అన్నమాట. వేరెవరో అనవలసిన అవసరం లేకుండా, వ్యూహ పత్రా లలో అమెరికన్ ప్రభుత్వాలే అరమరికలు లేకుండా చెప్పాయి. చైనా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఆర్థికంగానే గాక సైనిక బలం రీత్యా కూడా ఎదిగి ఇపుడు తమకు పోటీదారుగా మారిందన్నాయి. ఒత్తిడిలో అమెరికాఈ స్థితిని ఎదుర్కోవటం ఎట్లాగన్నది ప్రశ్న. మరొక మాటలో చెప్పాలంటే ఈ స్థితిని ఎదుర్కొని అమెరికా అగ్రస్థానాన్ని పదిలపర చుకోవటం, చైనాను ఇంతకుమించి ముందుకు రానివ్వక పోవటం అన్నమాట. రాగల కాలంలో అమెరికన్ వ్యూహాల కేంద్రీకరణ అంతా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉంటుందన్నది స్పష్టం. వాస్తవా నికి ఈ ఆలోచనలు కొత్తవి కావు. పశ్చిమాసియాలో ఎదురు దెబ్బల తర్వాత డెమోక్రటిక్ అధ్యక్షుడు ఒబామా(2009–17), ఇక తమ దృష్టి అటునుంచి ఆసియాకు మారాలని ప్రతిపాదించారు. బైడెన్ (2021–25) పైన పేర్కొన్న ‘ఇండో–పసిఫిక్ స్ట్రాటజీ’ని ప్రకటించారు. చైనాపై వాణిజ్య, పారిశ్రామిక యుద్ధాలను ట్రంప్ శక్తి మేర సాగించారు. అమెరికా ప్రయోజనాల కోసం ఇండో–పసిఫిక్ విధాన మన్నది డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాల రెండింటి ఉమ్మడి సంప్రదాయం అయింది.తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఏ వ్యూహ పత్రమూ ప్రకటించని ట్రంప్ ఇపుడు ఏడాదిలోనే రెండు పత్రాలు తేవటం గమనించదగ్గది. పదేళ్ల క్రితంతో పోల్చితే అమెరికా బలహీన పడగా, చైనా బలపడింది. అమెరికాపై పలు విధాలైన ఒత్తిళ్లు పెరుగు తున్నాయి. చైనాను కట్టడి చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థికంగా చూసినట్లయితే వారికి వేర్వేరు దేశాల నుంచి ఇంధనంతో సహా వనరుల సేకరణకు, మార్కెట్లకు, పెట్టుబడులకు ఆటంకాలు కల్పించాలి. వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకుని, ఇంతవరకు వలె గాక రాగల కాలంలో తమ అభివృద్ధిని వేగవంతం చేయాలి. సైన్స్, టెక్నాలజీ ఆధునికీకరణలు, వాటి ఆధారంగా ఆధునిక ఉత్ప త్తులు భవిష్యత్తుకు కీలకం అయినందున, ఆ రంగాలలో చైనా పురో గతి ఒక సవాలుగా మారినందున... ఆ విషయమై మరింత దృష్టి పెట్టాలి.ఎన్ని వ్యూహాలు?సైనిక విషయాలకు వస్తే వ్యూహ పత్రాలు ఒక సూత్రాన్ని పదే పదే పేర్కొనటం గమనించదగ్గది. అది– చైనాను కట్టడి చేయటమైతే తప్పనిసరి. కానీ యుద్ధం ద్వారా కాదు. ఒక బెదురు అన్నది సృష్టించి నిలువరించటం ద్వారా! బెదురును సృష్టించటం ఏ విధంగా? ఒకటి– ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని తమ సైనిక స్థావ రాలను (66 అని అంచనా) శక్తిమంతం చేయటం. రెండు– అక్కడి తమ కూటమి దేశాల సైన్యాలను బలోపేతం చేయటం. వారు తమ రక్షణ వ్యయాలను పెంచటం. మూడు– ఒకే చైనా విధానాన్ని కొన సాగిస్తూనే, తైవాన్ను తమ రక్షణ వ్యూహం కోసం ఉపయోగించు కోవటం. నాలుగు– జపాన్ నుంచి బోర్నియో వరకు వరుసగా గల మొదటి వరుస దీవులను (ఫస్ట్ ఐలాండ్ ఛెయిన్) దాటి చైనా యుద్ధ నౌకలు పసిఫిక్లోకి రాకుండా అడ్డుగోడ వంటిది తయారు చేయటం అన్నది వ్యూహం. దీనంతటి అమలు కోసమే ఇండియాతో కూడిన ‘క్వాడ్’ను 2017లో క్రియాశీలం చేసి, 2021లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో కలిసి ‘ఆకస్’ తదితర సంస్థలు ఏర్పాటు చేశారు.ట్రంప్ వ్యూహ పత్రాలలో ఆసక్తికరమైన అంశం ఒకటి కనిపి స్తుంది. దాని ప్రకారం, చైనా అభివృద్ధికి వారు వ్యతిరేకం కాదు. కానీ అమెరికా అగ్రస్థానానికి మాత్రం చైనా సవాలు కారాదు. ఇందు కోసం ఇండో–పసిఫిక్లోని అన్ని దేశాలనూ రకరకాల పేర్లతో ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహాల అమలుకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతోపాటు ఇండో–పసిఫిక్లోనూ అనేక దేశాలు అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగపడేందుకు సిద్ధంగా లేక బహుళ ధ్రువ ఆలోచనలు, అమెరికా–చైనా మధ్య సమతుల్యతల పాటింపు వంటివి చేస్తున్నాయి. ఇండియా కూడా ఈ కోవలోకే వస్తుంది. ట్రంప్ బుల్డోజరిజం కెనడా, యూరప్లలోనే వ్యతిరేకతను ఎదు ర్కొంటూ, ఆ దేశాలు చైనాతో వరుస ఒప్పందాలు చేసు కోవటం ఇందుకు అద్దం పడుతున్నది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిందలతో సవాళ్లు సమసిపోవు!
పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్ యోధులు జన వరి 31న బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. బలూచ్ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్ (24)గా బీఎల్ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్ దేశీయాంగ మంత్రి మొహిసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.బుగతీ హత్యతో మరో తిరుగుబాటునఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్ ప్రాంతం పాక్లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్ పైపులైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ ఖాన్ బుగతీని అప్పటి పాక్ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్ ఖేర్ బకష్ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. వనరులు బలూచిస్తాన్వి అయినా...అక్బర్ ఖాన్ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. పాక్ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్ ఇపుడు ట్రంప్కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. మారిన పోరాట పంథాబలూచ్ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.బీఎల్ఏకు 2018 నుంచి బషీర్ జెబ్ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కు అల్లా నాజర్ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్ ఇంజనీరింగ్లో జెబ్ డిప్లొమా చేయగా, నాజర్ వృత్తి రీత్యా డాక్టర్. వీరి నేతృత్వంలో బలూచ్ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్ఏ చెప్పుకొంది. నేటి సోషల్ మీడియా యుగంలో జెబ్, నాజర్ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.దాడులతో భంగపడిన సైన్యం బలూచ్ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మూలాన్ని గుర్తించని జెన్–జీ ఉద్యమాలు?
బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలలో జెన్–జీ ఉద్యమాలు జరిగి, అక్కడి ప్రభు త్వాలు కూలిపోవడం తెలిసినదే. ఈ ఆందోళనలకు ప్రేరణ ఆ యా సమాజా లలో పెరిగిపోతోన్న నిరుద్యోగం, ధరలు, అవినీతి వంటి అంశాలే. ఈ రెండు దేశాలు త్వరలో ఎన్నికలకు వెళ్ళబోతు న్నాయి. సరికొత్త రాజకీయ ‘అవతారం’ ఎత్తిన పాత రాజకీయ పక్షాలు కానీ... ప్రస్తుతం రాజకీయ రూపం సంతరించుకున్న జెన్–జీ ఉద్యమ కారులు కానీ సమస్యల పరిష్కారం కోసం ముందుకు తెస్తోన్న క్రొంగొత్త, సృజనాత్మక అజెండా మాత్రం ఏమీ లేదు! ఈ పోరాటాల వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ, ఇవి ఆవేశకావేశాల ప్రాతిపదికన సాగాయే తప్ప, స్పష్టమైన కార్యాచరణతో జరిగినవి కావు. నేపాల్, బంగ్లాదేశ్లలోనే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నిరు ద్యోగ సంక్షోభానికి జవాబు వెతకడం కష్టంగా మారుతోంది.ప్రస్తుత నిరుద్యోగ విలయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది– 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ఏర్పడి ఉపాధి కల్పన కుంటుపడింది. రెండోది– దశాబ్దాలుగా సాగుతున్న సాంకేతిక పురోగతి నేడు పరాకాష్టకు చేరింది. మానవ శారీరక శ్రమను రోబోలు ఆక్రమిస్తుంటే, మేధా శ్రమ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కైవసం చేసు కుంటోంది. ఫలితంగా బ్లూ కాలర్, వైట్ కాలర్ రంగాల్లో మనిషికి స్థానం లేకుండా పోతోంది. ఉదాహరణకు, అమెజాన్ సంస్థలో 30 వేల మంది వరకూ ఉద్యోగులను తొలగించనున్నారు. దీనికి కారణం ఆ కంపెనీ ఒక ఉద్యోగస్థుడికి సాలీనా సగటున 36 వేల డాలర్ల వేతనం చెల్లించవలసి ఉంటే... అదే స్థానంలో మర మనిషిని (రోబో) పెట్టుకుంటే అయ్యే ఖర్చు 3,600 డాలర్లు మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తన సంస్థకు సంబంధించిన కొత్త కోడ్ను గూగుల్ 2025 నాటికి 30% మేరకు రాయగలుగు తోంది. అంటే, ఆ మేరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోతలు అనివార్యమన్నమాట. వ్యవస్థ ఇక కొత్త ఉద్యోగాలను ఇవ్వలేదని గ్రహించిన బిల్గేట్స్ వంటి వారు ‘సార్వజనీన కనీస ఆదాయం’ (యూబీఐ) వంటి ప్రతిపాదనలు తెస్తున్నారు. అంటే, పెరిగిపోతున్న నిరుద్యోగుల తిరుగుబాట్లను అడ్డుకోవడానికి ప్రజల ఖాతాల్లో కొంత నిరుద్యోగ భృతి జమ చేసి వ్యవస్థను కాపాడుకోవాలనేది వారి ఎత్తుగడ. ఈ స్థితిని 180 ఏళ్ల క్రితమే కారల్ మార్క్స్ తన ‘కమ్యూనిస్ట్ ప్రణా ళిక’లో అంచనా వేశారు. ‘...ఒక వర్గాన్ని పీడించాలంటే ఆ పీడిత వర్గం తన బానిస బతుకును కొనసాగించడానికైనా హామీ ఇవ్వాలి... కానీ, ఈనాటి బూర్జువా వర్గ ఆధిపత్యం కింద, ఈనాటి పారిశ్రామిక క్రమంలో ఆధునిక శ్రామికుడు ఎదగడం మాట అటుంచి, నానాటికీ అడుగుకి పోతున్నాడు... కార్మికుడు బుక్కాపకీరుగా మారుతున్నాడు. తన బానిసకు బానిస బతుకునైనా నమ్మకంగా చూపించగల సత్తా దానికి (వ్యవస్థకు) లేదు. తన బానిస శ్రమ మీద బతకాల్సిన వర్గం అది. కానీ, ఆ పరిస్థితి మారి ఆ బానిసే దాని బిచ్చం (పైన పేర్కొన్న సార్వజనీన కనీస ఆదాయం) మీద ఆధారపడాల్సి వస్తే అటువంట ప్పుడు బూర్జువా వర్గం కింద సమాజం ఇక ఎంతమాత్రమూ బతక లేదు. కాబట్టి (ఆ) వర్గ పతనం తప్పదు. కార్మిక వర్గ విజయమూ తప్పదు.’ అదీ విషయం. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ దాని పరిణామక్రమంలో మార్క్స్ చెప్పిన పై దశను చేరుకుంది. ప్రస్తుత వ్యవస్థలో నిర్జీవమైన పెట్టుబడి (డబ్బు), సజీవమైన మనుషులపై పెత్తనం చేస్తోంది. నిన్నటి ఉత్పత్తి సాధనాలే నేడు విధ్వంసక శక్తులుగా మారుతున్నాయి. ఈ వ్యవస్థాగత లోపాలను గుర్తించకుండా చేసే ఏ ఉద్యమమైనా నిష్ప్రయోజనమే! కమ్యూనిజా నికి కాలం చెల్లిందన్న ప్రచారపు బూజును తలల నుంచి దులుపుకొని ఆ సిద్ధాంతపు వెలుగులో సమకాలీన సమస్యలను చూడగలిగితేనే మరో ప్రపంచానికీ, మానవాళి మహోదయానికీ దారులను అన్వేషించగలం.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు -
రైతుల పాలిట పిడుగుపాటు
షేక్స్పియర్ నాటకంలోలాగా, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియని సంకటం. ‘అమెరికన్ రైతులకు మేలు చేసే విధంగా’ ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు ట్రంప్కు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ కృతజ్ఞతలు తెలి పారు. సున్నిత అంశాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు తగు రక్షణ కల్పి స్తూనే అమెరికాతో ‘చారిత్రక’ ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు మోదీని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఒప్పందంలోని వివరాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే, అది రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలకు ఉభయ తారకమైనదా లేక బెదిరింపు ధోరణితో మెడలు వంచి ఒప్పిస్తున్నదా అన్నది తేలుతుంది. కానీ, ఇంతవరకు బహిర్గతమైన వివరాలే రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముంచెత్తితే ప్రమాదమే!దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే దయనీయ స్థితిలో ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా 30–40 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఈ స్థితిలో భారత మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే... హెచ్చు సబ్సిడీలు పొందు తున్న, చౌకైన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం, అమెరికన్ రైతులు ఏటా భారీ సబ్సిడీలు పొందుతున్నారు. అక్కడి రైతుకు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ లభిస్తున్నట్లు అంచనా. ఆ సబ్సిడీలు మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుంచి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. రైతులకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (ఎఫ్బీయే) కింద ఎకరాకు వస్తు చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్ డాలర్లను సమకూర్చాలని అమెరికన్ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ఆ పథ కాన్ని ‘ఒక పెద్ద అందమైన బిల్లు’గా అభివర్ణిస్తున్నారు. అయితే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకా లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. నాన్–ట్యారిఫ్ ప్రతిబంధకాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. రైతుల నిరసన హెచ్చరికలురైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా ‘సంరక్షించిన’ తర్వాతనే ఒప్పందం కుదిరిందని మన వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రయోజనాలకు భంగం వాటిల్లదనే హామీలు వెలువడుతున్నా ఇది రైతుల్లో సందిగ్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే, ఆహార పదార్థాలు దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడతాయని 2020–21లో న్యూఢిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన సంయుక్త్ కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది. 2020–21 తరహాలోనే కొత్తగా నిరసనలకు దిగుతామని అది బెదిరిస్తోంది. భారతీయ రైతులు 2000–01 నుంచి 2024–25 మధ్య కాలంలో సమష్టిగా రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ‘‘అది రైతులకు అశని పాతమే కాదు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అవుతుంది’’ అని హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్ల తోటల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు హరీశ్ చౌహాన్ అంటున్నారు.యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్లతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్ పండ్లకు మార్కెట్ అసాధారణమైన రీతిలో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఆపిల్ తోటల పెంపకం పరిశ్రమ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయ సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సుంకాలు ఏమీ లేకుండా అమెరికా ఆపిల్ పండ్లు దిగు మతి అయితే, మన దేశంలో ఆపిల్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుందని హరీశ్ హెచ్చరిస్తున్నారు. సుంకాలు లేకపోతే సమస్యే!పడిపోయిన ధరలతో పత్తి, సోయా, ఉల్లిపాయల రైతులు ఇప్ప టికే బిక్కుబిక్కుమంటున్నారు. సుంకాలు ఏమీ లేకుండా అవి దిగు మతి అయి, ధరలు మరింతగా పతనమైతే, వారు ఆ పంటలను వదిలేసి చేతులెత్తేయడం మినహా చేయగలిగింది లేదు. ఏడాదికి 500 బిలియన్ల విలువైన అమెరికన్ ఎగుమతుల గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అందులో ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటి రంగాలవి కూడా ఉన్నాయి. అయితే, అది ఏడాదికి దాదాపు 100 బిలియన్ డాలర్ల చొప్పున ఐదేళ్ళ కాలానికి లెక్క చెప్పినదై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తు న్నారు. అమెరికన్ ఎగుమతులన్నీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులతోనే నిండి ఉంటాయని భావించడం కూడా సబబు కాదు. పత్తి, పప్పుధాన్యాలు, ఉల్లిపాయల వంటి వస్తువుల విషయంలో ఒక కోటా మేరకు మాత్రమే మార్కెట్ అందుబాటులో ఉంటుందని వార్తలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడం లాంటిదేనని అర్థం చేసుకోవాలి. గత ఏడాది సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించినపుడు చౌక ధరకు పత్తి బేళ్ళు అపారంగా వచ్చిపడ్డాయి. దేశంలో పత్తి ధరలు తగ్గాయి. అందుకు వస్త్ర పరిశ్రమవారు సంతోషించారు కానీ, రైతులు నష్ట పోయారు. మూడు నెలల్లో 30 లక్షల పత్తి బేళ్ళు దిగుమతి అయ్యాయి. పత్తి ధర క్వింటాల్కు రూ. 1,000–రూ.1,500 వరకు పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలని ట్రంప్ చూస్తున్న నూతన వాణిజ్య వ్యవస్థ... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకమైనది. ట్రంప్ తన కొత్త వ్యవస్థకు ‘యూరో పియన్ యూనియన్ కూడా తలొగ్గేట్లు చేయాలని చూస్తున్నారు. వాణిజ్య సంస్థ 1995లో ఏర్పడినప్పటి నుంచి అమెరికా పప్పులు ఉడకడం లేదు. అది ఇపుడు ఎలాగైనా తన పంతం నెగ్గించు కోవాలని చూస్తోంది. ఒత్తిడికి లొంగిపోతున్న దేశాలతో, నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిష్కృతమవుతోంది. ‘కండ గలవాడిదే రాజ్యం’ అన్న లోకోక్తి ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి. దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
దేశ రాజకీయాల్లో భూకంపం
భారత్–చైనా సరిహద్దులో 2020లో జరిగిన ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రశ్న దేశాన్ని కుదిపేస్తోంది. యుద్ధం అంచున నిలిచిన వేళ సైన్యానికి రాజకీయ ఆదేశాలొచ్చాయా, లేదా? ఈ ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిన ఒక పుస్తకం ప్రచురణ కాకముందే పార్లమెంటును కుదిపేసింది. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం (Four Stars of Destiny) అధికారికంగా ఇంకా ప్రచురణ కాలేదు. కానీ, ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ‘క్యారవాన్’ మ్యాగజైన్ ద్వారా బయటకు రావడంతో దేశ రాజకీయాల్లో భూకంపం మొదలైంది. 2020 జూన్ నాటి సంగతి. గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్ మొత్తం ఉద్రిక్తతల్లో మునిగిపోయింది. చైనా సైన్యం కైలాశ్ రేంజ్ వైపు కదలడం మొదలు పెట్టింది. ఇది కేవలం సరిహద్దు సమస్య కాదు; ఒక యుద్ధ ప్రకటన!2020 ఆగస్టు 31. రాత్రి సమయం. చైనా యుద్ధ ట్యాంకులు భారత స్థావరాలకు కిలోమీటర్ దూరంలో మోహరించాయి. భారత కమాండర్లు అప్రమత్తమై దాడిని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ విధానపరంగా ఒక సమస్య వచ్చిపడింది. ఢిల్లీ నుండి ఎలాంటి ఆదేశాలూ లేవు. స్పష్టమైన ఆదేశాలు లేకుండా కాల్పులు చేయకూడదన్న నిబంధనలున్నాయి. అప్పటి ఆర్మీ చీఫ్ నరవణె రక్షణ మంత్రి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు, విదేశాంగ మంత్రి అందరికీ ఫోన్ చేసి ‘ఏం చేయాలి?’ అని అడిగారు. వెంటనే స్పందన రాలేదు. తరువాత రక్షణ శాఖ మంత్రి నుండి ఫోన్ వచ్చింది. రెండే రెండు క్లుప్త వాక్యాలు. ‘ప్రధానితో మాట్లాడాను... జో ఉచిత్ సమ్ఝో వో కరో’ (ఏది సరైనది అనుకుంటే అది చెయ్యండి). ఈ సూచన విని షాక్కు గురైనట్టు నరవణె రాసుకున్నారు. యుద్ధానికి సంబంధించిన ప్రాణప్రదమైన అంశం ఇది.ఇలాంటి ఉద్రిక్త సన్నివేశాలు 1971లో ఇందిరాగాంధీ హయాంలోనూ, 1999లో వాజ్పేయి హయాంలోనూ వచ్చాయి. వాళ్ళిద్దరూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నరవణె ఆ పుస్తకంలో చెప్పిందేమంటే ప్రధాని మోదీలో అలాంటి నిర్ణయాత్మక స్పష్టత కనిపించలేదూ అని! ప్రజాస్వామిక వ్యవస్థలో శాసన వ్యవస్థే నిర్ణయాలు తీసుకుంటుంది, దాన్ని సైన్యం పాటిస్తుంది. చైనా విషయంలో మోదీ తడబడి నట్టుగా నరవణె కథనం ద్వారా అర్థం అవుతోంది. సరిగ్గా ఈ అంశమే ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది.జాతీయ భద్రత కారణంగా నరవణె పుస్తకాన్ని (Naravane Book) పరిశీలించాల్సి ఉందని రక్షణ శాఖ అంటున్నది. ఏడాదిన్నర గడిచినా సమీక్ష పూర్తి కాలేదు. ప్రచురణకు అనుమతి రాలేదు. జాతీయ భద్రత కన్నా తమకు ఎదురయ్యే రాజకీయ ఇబ్బందుల గురించే కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా జంకుతున్నదనే విమర్శలూ ఉన్నాయి. ఒక ఆర్మీ మాజీ ఛీఫ్ తన యుద్ధ అనుభవాలను ప్రజలతో పంచుకోకూడదా? ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో నరవణె పుస్తకంలోని కొన్ని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నించి నపుడు అధికార పక్షాలు అడ్డుకున్నాయి.చదవండి: నరవణె పుస్తకంపై పెంగ్విన్ కీలక ప్రకటన‘అగ్నివీర్’, ‘అగ్నిపథ్’ పథకాల మీద కూడా నరవణె అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగ భద్రత లేదనీ, జీతాలు కూడా తక్కువనీ గుర్తు చేశారు. భారత సైన్యం భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తం చేశారు. క్యారవాన్ పత్రిక (caravan magazine) ఆ పుస్తకంలోని కొన్ని అంశాలతో ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. మిగిలిన పుస్తకంలో ఇతర సందరాల్లో మోదీజీ నాయకత్వాన్ని నరవణె పొగిడి ఉండవచ్చు. మొత్తం పుస్తకం అందుబాటులోనికి వస్తేగానీ అంతిమ నిర్ణయం చెప్పలేము.- డానీ వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
అసమానతలను రాజేయనున్న ఏఐ
దావోస్లో ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో చర్చించిన ప్రాథమికాంశాలలో ‘కృత్రిమ మేధ (ఏఐ)– దాని ప్రభావం’ కూడా ఉంది. ఏఐని ఆశ్రయించక తప్పని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అనుసరించడంలో మందగమనంతో సాగవచ్చు నేమోకానీ, ఏదో ఒకనాడు దాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. ఏఐని ఆశ్రయించడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి; అదే సమయంలో... అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వాలలో కొన్ని ఆందో ళనలున్నాయి. ‘ఫోరమ్’ సర్వే ఏం చెబుతోంది?ఆర్థికవేత్తలలో ఫోరమ్ ఈ అంశంపై నిర్వహించిన సర్వే కొన్ని ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో కొన్నింటి స్థానాన్ని ఏఐ ఆక్రమిస్తుందని దాదాపు 54 శాతం మంది అంగీకరించారు. కంపెనీలు ఏఐని ఎక్కువ వినియోగించు కుంటే లాభాల మార్జిన్లు పెరుగుతాయని సుమారు 45 శాతం మంది నమ్ముతున్నారు. అంటే, కంపెనీల సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాలోని కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఇది వివక్షకు దారితీయవచ్చని 21 శాతం మంది భయాలు వ్యక్త పరిచారు. వివిధ రంగాల పరిశ్రమల సామర్థ్యం ఏఐతో మెరుగుపడుతుందని మన దేశంలోనూ దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐని ఎక్కువ వినియోగించుకోవడం వల్ల అన్ని కంపెనీల్లో కస్టమర్ సర్వీస్ విభాగం సేవలు మెరుగుపడతాయి. ఆ విభాగం చాట్ బాట్స్ను సృష్టించుకోవడం వల్ల వినియోగదారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సామర్థ్యాన్ని పెంచుకునేందుకు దాదాపు అన్ని సేవా రంగాల పరిశ్రమలూ అటువంటి సాధనాలను ఉపయోగించుకోవడం ప్రారంభించాయి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు రిటైల్ కస్టమర్లతో ప్రమేయమున్న అన్ని వ్యాపార సంస్థలూ ఏఐని ఆశ్రయించక తప్పదు. కీలక రంగాల్లో ఏఐ వినియోగంబ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగంలో రుణ యోగ్యతను మదింపు చేసేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. రుణం కోరుతున్న కంపెనీకి చెందిన మొత్తం సమాచారాన్ని ఏఐ సమీకరించి, తిరిగి చెల్లించగల సామర్థ్యంపై అంచనాలు అందివ్వగలదు. కలన గణితాలను ఆధారం చేసుకుని, ఏ మేరకు రుణం మంజూరు చేయవచ్చునో, ఎంత వడ్డీ వసూలు చేయవచ్చునో తెలుపుతుంది. ముందే నిర్ణయించిన సూచికలను ఆధారం చేసుకుని ఆ కంపెనీ ఎగవేయడానికి ఏమైనా అవకాశం ఉందా అని కూడా చెప్పగలుగు తుంది. ఏఐ వినియోగం వల్ల మోసాన్ని కనిపెట్టడం తేలిక. ఫలితంగా, ఆ రంగానికి ఎంతో మేలు చేసినదవుతుంది. ఐటీ రంగంలో ఇప్పటికే పెక్కు మార్పులు కనిపిస్తున్నాయి. మొత్తం కోడింగ్ ప్రాసెస్, ప్రోగ్రామింగ్ పనిని ఏఐకి అప్ప గిస్తున్నారు. ఈ కంపెనీలు సూచిస్తున్న పరిష్కారాలు క్లయింట్లకు ఉపయోగపడుతున్నాయి. ఆ క్లయింట్లు ఏఐ వినియోగంతో హెచ్చు సామర్థ్య స్థాయులతో తమ ప్రాజెక్టులను వేగవంతం చేసుకుంటు న్నారు. రిటైల్ రంగంలో, కస్టమర్ సంబంధ మాడ్యూల్ మొత్తాన్ని ఏఐ ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అది ఉత్పత్తులను సమర్థంగా డెలివరీ చేసేందుకు ఉపయోగపడుతోంది. స్టోరుకు వెళ్ళే వినియోగ దారుల ఇష్టాలు, అభిరుచుల సమాచారం మొత్తాన్ని ఏఐ క్రోడీక రిస్తోంది. వాటికి తగ్గట్లుగా ఆ యా ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం తేలికవుతోంది. ఆరోగ్య రక్షణ రంగంలో సప్లై చెయిన్ నిర్వహణను ఏఐ సమకూరుస్తోంది. ఏ వ్యాపార రంగానికైనా ఏఐ వినియోగం అనివార్యంగా మారుతోందనీ, దాన్ని ఉపయోగించు కోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయనీ వీటివల్ల స్పష్ట మవుతోంది. కంపెనీలు భవిష్యత్తుకు తగ్గట్లుగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా క్రమేపీ ఏఐని ఆసరా చేసుకుంటు న్నాయి. ఏఐ సాధనాలు అందించిన ఇన్పుట్ల ఆధారంగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. బడ్జెట్ తయారు చేసుకునేటప్పుడే ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురుకాగల పోటీని అంచనా వేసుకోగలుగు తున్నాయి. కాకపోతే, ఏఐని ఒక టెక్నాలజీగా వినియోగించుకోవడం చౌక కాదు. విద్యుచ్ఛక్తి ఎక్కువ అవసరమవుతుంది. గ్లోబల్ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2035 నాటికి 1,200 టెరావాట్–గంట లను మించిపోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసింది. అంటే, 2024 స్థాయులకన్నా దాదాపు మూడింతలు ఎక్కువ. ఏఐ వృద్ధికి సమాంతరంగా విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచు కోవాలి. అయితే, మున్ముందు ఈ వ్యయాలు తగ్గుతాయనీ, లాభాలు పెంచుకునే వీలుంటుందనీ కంపెనీలు భావిస్తున్నాయి. ఖర్చుల మాట అట్టేపెట్టినా, మన దేశంలో పరిస్థితులు ఎలా మార తాయన్నది చూసుకోవాలి.దేశ కార్మికశక్తికి సవాల్మనది మిగులు కార్మిక ఆర్థిక వ్యవస్థ. ఉద్యోగాల అవసరం ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిపుణులైనవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. నైపుణ్యం పెద్దగా అవసరం లేని లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. నిర్దిష్ట నైపుణ్యాలు ఉన్నవారు దొరకడం ఒక సవాల్. ఏఐ వినియోగాన్ని పెంచుకుంటున్న కంపెనీలు ఇపుడున్న సిబ్బందిని తిరిగి నిపుణులుగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలి. లేదంటే వారిని గాలికి వదిలేసినట్లు అవుతుంది. అయితే, కొత్తగా నైపుణ్యాలను నేర్పించడానికి వయసు ఒక ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. కనుక, ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగి తీరుతుంది. విశ్వవిద్యాలయ స్థాయిలో వివిధ కోర్సుల పాఠ్య ప్రణాళికల్లో ఏఐని అంతర్భాగం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే మాట కూడా నిజం. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి మాత్రం కోతల బెడద తప్పకపోవచ్చు.సర్వేలో వెల్లడైన రెండవ పెద్ద అంశం– అసమానత. పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టి, ఏఐ నిచ్చెనమెట్లు ఎక్కేస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉంటుంది కనుక, అది వాటికి సాధ్యం కాని పని. ఇది ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మరింత పెంచుతుంది. కొన్ని సంస్థలు పోటీ పడలేక రంగం నుంచి వైదొలగక తప్పని స్థితి ఏర్పడవచ్చు. ఈ అసమానత సమస్య సిబ్బందికి కూడా వర్తిస్తుంది. అవస రమైన నైపుణ్యం ఉన్నవారికి వెంటనే ఉద్యోగాలొస్తాయి. మామూలు ఉద్యోగాలలో కంటే ఎక్కువ జీతభత్యాలు లభిస్తాయి. మిగిలిన రంగాలవారి కన్నా ఐటీ రంగం ఎక్కువ జీతభత్యాలు ఇవ్వజూప గలగడం ఇప్పటికే చూస్తున్నాం. ఏఐ విషయంలోనూ అదే జరుగు తుంది. వస్తూత్పత్తి నుంచి కస్టమర్ సర్వీస్ వరకు వివిధ సంస్థలు తమ కార్యకలాపాలకు అవసరమైన చట్రాలను డిజైన్ చేయగలిగిన ఏఐ నిపుణులకి ఎక్కువ జీతాలు ఇవ్వజూపుతాయి.మదన్ సబ్నవీస్వ్యాసకర్త ఆర్థికవేత్త, రచయిత -
రైతుకు భరోసానివ్వని బడ్జెట్
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా రోజుల క్రితమే ‘వ్యవసాయం, రైతాంగ సంక్షేమ’ మంత్రిత్వ శాఖ అనే పేరు పెట్టుకొంది. కానీ సంక్షేమం అన్నది మారిన పేరులో తప్ప క్షేత్ర స్థాయిలో కనబడటం లేదు. 2026 –27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ను చూసినప్పుడు అతి కీలకమైన వ్యవ సాయ రంగం క్రమంగా తన ప్రాధా న్యాన్ని కోల్పోయిందన్న బాధ కలగక మానదు. బడ్జెట్కు ముందురోజు విడుదలైన ఆర్థిక సర్వే, వ్యవసాయ రంగ దుఃస్థితిని తేటతెల్లం చేసింది. మొత్తం జీడీపీ (దేశ స్థూలోత్పత్తి) 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4.6 నుంచి 3.1 శాతానికి తగ్గుతుందని తేల్చారు. సాధారణంగా వృద్ధిరేటు మందగిస్తుందని తెలిసినప్పుడు దానిని పైకి లాగే చర్యలు తీసుకోవడం సహజం. ఆశ్చర్యంగా, తాజా బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ. 1.62 లక్షల కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల (2025–26 ఆర్థిక సంవత్సరంలో) కంటే ఇది 5.3 శాతం మాత్రమే ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే, ఈ పెరుగుదల నామమాత్రం.పరిశోధనలకు ఊతమేది?వ్యవసాయ రంగ ఉపరితల ముఖచిత్రాన్ని చూస్తే, గొప్ప గానే ఉన్నట్టు కనిపిస్తుంది. 2024–25లో 35.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండాయి. ఈ మొత్తం 145 కోట్ల జనాభాకు సరిపోవడమే గాక, ఎగుమతులు చేయడానికి ఆస్కారం ఉంది. పాడి, పండ్లు, కూరగాయలు, మత్స్య సంప దపై రాబడి సంతృప్తిగానే ఉంది. మరి సమస్యేమిటి? ఆర్థిక సర్వే వెల్లడించిన సమాచారం ప్రకారం – తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల ఉత్పాదకత, ఉత్పత్తి గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ స్థాయితో పోల్చుకుంటే మనం అట్టడుగున ఉన్నాం. దానివల్ల పంటలు గిట్టుబాటు కావడం లేదు. వారసత్వంగా సంక్రమి స్తున్న మార్కెటింగ్ సౌకర్యాల లేమి, ఇన్ఫుట్స్ వ్యయం గణనీ యంగా పెరగడం, చీడపీడలు, అకాల వర్షాలు, వర్షా భావం మొదలైనవి వెంటాడుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ‘మన కర్తవ్యం’ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్... ఉత్పాదకత పెంపుదలకు అవసరమైన ‘వ్యవసాయ పరిశోధన, విద్య’కు గతేడాది కేటాయించిన రూ.10,281 కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,967 కోట్లకు తగ్గించి వేయడం ఓ వైచిత్రి. వ్యవసాయ రంగంలో పరిశోధన, విద్యకు చాలా దేశాలు తమ వ్యవసాయ బడ్జెట్లో 1 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. దీన్ని స్థిరమైన ఉత్పాదకత వృద్ధికి సంబంధించి బెంచ్మార్క్గా పేర్కొంటారు. కానీ మనం మాత్రం ఇందుకు 0.5 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నాం. వ్యవసాయ పరిశోధనలపై పెట్టే ప్రతి రూపాయీ అదనపు రాబడిని తెచ్చి పెడుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేసినా, మన ప్రభుత్వాలు ఎందుకనో వినవు, కనవు.పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు మేలు చేకూర్చేందుకు ఇంతకు ముందుకంటే ఈ రంగాలకు దాదాపు 27 శాతం నిధులు కేటాయించడం ఒక్కటే సానుకూల అంశం. ఈ రంగాల ద్వారా రాబడి ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా తీరప్రాంత రాష్ట్రాలకు మత్స్య సంపదపై వచ్చే ఆదాయాన్ని వ్యవసాయంలో కలిపేసి... వ్యవసాయ రంగంలో తమ అభివృద్ధి 10 నుంచి 15 శాతంగా ఉన్నట్లు మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా చెప్పుకొంటున్నారు. దిగుమతుల బెడదదేశీయ రైతాంగానికి మరో పెను సవాలు పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు. అమెరికాకు చేసే ఎగు మతులపై తాజాగా ట్రంప్ 18 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని ఓ చల్లని కబురు చెప్పిన మాట నిజమే. కానీ, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అన్నింటిపై భారత్ ఎటువంటి సుంకాలూ విధించబోదని ట్రంప్ పేర్కొనడం పిడుగులాంటి వార్తే! ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంచడం ద్వారా ఇక్కడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నూనె గింజల దిగుమతులపై సుంకం విధించకుంటే దేశీయ నూనెగింజల రైతులు మునిగిపోతారు. కానీ, బడ్జెట్లో అటువంటి ప్రతిపాదనలేమీ చేయలేదు. దేశీయ వ్యవ సాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వకుండా దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నారు? అమెరికా ఉత్పత్తుల దిగుమతు లపై పూర్తిగా సుంకం ఎత్తివేస్తే... భారత రైతాంగం ఇకపై కొన్ని రకాల పంటల సాగును శాశ్వతంగా మానుకోవాల్సిందే. ఇక, తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొబ్బరి బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో తెలియదు. ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని 1.7 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాది ఇది 1.86 లక్షల కోట్లు. సబ్సిడీలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందని ఎరువుల లభ్యతను కావాలనే కేంద్రం తగ్గించేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఏదీ?అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించే అంశంలో చట్టబద్ధత కల్పించాలని ఎంతో కాలంగా రైతు సంఘాలు కోరుతున్నాయి. దాన్ని పెడచెవిన పెట్టారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపైన కూడా స్పష్టమైన దిశానిర్దేశం కొరవడింది. వ్యవసాయ పనిముట్లపై ఇంకా అధికశాతం జీఎస్టీ కొనసాగుతూనే ఉంది. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసే పరికరాల పైన కూడా కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలన్న కాఫీ గింజల ఉత్పత్తిదారుల డిమాండ్ను పట్టించుకోలేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని గత రెండు, మూడేళ్లుగా చెబుతూనే ఉన్నా... దానిని అమలు చేస్తున్న రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. సంప్రదాయంగా వరి పండించే తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని కొబ్బరి, జీడి, చందనం వంటి పంటలకు మళ్లమని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ, ప్రభుత్వాల పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎక్కడ? భవిష్యత్తులో వరి, గోధుమ వేసినట్లయితే నష్టపోతారని ఆర్థిక సర్వేలో చెప్పారు. వరి పండించే చిన్న సన్నకారు రైతాంగానికి తగిన అవగాహనతో పాటు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఫలితం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించు కోవడానికి ‘భారత్ విస్తార్’ పథకం ద్వారా రైతులకు వారి భాష లోనే సలహాలు, సూచనలు అందించాలన్న చొరవను స్వాగతించాల్సిందే. కానీ ముందుగా మౌలికమైన మార్పులు తేవడానికీ, ముఖ్యంగా పంటల మార్పిడికి రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికీ అవసరమైన నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
జెఫ్ బెజోస్ (వ్యాపార దిగ్గజం) రాయని డైరీ
సంతకం పెడుతున్నప్పుడు చేయి వణికిందంటే చేయకూడని పని ఏదో చేస్తున్నట్లు! లేదా, జరగవలసిన పనే ఏదో జరుగుతున్నట్లు!! ‘వాషింగ్టన్ పోస్ట్’లో ఒకేసారి 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ నేను చేసిన సంతకం... చేయక తప్పనిదా? చేసినా తప్పవనిదా? సిబ్బందిని తగ్గిస్తూ, నేను సంతకం చేస్తున్నప్పుడు నా వేలికి అంటిన ఫౌంటైన్ పెన్ ఇంకు నాకు భారంగా తోచింది. అయితే, నా గుండెను బరువెక్కించిన విషయం వేరే ఉంది. ఏ పత్రికలోని ఉద్యోగులనైతే తొలగించ టానికి నేను సంతకం చేయవలసి వచ్చిందో సరిగ్గా ఆ పత్రికే, నా తొలగింపుల సంతకపు కాగితానికి ‘ఒత్తు’గా ఉండటం నా మనసును కలవరపరిచిన కో–ఇన్సిడెన్స్!తొలగింపుల జాబితాలో తమ పేరు కనిపించిన ఉద్యోగులకు కూడా నాలాగే గుండె బరువెక్కి ఉంటుంది. కాళ్ల కింద భూమి కదిలే ఉంటుంది. కానీ, చెట్టును బతికించటానికి కొమ్మలను నరికేయక తప్పని స్థితి. ఈ ఏడాది మళ్లీ మరొక 100 మిలియన్ డాలర్ల నష్టాల్లోకి పేపర్ వెళ్లబోతోంది. పోయిన సంవత్సరం వంద మిలియన్ల నష్టం! ఆ ముందు ఏడాదీ వంద మిలియన్ల నష్టం! పన్నెండేళ్ల క్రితం నేను ‘వాషింగ్టన్ పోస్ట్’ను కొన్నదే 250 మిలియన్ డాలర్లకు!పేరున్న ఒక న్యూస్ పేపర్గా మాత్రమే ఆనాడు నేను ఈ 148 ఏళ్ల చరిత్ర కలిగిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికను కొనలేదు. ప్రజాస్వామ్య మూలస్తంభాన్ని కొన్నట్లుగా కొన్నాను. లాభాలు చూసుకోలేదు. కానీ ఇప్పుడు నష్టాలను చూసుకోవలసి వస్తోంది. ‘వాషింగ్టన్ పోస్ట్’లో న్యూస్ రూమ్లు, న్యూస్ బ్యూరోలు ఎక్కువైపోయాయి. న్యూస్ పేపర్ చదివేవాళ్లు తక్కువైపోయారు. ‘న్యూయార్క్ టైమ్స్’కూ, ‘వాల్స్ట్రీట్ జర్నల్’కూ... ‘వాషింగ్టన్ పోస్ట్’ పోటీ ఇవ్వలేకపోతోంది.‘‘ఏం చేద్దాం, మిస్టర్ మ్యాక్’’ అని అడిగాను ఒకరోజు. ఆయన మౌనంగా ఉండిపోయారు! మ్యాక్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఆయన పక్కనే సీఈవో విలియం ఉన్నారు. ‘‘మీరు చెప్పండి మిస్టర్ విలియం’’ అన్నాను. ఆయనా మౌనంగా ఉన్నారు!! ఆ ఇద్దరి మౌనాల తర్వాత నేను తీసుకోవలసి వచ్చిన కఠినమైన నిర్ణయమే... ‘వాషింగ్టన్ పోస్ట్’లోని కొన్ని డెస్క్లను, కొన్ని బ్యూరోలను ఎత్తివేయటం, మూకుమ్మడిగా కొందరు జర్నలిస్టులను తొలగించటం.270 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులున్న జెఫ్ బెజోస్కు 100 మిలియన్ డాలర్ల నష్టం ఒక లెక్కా అని ఎవరికైనా అనిపించవచ్చు. ఇది లెక్కల విషయం కాదు. నెలనెలా తన బిలియనీర్ యజమాని జేబు లోంచి వచ్చే డబ్బుతో ఏ సంస్థా నడవకూడదు. ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి దిగ్గజమైతే తన ఇంజిన్ తోనే రన్ అవ్వాలి. అలా నడవటమే పత్రికకు, పత్రికలోని ఉద్యోగులకు గౌరవం. అమెజాన్ ఆఫీస్ బిల్డింగ్కు నేను పెట్టుకున్న పేరు ‘డే–1’. కొత్తగా పెట్టిన కంపెనీ తొలి రోజు ఎంత ఎనర్జిటిక్గా ఉంటుందో, పదివేల ఏళ్ల తర్వాత కూడా ఆ కంపెనీ, తొలి రోజు ఉన్నట్లే ఉండాలన్నది ‘డే–1’ వెనుక నా ఫిలాసఫీ. కంపెనీ ‘డే–2’ లోకి వచ్చిందంటే... స్తబ్ధత, అసంబద్ధత, క్షీణత తప్ప ఇక అక్కడేం లేవని!‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రస్తుతం ‘డే–2’ లో ఉంది. తిరిగి ‘డే–1’లోకి తెచ్చేందుకే ఈ తొలగింపులు, ఎత్తివేతలు అంటే ఎవరైనా ఎందుకు సంతోషిస్తారు? ఆఖరికి మ్యాక్, విలియమ్ కూడా సమ్మతంగా లేరు. 18 సొంత కంపెనీలు ఉండొచ్చు, 31 కంపెనీల్లో వాటాలు ఉండవచ్చు. బిలియన్ల కొద్దీ ఆస్తులు ఉండవచ్చు. లక్షలాది మంది వర్కర్లు ఉండవచ్చు. కానీ, కొద్దిమంది ఉద్యోగులను తొలగించవలసి వచ్చినప్పుడు మాత్రం... అన్నన్ని కంపెనీలు, అన్నన్ని వాటాలు, అన్నన్ని ఆస్తులు, అంతంత మంది వర్కర్లు ఉన్న ఏ బిజినెస్ టైకూన్కైనా ఒక్క అపరాధ భావన మాత్రమే తోడుగా ఉంటుందేమో! -
వికృత ‘కాస్టింగ్ కౌచ్’ క్రీడకు మూలం!
సినిమా రంగం అంటే సామాన్య ప్రజలకు అదొక రంగుల ప్రపంచం, కలల సౌధం. వెండితెరపై కనిపించే తారల వెలుగుల వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో, ఎన్ని అవమానాలు దాగి ఉన్నాయో బయటి ప్రపంచానికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రతిభ ఉంటే చాలు, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చనే ప్రచారం ఈ పరిశ్రమలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఒక అగ్ర కథానాయకుడు మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనే సంస్కృతే లేదనీ, నటీనటులు క్రమ శిక్షణతో ‘స్ట్రిక్ట్’గా ఉంటే ఎవరూ ఇబ్బంది పెట్టరనీ ఉద్బోధించారు. తన కుమార్తెను కూడా ఈ రంగంలోకి రావాలని ప్రోత్సహించానని ఆయన ఉదాహరించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసే మహిళా నటీమణుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. వెనుక అండదండలు ఉన్న వారసులకూ, ఏ అండా లేని సాధారణ యువతులకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని వారు ఎత్తిచూపారు. ప్రతిభ ఉన్నా ‘కమిట్మెంట్’, ‘అడ్జస్ట్మెంట్’ పేరుతో శారీరక లొంగుబాటు కోరడం ఇక్కడ నిత్యకృత్యమనీ, అది లేకుండా అవ కాశాలు రావడం దాదాపు అసాధ్యమనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్ట్రిక్ట్’గా ఉండటం అంటే వచ్చిన అవ కాశాన్ని వదులుకుని వెనక్కి వెళ్లిపోవడమే తప్ప మరో మార్గం లేదని వారు కుండబద్దలు కొట్టారు. అసలు ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే మాటకూ అర్థం ఏమిటి? ‘కాస్టింగ్’ అంటే సినిమా నిర్మాణంలో నటీ నటులను, ఇతర సాంకేతిక నిపుణులను ఎంచుకునే ప్రక్రియ. ‘కౌచ్’ అంటే ఆ ఎంపిక సమయంలో చర్చలు జరిపే పెద్ద సోఫా. అది పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అమెరికన్ భాషా శాస్త్రవేత్త బెంజమిన్ జిమ్మెర్మ్యాన్ వివరణ ప్రకారం, సినిమాలో అవకాశం ఇవ్వాలంటే పడక సుఖం కోరడం అనే వికృత ధోరణే ఈ పేరుతో పిలవబడుతోంది. పైకి మాత్రం చాలా మర్యా దగా ‘కమిట్మెంట్’ ఉండాలనీ, కొంత ‘అడ్జస్ట్’ కావా లనీ అంటుంటారు. ఇది 1910–1920 కాలంలో హాలీవుడ్, బ్రాడ్వే నాటక రంగాల్లోనే ప్రబలంగా ఉండే దని చరిత్ర చెబుతోంది. నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే ఈ దోపిడీకి ‘కాస్టింగ్ కౌచ్’ అనే పేరు స్థిరపడిపోయింది.సినిమా రంగంలోని ఈ అనారోగ్యకర ధోరణు లను, దానిపట్ల ఉన్న ఆకర్షణ గురించి 80 ఏళ్ళనాడే చలం, తన ‘సినిమా జ్వరం’ అనే వ్యాసంలో సినిమా జాడ్యం ముసలివాళ్ళ దగ్గిర్నించీ పసిపిల్లల దాకా గట్టిగా పట్టుకుందనీ, ఇది మరింతగా విస్తరించబోతోందనీ జోస్యం చెప్పారు. పూర్వం యోగుల కటాక్షం కోసం శిష్యులు వేచి చూసినట్లు, నేటి యువతీ యువకులు ఒక్క అవకాశం కోసం దర్శకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సేవ చేస్తున్నారని ఆయన విమర్శించారు. సినిమా రంగం అత్యంత పవిత్రమైనదనీ, ఇక్కడ శీలానికి భయం లేదనీ చెప్పే దొంగ రాతలు ప్రజలను వంచించ డమేనని చలం ఘాటుగా స్పందించారు. ‘అడవిలో పాములు, పులులు ఉన్నాయని హెచ్చరించడం న్యాయం. జాగ్రత్తగా వెళ్ళు అనడం ధర్మం. కానీ పులిని బ్రహ్మస్వరూపంగా భావించమని, అడవిలో ఏమీ లేవని చెప్పి పంపడం ఘాతుకం’ అని ఆయన అభిప్రాయ పడ్డారు. వాస్తవాలను దాచిపెట్టి అబద్ధపు పేర్లతో లోకాన్ని మోసం చేయడం వల్లే సగం సమస్యలు పుడు తున్నాయని ఆయన ఆనాడే స్పష్టం చేశారు.హిందీ నుంచి తెలుగు దాకా...ఈ జబ్బు కేవలం మన ప్రాంతానికే పరిమితం కాదు. హాలీవుడ్ చరిత్రకారుడు కారీ రిక్కే రాసిన దాని ప్రకారం... ఆనాటి సుప్రసిద్ధ నటి మార్లిన్ మన్రో హాలీ వుడ్ను ఒక ‘కిక్కిరిసిన వేశ్యావాటిక’గా అభివర్ణించింది. హారీ కోహ్న్ వంటి బడా నిర్మాతలు నటీమణులను పడక గదిలో పరీక్షించకుండా అవకాశాలు ఇచ్చేవారు కాదని ప్రతీతి. హాలీవుడ్లో ఈ జాడ్యంపై 2018–2020 కాలంలో ప్రపంచవ్యాప్తంగా ‘మీ టూ’ ఉద్యమం పెల్లు బికింది. తెలుగు చిత్రసీమలో కూడా 2017లో ఫిలిం నగర్ సాక్షిగా ఒక నటి చేసిన అర్ధనగ్న నిరసన ప్రదర్శన పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనల తర్వాత వాస్తవాలను తేల్చడానికి, ఇటువంటి దుర్మా ర్గాలు జరగకుండా చూడటానికి కొన్ని కమిటీలు ఏర్పాటై నట్లు వార్తలు వచ్చినా, ఆశించిన మార్పు మాత్రం అగుపించలేదు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా కేవలం కమిటీలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని కాలం నిరూపించింది.సినిమా అనే విచిత్రమైన సరుకును తయారుచేసే పెట్టుబడిదారీ విధానంలోనే ఈ దోపిడీ మూలాలు ఉన్నాయి. సినిమాల ప్రారంభం నుండి స్త్రీ దేహాన్ని కేవలం ఒక భోగ వస్తువుగా, సెక్స్ సింబల్గా చూపే ధోరణి పెరిగింది. మహిళలను కేవలం లాభాలు తెచ్చి పెట్టే సరుకులుగా (‘కమోడిఫికేషన్’) మార్చే ఈ వ్యవ స్థలో మార్పు రానంత కాలం ఎన్ని నిరసనలు తెలిపినా ఫలితం శూన్యం. చలం తన వ్యాసంలో చెప్పినట్లు, స్టూడియోలు, దర్శకులు ఉన్నతమైన ఆశయాలు, ప్రజల మీద ప్రేమ గలవారైతే తప్ప పరిస్థితులు మారవు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అదొక కళ అనీ, అందులో పనిచేసే వారు మనుషులనీ గుర్తించినప్పుడే ఈ ‘కాస్టింగ్ కౌచ్’ అనే వికృత క్రీడకు ముగింపు లభిస్తుంది.– బి.ఆర్. బాపూజీహైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ -
అంతరిక్షానికి నిచ్చెనౌతాను!
ఇటీవలి తన భారతదేశ పర్యటనలో భాగంగా ‘నాసా’ వ్యోమగామి సునీతా విలియమ్స్ ‘అన్పాలిటిక్స్’ పాడ్ కాస్ట్లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో, మునుపెన్నడూ వెల్లడించని విషయాలను, భావోద్వేగాలను సునీత పంచుకున్నారు.‘ద మార్షియన్’ సినిమా గుర్తొచ్చింది!‘‘మేము అంతరిక్ష నౌకను అంతరిక్ష కేంద్రంతో కలుపు తున్న (డాకింగ్) సమయంలో ఐదు ఇంజిన్లు ఆగి పోయాయని తెలిసి ఆందోళన కలిగింది. అది మా పుస్త కాల్లో ఎక్కడా లేని ఒక పెద్ద సాంకేతిక సమస్య. కానీ ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలి? చిన్న చిన్న భాగా లుగా చేసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. అప్పుడు నాకు ‘ద మార్షియన్’ సినిమా గుర్తొచ్చింది. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, ఆ సమస్య ఎంత పెద్దదని చూడకూడదు; మన ముందున్న చిన్న పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. పనిలో పడిపోతే భయపడటా నికి సమయం ఉండదు.కల్పన కుటుంబంతో మూడు నెలలు‘కొలంబియా’ ప్రమాదం జరిగిన తర్వాత, నేను హ్యూస్టన్లోని కల్పన (చావ్లా) కుటుంబంతో మూడు నెలల పాటు గడిపాను. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వారితోనే ఉండేదాన్ని. అది ఊహించని, విపత్కాలం. వారికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగించాలని అనుకున్నాను. ఆ మూడు నెలల్లో మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కల్పనలోని సుగుణాల గురించి నేను వారికి చెప్పాను. ఇండియాలో కల్పన చిన్ననాటి కథలను వారు నాకు చెప్పారు. అది మా అందరికీ ఎంతో ఊరటనిచ్చింది. రానున్న కాలమంతా చంద్రుడిదే!‘‘నా రిటైర్మెంట్ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని ముగించడానికి ఇదే సరైన సమయం అని నా భావన. నా కెరీర్ అంతా అంతరిక్ష కేంద్రంతోనే సరిపోయింది కానీ, రాబోయే కాలం చంద్రుడికి సంబంధించింది. ఇప్పుడు నాకంటే చిన్న వయస్సులో ఉన్నవాళ్లు బాధ్యతలు చేపట్టారు. వారు చరిత్ర సృష్టించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపై ఆ సీటులో నేనే కూర్చోవాలని లేదు. నేనేమీ అద్భుతాలు చేసే మెజీషియన్ని కాదు. నేను కూడా వారిలో ఒకరిని మాత్రమే. వారు పైకి ఎదగడానికి నేను ఒక నిచ్చెనలా తోడ్పడాలని కోరుకుంటున్నాను. (సునీత 27 ఏళ్ల కెరీర్ తర్వాత ‘నాసా’ నుంచి 2025 డిసెంబర్ 27న రిటైర్ అయ్యారు. ఆ సంగతిని నాసా, సునీత ఇండియా పర్య టనలో ఉండగా 2026 జనవరి 21న ప్రకటించింది.)అదొక అందమైన జీవ ప్రవాహం!‘‘అంతరిక్షం నుండి భారతదేశాన్ని చూడటం అద్భుతంగా ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట. మనం పైనుండి వెళ్తున్నప్పుడు, నగరాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక ‘నరాల వ్యవస్థ’ లాగా కనిపిస్తాయి. మా నాన్న మైక్రోస్కోప్ కింద చూసే బొమ్మల్లా ఉంటా యవి. ముంబై తీరంలో చేపల పడవలు వెలుగుతున్న దీపాల్లా కనిపిస్తాయి. తీరం వెంబడి కాంతులు ఒక ముత్యాల హారంలా మెరుస్తాయి. ఇవన్నీ చూస్తుంటే మా కుటుంబ చరిత్ర, ఈ దేశంతో మాకున్న అనుబంధం నాకు బలంగా గుర్తొస్తాయి. చూడటానికి అది ఒక అందమైన జీవప్రవాహంలా అనిపిస్తుంది.పెంపుడు కుక్క ప్రేమ జ్ఞాపకాలు‘‘నా చేతిపై ఉన్న ఈ పాదముద్రల పచ్చబొట్లు మాపెంపుడు కుక్కవి. ఇవి నా దగ్గర 2001 నుండి 2017 వరకు ఉన్న ‘జాక్ రస్సెల్ టెర్రియర్’ రకానికిచెందిన నా పెంపుడు కుక్క అసలు పాద ముద్రలు. అది నాతో పాటు శిక్షణ కోసం రష్యాకు కూడా వచ్చింది. నేను పరిగెత్తేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు దానిని చూస్తుంటే, నాకు ఇంటితో ఉన్న అనుబంధం గుర్తు కొస్తుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు, జంతువులు మనకు స్వచ్ఛమైన నిజాయితీ గల ప్రేమను గుర్తు చేస్తాయి. మన మనుషుల్లాగా వాటికి మనసులోగందరగోళం ఉండదు. నా శరీరంపై ఉన్న ఈ గుర్తులు నన్ను ఎప్పుడూ నా ఇంటి జ్ఞాపకాలతో, ఆ స్వచ్ఛతతో కలుపుతూ ఉంటాయి.-ఎడిటోరియల్ టీమ్ -
పరిశోధనలు ప్రైవేటు పరమా?
సాధారణంగా అందరూ అనుకునేట్టు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ కేవలం పన్నులు, ఆదాయం, ఆ యారంగాలకు కేటాయింపులు మాత్రమే కాదు. కీలక రంగాల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు, విధానపరమైన మార్పులు ఇందులోనే వ్యక్తమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానరంగం ఉరకలేస్తున్న తరుణంలో అంతర్జా తీయ రాజకీయ పరిణామాలనూ దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది బడ్జెట్ సరికొత్త సవాళ్లకు సమాధానాలు తెలిపేదిగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఈ దిశలో బడ్జెట్ నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించుకున్నట్టు ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ కాదు. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల విషయంలో ఇది యథాతథ స్థితిని కొనసాగించే సాధారణ బడ్జెట్. మార్పునకు సూచికలేనా?ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. కొత్త టెలిస్కో పులు, వేధశాలల ఏర్పాటును ప్రస్తావించారు. అరుదైన మూలకా లకు సంబంధించిన కారిడార్ల గురించి, సెమీ కండక్టర్ మిషన్ రెండో అధ్యాయం ప్రారంభం, బయోఫార్మా తయారీ వ్యూహాలూ ప్రసంగంలో ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన పనులే. అయితే ఏవీ ఓ గొప్ప మార్పునకు సూచికలైతే కావు. ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్’ (ఐఐఏ) 15 ఏళ్లుగా నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోపు తయారీ కోసం శ్రమిస్తోంది; ఐదేళ్లుగా నేషనల్ లార్జ్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు నిర్మాణ ప్రయత్నాల్లోనూ ఉంది. ఆర్థిక మంత్రి వీటి గురించే బడ్జెట్లో ప్రస్తావించారు. వీటి డిజైనింగ్, స్థలంఎంపిక, పరిశోధన వేదిక పునాదులు, సిబ్బంది వంటి కీలకమైన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. స్థలం ఎంపిక కోసం ఆర్థిక మంత్రి స్వయంగా లద్దాఖ్ను సందర్శించారు కూడా.సూర్యుడిపై పరిశోధనల విషయంలో భారత్ సామర్థ్యం గట్టిదే. ప్రతిపాదిత టెలిస్కోపు కూడా ఆదిత్య ఎల్, ఉదయ్పూర్లోని మల్టీ అప్లికేషన్ సోలార్ టెలిస్కోపుల ద్వారా అందుతున్న సమాచారానికి సాయంగా నిలుస్తుంది. కొత్త టెలిస్కోపు నిర్మాణ వ్యయం దాదాపు రూ.3,500 కోట్లుగా లెక్కగట్టారు. అయితే ఐఐఏకు అదనపు బడ్జెట్ కేటాయింపులేవీ జరగలేదు. ఐఐఏ సహా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్్సకు అనుబంధంగా ఉన్న 25 అటానమస్ సంస్థలకు ఈ ఏడాది బడ్జెట్లో దక్కింది రూ.1,623 కోట్లు మాత్రమే.సాధారణ ప్రక్రియలో భాగమే!రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్లతో బయోఫార్మా ‘శక్తి’ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బయలాజిక్స్, బయో సిమిలర్స్ తయారీ చేపడతారు. అయితే మంత్రి ప్రకటించిన మొత్తం... మూడు కొత్త ‘నేషనల్ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’ (నైపర్)ల నిర్మాణానికీ, వీటికి అనుబంధంగా ఉన్న వెయ్యి అక్రిడి టెడ్ క్లినికల్ ట్రయల్స్కూ ఖర్చు చేస్తారు. ఈ రెండూ సాధారణ ప్రక్రి యల్లో భాగమే కానీ, బయోఫార్మాకు ప్రత్యేకమైనవి ఏమీ కాదు.‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ను బలోపేతం చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. ఇది అవసరమే కానీ బయో ఫార్మా వ్యూహంలో దీన్ని భాగం చేయడం ఆశ్చర్యకరం. శక్తి కార్యక్ర మంలో భాగంగా కేటాయించిన పదివేల కోట్ల రూపాయల్లో నైపర్ లకు ఎంత, మిగిలిన వాటికి ఎంతెంత అన్న స్పష్టత లేదు. వాస్తవా నికి, శక్తి కార్యక్రమం 2017లో వరల్డ్ బ్యాంక్ సాయంతో నేషనల్ బయోఫార్మా మిషన్లో భాగంగా 25 కోట్ల డాలర్లతో చేపట్టారు. దీని ద్వారా టీకాలు, బయోసిమిలర్లు, వైద్య పరికరాల తయారీ, పరిశో ధనలు చేయాలన్నది లక్ష్యం. హాట్ టాపికే కానీ...బడ్జెట్ ప్రసంగంలో సెమీ కండక్టర్లు, రేర్ఎర్త్ మినరల్స్, ఏఐ వంటి వాటి ప్రస్తావన వచ్చినప్పటికీ ఏదీ గేమ్ఛేంజర్ స్థాయికి చేరలేదు. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీ కేంద్రం ఒకదాన్ని గత ఏడాది నవంబరులో ప్రారంభించామని ప్రకటించిన మంత్రి... ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. గతేడాది ప్రకటించిన నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్లో ఇవన్నీ భాగం కావడం గమనార్హం. కొన్నేళ్లుగా బడ్జెట్ ప్రసంగాల్లో తరచూ వినిపించిన ఇంకో ఆలోచన ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’. ఈసారి దీన్ని కేవలం ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేశారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినా గతేడాది రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపులు కూడా అంతే మొత్తంలో ఉండటం గమనార్హం. గతేడాది ప్రకటించిన రిసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీమ్ ద్వారా ప్రైవేట్రంగ డీప్ టెక్ ప్రాజెక్టులకు వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లు అందాల్సి ఉండగా గతేడాది రూ.20,000 కోట్లు దక్కాయి. ఇందులో ఖర్చ య్యింది రూ. 3,000 కోట్లు మాత్రమే. కేంద్ర కేబినెట్ దీన్ని గత ఏడాది జూలైలో ఆమోదించడం ఇందుకు కారణం. నియమ నిబంధనలు కాస్తా నవంబరుకు కానీ పూర్తి కాలేదు.కేటాయింపులో ఖర్చు చేసిన మొత్తం తక్కువైనా... అమలు తీరులో ఎన్నో లోపాలున్నా ఆర్డీఐకి జరిపిన కేటాయింపులను బట్టి చూస్తే... ప్రభుత్వం పరిశోధనలను ప్రైవేట్పరం చేసేందుకు నిర్ణ యించినట్టుగా కనిపిస్తోంది. ‘అనుసంధాన్’కు కేవలం రూ. 2,000 కోట్లే దక్కాయి. ఆర్డీఐకి ఇంతకు పది రెట్లు ఎక్కువ కేటాయించారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలకు కేటాయింపులు తగ్గిపోగా... ప్రైవేట్ రంగానికి ఎక్కువయ్యాయి. ఇదేమంత మంచి పరిణామం కాదు.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత-దినేశ్ సి. శర్మ -
లడ్డూపై అబద్ధాల ప్రచారం రాజకీయ కుట్రే!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగకుండానే జరిగిందని ప్రచారం చేయడం పెద్ద నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు లడ్డూలో కల్తీ జరిగిందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను దోషిగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్డుకు ఈడ్చడం ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగనిది. సీబీఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో ఈ విషయాలన్నీ నేడు స్పష్టమయ్యాయి. అయినా వైఎస్సార్ సీపీని టార్గెట్ చేసేందుకు మళ్లీ దర్యాప్తు కమిటీని నియమిస్తామంటున్నారు. సీబీఐ తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వనందుకే ఈ కమిటీని నియమిస్తున్నారా?రాజకీయ లబ్ధి కోసం భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న చంద్రబాబు, ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారని ఆశించినవారికి నిరాశే మిగిలింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు అనుకూల మీడియాతో కలిసి ప్రజ లను తప్పుదోవ పట్టించే కొత్త పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి’ అని చెప్పి అధికారం దక్కించుకున్నాక, తన సహజ స్వరూపాన్ని మరో సారి బయటపెట్టుకున్నారు. సీబీఐ ఛార్జ్షీట్లో జంతు కొవ్వు కలవ లేదని తేలినా, పదే పదే అబద్ధాలు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. ఎటు వంటి విచారణ లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ముఖ్యమంత్రే స్వయంగా కల్తీ జరిగిందని ప్రకటించడం వెనుక ఉన్న ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సైతం ఘాటుగా స్పందించింది. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి అపోహలు సృష్టించడం తగదని మందలించింది.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థ లైన హరియాణాలోని ‘నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్ లోని ‘నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు’ పరిశోధనల ప్రకారం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయింది. సీబీఐ ఛార్జ్షీట్లో కూడా జంతు కొవ్వు ప్రస్తావనే లేదు. ఇలాంటప్పుడు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టి చేసిన ఈ రాజకీయ క్రీడ అత్యంత దురదృష్టకరం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు, ఇప్పటికైనా బాబు తన తప్పును ఒప్పుకుని హుందాగా వ్యవహరించడం అవసరం.దేవుని పేరుతో రాజకీయం చేసే బీజేపీ నాయకత్వం ఈ విష యంలో అనుసరిస్తున్న మౌనం విస్మయకరంగా ఉంది. ఒక మహిళా నేత తమ పార్టీకి కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తున్నారు. గతంలో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలపై సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు నోరు మెదపని ఆమె, ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై వింతగా స్పందిస్తున్నారు. తన బంధువు దోషిగా తేలుతారని తెలిసి ఇటువంటి విమర్శలు చేస్తున్నారా? మరొక నాయకుడు ఆలయ మెట్లు కడుగుతూ, సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. తన రాజకీయ భాగస్వామిని రక్షించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జరిగిన తప్పునకు బాధ్యత వహిస్తూ భక్తులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డివ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -
దారీ తెన్నూ లేని జెన్–జీ తుపాను
బంగ్లాదేశ్లో ఈ నెల 12న, నేపాల్లో వచ్చే నెల 5న పార్లమెంటు ఎన్నికలు జరగనుండగా, అక్కడ తిరుగుబాట్లు చేసి ప్రభుత్వాలను కూలదోసిన జెన్–జీ ఉద్యమాలు దారీ తెన్నూ లేకుండా పోయాయి. ఆ రెండు తిరుగుబాట్లు చేసిన యువతరానికి అందుకు తగిన కారణాలైతే ఉన్నాయి. కొన్ని లక్ష్యాలనూ ప్రకటించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ తమ సిద్ధాంతాలు ఏమిటో తెలియక, తగిన రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేక, నాయకులను ఎంపిక చేసుకోలేక అన్ని విధాలా అయోమయాలకు గురయ్యారు. చివరకు ఎన్నికలు ప్రకటించే వేళకు అనేక గ్రూపులుగా మారి ఎవరి దారి వారిదయింది. వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సమాజాలు ఈ సరికే నిరాశకు గురైన స్థితిలో, ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాతి పరిపాలనలు ఏ విధంగా ఉండేదీ అర్థంకాని పరిస్థితి కనిపిస్తున్నది.స్పష్టత లేని బంగ్లా యువతబంగ్లాదేశ్ విద్యార్థి–యువజనుల తిరుగుబాటు 2024 జూన్లో మొదలైంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా సాగించిన అణచివేతను తట్టుకుని మరింత తీవ్రంగా మారింది. రెండు నెలల పాటు జరిగిన ఉద్యమాన్ని పరిష్కరించలేక షేక్ హసీనా రాజీనామా చేసి భారత దేశానికి పారిపోయి వచ్చారు. ఆ దరిమిలా, నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంట్ను రద్దు చేసి కొత్త ఎన్నికలు ప్రకటించారు.అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా, తిరుగుబాటుతరం ఏమి చేయగలదీ స్పష్టత రాలేదు. వారిలో పలు గ్రూపులు తయారు కాగా, కనీసం కొందరు ముఖ్యులతో కలిపి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకోలేక పోయారు. చివరకు కొద్దిమంది కలిసి ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ పేరిట ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. కానీ అందులో ఐక్యత లేక పోయింది. అంతకన్నా ముఖ్యంగా, తమ సిద్ధాంతం ఫలానా అని నిర్ణయించుకుని దేశానికి తెలియజెప్పలేక పోయారు. నమ్మకం కోల్పోయిన తిరుగుబాటుతిరుగుబాటులో వారికి మద్దతుగా నిలిచిన ప్రజలు కోరుకున్నది నిర్దిష్టమైన నాయకత్వం, సిద్ధాంతాలు గల ఒక ప్రత్యామ్నాయ పార్టీని! విద్యార్థులు, యువకులు దేనికి నిరసనగా,ఏ లక్ష్యాలతో తిరుగుబాటు జరిపారో వాటి నుంచి, పాత పార్టీలకు భిన్నమైన ఒక కొత్త పార్టీని!! కానీ, తిరుగుబాటు రోజుల నుంచి సుమారు సంవత్సర కాలం గడిచినా ఇవేవీ జరగలేదు.షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఇక రంగంలో ఉండదని తేలిపోగా, మిగిలిన రెండు ప్రధానమైనవి ఖలీదా జియా మరణం తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్ నాయకత్వాన గల‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’, ‘జమాతే ఇస్లామీ పార్టీ’లు. విద్యార్థుల తీరు వల్ల వారి పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లగా, ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బీఎన్పీ,జమాతే అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల పార్టీ ఎక్కడో వెనుకబడి పోయింది. దానితో ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకత్వం జమాతేతో పొత్తు కలవగా, ఒక మతతత్వ పార్టీతో ఐక్య సంఘటనను నిరసిస్తూ పలువురు విద్యార్థి నాయకులు బయటకు పోయారు. బయటి సమాజంలోనూ తీవ్రమైన విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నుంచి గెలిచేది ఎందరనే ప్రశ్న ఎట్లున్నా, వారి ఉద్యమం ఈ రోజున ఎక్కడ మిగిలింది, తమ లక్ష్యాలను ఏ మేరకు సాధించనున్నది, తమపై ఆశలు పెట్టుకుని బలపరచిన ప్రజలకు ఏమి చెప్పగలదన్నది మౌలికమైన ప్రశ్న. అందులో విఫలమైన పక్షంలో, ఇకభవిష్యత్తులోనూ అవే పాత పార్టీలు అధికారానికి రాగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున, ఆ నాయకత్వాలు తామేదో మారామని బయటకు చెప్తున్నా అటువంటి ఆశలు ఎవరికీ లేని స్థితిలో, ఉద్యమ ప్రభావాలు శూన్యంగా మిగల నున్నాయంటే పొరపాటు ఉండబోదు. మునుముందు మరొక మారు తిరుగుబాటు తలెత్తితే ప్రజలు విశ్వసించటం తేలిక కాబోదు.చీలిన నేపాల్ గ్రూపులునేపాల్ను గమనించినా పరిస్థితి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. అక్కడి జెన్–జీ ఉద్యమం నిరుడు సెప్టెంబర్లో ఒకేమారు అగ్నిపర్వతం వలె పేలి కేవలం రెండు రోజులలో ప్రభుత్వాన్ని కూలదోసి, పార్లమెంటును రద్దు చేయించింది. వారి నిరసనలు కూడా బంగ్లాదేశ్లో వలె అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, బంధుప్రీతి, ఆర్థిక సమస్యలు, అసమర్థ పాలనకు సంబంధించినవే. అక్కడి ప్రజలు వారిని పూర్తిగా బలపరచి, వారి నాయకత్వాన ప్రత్యామ్నాయ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలు ఏర్పడగలవని ఆశించారు. తిరుగుబాటు ఆకస్మికం అయినందున దేశమంతటా ఎక్కడికక్కడ కలిపి మొత్తం సుమారు 60 జెన్–జీ గ్రూపులు ఉనికిలోకి రాగా, వాటిలో కనీసం కొన్ని ముఖ్యమైనవి ఒక్కటై ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలవనుకున్నారు.కానీ, నెలలు గడిచిపోతున్నా అది జరగకపోగా అనేక గ్రూపులు తమ గత కాలపు సిద్ధాంతాలు, వ్యక్తిగత అనుబంధాలను బట్టి, లేదా టికెట్లు ఆశించి ప్రధానమైన అయిదు పాత పార్టీలతో చేరాయి. రెండు మూడు గ్రూపులు సొంత పార్టీలు ఏర్పాటు చేశాయి గానీ అవి బలహీనంగా మిగిలిపోయాయి. ఉద్యమకారులకు, ప్రజలకు కూడా తగినంత అభిమానం ఉన్నట్లు భావించే మాజీ ఉపప్రధాని రవి లమిఛానే, ఖాట్మండు మాజీ మేయర్ బాలేన్ షా, జాతీయ విద్యుత్ సంస్థ మాజీ ఎం.డి. ఘీషింగ్ కలిసి ఏర్పాటు చేసిన పార్టీ కొన్ని ఆశలు రేకెత్తించింది గానీ, మొదలైన వారం రోజులకే చీలిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇంతటి తిరుగుబాటు జరిగి, దాని నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని నేపాలీ కాంగ్రెస్, మాజీ ప్రధానులు ఓలీ పార్టీ, ప్రచండ పార్టీ, బాబూరాం భట్టరాయ్ పార్టీ, మాజీ ఉపప్రధాని లమిఛానే పార్టీలు ప్రకటించినా, ఆ పాఠాలు ఏమిటో, భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటో వివరిస్తూ మేనిఫెస్టోలను ఏ ఒక్కరూ ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారాలు మొదలు పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు హతాశులై మిగిలారు.గత రెండేళ్ళలో బంగ్లాదేశ్, నేపాల్లోనే కాదు. మరొక డజను దేశాలలోనూ జెన్–జీ తిరుగుబాట్లు జరిగాయి. ఒకటి రెండు చోట్ల కొన్ని రాయితీలు సాధించినా ప్రత్యామ్నాయాలన్నవి ఎక్కడా ఏర్పడ లేదు. ప్రతిచోటా వెనుకటి పార్టీల రాజ్యమే కొనసాగుతున్నది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఉద్యమాలు తగినంత కాలం సాగి, తమ వైన సిద్ధాంతాలు, నాయకత్వాలతో ఒక రూపానికి వచ్చి, ప్రజలను మెప్పిస్తే తప్ప, ప్రత్యామ్నాయాలు సిద్ధించవు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం. రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది. రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. ‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినాఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనినపొగడరా నీతల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. సాగు, తాగునీటికి గేట్ వే! సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరారు.తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్ భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్ జగన్ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. అడుగడుగునా అడ్డంకులుశ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఒక సంజీవనిగా జగన్ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఇక ఇన్సూరెన్స్ పాలసీగా భావించి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు!రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. యావత్ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం.రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం! భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ శాసన సభ్యులు(నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’) -
బంగారం... భద్రతా? భారమా?
భారతీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో బంగారం కేవలం విలు వైన లోహం మాత్రమే కాదు; అదొక సెంటిమెంట్, సామాజిక హోదా. ప్రస్తుతం మధ్యతరగతి మనఃస్థితికి, జాతీయ ఆర్థిక నిర్మా ణానికి మధ్య ఇది ఒక విరోధాభాసగా మారింది. ఒకవైపు బంగారం కొనాలనే సామాజిక అంచనాలు, మరోవైపు కొనలేని ఆర్థిక వాస్త వాల మధ్య సామాన్య కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బంగారం ధరల పెరుగుదల ప్రభావం ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రులపై పడుతోంది. సమాజంలో వేళ్లూనుకున్న కట్నకాను కల సంస్కృతి, పరువు–ప్రతిష్ఠల పేరిట సాగే ఆడంబరాలు ఒక సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. కుమార్తె వివాహం కోసం జీవితకాలపు పొదుపును ఖర్చు చేయడమే కాకుండా, బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి చివరకు ‘అప్పుల చక్రం’లో చిక్కుకుంటున్నారు. సంపన్న వర్గాలకు బంగారం ఒక ‘హెడ్జింగ్’ సాధనం. మార్కెట్ అస్థిరత ఉన్న ప్పుడు అది భద్రమైన పెట్టుబడిగా మారి వారి సంపదను పెంచుతుంది. అయితే ఇదే క్రమంలో సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక కోణంలో చూస్తే, ప్రపంచంలోనే అగ్రగామి బంగారం దిగుమతి దేశంగా భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఇది చెల్లింపుల సమతుల్యత లోటును పెంచి, రూపాయి విలువను బలహీనపరుస్తోంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణం మళ్లీ తీవ్రమవుతుంది.కీలకమైన అంశం ఏమిటంటే, బంగారంపై పెట్టే అధిక పెట్టుబడి వల్ల దేశంలో ఉత్పాదక మూలధనం క్షీణిస్తోంది. పరిశ్రమలు, మౌలిక సదుపా యాలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడిగా వెళ్లాల్సిన నగదు బంగారంరూపంలో అచేతనంగా ఉండిపోతోంది. ఇది దేశ ఆర్థికవృద్ధి రేటును మందగింపజేస్తూ ‘అవుట్పుట్ గ్యాప్’ను సృష్టిస్తోంది. ప్రభుత్వం సావరీన్ గోల్డ్ బాండ్లు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా భౌతిక బంగారం వైపు ప్రజలు వెళ్లకుండా చూస్తున్నా, సామాజిక దృక్పథం మారనంతవరకు ఆశించిన ఫలితం ఉండదు.బంగారాన్ని గౌరవానికి చిహ్నంగా కాకుండా, ఒక సాధారణ పెట్టుబడిగా మాత్రమే చూడాలి. ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ పథకాల వంటి ప్రత్యా మ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక విద్యనుఅందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలి. బంగారం ధరల పెరుగు దల కేవలం మార్కెట్ పరిణామం కాదు; అదొక వ్యవస్థాగత హెచ్చరిక. మానవ మూలధనం, ఆర్థిక అవగాహన, సామాజిక సంస్కరణలే నిజమైన సంపద అని గుర్తించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. – ఆత్మకూరి ప్రశాంత్ చారి ‘ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్యాకల్టీ -
రాష్ట్రం కన్నా స్వలాభమే మిన్నా?
కృష్ణా, గోదావరి, వంశధార నదీ జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కన్నా స్వప్రయోజనాలే తనకు ప్రధానమని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తనకు తానుగానే చాటుకుంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకమే అందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 3న ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. వాటిని చంద్రబాబు ఖండించకపోగా... రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరమే లేదంటూ తెగేసి చెప్పడం ద్వారా రేవంత్ చేసిన వ్యాఖ్యలను బలపరిచారు. రేవంత్తో కుదిరిన చీకటి ఒప్పందం ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయడంపై రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పూర్తయితే ఆ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందే ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. ఆ ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల వద్ద అమర్చారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. వాటికి 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఆ ప్రాజెక్టుల కింద 10.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. 881 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉండే రోజులు బాగా తగ్గాయి. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 7 వేల క్యూసెక్కులు... 841 అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. అంత కంటే నీటిమట్టం తగ్గితే... ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే పోతిరెడ్డిపాడు ద్వారా ఆయకట్టుకు నీళ్లందించడానికి ఆస్కారం ఉండదు.వాటా జలాలను వాడుకోవడానికే...కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరకముందే జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 777 అడుగుల నుంచి 825 అడుగుల నీటిమట్టం లోపే కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి,డిండి ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా రోజుకు 7 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. అంటే... జూరాల, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి వినియోగం తొలి ప్రాధాన్యం తాగునీటికే! ఆ తర్వాత సాగునీరు!! శ్రీశైలం దిగువన సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు... అదీ కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు నీటిని మాత్రమే కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు తరలించవచ్చు. కానీ తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే... దిగువన నీటి అవసరాలు లేకున్నా సరే... శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం దిగువ నుంచే యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చి నట్టుగా తెలంగాణ సర్కార్ తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడుగులకు చేరడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వరద ప్రవాహం నిలిచిపోయాక కూడా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా నీటిని తరలిస్తుండటంతో శ్రీశైలం నీటి మట్టం 841 అడగులకు దిగువకు చేరుకుంటోంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాటిని వాడుకోలేని దుఃస్థితి. 2014–19 మధ్య రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలగనివ్వకుండా... ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగించుకోవడానికే 2020 మే 5న రూ.3,850 కోట్ల వ్యయంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. ఎత్తిపోతల రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ!శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటిమట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసి... ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ), తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టులో పంటలను రక్షించడం... రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తి పోతలను చేపట్టి... పనులను పరుగులెత్తించారు. ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు రైతులు నీరాజనాలు పలుకుతారని గ్రహించిన చంద్రబాబు... మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉసిగొలిపి అక్కడి రైతుల ద్వారా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసులు వేయించారు. సీమ ఎత్తిపోతల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఆ కేసులు వేయించారు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఉన్నాయనీ... ఆ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదనీ ఎన్జీటీలో వైఎస్సార్సీపీ సర్కార్ సమర్థ వంతంగా వాదనలు వినిపించింది. కానీ... పర్యావరణ అనుమతి తీసుకున్నాకే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే రాయలసీమ ఎత్తిపోతల పనులను వైఎస్సార్సీపీ సర్కార్ పరుగులు పెట్టించింది. మళ్లీ దీనిపై ఎన్జీటీలో చంద్రబాబు కేసులు వేయించారు. వాటిని ఎదుర్కొంటూనే... పర్యావరణ అను మతి కోసం ప్రయత్నిస్తూనే... తాగునీటి అవసరాల కోసం 58 టీఎంసీలను తరలించేలా రాయలసీమ ఎత్తిపోతల పనులను తొలుత పూర్తి చేయాలని 2023 ఆగస్టు 11న ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మే వరకూ పనులు జరిగాయి. వాటిని చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించిన ఎం–బుక్కులే అందుకు నిదర్శనం. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని గాలేరు– నగరి, హంద్రీ–నీవాను అనుసంధానం చేయడం ద్వారా తీసుకెళ్లి చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని హంద్రీ–నీవా రెండో దశ ఆయకట్టుకు అందించి... శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే 40 టీఎంసీలను కర్నూల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆయకట్టుకు అందించాలన్నది వైసీపీ సర్కారు ఆలోచన. 2024 జూన్ 12న చంద్రబాబు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తి స్థాయిలో ఆపేశారు. దానికి ప్రధాన కారణం ఏమిటన్నది తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడూ విఘాతమే!ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో చంద్రబాబు తొలి సారిగా అధికార పీఠాన్ని అధిరోహించారు. 1996 లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాననీ, అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవెగౌడను తానే పీఎంను చేశాననీ చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటారు. కానీ... అదే సమయంలో ఆనకట్టగా ఉన్న ఆల్మట్టిని కర్ణాటక రిజర్వాయర్గా మార్చేసి... దాని నీటి నిల్వ సామర్థ్యాన్ని 53 నుంచి 129 టీఎంసీలకు పెంచేసినా నోరు మెదపకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కర్ణాటకకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. ఆల్మట్టి సామర్థ్యం పెంచడం వల్ల శ్రీశైలానికి జూన్ నెలా ఖరుకు రావాల్సిన వరద జూలై చివరకు... ఆగస్టు మొదటి వారానికి గానీ రావడం లేదు. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కాలపరిధి 2000తో ముగు స్తుందనీ, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ వేస్తారనీ, ఆంధ్ర ప్రాంతంలో వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలంగా ణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ వంటి ప్రాజెక్టులను చేపడితే వాటికి నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ చేస్తుందనీ అప్పటి సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు, సాగునీటిరంగ నిపు ణులు అనేక మార్లు విఙ్ఞప్తులు చేశారు. కానీ వాటిని పట్టించుకోలేదు. అప్పట్లో వాటిని చేపట్టి ఉంటే... తెలుగు గంగకు 25 టీఎంసీలు కేటాయించినట్లే ఆ ప్రాజెక్టులకు కూడా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసేది.పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే!గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠ నీటిమట్టంతో పోలవరం ప్రాజెక్టును 2005లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 2021 జూన్ 11 నాటికే స్పిల్ వేను అప్పటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కానీ 2024 ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను మాత్రమే ఆంధప్రదేశ్ సర్కార్కు విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. చంద్రబాబు సర్కార్ కూడా దానిపై అభ్యంతరం చెప్పలేదు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. 41.15 మీటర్ల ఎత్తు వరకు కేవలం 119.4 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయవచ్చు. ఇక 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే... పోలవరం కుడి, ఎడమ కాలువ కింద 7 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కేవలం 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించడానికి వీలుంటుందని సాక్షాత్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీనే స్పష్టం చేస్తోంది. పోలవరం రిజర్వా యర్ను బ్యారేజ్గా మార్చేయడం వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 63 టీఎంసీలను వెనుకబడిన ఉత్తరాంధ్రకు మళ్లించడానికీ ఆస్కారం ఉండదు. జీవనాడి పోలవరంలో జీవం తీసేసి రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇక వంశధార జలాలపై రాష్ట్ర హక్కులను వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను 2004 దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి పరిరక్షించారు. ఆ ప్రాజెక్టు వల్లే వంశధారలో 75 శాతం నీటి లభ్యతగా ఉన్న 115 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఆ బ్యారేజీ నిర్మాణం కోసం 2021 నవంబర్ 9న నాటి సీఎం వైఎస్ జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో అప్పటి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపారు. నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం సంప్రదింపులు జరుపుతూనే... వంశధార జలాలను పూర్తి స్థాయిలో వాడుకుని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వంశధార ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లందించేందుకు హీరమండలం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి 40 శాతం పనులు పూర్తి చేశారు. కానీ... 2024 జూన్ 12 తర్వాత ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు సర్కార్ ఆపేయడం ద్వారా వంశధార ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం చేసింది.– ఆర్.జి.ఆర్. -
ఆర్థిక క్రమశిక్షణ
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక లోటు 2025–26లో జీడీపీలో 4.4 శాతం కాగా, 2026–27లో 4.3 శాతంగా ప్రతిపాదించడం, కేంద్ర ప్రభుత్వ రుణంలోనూ 2025–26తో పోల్చినప్పుడు (జీడీపీలో 56.1 శాతం), 2026–27లో జీడీపీలో 55 శాతంగా ప్రతిపాదించడం ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా పేర్కొనవచ్చు. ఆర్థిక క్రమశిక్షణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారం తగ్గి ప్రాధా న్యతా రంగాలకు అధిక వనరులు సమకూరడంతోపాటు ద్రవ్యోల్బణంలో క్షీణత, స్థిర స్థూల ఆర్థిక వాతావరణం లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మరోవైపు సంక్షేమంపై వ్యయం తగ్గినట్లయితే వినియోగం, సమష్టి డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడుతుంది.కనెక్టివిటీ సానుకూలంఆర్థిక వృద్ధి సాధనలో ప్రధాన అంశమైన మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఏడు కొత్త హై–స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ చర్యతో రోజువారీ ప్రయాణ సౌకర్యాల మెరుగుదల, ప్రాంతాల మధ్య ఆర్థిక సంబంధాల మెరుగుదల, వివిధ ప్రాంతాల మధ్య వస్తు ప్రవాహం, ఉత్పాదకత పెరుగుదల, ప్రయాణ సమయాలలో తగ్గుదల వలన ‘ఆర్థిక హబ్’ల మధ్య కనెక్టివిటీ లాంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కారిడార్ల నిర్మాణం వలన తయారీ రంగం, సేవలు, నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 2025–26 బడ్జెట్తో పోల్చినప్పుడు 2026–27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయంలో పెరుగుదలను 11.5 శాతంగా ప్రతిపాదించారు. తద్వారా నిర్మాణ రంగం, సిమెంటు, స్టీల్, యంత్రాలు, సేవలకు సంబంధించి డిమాండ్లో పెరుగుదల ఏర్పడవచ్చు. నిర్మాణ రంగంలోని శ్రామికులకు ప్రత్యక్షంగా ఉపాధి పెరగడంతోపాటు, లాజిస్టిక్స్; సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సప్లయ్ గొలు సులో పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఎక్కువవు తాయి. మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వ పెట్టుబడు లలో పెరుగుదల వలన ప్రైవేటు సంస్థల వ్యయం, నష్ట భయం తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలో పురోగమించడం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ లక్ష్య సాధనకు వీలవుతుంది. ఈక్విటీ డెరివేటివ్స్ అయిన ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల లావాదేవీ పన్నును పెంచడం వలన నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్లో క్షీణత ఏర్పడింది. సెక్యూరిటీల లావాదేవీల పన్నును పెంచడంలో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంపొందించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడు (ఎఫ్ఐఐ)లను ఆకర్షించడంతో పాటు, ఉన్న పెట్టుబడులను నిలుపుకొనే విధంగా చర్యలు తీసుకోవడం, రాబోయే రోజుల్లో కార్పొరేటు రాబడులు మెరుగవు తాయనే విశ్వాసం కల్పించడం లాంటి అంశాలు మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడతాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
అతి విశ్వాసంతో స్వారీ
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్సీయూ స్కూల్ ఆఫ్ సోషల్సైన్సెస్ మాజీ డీన్ -
సాగుకు ఒరిగేది తక్కువే!
డిజిటల్ వ్యవసాయం ద్వారా అద్భుతం సాధిస్తున్నామని చెబు తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణి బడ్జెట్ కేటాయింపుల్లోనూ కనిపించింది. అయితే భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్ల పట్ల బడ్జెట్లో ప్రతి స్పందన దాదాపు శూన్యం అని చెప్పాలి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఒత్తిడి, తగ్గుతున్న మార్కెట్ రాబడి కారణంగా రైతు ఆదాయాలు తరుగుతున్నాయి. పెరుగుతున్న వివిధ పంటల దిగుమతి, అమెరికా దేశం నుంచి ఒత్తిళ్లను ఆర్థిక సర్వే 2025–26 అంగీకరించినా బడ్జెట్లో కనీస స్పందన లేదు.పెరుగుతున్న వాతావరణ ప్రభావానికి, ప్రభుత్వ పెట్టుబడుల మధ్య పొంతన అసలు లేదు. ఆశించినట్టుగా 2026 –27 బడ్జెట్లో సహజ వ్యవసాయం వంటి పైలట్ కార్యక్రమాలకు నిధులను గణనీయంగా పెంచినట్లు కనిపించడం లేదు. డిజిటల్ వ్యవ సాయం మీద పెట్టుబడుల వల్ల ఒరిగేది చాలా తక్కువ. డిజిటల్ టెక్నాలజీ కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించి హెచ్చరించడానికి మాత్రమే పనికొస్తుంది. స్థిరమైన పంటల ఉత్పత్తి ఉన్నప్పటికీ రైతు ఆదాయ సంక్షోభాన్ని పరిష్క రించడంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ–నామ్, ధరల డ్యాష్బోర్డ్లు, గిడ్డంగి రసీదు వ్యవస్థలు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు రైతుల సమస్యలను పరిష్కరించడం లేదు.ధరల స్థిరీకరణ, వైవిధ్యభరితమైన సేకరణ, వ్యవసాయ–ప్రాసెసింగ్ సామర్థ్యం, మార్కెట్ కార్యకలాపాలలో బలమైన ప్రభుత్వ జోక్యం లేకుండా... డిజిటల్ వ్యవస్థలనేవి రైతుల ఆదాయాలను రక్షించడం కంటే ధరలను అస్థిర పరచేందుకే అవకాశం ఎక్కువ ఉంది. వ్యవసాయానికి ఇచ్చిన మొత్తం నికర కేటాయింపు రూ.1,30,561 కోట్లు (2025–26 సవరించిన బడ్జెట్ కేటాయింపు కన్నా 6% ఎక్కువ). ఇందులో ప్రధానంగా ‘పీఎమ్– కిసాన్ సమ్మాన్ నిధి’కి రూ. 63,500 కోట్లు (49%), వడ్డీ సబ్సిడీలకు రూ. 22,600 కోట్లు (17%),పంట బీమా (పీఎమ్ఎఫ్బీవై)కు రూ. 12,200 కోట్లు (9%) కేటాయింపులు జరిగాయి.‘కృషియోన్నతి యోజన’కు కేటాయింపులు 65% (రూ. 6,800 నుండి 11,200 కోట్లకు) పెరిగాయి. ఇందులో కొత్తగా ‘కూరగాయలు/ పండ్ల మిషన్ ’ ఉంది. సహజ వ్యవసాయ మిషన్కు ఇచ్చిన నిధులలో కేవలం 3% వృద్ధి (రూ.725 నుండి 750 కోట్లకు) మాత్రమే ఉంది. ఇక, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 41% కేటాయింపులు పెరిగాయి.వడ్డీ చెల్లింపుల భారంబడ్జెట్లో కొత్త కార్యక్రమాలు (2026–27) చూస్తే... ‘భారత్–విస్తార్’ అనే బహుభాషా ఏఐ సాధనం ఏర్పాటుకు రూ. 150 కోట్ల కేటాయింపు జరిగింది. ఇది రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయం చేస్తుందని భావిస్తు న్నారు. అధిక విలువ కలిగిన వ్యవసాయ పంటలకు మద్దతు పేరిట తీరప్రాంత/కొండ ప్రాంతాలలో కొబ్బరి, గంధపు చెట్ల పెంపకానికి రూ. 350 కోట్లు ఇచ్చారు. మఖానా అభివృద్ధికి రూ. 90 కోట్లు ఇచ్చి, పసుపుకు మాత్రం ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదు.బడ్జెట్ వ్యూహాత్మక దృష్టి కేవలం డిజిటల్ వ్యవసా యానికి పరిమితం అయ్యింది. డ్రోన్లు, ఏఐ, డిజిటల్ వ్యవస్థల వంటివి భాగంగా ఉండే సాంకే తిక పరిజ్ఞానాన్ని వాడటం; ‘పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’కి అధిక నిధులను కేటాయించడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించడం, అధిక విలువ కలిగిన పంట లను వైవిధ్యీకరించడం, సహజ వ్యవసాయ పరి వర్తనకు స్థిరమైన నిధులను అందు బాటులోకి తేవడం వంటి వాటికి బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చింది.మొత్తం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు కేటాయించినది 2.7% మాత్రమే! మొత్తం బడ్జెట్ ప్రాథమ్యాలతో పోలిస్తే... ప్రభుత్వం అప్పులపై వడ్డీ చెల్లింపుల (రూ. 14.4 లక్షల కోట్లు) పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. వ్యవసాయానికి రూ. 1.3 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ప్రభుత్వం మీద ఉన్న అప్పుల భారం అభివృద్ధి మీద వ్యయాన్ని పరి మితం చేస్తుందని స్పష్టం అవుతున్నది. వ్యవసాయ బడ్జెట్ నిరాడంబరమైన వృద్ధిని చూపుతోంది. వాస్తవ అభివృద్ధి/ వ్యవసాయ రంగ పరివర్తన వ్యయం కేవలం రూ. 33,000 కోట్లు మాత్రమే. ప్రభుత్వం ప్రతి 2 రోజులకు వడ్డీ చెల్లింపులపై చేసే ఖర్చు కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.డా‘‘ దొంతి నరసింహారెడ్డివ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
అంతా ప్రైవేటు రూటే!
ఈ ఏడాది బడ్జెట్లో అమెరికా టారిఫ్ల తాకిడిని తట్టుకోవడంపై దృష్టిని కేంద్రీకరించినట్టు కేంద్రం చెబుతూనే వారితో ఒప్పందానికి తలుపులు తీసి ఉంచింది. ఈయూతో ఒప్పందం కూడా చాలా విధాలుగా మన దేశీయ ఉత్పత్తులను, వ్యాపారాలను దెబ్బ తీస్తుంది. అంతర్జాతీయంగా చాలా ఆర్థికాంశాలు మన అధీనంలో లేకుండాపోయాయంటూ ఆర్థిక సర్వేలోనే కేంద్రం మూడు అవకాశాలు సూచించింది. అధ్వాన్నమైన పరిస్థితి వస్తే 2008 నాటి ఆర్థిక సంక్షోభం కన్నా దారుణంగా ఉండొచ్చని కూడా పేర్కొంది. మరి బడ్జెట్లో స్వావలంబన కోసం ఏవైనా నిర్మాణాత్మక పథకాలున్నాయా అంటే చాలా భాగం విదేశాలతో ముడిపడిన ప్రైవేటు ప్రాజెక్టులే. అన్నీ ప్రైవేటుకు అప్పగించే పీపీపీ నమూనా దీనంతటి వెనక దాగి ఉంది. ఆర్థిక సర్వేలోనే కేంద్రం ప్రైవేటు రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ సంస్థల్లో సర్కారుకు 51 శాతం వాటా ఉండాలనే విధానాన్ని మార్చి... 26 శాతం ఉంటే సరిపోతుందని సూచించింది. ఆర్థిక అంచనా ఆందోళన కరంగా ఉంటే ముందు ఆదుకో వలసింది పేద, మధ్య తరగతి వర్గాలను! కానీ ఆర్థిక క్రమశిక్షణ పేరిట వారికి ఇచ్చే సంక్షేమ పథకాలనే నిర్మలమ్మ టార్గెట్గా చేసుకున్నారు. 2025–26లో పన్ను ఆదాయం ఆశించిన మేర కైనా పెరిగింది లేదు. 2026– 27కు చూపించిన అంచనాలు 2025–26 స్థాయిలోనే ఉండటం ఇందుకు నిదర్శనం. కార్పొరేట్ రంగానికి లక్షల కోట్ల రాయితీల వల్ల గండి కొనసాగించారు. పీఎమ్ పోషణ్, పీఎమ్శ్రీ, పంటల బీమా వంటి వాటన్నిటికీ కేటాయింపుల్లో కోత వేశారు. మహిళల కోసం ఉద్దేశించిన నిధులలో 51,444 కోట్లు కోత పెట్టారు. 2026–27లో ఎరువులు, ఆహారం, పెట్రోలియం, సబ్సిడీ లలో మరింత కోత ప్రతిపాదించారు. ప్రజా సంక్షేమం ప్రధానంగా భావించకపోవడం వల్లనే నగదు బదిలీలు 1.7 కోట్లు దాటిపోతున్నాయని సర్వేలోనే ఆందోళన వెలిబుచ్చింది. గిగ్ వర్కర్ల జీతాలు పెరVýæక పోవచ్చని కూడా సర్వేలోనే వెల్లడించింది. కొత్త లేబర్ కోడ్లు, పనిగంటల పెంపు వంటివన్నీ కలిపి చూసుకుంటే ఏలినవారు ఏ దిశలో ఆలోచించారో తెలుస్తుంది. ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే.ఏఐ డేటా సెంటర్లకు, క్లౌడ్ కంపెనీలకు 2047 దాకా భారీ రాయితీలు ప్రకటించింది. కంటైనర్లపై, విమాన తయారీ పరికరాలపై రాయితీలు కూడా కార్పొరేట్లకే కానుక లవుతాయి. ఇన్ఫ్రా రంగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ పెట్టుబడులకు ఆధారమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అరుదైన మృణ్మయ నమూనాలపై ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడి కన్నుపడింది గనక ఏపీలోనూ అలాటి ఒక పరిశోధనా కేంద్రం నెలకొల్పు తామన్నారు. ఈనగాచి నక్కల పాలైనట్టు ఇవన్నీ తర్వాత ప్రైవేటు బాటలోకి తరలించబడతాయి. రక్షణ రంగం కేటా యింపుల పెంపు కూడా ప్రైవేటు భాగస్వామ్యంలోనే ఖర్చయి పోతుంది. అప్పుల శాతం జీడీపీలో 50 శాతానికి తగ్గించడం లక్ష్యమైందంటే పరిస్థితి తెలుస్తోంది. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించవలసిన రాష్ట్రాలు ఎంత మొరపెట్టుకున్నా వాటి కేటాయింపుల పెంపు లేదు. 16వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ గత ఏడాది ఇచ్చిన 41 శాతం వాటాను కొనసాగించ డమే గొప్ప వరంగా బడ్జెట్ చిత్రించింది. 2025–26 బడ్జె ట్లో చెప్పినదానితో పోలిస్తే ఆచర ణలో కేంద్ర పథకాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఇతర బదలా యింపుల కింద వచ్చే మొత్తం రాష్ట్రాల వాటాకు రూ. 2,03,801 కోట్లు కోత పడింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు రాష్ట్రాలపై ముందే వేటు వేసింది. ‘వీబీ జీ రామ్ జీ’ – కింద మరింత తగ్గింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలను ఆదుకో వడానికి ముందుకు రాకపోవడం దారుణం, విభజిత రాష్ట్రమైన ఏపీ వంటి వాటిని తీసుకుంటే... ఒక్కటంటే ఒక్క పథకం కింద కూడా నిధులు ఇవ్వలేదు. పోలవరం నిర్మాణానికి కేటాయింపు రూ. 3000 కోట్లు తగ్గించారు. నిర్వాసితులకు అవసరమైన 21 వేల కోట్లలో ఎంత ఇచ్చేదీ పేర్కొనలేదు. అమరావతి గురించి అప్పుల గొప్పలు చెప్పడం తప్ప సహాయం ఊసే లేదు. విశాఖ ఉక్కుపై ముఖ్య మంత్రి చంద్రబాబు వంటి వారు కార్మికులపై విరుచుకుపడ్డారు గానీ బడ్జెట్లో నిర్దిష్ట ప్రకటనలేమీ చేయించలేక పోయారు. అసలు కూటమిలో ఉండటం వల్ల రాష్ట్రానికిఏమి తీసుకురాగలిగారంటే శూన్యమే! అలాగే తెలంగాణ ప్రభుత్వం పలుసార్లు కోరిన అంశాలేవీ చోటు సంపాదించ లేకపోయాయి. కనుక ఏ విధంగా చూసినా నిర్మలమ్మ బడ్జెట్ నిస్సారమైన, నిరుత్సాహ కర వ్యవహారం. పైగా బడ్జెట్లో చూపించకుండా తర్వాత పన్ను పెంచడం ఇటీవలి రివాజు గనక పారా హుషార్!తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ
మంచి టీమ్కి హెడ్గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్లోని వాళ్లు టీమ్లో ఉంటూనే హెడ్గా పని చేయాలి, హెడ్గా ఉన్నవాళ్లు హెడ్గా ఉంటూనే టీమ్లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు! మునుపటి 8 బడ్జెట్లు కూడా నాకు ఇదే నేర్పించాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్సభలో నా 9వ బడ్జెట్. ఆర్థిక మంత్రిగా మాత్రమే ఇది నా బడ్జెట్. అసలు కసరత్తంతా నా టీమ్ది. కనుక, బడ్జెట్ సమర్పణ కూడా అదృశ్యంగా నా టీమ్దే అవుతుంది. సెక్రెటరీలు ఆరుగురు, అడ్వైజర్ ఒకరు... మొత్తం ఏడుగురు అపర చాణక్యులు!బడ్జెట్లో ఏముందో ఇంకొన్ని గంటల్లో దేశ ప్రజలకు తెలిసిపోతుంది. బడ్జెట్ను తయారు చేయటంలో నా టీమ్ కష్టం ఎంతుందో చెప్పాలంటే మాత్రం అది బడ్జెట్ ప్రసంగాన్ని మించిన ప్రసంగమే అవుతుంది! టీమ్లోని అనురాధా ఠాకూర్ ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ. బడ్జెట్ రూమ్లోకి ప్రవేశించిన తొలి మహిళ! నేటి బడ్జెట్కు ప్రాథమిక రూపశిల్పి. హల్వాను అడుగంటకుండా ఉడికించటంలోని వివిధ స్థాయుల సన్నని మంటల గురించి తెలిసిన నిపుణురాలు. ఇంట్లో మనుషుల్ని కదిలించకుండానే ఇంటి గదుల్ని, గోడల్ని పునర్నిర్మించగల నేర్పరి.అజయ్ సేuЇ ఫైనాన్స్ సెక్రెటరీ. గ్రాండ్ మాస్టర్! బడ్జెట్ టీమ్లోని సెక్రెటరీలందరికీ కెప్టెన్. ‘ఆర్థిక లోటు’ వార్నింగ్ సిగ్నల్ ఎర్రగా వెలిగి ఆరిపోతున్నా కూడా చలించని శాంత మనస్కుడైన పైలట్! అరవింద్ శ్రీవాత్సవ రెవిన్యూ సెక్రెటరీ. బడ్జెట్లో కొత్త ముఖం. ముక్కులుపిండకుండా, బుగ్గలు పుణికి పన్నులు వసూలు చేయగల టాక్స్ కలెక్టర్. బడ్జెట్ స్పీచ్లో పార్ట్–బి ఆయనదే. పన్నుల పెంపు, తగ్గింపు ఉండేది ఆ పార్ట్లోనే. డిన్నర్ బిల్లుని సమానంగా పంచే ధర్మరాజు. ఒకరెవరైనా అదనంగా ఆర్డర్ చేసి ఉంటే, వారికి అదనంగా ‘వడ్డించే’ నియమబద్ధుడు.ఉమ్లున్మాంగ్ ఉవల్నామ్ ‘ఎక్స్పెండిచర్’ సెక్రెటరీ. ప్రభుత్వాన్ని దేనినీ కొననివ్వరు. ఏం అడిగినా సరే, ‘ఇప్పుడు కాదు బాస్’ అనేస్తారు.అనంత నాగేశ్వరన్ ఛీఫ్ ఎకనమిక్ అడ్వైజర్. డేటా డిటెక్టివ్. సంక్లిష్టమైన ప్రపంచ గందరగోళాన్ని ‘ఆర్థిక సర్వే’గా అనువదిస్తారు. గాలివానలు సహాయకరంగా ఉంటాయా, లేక మనం తుపానులోకి వెళ్లబోతున్నామా అన్నది ఆర్థిక శాఖకు చెబుతారు. వర్షం వచ్చే ముందు మీ గొడుగు విరిగిపోయిందన్న విషయాన్ని కూడా కచ్చితంగా మీకు గుర్తు చేస్తారు.నాగరాజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ. బ్యాంకుల వైద్యుడు. బ్యాంకుల ఆరోగ్యాన్ని పరిరక్షించటం కోసం, మీరు ‘టీ’ తాగి చేసిన డిజిటల్ చెల్లింపులు లోప భూయిష్ఠంగా లేకుండా చూసుకునేది ఆయనే. అరుణిష్ చావ్లా ఇన్వెస్ట్మెంట్లు, పబ్లిక్ అసెట్ల కార్యదర్శి. ప్రభుత్వ కంపెనీల వాటాల కోసం కొనుగోలుదారులను వెతికి పెడతారు. వెతికి పడతారు. ఆయనొక ఇ–బే వేలం పవర్ సెల్లర్. ప్రభుత్వానికి లాభం వస్తుందంటే ఎవరి చేతనైనా ఏదైనా కొనిపించేస్తారు.నిజంగా, ఎంత గొప్ప టీమ్! కాకపోతే, ఇలాంటి టీమ్ ఉన్న ప్రతి లీడర్కీ ఎదురయ్యే సమస్య ఒకటే. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి ఇడ్లీ, వడ మాత్రమే అయినా ఆ రెండిట్లోంచి కూడా ఒక దానిని ఎంపిక చేసుకోలేక సతమతం అవటానికి తగినంత సమయాన్నింకా చేతిలో మిగిల్చే ఉంచుతారు! నాదీ ఇప్పుడు అటువంటి సమస్యే. ఏ కలర్ శారీ బాగుంటుందా అని ఆలోచిస్తూ, తెరిచి ఉన్న అల్మరా ముందు నిలబడి పోవటం అన్నది నాకు ఏనాడూ సమయం దొరకని పని. కానీ ఇవాళ నా టీమ్ నా చేత ఆ పనిని చేయించబోతున్నట్లే ఉంది! -
హైందవానికి ఆలన... జగన్ పాలన
చెరువు లేని చోట చేపలు పట్టిస్తాననీ, ఆకాశంలో కదలకుండా సూర్యుణ్ణి అలాగే ఉంచేస్తాననీ, గాలి పూసి ఏ గాయం అయినా మాయం చేస్తాననీ చెప్పి, ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆయనకే సాధ్యం అని ఊదర గొట్టించి, మాటి మాటికీ ప్రజలను నమ్మించి అందలం ఎక్కి గొంతు కోసేవారు ఒకరు. ఇచ్చిన మాట కోసం, చేసిన వాగ్దానం కోసం, చెప్పిన నిజం నిలబెట్టడం కోసం, పేదవాడి కడుపు నింపడం కోసం, దిగువనున్న వారికి ఎగువ తరగతి చదువు అందివ్వడం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, సంక్షేమ పథకాల నిత్యవికాసం కోసం, జనం కొరకు, జనం మధ్య నిలబడి పనిచేసినవారు మరొకరు.మొదటి వారు చంద్రబాబు నాయుడు అయితే, రెండవ వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అబద్ధానికీ నిజానికీ, చీకటికీ వెలుగుకూ మధ్య ఉన్నంత స్పష్టమైన తేడా ఈ ఇద్దరిలో! ఏమీ చేయకుండానే చేసినట్లు, చేస్తున్నట్లు, చేస్తూనే ఉన్నట్లు చెప్పి నమ్మించగలగడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పత్రికలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన రాగానికి తాళం వేసి, తప్పెట్లు మోగించి అభివృద్ధి ఆకాశం దాటేసింది అంటూ అరుస్తాయి. చిటికెల పందిళ్ళకు, ఊహల ఉత్సవాలకు, గాలిలో ఘనమైన మేడలకు, గ్రాఫిక్ ఇంద్రజాలాలకు బ్రాండ్ అంబా సిడర్ చంద్రబాబు. నేలమీద నిలబడి, కరోనాలో సైతం ప్రజల కోసం కష్టపడి, చేసిన ప్రతి వాగ్దానాన్నీ నిలబెట్టుకుని పెద్దగా ప్రచారం చేసుకోలేక పోయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.శ్రీవారి పనులు ఆపొద్దు!పదుల సంఖ్యలో ఆలయాలను నేలమట్టం చేసిన చంద్రబాబు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని నిలబెడతానని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. దేవుడిని, దేవుడి ప్రసాదాన్ని రాజకీయం చేసిన మొదటి రాక్షస రాజకీయ నాయకుడు ఈయనే. నిజానికి హైందవ ధర్మానికీ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికీ అపారమైన సేవ చేసిన వ్యక్తి జగన్ మాత్రమే. అంత సేవ చేసిన ఆయనను చంద్రబాబు విష ప్రచారపు ముసుగు వేసి అన్యుడని అవహేళన చేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన కాలం నుంచి ఎన్నికల వరకు తిరుమల శ్రీవారికి, హైందవ ధర్మానికి ఆయన చేసిన సేవ ప్రత్యక్షంగా చూసినవాడిగా, ఆత్మ సాక్షిగా గుండెమీద చేయి వేసుకుని ఈ మాటలు చెబుతున్నాను. ఈ వ్యాసం రాస్తున్నాను. అందరికీ తెలియాల్సిన పచ్చి నిజాలివి. పచ్చమీడియా ఎప్పటికీ అంగీకరించని వాస్తవాలివి. తిరుమల శ్రీవారి మీద జగన్కు అపారమైన భక్తి, విశ్వాసం. 2019లో అఖండమైన మెజారిటీతో జగన్ ఎన్నికలలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందే ఆయన తిరుమలకు వచ్చి, శ్రీవారి ఆశీస్సులు పొందిన అనంతరమే అధికార పీఠంపై కూర్చున్నారు. ఆ రోజు జగన్తో పాటు నేనూ కారులో ఉన్నాను. అప్పుడు గరుడ వారధి (శ్రీనివాస సేతు) పనులు జరుగుతున్నాయి.ఆ స్తంభాలను చూసి ‘ఏమిటిది’ అని అడిగారు. ‘‘ఇది శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికుల సౌకర్యం కోసం నిర్మి స్తున్న ఫ్లై ఓవర్. దాదాపు 40 కోట్లు చంద్రబాబు హారతి చేశాడు. దీన్ని ఆపడం మంచిది’’ అని కారులోని ఓ ముఖ్య వ్యక్తి చెప్పాడు. దానికి జగన్ నవ్వుతూ, ‘‘శ్రీవారికీ, ఆయన భక్తులకూ ఉపయోగపడే వంతెనను ఆపడం అన్యాయం. వాటా తీసుకున్న వారి పాపం వారికే తగులుతుంది, తగిలింది. ఆపొద్దు, మరింత మెరుగుగా నిర్మించండి’’ అన్నారు. అభివృద్ధి పనులు ఎవరు ప్రారంభించినా ఆపకూడదు అన్నది ఆయన భావన.అప్పటికి కొద్దికాలం క్రితమే ఆయన సుదీర్ఘమైన పాద యాత్రతో 3,648 కి.మీ. నడిచి ఉన్నారు. ఆ అలసట కూడా మరిచి శ్రీవారి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన పాదరక్షలు లేకుండా వెళ్ళారు. అలాంటి భక్తుడిని అన్యమతస్థుడు అని చంద్రబాబు, ఆయన మీడియా కొండంత ప్రచారం చేశాయి. జగన్ ఎంత సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తా రంటే, ఆయనకు తిరుపతి గంగమ్మ గురించి ఆమె శ్రీవారి చెల్లెలు అని చెప్పాను. ఆయన ముందుగా, ముఖ్యమంత్రిగా గంగమ్మను దర్శించుకునే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయాల పునరుద్ధరణ, గోసంరక్షణశ్రీవారి వైభవ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు జగన్ చేసిన సేవ మరెవ్వరూ చేయలేదు. భక్తికీ, రాజకీయానికీ ముడిపెట్టేంత నైచ్యానికి ఆయన ఏనాడూ దిగ జారలేదు. ధర్మాచరణ అంటే రాజకీయ అవసరాలకు శ్రీవారినీ, ప్రసాదాన్నీ వాడుకోవడం కాదు. శ్రీవారి ప్రసాదంలో పంది కొవ్వు, చేపకొవ్వు కలిసి కల్తీ జరిగిందని అసత్య ప్రచారం చేసిన వాళ్ళు భక్తులా? నిజానికి ఆ కొవ్వు వారి మస్తిష్కపు మకిలి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలో నిరంతర వేదఘోష ప్రతిధ్వనించింది. కోవిడ్ కాలం నుండి ‘నాద నీరాజన వేదిక’ మీద నిత్యం భారత, భాగవత, రామాయణ, సుందరకాండల ప్రవచన పరిమళం ఆ వైకుంఠాన్ని చేరింది.శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించింది జగన్. ఆ నిధుల ద్వారా దేశ వ్యాప్తంగా 3,500 ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ జరిగింది. దాన్ని సహించలేక ఆ రోజు ఆ ట్రస్టును విమర్శించాడు చంద్రబాబు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకో వెళ్తున్నాయనీ, అధికారం వస్తే ఆ ట్రస్టు రద్దు చేస్తామనీ బీరాలు పలికాడు. ఇప్పుడు ఆ టికెట్ల సంఖ్య పెంచి, ఆలయాలు నిర్మిస్తాం అంటున్నాడు. ఎంత వంచన! గోసంతతిని మరింత పెంచాలని భావించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విరాళాల క్రింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు, ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకువచ్చాం. వాటి సంర క్షణ, సంతతి వృద్ధికి మొదటిసారిగా ప్రణాళికలు తయారు చేసి అమలు పరిచాం. తెలుగు రాష్ట్రాలలోని గోశాలలను గుర్తించి మేత, నిర్వహణ వ్యయం అందించాం. అనేక ఆలయాలకు గోవులను విరాళంగా అందించాం. గోసేవా భాగ్యం హైందవ భక్తులందరికీ అందాలని అలిపిరి వద్ద గోమాత ప్రదక్షిణ శాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుత ప్రభుత్వంలో గోశాలల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పత్రికలు, మీడియా చెప్పాయి. ఇప్పటి దేవ స్థానం అధ్యక్షుడే ముందు కాదని... తర్వాత అంగీకరించాడు. వెన్నలాంటి మనసున్న వేంకటేశ్వరుడు నవనీత ప్రియుడు. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ యాంత్రికంగా జరిగేది. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగను చిలికించి అప్పుడే తీసిన ఆ నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించే ఏర్పాటు చేశారు. ఎంత భాగ్యం ఇది. ఎంత సేవ ఇది. ఎంత మంచి ఆలోచన ఇది.ఎన్నెన్ని సంస్కరణలు!తిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులను, మఠాధిపతులను ఆహ్వానించి హైందవ ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. ఇతర మతాల వారు హిందూమతం స్వీకరించాలి అనుకుంటే అందుకు కేంద్రం తిరుమల కావాలని తీర్మానించాం. అందుకు ఒక వేదిక ఏర్పాటు చేశాం. దేశంలోనే ఇంతటి విప్లవాత్మక నిర్ణయం మొదటిగా తీసుకున్నది తి.తి.దేవస్థానమే. దానికి కారణం జగన్. వేదమూర్తి, వేదస్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేద ఘోష వినిపించాలని, భక్తులు అది విని తరించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం ప్రారంభించాం. యువతరాన్ని సక్రమ మార్గంలో ఉంచాలని, శ్రీవారి భక్తి మరింతగా వారి హృదయాలలో నిండా లని శ్రీవారి గోవింద నామకోటి ప్రారంభించాం. యువతీ యువకులు గోవింద నామకోటి రాసి, ఆలయ అధికారులకు అందజేస్తే వారి కుటుంబానికి శ్రీవారి బ్రేక్ దర్శన సౌకర్యం కలిగించాం. దేశంలోని ప్రముఖ పండితుల సహాయంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలాన్ని గుర్తించాం. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించాం.శ్రీవారికి, శ్రీవారి వివిధ ఆలయాలలో ఉపయోగించిన పుష్పాలను వృథాగా పారవేయక వాటితో అగరుబత్తుల తయారీ ప్రారంభించాం. సప్తగిరులకు గర్తుగా ఏడురకాల పరిమళాల అగరుబత్తులు తయారు చేశాం. స్వామివారికి అలంకరించిన సుమాల పరిమళం... అగరుబత్తీగా మన ఇంట వెలగడం, ఆ పరిమళ భక్తి పరవశంలో మనం లీనం కావటం ఎంత అదృష్టం. అదీ గాక దీనివల్ల ఎందరో మహిళలలకు ఉపాధి ఏర్పడింది. బ్రేక్ దర్శనాలను దాదాపు తగ్గించి, సామాన్య భక్తుల దర్శ నాలకు ప్రాముఖ్యం ఇచ్చాం. క్యూలైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు కాఫీ, టీ, పాలు పంపిణీ చేశాం. కొండ మీద ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాం. శ్రీవారి ప్రసాదాల కవర్లను కూడా ప్లాస్టిక్ రహితంగా తయారుచేయించాం. కొండమీద పర్యావరణ హితమైన విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాం. శిలాతోరణం వద్ద 10 ఎకరాలలో పవిత్ర ఉద్యాన వనం, గోగర్భం డ్యామ్ వద్ద 25 ఎకరాలలో పవిత్ర శ్రీగంధ ఉద్యానవనం ఏర్పాటు చేశాం.2021 అక్టోబరు 30, 31 తేదీలలో తిరుపతి మహతి ఆడిటోరియంలో జాతీయ గో సమ్మేళనం నిర్వహించాం. వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. తిరుమలలో నేడు ప్రతి పౌర్ణమికి శ్రీవారికి జరుగు తున్న గరుడసేవ ప్రవేశపెట్టింది జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి. నాలుగు మాడ వీధులలో భక్తులు పాదరక్షలు ధరించ రాదని నిర్ణయం తీసుకున్నవారు జగన్మోహన్ రెడ్డి. అలిపిరి నుంచి కాలినడకన దర్శనం చేసుకున్న సమయంలో వారికి ఈ ఆలోచన వచ్చిందట. అలాంటి వ్యక్తిని, భక్తుడిని బూట్లు ధరించి పూజలు చేసేవారు విమర్శించడం ఎంత అన్యాయం?భక్తుల కోసం...అలిపిరి కాలినడక మార్గపు పైకప్పు ఎప్పుడో 40 సంవ త్సరాల క్రితం నిర్మించారు. అది పూర్తిగా పాడయింది. భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఓ దాత సహాయంతో, దాదాపు 25 కోట్ల వ్యయంతో దానిని పునర్నిర్మించాం. ఆ ఆదేశం ఇచ్చింది జగనే. ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని 2021 అక్టోబరు 11న ప్రారంభించారు. కార్తీక మాసంలో మహిళల సామూహిక దీపారాధన ఉత్సవాలను 2020 నవంబరు 30న ప్రారంభించాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాలలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాం.తిరుమలలో రూ. 100 కోట్ల వ్యయంతో మ్యూజియం అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ మ్యూజియంలో సుమారు 4 వేల అరుదైన, అపురూపమైన హైందవధర్మ కళాఖండాలు, దేవతామూర్తులు రూపకల్పన చేశాం. శ్రీవారి వైభవం ప్రపంచంలోని వారందరూ తెలుసుకోవాలని, శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ను హిందీ, కన్నడ భాషల్లో ప్రారంభించింది జగనే.తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో అధునాతన సి.టి. స్కాన్, ఎక్స్ రే మిషన్లు, 34 కోట్ల రూపాయల వ్యయంతో రోగుల కోసం నూతన గదులు నిర్మించాం. పేదలకు ఉచితంగా మోకాలు ఆప రేషన్లను ఆరోగ్యశ్రీ క్రింద చేయించాం. చెవుడు, మూగ పిల్లలకు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషను ఉచితంగా చేయించాం. పెదవి చీలికతో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు స్మైల్ లైన్ సంస్థ సహకారంతో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు నిర్వహించాం.శ్రీవారికి తల్లి వకుళమాత. ఆమె ఆలయాన్ని ఏ పాలక మండలీ, ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఆ శిథిల ఆలయాన్ని ఓ దాత సాయంతో 12 కోట్ల రూపాయల వ్యయంతో వైభవంగా నిర్మించాం. దాన్ని జగన్ 2022 జూన్ 23న ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి జరిగే అన్ని సేవలూ భక్తులందరూ దర్శించాలని, వైభవోత్సవాల పేరుతో వివిధ ప్రాంతాలలో నిర్వహించాం. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి వారి అనుమతితో వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులు ఉండేలా మార్పు చేశాం. దానివల్ల ఏటా దాదాపు 8 లక్షలమంది భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించు కున్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల వారికి స్వామిపట్ల మరింత భక్తి భావం ఏర్పడాలని, వారికి ఉచిత రవాణా, ఆహార, వసతి ఏర్పాట్లను చేసి వైకుంఠద్వార దర్శనం చేయించాం.ఉద్యోగుల కోసం...తి.తి.దే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగి చని పోయిన 90 రోజుల లోపు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తెచ్చాం. అంతకు ముందు ఆ ఉద్యోగం రావడానికి సంవత్సరాలు పట్టేది. ఇందులో భాగంగా ఒకేరోజు 119 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. ఈ మార్పులు జగన్ వల్లే సాధ్యమయ్యాయి. తి.తి.దేవస్థానం ఉద్యోగులకు చెన్నై, బెంగళూరు నగరా ల్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించేలా 2022 జనవరి 7న ఒప్పందం చేసు కున్నాం. శ్రీవేంకటేశ్వర మ్యాన్పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 14 వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒకే గొడుగు కిందికి తెచ్చాం. వీరందరికీ సీనియారిటీ, హెూదాను బట్టి జీతాన్ని 3 వేల నుంచి 20 వేల వరకు పెంచాం.తి.తి.దేవస్థానం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మేలు ఒక చరిత్ర. ఈ ఉద్యోగులందరికీ న్యాయ వివాదాలు లేకుండా ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం వడమాలపేట మండలం, పాదిరేడు అరణ్యం గ్రామం వద్ద 300 ఎకరాల భూమిని సేకరించాం. ఇందుకోసం ఉద్యోగులు చెల్లించాల్సిన రూ.60 కోట్లు యాజమాన్యమే కలెక్టరుకు చెల్లించేలా చేసి భూమిని స్వాధీనం చేసుకున్నాం. ఈ భూమిని చదును చేసి, రోడ్లు, కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. ప్రతి ఉద్యోగికీ 50 అంకణాల భూమి చొప్పున 5,518 మంది ఉద్యోగులకు జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశాం. భవిష్యత్తు అవసరాల కోసం ఆ భూమిని ఆనుకుని ఉన్న మరో 132 ఎకరాల భూమిని రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేశాం. తి.తి.దే. విశ్రాంత ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో శ్రీకాళహస్తి మండలం, పల్లం వద్ద భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాం. కానీ అధికార మార్పిడి వల్ల నీలినీడలు ఏర్పడ్డాయి.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి వేల ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. కోవిడ్ వల్ల ప్రభుత్వం మీద ఎంతో ఆర్థికభారం పడినా ఆయన ఏ సంక్షేమ పథకమూ ఆప లేదు. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే జనం కోసం, సత్యం కోసం నిలబడినవారు బలయ్యారు. సోక్రటీసుకు విషం పెట్టి, బ్రూనోను శరీరమంతా తగులబెట్టి చంపారు. భగత్సింగును ఉరితీశారు. అల్లూరి సీతారామ రాజును కాల్చి చంపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తల నరికారు. ప్రజల కోసం నిలబడిన వారి అధికారం, జీవిత కాలం స్వల్పమే అయింది. జగన్ అధికార కాలం కూడా వేల అబద్ధాల మబ్బుల ముందు మసక బారింది. ఆయన ఓడిపోయాడే గాని ఇంకా చనిపోలేదు కదా అని తన అనుయాయ, శిష్యుని చేత బహిరంగంగా అనిపించిన పాషాణ హృదయ కుటిలత్వం చంద్రబాబుది. హైందవ ధర్మ రక్షణకు జగన్ చేసింది కొండంత, ఇక్కడ నేను చెప్పింది గోరంత. ఆయనపై నీచ నికృష్ట ఆరోపణలు చేసిన బూట్ల బాబు, గాలి సోకినట్లు గోల చేసే పవనానందులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. అందుకే మళ్ళీ మళ్ళీ అంటాను: హైందవానికి ఆలన – జగన్ పాలన అని. ఓం నమో వేంకటేశాయ!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
పరిశ్రమలకు మేలు చేసే ఒప్పందం
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సుదీర్ఘమైన, క్లిష్టమైన చర్చల అనంతరం ఒక కొలిక్కి వచ్చినది మాత్రమే కాదు; మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న తీరుకు అది ప్రతీకగా నిలుస్తోంది. పైగా ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర ప్రయోజనాలున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవ స్థలను అది కలుపుతోంది. ఈ రెండింటి వాటా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నాల్గవ వంతుగా ఉంది. భవిష్యత్తులో కూడా ఆర్థిక బంధం స్థిరంగా కొనసాగేందుకు అది పునాది వేసింది. ఇది తాత్కాలిక బేరసారాల ప్రయోజనాల చుట్టూ అల్లుకున్నది కాకపోవడం వల్లనే ‘అన్ని భాగస్వామ్యాలకు మాతృక’ లాంటిది అనే పేరు తెచ్చుకుంది. ఇది దీర్ఘకాలిక ఆశయంతో సమగ్రంగా రూపుదిద్దుకున్న ఒప్పందం. వస్తు వాణిజ్యం, సేవలతోపాటు ఇన్వెస్ట్ మెంట్, డిజిటల్ ట్రేడ్, సతత వికాసం, రాకపోకలు, సాంకేతిక పరి జ్ఞాన సహకారాన్ని కూడా జోడించుకోవడం వల్ల ఇదేదో కేవలంసుంకాలలో వెసులుబాటు కల్పించుకున్నదిగా కాక, రెండు పక్షాలకు ప్రయోజనదాయకమైన ఆర్థిక చట్రాన్ని రూపొందించుకోగలిగింది. భారతీయ పారిశ్రామిక రంగానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే, పోటీ సామర్థ్యం ప్రస్తుతం మార్కెట్ల సౌలభ్యానికి మాత్రమే పరిమితమైనదిగా లేదు. దానికి ఒక స్థిరమైన, నమ్మకమైన, స్థితి స్థాపక సామర్థ్యమున్న వాతావరణం అవసరమవుతోంది.స్థిరమైన మార్కెట్ఐరోపా వంటి విస్తృత, నియమ–ఆధారిత మార్కెట్ వల్ల ఒక లాభం ఉంది. వివిధ సంస్థలు స్వల్పకాలిక లాభాలకు అతీతంగా, పెట్టుబడులు, ఎగుమతులు, ఉత్పాదక సామర్థ్యం, భాగస్వామ్యా లపై దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు, రసాయనాలు, మోటారు వాహనాల విడి భాగాల వంటి ఎక్కువ మంది శ్రమ అవసరమైన రంగాలకు అది మరీ అవసరం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించగల శక్తి కూడా ఆ రంగాలకు ఉంది. ఆయా రంగాలకు యూరోపియన్ మార్కెట్లు మునుపటికన్నా మెరుగ్గా అందుబాటులోకి వస్తే గణనీయమైన లాభం చేకూరుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలతో సహా భారతీయ సంస్థలకు మరో మహత్తర అవకాశం లభిస్తోంది. అవి కేవలం ధర విషయంలో పోటీపడటం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా మరింత మన్నికైన, విలువ ఆధారిత వస్తువుల ఉత్పత్తికి, విక్రయానికి యూరోపియన్ సంస్థలతో భాగ స్వామ్యం కుదుర్చుకోవడం తేలికవుతుంది. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం వల్ల రిస్కులుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకునేందుకు భారత్–యూరప్ కంపెనీలు రెండూ సప్లై చైన్లను చురుకుగా విస్తరించుకుంటున్నాయి. స్థాయి, సమరశీల సంస్కరణల అజెండా, మెరుగుపడిన పారిశ్రామిక మౌలిక వసతులతో యూరప్కుఇండియా నమ్మదగిన ఉత్పత్తి కేంద్రంగా, నవీకరణ భాగస్వామిగా ఆవిర్భవించగల స్థితిలో ఉంది. ఆ రకమైన మార్పునకు చాలా వరకు టెక్నాలజీ సహకారం పునాదిని అందిస్తుంది. కాలుష్య రహిత టెక్నాలజీలు, డిజిటల్ మౌలిక వసతులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ, అడ్వాన్డ్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో బలమైన సహకారాన్ని పాదుకొల్పుకునేందుకు తగిన పరిస్థితులను ఈ ఒప్పందం సృష్టిస్తోంది. నవీకరణలో ఐరోపాకున్న బలం, భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టగల భారత్ సామర్థ్యం ఈ విషయంలో సహజసిద్ధమైన పరస్పర ప్రయోజనదాయకమైన అంశాలుగా పరిణ మిస్తాయి. అధునాతన టెక్నాలజీలను అనుసరించడంలోనేకాదు, వాటి సహ అభివృద్ధిలో, స్థానికీకరణలో, నియోగించడంలో పాలు పంచుకునే అవకాశం భారత్ పరిశ్రమలకు లభిస్తుంది. ఫలితంగా, హెచ్చు విలువ కలిగిన వస్తూత్పత్తి, టెక్నాలజీ సునిశిత రంగాల్లోకి భారత్ పయనం వేగవంతమవుతుంది.పరస్పర తోడ్పాటు సేవలు, మానవ మూలధనంపై ఈ ఒప్పందం చూపగల ప్రభావం కూడా తక్కువదేమీ కాదు. జనాభా వర్గాలలో భారత దేశానికి ఉన్న సానుకూలాంశం వ్యూహాత్మక ఆస్తిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని పెద్ద యువ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా, టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన, ఆరోగ్య రక్షణ, వ్యాపార సేవలు వంటి వివిధ విభాగాల్లోకి వృత్తినిపుణులను తీసుకురాగలదు. యూరప్లో వయసు మీదపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండ వచ్చు. కానీ, వాటి ఆర్థిక వ్యవస్థలు నవీకరణతో నడుస్తున్నాయి. వాటికి సేవలను, మొబిలిటీని అందుబాటులోకి తెచ్చేందుకు యూరప్తో సంబంధాలు నెరపడంలో భారత నిపుణులకున్న సామ ర్థ్యాన్ని ఈ ఒప్పందం మెరుగుపరుస్తుంది. భద్రత–రక్షణ రంగాల్లో కూడా ఉభయ పక్షాల ప్రయోజనాలు సమ్మిళితం కావడం ఈ ఒప్పందంలో మరో ముఖ>్యంశం. అధునా తన రక్షణ పరికరాలు, ద్వంద్వ వినియోగ టెక్నాలజీ ఆవరణ వ్యవస్థ లలో తోడ్పాటుకు భారతీయ పరిశ్రమలకు ఈ ఒప్పందం ద్వారాలు తెరుస్తోంది. క్రమేపీ సమస్యాత్మకంగా మారుతున్న ప్రపంచ వాతా వరణంలో బలహీనతలను తగ్గించుకుంటూ, దేశీయ పారిశ్రామిక సామర్థ్యాలను పటిష్టపరచుకునేందుకు కూడా వీలుంది. మరో రకంగా కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గణనీయమై నదే. సమ్మిళితం ద్వారా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారతదేశం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈఒప్పందం ఎంతగానో అవసరమవుతుంది. దేశీయ ఉత్పాదక సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా నిష్ఠగా ఈ ఒప్పందాన్ని అమలు జరిపితే, భారతదేశపు పారిశ్రామిక పథం రూపురేఖలు కొన్ని దశాబ్దాలపాటు కొత్త అంచులను తాకుతూ ముందుకు సాగుతాయి. ప్రపంచ వాణిజ్యంలో భారత పారిశ్రామిక రంగ స్థితి ఎక్కడో అంచుల లోకాక, కేంద్ర స్థానాన్ని సుస్థిరంగా ఆక్రమించుకోగలుగుతుంది. -వ్యాసకర్త భారతీయ పరిశ్రమల సంఘాల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- చంద్రజిత్ బెనర్జీ -
స్వామిద్రోహుల లడ్డూ మోసం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకంజనక్షేమం ఒక బూటకంఅధికారం అన్నదే కీలకంసంపాదనే ఆయనకు మూలకంచంద్రబాబు ఒక స్వార్థ కీటకంహైందవ ద్రోహ రూపకంఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు. అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు. బయటపడిన నీచత్వంసుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకుహిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.స్వామివారి పుణ్యమా అని... లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది. శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది. దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు. నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్కు ఏంటి సంబంధం బాబు? సరైన పాప పరిహారంయజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి. కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు? అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ -
ఆర్థిక సర్వేకు కొత్త రూపునివ్వాలి!
