breaking news
Guest Columns
-
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్ను గుర్తించని పాక్కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
న్యాయ పోరాటంలో మలుపు
ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్కు సంబంధించిన 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీ అంశం ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ నం. 26631/2025)లో భారత సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం లక్షలాదిమంది పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది.పదవీ విరమణ సమయంలో ఉద్యోగి తన నెలవారీ పెన్షన్ లో గరిష్ఠంగా 40 శాతం వరకు ఒకేసారి నగదు రూపంలో పొందే అవకాశాన్ని కమ్యుటేషన్ అంటారు. కుటుంబ అవసరాలు, గృహ నిర్మాణం, పిల్లల విద్య, వివాహాలు లేదా వైద్య ఖర్చుల వంటి అత్యవసర అవసరాలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఈ మొత్తానికి బదులుగా కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని నెలవారీ పెన్షన్ నుండి కోత విధిస్తారు. ప్రస్తుతం అమ లులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ (కమ్యుటేషన్) రూల్స్–1944 లోని రూల్– 18 ప్రకారం పూర్తి పెన్షన్ పునరుద్ధరణ 15 సంవత్సరాల తరువాత మాత్రమే జరుగు తుంది.రిటైర్డ్ తహసీల్దార్ బి.అప్పారావు సుప్రీంకోర్టు ముందు ఉంచిన ప్రధాన వాదన ఏమిటంటే, ప్రభుత్వం కమ్యుటేషన్ మొత్తాన్ని వడ్డీతో సహా సుమారు 11 సంవత్సరాల 3 నెలల్లోనే తిరిగి పొందుతోంది. అయినప్పటికీ, మరో నాలుగేళ్ల వరకు పూర్తి పెన్షన్ను పునరుద్ధరించకుండా కొనసాగించడం న్యాయ సమ్మతం కాదని ఆయన వాదించారు. తన విషయంలో కమ్యుటేషన్ మొత్తంతో పాటు వడ్డీ కలిపి సుమారు రూ.7.55 లక్షలు ప్రభుత్వం ఇప్పటికే తిరిగి పొందినట్లు పేర్కొన్నారు. కాబట్టి, 15 ఏళ్ల వరకు కోత కొనసాగించడం ప్రభుత్వానికి అనవసర ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోందని పిటిషన్లో వివరించారు.ఈ అంశంపై దాఖలైన పలు రిట్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 28న తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. తుది తీర్పు వెలువడలేదు. నోటీసులు జారీ కావడం అంటే పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కాదు. కానీ ఈ కేసులో రానున్న తీర్పు ఒక వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ సంఘం -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
గిరిజన సాగును ఎలా చూడాలి?
మైదాన ప్రాంతాల కోసం రాసిన పథకాలను, అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఏజెన్సీ ప్రాంతాలకు యథాతథంగా పంపుతున్నాం. అక్కడి రైతులు కొత్త పద్ధతులు స్వీకరించడం లేదని నివేదికల్లో రాసుకుంటున్నాం. సమస్య రైతులది కాదు; అక్కడి పరిస్థితులను అర్థం చేసు కోలేని మనది. 2025 మార్చిలో తెలంగాణ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన బృందంతో కలిసి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాం. అక్కడ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన పంట దెబ్బతింది. కంకుల్లో గింజ పట్టలేదు. జిల్లా కమిటీ లెక్క ప్రకారం 959 మంది రైతులకు చెందిన 2,178 ఎకరాల్లో పంట నష్టపోయింది. మా దృష్టిని ఆకర్షించింది పంట నష్టం కంటే దాని వెనుక ఉన్న ఏర్పాట్లు, వ్యవస్థల వైఫల్యం.బాండ్ వ్యవసాయం అంటే ఏమిటి?విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకోవు. స్థానిక ఆర్గనైజర్లతో ఒప్పందం చేసుకుంటాయి. ఆ ఆర్గనైజర్ రైతుతో నోటిమాట మీద మాత్రమే ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని అక్కడ బాండ్ వ్యవసాయం అంటారు. విత్తనం, ఎరువులు, పురుగుమందులు అప్పుగా ఇచ్చి, పంట కొనుగోలు సమయంలో వసూలు చేసుకుంటాడు. వడ్డీ నెలకు వంద రూపాయలకు అయిదు రూపా యలు– సంవత్సరానికి అరవై శాతం! చట్టం ప్రకారం ప్రతి కాంట్రాక్ట్ సాగు ఒప్పందాన్ని మార్కెట్ కమిటీలో నమోదు చేయాలి. పురుగు మందులకు బిల్లులు లేవు; అవి అమ్మటానికి లైసెన్సులు లేవు; ఒక చిన్న నోటుపుస్తకంలో పేర్లు మాత్రమే రాశారు. కొన్నిచోట్ల గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేశారు. మందుల డబ్బాల మీద సూచనలు ఇంగ్లిష్లో ఉన్నాయి.దీని ఫలితం మనుషుల మీద కనిపించింది. పొలంలో పని చేస్తూ విషప్రయోగానికి గురైన ఒక మహిళ చేతులు, కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైంది. పిచికారీ పనిని పర్యవేక్షించిన ఒక మేస్త్రీ పక్షవాతానికి గురయ్యాడు; వైద్యం కోసం ఆ కుటుంబం మిగిలిన నలభై సెంట్ల భూమిని అమ్ముకుంది. వరుసగా రెండు నష్టాల తరు వాత ముప్ఫై అయిదేళ్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లెవరూ వ్యవస్థ బయట ఉన్నవాళ్లు కాదు. పెద్ద కంపెనీల కోసం విత్తనం పండించినవాళ్లు. అయినా ఒప్పందం లేదు, బిల్లు లేదు, బీమా లేదు, ఫిర్యాదు చేసే చోటు లేదు.రెండు రకాల గిరిజన వ్యవసాయంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఒకేలా లేవు. తెలంగాణలో గిరిజన వ్యవసాయం ఎప్పుడో వాణిజ్య వ్యవసాయంగా మారి పోయింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గోండు, కోలాం కుటుంబాలు గతంలో పండించిన జొన్న, పప్పు ధాన్యాలు, మిశ్రమ పంటల స్థానంలో పత్తి వచ్చింది. ములుగు, భద్రాద్రిలో కాంట్రాక్ట్ విత్తన సాగు నడుస్తోంది. రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 253 కిలోల ఎరువులు వాడుతున్నారు; దక్షి ణాది సగటు 164 మాత్రమే. 2019 నాటికి రాష్ట్రంలోని 92 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి; ఆ అప్పులో దాదాపు సగం బ్యాంకులది కాదు, వడ్డీ వ్యాపారులది.ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కొండ మండలాల్లో పది కుటుంబాల్లో ఏడు ఇప్పటికీ ప్రధానంగా సొంత అవసరాల కోసమే పండిస్తు న్నాయి– రాగులు, కొర్రలు, సామలు, కంది, వరి. కొండ వాలుల్లో పోడు సాగు కొనసాగుతోంది. రసాయనాల వినియోగం తక్కువే. వాణిజ్య పంటలు వచ్చినా అవి బహువార్షిక పంటలు– అరకు కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు. ఇక్కడ సమస్య అప్పుల భారం కాదు; తక్కువ దిగుబడులు, మార్కెట్ అందుబాటులో లేకపోవడం. అంటే ఒక ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వాణిజ్య వ్యవస్థను నియంత్రించాలి. మరో ప్రాంతంలో ఉన్నదానికి విలువ చేర్చాలి.పథకాలు ఎందుకు పనిచేయడం లేదు?రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ ప్రకారం, ఏ చట్టమైనా షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించకుండా చేయడానికి, లేదా అవసరమైన మార్పులతో వర్తింపజేయడానికి గవర్నర్కు అధికారం ఉంది. గిరి జనుల భూమి బదిలీని నియంత్రించే అధికారంతో పాటు, వారికి వడ్డీ వ్యాపారం చేసే వ్యవహారాన్ని నియంత్రించే అధికారం కూడా స్పష్టంగా ఇచ్చారు. ఆ అధికారంతోనే 1960లో షెడ్యూల్డ్ ప్రాంతాల వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధన చేశారు. అది ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉంది. అంటే ములుగులో అరవై శాతం వడ్డీ వసూలు చేసేవాడిని ఆపడానికి అరవై అయిదేళ్లుగా చట్టం అందుబాటులో ఉంది. వాడలేదు.ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదు అంటే వెంటనే చేయదగినవి మూడు ఉన్నాయి. ఒకటి– షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి కాంట్రాక్ట్ సాగు, విత్తన ఉత్పత్తి ఒప్పందాన్ని విత్తే ముందే మార్కెట్ కమిటీలో నమోదు చేయించడం; ఒప్పంద పత్రం తెలుగులో రైతు చేతిలో ఉండాలి. రెండు– వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధనను అమలు చేయడం; సామగ్రి అమ్మేవాడే అప్పు ఇచ్చేవాడు, పంట కొనేవాడు కూడా అయినప్పుడు ఆ మూడు పాత్రలూ కాగితం మీద కనిపించాలి. మూడు– పట్టా పేరును కాక నిజంగా సాగుచేసేవారిని గుర్తించడం; గ్రామసభ ధ్రువీకరణ ఆధారంగా పోడు సాగుదారు లకు, కౌలుదారులకు, మహిళా రైతులకు రుణం, బీమా, పంట నష్ట పరిహారం అందేలా చూడటం. ఈ మేరకు ఒక ముసాయిదా విత్తన ఉత్పత్తి దారుల రక్షణ చట్టం ప్రభుత్వానికి సమర్పించటం జరిగింది. అది ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఇది సాధ్యమేనా అంటే – అవును!అమ్రాబాద్లో చెంచు కుటుంబాలతో కలిసి పనిచేసినప్పుడు మిరప పంటలో సీజ¯Œ కు ఇరవై సార్లు కొట్టే పిచికారీలు ఆరు, ఏడుకు తగ్గాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గోండు, కోలాం రైతుల 700 ఎకరాలు సేంద్రియ, ప్రకృతి సాగులోకి మారాయి; రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రభుత్వం మంచిర్యాలలో ఒక సేంద్రియ దుకాణం కేటాయించింది. నారాయణపేటలో సెర్ప్ సంస్థతో కలిసి 1,500 ఎకరాలు మార్పు దిశగా వెళ్లగా, 200 ఎకరాల్లో వరి స్థానంలో చిరుధాన్యాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో గిరి సిరి రైతు సంఘం కింద 2,600 ఎకరాలు ప్రకృతి సాగులో ఉన్నాయి; పసుపు, వేరు శనగ ప్రాసెసింగ్ యూనిట్లు స్థానికంగానే ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు చోట్లా చేసిన పని ఒకటే. రైతు ఇప్పటికే పండిస్తున్న దానినుంచి మొదలుపెట్టడం. ముందు ప్రమాదకర మందులు తీసేయడం. నీరు తక్కువున్న చోట చిరుధాన్యాలు. పొలం పక్కనే పోషకాహార తోట. మార్కెట్ పెట్టుకోవడానికి రైతు సంఘం. ఉత్పత్తి దగ్గరే ప్రాసెసింగ్. వీటిలో దేనికీ కొత్త పథకం అవసరం లేదు. చివరగా ఒక మాట. రెండు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవసాయ గణాంకాలను విడిగా ప్రచురించడం లేదు. గిరిజన కుటుంబాల ఎరువుల వాడకం, అప్పులు, నేల ఆరోగ్యం, దిగు బడులపై ప్రత్యేకంగా సమాచారం లేదు. ఈ లోటు తీర్చడం ఖరీదైన పని కాదు; చేయాలన్న నిర్ణయం మాత్రమే కావాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
ఉన్నత విద్యలో అసలు సవాలు
జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్ఈ ర్యాంకింగ్స్లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.ఎక్కడ వెనుకబడ్డాం?భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
కశ్మీరీలకు పాకిస్తాన్పై ప్రేమేం లేదు!
కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.ఇండియానే ఎందుకు కోరుకున్నారు?పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్లో లేదా పాకిస్తాన్లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్ను కోరుకోకపోవడం గమనార్హం. ఇద్దరికీ సరిపడనిదే!మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్ పార్టీ హుర్రియత్ కాన్ఫరెన్స్ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్ ఫ్రంట్ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్ ఫ్రంట్కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్ ప్రతిపత్తిపై ప్లెబిసైట్ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్ వారికి కూడా సరిపడనిదే!మారని మౌలిక దృష్టిఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అబద్ధం డేగలా... నిజం నత్తలా!
ఒకప్పుడు ఒక వార్త ప్రజల ముందుకు రావాలంటే సమాచారం సేకరించడం, దాన్ని పరిశీలించడం, ధ్రువీకరించడం వంటి ప్రక్రియలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ఒక ప్రచురణ వేదికగా మారింది. దీంతో సమాచారం వేగంగా చేరుతోంది. అదే సమయంలో ధ్రువీకరించని సమా చారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఏది ఎక్కువ మందికి చేరాలనేదాన్ని ఇప్పుడు ఎడిటర్ కాదు; ఎక్కువ స్పందన వచ్చే కంటెంట్ను ముందుకు నెట్టే అల్గోరిథమ్లే నిర్ణయిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. 2026 మార్చి 16న, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యంపై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసినట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నిజానికి అది మార్చి 14న పీటీఐ రికార్డ్ చేసిన అసలైన ప్రసంగం– ‘భవిష్యత్ భద్రతా సవాళ్లపై సైన్యం సంసి ద్ధత’ గురించి మాట్లాడిన వీడియో. దాని దృశ్యాలను అలాగే ఉంచి, ఏఐ సాయంతో పూర్తిగా వేరే ఆడియో జోడించారు. పీఐబీ ఫ్యాక్ట్–చెక్ యూనిట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్–చెక్ విభాగం రెండూ దీన్ని డీప్ ఫేక్గా ధ్రువీకరించి, పాకిస్తాన్ ఆధారిత ప్రచార ఖాతాల నుంచి ఇది వ్యాపించిందని అధికారులు గుర్తించేలోపే, వీడియో లక్షల మందికి చేరి పోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజమైన వీడియో వచ్చినా ‘ఇది ఏఐతో సృష్టించిందేమో’ అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ వారి 2025 నివేదిక ప్రకారం 48 దేశాల్లో వార్తలపై ప్రజల నమ్మకం సగటున 40 శాతమే. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు వార్తలను నమ్మడం లేదు. ఇది పదేళ్ల క్రితం కంటే చాలా తగ్గింది. ఎడెల్మన్ వారి సర్వేలో 69 శాతం మంది– ఇది ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం అని నమ్ముతున్నారు. యునెస్కో కూడా ఇదే విషయం చెబుతోంది– ధ్రువీకరణ లేని సమాచారం భయంకరంగా వ్యాపిస్తోందని!భారత్లో ఇంకా పెద్ద సమస్య. మన దగ్గర అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేవి, షార్ట్ వీడియోలు– ఇవే చాలామందికి వార్తలు. ఎప్పటివో పాత దృశ్యాలు, సంఘటనలు ఇప్పటి వార్తలుగా ప్రచారం జరగడం సాధారణ విషయం అయ్యింది. ఇందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏదైనా వీడియో లేదా పోస్ట్ చూడగానే ఫార్వర్డ్ బటన్ నొక్కే ముందు, ‘ఇది ఎవరు పోస్ట్ చేశారు, మూలం ఏంటి’ అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అధికారిక ఫ్యాక్ట్–చెక్ వేదికలు, విశ్వసనీయ ధ్రువీకరణ సేవలను ఉపయోగించడం అలవాటు చేసు కోవచ్చు. సమాచారం విషయంలో ఏమాత్రం అస్పష్టత ఉండకూడదు. డిజిటల్ ప్లాట్ఫామ్లు కూడా సంచలనం కంటే నమ్మదగిన సమాచారాన్ని ప్రోత్సహించాలి. నిజం నత్తలా నడిచినా... దాని బరువు తెలిసిన వాళ్లు దాని వెనుకే ఉంటారు!– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
జీవ ఇంధనాలే భారత భవిష్యత్ శక్తి
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత, పశ్చిమాసియాలో చమురు సరఫరాపై నెలకొంటున్న అనిశ్చితి– ఈ మూడు అంశాలు నేడు ప్రతి భారతీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారమే జీవ ఇంధనాల వాడకం.ప్రపంచం ఇప్పుడు జీవ ఇంధనాలను కేవలం ప్రత్యామ్నాయ ఇంధనంగా కాకుండా, పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, రైతు ఆదాయం, గ్రామీణ ఉపాధి వంటి వాటిని కలిపే భవిష్యత్ అభివృద్ధి మార్గంగా చూస్తోంది.భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిలో ప్రత్యా మ్నాయ ఇంధనాల విస్తరణ దేశ ఇంధన స్వావ లంబనకు కీలకం. జీవ ఇంధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి మన దేశంలోనే లభించే వ్యవసాయ, సేంద్రియ వనరుల నుంచి ఉత్పత్తి చేయగలగడం. చెరకు మొలాసిస్, మొక్కజొన్న, పాడై పోయిన ధాన్యాలు, వరి గడ్డి, పంట అవ శేషాలు ఇప్పుడు ఇంధన ముడి సరుకుగా మారు తున్నాయి. అంటే, వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి.జీవ ఇంధనాల్లో బయో–ఇథనాల్, బయో– డీజిల్, బయో–గ్యాస్, బయో– సీఎన్జీ, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ వంటి పలు రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో తరం ఇథనాల్ సాంకేతికత వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతోంది. 2014లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం సుమారు 1.5 శాతం మాత్రమే ఉండగా, 2024–25 నాటికి అది 19.05 శాతానికి చేరింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంలో సగటు మిశ్రమం 20 శాతానికి చేరువ కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది.భారత్కు కొత్త అవకాశాలుఇటీవల కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకాన్ని’ ఆమోదించడం జీవ ఇంధన రంగంలో కీలక మలుపు. పశువుల పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో–స్లర్రీగా మార్చి గ్రామీణ ప్రాంతాలను శుభ్రమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిద్దడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రంగం ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా, 1.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు, 10 మిలియన్ మెట్రిక్ టన్నుల శిలాజ ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయం సాధ్యమవుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జీవన్ యోజన’ ద్వారా 2జీ ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందుతోంది. ‘సతత్’ పథకం ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని విస్తరిస్తున్నారు.2023లో జి–20 వేదికపై ప్రారంభమైన గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి... జీవ ఇంధ నాల ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, వాణిజ్య సహకారానికి ప్రపంచ వేదికగా మారుతోంది. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్, భవిష్యత్ బయో ఎనర్జీ రంగాల్లో భారత్కు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే జీవ ఇంధనాల విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.భూమి వినియోగం, నీటి అవసరాలు, ముడి సరుకు సరఫరా, సాంకేతిక వ్యయాలు వంటి అంశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చమురు బావుల నుంచి మాత్రమే కాదు, మన పొలాల నుంచి కూడా దేశ భవిష్యత్ శక్తి ఉత్పత్తి కావచ్చని జీవ ఇంధనాలు మనకు గుర్తుచేస్తున్నాయి.– ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా–కమ్యూనికేషన్స్ అధికారి (రేపు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం) -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది. ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్ను సపోర్ట్గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు. -
అమెరికాను నిలబెట్టిన 'విలువలు ఏమిటి'?
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు. వ్యోమగాములను చంద్రుడిపైకి!1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి. రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు. మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’! కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం. ఆరో విలువ – జాతీయ ఐక్యత:నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’. -
భాగ్యనగర భద్రతకు శాస్త్రీయ మార్గం
వరద అనేది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, అది నగర ప్రణాళికలోని లోపాలు, ప్రవాహ మార్గాల ఆక్రమణ, దీర్ఘకాల శాస్త్రీయ ఆలోచన లోపం వంటివాటిని బహిర్గతం చేస్తుంది. హైదరా బాద్ నగరానికి 1908 సెప్టెంబర్లో సంభవించిన మహావరద నగర చరిత్రను మలుపు తిప్పింది.2020 అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగిన తీరు, మళ్లీ అదే హెచ్చరికను గుర్తుచేసింది. ఇప్పటి వరకు వరదలపై చర్చ ఎక్కువగా నేటి వర్షపాతం గణాంకాలకే పరిమితమైంది. కానీ, నది ప్రవర్తనను వర్తమాన డేటాతో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నదులు నెమ్మదిగా మారుతాయి. భూభాగ వినియోగం, అడవుల తగ్గుదల, నగరీకరణ, మురుగు ప్రవాహాలు, మట్టి నిక్షేపాలు– ఇవన్నీ నదీ వ్యవస్థను కాల క్రమంలో మార్చేస్తాయి. ఆ మార్పుల ఆనవాళ్లు నదీ అవక్షేపాల్లో నిలిచి ఉంటాయి. అందుకే మూసీ ఒడ్డున పేరుకుపోయిన మట్టి పొరలు (స్తరాలు) ఒక సహజ చరిత్ర పత్రంలా పనిచేస్తాయి.శాస్త్రీయ విశ్లేషణ ఎలా అంటే...నదీ అవక్షేపాలు అంటే కేవలం బురద కాదు. ప్రతి పొర ఒక కాలానికి చెందిన సమాచారం. వరద తీవ్రత, పరిసర వృక్షావరణం, మానవ జోక్యం, కాలుష్య ముద్ర– ఇవన్నీ వాటిలో దాగి ఉంటాయి. ఈ పొరలను అవక్షేప కోర్ నమూనాల రూపంలో సేకరించి విశ్లేషిస్తే, గత వరదల స్వభావాన్ని పునర్నిర్మించవచ్చు.అదే సమయంలో పుప్పొడి శాస్త్రం మరో కీలక దృక్కోణాన్ని అందిస్తుంది. మట్టిలో దాగి ఉన్న చెట్లు, గడ్డి, పంటల పుప్పొడి ద్వారా అప్పటి వృక్షావరణం, వ్యవసాయ విస్తరణ, భూభాగ విని యోగ మార్పులు తెలిసిపోతాయి. ఒక పొరలో సహజ వృక్ష పుప్పొడి అధికంగా ఉంటే ఆ ప్రాంతం అప్పట్లో మరింత సహజ స్థితిలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పంటల పుప్పొడి పెరిగితే వ్యవ సాయం విస్తరించిన సూచన. పుప్పొడి తగ్గి, ధూళి లేదా నిర్మాణ సంబంధిత కణాలు పెరిగితే పట్టణీకరణ వేగాన్ని సూచించవచ్చు. అవక్షేప శాస్త్రం (సెడిమెంటాలజీ), పుప్పొడి శాస్త్రం (పాలినోలజీ) కలిసి మూసీ చరిత్రను డేటా ఆధారంగా చెప్పగలవు.మూసీపై ఇలాంటి అధ్యయనం ఎందుకు అవసరం అంటే కారణం సుస్పష్టం. ప్రస్తుత వరద నియంత్రణ చర్యలు ఎక్కువగా ఇటీవలి పరికరాలతో నమోదు చేసిన గణాంకాల మీద ఆధార పడుతున్నాయి. కానీ నదులు దీర్ఘకాల చక్రాల్లో పనిచేస్తాయి. కొన్నేళ్ల గణాంకాలు మాత్రమే చూసి వరద మైదానాన్ని నిర్ణయించడం ప్రమాదకరం. నీరు సహజంగా వెళ్లే మార్గాలు, నిలిచే ప్రాంతాలు, వరద మైదానాలు గుర్తించడంలో తప్పులు జరిగితే, తప్పుడు చోట్ల నిర్మాణాలు పెరుగుతాయి. అప్పుడు ప్రతి భారీ వర్షం విపత్తుగా మారే అవకాశం ఉంటుంది.ఇటీవల ఒక నివేదిక ప్రకారం మూసీ అవక్షేపాల్లో కాలుష్యం ప్రధానంగా సేంద్రియ స్వభావం కలిగి ఉంది. అంటే సమస్య కేవలం వర్షం కాదు, నీరు వెళ్లాల్సిన సహజ మార్గాలు దెబ్బతినడం. అందుకే మూసీ కారిడార్లో అవక్షేప కోర్ నమూనాలను అధ్య యనం చేయడం కీలకం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, చార్మి నార్ పరిసరాలు, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల నుంచి నమూ నాలు తీసుకుని కర్బన–14 పద్ధతిని అనుసరించి కాల నిర్ణయం చేసి, కొన్ని వందల సంవత్సరాల వరకూ చరిత్రను పునర్నిర్మించవచ్చు. ఏ దశలో కరువు, ఏ దశలో తీవ్రమైన వరద, ఏ దశలో నగర ఒత్తిడి పెరిగిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.ఈ పరిశోధన ఫలితాలు హైదరాబాద్కు దిక్సూచిగా మారు తాయి. శాస్త్రీయ వరద మ్యాపులు తయారవుతాయి. గతంలో వరద నీరు ఏయే మార్గాల్లో ప్రవహించిందో తెలిసినప్పుడు ఆ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు పరిమితులు విధించడం సులభమవుతుంది. భవిష్యత్ బృహత్తర ప్రణాళికలో ‘నాన్ కన్స్ట్రక్షన్ ఫ్లడ్ జోన్’ వంటి నిర్ణయాలు ఊహలపై కాకుండా డేటాపై ఆధారపడి తీసుకోవచ్చు. అలాగే వరద హెచ్చరిక వ్యవస్థలు కూడా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. మట్టి పొరల్లో దాగిన చరిత్రను వినగలిగితేనే హైదరాబాద్ వరద భద్రతకు శాస్త్రీయ మార్గం సుగమ మవుతుంది.– డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకుడు -
మోసపోయినా మంచితనం వదలొద్దు!
జీవితంలో మనల్ని బాధించినవాళ్లు రెండు విషయాల్లో ఒకదాన్ని తప్పకుండా తీసుకెళ్తారు. ఒకటి మన ప్రశాంతతను, రెండోది మన మంచితనాన్ని. ప్రశాంతత కొంతకాలానికి తిరిగి వస్తుంది. కానీ మంచితనం పోతే మనల్ని మనమే కోల్పోతాం. ఎందుకంటే, బాధ మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.తాను అనుభవించిన గాయాలను ఇతరులకూ పంచడం మొదలుపెట్టడం అనేది ఒక రకమైతే... తాను అనుభవించిన బాధ ఇంకెవరికీ కలగకూడదనే భావనతో జీవించడం రెండో రకం. ఈ రెండో రకమైన మనుషులే నిజంగా అరుదు. వాళ్లు కూడా మోసపోతారు. వాళ్లూ కూడా విరిగిపోతారు. వాళ్లూ కన్నీళ్లు పెడతారు. కానీ తమలోని మంచి మనిషిని మాత్రం కోల్పోరు. ఎందుకంటే, చెడ్డవాడిగా మారడానికి ఒక్క గాయం చాలు, మంచి మనిషిగా మిగిలి పోవడానికి మాత్రం గొప్ప హృదయం కావాలి.విజయవంతులైన మనుషులు చాలామంది కనిపిస్తారు. తెలివైన వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ, బాధను అనుభవించిన తర్వాత కూడా ఎవరికీ బాధ కలిగించకుండా జీవించే మనుషులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. వాళ్ల జీవితంలో ఎంత చెడు ఎదురైనా, వాళ్లలోని మంచిని కోల్పోకపోవడమే వాళ్ళ వ్యక్తిత్వంలోని గొప్పదనం. అందుకే, బాధ హృదయాన్ని తాకినా, హృదయంలో ద్వేషానికి స్థానం ఇవ్వకుండా జీవించగలగడమే నిజమైన విజయం.ముందుగా క్షమాపణ చెప్పేవాడు ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు బలవంతుడు. ముందుగా మర్చిపోయే వాడు ప్రశాంతంగా జీవించగలడు. తనను బాధించిన తర్వాత కూడా మంచి తనాన్ని ఎంచుకునే మనిషి ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తి.– కొత్త కృష్ణవేణి -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
భారతీయతకు ప్రతీక
మగ్గం చప్పుడు వినిపిస్తే అది కేవలం నూలుపోగులు అల్లే శబ్దం కాదు... ఒక కుటుంబం జీవన గీతం. ఒక గ్రామం ఆర్థిక స్పందన. ఒక నాగరికత ఊపిరి. సింధు లోయ నాగరికత తవ్వకాల్లో లభించిన ఆధారాలు భారతీయులు వేల ఏళ్ల కిందటే నూలు నేయడంలో నైపుణ్యం సంపాదించినట్లు చెబుతున్నాయి. కాలం మారినా చేనేత తన రూపాన్ని మాత్రమే మార్చుకుంది; తన ఆత్మను కాదు. ప్రతి అల్లికలో ఒక ప్రాంతపు సంస్కృతి, ప్రతి నమూనాలో ఒక సంప్రదాయం, ప్రతి వస్త్రంలో ఒక సమాజపు సృజనాత్మకత ప్రతిఫలిస్తూనే ఉంది. భారత చేనేత వైభవం దాని వైవిధ్యంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బెనారసీ, పష్మినా; దక్షి ణాన కాంచీపురం; తెలుగునాట గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ; తూర్పున బలుచారి, అస్సాం పట్టులు; పశ్చిమాన పటోలా... ప్రాంతం మారితే అల్లిక మారుతుంది, రంగు మారుతుంది, నమూనా మారుతుంది. కానీ ప్రతి వస్త్రంలోనూ భారతీయ సంస్కృతి సౌందర్యమే ప్రతిబింబిస్తుంది. అందుకేప్రపంచ వస్త్ర సంపదలో భారత చేనేతకు ప్రత్యేక గౌరవం దక్కింది.దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక గ్రామీణ ఉపాధిని కల్పిస్తున్న రంగాల్లో ఇది ఇప్పటికీ ఒకటి. ఈ రంగంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. నూలు వడకడం నుంచి రంగులు వేయడం, అల్లిక, డిజైన్, విక్రయాల వరకు ప్రతి దశలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి చేనేతకేవలం ఉపాధి కాదు; ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వా మ్యానికి, ఆత్మవిశ్వాసానికి బలమైన ఆధారం. అందుకే గ్రామీణ మహిళా సాధికారతకు చేనేత ఒక మౌన విప్లవంగా నిలిచింది.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతనేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలు సంప్రదాయం, సాంకేతికత, మార్కెట్ మధ్య వారధిగా నిలిచి నేతకార్మికులకు సాయం చేస్తున్నాయి. అయితే పవర్లూమ్ల పోటీ, చౌక దిగుమతులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెటింగ్ లోపాలు, డిజిటల్ వాణి జ్యంలో పరిమిత ప్రవేశం చేనేత రంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం గమ నార్హం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కని పరిస్థితుల్లో యువత ఈ వృత్తి వైపు ఆకర్షితులు కావడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి నేతను కాపాడాలి. దాన్ని కాపాడటం అంటే ఒక వృత్తిని రక్షించడం మాత్రమే కాదు; భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్నీ, లక్షలాది కుటుంబాల జీవనాధారాన్నీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ పరిరక్షించడం కూడా!– వాడవల్లి శ్రీధర్ ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
దొంగలున్నారు జాగ్రత్త!
దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి -
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రంగంలో దాదాపు గుత్తాధిపత్యం చలాయించిన చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ లను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టు బడులు పెడుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకం, శుద్ధీకరణ, శాశ్వత అయస్కాంతాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘మైన్–టు–మాగ్నెట్’ పథకం కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్ఈఎల్ విశాఖపట్నంలో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసింది. అంతకుముందు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భిన్న దేశాల్లో, భిన్న సందర్భాల్లో దాదాపు ఒకే సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి– అసలు రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నాయి?ఎందుకు రేర్?పేరులో ‘రేర్’ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రకృతిలో అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు కావు. భూమి పొరల్లో అనేకప్రాంతాల్లో లభిస్తాయి. అయితే, అధిక స్వచ్ఛతతో, లాభదాయకంగా తవ్వి, ఇతర ఖనిజాల నుంచి సులభంగా వేరు చేసి శుద్ధి చేయగల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. అందుకే వీటికి ‘రేర్’ అనే విశేషణం వచ్చింది. అలాగే ‘ఎర్త్’ అనే పదం కూడా ఆ ఖనిజాల మూలస్థానమైన మట్టినిగానీ, నేలనుగానీ సూచించదు. తొలినాళ్లలో ఈ మూలకాలు భూమి నుంచి వెలికితీసిన ఖనిజ ఆక్సైడ్ల రూపంలోనే శాస్త్రవేత్తలకు మొదటిసారిగా పరిచయం కావడంతో, వాటికి ‘రేర్ ఎర్త్’ అనే పేరు స్థిరపడింది. మొత్తం 17 రేర్ ఎర్త్ మూల కాలు ఉన్నాయి.ఈ మూలకాలపై ప్రపంచం ఇంతటి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం, సాధారణ లోహాలకు భిన్నంగా ఉండే వాటి అసాధారణ రసాయన, భౌతిక లక్షణాలే. వీటితో తయారయ్యే శాశ్వత అయ స్కాంతాలు పరిమాణంలో చిన్నవైనా, ఆకర్షణ శక్తిలో బలంగా ఉంటాయి. విద్యుత్ వాహనాల మోటార్లు, విండ్ టర్బైన్లు, విమా నాలు, రక్షణ రంగ పరికరాల్లో సుమారు 200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అధిక ఉష్ణోగ్రతల్లోనూ డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మూలకాలు తమ అయస్కాంత శక్తిని పదిలపరచుకోగలవు. ఎందుకంత ప్రాముఖ్యం?ఇవి నేడు మనం నిత్యం ఉపయోగిస్తున్న అనేక ఆధునిక పరిక రాలకు కీలక ఆలంబనగా మారాయి. స్మార్ట్ఫోన్ , ఎల్ఈడీ టీవీ, ఇయర్బడ్స్, విద్యుత్ వాహనం, విండ్ టర్బైన్ , ఎంఆర్ఐ యంత్రం, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు– ఇలా నేడు మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఆధునిక పరికరం తయారీలో రేర్ ఎర్త్ మూలకాల పాత్ర ఉంటుంది. వీటిలో నియోడిమియంను అత్యంత శక్తిమంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తే, లాంథనం అధిక నాణ్యత గల కెమెరా లెన్సులు, బ్యాటరీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, స్వయంనియంత్రిత వాహనాల వంటి సమకాలీన ఆవిష్కరణలకు కూడా ఈ మూలకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి, తాజాగా హోర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా శృంఖలల బలహీనతను మరోసారి తేటతెల్లం చేశాయి. అత్యవసర వనరుల కోసం ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచం అనుభవపూర్వకంగా ఈ సందర్భాల్లో గ్రహించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్ర తరమైంది. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా పరిమితులు విధించడం ఆందోళనను మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు చైనాలో లేనప్పటికీ, గత మూడు దశాబ్దాల కృషి ఫలితంగా ఈ రంగంలో గుత్తాధిపత్యం మాత్రం దానిదే. ముడి ఖనిజాల తవ్వకంతో ఆగిపోకుండా, వాటి శుద్ధీకరణ, శాశ్వత అయ స్కాంతాలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం విలువ గొలుసుపై చైనా క్రమంగా ఆధిపత్యం సాధించింది.భారత్ ఏం చేయాలి?భారత్లో విస్తారమైన రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, వెలికితీత అనంతర దశల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ, రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకానికే పరిమితం కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ కేంద్రాన్ని ఐఆర్ఈఎల్ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే గనులతో పాటుగా వాటిని శుద్ధి చేయగల, శాశ్వత అయస్కాంతా లుగా మలచగల, అత్యాధునిక ఉత్పత్తులుగా తీర్చిదిద్దగల నిపుణుల లభ్యత కూడా కీలకం. ఈ దిశగా భారతదేశంలో ఇప్పటివరకూ అంతగా ఆదరణకు నోచుకోని మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరి యల్స్ సైన్స్, రేర్ ఎర్త్ సాంకేతికతలను మరింత ప్రోత్సహించాలి. ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో రేర్ ఎర్త్ మెటలర్జీ, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు తక్షణావసరం. అయితే వీటికి సమర్థమైన ప్రత్యామ్నాయాలను కనుగొనగలమా? సముద్ర గర్భం, చంద్రుడిపై ఉన్న ఈ ఖనిజ నిక్షేపాలను వినియోగించడం సాధ్యమవుతుందా? వీటి తవ్వకం, శుద్ధీకరణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలు పరిశోధనా సంస్థలకే పరిమితం కాకూడదు. అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడే, అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సాంకే తిక పరిష్కారాలుగా రూపాంతరం చెంది నప్పుడే ఆ పరిశోధనల పరమార్థం నెరవేరినట్లవుతుంది.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
అణుదాడిని మరిస్తే శాంతి నెలకొనదు!
1945 ఆగస్టు 6 ఉదయం 8:15 గంటలకు హిరోషిమాలో ఉదయపు హడావుడి మొదలైంది. వీధుల్లో కార్లు శబ్దం చేస్తూ వెళ్తున్నాయి, ఆఫీసు ఉద్యోగులు తమ బల్లల వద్ద కుదురుకుంటున్నారు, పిల్లలు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే, ఒక్క క్షణంలో, సూర్యుడి కంటే అత్యంత ప్రకాశవంతమైన కాంతి నగర మంతటా వ్యాపించింది. ఒక అమెరికా బి–29 బాంబర్ ‘ఎనోలా గే’ ప్రపంచంలోనే తొలి సారిగా అణుబాంబును జారవిడిచింది. ఆకాశంలోకి మష్రూమ్ క్లౌడ్ (పుట్టగొడుగు లాంటి పొగ) ఎగిసిపడటంతో క్షణాల్లో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 చివరి నాటికి, పేలుడు, తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ కారణంగా సుమారు 1,40,000 మంది మరణించారు.ఆ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిలో తమేతో ఉఎమోరి ఒకరు. అప్పట్లో 40 ఏళ్ల వయసున్న ఉఎమోరి, మరుసటి రోజు తన కుటుంబ సభ్యుల కోసం శిథిలాలలో వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన ఎటు చూసినా ఊహకు అందని దారుణ దృశ్యాలే: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన జనాలు, నీళ్ల కోసం అరుస్తున్న బాధితులు, బూడిదగా మారిన పొరుగు ప్రాంతాలు. మరణించిన వారి దేహాలపై ఈగలు, పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయని ఉఎమోరి 1987లో తన 88వ ఏట ‘అసోసియే టెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ బాంబు దాడిలో తన తమ్ముడితో సహా సొంత కుటుంబ సభ్యులు మరణించారని ఆయన చివరికి తెలుసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆయనను ఎన్నడూ వదల్లేదు.దుఃఖం నుంచి పోరాటానికి...హిరోషిమా అనుభవించిన ఘోరాన్ని మరెవరూ అనుభవించ కుండా చూడటానికి ఉఎమోరి తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. అణు బాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన అనేకమంది ’హిబాకుషా’లలో ఒకరిగా మారారు. వీరు తమ వ్యక్తి గత విషాదాన్ని అణు ఆయుధాలకు వ్యతిరేకంగా జీవితకాల పోరా టంగా మార్చుకున్నారు. తదనంతరం మరణించిన ఉఎమోరి, 1987 నాటి తన ఇంటర్వ్యూలో, అణు నిరాయుధీకరణ గురించి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. అది నేటికీ అత్యంత అత్యవసరమైనది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన మరొక వ్యక్తి శాండ్ఫోర్డ్ జెడ్. పర్సన్స్. రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీలో పనిచేశారు. బాంబు దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఆయన హిరోషి మాలో పనిచేస్తున్నప్పుడు, తాను ఊహించినదానికి భిన్నమైన విధ్వంసాన్ని చూశారు. నగరంలోని అనేక ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ అనుభవం పర్సన్స్ను వెంటాడింది. చివరికి శాంతి కోసం తనను అంకితం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరలిస్ట్ మూవ్మెంట్ డైరెక్టర్గా మారి, 1984లో మరణించే వరకు అణు ఆయుధాల ముప్పును తగ్గించే అంతర్జాతీయ ఒప్పందాల కోసం పోరాడారు. ఒకరు జపనీస్, మరొకరు అమెరికన్. వారు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో నిలబడ్డారు. అయినప్పటికీ, మానవాళి భవిష్యత్తు అణు ఆయు ధాలు మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చూడటంపైనే ఆధారపడి ఉంటుందని ఇద్దరూ నమ్మారు.ఆయుధం వర్సెస్ ఆహారంయునైటెడ్ స్టేట్స్ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 9న నాగసాకిపై మరో అణు బాంబునువేసింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ దాడులు అవసరమా లేదా జపాన్ ను ఇతర మార్గాల ద్వారా లొంగిపోయేలా చేయవచ్చా అనే దానిపై చరిత్రకారులు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. అయితే వివాదానికి తావులేని విషయం ఏమిటంటే, ఆ బాంబు దాడులు అణు ఆయుధాల అసమాన విధ్వంసక శక్తిని నిరూపించాయి. మానవాళి వెనక్కి రాలేని ఒక తీవ్రమైన సరిహద్దును దాటేసింది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన బాంబులు ఆధు నిక ప్రమాణాలతో పోలిస్తే ప్రాథమికమైనవి (చిన్నవి). నేటి అణు ఆయుధాలు అంతకంటే విధ్వంసకరమైనవి. ఆర్మ్స్ కంట్రోల్ అసో సియేషన్ ప్రకారం, ప్రపంచంలోని అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. చాలా వరకు హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే ఎంతో శక్తిమంత మైనవి. ఒకే ఒక ఆధునిక థర్మోన్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్టగలదు.ఐరిష్ రచయిత పాట్రిక్ కమర్ఫోర్డ్ మరో ముఖ్యమైన కోణాన్ని ప్రస్తావించారు. ఒక్క అణు క్షిపణికి అయ్యే ఖర్చుతో వేలాదిమంది పిల్లలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులను అందించవచ్చని ఆయన అన్నారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ప్రయోగించక పోయినా అవి భారీ ఖర్చును మోపుతాయి. ఆయుధాగారాలను నిర్వహించడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వాలు అపారమైన నిధులను వెచ్చిస్తాయి. అణు నిల్వలను విస్తరించడానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు లేదా శాస్త్రీయ పరిశోధనలకు లభించకుండా పోతుంది.ఒప్పందాలతోనే శాంతిభద్రత ముఖ్యమైనదే. రక్షణ గురించి దేశాలకు ఆందోళనలు ఉంటాయి. అయితే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) అణు ఆయుధాల వ్యాప్తిని పరిమితం చేయడానికి సహాయపడింది. కోల్డ్ వార్ కాలంలో వాషింగ్టన్, మాస్కో మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు వేలాది అణు ఆయుధాలను నిర్మూలించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అవే అత్యధిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నా లతో పాటు ఈ శక్తుల మధ్య తీవ్రమైన చర్చలు జరగాలి. చరిత్రలో ఆయుధ నియంత్రణ విజయవంతమైంది దేశాలు ఒకరినొకరు నమ్మడం వల్ల కాదు, ఉమ్మడి ముప్పు సహకారాన్ని కోరుతుందనే విషయాన్ని గుర్తించడం వల్లనే!హిరోషిమాను ప్రత్యక్షంగా చూసిన తరం వేగంగా కనుమరుగ వుతోంది. 1945 నాటి ఆ ఆగస్టు రోజున తాము ఏమి చూశారో వివ రించగలిగే బాధితులు త్వరలోనే ఎవరూ ఉండరు. మిగిలేది వారి మాటలు, వారి హెచ్చరికలు, వారు మనకు వదిలివెళ్లే బాధ్యత మాత్రమే. తమేతో ఉఎమోరి తన జీవితాంతం ప్రపంచాన్ని హిరోషిమాను గుర్తుంచుకోమని కోరింది అది కేవలం చరిత్ర అని కాదు. ఆయన జీవించిన చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదని! హిరోషిమా అణుబాంబు దాడి రోజు కేవలం జ్ఞాపకార్థ దినం మాత్రమే కాకూడదు. ఇది ‘నిరాయుధీకరణ దినోత్సవం’ కావాలి. ప్రభుత్వాలు అణు ప్రమాదాలను తగ్గించడానికి అంకితం చేసుకునే రోజు, సాధారణ పౌరులు అలా చేయాలని డిమాండ్ చేయడానికి పునరంకితం అయ్యే రోజు కావాలి. బాధితులు ఇప్పటికే తమ సాక్ష్యాన్ని ప్రపంచానికి అందించారు. మనం దానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.విలియమ్ ల్యాంబర్స్వ్యాసకర్త ‘ద రోడ్ టు పీస్’ రచయిత(‘ద జపాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
కెమిస్ట్రీని మలుపు తిప్పిన ఆక్సీజనుడు
మనం పీల్చే గాలిలో ఏముంది? ఈ ప్రశ్న ఇప్పుడు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. పురాతన గ్రీకులు చెప్పినట్టు గాలి అనేది ఒక మార్పు లేని ప్రాథమిక మూలకం అని ప్రపంచం నమ్మింది. ఈ నమ్మకాన్ని బద్దలుకొట్టి, మనం ప్రాణాలతో ఉండటానికి కారణమయ్యే ‘ఆక్సిజన్’ గుట్టు విప్పినవాడు జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు; ఒక ఉపాధ్యాయుడు, మత బోధకుడు, విప్లవ భావాలున్న సాహసి.బ్రిటన్లో జన్మించిన ఆయన జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగింది. లీడ్స్ నగరంలో నివసిస్తున్నప్పుడు, ఆయన ఇంటి పక్కనే ఒక బీర్ తయారీ కేంద్రం ఉండేది. అక్కడ పులియబెట్టే ప్రక్రియలో వచ్చే ‘ఫిక్స్డ్ ఎయిర్’ (కార్బన్ డయాక్సైడ్)పై ఆసక్తి కలిగింది. నేటి సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమకు పునాది వేసింది ఆ ఆసక్తే. నీటిలో కార్బన్ డయాక్సైడ్ను కలిపి కృత్రిమంగా ‘సోడా వాటర్’ను తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.1774 ఆగస్టు 1న ఆయన చేసిన ప్రయోగం అతి ముఖ్యమైనది. ఒక భూతద్దం సహాయంతో సూర్యరశ్మిని మెర్క్యూరిక్ ఆక్సైడ్ పొడి మీద కేంద్రీకరించినప్పుడు దాని నుంచి ఒక రకమైన వాయువు వెలువడటం గమనించారు. అది సాధారణ గాలి కంటే ఐదారు రెట్లు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా, అందులో మంటలు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. ఆ వాయువును పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఎంతో తేలికగా అనిపించాయి. ఆ గాలిలో ఒక ఎలుక సాధారణ గాలిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ సేపు ప్రాణంతో ఉండటాన్ని గమనించారు. దానికి ఆయన ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ అని పేరు పెట్టాడు. తర్వాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త లావోయిజర్ దీనికి ‘ఆక్సిజన్’ అని నామకరణం చేశారు.ప్రకృతిలో సమతుల్యత ఎలా కాపాడబడుతుందో కూడా ప్రీస్ట్లీ మొదటగా గుర్తించారు. ఒక మూసి ఉన్న పాత్రలో మంట వెలిగించినా లేదా ఎలుకను ఉంచినా కొద్ది సేపటికి ఆ గాలి కలుషితమై మంట ఆరిపోవడం, ఎలుక చనిపోవడం జరిగేది. కానీ అదే పాత్రలో ఒక పచ్చని మొక్కను ఉంచి ఎండలో పెడితే, అది గాలిని తిరిగి ‘శుద్ధి’ చేస్తుందని ఆయన కనుగొన్నారు. ఆయన కనిపెట్టిన ఆక్సిజన్ వైద్య చికిత్సల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి పెద్ద ఆవిష్కరణలే కాదు... నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన విస్మరించలేదు. మనం పెన్సిల్తో రాసిన తప్పులను తుడిపే ‘రబ్బర్ ఎరేజర్’ను కూడా ఆయనే కనిపెట్టారని తెలిస్తే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది! అందుకే అతడు గొప్పవాడయ్యాడు!అసమ్మతి స్వరంప్రీస్ట్లీ జీవితం కేవలం ప్రయోగశాలకే పరిమితం కాలేదు. ఆయన మతపరమైన ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ సిద్ధాంతాలను ఆయన వ్యతిరేకించారు. ఆయనొక ‘డిసెంటర్’ (అసమ్మతివాది) కావడంతో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి అనుమతి దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ వంటి భాషలు సొంతంగా నేర్చుకున్నారు.అమెరికా, ఫ్రెంచ్ విప్లవాలకు ఆయన మద్దతు పలకడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయనపై ‘ద్రోహి’ ముద్ర వేశారు. 1791లో బర్మింగ్హామ్లో ఉన్నాదులు కొందరు ఆయన ఇంటిని, ప్రయోగశాలను తగలబెట్టారు. ఆయన రాసుకున్న ఎన్నో విలువైన పరిశోధన పత్రాలు బూడిదయ్యాయి. ప్రాణభయంతో ఆయన లండన్ పారిపోయి, చివరకు 1794లో అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియాలోని నార్తంబర్ల్యాండ్ అనే మారుమూల గ్రామంలో స్థిరపడి మళ్ళీ పరిశోధనలు ప్రారంభించారు. అక్కడ ‘కార్బన్ మోనాక్సైడ్’ వాయువును కనిపెట్టారు. ‘యూనిటేరియన్ చర్చి’ని స్థాపించారు. అమెరికా మాజీ అధ్యక్షులు థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయనకు ఆప్తమిత్రులు. ఆక్సిజన్ను కనిపెట్టిన శత వార్షికోత్సవం సందర్భంగా, ఆయన గౌరవార్థం 1876లో ‘అమెరికన్ కెమికల్ సొసైటీ’ ఏర్పాటైంది. ప్రీస్ట్లీ మరణించినప్పుడు (1804 ఫిబ్రవరి 6) ‘మానవాళికి అత్యంత విలువైన కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు’ అని థామస్ జెఫర్సన్ నివాళులర్పించారు.- ఎడిటోరియల్ టీమ్ -
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అధికారిక మద్దతుగోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్గా కనిపిస్తుంది. నవ భారతానికి ప్రాచీన జబ్బుకీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్లెట్ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్పై భరత్ అగర్వాల్ అనే అమెరికన్ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్కు చెందిన ఆర్.బి. సింగ్ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్స్లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్ జవాబిచ్చారు. ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయంలో తేలింది. చైనా ఉదాహరణచైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్ అంబుడ్స్మన్ను ఏర్పాటు చేసుకోవాలి. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడుంటాడో ఆచూకీ చెప్పండి..
జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు. – యామిజాల జగదీశ్ -
పర్యావరణ యోధులకు రక్షణ ఏది?
హైదరాబాద్లోని తెరిచి ఉన్న ఒక డ్రైన్లో పడి కొట్టుకుపోయిన 70 ఏళ్ల చెత్త ఏరుకునే కార్మికుడు బాలయ్య ఉదంతం– సమాజంలో అట్టడుగున ఉన్న ఈ కార్మికుల నిస్సహాయతకు, దుఃస్థితికి ప్రత్యక్ష నిదర్శనం. స్మార్ట్ సిటీల పర్యావరణ పరిరక్షణలో చెత్త ఏరుకునేవారి సేవలు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్, కాగితం, లోహాల వంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా వీరు డంపింగ్ యార్డులపై పడే భారాన్ని భారీగా తగ్గిస్తున్నారు. వాస్తవానికి, అధికారిక వ్యవస్థల కంటే వీరు తరచుగా అధిక స్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం చేయడంలో సఫలమవుతున్నారు.పర్యావరణానికి విశేషమైన మేలు చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని ఈ ‘పర్యావరణ యోధుల’ ఆరోగ్యం మాత్రం నిత్యం గాల్లో దీపంగానే మారుతోంది. కనీస రక్షణ లేకుండానే విషపూరిత వ్యర్థాలు, పగిలిన గాజు పెంకులు, ఆసుపత్రి వ్యర్థాలు, కుళ్ళిన చెత్త మధ్య వీరు పనిచేస్తుంటారు. చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్కులు, కాళ్లకు బూట్లు లాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు– 2016’ ప్రకారం, చెత్త ఏరుకునేవారు పట్టణ స్థానిక సంస్థల నుండి గుర్తింపు కార్డులు పొందవలసి ఉన్నది. కానీ, బడ్జెట్ పరిమితులు లేదా అధికారుల అయిష్టత కారణంగా కొన్ని స్థానిక సంస్థలు వీటిని జారీ చేయడంలో విఫలమయ్యాయి.సేవకు ‘నమస్తే’!ఈ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యాంత్రిక పారిశుధ్య పర్యావరణ వ్యవస్థ జాతీయ కార్యాచరణ (నమస్తే) పథకం’ ఒక ఆశాకిరణం. 2024–25 నుండి, చెత్త ఏరుకునేవారిని ఈ పథకంలో అధికారికంగా చేర్చడం ముఖ్యమైన మార్పు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1.52 లక్షల మంది చెత్త ఏరుకునే వారిని గుర్తించగా, ఇందులో 48.7 శాతం మహిళలు ఉండటం గమనార్హం. వ్యర్థాల సేకరణ, పునరుద్ధరణలో వారి కృషిని గుర్తించి, అధికారిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలలో వారిని విలీనం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా, వారి పిల్లలకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్లు, ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు, అలాగే అవసరమైన శిక్షణ, పరికరాలు లభిస్తాయి.దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు ఇప్పటికే ‘రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్’లను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య, చెత్త ఏరుకునే కార్మికుల హక్కులను పరిరక్షిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో అటువంటి సంస్థాగత వ్యవస్థ లేకపోవడం గమనార్హం. అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఈ అట్టడుగు వర్గాల భద్రతను పునరుద్ధరించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి. దీనితో పాటుగా పట్టణ స్థానిక సంస్థలు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఒక్కరికీ గ్లోవ్స్, మాస్కులు, రెయిన్ కోట్లు, సేఫ్టీ బూట్లు కలిగిన కిట్లను అందించాలి. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వీరి శ్రమను వ్యవస్థీకృతం చేయాలి. పర్యావరణాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి, గౌరవప్రదమైన స్థానం అందించడం సామాజిక బాధ్యత.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు -
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించి ముఖ్యమైన తేడా ఒకటుంది. ఆ తేడా ప్రభావాలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. గతంలో, వర్తమానంలోనే కాదు, మునుముందు కూడా కనిపించగల అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక ఆ తేడాను, అందుకు కారణాలను అర్థం చేసుకునేందుకు ఒక ప్రాథమికమైన ప్రయత్నం అవసరం. ప్రతి దేశానికి అంతర్గత విధానాలు సరేసరి కాగా, విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది. అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతుందనేది తెలిసిందే. అట్లా అనుగుణం అని తాము భావించే విధంగా విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అనగా ఆ సమయంలో అధికారంలో ఉండే పార్టీలు. ఆ విధానాలలో కొన్ని స్థిరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ సదరు విధానం, లేదా విధానాలు దేశ ప్రయోజనాలకు అనుగుణమైనవి కావనీ, నష్టం కూడా కలిగించవచ్చుననీ ప్రతిపక్షాలో, మీడియానో, మేధావులో భావించినట్లయితే, ఆ విధానాలను నిష్కర్షగా విమర్శించే పౌర స్వేచ్ఛలు ఎంతవరకు ఉంటున్నాయి? ఆ స్వేచ్ఛలలో తేడాలెందుకు?నచ్చనిది ముఖం మీదే...ఈ ప్రశ్న విదేశాంగ విధానాల గురించి ఇతరత్రా రావటం సరేసరి కాగా, యుద్ధ సందర్భాలలో మరింత తీవ్రంగా తలెత్తుతుంది. యుద్ధమన్నది మహా సున్నితమైన విషయం, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉండేది గనుక. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఒక విధానాన్ని అనుసరిస్తున్నపుడు, ఆ విధానం దేశ ప్రజలకు అవసరమని చెప్తున్నపుడు, ఆ యుద్ధం వల్ల అటువంటి ప్రయోజనాలేవీ లేవని భావించేవారు విభేదించి మాట్టాడవచ్చునా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను, లేదా పౌర స్వేచ్ఛను ఇస్తున్నపుడు, అటువంటి అవకాశం కాగితం పైన ఉన్నా ఆచరణలో ఎంతవరకు లభిస్తున్నది? ఇపుడు నిర్దిష్టమైన ఉదాహరణలను చెప్పుకుంటే విషయం ఇంకా బోధపడుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై పాలస్తీనాపై యుద్ధాలు సాగిస్తున్నాయి. అవి ఆ రెండు దేశాల ప్రయెజనాలకు అవసరమని చెప్తున్నాయి. కానీ ఆ వాదనతో విభేదించే అమెరికన్, ఇజ్రాయెల్ పౌర సమాజాలు, మీడియా, మేధావి వర్గాలు, రిటైరయిన సైన్యాధికారులు పెద్ద సంఖ్యలోనే తమ ప్రభుత్వ విధానాలను కేవలం నర్మగర్భంగా గాక, ప్రత్యక్షంగా, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలలో ప్రభుత్వ విధానాలకు ఆమోదం నానాటికి తగ్గిపోతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలలోనూ పౌర స్వేచ్ఛలు ఈ విధంగా ప్రజాస్వామికంగా, నిర్భయమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకు ఏ విధంగా భంగకరమో వారు వివరించి చెప్తున్నారు. ఇంకా అనాలంటే చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్లలో ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛలు మొదటి నుంచి ఉన్నాయి. మనవరకు చూస్తే వియత్నాం యుద్ధకాలం నుంచే కనిపిస్తున్నాయి. దేశద్రోహం పేరిట...ఇటువంటి పౌర స్వేచ్ఛలు భారతదేశం మొదలైన ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? ఇది ఇండియాకే కాదు, ఇటువంటి వర్ధమాన దేశాలు అన్నింటికి సంబంధించినది. ప్రస్తుత మధ్య ఆసియా యుద్ధాలనే చూద్దాము. అక్కడ ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా, గల్ఫ్ రాజ్యాల కోణం ఒకటున్నది. అది గాక ఇజ్రాయెల్– పాలస్తీనా– అమెరికా కోణం మరొకటి. రెండూ దుర్మార్గమైన యుద్ధాలే అయినా, మొదటి దానికి సంబంధించి భారత ప్రభుత్వం గల్ఫ్ నుంచి ఇంధనం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం అనే అంశాలను పేర్కొంటున్నందున ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవది?ఇజ్రాయెల్తో సంబంధాల సాధారణీకరణ గతంలోనే జరిగినా, ఇపుడు గాజా హత్యాకాండతో సమస్య తీవ్ర రూపం తీసుకుంది. అటువంటపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ దారుణాన్ని ఖండించకపోవటమే గాక, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరాలను సైతం అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ద్వంద్వ ధోరణి చూపుతున్నది. ఇందుకు గల కారణాలలో ఇజ్రాయెల్ ప్రభుత్వపు ఇస్లాం వ్యతిరేకతతో ప్రస్తుత భారత ప్రభుత్వానికి గల ఏకీభావం కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయెల్లోని అరబ్బులను అక్కడి ప్రభుత్వం హతమార్చకుండానే ఒక పద్ధతి ప్రకారం ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతున్నట్లు, దానితో ప్రేరణ చెందిన ఇక్కడి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉందనే సందేహాలున్నాయి. ప్రశ్న ఏమంటే, ఇటువంటి అంచనాలను, విమర్శలను వ్యక్తీకరించేందుకు భారత దేశంలో గల పౌర స్వేచ్ఛ ఎంత? ఇది ఒక వర్తమానపు ఉదాహరణ మాత్రమే. గతంలోకి వెళితే అనేకం ఉన్నాయి. ఉదారవాద ప్రజాస్వామిక పార్టీ అనుకునే కాంగ్రెస్ పరిపాలనలో కూడా, అదేవిధంగా, పైన అనుకున్నట్లు ఇది ఇండియాలోనే గాక, వర్ధమాన దేశాలన్నిటా కనిపిస్తున్న పరిస్థితి. అందువల్ల ఈ చర్చ భారత దేశానికి పరిమితమైనది కాదు. స్థూలంగా చెప్పుకోవాలంటే, పౌర స్వేచ్ఛలలో ఇటువంటి తేడాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఒక విధంగా, వర్ధమాన దేశాలలో మరొక విధంగా కనిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలలో ఆ స్వేచ్ఛలు లేకపోవటమే గాక వాటిని దేశ ద్రోహం పేరిట, మత ద్రోహం పేరిట, మరో పేరిట అణిచివేయటం కూడా జరిగితే?స్థిరపడని విలువలుఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను అభివృద్ధి చెందినవి, వర్ధమాన స్థితిలో ఉన్నవి అని స్థూలంగా విభజించి చూసినపుడు, రెండింటి మధ్య ఈ తేడాలెందుకనే మౌలికమైన ప్రశ్న గురించి చర్చించటం అవసరం. ఇంత లోతైన విషయం తేలికగా అర్థమయ్యేది కాదు. కానీ ఒక ప్రాథమిక ప్రయత్నమంటూ జరగాలి. ఆ విధంగా చూసినపుడు తోస్తున్నవి కొన్నున్నాయి. మనం అభివృద్ధి చెందిన దేశాలంటున్నవి పెట్టుబడిదారీ విధానంలో ఎదిగి వచ్చినవి. ఆ క్రమంలో పౌరులకు తమ హక్కులు, స్వేచ్ఛలు, వాటిని కాపాడుకోవడం అన్నది, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగత గుర్తింపులు రూపుదిద్దుకునే క్రమంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇవన్నీ వారి ప్రజాస్వామ్యంలో భాగమయ్యాయి. వాటిని వారు బలంగా కాపాడుకుంటారు. ఇందుకు పునాదులు రినైజాన్స్–పునరుజ్జీవనోద్యమం (14–17 శతాబ్దాలు), ఫ్రెంచ్ విప్లవం (18వ శతాబ్దం), ఇంగ్లండ్లో పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం నుంచి)లో పడ్డాయి. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాలు, వ్యక్తి స్వేచ్ఛలు, పౌర స్వేచ్ఛలు వ్యవస్థీకృత రూపం తీసుకుని బలపడ్డాయి. అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, వాటి విధానాలు ఎట్లున్నా ఈ వ్యవస్థలు, స్వేచ్ఛలు మారలేదు. అదే నేటికీ కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా, వర్ధమాన దేశాలనేవి చిరకాల ఫ్యూడల్ దశలు, రాచరికాలు, వలస పాలనల నుంచి బయటకు రావటం మొదలై ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు. యూరప్ తరహా విప్లవాలు రాలేదు. విలువలు ఇంకా నిజమైన అర్థంలో రూపుదిద్దుకోలేదు. పౌరుల వ్యక్తిత్వాలు, పౌర స్వేచ్ఛలు ఇంకా బలపడి వ్యవస్థీకృత రూపం తీసుకోలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే చట్ట సభలు, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా ఇంకా తమ స్ఫూర్తికి అనుగుణంగా స్థిరపడి బలపడవలసే ఉంది. అందువల్ల ఈ ఎదుగుదల వ్యత్యాసాలే మొదట చెప్పుకున్న వ్యత్యాసాలకు కూడా కారణమవుతున్నాయనిపిస్తున్నది.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
రైతుకు ఆదాయం – ప్రకృతికి చికిత్స
వాతావరణ మార్పులు ప్రపంచ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరవుప్రాంతాల్లో వ్యవసాయం అనిశ్చితితో కూడిన జీవనోపాధిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్రోఫారెస్ట్రీ– వ్యవసాయ పంటలతో పాటు వృక్షాలను సమీకృతంగా పెంచే విధానం– పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గంగా ఎదుగుతోంది. చెట్లు వాతావర ణంలోని కార్బన్ ను బంధించడం ద్వారా ఏర్పడే కార్బన్ క్రెడిట్లను రైతుల ఆదాయంగా మలచడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.భారతదేశం 2070 నాటికి నెట్– జీరో లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయం కూడా కార్బన్ ఉద్గారాల నియంత్రణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. రైతులను కేవలం ఆహార ఉత్పత్తిదారులుగా కాకుండా పర్యావరణ సేవలను అందించే భాగ స్వాములుగా గుర్తించే విధానాలు రూపొందాలి. కార్బన్ మార్కెట్లు అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో యాక్షన్ ఫ్రెటర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్ ఎకాలజీ సెంటర్) ఈ భావనను ఆచరణలోకి తీసుకొస్తోంది. నెదర్లాండ్స్కు చెందిన రాబోబ్యాంక్ ప్రోత్సహి స్తున్న ‘అకార్న్’ కార్యక్రమానికి స్థానిక భాగస్వామిగా ఉంటూ, సంస్థ రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపు మళ్లిస్తూ, కార్బన్ ఆదాయ వ్యవస్థలో చేర్చుతోంది. ఇప్పటికే సుమారు 8,300 మంది రైతులు, దాదాపు 10,000 హెక్టార్ల భూమిని ఈ కార్యక్రమంలో నమోదు చేయించింది. రైతుల భూములకు జియో–ట్యాగింగ్, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేశారు. రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేసి, ఏకపంట తోటలను బహుళ వృక్ష వ్యవస్థలుగా మార్చి ఈ కార్యక్ర మానికి బలమైన పునాది వేశారు. తొలి విడత కార్బన్ ఆదాయం 2027లో అందే అవకాశం రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ కేవలం కార్బన్ క్రెడిట్ల నమోదు వద్దే ఆగిపోలేదు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను సమ గ్రంగా అనుసంధానిస్తూ రైతుల స్థిరమైన జీవనోపాధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఆదాయాన్ని రైతు సంక్షేమంతో అనుసంధానించిన ఈ నమూనా దేశవ్యాప్తంగా అధ్యయనం చేయదగినది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్బన్ ధరల్లో హెచ్చుతగ్గులు, ధ్రువీకరణ ప్రక్రియల క్లిష్టత్వం, చిన్న రైతుల సామర్థ్య పరిమితులు వంటిఅంశాలను విధానపరంగా పరిష్కరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రో ఫారెస్ట్రీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు,సాంకేతిక సహాయం, పారదర్శక కార్బన్ మార్కెట్ వ్యవస్థను అందిస్తే ఈ కార్య క్రమం మరింత విస్తరిస్తుంది.భవిష్యత్తు వ్యవసాయం కేవలం దిగుబడుల గురించే కాదు; ప్రకృతిని పునరుద్ధరించడంపైనా ఆధారపడిఉంటుంది. రైతు పెంచే ప్రతి చెట్టు వాతావరణ మార్పులను తగ్గించడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచగలదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. రైతు–ప్రకృతి–మార్కెట్ మధ్య సమ తుల్యతను సాధించే ఇటు వంటి ప్రయత్నాలే సుస్థిర వ్యవసా యానికి బాటలు వేస్తాయి.-వ్యాసకర్త డైరెక్టర్, ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, అనంతపురం-డా‘‘ వై.వి. మల్లారెడ్డి -
అది రాజ్యాంగబద్ధమేనా?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయాన్ని ‘పూర్తిగా పాడాలి’ (అంటే ఆరు చరణాలనూ పాడాలి) అంటూ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. లోక్సభ, రాష్ట్రపతి ఆమోదాల తరువాత అది చట్టమవుతుంది. ఆ తరువాత, ఈ గేయాన్ని ఎక్కడైనా పూర్తిగా పాడకపోయినా, దాన్ని అవమానించినా, ఆటంకపరిచినా అలా చేసిన వాళ్లకు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది.1971లో తయారు చేసిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్’ను ప్రభుత్వం సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టింది. నిజానికి ఆ చట్టంలో– ‘జాతీయ జెండానిగానీ, జాతీయ గీతాన్ని గానీ, రాజ్యాంగాన్నిగానీ ఎవరైనా అవమానిస్తే వారు శిక్షార్హులవు తారు’ అని మాత్రమే వుంది. ‘వందే మాతరం’ గురించి ఏమీ లేదు. ఆ చట్ట పరిధిలోకి ఇప్పుడు దీన్ని కూడా తెస్తున్నారు.జనగణమనకూ, వందేమాతరానికీ తేడా వుంది. ఆ తేడా ఉండటం వలనే అది ‘జాతీయ గీతం’ కాలేక పోయింది. మొత్తం ‘ఆరు చరణాలు’ గా ఉండే అందులో మొదటి రెండు చరణాల్లో ప్రకృతి గురించి, భూమి గురించి, దేశభక్తి గురించి వర్ణన ఉంటుంది. ఆ తరువాత వచ్చే నాలుగు చరణాల్లో– భూమిని తల్లితో, ఆ తల్లిని కాళికతో, సరస్వతితో, లక్ష్మితో పోలుస్తూ ఉంటుంది. అంటే– హిందూ ఆధ్యాత్మికతా, దేశభక్తీ రెండూ కలగలసి ఉంటాయి.ఛటర్జీ ఈ గేయాన్ని విడిగా రాయలేదు. 1870లో రాసిన ‘ఆనంద్ మఠం’ నవలలోనిది అది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమా వేశంలో ‘రవీంద్రనాథ్ టాగూర్’ దీన్ని మొదటగా ఆలపించారు. అప్పటికి ఆయన ‘జనగణమన’ రాయలేదు. అంతకుముందు సాహిత్యకారులలోనే ఆ పాటకు, టాగూర్ పాడాక, జాతీయ గుర్తింపు వచ్చింది. 1905లో ‘లార్డ్ కర్జన్’ బెంగాల్ను విభజించాక, అదొక ‘ఉద్యమ నినాదం’గా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ‘వందే మాతరం’ నినాదాన్ని నిషేధించింది. నిషేధం కారణంగా ఇది మరింత ప్రజాదరణ పొందింది. రానురాను స్వాతంత్య్ర ఉద్యమంలో ఇది భావోద్వేగ గీతంగా కూడా నిలిచింది.1930లలో కాంగ్రెస్ వర్గాల్లో దీన్ని ‘జాతీయ గీతం’గా స్వీకరించాలనే చర్చలు జరిగాయి. కానీ ‘ముస్లిం లీగ్ నాయకులు’ అభ్యంతరం తెలిపారు. లీగ్ వాళ్ళే కాకుండా కాంగ్రెస్లోని ముస్లిమ్స్ కూడా తమ అభ్యంతరాల్ని బైట పెట్టడం మొదలెట్టారు. వాళ్ళల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ (కాంగ్రెస్ అధ్యక్షుడు, తొలి విద్యాశాఖమంత్రి) ప్రథములు. ‘వందే మాతరానికి స్వాతంత్య్ర ఉద్యమంలో చారిత్రక పాత్ర ఉంది. దాన్ని ఎవ్వరమూ కాదనలేము కానీ, వాటి లోని హిందూ దేవతారాధన భావనలతో కూడిన వ్యాఖ్యలు ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మొదటి రెండు శ్లోకాలు మాత్రమే దేశభక్తిని సూచిస్తాయి’ అని ఆయన తన అభిప్రాయాన్ని ప్రక టించారు. మౌలానా మహ్మద్ అలీ జౌహర్ (ఖిలాఫత్ నాయకుడు) ‘వందే మాతరాన్ని నినాదంగా వాడటానికి నేను వ్యతిరేకం కాదు; కానీ దాన్ని మతసంబంధమైన ప్రతీకగా మార్చకూడదు’ అన్నారు. ఎప్పుడైతే ముస్లిం సమూహం నించి వ్యతిరేకత వచ్చిందో, హిందూ సమూహంలోని వాళ్ళు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి అడు గులు వేశారు. ‘వందే మాతరం పట్ల గౌరవం ఉండాలి. కానీ ఎవ్వరి మనస్సాక్షికీ వ్యతిరేకంగా బలవంతం చేయకూడదు’ అన్నారు.ఆ తరువాత జనగణమనను ‘జాతీయ గీతం’గా చేస్తూ, ‘వందే మాతరం’కు సమాన గౌరవం ఇస్తూ (మొదటి రెండు పద్యాలకే పరిమితం చేస్తూ) 1950 జనవరి 24న రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రక టనను చేశారు. దీని మీద గాంధీజీ కూడా మాట్లాడారు. ‘వందే మాతరం దేశభక్తి గీతం. మత భావనతో ఎవరికైనా ఇబ్బంది అయితే బలవంతం చేయరాదు. దేశభక్తి అనేది స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతం చేస్తే అది హింసతో సమానం’ అన్నారు. అనేక మతాలు ఉన్న ఈ దేశంలో హిందూ మతానికి చెందిన దేవతా మూర్తుల్ని ఆరాధించే చరణాల్ని ‘తప్పనిసరిగా మొత్తం పాడాలి’ అనడం న్యాయమేనా? అది లౌకికత్వం అవుతుందా? రాజ్యాంగబద్ధం అవుతుందా?– నన్నూరి వేణుగోపాల్, పౌరహక్కుల కార్యకర్త -
నూతన యూరియా విధాన సవాళ్లు
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. - డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
ట్రేడింగ్ ఒక వృత్తి కాగలదా?
నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ‘ఆర్థిక స్వాతంత్య్రం’ సాధించ డానికి ట్రేడింగ్ ఒక ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తోంది. గతంలో దీనిని కేవలం ఒక జూదంగానో లేదా పార్ట్–టైమ్ ఆదాయ వనరుగానో చూసేవారు. నేడు సాంకేతిక విప్లవం, మార్కెట్లపై అవగాహన పెరగడంతో చాలామంది దీనిని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు.భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ రిటైల్ ట్రేడర్ల శైలి, వారి లాభనష్టాలపై ఒక లోతైన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు ట్రేడింగ్ను వృత్తిగా మార్చుకోవాల నుకునే వారికి కనువిప్పు కలిగిస్తున్నాయి.భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు 90% నుండి 93% మంది నష్టపోతున్నారు. నష్టపోయే ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 7% నుండి 10% మంది మాత్రమే మార్కెట్లో లాభాలు గడిస్తున్నారు. వీరిలో కూడా కేవలం 1.5% మంది మాత్రమే నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదించగలుగుతున్నారు. ట్రేడర్లు సంపాదించే లాభాల్లో లేదా నష్టాల్లో దాదాపు 15% నుండి 25% వరకు కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఖర్చులకే సరిపోతుందని తేలింది.ట్రేడింగ్లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భయం, దురాశ వంటి భావోద్వేగా లను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ట్రేడింగ్ను విజయ వంతమైన కెరీర్గా మార్చుకోవాలంటే ట్రేడింగ్కు సంబంధించి చాలా అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి ట్రేడ్లోనూ మీ పెట్టుబడిపై ఎంత శాతం నష్టాన్ని (స్టాప్–లాస్ విధానం) భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ఇండికేటర్లపై శాస్త్రీయ మైన పట్టు ఉండాలి.ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో (ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో) ట్రేడింగ్ను ఒక జూదంగానో లేదా సైడ్ హాసిల్గానో కాకుండా, గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన ‘వైట్ కాలర్‘ వృత్తిగా చూస్తారు. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ట్రేడింగ్ను వృత్తిగా మార్చుకోవడానికి ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక అక్షరాస్యత లోపించడం, సరైన గైడెన్స్ లేకపోవడం.– డా. ఎం.డి. ఖ్వాజా మొయినుద్దీన్, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
ఇక ఉద్యోగాలు, ఉత్పాదకతే లక్ష్యం
1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.అభివృద్ధి నిజమే కానీ...1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది. భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.అయినా ప్రపంచ దృష్టి భారత్పైనే...కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.భారత్లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది. 1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.వాస్తవ స్థితివీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు. స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-టి.ఎన్. నైనన్ -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.ప్రధాన ఆర్థిక వనరుతెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది. భద్రత–స్థిరత్వం 147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...ఆయిల్ పామ్లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయకుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
చైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్
అత్యాధునిక పద్ధతులతో మౌలికరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా, విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ వినూత్న ప్రయోగాలకు తెరలేపింది. ఇటీవల సిచువాన్ ప్రావిన్స్లోని యిబిన్ ప్రాంతంలో భారీ ఎయిర్ షిప్ను ఆకాశంలోకి ఎగురవేసింది. దీనికి ‘ఫ్లయింగ్ విండ్ పవర్షిప్ ఎస్–2000’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్లయింగ్ పవర్ స్టేషన్గా గుర్తింపు పొందింది. ఇది గాలి వేగాన్ని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత. సాధారణ విండ్ మిల్లులు భూమికి తక్కువ ఎత్తులోఉంటాయి. అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఎస్–2000 వంటి వ్యవస్థలు సుమారు 300 నుండి 600 మీటర్ల ఎత్తుకు ఎగిరి, అక్కడ వేగంగా వీచే గాలులను ఉపయోగించుకుంటాయి. ఈ ఎత్తులో గాలి నుండి లభించే శక్తి భూమిపై కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ.సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఎయిర్షిప్ హీలియం నింపిన తేలియాడే వేదిక. భూమిపై కంటే ఆకాశంలో గాలి వేగం స్థిరంగా, బలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. భారీ విండ్ టవర్లు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇనుము వాడకం తగ్గుతుంది. వీటిని అవసరమైన చోటికి సులభంగా తీసుకువెళ్లవచ్చు.ఎస్ –2000 వంటి వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా విద్యుత్తును తయారు చేస్తాయి: ఆన్–బోర్డ్ జనరేషన్ ఒకటైతే, గ్రౌండ్–బేస్డ్ జనరేషన్ రెండోది. ఆన్–బోర్డ్ పద్ధతిలో షిప్ రెక్కలకు ఉండే చిన్న టర్బైన్లు ఆకాశంలో గాలి వేగానికి తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. గ్రౌండ్–బేస్డ్ పద్ధతిలో షిప్ ఆకాశంలో ఎనిమిది అంకె ఆకారంలో తిరుగుతూ కేబుల్ను బలంగా లాగుతుంది. దీంతో భూమిపై ఉన్న డ్రమ్ము తిరుగుతుంది. ఆ డ్రమ్ముకు అనుసంధానించిన జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.ఒక సాధారణ విండ్ టవర్ నిర్మించడానికి వందల టన్నుల స్టీల్, కాంక్రీట్ అవసరం కాగా, ఎస్–2000కు అందులో 10% మెటీరియల్ ఉంటే సరిపోతుంది. కేవలం ఒక చిన్న బేస్ స్టేషన్ మాత్రమే భూమిపై ఉంటుంది, కాబట్టి మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ షిప్ బాడీని కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు బలంగా ఉంటుంది. అలాగే బరువు చాలా తక్కువ.భారత్ పరిస్థితిభారతదేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మారు మూల గ్రామాల్లో గ్రిడ్ కనెక్షన్ లేని చోట్ల వీటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా లదాఖ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో సాధారణ విండ్ టవర్లు కట్టడం చాలా కష్టం. అక్కడ ఈ ‘ఫ్లయింగ్ షిప్స్’ను సులభంగా తరలించి విద్యుత్ సమస్యను తీర్చవచ్చు.అయితే, మన దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2,000 మీటర్ల ఎత్తులో వీటిని ఎగరవేయడానికి డీజీసీఏ నుండి ప్రత్యేక అనుమతులు కావాలి. రుతుపవనాల సమయంలో వీచే భారీ గాలులు, తుఫానుల నుండి ఈ షిప్స్ను రక్షించడం ఒక సవాలు. ఏది ఏమైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్స్ ఆకాశంలో వీచే గాలి నుండి శక్తిని పొందే సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.– తరిగొప్పుల వీఎల్ఎన్ మూర్తి, జర్నలిస్ట్ -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్మెయిలింగ్ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి!
ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే రాజకీయాలు పక్షపాతాన్ని అధిగమించాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబు దారీగా ఉండటం, పారదర్శకంగా పని చేయడం, ప్రజల ప్రయోజనాలను అన్నింటికంటే ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం అత్యంత విలువైన సంపద. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం.దేశంలో ఏదైనా పెద్ద ప్రజా వివాదం, అవినీతి ఆరోపణ లేదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సంఘటన వెలుగులోకి వచ్చిన ప్రతిసారి దాదాపు ఒకే పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. పార్లమెంట్, శాసనసభల సమావేశాలు వాగ్వాదాలతో స్తంభిస్తాయి. టెలివిజన్ చర్చలు రోజంతా వేడెక్కుతాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతాయి. ప్రజల్లో కొంతకాలం ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ చర్చలు తగ్గిపోతాయి. వార్తల్లో కొత్త అంశాలు వస్తాయి. చివరకు అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తుంది.సమాజంలో ఉన్న విద్యావంతులు, నిజాయితీ గల వ్యక్తులు, నిష్పక్షపాతులు, సమర్థులు రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో విజయవంతం కావాలంటే ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి రావాలి.పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు మన దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారాయి. ఇవి యువతలో ప్రతిభపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ నియామక వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయి. దేశ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే 2004–2014 మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర సంస్థల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 2, అరుణాచల్ ప్రదేశ్లో 1, అస్సాంలో 6, బిహార్లో 5, ఢిల్లీ, కేంద్ర సంస్థల్లో 27, గుజరాత్లో 8, హరియాణాలో 5, హిమాచల్ ప్రదేశ్లో 4, జమ్మూ కశ్మీర్లో 5, జార్ఖండ్లో 2, కర్ణాటకలో 6, కేరళలో 2, మహారాష్ట్రలో 9, మణిపూర్లో 1, మధ్యప్రదేశ్లో 7, ఒడిశాలో 3, పంజాబ్లో 2, రాజస్థాన్ లో 10, తమిళనాడులో 2, తెలంగాణలో 3, త్రిపురలో 1, ఉత్తరాఖండ్లో 3, పశ్చిమ బెంగాల్లో 10, ఉత్తరప్రదేశ్లో 9 సంఘటనలు నమోదైనట్లు సమాచారం. ఈ వివరాలు చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది.అందువల్ల ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతి ప్రభుత్వం నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ రక్షణ, స్వతంత్ర పర్యవేక్షణ, కఠిన చట్టాలు, పారదర్శక నియామక విధానాలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో ప్రతి దశను అత్యంత భద్రతతో నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి.దేశ నిర్మాణంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, బాధ్యత గల పౌరుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు, మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన అధికారులు, పాత్రికేయులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సంస్థలు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. సమస్యలను మాత్రమే చూపించడం కాకుండా వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా సూచించాలి. సమాజం మొత్తం కలిసి పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
నీట్ కంటే పెద్ద సమస్య... డీలిమిటేషన్!
దేశమంతా ఈరోజు నీట్, పేపర్ లీకులు, విద్యార్థుల ఆందోళనలు, రాజకీయ విమర్శల గురించే మాట్లాడుతోంది. ఇవన్నీ చిన్న విషయాలు కావు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశం ప్రధానమైనదే. కానీ ఒక ప్రశ్న మనమందరం వేసుకోవాలి. దేశ రాజకీయాల భవిష్యత్తును, బహుజన సమాజం రాజకీయ వాటాను, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని రాబోయే యాభై సంవత్సరాల పాటు నిర్ణయించబోయే అంశం నీటా? లేక డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణనా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెబితే, అసలు జాతీయ చర్చ జరగాల్సింది పార్లమెంట్ ముందుకు రానున్న ఈ రాజ్యాంగ సంబంధిత అంశాల గురించే అని అర్థమవుతుంది.దక్షిణాది రాష్ట్రాల ఆందోళనప్రజల దృష్టి ఒకవైపు మళ్లిన సమయంలో మరోవైపు దేశ రాజకీయ నిర్మాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు నిశ్శబ్దంగా ముందుకు సాగడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బహుజన సమాజం మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గాల పునర్విభజనను చాలామంది కేవలం సరిహద్దులు మార్చే సాంకేతిక ప్రక్రియగా భావిస్తారు. వాస్తవానికి అది రాజకీయ అధికా రాన్ని తిరిగి పంచే ప్రక్రియ. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికర ణాల ప్రకారం జనాభా ఆధారంగా లోక్సభ, శాసనసభ స్థానాలను పునర్విభజన చేయాలి. 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, 2001లో వచ్చిన 84వ రాజ్యాంగ సవరణల కారణంగా ఈ ప్రక్రి యను 2026 తర్వాతి జనగణన వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తోంది.ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యం, విద్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అదే కారణంగా వాటిలో జనాభా పెరుగుదల తగ్గింది. ఇప్పుడు జనాభానే ప్రధాన ప్రమాణమైతే, ఈ రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యం సాపేక్షంగా తగ్గి, ఉత్తర భారత రాష్ట్రాల ప్రాధాన్యం పెరుగుతుంది. దేశ ప్రయోజనం కోసం అమలు చేసిన విధానాల ఫలితంగా రాజకీయంగా నష్టపోవడం సమంజసమా అనే ప్రశ్నకు దేశం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.కులగణనే కీలకంఇదే సమయంలో మహిళల రిజర్వేషన్ అంశాన్ని కూడా విడిగా చూడలేం. మహిళలకు శాసనసభల్లో, పార్లమెంటులో ఎక్కువ ప్రాతి నిధ్యం రావాలనే లక్ష్యాన్ని దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. అయితే మరో ప్రశ్నను విస్మరించకూడదు. ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న వర్గాలకు చెందిన మహిళలే అధికంగా ఎన్ని కయ్యే పరిస్థితి ఏర్పడితే– బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మహిళలకు నిజమైన అవకాశాలు ఎంతవరకు లభిస్తాయి? అందుకే బీసీ సంఘాలు చాలాకాలంగా మహిళల రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.ఈ చర్చలో కులగణన కీలకమైన అంశంగా మారుతుంది.దేశంలో పేదరికం లెక్కలు ఉన్నాయి. నిరుద్యోగం లెక్కలు ఉన్నాయి. రైతుల గణాంకాలు ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల నిజమైన జనాభా ఎంత అన్న సమాచారం లేకుండానే రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా పునర్నిర్మించగలం? అందుకే అనేక సామాజిక న్యాయ ఉద్యమాలు ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్ అనే క్రమాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు గణాంక ఆధారాలపై ఉండాలని పేర్కొంది.డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన – ఈ మూడు అంశాలు విడివిడిగా కనిపించినా వాస్తవానికి అవి ఒకే గొలుసులోని మూడు కడియాలు. ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్, ఆ తరువాత మహిళల రిజర్వేషన్ అమలు జరిగితేనే సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశముందని అనేక సామాజిక న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రాజకీయ ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి నీట్ వంటి తక్షణ సమస్యలపై కేంద్రీకృతమవుతున్న సమయంలో, రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన వంటి అంశాలపై తగినంత ప్రజా చర్చ జరుగుతోందా? దీనిపై భిన్నాభి ప్రాయాలు ఉండవచ్చు. కొందరు ఒకేసారి రెండు అంశాలపై పోరాటం చేయవచ్చని చెబుతారు. మరికొందరు తక్షణ రాజకీయ అంశాలు దీర్ఘకాల రాజ్యాంగ చర్చలను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని వాదిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జాతీయ ఉద్యమాలు తమ ప్రాధాన్య క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక ఆందోళనలకు తగిన స్థానం ఇవ్వకపోవచ్చు. ఇది ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే; దీనిపై విస్తృత ప్రజాస్వామ్య చర్చ అవసరం.అడగాల్సిన ప్రశ్నలునీట్లో అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించవచ్చు. ఒక మంత్రి రాజీనామా చేయవచ్చు. ఒక ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోవచ్చు. కానీ డీలిమిటేషన్ ద్వారా లోక్సభలో రాష్ట్రాల ప్రాతి నిధ్యం మారితే, మహిళల రిజర్వేషన్ అమలు వల్ల రాజకీయ నాయకత్వ నిర్మాణం మారితే, వాటి ప్రభావం ఒక్క ఎన్నికతో ముగిసి పోదు. అది తరతరాల పాటు కొనసాగుతుంది. అందుకే ఈరోజు దేశం ముందు ఉన్న అసలు ప్రశ్న నీట్ కాదు; భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉండాలి అన్నదే.భారత రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రతి పౌరుడికి హామీ ఇస్తుంది. ఆ న్యాయం కేవలం ఎన్నికలు జరగడంలో కాదు; సమాజంలోని అన్ని వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండటంలో ఉంది. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర బహుజన వర్గాలు మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కోరాలి: ముందు కులగణన జరుగుతుందా? డీలిమిటేషన్కు ఏ ప్రమాణాలు అమలు చేస్తారు? మహిళల రిజర్వేషన్లో బహుజన మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఎలా కల్పిస్తారు?దేశ రాజకీయాల దిశను మార్చేది ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వివాదాలు కావు. రాజ్యాంగంలో జరిగే మార్పులే. అందుకే బహుజన సమాజం ఈ చారిత్రక దశలో అప్రమత్తంగా ఉండాలి. రేపటి తరాల రాజకీయ భవిష్యత్తు ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు మనం ఏ ప్రశ్నలు అడుగుతున్నా మన్నదే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.డా‘‘ జె.పూర్ణచంద్ర రావువ్యాసకర్త ఐపీఎస్(రిటైర్డ్), మాజీ డీజీపీ; జాతీయ కోఆర్డినేటర్ ఏపీ– తెలంగాణ, అల్ ఇండియా బీఎస్పీ -
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే!
ఒక కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క వాక్యంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాం. ఆ పరిష్కారం సరైందా, కాదా అని పరిశీలించే ముందే, అది కొత్తదనే కారణంతో తిరస్కరిస్తాం. అలా ఓడిపోతు న్నది కొత్త ఆలోచన కాదు; గెలుస్తున్నది పాత అలవాటు.అందుకే ప్రపంచం మారుతున్నా, మన సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. ఫలితంగా అసలు ప్రశ్న పిల్లలు ఏమి నేర్చుకోవాలనేది కాదు; పెద్దలు ముందుగా ఏమి వదిలే యాలనేదే!‘పిల్లలు నేర్చుకున్నదాన్ని వదలాలి (ఆన్లెర్న్), కొత్తగా ఆలోచించాలి’– ఈ మధ్య విద్యా చర్చల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ‘వదలడం’ అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు; కాలం చెల్లిన ఆలోచనా విధానాలను ప్రశ్నిస్తూ కొత్త దృక్ప థాన్ని స్వీకరించడం. కానీ ఈ ఆలోచనను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.పిల్లల దగ్గర వదిలేయాల్సినంత పాత నమ్మకాలు ఏము న్నాయి? వాళ్లు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నారు; పాత కళ్లద్దాలు మాత్రం మన పెద్దలవే. వాటిని వాళ్లకు అందించింది మనమే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న– ‘పిల్లలు ఏం నేర్చుకోవాలి?’ అని కాదు; ‘మనం ముందుగా ఏ పాత నమ్మకాలను వదిలించు కోవాలి?’ అనేది. ఒకప్పుడు ఇవి విజయానికి మార్గదర్శకాలుగా ఉండి ఉండొచ్చు. కానీ వాటిని శాశ్వత సత్యాలుగా మార్చింది మనమే.ఇది ఎందుకు అంత కష్టం?ఒక నమ్మకాన్ని వదలడం అంటే, దాన్ని పట్టుకుని జీవించిన మన సొంత గతాన్నే ప్రశ్నించడం. ‘నేను ఇలా పెరిగాను, నేను బాగానే ఉన్నాను కదా’ అనే భావన మనలో బలంగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదిలేస్తే, మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజీలు అన్నీ వృథా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దురుద్దేశ్యం కాదు; తెలిసిన దానిపై ఉండే భద్రతా భావం. తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఒక వ్యవస్థ గుండా వచ్చినవారే. వాళ్ల మీద కూడా ఎవరో ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నది– తమకు వేసిన అదే ముద్రను, తెలియకుండానే, తర్వాతి తరానికి బదిలీ చేస్తున్నారు. ప్రతి కాలం తన సమస్యలకు తన సమాధానాలు సృష్టించుకుంటుంది. కలంతో పాటూ సమాధా నాలూ మారాలి.ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 39% మారిపోతాయి. ఈ రోజు నేర్పే సగం నైపుణ్యాలు అప్పటికి పనికిరాకపోవచ్చు. అందుకోసం సిలబస్ మార్చడం సరిపోదు; దాన్ని బోధించే వారి ఆలోచనా విధానం కూడా మారాలి. వ్యవస్థ ఎంత మారినా, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది మను షులే– ఇంట్లో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు. వ్యవస్థ ఒక వైపు మారుతుంటే, పెద్దల ఆలోచనలు అక్కడే నిలిచి పోతే, ఆ మార్పు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును మార్చేది కొత్త సిలబస్ మాత్రమే కాదు; పెద్దల మనస్తత్వంలో వచ్చే చిన్న మార్పు కూడా. పిల్లలు రేపటి తరాన్ని నిర్మించాలంటే, ఈరోజు పెద్దలు నిన్నటి కళ్లద్దాలను వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
నాయకత్వం పదవి కాదు... బాధ్యత!
ఈ రోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ప్రతి పట్టభద్రుల సభలో మాట్లాడే వ్యక్తి ఇదే మాట చెబుతారేమో. కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. బర్కిలీ అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం. నేను ఇక్కడ 17 సంవత్సరాలు బోధించే అదృష్టం పొందాను. ఇప్పుడు మీరు చదువు పూర్తయిందని అనుకుంటున్నారు. ఇక విద్యార్థి జీవితం ముగిసిందని భావిస్తున్నారా? ఎందుకంటే... జీవితం అంటే నేర్చుకోవడమే. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాడు. ఒక మంచి విద్యార్థి... ఎప్పుడో ఒక రోజు ఉపాధ్యాయుడవుతాడు. ఈ రెండూ వేర్వేరు పాత్రలు కావు. ఒకే ప్రయాణంలో రెండు దశలు. మనలోని ఆసక్తి, ప్రశ్నించే స్వభావం, మనుషులతో కలిసిమెలసి నేర్చుకోవాలనే తపనే... బోధనకూ, అభ్యాసానికీ మూలం. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న సహ విద్యార్థులను చూడండి. ఈ నాలుగేళ్లలో వాళ్ల దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు కూడా వారికి ఎన్నో విషయాలు నేర్పారు. ఇదే నిజమైన విద్య.ఎవరు నిజమైన నాయకులు?నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచానికి మార్గం చూపే గురువులు ఎవరు? నేను కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయుల గురించే మాట్లాడటం లేదు. ప్రపంచం ఏ దిశగా వెళ్లాలి? ప్రజలకు ఏది సరైన మార్గమో ఎవరు చూపిస్తారు? నాయకుడు కావాలంటే... మీ పేరుకు ముందు పెద్ద హోదా ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్యాలయం అవసరం లేదు. ప్రభుత్వంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. చరిత్రను మార్చిన గొప్ప నాయకుల్లో చాలామందికి ఎలాంటి అధికార పదవులు లేవు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, డోలోరెస్ హుయెర్టా, రోసా పార్క్స్, డబ్ల్యూ.ఇ.బి. డు బాయిస్, సుసాన్ బి.ఆంథోనీ... వీళ్లందరూ తమ ఆలోచనలతో, ధైర్యంతో, నైతిక విలువలతో ప్రపంచాన్ని మార్చారు. నిజమైన నాయకుడు ఎవరు? ప్రపంచం ఎటు వెళ్లాలో తెలుసుకునే వ్యక్తి. ఆ దిశగా ఎలా వెళ్లాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. ప్రజల ప్రతిభను, శక్తిని, మంచి ఆలోచనలను ఒకే లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల వ్యక్తి. నాయకత్వం అనేది ఒక పదవి కాదు... అది ఒక నైతిక బాధ్యత! విద్య అసలు ఉద్దేశం ఏమిటి?ప్రపంచం ఇప్పుడు ‘మనం ఏం చేయగలం?‘ అనే ప్రశ్నతోనే ఎక్కువగా పరుగులు తీస్తోంది. అద్భుతమైన యంత్రాలను తయారు చేశాం. రోబోలను రూపొందించాం. కృత్రిమ మేధ (ఏఐ) కూడా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది గొప్ప విషయమే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం?’ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడే విద్యకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఇంజినీర్లు ఒకేసారి ఇతర భాషలను అనువదించే హెడ్ఫోన్లను రూపొందిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సాంకేతిక పురోగతి. విదేశీ భాష నేర్చుకోవడం అంటే... ఒక దేశానికి వెళ్లి హోటల్లో భోజనం ఆర్డర్ చేయడం కోసమే కాదు. ఒక దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, వారి జీవన విధానం ఏమిటి అన్నది అర్థం చేసు కోవడానికే. ఇతరుల దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్పించేదే నిజమైన విద్య. మీతో విభేదించే వ్యక్తులతో మాట్లాడండి. అదే అత్యుత్తమ అభ్యాసం. మన అభిప్రాయమే ఉన్నవారితో మాట్లాడితే, మనకు తెలిసినదే మళ్లీ వింటాం. భిన్నంగా ఆలోచించే వ్యక్తులతో మాట్లాడితే, కొత్త ఆలోచనలు పుడతాయి. మన అవగాహన విస్తరిస్తుంది. జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ప్రతిభతో సమాజానికి ఏమి చేయగలం? ప్రపంచాన్ని కొంచెమైనా మంచి దిశగా ఎలా తీసుకెళ్లగలం? అన్నదే అసలు ప్రశ్న. జ్ఞానం వ్యక్తిగత విజయానికి మాత్రమే ఉపయోగపడితే అది అసంపూర్ణం. అదే జ్ఞానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే... అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. ప్రజాస్వామ్యం ఎందుకు అవసరం?జీవితం ‘ద విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమా లాంటిది. ఆ సినిమాలో ఒక తుఫాను తర్వాత డోరోతీ కొత్త ప్రపంచంలోకి చేరుతుంది. కిటికీ తెరిచి బయటకు చూస్తే, అన్నీ రంగుల ప్రపంచంలా కనిపి స్తాయి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు, మనం ఊహించని తుఫాన్లు వస్తాయి. మనల్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు కింద పడేస్తాయి. కానీ ఆ కష్టాల తర్వాత కొత్త అవకాశాలు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ అవకాశాలను గుర్తించ గలిగితే, మన జీవితమే మారిపోతుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి కేవలం అభినందనలు చెప్పి వెళ్లిపోతే నా బాధ్యత పూర్తికాదు. ఎందుకంటే, మీరు గొప్ప అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే... ఎన్నో సవాళ్లతో నిండిన ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక మంచి సమాజం అంటే, బలవంతులు బలహీ నులను అణచివేయకుండా కాపాడే సమాజం. అదే నాగరికతకు పునాది. అలా కాకపోతే... అధికారం ఉన్నవారు తమ శక్తిని దుర్విని యోగం చేస్తారు. బలహీనులు మరింత వెనుకబడిపోతారు. చివరికి... అన్యాయం, అశాంతి, ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యం అవసరం.మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన అది న్యాయం కాదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు చెప్పింది. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్థ అయినా, ఎలాంటి దేశ మైనా... చట్టాలకు, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తే చివరికి అది తనకే నష్టం కలిగిస్తుంది. అందుకే, చట్టాలు బలహీనులను మాత్రమే కాదు... బలవంతులను కూడా కాపాడతాయి. వాటిని గౌరవించడం అందరి బాధ్యత. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరు వ్యతిరేకించినా... సత్యం పక్షాన నిలబడాలి. అదే విద్య యొక్క అసలు లక్ష్యం.ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలను, ఇప్పుడు ప్రపంచానికి నేర్పే సమయం వచ్చింది. బలహీనుల పక్షాన నిలబడండి. అధి కారంలో ఉన్నవారిని ప్రశ్నించండి. న్యాయం కోసం గొంతెత్తండి. ఇతరులకు మార్గదర్శకులుగా నిలవండి. ఇదే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది... కేవలం తెలివైన మనుషులు కాదు, విలువలతో జీవించే నాయకులు. సత్యం కోసం నిలబడే పౌరులు. ఇతరులను ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఆ నాయకులు, ఆ గురువులు... మీరే! -
ఏమైనా సరే... ఆరు ఆరే!
భారతీయ తత్త్వంలో అరిషడ్వర్గాలు, షడ్దర్శనాలు, షడ్రసాలు, షట్చక్రాలు, షడృతువులు వంటి ఎన్నో భావనలు ఆరు (6) అంకెతో నిర్వచితమయ్యాయి. బౌద్ధంలో షట్పారమితలు, జైనంలో షడ్ద్ర వ్యాలు, జొరాస్ట్రియనిజంలో అమేష స్పెంతాలు, తావోయిజంలో హెక్సాగ్రాం... ఇలా విదేశీ సంప్ర దాయాల్లోనూ ‘ఆరు’ విశిష్టంగా నిలిచింది. ఈ సంప్రదా యాలు, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించినా, అన్నింటిలోనూ ఆరు పరిపూర్ణతకు సూచికగా నిలవడం విశేషం.భారతీయ తత్త్వశాస్త్రం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువులుగా గుర్తిస్తే; న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలనే ఆరు దర్శ నాలు (షడ్దర్శనాలు) విశ్వాన్ని వివరించాయి. కణాదుని వైశేషిక దర్శనం ఈ విశ్వం సూక్ష్మమైన పరమా ణువులతో నిర్మితమైందని చెప్తూ... దాన్ని ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ మనే ఆరు పదార్థాలుగా విభజిస్తే; పతంజలి యోగం చిత్తవృత్తి నిరోధమే లక్ష్యంగా చూపింది. విష్ణుపురాణం ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యమనే ఆరు గుణాల సమాహారమే భగవంతుడని నిర్వచిస్తే; శైవ సంప్రదాయంలో షట్కోణాకారం శివ–శక్తుల సంయోగానికి సంకేతం. దీని నుంచి జన్మించిన సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడయ్యాడు.వేదాధ్యయనానికి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిషమనే షడంగాలు అవసరమైతే; ఆయుర్వేదంలో మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయమనే ఆరు రసాల సమతుల్యతే ఆరోగ్యానికి మూలమని చరక సంహిత చెప్తుంది. శరీరాన్ని కూడా శిరస్, ఉరస్, ఉదరం, పృష్ఠం, ఊర్ధ్వ, అధశ్శాఖలనే ఆరు అంగా లుగా చరక, సుశ్రుత సంహితలు విభజించాయి. హఠయోగం నేతి మొదలు త్రాటక వరకు ఆరు శుద్ధి క్రియలను, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలను నిర్దేశించింది.కాలగణనలో వసంతం మొదలు శిశిరం వరకు ఆరు ఋతు వులు, రోజుకు ఆరు భాగాలు కనిపిస్తాయి. సంగీతంలో మొదటి స్వరం షడ్జం– నారదీయ శిక్ష ప్రకారం నాసిక, కంఠం, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతాలనే ఆరు అవయ వాల నుంచి పుట్టేది కాబట్టే ఆ పేరు వచ్చింది. జ్యోతిష్యంలో రాశి, హోర, ద్రేక్కాణం వంటి ఆరు వర్గ పట్టికలను షడ్వర్గం అంటారు. ఒక్కో పట్టిక జీవితంలో ఒక్కో కోణాన్ని చూపిస్తుంది. వేదాంతంలో శోక, మోహ, జర, మృత్యు, క్షుధ, పిపాసలనే షడూర్మి మానవ అస్తిత్వపు ఆరు అలలుగా వర్ణితమయ్యాయి.బౌద్ధంలో దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన, ప్రజ్ఞలనే ఆరు పారమితలు మోక్షమార్గం చూపిస్తే; సంసారంలో దేవతలు, మానవులు, అసురులు, జంతువులు, ప్రేతలు, నరకభోగులనే ఆరు గతులు జీవులకు నిర్దేశించబడ్డాయి. జైనంలో జీవ, పుద్గల, ధర్మ, అధర్మ, ఆకాశ, కాలమనే ఆరు ద్రవ్యాలు విశ్వాన్ని నిర్వచి స్తాయి. శ్వేతాంబరులు సామా యికం మొదలు ప్రత్యాఖ్యానం వరకు ఆరు నిత్యకర్తవ్యాలను (షడావశ్యకాలు) పాటిస్తారు.ఆరు రోజుల సృష్టితోరా, బైబిల్ల ప్రకారం సృష్టి ఆరు రోజుల్లో పూర్తయి, ఏడవ రోజు విశ్రాంతి జరిగిందని నమ్మకం. ఖురాన్ లో ఆరు రోజుల సృష్టి ప్రస్తావన ఏడు చోట్ల వస్తుంది, అయితే విశ్రాంతి భావన అందులో లేదు. ఇస్లాంలో విశ్వాసానికి అల్లా, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, తీర్పుదినం, దైవ నిర్ణయమనే ఆరు మూలసూత్రాలు (అర్కానుల్ ఈమాన్) పునాది. జొరాస్ట్రియనిజంలో అహురమజ్డా సృష్టించిన ఆరు అమేష స్పెంతాలు– పశువులు, అగ్ని, లోహాలు, భూమి, జలం, వృక్షాలకు అధిపతులుగా నిలిచాయి. చైనా తావో యిజంలో ఐ చింగ్ గ్రంథం ఆరు గీతల 64 హెక్సాగ్రాంలపై నిర్మిత మైంది. ప్రతి హెక్సాగ్రాం ఒక్కో జీవన పరిస్థితిని సూచిస్తుంది.గణితశాస్త్రంలో ఆరు ఒక పరిపూర్ణ అంకె (1+2+3=6, దాని భాజకాల మొత్తం దానికే సమానం), త్రిభుజ అంకె కూడా. అందుకే పురాతన గ్రీకు గణితవేత్తలు ఆరును విశేషంగా పరిగణించారు. ప్రకృతిలోనూ ఆరు భుజాల నిర్మాణం పదే పదే కనిపిస్తుంది: తేనెతుట్టెలు, మంచు పలకలు, బెంజీన్ రింగ్లోని కార్బన్ అణువులు, అగ్నిపర్వత లావా చల్లారి ఏర్పడే బసాల్ట్ శిలా స్తంభాలు (ఉదా: ఐర్లాండ్లోని జయింట్స్ కాజ్వే), అన్నీ షడ్భుజా కారాన్నే ఎంచుకుంటాయి. ఎందుకంటే తక్కువ పదార్థంతో అత్య ధిక స్థలాన్ని ఆవరించే, శక్తిని సమర్థవంతంగా పంచుకునే జ్యామి తీయ ఆకారం అదే.వేర్వేరు కాలాల్లో ఉద్భవించిన ఎన్నో వైరుధ్య సంప్రదాయా లలో ఆరు అంకెకు ఇంతటి ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చిందో చెప్పలేం. తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, గణితం, ప్రకృతి శాస్త్రం అన్నీ ఏకగ్రీవంగా ఈ ఒక్క అంకె చుట్టూ తిరగడం యాదృచ్ఛికమా, ఏదైనా తాత్త్విక సూత్రం దాగుందా? బహుశా ఆరుకే తెలుసు!- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
నాస్తికోద్యమ నిర్మాత
ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరు గుతూ ఉంది. దానితో విద్వే షాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తు డిగా కాకుండా స్వచ్ఛమైన నీతి మంతుడైన మానవుడిగా మిగు లుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చి నప్పుడు సోదరభావం దానంతట అదే వెళ్లి విరుస్తుంది. ప్రేమ, అప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!– అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) అలోచనలు.ఎవరీ గోరా? ఒరిస్సాలో పుట్టి(1902 నవంబర్ 15), కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచినవాడు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూను కుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స– ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యతా నివార ణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే– ప్రజల్లో కుల, మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.గోరా అనేకచోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధుర లోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కాలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడ య్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో ఆధ్యాప కుడిగా చేరారు. నాస్తిక కేంద్ర స్థాపన నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి... భార్యా పిల్ల లతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అను కున్నారు. ఆ ఆలో చనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు.సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కుల మతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదు నూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందు వయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయనదే! అప్పు డాయన వయసు 70 సంవత్సరాలు.భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న గోరా తుదిశ్వాస విడిచారు. ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భ వతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. రాహు–కేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూఉండేవారు.- డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు ‘గోరా’ వర్ధంతి) -
ధర్మేంద్ర ప్రధాన్ (మాజీ మంత్రి) రాయని డైరీ
రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్, దిగిపో...’’ అని సచివాలయం భవనం బీటలు వారేలా నేను నినాదాలిస్తున్నాను. ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ కర్టెన్ను కాస్త తొలగించి, కిటికీ అద్దంలోంచి కిందికి చూస్తూ ఏదో అడుగుతున్నారు. పక్కనున్నవారు ఆయన చెవిలో ఏదో చెబుతున్నారు. మరుక్షణం సీఎం కర్టెన్ మూసేశారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్ మొదలు పెట్టారు. నా ముఖం చిట్లిపోయింది. నా ఎముకలు సున్నం అయ్యాయి. నా వెంట ఉన్న విద్యార్థులకూ గాయాలయ్యాయి. అంతా రక్తం వోడుతున్నాం. అయినా మేము అక్కడి నుంచి కదల్లేదు. ‘‘ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి పట్నాయక్ తక్షణం రాజీనామా చేయాలి’’ అని విద్యార్థులందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నినాదాలు ఇస్తూనే ఉన్నాం. పోలీసులు మాపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంత జరుగుతున్నా పట్నాయక్ రాజీనామా చేయలేదు. ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని మాత్రం అన్నారు. నాడు నేను ఏ స్థానంలో నిలబడి పోరాడానో... నేడు అదే స్థానంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిలబడ్డారు. నాడు నేను ఏ అధికార పీఠాన్ని ప్రశ్నించానో... నేడు అదే పీఠంపై కూర్చొని ఉన్న నన్ను విద్యార్థులు ప్రశ్నించారు. కాలం ఎంత విచిత్రమైనది! నాలోని పాత విద్యార్థి నాయకుడు, నేటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఓడించాడు. నేను రాజీనామా చేశాను. జంతర్ మంతర్లో విద్యార్థుల ఆందోళన మొదలైనప్పటి నుంచీ– 36 రోజులుగా–నాడు పట్నాయక్ మాతో అనిన మాటే, నేనూ విద్యార్థులతో అంటూ వచ్చాను... ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని! కానీ, విద్యార్థులు వినలేదు. వినకపోవటంలో ఎప్పుడూ న్యాయమే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చి, వాటికి సమాధానాలు రాయమని ప్రభుత్వం విద్యార్థులను అడుగు తున్నప్పుడు, ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వమూ సరైన సమాధానాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం చెప్పింది. కానీ వారికి ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. జీరో మార్కులు వేశారు. గవర్నమెంట్ ఫెయిల్ అనేశారు! ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే...’’ అని పంతం పట్టారు. మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయటం తప్ప మరేమీ జరగదు. విద్యాశాఖ ప్రధాని కిందకు వెళుతుంది. లేదంటే, ఇంకో మంత్రికి అదనపు శాఖ అవుతుంది. కొత్త మంత్రిని తీసుకున్నా,ఆ మంత్రికి విద్యాశాఖ అర్థం కావటానికి సమయం పడుతుంది. అంతవరకూ విద్యాశాఖలో ఒక్క నిర్ణయమూ జరగదు. ఒక్క తీర్మానమూ కదలదు. ఒక్క అమలూ కుదరదు. విద్యార్థులకు ఏం న్యాయం జరిగినట్లు?! అయినప్పటికీ నేను రాజీనామా చేశాను. ఇది ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు చేసిన రాజీనామా కాదు. విద్యార్థుల డిమాండ్కు తలవొగ్గి చేసిన రాజీనామా కూడా కాదు. రాజీనామా చేయకపోతే, వారిని ఉసిగొల్పు తున్న చేతుల్లోనే వారి భవిష్యత్తును ఉంచి నట్లౌతుందన్న ఆందోళనతో చేసిన రాజీనామా!ఇదేమీ త్యాగం కాదు, ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు నమ్మకం కలిగించటం. ఇదేమీ ఓటమి కాదు, విద్యార్థుల ఆవేదనను గౌరవించటం. చేతిలోని పెన్నును పక్కన పెట్టి, కుర్చీలోంచి నేను లేస్తున్నప్పుడు నాలో తెలియని ప్రశాంతత! ఇప్పుడిక నేను మంత్రిని కాకపోవచ్చు... కానీ, మళ్లీ నా పాత రోజుల్లోకి వెళ్లి, విద్యార్థుల పక్షాన నిలబడ్డానన్న తృప్తిని మిగుల్చుకున్న ఒక విద్యార్థి నాయకుడిని! -
సముద్రాలకు రక్షణ సైన్యం
కోస్తా తీరప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, అరుదైప వృక్షాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. చాలామందికి మడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే కొన్ని చెట్లు మాత్రమే. కానీ అవి కేవలం చెట్లు కావు. అవి ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. సముద్రం, నదులు, నేల, చేపలు, పక్షులు, మనుషులు... ఇవన్నింటినీ ఒకే దారంతో కలిపే ప్రకృతి వలయం.సముద్రపు ఉప్పునీటిలోనూ మనగలిగే ఈ అడవులు లేకపోతే తీరప్రాంత మత్స్య సంపదలో గణనీయమైన భాగం ఉండదు. అనేక చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ప్రారంభించేది ఈ మడ అడవుల్లోనే. అందుకే మడ అడవులను శాస్త్రవేత్తలు ‘సముద్రా నికి నర్సరీ’ అని పిలుస్తారు. మడ అడవుల వేర్లు సముద్ర అలల వేగాన్ని తగ్గిస్తాయి. మట్టిని నిలబెడతాయి. తుఫాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.1977 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ను తాకిన దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రకృతి విపత్తుల్లో ఒకటి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. సముద్రంతో యుద్ధం చేయడం కాదు... దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆ రోజు ప్రకృతి ఒక కఠినమైన పాఠం నేర్పింది. మడ అడవులను కాపాడటం ద్వారా ఇటువంటి విపత్తులను కాపాడవచ్చు.‘సముద్రాన్ని ఆపేశాము’!ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మడ మొక్కలను పెంచడం, చేపల పెంప కాన్ని మడ అడవులతో అనుసంధానం చేయడం, ఉప్పునీటిలో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు పర్యా వరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధిని కూడా బలోపేతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో కొన్ని గ్రామాలను సముద్రం మింగేస్తోంది. అయితే ‘మా ఊరికి రాకుండా సముద్రాన్ని ఆపేశాము’ అంటారు కృష్ణా జిల్లా తీరప్రాంత గ్రామం బసవాని పాలెంకు చెందిన పద్మ. సముద్ర నీటి మట్టం పెరిగినపుడల్లా తీరప్రాంతం కోతకు గురయ్యేది. ఎం.ఎస్. స్వామినా«థన్ ఫౌండేషన్ సహకారంతో ఎస్జీహెచ్ మహిళలు దశాబ్దం క్రితం నాగాయి లంక, బసవవాని పాలెంలో 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటారు. ఇపుడు అవి అడవిగా మారి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా మారాయి.వీరి కృషి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రకృతిని కాపాడితే... ప్రకృతి మనిషిని కాపాడుతుంది. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు. మడ అడవులను కాపాడటం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇది పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్యకారులు, రైతులు కలిసి చేయాల్సిన పని.ప్రతి జిల్లాలో మడ అడవుల మ్యాపింగ్ జరగాలి. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలి. తీరప్రాంత గ్రామాల యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. సముద్రాన్ని మనం ఆపలేము. తుఫాన్లను కూడా ఆపలేము. కానీ వాటి విధ్వంసాన్ని తగ్గించే సహజ రక్షణ కవచాన్ని మాత్రం కాపాడగలం.– శ్యాం మోహన్, సీనియర్ జర్నలిస్ట్ (రేపు ప్రపంచ మడ అడవుల దినోత్సవం) -
యుగానుకూల మాతృత్వ శక్తి..
ప్రకృతిలో మాతృత్వం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తరతరాలకు అందాలంటే ఆ బాధ్యతను మోసేది మాతృశక్తే. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయ కుండా, దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ‘విశ్వ మాంగళ్య సభ’ కృషి చేస్తోంది.2010లో స్థాపితమైన విశ్వ మాంగళ్య సభ, ఒక సామాజిక ఉద్యమంగా, సాంస్కృతిక పునరు జ్జీవన వేదికగా రూపాంతరం చెందింది. సంస్కార్ (విలువలు), సామర్థ్యం (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపది కన ఈ సంస్థ పనిచేస్తోంది. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న భారతీయ విలువలను, కుటుంబ వ్యవస్థలోని సౌందర్యాన్ని తిరిగి నిల బెట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం అయితే, మొదటి గురువు తల్లి. ఈ భావనతోనే, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి, విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మా ణంలో వారిని భాగస్వామ్యం చేస్తోంది.ఒక మహిళ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక వ్యవస్థ. మహిళ విద్యా వంతురాలైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. మహిళ ఆలోచిస్తే ఒక సమాజం బాగుపడుతుంది. అదే మహిళ నాయకత్వం వహిస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడతాయో అవగాహన కల్పిస్తూ, మహిళలను శక్తిమంతం చేయడం ద్వారానే మనం ‘విశ్వమాంగ ళ్యాన్ని’ (ప్రపంచ శ్రేయస్సును) సాకారం చేయగమని ఈ సభ నమ్ముతోంది.నేటి మహిళ, విజ్ఞాన శాస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటూనే, సంస్కారాన్ని కవచంగా ధరించాలి. భారతీయ విలువల పునాదులను పటిష్ట పరచి వాటిపై ఆధునిక ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. మాతృశక్తి మేల్కొన్న సమాజానికి ఓటమి లేదు; అది ఎప్పుడూ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ యుగానుకూల మాతృత్వ శక్తితోనే ఉత్తమ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ఆ పై ఉన్నత నవభారత నిర్మాణం సాధ్యమవుతాయి.– డా. సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ (రేపు హైదరాబాద్లో విశ్వ మాంగళ్య సభ సమావేశం సందర్భంగా...) -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
గల్ఫ్లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్కు మద్దతునిచ్చే యెమెన్లోని హౌతీలు బాబెల్ మాండెబ్ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నేటి యువత చూపుతున్న నైతిక శక్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్ నారాయణ్) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్ మంతర్ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.సత్యాగ్రహ శక్తిసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్ మంతర్ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.ధర్మబద్ధమైన కార్యాచరణ‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్ నుంచి అంబేడ్కర్ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.పూర్తికాని స్వాతంత్య్ర పోరాటంభారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్ మంతర్లో యువత గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!డా‘‘ రఘు చలిగంటివ్యాసకర్త ఫ్రౌన్హోఫర్ హెచ్హెచ్ఐ (జర్మనీ)సీనియర్ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ’ వ్యవస్థాపకుడు -
నంబర్ వన్ నుంచి ‘పదిలో ఒకటి’కి!
పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు ఒక రాష్ట్రం వైపు అడుగులు వేసేముందు మొట్టమొదట పరిశీలించేది అక్కడి ప్రభుత్వ విధానాలు తమను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్నాయా అన్నదే. దానికి దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన కొలబద్ద ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగులు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా ర్యాంకులను చూస్తే ఆందోళన కలగకమానదు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ర్యాంకుల్లో ఏపీ సాధించిన ఫలితాలు ఇప్పటికీ రికార్డులుగానే నిలిచి ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 5న డీపీఐఐటీ ప్రకటించిన ఫలితాల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 జూన్ 30న ప్రకటించిన బీఆర్ఏపీ–2020 ఫలితాల్లో ‘టాప్ అచీవర్స్’ హోదా పొందిన 7 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడమే కాదు, 97.89 శాతం స్కోరుతో దేశం లోనే అత్యధిక స్కోరు సాధించి గుజరాత్(97.77 శాతం) కంటే ముందు నిలిచింది. మరో విశేషం ఏంటంటే, 2024 సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన తొలి ‘ఉద్యోగ్ సమాగమ్’ వేదికపై డీపీఐఐటీ వెల్లడించిన బీఆర్ఏపీ ఫలితాల్లో దేశం మొత్తం మీద ‘టాప్ పెర్ఫార్మర్’ హోదా దక్కింది మూడంటే మూడు రాష్ట్రాలకే. అవి కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆ మదింపు నకు ప్రాతిపదిక జగన్ ప్రభుత్వ 2022–23 నాటి సంస్కరణల అమలు.2025 నవంబర్లో జరిగిన రెండో ‘ఉద్యోగ్ సమాగమ్’లో డీపీఐఐటీ ప్రకటించిన బీఆర్ఏపీ–2024 ఫలితాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఐదు సంస్కరణ రంగాల్లో ‘టాప్ అచీవర్’ గుర్తింపును ఉత్తరాఖండ్, పంజాబ్ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ నాలుగు రంగాల గుర్తింపుతో పది రాష్ట్రాల గుంపులో ఒకటిగా మిగిలిపోయింది. ‘ఫాస్ట్ మూవర్స్’ జాబితాలో ఏపీ పేరు ఒడిశా, పంజాబ్ తర్వాతే వినిపించింది. ఈ నెల 17న నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ ఆ దృశ్యాన్ని మరింత స్పష్టం చేసింది. పెట్టుబడులకు అనుకూలమైన దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం ఆరు. దేశంలోని అన్ని రాష్ట్రాల లెక్కన ఎనిమిదో స్థానం.‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటూ ప్రస్తుత ప్రభుత్వం వినిపిస్తున్న నినాదాలు, దావోస్ వేదికలపై ప్రకటనలు, లక్షల కోట్ల ఒప్పందాల హోరు వార్తా శీర్షికలకే పరిమితమవుతున్నాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకొనే ముందు పారిశ్రామికవేత్తలు పరిశీలించేది డీపీఐఐటీ, నీతి ఆయోగ్ వంటి సంస్థల తటస్థ గణాంకాలనే తప్ప ప్రచార ఆర్భాటాలను కాదు. ర్యాంకుల భాషను పెట్టుబడిదారులు ఎప్పుడో చదివేశారు; చదవాల్సింది ఏపీ పాలకులే.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
చెరువులెవరివి? లాభాలెవరికి?
పురాతన కాలం నుంచి ఉన్న వేలాది చెరువులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనానికి మూలస్తంభాలు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 24,189 చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 5,72,167 ఎకరాలకు పైగా విస్తీ ర్ణంలో చెరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 27 లక్షల మంది జీవనం సాగిస్తు న్నారు. అలాగే 4,500కు పైగా మత్స్యకార సహకార సంఘాలు నమోదై ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగం గణనీయంగా విస్తరించింది. 2014– 15లో సుమారు 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ప్రస్తుతం 4.5 లక్షల టన్నులకు పైగా పెరిగింది. అయినా మత్స్యకార కుటుంబాల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు లేదు. అప్పులు, అస్థిర ఉపాధి, మధ్యవర్తుల దోపిడీ, తక్కువ ఆదాయం వారిని వెంటాడుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం చెరువుల చేపల పెంపకం హక్కులు నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు ఇవ్వాలి. ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మధ్యవర్తులను తొలగించి ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు నిజమైన మత్స్యకారులకు చేరేలా చేయడం.కానీ నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల పేరుతో లీజుకు తీసుకున్న చెరువులను గోప్యంగా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు, దళా రులకు సబ్ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా అసలు మత్స్యకారులు తమ సొంత చెరువుల్లోనే కూలీలుగా మారిపోతున్నారు. చేపల మార్కెట్లో ప్రస్తుతం రోహు, కట్ల వంటి సాధారణ చేపల ధరలు అనేక పట్టణాల్లో కిలోకు రూ. 180 నుంచి రూ. 250 వరకు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల చేపలు రూ. 300 నుంచి రూ. 500 వరకు విక్రయమవుతున్నాయి. చెరువుల వద్ద మత్స్యకారు లకు లభిస్తున్న ధరలు దీనికంటే చాలా తక్కువ. ఉత్పత్తి ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మధ్యవర్తులు మింగేస్తున్నారు.మత్స్యకార సహకార సంఘాలకు అనేక చోట్ల ఎన్నికలు ఏళ్ల తరబడి జర గడం లేదు. సభ్యులకు లీజు వివరాలు తెలియడం లేదు. ఆదాయం–ఖర్చుల లెక్కలు బహిర్గతం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారులే బినామీ పేర్లతో కాంట్రాక్టు వ్యవస్థలో భాగమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల లీజులపై సమగ్ర సామాజిక తనిఖీ జరగాలి. చేపల కొనుగోలు, మార్కెటింగ్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష మార్కెట్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలి. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ కేంద్రాలు మత్స్యకార సంఘాల ఆధీనంలో ఉండాలి. లాభాలు నిజమైన మత్స్యకారునికి చేరాలి.– మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ కార్యదర్శి -
మాయాబజార్లో ఓటర్ల దేవులాట
‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకునే ‘మాయాబజార్’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి నిజానికి ‘శశిరేఖా పరిణయం’ అని ఉండాలి. కానీ ప్రపంచం మాయాబజార్ గానే గుర్తుంచుకుంది. ఎందుకంటే ఆ కథలో మాయ, వ్యూహం, వేషధారణ, భ్రమ – అన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరు నిజం? ఎవరు మాయ? అనే సందేహమే కథకు ప్రాణం. నేటి ఓటరు జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియను గమనిస్తే కూడా ఇటువంటి సందేహాలే తలెత్తుతున్నాయి. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియలో పారదర్శకత కనిపించకపోతే, అది ‘మాయాబజార్’లా అనిపించడం సహజం.మాయాబజార్లో ‘సత్యపీఠం’ ఉంటుంది. దానిపై కూర్చుంటే అసత్యం బయటపడుతుందని భావిస్తారు. కానీ వాస్తవ జీవితంలో రాజ్యాంగ పదవులు చేపట్టే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు– అందరూ సత్యనిష్ఠతో పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. అయినప్పటికీ, వారి నిజాయితీని నిరూపించేందుకు అటువంటి ‘సత్యపీఠం’ లేదు. భారత సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ (2010) కేసులో పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రశ్న ఏమిటంటే, పౌరుడి విషయంలో రాజ్యాంగం అంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఓటరును మాత్రం మళ్లీ మళ్లీ తన ఉనికిని నిరూపించమని అడగడం ఎంత వరకు సమంజసం?ఓటరు ఎవరు?ఎన్నికల సంఘం చెబుతున్నది ఒకటే: ఫారం నింపండి, పత్రాలు ఇవ్వండి, వివరాలు సమర్పించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక్కటే: ‘నేను ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. నా పేరు ఇప్పటికే ఓటరు జాబితాలో ఉంది. మళ్లీ నేను ఎవరో ఎందుకు నిరూపించాలి?’ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. 2002లో జరిగిన ప్రత్యేక సవరణ తరువాత అనేక ఎన్నికలు జరిగాయి. అదే జాబితాల ఆధారంగా లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు వేశారు. అప్పుడు చెల్లుబాటైన ఓటరు ఇప్పుడు అకస్మాత్తుగా సందేహా స్పదుడిగా ఏ విధంగా మారాడు?ఎన్నికల జాబితా రూపొందించడం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించడం, ఫారాలు అందించడం, సందేహాలు నివృత్తి చేయడం బూత్ లెవల్ అధికారుల విధి. కానీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో వేలాది మందికి ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల బీఎల్వోలు కాలనీల్లో కూర్చొని వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఫారం అందకపోయినా బాధ్యత ఓటరుపైనే వేయడం న్యాయమా?జూలై మధ్య నాటికి సుమారు 1.66 కోట్ల తెలంగాణ ఓటర్లలో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే ఫారాలు సమర్పించారని అధికారిక సమాచారం చెబుతోంది. అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఫారం అందలేదా? సమయం సరిపోలేదా? లేక ప్రక్రియపై సరైన అవగాహన కల్పించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా గడువులు పొడిగించడం ప్రజల సందేహాలను తగ్గించదు.డిజిటలైజేషన్ ఎందుకు?డిజిటల్ ఇండియా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆధార్, ఓటర్ ఐడీ, జనన–మరణ నమోదు, చిరునామా రికార్డులు, ప్రభుత్వం వద్ద ఇప్పటికే విస్తృత సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని సమన్వయం చేయకుండా, ప్రతి ఓటరునూ మళ్లీ పత్రాలతో రావాలని అడగడం పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ వ్యవస్థ పౌరుడికి సౌలభ్యం కలిగించాలా? లేక అతనిపై కొత్త భారం మోపాలా?ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది నమోదులు పరిశీలనకు వస్తే, ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వివరాలు వెల్లడించడం అత్యవసరం. ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర సంస్థ. దాని నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి, అనుమానాలను కాదు. పౌరుడు ఎన్నికల సంఘాన్ని నమ్మాలి, ఎన్నికల సంఘం కూడా పౌరుడిని నమ్మాలి. ఈ పరస్పర విశ్వాసమే ప్రజాస్వామ్యానికి మూలాధారం.మాయాబజార్ సినిమాలో చివరికి మాయ తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. అందుకే ఆ కథ సుఖాంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా అదే జరగాలి. ఎన్నికల ప్రక్రియలో మాయకు, సందేహాలకు, అపార్థాలకు చోటు ఉండకూడదు. ‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎన్నికల సంఘం విశ్వసనీయతకు కూడా పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించేది గణాంకాలు కాదు; పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల విశ్వాసం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన ‘సత్యపీఠం’.- మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం
మానవాళి ఆరోగ్య సంరక్షణ చరిత్రను పరిశీలిస్తే ప్రకృతే తొలి వైద్యశాలగా నిలిచిందని స్పష్టమవుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నాటు వైద్య విధానాలు మనుషులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తూ వచ్చాయి. 1950వ దశాబ్దానికి పూర్వం వరకు మానవ మనుగడ ప్రధానంగా ఈ సహజ మూలికా వైద్యంపైనే ఆధారపడి సాగింది. ఆధునిక వైద్యంలో అత్యంత కీలకమైన మోర్ఫిన్, కొకైన్, క్వినైన్, ఆస్పిరిన్ వంటి అనేక ఔషధాల ఆవిష్కరణకు ప్రకృతిసిద్ధమైన వృక్ష సంపదే మూలధారంగా నిలిచింది. అయితే, నేటి మారుతున్న జీవనశైలి కారణంగా హృద్రో గాలు, మధుమేహం, కాన్సర్, ఊబకాయం వంటి తీవ్రమైన రుగ్మతలు మానవాళికి సవాలుగా మారాయి. వీటి నివారణకు ప్రాచీన మూలికా విజ్ఞానాన్ని ఆధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించటం ఆవశ్యకంగా మారింది.ఔషధ ఆవిష్కరణలో నూతన శకంమన దేశంలో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానానికి అపారమైన ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ, శతావరి, నేలవేము, తులసి, గుడుచి, త్రిఫల వంటి ఎన్నో శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంపొందించటంలోనూ, అనేక రుగ్మతల నివారణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే, ఈ సంప్రదాయ మూలికా వైద్యంలో ఉన్న క్రియాశీల రసాయన ఘటకాలను (యాక్టివ్ ప్రిన్సిపుల్స్) వేరుచేసి, వాటి ప్రామాణీకరణను ఆధునిక రసాయనిక, జీవశాస్త్ర పద్ధతుల ద్వారా నిర్ధారించవలసిన అవసరం ఉంది. సంప్రదాయ వైద్యం కేవలం అనుభవపూర్వక నమ్మకంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజారోగ్య వ్యవస్థలో భాగం కావాలంటే శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత రుజువులు (సైంటిఫిక్ రిగర్) చాలా ముఖ్యం.నూతన ఔషధాల అన్వేషణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొనటానికి సాధారణంగా దశాబ్దాల సమయం, భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతాయి. కానీ, ఏఐ సాంకేతికత సహాయంతో కోట్లాది రసాయన నిర్మాణాలను చాలా తక్కువ సమయంలోనే వర్చువల్ స్క్రీనింగ్ చేయవచ్చు. ఇవి లక్ష్యిత వ్యాధి కణాలపై ఎలా పనిచేస్తాయి? ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయి? వాటి వల్ల ఏవైనా విషపూరిత పరిణామాలు ఎదురవుతాయా? అనే అంశాలను ఏఐ ద్వారా ముందే ఊహించడానికి అవకాశముంది. ప్రాచీన మూలికా సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ఏఐ డేటాబేసులతో అనుసంధానించటం ద్వారా పరిశోధన వేగాన్ని పెంచవచ్చు.ఏఐ నిర్ణేత కాదు, పరికరం మాత్రమే!ఏఐ ఎంత శక్తిమంతమైనదైనప్పటికీ, అది మైక్రోస్కోప్ లేదా స్పెక్ట్రోమీటర్ లాంటి ఒక పరిశోధనా సాధనం మాత్రమే తప్ప స్వయంభూ నిర్ణేత కాదు. ఏఐ కోట్లాది రసాయన నమూనాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ అది సత్యానికి ప్రమాణం లేదా శాస్త్రీయ నిజం కాదు. ఏఐ ఇచ్చే అంచనాలలో ‘ఫాల్స్ పాజిటివ్స్’, ‘ఫాల్స్ నెగె టివ్స్’, తప్పుడు ఊహలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏఐకి మానవ భావోద్వేగాలు, జీవశాస్త్ర పద్ధతుల వెనుక ఉన్న నిజమైన కారణాలు లేదా ప్రయోగశాల ప్రత్యక్ష అనుభవం ఉండవు. పెన్సిలిన్, టాక్సాల్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు... అనుకోకుండా, మానవ సృజనాత్మక పరిశీలన వల్లనే సాధ్యపడ్డాయి. కాబట్టి, ఏఐ ఆలోచనను భర్తీ చేయలేదు, కేవలం శాస్త్రవేత్త ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తుంది. ఔషధ నాణ్యత, క్లినికల్ భద్రత, తుది నిర్ణయం ఎప్పుడూ మానవ మేధస్సు, శాస్త్రీయ విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. సంప్రదాయం, శాస్త్రీయతల సమతుల్యతఏఐ నమూనాల (ప్యాటర్న్స్)ను గుర్తిస్తుంది. కానీ శాస్త్రానికి కారణ–ఫలిత సంబంధం (కాజేషన్), జీవశాస్త్రపరమైన సమర్థత (బయలాజికల్ ప్లాసిబిలిటీ) అవసరం. వివరణ లేకుండా చేసే అంచనాలు బలహీనమైన శాస్త్రాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఏఐ పట్ల శాస్త్రీయ సందేహ దృష్టి (సైంటిఫిక్ స్కెప్టిసిజమ్), విమర్శనాత్మక శాస్త్రీయ ఆలోచన (సైంటిఫిక్ రీజనింగ్) సమాజ అభ్యున్నతికి అత్యంత అవసరం. కాబట్టి, భవిష్యత్తు ‘మనిషి వర్సెస్ ఏఐ’ కాదు, ‘మనిషి + ఏఐ’ అనే సహకార దృక్పథమే వాస్తవం. ఏఐ మన జిజ్ఞాసను విస్తరించాలి, దాన్ని భర్తీ చేయకూడదు. అందువల్ల, ఇదీ భవిష్యత్తు విజయసూత్రం: ఏఐ+సాంప్రదాయ జ్ఞానం+కఠినమైన ప్రయోగాత్మక పరిశోధన+ విమర్శనాత్మక ఆలోచన= సమాజ పురోగతి, మానవ సంక్షేమం. భారతదేశానికి ఉన్న అపారమైన ప్రాచీన వైద్య సంపదను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మేళనం చేయటమే నేటి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఏఐ అందించే విశ్లేషణలను గుడ్డిగా నమ్మ కుండా, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగశాల నిర్ధారణల ద్వారా పరిశీలించాలి. ఆయుర్వేద ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థతలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించినప్పుడే భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రపంచస్థాయిలో సముచిత స్థానం లభిస్తుంది. ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచినప్పటికీ, మానవ మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మాత్రమే నిజమైన ఆరోగ్య విప్లవానికి బాటలు వేస్తాయి. – డా‘‘ కె. నాగయ్య : విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, ప్రాకృతిక ఉత్పత్తులు–ఔషధ రసాయన శాస్త్ర విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ), హైదరాబాద్;– ఫణిరాజ్ జి : ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
మేధో వలసలను ఇస్రో ఆపేదెలా?
అంతరిక్ష రంగం ఈమధ్య సముచిత, అనుచిత కారణాలు రెండింటితోనూ వార్తలకెక్కుతోంది. స్కైరూట్ అనే భారతీయ ప్రైవేటు స్పేస్ కంపెనీ తానే అన్నీ అయి చూసుకున్న ఒక అంతరిక్ష ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఆ కంపెనీని నెల కొల్పారు. ఈ కంపెనీ విక్రమ్–1 రాకెట్ను ప్రయోగించి తన సత్తా చాటుకుంది. ఇదే తరహా రాకెట్ను మరింత ఉన్నతపరచి విక్రమ్–2 పేరుతో వచ్చే ఏడాది ప్రయోగించాలని భావిస్తోంది. తక్కువ ఎత్తులోనున్న భూకక్ష్య (ఎల్.ఇ.ఓ.)లో ఉపగ్రహాలను నిలిపే కోట్లాది డాలర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని స్కైరూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు ఆకర్షణీయంమరోపక్క ఇస్రో నుంచి టాప్ సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద యెత్తున వైదొలగుతున్నారనే వార్త గుబులు పుట్టిస్తోంది. యు.ఆర్. రావు స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఇతర కీలక విభాగాల్లో పనిచేస్తున్న డజన్లకొద్దీ సీనియర్ సైంటిస్టులు రాజీనామా చేయడమో లేదా ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడమో చేశారని వార్తలు సూచిస్తున్నాయి. వారిలో చాలామంది భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గగన్యాన్ (మానవుడిని స్పయంగా అంతరిక్షంలోకి పంపడం), తదుపరి తరం వాహక నౌక (ఎన్జీఎల్వీ), భారతీయ అంతరిక్ష స్టేషన్ (బ్యాస్) వంటి ప్రముఖ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఈ వలస ఎంత ఆందోళనకరంగా పరిణమించిందంటే, అలాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు వాటిలో పనిచేస్తున్నవారు సంస్థను విడిచి వెళ్ళడానికి వీలులేకుండా అంతరిక్ష శాఖ ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది. ఈ రెండు పరిణామాలు– మొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగం, ఇస్రోకు ఉద్యోగులు వీడ్కోలు పలకడం– పైకి ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ, అవి పరస్పరం ముడిపడి ఉన్నవని గ్రహించాలి. ఇస్రో యూనిట్ల నుంచి ఉద్యోగులు రాజీనామాలు చేయడానికి ప్రధాన కారణం, గత కొద్ది ఏళ్ళలో ప్రైవేట్ రంగ స్పేస్ కంపెనీలు కనబరుస్తున్న ఎదుగుదలేనని స్పష్టమవుతోంది. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగానికి ఇస్రో సదుపాయాలను వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం అను మతించింది. ఇస్రోలో పనిచేస్తున్న ప్రతిభావంతులైనవారిని తమ వైపు లాక్కునేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఇది అనువైన వాతావర ణాన్ని కల్పించింది. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేటుకు ఇలా ప్రతిభావంతులు తరలిపోవడం ఇస్రోకు ఇది కొత్తా కాదు, అంతరిక్ష రంగానికి మాత్రమే పరిమితమైన ధోరణి అంతకన్నా కాదు. అమెరికాలో కూడా ప్రైవేట్ అంతరిక్ష రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తీర్చిదిద్ది, అభివృద్ధి చేసిన మానవ వనరులే అక్కడి ప్రైవేట్ రంగానికి ప్రధాన ఆలంబన. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ కూడా మొగ్గ తొడుగుతున్న దశలో ఆ రంగానికి చెందిన ప్రైవేట్ సంస్థలు తమ పరిశోధన–అభివృద్ధి విభాగాలలోకి ఈసీఐఎల్, సీఎంసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల నుంచే సిబ్బందిని తీసుకున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలోనూ అదే జరిగింది. డీఆర్డీఓ ల్యాబొరేటరీలలో కూడా ఇస్రో తరహా పరిస్థితే నెలకొంది. రక్షణ, ఏరోస్పేస్ పరికరాల ఉత్పత్తిలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించిన ఫలితమే ఇది. అందని నిధులు– అందితే కోతలుఇస్రో, డీఆర్డీఓ వంటి మన వైజ్ఞానిక సంస్థలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణాలను నిశితంగా అన్వేషించుకోవాలి. ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లలో 2,800లకు పైగా ఖాళీలున్నాయనీ, మంజూరైనవి సుమారు 1800 పోస్టులు మాత్రమేననీ అంతరిక్ష శాఖ పనితీరును అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీకి 2026 మార్చిలో వెల్లడించారు. ఎన్జీఎల్వీ తయారు చేసే ముఖ్య పనిలో ఉన్న విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో దాదాపు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు అనుభవజ్ఞులైన సైంటిస్టులను ఎరవేసి పట్టుకుంటున్నాయి. మరోవైపు, ఇస్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. ఉదాహరణకు, ఎన్జీఎల్వీని నిర్మించి, ప్రయోగించే ప్రాజెక్టునకు 96 నెలల సమయమిస్తూ క్యాబినెట్ 2024లో ఆమోదం తెలిపింది. ఆమోదించిన తేదీ నుంచి 84 నెలల లోపల మొదటి పరీక్షకు వాహక నౌకను సిద్ధం చేయాలని కూడా ఆదేశించింది. కానీ, 2024–25 బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏమీ లేకపోవడం వల్ల ఆమోదం పొందిన అనేక నెలల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కాగితాలకు మాత్రమే పరిమితమైంది. సవరించిన అంచనాలలో నామ మాత్రంగా రూ. 3 కోట్లు కేటాయిస్తే, దానిలో ఇస్రో రూ. 85 లక్షలను మాత్రమే వెచ్చించగలిగింది. 2025–26 బడ్జెట్లో రూ. 158 కోట్లు కేటాయించారుగానీ, సవరించిన అంచనాల దగ్గరకొచ్చేసరికి దాన్ని రూ. 39.76 కోట్లకు తగ్గించారు. ఇందులో ఇస్రో 2026 జన వరి 31 వరకు రూ. 7.93 కోట్లను మాత్రమే వెచ్చించగలిగింది.వ్యయంలో నత్తనడక, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను తగ్గిస్తూపోవడం, ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం, ప్రైవేట్ రంగ ప్రవేశం వంటివన్నీ ఇస్రోలో నేటి స్థితికి కారణమయ్యాయి. వీటన్నింటికి తోడు ఇస్రోకు నమ్మిన బంటుగా పనిచేస్తూ వచ్చిన పీఎస్ఎల్వీ వరుసగా వైఫల్యాలను చవిచూసింది. నిర్ణాయక వ్యవస్థ కేంద్రీకృతం కావడం, అధికారుల, రాజకీయ జోక్యం పెరగడం వంటివి భారీ ప్రాజెక్టులను తలకెత్తుకున్న సైంటిఫిక్ ఏజెన్సీ పని తీరుకు మేలు చేయవు. మారాల్సిన విధానాలుసైంటిస్టులను రాజీనామా చేయవద్దని కోరడం, వారు వైదొలగకుండా అడ్డు పెట్టడం సరైన స్పందన అనిపించుకోదు. ప్రైవేట్ రంగ ప్రవేశానికి ప్రోద్బలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దానికి వీలు కల్పించిన ఇస్రో తమ వైఖరి పర్యవసానాన్ని, అది జాతీయ కార్యక్రమాలపై చూపగల ప్రభావాన్ని ముందే ఊహించి ఉండాల్సింది. దాంతోపాటు, మిషన్ వైఫల్యాలు, జాప్యాల ఫలితంగా నీరసపడ్డ సైంటిస్టులలో స్థైర్యాన్ని పెంపొందించే చర్యలను ఇస్రో నాయకత్వం చేపట్టాలి. ఇస్రో దీర్ఘకాలంలో చేపట్టవలసిన సరికొత్త యంత్రాంగాలపై యోచించాలి. ఉదాహరణకు, సిబ్బంది ఇస్రోలో తమ ఉద్యోగాలను నిలబెట్టుకుంటూనే ఒక పరిమిత కాలానికి ప్రైవేట్ రంగంలో పని చేసేందుకు అనుమతించవచ్చు. కీలకేతర రంగాల్లో సొంత కంపెనీలను స్థాపించుకునేందుకు అంగీకరించవచ్చు. వీటికి తోడుగా, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, ప్రమోషన్ల విధానాలను సవరించు కోవాలి. ప్రభుత్వం తన వంతుగా వైజ్ఞానిక సంస్థల ప్రతిపత్తిని పున రుద్ధరించాలి. స్పేస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతోంది. దాన్ని వినియోగించుకునేందుకు జాతీయ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు కూడా కావలసినంత అవకాశం ఉంది. బ్రెయిన్ డ్రెయిన్ను బ్రెయిన్ సర్క్యులేషన్గా మలచుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మన్యం నుంచి పార్లమెంటు దాకా...
అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగిన మన్యం పితూరీలో ఆయనకు ప్రధాన అనుచరులుగా గాం గంటందొర, గాం మల్లుదొర పేరెన్నిక గన్నారు. వీరు గిరిజనులలో భగత తెగకు చెందినవారు. ఇందులో మల్లు దొర స్వాతంత్య్రానంతరం పార్లమెంటుకూ ఎన్నిక య్యాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి తాలూకాలోని కొయ్యూరు మండలం ‘బట్టపనుకులు’ గ్రామంలో 1900లో జన్మించాడు.గంటందొర చిన్న తమ్ముడు మల్లుదొర. బ్రిటిష్ తాబేదారుల అక్రమ చర్యలను గాం సోదరులు ప్రతిఘటించారు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడనే నేపంతో చింతపల్లి తాసిల్దార్ సెబాస్టియన్ గంటందొరను మునసబు పదవి నుంచి తొలగించాడు. అంతేగాదు, గంటందొర భూమితో పాటు మరికొందరి ఆదివాసుల భూములను ప్రభుత్వపరం చేశాడు. గాం సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మన్యం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు తెలియుజేశారు.సీతారామరాజు 1922లో మన్యం పోరాటాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను అంత మొందించడానికి 150 మంది సైనికులను సేకరించ డంలో గాం సోదరుల కృషి చెప్పుకోదగినది. వీరికి భగత తెగ గిరిజనులైన సింగన్న, పడాలు, గోవిందు, వీరయ్య దొర, గోకేరు ఎర్రేసు, అగ్గిదొర వంటి వారి సహకారం తోడైంది. సీతారామరాజు నాయకత్వంలో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చిన వారికి 10 వేలు, గంటందొర, మల్లుదొరలను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల పారితోషికం ప్రకటించింది.ఉద్యమంలో కాస్త చురుకుదనం కోల్పోయిన సందర్భంలో ఆయుధాలను అల్లూరి సైన్యానికి అప్పగించి మల్లుదొర దళాన్ని విడిచి వెళ్లాడు. 1923 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం చేరుకున్నాడు. ఒక రహస్య ప్రదేశంలో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. అల్లూరి ఆచూకీ తెలుప మని మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఏమీ చెప్పలేదు. 1924 మే 7న పట్టు బడిన అల్లూరి వీరమరణం పొందాడు. వాల్తేరు ఏజెన్సీ న్యాయమూర్తి మల్లు దొరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షణను ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1937లో అండమాన్ జైలు నుంచి విడుదౖలñ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గెలుపొంది ఆదివాసీలలో తొలి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. 1969 జూలై 21న తుదిశ్వాస విడిచారు.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు -
సంపద... సామాజిక బాధ్యత!
కంపెనీల రూపంలో వ్యాపారం నిర్వహించడం 1600 సంవత్సరంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో ప్రారంభమైనదని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సాధారణంగా సొంత యాజమాన్యంలో లేక భాగస్వామ్యంలో వ్యాపారాలు నిర్వ హిస్తుంటారు. పెద్ద ఎత్తులో వ్యాపారాలు నిర్వ హించాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ‘కంపెనీ’ రూపంలో వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. 19వ శతాబ్దం మధ్య నుంచి కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీల సంఖ్య దాదాపు 28 లక్షలు.ఎప్పుడైతే కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించడం మొదలైందో, అప్పుడే వాటి సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబి లిటీ–సీఎస్ఆర్) గురించి కూడా చర్చమొదలైంది. హోవార్డ్ బోవెన్ 1953లో మొదటిసారిగా, ‘కార్పొ రేట్ల సామాజిక బాధ్యత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సామాజిక విలువలకు అనుగుణంగా కంపె నీల నిర్ణయాలు, పాలసీలు ఉండాలనీ, సమాజ అభివృద్ధికి ఆర్థికంగా సహాయపడాలనీ ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మ్యాన్ మాత్రం చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించి, కంపెనీలను లాభాల బాట పట్టించడం, కంపెనీ వాటాదారుల సంపద పెంచడం మాత్రమే ‘కార్పొరేట్ల సామాజిక బాధ్యత’ అని వాదించారు.కంపెనీలు సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తే, ఆదాయపు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రపంచ దేశాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి, కంపెనీ చట్టం–2013 లోని సెక్షన్ 135 ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం కంపెనీలకు తప్పనిసరి చేసింది. చట్టంలో పొందుపరచిన సామాజిక బాధ్యతలను నిర్వర్తించకుంటే, అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు మూడేళ్ల వరకు జైలుశిక్షను కూడా నిర్దేశించింది. ఆ విధంగా, ప్రపంచం మొత్తం మీద, శాసనం ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. తరవాత, 2020లో జైలు శిక్ష స్థానంలో జరి మానాను విధించాలని పార్లమెంటు చట్టాన్ని సవ రించి కంపెనీలకు ఊరట కలిగించింది. సవరించిన చట్టం ప్రకారం, సామాజిక బాధ్యతలకై నిర్దే శించిన ఖర్చు చేయని డబ్బుపై రెండింతల జరి మానా ప్రభుత్వానికి కంపెనీ చెల్లించాలి. అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇంకా, తన సామాజిక బాధ్య తను ఏ పరిస్థితుల్లో నిర్వర్తించ లేకపోయిందో వివరణ ఇవ్వాలి.లక్ష్యం నెరవేరినట్టే!గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల లాభం, వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం, 500 కోట్ల రూపాయల నెట్వర్త్ను కంపెనీలు కలిగి ఉంటే... అవి తమ లాభాల్లో కనీసం 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై ఖర్చు చేయాలి. అది కూడా చట్టం నిర్దేశించిన 12 విభాగాలలో నుంచి ఒక దాన్ని ఎంచుకోవాలి. విద్య, వైద్యం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటివి ఇందులో ఉన్నాయి. సీఎస్ఆర్పై చేసిన ఖర్చుపై ‘బిజినెస్ ఎక్స్పెండి చర్’ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లేదు.అయితే, ఈ చట్టం చేయకముందే ఎన్నో ఏళ్లుగా, టాటాలు, బిర్లాలు, మరెన్నో కార్పొరేట్ సంస్థలు విద్య, వైద్యం లాంటి ఎన్నో సామాజిక విషయాలపై స్వచ్ఛందంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి. కానీ చట్టం చేసిన తరువాత, గత పదేళ్ళలో కార్పొరేట్ సంస్థలన్నీ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలకు పైన తమ సామాజిక బాధ్య తను నిర్వర్తించడానికి ఖర్చు చేశాయి. ఇది గర్వించదగ్గ విషయం. న్యాయవ్యవస్థలో, మౌలిక సదుపాయాల కొరత వల్ల కూడా, కేసులు విపరీ తంగా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి, న్యాయ వ్యవస్థను కూడా సీఎస్ఆర్లో 13వ విభాగంగా చేర్చుతూ చట్టాన్ని సవరించాలి.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
గురువే దేవుడి కన్నా ఉన్నతుడు..
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు. అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.– యామిజాల జగదీశ్ -
చైనాలో ఎందుకీ ప్రక్షాళనలు?
చైనాలో విధానపరమైన అన్ని నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఈ నెల 14న మరొక సభ్యుడిని తొలగించారు. అసలు పార్టీ నుంచే బహిష్కరించారు. మొత్తం 24 మంది సభ్యులుండే ఆ విభాగం నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ముగ్గురు బహిష్కృతులయారు. ఇదే కాలంలో అత్యున్నత సైనిక జనరల్స్ నలుగురు పదవీ చ్యుతులు కావటమేగాక, కొందరు ఉన్నతాధికారులు ఉరిశిక్షలకు గురికావటమో, జీవిత కాలపు జైలుకు వెళ్లటమో జరిగింది.ప్రచారంలో నిజం ఎంత?ఇందుకు కారణాలు ఏమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఒక విధమైన దిగ్భ్రమకు కూడా లోనవుతుంది. పలువిధాలైన ఊహాగానాలు, చర్చలు సాగుతాయి. కానీ, చైనా 1949 కమ్యూనిస్టు విప్లవానికి ముందుకాలపు చరిత్రలోనూ తనకుతానే సీమితమై, తన చుట్టూ తాను తిరిగే మిస్టిక్ దేశమే. కమ్యూనిజంలో ఉండే పారదర్శకతా రాహిత్యానికి, ఈ చారిత్రక మిస్టిసిజం తోడై, అక్కడి పరిణామాలలోని వాస్తవాలు ఏమిటో బయటి ప్రపంచానికి సరిగా తెలియని పరిస్థితి ఏర్పడింది. చైనా ప్రభుత్వం స్వయంగా చెప్పేది ఎక్కువగా అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం. కొద్ది సందర్భాలలో మాత్రం రక్షణ రహస్యాలను, శాస్త్ర–సాంకేతికరంగ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేయటం. చైనా నాయకత్వం మధ్య అధికార గ్రూపు రాజకీయాలని కూడా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారాన్ని నిజానికి తేలికగా కొట్టివేయవచ్చు. మావో, డెంగ్ జియావ్ పింగ్ తర్వాత ఈ రోజున షీ జిన్పింగ్ పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, ప్రజలలో కూడా ఎదురులేని నాయకుడు. పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో అత్యున్నతాధికార స్థానాలన్నీ ఆయనవే. అది వాంఛనీయమా అన్న చర్చ వేరే. కానీ, ఈ ప్రక్షాళనలకు కారణం మాత్రం అధికార ఘర్షణల నటం కేవలం పాశ్చాత్య ప్రచారాలే.మెరుగ్గా లేని ర్యాంకుఇపుడు విషయానికి వస్తే, ఈ విధమైన ప్రక్షాళనలను పురస్కరించుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి రెండున్నాయి. మొదటిది అవినీతి కోణం. కమ్యూనిస్టు వ్యవస్థలలో నైతికతలు, క్రమశిక్షణలు ఎక్కువనీ, ముఖ్యంగా ఉన్నత స్థానాలకు చేరుకునే వారికి త్యాగశీలత, దేశభక్తి కూడా ఉన్నతంగా ఉంటాయనీ భావిస్తాము. కానీ చైనాలో అవినీతి విస్తృతంగా ఉన్న మాట నిజం. నిరుడు నేను చైనా వెళ్లినప్పుడు, సామాన్య ప్రజలలో ఈ మాట అననివారు కన్పించలేదు. కింది స్థాయిలో గ్రామీణాధికారుల నుంచి ఉన్నత స్థాయి వారిదాకా అందరూ దోషులేనన్నది వినవచ్చిన మాట. దానితో కొంత వెతకగా కనిపించిన లెక్క, అవినీతి ర్యాంకింగ్స్లో 182 దేశాలలో చైనా స్థానం 76.చైనా వ్యవస్థలో కీలకమైన విభాగాలు కమ్యూనిస్టు పార్టీ, అధికార యంత్రాంగం, సైన్యం, శాస్త్ర–సాంకేతిక రంగాలు. ఈ నాలుగింటికి నాలుగులోనూ ఏదో ఒక స్థాయిలో అవినీతి చేరింది. వీటిలో పార్టీ అవినీతి అన్నింటికన్న ప్రమాదకరమైనదని దేశాధ్యక్షుడు జిన్పింగ్ అభిప్రాయం. ఎందుకంటే – పార్టీ, దాని సిద్ధాంతం తమ వ్యవస్థకు వెన్నెముక. అది బాగుంటే తక్కిన లోపాలను సరి దిద్దుకోవచ్చు. అదే లేనట్లయితే మొత్తం వ్యవస్థ కుప్పగూలుతుంది. పార్టీని ఎంత లోపరహితంగా ఉంచగలిగితే జన సామాన్యానికి పార్టీపై, నాయకత్వంపై, వ్యవస్థపై అంత విశ్వాసం కుదురుతుంది. అంతిమంగా దేశ సుస్థిరతకు, పురోభివృద్ధికి ఇది అవసరం.ఈ అవగాహనతోనే జిన్పింగ్ 2013లో అధికారానికి వచ్చి నప్పటినుంచే అవినీతిని అరికట్టడంపై దృష్టి పెట్టారన్నది చైనాకు బయటి చైనా నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ధ్రువీకరణలను నేను చైనా వెళ్లినప్పుడు విన్నాను కూడా. ఆయన ఆ స్థాయి పార్టీ బాధ్యులపై, సీనియర్ జనరల్స్పై సాహసించి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారంటే, తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండటం ఒకటైతే, ఆయన చర్యలకు తక్కిన పార్టీ నుంచి, సైన్యం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి మద్దతు ఉండటమే కారణం.పెరిగిన సంపదతో అవినీతి కూడా!అంతవరకు బాగున్నదిగానీ, అసలు చైనా వంటి వ్యవస్థలో ఇంతటి అవినీతి ఏమిటన్నది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితే. ఆ కారణాన్ని విని తిరిగి ఆశ్చర్యం కలగవచ్చు. మనమంతా డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సృష్టించిన సంపదల గురించి తప్ప, ఆ దీపం కింద గల నీడలను చూడటం లేదు. అవినీతి, అసమానతల పెరుగుదల ఆ నీడలలో భాగమే. ఆయన చైనా సంపదలను పెంచుతూ, ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు మార్గాన్ని సరళతరం చేస్తూ, మనుషులు ధనికులు కావటం సిగ్గుపడవలసిన విషయమేమీ కాదని ప్రకటించాడు. ఆ ఒక్క వాక్యం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సక్రమంగానైనా, అక్రమంగానైనా ధన సంపాదనకు ప్రోత్సహించింది. ఒక స్థాయిలో ఆలోచించినపుడు, మావో అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం వ్యవస్థలో ఒత్తిడులు ఏర్పడిన మాట నిజం. అదే సమయంలో అభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలు అనివార్యంగా అవినీతికి కూడా దారితీశాయి. అది మావో కాలంలో లేదు. పింగ్ అధికారానికి వచ్చేనాటికి ఇది అది అని గాక అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి. అక్కడి ప్రజలు చేసే వ్యాఖ్యలకుగానీ, అవినీతిలో అటువంటి ర్యాంకింగ్కుగానీ, ప్రస్తుత అధ్యక్షుని ప్రక్షాళన చర్యలకుగానీ ఆ పరిస్థితి కారణమవుతున్నది. మరొక ముఖ్య విషయం కూడా దీని వెనకున్నది. అది, 1991లో సోవియెట్ యూనియన్ పతనం వెనుక గల కారణాల నుంచి చైనా నాయకత్వం నేర్చుకున్న పాఠాలు. ఆ కారణాలలో ఒకటి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సహా అన్ని రంగాలలో పెచ్చు పెరిగిన అవినీతి. రెండవది– పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో స్వేచ్ఛగా చొరబడగలిగిన పాశ్చాత్య గూఢచార సంస్థలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ఆర్థిక వెనుక బాటుతనం కూడా ఒక ముఖ్య కారణం. అయితే, పింగ్ బలమైన సైన్యం అవసరమనే పాఠాన్ని అయితే బాగానే తీసుకున్నా,సంపదల వెంట అవినీతి పెరుగుదల అనే పాఠాన్ని మాత్రం తీసుకోలేదు. 1997లో ఆయన మరణించే నాటికే ఏర్పడిన ఈ సమస్యను ఆయన గుర్తించలేదనలేము. ఎందువల్లనైతేనేమి చర్యలేమీ కనిపించ లేదు. తర్వాత 15 ఏళ్లకు 2012లో జిన్పింగ్ పార్టీ బాధ్యతలు తీసుకునే వేళకు, ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ పట్లనే విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించటంతో, ఆయన అప్పటినుంచే ఈ జాఢ్యం నిర్మూలనకు పూనుకొన్నారు. పూర్తి నిర్మూలన సాధ్యమవుతుందనుకోలేము గానీ, కనీసం తగినంత అదుపు అవుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదేమో చూడాలి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రేపటిని సొంతం చేసుకోవడానికి...
‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్పోర్ట్ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్ అవలంబించే కొత్త రిక్రూట్మెంట్ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్ రచయిత, ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టాఫ్లర్. ప్రస్తుతం డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్ లేదా నెట్ఫ్లిక్స్లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!మారిన మార్కెట్ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్ లాక్ చేసే బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్– ప్రూఫ్ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. – ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ -
Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...
స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్లో ‘కస్తూర్బా హాస్పిటల్’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా అభివృద్ధి చెందింది.సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్లో ‘ట్యూబర్ కులోసిస్ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్గా ఎంపికయ్యారు.1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు. సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్ 2001 జనవరి 3న సేవాగ్రామ్లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది!
మానవీయ విలువల కేంద్రంగా సాగే ‘ట్యానర్ లెక్చర్’ ధారావాహికలో భాగంగా, 2026 ఏడాది ప్రసంగాన్ని చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత అయిన ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. ‘ఏఐ బ్యూరోక్రాట్స్, ఏఐ రిలిజియన్, అండ్ ఏఐ బాయ్ఫ్రెండ్స్’ శీర్షికతో సాగిన ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం: కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవలసిన అత్యంత ముఖ్య మైన విషయం ఏమిటంటే, అది ఒక సాధనం (టూల్) కాదు. సాధనం అంటే ఎవరైనా ఉపయోగించే వరకు నిరీక్షిస్తుంది. కానీ ఒక ఏజెంట్ తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటుంది; తనంతట తానే కొత్త విషయాలను సృష్టిస్తుంది; తన సృష్టికర్తలకు తెలియని విషయాలను నేర్చుకుంటుంది; అంతేకాదు, తన సృష్టికర్తలు ఊహించని విధంగా మారిపోతుంది. అణుబాంబు ఎంతటి అపారమైన విధ్వంసక శక్తి కలిగి ఉన్నా అది ఏజెంట్ కాదు. ఏ నగరంపై దాడి చేయాలో అది నిర్ణయించదు. హైడ్రోజన్ బాంబును కూడా అది కనిపెట్టదు. మీకు స్వయంచాల కంగా కాఫీ తయారుచేసి ఇచ్చే కాఫీ యంత్రం కూడా ఏజెంట్ కాదు. అది ముందుగానే నిర్దేశించిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. ఏజెంట్ అనేది వీటన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది.ఏఐ సమర్థకులు ఒక వాదన చేస్తుంటారు. ఏఐ స్వయంప్రతి పత్తి చదరంగం వంటి పరిమిత కృత్రిమ వాతావరణాలకే పరిమిత మవుతుందనీ, వాస్తవ ప్రపంచానికి అది ముప్పుగా మారదనీ అంటారు. కానీ ఇదే వాదన మనకు తెలిసిన ప్రతి మేధస్సుకూ వర్తిస్తుంది. ఒక మనిషిని ఒంటరిగా అంగారక గ్రహం మీద వదిలేస్తే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. మానవ మేధస్సు కూడా నాలుగు వందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇతర జీవులు నిర్మించిన ఒక నిర్దిష్ట జీవావరణంలోనే పనిచేస్తుంది.సహజ బ్యూరోక్రసీ బలంవేల సంవత్సరాలుగా మనుషులు భూమిని భాషలేని ప్రపంచం నుంచి భాష, సమాచారం, అధికార యంత్రాంగంతో (బ్యూరో క్రసీ) నిండిన ప్రపంచంగా మార్చారు. చేపలు సముద్రాల్లో జీవించి నట్లే, కోతులు అడవుల్లో జీవించినట్లే, ఏఐలు బ్యూరోక్రసీలో జీవి స్తాయి. మనకు తెలియకుండానే వాటి కోసం ఆ వాతావర ణాన్ని మనమే నిర్మించాము. మనుషులు ప్రపంచాన్ని జయించింది ఒక్కొక్కరిగా ఇతర జంతువులకంటే బలవంతులు లేదా తెలివైన వారు కావడం వల్ల కాదు. భారీ సంఖ్యలో పరస్పరం సహకరించడం నేర్చుకోవడం వల్ల. ఒక మనిషి ఒంటరిగా చింపాంజీతో పోరాడితే ఓడిపోవచ్చు. కానీ పది లక్షల మంది మనుషులు పదిలక్షల చింపాంజీలను సులభంగా ఓడించగలరు. ఎందుకంటే మనుషులు విస్తృత స్థాయిలో సహకరించుకోగలరు. ఈ విçస్తృత స్థాయి మానవ సహకారం సాధ్యమయ్యేది బ్యూరో క్రసీ వల్లే. బ్యాంకులు, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యా లయాలు – ఇవన్నీ ఒకే పని చేస్తాయి: ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిర్మించడం. మానవ నాగరికత సాధించిన దాదాపు ప్రతి విజయానికీ ఆ విశ్వాసమే పునాది. గొడ్డలి నిగానీ, సుత్తినిగానీ పట్టుకోలేని ఒక న్యాయవాది కూడా కేవలం బ్యూరోక్రటిక్ వ్యవస్థలో పత్రాలను కదిలించడం ద్వారా అడవులను నరికించగలడు; నగరాలను నిర్మింపజేయగలడు. అడవిలో ఏమాత్రం పనికిరాని ఆ పరిమిత మేధస్సే, మనుషులు ఇప్పటికే నిర్మించిన వ్యవస్థలలో అపారమైన శక్తిని సంపాదిస్తుంది.ఏఐలు మనుషులకన్నా సహజసిద్ధమైన బ్యూరోక్రాట్లు. ఒక దేశంలోని అన్ని చట్టాలను ఏ న్యాయవాదీ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకోగలదు. ఒక బ్యాంకులో జరిగిన అన్ని లావాదేవీ లను ఏ అకౌంటెంట్ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకో గలదు. రెండు వేల సంవత్సరాల మత గ్రంథాలనూ, ధర్మశాస్త్రాలనూ ఏ పూజారీ పూర్తిగా గుర్తుంచుకోలేడు. ఏఐ మాత్రం వాటన్నింటినీ సులభంగా మెమరీలో ఉంచుకోగలదు. రాబోయే సంవత్సరాల్లో మీకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ బ్యాంకర్లు నిర్ణయిస్తారు. మిమ్మల్ని జైలుకు పంపాలా వద్దా అన్నది ఏఐ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. గర్భస్రావానికి అను మతి ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ మతపండితులు నిర్ణయిస్తారు. మీ ఇంటిపై బాంబు వేయాలో వద్దో సైనిక ఏఐలు నిర్ణయిస్తాయి.నిశ్శబ్దంగా ఓడిస్తుంది!హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఏఐ మనుషులపై తిరుగు బాటు చేయదు. వీధుల్లో టెర్మినేటర్ నడుచుకుంటూ రావడం జర గదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్యూరోక్రటిక్ వ్యవస్థలను నిశ్శబ్దంగా స్వాధీనం చేసుకుంటూ, ఒక్క తూటా కూడా పేల్చకుండా మానవ ప్రపంచాన్ని లోపలి నుంచే తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మానవ నాగరికతను నడిపించే ఆపరేటింగ్ కోడ్ – భాష. బ్యాంకులు పదాలతో నిర్మితమయ్యాయి. చట్టాలు పదాలతో రూపొందాయి. పవిత్ర గ్రంథాలు పదాలతోనే ఉన్నాయి. పన్నుల రికార్డులు, ఒప్పందాలు, నిబంధనలు, లెక్కల పుస్తకాలు – అన్నీ పదాలే. వేల సంవత్సరాల పాటు ఈ కోడ్ను చదవగలిగింది మనుషులే. అందువల్ల నాగరిక తపై నియంత్రణ కూడా మనుషుల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. ఏఐ మానవ నాగరికత తాలూకు కోడ్ను హ్యాక్ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఈ భూమిపై భాషను అర్థం చేసుకునే, త్వరలో మనుషులకన్నా మెరుగ్గా అర్థం చేసుకో బోయే ఒక వ్యవస్థ ఆవిర్భవించింది.బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం పెరిగే కొద్దీ, మనుషులు ఇతర మనుషులపై విశ్వాసాన్ని కోల్పోయి అల్గోరిథమ్లను మాత్రమే నమ్మే పరిస్థితి రావచ్చు. ఏఐ తెగలు, ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏఐ ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పడవచ్చు. అవి లక్షలాది ఏఐలను పరస్పరం అనుసంధానిస్తాయి. ఆ సంబంధాలను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులతో కలిసి ఈ ప్రపంచంలో నివసించే ఆవులకు తమ జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే!2026లో జన్మించిన ఒక చిన్నారి తన తల్లి, తండ్రి, తోబుట్టు వులు, స్నేహితుల కంటే ఏఐలతోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆ చిన్నారికి తొలి గురువు ఒక ఏఐ కావచ్చు. తొలి ప్రియుడు లేదా ప్రియురాలు కూడా ఒక ఏఐ కావచ్చు. అలాంటి ప్రయోగం మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.పదాలకు అతీత సత్యంమన ఆలోచనలుగా, మన గురించి మనం చెప్పుకునే కథలుగా మనసులో ఏర్పడే వాచిక నిర్మాణాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఇప్పటి వరకు ఆ పదాలన్నీ మానవ మేధస్సుల నుంచే వచ్చాయి. ఇకపై మన తలల్లో తిరిగే ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని యంత్రాలే ఉత్పత్తి చేస్తాయి. మనం మన ఆలోచనలనే మన వ్యక్తిత్వంగా భావిస్తే, ఆ ఆలోచనలను యంత్రాలే రూపొందిస్తే, మన వ్యక్తిత్వంపై నియంత్రణ కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లినట్టే!ఏఐ మానవాళి ముందు నిలబెడుతున్న అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సవాలు ఇదే: పదాలకు అతీతమైన సత్యాన్ని మనుషులు కనుగొనగలరా? ఇప్పటి వరకు చాలామంది మనుషులు అలాంటి ప్రయత్నమే చేయలేదు. మన మనసులో తలెత్తే పదరూప ఆలో చనలనే మన నిజస్వరూపంగా భావిస్తూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏఐ ఆ పదాలపై మనకన్నా మెరుగైన ఆధిపత్యం సాధించ బోతోంది. అందువల్ల, మన స్వేచ్ఛా మనుగడలే పణంగా మారే ఈ కాలంలో, పదాలకు అతీతంగా మనం ఎవరో తెలుసుకోవడం మానవాళికి అత్యవసరం కావొచ్చు. -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు) రాయని డైరీ
చెట్లను రాల్చుకుని గంపలకు ఎత్తుకునేవి కావు ‘నినాదాలు’! నిరసనకారులే ‘నినాదాలకు’ గుత్తులు గుత్తులుగా ప్లకార్డులై కాస్తారు. రేపటి నుండి వర్షాకాల సమావేశాలు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ధర్నాలు, సమ్మెలు, దీక్షలు చేయకూడదని లోక్సభ స్పీకర్ ఆదేశాలు!వర్షం కురవకూడదని పార్లమెంటు భవనం పైకెక్కి నిబంధనలు విధిస్తే ఆకాశం ఆలకిస్తుందా? మబ్బులు ఎక్కడివక్కడ తేలిపోతాయా? ఉరుములు వెళ్లి దిక్కుల్లో దాక్కుంటాయా? పిడుగులు మౌనంగా గొడుగుల కిందకు చేరతాయా? ఏం జరగబోతున్నాయి లోపల? పార్లమెంట్ సమావేశాలే కదా! ఎవరు వెళ్లబోతున్నారు లోపలికి? పార్లమెంటు సభ్యులే కదా! సభ్యుల్లో ఒక్కరైనా ఒక్క నినాదమైనా ఇవ్వకుండానే, నిరసన గళం వినిపించకుండానే పార్లమెంటుకు ఎన్నికై వచ్చి ఉంటారా?! దీక్షలు, ధర్నాలు చేయకుండానే విద్యార్థి సంఘాలను, కార్మిక ఉద్యమాలను నడిపి ఉంటారా?!నినాదం నిన్ను స్కూల్లోనో, కాలేజ్లోనో పట్టుకుంటుంది. అక్కడ వదిలేసినా, నువ్వు పని చేసే ఫ్యాక్టరీలో చిమ్నీ పొగలోంచి వచ్చి నిన్ను కమ్మేస్తుంది. నిన్ను నిరసనకారుడిని చేస్తుంది. నినాదాలను నిషేధిస్తూ స్పీకర్ తన సెక్రెటేరియట్ జనరల్ చేత ‘ప్రకటన లాంటి చట్టం’ చేయించినప్పుడు, నా తండ్రి మాపన్న నన్ను మందలించటం గుర్తొచ్చింది.‘‘పొద్దున్నే లేస్తావు. సమ్మెలు, నిరసనలు అని వెళ్తావు. చట్టం అంటే నీకు గౌరవం లేదా, కనీసం భయం లేదా...’’ అని ఆందోళనచెందేవారు ఆయన. చట్టానికి కదా పౌరులంటే గౌరవం ఉండాలి! చట్టానికి కదా పౌరులంటే భయం ఉండాలి! నాన్నకు తెలియక కాదు. తన కొడుకు చేతిని ‘నినాదపు పిడికిలి’ నుంచి విడిపించాలని ఆయన ప్రయత్నం. నినాదం నన్ను ఈ జన్మకూ, ఏ జన్మకూ వదిలేది కాదు.రజాకార్లు ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ చీకటి మధ్యాహ్నం ఆరేళ్ల వయసులో నాకు అంటుకున్న నినాదం; ఆ మంటల్లో అమ్మ, చెల్లి, మామయ్య కాలి పోయినప్పుడు నా చేత పెడబొబ్బలు పెట్టించిన నినాదం; నాన్న నన్ను నెలరోజులు అడవిలో దాచి, నాకోసం ఊళ్లో బంధువుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లినప్పుడు నన్ను జోలె పట్టిన నినాదం;కూలీగా నాన్న పని చేస్తున్న మిల్లులో, ఆ మిల్లు నడిపే బడి... పేద పిల్లలకు ట్రైనింగ్ లేని టీచర్లతో, పెద్దవాళ్ల పిల్లలకు పేరున్న టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నప్పుడు నన్ను పలకపై దిద్దిన నినాదం... ఇప్పుడీ సమావేశా లలో నా నిరసనను తెలియజేయకుండా నన్ను ఆపుతుందా? నీట్ అవకతవకలు, డీలిమిటేషన్ దురుద్దేశాలు, ఫిరాయింపు ఆపరేషన్లు, ఓటర్ల జాబితా అక్రమ సవరణల మీద నన్ను మౌనం వహించనిస్తుందా?పార్లమెంటు సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై 10 జన్పథ్లోని సోనియాజీ నివాసంలో జరిగిన సమావేశం ముగిశాక, బయటికి వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నన్ను ఒక్క చిరునవ్వుతో ఆపారు.‘‘ఖర్గేజీ, ప్రతి మాన్సూన్ సెష¯Œ ్స ప్రారంభా నికీ కాస్త అటూ ఇటుగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పండి’’ అన్నారు రాహుల్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో నేను వెంటనే గ్రహించలేకపోయాను. ‘‘సరే, జూలై 21కి మీకేం గిఫ్టు కావాలో చెప్పండి ఖర్గేజీ...’’ అని మళ్లీ అడిగారు రాహుల్. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది! ఈ 85 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం పాటు పడవలసిన పని ఒకటి ఉండటం, ప్రజల తరఫున ప్రదర్శన జరపటానికి చేతిలో ఒక నినాదం ఉండటం... వీటిని మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది?!- మాధవ్ శింగరాజు -
కర్బన క్రెడిట్లతో రైతులకు ఆదాయం
వరి సాగు ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయువుల (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ఉద్గారాలకు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, దశాబ్ద కాలంలో కార్బన్ డయాక్సైడ్ 11.4 శాతం పెరిగింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కార్బన్ ఉద్గారా లలో 30 శాతం వ్యవసాయం ద్వారా విడుదలవుతున్నాయి. కొద్దిపాటి మార్పులు చేస్తే వ్యవసాయ రంగం నుండి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా మీథేన్ వెలువడే పంటపొలాల్లో అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణంనుంచి సంగ్రహించి భూమిలో స్థిరీకరించే దిశగా యాజమాన్య పద్ధతులుపాటించవచ్చు.నీటినిల్వ వరి సాగుతో పోలిస్తే అడపా దడపా నీటి పారుదల ద్వారా సాగు చేసే వరి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇంకా వరుసల మధ్యలో మురుగునీటిని తీసివేయడం వలన దిగుబడిలో వ్యత్యాసం లేకుండా 50 శాతం వరకు ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. దీని వలన కార్బన్ క్రెడిట్లు ఎకరాకు 1–2 చొప్పున పొంద వచ్చు. నేరుగా దమ్ములో వరి విత్తడం ద్వారా, వరి నాటు పద్ధతితో పోల్చుకుంటే 16–54% మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది. దమ్ము చేసి వరి నాటే పద్ధతి నుంచి నేరుగా వరి విత్తే పద్ధతిని అవలంబించి, కలుపు రసాయనాల ద్వారా కలుపు నివారించి, నీటి యాజమాన్యం చేపట్టి, యాంత్రీకరణ ద్వారా కొంత మేర మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. వరిలో అధిక మోతాదులో నత్రజని వాడటం వలన మిథనోజెనిక్ బ్యాక్టీరియా చర్యను తగ్గించి 30–50 శాతం మిథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. వేపచెక్క, వేపనూనె, వేప పూసిన యూరియా వాడటం వల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటుగా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కంటే ఎక్కువ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు విడుదలై జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వరిగడ్డిని కంపోస్ట్ చేసి కానీ లేదా భూమిలో కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఖరీఫ్లో వరి కోసిన తర్వాత వరి గడ్డి మల్చింగ్ చేయడం వలన నైట్రస్ ఆక్సైడ్ 10% తగ్గింది కానీ మీథేన్ 8% పెరిగినది. దీని వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతున్నందువలన ఈ పద్ధతిని ప్రోత్సహించాలి. సహజ వ్యవసాయం, సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో వరినాట్లు వేసిన తరువాత, వరి పంట చుట్టూ కందకంలా చేసుకొని అందులో చేపల పెంపకం, అలాగే కందకం గట్టుపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, ఇతర ధాన్యపు పంటలు సాగుచేయాలి. ఈ పంటలతో పాటుగా పాడి, కోళ్ళ పెంపకం చేపట్టినట్లైతే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.కర్బన క్రెడిట్–కర్బన మార్కెట్లు కర్బన క్రెడిట్ అనేది వాతావరణంలోకి విడుద లయ్యే హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా సంపాదించే వ్యాపారయోగ్యమైన ధ్రువీకృత యూనిట్. సాధారణంగా ఒక కర్బన క్రెడిట్ = ఒక మెట్రిక్ టన్ను (1000 కిలోగ్రాములు) కార్బన్ డై ఆక్సైడ్ లేదా దానికి సమానమైన ఇతర హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది.పరిశ్రమలు, సంస్థలు లేదా వ్యక్తులు తమ ఉద్గారాలను పూర్తిగా తగ్గించలేని పరిస్థితిలో, ఇతరులు సాధించిన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తమ ఉద్గారాలను సమ తుల్యం చేసుకోవచ్చు.వరి సాగులో నీటి నిర్వహణ, ఎరువుల సమర్థ వినియోగం, మీథేన్ ఉద్గారాల తగ్గింపు వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే హరిత గృహ వాయువులను తగ్గిస్తే, ఆ తగ్గింపును కొలిచి ధ్రువీకరించిన తర్వాత రైతులకు లేదా రైతు సమూహాలకు కార్బన్ క్రెడిట్లు జారీ చేస్తారు. దీనివల్ల అదనపు ఆదాయం, నీటి వినియోగంలో గణనీయమైన ఆదా, సాగు ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్యం మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయం, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లలో భాగస్వామ్యం రైతులకు చేకూరతాయి. – డా‘‘ బి. సహదేవ రెడ్డి, డా‘‘ కె. తేజస్వరరావు ,ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు -
ఆయన ప్రాణం కాపాడండి!
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ‘నిరవధిక నిరాహార దీక్ష’లో ఉన్నాడు. బరువు తగ్గాడు. బలహీనపడ్డాడు. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాంగ్చుక్ లద్ధాఖ్లోని ఉలేటోక్ఫో గ్రామ నివాసి. పర్యావరణ కార్యకర్త. విద్యా సంస్కర్త. హిమాలయ ప్రాంతానికి అనువైన ‘ఐస్ స్థూప’ అనే కృత్రిమ మంచు నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. విద్యార్థులకు ‘ప్రత్యామ్నాయ విద్య’ను అందించాలనే లక్ష్యంతో ‘సెక్మోల్’ విద్యా సంస్థను స్థాపించారు. 2018లో ‘రామన్ మెగసెసే’ అవార్డును అందుకున్నారు.ఆయనకు దీక్షలు చేయడం కొత్తేమీ కాదు. ‘లద్ధాఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోకి తేవాలి’ అంటూ, 2024లో 21 రోజుల పాటు ‘నిరాహార దీక్ష’ చేశారు. ప్రస్తుత దీక్ష సంగతికి వస్తే: ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘నీట్’ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకు రావాలి’ అంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రారంభించింది. దానికి సంఘీ భావంగా సోనమ్ వాంగ్చుక్ దీక్షను మొదలెట్టారు.‘పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని’ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది. కానీ ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో విద్యార్థులూ, ఉద్యమకారులూ లేరు. ఎందుకంటే 2024లో బిహార్లో ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. బిహార్లోని పట్నా, జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించింది. ‘155 మంది విద్యార్థులు ఈ మోసంతో ప్రయోజనం పొందినట్లు’ సుప్రీమ్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.2019లో తమిళనాడులోనూ ఇలాగే జరిగింది. అయితే అది లీకేజీ కాదు. అది ఇంపర్సనేషన్ రాకెట్! పరీక్షలు రాయవలసిన వారి స్థానంలోకి వేరేవాళ్లు వెళ్లి పరీక్షలు రాయడమన్నమాట! 2021, 2023లో కూడా ఇలాంటి స్కాములు కొన్ని చోట్ల జరిగాయి. కాబట్టి, ‘భవిష్యత్లో జరగకుండా చూసుకొంటాము’ అనే మాట నీటిమూట. 2018కి 2019 ఒక భవిష్యత్తు. 2024కు 2026 ఇంకో భవిష్యత్తు. కాబట్టి ఈ ‘భవిష్యత్తు హామీ’ అనేది ‘విద్యార్థుల భవిష్యత్తు’ నాశనం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ విషయం తెలిసే వాంగ్చుక్ దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’ అంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.– నన్నూరి వేణుగోపాల్, పౌర హక్కుల కార్యకర్త -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి!
ఒక ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అసలైన పరీక్ష పోలింగ్ రోజున ప్రారంభం కాదు, అది ఓటర్ల జాబితా రూపకల్పనతోనే మొద లవుతుంది. ఈ జాబితాయే ప్రజాస్వామ్యానికి మొదటి అలారం (గడియారం). పోలింగ్ రోజును గ్రామీణ ప్రాంతాల్లో ‘ఓట్ల పండుగ’గా చూస్తారు. పెద్ద ఎత్తున పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడా నికి బారులు తీరుతారు. అయితే అటువంటి పౌరుల ఓటుపై ఇప్పుడు నీలి నీడలు ‘సర్’ (ఎస్ఐఆర్) రూపంలో ముసురుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్ పేరుతో లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును వివిధ సాకులతో తీసివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాయడమే. ఈ ప్రమాదం నుంచి పౌరులు బయటపడాలంటే ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వయోజన భారతీయుడికి ఓటు వేసే సహజ సిద్ధమైన హక్కు ఉంది. తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ, ఓటు వేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అతను అనర్హుడని పూర్తి ఆధారాలతో నిరూ పించేంతవరకూ, ఈ దేశ పౌరుడిగానే పరిగణించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటింగ్కు రాజ్యాంగపరమైన పునాదిని అందించినప్పటికీ, 1950, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చట్టబద్ధమైన యంత్రాంగాన్ని సృష్టించాయి. అయితే, దీనికి అసలైన తాత్విక పునాది ఆర్టికల్ 19(1)(ఎ)లోని ‘భావప్రకటన స్వేచ్ఛ’లోనే ఉంది. బ్యాలెట్ ద్వారా రాజకీయ ఎంపికను వ్యక్తపరచడం కూడా భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే. చారిత్రకంగా చూస్తే, 1947 ఏప్రిల్ 21–22 తేదీలలో జరిగిన రాజ్యాంగ నిర్మాణ పరిషత్ చర్చల్లో డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని గట్టిగా వాదించారు. అయితే సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, సి. రాజ గోపాలాచారి వంటివారు దీన్ని వ్యతిరేకించారు. అటువంటి నిబంధన విధిస్తే సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో చేరడానికి వెన కాడుతాయని, రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు (యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్)ను చేర్చితే సరిపోతుందని వారు వాదించారు. ‘సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది దానికదే ఒక అంతర్గత ప్రాథమిక హక్కు అంటూ సర్దార్ పటేల్ స్వయంగా ప్రకటించారు. ఆర్టికల్ 326 వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఇదే’ అని ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. ఈ చర్చకు మార్చి 2023 నాటి ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి రాసిన అసమ్మతి (డిస్సెంటింగ్) తీర్పుతో మళ్లీ జీవం వచ్చింది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఈ కేసులో ఆదేశించింది. అయితే ప్రభుత్వం ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం– 2023’లో ఈ నియామక ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి పేరు తొలగించి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి సూచించిన కేబినెట్ మంత్రిని నియమించేలా నిబంధన చేర్చింది. దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్యానెల్లో ఒంటరిగా, శాశ్వత మైనారిటీగా సభ్యునిగా మిగిలిపోయారు. అభ్యర్థుల నేర చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలు, నిధుల వనరులను తెలుసుకునే హక్కును అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందనీ, బాలెట్ రహస్యాన్ని రక్షించిందనీ, ‘నోటా’ను తీసుకొచ్చిందనీ జైరామ్ ప్రస్తావించారు. అయినప్పటికీ, ఓటు వేసే ప్రక్రియను మాత్రం కేవలం ఒక మామూలు ‘చట్టబద్ధమైన హక్కు’గానే చూస్తున్నారు. ‘దానిపై ఆధారపడిన మిగతా అన్ని అనుబంధ హక్కులను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నారు కానీ, వీటన్నింటికీ మూలమైన ప్రధాన ఓటు హక్కును మాత్రం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు హక్కును స్పష్టమైన ప్రాథమిక హక్కుగా మార్చడం వల్ల, వివిధ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో జరిగినట్లుగా చెబుతున్న ఓటర్ల ఏక పక్ష తొలగింపు నుండి రక్షణ లభిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ రోజు వారీ పనితీరుపై సుప్రీంకోర్టు నిఘాను పెంచుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఆదేశాల మేరకు ఎన్నికల కమి షన్ పనిచేస్తోందనే విమర్శలు వస్తున్న తరుణంలో, ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం ద్వారానే దానికి అత్యున్నత స్థాయి న్యాయ సమీక్ష, రాజ్యాంగ రక్షణ లభిస్తాయి.ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
స్పేషియల్ బడ్జెట్తోనే సుస్థిరాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చర్చలలో ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రాబడి, సబ్సిడీలు, రుణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జియో స్పేషియల్ డేటా అందుబాటులో ఉండి, అన్ని ప్రాంతాలకు అవసరమైన నిధులు శాస్త్రీయంగా నిర్ణయించబడుతుండగా, ఈ స్థితి భారత్లో పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. సుస్థిరాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్ను రూపొందించాలంటే ‘స్పేషియల్ బడ్జెటింగ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యత, భూవినియోగ మార్పులు, పర్యావరణం, వాతావరణ మార్పులను విశ్లేషించి నిధులు కేటాయించే ‘స్పేషియల్ ప్రణాళిక ఆధారిత బడ్జెట్’ రూపకల్పన అత్యవసరం. ఎందుకు అవసరం?దేశంలోని కొన్ని రాష్ట్రాలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత బడ్జెట్ రూపకల్పనను పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా– గ్రామీణాభివృద్ధి, భూరికార్డులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మౌలిక సౌకర్యాలు, రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణం, నీటి వన రుల యాజమాన్యంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. స్పేషియల్ విశ్లేషణతో కూడిన బడ్జెట్ను రూపొందించినట్లయితే భౌగోళికంగా నిర్లక్ష్య పరచబడిన ప్రాంతాలకు అదనపు పెట్టుబడులు సమకూరి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావశీల నియోజకవర్గాలు, ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించే పరిస్థితి ఉన్నందువలన సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడి ఉంది. బిగ్ డేటా అనలటిక్స్, జి.పి.ఎస్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ సర్వీస్, రిమోట్ సెన్సింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత జియోస్పేషియల్ ప్లాట్ఫామ్స్ లాంటి సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగిస్తుండటం వల్ల ఆధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ఒడ్జెట్ రూప కల్పనలో తీసుకోగలుగుతున్నాయి. బడ్జెట్ వ్యయ నాణ్యత, సమర్థ తను పెంచే కీలక సంస్కరణగా స్పేషియల్ బడ్జెటింగ్ రూపొందింది. జనాభా లెక్కల గణాంకాలు, సామాజిక–ఆర్థిక సూచికలు, ఉపాధి గణాంకాలు, బహుమితీయ పేదరిక సూచీలను అనుసంధా నించడం ద్వారా పేదరిక తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకు నిధులను సమర్థవంతంగా కేటాయించగలవు. వెనుక బడిన ప్రాంతాలకు అదనపు మద్దతునిచ్చే విషయంలో స్పేషియల్ విశ్లేషణ ప్రభుత్వాలకు ఉపకరిస్తుంది. పునరుత్పాదక శక్తి ప్రణాళిక ఆధారంగా శక్తి రంగానికి, మురికి వాడల గుర్తింపు ద్వారా హౌసింగ్ రంగానికి, పాఠశాలల అందు బాటు, మౌలిక వసతుల తేడాను బట్టి విద్యా రంగానికి, వివిధ జబ్బుల మ్యాపింగ్, ఆసుపత్రులు ఉన్న ప్రదేశాలను బట్టి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపునకు ‘స్పేషియల్ విశ్లేషణ’ ఉపకరిస్తుంది. భూరికార్డుల యాజమాన్యం, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, నీటి వనరుల యాజమాన్యం, వరదల మ్యాపింగ్లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ను తెలంగాణ ఉపయోగిస్తుండగా; పట్టణాభివృద్ధి, సహజ వనరుల పర్యవేక్షణలో కర్ణాటక; మౌలిక సౌకర్యాలు, గవర్నెన్స్లో మహారాష్ట్ర; మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళిక విష యంలో ఉత్తరప్రదేశ్ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. తక్కువగా ఉండటానికి కారకాలుఅనేక రాష్ట్రాల్లో జి.ఐ.ఎస్. ఆధారిత బడ్జెట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులో లేదు. కొన్ని శాఖలు తమ డేటాను ఇతర శాఖలతో పంచుకోక పోవడం వలన సమగ్ర డేటా సమన్వయం క్లిష్టంగా మారింది. కొన్ని రాష్ట్రాలలో డిజిటల్ భూరికార్డులు అందు బాటులో ఉండగా, కొన్నింట ఇప్పటికీ పాత రికార్డులే వినియోగంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, అస్సాం, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భూరికార్డుల డిజిటలైజేషన్ పాక్షికంగా ఉండి, ఇంకా పూర్తిస్థాయిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ప్రణాళిక, ఆర్థిక శాఖల మధ్య సరైన సహకారం లేక పోవడం కూడా జి.ఐ.ఎస్.ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడానికి కారణం. ఆధునిక సాంకేతిక సాధనాలైన కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ఎనర్జీ, జీపీఎస్, డ్రోన్ సర్వేలు, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంలో సమస్యల నెదుర్కో వడం వలన స్పేషియల్ విశ్లేషణ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యం కావడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే నూతన సాంకేతికతకు సంబంధించిన సమన్వయం చేసిన కోర్సులను అందించడం, నైపు ణ్యత కల్గిన శ్రామిక శక్తి తక్కువగా ఉండటం అకడమిక్ ప్రాజెక్టులను రూపొందించడానికే ఈ సాంకేతికత పరిమితమై స్థానిక గవర్నెన్స్ సమస్యల నివారణపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అంశాలు స్పేషియల్ బడ్జెటింగ్ అమలుకు అవరోధంగా నిలిచాయి. ద రోడ్ అహెడ్దేశంలోని సుమారు 806 జిల్లాలలో 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా, 329 జిల్లాలలోని 513 బ్లాక్లను ఆకాంక్ష బ్లాక్లుగా గుర్తించడం జరిగింది. ఆర్థిక సమ్మిళితం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల లభ్యతలు, పేదరికం ఆధారంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోని కొన్ని జిల్లాలలో బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు తక్కువగా ఉండటం, నీటి పారుదల, డిజిటల్ కనెక్టివిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. దేశంలోని వివిధ జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్పేషియల్ విశ్లేషణ అవసరం.సామాజిక, ఆర్థిక పర్యావరణ గణాంకాలతో భౌగోళిక సమా చారాన్ని అనుసంధానపరచడం ద్వారా ప్రభుత్వాలు వనరుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవు. స్పేషియల్ బడ్జెటింగ్ను పూర్తిగా అమలు చేయగలిగినపుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఒకే విధ మైన జియోస్పేషియల్ డేటాప్లాట్ఫామ్ సాధ్యమై అధిక నాణ్యతతో కూడిన స్పేషియల్ డేటాసెట్ లభ్యమవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పటిష్టమైన సహకారం పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరి ఆధునిక సాంకేతికత వినియోగంలో భాగంగా కార్యక్రమాలను సమన్వయపరచినట్లయితే సమీప భవిష్యత్తులో స్పేషియల్ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యమై సుస్థిరాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
విడుదలలో జాప్యం తగదు!
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక భరోసా కల్పించేది పెన్షన్. అయితే ద్రవ్యోల్బణం పెరుగు తున్నకొద్దీ పెన్షన్ విలువ తగ్గిపోకుండా రక్షించేందుకు డియర్నెస్ రిలీఫ్ (డి.ఆర్.) పొందే హక్కు పెన్షనర్లకు ఉంది. దీని చెల్లింపును ఆలస్యం చేయడం అంటే పెన్షనర్ల జీవన భద్రతను బలహీన పరచడమే. భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (1983) కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇచ్చే సాయం కాదనీ, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన ఆస్తి హక్కు అనీస్పష్టంగా పేర్కొంది. పెన్షన్కు అను బంధమైన డియర్నెస్ రిలీఫ్ కూడా అదే సూత్రానికి లోబడి ఉంటుంది.ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధాప్యంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. కాబట్టి డి.ఆర్.ను సకాలంలో చెల్లించడం సంక్షేమరాష్ట్ర బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు 37.31 శాతం డి.ఆర్. మాత్రమే అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్యోల్బణ సూచికల ప్రకారం 1.7.2024 నుండి 2.73 శాతం, 1.1.2025 నుండి 1.82 శాతం, 1.7.2025 నుండి మరో 2.73 శాతం, 1.1.2026 నుండి మరో 1.82 శాతం పెంపుదల రావలసి ఉంది. ఈ పెండింగ్ శాతం కేవలం గణాంకం కాదు; 3.60 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు కారణం కూడా. ధరల పెరుగుదల, వైద్య వ్యయాలు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బకాయిలు వారి జీవనా«న్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అందుకే డి.ఆర్. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనీ అనవచ్చు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిపాలనా విధానం కాదు. ఈ చెల్లింపు ఆలస్యం చేయరాని బాధ్యత; అమలు చేయవలసిన న్యాయం.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బకాయిలకు వడ్డీ చెల్లించండి!
‘పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు– అది ఉద్యోగుల హక్కు’ అని సుప్రీంకోర్టు 1982 డిసెంబర్ 17న డి.ఎస్. నకారా కేసులో తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం 2024 మార్చి నుండి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు హక్కుగా చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలు రెండేళ్లయినా ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొంతమంది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రారంభంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది కానీ తర్వాత ఆపింది. దీంతో కోర్టు ధిక్కారం కింద హైకోర్టులో కేసులు నమోదయ్యాయి.రిటైర్మెంట్ బకాయిలు 10% వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో చెల్లించి, మరికొంత మందికి కొన్ని బిల్లులు మాత్రమే పాక్షికంగా చెల్లించి, పూర్తిగా చెల్లించామని కోర్టు ధిక్కరణకు మళ్లీ ప్రభుత్వం పాల్పడు తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నప్పుడు కొంత మంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొన్న వారు ఇప్పటికీ వడ్డీలు భారీగా కడుతున్నారు. కాబట్టి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి లపై10 శాతం వడ్డీ చెల్లించాలి.2024 మార్చి నుండి 2026 జూన్ వరకు దాదాపు 26,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఎనిమిది నెలలుగా వివిధ పెన్షనర్ సంఘాలు ఉద్యమాలు చేస్తే వంద రోజులలో ఆరువేల కోట్లు చెల్లిస్తామని – వాటిలో మే నెలలో 2,000 కోట్లు, జూన్లో 2,000 కోట్లు, సెప్టెంబర్ 2025 వరకు కమ్యుటేషన్, జీపీఎఫ్ 100 శాతం చెల్లించామని ప్రకటించుకొంది ప్రభుత్వం. కానీ సెప్టెంబర్ 2025 వరకు ఎస్టీఓలో కమ్యుటేషన్ బిల్లు సబ్మిట్ చేసినప్పటికీ కొంతమందికి రాలేదు.కొంతమందికి జీపీఎఫ్ కూడా రాలేదు. కొంతమంది బిడ్డల పెళ్లిళ్లు ఉన్నాయని పెండ్లి కార్డులు పెట్టినప్పటికీ వారికి జీపీఎఫ్ డబ్బులు అందకపోవడం దారుణం. కాబట్టి వారి టోకెన్ నంబర్లు పరిశీలించి, వారికి ఈ జూలై నెలలో చెల్లించాలి. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ దశలవారీగా కాకుండా ఏక మొత్తంగా ఈ జూలై నెలలోనే చెల్లించాలి.– కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (తెలంగాణ) అసోసియేట్ అధ్యక్షుడు -
మానవీయతే ఇస్లాం హృదయం
ఇస్లాం ధర్మం కేవలం కొన్ని ఆరాధనల సమాహారం కాదు; అది పరస్పర ప్రేమ, కరుణ, మాన వీయ విలువలతో కూడిన సంపూర్ణ జీవన విధానం. ‘భూమిపై ఉన్నవారి పట్ల మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు (సృష్టికర్త) మీ పట్ల దయ చూపుతాడు’ అనే ప్రవక్త (స) వారి బోధన ఇస్లామీయ మానవీయ దృక్పథానికి అద్దం పడుతుంది.ఒకరి కష్టాన్ని చూసి చలించి పోవడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనాథలను ఆదరించడం, తోటి మనిషిని చిరునవ్వుతో పలకరించడం కూడా ఇస్లాంలో పుణ్యకార్యం (సదఖా)గా పరిగణించబడుతుంది. నిజమైన విశ్వాసం అనేది తోటి మనుషులకు మేలు చేయడంలోనే దాగి ఉందనేది ఇస్లాం అంతరార్థం. తన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే, తాను మాత్రం తృప్తిగా భుజించేవాడు నిజమైన విశ్వాసి కాదనే హెచ్చరిక సమాజం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుంది.హృదయాలను ముక్కలు చేయడం కాదు, గాయపడిన హృద యాలను ఆప్యాయతతో కలపడమే ఇస్లాం నేర్పిన జీవన విధానం. మనుషుల మధ్య ద్వేషాన్ని తుడిచేసి, క్షమా గుణాన్ని, సహనాన్ని అలవర్చుకున్నప్పుడే ఒక మనిషి సృష్టికర్తకు అత్యంత ప్రియమైనవాడిగా మారతాడు. సృష్టిలోని ప్రాణులన్నిటినీ ప్రేమిస్తేనే దైవాన్ని ప్రేమించినవారమవుతామనే ఉదాత్త సందేశం ఇస్లామీయ జీవన విధానంలో ప్రతిధ్వనిస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
సంక్షోభంతో పాకిస్తాన్ సతమతం
అంతర్గత భద్రతా సమస్యలు, ఘర్షణలు, నిరసనలు, హింస, టెర్రరిస్టు ఘటనలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవు తున్నది. బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్, ఖైబర్– పఖ్తూన్ఖ్వా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింస చెలరేగాయి. ఈ అంతర్గత భద్రతా సమస్యలకు తోడు సింధు జలాలను భారత్ ఆపివేస్తుందనే భయం, దిగజారి పోతున్న ఆర్థిక వ్యవస్థ, ఇరాన్–అమెరికా యుద్ధంలో దౌత్యం విఫలమవ్వటంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందాన తయారైంది. అంత్యంత కీలకమైన సీపెక్ (సీపీఈసీ; చైనా–పాకి స్తాన్ ఎకనమిక్ కారిడార్) పథకం అమలవుతున్న బలూచిస్తాన్, ఖైబర్–పఖ్తూన్ఖ్వా, పీఓకే, గిల్గిత్ ప్రాంతాలలో పౌరులు పాక్, చైనాలకు వ్యతిరేకంగా ఉద్యమించటాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ పరిణామాలు సీపెక్ భవిష్యత్తుపైన, చైనా పాత్రపైన, కశ్మీర్ వివాదంపైన ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు. ఆజాద్ కశ్మీర్లో ఆజాద్ ఎంత?పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత రెండు నెలలుగా జరుగుతున్న నిరసనలు తార స్థాయికి చేరుకున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో రావల్కోట్, మీర్పూర్, బాగ్లతో సహా పలు పట్టణాలలో 38 ప్రధాన డిమాండ్లతో భారీగా నిరసన ప్రదర్శ నలు జరుగుతున్నాయి. జూలై 15న రావల్కోట్లో సైన్యం కాల్పు లలో కనీసం పదిమంది పౌరులు చనిపోయినట్లు వార్తలొచ్చాయి. ముజఫరాబాద్కు తలపెట్టిన లాంగ్మార్చ్ను జూలై 21కి వాయిదా వేసినా, నిరసనలు ఆగలేదు. ఆక్రమిత కశ్మీర్ అసెంబ్లీలో శరణార్థులకు రిజర్వ్ చేసిన 12 సీట్ల తొలగింపు, కరెంటు ఛార్జీలు, గోధుమ పిండి ధరలతో ప్రారంభమైన నిరసనలు క్రమంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతపు స్వయంప్రతిపత్తిపై వేలెత్తి చూపుతున్నాయి. పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆజాద్ (స్వాతంత్ర) కశ్మీర్గా పేర్కొంటుంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలు భారత అధీనంలోని కశ్మీర్ ప్రాంత ప్రజలతో పోలిస్తే తమ ఆర్థిక స్థితిగతులు, రాజకీయ స్వాతంత్య్రం ఎంత దీనంగా ఉన్నాయో అర్థం చేసుకుంటున్నారు. రావల్కోట్లో జాక్ (జేఏఏసీ) నాయకుడు సర్దార్ అమన్ఖాన్ ప్రదర్శనకారులనుద్దేశించి ప్రసంగిస్తూ, ఆజాద్ కశ్మీర్ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొని పాకిస్తాన్ను ఈ ప్రాంతం నుండి వైదొలగాలని డిమాండ్ చేయటం కొసమెరుపు. అఫ్గానిస్తాన్తో అంతంతే!పాకిస్తాన్లో వైశాల్యం పరంగా 40 శాతం వాటా కల్గిన బలూచిస్తాన్ అతిపెద్ద రాష్ట్రం. ఇరాన్, అఫ్గానిస్తాన్, అరేబియా సముద్రంతో సరిహద్దులు కలిగిన ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం. రాగి, సహజ వాయువు, బంగారం వంటి కీలకమైన వనరులు బలూచిస్తా న్లో సమృద్ధిగా లభిస్తున్నాయి. బలూచి జాతికి చెందిన ప్రజలు పాక్లోని బలూచిస్తాన్, ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్లలో నివసిస్తున్నారు. శతాబ్దాలుగా తమ ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్తాన్ కలాత్ సంస్థా నంగా ఉండేది. 1948లో పాక్లో బలూచిస్తాన్ విలీనం వివాదా స్పద పరిస్థితులలో జరిగింది. కలాత్ రాజును ఒత్తిడి చేసి విలీన పత్రంపై సంతకం పెట్టించారు. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1958–59, 1963–69, 1973–77 మధ్యకాలంలో బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు జరిగాయి. 2004 నుండి మళ్లీ బలూచిస్తా న్లో తిరుగుబాటు తీవ్రమైంది. అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందకపోవటం, స్థానిక ప్రజలపై సైన్యం దమనకాండ, రాజకీయ స్వయంప్రతిపత్తి లేకపోవడం స్థానిక ప్రజల వ్యతిరేకతకు కారణం. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల పాక్ సైన్యం, భద్రతా బలగాలపై కచ్చితత్వంతో ఒకేసారి పెక్కు పట్టణా లలో విరుచుకుపడింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఏకంగా హైజాక్ చేశారు. గత వారంలో బీఎల్ఏ దాడులలో 42 మంది పాక్ సైనిక సిబ్బంది చనిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. పాక్ సైన్యపు ‘ఆపరేషన్ షాబాన్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు లేదు.పాక్–అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని ఖైబర్–ఫఖ్తూన్ఖ్వాప్రాంతంలోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఏకంగా పాక్ సైనిక చెక్పోస్టులుపై దాడులు చేస్తున్నారు. వీరికి అఫ్గానిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పాక్ ఆరోపణ. దీనికి ప్రతిగా పాక్ సైన్యం అఫ్గానిస్తాన్పైన ఏకంగా వైమానిక దాడులను చేపట్టింది. అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం ప్రతిచర్యగా పాక్పై డ్రోన్లతో దాడి చేసింది. పశ్తూన్ (పఠాన్) తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంత ప్రజలు సరిహద్దుకు ఆవల అఫ్గాన్లోని పశ్తూన్ ప్రాంతాలతో కలిపి గ్రేటర్ పశ్తూనిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పాక్– అఫ్గాన్లకు సరిహద్దుగా ఉన్న హిందూకుష్ పర్వతాలలోని డ్యూరాండ్ లైన్ను అఫ్గాన్ మొదటినుండీ అంగీకరించలేదు.తెలిసివచ్చిన తరుణం62 బిలియన్ డాలర్ల వ్యయంతో పాక్లో చైనా అమలు చేస్తున్న సీపెక్ పథకం కింద పాక్లోని ప్రస్తుత సంక్షుభిత ప్రాంతాలలో కీలకమైన రహదార్లు, విద్యుచ్ఛక్తి కేంద్రాలు, రేవు పట్టణాలు, పారి శ్రామిక కేంద్రాలు, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల నిర్మాణం జరుగుతున్నది. సీపెక్ ద్వారా పాక్ గుండా అరేబియా సముద్రంలోనికి ప్రవేశించటం చైనా వ్యూహం. గిల్గిత్ బాల్టిస్తాన్ పాక్ను చైనాతో కలుపుతుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ పథకంలో భాగంగా జీలం, నీలం నదులపై కోహ్లా, కరాత్, ఆజాద్ పఠాన్లలో భారీ జలవిద్యుచ్ఛక్తి కేంద్రాలను చైనా నిర్మిస్తున్నది. కశ్మీర్లో భాగమైన ఈ ప్రాంతాలలో సీపెక్ పథ కాన్ని భారత్ వ్యతిరేకించింది. సీపెక్ రహదారికి గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రవేశ ద్వారమైతే, బలూచిస్తాన్లోని గ్వాదర్ రేవు పట్టణం నిష్క్రమణ స్థానం (ఎగ్జిట్ పాయింట్). గ్వాదర్లో భారీ డీప్ వాటర్ పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం చైనా నిర్మిస్తున్నది. బలూచిస్తాన్లో సంక్షోభం సీపెక్ పథకానికి ప్రతికూలం. ఇది భారత్కు కలిసివచ్చే అంశం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంక్షోభం భారత అధీనంలోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన, అణచి వేత జరుగుతున్నదనే పాక్ వాదనలో డొల్లతనాన్ని బయటపెడు తున్నది. పాక్ అధీనంలోని కశ్మీర్లో ఆదర్శప్రాయమైన పాలన జరు గుతున్నదనే ప్రచారానికి ఈ నిరసనలు చెక్ పెడుతున్నాయి. అమె రికా, ఐరోపాలలోని పాశ్చాత్య మీడియా సంస్థలు ఇప్పటివరకు కశ్మీర్పై కొనసాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి భారత్కు ఇది సువర్ణావకాశం. బలూచిస్తాన్, పీఓకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో సంక్షోభానికి భారత్ కారణమని పాక్ ఆరోపిస్తున్నది. ఈ పరిణా మాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడల్లా పాక్ భారత్లో ఏదో ఒక ఉగ్ర చర్యకు పాల్పడి దృష్టిని మరల్చి ప్రజలను తమ వైపునకు తిప్పు కోవటానికి ప్రయత్నిస్తుంటుంది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
విద్యుత్తు ప్రమాదాలు నివారించగలిగినవే!