మన దేశం స్వాతంత్య్రం సంపాదించు కున్న కొత్తలో ముఖ్యమైన విధానపరమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయీ అంటే అవి ప్రణాళికా సంఘం ప్రచురించిన పంచవర్ష ప్రణాళికలే! ప్రణాళికా సంఘం ప్రాధాన్యం కోల్పోయి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాభవం పెరిగిన తర్వాత, బడ్జెట్కు ముందు ఆర్థిక శాఖ సమర్పించే ఆర్థిక సర్వే క్రమేపీ ఎక్కువ మందిని ఆకర్షించడం మొదలైంది. ఈ సర్వే కొన్నేళ్ళుగా పెక్కు ఉపయోగకరమైన విధానపరమైన ఐడియాలను, ఆలోచనలను రేకెత్తించే అంశాలను మన ముందు ఉంచుతూ వస్తోంది. ఉదాహరణకు, చైనాపై వాణిజ్య, పెట్టుబడులపరమైన ఆంక్షలను విధించడంలోని ఔచిత్యాన్ని 2023–24 ఆర్థిక సర్వే ప్రశ్నించింది. అప్పటికి భారత్–చైనా సంబంధాలు కదలని స్థితిలోనే ఉన్నాయి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకునే బదులు భారత దేశంలో వస్తూత్పత్తి చేసేందుకు చైనా సంస్థలకు అనుమతించడం మెరుగైన ఆలోచన అనిపించుకోవచ్చని సర్వే వాదించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మొదట్లో ఆ ఆలోచనను తోసిపుచ్చినా, అది పునః పరిశీలించదగ్గ ప్రతిపాదనేనని ఆ తర్వాత అంగీకరించింది. సంక్షేమ పథకాల ఫలాలు అందవలసిన వారికి అందడం లేదనీ, వాటిలో లొసుగులు ఉన్నాయనీ గతంలో ఆర్థిక సర్వేలు ఎత్తి చూపాయి. లబ్ధిదారులకు నేరుగా నగదు బదలీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాయి. ఈ ప్రతిపాదన 2009–10, 2010–11 సంవత్సరాల సర్వేలలో మొదట చోటుచేసుకుంది. దానిపై అప్పట్లో మొదట్లో పెద్ద దుమారమే రేగింది. కానీ, అప్పటి నుంచి రైతులు, మహిళలు, ఇతర ఉద్దేశిత లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా నగదు బదలీ చేయడం సంప్రదాయసిద్ధమైన విధాన సాధనాలలో అంత ర్భాగంగా మారింది. మరింత ఉపయోగపడేలా...ఆర్థిక సర్వే కొత్త ఆలోచనలను అందించి, ఎక్కడెక్కడ దిద్దు బాటు చర్యలు అవసరమో సూచించగలదు. కానీ, సర్వేలో పది సూచనలు ఉంటే, ఏదో ఒక దానిపై చర్చించి, అమలులోకి తెస్తు న్నారు. మిగిలిన తొమ్మిదింటిని గాలికి వదిలేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే, సర్వేలో చూపే టేబుల్స్, ఛార్టులలో గాఢత లోపిస్తోంది. మరి పౌరులు, సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రజా సేవకులకు మరింత ఉప యోగకరమైనవిగా ఆర్థిక సర్వేలు ఉండేటట్లు చేయడం ఎలా? మొదట... వాటిని ప్రాధాన్యం కలిగినవిగా మార్చాలి. తదుపరి ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలో రూపుదిద్దుకోగలిగిన వివిధ సందర్భాలను సర్వే స్థూలంగా వివరించగలగాలి. ఆ యా సందర్భా లలో వివిధ మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటరీ ఏజన్సీలు విధాన పరంగా ఏ రకంగా స్పందిస్తే బాగుంటుందో కూడా సూచించాలి. అటువంటి పరిణామాల విశ్లేషణ చిన్న వ్యాపార సంస్థలు రానున్న నెలలకు సంబంధించి అత్యవసర ప్రణాళికలు తయారు చేసుకునేందుకు సహాయపడుతుంది. బాహ్య వాతావరణం మార గానే, దానికి తగ్గట్లుగా విధానపరంగా చకచకా మార్పులతో స్పందించేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. రకరకాల ప్రత్యామ్నా యాలను లెక్కలోకి తీసుకుంటూ స్వల్ప, మధ్యకాలిక అంచనాలకు రావడంలో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్తో కలసి ఆర్థిక మంత్రిత్వ శాఖ పనిచేయవచ్చు. ఈ అంచనాలను బట్టి ఎటువంటి పరిస్థితులు తలెత్తగలవో ప్రణాళిక వేసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో ప్రతి 3 నెలలకోసారి ఈ అంచనాలను అప్డేట్ చేయవచ్చు. ఏం చేయాలి?ఒకటి – చాలా భాగం భారతీయ వ్యాపార సంస్థలు సొంత ఆర్థిక, భౌగోళిక రాజకీయ సలహాదారులను నియమించుకోగలిగిన స్థోమత ఉన్నవి కావు. కీలక ఆర్థిక ప్రశ్నలపై మార్గదర్శనం చేయడం ద్వారా సర్వే బృందం ఆ లోటును భర్తీ చేయవచ్చు. రెండు – సర్వే చాట భారతంలా కాకుండా వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి. అది భారతీయ ఆర్థిక వ్యవస్థపై ఇయర్ బుక్లా కాకుండా ముఖ్యమైన ఆర్థిక సవాళ్ళపై దృష్టి కేంద్రీకరించిన సంగ్రహ డాక్యుమెంట్గా ఉండాలి. అప్పుడే అది నిజంగా ఉపయోగ పడుతుంది. నిర్ణయాలు తీసుకునేవారిలో చాలా మందికి సుదీర్ఘ పాఠాలను చదివేంత తీరిక ఉండదు. మూడు– ఆర్థిక సర్వే అందరి భాగస్వామ్యంతో రూపొంది నదిగా ఉండటం సముచితం. వివిధ ఆర్థిక మంత్రిత్వ శాఖలు,రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య లపై సర్వే బృందం ఇన్పుట్స్ సేకరించాలి. ఆ యా అంశాలపై ఆలోచించదగ్గ విధాన ప్రతిపాదనలు చేసిన వారికి విధాన నోట్సును తయారు చేసేందుకు స్వల్పకాలిక గ్రాంటులు మంజూరు చేయవచ్చు. ఆ సమావేశాల్లో పాల్గొనేవారు అకడమిక్ పరిశోధకులు, పాలసీ ప్రాక్టీషనర్లు ఇద్దరి మాటలను వినేవారుగా ఉండాలి. ఎటొచ్చీ వయసు విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడం వాంఛ నీయం. విధాన నిర్ణయ ప్రక్రియలో యువత పాలుపంచుకోవడాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది. బహిరంగ పోటీ వల్ల తుది ఎంపిక లను సీరియస్గా తీసుకోగల అవకాశం ఉంటుంది.హ్యాకథాన్ అవసరంఎవరో తెలివైన కొద్దిమంది పురుషులు, మహిళలతో భారత దేశ ఆర్థిక వ్యవస్థ లాంటి సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం కష్టం. చాలామంది విధాన నిర్ణేతలు తాత్కాలిక ప్రాతి పదికపై బయటవారి సలహాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతూంటారు. కానీ, దీనికి ఒక విధానపరమైన బృందం అవసరం. ఆబృందాన్ని నేటి కంప్యూటర్ పరిభాషలో హ్యాకథాన్ అందాం. విద్యా వేత్తలు, విధానపరమైన పరిశోధకుల నుంచి సమాచారాన్ని సేకరించి క్రోడీకరించే సంస్థాగత వేదికగా అది పని చేస్తుంది. నూతన విధాన పరిష్కారాలను ప్రతిపాదించేవారు సంకుచిత ప్రయోజనాల నిమిత్తం ఆ పని చేయడం లేదనీ, వారు పోటీతో కూడిన ప్రక్రియ ద్వారా ఎంపికై వచ్చినవారనీ విధాన నిర్ణేతలకు తెలిస్తే, వారు ఆ పరిష్కారాలను సానుకూలంగా పరిశీలించే అవ కాశం ఎక్కువ. హ్యాకథాన్ సూచించిన కొన్ని పరిష్కారాలు నేడు పూర్తిగా ఆచరణ సాధ్యమైనవి కాకపోయినప్పటికీ, అవి రేపటికైనా ఉపయోగపడేవిగా ఉంటాయి. నేటి యువ హ్యాకథాన్ విజేత రేపటి సీనియర్ విధానపరమైన నిర్ణేతగా పరిణమించనూ వచ్చు.ప్రమిత్ భట్టాచార్య వ్యాసకర్త ‘డేటా ఫర్ ఇండియా’ రిసెర్చ్ హెడ్; ‘న్యూఇండియా ఫౌండేషన్’ ఫెలో (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఈసారి రాజకీయ దావోస్
స్విట్జర్లాండ్లోని దావోస్లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’లు ఇంతకుముందు 1971 నుంచి 55 సార్లు జరిగాయి గానీ, ఈ తరహా పరిస్థితులు ఎప్పుడూ తలెత్తినట్లు లేవు. సాధారణంగా ఆ సదస్సు అజెండా లోకి ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, ప్రైవేట్ రంగానికీ ప్రభుత్వాలకూ మధ్య సహ కారం, సామాజిక అసమానతలు, సాంకే తిక రంగం, వాతావరణ పరిరక్షణ, రాజ కీయ సుస్థిరతల వంటి అంశాలు వస్తాయి. వీటన్నింటిని కూడా ఆర్థిక రంగ కోణం నుంచే చూస్తారు. అందుకే వాటికి ఆర్థిక సదస్సులనే పేరు వచ్చింది. కానీ, ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన సమావేశాలలో ఈ అంశాలపై ఏ చర్చలు జరిగినా జరగకున్నా, గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వివాదాలు రాజ్యమేలాయి. అది ఆర్థిక దావోస్కు బదులు రాజకీయ దావోస్ అయింది.మిత్రుల మధ్యే భేదాభిప్రాయలుతిరిగి అందులోనూ గమనార్హమైన విశేషం ఒకటున్నది. దావోస్ సమావేశాలు మొదలైనప్పటినుంచి ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అమెరికా, యూరప్ కలిసి శాసిస్తూ వచ్చాయి. అటువంటిది ఈసారి ఆ రెండు పక్షాల మధ్యనే భేదాభిప్రాయాలు ఏర్ప డ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ ఉడ్స్ సమావేశా లతో ఆరంభించి అమెరికా, యూరప్లు కలిసి పలు అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను సృష్టించాయి. అన్ని చట్టాలూ తామే చేశాయి. ఆర్థిక, వాణిజ్య రంగాలను తమ గుప్పిట పెట్టుకుని లాభ పడ్డాయి. అటువంటిది ఈసారి సమావేశాలు వచ్చేసరికి అంతర్గత విభేదాలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఈసారి దావోస్ భిన్నమైనది కావటం అందువల్లనే!అయితే ఇది ఆకస్మిక పరిణామం కాదు. ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత గత ఏడాదిగా ఉభయపక్షాల మధ్య పొగ రాజుకుంటూనే వస్తున్నది. అది, తక్కిన దేశాలతో పాటు యూరప్పై భారీ సుంకాలు, ఉక్రెయిన్ విషయంలో రష్యా అను కూల వైఖరి తీసుకోవటం, యూరప్ తన రక్షణ వ్యయాన్ని రెట్టింపు చేసి తన భద్రతను తాను చూసుకోవాలనటం, ‘నాటో’తో సంబంధాలు గతంలో వలె ఉండబోవన్న సూచనలు, యూరప్ ఇంతకాలం ‘తమపై పడి తిన్న’దనే తరహా వ్యాఖ్యలు, యూరప్లోని ఉదార వాద ప్రభుత్వాలు, పార్టీలకు వ్యతిరేకంగా తమ తరహా మితవాద – జాతీయవాద పార్టీలకు బహిరంగ మద్దతు వంటి చర్యలు ఆ పొగకు కారణమయ్యాయి. అలాగే గత కొద్ది నెలలుగా యూరప్ను ఈసడించి మాట్లాడటం ఒకటైతే, గత నవంబర్లో ట్రంప్ ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో అదే వైఖరిని చూపుతూ, అసలు యూరోపియన్ నాగరికత అన్నదే ‘తుడిచి పెట్టుకుపోయే’ పరిస్థితి వచ్చిందనటం మరొకటి అయింది.గ్రీన్ల్యాండ్తో పైపైకి...ఆ విధంగా పొగలు దట్టం కాగా, తమ సాటి ‘నాటో’ దేశమైన డెన్మార్క్కు చెందిన గ్రీన్ల్యాండ్ విషయమై జరుగుతున్న తతంగంతో ఆ పొగ కాస్తా భగ్గున మంటగా మారింది. మొదట ఇదే విధంగా కెనడాను సైనిక బలంతోనైనా తమ 51వ రాష్ట్రంగా మార్చుతామన్న ట్రంప్ పుట్టించిన ఆ మంటలు ఇప్పటికీ ఆగ్రహాన్ని రగుల్చుతుండగా, ఇపుడు గ్రీన్ల్యాండ్ను బలప్రయోగంతో 51వ రాష్ట్రం చేయగల మనటం అగ్నికి ఆజ్యంగా మారింది. గత వారపు దావోస్కు ముందు అందరూ ఎవరి దేశంలో వారుండి రాళ్ళు విసురుకోగా, దావోస్లో ఒకేచోట సమావేశమయే పరిస్థితితో బాహాబాహీ వంటి సన్నివేశాలు కనిపించాయి.ఇది అంతిమంగా ఏ విధంగా పరిణమించేదీ చెప్పలేము. మౌలికంగా ఇరువురివీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలు. ఉభయుల ప్రయోజనాలు కలిసి ఉన్నాయన్నది ట్రంప్ వ్యూహపత్రంలోనూ వివరించిన విషయమే. కానీ గతానికీ, ఇప్పటికీ ఒక కీలక మైన తేడా ఉంది. ‘అమెరికా ఫస్ట్’, ‘మాగా’ లక్ష్యాలను ప్రకటించిన ట్రంప్, యూరప్ సహా ప్రపంచ దేశాలన్నింటినీ అందుకోసం ఉప యోగించుకోవటమే తన విధానమైనట్లు ఆ పత్రంలో దాపరికం లేకుండానే ప్రకటించారు. ఆ పద్ధతిలో ముందుకు సాగుతుండటం వల్లనే ఇరువురి మధ్య గతంలో లేని విధంగా పొగలు, మంటలు రాజుకుంటున్నాయి. దావోస్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు, అవి ముగిసిన తర్వాత కూడా రెండు వైపుల నుంచి వినవచ్చిన మాటలను గమనించగా, రాజీలు కనీసం ప్రస్తుతానికి జరగక పోవచ్చు. తన వ్యూహాలు, ఎత్తుగడలు నెగ్గే పరిస్థితి లేదని ట్రంప్ గ్రహించి బాగా వెనుకకు తగ్గితే తప్ప. కానీ ఆయన స్వభావం తెలిసిన వారిలో అటువంటి ఆశాభావం కనిపించటం లేదు.ఢీ అంటే ఢీపరిస్థితి అర్థం అయేందుకు రెండువైపుల నుంచి వినవచ్చిన కొద్ది మాటలను గమనించాలి. ట్రంప్ అన్నది, ‘నేను మితిమీరిన బలప్రయోగానికి నిర్ణయిస్తే తప్ప బహుశా మాకేదీ లభించదు. అపుడు మమ్ములను ఎవరూ ఆపలేరు. అయితే నేనాపని చేయను’. ఇది గ్రీన్ల్యాండ్ గురించినది. మరొకవైపు యూరోపియన్ యూని యన్ కమిషనర్ ఉర్సులా వ్యాఖ్యలు ఇవి: ‘గతాన్ని (ఇరువురి సంబంధాలపై) గుర్తు చేసుకున్నంత మాత్రాన గత వ్యవస్థలు,సంబంధాలు తిరిగి రావు. ఈ మార్పే గనుక శాశ్వతమైతే, యూరప్ కూడా శాశ్వతంగా మారాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కుని ఒక కొత్తదైన యూరప్ను శాశ్వతంగా నిర్మించుకోవాలి’. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన గీతా గోపీనాథ్, ‘అమెరికా, యూరప్ల మధ్య విశ్వాసమన్నది పూర్తిగా భంగపడి పోయింది. ఇపుడు యూరప్ ఆర్థికంగా, అంతర్గత భద్రత రీత్యా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ఆలోచిస్తున్న’దని అన్నారు.ఈ కొత్త పరిస్థితికి బాగా అద్దం పట్టింది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఉత్తేజకర ప్రసంగం. అది అంతే ఆలోచనాస్ఫోరకం కావటంతో వెంటనే దావోస్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్కు అదే స్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించింది. దానిపై ఆయన వ్యాఖ్యను హైదరాబాద్ పరిభాషలో చెప్పాలంటే, ‘యాద్ రఖ్లో బేటా, దేఖ్ లూంగా’ అవుతుంది. అట్లా అని ఊరుకోలేదు. అమెరికా లేనిదే కెనడా అసలు బతకలేదన్నారు. దానిని కార్నీ తిప్పి కొట్టడమేగాక, పది రోజుల క్రితం చైనా వెళ్లి భారీ ఒప్పందాలు చేసుకున్నారు. పైగా చైనా నమ్మదగ్గ భాగస్వామి అనీ, అమెరికా కాదనీ ప్రకటించటాన్ని ట్రంప్ గుర్తు చేసుకుంటూ... ఆ ఒప్పందాలు చేసుకున్నందుకు కెనడాపై వందశాతం సుంకాలు విధించగలనని ప్రకటించారు. వాస్తవానికి కార్నీ ప్రసంగం పూర్తి పాఠంగా పత్రిక లలో రాదగ్గది. మొత్తంమీద ఈసారి దావోస్ సమావేశాల ప్రభావం దీర్ఘకాలం ఉండనున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కనబడే వృద్ధిలో కనబడనివి...
దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్టకేలకు అధిక వృద్ధి బాట పట్టిందని వ్యాఖ్యాతలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ముందస్తు అంచనాలను కూడా లెక్కలోకి తీసుకుంటే, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు 8.1 శాతం. నమోదైనవాటిలో ఇదే ఉత్తమం. కానీ, దీన్ని సందర్భానుసారంగా చూడాలి. గడచిన ఐదేళ్ళ రికార్డు, చతికిల పడిన స్థితి నుంచి చూసి చెబుతున్నది. కోవిడ్ ఏడాది 2020–21లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కోవిడ్కు ముందరి ఏడాది (2019–20)ని ప్రాతిపదికగా చేసుకుంటే, తాజాగా ఆరేళ్ళలో వృద్ధి రేటు 5.7 శాతంగా తేలుతుంది. అంతకుముందు 19 ఏళ్ళలోని వృద్ధి రికార్డు కన్నా అది మందగమనం కిందనే లెక్క. కోవిడ్కు ముందరి ఏడాది వరకు సగటున 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది.తాజా వృద్ధిరేటు 2020–21 క్షీణత నుంచి ఏ మేరకు కోలుకున్నామనేదానికి ప్రాతినిధ్యం వహిస్తోందా అనేది కీలక ప్రశ్న. నిలకడగా సాధించగలిగిన వృద్ధిరేటు ఇపుడు ఎంతని చెప్పగలం? వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 6.5 శాతం వృద్ధిరేటు ఉండగలదని కొందరు అంచనాలు వెల్లడించారు. దాన్ని ప్రాతిపదికగా చేసుకుంటే, మూడేళ్ళ (2024–27) చక్రభ్రమణంలో సగటు వృద్ధి రేటు 6.8 శాతం ఉండవచ్చు. మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో కూడా అదే రేటు ఉంది. స్థిర వృద్ధి రేటులో గణనీయమైన పెరుగుదల ఇంకా ఏదీ లేదని ఇది సూచిస్తోంది. విరుద్ధ సూచికలుగతంలో చాలా సందర్భాలలో, ఏదో ఒక ఆర్థిక సూచి సరైన స్థితిలో లేనట్లుగానే కనిపించేది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండ టమో, లేదా ద్రవ్యలోటు మాదిరిగానే వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటమో జరిగేది. దానికి భిన్నంగా నేటి ఆర్థిక వ్యవస్థ స్వర్ణ యుగ దశలో ఉన్నట్లుగా చిత్రితమవుతోంది. అయినా, స్థూల గణాంకాలు అప్రమత్తతను సూచిస్తున్నాయి. ద్రవ్యలోటు తగ్గుతున్న బాటలోనే ఉంది. కానీ, స్థూల జాతీయో త్పత్తి (జీడీపీ)లో అది 4.4 శాతంగా ఉంది. అంటే, మోదీ ప్రభుత్వ మొదటి హయాంలో (3.6 శాతం) కన్నా అధికం. ప్రభుత్వం పెట్టుబడుల ప్రవాహాన్ని ఉధృతం చేయడం, మరింత నిజాయతీతో కూడిన పద్దులు... బహుశా అందుకు కారణం కావచ్చు. ప్రభుత్వ రుణం కూడా తగ్గుతున్న సరళిలోనే ఉన్నప్పటికీ, అధికంగానే కొనసాగుతోంది. జీడీపీలో 81 శాతంగా ఉన్న ప్రభుత్వ రుణం, ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారితే, దాన్ని ఎదుర్కోగల ద్రవ్యాచరణకు అది వెసులుబాటు కల్పించగలిగినదిగా లేదు. కాగా, వృద్ధికి కీలకమైన పొదుపు, ఇన్వెస్ట్మెంట్ రేట్లు గతంలో కన్నా తక్కువగా ఉన్నాయి. స్థూల స్థిర మూలధన సమీకరణ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి జీడీపీలో 30 శాతంగా ఉంది. ఇది 2012–13 వరకు ఉన్న ఎనిమిదేళ్ళ సగటు 34 శాతం కన్నా తక్కువ. ఆర్థిక కలాపంలో వస్తువులు, సరుకుల ఎగుమతుల వాటా కొంత కాలంగా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా, దీన్ని వేగవంతమైన వృద్ధి రేటుకు విరుద్ధమైన సూచిగానే చూస్తారు. బాగుంది కానీ...వృద్ధి రేటు పెరుగుతున్న సరళికి ఆలంబనగా నిలిచే డేటా ఏదైనా కావాలనుకుంటే, ఇతరత్రా సంఖ్యలను చూడక తప్పదు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన మానవ అభివృద్ధి సూచిలో మన దేశం ఈ ఏడాది ‘మధ్యస్థ’ నుంచి ‘అధిక’ కేటగిరీలోకి పురోగమించవచ్చునని భావిస్తున్నారు. ఇది విద్యాస్థాయులు, ఆయుర్దాయం, ఆదాయాలలో వచ్చిన స్థిర మెరుగుదలను ప్రతిబింబిస్తోంది. దీంతో మురిసిపోవడానికి లేదు. ఈ సూచిలో ‘అత్యధిక’ కేటగిరీ కూడా ఉంది. దానిలో 70కి పైగా దేశాలున్నాయి. ఆర్థిక నిర్వహణ విషయానికి వస్తే, పన్ను రేట్లు (కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, జీఎస్టీ) గతంలో కన్నా హేతుబద్ధంగా ఉన్నాయి. డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులు విస్తృత వినియోగాన్ని సంతరించుకున్నాయి. భౌతిక మౌలిక వసతుల్లో భారీ పెట్టుబడులు అభినందనీయం. ఇవి రోడ్డు, రైలు మార్గాలలో సరుకుల రవాణాను వేగవంతం చేశాయి. అదే సమయంలో, వాణిజ్య వాహనాల అమ్మకాలలో అది ప్రతికూల ప్రభావం చూపడం వేరే సంగతి. సంస్కరణల వల్ల స్థిరాస్తి, వస్తూత్పత్తి వంటి రంగాలు లబ్ధి పొందాయి. ఎలక్ట్రానిక్స్ రంగ నేతృత్వంలో వస్తూత్పత్తి ఎట్టకేలకు కొంత వేగాన్ని అందిపుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా కింది స్థాయి వరకు కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. కానీ పారిశ్రామిక విభాగాల్లో మూలధన వస్తువుల ఉత్పత్తి నత్తనడకన సాగుతోంది. తీవ్ర పేదరికం నుంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరగడం శుభ సూచకం. కానీ, అది వినియోగ వస్తువుల డిమాండ్ బాగా పెరిగేటంతగా తోడ్పడకపోవచ్చు. వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నవారు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. దానిలోంచి కొందరు బయటకు రావడానికి బదులుగా కొత్తవారు కూడా ఉపాధికి అదే రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. చేయాల్సింది ఎంతో!ఆదాయ నిచ్చెనలో పై మెట్లపై ఉన్నవారి వినియోగ రుణం ఎక్కువగా ఉంది. గృహోపయోగ వస్తువులపై రుణాలు 2021–22లో ఉన్న రూ. 8.99 ట్రిలియన్ల నుంచి 2023–24లో రూ. 18.79 ట్రిలియన్లకు రెట్టింపయ్యాయి. ఇప్పటికే చేసిన అప్పులు చెల్లించ వలసి రావడం వల్ల భవిష్యత్ వినిమయంపై దాని ప్రభావం పడుతుంది. చాలా రంగాల్లో వృద్ధి ఇప్పటికే మందంగా ఉంది. ముఖ్యంగా, రైళ్ళలో ప్రయాణించే వారి సంఖ్య నెమ్మదిగానే పెరుగుతూ వస్తోంది. వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్న ప్పటికీ అదీ పరిస్థితి. వినియోగదారులలో అగ్ర భాగాన ఉన్న 20 శాతం మందిపైనే దృష్టి పెడుతున్నట్లు మొన్నామధ్య ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అందుకే ఆశ్చర్యం కలిగించలేదు. కానీ విమాన ప్రయాణికుల సంఖ్య 2024 వరకు గడిచిన ఐదేళ్ళలో 11 శాతం మాత్రమే వృద్ధి చెందింది. దేశం 1991లో సంస్కరణల బాట పట్టిన తర్వాత, ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పు తగినంత చోటుచేసుకోలేదని వీటన్నింటి బట్టి తెలుస్తోంది. తలసరి ఆదాయాలు దాదాపు ఐదు రెట్లు పెరిగినప్పటికీ, జీడీపీలో పరిశ్రమ వాటా అప్పటిలానే ఇప్పుడు కూడా ఒకటో వంతుగానే ఉంది. వ్యవసాయ రంగ వాటా కూడా క్షీణించింది. పంట దిగుబడులు ప్రపంచ ప్రమాణాల కన్నా తక్కువ స్థాయులలో ఉన్నాయి. సేవల రంగమే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగంగా పరిణమించింది. అది చాలా వరకు, ఆర్థిక వ్యవస్థలో అవ్యవస్థీకృత భాగంగానే కొనసాగుతోంది. సరైన ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా సత్వర సేవల రంగాన్ని చూపలేం. ఉత్పాదకత పెంపుదల మూడు సంస్థాగత మార్పులపై ఆధార పడి ఉంది. వస్తూత్పత్తి రంగం గణనీయమైన రీతిలో పెద్దదిగా మారాలి. ఆర్థిక వ్యవస్థ మరింత నియతమైనదిగా మారాలి. పట్టణీ కరణ వేగంగా సాగాలి. ఆర్థికవ్యవస్థ తగినంత వేగాన్ని పుంజు కోవడానికి చేయవలసింది చాలా ఉంది. టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రాజ్యాంగం ఓ ‘సోషల్ డాక్యుమెంట్’
రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రెండేళ్ల 11 నెలల 11 రోజుల సుదీర్ఘ కసరత్తు చేశాక బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఓ ఆదర్శ ప్రాయమైన రాజ్యాంగాన్ని అందించింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను ఫ్రెంచ్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, మార్గదర్శక సూత్రాలను ఐర్లాండ్ నుంచి, సుప్రీం కోర్టు విధివిధా నాలను జపాన్ నుంచి స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించే పరిపాలనకు రాజ్యాంగమే మార్గదర్శి. చట్టాల రూపకల్పనకు దిక్సూచి. దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. బాధ్యతలను అందించింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు, ప్రభుత్వాలు చేసిన హామీలను, చేసిన చట్టాల అమలులో లోపాల్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ, సామాజిక అస్థిరతలతో కుప్పకూలాయి. కానీ, ఎంతో విశాలమైనదీ, అతి పెద్ద జనాభాతో కూడి అనేక భిన్న సంస్కృతులు, భాషలు, వర్గాలు,సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ‘భిన్నత్వంలో ఏకత్వం’లా సుదృఢంగా భారతదేశం 8 దశాబ్దాలుగా నిలబడగలిగిందంటే నిస్సందేహంగా మనకున్న అతి గొప్పదైన రాజ్యాంగమే కారణం. రాజ్యాంగం కేవలం ఒక నియమాల సంకలనం కాదు. సమసమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు దారిచూపే ఓ ‘దీపం’. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించాలో నిరంతరం గుర్తు చేసే ఓ దార్శనిక పత్రం.ప్రవేశిక ప్రాధాన్యంరాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్దేశించింది. ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో మొదలుపెట్టి ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాము’ అని ఉంటుంది. భారత రాజ్యాంగం దేశంలో ఏ ఒక్క వర్గానిదో, మతానిదో కాదు. కులం, మతం, వర్గం, భాష, లింగ వివక్ష, విద్య... ఇంకా ఇతర ప్రమాణాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరి సమానత్వం కోసం ఏర్పరిచింది. సార్వభౌ మత్వం అంటే అర్థం ప్రజలు మాత్రమే సర్వాధికారులు. ప్రభుత్వా లన్నది ప్రజలకు సేవ చేయడానికి ఉనికిలో ఉంటాయి. ప్రభుత్వాల అధికారాలన్నీ ప్రజల చేత, ప్రజల తరఫున, ప్రజల కోసం పాలించ డానికి ఇవ్వబడేవే! రాజ్యాగం గొప్పదైనంత మాత్రాన ఆశించిన ఫలితాలు అంద వని ముసాయిదా ప్రతిని సమర్పించి 1949 నవంబర్ 26న చేసిన చరిత్రాత్మక ప్రసంగంలోనే అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగం ఎలా పని చేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడిలేదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అనే అంగాలను మాత్రమే రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆకాంక్షలను, రాజకీయాలను కోరుకొంటున్నారన్న దానిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది’’ అంటూ స్పష్టం చేశారు.మంచీ... చెడూ...రాజ్యాంగబద్ధమైన పాలనలో దేశం కొన్ని మైలురాళ్లు చేరుకున్న మాట వాస్తవం. 1947లో దేశ ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు అది 72 సంవత్సరాలకు పెరిగింది. అక్షరాస్యత 16% నుండి 80 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.773 కోట్ల టన్నులకు పెరిగింది. 1947లో కేవలం 1,500 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పర్చు కోగలిగాము. రహదారుల నిర్మాణం కూడా 4 లక్షల కిలోమీటర్ల నుంచి నేడు 60 లక్షల కిలోమీటర్లకు చేరుకోగలిగాము. అంటరాని తనం చట్టపరంగా తొలగించబడింది. దళితులు, గిరిజనులపై జరిగే అకృత్యాల నుండి పరిరక్షించే చట్టాలు రూపొందించబడ్డాయి. వివక్షకు గురైన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆహారం, సమాచారం హక్కుగా కల్పించబడ్డాయి. నిరాదరణకు గురైన సామా జిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రు లుగా, న్యాయమూర్తులుగా నియమించబడటం చెప్పుకోదగిన మార్పు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినవారి సంస్కృతి, మతపర విశ్వాసాలకు చట్టపరంగా రక్షణలు కల్పించడం జరిగింది. అయితే, రాజ్యాంగం కల్పించిన మహత్తర అవకాశాలను పూర్తి స్థాయిలో ఈ 8 దశాబ్దాల రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందనడం ఓ చేదు వాస్తవం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తి అమలు కాలేదు. ఫలితంగానే, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. 90 శాతం సంపద 10 శాతం మంది వద్ద పోగుపడింది. ధనికులు మరింత ధనికులు కాగా, పేదలు మరింత పేదలు అవుతున్నారు. విధానపరమైన వైఫల్యాలే దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. రాజ్యాంగం ద్వారా రూపొందించే సంస్థలలో ప్రజా భాగస్వామ్యం, పాత్ర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.అవగాహన పెరగాలి!రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వాలు జరగడంతోనే ఈ సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లలో సంక్షేమానికి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రాధాన్య రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి దిగజారి పోయాయి. ప్రభుత్వాలకు ఆదాయం ప్రజల పన్నుల ద్వారా సమకూరుతున్నదే. పన్నుల్లో ఎంతమేరకు తిరిగి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారో లెక్కలు తీస్తే సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది. సామాజిక న్యాయం జరగకపోతే రాజ్యాంగం ఆశించిన తీరులో అభివృద్ధి జరగదు. రాజ్యాంగ సూత్రాల స్ఫూర్తితో పని చేస్తేనే పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడతాయి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అన్ని వర్గాల ప్రజలను సాధికారుల్ని చేయగలిగితేనే... భారత రాజ్యాంగం ఆశించిన మేరకు ఫలితాలు అందుతాయి. భారత రాజ్యాంగాన్ని ఓ సోషల్ డాక్యుమెంట్గా అమలు చేసినప్పుడే ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంత రాలు తగ్గుతాయి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. రాజ్యాంగం అందించిన హక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వాలను నిలదీయాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు (నేడు గణతంత్ర దినోత్సవం) -
సునీల్ మిత్తల్ (వ్యాపార కుబేరుడు) రాయని డైరీ
దావోస్ నుండి తిరిగి వచ్చేస్తుంటే దారి మధ్యలో ట్రంప్ నా మనసులోకి వచ్చారు! నిజానికి ఆయన ఎవరి మనసులోనికైనా కొత్తగా రావటం ఉండదు. వచ్చేసి, ఇక వెళ్లకపోవటమే ఉంటుంది. ఏం మనిషి!! ప్రపంచాన్ని పిచ్చిగా షేక్ చేస్తున్నారు ఆయన. షేక్ చేయటం అంటే, కదిపేయటం మాత్రమేనా, ‘కలిపేయటం’ కూడా! ట్రంప్ పిచ్చికి ఒక పద్ధతి ఉన్నట్లుగా నాకు తోస్తోంది. పెద ఉప్పెన ఒకటేదైనా వచ్చిపడాలి... మనుషులంతా ఒకరిలోకి ఒకరు మునగదీసుకోవటానికి! దేశాలైనా అంతే, ఉపద్రవం వచ్చిపడితే హద్దులు చెరిపేసుకొని భూభాగాలన్నీ ఒకచోట చేరిపోవలసిందే. మనుషులకన్నా ఏం గొప్పవని ఈ దేశాలు!ట్రంప్ ఇప్పుడొక ఉప్పెన. ఒక ఉపద్రవం. నాకనిపిస్తోందీ... యూరప్ చాలా కాలంగా సెలవుల్లో ఉన్నట్లుగా ఉండటం వల్ల ట్రంప్ను తమాయించుకోలేక పోతున్నదని! సెలవుల నుంచి తిరిగొచ్చాక, ఇంట్లో పని ఉంటుంది; ఒంట్లో బద్ధకంగా ఉంటుంది. ట్రంప్ ఆ బద్ధకాన్ని వదిలించి, మూలన ఉన్న చీపురును చేతికి అందుకునేలా చేశారు. ‘‘గ్రీన్ల్యాండ్ను కలిపేసుకుంటాం’’ అని ఆయన ఒక్కమాట అనగానే ఐరోపా దేశాలన్నీ మెలకువలోకి వచ్చేశాయి! ఆయన ఒక్కసారిగా ట్యారిఫ్లు పెంచేయగానే ఇండియా వంటి దేశాలతో ట్రేడ్ డీల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈయూ లీడర్లు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. ‘యూరోపియన్ కమిషన్’ ప్రెసిడెంట్ మిస్ ఉర్సులా వాండర్, ‘యూరోపియన్ కౌన్సిల్’ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా... రేపు జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు ప్రత్యేక అతిథులు. ఆ మర్నాడే ‘ఇండియా–ఈయూ’ సదస్సు. బహుశా, సెలవుల నుంచి ఎలా తేరుకొని ఎలా పనిలో పడిపోవాలో తెలుసుకునేందుకు ఇండియాతో ఆ సదస్సులో యూరప్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవచ్చు. ఇండియాకు వర్క్ తప్ప వెకేషన్ అలవాటు లేదు కనుక ప్రతిఫలంగా యూరప్ నుంచి వర్క్ తీసుకోవచ్చు. ట్రంప్ విషయంలో ఇండియా ‘‘ఇలా ఉండాల్సింది’’, ‘‘అలా ఉండాల్సింది’’ అని ఇండియాలోనే కొందరు విమర్శిస్తున్నారు! ‘ఉండాల్సింది’ అనే మాటను ఎప్పుడైనా సరే, భుజాల మీద బరువు లేని తేలికపాటి మనుషులు మాత్రమే అనగలరు. నేను బిజినెస్మేన్నే కావచ్చు. కానీ నేను జియోపాలిటిక్స్ స్టూడెంట్ని కూడా! ట్రంప్ ట్యారిఫ్ల శబ్దానికి ప్రతీకారంగా ఇండియా మౌనం వహించటమే దీటైన జవాబు అని నేను నమ్ముతాను. శబ్దానికి శబ్దంతో సవాలు విసిరితే అది తగాదా అవుతుంది. మౌనాన్ని అస్త్రంగా సంధిస్తే అవతలి వాళ్ల శబ్దాలు తాటాకు చప్పుళ్లుగా మాత్రమే మిగులుతాయి! ఇది కదా ప్రత్యర్థి ప్రకోపాన్ని శక్తిహీనం చెయ్యటం! గాజాను గొప్ప రియల్ ఎస్టేట్గా మారుస్తానని ట్రంప్ దావోస్ ఎకనమిక్ ఫోరమ్లో అన్నారు! ఒక పిచ్చివాడు అనలేని మాట అది. పచ్చి వ్యాపారి మాత్రమే అలా అనగలడు. చందమామ కోసం గెడకర్రతో ఆకాశాన్ని కదిలిస్తే కనీసం చుక్కలైనా రాలకపోతాయా అని ఆలోచిస్తారు ట్రంప్. ట్రంప్ అనే అధ్యక్షుడిలో ట్రంప్ అనే అనేకమంది వ్యాపారులు ఉన్నారు. లేకుంటే ఆయన గాజాను, గ్రీన్ల్యాండ్ను పునర్నిర్మించాల్సిన నివాస ప్రాంతాలుగా కాకుండా, కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్సులుగా ఎందుకు చూస్తారు? ఎకనమిక్ ఫోరమ్లో ట్రంప్ 72 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ప్రతి మాటలోనూ ‘అమెరికా ఫస్ట్’ అనే క్లాసిక్ నినాదం చాలా కఠినంగా ధ్వనించింది!ఫస్ట్ అన్నప్పుడు పరుగెత్తి ఫస్ట్ రావాలి. కానీ ట్రంప్, అమెరికాను ఉన్నచోటనే ఉంచి, అమెరికా ఫస్ట్ అనిపించేలా ప్రపంచం ఉన్న ఆర్డర్ని మార్చాలని చూస్తున్నారు! ఆశ్చర్యం ఏముంది?! ఫక్తు వ్యాపారి అలాగే కదా చూస్తాడు, అలాగే కదా చేస్తాడు! -
కమ్యూనిస్టు కూటమికి ఎదురుగాలి
కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజక వర్గాల్లో ఓటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇదీ పరిస్థితి. మరోవైపు ఎన్డీయే కూటమి ఉనికి పెంచుకుంటుంటే, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రత్యర్థి కూటమి ‘యూడీఎఫ్’ బలపడుతోంది. దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు ప్రభు త్వాన్ని కేరళలో నడుపుతున్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) పదేళ్ల పాలన తర్వాత ఎదురీదుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సైద్ధాంతిక మందగింపు, కులాల కుమ్ములాటలు కూటమిని బల హీనపరుస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో వివిధ ప్రభా వాల వల్ల ఎల్డీఎఫ్ బలహీనపడ్డ తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పతనం తర్వాత దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్టు (కూటమి) ప్రభుత్వం ఇక్కడుంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గెలుపు వరించాలంటే 71 స్థానాల మేజిక్ ఫిగర్ చేరుకోవాలి. 16 రిజర్వుడ్ (పద్నాలుగు ఎస్సీ, రెండు ఎస్టీ) స్థానాలపై పట్టు కీలకం! 2011, 2016, 2021 మూడుఅసెంబ్లీ ఎన్నికల్లోనూ 14లో 12 ఎస్సీ స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయ పరంపర కొనసాగించింది. ఇతర స్థానాల్లోనూ ఎల్డీఎఫ్ దళితుల మద్దతు అపారంగా పొందుతూ వచ్చింది. కార్మికోద్యమాలు, బడు గుల సంక్షేమం, పింఛన్లు, రిజర్వేషన్లు వంటి అంశాల్లో కమ్యూని స్టుల సహజ సైద్ధాంతిక బలం, వ్యవస్థీకృత నిర్వహణ వంటివి దళితుల మద్దతు కూడగట్టడంలో కూటమికి కలిసి వచ్చిన అంశాలు. కానీ, ఇప్పుడా మద్దతు సన్నగిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో... ఎన్నిక లకు సంబంధించి కేరళలో ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రారంభించింది. వేగంగా మార్పులుకేరళ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో మూడు ముఖ్య కూట ముల గెలుపోటములను ప్రధానంగా మూడంశాలు ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కమ్యూనిస్టు మూస విధానాలను వ్యతిరేకిస్తూ ఆశావహంగా పెరిగిన నగర–పట్టణ ఓటర్ ఆకాంక్షలు; కులాల కుంపట్లతో, విభిన్న సామాజిక వాదాలతో వచ్చిన చీలికల్లో ‘ఎల్డీఎఫ్ ఓటు బ్యాంకులు’ బలహీనపడటం; కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ బీజేపీ, తిరిగి పుంజుకుంటూ, యూడీఎఫ్ కిందటిఅసెంబ్లీ ఎన్నికల నుంచి బలపడుతూ రావటం... ఈ మూడంశాలు ‘ఓటు రాజకీయాల్ని’ ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ బీజేపీ ఎదుగుదల నేరుగా సొంతానికైనా లాభించ వచ్చు, లేదా ఓటు బ్యాంకు చీలికల వల్ల పరోక్షంగా యూడీఎఫ్కైనా మేలు చేయ వచ్చన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తిరువ నంతపురం కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడం, అంతకు ముందరి అసెంబ్లీ ఎన్నికల (2021) ఫలితాలకు భిన్నంగా పలుచోట్ల యూడీఎఫ్ కొత్తగా బలపడటం ఇందుకు నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వాతావరణం కొనసాగితే.... నికరంగా నష్ట పోయేది ఎల్డీఎఫ్ అనడంలో సందేహమే లేదు. గతంతో పోల్చి చూస్తే దేశవ్యాప్త రాజకీయ పరిణామాల ప్రభావం కేరళ రాజకీయాలపైన ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేయడం, ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ గెలవడం ఓ పెద్ద పరిణామమే! పార్టీ మరో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయ కుడు కె.సి. వేణుగోపాల్కు ఏఐసీసీలో ప్రాధాన్యం పెరగటంవంటివి కేరళ రాజకీయాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్సభ స్థానాన్ని గెలవటం, మరుసటి యేడు (2025) జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం బీజేపీకి కలిసివచ్చిన అంశాలే! లోక్సభ ఎన్ని కల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత లభించగా అందులో 2 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. పరిమిత వర్గాల్లోనే అయినా దళి తుల్లో బీజేపీ బలపడటం సీపీఎంకు ఆందోళన కలిగిస్తున్న అంశం. చీలిక విసిరిన సవాల్ దళిత ఉప కులాల్లో వచ్చిన చీలికలు అటు యూడీఎఫ్కు, ఇటు ఎన్డీయేకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. ఫలితంగా రిజర్వుడు స్థానాల్లో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మొత్తం కేరళలో ఎస్సీల జనాభా 9 శాతం. దళితుల్లో ప్రధానంగా ఉన్న పులియలకు తోడు పరయ, కురవ, కనక్కన్, తండన్ వంటి ఉప కులాలున్నాయి. రెండు ఎస్టీ రిజర్వు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నా, 14 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటికాంగ్రెస్ చేతిలో ఉంటే మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యత 3–6 స్థానాలకు పెరిగితే, ఎల్డీఎఫ్ పట్టు 10–7 స్థానాలకు పరిమితం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దళితుల్లో అధిక సంఖ్యాకులైన పులియ సామాజికవర్గం పైన కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. ఎస్సీల్లోని ఇతర ఉపకులాలు సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం సాను కూలంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీల్లో కుల వివాదాలకు, వైషమ్యాలకు, తద్వారా చీలికకు హేతువవుతోంది. అది కూడా పరోక్షంగా కమ్యూనిస్టులు దళితుల్లో పట్టు కోల్పోవడానికి కారణంగా నిలుస్తోంది. పార్టీ సైద్ధాంతికంగా మంద గిల్లడం, ఇతరేతర కారణాల వల్ల పులియ వర్గంలోనూ కమ్యూని స్టులకు కొంత పట్టు సడలింది. కురవ సామాజికవర్గ మద్దతు పరంగా ఎల్డీఎఫ్కు గట్టి పట్టున్న దక్షిణాది జిల్లాలు కొల్లం, పత్తనంతిట్టలలోనూ కులాల్లో వచ్చిన చీలిక వారిని బలహీనపరిచింది.ప్రజానాడి సంకేతాలే కీలకంప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ స్థానిక స్వపరిపాలనను పటిష్ఠపరచుకున్న కేరళలో గత స్థానిక ఎన్నికలు జనం మనోగతాన్ని కొంతమేర వెల్లడి చేశాయి. అలా చూస్తే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునకు భిన్నమైన ఫలితాలు 2025 స్థానిక ఎన్నికల్లో వచ్చాయి. అవి యూడీఎఫ్, ఎన్డీయేకు కొంత ఆశావహంగానే ఉన్నాయి. వరుస రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పు, దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక పాలక ఎల్డీఎఫ్ వ్యతిరేక వాతావరణాన్నే స్పష్టం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకున్న దాదాపు మూడు మాసాల వ్యవధిలో పరిస్థి తులు ఇంకా ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే!-వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -దిలీప్ రెడ్డి -
అధికారం లేని ఆర్థిక రాజధాని
ముంబై మునిసిపల్ ఎన్నికలను నాలుగేళ్ళు ఆలస్యంగా నిర్వహించారు. రాజ్యాంగ ఉల్లంఘనతో సమానమైన ఈ జాప్యం భారతీయ ప్రజాస్వామ్యం గురించి చెప్పకనే చెబుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకుండా, పర్యవసానాలపై ధ్యాస లేకుండా భారతదేశపు సంపన్న మునిసిపాలిటీ పాలనను సస్పెన్షన్లో ఉంచారు. అయితే, మూడవ అంచెలోని రాజ్యాంగపరమైన స్వయం– పాలనా ప్రభుత్వం ఐచ్ఛికమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. మొత్తం 227 మంది సభ్యుల బృహన్ ముంబై పాలక సంస్థ (బీఎంసీ)లో బీజేపీ 2017 నాటి (82) స్థితిని మెరుగుపరచుకుని ఈసారి 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనలో చీలిక దానికి బాగా ఉపయోగపడింది. మహారాష్ట్రలో ఎన్నికలు జరి గిన ఇతర పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా కమలమే ఎక్కువచోట్ల వికసించింది. కానీ, ముంబై ఫలితం కనీసం ఒక చక్కని రాజకీయ భాష్యా నికైనా అనువైనదిగా లేదు. ఎందుకంటే, ముంబై మామూలు నగరం కాదు. అదొక నగర రాజ్యం. దాని బడ్జెట్ ముందు దేశంలోని చాలా రాష్ట్రాల బడ్జెట్లు కూడా తక్కువే. అది భారతదేశపు ఆర్థిక రాజధాని. బాలీవుడ్కు నెలవు. కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి వాలే పెద్ద చెట్టు. సృజనాత్మక కళాకారుల ఆట మైదానం. ఆ విధంగా అది సాంస్కృతిక చోదక శక్తి. దాని బహుళత్వం, విస్తృత దృక్పథ స్వభావం దాని సంపదకు ఏమీ తీసిపోనంత విలువైనవి. బాధ్యత లేని సంస్థలుఅయినా ఎందుకో నామమాత్రపు జవాబుదారీతనమనే జబ్బుతో, ఈ మహా నగరం బాధపడుతోంది. దాని పాలనా విభా గాలు సాలెగూడును తలపిస్తాయి. బీఎంసీ (పౌర సంస్థ), ఎంఎంఆర్డీఏ (ప్రాంతీయ ప్రణాళిక), ‘బెస్ట్’ (రవాణా), ఎంహెచ్ఏడీఏ (గృహ నిర్మాణం), ఎస్ఆర్ఏ (మురికివాడల వాసులకు పునరా వాసం), రైల్వేలు... ఇలా చెప్పుకొనేందుకు చాలా ఉన్నాయి. కానీ, ఏ సంస్థా పూర్తి బాధ్యత తీసుకోదు. ఒకదాని పరిధిలోకి ఒకటి చొరబడే వీలుంటుంది. నింద నుంచి తప్పించుకునే మార్గాలను అవి జాగ్రత్తగా రూపొందించుకున్నాయి. ప్రణాళిక– అమలు, రవాణా– భూవినియోగం, హౌసింగ్–కనెక్టివిటీల మధ్య సంబంధం లేదు. నగరం స్తంభిస్తే ఏ సంస్థనూ బాధ్యురాలిగా చేయడానికి లేదు. కనుక బీఎంసీ ఎన్నికలను పర్మిషన్లు, కాంట్రాక్టులు, భారతదేశపు అత్యంత విలువైన పట్టణ జాగ్రఫీని తీర్చిదిద్దగల హక్కుపై పట్టు సంపాదించ డానికి జరిగినవిగా చెప్పుకోవాలి. ముంబైలో వైచిత్రి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది అసాధా రణమైన సంపదను సృష్టిస్తోంది. అయినా, దాని పౌరులు దుర్బలురు. రియల్ ఎస్టేట్ బంగారం అంత విలువైనది. అయినా, పట్టణ జనాభాలో చెప్పుకోతగినంత మంది మురికి వాడల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తంమీద లెక్కకు వచ్చే కుబేరుల్లో కొంతమంది ఇళ్ళు అక్కడే ఉన్నాయి. సాధారణ పౌర జీవనం బీటలువారిన ఫుట్పాత్లు, క్రిక్కిరిసిన రైళ్ళ గుండా సాగిపోతుంది. వర్షా కాలం వచ్చిందంటే, ఇంట్లోకి వరద నీరు రాదనే గ్యారంటీ లేదు. ముంబైని అంతర్జాతీయ ఫైనాన్సియల్ కేంద్రం (ఐఎఫ్సీ)గా తీర్చిదిద్దుతామని 2006లో అప్పటి ప్రధాని వాగ్దానం చేశారు. సింగపూర్, దుబాయ్, హాంగ్కాంగ్ లేదా లండన్లతో పోటీ పడగలిగిన నగరం ఏదైనా ఉందీ అంటే అది ముంబయ్యే! ప్రణాళి కలు రచించారు. కమిటీలు వేశారు. రెండు దశాబ్దాలు గడిచినా, ముంబై అంతర్జాతీయ ఫైనాన్షియల్ సెంటర్ కాలేకపోయింది. అది ఇప్పటికీ భారతదేశపు ఆర్థిక రాజధానిగానే ఉంది. అది దేశం ఇచ్చిన పతకం. అంతర్జాతీయ గమ్యస్థానంగా గౌరవం దక్కనే లేదు.అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం?ఐఎఫ్సీ కల సాకారం కాకపోవడానికి బ్యాంకర్లు, వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారు, న్యాయవాదులు లేదా మూలధనం కొరవ డటం కారణం కాదు. అంతర్జాతీయ నగరాలుగా గుర్తింపు పొంద డానికి పొందికతో కూడిన పాలన, ఉత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెద్ద స్థాయిలో ఉండటం అవసరం. అవి కొరవడటం ముంబై వైఫల్యానికి కారణం. ఈ విషయంలో గుజరాత్ లోని ‘గిఫ్ట్’ సిటీ ముందంజ వేయగలిగింది. ముంబైకున్న సాంస్కృతిక లేదా మార్కెట్ పరిపూర్ణత దానికి ఉండబట్టి కాదు. స్నేహ పూర్వక రెగ్యులేషన్, నగదు ప్రోత్సాహకాలు, ఉన్నత స్థాయి నుంచి లభించిన ప్రోద్బలం ఇతోధికంగా తోడ్పడ్డాయి. ముంబైకున్న ఆర్థిక స్వయం ప్రతిపత్తి పరిమితం. అక్కడి ఆస్తి పన్ను రేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఆకర్షణీ యమైన కోస్టల్ రోడ్ ప్రాజెక్టునకు కేంద్రం నుంచో, ఇతర వనరుల నుంచో నిధులు అందాల్సిందే. మెట్రో నెట్వర్క్ కూడా చాలావరకు బాహ్య వనరులపైనే ఆధారపడింది. నిర్మాణం పూర్తయి, అమ్ముడుకాని ఫ్లాట్లు రెండు లక్షలకు పైగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. సబబైన ధరలకు గృహ సదుపాయం, వరద నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా రోడ్డు మరమ్మతులు వంటివి ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా కనిపించవు. రాయితీలు, ఉచిత బస్సు ప్రయాణాలు మేనిఫెస్టోలలో కనిపించాయి కానీ, వాటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో పేర్కొన లేదు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండే పాలనా వ్యవస్థ పురపాలక సంస్థే. కానీ, వాటి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీ యాల్లా తయారయ్యాయి. స్వయం పాలన సాగినప్పుడే...ట్రిపుల్ (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) ఇంజిన్ నినాదం 2017లో మాదిరిగానే మళ్ళీ పనిచేసింది. చీలికలు పీలికల రాజకీయ పర్వంలో ఓటర్లు సుస్థిరతనే ఎంచుకున్నట్లు సంకేతమిచ్చారు. కాస్మోపాలిట నిజంకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ‘మరాఠీ అస్మిత’కు ముప్పు వాటిల్లుతోందంటూ చూపించబోయిన బూచి పనిచేయలేదు. ముంబై ప్రధాన సమస్య దాన్ని ఎవరు పాలిస్తున్నారు అన్నది ఒక్కటే కాదు. నికరంగా నగర–ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటన్నది! భారత పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్సు... రెండూ కూడా నగరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అనుబంధంగానే చూస్తున్నాయి తప్ప, వాటిని స్వయం ప్రతిపత్తి అవసరమైన ఆర్థిక ఇంజిన్లుగా చూడటం లేదు. వాటికి సామర్థ్యాన్ని సమకూర్చుకునే శక్తినిచ్చి, దీర్ఘకాలిక విస్తృత ప్రణాళికలో భాగం చేయడం లేదు. పట్టణాభివృద్ధి శాఖను ముఖ్యమంత్రే అట్టేపెట్టుకోవడం ఊహించదగిన అంశం అవుతోంది. అది బంగారు బాతు లాంటి శాఖ. అంతర్జాతీయ నగరంగా మారాలని ముంబై నిజంగా భావించే పక్షంలో, దానిలో సంస్థాగతమైన మార్పులు అవసరం. నగరంలో పరిస్థితులకు ఒకే సంస్థ బాధ్యత వహించేటట్లు చేయాలి. వివిధ ఏజెన్సీలను ఒక కోవలోకి తేవాలి. కోశ సంబంధ స్వయం ప్రతిపత్తి ఉండాలి. నియమ నిబంధనల ననుసరించి పర్మిషన్లు తప్పక లభిస్తాయనే నమ్మకం కలగాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో బతికే గుమాస్తాలా మునిసిపాలిటీ పరిణమించకూడదు.అజీత్ రానాడేవ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
'వ్యూహం' అమలు తీరు ఇదేనా?
అమెరికా గత నవంబర్లో ప్రకటించిన ‘జాతీయ భద్రతా వ్యూహ’ పత్రాన్ని చది విన వారికి, ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును గమనించి నప్పుడు, ఆ వ్యూహాన్ని అమలు పరచవలసింది ఇట్లాగేనా అనే సందేహం కలుగు తుంది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) అనే లక్ష్యంతో రూపొందించిన ఆ సమగ్ర వ్యూహం అమలులో చాకచక్య మైన దౌత్య నైపుణ్యాన్ని, ఓర్పును ప్రదర్శించాలి. అమెరికా ఆధిపత్యానికి 21వ శతాబ్దం ఆరంభం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్న స్థితిలో, తమ దేశాన్ని ‘తిరిగి గొప్పదిగా’ చేయదలచుకునే నాయకత్వం అటువంటి నీతిని అనుసరించని పక్షంలో, ఉన్న సవాళ్లు పరిష్కారం కాకపోగా కొత్తవి తలెత్తక తప్పదు.ట్రంప్ చాణక్యనీతికి బదులు ధూర్తనీతికి పాల్పడుతున్నందున ప్రస్తుతం జరుగుతున్నది అదే. అందుకు వెనిజులా, గ్రీన్ల్యాండ్, యూరప్, కెనడా, ఇండియా వంటి కొన్ని ఉదాహరణలను గమనించినా, ఆయన నాయకత్వాన అమెరికా ‘తిరిగి గొప్పది’ కావటం అట్లుంచి మరింత వేగంగా తన గొప్పతనాన్ని కోల్పోక తప్పదనే అభిప్రాయం కలుగుతుంది. గ్రీన్ల్యాండ్కు సంబంధించి జరుగుతున్నది ప్రపంచాన్ని ఆశ్చర్యపరచటం అట్లుంచి, అమెరికా మిత్ర ప్రపంచంలోనే కల్లోలాన్ని సృష్టిస్తున్నది. చివరకు విషయం ఎటు తేలినా, ఆ మిత్ర ప్రపంచంతో పాటు తక్కిన ప్రపంచం దృష్టిలోనూ ట్రంప్ పట్ల విశ్వసనీయత మాత్రం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఒక వ్యూహం విజయవంతం కావాలంటే కేవలం అమెరికాకు గల ఆర్థిక బలం, మార్కెట్ బలం, సైనిక బలం చాలవు. వాటితో పాటు శాస్త్ర, సాంకేతిక బలం ఉండి కూడా గత పాతికేళ్ళుగా సవాళ్ళు పెరగటం లేదా? కనుక కావలసింది దేశాలతో విశ్వసనీయత, సత్సంబంధాలు. కేవలం బలాలను ఉపయోగించి ఇతరులను బెదిరించే కాలం గతించి పోయిందని సాక్షాత్తూ ‘వ్యూహ’ పత్రమే అంగీకరిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోక పోవటం ఆశ్చర్యకరం.మొత్తంగా వశమైతేనే...గ్రీన్ల్యాండ్ విషయం ముందు చూద్దాం. యూరప్లోని డెన్మార్క్కు చెందిన ఆ ద్వీపపు రక్షణ, అక్కడి వనరులు ఆ ప్రాంతాల కోసమో, యూరప్ కోసమో అవసరమనీ, వాటిని రష్యా, చైనాల బారిన పడకుండా కాపాడాలనీ ట్రంప్ భావిస్తున్నట్లయితే, ఆ ప్రకారం గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్లతో చర్చలు జరిపి తగిన ఉమ్మడి విధానాన్ని రూపొందించవచ్చు. కానీ ఆయన గ్రీన్ల్యాండ్ భూభాగం, అక్కడి వనరులు, దాని రక్షణ ‘అమెరికా ప్రయోజనాల కోసం తప్పక అవసర’మని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అందుకు గ్రీన్ల్యాండ్, డెన్మార్క్, యూరప్లలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ‘అంగీకరిస్తారా, సైన్యాన్ని పంపమంటారా’ అని భయపెట్టజూస్తున్నారు. ఒత్తిడి చేసేందుకు ఈ నెల 17న 10 శాతం సుంకాలు ప్రకటించి, వాటిని జూలై నుంచి 25 శాతానికి పెంచగలనని హెచ్చరించారు.అమెరికాను ‘తిరిగి గొప్పది’ చేయగల దౌత్యనీతి, ఆర్థిక విధానం ఇవేనా అన్నది ప్రశ్న. అది కూడా ‘నాటో’ కూటమిలో తన సహచరులై, రాగల కాలంలో తమతో తప్పక నిలవవలసిన దేశాలంటూ ‘వ్యూహ పత్రం’లో తామే ప్రకటించిన వారిపట్ల చూపవలసిన వైఖరి? వాస్తవానికి గ్రీన్ల్యాండ్లో అమెరికన్ సైనిక స్థావరాల నిర్మాణం, వాటి విస్తరణ కోసం డెన్మార్క్తో 1951లోనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందపు పాఠాన్ని చూసిన వారికి, అక్కడ ఏమి చేయాలన్నా డెన్మార్క్తో ‘సంప్రదింపులు’ జరపాలనే నిబంధన తప్ప వారి ‘అంగీకారం’ కావాలనే షరతు కనిపించదు. అనగా అంతటి స్వేచ్ఛ అమెరికాకు ఉందని స్పష్టమవుతుంది. అమెరికన్లు అక్కడ గతంలోనే ఒక ఉపరితల స్థావరం, ఒక భూగర్భ అణుశక్తి స్థావరం నిర్మించారు కూడా! కానీ ఇవేవీ చాలవని, గ్రీన్ల్యాండ్ ‘పూర్తిగా స్వాధీనమైతేనే దాని రక్షణకు తగిన మానసిక స్థితి’ తనకు కలుగుతుందని ట్రంప్ ఆశ్చర్యకరంగా వాదిస్తున్నారు. ఆ ప్రాంతంలోని రష్యా, చైనా యుద్ధ నౌకలున్నాయని, వారు మైనింగ్ జరుపుతూ వనరులను కొల్లగొడుతున్నారనే మాటలు ఎంతమాత్రం నిజం కాదని గ్రీన్ల్యాండ్, డెన్మార్క్లు స్పష్టం చేస్తున్నా లెక్క చేయటం లేదాయన.మిత్రులు సైతం దూరంగ్రీన్ల్యాండ్ విషయం అట్లుంచి కూడా, ముఖ్యంగా చైనా సవాలు గురించి ‘వ్యూహపత్రం’లో సుదీర్ఘంగా చేసిన చర్చలో, యూరప్ తిరిగి శక్తిమంతం కావటం, రష్యా–యూరప్ల మధ్య రాజీ, అమెరికాతో సంబంధాల అభివృద్ధి వంటి తనదైన దార్శ నికతను చూపిన ట్రంప్, ఆచరణలో అందుకు తగిన దౌత్యపరిణతిని ప్రదర్శించటానికి బదులు, అంతకుముందు వలెనే, ఈ ‘పత్రం’ ప్రకటన తర్వాత సైతం ధూర్త దౌత్యాన్నే ప్రయోగిస్తున్నారు. ఉక్రె యిన్ యుద్ధం, సుంకాల విధింపు దరిమిలా యూరోపియన్ యూని యన్కు అమెరికాతో ఇప్పటికే పేచీలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వివాదాల కారణంగా వారు అమెరికా నుంచి చైనా వైపు మళ్లటం మొదలైంది. చైనాను వ్యతిరేకిస్తూ వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ... అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదనీ, చైనా నమ్మదగ్గదనీ బహిరంగంగా ప్రకటిస్తూ, గత వారమే బీజింగ్కు వెళ్లి భారీ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. చైనా ఎలక్ట్రికల్ కార్ల దిగుమతిపై సుంకా లను 100 శాతం ఎత్తివేయటం వాటిలో ఒకటి. రానున్న కొద్ది నెలల్లో మరికొందరు యూరోపియన్ ప్రభుత్వాధినేతల పర్యటనలు కూడా ఖరారయ్యాయి.అమెరికాకు అన్నివిధాలా సన్నిహితమైన యూరప్ పరిస్థితి ఇది కాగా, తక్కిన ప్రపంచ దేశాల ఆలోచనలు ఏమిటో ఊహించవచ్చు. అటు తూర్పున అమెరికాకు ఇంతే సన్నిహితమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మ్యూంగ్ కూడా ఈ నెల మొదటి వారంలో చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం గమనించదగ్గది. ఇంతకూ ట్రంప్ ‘వ్యూహ పత్రం’, దాని అమలు తీరు, అమెరికా పట్ల దాని మిత్ర దేశాల విశ్వాసం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. తనకు ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’తో తప్ప అంతర్గతంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఏ నియమ నిబంధనలతో నిమిత్తం లేదని బాహాటంగా ప్రక టించిన ట్రంప్ 33 పేజీల ‘వ్యూహ పత్రాన్ని’ పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, మిత్రులా, ప్రత్యర్థులా అనే దానితో నిమిత్తం లేకుండా అందరినీ అమెరికా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. అందుకోసం సామ దాన భేద దండోపా యాలు అన్నింటినీ ప్రయోగించగలమనే సూచనలు కూడా ఆ పత్రంలో దండిగానే ఉన్నాయి.వాడుకొని వదిలెయ్!ఇండియా గురించి కూడా ‘వ్యూహ పత్రం’లో రాసిన మాట లన్నింటి సారాంశం ఇదే. ఒకవైపు వాణిజ్యం, మరొకవైపు ఇండో– పసిఫిక్లో సైనిక వ్యూహాల విషయంలో భారతదేశాన్ని తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ట్రంప్ గత ఏడాదిగా చేస్తూ వస్తున్నదేమిటో చూస్తూనే ఉన్నాము. ఇపుడు ఈ ‘పత్రం’ మూలంగా అర్థం చేసుకోవలసిందేమంటే, ‘ఉపయోగించుకో – ఒత్తిడి చెయ్ – ఉపయోగించుకో – వదిలెయ్’ విధానం ఇండియాకు సంబంధించి రాగల కాలంలో కూడా కొనసాగుతుందన్నమాట. వ్యూహ పత్రాల రూపంలో ప్రకటించినా, లేకున్నా సామ్రాజ్యవాద విధానాలు ఎప్పుడూ ఇవే!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంస్కరణలతోనే సత్వర వృద్ధి
ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోపక్క అమెరికా ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందుతున్నాయి. ఈ కీలక ఘట్టంలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాలు కొన్ని శుభ వార్తలను మోసుకొచ్చాయి. స్థూల జాతీ యోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి రిజర్వ్బ్యాంక్ తొలుత అంచనా వేసినట్లు 6.5 శాతం కాక, 7.4 శాతం ఉండగలదనే అంచనాకు రావడం పరిస్థితులలో వచ్చిన మార్పును సూచిస్తోంది. సంస్కరణలు మార్పు తెచ్చాయనీ, వృద్ధి ఇదే స్థాయిలో నిలకడగా కొనసాగేందుకు వాటిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందనీ కూడా ఇది సూచిస్తోంది. వస్తువు – సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబులను మార్చడం, చాలా వాటిపై పన్నుల శాతాలు తగ్గించడం వల్ల ఆర్థిక వ్యవస్థ తేటపడింది. జీఎస్టీలోని నియంత్రణ సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని ఆ మార్పుచేర్పులు ఎప్పుడో చేసి ఉండ వలసింది.కాలం చెల్లిన చట్టాలకు గుడ్బై!అలాగే, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని చర్యలను ఇటీవలి కాలంలో తీసుకున్నారు. పార్లమెంట్ ఐదేళ్ళ క్రితమే ఆమోదించిన నాలుగు కార్మిక స్మృతులను అమలులోకి తెచ్చారు. పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన దాదాపు 29 వేర్వేరు చట్టాల స్థానంలో ఆ స్మృతులు వచ్చి చేరాయి. వలస పాలన కాలంనాటి ఆ చట్టాలను కూడా ఎన్నడో మార్చి ఉండాల్సింది. చట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో కార్మిక సమస్యలు ఏళ్ళ తరబడి చిక్కుముడులకు లోనవుతూ వచ్చాయి. ఫలితంగా, వ్యాపార సంస్థలు ఆ చట్టాలను అనుసరించడంలో గందరగోళం నెలకొంటూ వచ్చింది.కొత్త లేబర్ కోడ్స్ ఆర్థిక వృద్ధికి తక్షణం తోడ్పడగల సంస్కరణ కాకపోవచ్చు. కానీ, పెట్టుబడులు పెట్టదలచుకున్నవారికి తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్న అంశాల్లో అవి స్పష్టతను, సరళతను తెచ్చాయి. ఉదాహరణకు, ఇంటి నుంచి పని చేసే విషయంలో అవి మరింత వెసులుబాటుకు అవకాశం కల్పించాయి. పర్మనెంట్ ఉద్యోగాలకు బదులు స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్సర్ ఉద్యోగాలు పెరుగుతున్న ‘గిగ్’ ఆర్థిక వ్యవస్థలో వర్కర్లకు మరింత సామాజిక భద్రతను కల్పించేందుకు తోడ్పడనున్నాయి. ఆ స్మృతుల్లో ఇప్పటికీ లోపాలు ఉంటే ఉండవచ్చు; వాటిని భవిష్యత్తులో పరిష్కరించు కోవచ్చు. మొత్తానికి, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం వల్ల దేశంలో వ్యాపార నిర్వహణ సులభతరం అయింది. వృద్ధి సానుకూలమే!ఇతర రంగాలలో కూడా సంస్కరణల అవసరం ఉంది. మొదటి ముందస్తు అంచనాలలో అన్నీ సానుకూలంగా ఏమీ లేకపోవడం ఆ వాస్తవాన్ని మరింత వెల్లడిస్తోంది. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో అంటే అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాలంలో వృద్ధి రేటు మందగించింది. మొదటి రెండు త్రైమాసికాలలో వరుసగా 7.8 శాతం, 8.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. తర్వాత, రెండు త్రైమాసి కాలలో ఇది 6.9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నారు. తిరిగి సానుకూలంగా ఉన్న అంశాల వైపు దృష్టి సారిద్దాం. వస్తూత్పత్తి 4.5 శాతం నుంచి 7.4 శాతానికి విజృంభించినట్లు ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది 2025–26 ఆర్థిక సంవ త్సరంలో అధిక వృద్ధి సాధించేందుకు ఊతం ఇచ్చింది. సగటున దాదాపు 8 శాతం చొప్పున, గత మూడేళ్లలో వృద్ధిలో కనిపించిన వేగం కూడా గణనీయమైన విషయమే. ఇప్పటికి కొద్ది ఏళ్ళ నుంచి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకుంటున్నప్పటికీ, మధ్య–ఆదాయ ట్రాప్ నుంచి తప్పించుకునేందుకూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకూ, ఇంకా వేగంగా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేటపుడు, ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. దృష్టి పెట్టాల్సినవి!అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల మారిపోతున్న ప్రపంచంలో వాణిజ్యమే పెద్ద అంశంగా కనిపిస్తోంది. అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులు 50 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై మరికొంత సుంకాలు విధిస్తామని ఆయన బెదిరిస్తున్నారు. భారత –అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం అనేక కారణాల రీత్యా, ముఖ్యంగా ట్రంప్ అహంకారం వల్ల, ఇప్పటికీ తుదిరూపు దిద్దు కోలేక పోతోంది. మన దేశానికి కొత్త అమెరికా రాయబారిగా వచ్చిన సెర్జియో గోర్ కనబరుస్తున్న సానుకూలత వల్ల, ఈ ఒప్పందం కుదరవచ్చని ఆశలు పొటమరిస్తున్నాయి. దానిమాటెలా ఉన్నా... ఎగుమతులపై ఆధార పడిన, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు బడ్జెట్ కొంత ఆసరా కల్పించవలసి ఉంది. రత్నాలు, ఆభరణాలు వంటి పరిశ్రమలు, రెడీమేడ్ దుస్తుల కంపెనీలు అమెరికా సుంకాలతో బాగా దెబ్బతినిపోతాయని భయ పడిన మాట వాస్తవం. కానీ, అవి వేగంగా ఇతర మార్కెట్లకు విస్తరించడం వల్ల కనీసం తాత్కాలికంగానైనా ఆ ప్రభావాన్ని తట్టుకో గలుగుతున్నాయి. నవంబర్ (2025)కు సంబంధించిన డేటా, ఈ విభాగాల ఎగుమతుల్లో ఆశ్చర్యకరంగా పెరుగుదలను కనబరచింది. ఆ విభాగాల ఎగుమతులు 2025 నవంబర్లో దాదాపు 19 శాతం పెరిగాయి. ఎగుమతులలో వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు ప్రధాన ఆలంబనగా నిలిచాయి. ఇంకా ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే, భారీ సుంకాల ప్రతిబంధకాలు ఉన్న ప్పటికీ, అమెరికాకు ఎగుమతులు 22 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్లు, ఎగుమతుల్లో ప్రధాన వస్తువుగా నిలుస్తున్నాయి. ఒక్క ఏడాది కాలంలోనే వాటి ఎగుమతులు మూడు రెట్ల పెరుగుదలను చవిచూశాయి. నిరుద్యోగిత రేటు మూడునెలల కాలంలో అత్యల్ప స్థాయికి అంటే 8.6 శాతానికి తగ్గిందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకానమీ’ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం దానికి కారణంగా పేర్కొంది. అయితే, వ్యవసాయమే ఇప్పటికీ 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నైపుణ్యం లేని, నైపుణ్యం ఉన్న వారిని తగినంతగా ఇముడ్చుకోగలిగినంతగా వస్తూత్పత్తి రంగం వ్యాకోచించలేదు. ఈ రంగం విషయంలోనే, భారత్, ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఇతర దేశాల్లో చిన్న, మధ్య తరహా వస్తూత్పత్తి సంస్థలు తగినంతగా విస్తరించగలిగాయి. వ్యాపార నిర్వహణ సులువుగా సాగే అవకాశాన్ని కల్పించే విధంగా బడ్జెట్ రూపొందాలి. అప్పుడే, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు అవసరమైన స్థాయిల్లో వృద్ధి రేటును తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్సియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అందరినీ కలుపుకొంటేనే అభివృద్ధి
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలను సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం ద్వారా సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడమే సామాజిక సమ్మిళితత్వం. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుక బడిన తరగతుల వారికి రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలనపై దృష్టి సారించడం, భూసంస్కరణల అమలు; 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పట్టణ స్థానిక సంస్థలను పటిష్ఠపరచటం వంటి చర్యలు సామాజిక సమ్మిళితత్వం సాధించటంలో పూర్తిగా విజయవంతం కాలేకపోయాయి. అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కుల ఆధారిత వివక్ష, అవస్థాపనా సౌకర్యాల అందుబాటులో వ్యత్యాసాలు, అసంఘటిత రంగంలో ఉపాధి అధికంగా ఉండటం లాంటి అంశాలు సామాజిక సమ్మిళితత్వానికి అవరోధంగా నిలుస్తున్నాయి. వివిధ రాష్ట్రాల చర్యలుకుల, మత, రాజకీయ వివక్షకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో 2019–24 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రంగాలలో సంస్కరణలను ప్రవేశ పెట్టింది. సామాజిక ఇంజి నీరింగ్లో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యంతోపాటు కౌన్సిల్, స్థానిక సంస్థలలో నామినేషన్ కోటాలో ప్రాధాన్యమిచ్చింది. దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా విప్లవాత్మకమైన చర్యలను విద్య, ఆరోగ్య రంగాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించింది. తెలంగాణలో దళిత బంధు, ఆసరా పెన్షన్లు, గొర్రెల పంపిణీ, శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇటీవలి ప్రభుత్వం మహిళలు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ఆరు గ్యారెంటీలతో అనేక ప్రోత్సాహ కాలను ప్రకటించింది.తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు విద్యనభ్యసించే వారిలో పౌష్టికాహారం పెంపు, డ్రాపవుట్ రేట్ తగ్గింపు లక్ష్యంగా ఆర్థికంగా వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలో ముఖ్యమంత్రి ఉదయం అల్పాహార పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నభ్యసించే 6 నుండి 12వ తరగతి బాలికలకు నెలవారీ రూ. 1,000 ఆర్థిక సహాయం వంటి చర్యలను చేపట్టింది. వృద్ధులు, వితంతు వులు, అంగవైకల్యం కలిగినవారు, పేద ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన సామా జిక భద్రతా మిషన్ సత్ఫలితాలనిచ్చింది. భూమి హక్కు, విద్య అందుబాటుకు కేరళ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.ఢిల్లీ ప్రభుత్వం అల్పాదాయ, అణగారిన వర్గాల ప్రజలకు ఒక పరిమితి వరకు ఉచిత విద్యుత్, నీరు అందించడం; ప్రైవేట్ ఆసు పత్రులలో ఉచిత ట్రీట్మెంట్ కోసం ప్రజల ఆదాయ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచడం, వికలాంగులకు పెన్షన్ లాంటి చర్యలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల మంది స్వయం సహాయక బృందాల సభ్యులతో ఆర్థిక సాధికారత పెంపు, ఎస్టీ, ఎస్సీ యువతలో ఎంట్రప్రెన్యూర్షిప్ పెంపు లాంటి చర్యలు చేపట్టింది.గుజరాత్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల బాలికల్లో పాఠశాల నమోదు నిష్పత్తి పెంచడానికి చర్యలతోపాటు, మల్టీపర్పస్ మహిళా సంక్షేమ కేంద్రాలను ప్రారంభించింది. బిహార్ ప్రభుత్వం మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రతి మహిళ అకౌంట్లో రూ. 10,000 జమ చేయడం, సామాజిక భద్రతా పెన్షన్లను అందిస్తున్నది.ఆచరణలో విఫలంవివిధ కార్యక్రమాల ప్రభావం వలన విద్యావకాశాలు మెరుగ యినప్పటికీ, ఉన్నత విద్యలో ఇప్పటికీ లక్షిత వర్గాల ప్రజల నమోదు తక్కువగా ఉండటం, సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు అల్పా దాయ వర్గాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి ప్రభావం వివిధ ప్రాంతాల మధ్య వేరుగా ఉండటం స్పష్టమవుతున్నది.భూసంస్కరణలు ఆచరణలో విఫలమయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి ఆర్థిక కమతంగా లేకపోవడం వలన ఆయా వర్గాల ప్రజల జీవన ప్రమాణంలో మార్పు సంభవించలేదు. మార్చి 2003 నాటికి 56.73 లక్షల లబ్ధిదారులకు 52.93 లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణీ చేయడం జరిగింది. మొత్తం లబ్ధిదారులలో ఎస్టీల వాటా 15 శాతం కాగా, ఎస్సీల వాటా 36 శాతం. దేశంలోని మొత్తం వ్యవసాయ భూమిలో 2 శాతం మాత్రమే భూసంస్కరణలలో భాగంగా పంపిణీ చేయడం జరిగింది.ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం, దేశంలో స్వయం ఉపాధిలో నిమగ్నమయిన వారి నెలవారీ ఆదాయం రూ. 13,279గా నమోదు కావడాన్ని బట్టి వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయపరమైన అసమానతలు స్పష్టమవుతున్నాయి. లాక్డౌన్ తర్వాతి కాలంలో గ్రామీణ వ్యవసాయేతర వేతన రేటులో ఏ విధమైన పెరుగుదల లేకపోగా వ్యవసాయ వేతనాలలో 2 శాతం మాత్రమే పెరుగుదల ఏర్పడింది. దళితులు, ఆదివాసీలలో ఆయుఃప్రమాణం ఉన్నత వర్గాలతో పోల్చినప్పుడు 3 నుండి 5 సంవత్సరాలు తక్కువ.ప్రపంచ అసమానత నివేదిక 2026 ప్రకారం జాతీయాదాయంలో 58 శాతం సంపన్నులైన మొదటి 10 శాతం ప్రజలలో కేంద్రీకృతం కాగా, చివరి 50 శాతం ప్రజల వాటా 15 శాతం మాత్రమే. మొదటి 1 శాతం ప్రజల వాటా మొత్తం సంపదలో 40 శాతం. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 28.4 శాతం కాగా, ఎస్సీ వర్గాల వారిలో ఇది 23 శాతం, ఎస్టీ వర్గాల వారిలో కేవలం 17.2 శాతం. శిశు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 29.2 కాగా, ఎస్సీలలో 39.6గా ఉంది. అయిదు సంవత్సరాల లోపు మరణాల రేటు సగటు ప్రతి వెయ్యి జననాలకు 33.2 కాగా, ఎస్సీలలో ఇది 45.9. విధానాలు ఎలా ఉండాలి?అయితే, సుస్థిర ఆర్థిక విధానాలకు పూర్తిగా తిలోదకాలిచ్చి అధికంగా సంక్షేమంపై దృష్టి సారిస్తే మాత్రం పనిచేసే వయస్సుగల జనాభాను నిరుత్సాహపరుస్తుంది. పటిష్ఠమైన ఉత్పాదకతతో కూడిన శ్రామిక శక్తి, మార్కెట్ అవకాశాల పెంపు, సామాజిక స్థిరత్వాన్ని పెంపొందించే విధానాలు ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహద పడతాయి. సంక్షేమం లక్ష్యంగా అవలంబించే సమ్మిళిత సాధన విధా నాలను ఆర్థికాభివృద్ధి, నాణ్యమైన సేవలు, సామాజిక మార్పుతో అనుసంధానపరచాలి. సుస్థిరతకు మద్దతు నిచ్చే పటిష్ఠమైన ఆర్థిక వృద్ధి జరగనప్పుడు, సంక్షేమం మాత్రమే నాణ్యతతో కూడిన ఉపాధి, మార్కెట్ అందుబాటుకు దారి తీయదు. వ్యక్తుల సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి లింగ సంబంధిత; జాతులు, అంగ వైకల్యం కల్గినవారి మధ్య అసమానతలు తొలగించే ఆర్థిక విధానాలు అవసరం. పురోగామి పన్ను విధానం, కనీస వేతనాల చట్టాలు, సామాజిక భద్రతా పథకాలు అల్పాదాయ వర్గాల వ్యయార్హ ఆదాయ పెరుగుదలకు దారి తీసి స్వదేశీ వినియోగ మార్కెట్ను విస్తృత పరచగలవు. తద్వారా సమష్టి డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వ్యాపార అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా చిన్న వ్యాపారాలు వృద్ధి చెంది నూతన వ్యవస్థాపకులు పెరుగుతారు. సమీకృత పట్టణ ప్రణాళిక, సమ్మిళిత ఫైనాన్స్ సేవలు, శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన విధానాలు అవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జ్),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
నవ లోకం... మన కోసం!
గతాన్ని సమీక్షించుకుంటూనే, రాబోయే కాలంలో శాస్త్ర, పరిశోధన రంగాల్లో భారత్ ఎటువంటి అద్భుతాలు సృష్టించనున్నది, ప్రపంచ యవనికపై మన దేశం ఏ ఏ మైలురాళ్లను అధిగమించబోతోంది అనే అంశాలను తరచి చూడాల్సిన సమ యమిది. శాస్త్ర – సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎక్స్–రే వంటివి కనిపెట్టడాలు అనుకోకుండా జరిగినవే అయినా, భారీ ప్రాజెక్టులు మాత్రం పక్కా ప్రణాళికతోనే పట్టా లెక్కుతాయి. ఏళ్ల తరబడి సాగే కఠోర శ్రమ, వ్యూహాల ఫలితంగానే ఆ యా రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది.1969 తర్వాత మళ్లీ ఇప్పుడు జాబిల్లిపై మనిషిని దించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ‘నాసా’ చేపట్టిన ‘ఆర్టిమిస్’ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి పైకి పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు చైనా సైతం తన ‘ఛాంగ్ ఈ–7’ ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు సిద్ధమైంది. సూర్యరశ్మి సోకని ఈ ప్రాంతంలో ఘనీభవించిన నీటి జాడలు ఉన్నట్లు తేలడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరిగింది. చైనా ఈ ఏడాదే ‘జున్టియాన్’ టెలిస్కోపును, ‘మెంగ్ఝౌ–1’ వ్యోమ నౌకను పరీక్షించనుంది. 2026 నాటికి ‘లాంగ్ మార్చ్–10’ ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపాలన్నది చైనా లక్ష్యం.అంతరిక్ష రక్షణ విషయానికొస్తే, నాసా ’డార్ట్’ తరహాలోనే ఒక సరికొత్త ప్లానెటరీ డిఫెన్స్ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘2015 ఎక్స్ఎఫ్261’ అనే ఖగోళ శకలాన్ని నేరుగా ఢీకొట్టి దాని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం చేయనున్నారు. గతంలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లనే రాక్షసబల్లులు అంతరించినట్లు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భవిష్యత్తులో అటువంటి ముప్పులు రాకుండా ఉండటంతో పాటు, ఆయా గ్రహశకలాల్లో ఉండే అరుదైన ఖనిజాలను మన అవసరాలకు వాడుకోవడం ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. కిలోమీటరు పొడవుండే ఉల్కా శకలాలను ఒడిసిపట్టి ఆర్థిక ప్రయోజనాలు పొందడం ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న సవాలు.గగన్ యాన్ పరీక్ష...భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంత రిక్ష ప్రయోగం ‘గగన్ యాన్ ’కు 2026 సంవత్సరం చాలా కీలకం కానుంది. అసలు ప్రయోగానికి ముందు సిబ్బంది లేకుండా అనేక ప్రయోగాలు నిర్వహించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. హ్యూమనాయిడ్ రోబో ‘వ్యోమమిత్ర’, అత్యవసర పరిస్థితుల్లో వ్యోమనౌక నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్, ప్యారాచ్యూట్ వ్యవస్థ పనితీరు, గగన్ యాన్ క్యాప్సూల్ను కక్ష్య వరకూ తీసుకెళ్లడం వంటివన్నీ ఉన్నాయి. ‘బ్లూ ఆరిజిన్’ తన హెవీ లాంచర్తో జాబిల్లిపైకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తమ్మీద ఈ ఏడాది అటు ప్రభుత్వ, ఇటు వ్రైవేట్ కంపెనీల అంతరిక్ష ప్రయోగాలు, జాబిల్లి యాత్రలు చాలానే ఉన్నాయన్నమాట. భారతదేశం దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన మూడంచెల అణు శక్తి కార్యక్రమం ఈ ఏడాది కీలకదశకు చేరనుంది. చెన్నై సమీపంలోని కల్పాక్కం అణువిద్యుత్ కేంద్రంలోని ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (పీఎఫ్బీఆర్) ఈ ఏడాది పని చేయడం మొదలుపెడు తుంది. ముందుగా ప్రయోగాత్మకంగా మొదలై... ఈ ఏడాది చివరి కల్లా పూర్తిస్థాయిలో పనిచేస్తుందని అంచనా. దేశంలో విస్తృతంగా లభ్యమయ్యే థోరియంను ఇంధనంగా ఉపయోగిస్తుందీ రియాక్టర్. విజయవంతమైతే దేశ ఇంధన భద్రత మరింత పటిష్ఠమవుతుంది. దేశం మూడు దిక్కులా ఆవరించిన విశాల సముద్రాన్ని మానవ ప్రయోజనాలకు సద్వినియోగం చేసుకోవాలన్న భారతదేశ ఆశయం ఈ ఏడాది కార్యాచరణ దిశగా అడుగులు వేయనుంది. సముద్రయాన్లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించిన ‘మత్స్య– 6000’ జలాంతర్గామి ముగ్గురు శాస్త్రవేత్తలను ఆరువేల మీటర్ల లోతు వరకూ తీసుకెళ్లనుంది. సముద్ర మట్టంతో పోలిస్తే 600 రెట్లు ఎక్కువ పీడనం ఉండే ఈ ప్రాంతాల్లో జలాంతర్గామి తొడుగులోని ప్రతి చదరపు సెంటీమీటర్ 600 కిలోల బరువును తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని అత్యంత దృఢమైన ప్రత్యేకమైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు.వాతావరణ అంచనాలు అతి సంక్లిష్టమైన భారత దేశ వాతావరణ అంచనాల కోసం ఈ ఏడాది నుంచి కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ల వినియోగం మొదలు కానుంది. ఏడాది చివరికల్లా ఇది సిద్ధమవుతుందని అంచనా. ‘మిహిర్’ వంటి సూపర్ కంప్యూటర్ల సాయంతో ఆరు కిలో మీటర్ల పరిధికి సంబంధించిన వాతావరణ అంచనాలను పది రోజుల ముందే ఇవ్వవచ్చునని భారత వాతావరణ విభాగం చెబుతోంది. వరదల్లాంటి విపత్తుల నుంచి మెరుగైన సన్నద్ధత కలిగి ఉండేందుకు, వ్యవసాయానికీ, పర్యాటక రంగానికీ ఎంతో ఉపయోగపడనుంది ఇది. శిలాజ ఇంధన వినియోగాన్ని వేగంగా తగ్గించాలన్న లక్ష్యం వైపు భారత్ అడుగులేస్తోంది. ఇందుకు తగ్గట్టే సంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యంలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పవన విద్యుత్తులో నాలుగో స్థానంలో ఉంటే... సౌరశక్తి సామర్థ్యంలో మనది మూడో స్థానం. అయితే భారతదేశ స్థాపిత విద్యుదుత్పత్తి 482.82 గిగావాట్లలో ఇది సగం కంటే కొంచెం ఎక్కువ. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మనం నాలుగేళ్ల ముందుగానే ఈ స్థాయికి చేరుకున్నాం. ‘ఒన్ సన్ ఒన్ వరల్డ్, ఒన్ గ్రిడ్’ కార్యక్రమం కారణంగా సౌరశక్తి రంగంలో మన పురోగతి ఇకపై కూడా కొనసాగనుంది. కృత్రిమ మేధఏఐ వాడకంతో ఈ ఏడాది టిక్కెట్ల బుకింగ్ మొదలుకొని వాహ నాల రవాణా వరకూ అనేక విషయాలు మరింత సౌకర్యవంతం కానున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో చైనా సంస్థ అభివృద్ధి చేసిన ‘డీప్సీక్’ వంటివి ఏఐని మరింత వైవిధ్యభరిత అవసరాల కోసం వాడుకునే అవకాశం కల్పించనున్నాయి. స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ వినియోగం కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా... ఇంగ్లీషులో కాకుండా కొరియన్ భాషలోనూ ఏఐ అందుబాటులోకి రావచ్చు. బయో టెక్నాలజీజన్యుపరమైన తప్పులను వెతకడం కంటే... వాటిని సరిచేయ డంపై ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. మన డీఎన్ఏలో జరిగే అతి చిన్న మార్పు కూడా వ్యాధులకు కారణ మవుతుందన్నది తెలిసిందే. ఈ మార్పులను సరిచేసేందుకు ‘క్రిస్పర్–క్యాస్9’ వంటి ఆధునిక జన్యు ఎడిటింగ్ టూల్స్ అందు బాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీలు ఒకే ఒక్క జన్యువులోని మార్పులను సరి చేసేందుకు ఉపయోగించవచ్చు.అంతేకాదు క్రిస్పర్ టెక్నాలజీతో అననుకూల వాతావరణాలను కూడా తట్టుకుని పండే పంటలను అభివృద్ధి చేసేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టు కోవడంలో, ఆహార భద్రత కోసం ఇది ఎంతో కీలకం. ఇలా ఈ ఏడాది సైన్స్–టెక్సాలజీ రంగంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసు కుని మానవ చరిత్రలో మైలురాళ్లు కానున్నాయి.టి.వి.వెంకటేశ్వరన్ వ్యాసకర్త విజిటింగ్ ప్రొఫెసర్, ఐసర్ మొహాలీ -
శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!
ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.తప్పు జరిగితే వదిలేవారా?వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా? టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్కుమార్ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.గోశాల గోవుల మరణాలుటీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్ గెస్ట్హౌస్ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి? వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బీఆర్ నాయుడు ఉన్నారు.అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.సంస్కరణలా? ఇబ్బందులా?సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? ‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!భూమన కరుణాకరరెడ్డి వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
నయా వలసవాద కేంద్రం అమెరికా
అమెరికా ఇటీవల కాలంలో తాను వేసుకున్న ముసుగును పూర్తిగా తొల గించి బాహాటంగానే దురాక్రమణ కాంక్షను వ్యక్తం చేస్తోంది. వరుసగా ఒక దేశం తరువాత మరొక దేశాన్ని ఆక్రమించడానికి వేగంగా పావులు కదుపుతోంది. వెనిజులా అధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి పట్టుకుపోవడం, గ్రీన్ల్యాండ్ తమదేనని ప్రకటించడం, తాజాగా ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు అండగా ఉంటామని ప్రకటించడం... ఇవన్నీ అమెరికా దూకుడును సూచించే అంశాలే. ముఖ్యంగా అణు పాటవం సంతరించుకోకుండా ఇరాన్ను అడ్డుకోవడం, దాని చమురు సంపదను చేజిక్కించుకోవడంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. దాని కొనసాగింపే ప్రస్తుత ఇరాన్ సంక్షోభం.2015 అణు ఒప్పందం నుండి అమెరికా ఏకపక్షంగా బయటకు రావడంతో ఇరాన్తో అమెరికా ఘర్షణ ముదిరింది. ఇరాన్కు చెందిన సుమారు 100 బిలియన్ డాలర్ల నిధులను అంతర్జాతీయ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపజేయడమే కాకుండా, కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధించింది. గడిచిన కొద్ది నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఏడు బి–2 స్టెల్త్ బాంబర్లు, అత్యంత శక్తిమంతమైన 14 బంకర్ బస్టర్ బాంబర్లు, 30,000 పౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి ఫోర్డో, నటాంజ్, ఇస్ప హాన్ వంటి కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ఇరా నీయులు ప్రాణాలు కోల్పోగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూల మధ్య ఇటీవల జరిగిన భేటీ పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రతను పెంచేలా ఉంది. గాజాలో ప్రతిఘటనను తుడిచిపెట్టడమే కాకుండా, ఇరాన్ పుంజుకుంటే తీవ్రంగా దెబ్బతీస్తామని వారు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ లోపల వ్యూహాత్మక అల్లర్లు ప్రారంభమయ్యాయి. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న కరెన్సీ విలు వపై ప్రజల్లో అసహనం పెంచుతూ నిరసనలను, సమ్మెలను అమెరికా ప్రోత్సహిస్తోంది. శాంతియుత నిరసనల ముసుగులో జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటికే వందలాదిమంది మర ణించారు. నిరసనకారులకు అమెరికా బాసటగా నిలుస్తామని ప్రకటించడం వెనుక ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే పక్కా ప్లాన్ ఉంది. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురి పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఆర్థిక విధ్వంసం – చమురు రాజకీయం 2025 జూన్ నాటి యుద్ధ పరిస్థితులు, చమురు ధరల పతనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. నిత్యా వసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజల జీవన ప్రమా ణాలు పడిపోయాయి. విద్యుత్ కోతలు పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీయగా, వాతావరణ మార్పుల వల్ల వర్షాలు లేక వ్యవసా యోత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అమెరికా చర్యలను ఇరాన్ నేత ఖమేనీ తీవ్రంగా ఖండిస్తున్నారు. పాత కాలపు షా రాజరికం లాంటి బానిసత్వాన్ని ‘నయా వలస వాదం’ రూపంలో అమెరికా మళ్లీ రుద్దాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కార్పొరేట్ శక్తులు తమ స్వార్థం కోసం అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలుపు తున్నాయనీ, దీనివల్ల కార్మికులు, గ్రామీణ ప్రజలపై భారం పెరుగుతోందనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచ ముడిచమురు నిల్వల్లో ఇరాన్ వాటా 13 శాతం ఉండగా, అమెరికా అడుగులకు మడుగులొత్తే సౌదీ అరేబియా వద్ద 16 శాతం నిల్వలు ఉన్నాయి. వెనిజులా నిల్వలను కూడా కలిపితే, ప్రపంచ చమురులో 50 శాతాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. రష్యా, చైనాలు అమెరికా చర్యలను ఖండించే ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగకపోవడం గమనార్హం.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా తన గూఢ చారి సంస్థ ‘సీఐఏ’ ద్వారా అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చివేసింది. 1954లో గ్వాటెమాల, 1963లో ఈక్వె డార్, 1964లో బ్రెజిల్, 1973లో చిలీ... ఇలా సుమారు 20కి పైగా దేశాల్లో అమెరికా తన తోలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్రలు చేసింది. క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను హతమార్చేందుకు 621 సార్లు విఫలయత్నం చేయడం అమెరికా దురహంకారానికి పరాకాష్ఠ. డ్రగ్స్పై పోరాటం పేరుతో మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అరాచ కాలు సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ట్యారిఫ్ యుద్ధాలు, సైనిక బెదిరింపులతో నూతన సామ్రాజ్యవాదాన్ని విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. బుడ్డిగ జమిందార్వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
మూల రచయితలకు ద్రోహమేనా?
‘కృత్రిమ మేధ (ఏఐ) చేసే సృజన – కాపీరైట్’పై దేశంలోని ‘పారిశ్రామిక,ఆంతరంగిక వర్తక ప్రోత్సాహక శాఖ’ 2025 చివరలో ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించింది. ఏఐ యుగంలో కాపీ రైట్ను కాపాడడమెలా అనే జటిలమైన అంశాన్ని ఒక నిపుణుల కమిటీ పరిశీలించి ఆ నివేదికను రూపొందించింది. సమీప భవిష్యత్తులో, ఈ అంశంపై భారత్ అనుస రించబోయే విధానానికి ఆ నివేదికలోని అంశాలే ప్రాతిపదికగా మారే అవకాశాలున్నాయి. ఛాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి జనరేటివ్ ఏఐ ప్రొడక్టులు భారీ లాంగ్వేజి మోడళ్ళు. యూజర్లు చేసే సూచనలను ఆధారంగా చేసుకుని అవి కంటెంట్ను సృష్టిస్తాయి. ఉదాహరణకు, మనం ఇతివృత్తాన్ని ఇచ్చి ఆర్.కె. నారాయణ్ లేదా ప్రేమ్చంద్ శైలిలో కథానికను రాసివ్వాలని ఛాట్ జీపీటీని అడిగితే అది రాసి పెడుతుంది. అలాగే డయల్–ఈ, మిడ్ జర్నీ వంటివాటికి మనం ఒక వచనాన్ని లేదా కవితను అందిస్తే, దాన్నిబట్టి అవి పెయింటింగ్ వేయడం లేదా వీడియో సృష్టించడం చేస్తాయి. జెమినీరాయ్ లేదా ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగుల మాదిరిగా ఉండాలని కూడా మనం కోరవచ్చు. అంతేకాదు, సత్యజిత్ రే తరహాలో ఒక చిన్న మూవీ క్లిప్ను రూపొందించి ఇమ్మని అడిగినా అవి ఆ పని పూర్తి చేసేస్తాయి.ఆ పని ఎలా చేయగలుగుతున్నాయంటే వాటికి ఇచ్చిన ట్రయినింగును అనుసరించి అని మనం జవాబు చెప్పు కోవాల్సి ఉంటుంది. నారాయణ్ నవలలు, హుస్సేన్ పెయింటింగులు వంటి రకరకాల వనరుల నుంచి అవి డేటాను గ్రహిస్తాయి. ఏఐ మోడళ్ళకు ట్రయినింగు ఇచ్చేటపుడు ఉపయోగించే డేటా వివిధ కేటగిరీలకు చెందినదై ఉండవచ్చు. అందులో కాపీరైట్ ఉన్నవీ, కాపీరైట్ గడువు తీరిపోయినవి కూడా ఉంటాయి. ‘సమంజస వినియోగానికి’ పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న డేటా మాదిరిగా అది వివిధ వనరుల నుంచి తెచ్చుకున్నదై ఉంటుంది. జనరేటివ్ ఏఐ మోడళ్ళ కమర్షియల్ వెర్షన్లను టెక్నాలజీ సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి పుస్తకాలు, పరిశోధన పత్రాలు, ఫోటోలు, సినిమాలు, సృజనాత్మక శక్తిని వ్యక్తపరచిన ఇతర రూపాల లోని కాపీరైట్ మెటీరియల్ను వాడుకోవచ్చునా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే, ఏఐ డేటాబేస్కి అవి పునాదిగా మారాయి. ఇది సంక్లిష్టమైన లీగల్, నైతికపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ చిక్కు ముడులే ఇంకా విడలేదనుకుంటే, ఏఐ జనరేట్ చేసినవాటి కర్తృత్వం, కాపీరైట్ హక్కుల వర్తింపునకు సంబంధించిన అంశం మరో అపరిష్కృత అంశంగా తయారైంది. ఏఐ మోడళ్ళకు డేటా ట్రైనింగ్ అనే సరికొత్త సమస్యతో మనమే కాదు, చాలా దేశాలలోని ప్రభుత్వాలు, కోర్టులు సతమతమవు తున్నాయి. ఏఐ మోడళ్ళు కాపీరైట్ ఉన్న పుస్తకాలను లేదా ఫోటో లను కాపీ చేయడం లేదా చౌర్యం చేయడం లేదనీ, కనుక అవి కాపీరైట్ హక్కును ఉల్లంఘిస్తున్నట్లు కాదనీ ఇండియాలోని కంపె నీలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు వాది స్తున్నాయి. కొత్త కంటెంట్ను జనరేట్ చేయడానికి వీలుగా సరళులు, శైలులు, నిర్మాణ రీతులకు సంబంధించి కలన గణితాలను ట్రైన్ చేసుకునేందుకు, గణాంకాలతో సరిపోల్చుకునేందుకు వాటిని విభా గిత డేటాసెట్లుగా మాత్రమే వినియోగించుకుంటున్నాయని చెబు తున్నాయి. సృజనాత్మక వర్కులను సమంజసమైన రీతిలో వినియో గించుకోవచ్చన్న సాధారణ ఆమోదిత లోకోక్తినే అవి అనుసరిస్తున్నా యని ఆ కంపెనీలు తమ వ్యాసంగాన్ని వెనకేసుకొస్తున్నాయి. కానీ, ఏఐ మోడళ్లు ఒరిజినల్ వర్కులను ‘కాపీ’ చేయడం లేదని, వాటి నుంచి ’నేర్చుకోవడం మాత్రమే చేస్తున్నాయని అనడం వాదనకు నిలిచే అంశం కాదు. ఏఐ సిస్టం ట్రైనింగ్ ప్రక్రియలో అనేక దశలుంటాయి. వాటిలో డేటా (ఒరిజినల్ వర్కుల) కాపీయింగ్, స్టోరేజి కూడా ఒకటి. అది కాపీరైట్ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది మహా అయితే ‘సాంకేతిక చొరబాటు’ కిందకు వస్తుంది కానీ, ‘లీగల్ పరమైన ఉల్లంఘన’ కిందకు రాదని ఏఐ పరిశ్రమ వాదించవచ్చు.ఏ విధమైన కాపీరైట్ లైసెన్సింగ్ అవసరం లేదనే భావనను నిపుణుల కమిటీ కూడా తిరస్కరించింది. భారత్లో అమలుకు ఒక హైబ్రిడ్ చట్రాన్ని సిఫార్సు చేసింది. కాపీరైట్ హక్కుదారులకు రాయల్టీ చెల్లించే పక్షంలో, కాపీరైట్ సంరక్షణ ఉన్న వర్కులను గ్రహించి ఏఐ డెవలపర్లు వాడుకోవచ్చని, ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని వినియోగించుకోవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. కానీ, ఏఐ సిస్టంలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ వర్కులను ఇవ్వకుండా నిలిపి ఉంచే అవకాశం కాపీరైట్ హక్కుదారులకు లేదు. ఏఐ డెవలపర్ల నుంచి ఆ (రాయల్టీ) చెల్లింపులను వసూలు చేసే బాధ్యత లాభాపేక్ష లేని ఒక కేంద్రీకృత సంస్థకు ఉండాలని కమిటీ పేర్కొంది. మొత్తానికి, అసలు సృజనశీలురకు రాయల్టీలను చేర్చ వలసిన బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలని చెప్పింది. కాపీరైట్ కంటెంట్ను వాడుకున్న ఏఐ సిస్టంలు తద్వారా గడించిన ఆదాయంలో కొంత శాతాన్ని ఆ కాపీరైట్ ఉన్నవారికి చెల్లించాలి. రేట్లను ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ సిఫార్సుల పట్ల, కమిటీలో ఉన్న పరిశ్రమ (నాస్కామ్) ప్రతినిధి తన అసమ్మతిని వ్యక్తపర చారు.ఏఐ మోడళ్ళ రాబడిలో కొంత శాతాన్ని రాయల్టీలుగా చెల్లించాలన్న సిఫార్సుతో సదరు సభ్యుడు విభేదించారు. టీడీఎంకు వీలుగా తమ వర్కు పబ్లిక్గా అందుబాటులో లేకుండా నివారించుకోవలసిన బాధ్యత కాపీరైట్ హక్కుదారులపైనే పెట్టాలని ‘నాస్కామ్’ ప్రతినిధి సూచించారు. వారి రచన బహిరంగంగా అందుబాటులో ఉందని భావించినపుడు, దాన్ని ఇతరులు వాడుకునేందుకు వీలులేకుండా, ‘ఆప్ట్ ఔట్’ అవకాశాన్ని రచయిత లకు ఇవ్వవచ్చని ఆ ప్రతినిధి సూచించారు.ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న కోట్లాది పుస్తకాలలోని అంశాలను టెక్నాలజీ కంపెనీలు తవ్వి తీసేశాయి. ఏఐ మోడళ్ళ ట్రైనింగుకు వాడుకు న్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆప్ట్ ఔట్’ కూడా ఆచరణసాధ్యమైన పరి ష్కారంగా కనిపించడం లేదు. నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడేవిగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చే విగా లేవు. దేశంలో కాపీ రైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరి శ్రమకు చెందినవారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.నిపుణుల కమిటీ సిఫార్సులు ఏఐ పరిశ్రమకు తోడ్పడే విగా ఉన్నాయి కానీ, రచయితలకు ఊతమిచ్చేవిగా లేవు. దేశంలో కాపీరైట్ చట్రాన్ని రూపొందించేవాళ్ళు పరిశ్రమకు చెందిన వారి కన్నా, మూల రచయితలకు పెద్ద పీట వేసే వారుగా ఉండాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
'క్విక్' డెలివరీలో భద్రత ఎంత?
సుమారు రెండేళ్ళ క్రితం నాటి ఘటన. డెలివరీ బాయ్ ఇంటి తలుపు తట్టాడు. వస్తువును అందుకునేందుకు తలుపు తెరవగానే ఆతని చీలమండపై లోతైన గాయం కనిపించింది. చిరిగిన ప్యాంటు అతని యాక్సిడెంట్ గురించి చెప్పకనే చెబుతోంది. నొప్పిని ఓర్చుకుంటూనే చెప్పిన సమయానికే వస్తువును అందజేశాడు. నేను ఊహించినట్లుగానే, అతని స్కూటర్ను ఏదో కారు ఢీకొట్టిందని తెలి సింది. కిందపడి గాయపడ్డాడు. అదృష్టవశాత్తు, స్కూటర్కు ఏమీ కాలేదని అతను ఊరట చెందడం నన్నింకా బాధించింది. అది అతనికి దినసరి అద్దెపై ఇచ్చింది కనుక, దానికి ఏమైనా అయితే, అతని అరకొర ఆదాయానికి మరింత చిల్లుపడుతుంది. నైతిక బాధ్యతగా భావించి ఒకటి రెండు బ్యాండ్–ఎయిడ్లు, ఒక 200 రూపాయల నోటు అతని చేతిలో పెట్టాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొమ్మని ఒక సలహా కూడా ఇచ్చాను. కానీ అతను ఆ నోటును జేబులో కుక్కుకుని, మళ్ళీ పనిలో పడతాడనే అనిపించింది. అతనికి గాయానికి ఏదో మందు పూయించుకోవ డమో లేదా కట్టు కట్టించుకోవడమో చేసేంత వ్యవధి కూడా లేదు. ఇతని తప్పిదం వల్లనే ఆ యాక్సిడెంట్ అయివుంటుందని కూడా నా అనుమానం. డెలివరీ బాయ్లు తాము తీసుకెళుతున్నవాటిని వీలై నంత త్వరగా అందించాలన్న తొందరలో ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించు కోకపోవడం, రాంగ్ సైడులో వెళ్ళిపోవడం నేను అంతకుముందు గమనించక పోలేదు. ట్రాఫిక్ ఉల్లంఘనలుఅంత హడావిడి పడవలసిన అవసరం లేదని వారికి పని ఇస్తున్న క్విక్–సర్వీస్ కంపెనీలు వాదిస్తాయి. ఆ రంగం పరిభాషలో వారు ‘భాగస్వాముల’ కింద కూడా లెక్క. తాము వారికి సరుకును అందించే ‘గుప్త’ ప్రదేశాలు, గమ్యస్థానాలకు తక్కువ సమయంలో వెళ్ళదగినవిగానే ఉంటాయని అవి చెబుతాయి. సిద్ధాంతం ప్రకారం డెలివరీ బాయ్ నడచుకుంటూ వెళ్ళి కూడా ఇచ్చి రావచ్చు. వారు గంటకు సగటున 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళుతున్న మాట కూడా నిజం. అయినా, వారు ట్రాఫిక్ రూల్స్ను ఎప్పటి కప్పుడు ఎందుకు అతిక్రమిస్తున్నట్లు? ఒక్క బెంగళూరు నగరంలోనే, 2025లో వీరు దాదాపు 64,000 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. ఇది నవంబర్ 15 నాటి వరకు అందు బాటులో కొచ్చిన డేటా మాత్రమే. మరి, డెలివరీ బాయ్లు ఎందుకంత పరుగులు తీస్తున్నట్లు? ఈ ప్రశ్నకు జవాబు క్విక్–సర్వీస్ రంగ లాభ నష్టాల లెక్కల్లో ఉంది. బాయ్లు గంటకు సగటున రూ. 102 సంపాదిస్తారని కామర్సు కంపెనీలు పేర్కొంటున్నాయి. అవి తమకయ్యే ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని యూనియన్లు చెబుతున్నాయి. పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు పోగా, మహా అయితే, గంటకు రూ. 81 చొప్పున లభిస్తుందని అవి అంటున్నాయి. నెలకు 26 రోజులు ఎవరన్నా రోజుకు 10 గంటలు పనిచేస్తే వచ్చేది రూ. 21,000. నెలకి ఆ పాటి సంపాదించాలన్నా ఆ 10 గంటల లోపల డెలివరీ వర్కర్ 30–35 ట్రిప్పులు వేయాలి. ఒక డెలివరీ పూర్తి చేసి, దాన్ని యాప్లో మార్క్ చేసిన తర్వాతనే, అతనికి మరో ట్రిప్పునకు అవకాశం లభిస్తుంది. వారికి వెంట వెంటనే డెలివరీ అవకాశాలు రావు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అందుకని వేగంగా చేరవేస్తే మరో అసైన్మెంట్ లభిస్తుందని తాపత్రయపడతారు. సరుకును అందివ్వడంలో మందకొడిగా వ్యవహరిస్తే వర్కర్లు పరోక్షంగా శిక్షకు గురవుతారని యూనియన్లు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు వెన్ను తట్టి ఇచ్చిన ‘బ్యాడ్జీ’లను కంపెనీలు వెనక్కి తీసేసుకుంటాయి. ఆ మేరకు డెలివరీ అవకాశాలు తగ్గిపోతాయి. ఇంతమందికి చేర్చగలిగితే అంటూ లక్ష్యాలు నిర్దేశించి, వాటిని పూర్తి చేసినవారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఇది వారు బండ్లు నడపడంలో వ్యక్తిగత భద్రతను గాలికొదిలేసేటట్లు చేస్తోంది. శ్రమ–ఒత్తిడిఅయినా, వేలాది మంది ఈ ఉద్యోగానికి ఎందుకు తరలి వస్తున్నట్లు? ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు లేకపోబట్టే అని దానికి జవాబు చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు రెండూ అంతగా లేకపోవడంతో, వారికి ఇంతకన్నా గత్యంతరం కనిపించడం లేదు. దేశంలో గిగ్ వర్కర్లలో దాదాపు మూడొంతుల మంది 24–38 ఏళ్ళ మధ్య వయసు వర్గం వారని వివిధ సర్వేలలో తేలింది. వారిలో చాలా మంది మిడిల్ లేదా హైస్కూలు విద్యతో ఆపేసినవారని మరికొన్ని సర్వేల్లో వెల్లడైంది. దీన్ని బట్టి వారు ఏదైనా మంచి ఉద్యోగం లభిస్తుందేమోనని కొంత కాలం ఎదురు చూసి, ఆ తర్వాత, క్విక్–కామర్స్ డెలివరీలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని స్పష్టమవుతోంది. కానీ ఈ ఉద్యోగాల్లో చేరుతున్నవారిలో చాలామంది శ్రమ, ఒత్తిడి తట్టుకోలేక మూడు నెలల లోపలే వీడ్కోలు పలుకుతున్నారు. సత్వర సేవ సంస్థల మధ్య ముఖ్యంగా బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టోల మధ్య పోటీ పెరిగింది. వేటికవి వ్యాపార విస్తరణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా, చేతులూ కాల్చుకుంటు న్నాయి. ఉదాహరణకు, కడచిన నాలుగు త్రైమాసికాలలో బ్లింకిట్కు వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచన వంటివాటికి ముందు ఆదాయాన్ని సర్దుబాటు చేసి చూసినా కూడా దాదాపు రూ. 600 కోట్ల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు. ఉద్యోగుల స్టాక్ యాజమాన్య ప్రణాళికను మినహాయించగా తేలిన లెక్క అది.అంటే, అసలు నష్టం అంతకన్నా ఇంకా ఎక్కువే ఉండవచ్చు. బ్లింకిట్ తమ వేదిక, డెలివరీ రుసుము కింద కొద్ది మొత్తాన్ని వసూలు చేస్తోంది. స్విగ్గీ ఒక నిర్దిష్ట మొత్తానికి మించిన విలువైన ఆర్డర్లకు ఏ రకమైన చార్జీలూ వసూలు చేయడం లేదు. దీంతో క్విక్–కామర్స్ రంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వ్యయాలు మరీ పెరగకుండా చూసుకుంటూనే, సేవలను మరిన్ని విభాగాలకు పెంచి, మరింత మంది కస్టమర్లను కూడగట్టుకోవాలి. ఇంకా ఎక్కువ రాయితీలు ఆఫర్ చేయాలి. అదే సమయంలో, డెలివరీకి మరింత మంది సిబ్బందిని తీసుకోవాలి. ఇదొక దురవస్థఅయితే, గత కొద్ది నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు ఉపాధి అవకాశాలు (వార్షికంగా లెక్కగట్టి చూసినపుడు) 4.5 శాతం నుంచి 5 శాతం రేటు చొప్పున పెరిగినట్లు ‘సెంటర్ ఫర్ మానిట రింగ్ ఇండియన్ ఎకానమీ’ చెబుతోంది. గత ఏడాది అదే కాలంతో పోల్చి చూసినపుడు ఆ రకమైన మెరుగుదల కనిపించినట్లు అది పేర్కొంది. ‘కోవిడ్’ తర్వాత ఉద్యోగ వృద్ధిలో ఇదే వేగవంతమైన రేటు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి తిప్పలు పడాల్సిన అవసరం తప్పుతోంది. గ్రామాలకు తిరిగి వెళ్లినా ఫరవాలేదని భరోసా ఏర్పడుతోంది. మరింత నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, సమ్మెకు దిగడానికి గిగ్ వర్కర్లకు అందుకే ధైర్యం వచ్చింది. కానీ, దురదృష్టవశాత్తు, ఇది ఈ రంగంలోని అందరికీ నష్ట దాయకంగానే ఉంది. మూసేయకుండా వ్యాపారం కొనసాగించా లంటే, క్విక్–కామర్స్ సంస్థలు ఇప్పటికన్నా ఎక్కువ ఇవ్వగలిగిన స్థితిలో లేవు. ఇంతోటి ఆదాయానికి అంత ఒత్తిడిని తట్టుకోవడం అవసరమా అని డెలివరీ వర్కర్లు భావిస్తున్నారు. ఇంకో వైచిత్రి ఏమిటంటే, ప్రారంభ స్థాయి వైట్–కాలర్ ఉద్యోగులకన్నా, ప్రస్తుతా నికి డెలివరీ వర్కర్లు గడిస్తున్నదే కాస్త ఎక్కువ. అలాగని ఎంబీఏ డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు రాలేరు కదా! ఇది సత్వర పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని ప్రతిష్టంభన.అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త ఆర్థికాంశాల విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అసలు సంక్షోభం అమెరికాదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల వల్ల ప్రపంచం సంక్షోభంలో పడుతున్నదనేది సర్వసాధారణ అభిప్రాయం. స్థూలంగా చూసినపుడు అది సరైన అభిప్రాయమే. కానీ కొంత లోతులకు వెళ్లి పరిశీలించి నట్లయితే, అమెరికాయే సంక్షోభానికి గుర వుతున్నదనీ, ఆ స్థితి నుంచి కాపాడుకు నేందుకే ట్రంప్ ఇటువంటి విపరీత ధోర ణిని అనుసరిస్తున్నారనీ బోధపడుతుంది.వందల సంవత్సరాల పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని గమనించినప్పుడు, అందులో పలు విధాలైన దుర్మార్గాలు కనిపిస్తాయి. హిట్లర్ వంటి వారు తీవ్రమైన మారణకాండకు కూడా పాల్పడ్డారు. కానీ, ట్రంప్ వంటి ఏ నియమ నిబంధ నలూ లేని సర్వతోముఖ అరాచక విజృంభణ ఏ దశలోనూ లేదు. ‘నాకు అంతర్గతంగా, అంతర్జాతీయంగా ఏ నియమాలూ, చట్టాలూ లేవు. నా మనసుకు తోచింది చేస్తా’నని ఆయన బాహాటంగా ప్రకటిస్తూ, అందుకు తగినట్లే వ్యవహరిస్తున్నట్లు ఇంతవరకు ఏ సామ్రాజ్యవాదీ చేయలేదు.అరాచకానికి కారణాలు?అయితే ఇందుకు మూలకారణం ట్రంప్కు గల విలక్షణమైన అరాచక వ్యక్తిత్వం మాత్రమేనా? అమెరికా కొంత కాలంగా ఎదు ర్కొంటున్న రకరకాల తీవ్ర సమస్యలు, ఎదురు దెబ్బలు, ఇతరుల నుంచి సవాళ్ళు తీవ్రమైన ఒత్తిడులను, ఒక కొత్త చారిత్రక దశను సృష్టిస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ కారణంగా, ప్రపంచంపై అమె రికా గత పాతికేళ్ళ ఏకధ్రువ ఆధిపత్యం స్పష్టమైన రీతిలో బీటలు వారుతున్నది. పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే మరొక 15–20 సంవత్సరాలలో తమ ఆధిపత్యాన్ని పూర్తిగా కోల్పోవటం తథ్యమన్న భావన పాశ్చాత్య ప్రపంచం సహా ప్రపంచమంతటా ఏర్పడింది. వాస్తవానికి ఈ కోణం కొంతకాలంగా అందరూ చర్చిస్తున్నదే తప్ప కొత్తది కాదు. కానీ ఎందుకోగానీ, వెనిజులాపై ప్రళయ భీకరమన్నట్లు జరిగిన సైనిక చర్య, ఆ వెనువెంటనే ట్రంప్ ఇతర ప్రకటనలతో ప్రపంచం దృష్టి ఈ నేపథ్యం నుంచి మళ్ళీ తక్షణ ఘటనలు, తదనంతర ప్రకటనలే సర్వస్వమన్నట్లు మారింది.ఇంతకూ ట్రంప్ను ఈ ఆకస్మిక అరాచక ధోరణికి పురికొల్పిన నేపథ్య పరిణామాలేమిటి? 1991లో సోవియట్ యూనియన్ కుప్ప కూలిన తర్వాత అవతరించిన ఏకధ్రువ ప్రపంచానికి, సుమారు 15 సంవత్సరాలు గడిచేసరికి అదే రష్యా దేశం పుతిన్ నాయకత్వాన తిరిగి పుంజుకుంటుండటంతో మొదటి సవాలు మొదలైంది.అందుకే అమెరికా అధ్యక్షులందరూ వరుసగా యూరప్తో కలిసి ‘నాటో’ను విస్తరించటం మొదలుపెట్టారు. ఇది జరుగుతుండగా మరొకవైపు చైనా అదే కాలంలో మరొక సవాలుగా ఎదగసాగింది. ఇవి చాలదన్నట్లు అదే సమయంలో (2008) అమెరికాతోపాటు యూరప్ అంతా ఆర్థిక సంక్షోభానికి గురయింది. ఈ పరిణామాలు అక్కడి సమాజాలపై ప్రభావాన్ని చూపటంతో ‘ఆక్యుపై వాల్స్ట్రీట్’ ఉద్యమం (2011) వచ్చి ఆ దేశాలను ఊపివేసింది. పుండుపై కారం చల్లినట్లు చైనా, రష్యాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఊపందుకో సాగాయి. ఆ పరిస్థితులకు జడిసిన అమెరికా తన సైనిక బడ్జెట్లను ప్రతి సంవత్సరం పెంచసాగింది. ఇదే క్రమం ఇపుడు తాజాగా ట్రంప్, ఆ బడ్జెట్ను ఒకేసారి ఏకంగా 50 శాతం పెంచి 1.5 ట్రిలి యన్ డాలర్లకు ప్రతిపాదించే పరిస్థితి వచ్చింది.రక్షణ బడ్జెట్ పైపైకి...21వ శతాబ్దం వచ్చినప్పటి నుంచి అమెరికా పరిస్థితి ఏమిటో సూక్ష్మంగా అర్థం చేసుకునేందుకు బహుశా ఈ వివరణలు సరి పోతాయి. అమెరికా పతన క్రమం గురించి ఎంత తీవ్రమైన ఆందో ళన చెందకపోతే ట్రంప్ రక్షణ బడ్జెట్ను ఈ స్థాయికి పెంచజూస్తారు! యథాతథంగానే సుమారు 900 బిలియన్ డాలర్ల మేర గల ఈ బడ్జెట్, అమెరికా తరువాత వరుసలో గల తొమ్మిది దేశాల బడ్జెట్ కన్నా ఎక్కువ. అదిగాక ‘నాటో’ దేశాల బడ్జెట్లు ఉన్నాయి. అవి ఆ మొత్తాలను రెట్టింపు చేయాలని ఇటీవల ఒత్తిడి చేస్తున్నారాయన. ప్రపంచ పరిస్థితులు తమకు వ్యతిరేకమవుతున్నాయనీ, తమ ఆధి పత్యం చేజారుతున్నదనీ, దాని అర్థం వివిధ దేశాల వనరులు, మార్కెట్లు, వాటిపై పరోక్ష రాజకీయ నియంత్రణలు చేజారటమనీ క్రమంగా ఎంతగా భయపడకపోతే ట్రంప్ ఇదంతా చేస్తారో ఆలో చించండి. అది కూడా తమకు ఎటు నుంచీ సైనిక ముప్పు లేనపుడు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రణాళికలో ఒక సంకేతం వంటిదే వెనిజులాపై దాడి. అందువల్ల నిజమైన దీర్ఘకాలిక సంక్షోభం వెనిజులాది కాదు, ప్రపంచానిది కాదు. అది స్వయంగా అమెరికాది! అందుకు అనుబంధంగా యూరప్ది, ‘నాటో’ది, సామ్రాజ్యవాదానిది. ముఖ్యంగా సామ్రాజ్యవాద కూటమికి అధిపతిగా అమెరికాకు ఎదురవుతూ వస్తున్న సవాళ్లు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి జమిలి ప్రభావాన్నే మనమిపుడు చూస్తున్నాము. ఇదే కాలంలో ఇటువంటి ఇంకా పలు పరిణామాలు అమెరికాను భయపెట్టాయి. కరోనా (2020–22) సమస్యను అమెరికా ఎదుర్కొనలేక పోవటమే గాక ఆర్థికాభివృద్ధి దెబ్బతినగా, చైనా అందుకు విరుద్ధ ఫలితాలు సాధించటం వాటిలో ఒకటి. ప్రపంచంలో అమెరికా అగ్రస్థానానికి ఆధారాలు... సైనిక బలం, ఆర్థిక బలం, శాస్త్ర–సాంకేతిక బలం, డాలర్ బలం, ప్రపంచ వ్యాప్తంగా గల రాజకీయ ప్రాబల్యం. వీటన్నింటికి చైనా, రష్యాల నుంచే గాక బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం కోసం పలు రూపాలలో జరుగుతున్న ప్రయత్నాలు క్రమంగా ముందుకు సాగు తున్నాయి. వాటిని నిరోధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు నెరవేరటం లేదు. ఈ విషయాలు స్వయంగా అమెరికన్, యూరో పియన్ రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ఇతర నిపుణులుఅంగీకరిస్తున్నవే!అందుకే ఆక్రమణలుఅమెరికాతోపాటు పాశ్చాత్య సామ్రాజ్యవాద సంక్షోభమంటున్నది ఈ స్థితినే! దీనిని తట్టుకునేందుకు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలోనే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంతో ఆరంభించి, పదవిని స్వీకరించిన తర్వాత గత ఏడాది కాలంలో కాలుగాలిన పిల్లి తరహా చర్యలు అనేకం ఇంటా బయటా, చివరకు మిత్ర దేశాలపైనా తీసుకుంటూ వస్తున్నారు. ఆ ఫలితాలతో సంతృప్తి లేక, కనీసం పశ్చి మార్ధ గోళాన్ని, పశ్చిమాసియాను అయినా పూర్తిగా నియంత్రిం చేందుకు గత నవంబర్లో ‘జాతీయ భద్రతా వ్యూహపత్రం’ ఒకటి ప్రకటించారు. ‘మన్రో డాక్ట్రిన్’కు తోడు ‘డోన్రో డాక్ట్రిన్’ అంటూ లాటిన్ అమెరికాతో పాటు ఈ ప్రాంతాల వనరులన్నీ చేజిక్కించు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రీన్ల్యాండ్, పనామా ఆక్రమణలూ ఇందులోకే వస్తాయి. అంతిమంగా ఈ భయకంపిత అరాచక చర్యలు అమెరికా సంక్షోభాన్ని దీర్ఘకాలంలో పరిష్కరిస్తాయా అన్నది ప్రశ్న. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చెంతన ఉన్నది చేజార్చుకుంటారా?
డిసెంబర్ 2న 'షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కొత్తగా 200కు పైగా 'మర్చెంట్ షిప్స్' కొంటున్నట్లు ప్రకటించింది. ఉన్నట్టుండి మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా మారడం 'మీడియా'ను సైతం విస్మయపర్చింది. గత వైభవం తర్వాత కనుమరుగైన ఈ 'మినీరత్న' సంస్థ గురించి ఓ ఆంగ్ల పత్రిక వెంటనే ఒక 'బైలైన్ స్టోరీ' కూడా రాసింది. నిజానికి ఈ రంగం గత ఐదేళ్లుగా ప్రైవేట్ చేతుల్లోకి మారుతుండగా, అకస్మాత్తుగా మారిన కేంద్రం వైఖరి ఇది. ఈ కొత్త నౌకల కొనుగోళ్లను ప్రభుత్వమే చేయబోతున్నది.“ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న 'జియో పాలిటిక్స్' పరిణామాలు మనకు కూడా 'నేషనల్ షిప్పింగ్ సర్వీసెస్' ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేశాయి. దేశ ఆర్ధిక భద్రత కోసం 'మర్చెంట్ నేవీ' ప్రాధాన్యం ఏమిటో ఇన్నాళ్ళకు ప్రభుత్వం గుర్తించింది" అని "నేషనల్ షిప్ ఓనర్స్ అసోషియేషన్' సీఈఓ అనిల్ దేవళి అన్నట్టు ఆ వ్యాసంలో రాశారు. మారుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇలా ఉంటే, డిసెంబర్ 24న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- 'క్వాంటమ్ టాక్ బై సీబీన్' కార్యక్రమంలో "రెండేళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు తయారుచేసి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తాము" అన్నారు..మన పక్కన వెయ్యి కిలోమీటర్ల మేర సముద్రం ఉన్నప్పుడు, ముందు 'మెరైన్ ఎకానమీ'లో మన వృద్ధి 'రికార్డు' అయితే పెరిగే వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'క్వాంటమ్ వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? ఉపాధితో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి 'మార్కెట్'లో ఇక్కడి ఉత్పత్తుల 'డిమాండ్' పెరుగుతుంది. సముద్రం ఎండేది కాదు. కనుక పెరిగే నౌకా వాణిజ్యంతో ఏపీ 'బ్లూ ఎకానమీ' స్టేట్ అవుతుంది. ఆ తర్వాత దశలో 'క్వాంటమ్ వ్యాలీ' వంటి మొదటి శ్రేణి సాంకేతికత గురించి కూడా మాట్లాడవచ్చు.అయినా వేసవి ఎండల తీవ్రతకు 'బ్లేజ్ వాడ' అని పిలవబడే ప్రాంతానికి 'వ్యాలీ' అని పేరు పెడితే దానికి 'వ్యాలీ' క్లైమేట్ వస్తుందా? భౌగోళిక శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఒక ప్రాంతం సముద్ర మట్టానికి 1,850 మీటర్ల ఎత్తున ఉంటే, దాని శీతోష్ణ స్థితుల కారణంగా 'వ్యాలీ' అంటారు. మరి సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతిలో 'క్వాంటమ్ వ్యాలీ' అంటే, అది కేవలం 'మార్కెటింగ్ వ్యూహం కావొచ్చు.మన ఆలోచనలు అక్కడ ఉంటే, విశ్వకర్మ జయంతి సంద ర్భంగా గత సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ భావ నగర్ 'సముద్ర సే సమృద్ధి' సభలో మాట్లాడుతూ "ఒకప్పుడు స్వదేశీ నిర్మిత నౌకల ద్వారా మన రవాణా 40 శాతం సాగేది. మన నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడం మీద మనం శ్రద్ధ పెట్టాము. దాంతో, మన నౌకా వాణిజ్యం రెవెన్యూ 40 నుంచి 5 శాతానికి పడిపోయింది. ఒక 'రీసెర్చి' ప్రకారం 'షిప్ బిల్డింగ్ రంగంపై మనం ఒక రూపాయి. ఖర్చు పెడితే, అది రెండింతలై మనకు తిరిగివస్తుంది. 'షిప్ యార్డు'లో ఒక ఉద్యోగం మనం సృష్టిస్తే, బయట 'సప్లై చైన్' మార్కెట్లో ఆరేడు కొత్త ఉద్యోగాలు పుడతాయి. అంటే, వంద ఉద్యోగాలు ఇక్కడ వస్తే, బయట ఆరు వందల మందికి వేర్వేరు రంగాల్లో పని దొరుకుతుంది" అన్నారు."నౌకా వాణిజ్యంతో నావికుల ('సీ ఫేరర్స్') అవసరం పెరుగుతుంది. పదేళ్ళ క్రితం మన దేశంలో వీళ్ళు 1 లక్ష 25 వేలు ఉంటే, ఈ రోజున అది మూడు లక్షలు దాటింది. ప్రపంచ దేశాలకు వీరిని సరఫరా చేసే మూడు దేశాల్లో మనం ఉన్నాము. రాబోయే రోజుల్లో యువతకు ఈ రంగం వల్ల విశేషమైన ఉపాధి దొరుకుతుంది..." ఇలా ప్రధాని ప్రసంగం సాగింది. ఒక వారం తర్వాత 'కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ' రీసెర్చ్ స్కాలర్ సంగమూన్ హన్సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో "ఇండియా ఎగుమతుల ఎకానమీ అంతా కొన్ని చోట్ల కేంద్రీకృతమై ఉంది.గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక 70 శాతం నౌకా వాణిజ్యం చేస్తుంటే, అందులో గుజరాత్ వాటా 33 శాతంగా ఉంది. రాజకీయంగా అన్నింటా ముందుండే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్లో అది 5 శాతం మాత్రమే" అని రాశారు. ఏపీ ప్రభుత్వాలతో బీజేపీకి 'వర్కింగ్ రిలేషన్స్' ఉన్నప్పటికీ, మోదీ ప్రసంగంలో పదేళ్లనాడు ఏర్పడిన తీర ప్రాంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. పోనీ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళే బాబుకు మోదీ సలహా ఇచ్చారా? అంటే, 'ఎన్డీఏ' కూటమి 'మీకు మీరే మాకు మేమే' తీరుతో చివరికి రాష్ట్రం బలవుతున్నది. ఏపీ 'మెరైన్' రంగంలో ఈ పదేళ్ళలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మొదలైన పూనిక అంటూ ఏదైనా ఉందంటే, అది 'కోవిడ్' రోజుల్లో కూడా వైసీపీ పాలనలోనే కనిపిస్తున్నది.-జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
వికసిత భారత నిర్మాణంలో ‘జెన్–జీ’
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం ‘జెన్–జీ’. 1995 నుంచి 2010 మధ్యలో జన్మించిన ఈ ‘జెన్–జీ’ గురించి 2025లో ప్రపంచమంతా మాట్లాడుకుంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ప్రతి ఇంటా చర్చ జరిగింది. వీరి ఉద్యమాన్ని కొందరు సానుకూలమైన అంశంగా గమనించారు. స్వాతంత్య్రం, స్పష్టత, మార్పు తదితర అంశాలపై యువత ఆలోచిస్తున్న తీరునూ, ఏకతాటిపైకి వచ్చి పోరాడిన తీరునూ అభినందించారు. మరికొందరు... యువతలో హఠాత్తుగా పెరుగు తున్న నిరాశ, నిస్పృహలకు కారణంగా నేపాల్, మడగాస్కర్ దేశాల ఘటనలను ఉదాహరణలుగా చెబుతున్నారు.ఇలాంటి భిన్నమైన వాదనలను పక్కనపెడితే... ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి ఆశలు, ఆకాంక్షలతో పాటుగా వారి సామర్థ్యం పెరుగుతోంది. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవాలన్న పట్టుదల, అంకితభావం పెరుగుతోందనేది నిర్వివాదాంశం. భారత దేశంలోనూ విపక్ష పార్టీ సభ్యులు కొందరు... ఇక్కడి ‘జెన్–జీ’ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా తమ శక్తిసామర్థ్యాలను సమాజ పురోగతి కోసం, దేశాభివృద్ధి కోసం వినియోగిస్తూ... స్పష్టమైన ఆలోచనలతో ‘వికసిత భారత నిర్మాణం’లో భాగస్వాములవుతున్నారు.భారత యువత ‘వివేకం’నేటి ప్రపంచం ‘జెన్–జీ’ గురించి మాట్లాడుతోంది. కానీ,వందేళ్ల క్రితమే స్వామి వివేకానంద యువత సామర్థ్యం, వారికి సరైన మార్గదర్శనం చేయడం ద్వారా దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎలా ఉండాలనేదానిపై ఆలోచించారు. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యువత గురించి మాట్లాడినా... వివేకానందుడి బోధనల గురించి ప్రస్తావించకుండా ఆ సమావేశం సంపూర్ణం కాదు. అంతటి గొప్ప దీర్ఘదర్శి స్వామి వివేకానంద. ఇవాళ (జనవరి 12) వారి 164వ జయంతి. ‘జెన్–జీ’ సామర్థ్యానికి మరింత పదునుపెట్టి... వికసిత భారత నిర్మాణంలో వారిని భాగ స్వాములను చేసే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సంద ర్భమిది. వ్యక్తిత్వం, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చు కోవడం, స్వీయ అవగాహన, సంస్కృతి–సంప్రదాయాలపై గౌరవం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ నిర్మాణంలో మనం ఏం చేయాలనే అనేక అంశాలపై వివేకానందుని బోధనల ప్రభావం ఉంటుంది.వివేకానందుడు వందేళ్ల క్రితం ఉద్బోధించిన ఆధునిక దృక్పథం, నాగరికత విలువల పునాదులు మొదలైన విషయాలన్నీ... నేటి భారత యువతలో కనిపిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాల్లోని యువత ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ, వీరంతా భావిభారత నిర్మాణంలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. స్వచ్ఛ భారత్, మేరీ మాటీ మేరా దేశ్ (మొక్కల పెంపకం), నషా ముక్త్ భారత్ (మాదక ద్రవ్యాల విని యోగ రహిత భారతం) వంటి ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలకు యువతే నేతృత్వం వహించి వాటిని విజయవంతం చేస్తోంది. నవీన సాంస్కృతిక సారథులుఆధునిక సాంకేతికత వినియోగంలోనూ, స్టార్టప్ల రూపకల్పన లోనూ మన యువత సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ‘ఇండియా స్టాక్’ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పరిజ్ఞానాన్ని కూడా యువత స్వీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వినూత్న మార్కెట్ పరిష్కారాలకు బాటలు వేయడం, యూనికార్న్ (రూ.వందకోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టే స్టార్టప్)ల ఏర్పాటు వంటి వాటి ద్వారా ఉద్యోగాల సృష్టికర్తలుగా వారి పాత్రను మరింత బలోపేతం చేసుకుంటున్నారు.యువత సంస్కృతికి దూరంగా వెళ్తోందనే దుష్ప్రచారం జరుగు తోంది. కానీ ఆధ్యాత్మిక మూలాలను తెలుసుకోవడంపై, మన వైభవోపేతమైన చరిత్రను అధ్యయనం చేయడంపై యువత మక్కువ చూపుతోంది. 2022 ఆగస్టు 15 నాడు... దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. పంచ్ ప్రాణ్ (5 తీర్మాణాల) గురించి వివరించారు. ప్రతి భారతీయుడూ తన లోని బానిస మనస్తత్వపు ఆలోచనలను తొలగించుకుని... మన సంస్కృతీ సంప్రదాయాలు, ఘనమైన చరిత్ర పట్ల గర్వపడాలని సూచించారు. అందుకే యువత... ఓవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే... మరోవైపు భారతీయ నాగరి కత మూలాలను, మన విలువలతో కూడిన సంప్రదాయాల సారాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే దిశగా కృషి చేస్తోంది.ఇవాళ యువత ఆధ్యాత్మిక పర్యాటకం, భారతీయ తాత్వికతపై ఆసక్తిని కనబరుస్తోంది. యోగా, శాస్త్రీయ సంగీతం, ఇతర సాంస్కృతిక పద్ధతులను అలవర్చుకుంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగిన ‘కుంభమేళా’లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని జరుపుకొనేందుకు వేలాదిమంది ‘కాశీ విశ్వనాథ మందిరాన్ని’ ఎంచుకోవడం... యువతలో వస్తున్న పరివర్తనకు ఉదాహరణలు.రాజకీయాల్లో యువశక్తిదీని కారణంగా యువత ఆలోచనల్లోనూ సానుకూలమైన మార్పు కనబడుతోంది. దేశ రాజకీయ, సంస్థాగత అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా... యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తున్నాయి. నాయకత్వంలోనూ యువ భారతానికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. 2024లో దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువత... రాజకీయాల్లోకి వచ్చి దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. దీన్ని ఆచరణలో పెడుతూ, ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. దేశ యువత ఏమనుకుంటోందో తెలుసుకునేందుకు ప్రధానమంత్రి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. వారి ఆకాంక్షలను, వారి ఆలోచనలను, వారి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కూడా... ఇటీవలి కాలంలో యువ నాయకులకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పజెబుతోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా యువకుడిని నియమించింది. రాజకీయంలో పెద్దలకు ఉండే అనుభవాన్ని యువత జోరు, వారి ఆవిష్కరణల సామర్థ్యంతో సమతుల్యం చేయాలన్న ప్రధాని ఆలోచనలకు కార్యరూపం ఇది.దేశ యువశక్తి బలం, క్రమశిక్షణ, నైతికతలోనే భారతదేశ పునరుజ్జీవనం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఇవాళ అక్షరసత్యాలుగా మనముందున్నాయి. ఈ ‘జెన్–జీ’పై, యువశక్తిపై ప్రబలమైన విశ్వాసంతోనే... 2047 నాటికి వికసిత భారత నిర్మాణం జరగాలనే సంకల్పాన్ని ప్రధాని దేశం ముందుంచారు. ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక సాంకేతికతకు వారథులుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ‘జెన్–జీ’ పాత్ర అత్యంత కీలకం. అందుకే స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ, భారతదేశాన్ని మళ్లీ విశ్వగురువుగా నిలబెట్టుకునేందుకు... ఆధునిక, ఆధ్యాత్మిక భారతాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు ప్రధాన మంత్రి సంకల్పించిన మహాయజ్ఞంలో మనమంతా భాగస్వాము లమవుదాం!జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి(నేడు స్వామి వివేకానంద జయంతి; జాతీయ యువజన దినోత్సవం) -
మద్యప్రవాహానికి అడ్డుకట్టే లేదా?
ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతా వని సిగ్గుతో తలదించు కోవాల్సిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా ఆవిష్కృతమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులు రోడ్లపై వేసిన వీరంగం చూస్తే వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు ఉండవేమోనన్న భావన కలుగుతుంది. పీకల దాకా తాగి తామేమి చేస్తున్నామో కనీస స్పృహ లేకుండా ఫుట్పాత్లపై పడిపోవడం, వాంతులు చేసుకోవడం, శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి దృశ్యాలు వీక్షకులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం అంటే కేవలం మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల్లో మునిగి పోవడమేనా? దేశంలోని 29 రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31న జరిగిన మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,671 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వాటానే అత్యధికం. ఒక నిమిషానికి తెలంగాణలో 95 బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్లో 93 బాటిళ్ల చొప్పున అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు, మద్యం అమ్మకాల్లో పోటీ పడటం శోచనీయం.యువత భవితవ్యం ప్రశ్నార్థకంమద్యం అలవాటు క్రమంగా గంజాయి, ఇతర ప్రమాదకర మత్తుపదార్థాల వైపు మళ్లుతోంది. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే రేవ్ పార్టీలు ఇప్పుడు నగరాల శివార్లలోని ఫామ్హౌస్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. కేవలం మద్యం తాగడానికే పరిమితం కాకుండా, యువత మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారంలో కూరుకుపోతోంది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయంతో సరిహద్దులు దాటి మత్తు పదార్థాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.మరీ దారుణమైన విషయం ఏమిటంటే, స్కూల్ పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తమ కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డలు మత్తులో జోగుతున్నారని తెలిస్తే వారి గుండెలు పగిలిపోవా?మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికత, సుశిక్షితులైన పోలీసు యంత్రాంగం అవసరం. కానీ అనేక రాష్ట్రాల్లో అటువంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలు లోపించాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ముసు గులో గంజాయి సాగు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. మానవ వనరులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలుమరోవైపు ప్రభుత్వాల ద్వంద్వ నీతి కూడా విమర్శలకు తావిస్తోంది. మాదక ద్రవ్యాల వినియో గానికి వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఎందుకు పాకులాడు తున్నాయి? మద్యం కూడా ఒక మత్తు పదార్థమే కదా! దానివల్ల కలిగే అనర్థాల గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఏ రకమైన అభివృద్ధి?మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడిగా పరిగణించకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. మద్యపానం మనిషి శారీరక, నైతిక, మేధాపరమైన పతనానికి దారితీస్తుందని మహాత్మాగాంధీ ఎప్పుడో హెచ్చరించారు. గాంధీ పుట్టిన గుజరాత్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మద్యంలో పదో వంతు భారతదేశంలోనే వినియోగం అవుతున్నట్లు ‘లాన్సెట్’ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ సారా, గుడుంబా వంటి ప్రాణాంతక పదార్థాల వల్ల ఎంతో మంది అకాల మృత్యువాత పడుతున్నారు. మద్యం తయారీ పరిశ్రమ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని ‘అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వెల్లడించడం దేశ ఆరోగ్య స్థితిగతులకు అద్దం పడుతోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి, మత్తు ప్రవాహాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి. లేనిపక్షంలో 2047 నాటికి మనం కలలుగంటున్న ‘వికసిత్ భారత్’ కాస్తా ‘మద్యపాన భారత్’గా మారే ప్రమాదం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలే కాదు, ఆరోగ్యవంతమైన సమాజం కూడా అని గుర్తించాలి. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
అమర్త్య సేన్ (నోబెల్ ఆర్థికవేత్త) రాయని డైరీ
ఇష్టమైన ప్రయాణాలకు, ఇష్టమైన మనుషుల్ని కలవటానికి సాకులు వెతుక్కోవడం బాగుంటుంది. బలంగా లేని సాకులు మనల్ని దొంగలా పట్టివ్వటం మరింత బాగుంటుంది. ‘‘స్కూల్కి ఎందుకు వెళ్లనంటున్నావ్ అమ్మూ బాబూ’’ అని అడిగేవారట అమ్మ, నా చిన్నప్పుడు. ‘‘నాకు తెలీదు. నువ్వే చెప్పమ్మా’’ అనేవాడినట నేను... అమ్మ ఒడిలోకి దూకేస్తూ! ‘‘దొంగ...’’ అని అమ్మ ఒకటే నవ్వట! జనవరి 16 మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈసీ నుంచి నాకు నోటీసు! బెంగాల్ వెళ్లేందుకు వెతుక్కో నక్కర్లేని ఒక సాకు దొరకటం నా 92 ఏళ్ల వయసును ఉత్సాహపరిచే సంగతే!ఇండియా వెళ్లినప్పుడు, శాంతి నికేతన్ లో నేనుండే నా పూర్వీకుల నివాసానికి పొరుగునే ఉంటాడు నా కజిన్ శాంతాభాను సేన్ ! ఇండియా పొరుగున బంగ్లాదేశ్ ఉండటం నాకెంత సంతోషమో, శాంతాభాను నా పొరుగున ఉండటం నాకంత సంతోషం. మనసుకు నచ్చినవాళ్లు, మనం చెయ్యెత్తితే చూసి పలకరింపుగా నవ్వేంత దూరంలో ఉండటం ఎంత సంపద, ఎంత ఆరోగ్యం మనిషికి! ఈసీ అధికారులు నాకు ఇవ్వవలసిన నోటీసును, నేను అక్కడ లేనందువల్ల శాంతాభాను చేతికి అందజేసి వెళ్లారట.85 ఏళ్లు దాటినవారు విచారణ కోసం ఈసీ ఆఫీసుకు వెళ్లనవసరం లేదనీ, ఈసీనే ఆ వయసు దాటినవారి ఇంటికి వెళ్లాలనీ నిబంధన. అలాగైతే విచారణ కోసం ఈసీ అధికారులు ప్రస్తుతం కేంబ్రిడ్జ్లో నేను ఉంటున్న ఇంటికి రావాలి. కొన్ని లాజిక్లు అంతదూరం రాలేవు. కొంత దూరం మాత్రమే వచ్చి ఆగిపోతాయి. బెంగాల్ ఓటర్ల రికార్డులలో అమ్మకు, నాకు మధ్య ఏజ్ డిఫరెన్ ్స 15 ఏళ్ల కంటే తక్కువ ఉందనీ, అదెలా సాధ్యమో లాజిక్కి అందటం లేదనీ ఈసీ! బెంగాల్లో ఓటర్ల జాబితాను గట్టిగా సవరిస్తున్నారు. ఆ సవరణల్లో ఈ ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ బయట పడిందట! రెండు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు. నిజానికీ, అమ్మకూ నాకూ మధ్య 19 సంవత్సరాలకు పైగా వ్యత్యాసం ఉంది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ను చూపిస్తే నా ఓటు ఉంటుంది. నేను బెంగాల్ వెళ్లి, ఓటేయొచ్చు. రికార్డులలో ఏది ఫీడ్ అవుతుందో, ఆ ఫీడ్ అయిందే లాజిక్కు. రికార్డులను దాటుకుని లాజిక్కులు బయటికి రాలేవు. ‘‘సేన్! మీరు లాజికల్గా ఆలోచించటం లేదు, పేదలు... పేదలు అంటూ ఆర్థికశాస్త్రాన్ని కారుణ్యంతో నింపి, ‘మదర్ థెరెసా ఆఫ్ ఎకనామిక్స్’లా తయారవుతున్నారు’’ అంటుంటారు నా తోటి ఎకనమిస్టులు. ఆర్థికశాస్త్రం కఠినంగానే ఉండాలి. కానీ, ఆర్థికశాస్త్రానికి మనసెందుకు ఉండకూడదు? లాజిక్ తప్పిపోతుందనా?‘‘నేను స్కూలుకు వెళ్లను’’ అని, ఆఖరి నిమిషంలో స్కూల్ బాక్స్ను పక్కన పెట్టేసి, అమ్మ ఒడిలోకి దూకేసినప్పుడు అమ్మ నన్ను తన కడుపులోకి కూడదీసుకుని నా బుగ్గపై ముద్దు పెట్టడం నాకు గుర్తుంది. స్కూలు కఠినంగా ఉంటుందని, అమ్మ కూడా కఠినంగానే ఉండాలా? పేదల విషయంలో ఆర్థికశాస్త్రం కూడా అమ్మలానే ఉండాలంటాను నేను. ఆర్థికశాస్త్రం మాత్రమే కాదు, ఓటర్ల విషయంలో ఈసీ కూడా!ఓటర్ల జాబితాను సవరిస్తున్నప్పుడు ‘జీవించే ఉన్నారా?’ అని చూస్తున్న ఈసీ, ఎవరెక్కడ జీవిస్తూ ఉన్నా ప్రాణాలు మాత్రం ఇక్కడే కదా ఉంటాయి అన్నది కూడా ఆలోచించాలి. కేంబ్రిడ్జిలో ఉంటున్నంత మాత్రాన, బెంగాల్లో లేనట్లు కాదు. నాకైతే, విచారణ సాకుతో హార్వర్డ్ క్యాంపస్లోని ‘ఆర్నాల్డ్ ఆర్బోరెటమ్’ పూలతోటల నుంచి వీచే తీపి సువాసనలను ఓ నాలుగు రోజులు సెలవడిగి, బెంగాల్ వెళదామనే ఉంది! -
కాలుష్యం తగ్గేలా... పరిశ్రమ పెరిగేలా!
విద్యుత్ చలనశక్తి వైపు పెద్ద ఎత్తున మళ్ళడం కేవలం వాంఛనీయం కాదు, తక్షణావశ్యకమని ఢిల్లీ వాయు కాలుష్యం హెచ్చరిస్తోంది. ప్రపంచ మోటారు వాహ నాల పరిశ్రమ ఇప్పటికే ఆ క్రమంలో ఉంది. ఈ శతాబ్దంలోని పరిస్థితులు దాన్ని అనివార్య పరిణామంగా మారుస్తు న్నాయి. ఇదేదో వాతావరణ మార్పునకు పరిష్కారంగా తీసుకుంటున్న చర్య కాదు. పారిశ్రామిక పోటీ సామర్థ్యానికి, సాంకే తిక నాయకత్వానికి, జాతీయ ఆర్థిక స్థితిస్థాపక శక్తికి బ్యాటరీలతో నడిచే వాహనాలు నిర్ణయాత్మక శక్తిగా మారాయి.నేటి వ్యూహాత్మక అవసరంఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో గడచిన పదేళ్లలో మనం అడుగులు వేయడం ప్రారంభించాం. ఎక్కువ శక్తిని పొందుపరచు కునే కొత్త రకం బ్యాటరీల తయారీకి నడుం బిగించాం. కానీ, ఇతర దేశాలు నాటకీయంగా వేగం పుంజుకున్నాయి. పారిశ్రామిక ఆధిప త్యాన్ని చాటుకునేందుకు చైనా వీటిని కూడా ఒక వేదికగా చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈవీల సరఫరా క్రమంలో ప్రధాన విడి భాగాలపై అది పట్టు చేజిక్కించుకుంది. ఈవీలను వాడక తప్పని మార్పు ఎంత లోతైనదో అమెరికా, యూరోపియన్ యూనియన్ గ్రహించి, అసాధారణ పారిశ్రామిక విధానాలతో దానికనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి. ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, ఈయూ గ్రీన్ డీల్ ఆ కోవకు చెందినవే! ఇపుడు కనుక నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే, ప్రపంచానికే నాయకత్వం వహించగల ఈవీ ఎకోసిస్టంను మనం నిర్మించుకో గలం. దేశంలో రోడ్లపై కనిపించే వాహనాల్లో ఈ రెండు విభాగాలవే దాదాపు 80 శాతం. పెట్రోలు వాహనం కన్నా ఈవీని కొనడం, నడపడం దాదాపు 30 శాతం చౌకతో కూడిన పని. పట్టణాలు, నగరాలు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీటిని విరివిగా వాడవచ్చు. ద్వి, త్రిచక్ర వాహనాలు విధిగా 2030 కల్లా బ్యాటరీలతో నడిచేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు కూడా స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. కంపెనీలు పరిశోధన–అభివృద్ధి, విడి భాగాల తయారీ, బ్యాటరీల ఉత్పత్తిపై సందేహించకుండా పెట్టుబడులు పెంచుకునేందుకు వీలవుతుంది. దేశంపై చమురు దిగుమతి భారం తగ్గుతుంది. నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. ఈయూ దేశాలతోపాటు, ఇండోనేషియా, థాయిలాండ్, తైవాన్ వంటి పెక్కు దేశాలు ఈవీలను ఇప్పటికే తప్పనిసరి చేశాయి. కార్ల వైపు కూడా దృష్టి!ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల వినియోగం వైపు మనం పూర్తిగా మళ్ళాలి. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న పురోగతు లకు తగ్గట్లుగా మన కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య (కఫే) నిబంధనలను మార్చుకోవాలి. కిలోమీటరుకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 93.5 గ్రాములకు మించకూడదనే నియమాన్ని ఈయూ అమలుపరుస్తోంది. మన దేశంలో ఇది ఇప్పటికీ కిలోమీటరుకు 113 గ్రాములుగా ఉంది. కర్బన ఉద్గారాలు తగ్గించుకోవలసిందేనని నిబంధన తెస్తే వాహన తయారీ సంస్థలు ఇంధన సామర్థ్య లక్ష్యాల సాధనపై శ్రద్ధ పెడతాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ల (ఐసీఈ)లో క్రమానుగత మెరుగుదలకు ఉపక్రమిస్తాయి. ఆర్థికంగా ఎక్కువ భారం మోపని కార్ల తయారీ వైపు కంపెనీలను నడిపించాలి. లైట్–డ్యూటీ వాహన ‘కఫే’ ప్రమాణాల అమలుతో యూరప్లో ఈవీల వాటా ఒక్క ఏడాదిలోనే 3 నుంచి 11 శాతానికి పెరిగింది. ‘కఫే’ నిబంధనలు కఠినతరం చేయడం వల్ల మూడు ప్రయో జనాలున్నాయి. కంపెనీలు కాలం చెల్లిన ఐసీఈ టెక్నాలజీలపై ఆధారపడే బదులు తదుపరి తరం ఈవీల తయారీలపై పెట్టు బడులు పెడతాయి. ప్రపంచ రెగ్యులేటరీ ప్రమాణాలతో భారత్ సమతూకం సాధిస్తుంది. ఫలితంగా, దేశంలోని కార్ల తయారీసంస్థలు ఎగుమతి మార్కెట్లో పోటీ పడగలుగుతాయి. మూడవది– భారతీయ వినియోగదారులకు సరసమైన ఎలక్ట్రిక్ కార్లు అందు బాటులోకి రావడం వేగం పుంజుకుంటుంది. ఛార్జింగ్ అడ్డంకులుదేశంలో ఈవీల వాడకం ఆశించినంత పెరగకపోవడానికి కారణం వాటి ధర, లేదా పనితీరు కారణం కాదు. ఆధారపడదగిన రీఛార్జి సదుపాయాలు లేకపోవడం. ఇళ్లు, ఆఫీసులు రెండింటి వద్ద ఈ సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 60 శాతం మందికి పైగా బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో నివసి స్తున్నారు. ఛార్జర్లను ఏర్పాటు చేసుకోవడం వారికి వ్యయ ప్రయాస లతో కూడిన పని. వాహనాలు ఛార్జి చేసుకోవడం భారతదేశంలో తక్షణం జాతీయ హక్కుగా మారాలి. వాహనాలను పార్కు చేసుకునే చోట ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోనివ్వాలి. ప్రాథమిక విద్యుత్, సురక్షితా నిబంధనలతో ఆ సదుపాయాలు అందుబాటు లోకి తేవచ్చు. లీగల్ ఫ్రేమ్ వర్కును కూడా మార్చుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తరహాలో రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు లేదా బిల్డింగ్ అసోసియేషన్ల నుంచి అనుమతి తీసుకోనవసరం లేకుండా ఏ పౌరుడైనా లీగల్ పార్కింగ్ స్పాట్ వద్ద ఛార్జర్ ఏర్పాటు చేసుకునేందుకు అధికారమివ్వాలి. వోల్టేజి తగ్గని విధంగా విద్యుత్ సరఫరా ఉండాలి. కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో ఈవీ–రెడీవైరింగు అమర్చాలి. స్లో, ఫాస్ట్ చార్జింగ్లకు వేర్వేరు ప్రదేశాలు నిర్ణ యించాలి. రెసిడెంట్ల సంక్షేమ సంఘాలు సాముదాయిక రీఛార్జింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని ప్రభుత్వం, పురపాలక సంస్థలు వివిధ కానుకల రూపంలో ప్రోత్సహించాలి. దీన్ని కేవలం పర్యావరణపరమైన బాధ్యతగా భావించడం పొరపాటు. భారత్ బలమైన ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా అవత రించేందుకు ఇది ద్వారాలు తెరుస్తుంది. మనం శిలాజ ఇంధనాల దిగుమతిపై చాలా కాలంగా ఆధారపడుతూ వస్తున్నాం. దాన్ని తగ్గించుకోవచ్చు. ప్రజారోగ్య లక్ష్యాలను అందుకోవడంలో నగరాలకు సహాయపడినట్లు అవుతుంది. బ్యాటరీలు, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి గ్రిడ్ల అధునికీకరణ, పునరుత్పాదక ఇంధన వనరుల దిశగా అధునా తన టెక్నాలజీలలో పెట్టుబడులను ఉద్దీపింపజేస్తుంది. ఈ రంగాన అగ్ర భాగాన నిలిచేందుకు భారత్ కృషి చేసి తీరాలి. ప్రపంచం గేరు మారుస్తున్నప్పుడు, ఇండియా కూడా యాక్సిలరేటర్ తొక్కాలి. ఎలక్ట్రిక్ వాహనాలతో నగరాల్లో గాలి మెరుగుపడుతుంది. 2030 కల్లా విధిగా ద్వి, త్రిచక్ర వాహనాలు బ్యాటరీలతో నడి చేవే ఉండాలని నిబంధన తెస్తే, పరిశ్రమకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది. అలాగే విస్తృతంగా ఛార్జింగ్ సదుపాయా లను అందుబాటులోకి తేవాలి.అశోక్ ఝున్ఝున్వాలా వ్యాసకర్త ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రాయలసీమ ఆశాదీపం
రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆశాదీపం అయ్యింది. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరిపి ఈ పథకాన్ని నిలిపివేయించానని ప్రకటించడం, సీమ ప్రాజెక్టులను అక్రమమైనవిగా అభివర్ణించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాయలసీమ నీటి హక్కుల వెనుక ఉన్న భౌగోళిక, సాంకేతిక వాస్తవాలను నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.కేటాయింపులుండీ వాడుకోలేక...రాయలసీమ దాహార్తిని తీర్చే క్రమంలో గాలేరు–నగరి, హంద్రీ –నీవా, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎస్సార్బీసీ, గుండ్రేవుల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దాదాపు 144.7 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చట్టబద్ధంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. ప్రస్తుతం సీమలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యం 100 టీఎంసీల కంటే తక్కువగానే ఉంది. సరైన కాల్వల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏటా కేవలం 50 నుంచి 60 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. అంటే, తమకు దక్కాల్సిన వాటాలో సగం కూడా వాడుకోలేక పోతున్న ఈ ప్రాంతంపై ‘జల దోపిడీ’ చేస్తున్నారనే నిందలు వేయడం అత్యంత విచారకరం.రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాధారమైన పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి వంటి మలుపులకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రధాన వనరు. గతంలో శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలుగా ఉండేది. కానీ తీవ్రమైన పూడిక పేరుకుపోవడం వల్ల అది ప్రస్తుతం 200 టీఎంసీల లోపుకు పడిపోయింది. దీనికి అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖాళీ చేయడం వల్ల జలాశయం మట్టం వేగంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలల తరబడి వచ్చే కృష్ణా, తుంగభద్రల ప్రవాహాలు ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే పరిమితమవు తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం ఉండాలి. పూడిక, విద్యుత్ అవసరాల కారణంగా ఈ మట్టం నిర్వహించడం అసాధ్యంగా మారుతోంది, ఫలితంగా వరద జలాల మీద ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ– నీవా వంటి ప్రాజెక్టులకు గండం ఏర్పడుతోంది.పథకం ఆవశ్యకతవరద సమయంలో కృష్ణా నది నుంచి సుమారు 700–800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి ఉన్న పరిమితులను అధిగమించేందుకు, కేవలం వారం పది రోజులు మాత్రమే లభించే వరద సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం సాధ్యమవుతుంది.ముచ్చుమర్రి వంటి ఎత్తిపోతల కేంద్రాలకు అనేక సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ముచ్చుమర్రి నుంచి నాలుగు రోజులు నిరంతరాయంగా నీటిని తోడితే కానీ ఒక టీఎంసీ నీరు రాదు. 40 టీఎంసీల లక్ష్యంతో నిర్మించిన హంద్రీ–నీవాకు ఇది ఏమాత్రం సరిపోదు. అలాగే మల్యాల నుంచి నీటిని తీసుకోవాలంటే కనీసం 842 అడుగుల మట్టం అవసరం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని రూపొందించారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుంచి నీటిని లిఫ్ట్ చేసే పథకాలను నిర్మించుకుంది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తన చట్టబద్ధమైన వాటాను వినియోగించు కోవడానికి 800 అడుగుల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసు కోవడం ఏమాత్రం అక్రమం కాదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది ఏపీ ప్రాథమిక హక్కు కూడా!శాశ్వత పరిష్కారంరాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే అది గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు వెన్నెముకగా మారుతుంది. పోతి రెడ్డిపాడు ద్వారా ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి రిజర్వాయర్ల ముంపు సమస్యలను పరిష్కరించి, అక్కడ 35 టీఎంసీల నీటిని నిల్వ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవాతో అనుసంధానం చేస్తే, చిత్తూరు జిల్లాలోని మదన పల్లి డివిజన్ నుంచి కుప్పం వరకు గాలేరు–నగరి నీటిని సరఫరా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది. ఇది రాయలసీమ కరవు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా మారుతుంది.ఈ పథకానికి అనుమతులు సాధించడం అసాధ్యమైన పని కాదు. సీడబ్ల్యూసీ నియమించిన కమిటీలు ఒక కీలకమైన సిఫార్సు చేశాయి: డ్యామ్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు. శ్రీశైలం సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు తగ్గిపోయిన వాస్తవాన్ని ప్రభుత్వం సమర్థంగా వాదించాలి. శ్రీశైలం భద్రతను, తగ్గిపోయిన నిల్వ సామర్థ్యాన్ని సాధికారిక సంస్థల ముందు నిరూపించగలిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సులభమవుతుంది.తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజ నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే నెపంతో ప్రాజెక్టు అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ వాదనకు ఆయుధంగా మారుతుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకానికి మిగిలి ఉన్న అనుమతులను తీసుకురావడానికి, పెండింగ్లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.శ్రీశైలం ఎగువ భాగం నుంచి నీటిని తీసుకోవడం సీమ ప్రజల ప్రాథమిక హక్కు అని జాతీయ వేదికలపై గట్టిగా వినిపించాలి. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ కేవలం ఒక ఇంజినీరింగ్ నిర్మాణం కాదు, అది సీమ రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. ఈ పథకం కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
దాపరికం లేని సామ్రాజ్యవాదం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్కు ముందు నవంబర్లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!ఏ చట్టాలూ పాటించరా?వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా. పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?మేమే బాస్!దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది. ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏవిధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
కానివారికి కంచాల్లో వడ్డిస్తారా!
గుర్తుండే ఉంటుంది, 2022లో నిస్సాగు నిరసన చేపట్టారు కొందరు పెద్ద రైతులు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించడం వల్ల పూర్వంలా కూలీలు తక్కువ దినవేతనాలకు దొరకడం లేదన్నది వారి అసంతృప్తికి కారణం. అందువల్ల తమ సాగు వ్యయ భారం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసారి సాగు విరామాన్ని పాటించారు. ఉపాధి పథకం కార్మికుల చేత రైతుల వ్యక్తిగత వ్యవసాయ పనులు చేయించాలన్న డిమాండ్కు మద్దతుగానూ ఇది జరిగింది. ఈ పథకం వల్ల కూలీలు ప్రియ మైపోయారన్నదే నిజమైతే, రైతులు వారిని భరించలేకపోతున్నా రన్నదే వాస్తవమైతే ఆ మేరకు పంటల మద్దతు ధరను పెంచి ఆదు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దానిని సాధించుకోవచ్చు. రైతుల సమస్య అదొక్కటే కాదు. ఉపాధి పథకం భూమిలేని నిరుపేద వ్యవసాయ కార్మికుల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచినమాట నిజమే. వాస్తవానికి అదిఅంత గొప్ప పథకమేమీ కాదు. పేద కార్మికులకు తమ కాళ్ళ మీద తాము బతగ్గలిగే పూర్తి స్థాయి బలాన్ని అది కల్పించలేదు. వారి చేతిలోని ఊతకర్రకు కొంచెం అదనపు ఊతాన్ని మాత్రమే ఇచ్చింది. దానికే వారు తమను దాటిపోతున్నారని దేశమంతటా గల పెద్ద రైతులు భావించడం విడ్డూరం. దీని మూలాల్లో ఫ్యూడల్ శక్తుల అసహనం ఇమిడి ఉన్నదనే అభిప్రాయాన్ని తోసిపుచ్చలేము. ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు గాంధీ పేరు తీసేసి, ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని తెచ్చింది. పేద వర్గాల పొట్ట కొట్టి...గత పథకంలో మాదిరిగా ఈ కొత్తది డిమాండ్ ఆధారంగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించబోవడం లేదు. పనిని హక్కుగా గుర్తించి దానిని కల్పించడం తన బాధ్యతగా ఎన్డీయే ప్రభుత్వం భావించడం లేదు. కేంద్రం తాను అనుకున్న చోట మాత్రమే ఈ పథకం కింద పనులు మంజూరు చేస్తుంది. డిమాండ్ ఆధారిత పని కల్పనకు తెర దించబోతున్నారు. పథకం మొత్తం ఖర్చులో పూర్వం మాదిరిగా 90 శాతానికి బదులు 60 శాతం నిధులనే కేంద్రం భరిస్తుంది. అందువల్ల రాష్ట్రాల వాటా 10 నుంచి 40 శాతానికి చేరుకుని భారీగా పెరిగిపోనున్నది. అన్నింటికీ మించి సాగు సీజన్లో 60 రోజులపాటు ఉపాధి పనులను నిలిపివేయడం కొత్త పథకంలోని ప్రధానమైన ప్రజావ్యతిరేక లక్షణం. మహాత్మా గాంధీ ‘నరేగా’ కార్మి కులకు ప్రసాదించిన ఉపాధి భరోసా ఈ విధంగా డొల్ల అయి పోతుందన్న మాట! దీనితో ముమ్మర సీజన్లో అధిక కూలీని సాధించుకునే హక్కును కార్మికులు కోల్పోనున్నారు. పేదలు, అణగారిన వర్గాలు పెత్తందారుల కింద బతకాలనే వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ కోరుకుంటున్నది. హిందూ సమాజ రక్షణే తమ విధి అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవలే అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దానిని చేసి చూపిస్తున్నది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భూస్థాపితం చేయా లని ప్రధాని మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఆ పథకాన్ని వదిలించుకోడం అంత తేలిక కాదని కూడా ఆయన గ్రహించారు. అందుకే అవసరమైన నిధులు విడుదల చేయకుండా దానికి నెమ్మది నెమ్మదిగా విషం ఇచ్చి చంపుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా తెర దించారు. కోవిడ్ కాలంలో నగరాలు, పట్టణాల నుంచి కాళ్లీడ్చుకుంటూ స్వస్థలాలకు చేరిన అసంఖ్యాక గ్రామీణ యువతకు పనులు కల్పించి ఆదుకున్న ‘నరేగా’ను అంతమొందిస్తున్నందుకు ఇప్పుడి ప్పుడే పల్లెల్లో నిరసన రూపుదిద్దుకుంటున్నది. మైనారిటీలను దూరం పెట్టి...స్వతంత్ర భారత రాజ్యాంగంలో బీజేపీకి బొత్తిగా గిట్టని పదాలు సోషలిస్టు, సెక్యులర్. ఈ రెండింటినీ 1976లో అప్పటికాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ‘ప్రవేశిక’లో చేర్చింది. వాటిని సుప్రీంకోర్టు ధ్రువపరిచింది. భావజాలపరంగా, సంకేతాత్మకంగా సోషలిస్టు పదానికి మహాత్మా గాంధీ ‘నరేగా’ ప్రాతినిధ్యం వహి స్తున్నది. దానిని కూల్చివేయడం ద్వారా సోషలిస్టు తరహా వ్యవస్థ మూలాలను బీజేపీ ఛేదించగలిగింది. సెక్యులర్ లక్షణానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న సర్వమత సమభావాన్ని నిర్మూలించాలని ఎదురు చూసిన ఆ పార్టీ అందుకోసం ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను (సర్) ఎంచుకున్నది. సరిహద్దు రాష్ట్రాల్లోకి పొరుగు దేశాల ముస్లింల వలస పరాకాష్ఠకు చేరుకున్నదనే నెపం ఇందు కోసమే దూసుకొచ్చింది. మొత్తం మీద మైనారిటీ ఓటర్లను భారీ ఎత్తున తొలగించడం ద్వారా దేశ లౌకిక లక్షణాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ సమకట్టిందనే అభిప్రాయం ధ్రువపడింది. ‘సర్’ మరో ఎన్ఆర్సి (జాతీయ పౌరసత్వ రిజిస్టర్) అనే విమర్శ బయలుదేరింది. దీని ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన మైనారిటీలను విదేశీయులుగా ముద్రవేసి అస్సాంలో మాదిరిగా వెనక్కు పంపిస్తారనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీ ఓటర్ల సంఖ్యను తగ్గించడం ద్వారా బీజేపీ తన గెలుపు అవకాశాలను గ్యారంటీ చేసుకుంటున్నది. బహుళత్వ రాజ్యాంగాన్ని హిందూత్వ పాలనాపత్రంగా మార్చివేసే తెగువకు పాల్పడు తున్నది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉద్దేశించిన త్రిసభ్య కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించినప్పుడే ఎన్నికల యంత్రాంగాన్ని దుర్వినియోగానికి దారి ఏర్పడింది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ, ప్రాణప్రదం అయిన నిష్పాక్షిక ఎన్ని కల వ్యవస్థకు తూట్లుపొడవటం అందువల్లనే సాధ్యమవుతున్నది. దాని విష శిశువే ‘సర్’!జి. శ్రీరామ్మూర్తివ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఒక అజేయ స్ఫూర్తి సంకేతం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్ రాష్ట్రం ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ‘ద్వాదశ జ్యోతిర్లింగ’ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ‘‘సౌరాష్ట్రే సోమనాథం చ...’’ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా ఈ శ్లోకం జ్యోతిర్లింగ మహత్తును ఇలా చాటిచెబుతుంది: ‘‘సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపైః ప్రముచ్యతే‘ లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్’’ అంటే– ‘‘సోమనాథ్ శివలింగ దర్శన మాత్రాన జీవుడు పాప విముక్తుడై సదాశయాలను నెరవేర్చి, మరణానంతరం స్వర్గ ప్రాప్తినొందుతాడు’’ అని అర్థం. కానీ, లక్షలాది భక్తజనం భక్తిప్రపత్తులతో నీరాజనాలు అర్పించిన ఈ సోమనాథ్పై దురదృష్టవశాత్తూ విధ్వంసమే ఏకైక ధ్యేయంగా విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఈ నేపథ్యంలో సోమనాథ ఆలయానికి 2026 సంవత్సరం ప్రత్యేకమైనది. ఈ ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై తొలి దాడికి ఈ ఏడాదిలో వెయ్యేళ్లు పూర్తవుతున్నాయి. గజనీ మహమ్మద్ 1026 జనవరిలో క్రూర, హింసాత్మక దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తివిశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయజూశాడు. అయితే, సోమనాథ్కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన అవిరళ కృషి ఫలితంగా వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ దివ్య దీప్తి ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తోంది. ఇటువంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ మేరకు ఆలయ పునరుద్ధరణ అనంతరం 1951 మే 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు జ్యోతిర్లింగ భాగ్యం కల్పిస్తూ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.అఖండ ధైర్యానికి నిర్వచనంసోమనాథ్పై వెయ్యేళ్ల నాటి తొలి దండయాత్ర, అక్కడి దురాక్రమణదారుల క్రూరత్వం, పుణ్యక్షేత్ర విధ్వంసం వంటి అమానుష ఘట్టాలను వివిధ చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదు చేశాయి. వాటిని చదివే ప్రతి పాఠకుడి గుండె విలవిలలాడుతూ లిప్తపాటు విచలితమవుతుంది. ప్రతి పంక్తిలోనూ బట్టబయలయ్యే హింస, క్రూరత్వం వెయ్యేళ్లు గడిచినా మరపురాని విషాద భారాన్ని మన మనోఫలకంపై మోపుతాయి. భారత దేశంపైన, ప్రజల మనోధైర్యం మీద అది చూపిన పెను దుష్ప్రభావాన్ని ఒకసారి ఊహించండి. సముద్ర తీరంలోగల సోమనాథ్ ఆలయం అమేయ ఆర్థిక శక్తితో సమాజానికి సాధికారతనిచ్చింది. అన్నింటినీ మించి సోమనాథ్కు విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. నాటి సమాజంలోని సముద్ర వ్యాపారులు, నావికులు సోమనాథ్ వైభవ గాథలను దేశదేశాలకు విసృతంగా మోసుకెళ్లారు. తొలి దాడికి సహస్రాబ్ది పూర్తయ్యాక కూడా సోమనాథ్ గాథ విధ్వంస నిర్వచనంగా నిలవకపోవడంపై నిస్సందేహంగా నేనెంతో గర్విస్తున్నాను. ఈ ఆలయం ఈనాడు భరతమాత కోట్లాది బిడ్డల అఖండ ధైర్యానికి నిర్వచనంగా నిలుస్తోంది. ఎన్నడో వెయ్యేళ్ల కిందట 1026లో మొదలైన మధ్యయుగపు అనాగరిక దండయాత్ర, ఇతరులను కూడా సోమనాథ్పై పదేపదే దాడులకు ‘ప్రేరేపించింది.’ దేశ ప్రజలను, సంస్కృతిని దాస్య శృంఖలాల్లో బంధించే ప్రయత్నాలకు నాంది పలికింది. ఎందరో మహానుభావులుకానీ, ఆలయంపై దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ రక్షణ కుడ్యంలా నిలిచి, ఆత్మార్పణకూ వెరవని వీరపుత్రులు, పుత్రికలు ఎందరో ఉన్నారు. దాడి జరిగిన ప్రతిసారి మనదైన గొప్ప నాగరికతకు వారసులుగా వారు పుంజుకుంటూ తరతరాలుగా ఆలయ పునర్నిర్మాణం, పునరుజ్జీవనానికి పాటుపడుతూనే వచ్చారు. ఇటువంటి మహనీయులలో అహల్యాబాయి హోల్కర్ ప్రముఖులు. సోమ్నాథ్లో భక్తులు ప్రార్థనలు చేసుకునేలా ఆమె అందించిన అవిరళ కృషి వెలకట్టలేనిది. అటువంటి మహానుభావులు జీవించిన నేలపై నడయాడగలగటం నిజంగా మన అదృష్టం. స్వామి వివేకానంద 1890 దశకంలో సోమనాథ్ను సందర్శించినపుడు అనిర్వచనీయ అనుభూతికి లోనయ్యారు. నాటి తన అనుభవాన్ని 1897లో చెన్నయ్ నగరంలో ఓ కార్యక్రమం సందర్భంగా– ‘‘దక్షిణ భారతంలోని ప్రాచీన ఆలయాలతోపాటు గుజరాత్లోని సోమనాథ్ వంటివి మనకు అపార జ్ఞానప్రదాతలు. ఎన్నో పుస్తకాలు వివరించలేని జాతి చరిత్రపై మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తాయి. వంద దాడులను భరించిన గుర్తులతోనే కాకుండా వంద పునరుజ్జీవన చిహ్నాలతో ఈ ఆలయాలు ఎంత వైభవంగా నిలిచాయో గమనించండి. నిరంతర విధ్వంసం, శిథిలాల నుంచి నిరంతర పునరుజ్జీవనంతో మునుపటి ఠీవితో ఎంత శక్తిమంతంగా విలసిల్లుతున్నాయో చూడండి! అదే జాతీయ మనోభావనం జాతీయ జీవన స్రవంతి. అనుసరిస్తే అది అమేయ యశస్సు వైపు మనల్ని నడిపిస్తుంది. ఆ జీవన స్రవంతిని వీడితే ఫలితం మరణమే! ఆ మార్గం వదిలిపెడితే ప్రభావం ఆత్మనాశనం, వినాశమే!’’ స్వాతంత్య్రానంతరం సమర్థుడైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సోమనాథ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర బాధ్యతను స్వీకరించారు. 1947లో దీపావళి వేళ ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన సర్దార్ పటేల్... అక్కడే ఆలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి 1951 మే 11న సోమనాథ్లో భవ్యమైన ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరచుకున్నాయి. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలని కలలుగన్న యోధుడు సర్దార్ సాహెబ్ ఆ సమయానికి భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, ఆయన స్వప్నం సాకారమై దేశం ఎదుట సగర్వంగా నిలిచింది. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ పరిణామం పట్ల అంతగా ఉత్సాహం చూపలేదు. ఎంతో విశిష్టమైన ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి, మంత్రులు పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదు. ఈ కార్యక్రమం భారత్పై ప్రతికూల ముద్ర వేసిందని నెహ్రూ వ్యాఖ్యానించారు. కానీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. అనంతర పరిణామాలు చరిత్ర పుటల్లో నిలిచే ఉన్నాయి. సర్దార్ పటేల్కు ఎంతో అండగా నిలిచిన కె.ఎం. మున్షీని స్మరించుకోకపోతే సోమనాథ్ గాథ అసంపూర్ణమే అవుతుంది. ‘సోమనాథ: నిత్య క్షేత్రం (సోమనాథ: ద ష్రైన్ ఎటర్నల్)’ గ్రంథంతోపాటు... సోమనాథ్పై ఎన్నో సమాచారభరిత, విజ్ఞానదాయకమైన రచనలు చేశారు. నిజానికి, మున్షీ తన గ్రంథ శీర్షికలో చెప్పినట్టు... ఆత్మ నిత్యత్వాన్నీ, ఉన్నత భావాల శాశ్వతత్వాన్నీ బలంగా విశ్వసించే గొప్ప నాగరికత మనది. ‘నైనం ఛిందన్తి శస్త్రాణి’ అని గీతలో చెప్పినట్టు – అది ధ్వంసం చేయ శక్యంగాని అజరామరత్వమని మనం బలంగా నమ్ముతాం. మన నాగరికత అజేయ స్ఫూర్తికి సోమనాథ్ను మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఎన్నో అవరోధాలనూ, ఆటుపోట్లనూ ఎదుర్కొని వైభవోపేతంగా నిలిచిన సోమనాథ్ కన్నా మిన్నగా మరేది దీన్ని వివరించగలదు? ఒక ఆశాగీతంవందల ఏళ్ల దాడులనూ, వలసవాద దోపిడీనీ తట్టుకొని నిలబడి... నేడు ప్రపంచ వృద్ధిలో అత్యంత ఆశాజనకమైన దేశంగా ఎదిగిన భారత ప్రగతిలోనూ ఇదే స్ఫూర్తి తొణికిసలాడుతోంది. నేడు భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందంటే... మన విలువలు, భారతీయుల దృఢ సంకల్పమే దానికి మూలం. ప్రపంచం ఆశతో, ఆశాభావంతో భారత్ను చూస్తోంది. సృజనాత్మకత నిండిన మన యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. మన కళ, సంస్కృతి, సంగీతం, పండుగలు ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతున్నాయి. యోగా, ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొన్ని అత్యంత తీవ్రమైన సవాళ్లకు భారత్ పరిష్కారాలను చూపుతోంది. అనాది కాలం నుంచి వివిధ వర్గాల ప్రజలను సోమనాథ్ ఏకం చేస్తోంది. శతాబ్దాల కిందటే పూజ్య జైన సన్యాసి కలికాల సర్వజ్ఞ హేమచంద్రాచార్యులు సోమనాథ్కు వచ్చారు. అక్కడ ప్రార్థన అనంతరం... ‘భవబీజాంకురజననా రాగాధ్యాః క్షయముపగతా యస్య’ అనే శ్లోకాన్ని ఆయన చెప్పాడంటారు. అంటే – ‘‘లౌకిక కర్మ బీజాలను నశింపజేసే వాడికీ... రాగద్వేషాలనూ, సమస్త క్లేశాలనూ తుడిచిపెట్టే వాడికీ వందనాలు’’ అని అర్థం. నేడు మన మనస్సులోనూ, ఆత్మలోనూ ఒక బలమైన చైతన్యాన్ని రగిలించే అద్భుత శక్తి సోమనాథ్కు ఉంది. 1026లో మొదటిసారి దాడి జరిగి వెయ్యేళ్లు గడిచినా... సోమనాథ్ వద్ద సాగరం నేటికీ అంతే గంభీరంగా గర్జిస్తోంది. సోమనాథ్ తీరాన్ని తాకే అలలు అద్భుతమైన కథను చెబుతున్నాయి. ఆటంకాలెన్ని ఎదురైనా... ఆ అలల మాదిరిగానే మళ్లీ సోమనాథ అభ్యుదయం తథ్యం. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసిన ధూళి కణాలయ్యారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయపదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాదసూచికలు మాత్రమే. సోమనాథ్ మాత్రం దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కుచెదరని ఆ అజేయమైన, చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.సోమనాథ్ ఒక ఆశా గీతం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు. కానీ సత్యమూ, ధర్మంపై అచంచలమైన విశ్వాసమూ అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ చాటుతోంది. వెయ్యేళ్ల కిందట దాడికి గురై, తర్వాత కూడా నిరంతర దాడులను ఎదుర్కొన్న సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ సగర్వంగా నిలిచినట్టే... మనం కూడా పరాయి దండయాత్రలకు ముందున్న, వెయ్యేళ్ల కిందటి మన దేశ మహా వైభవాన్ని పునరుద్ధరించుకుని తీరుతాం. శ్రీ సోమనాథ మహాదేవుడి ఆశీస్సులతో, వికసిత భారత నవ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాం. విశ్వ కల్యాణమే పరమావధిగా... మన నాగరికతా స్ఫూర్తి దిశానిర్దేశం చేస్తోంది. జై సోమనాథ్! నరేంద్ర మోదీభారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్టు చైర్మన్ -
బ్యాంకింగ్ వ్యవస్థకు ‘రెపో’ సవాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు గుండె కాయ వంటి బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఒక విలక్షణ మైన ‘రెపో’ సంక్షోభంలో చిక్కుకుంది. భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) అనుసరి స్తున్న ద్రవ్య విధానాలు ఒక వైపు రుణాల వృద్ధికి రెక్కలు ఇస్తుంటే, మరోవైపు డిపాజిట్ల సేకరణకు గడ్డుకాలం దాపురించేలా చేస్తున్నాయి. సాధా రణంగా వడ్డీ రేట్లు తగ్గితే ఆర్థిక కార్యకలాపాలు పుంజు కుంటాయి. అయితే అదే సమయంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు హరించుకుపోవడం ఇప్పుడు వ్యవస్థాగత స్థిరత్వానికి సవాలుగా మారింది.ప్రస్తుత బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, రుణాల విస్తరణకు, డిపాజిట్ల రాకకు మధ్య అగాథం స్పష్టంగా కనిపిస్తోంది. 2025 నవంబర్ నాటి గణాంకాల ప్రకారం, బ్యాంకుల రుణ వృద్ధి 11.42 శాతంగా నమోదు కాగా... డిపాజిట్ల వృద్ధి కేవలం 10.19 శాతా నికే పరిమితమైంది. ఈ 1.23 శాతం వ్యత్యాసం బేసిస్ పాయింట్ల లెక్కన చూస్తే 123 పాయింట్లు. 2024 అంతా నికి ఈ అంతరం కేవలం 0.58 శాతమే. అంటే ఏడాది కాలంలోనే నిధుల కొరత రెట్టింపు స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంకు రెపో రేటును 6.50 శాతం నుంచి 5.25 శాతానికి అంటే ఏకంగా 125 బేసిస్ పాయింట్లు తగ్గించడం వల్ల... అప్పులు చౌకయ్యాయి. అదుపు తప్పుతున్న క్రెడిట్–టు–డిపాజిట్ నిష్పత్తిఆర్బీఐ తాజా లెక్కల ప్రకారం, బ్యాంకులు పంపిణీ చేసిన మొత్తం రుణాలు సుమారు రూ. 194 లక్షల కోట్లు ఉంటే, డిపాజిట్లు రూ. 241 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్ –టు–డిపాజిట్ నిష్పత్తి సాధారణంగా 75 నుండి 80 శాతం మధ్య ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది 82 శాతానికి చేరింది. అంటే బ్యాంకులు సేకరిస్తున్న ప్రతి వంద రూపాయల్లో 82 రూపాయలను అప్పులుగా ఇచ్చేస్తు న్నాయి. మిగిలిన మొత్తంలో క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్ట్యాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) వంటి చట్టబద్ధ నిల్వలను పక్కన పెడితే, బ్యాంకుల వద్ద అత్యవసర ద్రవ్య లభ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది.బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గడానికి ప్రధాన కారణం సామాన్యుడికి దక్కే వడ్డీ ఆశించిన స్థాయిలో లేక పోవ డమే. ముఖ్యంగా స్థిర ఆదాయంపై ఆధారపడే సీని యర్ సిటిజన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాంకుల్లో దొరికే స్వల్ప వడ్డీ కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే మార్గాల వైపు ప్రజలు మళ్లుతున్నారు. మ్యూచు వల్ ఫండ్స్, షేర్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు నేడు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్య స్థానాలుగా మారాయి. ప్రభుత్వ చిన్న పొదుపు పథ కాలు సైతం బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. దీనికి తోడు పెరిగిన విని యోగ వ్యయం కారణంగా ప్రజల చేతుల్లో పొదుపు చేసేందుకు మిగులు ఆదాయం తగ్గడం కూడా బ్యాంకు లకు ప్రతిబంధకంగా మారింది. బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డీ పథకాలు, సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ, యాన్యుటీ స్కీమ్లు ప్రవేశపెడుతున్నప్పటికీ, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం ముందు ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.ద్రవ్య కొరత ప్రభావండిపాజిట్ల కొరత ఇలాగే కొనసాగితే బ్యాంకులు తమ ఆర్థిక అవసరాల కోసం బాండ్ మార్కెట్ లేదా అంతర్–బ్యాంక్ మార్కెట్ల నుంచి భారీ వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. రూపాంతర రహిత రుణపత్రాలు (నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్), మౌలిక సదుపాయాల బాండ్ల ద్వారా నిధులు సేకరించడం వల్ల బ్యాంకుల నిర్వహణ వ్యయం భారమవుతుంది. ఇది బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడమే కాకుండా, అంతిమంగా ఖాతాదారులపైనే ప్రభావం చూపుతుంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ పెంచితే, ఆటోమేటిక్గా రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగు తాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గృహ, వ్యక్తిగత రుణాలను భారం చేస్తుంది. పర్యవసానంగా కొత్త పెట్టుబడులు తగ్గి ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం పొంచి ఉంది. అలాగే నిధులు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి విపరీతంగా ప్రవహించి అక్కడ ‘ఆస్తి బుడగలు’ ఏర్పడే అవకాశం ఉంది. ఇది విదేశీ పెట్టుబడులు తరలిపోవడానికీ, రూపాయి విలువ పడిపోవడానికీ దారితీయవచ్చు.బ్యాంకుల్లో నిధులు తగ్గడానికి కేవలం వడ్డీ రేట్లే కారణం కాదు, వ్యవస్థపై నెలకొన్న అభద్రతా భావం కూడా ఒక ముఖ్య కారణం. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ శక్తులు దాదాపు రూ. 1.70 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ఎగ్గొట్టాయి. సైబర్ నేరగాళ్లు సామా న్యుల ఖాతాలను ఖాళీ చేస్తూ స్వైరవిహారం చేస్తున్నారు. లక్షల ఖాతాల నుంచి వేల కోట్ల రూపాయలు మాయమవుతుండటంతో హడలిపోతున్న పొదుపుదారులు బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి వెనుకాడుతున్నారు. పరిష్కారం దిశగా అడుగులుప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ సమగ్ర వ్యూహంతో ముందుకు రావాలి. కేవలం రెపో రేట్ల మార్పులతోనే సరిపెట్టకుండా, డిపాజిట్ల వృద్ధిని ప్రోత్సహించేలా పన్ను రాయి తీలు లేదా ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. రుణ ఎగవేతదారులు, సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసు కున్నప్పుడే ప్రజల్లో బ్యాంకులపై భరోసా కలుగుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకింగ్ స్థిరత్వం, తక్కువ వడ్డీకి రుణ లభ్యత అనే మూడు అంశాల మధ్య సమ తుల్యత సాధించడం దేశ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత కీలకం. బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలు, డిపాజిట్లు అనేవి ఒకే బండికి ఉన్న రెండు చక్రాల వంటివి. ఒక చక్రం తిరుగుతూ రెండో చక్రం మొరాయిస్తే ఆ బండి గమ్యాన్ని చేరడం అటుంచి, ప్రమాదంలో పడుతుంది.బోగా దీపికవ్యాసకర్త పరిశోధకురాలు -
జోహ్రాన్ మమ్దానీ (న్యూయార్క్ మేయర్) రాయని డైరీ
నీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారన్నది నీ బలాన్ని తెలుపుతుంది. నువ్వు ఎవరి పక్కన నిలబడి ఉంటున్నావన్నది వారి పట్ల నీలోని బలమైన ఆపేక్షను చూపుతుంది.నేను, న్యూయార్క్ సిటీ... నా బాల్య మిత్రులం. ఎప్పటికీ ఒకరి పక్కన ఒకరం నిలబడి ఉండేవాళ్లం.హడ్సన్ నది ఒడ్డున , న్యూయార్క్ సిటీ నా భుజం పైన చెయ్యేసి నడుస్తుంది. నాకెంతో ఇష్టమైన గోధుమ పిండి ‘బురిటో’ను క్వీన్స్ – బ్రూక్లిన్ స్టేషన్ల మధ్య తిరుగుతుండే ‘క్యూ’ ట్రైన్లో తనతో ఇష్టంగా పంచుకోనిస్తుంది. వలస వచ్చిన వారిని కలవనివ్వటం అంటే, రమ్మని పిలిచి కలవటం కాదు. రావచ్చా అని అడిగి వెళ్లి కలవటం. న్యూయార్క్ మర్యాదగల మనిషి. మానవ మర్యాదల కోసం చూడని నగరం. ఇలాగే కదా నాగరికత ఉండాల్సింది! జనవరి 1 అర్ధరాత్రి... కొత్త ప్రయాణికుడిలా ఓల్డ్ సిటీ హాల్ సబ్వే స్టేషన్లో దిగాన్నేను. లగేజ్ లేదు. లగేజ్లు మోయటానికి వచ్చినవాడి దగ్గర లగేజ్ ఎందుకు ఉంటుంది?‘‘ఎవరతను, ఈ టైమ్లో దిగాడు?’’‘‘న్యూయార్క్ సిటీ కొత్త మేయర్!’’‘‘అది తెలుసు. ఎవరతను?’’‘‘డెమోక్రాటిక్ సోషలిస్ట్!’’‘‘అదీ తెలుసు. ఎవరతను?’’‘‘ఒక యువకుడు!’’‘అది తెలుస్తూనే ఉంది. ఎవరతను?’’‘‘వలస వచ్చినవాడు’’ ‘‘అది కూడా తెలుసు. ఎవరతను?’’‘‘ఒక ముస్లిం’’ ‘‘ఓరి దేవుడా! న్యూయార్క్ సిటీ ఒక ముస్లింని, ఒక వలస మనిషిని, ఒక డెమోక్రాటిక్ సోషలిస్ట్ని, ఒక అనుభవం లేని వాడిని తన మేయర్గా ఎన్నుకుందా? ఏం కర్మ ఈ 400 ఏళ్ల మహా నగరానికి?!’’నాతో తలపడి నన్ను గెలిపించిన ఆండ్రూ క్యూమో, కర్టిస్ స్లివా, ఎరిక్ ఆడమ్స్ ఆత్మలు సబ్వేలో బాధతో మూలుగుతున్నట్లుగా అనిపించింది!ఇందులో దేనికి నేను క్షమాపణలు చెప్పి ఈ ఆత్మల ఘోషను చల్లార్చాలి? వలస వచ్చినందుకా? ముస్లింని అయినందుకా? యువకుడిని అయినందుకా? డెమోక్రాటిక్ సోషలిస్టును అయినందుకా?... లేక, ఇవన్నీ అయి కూడా, న్యూయార్క్ సిటీ మేయర్గా ఓడిపోనే పోనందుకా?!న్యూయార్క్ వలసల నగరం. వలసలు నిర్మించిన నగరం. వలసల శ్రమతో నడిచే నగరం. ఇక నుంచి ఒక వలసదారుడు నడిపే నగరం కూడా.ఈ మూడు పరాజిత ఆత్మలు నాతో పాటుగా రోజూ సిటీ హాల్లోని మేయర్ ఆఫీస్కి వచ్చి, డ్యూటీ చేసి వెళుతుంటాయా? వెంటాడే వాళ్లు, వేటాడేవాళ్లు ఎక్కడికైనా వస్తారు!ఇకపై వాషింగ్టన్ నుంచి వచ్చిన వారెవరైనా న్యూయార్క్ సిటీలోని ఒక వలసదారుడిని తాకాలంటే, ముందుగా జోహ్రాన్ మమ్దానీ అనే ఈ కొత్త న్యూయార్క్ మేయర్ను దాటే వెళ్లాలి.కర్టిస్ స్లివా వ్యథాత్మ అసహనంగా అంటోంది: ‘‘జోహ్రాన్, నువ్వు ఎవరివైనా, ఎక్కడి నుంచి వచ్చినా... ప్రమాదకారివి అవటం మాత్రం మొదట నువ్వు డెమోక్రాటిక్ సోషలిస్ట్వి అయినందువల్లనే...’’నవ్వొస్తోంది నాకు. మనిషన్న వారెవరైనా డెమోక్రాటిక్ సోషలిస్ట్ అవకుండా ఉండగలరా? కర్టిస్ రిపబ్లికన్. మేయర్ ఎన్నికల్లో 7 శాతం ఓట్లు గెలుచుకున్న కర్టిస్ కానీ; 41 శాతం ఓట్లు సాధించిన ఆండ్రూ క్యూమో కానీ; పాయింట్ 3 శాతం ఓట్లు పొందిన ఎరిక్ ఆడమ్స్ కానీ, వ్యక్తులుగా డెమోక్రాటిక్ సోషలిస్ట్లు కాకుండా పోతారా?!డెమోక్రాటిక్ సోషలిస్ట్గానే నేను ఎన్నికయ్యాను. డెమోక్రాటిక్ సోషలిస్టుగానే న్యూయార్క్ సిటీని నడిపిస్తాను. ఆ నడక నాకు న్యూయార్క్ సిటీ నేర్పిందే! -
ఆస్క్ మీ... ఏనుగంత టాస్క్
ఓపెన్ ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే చిన్న చిన్న సమస్యల్ని కాకుండా, పరిష్కారానికి అత్యంత కష్టంగా ఉండేవాటిని ఎంచుకోవాలని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టుగెదర్ ఫండ్’ కో–ఫౌండర్ మానవ్ గార్గ్ అంటు న్నారు. ఏఐ రంగంలో స్టార్టప్ పెట్టుబడుల వేటలో ఉన్నవారు తమ విజన్ ప్రపంచాన్ని ఎలా మెరుగుపరచ గలదో స్పష్టంగా చెప్పలేకపోతే వెంచర్ క్యాపిటలిస్టు లను ఒప్పించటం చాలా కష్టం అని గార్గ్ సూచిస్తు న్నారు. ఆయన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:వస్తున్నది 100... పోతున్నది 110‘‘ప్రస్తుతం దాదాపు అన్ని ఏఐ స్టార్టప్ కంపెనీలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. దీనర్థం ఏమిటంటే, మాకు వంద రూపాయల ఆదాయం వస్తే... కేవలం టెక్నాలజీ, కంప్యూటర్ సర్వర్ల కోసమే 110 రూపాయలు ఖర్చు అవుతోంది. ఇక మార్కెటింగ్, ఉద్యోగుల జీతాల ఖర్చులు దీనికి అదనం. అలాగని ఇది తెలివి తక్కువ తనం కాదు, ఇదొక వ్యూహం. టెక్నాలజీ ఖర్చులు రాను రానూ వేగంగా తగ్గిపోతాయి కాబట్టి, ఇప్పుడు నష్ట మైనా సరే ఎక్కువ మంది వినియోగదారులను, డేటాను సంపాదించుకునే కంపెనీలే భవిష్యత్తులో లాభాలు వచ్చినప్పుడు మార్కెట్ను ఏలుతాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఖర్చు‘‘ఓపెన్–ఏఐ’ సంస్థ వేల కోట్లు నష్టపోతోందని వినిపి స్తోంది. వారు సుమారు 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడబోతున్నారని అంచనా. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నష్టంలో కేవలం 20 శాతం మాత్రమే కొత్త ఏఐ మోడల్స్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు వల్ల వస్తుంది. అసలైన భారీ ఖర్చంతా– దాదాపు 70 శాతం – ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. పెద్ద ఎత్తున డేటాసెంటర్ల నిర్మాణం, ఎంత వ్యయమైనా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనడం, కరెంట్ బిల్లుల చెల్లింపు వంటివి. గూగుల్ సంస్థలా సొంతంగా చిప్స్ తయారీ, సొంత డేటా సెంటర్లు ఏర్పాటు, ప్రత్యేక విద్యుత్ఒప్పందాలు ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఏఐ వ్యాపారాన్ని లాభదాయకంగా నడపడం సాధ్య మవుతుంది.యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు!‘‘మనం ఇప్పుడు వాడుతున్న సాధారణ యాప్స్ భవి ష్యత్తులో మెల్లగా మరుగునపడిపోతాయి. రాబోయే కాల మంతా ‘ఏఐ ఏజెంట్’ (ఒక పర్సనల్ అసిస్టెంట్ లాంటి సాఫ్ట్వేర్)లదే. మనం గంటల కొద్దీ బ్రౌజింగ్ చేయటం ఉండదు. ఈ ఏఐ ఏజెంట్లకు మీ ఇష్టానిష్టాలు తెలు స్తాయి. మీ తరఫున అవి పనులు చేస్తాయి. మీ క్యాలెండర్ లేదా మీరు ధరించే వాచీలు వగైరాల నుంచి సమా చారాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు మీకు సాయపడ తాయి. ఒక్కసారి ఊహించండి:నా పర్సనల్ ఏఐఏజెంట్ నేరుగా అమ్మకాలు జరిపేవారి ఏఐ ఏజెంట్తో మాట్లాడుతుంది. నా బడ్జెట్ ప్రకారం బేరమాడుతుంది, నా ఆరోగ్యానికి తగిన, నా సమయానికి అనుకూలమైన వస్తువును ఎంచుకుంటుంది. ఆపై నేరుగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇదంతా నేను ఒక్క వెబ్సైట్ కూడా ఓపెన్ చేయకుండానే జరిగి పోతుంది.కొత్తవాటిపై కసరత్తు చేయాలి!‘‘మీరు ఏఐ రంగంలో విజేతగా నిలవాలంటే, అందరికీ తెలిసిన చిన్న చిన్న సమస్యలు కాకుండా, పరిష్కరించ డానికి కష్టంగా ఉండే కొత్త సమస్యలను ఎంచుకోవాలి. అప్పుడే మీ పోటీదారులు మిమ్మల్ని త్వరగా కాపీ కొట్ట లేరు. మీ దగ్గర ఉన్న ప్రత్యేకమైన డేటా ఆధారంగా ఇతరులు సులభంగా తయారు చేయలేని విధంగా మీ వ్యాపారాన్ని నిర్మించుకోవాలి. ఏఐ రేసులో భారతదేశం శక్తిని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఓపెన్–ఏఐ’ని ఎక్కువగా వాడు తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దగ్గర అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు. అంతేకాకుండా, ఇక్కడ చాలా రకాల వ్యాపారాలు ఇంగ్లిష్లోనే జరుగు తాయి కాబట్టి, భారతీయ కంపెనీలు మొదటి రోజు నుండే ప్రపంచ స్థాయిలో కొత్త ఏఐ ఉత్పత్తులను తయారు చేసే గొప్ప అవకాశం ఉంది.-ఎడిటోరియల్ టీమ్ -
ఏఐలో మనమేం చేయాలి?
‘డీప్సీక్’ గుర్తుందా? గడచిన 2025 మొదట్లో ఈ చైనీస్ కంపెనీ కృత్రిమ మేధ రంగాన్ని కుదిపేసింది. తక్కువ ఖర్చుతో అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన ‘ఛాట్ జీపీటీ’ని తలదన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. కృత్రిమ మేధలో చైనా ఎంత ముందుందో ప్రపంచానికి చాటిన సందర్భం ఇది. తాజాగా అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ సైతం ‘డీప్సీక్’ ప్రాముఖ్యన్ని గుర్తించింది. కంపెనీ వ్యవస్థాపకుడు లియంగ్ వెన్ఫెంగ్ను గతేడాది టాప్ వ్యక్తుల్లో ఒకరిగా నిలిపింది. ఒకే ఏడాదిలో డీప్సీక్ తాలూకూ జనరల్ పర్పస్ వీ–3 మోడల్ విప్లవాత్మకమైన మార్పునకు కారణమైంది. దీంట్లోని అడ్వాన్స్డ్ మోడల్ ఆర్–1 తర్కానికి సంబంధించినది. ఫలితంగా ఇది గణిత, సాఫ్ట్వేర్ కోడింగులకు సంబంధించిన సంక్లిష్టమైన విషయాలను కూడా మెరుగ్గా చేపట్టగలదు. పైగా ఇది ఓపెన్ మోడల్. అంటే ఎవరైనా స్వేచ్ఛగా దీన్ని వేర్వేరు రంగాల్లో ఉపయోగించుకోవచ్చు. లాంగ్వేజ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వాలంటే అపారమైన సమాచారం అవసరం. ఎంత సమాచారంతో శిక్షణ ఇస్తే అంత మెరుగైన ఫలి తాలు రాబట్టుకోవచ్చు. గతేడాది చైనీస్ ఏఐ మోడళ్లు మార్కెట్లో అన్నింటి కంటే ముందున్నట్లు ఒక సర్వే ద్వారా తెలిసింది. అంత ర్జాతీయంగా 33 శాతం మంది వీటిని వాడుతున్నట్లు అంచనా.ఇంగ్లీషు తరువాత అత్యధిక సంఖ్యలో టోకెన్లు అడిగింది కూడా చైనీస్ భాషలోనే కావడం గమనార్హం. చైనాతోపాటు అంతర్జాతీయంగానూ చైనా మోడళ్లు బాగా పనిచేస్తున్నాయనేందుకు ఇవి నిదర్శ నాలు. శిక్షణ సమయంలో ఏఐ మోడళ్లు ప్రాసెస్ చేసి అర్థం చేసు కోవడం ద్వారా అంచనా కట్టే, తర్కాన్ని అభివృద్ధి చేసుకునే యూనిట్లనే ‘టోకెన్లు’ అని పిలుస్తారు. ఏఐలో స్వావలంబన కోసం...డీప్సీక్ ప్రకటన వెలువడిన వెంటనే భారత్ కూడా ఎల్ఎల్ఎంలతో పాటు స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రాథమిక ఏఐ మోడళ్ల అభి వృద్ధి గురించి వివరాలు వెల్లడించింది. భారతీయ అవసరాలకు తగ్గట్టుగా ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా భాషిణి’ (భారతీయ భాషలను అను వదించేది), ‘భారత్ జెన్’ (ప్రభుత్వ సేవలను అందించే మల్టీ మోడల్ ఎల్ఎల్ఎం), పదివరకూ భారతీయ భాషల ఏఐ ఎల్ఎల్ఎం మోడల్గా ‘సర్వం–1’, వీడియోలను సృష్టించే ‘చిత్ర లేఖ’, 35 వరకూ భారతీయ భాషలకు ‘హనూమాన్ ఎవరెస్ట్ 1.0’ పేరుతో ఓ ఏఐ వ్యవస్థ వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ‘భారత్ జెన్’ అభివృద్ధికి పలు టెక్నాలజీ విద్యా సంస్థలు చేతులు కలిపాయి.కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కొన్ని నిధులు సమకూర్చాయి. జాతీయ ఏఐ మిషన్ కింద మరో రూ. 980 కోట్లు కూడా కేటాయించారు. ఈ రకమైన మద్దతు లభించిన, ఒక దేశ లక్ష్యం కోసం ఏర్పాటైన మొట్టమొదటి ప్రాజెక్టు భారత్ జెన్ మాత్రమే అయివుంటుంది.భారత్ జెన్ను చాలామంది డీప్సీక్కు పోటీ అనుకుంటారు. కానీ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. డీప్సీక్ పూర్తిగా వాణిజ్యపరమైంది. స్టార్టప్ మాదిరిగా మొదలైంది.భారత్ జెన్... వ్యూహాత్మకమైన జాతీయ మిషన్. సాంకేతిక రంగం విషయంలో స్వావలంబన కోసం ప్రభుత్వ మద్దతుతో మొదలైన ప్రాజెక్టు. డీప్ సీక్, ఛాట్జీపీటీల ముందున్న అతి పెద్ద సవాలు... సంక్లిష్టమైన భారతీయ భాషలను, సంస్కృతులను అర్థం చేసుకోవడం. ఈ అంత రాన్ని ‘భారత్ జెన్’ పూడ్చగలదని అంచనా. 1970, 80లలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సీఎంసీ, సీ–డాట్ కంపెనీల మాదిరిదే ఈ భారత్ జెన్. సీఎంసీ, సీ–డాట్లను దేశీ స్వావలంబన, ఆత్మనిర్భరత లక్ష్యాలతోనే ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం కావడం వెనుక ఐఐటీలు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వంటిసంస్థలు కూడా ఉన్నాయి. అవసరమైన మార్గదర్శకాలుఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, భారతీయ టెక్ కంపె నీలేవీ ఏఐ ఫౌండేషనల్ మోడళ్లను అభివృద్ధి చేయకపోవడం. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఏఐ వ్యవస్థలకు అవసరమైన డేటా సెంటర్ల వంటి మౌలిక సదుపా యాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. భార తీయ టెక్ పరిశ్రమ మొత్తం సేవా రంగం ప్రధానంగానే నడుస్తోంది. సుమారు 200 బిలియన్ డాలర్ల ఆదాయమున్న ఈ రంగం ఏఐ విషయంలో ప్రేక్షక పాత్ర వహించడం అభిలషణీయం కాదు. నైపుణ్యం, అనుభవం, ఆర్థిక శక్తి కూడా కలిగిన భారతీయ టెక్ రంగం భారత్ జెన్ వంటి వాటి అభివృద్ధికి భాగస్వాములు కావాల్సిన అవసరముంది.ప్రభుత్వ సహకారం లేదు కానీ డీప్సీక్ అభివృద్ధి చేసిన మోడళ్లు చైనా ప్రభుత్వ పర్యవేక్షణకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుత చైనా నియంత్రణల ప్రకారం... అన్ని ఏఐ సేవలు కూడా సోషలిస్ట్ విలువలను పాటించాలి. జాతీయ ఏకతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. అందుకే తియనాన్మెన్ స్క్వేర్ నిరస నలు, తైవాన్ పరిస్థితి, చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంపై వస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదుల వంటి అంశాలపై ఈ మోడళ్లు కిమ్మనవు.బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి అన్న నినాదంతో మార్గదర్శ కాలను ప్రభుత్వం విడుదల చేసింది. పారదర్శకత, జవాబుదారీ తనం, భద్రత, మానవ పర్యవేక్షణల ప్రాముఖ>్యన్ని, అవసరాన్ని ఈ మార్గదర్శకాలు నొక్కి చెప్పాయి.ప్రభుత్వ సహకారంతో నడుస్తోంది కాబట్టి, అటు ఈ మద్దతును కొనసాగించడం... ఇటు ప్రజా సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకోవడం భారత్ జెన్కు కీలకం. పాశ్చాత్య దేశాల ఏఐ మోడళ్లలో మాదిరి అల్గరిథవ్ుల పరమైన వివక్ష భారత్ జెన్లో ఉండకూడదు. రాజకీయ ప్రభావానికి గురిచేసేలా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మొత్తం సామాన్యుల పన్నుల డబ్బుతోనే నడుస్తోంది. వేర్వేరు భాషలకు సంబంధించిన ఎల్ఎల్ఎంలను అభివృద్ధి చేసే సందర్భంలోనూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్ద పీట వేయాలి. భాషా శాస్త్రవేత్తలు, సోషల్ సైంటిస్టులు, వేర్వేరురంగాల నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరిపి అభివృద్ధి చేస్తేనే ఈ లక్ష్యం నెరవేరుతుందన్నది గుర్తుంచుకోవాలి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మెరుగయ్యామా?
ఒక దేశం గడిచిపోయిన సంవత్సరాన్ని వెనుకకు తిరిగి సమీక్షించుకోవట మంటే, ఆ సంవత్సరంలోని పరిణామాలను తారీఖులు, దస్తావేజుల పద్ధతిలో నెమరు వేసుకోవటం కాదు. అంతకుముందటి సంవత్సరంతో పోల్చినప్పుడు ఏమైనా మెరుగుపడిందా అని సరిచూసుకోవటం. రాజకీయంగా, పరిపాలనాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, వాటితో పాటు బయటి దేశాలతో సంబంధాల రీత్యా! వీటికి సంబంధించిన అంశాలు అన్నింటికి అన్నీ మెరుగుపడి ఉండకపోవచ్చు. అది సాధ్యం కూడా కాదు. కొన్ని ఒడుదొడుకులు తప్పవు. కానీ, మొత్తం మీద సారాంశం ఏమిటన్న దానిని బట్టే ఒక దేశం ముందుకు పోవటం ఆధారపడి ఉంటుంది.పైన పేర్కొన్న అయిదు ప్రధాన రంగాలకు సంబంధించి, గడిచిపోయిన 2025వ సంవత్సరంలో అనేకానేకం జరిగాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రం పేర్కొని ఆ ప్రభావాలను అంచనా వేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యమైనవి అనే మాటను ముందు నిర్వచించుకోవాలి. కొన్నింటికి తక్షణ ప్రాముఖ్యం ఉండి క్రమంగా తేలిపోతాయి. కొన్నింటికి తదనంతర కాలంలోనూ ప్రభావాలు కొనసాగుతాయి. ఇక్కడ చూసేందుకు ప్రయత్నిస్తున్నది ఈ రెండో తరహా వాటి గురించి.బలపడిన బీజేపీముందుగా రాజకీయాలను గమనిస్తే, 2025వ సంవత్సరం వచ్చే వేళకు దేశం ముందుండిన ప్రధానమైన ప్రశ్న, 2024లో వరుసగా కేంద్రంలో, రాష్ట్రాలలో పరాజయాల పాలైన ప్రతిపక్షాలు ఇప్పటికైనా కూడదీసుకోగలవా అన్నది. కాంగ్రెస్ను, దాని నాయకత్వాన గల యూపీఏను 2014లో వెనుకకు తోసిన బీజేపీ, క్రమంగా ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరుస్తున్న క్రమం 2025లో, ఆ తర్వాత 2026లో ఆగగలదా? కాంగ్రెస్, దాని కూటమి పార్టీలు కలిసి 2027 కల్లా పుంజుకుని బీజేపీకి నిజమైన సవాలుగా నిలవగలవా అన్నది పెద్ద ప్రశ్న అయింది. అసెంబ్లీ ఎన్నికలు 2025లో జరిగిన ఢిల్లీ, బిహార్, 2026లో జరగనున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కలిపి మొత్తం ఆరు రాష్ట్రాలు. వీటిలో ప్రతిపక్ష రాష్ట్రం ఢిల్లీని బీజేపీ ఇప్పటికే గెలుచుకోగా, ప్రతిపక్షం ఎన్నో ఆశలు పెట్టు కున్న బిహార్, అంతకుముందటి కన్న భారీ ఆధిక్య తతో బీజేపీ వశమైంది. 2026లో జరిగే అస్సాంపై ప్రతిపక్షాలకు, కేరళపై బీజేపీకి అంచనాలు లేక పోవచ్చు గానీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు కోసం ఆ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తున్నది. 2025 చివరన నికరంగా కనిపిస్తున్నదేమంటే, బీజేపీ 2024 కన్న ఇప్పుడు మరింత బలపడి, 2026లో ఇంకా బలపడే సూచనలు కనిపిస్తుండగా, ప్రతిపక్షాల పరిస్థితి అందుకు విరుద్ధ దిశలో సాగుతున్నది.ఆర్థికం యథాతథందేశం ఆర్థికంగా 2025లో మెరుగుపడిందా, క్షీణించిందా అన్న ప్రశ్నపై తీవ్రమైన చర్చలు సాగు తున్నాయి. అవి స్థూలంగా చూసినపుడు ఉత్తర – దక్షిణ ధ్రువాలన్నంత భిన్నంగా ఉన్నాయి. వాస్తవా నికి ఆర్థిక రంగం 2024తో పోల్చినప్పుడు కొద్దిపాటి తేడాలతో యథావిధిగానే సాగుతున్నది తప్ప భారీ మార్పులంటూ కనిపించవు. ఉత్పాదక రంగం, వాణిజ్యం, ఆదాయాలు, ధనిక పేద తారతమ్యాల పెరుగుదల, అదే సమయంలో మధ్యతరగతి పెరుగు దల, అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆర్థిక – వాణిజ్య సవాళ్లు, రూపాయి విలువ ఆగకుండా పతనమవుతుండటం, వాణిజ్య లోటు పెరుగుతూనే ఉండటం, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగు దల, వ్యవసాయ రంగ సమస్యలు అన్నింటిదీ 2024 నాటి పరిస్థితే. అదే సమయంలో మరొకవైపు, పలు విధాలైన సక్రమ, అక్రమ రాయితీలతో కొందరి సంపదలు కొండలవలె పెరగటం కూడా 2025లో కొనసాగింది. మరొకవైపు వివిధ అంతర్జాతీయ సూచీలలో ఎందులోనూ భారతదేశపు ర్యాంకింగులు మెరుగుపడలేదు.ఆర్థిక రంగానికి సంబంధించి 2025వ సంవత్సరపు రెండు గమనార్హమైన విషయాలున్నాయి. ఒకటి – అమెరికా విధించిన భారీ సుంకాలు, ఇండియాను లొంగదీసేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వాణిజ్య ఒప్పందం. రెండవది – అమెరికా ఒత్తిడిని సరకు చేయకుండా భారత ప్రభుత్వం ‘బ్రిక్స్’లో కొనసాగుతూ ఆ వ్యవస్థను శక్తిమంతం చేస్తుండటం. ఇవిగాక, అమెరికా కూటమి నుంచి వైవిధ్యంకోసం పలు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని మోదీ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధమైన పరిస్థితులు, పరిణామాలు 1991 నాటి ఆర్థిక సంస్కరణల సమయం నుంచి ఇదే మొదటిసారి. 2025లో ఎదురైన ఈ సవాళ్ల వంటివి లోగడ లేవు. వీటిని సానుకూలంగా ఎదుర్కొనగలగటంపై వర్తమానంతోపాటు దీర్ఘకాలిక భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. దెబ్బతిన్న సంబంధాలుబయటి ప్రపంచంతో ఆర్థిక సంబంధాల పరిస్థితి ఇది కాగా, రాజకీయ సంబంధాలు మాత్రం సంతోషకరంగా సాగలేదు. పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్తో సంబంధాల క్షీణత, శ్రీలంకతో సత్సంబంధాల కోసం పడుతున్న శ్రమ ఇందుకు తార్కాణం. చైనా, రష్యాలకు, ఇండియాకు మధ్య సంబంధాల అభివృద్ధి ముఖ్యంగా అమెరికా తీరు కారణంగా ముగ్గురికీ అవసరమనే గుర్తింపు గతంలో కన్న ఎక్కువగా ఏర్పడటం, అందుకు తగిన వ్యవహరణ అన్నది 2025లో కనిపించిన కొత్త విశేషం. చివరగా సమాజం విషయానికి వస్తే, యథాతథంగానే పెరుగుతున్న ఆర్థిక అసంతృప్తికి తోడు, ఒకవైపు అల్పసంఖ్యాక వర్గాలు, మరొకవైపు దళితుల భద్రత 2024 కన్న స్పష్టమైన రీతిలో మరింత క్షీణించింది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పాలకుల ‘బంగారు’ పిచ్చి
ప్రజా పథకాల అమలులో చిత్తశుద్ధి ముఖ్యం గానీ, పేరు మార్పుతో ప్రజలకు ఒరిగేదేముంది? కేంద్రంలో ఎన్డీయే సర్కారు ‘మహాత్మాగాంధీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాక విధానాలనూ మార్చి కొత్త పథకం తెస్తోంది. పాలన వికేంద్రీకరణకు ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వ్యవస్థ పేరు మార్పునకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అమలు అధోగతి పాలై, వ్యవస్థ కుప్పకూలుతుంటే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా చట్టం ద్వారా పథకం పేరు మార్చే క్రమంలో ఆర్డినెన్స్ తేవడానికి రాష్ట్ర మంత్రివర్గం సిద్ధమైంది. కొత్త పేరు ‘స్వర్ణ గ్రామం’ ‘స్వర్ణ వార్డు’ అట! ఈ ‘స్వర్ణం’ పిచ్చి ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త కాదు. పాతికేళ్ల కింద ‘స్వర్ణాంధ్ర’ రాగాలు పాడారు. బంగారం ధరలు సామాన్యులకు అందనంత పైపైకి వెళుతుంటే, జనానికి చేరువగా పాలనను తెచ్చే పథకాలకు ఈ ‘బంగారం’ పేర్లేంటో అర్థమే కాదు!ప్రభుత్వ పాలనను పౌరులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో వికేంద్రీకృత ‘సచివాలయ’ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో 2019లో తీసుకు వచ్చారు. ఇందులో భాగంగా ఏర్పడ్డవే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు. పౌరులకు పెన్షన్ వంటి వ్యక్తిగత లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు రెవెన్యూ, విద్య, వైద్యం, విద్యుత్తు, వ్యవసాయం, పశుపోషణ, మహిళా భద్రత వంటి వివిధ విభాగాల సేవల్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయాల్ని ఏర్పరచి, అందులో పది మందికి పైగా ఉద్యోగుల్ని నియమించి ఈ వికేంద్రీకరణ చేపట్టారు. ముందు కన్సాలిడేటెడ్ వేతనాలపై పనిచేసిన ఈ సిబ్బంది ఇప్పుడు పూర్తిస్థాయి స్కేల్–జీత భత్యాలు పొందుతున్నారు. దీనికి తోడు సగటున ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున ‘స్వచ్ఛంద సేవకుల’ను నియమించి, వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం నడిపింది. వాలంటీర్లకు నెలనెలా అయిదువేల రూపాయల గౌరవ భృతి ఇచ్చేది. సచివాలయానికి, గ్రామస్థులు/వార్డు పౌరులకు మధ్య సంధానకర్తగా ఉండే ఈ వాలంటీర్లు పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అప్పగించడం నుంచి పలు సేవలు అందించేది. కుల, జన్మ, మరణ ధ్రువపత్రాలను ఇప్పించడం, వేర్వేరు సేవలకు సంబంధించిన దరఖాస్తుల్ని సచివా లయం ద్వారా సంబంధిత శాఖా కార్యాలయాలకు చేర్చడం, సర్కారు స్పందనల్ని, పరిష్కారాల్ని పౌరులకు అందించడం వరకు వారికి సహాయకారులుగా ఉండేది. కొత్త ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ రద్దయింది. మొదట మొత్తంగా 15,000 పై చిలుకు సచివాలయాలు ఏర్ప డగా 1.34 లక్షల ఉద్యోగులు, 2.52 లక్షల వాలంటీర్లు ఇందుకోసం నియమితులయ్యారు. 35 విభాగాలకు చెందిన 500 సేవలు సకాలంలో, సజావుగా ప్రజలకు అందాలని, ఏ అంశమైనా గరిష్ఠంగా 72 గంటల్లో పరిష్కారమవ్వాలని ఉద్దేశించారు. అసలీ వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే దిశలో సాగుతోంది. ఏపీ మంత్రివర్గంలోని ఒకరు ప్రైవేటు సంభాషణలో అన్నట్టు ‘ఆకాశాన్నంటుతున్న ధరలతో ఒక బంగారు చెవిపోగు కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ స్వర్ణ గ్రామమేంటో, స్వర్ణ వార్డేంటో!’ అనే భావన అక్షర సత్యం. ఏపీ సీఎం చంద్రబాబు తొలిదఫా ముఖ్యమంత్రి అయిన కాలంలో ‘స్వర్ణాంధ్ర’ కలలు కనేది! అదే క్రమంలో ‘విజన్ 2020’ విధాన పత్రాన్ని ప్రకటిస్తే నాటి విపక్ష నేత డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి దాన్నొక ‘దశాబ్ది ఉత్తమ కాల్పనిక పత్రం’గా విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ‘విజన్–2047’ అంటూ రెండు దశాబ్దాల కలల్ని ఇప్పట్నుంచే ఆమ్మ జూపుతున్నాయి. తక్షణ ఆచరణలో నిబద్ధత, చిత్తశుద్ధి లేకుండా సుదూర భవిష్యత్తుకు గేలాలు వేయడం, ‘బంగారు తాపడం’ పూయడం మాయ కాక మరేమవుతుంది? తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి పదేళ్లు పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘బంగారు తెలంగాణ’ నినాదం కూడా విమర్శలను ఎదుర్కొంది. చేసేందుకు ఎంతో ఉంది!ఏపీలో పదిహేను వేల వరకున్న గ్రామ వార్డు సచివాలయాల్లో కనీసం రోజూ ఆఫీస్ ఊడ్చేవారు లేరు. అందుకవసరమైన వ్యవస్థే లేదు. ఏమంటే ‘ఇందుకోసం నిధులు లేవు, జీరో బడ్జెట్’ అని నోడల్ అధికారిగా ఉన్న ఒక డిప్యూటీ ఎంపీడీవోనే చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద లక్ష్యాలతో వస్తే మొదట వాలంటీర్లతో చేయించిన పనులు ఇప్పుడు తమతో చేయిస్తున్నారనే ఆవేదన, తమ సేవలకు తగిన గుర్తింపు దక్కడం లేదనే ఆక్రోశం మెజారిటీ సచివాలయ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.‘సచివాలయ వ్యవస్థ’ తాజా స్థితిపై రాష్ట్రవ్యాప్త అధ్యయనం చేపట్టిన ‘పీపుల్స్ పల్స్’ రిసెర్చ్ సంస్థ పరిశీలనకు వస్తున్న అంశాలు ఆసక్తికరంగానే కాదు, ఒకింత ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. పెద్దమొత్తంలో ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఇలాగే నడిపిస్తే సమీప కాలంలోనే కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థ సమర్థ నిర్వహణకు సరైన నిఘా, నియంత్రణ, అజమాయిషీ తక్షణావసరమని సర్వేలో వెల్లడవుతున్న అభిప్రాయం. ఈ అధ్యయనం జరుగుతున్న సమ యంలోనే ‘పేరు మార్పు’ మంత్రివర్గ నిర్ణయం వెలువడింది. అవస రానికి మించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారనేది ఒక విమర్శ. అందుకే, ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధం చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఇదివరకున్నట్టు అన్ని సచివా లయాల్లో 11 మంది కాకుండా, జనాభాను బట్టి 6, 7, 8 మంది సిబ్బందితో సరిపెట్టడం, ఆ మేర సర్దుబాటు చేయడం అనే ప్రక్రియ మొదలైంది. కానీ అది సవ్యంగా జరగటం లేదు. దాన్ని సరిగా జరిపించి, ఆశించిన లక్ష్యం మేరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో, సులభంగా అందేట్టు చూడాలి. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసే దిశలో ఇదొక మార్గం కావాలి. ప్రభుత్వం నిరంతర ప్రక్రియపాలనలోకి రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రభుత్వమన్నది నిరంతరంగా ఉండే ఒక బాధ్యత, అంతకు మించి జవాబుదారీతనం! నిన్నటి ప్రభుత్వ విధానాలను, పేర్లను నేడు గౌరవించక, గుడ్డిగా మార్చేసే వారికి రెండు, మూడు దశాబ్దాల ‘విజన్ ’ పేరిట కార్యక్రమాలు మొదలెట్టే నైతిక హక్కు ఏముంటుంది? ‘మీరు ఎన్నికైంది అయిదేళ్లకోసమే కదా, మీలాగానే మీ తర్వాత వచ్చినవారు మీ విధానాలను కొనసాగించక, పక్కన పడేస్తే ఏమిటి పరిస్థితి?’ అని అడిగితే ఏం సమాధానమిస్తారు! పైగా ప్రజోపయోగంగా విధానాలను సరిదిద్దకుండా పేరు మారిస్తే ఏమొస్తుంది? ‘ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల కంపు’ అన్నట్టుంటే– గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థే కాదు, ఏదీ సవ్యంగా ఉండదు. పౌర సేవల్ని సజావుగా అందిస్తూ, పాలనను ప్రజలకు చేరువ చేసే చిత్తశుద్ధిని ప్రభుత్వాలు ప్రదర్శించాలి. ఇదే ప్రజాస్వామ్య ధర్మం!దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్, సోషల్ ఎనలిస్ట్;డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ -
పేరుకు అభివృద్ధి... 'చేసేది విధ్వంసం'
బొగ్గు గనులు ‘ఇంధన భద్రత’గా మారాయి. రేవులు ‘వ్యూహాత్మక మౌలిక వసతులు’ అయ్యాయి. సఫారీ పార్కులు ‘సంరక్షణ’ ముద్ర వేసుకుంటున్నాయి. వీటిని ఒకే తాటిపైకి తెస్తున్నది జాగ్రఫీ కాదు, వాటి రాజకీయ ఆర్థిక వ్యవస్థ. హరిత ఆవరణ వ్యవస్థ అడవులు,కొండలు, దీవులను అభివృద్ధి పేరిట పెట్టుబడి ఆస్తులుగా మార్చేస్తోంది. హరియాణాలో ఆరావళి పర్వత శ్రేణిలో 3,800 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని మెగా సఫారీ పార్కుగా మార్చాలన్న ప్రతిపాదన అందుకు తిరుగులేని నిదర్శనం. ఎకో టూరిజం, జీవవైవిధ్య పెంపుదల పేరు చెప్పి అది టూరిస్టులకు కన్నుల పండువను, డెవలపర్లకు లాభాలను వాగ్దానం చేస్తోంది. కానీ, అది అడవుల ఆవరణకు, జల వనరులకు, గ్రామాల ఉమ్మడి ఆస్తులకు ముప్పుగా పరిణమిస్తోంది. ఇది ఆరావళికి మాత్రమే పరిమితమైంది కాదు. హసదేవ అరండ్లో బొగ్గు బ్లాకుల నుంచి దేహింగ్ పటకాయీలో చమురు, మైనింగ్; గ్రేట్ నికోబార్లో ట్రాన్స్– షిప్మెంట్ పోర్టు వరకు, భారతదేశపు అత్యంత బలహీనమైన జీవావరణ వ్యవస్థలు, అభివృద్ధికి పొలిమేరలుగా పునర్నిర్మాణం చెందుతున్నాయి. సఫారీ అనేది మినహాయింపు కాదు. అదొక నమూనా! జీవనాధార వ్యవస్థకు ముప్పుఆరావళి పర్వతాలు గుజరాత్లో మొదలై రాజస్థాన్, హరి యాణా గుండా సాగి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థగా దీన్ని చెబుతారు. ఇది భౌగోళిక అవశేషం కాదు. జీవావరణ మౌలిక వ్యవస్థ. థార్ ఎడారి తూర్పు వైపు మరింత విస్తరించకుండా ఇవి దాన్ని కాస్త మందగింపజేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాయవ్య భారతాన భూగర్భ జలాల రీఛార్జీకి ఇవి ఉపయోగ పడుతున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. ఆ జిల్లాలకు ఆరావళి పర్వతాలే జీవనాడి. అవి రుతుపవన వర్షాలను పీల్చుకుంటూ భారీ స్పాంజ్లుగా ఉపయోగపడుతున్నాయి. నీటికి ఎంతో కటకటలాడే ప్రాంతంలో జలవనరులు అంతో ఇంతో నిండటానికి తోడ్పడుతున్నాయి. పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో, పులిమీద పుట్రలా సుప్రీం కోర్టు భౌగోళిక శాస్త్ర ప్రమాణాలను ఉటంకిస్తూ, ‘సైన్స్’ పేరుతో ఆరావళి పర్వతాల రూపురేఖలకు ఆ మధ్య కొత్త నిర్వచనం ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలని పేర్కొంది. ఈ విషయంలో అది రెగ్యులేటరీ అస్పష్టతను తొలగించేందుకు కేంద్రం ఇచ్చిన నిర్వచనం పైనే ఆధారపడింది. కాగితాలపై ఇది సాంకేతిక సునిశితత్వంగా కనిపించవచ్చు. వాస్తవంలో, ఇది లీగల్ భూకంపం లాంటిది.ఆరావళులలో చాలా భాగాలు ముఖ్యంగా హరియాణా, రాజస్థాన్ లోనివి తక్కువ ఎత్తులోనే ఉంటాయి. అవి కోర్టు చెప్పిన ఎత్తును అందుకోలేకపోవచ్చు. కానీ, జీవావరణ పరంగా అత్యంత కీలకమైనవి. పర్వతాలను పునర్ నిర్వచించడం ద్వారా భారీ భూభాగాలను పరిరక్షణ నుంచి మినహాయిస్తే, అవి గనుల తవ్వ కాలు, రియల్ ఎస్టేట్, హైవేలు, సఫారీ లాంటి ప్రాజెక్టులకు ఆల వాలం అవుతాయి. (అయితే, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.)చెప్పేదొకటి... చేసేదొకటి!వన్య ప్రాణులను సంరక్షిస్తామని సఫారీ ప్రాజెక్టు చెబుతోంది. కానీ, పెళుసుగా ఉన్న ప్రాంతంలో రోడ్లు, లాడ్జీలు, పార్కింగ్ లాట్లు, ఇతర ఎన్క్లోజర్లు నిర్మించడం ద్వారా చేసే పనులు సంరక్షణ కిందకు రావు. అడవులకు కంచె నిర్మిస్తారు. ప్రజలను వాటిని దాటి వెళ్ళ నివ్వరు. ఉన్నత వర్గాల సరదాలకు అనుగుణంగా ప్రకృతిని తాము ఎంచుకున్న పద్ధతిలో నిర్వహిస్తారు. గురుగ్రామ్, నుహ్లలోని స్థానిక ప్రజానీకం పశుగ్రాసం, కట్టెలు, నీరు, రుతువులను బట్టి లభించే ఉపాధి మార్గాలకు ఆరా వళులపైనే ఆధారపడుతోంది. ఇది ఉన్నవి లాగేసుకోవడం ద్వారా వేరే వారికి పోగేసిపెట్టడమే! దాన్ని ‘ఎకో–టూరిజం’గా రీప్యాకేజీ చేయడమే. మధ్యభారతంలోని విస్తారమైన అడవుల్లో ఛత్తీస్గఢ్లోని హసదేవ అరండ్ ఒకటి. టేకు చెట్లకు, ఇనుమద్ది, సాళువ, గుగ్గిలం చెట్లుగా పిలిచే రకం చెట్లకు ఇది ప్రసిద్ధి. ఇంధన భద్రత పేరుతో బొగ్గుకు ఈ ప్రాంతాన్ని త్యాగం చేశారు. అధికారుల ప్రోద్బలంతో మైనింగ్ బ్లాకులు తెరిచారు. ఆరావళికి ఎకో–టూరిజం మాదిరిగానే హసదేవకు బొగ్గు ఎసరు పెట్టింది. రెండు ఉదంతాల్లో పేర్లు మారినా వాటిల్లే హాని ఒక్కటే!కాగితాలపై పచ్చదనం... ఆచరణలో అరాచకం అస్సాంలోని దేహింగ్ పటకాయీని ‘అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణకు, బొగ్గు గనుల తవ్వకానికి అనుమ తించారు. రెగ్యులేటరీ మినహాయింపులనిచ్చారు. అనుమతులకు ముందే పనులు చకచకా సాగిపోయాయి. మొదట తవ్వి తీయడం, తరువాతే పరిశీలనలు. టెక్నోక్రాటిక్ పరిభాషతో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తున్నారు. ప్రభావం మదింపు, నిపుణుల కమిటీలు, నష్టాన్ని తగ్గించే ప్రణాళికలు అంటారు. కానీ, ఈ మంత్రాంగాలు సంరక్షణ చర్యలగా కన్నా, ముందే నిర్ణయించిన ఫలితాలను చట్టబద్ధం చేసే సాధనాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి. జాతీయ భద్రత, వ్యూహాత్మక మౌలిక వసతుల పేరుతో గ్రేట్ నికోబార్లో మెగా ట్రాన్స్–షిప్మెంట్ పోర్టును, విమానాశ్రయాన్ని, టౌన్ షిప్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్షారణ్యాలకు, కోరల్ ఎకోసిస్టవ్ులకు, స్థానిక శోంపెన్ జనజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. ఇక్కడ గ్రీన్ ఎన్క్లోజర్ భౌగోళిక రాజ కీయాల ముసుగు వేసుకుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవా వరణం సలాం చేయవలసిందే. ఈ ఉదంతాలన్నింటిలోనూ చట్టం లోపించలేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. ఆరావళి, హసదేవ, ఇతర దుర్బల మండ లాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడపాదడపా జోక్యం చేసుకుంటూనే ఉన్నాయి. 1900 నాటి పంజాబ్ భూసంరక్షణ చట్టం వంటివి భూ వినియోగ మార్పుపై కొన్ని పరిమితులను విధించగలిగాయి. అయినా, కమిటీలు, పునర్ వర్గీకరణలు, నీరుగార్చిన మదింపులు, ఇప్పుడు ఏకంగా మారిన నిర్వచనాలను కవచాలుగా ధరించి మెగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.దేవాశీస్ చక్రవర్తివ్యాసకర్త అంతర్జాతీయ మీడియా స్కాలర్,సామాజిక శాస్త్రవేత్త (‘యూరేసియా రివ్యూ’ సౌజన్యంతో) -
ఈ యేటి మేటి మాట... ట్రంపిజం
ఈ ఏడాది ఎక్కువసార్లు పతాక శీర్షికలకు ఎక్కిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేననడంలో సందేహం లేదు. ఐదు భిన్నమైన కారణాల రీత్యా ఆయన వార్తల్లో అగ్రభాగాన నిలిచారు. ఒకటి– అమెరికా ఫస్ట్ విధానం. రెండు– ఆయన సుంకాల యుద్ధం. మూడు– దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయాసియా నుంచి యూరప్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ద్వైపాక్షిక ఘర్షణల్లో తల దూర్చా లని కోరుకోవడం. నాలుగు– అమెరికా, చైనా, రష్యాల మధ్య సమీక రణలను మార్చడం. చివరగా, వ్యక్తిగత లైంగిక జీవితానికి సంబంధించి వార్తల కెక్కడమే కాకుండా, దర్యాప్తునకు లోనవడం!భద్రతా వ్యూహంతో మరోసారి...తాజాగా ట్రంప్ పాలనా యంత్రాంగం రూపొందించిన జాతీయ భద్రతా వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది అమెరికా భద్రతా వ్యూహంలో పశ్చిమ అర్ధ గోళానికున్న ప్రాధాన్యాన్ని చాటడమే కాకుండా, ఆ ప్రయోజనాలను కాపాడు కునేందుకు సైనిక చర్యను ప్రతిపాదించింది. దౌత్య, సైనికపరంగా అమెరికా వాస్తవిక ప్రవర్తనను ప్రభా వితం చేయడంలో ఈ వ్యూహం ఎంత ముఖ్యమైనదిగా పరిణ మిస్తుందనేది వేచి చూడవలసి ఉంది. మన దేశంలో చాలావరకు, మనతో సంబంధాలు నెరపడంలో వ్యూహ పత్రం దృక్కోణం ఏమిటి? ట్రంప్ ప్రపంచ వీక్షణం, ‘పెద్ద వ్యూహం’లో భారత్ స్థానం ఎక్కడ? అమెరికా–భారత్ సంబంధాలు మున్నెన్నడూ ఎరుగనంతగా క్షీణించిపోయాయనే అందరూ అంటున్నమాట. ముఖ్యంగా, నాయకత్వ స్థాయి సాంగత్య స్వరూప స్వభావాలలో, ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి అపనమ్మకం తిరిగి చోటు చేసుకుంది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆమె గురించి నీచంగా మాట్లా డారు. భారత్ కూడా దానికి తగ్గట్లుగానే తలుపులు బిడాయించుకుని కూర్చుంది. భారత్, దాని నాయకత్వం గురించి వాషింగ్టన్ చర్చలలో ఎంత హీనంగా ప్రస్తావనకు వచ్చిందీ, ఆ తర్వాత బహిరంగపరచిన రహస్య పత్రాలు, కొందరు రాసుకున్న జ్ఞాపకాల పుస్తకాల ద్వారా వెల్లడైంది. ఇపుడు టెలివిజన్, సోషల్ మీడియాలో క్షణాల్లో అవి వెలికి వస్తున్నాయి. కనుక, ఇది స్నేహ సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపి తీరుతుంది. మూడు ముఖ్య సంగతులువ్యూహ పత్రం విషయానికొస్తే, ఇంతవరకు మూడు సంగతులు స్పష్టమయ్యాయి. ఒకటి–దాడులు, ప్రమాదాల నుంచి సామూహిక స్వీయ రక్షణకు ‘ఒక గ్రూపు’గా ఏర్పడే ధోరణిని కొనసాగించాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికాలను ‘బయటి’ శక్తులకు ‘అందని దుర్గాలు’గా ప్రకటించి, పశ్చిమ అర్ధ గోళంపై పట్టు సంపాదించాలనుకుంటున్నారు. కొన్ని విధాలుగా ఇది ఆసియాలోని అభిప్రాయాలనే ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోని ఈ భాగంవారు కూడా అమెరికాను ‘బయటి’ శక్తిగానే భావిస్తారు. అయితే, ఆసియా నుంచి అమెరికా సేనలను ట్రంప్ ఉపసంహరించుకుంటారనీ, ఈ ప్రాంత భద్రతను ప్రాంతీయ శక్తుల చేతులకే విడిచిపెడతారనీ అనడానికి ఆధారాలు కనిపించడం లేదు. రెండు– మిగిలిన వాటన్నింటి కన్నా చైనాతో సంబంధాలకు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా అటు సవాల్గానూ, ఇటు సమ వుజ్జీగా పరిగణించి వ్యవహరించవలసిన శక్తిగానూ కూడా ఉంది. ‘జి–2’ ఆలోచనతో ఆయన చేసిన ట్వీట్ ఆసియాలో కలకలం సృష్టించింది. ఇంచుమించు రష్యా కోరుకుంటున్న విధంగానే, యూరప్లో యుద్ధం ముగియాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రపంచంలోని మూడు పెద్ద (అమెరికా, రష్యా, చైనా) శక్తులు తమ భద్రత, పరపతి ఉన్న ప్రాంతాలకు పరిమితమయ్యే హక్కు ఉందనే లోపాయకారీ అవగాహనను బలపరుస్తున్నారు. కానీ, భారత్పై దీని పర్యవసానాలుంటాయి. చివరగా, వ్యూహ పత్రాన్ని అమెరికా విరమణ ప్రకటనగా, దేశ, విదేశాలలో ముఖ్యంగా యూరప్లో చాలా మంది భాష్యం చెబుతున్నారు. కానీ, ఆ రకమైన నిర్ధారణకు రావడం ట్రంప్ ప్రపంచ వీక్షణాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. అమెరికా సేనల ఉపసంహరణకు సంబంధించి దాని వ్యూహ పత్రంలో ఎక్కడా ఒక్క మాట లేదు. అమెరికా శైలి మాఫియాప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలలో 750 సైనిక స్థావరాలలో 1,60,000కు పైగా అమెరికా సైనిక దళాలు న్నాయి. అమెరికా సాయుధ దళాలున్న అత్యంత ముఖ్యమైన కేంద్రాలు జర్మనీ, జపాన్, ఇటలీ, కొరియాలలో ఉన్నాయి. అవి రెండవ ప్రపంచ యుద్ధకాలం నుంచి అమెరికా ‘అధీనం’లో ఉన్నాయి. ‘నాటో’ కూటమి దేశాల్లోనూ, పశ్చిమాసియా ‘క్లయింట్’ దేశాల్లో ముఖ్యంగా బహరైన్, కువైట్లలోనూ అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఈ స్థావరాల నిర్వహణకు ఏటా 5,000 నుంచి 6,000 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయి. సేనలు లేదా స్థావరాల సంఖ్యను తగ్గించుకోవడం గురించి వ్యూహ పత్రం ఎక్కడా మాట్లాడలేదు. మరింతగా ‘భారాన్ని పంచుకోవలసిన’ అవసరం గురించి మాత్రం అది ప్రస్తావించింది. ‘నాటో’ కూటమి దేశాలు, జపాన్, కొరియా, గల్ఫ్ దేశాలు వాటి రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని అమెరికా కోరుతోంది. ఇతర దేశాల్లో అమెరికా సేనల ఉనికి అవసరం ఏమిటో, అది ఎంతకాలమో, ట్రంప్ గానీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా అధ్యక్షులైన ఇత రులు గానీ వివరించిన పాపాన పోలేదు. భారతదేశంతో సహా ఇంకా అనేక దేశాల్లోనూ ద్వైపాక్షిక ఒప్పందాల రీత్యా మాత్రమే అమెరికా సేనలు పరిమిత సంఖ్యలో కనిపి స్తాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితంగానే, కొన్ని దేశాల్లో అవి పెద్ద సంఖ్యలో ఉన్నాయన్నది వాస్తవం. ఆ యుద్ధం ముగిసేనాటికి అమెరికా ‘విముక్తి’ కల్పించిన ‘ఆక్రమించిన’ దేశాల్లో అమెరికా సేనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వ్యూహ పత్రం, ఆ యా భూభాగాల నుంచి సేనల ఉపసంహరణ లేదా తగ్గింపునకు పిలుపు ఇవ్వలేదు. అవి ఆతిథ్యం ఇస్తున్న అమెరికా సేనల నిర్వహణకు ఆయా దేశాలు కొంత పైకాన్ని చెల్లించాలని మాత్రమే అది అడుగుతోంది. ఇది కళాత్మక మాఫియా శైలి అవుతుంది. ఇతర పెద్ద శక్తుల నుంచి ఎదురు కాగల బెడద నుంచి ‘రక్షణ’ కల్పిస్తున్నందుకు ‘మామూలు’ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నమాట!ఇది చూడండి: యూరప్, ఆసియాలలో శక్తిమంతమైన సైనిక యంత్రాలుగా చైనా, రష్యా నడుచుకునేందుకు అమెరికా అనుమతి స్తుంది. చైనా, రష్యా పొరుగునున్న దేశాలు ప్రపంచ శక్తి అయిన అమెరికా పెత్తనం నుంచి తమను కాపాడుకునేందుకు ఈ ప్రాంతీయ శక్తుల పంచన చేరవచ్చు. ఇక సేనల తగ్గింపు ప్రసక్తి ఎక్కడ? ట్రంపి జంగా అభివర్ణించదగిన ఈ విధానంపై ఇతర దేశాల స్పందన ఎలా ఉండబోతోందన్నది 2020లలో కాలగతిని నిర్వచించనుంది.సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అక్కరకు రాని చట్టాలతో భయమేల?