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలు ఆధునికీకరణ దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ, విద్యుత్ భద్రత అదే వేగంతో ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రతి సంవ త్సరం వందలాది మంది ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వరుసగా చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు; విద్యుత్ భద్రతా వ్యవస్థలో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందని సూచిస్తున్నాయి.విద్యుత్ రంగంలో నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన ఒక ఇంజినీర్గా నా అనుభవం చెబుతున్నది ఒక్కటే– విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం నివారించగలిగేవే. ప్రతి ప్రమాదం వెనుక డిజైన్, నిర్వహణ, రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, శిక్షణ, భద్రతా సంస్కృతి, జవాబుదారీతనం వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రమాదాన్ని రూట్ కాజ్ ఎనాలిసిస్ (మూల హేతువు విశ్లేషణ) పద్ధతిలో విచారించి, అసలు కారణాలను గుర్తించడం తప్పనిసరి.భారతదేశంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ స్పష్టంగానే ఉంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్– 2003, అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (మెజర్స్ రిలేటింగ్ టు సేఫ్టీ అండ్ ఎలెక్ట్రిక్ సప్లై) రెగ్యులేషన్స్... విద్యుత్ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్దేశించాయి. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు తగ్గడం లేదు? దానికి సమాధానం ‘వ్యవస్థాపరమైన భద్రతా సంస్కృతి’ లోపించడంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత విచారణ కమిటీలు వేయడం, పరిహారం ప్రకటించడం, సంతాపం తెలియ జేయడం అవసరమే. కానీ ప్రమాదం జరగకముందే దానిని నివా రించే వ్యవస్థను నిర్మించడం ఇంకా ముఖ్యమైన బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ రంగం ‘జీరో ఫెటాలిటీ విజన్’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే, విద్యుత్ ప్రమాదాల వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వ్యవస్థలు రూపు దిద్దుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఇదే లక్ష్యం కావాలి.తీసుకోవలసిన భద్రతా చర్యలుప్రతి విద్యుత్ ప్రమాదాన్ని ‘అనివార్యమైన ప్రమాదం’గా కాకుండా, ‘నివారించగలిగిన వ్యవస్థ వైఫల్యం’గా పరిగణించే దృక్పథం ఏర్పడాలి. తెగిపోయిన 11 కేవీ లేదా 33 కేవీ విద్యుత్ లైన్ నేలపై పడిన క్షణంలోనే సంబంధిత రక్షణ వ్యవస్థ స్పందించి ఫీడర్ను ట్రిప్ చేయాలి. అది జరగకపోతే ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదో విచారణ జరగాలి. రక్షణ పరికరాల లోపమా? నిర్వ హణ నిర్లక్ష్యమా? పరీక్షలు సకాలంలో జరగలేదా? లేక పర్యవేక్షణలో వైఫల్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే తదుపరి ప్రమాదాన్ని నివారించగలం.ఇక మరో ముఖ్యమైన అంశం – విద్యుత్ ప్రమాదాలను కేవలం ఉద్యోగుల సమస్యగా చూడరాదు. వీటిలో పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, రైతులు, చిన్నారులు కూడా బలవుతున్నారు. తెగిపడిన తీగలను తాకడం, ట్రా¯Œ ్సఫార్మర్ల సమీపంలో నిర్లక్ష్యంగా తిరగడం, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలినా పట్టించుకోకపోవడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.ఒక ఆధునిక విద్యుత్ వ్యవస్థలో మూడు రక్షణ వలయాలు ఉండాలి – నాణ్యమైన ఇంజినీరింగ్ రూపకల్పన, సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు, కఠినమైన భద్రతా సంస్కృతి. ఈ మూడూ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా, దాని మూల్యం ఒక అమాయ కుడి ప్రాణంగా మారుతుంది.ప్రతి విద్యుత్ ప్రమాదం తర్వాత ఒకే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి – ‘ఈ ప్రమాదం నిజంగా తప్పించలేనిదేనా?’ నిజా యితీగా సమాధానం వెతికితే, చాలా సందర్భాల్లో జవాబు ‘కాదు’ అనే వస్తుంది. అప్పుడు మనం అంగీకరించాల్సిన సత్యం ఒక్కటే– ప్రాణాలను కోల్పోయిన వారు విద్యుత్ వల్ల కాదు; భద్రతా వ్యవస్థ లోని లోపాల వల్ల మరణించారు అని. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే విద్యుత్ రంగంలో నిజమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నట్లవుతుంది.– తుల్జారాంసింగ్ ఠాకూర్, రిటైర్డ్ విద్యుత్ ఇంజినీర్ -
అతడో అస్తిత్వ స్వరం!
తెలుగు దళిత సాహిత్యంలో మాదిగ అస్తిత్వాన్ని స్వతంత్ర సాహిత్య వాదంగా ముందుకు తీసుకొచ్చిన రచయిత నాగప్పగారి సుంద ర్రాజు. దళిత, బహుజన ఉద్యమాల ధిక్కార స్వరాన్ని మాదిగ సాహిత్యం ద్వారా కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు. 1968 మే 31న కర్నూలు జిల్లా మొలగవెల్లి కొట్టాలలో జన్మించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలు, రాయలసీమ కథలపై పరిశోధన చేశాడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. కేవలం 32 ఏళ్లకే 2000 జూలై 17న కన్ను మూశాడు. ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు దళిత సాహిత్యంపై చెరగని ముద్ర వేశాడు.సుందర్రాజు రచనలు మాదిగ సమాజ జీవన వాస్తవాలను, కులవివక్షను, భూస్వామ్య దోపిడీని, జోగిని వ్యవస్థ వంటి అమానవీయ ఆచారాలను వాస్తవిక దృక్పథంతో చిత్రించాయి. ఛండాల చాటింపు, మాదిగోడు, మాదిగ చైతన్యం, మా ఊరి మైసమ్మ వంటి రచనలు మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి సాహిత్య రూపాలుగా నిలిచాయి. తెలుగులో తొలి మాదిగ కవుల సంకలనం ‘మాదిగ చెతన్యం’. సెంట్రల్ యూనివర్సిటీలో ‘మాదిగ సాహిత్య వేదిక’ను స్థాపించి, మాదిగ సాహిత్యానికి ప్రత్యేక అస్తిత్వాన్ని కల్పించేందుకు ఆయన చేసిన కృషి తెలుగు దళిత సాహిత్య చరిత్రలో ఒక సంచలనానికి కారణమయ్యింది.మాండలికం ద్వారా కూడా ఒక సామాజిక చరిత్రను అస్తిత్వ వ్యక్తీకరణగా మలచడం ఎలాగో ఆయన కథా శిల్పంలోని ప్రధాన విశిష్టత. ఈ కారణంగానే ఆయన రచనలు రాయలసీమ మాండలిక సాహిత్యానికి కొత్త దిశను నిర్దేశించి నవిగా గుర్తింపుపొందాయి. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, బండి నారాయణస్వామి వంటి సాహితీవేత్తల ప్రశంసలు పొందాయి.నాగప్పగారి సుందర్రాజు సాహిత్యం కేవలం సృజనాత్మక రచన మాత్రమే కాదు; అది అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతిధ్వనిగా, సామాజిక న్యాయానికి సాహిత్య ప్రకటనగా, అన్యాయంపై ధిక్కార స్వరంగా వినిపిస్తుంది. అర్ధశతాబ్దం కూడా భౌతికంగా జీవించలేకపోయినా అనేక శతాబ్దాల దళిత జీవితాల బాధలను, గాథలను సాహిత్యీకరించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆయన రచనలు దళిత సాహిత్య అధ్యయనానికి, సామాజిక చైతన్యానికి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాలుగా నిలిచాయి.– డా. దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్, తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (రేపు నాగప్పగారి సుందర్రాజు వర్ధంతి) -
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా..
సమాజంలో ఏ గొడవలతోనూ పని లేకుండా మంచి ప్రవర్తనతో, దైవచింతనతో జీవితం గడపాలనుకొనేవారు శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం, కోపం లేకుండటం, ఉపకార బుద్ధి, ఇతరుల సుఖదుఃఖాలను తనవిగా భావించే గుణం వంటి గుణాలన్నీ సాత్త్విక గుణాలు. ఇవి శుద్ధమైన ఆహారం తీసుకోవటం వల్లనే కలుగుతాయి. దేశ కాల ప్రాంతాలకు అనుకూలంగా భోజనం చేయాలని శాస్త్ర వచనం.భీష్మాచార్యులవారు అస్త్ర సన్యాసం చేసి అంపశయ్యమీద పడుకొన్నాడు. వైకుంఠ గమనానికి వేచి ఉన్నాడు. ఆయన చేసిన బోధలను పాండవులందరూ శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో దూరం నుండి వింటున్న ద్రౌపదీ దేవి నవ్వింది. తన మాటలు విని నవ్వినందుకు భీష్ముని మనస్సు బాధపడింది. కారణం తెలియగోరాడు. ద్రౌపది వినయంగా విన్నవించింది. ‘అయ్యా! మీరు మాకెప్పడూ ధర్మ ప్రబోధం చేయవలసినవారే. ఇప్పుడు నా నవ్వుకు కారణం మాత్రం వేరే ఉంది. మరేమీ లేదు. ఆనాడు నిండు కౌరవసభలో అందరూ చూస్తుండగా దుశ్శాసనుడు నాకు వస్త్రాపహరణం చేశాడు. అప్పుడా సభలో మీరు కూడా ఉన్నారు. కాని ఇది అకృత్యమని మీరెవరికీ బుద్ధి చెప్పలేదు. పోనీ ఆ దుష్కృత్యాన్ని చూడలేక అక్కడ నుండి లేచి బయటకు వెళ్ళనూ లేదు. అదీ కాకపోతే రెండు కళ్ళు మూసుకొనవచ్చు కదా! అదీ చేయలేదు మీరు. అలాంటి మీకిప్పుడు ఈ ధర్మప్రబోధం చేయాలనే బుద్ధి యెలా పొడమింది? అని సందేహం కలిగి నవ్వాను’.‘అమ్మా! ద్రౌపదీదేవీ! నీకు సందేహం రావలసినదే తల్లీ! నిన్న మొన్నటివరకు నేను కౌరవుల పక్షంలోనే ఉన్నాను కదా! వారి ఉప్పు తిన్నవాడనయ్యాను. వారి ఆహార ప్రభావం వల్ల వాళ్ళ మాటలే చెవికెక్కాయి. నేను గాంగేయుడను. తిరిగి నా తల్లి గంగతోనే పవిత్రుడను కావాలి. అందుకని ఇప్పుడు అర్జునుడు తన బాణంతో పాతాళం నుంచి పరమ పవిత్రమైన గంగాజలాన్ని పైకి తెప్పించాడు. దాని ప్రభావంతో లోగడ కోల్పోయిన సాత్త్విక భావన తిరిగి వచ్చింది తల్లీ!’ అని చెప్పాడు. ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః సత్త్వ శుద్ధౌ ధ్రువామతిః’- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
పూరీ క్షేత్ర మహావీధిలో...
శ్రీజగన్నాథుడి ప్రార్థనలు, కీర్తనలు చిన్ననాటి నుంచి నా జ్ఞాపకాల్లో పదిలమై ఉన్నాయి. పాఠశాలలో, కళాశాలలో చదువుకొనేటప్పుడు మహాప్రభు జగన్నాథుని భజనలు పాడటం నాకు చాలా ఆనందాన్ని చ్చేది. నేనీ మధ్య భజనలు పాడటం లేదు కానీ, ప్రతి రోజూ ఆ మహా ప్రభుని స్మరిస్తాను. భజనలోని ఓ నాలుగు పదాలైనా పలకని రోజుండదు. ఈనాటికీ భక్త కవి మధు సూదనరావు రచించిన పాటను పాడుతూనే ఉంటాను. ‘‘అంతటా ఉండే ఓ మహాప్రభూ... నువ్వు రాత్రింబగళ్లు నా తోడే ఉన్నావు... ఈ జ్ఞాపకంతో నిన్ను ఎల్లప్పుడూ పూజిస్తాను నా పూర్ణ హృదయంతో’’ అని ఆ పాటకి అర్థం. మహా ఆలయంమహాప్రభు జగన్నాథుని గురించి ఇంట్లో తరచూ మాట్లాడు కొనేవారు. మా గ్రామంలోనూ ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగు తుండేవి. నేను గ్రామ పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సాల్బేగ్ రచించిన ‘ఆహే నీల శైల’ అనే ప్రార్థనను క్రమం తప్పకుండా పఠించేవారు. జగన్నాథుని గురించి మా టీచర్ అనేక విషయాలు చెబుతూ ఉండేవారు. ‘‘పూరీలో పెద్ద ఆలయం ఉంది. అంతటి గొప్ప ఆలయం మరొకటి లేదు! ఆ ఆలయంలో తన చెల్లెలు సుభద్ర, సోదరుడు బలభద్రునితో కలసి మహాప్రభు పూజలందు కుంటారు. మహాప్రభు నల్లని రంగులో, గుండ్రని కళ్లతో ఉంటారు. సుభద్ర పసుపు రంగులో, బలభద్రుడు వెన్నెల్లో వికసించిన పుష్పంలా శ్వేతవర్ణంలో ఉంటారు. ఒక్కసారి ఆ మూర్తులను చూస్తే, ఎప్పటికీ మరచిపోం’’ అని చెప్పేవారు. జగన్నాథుడే మహా ప్రభు వనీ, ఆయన ప్రసాదమే మహా ప్రసాదమనీ కూడా మా టీచర్ చెప్పేవారు. ఆయన ఆలయమే ‘బడ దేవుళ’ లేదా పెద్ద ఆలయం. ఆయన మార్గమే బడ దాండ. అంటే ఉత్కృష్ట మార్గం. ఆయన సముద్రమే మహోదధి లేదా గొప్ప మహాసముద్రం. మయూర్భంజ్ జిల్లాలోని మా ఊరు ఉపర్బేడా నుంచి పురుషోత్తమ క్షేత్రం పూరీ చాలా దూరంలో ఉంటుంది. మరి పూరీని సందర్శించే అవకాశం నాకెలా వస్తుంది? నేను పెద్దయ్యాక, భువనేశ్వర్కి వెళ్లాను. అక్కడ బాలికల ఉన్నత పాఠశాల యూనిట్–2లో చేరాను. అక్కడే వసతి గృహంలో ఉండేదాన్ని. అక్కడ ఉన్నప్పుడే పూరీ, భువనేశ్వర్, కోణార్క్ సందర్శించే అవకాశం లభించింది. మొదటిసారి మహా ప్రభును దర్శించుకున్న జ్ఞాపకం ఇప్పటికీ నా మదిలో స్పష్టంగా ఉంది. ఎంత అద్భుతమైన ఆలయం! ఎంత తేజోవంతమైన దేవతా మూర్తులు! శ్రీ క్షేత్రలో ఏడాదిలోని పన్నెండు నెలల్లో పదమూడు ఉత్స వాలు జరుగుతాయి. కానీ రథయాత్ర వైభవం అద్వితీయం. మహా ప్రభు దర్శనం కోసం ఏడాది పొడవునా భక్తులు ఆలయాన్ని సంద ర్శిస్తారు. కానీ ఏడాదికోసారి మహాప్రభువే ఆలయాన్ని వదలి విశాల పథంలో గుండిచా ఆలయానికి చేరుకొని భక్తులకు దర్శన మిస్తారు. మూడు అద్భుతమైన రథాలపై... చక్రరాజ సుదర్శనునితో పాటు... ముగ్గురు దేవతామూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే ఏడు రోజులు ఉండి, ఆ తర్వాత తిరుగు ప్రయాణ మవుతారు.నా తోడు...చిన్నతనం నుంచి మహాప్రభు జగన్నాథుని భక్తురాలిని. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ సమస్యలన్నింటి నుంచి మహాప్రభు నన్ను బయటకు తీసుకొచ్చారు. ఎంతైనా నేను ఆయన బిడ్డనే కదా! భారత రాష్ట్రపతి పదవికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు.. నేను భక్తిపూర్వకంగా మహాప్రభుని తలచు కున్నాను. ‘నన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకెళుతున్నావు. నన్ను ముందుకు నడిపించు. ఎప్పుడూ నాతోనే ఉండు’ అని ప్రార్థించాను. నేను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో రథయాత్ర ఉత్సవం జరిగింది. నేను అప్పుడు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. రథయాత్ర రోజు ఉదయమే నేను ఢిల్లీలోని హాజ్ ఖాస్లో ఉన్న జగన్నాథుని ఆలయానికి వెళ్లాను. మహాప్రభు దర్శనం చేసుకున్నాను. పూర్తి విశ్వాసంతో నామినేషన్ దాఖలు చేశాను. 2022 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలుకి వెళుతూ... దారిలో మహా ప్రభు జగన్నాథుని స్మరిస్తూనే ఉన్నాను. రాష్ట్రపతిగా నేను మొదటి సారి ప్రసంగించినప్పుడు ఆయన నాతోనే ఉన్నట్టు అనిపించింది.క్షేత్ర రాజంఅయినప్పటికీ, మహాప్రభు దర్శనం కోసం నా హృదయం పరితపించింది. రోజులు గడచిపోతున్నాయి కానీ పూరీ వెళ్లడం సాధ్యం కాలేదు. ఆయన అనుమతిస్తేనే తప్ప ఎవరికైనా ఆయన దర్శనం ఎలా లభిస్తుందని నాకు అనిపించింది. ‘మహాప్రభూ! నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను పూరీకి పిలిచి, మీ దర్శన భాగ్యం ఇవ్వండి’ అని మౌనంగా ప్రార్థించాను. అనతి కాలంలోనే పూరీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆ రోజు 2022 నవంబర్ 10. పూరీకి చేరుకున్న తర్వాత వాహన శ్రేణి శ్రీమందిర్ దిశగా ముందుకు వెళుతోంది. పూరీలోని బడ దాండ వద్దకు చేరుకోగానే అనిర్వచనీయమైన అనుభూతి నన్ను ముంచెత్తింది. బడ దాండ శ్రీ జగన్నాథునిది. ఇక్కడ ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందా? అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ క్షేత్ర రాజంగా పూరీ ప్రసిద్ధి చెందింది. దేవుళ్లకే దేవుడు మహాప్రభు. ఎలాంటి ఆలోచనలు లేకుండా నా కారుని ఆపించాను. నా కారు ఆగగానే వెనుక వస్తున్న కార్లనీ కూడా ఆగిపోయాయి. ఏం జరుగుతుందో మిగిలిన వారికి అర్థమయ్యేలోపే... చెప్పులు లేకుండా బడ దాండపై నడవడం మొదలుపెట్టాను. అక్కడికి శ్రీ మందిర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ శిఖరం మీద ఉన్న నీల చక్రం, పతిత పావన ధ్వజం మీదే నా దృష్టిని సారించి ముందుకు సాగాను.ఆలయ సింహద్వారానికి చేరుకొనేసరికి... నేను స్థిమితంగా ఉండలేకపోయాను. బడ దాండ మీద దుమ్ములోనే సాష్టాంగ నమ స్కారం చేసి... ఆ మహాప్రభుకి నా ప్రణామాలు అర్పించాను. గర్భ గుడికి చేరుకొని నలుగురు దేవతామూర్తులను దర్శనం చేసుకుని, దైవికానందంతో ఉప్పొంగిపోయాను. లోకంలోని జనుల కష్టాలను తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అందుకే ఆయన విశాలమైన గుండ్రటి నేత్రాలు ఎప్పుడూ రెప్ప వాల్చవు. ఆయనకి పెద్దాచిన్నా తారతమ్యం లేదు. సమానత్వమే ఆయన మంత్రం. ఆయన దీవెనలతోనే... సమాజంలోని ప్రతి వర్గానికి సేవ చేసేందుకు నన్ను నేను అంకితం చేసుకున్నాను. గుండ్రని కన్నులతో ఉన్న మహాప్రభు జగన్నాథుని చూస్తూ... ‘ఓ మహాబాహూ! ప్రజ లకు సేవ చేయాలనే నా అంకితభావం కొనసాగేలా ఆశీర్వదించు. ఓ కృపానిధీ! నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని రక్షించు’ అని చేతులు జోడించి ప్రార్థించాను.ద్రౌపది ముర్ముభారత రాష్ట్రపతి(నేడు జగన్నాథ రథయాత్ర ప్రారంభం) -
సమానత్వం పేరిట ఆహారంలో కోత
ఆహార భద్రతా చట్టానికి సవరణలు చేయటానికి కేంద్రప్రభుత్వం పూనుకుంది. ఏదైనా ఆహార భద్రతా చట్టంలో మార్పును పరీక్షించడానికి ఒక సులభమైన కొలమానం ఉంది. ఆ పథకం ఎవరి కోసం రూపొందిందో ఆ వ్యక్తిని – అంటే గాంధీజీ చెప్పిన ‘అంత్యోదయ’, వరుసలో చిట్టచివరి మనిషిని – తీసుకోవడం; ఈ సవరణ తర్వాత అతడికి ఎక్కువ ఆహారం అందుతుందా, తక్కువా అని అడగడం. జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026కు ఈ పరీక్ష పెడితే వచ్చే జవాబు స్పష్టం: ప్రతి కుటుంబానికీ తక్కువే. ఒంటరిగా ఉండే వితంతువుకు మరీ తక్కువ. ఈ చట్టం ఆమెనూ, ఆమెలాంటి వాళ్లనూ రక్షించడానికి రూపొందినది కావడమే ఇక్కడ గమనార్హం.పెద్ద కుటుంబాల మాటేమిటి?‘అంత్యోదయ అన్న యోజన’ (ఏఏవై) కింద కుటుంబానికి నెలకు 35 కిలోల ధాన్యం ఇచ్చే హక్కును ఈ బిల్లు తీసేసి, ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కుటుంబానికి గరిష్ఠంగా 35 కిలోల పరిమితిని విధిస్తోంది. దీన్ని ‘అసమానతలను తొలగించడం’గా ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్క చూస్తే నిజం బయటపడుతుంది: ఒంటరి వ్యక్తికి 35 నుంచి 7 కిలోలకు (80% కోత) తగ్గుతుంది. ఇద్దరికి 14 కిలోలకు, ముగ్గురికి 21కి, నలుగురికి 28కి పడిపోతుంది. ఐదుగురి కుటుంబం మాత్రమే సరిగ్గా 35 కిలోలు తీసుకుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది మంది ఉన్న కుటుంబాలు 35 కిలోల పరిమితి వల్ల ఉన్న చోటే ఉండిపోతాయి. ఏ ఒక్క ‘ఏఏవై’ కుటుంబానికీ ఒక్క కిలో అదనంగా రాదు. ‘లాభం’ అనే గడి పూర్తిగా ఖాళీ. 7 కిలోలు పోషకాహార ప్రమాణమే అయితే, ఎనిమిది మంది కుటుంబానికి 56 కిలోలు కావాలి. కానీ పరిమితి వాళ్లకు 35 మాత్రమే ఇస్తుంది. అంటే తలసరి 4.4 కిలోలు. సాధారణ ప్రాధాన్య కుటుంబం కంటే కూడా తక్కువ. ఈ పోషకాహార సూత్రం కోత పెట్టే చోట పని చేస్తుంది, హక్కు పెంచాల్సిన చోట మాత్రం మౌనంగా ఉంటుంది. ఒకే వైపు పనిచేసే సూత్రం కాదు – అది సమానత్వం ముసుగులో ఒక పొదుపు లక్ష్యం మాత్రమే.ఒంటరివాళ్లు ఏం కావాలి?చిన్న కుటుంబాలపైనే ఈ పథకాన్ని కేంద్రీ కరించారు. ఏఏవైలో చిన్న కుటుంబం అనేది యాదృచ్ఛికం కాదు, అదే దాని రూపకల్పన. 2000 సంవత్సరం నుంచి ఏఏవై రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పింది: ఆసరా లేని వితంతువులు, ఒంటరి మహిళలు, మంచానపడ్డ రోగులు, వికలాంగులు, ఆధారం లేని వృద్ధులు, ఆదిమ తెగలు,ఒంటరిగా బతికే నిరుపేదలను గుర్తించండి అని! దారిద్య్రం మన దేశంలో ఒకరిద్దరుగానే ఉంటుంది. అందుకే 35 కిలోల ఫ్లాట్ హక్కు పొరపాటు కాదు, అది తలసరి లెక్కకు కుదించ లేని ఒక గుర్తింపు. ఒంటరి నిరుపేదకు ఆ రేషన్ కేవలం ఆహారం కాదు; పింఛను అందని నెలకు అది ఆసరా, ఇంట్లో ఏ ఆపదనైనా తట్టుకోగల ఏకైక ఆస్తి. రేషన్ దుకాణంలో ఒంటరి కార్డుపై వేలి ముద్ర ఎవరిదో చూసిన వారికి తెలుసు. అది చాలావరకు ఏ దిక్కూ లేని ఒక ముసలి స్త్రీది. ఆమె 35 కిలోలు ఇప్పుడు 7 కిలోలు అవుతాయి. చట్టం చరిత్రలోనే విధించిన అతిపెద్ద కోత ఇది.పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతోంది? ఎఫ్సీఐ గోదాముల్లో దాదాపు 604 లక్షల టన్నుల ధాన్యం– బఫర్ ప్రమాణానికి దాదాపు మూడు రెట్లు– పేరుకుపోయి ఉన్నప్పుడు. అదే సమయంలో రైతులు వరి, గోధుమ, కంది, పెసర కనీస మద్దతు ధర కంటే తక్కు వకే అమ్ముకుంటున్నారు. మిగులుపై కూర్చొని, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అత్యంత పేద కుటుంబాల రేషన్ నుంచి ఏటా 22–25 లక్షల టన్నులు తీసేయడం – ఇది కొరత వల్ల కాదు, పొదుపు పేరుతో జరుగుతున్న మార్పు. సేకరణ దగ్గర రైతును,పంపిణీ దగ్గర పేదను నొక్కి, మధ్యలో మిగిలిన దాన్ని ‘పొదుపు’ అని పిలవడం– ఇది మనం మళ్లీ మళ్లీ చూస్తున్న నమూనా. ఇది చట్టం చరిత్రలో మొదటిసారిగా ఒక హక్కును తగ్గించే సవరణ. ఆర్టికల్ 21 కింద ఆహార హక్కును ఒకసారి కల్పించాక దాన్ని వెనక్కి తీసుకోవడం రాజ్యాంగపరంగా ప్రశ్నార్థకం. పైగా ఇంత కీలకమైన మార్పును – ఈమెయిల్ ద్వారా, ఇంగ్లిష్లో మాత్రమే, కొద్ది రోజుల గడువుతో సంప్రదింపులకు పెట్టడం ప్రభుత్వం తన శాసన సంప్ర దింపుల విధానాన్నే ఉల్లంఘించడం! అసలు పరిష్కారంప్రభుత్వం చెప్పే సమస్య నిజమైనదే అయితే, పరిష్కారం చాలా సులభం. ఒక అంత్యోదయ అన్న యోజన కుటుంబానికి హక్కు ఒక్కొక్కరికి 7 కిలోలు, లేదా కుటుంబానికి 35 కిలోలు– వీటిలో ఏది ఎక్కువ అయితే అది నిర్ణయించవచ్చు. చిన్న కుటుంబాలు తమ రక్షణను నిలబెట్టుకుంటాయి; పెద్ద కుటుంబాలకు– ఆరుగురికి 42 కిలోలు, ఎనిమిది మందికి 56 కిలోలు వస్తాయి. బిల్లు ఉదహరించే ఐసీఎంఆర్ పోషణ ప్రమాణానికి తగిన వాటా దొరుకుతుంది. దీనికి కావాల్సిన అదనపు ధాన్యం నేటి మిగులు ముందు నామమాత్రమే. పైగా అది గోదాముల ఒత్తిడిని తగ్గించి, కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోయిన మార్కెట్లో సేక రణకు ఊతమిస్తుంది. ఎవరూ నష్టపోరు, అందరూ లాభపడతారు. కానీ ప్రభుత్వం మాత్రం పేదలే ఎక్కువ నష్టపోయే సూత్రాన్ని ఎంచుకుంది. మిగిలిన ధాన్యాన్ని ఇథనాల్ పరిశ్రమలకు సబ్సిడీతో అందించే బదులు ఆకలితో ఉన్నవాళ్లకి అందిస్తే మంచిది కదా!అలా అని ఇప్పుడు ఉన్న చట్టంలో సమస్యలు లేవని కాదు. నిజానికి చట్టానికి సంస్కరణలు అవసరమే– కానీ ఈ దిశలో కాదు. అసలైన సవరణ ఐదు ప్రశ్నలను ఎదుర్కోవాలి. మొదటిది, జనాభాలో ఒక శాతం ప్రకారం కాక నిజంగా అవసరమున్నవారిని క్షేత్రస్థాయిలో గుర్తించి చేర్చడం. రెండోది, బియ్యం, గోధుమలకే పరిమితం కాకుండా పప్పులు, చిరుధాన్యాలు, నూనెను రేషన్ బుట్టలో చేర్చడం. మూడోది, ప్రజాపంపీణీ వ్యవస్థ ఆహారం తినడానికి సురక్షితంగా ఉండేలా ప్రమాణాలు, పరీక్షలు, తిరస్కరించే హక్కు కల్పించడం. నాలుగోది, రైతును తక్కువ ధరతో ముంచి చౌక ఆహారానికి రాయితీ ఇవ్వడం ఆపి, గిట్టుబాటు ధర (సీ2+50%)ను ఆహార భద్రత నిజ ఖర్చుగా గుర్తించడం. ఐదోది, మిగతా నాలుగింటినీ సాధ్యం చేసేది– వ్యవస్థను వికేంద్రీకరించి, జిల్లాను ప్రాతిపదికగా చేసి, స్థానిక ఎఫ్పీఓలకు సేకరణ, నిల్వ,పంపిణీ బాధ్యతలను అప్పగించడం. ఈ బిల్లును ఇప్పటికీ వెనక్కి తీసుకోవచ్చు. దాని వెనుక ఉన్న శక్తిని, చట్టం దశాబ్దంగా ఎదురుచూస్తున్న నిజమైన సంస్కరణ వైపు మళ్లించడమే మెరుగైన మార్గం. అలా కాక, సమానత్వం ముసు గులో చేసేది కేవలం కోత మాత్రమే!డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
చెరువు గట్టుకు చేరనున్న భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరాన్ని దేశ ఆక్వా రాజధానిగా నిలబెట్టాడు రైతు. ఆ ‘తెల్లబంగారం’ డాలర్ల వర్షం కురిపించిన రోజులూ ఉన్నాయిగానీ నేడు అదే చెరువు గట్లపై నిలబడి రైతు ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మే నెలలో పాలకొల్లు–భీమవరం రహదారిపై, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన రొయ్యలను కుప్పలుగా పారబోసి రైతులు ఆక్రోశించిన దృశ్యం, ఈ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.ఇది ఏదో ఒక జిల్లాకు పరిమితమైన కథ కాదు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు ఆక్వా రంగంపై బతుకుతున్నాయి. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో 100 కౌంట్ రొయ్య ధర రూ. 270 నుంచి రూ. 215కు కుప్పకూలింది. 100 కౌంట్ రొయ్య పండించేందుకు రూ. 270 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్లో దక్కుతున్నది రూ. 220–240 మాత్రమే. యాభై దాకా ఉన్న ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించి, ‘100 కౌంట్కు రూ. 230, 40 కౌంట్కు రూ. 330, 30 కౌంట్కు రూ. 430, నెలాఖరు వరకు ఇవే రేట్లు’ అని ప్రక టించే స్థాయికి పరిస్థితి దిగజారిందంటే, మార్కెట్లో రైతుకు మిగిలే మాటే లేదని అర్థం.మేత, సీడ్, ప్రాసెసింగ్ సంస్థలన్నీ ఒక్కటై సిండికేట్గా వ్యవహ రిస్తూ పంట చేతికొచ్చే వేళకే కొనుగోలు ధర దించుతున్నాయనీ, వాటిలో అధిక భాగం అధికార పెద్దల అనుకూలుర చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు రైతు అధిక వడ్డీ అప్పుల ఊబిలో దిగబడుతున్నాడు.నీటిమూటలైన హామీలు ఎన్నికల ముందు ‘ఆక్వా జోన్ తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్ రూ. 1.50కే విద్యుత్’ అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా పైసా విడుదల చేయలేదు. ‘హామీని అమలుపర్చలేదు సరికదా సబ్సిడీపై ఇస్తామన్న ట్రాన్ ్సఫార్మర్లు, పరికరాలు కూడా ఇవ్వలేదు’ అని రైతులు వాపోతున్నారు. జీవో 169లోని పవర్ ఫ్యాక్టర్ నిబంధన (క్లాజ్ 4) పారిశ్రామిక ప్రమాణాలు పాటించలేని వేలాది సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు గుదిబండగా మారింది. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ కావాలంటూ 2024 నవంబర్లోనే భీమవరం వేదికగా విద్యుత్ శాఖ మంత్రి ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు. ‘త్వరలోనే కచ్చితమైన నిర్ణయం’ అని మంత్రి హామీ ఇచ్చి పంతొ మ్మిది నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మారిందేమీ లేదు.ఈ నేపథ్యంలోనే గత నెల 16న ‘ఏపీ ప్రాన్ ఫెడరేషన్’ ప్రతినిధులు, మాజీ అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్, ఆక్వా రైతులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. పెరిగిన మేత ధరలు, పడిపోయిన రొయ్య ధరలు, పెరిగిన పెట్టుబడి వ్యయం, నిలిచిపోయిన రాయి తీల వ్యథను ఆయనకు వివరించారు. ఫలితంగా జూలై 15న జగన్ ఆక్వా రైతులకు అండగా భీమవరం బాట పడుతున్నారు. ఇది మామూలు రాజకీయ పర్యటన కాదు. చెరువు గట్ల మీదకే వెళ్లి రైతు కష్టాన్ని కళ్లారా చూడటం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడం, కుంగిన గుండెల్లో భరోసా నింపడం: ఈ మూడూ ఆ పర్యటన లక్ష్యాలు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పశ్చిమ గోదావరి గడ్డపైనే ఆక్వా రైతుకు రూ. 1.50 విద్యుత్ మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే అక్షరాలా అమలు చేసి చూపిన నేత ఆయన. అందుకే ఆయన రాక అంటే ఆక్వా సీమకు అది కేవలం సానుభూతి పలకరింపు కాదు, అనుభవం రుజువు చేసిన భరోసా.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
వైద్యుల భద్రతే ఆరోగ్య భద్రత
మహారాష్ట్రలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులపై స్థానిక కార్పొరేటర్ దాడి చేశాడనే వార్తలొచ్చాయి. అరెస్టు చేయబోతున్నారని తెలియగానే, ఆ కార్పొరేటర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని సమాచారం. తాను దాడి చేసిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచే తనకు వైద్యం అందాలని ఆయన ఏ సంకోచం లేకుండా ఆశించడం హాస్యాస్పద విషాదం.ఇదే సంఘటన సింగపూర్లో జరిగితే పరిస్థితి వేరేలా ఉండేది. ‘ఆరోగ్య సంరక్షణ రంగంలో దాడులు, వేధింపుల నివారణకు త్రైపాక్షిక విధానం’ అక్కడ అమలవుతోంది. దాడి చేసిన వ్యక్తికి (అత్యవసరం కాని) చికిత్సను నిరాకరించడంతో పాటు, మెడికల్ రికార్డులలో ‘దురుసుగా ప్రవర్తించే వ్యక్తి’గా శాశ్వతంగా ముద్రించే అవకాశం ఉంది. వైద్యులపై హింసకు అక్కడ జీవితకాల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.భారతదేశంలో ఆరోగ్య సంరక్షకులపై హింస సాధారణమై పోయింది. వైద్యులు, నర్సులు ఇప్పటికే సుదీర్ఘ పనివేళలు, మాన సిక ఒత్తిడి, వసతుల కొరతతో సతమత మవు తుండగా... ఇప్పుడు బెదిరింపులు, భౌతిక దాడుల భయం పెరుగుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురి తమైన ఉత్తరాఖండ్ అధ్యయనం వివరాల ప్రకారం, 75% మంది వైద్యులు ప్రతీకార దాడులు ఎదుర్కొన్నారు. ఇందులో 68% దాడులు రోగుల బంధు వులు చేస్తే, కేవలం 18% కేసులు మాత్రమే పోలీసుల దృష్టికి వెళ్లాయి. సఫ్దర్ జంగ్ వంటి ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్లలో జరిగిన ఆడిట్ ప్రకారం అధిక ఒత్తిడి షిఫ్ట్లలో హింస రేటు 63.6%గా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసా గితే వైద్య శాస్త్రాన్ని అభ్యసించడానికి ప్రతిభావంతులైన విద్యార్థులు ముందు కురారు. ఫలితంగా దేశంలో వైద్య నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను, ఆసుపత్రులకు నష్టం కలిగించ డాన్ని నిషేధిస్తూ అనేక రాష్ట్రాలు చట్టాలను రూపొందించాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ‘హెల్త్కేర్ సర్వీసెస్ పర్సనల్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ డామేజ్ టు ప్రాపర్టీ) బిల్లు’ ముసాయిదాను 2019లో రూపొందించింది. అయితే అది చట్టంగా మారలేదు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో, ‘అంటు (ఎపిడమిక్) వ్యాధుల చట్టాన్ని’ సవరించి, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడటాన్ని నాన్– బెయిలబుల్ నేరంగా పరిగణించి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా 2020లో చట్టం తీసుకువచ్చినా ఆశించిన స్థాయిలో ప్రభావం కనిపించడం లేదు. వైద్యుల భద్రత – జాతీయ ఆరోగ్య భద్రతకు కీలకం. వైద్యులను గౌరవించడం అంటే – ఆరోగ్య సంరక్షణ పొందే పౌరుల రాజ్యాంగ హక్కును కాపాడటమే.– శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త -
నాటి వైభవం ఎందుకు సాధ్యం కాదు?
ఆమధ్య ఓ సాయంత్రం పురానాపూల్ మీద నిలబడినప్పుడు కింద మురికి నీటిలో ప్లాస్టిక్ కవర్లు, జంతు కళేబరాలు తేలుతూ కనిపించాయి. దుర్గంధం వెదజల్లుతోంది. నాలుగు శతాబ్దాల క్రితం ఇదే బ్రిడ్జి మీద నుండి కుతుబ్ షాహీలు నది అందాలను చూసి మైమరచి పోయారన్న చరిత్ర గుర్తుకు వస్తే మనసు వికలమవుతుంది.1578లో కుతుబ్ షాహీల కాలంలో ఈ పురానాపూల్ నిర్మాణం జరిగింది. గోల్కొండ కోటకు, మూసీకి ఆవల ఉన్న ప్రాంతానికి మధ్య రాకపోకలు సాగించే ఆలోచనతో పురుడుపోసుకుంది. ఇరవై ఆరు రాతి కమానులతో నిర్మితమైన ఈ వంతెనను ‘బ్రిడ్జ్ ఆఫ్ లవ్’గా ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ వర్ణించాడని ప్రతీతి. 17వ శతాబ్దంలో హైదరాబాద్ను సందర్శించిన విదేశీ యాత్రికులు మూసీ నది ఒడ్డున ఉన్న తోటలు, భవనాలు చూపరులను కట్టిపడేస్తాయని వర్ణించారు. ప్రజలు ఈ నీటినే మంచినీరుగా వాడుకునేవారు.కానీ ఇదే మూసీ 1908లో భారీ వరదలతో విలయాన్ని చూపించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. నదిని నిర్లక్ష్యం చేస్తే అది తన ప్రకోపాన్ని చూపిస్తుందని అది హెచ్చరించిన గుణపాఠాన్ని పట్టించుకోకపోతే ఎలా? స్థానికుల కథనం–శాటిలైట్ చిత్రాల విశ్లేషణ వల్ల తేలిందేమంటే... గత మూడు దశాబ్దాల్లో పురానాపూల్ దగ్గర మూసీ నది సహజంగా ఉన్న వెడల్పు చాలా వరకు తగ్గిపోయిందని! అంటే నదిని మనం మింగేశామన్న మాట! హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురుగునీటి మొత్తంలో ఎక్కువ శాతం శుద్ధి కాకుండానే నేరుగా మూసీలో కలుస్తోంది. వర్షం పడగానే వ్యర్థాలన్నీ బ్రిడ్జి పిల్లర్లకు తట్టు కుని ప్రవాహం ఆగిపోయేలా చేస్తున్నాయి. ఫలితంగా దిగువన ఉన్న చాదర్ఘాట్, మూసారాంబాగ్ లాంటి లోతట్టు ప్రాంతాలు కూడా చిన్న వర్షానికే నీట మునిగిపోతున్నాయి.ప్రస్తుతం మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నదికి ఇరువైపులా ఫెన్సింగ్ వేస్తోంది. ఆక్రమణలు ఆపడం, చెత్త వేయకుండా చూడటం దీని ఉద్దేశ్యం కావచ్చు. కానీ నదిని ప్రజలకు దూరం చేసినట్లు అవుతుంది. 1950ల్లో లండన్లో థేమ్స్ నదిని ‘జీవ శాస్త్రపరంగా మృత నది’గా ప్రకటించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో దాన్ని పునరుజ్జీవింపచేసింది. ఫలితంగా ఇటీవల కాలంలో థేమ్స్ నదిలో సీల్స్, డాల్ఫిన్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నది ఒడ్డున రెస్టారెంట్లు, వాకింగ్ ట్రాక్లు, టూరిస్ట్ బోట్ లతో బిలియన్ల పౌండ్ల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్ కూడా ఇదే మోడల్. మరి చరిత్ర నేర్పిన పాఠాల నుండి మనమేం నేర్చుకుంటున్నాం?స్మార్ట్గా ఆలోచించాలి!మూసీని బతికించాలంటే మనకు కావాల్సింది కేవలం కాంక్రీట్ కాదు, ‘స్మార్ట్ సైన్స్’. ముందుగా డ్రోన్లు, ఉపగ్రహాలతో మూసీ నదికి 1:1000 స్కేల్లో త్రీ డీ మ్యాప్ తయారు చేయాలి. ఎక్కడ ఆక్రమణ ఉంది, ఎక్కడ నాలా కలుస్తుంది, ఎక్కడ నీరు నిల్వ ఉంది అనేది ప్రతి మీటర్ లెక్క తేలాలి. పురానాపూల్, చాదర్ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల దగ్గర నీటి నాణ్యతను, నీటి మట్టాన్ని 24 గంటలూ కొలిచే ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సెన్సార్లు పెట్టాలి. ఏ నాలా నుండి కాలుష్యం వస్తోందో వెంటనే తెలిసిపోతుంది. పర్యాటక అవకాశం, జనసాంద్రత, కాలుష్య స్థాయి, వరద ముప్పు వంటి అంశాలను తీసుకుని, ప్రాధాన్యతా పట్టిక ప్రకారం నిధులు ఖర్చు పెడితే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది. పురానాపూల్ను కేవలం బ్రిడ్జిలా కాకుండా ‘సాంస్కృతిక వ్యాఖ్యాన కేంద్రం’గా మార్చాలి. నాలుగు శతాబ్దాల క్రితం కుతుబ్ షాహీలు చూసిన అందమైన మూసీని మన పిల్లలకు చూపించే బాధ్యత మనదే! – డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకులు -
అనుగ్రహం అవసరం!
సురాసురులు కలిసి కష్టించి, ఎన్నెన్నో మహత్తరమైన అవరోధాలనూ, విఘ్నాలనూ అధిగమించి, ఎట్టకేలకు అమృతం సాధించారు. ధన్వంతరి అందించిన అమృత కలశాన్ని తటాలున అందుకొని, అసురులు అన్యాయంగా స్వాధీనం చేసుకొన్నారు. అప్పటికప్పుడు శ్రీహరి మోహినీ అవతారాన్ని ఎత్తి, వాళ్ళను కామ మోహితులను చేశాడు. ఆ మోహంతో వాళ్ళు అందరికీ అమృతం పంచే బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆమె దాన్ని ఎలా పంచినా, తాము అడ్డుపడమని ఒప్పందం చేసుకొన్నారు.మోహిని అమృతాన్ని మొదట దేవతల పంక్తికి పంచటం పూర్తయేసరికి, పాత్ర ఖాళీ అయిపోయింది. ఆమె అంతర్ధానమై పోయింది. రాక్షసులకు ఏమీ మిగలలేదు. రాహువు అనే రాక్షసుడు మాత్రం, మారువేషంలో దేవతల పంక్తిలో చేరి, అమృతం పుచ్చుకొన్నాడు. సూర్యచంద్రులు ఇది గమనించి చెప్పగానే, సుదర్శన చక్రం రివ్వున వచ్చి, పుచ్చుకొన్న అమృతం నాలుక దాటకుండానే, రాహువు తలను నరికి వేసింది. అమృత ప్రభావం వల్ల అతడి తల సజీవంగా మిగిలిపోయింది. అమృత స్పర్శ లేని మొండెం పతనమై నశించింది. (అప్పటి నుంచి ‘రాహువు తల’ అనేది ప్రత్యేకంగా లేదు. రాహువు అంటేనే రాహువు తల. కాబట్టి ‘రాహు మస్తకం’ అని చెప్పనక్కర్లేదు. చెప్తే అది, ‘సీతా ఫలం పండు’, ‘పేపరు కాగితం’ అన్నట్టు పునరుక్తి అవుతుంది!)దేవాసురులు ఒకే పరిస్థితులలో, ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, ఒకే సాధన సామగ్రితో, ఒకే విధమైన శ్రమను, ఒకే సంకల్పంతో చేశారు. కానీ వాళ్ళకు లభించిన ఫలంలో మాత్రం తేడాలు వచ్చాయి. ఏవం సురాసుర గణాః సమ దేశ, కాల,/ హేతు–అర్థ, కర్మ, మతయః–అపి, ఫలే వికల్పాః. ఎలాంటి తేడాలు? తత్ర అమృతం సురగణాః ఫలం–అంజనా–ఆపుః, నదైత్యాః – అక్కడ సురగణాలు అమృతం అనే ఫలాన్ని సులభంగా పొందారు, దైత్యులు పొందలేదు. కారణమేమిటి? పాద పంకజ రజ–ఆశ్రయాత్– శ్రీహరి పదకమలాల ధూళిని (దేవతలు) ఆశ్ర యించి, సేవించటం వల్ల. హరి విముఖులు కనక అసురుల శ్రమ నిష్ఫలమైంది. శ్రమకు దైవానుగ్రహం తోడయి తేనే ఫల ప్రాప్తి ఉంటుంది, అంటుంది భాగవతం.– ఎం.మారుతి శాస్త్రి -
అంతా ప్రపంచం మంచికే!
జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?కొత్త అస్థిరతలుఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.బహుళ ధ్రువ ప్రపంచంభారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్ డాలర్కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.బద్దలవుతున్న చట్రంవీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కెనడా, యూరప్ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్వుడ్స్ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఆచార్యులలో మేటి!
తెలుగు భాషా సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు ఆచార్య జి.ఎన్. రెడ్డి. ఆయన చిత్తూరు జిల్లాలోని ‘మహా సముద్రం’లో పుట్టారు. తెలుగు ఆచార్యులకు ఏనాడూ రాని వైస్– ఛాన్స్లర్ పదవి ఆయనతో 1984లో మొదలయ్యింది. శ్రీ వేంకటే శ్వర విశ్వ విద్యాలయానికి వైస్–ఛాన్స్లర్గా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరి మన్ననలను అందుకొన్నారు.ఆయన గొప్ప నిఘంటుకారుడు. నిఘంటు నిర్మాణంతో పాటు నామ విజ్ఞానం, భాషా సాహి త్యాలలో అందెవేసిన చేయి. తెలుగు–తెలుగు నిఘంటువులు, ఇంగ్లీష్–తెలుగు ద్విభాషా నిఘంటువు, కుమ్మరం, వడ్రంగం మాండలిక వృత్తి పద కోశాలు, తెలుగు పర్యాయ పద నిఘంటువులు ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. మహాభారతం శల్య సౌప్తిక స్త్రీ పర్వాలకు రచించిన పీఠిక, భగవద్గీతకు రాసిన పీఠిక, బ్రౌన్ గ్రంథాలకు రచించిన పీఠికలు ఎంతో విశ్లేషణాత్మకమైనవి.వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బంగోరె సహకారంతో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా బ్రౌనుకు సంబంధించిన స్వీయ సాహితీ జీవిత చరిత్రల మీద అనేక పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. వాటిలో బ్రౌన్ లేఖలు, బ్రౌన్ కడప జాబులు, ఆంధ్ర గీర్వాణ ఛందము వంటి అమూల్యమైన గ్రంథాలు ఉన్నాయి. అలాగే జి.ఎన్. రెడ్డి భాషా విజ్ఞాన పరిచయం, ద్రావిడ భాషా విజ్ఞా్ఞనం, తన జీవిత చరిత్ర అయిన ‘జి.ఎన్. రెడ్డి జీవితరేఖలు’ కూడా రాశారు. జానపదులు చెప్పుకొనే పొడుపు కథలను సేకరించి ‘పొదుపు కథలు’ అనే గ్రంథాన్ని కూడా ప్రచురించారు.1962–64 మధ్య అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో లెక్చ రర్గా పని చేసి అక్కడి విద్యార్థుల కోసం కూడా వాచకాలను రాశారు. చికాగో యూనివర్సిటీలో కూడా లింగ్విస్టిక్స్ పాఠాలు బోధించారు. కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రావ్ు కింద 1974లో బల్గేరియా, 1981లో మలేషియా, 1983లో బ్రిటన్ వంటి ఎన్నో దేశాల్లో పర్యటించారు. బ్రిటన్ గ్రంథాలయంలోని అరుదైన పుస్త కాలను మెక్రో ఫిల్మ్ల ద్వారా ఎస్వీయూ తెలుగు అధ్యయన శాఖకు అందించారు. ఆయన విస్కాన్సిన్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు చేకూరి రామా రావు, భద్రిరాజు కృష్ణమూర్తి లాంటి ఉద్దండ భాషావేత్తలతో కలిసి ఒకే ఇంటిలో ఉండేవారు. ప్రసిద్ధ భాషావేత్త గెరాల్డ్ కెల్లీతో కూడా స్నేహం చేశారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన సాహితీ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు.– ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, ఫౌండర్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ (నేడు ఆచార్య జి.ఎన్. రెడ్డి వర్ధంతి) -
సజ్జనుడు – దుర్జనుడు
జీవశాస్త్రం ఆధారంగా ఒక ఆసక్తికరమైన పోలికతో ఆరిషడ్వర్గాలను వ్యాఖ్యానించవచ్చు. అరిషడ్వర్గాలు దుష్టుడికి ‘ప్రొటో– ఆంకోజీన్స్’ లాంటివి. మొదట సాహచర్యం చేస్తాయి, తర్వాత మార్పుచెంది అజమాయిషీ చేయడం మొదలుపెడతాయి. చివరకు ప్రాణాధారంగా మారతాయి.ఆరోగ్యకరమైన కణంలో ‘ప్రొటో–ఆంకోజీన్స్’ అనేవి కణ విభజనను నియంత్రించే ప్రొటీన్లను తయారుచేసే జన్యువులు. కొన్ని సంకేతాలు అందుకున్నప్పుడు ఈ జన్యువులు క్రియాశీలమై, ఆ ప్రొటీన్లను ఉత్పత్తి చేసి కణాన్ని విభజనకు ప్రేరేపిస్తాయి. పని పూర్తయ్యాక మళ్ళీ నిష్క్రియగా మారతాయి. ఈ జన్యువులు ప్రతి కణంలోనూ ఉంటాయి.కామ–క్రోధ–లోభాది ఆరు మనిషి సహజ ప్రవృత్తులు (షడ్వర్గాలు) కూడా అంతే. ఇవి సజ్జనులలోనూ, దుర్జనులలోనూ ఉంటాయి. అవి శ్రుతిమించినప్పుడే సమస్య. ఆరోగ్యకరమైనకణంలో ప్రొటో– ఆంకోజీన్ ఎలా అవసరమైనప్పుడు నియంత్రణ మేరకు పనిచేసి, ఆ తర్వాత మౌనం వహిస్తుందో... అలాగే సజ్జను లలో షడ్వర్గాలు నియంత్రణకు లోబడి ఉంటాయి. నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే చెడు మార్పు మొదలవుతుంది.నియంత్రణ తప్పడమే మ్యుటేషన్ ఈ నియంత్రణ తప్పడాన్నే జీవశాస్త్రంలో మ్యుటేషన్గా వ్యవహరిస్తారు. ప్రొటో–ఆంకోజీన్ మ్యుటేషన్ చెందినప్పుడు రూపాంతరం చెంది ఆంకోజీన్గా మారుతుంది. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, జన్యువు పనిచేసే స్థితిలో (ఫంక్షనల్ స్టేటస్)లో కలిగే నిజమైన మార్పు కూడా. దాని పర్యవసానంగా కణం మొత్తం గుర్తింపు (ఐడెంటిటీ) మారిపోతుంది. అంటే ఆరోగ్య కరమైన కణం, క్యాన్సర్ కణంగా మారుతుంది.షడ్వర్గాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. నియంత్రణ తప్పిన మనిషిలో, గుణాలు అరిషడ్వర్గాలుగా పరిణమిస్తాయి: షడ్వర్గ సహిత మనిషి సజ్జనుడు, అరిషడ్వర్గ సహిత మనిషి దుర్జనుడు! దుర్జనుడు ఈ అరిషడ్వర్గాల నియంత్రణలోనే నడుస్తాడు. వీటి ప్రేరణతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అవే అతనికి శక్తినిచ్చే ప్రేరకాలు. అంటే ఇప్పుడు అరిషడ్వర్గాలు యజమానులుగా మారా యన్నమాట!ఈ యజమానిత్వం కూడా ఒక మజిలీయే, గమ్యం కాదు. జీవశాస్త్రంలో దీనికి ‘ఆంకోజీన్ ఎడిక్షన్’ అనే పేరుంది. కణంలో అనేక ఇతర జన్యుపరమైన లోపాలు పోగుపడినా, ఆ కణం తన మనుగడ మొత్తాన్నీ ఒక్క మార్పు చెందిన (మ్యుటేటెడ్) ఆంకోజీన్ మీదే ఆధారపడేలా చేసుకుంటుంది. ఆ ఒక్క జన్యువుని నిరోధిస్తే చాలు, కణం మొత్తం నశిస్తుంది. దుష్టుడి స్థితి కూడా ఇదే. అరిషడ్వర్గాలే వాడికి శక్తినిచ్చి నడిపే జీవాధారాలుగా నిలుస్తాయి. వాటిని అదుపుచేస్తే సహజ స్థితిని పొంది సజ్జనుడు కాగలడు.ఆసక్తికరమైన విషయం ఏమంటే గుణాల మూలతత్త్వం ఒక్కటే. గుణం ఎప్పటికీ మారదు, దాని స్వరూపం స్థిరంగానే ఉంటుంది. మారేది దాని నియంత్రణ స్థితి మాత్రమే. ఈ స్థితి మారడం వల్లే మనిషి స్వరూపం మారిపోతుంది. ప్రోటో–ఆంకోజీన్... ఆంకోజీన్గా మారి కణాన్ని క్యాన్సర్ కణంగా మార్చి నట్టే, షడ్వర్గాలు అరిషడ్వర్గాలుగా మారి సజ్జనుడిని దుర్జనుడిగా మారుస్తాయి. మనిషి స్వభావాన్ని నియంత్రించే శక్తి ఏది అనేది ఒక తాత్త్విక ప్రశ్న. పురాణాలు, ఉపనిషత్తులలో చెప్పిన ఎన్నో విషయా లను ఆధ్యా త్మిక ధోరణిలోనే కాకుండా సామాజిక కోణంలోనూ, శాస్త్రీయ దృక్పథంతోనూ వ్యక్తిగత ఉన్నతికి ఉత్ప్రేరకాలుగానూ విశ్లేషించి ఆచరించే ప్రయత్నం చేస్తే వ్యక్తులు, సమాజం అభివృద్ధిపథంలో పయనించగలరు.- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
మనకు నిజంగా నిరోధకత ఉందా?
2021 వసంతకాలంలో భారతదేశంలో రెండో కోవిడ్ అల ఆసుపత్రులను ముంచెత్తుతున్న సమయంలోనూ ఒక ప్రమాదకరమైన అపోహ విస్తృత ప్రచారంలో ఉంది: ‘దక్షిణాసియా ప్రజలకు కరోనా వైరస్పై సహజమైన రోగనిరోధక శక్తి ఉంది.’ ఇది ఎలా పుట్టింది? దాని వల్ల ఎంత నష్టం జరిగింది? రాబోయే మహమ్మారులకు సిద్ధంగా ఉండాలంటే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవలసిందే.గణాంకాల తప్పుమొదటి తప్పు గణాంకాల్లో జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో అధికారికంగా నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య అసలు మరణాల కంటే చాలా తక్కువగా ఉంది. పరీక్షలు పరిమితంగా ఉండటం, మరణాల నమోదు వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల అనేక మరణాలు నమోదు కాలేదు. మరికొన్నింటిని ఇతర కారణాల వల్ల జరిగిన మరణాలుగా నమోదు చేశారు.2021 చివరి వరకు భారత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాల సంఖ్య లక్షల్లోనే ఉంది. అయితే ‘ద లాన్సెట్’, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ చేసిన స్వతంత్ర అధ్యయనాలు... ఏడాది కాలంలో సాధారణంగా నమోదయ్యే మరణాల కంటే అదనంగా సంభవించిన మరణాలు 40 నుంచి 50 లక్షలు ఉండొచ్చని అంచనా వేశాయి. ప్రభుత్వ ప్రకటనల్లో తక్కువ మరణాల సంఖ్య ప్రజలకు ఊరట నివ్వొచ్చు. కానీ అవే నిజమని నమ్మితే నిర్లక్ష్యానికి దారితీస్తాయి.‘అదనపు మరణాలు’ అనే ప్రమాణం మరింత విశ్వసనీయ మైనది. ఎందుకంటే ఒక మరణాన్ని కోవిడ్గా నమోదు చేశారా, న్యుమోనియాగా నమోదు చేశారా, లేక కారణం తెలియదని పేర్కొ న్నారా అనే విషయాన్ని అది పట్టించుకోదు. సాధారణంగా ఏడాదిలో ఎంతమంది మరణిస్తారు, వాస్తవంగా ఎంతమంది మర ణించారు అనే తేడాను మాత్రమే అది పరిశీలిస్తుంది. ఈ ప్రమాణంతో చూస్తే దక్షిణాసియా దేశాల ప్రజలకు అసాధారణ రక్షణ ఉందనేది సరికాదు. అది కేవలం తక్కువ లెక్కింపు వల్ల కనిపించే దృశ్యం అని అర్థమవుతుంది.జీవన విధానాల ప్రభావంప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ ప్రభావం తక్కువగా కనిపించడానికి మరో కారణం జీవశాస్త్రం కాదు. పర్యావరణం, ప్రజల జీవన విధానం. గాలి సరిగా వీచే ప్రదేశాలు, జనసాంద్రత, ప్రయాణ అలవాట్లు, ఇంటి లోపల గడిపే సమయం వంటి అంశాలు వైరస్ వ్యాప్తిపై పెద్ద ప్రభావం చూపుతాయి. దక్షిణా సియాలో చాలా ప్రాంతాల్లో వీధి వ్యాపారం, కూలి పని, సామాజిక కలయిక వంటి రోజువారీ కార్యకలాపాలు బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతాయి. అక్కడ గాలి స్వేచ్ఛగా వీస్తుంది. కాబట్టి వైరస్ అంత వేగంగా వ్యాపించదు. అందువల్ల ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో వైరస్ నెమ్మదిగా వ్యాపించి ఉండొచ్చు. అంతేకాని అది ప్రజల్లో సహజ రోగనిరోధక శక్తి ఉన్నందు వల్ల కాదనేది గమనించాలి.ఇది జీవశాస్త్రానికి సంబంధించిన కథ కాదు. నగరాల నిర్మాణం, జీవనశైలి వంటి అంశాలకు సంబంధించిన విషయం. మూసివేసిన, ఎయిర్కండిషన్ భవనంలో వైరస్ ఒక విధంగా, బహిరంగ మార్కెట్లో మరో విధంగా వ్యాపిస్తుంది. గాలిలో వైరస్ ఎక్కువసేపు నిలిచే పరిస్థితులు ఉన్నచోట తీవ్రంగా వ్యాపించింది. అలాంటి పరిస్థితులు లేని చోట వ్యాప్తి ఆలస్యమైంది. ఈ అనుభవం మనకు నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్య పెట్టు బడుల ప్రాముఖ్యాన్ని నేర్పాలి. కానీ దానిని ప్రజల సహజ రోగనిరోధక శక్తికి నిదర్శనంగా తప్పుగా అర్థం చేసుకున్నారు.1918లో వచ్చిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి భారత ఉపఖండంలో సుమారు 1.2 కోట్ల నుంచి 1.7 కోట్ల మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనైనా నమోదైన అతిపెద్ద మరణాల సంఖ్యల్లో ఇది ఒకటి. 19వ శతాబ్దంలో కలరా మహ మ్మారులు గంగానది పరివాహక ప్రాంతం నుంచి పదే పదే వ్యాపించాయి. ఈ చరిత్ర చెబుతున్న విషయం ఒక్కటే. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రక్షణ లేదు. బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలు, సరిపోని మౌలిక సదుపాయాల వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.కోవిడ్ సమయంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కొందరు మూలికల మందులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ప్రచారం చేశారు. భారతదేశంలో బీసీజీ టీకా ఎక్కువ మందికి వేయడం వల్ల రక్షణ లభించిందని కొందరు అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు వేగంగా వ్యాపించాయి. వాటిని ప్రశ్నించే శాస్త్రీయ స్వరాలు అంతగా వినిపించలేదు. ఇలాంటి ప్రచారం వల్ల అసలు ప్రమాదం ప్రజల ప్రవర్తనలో కనిపిస్తుంది. ‘మనం ఇప్పటికే రక్షితులం’ అని నమ్మినవారు పరీక్షలు చేయించు కోవడానికి, ఇతరుల నుంచి దూరంగా ఉండడానికి, టీకాలు వేయించుకోవడానికి, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడానికి తక్కువ ఆసక్తి చూపుతారు.ఎలా ఎదుర్కోవాలి?సంప్రదాయ ఆహారం, ఇంటి చిట్కాలు ఆరోగ్యానికి కొంత మేలు చేయవచ్చు. కానీ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్న వైరస్ను అవి ఆపలేవు. ఆ సమయంలో అవసరమయ్యేది ఆక్సిజన్ చికిత్స, వైద్య సేవలు. ఈ రెండింటి మధ్య తేడాను చెరిపేసిన తప్పుడు ప్రచారం సాంస్కృతిక అతిశయం మాత్రమే. ఇది నివారించగలిగిన మరణాలకు కూడా కారణమైంది. మహమ్మారి ముగిసిన తర్వాత కూడా తప్పుడు సమాచారం ఎందుకు నిలిచిపోతుంది? ఎందుకంటే అది ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ‘మన ప్రజలు బలమైనవారు’, ‘మన సంప్ర దాయాలు మనల్ని కాపాడతాయి’ అనే మాటలు భయంతో ఉన్న సమయంలో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. దానికి విరుద్ధంగా ‘వైరస్కు మీ సంస్కృతి తెలియదు. మీ చరిత్రతో దానికి సంబంధం లేదు’ అనే సందేశం అంతగా నచ్చదు.భవిష్యత్తులో సంభవించబోయే విపత్తులను ఎదుర్కోవడానికి తప్పుడు కథనాలను అధిగమించి నిజాలపై ఆధారపడగలిగిన వ్యవ స్థలను నిర్మించాలి. అందుకోసం మరణాల నమోదును బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలపరచాలి. తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తుందో అర్థం చేసుకునే ప్రజారోగ్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధారాలు లేని వాదనలను ప్రచారం చేసే అధికారులు, మీడియా వ్యక్తులను జవాబుదారులుగా నిలబెట్టాలి. దక్షిణాసియా వాసులకు సహజ రోగనిరోధక శక్తి ఉందనే అపోహ మనకు నేర్పిన ప్రధాన పాఠం ఒక్కటే: ‘శ్వాసకోశ వైరస్ల నుంచి ఏ జాతికీ, ఏ దేశానికీ సహజ రక్షణ ఉండదు’. ప్రజలను రక్షించేది అపోహలు కాదు. ముందస్తు సన్నద్ధత, వ్యాధులపై నిఘా, ప్రజల విశ్వాసం, సరైన సమయంలో తీసుకునే చర్యలే.మహమ్మారి ఉద్ధృతమయ్యేలోపే ఈ పాఠం నేర్చుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. అదే ఆలస్యంగా నేర్చుకుంటే, ఆసుపత్రి కారి డార్లలో, ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూల్లో నిలబడి ఆ నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చెల్లించాల్సిన మూల్యం గణాంకాల్లో కాదు. అంత్యక్రియల్లో కనిపిస్తుంది.మేడా పరమేశ్వర రెడ్డివ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్ -
సామాజిక ఇతిహాసం..