గత నెల కొత్త కార్మిక చట్టాలు (లేబర్ కోడ్స్) అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధ నల్లో ఎన్నో విశేషాలు ఉన్నప్పటికీ, ఎవరూ వాటి జోలికి పోవడం లేదు. కార్మిక వర్గాన్ని అవి ఎలా కట్టడి చేస్తు న్నాయి అనే అంశం మీదనే చర్చ జరుగు తోంది. నిజానికి ఈ కొత్త చట్టాల్లో కార్మికులకు లెక్కలేనన్ని తీపి గుళికలు ఉన్నాయి. అయినా సరే, సమ్మె అంశం ఒక్కటే ఒక ఎర్ర మిరపకాయలా కొట్టొచ్చి నట్లు కనిపిస్తోంది. దీంతో, సమ్మెలను అరికట్టే నిబంధనలే ప్రము ఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ భయాలకు హేతువు లేదు. వాస్తవం ఏమిటంటే, దేశంలో సమ్మెల సంఖ్య క్రమంగా తగ్గి పోతోంది. అయినా, మొట్టమొదటి ఫ్యాక్టరీ సైరన్ మోగిన నాటి నుంచీ కార్మిక అశాంతి భయమే కార్మిక చట్టాల్లో ప్రధానంగా ఉంటూవస్తోంది. పారిశ్రామిక రంగ చరిత్ర చూసినట్లయితే, చట్టాలు అత్యంత కఠినంగా ఉన్న కాలంలోనే సమ్మెలు అత్యధికంగా జరిగాయి. ఇది ఆశ్చర్యకర వాస్తవం. ‘రాబర్ బ్యారన్స్’గా పేరుమోసిన 19వ శతా బ్దపు అమెరికన్ పారిశ్రామికవేత్తలు, వడ్డీ వ్యాపారులు తమ కిరాయి గూండాలతో కార్మికులను చితకబాదించేవారు. ఆ రోజులు పోయాయి.అనుమానపు చూపులుకాలగమనంలో కార్మిక వర్గం మార్పు చెందింది. అయినా ఫ్యాక్టరీ చట్టాలు మారలేదు. పాత మనస్తత్వం నుంచి బయట పడ లేదు. 2003–14 మధ్యకాలంలో దేశంలో సమ్మెలు 75 శాతం తగ్గాయి. 2019కి వస్తే కేవలం 59 సమ్మెలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 30కి పడిపోయింది. కార్మిక చట్టాలు నిరస నలను, సమ్మెలను మరింత కష్టతరంగా మార్చేస్తున్నాయి.చివరకు ఎలా తయారయ్యిందంటే... ప్రభుత్వాలు, పారిశ్రా మికవేత్తలు, యాజమాన్యాలు చేపట్టే ప్రతి చర్యనూ కార్మికసంఘాలు అనుమానిస్తున్నాయి. కార్మిక చట్టాలు ప్రతిపాదించే సానుకూల చర్యలను గుర్తించడం లేదు. భవిష్యత్తులో సమ్మె జరిగే జాడే కనిపించడం లేదు. అయినా, ఒకవేళ సమ్మె చేయాలనుకుంటే అది మరింత కష్టతరం అవుతుందని యూనియన్లు బెంబేలెత్తి పోతున్నాయి.కొత్త చట్టాలు కార్మికులకు ఒనగూర్చే ప్రయోజనాలు చూడండి: ఇక మీదట 240 రోజులకు బదులు 180 రోజులు పనిచేస్తే చాలు వార్షిక సెలవులు అందుబాటులోకి వస్తాయి. ఆర్జిత ప్రసూతి సెల వులు 12 వారాల నుంచి 16 వారాలకు పెరిగాయి. ‘గిగ్ వర్కర్లు’ రిటైర్మెంట్ ప్రయోజనాలకు అర్హులు. పురుషులు, మహిళలు సమాన పనికి సమాన వేతనం పొందుతారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులకు పునఃశిక్షణ కోసం 15 రోజుల వేతనం లభిస్తుంది.అయితే కార్మిక ప్రతినిధులు వీటిని కంటితుడుపు చర్యలుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే, కొత్త చట్టాల ప్రకారం 300 కంటే తక్కువ మంది పనిచేస్తున్న సంస్థలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే కార్మికులను తొలగించవచ్చు. ఇప్పటి వరకు ఈ పరి మితి 100గా ఉండేది. అలాగే, సమ్మె చేయాలంటే 14 రోజులకు బదులు 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఈ రెంటితో కార్మిక వర్గపు కోరలు పీకేసినట్లు అవుతుందని యూనియన్లు భావిస్తు న్నాయి. కరవలేని అరుపులకు ఇక విలువేముంటుంది?ఉద్యోగుల సంఖ్య 299కి మించనట్లయితే, ఆ ఫ్యాక్టరీలు ప్రభు త్వానికి తెలియజేయకుండా ఉద్యోగులను తొలగించవచ్చు. ఇదే మంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే 100 నుంచి 199 మంది కార్మికులను నియమించుకునే సంస్థలు కేవలం 4.5 శాతం మాత్రమే ఉన్నాయి. యజమానులు సమ్మెల భయంతో ఉంటే, కార్మికులు లాక్ అవుట్ల భయంతో ఉన్నారు. కానీ సమ్మెలతో పాటు లాక్ అవుట్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. 2022లో కేవలం 34 లాక్ అవుట్లు మాత్రమే జరిగాయి. మరి భయం ఎందుకు?ప్రయోజనాలు ఎంతమందికి?గుర్తించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, కొత్త కోడ్స్లోని సానుకూలతలు దేశంలోని అధిక శాతం కార్మికులకు వర్తించవు. 20 కంటే తక్కువ మంది కార్మికులతో నడిచే ఫ్యాక్టరీలే దాదాపు 50 శాతం ఉన్నాయి. వీటికి ఆరోగ్య భద్రత నిబంధనలు సైతం వర్తించవు. కార్మికులు నిర్లక్ష్యానికి గురవుతారు. కార్మికుల సంఖ్య 300 దాటేంత స్థాయికి ఈ సంస్థలు చేరుకుంటాయని ఊహించడంకష్టం. సంఘటిత రంగంలో ఉద్యోగాల వాటా క్రమంగా తగ్గుతూ వస్తోందని (2017–20) ఆర్థిక సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడీ వాటా కేవలం 17 శాతమే. ఆఖరుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ల్లోనూ ఇలాంటి ఉద్యోగాలు తగ్గాయి. ఈ సంస్థల్లో 2016–17లో 11.29 లక్షల మంది సంఘటిత కార్మికులు పని చేస్తూ ఉండగా, 2020–21లో వీరి సంఖ్య 8.61 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలోనే ఇలా ఉంటే, ప్రైవేట్ రంగం పరిస్థితి చెప్పేదేముంటుంది?2023–24 ఆర్థిక సర్వే ప్రకారం, భారత కార్మికుల్లో 57 శాతం మంది స్వయం ఉపాధి మీదే ఆధారపడుతున్నారు. నిర్వచనం ప్రకారం వారు ఏ కార్మిక చట్టాల పరిధిలోకీ రారు. సంఘటితరంగంలో ఉపాధి తగ్గిపోతోంది కాబట్టే, సమ్మెలు తగ్గుతున్నాయి. మరోవంక, అసంఘటిత కార్మికులు పెరుగుతుండగా, లాక్ అవుట్ల సంఖ్యా క్షీణిస్తోంది. 2017లో 80.8 శాతం ఉన్న అసంఘటిత కార్మి కులు 2022లో 82.6 శాతానికి పెరిగారు.ప్రభావం ఎంత?కొత్త లేబర్ కోడ్స్ వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందా? మార్పు నామమాత్రమే! ఫ్యాక్టరీల్లో ప్రత్యక్ష ఉపాధి 2011లో 61 శాతంఉండగా, 2023లో 47 శాతానికి పడిపోయింది. సంఘటిత రంగం తన ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా అసంఘటిత రంగానికి తరలిస్తోంది. పెద్ద కార్ల కంపెనీలు సైతం ఛోటామోటా వర్క్షాప్స్ నుంచి విడి భాగాలు సమకూర్చుకుంటున్నాయి. ఆ కార్లపై ఉండే లోగో కేవలం లిప్స్టిక్ లాంటిది!భారత పారిశ్రామిక రంగంలో అసంఘటిత కార్మికులు అత్య ధికంగా ఉన్నంత కాలం కొత్త కార్మిక చట్టాలు ఎన్ని వచ్చినా పెద్దగా ఉపయోగపడవు. వ్యాపార ప్రముఖులు, కార్మిక సంఘాలు ఈ వాస్తవం గుర్తించాలి. ఒప్పందాలు కుదుర్చుకుని పనిచేసే కొద్దిమంది ఉన్నత వర్గ కార్మికులకే ఇవి ప్రయోజనం చేకూర్చగలవు. కాని వారు ఎంత మంది? అతి చిన్న వర్గం. అది పెరిగే అవకాశమూ లేదు. కార్మికులు భయపడే లాక్ అవుట్లు, పెట్టుబడిదారులు భీతిల్లే సమ్మెలు అరుదైనవిగా మారుతున్న ఈ రోజుల్లో కొత్త కార్మిక చట్టాలపై ఇంత గడబిడ అవసరమా?-వ్యాసకర్త సోషియాలజిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-దీపాంకర్ గుప్తా -
అల్లకల్లోల ప్రపంచంలో అద్వితీయ చైనా
సోవియట్ సోషలిస్ట్ నమూనా పతనం తర్వాత, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్య మంలో ఏర్పడిన శూన్యాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప చర్చకు వేదికగా మార్చు కుంది. సోవియట్ మోడల్ను గుడ్డిగా అనుసరించడం కంటే, మార్క్సిజం–లెనినిజం సిద్ధాంతాలను చైనా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవాలని ఆ దేశ నాయకత్వం నిర్ణయించింది. దీని ఫలితంగా పుట్టిందే ‘చైనా లక్షణాలతో కూడిన సోషలిజం’. 1947లో స్వాతంత్య్రం పొందిన భారత దేశం కంటే రెండు ఏళ్ళు ఆలస్యంగా, 1949 అక్టోబర్1న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఏర్పడినప్పటికీ, నేడుఆ దేశం సాధించిన ప్రగతి అసాధారణం. కొనుగోలుశక్తి సామర్థ్యం పరంగా చైనా ఇప్పటికే అమెరికాను అధిగమించి, అనేక రంగాలలో అగ్రగామిగా నిలిచింది.భారతదేశం నేడు దారిద్య్రం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రూపాయి పతనం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) భారత ఆర్థిక గణాంకాల పారదర్శకతను ప్రశ్నిస్తూ ‘సీ గ్రేడ్’ ఇచ్చింది. ఒకవైపు డాలర్తో రూపాయి విలువ 90 రూపాయలకు పడి పోతుంటే, మరోవైపు ‘మేడ్ ఇన్ చైనా –2025’ ప్రణా ళికతో చైనా పారిశ్రామిక మౌలిక సదుపాయాలనుసంపూర్ణ ఆటోమేషన్ దిశగా మలుస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలు చైనాతో భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాయి. ఇది ఆ దేశ ఉత్పత్తి సామర్థ్యానికి నిదర్శనం.1978లో డెంగ్ జియావో పింగ్ ప్రారంభించిన ‘ఓపెనింగ్ అప్’ సంస్కరణలు చైనా స్వరూపాన్ని మార్చివేశాయి. గత మూడు దశాబ్దాలలో 85 కోట్లమంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడం ప్రపంచ మానవాభివృద్ధి చరిత్రలోనే ఒక అద్భుతం. 30 ఏళ్ళ క్రితం 66%గా ఉన్న పేదరికాన్ని 2020 నాటికిసంపూర్ణంగా నిర్మూలించి, ప్రపంచానికి ఒక పాఠంగా చైనా నిలిచింది.ప్రపంచ ఉత్పత్తిలో చైనా వాటా ఆశ్చర్యకరంగాఉంది. ఉక్కు ఉత్పత్తిలో 53.9%, సిమెంట్ ఉత్పత్తిలో 51.1% వాటాతో చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచంలోని మొత్తం హై స్పీడ్ రైల్ లైన్లలో 66% ఒక్క చైనాలోనే ఉన్నాయి. షిప్ బిల్డింగ్ రంగంలో కూడా అమె రికా, ఐరోపాలను తలదన్నేలా 51% భారీ ఓడలను చైనా నిర్మిస్తోంది. ముఖ్యంగా, ‘కొస్కో’ వంటి ప్రభుత్వ సంస్థలు 24,000 కంటైనర్ల సామర్థ్యం గల భారీ ఓడ లను అత్యంత చౌకగా నిర్మిస్తున్నాయి. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఈ రంగంలో ఉనికి లేని చైనా, నేడు జపాన్, సౌత్ కొరియాలను కూడా సవాలు చేస్తోంది.చైనా నేడు ఏఐ రేసులో అగ్రస్థానంలో ఉంది. 2024లో పరిశోధనల కోసం ఆ దేశం 570 బిలియన్ డాలర్లను కేటాయించింది. సుమారు 5,000 ఏఐకంపెనీలు, 16,000 ఇంక్యుబేటర్లతో పూర్తి స్థాయి ఆటోమేషన్ దిశగా అడుగులు వేస్తోంది. సామాజిక సామరస్యం కోసం 700 మిలియన్ల ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో ‘సోషల్ క్రెడిట్ సిస్టం’ (ఎస్సీఎస్)ను అమలు చేస్తూ నేరాల రేటును గణనీయంగా తగ్గించింది. విద్యా రంగంలో కూడా ప్రతి ఏటా 5 మిలియన్ల ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విద్యార్థులు పట్టా పొందుతున్నారు. ఇది అమెరికాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ.అభివృద్ధికి వెన్నెముక విద్యుత్తుచైనా విద్యుత్ వినియోగం అమెరికా, యూరో పియన్ యూనియన్, ఇండియా, రష్యాల మొత్తం వినియోగం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. త్రీ గార్జెస్ డ్యామ్ (22,500 మె.వా.) వంటి భారీ ప్రాజెక్టులతో పాటు, దానికంటే రెండింతలు పెద్దదైన మెడోగ్ హైడ్రో పవర్ స్టేషన్ (60 వేల మె.వా.) నిర్మాణాన్ని ప్రారంభించింది. కాలుష్య రహితవిద్యుత్తు కోసం న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియపై పరిశోధనలు చేస్తోంది. 2025 నాటికి ఏఐ డాటాసెంటర్ల కోసం భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తినిలక్ష్యంగా పెట్టుకుంది.వ్యవసాయ ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, ఆహార భద్రత విషయంలో చైనా స్వయం సమృద్ధిని సాధించింది. ‘బేదో’ శాటిలైట్ ద్వారా నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రైవర్ లేని వరి నాటు యంత్రాలతో వ్యవసాయ రంగంలో 72% ఆధునికీకరణను సాధించింది. కొండ ప్రాంతాలలో నేలకోతను అరికట్టడానికి ‘మూడు పాళ్ళు అడవి, రెండు పాళ్ళు గడ్డిభూమి’ విధానాన్ని అమలు చేస్తూ పర్యావరణాన్ని రక్షిస్తోంది. దీనివల్ల మృత్తిక క్రమక్షయం78% తగ్గింది. 1990లో 170గా ఉన్న పట్టణాల సంఖ్య నేడు 700కు పెరిగింది. ఇందులో 17 మెగా సిటీలుఉన్నాయి. ఒకప్పుడు చిన్న చేపలు పట్టే గ్రామమైన షేన్జెన్, నేడు ప్రపంచానికి ‘సిలికాన్ వ్యాలీ’గా రూపాంతరం చెందింది. ఈ అద్భుతమైన అభివృద్ధి వెనుక క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంకల్పం, విప్లవాత్మక నాయకత్వం ఉన్నాయి. చైనా కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాక, అగ్రరాజ్యాల ఆధిపత్య వలస వాదానికి వ్యతిరేకంగా, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేస్తోంది. చైనా అభివృద్ధి నమూనా ఇతర దేశాలకు గుడ్డిగా ఎగుమతి చేసేది కాదనీ, ప్రతి దేశం తమ భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందాలనీసీపీసీ భావిస్తోంది. పర్యావరణ హితమైన ‘నూతన ఉత్పత్తి శక్తుల’ ఆవిష్కరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చైనా, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక వ్యవ స్థాగత సవాలుగా నిలిచింది.చైనా సాధించిన ఈ ప్రగతి కేవలం అంకెల్లో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల జీవన ప్రమాణాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులో కనిపిస్తుంది. పర్యా వరణం, సాంకేతికత మానవ వనరుల సమతుల్యతతో కూడిన ఈ నమూనా ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త దిశను చూపిస్తోంది. మొత్తంగా చూసినప్పుడు చైనా ప్రస్థానం కేవలం ఒక దేశాభివృద్ధి మాత్రమే కాదు, అది ఒక సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య జరిగిన విజయ వంతమైన ప్రయోగం.-వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-నైనాల గోవర్ధన్ -
'ఆరావళి'ని ఎందుకు కాపాడాలంటే..?
భారతదేశ చరిత్రకు ఆరావళి పర్వత శ్రేణి ఒక మౌన సాక్షి. కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పురాతన పర్వత వ్యవస్థ ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది. కానీ నేడు అభివృద్ధి ముసుగులో మైనింగ్ దోపిడీకి బలవుతోంది. ఇది కేవలం పర్యా వరణ సమస్య కాదు; ప్రజల జీవన హక్కులపై దాడి.ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆరావళి పర్వతాలను (Aravalli Range) ప్రధానంగా ఎత్తు (100 మీటర్లు) ఆధారంగా నిర్వచించింది. ఇది కీలక ప్రాంతాలను రక్షణ పరిధి నుంచి తొలగించే ప్రమాదాన్ని తెచ్చింది. ఈ నిర్ణయం చట్టపరంగా సాంకేతికంగా ఉన్నా, దాని ప్రభావాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.ఆరావళి ఒక పర్వత శ్రేణి కాదు, ఒక జీవవ్యవస్థ. అవి కేవలం రాళ్ల సమూహం కాదు, భూగర్భ జలాలకు సహజ భండారం; ఎడారీకరణను అడ్డుకునే చివరి గోడ; అడవులు, వన్యప్రాణులకు నివాస స్థలం; ఢిల్లీ – ఎన్సీఆర్కు సహజ గాలి శుద్ధి యంత్రం. భౌగోళిక నిర్మాణం, అడవుల విస్తరణ, శిలా స్వభావం, నీటి ప్రవాహం వంటివన్నీ కలిసి ఆరావళిని జీవవ్యవస్థగా నిలబెట్టాయి. ఎత్తు ఆధారంగా ఈ వ్యవస్థను విభజించడం అంటే శాస్త్రానికే అవమానం. ఆరావళిలో మైనింగ్ నష్టాలు తాత్కాలికం కావు. పర్వతాలను పేల్చడం ద్వారా శిలా నిర్మాణాలు శాశ్వతంగా ధ్వంసమవుతాయి. భూగర్భ జలాల సహజ ప్రవాహం తెగిపోతుంది. అడవులు తిరిగి పునరుద్ధరించలేని విధంగా నశిస్తాయి. ‘సస్టెయిబుల్ మైనింగ్’ భావన ఒక మిథ్య.హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే తీవ్రమ వుతోంది. మైనింగ్ వల్ల సహజ వ్యవస్థ దెబ్బతింటే, కోట్లాది ప్రజలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల అడవులు... ధూళిని, ఇసుక గాలులను అడ్డుకుంటూ సహజ రక్షణ గోడలా పనిచేస్తాయి. ఆ గోడను కూల్చేసి, కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వ ద్వైదీ భావానికి ప్రతీక. ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను అడ్డుకునే చివరి అవరోధం. ఈ అవరోధం బలహీనపడితే, ఎడారీకరణ హరియాణా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు విస్తరించే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్ తరాలపై విధించే శిక్షతో సమానం.చదవండి: విభేదాలు ప్రమాదకరం కాదు! ప్రకృతి వనరులు కొద్దిమంది కార్పొరేట్ లాభాల కోసం త్యాగం చేయ బడితే, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అభివృద్ధి అంటే నీటి భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల భద్రతకు హామీ ఇచ్చేదిగా ఉండాలి. ఆరావళిని కాపాడటం అంటే ఒక పర్వత శ్రేణిని కాపాడటం కాదు, దేశపు జీవనాధారాలను కాపాడటం. నిజమైన అభివృద్ధి ఎప్పుడూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతుంది.- కె. నారాయణ చైర్మన్, కంట్రోల్ కమిషన్; కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా -
విభేదాలు ప్రమాదకరం కాదు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య జరిగే ‘ఘర్షణ’లు తరచుగా వార్తల్లోకి వస్తుంటాయి. ‘‘కానీ, ఇది సంక్షోభానికి సంకేతం కాదు. పాలన లక్షణం’’ అంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఈ ఘర్షణలను ఆయన, వైవా హిక జీవితంలోని విభేదాలతో పోల్చారు. ‘‘కొన్నిసార్లు అవి తీవ్రంగా ఉండొచ్చు. అయితే అవి ఒకే లక్ష్యం పట్ల ఉమ్మడి నిబద్ధతతో జరుగుతాయి’’ అని దువ్వూరి చెబుతున్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి కోసం జరిగే సంస్థాగత చర్చ ల్లోని ఘర్షణలు చివరికి మంచే చేస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన ఈ పాడ్కాస్ట్లో వెలిబుచ్చారు.ఘర్షణ ఉండటం మంచి లక్షణంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య అనివార్యంగా కొంత ఘర్షణ ఉండనే ఉంటుంది. నా అనుభవాన్ని బట్టి, అలా ఉండటం అవసరం కూడా! ఈ రెండు సంస్థలు ఆర్థిక వ్యవస్థను భిన్న దృక్పథాలతో చూస్తాయి. ఆర్బీఐ ద్రవ్య స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ భద్రతపై దృష్టి పెడితే; ప్రభుత్వం సహజంగానే అభివృద్ధి, ఉపాధి, ప్రజలకు జవాబుదారీగా ఉండటం వంటి బాధ్యతలపై దృష్టి సారిస్తుంది. ఈ భిన్న దృక్పథాలు కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అభిప్రాయ భేదాలు రావడం సహజమే. ఇది వ్యవస్థలోని లోపం కాదు. ఇండియా వంటి విస్తృతమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో ఉన్న సంక్లిష్టతకు ఒక లక్షణం మాత్రమే.ప్రత్యర్థులు కారు, భాగస్వాములునేను తరచూ, ఆర్బీఐ–ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలను దాంపత్య జీవితంలోని చిన్న గొడవలతో పోలుస్తాను. మీరు బలంగా వాదించవచ్చు. ఒక్కోసారి తీవ్రమైన ఆవేశంతో కూడా! కానీ, అందువల్ల మీరు ప్రత్యర్థులు అవుతారని కాదు. చివరికి, ఇద్దరూ ఒకే పక్షంలో ఉన్నారన్న గ్రహింపు వస్తుంది. విభేదాలు ప్రమాదకరం కాదు. వాటిని శత్రుత్వంగా లేదా సంస్థాగత వైఫల్యంగా భావించడమే ప్రమాదకరం. పరస్పర గౌరవం ఉన్నంత కాలం ఈ చర్చలు, లేదా ఘర్షణలు నిర్మాణాత్మకంగానే ఉంటాయి.సంఘర్షణ, సంభాషణలో భాగమే!ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండూ కూడా భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, సమృద్ధి అనే ఒకే భారీ లక్ష్యం కోసం పని చేస్తాయి. ఆ ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటాయి. మా విధానాలు వేరుగా ఉండవచ్చు. మా కాల పరిమితులు కలవకపోవచ్చు, కానీ చేరుకోవాల్సిన గమ్యం ఒక్కటే. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, విభేదాలు సంభాషణల ద్వారా పరిష్కా రమవుతాయి. ఆ సంభాషణలకు మరొక స్వరూపమే సంఘర్షణ.ఇటు దృఢత్వం... అటు సంక్షేమంచాలామంది ఈ ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు, వ్యక్తిగత విభేదాల వల్ల వస్తాయని అనుకుంటారు. అలా జర గడం చాలా అరుదు. అసలు కారణం, సంస్థలకు అప్పగించిన బాధ్యతలే. ఆర్బీఐ గవర్నర్గా ప్రజాదరణ లేని, స్వల్పకాలికంగా అసౌకర్యాన్ని కలిగించే నిర్ణయాలైనా సరే తక్షణం తీసుకోవలసి వస్తుంది. ధరల స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని కాపాడటం ఆర్బీఐ బాధ్యత. అదే సమయంలో, ఆర్థిక మంత్రి తక్షణ ఆర్థిక ఒత్తిడులకు, ప్రజల అంచనాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ భిన్నమైన బాధ్యతలే విధానపరమైన విభేదాలకు దారితీస్తాయి.చదవండి: సర్దుబాటుతోనే సాన్నిహిత్యం!విభేదాలు పదును పెడతాయి!పరిపక్వతతో, పరస్పర గౌరవంతో ఈ ఘర్షణను నిర్వహిస్తే, అది విధాన రూపకల్పనను మరింత బలపరు స్తుంది. వాదనలు... ఇరు పక్షాలనూ తమ ఆలోచనలను పదును పెట్టుకునేలా చేస్తాయి. అంచనాలను, అభ్యంతరాలను ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఊహించని ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రేరేపిస్తాయి. సులభమైన ఏకాభిప్రాయం కంటే లోతైన చర్చల నుంచే మెరుగైన విధానాలు వెలువడతాయి. ముఖ్యంగా... సంస్థల మధ్య నమ్మకం ఉండటం, అంతరాయం లేని స్పష్టమైన సంభాషణ కొనసాగడం అత్యంత ముఖ్యం.- ఎడిటోరియల్ టీమ్ -
సర్దుబాటుతోనే సాన్నిహిత్యం
భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటం తర్వాత అత్యంత కీలకమైన ఘట్టంలో ఉన్నాయి. భారత్ అనుకూల అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో హఠాత్తుగా కుప్పకూలి, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక గత దశాబ్దపు సోనాలీ అధ్యాయ్ (స్వర్ణ అధ్యాయం) ఛాయలు కనుమరుగ య్యాయి. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా రెండు దేశాల మధ్య పొత్తు కొనసాగవలసి ఉంది. ఆర్థిక కారణాల రీత్యానూ ఇది రెండు దేశా లకు అవసరం. ప్రాంతీయ సుస్థిరతకు అదే ప్రాణాధారం. ఇండియాపై పెరిగిన వ్యతిరేకతఈ ఏడాది (2025) బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక భావనలు అసాధారణ స్థితికి చేరుకున్నాయి. యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హతుడైన తర్వాత నిరసన ప్రదర్శనలు ముమ్మర మైనాయి. అతని మృతి వెనుక భారత్ హస్తం ఉందని బంగ్లాదేశ్లో చాలామంది ఆరోపిస్తున్నారు. నిరసనకారులు భారత దౌత్య కార్యా లయాలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందు యువకుడు దీపూ చంద్ర దాస్ దారుణ హత్య సభ్య ప్రపంచాన్ని నిర్ఘాంతపరచింది. బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగవలసి ఉంది. రాజకీయ ప్రయోజనాలను మూటగట్టుకునేందుకు భారత వ్యతిరేక భావనలను ఎగదోస్తున్నారనే అభిప్రాయం ఉంది. షేక్ హసీనాను అప్పగించడానికి భారత్ తిరస్కరించడం కూడా రెండు దేశాల మధ్య ఘర్షణకు ఒక ప్రధానాంశంగా మారింది. ఢాకాలో అధికారం చేతులు మారడంతో, జమాత్–ఏ–ఇస్లామీ వంటి భారత వ్యతిరేక ఇస్లామీయ వర్గాలకు ఊతం లభించింది.రెండు దేశాల మధ్య భద్రతాపరమైన సహకారానికి ఒకప్పుడు ‘అగ్ర ప్రాధాన్యం’ లభించేది. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత అక్కడి ఇస్లా మీయ వర్గాల పునరేకీకరణకు వీలు కల్పించి ఈశాన్య ప్రాంతంలో ఆంతరంగిక భద్రతకు బెడదగా పరిణమిస్తుందని భారత్ కలవర పడుతోంది. ఉగ్రవాద ప్రసంగాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలలో మతపరమైన ఘర్షణలను రేకెత్తించవచ్చు. ముప్పేట ముప్పు‘పొరుగు దేశాలకే మొదట పెద్ద పీట’ అనే భారత్ విధానం కొన్నేళ్ళుగా అవామీ లీగ్తో మైత్రి అనే లంగరుపైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. భారత్ చర్చలు జరిపేటపుడు సంప్ర దాయసిద్ధమైన మిత్రులతోనే కాకుండా, యువజన నాయకులను, పౌర సమాజాన్ని కూడా ఆ ప్రక్రియలోకి తేవాలి. ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహిస్తుందని భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) వంటి ప్రతిపక్షాలను కూడా కూడగట్టుకోవాలి. దక్షిణాసియాలో భారత్కు బంగ్లాదేశ్ అతి పెద్ద వాణిజ్య భాగ స్వామి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను మూల బిందు వుగా చేసుకున్న విధానం నుంచి మరలి చైనా, పాకిస్తాన్, పశ్చిమ దేశాలతో సంబంధాలను పటిష్టపరచుకుంటోంది. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ తరహాలో సైద్ధాంతిక లేదా సైనిక అమరిక వైపు మొగ్గు చూపుతున్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్న బంగ్లాదేశ్ మనకు ‘మూడు వైపుల’ నుంచి ముప్పును తేవొచ్చు. పశ్చిమ (పాకిస్తాన్), ఉత్తర (చైనా), తూర్పు (బంగ్లాదేశ్) సరిహద్దుల వైపు భారత్ సైన్యాన్ని, వనరులను విస్తరింపజేయక తప్పని స్థితి ఏర్పడుతోంది. భారతదేశపు ప్రధాన భూభాగాన్ని దాని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానపరచే 22 కిలోమీటర్ల సన్నని భూభాగమైన సిలీగుడీ కారిడార్ అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతం. దీన్నే ‘చికెన్ నెక్’ అంటారు. పాక్–చైనాలతో సాన్నిహిత్యం బంగ్లాదేశ్ను ఈ కారిడార్కు సమీపంలో సైనిక మౌలిక వసతుల కల్పన అభి వృద్ధికి పురికొల్పవచ్చు. భారత్ను సాగర జలాల నుంచి చుట్టు ముడుతూ ప్రత్యర్థి దేశాలు చిట్టగాంగ్, మోంగ్లా వంటి వ్యూహాత్మక రేవులను వినియోగించుకోవచ్చు. చైనా సాయంతో పెకువా జలాంత ర్గామి కేంద్రాన్ని బంగ్లాదేశ్ అభివృద్ధి చేస్తూండటంతో బంగాళా ఖాతంలో భారత నౌకాదళ ఆధిపత్యానికి గండి పడుతోంది.అన్ని పక్షాలను కలుపుకొంటేనే...బంగ్లా భూభాగాన్ని ఉపయోగించుకుని అస్సాం సమైక్య విమో చన కూటమి (ఉల్ఫా) వంటి తిరుగుబాటు గ్రూపులు తిరిగి తలెత్త వచ్చు. హసీనా ప్రభుత్వం దాన్ని చాలా వరకు నిరోధించింది. పాకి స్తాన్ ఐఎస్ఐ కార్యకలాపాలు బంగ్లాదేశ్లో ఊపందుకుంటే – నకిలీ కరెన్సీ, ఆయుధాలు, మతోన్మాద శక్తులు భారతీయ సరిహద్దు రాష్ట్రా ల్లోకి చొరబడటం పెరుగుతుంది. తీస్తా నదీ ప్రాజెక్టులో కూడా పెట్టు బడులకు చైనా ముందుకొస్తోంది. ఈ చిక్కుముడులను విప్పుకుంటూ, బంగ్లాతో సంబంధాలను మళ్ళీ బలోపేతం చేసుకునేందుకు తగిన ఆచరణాత్మక పంథాను, బహుళ దృక్కోణ వైఖరిని రూపొందించుకునే దిశగా భారత్ కృషి చేయాలి. భారత్ తమ దేశంలో ఒక పార్టీకే అనుకూలంగా ఉందనే అభిప్రాయాన్ని తొలగించాలి. గంగా జలాల ఒడంబడిక వంటి కీలక అంశాలపై సకాలంలో పారదర్శకమైన చర్చలు చేపట్టాలి. ఇతర నదీ జలాల పంపకాలపై విస్తృత నిర్వహణా వైఖరిని అనుస రించాలి. బంగ్లాకు అది సున్నితమైన జాతీయ అంశం కనుక ఈ విష యంలో జాగు చేస్తే, అది ఆ దేశంలో భారత్ వ్యతిరేక అభిప్రా యాలను ఎగదోసేందుకు తోడ్పడుతుంది. సంక్షుభిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థికంగా పరస్పరం ఆధారపడి ఉండటమనే అంశం భవిష్యత్ సంబంధాలకు బలమైన లంగరుగా పనిచేయగలదు. ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25లో 13.46 బిలియన్ల డాలర్ల మేరకు ఉన్నట్లు అంచనా. ఏమాత్రం అభివృద్ధి చెందని దేశ స్థాయి నుంచి 2026లోనన్నా బయటపడాలని బంగ్లా తాపత్రయపడుతోంది. అది భారతదేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే, వాణిజ్యపరమైన ప్రత్యేక హక్కులను కాపాడుకున్నట్లవుతుంది. భారత్–బంగ్లా స్నేహ పూర్వక పైపులైను, (అఖౌడా–అగర్తలా వంటి) సీమాంతర రైలు సంధానం వంటివి భారత్ ‘తూర్పు కార్యాచరణ’ విధానానికీ, బంగ్లా వృద్ధికీ అవసరం. వ్యాసకర్త కువైట్, మొరాకోల్లో భారత మాజీ రాయబారి(‘ఫస్ట్ పోస్ట్’ సౌజన్యంతో) -
పరిహారం ‘అణు’వంతేనా?
భారత రూపాంతరీకరణకు ఉద్దేశించిన ‘అణు శక్తి స్థిర వినియోగ–పురోగతి బిల్లు (శాంతి) 2025’కు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది అణు శక్తికి సంబంధించి మూడు కీలక అంశాలపై చిరకాలంగా ఉన్న చర్చను మళ్ళీ రేకెత్తించింది. అవి: అణుశక్తి అభివృద్ధి–నియంత్రణ; ప్రమాదాలు సంభవించినపుడు సివిల్ లయబిలిటీ; అణు శక్తి ఉత్పాదనలో ప్రైవేటు భాగస్వామ్యం. అటామిక్ ఎనర్జీ చట్టం (1962), సివిల్ లయబిలిటీ–న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010) స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. అణుశక్తి అభివృద్ధి –వినియోగానికి 1962 నాటి చట్టం వీలు కల్పిస్తే, అణు ప్రమాదాలు సంభవించిన పక్షంలో బాధ్యత వహించడం, పరిహారం చెల్లించడా నికి సంబంధించి ఒక చట్రాన్ని 2010 నాటి చట్టం అందించింది. స్వతంత్ర నియంత్రణకు సుముఖం కాదా?విద్యుదుత్పాదనకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్) అందుబాటులోకి రావడం, 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యు దుత్పాదన గడించాలనే ఆశావహ లక్ష్యసాధనకు ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమవడం అనే రెండు కారణాల రీత్యా కొత్త చట్టం అవసరమైందని ప్రభుత్వం వివరించింది. అణు విద్యుదుత్పాదనలో ప్రైవేటు రంగానికి ద్వారాలు తెర వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... నియంత్రణ, లయబిలిటీ చట్రాలు రెండూ అత్యంత ముఖ్యమైనవిగా పరిణమించాయి. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. నియంత్రణకు సంబంధించి కొత్త చట్టం యథాతథ స్థితినే కొనసాగించింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) గతంలో మాదిరిగానే పని చేస్తుంది. అణుశక్తి అభివృద్ధి మొగ్గ తొడుగుతున్న 1960లలో, రేడియేషన్ సదుపాయాలలో రేడియేషన్ సురక్షణను అమలుపరచేందుకు, అటా మిక్ ఎనర్జీ శాఖ (డీఏఈ)కు వెలుపల డైరెక్టరేట్ ఆఫ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (డీఆర్పీ) ఏర్పాటు చేశారు. హోమీ భాభా తర్వాత అణుశక్తి శాఖ బాధ్యతలు చేపట్టిన విక్రమ్ సారాభాయ్, స్వతంత్ర అణుశక్తి నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారుగానీ, ఆ భావన అమలుకు నోచుకోక ముందే, ఆయన కన్నుమూశారు. ఆయన వారసుడు హోమి ఎన్.సేత్నా ఏఈఆర్ఏ ఆలోచనను పక్కనపెట్టి, డీఆర్పీని కొనసాగించాలని నిర్ణయించారు. రాజా రామన్న 1983లో నియంత్రణ సంస్థ (ఏఈఆర్బీ)కు పచ్చ జెండా ఊపారు. కానీ, అది ఇతర రంగాలలోని అదే రకమైన సంస్థలలాగా పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినది కాదు. ఈ 2025 చట్టం కూడా ప్రస్తుత ఏఈఆర్బీ చట్రాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపింది. స్వతంత్ర నియంత్రణ సంస్థ ఆలోచనకు అణుశక్తి వ్యవస్థ సానుకూలంగా లేదని స్పష్టమవుతోంది. అణుశక్తి శాఖ పరిధిలోనే ఏఈఆర్బీ పనిచేస్తున్నప్పటికీ, గతంలో అది నీళ్ళు నమలకుండా పనిచేసిన దాఖలాలు లేకపోలేదు. వివిధ సందర్భాలలో నియమాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు ఏఈఆర్బీ–ముఖ్యంగా ఎ. గోపాలకృష్ణన్ అధ్యక్షుడిగా ఉన్నపుడు– విద్యుదుత్పాదన కేంద్రాలు, ఇతర సంస్థలపై ఆంక్షల రూపంలో కొరడా ఝళిపించింది. పరిహారానికి పరిమితులా?ఇపుడు ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తున్నారు కనుక, నిజాయతీగా పనిచేసే, సాంకేతికంగా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ అవసరం ఉంది. దేశ పురోగతి ముసుగులోనే అయినప్పటికీ, ఏఈఆర్బీ యథాతథ స్థితిని కొనసాగించడం శుభ సూచకం కాదు. ప్రైవేటు రంగాన్ని అనుమతించిన అంతరిక్ష రంగంలో కూడా ప్రభుత్వం స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడానికి బదులుగా ఇన్–స్పేస్ పేరుతో, ఏ ఎండకా గొడుగు పట్టే సంస్థనే సృష్టించింది. ఒక విధానాన్ని ప్రోత్సహించే, నియంత్రించే రెండూ ఒకే చూరు కింద ఉండకూడదన్నది మూలసూత్రం కావాలి. అణు దుర్ఘటనలు సంభవిస్తే కలిగే నష్టానికి లయబిలిటీ విషయంలో నియంత్రణ సంస్థ ఎలా వ్యవహరిస్తుందన్నది ప్రశ్న. నియంత్రణ కఠినంగా లేకపోతే, ప్రమాదాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది. లయబిలిటీకి సంబంధించి అంతర్జాతీయంగా పాటించే నియమాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జాతీయ చట్టాలు కూడా వాటికి అనుగుణంగా రూపొందాలి. అణు ప్రమాదం సంభవించిన చోట మూడవ పక్షానికి పరిహారం చెల్లించే బాధ్యత న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఆపరేటర్ పైనే ఉంటుందని అంతర్జాతీయ కట్టుబాట్లు చాలా వరకు నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ న్యూక్లియర్ ఇన్స్టలేషన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కిందనే లెక్క. కానీ, ఇతర సదుపాయాలున్న న్యూక్లియర్ సైట్ వద్ద కూడా దుర్ఘటన సంభవించవచ్చు. లయబిలిటీని అనేక అంశాలు నిర్ణయిస్తాయి. ప్రస్తుత చట్టంలో పరిహారంపై రూ. 3,000 కోట్ల పరిమితి విధించడం, దాన్ని న్యూక్లియర్ ప్లాంట్ ప్రదేశంతో ముడిపెట్టడం అసంబద్ధం. చిన్న రియాక్టర్లకు (150 మెగావాట్ల నుంచి 750 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్నవి) లయబిలిటీని మరీ తక్కువగా రూ. 300 కోట్లుగా నిర్ణయించారు. ఇక 150 మెగావాట్ల కన్నా తక్కువ సామర్థ్యం ఉన్నవాటికి కేవలం రూ. 100 కోట్లనే నిర్ణయించారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లను ప్రోత్సహిస్తున్న సంస్థలను మచ్చిక చేసుకునేందుకే అలా నిర్ణయించారని తేటతెల్లమవుతోంది. హెచ్చు సామర్థ్యమున్న భారీ అణు విద్యుదుత్పాదన కేంద్రాలను నెలకొల్పేందుకు పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అవసరమవుతాయి. అవి నిర్మాణం పూర్తి చేసుకుని, ఉత్పాదన ప్రారంభించేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అణు విపత్తులలో లయబిలిటీ చట్రాన్ని సడలించడం ద్వారా, మాడ్యులర్ రియాక్టర్ల వల్ల పెద్ద నష్టం ఉండ బోదని ఆ పరిశ్రమ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. లయబిలిటీలను వర్గీకరించడం ద్వారా కొత్త చట్టం ఆ పరిశ్రమను సంతృప్తి పరచింది. భోపాల్ దుర్ఘటన పాఠాలు నేర్చుకున్నామా?అణు రియాక్టర్ల వద్ద (అణు ఇంధన వలయ సదుపాయాలతో కూడుకుని) తలెత్తే ప్రమాదాలను కొత్త చట్టం నిర్వచించి, లయబిలి టీలను కూడా నిర్ణయించింది. కానీ, ‘అణు సదుపాయాలు’గా నిర్వ చించిన చోట్ల ప్రమాదాలు సంభవిస్తే, లేదా అణు ధార్మికత వెలు వడితే ఏమిటన్న దానిపై మౌనం వహించింది. అలాంటి పరిస రాలలో ఏదైనా సంభవిస్తే ఆ నష్టాలకు పరిహారం చెల్లించే బాధ్యత ఎవరిది? ‘న్యూక్లియర్ డ్యామేజీ’ అనే దానికి మాత్రం చట్టంలో విçస్తృతార్థం ఇచ్చారు. ప్రాణ నష్టం, గాయపడటం, ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, అణు ప్రమాదం వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించేందుకు అయ్యే వ్యయం అంటూ దానిలో చాలా వాటిని చేర్చారు. కానీ, లయబిలిటీ పరిమితిని మాత్రం రూ. 100 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లుగా పేర్కొన్నారు. 2010లో సంభవించిన సముద్ర ప్రమాదానికి గానూ బ్రిటిష్ పెట్రోలియం సంస్థ 65 బిలియన్ డాలర్లు చెల్లించింది. అదే భోపాల్లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకవడాన్ని ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ఉపద్రవంగా చెబుతారు. కానీ దాని బాధితుల్లో పరిహారం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా ఉన్నారు. పర్యావరణ నష్టానికి ఎవరూ చెల్లించింది ఏమీ లేదు. మళ్లీ మధ్యవర్తిత్వం నెరపే ప్రయత్నమూ లేదు. అణుశక్తి విషయంలో అడుగు ముందుకేసే ముందు గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పెంపొందించే పని, నియంత్రణ ఒకే చూరు కింద సంసారం చేయకూడదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ కామెంటేటర్ -
ఉపాధి పెంపునకు అవకాశాలెన్ని?
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ. తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.ఎందుకీ మందగమనం?గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.యువతలో ఉపాధిభారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్లోని మొత్తం గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 42.3 శాతం. నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి. వివిధ దేశాల అనుభవాలుమానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి. మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.యువతలో ఉపాధి పెంపునకు చర్యలుభారత్లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి. యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్, ఆంట్రప్రెన్యూర్షిప్పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి. ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
నేపాల్ దారి అగమ్యగోచరం
నేపాల్లో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ 1990లో ఏర్పడిన 35 సంవత్సరాల తర్వాత, రాచరిక వ్యవస్థ పూర్తిగా 2008లో రద్దయిన 17 సంవత్సరాలకు, ఆ దేశ భవిష్యత్తు ‘అగమ్యగోచరమేనా?’ అనే ప్రశ్న వేసుకోవలసి రావటం నిజంగానే విచిత్రమైన పరిస్థితి. గత సెప్టెంబర్ నాటి జెన్–జీ భూకంపం సృష్టించిన స్థితిగతులు, రేకెత్తించిన ప్రశ్నల కారణంగా దేశం ఈ దశలోకి ప్రవేశించింది.2008 వరకు ఒకవైపు రాచరికాన్ని, మరొకవైపు ప్రజాస్వామిక పార్టీల ద్వంద్వ పాలనను, 2008లో రాచరికం రద్దు తర్వాత నుంచి మధ్యేమార్గ పార్టీలు, సాధారణ కమ్యూనిస్టులు, మావోయిస్టుల పాలనను చూసిన యువతరం, దానికి మద్దతుగా నిలిచిన సమాజం కలిసి అగ్నిపర్వత విస్ఫోటనం వంటి తిరుగుబాటు చేశాయి. అనగా అది ప్రస్తుత తరపు తిరుగుబాటు. మరి ఈ తరం గడిచిపోయి మరొక 15–20 సంవత్సరాలకు కొత్త తరం ఉనికిలోకి వచ్చే సమ యానికి పరిస్థితి ఏమిటి? ఈ తిరుగుబాటుకు కారణమైన పరి స్థితులు అప్పటికి మారుతాయా? మారగలవన్న హామీని ఇపుడున్న రాజకీయ పార్టీలు యువతరానికి, ప్రజలకు ఇవ్వగలవా?కనీసం ప్రశ్నించుకోని వైనంఈ ప్రశ్నలను ఇంతే సూటిగా అన్ని ప్రధాన పార్టీల నాయ కులను నేను అడిగాను. ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, ఏ ఒక్క పార్టీ కూడా సెప్టెంబర్ పరిణామాల అనంతర కాలంలో ఈ ప్రశ్నలను తనకు తాను వేసుకోలేదు. ప్రశ్నలు వేయగానే అందరిలో కన్పించిన మొదటి స్పందన నా వైపు శూన్యంగా చూడటం. కొద్దిసేపటికి తేరు కుని స్పష్టాస్పష్టంగా కొద్ది మాటలేవో చెప్పటం. ప్రస్తుతం మిత వాదులు, మధ్యేమార్గీయుల నుంచి మావోయిస్టుల వరకు అందరూ తమను తాము కూడదీసుకోవటం, పార్టీలలో తలెత్తిన అంతర్గత సంక్షోభాలను, చీలిక అవకాశాలను నియంత్రించటం, చీలినవారు ఇతరులతో కలిసి కొత్త పార్టీలు ఏర్పాటు చేయటం, మార్చి 5న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడటం వంటి పనులలో తలమునకలై ఉన్నారు.మరొకవైపు చూడగా, తిరిగి అధికారంలోకి రావాలనే కోరికలో నైతే ఎటువంటి మార్పు లేదు. తిరుగుబాటు తరాన్ని ఎట్లా చల్లబరచటం, వీలైనన్ని జెన్–జీ గ్రూపులను తమ వైపు ఏ విధంగా ఆకర్షించటం, ప్రజలలో తమ పార్టీలకు ఉండిన సంప్రదాయికమైన నెట్వర్క్ ఇటీవలి పరిణామాల వల్ల చెదిరి పోకుండా తిరిగి ఎట్లా కూడదీయటమన్నవి అందరి ప్రాధాన్యాలుగా మారాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా అందరి నోటినుంచి దాదాపు ప్రతిరోజూ కొన్ని మాటలు నిత్య పారాయణం వలె వినవస్తున్నాయి. అవి: జెన్–జీ ఆలోచనలూ, మావీ ఒకటే; వారి డిమాండ్లన్నీ సమంజసమైనవే; వారూ, మేమూ కలిసి పని చేయాలని భావిస్తున్నాము. అందరి మాటల సారాంశం స్థూలంగా ఇదే. ఇటువంటి మొక్కుబడి మాటలు బయటకు మాట్లాడటం తప్ప, తమవైపు నుంచి గతంలో జరిగిన తప్పులు, భవిష్యత్తులో జరగవలసిన మార్పుల గురించి అంతర్గతంగా ఏ పార్టీ కూడా ఒక పద్ధతిలో చర్చించలేదని ఆ యా పార్టీల సీనియర్ నాయకులే నాతో స్వయంగా చెప్పారు.రాజకీయ శూన్యంజెన్–జీ గ్రూపులు కొన్ని ఇటీవలి వారాలలో వేర్వేరు పార్టీలతో చేరినా, అసలు పార్టీ నాయకులు, వారి తీరు, ఒకవేళ గెలిచినట్లయితే పరిపాలన ఎంతవరకు మారవచ్చుననే ప్రశ్నపై ఆ యువకులలో పూర్తి ఆశాభావం కన్పించటం లేదు. ఏ పార్టీతో చేరని గ్రూపులే ఎక్కువ. వాటి గురించి చెప్పనక్కర లేదు. అవి తమ వాదనలు, ఒత్తిడులు యథావిధిగా కొనసాగిస్తున్నాయి. విషయం ఏమంటే, ఆ నాయకులు ఏమి చెప్తున్నా ఇప్పటికీ తిరిగి విశ్వాసం కలగటం లేదు. అందుకే ఇటీవలి ఒపీనియన్ పోల్లో ఏ నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. ఇందులోని విచారకర స్థితి ఏమంటే, స్వయంగా జెన్–జీ గ్రూపులు ఏకమై ఒక దేశవ్యాప్త పార్టీని ఏర్పాటు చేయటంగానీ, లేదా ఇపుడున్న పార్టీలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని పొందగల ఒక కొత్త పార్టీగానీ ముందుకు రాకపోవటం వల్ల రాజకీయంగా అతి పెద్ద శూన్యం కనిపిస్తున్నది. మొదటినుంచి గల పార్టీలు విశ్వాసాన్ని కోల్పోయి, అటువంటి కొత్త ప్రత్యా మ్నాయాలూ ఏర్పడనపుడు, సమస్యలూ, అసంతృప్తులూ అదే విధంగా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు, నేపాల్ దేశ భవిష్యత్తు ఏమిటి? ఆ స్థితి అగమ్యగోచరంగా తోస్తున్నదనటం అందు వల్లనే!పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానంగా కొద్దిమంది నాయకులు మాత్రం నాతో కొన్ని మాటలు అన్నారు. అవి ఈ విధంగా ఉన్నాయి: అన్ని పార్టీల అగ్రనాయకత్వాలు కూడా జెన్–జీకి, ప్రజలకు మూర్తీభవించిన విలన్లుగా కనిపిస్తున్నందున అందరూ అధ్యక్ష పదవుల నుంచి వైదొలగి ఇతరులకు నాయకత్వం అప్పగించాలి. కొత్త కార్యవర్గాలలో యువకులకు భారీగా అవకా శాలు కల్పించాలి. నాయకులంతా అవినీతిని, బంధుప్రీతిని పూర్తిగా వదలుకోవాలి. అధికారంలోకి వచ్చినట్లయితే పారదర్శక పాలన, సమర్థవంతమైన పాలన, సమర్థులూ నిజాయితీపరులైన వారికి అధికారంలో స్థానం, వేగవంతమైన, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, యువతకు ఉపాధి అవకాశాలు అనే వాటిపై చిత్తశుద్ధి చూపగలమని ప్రకటించి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వ్యవహరించాలి. లేని పక్షంలో ప్రస్తుత జెన్–జీ తరంగానీ, లేదా కొత్త తరం గానీ ఇంతకన్న తీవ్రమైన తిరుగుబాటు చేయగలదు. రాజకీయ పార్టీలకు ఇది చివరి అవకాశం వంటిది.కోల్పోయిన విశ్వాసంవీరు ఇట్లా అంటున్నట్లు బయట వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలతో నేను ప్రస్తావించాను. వారిలో ఒక్కరు కూడా ఆ మాటలను నమ్మలేదు. గతంలో పలుమార్లు ఈ తరహా మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. మరి భవిష్యత్తేమిటి? అది వారికీ అగమ్య గోచరంగానే ఉంది. నిజానికి రాచరిక వ్యవస్థలోనే బహుళ పార్టీల ప్రజాస్వామిక పార్లమెంటరీ వ్యవస్థ కోసం 30 ఏళ్లపాటు తీవ్రమైన ఉద్యమాలు జరిపి సాధించిన నేపాలీ కాంగ్రెస్, సాధారణ కమ్యూనిస్టులూ సక్రమంగా పాలించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. తర్వాత మావోయిస్టులు దశాబ్దంపాటు భీకరమైన పోరాటం సాగించి, కేవలం ప్రభుత్వానికి అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఇండియా ఆధునిక ఆయుధాలు సమకూర్చటం వల్ల, చివరి దశలో వెనుకకు తగ్గారు. అయినా ఇతరులతో కలిసి 2008 నుంచి 2025 వరకు 17 సంవత్సరాలలో 12 సంవత్సరాలు వామ పక్షాలే పాలించాయి. వీరి పాలన సవ్యంగా సాగినా ఈ విపత్తు ఎదురయేది కాదు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి 47 సంవత్సరాల పాటు విఫలమై, అందరికందరూ విశ్వాసాన్ని కోల్పోయినందునే, ప్రత్యామ్నాయ సృష్టి అయినా జరగనందునే, నేపాల్ భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనిజులా ముడిచమురుపై డేగకన్ను
అమెరికా చరిత్రలో అతిపెద్ద మిలిటరీ ఖర్చు బిల్లును 2026 సంవత్సరానికి గానూ 90,100 కోట్ల డాలర్లతో ప్రతినిధుల సభ ఆమో దించింది. లాటిన్ అమెరికాలో సరికొత్త యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతున్న తరుణంలో, ఈ వ్యయ బిల్లు ఆమోదం కోసం డెమోక్రాట్లు కూడా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. ఇప్పటికే జూలైలో కేటాయించిన 15,600 కోట్ల డాలర్ల అనుబంధ సైనిక వ్యయ నిధులతో కలిపితే, 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ప్రోత్సహించడానికి అమెరికా మొత్తం లక్షా 5,700 కోట్ల డాలర్లను వెచ్చించనుంది. ‘ఆపరేషన్ దక్షిణ గోళం’ పేరిట కరేబి యన్ ప్రాంతానికి ఎఫ్–35 స్టెల్త్ ఫైటర్లు, యుద్ధనౌకలను తరలించడం... 1962 క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత అతిపెద్ద సైనిక మోహరింపుగా పరిగణించవచ్చు. శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను అణచివేసే ఇఎ18జి వార్జెట్లు ఇప్పటికే ప్యూర్టోరికో చేరు కున్నాయి.అమెరికా చూపు ఇప్పుడు వెనిజులాలోని అపారమైన ముడి చమురు నిల్వలపై పడింది. ప్రపంచంలోనే అత్యధికంగా 20 శాతం ముడిచమురు నిల్వలు (సుమారు 30,000 కోట్ల బారెల్స్) ఈ చిన్న దక్షిణ అమెరికా దేశంలోనే ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. గతంలో అధ్యక్షుడు ఛావెజ్ చమురు పరిశ్రమలను జాతీయం చేసి, 2005లో భూసంస్కరణల ద్వారా సామాన్య రైతాంగాన్ని భూస్వాముల నుండి విముక్తి చేశారు. అదే ఏడాది 13 లాటిన్ అమెరికా దేశాలు కలిసి వాణిజ్య సమాఖ్యగా ఏర్పడి స్వల్ప ధరలకే ముడిచమురును అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్నాయి. 2008లో బ్యాంకులను జాతీయం చేయడం, రష్యాతో కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా అమెరికా ఆయిల్ కంపెనీల ఆధిపత్యాన్ని వెనిజులా తగ్గించింది. ఇవన్నీ అమెరికాకు మింగుడుపడని అంశా లుగా మారాయి.ప్రస్తుతం ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాదం’ ముసుగులో మదూరో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వాషింగ్టన్ కుయుక్తులు పన్నుతోంది. ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే సంస్థతో వెనిజులా నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయని అమెరికా ఆరోపిస్తుండగా, అధ్యక్షుడు మదూరో, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ వాదనలను తిరస్క రిస్తున్నారు. వెనిజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగా ప్రకటించారు.యుద్ధ తంత్రాన్ని అమెరికా మరింత క్రూరంగా మార్చి, నేరుగా భూభాగంలోకి సైన్యాన్ని పంపకుండా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో దాడులు చేసే వ్యూహంలో ఉంది. ఇటీవల డ్రోన్ల దాడిలో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోవడం దీనికి నిదర్శనం. ఆయుధ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అమెరికా ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తోంది.గత నాలుగేళ్లలో ఉక్రెయిన్కు 17,000 కోట్ల విలువైన ఆయుధాలను, ఇజ్రాయెల్కు భారీగా ఆయుధ సామగ్రిని సరఫరా చేస్తూ అమెరికా తన యుద్ధ దాహాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమా సియాలో చమురు ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ను అంగరక్షకుడిగా వాడుకున్నట్లే, ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులాలో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. 1946 నుండి ఇప్పటివరకు ఇజ్రాయెల్కు సుమారు 35,000 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించిన అమెరికా, ఇప్పుడు సహజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా వెనిజులాపై దాడికి సిద్ధమవు తోంది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ సాగుతున్న ఈ యుద్ధ క్రీడలో వెనిజులా ఇప్పుడు బలిపీఠంపై ఉంది.– జమిందార్ బుడ్డిగఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
మయన్మార్లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పేరు సరే... తీరు మారేనా?
2005లో నాటి యూపీఏ–1 ప్రభుత్వం ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం’ పేరిట, గ్రామీణ కుటుంబాల వారికి సాలీనా వంద పని దినాల ఉపాధి హామీ చేస్తూ ఒక పథకాన్ని ప్రవేశ పెట్టింది. దాని కింద అర్హులైన గ్రామీణ పేదలకు వారు పనిని కోరిన 15 రోజుల లోగా ఉపాధిని కల్పించవలసి ఉంటుంది. అలా జరగకుంటే, వారికి నిరుద్యోగ భృతిగా, నిర్దిష్ట మొత్తాన్ని అందించవలసి ఉంటుంది. గ్రామీణ పేదలకు, వారికి రోజువారీ కూలీ పనులు దొరకని రోజులలో, వారికి ఉపాధిని కల్పించడం ద్వారా, వారి కొనుగోలు శక్తినీ, మార్కెట్ డిమాండ్నూ కాపాడటం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం తన ఉద్దేశిత లక్ష్యాలను అత్యద్భుతంగా నిర్వహించగల్గింది. దీనికి తార్కాణమే 2008లో అమెరికా కేంద్రంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తీ, మార్కెట్ డిమాండ్ పతనమైన కాలంలో ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం మన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఆ సంక్షోభ తీవ్రతకు తార్కాణమే, 2007–08 కాలం వరకూ సగటున 9%గా ఉన్న మన దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 2008–09లో 6.7%కి పతనం కావడం. అదా ఘనత?ఈ క్రమంలోనే 2009 ఫిబ్రవరిలో, దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ పథకానికి కేటాయింపులను, అంతకు ముందరి సంవత్సరపు బడ్జెట్లో కంటే 144% మేరన భారీగా పెంచారు. తద్వారా నాడు ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం ఆసరాగా చేసుకుంది. ఈ పథకానికి కేటాయింపులను పెంచడం వలన అప్పటి (2008–09) ప్రభుత్వ ద్రవ్య లోటు, దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 6.2%కి పెరిగింది. ఈ ద్రవ్య లోటు, అంతకు ముందరి ఆర్థిక సంవత్సరం (2007–08)లో కేవలం 2.7%గా ఉండటం గమనార్హం. అంటే, నాటి యూపీఏ ప్రభుత్వం సంక్షోభ పరిస్థితులలో ప్రజల కొను గోలు శక్తిని కాపాడేందుకుగానూ ప్రభుత్వ వ్యయాలకు లక్ష్మణ రేఖగా భావించబడే ద్రవ్య లోటు పరిమితులను కూడా దాటేందుకు వెనుకాడలేదు. అయితే, యూపీఏ–2 హయాం చివరి నాటికే, ఈ పథకం అమలులో మొదలైన అలసత్వం, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో మరింత తీవ్రతరమైంది. ఈ సందర్భంలోనే మోదీ, జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనా వైఫల్యాలకు సజీవ తార్కాణంగా పేర్కొనడాన్ని గుర్తు చేసు కోవచ్చు. అంతకాలం తరువాత కూడా ప్రజలకు జీవనోపాధిగా ఈ పథకం అవసరం ఏర్పడిందనేది మోదీ మనోగతం. విమర్శ బాగానే ఉంది. కానీ, నేడు మోదీ హయాంలోనూ 80 కోట్ల మందికి, ధాన్యం గింజలను ఉచితంగా పంచే ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం అమలులో ఉండటం ఏ ‘ఘనత’కు తార్కాణం?కేటాయింపులేవీ?నిజానికి, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసు కుంటే, ఈ పథకానికి కేటాయింపులు, ఏటికేడు తగ్గి పోతున్నాయి. 2025–26 బడ్జెట్లో కేటాయింపు రూ. 86 వేల కోట్లు. అంతకు ముందరి బడ్జెట్(2024– 25)లోనూ కేటాయింపులు దరిదాపు అంత మొత్తమే. 2025–26 బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఫిబ్రవరి 1, 2025 నాటికి, దాని ముందరి బడ్జెట్ కాలానికి సంబంధించిన రూ. 9,860 కోట్ల నిధుల లోటు ఉంది. 2025 జన వరి 25 నాటికి చెల్లించకుండా ఉండిపోయిన, కూలీల వేతనం బకాయి రూ. 6,948 కోట్లు. అంటే, వీటన్నింటినీ ఈ సరికొత్త 2025–26 బడ్జెట్ కేటాయింపులో భర్తీ చేసుకోవాలి.మరో కోణాన్ని తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఈ పథకం సాలీనా 100 రోజుల పని దినాలను హామీ చేసింది. వాస్తవంలో అనేక సంవత్సరాలుగా తలసరిన ఒక్కో కూలీకి లభిస్తోన్న పని దినాలు 50 మాత్రమే. ఫిబ్రవరి 2025 గణాంకాల ప్రకారం, లభించిన పని దినాలు 44 మాత్రమే. అలాగే, వేతనాల చెల్లింపులకు ఆధార్ అనుసంధానం పేరిట అదనపు చిక్కుముడులు, డిజిటల్ హాజరు అంటూ సృష్టించిన సంక్లిష్టతల నేపథ్యంలో గ్రామీణ పేదలకు ఉద్దేశించిన ఈ పథకం మరికొంత దూరమయ్యింది. నేడు సరికొత్తగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘వీబీ – జీ రామ్ జీ’ బిల్లులోని బయో మెట్రిక్ ధ్రువీకరణలు, జియో స్పేషియల్ టెక్నాలజీల తప్పనిసరి అమలు వంటివన్నీ పేద ప్రజానీకానికి ఈ పథకాన్ని మరింత దూరం చేసేవే. వీటన్నింటికి తోడు...ఇదంతా చాలదన్నట్లుగా ఈ సరికొత్త పథకం తీరు ‘సొమ్మొకడిది సోకొకడిది’గా మారుతోంది. గతంలో, 90% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేది. మిగతా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా ఉండేది. ఇప్పుడు కేంద్రం వాటాను 90% నుంచి 60%కి తగ్గించుకొని, రాష్ట్రాల వాటాను 10% నుంచి 40%కిపెంచేశారు. 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ వలన పన్నుల ఆదాయంలో కేంద్రం వాటా పెరిగిపోయింది. ఆర్థిక వనరుల విషయంలో కేంద్రం పెత్తనం పెరిగింది. ఇప్పుడు ఈ సరికొత్త ఉపాధి పథకం రూపంలో రాష్ట్రా లపై మరింత భారాన్ని పెడుతున్నారు. అదీ కథ!ఇక, ‘ఉట్టికెక్కలేనమ్మ, స్వర్గానికి ఎగురుతాను అన్నట్టుగా’ ఈ కొత్త పథకం, దాని పాత రూపంలోని వంద రోజుల పని దినాల హామీ స్థానంలో... 125 రోజుల ఉపాధిని వాగ్దానం చేస్తోంది. పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగిన మేర లేకపోవడం, రకరకాల బ్యురాక్రటిక్ ఆటంకాల వలన ఈ పథకం ఇప్పటికే అరకొరగా నడు స్తోంది. అలాంటిది పని దినాలను 125 రోజులకు పెంచుతున్నామంటూ చేస్తోన్న సరికొత్త వాగ్దానం, నిజంగా అమలు జరిగేనా? పాత పథకం పేరులోని మహాత్మా గాంధీ పేరును తొలగించి వేయడం నేడు వివాదానికి మరొక కేంద్ర బిందువు అవుతోంది. పథకం పేరు నుంచి గాంధీని మినహాయించడం కూడా, ఆయన ఆత్మకు కొంత శాంతిని కల్గించడమేనేమో! సత్యాన్ని నమ్ముకున్న గాంధీజీ పేరు... అసత్యానికి మేలి ముసుగుగా ఉపయోగపడకపోవడం కాస్తంత మంచిదే!‘వీబీ – జీ రామ్ జీ’ పథకం, దాని పాత రూపంలోని వంద రోజుల పని దినాల హామీ స్థానంలో... 125 రోజుల ఉపాధిని వాగ్దానం చేస్తోంది. బడ్జెట్ కేటాయింపులు తగిన మేర లేకపోవడంతో ఆ పథకం ఇప్పటికే అరకొరగా నడుస్తోంది. అలాంటిది పని దినాలను పెంచుతున్నామంటూ చేస్తున్న వాగ్దానం నిజంగా అమలు జరిగేనా?డి.పాపారావు-వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ)‘ (వీబీ–జీ రామ్ జీ) అనే నూతన బిల్లును లోక్సభలో ఆమోదించింది. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న నిబంధనలు గ్రామీణ శ్రామిక వర్గం హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ఈ బిల్లులో 8 అధ్యాయాలు, 37 సెక్షన్లు, రెండు షెడ్యూళ్లు ఉన్నాయి. ఎమ్జీ నరేగా చట్టం గ్రామీణ వయో జనులకు 100 రోజుల పనిని హక్కుగా కల్పిస్తూ, డిమాండ్ ఆధారిత బడ్జెట్ కేటాయింపులతో నడుస్తోంది. అయితే, నూతన బిల్లు ఈ చట్ట మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తోంది.నిధులకు లోబడి...పాత చట్టం ప్రకారం, పనులు అడిగిన వారందరికీ బడ్జెట్ పరిమితి లేకుండా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండేది. కానీ, నూతన బిల్లులోని సెక్షన్4(5) ప్రకారం, కేంద్రం ప్రతి రాష్ట్రానికీ ఎంత బడ్జెట్ ఇవ్వాలో ముందే నిర్ణయిస్తుంది. దీనివల్ల పని హక్కు అనేది నిధుల లభ్యతకు లోబడి ఉంటుంది. సెక్షన్ 4(6) ప్రకారం, కేంద్రం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చయితే ఆ భారాన్ని పూర్తిగా రాష్ట్రాలే భరించాలి. నిధుల కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారంతో ఉపాధి పనులకు స్వస్తి చెప్పే ప్రమాదం ఉంది.కొత్త బిల్లులోని సెక్షన్ 6(2) ప్రకారం, వ్యవసాయ సీజన్లో కూలీల లభ్యత కోసం 60 రోజుల పాటు ఉపాధి పనులను నిషేధిస్తున్నారు. ఇది రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ, వాస్తవ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఉపాధి పనులు చేసే వారిలో 36% దళిత, గిరిజనులు కాగా, మిగిలిన 64% మందిలో మెజారిటీ చిన్న , సన్నకారు రైతులే ఉన్నారు. వీరు తమ సొంత పనులు లేనప్పుడే ఉపాధి పనులకు వెళ్తున్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే... 70– 80% పని దినాలు ఫిబ్రవరి నుండి జూన్ మధ్య, అంటే వ్యవసాయ పనులు లేని కాలంలోనే జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో 60 రోజుల నిషేధం అనేది ‘బోడి గుండుకీ మోకాలికీ ముడివేయడం’ వంటిదే. ఇది కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) వంటి ప్రధాన సమస్యల నుండి రైతుల దృష్టిని మళ్లించే కుట్రగా కనిపిస్తోంది.ప్రస్తుత చట్టం ప్రకారం వ్యయంలో 90%కేంద్రం, 10% రాష్ట్రాలు భరిస్తున్నాయి. నూతన బిల్లులో కేంద్రం వాటా 60%కి తగ్గించి, రాష్ట్రాల వాటాను 40%కి పెంచారు. దీనివల్ల దేశవ్యాప్తంగా రాష్ట్రాలపై సుమారు రూ. 37,500 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్పై 2,600 కోట్లు, తెలంగాణపై రూ. 1,300 కోట్ల అదనపు భారం పడనుంది.ప్రభుత్వం 100 రోజుల పనిని 125 రోజులకు పెంచుతున్నామని ప్రచారం చేస్తోంది. కానీ, పాత చట్టంలో ‘కనీసం 100 రోజులు’ అని ఉంది తప్ప, గరిష్ఠ పరిమితి లేదు. మోదీ హయాంలో గత ఏడాది కేవలం 8% లోపు కుటుంబాలు మాత్రమే 100 రోజుల పనిని పూర్తి చేయగలిగాయి. నిధుల కేటాయింపులను 4% నుండి 1.37%కి తగ్గించి, 125 రోజుల పని ఇస్తామనడం కేవలం ప్రజలను మభ్యపెట్టడమే! ప్రస్తుతం సగటున ఒక కుటుంబానికి 50 రోజుల పని కూడా దొరకడం లేదు.ఎమ్జీ నరేగాలో గ్రామసభల ద్వారా పనుల ప్రణాళిక జరిగేది. కానీ కొత్త బిల్లులో ‘నేషనల్ రూరల్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్’ ద్వారా కేంద్రమే పనులను నిర్ణయిస్తుంది. ఇది గ్రామసభల హక్కులను కాలరాస్తూ, బ్యూరోక్రసీకి అధికారం కట్టబెడుతోంది. వేతన నిర్ణయంలో కూడా కనీస వేతన చట్టం–1948తో సంబంధం తెంచేశారు. ద్రవ్యోల్బ ణానికి అనుగుణంగా వేతనాలు పెరిగే అవకాశం ఇక ఉండదు. టెక్నాలజీ పేరుతో ఇప్పటికే ఆధార్, కేవైసీ నెపంతో కోట్లాదిమంది జాబ్ కార్డులను రద్దు చేశారు. బయోమెట్రిక్, ఫొటో అప్లోడ్ వంటి కఠిన నిబంధనల ద్వారా కూలీలను పనులనుండి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది.పేరు మార్పు – రాజకీయ ఎజెండాఈ పథకం నుండి మహాత్మాగాంధీ పేరును తొలగించి, హిందూత్వ ఎజెండా ప్రతిబింబించేలా ‘వీబీ–జీ రామ్ జీ’ అని పేరు మార్చారు. అక్షరాల కూర్పులో కూడా తమ రాజకీయ ఎజెండా నెరవేరేలా హిందీ, ఇంగ్లీష్ పదాలను కలిపారు. ఒక ఆరోగ్య కరమైన కుక్కను చంపాలనుకున్నప్పుడు అది ‘పిచ్చి కుక్క’ అని ప్రచారం చేసినట్లుగా, అద్భుతంగా అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం దానిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, కొత్త చట్టం ముసుగులో పేదల పొట్ట కొడుతోంది. దీనిపై శ్రామికులు ఉద్యమించాలి.బి.వెంకట్- వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంజాతీయ ప్రధాన కార్యదర్శి -
ఎదురుగాలికి ఎదురొడ్డి నిలిచి...
నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడి గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన రోజు. తెలుగు ప్రజలను అత్యంత ప్రభావితం చేస్తున్న రాజ కీయ నేత ఆయన. వైఎస్సార్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అసాధారణ నాయకత్వ లక్ష ణాలు కలిగి, విలువల కోసం తపించే నేతగా తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. జగన్ రాజకీయంగా వేసిన తొలి అడుగు నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు ప్రతి అడుగు అనేక ఆటంకా లను అధిగమించింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు అసలు జగన్ రాజకీయాల్లో నిలబడగలడా అన్న అనుమానం కలిగే విధంగా ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక వైపు అధికార కాంగ్రెస్, రెండవ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం – పేరుకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా... జగన్ విషయంలో ఏకమై నాయి. అదెంతగా అంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెడితే విపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం విప్ జారీ చేసి మరీ అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసింది. ఈ పరిణామం బహుశా భారతదేశ రాజకీయాలలో అరుదైన ఘటన. అప్పుడే రాజకీయ ప్రవేశం చేసిన ‘ప్రజా రాజ్యం’ కూడా జగన్కు వ్యతిరేకంగా అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. పార్టీగా ముందుకు సాగుతున్న దశలో 16 నెలలు జైలులో ఉండాల్సిన పరిస్థితి మరోవైపు దాపురించింది. ఒక్క రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న అంశం తప్ప చుట్టూ అన్నీ ప్రతికూల పరిస్థితులే. వైఎస్సార్ సాధించి పెట్టిన వెలకట్టలేని ‘ప్రజాభిమానం’ అన్న ఆయుధాన్ని చేపట్టి ‘ఏమైనా సరే నిల బడాల్సిందే, చావో రేవో తేల్చుకోవాల్సిందే’ అని ఆయన చేసిన సుదీర్ఘ రాజకీయ పోరాటం తిరుగులేని నాయకుడిగా, జనం మెచ్చిన నేతగా ఆయన్ని మార్చింది. నాడు జగన్పై నమోదు అయిన సీబీఐ కేసులను నిశితంగా పరిశీలిస్తే... ఆయన్ని వీలైనన్ని ఎక్కువ రోజులు జైలులో పెడితే పురిటిలోనే పార్టీ మట్టిగొట్టుకు పోతుందన్న వ్యూహం కనిపి స్తుంది. ఈ పరిస్థితుల్లో మరో నాయకుడైతే ఏదో ఒక స్థాయిలో రాజీపడి ఉండేవారు. కానీ జగన్ మొండిగా ప్రజలను నమ్ము కుని ముందుకు సాగారు. అందు వల్లే ఆయన రాజకీయంగా హీరోగా, పోరాట యోధుడిగా మారారు. తొలి ఎన్నికల్లో సంపూర్ణ విజయం దక్కక పోయినా నిలదొక్కుకున్నారు. 2014 నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు పోరాటాలు విస్తృతంగా నిర్వహించారు. ‘ప్రజా సంకల్ప యాత్ర’తో పార్టీని విజయం వైపు నడిపారు. ఎన్నికల హామీల అమలుకు విశ్వసనీయతజగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తన మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి అమలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర విస్తృత ప్రయోజనాల ప్రాతిపదికన పరిపాలనా ప్రాథమ్యా లను నిర్ణయించుకున్నారు. ప్రజల ముంగిటకు పాలన తీసుకు వెళ్లడం కోసం గ్రామ ‘సచివాలయ’ వ్యవస్థను సృష్టించి 1.30 లక్షల శాశ్వత ఉద్యోగులు, 2.7 లక్షల వాలంటీర్లను నియమించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో సైతం విప్లవం తెచ్చారు. ‘కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ఆఖరికి రాజకీయాలు చూడం... అర్హత ఉంటే చాలు ప్రతి పేదవాడికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు’ అంటూ అందరినీ ఆదుకున్న చరిత్ర, సమానంగా ఆదరించిన ఘనత జగన్ది. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి అధికా రంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలుకు ఉన్న పరి మితులు చెప్పడం రాజకీయాల్లో సహజం. కానీ జగన్ అందుకు భిన్నంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఏకంగా ఓ వ్యవస్థనే సృష్టించారు. ప్రతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ లను మరిచిపోవడం సాధారణమైన రోజుల్లో... జగన్ అందుకు భిన్నంగా ‘గడప గడపకూ మీ ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చిన సంగతిని ప్రజ లకు గుర్తు చేస్తూ... పాలన చేయడం ఒక సాహసం.అభివృద్ధి–దూరదృష్టి మేళవించిన విజనరీ మెజారిటీ ప్రజలకు తమ అవసరాలు తీరడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంటి వద్దకు తీసుకుపోవడం ఒక గొప్ప ప్రయత్నం. అధికార వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ. గ్రామ ‘సచివాలయ వ్యవస్థ’, ‘ఆర్బీకే’, ‘విలేజ్ క్లినిక్లు’, ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి అనేక వ్యవస్థలు గ్రామంలోనే అన్ని అవసరాలూ తీర్చేలా రూపొందాయి. ‘నాడు–నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠ శాలలు ఆధునీకరించడం, పట్టణాలకే పరిమితం అయిన ఆంగ్ల బోధనను గ్రామీణ స్థాయికి తీసుకు రావడం ద్వారా... పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ను అందించారు. పోర్టులు, షిపింగ్ హార్బర్ల ఏర్పాటు; ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పేరుతో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ సారథ్యంలో నెలకొల్పడం వంటివి ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశాయి. కరోనా సమయంలో జనం అతలాకుతలం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఆధునిక వైద్యం ప్రధాన పట్టణాలకు పరిమితం కావడం. అందుకే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలందించ వచ్చని ఆయన భావించి, వాటి నిర్మాణం చేపట్టారు. మొత్తంగా ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తే... ప్రజలకు ఏదో చేయాలి అన్న తపన, అందుకోసం ఎంత సాహసం చేయడానికైనా వెనుకాడనితనం కనిపిస్తుంది. ఈ వ్యవహార శైలితోనే తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి తగ్గ వారసుడిగా తెలుగు ప్రజల మధ్య నిలబడ్డారు. ఆయన జన్మదినం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.మాకిరెడ్డి పురుషోత్తమ్రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరమ్సమన్వయ కర్త -
అనితర సాధ్యుడు
ధరిత్రిలో చరిత్ర సృష్టించేవాళ్ళు కొందరే ఉంటారు. వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది. కాలం కలకాలం వారిని గుర్తుంచుకుంటుంది. సమ కాలీన భారత రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తుంగ తరంగం ఎగిసింది. హిమాలయ శృంగ సమా నమై నిలిచింది. ఆ తరంగం పేరే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. మన మాజీ ముఖ్యమంత్రి. ప్రజలు ముద్దుగా, గౌరవంగా, ఆత్మీయంగా పిలుచుకునేది ‘జగన్’ అని! ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఒక కఠోర శ్రమ, ఒక నిరంతర దీక్ష, ఒక పట్టుదల, ఒక ఆత్మీయం – జగన్. అలజడి, ఆందోళన, తిరుగుబాటు ఆయన తత్త్వం. బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు జగన్. ఓ 36 ఏళ్ల యువకుడు, రాజకీయ పసిబాలుడు సమాజపు అట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయడం ఆశ్చర్యం. అది జగన్కే చెల్లింది. 125 సంవత్స రాల కాంగ్రెస్ పార్టీని కదిపి, కుదిపి, ధిక్కరించి, ఛీత్కరించి తన అసామాన్య, అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి రాష్ట్రంలో, దేశంలో లేకుండా చేయటం అన్నది మాటలు కాదు. మహామహులకు సాధ్యం కాని పని జగన్మోహన్ రెడ్డి చేయడం జగత్తు చూసి ముక్కున వేలేసుకుంది.ప్రియమైన వారసుడుమహానేత, తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్యవిధాత అయిన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హఠాత్తుగా అందర్నీ వీడి పోతే... ఆ బాధ భరిస్తూ, ఆ అనంత శోకాన్ని ఎదలో మోస్తూ, తండ్రి ఆశయ సాధన కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్. తండ్రి ఆశయం కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు సిసలు యుద్ధవీరుడు. తండ్రి ఆస్తులకు కాదు, ఆశయాల కోసం నిలబడాలి అని ప్రజల పక్షం వహించి, లోకంలో ఆశయం కోసం ఎలా ఉండాలో పోరాటం చేసి చూపిన యోధుడు.పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రత్యర్థులు ప్రతి క్షణం వెనక్కి లాగుతున్నా, ప్రజల కోసం అడుగులు వేసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న వ్యక్తి జగన్. ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం, నమ్మకం పెంచుకుంటున్న పరిస్థితిని పసిగట్టి జగన్ను అణిచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలిసిందే.మహానేత మరణాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్రం అల్లాడి పోయింది. దాదాపు 673 మంది ప్రజలు ఆత్మహత్య చేసు కున్నారు. తన తండ్రి కోసం తనువులు వీడిన ఆ కుటుంబాలను పలకరించాలని, పరామర్శించాలని జగన్ సంకల్పించారు. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించలేదు. ఆ యువకుడు కదిలితే అతని వెంట కోట్లాది జనం నడుస్తారని వారికి తెలుసు. అది ఇష్టం లేక ఆ కుటుంబాలను ఒక చోటికి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ అధిష్టానం. చెప్పుడు మాటలకు తలవొగ్గి జగన్మోహన్రెడ్డికి గిరి గీయాలి అని ప్రయత్నించింది సోనియా గాంధీ.బాధిత కుటుంబాలను తన దగ్గరకు పిలిపించుకోవడం న్యాయం కాదనీ, తానే వారి దగ్గరికి వెళ్లి పలకరించడం భార తీయ ధర్మం, సంప్రదాయం అనీ ఆయన చెప్పినా అంగీకరించ లేదు సోనియా గాంధీ. అన్యాయాన్ని, అధర్మాన్ని అంగీకరించి తలవంచడం తెలి యని జగన్, ఆమె మాట కాదన్నాడు. ఆ అభాగ్యుల చెంతకు తనే స్వయంగా వెళ్ళటానికి నిర్ణయించి అడుగు ముందుకు వేశాడు. అది అభిమాన జనప్రవాహంతో ఓదార్పు యాత్రగా మారింది. ఆ యువకుడిని, తమ ప్రియమైన డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర రెడ్డి కుమారుడిని చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు, ప్రజా సముద్రం కదిలింది. జగన్ మాట్లాడుతూఉంటే, ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, ఆదరంగా భుజంమీద చేయి వేస్తూ ఉంటే, చేయి ఊపి దగ్గరికి పిలుస్తూ ఉంటే, ‘నేను ఉన్నాను’ అని నమ్మకం ఇస్తూ ఉంటే, ఆంధ్ర ప్రజలు ఆప్యాయ తతో పొంగిపోయారు. కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నా డని ఆనందపడ్డారు. అతడే తమ నాయకుడు, పరిపాలకుడు కావాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి మారుగా తనయుడు తమ కష్టాలు తీరుస్తాడని త్రికరణ శుద్ధిగా నమ్మారు.అవిశ్రాంత యోధుడుజగన్ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణ చూసి, ప్రత్య ర్థులకు, సోనియా గాంధీకి, చంద్రబాబుకు కన్ను కుట్టింది, వెన్ను జలదరించింది. అతని ముందు నిలబడలేమని అర్థమైంది. ఆనాడు అభిమన్యుడి మీదికి కుట్రతో ఉరికిన కురు మూకల మాదిరి ప్రత్యర్థులు సోనియాగాంధీ, చంద్రబాబు కుయుక్తులు పన్నారు, కుతంత్రాలు చేశారు. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకున్నా, పరిపాలనలో పాలుపంచు కోకున్నా సీబీఐని ఉసిగొల్పారు. దాని ఫలితం అనేకమైన అబద్ధపు కేసులు పెట్టి, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం బెయిలు కూడా రాకుండా అక్రమ నిర్బంధం చేశారు. మానసికంగా కుంగదీయాలని అనేక ప్రయత్నాలు చేశారు.అన్ని రోజుల పాటు జైలులో అనంత ఏకాంతంలో ఉన్నా జగన్ మనోబలం ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలకు సేవ చేయా లన్న పట్టుదలలో వెనుకంజ వేయలేదు. తాత నుండి ఆత్మస్థైర్యం, తండ్రి నుండి మనోబలం, తల్లి నుండి సహనం సహజంగా అతనికి అబ్బిన గుణాలు. చెక్కుచెదరని అసాధారణ సాధనతో, మనో నిబ్బరం సడలని బలంతో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చాడు. మరొకరైతే చెదిరి బెదిరి విలువలకు తిలోద కాలు ఇచ్చి, కాడె పారేసి కదలి వెళ్లిపోయేవారు. ఎన్ని దాడులు, ఎన్ని విమర్శలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని ప్రచారాలు, ఎంత వైషమ్యం, ఎంత విషం తమ పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా నిత్యం ప్రత్యర్థులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసత్యాన్ని సత్యం అని చెబుతూనే ఉన్నారు. జగన్మోహనుడు ఏ మాత్రం జంక లేదు. ఏ మాత్రం తొణకలేదు. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా జనాన్ని నమ్మి కదన రంగంలోకి కొదమ సింహంలా ఉరికాడు. ఆత్మీయులను ఆదరిస్తూ 2014 ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు. ప్రజలలో అదే ఆదరణ, అదే నమ్మకం.అబద్ధం చెప్పలేను, మోసం చేయలేను, అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వలేను అని విలువలకై నిలబడ్డాడు. ప్రత్యర్థులు, చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. అధికారం వస్తే చాలని అబద్ధాల కుప్పలు ప్రజల ముందు పోశారు. ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అని ఒకే ఒక అబద్ధం జగన్ చెప్పి ఉంటే అధికారం దక్కేది. మోసం చేయను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోలేదు, ప్రజల పక్షాన నిలబడటం మానలేదు. ఆయనకు కావాల్సింది అధి కారం కాదు, జన క్షేమం. చంద్రబాబు బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. అయినా చంద్ర బాబు ప్రభుత్వం మీద జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు. ప్రతిపక్షంలో ఉండి, ప్రజల పక్షం నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన శాసన సభ్యుల్ని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ధైర్యం కోల్పోలేదు. బడుగు, బలహీన వర్గాల కోసం, పేదల కోసం గళం ఎత్తుతూనే ఉన్నాడు.సహృదయ నాయకుడుజనం కోసం జగన్ జరిపిన సుదీర్ఘ పాదయాత్ర మరొక చరిత్ర. తండ్రిలాగే తాను జనం మధ్యకు వెళ్లాలనీ, కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలనీ, రైతుల గోడు వినాలనీ, నిరుద్యోగుల, ఉద్యోగుల, ఆడపడుచుల బాధలు వినాలనీ, ఓదార్చాలనీ, ధైర్యం చెప్పాలనీ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు జగన్. సెక్యూరిటీ వారు వద్దన్నా, ఆత్మీయులు ప్రేమగా వారించినా కాదని ప్రజల కోసం ఎండనకా, వాననకా అడుగులు వేశాడు. కాళ్లు బొబ్బలు ఎక్కాయి, హఠాత్తుగా ఆరోగ్యం సహకరించలేదు, హత్యా ప్రయత్నం జరిగింది, ప్రతీప శక్తులు హేళన చేశాయి. ఏవీ ఆయన లెక్కలోకి తీసుకోలేదు. దీక్ష, పట్టుదల, పేదల పట్ల ప్రేమ, సేవ చేయాలన్న ఆశయం ఆయనను నడిపించాయి. ప్రతిరోజూ ఇరవై వేల మందిని కలుస్తూ, కన్నీళ్లు తుడుస్తూ, ధైర్యం ఇస్తూ కదిలాయి ఆయన పాదాలు. ఆ పాదస్పర్శకు నేలతల్లి పులకించింది. ఆయన మాటల ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది.పేదలు, వృద్ధులు, రోగగ్రస్థులు, ఎందరో ఆయనకు గోడు వినిపించుకున్నారు. పుండ్లతో శరీరం కుళ్ళి రసి కారుతూ దగ్గరకు వెళ్ళటానికి జుగుప్స కలిగించే వారిని సైతం ఆలింగనం చేసుకొని అక్కున చేర్చుకున్న అమృత హృదయం జగన్ మోహన్ రెడ్డి గారిది. ముగ్గుబుట్ట వంటి తలా, ముడ తలు దేరిన దేహం, కాంతి లేని కళ్ళతో దీనంగా, హీనంగా, దైన్యాతిదైన్యంగా ఆదరణ కోసం, ఆత్మీయత కోసం, సహాయం కోసం, సానుభూతి కోసం ఎదురుచూస్తున్న నిర్భాగ్య సోదర సోదరీమణుల్ని ఆప్యాయంగా, ప్రేమగా, అత్యంత సన్నిహి తంగా దగ్గరకు తీసుకున్న మొదటి, ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగనే! అంతరంగంలో అపారమైన ప్రేమ, దయ, జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు.అపూర్వమైన సంస్కారం ఆయనది. తనకన్నా చిన్నవారిని, నౌకర్లను, డ్రైవర్లను, సెక్యూరిటీ వారిని అందరినీ ‘అన్నా’ అని పిలిచే సహృదయత ఆయనది. ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరే రాజకీయ నాయకుడూ ఇవ్వడు. పాదయాత్రతో మరింత ఎదిగాడు. ప్రజల మనసులలో నమ్మకం పెంచాడు. వారికి ఏం కావాలో, తనేం చేయాలో నిర్ణయించుకున్నాడు. పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నాడు. నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం. చేయాలనుకున్నది చేసి తీరే పట్టుదల. కన్నీటి కథలకు, వెతలకు, కరిగిన ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం.ఒకే ఒక్కడు2019 ఎన్నికలు వచ్చాయి. ఒక్కడే ఒకే దీక్షతో నారాయణ ధనుర్ముక్త బాణంలా జనంలోకి వచ్చాడు. పర్జన్య గర్జన్యం వంటి ఆయన వాక్కు హామీ అందరూ ఆదరించారు. 151 సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేను అధికారిని కాను, సేవకుడిని అని ఆ క్షణమే చాటాడు. తను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే తన శాసనాలనీ, తన మ్యానిఫెస్టో తన ఖురాను, బైబిలు, భగవద్గీత అనీ, కడుపు నిండని పేద తన దేవుడనీ నమ్మి పరిపాలన సాగించాడు.తను ఇచ్చిన వాగ్దానాలలో దాదాపు అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదవాడు మూడు పూటలా భోజనం చేయడానికి ఆయన ప్రథమ ప్రాధాన్య మిచ్చాడు. వారి ఇంటి ముంగిటకే తీసుకువెళ్లి రేషన్ అందించాడు. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభు త్వాన్ని వారి ఇంటి పక్కన నిలిపాడు. వాలంటీర్లుగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. వారి ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు, విధవలకు పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశాడు. ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావడం మనందరి గర్వకారణం, అదృష్టం. రెండు సంవత్సరాలు కరోనాతో దేశం స్తంభించిపోయింది. ఆర్థికపరంగా అన్ని వ్యవస్థలూ అతలాకుతలమయ్యాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఏ పథకమూ ఆగలేదు. ఏ నిరుపేదా ఆకలితో ఉండలేదు. అనేక పట్టణాలలో అభాగ్యు లకు రెండు పూటలా ఆహార పొట్లాలు అందించాడు. అందరికీ వైద్యం అందింది. ఈనాటి పాలకులు, సనాతన ధర్మ రక్షణ పరులు ఇళ్లల్లో ముడుచుకుని మూలన పడుకుంటే ప్రజలకు చేరువగా జగన్ ఉన్నాడు.ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటి సారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన మొదటి ముఖ్యమంత్రి జగనే. తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్. పేదల కోసం ఇళ్ళ స్థలాలు ఇవ్వడమే కాకుండా, లక్షల ఇళ్లు నిర్మించాడు. పేద విద్యార్థులకు ఆర్థికసహాయం పథకం మరింత మెరుగు పరిచాడు. ప్రతి పేద పిల్లవాడూ చదువుకోవాలనీ, తద్వారా జీవన ప్రమాణం పెంచుకోవాలనీ ప్రభుత్వ పాఠశాలల్ని వేల కోట్లతో ఆధునీకరించాడు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాడు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు. పిల్లలను స్కూల్కు పంపితే చాలు... ఆ తల్లుల అకౌంట్లలో ఏటా రూ. 15 వేలు వేళకు ఇస్తూ, ‘అమ్మ ఒడి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఆధునిక లాప్టాప్లు, ఆరోగ్యకరమైన ఆహారం, యూనిఫాం అందించి, పెను మార్పులు తీసుకురావడానికి కారణమయ్యాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ర్థులను చేర్చడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారన్న మాట, కొన్ని పాఠశాలల్లో సీట్లు దొరకని మాట అక్షరాలా నిజం. ప్రజలు కొనియాడిన సత్యం.ధీరోదాత్తుడుదేశం మొత్తం మీద అతి తక్కువ కోవిడ్ మరణాలు జరి గింది మన రాష్ట్రంలోనే అన్నది జగమెరిగిన విషయం. పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. సీట్ల సంఖ్య పెంచాడు. హైందవ ధర్మ ప్రచారానికి, తిరుమల తిరుపతి దేవస్థానాల అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే. చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతిని, అరాచకాలను నేడు వారు జగన్ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతని కూటమి అనేక అబద్ధాలు ఆడాయి. జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామనీ, ఉచితాలు అందజేస్తామనీ, అసత్య ప్రచారాలు చేశాయి. ప్రజ లను ఆశపెట్టాయి, భ్రమలు కల్పించాయి. సాధ్యం కాని హామీలు అమలు పరుస్తామని అరచి, మోసం చేసి ప్రజల నోళ్లు కొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నిజానికి జగన్ పథకా లకు పేర్లు మార్చి కొత్త పథకాలుగా ప్రచారం చేసుకున్నారు తప్ప మరేమీ కాదు. కొత్త పథకం ఒక్కటీ లేదు. ఇప్పుడు ఏమీ అమలపరచలేక దీనికి కారణం జగన్ అని ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రాఫిక్ మాయాజాలంతో చిటికెల పందిళ్లు వేస్తున్నాయి. మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు. ఓ మహా నాయకుడిని మాయ మాటల వల్ల ఓడించి ఓడిపోయామని బాధపడుతున్నారు. అన్ని వర్గాల వారూ విలపిస్తున్నారు.గతంలో ఓడిపోయిన చంద్రబాబు మూడు సంవత్సరాలు మూలన ముక్కుతూ కూర్చుంటే – ఓటమిని, ప్రజల తీర్పును, హుందాగా స్వీకరించిన జగన్ వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజల కలంగా, గళంగా, బలంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను నిలదీస్తున్నారు, ప్రజలను మేల్కొల్పుతున్నారు. ఐదు సంవత్సరాల పాలనలో రెండేళ్లు కరోనాకు పోయినా, అద్భుతాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల హృదయాలలో, పేదల మనసులలో, సుస్థిర స్థానం సంపాదించుకున్న పాలకుడు. నేత అన్న పదానికి అర్థం చెప్పిన ప్రజా సేవకుడు. ఓటమికి కుంగని ధీరోదాత్తుడు. ప్రజా హృదయ గోవర్ధనమెత్తిన గోపాలుడు. వక్రబుద్ధులు, కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి జనుల కోసం స్థిరంగా నిలబడిన జననేత, అజేయుడు, అనితర సాధ్యుడు, సున్నిత మనస్కుడు, పేదల పక్షపాతి, ఆరోగ్య విద్యాదాత, ఆపన్నులకు వర ప్రదాత, సహాయానికి సహస్ర హస్తుడు, ఆంధ్రుల ఆరాధ్యుడు, భవిష్యత్ భాగ్యప్రదాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి, ఆలోచనాపరుడికి అనుచరుడిగా ఉండటం, ఆయనతో కలిసి నడవడం నాకు ఇష్టం, ఆనందం, సంబరం... సమున్నత గర్వం.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
పనిలో పారదర్శకతకు పట్టం
సంక్షేమ సంస్కరణల విషయంలో బహి రంగ చర్చ అవసరమైనదే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ (వీబీ జీ– రామ్ జీ) బిల్లుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమౌతున్న ఆందోళనలు... చారిత్రక ఉపాధి హామీ చట్టంలో వచ్చే మార్పులు కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయేమో అనే భయం నుంచి వచ్చాయి. అటువంటి ఆందోళనలను గౌరవించాల్సిందే. అయితే ఊహల కంటే కూడా ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లు అసలు ఏం చేస్తుందో క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. ఈ బిల్లులోని అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే, ఇది ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు ఉపాధి కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతిని అందించే నిబంధనను కూడా ఈ బిల్లు కలిగి ఉంది. 125 రోజుల గ్యారంటీ పని!జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో బలహీనత అనేది ఉద్దేశంలో లేదు... నిర్మాణపరమైన లోపాలలో ఉంది. ఈ విషయంలో సంస్కరణలు అవసరం. ‘వీబీ–జీ రామ్ జీ’ని ఈ వాస్తవికతకు అనుగుణంగా అంచనా వేయాలి. హక్కులను బలహీనపరచడానికి బదులుగా ప్రతిపాదిత చట్రం ‘ఎంజీ నరేగా’లోని లోపాలను నేరుగా పరిష్కరిస్తుంది. కార్మికులకు రావలసిన వాటిని నిరాకరించే అనర్హత నిబంధనలను తొలగించడంతో పాటు పారదర్శకత, సామాజిక తనిఖీ, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టబద్ధమైన బాధ్యత లను బలోపేతం చేస్తుంది. ‘వీబీ–జీ రామ్ జీ’ గ్రామీణ ఉపాధి విషయంలో డిమాండ్– ఆధారిత స్వభావాన్ని దెబ్బతీస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లును క్షుణ్ణంగా చదివితే ఆ వాదన నిలబడదు. సెక్షన్ 5(1) ప్రకారం, గ్రామీణ కుటుంబానికి చెందిన వయోజనులు ఎవరైనా శారీరక శ్రమతో నైపుణ్యం లేని పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల ఉపాధిని కల్పించాల్సిన స్పష్టమైన చట్టబద్ధమైన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఉపాధి హామీని 125 రోజులకు విస్తరించడం, ‘ఎంజీ నరేగా’ కాలం నాటి అనర్హత నిబంధనలను తొలగించడం ద్వారా ఈ బిల్లు ఈ హక్కును మరింత బలోపేతం చేస్తోంది. తద్వారా నిరుద్యోగ భృతిని ఒక నిజమైన చట్టబద్ధమైన రక్షణ కవచంగా పునరుద్ధరిస్తోంది.బలోపేతం కానున్న జీవనోపాధి హామీఈ సంస్కరణ ఉపాధిని పక్కన పెట్టి కేవలం ఆస్తుల కల్పనకే ప్రాధాన్యత ఇస్తుందన్నది మరో విమర్శ. ఈ బిల్లు స్పష్టంగా చట్ట బద్ధమైన జీవనోపాధికి హామీని ఇస్తూనే ఉపాధిని ఉత్పాదక, మన్నికైన ప్రభుత్వ ఆస్తుల కల్పనతో అనుసంధానిస్తుంది.షెడ్యూల్ ‘ఐ’తో కలిపి సెక్షన్ 4(2)... నీటి భద్రత, కీలకమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించే పనులు అనే నాలుగు ప్రధాన రంగాలను గుర్తించింది. దీనివల్ల వేతన ఉపాధి అనేది తక్షణ ఆదాయ మద్దతును అందించడమే కాకుండా దీర్ఘకాలిక గ్రామీణ దృఢత్వం, ఉత్పాదక తకు కూడా దోహదపడుతుంది. అందువల్ల ఉపాధి, ఆస్తుల కల్పన అనేవి పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు. అవి ఒకదానికొకటి తోడ్పడుతూ సుసంపన్న గ్రామీణ భారతానికి పునాది వేస్తాయి.కేంద్రీకరణ కాదు, సమన్వయం ద్వారా వికేంద్రీకరణఈ బిల్లు అధికారాల కేంద్రీకరణను వ్యతిరేకిస్తోంది. సెక్షన్ 4(1) నుంచి 4(3)... అన్ని పనులను గ్రామ స్థాయిలో స్థానిక అవస రాల ఆధారంగా రూపొందించిన, గ్రామసభ ఆమోదించిన వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్లతో (వీజీపీపీలు) అనుసంధానిస్తాయి. పాత చట్రంలో ఉన్న ప్రధాన లోపం విభజన. దీనిని తొలగించేందుకు అన్ని పనులను వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్లో (వీబీఎన్ఆర్ఐఎస్) చేర్చాలని ఈ బిల్లు చెబుతోంది. దీని వల్ల ప్రణాళికా రచనలో ఏకరూపత, పారదర్శకత ఉంటాయి. ఇది కేవలం పై నుంచి రుద్దిన కేంద్రీకరణ కాదు. సెక్షన్ 16, 17, 18, 19 ప్రకారం ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అధికారాలు ఆ యా స్థాయుల్లోని పంచాయతీలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, జిల్లా అధికారు లకు ఉంటాయి. ఈ బిల్లు కేవలం పనుల పట్ల స్పష్టత, సమన్వయం, సమగ్రతను కల్పిస్తుందే తప్ప నిర్ణయాధికారాన్ని కేంద్రీకరించదు. స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా ప్రణాళికలను రూపొందించడంలో గ్రామ సభలదే ప్రధాన పాత్ర.భద్రత, ఉత్పాదకత మధ్య సమతుల్యతసాగు పనులు ఎక్కువగా ఉండే సమయాల్లో వ్యవసాయ కూలీల కొరతపై ఉన్న ఆందోళనలను ఈ బిల్లు స్పష్టంగా పరిష్కరించింది. ఈ బిల్లు కింద సెక్షన్ 6 ప్రకారం విత్తనాలు నాటడం, కోతల సమయాలను కలుపుకొని ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజుల వరకు పనులు చేపట్టుకూడదని ముందుగానే ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.ముఖ్యంగా సెక్షన్ 6(3) ప్రకారం వ్యవసాయ–వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లా, బ్లాక్ లేదా గ్రామ పంచాయతీ స్థాయుల్లో వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసేందుకు రాష్ట్రాలను ఇది అనుమతిస్తుంది. ఈ అంతర్నిర్మిత సౌలభ్యం పెరిగిన ఉపాధి హామీని వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించకుండా... దానికి అనుబంధంగా ఉండేలా చూస్తుంది. చాలా తక్కువ సంక్షేమ చట్టాలు మాత్రమే సాధించగలిగిన ఒక సున్నితమైన సమతుల్యత ఇది. కేటాయింపుల ద్వారా సమానత్వంఆర్థికపరమైన కోతలకు సంబంధించిన ఆందోళనలను కూడా విమర్శకులు వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 4(5), సెక్షన్ 22(4) ప్రకారం నిబంధనల్లో చెప్పిన అంశాల ఆధారంగానే రాష్ట్రాల వారీగా నిధు లను కేటాయిస్తారు. ఈ చట్రం రాష్ట్రాలను కేవలం అమలు చేసే వాటి గానే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా పరిగణిస్తుంది. నిర్దేశించిన కనీస చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా సొంత పథకాలను నోటిఫై చేసి అమలు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ఆచరణ పరంగా ‘సహకార సమాఖ్య’ ఇది. సాంకేతికత కారణంగా లబ్ధిదారులు దూరమవుతారనే వాదన ఈ బిల్లులో పొందుపరిచిన రక్షణ చర్యలను విస్మరిస్తోంది. సెక్షన్ 23, 24లు బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో–ట్యాగ్ పనులు, రియల్–టైమ్ డ్యాష్బోర్డ్లు, క్రమబద్ధమైన బహిరంగ వెల్లడి ద్వారా సాంకేతికతతో కూడిన పారదర్శకతను తప్పనిసరి చేస్తాయి. ఇవి నకిలీ హాజరు, ఉనికిలో లేని కార్మికులు, ధ్రువీకరించలేని రికార్డులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయి. సెక్షన్ 20 అనేది గ్రామ సభ ద్వారా సామాజిక తనిఖీలను బలోపేతం చేస్తుంది. సాంకేతికత జవాబుదారీతనాన్ని దాటవేయదు... పునాదిగా నిలుస్తుంది.హామీకి మళ్లీ విశ్వసనీయతఉపాధి హామీని పెంపొందించడం, స్థానిక ప్రణాళికను అంత ర్భాగం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతతో కార్మిక భద్రతను సమ తుల్యం చేయడం, పథకాలను అనుసంధానించడం, మెరుగైన పరిపాలనా మద్దతు ద్వారా క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, పరిపాలనను ఆధునీకరించడం ద్వారా ఆచరణలో తర చుగా విఫలమౌతున్న ఒక హామీకి విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎంపిక అనేది సంస్కరణ, సానుభూతికి మధ్య కాదు... తక్కువ ఫలితాలనిచ్చే నిలకడ లేని హక్కు, గౌరవం – స్పష్టమైన ఉద్దేశ్యంతో ఫలితాలను అందించే ఆధునిక చట్రానికి మధ్య ఉంది. ఈ కోణంలో చూస్తే ‘వీబీ–జీ రామ్ జీ’ అనేది సామాజిక రక్షణ నుంచి వెనక్కి తగ్గడం కాదు, దాన్ని పునరుద్ధరిస్తోంది.శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాసకర్త కేంద్ర గ్రామీణాభివృద్ధి,వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి -
పని హక్కును కాలరాసిన బిల్లు
కరోనా కాలంలో పరిశ్రమలు, రవాణా, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలైనప్పుడు, కేవలం ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ మాత్రమే గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెట్టింది. అలాంటి చట్టాన్ని రద్దుపరచి, ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లును ఆమోదించడం ప్రజల జీవించే హక్కును కాలరాయడమే2005 నాటి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’(ఎంజీఎన్ ఆర్ఈజీఏ–ఎంజీ నరేగా)ను రద్దుపరచి, ఆ స్థానంలో తెచ్చిన 2025 ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)–వీబీ జీ రామ్ జీ– బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది.ఈ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రెండు దశాబ్దాల క్రితం తెచ్చిన పాత చట్టం స్థానంలో సరి కొత్త ఆదర్శాలు, లక్ష్యాలతో ఈ కొత్త చట్టాన్ని తెస్తున్నామని ఎన్డీయే ప్రభుత్వం చెబుతోంది.పాతదానికంటే ఇది అత్యంత పారదర్శక మైనదనీ, గ్రామీణ పేదలకు మరిన్ని ఎక్కువ పనిదినాలు కల్పించ డమే కాకుండా తాగు, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం దక్కుతుందనీ మోదీ ప్రభుత్వం చెబుతోంది. కానీ అసలు ఈ చట్టాన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది?తిండి పెట్టిన చట్టం పోయి...నూటికి 60% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం మనది. నూటికి 70% మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు అనేక లెక్కలు చెబుతున్నాయి. మన లాంటి దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఏడాదికి 100 రోజులు హక్కుగా పని కల్పించిన చట్టం పాతది. ఈ చట్టం బాగా అమలు జరిగిన చోట పేదల కొనుగోలు శక్తి పెరిగింది, వలసలు తగ్గాయి, సంపన్నులతో పేదలు బేరమాడే శక్తి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాల సన్న, చిన్నకారు రైతుల భూములు అభివృద్ధి కావడమే కాకుండా పంట కాలువలు, చెరువుల పూడికలు తీయడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్పుడు మన లాంటి దేశంలో వాటిని తట్టుకుని నిలబడటానికి గ్రామీణ ఉపాధి హామీ చట్టం తోడ్పడింది. రెండు దశాబ్దాలుగా వ్యవసాయ కూలీలకు ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక స్వావలంబనను, భూస్వామ్య బంధనాల నుండి స్వాతంత్య్రాన్ని కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన చట్టాన్ని ఎటువంటి బాధ్యతలూ లేని, పరిమిత బడ్జెట్ పథకంగా మార్చివేశారు.రాష్ట్రాల అధికారం పోయి...ఇప్పటివరకు పని కల్పించే బాధ్యత గ్రామసభల ద్వారా రాష్ట్రా లకు ఉండేది. అన్ని అధికారాలనూ ఇకపై కేంద్రం లాగేసుకుంటుంది. ‘ఎంజీ నరేగా’ ప్రకారం ఏ గ్రామంలోనైనా నిరుపేదలు, రైతులు, చేతి వృత్తిదారులు పని కావాలని అడిగితే 15 రోజుల లోపల వారికి పని కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది.కానీ, కొత్త బిల్లు సెక్షన్ 5(1) ప్రకారం, ఎక్కడ పని కల్పించాలో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కల్పిస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని నోటిఫై చేయలేదో ఆ ప్రాంత ప్రజలకు హక్కు ఉండదు. అంటే సార్వజనీనంగా, సార్వకాలీనంగా ఉన్న హామీని కాలరాసి ఇతర సాధారణ పథకం లాగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చేసింది.పాత చట్టంలో డిమాండ్ చేసిన 15 రోజుల్లోపు పని కల్పించ వలసి ఉంటుంది. అలా కల్పించక పోతే నిరుద్యోగ భృతి చెల్లించాలి. కార్మికులకు ఇచ్చే వేతనాలలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వానివే. కానీ కొత్త బిల్లు సెక్షన్ 4(5) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని డిమాండును బట్టి నిధులు కాకుండా రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తుంది.ఉదా: కేరళ లాంటి వామపక్ష పాలన, లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఈ చట్టం ఆధారపడి ఉంటుంది. సెక్షన్ 4(6) ప్రకారం, కేటాయింపు ల్లోని మొత్తం కంటే ఎక్కువ ఖర్చుపెడితే ఆ మేరకు రాష్ట్ర ప్రభు త్వాలే భరించాలి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిధులు ఇచ్చే పరిస్థితిని కల్పిస్తుంది. అంటే డిమాండ్ను బట్టి నిధులు ఇచ్చే పద్ధతికి బదులు, కేటాయింపులకు అనుగుణంగా డిమాండ్ను సర్దు బాటు చేసుకునే పరిస్థితి వస్తుంది.జీవించే హక్కు పోయి...పాత చట్టం ప్రకారం, కార్మికుల వేతనాలకు 100%, మెటీరి యల్కు 75% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అంటే 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. కొత్త బిల్లు ప్రకారం ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 90:10, ఇతర రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో భరించాలి. 2020–21 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి లక్షా పదివేల కోట్లు కేటాయించింది.ఆనాడు కేంద్రం రూ. 99 వేల కోట్లు భరిస్తే, రాష్ట్రాలు రూ. 11 వేల కోట్లు మాత్రమే భరించాయి. కానీ, ఈ బిల్లు ప్రకారం రూ. 44 వేల కోట్లు భరించాలి. దీనివల్ల రాష్ట్రాలపై భారం పడుతుంది. పేద, వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి. నిధుల భారం పెరిగితే రాష్ట్రాలు కార్మికుల డిమాండ్ను నమోదు చేయకుండా తప్పించుకునే ప్రమాదం ఉంది. లక్షల కోట్లు అప్పులు తెచ్చి రోజువారీ పబ్బం గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం నిధులు లేవనే పేరుతో చట్టానికే మంగళం పాడే ప్రమాదం ఉంది.పాత చట్టంలో పనుల ప్లానింగ్ గ్రామ సభల స్థాయిలో జరిగేది. కానీ, ఈ బిల్లు పనుల ప్లానింగ్ను కేంద్రీకృతం చేస్తోంది. దీనివల్ల పంచాయతీల అధికారాలు హరించుకుపోతాయి. నేడున్న సాంకేతిక విధానాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసిందే. ఈ కొత్త బిల్లు బయోమెట్రిక్ అటెండెన్స్, జియోస్పేషియల్ టెక్నాలజీ వంటి పర్యవేక్షణ పద్ధతులను ప్రవేశపెడుతోంది. దీనివల్ల కార్మికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా పాత చట్టం పని హక్కును కల్పించింది. కానీ ఈ బిల్లు ఆ హక్కును నిరాకరిస్తోంది. పేదరికం, నిరుద్యోగం విస్తరిస్తున్నఈ తరుణంలో ఈ బిల్లు గ్రామీణ నిరుద్యోగాన్ని మరింతగా పెంచి, వెట్టిచాకిరీ వైపు నడిపిస్తుంది. ఈ కొత్త బిల్లు సామాజిక పురోగమ నానికి కాకుండా, భూస్వామ్య సంస్కృతికి జీవం పోస్తుంది. కోట్లాది మంది పొట్టగొట్టే ఇలాంటి బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతివ్వడం శోచనీయం.వ్యాసకర్త- వి. వెంకటేశ్వర్లుఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
దీపం వివాదం ఓట్లు తెచ్చేనా?
2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ వ్యూహరచనలో ఇప్పటికీ హిందూత్వమే అగ్ర భాగాన ఉంది. తిరుప్పరన్ కుండ్రంలో దీపం వివాదం అంతర్లీనంగా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది.బిహార్లో ఇటీవల ఘన విజయం సాధించిన బీజేపీ, 2026 ఏప్రిల్–మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళనే ఎదుర్కొంటోంది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం వహిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల ప్రాభవం కనిపించదు. తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే), పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈసారి కూడా తమ సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తమిళనాట డీఎంకేతో సర్దుబాటు చేసుకుని, సంతృప్తి చెందేందుకే కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ, బెంగాల్లో దానికి ఆ మాత్రం ఊతం కూడా లభించడం లేదు. అందులోనూ బిహార్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ను తోడు తీసుకెళ్ళేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. మరోపక్క బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ సమరానికి సై అంటోంది. ఒంటరిగానే సై!అయితే, బెంగాల్లో 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాలతో, ఇక ఆ తూర్పు రాష్ట్రాన్ని ‘జయించడం’ తనకు చిటికెలో పనిగా బీజేపీ భావించింది. తీరా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. మొత్తం 294 స్థానాల్లో 200 కైవసం చేసు కోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, 77 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, పోలైన ఓట్లలో 38 శాతం గడించి, ముఖ్య ప్రతిపక్షంగా అవతరించినందుకు కొంత సంతృప్తి చెందింది. ఈ గణాంకాలు అంత ప్రోత్సాహకరంగా లేకపోయినా, బిహార్లో విజయఢంకా మోగించాక ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాల యంలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ‘‘గంగా నది బిహార్ నుంచి బెంగాల్లోకి ప్రవహిస్తుంది’’ అని ప్రకటించారు. అది ఏదో ప్రాసంగికంగా దొర్లిన విషయంలా లేదు. బెంగాల్ విపుల ప్రణాళికపై కార్యాచరణకు హోమ్ మంత్రి అమిత్ షా అప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహరచనలో హిందూత్వమే ఇప్పటికీ అగ్ర భాగాన ఉంది. కానీ, పశ్చిమ బెంగాల్, తమిళ నాడుల్లో అది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. దీప ప్రజ్వలన వివాదంతిరుప్పరన్ కుండ్రంలో దీపం వెలిగించడానికి సంబంధించి ఇటీవల రేగిన వివాదం అంతర్లీనంగా ఆ అంశాన్నే ప్రతిబింబించింది. తమిళులు ‘మురుగా!’ అంటూ విపరీతంగా ఆరాధించే సుబ్ర హ్మణ్య స్వామికి చెందిన ఆరు పవిత్ర క్షేత్రాలలో తిరుప్పరన్ కుండ్రం ఒకటి. అక్కడి ఆలయానికి కొద్ది మీటర్ల దూరంలోనే సుల్తాన్ సికందర్ ఔలియా దర్గా ఉంది. చెదురుమదురు ఘర్షణలను మినహా యిస్తే అక్కడ కార్తీక దీపోత్సవం శాంతియుతంగానే సాగిపోయింది. కాకపోతే, దర్గాకు కేవలం 15 మీటర్ల దూరంలో ఉన్న దీపత్తూన్గా పిలిచే ప్రాచీన స్తంభంపై దీపం వెలిగించేందుకు కోర్టు ఉత్తర్వు తెచ్చుకోవలసి వచ్చింది. దీపాన్ని వెలిగించే కార్యక్రమానికి అను మతి కోరుతూ మద్రాసు హైకోర్టులోని మదురై ధర్మాసనం ముందు ఈసారి పిటిషన్ దాఖలైంది. కోర్టు దీపారాధనకు అనుమతించడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు సంబరం చేసుకున్నాయి. కానీ, జిల్లా పాలనా యంత్రాంగం వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయడంతో, పోలీసులు వాటిని అమలుపరచవలసి వచ్చింది. ‘‘ఆశించిన ఫలితం సాధించడానికి హిందువులలో చైతన్యాన్ని రేకెత్తిస్తే చాలు’’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్య అవసరమైతే ఘర్షణకు దిగవలసిందని పరోక్షంగా సూచించి నట్లయింది. తమిళనాడు సాంస్కృతిక, మత సమ్మేళనాన్ని అర్థం చేసుకోవడంలో బీజేపీకి ‘ప్రాథమికమైన లోపం’ ఉందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు. ‘‘తమిళ నాడు ప్రజానీకానికి దైవభక్తి ఎక్కువ. కానీ, మతాన్ని రాజకీయా లతో మిళితం చేసి చూడరు’’ అని ఆయన అన్నారు. చిన్నాచితక ప్రాంతాల్లో తప్పించి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు తమిళ నాడులో పటిష్ఠమైన స్థానిక వ్యవస్థలు లేవు. అయినా, అవి దీపారా ధనపై వివాదాన్ని నిలకడగా కొనసాగించగలిగితే, ఓటర్ల మనసును కొంత వరకు పట్టుకోవచ్చు. కానీ, తమిళనాడు రాజకీ యాలు చాలావరకు ద్రావిడ కళగం నాయకుడు పెరియార్ ఇ.వి. రామస్వామి సిద్ధాంతాలతో ప్రభావితమైనవి. ఆయన చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమంలో ముస్లింలను కూడా దళితులుగా చిత్రించడం ఒక కీలకమైన అంశం. హిందూయిజంలో అంతర్లీనంగా ఉన్న కుల అణచివేత నుంచి తప్పించుకునేందుకు దళితులు ఇస్లాంలోకి మారారన్నది ఆయన సిద్ధాంతాలలో ఒకటి.ఓటుబ్యాంకుకు దెబ్బపశ్చిమ బెంగాల్లో టీఎంసీ వరుసగా మూడు విడతలుగా అధికారంలో ఉంది. ఆరోపణల తీవ్రతతో ఈసారి టీఎంసీ దుర్బల మైనదిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధేయులు పాల్పడినట్లుగా చెబుతున్న అవినీతి వాటిలో ప్రధానమైనది. అలాగే, కోల్కతాలో ఒక యువ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వీధులకెక్కాయి. పాలక పార్టీకి చెందిన గూండాలు, దళారీలకు తృణమో పణమో చెల్లిస్తేనే పనులు అవుతాయనీ, రక్షణ లభిస్తుందనీ ప్రజలు చెబుతున్న దృష్టాంతాలున్నాయి. దాంతో, తాము వామపక్ష కూటమి పాలన నాటి రోజుల్లోకే తిరిగి వెళ్ళినట్లుందని వారు అంటున్నారు. అయితే, అక్రమ వలసదారుల అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఒక రకంగా తానే చిక్కుల్లో పడింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం వలస దారుల కన్నా హిందూ వలసదారుల సంఖ్యే ఎక్కువగా ఉందని డేటా సూచిస్తోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితాల సునిశిత సవరణ (సర్) బీజేపీ ఓటు బ్యాంకు లోపల కూడా ఆందో ళనను రేకెత్తించింది. బెంగాలీ భాషను ఢిల్లీ పోలీసులు ‘బంగ్లాదేశీ భాష’గా పేర్కొంటూ మరింత అపకీర్తిని తెచ్చిపెట్టారు. హిందూ పూజారులకు నెలసరి జీతాలు చెల్లించడం, దుర్గా ఉత్సవాలను నిర్వహించడం వంటి చర్యల ద్వారా తనను ‘హిందు వుల ఆప్తురాలు’గా చిత్రించుకునేందుకు మమత గట్టిగానే కృషి చేస్తున్నారు. కానీ, హిందూత్వపై బీజేపీతో పోటీ పడటం ప్రతి పక్షా లకు ఇప్పటికీ కష్టమవుతోందని ఇతర రాష్ట్రాల్లోని అనుభవాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాజకీయాలు బలమైన ప్రాంతీయ గుర్తింపుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చడానికి లేదు. అక్కడి ఓటర్లు హిందూత్వతో సునాయాసంగా మమేకమవుతారు. హిందూత్వ థీమ్లోకి భాష, సంస్కృతులను కూడా బీజేపీ ఈసారి అంతర్లీనం చేయ గలుగుతుందా? అన్నదే ప్రశ్న. వ్యాసకర్త: రాధికా రామశేషన్సీనియర్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జాప్యానికి విరుగుడు చర్యలు
దశాబ్దాల తరబడి పరిశ్రమలను కట్టిపడేసిన శృంఖలా లను తెగ్గొట్టి, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడమే మన లక్ష్య మైతే, సత్వర కార్యాచరణను చూపాల్సిన అవసరం ఉంది.జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం ఆర్థిక సంస్కరణ లను కొన్నాళ్లు అటకెక్కించింది. ఇటీవలి సంవత్సరాల్లో రాజకీయ ప్రయోజనాలను మూటగట్టుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించడంపైనే అది దృష్టిని కేంద్రీకరించింది. వ్యవసాయ సంస్కరణలు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైనప్పటి నుంచి మరింత ఆచితూచి అడుగులు వేయడం మొదలెట్టింది. అయితే, భార తీయ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో విధాన నిర్ణేతలు మళ్ళీ కార్యాచరణకు ఉపక్రమిస్తున్నారు. జీఎస్టీతో మొదటి అడుగుసుంకాల ప్రభావంతో ఆర్థిక వృద్ధి ఏమాత్రం కుంటుపడకుండా నివారించడం ప్రభుత్వానికి తక్షణ కర్తవ్యంగా మారింది. అమెరికా సుంకాలు ఎగుమతులపైనే కాకుండా, ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాకు వస్తువులు సరఫరా చేసే సంస్థలలోని ఉద్యోగాలపైన కూడా ప్రభావం చూపుతున్నాయి. చాలా కాలంగా జాప్యం చేస్తూ వచ్చిన వస్తు–సేవల పన్ను (జీఎస్టీ) మార్పు చేర్పులను పూర్తి చేయడాన్ని ప్రభుత్వం ఆ దిశగా వేసిన మొదటి అడుగుగా చెప్పవచ్చు. ఆగస్టు నెలలో అమెరికా సుంకాలు ప్రకటించడంతోనే, సెప్టెంబర్లో జీఎస్టీ రేట్లకు కోత పెట్టారు. శ్లాబులను తగ్గించారు. క్రమరాహిత్యాలను వేగంగా తొలగించారు. ఫలితంగా పండుగల సీజన్లో అమ్మకాలు విజృంభించాయి. కొన్నేళ్ళుగా మందగొడిగా సాగుతున్న అమ్మకాలతో నీరసించిన వ్యాపార వర్గాల్లో సంతోషం వెల్లివిరిసింది. జీఎస్టీ తేవడంలోని అసలు లక్ష్యం ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం. తీరా, అది అనేక తలల జీవిలా తయారైంది. అంతకుముందు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక రకాలుగా ఉన్న పన్నుల వ్యవస్థతో పోలిస్తే జీఎస్టీ మెరుగైనదనడంలో సందేహం లేదు. కానీ, సులభతరం చేయడా నికి, వ్యాపార సంస్థలకు మరింత స్నేహ పూర్వకంగా మార్చడానికి జీఎస్టీలో మార్పులు అవసరమయ్యాయి. కార్మికుల కోసం రెండో అడుగురెండవ అడుగు వేయడంలో కూడా ప్రభుత్వం ఎట్టకేలకు తెగువను ప్రదర్శించింది. కార్మిక అంశాలకు సంబంధించి ఇప్పు డున్న 29 చట్టాల స్థానంలో నాలుగు స్మృతులను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇది ప్రభుత్వాన్ని ఒక రకంగా ఇరుకునపెట్టే నిర్ణయమే. ఇది రాజకీయంగా సున్నితమైన అంశం. వ్యవస్థీకృత, అవ్యవసీకృత రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు సంబంధించినది. నిజానికి, ఈ స్మృతులను పార్లమెంట్ 2020లోనే ఆమోదించింది. కానీ, వాటిని నోటిఫై చేయలేదు. నిబంధనలను అధికారికంగా అమలులోకి తేలేదు. ఇప్పుడు నోటిఫై చేశారు కనుక, నిబంధనలు వచ్చే రెండు నెలల్లోపల వాస్తవ రూపం ధరిస్తాయి. యాజ మాన్యాలు వాటిని అమలు చేసేందుకు కొంత సమయం పట్టవచ్చు. కార్మిక సంఘాలు వీటిపై రుసరుస లాడుతున్నప్పటికీ, వాస్తవానికి, అవి విస్తృతమైన సంఖ్యలో కార్మికులను భద్రతా వలయంలోకి తెస్తున్నాయి. ఇవి కేవలం షెడ్యూల్డు వాటికే కాకుండా, అన్ని రకాల సంస్థలకూ వర్తిస్తాయి. వేగంగా విస్తరిస్తూ పోతున్న కంప్యూటర్ సిబ్బంది కూడా వాటి పరిధిలోకి వస్తున్నారు. వీటిలో వివిధ చర్య లను రాష్ట్రాలు ఇప్పటికే అమలులోకి తెచ్చాయి. కానీ, కేంద్రం ఆ నిబంధనలను నోటిఫై చేయడంతో, దేశవ్యాప్త ప్రాతిపదికన ఇప్పుడు విస్తరింపజేసినట్లు అయింది. పరస్పర వైరుద్ధ్యంతో కూడిన నిబంధనలున్న 29 చట్టాలను, కార్మికులకు సంబంధించిన అన్ని అంశాలలోని అన్ని కోణాలను లెక్కలోకి తీసుకుంటూ, నాలుగు స్థూలమైన స్మృతులుగా తీసుకు రావడం గణనీయమైన చర్యే. దీనివల్ల, వ్యాపార నిర్వహణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఇవి వలస పాలనలో 1930ల నుంచి అమలులోకి వచ్చినవి. అప్పటి నుంచి అవి శాసనాల పుస్తకాలలో అలాగే పడి ఉన్నాయి. అధికార యంత్రాంగపు జాప్యం తగ్గేలా...పాలనా యంత్రాంగంలోని రెగ్యులేటరీ కొలెస్టరాల్ను పెద్ద యెత్తున తగ్గించే విధంగా స్థూలమైన ప్రణాళికలతో నీతి ఆయోగ్ కమిటీ ఈమధ్యనే నివేదిక సమర్పించింది. ఆగస్టులో నెలకొల్పిన ఆ కమిటీకి మాజీ క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అభివృద్ధి కార్యకలాపాలకు విఘాతంగా పరిణ మిస్తున్న అధికార యంత్రాంగపు నియమ నిబంధనలు, విధానా లకు కోత పెడుతూ, అనేకానేక చర్యలను ఈ కమిటీ ప్రతిపాదించింది. వ్యాపారాలు సాఫీగా సాగకుండా అడ్డం పడుతున్న రెగ్యు లేటరీ ప్రక్రియలు కేంద్ర స్థాయిలోనే కొనసాగుతున్నాయని అదృష్టవశాత్తూ ఈ కమిటీ గుర్తించింది. దేశ రెగ్యులేటరీ చట్రాన్ని విప్లవాత్మకంగా మార్చి వేయాలని కమిటీ ప్రతిపాదించింది. జన్ విశ్వాస్ సిద్ధాంత్ పేరుతో సంస్థలపై నమ్మకం ఉంచే విధానంతో మెలగాలని పేర్కొంది. నూతన ప్రతిపా దనలను ఆ విశ్వాస ఆధారిత వైఖరిలో భాగంగా పేర్కొంది. లైసెన్సులు, పర్మిట్లు, నో–అబ్జెక్షన్ సర్టిఫికెట్లు వంటి వాటిని రద్దు చేయడం ద్వారా ‘ఇన్స్పెక్టర్ రాజ్’ను అంతమొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. క్రమానుగత తనిఖీల బాధ్యతను అక్రెడిటెడ్ మూడవ పక్షాలకు అప్పగించాలని కూడా కమిటీ కోరింది. ఈ చర్యలు అధికారుల విచక్షణాయుత పాత్రను తగ్గిస్తాయి. మొదటి విడత ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ చర్యలు 1991లో మొదలైన దశాబ్దాల తర్వాత కూడా అధికారులు వేళ్లూనుకునే ఉన్నారు. విధానాలలో హఠాత్తుగా మార్పులు తీసుకురావద్దనీ, నియంత్రణ విధానాలను అప్డేట్ చేయడానికి ఒక స్థిరమైన కాల వ్యవధిని పెట్టుకోవాలనీ కూడా కమిటీ సిఫార్సు చేసింది. అప్పుడే నిబంధనలలో మార్పుల గతి కొంతవరకు ఊహకందేదిగా ఉంటుందని పేర్కొంది. చిన్నా చితక పొరపాట్లు లేదా సాంకేతికపరమైన ఉల్లంఘనల్లో పీనల్ నిబంధనలకు వెళ్ళడాన్ని రద్దు చేయాలనీ, తీవ్రమైన నేరాల విషయంలో మాత్రమే అటువంటి శిక్షలు, జరిమానాలు విధించాలనీ కమిటీ ప్రతిపాదించింది. మరో సమాంతర నీతి ఆయోగ్ కమిటీ కూడా వరుసగా అనేక సంస్కరణలను, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థల విషయంలో ప్రతిపాదించింది. కంపెనీల చట్టం కింద పాటించవలసిన నియమాలను వాటి విషయంలో సడలించాలని ఆ కమిటీ కోరింది. చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రభుత్వ సంస్థల నుంచి చెల్లింపు లలో జాప్యం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కూడా కమిటీ కోరింది. ఈ రంగం ప్రయోజనాలను నేరుగా దెబ్బ తీస్తున్న, కొనసాగుతున్న సమస్యగా కమిటీ దాన్ని పేర్కొంది. జీడీపీ వృద్ధికి సంబంధించి 2025–26 సంవత్సరపు ద్వితీయ త్రైమాసికపు డేటా 8.2 శాతంగా ఉండటం ఉత్సాహపరచేదిగా ఉంది. కానీ, పూర్తి సంవత్సరానికి సంబంధించిన అంచనా దాదాపు 6.5 నుంచి 7 శాతంగా మాత్రమే ఉంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల కేటగిరీలో అడుగు పెట్టేందుకు ఇంకా వేగంగా ముందుకు సాగుతూ 9 నుంచి 10 శాతం వృద్ధి రేటును కనబరచవలసిన అవసరం ఉంది. అందుకు, అమెరికా సుంకాల ప్రభావం లేకుండా చేసేందుకు ఇప్పటి మాదిరిగానే, లోతైన సంస్క రణలు తీసుకురావాలి. ఈ ఆచరణాత్మక, సానుకూల అడుగులు దీర్ఘకాలంలో కూడా స్థిరంగా ముందుకు పడాలి.వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్సీనియర్ ఫినాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సంప్రదాయ ఫార్మసీలు నిలబడాలి!
ఈ–ఫార్మసీ తుపాను ఇప్పుడు సంప్రదాయ ఫార్మసీ రంగానికి ఒక ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నది. కరోనా సంక్షోభం తర్వాత వాయువేగంతో విస్తరిస్తున్న ఈ–ఫార్మసీలు, కార్పొరేట్ల భారీ పెట్టుబడులతో సంప్రదాయ ఫార్మసీల మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఔషధ మార్కెట్పై గుత్తాధిపత్యం కోసం అనేక కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఈ–ఫార్మసీ రంగంలోకి దిగుతున్నాయి. 2021 జూన్లో టాటా గ్రూప్కు చెందిన ‘టాటా డిజిటల్’ సుమారు రూ. 1,500 కోట్లతో ‘1ఎమ్జీ’ అనే ఈ–ఫార్మసీ స్టార్టప్లో 65% వాటాను కొనుగోలు చేసి, ఈ ప్రక్రియకు పునాదులు వేసింది. 2024లో సుమారు రూ. 28 వేల కోట్లుగా ఉన్న భారతదేశ ఆన్ లైన్ ఫార్మసీ మార్కెట్ విలువ 2025–2033 కాలానికి 16.65% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ను నమోదు చేస్తుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సంప్రదాయ ఫార్మసీల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలున్నాయి. ఆన్ లైన్ ఔషధాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ తమిళనాడు డ్రగ్గిస్ట్స్ అండ్ కెమిస్ట్స్ అసోసియేషన్ 2018లో దాఖలు చేసిన కేసులో మద్రాస్ హైకోర్టు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ, తరువాత ఆన్లైన్ విక్రయాలకు లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ‘ఈ–ఫార్మసీ డ్రాఫ్ట్ రూల్స్–2018’ని రూపొందించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో నమోదైన కేసులోనూ ఇదే డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం కార్యకలాపాలను నిర్వహిస్తామని ఈ–ఫార్మసీలు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టపరమైన స్పష్టత వచ్చే వరకు వివిధ హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులను సమర్థిస్తూ ఆన్లైన్ విక్రయాలకు అనుమతించింది. రాబోయే ఈ–ఫార్మసీల నిబంధనలకు అనుగుణంగా పనిచేయడానికి చాలా ఈ–ఫార్మసీ సంస్థలు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన షెడ్యూల్–ఎక్స్ (నార్కోటిక్, సైకోట్రోపిక్, ట్రాంక్విలైజర్లు, ఔషధాలు) మాత్రం అమ్మడం లేదు. షెడ్యూల్–హెచ్ మందులను కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతున్నాయి. ముసాయిదాలో చెప్పినట్టు ఎలక్ట్రానిక్ కాపీని నిల్వ చేస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేపు రాబోయే చట్టం ఈ–ఫార్మసీలకు మరింత సాధికారతను ప్రసాదించబోతుందన్నది సుస్పష్టం. ప్రజలు కూడా ఆన్లైన్ మందుల కొనుగోలుకు మద్దతునిస్తున్నారన్న విషయం అనేక పరిశోధన పత్రాలు రూఢి చేస్తున్నాయి.కరోనా మహమ్మారి తదనంతర కాలంలో ప్రజలకు విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగంలోకి రావడం, 30 నిమిషాల్లో హోం డెలివరీ వంటి సేవలు, ఈ–ఫార్మసీలోకి పెద్ద కార్పొరేట్లు ప్రవేశించడం, సంప్రదాయ ఫార్మసీల కన్నా ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం వంటి అంశాలు అటు మిలీనియల్స్నూ, ఇటు జెనరేషన్ జెడ్నూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సంప్రదాయ ఫార్మసీలు ఆన్లైన్ బాట పట్టకపోతే వాటి మనుగడకు తీవ్రమైన ముప్పు తప్పదని అనేక నివేదికలు చెబుతున్నాయి. రిటైల్ ఫార్మసీలు–కస్టమర్లకు అనుసంధానంగా నడుస్తున్న ఈ–ఫార్మా మార్కెట్ ప్లేస్ కంపెనీలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలిస్తే మళ్లీ రిటైల్ ఫార్మసీ రంగం భద్రంగా ఉంటుంది. లేదంటే దేశంలో ఉన్న దాదాపు 10 లక్షల ఫార్మసీలలో పనిచేస్తున్న కోటిమందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది.– శ్రీపాద రమణ ‘ ఔషధ రంగ నిపుణులు -
ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలి!
ఆధిపత్యం వహిస్తున్న ఒక సంస్థ (ఈ సందర్భంలో ‘ఇండిగో’) తన ఆధిపత్యాన్ని దుర్వినియోగపరచకుండా నివారించేందుకు ఆ సంస్థను విభజించవలసిందని ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ ఆదేశించవచ్చు. అమలులో ఉన్న మరి ఏ ఇతర చట్టాలలోని అంశాలు కూడా అందుకు అడ్డుపడటానికి లేదు.వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆకాశయానం జీవనాడి లాంటిది. దాంతో భారతదేశ గగనతలం సహజంగానే కిటకిటలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఒకే విమానయాన సంస్థ ప్రాబల్యం వహిస్తే, అది మొత్తం దేశాన్ని అస్థిరపరుస్తుంది. విమాన ప్రయాణాల్లో అత్యంత అస్తవ్యస్తమైన కాలంగా 2025 డిసెంబర్ చిరకాలం గుర్తుండిపోతుంది. నియమ నిబంధనల పట్ల భారత ఆకాశరాజుగా వెలుగొందుతున్న ‘ఇండిగో’ చూపిన నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఈ సంస్థ తనకు 350కి పైగా విమానాలున్నాయని ఈ మధ్యనే గొప్పగా చాటుకుంది. దేశ విమానయాన మార్కెట్లో అది దాదాపు 64 శాతం వాటా చేజిక్కించుకుంది. కానీ, గత కొద్ది రోజుల్లో వేలాది విమాన సర్వీసులను రద్దు చేయడంతో, లక్షలాది మంది ప్రయాణికులు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వ్యాపార ఎగ్జిక్యూటివ్లు విలువైన లావాదేవీలను కోల్పోయారు. అత్యవసర వైద్య సేవలకు వెళ్ళవలసిన వారిని వేరే మార్గాల గుండా పంపవలసి వచ్చింది. మహిళలు, పిల్లల అగచాట్లు చెప్పనలవి కాదు. ఇదే అదనుగా, విమాన ఛార్జీలు ఆకాశాన్ని అంటాయి. హోటళ్ళు కూడా వీలైనంత సొమ్ము చేసుకునేందుకు రేట్లను పెంచేశాయి.అవసరమైన నియమావళిఅలసటను తగ్గించే సిబ్బంది విశ్రాంత నియమాల సాధారణ అమలు తతంగం కాస్తా చారిత్రక విమానయాన వినాశకర చర్యగా పరిణమించింది. విమాన సేవలలో ప్రపంచంలోనే భారత్ మూడవ పెద్ద మార్కెట్. ఈ స్థితిలో ఒకే సంస్థ గుత్తాధిపత్యం వహిస్తే చోటుచేసుకోగల అవాంఛనీయ పరిణామాలకు ఈ ఉదంతం తిరుగులేని నిదర్శనంగా నిలిచింది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సవరించిన గగనతల విధుల సమయ పరిమితు (ఎఫ్.డి.టి.ఎల్.)లు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. పైలట్ల బడలికను తగ్గించి, ప్రయాణికుల భద్రతను పెంచేందుకు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఒక ఆదేశంతో, రెండవ విడత నిబంధనలను నవంబర్ 1 నుంచి అమలులోకి తెచ్చారు. ఈ నిబంధనలు పైలట్లు రాత్రిళ్ళు జరిపే ల్యాండింగ్ల సంఖ్యపై పరిమితి విధించాయి. విధిగా తీసుకోవాల్సిన విశ్రాంతి వ్యవధిని పొడిగించాయి. పైలట్లు ఎంతసేపు విమానాన్ని నడుపవచ్చునో తెలిపే నిబంధనలున్నాయి. నిజానికి, శక్తికి మించి పనిచేస్తున్న సిబ్బంది ఉన్న పరిశ్రమలో– వారి భద్రతకు, ప్రయాణికుల రక్షణకు ఏనాటి నుంచో అమలుకావలసిన నిబంధనలవి. ‘స్పైస్ జెట్’, ‘ఆకాశ ఎయిర్’ వంటి చిన్న సంస్థలు కొద్దిపాటి ఇబ్బందులతో నిబంధనలను పాటించడం ప్రారంభించాయి. నిబంధనల పట్ల మన్నన చూపడంలో ఇండిగో వైఫల్యం దాని దురహంకారాన్నీ, మార్కెట్ ప్రాబల్య దుర్వినియోగాన్నీ ప్రతిబింబించింది.ముందే హెచ్చరించిన స్థాయీ సంఘం‘ఇండిగో’ సాచివేత ధోరణి ఈ ప్రహసనానికి మూల బిందువైంది. ఈ సంస్థ మినహాయింపులు కోరుతూ అక్టోబర్ చివరి వరకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. నూతన ఎఫ్డీటీఎల్ వ్యవస్థకు తగ్గట్లుగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోలేదు. పైలట్లకు నిర్దేశించిన నూతన నిబంధనలను పక్కదోవ పట్టిస్తున్న సంస్థను ఒక పార్లమెంటరీ ప్యానెల్ ఆగస్టులోనే హెచ్చరించిందని ఇపుడు వెల్లడవుతోంది. భారత విమానయాన రంగం ఒక ‘కీలకమైన మలుపు తీసుకునే స్థితి’లో ఉందని రవాణా, టూరిజం, సంస్కృతికి చెందిన స్థాయీ సంఘం పార్లమెంట్కు సమర్పించిన ఒక నివేదికలో పేర్కొంది. విమానాల సంఖ్య శీఘ్రగతిన పెరుగుతోంది; కానీ పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని పెంచుకునే ప్రక్రియ మందగతిన సాగుతోందని అది స్పష్టం చేసింది. పైలట్ల అలసట, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిపై పడుతున్న మితిమీరిన భారం, మానవ వనరుల కొరతలు... త్వరితగతిన సాగుతున్న వ్యాపార విస్తరణ ఈ రంగాన్ని ఒక ప్రమాదకర స్థితికి నెడుతున్నాయని హెచ్చరించింది. ‘ఇండిగో’కు డీజీసీఏ సంజాయిషీ నోటీసు జారీచేసి, నిబంధనలను అమలులోకి తెచ్చేందుకు నడుం బిగించినప్పటికీ, ఈ కేసును దేశ పోటీ నియంత్రణ వ్యవస్థ పరిశీలన కిందకు తేవలసిన అవసరం ఉంది. ఇంచుమించుగా రెండు సంస్థలు ప్రాబల్యం వహిస్తున్న మార్కెట్లో దాదాపు మూడింట రెండు వంతులను గుప్పిట పెట్టుకున్న ఈ విమానయాన సంస్థ ఆధిపత్యం తగు ప్రక్రియ ద్వారా రుజువు కావలసి ఉన్నప్పటికీ, దానిపై ఎవరికీ కొద్దిగా కూడా సందేహం లేదు. ‘‘గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల సగటు టర్నోవరుపై 10 శాతం వరకు’’ జరిమానా విధించవచ్చని కాంపిటీషన్ చట్టంలోని 27వ సెక్షన్ నిర్దేశిస్తోంది. ప్రతిస్పర్థ–విరోధి చట్టం అందుకు వీలు కల్పిస్తోంది. ఒక సంస్థ తన ‘ఆధిపత్యాన్ని దుర్వినియోగపరచినందుకు’ పై అంశాన్ని పరిశీలించడంలో తప్పు లేదు. కాకపోతే, చట్టంలోని 26వ సెక్షన్ నిర్దేశించిన విధంగా తగు విధానం కింద ఆ సంస్థ ‘ఆధిపత్యం’, ‘దుర్వినియోగం’ అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. సంస్థను విభజించడమే మార్గమా?ఆధిపత్యం వహించే అన్ని సంస్థల విషయంలో, ప్రాధాన్యం వహించగల సెక్షన్ ఒకటి ఉంది. సాపేక్షంగా చూస్తే, దాన్ని ఎవరూ గమనికలోకి తీసుకోవడం లేదు. ఇంతవరకు దేశంలో దాన్ని ఉపయోగించలేదు కూడా! దాన్ని కూడా పరిశీలనకు తేవాలి. ఆధిపత్యం వహిస్తున్న ఒక సంస్థ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగపరచకుండా నివారించేందుకు ఆ సంస్థను విభజించవలసిందని కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశించవచ్చు. అమలులో ఉన్న మరి ఏ ఇతర చట్టాలలోని అంశాలు కూడా అందుకు అడ్డుపడటానికి లేదు. చట్టంలోని 28వ సెక్షన్ దీన్ని పేర్కొంటోంది. అలా విభజించడానికి అనుసరించవలసిన తీరుతెన్నులను సెక్షన్ 28(2)లోని వివిధ ఉప సెక్షన్లు విశదపరుస్తున్నాయి. అటు వంటి చర్య తీసుకున్న పెక్కు దృష్టాంతాలు ప్రపంచ వ్యాప్తంగా మనకు కనిపిస్తాయి. ఆధిపత్యం వహిస్తున్న సంస్థలను ‘యాంటీ ట్రస్ట్’ అధికారులు విభాగాలుగా చేసిన ఉదాహరణలు అమెరికాలో ఉన్నాయి. ‘స్టాండర్డ్ ఆయిల్’ను 1911లో, ‘ఎ.టి.–టి’ని 1982లో అలా విభజించారు. వాటిలో రెండవ దాని విషయంలో, చిన్నతరహా, ప్రాంతీయ టెలికాం ఆపరేటర్ల సృష్టి జరిగింది. ‘ఏషియానా ఎయిర్ లై¯Œ ్స’ ను ‘కొరియన్ ఎయిర్’ అలానే తనలో ఇముడ్చుకుంది. ‘ఐ.టి.ఎ. ఎయిర్ వేస్’లో ‘లుఫ్తాన్సా’ పెట్టుబడులు పెట్టింది.అంతిమంగా, ఈ సంక్షోభం, ఒక సత్యాన్ని ప్రబోధిస్తోంది. విమానయానం మరో సాధారణ వ్యాపారం కాదు. మన వృద్ధి గమనంలో అదొక కీలకమైన అనుసంధాన కణజాలం. దాన్ని శిక్షించడం ఎలాగన్నది ప్రశ్న కాదు. తిరిగి నిలకడగా సేవలు సాగేట్లు చూడటం ఎలా అన్నది ముఖ్యం. ప్రయాణికుల భద్రతకు, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ నియంత్రణ సంస్థలు నిబంధనలను కచ్చితంగా అమలుపరచి తీరాలి. డీజీసీఏ, సీసీఐ వంటి పర్యవేక్షణ సంస్థలు మార్కెట్పై ‘ఇండిగో’కున్న పట్టును సడలించి తీరాలి. అప్పుడే మనం రెక్కలు విప్పుకున్న ఆకాశం గురించి మాట్లాడుకోగలుగుతాం!వ్యాసకర్త: ధనేంద్ర కుమార్, ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ మాజీ చైర్మన్, ‘కాంపిటీషన్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా’ చైర్మన్ -
క్రైస్తవానికి పునాది లౌకికవాదం!
సమాజం లార్వా నుండి ప్యూపా రూపంలోకి, అటునుండి సీతాకోక చిలుకలా మారే ఒక నిరంతర ప్రక్రియలో ఉంటుంది. సమాజ గతి చలనం ఎన్ని సంస్కృతులు, ఎన్ని జాతులు, మతాలు, ఖండాలు ఏర్పడినా... అది ఒక సమూహంగా మనడానికి గతి మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇందులో కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని అనుభవ రీత్యా నేర్చుకున్న పాఠాలు ఉంటాయి. కొన్ని శాస్త్రీయ పరిణామాలు ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిన ఫౌండేషన్ – ఒక బేసిక్ సోషల్ ఫ్యాబ్రిక్. అది సమాజం మొత్తానికీ ఉమ్మడిగా సమ్మతమైన మోరల్ కోడ్, సోషల్ కోడ్! ఇది వ్యక్తిగత అభిరుచులు, నమ్మకాలు, హక్కులకు అతీతంగా సామూహిక ప్రయోజనాల మీద నిలబడి ఉండాలి. లేనప్పుడు– వ్యక్తిగత హక్కులు, సామూహిక నిబంధనలకు లోనై– ఒక ఘర్షణ పూరితమైన, ఒక తిరోగమన సమాజానికి దారి తీస్తుంది. ఈ కోడ్ – సమానత్వం, సౌభ్రాతృత్వంతో సమ్మిళితమైన స్వేచ్ఛ కలిగి ఉండాలి. స్వేచ్ఛ పరిమాణం ఎంత అన్నది మరో ప్రశ్న. తిరిగి అది ‘ర్యాడికల్ ఇండివిడ్యువలిజం’ను ప్రేరేపిస్తే అది మరో తిరోగమన రూపాన్ని తీసుకుంటుంది. ఈ బ్యాలన్స్ ప్రజాస్వామిక వ్యవస్థలో ఇప్పటికీ ఎవాల్వ్ అవుతూ ఉంది. అయితే – ఎంతో విపరీతమైన ఘర్షణ రూపంలో కొన్ని తిరోగమన సమాజాలలో ఎంతో రక్తపాతం తర్వాత వస్తుంది. అందుకే వీటన్నిటికీ కావాల్సిన సత్తా ఉండే సోషల్, మోరల్ ఫ్యాబ్రిక్– ఒక మతమే! మతం అంటే ‘కల్ట్’లా ఉండటం కాదు. రోజుకు ఎన్ని సార్లు పూజించాలి, ఏం బట్టలు కట్టాలి, మీసాలు ఎలా పెంచాలి... ఇలాంటి ‘రూల్స్’ మతాన్ని పోషించడం మొదలు పెడితే అది ‘కల్ట్’ అవుతుంది. ఆ ‘కల్ట్’ ఒక మూస పోసిన విధానంలో మను షులను సామాజిక సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు అతీతంగా తయారు చేస్తుంది. అటు నుండి ఒక పిడివాదం మొదలవుతుంది. అది ఒక ఫండమెంట లిజానికి దారి తీస్తుంది. దైవ విశ్వాసాలకు, సోషల్ లాజిక్కు సరిగ్గా కుట్లు వేసి అందంగా తీర్చగలిగేదే ఆదరించదగ్గ మతం అవుతుంది. దేవుడు ఒక సామాజిక అవసరం.ఒక మతానికి కావాల్సిన లిట్మస్ టెస్ట్ అంబేడ్కర్ చెప్తాడు: ‘మతం అన్నది ముఖ్యంగా నియమ సూత్రాలకు సంబంధించినది అయి ఉండాలి. ఎప్పుడైతే అది నిబంధనల చుట్టూ తిరుగుతుందో మతానికి ఉండాల్సిన సారమైన (సామాజిక) బాధ్యతను చంపేస్తుంది’ (‘కుల నిర్మూలన’ నుండి). మత ప్రాతిపదిక మీదనే–అంబే డ్కర్ ప్రగతి వాద కోణంలో మాట్లాడితే– దేవుడు ఈ ‘లిట్మస్ టెస్ట్’కు నిలబడలేని మనిషి/ ఆత్మ/ శక్తి అయితే ఆ దేవుడు నీతిమంతుడు కాలేడు. సమాజంలో ఒకరి అభిప్రాయాలకు, నమ్మకాలలో ఎన్ని తేడా, తారతమ్యాలు ఉన్నా... కలిసి ఒక సామూహిక ప్రయోజనాన్ని పండించడం కోసం ప్రజలు నడవడం ఈ రోజు సమాజానికి కావాల్సిన అత్యవసరమైన అంశం. యేసు క్రీస్తు యోహాను సువార్త గ్రంథంలో ఇలా అంటాడు: ‘నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడ ఒకరిని మరొకరు ప్రేమించవలెను.’ అదే రకంగా మార్కు సువార్త గ్రంథంలో ‘నీవు నీ పొరుగువానిని నీలాగునే ప్రేమింపవలెను’ అంటాడు. ఇది సింపుల్గా కనిపించవచ్చు. కానీ చాలా డెప్త్ ఉన్న స్టేట్మెంట్. ఇక్కడ పొరుగు క్రైస్తవుడిని ప్రేమించ మని యేసు క్రీస్తు చెప్పలేదు. లేదా నాస్తికుడిని ప్రేమించవద్దు అని చెప్పలేదు. హంతకుడు, దొంగ ఎవరైనా సరే వాళ్ళను ప్రేమించవద్దు అని చెప్పలేదు. పది మంది కుష్టువాళ్ళను బాగు చేస్తే అందులో ఒక కుష్టువాడు మాత్రమే జీసస్ను ఫాలో అవుతాడు. ఆయన ‘ముందుగా నన్ను ఫాలో అయితేనే నిను బాగుపరుస్తా’ అనే కండి షన్ పెట్టి బాగుపరచలేదు. జీసస్ విధానం పూర్తిగా పక్షపాత రహితం, రాజకీయ స్వార్థాల నుండి దూరం, అందరినీ చేరదీసే స్వభావం, విశ్వమానవతా దృష్టి కలిగినది. ఆ అర్థంలో ఆయన ఆచరణలో ‘లౌకికత’ ఉంటుంది. ముగింపుగా – క్రిస్టియానిటీ ఎదగడానికి ప్రభుత్వ చట్టాలు అవసరం లేదు. క్రిస్టియానిటీ యుద్ధాలు చేసి ఎదగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే– క్రిస్టియానిటీకి మూలం సెక్యులరిజం!– పి. విక్టర్ విజయ్ కుమార్ ‘ రచయిత, విమర్శకుడు(క్రిస్మస్ ఆగమన కాలం సందర్భంగా) -
ఇది ప్రజల గొంతుకను నొక్కడమే!
స్వేచ్ఛగా, విమర్శనాత్మకంగా పనిచేసే పత్రిక... ప్రజాస్వామ్యానికి రక్తనాళం లాంటిది.– నెల్సన్ మండేలాఈ మాటలు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విని ఉండే అవకాశం లేదు. ఆయన దృష్టిలో పత్రికా స్వేచ్ఛ అంటే తనకు అనుకూల పత్రికల స్వేచ్ఛ మాత్రమే. ప్రశ్నించే పత్రిక అంటే భయం. అందుకే ‘సాక్షి’ మీడియా మీద కత్తి కట్టాడు. కక్ష పెంచుకుని వేధిస్తు న్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై 19 కేసులు పెట్టారు. దేశ చరిత్రలోనే ఇలాంటిది ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. జరిగే అవ కాశం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఇది సాధ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం లేని నాయకుడు చంద్రబాబు.ఇదా విజనరీ లక్షణం?దేశం భద్రంగా ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ అతి ముఖ్యం అంటాడు జాన్ ఆడమ్స్. అమెరికా వ్యవస్థాపకులుగా పిలవబడే ఐదుగురిలో ఆయన ఒకరు. తాము భద్రంగా ఉండాలంటే ప్రశ్నించే పత్రికలు ఉండకూడదని బాబు నమ్మకం. ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టించిన వాళ్లలో ఈయన ప్రథముడు. కానీ ఆయన తనని తాను విజనరీ అని చెప్పుకొంటారు. విజనరీకి ఉండాల్సిన మొదటి లక్షణం పత్రికా స్వేచ్ఛను కాపాడడం. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో పత్రికా స్వేచ్ఛ ఒకటి. ఆ స్తంభం తన సొంత స్తంభం కావాలని చంద్రబాబు కోరిక. ‘సాక్షి’ అంటే చంద్రబాబుకు ఎందుకు భయమంటే... అది ప్రశ్నిస్తుంది; ప్రజల నిరసనను, అసహనాన్ని, కోపాన్ని, రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజల ఆగ్రహం నరసింహస్వామిగా మారి ఆ స్తంభంలోంచి ఉగ్రరూపం బయట పడుతుందని బాబు భయం. అందుకే ‘సాక్షి’ గొంతు నొక్కాలి, కేసులు పెట్టాలి, వీలైతే మూసి వేయించాలి. టీవీ ప్రసారాల్ని అడ్డుకోవాలి. అందుకే ఎడిటర్కూ, ఆ మీడియా జర్నలిస్టులకూ అన్ని వేధింపులు, కేసులు!చారిత్రక అవసరం లోంచి...‘సాక్షి’ ఒక చారిత్రక అవసరం లోంచి పుట్టింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల్ని, ప్రజా క్షేమం కోసం ఆయన చేస్తున్న మహోత్తర కార్యక్రమాల్ని, జనాన్ని ప్రేమించే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నందుకు కత్తి కట్టి, మంచి పనుల్ని వక్రీకరిస్తున్న నేపథ్యంలో ‘సాక్షి’ వచ్చింది. అబద్ధం నిజం అవుతున్నపుడు, నిజాల్ని పచ్చి నిజాలుగా చెప్పడానికి వచ్చింది. నిజం అంటే చంద్ర బాబుకు భయం. అందుకే ‘సాక్షి’ అంటే భయం. ప్రశ్నను భరించ లేని కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. ‘సాక్షి’లో వచ్చే కథ నాల్లోని కఠోర సత్యాలను భరించలేక భగ్గుమని ఒళ్లంతా కారం పూసుకుని మండి పడుతున్నారు. ఇంతకీ ‘సాక్షి’ ఏమడిగింది? నిజాలు చెప్పమని నిలదీసింది. పాలనలోని డొల్లతనాన్ని ప్రశ్నించింది. చంద్రబాబు వక్రీకరణలకు భాష్యం చెప్పింది. అభివృద్ధి, సంపద సృష్టి పదాలకు అసలు అర్థం అప్పులు, చంద్రబాబు సొంత సంపద సృష్టి అని తాత్పర్యం వివరించింది. బూటకపు మాటలకు ప్రతిపదార్థాన్ని విప్పి చెప్పింది. అందుకే కసి, క్రోధం, పగ! ప్రశ్నించడమే తప్పా?18 నెలల్లో చంద్రబాబు ఏం చేశాడు? ‘సూపర్ సిక్స్’ పేరుతో వంచించాడు. ఫించన్లు పెంచినట్టే పెంచి లక్షల్లో లబ్ధిదారుల్ని తగ్గించాడు. ‘అమ్మకు వందనం’ అంటూ తల్లుల్ని తొలగించాడు. ఏడాది ఎగ్గొట్టి, అరకొరగా ఇచ్చాడు. సిలిండర్ పథకంలో చంద్రబాబు గ్యాస్ కొట్టిందే ఎక్కువ. రైతులకు పంగనామాలు పెట్టి నామ్ కే వాస్తే నిధులిచ్చాడు. అన్ని బస్సులూ ఫ్రీ అని, కొన్ని బస్సుల్లోనే చెల్లెమ్మలు ఎక్కేలా చేశాడు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల పథకం ఊసే లేదు. అయినా ‘సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్’ అని ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటే ‘సాక్షి’ ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?ఎమ్మెల్యేలు తమ నియో జకవర్గాల్ని సంస్థానాలుగా భావించి ప్రజలతో కప్పం కట్టించుకుంటూ, పాలెగాళ్లలా అన్ని వనరుల్నీ దోచుకుంటూ ఉంటే ప్రశ్నించడం తప్పా? పేకాట క్లబ్బులు, గంజాయి బ్యాచ్లు ఆడపిల్లలపై అత్యాచారాలు యథేచ్ఛగా సాగిస్తుంటే, పోలీసులు చూసీచూడనట్టు ఉంటే ‘సాక్షి’ కూడా చూసీ చూడనట్టుండాలా? అన్ని రంగాల్లో వైఫల్యాలు చెంది తండ్రీ కొడుకులు విమానాల్లో తిరు గుతూ, పెట్టుబడుల పేరిట దేశాలన్నీ పర్యటిస్తూ కాశీమజిలీ కథలు చెబుతూ ఉన్నా కూడా మౌనం వహించాలా? వైసీపీ హయాంలో, జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అయి పోయిందని గోబెల్స్ ప్రచారం చేసినవాళ్లు 18 నెలల్లో చంద్రబాబు, ఆయన కూటమి ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లకు పైగా ఎందుకు అప్పులు చేశారో చెప్పగలరా? అనేక పథకాలతో ప్రజలకు చేరువై, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ పై చిమ్మిన విషాన్ని చూసి ఒకవేళ గోబెల్స్ బతికి ఉంటే మళ్లీ ఆత్మహత్య చేసుకునేవాడు. సువిశాల రష్యాలోని జార్ చక్రవర్తుల అహంకారాన్ని, అరాచకాల్ని ‘ప్రావ్దా’ పత్రిక ద్వారా లెనిన్ కూల్చేశాడు. ప్రజల గొంతు పత్రిక ద్వారా వినిపించకపోతే పాలకుల గొంతే శిలాశాసనంగా మారుతుందని అంటాడు లెనిన్ . ప్రపంచానికి కమ్యూనిజాన్ని ప్రసాదించిన లెనిన్ పార్టీ నిర్మాణానికి, విప్లవానికి ప్రావ్దా మూలస్తంభం అంటాడు. పత్రికా స్వేచ్ఛను గౌరవించిన వాళ్లే చరిత్రలో నిలబడ్డారు. కూల్చేయాలని చూసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాదు, ప్రజాస్వామ్యం అంటేనే పత్రికా స్వేచ్ఛ అంటాడు ప్రముఖ అమెరికా పాత్రికేయుడు వాల్టర్ క్రాన్కైట్. కానీ మన చంద్రబాబు పాత్రికేయుల్ని జైల్లో పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా మరుక్షణంలోనే పోలీసులు వాలిపోయే వ్యవస్థను సృష్టించాడు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై పగబట్టిన వాళ్లంతా చిరునామా లేకుండా పోయారు. చంద్రబాబు కూడా అతీతుడు కాదు. స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూసిన వాళ్లంతా చరిత్రలో కలిసిపోయారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందని చెబుతున్న చంద్రబాబు చేతిలో అసలు దీపమే లేదు. ఆయన చేతిలో ఉన్నది అగ్గిపెట్టె మాత్రమే! దాంతో రాష్ట్రాన్ని తగలబెట్టే పనిలో ఉన్నాడు. సత్యం జయిస్తుంది. ‘సాక్షి’ కూడా జయిస్తుంది. దాని గొంతు నొక్కడం సాధ్యం కాదు, ఎందుకంటే అది ప్రజల గొంతు!వ్యాసకర్త: భూమన కరుణాకర రెడ్డిమాజీ ఎమ్మెల్యే -
ఓం బిర్లా (లోక్సభ స్పీకర్) రాయని డైరీ
ఇల్లు, వంటిల్లు చేజారిపోకూడదు. ఇల్లు చేజారితే లోన్లు, ఈఎంఐల స్వాధీనంలోకి వెళ్లిపోతుంది. వంటిల్లు చేజారితే ఫుడ్ డెలివరీ యాప్ల పాలౌతుంది. ఇల్లు అదుపు తప్పితే అప్పులు, వంటిల్లు ఆర్డర్ తప్పితే అనారోగ్యాలు! సభ కూడా చేజారినట్లే నాకు అనిపిస్తోంది. సమావేశాలు 1న మొదలయ్యాయి. 19న ముగుస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని అధికరణాలు, ఆదేశిక సూత్రాలతో పని లేకుండా శీతకాలం వచ్చి వెళ్లినట్లుగానే సమావేశాలూ ఒక రుతువులా మాత్రమే ప్రారంభమై ఒక రుతువులా మాత్రమే పూర్తయ్యే కాలం వచ్చేసిందా?! సెషన్స్ ఇంకో 5 రోజులే ఉన్నాయి. బిల్లులు ఇంకా 10 పెండింగులో ఉన్నాయి. 150 ఏళ్ల వందేమాతరం, ఎస్ఐఆర్, ఈవీఎంలు... ఈ మూడే, సభలో రెండు వారాలుగా డిబేట్లు!బంకిం ఛటర్జీని ప్రధాని ‘‘బంకిం దా’’ అనటం అహంకారం తప్ప మరొకటి కాదని తృణమూల్ ఎంపీలు! బెంగాల్లో అందరూ గౌరవంగా ‘బంకిం బాబు’ అంటారు కనుక ప్రధాని కూడా ‘బంకిం బాబు’ అనే అనాలని వాళ్ల పట్టు. మొత్తానికి ప్రధాని చేత ‘బంకిం బాబు’ అనిపించారు. ఒక సభ్యుడు ‘వందే మాతరం’ అనబోయి రెండుసార్లు ‘వందే భారత్’ అన్నారు. ‘‘మాట్లాడే ముందు నాలుగో తరగతి హిస్టరీ టెక్స్›్ట బుక్ ఒకసారి చూసుకొని రావాలి’’ అని వెక్కిరింపులు! నోరు జారటం, మాట జారటం ఒకటేనా?! మనసులో ఉన్నదే నోట్లోంచి వస్తుంది. మాటగా జారింది మనసు లోనిది ఎలా అవుతుంది?! మాట తడబాట్లను కూడా నవ్వుతూ తీసుకోలేనంత సీరియస్గా అయిపోతు న్నామా... చలిలో బిగుసుకుపోయినట్లు, మంచులో కూరుకుపోయినట్లు. సెషన్స్లో నేనూ ఒకర్ని హర్ట్ చేయవలసి వచ్చింది! వ్యవసాయ మంత్రి ప్రసంగిస్తుంటే, సభలో ఒక సభ్యుడు ‘లంచ్’ చేస్తూ నాకు కనిపించారు. ‘‘ఇక్కడ ఈటింగ్ ప్రోగ్రామ్ పెట్టకండి. ప్లేట్లు తీసేయండి’’ అని కాస్త హార్ష్ గానే అన్నాను. నిబంధనలు ఎలా ఉన్నా, నేనే కాస్త సౌమ్యంగా చెప్పి ఉండవలసిందా! లంచ్ టైమ్లో లంచ్, డిబేట్ టైమ్లో డిబేట్, క్వొశ్చన్ అవర్లో క్వొశ్చన్స్ ఉండాల్సిందే. కొన్నిసార్లు లంచ్ టైమ్లోకి డిబేట్ టైమ్ వచ్చేసి, డిబేట్ టైమ్లోకి లంచ్ టైమ్ చొరబడుతుంది.సభలో ఆ సభ్యుడు లంచ్ చేయటం కన్నా, సభలో ఆ సభ్యుడిని అందరి ముందూ ‘‘తినటం ఆపేయండి’’ అని నేను అనటమే సభా మర్యాదను తప్పినట్లుగా అనిపించింది నా మనసుకు. శుక్రవారం సెషన్స్లో ఒక సభ్యుడు హఠాత్తుగా లేచి నిలబడ్డారు. ‘‘మాననీయ్ అధ్య„Š మహోదయ్...’’ అని ఆగారు!‘‘చెప్పండి’’ అన్నాను.‘‘మాననీయ్ అధ్యక్ష్ మహోదయ్... 2019 లోనే భారత ప్రభుత్వం ఇ–సిగరెట్లను బ్యాన్ చేసింది కదా!’’ అన్నారు ఆ సభ్యుడు. ‘‘ఆ... చేసింది’’ అన్నాను. ‘‘భారత ప్రభుత్వం బ్యా¯Œ చేసినప్పటికీ సభలో ఇ–సిగరెట్లు తాగటానికి మీరు గానీ అనుమతి ఇచ్చారా?’’ అని ఆయన ప్రశ్న! ‘‘ఇవ్వలేదు కానీ, మీరు విషయం చెప్పండి’’ అన్నాను.‘‘సభ లోపల టీఎంసీ సభ్యులు కొందరు ప్రతిరోజూ ఇ–సిగరెట్ తాగుతున్నారు. వెంటనే వారిని తనిఖీ చేయించండి’’ అని ఆదేశం! నేను నవ్వాపుకోలేనంతగా నన్ను ఆదేశించారు ఆ సభ్యుడు! స్పీకర్నే సభ్యులు ఆదేశిస్తున్నారంటే, స్పీకర్ని పక్కన పెట్టేసి సభ్యులే డిబేట్లు పెట్టేసుకుంటూ సభలో రౌండ్లు కొట్టేస్తున్నారంటే... సభ కూడా చేజారిన ఇల్లుగానో, వంటిల్లుగానో అయిపోతోందా?! ‘హౌస్’ కాస్తా ‘హోమ్’గా మారిపోతోందా?! - మాధవ్ శింగరాజు -
ఓపెన్ చెరసాల కాదు... అది ఉత్తమ కళాశాల!
నేను 1983లో నాగార్జున సాగర్లోని ఏపీ గురుకుల జూనియర్ కళాశాలలో సీటు దొరికిందని తెలిసి ఎంతో సంతోషించాను. రాష్ట్రంలో అప్పటికి అదొక్కటే ఆ తరహా కళాశాల. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎప్పుడూ నెంబర్ వన్. అందువల్ల ఒక వైపు ఆనందం. ఇంకోవైపు కించిత్ గర్వం. అలా ఆ మూల ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లె సాలూరు నుండి పల్నాడు చివర నాగార్జునసాగర్కి పయనం సాగింది. అంతవరకూ తాడికొండ గురుకుల పాఠశాలలో గడిపిన మూడేళ్ల రోజుల్ని ‘సెంట్రల్ జైలు’గా భావించిన నేను, ‘ఇంతకు మించి ఏముంటుంది లే, బహుశా ఓపెన్ జైలులా ఉండొచ్చ’ని అనుకుంటూ కాలేజీలో అడుగుపెట్టాను.అయితే వారంలోనే అది ఓపెన్ చెరసాల కాదు, ఉత్తమ భవి ష్యత్ తయారీశాల అని అర్థమై గొప్ప ఊరట కలిగింది. ఆదివారంతో బాటు, పండగ సెలవొస్తే చాలు... విజయపురి సౌత్లో రామ కృష్ణ థియేటర్, అందులోంచి ఆట మొదలవ్వడానికి ముందు విని పించే ‘నమో వేంకటేశా ’పాట తెచ్చిన ఉత్సాహం, భాను వీడియో అంటూ బస్టాండ్ దగ్గర ఉన్న వీడియో థియేటర్, డ్యామ్కి అటు చివర మూడు కిలోమీటర్ల దూరంలోని హిల్ కాలనీ వరకూ క్రమం తప్పని పాదయాత్ర... అన్నీ నిన్నమొన్నటి విషయాల్లాగానే ఉన్నాయి. ఇక, మా సీనియర్లు ఎవ్వరూ ర్యాగింగ్ చెయ్యలేదు... కాకపోతే అందరినీ ‘సర్’ అని పిలవాలి. మా బోటనీ సర్ ఎప్పుడూ ‘ఇలాగే చదువు, నువ్వు డాక్టర్ అయిపోయినట్టే’ అంటూ ప్రోత్సహించే వారు. అభిమానం కనబడేది. రెండుసార్లూ టీచర్స్ డేకి నేను బోటనీ క్లాస్ తీసుకున్నాను (పిల్లలతో ఆ రోజు చెప్పించేవారు). క్లాస్ లాస్ట్లో ఆయన్ని అనుకరిస్తూ గొంతు మార్చి కామెడీ చేస్తే ఒక్కడు కూడా నవ్వలేదు. ఏమిటా అని చూస్తే ఆయన ఎప్పుడు వచ్చి కూర్చున్నారో తెలియదు కానీ లాస్ట్ బెంచ్ నుండి లేచి వచ్చారు. బిక్కచచ్చిన నన్ను ‘వెరీ గుడ్’ అంటూ కదిలిపోయారు. ఇంకోసారి ఇంగ్లీష్ సర్ దివాకర్ గారు బోర్డు వైపు తిరిగి క్లాస్ చెప్తుంటే ఏదో చిన్నతనపు అల్లరి చేశాం. ఆయన చూడలేదనుకున్నాం. కానీ ముద్దా యిలందరినీ లేపారు. నన్నులేపి ‘చేసిందంతా చేసి, ఎంత అమాయ కపు మొహం పెట్టావు రా నాయనా’ అని నవ్వేశారు. చాలా చిక్కని స్నేహాలు. అరమరికలు లేనివి. ఇంట్లోంచి తెచ్చు కున్న ఊరగాయలు, జంతికలు ఉమ్మడి ఆస్తి. కలిసి పోటీగా చదువు కోవడం, ఒకరి డౌట్లు ఒకరు తీర్చుకోవడం మాత్రమే కాదు... ఆట లైనా, పాటలైనా, షికార్లయినా, జట్లుగానే! రష్యా, ఉక్రెయిన్ స్థాయిలో గొడవపడినా రెండో రోజుకి సంధి కుదిరిపోవాల్సిందే. ఒక సారి సెలవులు ఇచ్చిన టైమ్కి వరదలు. ట్రైన్లు లేక బస్సుల్లో బయ లుదేరాం. అవి కూడా డైరెక్ట్గా లేవు. ఉత్తరాంధ్ర వాళ్ళం నలుగురం కలిసి రాజమండ్రి చేరుకున్నాం. ఎవరి దగ్గరా డబ్బులు మిగల్లేదు. అయినా భయం లేదు. అందులో రవిది వైజాగ్. ధైర్యం చెప్పాడు. ‘నా చేతికి వాచీ ఉందిరా, ఏం ఫరవాలేదు’ అని. బస్టాండ్లో ఒకా యన్ని పరిచయం చేసుకుని, పరిస్థితి చెప్పి మా నలుగురికీ టికెట్స్ తీయమని చెప్పాడు. తన వాచీ ఉంచుకుంటే, తర్వాత రోజు కలిసి డబ్బులిచ్చి రిటర్న్ తీసుకుంటానన్నాడు. ఆయన ‘అదేమీ వద్దులే ’ అని చెప్పి మాకు టికెట్స్ తీసి ఇచ్చాడు. మేం వైజాగ్లో రవి ఇంటికి చేరిపోయి, వారి ఆతిథ్యం పొంది, మరుసటిరోజు మా ఇళ్లకు చేరాం.ఇలా చెప్తూ పోతే బోలెడు. నా పేరు అచ్చులో చూసుకోవడం మొదటిసారి అక్కడే. ‘ఆశాజీవులు’ అని కవిత రాస్తే ఆ సంవత్సరం మేగజైన్లో అచ్చయింది. చదువుతో బాటు అందమైన అనుభవాలు, స్నేహాలు, జీవిత పాఠాలు మిగిల్చిన మా ‘ఏపీ గురుకుల జూనియర్ కళాశాల’ మా అందరికీ ఉన్నతి కలుగ జేసిన మేధా తయారీ శాల.– డా‘‘ డి.వి.జి. శంకరరావు ‘ పార్వతీపురం మాజీ ఎంపీ(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాల ఆరంభమై రేపటికి 50 ఏళ్ళు) -
‘ఆత్మనిర్భరత’కు రష్యాయే ఆలంబన
భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు – విక్రేతకు మధ్య ఉండే వాటి కన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్వేర్ సమీకరించు కున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞా నాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఉక్రెయిన్పై యుద్ధం 2022లో మొద లెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల న్యూఢిల్లీకి రెండు రోజుల పర్యటనపై వచ్చి వెళ్ళడం ఇదే మొదటి సారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆతిథేయిగా వ్యవహరించిన ఈ శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల మధ్య చెక్కు చెదరకుండా నిలిచిన వ్యూహాత్మక భాగ స్వామ్యం ప్రాధాన్యాన్ని తెలియజేసింది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శ్రీకారం చుట్టుకున్న సహకారాన్ని ఉభయ దేశాలు కొన్ని దశాబ్దాలుగా పెంపొందించుకుంటూ వస్తున్నాయి.ఉక్రెయిన్పై యుద్ధానికిగాను రష్యా అధ్యక్షుడిని ఏకాకిని చేయా లని అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లు కోరు కోవడంతో ఈ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన ఆసక్తి వ్యక్తమైంది. ఉక్రెయిన్పై యుద్ధ నేరాలకు సంబంధించి అంత ర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్కు అరెస్టు వారంట్లు జారీ చేసింది. అయినా ఘనంగా, సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పల కాలన్న భారత్ నిర్ణయంలో స్వీయ వ్యూహాత్మక ప్రాధాన్యముంది.రష్యా నుంచి చమురు దిగుమతులను, రక్షణ సామగ్రి కొను గోళ్ళను తగ్గించుకోవాలని అమెరికా నుంచి మనపై ఒత్తిడి పెరుగు తున్న నేపథ్యంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. తమ సంబంధాలు ‘బాహ్య ఒత్తిడులకు లోబడేవి కావు’ అని రెండు పక్షాలూ పునరు ద్ఘాటించాయి. ఉభయ సేనల మధ్య సాంకేతిక సహకారం ఒక ముఖ్య అంశంగా కొనసాగుతోందని సంయుక్త ప్రకటనలో నామ మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. రష్యా నుంచి వచ్చిన ఆయు ధాలు, ఇతర రక్షణ సామగ్రి నిర్వహణకు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య క్రమం కింద టెక్నాలజీ బదలీ ద్వారా భారతదేశంలోనే స్పేర్ పార్టులు, పరికరాలు, చిన్నాచితక వస్తువులు, ఇతర ఉత్పత్తులను సంయుక్తంగా తయారు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చేందుకు సంయుక్త సంస్థలను నెలకొల్పాలని నిర్ణయించారు.భారత–రష్యా రక్షణ సంబంధాలు కొనుగోలుదారు–విక్రేతకు మధ్య ఉండే వాటికన్నా మించిన స్థాయిలో ఉన్నట్లు మోదీ–పుతిన్ శిఖరాగ్ర సమావేశం సంకేతాలు ఇచ్చింది. భారత్ 1960ల మధ్యలో సోవియట్ యూనియన్ నుంచి గణనీయంగా సైనిక హార్డ్ వేర్ (మొదటి మిగ్ పోరాట విమానం, పెత్య/కమోర్త తరగతి నౌకలు, ట్యాంకులను) సమీకరించుకున్నప్పటికీ, తన సన్నిహిత మిత్రుని నుంచి డిజైన్ పరిజ్ఞానాన్ని ఎన్నడూ పొందలేకపోయింది.ఆ విధంగా సోవియట్/రష్యా మూలాలున్న పరికరాలలో చాలా భాగం భారతదేశంలో ‘తయారైనట్లు’ పైకి కనిపించినప్పటికీ, అది చాలా వరకు దిగుమతి చేసుకున్న కిట్లు/కాంపొనెంట్ల కూర్పు నకు మాత్రమే పరిమితమైంది. ఆయుధాల ఫ్యాక్టరీలలో, లేదా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్.ఎ.ఎల్)లో సాగింది ప్రాథమికంగా విడి భాగాల అసెంబ్లింగ్ కలాపం మాత్రమే. రివర్స్–ఇంజనీరింగ్ లేదా దేశీయ డిజైన్ చేపట్టేందుకు జరిగిన కృషి అతి స్వల్పం లేదా అసలు ఏమీ లేదనే చెప్పాలి.చైనాతో పోల్చుకుంటే, డిజైన్ డొమైన్లోకి దిగడంలో అశక్తత /విముఖత కనిపిస్తుంది. సోవియట్ హయాం నాటి సైనిక సామగ్రిని చైనా ఎంతో విజయవంతంగా రివర్స్–ఇంజనీరింగ్ చేసి విజయం సాధించింది. సుఖోయ్ ఎస్ యు–27 ఫ్లాంకర్ ను ఆధారం చేసుకుని అది షెన్యాంగ్ జె–11యుద్ధ జెట్ విమానాన్ని అభివృద్ధి చేసింది. లైసెన్సు పొందిన ఉత్పత్తి ఒప్పందం కింద పీపుల్స్ లిబ రేషన్ ఆర్మీ 1990లలో రష్యా నుంచి సు–27 ఎస్కే యుద్ధ విమా నాలను సమీకరించింది. తర్వాత, రష్యా సరఫరా చేసిన కిట్లను ఉపయోగించుకుని, 2000ల మధ్య నాటికి ఆ విమాన రివర్స్–ఇంజ నీరింగ్లో సఫలమై జె–11ఎ విమానాలుగా తయారు చేసింది.సు–27 సోవియట్ యూనియన్లో 1970లలో డిజైన్ అయి, 1985లో సర్వీసులో ప్రవేశించింది. ఈ సోవియట్ టెక్నాలజీని మక్కికి మక్కి కాపీ కొట్టి చైనా జె–11 తయారు చేసుకుంది. డిజైన్లో సాధించిన ఈ పురోగతితో చైనా దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించుకుంది. స్వయం సమృద్ధిని సమీకరించుకుంది. తర్వాత, ఇదే యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ (అదే పెద్ద కొనుగోలు దారు)కు విక్రయించింది.భారత్ మొదటి సుఖోయ్ సు–30ని 1997లో సమీకరించుకుంది. కానీ, దేశంలో అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా, దిగుమతు లపై ఆధారపడడం కొనసాగింది. యుద్ధ విమాన (రఫేల్) ప్రత్యా మ్నాయ సరఫరాదారుగా ఫ్రాన్స్ ముందుకొచ్చింది. పుతిన్ పర్యట నతో ఐదవ తరం సు–57 యుద్ధ విమానాలపై మళ్ళీ ఆసక్తి రేగుతోంది. భారత్ సోర్స్ కోడ్ యాక్సెస్ను, స్టెల్త్ ఉన్నతీకరణలను కోరుతోంది. దీన్ని సమీకరించుకోవడం వల్ల దేశీయ ‘తేజస్’కు ఏమైనా ఊతం చేకురుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కొన్ని నవీన రంగాలలో అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయాన్ని మాస్కో (సోవి యట్ యూనియన్గా ఉన్నపుడు, ఆ తర్వాత కూడా) భారతదేశానికి సమకూర్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. క్షిపణులు, అణుశక్తి చోదిత జలాంతర్గత ప్రొపల్షన్ (ఐ.ఎన్.ఎస్. అరిహంత్) అందుకు నిదర్శనం. ఇక సంయుక్త రంగ బ్రహ్మోస్ది దిగ్విజయ మైన గాథ. తేలిక రకం బ్రహ్మోస్ను తయారు చేయడం ప్రస్తుత సమావేశ చర్చనీయాంశాలలో చేరింది. ప్రధాన సైనిక సామగ్రి డిజైన్, తయారీ పరిజ్ఞానం ఒక దేశాని కుండే వజ్ర వైడూర్యాల లాంటివి. ఇది అలమారాలో పెట్టి అమ్మే పరిజ్ఞానం కాదు. అందు కనే, భారత–రష్యాల మధ్య సైనిక సరఫరాలలో ఎంత పటిష్ఠమైన బంధం ఉన్నా డిజైన్ పరిజ్ఞానాన్ని పంచుకోవడమన్నది లేదు.ఆత్మనిర్భరతను వీలైనంత త్వరగా, పటిష్ఠంగా ముందుకు తీసుకెళ్ళే దృఢ నిశ్చయాన్ని భారత్ కనబరిస్తే పుతిన్ పర్యటన తద నంతర ఫలాలపై ఆశ పెట్టుకోవచ్చు. నిజంగానే, రెండు దేశాలు రక్షణ రంగ పరిశోధన–అభివృద్ధిలో, వస్తూత్పత్తిలో సహకారముంటే మరింత ప్రగతిని సాధించవచ్చు. కానీ, ఈ విషయంలో భారత్ తొలగించుకోవలసిన సాలెగూళ్ళు చాలానే ఉంటాయి.మాస్కోకి కూడా ఢిల్లీతో గాఢమైన సైనిక సహకారం విషయంలో కొన్ని లక్ష్మణ రేఖలున్నాయి. అది బీజింగ్ సందేహాలను కూడా తీర్చవలసి ఉంటుంది. అదే మాదిరిగా, భారత్ కూడా రష్యాతో కలసి అడుగులేయడంలో అమెరికా పెడుతున్న తంపులను గుర్తెరిగి ప్రవర్తించవలసి ఉంటుంది. పుతిన్ పర్యటన ద్వైపాక్షిక స్నేహ సంబంధానికి మెరుగులు దిద్దింది. కానీ, రెండు దేశాలకూ కొత్త సవాళ్ళు కూడా ముందుకొచ్చి నిలుస్తున్నాయి. సి. ఉదయ భాస్కర్,వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ -
సంక్షోభంలో నేపాల్ పార్టీలు
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.ఒక్కో పార్టీ... ఒక్కో సమస్యఅన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే! ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు. దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది. అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!అదే మొండి ధోరణిఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు. ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు. ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వెనిజులాపై అమెరికా యుద్ధోన్మాదం
వెనుకబడిన, బలహీనమైన చిన్న దేశా లను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యం కాకపోతే యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తరు వాత ఆ దేశాల సహజ వనరులను తరలించుకుపోవడం అమెరికా అనుసరిస్తున్న విధానంగా ఉంది.నేడు వెనిజులాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై దాడి చేయడానికి అమె రికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు 8 వార్షిప్లతో పాటు అతిపెద్ద విమాన వాహక నౌకను, 10 వేల మంది సైనికులనుపంపాడు. ఇది ఇలా ఉండగా 2025 సెప్టెంబర్ 2 నాడు వెనిజులా నుంచి పోతున్న పడవలపై అమెరికా దాడి చేసి 11 మంది ప్రాణాలు తీసింది. ఈ దాడికి కారణం పడవల్లో వెనిజులా మాదక ద్రవ్యాలను రవాణా చేయడమే అంటున్నది.వెనిజులాపై అమెరికా వ్యతిరేకత చాలా కాలంగా కొనసాగు తున్నది. ఆ దేశ భూగర్భంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వంటివి అపారంగా ఉన్నాయి. తన బహుళ జాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకు పోతున్న అమెరికాకు, 1999లో వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికైన హ్యూగో చావేజ్ అడ్డు కట్ట వేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాలకు మద్దతిచ్చింది.ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. బొలీ వియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో అమెరికా రాయబారిని వెనిజులా దేశం నుంచి బహిష్కరించింది. చావేజ్ మరణం తర్వాత వరుసగా మూడు సార్లు నికోలస్ మదురో అధ్యక్షుడయాడు. తమ దేశ పెట్టుబడిదారులకు చెందిన వెనిజులాలోని సంస్థలనూ, గను లనూ ఆ దేశం జాతీయం చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అమెరికా కోర్టులు తీర్పులు వెల్లడించాయి. సార్వభౌమాధికారం గల ఒక దేశానికి సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజులా అలాంటి దేశం కాబట్టి చమురు పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి? వెని జులా నుంచి ఎవరూ చమురు కొనవద్దని అమెరికా ఆంక్షలు (2023) విధించి ఆర్థికంగా దాన్ని దెబ్బతీస్తోంది.అలాగే వెనిజులాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టి పోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్లు ‘హెరాల్డ్’ పత్రిక పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వ ప్రకటనను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్య అని పేర్కొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపి వేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనిజులా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసి వేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరు ద్ధమైనది. ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్వానికి నిదర్శనం. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
క్షమించండి, తీర్పు అనంగీకారం!
‘తమిళనాడు రాష్ట్రం వర్సెస్ తమిళనాడు గవర్నర్’ కేసులో సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యం: తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించ లేదు. వాటిని ఆయన రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా ఆ బిల్లులకు సమ్మతి తెలుపలేదు. మరోసారి పరిశీలించవలసిందిగా కోరుతూ శాసనసభకు తిప్పి పంపనూ లేదు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం–గవర్నర్ మధ్య వివాదానికి దారితీసింది.ఇక్కడ మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి: 1. ఆమోదం పొందని బిల్లుపై సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు చెప్పగలదా? శాసనసభ ఆమోదించి పంపినా గవర్నర్ లేదా రాష్ట్రపతి దానికి సమ్మతి ఇవ్వనప్పుడు అది చట్టం హోదా పొందినట్లేనని భావించ వచ్చా? 2. ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ గవర్నర్ లేదా రాష్ట్రపతిని, ఆర్టికల్ 142 కింద, సంపూర్ణ న్యాయం అనే సూత్రం ప్రాతిపదికగా సుప్రీం కోర్టు బలవంత పెట్టగలదా? 3. శాసన సభ–గవర్నర్ మధ్య వివాదాన్ని పరిష్కరించే అధికారం రాజ్యాంగం సుప్రీం కోర్టుకు దఖలు పరిచిందా?రాజ్యాంగం ఏం చెబుతోంది?ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్ బిల్లును అందుకున్న తరువాత సాధ్యమైనంత త్వరగా దానికి ఆమోదముద్ర వేయాలి లేదా తన వ్యాఖ్యలు జోడించి వెనక్కు పంపాలి లేదా రాష్ట్రపతికి నివేదించాలి. ఒకసారి తిప్పిపంపిన తర్వాత, శాసనసభ ఆ బిల్లును మళ్లీ పంపితే, దానికి ఆమోదముద్ర వేయడం తప్ప గవర్నర్కు మరో మార్గం లేదు. తమిళనాడు విషయంలో బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు, వెనక్కు పంపలేదు. శాసనసభ తనకుతానుగా అదే బిల్లును రెండోసారి ఆమోదించి గవర్నర్కు పంపింది. గవర్నర్ ఎంతకాలం బిల్లును పెండింగులో పెట్టగలరు? రాజ్యాంగం కాలపరిమితి విధించడం లేదు. ‘సాధ్యమైనంత త్వరగా’ తిప్పి పంపాలని మాత్రమే చెబుతోంది. ఒకవేళ బిల్లు ఆమో దించడానికి నిరాకరిస్తే? అలాంటప్పుడు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్ లేదా రాష్ట్రపతి మీద చట్టసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం. రెండు, ఆ బిల్లును మరోసారి పరిశీలించి ఆమోదించి పంపడం. తమిళనాడు శాసనసభ ఈ రెండో మార్గం ఎంచుకుంది. అది ప్రారంభించిన ఈ రాజ్యాంగ సంప్రదాయానికి రాజ్యాంగబద్ధత ఉందా? సుప్రీం కోర్టు ఈ అంశాన్ని చర్చించలేదు. మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం నివేదించినప్పుడు, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయకుండా నిలిపివేస్తే, రాష్ట్ర శాసనసభ ఏం చేయాలి? రాష్ట్రపతి నుండి ఎలాంటి సందేశం రాకపోతే, శాసనసభ స్వయంగా బిల్లును పున:పరిశీలించి రెండోసారి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. బిల్లు రెండోసారి సభ ఆమోదం పొందినప్పుడు, ఆమోద ముద్ర వేయడం తప్ప రాష్ట్రపతికి మరో మార్గం లేదు. ఆర్టికల్ 143 కింద, రాష్ట్రపతి సుప్రీం కోర్టును అడిగిన ప్రశ్న: రాష్ట్రపతి ఎంతకాలం బిల్లును నిలిపివేయవచ్చు? దీనికి సమాధానంగా ఒక సంప్రదా యాన్ని నెలకొల్పే అవకాశం ఇదే ఆర్టికల్ కల్పిస్తోంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో మార్గదర్శక న్యాయస్థానంగా వ్యవహరించకుండా, దేశానికి సూపర్ హీరోగా, బాస్గా వ్యవహరించింది.ప్రస్తుత పరిస్థితిప్రస్తుత కేసులో రాష్ట్రపతి బిల్లును తిప్పి పంపలేదు, ఆమోద ముద్రా వేయలేదు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఇవ్వకపోయినా, లేదా సందేశంతో వెనక్కు పంపకపోయినా, శాసనసభకు ఉన్న ప్రత్యామ్నాయం ఆ బిల్లును తిరిగి పరిశీలించడం. అలా రాష్ట్రపతి సలహా లేకుండా బిల్లును పున:పరిశీలించి ఆమోదిస్తే, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడం తప్ప మరోలా చేయలేరు. భవిష్య త్తులో శాసనసభకు రాష్ట్రపతికి మధ్య విభేదాలు వస్తాయని రాజ్యాంగం ఊహించలేదు.కానీ సుప్రీం కోర్టు తీర్పు వ్యవస్థల అధికార పరిధి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే ప్రధాన సమస్య. ఆర్టికల్ 145 ప్రకారం, సుప్రీం కోర్టుకు తన కార్యకలాపాలకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం ఉంది. అలాగే, ఆర్టికల్స్ 118, 208 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తమ సభావ్యవహారాల నిర్వహణకు అవసరమైన నియమావళిని రూపొందించుకునే అధికారం కలిగి ఉన్నాయి. ఆర్టికల్స్ 122, 212 ప్రకారం సభా కార్యకలాపాలను కోర్టులో ప్రశ్నించే వీల్లేదు. రాష్ట్రం, కేంద్రం నడుమ వివాదమా?భారత రాజ్యాంగం శాసనసభ, గవర్నర్ మధ్య సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించింది. అయితే, ఆచరణలో అనేక సందిగ్ధతలు ఉత్పన్నమవుతున్నాయి. బిల్లులు స్పీకర్ ద్వారా మాత్రమే గవర్నర్కు చేరతాయి. గవర్నర్ సమ్మతి పొందే వరకు బిల్లు శాసనసభ ఆస్తిగా ఉంటుంది. ఆమోదముద్ర పడిన తర్వాత అది చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదముద్ర పొందనంత వరకు ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు.ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ ప్రక్రియలు న్యాయస్థాన అధికార పరిధిలోకి రావు. అదే సమయంలో, ఆర్టికల్స్ 32, 131 ప్రకారం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా రాష్ట్రం–కేంద్రం నడుమ వివాదాలు సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి. గవర్నర్ లేదా రాష్టపతి బిల్లుపై సంతకం చేయకపోవడం రాష్ట్రం–కేంద్రం మధ్య వివాదం అవుతుందా? అలా అయ్యేట్లయితే అది సుప్రీం పరిధిలోకి వస్తుంది. సమస్య ఏమిటంటే, సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశాన్ని పరిశీలించలేదు. ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, శాసనసభ బిల్లును రెండోసారి ఆమో దించడం. దీనివల్ల గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా తప్పించు కోలేరు. రెండవది, ఆర్టికల్ 156(1) ప్రకారం, రాష్ట్రపతి సంతృప్తి మేరకు గవర్నర్ పదవిలో ఉంటారు. అసెంబ్లీ తీర్మానం చేసి, గవర్నర్ను వెనక్కి పిలిపించవలసిందిగా రాష్ట్రపతిని కోరవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఈ మార్గాన్ని ఉపయోగించకపోవడం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఉత్పన్నమైంది.గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేసినప్పుడు, ఆయన తన అధికారాన్ని రాష్ట్రపతికి అప్పగించినట్లే. అందువల్ల రాష్ట్రపతి, గవర్నర్ ఒకే గుర్తింపు కలిగిన వారవుతారు. ఈ ముఖ్యాంశాన్ని సుప్రీం కోర్టు పరిశీలించలేదు. ఆర్టికల్ 12 ప్రకారం ‘స్టేట్’ అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ; కేంద్రంలో కేంద్రప్రభుత్వం, పార్లమెంటు అవుతాయి. కాబట్టి, రాష్టం గవర్నర్పై పిటిషన్ వేయడం అంటే తన మీద తనే కేసు వేసుకున్నట్లు అవుతుంది. ఇదెలా సాధ్యం? రాష్ట్రంలోని ఒక విభాగం మరొక విభాగానికి వ్యతి రేకంగా రిట్ పిటిషన్ను ఎలా దాఖలు చేయగలదో తేల్చడంలో అత్యున్నత న్యాయస్థానం విఫలమైంది. ఈ కారణాల వల్లనే నేను ఆ తీర్పుతో ఏకీభవించడం లేదు.ప్రకాశ్ అంబేడ్కర్వ్యాసకర్త లోక్సభ, రాజ్యసభ మాజీ సభ్యులు, అడ్వకేట్ (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
మనకు తెలియని మరో దేశం
అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనంగా, వివిధ ప్రాంతాల సమాఖ్యగా భారతదేశం విశాలమైనది.అంతకు మించి వైవిధ్యభరితమైనది. అలాంటి చోట ‘హిందీ బెల్ట్’గా రాజకీయ, ఆర్థిక జనవ్యవహారంలో పాపులరైన ప్రాంతం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల భూమి. మహాజనపదాల కాలం నుంచి ఇవాళ్టి దాకా భారత రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించడంలో ఈ ప్రాంత ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.చెప్పాలంటే, మొత్తం దేశ విస్తీర్ణంలో దాదాపు 38 శాతం, అలాగే భారత జనాభాలో 42కి పైగా శాతం ఇక్కడిదే. దేశ పార్లమెంట్ సభ్యుల్లో 40 శాతం పైగా ఇక్కడివారే. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశానికి 15 మంది ప్రధానమంతులైతే, వారిలో సగానికి పైగా (8 మంది) ఇక్కడివారే. అయినా ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతంగా మిగిలి, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి, హింస తదితర జాడ్యాలతో సతమతమవుతోంది.దేశ వనరుల్లో అధిక భాగం ఇక్కడే ఖర్చవుతున్నా ఈ వెనుకబాటుతనానికి కారణాలేమిటి? ఆ ప్రశ్నకు జవాబుగా ఆ ప్రాంతంపై వివిధ కోణాల్లో వేసిన ఫోకస్లైట్... గజాలా వహాబ్ రచన ‘ది హిందీ హార్ట్ల్యాండ్’.ప్రధానంగా అయిదు విభాగాలుగా సాగిన ఈ రచన కీలకమైన హిందీ ప్రాంతం ప్రత్యేకతను సంత రించుకోవడానికి దోహదం చేసిన చారిత్రక కారణా లనూ, అలాగే వెనుకబాటు సహా సమకాలీన చరిత్రను ప్రతిఫలించే అక్కడి అనుభవాలనూ అందంగా గుది గుచ్చింది. అవి చదువుతుంటే ఆ ప్రాంత సామాజిక, రాజకీయ, ధార్మిక చలనసూత్రాలపై మునుపున్న అవ గాహన మరింత విస్తరిస్తుంది.స్వతంత్ర భారతావనిలో కాలగతిలో పెరుగుతూ వచ్చిన మత విద్వే షాలకు కారణాలపైనా ఈ రచన దృష్టిపెట్టింది. రచ యిత్రి ప్రాథమికంగా పాత్రికేయురాలు కావడంతో ఇంటర్వ్యూలు, సంభాషణలు, స్థానికంగా పర్యటన లతో సమాచారం సేకరించి, పరిణామాలన్నిటినీ క్షేత్ర స్థాయి నుంచి, ప్రత్యక్ష సాక్షుల ద్వారా పాఠకుల కళ్ళ ముందుంచారు. కుల మతాల చిచ్చులోపడి కునారిల్లుతున్న ఈ ప్రాంతంలో ముస్లిమ్లతో సంఘర్షణ కేవలం 144 ఏళ్ళ నుంచేననీ, ఎప్పుడో 12వ శతాబ్దం నుంచి ఉన్న సామరస్య సహజీవనాన్ని కొనసాగిస్తే అభివృద్ధి సాధ్యమేననీ రోడ్మ్యాప్ చూపారు. 1857 తర్వాత పెరుగుతూ వచ్చిన హిందూ – ముస్లిమ్ విభేదాలతోనే శుద్ధ హిందీని హిందువుల భాషగా, ఉర్దూను ముస్లిమ్ల భాషగా చిత్రీకరించే యత్నం మొదలైంది. ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోలీసు పరిభాష నుంచి ఉర్దూ పదాలను ప్రభుత్వాలు తొలగించడం దాకా అది జరుగుతూనే ఉందని చారిత్రక ఆధారాలతో తెలుసుకుంటాం. భాష, సంస్కృతి పేరిట సాగుతున్న రాజకీయాలతో పాటు టాకీల తొలినాళ్ళ నుంచి హిందీ చిత్రసీమలో అధిక భాగం రచయితలు, కవులు హిందీ బెల్ట్ నుంచి ముంబయ్కి వెళ్ళినవారేనన్నది ఆలోచింపజేసే వాస్తవం. కులం, మతం, భాషా రాజకీయాల సూక్ష్మ వాస్తవాల విశ్లేషణ ఈ పుస్తకంలోని అధ్యాయాల నిండా పరుచుకుంది. లౌకికవాదం అనే మాటను సైతం దోషంగా భావిస్తూ, సామరస్యపూర్వక సాంస్కృతిక సమ్మిళిత జీవనాన్ని చెప్పే గంగా–జమునా తెహజీబ్ను తప్పుగా ఎంచే కాలానికి మన దేశం, ముఖ్యంగా హిందీ ప్రాంత ప్రయాణాన్ని ఆవేదనాభరితంగా బొమ్మ కడుతుంది.చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, ఎమర్జెన్సీ... ఇలా ఎన్నింటినో స్పృశిస్తూ సాగే ఈ రచన కనిపించని కథ లెన్నో వెలికితీసింది. శివాజీ పట్టాభిషేకం, బ్రిటిషర్లపై చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తిరుగుబాటు వెనుక కథలెన్నో ఆసక్తి రేపుతాయి. నిజానికి, విస్తృత చారిత్రక క్యాన్వాస్ ఉన్న పుస్తకాన్ని ఏకబిగిన చదవడమే అనుకుంటే, రాయడం మరీ కష్టం. కానీ, గజాలా పడిన కష్టమేమో కానీ హాయిగా చదివించడం ఈ రచన ప్రత్యేకత. చదువుతుంటే రచయిత్రి పక్కనే కూర్చొని కాశీ నుంచి కశ్మీర్ దాకా ప్రయాణించిన అను భూతి. కళ్ళ ముందు జరుగుతున్న కథలా చరిత్రను తెలుసుకుంటున్న భావన. ఈ రచనకున్న అతి పెద్ద బలాలు అవే! -గజాలా వహాబ్,జర్నలిస్టు – రచయిత్రి -
ఈసీపై నమ్మకం పెరిగేనా?
గట్టిగా బెట్టు చేసిన తర్వాత, ఎన్నికల సంస్కరణలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం దిగివచ్చింది. కానీ ఓటర్ల జాబితాల ప్రత్యేక సునిశిత సవరణ (సర్)పై నెలకొన్న వివాదం పరిష్కార మయ్యేందుకు ఇది తోడ్పడుతుందా? అసాధారణమైన రీతిలో సర్ నిర్వహించా లని భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ) గైకొన్న నిర్ణయం అత్యంత వివాదాస్పద మైన నిర్ణయాలలో ఒకటిగా నిలుస్తుంది. ‘లొసుగులు లేని’ ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నామని కమి షన్ చెప్పుకుంటూంటే, ఇది చాలామంది ఓటు హక్కును కాల రాసేదిగా తయారైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.సంస్కరణలకు ముందున్న పార్లమెంట్ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల తర్వాత ముఖ్యమైన భాగస్వా ములైన రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో ముందు నిలిచిన సందర్భాలు అరుదు. సుప్రీం కోర్టు ముందుకు నెట్టిన సందర్భాలలో తప్పించి, ప్రభుత్వాలు కూడా సంస్కరణలకు విముఖంగానే ఉంటూ వస్తున్నాయి. పోలింగ్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనేటట్లు చేసేందుకు, సాంకేతిక ప్రగతిని వాడుకునేందుకు, నేరస్థులు పోటీ చేయకుండా అరికట్టేందుకు, పారదర్శకతను పెంచేందుకు, ఎన్నికల ప్రచారంలో నడచుకోవాల్సిన తీరును మెరుగుపరచేందుకు గణనీయమైన సంస్కరణలు తీసుకురావడంలో పార్లమెంట్ ముఖ్య భూమిక వహించింది. ఓటు హక్కు వినియోగించుకునే వయో పరిమితిని 1988లో 21 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళకు తగ్గించారు. తర్వాత, 2021లో అర్హత గడించుకునే తేదీలను పెంచారు. వయోజనులు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత, తదుపరి ఏడాది జనవరి 1 వరకు వేచి చూడన వసరం లేకుండా– జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల మొదటి తేదీలలో కూడా తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవచ్చని మంచి మార్పు తెచ్చారు. అలాగే, 1993లో ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)లను వినియోగించ డాన్ని 1998లో దశల వారీగా మొదలుపెట్టి, అవి సక్రమంగా ఉన్నాయో లేవో సరిచూసేందుకు, ‘ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్’ (వీవీప్యాట్)లను 2019లో తప్పనిసరి చేశారు. సుప్రీం కోర్టు ఆదేశం పుణ్యమా అని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పూర్వాపరాలను వెల్లడించడం 2003 నుంచి మొదలైంది. దోషులుగా తేలిన లెజిస్లేటర్లను, లిల్లీ థామస్ కేసు పర్యవసానంగా, వెంటనే అనర్హులుగా చేయడం 2013లో మొదలైంది. పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకున్నా లేదా పెద్ద యెత్తున హింస చోటు చేసుకున్నా పోలింగ్ను వాయిదా వేసే లేదా రద్దు చేసే అధికారాన్ని పార్లమెంట్ 1989లో ఎన్నికల కమిషన్కు కట్టబెట్టింది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతోనే ఎన్నికల కమిషన్, పార్లమెంట్, సుప్రీం కోర్టు ఆ యా సంస్కరణలు తెచ్చాయి.అవసరమైన సంస్కరణలుఎగువ పేర్కొన్న శాసనపరమైన మార్పులు తెచ్చినప్పటికీ, పెండింగ్లో ఉన్న సంస్కరణల జాబితా పెద్దదే. అభ్యర్థులను అనర్హు లుగా ప్రకటించడానికి సంబంధించిన చట్టాన్ని మరింత కఠినతరం చేయడం నుంచి రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు ప్రత్యా మ్నాయ పద్ధతులను రూపొందించడం, ఎన్నికల ప్రచార ఖర్చులపై ఒక పరిమితి విధించడం వరకు చాలానే ఉన్నాయి. రాజకీయ పార్టీల లీగల్ స్టేటస్పై స్పష్టత లోపించడం ఇప్పటికీ ఆందోళనకర అంశమే. రాజకీయ పక్షాలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. కీలకమైన ఈ అంశాలను పక్కన పెట్టేసి, ‘సంస్కరణలన్నింటికీ’ తల్లిగా చెబుతున్న ‘ఒక దేశం – ఒకే ఎన్నిక’పై చర్చించడంలో పార్లమెంట్ చొరవను ప్రదర్శించింది.‘సర్’పై ఆవేశకావేషాలను చల్లార్చవలసిన బాధ్యత కమిషన్ పైనే ఉంది. తమ ఓటు హక్కును తొలగిస్తున్నారని కొందరు అంటూంటే, దానికి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయ వలసి రావడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది పోలింగ్ కేంద్ర స్థాయి (బీఎల్వో) అధికారులు చనిపోయినట్లు చెబుతున్న అంశం తోడవు తోంది. కమిషన్ కున్న నిష్పాక్షిక ప్రతిష్ఠను సవరణ తతంగం మసక బారేటట్లు చేసింది. సాఫీగా, శాంతియుతంగా నిర్వహించదగిన ఓటర్ల జాబితా సవరణను, అనర్హత రాక్షసిపై యుద్ధంగా మార్చినందుకు కమిషన్ నిందను స్వీకరించవలసిన అవసరం లేదా?బిహార్లో ఏం సాధించినట్టు?బిహార్లో తుది ఓటర్ల జాబితాను లోపాలు లేకుండా మెరుగు పరచడం ద్వారా గడించిన ప్రస్ఫుట ప్రయోజనాలు ఏమిటో కమి షన్ తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకుని, ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అది గతంలో డూప్లికేషన్ సాఫ్ట్వేర్ను విజయవంతంగా వినియోగించుకుంది. ఇపుడు దాన్ని ఉపయోగించి అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలి. తద్వారా, డూప్లికేట్ ఓటర్లను గుర్తించి, వారి పేర్లను జాబితాల నుంచి తొలగించవచ్చు. కానీ అది ఆ సాఫ్ట్వేర్ను పక్కన పెట్టడానికి గల కారణం తెలియడం లేదు.‘‘డూప్లికేషన్ను నివారించేందుకు ఒకే ఒక్క సేకరణ ఫారాన్ని’’ మనఃసాక్షి ననుసరించి సమర్పించవలసిందిగా ఓటర్లను కోరడంపై అది ఆధారపడుతోంది. తాను ఎప్పుడూ అనుసరించే సాధారణ సవరణ విధానాల ప్రకారం కాకుండా, దేశవ్యాప్తంగా సునిశిత సవరణ ద్వారా తాను ఏం సాధించదలచుకున్నదీ కమిషన్ స్పష్టంగా వివరించి తీరాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ‘అర్హత లేని’ ఓటరును వెతికి పట్టు కునేందుకు ఇపుడు ఉన్న ఓటర్లు అందరినీ హాజరు పరచి తనిఖీ చేసే వ్యామోహాన్ని కమిషన్ వదులుకోవాలి. బిహార్లో సునిశిత సవరణ ద్వారా అది ఆ పని చేయలేకపోయింది.ప్రజలకు తనపై ఉన్న నమ్మకాన్ని తిరిగి గడించుకోవడంలో పార్లమెంట్లో జరిగే చర్చ కమిషన్కు ప్రేరణ నిస్తుందని ఆశిద్దాం. పార్లమెంట్ లేదా సుప్రీం కోర్టు మాదిరిగానే ఎన్నికల కమిషన్ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది తన తలుపులను తెరచి ఉంచితే జనం ఇతర సంస్థల తలుపులు తట్టాల్సిన అవసరం ఉండదు. మన రిపబ్లిక్ అవతరించకముందే పురుడుపోసుకున్న కమిషన్కు పౌరు లతో పేగు బంధం ఉంది. ఈ రక్త సంబంధాన్ని ఏ సుప్రీం కోర్టు ఉత్తర్వో గుర్తు చేయవలసి వస్తే అది విషాదకరం అవుతుంది. రాజకీయ సంక్షోభం దానికి కారణమైతే, అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు.అశోక్ లవాసా: వ్యాసకర్త ఎన్నికల సంఘం మాజీ కమిషనర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గెలవాలంటే మాయం కావాలి!
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పట్టభద్రులైన మీ అందరికీ అభినందనలు! నేను నా స్నాతకోత్సవానికి హాజరు కాలేదు. ఎందుకంటే, నేను సన్యాసిని కావాలనుకున్నా. సాధారణంగా, భారతదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చేవారు ఎవరైనా డాక్టరు, లాయరు కావాలను కుంటారు. లేదా దేనికీ కొరగాకుండా పోతారు. అందుకే మా అమ్మా నాన్న నా మానసిక స్థితిపై ఆందోళనపడ్డారు. కానీ, దాన్ని బయటకు కనిపించనీయలేదు. ‘వై వుయ్ మేక్ బ్యాడ్ డెసిషన్స్’ అనే శీర్షికతో డ్యాన్ గిల్బర్ట్ రాసిన పుస్తకాన్ని నాకు పంపించారు. కాకతాళీయంగా, ఆయన కూడా ప్రిన్స్టన్ నుంచి పీహెచ్డీ చేసినాయనే! కనుక నా జీవితంలో ఒక చక్రభ్రమణం పూర్తయిందనుకుంటున్నాను. మీ విలు వైన కాలానికి తగ్గ విలువైన అంశాలనే చెప్పగలనని ఆశిస్తున్నాను. ఈ ధైర్యం నాకు చిన్నప్పుడు లేదు.స్వశక్తిపై సందేహాలు సహజమే!ఎనిమిదేళ్ళ వయసులో మొదటిసారి దీపావళి సందర్భంగా స్కూల్లో స్టేజీ ఎక్కాను. నాతో మాట్లాడించి, పాడించాలని మా అమ్మ ఆశ. నా గొంతు విని అందరూ నవ్వడం మొదలెట్టారు. దాంతో మాటలు మరచిపోయాను. కాగితంలో తర్వాతి వాక్యం చూడాలని ప్రయత్నించాను. కన్నీటి చుక్కలతో అక్షరాలు మసక బారాయి. టీచరు వచ్చి భుజం చుట్టూ చేయి వేసి, స్టేజి మీద నుంచి కిందకు దింపింది. తర్వాత, ఓ అమ్మాయి నా ప్రేమను తిరస్కరించింది. కొన్ని రోజులు నా బుర్రంతా అదే ఆలోచన. ఆమె నన్ను తిరస్కరించినందుకు కాదు. నా ప్రతిపాదనకు ఆమె ఏమనుకుందోనని నాలో భయం. కాలేజీ చదువు తర్వాత, ఆరామానికి వెళ్ళి భిక్షువుగా మారాను. అమ్మ, నాన్న నా నిర్ణయాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకుంటారా అని ఆందోళన. మూడేళ్ళ తర్వాత, బౌద్ధారామానికి వీడ్కోలు పలికాను. ఫెయిలయ్యానని అనిపించింది. ఉద్యోగాల వేటలో 40 తిరస్కారాలు ఎదురయ్యాయి.కనీసం ఇంటర్వ్యూలకు కూడా పిలవలేదు. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ తెచ్చు కున్నా అదీ పరిస్థితి. చివరకు కన్సల్టెంట్గా ఉద్యోగం వెలగబెట్టా. అందులోనూ అందరికన్నా వెనుకబడి ఉన్నానని బాధే. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారోనని ఆదుర్దా. మీడియాలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుదురుగా ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టా. నేను పాడ్కాస్ట్ మొదలుపెట్టినపుడు, చేయూత నిస్తానన్న ప్రొడక్షన్ కంపెనీ, అది మొదలవడానికి రెండు వారాల ముందే చేతులెత్తేసింది. నేను మొదటి పుస్తకం రాసినపుడు, 14 మంది పబ్లిషర్లు పుస్తకం పేరు మార్చమన్నారు. ఇలాంటివన్నీ ఎదుటివాళ్లు మన గురించి ఏమనుకుంటున్నారోనన్న ఆందోళనకు గురిచేస్తాయి.చార్లెస్ హార్టన్ కూలే 1902లో చెప్పిన మాటల సారాంశం చెబు తాను: నేను తెలివైనవాడినని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటే, నేను తెలివైనవాడిగా వ్యవహరించడం ప్రారంభిస్తా! కానీ, పనికిరానివాడినని మీరు నా గురించి అనుకుంటున్నారని, నేను అనుకుంటే, నేను నిజంగానే పనికిరానివాడిగా మారతా!! మన చుట్టూ ఉన్న ప్రపంచం పన్నే ఈ వలలో మనం పడకూడదు. మన రంగాల్లో ఏ పని చేయడానికైనా ఒత్తిడి అనుభవిస్తాం. అవి జనం అంగీకరించేవిగా, ముఖ్యమైనవని భావించేవిగా ఉండాలని కోరుకుంటాం. ఉనికిని చాటుకునేందుకు, ప్రాధాన్యాన్ని నిలుపు కొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. ఎందుకంటే, ప్రపంచం ఆకట్టుకునేదిగా ఉన్నదానివైపే మొగ్గుతుంది. నేను చెప్పేది ఒకటే. మనం కనపడకూడదు.బుద్ధుడు చెప్పిన పాఠంఅదృశ్యమైపోవడమంటే పని మానేయడం కాదు. పని చేస్తూనే ఉండాలి. కానీ, అది నలుగురికీ కనిపించేలా ఉండనవసరం లేదు. ప్రతి అడుగూ ముందే ప్రకటించాల్సిన అవసరం లేదు. జనం ఏమనుకుంటారోననే ఆలోచనను పక్కన పెట్టండి. మీకు ఏ పని చేయగలమని గట్టి నమ్మకం ఉందో దానికి విలువ నివ్వండి. మీకు ఆనందాన్ని ఇచ్చే దానితో పోలిస్తే, పైకి గొప్పగా కనిపించే లేదా సవ్యమైనదిగా తోచే పని ఏదైనా సరే దిగదుడుపే!వృత్తి జీవితం మొత్తం ప్రజల కళ్ళెదుట ఆన్లైన్లో గడిపే వ్యక్తి ఇటువంటి సలహా ఇవ్వడం చోద్యంగా తోచవచ్చు. కానీ, ఒకసారి కాదు రెండు సార్లు అదృశ్యమైన తర్వాతే, నేను ఇప్పుడున్న స్థితికి చేరుకున్నా. మొదటిసారి భిక్షువునయ్యా. రెండవసారి, బౌద్ధ భిక్షు వుల వద్ద నేర్చుకున్న అంశాలను నలుగురికీ పంచేందుకు, కుదు రుగా చేసుకుంటున్న ఉద్యోగాన్ని మానేశా. వ్యవస్థాపక సామర్థ్యం ఉన్న ప్రపంచస్థాయి ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తలు అందరూ తాము ఇష్టపడే వ్యాపకంపై మౌనంగా కృషి చేసినవారే!ఒకసారి ఓ విద్యార్థి ‘‘ధ్యానం ద్వారా ఏమి పొందుతారు?’’ అని అడిగాడు. ‘‘ఏమీ లేదు’’ అన్నది బుద్ధుడి జవాబు. ‘‘ఇంక ధ్యానం చేయడం దేనికి?’’ అని విద్యార్థి అడిగాడు. ‘‘నేను ఏదో పొందాలని ధ్యానం చేయడం లేదు. ధ్యానం ద్వారా ఆందోళన, అభద్రత, సంశయాలు పోగొట్టుకుంటున్నా’’ అన్నాడు బుద్ధుడు.ప్రిన్స్టన్లో పట్టభద్రులవడం ద్వారా మీరు ఏయే ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారో ఊహించుకోవచ్చు. కానీ, మీరు వదిలించుకోవాల్సిన వాటి పట్ల కూడా కొంత ఆసక్తి వహించండి. ఎవరి ఆమోదం కోసమో చూసే అవసరాన్ని పోగొట్టు కోండి. ఎదుటివారితో పోల్చుకోవడమనే చాపల్యాన్ని వదులుకోండి. మన విజయాలను మరొకరి విజయాలతో పోల్చి చూసుకుంటే, మనం సాధించగలిగిన విజయాలు కూడా దెబ్బతింటాయి. మీరు మీ సాఫల్యాన్ని మరొకరితో పోల్చి చూసుకోవడం వల్ల మీకు ఎన్నటికీ అసంతృప్తే మిగులుతుంది.జీవితాన్ని తీర్చిదిద్దే నిర్ణయాలుమీరు నమ్మే వ్యక్తుల నుంచి పాఠాలు నేర్చుకోండి. కానీ, ఇత రుల అభిప్రాయాలు ఈ నిర్ణయాలను నిర్వచించకుండా చూసుకోండి. ఎందుకంటే, మనం తీసుకునే నిర్ణయాలకు మనమే బాధ్యు లమవుతాం. మనపై మన స్వీయ అభిప్రాయమే ముఖ్యం. ప్రతి రోజు నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు సమీక్షించుకోవాలి. కొన్ని రోజులు అప్రియమైనవిగా గడుస్తాయి. ఏవేవో పొరపాట్లు చేస్తాం. అప్పుడు నిజాయతీతో కూడిన స్వీయ అభిప్రాయం అవసరం.పొట్టకూటి కోసం ఏం చేస్తామన్నది మరో ముఖ్య నిర్ణయం అవుతుంది. మీకు ఏది ఇష్టమైన పనో దాన్ని చేయడానికి ప్రయత్నిం చండి. అటువంటి ఉద్యోగం దొరక్కపోతే, చేస్తున్న పనిలోనే పర మార్థాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మన జీవి తంలో మూడవ వంతు సమయాన్ని మనం పని చేస్తున్న చోటే వెచ్చిస్తాం. దాదాపుగా 90,000 గంటలు అను కోవచ్చు. కనుక దాన్ని ద్వేషిస్తూ కూర్చోవద్దు. చేస్తున్న పనిపై మక్కువ పెంచుకునే ప్రయత్నం చెయ్యండి. పని ఇష్టం లేకపోయినా, ఆ పనికి మీరు ఇష్టపడేదేదో కలపండి. అయినా, ఏమాత్రం మన సుకు ఎక్కకపోతే, ఆ భావాన్ని మరో కొత్తదాన్ని ప్రయత్నించి చూడ టానికి ఉత్ప్రేరకంగా వాడుకోండి. 2030 నాటికి ఉండగల ఉద్యోగాల్లో 85 శాతం ఉద్యోగాలు ఇంకా రూపొందనే లేదని చెబుతున్నారు. అంటే, ఏ రకమైన అవకాశాలు తలుపు తడతాయో చెప్పలేం!మానవాళికి మనం ఏమి చేస్తామన్నది మరో ముఖ్యాంశం. చాలా మంది అసలు దీని గురించే ఆలోచించరు. కానీ, ఈ ప్రశ్నను కనుక పక్కన పెడితే, నిజమైన సంతృప్తికి దారితీసే ఒక అంశాన్ని జార విడుచుకుంటున్నట్లే లెక్క. అది ఎక్కువో, లేదా తక్కువో కావచ్చు. కానీ, మీ సమయం, శక్తి, వనరులు మీ సొంతం కోసమే కాకుండా ఎదుటివారికి వినియోగపడినప్పుడు అవి మరింత అర్థవంతమైనవిగా మారతాయి. -
మహాకవి గురజాడ మార్గం
వెయ్యేళ్ళుగా వస్తున్న సాహిత్య ఒరవడిని మార్చి, మరో వెయ్యేళ్ళ ముందుచూపుతో రచనలు చేసి సంఘ సంస్కరణ కావించిన మహా కవి గురజాడ వేంకట అప్పారావు. బౌద్ధాన్ని గురజాడ విశ్వసించారు. బుద్ధిజం ఏనాడైతే మన భారతదేశం ఎల్లలు దాటి వెళ్ళిందో ఆనాటి నుండి మన దేశం వెనుకబడిందన్నారు. దేవుళ్ళూ దయ్యా లని పూజలు చేస్తాం. సాటి మనిషికి సాయపడం. అదే కదా మూర్ఖత్వం. మనకు భౌతిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. వెనుకబడటానికి మూలం మూఢవిశ్వాసం. ప్రపంచ దేశాలు హేతు వాద దృక్పథంతో విజ్ఞాన శాస్త్ర ఫలాలు పొందుతుంటే మన దేశం నమ్మకాలు, ఆచారాలు అంటూ అనాలోచితంగా వెనుకబడిపోతోందని ఆయన ఉద్దేశం. రవి కాంచని చోటు కవిగాంచునన్నారు. ఆ కవి గురజాడ.సమాజం ఆనాడు అవినీతి క్రిములమయం. మానవత్వం మంటగలిసిపోయింది. బైరాగులు, పెత్తందార్ల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. దానికి తోడు పురుషాహంకారం ప్రజ్వరిల్లింది. కన్యాశుల్కం అన్న పేరుతో పసిపిల్లలను పశువుల కన్నా హీనంగా విక్రయించడం, కాటికి కాళ్ళు చాచుకుని ఉన్న ముసలివారికి ఇచ్చి వివాహం చేయడం, వితంతువుల దౌర్భాగ్యం, దొంగ జాతకాలు, సాక్ష్యాలు, గిరీశం లాటి గిర్రలు, రామప్పంతుల లాంటి జాకాల్స్, లుబ్ధావధానులు లాంటి లోభులు, అగ్నిహోత్రావధానుల్లాంటి మూర్ఖులు సమాజానికి పట్టిన చీడపీడలు. గురజాడ విద్యా ప్రాముఖ్యాన్ని తన రచనల ద్వారా నొక్కి చెప్పారు. విద్య నేర్వడం వలన మధురవాణి సానుల్లో సంసారిగా భాసించింది. ‘దిద్దుబాటు’ కథలో చదువుకున్న కమలిని తన భర్త గోపాలరావుని లేఖ ద్వారా మార్చుతుంది. ఆంగ్లేయులు వారి రాజ్యాన్ని సుస్థిరం చేసు కోవడం కోసం ఆంగ్ల భాషలో విద్యను ప్రవేశ పెట్టారు. స్త్రీల కోసం కోపగృహం, మైల గదులు ఉండేవి. ‘మైలగియిలా ఇంగ్లీషు వారికి లక్ష్యం లేదంటాడు’ గిరీశం. సాంఘిక చైతన్యం, సంఘ సంస్కరణ అవసరం అని గురజాడ ఆశించారు. ‘వెనుక చూసిన కార్యమేమోయి, మంచి గతమున కొంచె మేనోయి, మందగించక ముందుకడుగేయి వెనక బడితే వెనకే నోయీ’ అన్నారు. మతం ఏదైనా బాధ లేదు, మనుషులు ఒక్కటిగా ఉండాలని ఉప దేశించారు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలచును అంటారు గురజాడ. అలాగే సజీవ భాష, నాల్క మీద నర్తించే భాషలో నా కలం బలంగా పలుకుతుంది అన్నారు. ‘దేశ మును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచు మన్నా’ అన్న కవి. ఇంకా ‘గుడిలో రాతి దేవుని కంటే మనతో ఉన్న మనిషిని ప్రేమించాలి’ అన్నారు. ఈ రెండు వాక్యాల సారమే గురజాడ వారి రచనల సందేశం. – డా‘‘ జక్కు రామకృష్ణ ‘ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, విజయనగరం -
ఎన్నికల సంఘం ‘నో’ అనగలదా?
భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అంతకు రెండు నెలల ముందు 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగానికి ఆమోదం లభించింది. అయితే, పూర్తి రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకూ వేచి ఉండకుండా అదే రోజున అందులోని 324 నుంచి 329 వరకు ఉన్న అధికరణాలను అమల్లోకి తెచ్చారు. అవే భారత ఎన్నికల సంఘానికి ప్రాణం పోశాయి. ఈ అధికర ణాలను ముందే అమల్లోకి తేవడం వెనుక సాంకేతికపరమైన అంశా లేమీ లేవు. అది లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, దాని అధికార పరిధికి లోబడి ఒక ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడి తీరాలి. రాజ్యాంగ నిర్మాతలకు ఈ విషయం తెలుసు. అందుకే గణతంత్రం పుట్టకముందే భారత ఎన్నికల సంఘాన్ని మనుగడలోకి తెచ్చారు. ఫలితంగా, కార్య నిర్వాహక వ్యవస్థ ద్వారా కాకుండా, రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ నిర్ణేత (ఎన్నికల సంఘం) పర్యవేక్షణలో తొలి ప్రభుత్వం చట్టబద్ధత పొందుతుంది.ఎందుకు సర్వ స్వతంత్రం?అంతే ముఖ్యమైన మరో అంశం నాడు రాజ్యాంగ నిర్మాతల ముందు నిలిచింది. సమాఖ్య వ్యవస్థలో, ప్రతి రాష్ట్రం తన సొంత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించుకోవలసి ఉంటుంది. వాటికి ఆ అధికారం ఇవ్వడం సహజమే కదా అనిపిస్తుంది! చాలా సమాఖ్య దేశాల్లో అలా జరిగింది కూడా! అయితే, రాజ్యాంగ నిర్మాతలు ఆ నమూనాను తిరస్కరించారు.అందుకు కారణం ఉంది. రాష్ట్రాలు తమ ఎన్నికలను తిమ్మిని బమ్మిని చేయగలవని వారు భయపడ్డారు. పనుల కోసం, చదువుల కోసం, లేదా రాజకీయ కార్యకలాపాల కోసం వలస పోయే ‘వెలుపలి వారి’ని ఓటర్ల జాబితాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగిస్తాయనీ, తద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తాయనీ సందే హించారు. రాష్ట్రాలు నడిపే ఈ వ్యవస్థ ప్రాదేశికవాదానికి పని ముట్టుగా మారుతుందని రాజ్యాంగ సభలోని పలువురు సభ్యులు హెచ్చరించారు. కాబట్టి, ప్రతి భారతీయుడికీ తాను ఎక్కడ నివసించినా సరే సమానత్వం ప్రాతిపదికగా వివక్ష లేకుండా ఓటర్ల జాబితాలో స్థానం లభిస్తుందన్న గ్యారంటీ ఇచ్చేందుకు ఒక ఏకైక సర్వ స్వతంత్ర జాతీయ అధికారిక వ్యవస్థ అవసరమైంది.ఓటర్ల జాబితాలు; పార్లమెంటు, శాసనసభల ఎన్నికలు; అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల ఎన్నికలపై ఆర్టికల్ 324కింద భారత ఎన్నికల సంఘానికి ‘పర్యవేక్షణ, మార్గనిర్దేశం, నియంత్రణ’ అధికారాలు దఖలు పడ్డాయి. పౌరులందరికీ ఒకే విధమైన ఓటర్ల జాబితా, వివక్ష రహితమైన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉండేలా 325, 326 అధికరణాలు పూచీ పడుతున్నాయి. ఈ రాజ్యాంగ నిబంధనలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం రూపొందినవి కావు. గణతంత్ర పునాదులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా వీటిని పొందుపరచారు. సమగ్రత, సమన్యాయం, స్వతంత్రత అనే విలువల ప్రాతిపదికగానే ఎన్నికల వ్యవస్థ నిర్మాణం జరిగింది.కమిషన్ను బలపరిచిన తీర్పులుదేశ అత్యున్నత న్యాయస్థానం దశాబ్దాల తరబడిగా ఈ రాజ్యాంగ దృక్పథాన్ని విస్తరించి, పరిరక్షించింది. స్వచ్ఛమైన ఎన్ని కల నిర్వహణ కోసం ‘చట్టం ప్రవేశించని చోట’ స్వతంత్రించి చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘానికి లభించిన సంపూర్ణ అధికారంగా మొహిందర్ సింగ్ గిల్ (1978) కేసులో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఈ 324వ అధికరణాన్ని అభివర్ణించారు. కమిషన్ అధికారాలు న్యాయ చట్టాలకు పరిపూర్ణత కల్పించేవిగానే ఉంటా యనీ, అవి వాటిని పడగొట్టేవి కావనీ ఏసీ జోస్ (1984) కేసులో కోర్టు స్పష్టం చేసింది. దీని సారాంశం: ఎక్కడ చట్టం మౌనం వహి స్తోందో, అక్కడ కమిషన్ క్రియాశీలం అయితీరాలి. ఎక్కడ చట్టం మాట్లాడుతుందో, అక్కడ ఎన్నికల సంఘం ఆ మాటకు లోబడి నడచుకోవాలి.స్వేచ్ఛాయుత, న్యాయబద్ధ ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని టి.ఎన్. శేషన్ (1995) కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం ఏమాత్రం పడకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఓటరుకు ఉన్న తెలుసుకునే హక్కును, ‘నోటా’ను ఎంపిక చేసుకునే హక్కును బలోపేతం చేస్తూ ఏడీఆర్ (2002), పీయూసీఎల్ (2013) వంటి తర్వాతి తీర్పులు యావత్ ప్రక్రియలో పౌరుడిని కేంద్రబిందువు చేశాయి.తరచూ విస్మరించే ఒక చిన్న తేడా గురించి ఇక్కడ నొక్కి చెప్పాలి. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికల కోసం వీవీప్యాట్ పేపర్ ట్రయల్ అనేది ‘తప్పనిసరి అవసరం’గా సుబ్రమణియన్ స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (2013) కేసు విచారణలో సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే తక్షణం దేశవ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టాలంటూ ఉత్తర్వులు ఇవ్వ లేదు. దశల వారీగా చేపడతామంటూ చేసిన ప్రతిపాద నను అమోదిస్తూ ఈ దిశగా కమిషన్ తీసుకుంటున్న చొరవను ప్రశంసించింది. అందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది వ్యవస్థల నడుమ వెల్లివిరిసిన సరైన రాజ్యాంగ సమతు ల్యతను ప్రతిబింబించింది.విశ్వసనీయతను నిలబెట్టుకునేదెలా?ఎన్నికల సంఘానికి ఉన్న అధికారం రాజ్యాంగం ద్వారా సంక్ర మించింది. అయితే దాని విశ్వసనీయత మాత్రం అసాధారణమైన నిశిత సమీక్షకు లోనయ్యే సాధా రణ అధికారుల మీద ఆధారపడి ఉంది. వారు తీసుకునే లక్షలాది చర్యలతో కూడిన ఆచరణలో అది నిగ్గు తేలాల్సి ఉంటుంది.18వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ రాజ్యాంగ వ్యవస్థకు సరికొత్త ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఆడిట్స్, డాష్బోర్డులు అన్నీ కలిసి ఓట్ల నిరూపణీయతకు హామీ ఇస్తున్నాయి. అయితే నియమ నిబంధనల పరంగా స్వతంత్రత కలిగి ఉండటం కీలకం. నియామక ప్రక్రియలు, పదవీకాల భద్రతలు విశేష అధికారాలు కావు. అవి తటస్థ వ్యవహార శైలికి వ్యవస్థాగత అవసరాలు మాత్రమే. తను నియంత్రించే కార్యనిర్వాహక వ్యవస్థ మీదే న్యాయనిర్ణేత ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. పార్లమెంటు ఆమోదించే ఏ సంస్కరణ నమూనా అయినా సరే ఒకే ఒక్క పరీక్షకు నిలబడి తీరాలి. రాజకీయ అధికారానికి ఎన్నికల కమిషన్ ‘నో’ చెప్పగలదని సగటు ఓటరు నమ్ముతున్నాడా అనే ప్రశ్నే ఆ పరీక్ష.సమ్మిళితం అనేది ఇప్పటికీ నెరవేరని వ్యవహారం. వలస కార్మి కులు, వికలాంగులు, తొలిసారి ఓటర్లు, మహిళలు, పోలింగ్ కేంద్రా లకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వయోవృద్ధులు హర్షించే దిగా ఎన్నికల ప్రక్రియ ఉండాలి. విషాదం ఏమిటంటే, ఖైదీలు పోటీ చేయొచ్చు కాని వారు ఓటేయలేరు. వారికి ఆ అవకాశం కూడా ఉండాలి. ప్రజాస్వామ్య సక్రమత గెలిచినవారి మీదే కాదు, ఎవర్ని అనుమతిస్తున్నామనే దానిమీద ఆధారపడి ఉంటుంది.గణతంత్ర ఆవిర్భావానికి ముందే రాజ్యాంగపు 15వ ప్రకర ణాన్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థాపకులు ఎందుకు అమలులోకి తెచ్చారనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. భారత ప్రజలు తొట్టతొలిసారి ఓటేసేప్పుడు... ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు తాను సహాయపడుతుందో ఆ ప్రభుత్వంపై ఆధార పడకుండా స్వతంత్రంగా ఉండే వ్యవస్థ పర్యవేక్షణలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ధ్యేయంతో వారా చర్య తీసు కున్నారు. న్యాయనిర్ణేత నమ్మదగిన వాడైతేనే ఆ ప్రజాస్వామ్యం సఫలీకృతం అవుతుంది. ఎన్నికల కమిషన్ దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి తీరాలి.ఎస్.వై ఖురేషి: వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ) రాయని డైరీ
రాష్ట్రపతి భవన్ డిన్నర్ హాలులో నేనొక్కడినే ఉన్నాను! హాలు నిండా మనుషులు ఉన్నా, ఒక్కడినే ఉన్నట్లుగా నాకు అనిపిస్తోందంటేనా పక్కన ఉండవలసిన వారు లేరని! మోదీజీ, పుతిన్లతో కలిసి డిన్నర్కు కూర్చోవటం గొప్ప ఆతిథ్యమే కానీ, గొప్ప అనుభూతైతే కాదు. నా పక్కన రాహుల్జీ ఉండాలి. ఖర్గేజీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఒక కాంగ్రెస్వాదిగా నా కడుపు నిండినట్లు! సరళమైన ఒక త్రేన్పు బయటికి వచ్చినట్లు!భోజనం రుచి మన ప్లేటులో వడ్డించి ఉన్న సౌతిండియన్ థాలీ వల్ల రాదు. మనతో కలిసి భోంచేస్తున్న వారి వల్ల వస్తుంది. రాహుల్జీని, ఖర్గేజీని కూడా మోదీజీ డిన్నర్కి ఆహ్వానించి ఉండవలసిందా? ఆహ్వానాలు పంపటానికి కొలబద్దలు, కొలమానాలు ఏవో ఉంటాయి. కానీ, కొన్నిసార్లు కొలతల్ని పక్కన పెట్టడమే సరిగా తూచటం అవుతుంది.ఏమైనా... మోదీ నుంచి ఆహ్వానం రావటం, రాకపోవటం రెండూ గౌరవాలే. ఆయనను అంగీకరించటం అసాధ్యం. ఆయనను విస్మరించడం దుస్సాధ్యం! మహాభారతం అంటుంది – ఇక్కడున్నది ఎక్కడా లేదు, ఇక్కడ లేనిదీ ఎక్కడా లేదని! భగవద్గీత నిష్కామ కర్మ గురించి చెబుతుంది. రెండూ నేను అనుసరించి, ఆచరించేవే.మోదీ వంటి నాయకులు ఇక్కడ తప్ప ఎక్కడా లేరు. ఇక్కడ లేకుంటే ఎక్కడా ఉండరు. మోదీజీ నిష్కామ కర్మయోగిలా కనిపిస్తారు నాకు! మహా భారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీత ఒక భాగం అయినట్లే... భారతదేశ రాజకీయ పర్వంలో మోదీజీ ఒక భాగం అని నాకు తరచూ అనిపిస్తుంటుంది.పుతిన్కు మోదీజీ భగవద్గీతను కానుకగా ఇవ్వటం కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణను బోధించినట్లే ఉంది. డిన్నర్ అయ్యాక రాష్ట్రపతి భవన్ నుంచి లోధీ ఎస్టేట్లో ఉన్న నా నివాసానికి వస్తున్నాను. నేను చేసింది తగిన పనా, తగని పనా అని నేనెప్పుడూ ఆలోచించను. జీవితంలో తగనివి అంటూ ఏవీ ఉండవు. తగని స్థలాలు, తగని సమయాలు అనేవీ ఉండవు.ఏ సమయంలో మనం ఎక్కడ ఉంటామన్నది బహశా, మనం అక్కడ ఉండాల్సిన సమయం, స్థలం అయి ఉండాలి! పార్టీలో అంతా నాపై అసహనంగా ఉన్నట్లున్నారు. ‘పార్టీని మాటైనా అడగకుండా, పిలిస్తే వెళ్లి భోజనాల వరుసలో కూర్చోవటమేనా’ అని పవన్ ఖేరా! ‘డిన్నర్కి మన నాయకులను పిలవకుండా మనల్ని పిలుస్తున్నారంటేనే లోపల ఏం ఉడుకుతోందో మనం అర్థం చేసుకోవాలి కదా’ అని జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్!‘‘కనీసం మనస్సాక్షి ఉండాలి’’ అంటున్నారంతా! ఉండాల్సిందే. కానీ, మనస్సాక్షి అవసరమైన స్థితిని మోదీజీ నాకు కల్పించలేదు. ఫారిన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మాత్రమే నాకు ఆయన డిన్నర్ ఇన్విటేషన్ పంపించారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ఖర్గే మీద నేను పోటీ చేసినప్పుడు కూడా పార్టీ సీనియర్ లీడర్లు ఇలాగే అన్నారు: ‘‘ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని. ఆత్మ విమర్శ చేసుకుంటే ఏమవుతుంది? ‘‘ఖర్గే మీద నువ్వు పోటీ చేయటం కరెక్టే’’అంటుంది.‘‘సార్, వచ్చేశాం’’ అన్నాడు డ్రైవర్! రాష్ట్రపతి భవన్ నుంచి లోధీ రోడ్కు పది నిమిషాల ప్రయాణం. కారు దిగి, ఇంట్లోకి నడుస్తుంటే మొబైల్లో – మీడియాతో మాట్లాడుతున్న పవన్ ఖేరా! ఎవరో ఫార్వార్డ్ చేసిన క్లిప్. ‘‘ఆహ్వానాన్ని పంపినవారూ, ఆహ్వానాన్ని కాదనలేనివారూ అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఆ ప్రశ్నలకు వారే జవాబు చెప్పాలి’’ అంటున్నారు ఖేరా. వీడియోను ఆఫ్ చేశాను. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పనవసరం లేదు. జవాబు మనసులో ఉంటే చాలు. -
పెనుముప్పు పట్టని పెద్ద దేశాలు
వాతావరణ మార్పుపై భారత్ తరఫున (2007–10) ప్రధాన సంప్రదింపులకర్తగా వ్యవహరించిన నాకు దానికి సంబంధించిన పరిణామాలను గమనిస్తూంటే, నిస్పృహ పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. మానవాళి అస్తిత్వానికే ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పును నిరోధించే లక్ష్యాలు నీరుగారుతున్నాయే తప్ప బలపడటం లేదు. బ్రెజిల్లోని బెలేమ్లో ఇటీవల ముగిసిన ‘కాప్–30’ని సరిగ్గా మదింపు చేయాలంటే, వాతావరణ మార్పు చరిత్ర పాఠాలను ఒక క్రమానుగతిలో ఆకళింపు చేసుకోవాలి.గట్టి వాగ్దానాలు వట్టి మాటలై..వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆధ్వర్యంలో మొదటి చారిత్రక సమావేశం బ్రెజిల్లోనే రియో డి జనేరోలో 1992లో జరిగింది. వాతావరణ మార్పును నిరోధించడంలో అందరూ కలసికట్టుగా వ్యవహరించాలనే సంకల్పాన్ని అది వ్యక్తపరచింది. రియో సదస్సులో పాల్గొన్నవారిలో నేనూ ఒకడిని. తర్వాత, కొద్ది ఏళ్ళలోనే అభివృద్ధి చెందిన దేశాల అసలు రంగు బయటపడింది. అమెరికా నేతృత్వంలో అవి ఐరాస దీక్షను భగ్నం చేస్తూ వచ్చాయి.చట్టబద్ధంగా కట్టుబడి ఉండవలసిన ఒప్పందం కాస్తా, స్వచ్ఛంద ‘ప్రతిజ్ఞ–సమీక్ష’ తంతుగా మారిపోయింది. ఐరాస స్థూల నియమావళికి అనుగుణంగా 1997లో తీర్మానించుకున్న క్యోటో ప్రోటోకాల్ను ఏకపక్షంగా మూలన పడేశాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం 37 పారిశ్రామిక దేశాలు తమ గ్రీన్హౌస్ వాయువులను నిక్కచ్చిగా తగ్గించుకోవాలి. అవి మాట నిలబెట్టుకుని ఉంటే, మొత్తం ఉద్గారాలలో సగటున 5.2 శాతం తగ్గుదల సాధ్యమయ్యేది. అవి తాము పెట్టుకున్న లక్ష్యాలను మొదటి నిబద్ధతా పరిధి (2008–13)లో సాధించి ఉండవలసింది. ఉద్గారాలను మరింతగా తగ్గించుకోవడంపై చర్చించుకుని, కొత్త లక్ష్యాల సాధనకు రెండవ నిబద్ధతా పరిధి (2014–19)లో ప్రయత్నించి ఉండవలసింది.ఈ పదేళ్ళ వ్యవధిలో ఉద్గారాలను తగ్గించుకునేందుకు అంగీక రించవలసిన అవసరం లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఆ గ్రేస్ పీరియడ్ ముగిసేనాటికి, భారాన్ని సమంగా పంచుకోవాలనే సూత్రాన్ని అనుసరించి, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు రెండూ తమ ఉద్గారాలను తగ్గించుకుంటామని మాట ఇచ్చి ఉండేవి. ఇచ్చిన మాటకు తప్పని సరిగా కట్టుబడి ఉండేలా క్యోటో ప్రోటోకాల్ను రూపొందించారు. మొదటి నిబద్ధతా కాల పరిధి పూర్తయ్యే సమయానికి ఏ దేశమైనా ఉద్గారాల తగ్గింపు లక్ష్య సాధనలో వెలితిని కనబరిస్తే, ఆ వెలితిని రెండవ నిబద్ధతా కాల పరిధిలో భర్తీ చేయాలి. అంతేకాక, జరిమానా కింద, రెండవ పరిధికి నిర్ణయించిన లక్ష్యానికి, మరో 30 శాతం అదనపు తగ్గింపును జోడించవలసి ఉంటుంది. కానీ ప్రోటోకాల్పై సంతకం చేసిన అమెరికా దానికి అధికారికంగా ఆమోదం తెలుప లేదు. కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి పలు పారిశ్రామిక దేశాలు ఆ ఒడంబడికను ఏకపక్షంగా ఉల్లంఘించాయి. ఈ ఉల్లంఘనకు వాటిని జవాబుదారీ ఎందుకు చేయకూడదు?అటు అమెరికా... ఇటు చైనాకోపెన్ హ్యాగన్లో 2009లో ఒక శిఖరాగ్ర సభ జరిగింది. ఐరాస సదస్సు సూత్రాలను గాలికొదిలేయకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రయత్నించిన బహుశా చివరి సందర్భంగా దాన్ని చెప్పు కోవచ్చు. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా (‘బేసిక్’ గ్రూప్) సడలుతున్న నియమాలను కట్టుదిట్టం చేసేందుకు తమవంతు కృషి చేశాయి. కానీ, అవేవీ ఫలించలేదు. నియమాలను విప రీతంగా పలుచన చేసిన ప్యారిస్ ఒప్పందాన్ని 2015లో ఆమోదించారు. అంతకుముందు ‘బేసిక్ గ్రూప్’లో ఉన్న చైనా, దాన్నుంచి బయటకొచ్చి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ మాత్రం ప్యారిస్ ఒప్పందమైనా రూపుదాల్చింది. కానీ, అమెరికా, చైనా అంతర్జాతీయ క్షేమాన్ని పక్కన పెట్టి తమ సంకుచిత ప్రయోజ నాలను కాపాడుకున్నాయని వేరే చెప్పనవసరం లేదు.అమెరికాతో పోల్చదగిన స్థాయిలో ఉద్గారాలను పెంచుకుంటూ పోయేందుకు చైనాను వదిలేశారు. ‘నియమాలు అందరూ ఉమ్మ డిగా పాటించవలసినవే అయినా బాధ్యతలు, సంబంధిత సామర్థ్యా లను బట్టి వాటిలో తేడాలుంటాయి (సీబీడీఆర్)’ అని ఐరాస ఒప్పందంలో ఒక కీలక సూత్రం ఉంది. ‘దేశ స్థితిగతులకు అనుగుణంగా’ అనే పదాలను జోడించడం ద్వారా చైనా ఆ సూత్రానికి కొత్త భాష్యం చెప్పింది. ఐరాస ఒడంబడికను గడ్డి పరకగా మార్చడంలో, చైనాను తోడుదొంగ చేసుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు సఫల మయ్యాయి. మరోవైపు అమెరికా రెండుసార్లు ప్యారిస్ ఒప్పందం నుంచి బయట కొచ్చింది. వాతావరణ మార్పును ఒక బూటకంగా అది కొట్టిపారేస్తోంది.ఎవరి ప్రయోజనాలు వారివే!ఈమధ్యనే బెలేమ్లో ముగిసిన కాప్–30ని ‘సత్యం, అమ లు’కు పెద్దపీట వేసినదిగా అభివర్ణిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే, ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న నామమాత్రపు లక్ష్యాలను సాధించ లేదు. వాటి అమలుకు కనీసం ఇప్పుడైనా రంగాన్ని సిద్ధం చేసు కోలేదు. గత ఏడాది (2024) అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు అయింది. పారిశ్రామిక విప్లవం ముందటి స్థాయిలకన్నా 1.55 సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే విడత ప్రపంచ వ్యాప్త సమీక్షకు తాజాగా నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమైన ప్పటికీ, ఈ శతాబ్దాంతానికి ఉష్ణోగ్రతలలో 2.5–3 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరుగుదల కనిపించే దిశగా సాగుతున్నాం.ఉష్ణోగ్రతల్లో 1.5 సెంటిగ్రేడ్ పెరుగుదల కనిపించినా అది ప్రపంచ జీవావరణానికి వినాశకర పర్యవసానాలు సృష్టిస్తుందనీ, ఇక మార్చడానికి వీలులేని గతి ఏర్పడుతుందనీ ఐరాస ప్రత్యేక నివేదిక ఇప్పటికే హెచ్చరించింది. (మనం ఇప్పటికే ఆ ప్రమాద హెచ్చరికను మించి ఉన్నాం. 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ, ప్రపంచవ్యాప్త అమలును వేగవంతం చేస్తామని కాప్–30 వాగ్దానం చేసింది. కానీ, ఎలా? ఎవరికి వారే యమునా తీరే రీతిలో ఉన్న ప్రపంచంలో వాతావరణ మార్పు సమస్యకు ప్రాధాన్యం లభిస్తుందనుకోవడం ఒక భ్రమ.శ్యామ్ శరణ్: వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జెన్-జీ అగ్నిపర్వతం: ఉద్యమానంతర అయోమయం
నేపాల్ను అల్లకల్లోలపరచి, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసిన జెన్–జీ అగ్నిపర్వతం ఇప్పటికీ నిప్పులు చిమ్ము తూనే ఉంది. సెప్టెంబర్ తిరుగుబాటుతో పాత ప్రభుత్వం కూలిపోగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్నీ, మార్చిలో జరగ నున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవు తున్న రాజకీయ పార్టీలు అన్నింటినీ భయపెడుతూనే ఉంది. మావోయిస్టు పార్టీలు మొదలుకొని రాచరికపు అనుకూల మిత వాద పార్టీల వరకు అన్నీ సిద్ధాంతాల మార్పిడి, నాయకత్వాల మార్పిడి, చీలికలు, పునరేకీకరణల మార్గంలో సతమతమవు తున్నాయి. అది ‘ఉద్యమం’ కాదు!జెన్–జీ తిరుగుబాటుకూ, ఎన్నికల తేదీ అయిన మార్చి 5కీ మధ్యకాలపు పరిస్థితి ఇది. నవంబర్ చివరలో సుమారు పన్నెండు రోజులపాటు నేపాల్లో గడిపి జెన్–జీ ఉద్యమకారులు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో పాటు, సామాన్య ప్రజలతో కలిసి మాట్లాడిన మీదట నాకు కనిపించిన పరిస్థితి ఇది. వాస్తవానికి జెన్–జీ యువతరం బయటి ప్రపంచం అనుకుంటున్నట్లు, సాంప్ర దాయికమైన అర్థంలో ఉద్యమమేమీ సాగించలేదు. అక్కడ రాజవంశాల ఫ్యూడల్ పాలన, పేదరికం, ప్రజాస్వామ్య రాహిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి.ఫలితంగా ఏర్పడిన ఒక మోస్తరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగానీ, వాటి వైఫ ల్యంతో సాయుధ పోరాటం సాగించి అధికారానికి వచ్చిన మావో యిస్టులు, ఇతర కమ్యూనిస్టులు గానీ దేశ సమస్యలను పరిష్కరించ లేకపోయారు. అది చాలదన్నట్లు స్వయంగా అవినీతి, అసమర్థ పాలన, నత్తనడక అభివృద్ధితో యువతరంతో పాటు మొత్తం సమాజం తీవ్ర అసంతృప్తికి గురవుతూ వచ్చింది. మావోయిస్టు పోరాటం వల్ల రాచరిక వ్యవస్థ అన్నదే ఇక లేకుండా 2008లో రద్దయి ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవతరించిన తర్వాత యువతరం, సమాజం కొత్త ప్రభుత్వాల నుంచి చాలా ఆశించాయి. ముఖ్యంగా వేర్వేరు కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి బలమే సగా నికి పైగా ఉండిన స్థితిలో! అయినప్పటికీ, ప్రజలు ఎంతగానో ఆశించిన ఈ చివరి రాజకీయ శక్తులు మూడింట రెండు వంతుల కాలం పాలించి కూడా నిరాశ పరచటం ఎండుగడ్డిపై నిప్పురవ్వ అయింది.రాచరిక వ్యవస్థల కాలం నుంచి క్రమక్రమంగా అగ్నిపర్వతం వలె మారుతూ వచ్చిన సమాజం, కమ్యూనిస్టుల పాలనా కాలంలో మరింత లావాను కూర్చుకుని మరుగుతూ పోయింది. ఇక ఆ అగ్ని పర్వతం పేలి లావాను ఎగజిమ్మడానికి కావలసింది ఏదో ఉద్యమం కాదు. ఆ లావా కదలికలు అకస్మాత్తుగా ఒక స్థాయికి చేరటం మాత్రమే. సెప్టెంబర్లో సోషల్ మీడియా నిషేధంతో జరిగింది సరిగా అదే. చదువులు, నైపుణ్యాలు ఉన్నా స్థానికంగా తీవ్ర నిరు ద్యోగ సమస్యను ఎదుర్కొంటూ రోజుకు రెండు వేల మంది వరకు ఉద్యోగాన్వేషణలో విదేశాలకు వెళుతున్న యువకులు అక్కడినుంచి తమ కుటుంబాలకు డబ్బు పంపేందుకు, స్థానికంగా కూడా సెల్ ఫోన్ ఆధారంగా వివిధ వృత్తులు చేసుకుంటున్నవారిలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.మౌలికమైన మార్పు కోసం...అయితే ఇదంతా సాంప్రదాయికమైన దృష్టి. నేపాల్లో జెన్–జీ ప్రస్తుత స్థితిని, దాని పాత్రను సంప్రదాయానికి భిన్నమైన రీతిలో అర్థం చేసుకోవటం అవసరం. యథాతథంగా జెన్–జీ అనే మాట 18–30 సంవత్సరాల వయసు వారికి వర్తించేది. కానీ వారి అసంతృప్తి మొత్తం సమాజానిది. ఇతర చోట్ల సాధారణంగా జరిగే యువ తరం ఉద్యమాలకు ఇది భిన్నమైన స్థితి. అదే విధంగా, నేపాల్ జెన్ –జీ డిమాండ్లు తమ నిరుద్యోగానికే పరిమితమై లేవు. తమ కుటుంబాలు, సమాజం, దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి మధ్య పరస్పర సంబంధం ఉందనే గుర్తింపు వారిలో ఉంది. వామపక్షాలు సైతం భిన్నం కాకపోవటం వారిని మరింత నిరాశకు గురి చేస్తున్నది. ఈ అవాంఛనీయ లక్షణాలు లేని పార్టీలు, ప్రభుత్వాలు, పరిపాలన, కొత్త వ్యవస్థ కావాలన్నది జెన్–జీ లక్ష్యం. మరొక విధంగా చెప్పా లంటే, వారు మౌలికంగా కోరుతున్నది వ్యవస్థాగతమైన మార్పు!ఉద్యమానంతర అయోమయంఅదే సమయంలో జెన్–జీకి సంబంధించి కొన్ని అయోమయాలు, ప్రశ్నార్థకాలు కూడా ఉన్నాయి. వారి నిరసనలు కేవలం రెండు రోజులలోనే ఉద్భవించటం, పరాకాష్ఠకు చేరటం కూడా కాకుండా కనీసం కొద్దికాలం పాటు సాగి ఉండినా పరస్పర ఏకీభా వాలతో రెండు మూడు ఐక్య వేదికలు ఏర్పడి ఉండేవి. అట్లా సాగనందువల్ల ఆ తక్షణ ఉధృతిలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ లెక్కలేనన్ని జెన్–జీ బృందాలు ఉనికిలోకి వచ్చాయి. రకరకాల భావజాలాలు గలవి, ఏ భావజాలం లేనివి, వేర్వేరు పెద్దాచిన్నా పార్టీలకు అనుకూ లమైనవి, దేనికీ కానివి, ప్రాంతీయమైనవి, మతాలు, కులాలు, వ్యక్తుల పరంగా ఏర్పడినవి, సమష్టి ప్రయోజనాలవి, వ్యక్తిగతంగా ఆలోచించేవి – ఇట్లా పలు విధానలైనవి తేలికగా వందకు పైగాఉంటాయి. ఇపుడు ఎన్నికలు సమీపిస్తుండగా కొన్ని బృందాలు వేర్వేరు పార్టీలతో చేరుతున్నాయి. తిరిగి రాచరికాన్ని కోరే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలతోనే 34 బృందాలు ఉన్నాయంటే పరిస్థితిని ఊహించవచ్చు. కొన్ని బృందాలు ఒకటై మూడు కొత్త పార్టీలు కూడా స్థాపించాయి. ఎన్నికల నాటికి ఇంకా ఏమి జరిగేదీ చెప్పలేని స్థితి.మరొకవైపు ‘జెన్–జీ వాతావరణం’ అనదగ్గది ఒకటి స్పష్టంగా ఏర్పడి ఉంది. సుశీలా కర్కీ ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం నుంచి, ఆ యా పార్టీల వరకు ఎక్కడ ఏ తప్పు చేస్తు న్నట్లు కనిపించినా జెన్–జీ గ్రూపులు వెంటనే విరుచుకుపడు తున్నాయి. ఈ బృందాలు విశాల వేదికగా, ఒకే కొత్త పార్టీగా ఏర్పడి ఉంటే ఎన్నికలలో గెలిచితీరేవన్నది విస్తృతంగా గల అభిప్రాయం. అటువంటి పార్టీ ఏర్పడలేదు. ఈ బృందాలు కొత్త ఓటర్లనైతే లక్షల సంఖ్యలో చేర్పించాయి. ప్రస్తుత పార్టీలన్నీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో, జెన్–జీ ఐక్య రాజకీయ వేదిక ఏర్పడక పోవటం ప్రజలకు విచారకరంగా తోస్తున్నది. అంతిమంగా కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినా, ‘జెన్–జీ వాతా వరణం’ కొనసాగి ఆ ప్రభుత్వంపై నిఘా వేసి అదుపు చేయగలదనే ఆశాభావం అయితే వారిలో కనిపిస్తున్నది.టంకశాల అశోక్: వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అస్థిర ప్రపంచంలో సుస్థిర బంధం
ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ రాక ఒక పాత సంగతిని గుర్తుకు తెస్తోంది. దాదాపు ఐదు న్నర దశాబ్దాల క్రితం భారతదేశంతో ‘స్నేహ ఒడంబడిక’ కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో చేతులు కలిపేందుకు అప్పటి సోవియట్ యూనియన్ నాయకులు ఇలాగే ఢిల్లీ వచ్చారు. తూర్పు పాకిస్తాన్లో మారణ హోమాన్ని అంత మొందించే ప్రత్యక్ష ప్రమేయానికి ముందు అది జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచం రెండు అగ్ర రాజ్యాల మధ్యన చీలిపోయింది. కానీ, ఇపుడు అంతర్జాతీయ వ్యవస్థ ఏ దిశగా సాగుతోందో తెలియని ఒక కొత్త స్థితిలోకి జారు కుంది. అమెరికా శక్తిమంతమైనదిగానే కొనసాగుతోంది కానీ, దాన్ని అంతగా నమ్మడానికి లేదనే అభిప్రాయం పాదుకుంది. చైనా శిఖరా రోహణ ఇతర ప్రవర్ధమాన దేశాలలో ఆందోళనను పెంచుతోంది. ఐరోపా మరింత స్వయం ప్రతిపత్తిని చాటుకునేందుకు తారట్లాడు తోంది. గాలివాటుగా ఉన్న భారత–రష్యాలు అవసరార్థమే అయిన ప్పటికీ, వ్యూహాత్మక పొందికను పునరుద్ధరించుకుంటున్నాయి. ఒకరికొకరు నిలబడి...అమెరికా నిలకడలేనితనంతో దానిపై చాలా దేశాలకు నమ్మకం కొరవడింది. దానికి తోడు అది ఎక్కడెక్కడో సుదీర్ఘ కాలం యుద్ధా లను కొనసాగించి, చివరకు అక్కడ పరిస్థితులు కుదుటపడక పోయినా నిష్క్రమిస్తూ వచ్చింది. అమెరికా లోపల కూడా పరి స్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. తాజాగా, సుంకాల విష యంలో అది అనుసరిస్తున్న తలతిక్క ధోరణి అందుకు ఉదాహరణ. ఇదంతా ప్రపంచంలో ఒక అస్థిర వాతావర ణానికి దారితీసింది. చైనా తన వంతు ఆకర్షణలను, భయాలను రెండింటినీ సృష్టించు కుంది. క్రమేపీ అది దృఢ వైఖరిని చాటడం పెరగడంతో, దాని ప్రత్య ర్థులు, మిత్రులు కూడా దానిపై చిరకాల అభిప్రాయాలను పునరా లోచించుకోవడం ప్రారంభించాయి. ఉక్రెయిన్పై యుద్ధం మొదలెట్టిన తర్వాత, చైనాతో రష్యా వ్యూహాత్మక ఏకీకరణ బలపడిందికానీ, సంబంధాలు అసమంగానే ఉన్నాయి. మాస్కో వ్యూహాత్మక ఆలోచనల ప్రకారం, దీర్ఘకాలంలో తనకు బెడదగా పరిణమించగల శక్తి అమెరికా కన్నా చైనాకే ఉంది. మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని కనబరచేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు, సైబీరియాకు సంబంధించి రష్యా పడుతున్న ఆందోళన, చైనాకు తాను జూనియర్ భాగస్వామిగా మారవలసి వస్తుందే మోననే భయం క్రెమ్లిన్ను మరోసారి భారతదేశానికి సన్నిహితం చేస్తున్నాయి. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుందని కాదు. చైనాపై తాను ఎక్కువ ఆధారపడకుండా భారత్ తనకొక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని రష్యా ఆలోచన. స్నేహమే కాదు, వ్యూహాత్మకం కూడా!సోవియట్ యూనియన్ చీలికలు పీలికలైన తర్వాత కూడా భారత్తో రష్యా స్నేహ సంబంధాలు నిలదొక్కుకుంటూ వచ్చాయి. కశ్మీర్పై భారత్ ఇరకాటంలో పడకుండా ఐరాసలో రష్యా తన వీటో గొడుగు పడుతోంది. దానికి తగ్గట్లుగానే, ఉక్రెయిన్పై యుద్ధం పర్యవసానంగా రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలు పదేపదే కోరినా భారత్ తలొగ్గలేదు. ఈ విషయమై అమెరికా విధిస్తానన్న సుంకాల బెదిరింపును కూడా భారత్ ఖాతరు చేయలేదు. దీనికి రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకంతో కూడిన స్నేహ సంబంధం ఒక్కటే కారణం కాదు. ఈ బంధాన్ని నిలబెట్టుకునేందుకు రెండు దేశాలకు తమవైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి.దానికి తోడు, కొన్నేళ్ళుగా ఎన్నడూ చూడనంత అస్థిర పరిస్థి తులు ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ ఒక్క దేశమూ పరిస్థితులను శాసించగలిగిన స్థితిలో లేదు. అగ్ర రాజ్యంగా నిలవాలని కలలు కంటున్న దేశపు అడుగులకు మడుగు లొత్తడానికి ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో చాలా మధ్య స్థాయి దేశాలు సిద్ధంగా లేవు. తమ వ్యూహాత్మక స్వయం ప్రతి పత్తిని కాపాడుకోవాలని గాఢంగా కోరుకుంటున్న భారత – రష్యాలకు ఆ సెంటిమెంట్లో ఒక ఉమ్మడి ప్రయోజనం కనిపిస్తోంది. పరస్పర రక్షణభారత్–రష్యాల మధ్య స్నేహ సంబంధాలకు రక్షణ అంశమే ఇప్పటికీ వెన్నెముకగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో పరస్పర సహ కారానికి సంబంధించిన ఒప్పందం కుదరబోతోంది. అది కార్య రూపం ధరిస్తే ఇరు దేశాలు సైనిక స్థావరాలను, రేవులను, వైమానిక క్షేత్రాలను పరస్పరం వినియోగించుకోవచ్చు. దీంతో ఇండో–పసిఫిక్ నుంచి ఆర్కిటిక్ వరకు కార్యకలాపాలు నిర్వహించగలిగినదిగా భారత్ తయారవుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రష్యా భౌతికంగా కాలు మోపేందుకు వీలు చిక్కుతుంది. ప్రపంచంలో సగం వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ ప్రాంతమే జీవనాడి. భారత–రష్యా అధికారులు అత్యంత ఆశావహమైన సైనిక– సాంకేతిక ప్యాకేజీకి రూపుదిద్దుతున్నారు. దీనివల్ల ఎస్–400 గగన రక్షణ వ్యవస్థలను మరిన్ని చోట్ల ఏర్పాట్లు చేయవచ్చు. సు–30 ఎంకెఐ యుద్ధ విమానాలను భారత్ చాలా ఎక్కువగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మరింత దూరం వెళ్ళగలిగినవిగా బ్రహ్మోస్ క్షిపణు లను ఉన్నతీకరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. సు–57ఇ స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సంబంధించి తాత్కాలిక చర్చలైనా మొదలయ్యేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఇక భారత్–రష్యా స్నేహంలో అణు సహకారం మరో అంశం. బృహత్తర వీవీఈఆర్–1200 రియాక్టర్ల నిర్మాణ ప్రణాళికలతో రోసాటమ్, భారత అణు శక్తి సంస్థలు ముందుకు ఉరకాలని చూస్తున్నాయి. అలాగే, కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ల అన్వేషణ రెండు దేశాల మధ్య సంబంధాలను గుణాత్మకంగా మార్చివేయవచ్చు. వీటి అంత ర్జాతీయ సరఫరాలో చైనాదే పైచేయిగా ఉంది. ఖనిజాలు సుసంపన్నంగా ఉన్న రష్యా తూర్పు దూర ప్రాంతాలలో సంయుక్త రంగంలో పనులు సాగించాలని భారత్ ఎదురు చూస్తోంది. భారత వైజ్ఞానిక సంస్థలు, రష్యా పరిశోధన కేంద్రాల మధ్య భాగస్వామ్యాలు ఏర్పడితే దేశీయంగా రేర్–ఎర్త్ ప్రాసెసింగ్కు, పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీకి రంగం సిద్ధమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యున్నత ఎలక్ట్రానిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల వాల్యూ చైన్ను నియంత్రించగల పరిశ్రమలు రెండు దేశాలకు సొంతమవుతాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం సుమారు 65–66 బిలియన్ డాలర్లుంది. 2030 నాటికి దీన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చే లక్ష్యంతో ఉన్నాయి. ఈ శిఖరాగ్ర సదస్సులో వ్యక్తమయ్యేది కేవలం పొత్తు కాదు. స్నేహ సంబంధాలు ఏవీ దెబ్బతిని లేవు కనుక ఇండో–సోవియట్ మైత్రి పునరుద్ధరణ అనడానికి కూడా లేదు. ఇది మరింత ఆచితూచి వేస్తున్న అడుగు కాబోతోంది. మరింత ఆచరణాత్మక దృక్పథం కన పడబోతోంది. అధికార కేంద్రాలు మసకబారి, సమీకరణాలు అను క్షణం మారిపోతున్న వర్తమాన ప్రపంచంలో అంతకన్నా ఇంకేం కావాలి!జయంత రాయ్ చౌధురీవ్యాసకర్త పీటీఐ వార్తా సంస్థ తూర్పు ప్రాంత మాజీ అధిపతి -
‘ప్రత్యేక’ విద్య అందించాలి!
వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక. మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్బర్గ్లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది. భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి. ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి. మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి. – జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) -
సింగపూర్ చూపుతున్న మార్గం
ఢిల్లీలో ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఉగ్ర దాడి, భారత్ ఎదుర్కొంటున్న ఆంతరంగిక భద్రతా సవాళ్ళపైకి మరోసారి దృష్టిని మరల్చింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలో హైకోర్టు వద్ద 2011లో జరిగిన బాంబు పేలుడు తర్వాత, అంతటి భీతావహమైన దాడి చోటుచేసుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. ముంబయిలో 2008 నవంబర్ 26న భారత్ పెద్ద ఉగ్ర దాడిని చవిచూసింది. ఆ దాడిలో పాల్గొన్నవారిలో ఒకడైన కసబ్కు పాకిస్తాన్తో ఉన్న సంబంధం స్పష్టంగా వెల్లడైంది. వైట్ కాలర్ ఉగ్రవాదంఅయితే, ఢిల్లీ ఘటన ఇస్లామీయ ర్యాడికలైజేషన్లో వచ్చిన పెద్ద మార్పునకు అద్దం పడుతోందని చెబుతున్నారు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పాకింది. వృత్తి నిపుణులు (ఈ కేసులో డాక్టర్లు) తమకు తాము ఉగ్రవాదులుగా మారుతున్నారు. వారు డిజిటల్ సాధనాలను, సంస్థాపరమైన సౌలభ్యాన్ని వినియో గించుకుంటున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తదనంతర దర్యాప్తులో అనేక సంగతులు వెల్లడయ్యాయి. ఊహకందని ఉగ్ర సాలెగూడు జమ్ము–కశ్మీర్, హరియాణా, ఉత్తర ప్రదేశ్లను మించి విస్తరించినట్లు తేలింది. ఒక వైట్–కాలర్ ఉగ్ర వ్యవస్థ బయటపడింది. దానికి పాకిస్తాన్లోని జైష్–ఏ–మహమ్మద్ (జెమ్), అన్సార్ గజవత్ ఉల్– హింద్తో సంబంధాలున్నాయి. వారు అనుసరించిన ఎత్తుగడలు హమాస్ నుంచి స్ఫూర్తి పొందినవిగా కనిపిస్తున్నాయని కూడా ప్రాథ మిక నివేదికలు సూచించాయి. విదేశీ సూత్రధారుల (ఉదాహరణకు తుర్కియేలోని ‘ఉకాస’) ఆదేశాలను పాటించినట్లు కూడా వెల్లడవు తోంది. దానికి వారు సెషన్, టెలిగ్రామ్ వంటి యాప్లను వాడు కున్నారు. సోదాలలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, డిటొ నేటర్లు, అసాల్ట్ రైఫిళ్ళు, (42 వీడియోలతో సహా) ప్రాపగాండా సామగ్రి దొరికాయి. ‘జెమ్’ వంటి ఉగ్ర తండాలు, వాటి అనుబంధ వర్గాలు స్లీపర్ సెల్స్ సృష్టించేందుకు, విద్యావంతులైన యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అందుకు సామాజిక మాధ్యమా లను వాడుకుంటున్నాయని తేటతెల్లమైంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితులు, అశాంతి ఈ వ్యవహారాలలో ఒక వారధిగా పనిచేయడానికి అవకాశం కల్పించి ఉండవచ్చునని కూడా అను మానిస్తున్నారు.సింగపూర్కూ తప్పని సంకటంఇటీవలి నా సింగపూర్ సందర్శన సందర్భంగా నాకు కొన్ని నిగూఢమైన అంశాలు తెలిసి వచ్చాయి. సోషల్ మీడియా, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజె¯Œ ్స ఆధారిత ఇస్లామీయ ర్యాడికలైజేషన్ విసురు తున్న సవాల్, అది ఆ నగర రాజ్యంలోని యువ వర్గాలపై చూపు తున్న ప్రభావం దిగ్భ్రమకు గురిచేశాయి.సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్భంధంలోకి తీసుకుంటున్న యువ ర్యాడికల్ సింగపూరియన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందని మరిన్ని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీలు జాగు చేయకుండా వెంటనే నివారణ చర్యలకు దిగడం వల్ల చాలా ప్రమాదకర ఘటనలు తప్పిపోయాయి. సింగపూర్లో తుపాకీ నిరోధక చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటిని తప్పించుకుని ఒక ఆయుధాన్ని తయారు చేసేందుకు, 17 ఏళ్ళ ఓ యువకుడు 3–డి ప్రింటింగ్ను వినియోగించుకునే ప్రణాళికలో ఉన్నాడు. కానీ, ఆంతరంగిక భద్రతా విభాగం (ఐఎస్డీ) ఈ ఏడాది మార్చిలో అతడిని నిర్బంధంలోకి తీసుకోగలిగింది. అతడి నుంచి రాబట్టిన విషయాలు మరింత ఆశ్చర్యం గొలిపాయి. అతడు ఆ ఆయుధాన్ని ఉపయోగించి స్థానిక మసీదు ఒక దానిలో కనీసం 100 మందిని చంపేసి, తనను తాను కాల్చుకుని చనిపోయే ఆలోచనలో ఉన్నాడు. దీనికి ముందు, ఫిబ్రవరి నెలలో, ఐఎస్డీకి ఓ 15 ఏళ్ళ అమ్మాయిపై అనుమానం కలిగింది. ఆమె కదలికలపై నిఘా పెట్టి, తర్వాత నిర్భంధంలోకి తీసుకుంది. ఆంతరంగిక భద్రతా చట్టం కింద సింగపూర్లో ఓ అమ్మాయిని అరెస్టు చేయడం అదే మొదటి సారి. ఆమె ‘ఐసిస్’ సభ్యుడిని పెళ్ళి చేసుకుని, దానికి అనుకూ లమైన కుటుంబాన్ని పెంచాలని భావిస్తోంది. సిరియాలో పోరాటంలోకి దిగి, అమర వీరురాలిగా మారాలని కలలు గంటోంది. అరికట్టే చర్యలు ఈ పెడ ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు సింగపూర్ ప్రభుత్వం రెలిజియస్ రీహ్యాబిలిటేషన్ గ్రూప్ (ఆర్.ఆర్.జి.) పేరుతో 2005లోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవస్థీకృత ఉగ్ర తండాల సభ్యుల నుంచి పొంచి ఉన్న బెడదను ఎదుర్కోవడాన్ని అది మొదట లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా జెమా ఇస్లామియా (జేఐ) నుంచి ఉన్న ముప్పును నివారించే పనిలోపడింది. కాలక్రమంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆర్.ఆర్.జి. తన కార్యాచరణను మార్చుకుంటూ వచ్చింది. అసలు మతం ఉద్దేశాలు, ఆశయాల గురించి యువతకు సక్రమ అవగాహన కల్పించే పనిని ప్రశంసనీయమైన రీతిలో కొనసాగిస్తూ వచ్చింది. యువతలో కొందరు ఆవేశం, నిరాశా నిస్పృహలతో హింసకు దిగడాన్ని గమనించి అది పరిష్కారం కాదని పరివర్తనకు దారి చూపింది. అది సత్ఫలితాలను ఇచ్చినట్లు ఒక విస్తృత సర్వేలో తేలింది. సింగపూర్ ఐ.ఎస్.ఏ. కింద Výæడచిన దశాబ్దంలో కేవలం 17 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. ముఖ్యంగా, ఆ నగర రాజ్యంలో పెద్ద ఉగ్ర ఘటన ఏదీ చోటుచేసుకోలేదు. అయితే, సింగపూర్ ముస్లిం వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్ ఫైజల్ ఇబ్రహీం తాజా ర్యాడికలై జేషన్ను గమనించకపోలేదు. ‘‘దేశాల మధ్య అనుసంధానకత్వం పెరిగిపోతున్న ప్రపంచంలో ఉగ్ర సామగ్రి తేలిగ్గా అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ సాధనాలలో సైద్ధాంతిక ప్రబోధాలు ప్రతిధ్వని స్తున్నాయి. యువత ఇంటర్నెట్లోనే ఎక్కువ సమయం గడుపు తూండటం వల్ల ర్యాడికలైజేషన్కు వెసులుబాటు ఏర్పడడమే కాక, ఆ ప్రక్రియ వేగం పెరుగుతోంది’’ అన్నారు.అయితే, భారతదేశాన్ని ఆ నగర రాజ్యంతో పోల్చుకోలేం. సింగపూర్ జనాభా అరవై లక్షలు మాత్రమే. భారత్ జనాభా ఇంచు మించు 150 కోట్లు. వైవిధ్యంతో కూడిన భారతీయులు దాదాపు 800 జిల్లాలలో విస్తరించి ఉన్నారు. వివిధ మతాలు, భాషలు, కులాలకు చెందిన వారి సామాజిక–సాంస్కృతిక మిశ్రమత్వం మరింత జటిలమైంది. కానీ టెక్నాలజీ, సోషల్ మీడియా, ఏఐ ఆధారిత ర్యాడికలైజేషన్ తీరుతెన్నులకు సరిహద్దులు లేవు. సింగ పూర్ ఆర్.ఆర్.జి. నమూనాను సమీక్షించి, భారతదేశానికి తగ్గ విరుగుడు కార్యక్రమాలను రూపొందించుకోవచ్చు.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
రైతుల హక్కుల మాటేమిటి?
దాదాపు రెండు దశాబ్దాల చర్చలు, కోర్టు కేసులు, విత్తన వైఫల్యాలు, పెరుగుతున్న సాగు వ్యయాల తర్వాత, భారత దేశం మరోసారి తన విత్తన చట్టాలను మార్చే దశకు వచ్చింది. 2004, 2019 ముసాయిదాల తర్వాత వచ్చిన విత్తనాల ముసాయిదా బిల్లు 2025 ఎన్నో ఆశలను రేకెత్తించింది. నేడు రైతులు ఎదుర్కొంటున్న అస్థిర విత్తన నాణ్యత, ఊగిసలాట ధరలు, పెరుగుతున్న కార్పొరేట్ ఆధి పత్యం వంటి భారాలను దృష్టిలో పెట్టుకుని రైతులను బలోపేతం చేస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ బిల్లులో ‘వ్యాపార సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)కు ఉన్న ప్రాధాన్యం, ‘వ్యవసాయ సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ ఫార్మింగ్)కు లేదు.నష్టపోయిన రైతుల్ని వదిలేసి...బిల్లులోని ఉద్దేశ్య వాక్యం దీని అసలు వైఖరిని తేటతెల్లంచేస్తోంది. ఇది ‘నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాను సులభ తరం చేయుటకు’ అని చెబుతుందే తప్ప, రైతుల హక్కులు, పంట నష్టపరిహారం, ధరల నియంత్రణ వంటి అంశాలపై ఒక్క మాటా లేదు. ఇది ముసాయిదాలో లోపం కాదు. ఇది చట్టం ఏ ధోరణిలో ఉన్నదో స్పష్టంగా తెలియజెబుతోంది. అసలు బిల్లే పరిశ్రమ – వాణిజ్య చట్టంలా కనిపిస్తుంది తప్ప, రైతుల హక్కుల చట్టంలా కాదు! నాణ్యత నియంత్రణ బలోపేతం అవుతుందనీ, కేంద్రీకృత విత్తన ట్రేసబిలిటీ పోర్టల్ వస్తుందనీ బిల్లు మద్దతుదారులు చెబు తున్నారు. క్యూఆర్ కోడ్లు, డిజిటల్ ట్రేసింగ్– ఇవన్నీ కాగితంపై బానే కనబడతాయి. కానీ ఇవి న్యాయం సాధించడానికి సరిపోవు. ట్రేసబిలిటీ డేటా ఆధారంగా చెడు బ్యాచ్లు ఆటోమేటిక్గా వెనక్కి పోతాయనీ, పునరావృత దోషులను బ్లాక్ లిస్ట్లో పెడతారనీ, రైతులకు నష్టపరిహారం స్వయంచాలకంగా అందుతుందనీ బిల్లు ఎక్కడా నిర్దేశించలేదు.విత్తనాల ముసాయిదా బిల్లులోని అత్యంత పెద్ద లోపం? రైతులకు చట్టబద్ధ, కాలపరిమితి ఉన్న నష్టపరిహారం వ్యవస్థ లేకపోవడం! తేలిక, చిన్న, పెద్ద తప్పులకు భారీ జరిమానాలు, జైలు శిక్ష వరకూ బిల్లు నిర్దేశిస్తోంది. కానీ ఆ జరిమానాలు రైతులకు కలిగిన నష్టాలను భర్తీ చేయలేవు. పాత, నాసిరకం, నకిలీ విత్తనం వల్ల పంటనష్టం జరిగిన రైతు, ఇంకా వినియోగదారుల కోర్టులకే వెళ్లాలి; సాక్ష్యాధారాలు సమర్పించాలి; సంవత్సరాల తరబడి కేసును లాగాలి. చిన్న రైతులకు ఇది సాధ్యం కాని వ్యవస్థ.ధరల నియంత్రణపై చేతులెత్తేసి...ధర నియంత్రణ విషయంలో కూడా బిల్లు బలహీనంగానే ఉంది. సెక్షన్ 22 ప్రకారం ధరలను కేవలం ‘అత్యవసర పరిస్థితుల్లో’ – అసాధారణ పెరుగుదల, కొరత, ఏకాధిపత్య ధోరణి సమయాల్లో మాత్రమే నియంత్రించవచ్చు. దీని అర్థం: సాధారణ పరిస్థితుల్లో విత్తన ధరలపై ప్రభుత్వం తన చేతులు దులుపుకొంటుంది. గతంలో రాష్ట్రాలు అత్యవసర ఉత్పత్తుల చట్టం కింద బీటీ కాటన్ ధరలు, రాయల్టీలను నియంత్రించిన చట్టపరమైన హక్కులు ఇప్పుడు క్షీణి స్తాయి. విత్తన మార్కెట్ ఇప్పటికే కొద్ది కంపెనీల చేతుల్లో ఉండగా, ఈ బలహీన నియంత్రణ రైతులపై మరింత భారాన్ని మోపుతుంది. ఇంకో ప్రధాన సమస్య– ఈ బిల్లు కేంద్రాధిపత్యాన్ని బలపరచడం, రాష్ట్రాల హక్కులను బలహీన పరచటం! సెక్షన్ 17(8)లో సూచించిన ‘కేంద్ర అక్రెడిటేషన్ వ్యవస్థ’ వల్ల, ఒకసారి కేంద్రం నుండి అక్రెడిటేషన్ పొందిన కంపెనీలు అన్ని రాష్ట్రాల్లో ఆటోమే టిక్గా నమోదు అయినట్లే! రాష్ట్రాలు సాంకేతిక, ఆర్థిక, వసతి కారణాల మీద ఆ కంపెనీలను నిరాకరించలేవు. సెక్షన్లు 38, 41తో కలిపి చూస్తే, ఈ బిల్లు రాష్ట్రాల విత్తన పాలనా హక్కులను దాదాపుగా తొలగిస్తుంది.వెరైటీ ట్రయల్స్, సర్టిఫికేషన్లో విదేశీ సంస్థలను అనుమతించే నిబంధనలు దీనికంటే ప్రమాదకరమైనవి. ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థానిక శాస్త్రీయ పరీక్షలను పక్కన పెట్టి, విదేశీ ట్రయల్ డేటాకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత వాతావరణానికి సరిపోని వెరైటీలు వేగంగా మార్కెట్లోకి రావచ్చు. ఇది విత్తన స్వావ లంబనకు ముప్పు. జన్యుమార్పిడి పంటలు (జీఎం) లేదా ‘ప్రొప్రై టరీ హైబ్రిడ్స్’ నిర్బంధం లేకుండా ప్రవేశించే పరిస్థితి వస్తుంది. కమ్యూనిటీ విత్తన వ్యవస్థలు, ఇప్పటికీ అనేక పంటలలో ప్రధాన విత్తన వనరుల గురించి బిల్లులో కేవలం ప్రస్తావన స్థాయిలోనే చూపారు. రైతు–బ్రీడర్ల హక్కులు, ఎఫ్పీఓలు చేసే స్థానిక విత్తన వ్యాపారం, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు–వీటిని బలపరచడంలో బిల్లు పూర్తిగా విఫలమైంది. కాంట్రాక్ట్ ఆధారంగా విత్తనాలు ఉత్పత్తి చేసే విత్తన రైతుల హక్కులను కూడా పూర్తిగా పట్టించుకోలేదు.పాలనా నిర్మాణం అంతా కూడా కేంద్రీకృతమైపోయింది. రైతుల ప్రతినిధులు సెంట్రల్ కమిటీలో కొన్ని రొటేటింగ్ సీట్లు పొందినా, ఎన్ఫోర్స్మెంట్ లేదా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ వ్యవస్థల్లో వారికి ప్రత్యక్ష పాత్ర లేదు. దీని వల్ల పెద్ద కంపెనీలు వ్యవస్థను సులభంగా తమ వైపు తిప్పుకోగలవు. చిన్న డీలర్లు, చిన్న కంపెనీలు మాత్రమే నియంత్రణ బరువును మోస్తాయి.మరి బిల్లు ఎలా ఉండాలి?నిజమైన రైతు కేంద్రీకృత విత్తన చట్టం ఎలా ఉండాలంటే:1. నష్ట పరిహారం ఆటోమేటిక్ కాల పరిమితితో, పంట నష్టానికి అనుసంధానంగా ఉండాలి. కంపెనీల నుంచే సీడ్ లయబిలిటీ ఫండ్ ఏర్పడాలి. 2. విత్తన ధరలు, రాయల్టీలను శాశ్వతంగా నియంత్రించే స్వతంత్ర సంస్థ ఉండాలి. అందులో రైతులు, రాష్ట్రాలు, శాస్త్రవేత్త లకు భాగస్వామ్యం ఉండాలి. 3. స్థానిక అవసరాల ప్రకారం విత్తన రకాలను అనుమతించడానికి/నిరాకరించడానికి రాష్ట్రాలకు పూర్ణ అధికారం ఉండాలి. 4. రైతు బ్రీడర్లను, కమ్యూనిటీ సీడ్ వ్యవస్థలను బలపరచాలి. 5. సీడ్ ప్రొడ్యూసర్ రైతులకు న్యాయమైన కాంట్రా క్టులు, కచ్చితమైన చెల్లింపులు, రక్షణ ఇవ్వాలి. 6. లెసెన్సింగ్, ట్రేస బిలిటీ రెండూ తప్పనిసరి కావాలి. 7. జెర్మినేషన్, పేరెంటేజ్, రాయల్టీ, రిజిస్ట్రేషన్ వివరాలపై పూర్తి పారదర్శకత ఉండాలి.8. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్’ చట్టంలోని రైతుల హక్కులు బలపడాలి తప్ప బలహీనపడకూడదు. ‘విత్తనాల బిల్లు 2025’ భారత విత్తన వ్యవస్థను సమానత్వం, ప్రతిస్పందనశీలత, స్వావలంబన దిశగా మలిచే అవకాశం. కానీ బిల్లు రైతుల రక్షణ కంటే వ్యాపార నిర్వహణ సులభతరంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే, ఆ అవకాశం వృథా అవుతుంది. బిల్లుకు తుది రూపం దిద్దేముందు రైతు సంఘాలు, రాష్ట్రాలు, శాస్త్ర సమాజం, ప్రజా పరిశోధనా సంస్థలతో కేంద్రం అర్థవంతమైన సంప్రదింపులు జరపాలి. విత్తనం వేస్తున్న రైతు ప్రమాదం భరించాల్సిన చివరి వ్యక్తి కాకుండా ఉండేలా చట్టాన్ని పునర్నిర్మించాలి. డా. జి.వి.రామాంజనేయులు వ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అంతిమంగా రష్యాకు మేలు...
రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని విరమించేందుకు 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ఆగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఉక్రెయిన్ ‘నాటో’ సభ్యత్వం స్వీకరించకూడదనేది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో ‘నాటో’ స్థావరాలను స్థాపించి మాస్కో పొలిమేర్ల వరకూ అమెరికా మిలిటరీ క్షిపణుల్ని మోహరించే ప్రయత్నంలో భాగంగా ‘నాటో’లో సభ్యత్వానికి ఉక్రెయిన్ను ప్రోత్సహించాయి. దీంతో తన ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్పై యుద్ధానికి దిగింది రష్యా.ఉక్రెయిన్ తూర్పు భాగంలో 25 శాతం భూభాగాన్ని రష్యన్ సేనలు ఆక్రమించాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్రులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఉక్రెయిన్ ప్రధాన పట్టణాలను ఆక్రమించి రాజధాని కీవ్ దిశగా రష్యన్ సేనలు దూసుకెళుతున్నాయి. ‘మీరు శాంతియుతంగా లొంగకపోతే ఉక్రెయిన్ను నామరూపాలు లేకుండా చేస్తామ’ని రష్యా హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో యుద్ధాన్ని ప్రోత్సహించిన అమెరికాయే ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి, ఉక్రెయిన్ ఓటమి నుంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తోంది. 28 శాంతి ప్రతి పాదనల్లో ప్రధానంగా 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పాన్ని వాస్తవ రష్యన్ నియంత్రణ ప్రాంతంగా గుర్తించి... అమెరికా గుర్తింపుతో సహా అంతర్జాతీయ గుర్తింపును పొందేలా చూడాలి. యుద్ధంలో రష్యా వశపరచుకున్న డొనెట్స్క్ పొరుగున ఉన్న లుహాన్స్క్ ప్రాంతాలను రష్యాకు ఇవ్వాలి. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఇవ్వాలి. అక్కడ మిగిలి ఉన్న ఉక్రెయిన్ ట్రూపులను వెనుకకు పిలవాలి. ‘నాటో సభ్యత్వాన్ని కోరను’ అని ఉక్రెయిన్ చేయాలని చెబుతున్న ప్రతిజ్ఞను ఈ శాంతి ముసాయిదాలో చేర్చారు. ఇందుకోసం ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. ప్రతిఫలంగా ఉక్రెయిన్ భద్రతా హామీలను పొందుతుంది. ఉక్రెయిన్లో విదేశీ మిలిటరీ స్థావరాలు కానీ, దూరపు శ్రేణి క్షిపణులను కానీ మోహరించ కూడదు. ఉక్రెయిన్ ఆర్మీని 6 లక్షలకు మించకుండా కుదించడం, ‘నాటో’ ఇకపై రష్యా వైపు విస్తరించదనీ, రష్యా ఇకపై పొరుగు దేశాలపై దాడి చేయకూడదనీ ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక వాడలన్నీ రష్యా స్వాధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్ అణుశక్తిగా ఎన్నటికీ ఉండ కూడదు. యుద్ధ నష్టపరిహారం వంటివి ఇరువైపులా ఉండవు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేసి, 2014లో తొలగించిన జీ8 దేశాల కూటమిలో సభ్యత్వం తిరిగి ఇస్తారు. ఉక్రెయిన్లో 100 రోజులలోగా అధ్యక్ష ఎన్నికలు జరగాలి. యూరోపియన్ యూనియన్ అధికారులు మాత్రం ఈ శాంతి ప్రణాళిక కోసం తమతో సంప్రదించలేదనీ, ఇది రష్యా అనుకూల ప్రణాళిక అనీ అంటున్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ ప్రతిపా దనల్ని ఒప్పుకొని ఉంటే యుద్ధమే ఉండేది కాదు. ఇంత విధ్వంసమే జరిగేది కాదు. లక్షలాది మంది పశ్చిమ యూరప్కు వలసలు పోయేవారు కాదు. ఐతే బ్యాంకుల్లో స్తంభించిన 30,000 కోట్ల డాలర్ల రష్యా కరెన్సీ గురించి ఇంకా స్పష్టత రాలేదు. శాంతి ఒడంబడిక జరిగితే అంతిమ విజేతగా రష్యా నిలవనుంది. రష్యాను బలహీనపర్చి, రష్యాను విభజించి వలస దేశంగా మార్చి ఖనిజసంపదను దోచుకోవాలన్న అమెరికా, పశ్చిమ దేశాల ఆశలు అడియాసలుగా మిగిలిపోతాయి.పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ దిగజారుడులో ఉంది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్తూ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయానికి కూడా వెళ్లాలనే ఆలోచనలో యూకే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపటం ద్వారా అమెరికా, మిత్రదేశాలు తమ పరువును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నాయనడం సముచితం.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
డి.కె. శివకుమార్ (కర్ణాటక డిప్యూటీ సీఎం) రాయని డైరీ
అప్పు తీసుకునేటప్పుడు బాగానే ఉంటారు. తిరిగి ఇచ్చేయవలసి వచ్చినప్పుడే బాధపడి పోతుంటారు!సిద్ధరామయ్య నాకు సీఎం సీటు బాకీ. ‘‘ఫస్ట్ హాఫ్లో నేను సీఎంగా ఉంటాను. సెకండ్ హాఫ్లో మీరు సీఎంగా ఉండండి’’ అని నన్ను నమ్మించి సీఎం అయ్యారు సిద్ధరామయ్య. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. నవంబర్ 20న ఆయన నా బాకీ తీర్చేయాలి. తీర్చలేదు! మాట మీద నిలబడని మనుషుల వల్లే రాజకీయాల్లో ఈ లంచ్ మీట్లు, సర్దుబాటు బ్రేక్ఫాస్ట్లు!‘‘సిద్ధరామయ్య గారూ... మాట తప్పటం మన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదు’’ అన్నాను, అలాగైనా హై కమాండ్ గుర్తొచ్చి, ఆ భయంతో నైనా నా అప్పు తీర్చేస్తారని!‘‘నేను మీకు ఏ మాటా ఇవ్వలేదు శివకుమార్. ఇచ్చానని మీరనుకుంటే సరిపోదు. పత్రం ఏది? సాక్షులు ఏరి? ఉంటే చూపించండి’’ అన్నారు! అప్పును ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్న వారి జార్గాన్ ఎలా ఉంటుందో సరిగ్గా అలానే మాట్లాడుతున్నారు సిద్ధరామయ్య! ‘‘దిక్కున్న చోట చెప్పుకో...’’ అనే మాటొక్కటే అనటం లేదు. ఇద్దరి దిక్కూ హై కమాండే కాబట్టి.నవంబర్ 20 దాటి పది రోజులైంది! సిద్ధరామయ్య సీఎం సీట్లోంచి లేవటం లేదు. ‘‘ఒకరు చెబితే లేవను. హై కమాండ్ మాటే నాకు ఫైనల్’’ అంటున్నారు.‘‘అవును. హై కమాండ్ మాటే మా నాయకుడికి ఫైనల్’’ అని పరమేశ్వర, సతీశ్ జార్కిహోలీ, మహదేవప్ప, వెంకటేశ్, కె.ఎ¯Œ . రాజన్న అంటున్నారు.సిద్ధరామయ్యకే కాదు, నాకూ హైకమాండ్ మాటే ఫైనల్. కానీ హై కమాండేఏ మాటా ఫైనల్ చేసి చెప్పటం లేదు. శుక్రవారం హఠాత్తుగా ఢిల్లీ నుండి ఖర్గే ఫోన్! ‘‘శనివారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఒకటి పెట్టుకుని వాళ్లలో వాళ్లనే తేల్చుకోమనండి’’ అని సోనియాజీ అంటున్నారని!నచ్చని మనుషులతో కలిసి, నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చెయ్యడం రాజకీయాల్లో మాత్రమే ఉంటుందేమో! అనిష్టంగానే శనివారం ఉదయం సిద్ధరామయ్య ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్లాను. టేబుల్కి ఒక ఒంపులో ఇద్దరం పక్క పక్కన కూర్చొనేలా ముందే ఏర్పాట్లు చేయించి నట్లున్నారు ఆయన!‘‘తినండి శివకుమార్! మీకు ఇష్టమని ఇడ్లీ తెప్పించాను’’ అన్నారు, నవ్వుతూ. ‘‘ఇడ్లీ మాత్రమే కాదు సిద్ధరామయ్య గారూ... నాకు మసాలా దోసె, ఉప్మా, కేసరి బాత్ కూడా ఇష్టమే’’ అన్నాను.‘‘వాటికి టైమ్ పడుతుందని ఇడ్లీ తెప్పించాను శివకుమార్. టైమ్ పట్టేవాటి కోసం వెయిట్ చేయాల్సిందే కదా’’ అన్నారు నవ్వుతూ! హై కమాండ్ నుంచి హామీ లభించిన అల్లరితనమేదో ఆయన నవ్వులో కనిపిస్తోంది. ఇడ్లీ తిని బయటికి వచ్చేశాను.అరగంట పైగా మాట్లాడుకున్నాం. సీటు కావాలని నేను అడగలేదు. సీటు ఇస్తానని ఆయనా అనలేదు. ‘‘నాకూ పనుంది’’ అని ఆయనా లేచారు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేరుగా వెళ్లి శ్రీ నిర్మలానందనాథ స్వామీజీని కలిశాను.‘‘డిసెంబర్ 8 నుండి శాసన సభ సమావేశాలు స్వామీజీ. ఉప ముఖ్యమంత్రిగా ఆ సమావేశా లకు హాజరవటం నాకు ఇష్టం లేదు. ఏం చేయ మంటారు?’’ అని అడిగాను. స్వామీజీ చిద్విలాసంగా చూశారు.‘‘నీ అభీష్టం ఒక విధంగా నెరవేరకుంటే, ఇంకో విధంగా నెరవేర్చుకో నాయనా’’ అన్నారు. సమావేశాలు ప్రారంభం అయ్యేలోపు నువ్వు ముఖ్యమంత్రివి కాలేకపోతే, ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండొద్దు అనిప్రబోధించారు! తిరుగులేని బాణం.స్వామీజీ దగ్గర సెలవు తీసుకుని,నాగమంగళలోని ఆదిచుంచనగరిమహాసంస్థాన మఠం నుంచి తిరిగివస్తుంటే, దారిలో... బైడ్గిలోని కగినెలేకనకగిరి పీఠంలో శ్రీ నిరంజనానందపురి స్వామీజీని దర్శించుకుని వస్తూ సిద్ధరామయ్య కనిపించారు! -మాధవ్ శింగరాజు -
అందరికీ ఆహార భద్రత ఓ ఎండమావేనా!
దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది ఆహార భద్రత. ప్రపంచ ఆహార భద్రత సూచీ ప్రకారం 2022 నాటికి 113 ప్రధాన దేశాలలో భారత్ 68వ స్థానం పొందగా 2024 నాటికి, అంటే రెండేళ్ల తర్వాత 127 ప్రధాన దేశాలలో 105వ స్థానానికి దిగజారింది. దేశ జనాభాలో ఆకలితో బాధపడుతున్న వారిసంఖ్య 22 కోట్లుగా అంచనా వేస్తుండగా, అందులో అధిక శాతం మంది వ్యవసాయం వృత్తిగా చేసుకొన్న రైతులు, రైతు కూలీల కుటుంబాల వారే. దేశ జనాభాకు తిండిగింజల్ని పండిస్తున్న రైతాంగమే కడుపు నిండా తిండికి నోచుకోకపోవడం అన్నది జీర్ణించుకోలేని చేదు వాస్తవం. ఇతర రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరగడం లేదు. జాతీయ శాంపుల్ సర్వే ప్రకారం 1960–2020 మధ్య వ్యవసాయ రంగంలో నికరా దాయం 4 రెట్లు మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో పారిశ్రామిక నికరాదాయం 75 రెట్లు పెరిగింది. 2004లో ఒక వ్యవసాయ రంగ శ్రామికుడి ఉత్పాదకత రూ. 11,964 ఉండగా, పారిశ్రామిక రంగ కార్మికుడి ఉత్పాదకత రూ. 66,323గా ఉన్నట్లు తేలింది. అంటే ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు వ్యవసాయదారుల కంటే ఎక్కువ ఆదాయం వస్తోందన్నమాట! ఈ కారణంగానే కార్మికులు, కూలీలు వ్యవసాయ రంగాన్ని వీడి పెద్ద సంఖ్యలో ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. ప్రతీ ఏటా సాగు ఖర్చులు నిరంతరంగా పెరుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటేటా 14 ప్రధాన పంటలకు కొంతమేర కనీస మద్దతు ధరల్ని పెంచుతున్న మాట నిజమే గానీ, ఆ పెరిగే మొత్తం రైతు కుటుంబ, సాగు ఖర్చులను పూడ్చలేక పోతున్నాయి. హరిత విప్లవం స్ఫూర్తిగా...దేశంలో 1950 దశకం చివర్లో వచ్చిన ‘హరితవిప్లవం’ కారణంగా వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరిగాయి. హరిత విప్లవం నాటి సమయంలో దేశంలోని పలు రాష్ట్రాలు వ్యవసాయ, భూ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశాయి. అధిక దిగుబడి సామర్థ్యం గల వంగడాలను ప్రవేశపెట్టాయి. బంజరు భూములు సాగులోకి వచ్చాయి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువుల ఉపయోగం మొదలైంది. యంత్రాల వినియోగం కూడా రావడంతో సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికావడం సాధ్యమైంది. గోధుమ, వరి, నూనె గింజలు, పప్పు ధాన్యాలు పుష్కలంగా పండి వాటి ఉత్పత్తి సాలీనా 7 శాతం చొప్పున పెరిగింది. దాంతో, ప్రజల అవసరాలకు పోను కొంతమేర ఎగుమతులు చేసే స్థాయికి దేశం చేరింది. ఇప్పుడు దేశంలో సాగు భూములు క్రమంగా కుంచించుకు పోతున్నాయి. వ్యవ సాయ యోగ్యమైన భూముల్ని పారిశ్రామిక వాడలుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేయటం గత దశాబ్దకాలంగా ఎక్కువైంది. హరిత విప్లవమే కాదు... 1980–90 మధ్యకాలంలో పాల ఉత్పత్తిని పెంచడానికి పలు చర్యలు చేపట్టి శ్వేత విప్లవాన్ని సాధ్యం చేశారు. చేపలు, రొయ్యల ఉత్పత్తుల తలసరి లభ్యతను పెంచి నీలి విప్లవాన్నీ, అలాగే నూనెగింజల ఉత్పత్తిలో అనూహ్య వృద్ధిని సాధించి ‘బ్రౌన్ రివల్యూషన్ను సాధించిన ఘనత మనది. అయితే ‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి దప్పులు మరొక చోట’ అన్నట్లుగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత పెరిగినప్పటికీ దేశాన్ని ఆకలి రహిత భారత్గా తీర్చిదిద్దలేక పోవడం లోపమే!ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలంటే ఏడాది పొడవునా వారికి ఉపాధి, మెరుగైన ఆదాయం లభించాలి. అరకొరగా తీసుకొనే ఆహారంలో తగినన్ని పోషకాలు లేకపోవడంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఆహార భద్రతకు తోడుగా పోషకాహార భద్రత కల్పించాలంటే, ప్రజల ఆహార అలవాట్లను మార్చాలి. ఇటీవలి కాలంలో పాతకాలపు ఆహారపు అలవాట్లకు మెజారిటీ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అంటే, వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన, జొన్న, సజ్జ, రాగులు, ఊదలు, కొర్రలు వంటివాటిని ఎక్కువగా తీసుకొంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలతో పాటు చిరు ధాన్యాలను కూడా తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలి.ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరాలంటే ముందుగా రైతులకు ఆదాయ భద్రత కలగాలి. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది గానీ అది ఆచరణలో అరకొరగానే అమలు జరుగుతోంది. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలు, గిడ్డంగుల సౌకర్యం మెరుగుపడాలి. వ్యవసాయ దిగుమతులు తగ్గాలి. సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. ఆహార భద్రత అనే అంశం రైతాంగం ఆదాయ భద్రతతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గ్రహించనంత వరకూ, ఆ దిశగా చర్యలు చేపట్టనంత వరకూ అందరికీ ఆహార భద్రత అన్నది ఓ ఎండమావిగానే మిగిలిపోతుంది.డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త మాజీ కేంద్ర మంత్రి, శాసన మండలి సభ్యులు -
చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు
తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాటు నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది. స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎంతో ఆర్భాటం చేసింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఇదివరకు అమలు చేసిన రిజర్వేషన్ల శాతం కంటే మరింత తగ్గించి బీసీలను నిలువునా ముంచేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు... వ్యూహాత్మక కార్యాచరణ ఏమైంది? కేవలం ఆర్భాటం చేస్తూ బిల్లులు రూపొందించి అసెంబ్లీలో ఆమో దింపజేయడం, ఆ తర్వాత హడావిడిగా ఆర్డినెన్స్ ఇవ్వడం, వాటికి దిక్కులేకపోవడంతో జీఓ జారీ చేయడం అంతా ఒక కల్పనగానే ఉంది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా... పార్టీ పరంగా ఇస్తామంటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే నాటకీయంగా తప్పించుకున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్ని కలు పార్టీ గుర్తుతో జరగనప్పుడు, పార్టీ అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేస్తారు?ఉత్తుత్తి ప్రయత్నం...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. తొలి వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మూడు నెలల తర్వాత కుల సర్వేపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్లో ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వే అని, ఆ తర్వాత డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, చివరకు వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సమగ్ర సర్వే చేసి వాటి వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ముందుగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేయడం, లోతుగా సర్వే చేపట్టిన నివే దికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి. అక్కడ ఆమోదం పొందితేనే అవి చెల్లుబాటు అవుతాయి. తమిళనాడు నమూనా ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్రంపైన ఒత్తిడి తీవ్రతరం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి చేయకుండా ‘జంతర్మంతర్’లో ధర్నా చేసి చేతులు దులుపుకొంది.కేంద్రంలో 243 మంది ఎంపీలున్న ఇండియా కూటమి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోదీని కలిశారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో సంప్రదింపులు ఎందుకు చేయలేదు? తమిళనాడు తరహా అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు. ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర స్థాయిలో పరపతి లేని అనామకులు మాత్రమే ‘జంతర్మంతర్’ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తారు. అన్ని రకాల అధికారాలున్న కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ల పట్ల కపటప్రేమను ప్రదర్శించింది. ఆర్డినె¯Œ ్స జారీ చేసి గవర్నర్ ఆమోదించలేదంటూ... చివరకు ఎలాంటి ఆధారాలూ లేకుండా జీఓలు జారీ చేసి బీసీ రిజర్వే షన్లు పెంచుతున్నామని చెప్పుకొంది. కానీ ఆ ఉత్తర్వులు న్యాయవ్యవస్థ ముందు నిలవలేదు.ఐక్యతే అసలు మంత్రం...కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో మూడు తీర్మానాలు చేయించాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలనీ; కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమా వేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పార్లమెంట్లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలనీ; స్థానిక రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూ ల్లో చేర్చి, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానాలు చేయించాను.ఇప్పుడు గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతి పదికన ఖరారు చేశారో ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో 20 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టారు. శాస్త్రీయత లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉత్తర్వులు ఇస్తే అవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హర్షిస్తూ బీసీ సంఘాలు పాలాభిషేకాలు, పూలాభిషే కాలు చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కనీసం ఆలోచన చేయలేని స్థితిలో సంఘాలున్నాయి. బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సిందే! రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వ్యూహా త్మకంగా పంచాయతీలను విభజించుకుని దళిత, గిరిజన, బీసీలను సర్పంచులుగా గెలిపించుకోవాలి.జస్టిస్ వి. ఈశ్వరయ్యఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ -
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?
చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ ల చట్టసభలు చేసే బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ లకు డువు విధించలేమని ,అది పూర్తిగా రాజ్యాం గవిరుద్దమని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం మరింతగా పెరుగుతుందా?లేక రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన రీతిలో బిల్లులు పాస్ చేయకుండా నియంత్రిస్తుందా అన్నది చర్చనీయాంశమే. ఈ తీర్పుపై వచ్చిన కధనాలన్నిటిని పరిశీలిస్తే ఒక విషయం బోధ పడుతుంది. దేశంలో జరుగుతున్న రాజకీయాలు, గవర్నర్ ల నియామకాల తీరుతెన్నులు మొదలైన వాటి విషయంలో గౌరవ న్యాయ మూర్తులకు కూడా మనసులో ఆవేదన ఉన్నప్పటికీ ,రాజ్యాంగ రీత్యా వారి వారికి గడువు విధించలేమని చెప్పారా అన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా సుధీర్ఘకాలం గవర్నర్ లు సమయం తీసుకుంటున్నట్లయితే న్యాయ వ్యవస్థ పరిశీలించవచ్చని చెబుతున్నప్పటికీ, అంతిమ అధికారం గవర్నర్ లే అయితే అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉంటుందా అన్న సంశయం కలుగుతుంది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక పరీక్షగా కనబడుతోంది. రాష్ట్రపతి పార్లమెంటు, అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు.కాని గవర్నర్ లు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా నియమితులవుతారు. కొన్నిసార్లు రాజ్ భవన్ లు రాజకీయ నేతల పునరావాలస కేంద్రాలు గా మారుతున్నాయన్న విమర్శలు కూడా లేకపోలేదు.అది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా,లేదా బిజెపి కేంద్రంలో ఉన్నా పెద్ద తేడా లేదనే చెప్పాలి. గవర్నర్ లను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీ విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఈ మద్యకాలంలో కేరళ లో కొంతకాలం క్రితం వరకు ఉన్న గవర్నర్ కు, సిపిఎం ప్రభుత్వానికి మద్య పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ, కర్నాటక ,పంజాబ్, పశ్చిమబెంంగాల్ రాష్ట్రాలలోని బిజెపియేతర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను ఎదుర్కుంటున్నాయి. రాష్ట్రాలలో ఇది రాజకీయ దుమారంగా ఉంటోంది. తమిళనాడులో శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ తొక్కి పెట్టి ఉంచారు. దానిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్లినప్పుడు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మూడు నెలల గడువులోపు బిల్లులపై నిర్ణయం చేయాలని తీర్పు ఇచ్చింది. అది సంచలనంగా మారింది. కాని కేంద్రం దీనిని అంగీకరించలేదు. రాష్ట్రపతి ఈ విషయంలో పద్నాలుగు ప్రశ్నలు సంధిస్తూ సుప్రింకోర్టుకు లేఖ రాశారు.ఆ మీదట రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి రాష్ట్రపతి,గవర్నర్ లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది. అలాఅని సుదీర్ఘ సమయం తీసుకోవడం కూడా సరికాదని,ఫెడరల్ స్పూర్తికి విరుద్దం అన్నప్పటికీ, అలా వ్యవహరిస్తే పరిష్కారాన్ని సుప్రింకోర్టు సూచించినట్లు అనిపించదు.ఇది దేశంలో భవిష్యత్తులో మరిన్ని రాజకీయ ,రాజ్యాంగ సంక్షోభాలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. కేంద్రం కనుక దీనిని తనకు అనుకూలంగా మలచుకుని రాష్ట్రాలపై గవర్నర్ ల ద్వారా మరింత పెత్తనం చేయవచ్చు.ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.ఒకవేళ రాష్ట్రాలు ఏదైనా రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని రూపిందిస్తే దానిపై నిపుణులైన న్యాయ కోవిదులతో పాటు ,వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుని గవర్నర్ లు నిర్ణయాలు తీసుకునేలా ఏర్పాటు చేయడం అవసరం అనిపిస్తుంది.. బిల్లును ఆమోదించడం, రాష్ట్రపతికి నివేదించడం,లేదా పునస్సమీక్షకు అసెంబ్లీకి తిరిగి పంపడం అనే ఆప్షన్లు ఉన్నాయని అంటూనే గడువు పెట్టలేమని చెప్పడం వల్ల రాజకీయ సమస్య అయ్యే అవకాశం ఉంటుందనిపిస్తుంది. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యను చూస్తే ఆపివేలయాలన్న బిల్లులను అసెంబ్లీకి తిరిగి పంపడం అనేది ఆప్షన్ కాదని, నిబంధన అనడం బాగానే ఉంది. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. న్యాయమూర్తుల మనసులలో గవర్నర్ ల అధికారాలపై అనుమానాలు ఉన్నప్పటికీ, రాజ్యాంగంలో ఉన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఆ నిబంధనను గవర్నర్ లు పట్టించుకోకపోతే ఎలా వ్యవహరించాలన్నదానిపై మరింత స్పష్టత అవసరం అనిపిస్తుంది. రాజ్యాంగ విరుద్దం కానప్పటికీ, గవర్నర్ లు కావాలని బిల్లులను ఆమోదించకుండా ఉంటే ఏమి చేయాలన్నది ఇప్పుడు ప్రశ్న.ప్రజాస్వామ్యంలో గవర్నర్ లు పెత్తనంపై ఇంతవరకు చాలా చర్చ జరిగింది. సర్కారియా కమిషన్ వంటివి దీనిపై విస్తృతంగా పరిశీలన చేసి అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా చట్టసభలలో మెజార్టీ పై గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా శాసనసభలలోనే రుజువు చేసుకోవాలన్న సూత్రం అప్పటి నుంచే వచ్చింది. 1980,90 వ దశకాలలో ఉమ్మడి ఎపితో పాటు పలు రాష్ట్రాలలో గవర్నర్ ల తప్పుడు నిర్ణయాల వల్ల రాజకీయ సంక్షోభాలు వచ్చాయి. మెజార్టీ లేని పార్టీ నేతలకు కేంద్రం లోని పెద్దల సలహాల మేరకు పట్టం కట్టి నాలుక కరచుకున్న ఘట్టాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు గవర్నర్ ల వ్యవస్థ ఉండరాదని వాదించేవారు. ఆయన సీఎం.గా ఉన్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన గవర్నర్ కుముద్ బెన్ జోషి తో తరచు వివాదాలు ఏర్పడేవి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సందర్భాలలో గవర్నర్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.కాకపోతే ఆయన ఎప్పుడూ ఒక స్థిరమైన విధాన నిర్ణయానికి కట్టుబడి లేరు. యుపిలో గవర్నర్ కు వ్యతిరేకంగా బిజెపి అగ్రనేత వాజ్ పేయి ఏకంగా నిరాహార దీక్షకు దిగిన సందర్భం కూడా ఉంది. పశ్చిమబెంగాల్ లో గతంలో గవర్నర్ గా ఉన్న జగదీప్ ధంఖడ్ కు, ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఎంత పెద్ద రగడ నడిచింది ఇటీవలి చరిత్రే. చివరికి ధంఖడ్ ఒక సందర్భంలో అసెంబ్లీ వద్దకు వెళితే గేటు కూడా తెరలేదు. ప్రస్తుత గవర్నర్ తో కూడా వివాదం సాగుతోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే టీఎంసీ పార్లమెంటు సభ్యుడు ఒకరు రాజ్ భవన్ లో ఆయుధాలు ఉన్నాయని ఆరోపించారు. దానిపై ఆయన మీద కేసు పెట్టడం, అందుకు ప్రతిగా గవర్నర్ ఆఫీస్ పై ఎమ్.పి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు బిల్లుల ఆమోదం తో పాటు పలు అంశాలపై బిజెపి ప్రభుత్వ నియమిత గవర్నర్ లు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్.డి.ఎ. యేతర ప్రభుత్వాలు గుస్సగాఉన్నాయి. ఉదాహరణకు ఎమ్మెల్సీ నియామకాలపై గవర్నర్ లు ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారు.ఎన్.డి.ఎ.పాలిత రాష్ట్రాలలో గవర్నర్ లు రాష్ట్రాల అభిమతం మేరకు నడుచుకుంటారు. గతంలో కాంగ్రెస్ కేంద్రంలో పవర్ లో ఉన్నప్పుడు కూడా ఇదే తంతు సాగేది. ఈ నేపధ్యంలో మంత్రివర్గ సలహాను కూడా గవర్నర్ లు విధిగా పాటించనవసరం లేదని సుప్రింకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సరికొత్త సంక్షోభాలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావడం మంచిది. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని కొందరు న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అధికారం కాకుండా, నామినేటెడ్ గవర్నర్ లకు అధికారం ఉండడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మీదీ బిలియనీర్ మైండే!
బిలియనీర్ల మెదడుకు, మామూలు వ్యక్తుల మెదడుకు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవటానికి డాక్టర్ శ్వేతను చేసిన ఇంటర్వ్యూ ఇది. శ్వేత ప్రధానంగా ‘న్యూరో ప్లాస్టిసిటీ’ (మెదడుకు ఉండే ‘తర్ఫీదుకు మార గల’ సామర్థ్యం) గురించి మాట్లాడారు. సగటు మనిషికి భిన్నంగా ‘సంపన్న’ ఆలోచనలు కలిగిన బిలియనీర్లో ‘ఫ్రంటల్ కార్టెక్స్’ శక్తిమంతంగా పని చేస్తుందన్నారు. మెదడుకు తర్ఫీదు ఇవ్వగలిగితే ఎవరైనా బిలియనీర్లు కావచ్చంటారు. ఆమె మాటల్లోని ముఖ్యాంశాలు:స్ట్రాటెజిక్ మార్నింగ్ రొటీన్‘‘ఉదయం మేల్కొన్నాక, తొలి గంట ఎంతో అమూల్య మైనది. ‘గోల్డ్’ అంటాను ఆ గంటను నేను. ఆ రోజంతా మనం ఎలా ఉండబోతున్నాం అన్నది ఆ ‘గోల్డెన్ అవరే’ నిర్ణయిస్తుంది. ఆ గోల్డెన్ అవర్ ఎలా ఉండాలన్నది మాత్రం మనం నిర్ణయించగలగాలి. ఉదా: ఉదయం లేవగానే మీరు ఒక గంట వరకు ఫోన్ను చేతుల్లోకి తీసు కోకండి. తీసుకుంటే ఏమౌతుందంటే, మీ మెదడు ప్రతి చర్యాశీలకమైన (రియాక్టివ్) ‘బీటా వేస్’ స్థితిలోకి వెళ్లి పోతుంది. అలా కాకుండా... తీటా, ఆల్ఫా వంటి శాంతియుతమైన తరంగ స్థితుల్లోకి మీరు ఉద్దేశపూర్వ కంగా వెళ్లిపోవాలి. ఫోన్ను మీరు టచ్ చేయకుండా, ఉషోదయ కిరణాలను కాసేపు మిమ్మల్ని టచ్ చేయ నివ్వండి. మెదడులో ఉండే హైపోథాలమస్లోని చిన్న కేంద్రకాల జతలు క్రియాత్మకమై, మీ జీవ గడియా రాన్ని లయబద్ధం చేస్తాయి. దీనినే ‘స్ట్రాటెజిక్ మార్నింగ్ రొటీన్’ అంటాం.లక్ష్యానికి మేల్కొలుపు ‘మూవర్స్’‘‘స్ట్రాటెజిక్ మార్నింగ్ రొటీన్ను పాటించటానికి ‘మూవర్స్’ అనే ఒక సరళమైన సూత్రాన్ని మేము వృద్ధి చేశాం. మూవర్స్ అనే సంక్షిప్త నామంలోని 6 ఇంగ్లిష్ లెటర్స్లో ఒక్కో లెటర్కు ఒక్కో అర్థం ఉంది. ఎం–మెడి టేషన్, ఒ–ఆక్సిజనేషన్, వి–విజువలైజేషన్, ఇ–ఎక్సర్ సైజ్, ఆర్–రీడింగ్, ఎస్–స్క్రైబింగ్. ధ్యానం, శ్వాస, మనోవీక్షణ, వ్యాయామం, చదవటం, రాయటం అనే ఈ ఆరు సాధనలలో ప్రతి దానికీ కనీసం ఐదు నిము షాలు కేటాయించాలి. అవన్నీ కూడా అంతిమంగా మెద డును చురుకెత్తించేవే. మొత్తంగా మూవర్స్ అనే ఈ మెళుకువ మీలో ఒక లక్ష్యం ఏర్పరచి, ఆ లక్ష్య సాధనకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.‘ఫ్రంటల్ కార్టెక్స్’దే కీలకమంతా!‘‘మెదడు ముందు భాగంలో ఉండే ‘ఫ్రంటల్ కార్టెక్స్’ తార్కికమైన ఆలోచనను జనింపజేస్తుంది. భావోద్వేగా లను అదుపు చేస్తుంది. వ్యసనాలను నియంత్రిస్తుంది. ఇందుకు భిన్నంగా మెదడు మధ్యభాగంలో ఉండే‘లింబిక్ సిస్టమ్’ వాయిదా మనస్తత్వానికీ, ఒత్తిళ్లకూ కారణం అవుతుంది. మామూలు మనుషుల్లో లింబిక్ సిస్టమ్ పైచేయిగా ఉంటే, బిలియనీర్లలో ఫ్రంటల్ కార్టెక్స్ బలంగా ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు. ‘మూవర్స్’ టెక్కిక్ లింబిక్ సిస్టమ్ను మందగింపజేసి, ఫ్రంటల్ కార్టెక్స్ను క్రియాశీలం చేస్తుంది. దాంతో బిలి యనీర్స్ లేదా ‘హై–పెర్ఫార్మర్’ల ఫ్రంటల్ కార్టెక్స్ శక్తి పుంజుకుని, తద్వారా ఒక భావోద్వేగ నిర్లిప్తత అలవడు తుంది. ప్రాక్టికల్గా మారిపోతారు.పుట్టుకురారు... తయారౌతారు‘‘చివరికి, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ‘బిలియనీర్ మెదడు’ అనేది జన్యువుల లాటరీలో తగిలిన సంపద కాదు. క్రమం తప్పని, స్వల్పమైనవైన, సోమరితనంతో వాయిదా వేయని దినచర్యల ‘సాగు ఫలితం’. ఐదు నిమిషాల రోజువారీ నిశ్శబ్ద ధ్యానం, క్రమబద్ధం చేసు కున్న ఉదయపు వేళ అలవాట్లు, 4–7–8 వంటి శ్వాస వ్యాయామాలు (ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గాలిని గుండెల్లోకి పీల్చటం, 7 సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచటం, 8 సెకన్ల పాటు గాలిని నోటి ద్వారా బయటికి వదలటం) మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. బిలియ నీర్లు పుట్టుకురారు. తయారౌతారు. బికారులు కూడా సాధనతో, స్థితిగతుల నియంత్రణతో బిలియనీర్లుగా ఎదగవచ్చు. కీలకమంతా మెదడుకు తర్ఫీదు ఇవ్వటంలోనే ఉంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ ఏ వయసులోని వారికైనా సాధ్యమే!-ఎడిటోరియల్ టీమ్ -
సమాజం ఎవరికీ పట్టదా?
సమాజం పరిస్థితి తీవ్రమైన విచారాన్ని కలిగిస్తున్నది. ఈ మాట అంటున్నది అభివృద్ధి, పేదరికం, అవినీతి, తారతమ్యాలు, కులతత్వం, మతతత్వం వంటి విషయాల గురించి కాదు. ఆ సమస్యలపై చర్చలు ఎప్పుడూ జరుగుతున్నవే. ఉద్యమాలూ సాగుతున్నవే. అందుకు పరిష్కారాలపై అనేక థియరీలు, ఆలోచనలు చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తావిస్తున్నది వీటన్నింటికి భిన్నమైనది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తులకు తమతో తమకు ఉండే ఆత్మ సంబంధాలు, ఈ సంబంధాలకు ఆలవాలమయే విలువల గురించి. ఇవి అన్నింటికీ అన్నీ క్రమక్రమంగా క్షీణిస్తుండటం గురించి.సామాజిక క్షీణత ఆ యా కాల పరిస్థితులను బట్టి ఈ సంబంధాలు బలంగా ఉండటం, బలహీనపడటం జరుగుతూనే ఉంటుంది. అది సాధారణ స్థాయిలో ఉండటానికీ, ఒక ధోరణిగా మారి తీవ్రతరం కావటానికీ తేడా ఉంది. దానికదే ఒక ఆందోళనకరమైన స్థితి కాగా, అంతే ఆందోళన కలిగిస్తున్నది మరొకటి ఉంది. అది, ఈ విషయమై ఎవరికీ పట్టినట్లు లేకపోవటం. ప్రభుత్వం, పార్టీలు, పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు, వివిధ మతాల పెద్దలు, గురువులు, సంస్కర్తలు, లెక్క లేనంతగా ఉన్న సంఘాల వారు, ఆ యా ఇజాల వారు. అందరికీ అందరూ. ఎవరికి ఏదీ పట్టడం లేదు. ఒక మాట సూటిగా చెప్పుకోవాలంటే, మనుషులు తమను తాము చంపుకోవటం, ఇతరులను చంపటం ఎక్కువవుతున్నాయి. అందుకు స్థూలంగా కనిపిస్తున్న కారణాలు ఆర్థికం, లైంగికం, మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం, బలహీనపడుతున్న కుటుంబ సంబంధాలు, పెరిగిపోతున్న అసహనం వంటివి. ఇది స్థూలమైన పరిభాష. వీటిలో ఒక్కొక్క అంశాన్ని విడిగా పరిశీలిస్తే అన్నింటికీ కలిపి ఒక సమగ్ర సామాజిక స్థితి కనిపిస్తుంది. ఈ అంశాలలో కొన్నింటికి పరస్పర సంబంధం ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. వాటి జమిలి ప్రభావాలతో మన సమాజం, మనుషులు, కుటుంబాలు ప్రమాదానికి గురవుతున్నాయి. వాస్తవానికి ఇటువంటి అధ్యయనాలను సామాజిక శాస్త్రజ్ఞులు చేయాలి. సమాజ అధ్యయన శాస్త్రంలోకి రాజకీయం, ఆర్థికం, సమాజ సంస్కృతి, కుటుంబం, వ్యక్తిత్వ రూపకల్పనలు, మానసికతలు వీటన్నింటి పరస్పర సంబంధాలు, పరిణామాలు, మంచి చెడులు అన్నీ వస్తాయి. సామాజిక శాస్త్రం మనకు శ్రీకృష్ణుని నోటిలో సమస్త విశ్వ సందర్శనం వంటిది. కానీ దురదృష్టవశాత్తు, ఇతరత్రా మన విద్యా రంగాల వలె, సామా జిక శాస్త్ర విభాగాలు కూడా బలహీనపడుతూ, ఇటువంటి అధ్యయ నాలు చేయటం లేదు. తెలుగు రాష్ట్రాలలోని ఈ విభాగాల వారికి ఆ స్పృహ అయినా ఉన్నట్లు లేదు.చెదురుతున్న సంబంధాలువివరాలలోకి వెళితే, పైన పేర్కొన్న కారణాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు జరగని రోజంటూ ఉండటం లేదు. డబ్బు, వ్యసనాలు, లైంగికాలు, హీన సంస్కృతి, వినియోగదారీతత్వం పాత్రలు పెరుగుతూ, మనుషులకు తమతో తమకు స్వీయ సంబంధాలు, వ్యక్తిత్వాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాల పాత్రలు, అనుబంధాలు బలహీనపడి అప్రధానమవుతున్నాయి. ధన ప్రభావం, క్రమంగా వ్యాపిస్తున్న కొత్త కన్జూమరిజం, కొత్త సంస్కృతి ప్రభావం పట్టణ ప్రాంతాలకు, కొన్ని తరగతులకు పరిమితమై ఉండక గ్రామాలకూ, అన్ని తరగతులకూ విస్తరిస్తున్నది. పట్టణాలకు ఎక్స్పోజర్, కొత్త మీడియా, వినోదం, బలహీనపడిన విద్య, కుటుంబ శిక్షణలు, క్రమశిక్షణలు, కన్జూమరిజం పెంచుతున్న కోరికలు ఈ సరిహద్దులను చెరిపివేస్తున్నాయి. అది జరిగినప్పుడు మనిషి ఒక భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించటంతో మొదట తనతో తనకే స్వీయ సంబంధం చెదిరిపోతుంది. వ్యక్తిత్వం కలుషి తమవుతుంది. ఒకసారి అది జరగటం మొదలైతే కుటుంబంతో, ఇతర వ్యక్తులతో, సమాజంతో సంబంధాలు చెదిరిపోవటమన్నది తార్కికమైన సహజ పరిణామం. అది, వేర్లకు పురుగుపట్టిన చెట్లు మామూలు గాలికే కూలిపోవటం వంటిది. అట్లా కూలటంలో భాగంగానే అన్ని విధాలైన సంస్కారాలూ దెబ్బతిని వ్యక్తులు ఆత్మహత్యలకు, హత్యలకు, కుటుంబ సభ్యులపై దాడికి, లైంగిక నేరాలకు, ఇతర నేరాలకు, వ్యసనాలకు, తత్సంబంధిత అకృత్యాలకు పాల్ప డటం పెరుగుతున్నది. ఇదే సామాజిక క్షీణ స్థితి. పైన చెప్పుకున్నట్లు, ఇటువంటి స్థితి ఏర్పడటం వర్తమానకాల పరిస్థితుల ప్రభావంతో జరుగుతున్నది. అటువంటికాల పరిస్థితులకు పరిష్కారం ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా, పరిష్కార ప్రయత్నాలు ఒక స్థాయిలో జరుగుతూనే వీలైనంత నివారణ ప్రయత్నాలు కూడా ఏమి జరగాలన్నది మరొక ప్రశ్న. ఈ ధోరణిని భిన్న కోణాల నుంచి మౌలికంగా ఎదుర్కోవటం, పరిష్కరించటం, ప్రభుత్వాలు విధానపరంగా తీసుకోగల చర్యలపై ఎక్కువగా ఆధారపడిఉంటుంది. పైన పేర్కొన్న వివిధ సమస్యలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు సాధ్యమే. విద్య, వినోదం, ఆర్థికం, కొత్త తరహా మీడియా, కన్జూమరిజం, సమస్త అంశాలలో డబ్బు పాత్ర మొదలైనవి విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి రాగలవు.క్రియాశీలంగా మారితేనే...కానీ, అది మాత్రమే ఎంత మాత్రం చాలదు. అందుకు సమాజ పరంగా జరిగేది సరిసమానంగా అనుబంధం కావాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు, సమాజం ఏదీ శ్రద్ధ చూపటం లేదన్నది సమస్యగా మారింది. ఒకోసారి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినా కనీసం సామాజికులు, సంస్కర్తలు, మత పెద్దలు, మేధావులు, రచయితలు, కళాకారులు ఇటువంటి పరిస్థితుల పట్ల ఆందోళన చెంది చైతన్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తారు. సంస్కరణోద్యమాలు తెస్తారు. ఆ విధంగా పాలకులపై కూడా ఒత్తిడిని సృష్టిస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చూపినా ఇటువంటి సామాజిక వర్గాల క్రియాశీలతపై సమాజాలు ఆశలు పెట్టుకుంటాయి. కానీ ఈ వర్గాలు నిష్క్రియాపరంగా మారటం ఇంకా పెద్ద సమస్య అవుతున్నది. వారికి రాజకీయాలపై ఉన్న ఆసక్తి సమాజం పట్ల కలగటం లేదు. కనీసం ఇప్పటికైనా, ఈ సామాజిక ఉపద్రవం మరింత తీవ్రంగా మారకముందే, ఈ వర్గాలు కళ్ళు తెరవటం అవసరం. లేనట్లయితే, కొంతకాలంగా మారుతున్న కాల పరిస్థితుల ప్రభావాలు పెరిగి సమాజం మరింత ప్రమాదకరం అవుతుంది. టంకశాల అశోక్-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతుచిక్కని అగ్నిశిఖల ముప్పు
దీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఇథియోపియా ఉత్తర ప్రాంతంలోని హేలీ గబ్బి అగ్నిపర్వతం అసాధారణ రీతిలో బద్దలైన ఘటన అనూహ్యంగా ఆందోళనలోకి నెట్టింది. పేలుడుతో అత్యంత భారీగా రేగిన ధూళి మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమన్, ఒమన్ సహా చివరకు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతం నుంచి భారతదేశం వైపు కమ్ముకొస్తూ ఉండడం మన ఆందోళనకు కారణం. ఎదుట ఉన్నదేదీ కనిపించనివ్వని ఆ భారీ దుమ్ము ధూళి ఏకంగా కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణించి వివిధ ఖండాలకు విస్తరించింది. ఇప్పటికే భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాల విమాన ప్రయాణ సర్వీసులకు చిక్కులు తెచ్చింది.ఏం జరిగింది?ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఈశాన్యాన 800 కి.మీల దూరంలో అఫార్ ప్రాంతంలో ఉందీ హేలీ గబ్బి అగ్నిపర్వతం. ముఖ్యంగా భూ ఉపరితలంపై కదిలే పెద్ద శిలల పొరల మీద ఉంది. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ జోన్ కిందకొచ్చే ఆ ప్రాంతంలో అటు ఆఫ్రికన్, ఇటు అరేబియన్ భూ ఫలకాలు ఘర్షించుకుంటూ, ఏటా 0.4 నుంచి 0.6 అంగుళాల మేర పరస్పర వ్యతిరేక దిశలో కదులుతుంటాయి. 12 వేల ఏళ్ళుగా గమ్మునున్నట్టు తోచిన సదరు వాల్కనో ఈ నవంబర్ 23న విస్ఫోటనం చెంది, అనేక గంటలు నిప్పులు విరజిమ్మింది. ఆ ఘటనలో ఎవరూ మరణించలేదు కానీ, ఆ ప్రాంత ప్రజలు, జీవజాలంపై సుదీర్ఘ ప్రభావం ఉండనుంది. ముందస్తు హెచ్చరికలు లేవా?ఇథియోపియాలో దాదాపు 50 అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో అనేకం కొన్ని వేల ఏళ్ళుగా నిద్రాణంగా ఉన్నాయి. నిజానికి, ఈ జూలైలోనే దగ్గరలోని ఎర్తా ఆలె అగ్నిపర్వతం బద్దలైంది. భూగర్భంలో 30 కిలోమీటర్ల కింద అంతశ్శిలాద్రవం చొచ్చుకుపో యింది. భూగర్భ కదలికలతో హేలీ గబ్బి సైతం విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందని సూచనలు అందాయి. గత ఆదివారం అదే జరిగింది. భారీ శబ్దంతో అగ్నిపర్వతం పేలినప్పుడు 14 కి.మీ.ల మేర ఆకాశంలోకి ధూళి మేఘాలు విస్తరించాయి. పర్వతాలంత ఎత్తున గగన భాగాన్ని కప్పేసిన ఆ బూడిద పర్యాటక ప్రాంతాలైన చుట్టుపక్కలి పర్వతప్రాంత గ్రామాలను చుట్టేసింది. దట్టమైన పొగ, గాఢాంధకారంతో గాలి పీల్చడానికైనా లేదు. తాజా ఘటనను బట్టి ఆ అగ్ని పర్వత ప్రాంతం గురించి లోతైన అధ్యయనం జర గనే లేదనీ, ఆ లోటు పూరించాల్సి ఉందనీ తేలింది.ఎంత కష్టం... ఎంత నష్టం...అగ్నిపర్వత భస్మ మేఘాల్లో కరకైన కణాలుంటాయి. లక్షల టన్నుల ఆ కణాలు లోపలికి చొచ్చుకుపోయి విమానాల ఇంజన్లను చెడగొడతాయి. విమానయానం ప్రమాదకరమవుతుంది. 1982లో బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం ఇలానే భస్మ మేఘం గుండా వెళ్ళి 4 ఇంజన్లూ ఆగిపోయాయి. కష్టపడి పావుగంటలో పైలట్లు 3 ఇంజన్లను పునరుద్ధరించేసరికి జనం బతికిపోయారు. మునుపు 2010లో ఐస్ల్యాండ్లో ఓ అగ్నిపర్వతం కొద్ది నెలలు నిరంతరం విస్ఫోటనం చెంది, 11 కి.మీ.ల మేర బూడిదను విరజిమ్మింది. బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను ఈ భస్మ మేఘాలు తాకాయి. బ్రిటన్ 6 రోజులు వైమానిక మార్గాన్ని మూసేయాల్సి వచ్చింది. 95 వేల విమా నాలు రద్దయ్యాయి. యూరప్లో అనేక దేశాలు గగన తలాన్ని మూసేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద వైమానిక షట్డౌన్ అదే! రోజూ 12 లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బ్రిటన్ 145 కోట్ల డాలర్లు నష్టపోయింది.గతిని మార్చేసిన గతం...అగ్నిపర్వత విస్ఫోటనాలంటే ఆషామాషీ కాదు. అవి మానవాళి చరిత్రనే మార్చేసిన ఘట్టాలున్నాయి. 1783 నాటి లకీ విస్ఫోటనంతో యూరప్లో వాన రాకడే మారింది. ఫ్రాన్స్లో ఆకలి మంటలు రేగి, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు ఇండొనేసియాలోని తంబోరాలో విస్ఫో టనం యూరప్లో ఎడతెగని వానలు సహా కొన్నేళ్ళు ప్రపంచ పర్యావరణాన్నే మార్చేసింది. వర్షంతో చిత్తడిగా మారిన నేల వల్లే వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమి పాలయ్యారట. ఏమైనా, ఇప్పుడు హేలీ గబ్బి దెబ్బకు ఆఫ్రికాలోని అతి పెద్ద వైమానిక కేంద్రాల్లో ఒకటైన ఇథియో పియా సహా అనేక ఖండాల్లో విమాన సర్వీసులు ఇరుకున పడ్డాయి. 4 వేల కి.మీ.ల దూరంలో ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, పంజాబ్లకు ఈ ధూమం విస్తరించింది. విమాన సర్వీసులు అనేకం రద్దయ్యాయి. కొద్ది రోజుల్లో ఈ ధూళి తగ్గినా, ఆ మేఘాల్లోని హానికారక వాయువులతో జాగ్రత్త పడక తప్పదు. -
ఫెడరలిజంను బలహీనపరిచే సలహా
తమిళనాడు గవర్నర్ అనేక బిల్లులను, అవినీతి కేసులపై దర్యాప్తు అనుమతి ఫైళ్ళను, ఖైదీల విడుదల ప్రతిపాదనలను నెలల తరబడి నిలిపివేసి పరిపాలనను దెబ్బకొట్టారు. ఇలా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ‘ఇది రాజ్యాంగ విరుద్ధం’ అంటూ గతంలో సూటిగా చెప్పింది. కానీ ఆశ్చర్య కరంగా, అదే అంశంపై, 14 ప్రశ్నలతో రాష్ట్రపతి కోరిన సలహా కేసులో (ప్రెసిడె న్షియల్ రిఫరెన్స్ కేసు) మాత్రం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ పీఠం అందుకు విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. మన రాష్ట్రపతికి ధర్మాసనం అద్భుతమైన ‘సలహా’ రూపొందించింది. ఆ సలహా అర్థం ఇదీ: ఎ) గవర్నర్కు కాల గడువు (టైమ్ లిమిట్) విధించలేం. బి) రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టు ప్రశ్నించలేదు. (సి) గవర్నర్ పరిపాలనను నిలి పేసినా, ఏమీ చేయలేం. ఎంత అన్యాయం? దేశ ప్రధాన న్యాయ మూర్తి తన పదవీ విరమణ చేయడానికి ముందు ఇటువంటి సలహా తీర్పును ఇచ్చి రాజ్యాంగ ఆత్మకు, ఫెడరలిజానికి, పరిపాలనా సమతౌల్యానికి పెద్ద దెబ్బ కొట్టారు.కేంద్ర ప్రతినిధిగా మార్చే పరిస్థితిఈ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సలహా ఎందుకు ప్రమా దకరం? దీనివల్ల ఒక్క తమిళనాడుకే కాదు, ప్రతి బీజేపీయేతర రాష్ట్రంలో కొత్త రాజ్యాంగ సంక్షోభం వచ్చిపడింది. బిల్లులు గవర్నర్ దగ్గరే నెలల తరబడి నిలిచిపోవడం, విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్ నియామకాల్లో పూర్తిగా పక్షపాతం, అవినీతి కేసుల్లో అభియోగ అనుమతులపై నిర్ణయాలు పెండింగ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియా మకాల నిలిపివేత వంటి దారుణమైన వైఫల్యాలకు ఈ సంక్షోభం కారణం కానుంది. అంతా గవర్నర్ ఇష్టం ప్రకారం చేయడానికి ఉంటే ఇక జనం ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించడం సాధ్యమా? ఫైళ్ళు, నియామకాలు అన్నీ ఆగిపోయే పనులను గవ ర్నర్ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఇది రాజ్యాంగా ధికారి అయిన రాజ్ ప్రముఖ్ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మార్చే పరిస్థితి. రాష్ట్రపతి గారు సార్వభౌమ ప్రజల తరఫున పనిచేసే అత్యున్నత రాజ్యాంగాధికారే. కానీ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం వారు నియమించేవారు. (ఎన్నికల్లో గెలవకుండా) ఎంపిక చేయబడినవారే రాజ్ ప్రముఖ్ అవుతారు. ఈ సలహా వంటి తీర్పు వల్ల రాష్ట్రపతినీ, గవర్నర్నూ ఒకే స్థాయిలో గానీ, హోదాలో గానీ (కాన్స్టిట్యూషనల్ పెడెస్టల్) పెట్టడం రాజ్యాంగ ఆత్మను అవమానించడమే!సరైన కాలం అంటే?గవర్నర్ల రాజకీయ పక్షపాతం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెను సమస్యగా మారింది. ‘గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసు కోవాలి’ అని సుప్రీంకోర్టు తన సలహా తీర్పు వెలువరించింది. ఎంత వ్యవధి సమంజసం? ఒక నెల సరైనదా? ఒక సంవత్సరం సరైనదా? మూడు సంవత్సరాలు సరైనవా? ఎవరికీ తెలియదు. ఈ అస్పష్టత రాజకీయ పక్షపాతంతో వ్యవహరించే గవర్నర్లకు పెద్ద ఆయుధం. దీనివల్ల పరిపాలన నిలిచిపోతుంది, లెజిస్లేచర్ సంక ల్పానికి అడ్డుకట్ట పడుతుంది. ప్రజాభిప్రాయం నీరుగారిపోతుంది. గవర్నర్ ‘రబ్బర్ స్టాంప్’ కాదు. కానీ పాలనకు స్పీడ్ బ్రేకర్ అయిపోవడం న్యాయమా? గవర్నర్ బిల్లులను ఆపాలని అనుకుంటే పూర్తిగా ఆపగలిగే అవకాశం కొనసాగుతుంది. ఒకసారి బిల్లును ఆమోదించకుండా అసెంబ్లీకి తిప్పిపంపిన తరువాత, మళ్లీ అదే బిల్లును పంపితే గవర్నర్ వెంటనే ఒప్పుకోవాలి. కానీ ఆ పనీ చేయ కుండా, రాష్ట్రపతికీ పంపకుండా వదిలేస్తూ పోతూ ఉంటే పరిపాలన స్తంభించిపోతుంది. ఈ లోగా అయిదేళ్ల పాలన ‘కాలధర్మం’ చెందు తుంది. బిల్లులు, చట్టాలను నిష్క్రియ, ఆలస్యాలతో చంపేస్తారా? చేతలలో చంపరు. కానీ తిండి ఇవ్వక వదిలేస్తే వాడే చస్తాడు అన్నట్టుంది. ఫెడరలిజంపై చావు దెబ్బసమాఖ్య విధానంలో కేంద్రం–రాష్ట్రాల మధ్య సంబంధాలు సమతౌల్యంగా ఉండటం కీలకం. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సలహా (అడ్వైజరీ ఒపీని యన్) రాష్ట్రం ఆమోదించిన బిల్లులను... రాష్ట్ర ప్రజా మద్దతుతో వచ్చిన లెజిస్లేచర్ బిల్లులను, గవర్నర్ ఒకరే నెలల తరబడి అడ్డుకునే పరిస్థితిని అన్యాయంగా రాజ్యాంగబద్ధం చేసిపెట్టింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. కేంద్ర అధికారుల అతి చర్యలను బలపరుస్తుంది. అంతేగాక ఫెడరలిజం మూల సూత్రానికి విరుద్ధం అవుతుంది. ఈ సలహా తీర్పులో ‘‘రాజ్యాంగాధికారులు తమ విధులు నిర్వ ర్తించకపోతే కోర్టు నిష్క్రియగా ఉండదు’’ అని చెప్పడానికి బాగానే ఉంది. కానీ దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఈ సలహా వినాల్సిన అవసరం లేదు. గడువు (టైమ్ లైన్) పెట్టలేమనీ, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి నిర్ణయాలను ప్రశ్నించలేమనీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కచ్చితంగా అటువంటి అధికారాలను వాడుకుంటాయి. అంటే, మన సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సమస్యను గుర్తించినప్పటికీ, పరిష్కారాన్ని చూపలేదన్న మాట! ఇది ఫెడరల్ రాజ్యాంగ సంక్షోభ నివారణకు సరైన మార్గం కాదు.గవర్నర్ తన ఇష్టానుసారం ఆలస్యాలు చేయడం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. ప్రజాస్వామ్య సంకల్పాన్ని, రాష్ట్రాల పరిపా లనను అణగదొక్కడం అవుతుంది. అధికారాలను సరిగ్గా సమంగా విభజించే సిద్ధాంతాన్ని వక్రీకరించడం అవుతుంది. ఇది రాజకీయ అవినీతి మాత్రమే కాదు. రాజ్యాంగ అనైతికం కూడా అవుతుంది. ఈ అవినీతిని ఆపడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సలహా తీర్పు ప్రభావంతమైన పరిష్కారం ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో రాష్ట్రపతి పాత్ర అత్యంత కీలకం. ఆర్టికల్ 143 కింద ఇచ్చే కోర్టు సలహా బైండింగ్ కాదు. అందుకే రాజ్యాంగాన్ని మనస్సాక్షి ప్రకారం, నమ్మిన దేవుడి ముందు ప్రమాణం చేసిన అత్యున్నతాధికారి అయిన రాష్ట్రపతి గారూ! మీ ప్రమాణాన్ని గుర్తు చేసుకోండి. మీరు మన రాజ్యాంగపు ఆత్మను రక్షించవలసిన బాధ్యత కలిగినవారు. ఫెడరల్ సమతౌల్య తను, ప్రజాస్వామ్య కర్తవ్యాలను పరిరక్షించవలసి ఉంటుంది. కనుక రాజ్యాంగ విరుద్ధమైన, ఫెడరలిజాన్ని బలహీనపరిచే ఈ అడ్వై జరీ ఒపీనియన్ను తిరస్కరించడం రాష్ట్రపతి ప్రాథమిక రాజ్యాంగ బాధ్యత.మాడభూషి శ్రీధర్-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
లేబర్ కోడ్ల పరమార్థం ఏమిటి?
భారత్ కొత్త కార్మిక శకంలోకి ప్రవేశించిందనీ, ఇకపైన కార్మిక నిబంధనలు మారటంతో పాటు వారి సంక్షేమం మెరుగుపడుతుందనీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను క్రమబద్ధీకరించి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ప్రారంభించారు. ‘వికసిత భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ సంస్కరణ లక్ష్యంగా పేర్కొన్నారు. వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తిపరమైన భద్రత, హెల్త్, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ (2020) అనే ఈ నాలుగు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కార్మికుల ఉపాధికి, సామాజిక భద్రతకు వీటి ద్వారా పెద్దపీట వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.పీవీ నరసింహారావు నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతినాయకుడూ పాత కార్మిక చట్టాలు అభివృద్ధికి అవరోధం అంటు న్నారు. అయితే సంస్కరణల విషయంలో ముందడుగు వేయలేక పోయారు. 1999లో కార్మిక చట్టాల సవరణకు ఉద్దేశించిన రెండో నేషనల్ కమిషన్... వివిధ చట్టాలలో ఉన్న అసమతౌల్యాన్ని గుర్తించింది. ఒకే అంశానికి సంబంధించిన నిర్వచనాలు ఒక చట్టంలో ఒక రకంగా, ఇంకో చట్టంలో మరో రకంగా ఉండటాన్ని ప్రస్తావించింది. చివరకు పరిస్థితి ఎలా తయారైంది అంటే... ‘కనీసం 20 శాతం నిబంధ నలను విస్మరించకపోతే 100 శాతం కార్మిక చట్టాలను అమలు చేయటం కష్టం’ అన్న అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు మన కార్మిక విధానాల్లో సంక్లిష్టత; చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లతో పోలిస్తే ఉండే తేడాలపైన చాలా కాలంగా చర్చ సాగుతోంది.కోవిడ్ సమయంలో తగినంత ఉద్యోగ భద్రత లేక ఉపాధి కోల్పోయి వీధిన పడిన కుటుంబాలు కొత్త కార్మిక చట్టాలను స్వాగ తిస్తున్నాయి. కార్మికులకు తప్పనిసరిగా అప్పాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం. అందరికీ సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అంటే... పీఎఫ్, ఈఎస్ఐసీ, బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తారనే అంశాన్ని ప్రశంసిస్తున్నాయి. 40 ఏళ్లకు పైనున్న వారికి ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించాలనీ, యాజమాన్యాలు తమ వార్షిక ఆదాయంలో 1 నుంచి 2 శాతాన్ని సామాజిక భద్రత కవరేజ్కి వెచ్చించాలనీ ప్రభుత్వం నిబంధన విధించింది. అలాగే కార్మికులకు ఆధార్తో జత చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. ఏ రాష్ట్రంలో ఉన్నా ... వారు ఒకే రకమైన ప్రయోజనాలను పొందగలుగుతారు.ఏడాది పాటు పనిచేసినా గ్రాట్యుటీ వంటి సౌకర్యాలను అందు కోగలుగుతారు. మహిళలు నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారు. అందుకు అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘సోషల్ సెక్యూరిటీ కోడ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించింది. దాంతో కేంద్ర కార్మిక శాఖ ‘ఈ–శ్రమ్’ పోర్టల్లో 15 లక్షల మంది నమోదయ్యారు. మొత్తంగా 40 కోట్ల మంది దీని ద్వారా ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణ మరేదీ లేదని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇది కార్మి కుల్లో సాధికారతను పెంచటమే కాదు, నిబంధనలను సరళతరం చేసి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను ప్రమోట్ చేస్తుందని అంటు న్నారు. అయితే, దీని వెనక పెద్ద కుట్ర ఉందనీ, కార్మికుల చేత వారా నికి 12 గంటలు పని చేయించాలనే ప్రణాళిక ఉందనీ ట్రేడ్ యూని యన్లు ఆరోపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే వారానికి 70గంటలు పనిచేస్తే తప్ప ప్రపంచ దేశాలతో పోటీపడలేమని మేధావి వర్గం చెబుతూ వస్తున్న మాటలను ఉటంకిస్తున్నాయి. – డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
‘పరిష్కారం’ దారులు తెరవాలి!
ఏది సమస్య? ఏది పరిష్కారం? మధ్య భారతంలో ముఖ్యంగా అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న వామపక్ష ఉద్యమాలు–తీవ్రవాదం, హింస –ప్రతిహింస విషయంలో ఇటీవలి పరిణా మాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. హింస ఆగటం లేదు, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. మౌలిక సమస్యను పరిష్కరించకుండా జరిపే ప్రక్రియ అర్థంలేని గమ్యం వైపు సాగుతోందన్నది ఈ ఆందోళనకు కారణం. ముఖ్యంగా మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన ‘హిడ్మా’ మరణానంతరం చర్చ తీవ్రస్థాయికి చేరింది.వచ్చే (2026) మార్చి మాసాంతానికి నక్సలైట్లను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. హింస ఏదైనా హింసే! చావులు ఎటువైపున జరిగినా క్షోభ తప్ప దనేది జనాభిప్రాయం! కూంబింగ్ ఆపితే ఆయుధాలు వీడుతామనే కొత్త మాట మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి తాజాగా మొదలైంది. మధ్య భారతంలోని మూడు (ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహా రాష్ట్ర) రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు లేఖలు రాసినట్టు వార్తలొస్తున్నాయి.ఇదే అదనుగా, ఆయుధాల అంశం బెట్టు చేయ కుండా కేంద్రం చొరవ తీసుకోవాలి. చర్చలతో శాంతి సాధనకు యత్నిస్తూనే, నక్సలైట్ల ఎజెండా అంశాల్ని పరిష్కరించాలి. నక్సలైట్లు లేవనెత్తే సమస్యల్ని ‘సామాజికార్థికాంశం’గా చూడకుండా, ‘నక్స లైట్ల’నే శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వాలు పరిగణించడం వల్ల పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ‘హిడ్మా’ ఎందుకు హీరో అయ్యాడు?వరుస ప్రభుత్వాల వైఫల్యం దృష్ట్యా సమస్యల పరిష్కారానికి ఆయన నిలబడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులను, సాయుధ బలగా లను, రాజ్యాన్ని ఎదిరించాడు. ఉద్యమం వల్ల లభించిన పుష్కల అవకాశాలతో ఇంటికో, తల్లికో, తనకో, తన వారికో ఏదీ చేసుకో కుండా ఆదివాసీల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఆయన త్యాగానికి మరణానంతరమూ విశేష ఆదరణ లభించింది. ఇపుడు హిడ్మాను హతమార్చారు. రేపు మిగతా నక్సలైట్లను లొంగదీసు కోవడమో, చంపడమో చేస్తారు.అది, కొంత మేరకే సమాధానం. మౌలికమైన ప్రజల సమస్యకు పరిష్కారం కాదు. నక్షత్రాల స్థానాలు –కదలికల ఆధారంగా రూపొందించే పంచాంగాలను బట్టి ముహూ ర్తాలు, శకునాలు చెబుతారు. ఆవేశంతో ఎవరో పంచాంగాలు చింపేయడమో, కాల్చేయడమో చేసినంత మాత్రాన అంతా అయి పోతుందా? నక్షత్రాలుంటాయి కదా. అవి కదా మూలం! ఉద్యమకారుల్ని చంపేయడం, ఉద్యమాల్ని అణచివేయడం కాకుండా, ఉద్యమాలు తలెత్తడానికి కారణమవుతున్న మౌలికాంశాల్ని సరిదిద్దడం ద్వారా ఉద్రిక్తతల్ని, అశాంతిని నిర్మూలించాలి. ఇదే విషయాన్ని అత్యున్నత నిపుణుల కమిటీ 2008లోనే చెప్పింది.అజిత్ దోవల్ సభ్యుడే!మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు కలిసిన అటవీ, ఆదివాసీ ప్రాంతాల్లో వామపక్ష హింసను రూపుమాపి, అభివృద్ధికి దోహద పడాలంటే ఏం చేయాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం జరిపించింది. అశాంతి స్థానే శాంతి వెల్లివిరియాలంటే కేంద్రం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనీ, నక్సలైట్ల నిర్మూలన మాత్రమే ఇందుకు పరిష్కారం కాదనీ ఈ నిపుణుల కమిటీ 2008లోనే నివేదించింది.నక్సలైట్ల హింసకు విరుగుడుగా స్థానిక ఆదివాసీ యువకులతో ‘ఎదురుదాడుల’ కోసం ప్రభుత్వ బలగాలు ఏర్పాటు చేసిన సాయుధ ‘సాల్వాజుడుం’ను 2011లో సుప్రీంకోర్టు నిషేధించడానికి మూడేళ్లు ముందరే, ‘ఆ వ్యూహం, అటువంటి ఆచరణ తప్పు’ అని ఈ కమిటీ నిర్ద్వంద్వంగా చెప్పింది. నివేదికను రూపొందించిన డ్రాఫ్టింగ్ సబ్ కమిటీలో తెలుగు వాడైన దివంగత హక్కుల కార్యకర్త, న్యాయవాది కె. బాలగోపాల్ కీలకపాత్ర పోషించారు.కేంద్ర ప్రణాళికా సంఘం 2006లో, డి. బంధోపాధ్యాయ (కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్) అధ్యక్షతన 16 మంది సభ్యులతో ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ‘అసంతృప్తి, అశాంతి, తీవ్రవాదం– అభివృద్ధికి అవరోధం’ అంశంపై అధ్య యనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ‘నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి సవాళ్లు’ పేరిట ఇచ్చిన సుమారు 90 పేజీల నివేదిక ఇది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల ప్రతిపాదనలతో, 20 పేజీల మేర ఇందులో ‘నిర్దిష్ట సిఫారసులు’న్నాయి. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ‘జాతీయ భద్రతా సలహాదారు’ అజిత్ దోవల్ (మాజీ కేంద్ర నిఘా సంస్థ) ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ (పౌర స్పందన వేదిక కన్వీనర్), ఐపీఎస్లు సహా పలు ఇతర రంగాల వారు సభ్యులుగా ఉన్నారు.ఉద్యమాలకు తావీయొద్దు!అటవీ, అదివాసీ ప్రాంతాల్లో, బడుగు–బలహీనవర్గాల్లో ప్రజా సమస్యల్ని ప్రభుత్వమే పరిష్కరిస్తూ, జన బాహుళ్యంలోకి నక్సలైట్లు చొరబడే, వారి మద్దతు కూడగట్టే ఆస్కారం లేకుండా చేయాలని నిపుణుల కమిటీ కేంద్రానికి సూచించింది. దేశంలో వామపక్ష తీవ్ర వాదం ఒక దశలో, ‘ముఖాముఖి యుద్ధ’ పరిస్థితికి వెళ్లింది. యుద్ధంలో వలెనే, ఎవరికి వారు వ్యూహ–ప్రతివ్యూహాలతో ఎదుటి వారి బలహీనతల్ని సొమ్ముచేసుకునే ఎత్తుగడలూ పన్నారు. పాలనా వైఫల్యాలు, సంక్షేమాభివృద్ధి లేమి, హక్కుల హననం, సహజ వనరుల దోపిడీ వంటి పరిస్థితుల్ని సానుకూలంగా మలచుకొని నక్స లైట్లు ప్రజల మద్దతు కూడగట్టారు.కొన్నిచోట్ల ప్రభుత్వ సాయుధ బలగాలను మించి బలోపేతమయ్యారు. నక్సలైట్లలో గ్రూపులు, అనైక్యత, సిద్ధాంత క్షీణత, స్వార్థ–లంపెన్ శక్తుల ప్రవేశం... వంటి పరిస్థితుల్ని పోలీసు, మిలిటరీ, ప్యారా మిలిటరీ బలగాలు తమకు అనుకూలంగా మలచుకొని ఆధిపత్యం సాధించాయి. ఈ ఆధిపత్య పోరులో హింస పెరిగి, అశాంతి తీవ్రంగా ప్రబలింది. దీనిపై అధ్యయనం తర్వాత నిపుణుల కమిటీ అయిదు ఛాప్టర్లుగా నివేదిక ఇచ్చింది. ‘పెసా’, భూగరిష్ఠ పరిమితి వంటి ప్రస్తుత చట్టాల పకడ్బందీ అమలు, జీవనోపాధుల కల్పన, సాంఘిక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల లోపరహిత అమలు.. ‘సాల్వా జుడుం’ వంటి రాజ్యాంగేతర సాయుధ దళాలు కాకుండా రాజ్యం తన బాధ్యతను రాజ్యాంగ పరిధిలో నిర్వహించడం, మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుల్ని సత్వరం పరిష్కరించడం, పాలనను మానవీకరించి ఆదివాసీల సమస్యలు, ఫిర్యాదుల్ని ఎప్పటి కప్పుడు పరిష్కరించడం వంటి చర్యల్ని చేపట్టాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రజలకు దన్నుగా నక్సల్స్ చేస్తున్న పనుల్ని ప్రభు త్వమే ముందు చేసి వారికి జనహృదయాల్లో తావు లేకుండా చేయా లని కమిటీ సూచించింది. ఇవన్నీ చిత్తశుద్ధితో చేపడితే, అసమాన తలు కొంతైనా తొలగి ఉద్యమాలకు తావులేని వాతావరణం ఉంటుందని ప్రభుత్వాలు గ్రహించాలి.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్ -
‘శ్రమదోపిడీ లేని భారత్’ కావాలి!