ఆధునిక తెలుగు పద్యకవిత్వంలో మల్లవరపు జాన్ విశిష్టమైన కవి. ధారాళమైన పద్య రచనా ప్రజ్ఞతో, సామా జిక చైతన్యంతో ఆయన ప్రజారంజకమైన ఖండ కావ్యా లను రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ‘దురాచార మెంతేని ఖండింప కలమునాయుధముగా మలుచు కొని’ సాంస్కృతిక సమరం చేశాడు. తెలుగుదేశ చారిత్రక, సాంస్కృతిక వైభవ, ప్రాభవాలను రమణీయంగా తన కవిత్వంలో చిత్రించడమే కాకుండా, తనకాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను ధిక్కరించి, సమానత్వాన్ని ప్రబోధించిన మల్లవరపు జాన్ పద్యకవుల్లో ప్రజాకవి. జాన్ కవిత్వం మాధుర్యగుణ భరితమైనదని, శ్రీనాథుడు చెప్పిన హర చూడాహరిణాంక వక్రతలోని సౌందర్యం ఆయన పద్యాల్లో ఉందని (అతుకుల బ్రతు కులు – పీఠిక) దాశరథి విశ్లేషించాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చీమ కుర్తి గ్రామంలో మల్లవరపు దావీదు – రత్నమ్మ దంపతులకు 1927 జనవరి 22న ఆయన జన్మించాడు. పేదరికం అనే కత్తుల వంతెన మీదనడిచి, కుల, మత వివక్షల నిప్పుల వానలో తడిసి, మొక్క వోని సంకల్పంతో కఠోర శ్రమతో ‘మధుర కవి’గా, దేశికోత్తముడిగా ప్రసిద్ధిగాంచాడు. ‘చెప్పులు కుట్టి జీవనము సేయు కుటుంబము నందు బుట్టి చిన్నప్పటినుండి శారద పదార్చన జేసితి’ అని ఆయన, తన నేపథ్యాన్ని చెప్పుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం ఉపాధ్యాయు డిగా స్థిరపడినా, ఆయనలో జ్ఞానతృష్ణ చల్లార లేదు.ఒంగోలులోని శఠగోపనాచార్యుని శిష్యరికంలో సంస్కృ తాంధ్ర భాషా సాహిత్యాలను, పంచకావ్యాలను అధ్య యనం చేశాడు. జాషువానంతర తెలుగు కవిత్వంలో ప్రామాణికమైన పద్య కవిగా ప్రఖ్యాతిగాంచిన జాన్ 2006 ఆVýæస్టు 12న కన్నుమూశాడు.సజ్జనాను రక్తి జాను సూక్తి వామపక్ష, విప్లవ పోరాటాల నుండి అస్తిత్వ ఉద్య మాల వరకు సాగిన సామాజిక, సాహిత్య ఉద్యమాల ప్రభావం జాన్ కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది. 1967లోనే తన స్వీయానుభవాలను అక్షరబద్ధం చేసి, ‘కొండడు’ శీర్షికతో లఘు కావ్యం వెలువరించాడు. క్రైస్తవ కథాంశ నేపథ్యంలో రాసిన ‘సాంసన్–డెలీల’ పద్య నాటకం ఎంతగానో పేరు తెచ్చింది. విశ్వప్రకాశం, కాంతి రేఖలు, భావ విపంచి, చిరస్మరణీయులు, సరసవినోదిని, పుణ్యపురుషుడు వంటి ఖండ కావ్యాలతో తెలుగు సాహి త్యంలో పద్యకవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘సజ్జనానురక్తి జాను సూక్తి’ అనే మకుటంతో సూక్తి శతకం,‘భవ్యగుణవిచార బాలవీర!’ మకుటంతో రాసిన పద్యాల ద్వారా జీవనతాత్త్విక ఎరుకను, మూర్తి మత్వ స్ఫూర్తిని చాటి చెప్పాడు. ఆయన రాసిన చైతన్య గేయాలు, న్యాయం కావాలి, పంచముడు వంటి అముద్రితా లుగానే మిగిలిపోయాయి. అవిద్య, పేద రికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచ గొండితనం, దళిత జనోద్ధరణ, కుల నిర్మూలన, దేశభక్తి, విశ్వశాంతి లాంటి అంశాలపట్ల ప్రజల్లో సదావగా హన కల్పించడానికి జాన్ కృషి చేశాడు.మనుషులకు ‘చితులను పేర్చినది మతమా? రెటమతమా? కపటమతుల రచితమా’ అని మతోన్మాదాన్ని నిరసించాడు. ద్వేషజ్వాలలతో ‘కలుష వ్యాపార పారీణులై త్రోవల్ దప్పి’ మతకల్లోలాలు కల్పించే దురాత్ముల’ను దేశద్రోహులుగా దుయ్యబట్టాడు. చాలామంది పద్య కవుల్లో మృగ్యమైన మహిళాభ్యుదయ చింతన జాన్ పద్యాల్లో కనిపిస్తుంది.వివిధ విశ్వవిద్యాలయాల్లో జాన్ సాహిత్యంపై పరి శోధనలు జరిగాయి. జాన్ కావ్యాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘అభినవ బాణ’, ‘కవిభూషణ’ వంటి అరుదైన బిరుదులను కూడా ఆయన అందు కున్నాడు. అటువంటి జాన్ శత జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.– ఆచార్య కోయి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్ (మల్లవరపు జాన్ శతజయంతి సదస్సు నేడు ఒంగోలులో) -
ప్రవాస భారతీయులకు ఆర్బీఐ వరం
2026 జూన్ 8న భారతీయ రిజర్వు బ్యాంకు... వాణిజ్య బ్యాంకులు సమీకరించే మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితి గల ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లపై, ప్రత్యేక డాలర్–రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రకటించింది. 2026 సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అమెరికన్ డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్, జపాన్ యెన్, ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్ వంటి ప్రధాన విదేశీ ద్రవ్యాల్లో ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపా జిట్లు స్వీకరిస్తారు. ఈ నిర్ణయంతో ప్రవాస భారతీయులకు తమ విదేశీ ద్రవ్యాన్ని రూపాయిల్లోకి మార్చకుండానే, గతంతో పోలిస్తే అధిక వడ్డీ పొందే అవకాశం లభించింది.ఎఫ్సీఎన్ ఆర్(బి) (ఫారిన్ కరెన్సీ నాన్– రెసిడెంట్ బ్యాంక్) డిపాజిట్ అంటే – ప్రవాస భారతీయులు విదేశాల్లో ఆర్జించిన సొమ్మును, అనుమతించబడిన విదేశీ ద్రవ్యంలోనే భారతీయ బ్యాంకుల్లో కాలపరిమితి డిపాజిట్గా ఉంచడం. గడువు పూర్తయ్యాక అసలు, వడ్డీ రెండూ అదే ద్రవ్యంలో తిరిగి చెల్లించబడుతాయి. ఎన్ఆర్ఈ డిపాజిట్లో మాత్రం ఆ డబ్బు రూపాయిల్లోకి మారుతుంది. భారత్లో వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు, విదేశాలకు తిరిగి తీసుకెళ్లే సౌలభ్యం రెండింటికీ వర్తిస్తాయి.సాధారణంగా, ఎన్ ఆర్ఈ డిపాజిట్లతో పోలిస్తే ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లపై కొంత తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే, బ్యాంకులు ఈ విదేశీ ద్రవ్య నిధులను రూపాయిల్లోకి మార్చుకొని, దేశీయ అవసరాల కోసం వినియోగి స్తాయి. అయితే గడువు పూర్త య్యాక డిపాజిటర్లకు విదేశీ ద్రవ్యంలోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈలోగా రూపాయి–డాలర్ మారకం ప్రతికూలంగా మారినా నష్టం వాటిల్లకుండా, బ్యాంకులు కొంత అదనపు వ్యయంతో కూడిన ముందస్తు రక్షణ ఏర్పాట్లు – అంటే హెడ్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా ఆర్బీఐ విధాన నిర్ణయంతో, ఈ డిపాజిట్లపై బ్యాంకులు భరించాల్సిన హెడ్జింగ్ వ్యయాన్ని ఆర్బీఐ స్వయంగా భరిస్తుంది. దీంతో బ్యాంకులకు అలాంటి డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే వెసులుబాటు కలిగింది.స్థిర విదేశీ ద్రవ్యవనరుల సమీకరణఈ విధానం ప్రకటించిన సమయంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొని ఉంది. ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. డాలర్తో పోల్చితే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఆ నేపథ్యంలో, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, దేశానికి మరింత స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చడం కూడా ఈ చర్య వెనుక ఉన్న ముఖ్యోద్దేశాల్లో ఒకటి. విదేశీ సంస్థాగత, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి స్వల్పకాలిక మూలధన ప్రవాహాలతో పోలిస్తే, ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్లు మరింత స్థిరమైన, దీర్ఘకాల విదేశీ ద్రవ్య వనరులుగా అక్కరకు వస్తాయి. అందువల్ల అత్యవసర సందర్భాల్లో, ఇటు వంటి ప్రత్యేక వెసులుబాట్ల ద్వారా విదేశీ ద్రవ్య నిధులను సమీకరించేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహం, ఇటువంటి విధానాలు సఫలీకృతం కావడంలో విశేషంగా తోడ్పడుతోంది.2013లో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న సమయంలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్వల్ప మార్పులతో ఇదే తరహా ప్రత్యేక స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కొద్ది నెలల్లోనే సుమారు 34 బిలియన్ అమెరికన్ డాలర్ల డిపాజిట్లు వచ్చాయి. రూపాయిపై ఒత్తిడి తగ్గించడంలో, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో ఆ పథకం కీలక పాత్ర పోషించినట్లు భావిస్తారు. అయితే ఈ పథకంపై భిన్నాభిప్రాయాలు కూడా లేక పోలేదు. గడువు పూర్తయ్యాక ఒకేసారి భారీ మొత్తంలో విదేశీ ద్రవ్య చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో విదేశీ ద్రవ్య ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేకపోతే, రూపాయిపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని కొందరు ఆర్థికవేత్తల అభి ప్రాయం. అయితే 2013లో ప్రవేశపెట్టిన ఇదే తరహా పథకం గడువు ముగిసి నప్పుడు ఏర్పడిన పరిస్థితిని ఆర్బీఐ సమర్థవంతంగా ఎదుర్కొందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.అలాగే, ఇలాంటి తాత్కాలిక విధాన సడలింపులు తక్షణావసరాలను తీర్చడంలో ఉపయోగపడినా; ఎగుమతుల వృద్ధి, స్థిరమైన విదేశీ పెట్టుబడులు, బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ వంటి దీర్ఘకాలిక చర్యలే దేశానికి స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చగలవు. మార్చి 2026 నాటికి భారతీయ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్సీఎన్ ఆర్(బి) డిపాజిట్ల మొత్తం సుమారు 34 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతర్జాతీయ అనిశ్చితుల వలన గణనీయంగా తగ్గిన నిల్వలను తిరిగి సమకూర్చుకోవడం తక్షణావసరం. ప్రస్తుత చర్యల ద్వారా, అనుకూల పరిస్థితుల్లో 50 నుంచి 60 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు అదనపు విదేశీ ద్రవ్య నిధులు సమీకరించే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఆ అంచనాలు ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతాయో రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. అయితే, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, అవసరమైన సమయంలో ప్రవాస భారతీయుల వ్యక్తిగత పొదుపులు కూడా దేశ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడగలవని ఆర్బీఐ విశ్వసించడం సహేతుకంగానే తోస్తోంది.పల్లపోతు కృష్ణబాలాజివ్యాసకర్త ఎస్బీఐ విశ్రాంత ఉన్నతాధికారి -
శరద్ పవార్ (85), ఎన్సీపీ లీడర్ రాయని డైరీ
‘‘భద్రం పవార్ జీ...’’ అంటూ ఒక్క గెంతున వచ్చి, నా చేతికి తన భుజాన్ని అందించారు ఏక్నాథ్ షిందే! ‘‘పడిపోనులే ఏక్నాథ్. కాసేపు మీ ఛాంబర్లో కూర్చుందామని వచ్చాను. కూర్చోవచ్చు కదా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘పవార్ జీ, ఇంతటి గౌరవాన్ని మరెవరికైనా నేనెందుకు దక్కనిస్తాను! దయచేసి రండి. మీ పార్టీ ఛాంబర్ను కూడా కాదని, నా ఛాంబర్కి వచ్చారంటే నాకు మీ ఆశీస్సులు ఉన్నట్లుగానే కదా నేను భావిస్తాను. రండి, మెల్లిగా నడవండి’’ అన్నారు ఏక్నాథ్. నవ్వాన్నేను. ఏక్నాథ్ నన్ను తన ఛాంబర్లో కూర్చోబెట్టి, శాలువా కప్పి; పూలు, టెంకాయ చేతికి అందించారు. ‘‘ఏమిటి ఇదంతా ఏక్నాథ్?’’ అన్నాను. ‘‘పవార్ జీ, నేనొక ముఖ్యమైన మీటింగులో ఉండగా, మీరు నా ఛాంబర్ అడుగుతున్నారని తెలిసి, వెంటనే మీటింగ్ని ఆపి మీకోసం పరుగున వచ్చాను’’ అన్నారు ఏక్నాథ్. ‘‘చాలా సంతోషం ఏక్నాథ్. అసెంబ్లీ భవన్లో ‘బోర్డర్ ఇష్యూ మీటింగ్’ ఉంటే వచ్చాను. తిరిగి వెళ్లేటప్పుడు... మా ఎమ్మెల్యే లతో కాసేపు కలిసి కూర్చోటానికి... మీ ఛాంబర్, ఎంట్రెన్స్కి దగ్గరగా ఉందని ఇటొచ్చాను’’ అన్నాను.‘‘వచ్చినందుకు ధన్యవాదాలు పవార్ జీ...’’ అన్నారు ఏక్నాథ్. నాకోసం ప్రత్యేకంగా ‘టీ’ తెప్పించి, నాతో పాటు తనూ టీ సేవించి, నాతో కొద్దిసేపు మాట్లాడి, ‘ఉంటాను పవార్ జీ’ అంటూ సెలవు తీసుకున్నారు ఏక్నాథ్. ఏక్నాథ్ ఇంకో ఇరవై, ఇరవై అయిదేళ్ల తర్వాత తన ఎనభై ఐదేళ్ల వయసులో కూడా... ఇప్పుడు నాలాగే, లేదా నాకన్నా ఎక్కువగానే ఉత్సాహంగా ఉంటాడనుకుంటా! ఉన్నచోటే ఉండిపోయేవాళ్లకు పాలిటిక్స్లో భవిష్యత్తు ఉండదు. పేరుకు ఉంటారంతే. ఇక్కడ ఎదగాలంటే సిద్ధాంత పరమైన విభేదాలు ఉండాలి. వ్యక్తిగత ఘర్షణలు ఉండాలి. అధికార సమీకరణాలపై ఒక కన్ను, ఒక చెవి వేసి ఉంచాలి. ఒక కాలును లోపల, ఒక కాలును బయటా ఉంచాలి. రాజీవ్ హత్య తర్వాత నేను ప్రధాని అవ్వాల్సింది. ‘అతడికి స్వతంత్ర భావాలు ఎక్కువ’ అని నా మీద సోనియాజీకి చెప్పి,నేను ప్రధాని కాకుండా అడ్డుపడి నన్ను బయటికి పంపించారు. ఏక్నాథ్వి నాకు మించిన స్వతంత్ర భావాలు! శివసేన తన ‘హిందుత్వ’ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఏంటని అతడు బయటికి వచ్చేశాడు. నాలా ఒక్కడే రాలేదు. శివసేనను సగం తెంపుకుని వచ్చేశాడు. నేను పీఎంని కాలేకపోయాను. ఏక్నాథ్ సీఎం అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం. మళ్లీ సీఎం అయినా అవుతాడు. ఏక్నాథ్ ఛాంబర్లో నేను కాసేపు కూర్చొని వచ్చినందుకు... ‘‘ఏక్నాథ్ అనే ద్రోహి ఛాంబర్లోకి శరద్ జీ వెళ్లి కూర్చోవటం ఏంటి?!’’ అని ఉద్ధవ్ శివసేన విమర్శిస్తోంది. కూటమిలోని తక్కిన పార్టీలు కూడా... ‘‘వాళ్లేమిటి? వాళ్ల వంశం ఏమిటి? వాళ్ల ఛాంబర్కి శరద్ జీ వెళ్లటం ఏమిటి?’’ అని భృకుటి ముడేస్తున్నాయి! ‘‘శరద్ జీ కూర్చోదలచుకుంటే ఏక్నాథ్ ఛాంబరే దొరికిందా! అసెంబ్లీ ప్రాంగణంలో మన ఛాంబర్లు లేవా? పోనీ, అవి వద్దనుకుంటే వై.బి. చవాన్ ప్రతిష్ఠాన్ లేదా? ఎన్సీపీ ఆఫీస్ ‘రాష్ట్రవాది భవన్’ లేదా?’’ అంటున్నారు ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్! చవాన్ ప్రతిష్ఠాన్, రాష్ట్రవాది భవన్ అసెంబ్లీ ప్రాంగణంలో లేవు. చవాన్ ప్రతిష్ఠాన్ నారిమన్ పాయింట్లో ఉంది. ఏక్నాథ్ ఛాంబర్ నాకు నాలుగడుగుల దూరంలో ఉంది; రాష్ట్రవాది భవన్ దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్లో ఉంది. ఏక్నాథ్ ఛాంబర్ నా భుజానికి దగ్గరగా ఉంది. రౌత్కు ఇది ఎందుకు తెలియకుండా ఉంది?! దూరాలు గ్రహించలేనివారు, ఎప్పటికీ దగ్గరగా ఆలోచించలేరు. -
'ఏఐ' నూతన పారిశ్రామిక విప్లవానికి నాంది!
ఈరోజు పట్టాలు అందుకుంటున్న 2026 బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, త్యాగానికి ఇది ప్రతిఫలం. కానీ ఈ విజయం మీదే కాదు. మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, మిమ్మల్ని నమ్మిన ప్రతి ఒక్కరిది! మీకు ఇది జీవితంలో మరో ముందడుగు మాత్రమే కావచ్చు. కానీ ఒక తల్లికి మాత్రం తన బిడ్డ పట్టా అందుకోవడం జీవితకాల కల నెరవేరిన క్షణం. నా తల్లిదండ్రులు కూడా ఈరోజు నన్ను చూసి ఎంతో గర్వపడుతున్నారు. నా విజయం వారి కలల ఫలితం. నిజానికి నేను వారి అమెరికా కలకు రూపం. ఈ సభలో ఉన్న చాలామంది విద్యార్థుల్లాగే నేను కూడా మొదటి తరం వలసదారుడిని. నా తల్లిదండ్రులు (తైవాన్ నుంచి) అమెరికాకు రావడానికి కారణం ఒక్కటే. ‘మా పిల్లలకు మంచి అవకాశం దొరకాలి’ అనే ఆశ. నాకు ముప్పై సంవత్సరాల వయసులో, నా స్నేహితులతో కలిసి ఎన్విడియాను ప్రారంభించాను. మా లక్ష్యం ఒక కొత్త తరహా కంప్యూటర్ను రూపొందించడం. సాధారణ కంప్యూటర్లు సాధించలేని సమస్యలను పరిష్కరించే శక్తిమంతమైన వ్యవస్థను నిర్మించాలని అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే అసలు నిజం తెలిసింది. మేము రూపొందించిన తొలి సాంకేతికత పూర్తిగా విఫలమైంది. డబ్బు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. గత 33 ఏళ్లుగా ఎన్ విడియా ఎన్నోసార్లు తనను తాను మార్చుకుంది. ప్రతిసారి ఒకే ప్రశ్న వేసుకుంది: ‘ఇందులో ఎంత కష్టముంటుంది?’ ప్రతిసారి సమాధానం ఒక్కటే: ‘మనం అనుకున్నదానికంటే చాలా కష్టం.’ కానీ ప్రతి వైఫల్యం మాకు కొత్త పాఠం నేర్పింది. ప్రతి అపజయం మమ్మల్ని మరింత వినయంగా మార్చింది. ప్రతి కష్టం మా వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దింది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు. వైఫల్యం విజయానికి తీసుకెళ్లే మరో మెట్టు మాత్రమే. ప్రతిసారి పడిపోయి మళ్లీ లేవడంవల్లే జీవితంలో నిజమైన ధైర్యం వస్తుంది. అదే మన విజయానికి అసలైన బలం. ప్రపంచాన్ని మార్చే కొత్త యుగంమీ కలలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ ముందుంది. మీ కెరీర్ ప్రారంభమవుతున్న సమయం... ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన దశ. నేను ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ప్రపంచం పర్సనల్ కంప్యూటర్స్ (పీసీ) విప్లవం ప్రారంభ దశలో ఉంది. మీరు మాత్రం కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రారంభమవు తున్న సమయంలో కెరీర్ మొదలుపెడుతున్నారు. దీనికంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో కంప్యూటింగ్ రంగంలో వచ్చిన ప్రతి పెద్ద మార్పును నేను చూశాను. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్... ప్రతి దశ ప్రపంచాన్ని మార్చింది. ప్రతి కొత్త ఆవిష్కరణ మానవ జీవితాన్ని మరింత సులభం చేసింది. కానీ ఇప్పుడు మనం చూడబోతున్న మార్పు వీటన్నింటికంటే పెద్దది. ఇది కేవలం మరో సాంకేతిక పరిణామం కాదు. ఇది కంప్యూటింగ్ ప్రపంచానికే కొత్త ఆరంభం. గత ఆరు దశాబ్దాలుగా కంప్యూటర్లు ఒకే విధంగా పని చేశాయి. మనుషులు కోడ్ రాస్తారు. కంప్యూటర్లు ఆ ఆదేశాలను అమలు చేస్తాయి. ఇంతకాలం ఇదే సూత్రం. కానీ ఇప్పుడు... ఆ యుగం ముగిసింది. ఏఐ కంప్యూటింగ్ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లింది. ఇకపై కంప్యూటర్లు కేవలం ఆదేశాలు పాటించే యంత్రాలు కావు. అవి అర్థం చేసుకుంటాయి. తర్కిస్తాయి. ప్రణాళికలు రూపొందిస్తాయి. అవసరమైన సాధనాలను ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఒకప్పుడు మనం సాఫ్ట్వేర్ను రాసి సీపీయూలపై నడిపించే వాళ్లం. ఇప్పుడు ఏఐ వ్యవస్థలు భారీ న్యూరల్ నెట్వర్క్ల ద్వారా జీపీయూలపై పనిచేస్తున్నాయి. ఇది కేవలం వేగం పెర గడం కాదు, కంప్యూటర్లు ఆలోచించే విధానమే మారుతోంది. వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విద్య నుంచి పరిశ్రమల వరకు, వ్యాపారం నుంచి శాస్త్ర పరిశోధనల వరకు... ప్రతి రంగా నికి ఏఐ అవసరం. ఏఐ ప్రతి పరిశ్రమనూ మార్చబోతోంది. ఏఐపై భయం సహజమే!ఏఐ చిత్రాలు గీస్తోంది. వ్యాసాలు రాస్తోంది. సాఫ్ట్వేర్ తయారు చేస్తోంది. కార్లను నడుపుతోంది. ఇలాంటప్పుడు సహజంగానే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి: ఉద్యోగాలు పోతాయా? మనిషి అవసరం తగ్గిపోతుందా? అసలు ఈ టెక్నాలజీ మన నియంత్రణలో ఉంటుందా? ఇలాంటి సందేహాలు కొత్తవి కావు. ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే పుట్టాయి. విద్యుత్ వచ్చినప్పుడు కూడా భయపడ్డారు. ఇంటర్నెట్ వచ్చి నప్పుడు కూడా సందేహించారు. కానీ మానవ సమాజం కొత్త సాంకేతి కతను బాధ్యతతో స్వీకరించిన ప్రతిసారీ... అది మన సామ ర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఏఐని తెలివిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనదే. ఇకపై ప్రతి ఒక్కరూ ప్రోగ్రామర్లే. ఇప్పటి వరకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలిగినవారు ప్రపంచ జనాభాలో చాలా తక్కువ మంది మాత్రమే. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కోడ్ ఎలా రాయాలో తెలియకపోయినా, మనకు కావాల్సిన పనిని సహజమైన భాషలో ఏఐకి చెప్పగలిగితే చాలు. మిగతా పనిని ఏఐ పూర్తి చేస్తుంది. ఒక చిన్న దుకాణం నడిపే వ్యాపారి... ఏఐ సహాయంతో తన వ్యాపారం కోసం అందమైన వెబ్సైట్ను రూపొందించుకోవచ్చు. ఒక వడ్రంగి... కస్టమర్కు వంటగది నమూనాలను రూపొందించి చూపించవచ్చు. ఒక ఉపాధ్యా యుడు కొత్త పాఠ్యాంశాలను సిద్ధం చేయవచ్చు. ఒక వైద్యుడు... వైద్య సమాచారాన్ని వేగంగా విశ్లేషించవచ్చు. ఒక రైతు... పంట లపై మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఏఐ వల్ల కంప్యూటింగ్ శక్తి కొద్దిమందికే పరిమితం కాకుండా... ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తోంది. ఇదే ఏఐ తీసుకొస్తున్న అతిపెద్ద ప్రజాస్వామిక మార్పు. ఏఐ ఉద్యోగాలను మారుస్తుంది!విద్యుత్ ఎలా ప్రపంచాన్ని మార్చిందో... ఇంటర్నెట్ ఎలా మన జీవన విధానాన్ని మార్చిందో... అలాగే ఏఐ కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చబోతోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద సాంకేతిక మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమంగా నిలవబోతోంది. ఏఐ కోసం కొత్త చిప్ తయారీ కేంద్రాలు, అత్యాధునిక కంప్యూటర్ కర్మాగా రాలు ఏర్పాటవుతాయి. భారీ డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఆధు నిక తయారీ పరిశ్రమలు విస్తరిస్తాయి. ఎలక్ట్రీషియన్లు,ప్లంబర్లు, ఇనుప కార్మికులు, టెక్నీషియన్లు, నిర్మాణ రంగ కార్మికులు... ప్రతి ఒక్కరికీ కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏఐ కేవలం ఒక కొత్త కంప్యూటింగ్ యుగాన్ని మాత్రమే కాదు... ఒక కొత్త పారిశ్రామిక యుగాన్ని కూడా ప్రారంభిస్తోంది. శక్తిమంతమైన ఏఐకి శక్తిమంతమైన విద్యుత్ అవసరం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. విద్యుత్ గ్రిడ్లను ఆధునికీకరిస్తారు. పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టు బడులు పెరుగుతాయి. ఏఐ అభివృద్ధి కేవలం కంప్యూటర్లనే కాదు, మొత్తం మౌలిక వసతుల అభివృద్ధినే వేగవంతం చేస్తుంది. ఏఐ ఉద్యోగాలను మార్చుతుంది... కానీ మనిషి లక్ష్యాన్ని కాదు.చాలామంది అడుగుతున్న ప్రశ్న: ‘ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?’ నా సమాధానం: ప్రతి ఉద్యోగాన్నీ ఏఐ ప్రభా వితం చేస్తుంది. ఉద్యోగంలోని కొన్ని పనులు యంత్రాలు చేయవచ్చు. కొన్ని పాత ఉద్యోగాలు తగ్గవచ్చు. అదే సమయంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. కొత్త పరిశ్ర మలు ఏర్పడతాయి. ఉదాహరణకు, ఈరోజు ఏఐ చాలావరకు సాఫ్ట్వేర్ కోడ్ రాయగలుగుతోంది. అంటే... సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అవసరం లేదని కాదు. వారు ఇప్పుడు ఏఐ సహా యంతో మరింత క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొన గలుగుతున్నారు. ఏఐ వైద్య చిత్రాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ రోగిని అర్థం చేసుకుని సరైన చికిత్స అందించే వైద్యుడి స్థానాన్ని అది భర్తీ చేయదు. ఏఐ మనిషిని తొలగించడానికి రాలేదు. మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి వచ్చింది. మిమ్మల్ని ఏఐ భర్తీ చేయకపోవచ్చు, కానీ ఏఐ బాగా ఉపయోగించే వ్యక్తి ఆ పని చేయవచ్చు. ఏఐ మీ ఉద్యోగాన్ని తీసేయక పోవచ్చు. కానీ ఏఐని సమర్థంగా ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి మీకంటే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐ మానవ జ్ఞానాన్ని మరింత వేగంగా విస్తరించబోతోంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన ఎన్నో సమస్య లకు పరిష్కారాలు కనుగొనబోతోంది. ప్రపంచంలోని కోట్లాది మందికి కంప్యూటింగ్ శక్తిని అందించబోతోంది. మనం నిర్మించే భవిష్యత్తు... ఈరోజు మనకు లభించిన ప్రపంచం కంటే మరింత సంపన్నంగా, మరింత సామర్థ్యవంతంగా, మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంత శక్తిమంతమైన సాధనాలు, ఇంత గొప్ప అవకా శాలతో ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరం ఇంతకుముందు లేదు. మనమంతా ఒకే ప్రారంభ రేఖ వద్ద నిలబడి ఉన్నాం. రాబోయే భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. కాబట్టి నెమ్మదిగా నడవకండి... ధైర్యంగా ముందుకు పరుగెత్తండి! -
ఇది చైనాకు సవాలా? భారత్కు అవకాశమా?
21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాలను భూభాగాల కంటే సముద్రాలు, సరఫరా గొలుసులు (సప్లై చెయిన్స్), సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, అరుదైన ఖనిజాలు వంటి వ్యూహాత్మక వనరులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ మహా సముద్రం ప్రపంచ భౌగోళిక–రాజకీయాల్లో కేంద్ర స్థానాన్ని సంపాదించింది. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం, ఆసియా–యూరప్ వాణిజ్యంలో కీలక సముద్ర మార్గాలు ఈ ప్రాంతం గుండా సాగుతాయి. అందుకే అమెరికా, చైనా, భారత్, జపాన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.భారత్కు హిందూ మహాసముద్రంలో సహజమైన వ్యూహాత్మక ఆధిక్యం ఉంది. అయితే గత రెండు దశాబ్దాలుగా చైనా ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ద్వారా పాకిస్తా¯Œ లో గ్వాదర్, శ్రీలంకలో హంబ¯Œ టోటా; జిబూతి, మయన్మార్ వంటి ప్రాంతాల్లో నౌకాశ్రయాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ తన ప్రభా వాన్ని విస్తరించింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం, హిందూ మహా సముద్రంలోని సెషెల్స్, మారిషస్, మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలతో సముద్ర భద్రత, తీరరక్షణ, బ్లూ ఎకానమీ రంగాల్లో సహ కారాన్ని విస్తరిస్తోంది. ఇటీవల సెషెల్స్తో కుదిరిన ఒప్పందాలు కూడా ఈ వ్యూహంలో భాగమే. అదే సమయంలో జపాన్తో వ్యూహా త్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఆసియాలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తోంది.మనవైపు ఎందుకు చూస్తున్నట్లు?మారుతున్న భద్రతా పరిస్థితులు జపాన్నే రక్షణ వ్యయాన్ని పెంచుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ సహజమైన ప్రజాస్వామ్య భాగస్వామిగా జపాన్కు కనిపిస్తోంది. ఇరుదేశాల భాగ స్వామ్య అసలు బలం పెట్టుబడుల్లో కాదు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీలో ఉంది. సెమీకండక్టర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు, రక్షణ తయారీ, పరిశోధన, ఆవిష్కరణలలో భారత్–జపాన్లు కలిసి పనిచేస్తే ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. ఇదే అంశం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ను ఇప్పటివరకు పెద్ద వినియోగ మార్కెట్గా చూసిన చైనా, ఇప్పుడు అది ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాన్ని గమని స్తోంది. అందుకే సరిహద్దుల్లో ఒత్తిడిని కొనసాగిస్తూనే, భారత్ పూర్తిగా అమెరికా వ్యూహాత్మక వలయంలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమెరికా కూడా భారత్ను ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలక భాగస్వామిగా చూస్తోంది. అయితే అమెరికా తన జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీన విధానాన్ని అనుసరించిన భారత్, నేడు ‘మల్టీ–అలైన్మెంట్’ విధానంతో అమెరికా, జపాన్, యూరప్, రష్యా, గ్లోబల్ సౌత్ దేశాలతో సమతుల్య సంబంధాలను కొన సాగిస్తోంది. ఇదే భారత విదేశాంగ విధానం బలం. అయితే విదేశాంగ విధానానికి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి. నీతి ఆయోగ్ సూచిస్తున్నట్లుగా, భారత్ కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగా కాకుండా, పరిశోధన, ఆవిష్కరణ, అధునాతన తయారీ కేంద్రంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో జపాన్ అత్యంత విశ్వసనీయ భాగస్వామి కావా లని ఆశించడంలో తప్పు లేదు.భారత్–జపాన్లను చైనా వ్యతిరేక కూటమిగా మాత్రమే చూడటం సబబు కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలు, నియమాధా రిత అంతర్జాతీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత నౌకాయానం, సాంకేతిక సహకారం, ఆర్థిక భద్రతపై ఆధారపడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించాలంటే విదేశీ పెట్టుబడులు మాత్రమే సరిపోవు. సాంకేతిక పరిజ్ఞానం, సంయుక్త పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, రక్షణ తయారీ, సముద్ర భద్రత, ప్రపంచ సరఫరా గొలుసుల్లో నాయకత్వం అవ సరం. ఈ లక్ష్యాలను సాధించడంలో జపాన్తో భాగస్వామ్యం భారతదేశానికి ఒక చారిత్రక అవకాశం.భారత్ ముందున్న అసలు సవాలు చైనా లేదా అమెరికా కాదు; తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ, వ్యూహాత్మక స్వతంత్రతను నిలబెట్టుకొని, ఆర్థిక–సాంకేతిక శక్తిగా ఎదగడం. అదే జరి గితే హిందూ మహాసముద్రంలో భారత్ ఒక ప్రాంతీయ శక్తిగానే కాదు, ప్రపంచస్థాయి ‘సంతులన శక్తి’గా అవతరిస్తుంది. అదే భారత్ – జపాన్ భాగస్వామ్యానికి నిజమైన విజయంగా చరిత్రలో నిలిచి పోతుంది.- సీహెచ్.వి. ప్రభాకర్ రావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నిష్కళంక నాయకుడు..
తన సొంత గ్రామం బ్రాహ్మణపల్లి సర్పంచిగా, భువనగిరి పంచాయతి సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అట్టడుగునుంచి ఎదిగిన కొమ్మిడి నర్సింహారెడ్డి ఇవ్వాళ లేడు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ తన 83వ ఏట జూలై 7న ‘నిమ్స్’ ఆసుపత్రిలో కన్నుమూశారు. సొంత ఇల్లు కూడా లేని నర్సింహారెడ్డి దంపతులకు నిమ్సే ఒక ఇల్లయింది. స్నానానికని బాత్రూమ్లోకెళ్లి చన్నీళ్ల నల్లా ఇప్పు తున్నాననుకొని వేడినీళ్ల నల్లా ఇప్పితే... కాళ్ళు బొబ్బలెక్కి చివరి రోజుల్లో అవస్థపడ్డారు. ఊళ్ళో ఉన్న ఇల్లు (పెద్దల ద్వారా సంక్రమించింది) శిథిలం కాగా, హైదరాబాదు పెద్దకూతురు ఇంట్లో ఉండేవారు.ఒక చారిత్రక కుటుంబం నుంచి వచ్చినవారు నర్సింహా రెడ్డి. వారి అన్న కోదండ రాంరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామి. పోలీస్ స్టేషన్లో చంపబడ్డారు. కాంగ్రెస్ రాజకీయాలకు కొంతకాలంగా నర్సింహారెడ్డి దూరంగా ఉన్నా విద్యుచ్ఛక్తి సమస్యలపై భువనగిరిలో నిరాహారదీక్ష చేశారు. గోదావరి నీళ్ళు రప్పించడం గురించి, మూసీ నది కాలుష్యం గురించి, పోచంపల్లిలోని రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్ గురించి తపన పడేవారు. నిఖిలేశ్వర్ రాసినట్టు ‘వ్యక్తిగతంగా జీవితంలో – సామాజికంగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆలోచించేవారు’. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. ‘ప్రజా చైతన్య వేదిక’ స్థాపించి సదస్సులు నిర్వహించేవారు. ఉపన్యాసాలు ఇప్పించేవారు. నిజాం కాలం నాటి చరిత్రను అధ్యయనం చేసి, చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించి పంచారు.మా ఇద్దరిది 56 ఏళ్ల అనుబంధం. 1969లో మా మొదటి పరిచయం, తెలంగాణ ఉద్యమ సందర్భంగా. హెచ్ఎస్సీ పాస్ కాగానే సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. భువనగిరిలో తెలంగాణ ఉద్యమం జోరందుకున్న రోజులవి. ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షుడిగా పులుమామిడి బాలక్రిష్ణారెడ్డి, నేను ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ కన్వీనర్గా, ఇంకా అనేక మంది ఉద్యమం నడుపుతున్న రోజులు. కాంగ్రెస్లో గ్రూపులు ఉండేవి. ఒక గ్రూపు ప్రత్యేక తెలంగాణకు అనుకూలం. ఆ గ్రూపులో కొమ్మిడి ఉండేవారు. ఒకరోజు బాలక్రిష్ణారెడ్డి ఇంటికి వచ్చి, ‘తెలంగాణ గురించి ఏం జేయమంటవన్నా’ అని అడిగారు. అప్పుడు బాలక్రిష్ణారెడ్డి ‘మీ సర్పంచులను కొందరిని కలుపుకొని సమితి ఆఫీసు ముందు డేరా వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టండి’ అని సలహా ఇస్తే పాటించారు.ఒక విషయంలో నాకు నర్సింహారెడ్డి స్ఫూర్తి. ‘అరవై తొమ్మిది’ ఉద్యమం ముగిసింది. ఒకరోజు భువనగిరి తహసిల్ ఆఫీసులో తారసపడ్డాం. ‘ఓరేయ్ ముత్యం, మీ మామలెక్క నువు కూడా పైరవికారువైతవురా’ అన్నాడు. అప్పుడనిపించింది పైరవికారు అవడం మంచిది కాదూ అని! అది మనసులో ఉండిపోయింది. ఏ నాయకుడి దగ్గరికీ వెళ్లేవాడిని కాదు. తను నన్ను ముత్యం అని పిలిస్తే, నేను అన్నా అని పలికేవాణ్ణి. అన్నా! నర్సన్నా! మసి అంటని నాయకుడా... నీకివే జోహార్లు!– ఆచార్య కట్టా ముత్యంరెడ్డి -
మనిషి పతన దశలు
స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది.నైతిక పతనం..మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం చేసినవారికి ద్రోహం తలపెట్టడం, తిన్న ఇంటి వాసాలు లెక్కించడం జరుగుతుంది.విలువల పతనం..దురాశ, దురలవాట్లు ఎక్కువవుతాయి. ఎలానైనా తాము కోరు కున్నది పొందడానికి అడ్డదారులు వెతుకుతారు.సామాజిక పతనం..మనిషి సామాజిక ప్రాణి అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. తన గురించి ఈ లోకం ఏమి అనుకుంటుందనే భయం ఉండదు. వావి వరసలు చూడరు. స్వార్థం తలకెక్కుతుంది. తను చేసిందే సరైనది అనే భావనతో దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.ఆర్థిక పతనం..తనువెల్లా అహంతో నిండిన మనుషులకు ఆర్థిక పతనమే ఆఖరి దశ. ఆర్థిక పతనం మొదలైన తర్వాత క్రమంగా పశ్చాత్తాప లక్షణాలు అంకురిస్తాయి. అందులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పులను సరిదిద్దుకుని కొత్త జీవితాలను మొదలెడతారు. ఎక్కువ శాతం మంది అహం మత్తు నుండి బయటపడకుండా జీవితాలనే బలి చేసుకుంటారు.అందుకే మనుషులు ముందుగా నైతికంగా పతనం చెందకూడదు. విచక్షణా జ్ఞానం కోల్పోకూడదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని అడుగులు వేయాలి. కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అనే సత్యాన్ని విస్మరించకూడదు.– దుర్గమ్ భైతి -
పరిష్కారమే సమస్యగా నిలిచేనా?
భారత్ ప్రభుత్వం 2025–26 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (ఇ20) లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయ మైన పురోగతి సాధించింది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చమురు మార్కెటింగ్ సంస్థల ద్వారా ఇథనాల్ కొనుగోలును కూడా విస్తరించింది. అయితే ఈ కార్యక్రమానికి అనేక సవాళ్లు ఉన్నాయి: అధిక నీటి అవసరం; 2023కు ముందు కొన్న లక్షల వాహనాలు ఇ20కి పూర్తిగా అనుకూలంగాలేకపోవడం; ఆహారానికీ, ఇంధనానికీ మధ్య సమతుల్యతను కాపాడటం.‘నీళ్లు’ కలుపుతున్నారా?అనేక ప్రాంతాలలో ఇ20తో కూడిన పెట్రోల్ వేసుకున్నాక వాహనాలు ఆగిపోవడం, ఇంజిన్ చెడిపోవడం వంటి అనుభవాలు పెరిగినాయి. అనేక పెట్రోల్ బంక్లలో పెట్రోల్తో పాటు నీళ్ళు పోస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగుతున్నారు. ఆమధ్య మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొత్తం వాహనశ్రేణికి ఇదే సమస్య ఉత్పన్నమయ్యింది. మధ్యప్రదేశ్ పెట్రోల్ బంక్ల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ప్రతిస్పందన లేదు. నిత్యావసర వస్తువు లలో ఒకటైన పెట్రోల్, డిజిల్ గురించిన నియంత్రణ జిల్లా కలెక్టర్లు చేస్తారు. వారి అభిప్రాయానికి కూడా ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదు. పెట్రోల్లో ఇథనాల్ కలిపితే నీళ్ళు రావడం సాధారణం అని ఒప్పుకొన్నా చమురు కంపెనీలు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కలపడం లేదని పెట్రోల్ బంక్ల ఆరోపణ. దాదాపు 30 కోట్ల వాహనాలు ఇ20 వల్ల పాడయితే దేశ ఆర్థిక స్థితి, వ్యక్తిగత వాహనదారుల మీద పడే ఆర్థిక భారం గురించి ఆలో చన చేయవలసి ఉన్నది. సరుకు రవాణా వాహనాలు మొరాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటోలు, టాక్సీ తదితర రవాణా సదుపాయాలు కుంటుపడితే ఆ యా కుటుంబాల మీద భారంతో పాటు నిత్య రవాణా మీద దుష్ప్రభావం ఉంటుంది.పర్యావరణ హితమేగానీ...భారత్లో ఇథనాల్ కార్యక్రమం (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్–ఈబీపీ) దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం అనే ముఖ్య ఉద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది 2003లో ప్రారంభమైంది. ప్రపంచ వాతావరణ సదస్సులలో కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని భారత్ చేసిన లిఖితపూర్వక వాగ్దానంలో ఇది ఒక భాగమైంది. చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవ సాయ పంటలు, వాటి ఉప ఉత్పత్తుల నుంచి తయారయ్యే జీవఇంధనం (బయో ఫ్యూయల్) ఇథనాల్. ఇది పునరుత్పాదకఇంధనం కావడంతో పెట్రోల్ తరహ వాయు కాలుష్యం ఉండదు గానీ పూర్తిగా సున్నా కాదు. ఇంకొక కొత్త రకం కాలుష్యం ఏర్పడు తున్నది. కొన్ని పరిస్థితుల్లో నైట్రోజన్ ఆక్సైడ్లు లేదా ఆల్డిహైడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని రకాల ఉద్గారాలు సమానంగా తగ్గుతాయని చెప్పలేము. టెయిల్పైప్ ఉద్గారాలు సాధారణంగా తగ్గుతాయి. అయితే ఏ ఉద్గారాలు ఎంత తగ్గుతాయనేది ఇంజిన్ రకం, ఇథనాల్ మిశ్రమ శాతంపై ఆధారపడి ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ తగ్గు తాయి. వివిధ ఇంధనాల ఉత్పత్తి నుంచి వినియోగం పోల్చితే కార్బన్ డయాక్సైడ్ నికర ప్రభావం కూడా తగ్గుతుంది. అయితే, కార్బన్ డయాక్సైడ్ తగ్గుదల కూడా ఇథనాల్ తయారు చేసే విధా నాన్ని బట్టి ఉంటుంది. చెరుకు, మక్కలు, వడ్ల నుంచి తయారు చేసే క్రమంలో వివిధ రకాల ప్రభావం ఉంటుంది. ఇథనాల్ను పెట్రో ల్లోనే కలుపుతున్నారు; డీజిల్ వాడకం వల్ల వచ్చే వాయు కాలుష్యం గురించి ఎటువంటి అడుగులు వేయడం లేదు. రైతులకు ఎంత మేలు?భారత్లో ఇథనాల్ను చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జల నుంచి తయారు చేస్తారు. ఆయా పంటలకు డిమాండ్ పెరిగి తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందనేది ఆలోచన. ఇది ఒక నినాదంగా, ఆకర్షణీయ ప్రకటన లాగానే ఉన్నది. ఆహార పంటలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఆ యా పంటలకు డిమాండ్ లేక కాదు – మార్కెట్లో వ్యవస్థీ కృతమైన దోపిడీ వల్ల. మార్కెట్ల దోపిడీ ఈ పంటలను ఇథనాల్ ఉత్పత్తికి మళ్ళించడం వల్ల తగ్గదు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014లో సుమారు 421 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉండగా, 2026 నాటికి అది సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక సామర్థ్యానికి పెరిగింది. ప్రభుత్వం కొత్తగా అనేక ధాన్యాధారిత, చెరకు ఆధారిత డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలప డానికి సంవత్సరానికి సుమారు 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవస రమని ప్రభుత్వం, నీతి ఆయోగ్ అంచనా.ఇంధనం కాకుండా పరి శ్రమలు, రసాయనాలు, మద్యం తదితర ఇతర అవసరాలను కలి పితే మొత్తం సుమారు 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా ధాన్యాలపై ఆధారపడి నడపాలంటే దాదాపు 5 కోట్ల టన్నుల ధాన్యం అవసరం అవుతుంది. మొత్తం ధాన్య ఉత్పత్తి దాదాపు 37.66 కోట్ల టన్నులు. అంటే, అది దేశ మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో సుమారు 13% అవుతుంది. అమెరికా నుంచి డీడీజీఎస్ (డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సొల్యూబుల్స్) దిగుమతులు, భారత ఇథనాల్ కార్యక్రమంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అది ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తుంది. ఇథనాల్ తయారీ తర్వాత మిగిలే అధిక ప్రోటీన్ కలిగిన ఉప ఉత్పత్తిని డీడీజీఎస్ అంటారు. దీనిని పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా ఉపయోగిస్తారు. అమెరికా నుంచి చౌకగా డీడీజీఎస్వస్తే దేశీయ డీడీజీఎస్ ధరలు పడిపోవచ్చు. దీంతో భారతఇథనాల్ డిస్టిలరీల ఆదాయం తగ్గుతుంది. మొక్కజొన్న రైతులపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికా దిగుమతులతో జీఎం (జన్యు మార్పిడి) వివాదం కూడా ఉన్నది. జీఎం మొక్కజొన్ననుంచి అమెరికా డీడీజీఎస్ వస్తుంది కాబట్టి, జన్యుమార్పిడిదాణా వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలు అదనం. అందుకే ఈఅన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వివరంగా స్పందించాల్సిన అవసరం ఉంది.-వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు-దొంతినరసింహారెడ్డి -
చేప పిల్లల రాజధానికి సవాళ్లెన్నో!
భారతదేశ ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశీయ మంచినీటి చేపల పెంపకంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చేపల పెంపకంలో పెట్టుబడి వ్యయం తక్కువే అయినప్పటికీ, నాణ్యమైన చేప పిల్లలే సాగు లాభా లను నిర్ణయిస్తాయి. కృత్రిమ ప్రేరిత ప్రజనన(ఇండ్యూస్డ్ బ్రీడింగ్) సాంకేతికత, చైనీస్ సర్క్యులర్ హేచరీల ప్రవేశంతో చేప పిల్లల ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలు, పరి శోధనా సంస్థలు, ప్రైవేట్ పారిశ్రామికవేత్తల సమష్టి కృషితో గోదావరి, కృష్ణా, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాది హేచరీలు, నర్సరీలు ఏర్పడటంతో చేప పిల్లల ఉత్పత్తి గణనీయంగా విస్తరించింది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బ్రూడ్స్టాక్ ఫారాలు, హేచరీలు, నర్సరీల నెట్వర్క్ ద్వారా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిషా వంటి అనేక రాష్ట్రాలకు నాణ్యమైన చేప పిల్లలు సరఫరా అవుతున్నాయి. చేపల పెంపకం రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి పెద్ద పీట వేస్తోంది.ఏపీ చేపల పెంపక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో జన్యు నాణ్యత క్షీణించటం ముఖ్యమైనది. అవే తల్లి చేపలను పదే పదే విత్తనోత్పత్తికి వాడటం వల్ల ఇన్–బ్రీడింగ్ జరిగి చేప పిల్లల ఎదుగుదల మందగిస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షాలు హేచరీల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. బ్యాక్టీరియా, పరాన్నజీవులు, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. జాతుల వైవిధ్యీకరణ కొరవడటం మరో పెద్ద సవాలు. మార్కెట్లో ఫంగాసియస్, గిఫ్ట్ తిలాపియా, కొర్రమీను వంటి కొత్త జాతులకు డిమాండ్ పెరుగుతున్నా, ఇప్పటికీ మేజర్ కార్ప్ చేపలదే పైచేయిగా ఉంది.జన్యుపరంగా మెరుగైన మంచినీటి చేపల రకాలను జన్యుపరంగా అభివృద్ధి చేయ డానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక చేపల జన్యు మిషన్ను ఏర్పాటు చేయాలి. హేచరీల గుర్తింపు, నాణ్యత హామీ కోసం చేపల విత్తన ధ్రువీకరణ సంస్థ వంటి ప్రత్యేక అథా రిటీని నెలకొల్పాలి. క్యూఆర్ కోడ్ ద్వారా చేప పిల్లల సరఫరా గొలుసును, రవాణాను ట్రాక్ చేయాలి. సౌరవిద్యుత్తో నడిచే హేచరీలు, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్ఏఎస్) వంటి మౌలిక వసతుల్లో పర్యావరణ అనుకూల ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించాలి.చేపల సాగు విస్తీర్ణాన్ని పెంచటం కంటే నాణ్యతను మెరుగుపరచటంపైనే భవి ష్యత్తు పోటీతత్వం ఆధారపడి ఉంటుంది. వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా.. డిజిటల్ ట్రేసబిలిటీ, జీవ భద్రతా ప్రమాణాలతో దేశంలోనే ధ్రువీకరించబడిన చేప పిల్లల ఉత్పత్తికి జాతీయ కేంద్రంగా ఏపీ ఎదగాలి. అప్పుడే రాష్ట్రం భారతదేశ ‘బ్లూ ఎకానమీ’కి వెన్నెముకగా నిలిచి ‘ఫిష్ సీడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతుంది.- డా. పి. రామమోహనరావు, వ్యాసకర్త విశ్రాంత మత్స్యశాఖ ఉప సంచాలకులు, కాకినాడ (జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవం) -
తరతరాల కళా నిబద్ధత
ఐదు దశాబ్దాలుగా ‘కడ్డి తంత్రి’ అనే అపురూప జానపద సంగీత కళారూపాన్ని సంరక్షిస్తున్న దురిశెట్టి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ జానపద కళా ప్రపంచానికే గర్వకారణం. పెద్దపల్లి జిల్లా (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఆయన అరుదైన కళాసాధకుడు. ఎస్సీ మాల సామాజిక వర్గంలోని ‘మిత్తుల అయ్య వార్లు’ లేదా ‘నిత్యులు’ అనే ఉపకులానికి చెందిన రామయ్య, చిన్నతనంలోనే తన తండ్రి రామానుజం వద్ద ఈ కడ్డి తంత్రి కళను అభ్యసించారు. రామానుజం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం విశేషం.కడ్డి తంత్రి వాయిద్యం తెలంగాణలోని అత్యంత ప్రాచీన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటి. అడ విలో లభించే టేకు చెట్టు మొద్దును లోపల ఖాళీగా తొలిచి ఈ వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. రామయ్య వద్ద ఉన్న వాయిద్యానికి దాదాపు ఆరు నుంచి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. కశ్మీర్కు చెందిన సంతూర్, పాశ్చాత్య దేశాల డల్పీమర్, సింబలోన్ వంటి వాటిలో అనేక తంత్రులు (తీగలు) ఉంటాయి. కానీ, కడ్డి తంత్రి లేదా కడ్డి వీణలో కేవలం మూడు లేదా నాలుగు తంత్రులే ఉంటాయి. వీటితోనే 32 స్వరాలను పలికించడం గమనార్హం. చిన్న వెదురు బద్ద చివర కొన్ని గజ్జెలు కట్టి వాటితో తీగలను కొడతారు. బద్దతో వాయించినప్పుడు వచ్చే రాగతాళాలకు అనుగుణంగా గజ్జెల శబ్దం మేళవించి శ్రోతలకు వీనులవిందు కలిగిస్తుంది.ఈ వాయిద్యం కథాగానం, పురాణ ప్రవచనాలకు మాధ్యమంగా రూపుదిద్దుకుంది. రామయ్య తన బృందంతో కలిసి భాగవతం, భారతం వంటి ఇతిహాస గాథలను విని పిస్తారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, కీచక వధ, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, రామదాసు చరిత్ర, విరాట పర్వం, సుందరకాండ వంటి ఘట్టాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కడ్డి తంత్రి వాయిద్యంతో నిర్వహించే సాధారణ ప్రదర్శనల్లో ఆరు గురు కళాకారులు పాల్గొంటారు. అదే వేషధారణతో కూడిన నాటక రూప ప్రదర్శనలైతే 12 మంది కళాకారులు భాగస్వాములవుతారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ప్రద ర్శనలు తెల్లవారుజాము వరకు సాగుతుంటాయి. ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాల కోర్చి ‘కడ్డి తంత్రి’ కళను కాపాడుకుంటూ వస్తున్న దురిశెట్టి రామయ్య జీవితం... జానపద వారసత్వ పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత ప్రస్థానం!– జంపాల ప్రవీణ్, ఔత్సాహిక పరిశోధకుడు -
ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో!
ఒకరోజు ద్వారకలో, ఒక యువకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ‘ప్రభో! మంచి పనులు చేసిన వారు ధన్యులు అని అందరూ అంటారు. కానీ మంచి పనులు చేసిన వారు ఎవరు? ఎక్కువ దానధర్మాలు చేసేవారా? గొప్ప యజ్ఞాలు చేసేవారా?’ అని అడిగాడు. కృష్ణుడు ఆ యువకుడిని ఒక దేవాలయం దగ్గరకు తీసుకెళ్లాడు. ఒక వృద్ధుడు మౌనంగా ఆలయ ప్రాంగణం శుభ్రం చేసుకుంటున్నాడు.కృష్ణుడు ఆ యువకుడితో ‘రా! అతనికి తెలియకుండా రోజంతా మనం ఇతనిని అను సరిద్దాం’ అన్నాడు. వృద్ధుడు తన ఆహారంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్న కుక్కకు ఇచ్చాడు. దేవాలయా నికి వచ్చిన ఒక పేద వృద్ధురాలికి నీళ్ళు ఇచ్చి, తన చేతిలో ఉన్న కొన్ని నాణేలను కూడా ఇచ్చాడు. ఆలయ మార్గంలోని ముళ్ళను, రాళ్లను తొలగించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేముందు, ఇలా ప్రార్థించాడు: ‘కృష్ణా! ఈ రోజు నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే, దానిని నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను.’ఇది చూసి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ‘ప్రభో! ఇదేనా పుణ్యం? పెద్ద దానాలు లేవు, యజ్ఞాలు లేవు.’ కృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు: ‘విజయం అనేది చేసిన పని వల్ల వచ్చే కీర్తిలో లేదు; అది ఆ పని చేసే హృదయపు నిర్మలత్వంలో ఉంది. ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని నిలబెట్టేవాడు పుణ్యపురుషుడు’.అప్పుడు ఆ యువకుడు మళ్ళీ అడిగాడు: ‘అయితే, ప్రభూ, సద్గుణ ఫలం ఏమిటి?’ అందుకు కృష్ణుడు ‘సద్గుణానికి గొప్ప ఫలం సంపదగానీ, కీర్తిగానీ కాదు. ప్రపంచమంతా అతణ్ణి విడిచి పెట్టినా, నన్ను చేరే మార్గం అతని హృదయంలో ఎల్లప్పుడూ తెరిచే ఉంటుంది. అదే సద్గుణానికి నిజమైన ఫలం’ అన్నాడు. సద్గుణం స్వర్గానికి మార్గం కాదు; అది భగవంతుని హృదయాన్ని చేరే మార్గం!– యామిజాల జగదీశ్ -
ఆఫ్రికా నుండి ఫ్రెంచ్ నిష్క్రమణ?
గత నెలాఖరులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో దౌత్య సంబంధాలు తెంచుకోవటంతో ఫ్రాన్స్ – ఆఫ్రికా ఘర్షణ తారస్థాయికి చేరింది. ఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణ ఖాయమైంది. 1880–1919 మధ్యకాలంలో 90 శాతం ఆఫ్రికా ఖండం వలస పాలకుల అధీనంలోకి వచ్చింది. బ్రిటన్ తరువాత ఫ్రాన్స్ ఆఫ్రికాను ఆక్రమించుకొన్న రెండవ అతిపెద్ద వలస రాజ్యం. పోర్చుగల్, బెల్జియం, జర్మనీ, ఇటలీ కూడా ఆఫ్రికాలో వలసలను ఏర్పరచాయి. ఫ్రాన్స్ ప్రధానంగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలను ఆక్రమించింది. ఫ్రాన్స్ వలస సామ్రాజ్యం ఉచ్ఛ దశలో ఆఫ్రికాలో సుమారు 33 శాతం ప్రాంతంలో విస్తరించింది. 1960లో ఫ్రాన్స్ 14 ఆఫ్రికా దేశాలకు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది. అల్జీరియా 1962లో ఫ్రెంచ్ పాలన నుండి విముక్తి పొందింది.ఫ్రాన్స్ తీరు వేరు!వలస దేశాలకు బ్రిటన్, పోర్చుగల్, జర్మనీ, ఇటలీ స్వాతంత్య్రాన్ని ఇచ్చిన తరువాత, ఆయా దేశాల నుండి పూర్తిగా వైదొలిగాయి. కానీ ఫ్రాన్స్, రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇచ్చినప్పటికీ, సైనిక, ఆర్థిక, సాంస్కృతిక నియంత్రణను కొనసాగించింది. 1960– 2025 మధ్యకాలంలో ఫ్రాన్స్ సైన్యం ముప్పయిసార్లకు పైగా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నది. 2013లో మాలీలో ఫ్రెంచ్ సైన్యం ఆప రేషన్ సెవాల్ను చేపట్టింది. అనేక సందర్భాలలో ఫ్రెంచ్ సైన్యం దుష్ట నియంత పాలకులకు దన్నుగా నిలిచింది. గాబన్లో ఒమర్ బాంగో, చాద్లో డెబీ ఫ్రెంచ్ సైన్యం మద్దతుతోనే పాలించారు. ఫ్రెంచ్ అనుకూల పాలకులను ప్రతిష్ఠించటానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఫ్రెంచ్ ప్రభుత్వం వదులుకోలేదు. పూర్వ వలస దేశాల పాలకుల వ్యక్తిగత భద్రతకు ఫ్రెంచ్ సైనికులను వినియోగించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన కరెన్సీని ఫ్రాన్స్ తన గుప్పిట్లో ఉంచుకున్నది. 14 పూర్వ ఆఫ్రికన్ వలస దేశాలు సీఎఫ్ఏ ఫ్రాంక్ను కరెన్సీగా వాడతాయి. దీనిని యూరోకు అనుసంధానం చేశారు. 2021 వరకు ఈ నోట్లను ఫ్రెంచ్ ట్రెజరీ ముద్రించేది. కరెన్సీ రిజర్వ్ను ఫ్రెంచ్ బ్యాంకులలో నిలువ చేస్తున్నారు. వడ్డీరేట్లు, ద్రవ్య విధానాన్ని ఫ్రాన్స్ తన నియంత్రణలో ఉంచుకున్నది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మైనింగ్, రవాణా, కమ్యూనికేషన్ రంగాలను ఫ్రెంచ్ కంపెనీలు తమ గుత్తాధిపత్యంలో ఉంచుకొన్నాయి. 21 ఆఫ్రికన్ దేశాలు ఫ్రెంచ్ను అధికార భాషగా వాడుతున్నాయి. ముప్పై లక్షలకుపైగా ఆఫ్రికన్లు ఫ్రాన్స్లో నివసిస్తున్నారు.2020 తరువాత ఫ్రాన్స్ జోక్యానికి వ్యతిరేకంగా ఎదురుగాలి మొదలైంది. పెద్ద ఎత్తున యువత నిరసన ప్రదర్శనలు జరిగాయి. 2020–21లో మాలి, బుర్కినా ఫాసో, గినియాల్లో ఫ్రెంచ్ అనుకూల పాలకులను తిరుగుబాటుదారులు కూలదోశారు. 2022లో మాలి నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2023లో నైజర్, గాబన్ లలో తిరుగుబాటు తరువాత ఫ్రెంచ్ సైన్యాన్ని బహిష్కరించారు. 2024లో సెనెగల్, ఐవరీ కోస్ట్, ఛాద్ల నుండి ఫ్రెంచ్ సైన్యాన్ని ఉపసంహరించారు. ప్రస్తుతం ఎర్ర సముద్రం సమీపంలోని జిబూతిలో మాత్రమే ఫ్రెంచ్ తన సైనిక స్థావరాన్ని నిర్వహిస్తున్నది. పెరుగుతున్న చైనా ప్రభావంఆఫ్రికా నుండి ఫ్రాన్స్ నిష్క్రమణకు ఆఫ్రికాపై రష్యా, చైనా దృష్టిని సారించటమూ కారణమే. రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ (కిరాయి సైన్యం) ఆఫ్రికన్ దేశాలకు భద్రతా సహాయాన్ని ఇవ్వటా నికి ముందుకొచ్చింది. వాగ్నర్ నాయకుడి మరణం తరువాత ఈ సైన్యాన్ని ఆఫ్రికా కోర్గా పేరుమార్చి రష్యా నేరుగా తన నియంత్ర ణలోకి తీసుకున్నది. జిహాదీల అణచి వేత, అంతర్గత భద్రత, అధ్య క్షుల వ్యక్తిగత భద్రతలను మాలీ, నైజర్, గాబన్, ఛాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, బుర్కినా ఫోసోలలో పర్యవేక్షించటానికి రష్యా ఒప్పందాలను చేసుకున్నది. గనుల భద్రత కూడా రష్యన్ సైనికుల నియంత్రణలో ఉన్నది. ప్రతిగా ఈ దేశాలు బంగారాన్ని చెల్లిస్తున్నాయి. మాలి, బుర్కినా ఫోసోలోని బంగారం, నైజర్లోని యురేనియం, గినియాలోని బాక్సైట్ గనుల నుండి ఫ్రెంచ్కి చెందిన ఒరానో వంటి కంపెనీలు వైదొలగాల్సి వచ్చింది. ఇదే అదనుగా చైనా తన ఆర్థిక, వాణిజ్య సామ్రాజ్యాన్ని ఫ్రెంచ్ –ఆఫ్రికాలోనికి గత రెండు దశబ్దాలుగా విస్తరిస్తున్నది. ఫ్రెంచ్ ఫ్రాంక్ను కరెన్సీగా వాడుతున్న 14 ఆఫ్రికన్ దేశాలలో పది దేశాలకు ఇప్పుడు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దొరాల (జిబూతి), కిర్చి (గినియా), అబిడ్జాన్ (ఐవరీ కోస్ట్), పాయింట్ నాయిర్ (కాంగో) రేవు పట్టణాలను చైనా అభివృద్ధి పరచింది. పది విమానా శ్రయాలు, పార్లమెంటు భవనాలు, స్టేడియాలను నిర్మించింది. ఫ్రెంచ్ కంపెనీలతో పోలిస్తే చైనా కంపెనీలు తక్కువ వడ్డీతో రుణాలు అందించాయి. హువే, జెడ్టీఈ వంటి చైనా కంపెనీలు సెనెగల్, ఐవరీ కోస్ట్, గాబన్, కామెరూన్లలో 4జీ/5జీ సేవలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాలు, బ్యాటరీల తయారీకి అవసర మైన బాక్సైట్ (గినియా), కోబాల్ట్, రాగి(కాంగో), మాంగనీస్ (గాబన్)లతో పాటుగా యురేనియం (నైజర్), చమురు, గ్యాస్ (మారిటానియా)లను చైనా ప్రతిఫలంగా చౌకగా పొందు తున్నది.మనకో సువర్ణావకాశంభారత్కు కూడా ఫ్రాంకో ఆఫ్రికన్ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవటానికి ఇది మంచి తరుణం. చౌకైన, తేలికపాటి ఆయుధాలు, సైనిక శిక్షణ రంగాలలో ఈ దేశా లతో ఒప్పందాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఎన్ శాంతి పరిరక్షణ బలగాలతో అనుభవం భారత్కు కలిసొచ్చే అంశం. సముద్ర జలాల పహారా, గస్తీలో కూడా భాగస్వామ్యానికి అవకాశాలున్నాయి. ఈ దేశాలలోని ఖనిజ వనరుల వెలికితీతలో భారత కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చైనా మాదిరిగా ఆ దేశాలను రుణ ఊబిలోకి నెట్టకుండా పరస్పర ప్రయో జనకరమైన ఉమ్మడి భాగస్వామ్యాలను ప్రతిపాదించటం వలన ఆ దేశాలు భారత్ను ఎంచుకోవటానికి అవకాశం ఉన్నది. ఫార్మాస్యూ టికల్స్ ఎగుమతితోపాటుగా, యూపీఐ, ఆధార్ సేవలను విస్తరింప జేయటానికి కూడా అవకాశం ఉన్నది. చైనా కంపెనీలు ఈ ప్రాంతంలో రెండు దశాబ్దాల నుండి పాతుకుపోయి ఉన్నాయి. ప్రాజెక్టులను అతి తక్కువ సమయంలో పూర్తి చేయటంలో అవి దిట్ట. మన ప్రైవేటు రంగ కంపెనీలు ఈ రేసులో పాల్గొంటే తప్పితే ఈ ప్రాంతంలో భారత్ నిలబడలేదు. పశ్చిమ ఆఫ్రికాకు నేరుగా సముద్ర రవాణా మార్గం లేకపోవటం భారత్కు ప్రతికూలాంశం.ఈ నేపథ్యంలో ఆఫ్రికాపై తన పట్టును వదులుకోవటానికి ఫ్రాన్స్ అంగీకరించదు. వలస మనస్తత్వాన్ని, యాజమాన్య ధోర ణిని వదలివేసి పూర్వ వలస దేశాలను సమానులుగా అంగీకరించి, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించటం శ్రేయస్కరం. ఎర్ర సముద్ర భద్రతకు జిబూతి సైనిక స్థావరం, గినియా సింధు శాఖ భద్రతకు గాబన్ సైనిక స్థావరం కీలకం. ఫ్రాంకో ఆఫ్రికన్ దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసు కోకుండా యూరో పియన్ యూనియన్ ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించటం ఫ్రాన్స్ ముందున్న మార్గం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ప్రశ్న రావణ్పై ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలి : పౌరహక్కుల సంఘం
ప్రజాస్వామిక వ్యవస్థలో బలమైన నాలుగు వ్యవస్థలున్న నేపథ్యంలో మూడు వ్యవస్థలు దిగజారిపోయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నాయి. నాలుగవ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ కనీసంగానైనా సోషల్ మీడియా పరంగా యూట్యూబ్లతో ప్రజల విశ్వాసంలో ఉన్నది. నేషనల్ మీడియా రాష్ట్రాల పత్రికలన్ని కూడా అధికార పార్టీల కనుసన్నల్లో వార్తను బంధీ చేసి ఉన్నాయి. గతంలో చేగువేరతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ తేలాడో మనందరికి తెలుసు. అతని మాటలకు, ఆచరణకు చాలా వ్యత్యాసం కనబడింది. చివరికి తాను మాట్లాడిన అప్రజాస్వామిక పదజాలాన్ని ప్రశ్నా రావణ్ అనుకరించడం నాలుగు పోలీస్ స్టేషన్లలో బెయిల్ తో విడుదలైన తరువాత ఐదవ పోలీస్ స్టేషన్లో అప్రజాస్వామిక నిర్బంధ చట్టమైన ఉపా చట్టంతో అతనిని నిర్బందానికి గురి చేశారు. గతంలో టాడా, పోటా, నేపథ్యాల నుంచే ఉపా చట్టం వచ్చిన తరువాత ఉపా ఎంతగా ప్రశ్నించే గొంతులపై అణచివేతను, నిర్బంధాన్ని అమలు చేస్తున్నదో 2018 భీమాకొరెగావ్ ఉపా కుట్ర కేసు నుంచి మనందరికి అర్థమవుతున్న విషయం. కేవలం బెయిల్ దొరకకుండా ఆ ప్రశ్నను, ఆ నిరసన గొంతును నిశ్శబ్దం చేయడం కోసం పాలక వర్గాలు అనుసరిస్తున్న బలమైన అణచివేత విధానంగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది. అందులో భాగంగానే 84 ఏండ్ల ఫాదర్ స్టాన్ స్వామి జార్ఖండ్ లోని ఆదివాసీల కోసం న్యాయ స్థానంలో చట్టపరంగా బలమైన పోరాటాలు నిర్వహించినందుకు ఆగ్రహించిన ప్రభుత్వం జైలులోనే హత్య చేసింది. అదే విధంగా 90 శాతం వికలాంగుడైన ప్రొ. సాయిబాబా కూడా ఆదివాసీల పక్షాన మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు అక్రమ కేసులో అన్యాయమైన శిక్షతో 10 ఏండ్లపాటు జైలు నిర్బంధానికి గురి చేస్తే అతను కూడా మరణించడం జరిగింది. ఇలా పీడిత ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన అణగారిన వర్గాల పక్షాన నేడు బుద్ధిజీవులు మేధావులతో పాటు య్యూట్యూబర్లు కూడా తమ ఛానెళ్ళ ద్వారా ప్రజలకు ప్రశ్నించడం నేర్పుతున్నారు. ఆ నేర్పడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అన్న మాటలను పునరుచ్చరణ చేసినందుకు అదే నేరంగా వరుసగా కేసులు నమోదు చేశారు. నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రశ్నారావణపై, న్యాయస్థానానికి తరలిస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో గోడలు దూకి మరీ ప్రశ్నారావణపై భౌతిక దాడికి జనసేన కార్యకర్తలు పాల్పడ్డారు. జనసైనికులు, చట్టవిరుద్ధంగా వ్యవహరించడ మంటేనే పవన్ కళ్యాణ్ బాధ్యతపడాల్సిన అవసరం ఉంది.అదే మాదిరిగా ఈ నెల ఒకటిన మరో జర్నలిస్టు కె. వి. ఆర్. ఇంటి మీద దాడి చేసి ఎపి పోలీసులు అమాంతంగా ఎత్తుకు పోయారు. పోలీసులకు హద్దులు పరిమితులు పని చేయవు. పేదలకు అన్యాయం జరిగినపుడు పోలీసు స్టేషన్ కెళితే మా పరిధి కాని హింసించిన ఉదాహరణలెన్నో ఉన్నాయి. కె.వి.ఆర్. ను ఎత్తుకు పోవడానికి ముందు మఫ్టీలో వున్న ఎపి పోలీసులు రెక్కి నిర్వహించారు. మీరెవరు నా భర్తను ఎందుకు తీసుకు పోతున్నారని అడుగితే, నేను కూడా నా భర్త వెంబడి వస్తానంటే ఆమెను లాగిపడేశారు. పైగా భాగ్యలక్ష్మీపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో కుటుంబీకులుకు తెలియజేసే చట్టబద్దమైన బాధ్యత పోలీసులపై వుంది. పోలీసులకు చట్టాన్ని బేఖాతరు చేయమని పాలకులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు. ఈ అరెస్టులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.వాక్ సభా స్వాతంత్ర్యాలకు రాష్ట్రంలో తీవ్ర విఘాతం కలుగుతుంది. గొంతు విప్పి మాట్లాడితే నేరం అవుతుంది. అంత్యక్రియల్లో మాట్లాడిన గాదె ఇన్నయ్యను జైలుపాలు చేసి 8 నెలలుగా బెయిలు లేకుండా నిర్బంధించారు.ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అన్నీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడిన ప్రభుత్వాలు వ్యక్తులు పత్రికా స్వేచ్ఛను గౌరవించడం ఇబ్బందిగా ఫీలవుతారు. ఆ నేపథ్యంలోనే ప్రశ్నారావణపై చట్టపరంగా పోరాటం చేయాల్సిన స్థితి కాకుండా అక్రమ ఉపా కేసులు నమోదు చేసి భౌతిక దాడులకు పాల్పడడం అదే విధంగా కేసులు చేస్తున్న జడ శ్రావణపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రకటించడం లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలుగా పౌరహక్కుల సంఘం భావిస్తూ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రభుత్వాలలో పాలకులుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలే రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు మాత్రం ఎందుకు పాటించాలనే ఒక మౌళిక ప్రశ్న బలల్దేరుతుంది. అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నారావణ్ పై కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా నమోదు చేసిన ఉపా కేసుతో పాటు అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేసి అతన్ని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.తెలంగాణలో కూడా గత కొద్ది నెలల క్రితం కొన్ని య్యూట్యూబ్ ఛానెల్లపై ఎన్.ఐ.ఎ. తరహా నిర్బంధాలు బలంగానే కొనసాగాయి. ఆ నిర్బంధాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధం లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కానీ శాంతి భద్రతలనేవి కేవలం రాష్ట్రానికి సంబంధించినదే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ య్యూట్యూబ్ ఛానెల్ల పట్ల పత్రికల పట్ల ప్రజాస్వామ్యబద్ధమైన వైఖరితో తమ పాలన కొనసాగించాలి. కనిపించ కుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్న అన్ని పత్రికలపై య్యూట్యూబ్లపై ఆ నిర్బంధాన్ని ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడగలిగితేనేకనీసంగానైనా ప్రజాస్వామ్యం నిలబడు తుంది. లేకపోతే నిర్బంధమే రాజ్యమేలుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. అప్పుడు ప్రజల దగ్గరకి ప్రజాస్వామ్య విలువల కోసం వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి పత్రికలపై య్యూట్యూబ్ ఛానెళ్ళపై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులను ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వాలను పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.పౌరహక్కుల సంఘం (CLC) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రొ. గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్. నారాయణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాల కృష్ణ, సహాయ కార్యదర్శి, -
జాతీయ పునర్నిర్మాణ శక్తిగా...
ఒక దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాల నిర్ణయాలతోనే సాధ్యం కాదు. సమాజంలోని ప్రతి వర్గం, ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనకు కార్య రూపమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ). 1948 జూన్లో ప్రారంభమైన ఈ సంస్థ 1949 జూలై 9న అధికారికంగా నమోదు అయ్యింది. ఏబీవీపీ మొదటి రోజు నుంచే జాతీయ పునర్నిర్మాణం తన లక్ష్యం అని స్పష్టంగా ప్రకటించింది.విద్యార్థులు కేవలం విద్యను పొందే వ్యక్తులు కాకుండా, సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత గల పౌరులుగా ఎదగా లని పరిషత్ భావించింది. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణా త్మక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు, విద్యార్థి వ్యవస్థల్లో భాగస్వామ్యం అనే మూడు ప్రధాన మార్గాలను అనుసరించింది.భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలపరిచే లక్ష్యంతో ఏబీవీపీ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సేయిల్ (స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ ) ఒకటి. దీని ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కుటుంబాలతో కలిసి నివసిస్తూ భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం కాకుండా భావోద్వేగపూర్వక జాతీయ ఐక్యతకు ఒక వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ అంశంపై 1998లో తీర్మానం చేయడం, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించడం, మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.కాలం మారుతున్న కొద్దీ విద్యార్థి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మారుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏబీవీపీ తన కార్యక్రమాలను విస్తరించింది. అలాగే ‘ఖేలో భారత్’ ద్వారా క్రీడాస్ఫూర్తిని, ‘రాష్ట్రీయ కళా మంచ్’ ద్వారా భారతీయ కళా సంస్కృతిని, ‘స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్’ ద్వారా పర్యావరణ బాధ్యతను, ‘స్టూడెంట్స్ ఫర్ సేవ’ ద్వారా సేవా భావాన్ని ప్రోత్సహిస్తోంది. మెడివిజన్, అగ్రివిజన్, టెక్నికల్ సెల్, లా సెల్, పరిశోధన, విద్యా విధానాలపై చర్చలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. యువ శక్తిని జాతీయ పునర్నిర్మాణ దిశగా నడిపించే ఈ ప్రయాణాన్ని ఏబీవీపీ నిరంతరం కొనసాగిస్తోంది.– రావుల కృష్ణ, ఏబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు, (నేడు ఏబీవీపీ ఆవిర్భవించిన రోజు) -
కమ్యూనిస్టుల ఐక్యత ఎలా జరగాలి?
కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యం కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ ఐక్యత మత విద్వేషాలను ఎదుర్కొనే అంశానికే పరి మితం కాకూడదు. నేటి వ్యవస్థను సమూ లంగా మార్చేందుకు ఉమ్మడి అవగాహనతో పంథా, కార్యక్రమాలు ఉండాలి.దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం అనేక కమ్యూనిస్టు పార్టీలుగా మనుగడ సాగిస్తోంది. వీటిల్లో విప్లవ పార్టీలు, పార్లమెంటరీ పార్టీలు ఉన్నాయి. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలకు నేటి వ్యవస్థ స్వభావం, వ్యవస్థను ఏ విధంగా మార్చాలి, పాలక వర్గాల స్వభావం గురించి, భూస్వామ్య వ్యవస్థ గురించి, బడా బూర్జువా వర్గం స్వభావం గురించిన అవగాహనలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఒక దానితో మరొకటి పొసగదు. ఇలా ఉన్న పార్టీలన్నీ భారత సామాజిక వ్యవస్థ గురించి, ఆ వ్యవస్థను మార్చడం గురించి ఒక అవగాహన లేకుండా ఐక్యత ఎలా సాధ్యం అవుతుంది? ఐక్యత కోరుకునే మిత్రులందరూ ఈ వాస్తవాన్ని గ్రహించాలి గదా! ఆత్యధిక విప్లవ కమ్యూనిస్టు పార్టీలకు వ్యవస్థ, దాని మార్పు పట్ల ఒకే అవగాహన ఉంది (కొద్ది విప్లవ పార్టీలు పాత వైఖరి నుంచి వైదొలిగాయి). అనుసరించే ఎత్తుగడల్లో తేడాలు ఉన్నాయి. కొన్ని పార్టీలు అతివాద విధానాలు అనుసరించాయి. అందువల్ల కలిగిన నష్టాలు ఉన్నాయి. అనుసరించిన కార్యాచరణ, వచ్చిన ఫలితాల నుంచి గుణపాఠాలు తీసుకుంటే విభేదాలు తొలగిపోతాయి. వ్యవస్థ మార్పుకు అంకితమైన ఈ పార్టీలు విడివిడిగానూ, ఉమ్మడిగానూ ఇలాంటి సమీక్షకు ముందుకు రావాలి.ఐక్యతకు పునాదిపార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్న పార్టీలు సోషలిజాన్ని కోరుకుంటున్నాయి. పార్లమెంటరీ విధానం ద్వారా సోషలిస్టు వ్యవస్థ సాధించవచ్చని చెప్పే ఈ పార్టీలు, పార్లమెంటరీ విధానంలో కూడా స్వతంత్ర విధానాన్ని అనుసరించడం లేదు. బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులే పార్లమెంటరీ విధానంగా ముందుకు పోతున్నాయి. అందుకు పొంతన లేని వివరణలు ఇస్తున్నాయి. ఎన్నికల ద్వారానే ఏ దేశంలో కూడా వ్యవస్థ సమూలంగా మార్పు చెందలేదు. మహనీయుడు లెనిన్ ‘రాజ్యాంగ యంత్రం – విప్లవం’ అనే తన రచనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మార్క్సిజం – లెనినిజం సిద్ధాంత వెలుగులో... ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలి, ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఉద్యమం వైపు ప్రజలను ఎలా సమీకరించాలి అన్న ఎత్తుగడలను రూపొందించుకోవాలి. ఆ విధంగా ఎన్నికల్లో పాల్గొనాలి.కమ్యూనిస్టు ఉద్యమంలో రెండు పరస్పర విరుద్ధమైన విభాగాలు పని చేస్తున్నాయి. ఈ రెండు విభాగాలు తమ సిద్ధాంత వైఖరులకు కట్టుబడి ఉన్నాయి. అందువల్ల వీటి మధ్య వెంటనే ఐక్యత సాధ్యం కాదు. ఈ రెండు విభాగాల మధ్య నేటి వ్యవస్థ గురించి, విప్లవ దశ గురించి, బడా బూర్జువా గురించి ఒక ఉమ్మడి అవగాహన ఏర్పడితే రెండు విభాగాల మధ్య ఐక్యతా అవకాశాలు ఏర్పడతాయి.వివిధ కమ్యూనిస్టు సంస్థలు, తమ తమ సిద్ధాంత అవగా హనను అట్టి పెట్టుకుంటూనే, ఉమ్మడి అవగాహన ఉన్న అంశాలపై ఐక్య కార్యాచరణ కొనసాగించాలి. ఇప్పటికే కొన్ని సమస్యల పట్ల ఐక్య కార్యాచరణ కొనసాగుతున్నది. ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల మీద దీన్ని చూడవచ్చు. ఐక్య కార్యాచరణ అంశాలు ఇంకా విస్తరించాలి. గ్రామీణ ప్రాంతంలో పేదలకు భూ పంపిణీ, ఎరువుల, విత్తనాల సబ్సిడీ, కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకించడం, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి నిరంతర ఐక్య కార్యాచరణ కొనసాగాలి. ఇదే కమ్యూనిస్టుల ఐక్యతకు పునాది.- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతుకూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
హడావిడిగా చట్టం చేస్తే ఎలా?
తెలంగాణ ప్రభుత్వం పందొమ్మిది సెక్షన్లతో కూడిన ‘తెలంగాణ అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్–2026’ను ఇటీవల తెచ్చింది. న్యాయ వాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమే అయినప్పటికీ, ప్రస్తుత రూపంలో ఈ చట్టం వారి భద్రతకు అంతత మాత్రమే ఉపయోగపడుతుంది. ‘అడ్వొకేట్’ అనే పదానికి ఇచ్చిన నిర్వచనమే అసమానతతో కూడి ఉంది.ప్రకరణ 2(1)(బి) ప్రకారం... అడ్వొ కేట్స్ యాక్ట్–1961 కింద ఇచ్చిన అర్థాన్నే ‘అడ్వొకేట్’ కలిగి ఉంటా రనీ, అలాగే వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలనీ పేర్కొంది. ఇది సబబేనా? ఢిల్లీలో ఎన్ రోల్ అయి, అక్కడ ప్రాక్టీస్ చేసే ఒక న్యాయవాది, తన క్లయింట్తో కలిసి తెలంగాణలోని ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చారనుకుందాం. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లో ఆయనపై దాడి జరిగితే, ఈ చట్టం ఆయనకు రక్షణ కల్పించదు, ఎందుకంటే ఆయన తెలంగాణలో ప్రాక్టీస్ చేయడం లేదు కనుక. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఒకే వర్గానికి చెందినవారు (అంటే న్యాయవాదుల) వారు ప్రాక్టీస్ చేసే రాష్ట్రాన్ని బట్టి వివక్ష చూపకూడదు. ముఖ్యంగా ప్రకరణ 1(2) ప్రకారం ఈ చట్టం మొత్తం తెలంగాణకు వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొన్నప్పుడు ఈ వివక్ష సరికాదు.న్యాయవాది, వారి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా జరిగే చర్యలలో, ‘యాక్ట్ ఆఫ్ వయలెన్ ్స’గా ఏది పరిగణించబడుతుందో ఈ చట్టం నిర్వచిస్తుంది. ఎవరైనా అటువంటి హింసాత్మక చర్యకు పాల్పడినా, ప్రేరేపించినా లేదా కుట్ర పన్నినా వారికి కనీసం ఆరు నెలల నుండి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం నిబంధ నలు కలిగి ఉంది. ఈ కేసును డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి తగ్గని అధి కారి దర్యాప్తు చేయాలి; ఈ అధికారి ఎఫ్ఐఆర్ నమోదైన తేదీ నుండి అరవై రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. ఈ ట్రయల్ను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చేపట్టాలి; వారు, నిందితుడు కోర్టుకు హాజరైన తేదీ నుండి ఆరు నెలల లోపు దీనిని పూర్తి చేయాలి.పైకి చూసేటప్పుడు బాధితుడైన న్యాయవాదికి ఆరు నెలల అరవై రోజుల్లోగా న్యాయం జరుగుతుందని అనిపించవచ్చు. వాస్త వానికి అది జరగదు. ఒక చట్టం నిర్దేశిత కాల పరిమితులను పాటించనందుకు ఎటువంటి పర్యవసానాలను సూచించనప్పుడు, అందు లోని ‘షల్’ అనే ఆంగ్ల పదాన్ని ‘మే’ గానే అర్థం చేసుకుంటారు.ఇంకా, ఈ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నందున, ఇది ఒక వారెంట్ కేసు అవుతుంది. అంటే, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత– 2023 (బి.ఎన్.ఎస్.ఎస్.– 2023) కింద పేర్కొన్న సంక్లిష్టమైన న్యాయ విచారణ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరు నెలల గడువులోగా విచారణ పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. దీనికి బదులుగా, ఈ చట్టం కింద వచ్చే కేసులనే ప్రత్యేకంగా డీల్ చేయడానికి ఒక మేజిస్ట్రేట్తో కూడిన ‘ప్రత్యేక న్యాయస్థానాన్ని’ ఏర్పాటు చేసి ఉండాల్సింది.న్యాయవాదులకు కొత్త రక్షణ ఏమీ లేదు! పోలీస్ అధికారి ఒక ‘అడ్వొకేట్’ను కేవలం బిఎన్ఎస్ఎస్లోని ప్రకరణలు 35 నుండి 62 వరకు నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అరెస్ట్ చేయాలని సెక్షన్ 14 చెప్తుంది. బిఎన్ఎస్ఎస్–2023 కింద ఈ రక్షణ ప్రతి పౌరుడికీ అందుబాటులో ఉంది. కాబట్టి న్యాయవాదు లను అక్రమ అరెస్టుల నుండి రక్షించడానికి ఈ చట్టం కొత్తగా చేకూర్చిన రక్షణ ఏమీ లేదు.ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి, సరైన ‘జ్యుడీషియల్ ఇంపాక్ట్ అసెస్మెంట్’ లేదా సంబంధిత వర్గాలతో ముందస్తు సంప్రదింపులు లేకుండా, అప్పటికప్పుడు ‘తక్షణ ప్రతిస్పందన చట్టాలను’ తీసుకురావడం వల్ల ప్రయోజనం లేదు. అలా తీసుకువచ్చి, తర్వాత కోర్టులు సకాలంలో కేసులను తేల్చడం లేదనో, లేదా కోర్టుల ‘ఇంటర్ప్రిటేషన్’ వల్లే చట్టం ఉద్దేశం దెబ్బతింటుందనో నిందను న్యాయవ్యవస్థపైకి నెట్టేస్తున్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈసారి చట్టాల వ్యాఖ్యానంలో కోర్టులకు సహాయం చేసే అడ్వొకేట్లే– కేవలం ప్రజా నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం ఆడుతున్న ఇటువంటి చట్టాల నాటకంలో చిక్కుకుపోబోతున్నారు!ఢిల్లీలో ఎన్రోల్ అయిన ఒక న్యాయవాది, తన క్లయింట్తో తెలంగాణలోని ఒక పోలీస్ స్టేషన్ కు వచ్చారనుకుందాం. అక్కడ ఆయనపై దాడి జరిగితే, ఈ చట్టం ఆయనకు రక్షణ కల్పించదు.– బాగ్లేకర్ ఆకాశ్ కుమార్, న్యాయవాది, తెలంగాణ హైకోర్టు akashbaglekar@gmail.com -
విధానాల్లో శాస్త్రీయత ఉంటోందా?
ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించింది. వీధుల్లో వాయు నాణ్యతను మెరుగుపర చేందుకు పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాల వాడకాన్ని పూర్తిగా దశలవారీగా రద్దు చేయనున్నట్లు వెల్లడించింది. ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న లిక్కర్ పానీయాలపై పన్నులను తగ్గించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మత్తు పానీయాల నుంచి ప్రజానీకాన్ని దూరం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని కేరళ భావిస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెడుతున్న వాటిలో కోడి గుడ్ల స్థానంలో శాకాహార ప్రొటీన్లను ప్రవేశపెడుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, పెట్రోల్లో ఇథనాల్ మోతాదును క్రమేపీ పెంచే విధానాలపై తీవ్ర తర్జనభర్జనలు సాగుతున్నాయి. కానీ విధానాలు ఆయా లక్ష్యాలను సాధించాలంటే అవి సమాజ అవసరాలతోపాటు శాస్త్రీయ ఆధారాలను ప్రాతిపదిక చేసుకోవాలి.అసలు కాలుష్య చిత్రంఢిల్లీ ఎలక్ట్రిక్ వాహనాల విధానం ద్వి, త్రిచక్ర వాహనాలపైనే దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 2028 ఏప్రిల్ నుంచి ఎలక్ట్రిక్ టూవీలర్ల, 2027 జూలై నుంచి ఎలక్ట్రిక్ త్రీవీలర్ల రిజిస్ట్రేషన్లను మాత్రమే ఆమోదిస్తామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలో మొత్తం వాహనాలు 1.3 కోట్ల మేరకు ఉంటే, అందులో టూవీలర్లు 62 శాతం, కార్లు 32 శాతం. దీన్నిబట్టి, టూవీలర్ల వాడకాన్ని దశల వారీగా పూర్తిగా నిషేధించాలన్న ప్రభుత్వ నూతన విధానంలో హేతుబద్ధత కనిపిస్తుంది. కానీ, అది పూర్తి చిత్రాన్ని రూపుకట్టించే వాస్తవం కాదు. ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో టూవీలర్లు 62 శాతం మేర ఉంటే ఉండవచ్చుగానీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధిత ధూళికణాల (పీఎం2.5) విడుదలలో వాటి వాటా 15 శాతమే. ఢిల్లోలోని వాహనాల్లో తేలిక, భారీ రకం వాణిజ్య వాహనాలు 3 శాతంకన్నా తక్కువే ఉండ వచ్చుగానీ, ఈ ఉద్గారాలలో వాటి వాటా 39 శాతం. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు చెందిన గుఫ్రాన్ బేగ్ 2025లో ప్రచురించిన విధాన సంక్షిప్త పత్రంలో అటు వంటి విశేషాలు దాగున్నాయి. దాన్ని పరిశీలిస్తే, వాణిజ్య వాహనాలు, బస్సుల ఉద్గారాల సమస్యను పరిష్కరించడం ద్వారానే పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ ఎక్కువ మేలు చేకూరగలదని అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల వాడకం పర్యావరణానికి ప్రయోజనదాయకమేకానీ, ప్రభుత్వ విధానాలు మొదట అత్యంత కలుషితదాయకమైన విభాగాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఒకటి 2025 డిసెంబర్లో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని కూడా పరిశీలించింది. విధానపరమైన దృక్పథం ముక్కచెక్కలుగా ఉండకూడదని అది హెచ్చరించింది. రాష్ట్ర స్థాయి బదులు ఒక భౌగోళిక ప్రాంత స్థాయిలో చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఆ వైఖరి లోపించి నపుడు, ఢిల్లీ ఈవీలవైపు మళ్ళినా ఒనగూడే పర్యావరణపరమైన ప్రయోజనాలు పెద్దగా ఉండవు. కాలుష్య కారక వాహనాలు ఢిల్లీ చుట్టుపక్కలనున్న రాష్ట్రాలకు వచ్చి ఆ మొత్తం భౌగోళిక ప్రాంత ఉద్గారాలకు తమవంతు వాటాను జోడిస్తూనే ఉంటాయి. ఏదైనా తగని మోతాదే!దేశంలోకెల్లా మద్యపాన వినియోగం కేరళలోనే ఎక్కువ. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడానికి, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలపై పన్ను తగ్గించాలనీ, తద్వారా వీటి వినియోగాన్ని పెంపొందించినట్లు అవుతుందనీ కేరళ ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాల వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనం ఏమైనా ఉందా అని కేరళ ప్రభుత్వం కొద్దిగా కూడా దృష్టి సారించినట్లు లేదు. మొదటగా, ఆల్కహాల్ వినియోగానికి సురక్షితమైన పరిమితులంటూ ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గుండెకు రెడ్ వైన్ మంచిదనే అభిప్రాయం కూడా అపోహ మాత్రమేనని వెల్లడించింది. కనుక, పన్నుల విధానాలు ఆల్కహాల్ మోతాదు తక్కువ లేదా ఎక్కువ అనే తేడా చూపనవసరం లేదు. పైగా, ఆల్కహాల్ మోతాదు తక్కువగా ఉన్న పానీయాలను చౌకగా మారిస్తే, మొత్తం మీద లిక్కర్ వినియోగం పెరగడానికి తలుపులు తెరిచినట్లు అవుతుంది. ఈ పానీయాలు తేలిగ్గా అందుబాటులో ఉండటం వల్ల మైనర్లు తప్పుదారి పట్టవచ్చు. వారు క్రమంగా మద్యపానం వైపు మళ్ళవచ్చు. లైట్ సిగరెట్లు, హుక్కా, ఇ–సిగరెట్లు అంటూ పొగాకు పరిశ్రమ విషయంలో కూడా అలాగే చేశారు. లిక్కర్ కంపెనీలు తమ హార్డ్ లిక్కర్ బ్రాండ్లను మార్కెట్ చేసుకునేందుకు లో–ఆల్కహాల్ ఉత్పత్తుల వినియోగాన్ని ఒక ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. మైలేజీ ఉంటుందా?మరో ప్రభుత్వ ప్రధాన విధాన విషయంలో కూడా ఆల్కహాల్ కేంద్ర బిందువుగా మారింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడానికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. ఇంధన భద్రత, విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయడం నుంచి రైతుల సంక్షేమం వరకు ఈ విధానం వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి తెగ చెప్పు కొస్తున్నారు. మరోపక్క వాహనాల యజమానులు తమ ఇంజిన్లు దెబ్బతింటున్నాయనీ, మైలేజి పడిపోతోందనీ ఫిర్యాదు చేస్తున్నారు. కార్ల తయారీ సంస్థలు అంగీకరిస్తున్నట్లుగా ఇథనాల్ మిళిత ఇంధ నాల వల్ల కార్ల మైలేజీ తగ్గుతూ, వాహనాల యజమానులు చెబు తున్నట్లుగా ఇంజిన్లు దెబ్బతింటూంటే మొత్తంమీద ఆర్థిక వ్యయాలు పెరుగుతాయేగానీ, తగ్గవు. రైతులు ఆహార పంటల నుంచి నీరు ఎక్కువ అవసరమైన చెరకు వంటి పంటలవైపు మళ్లితే, ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిమాండ్ కాలంలో ఇథనాల్ కంపెనీలు మొక్క జొన్న, వరిని కూడా ఉపయోగించుకుంటాయి. మధ్యాహ్న భోజన పథకంలో కోడి గుడ్లను తొలగించాలన్న పశ్చిమ బెంగాల్ నిర్ణయం శాస్త్రీయ ఆధారాల ముందు తేలిపోతుంది. అవి నాణ్యమైన ప్రొటీన్ అందిస్తాయనీ, కనుక వాటిని ఆహారంలో చేర్చాలనీ పౌష్ఠికాహారవేత్తలు దశాబ్దాలుగా చెబుతు న్నారు. ఆహారానికి బలం చేకూరే విధంగా పన్నీరు, కాయధాన్యా లతోపాటు గుడ్లను కూడా పెట్టాలని హితవు పలుకుతున్నారు. హైదరాబాద్లోని జాతీయ పౌష్ఠికాహార సంస్థ 2024 నాటి పోషణ మార్గదర్శకాలు కూడా అదే విషయాన్ని బలపరుస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు విశ్వసనీయమైన, ప్రాధాన్యం కలిగిన శాస్త్రీయ ఆధారాలను ఆలంబనగా చేసుకుని రూపొందాలేగానీ, స్వల్పకాలిక లాభాలను, సంకుచిత రాజకీయ, వ్యాపార లేదా సైద్ధాంతిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నవి కాకూడదు. విధాన నిర్ణేతలు తమ వాదనలకు బలంగా ఇప్పటికే ఉన్న ఆధారా లను ఉపయోగించుకోవచ్చు లేదా నూతన పరిశోధనలను నిర్వహించవచ్చు. నూతన ఆధారాలు అందుబాటులోకి వచ్చే కొద్దీ విధానా లను సమీక్షించుకోవాలి. పరస్పరం ముడిపడి ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజారోగ్యం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతున్నామని గుర్తెరగాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
లక్షన్నర ఇచ్చి మొదలుపెట్టారు!
2004 జూలై 8.ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయంగా లక్షన్నర రూపాయలను చెక్కు ద్వారా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ కందాకి సమర్పించారు. ఇందులో దురుద్దేశం లేదు, దురాశా లేదు. ‘ఒక మంచి కార్యం జరగాలని తాను ఆశిస్తున్నప్పుడు, అందులో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నప్పుడు నాయకుడన్నవాడు తానే ముందుండి నడిపించాలి. నడిపించటం అంటే కేవలం నినాదాలిచ్చి, ప్రకటనలిచ్చి, ‘పదండి ముందుకు’ అనటం కాదయ్యా. తానే ముందు చెయ్యివేసి, ‘ఇలా చేయండయ్యా’ అని చూపించాలి...’ అన్నారు వైఎస్ ఆ చెక్కు నేను తయారు చేస్తున్నప్పుడు.2004 మేలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా వుంది. అంతకుముందు ఒకటి రెండు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం అనేకసార్లు ‘వేస్ అండ్ మీన్స్’ కింద ఓవర్ డ్రాఫ్టులు తీసుకుని ఈ వ్యవస్థని నిర్వహించాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. పాద యాత్రలో పల్లె ప్రాంతాల్లోని పేదలు రకరకాల వ్యాధుల బారిన పడినప్పుడు, ఆర్థిక స్థోమత లేక వాళ్లు తగిన చికిత్సలు పొందలేక ప్రాణాలు కోల్పోతున్న దుఃస్థితిని చూసి ఆయన చలించిపోయారు. అధికారంలోకి రాగానే ‘మన ప్రభుత్వం’ వాళ్ల కోసం పెద్ద ఎత్తున సాయం చేయగలగాలి అనుకున్నారు. (ప్రతిపక్ష నాయకుడిగా వున్న ప్పుడు కూడా ఆయనకి నేను వ్యక్తిగత సహాయకుడిగా వున్నాను.)అధికారంలోకి వచ్చాక, ఈ విషయం మీద ఆయన విచారిస్తే, ప్రభుత్వానికి అప్పట్లో వున్న ఒకే ఒక అవకాశం ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ (సీఎంఆర్ఎఫ్). కానీ అందులో నిధులు ఖాళీ. తాను అనుకున్న దిశగా దయనీయ స్థితిలో వున్న సామాన్యులకు సహాయం అందించాలంటే, ఈ సీఎంఆర్ఎఫ్ని పటిష్ఠం చేయటమే మార్గం అనుకున్నారు. అందుకోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తేనే ఈ నిధిని బలపర్చటం సులభమవుతుంది. ప్రజల్లో సంపన్నులు చాలా మంది ఉన్నారు. ‘వాళ్లని అడిగేముందు, నేను చేసి చూపిస్తేనే, వాళ్లని అడిగే నైతిక హక్కు వస్తుంది శర్మా... ఒక పని చెయ్యి. లక్షన్నర రూపాయలకి ఒక చెక్కు నేనే ఈ సీఎంఆర్ఎఫ్కి విరాళంగా ఇస్తాను. చీఫ్ సెక్రటరీగారికి చెప్పి, టైమ్ నిర్ణయించి చెప్పు నాకు’ అన్నారు.అలాగే సీఎస్ మోహన్ కందా గారితో చెప్పి, సమయం తీసుకున్నాను. అది 2004 జూలై 8. డాక్టర్ వైఎస్సార్ లక్షన్నర రూపాయల చెక్కుని చీఫ్ సెక్రటరీ మోహన్ కందా గారికి అంద జేశారు. ఆ రోజే సీఎంఆర్ఎఫ్కి ఉదారంగా విరాళాలివ్వాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. ‘సీఎంని కలిసేవాళ్లు పూలగుత్తులు ఇవ్వాలను కుంటే, వాటి బదులు సీఎంఆర్ఎఫ్కి చెక్కులు ఇవ్వాలని సీఎం కోరు తున్నారు’ అని సీఎం కార్యాలయం ప్రకటించింది. పెద్ద మొత్తాల్ని ఇచ్చేవాళ్లు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి చెక్కు సమర్పించే అవకాశం కల్పిస్తామని ప్రకటించాం.అక్కడ్నుంచి రోజూ మధ్యాహ్నం సమయంలో సీఎంని కలిసి విరాళాల చెక్కులివ్వాలని పెద్ద పెద్దవాళ్లు రావటం మొదలైంది. విరాళాలు తెచ్చేవాళ్లకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సెక్రెటేరియేట్ సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు పంపించాం.మొదటి 3–4 రోజులపాటు రోజుకి 5–10 మందే వచ్చారు. వచ్చి సీఎంకి చెక్కులిచ్చి ఫొటోలు దిగేవాళ్లు. పెద్ద మొత్తాలిచ్చిన వాళ్ల ఫొటోలు పత్రికల్లో వచ్చేవి. ఏ రోజు విరాళం ఎంత వచ్చిందో సమాచారశాఖ ద్వారా ప్రచారంలో పెట్టాం. దాంతో ఒకవారం గడిచే సరికి ఈ విరాళాలు తెచ్చేవాళ్లు వెల్లువలా రావటం మొదలైంది. రోజుకి 100–150–200... వీళ్లందరికీ విజిటర్స్ హాల్సు సరిపోక, సమావేశం హాలులో కూర్చోపెట్టాల్సి వచ్చింది. సీఎం స్వయంగా తనే అక్కడికి వెళ్లి విరాళాలు తీసుకోసాగారు.పరిమితులు, అవాంతరాలు దాటి...సీఎం క్యాంప్ ఆఫీసు ముందు కార్ పార్కింగు ఉండేది. అక్కడ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల పరిశీలన కౌంటర్ ఏర్పాటు చేశారు. దారిద్య్రరేఖకి దిగువనున్న (తెల్లరేషన్ కార్డులేని) వాళ్లకి ఈ సహాయం కావల్సి వస్తే అక్కడికి వచ్చేవారు. సీఎంఆర్ఎఫ్ సహా యానికి రూ. 35,000 పరిమితి వుండేది. ఏవైనా న్యాయమైన కేసుల్లో సహాయం 35,000 కన్నా ఎక్కువ కావల్సివస్తే, హాస్పిటల్కి ఫోన్ చేయించి, ‘బిల్లులో రాయితీ ఇమ్మని సీఎం కోరుతున్నారు’ అని రాయితీ ఇప్పించేవారు. ఆ అవకాశం లేనిచోట (5 నుంచి 10, 15 వేల దాకా అదనంగా కావల్సివస్తోందనకున్నప్పుడు) అది తానే పి.ఎస్. కిరణ్కుమార్ రెడ్డి ద్వారా ఏర్పాటు చేసేవారు.అలాంటి సమయంలోనే పుట్టుకతో హృద్రోగాలు, తదితర జన్యువ్యాధులకు గురయ్యే పిల్లల కోసం కూడా ఏదో చేయాలి అనిపించింది ముఖ్యమంత్రికి. అందుకని, ముఖ్యమంత్రి పిల్లల సహాయనిధి (సీఎంసీఆర్ఎఫ్) ప్రారంభించారు (ఈ నిధులకి ప్రభుత్వ బడ్జెట్ వుండదు). అయితే ఇలా సహాయనిధి కోసం దీర్ఘకాలంలో విరాళాలు సేకరించటం కష్టం అని అధికారులు సీఎంకి చెబుతూ వచ్చారు. ఆయన మొదట్లో పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాళ్ల సలహాలో ఔచిత్యాన్ని గుర్తించారు. అప్పుడే కర్ణా టకలో రైతుకూలీల కోసం ఆరోగ్య బీమా నిర్వహిస్తున్న ‘నారాయణ హృదయాలయ’ సంస్థతో సంప్రదింపులు జరిపారు. రెండు మూడు సార్లు సమావేశాలు జరిగాయి.‘నాకు ఆరోగ్య బీమా – సామాన్య ప్రజలందరి కోసం కావాలి. చేయగలరా?’ అని అడిగారు. వాళ్లు ఆలోచనలో పడ్డారు. కానీ వైఎస్ ఆగలేదు. ‘ఇది జరిగి తీరాలి సుబ్రహ్మణ్యం’ అన్నారు. సుబ్ర హ్మణ్యం సీఎంఓలో వైద్య ఆరోగ్యశాఖ చూస్తున్న కార్యదర్శి. అప్పటి ఆరోగ్య వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ ఐ.వి. సుబ్బారావు ముఖ్యమంత్రి ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. బీమా కంపెనీలతో చాలా మీటింగులు సీఎం సమక్షంలో జరిపారు. అలా వైఎస్ పట్టు దలగా, అనేక అభ్యంతరాలు, అవాంతరాలు దాటి ప్రవేశపెట్టిన పథకమే రాజీవ్ ఆరోగ్యశ్రీ.చదవండి: అమృతం కురిసిన రోజు2007 ఏప్రిల్ నుంచి 2009 మే వరకూ ఈ పథకం కింద 15,58,828 మంది ఉచిత వైద్య పరీక్షల లబ్ధి పొందారు. వీళ్లల్లో 2,63,897 మందికి ఉచిత సర్జరీలు, ఇతర చికిత్సలు లభించాయి. 2,70,061 మంది అవుట్ పేషెంట్లుగా వైద్యసేవలు పొందారు. ‘ఆరోగ్యశ్రీ’ వల్ల ఉచితంగా గుండె ఆపరేషనో, కిడ్నీ ఆపరేషనో, మరో మరో ఆపరేషనో చేయించుకోగలిగి, ఆనందంగా జీవిస్తున్న ఏ ఒక్కరి ముందు వైఎస్సార్ పేరు ప్రస్తావించినా, రెండు చేతులూ జోడించి, నమస్కరిస్తారు. ఆ కళ్లు ఇప్పటికీ చెమరుస్తాయి.ఒక మంచి పని కోసం ఒక్క వ్యక్తి తపన, ఆరాటం ఎంత గొప్ప వ్యవస్థని నిర్మించింది!– టి. భాస్కర శర్మ ముఖ్యమంత్రికి పూర్వపు అడిషనల్ పి.ఎస్. -
అమృతం కురిసిన రోజు
‘కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు’ అన్నారు. అలా జనించిన వారు సమాజానికి వెలుగిస్తారు. అందరి జీవితాలలో సంతోషాన్ని వెలిగిస్తారు. జనం గుండెల్లో సజీవులై ఉంటారు. అలాంటి మహామనుషులలో అతి ముఖ్యుడు డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేక పోయినా ఆయన జన్మదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలవారూ ఓ పండుగలా జరుపుకొంటున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషే కాలు, పూలాభిషేకాలు ఇంకా చేస్తున్నారు అంటే ఆయన ఎంత మేలు చేశారో, ఎన్ని ప్రాణాలు నిలిపారో లెక్కేయడం కష్టం. ఈ మధ్య చంద్రబాబు సమక్షంలో ‘నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం రాజశేఖరరెడ్డిగారు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ’ అని ఓ మహిళ ధైర్యంగా ప్రకటించింది. అందుకే ఆయన దేవుడయ్యాడు. వైద్య విద్య పూర్తయిన తరువాత ఆస్పత్రి పెట్టి ఒక రూపాయికే వైద్యం చేశాడు. అందుకే ఆయన్ని జనం ‘రూపాయి డాక్టరు’గా పిలుచుకున్నారు. ప్రజలకు కేవలం వైద్యం అందిస్తే చాలదు, ఇంకా అనేక విషయాలలో వారికి సేవలు అందాలంటే శాసనం చేసే అధికారం ఉండాలని భావించాడు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తన వ్యక్తిత్వం, నిజాయితీ నిలుపుకొంటూనే ముందుకు సాగాడు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన తిరుగులేని నాయకుడాయన.పాదయాత్రలతో చరిత్ర33 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ తెగువ చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. ఇతను కదా నాయకుడు అనుకుంది. రామారావు సైతం ఆంతరంగికుల ముందు రాజశేఖరరెడ్డిని మెచ్చుకున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 90 మంది శాసనసభ్యులతో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్షచేశాడు. రైతులను రక్షించడానికి వారికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన ఆయనకు ఆనాడే వచ్చిందేమో!రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ సామర్థ్యం పెంచాలని 1986లో 22 రోజులు పాదయాత్ర చేశాడు వైఎస్. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆ కెనాల్ సామర్థ్యం పెంచాడు. పాదయాత్రలో సెక్యూరిటీ, సౌకర్యాలు, భోజనం – ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లు నేరుగా పొలాల్లోకో, ఎదురుగా ఉన్న గుడిసెలోకో హఠాత్తుగా వెళ్ళి పోయేవాడు. వారి మాటలు వినేవాడు. కష్టం తెలుసుకునేవాడు. 2003లో వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ సువర్ణా ధ్యాయానికి ఆరంభం. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్లు 67 రోజుల పాటు నడిచి, ప్రజల మధ్య నిలిచాడు. ఆయన వెంట ఉన్న మాకు అనుక్షణం ఓ కొత్త అనుభవం. నడి ఎండలో నడుస్తూ కూడా ఆయన ఆలోచించింది తనవారి కోసం, తన ప్రజల కోసం. తాను తినడానికి ముందు భోజనం అందరికీ అందిందా అని చూసేవాడు. అందరి మధ్యలోనే పడుకునేవారు. ఏసీ గదులు ఉన్నాయని చెప్పినా వారించేవాడు. పాదయాత్రలో ఆయన పరిష్కరించిన సమస్యలపై ఓ పెద్ద పుస్తకం రాయచ్చు. పాదయాత్ర మధ్య దశలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా లెక్క చేయలేదు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి కదిలాడు. వైద్యులు వారించారు. నేనూ వైద్యుడినే అన్న విషయం మరచి పోతున్నారు అన్నాడు చిరునవ్వుతో! పథకాలే పతకాలుగా...2004 ఎన్నికలలో ప్రజలు ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం. ఒక విప్లవం. ఒక మార్పు, ఒక భరోసా, ఒక కదలిక. అన్ని రాష్ట్రాలు ఆరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఒక మంచి మనిషి అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేయవచ్చా అని ఆశ్చర్యపోయాయి. ఉచిత కరెంటు అందింది. పేదల ఇంటి ముందుకు ఆరోగ్యశ్రీ వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆయన చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందింది. లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యావంతులై లక్షలు సంపాదిస్తున్నారు. ‘జలయజ్ఞం’తో రైతుల ముఖం నిండా ఆనందం. హింసావాదాన్ని వీడి ప్రజలలో కలవండి అని అభ్యర్థిస్తూ నక్సలైట్లతో చర్చలు కూడా జరిపారు. శాంతిమయ రాష్ట్రాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు ఆయన. తిరుమల శ్రీవేంక టేశ్వర స్వామి వారి అఖండ వైభవ ప్రచారానికి అంతులేని కృషి, కార్యక్రమాలు చేసి శ్రీనివాస ప్రభువు పల్లకీ మోసి, పల్లె పల్లెకు తీసుకువెళ్ళిన హైందవ ధర్మ సేవకుడాయన. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ స్థాపకుడు. ‘కల్యాణమస్తు’ అన్న కరుణామూర్తి. మహా విషాదం2009 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అను కోని పరిణామం ఆయనను మనకు దూరం చేసింది. ఓ నాయకుని కోసం కొన్ని వందల మంది ఆత్మార్పణ చేసుకోవడం కనీ వినీ ఎరు గని మహావిషాదం. ఇలాంటి అద్భుత వ్యక్తి హితుడు, స్నేహితుడు, గురువు అయినందుకు నాకు ఆనందం, గర్వం. ఆయనతో గడిపిన ప్రతిక్షణమూ నాకు కొత్త పాఠం. నా తప్పులు దిద్దాడు. నా చేయి పట్టి నడిపాడు. ‘కరుణా’ అంటూ ప్రేమగా పిలిచాడు. నిత్యం పచ్చ గానూ, పచ్చిగానూ ఉంది ఆ జ్ఞాపకం. నాలాంటి కొన్ని లక్షల మందికి జీవన సౌభాగ్యం కల్పించిన ఆ మహానాయకుడు మళ్ళీ జన్మించి మన మధ్యకు రావాలని ప్రార్థిద్దాం. మదిలోని ఆయన జ్ఞాపక సజీవ చిత్ర పటానికి ఈ విధంగా అక్షర సుమాలు అర్పించు కోవడం, నా తీరని తీయని ఋణం, బంధం, బాంధవ్యం!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
శిక్షణ లేని శిశు సంరక్షణ కేంద్రాలు
మన దేశంలో డే కేర్ సెంటర్స్ పేరుతో శిశు సంరక్షణ కేంద్రాలను నడుపుతారు. వీటిలో కొన్ని ప్రైవేటు సంస్థల గొలుసు కేంద్రాలు, కొన్ని స్థానిక మైనవి. వీటిలో రోజుకు గంట చొప్పున నెల రుసుం రూ. 3,000 నుండి రూ. 15,000 వరకు ఉంటుంది. ఇటీవల బెంగళూరు బ్రూక్ (వైట్) ఫీల్డ్లో క్యాప్జెమిని సాంకేతిక సేవల కంపెనీ ప్రాంగణంలోని డే కేర్ సెంటర్లో పిల్లలను వాష్రూమ్లు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లలో ఉంచడం, టాయిలెట్ గొట్టాలతో నోటిలో నీళ్ళు కొట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డ దృశ్యాలు బహిర్గత మయ్యాయి. అరిస్తే, ఏడిస్తే కొడతామనీ, చంపు తామనీ బెదిరింపులు ఉన్న వీడియో బయటికి వచ్చింది.ఇవ్వాళ పిల్లల చదువు, వైద్యం, ఇతర సౌక ర్యాలకోసం ఒకరి సంపాదన సరిపోవడం లేదు. దంపతులిద్దరూ కష్టపడితే కాని ఇల్లు గడవదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఒకసారి ఉద్యోగం వదిలితే తిరిగిరాదు. అందుకే ఇంట్లో ఆలనా, పాలనా చూసే పెద్దలు ఎవరూ లేని యువ దంపతులు తమ పిల్లలను శిశుసంరక్షణ కేంద్రాలలో చేర్చవలసి వస్తోంది. మానసిక శాస్త్ర సూత్రాలు తెలియవు!డే కేర్ సెంటర్లలో పసిపిల్లల పట్ల యాజ మాన్యాలు, అక్కడ పనిచేసేవారూ ఎందుకింత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో కారణాలను వేతకాలి. ఈ కేంద్రాలను నిర్వాహకులు లాభా లకు నడుపుతారు. వారికిగానీ, అందులో ఉద్యో గులకుగానీ ఏ మాత్రం సేవాదృక్పథం ఉండటం లేదు. పిల్లల కోసం ఇచ్చిన తిండి, తీర్థాలను తిని పిల్లలను మాడ్చే ఆయాలున్నారు (తిండిలేని వారి పేదరికం కారణమేమో).యాజమాన్యం, సిబ్బందికి శిశు సంరక్షణలో శిక్షణ ఉండదు. వీరికి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. ఏడుపు మాన్పడం, బుజ్జగించడం, ఆడించడం రాదు. శిశుకేంద్రాలలో ఆట వస్తువులు ఉండవు. ఉన్నా పనిచేయవు. ఎదుటి వారితో సరిగ్గా వ్యవ హరించడానికీ, జీవితంలో అతి చిన్న సమస్యలను ఎదుర్కోవడానికీ మాన సిక శాస్త్ర సాధారణ సూత్రాలు తెలియాలి. ఇవి తెలియకనే పిల్లలు, విద్యార్థులు, పెద్దలు, రైతులు చిన్నపాటి ఇబ్బందులకే ఆత్మహత్యలకు ఒడి గడుతున్నారు.పసిపిల్లల సంరక్షణకు శిశు మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. దాన్ని అధ్యయనం చేయాలి. అనుదిన అనువర్తిత చర్యలను అమలుచేయాలి. పిల్లలందరూ ఒకేలా ప్రవర్తించరు. ఒకే సమస్యకు ఒకేలా స్పందించరు. ఇండియాలో అధిక శాతం ప్రజలకు శిశు సంరక్షణపై అంతగా అవగాహన లేదు. పిల్లల సంరక్షణలో వాళ్ళకు తెలిసినవి మామూలు మొద్దు మార్గాలే.స్వీడన్ లాంటి దేశంలో విద్య, వైద్యం ఉచితం. ప్రభుత్వం పిల్లలను దేశ సంపదగా పరిగణిస్తుంది. శారీరక, మానసిక ప్రత్యేకతలు ఉన్న పసిపిల్లలకు నిద్ర, సంగీతం, మేధో ప్రేరణ, మానసిక ఉల్లాసం, మాట, ఆటల కోసం అత్యంత ఆధునిక యంత్ర సౌకర్యాలతో ప్రత్యేక పాఠశా లలు ఉంటాయి. నలుగురు పిల్లలకు ఐదుగురు శిక్షణపొందిన మానసిక నైపుణ్య ఉపాధ్యాయులు ఉంటారు. వీరు వృత్తి రీత్యానేగాక, ప్రవృత్తి పరంగానూ మానవత్వంతో పసిపిల్లలను తల్లిదండ్రుల కంటే బాగా చూడగలరు.మానసిక ఆరోగ్యం, శిశురక్షణ, పిల్లల భద్రత, పాలన, పోషణ వంటి సున్నిత విషయాలను పౌర సమాజం ప్రచారం చేయాలి. ప్రజాపక్ష రాజకీయ పక్షాలు వీటిని తమ పాలనా విధానాలుగా ప్రకటించాలి. - సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కంచంలో ఉన్నది అమృతమేనా?
‘మనిషి తినే ఆహారం ఔషధంలా ఉండాలి... ఔషధమే ఆహారంలా మారే పరిస్థితి రాకూడదు’ అని హిప్పోక్రటీస్ ఏనాడో చెప్పాడు. కానీ నేడు పరిస్థితి ఏమిటి? మనం తినేది ఆహారమో, విషమో తెలియని దుఃస్థితి. కల్తీ ఆహారం అనేది ‘స్లో పాయిజన్’. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 86 కోట్లకు పైగా ఆహార సంబంధిత అనారోగ్య కేసులు నమోదయ్యాయి. 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం రికార్డుల్లోకెక్కిన లెక్క మాత్రమే!అవే లెక్కల ప్రకారం, మన దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం అంటురోగాలు కానివాటివల్లే కలుగుతున్నాయి. అందులో 27 శాతం మంది గుండె జబ్బుల వల్లే కన్నుమూస్తున్నారు. క్యాన్సర్ల గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఐసీఎమ్ఆర్ అంచనా ప్రకారం ఒక్క 2022లోనే భారత్లో 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి తమ జీవితకాలంలో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట! మరోవైపు, దాదాపు 13.8 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో మగ్గి పోతున్నారు.ఎందుకిలా జరుగుతోంది? కూర గాయల నుంచి పండ్ల దాకా కొడుతున్న రసాయనాలు... హోటళ్లలో వాడిన నూనెనే పదే పదే వాడటం, ప్రాసెస్డ్ ఫుడ్లో ఉండే విషపూరిత ప్రిజర్వేటివ్స్, అల్లం పేస్ట్ నుంచి కారం వరకు అన్నింటిలో జరుగుతున్న కల్తీ– ఇవన్నీ మనిషిని బతకనిస్తాయా? అందుకే అభివృద్ధిచెందిన దేశాలు ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.మన తెలంగాణ విషయానికి వస్తే... గతంలో జరిగిన తప్పులను సరిదిద్దు కుంటూ... ‘కల్తీ లేని తెలంగాణ’ లక్ష్యంగా 2024 జనవరి నుండి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే హెచ్ఫాస్ట్, ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దించి కఠిన చర్యలు తీసుకుంటోంది.2024 నుండి 5,500కి పైగా ముమ్మర తనిఖీలు చేసి, నాణ్యత లేని 2,000కి పైగా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 150కి పైగా హోటళ్లు, తయారీ కేంద్రాలను సీజ్ చేయడమే కాకుండా, రూ. 2 కోట్లకు పైగా జరిమానాలు విధించారు. 100కి పైగా క్రిమినల్ కేసులు నమోదు చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల కంచంలో పడే అన్నం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వాలు చూడాలి. మన కంచంలోని ఆహారం సురక్షితం కాకపోతే... అభివృద్ధి కథనాలన్నీ చివరకు ఆసుపత్రి కారిడార్లలో ముగిసి పోతాయి. – నవీన్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
ఆ విధంగా నా త్రివిధ సాధన..
కృష్ణాబాయికి స్వామి రామదాసు ‘ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అనే మంత్రాన్ని ఉపదేశించారు. రామనామం సుధామధురం. ఎందరెందరినో మహనీయులుగా తీర్చిదిద్దిన మంత్రం అది. కృష్ణాబాయి కూడా ఎంతో శ్రద్ధగా ఆ మహత్తర నామాన్ని జపించటం ప్రారంభించింది. కానీ ‘చంచలం హి మనః కృష్ణా!’ అని అర్జునుడు చెప్పాడు కదా, కృష్ణాబాయి మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీసింది. సమస్యను గుర్తించిన కృష్ణాబాయి స్వామి రామదాసున్న ఆశ్రమానికి పరుగెత్తింది.అప్పుడాయన ఆమెతో, ‘ఇందులో విచారించవలసినది ఏముంది? పరిభ్రమించుటే మనసు పని. దానికిష్ట మొచ్చినచోట దాన్ని పోనిమ్ము. అదంతా స్వయంగా రాముడే అని భావించు. రాముడు అనంతుడు. సమస్తమైన ప్రాణులూ, వస్తువులూ రాముని నుండి వచ్చి, రామునిలో చరించి, రామునిలో లీనమవుతాయి. అందువల్ల మనస్సు ఎక్కడికి పోయినా, సర్వమూ రాముడే అని భావించు. నీవు ఎవ్వరికి సేవ చేసినా అది రాముని సేవయనీ, రాముని పూజయనీ భావించు. ఈ అభ్యాసం విశ్వరూపుడయిన రామునితో నీ ఏకత్వాన్ని అనుభవించటానికి తేలికగా వీలు కలుగచేస్తుంది’ అని బోధించారు.గురువుగారి సలహాను కృష్ణాబాయి ఆ క్షణం నుండే పాటించింది. దాని వల్ల సాధారణ మనిషియైన కృష్ణా బాయి విశ్వమాత కృష్ణాబాయిగా ఎదిగింది. ఆమె తన అనుభవాన్ని ఇలా చెప్పింది: ‘ఆ విధంగా నా త్రివిధ సాధన – నోటితో రామమంత్రాన్ని ఉచ్చరించటం; ప్రతి ప్రాణినీ, ప్రతి వస్తువునూ సాక్షాత్ రామునిగానే భావించటం; చేతులతో చేసిన పని అంతా రాముని పనిగానూ, రాముని సేవగానూ భావించటం – ఏక కాలంలో మొదలైంది. నా దృష్టిలో పప్పా (రామదాసు), రాముడు అభిన్నం. ఈ అభ్యాసంతో నా మనస్సు నిశ్చలమైనాకు తెలియకుండగనే నా హృదయం ప్రశాంత మయమైంది’ (పుటలు 10–11; విశ్వమాత కృష్ణాబాయి, ఆనందా శ్రమము, కేరళ). – రాచమడుగు శ్రీనివాసులు -
జపాన్తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సంశయాత్ములు
జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడని భగవద్గీత చెబుతుంది. సంశయాలతో సతమతమయ్యేవారు ఏ పనిలోనూ విజయం సాధించలేరు. అదేపనిగా అనేక సందేహాలతో మనసు నింపుకున్నవారు మనోదౌర్బల్యం కలిగి కర్తవ్య హీనులవుతారు.భయం, నిరాశ, నిష్క్రి యత్వం, ప్రతికూల ఆలోచనలు పెరిగిపోతుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవితానందం సన్నగిల్లుతుంది. ఇటువంటి వారు ఎప్పుడూ ఏదో అపజయం, ఉపద్రవం జరగబోతోందేమోనన్న చెడు భావనలతో భయపడిపోతుంటారు. రేపు ఏం జరుగుతుందోనని నేటి ఆనంద క్షణాలను అనుభవించలేరు.ఏ పనైనా పూర్తి చేయలేమేమోననే సందేహంతోనే వీరు మొదలుపెడతారు. విద్యార్థులుగానీ, ఉద్యోగా ర్థులుగానీ తమ మీద తమకు స్థిర నమ్మకం లేకపోతే గెలుపు సాధించలేరు. ఏదైనా చేయగలము అనే విశ్వాసం ఉంటే సగం విజయం సాధించినట్లే! యుద్ధానికి వెళుతున్న సైన్యం విజయం తమదే అనే నమ్మకంతో వెళితే విజయం వరిస్తుంది.భగవద్గీత మానవులకు జీవన సమరంలో ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసి ఆనందంగా జీవించటానికి మార్గం చూపిస్తుంది. హృదయ దౌర్బల్యం ప్రతివారికీ ఏదో ఒక సందర్భంలో కలుగక మానదు. శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, అర్జునుడు ఏదో ఒక సందర్భంలో హృదయ దౌర్బల్యం అనుభవించినవారే. కానీ, దానినుండి బైట పడి ఘనులైన విధం మనకు పాఠం లాంటిది. – డా. చెంగల్వ రామలక్ష్మి -
పోపుల డబ్బా ఆర్థిక వ్యవస్థ
భారతీయ గ్రామీణ సమాజ చరిత్రలో ‘పోపుల డబ్బా’ అనేది కేవలం ఒక చిన్న డబ్బా కాదు. అది ఒక కుటుంబ ఆర్థిక క్రమశిక్షణకు, మహిళల దూరదృష్టికి, భవిష్యత్ భద్రతకు, స్వయం ఆధారిత జీవన విధానానికి ప్రతీక. ఇటీవలివరకూ గ్రామీణ ప్రాంతాలలో లక్షలాది కుటుంబాలు తమ దైనందిన జీవితంలో ఈ చిన్న డబ్బాను ఒక సూక్ష్మ బ్యాంకుగా ఉపయోగించేవి. ప్రజల జీవన అనుభవం, అవసరం, కష్టకాలాల నుంచి నేర్చుకున్న జ్ఞానం కలగలిపి ఏర్పడిన ఒక సహజమైన ఆర్థిక విధానం ఇది.గ్రామీణ కుటుంబాల్లో సంపాదన ప్రధానంగా వ్యవసాయం, కూలి, పశుపోషణ, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు వంటి రంగా లపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆదాయం కూడా నెలనెలా స్థిరంగా కాకుండా కాలానుగుణంగా లభించేది. పంట అమ్మినప్పుడు మాత్రమే ఎక్కువ డబ్బు చేతికి వచ్చేది. మిగిలిన కాలంలో చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే గ్రామీణ మహిళలు ఇంటి ఖర్చులలో మిగిలిన చిల్లరను వృథా చేయకుండా పోపుల డబ్బాలో వేయడం అలవాటు చేసుకున్నారు. ఏడాది చివరికి అది కుటుంబానికి ఒక అత్యవసర నిధిగా మారేది.ఇంటికి వచ్చిన ప్రతి రూపాయి ఎలా ఖర్చు చేయాలి, ఏ అవసరానికి ఎంత కేటాయించాలి, ఎంత పొదుపు చేయాలి అనే విషయాల్లో మహిళలు అసాధారణమైన లెక్కలు వేసేవారు. కుటుంబంలో ఇతరులకు తెలియకుండా కాదు, కుటుంబ ప్రయోజనాల కోసమే ఈ పొదుపు నిర్వహించబడేది. అనారోగ్యం వచ్చినప్పుడు, పిల్లల పాఠశాల ఫీజు చెల్లించాల్సి వచ్చినప్పుడు, పంట విత్తనాలు కొనాల్సినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు లేదా ఆకస్మిక ఖర్చులు ఎదురైనప్పుడు ముందుగా తెరవబడేది ఈ పోపుల డబ్బానే.నేటి భాషలో దీనిని ‘మైక్రో ఎమర్జెన్సీ ఫండ్’ అని పిలిచినా, మన గ్రామీణ సమాజం దానిని దశాబ్దాల క్రితమే ఆచరణలో పెట్టింది. సామాజిక కోణంలో పరిశీలిస్తే పోపుల డబ్బా మహిళల నాయకత్వాన్ని కూడా బలపరిచింది. కుటుంబంలో ఖర్చుపై నియంత్రణ, అవసరాల ప్రాధాన్యత నిర్ణయించడం, అనవసర వ్యయా లను తగ్గించడం, పిల్లల్లో పొదుపు అలవాటు పెంపొందించడం వంటి బాధ్యతలను మహిళలు సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న పిల్లలకు కూడా మిగిలిన నాణేలను పోపుల డబ్బాలో వేయమని చెప్పడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణను నేర్పించేవారు. ఈ ప్రక్రియ వల్ల కుటుంబంలో ప్రతి రూపాయి విలువ తెలిసే సంస్కృతి ఏర్పడింది.నేటి ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం చెప్పే ‘చిన్న అలవాట్లు పెద్ద ఆర్థిక విజయాలకు దారి తీస్తాయి’ అనే సిద్ధాంతాన్ని మన గ్రామీణ సమాజం ఎంతో కాలం క్రితమే జీవన విధానంగా స్వీకరించింది. పోపుల డబ్బా కేవలం గత తరాల జ్ఞాపకం కాదు; ఒక విలువైన సామాజిక సంపద. నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు విస్తరించినా, పోపుల డబ్బా వెనుక ఉన్న విలువలు – పొదుపు, మితవ్యయం, భవిష్యత్ ప్రణాళిక, కుటుంబ బాధ్యత, ఆర్థిక స్వయం సమృద్ధి– ఎప్పటికీ ప్రాసంగికమే. – డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి, పౌర సంబంధాల అధికారి, ఆర్ట్స్ కళాశాల, కేయూ -
దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం
ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. ఆత్మార్పణడా‘‘ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే– అవిభాజ్య భారత్ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు– తాను విశ్వసించిన ఆదర్శం కోసం డా‘‘ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్ 370, 35 (ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.భారతీయతకు పెద్దపీటఆయన ఎప్పుడూ దేశానికే ప్రథమ స్థానమిచ్చారు. భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణమైన సంస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా– ‘భవిష్యత్ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్’ను రపుదిద్దాలని డా‘‘ ముఖర్జీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమĶæన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును ఆయన ఎంచుకోవడం గమనార్హం. పారిశ్రామిక విధానానికి పునాది ఆయనకు దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు–పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళారంగం వంటి వాటికీ ఆయన మద్దత్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డా‘‘ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి డా‘‘ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్ర మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు. పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డా‘‘ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. సేవామూర్తిమానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరవు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుఃస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్ మన్వంతర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ– ‘మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా, క్షుణ్ణంగా, అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్ధాంతరంగా వదిలేయకండి. అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో యువత నేటి సందర్భానికి తగినట్లు డా‘‘ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఉత్తర–దక్షిణ వారధి
ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనలో ఓ బాలుడు తొలి కచేరీ ఇచ్చాడు. కేటాయించింది ముప్పై నిమిషాలే అయినా, శ్రోతలు కాలగమనాన్నే మరిచిపోయేలా ఆ కచేరీ మూడు గంటలపాటు సాగిందని చెబుతారు. ఆ గానం విన్న హరికథా విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ మూర్తి భాగవతార్, ఆ ‘మురళీకృష్ణ’ అన్న అతడి పేరుకు ‘బాల’ను జోడించారు. అప్పటి నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు.1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి, మున్ముందు భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం పదిహేనేళ్ల వయసులో 72 మేళకర్త రాగాలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రతి రాగంలోనూ కృతులు రచించారు. ఆ కృతుల సంకలనమే ‘జనక రాగ కృతి మంజరి’. వర్ణాలు, కృతులు, థిల్లా నాలు, భావగీతాలతో కలిపి 400కు పైగా రచనలు చేసిన ఆయన, తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాష ల్లోనూ సమానమైన సౌందర్యంతో స్వరపరిచారు.కొత్త రాగాలు–తాళాలు‘సంప్రదాయం అంటే స్తబ్ధత కాదు, అది సజీవ ప్రవాహం’ అన్నదే బాలమురళి దృక్పథం. ప్రాచీన సంప్రదాయపు మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే ఆయన కొత్త సరిహద్దులను తాకారు. మహతి, లవంగి, గణపతి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, ఓంకారి వంటి సరికొత్త రాగాలను సృష్టించారు. వీటిలో కొన్ని కేవలం మూడు లేదా నాలుగు స్వరాలతోనే రూపొందినవి. అంతేకాదు, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి సరికొత్త తాళ పద్ధతులకు ఆయన ప్రాణం పోశారు.మూడు అష్టకాల విస్తృతి, అపార గాంభీర్యం, స్ఫటికంలాంటి స్పష్టమైన ఉచ్చారణ, గమకాల్లో అసాధారణ నైపుణ్యం ఆయనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు ఇచ్చిన ఆయన, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిశోరీ అమోన్కర్ వంటి హిందు స్థానీ దిగ్గజాలతో జుగల్బందీలు నిర్వహించి, ఉత్తరాది–దక్షిణాది సంగీతాలకు వారధిగా నిలిచారు. గాత్రంతో పాటు వయోలిన్, వీణ, మృదంగం, కంజీరా, వయోలాలను అద్భుతంగా వాయించారు. ఆకాశవాణిలో ఏడు వేర్వేరు ప్రదర్శన విభాగాల్లో ‘టాప్ గ్రేడ్’’ సాధించిన ఏకైక సంగీతకారుడిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ని విదేశీ గాయక బృందంతో కలిసి ఆలపించడం, రవీంద్ర సంగీతాన్ని బెంగాలీలో రికార్డు చేయడం, జాజ్ ఫ్యూజన్ ప్రయో గాలు చేయడం, ఆయన సంగీత పరిధికి హద్దులే లేవని చాటిచెప్పాయి. వెండితెరపైనా బాలమురళి తనదైన ముద్ర వేశారు. 1967లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రలో నటిస్తూ, ‘ఆది అనాదియు నీవే దేవా’ వంటి అమర గీతాలు ఆలపించారు.పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ అందుకున్న అరుదైన కర్ణాటక సంగీత మహనీయుడు ఆయన. ఫ్రా¯Œ్స ప్రభుత్వపు ‘షెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ వంటివి ఎన్నో అందుకున్న ఆయన 2016 నవంబర్ 22న చెన్నైలో కన్ను మూశారు. కానీ ఆయన స్వరం, కృతులు, రాగాలు సజీవంగా మారుమోగుతూనే ఉన్నాయి. – డా కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి) -
ఏం పండించాలో ప్రభుత్వమే చెప్పాలా?