2026 మార్చ్ 31 నాటికి, ‘నక్సలిజం లేని భారత్ని ఏర్పాటు చేస్తాము’– అని, దేశ ప్రధానీ, హోమ్ మంత్రీ కూడా పదే పదే ప్రకటిస్తున్నారు. నక్సలైట్లు ‘లొంగే వరకూ, లేదా పట్టుబడేవరకూ, లేదా నిర్మూలనం అయ్యేవరకూ, తమ ప్రభుత్వం నిద్రపోదు’ అని కూడా ప్రక టించారు. అందుకోసం అనేక రకాల పేర్లతో, పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఆ పేర్లలో ఒకటి ‘కోబ్రా’ (నాగు బాము) దళం, ఇంకోటి ‘గ్రే హౌండ్స్’ (వేట కుక్కల) దళం. ‘గ్రే హౌండ్స్’ అనేవి ఒక జాతి కుక్కలు. ప్రాచీన ఈజిప్టులో, వేటల కెళ్ళినప్పుడు, జంతువుల్ని పట్టెయ్యడానికి, ఆ కుక్కల్ని ఉపయోగించేవారట!ఇప్పుడు, నక్సలైట్లని పట్టుకోవడానికి, పోలీసు దళాల్ని అదే పేరుతో ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నారు! నిన్న గాక మొన్న, ఈ పేరుగలిగిన పోలీసు దళం వాళ్ళే, ఆదివాసీల తరఫున పోరాడు తున్న నక్సలైట్ల నాయకుల్ని చాలా మందిని చంపేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చదివాక, నాకు వచ్చిన ఆలోచనలు కొన్ని ఇవి:పరస్పర శత్రుత్వం వెనక...(1) నేను తెలుగులో, 1978లో, పరిచయం చేసిన ‘అంకుల్ టామ్స్ కేబిన్’ (‘టామ్ మామ ఇల్లు’) అనే ఒక ఇంగ్లీషు నవలలో చదివిన ఒక ‘వ్యాపార ప్రకటన’ ఈ సందర్భంలోనే కాదు, ఎప్పుడూ గుర్తే వస్తుంది. అమెరికాలో, నీగ్రోల బానిసత్వం కొనసాగుతున్న కాలంలో, బానిసలుగా ఉండటం ఇష్టం లేని శ్రామికులు పారిపోతే, వారిని వెతికి పట్టుకోవడానికి, వారి యజమానులు నిజం వేట కుక్కల్ని వాడేవారు. వాటికి సంబంధించినదే ఆ వ్యాపార ప్రకటన! దాని హెడ్డింగు: ‘నీగ్రో కుక్కలు!’ ఆ ప్రకటనలో ఇలా వుంది:‘‘నగర వాసులందరికీ, ఈ క్రింద సంతకం చేసిన వ్యక్తి విన్నవించుకొనేదే మనగా– ‘నేను మన్రో రోడ్డులో తూర్పున రెండున్నరమైళ్ళ దూరాన నివసిస్తున్నాను. నా దగ్గిర, నీగ్రోల్ని పట్టుకోడానికి చాలా మంచి కుక్కలు ఉన్నాయి! పారిపోయిన నీగ్రోల్ని పట్టుకోవాలని కోరే వ్యక్తులు నాకు ఒక్క పిలుపు ఇస్తే చాలు. నేను వేటకెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో నా నివాసంలోనే ఉంటాను. నేను లేక పోయినా, నా నివాసం దగ్గర నా సమాచారం మీకు అందుతుంది. నీగ్రోని పట్టుకున్న కుక్క కోసం– 25 డాలర్లు. నీగ్రోని పట్టుకోక పోతే 5 డాలర్లు మాత్రమే’. – ఇట్లు, గాఫ్. ఫిబ్రవరి 17, 1852.’’ – ఇదీ ఆ ప్రకటన!ఎంత ఆశ్చర్యం! అక్కడ, ఆ నాడు, 170 ఏళ్ళనాడు, స్వేచ్ఛ కోసం పారిపోయిన బానిసల్ని పట్టుకోవడానికి, ఆ నాటి బానిస యజమానులు వేటకుక్కల్ని ఉపయోగించారు. ఈనాడు, ఉద్యమ కారులు తప్పించుకుంటూ, ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి, భద్రమైన స్థలాలకు వెళ్తూ వుంటే, ఈ ప్రభుత్వ పాలకులు, వేట కుక్కల పేరుతో వున్న పోలీసుల దళాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ పోలీసుల గురించి, కవి చెరబండరాజు, ఒక పాటలో ఇలా చెప్పాడు: ‘‘మాలోని మనిషివే! మా మనిషివే నీవు!/ పొట్ట కూటికి నీవు పోలీసువైనావు!’’ నిజానికి పోలీసులంటే ఎవరు? వారూ మానవులే! శ్రామిక కుటుంబాలనించీ వచ్చిన వారే! సైనికుల లాగే, యజమానులు ఆజ్ఞాపించే ‘బలప్రయోగం’ అనే శ్రమ చేస్తూ, వచ్చిన జీతాలతో బతుకుతారు.ఈ పోలీసుల గురించి, మార్క్స్ మాటల్లో చెప్పాలంటే, ‘‘తప్పుడు సామాజిక సంబంధాల కారణంగా దోపిడీ సమాజానికి అవసరమైన అనుత్పాదక శ్రామి కులు.’’ అంటే, ‘శ్రమ దోపిడీ’ అనే తప్పుడు సామాజిక సంబంధాల వల్లే, సమాజంలో వర్గాలూ, వర్గాల మధ్య ఘర్షణలూ తలెత్తు తాయి! వాటిని నివారించడానికీ, శ్రమ దోపిడీని సాఫీగా సాగ నివ్వడానికీ నిరంకుశ ప్రభుత్వాలు, సాయుధ భటులతో అణిచి వేయడం అన్నది బానిస యజమానుల కాలం నించీ వస్తున్నదే! ఆనాటి సాయుధ భటులకు బదులుగా ఈ నాడున్నది ‘పోలీసులు’! పత్రికల్లో, ఈ వార్తలు చదివే పాఠకులు గ్రహించ వలిసింది ఏమిటంటే: ఆ నాడైనా, ఈ నాడైనా, పాలకులు, ప్రజల్లోనే వున్న రెండు భాగాలను, (వృత్తి ధర్మం పేరుతో, ఇటు పోలీసులనూ; శాంతి భద్రతల పేరుతో, అటు శ్రమ దోపిడీని అడ్డుకునే నక్సలైటు ఉద్యమకారులనూ) శత్రువులుగా నిలబెట్టి, పరస్పరం సంఘర్షించు కునేలా చేస్తారు!ఆ సంఘర్షణలో, ప్రాణాలు పోగొట్టుకునేది ఇటు పోలీసులూ, అటు ఉద్యమకారులూనూ. ఇరు పక్షాల కుటుంబాలూ ఎంతో క్షోభని అనుభవిస్తాయి! బిరుదులతోనూ, ఎవార్డులతోనూ, రివార్డులతోనూ, ఆ క్షోభని తగ్గించలేరు! అందుచేత, సమాజం బాగుపడాలని కోరుకునే ఎవ్వరైనా అనుకోవలిసింది: ‘నక్సలిజం లేని భారత్ కాదు, శ్రమ దోపిడీ లేని భారత్’ కావాలి!– అని.విమర్శకు అతీతులా?(2) ‘మరి నక్సలైట్లు అనుసరించే రాజకీయ పంథాని విమర్శించవద్దా’ అని ఎవరైనా అడగవచ్చును. తప్పులున్నప్పుడు, తప్పకుండా విమర్శించవలిసిందే! ‘మావోయిస్టులూ! మీ అంతిమ లక్ష్యం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా, మంచిదే! కానీ ఎన్నెన్నో పోరా టాల తర్వాత, తప్పనిసరిగా చెయ్యవలిసి వచ్చే ‘ఆయుధాల’ పోరా టాన్ని, ప్రారంభంలోనే మొదలు పెడితే, మీది ‘వామపక్ష బాలా రిష్టమే’ అవుతుంది – అని విమర్శించవలిసిందే! దీన్ని బట్టి రాజ కీయంగా, నక్సలైట్లు ఇంకా శైశవ దశలోనే వున్నారనుకోవాలి. ఒక హిందీ కవి శిశువుల గురించి ఇలా చెపుతాడు: ‘శిశువు పడుతూ, పడుతూ, నడవడం నేర్చుకున్నాడు! శిశువు ఏడుస్తూ, ఏడుస్తూ, నవ్వడం నేర్చుకున్నాడు!’ (‘శిశూ నే గిర్ గిర్ కర్, చల్నా సీఖా! రో రోకర్, హస్నా సీఖా!). భవిష్యత్తులో ఈ ఉద్యమకారులు కూడా శిశువుల లాగే నేర్చుకుంటారని ఆశించాలి.ఏం మారిందని?(3) ఇంకో వార్త! లొంగిపోకుండా తప్పించుకు తిరిగే ఉద్యమ కారులకు, వారి తలకి కొంత వెలకట్టి, వారిని పట్టిచ్చిన వారికి కొన్ని లక్షల బహుమతీ, ఒక ఉద్యోగమూ ఇస్తామని ప్రభుత్వ ప్రక టనలు కూడా వున్నాయి. (‘ది ఎకనామిక్ టైమ్స్’, 16–4–2024). ఇలాంటి ప్రకటనలు, అమెరికాలో బానిసత్వం వున్న రోజుల్లో (1619–1865), కూడా వున్నట్టు, ‘అంకుల్ టామ్స్ కేబిన్’ నవల చెపుతుంది. ఆ ప్రకటన హెడ్డింగు: ‘25 డాలర్ల బహుమానం!’ ప్రకటన ఇలా వుంది: ‘‘అక్టోబర్ 17న బానిస ఒకడు పారిపోయాడు.పేరు యాలెన్. వయస్సు 23 సం.లు. ఎత్తు 6 అడుగులు. రంగు ములాటో. కుక్క పీకిన మచ్చలుంటాయి. లావెల్ పాంటూ, కాటన్ షర్టూ ఒంటి మీద ఉన్నాయి. బాగా చదవలేడు. చిన్న చిన్న పదాలు రాస్తాడు. చిన్న చిన్న లెక్కలు చేస్తాడు. మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉంటాడు. తొందరగా మాట్లాడుతాడు. జైల్లో పెట్టి, నాకు తెల్పండి. ఇట్లు – చీతం, నవంబరు 6, 1852.’’ అంటే, యజమానుల కోసం పనిచేసే ప్రభుత్వాల చర్యల్లో అప్పటికీ, ఇప్పటికీ ఏదైనా తేడా వుందా? ఎప్పుడో, 175 ఏళ్ళ నాడే, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’లో చెప్పినట్టు, ‘‘ప్రభుత్వం అనేది, పెట్టు బడిదారీ వర్గపు ఉమ్మడి వ్యవహారాలను నిర్వహించే కమిటీ మాత్రమే!’’రంగనాయకమ్మ వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి -
సోషల్ ఇంజినీరింగ్పై దృష్టి పెట్టాలి!
ఏ ఉద్యమమైనా, సామాజిక సంస్థ అయినా, రాజకీయ పార్టీ అయినా – సమా జంలోని అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం వహించేలా నాయకత్వాన్ని రూపొందించడానికి ‘సోషల్ ఇంజినీరింగ్’ ముఖ్య సాధనం. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న రోజులవి. తిరుపతిలో జరిగిన ఒక పార్టీ సమావేశంలోని మరచిపోలేని అనుభవం గుర్తుకు వస్తున్నది. సమావేశం మధ్యలో ఒక కార్యకర్త లేచి నిలబడి, వేదిక మీద కేవలం అగ్రకులాలకు చెందిన నాయకులే ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించాడు. నేను కూడా ఆ వేదిక మీదే ఉన్నాను. నిజమే – వేదిక మీద ఉన్నవారంతా అగ్రకులాలకు చెందినవారే. ఆ కార్యకర్త ప్రశ్న నా హృదయాన్ని తాకింది. అది పరిశీలించదగిన, స్పందించదగిన ప్రశ్నగా అనిపించింది.2003 వరకు అదే బాధ్యతలో ఉన్నంత కాలం ఈ అంశాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో నేను కృషి చేశాను. అనేక వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను. సమాజాభివృద్ధి కోసం పనిచేసే ప్రతి సంస్థ, ప్రతి ఉద్యమం ఈ సూత్రాన్ని తప్పనిసరిగా అనుసరించాలి కూడా!ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా ఉన్నంత మాత్రాన కుగ్రామంలోని బీసీ యువకుడికి ఆర్థికంగా పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చు. కానీ మనవాడే ప్రధాని అన్న గర్వంతో, సంతృప్తితో అతని కళ్లు మెరిసిపోతాయి. ఈ విష యాన్ని విస్మరించి ముందుకు సాగే సంస్థలు, ఉద్యమాలు ఎప్పటికీ విజయవంతం కాలేవనేది నా గట్టి నమ్మకం.తెలివితేటలు, చిత్తశుద్ధి, పట్టుదల, త్యాగనిష్ఠ – ఇవి ఏ ఒక్క కులానికో పరిమితం కావు. అన్ని కులాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ ఈ లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తులు ఉన్నారు; ఉంటారు. వారిని గుర్తించి, ప్రోత్సహించి, వివిధ బాధ్యతల్లోకి తేవడమే నిజమైన నాయకుడి సమర్థత. కానీ ఇది ఎందుకు జరగడం లేదు? తీవ్రవాద ఉద్యమాల్లో అగ్రకులాల ఆధిపత్యం గురించిన చర్చ గట్టిగానే జరి గింది. సోషల్ ఇంజినీరింగ్ను అమలు చేయకపోవడమే అందుకు కారణం. సమాజం సజావుగా, శాంతియుతంగా ముందుకు సాగాలంటే రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలకే పరిమితం కాకూడదు; ప్రైవేటు వ్యాపార సంస్థల్లోనూ ఇవి అమలు కావాలి. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు వస్తే క్వాలిటీ పడిపోతుంది అని వాదిస్తారనడంలో అనుమానం లేదు; కానీ అది వాస్తవం కాదు. ఇటీవల వార్తల్లో ‘ఆపరేషన్ కగార్’ ప్రధానాంశంగా నడుస్తు న్నది. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపించిన పేరు – హిడ్మా.ఎందరో సీనియర్ నాయకులు ఎన్కౌంటర్లలో మరణించినా, లొంగి పోయినా హిడ్మా పేరు మాత్రమే ఇంతటి సంచలనం సృష్టించింది. కేవలం 5వ తరగతి మాత్రమే చదివిన ఒక గిరిజనుడైన హిడ్మాలో అపారమైన మేధ, వ్యూహాత్మక దక్షత, అసాధారణ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. హిడ్మా ఎన్ను కున్న హింసాత్మక మార్గాన్ని నేను వందశాతం ఖండిస్తాను. కానీ ఆ గిరిజన యువకుడిలో ఉన్న అసామాన్య సమర్థతలు, చిత్తశుద్ధి, లక్ష్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యం – వీటిని గుర్తించక తప్పదు కదా! సమాజంలోని అన్ని కులాల్లోనూ, అన్ని వర్గా ల్లోనూ ఇలాంటి యోగ్యులు ఉంటారనడంలో సందేహం లేదు. వారిని గుర్తించి, తగు శిక్షణ ఇచ్చి, అవకాశాలు కల్పిస్తే – ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయం సిద్ధిస్తుంది.పి. వేణుగోపాల్, వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ ఛైర్మన్pvg2020@gmail.com -
ఓట్ల పర్యాటకాన్ని ఆపేయాలి!
బిహార్లో పేరు నమోదు చేయించుకుని అక్కడ ఓటు వేసేందుకు ఢిల్లీ, హరియాణా లాంటి రాష్ట్రాల నుంచి వేలాది ఓటర్లు తరలివెళ్లినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఢిల్లీ జాబితా నుంచి తన పేరు కొట్టేయించుకుని, బిహార్లో నమోదు చేసుకున్నారంటూ ఇందుకు ఉదాహరణగా మార్మోగింది. ఇది నిజ మైతే, ఇది చట్టవిరుద్ధమైన ఆచారం.మీ ‘సాధారణ నివాస స్థలం’ ఏదో అక్కడే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి. భారత ఎన్నికల చట్టాలు ఈ విష యాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. మీ ఇల్లు, సొంతూరి మీద మీ ప్రేమ... ఇవేవీ ఓటు హక్కు పొందడానికి అర్హతలు కావు. మీరు వాస్తవంగా నివసిస్తున్న చోటు మాత్రమే మీ సాధారణ నివాసం అవుతుంది.సాధారణ నివాసమే ప్రాతిపదికప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 19 ప్రకారం, ఒక వ్యక్తికి తను ‘సాధారణ నివాసి’గా ఉన్న నియోజక వర్గంలో మాత్రమే ఓటరుగా నమోదు చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. 17, 18 సెక్షన్లు మరో రెండు నిబంధనలను జత చేశాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదు కాలేరు. ఒకే నియోజకవర్గంలోనూ ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు అయ్యే వీల్లేదు. ఈ రెండు నిబంధనలూ మార్చడానికి వీల్లేనివి (నాన్–నెగోషియబుల్). ‘సాధారణ నివాసి’ అంటే ఏమిటో సెక్షన్ 20 వివరిస్తుంది. సొంత ఆస్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రదేశంలో సాధారణ నివాసి కాలేరని ఇది స్పష్టం చేస్తోంది. సాధారణ నివాసం అనేది వాస్తవ ఆధారితంగా ఉంటుంది. నిరంతరం అక్కడే ఉంటున్నారా, లేదా అన్నది ప్రధానం అంటే, మీరు స్వతహాగా అక్కడ ఉంటారు, మున్ముందు కూడా అక్కడే ఉండాలనుకుంటారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నా నివాస హోదా మారదు. చివరిగా, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవి తప్పుడు ప్రకటనలు అవుతాయో సెక్షన్ 31 చెబుతోంది.కొత్త ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వేరే చోట అప్పటికే తన పేరు నమోదై ఉన్నదనే వాస్తవం దాచిపెట్టడం క్రిమినల్ నేరం. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే వీలుంది. పని నిమిత్తమో, పర్యటనల నిమిత్తమో వేరే ప్రదేశానికి వెళ్లి తాత్కాలికంగా చిరునామాలో లేనంత మాత్రాన అక్కడి ఓటు హక్కు పోదు. అది కొన్ని వారాలు లేనందున పోయేదీ కాదు, పోలింగ్ ముందు అక్కడకు రాగానే వచ్చేదీ కాదు! ఆరు నెలల వ్యవధిని సాధారణ నివాసం కింద భారత ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.వ్యూహాత్మక తరలింపులను ఆపాలి!ఓటర్లను బస్సుల్లో తరలించి వలస వెళ్లిన వారంటూ వారి పేర్లను జాబితాల్లో నమోదు చేయడం, తర్వాత ఢిల్లీ లేదా హరి యాణాలో మళ్లీ నమోదు చేయించాలని ప్లాన్ చేయడం ప్రజా ప్రాతి నిధ్యాన్ని పక్కదారి పట్టించడమే! ఆ ప్రాంతంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, రోడ్లు, పోలీసు వ్యవస్థలను వినియో గించుకునే సాధారణ నివాసుల అభిమతం నియోజకవర్గ ప్రాతి నిధ్యంలో ప్రతిబింబిస్తుందని రాజ్యాంగం తలుస్తోంది. జరుగుతున్న ఈ తరలింపుల ప్రహసనం అందుకు భిన్నం.వాస్తవంగా వలస వెళ్లిన కార్మికుల, విద్యార్థుల ఓట్ల నమోదును కష్టతరం చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు చేయ వలసిందల్లా నిజమైన వలసల నుంచి వ్యూహాత్మక తరలింపులను వేరు చేయాలి. ఈ దిశగా అనుసరించదగిన అయిదు మార్గాలు: (1) నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాత ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో సాధారణ నివాసం ఉండటం లేదని తేలితే ఆ వ్యక్తి పేరు జాబితా నుంచి తొలగించడానికి చట్టం ఇప్పటికే వీలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇరుగు పొరుగువారి ప్రకటనలను తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. ఇంట్లో ఉంటున్నదీ లేనిదీ ధ్రువీకరించాలి. సంతకం చేసి నివేదికలు సమ ర్పించాలి. ఈఆర్ఓలు ప్రతి కేసుపై దృష్టి సారించాలి.(2) క్రాస్–స్టేట్ డూప్లికేషన్ నివారణ: వేరొక రాష్ట్ర ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తుల నుంచి వచ్చే ఫారం6 దరఖాస్తులను ఆటోమేటిక్గా గుర్తించేట్లు ఈఆర్ఓ–నెట్లో తగు ఏర్పాట్లు ఉండాలి. అటువంటి అభ్యర్థనల్ని ఆమోదించే ముందు గట్టి రుజువులు (ఇటీవలి అద్దె ఒప్పందాలు, ఉపాధి/విద్య సర్టిఫి కెట్లు, యుటిలిటీ బిల్లులు) తీసుకోవాలి.(3) నేర నిరోధకత: తెలిసీ తప్పుడు ప్రకటన (‘‘నేను మరె క్కడా నమోదు కాలేదు’’) చేస్తూ ఫారమ్ 6ను దాఖలు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం నేరం. వేళ్ల సంఖ్యలో కేసులు ఎంపిక చేసి కఠిన శిక్షలు పడేట్లు చేస్తే, అవే వేలాది హెచ్చ రికలుగా పని చేస్తాయి. లక్ష్యం సామూహిక శిక్ష కాదు, ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజెప్పడం!(4) ఎన్నికల అనంతరం ఆడిటింగ్: పోలింగ్ అనంతరం మూడు నెలలు గడిచాక, సున్నిత ప్రాంతాలలో ‘కొత్త ఓటర్ల‘శాంపిల్ తీసుకుని విశ్లేషించాలి. వారిలో చాలా మంది సంబంధిత ప్రాంతంలో ఎప్పుడూ లేరని తేలితే అది చర్య తీసుకోదగిన సాక్ష్యం అవుతుంది. (5) నిజమైన వలసదారుకు రక్షణ: పేదలు, నిజంగా నివా సాలు మారేవారు, వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండేవారు తమకు అందుబాటులో ఉండే పత్రాల ద్వారా తమ ఓటు నమోదు చేయించుకోవడాన్ని సులభతరం చేయాలి. బీఎల్ఓ నిర్ధారించిన స్వీయ ధ్రువీకరణ నివాస పత్రం, యజమాని లేదా సంస్థ ఇచ్చే ధ్రువీకరణ పత్రం వంటి వాటిని అంగీకరించాలి. చివరి మాటవిస్తృత చర్చకు దారితీసిన ప్రొఫెసర్ మాటేమిటి? అతడు నిజంగా ఢిల్లీలో సాధారణ నివాసం ఉండకుండా బిహార్కు వెళ్లి అక్కడే వాస్తవంగా నివసిస్తూ ఉంటే, బిహార్లో అతడి ఓటు హక్కు నమోదు చట్టబద్ధమైనదే. అయితే, అది ఢిల్లీలో తొలగించబడి ఉండాలి. నివాసం మార్చకుండా, ఢిల్లీ జాబితాలో పేరు కొట్టేయించుకుని, బిహార్లో ఓటు వేయడానికి అక్కడ నమోదు చేసుకుని ఉంటే, తర్వాత ఢిల్లీ ఓటరుగా మళ్లీ నమోదు చేయించుకోవాలని ప్లాన్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలి. రూల్ ఒక చిన్న వాక్యంగా చెప్పగలిగినంత సరళమైనది.మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు వేయండి. మీ తాత ముత్తాతల ఇల్లు తాళం పడిన చోట కాదు! మీ పార్టీ మిమ్మల్ని ఒక వారం పాటు ఉండమని కోరుకున్న చోట కాదు!! పోలింగ్ రోజున సుఖప్రదంగా ఉండే చోట కాదు!! సాధారణ నివాసం అనేది ఆఖరికి విద్యార్థులు, సీజనల్ కార్మికులు, నిరాశ్రయులకు కూడా ఓటరుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఎన్నికల ‘పర్యాటకం’ ఎప్పటికీ మంచి ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి పర్యాటకానికి ద్వారాలు మూసేయాలి.ఎస్.వై. ఖురేషి వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ -
ఎన్కౌంటర్ లేవనెత్తుతున్న ప్రశ్నలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన సహచరి రాజే, మరొక నలుగురు సహచరులతో సహా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం గుజ్జి మామిడి వలస దగ్గర అడవుల్లో నవంబర్ 18న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారని పోలీ సులు ప్రకటించారు. ఉద్యమ జీవితంలో హిడ్మా కార్యకలాపాలపై చర్చ జరుగు తున్నది. హిడ్మా అంతంతో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కొన్ని సామా జిక పరిణామాలకు అంతం ఉండదు. ఒక రూపంలో అంతమైనదను కున్నది మరొక రూపంలో ప్రారంభమవుతుంది. ఒక అంతం అనేక ప్రశ్నలను లేవనెత్తి కొత్త ప్రారంభాలకు దారి తీస్తుంది. ఉద్దేశపూర్వక హత్యమొట్టమొదటి ప్రశ్న. అది నిజమైన ఎన్కౌంటరేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో 1969లో మొదలైన ఎన్కౌంటర్ కథనాల్లో నూటికి తొంభైæ అబద్ధాలని ఇప్పటికే సమాజానికి తేటతెల్లమ యింది. ఎన్కౌంటర్ అంటే అనుకోకుండా ఎదురుపడటం అనే భాషాపరమైన అర్థాన్ని తలకిందులు చేసి, పట్టుకొని ఉద్దేశపూర్వ కంగా చంపడం అనే అర్థాన్ని పోలీసులు స్థిరపరిచారు. ‘ఎన్కౌంటర్ చేస్తాం’ అని పోలీసులే అనడం, కొన్ని సందర్భాలలో బాధితులు కూడా ‘నేరస్థులను’ ఎన్కౌంటర్ చేయమని కోరడం చూస్తే ఆ మాట సంతరించుకున్న కొత్త అర్థం స్పష్టమవుతుంది.ఛత్తీస్గఢ్లో 2024 జనవరి 1న మొదలై వరుసగా కొనసాగు తున్న మావోయిస్టు నిర్మూలనా కార్యక్రమం నుంచి తప్పించుకోవ డానికి, లేదా ఆరోగ్య కారణాల కోసం కొందరు మావోయిస్టులు ఇతర చోట్ల తలదాచుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో విజయ వాడతో సహా కొన్ని పట్టణాలలో పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు జరిగాయి. అందులో భాగంగానే హిడ్మానూ, ఇతరులనూ పట్టుకుని, వారిని రెండు విడతలుగా కాల్చి చంపారని బలమైన అనుమానాలున్నాయి.‘హిడ్మా లొంగిపోయినా వదలం, చంపుతాం’ అని ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు గతంలో అన్నారు. కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు, పోలీసు అధికారులు హిడ్మా పేరు పెట్టి మరీ హెచ్చ రికలు జారీ చేశారు. ఎన్నో హింసాత్మక ఘటనలు స్వయంగా హిడ్మా తన చేతులతో జరిపినట్టు కథనాలు ప్రచారంలో పెట్టారు. వ్యవస్థ మార్పునకు సాయుధ పోరాటం అనివార్యమనే విశ్వాసంతో, దీర్ఘ కాలిక ప్రజాయుద్ధం జరుపుతున్న, సమష్టి నిర్ణయాలతో నడిచే ఒక పార్టీ నాయకత్వంలో జరిగిన ఘటనలను అలా ఒక వ్యక్తికి కుదించడం, ఆ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడానికి, ఎప్పుడైనా భవి ష్యత్తులో ఆయనను చంపితే సమర్థన సమకూర్చుకోవడానికి మాత్రమే! అందువల్ల హిడ్మాది నిజమైన ఎన్కౌంటర్ కన్నా ఎక్కు వగా ఉద్దేశపూర్వక హత్య కావడానికే అవకాశం ఉంది. దేశ ప్రజల సమస్యరెండో ప్రశ్న. మరి అలా పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందా? ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, ప్రత్యేకించి అందులోని అధికరణం 21 పేర్కొన్న జీవించే స్వేచ్ఛ పట్ల గౌరవం ఉంటే ఆ అధికారం ఉండదు. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరొక రకంగా మనిషి ప్రాణాలు తీసే హక్కు రాజ్యానికి లేదని, పౌరులందరికీ జీవించే హక్కు ఉందని చెప్పే ఆ అధికరణాన్ని ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఉల్లంఘి స్తూనే ఉన్నాయి. చట్టం నిర్దేశించిన పద్ధతి అంటే సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో విచారణ జరిపి, సహేతుకమైన సందేహాలకు తావులేని రీతిలో శిక్ష విధించడం. ఇక్కడ సాక్ష్యాధారాలు లేవు, విచా రణ లేదు, సహేతుకమైన సందేహాలు లెక్కలేనన్ని ఉన్నాయి. శిక్ష, అదీ తిరిగి మార్చడానికి వీలులేని మరణశిక్ష మాత్రం అమలైంది.మూడో ప్రశ్న. హిడ్మా మీద ప్రత్యేకంగా, ఆదివాసుల మీద మొత్తంగా ఈ దాడి ఎందుకు? సుక్మా జిల్లా మారుమూల గ్రామం పువ్వర్తిలో పుట్టి పెరిగిన ఆదివాసి యువకుడు హిడ్మా మీద ఎక్కు పెట్టిన ఈ దాడి, గతం నుంచీ ఆదివాసుల మీద మొత్తంగా సాగు తున్న దాడులలో భాగమే. దండకారణ్య ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న అపార ఖనిజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే పథకంలో భాగంగా, పాలకులు ఆదివాసులను భయోత్పాతంలో ముంచి, వారి ఆవాసాల నుంచి బేదఖలు చేయదలచు కున్నారు. ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను నిర్మూలించి, అడవిలో, కొండల్లో ఉన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహం రెండు మూడు దశాబ్దాలుగా సాగుతున్నది. దానికి అడ్డుగా ఉన్నారనే హిడ్మాను, జల్ జంగల్ జమీన్ ఆకాంక్షను, విప్లవోద్య మాన్ని నిర్మూలించదలచారు. అంటే ఇది ఆదివాసుల సమస్యో, మావోయిస్టుల సమస్యో కాదు, ఈ దేశ ప్రజల సమస్య, ఈ దేశ భవిష్యత్తు సమస్య. పోరాట ధార ఆగేదా?నాలుగో ప్రశ్న. హిడ్మా విషయంలో ప్రభుత్వ ప్రచారం గెలి చిందా, ఓడిందా? హిడ్మాను ఎంత భయంకరుడిగా చూపడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ వచ్చినా, ఆయన హత్య తర్వాత వెల్లు వెత్తుతున్న నిరసన, పువ్వర్తిలో ఆయన అంత్యక్రియలకు వేలాది మంది హాజరై ఘన నివాళి అర్పించడం ఆయన ఆదివాసుల హృద యాల్లో ఎటువంటి స్థానం సంపాదించాడో చూపుతున్నది. ఆదివా సుల గూడాలు తగుల బెడుతూ, విచ్చలవిడిగా హత్యలు, అత్యాచా రాలు చేసిన సాల్వా జుడుమ్ దుర్మార్గాన్ని క్రియాశీలంగా ఎదు ర్కొన్న నాయకులలో ఒకరుగా ఆదివాసులలో ఆయనకు చెరగని స్థానం ఉంది. దాదాపుగా అన్ని ఆదివాసీ సమూహాల భాషలూ ధారాళంగా మాట్లాడుతూ వారికి తలలో నాలుక అయ్యాడు గనుక ఆయన పట్ల అపార గౌరవం ఉంది.ఐదో ప్రశ్న. హిడ్మా అంతంతో ఉద్యమం అంతమవుతుందా? ఆదివాసులకు నవంబర్ 18 వరకూ సజీవంగా నాయకత్వం వహించిన మాడ్వి హిడ్మా, ఆనాటి నుంచీ వందలాది ఆదివాసీ అమర పోరాట యోధుల చారిత్రక జాబితాలో చేరాడు. కానూ, సిద్ధూ, వీరనారాయణ సింగ్, బిర్సా ముండా, తిలక్ మాంఝీ, రాంజీ గోండు, గుండాధుర్, కొమురం భీమ్ వంటి ఉత్తేజకర, స్ఫూర్తి దాయక జాబితా అది. వాళ్లకు, వాళ్ల స్ఫూర్తికి మరణం లేదు. మొదట బ్రిటిష్ వలసవాదుల మీద, మైదాన ప్రాంతాల దోపిడీదారుల మీద, భూస్వాముల మీద, ఆ తర్వాత ‘అభివృద్ధి’ పేరుతో జల్ జంగల్ జమీన్ కొల్లగొట్టి తమను నిర్వాసితులను చేసిన ప్రభుత్వాల మీద ఆదివాసుల పోరాటాలు మూడు శతాబ్దాలుగా జరుగుతున్నాయి. దోపిడీ, పీడనలు ఉన్నంతవరకూ ఆ పోరాట ధారకు అంతం ఉండదు. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు – ‘వీక్షణం’ ఎడిటర్ -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం) రాయని డైరీ
ఈ ప్రాణబంధం ఏమిటో అర్థం కాకుండా ఉంది. 74 ఏళ్ల వయసులో 10వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా, నా 26వ ఏట తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన రోజు నాలో ఉన్నప్పటి ఆ కొత్త లోతైన ఆనందపు అనుభూతే నేటికీ పరవళ్లు తొక్కుతూ ఉంది! ఆ మాటే విజయ్ చౌధరీతో అన్నాను.‘‘పరవళ్లు తొక్కటం మంచి విషయం నితీశ్జీ. అయితే, ఆ పరవళ్లు పక్కనున్న వాళ్ల కాళ్లను తొక్కేస్తున్నాయేమో కాస్త గమనించుకుంటూ ఉండాలి’’ అన్నారాయన, నవ్వుతూ. ‘‘అయ్యో, సారీ విజయ్! మీ కాలును తొక్కేశానా?’’ అన్నాను నవ్వుతూ.‘‘లేదు నితీశ్జీ, మీరు నా కాలును తొక్కలేదు. గాంధీ మైదాన్ వేదిక పైన మీ పక్కనున్న మోదీజీ కాలును తొక్కినంత పని చేశారు! మీకై మీరు మీ చేత్తో ఆయన చేతిని గాల్లోకి లేపకుండా, ఆయనకై ఆయనే ఆయన చేత్తో మీ చేతిని గాల్లోకి లేపేవరకు మీరు ఆగవలసింది’’ అన్నారు విజయ్.మోదీజీ చేతిని పట్టుకుని బలవంతంగా పైకెత్తటం అంటే మోదీజీ కాలును చూసు కోకుండా తొక్కేయటమేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్లు నాకు అర్థమైంది.వయసులో ఏడేళ్లు చిన్నవాడే అయినా, సూక్ష్మాన్ని పట్టుకోవటంలో నా కంటే పెద్దవాడు విజయ్ కుమార్ చౌధరీ. పార్టీలో విజయ్ నా సన్నిహితుడు, మంత్రి వర్గ సహచరుడు. విజయ్లాగే రామచంద్ర ప్రసాద్ సింగ్ అనే మరొక సన్నిహితుడు కూడా ఉండేవారు. ఆయన నా ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా! ఇప్పుడు లేరు.విజయ్ నాకు లెఫ్ట్లో ఉంటే, రామచంద్ర నాకు రైట్లో ఉండేవారు. రెండేళ్ల క్రితం కేంద్ర మంత్రి పదవి కోసం రామచంద్ర రైటిస్టుగా మారి, బీజేపీలోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి కూడా వెళ్లిపోయి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సొంత పార్టీని కూడా తీసుకెళ్లి ప్రశాంత్ కిశోర్ పార్టీలో కలిపేసుకున్నారు. చివరికి ఆయన ఏమయ్యారో తెలీదు! లెఫ్ట్–వింగ్లోని వాళ్లు రైట్–వింగ్లోకి వెళ్లటంలో తప్పేమీ లేదు. కానీ, రైట్ టైమ్లో వెళ్లాలి. రైట్ టైమ్లో వెనక్కి వచ్చేయాలి. అది తెలుసుకున్నట్లు లేరు రామచంద్ర. తొలిసారి నేను 2000లో ఎన్డీయేతో కలిశాను. మాటా మాటా వచ్చి, ఏడు రోజుల తర్వాత ఎన్డీయేలోంచి వచ్చేశాను. రెండోసారి 2005లో ఎన్డీయేలోకి వెళ్లాను. 2013లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చాను. 2017లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను. తిరిగి 2022లో ఎన్డీయేలోంచి వచ్చేశాను. 2024లో మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లాను.అవసరమైతే ఇప్పటికిప్పుడైనా, ఎన్డీయేలోంచి బయటికి వచ్చేయగలను నేను. ప్రజల కోసం ఎన్నిసార్లైనా వెళ్లి, ఎన్నిసార్లైనా వెనక్కు వచ్చేయాల్సిందే. ఎంత మందితో ఎన్ని మాటలైనా అనిపించుకోవలసిందే!శరద్ యాదవ్ నన్ను ‘ఫాల్తూ’ మనిషి అనేవారు. లాలూజీ నన్ను ‘పల్టూ రామ్’ అని అంటుంటారు. మీడియా నన్ను ‘సుశాసన్ బాబు’ అంటుంది. ఈ పేర్లేవీ నన్ను పైనుంచి పడేసేవీ, రథమెక్కించి ఊరేగించేవీ కాదు. ప్రజా జీవితం ఒక పేరుతో ముగిసిపోయేదీ, ఒక టెర్మ్తో తీరిపోయేదీ కాదు.‘నితీశ్జీ... కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులు ఇద్దరే ఎందుకు ఉండాలి? నలుగురు ఉండొచ్చు కదా అని మనవాళ్లు అడుగు తున్నారు’’ అన్నారు విజయ్. ఇప్పుడున్న ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్లు. జేడీయు నుంచి కూడా ఇద్దరు ఉండాలని పట్టుబడితే... ‘మొత్తం నలుగురూ మీవాళ్లనే ఉప ముఖ్యమంత్రులుగా ఉండ నివ్వండి. సీఎం పోస్టు ఒక్కటీ మాకు ఇవ్వండి’ అని మోదీజీ అనొచ్చు. బీజేపీకి వచ్చినవి 89. జేడీయూకు వచ్చినవి 85.ఇరవై ఏళ్లుగా బిహార్లో బీజేపీ పవర్లో లేదు. ఇరవై ఏళ్లుగా బిహార్లో బీజేపీ లేకుండా పవరూ లేదు! ‘‘ఇప్పుడు కాదులే విజయ్’’ అన్నాను.‘మరెప్పుడు?’ అన్నట్లేం చూడలేదు విజయ్.-మాధవ్ శింగరాజు -
మొన్న అలా! ఇవాళ ఇలా!!
సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాను గవర్నరు, రాష్ట్రపతి విధుల్లో వేలు పెట్టేది లేదని పరోక్షంగానైనా స్పష్టంగానే తెలియబర్చింది. రాష్ట్రపతి రిఫరెన్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తన అభిప్రాయాల్ని ఏకగ్రీవంగా వెలిబుచ్చింది. కొండొకచో కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాన్నీ, వాదననూ బలపర్చింది. శాసన వ్యవస్థకు, కార్య నిర్వాహక వ్యవస్థకు నడుమ ఏర్పడగల వివాదానికి ‘మీరూ మీరే చూసుకోండి గానీ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అన్న తరహాలో జవాబులిచ్చింది.ఈమధ్య గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో తస్మదీయ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు వస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లు గవర్నర్ సంతకం పెడితేనే చట్టంగా మారుతుంది. ఆయన సంతకం పెట్టాలి, లేదా తిప్పి పంపాలి లేదా రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోరుతూ పంపాలి. ఇలా ఏదో ఒక నిర్ణయం ఎప్పటిలోగా తీసుకోవాలన్నది రాజ్యాంగం చెప్పలేదు. అది ఆధారం చేసుకొని కొంతమంది గవర్నర్లు ఎటూ తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. దాని వల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాను చట్టాన్ని అందివ్వలేని స్థితిలో పడుతుంది. (మాటలే సరిగ్గా రాని వయసులో డైరెక్టరై పోయాడు)ఇలాంటి కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఏమంటే మరీ జాప్యం చేసిన బిల్లుల్ని ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లు అనుకోవాలని! అయితే ఇప్పుడు అదే సుప్రీం కోర్టు అలా ఆటోమేటిక్ ఆమోదం (డీమ్డ్ అస్సెంట్) అన్నది రాజ్యాంగ బద్ధం కాదంది. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకోవడంపై ఎలాంటి గడువూ లేదంది. పైగా వారి నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతం అని కూడా అభిప్రాయ పడింది. అయితే బిల్లులపై జాప్యం చెయ్యడం అన్యాయమని తోస్తే వాటిపై కాల పరిమితి పెట్టే అవకాశం కోర్టు తీసుకుంటుందని చెప్పింది. స్థూలంగా రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల పట్ల, కేంద్రం వాదన పట్ల సానుకూల ధోరణితో ఉందీ తీర్పు. చదవండి: ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ -
శాస్త్ర స్వతంత్రతకు గొడ్డలిపెట్టు
నూరేళ్ల కింద పి.సి.మహాలనోబిస్ స్థాపించిన ఐఎస్ఐని కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. సంస్థ ప్రెసిడెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది. ఇది వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే.దేశ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో అనూహ్యమైన, విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీజే అబ్దుల్ కలామ్ లాంటి శాస్త్రవేత్తను తమ ‘ఫెలో’గా చేర్చుకునేందుకు నిరాకరించిన జాతీయ సైన్స్ అకాడమీ ఇప్పుడు పారిశ్రా మిక వేత్త ముకేశ్ అంబానీకి ఆ హోదా కల్పించింది. ఇప్పటివరకూ ఈ సభ్యత్వం విద్య, పరిశోధన రంగాల్లో అద్భుత మైన రాణింపు ఉన్న వారికి మాత్రమే దక్కేది.ఢిల్లీలోని ఓ అగ్రశ్రేణి సంస్థ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేక పోయినా కేవలం అక్కడి ప్రభుత్వ కోరిక తీర్చేందుకు వాయు కాలు ష్యాన్ని తగ్గిస్తామన్న మిషతో కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం చేసింది. వనరులు లేకపోవడం కారణంగా సైకిల్పై రాకెట్లు మోసు కెళ్లారని దేశ అంతరిక్ష రంగానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ని ఓ కేంద్ర మంత్రి అగౌరవపరిచారు. ఎందుకు? అంత రిక్ష రంగంలో సాధించిన ఘనతలన్నింటికీ 2014 తరువాత మోదీ ప్రభుత్వం అందించిన సహకారమే కారణమన్న వాదనకు బలం చేకూర్చేందుకు! ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేనివని అనిపించవచ్చు గానీ... శాస్త్ర పరిశోధన సంస్థలు ఒక్కటొక్కటిగా తమ స్వతంత్రతను కోల్పోతున్నాయనేందుకు మచ్చుతునకలు. కొన్నింటిని బలవంతంగా లొంగదీసుకుంటే... మిగిలినవి స్వచ్ఛందంగా చేతులెత్తేశాయి.ప్రధాని మాటనే కాదన్న ఇస్రోప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాన్ని కూడా కాదనే ధైర్యం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కనబరచడం గతకాలపు మాట గానే మిగిలిపోనుంది. 1980లో సోవియట్ యూనియన్ ప్రయోగంలో భారతీయ వ్యోమగామిని భాగం చేయాలని ఇందిర కోరితే, ‘ఇస్రో’ దాన్ని తన బలమైన వాదనతో తిరస్కరించింది. ధిక్కారం కాదది. దేశ ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడే ఉపగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నందున మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు వనరులను ఖర్చు చేయలేమని చెప్పడం! ప్రధాని ఇందిర కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఆ దశలోనే ఇందిర భారత వ్యోమ గామిని అంతరిక్షంలో పెట్టే బాధ్యతను భారతీయ వాయుసేనకు అప్పగించింది. దీని ఫలితమే 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లడం! కాగితంపై ‘ఇస్రో’ ఇప్పటికీ స్వతంత్ర సంస్థే. కానీ సంస్థ వ్యవస్థాపకుడిని కేంద్ర మంత్రి ఒకరు అగౌరవపరిచినా సరిదిద్దలేని స్థితికి చేరింది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) పరిస్థితి కూడా ఇంతే. దశాబ్దాలుగా ఆర్థిక సాయం పొందుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి చేరింది మాత్రం ఇటీవలే. జన్యు మార్పిడి ఆహారం వివాదం 2010లో పతాక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ సంస్థ రెండు ఇతర సైన్స్ అకాడమీలతో కలిసి ప్రభుత్వ అభి లాషకు భిన్నంగా స్పష్టమైన వైఖరి కనబరిచింది. జన్యుమార్పిడి పంటల భద్రత, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలపై క్షుణ్ణమైన అధ్యయనం జరిగి తీరాల్సిందేనని భీష్మించింది.2018లో కేంద్ర మంత్రి ఒకరు డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎగతాళి చేసిన సందర్భంలో కూడా ఐఎన్ఎస్ఏ, ఇతర సంస్థలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. బోధనాంశాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొల గించాలన్న మంత్రిగారి ఆలోచనను తప్పుబట్టాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఈ సంస్థలు సైద్ధాంతిక వైఖరికి కట్టుబడ్డాయి. తమ స్వతంత్రతపై దాడిని సమర్థంగా ఎదుర్కొన్నాయి.శాస్త్రవేత్తలు కానివారికి సభ్యత్వమా?ప్రస్తుతానికి వస్తే.... శాస్త్రవేత్తలు కాని పారిశ్రామికవేత్తలకు కూడా సభ్యత్వం ఇవ్వడం అవసరమని ఐఎన్ఎస్ఏ ఒక అంచనాకు వచ్చింది. సభ్యత్వం ఇవ్వడం కాకుండా... పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేందుకు అనువైన కార్యక్రమాలను రూపొందించి ఉంటే, వేదికలను ఏర్పాటు చేసి ఉంటే మరింత మెరుగ్గా ఉండేది. ప్రపంచంలో ఏ శాస్త్ర పరిశోధన సంస్థ కూడా తమ రంగంలో తగిన అర్హతలు లేనివారికి సభ్యత్వం కట్టబెట్టదు. సత్యేన్ బోస్, మేఘనాథ్ సాహా, హోమీ జహంగీర్ భాభా, శాంతి స్వరూప్ భట్నాగర్ వంటి దిగ్గజ శాస్త్రవేత్తల పక్కన ఇప్పుడు అంబానీకి చోటు కల్పిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అన్ని సైన్స్ అకాడమీలకు మార్గదర్శకంగా భావించే సంస్థ లండన్లోని ‘ద రాయల్ సొసైటీ’. ఇది కూడా శాస్త్రవేత్తలు కానివారు, అంటే పారిశ్రామిక రంగంలో పరిశోధనలు చేసేవారికి సభ్యత్వం ఇస్తుంది. అయితే, ఆ యా రంగాల్లో జ్ఞానాభివృద్ధికి వారు తగినంత కృషి చేసి ఉండాలి. ఈ నేపథ్యంలోనే కొందరు పారిశ్రామిక వేత్తలకు ఐఎన్ఎస్ఏ సభ్యత్వం ఇవ్వడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. కన్ను ఇప్పుడు గణాంక సంస్థపై..కేంద్రం దృష్టి ప్రస్తుతం కోల్కతాలోని ఐఎస్ఐ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్)పై ఉంది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ వందేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యక్ష అధీనంలోకి తెచ్చుకునేందుకు అనువుగా ఒక బిల్లును సిద్ధం చేస్తోంది. గణితం, గణాంక శాస్త్రం, అప్లైడ్ సైన్సెస్లో ఎన్నదగ్గ పరిశోధనలు చేసిన సంస్థ ఇది. పరిపాలన వ్యవహారాలన్నీ తనంతట తాను నిర్వహించుకుంటుంది. లాభాపేక్ష లేని సంస్థ. అలాంటి ఐఎస్ఐ సొసైటీని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఒక బోర్డుకు అప్పగించాలని కొత్త బిల్లు ప్రతిపాదిస్తోంది. సంస్థ ప్రెసి డెంట్, డైరెక్టర్, అకడెమిక్ కౌన్సిల్ సభ్యులందరినీ ఎన్నికల ద్వారా కాకుండా, నేరుగా నియమించే ప్రయత్నం చేస్తోంది.ఐఎస్ఐకి చెందిన స్థిరచరాస్తులన్నింటినీ కూడా ఈ బోర్డు తన స్వాధీనంలోకి తీసుకుంటుందని బిల్లు స్పష్టం చేస్తూండటం గమనార్హం. ఇది విద్యా సంస్థల స్వతంత్రతపై దాడే! వ్యవస్థల నిర్మాణాన్ని, స్వాతంత్య్రాన్ని బలి చేయడమే!! సంస్థల స్వతంత్ర ప్రతిపత్తి ఏదో గుప్తమైన ఆలోచన కాదు. బోధనాంశాలపై చర్చలు జరిపి మరింత ప్రభావశీలం చేసేందుకు అవకాశం కల్పించేది. విద్యా ప్రమాణాలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.అలాంటి ఈ వ్యవస్థకు బదులుగా ఢిల్లీ బ్యూరోక్రాట్ల అజమాయిషీ పెట్టడం బోధనాంశాల నాణ్యత, స్వతంత్రతకు గొడ్డలిపెట్టు. 1959 నాటి చట్టం పరిధిలో పనిచేసే ఐఎస్ఐ సొంతంగా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయగలదు. కొత్త బిల్లులో ఈ అంశం ప్రస్తావన లేదు. ఐఎస్ఐకి బదులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనే పట్టాలిస్తుందన్న అను మానాలు కలుగుతున్నాయి. తద్వారా ఇది దేశంలోని అనేక ఇతర విద్యాసంస్థల్లో ఒకటిగా మాత్రమే మారిపోనుంది. విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా స్వేచ్ఛగా ఆలోచించేందుకు అకడమిక్ ఫ్రీడమ్ అన్నది ఎంతో కీలకం.ప్రశ్నించడం, భయం, విమర్శలకు బెదరకుండా భావాలను వ్యక్తం చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. పరిశోధనలు, బోధన తాలూకూ సమగ్రతను కాపాడుతుంది. పొలిటికల్, బ్యూరోక్రటిక్, కార్పొరేట్ సంస్థల ప్రమేయం, ప్రభావాలను తొలగించేందుకు వ్యవస్థాగతమైన స్వాతంత్య్రం అవసరం. ఇది కాదని... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రమన్నట్టు వ్యవహరిస్తే... శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతర్జాతీయంగా భారత్కు ఉన్న స్థానానికే చేటు కలిగే ప్రమాదం ఉంది.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
“సినిమాటిక్ లిబర్టీ” అనే సాకుతో దోపిడీ, చట్టవ్యతిరేక చర్యలను ‘న్యాయం’ పేరిట చూపిస్తూ, నేరస్తులకే కిరీటాలు పెట్టే సంస్కృతిని మీరు ఎన్నేళ్లుగా పెంచారు. అందుకే సామాన్యులను నిలువునా దోచే సినిమా ఇండస్ట్రీకి ప్రతిస్పందనగా చట్టవ్యతిరేకంగా సినిమాలను పైరసీ చేసిన iBOMMA రవిని ప్రజలు ‘దేవుడు’గా చూసినా, ‘రాబిన్ హుడ్’గా కీర్తించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ప్రజలకు ఇదే ధర్మం ఇది మీరు నేర్పినది.ప్రజలు iBOMMA వంటి పైరసీ సైట్లను ఆశ్రయించడానికి అస్సలు కారణాన్ని పరిశీలించకుండా లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తూ మూలసమస్యలను పట్టించుకోకుండా,సినిమా ఇండస్ట్రీ సామాన్యులను చేస్తున్న నిలువు దోపిడీ గురించి మాట్లాడకుండా,సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిన టికెట్ రేట్లను నియంత్రించకుండా,ఒక్క iBOMMA ban చేశారంటే సమస్యను పరిష్కరించినట్టు కాదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి .. అటు సినిమా ఇండస్ట్రీకి, ఇటు సామాన్య ప్రజలకు నష్టం కలగకుండా సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, మీరు ఆ సమయంలో ప్రతిపక్ష మీడియా సహకారంతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ప్రజలు అర్థం చేసుకోకుండా, ఆ నిర్ణయాన్నే వ్యతిరేకించేలా మోసపర్చారు.కానీ ‘నిజం అనేది నిప్పు’, దానిని దాచలేరు, ఆపలేరు. ఆ రోజున అర్థం కాలేకపోయిన విషయాలు iBOMMA ఉదంతం వెలుగులోకి వచ్చిన తరువాత ఈ రోజు ప్రజలు స్పష్టంగా గ్రహిస్తున్నారు.ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్న వాస్తవం ఏమిటంటే:వైఎస్ జగన్ సినిమా ఇండస్ట్రీ దోపిడిని తొలిసారి ప్రశ్నించిన నాయకులుసామాన్య ప్రజలకు అందుబాటు ధరలో సినిమా అందాలని ఉద్దేశంతో టికెట్ రేట్లపై సంస్కరణలు తీసుకువచ్చారుఆ రోజు ప్రతిపక్ష మీడియా అడ్డు అదుపు లేకుండా చేసిన మాయాప్రచారం వల్ల మోసపోయాముఇప్పుడు iBomma వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ఘర్షణ బయటపడడంతో ప్రజలు దీని అసలు రూపాన్ని “సామాన్యుడు వర్సెస్ ఇండస్ట్రీ దోపిడి”గా చూస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో iBomma వ్యవస్థాపకుడిపై ఇటీవల జరిగిన చర్యలు కొత్త ప్రశ్నల శ్రేణిని లేవనెత్తాయి. పైరసీ నేరం అయినప్పటికీ, ఈ చర్య అసలు సమస్యను పరిష్కరిస్తుందా అనే సందేహం ప్రజల్లో పెరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న టికెట్ రేట్ల పెరుగుదల, సామాన్య ప్రజలను తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.తెలుగు సినిమా రంగంలో టికెట్ ధరల పెరుగుదల, ప్రభుత్వ నియంత్రణల్లో అసంగత,ప్రజల్లో పైరసీ సైట్ల వైపు ఆధారణ పెరుగుతున్న దృశ్యం… ఇవన్నీ ఒకే కథ చెబుతున్నాయి: సమస్య వ్యక్తుల్లో కాదు, వ్యవస్థల్లో ఉంది. అయినా ఎలా జరుగుతోంది? వ్యక్తులను పట్టుకుని శిక్షించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపుతున్నట్టు చూపడం.ఇటీవల iBomma వ్యవస్థాపకుడిపై జరిగిన చర్యలు చట్టపరంగా సరైనవే. పైరసీ అనేది నేరమే. కానీ ఈ చర్య ఒక పెద్ద ప్రశ్నను మాత్రం తప్పించలేదు: ఇది నిజంగా సమస్యకు శాశ్వత పరిష్కారమా?“తెలుగు సినిమాల టికెట్ రేట్లు అసహజంగా పెరగడం కొత్త విషయం కాదు. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం ధరలు ఆకాశాన్నంటుతాయి. కుటుంబంతో కలిసి సినిమా చూడడం సాధారణ ప్రేక్షకుడికి ఈ రోజుల్లో ఒక చిన్న ‘ఈవెంట్’లా మారిపోయింది; ఖర్చు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు వెళ్తోంది. ‘సరే, OTTలో చూద్దాం’ అనుకుంటే, వాటి ధరలు కూడా సామాన్యుడికి అందే స్థాయిలో లేవు. సినిమాలు మన జీవన విధానంలో భాగమైనప్పటికీ, ఈ పరిస్థితుల్లో పైరసీ వేదికలు ఎదగడం ఆశ్చర్యకరం కాదు సహజమే.”అంటే iBomma కారణంగా టికెట్ ధరలు తగ్గలేదు; టికెట్ ధరలు అధికంగా ఉండటమే iBomma వంటి వేదికలకు ప్రాణవాయువు.అయితే ప్రభుత్వ వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది. చట్టవిరుద్ధ ప్రవర్తనను చూపించే సినిమాలు సులభంగా సెన్సార్ అవుతాయి. అదే సినిమాలను ప్రైడ్, కల్చర్, ఇండస్ట్రీ గ్రోత్ పేరుతో ప్రోత్సహించడంలో వెనుకాడదు.కానీ పైరసీ విషయానికి వస్తే మాత్రం "కఠిన చర్యలు" అనే నినాదం.ఇది ద్వంద్వ వైఖరి కాదు అంటే ఇంకేమిటి?ఇది సనస్యకు శాశ్వత పరిష్కారం కాదు కేవలం తాత్కాలిక విరామం మాత్రమే.ఎందుకంటే..iBOMMA పుట్టింది అంటె అది ప్రజల తప్పు కాదు.. మీరు సంవత్సరాలుగా పట్టించుకోని దోపిడీ, అధికారదుర్వినియోగం,అదుపుతప్పినవ్యవస్థలవల్లే.,ఈ రోజు iBOMMA ban చేస్తే,రేపు అదే కారణాలతో ఇంకో వెబ్సైట్ పుడుతుంది.మరో రోజు ఇంకోటి.సైట్లను మూసేయడం కాదు.. సమస్యను మూసేయడం అవసరం.ఒక బొమ్మను మూసేస్తే మరొక బొమ్మ వస్తుంది—ఇది ఇంటర్నెట్ యుగం యొక్క వాస్తవం.వ్యక్తులు మారవచ్చు, వెబ్సైట్లు మూసుకోవచ్చు, కానీ వ్యవస్థలు మారకపోతే సమస్య మారదు.పైరసీ ఒక సాంకేతిక నేరం కాదు, ఒక ఆర్థిక–సామాజిక ప్రతిస్పందన.సమస్యను చూడాల్సిన నిజమైన కోణం• సినిమా టికెట్ ధరలు సాధారణీకరణ • ప్రభుత్వ పాలసీల్లో స్పష్టత • OTTలను అందుబాటులో ఉంచడం • మార్కెటింగ్ వ్యయం, సినీ నటుల పారితోషక నియంత్రణ • ప్రజలను శత్రువులుగా చూసే వ్యవహారం ఆపడం ఇవి జరిగితేనే పైరసీకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితేనే iBomma తరహా వేదికలు నిలిచిపోతాయి.ఇది ప్రపంచం నిరూపించిన మోడల్ —Netflix, Aahaa,Amazon prime,Hot Star and YouTube Premium… అన్నీ చవకగా చేస్తే ప్రజలు పైరసీ వైపు వెళ్ళడం తగ్గిపోతుంది.అందువల్ల ప్రశ్న ఒక్కటే: ప్రభుత్వం, సినీ పరిశ్రమ,మూల సమస్యను ఎందుకు పరిష్కరించడంలేదు?ఎందుకు వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా తీసుకుని పబ్లిసిటీ యుద్ధం చేస్తోంది?“ఒక వ్యక్తిని జైలుకు పంపితే వ్యవస్థలోని లోపాలు తొలగిపోవు. ఒక వెబ్సైట్ను మూసేసినా, ఆ సమస్యను పుట్టించే కారణాలు మాత్రం అలాగే బతికే ఉంటాయి. అందువల్ల ఇప్పుడు అయినా ప్రభుత్వం మరియు సినిమా ఇండస్ట్రీ పెద్దలు మేల్కొని, అసలు సమస్యకు కారణమేమిటో నిజాయితీగా పరిశీలించి, ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలి.”-పి. నేతాజి పవన్ కుమార్ -
నిఠారీ కేసులో బాధితులకే శిక్ష!
ఇరవై ఏళ్ల నాటి నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి త్వాల తీర్పు భారత నేర దర్యాప్తు వ్యవస్థలోని వైఫల్యాలను బట్టబయలు చేసింది. 16 మంది మహిళలు, పిల్లల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11న చెప్పిన తీర్పుతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే!యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని నిఠారీ గ్రామంలో డ్రైనేజీలో మానవ అవశేషాలు బయటపడి దాదాపు ఇరవై ఏళ్లు గడచిన తర్వాత కూడా, ఏ ఒక్కరూ దోషిగా నిర్ధారణ కాలేదు. 16 మంది మహిళలు, పిల్లల ‘నిఠారీ’ హత్య కేసులో నింది తుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ‘నేర న్యాయ’ వ్యవస్థలోని దారుణ వైఫల్యాలను బట్టబయలు చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే.కీలక ఆధారాలు లేకపోవడం వల్లే... 2006 చివర్లో నిఠారీ గ్రామ సమీపాన 31వ సెక్టార్లో మురుగు కాల్వల పూడిక తీస్తుంటే దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు, డి–5, డి–6 ఇళ్ల మధ్య ఒక చెయ్యి కనబడింది. క్రికెట్ ఆడుతున్న కుర్రాడు దాన్ని చూశాడు. అదే ఏడాది డిసెంబర్లో ఈ బంగ్లాల వెలుపల ఉన్న డ్రెయిన్లో మట్టి తొలగించడంతో అక్కడ అనేక పుర్రెలు, ఎముకలు, పీలికలైన పిల్లల దుస్తులు, చిన్ని చిన్ని చెప్పులు దొరికాయి.డి–5 ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ అనే వ్యక్తి, ఇంటి యజమాని, వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ ఈ మారణకాండకు బాధ్యులని పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం – పిల్లలను, ఆడవారిని కోలీ ప్రలోభపెట్టి ఇంటికి రప్పించే వాడు. తర్వాత వారిని హత్య చేసేవాడు. కొన్నిసార్లు హతుల శరీర భాగాలను తిన్నాడు కూడా! ఈ అకృత్యాల్లో పంఢేర్ భాగస్వామి. భయానకమైన ఈ హత్యల కేసులో స్థానిక పోలీసుల విచారణ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దర్యాప్తులో భాగంగా ఇంటి మేడ పై భాగంలో నీళ్ల ట్యాంకు కింద దాచిన ఓ కత్తిని పోలీసులు ‘స్వాధీనం’ చేసుకున్నారు.ఇది, ఇంకా అనేక వస్తువులు వారికి దొరికాయి. ఇవే వారి దర్యాప్తులో ‘కీలక ఆధారాలు’. వీటి ఆధారంగా వారు రూపొందించిన కథనాలను కోర్టులు విశ్వసించలేదు. దీంతో 2007 జనవరిలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. సీబీఐ సైతం స్థానిక పోలీసులు చేసిన తప్పిదాలనే పునరా వృతం చేసింది. కొన్ని వారాల తరబడి కస్టడీలో ఉంచి రికార్డు చేసిన కోలీ నేరాంగీకార పత్రం మీదే సీబీఐ అధికారులు ఆధారపడ్డారు. వారు రికవర్ చేసిన ఆధారాలు నమ్మదగినవిగా లేవు. కోలీ, పంఢేర్ ప్రమేయాన్ని నిరూపించగల సరైన ఫోరెన్సిక్ లింకులను కూడా సంపాదించలేక పోయారు.స్థానిక పోలీసుల మీద ఆధారపడకుండా మళ్లీ మొదటి నుంచి సొంత దర్వాప్తు చేయడంలో సీబీఐ విఫలమైంది. నేరాంగీకారాలు, రికవరీలు, ఆధారాలను అటూయిటూ చేసి... మోపిన 13 కేసుల్లోనూ వాటినే కోర్టుల ముందుంచారు. కాబట్టే, పై కోర్టులు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాటన్నిటినీ కొట్టేశాయి. నేరాంగీకార పత్రాలు, నేరాలకు సంబంధించిన రికవ రీలు అన్నీ అంతకు ముందు కొట్టేసిన ఇతర కేసుల్లో ఉన్నట్లే ఏ మాత్రం తేడా లేకుండా ఈ కేసులోనూ ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా నవంబర్ 11 నాటి తీర్పులో గుర్తించింది.మరి నేరస్థులు ఎవరు?తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, వారి పాత గాయాలు ఈ తీర్పుతో మళ్లీ రేగాయి. 2005లో తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ బాధితులే! డి–5 ఇంటి ముందు తొలుతగా నిరసన చేసింది వీరే. న్యాయస్థానంలో చివరి దాకా పోరా డింది కూడా వీరే. చివరకు కోర్టు తీర్పుతో తమ పిల్లలను ఎవరూ చంపలేదన్న ‘న్యాయపరమైన వాస్తవం’ వారిని వెక్కిరిస్తోంది. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగినప్పటికీ, నిజమైన ద్రోహులెవరో నిరూపణ కాకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసి వారి బాధను గుర్తించింది. నిర్లక్ష్యం వహించి, అసాధారణ జాప్యం చేసి నిజనిర్ధారణ ప్రక్రియ పట్ల విశ్వాసం సన్న గిల్లేలా చేశాయంటూ దర్యాప్తు సంస్థలను తప్పు పట్టింది. అవయ వాలతో వ్యాపారం చేసే ముఠాల ప్రమేయం వంటి కొత్త కోణాల నుంచి దర్యాప్తు చేపట్టలేక పోయాయని నిందించింది.నిఠారీ కేసు నిర్దోషిత్వాల తీర్పులు భారత నేర దర్యాప్తు వ్యవస్థకు సోకిన రోగం లక్షణాలను కళ్లకు కట్టాయి. ప్రతి స్థాయి లోనూ వ్యవస్థ విఫలమైంది. స్థానిక పోలీసులు క్రైమ్ సీన్ను పరిరక్షించలేకపోయారు. సరైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించలేక పోయారు. ఈ లోపాలను చక్కదిద్దడంలో సీబీఐ విఫలమైంది. కొత్త కోణాలను గుర్తించలేక పోయింది. న్యాయ పరీక్షకు నిలబడేలా పకడ్బందీ వాదనలు చేయడంలో ప్రాసిక్యూటర్లు విఫలమయ్యారు. బాధితుల ఘోర విషాదాన్ని వ్యవస్థల ప్రహసనంగా మార్చి, ప్రభుత్వం వారికి తీవ్రమైన నిరాశ కలిగించింది.సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కోలీ జైలు నుంచి బయటకు వచ్చాడు. పంఢేర్ ఇప్పటికే నేర విముక్తుడు. న్యాయస్థానం చట్టాలకు లోబడి వ్యవహరించింది. తిరుగులేని రుజువులు ఉంటే తప్ప కోర్టు శిక్ష విధించలేదు. తమ పిల్లల మసకబారిన పాత ఫొటోలను పట్టు కుని ఆ తల్లిదండ్రులు క్షోభపడుతూ ఉంటే, న్యాయం అమూర్తంగా మారిపోయింది. నిఠారీలో చట్టం తన చివరి మాటను చెప్పేసింది. ఇక మిగిలింది నిశ్శబ్దమే! అది చెవులు పగిలిపోయేంత కఠోరంగా ఉంది.-ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త లీగల్ అంశాల జర్నలిస్ట్(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పంజరం లేని పెంపుడు చిలక
వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ (ఏఐ) చొచ్చుకొస్తున్న వేళ... సురక్షితంగా, బాధ్యతాయుతంగా దాన్ని వినియోగించేందుకు వీలుగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఇటీవల ‘భారత ఏఐ గవర్నన్స్ గైడ్లైన్స్’ను ప్రకటించింది. ఇంతకీ ప్రభుత్వం ప్రకటించిన ఈ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడున్న చట్టాల పరిధిలోనే ఏఐతో వచ్చే ఇక్కట్లను సైతం ఎదుర్కోవాలని చూస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏఐని మరీ పంజరంలో చిలకగా చేయకూడదన్న మాట నిజమే కానీ, డేటా ప్రైవసీ సహా అనేకఅంశాలపై ఆందోళన తీరేదెలా?ఇప్పుడేం జరిగింది?శరవేగంతో దూసుకొస్తున్న ఏఐ టెక్నాలజీల విష యంలో ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా చట్టాలు చేసేస్తుంటే, మన దేశంలో ప్రత్యేకమైన చట్టమంటూ ఇంకా ఏమీ లేదు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలనుకుంటున్న ప్రభుత్వం ఈ పరిస్థి తుల్లో ఆచరణాత్మక దృక్పథంతో ఒక అడుగు వేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీ ‘ఇండియా ఏఐ గవర్నన్స్ గైడ్లైన్స్’ నివేదికను తయారుచేసి, అందించింది. ఏఐపై నియంత్రణ కన్నా సమన్వయా నికి ప్రాధాన్యమివ్వడం 66 పేజీల ఈ బ్లూ ప్రింట్ ప్రత్యేకత.ఏఐతో ఒనగూడే లాభాలనూ, ఎదురయ్యే కష్టనష్టాలనూ సమతూకం చేస్తూ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఇందులో మార్గదర్శకాలను సిద్ధం చేశారు. ఏఐపై అతిగా కట్టుదిట్టాలు పెట్టి, సృజనశీలురనూ, మదుపరులనూ ఇరుకునపెట్టరాదనే భావనతో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. నిజానికి, గతంలోనే ఓ సబ్ కమిటీ ఒక ముసాయిదా సిద్ధం చేసింది. అయితే, ఆ తర్వాత సదరు సబ్ కమిటీతో సంబంధం లేకుండా మొన్న జూలైలో మంత్రిత్వ శాఖ వేసిన కమిటీ తాజా మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ పత్రం ఏం చెబుతోంది?ఇవాళ ప్రపంచంలోనే ఛాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎంలు)ను అమెరికా తర్వాత అత్యధికంగా వాడుతున్న దేశం మనదే. ఏఐలో ప్రపంచ ఆధిపత్యం సంపాదించాలని అమె రికా, చైనాలు తహతహలాడుతుంటే, భారత్ మాత్రం సమూల మార్పు తెచ్చే ఈ టెక్నాలజీలను ప్రజల జీవితాలను మార్చేందుకు ఎలా వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘ఏఐ గవ ర్నెన్స్ గూపు’ను ఏర్పాటు చేయాలన్నది ఈ మార్గ దర్శకాల్లో ఓ సూచన.ఆ గ్రూపునకు అండగా ‘టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ’, అలాగే ‘ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్’ ఉంటాయి. అయితే, ప్రభుత్వ అధికారులు ఏఐ సిస్టమ్స్ను వాడినప్పుడు ఏం చేయాలన్న దానిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ప్రభుత్వం సంగతి అటుంచితే, ప్రైవేట్ రంగం భారతీయ చట్టాలన్నిటినీ పాటిస్తూ, స్వచ్ఛందంగా నియమాలు పెట్టుకొని, పారదర్శకంగా వ్యవహరించాలనీ, బాధితుల సమస్యను పరిష్కరించే వ్యవ స్థలు ఏర్పాటు చేసుకోవాలనీ మార్గదర్శకాలు సూచించాయి. ఏఐతో చేసిన కంటెంట్ విషయంలో యూట్యూబ్, ఇన్స్టా లాంటివి ఇకపై ఆ మాట స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఐటీ రూల్స్లో ఇప్పటికే ఈ సవరణ ముసాయిదా తెచ్చారు.రానున్న రోజుల్లో ఏం జరగనుంది?ఏఐ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే వరుసగా ప్రపంచ సదస్సులు జరుగుతున్నాయి. బ్లెట్చెలీ పార్క్ (బ్రిటన్), సియోల్, ప్యారిస్లలో జరిగిన గత సదస్సుల అనంతరం రానున్న నాలుగో సదస్సు వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గదర్శకాల రూపకల్పన కీలకమైంది. ఏఐని నియంత్రించడం కష్టమైపోతోందని ప్రపంచ దేశా లన్నీ కిందా మీదా అవుతున్న పరిస్థితుల్లో మన దేశం ఇలా ఆగి, ఆలోచించే వైఖరిని అవలంబించడం మంచిదే. అర్థం చేసుకోదగినదే. భవిష్యత్తులో అవస రాన్ని బట్టి ఏఐపై నియంత్రణ, లేదా చట్టాన్ని చేస్తా మంటూ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి సైతం చెప్పడాన్ని ఆ కోణం నుంచి చూడాలి.అయితే, ఏఐ సృష్టి వీడి యోలతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ రాజకీయ నేతల మొదలు రంగుల లోకపు తారల దాకా అందరినీ బాధితుల్ని చేస్తున్న డీప్ ఫేక్ మహ మ్మారిపై చర్యలు తక్షణావసరం. ఈ విషయంలో విధాన నిర్ణేతలపై ఇప్పటికే చాలా ఒత్తిడి వస్తోందని మర్చిపోలేం. ఏఐపై అతిగా రూల్స్ పెట్టిన యూరో పియన్ యూనియన్, మార్కెట్ శక్తులకే అంతా వది లేసి స్వచ్ఛంద నియమాలతో ఈ రంగం పెంపొందా లని భావిస్తున్న అమెరికా... ఈ రెంటితో పోలిస్తే, భారత మధ్యేమార్గ ధోరణి ప్రశంసనీయమే కానీ ఫలితాలిస్తుందా అన్నది చూడాలి. -
బంగ్లా సంక్షోభంలో భారత వైఖరి?
షేక్ హసీనాకు విధించిన మరణదండన తీర్పుపై ఇండియా ఏ వైఖరి అనుసరించినా చిక్కే! భారత్ ఒకవేళ బంగ్లాదేశ్ ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా చేసుకున్నా లేదా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది.బంగ్లాదేశ్ చరిత్ర మరో మలుపు తిరుగు తోంది. ఉద్వాసనకు గురైన బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆమె దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ సోమ వారం నాడు మరణ దండన విధించింది. హసీనాపై విచారణ రాజకీయ దురుద్దేశా లతోనే సాగిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆమెకు మరణ దండన విధించడంతో అదొక భద్రతా, దౌత్యపరమైన విస్ఫో టనంగా పరిణమించింది. భారత్తో సహా పాశ్చాత్య దేశాలు ఈ ప్రాంతంలో సుస్థిరతను కోరుకుంటున్నాయి. కానీ ట్రైబ్యునల్ తీర్పుపై ఏ వైఖరి అనుసరించినా చిక్కులు తెచ్చిపెట్టేదిగానే ఉంది.రెండు వర్గాలుగా బంగ్లాదేశీయులుబంగ్లాదేశ్తో వచ్చిన చిక్కేమిటంటే, ప్రజానీకం రెండు శిబిరా లుగా చీలిపోయి ఉంటున్నారు. ఒక వర్గం ఉదారవాద ఇస్లాంకు అనుకూలం. ఉపఖండం స్వాతంత్య్రాన్ని గడించుకోక ముందు నుంచీ ఈ వర్గంవారు దక్షిణాసియాలోని మిగిలిన దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటూ, ప్రజా కృషక్ పార్టీ వంటి పార్టీల వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. వారు 1947 తర్వాత, అవామీ లీగ్, వామపక్షాలకు మద్దతు ఇస్తున్నారు. రెండవ వర్గం ఇస్లామిక్ దేశంగా మారాలని కోరుకుంటోంది.వీరు గతంలో ముస్లిం లీగ్కు మద్దతు ఇచ్చారు. తర్వాత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి, జనరల్ హుస్సేన్ ఎర్షాద్కు చెందిన ‘జాతీయ పార్టీ’ వంటి కొన్ని పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. మూడవ వర్గం కూడా ఒకటుంది. అది షరియాను కోరుతూ, ఇస్లాం మతాచారాలను తు.చ. తప్పకుండా పాటించాలని డిమాండ్ చేస్తోంది. అది జమాత్–ఇస్లామీ బంగ్లాదేశ్ మద్దతుదారు. అయితే, బంగ్లాదేశ్లో అత్యధిక ప్రజానీకం ఈ సైద్ధాంతిక ఘర్షణల్లో తటస్థంగానే ఉంటూ, ప్రభుత్వ మార్పునకు వీలు కల్పిస్తూంటారు.ఇండియాపై తక్షణ ప్రభావంభౌగోళిక అంశాలు, ప్రజా వర్గాల కారణంగా బంగ్లాదేశ్ ప్రభావం మనపై ఉంటుందని మొదట అర్థం చేసుకోవాలి. భారత్– బంగ్లాదేశ్ సరిహద్దు నిడివి ఎక్కువ. బంగ్లా వైపు నుంచి ఉగ్ర వాదులు సులభంగా భారత్లోకి ప్రవేశించడం, ఇక్కడి నేరస్థులకు ఆయుధాలు చేరవేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అలాగే పోరాటాలకు దిగేవారు, శరణార్థులు భారత్ లోనికి ప్రవేశించేందుకు ఢాకాలోని అస్థిర పరిస్థితులు పురికొల్పవచ్చు.రెండు-పాకిస్తాన్తో ముడిపడిన కుట్రదారులు, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న పాత్రధారుల మధ్య జరిగిన సమావేశాలకూ, ఢిల్లీ ఎర్రకోట ఘటన దర్యాప్తులో నిగ్గుదేలుతున్న అంశాలకూ మధ్య నున్న సంబంధం ఒక ఆందోళనకర ధోరణిని సూచిస్తోంది. ఉగ్ర వాదులు, వారిని పోషిస్తున్న వ్యవస్థల సంబంధీకులు బంగ్లాదేశ్ను కేవలం దేశీయ రంగస్థలంగా చూడటం లేదు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగపడే రహస్య స్థావరంగా చూస్తున్నారు. దాంతో ఢాకాలో అస్థిరత న్యూఢిల్లీకి ప్రత్యక్ష జాతీయ భద్రతా సమస్యగా పరిణమిస్తోంది.మూడు– రాజకీయ దృక్కోణం దౌత్యపరమైన ఒత్తిడిని సృష్టి స్తోంది. భారతదేశం ఒకవేళ ఢాకా ఆంతరంగిక రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే, నిజంగా జోక్యం చేసుకున్నా లేదా జోక్యం చేసు కున్నట్లు ఆరోపణలు వచ్చినా అక్కడి తాత్కాలిక ప్రభుత్వ ప్రాపగాండాకు గొప్ప వరంలా అందివస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలలో మరింత విషం నింపినట్లు అవుతుంది. సరిహద్దు నిర్వహణ, కౌంటర్ టెర్రరిజంపై సహకారాన్ని బలహీనపరుస్తుంది. నీతి నియమాల సూత్రాలు, వివేకం– రెండింటిలో దేనితో నడుద్దామనుకున్నా భారతదేశానికున్న అవకాశాలు సవాళ్ళతో నిండినవే! ఏం చేయగలం? ప్రాంతీయ పెత్తందారుగా వ్యవహరిస్తోందని ఢాకా భాష్యం చెప్పడానికి వీలున్న చర్యల జోలికి పోకుండానే, తన జాతీయ భద్ర తను, పౌరులను భారత్ పరిరక్షించుకోవాల్సి ఉంది. సరిహద్దులో చొరబాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను భారత్ వేగ వంతం చేయాలి. సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాలలో మానవతా చర్యలను చేపట్టేందుకు సమాయత్తమవ్వాలి. అత్యవసర మందు లను, గుడారాలను, జన ప్రవాహాన్ని తట్టుకుని చట్టాన్ని అమలు చేయగల విభాగాలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాతలను రంగంలోకి దింపడానికి సిద్ధమై, ఐరాస సంస్థలతో సమన్వయంతో పని చేయాలి.సైనిక దళాలను మోహరిస్తే, పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది. ఆత్మరక్షణ, పౌర రక్షణ ఏర్పాట్లు చేసుకోవ డంలో తప్పు లేదు. అవి అత్యవసరం కూడా! సరిహద్దుకు ఆవల నున్న ఉగ్రవాద తండాల కదలికలపై సాంకేతిక, కార్యనిర్వహణా పరమైన, జ్యుడీషియల్ మార్గాల ద్వారా ఒక కన్ను వేసి ఉంచి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడాన్ని న్యూఢిల్లీ తీవ్రం చేయాలి. అవి నిక్కచ్చిగా కౌంటర్ టెర్రరిజం చర్యలవుతాయి కానీ, రాజకీయ జోక్యం కిందకు రావు.సుస్థిరతను అందించగల సామర్థ్యమున్న బంగ్లాదేశీ మధ్య వర్తితో ప్రైవేటుగా చర్చలు జరిపేందుకు సిద్ధమై ఉండాలి. అది రాజ కీయంగా అసౌకర్యమైనదే. కానీ, రాజకీయ సంబంధాలు అట్టడు గుకు చేరిన సమయంలో కూడా (సరిహద్దుల నిర్వహణ, కౌంటర్ టెర్రరిజం, విద్యుత్తు, వర్తక వాణిజ్యాల వంటి) అంశాల ఆధారిత చర్చలు కొనసాగాలి. దక్షిణాసియా అస్థిరత సరిహద్దులను దాటి ఎలాంటి పర్యవసానాలకు కారణం కాగలదో అమెరికా, ఐరోపా దేశాలకు, ‘క్వాడ్’ భాగస్వాములకు న్యూఢిల్లీ నివేదించాలి. ఉద్రిక్తత లను సడలింపజేసేందుకు అంతర్జాతీయంగా ఒత్తిడి తేవడం, పౌరుల హక్కులను గౌరవించేలా మాట తీసుకోవడం మంచిది. ఢాకాలో రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు ఎంతో కొంత ప్రయత్నించినా కూడా అది హింసను నిరోధించగల ఉత్తమ కవచంగా పనిచేస్తుంది. గౌరవప్రదమైన ప్రాంతీయ ప్రముఖులు, బహుళ పక్షీయ మధ్యవర్తులతో సమ్మిళిత రాజకీయ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్స హించేందుకు భారత్ ప్రయత్నించవచ్చు. తద్వారా, ఎన్నికల నిర్వహణకు, చట్టబద్ధ పాలనకు అనువైన పరిస్థితులు ఏర్పడేటట్లు చేసినట్లు అవుతుంది. అవి కొరవడితే, అణచివేతలు, తిరుగుబాటు కార్యకలాపాలు పునరావృతమవుతూనే ఉంటాయి.-జయంత రాయ్ చౌధురీ వ్యాసకర్త పీటీఐ తూర్పు ప్రాంత విభాగ మాజీ అధిపతి -
ఆశ్చర్యం కలిగించని పరాభవం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది. మహాగఠ్బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.నాయకత్వానికి సవాలురాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు. ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.వైఫల్యాలపై అధ్యయనం శూన్యంఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది. పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది. పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.యూపీఏ ఉన్నట్టేనా?అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది. దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు. ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బీఎన్ను ఇట్లా స్మరించుకుందాం!
కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కార్యాచరణే వారిని ముందు తరాల వారు గుర్తించేలా చేస్తుంది. మరి కొన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది. కొద్ది రోజులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే డిమాండే ఈ చర్చకు నేపథ్యం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళ్లిన సందర్భంలో వరద కాలువకు ఫలానా నాయకుని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఫలానా నాయకుని పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు. దానికి ఎవరి పేరు పెడితే సరైందో వారి పేరు పెట్టాలనే సూచన బలంగా వస్తున్నది. 1940లకు పూర్వం నుండే ఈ ప్రాంత చైతన్యానికి బాటలు వేసిన వారిలో బీఎన్ ఒకరు. బీఎన్ సేవలను కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాత్రమే పరిమితం చేయకూడదు. కాకపోతే సందర్భం అలాంటిది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తున్నది. వరద కాలువ నీటి కోసం ఆయన నిర్వహించిన సభలు, సమావేశాల గురించి కథనాలు నాటి పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చాయి. బీఎన్ ఇంట ర్వ్యూలు కూడా అందులో ఉన్నాయి. నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఆందోళనకు ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారింది. కానీ అప్పట్లో అధికార, విపక్షాల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకూ అన్ని విషయాలు తెలుసు. చదవండి: Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయంతెలంగాణ రైతాంగ పోరాటాన్ని ‘మట్టి మనుషుల పోరాట’ మని నిర్వచించిందే బీఎన్. తాను భూస్వామి అయినా పేదల పక్షాన్నే నిలబడ్డారు. తన భూములను కూడా పేదలకు పంపిణీ చేశారు. తెలంగాణ గ్రామీణ జీవితపు సంఘర్షణను అనుభవించి, దాన్ని పారదోలేందుకు కంకణం కట్టుకున్న వారాయన. కాబట్టే అట్టడుగు వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం కావాలని పట్టు బట్టారు. రైతుల సాగు ముందుకు సాగాలన్నారు. నీటి వసతి కావాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ తీసుకున్నారు. ‘కొట్టిన వారిని, పెట్టిన వారిని మర్చిపోర’ని తెలంగాణలో అందరికీ పరిచయం ఉన్న సామెత. బీఎన్ అశేష తెలంగాణ ప్రజల మేలుకోరారు. మరీ ముఖ్యంగా తాను పుట్టిపెరిగిన నల్లగొండ జిల్లా జనాల, పొలాల దాహార్తి తీర్చాలని తపన పడ్డారు. బీఎన్ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి నుండి చివరిదాకా ఆయుధం పట్టి పోరాడిన యోధుడే కాదు... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా చట్టసభలలో అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై పోరాడిన మహాయోధుడు. అలాంటి వారి గురించి పట్టించుకోపోతే ఎట్లా? నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని గుర్తించాలని అడగటమే ఆవేదన కలిగించే విషయం. జన జీవితాలను మారుస్తున్న వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే ఉమ్మడి నల్లగొండ ప్రజల డిమాండ్ సముచితమే! – గోర్ల బుచ్చన్న, జర్నలిస్టు(ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని రేపు జరగనున్న ధర్నా సందర్భంగా) -
'ప్రాధాన్యాలను' గుర్తించడమే గెలుపు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి. ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను. ఏఐ వెంట పరుగెత్తాలి!‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసు కుని ముందుకు సాగండి. ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్టెక్లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది. కంప్యూటింగ్లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్వేర్ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.అలెక్స్ నెట్కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్జీపీటీ’ తెచ్చారు.తోటమాలి నేర్పిన పాఠంఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం. మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది. నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.సూపర్ పవర్స్మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను. మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి. చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది. -
బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయం
అందెశ్రీ సహజ కవి, ప్రజాకవి. కాళి దాసుది మేఘ సందేశం, అందెశ్రీది నది సందేశం. ‘నది నడిచి పోతున్నది, నావనై నను రమ్మన్నది’ అంటూ దేశ దేశాలను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన కవి ప్రపంచంలో అందెశ్రీ ఒక్కడే! అత్యంత పేదరికం నుండి ఆశు కవిగా, ప్రకృతి కవిగా పరిణతి చెందాడు.అందెశ్రీది వాక్శుద్ధి గల కవిత్వం. ఆయన పలికింది సత్యమై కూర్చుంటుంది. అలనాటి పోతులూరి వీరబ్రహ్మం గురించి విన్నాము. పోతులూరి సమాజానికి తిరుగుబాటు నేర్పాడు. రాజులను మార్చాడో లేదో తెలియదు గానీ అందెశ్రీ ప్రభుత్వాలను మార్చుతాను అన్నాడు. ‘వాడెంత’ అన్నవాడిని కుర్చీ నుండి దించే దాక హృదయంలో అగ్నిగుండమై రగిలాడు. అదే ‘నిప్పుల వాగు’ పాటల, కవితల సంకలనం. అది ఆరేండ్ల కృషి. ఆనాడు అవమానించబడిన చాణక్యుడు నంద రాజ్యాన్ని కూల్చి మౌర్య చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేసినట్లు... నేటి చాణక్యుడిగా నిలిచి, ‘ఇంటర్వ్యూ నువ్వు చెయ్యాలి. నేను జవాబులు చెప్పాలి’ అని భవిష్యత్ తెలిసిన అందెశ్రీ... రేవంత్రెడ్డిని ఇంటర్వ్యూ చేయమన్నాడు. ‘ఆ చదువు రానివాడు నాలుగు నుడుగులు నేర్వగానే ఇంత పొగరా!’ అని అనుకున్న వారు ఉన్నారు. అతడు అంద రినీ ప్రేమించాడు. అతడికి కులం లేదు, ధనం లేదు. అందెశ్రీలో ఎంత పొగరున్నదో, ఎంత విద్వత్తున్నదో అంత వినయ సంపన్నుడు. అది ఆయన గురువుగా గౌరవించే శ్రీరాం సర్కు తెలుసు. నాకు తెలుసు. ఆయన వాక్శుద్ధిని గమనించిన సంస్కృతపండితులూ, వయోవృద్ధులూ ఆయనకు తలలు వంచి నమస్కరించారు. అందెశ్రీని ఒక్క మాటలో చెప్పాలంటే... ఆధునిక ఋషి. 1995లో ‘ప్రవహించే పాట: ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే పాటల పుస్తకం కోసం... అన్ని ప్రాంతాలనుండి వందలాది కవుల పాటలను సేకరిస్తున్న కాలంలో అందెశ్రీ వెలువరించిన రెండు పాటల పుస్తకాలు అందించాడు. అవి అన్నీ ప్రకృతి, పల్లె జీవితం, మానవీయత గురించిన పాటలు. 1992లో ప్రారంభించిన ‘దరకమే’ ఐక్యవేదికలో చేరలేదు. పాట కవుల వేదిక, అలాగే ‘కథకుల వేదిక’ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న ప్రకారం... గూడ అంజయ్య పాట కవుల వేదికను ప్రారంభించాడు. అందెశ్రీ దానితో కలిసి కొన్ని పాటలు రాశాడు. ఆ పాట కవుల వేదికే ‘తెలంగాణ ధూం ధాం’కు బీజం వేసింది. కామారెడ్డి సభతో తన రూపం తీసుకుంది. పాట కవులు, కళాకారులు తప్ప ఎవరూ వేదికపై ఉండరాదనే నియమంతో ‘తెలంగాణ ధూం ధాం’ బయల్దేరింది. పాట కవుల వేదికను ‘తెలంగాణ ధూం ధాం’గా మలచడంలో అందెశ్రీది కీలక పాత్ర. మారోజు వీరన్న కృషి అంత ర్లీనంగా ఉండింది. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను ‘తెలంగాణ ధూం ధాం’ నిర్మాత అందెశ్రీనే అని! ఈ విషయాన్ని ‘నడుస్తున్న చరిత్ర తెలంగాణ’ సిరీస్ 2వ పుస్తకంలోనే ఇరవై యేళ్ళ క్రితం నమోదు చేశాను. ‘రసమయి’ బాలకిషన్ కళాకారుడిగా తెలంగాణ ధూం ధాంకు ఐకా¯Œ గా నిలిస్తే దాని రూపురేఖలను తీర్చిదిద్ది సాహిత్యాన్ని అందించినది అందెశ్రీ. అంతడుపుల నాగరాజు కళాబంధం దాన్ని రసమయం చేసింది. అందెశ్రీ బడిలో చదవలేకపోయాడు. లోకమే విశ్వవిద్యాలయంగా చదివినవాడు. అతడు పశువులను కాశాడు. సుతారి పని చేశాడు. నిజామాబాద్లో శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ గురూజీ ఆయనకు జ్ఞానబోధ చేశాడు. బిరుదురాజు రామరాజు కన్నబిడ్డగా చూసుకున్నాడు. బాసర వాక్కులమ్మ స్ఫూర్తితో ఎది గాడు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవిగా నిలిచాడు. వర్తమానంలో సాహిత్యం మీద బతికిన మహాకవి అందెశ్రీ. ఏ నిర్మాణంలో ఇమడలేనని చెప్పి స్వతంత్రుడుగా జీవించిన కవి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడి పాడె మోసి ముందుకు నడిచాడు. అమరుడైనాక కూడ ఆయన కోరుకున్నట్టు ‘పద్మ భూషణ్’, ‘పద్మవిభూషణ్’ తప్పక వరిస్తాయి. అమరుడా...అందెశ్రీ! నీకు జోహార్లు.-బి.ఎస్. రాములు తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ -
మళ్లీ అణ్వాయుధ పోటీ?
అణ్వాయుధాల పరీక్షలను తక్షణం పున రుద్ధరించవలసిందిగా రక్షణ (ఇప్పుడు ‘యుద్ధ విభాగం’గా పిలుస్తున్నారు) శాఖను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 29న ప్రకటించారు. ఇది ప్రపంచ అణు సుస్థిరత, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక నియమావళులపై అక్షరాలా బాంబు వేయడమే! అమెరికా 1992 సెప్టెంబర్ తర్వాత, పూర్తి విస్ఫోటనాత్మక అణు పరీక్షను నిర్వహించలేదు. అయితే, 1998లో భారత్ అణు పరీక్షలను జరిపితే, ఆ వెంటనే పాకిస్తాన్ కూడా నిర్వహించింది. ఒక అణ్వాయుధాన్ని విస్ఫోటనం చెందించి చూడటం కడసారిగా 2017లో జరిగింది. భూగర్భంలో ఉత్తర కొరియా ఆ పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి, అణు పాటవ పరీక్షలపై మారటోరియం అమలులో ఉంది. ఇప్పటివరకు అది ఉల్లంఘనకు గురి కాలేదు. ‘‘చాలా ఏళ్ళ క్రితం మేం దాన్ని నిలుపు చేశాం. కానీ, ఇతరులు పరీక్షలు చేస్తూండటంతో, మేం కూడా చేయడం సముచితమని నాకనిపించింది’’ అని ట్రంప్ అన్నారు. రష్యా పేరును ట్రంప్ ప్రస్తావించకపోయినా ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ మాటలన్నారన్నది స్పష్టం. రష్యా పుట్టిస్తున్న దడట్రంప్ ప్రకటనకు 10 రోజుల ముందు, మాస్కో అణ్వాయుధాలను మోసుకెళ్ళగల రెండు అధునాతన ప్రయోగ వ్యవస్థలను పరీ క్షించింది. బురైవెస్నిక్ (ఆకాశం నుంచి జారిపడే) క్రూజ్ క్షిపణిని... అక్టోబర్ 21న, అసాధారణ పొసైడాన్ జలగర్భ టార్పెడోను... అక్టో బర్ 28న పరీక్షించింది. అయితే, ఈ రెండూ అణ్వాయుధాలను మోసుకెళ్ళగల వాహకాలు మాత్రమే. వాటిని పరీక్షించడం అణు విస్ఫోట పరీక్షలతో సమానం కాదు. సాంకేతికంగా, అవి ప్రస్తుత ఆయుధ నియంత్రణ చట్రంలోకి రావు. ప్రయోగ వాహకాలను పరీ క్షించాంగానీ, అణ్వాయుధాలను కాదని రష్యా పునరుద్ఘాటించింది. కానీ అణ్వాయుధాలను కూడా పొదువుకుంటే, బురైవెస్నిక్, పొసైడాన్ ప్రాణాంతక ఆయుధాలుగా పరిణమిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవి రష్యా వద్ద ఉన్నంతవరకూ దాని జోలికి వెళ్ళే సాహసం ఎవరూ చేయలేరు. రాడార్ దృష్టిలో పడకుండా బురైవెస్నిక్ 15 గంటల్లో 14,000 కిలోమీటర్ల దూరం పయనించినట్లు అక్టోబర్ 21 పరీక్షలో తేలింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన చోట మాత్రమే అది భూవాతావరణంలోకి ప్రవేశించగలదు. ప్రస్తుతమున్న క్షిపణి రక్షణ వ్యవస్థలు దాన్ని పసిగట్టలేవు. అదే అమెరికా ఆందోళనకు కారణం. ఇక పొసైడాన్... మానవ రహిత జలాంతర్గత అణ్వాయుధ వాహకం. ఇది 10,000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. గరి ష్ఠంగా గంటకు 100 నాట్ల (185 కిలోమీటర్ల) వేగాన్ని అందుకోగ లదు. నీటిలో 1,000 మీటర్ల లోతు నుంచి సునాయాసంగా పని చేయగలదు. ఇది ఇప్పుడున్న జలాంతర్గామి నిరోధక రణతంత్ర సామర్థ్యాలకు అందనిది. అణ్వాయుధాన్ని కూడా తగిలించుకున్న పొసైడాన్ను యుద్ధంలో ప్రయోగిస్తే, అది భూగర్భ శిలా ఫలకాలను కదిలించే విధంగా అణుధార్మిక సునామీని రేకెత్తించగలదు. భూగోళానికి, మానవాళికి ఇది చూపించగల ప్రళయం మాటలకు అందనిది. ‘ఐరన్ డోమ్’తో మారిన పరిస్థితిప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 1972లో అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్లు బాలిస్టిక్ నిరోధక క్షిపణుల ఒడంబడిక (ఏబీఎం)కు వచ్చాయి. పరస్పరం ఆయుధాలను ప్రయోగించుకుంటే ఇద్దరమూ నాశనం కావడం ఖాయం అనే అవగాహన (మ్యాడ్)ను అది కల్పించింది. విధ్వంసాన్ని ఆధారం చేసుకున్న మనుగడ అనే ఆ సిద్ధాంతం అసంబద్ధమైనదిగా కనిపిస్తుంది. ఏబీఎం ఆనాటి పరిస్థితులను బట్టి కుదుర్చుకున్న సంక్లిష్టమైన,సాంకేతిక–వ్యూహాత్మక ఒడంబడిక. పోగుపడుతున్న సామూహిక విధ్వంసక ఆయుధాల (డబ్లు్య.ఎం.డి.)తో రెండు అగ్ర రాజ్యాల మధ్య అభద్రత నెలకొన్న నేపథ్యంలో కుదుర్చుకున్నది. అయితే, 2001 సెప్టెంబర్ 11 (9/11) పరిణామాల నేపథ్యంలో, అమెరికా 2002 జూన్లో, ఏకపక్షంగా ఆ ఒడంబడిక నుంచి ఉపసంహరించుకుంది. వైశాల్యం కుంచించుకుపోయి, ఆత్మ విశ్వాసం సన్నగిల్లిన పరిస్థితిలోనున్న రష్యాలో అది అభద్రత బీజాలను నాటింది. పొసైడాన్ 2015లో పురుడు పోసుకోవడం పుతిన్ కన్నుల్లో కాంతి రేఖను నింపింది. కడచిన దశాబ్దంలో అది వైఫల్యాలను చూసింది. సైంటిస్టులు ప్రమాదాల్లో హతులయ్యారు. కానీ, కార్యక్రమం కొన సాగింది. అక్టోబర్ 21న విజయవంతమైంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, చేసిన ప్రక టన బహుశా పుతిన్ను ఈ పరీక్షకు పురిగొల్పి ఉండవచ్చు. ‘అమె రికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు’ శీర్షికతోనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై 2025 జనవరి 27న ట్రంప్ సంతకం చేశారు. ఇప్పుడా డోమ్కు ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. అది అమెరికా ప్రధాన భూభాగానికి అంతటికీ గొడుగులా పనిచేస్తుందనీ, బహుశా 2045 నాటికి పూర్తి కాగల ఈ కార్యక్రమానికి దాదాపు 3.6 ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయనీ అంచనా. ఇందుకు సంబంధించి ఎలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’కు మొదటి విడత చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ‘స్టార్ వార్స్’ కార్యక్రమాన్నీ, ప్రచ్ఛన్న యుద్ధం అంతాన్నీ గుర్తుకు తెస్తోంది. ఈ కార్యక్రమాలు దీర్ఘకాలంలో అమెరికా, రష్యా రెండింటినీ దివాళా తీయిస్తాయా? నిరాయుధీకరణే దారిపాకిస్తాన్తో సహా ఇతర దేశాలు రహస్యంగా అణు పాటవ పరీ క్షలు నిర్వహిస్తున్నాయని ట్రంప్ చెబుతున్నారు. అధునాతన అణ్వా యుధాలు డోమ్లో భాగం కావాలంటున్నారు. దానికి కొనసాగింపుగా, అమెరికా అణు పరీక్షలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ‘‘సంయమనం, చర్చలు అవసరమైన సమయంలో అణు పాటవ పరీక్షలను పునరుద్ధరించడం అస్థిరతకు ద్వారాలు తెరుస్తుంది. మూడు దశాబ్దాలుగా అణ్వాయుధ పోటీని నిరోధిస్తూ వస్తున్న అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని బీటలు వారుస్తుంది’’ అని ఆసియా –పసిఫిక్ లీడర్షిప్ నెట్వర్క్ (ఏపీఎల్ఎన్) అనే ప్రాంతీయ బృందం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఆ ప్రకటనపై సంతకం చేసిన వారిలో ఈ వ్యాసకర్త కూడా ఉన్నారు. ట్రంప్ అణు సంయ మనాన్ని పాటిస్తారో, లేక పరీక్షల నిషేధ ‘రెడ్ లైన్’ను ఉల్లంఘిస్తారో చూడవలసి ఉంది. అంతర్జాతీయంగా అణు సంయమనం, నిరాయు ధీకరణకు ఎల్లప్పుడూ పోరాడే భారత్ తన గొంతును తప్పనిసరిగా వినిపించవలసి ఉంది. వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్ -
శత్రువు తెలుసు, మిత్రులెవరో తెలీదు!
వర్తమాన భారత సమాజాన్ని చాలామంది చాలా రకాలుగా వర్ణి స్తున్నారు. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం (సీసీడీ) అనే భావన ఇప్పుడు క్రమంగా బలాన్ని పుంజుకుంటోంది. ఈ కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వం తనకు అనుకూలమైన రాజకీయ విభాగానికి పార్లమెంటరీ ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అదే బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజా స్వామ్య కూటమి (ఎన్డీఏ).ఈ వ్యవస్థ మారాలని అత్యధికులు ఆశిస్తుంటారు. వ్యవస్థను మార్చడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది – ఎన్డీఏను తప్పించడం. ఇది అన్నింటికన్నా ఆదర్శ పరి ష్కారం. అయితే, ఆచరణ అంత సులువు కాదు. చాలా కాలం పడుతుంది. సాధారణ ఉద్యమాలు, పోరాటాలు కూడ సరిపోకపోవచ్చు. తీవ్ర పోరాటాలు అవసరం కావచ్చు. తీవ్ర అనే మాటకు అర్థాన్ని ఎవరికి వారు ఎంత వరకైనా అన్వయించుకోవచ్చు.లేత ఎరుపు నుండి ముదురు ఎరుపు వరకు, లేత నీలం నుండి ముదురు నీలం వరకు గడిచిన వందేళ్ళలో మనదేశంలో సాగిన ఉద్యమాలన్నీ పౌర సమాజం మీద చాలా సానుకూల ప్రభావాన్ని వేశాయి. అయితే దాన్ని రాజకీయ ప్రయోజనంగా మార్చుకోవడంలో అవన్నీ ఘోరంగా విఫలం అయ్యాయి. అలనాడు గొప్పగా వెలిగిన పౌర సమాజాన్ని కూడ ఇప్పుడు సీసీడీ కలుషితం చేసేసింది. సమానత్వ, సహోదర, సామ్యవాద భావాల నుండి సమా జాన్ని తప్పించే పనిలో పడింది. దీనిని శుద్ధి కార్యక్రమం అని కూడ అంటున్నారు.బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మనకు ఇంకో పరిష్కారం ఉంది; ఐదేళ్ళకు ఒకసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో మనకు నచ్చని పార్టీనో, కూటమినో ఓడించడం. అది సాయుధ పోరాటాలు చేయాల్సినంత కష్టమైన పని కాదుగానీ, అంత ఈజీ కూడా కాదు. దాదాపు వందకోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటారు. వాళ్ళలో ఓ70 కోట్ల మంది పోలింగులో పాల్గొంటారు. వారిలో సగానికి పైగా, అంటే నలభై కోట్ల మందిని ప్రభావితం చేసేబృహత్తర పథకాన్ని రచించి కచ్చితంగా ఫలితాలనుసాధించే కార్యాచరణ ఒకటి ఉండాలి.అయితే, ప్రజాస్వామ్యం పేదది కాదు; పేదోళ్ళదిఅంతకన్నా కాదు. రాజకీయ కళలో ప్రావీణ్యం సంపాదించిన కొద్దిమంది కలిసి నడిపే నియంతృత్వంగా ప్రజా స్వామ్యం కుంచించుకుపోయింది. ఇదో రాజకీయ పార డాక్సీ! ఈ వాస్తవాన్ని ముందు గుర్తించాలి. సమ్మతి ఉత్పత్తి అన్నమాట! ఉత్పత్తి అంటేనే పెట్టుబడి.అయితే, సమాజం చాలామంది అనుకుంటున్నంతగా చెడిపోలేదు. సీసీడీ ప్రాయోజితంగా గెలిచినవాళ్ళు తమను తాము అప్రతిహత శక్తిగా చెప్పుకుంటున్నారుగానీ, ఓటర్లు వాళ్ళకు అంతగా మద్దతు పలకలేదు. 2014 నుండి 2024 వరకు జరిగిన మూడు లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పడిన ఓట్లు 31, 37.36, 36.56 శాతం మాత్రమే!అంటే, 60 శాతానికి పైగా ఓటర్లు ఎన్డీఏ కూటమికి వ్యతి రేకంగా ఓటు వేస్తున్నారు. దీని అర్థం ఏమిటీ? ఎన్డీఏ కూటమి తన సొంత బలం మీద కాకుండా విపక్షాల అనైక్యత వల్ల మాత్రమే గెలుస్తున్నది.విపక్షాలు ఏకం అయితే ఎన్డీఏ కూటమిని ఓడించడం సులువు అని దీన్నిబట్టి అర్థమవుతుంది. ఒక సీటు దగ్గర, ఒక పదం దగ్గర, అప్పుడప్పుడు ఒక అక్షరం దగ్గర కూడ తేడాలొస్తే భూమ్యాకాశాల్ని ఏకంచేస్తూ మన విపక్షాలు కొట్లాడుకుని విడిపోతుంటాయి. మరోవైపు, ఎన్డీఏ కూటమి ఏకశిలా సదృశంగా సమైక్యంగా ఉంటుంది. ఆ కూటమిలో, ఆరెస్సెస్ వంటి మెజారిటీ మతవాదులతోపాటు అథవాలే వంటి అంబేడ్కరిస్టులు, నితీశ్ కుమార్ వంటి సోషలిస్టులు కూడా ఉంటారు. అయినా, అందరూ ఒక్కటై ఉంటారు. అది వాళ్ళ విజయ రహస్యం.విపక్షాలను ఏకం చేయాలనే ఆలోచన ఓ ఐదారేళ్ళుగా చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఎద్దేలు కర్ణాటక’ (మేలుకో కర్ణాటక) అనే ఒక పౌరసంస్థ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నడుం బిగించింది. ఆశించిన ఫలితాలను సాధించడానికి ఆధునిక టెక్నా లజీని కూడ వాడింది. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఓటింగ్ శాతం దాదాపు స్థిరంగా ఉన్నాసరే ఎన్నికల్లో ఓడి పోయింది. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్కు ఓట్లు పెద్దగా పెరVýæకపోయినా (4–5 శాతం), సీట్లు మాత్రం భారీగా పెరిగి, అధికారాన్ని చేపట్టింది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నచోటనే ‘ఎద్దేలు కర్ణాటక’ ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల ఫలితాలను సాధించింది. కానీ, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆ సంస్థ ప్రభావం కనిపించలేదు. మళ్ళీ బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. రాబోయే 2029 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ పౌరసంఘాలు కొన్ని ఈసారి కొంచెం ముందుగానే సన్నాహాలు మొదలెట్టాయి. ఇదొక సానుకూల సంకేతం. తొలి అడుగులో, వామపక్ష (మార్క్స్), సామాజిక న్యాయ (అంబేడ్కర్) ఆదర్శాలుగల రాజకీయ పార్టీల్ని ఏకం చేయాలనేది ఒక ప్రతిపాదన. ఇది సరిపోదు. సీసీడీ, ఎన్డీఏ కూటమి బాధిత సమూహాలు అనేకం ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకు ముస్లింలు తదితర మైనారిటీలకు మత సామరస్యం ప్రధాన ఆదర్శం. అలాగే బీసీలు, ఆదివాసీలు, మహిళలు, కార్పొరేట్ ప్రాజెక్టుల నిర్వాసితులు. ఆధిపత్య కులాల్లోని పేదలు, ఉదారవాదులకు వారివైన ప్రత్యేక లక్ష్యాలు ఉంటాయి. ఇలా విభిన్న లక్ష్యాలున్న సమూహా లన్నింటినీ మినహాయింపు లేకుండా ఏకం చేయాలి. లోక్ సభ ఎన్నికల్లో ఎవర్ని ఓడించాలో మనకు స్పష్టంగానే తెలుసు. ఎవర్ని బలపరిస్తే ఈ లక్ష్యాన్ని సాధించగలమనే దాని మీదనే ఇప్పుడు మేధామథనం సాగాలి.-వ్యాసకర్త సమాజ విశ్లేషకులు-డానీ -
వైట్ కాలర్ ఉగ్రవాదం... ఓ వాస్తవం
నవంబర్ 10 సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడుతో న్యూఢిల్లీ గతుక్కుమంది. భద్రతా సంస్థలు ఒక ప్రధాన నిందితుడిని గుర్తించగలిగాయి. కశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఈ డాక్టర్ అధునాతన టెర్రర్ మాడ్యూల్లో భాగమని భావిస్తున్నారు. ఈ వైట్–కాలర్ టెర్రర్ మాడ్యూల్కు పాకిస్తాన్లో పేరుమోసిన జైషే మహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్నట్లు వెలుగు చూస్తున్న సాక్ష్యాధారాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు తాము నేరుగా ప్రమేయం పెట్టుకోకుండా, విద్యావంతులైన స్థానిక రిక్రూట్లతో దుశ్చర్యలకు పాల్పడే ధోరణి పెరుగుతోంది. విద్యావంతుల దుశ్చర్య‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా, ఉగ్రవాద ప్రయత్నాలలో ఎక్కడా విరామం కనిపించడం లేదు. భద్రతా దళాలు మే నెల నుంచి, కొన్ని డజన్ల ప్రయత్నాలను భగ్నం చేసినట్లు నిపుణుల అంచనా. స్థానిక మాడ్యూళ్ళ ప్రమేయమే చాలా వాటిలో ఉంది. కారు పేలుడుకు ముందు, వివిధ చట్ట సంస్థల అధికారులు రెండు గణనీయమైన డంపులను బట్టబయలు చేయగలిగారు. పోలీసులు నవంబర్ 9న వసతి భవనాల నుంచి 350 కిలోల అమోనియం నైట్రేట్తో సహా దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కశ్మీర్ నుంచి పనిచేస్తున్న ఒక ఉగ్ర ముఠాకు చెందినవి. స్వాధీనపరచుకున్న వాటిలో అసాల్ట్ రైఫిళ్ళు, పిస్తోళ్ళు, బాంబుల తయారీకి ఉపయోగపడే టైమర్లు, రిమోట్ డిటొనేషన్ సాధనాలు కూడా ఉన్నాయి. గుజరాత్ ఉగ్ర నిరోధక స్క్వాడ్ (ఏటీఎస్) అదే రోజున ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసింది. వారి నుంచి బిరెట్టా పిస్తోళ్ళు, తూటాలు స్వాధీనపరచుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ డాక్టర్లు, విశ్వవిద్యాలయ ఉద్యో గులు నిందితులుగా ఉన్నారు. వైట్–కాలర్ ఉగ్రవాదం పెరుగుతున్న ధోరణికి ఇవి మరిన్ని ఆధారాలను సమకూర్చాయి. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సాగి స్తున్న సీమాంతర ఉగ్రవాదంలో మారిన వ్యూహానికి ఢిల్లీ ఘటన అద్దం పడుతోంది. అది ఇక ఎంతమాత్రం విదేశీ ముష్కరులపై ఆధార పడటం లేదు. సరిహద్దుల నుంచి నేరుగా చొర బడేటట్లు చేయడం లేదు. భారతదేశం లోపల వృత్తి నిపుణులను మతోన్మాదులుగా తయారు చేసి వారిని దాడులకు ఉపయోగించుకునే పనికి పాకిస్తాన్ నిగూఢ వ్యవస్థ పాల్పడుతోంది. ఇది తమకేం సంబంధం లేదని చెప్పుకొనేందుకు పాక్ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల ఉగ్రవాద చర్యలను పాకిస్తాన్తో, దాని లోని సంస్థలతో నేరుగా ముడిపెట్టడం కుదరదు.మారిన పాక్ వ్యూహంపాక్ ఇలా వ్యూహం మార్చుకోవడం వెనుక దేశీయ, అంతర్జాతీయ అంశాలు చాలా ఉన్నాయి. ఉగ్ర సంఘటనల్లో పాత్రకుగానూ అంతర్జాతీ యంగా ఎదురయ్యే విఘాతాలను తప్పించుకోవా లని పాక్ యోచిస్తోంది. ‘ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’ ఈ మధ్య అంటే అక్టోబర్ నెలలో పాకిక్కు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. నిషే ధిత జాబితా నుంచి 2022లో బయటపడినందుకు సంబరపడిపోవద్దనీ, అది గుప్త ధనాన్ని మార్చడం, ఉగ్రవాదులకు నగదు చేకూర్చడానికి సంబంధించి అంతర్జాతీయ పర్యవేక్షణ నుంచి తప్పించుకున్నట్లు కాదనీ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోపల కూడా పరిస్థితులు సవ్యంగా లేవు.‘తెహ్రీక్–ఏ–తాలిబాన్ పాకిస్తాన్’ మళ్ళీ విజృంభిస్తోంది. అఫ్గానిస్తాన్తో ఘర్షణ కొనసాగుతోంది. ఫలితంగా, పాక్ సైన్యం ఆంతరంగిక భద్రతా విధుల పైనా, డ్యూరాండ్ రేఖ పైనా ఎక్కువ దృష్టి పెట్టవలసి వస్తోంది. ప్రాంతీయ ఘర్ష ణల్లో వ్యూహాత్మక లివరేజీని నిలబెట్టుకుంటూనే అంతర్జాతీయంగా తనకున్న చెడ్డ పేరును చెరిపేసు కుని, కొత్త అవతారం దాల్చినట్లుగా కనిపించవలసిన అవసరాన్ని అది గుర్తించింది. భారతదేశపు భద్రతా సంస్థలు కనివిని ఎరుగని సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. విదేశీ చొర బాటుదారులకు, దేశీయ కుట్రదారులకు మధ్యనున్న రేఖలు చెరిగిపోతున్నాయి. టెర్రర్ మాడ్యూళ్ళు వృత్తి నిపుణుల ముసుగును కూడా వేసుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అవి ఏవో చెదురుమదురు దాడులకు ఉద్దేశించినవి కావనీ, సరిహద్దుకు ఆవల నున్న సూత్రధారుల ఆదేశాల మేరకు విస్తృత దాడులకు పథకాలు రచించుకున్నాయనీ తేలుతోంది. భద్రతా సంస్థలు ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరిస్తూ నూతన రిక్రూట్మెంట్ మార్గాల రూపు రేఖలను కనిపెట్టవలసి ఉంది. వృత్తి విద్యా సంస్థల్లో రాడికలైజేషన్పై మానవ ఇంటెలిజెన్స్ పెంచు కోవాల్సి ఉంది. ఎవరెవరు చేతులు కలుపుతున్నారో గ్రహించేందుకు ఫోరెన్సిక్ డేటాను, డిజిటల్ నిఘాను వినియోగించుకోవాలి. సంస్థలు కూడా ఉద్యోగాలిచ్చే ముందు క్షుణ్ణంగా నేపథ్యాలు తెలుసు కోవాలి. యూనివర్సిటీలు, వృత్తి విద్యా సంస్థల లోపల కౌంటర్–రాడికలైజేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి. ఫ్రాన్స్ 2018లో చేపట్టిన ‘కాపాడుకునేందుకు నివారణ’ మార్గాన్నే మనమూ అనుసరించవచ్చు. సామాజిక, విద్యా, భద్రతా, జైలు వ్యవస్థలను కూడగట్టుకుని ప్రభుత్వం సమ న్వయ కార్యాచరణ ద్వారా ఎవరూ ఉగ్రవాదం వైపు మళ్ళకుండా నివారించడంపై దృష్టి పెట్టాలి.లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్.కె. సైనీ (రిటైర్డ్)వ్యాసకర్త సైనిక దళ మాజీ వైస్ చీఫ్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)విశ్లేషణఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనను ఉగ్ర దాడిగా ముద్ర వేయడంపై ప్రభుత్వం అభినందనీయమైన రీతిలో ఆచితూచి వ్యవహరించింది. దర్యాప్తు మొదలైన రెండు రోజుల తర్వాతే, దాన్ని ధ్రువపరచింది. కొన్ని ప్రాథమిక వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఒక మాడ్యూల్ కశ్మీర్లో పనిచేస్తోంది. పెద్ద యెత్తున పేలుడు పదార్థాలు సహారన్పుర్, ఫరీదాబాద్ మీదుగా దేశ రాజధానికి చేరుకున్నాయి. ఆ రెండూ పరస్పర సంబంధం కలిగినవనీ, పాలుపంచుకున్నది ఒకే మాడ్యూలేననీ కొత్త డేటా తెలుపుతోంది. కానీ ఎవరి ప్రేరణతో జరిగిందనేది స్పష్టం కాలేదు. దీన్ని మరింత ప్రమాదకరమైనదిగా భావించవలసి వస్తోంది. ఇది అజ్ఞాతంగా పాకుతూ పోయే వైరస్ లాంటిది. డాక్టర్ టెర్రర్పోలీసులకు సహకరించవద్దని ఉద్భోదిస్తూ జైషే–మహమ్మద్ పోస్టర్లు నౌగామ్, శ్రీనగర్లలో అక్టోబర్లో దర్శనమిచ్చాయి. అప్రమత్తంగా ఉన్న పోలీస్ సూపరింటెండెంట్ వాటికి కారకుడైన వ్యక్తిని గుర్తించారు. అతను అదీల్ అహ్మద్ రాథెర్ అనే డాక్టర్. అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశా లలో సీనియర్ రెసిడెంట్గా పనిచేశాడు. జమ్ము–కశ్మీర్ పోలీసులు ఆ వైద్య కళాశాలలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కనుగొన్నారు. వాళ్ళు ఉత్తర ప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేయడంతో, అది నవంబర్ మొదటి వారంలో సహారన్పుర్కు మకాం మార్చిన రాథెర్ అరెస్టుకు దారి తీసింది. అక్కడ తీగ లాగితే ఫరీదాబాద్లో డొంక కది లింది. ముజమ్మీల్ గనాయీ అరెస్టయ్యాడు. పుల్వామాకు చెందిన అతడు ఫరీదాబాద్లోని అల్–ఫలా ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తు న్నాడు. ఇవి నవంబర్ మొదట్లో జరిగిన సంఘ టనలు. ఫలితంగా, ఫరీదాబాద్లో అమో నియం నైట్రేట్తో సహా సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. మరింత మంది ఉగ్రవాదులను పసిగట్టే పనిని పోలీసులు నవంబర్ 10న ప్రారంభించి నప్పటికీ, ఆ సాయంత్రం ఎర్ర కోట వద్ద కారు బాంబు పేలింది. సీసీటీవీ ఫుటేజీలో ఉమర్ ఉన్–నబీ అనే మరో డాక్టర్ పైకి తేలాడు. కారు నడిపింది అతడేనని ఫోరెన్సిక్ ఆధారాలు వెల్ల డించాయి. అతనూ ఫరీదాబాద్లోని అదే ఆస్ప త్రికి చెందినవాడు. షోపియాన్లో ఒక రాడికల్ ఇమామ్ను, అల్–ఫలాకు చెందిన మహిళా డాక్టర్ను లక్నోలో అదుపులోకి తీసుకున్నారు. మరింత మంది పట్టుబడవచ్చు. అసలు కారు బాంబును ఉద్దేశపూర్వకంగానే పేల్చారా అనేది సందేహంగా మారింది. అక్కడికి కొద్ది వందల గజాల దూరంలో శ్రీ గౌరీ శంకర్ ఆలయం ఉంది. అక్కడ కారు బాంబును పేల్చి ఉంటే మరింత మంది చని పోయి ఉండేవారు. ఉగ్ర వాదులు సాధారణంగా కోరుకునే మతపరమైన కల్లోలాలను రేకెత్తించి ఉండేది. ముఠాలోని ఇతర సభ్యులు పట్టుబడటంతో, అతను భయోత్పాతానికి లోనై పేల్చేసుకున్నాడన్నది ఒక భావన. ఏ విధంగా చూసినా, ఇది రెండేళ్ళుగా సాగుతున్న పథకంగా కనిపిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’కు ముందే ఈ సెల్ క్రియాశీలంగా ఉంది కనుక, జైష్, లష్కర్ల పురిటి గడ్డపై వైమానికి దాడులకు ప్రతీకారంగా ఇది జరిగి ఉండవచ్చునుకోవడానికి లేదు. కాచుకుని ఉన్న శత్రువులుఇది సడీచప్పుడు లేకుండా పనిచేస్తూ వచ్చిన, విస్తృతమైన స్లీపర్ సెల్. అనుమానించడానికి ఏమాత్రం అవకాశం లేని వ్యక్తులు దీనిలో ఉన్నారు. వారందరూ కశ్మీర్కు చెందినవారు కాదు. ఈ ధోరణిని అర్థం చేసుకునేందుకు స్పెయిన్, ఇటాలియన్ పోలీసుల చర్యలోకి వెళ్ళాలి. వారు అక్కడ ఒక పెద్ద పాకిస్తానీ సెల్ను కనుగొన్నారు. అది జనాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తోందని తేలింది. దాని ఆనుపానులు కనుగొనేందుకు పోలీసులకు రెండేళ్ళు పట్టింది. ఈ ఏడాది మార్చిలో మాత్రమే వారు కొందరిని అరెస్టు చేయగలిగారు. ఒక కీలక వాస్తవాన్ని గుర్తించి తీరాలి. ఉగ్రవాదాన్ని సరికొత్తగా సృష్టించలేం. ప్రస్తుతమున్న వేర్పాటువాద పరిస్థితిని ఆధారం చేసుకునే అది పైకి లేస్తుంది. వీటిలో రెండవ దానికి పాకిస్తానే చక్కని ఉదాహరణ. ఢిల్లీ ఇంతవరకు ఉపేక్షించిన ఒక అంశానికి వ్యతిరేకంగా కార్యాచరణకు దిగాలి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత విద్వేషం సెగలు గక్కుతోంది. రెండు వర్గాలకు చెందిన మనుషులు చనిపోయిన అంశాన్ని మీడియా ప్రముఖంగా పేర్కొనవలసిన అవసరం ఉంది. ఇది దేశాల సరిహద్దులను దాటిన అంతర్జాతీయంగా కనిపిస్తున్న ధోరణి. కీలక ఉగ్రవాద నాయకులు తుర్కియేలోని ‘సూత్రధారుల’తో సమావేశమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, అంకారాను హెచ్చరించడం కూడా సమయోచితం అనిపించుకుంటుంది. భారతదేశాన్ని ఎలాగైనా ముక్కచెక్కలు చేయాలని చాలా మంది శత్రువులు కాచుకుని కూర్చున్నారు. భారత్–పాక్ యుద్ధానికి దిగాలని చూస్తున్నారు. భారత్ ఆర్థికంగా స్థిరంగా వృద్ధి చెందుతూండటం అనేక రాజధానులలో గణనీయమైన ఆందోళన రేకెత్తిస్తోంది. తారా కార్థా వ్యాసకర్త నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మాజీ డైరెక్టర్(‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇండియాకు మునీర్ బెడద తప్పదా?