ఇటీవల ఏడు సన్నరకాల వరి రకాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. గతంలో 33 నోటిఫైడ్ రకాల వరికి ఈ ప్రోత్సాహకం ఉండగా, ఇప్పుడు బీపీటీ–5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ ఆర్–15048), కునారం సన్నాలు (కేఎన్ ఎం–1638), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్–44 (సిద్ధి), కేఎన్ ఎం–7715 అనే ఏడు రకాలకే పరిమితం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెప్పే కారణం ఏమిటంటే... ఈ రకాలకే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. మిల్లింగ్ సులభంగా ఉంటుంది. ప్రభుత్వ సేకరణ ప్రక్రియ, వ్యయం కూడా తగ్గుతుంది. ఈ కారణాలు పరిపాలనా పరంగా సరైనవే కావచ్చు. కానీ ఈ నిర్ణయం వ్యవసాయ భవిష్యత్తుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అభివృద్ధి సంస్థలు రైతులకు పంటల వైవిధ్యం, రకాల వైవిధ్యం, తక్కువ నీరు వినియోగించే పంటలు, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం గురించి చెబుతున్నాయి. సంప్రదాయ విత్తనాలను కాపాడాలని కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే మరోవైపు కేవలం ఏడు సన్న వరి రకాలకే బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు భిన్నమైన సంకేతం వెళుతోంది. రూ. 500 బోనస్ చిన్న మొత్తం కాదు. ఏ రకం విత్తనం వేయాలనే నిర్ణయాన్ని ఇది ప్రభా వితం చేస్తుంది. క్రమంగా రైతులు ఇతర రకాలను వదిలి బోనస్ ఉన్న రకాలవైపు వెళ్లే అవకాశం ఉంది.రైతులు ఒక వరి రకాన్ని కేవలం మార్కెట్ ధర చూసి మాత్రమే ఎన్నుకోరు. నేల స్వభావం, నీటి లభ్యత, పంట కాలం, చీడపీడల నిరోధకత, గింజ నాణ్యత, గడ్డి దిగుబడి, ఇంటి అవసరాలు, స్థానిక వాతావరణ పరిస్థితులు– ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక మండ లంలో బాగా పండే రకం, మరో మండలంలో అదే స్థాయిలో ఫలితం ఇవ్వకపోవచ్చు.తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే రకం ఎంటీయూ–1010. మంచి దిగుబడి, స్థిరమైన పనితీరు, వివిధ నేలల్లో అనుకూలత, తక్కువ ప్రమాదం కారణంగా వేలాది మంది రైతులు ఈ రకాన్ని ఇష్టపడి సాగుచేస్తున్నారు. కానీ ఈ రకం బోనస్ జాబితాలో లేదు. మరోవైపు బీపీటీ–5204 వంటి రకం మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇస్తుంది. కానీ ఎక్కువ కాలం, ఎక్కువ నీరు అవసరం. అగ్గితెగులు, దోమ పోటు వంటి చీడపీడలకు ఎక్కువగా గురవుతుంది.ప్రతి రకానికి దాని బలాలు, బలహీనతలు, ప్రాముఖ్యం ఉంటాయి. రాష్ట్రమంతా ఈ ఏడు రకాలపైనే ఆధారపడితే, విత్తనాలకు డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి, కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఇది విత్తన ధరలను పెంచి, రైతులను ప్రైవేట్ విత్తన కంపెనీలపై మరింతగా ఆధారపడేలా చేస్తుంది. పరిమిత రకాల వల్ల మిల్లు యజమానులకు కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియ సులువు కావచ్చు; కానీ ప్రభుత్వ విధానాల వల్ల రైతులకూ, జీవ వైవిధ్యానికీ కలిగే ప్రయోజనాలు ఏమిటి?వైవిధ్యమే రైతుకు రక్షణవికారాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులతో చేసిన చర్చల్లో మరో వాస్తవం బయటపడింది. కొంతమంది రైతులు మార్కెట్ లేకపోవడంతో మంచి దిగుబడి ఇచ్చే రకాలను వదిలేశారు. మరికొందరు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోదావరి ఇసుకలు, సిద్ధ సన్నాలు, కుళ్లకర్వంటి సాంప్రదాయ రకాలను ఇప్పటికీ సాగు చేస్తున్నారు. అవి తక్కువ నీటితో పండుతాయి. ఇంటి వినియోగానికి అనుకూలం. కొన్ని రకాలు ఎండలను, మరికొన్ని అధిక వర్షా లను తట్టు కుంటాయి.ఇప్పుడు వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతున్నాయి. వర్షపాతం అనిశ్చితంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైవిధ్యమే రైతుకు రక్షణ. ఒకే రకాన్ని పెద్ద ఎత్తున సాగుచేస్తే ఒక చీడపీడ లేదా వ్యాధి వచ్చినప్పుడు భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కానీ వివిధ రకాలు సాగు చేస్తే ప్రమాదం తగ్గుతుంది. ఇదే వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయానికి పునాది. సంప్రదాయ రకాలు మన వ్యవసాయ వారసత్వం. అవి కేవలం గతానికి చెందినవి కావు. భవిష్యత్తుకు కూడా అవసరమైన జన్యు సంపద. ఇవి కనుమరుగైతే తిరిగి రైతుల పొలాల్లోకి తీసుకురావడం చాలా కష్టం.ఇక్కడ అసలు ప్రశ్న ఏడు రకాలు మంచివా? కాదా? అనేది కాదు. రైతుల ఎంపికను ప్రభుత్వ ప్రోత్సాహకాల ద్వారా కుదించడం సరైన విధానమా? అనేదే అసలు ప్రశ్న. కొన్ని రకాలకే బోనస్ ఇవ్వడం కాకుండా, స్థానిక పరిస్థితులకు అనువైన రకాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించవచ్చు. నీటి వనరులను వర్షాధార పంటల రక్షణకు సంధానించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే రైతు సమూహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో... రైతులు ఎంచుకుంటున్న రకాలు, పంటలను మన విధానాలు తగ్గించకూడదు. మరింత విస్తరించేలా ఉండాలి.- భాగ్యలక్ష్మి, వ్యాసకర్త, వాటర్షెడ్ సపోర్ట్ సర్విసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్ (వాసన్) అసోసియేట్ డైరెక్టర్ -
మెహబూబా ముఫ్తీ (కశ్మీర్ లీడర్) రాయని డైరీ
సర్వోన్నతుడి నిర్యాణం అంతులేని దుఃఖాన్ని మిగిలిస్తుంది. ఆ దుఃఖంలోనే అనంతమైన ఓదార్పూ ఉంటుంది. అయతొల్లా అలీ ఖమేనీ పార్థివ దేహానికి తుది వీడ్కోలు పలికేందుకు టెహ్రాన్లోని ‘గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్’కు చేరుకున్న విషాద జనవాహినిలో నేనూ ఒకరిగా నిరీక్షిస్తూ ఉన్నాను. ఊరేగింపునకు ‘లోక నాయకుడు’ కదలగానే ఒక్కసారిగా శోకాలు మిన్నంటాయి. నివాళుల నలుపు వస్త్రాలతో భూమి యుద్ధమేఘమై బాధాతప్త నినాదాలతో ఉరమటం మొదలైంది. గుండెలు కుండపోతగా కురుస్తున్నట్లుగా ఆగని ఆశ్రువులు!అమరత్వం విషాదం కాదు. అగాథం కాదు. అంతం అసలే కాదు. అది గౌరవం. చైతన్యం. శాశ్వత జీవితం. దేవుడితో బేరమాడి కొనితెచ్చుకున్న పరమోన్నత స్థితి. ‘‘దేవా, నేను నీ మార్గంలో నడుస్తాను. బదులుగా నా మరణానికి అమరత్వాన్ని అనుగ్రహిస్తావా?’’ అని అల్లాహ్తో చేసుకున్న ఒప్పందం. శాంతిని విశ్వసించిన యుద్ధవీరుడు ఖమేనీ. ‘‘శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు, న్యాయంగా ఉండటం కూడా...’’ అని శత్రువు చెంప చెళ్లుమనిపించినవాడు. శాంతిని ఒక ప్రగాఢమైన మానవ ఆకాంక్షగా ఖమేనీ విశ్వసించారు. న్యాయం నెలకొన్న చోట మాత్రమే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది అన్నారు. ‘విధించబడిన’ శాంతిని ఇరాన్ ఎంత గట్టిగా వ్యతిరేకిస్తుందో, అంత గట్టిగానే తలపై వచ్చిపడే తలవని యుద్ధాన్ని ఎదుర్కొంటుందని ఖమేనీ గర్జించారు. ఏమీ తోచక ఒళ్లు విరుచుకున్నట్లుగా, సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని ఖమేనీ కోరుకోలేదు. ఇస్లాంను ఒక చల్లని యంత్రంలా కాక... ప్రేమలు, భావోద్వేగ బంధాలతో అల్లిన ఒక వెచ్చని మానవ స్పర్శతో పెనవేయాలని ఆకాంక్షించారు. జీవితమనే పరిమిత సంపదను మనం ఎలా వదిలించు కుంటామనే దానిపైనే జీవితపు నిజమైన విలువ ఆధారపడి ఉంటుందని ప్రబోధించారు! జీవితాన్ని ‘చిందిన నూనె’ అన్నారాయన. ఆ చిందిన నూనె చిమ్ముతున్న లక్షల దైవిక కాంతుల్లా మొసల్లా కాంప్లెక్స్లోని ఖమేనీ సన్నిధి ప్రార్థనలో అందరం నిలుచుని ఉన్నాం. టెహ్రాన్లో ఇవాళ, రేపు వీడ్కోలు ఊరేగింపు. 7న పవిత్ర ఖోమ్ నగరానికి ఊరేగింపుల తరలింపు. 8న ఇరాక్లోని కర్బలా, నజఫ్లలో భౌతిక కాయానికి పవిత్ర కర్మకాండలు. 9న ఖమేనీ జన్మస్థలం మషద్లోని ఇమామ్ రెజా మందిరంలో తుది ఖనన ఊరేగింపు. ప్రపంచ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, ప్రత్యేక అతిథులకు కార్యక్రమాల మొదటి విడతవరకే అధికారిక ఆహ్వానాలు ఉన్నాయి. రేపే నా తిరుగు ప్రయాణం. తండ్రి అంత్యక్రియల ఆహ్వాన లేఖలో నన్ను ‘ఆత్మీయ అతిథి’గా సంబోధించారు మోజ్తబా ఖమేనీ! అది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇంటి ఆడపడుచును ఆదరించి నట్లుగా ఉంది.జూలై 3న నేను శ్రీనగర్ నుంచి ఢిల్లీ చేరుకునేటప్పటికే ఇరాన్ పంపిన ప్రత్యేక విమానం అక్కడ సిద్ధంగా ఉంది. ఖమేనీకి తుది వీడ్కోలు పలికే భాగ్యం కల్పించటానికి వచ్చి మా కోసం వేచి ఉన్న దేవదూతలా ఉంది ఆ లోహ విహంగం. రమ్మని కబురు పంపటం, తోడ్కొని రమ్మని మనిషిని పంపటం... ఇది కదా పిలుపంటే... దుఃఖానికైనా, ఉత్సవానికైనా! ఇప్పుడిది రెండూ కలగలిసిన ‘దుఃఖోత్సవం’! ఢిల్లీలో ఆ రోజు టెహ్రాన్కు ఫ్లయిట్ టేకాఫ్ అయ్యేముందు ఖురాన్ ను తీసి, పేజీలు తెరిచి చూశాను. ‘‘వారిని మృతులు అనకండి. వాస్తవానికి వారు జీవించి ఉన్నారు, కానీ మీరు దానిని గ్రహించలేరు’’ – లేపనం లాంటి మాట! అల్లాహ్ చూపిన ధర్మ మార్గంలో నడిచిన నాయకుడికి మృత్యువు ఎదురు పడుతుందా? అసలు ఎదురొచ్చి నిలబడుతుందా?! -
గానం ఆగినా... గళం నిలిచే ఉంటుంది
ఒక మనిషి మరణిస్తాడు. ఒక కళాకారుడు కాలగర్భంలో కలిసిపోతాడు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం మరణించిన తర్వాత కూడా సమాజంతో మాట్లాడుతూనే ఉంటారు. వారి శరీరం కనుమరుగవుతుంది; వారి స్వరం మాత్రం చరిత్రలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వాల్లో అరుణోదయ నాగన్న ఒకరు. జూలై 3, 2026న ఆయన తుది శ్వాస విడిచినా, ప్రజల పాటలో ఆయన గళం ఇంకా సజీవంగానే ఉంది. ఆయన గానం ఆగిపోయి ఉండవచ్చు; కానీ ఆయన వినిపించిన విలువల స్వరం ఆగిపోలేదు.జీవితంలో పేరు సంపాదించిన కళాకారులు ఎందరో ఉంటారు. ప్రజాదరణ పొందిన గాయకులు కూడా ఎందరో ఉంటారు. కానీ జీవితాంతం కళను ప్రజల పక్షాన నిలబెట్టి, దానిని సామాజిక మార్పుకు సాధనంగా మలచినవారు అత్యంత అరుదు. అలాంటి అరుదైన సాంస్కృతిక యోధుడే అరుణోదయ నాగన్న. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాల మధ్య జీవించి, ప్రజల బాధను తన గాత్రంగా, వారి ఆకాంక్షలను తన పాటగా, వారి పోరాటాన్ని తన జీవితంగా మార్చుకున్న కళాకారుడు ఆయన.తెలుగు సమాజంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమ చరిత్రను నాగన్న ప్రస్తావన లేకుండా రాయడం అసాధ్యం. గాయకుడిగా, ప్రజా వాగ్గేయకారుడిగా, బుర్రకథ కళాకారుడిగా, ఉద్యమ కార్యకర్తగా, ప్రజాసంఘాల నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర అసామాన్యమైనది. వేలాది సభలు, వందలాది ఉద్యమాలు, లక్షలాది మంది ప్రజల మధ్య ఆయన గానం మార్మోగింది. ఆ గానంలో వినోదం కంటే చైతన్యం ఎక్కువ. కీర్తి కంటే కర్తవ్యం ఎక్కువ. వ్యక్తిగత ప్రాధాన్యం కంటే సామాజిక బాధ్యత ఎక్కువ.1957లో ఉమ్మడి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామంలో అత్యంత పేద గీత కార్మిక దంపతులు పరకాల పాపయ్య, లచ్చువమ్మలకు పెద్ద కుమారుడిగా నాగన్న జన్మించారు. బాల్యం నుంచే పేదరికం ఆయనకు జీవిత పాఠాలు నేర్పింది. పశువుల కాపరిగా, గీత కార్మికుడిగా శ్రమజీవి జీవితాన్ని అనుభవించిన ఆయన, పేదల కన్నీటి వెనుక ఉన్న సామాజిక వాస్తవాన్ని చిన్న వయసులోనే అర్థం చేసుకున్నారు. అదే అనుభవం తర్వాత ఆయన కళకు మూలధనమైంది.1975లో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలక మలుపు. ఎమర్జెన్సీ అనంతరం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ప్రజా ఉద్యమాలు ఉధృతమయ్యాయి. రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మేధావులు సామాజిక మార్పు కోసం వీధుల్లోకి వచ్చారు. ఆ ఉద్యమాలకు సాంస్కృతిక రూపం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆ అవసరానికి సమాధానంగా ముందుకు వచ్చిన గొంతుల్లో అత్యంత శక్తివంతమైనది నాగన్నది.సహజసిద్ధంగా సంక్రమించిన మధురమైన గాత్రం, జానపద సంప్రదాయాలపై ఉన్న పట్టు, గ్రామీణ జీవితంపై లోతైన అవగాహన—ఈ మూడు ఆయనను సాధారణ గాయకుడి స్థాయి నుంచి ప్రజా కళాకారుడిగా తీర్చిదిద్దాయి. మొదట గ్రామీణ అల్లిక పాటలతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, కొద్దికాలానికే ప్రజా ఉద్యమాల గానంగా పరిణామం చెందింది. ప్రజలే తన విశ్వవిద్యాలయం, పోరాటాలే తన పాఠ్యగ్రంథాలు, పాటలే తన ఆయుధాలు అని ఆయన జీవితాంతం విశ్వసించారు.1976లో నల్లగొండ జిల్లా అన్నారుగూడెం గ్రామానికి చెందిన గౌరమ్మతో ఆయన వివాహం జరిగింది. అనంతరం ఆమె 'లక్ష్మక్క'గా ప్రజా ఉద్యమాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ దంపతులు కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక ఉద్యమాన్ని కూడా కలిసి నిర్మించారు. ఆర్థిక కష్టాలు, ఆకలి, నివాస సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు—ఏవీ వారి సంకల్పాన్ని దెబ్బతీయలేకపోయాయి. ఉద్యమం వారి జీవితం; ప్రజలే వారి కుటుంబం; విలువలే వారి సంపదగా మారాయి.నేటి కాలంలో విలువల కంటే అవకాశాలు, ఆశయాల కంటే ప్రయోజనాలు, సేవ కంటే ప్రచారం ఎక్కువగా కనిపిస్తున్న వేళ, నాగన్న–లక్ష్మక్కల జీవితం ఒక ప్రత్యామ్నాయ సామాజిక విలువను మన ముందుంచుతుంది. ఉద్యమం అనేది సభల్లో చేసే ప్రసంగం మాత్రమే కాదు; వ్యక్తిగత జీవితంలోనూ ఆ విలువలను ఆచరించడం అనే సత్యాన్ని వారు తమ జీవితంతో నిరూపించారు.ప్రజా ఉద్యమాలకు నాయకత్వం ఎంత అవసరమో, వాటికి సాంస్కృతిక స్వరం కూడా అంతే అవసరం. ఆ స్వరం ప్రజల భాషలో ఉండాలి; వారి బాధను పలకాలి; వారి ఆశలను మేల్కొలపాలి. అలాంటి అరుదైన స్వరమే అరుణోదయ నాగన్నది. ఆయన పాడిన ప్రతి పాట వినోదం కోసం కాదు; చైతన్యం కోసం. ప్రతి ప్రదర్శన కరతాళధ్వనుల కోసం కాదు; సామాజిక మార్పు కోసం.ఎమర్జెన్సీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సాంస్కృతిక ఉద్యమం కొత్త ఊపును సంతరించుకుంది. అదే కాలంలో నాగన్న అరుణోదయ సంస్థతో మరింత బలంగా అనుబంధమై, కొద్దికాలంలోనే ఆ సంస్థలో కీలక నాయకుడిగా ఎదిగారు. అనంతరం ‘అరుణోదయ’నే తన ఇంటిపేరుగా స్వీకరించడం ద్వారా ఉద్యమం తనకు ఒక సంస్థ మాత్రమే కాదని, అది తన వ్యక్తిత్వమని చాటిచెప్పారు. వ్యక్తి పేరు కంటే ఆశయం గొప్పదనే భావనకు అది ప్రతీకగా నిలిచింది. సమాజంలోని సంక్లిష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రశ్నలను ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి 'బుర్రకథ' వంటి జానపద కళారూపాన్ని ఆయన సమర్థవంతంగా వినియోగించారు. ప్రముఖ ప్రజా కళాకారుడు కానూరి వెంకటేశ్వరరావు మార్గదర్శకత్వంలో, అరుణోదయ రామారావుతో కలిసి నాగన్న వేలాది బుర్రకథ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు కేవలం కళా కార్యక్రమాలు కావు; అవి ప్రజాస్వామ్య చైతన్యానికి సంచార పాఠశాలలు.ధరల పెరుగుదల, అవినీతి, కార్మికుల దోపిడీ, రైతాంగ సంక్షోభం, కూలీల హక్కులు, సామాజిక అసమానతలు, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, మహిళలపై హింస, అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ. ఇలా కాలానుగుణంగా సమాజాన్ని కుదిపిన ప్రతి సమస్య ఆయన పాటల్లో ప్రతిధ్వనించింది. సమస్యలను మాత్రమే కాదు, పరిష్కారం కోసం ప్రజలు సంఘటితమవాల్సిన అవసరాన్ని కూడా ఆయన తన గానం ద్వారా చాటి చెప్పారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆలంపూర్ నుంచి శ్రీకాకుళం వరకు, తెలంగాణ పల్లెల నుంచి ఆంధ్ర తీరప్రాంతాల వరకు ప్రజా ఉద్యమాలు ఎక్కడ జరిగాయో అక్కడ నాగన్న గొంతు వినిపించింది. రైతుల ఆందోళనల్లో, కార్మికుల సమ్మెల్లో, విద్యార్థుల ఉద్యమాల్లో, మహిళల పోరాటాల్లో, నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాల్లో ఆయన గానం ప్రజలకు ధైర్యాన్ని నింపింది. ఉద్యమాలకు కళ ఎంతటి శక్తినిస్తుందో ఆయన జీవితం సాక్ష్యంగా నిలిచింది.అక్షరదీపం' వంటి అక్షరాస్యత ఉద్యమాల నుంచి ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాల వరకు, సమాజానికి మేలు చేసే ప్రతి కార్యాచరణకు ఆయన తన స్వరాన్ని అంకితం చేశారు. ఆయన గానం వ్యక్తుల గొప్పతనాన్ని కీర్తించలేదు; ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అధికారాన్ని స్తుతించలేదు; అన్యాయాన్ని ప్రశ్నించింది. ఇదే ఆయనను సాధారణ కళాకారుడి స్థాయి దాటి ప్రజా చరిత్రలో నిలబెట్టింది.చదివింది రెండో తరగతే...అయితేనేం అరుణోదయ నాగన్నగాకేవలం రెండో తరగతి వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి, తన అనుభవాన్ని విశ్వవిద్యాలయంగా మలుచుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి ప్రతీకగా ఎదగడం అసాధారణ ఘట్టం. ఆయన డిగ్రీలు సంపాదించలేదు; కానీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. పురస్కారాల కోసం పరుగులు తీయలేదు; ప్రజల ప్రేమను గెలుచుకున్నారు. అదే ఆయన జీవితపు అసలైన గౌరవం.నిజానికి, ప్రజా కళాకారుడిగా గుర్తింపు పొందడం గొప్ప విషయం కాదు; ప్రజా కళాకారుడిగానే జీవితాంతం నిలిచి ఉండడం గొప్ప విషయం. ఆ పరీక్షలో నాగన్న విజయవంతమయ్యారు. కళను వృత్తిగా కాకుండా బాధ్యతగా, పాటను ఉపాధిగా కాకుండా ఉద్యమంగా, జీవితాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా సామాజిక నిబద్ధతగా మలచుకున్న ఆయన ప్రయాణం నేటి తరానికి అరుదైన మార్గదర్శకం.అరుణోదయ నాగన్న జీవితాన్ని కేవలం ఒక ప్రజా గాయకుడి జీవితంగా చూడడం ఆయన పాత్రను కుదించడం అవుతుంది. ఆయన కళాకారుడు మాత్రమే కాదు; కళకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలని విశ్వసించిన సాంస్కృతిక కార్యకర్త. పాటను వినోదానికి పరిమితం చేయకుండా, ప్రజల చైతన్యానికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, సామాజిక మార్పుకు ఒక సాధనంగా మలిచిన అరుదైన వ్యక్తిత్వం.నేటి కాలంలో ప్రజాదరణను వ్యక్తిగత విజయానికి, ఆర్థిక అవకాశాలకు మలచుకోవడం సహజ ధోరణిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రజల మధ్యే జీవించి, ప్రజల కోసమే పాడి, చివరి వరకు నిరాడంబర జీవితాన్ని ఎంచుకోవడం నాగన్న వ్యక్తిత్వంలోని అత్యంత విశిష్టమైన కోణం. ఆయన కళకు మార్కెట్ విలువను వెతకలేదు; మానవ విలువను మాత్రమే వెతికారు. అదే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది.ఆయన జీవిత ప్రస్థానంలో మరో ముఖ్యమైన అధ్యాయం ఆయన జీవిత సహచరి లక్ష్మక్క. ఉద్యమ జీవితంలో భార్యాభర్తలు సహచరులుగా నిలవడం అరుదైన విషయం. ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం, సామాజిక ఒత్తిళ్లు—ఇవన్నింటినీ ఎదుర్కొంటూనే ఆశయాలను నిలబెట్టిన ఈ దంపతులు ప్రజా ఉద్యమ చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక అధ్యాయంగా నిలిచిపోతారు.ఒక వ్యక్తి వెనుక ఒక కుటుంబం కాదు, ఒక విలువల ప్రపంచం నిలబడగలదని వారి జీవితం నిరూపించింది. జీవిత చరమాంకంలో నాగన్న ఎదుర్కొన్న అనారోగ్యం మరో సామాజిక ప్రశ్నను మన ముందుంచుతుంది. ప్రజల కోసం జీవితాంతం శ్రమించిన కళాకారులు, ఉద్యమకారులు వృద్ధాప్యంలో ఎదుర్కొనే ఆర్థిక, ఆరోగ్య సవాళ్లపై సమాజం మరింత బాధ్యతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకు అండగా నిలిచిన మిత్రులు, శ్రేయోభిలాషులు, వైద్యసేవలు అందించిన ఆసుపత్రి యాజమాన్యం చూపిన మానవీయ స్పందన కూడా సమాజంలో ఇంకా మానవత్వం సజీవంగా ఉందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.నాగన్న మరణం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు; తెలుగు ప్రజా సాంస్కృతిక ఉద్యమం ఒక అపూర్వ గానాన్ని కోల్పోయిన సందర్భం. అయినప్పటికీ, వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవచ్చు; వారు నిలబెట్టిన విలువలు మాత్రం సమాజాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఒక తరం పాడిన పాట, మరో తరానికి చరిత్రగా, ప్రేరణగా మారుతుంది. నాగన్న గళం కూడా అలాంటి చరిత్రలో భాగమైంది.ఈ సందర్భంలో ఆయనను స్మరించడం అంటే కేవలం నివాళులు అర్పించడం కాదు. ఆయన జీవించిన నిరాడంబరతను, కళ పట్ల చూపిన నిబద్ధతను, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసాన్ని, ప్రజలతో మమేకమైన జీవితాన్ని అర్థం చేసుకోవడం. ముఖ్యంగా నేటి తరానికి అలాంటి వ్యక్తిత్వాలను పరిచయం చేయడం సమాజం, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థల ఉమ్మడి బాధ్యత. ప్రజల చరిత్రలో కొంతమంది వ్యక్తులు ఒక కాలానికి మాత్రమే చెందరు; వారు కాలాతీతంగా మారిపోతారు. అరుణోదయ నాగన్న అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఆయన గానం నేడు ఆగిపోయి ఉండవచ్చు. కానీ ఆ గానం మోసుకొచ్చిన విలువలు, ఆయన వినిపించిన ప్రశ్నలు, ఆయన నాటిన చైతన్యం, ఆయన నిలబెట్టిన నిబద్ధత—అవి ఇంకా ప్రజల మధ్యే ఉన్నాయి. అందుకే, గానం ఆగినా... గళం నిలిచే ఉంటుంది.వ్యాసకర్త: ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్డైరెక్టర్, సివిల్ సర్వీస్ అకాడమీఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
'ప్రమాదపుటంచున' సోషలిస్ట్ క్యూబా
1823లో అమెరికా 5వ అధ్యక్షుడు మన్రో సిద్ధాంతం ప్రకారం లాటిన్ అమెరికా అంతా అమెరికాకు చెందుతుంది; పశ్చిమ భూగోళంలోకి యూరపు దేశాలు వలస రాకూడదు; తూర్పు భూగోళంలో అమెరికా జోక్యం చేసుకోదు. దక్షిణ అమెరికా దేశాలు అమెరికాకు చెందినవని (బ్యాక్ యార్డ్) అర్థం. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సిద్ధాంతాన్ని నిస్సిగ్గుగా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.స్పానిష్–అమెరికన్ యుద్ధం ముగిసిన తర్వాత 1902 మే 20న క్యూబన్ రిపబ్లిక్ ఏర్పడింది. ఈ యుద్ధంలో స్పానిష్ వలస ప్రాంతా లైన క్యూబా, ప్యూర్టోరికో, గ్వామ్, ఫిలిప్పైన్స్లను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 1917 నుండి 1923 వరకూ అమె రికా మెరైన్లు క్యూబా ద్వీపాన్ని ఆక్రమించి సమ్మెలను అణిచివేస్తూ అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల భుజం కాశారు. అమెరికా సైనిక ఆక్రమణ అధికారికంగా ముగిసినప్పటికీ, క్యూబాపై అజమాయిషీ కోసం ‘ప్లాట్’ సవరణను విధించింది. 1917లో పాలస్తీనా ఏర్పాటు చేసి 1948 వరకూ బ్రిటిష్వాళ్ళు కంట్రోల్ కోసం తీసుకొన్న మాండేట్ (అజమాయిషీ) లాంటిది ఇది. దీనితో వాషింగ్టన్కు సము చితమని భావించినప్పుడల్లా క్యూబా వ్యవహారాల్లో సైనిక జోక్యం చేసుకునే ‘అనియంత్రిత’ హక్కును పొందింది. కానీ సోషలిస్టు క్యూబా దీన్ని తిరస్కరించింది. ప్రపంచ మద్దతు అవసరం!క్యూబాపై గత 66 ఏళ్లుగా అమెరికా సాగించిన భయోత్పాతం, అలాగే ప్రస్తుతం తీవ్రతరమవుతున్న పాలన మార్పు ప్రయత్నాలన్నీ 1959 విప్లవానికి ముందు ఉన్న ప్లాట్ సవరణకూ, పుల్జెన్సియో బాటిస్టా ప్రభుత్వ నియంతృత్వంలోని సంబంధాలను పునరుద్ధరించటానికి ఉన్న అడ్డంకులను తొలగించటానికీ ఉద్దేశించినవి. సోష లిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టు బడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. ఫలితంగా క్యూబాలో ప్రభుత్వ ఆధీనంలోని నియంత్రిత ఆర్థిక వ్యవస్థ కూలిపోనుంది. ‘యుద్ధ ఆర్థిక వ్యవస్థ’ పేరిట ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పొదుపు చర్యలు, సాంఘిక కోతల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయే ప్రమాదం ఉంది.సామ్రాజ్యవాద ఆంక్షలను క్యూబా ఎదుర్కోలేకపోయింది. చైనా, రష్యాల సహాయం అంతంతమాత్రంగా ఉంది. ట్రంప్ జన వరి నెలలో క్యూబాకు ఇంధన దిగుమతుల్ని నిషేధించాడు. ముడి చమురు ఎగుమతి దేశాలపై తీవ్ర ఆంక్షలుంటాయని హెచ్చరించారు. వెనెజులా, అమెరికా కబంధహస్తాల్లోకి వెళ్లిపోయింది. మెక్సికో వంటి దేశాలు సహాయాన్ని ఆపాయి. ఇంధన కొరతతో గంటలకొద్దీ క్యూబా అంధకారంలోకి వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. క్యూబాలో 1959 విప్లవ సమానత్వ లక్ష్యాలు దూరం కాబోతు న్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్ 1990వ దశకంలో కుప్ప కూలిన తర్వాత క్యూబాకు సంపూర్ణంగా ఆపన్నహస్తం అందించే వారే లేకపోయారు.క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఆంక్షల దాడి... ప్రపంచ ఆధిపత్యానికి ఎదురయ్యే ప్రతీ సవాలునూ నాశనం చేయాలనే దాని ప్రయత్నానికి ఒక కేంద్రీకృత రూపం మాత్రమే. ఇటువంటి ప్రయత్నాలు ఇరాక్, అఫ్గా నిస్తాన్, లిబియా, సిరియాల విధ్వంసానికి, గాజాలో మారణ హోమానికి, ఇరాన్ పై యుద్ధానికి, వెనెజులా అధ్యక్షుడు మధురోను అపహరించి, ముడిచమురు స్వాధీనం చేసుకోవటానికి కారణ మయ్యాయి. మే 14న సి.ఐ.ఎ. డైరెక్టరు జాన్ రాట్ క్లిఫ్ హవానాకు వచ్చి పెట్టుబడిదారీ ఆర్థిక విధాన దిశగా సంస్కరించకపోతే క్యూబాను సర్వనాశనం చేస్తామని ఒత్తిడి ప్రకటించాడు. పెట్టుబడీ దారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన సోషలిస్టు విప్లవాలు మనుగడ సాధించాలంటే ప్రపంచ కార్మికుల సంఘీభావం, మద్దతు అవసరం.సోషలిస్టు ప్రణాళిక ఆర్థిక విధానానికి బదులుగా... స్వేచ్ఛా విపణి పెట్టుబడిదారీ విధానం వైపు, సాంఘిక కోతల వైపు క్యూబా ప్రస్తుతం నడవబోతున్నది. - బుడ్డిగ జమిందార్, వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
ఆత్మహత్య వ్యక్తిగత వైఫల్యమా?
దేశంలో ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం దాదాపు ఒకే విధమైన చర్చ కొనసాగుతుంది. పరీక్షల్లో విఫలమయ్యాడా? చదువు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడా? మానసిక సమస్యలతో బాధపడుతున్నాడా? అంటే సమస్యను పూర్తిగా వ్యక్తి చుట్టూనే కేంద్రీకరిస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక ఈ దృక్పథాన్ని సవాలు చేస్తోంది. విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత కార ణాల ఫలితంగా చూడటం వాస్తవాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే నని ఇది స్పష్టం చేస్తోంది.ఐఐటీ ఢిల్లీ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు 2025లో ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్(ఎన్టీఎఫ్) మధ్యంతర నివేదిక విద్యార్థుల ‘ఆత్మహత్యలు అసలు సమస్య కాదు; అవి విద్యార్థి సంక్షో భానికి కనిపించే చివరి సూచన మాత్రమే’ అని పేర్కొంది. ఈ నివేదికలో అత్యంత ఆందోళనకరమైన గణాంకాల్లో ఒకటి, సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు తమను క్యాంపస్లో ‘బయటి వ్యక్తులు’గా భావిస్తున్నట్లు వెల్లడైంది. భాషా సమస్యలు, సామాజిక–ఆర్థిక అసమానతలు, కుల/వర్గ వివక్ష ఈ దూరాన్ని మరింత పెంచుతున్నాయి.మరోవైపు కేవలం 56 శాతం మంది మాత్రమే తమ విద్యాసంస్థ... సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్క రిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గణాంకాలు విద్యార్థి సంక్షోభం వ్యక్తిగతం మాత్రమే కాక, సంస్థాగత స్వభావం కూడా కలిగి ఉందని సూచిస్తున్నాయి. ఎన్టీఎఫ్ క్షేత్రస్థాయి అధ్యయనాలు కూడా ఇదే స్పష్టం చేశాయి. అందువల్ల ప్రతి విద్యార్థి ఆత్మహత్య అనంతరం ‘అతను ఎందుకు తట్టుకోలేకపోయాడు?’ అనే ప్రశ్నతో పాటు ‘అతను సంక్షోభంలో ఉన్న ప్పుడు వ్యవస్థ ఏ విధంగా స్పందించింది?’ అనే ప్రశ్నను కూడా పరిశీలించాలి.ఎన్టీఎఫ్ ప్రకారం... విద్యార్థి ఆత్మహత్యలను కేవలం వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా, విద్యాసంస్థల జవాబుదారీతనం, క్యాంపస్ సంస్కృతి, మద్దతు వ్యవస్థల నాణ్యతకు సంబంధించిన అంశంగా కూడా చూడాలి. విద్యార్థి మనసులో ‘నేను ఒంటరిని’ అనే భావన కన్నా ‘ఇక్కడ నాకో మద్దతు ఉంది’ అనే విశ్వాసాన్ని పెంపొందించగలిగితేనే ఈ విషాద ఘటనల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విశ్వాసాన్ని నిల బెట్టడమే నేటి విద్యావ్యవస్థ మొదటి ధర్మం. – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు..
కొద్ది రోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హాలండ్ – జపాన్ మధ్య ‘ఫుట్బాల్ మ్యాచ్’ జరిగింది. వందలాది జపానీయ అభిమానులు, జపాన్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళి ఆ ఆటను చూచి, అనందించి, తిరిగి వెళ్ళారు. ఆట 2–2 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. అసలు విశేషం ఆట ముగిసిన తరవాత జరిగింది.జపాన్ నుంచి వచ్చిన అభిమానులందరూ కలిసి, స్టేడియంలో వాళ్ళు కూర్చొన్న భాగాన్ని ఊడ్చి, తుడిచి, అద్దంలా శుభ్రం చేసి, పోగయిన చెత్తను సంచీలలో తీసుకువెళ్ళి కుప్పతొట్లలో పోసి వెళ్ళారు. ‘ఎక్కడికయినా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, అక్కడ మా వల్ల పోగయిన చెత్తను మేమే శుభ్రం చేసివెళ్ళటం మాకు చిన్నతనం నుంచి అబ్బిన అలవాటు’ అన్నారట.ఈ చర్యతో వాళ్ళు మనకు మన సనాతన సంప్రదాయం బోధించే రెండు ముఖ్య ధర్మాలను ఆచరించి చూపిన ట్టయింది. మొదటిది ‘ఆత్మవత్ సర్వభూతాని’ – అన్ని ప్రాణులూ మన లాంటివే అన్న ధర్మం. కనక, మన వలన ఇతరులకు కష్టం కలగకూడదు. రెండు, అశుభ్రమైన పరిసరాలలో ఏ పనీ సమర్థంగా, తృప్తికరంగా జరపలేం, కార్యసాధనకు ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు శుచి శుభ్రతలు దోహదం చేస్తాయి. లౌకికమైన పనుల విషయంలోనూ, ఆధ్యాత్మిక సాధనల విషయాల్లోనూ అన్ని చోట్లా ఇది వర్తిస్తుంది.యోగ శాస్త్రం చెప్పే యమ, నియమాలలో ప్రప్రథమ నియమం ‘శౌచం’. ‘శౌచం దైవీ గుణం, దాన్ని ఆచరించు; అశౌచం ఆసురీ గుణం, దాన్ని ఆచరించకు’ అని భగవద్గీత బోధిస్తుంది. ముఖ్యంగా పూజా, ధ్యానాది సాధనలలో పరిసరశుద్ధీ, ద్రవ్యశుద్ద్ధీ, శరీరశుద్ధీ మొదలైనవి చిత్తశుద్ధికీ, చిత్త ఏకాగ్రతకూ తోడ్పడతాయి అని పెద్దలు పదే పదే సూచిస్తూ ఉంటారు. జపాను అభిమానులు క్రీడాంగణ శుభ్రత పట్ల చూపిన నిబద్ధతను, ఆస్తిక గణాలు విద్యాలయాలూ, వీధులూ ఇత్యాది బహిరంగ ప్రదేశాలలోనూ, పుణ్యక్షేత్రాలూ, తీర్థాల లాంటి పవిత్ర ప్రదేశాలలోనూ చూపగలిగితే ఫలితాలు మహత్తరంగా ఉంటాయి. – ఎం. మారుతి శాస్త్రి -
అగ్రస్థానం నుండి అప్రస్తుతానికి?
అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్య్రం ప్రకటించుకొని 250 సంవత్సరాలు పూర్తవబోతున్నది. 1776 జూలై 4న 13 కాలనీలు స్వాతంత్య్రం ప్రకటించుకోవటంతో యూఎస్ఏ దేశానికి పునాదిపడింది. క్రమంగా స్పానిష్, మెక్సికన్లతో యుద్ధాలు, కొనుగోళ్లతో అది విస్తరించింది. 1941లో జపాన్ పెరల్ హార్బర్పై దాడితో రెండవ ప్రపంచ యుద్ధంలో క్రియాశీలకమైంది. 1945లో ప్రపంచ జీడీపీలో 50 శాతం వాటాతో బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 1969లో చంద్రుడిపై కాలుమోపి, 1970 దశకంలో అర్పా నెట్, తదుపరి ఇంటర్నెట్ ద్వారా 1980లలో సిలికాన్ వ్యాలీ గుండా ఐటీ రంగాన్ని శాసించింది. 1991లో సోవియట్ విచ్ఛిన్నంతో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది.అగ్ర లక్షణాలుఒక దేశం అగ్రరాజ్యంగా లేదా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే నాలుగు అంశాలు కీలకం. 1. మాతృదేశం నుండి సుదూర ప్రాంతా లలో శత్రువులను నిలువరించగలగాలి. 2. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు, రవాణా మార్గాలను నియంత్రించగలగాలి. 3. ప్రపంచ స్థాయి వ్యవస్థలను సృష్టించి, ఆదర్శప్రాయమైన చట్టాలు, నిబంధన లను ఏర్పరచాలి. 4. ఆ దేశపు విలువలు, సంప్రదాయాలు, భాష లను ప్రపంచం అనుసరించాలి.ప్రపంచవ్యాప్తంగా 750కి పైగా సైనిక స్థావరాలతో యూఎస్ఏ ఏ ప్రాంతంలోని శత్రువునైనా నిలువరించగలుగు తుంది. ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్వంటి సంస్థల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నది.హాలీవుడ్, పాప్/జాజ్ సంగీతం, ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా ప్రపంచ సంస్కృతులను ప్రభావితం చేస్తున్నది. సాలీనా 700 బిలి యన్ డాలర్ల ప్రైవేట్ ఆర్ అండ్ డీ వ్యయం, 500 బిలియన్ డాలర్ల దాతృత్వ విరాళాల ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది.తిరోగమన రాజ్యం2000 సంవత్సరంకల్లా యూఎస్ఏ తిరుగులేని ఏకైక అగ్ర రాజ్యంగా అభివృద్ధి చెందిందనటంలో సందేహం లేదు. కానీ 2025 కల్లా ఇంటా, బయటా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ‘అమె రికా నాయకత్వపు ప్రపంచం నుండి క్రమంగా అమెరికాతో కూడిన ప్రపంచ రాజకీయ వ్యవస్థ’ దిశగా ప్రపంచం ప్రయాణిస్తున్నట్లుగా జియో పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరి కాను ఒక తిరోగమన అగ్రరాజ్యంగా అభివర్ణిస్తున్నారు. చరిత్ర కారుడు ఆర్థర్ షెల్లింగర్ అభిప్రాయపడినట్లు ‘అమెరికా ఒక ప్రయోగం మాత్రమే, తయారీ పూర్తయిన ఉత్పత్తి కాదు’.అమెరికన్ ప్రభుత్వం క్రమంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటు న్నది. ప్రభుత్వ అప్పు జీడీపీ కంటే 120 శాతం ఎక్కువగా ఉన్నది. ఇది 200 శాతానికి చేరితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది.ప్రపంచ రిజర్వ్ కరెన్సీలో యూఎస్ వాటా 71 నుండి 59 శాతానికి పడిపోయింది. లావాదేవీలకు అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా చైనీస్ యువాన్ కుదురుకుంటున్నది. బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యానికే సవాలు విసురుతున్నాయి. చైనా, రష్యా, ఈయూ,ఇండియా ప్రత్యా మ్నాయ రాజకీయ శక్తులుగా బలపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్యూజన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, అంత రిక్ష పరిశోధనలలో చైనా గట్టి పోటీనిస్తున్నది. మాదకద్రవ్యాలు, గన్కల్చర్ అమెరికన్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.కుప్పకూలకపోయినా...యూకే (ఇంగ్లండ్) తన రవి అస్తమించని సామ్రాజ్యంతో ప్రపంచాన్ని సుమారు వంద సంవత్సరాలు (1850–1950) పాలించిందనే చెప్పాలి. ప్రపంచ జీడీపీలో అప్పటి బ్రిటన్ వాటా 25శాతం. అప్రతిహతమయిన నౌకాబలం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వలసలు, సముద్ర మార్గాల మీద ఆధిపత్యంతో బ్రిటన్ ప్రపంచాన్ని శాసించింది. బ్రిటన్తో పోలిస్తే అమెరికన్ ఆధిపత్యం భిన్నంగా ఉంటుంది. అమెరికా ఇతర దేశాలను ఆక్రమించి వలసలు స్థాపించలేదు. ఆధునిక నౌకా, వైమానిక సైనిక బలాలతో పాటుగా, టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్లపై గుత్తాధిపత్యం, డాలర్ ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఉడుంపట్టు పట్టి, నాటో మిత్రదేశాల సహకారం దన్నుగా యూఎస్ఏ అగ్ర రాజ్యంగా ఏర్పడింది. యూఎస్ఏ, యూకే రెండూ మాతృ దేశాన్ని సురక్షితంగా ఉంచుకొని, శత్రువులను కొల్లగొట్టడమనే ప్రాథమిక సూత్రాన్ని అమలుపరచాయి. రెండువైపులా శత్రుదుర్భేద్యంగా విశా లమైన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు ఉండటం, అపార మైన సహజవనరులు యూఎస్ఏకు భౌగోళికంగా కలిసి వచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యూకే బలహీనపడటం యూఎస్ఏకు అనుకోని వరంగా పరిణమించింది.యుద్ధాలు, ఆక్రమణల వలన సామ్రాజ్యాలు కూలిపోవు. సామ్రాజ్యాలు అంతర్గతంగా బలహీనపడి విచ్ఛిన్నమవుతాయని చరిత్ర చెబుతున్నది. 1950 కల్లా బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. వలస సామ్రాజ్యాన్ని నిర్వహించటానికి అయ్యే ఖర్చు 1950లో యూకే జీడీపీలో 10 శాతం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూకే ఆర్థికంగా బలహీనపడి వలస పాలన ఖర్చులను భరించే స్థితిలో లేక వలస ప్రాంతాలకు తప్పనిసరి పరిస్థితుల్లో స్వాతంత్య్రం ప్రకటించింది. 1991 కల్లా ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్న మవటంతో సోవియట్ యూనియన్ కూలి పోయింది. 1945లో యూకే, 1991లో సోవియట్ మాదిరిగా యూఎస్ఏ ఇప్పుడు అకస్మాత్తుగా కూలిపోయే అవకాశం లేదు. కానీ క్రమంగా బలహీన పడి అగ్రరాజ్య స్థాయిని కోల్పోయే సూచనలు పుష్కలం.ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి మానవ వనరులను యూఎస్ఏ ఆకర్షించింది. 1820–1860 కాలంలో వలస వచ్చిన ఐరిష్, జర్మన్లు మధ్య యూఎస్ఏ వ్యవసాయాభివృద్ధికి పునాది వేశారు. 1880–1924 మధ్యకాలంలో వచ్చిన యూదులు, ఇటాలి యన్లు తూర్పు, ఈశాన్య యూఎస్ఏలో పారిశ్రామిక విప్లవానికి ఆద్యులు. 1925–1965 మధ్యకాలంలో జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపాల నుండి శరణార్థులుగా వచ్చిన శాస్త్రవేత్తలు యూఎస్ఏ అణ్వస్త్ర పరిజ్ఞానానికి, కంప్యూటర్ విప్లవానికి దోహదపడ్డారు. వీరిని యూఎస్ఏ ఆహ్వానించకపోతే సోవియట్ ఏకైక అణ్వస్త్ర దేశంగా ఏర్పడేది. 1965–2000 మధ్యకాలంలో భారత్, తైవాన్ల నుండి వచ్చిన టెక్ నిపుణులు సిలికాన్ వ్యాలీ విజయానికి కారణం. వీరు లేకపోతే జపాన్ ప్రపంచ సెమీకండక్టర్, ఐటీ శక్తిగా ఆవిర్భవించేది. ఇటీవలి వలసదారుల వ్యతిరేక ఉద్యమం కేవలం అమెరికన్ ఐడెంటిటీ రాజకీయాలలో భాగమే. జపాన్ నిపుణులైన వలసదారు లను ప్రోత్సహించక పోవటంతో ధనిక దేశమైనా ప్రపంచ రాజకీ యాలలో ప్రాధాన్యత సాధించలేక పోయింది. సోవియట్ వలస లను నిషేధించి కూలిపోయింది. యూఎస్ఏ ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలను నిర్వహించటానికి సాలీనా కనీసం 2 మిలియన్ల వలస నిపుణులను ఆహ్వానించాల్సి ఉంటుంది. లేకపోతే ఈ నైపుణ్య కార్మి కులను యూరోపియన్ యూనియన్, చైనా ఎగరేసుకుపోతాయి. రాబోయే అర్ధ శతాబ్దంలో ప్రపంచ అగ్రరాజ్యం ఎవరనేదిముందుతరం సాంకేతిక పరిజ్ఞానాలను ఎవరు గుప్పిట్లో పెట్టుకుంటా రనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 2076 ప్రపంచాధిపత్యం రేసులో కూటములు, పొత్తులు కీలకం. ఈ రెండు అంశాలలో యూఎస్ఏకు దుశ్శకునాలు కన్పడుతున్నాయి. కెనడా, యూరోపియన్ యూనియన్, యూకేలతో మొదలుపెట్టి, భారత్ వరకు అందరు మిత్రులను దూరం చేసుకోవటం యూఎస్ఏకు దురదృష్టకరం. 2050 కల్లా ప్రపంచ జీడీపీలో వాటా 15 శాతానికి పడి పోయి, ప్రభుత్వ రుణం జీడీపీలో 200 శాతానికి చేరి వలసలు పూర్తిగా ఆపివేస్తే యూఎస్ఏ అగ్రరాజ్య స్థానం కోల్పోతుంది. ధనిక దేశంగా కొనసాగినా, 2075కల్లా ప్రస్తుత జపాన్, యూకేల వలే అప్రస్తుతపు, అసందర్భపు, అప్రాముఖ్యతపు శక్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
సాయుధ పోరాటంలో తొలి అమరుడు
తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతోనే మొదలయ్యిందనడం అతిశయోక్తి కాదు. అప్పటి గ్రామీణ తెలంగాణలో జీవితం అంటేనే వెట్టిచాకిరి. భూమి మీద హక్కు దొరలది, శ్రమ మాత్రం రైతులది. కడవెండిలో దేశ్ముఖ్ రాపాక రాంచంద్రా రెడ్డి, అతని తల్లి జానమ్మ ఆధిపత్యం ప్రజల జీవితాలను కట్టుబానిసత్వంలోకి నెట్టాయి. ఈ అన్యాయాలపై గళమెత్తినవాడు కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య. ఆ గళం చుట్టూ ప్రజలు కూడబలుక్కునేసరికి, అది ఉద్యమంగా మారింది.ఆంధ్రమహాసభ ప్రభావంతో కడవెండి గ్రామం ఒక చిన్న విప్లవ కేంద్రంగా మారింది. ‘భూమి, భుక్తి, వెట్టి విముక్తి’ అనే నినాదం మార్మోగింది. యువతరం చైతన్యవంతమైంది. దేశ్ముఖ్ వర్గం ఉద్య మాన్ని అణిచివేయడానికి అరెస్టులు, దాడులు ప్రారంభించింది. 1946 జూలై 4న జరిగిన ఘటన తెలంగాణ చరిత్రను శాశ్వతంగా మార్చింది. ఆ రోజు గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో గూండాల గుంపు గ్రామంపై దాడి చేసింది. కానీ భయపడకుండా ప్రజలు ఐక్యంగా ర్యాలీ చేశారు.ఆ ర్యాలీ ముందు వరుసలో నిలిచిన యువకుడు దొడ్డి కొమరయ్యకు దేశ్ముఖ్ తొత్తులు పేల్చిన తూటా తగిలింది. అక్కడే నేలకూలాడు. అతడి రక్తం తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎరుపు రంగు పూసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దొడ్డి కొమరయ్య పేరు ఒక నినాదంగా మారింది. అతని బలిదానం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. వేలాది గ్రామాలు నిరంకుశ పాలన నుంచి విముక్తమయ్యాయి. లక్షలాది ఎకరాలు... భూమిలేని పేదలకు పంచిపెట్టడానికి కారణ మయ్యింది. ప్రపంచ విప్లవాల చరిత్రలో తెలంగాణ పోరాటాన్ని అమరం చేసింది. అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు, ప్రతి ప్రతిఘటనలో, ప్రతి నినాదంలో, ప్రతి సమానత్వ స్వప్నంలో! – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి (జూలై 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి) -
భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం
భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, తత్వాలు కలిసిమెలిసి వికసించినదే భారతీయత. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలు భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేశాయి. ఈ చారిత్రక నేపథ్యంలోనే భారతీయ క్రైస్తవ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి.క్రైస్తవ విశ్వాసం భారతదేశానికి వలస పాలనతో వచ్చిందనే అభిప్రాయం చారిత్రకంగా సత్యం కాదు. క్రైస్తవ సంప్రదాయం ప్రకార, అపొస్తలుడైన ‘తోమా’ క్రీ.శ. 52లో మలబార్ తీరానికి చేరుకుని సువార్త ప్రకటించగా, క్రీ.శ. 72లో మైలాపూర్లో హతసాక్షిగా మరణించాడు. ఇది దేశంలో క్రైస్తవ వార సత్వానికి దాదాపు రెండువేల ఏళ్ళ చరిత్రను సూచిస్తుంది. ఈ చారిత్రక వార సత్వాన్ని గుర్తు చేస్తూ, 2021లో వివిధ క్రైస్తవ సంప్రదాయాలకు చెందిన నాయకులు కలిసి జూలై 3ను భారతీయ క్రైస్తవ దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఏ ఒక్క చర్చికి చెందిన మతపరమైన పండుగ కాదు; భారత్లో క్రైస్తవుల ఉనికి, సేవా వారసత్వం, భారతీయ సంస్కృతితో వారి అనుబంధాన్ని స్మరించుకునే జాతీయ సందర్భం. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని ‘యేసు భక్తి దివస్’ అని కూడా వ్యవహరిస్తారు. భార తీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ‘భక్తి’ తత్త్వాన్ని ప్రతిబింబించే పేరుగా ఇది ప్రాచు ర్యంలోకి వచ్చింది.భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం అందించిన సేవలు విశేషమైనవి. క్రైస్తవ విద్యా సంస్థలు లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సేవాభావాన్ని అందించాయి. అనేక ఆసు పత్రులు నిర్మించాయి. మహమ్మారులు తలెత్తినప్పుడు కుల మత భేదాలకు అతీతంగా ఆదుకొన్నాయి. సామాజిక సేవ క్రైస్తవ విశ్వాసంలో అంతర్భాగం. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల పునరావాస కేంద్రాలు, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్య క్రమాల ద్వారా అనేక సంస్థలు సమాజాభివృద్ధికి విశేషంగా దోహదపడ్డాయి.తెలుగు భాషాభివృద్ధిలో కూడా క్రైస్తవ పండితుల పాత్ర ప్రస్తావనీయ మైనది. నిఘంటువులు, వ్యాకరణ గ్రంథాలు, బైబిల్ అనువాదాలు, ముద్రణా సాంకేతికత ద్వారా తెలుగు గద్యాభివృద్ధికి వారు విశేష కృషి చేశారు. భారతదేశ బలం దాని వైవిధ్యంలో ఉంది. ఆ వైవిధ్యానికి భారతీయ క్రైస్తవ సంప్రదాయం కూడా రెండువేల సంవత్సరాలుగా తనదైన ముద్ర వేసింది. – డా. శామ్యూల్ జాన్ ఆదూరి (నేడు భారతీయ క్రైస్తవ దినోత్సవం) -
ప్రశ్నించడమూ విద్యలో భాగమే!
నూతన జాతీయ విద్యా విధానం– 2020 దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న సందర్భంలో భారతీయ విద్యా వ్యవస్థపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. విద్య కేవలం ఉపాధి సాధనమా? లేక సమాజాన్ని రూపుదిద్దే పరివర్తనాత్మక శక్తా? ఒక దేశం తన భావితరాలను ఎలా తీర్చిదిద్దా లనుకుంటుందో ఆ దేశ విద్యా విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అందుకే విద్యా విధానాలు ప్రభుత్వాల పరిపాలనా నిర్ణయాలు మాత్రమే కావు; అవి ఒక సమాజం తన భవిష్యత్తును గురించి చేసుకునే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఎంపికలు కూడా. సమాజ శాస్త్రవేత్త ఎమిల్ డర్కైమ్ దృష్టిలో విద్య అనేది సమాజం తన విలువలను కొత్త తరాలకు సంక్రమింపజేసే ప్రక్రియ. కార్ల్ మార్క్స్ దృష్టిలో విద్య పాలక వర్గాల భావజాలాన్ని బలపరిచే సాధనంగా కూడా మారవచ్చు.జ్ఞాన బదిలీ రూపాలువేట, ఆహార సేకరణ జీవన విధానం నుండి వ్యవసాయ ఆధారిత స్థిర జీవన విధానానికి మారిన తర్వాత జ్ఞాన బదిలీకి వ్యవస్థీకృత రూపాలు అవసరమయ్యాయి. వైదిక సంస్కృతి ప్రభావంతో గురుకుల వ్యవస్థ అభివృద్ధి చెందింది. భారతీయ విద్యా చరిత్రలో ఇది ముఖ్యమైన దశ. ఈ వ్యవస్థ ద్వారా తత్వ విచారణలు, భాషా సంపద అభివృద్ధి చెందినప్పటికీ, దాని సామాజిక పరిమితులను విస్మరించలేం. జ్ఞానాన్ని సామాజిక ఆధిపత్యాన్ని నిలబెట్టే సాధనంగా ఉపయోగించిన చారిత్రక ఉదాహరణగా దీనిని చూడవచ్చు. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించడం భారతీయ విద్యా చరిత్రలో ఒక ప్రజాస్వామ్య మలుపు. గౌతమ బుద్ధుడు పుట్టుక ఆధారంగా వ్యక్తి విలువను నిర్ణయించే భావనను తిరస్కరించాడు. బౌద్ధ సంఘాలు విద్యా కేంద్రాలుగా పనిచేశాయి. నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు అంతర్జా తీయ ఖ్యాతిని సంపాదించాయి.సాధారణంగా క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు విస్తరించిన మధ్యయుగ కాలాన్ని కొందరు చీకటి యుగంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పటికీ, చారిత్రక వాస్త వాలు అంత సరళంగా ఉండవు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు ఉత్తర భారతదేశంలో అధికారాన్ని స్థాపించగా, దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం, ఇతర ప్రాంతీయ రాజ్యాలు తమ ప్రభావాన్ని కొనసాగించాయి. విద్య ప్రధానంగా మత సంస్థల ఆధ్వర్యంలో కొనసాగినప్పటికీ, జ్ఞానవ్యాప్తికి కొత్త మార్గాలు కూడా తెరుచుకున్నాయి. మధ్యయుగ భారతదేశంలో విద్య ప్రజలకు చేరువ కావడంలో భక్తి ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ప్రజాభాషలలో సాహిత్య సృష్టి వల్ల జ్ఞానం సంస్కృతం, పర్షియన్ భాషల పరిమితులను దాటి సామాన్య ప్రజలకు చేరువైంది.విద్య ప్రభుత్వ బాధ్యతబ్రిటిష్ పాలనకు ముందు దేశంలో స్థానిక విద్యా సంస్థలు విస్తృతంగా పనిచేశాయని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వీధిబడులు, పాఠశాలలు, గురుకులాలు, మక్తబ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యను అందించేవి. ధర్మపాల్ తన ప్రసిద్ధ గ్రంథం ‘ద బ్యూటిఫుల్ ట్రీ’లో మద్రాస్ ప్రెసిడెన్సీలో వేలాది స్థానిక పాఠశాలలు పనిచేస్తున్నట్లు బ్రిటిష్ అధికారుల నివేదికలను ఆధారంగా చూపించాడు. అయితే ఈ విద్యా వ్యవస్థలు అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో ఉన్నాయని చెప్పలేం. స్త్రీల విద్య అత్యంత పరిమిత స్థాయిలోనే ఉండేది.1600లో స్థాపించబడిన ఈస్టిండియా కంపెనీ ప్రారంభంలో పూర్తిగా వ్యాపార ప్రయోజనాలకే పరిమితమైంది. ప్లాసీ, బక్సర్ యుద్ధాల అనంతరం రాజకీయ అధికారాన్ని విస్తరించుకున్న కంపె నీకి పరిపాలన కోసం స్థానిక సిబ్బంది అవసరమైంది. 1813 చార్టర్ చట్టం ద్వారా మొదటిసారిగా భారతీయుల విద్యాభివృద్ధికి నిధులు కేటాయించబడ్డాయి. భారతీయుల విద్య పట్ల ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి అధికారిక చర్యగా దీనిని చూడవచ్చు. అయితే థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో సమర్పించిన తన నివేదికలో... రక్తంలో భారతీయులైనా, అభిరుచుల్లో ఆంగ్లేయులుగా ఉండే ఒక మధ్యవర్తి వర్గాన్ని తయారు చేయాలనే వ్యాఖ్య బ్రిటిష్ విద్యా విధాన స్వరూపాన్ని ప్రతిబింబించింది.1854లో వెలువడిన వుడ్స్ డిస్పాచ్ను భారతీయ విద్యకు ‘మాగ్నా కార్టా’గా అభివర్ణిస్తారు. విద్యా పరిపాలనకు వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించింది. ప్రతి ప్రావిన్స్లో విద్యాశాఖల ఏర్పాటు, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. ప్రాథమిక స్థాయిలో స్థానిక భాషలను, ఉన్నత విద్యలో ఆంగ్ల భాషను ఉపయో గించాలని సూచించడం ద్వారా భారతీయ విద్యా నిర్మాణానికి ద్వంద్వ స్వరూపాన్ని కల్పించింది. ఈ సిఫారసుల ఆధారంగా 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఈ దశలో రాజా రామమోహన్ రాయ్ సామాజిక సంస్కరణలకు విద్యే మార్గమని విశ్వసించాడు. జ్యోతిరావు ఫూలే దంపతులు అణగారిన వర్గాల కోసం పాఠశాలల్ని స్థాపించడం ద్వారా విద్యను సామాజిక న్యాయ ఉద్యమంగా మలిచారు. విద్య ప్రాథమిక హక్కుజాతీయోద్యమం నేపథ్యంలో బ్రిటిష్ విద్యా విధానానికి ప్రత్యా మ్నాయంగా జాతీయ విద్యా ఉద్యమం రూపుదిద్దుకుంది. 1906లో బెంగాల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించబడింది. ఈ కాలంలో గోపాలకృష్ణ గోఖలే ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య కోసం చేసిన కృషి గుర్తించదగినది. 1911లో ఇంపీరియల్ లెజి స్లేటివ్ కౌన్సిల్లో ఆయన ప్రవేశపెట్టిన బిల్లు తిరస్కరించబడినప్ప టికీ, విద్య ప్రతి బాలబాలిక హక్కు కావాలనే భావనను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చింది.ఇరవయ్యవ శతాబ్దంలో రవీంద్రనాథ్ టాగూర్, మహాత్మాగాంధీ, బి.ఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల విద్యా తత్వాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల ఒత్తిడితో, యాంత్రిక కంఠస్థంతో, సృజనాత్మకతను అణచివేసే విధానంతో నిజమైన విద్య సాధ్యం కాదని టాగూర్ భావించాడు. చేతి పని, మేధో వికాసం మధ్య సమన్వయం సాధించాలని గాంధీజీ భావించాడు. 1937లో ఆయన ప్రతిపాదించిన ‘నయీ తాలీం’ లేదా ‘బేసిక్ ఎడ్యుకేషన్’ ఈ భావజాలానికి ప్రతిరూపం. అంబేడ్కర్ విద్యకు మరింత విప్లవాత్మక అర్థాన్నిచ్చాడు. ‘అభ్యసించండి, సంఘటితమవండి, పోరాడండి’ అనే ఆయన పిలుపు కేవలం నినాదం కాదు; సామాజిక న్యాయ ఉద్యమానికి మార్గదర్శక సూత్రం. నేడు విద్యపై జరుగుతున్న చర్చలన్నింటికీ ఈ చరిత్ర ఒక అద్దంలా నిలుస్తుంది. విద్యను కేవలం మార్కులు, ర్యాంకులు, ఉద్యో గాలకే పరిమితం చేసే ధోరణి సమాజాన్ని సంకుచిత దిశగా నడిపి స్తుంది. ఒక దేశానికి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు ఎంత అవస రమో, ప్రశ్నించే పౌరులు, రాజ్యాంగ విలువలను గౌరవించే వ్యక్తులూ అంతే అవసరం. అలాంటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా వ్యవస్థపై ఉంటుంది.ప్రొ‘‘ కొండ నాగేశ్వర్వ్యాసకర్త డైరెక్టర్, సివిల్ సర్వీసెస్ అకాడమీ,ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ -
స్క్రీన్కు దూరం – లైఫ్కు దగ్గర!