పాకిస్తాన్ పార్లమెంట్ ప్రస్తుతం ప్రతిపాదిత 27వ రాజ్యాంగ సవరణపై చర్చిస్తోంది. ఈ సవరణ 243వ అధికరణాన్ని పూర్తిగా మార్చేసి దేశ సాయుధ దళాలపై నియంత్రణ, ఆధిపత్యానికి సంబంధించి మౌలికంగా కొత్త రూపు నివ్వనుంది. దేశ రాజకీయ రంగస్థలంపై సైన్యానికున్న పట్టును దృష్టిలో పెట్టుకుని చూసినపుడు, ఆ చర్చ చాలావరకు నిరుపయోగమైనదే అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదట్లో భారత్–పాకిస్తాన్ మధ్య ప్రతిష్టంభన తర్వాత, పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి అసీమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించారు. అమెరికా అధ్యక్షుడి నుంచి లభిస్తున్న వ్యక్తిగత మద్దతు ధీమాతో ఆయన సాయుధ దళాలపై తన అధికారాన్ని మరింత పటిష్ఠపరచుకుంటున్నారు. పౌర ప్రభుత్వ–సైనిక సంబంధాలలో ఇప్పటికే మొగ్గు సైన్యం వైపు ఎక్కువగా ఉంది. తక్కెడలో సైన్యం వైపు బరువు మరింత పెరిగేటట్లు మునీర్ చూసుకుంటున్నారు. పదాతి దళానికే పెద్ద పీటప్రతిపాదిత రాజ్యాంగ సవరణ పౌర–సైనిక సంబంధాలలో, సైన్యం పాత్రలో గణనీయమైన మార్పులను ప్రవేశపెట్టే లక్ష్యాలతో ఉంది. త్రివిధ దళాలపైన పెత్తనం వహించేటట్లుగా రక్షణ దళాల ప్రధానాధికారి (సీడీఎఫ్) పదవిని సృష్టించాలని ప్రతిపాదిస్తోంది. సీడీఎఫ్గా ఎప్పుడూ పదాతి దళాల ప్రధానాధికారే ఉండాలని పేర్కొంటోంది. ఆయన పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పెంచుతోంది. సీడీఎఫ్కు వీలు కల్పించేందుకు, చిరకాలంగా ఉన్న త్రివిధ దళాల సంయుక్త కమిటీ చైర్మన్ (సి.జె.సి.ఎస్.సి.) పదవిని త్వరలో రద్దు చేయనున్నారు. సంయుక్త కమిటీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా రిటైరవడం, ఆ పదవి రద్దవడం ఒకేసారి జరగనున్నాయి. ఐదు నక్షత్రాల ర్యాంకులు పొందిన సైనిక అధికారులకు ఫీల్డ్ మార్షల్, మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అడ్మిరల్ ఆఫ్ ద ఫ్లీట్ వంటి సైనిక బిరుదులను ప్రదానం చేయడం అసాధా రణం ఏమీ కాదుకానీ, అటువంటివారిని అభిశంసన ద్వారా తప్ప వేరే విధంగా తొలగించడానికి వీలు లేకపోవడం పాక్లో కనిపించే విచిత్రమైన అంశం. అన్ని అణు, వ్యూహాత్మక సంపత్తులను పర్యవేక్షించే విధంగా జాతీయ వ్యూహాత్మక దళ కమాండర్ (సి.ఎన్.ఎస్.సి.)గా ఒకరిని నియమించాలని కూడా ఆ సవరణ ప్రతిపాదిస్తోంది. ఆర్మీ చీఫ్ సిఫార్సు మేరకు, సైన్యం నుంచే ఒకరిని ఆ పదవిలో ప్రధాన మంత్రి నియమిస్తారు. సూటిగా చెప్పాలంటే, దానిపై నియంత్రణ పౌర ప్రభుత్వం నుంచి చేజారిపోతోంది. వీసమెత్తు ప్రతిఘటన లేకుండా, పాక్లో బాహాటంగా, ఇలా అధికారం కేంద్రీకృతం కావడం, పర్వేజ్ ముషారఫ్ హయాంతో సహా, ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఈ పరిణామాలు పాక్, భారత్ రెండింటిపైనా గణనీయమైన ప్రభా వాన్ని చూపనున్నాయి. అనూహ్యంగా ఎదిగిన మునీర్పాక్ను 1977 నుంచి 1988 వరకు పాలించిన సైనిక పాలకుడు జియా–ఉల్–హక్ తర్వాత, తిరిగి అంత ప్రాభవాన్ని అనుభవిస్తున్న వ్యక్తి మునీర్ కానున్నారు. జియా కంటే కూడా మునీరే నాలుగు ఆకులు ఎక్కువ చదివాడనుకోవాలి. సైనిక తిరుగుబాటు మాట లేకుండానే ఆయన మొత్తం అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చు కున్నారు. అసీమ్ అధికారాన్ని పటిష్ఠపరచుకున్న తీరు ఆసక్తి కలిగిస్తుంది. ఆయన 2022 నవంబర్లో ఆర్మీ చీఫ్ అయ్యారు.హిందువులు, ముస్లింలు కలసి ఎన్నడూ సహజీవనం సాగించలేరంటూ వ్యాఖ్యానించి, హిందూ వ్యతిరేక ధోరణితో ఈ ఏడాది మొదట్లో వార్తల కెక్కారు. ఘోరమైన పహల్గామ్ దాడికి సరిగ్గా ఒక నెల ముందు ఆయన నోటి నుంచి ఆ ప్రేలాపనలు వెలువడ్డాయి.పాక్లో అడుగుజాడలున్న ఉగ్రవాదులు పహల్గామ్లో పౌరులను పొట్టనబెట్టుకోవడంతో, పాక్పై భారత్ దాడులను నిర్వ హించింది. ఆ స్వల్పకాలిక సమరంలో, తాను 1971 మాదిరి విజ యాన్ని సాధించినట్లుగా పాక్ నిస్సిగ్గుగా ఒక ప్రాపగాండా ప్రారంభించింది. దాన్ని ఊతంగా చేసుకునే మునీర్ దేశంలో తన స్థితిని పటిష్ఠపరచుకుని, ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ గడించారు. పాక్ను ట్రంప్కు చేరువ చేసే పనిని యుక్తితో నిర్వహించారు. సౌదీ అరేబి యాతో రక్షణ ఒప్పందాన్ని ఆధికారికం చేసుకోవడంతో సహా పశ్చి మాసియాకు స్నేహహస్తాన్ని చాచే వ్యూహాత్మక ప్రణాళికను రచించడంలో కృతకృత్యులయ్యారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణతో, మునీర్ పదవీ కాలాన్ని ఐదేళ్ళకు పొడిగించినట్లవుతుంది. త్రివిధ దళాలు ఆయన కనుసన్న ల్లోనే మెలుగుతాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పరమ అధ్వాన్నంగా తయారైన పరిస్థితుల్లో, తెలివిగా పావులు కదుపుతూ, కేవలం ఎనిమిది నెలల్లో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. కార్యనిర్వాహక అధికారాన్ని హస్తగతం చేసుకోకపోయినా నేడు పాక్లో ఆయనకు ఎదురు చెప్పగలవారు లేరు. ప్రస్తుత సవరణ, వైమానిక, నౌకా దళాలను కూడా ఆర్మీ చీఫ్ పరిధిలోకి తీసుకొస్తుంది. ఇది ఆ రెండు దళాలకు రుచించకపోవచ్చు. సైనిక ప్రధానాధికారే ఎల్లప్పుడూ సి.ఎన్.ఎస్.సి.గా ఉంటాడని నిర్దేశించడాన్ని అవి వ్యతిరేకించవచ్చు. క్షిపణులు సాధారణంగా నౌకాదళం వద్ద ఉంటాయి. ఇపుడీ సవరణతో మొత్తం పాక్ అణ్వాయుధాలన్నీ పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వస్తాయి. సైన్యానికి ప్రస్తుతం ఉన్న పైచేయిని ధ్రువపరచే ప్రయత్నం మాత్రమే మునీర్ చేస్తూ ఉండవచ్చు. కానీ, ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ఆదేశంగా కాకుండా, రాజ్యాంగ సవరణ రూపం పొందుతోంది. కనుక, భవిష్యత్ నాయకులకు, దీన్ని తిరగదిప్పడం అసాధ్యంగా పరిణమించవచ్చు. భారత్ ద్వేషమే ఆయుధంభారత్ పట్ల మునీర్ విద్వేష వైఖరి సుస్పష్టం. ఇపుడు మరిన్ని అధికారాలున్న మునీర్ కింద పనిచేసే సైన్యం, భారత్కు గణనీ యమైన సవాల్గా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు. చిర కాలంగా, పాక్ సైన్యం దృష్టంతా భారతదేశంపైనే ఉంటూ వస్తోంది. అది ఇపుడు మరింత కేంద్రీకృతమవుతుంది. సాధారణ ప్రజానీకం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పాకిస్తానీ పౌర సమాజం ఈ మార్పులను ప్రతిఘటించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి తలెత్తడం సైన్యానికే వాటంగా ఉంటుంది. ప్రజల దృష్టిని మళ్ళించే అత్యంత ప్రభావయుక్తమైన వ్యూహంగా, అది భారతదేశంపై యుద్ధానికి, లేదా ఘర్షణకు దిగవచ్చు. భారత్కు వ్యతిరేకంగా సైన్యం చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికే సహజంగా జనం మొగ్గు చూపు తారు. అది వారిని ఏకం చేసే ఆయుధంగానూ పనికొస్తుంది. కనుక, మునీర్ ఎత్తుగడలను భారత్ తప్పనిసరిగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. హ్యాపీమ్యాన్ జాకబ్ వ్యాసకర్త ‘కౌన్సిల్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ డిఫెన్స్ రిసెర్చ్’ ఫౌండర్–డైరెక్టర్ (‘ద హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సువర్ణ గళ దేవత
నేనెప్పుడూ ప్రసిద్ధి చెందాలని కోరుకోలేదు. పాటలు పాడి శ్రోతల్ని సంతోషపెట్టాలని మాత్రమే అనుకున్నాను. అభిరు చికి కట్టుబడి, నిజాయతీగా కష్టపడి పని చేస్తే మన ప్రతిభకు ఆశీర్వచనాలు లభిస్తాయి. నిరంతర సాధన, అభ్యాసం అనేవి కళాకారునికి శ్వాస వంటివి. – పి.సుశీల (90), నేపథ్య గాయని దక్షిణ భారత ప్లేబ్యాక్ రంగంలో అగ్రగామి గాయకురాలు పి. సుశీల. 12 భాషల్లో వేలాది పాటలు పాడిన ఆమెను ‘గాన సరస్వతి’ అనడం అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లోని విజయ నగరంలో 1935 నవంబర్ 13న ప్రసిద్ధ క్రిమినల్ న్యాయవాది,సంగీత ప్రియుడు పులపాక ముకుంద రావు – శేషావతారం దంప తుల ఐదవ సంతానంగా ఆమె జన్మించారు.సుశీల కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ వయొలిన్ విద్వాంసులైన ‘సంగీత కళానిధి’ ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆయన కుమారుడు ద్వారం భావనరాయణల వద్ద ఆరు సంవత్సరాలు కఠిన శిక్షణ పొంది, గాత్ర సంగీతంలో డిప్లొమా సాధించారు. మొదట్లో వివాహ వేడుకలలో శాస్త్రీయ సంగీతం ఆలపించేవారు. సినిమా పాటలు పాడటానికి చెన్నై చేరే ముందు కొన్ని ఆలయ కచేరీలు ఇచ్చేవారని కొద్దిమందికి మాత్రమే తెలుసు. సుశీల స్వరం మూడో స్థాయిని కూడా స్పష్టంగా దాటుతుందని అందరికీ తెలుసు. ప్రముఖ వీణా విద్వాన్ ‘వీణ గాయత్రి’... సుశీల స్వరాన్ని ఒక గాత్ర వీణగా వ్యాఖ్యానించారు. ఆమె గొంతులో సూక్ష్మ గమకాలు సైతం అత్యంత స్పష్టతతో వినవచ్చు. ఈ గుణం సుశీలను శాస్త్రీయ గాయకులు కూడా భయపడే, గౌరవించే గాయనిగా చేసింది. ఆమె 1970లో ‘ఉయర్న్ద మనిదన్’ (1969) చిత్రానికి ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచు కున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ చిత్రాలకు మరో నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆ కాలంలోని ప్రముఖ గాయకులైన ఘంటసాల వేంకటేశ్వర రావుతో తెలుగులో, టి.ఎం. సౌందరరాజన్, పి.బి. శ్రీనివాస్లతో తమిళం, కన్నడ భాషలలో; తరువాత ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో; కె.జె. ఏసుదాస్తో మలయాళంలో ఆమె యుగళగీతాలు పాడి దక్షిణాదిలో అగ్రగామి గాయనిగా నిలిచారు. 1991లో తమిళనాడు అత్యున్నత కళా పుర స్కారం ‘కలైమామణి’, 2004లో తెలుగు సినిమా రంగంలో ఆమె జీవితకాల కృషికి ‘రఘుపతి వెంకయ్య అవార్డు’, 2008లో 73 ఏళ్ళ వయసులో ‘పద్మభూషణ్’ పురస్కారం వంటివి వరించాయి. ఆమె సమకాలీనులైన ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత; ఆమె జూనియర్లు కె.ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ వంటివారందరూ ఆమె స్వర నాణ్యత, స్వాభావిక శ్రావ్యతను ఎంతో గౌరవించారు. ఆమె 1962 నుండి 1990ల చివరి వరకు 17,695 పాటలను రికార్డ్ చేయడం... పాట పట్ల ఆమె నిబద్ధతకు నిదర్శనం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం 12 భారతీయ భాషలలో సోలోలు, డ్యూయెట్లు, కోరస్, నేపథ్య పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె అభిమానులు చాలా మంది ఆమెకు ’భారతరత్న’ పురస్కారం ఆమె 90వ పుట్టిన రోజు కానుకగా వస్తే బాగుండు అనుకుంటున్నారు. అందుకు ఆమె ముమ్మాటికీ అర్హురాలు.– డా.ఎం.ఎస్. నీలోత్పల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తమిళనాడు(నేడు గాన సరస్వతి పి. సుశీల 90వ జన్మదినం) -
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్ను నియంత్రించే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం) -
పత్తి రైతుకు మరో పాడుకాలం
పత్తి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చూడగా, 1990ల కాలం అని వార్యంగా గుర్తుకు వస్తున్నది. అప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలలో పత్తి రైతులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రాలలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని విదర్భ అయితే లెక్కలేనన్ని ఆత్మహత్యలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అటువంటి విపత్కర పరిస్థితి ఇంకా ఏర్పడనైతే లేదు; కానీ, నెమ్మదిగా రూపు తీసుకుంటున్న పరిణామాలను చూడగా, ఆ దుఃస్థితి పునరావృతం కాగలదేమోననే అనుమానం కలుగుతున్నది.1990లలో జరిగిందేమిటి?పత్తికి, నూలు వస్త్రాలకు భారతదేశం క్రీస్తు పూర్వం నుంచే పేరెన్నిక గన్నది కాగా, బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగిందే మిటో తెలిసిందే. అక్కడి మిల్లుల కోసం ఇక్కడి రైతును కొల్లగొట్టి, స్థానిక చేనేత పరిశ్రమను ధ్వంసం చేసి, నేత కార్మికుడిని ఆకలి చావుల పాలు చేశారు. స్వాతంత్య్రానంతరం 1990లు వచ్చేసరికి అధికాదాయం పేరిట పత్తి పంటను విపరీతంగా ప్రోత్సహించి, అమ్మకాలను మాత్రం అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి, ధరలతో ఆటలాడారు. రైతు మరో పంటకు మారలేక, అక్కడే నిలవలేక, అప్పుల బాధకు తాళలేక, చావును ఎంచుకున్నాడు. ఆ సరికే భారత దేశపు డబ్ల్యూటీవో సభ్యత్వం, పశ్చిమ దేశాలకు కలసి వచ్చిన స్వేచ్ఛా వాణిజ్యం రైతు ఆత్మహత్యకు ఉరితాళ్లను పేనాయి.డబ్ల్యూటీవో సమయంలో వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల విషయమై ఇండియా, చైనా, బ్రెజిల్ తదితర దేశాలు ఒక్కటై గట్టిగా నిలబడి కొన్ని రాయితీలు సాధించాయి. ఆయా రంగాలపై కోట్లాదిమంది ఆధారపడి జీవిస్తున్నందున వాటిని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతులపై తగినన్ని సుంకాలు విధించే హక్కు సంపాదించటం వాటిలో ఒకటి. ముఖ్యంగా అమెరికా తమ రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండగా, ఇతర దేశాలు ఆ పని చేయరాదని ఆంక్షలు విధించటాన్ని అంగీకరించబోమన్నది మరొకటి. ఇంత జరిగినా పాశ్చాత్య దేశాలు పత్తి కొనుగోళ్లు, తమ పత్తి ఎగుమతులు, అందుకు కోటాలు, వస్త్రాల ఎగుమతిలో కోటాలు వగైరా ఎత్తుగడలతో సృష్టించిన సమస్యలు తక్కువ కాదు. అధిక దిగుబడి వంగడాలపై వారిదే ఆధిపత్యం అయ్యింది. దీనంతటి ప్రభావాలు బట్టల మిల్లులు, పత్తి వ్యాపారులపై కన్నా పత్తి రైతుపైనే పడింది. ఇపుడు, స్వేచ్ఛా వాణిజ్యం తమకు లాభసాటిగా లేనట్లు భావిస్తున్న ప్రస్తుత అమెరికా ప్రభుత్వం, డబ్ల్యూటీవో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించజూస్తుండటంతో, పత్తి రైతుకు 1990ల కాలం వలె కారు మేఘాలు తిరిగి కమ్ముకొస్తున్నాయి.అమెరికా ఒత్తిడితమ కొత్త వ్యూహంలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని గాలికి వదలిన అమెరికా, వేర్వేరు దేశాలతో విడివిడిగా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నది. అందుకోసం చర్చల పేరిట ఒత్తిడి, బ్లాక్మెయిలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నది. ఇతరులను దారికి తెచ్చు కునేందుకు మొదటనే సుంకాలను భారీ ఎత్తున పెంచివేసి, అవతలి దేశాలు వాటి సుంకాలను తాము చెప్పినట్లు మార్చాలని, ఎత్తి వేయాలని షరతులు పెడుతున్నది. తమ పత్తి, మొక్కజొన్న, సోయా వంటి ఉత్పత్తులకు పూర్తిగా గేట్లు తెరవాలంటున్నది. లేనట్లయితే, సుంకాలూ, వాణిజ్యాలతో సంబంధం ఉన్న రంగాలలోనే గాక,లేని విషయాలలోనూ ఏకపక్షపు చర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తున్నది.ఈ పరిస్థితుల మధ్య జరిగిందే అమెరికన్ పత్తి దిగుమతులపై ఉండిన 11 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేయటం. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరుగగా, తిరిగి డిసెంబర్ వరకు పొడిగించారు. ఇది తాత్కాలిక చర్య అని పైకి చెప్తున్నారు గానీ, నమ్మదగినట్టు లేదు. ఎందుకంటే, ఇదే సమయంలో అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందం ఈ సంవత్సరం ఆఖరు నాటికి జరగవచ్చునని భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్తో పాటు అమెరికన్ అధికారులు కూడా చెప్తున్నారు. అందు వల్ల, ఇప్పుడు తాత్కాలికం అంటున్నది దీర్ఘకాలికం కాగల ప్రమాదం పొంచి ఉంది. లేదా కనీసం 11 శాతం సుంకం గణనీయంగా తగ్గవచ్చు. ఏది జరిగినా ఇక్కడి పత్తి రైతుకు తీవ్ర ప్రమాదమే!సుంకం ఎత్తివేత ప్రత్యేకంగా అమెరికాకు మాత్రమే చేయలేరు గనుక మౌలికంగానే రద్దు కావటంతో అమెరికా సహా వేర్వేరు దేశాల నుంచి పత్తి నిల్వలు వచ్చిపడటం మొదలైంది. భారత ప్రభుత్వం తన నష్టాలు తాను చేయటం మొదలు పెట్టింది. గతంలో రైతులు ఎంత పత్తి తెచ్చినా కొనుగోలు చేస్తుండిన కాటన్ కార్పొరేషన్, ఎకరానికి 12 క్వింటాళ్లు మాత్రమేనని ఈసారి సీజన్కు ముందు షరతు విధించింది. పంట మార్కెట్కు రావటం మొదలైన తర్వాత తన ప్రకటనను తానే ఉల్లంఘిస్తూ 7 క్వింటాళ్లు మాత్రమే అంటు న్నది. తక్కిన పంటను వ్యాపారులు మద్దతు ధర కన్న తక్కువకు కొంటున్నా అధికారులు మాట్లాడటం లేదు. ఇదిగాక, ‘కపాస్ కిసాన్’ అనే కొత్త నిబంధన ఒకటి తీసుకువచ్చి, అందుకు అవస రమైన స్మార్ట్ ఫోన్లు లేని, ఆ సాంకేతికత తెలియని సామాన్య రైతులను యాతనలకు గురి చేయటం మొదలు పెట్టింది. ఇక, పత్తిలో తేమ నిబంధనలు ఎప్పుడూ ఉన్నవే.ఒప్పందం ఇంకెలా ఉండగలదో!అధికారికంగా సుంకాల ఎత్తివేత నుంచి మొదలుకొని, క్షేత్ర స్థాయిలో ఈ విధమైన ఎత్తుగడలు గానీ, కొత్త కాదు. అదే కథ తిరిగి నడుస్తున్నది. అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్న తీరును చూసినప్పుడు, పత్తి రైతుకు 1990ల నాటి పరిస్థితి పునరావృతం కాగలదేమోననే భయం కలుగుతుండటం అందువల్లనే! మనం మరొకటి గమనిస్తున్నట్లు లేము. పత్తితో పాటు మొక్కజొన్నను, సోయాను కూడా అమెరికా బలవంతంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకు సహకరిస్తున్నారా అనే అనుమానం కలిగేట్లు, మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయటంలోనూ పత్తి పంట తరహా షరతులు విధిస్తున్నారు. ఎకరానికి 18 క్వింటాళ్లు మాత్రమే కొనగలమన్నది ఆ నిబంధన. దీనిని బట్టి, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎట్లుండవచ్చునో ఎవరి ఊహ వారు చేయవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?
ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆకర్షించి,సామర్థ్యం, జవాబుదారీతనం, పని సంస్కృతిలో బాధ్యతను ప్రోత్స హించే విధంగా 8వ వేతన సవరణ సంఘం వేతనాలను సిఫార్సు చేయాలని... వేతన సంఘం నియామకంపై కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భత్యాలు, అమలు చేస్తున్న షరతులను పరిశీలించి వాటి హేతుబద్ధీకరణకు సిఫార్సు చేయాలని గెజిట్ నిర్దేశించింది. ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న బోనస్ పథకాలను పరిశీలించి, మంచి పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సహించేలా ఆర్థిక కొలమానాలు సిఫార్సు చేయాలని కోరింది.గెజిట్ నోటిఫికేషన్ ఇలా ఉంటే దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి ఎగిసిందని పాలకులు ప్రచారం చేస్తూ, ఆర్థిక అధోగతిని సూచించే ఆర్థిక జాగ్రత్తలను పాటించమని వేతన సవరణ యంత్రాంగానికి పరస్పర విరుద్ధమైన షరతులు విధిస్తున్నారు. నిజానికి ఆర్థిక పరిస్థితిని పరిశీలించాల్సిన బాధ్యత వేతన సవరణ యంత్రాంగానిది కాదు. వేతన సవరణ యంత్రాంగం ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక స్థితిలో జీవన వ్యయం వంటి అంశాలను పరిశీలించి సిఫార్సులు చేయాలి. వారి మెరుగైన సిఫార్సులతోనే ప్రతిభావంతులైన యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వైపునకు ఆకర్షింపబడుతారు. అప్పుడే ప్రభుత్వ యంత్రాంగంలో సామర్థ్యం, జవాబుదారీతనం పెరుగుతాయి. ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు చేరుతాయి. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో లక్షలాదిమంది ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల అధీనంలో పనిచేస్తున్నారు. వీరందరికీ రెగ్యులర్ ఉద్యోగుల వలె వేతన భత్యాలు అమలు కావడం లేదు. ‘సమాన పనికి సమాన వేతనం’ ఇక్కడ వర్తించడం లేదు. వేతన సవరణ సిఫార్సులు ఇటువంటి తాత్కాలిక ఉద్యోగులకు వర్తించవు. అటువంటప్పుడు సామర్థ్యం, జవాబుదారీతనం ఎలా సాధ్యమవుతాయి? (100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద)పైగా ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల తీరు, ప్రయోజనాలు, పని పరిస్థితులు కూడా పరిశీలించి, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సిఫార్సు చేయాలని మరో నిబంధన ఉంది. అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల శ్రమదోపిడీ ఎక్కువగాఉంటుంది. వేతనాలు తక్కువ. పని పరిస్థితులు అధ్వాన్నం. ‘ఉద్యోగుల ప్రయోజనాల కంటే యాజమాన్యాల ప్రయోజనాలకే’ అక్కడ ప్రాముఖ్యం ఉంటుంది. వాటితో కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులను పోల్చడం... ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను, పెన్షన్లను తగ్గించడానికే! ఉద్యోగుల వాటా నిధులు లేని పెన్షన్ పథ కాల ఖర్చు తగ్గింపు మరో షరతు. పాత పెన్షన్ పథకంలో కొనసాగు తున్న కొద్దిమంది ఉద్యోగుల పెన్షన్ను, పాత పెన్షన్ పథకాన్ని ఆపడానికి ఈ షరతులను ప్రభుత్వం నిర్దేశించింది. పదేళ్లకోసారి జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవ రణ ఇప్పుడు 2026 జనవరి 1 నుండి అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే 2025 ఆర్థిక బిల్లు ద్వారా ఉద్యోగుల పెన్షన్లను పెంపులేకుండా చూసే నిబంధనలను ఆమోదించుకున్న కేంద్ర ప్రభుత్వం, భవిష్యత్తులో వేతన సవరణ ద్వారా పెన్షన్ల పెరుగుదల లేకుండారంగం సిద్ధం చేసింది. ఆ మేరకే ఈ నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాబోయే వేతన సవరణ ద్వారా ఉద్యోగుల వేతనాల బిల్లు పెరగకుండా చూడటానికి వేతన సవరణ కమిషన్ నిబంధనల ద్వారా ముందు కాళ్లకు బంధం వేయడం గమనార్హం. (సహజీవనం నేర్చుకోవాలి..మానవత్వంతో వ్యవహరించాలి!)– కె. వేణుగోపాల్విద్యారంగ విశ్లేషకులు, టీపీటీఎఫ్ -
సహజీవనం నేర్చుకోవాలి..మానవత్వంతో వ్యవహరించాలి!
భారత సంస్కృతిలో జంతువులకు ఉన్న స్థానం ఉన్నతమైనది– నంది, గోవు, కాలభైరవుని వాహనమైన కుక్కలను పూజిస్తాం. అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన దేశం అంటాం. కానీ కుక్క వీధిలో కనిపిస్తే రాళ్లు విసురుతున్నాం! దేశ అత్యున్నత న్యాయస్థానం వీధి జంతువులను ‘తొలగించండి‘ అని ఆదేశిస్తోంది. ఇది కేవలం చట్ట విరుద్ధం మాత్రమే కాదు, మన నాగరికతకూ విరుద్ధమే. వీధికుక్కల విషయంలో సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మన సమాజం ఏ దిశగా సాగుతుందో ఆలోచించే సమయం వచ్చింది.తాజా సుప్రీం కోర్టు ఆదేశాలు – కొన్ని ప్రదేశాల నుంచి వీధికుక్కలు, పశువులను తొలగించాలని చెప్పడం, ఇప్పటికే ఉన్న చట్టాలను పూర్తిగా విస్మరించటం. ‘యానిమల్ బర్త్ కంట్రోల్ (డాగ్స్) రూల్స్ – 2023’ ప్రకారం, వీధి కుక్కలను పట్టి, స్టెరిలైజ్ చేయించి, వ్యాక్సినేట్ చేసి తిరిగి అదే ప్రదేశంలో వదలడం తప్పనిసరి. ఇది కేవలం జంతు సంక్షేమం కోసం కాదు, మానవ సమాజం భద్రత కోసం కూడా! ‘తొలగించటం’ కాదు, ‘వ్యవస్థీకరించటం’ అని చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ, కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు ఈ చట్టానికేవిరుద్ధంగా ఉన్నాయి. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద సాధారణంగా, చట్టం చేయటానికి పార్లమెంట్, అమలు చేయటానికి కార్యనిర్వాహక శాఖ, పర్యవేక్షించటానికి న్యాయవ్యవస్థ ఉన్నాయి. అయితే న్యాయస్థానం కొన్ని సందర్భాల్లో నేరుగా పాలనా నిర్ణయాల్లాంటి ఉత్తర్వులు ఇస్తోంది. ఇది ‘జ్యుడీషియల్ ఓవర్ రీచ్’ అని పిలవబడుతుంది. ఎన్నికల ద్వారా ఎన్నికవ్వని కొద్ది మంది న్యాయమూర్తులు ప్రజా జీవితంపై ఇంత ప్రభావం చూపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.భారత రాజ్యాంగం ప్రతి జీవికీ ‘జీవన హక్కు’ (ఆర్టికల్ 21) ఇచ్చింది. సుప్రీం కోర్టే ఎన్నో తీర్పుల్లో ఈ హక్కు మానవులకే కాకుండా జంతువులకు కూడా వర్తిస్తుందని స్పష్టంగా చెప్పింది. అలాంటప్పుడు, వాటిని ‘తొలగించండి’ అనే ఆదేశం ఆ హక్కుకే విరుద్ధం. జంతువుల పట్ల దయ చూపడం కేవలం ‘ప్రేమ’ కాదు. అది నాగరికత ప్రథమ లక్షణం. సర్కారు, న్యాయస్థానం, ప్రజలు అందరూ కలిసే ఈ విలువను కాపాడాలి. జంతువులను దూరం చేయడం కాదు, వాటితో సహజీవనం నేర్చుకోవడం మన బాధ్యత. మన దేశం తన హృదయాన్ని కోల్పోయినట్లయితే తిరిగి దాని మూలాల్ని వెతకటానికి ఇదే సరైన సమయం.ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం– తలకోల రాహుల్రెడ్డి ‘ మౌలిక సదుపాయాల విశ్లేషకుడు -
ఇది భారతీయ–అమెరికన్ల విజయం
‘భారతీయులు వెళ్లిపోవాలి’... ఇదే ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మూకలు ఏడాదిగా చేస్తున్న నినాదం. భారతి సంతతి అమెరికన్లు వారి నినాదం విన్నారు, వెళ్లిపోయారు; కానీ ఇండియాకు కాదు. తాము ఎప్పటినుంచో మద్దతిస్తూ వచ్చి మధ్యలో వదిలేసిన డెమాక్రటిక్ పార్టీలోకి తిరిగి వెళ్లారు! న్యూయార్క్ నగర పునాదులను వారు కదిలించారు.సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ తాజా మేయర్ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించారు. మాజీ గవర్నర్ ఆండ్రూ కుమో చిత్తుగా ఓడిపోయారు. మమ్దానీ న్యూయార్క్ మొట్టమొదటి ముస్లిం మేయర్. భారత మూలాలున్న తొలి మేయర్. ఈ వందేళ్లలో ఈ పదవికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడు కూడా! మారిన రాజకీయ మొగ్గు‘అమెరికన్ డ్రీమ్’ను సాకారం చేసుకునేందుకు వచ్చిన భారతీయులు– విద్యావంతులు, కుటుంబ జీవులు సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఒక ఆదర్శప్రాయమైన సమాజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంప్రదాయికంగా మేము డెమాక్రటిక్ పార్టీ సానుభూతిపరులం. ఇటీవలి కాలంలో మాలో చాలామంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గడం మొదలైంది. క్రమశిక్షణ, వ్యాపార వ్యవస్థాపక సామర్థ్యం, కుటుంబ విలువల పరంగా అది మా జీవి తానుభవానికి దగ్గరగా ఉండటం, మరోవంక డెమాక్రాట్లు రాను రానూ సాంస్కృతిక పోరాటాల్లో మునిగిపోవటం ఇందుకు కారణాలు. నేను కూడా ఈ ఆకర్షణలో పడ్డాను. 1980లో అమెరికా వచ్చి నప్పటి నుంచీ నేను డెమాక్రాట్స్కే ఓటు వేశాను. గత అధ్యక్ష ఎన్ని కలకు మాత్రం దూరంగా ఉన్నాను. జో బైడెన్కు వయసు మీరడం, స్పష్టమైన దిశ కొరవడటం వల్ల ఆయన అభ్యర్థిత్వం నాకు నచ్చ లేదు. మరోవంక, రిపబ్లికన్ పార్టీ చెబుతున్నదీ కొంతవరకు సబబు గానే అనిపించింది. కుటుంబం, మతవిశ్వాసం అంశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాలు, సోషలిజం గురించి ఆయన చేసిన హెచ్చరికలు నన్ను ఆకట్టు కున్నాయి. మాలో ఇండియాలో పుట్టిపెరిగిన వారున్నారు. వారికి ‘సామ్యవాదం’ అనేది శుద్ధమైన సిద్ధాంతంగా అనిపించదు. రేషన్ క్యూలైన్లు, సరుకుల కొరతలు, ప్రజలు ఏది తినాలో ఎంత సంపా దించాలో నిర్ణయించే అవినీతిపరులైన అధికార గణం... ఇవన్నీ సామ్యవాదపు వాస్తవికతకు అద్దం పడతాయి. చెదిరిన ఆశలునాలాంటి వలసదారులకు, కింది స్థాయి నుంచి ఉన్నత స్థానా లకు ఎదిగిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ఉషా వాన్స్ వంటి వారికి రిపబ్లికన్ పార్టీ ద్వారాలు తెరుస్తుందని నేను అనుకున్నాను. కానీ గడచిన ఏడాది కాలంలో మా ఆశలు హరించుకుపోయాయి. ఒకప్పుడు ఎవరితోనైతే స్నేహం చేసిందో ఇప్పుడు వారిమీదే ‘మాగా’ ఉద్యమం నిప్పులు చెరుగుతోంది. లారా లూమర్ వంటి ఇన్ఫ్లుయె న్సర్లు ఇండియన్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకున్నారు. మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి కాంగ్రెస్ సభ్యులు హెచ్–1బి వీసాలకు మంగళం పాడాలని పిలుపునిచ్చారు. భారతీయులు ‘అమెరికన్ల ఉద్యోగాలు దొంగిలిస్తున్నారు’ అని దుష్ప్రచారం చేశారు. సంకే తాలు స్పష్టంగా వెలువడుతున్నాయి: మేం అమెరికాకు ఎంత చేసినా, ఎప్పటికీ పూర్తి అమెరికన్లం కాబోము!అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్లు రెండు శాతంకంటే తక్కువే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పన్నుల ఆదాయంలో వారి వాటా దాదాపు 6 శాతం. మా సగటు కుటుంబ ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు. ‘ఫార్చ్యూన్ 500’ జాబితాలోని 16 కంపెనీలకు భారత సంతతి సీఈవోలే సారథ్యం వహిస్తున్నారు. వారి నాయకత్వంలోని ఈ కంపెనీల వార్షిక ఆదాయం లక్ష కోట్ల డాలర్లకు పైనే ఉంటుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు పట్టుగొమ్మలుగా ఉన్న చిన్న వ్యాపా రుల నుంచి యూనివర్సిటీలు, ఆసుపత్రులను నిర్వహించే సైంటి స్టులు, ఇంజినీర్లు, వైద్యుల వరకు పలు రంగాల్లో విస్తరించి ఉన్న భారత సంతతి ప్రజలు మరే ఇతర దేశాల వలసదారుల కంటే మిన్నగా అమెరికాను బలోపేతం చేస్తున్నారు. అమెరికా అభ్యున్నతికి దశాబ్దాలుగా శ్రమిస్తున్న మమ్మల్ని ‘గో హోమ్’ అనడం ద్రోహమే!భారత సంతతి అమెరికన్లకు గుండెకాయ లాంటి న్యూజెర్సీ లోని ఎడిసన్ ఓటర్లు ఈ అవమానానికి తగిన జవాబు చెప్పారు. 2024లో అక్కడి ఒక ప్రదేశం ట్రంప్కు 30 పాయింట్ల ఆధిక్యంఇచ్చింది. ఈ నెలలో, డెమాక్రాట్ మికీ షెర్రిల్ దాన్ని 76 పాయింట్ల తేడాతో గెలుచుకున్నాడు. 106 పాయింట్ల ఈ స్వింగ్కు విధానాలతో సంబంధం లేదు; ఆత్మగౌరవం తెచ్చిన మార్పు ఇది.డెమాక్రాట్లా? రిపబ్లికన్లా? ఏమైనా, పార్టీ విధేయతకు సంబంధం లేని కారణాలతోనే భార తీయ అమెరికన్లు డెమాక్రాట్ల చెంతకు తిరిగి వస్తున్నారు. ఆత్మ గౌరవం, అస్తిత్వ రక్షణ అవసరమే ఈ మార్పు తెచ్చింది. అంతేగానీ ప్రగతిశీల రాజకీయాల పట్ల మూఢభక్తి ఇందుకు కారణం కాదు.డెమాక్రటిక్ పార్టీ అన్ని వర్గాలనూ కలుపుకొనిపోవడం గురించి మాట్లాడుతుంది. అయితే, ఒకప్పడు తనకు కంచుకోటలా ఉన్న మధ్యతరగతితో ఇప్పుడు సంబంధం కోల్పోయింది. వలసదారులు పాటించే కుటుంబ విలువల నుంచి అది దూరం జరిగింది. శ్రామిక కుటుంబాల రోజువారీ బతుకు పోరాటాలను విస్మరించింది. అతి వాదుల చేతిలో ఆ పార్టీ బందీగా మారింది. సంస్కృతుల పోరా టాల్లో అది మునిగితేలుతోంది. ‘బాలికలు దుస్తులు మార్చుకునే గదుల్లో (లాకర్ రూమ్స్లో) బాలురు ఉండటం’ అనే అంశం మీద స్కూళ్లు చర్చలు నిర్వహించేదాకా పరిస్థితి వెళ్లింది. ఒకపక్క మౌలిక విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్న సమయంలో ఇలాంటి చర్చలు జరగడం పట్ల ‘నా’ లాంటి వలసదారులు సహా పలువురు అమెరి కన్ తల్లితండ్రులు దిగ్భ్రాంతి చెందారు.మమ్దానీ గెలుపు ఈ నూతన వాస్తవికత రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తోంది. ఒక సమాజపు ఆత్మవిశ్వాసం, స్వరం ఆయన ఎన్నిక వెనుక ఉన్నాయి. అదే సమయంలో, వాస్తవిక దృక్పథం లోపించిన సిద్ధాంతంతో ముడిపడిన ప్రమాదాలనూ అది వెల్లడిస్తోంది. నిత్యావసర వస్తువుల దుకాణాలు నిర్వహిస్తామన్న ఆయన వాగ్దానం దయాపూరితంగా కనబడుతుంది. కానీ, పాత కాలపు ఇండియన్ సోషలిస్టు మోడల్ గురించి తెలిసిన నా లాంటి వారికి ఈ కథ ముగింపు ఎలా ఉండబోతోందో బాగా తెలుసు. అధికార గణస్వామ్యం, జనాకర్షక విధానం స్వల్పకాలంలో ప్రశంసలు కురిపించవచ్చు. అయితే అవి ప్రగతికి శత్రువులు. నాణ్యతకు బదులు నాసిరకంలో సమానత్వం వస్తుంది.రిపబ్లికన్లకు ఇప్పటికీ అవకాశం ఉంది. అయితే వారు తమ దౌర్జన్య వైఖరిని విడనాడాలి. ఒకప్పుడు తమకు వన్నె తెచ్చిన తెగువ, యోగ్యత, ఆశావాదం వంటి విలువలను తిరిగి ఒంటబట్టించుకోవాలి. అందాకా, వారికి దూరమైన ఓటర్లు దూరంగానే ఉంటారు.వివేక్ వాధ్వావ్యాసకర్త విశ్లేషకుడు – ‘వయోనిక్స్ బయోసైన్సెస్’ సీఈఓ(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సంస్కరణల పథాన్ని స్వాగతిద్దాం!
ఏ దేశ అభివృద్ధి అయినా అక్కడి మానవ వనరుల వికాసం మీదే ఆధారపడిఉంటుంది. ఈ మానవ వనరుల అభివృద్ధికి ప్రధానమైనది ‘విద్య’. బ్రిటిష్ కాలంలో కేవలం వారికి అనుకూలమైన గుమస్తాలను తయారుచేసే విద్యా విధానాన్నే అనుసరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్య శాఖ మంత్రిగా కొన్ని సంస్క రణలకు శ్రీకారం చుట్టారు. ఆయన జయంతినే ‘జాతీయ విద్యా దినోత్సవం (National Education Day 2025 ) గా జరుపుకొంటున్నాం.కేంద్ర పాలకులు 1968లో మొదటి జాతీయ విద్యా విధానాన్ని, 1986లో రెండవ జాతీయ విద్యా విధానాన్ని, 1992లో పరిమిత స్థాయిలో మూడవ జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారు. కానీ ప్రపంచ దేశాలతో ప్రత్యేకించి అభివృద్ధి చెందిన దేశా లతో సమానంగా పోటీపడి నైపుణ్యాలతో ముందుకు వెళ్లలేక పోయాము. మానవ వనరుల శాఖను కూలంకషంగా చర్చించి 34 ఏళ్ల తరువాత విద్యా రంగంలో కీలకమైన మార్పులు చేయాలనే తలంపుతో డా‘‘ కస్తూరి రంగరాజన్ అధ్యక్షతన ‘జాతీయ నూతన విద్యా కమిషన్’ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ సూచనల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ‘నూతన జాతీయ విద్యా విధానం 2020’ (ఎన్ఈపీ–2020) ప్రకటించింది. ఇది దేశంలో విద్యారంగా నికి సంబంధించి సమగ్రమైన సంస్కరణ. సాంకేతిక విజ్ఞానం, నైతిక విలువ లతో కూడిన విద్య, ఉపాధి కల్పన, పారదర్శకత దీని లక్ష్యం. 2035వ సంవత్సరం నాటికి ఉన్నత విద్యాసంస్థల్లో దాదాపు 3 కోట్ల సీట్లు అదనంగా రానున్నాయి. యూజీసీ కోర్సులలో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణలు చేర్చారు. దేశ జీడీపీలో 6% నిధులు విద్యా రంగానికి కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది 4.4% శాతంగా మాత్రమే ఉంది. విదేశీ విద్యా సంస్థలు తమ ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే విదేశీ విద్యార్థులు భారత్కు వచ్చి చదువుకునేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటివరకు – కంటెంట్ కేవలం ఆంగ్లం, హిందీలోనే అందుబాటులో ఉండగా ప్రస్తుతం అది 8 భారతీయ భాషల్లో (ఇందులో తెలుగు కూడా ఉంది) అందు బాటులోకి రానుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను ఒకే వేదిక మీదకు తీసుకువస్తారు. దీనికై ‘నేషనల్ టెక్నాలజీ ఫోరమ్’ను ఏర్పాటు చేస్తారు.పాఠశాల విద్యను ప్రీ–ప్రైమరీ పాఠ్యంశాలను ఎన్సీఈఆర్టీ అభివృద్ధి చేస్తుంది. 3–6 సంవత్సరాల పిల్లలకు ఆటల కార్యక్రమాల ద్వారా సరళమైన పాఠ్యంశాలను అమలు చేస్తారు. 1–3 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక అక్షరాలను, అంకెలను త్వరగా గుర్తుపట్టి చదివేలా తీర్చిదిద్దుతారు. దీనికై ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేశారు. ‘కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల’ను ఇప్పుడున్న 8 – 10 తరగతుల నుండి 12వ తరగతి వరకు పొడిగిస్తారు. బోర్డు పరీక్షకు ఉన్న ప్రాధాన్యాన్ని తగ్గిస్తారు. ఏటా ఒకసారి కాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయ టకు వెళ్లే సమయానికి వాళ్ళు ఏయే నైపుణ్యాలు నేర్చుకున్నారో వాటిని ఒక డేటాబేస్లో నిక్షిప్తం చేస్తారు. ఈ నూతన విద్యా విధానంలో భాగంగా ఏ భాషను కూడా బలవంతంగా రుద్దడం జరగదు. అన్ని స్థాయుల తరగతుల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు పరుస్తారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 బదులు... 5+3+3+4 ఉండేలా మార్పులు చేస్తారు. 9–12 తర గతుల విద్యార్థులు ఏ మార్కులు వచ్చినా నచ్చిన సబ్జెక్టు తీసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే వాటితో పాటు విద్యార్థులు తమకు నచ్చిన ఫ్యాషన్ డిజైన్, ఆహార తయారీ, తదితర కోర్సులు నేర్చుకోవచ్చు. డిజిటల్ లాకర్ ద్వారా పాత క్రెడిట్స్ అట్టిపెట్టు కొని... చదువు మానేసినా, తనకు వీలైన సమయంలో తిరిగి చదువు కొనసాగించేలా వెసులుబాటు కల్పించారు. చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంవృత్తి విద్యను 6వ తరగతి నుండే ప్రారంభిస్తారు. దీనిలో ఇంట ర్న్షిప్ కూడా ఉంటుంది. యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపా ధ్యాయ మండలి వంటివాటిని విలీనం చేసి మొత్తం విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఒకే రకమైన నిబంధనలను అమలు చేస్తారు. గుర్తింపు ఆధారంగానే స్వయం ప్రతిపత్తి ఇస్తారు. విద్యా ర్థులు, అధ్యాపకులకు మార్గదర్శనం చేయడానికి ‘నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్’ను ఏర్పాటు చేస్తారు.ఈ సంస్కరణలను సంకుచితమైన రాజకీయ దృక్కోణంలో చూడకుండా అన్ని రాష్ట్రాలూ అమలు చేయడానికి ముందుకు రావాలి. మనమందరం కూడా ఈ సంస్కరణ ను స్వాగతిద్దాం. అదే మనం అబుల్ కలావ్ు ఆజాద్కు ఇచ్చే నిజమైన నివాళి.బండారు దత్తాత్రేయ వ్యాసకర్త మాజీ గవర్నర్(నేడు ‘జాతీయ విద్యా దినోత్సవం) -
అమెరికాతో ఆచి తూచి...
ఇండియా, అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వచ్చినట్లేనా? సంతకాలు చేయడమే తరువాయి అంటూ ఆరు నెలలుగా వింటున్నాం. అయినా, ఉభయ పక్షాలూ ఆ చివరి ఘట్టం చేరుకోలేకపోతున్నాయి. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియా మీద విధించిన 25 శాతం అదనపు సుంకం విషయానికి వద్దాం. ప్రైవేటు రంగ సంస్థలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించాయి. మరి ఆ 25 శాతం అదనపు సుంకాలను అమెరికా ఎత్తివేస్తుందా? అలాంటి సంకేతాలేమీ లేవు.చమురు కొనకపోయినా...ఇండియా–యూఎస్ రక్షణ సహకారం మరో పదేళ్లు కొన సాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా యుద్ధ వ్యవహారాల మంత్రి పీట్ హెగ్సేథ్ ‘ఏసియాన్’ రక్షణ మంత్రుల సదస్సు సందర్భంగా అక్టోబర్ 31న కౌలాలంపూర్లో ప్రకటించారు. దీంతో వాణిజ్య వివాదం త్వరలోనే పరిష్కరం కాగలదన్న ఆశలు చిగురించాయి. ఇండియాకు రక్షణ సామగ్రి సరఫరా చేయడం ద్వారా అమెరికా బిలియన్ల డాలర్లను అర్జిస్తోంది. కాబట్టి మనపై ఆంక్షలు తొలగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అమెరికా అధ్యక్షుడి లెక్కలు వేరేగా ఉంటాయి. ఇండియా జాగ్రత్తగా అడుగులు వేయాలి. రాబోయే రోజుల్లో ఎస్–500 తరహా రష్యా అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ట్రంప్ అభ్యంతరం చెప్పరని అనుకోలేం. వాటిని సమకూర్చుకునేట్లయితే తాము ఇండియాకు రక్షణ పరికరాలను, విడిభాగాలను విక్రయించబోమంటూ పేచీ పెట్టరన్న గ్యారంటీ లేదు. చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తారని అనుకున్నామా? రష్యా చమురుకు చైనా కూడా భారీ కొనుగోలుదారు. నాటో కూటమి సభ్యులైన టర్కీ, హంగరీ సైతం గణనీయంగా ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. అయినా, అమెరికా ఇండియాను మాత్రమే వేరు చేసి ఆంక్షల శిక్ష విధించింది. బూసాన్ (దక్షిణ కొరియా)లో ఎపెక్ సదస్సు సందర్భంగా ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ చర్చలు జరిపారు. అందులో రష్యా చమురు ప్రస్తావన తేలేదని అన్నారు. ఇండియా మీద ఆంక్షల కత్తి ఝుళిపించిన ట్రంప్ చైనా విషయంలో అలా చేయలేక పోయారు. ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా ముందే హెచ్చరించడం అందుకు కారణం కావచ్చు.‘క్వాడ్’ లేనట్లేనా?అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం చైనా ముప్పు నుంచి కాపాడుతుందన్న నమ్మకాన్ని పునఃసమీక్షించుకోవాలి. నంబర్ 1, నంబర్ 2 దేశాల నడుమ నెలకొన్న వ్యవస్థాగత పోరు సమసి పోనప్పటికీ, ఇరు దేశాలూ వ్యూహాత్మక సర్దుబాట్లు చేసుకుంటున్నందువల్ల ఇండియా ఎత్తుగడలు ఫలించే అవకాశం తగ్గిపోతుంది. యుక్తమైన దౌత్యవిధానం అనుసరించడం ద్వారానే ఈ ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది.అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహం యథాతథంగా కొనసాగు తుందనడానికి ఇటీవలి ట్రంప్ ఆసియా పర్యటనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ వ్యూహంలో ఇండియా ప్రయోజనాలకు సంబంధించిన ‘క్వాడ్’ అంశం మరుగున పడింది. ఈ ఏడాది అఖరున క్వాడ్ దేశాధినేతల సమావేశం జరగాల్సి ఉంది. ఇది అనుమానమే. ట్రంప్ ఎక్కడా క్వాడ్ ఊసెత్తలేదు. భాగస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ సైతం ప్రస్తావించక పోవడం గమ నార్హం. అవి ట్రంప్ మనసెరిగి మసలుకున్నట్లుంది.ఒకవేళ ఆస్ట్రేలియా, జపాన్లతో ఇండియా తన సహకారాన్ని ముమ్మరం చేసుకుని ఒక త్రైపాక్షిక కూటమి (ట్రయడ్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది అనుకుంటే, దాని ప్రయోజనాలు ఎలా ఉంటాయన్నది మరో ప్రశ్న. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇండియాకు ఉన్న ఇతర అవకా శాలను చూద్దాం. యూరప్తో సన్నిహిత సమగ్ర భాగస్వామ్య ఒప్పందం వీటిలో ఒకటి. యూరప్ రక్షణ పరిశ్రమ భారీ విస్తరణ కోసం నమ్మకమైన విపణి, అగ్రశ్రేణి మానవ వనరులు అవసరం.ఇండియా వీటిని సమకూర్చగలదు. యూరప్, ఇండియాల మధ్య దృఢ మైన రక్షణ భాగస్వామ్యం ఉన్నట్లయితే, నిలకడ లేని అమెరికా విధానా లకు విరుగుడుగా అది ఉభయ పక్షాలకూ ఉపయోగపడుతుంది. ఇండియా బలాలుఅరిగిపోయిన రికార్డులా నేను మళ్లీ చెబుతున్నా. ఉపఖండ సరిహద్దుల భద్రత మన తక్షణ ఆవశ్యకత. పొరుగు దేశాలతో ద్వైపా క్షిక సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడు తుంది. మనం దక్షిణాసియా వృద్ధికి ఒక కేంద్రకంగా, భద్రత కల్పించే శక్తిగా మారడం ముఖ్యం. అనూహ్యంగా అనిపించినా కాలక్రమంలో పాకిస్తాన్ కూడా ఈ పరిధిలోకి వచ్చి తీరాలి. మన ప్రాంతానికి వాతావరణ మార్పు అతిపెద్ద సవాలు కాబోతోంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడం ప్రాంతీయ దేశాల నడుమ సహకారంతోనే సాధ్యమవుతుంది. ఈ విపత్తుపై ఉమ్మడి పోరాటానికి సారథ్యం వహించే శక్తి ఇండియాకు మాత్రమే ఉంది. తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లోనూ ఇండియా ప్రముఖ పాత్ర వహించాలి. ఇందుకు వీలుగా ఆర్సీఈపీ, సీపీటీపీపీ స్వేచ్ఛా వాణిజ్య కూటముల్లో సభ్యత్వం కోసం ప్రయత్నించాలి. శాస్త్ర సాంకేతిక మానవ వనరులతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సంక్షుభిత సమకాలీన ప్రపంచంలో చెక్కు చెదరని రాజకీయ సుస్థిరత... ఈ రెండూ ఇండియా సొంతం. వివేకంతో వినియోగించుకోగలిగితే దేశాన్ని ఇవి వ్యూహాత్మకంగానూ ముందంజ వేయిస్తాయి. చైనాతో సంబంధాలను మెరుగుపరచడంలో వీటి పాత్ర ఉంది. ఏమైనప్పటికీ, విదేశీ విధానంలో, రక్షణ వ్యవహారాల్లో బయటి శక్తుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా నిర్ణ యాలు తీసుకోగల ‘వ్యూహాత్మక స్వతంత్రత’ సాధించడానికి... సామర్థ్యం కంటే సంకల్పం ముఖ్యం.శ్యామ్ శరణ్వ్యాసకర్త కేంద్ర విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తెలుగు సూర్యునికి అక్షర నీరాజనాలు
తెలుగు భాషకూ, సాహిత్యానికీ అనుపమాన సేవలు చేశారు సి.పి. బ్రౌను (CP Brown) వేమన పద్యాలు వెలుగు చూడటానికి ఆయనే కారణం. అలాగే ఆయన రూపొందించిన ‘తెలుగు–ఇంగ్లీషు నిఘంటువు’ ఇప్పటికీ ప్రామాణికమైనదిగానే వెలుగొందుతోంది. బ్రిటిష్ అధి కారిగా వచ్చిన బ్రౌను తెలుగు కోసం సర్వస్వాన్నీ అర్పించారు. అటువంటి బ్రౌనుపై ఎందరో గద్య, పద్య రచనలు చేశారు. ‘వైదర్భీపరిణయం’ కవి మచ్చా వెంకటకవి తన పద్యంలో ‘తానాంధ్ర వి/ద్యా పాండిత్యము మేటి గ్రంథ పఠనాద్యస్తోక నైపుణ్యమున్/ జూపెన్ రాజమహేంద్ర పట్టణమునన్ సూర్యుత్త ముల్ మేలనన్’ అంటూ పండితుల అభిమానం బ్రౌను ఎలా పొందారో రాశారు. ఇక ములుపాక బుచ్చయ్య కవి ‘నూర్లార్లు లెక్కసేయక/ పేర్లెక్కిన విబుధవరుల పిలిపించుచు, వే/మార్లర్థ మిచ్చు వితరణి/ చార్లీసు ఫిలిప్పుబ్రౌను సాహెబు కరుణన్’ అన్న పద్యం బ్రౌను వదాన్యత తెలిపే ప్రశస్త పద్యమైంది. పిండిప్రోలు లక్ష్మణ కవి ఏకంగా బ్రౌనును హరి, శ్రీకృష్ణుడు అంటూ ప్రస్తుతి చేశారు. భట్రాజు రామన కవి అయితే ప్రేమతో బ్రౌనుపై దండకాన్నే రాసి ‘శారదా శారదా భ్రమందార కుంద/ చందనాంచితకీర్తి, బ్రౌను చక్రవర్తి’ అని అభివర్ణించారు.పుట్లూరు శ్రీనివాసాచార్య కవి బ్రౌను సేవను ఒక సీసంలో ‘ఆంగ్లేయుడైయుండి ఆంధ్రలో ‘కడప’ను / తన జన్మభూమిగా తలచెనెవడు / తాటియాకుల జీర్ణ దశనున్న ప్రతు లకు/ కొత్త జీవము పోసి కొలచె నెవరు/ లోపించు పదజాల రూపమ్ము నిలుపగా/ తెలుగు నిఘంటువుల్ మలచె నెవడు/ఛందోగతుల తేనె విందులు సమ కూర్చి/ ప్రియ జానపద వాణి పిలిచె నెవడు’ అంటూ ఆయన సేవలను కళ్లకు కట్టారు.శతావధాని సి.వి. సుబ్బన్న ‘కులమును కాలమున్ స్థలము కొండొక గుర్తు లభింపదయ్యె’ అనే పద్య రత్నాన్ని అందించారు. బెజవాడ గోపాల రెడ్డి ఒక దీర్ఘ వచన కవితా ఖండికలో ‘క్రొత్త రెక్కలతో కావ్యవిహంగము/ క్రొత్త దేశాలకు ఎగిరింది/ క్రొత్త వనాల గూడు కట్టింది/ దీర్ఘసుప్త శిల అహల్యయై లేచింది’ అంటూ బ్రౌను వల్ల వచ్చిన సాహిత్య చైతన్యాన్ని కవితాపరంగా చెప్పారు. రాధశ్రీ అందాల కందాలలో బ్రౌనుకు నివాళి పలికారు. ‘సి.పి. బ్రౌను పరాయి పండితుడటే’ అంటూ ఆరే దీపాన్ని పట్టుకుని ఆంధ్రీకావ్యా లకు చీకటెక్కడుందని చీకటిని చీల్చాడన్నారు. ఆచార్య ఎన్. గోపి బ్రౌను పరిశోధక కవి– ‘బ్రౌనుకు నమస్కారం’ అనే అవిస్మరణీయ భావాత్మక కవిత వ్రాస్తూ ‘ఆరిపోతున్న భాషా దీపానికి/ ఊపిరిలోంచి/ ప్రాణవాయువు దానం చేసిన సంజీ వనుడు’ అని సమున్నతంగా చెప్పారు.పద్యాలు, వచనకవితా ఖండికలు ఇలా వస్తే బ్రౌనుమీద ఒక కావ్యమే వచ్చింది. ‘సి.పి. బ్రౌను ఉదాహరణ కావ్యం’గా రాసిన కవి సన్నిధానం నరసింహశర్మ. ఇది బ్రౌనుపై వచ్చిన ప్రథమ కావ్యం. ఆరుద్రకి అంకితం. ‘సూర్యుడు వచ్చే పచ్చలను చూడుడు వెల్గుల నక్షరాల సౌం/దర్యపు భాష బ్రాకృతిక ధన్యనిఘంటువు చాటి చెప్పు స/త్కార్య విజృంభణార్థ సుముఖ ప్రభ కన్పడెతాటి చెట్టులన్ / ధైర్యము గల్గ తెల్గులకు దారుడు సూర్యుడెచూపు హేతువుల్’ వంటి ఆలోచనాత్మక భావాల, పద్యాల కేళికో త్కళికలతో ఈ కావ్యం భావరస ప్రధానమైంది.ఇలా కవుల సహృదయ కవితా నీరాజనాల నందుకున్న సి.పి. బ్రౌను ధన్యుడు. మహామహులైన కవులు తెలియచేసినట్లు మనం తాళపత్ర గ్రంథాలు సేకరించకపోయినా ఫరవాలేదు. కొత్తగా నిఘంటువులు వ్రాసి తెలుగుకు ఘనకీర్తి తేనవసరం లేదు. మన మన పిల్లలతో తెలుగు పుస్తకాలు చదివించగలిగితే – అదే మన భాషను కాపాడినట్లు! బ్రౌను దొరకు మనం ఇచ్చే ఘన నివాళి ఇదే.– పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి,రచయిత–రిటైర్డ్ హెడ్ మాస్టర్ -
పరమ పవిత్రం.. శ్రీవారి లడ్డూ ప్రసాదం
సాక్షి, అమరావతి: రాజకీయ కుట్ర కోసం ఎంతకైనా దిగజారుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం పదేపదే నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అందుకోసం ఏకంగా శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుమల పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యంపై దుష్ప్రచారం చేసేందుకు కూడా తెగిస్తామని నిరూపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్ నివేదిక పేరుతో ఎల్లో మీడియా ద్వారా మరోసారి విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ఎల్లో మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొడుతూ అసలు వాస్తవాలను “సాక్షి’ ప్రజల ముందు ఉంచుతోంది.చిన్న అప్పన్న ఏపీ భవన్ ఉద్యోగితిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా!? నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తుండటం గమనార్హం. ఓ అనాకమ ఫిర్యాదు వస్తే బోలే బాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు.. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు, ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప, వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.చైర్మనే సర్వస్వం కాదు.. టీటీడీ బోర్డు ఉంటుంది ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా టీటీడీ వ్యవస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమల–తిరుపతి వ్యవహారాలకు టీటీడీ చైర్మనే సర్వస్వం, సర్వాధికారి కాదు. టీటీడీ బోర్డుదే అత్యున్నత అధికారం. ఆ బోర్డులో సభ్యులు చర్చించి తీసుకున్న నిర్ణయాలనే టీటీడీ అమలు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు నిర్ణయాన్ని కూడా అదే రీతిలో బోర్డు తీసుకుంది. ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే.. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. భోలే బాబా డెయిరీ పాల సేకరణపై భిన్న కథనాలుపోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి భోలే బాబా డెయిరీ గురించి ప్రభుత్వం, ఎల్లో మీడియా పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తుండటమే అందుకు తార్కాణం. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండా టీటీడీ నుంచి రూ.240 కోట్ల నెయ్యి కాంట్రాక్టు పొందిందని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు ఎల్లో మీడియా తన కథనంలో పేర్కొంది. మళ్లీ భోలే బాబా డెయిరీ ఉత్తర్ప్రదేశ్లో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి, పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే కథనంలో పేర్కొనడం గమనార్హం. మరి ఆ డెయిరీ పాలు సేకరిస్తున్నట్టా.. సేకరించనట్టా? రెండూ ఎల్లో మీడియానే చెబుతుంటే అందులో ఏది వాస్తవం!?నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబు ప్రభుత్వమేకర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా, చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. అంటే నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొన లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వ లేదు కాబట్టి.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనమని చెప్పింది. వాస్తవాలు అలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డెయిరీకి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండరులో పాల్గొన్న ఇతర డెయిరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కదా! టీడీపీ వీరవిధేయ సిట్తో కుతంత్రంనెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో గత ఏడాది హడావిడిగా సిట్ను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తర్వాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్గా నియమించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత.. నెయ్యిలో కల్తీపై టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి, ఆ స్థానంలో టీడీపీకి అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. సుప్రీం కొరడా.. సిట్ క్లోజ్ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా.. అన్నది ఆలోచిస్తామని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేసింది. అనంతరం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పరిశీలకులు స్పష్టం చేశారు.డైవర్షన్ డ్రామా కోసం తిరుమల పవిత్రతపై దుష్ప్రచారంఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలో భాగంగానే కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తోంది. అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు బరితెగిస్తోంది. గత ఏడాది బుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించినా, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది. కూటమి నేతలు, ఎల్లో మీడియా పక్కా పన్నాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. కానీ టీడీపీ కూటమి నేతల కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అధికారిక ప్రకటనే తిప్పికొట్టింది. ఆ వ్యవహారం ఇలా సాగింది.2024 జులై 23వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు వెనక్కి పంపాం నెయ్యిలో కల్తీ జరిగిందని శాంపిల్స్ పరీక్షల్లో తేలింది. వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని వెల్లడైంది. దాంతో కాంట్రాక్టరును బ్లాక్ లిస్ట్ పెట్టి షోకాజ్ నోటీసు ఇచ్చాం. ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వినియోగించనే లేదు. – టీటీడీ ఈవో శ్యామలరావు2024 సెప్టెంబర్ 18 నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు : చంద్రబాబుటీటీడీ ఈవో అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 22నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపాం : టీటీడీ ఈవోఅయినా సరే చంద్రబాబు ఆరోపణలను టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పికొట్టారు. నమూనాలను పరీక్షించాక అది కల్తీ నెయ్యి అని తేలడంతో ఆ డెయిరీ పంపిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశామని తెలిపారు.సెప్టెంబరు 22 ఆ నెయ్యి వాడారు : చంద్రబాబుఅయినా సరే చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని కొనసాగించారు. నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. అందులోని కల్తీ నెయ్యిని వాడారని మళ్లీ దుష్ప్రచారం చేయడం గమనార్హం. అంటే వాస్తవాలతో తనకు నిమిత్తం లేదని, రాజకీయ ప్రయోజనం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీసేందుకు వెనుకాడనని నిరూపించారు. ఇంతటితో ఆగకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం తన డర్టీ పాలిటిక్స్కు మరింత పదును పెట్టింది. 2024 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే.. ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. వాస్తవానికి ఎన్డీడీబీ నివేదికను గోప్యంగా ఉంచాలి. కానీ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ కార్యాలయం ఆ నివేదికను విడుదల చేయడం గమనార్హం.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరిన వైవీ సుబ్బారెడ్డితిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచారంపై వైవీ సుబ్బారెడ్డి సత్వరం స్పందించారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవీ సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది.టీటీడీలో నెయ్యి కొనుగోలుకు పటిష్ట వ్యవస్థ⇒ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారింది. కానీ నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ పటిష్ట విధానం అనుసరిస్తోంది.⇒ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.⇒ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ను కూడా సమర్పించాలి.⇒ అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కు పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.⇒ తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవం.ప్రస్తుత నెయ్యి వివాదం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనిదే ప్రస్తుతం కల్తీ అంటూ చేçస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? 2024 జూన్ 12న తీసిన శాంపిల్స్ అవి. 2024 జూన్ 4నే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి గెలిచిందన్నది తేలి పోయింది. జూన్ 12నే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ చెప్పనే లేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, ఆ కల్తీ జంతువుల కొవ్వు కలపడంతో జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్త నేహా దీపక్ షా స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి. సాధారణంగా నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతవుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం కేవలం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం. -
ఆపద పైబడుతున్నా... అదే వైఖరి
బ్రెజిల్లోని బెలేమ్ నగరంలో ఈ రోజు (నవంబర్ 10) నుంచి ‘సీఓపీ30’ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో 100కు పైగా దేశాల ప్రతి నిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను అప్డేట్ చేసుకునేందుకూ, పుడమి తాపాన్ని నిరోధించే చర్యల అమలును ముందుకు తీసుకెళ్ళేందుకూ ఈ సమావేశాలు నిర్ణయాత్మక మైలురాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఆతిథ్యమిస్తున్న దేశంగా బ్రెజిల్ దీన్ని ఫలితమిచ్చిన శిఖరాగ్ర సమావేశంగా మలచాలని కోరుకుంటోంది. నడుం బిగించేందుకు ఇదే సమయమని సమావేశాల అధ్యక్షుడు ఆంద్రే కొర్రియా దొ లాగో అన్నారు. అయినా పెరిగిన భూతాపంవాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కూడా దీనికి కలసి వస్తోంది. అది కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే లక్ష్యంగా కుదిరిన గొప్ప ఒప్పందం. కానీ, దాని లక్ష్యసాధన దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ అరకొరగానే ఉంటున్నాయి. పుడమి సగటు ఉష్ణో గ్రత పారిశ్రామిక విప్లవం ముందు రోజుల కన్నా, 1.5 సెంటిగ్రేడ్ దాటకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2024లో అది మొదటిసారి దాన్ని దాటేసింది. తీవ్ర వాతావరణ ఉపద్రవాలు పెరుగుతూ పోతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో 80కి పైగా దేశాలలో సముద్రపు దిబ్బలు నిర్జీవంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్పును ఆపడం కష్టమైన ‘నిర్ణయాత్మక దశ’కు పుడమి చేరుకుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమ తూకానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్ సతత హరితారణ్యాలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఓపీ30 సమావేశాలు అమెజాన్కు సమీపంలోని నగరంలోనే జరుగుతున్నాయి. ప్యారిస్ ఒప్పందానికి పరీక్షప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు సుముఖంగా ఉన్నాయో లేదో సీఓపీ30 సమావేశాలలో తేలిపోనుంది. దుబాయ్లో 2023లో జరిగిన సీఓపీ28 సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పరిస్థితిని మొదటిసారిగా సమీక్షించుకున్నారు. శిలాజ ఇంధనాల నుంచి మారడాన్ని ఆ సమావేశాల తుది ప్రకటనలో మొదటిసారిగా ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరిగిన సీఓపీ29 సమావేశాల్లో నూతన వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వార్షిక వాతావరణ ఫైనాన్స్ 2035కల్లా 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరేటట్లు చూసుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అమలుపరచడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలను సమీక్షించడం బెలేమ్ సమా వేశాల్లో జరగనుంది. వివిధ దేశాలు ఏ మేరకు ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో వాటిని జాతీయ నిశ్చయ వాటాలు (ఎన్డీసీలు)గా పిలుస్తున్నారు. వీటిని ప్రతి ఐదేళ్ళ కొకసారి అప్డేట్ చేసుకుంటున్నారు. ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేసిన 190కి పైగా దేశాలలో దాదాపు 70 ఇప్పటికే తమ లక్ష్యాలను అప్డేట్ చేశాయి. ప్రపంచ ఉద్గారాలలో మూడో వంతు పైగా వాటాకు మాత్రమే లెక్క తేలే విధంగా అవి ప్రణాళికలు సమర్పించాయి. పుడమి తాపాన్ని 1.5 సెంటిగ్రేడ్ పరిమితికి లోపల ఉంచేందుకు 2030 నాటికల్లా గ్రీన్హౌస్ వాయువు (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి)లను సుమారు 31 గిగా టన్నులకు తగ్గించవలసి ఉంది. అయితే, అప్డేట్ చేసిన ఎన్డీసీలను లెక్కలోకి తీసుకున్నా అది 2 గిగా టన్నులకు మించడం లేదు. అమెరికా తడబాటు – చైనా ఎడబాటుభౌగోళిక రాజకీయాలు బహు సున్నితంగా ఉన్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య నమ్మకం కొరవడటం ప్రధాన సమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఇది వాతావరణంపై చర్చలకు అవరోధం కానుంది. అంతర్జాతీయ వాతావరణ మార్పు నిరోధక సహాయ కార్యక్రమాలకు అమెరికా నుంచి అందే విరాళాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోత పెట్టారు. ప్రభుత్వ వనరులను సైనిక, భద్రతాపరమైన అంశాలకు మళ్ళిస్తున్నారు. తలో చేయి వేస్తామని చెప్పిన దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. వాగ్దానం చేసిన మొత్తాలను తగ్గించి ఇస్తున్నాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇబ్బందులను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో సామాజిక ఉద్యమాల, పేద దేశాల ప్రతినిధుల హాజరు అంతంతమాత్రంగానే ఉండవచ్చుననిపిస్తోంది. చాలా దేశాలు తమ ప్రతినిధి బృందాల సంఖ్యను కుదించుకున్నాయి.కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల నాయకత్వాలు ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో సుమారు సగ భాగం ఈ దేశాల నుంచే ఉన్నాయి. ఇవి తమ దేశాల్లో పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే, మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ పైన కూడా పెద్ద బాధ్యతే ఉంది. వాతావరణ మార్పు ఇంత పెను సమస్యగా పరిణమించడంలో చారిత్రకంగా వాటి బాధ్యత చాలానే ఉంది. గ్రీన్హౌస్ వాయువుల విడుదలలో ప్రపంచంలో రెండవ పెద్ద పాత్ర అమెరికాదే! ప్యారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియ ట్రంప్ 2025 జనవరిలో తిరిగి అధికారానికి వచ్చాక ఊపందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోగల గతిని నీరుగార్చనుంది. నిధుల మంజూరులో ఇచ్చిన మాటను అమెరికా ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేదు. ఆ లోటును ఫెడరల్ ప్రభుత్వం బదులు, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థలు తీరుస్తాయని భావిస్తున్నారు. ఇక తమ గ్రీన్హౌస్ వాయువుల విడుదలను 2035కల్లా 7 నుంచి 10 శాతం మధ్యకు తగ్గించుకుంటామని చైనా నాయకుడు షీ జిన్పింగ్ గత సెప్టెంబరులో ఐరాస సర్వ ప్రతినిధి సభలో చెప్పారు. ప్రపంచ ఉద్గారాలలో చైనా వాటా సుమారు మూడో వంతుగా ఉంది. దానితో పోలిస్తే, ఆయన చెబు తున్న మాటలు పెద్దగా లెక్కలోకి రావు. వాతావరణ మార్పును అరికట్టే నాయకత్వం నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉపసంహరించుకోవడంతో చైనాయే నేతృత్వం వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ ‘ఏకైక నాయక’ పాత్రను చేపట్టడంలోని బరువు బాధ్యతలు చైనాకు బాగా తెలుసు. అందుకే నాయకత్వ బాధ్యత లను పంపిణీ చేయాలనీ, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠపరచాలనీ చైనా భావిస్తోంది.అమందా మగ్నానివ్యాసకర్త బ్రెజిల్ పర్యావరణ పాత్రికేయురాలు -
తేజస్వీ యాదవ్ (సీఎం అభ్యర్థి) రాయని డైరీ
దేశంలో ఏదైనా ఒక రాష్ట్రానికి 14 కోట్ల మంది సీఎంలు ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో శ్రీ మోదీజీ, శ్రీ నితీశ్ కుమార్ నవంబర్ 14న ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నేను సీఎంని అయితే బిహార్ ప్రజలంతా సీఎంలు అయినట్లే!ఎల్లుండి, నవంబర్ 11న రెండో విడత పోలింగ్. 14న ఫలితాలు. 6న మొదటి విడత పోలింగ్ పూర్తయింది. నాన్నగారు, అమ్మ, నేను, రాజశ్రీ, భారతి అక్క, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఓటేసి వచ్చాం. తేజ్ ప్రతాప్ అన్నయ్య కూడా మాతో ఉంటే బాగుండేది.నాన్నగారు తేజ్ అన్నయ్యను ఇంట్లోంచి, పార్టీ నుంచి వెళ్లి పొమ్మన్నాక తేజ్ అన్నయ్య వేరే పార్టీ పెట్టుకున్నారు. మాలో ఎవరితోనూ మాట్లాడటం లేదు. మొన్న పట్నా ఎయిర్ పోర్టులో ఒకరికొకరం ఎదురుపడినప్పుడు కూడా తేజ్ అన్నయ్య ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు! నేను చాలా ఫీల్ అయ్యాను. తేజ్ అన్నయ్య ‘జనశక్తి జనతా దళ్’ అనే పార్టీ పెట్టుకుని మహువా నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్జేడీలోని ‘జేడీ’ని అలాగేఉంచేసుకుని, ‘రాష్ట్రీయ’కు బదులుగా ‘జనశక్తి’ అని పెట్టుకున్నారు. అంటే పూర్తిగా పార్టీలోంచి వెళ్లినట్లు కాదు. నేను పోటీ చేస్తున్న రాఘోపుర్, తేజ్ అన్నయ్య పోటీ చేస్తున్న మహువా... రెండూ వైశాలి జిల్లాలోనివే. నాన్నగారు, అమ్మ,మా ఇద్దరి తలపై చేయి ఆన్చి వేర్వేరుగా మాకు ఆశీస్సులు అందించారు. అంటే అన్నయ్య పూర్తిగా ఇంట్లోంచి వెళ్లినట్లు కాదు. ఎవరో అమ్మాయితో తను రిలేషన్లో ఉన్నట్లు తేజ్ అన్నయ్య ఫేస్బుక్లో పోస్టు పెట్టడంతోనే వచ్చింది అసలు ఇదంతా! పాపం వదిన ఆ రోజు ఎంతగా చిన్నబోయారో ఇంట్లో అందరం చూశాం. అమ్మ వదినను గుండెల్లోకి తీసుకుంది. నాన్న గారు తేజ్ అన్నయ్యను గట్టిగా మందలించారు. ‘‘వ్యక్తిగా నీతి తప్పిన వారికి సమాజం కోసం పోరాడే శక్తి తగ్గుతుంది’’ అన్నారు. ఇంట్లోంచి, పార్టీలోంచి అన్నయ్యను పంపించేశారు.బయటికి వెళ్లి, కొత్త పార్టీ పెట్టగానే తేజ్ అన్నయ్య మొదట అన్నమాట... ‘‘మృత్యువునైనా ఆలింగనం చేసుకుంటాను కానీ తిరిగి ఆర్జేడీని ఆశ్రయించేది లేదు’’ అని! ఆ మాటకు నాన్నగారు, అమ్మ చాలా బాధపడ్డారు.తేజ్ అన్నయ్య జేజేడీ పార్టీ 22 చోట్ల పోటీ చేస్తోంది. ఆ పార్టీ అన్ని చోట్లా గెలిచి, నేను సీఎం అవటానికి 22 సీట్లు తగ్గితే అన్నయ్య అప్పుడేమంటారో చూడాలి. 2020 ఎన్నికల్లో నేను సీఎం అవటానికి తగ్గింది 12 సీట్లే! ఒంట్లో హుషారుగా లేక నాన్నగారు ప్రచారానికి రాలేకపోతున్నారు. కానీ, నాన్నగారి మాటలు నేరుగా ఇళ్లలోకే వెళ్లి పోతాయి. బిహార్లోని ప్రతి ఇల్లూ భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు నాన్నగారి సత్తువ కలిగిన మాటలను రొట్టెల్లా పంచుకుంటుంది. నాకింకా ఆ ఒరవడి రాలేదు.నితీశ్జీ ఇరవై ఏళ్లుగా బిహార్కు సీఎంగా ఉంటున్నారు. నాన్నగారు ఏమంటారంటే... ‘‘పెనం మీద రొట్టెను తిరగెయ్యకపోతే మాడిపోతుంది. ఇరవై ఏళ్లు అంటే చాలా ఎక్కువ సమయం’’ అని!ఈ ఒక్క మాట చాలు, రోజుకు నేను పది ర్యాలీలు తీసి, పది ప్రసంగాలు చేసినంత!ఇవాళ రాహుల్జీ పట్నా వస్తున్నారు. ఇవాళ జరిగే అన్ని ర్యాలీలలో ఆయన నా వెంట ఉంటారు. ప్రచారానికి సిద్ధం అవుతుంటే... ‘‘చల్లగా ఉండు’’ అని నాన్నగారు, అమ్మ వచ్చి నన్ను దీవించారు. నాకు మిఠాయిలు తినిపించారు. అమ్మ నా నుదుటిపై ముద్దు పెట్టింది.ఇంట్లోంచి నేను బయలుదేరుతుంటే... తేజ్ అన్నయ్య నుంచి ఫోన్... ‘‘హ్యాపీ బర్త్ డే రా తమ్ముడూ...’’ అని!!నాన్నగారికి నెహ్రూజీ అంటే ఇష్టం. ఈసారి ఎన్నికల ఫలితాలు సరిగ్గా నెహ్రూజీ బర్త్డే రోజే వస్తున్నాయి. బిహార్ ప్రజలంతా సీఎంలు కాబోతున్న రోజు కూడా అదే! -
వినిమయ తత్వమే కాలుష్య కారకం
దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రత గురించి ఇప్పటికే చాలా విన్నాం. మనం పీల్చే విషపు గాలి పర్యవసానాలు, నష్టా లపై నిపుణులు అడపాదడపా హెచ్చరి స్తూనే ఉన్నారు. కోవిడ్–19 వల్ల కన్నా వాయు కాలుష్యం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ‘ఎయిమ్స్’ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం వాయు కాలుష్య దీర్ఘకాలిక ప్రభావాలు దగ్గులు, ఊపిరి సలపకపోవడానికి మాత్రమే పరిమితమైనవి కావు. అది హార్ట్ ఎటాక్, స్ట్రోక్, చివరకు క్యాన్సర్కు కూడా కారణమవుతోంది. అయినా, మనం సంక్షోభం మూలాలలోకి వెళ్ళేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం సూచించే తాత్కాలిక పరిష్కాలతో తృప్తి పడుతున్నాం. ఎయిర్ ప్యూరిఫయర్లు కొనేందుకు, బయటకు వెళ్ళేటపుడు ఎన్ 95 మాస్కులు ధరించేందుకు అలవాటు పడుతున్నాం. కృత్రిమ వర్షాలను సాంకేతిక అద్భుతంగా మురిసిపోతూ, అవి తేగల ఊరట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక ప్రజా సమస్యకు ఆ రకమైన ప్రైవేటు పరిష్కారాలనుమించి ఆలోచించేందుకు తెగువ, రాజకీయ, నైతిక విశ్వాసం అవసరం. మనం సాధారణంగా మార్చేసిన జీవన విధానాలకు సంబంధించి ప్రపంచ దృక్కోణాన్ని ప్రశ్నించేందుకు మనమంతా ఏకం కావాల్సి ఉంది.వినిమయ తత్వపు విషవలయంఢిల్లీ వాయు కాలుష్యం విస్తృతమైన వాతావరణ మార్పు సంక్షో భంతో ముడిపడి ఉన్నదనీ, అవి రెండూ అవిభాజ్యమైనవనీ నిజాయితీగా అంగీకరిద్దాం. అది ఆధునికత తెచ్చిపెడుతున్న అనర్థం. ముందు వెనుకలు ఆలోచించని సాంకేతిక ప్రగతి కోసం ప్రకృతిని జయించాలని చూస్తున్నాం. దాంతో, టెక్నో–క్యాపిటలిజం స్థిరంగా వృద్ధి చెందుతూ వచ్చింది. వస్తు వినియోగ తత్వానికి మనం క్రమంగా బానిసలమైపోయాం. మవ చుట్టూ ఉన్న వాటిలో చెట్టు, పుట్ట, నది, పర్వతం ఏదైనా కావచ్చు– ప్రతీదీ వాటివైన స్వరూప స్వభావాలను, ప్రయోజనాన్ని కోల్పోయాయి. ప్రకృతి అంటే కొల్లగొట్టదగిన వనరు అనే భావన పాదుకుపోయింది. మరింత విద్యుచ్ఛక్తి, మరిన్ని కార్లు, మరింత వస్తు సామగ్రి, మరిన్ని దుస్తులు... వస్తు వినిమయ తత్వానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. రోడ్ల విస్తరణకు వేలాది చెట్లను నరికేసేందుకు మనం సంశయించడం లేదు. విద్యుదుత్పాదనకు నదుల సహజ ప్రవాహ గతులను మార్చేస్తున్నాం. ఔను. ఆధునికత సంక్షోభం ఢిల్లీ వాయు కాలుష్య రూపంలో జడలు విప్పుకుని దర్శనిమిస్తోంది. ఒక్కసారి ఢిల్లీ రోడ్లను పరికిస్తే వాహనాలు వరదెత్తినట్లుగా కనిపిస్తాయి. దేశ రాజధానిలో 1.2 కోట్ల వాహనాలు రిజిస్టరయ్యాయనీ, వాటిలో 33.8 లక్షలు ప్రైవేటు కార్లేననీ ఢిల్లీ స్టాటిస్టికల్ హ్యాండ్ బుక్ (2023) సూచిస్తోంది. వేగం, చలన శక్తి ఆధునికతలో అంతర్భాగాలవడంతో మనకు మరిన్ని కార్లు, విమానాలు అవసరమవుతున్నాయి. పర్యవసానంగా శిలాజ ఇంధనాలను వెలికి తీయడం అవిశ్రాంతంగా సాగుతోంది. కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఆధునికత, టెక్నో–క్యాపిటలిజం విష విలయంలో చిక్కుకున్నాం. తప్పులో మన వాటా?ఢిల్లీలో కాలుష్యానికి ప్రాథమిక కారణం పొరుగు రాష్ట్రాలలో పంట కోతల తర్వాత గడ్డి గాదాన్ని మంటపెట్టడం వల్ల కాదని నిజాయితీగా అంగీకరించాలి. ఢిల్లీ వాయు కాలుష్యానికి వాహనాల ఉద్గారాలు ప్రధాన దోహదకారిగా ఉన్నాయనే వాస్తవాన్ని మనం ఎలా విస్మరించగలం? సూక్ష్మ ఘన, ద్రవ ధూళి కణాలు, దుమ్ము, మసి, పొగల మిశ్రమాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం)గా పిలుస్తు న్నారు. ఢిల్లీలో వార్షిక పీఎం 2.5 శాతంగా ఉంది. దానిలో వాహన ఉద్గారాల వాటాయే 10 నుంచి 30 శాతంగా ఉందని లెక్క తేలింది. అలాగే, పరిశ్రమలు, విద్యుదుత్పాదన కేంద్రాలు విడిచిపెట్టేవి, వ్యర్థ పదార్థాలను దగ్ధం చేయడం వల్ల వచ్చేవి, నిర్మాణ పనుల వల్ల రోడ్లపైకి వస్తున్న దుమ్ము నగరంలో వాయు కాలుష్య తీవ్రతకు కారణమవుతున్నాయి. కానీ, ఈ ప్రశ్నలను లేవనెత్తడం కష్టం. ఎందుకంటే, అవి మనల్నే వేలెత్తి చూపుతాయి. మనం అనుసరిస్తున్న హైపర్ ఆధుని కత జీవన మార్గాలపై ఇంటరాగేషన్కు దిగుతాయి. కనుక, ఆత్మ పరిశీలనకు మనం విముఖులుగా ఉంటాం. దానికి బదులు, మన పడక గదుల్లో ఎయిర్ ప్యూరిఫయర్లను వాడితే మనం సురక్షితంగా ఉంటామని మనకు మనం సర్ది చెప్పుకోవడం తేలిక. పెద్దగా ఆందో ళన చెందనక్కర లేకుండా టెక్నో–సైన్స్ కృత్రిమ వర్షాలను కురిపించగలదని సంతృప్తి పడటం తేలిక. ఎలక్ట్రిక్ కార్లను వాడటం ప్రారంభిస్తే సమస్య పరిష్కారమైపోతుందని నమ్మడం తేలిక. కట్టె పొయ్యిలు, బొగ్గు కుంపట్లు వంటి వాటి ద్వారా కాలుష్యానికి కారణమవుతున్నారని పేదలను నిందించడం తేలిక. లగ్జరీ ఎస్యూవీలు, స్పీడుగా దూసుకుపోయే కార్లు, ఖరీదైన వస్తువుల వినియోగం కర్బన ఉద్గారాలకు గణనీయంగా తోడ్పడు తున్నాయని చెబితే ధనికులకు, అత్యంత సంపన్నులకు కోపం వస్తుంది. కాలుష్య పర్యవసానంగా ఏర్పడుతున్న ప్రతికూల అనా రోగ్య పరిస్థితుల బారిన ధనికులకన్నా పేదలు ఎక్కువ పడుతున్నా రనే వాస్తవాన్ని తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు. నిజంగా కావాల్సినవి!కాలుష్య రహిత భవిష్యత్తుకు నూతన జీవన పద్ధతులు, పట్టణ ప్రణాళికలు తప్పనిసరి. న్యూరోటిక్ స్పీడు నుంచి మందగమనానికి, భారీ ఎక్స్ప్రెస్ వేల నుంచి నడకకు, సైకిళ్ళు తొక్కడానికి ప్రోత్సహించే రోడ్లకు, ప్రైవేటు వాహనాల నుంచి ప్రజా రవాణా వ్యవస్థ లకు మారక తప్పదు. ఆకర్షణీయంగా కనిపించే వినిమయ తత్వం నుంచి నిరాడంబర, నిలకడగా సాగించగలిగిన జీవన విధానాలకు మళ్ళాలి. అవసరం లేనివాటి కోసం వెంపర్లాడటం మానుకోవాలి. మనం, మన సంతానం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయ పడగల వాటిని అలవరచుకోవాలి. శుద్ధమైన తాగునీరు, గాలి, చెట్లు, నీటి వనరులు, నీలాకాశం, ఎటుచూసినా హరిత పరిసరాలు మనకు నిజమైన అవసరాలు. ప్రాధాన్యాలను ఎంచుకోవాల్సింది మనమే. మనం ఏ విధమైన అభివృద్ధిని కోరుకుంటున్నామో, ఆ దిశగా అడుగులు వేసేందుకు మనమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.-వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-అవిజిత్ పాఠక్ -
పరతంత్య్రాన్ని పారదోలిన గేయం
Vande Mataram ‘వందేమాతరం’ నినాదం లేని స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఊహించలేం. బ్రిటిష్వాళ్లకు వ్యతిరేకంగా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమ కాంక్షను వందేమాతర గేయం భారతీయుల్లో రగిలించింది. అదే తరువాత మన జాతీయ గేయం అయ్యింది. దీన్ని బంకించంద్ర ఛటర్జీ (ఛటోపాధ్యాయ) రచించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టడం, సాంస్కృతికంగా బలహీనపరచడం ఆయన్ని వేదనకు గురిచేసింది. అందుకే ‘ఆనంద్ మఠ్’ నవల రాశారాయన. ఈ నవలలో సన్యాసుల స్వాతంత్య్ర సమర శంఖ నినాదం వందే మాతరం అవుతుంది. ఈ గేయాన్ని 1875 నవంబరు 7న బంకించంద్ర రాశారు. తరువాత ‘ఆనంద్ మఠ్’లో పొందుపరిచారు. ఈ నవంబర్ 7తో వందేమాతర గేయానికి 150 ఏళ్లు పూర్తవుతాయి (150 years of iconic Vande Mataram). వందే మాతర వేడుకలను అధికారికంగా వచ్చే ఏడాది నవంబర్ 7 వరకూ కేంద్రం నిర్వహించనుంది.బంకించంద్ర ‘ఆనంద్ మఠ్ రాయడానికి నూరేళ్లకు పూర్వం 1773లో కొందరు సన్యాసులు ఆంగ్లేయుల మీద ఉద్యమించారు. 1770 ప్రాంతంలో క్షామంతో ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో లక్షల మందికి పైగా చనిపోయారు. బ్రిటిష్ ఈస్ట్ఇండియా కంపెనీ పాలకుల పన్నుల పీడనకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఏకమై చారిత్రాత్మక తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఘట్టాలను కూర్చిన ఆనంద్ మuЇ 1882లో ప్రచురితమైంది. 1884 ఏప్రిల్ 8న బకించంద్ర మరణించాక 1896లో రవీంద్రనాథ్ టాగూర్ ఆ గేయానికి స్వరకల్పన చేసి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు. అప్పట్నుంచి వందే మాతరం అందరి నోళ్ళలో నినాదంగా మారింది. విభజించు–పాలించు సిద్ధాంతంతో హిందువులను, ముస్లిము లను విడదీసేందుకు వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1905 జూలై 20నబెంగాల్ విభజన ప్రకటన చేశాడు. తూర్పు బెంగాల్, పశ్చిమబెంగాల్గా ఈ విభజన 1905 అక్టోబర్ 16న అమలులోకి వచ్చింది. ఈ విభజనకు వ్యతిరేక ఉద్యమం 1905 ఆగస్ట్ 7నే ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ‘వందేమాతర ఉద్యమం’ అని అశ్వనీకుమార్దత్త నామకరణం చేశారు. వందేమాతరం అంటే ‘మాతృభూమికి నమ స్కారం’ అని అర్థం. ఈ ఉద్యమంలో ప్రజలు వందేమాతరం గేయాన్ని ఆలపించటం, ఒకరినొకరు వందేమాతరం అని పలకరించుకోవడం వల్ల దీన్ని వందేమాతర ఉద్యమం అని పిలిచారు. ఈ ఉద్యమంలోనే విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలానే నిర్ణయం తీసుకోవడం వలన దీనికి స్వదేశీ ఉద్యమం అనే పేరు కూడా వచ్చింది. ఉద్యమం దెబ్బకు బ్రిటిష్ వాళ్లు దిగివచ్చి బెంగాల్ విభజనను 1911లో రద్దుచేశారు. దీంతో వందేమాతర ఉద్యమం ఆగింది కానీ... తరువాత స్వాత్రంత్య ఉద్యమంలోని ప్రతిఘట్టంపైనా దాని ప్రభావం పడింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ గేయాన్ని ‘జనగణమన’తో సమానంగా గౌర విస్తూ జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది.– నర్సింగు కోటయ్య హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్(వందేమాతరం గేయానికి 150 ఏళ్లు) -
ఈసీ మౌనం సిగ్గుచేటు!
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొంతకాలంగా ప్రయోగిస్తానంటూ చెప్పిన ‘హైడ్రోజన్ బాంబు’ ఎట్టకేలకు బిహార్ తొలి దశ పోలింగ్కు 24 గంటల ముందు బుధవారం బద్దలైంది. ఇది నిరుడు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల జాబితాకుసంబంధించింది. రాహుల్ చెబుతున్న ప్రకారం అందులో 25 లక్షలమంది నకిలీ ఓటర్లున్నారు. సహజంగానే ఎన్నికల సంఘం(ఈసీ) మినహా దేశంలో అందరికీ ఈ విషయం దిగ్భ్రాంతి కలిగించింది. బ్రెజిల్లో ఉంటున్న పోర్చుగీసువాసి హెయిర్ డ్రెసర్ లారిసా నెరి అనే యువతి ఫొటోకు ఈ జాబితాలో చోటు దొరికింది. ఒకసారి కాదు... 10 పోలింగ్ కేంద్రాల పరిధిలో 22 సార్లు వినియోగించారు. ‘సెర్చ్’లో దొరక్కుండా ఒక్కో చోట ఒక్కో పేరు తగిలించారు. స్వీటీ, సరస్వతి, సీమ...ఇలా బహుళ నామధేయాలతో ఆమె మన ఎన్నికల జాబితాలో వర్ధిల్లింది. బహుశా 22 సార్లూ తన ఓటు హక్కు ‘విని యోగించుకుని’ ఆమె తన ‘పవిత్ర కర్తవ్యాన్ని’ నెరవేర్చి ఉంటుంది. మీడియా సమావేశంలో ఆమెను రాహుల్ బ్రెజిల్ మోడల్గా చెప్పారు. ఇది స్పీడ్ యుగం కనుక ఆ సమా వేశం ముగిసిన వెంటనే విషయం ఆమెకు చేరిపోయింది. ఏనాడూ సందర్శించని దేశంలో ఎన్నికల జాబితాలో తన పాత ఫొటో రావటంపై ఆమె బోలెడు ఆశ్చర్యపోతోంది. జనాన్ని దగా చేయటానికి తన ఫొటో వినియోగించి ఉంటారని సరిగానే గుర్తుపట్టింది.నకిలీ ఓటర్ల పంచాయతీ రాహుల్–ఈసీలకు సంబంధించింది కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరి మాటే నిజం కావాలి కనుక జరిగిందేమిటో ఈసీ సంజాయిషీ ఇచ్చితీరాలి. తప్పు తనవైపుంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ ఆరోపణ అవాస్తవమైతే ఆయనపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదీ చేయకుండా ‘అప్పుడెందుకు చెప్పలేద’ంటూ దబాయింపులకు దిగటం నైతిక పతనానికి చిహ్నమవుతుందే తప్ప సమర్థవంతమైన జవాబు కానేరదు. సీ–డాక్ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ఉపకర ణాన్ని 2022లో వినియోగించారు. వార్షిక ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) పేరిట జరిగిన ఆ ప్రక్రియలో దాని సాయంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఓట్లు తొలగించారు. ఇవన్నీ ఒకటికన్నా ఎక్కువసార్లు నమోదైన ఓట్లు, చెల్లని ఓట్లు. ఆ ఉపకరణం ఒకటికన్నా ఎక్కువసార్లు వినియోగించిన ఫొటోను కూడా పసిగడుతుంది. దానికి ఎందుకు స్వస్తి చెప్పారో ఈసీ సంజాయిషీ ఇవ్వాలి.అసలు ఈసీకీ, ఈ 12.5 శాతానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధమేమిటో అర్థంకాదు. రాహుల్ లెక్క ప్రకారం హరియాణాలో 12.5 శాతం మంది నకిలీ ఓటర్లు. చిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైన వెంటనే ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికీ, నాలుగు రోజుల తర్వాత అదే సంస్థ చెప్పిన శాతానికీ మధ్య వ్యత్యాసం కూడా 12.5 శాతమే! ఇంత శ్రద్ధగా లెక్క పాటిస్తున్న మాయావులెవరో ఈసీ తేల్చుకోవాలి. రాహుల్ ఆరోపణలకు ఈసీ ఎగవేత ధోరణిలో జవాబిస్తున్నందువల్ల కేంద్రం జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలి. జాబితాలో చేరిన నకిలీ ఓట్ల సంగతలా ఉంచి... గల్లంతైన ఓట్లు మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎన్డీటీవీ బృందం ఆరా తీసిన ప్రకారం హరి యాణాలో ఒక గ్రామంలోని పలు కుటుంబాల్లో రెండు నుంచి నాలుగు ఓట్లు గల్లంత య్యాయి. చిత్రమేమంటే వీరు ఆ ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఓటేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మాదిరి లీలలు బహు విధాలు! నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచే అక్రమాలు మొదలైపోయాయి. నిజానిజాలేమిటో నిర్ధారించుకోకుండానే కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా జిల్లాల్లో ఉన్నతాధికారుల్ని మార్చారు. అయి దేళ్లుగా అమలవుతున్న పథకాలు ఆపేశారు. బదిలీల వెనకున్న కుతంత్రమేమిటో పోలింగ్ రోజు హింస బయటపెట్టింది. పోలైన నాలుగు కోట్లకుపైగా ఓట్లలో 51 లక్షలు సాయంత్రం 6 తర్వాతే పడ్డాయి. ఇక ఈవీఎంల విన్యాసాలు అనంతం. సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో 28,000 ఓట్లు, లోక్సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది 87 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించింది. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసి 17 నెలలు గడుస్తున్నా జవాబు లేదు! కర్ణాటక, మహారాష్ట్రలకు సంబంధించి కూడా ఇలాగే ఫిర్యాదులొచ్చాయి. ఈ స్థితిలో జరుగుతున్న, జరగబోయే ఎన్నికలపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇకనైనా ఈసీ బాధ్యులు నోరు విప్పాలి. ఆ ఉద్దేశం లేకుంటే తప్పుకోవాలి. -
‘కృత్రిమ’ కంటెంట్కు కళ్లెం ఇలాగా?
డీప్ఫేక్, జనరేటివ్ ఏఐల సాయంతో సృష్టించిన ఆడియో, వీడియో సమాచారం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రకమైన కంటెంట్ను నియంత్రించేందుకు ఉద్దేశించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించింది. ఇవి 2021 నాటి ఐటీ చట్టానికి కొనసాగింపుగా ఉండ నున్నాయి. కంప్యూటర్లు, ఏఐ, అల్గారిథ మ్ల వంటి వాటి సాయంతో సృష్టించిన, అభివృద్ధి చేసిన, మార్పులు చేసిన సమాచారం, కంటెంట్ అన్నింటినీ కృత్రిమ మీడియాగా పరిగణిస్తారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్పై కొన్ని నెలలుగా ఈ కృత్రిమ కంటెంట్ మోతాదు విపరీ తమైన విషయం తెలిసిందే. ఎప్పుడూ అనని మాటలను, చేయని పనులను చేసినట్టుగా చూపించే ఈ రకమైన కంటెంట్ను నియంత్రించకపోతే ప్రమాదమే. ట్రంప్, మోదీ మధ్య జరిగినట్టుగా చెబు తున్న టెలిఫోన్ సంభాషణ కూడా ఈ కోవకే చెందుతుంది. ‘చట్టబద్ధమైన’ హెచ్చరిక ఉండాలి!ఏఐ ఆధారిత డీప్ఫేక్లను తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, ఒకరి పరపతిని తగ్గించేందుకు, ఆర్థికపరమైన నేరాలు చేసేందుకు వాడుతున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో ప్రజలను ప్రభావితం చేసేందుకూ వాడటం కద్దు. ఇలాంటి అభ్యంతరకరమైన సమాచారం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకూ ‘సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్’ (యాభై లక్షల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న సామాజిక మాధ్యమ ప్లాట్ ఫామ్స్)కు సలహా, సూచనలు ఇవ్వడానికే పరిమితమైంది. ఫిర్యా దులపై స్పందించేందుకు, చట్టపరమైన నిబంధనలు అమల్లో ఉండేలా చూసేందుకు ఈ కంపెనీల్లో వ్యవస్థలు ఉండాలి.కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నిబంధనలు... కంటెంట్ తీరుతెన్నులను గుర్తించేందుకు; సృష్టి, పంపిణీ, విస్తృతి వంటివి తెలుసుకునేందుకు బాధ్యత ఎవరిదన్న విషయాలపై చట్ట బద్ధతను కోరుతున్నాయి. ఏఐ ఆధారంగా సృష్టించిన కంటెంట్ మొత్తాన్ని మెటాడేటాలో స్పష్టం చేసేలా చేయడం ద్వారా దీన్ని సాధించాలన్నది లక్ష్యం. ఫలితంగా ఏది కృత్రిమమైంది? ఏది కాదన్న విషయం స్పష్టమవుతుంది. ఏది కృత్రిమ సమాచారం అన్న విషయాన్ని ఆయా సోషల్ మీడియా సంస్థలే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోపాటు ఏఐ కంపెనీలు, అవి అందించే టూల్స్కు కూడా వర్తిస్తాయి. ఏఐ టూల్స్ సిద్ధం చేసే కంపెనీలు కూడా సమాచారం ఏ రకమైందన్న విషయాన్ని స్పష్టం చేయాలి. పొగాకు ఉత్పత్తులపై ఉండే హెచ్చరిక మాదిరిగా ‘ఈ కంటెంట్ కృత్రిమమైంది’ అన్న లేబిలింగ్ శాశ్వతంగా ఉండాలన్న మాట! కనిపించే స్క్రీన్లో ఈ హెచ్చరిక కనీసం పది శాతం సైజులో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ఆడియో విషయానికి వస్తే మొదటి పది శాతం నిడివిలో ఈ హెచ్చరిక వినిపించాలి. తాము అప్లోడ్ చేసే సమాచారం ఏ రకమైందో వినియోగదారులే ప్రకటించేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకోవాలి. సదుద్దే శంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్... ఏఐ ఆధారిత కంటెంట్ దేన్నైనా నిరోధించినా, తొలగించినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం వీరికి లభించే చట్టపరమైన రక్షణ కొనసాగుతుంది. కృత్రిమ మేధ ఏదైనా సరే... నియంత్రణ ప్రభుత్వాలకు కష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు. ఏఐ కంటెంట్ చాలా సంక్లిష్టమైంది. ఛాట్జీపీటీ, జెమిని, డాల్–ఈ వంటి ఏఐ టూల్స్ మాత్రమే కాదు.. మరెన్నో రకాల ఏఐలు, ప్లాట్ఫామ్స్ కంటెంట్ సృష్టిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఏఐ ఆర్ట్ జనరేటర్, వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్ఫేక్ యాప్స్ వంటివన్నీ కలిస్తేనే కృత్రిమ కంటెంట్ సృష్టి, వ్యాప్తి సాధ్యమవుతోంది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ వంటి ప్రధాన సోషల్ మీడియా కంపె నీలు మాత్రమే భారత్లో ఉండగా... మిగిలినవి ప్రపంచంలో ఎక్కడి నుంచో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ భారత ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తేవడం దుస్సాధ్యం.హడావిడిగా నిబంధనలా?కేంద్రం డీప్ఫేక్స్ విషయంలో ప్రతిపాదించిన కొత్త నిబంధ నలు హడావిడిలో చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంకోలా చెప్పాలంటే రాజకీయ నేతలపై వస్తున్న వరుస డీప్ఫేక్ వీడియోలపై అప్పటి కప్పుడు స్పందించినట్టుగా అనిపిస్తోంది. ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించేలా ఆలోచించి రూపొందించి ఉంటే బాగుండేది. ఈ కొత్త నిబంధనలన్నీ డీప్ఫేక్స్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్ను తొల గించడంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. అలాంటి కంటెంట్కు బాధ్యతను సోషల్ మీడియాపైనే మోపే ప్రయత్నం జరిగింది. ఇలా కాకుండా ప్రతి ఒక్కరి భౌతిక లక్షణాలు, గొంతుల రక్షణకు వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించి ఉండాల్సింది. సినీతారలు తమ ముఖాలు, గొంతులను ఏఐ ద్వారా అనధికారికంగా ఎవరూ వాడకుండా ఉండే హక్కును కోరుతున్నారు.డీప్ఫేక్లపై వివిధ దేశాలు వేర్వేరు పద్ధతుల్లో స్పందిస్తు న్నాయి. డెన్మార్క్ పౌరులందరి వ్యక్తిగత లక్షణాలను ప్రత్యేకమైన హక్కుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. అమెరికా ఎన్ని కల్లో ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, వీడియో కంటెంట్ను నిషేధించేలా చట్టాన్ని ప్రతిపాదించారు. ఆన్ లైన్ భద్రతకు సంబంధించి ఫ్రాన్స్ ఒక సమగ్రమైన చట్టం చేసే ప్రయత్నాల్లో ఉంది. యూకే కూడా ఆన్ లైన్ సేఫ్టీ చట్టాలకు సవరణలు చేసింది. దీని పరిధిలోకి డీప్క్స్, ఫొటోల మార్ఫింగ్ను కూడా చేర్చింది. వీటన్నింటిలో యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చట్టం సమగ్రంగా ఉందని చెప్పాలి. ఏఐతో రాగల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించి, నియంత్రణ అవసరాన్ని, లోటు పాట్లను చర్చించి దీన్ని రూపొందించారు. భారతదేశంలో మాత్రం ఎలాంటి బహిరంగ చర్చ లేకుండా ఈ నిబంధనల రూపకల్పన జరిగింది. ప్రతిపాదిత నిబంధనలపై వ్యాఖ్యానించేందుకు రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చారు. కీలకమైన, దేశ ప్రజల్లో చాలామందిపై ప్రభావం చూపే అంశమైనందున మరింత విస్తృత చర్చ జరిగి ఉండాల్సింది. వేర్వేరు రంగాల భాగస్వాములతో చర్చించి ఉంటే నిబంధనలు మరింత సమర్థంగా ఉండేవి. పనిలో పనిగా 2021 నాటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ఎంత సమర్థంగా పనిచేస్తోందో కూడా చర్చించే అవకాశం దక్కేది. ఇందులో లోపాలను సరిదిద్దుకోవడంతోపాటు కొత్త నిబంధనలను మరింత సమర్థంగా రూపొందించేందుకు అవకాశం దక్కేది. అసలు సమస్యలుప్రభుత్వ సంస్థలు ఇలాంటి చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుని కొందరి కంటెంట్ను మాత్రమే తొలగిస్తాయన్న అను మానం నిత్యం ఉంటుంది. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు కొందరు తప్పుడు, ఏఐ జనరేటెడ్ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే రోబోట్లు లేదా అపరిచితులు సృష్టించే కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అవిశ్వసనీయ వైఖరి అన్నది కొత్త నిబంధనల అమలులో అతి పెద్ద ప్రతిబంధకం అని చెప్పాలి. యూరోపియన్ యూనియన్ మాదిరిగా అన్ని విషయాలనూ నియంత్రించే సమగ్రమైన చట్టం భారతదేశానికి అవసరం. డిజిటల్ అక్షరాస్యత, ఆన్ లైన్ భద్రతలపై ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
కృత్రిమ వర్షాల కథేమిటి? లాభమా? నష్టమా?
వాయు కాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని నగరానికి ఉపశమనం కల్పించేందుకు ఇటీవల క్లౌడ్ సీడింగ్తో ( cloud seeding) కృత్రిమంగా వర్షాలు కురిపించే ప్రయత్నాలు రెండుసార్లు జరిగాయి. గత అయిదు దశాబ్దాల కాలంలో ఢిల్లీలో ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఐఐటీ – కాన్పూర్ భాగస్వామ్యంతో ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలు అంతగా ఫలించకపోయినప్పటికీ, అందరి దృష్టినీ ఆకర్షించాయి. అసలింతకీ ఈ కృత్రిమ మేఘమథనం అంటే ఏమిటి? ఎలా చేస్తారు? ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా దీని ఫలితాలేమిటి? ఇలా కృత్రి మంగా వర్షాలు కురిపించడంలో లాభమెంత? నష్టమెంత? కృత్రిమ మేఘమథన ప్రయత్నాలు ఏడున్నర దశాబ్దాల పైగా జరుగుతూనే ఉన్నాయి. సౌదీ, అమెరికా, చైనా, ఇజ్రాయెల్, ఇండొనేషియా, ఆస్ట్రే లియా సహా 50 దేశాలు ఈ ప్రయోగాలు చేశాయి. అయితే, మిశ్రమ ఫలితాలే వచ్చాయి. మన దేశంలోనూ 1952 నుంచి ప్రయోగాలు జరిగాయి. అప్పట్లో హైడ్రోజెన్ బెలూన్లలో ఉప్పు, సిల్వర్ అయొడైడ్లను పంపేవారు. ఢిల్లీలోనూ ఎప్పుడో 1960ల్లోనే ప్రయోగం చేసి, విఫలమయ్యారు. ఆ తర్వాత 1970ల నుంచి విమానాల వినియోగం వచ్చింది. తాజాగా అక్టోబర్ 28న ఢిల్లీలో చేసిన ప్రయత్నాలతో వర్షం రాలేదు కానీ, ప్రమాద స్థాయిలో ఉన్న వాయునాణ్యత కాస్తంత మెరుగైంది. ఏమిటీ క్లౌడ్ సీడింగ్?మేఘాలు వర్షం కురిపిస్తాయి. కానీ, అన్ని మేఘాలూ వర్షించవు. అందుకే క్లౌడ్ సీడింగ్. ‘క్లౌడ్ సీడింగ్’ అంటే మేఘాలను మథించి, కృత్రిమ పద్ధతిలో వర్షాలు కురిసేలా చేయడం. సామాన్యుల భాషలో... పనిచేస్తున్న వాహనం పెట్రోల్ ఉన్నా సరే బ్యాటరీ బలహీనమై స్టార్ట్ కానప్పుడు బండిని వెనక నుంచి ముందుకు తోసి ఆ ఊపుతో స్టార్ట్ అయ్యేలా చేసి నట్టే, సైన్స్ ఆసరాతో కృత్రిమంగా మేఘాలను ప్రేరేపించి కురిసేలా చేస్తారు. ఓ విమానాన్ని వాడి, మేఘానికి కొన్ని కణాలను జత చేరుస్తారు. జీరో డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే చల్లటి మేఘాలలో సిల్వర్ అయొడైడ్ కణాలను జత చేర్చే ప్రక్రియ సాగుతుంది. సదరు ఆ కణాలే ‘సీడ్స్’ (విత్తనాలు)గా పనిచేస్తాయి. వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. అలా బరువెక్కిన కణాలు నేల రాలే క్రమంలో దోవలో అధిక ఉష్ణోగ్రతకు లోనై, ద్రవీభవించడం వాన చినుకులుగా మారడం జరుగు తుంది. అదే వెచ్చటి మేఘాలలో అయితే సోడియం క్లోరైడ్, లేదా పోటాషియం క్లోరైడ్ లాంటి రసాయన ద్రావణాలను సీడింగ్ ఏజెంట్లుగా వినియోగిస్తారు.తొలి ప్రయోగాలు... తాజా అధ్యయనాలు...కృత్రిమ వర్ష ప్రయత్నాలు 1946లోనే జరిగాయి. అవపాతం జరిగే భౌతిక సూత్రాలను లోతుగా అవ గాహన చేసుకొనేందుకు అమెరికన్ రసాయనవేత్త, వాతావరణ నిపుణుడు విన్సెంట్ షేఫెర్ అప్పట్లోనే ల్యాబ్లో ప్రయోగాలు చేశారు. ఆయన డ్రై ఐస్తో ప్రయోగాలు చేస్తే, ఆ తర్వాత శాస్త్రవేత్తలు ల్యాబ్లో కాక, బయటే అనేక ప్రయోగాలు చేశారు. సిల్వర్ అయొడైడ్ స్ఫటికాలను ఉపయోగించి, మెరుగైన ఫలితాలు సాధించారు. అనేక చోట్ల వర్షాలు కురిపించారు. పుణేకు చెందిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ’ మాత్రం 1970ల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నామంటోంది. దీని వల్ల వర్షపాతం 17 శాతం మేర పెరిగినట్టు చెబుతోంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా క్లౌడ్ సీడింగ్. ఆశించిన ఫలితాలు అందించలేదని అమెరికన్ ప్రభుత్వ వర్గాల 2024 నాటి నివేదిక కూడా చెప్పింది. చదవండి: స్కిన్ కేర్పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?లాభమెంత? నష్టమెంత?మేఘమథనాన్ని ప్రేరేపించడానికి వాడిన సిల్వర్ అయొడైడ్ తాలూకు అవశేషాలు భూమిపై పడి, పర్యావరణానికి హానికరం కావచ్చని పరిశోధకుల తాజా అధ్యయనం మాట. అలాగే, డ్రై ఐస్ అంటే ఘనరూప కార్బన్ డయాక్సైడే గనక అది కూడా భూతాపాన్ని పెంచుతుందంటున్నారు. సీడింగ్కు విమానం, పైలట్లు, సాంకేతిక సిబ్బంది సేవలతో పాటు రసాయన మిశ్రమాలకు బాగా∙ఖర్చవుతుంది గనక అది ఏ మేరకు లాభదాయకమో స్పష్టత లేదు. గత ఏడేళ్ళుగా ఢిల్లీలో మేఘమథన ప్రతిపాదనలు వస్తున్నా, ఈసారే ప్రయోగాలు జరిగాయి. తాజా ప్రయత్నం విఫలమైనా, ప్రయోగాలు కొనసాగిస్తా మని ఐఐటి–కాన్పూర్ చెబుతోంది. వాయు కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు మానేసి, ఇలా తాత్కాలిక ఉపశమనానికై పాకులాడ డమే విచిత్రం. (మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’) -
ఆ సమావేశాల్లో తేలిందేమిటి?
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు ఏడు రోజులలో ఆసియాలో కీలకమైన ఆర్థిక సమావేశాలు వరుసగా జరిగాయి. జరిగింది ఆసియాలోని మలేషియా, జపాన్, దక్షిణ కొరియాలలో అయినా, అమెరికా, చైనా, రష్యా సహా ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి. ఆ సమావేశాలలో జరిగిన చర్చలు, జరిగిన ఒప్పందాలు మొత్తం ప్రపంచ వాణిజ్య, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల విషయమై భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనా ధోరణులు ఏ విధంగా ఉండనున్నాయో ఆ సమావేశాలలో స్పష్టమైంది. కానీ, అగ్రస్థాయి ఆసియా దేశం అయి ఉండి, ఆర్థిక పరిమాణంలో నాల్గవ స్థానానికి చేరిన ఇండియా ప్రధాని మోదీ మాత్రం ఆ సమావేశాలలో పాల్గొనక అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు ప్రభుత్వం అధికారికమైన వివరణ కూడా ఏమీ ఇవ్వక ఊహాగానాలకు వదలివేసి మరింత ఆశ్చర్యపరిచింది.ట్రంప్ వర్సెస్ ఇతర దేశాలుమొదట మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ‘ఆసియాన్’, ఆర్సీఈపీ (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్), తర్వాత దక్షిణ కొరియా నగరం బూసాన్లో ఏపీఈసీ (ఆసియా– ఫసిఫిక్, ఎకనమిక్ కో–ఆపరేషన్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అమెరికా, చైనా అధ్యక్షులు విడిగా సమావేశమయ్యారు. వీటి మధ్య అమెరికా అధ్యక్షుడు జపాన్ వెళ్లి అక్కడి ప్రధానితో చర్చలు జరిపారు. ‘ఆసియాన్’లో 11 దేశాలకు, ఆర్సీఈపీలో 15 దేశాలకు, ఏపీఈసీలో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. మొత్తం అన్ని ఖండాలకు చెందిన ఈ దేశాలను కలిపి చూస్తే, ప్రపంచ జనాభాలో, ఆర్థిక శక్తిలో, వాణిజ్యంలో అత్యధిక భాగస్వామ్యం వాటిదే. చర్చలు, తీర్మానాలు, ఒప్పందాల చివరన రెండు ధోరణులు స్పష్టంగా తేలాయి. ఒకటి – అమెరికా తన ‘అమెరికా ఫస్ట్’ నినాదా నికి అనుగుణంగా ఆ యా దేశాలతో విడివిడిగా చర్చించి ద్వైపాక్షిక ఒప్పందాలు మాత్రమే చేసుకోవటం. చైనా మినహా మరెవరిపై సుంకాలు తగ్గించకపోవటం. ఆ యా సంస్థల సామూహిక చర్చలలో అధ్యక్షుడు ట్రంప్ అసలు పాల్గొనక పోవటం. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల పట్ల విముఖత చూపటం. ఇందుకు భిన్నంగా, అమెరికాకు సన్నిహితంగా భావించే వాటితో సహా తక్కిన అన్ని దేశాలు, ఎటువంటి మినహాయింపు లేకుండా, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టు బడులు వర్తమాన ప్రపంచానికి తప్పనిసరి అవసరమని తీర్మానించాయి. వారిలో కొందరు ఒత్తిడి కారణంగానైతేనేమి, సైద్ధాంతిక మైత్రి వల్లనైతేనేమి అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసు కున్నారు. ప్రధానంగా అరుదైన లోహాలు, ఖనిజాలు, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, రక్షణ, రవాణా పరికరాలకు సంబంధించి! అదే సమయంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అనుకూలిస్తూ, ఒత్తిడులను వ్యతిరేకిస్తూ తీర్మానించారు. పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ – ప్రొటెక్షనిజాన్నీ, ప్రపంచం తిరిగి ఆటవిక రాజ్య స్థితికి వెళ్లటాన్నీ విమర్శించారు. అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలలో ఒకటైన కెనడా ప్రధాని మార్క్ కార్నీ అయితే తాము వాణిజ్య పరంగా అమెరికాపై ఆధారపడే సాంప్రదాయిక స్థితి నుంచి దూరంగా జరగదలచుకున్నామనీ, రాగల కాలంలో అమెరికా బయటి దేశాలతో వాణిజ్యాన్ని రెట్టింపు చేయగలమనీ ప్రకటించారు. ఆ వెంటనే చైనా అధ్యక్షునితో సమావేశమై, ‘మరింత సుస్థిరమైన, సమ్మిళితమైన అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణానికి’ చైనాతో కలిసి పనిచేయగలమన్నారు. త్వరలో చైనా సందర్శనకు అంగీకరించారు.ప్రాంతీయ సంబంధాల సరళతరంవాస్తవానికి ఒకవైపు అమెరికా, మరొకవైపు తక్కిన ప్రపంచపు ఈ విధమైన ధోరణులు కొంత కాలంగా కనిపిస్తున్నవే. అది ట్రంప్కు తెలియనిది కాదు. ఆయన తన విధానాలను ఈ ఆసియా సమావేశాల సందర్భంగా మార్చుకోగలరని కూడా ఎవరూ ఆశించి ఉండరు. అయితే రెండు ధోరణులు కూడా ఈ వారం రోజుల సమా వేశాల కాలంలో మరింత స్థిర రూపం తీసుకోవటమన్నది గమనించదగ్గది. అంతా మన మంచికే అన్న సామెత వలె, ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మధ్య బహుముఖ సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచ ఆవిష్కరణకు మార్గాన్ని మరింత సుగమం చేయగలవు.ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. అవి – సాధారణంగా అమెరికా పలుకుబడి కింద పని చేస్తాయనే పేరున్న ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎంఎఫ్) ఈ సమావేశాలకు ముందు చెప్పిన మాటలు. నిబంధనలకు విరుద్ధంగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల దృష్ట్యా వివిధ దేశాలు తమ ప్రాంతీయ వాణిజ్య సంబంధాలను సరళతరం చేసుకోవాలని ఐరాస వాణిజ్య విభాగం అధికారులు సూచించారు. తర్వాత ఆసియా ప్రాంతీయ ఆర్థిక పరిస్థితులపై ఐఎంఎఫ్ ఒక నివేదికను విడుదల చేస్తూ– ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధి ప్రధానంగా వాణిజ్యంపై ఆధార పడి ఉందనీ, అందువల్ల అక్కడి దేశాలు సుంకాలు కాని ఇతర వాణిజ్య ఆంక్షలను తగ్గించుకోవటం, ప్రాంతీయ వాణిజ్యాన్ని సమీ కృత పరచుకోవటం, ఆ విధంగా అమెరికా సుంకాల ఒత్తిడి నుంచి తప్పించుకోవటం, ప్రపంచ ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవటం చేయాలనీ చెప్పింది. ఇండియా ఏం చేస్తున్నట్టు?ఇంత ముఖ్యమైన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపిన భారత ప్రభుత్వం దీనంతటి నుంచి గ్రహించవలసింది చాలానే ఉంది. ఉదాహరణకు మనం ‘లుక్ ఈస్ట్’, ‘యాక్ట్ ఈస్ట్’ అని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాము గానీ, ఆర్సీఈపీలో సభ్యత్వమైనా లేదు. ఆసియాన్లో సభ్యత్వం లేకున్నా ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి’ హోదా ఉంది. ‘ఆసియాన్’ కూటమితో వాణిజ్య, ఆర్థిక సంబంధాల గణనీయమైన అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ఆ పని మందకొడిగానే సాగుతున్నది. చైనా 771 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, మన వాణిజ్యం విలువ 131 బిలియన్లు మాత్రమే. భౌతికంగా, డిజిటల్ పరంగా సంబంధాలు చాలా పరిమితం. పోతే... ఐరాస, ఐఎంఎఫ్ సూచనలను అన్వయించుకుని చూస్తే – ఇండియా ఉన్న దక్షిణాసియాలో, ‘సార్క్’లో ఆర్థిక సమన్వయం, వాణిజ్య సంబంధాలు పాకిస్తాన్తో సమస్య వల్ల అథమ స్థాయిలో ఉన్నాయి. ‘బిమ్స్టెక్’ అనే మరొక సంస్థను పాకిస్తాన్ను మినహాయిస్తూ ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