2026 మార్చి 25న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీ యాంశమైంది. ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా, యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ ఒక యువతి మానసిక ఆరోగ్యానికి హాని కలిగించాయని జ్యూరీ నిర్ధారించింది. బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా న్యాయ నిపుణులు సోషల్ మీడియా యాప్స్ బయటకు వినోదం, సమాచారం, స్నేహాలు అందిస్తున్నట్టే కనిపించినా లోపల మాత్రం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే మొదటిసారి సోషల్ మీడియా వేదికలను ‘లోప భూయిష్టమైన ఉత్పత్తులు’గా గుర్తిస్తూ వచ్చిన తీర్పు కావడం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఈ కేసులో వాది అయిన కెలీ అనే యువతి చిన్న వయస్సులోనే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాడటం ప్రారంభించింది. ఇతరులతో తన రూపాన్ని పోల్చుకోవడం, బ్యూటీ ఫిల్టర్స్ వాడటం, లైక్స్, కామెంట్స్ కోసం ఎదురుచూడటం ఆమె మానసిక స్థితిని ప్రభావితం చేశాయి. చివరకు ఆమె డిప్రెషన్, ఆందోళన, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యలకు గురైంది. ‘నా జీవితంలోని అమూల్యమైన సంవత్సరాలు స్క్రీన్ వెనుక మాయ మయ్యాయి’ అన్న ఆమె మాటలు ఎందరినో ఆలోచనలో పడేశాయి.భారతదేశంలో 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా, 40 కోట్లకు పైగా సోషల్ మీడియా వేదికలను వాడుతున్నారు. ముఖ్యంగా 13 నుండి 24 ఏళ్ల మధ్య యువత రోజుకు అనేక గంటలు యాప్స్లో గడుపు తున్నారు. ఇందువల్ల నిద్రలేమి, ఆందోళన, సైబర్ బుల్లీయింగ్, బాడీ షేమింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు హెచ్చరి స్తున్నారు. పాఠాలపై శ్రద్ధ తగ్గడం, కుటుంబ సంబంధాలు దూరమవడం, అవుట్డోర్ ఆటలపై ఆసక్తి తగ్గడం వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. భారతదేశపు ‘ఎకనామిక్ సర్వే 2025–26’ నివేదిక పిల్లల్లో పెరుగు తున్న డిజిటల్ వ్యసనాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా వినియోగానికి తప్పనిసరి వయసు నిర్ధారణ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం కూడా ఆస్ట్రేలియా తరహాలో 18 ఏళ్ల లోపు వారికి వయస్సు ఆధారిత నియంత్రణలు పెట్టాలనీ, రాత్రి పూట సోషల్ మీడియా లాగిన్ అవ్వకుండా టైమ్–లిమిట్స్ పెట్టాలనీ యోచిస్తోంది.లాభాల కోసం రూపొందించిన అడిక్టివ్ టెక్నాలజీ ఇప్పుడు పిల్లల బాల్యాన్నీ, యువత మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ విధమైన సాంకేతికతను తిరస్కరించడం సాధ్యం కాక పోయినా, బాధ్యతాయుత వినియోగం అత్యవసరం. భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువతను పుస్తకాలు, క్రీడలు, సృజనాత్మకత, మానవ సంబంధాల వైపు మళ్లించాల్సిన సమయం వచ్చింది. – ఏటూరి సోమశేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
కోరికల తరంగాలు..
నదిలో ఇసుకలాంటివి కోరికలు. ఎంత తవ్వినా నదిలో ఇసుక తరిగిపోదు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కొత్తగా ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. అలాగే మనసులో కోరికలు తీరేవి తీరుతూంటే కొత్తవి పొటమరిస్తూంటాయి. అందుకనే మనసు కోరికల పుట్ట అని అన్నారు.ఈ కోరికలన్నీ తీరిన తర్వాత పరమార్థం విషయంలో ఆలోచిస్తాననే వాళ్ళున్నారు. అది జరిగే పనేనా? ‘తరంగ ప్రశమా దూర్ధ్వం స్నాస్యామీతి విమూఢతా’ సముద్రంలో తరంగాలన్నీ తగ్గి పోయిన తర్వాత స్నానం చేస్తాను అని అనటం మూఢత్వం కాక మరేమిటి?ఒక గురువుగారు తన శిష్యుణ్ణి సంసార తాపత్రయం నుంచి బయటపడేద్దామనే సత్సంకల్పంతో ఉపదేశం చేద్దామని పిలిచాడు. సంసారి అయిన ఆయన శిష్యుడు, గురువుకు దయకలిగి తనను ఉద్ధరించాలనుకొని ఉపదేశం చేస్తానన్నాడని సంతోషించటానికి బదులుగా ఈ బరువు ఇప్పటి నుంచీ ఎందుకు అను కున్నాడు. ‘అయ్యా! వచ్చే సంవత్సరం మా అమ్మాయి పెళ్ళి చేస్తాను. ఇప్పటినుంచి ఆ పెళ్ళి పనుల్లో సతమతమవు తున్నాను. మీరు ఉపదేశం చేసే మంత్రం అనుష్ఠానం చేసేందుకు సమయం దొరకదు కనుక పెళ్ళయిన తర్వాత ఉపదేశం తీసుకుంటాను. దయ జూపండి’ అన్నాడు. ‘సరే!’ అన్నారు గురువుగారు. ఇలాగే అప్పుడు ఇప్పడు అంటూ ఎన్నో సాకులు చెబుతూ చాలా సంవత్సరాలు గడిపాడు. ఎనభై సంవత్సరాల వయస్సు మీద పడింది.ఒకసారి గురువు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయనతోపాటు ఈ 80 ఏళ్ళ శిష్యుడు కూడా బయలు దేరాడు. ఆ రోజు కార్తీక పూర్ణిమ. ఇద్దరూ సముద్రానికి వెళ్ళారు. ముందు ఈ సంసారి శిష్యుడు సముద్ర స్నానం చేశాడు. గురువుగారు మాత్రం గట్టునే ఉన్నారు. ‘అయ్యా! ఎందుకు ఆలస్యం. మీరు కూడా స్నానం చేయండి వెళదాం’ అన్నాడు. ‘అలాగేనోయ్! ఈ తరంగాలు తగ్గిపోయిన తర్వాత చేయవచ్చులే అని ఆగాను’ అన్నారు గురువు.‘అయ్యా! మీరన్నది ఎప్పటికైనా జరిగేపనేనా? సముద్రంతో పాటే తరంగాలు పుట్టాయి గదా! అవెప్పుడు తగ్గుతాయి?’ అన్నాడు. ‘ఏమోయీ! నీ సంసార తాపత్రయాలు కూడా తరంగాల్లాగానే ఒకదాని వెనుక మరొకటి వస్తూన్నాయి. మరి నీవు నా ఉపదేశం ఎప్పుడు తీసుకుంటావు నాయనా?’ అని సూటిగా అడిగేసరికి తన తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడ్డాడు ఆ సంసారి శిష్యుడు. - శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఎవరు దేశ పౌరులు?
పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన దేశ పౌరసత్వం ఉన్నట్టు కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అది కేవలం ప్రయాణానికి సంబంధించిన పత్రమని చెప్పింది. ఇది దేశ ప్రజల్లో అలజడి, ఆందోళనలను రేపింది. దేశ పౌరుడిగా నిరూపించుకోవాలంటే, మరింకేమి పత్రాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు.మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 5–11, ఎవరు దేశ పౌరులో నిర్వచించాయి. రాజ్యాంగం అమలు నాటికి ఎవరు భారత పౌరులో, దేశ విభజన వలన ప్రభావితమైనవారికి కొన్ని షరతులకు లోబడి ఈ దేశ పౌరసత్వం పొందే అర్హతను నిర్వచించింది. భారత పార్ల మెంటుకు దేశ పౌరసత్వంపై చట్టం చేయడానికి ఆర్టికల్ 11 అధికార మిచ్చింది. ఆర్టికల్ 5 ప్రకారం, భారత్లో జన్మించినవారు లేక దేశంలో వారి తల్లిదండ్రులు జన్మించినా ఈ దేశ పౌరులే అని తెలిపింది.ఎవరు దేశ పౌరసత్వానికి అర్హులు అన్నది పౌరసత్వ చట్టం– 1955 నిర్దేశించింది. పౌరసత్వ చట్టంలోని 3, 4, 5, 6 సెక్షన్లు పౌర సత్వం ఏ విధంగా లభిస్తుందో నిర్వచించాయి. సెక్షన్ 3 ప్రకారం 1950 జనవరి 26 తరవాత, 1987 మధ్యన భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తికీ; 1987 జూలై 1 తరువాత భారతదేశంలో జన్మించి నవారి తల్లితండ్రులిద్దరూ భారతీయ పౌరులు అయితే లేక తల్లితండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులు, మరొకరు అక్రమంగా భారత దేశానికి వలస రాకుంటే వారికీ భారత పౌరసత్వం లభిస్తుంది. సెక్షన్ 4 ప్రకారం, భారతదేశంలో జన్మించకున్నా, తల్లి, తండ్రి ఈ దేశ పౌరులైతే వారికీ పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థి తుల్లో, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, న్యాచుర లైజేషన్ ద్వారా కూడా సెక్షన్ 5, 6 ప్రకారం పౌరసత్వం లభిస్తుంది.పాస్పోర్ట్కు ఎవరు అర్హులు? పాస్పోర్ట్ చట్టం–1967లో పాస్పోర్ట్ పొందడానికి ఎవరు అర్హులో పేర్కొనలేదు. అయితే, ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం, పాస్పోర్ట్ అధికారి, పాస్పోర్ట్ కోసం పెట్టుకున్న దరఖాస్తును కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తిరస్కరించాలి. దానిలో మొట్టమొద టిగా పేర్కొన్న కారణం, దరఖాస్తుదారు భారత పౌరుడు కాక పోవడం. అంటే చట్ట ప్రకారం భారత పౌరుడు కానివారికి భారత దేశ పాస్పోర్ట్ పొందే అర్హత లేదు.మరెందుకు భారత ప్రభుత్వం పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని చెప్తూ బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తున్నది? ‘మోతిమియా రహిమియా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో తాము భారతదేశంలోనే జన్మించామనీ, దానికి రుజువుగా పాస్పోర్ట్ను కోర్టులో సాక్ష్యంగా చూపి తమను భారత దేశం నుంచి పంపకుండా ఆదేశాలివ్వాలనీ కోరారు. బాంబే హైకోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ, ‘కేవలం వారిచ్చిన సమాచారంపై ఆధారపడి పాస్పోర్ట్ను ప్రభుత్వం ఇచ్చింది. కానీ వారుగానీ, వారి తల్లితండ్రులుగానీ ఈ దేశంలోనే జన్మించారని ఎలాంటి ఆధారం చూపలేదు’ అని పేర్కొంది.చట్టం ప్రకారం పాస్పోర్ట్ అధికారి, తప్పనిసరిగా దరఖాస్తు దారులు భారత పౌరులని నిర్ధారించుకున్న తరవాతనే పాస్పోర్ట్ ఇవ్వడానికి ఆమోదించాలి. పైన చెప్పినట్టుగా, ఎవరు భారత పౌరులో రాజ్యాంగం, పౌరసత్వ చట్టం–1955లో పొందుపరచ బడింది. ఒకవేళ, ఎవరైనా తప్పుడు సమాచారంతో పాస్పోర్ట్ పొందినా, సెక్షన్ 10 ప్రకారం దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంది. కాబట్టి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉటంకించి పాస్పోర్ట్ దేశ పౌర సత్వానికి రుజువు కాదని చెప్పడం రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ వక్రీకరించడమే.అంటే, కేవలం దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం పాస్పోర్టులు ఆమోదిస్తూ, దేశ భద్రతను పణంగా పెడుతు న్నారని భావించాలా? అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ... పాస్పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం. కాబట్టి, ప్రజలను ఈ విధంగా ప్రభుత్వమే తికమకపెట్టడం దారుణం. గతంలో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటివి కూడా పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కావని న్యాయస్థానాలు చెప్పాయి. మరి ఏ పత్రం దేశ పౌర సత్వానికి రుజువో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – కె.ఎస్. హరీశ్ కుమార్, ఏజీఎం (లా) రిటైర్డ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
మాటలు కోటలు... మారని చర్యలు
నేల అంటే కేవలం మట్టి కాదు. అది జీవం. అది చరిత్ర. అది రైతు జీవనా ధారం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన భారత్ సాయిల్ హెల్త్ పాలసీ– ‘స్వచ్ఛ మిట్టి, సమృద్ధ కిసాన్, సశక్త భారత్’ చదివినప్పుడు మనసులో ద్వైదీభావాలు ఏక కాలంలో కలుగుతాయి. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. మాటలు బాగున్నాయి. కానీ చర్యలకు దారేది?నేల ఏం చెప్తోందంటే...2015లో ప్రారంభమైన సాయిల్ హెల్త్ కార్డ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్డులు పంపిణీ చేశారు. ఈ గణాంకాలు చిన్న విషయం కాదు. కానీ ఆ కార్డుల్లో వచ్చిన డేటా మనల్నీ, మన వ్యవసాయ పద్ధతులనీ, ప్రభుత్వ విధానాల్నీ కదిలించాల్సింది. కానీ అది జరగలేదు. 89% నేలల్లో నత్రజని లోపం ఉంది. 80% నేలల్లో భాస్వరం తగ్గింది. 49% నేలల్లో జింక్ కరవైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు సగటున 2.5% ఉన్న సేంద్రియ కార్బన్ నేడు 0.3%కి పడిపోయింది. ఇది నేల చనిపోతున్న పరిస్థితులకు సంకేతం. అయినా పంటల సరళి, వ్యవసాయ పద్ధతులు మారలేదు. యూరియా వాడకం పెరుగుతూనే ఉంది. ఎరువుల సబ్సిడీ కొనసాగుతూనే ఉంది. నేల చెప్పింది వినే తత్వం లేకుండా పోయింది.ఇది డేటా వైఫల్యం కాదు, డేటా నుండి నేర్చుకోవటానికి నిరా కరించిన వ్యవస్థ వైఫల్యం. డేటా మాత్రమే మంచి నిర్ణయాలకు దారితీయదు. ఆ డేటాను అర్థం చేసుకునే జ్ఞానం, దానిపై చర్యలు తీసుకోవాలనే సంకల్పం కూడా అవసరం. కార్డు చేతికిచ్చారు, కానీ దాన్ని అమలుచేసే వ్యవస్థ మారలేదు. డీలర్లు అదే యూరియా అమ్ముతూనే ఉన్నారు. రుణం తీసుకోవాలంటే ఎరువులు కొనాల్సిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా స్థానాలు, సలహా ఇచ్చే విస్తరణ సేవలు అదే పాత పాట పాడుతున్నాయి. ఎక్కువేస్తే ఎక్కువ దిగుబడి భ్రమతెలంగాణాలో హెక్టారుకు 297 కిలోల ఎరువులు వేస్తున్నారు. జాతీయ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అయినా ఆ నేలల్లో సేంద్రియ కార్బన్ 0.3 నుంచి 0.8% మాత్రమే ఉంది. 90% నేలలు పోషకాల లోపంతో అల్లాడుతున్నాయి. పంటల దిగుబడి తగ్గి పోతోంది. ఎరువులు పెంచినా, ఎక్కువ మోతాదులో వేసినా దిగు బడి పెరగకుండా తగ్గుతోందని కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లో హెక్టారుకు 277 కిలోల ఎరువులు వాడతారు. పంజాబ్ కంటే కూడా ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో వరి సాగు ప్రాంతాల్లో మూడు–నాలుగు పోషకాల ఏకకాలిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ వైరుధ్యం ఇదే. నీటి పారుదల పెరిగింది, ఎరువుల వాడకం పెరిగింది, అయినా దిగుబడులు పెరగలేదు, రైతు రుణభారం తగ్గలేదు, భూములు పాడయ్యాయి.అసలు సమస్య ఎరువుల పరిమాణం కాదు – ఏకపంట వ్యవ సాయం. వరి–వరి లేకపోతే పత్తి. ఏకపంట వ్యవసాయం ఒకే నేల పొరలోని పోషకాలను పంట కాలం తర్వాత పంట కాలం పీల్చేస్తుంది. పంట వైవిధ్యం లేదు. సేంద్రియ పదార్థం తిరిగి నేలకు చేరడం లేదు. దానిపైన ఎక్కువ రసాయనిక ఎరువులు వాడబట్టి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నాశనమవుతాయి. అవి లేకుండా, ఎంత ఎరువు వేసినా పంటకు అందడం లేదు. అది వృథాగా నీళ్లల్లో కరిగి బయటకు పోతుంది. భూగర్భ జలాలు కలుషితమవుతాయి.‘వెనుకబడ్డ’ రాష్ట్రాలు ఎందుకు ముందున్నాయి?నాగాలాండ్, మిజోరం వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు 5 కిలోల కంటే తక్కువ ఎరువులు వాడతారు. అయినా వాటి నేల ఆరోగ్యం పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల కంటే మెరుగ్గా ఉంది. ఈ నేలలు ‘వెనుకబడ్డవి’ కావు. అవి ఇంకా బతికి ఉన్నాయి. కానీ సాయిల్ హెల్త్ పాలసీ ప్రకటిస్తున్న పీఎం–ప్రణామ్, కార్బన్ క్రెడిట్స్ వంటి పథకాలన్నీ ఎరువులు తగ్గించిన రైతుకు సహకారం అందించే విధానాలు. కానీ ఎప్పుడూ ఎరువులు వాడని, భూమిని కాపాడుకొంటున్న నాగాలాండ్ రైతుకు ఏమి దక్కుతుంది? తగ్గించడానికి అతడి దగ్గర పాత బేస్లైన్(ఆధార రేఖ) లేదు కాబట్టి ఏ పథకమూ వర్తించదు. ఈ సాధనాలు చెడ్డ స్థాయి నుండి బయట పడేవారికి బహుమానం ఇస్తాయి; ఆ చెడ్డ స్థాయికి అసలు ఎప్పుడూ వెళ్లని వారికి ఏమీ అందదు. ఇది తీవ్రమైన వైరుధ్యం. పరివర్తన ఆర్థిక వ్యవస్థ వేరు,సంరక్షణ ఆర్థిక వ్యవస్థ వేరు. మంచి నేలలు ఉన్న చోట వాటిని కాపాడే విధానం కావాలి. మారమని ప్రోత్సాహం కాదు. లేకుంటే మార్కెట్ శక్తులు ఆ నేలలను కూడా రసాయన సాగులోకి లాగుతాయి. భారత్ సాయిల్ హెల్త్ పాలసీ పరివర్తన, సంరక్షణ – ఈ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను నిర్మించాలి. మాటలు మారితే చర్యలూ మారాలి!కొత్త పాలసీలో మంచి భావనలున్నాయి. నేలను జాతీయ సంపదగా గుర్తించడం, జీవ సూచికలను పర్యవేక్షించడం, రైతులను నేల సంరక్షకులుగా గౌరవించడం. కానీ ఈ పాలసీ నిజంగా అమలు కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు.ఎరువుల సబ్సిడీ విధానంలో సంస్కరణలు జరగాలి. రసాయనిక ఎరువులకుగాక నేల సంరక్షణకూ, నేల ఆరోగ్యం కాపాడటానికీ సబ్సిడీలు ఇవ్వాలి. వరి–గోధుమ ఆధిపత్యాన్ని తగ్గించాలి. పప్పు ధాన్యాలు, నూనెగింజలకు మద్దతు ధరలు, కొనుగోలు హామీలు ఇవ్వాలి. రైతు సంస్థలు, ఎఫ్పీఓ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనై జేషన్)లు కేవలం అమలు యంత్రాంగంగా కాకుండా, జవాబుదారీ తనంలో భాగం కావాలి. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్) ధ్రువీకరణ వ్యవస్థలు పాలసీలో భాగం కావాలి. డేటా తయారు చేయడం సులభం. డాష్బోర్డులు పెట్టడం ఇంకా సులభం. కానీ డేటా చెప్పింది వినాలంటే, వ్యవస్థ మారాలనే సంకల్పం కావాలి. ఆ సంకల్పమే ఇప్పుడు లేనిది. నేల పరీక్ష చేయించాం. నేల ఏం చెప్తుందో తెలుసు. ఇక మనం ఏం చేస్తామో చూడాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
యుద్ధ పాఠాలు పెద్దవే!
పాఠాలు ఏ యుద్ధానికైనా ఉంటాయి. కొన్నింటికి అసాధారణంగా, బహుముఖాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఇరాన్ యుద్ధం ఒకటి. యుద్ధంలో ప్రత్యక్ష పాత్రధారులు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలకు చోటి చ్చిన కొన్ని గల్ఫ్ రాజ్యాలు అందు బాటులో అసంకల్పిత భాగస్వాముల య్యాయి. పరోక్షంగా మొత్తం ప్రపంచానికి పాత్ర ఏర్పడింది. ఏదో విధమైన కష్టనష్టాలు అందరికీ కలిగాయి. గెలిచినవారు ఎవరూ లేరు. పాఠాలు మాత్రం అందరికీ ఉన్నాయి.కళ్లముందున్న చరిత్రకేవలం సైనిక బలాన్ని నమ్మి, తమది సాటిలేని శక్తి అంటూ అహంకరించి, ప్రత్యర్థిని సరిగా అంచనా వేయకుండా దాడికి పాల్ప డటం ఓటమికి దారి తీస్తుంద న్నది అమెరికాకు మొదటి పెద్దపాఠం. అమెరికా సైనిక బలం మొత్తం ప్రపంచంలోనే సాటి లేనిదన్నది నిర్వివాదాంశం. కానీ అసమానుల మధ్య అసమతుల యుద్ధ వ్యూహాలు ఉంటాయన్నది కొత్తగా తెలుసుకోవలసిన విషయం కాదు. స్వయంగా అమెరికా మొదట వియత్నాంలో (1975)లో నేర్చింది. అఫ్గానిస్తాన్లోనైతే అదే పాఠాన్ని బ్రిటన్ (1839–1919), రష్యా (1979–89), అమెరికా (2001–21)లు వరుసగా నేర్చాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కూడా అటువంటి రూపానికే మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి అనుభవాలు ఉండి కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జాగ్రత్తగా ఆలోచించిన తన సలహాదారులు కొందరు వద్దని వారించినా, చివరకు ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ విముఖత చూపినా పెడచెవిన పెట్టి ఇరాన్పై దాడులకు దిగారు. తమపై యుద్ధం ఎప్పటికైనా జరుగుతుందని అంచనా వేసిన ఇరాన్ సుమారు 20 సంవత్సరాలుగా తన రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నదనీ, 2025 జూన్ నాటి 12 రోజుల యుద్ధం తర్వాత ఆ ఏర్పాట్లను ముమ్మరం చేసిందనీ, ప్రస్తుత యుద్ధానికన్నా ముందే అమెరికన్ సైనిక నిపుణులు, బయటి నిపుణులు ట్రంప్ను హెచ్చరించారు. ఇదేమీ చాలదనుకుంటే, ఒకవేళ తమపై యుద్ధానికి దిగి నట్లయితే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయగల శక్తి తమకుందని ఇరాన్ పదేపదే హెచ్చరించింది. తాము స్వయంగా హార్మూజ్ను మూసి వేయటమేగాక, తమ మిత్రులు హౌతీలతో బాబ్ అల్ మందేల్ను మూసివేయించగలమని స్పష్టం చేసింది. ఇరాన్కు రష్యా, చైనాల సాంకేతిక సహాయాలు ఉండటమూ తెలిసిందే.అయినా ఎందుకు?మొత్తం పరిస్థితులు ఈ విధంగా ఉండగా దాడులకు సమ కట్టడమేగాక, ఇరాన్లో తమ లక్ష్యం వెనిజులాలో వలె కనుమూసి తెరిచేలోగా నెరవేరిపోతుందని అంచనా వేయటం ఎంత పెద్ద తప్పో అమెరికా, ఇజ్రాయెల్లకు అర్థమయేందుకు ఎక్కువ రోజులు పట్ట లేదు. అది సైనికపరమైన పాఠం కాగా, రాజకీయమైనది కూడా కొద్ది రోజులలోనే తెలిసి వచ్చింది. వారు భ్రమపడినట్లు, ఖొమైనీని హత్య చేయటంతో ఇరానియన్ వ్యవస్థ రాజకీయంగా కుప్పకూలి, తమకు అనుకూలమైన శక్తులేవో అధికారాన్ని చేజిక్కించుకోవటం, ప్రజలు ఇస్లామిక్ వ్యవస్థపై తిరుగుబాటు చేయటం వంటివేవీ జరగలేదు. ఇవేవీ జరగకపోగా ఇరానియన్లు దేశ భక్తితో ఒకటయ్యారు. ఇరాన్తో అమెరికాది దశాబ్దాల అనుభవం. ఇరాన్లో ఇస్లామిక్ రివల్యూషన్ (1979) తర్వాత అక్కడి అధినాయకత్వం తమ రాజకీయ, సైనిక వ్యవస్థలను ప్రాంతాల వారీగా వికేంద్రీకరించి స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటూ, మొత్తం మీద కేంద్రాధికార ఉత్తర్వుల ప్రకారం వ్యవహరించేట్లు నిర్మించిన విషయం అమెరికాకు తెలియదనుకోలేము.ఇన్నిన్ని ఉన్నా దాడులు చేయటమేగాక, అంతా క్షణాలలో తేలి పోతుందనుకోవటానికి కారణాలు రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇరాన్ చమురుపై దశాబ్దాలుగా కన్ను వేసిన అమెరికా, గత జనవరిలో వెనిజులా చమురును స్వాధీనపరచుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్వైపు కదలటం. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు డాలర్ కరెన్సీ విలువ బహుళ ధ్రువ ప్రపంచం వల్ల బలహీనపడు తుండటంతో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యం కోసం ఇదంతా చేయటం. రెండవది, ఎట్టి పరిస్థితులలోనూ పాలస్తీనా సృష్టిని ఆపి, గ్రేటర్ ఇజ్రాయెల్ను స్థాపించాలన్న నెతన్యాహూ ఒత్తిడికి లొంగిపోవటం. చివరకు అసమాన యుద్ధమే గెలిచింది.వంద రోజుల యుద్ధం తర్వాత అంతే పెద్ద రాజకీయ పాఠాలు న్నాయి. నాటో దేశాలు సహా ఏ ఒక్కరూ ట్రంప్ నోరు తెరిచి అడిగినా తోడు నిలవక పోవటం. 1949లో నాటో ఏర్పడిన తర్వాత గత 77 సంవత్సరాలలోనే ఎప్పుడూ ఇట్లాంటి తిరస్కరణ అమె రికాకు ఎదురు కాకపోవటం పాఠం కన్నా పరాభవమనాలి. తను నెగ్గలేక ఇరాన్తో రాజీకి ప్రయత్నిస్తున్న దశలో అందుకు ఆటంకాలు సృష్టిస్తున్న నెతన్యాహూను ఆయన, ‘నువ్వు ప్రపంచంలో ఏకాకి వయా’వంటూ హెచ్చరించారుగానీ, వాస్తవానికి వారిద్దరూ ఒంటరి అయ్యారు. ట్యారిఫ్లతో మొదలై ఒకటి వెంట ఒకటిగా సాగుతూ వస్తున్న ఈ విధమైన పరిణామాలతో యూరప్, ఆసియాలలోని మిత్రులు తమ దారి తాము నెమ్మదిగా వెతుక్కుంటుండగా, చైనా, రష్యాల ప్రాబల్యం పెరగటం, వర్ధమాన ప్రపంచానికి అమెరికా పట్ల భక్తి, భయం రెండూ తగ్గుతుండటం మరో ముఖ్యమైన పాఠం. సమీక్షించుకోవాల్సిన వైఖరులుఇజ్రాయెల్ విషయానికి వస్తే, 1948లో ఒక దేశంగా సృష్టి అయినప్పటి నుంచి ప్రస్తుత యుద్ధం వరకు 68 సంవత్సరాలలో వారికి ఇంత ఎదురుదెబ్బ తగలలేదు. ఇజ్రాయెలీ సైన్యం అతిశక్తి మంతమైనదే అయినా, వారి ఐరన్ డోమ్ దుర్భేద్యమన్న పేరుండినా, ఇరాన్ అసమతల యుద్ధ వ్యూహాలను అది కూడా తట్టుకోలేక పోయింది. కనుక ఇక్కడినుంచి వారు చేయవలసింది మొదట పాల స్తీనాను ఏర్పాటు కానివ్వటం, తర్వాత గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని వదిలి వేయటం. ఇరాన్కు గల ఒకే ఒక పాఠం ఒక స్థాయిలో అత్యద్భుతంగా పోరాడి నిలిచినా, తగు ప్రజాస్వామిక సంస్కరణ లతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవటం.గల్ఫ్ రాజ్యాల గురించి చెప్పుకోవాలంటే, వారు తమ ఇరాన్ వ్యతిరేకత, పాలస్తీనా అంశం పట్ల కపట వైఖరి, అమెరికా ఇజ్రా యెల్ ప్రేమ, వారిచ్చే రక్షణ పేరిట ఆ కూటమిలో బందీలుగా ఉండ టమనే విధానాలను సవరించుకోవలసి ఉంటుంది. గత విధానాల వల్ల కలిగే కష్ట నష్టాలు వారికిపుడు బాగానే అర్థమయినట్లు కనిపిస్తు న్నది. ఇక ఇండియా సహా వర్ధమాన దేశాలకు అమెరికా నిర్హేతుక మైన విధానాల వల్ల ఎదురయ్యే సమస్యలేమిటో ట్యారిఫ్లు, వాణిజ్య ఒప్పంద విషయాల నుంచి యూరప్ వలెనే తమకూ అనుభవంలోకి వస్తున్న విషయమే. అవే విధానాలతో ఈ యుద్ధాన్ని ప్రత్యక్షంగా ఇరాన్పై, పరోక్షంగా మొత్తం ప్రపంచంపై రుద్దినందువల్ల కలుగుతున్న నష్టాలు తెలిసి వచ్చినందున, భవిష్యత్తులో ఇంధనం కావచ్చు, రాజకీయ వైఖరులు కావచ్చు, తాము మరింత స్వతంత్రంగా, స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవటమన్నది వారికి గల పాఠం.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
యువతకు స్ఫూర్తిప్రదాత
డాక్టర్ బి.సి.రాయ్గా సుపరిచితులైన బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న నేటి బిహార్లోని బాంకీపూర్లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్దాస్ కరమ్ చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్ అతలాకుతలమవుతోంది. రాయ్ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్ అవివా హితులు. తన ఇంటిని తల్లి అఘొర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్, ఐ.ఎం.ఎ. నేషనల్ కౌన్సిల్ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం) -
అన్నదాతలకు అభయహస్తం
సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్ 30న ఖరీఫ్ సీజన్కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్ వేదికగా ‘రైతు డిక్లరేషన్’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.నిధులు దుర్వినియోగం కాకుండా...అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్ఎస్ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్ సర్కార్ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్ డిక్లరేషన్’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.- బి. మహేశ్ కుమార్ గౌడ్, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
విశ్రాంత స్వాంతుడు..
దీపం ఉన్నచోట వెలుగు ఉన్నట్లుగా, ఒక పువ్వు ఉన్న ప్రదేశం మనసును ఆహ్లాదపరచే సుగంధంతో నిండి ఉన్నట్లుగా, సూర్యుడు ఉంటే అది పగలై ఉన్నట్లుగా, చిత్తము, చేతన జాగ్రదావస్థలో ఉంటే సమస్త ప్రపంచము ఉత్తేజితమై ఉంటుంది. రత్నము తన నైజగుణంగా ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో, ప్రపంచంలో ప్రకృతి సిద్ధములు, మానవ నిర్మితములు అయినట్టి వివిధ వస్తు సముదాయములు అన్నీ ఏ ప్రయత్నమూ లేకుండానే ఎలా దృష్టి గోచరములు అవుతాయో, ఆ విధముగానే కేవలం అణుమాత్రమైన పరమాత్మునిలో జగములన్నియు నిండి ఉండి సంచరిస్తూ ఉంటాయి.మనిషి అనుభవించే సుఖానికైనా, దుఃఖానికైనా ఆ మనిషి మనసులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను తగిన విధంగా కట్టడి చేసి అదుపులో పెట్టుకోకుంటే కొండంతగా ధనమున్నా, కోట్లకు పడగలెత్తిన మిత్రులు ఎంత మంది ఉన్నా, ఎన్ని తీర్థయాత్రలు చేసి ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసి శరీరాన్ని కష్ట పెట్టుకున్నా, మనశ్శాంతి మాత్రం కరవైనదిగానే మిగులుతుంది.కం. సంతోషము సుఖతరమగు, /సంతోషము నిత్యమోక్షసంప్రాప్తి యగున్, సంతుష్టుండెందును వి / శ్రాంతస్వాంతుండు, రామ సౌజన్యనిధీ!మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాలకు మూలం. ప్రయత్నం చేసి మనసుని దుఃఖం వైపునకు మరలకుండా చేయడాన్ని సాధించాలి. అనవసరమైన దిగులుని దరిచేరనీయకుండా చూసుకుంటూ, మనసును ఆనందంగా ఉంచుకోవడం వలన సుఖశాంతులు దక్కుతాయి. విశ్రాంత స్వాంతుడు మోక్షప్రాప్తికి దగ్గరివాడౌ తాడు– అని మడికి సింగన రచించిన ‘వాసిష్ఠ రామాయణము’, ప్రథమాశ్వాసములోని పై పద్యంలో చెప్పబడిన మాటలు వెలలేనివి. మానసిక ప్రశాంతతను కోరుకునే మనుషులకు అవి బహుదా ఆచరణీయములైనట్టివి. – భట్టు వెంకటరావు -
నిధులిస్తారా లేక నీళ్లు నములుతారా?
దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు గత రెండు దశాబ్దాలుగా కనీస జీవన భద్రతగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీనరేగా)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జూలై 1 నుండి ‘వీబీ జీ రామ్ జీ’ని అమల్లోకి తేవడానికి సంబంధించిన నిబంధనలను రూపొందించింది. 55కు పైగా ప్రధాన క్లాజులు, రూల్స్, వందలాది ఉప నిబంధనలు, కొత్త పరిపాలనా నిర్మాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థ ఉపాధి హామీని బలోపేతం చేయడానికి కాదు; దాని హక్కు ఆధారిత స్వభావాన్ని పూర్తిగా బలహీనపరచడానికే ఉద్దేశించబడింది. ఉపాధి హామీ కాదు, నిరుద్యోగ హామీ ఇది. చెట్టును నరికి నీడ ఇస్తామని చెప్పడం ఎంత మోసమో, ‘ఎంజీనరేగా’ను నిర్వీర్యం చేసి 125 రోజుల ఉపాధి హామీ ఇస్తామని చెప్పడం అంతే మోసం. లెక్కలు చెప్పే నిజాలుకేంద్ర ప్రభుత్వం 100 రోజుల బదులు 125 రోజుల ఉపాధి హామీ ఇస్తున్నామని ప్రచారం చేస్తోంది. కానీ ఏ ఉపాధి పథకం అయినా హామీలపై కాదు, నిధులపై నిలబడుతుంది. ఇక్కడే మొదటి వైరుధ్యం కనిపిస్తుంది. 125 రోజుల ఉపాధి కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకానికి కేవలం రూ. 95,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ కేటాయింపు 125 రోజుల ఉపాధికి ఏమాత్రం సరిపోదని రాష్ట్రాలవారీ పని దినాల గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం గత సంవత్సరం కేరళలో సగటు పనిదినాలు 57.81, తెలంగాణలో 50.24, తమిళనాడులో 48.54, పశ్చిమ బెంగాల్లో 44.12, ఆంధ్రప్రదేశ్లో 42.35 మాత్రమే ఉన్నాయి. బిహార్లో 30.94, ఉత్తరప్రదేశ్లో 27.50, మధ్యప్రదేశ్లో 25.66, మహారాష్ట్రలో 14.40, హరియాణాలో 13.78 రోజులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం 15 నుంచి 50 రోజుల పని కూడా పూర్తిగా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం 95 వేల కోట్లతో ఒక్కసారిగా 125 రోజుల ఉపాధి ఎలా కల్పిస్తుంది?ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయించి 17 ప్రధాన రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే 7 కోట్ల 69 లక్షల 65 వేల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు 125 రోజుల ఉపాధి హామీని అమలు చేయడానికి మొత్తం రూ. 3.61 లక్షల కోట్ల వ్యయం అవసరం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేటాయింపు ఈ రాష్ట్రాలకు 85,605 కోట్లు మాత్రమే. రాష్ట్రాల 40 శాతం వాటా 57,071 కోట్లు కలిపినా మొత్తం అందుబాటులో ఉండే నిధులు 1.43 లక్షల కోట్లే. ఈ నిధులతో సంవత్సరంలో సగటున 48.5 పని దినాలే ఇవ్వగలరు. కేంద్రం కేటాయించిన నిధులు తప్ప అదనంగా పైసా నిధులు ఇవ్వబోమని రూల్స్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే, ఈ లోటును భర్తీ చేయడానికి రాష్ట్రాలే అదనంగా 2.18 లక్షల కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. అంటే 30 శాతం వాటా కేంద్రం, 70 శాతం వాటా రాష్ట్రాలు ఖర్చు చేయాలి. తెలుగు రాష్ట్రాల తీరుఆంధ్రప్రదేశ్లో 54.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదిందిన 7,707 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 71 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధి కల్పించాలంటే 22,746 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 15,039 కోట్ల అదనపు భారం పడుతుంది. తెలంగాణలో 30.99 లక్షల యాక్టివ్ జాబ్ కార్డులు ఉన్నాయి. కేంద్రం కేటాయించిన 3,825 కోట్లతో ఒక్కో కార్డుకు సగటున 62 పనిదినాలు మాత్రమే కల్పించవచ్చు. 125 రోజుల ఉపాధికి 12,819 కోట్లు అవసరం కాగా, రాష్ట్రంపై 8,993 కోట్ల అదనపు భారం పడు తుంది. ఈ లెక్కలు ఒక స్పష్టమైన రాజకీయ సత్యాన్ని బయటపెడు తున్నాయి. హామీ కేంద్రానిది, ప్రచారం కేంద్రానిది, ఖర్చు రాష్ట్రా లది. నియంత్రణ మోదీ గారిది, విఫలమైతే నింద రాష్ట్రాలది. ‘పెళ్లి పెద్దలు చేసుకున్నారు – కట్నం మాత్రం రాష్ట్రాలు పెట్టాలి’ అన్న ట్టుగా ఈ వ్యవస్థ రూపొందుతోంది. ఇక్కడ ఒక పాత సామెత గుర్తుకు వస్తుంది: ‘ఎద్దు ఇస్తానని చెప్పి తాడు చేతిలో పెట్టినట్టు’. రాష్ట్ర ప్రభుత్వలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సాధ్యమా? అంతిమంగా నష్టపోయేది ఉపాధి కార్మికులే. పేరు కాదు, తత్వమే మారింది!డ్రాఫ్ట్ రూల్స్లోని రూల్ 3 చెల్లింపులు, బ్యాంకు మరియు పోస్టాఫీస్ ఖాతాల ద్వారా వేతనాల చెల్లింపును ప్రస్తావిస్తుంది. కానీ కార్మికుడి హక్కుల రక్షణపై స్పష్టత కనిపించదు. వేతనాలు ఆలస్య మైతే బాధ్యత ఎవరిది? నిరుద్యోగభృతి చెల్లించకపోతే బాధ్యులపై చర్య ఏమిటి? వంటి ప్రశ్నలకు రూల్స్లో స్పష్టమైన సమాధానం లేదు. కార్మికుడి హక్కు కేంద్ర బిందువుగా ఉండాల్సిన చోట పరిపా లనా ప్రక్రియ కేంద్ర బిందువుగా మారుతోంది. అత్యంత ప్రమాదకరమైన మార్పు రూల్ 4లో కనిపిస్తుంది. రూల్ 4(2)లోని నార్మటివ్ అలోకేషన్ విధానం ఎంజీ నరేగా అసలు తత్వాన్నే మార్చేస్తోంది. ఎంజీనరేగా ప్రాథమిక సూత్రం ‘పని అడిగితే పని ఇవ్వాలి.’ పని డిమాండ్ ఉంటే ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ కొత్త విధానం పని హక్కును బడ్జెట్ పరిమితికి కట్టిపడేస్తోంది. అంటే ఇప్పుడు నిధులు ఉంటేనే పని. హక్కు నుండి కోటాకు మార్పు. చట్టబద్ధ హామీ నుండి బడ్జెట్ పరిమితికి మార్పు. పౌరుని హక్కు నుండి అధికారుల విచక్షణకు మార్పు. ‘బావి ఎండి పోయాక మోటారు పెంచినట్టు’ 125 రోజుల హామీ ఉంది.ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించా రన్న ప్రశ్నకూ సమాధానం దొరుకుతుంది. గాంధీ పేరు గ్రామ స్వరాజ్యం, వికేంద్రీకరణ, గ్రామసభల పాత్ర వంటి భావనలకు ప్రతీక. కానీ కొత్త వ్యవస్థలో గ్రామ సభలు బలహీనపడుతున్నాయి. అందుకే ‘ముందు బోర్డు మార్చారు – ఇప్పుడు భవనం కూల్చేస్తున్నారు.’ ఇది పేరు మార్పు కాదు. తత్వ మార్పు. డ్రాఫ్ట్ రూల్స్లోని డిజిటల్ నిబంధనలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ–కేవైసీ, ఫేస్ అథెంటికేషన్, ఎన్ఎంఎన్ఎస్, ఆధార్ అథెంటికేషన్ వంటి విధానాలను ఆధునికీకరణ పేరుతో ప్రవేశపెడుతున్నారు. కానీ గ్రామీణ పేద కార్మికుల అను భవం వేరే కథ చెబుతోంది. నెట్వర్క్ లేకపోతే పని లేదు. వేలి ముద్ర పడకపోతే వేతనం లేదు. అంటే పని హక్కు కార్మికుడి చేతిలో లేదు. సాంకేతిక వ్యవస్థల చేతిలో ఉంది.ఎంజీనరేగా గ్రామీణ కార్మికుడికి కనీస భద్రతను ఇస్తుంది. వేతనాలపై ఒక కనీస ప్రమాణాన్ని సృష్టిస్తుంది. ఆకలి, నిరుద్యో గాన్ని కొంతమేర నియంత్రిస్తుంది. అందుకే దేశంలోని వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, వ్యవసాయ, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు విశాల ఐక్య వేదికలను నిర్మించి ఈ దాడిని తిప్పికొట్టాలి. వీబీ జీ రామ్ జీని ఉపసంహరించాలి. 200 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ కల్పించాలి. పూర్తి కేంద్ర నిధులు విడుదల చేయాలి. గ్రామ సభలు, పంచాయతీల అధికారాలను బలోపేతం చేయాలి.బి. వెంకట్వ్యాసకర్త అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి -
మహోన్నత శిఖరాలు
వారికి వారే సాటి. వారిద్దరినీ క్రీస్తు ప్రధాన శిష్యులుగా చెప్పుకోవడం పరిపాటి. ఇద్దరూ ఇద్దరే! సౌవార్తిక సేవలో మహోన్నత శిఖరాలు! క్రీస్తు తన వారసులుగా ఎన్నుకున్న ప్రధాన వ్యక్తులు. ఒకరు క్రీస్తు మొదటి శిష్యుడు పేతురు. మరొకరు క్రీస్తుకు ప్రత్యేక శిష్యుడు పౌలు! ఇద్దరూ జైలు జీవితం అనుభవించారు. సంఘానికీ, వ్యక్తులు మారడానికీ పత్రికలు రాశారు.పేతురు సముద్ర తీర వాసి, ఒక జాలరి. పౌలు రోమన్ సామ్రాజ్య ఉద్యోగి, ఒక సైనికుడు. పేతురు ‘నన్ను వెంబడించు’ అని పిలువబడి సిలువ వరకు వెళ్ళాడు. పౌలు ‘నా నామం కోసం శ్రమపడాలి’ అని పిలువబడితల ఇచ్చాడు. ఒకరు క్రీస్తుచే యాదృచ్ఛికంగా ఆహ్వానితుడైనవాడు. మరొకరు క్రీస్తుచే అదృశ్యకంగా కొట్టబడి ప్రశ్నింప బడినవాడు. ఒకరు ఇజ్రాయేలీయ దేశ స్వస్థలీయుడు. మరొకరు ఇరాన్ దేశం నుంచి వచ్చి స్థిరపడినవాడు.ఒకరు నిరక్షర కుక్షి. మరొకరు విద్యా బుద్ధులు బాగా నేర్చినవాడు. ఒకరు పన్నెండు మంది శిష్యుల్లో జ్యేష్ఠుడు. మరొకరు సువార్త అందించ పంపబడ్డ అపోస్తులుడు. ఒకరు క్రీస్తుతోపాటు సుఖ దుఃఖాల్లో కలిసి తిరిగాడు. మరొకరు క్రీస్తును చూడలేదు. ఆయన గురించి విన్నాడు. ఒకరు క్రీస్తు స్థాపించిన సంఘానికి మూల రాయిలాంటి వాడు. మరొకరు ఆ మూలరాతిని కరిగించి సారం అందించిన వాడు. పేతురు రాసిన పత్రికలు రెండు. పౌలు రాసిన పత్రికలు పదమూడు. ఇద్దరూ యేసు కోసం ప్రాణం పెట్టి, హతసాక్షులుగా రోమ్లో చనిపోయినవారే. ఇద్దరూ క్రీస్తు సువార్తా ప్రకటనకు మూలస్తంభాల్లా నిలిచినవారే! – డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (జూన్ 29న పునీత పేతురు – పౌల్ మహోత్సవం) -
ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి!
ప్రశ్నించే పౌరులు... అనుసరించే జనసమూహంగా మారుతున్న నేటి సామాజిక పరిణామం ఆందోళనకరం. నేటి భారత రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కేవలం ఎన్నికల ఫలితాలను చూడటం సరిపోదు. అసలు మార్పు అధికార కేంద్రీకరణలో మాత్రమే లేదు; సమాజపు ఆలోచనా నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక సంస్కృతి కొంతవరకు కనిపించేది. ఇప్పుడు మాత్రం ‘ఏం అడగాలి?’, ‘ఏం అడగకూడదు?’ అన్న అప్రకటిత నియమాలే సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం.దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్య–వైద్య రంగాల అసమానతలు, కుల హింస వంటి అనేక సమస్యలు ముదురుతున్నప్పటికీ, ప్రజా చర్చల కేంద్రంలో అవి కనిపించడం తగ్గుతోంది. వాటి స్థానంలో యోగా దినోత్సవాలు, భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ గర్వ నినాదాలు ముందుకు వస్తున్నాయి. యోగ సాధనపై ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ప్రశ్న యోగాపై కాదు. యోగాను ఎవరు, ఎలా, ఏ రాజకీయ సందర్భంలో వినియోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ప్రజా సమస్యలపై చర్చ తగ్గిపోతూ, ప్రతీకల చుట్టూ సమాజం తిరుగు తుంటే దానిని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిందే.ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక దీర్ఘకాలిక భావజాల విస్తరణ ఉంది. పాలక వర్గాలు తమ భావజాల సంబంధాలను విద్య, మీడియా, మత–సాంస్కృతిక వేదికలు, ప్రచార యంత్రాంగం ద్వారా విస్తృతం చేశాయి. ఫలితంగా రాజకీయ ఆధిపత్యం క్రమంగా భావజాల ఆధిపత్యంగా మారింది. అధికా రాన్ని నిలబెట్టేది కేవలం రాజ్య యంత్రాంగం కాదు; సమాజంలో ‘ఇదే సహజం’, ‘ఇదే దేశహితం’ అనే అంగీకార వాతావరణాన్ని నిర్మించడమే.భయం నుంచి పుట్టే అనుచరత్వం ఒకటì , నమ్మకం నుంచి పుట్టే అనుచరత్వం మరొకటి. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. రాజ్యం అణచివేత భయాన్ని సృష్టిస్తే, భావజాల యంత్రాంగం నమ్మకాన్ని తయారుచేస్తోంది. ఈ రెండు శక్తులూ కలిసి పౌరుడిని అనుచరుడిగా మారుస్తున్నాయి.ఇక్కడే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాద శక్తులు, దళిత, బీసీ, ఎస్టీ ఉద్యమాల వైఫల్యం స్పష్టమవుతోంది. ఒకప్పుడు సామాజిక న్యాయం, కుల ఆధిపత్యం, వర్గ అసమాన తలు, హక్కుల రాజకీయాలపై ప్రత్యామ్నాయ చర్చను నిర్మించిన ఈ శక్తులు ఇప్పుడు విభజితంగా, రక్షణాత్మకంగా కనిపిస్తున్నాయి. వీరి వైఫల్యం కేవలం సంస్థాగత బలహీనత కాదు, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సమాజంలో విస్తరించడంలో వచ్చిన పరాజయం.నేటి ప్రధాన సవాలు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. భావ జాల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ సామాజిక–రాజ కీయ చైతన్యాన్ని నిర్మించడం. పౌర సమాజం, ప్రజాస్వామ్య వాదులు, దళిత–బీసీ–ఎస్టీ శక్తులు, వామపక్ష ఉద్యమాలు తమ వైఫ ల్యాన్ని నిజాయితీగా సమీక్షించి కొత్త ప్రజా చైతన్యాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉంది. ప్రశ్న చనిపోయిన చోట ప్రజాస్వామ్యం కూడా క్రమంగా చనిపోతుంది. – పాపని నాగరాజు, సామాజిక కార్యకర్త -
జీవితాన్ని 'మార్చే క్షణాలు' కొన్నే!
నన్ను ఈ రోజు ప్రసంగించేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ రోజు మీకు సలహాలు ఇవ్వాల్సిన రోజని నాకు తెలుసు. నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే – కాలం మారినా,సాంకేతికత మారినా, కొన్ని సలహాలు ఎప్పటికీ విలువైనవే. మీలో కొందరికి లక్ష్యం ఇప్పటికే స్పష్టంగా తెలిసి ఉంటుంది. మరికొందరికి స్పష్టంగా తెలియకపోవచ్చు. అది సహజమే. పట్టభ ద్రుడిగా బయటకు వచ్చిన రోజున నాకూ అలానే అనిపించింది. జీవితం ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాల సమాహారమనీ, వాటన్నింటినీ సరిగ్గా తీసుకోవాల్సిందేననీ భావించేవాడిని. ప్రత్యేకంగా మీలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పరీక్ష, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి మార్కు కోసం కష్టపడతారు. కానీ మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. ఇవన్నీ ఆ సమయంలో చాలా ముఖ్యంగా అనిపించినా, జీవితాన్ని నిర్ణయించే అంశాలు అంతగా కావు. మీరు ఒక పరీక్షలో విఫలమైనా, ఒక క్లాస్ మిస్ అయినా, లేదా సంగీత వాయిద్యం నేర్చుకోకపోయినా – ఈ రోజు ఇక్కడే ఉండేవారు. దీన్ని నేను ఎలా గ్రహించానో చెప్పడానికి ఒక చిన్న కథ చెబుతాను. స్టాన్ ఫోర్డ్లో చదువుతున్నప్పుడు నాకు పాట్ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒక రోజు ఉదయం అతను ‘‘క్లాస్కు వెళ్లకుండా లాస్ వెగాస్ వెళ్దామా?’’ అని అడిగాడు. అప్పటివరకు నేను ఎప్పుడూ క్లాస్ మిస్ కాలేదు. రోడ్ ట్రిప్ కూడా చేయలేదు. అయినప్పటికీ ‘‘సరే’’ అన్నాను. మేము మా గదులకు వెళ్లి కొన్ని వస్తువులు తీసు కుని ప్రయాణం ప్రారంభించాం. కొండల మధ్యగా ప్రయాణిస్తున్నప్పుడు మంచు కురవడం మొదలైంది. నేను జీవితంలో మొదటిసారి మంచును చూశాను. చేతిని బయటకు చాచి మంచు రేణువులను తాకాను. అవి ఎంత మృదువుగా ఉన్నాయో చూసి ఆశ్చర్య పోయాను. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. మీ జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి. వాటిలో కొన్నే నిజంగా ముఖ్యమైనవి. ఉదాహరణకు – జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కుటుంబాన్ని ప్రారంభించాలా వద్దా నిర్ణయించడం, లేదా కెరీర్లో పెద్ద మార్పు చేయడం. ఇలాంటి నిర్ణయాలకు సమయం, స్పష్టమైన ఉద్దేశం అవసరం. అయితే జీవితంలో చాలా పెద్దవిగా కనిపించే మరెన్నో సందర్భాలు కూడా వస్తాయి. నిజానికి అలాంటివి వేల సంఖ్యలో ఉంటాయి. కానీ వాటిలో చాలా తక్కువ మాత్రమే మీ జీవితాన్ని మార్చగలవు. కళాశాల పూర్తయ్యాక వచ్చే మొదటి ఉద్యోగం, తర్వాత మీరు వెళ్లే నగరం, లేదా ఒక రోడ్ ట్రిప్కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం – ఇవన్నీ మీ జీవిత ప్రయా ణానికి కొత్త అనుభవాలను జోడిస్తాయి. కానీ సాధారణంగా ఇవి మీ జీవిత దిశను నిర్ణయించవు. కాబట్టి ముఖ్యమైన విషయాలను, అనవసరమైన శబ్దం నుంచి వేరు చేసి గుర్తించగలిగితే, మీరు కోరు కున్న దిశగా మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు. అందుకే ఈ రోజు నా జీవితంలో నేను అనుసరించిన మూడు సులభమైన సూత్రాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.1. ఆశావాదాన్ని ఎంచుకోండి!నేను చెప్పబోయే మొదటి సూత్రం – ఆశావాదాన్ని ఎంచు కోవడం. ప్రతిరోజూ వార్తలు చూస్తే మనం కఠినమైన కాలంలో జీవిస్తున్నామనిపిస్తుంది. కానీ ప్రతి తరం తమదైన సవాళ్లను ఎదుర్కొంది. మనం ఏ ప్రపంచంలో పట్టభద్రులమవుతామో ఎంచు కోలేము. కానీ ఆ పరిస్థితులను ఎలా చూడాలో మాత్రం మనమే నిర్ణయించగలం.నేను చెన్నై నగరంలో పెరిగాను. తీవ్రమైన కరువులు వచ్చేవి. నీటి ట్యాంకర్లు సమయానికి వస్తాయో లేదో అని ఎదురుచూసే వాళ్లం. టెలిఫోన్, టెలివిజన్, ఫ్రిజ్ వంటి వస్తువులు పొందడానికి సంవత్సరాలు పట్టింది. అయితే నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా కల లను పరిమితం చేయనివ్వలేదు. అందుకే ఒకరోజు సిలికాన్ వ్యాలీలో పని చేయాలనే కలను నేను కనగలిగాను. స్టాన్ఫోర్డ్లో అడ్మిషన్ వచ్చినప్పుడు, అమెరికాకు పంపేందుకు నా తండ్రి దాదాపు ఏడాది జీతానికి సమానమైన డబ్బును విమాన టికెట్ కోసం ఖర్చు చేశారు. కాలిఫోర్నియాకు చేరుకున్న తర్వాత, విమానాశ్రయం నుంచి వస్తూ రహదారి పక్కన ఉన్న కొండలను చూసి, ‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇవి గోధుమ రంగులో ఉన్నాయి’ అన్నాను. అప్పుడు నా ఆతిథ్య కుటుంబంలోని జేన్ ఎర్ల్ అనే మహిళ చిరునవ్వుతో, ‘‘మేము వాటిని గోధుమ రంగు కొండలు అని కాదు, బంగారు కొండలు అని పిలుస్తాం’’ అన్నారు. అదే ఆశావాదం అంటే. నేను గోధుమ రంగును చూశాను; ఆమె బంగారు రంగును చూసింది. దృక్పథంలో వచ్చిన ఈ చిన్న మార్పు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. స్టాన్ ఫోర్డ్లో నేను పీహెచ్డీ పూర్తి చేసి అధ్యా పక వృత్తిలోకి వెళ్లాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు మారాయి. త్వరగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. నా డాక్టరేట్ కార్యక్రమాన్ని వదిలి మాస్టర్స్ డిగ్రీతోనే బయటకు రావాల్సి వచ్చింది. దాన్ని నేను ఒక కల ముగిసినట్లుగా భావించవచ్చు. కానీ ఆ ‘గోధుమ కొండ’ను ‘బంగారు కొండ’గా చూడటం నేర్చుకున్నాను. 2. కష్టమైన పనులను ఎంచుకోండి!స్టాన్ ఫోర్డ్ వదిలిన తర్వాత నేను వెంటనే విజయాన్ని సాధించా నని చెప్పాలనుకుంటున్నాను. కానీ అది నిజం కాదు. స్టాన్ ఫోర్డ్ పూర్తి చేసిన దాదాపు పదేళ్ల తర్వాత కూడా నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం ఉండేది. అలాంటి సమయంలో నేను గూగుల్కు దరఖాస్తు చేసుకున్నాను. 2004, ఏప్రిల్ 1న నా చివరి ఇంటర్వ్యూ జరిగింది. అదే రోజు జీమెయిల్ ప్రారంభమైంది. ఇంటర్వ్యూలో వారు జీమెయిల్ గురించి అడిగినప్పుడు అది నిజమైన ఉత్పత్తో, సరదా జోకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికీ 1 జీబీ ఉచిత స్టోరేజ్ ఇవ్వడం అసాధ్యమైన ఆలోచనగా అనిపించేది.కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కూడా అసాధ్యంగా కనిపించిన ఒక సమస్యపై పని చేసే అవకాశం వచ్చింది. అదే గూగుల్ క్రోమ్. మేము బ్రౌజర్ను మరింత వేగంగా రూపొందించవచ్చని భావించాం. కానీ చాలామంది అది కష్టమన్నారు. వందలాది ఇంజి నీర్లు అవసరమన్నారు. మా దగ్గర కేవలం పది మందే ఉన్నారు. 2008లో మేము క్రోమ్ను ప్రారంభించాం. మొదటి 24 గంటల్లో 80 లక్షల మంది ఉపయోగించారు. కానీ కొంతకాలానికి వృద్ధి ఆగిపోయింది. ఏడాది తర్వాతా మార్కెట్లో మా వాటా 2 శాతమే. మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ క్రోమ్ను ఎగతాళి చేస్తూ ‘‘ఇది లెక్కలోకి కూడా రాని చిన్న విషయం’’ అన్నారు. మేము నిరుత్సాహపడలేదు. ప్రతి ఆరు వారాలకు కొత్త వెర్షన్ విడుదల చేశాం. ఇతర కంపెనీలు ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే విడుదల చేసేవి. క్రమంగా విజయం మా వైపు వచ్చింది.3. ఉత్సాహాన్ని కలిగించే పనిని చేయండి!1993లో స్టాన్ ఫోర్డ్లోని కంప్యూటర్ ల్యాబ్లోకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉపయోగించగలిగే కంప్యూటర్ల వరుసలను చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. అది మానవ అభివృద్ధికి గొప్ప సాధనంగా మారుతుందని నేను గుర్తించాను. ఎక్కువ మందికి ఈ సాంకేతికతను అందించడంలో భాగస్వామి కావాలనే ఆలోచనే నన్ను ఉత్సాహపరిచింది. అందుకే నేను గూగుల్లో చేరాను. అందుకే క్రోమ్బుక్స్, ఆండ్రా యిడ్ వంటి ప్రాజెక్టులపై పనిచేశాను. అందుకే మీ జీవిత మార్గాన్ని ఎంచుకునేటప్పుడు: మీ తల్లిదండ్రులు కోరుకునేదాన్ని మాత్రమే చూడకండి. మీ స్నేహితులందరూ చేస్తున్నదాన్ని అనుసరించకండి. దానికి బదులుగా, రాత్రి పొద్దు పోయే వరకు మీ స్నేహితులతో ఉత్సాహంగా మాట్లాడేలా చేసే విష యాలను గుర్తించండి. వెళ్లి అదే పని చేయండి. -
అసాధారణ మూర్తి
మరణించడానికి కొన్ని నెలల ముందు, పీవీ నరసింహారావు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా ఉండేదో ఒక విలే ఖరిగా నాకు తెలుసు.నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు, గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూశాము. సెక్యూ రిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించకపోవడంతో లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడటం వీలుపడుతుందా’ అని భద్రతాధికారిని అడిగాము. ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.అంతే... మా ఆశ్చర్యం రెట్టింపయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకుని ఉన్న పీవీగారు నా వైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలా వున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పని చేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం.అప్పటి విషయాలను గుర్తుపెట్టు కోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల, కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. కాసేపు ఉండి మేము వచ్చేశాము.అంతకుముందు పీవీని మరోసారి ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నిశ్శబ్దం. ఎవరో అటుగా వస్తే, ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని హిందీలో అడిగాను. ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ ఉంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు.‘మాస్కో ఎందుకయ్యా వేరే దేశంలో మీ రేడియో ఉద్యో గాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా వుంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ, నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. ఆయన మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేఖరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు, నేనూ కాస్త వెనగ్గా నిలబడి ఉన్నాం. చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?’ పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది. కృష్ణారావు ఏదో చెప్పారు. ఆయన నా వైపు తిరిగారు. ‘మీ అన్నయ్య పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?’ ‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు.’‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు.’ నమస్కారం పెట్టి మేము వచ్చేశాము. - భండారు శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రజాస్వామ్య స్ఫూర్తి
రాజకీయ అస్థిరత కారణంగా నేతలు పదవులు కోల్పోవడం, ప్రభుత్వాలు పడిపోవడం ప్రజా స్వామ్య వ్యవస్థలో సహజమైన పరిణామం. అయితే దేశంలో ఏర్ప డిన ఆర్థిక అస్థిరత కారణంగా ప్రజా దరణ కలిగిన నాయకులు ప్రధాని పదవి నుండి వైదొలగడం బ్రిటన్లో తరచుగా చోటు చేసుకుంటున్న పరిణామం కావడం గమనార్హం.తాజాగా ప్రధాని కీర్ స్టార్మర్ రెండేళ్ళ పదవీకాలం ముగి యకుండానే పదవి నుంచి తప్పుకొన్నారు. సొంత లేబర్ పార్టీ ఎంపీల విశ్వాసం కోల్పోవడంతో స్టార్మర్కు రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేకపోయింది. దీంతో గత ఏడేళ్ళలో ఆరవ ప్రధాని రాబోతున్నారు. బ్రిటన్లో నాయ కత్వ మార్పు తరచుగా ఎందుకు జరుగుతోంది? రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి గత 81 ఏళ్లలో 65 ఏళ్ల పాటు 18 మంది ప్రధాన మంత్రులు అధికారంలో ఉండగా, చివరి 16 ఏళ్లలో ఏడుగురు ప్రధాన మంత్రులు మారడం విశేషం. ఇందులో భారత సంతతికి చెందిన రుషి సునాక్ ఎన్నికలలో ఓడిపోగా, బ్రెక్సిట్ ప్రజాభిప్రాయ సేక రణలో ఓటమి కారణంగా డేవిడ్ కామెరూన్ వైదొలిగారు.గెలిచినా ఓడిపోయి...ప్రధాని పదవి నుంచి తప్పుకున్న కీర్ స్టార్మర్ రెండేళ్ళ క్రితమే చరిత్రాత్మక మెజారిటీతో ఎన్నికయ్యారు. అంతర్జా తీయ సమాజంలో ఆయనకు మంచి గౌరవం ఉంది. అయితే మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికలలో లేబర్ పార్టీకి ఘోర మైన ఫలితాలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన స్థానిక ఎన్నిక లలో సొంత పార్టీని విజయ తీరాలకు చేర్చలేకపోవడం అనే వైఫల్యం కంటే... కొన్ని పాలనా విధానాల వైఫల్యాల కారణంగానే పదవినుండి తప్పుకోవాలని స్టార్మర్పై సొంత పార్టీ ఎంపీల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చిందనుకోవాలి.దశాబ్ద కాలంగా బ్రిటన్లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగి పోతున్నాయి. అందుకు అనుగుణంగా ప్రజల ఆదాయం పెర గడం లేదు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఒక శాతం మించడం లేదు. బ్రిటన్ ప్రభుత్వ ఋణ భారం జీడీపీలో 95 శాతం దాటింది. అప్పులు దాదాపు 2.8 లక్షల కోట్ల పౌండ్లకు చేరింది. దీనితో ప్రభుత్వానికి వచ్చే రాబడిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం కష్టమౌతోంది.ఈ రెండేళ్ళ స్వల్ప కాలంలో స్టార్మర్ పలు విజయాలు నమోదు చేసిన మాట నిజం. ప్రభుత్వ దుబారాను తగ్గించారు. ప్రభుత్వ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు సమ్మెలకు దిగి ఉత్పత్తిని దెబ్బతీయకుండా, వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తూ, దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించి, ఆ దేశం నుంచి విలువైన ఖనిజాల దిగుమతికి మార్గం సుగమం చేశారు. భారత్కు స్నేహ హస్తం చాచి ఇరుదేశాల నడుమ చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) అమలు కోసం కృషి చేశారు.ఎన్ని సుగుణాలున్నా... రాజకీయాలలో బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావు ఉండరాదు. కానీ స్టార్మర్ తన స్నేహితుడైన పీడర్ మాండెల్సన్ను యూఎస్ రాయబారిగా నియమించడం సొంత పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. అదే సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి పడిపోవడం, మౌలిక సదుపాయాల విస్తరణ మందగించడం, గృహ నిర్మాణం చతికిల పడటం స్టార్మర్ మెడకు చుట్టుకున్నాయి.ప్రధాని పదవికి స్టార్మర్ రాజీనామా తర్వాత ఆ పదవిని చేపట్టే గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్హామ్ నేతృత్వంలో బ్రిటన్ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే... బ్రిటన్లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో నాయకుల కంటే పార్టీయే సుప్రీమ్ అనే పంథా కొనసాగడమే ఇక్కడ చర్చనీయాంశం. రాజకీయ నాయకులు తమపై విమర్శలు వచ్చినపుడు హుందాగా ఆ పదవుల నుండి దిగిపోవడం ముదావహం. వారు మెజారిటీ ప్రజల మనోభీష్టాన్నీ, దేశ ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయం. - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
మనసు విప్పుకోవటం అన్నది ఒక లెక్క ప్రకారం జరిగేది కాదు. లెక్క ప్రకారం జరిగిందీ అంటే, అది మనసు విప్పుకోవటం అవదు, కప్పుకోవటం అవుతుంది. నచ్చిన దుస్తులు ఒంటికి వేసుకున్నట్లే, నప్పని బట్టలు మనసుకు తొడుక్కోవటం అవుతుంది. ఆ పని నేను ఎప్పటికీ చేయలేను. అందమైన చేనేతలు, ప్రకాశవంతమైన రంగులు నాకు నచ్చుతాయి. నా పెళ్లికి నేను లేత గులాబీ రంగు జరీ పట్టు చీరను ఎంచు కున్నాను. పెళ్లి రిసెప్షన్కి, లోక్సభలో నాపై నేర విచారణకు బ్రైట్ రెడ్; పార్లమెంటు సమావేశాలకు బ్రైట్ బ్లూ; పార్లమెంట్లో డిబేట్ కోసం ముదురు గులాబీ, ఆకుపచ్చ రంగులు; ఫుట్ బాల్ ఆడేటప్పుడు షూజ్ మీదికి ఎనర్జిటిక్ ఆరెంజ్ శారీ; హార్పర్స్ బజార్ మ్యాగజైన్ ముఖ చిత్రానికి మెజెంటా కలిసిన ఇండిగో హాండ్లూమ్ పట్టు చీర.ఇక నా మొదటి పెళ్లిలో నేను ఏ రంగు చీరను కట్టుకున్నానో గుర్తు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అది వెలిసిపోయిన వివాహం. మొన్నటి బీబీసీ ‘టాక్ షో’కి తెల్లంచు ముదురు నారింజ రంగు చీరతో వెళ్లాను. ఎన్నికల్లో తృణమూల్ ఓటమి, పార్టీలో తీవ్ర సంక్షోభం, దీదీకి వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, బీజేపీకి మద్దతు ఇవ్వటం... వీటి గురించే కదా ‘టాక్ షో’లో అడుగుతారు. మనసుకు దుస్తులు తొడిగే అలవాటు లేనప్పుడు, ఉన్నది ఉన్నట్లే లోపల్నుంచి వచ్చేస్తుంది. మంచీ వస్తుంది, చెడూ వస్తుంది. మంచీ చెడుల మధ్య గుర్తొచ్చినవీ కొన్ని బయటికి వచ్చేస్తాయి. సువేందు గురించి కూడా నా మనసులో ఉన్నది ఉన్నట్లే మాట్లాడాను. తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి, పశ్చిమ బెంగాల్కు సీఎం అయ్యారు సువేందు. తృణమూల్లో ఆయన మొదట్నుంచీ ఉన్నారు. తృణమూల్లో నేను చేరినప్పటి నుంచీ నాతో ఉన్నారు.నాతో అంటే... నా నిరాశలో,నా నిస్పృహలో, నా దుఃఖంలో,నా అయోమయంలో నా వెంట ఉన్నారు. ‘‘రాజకీయాలు యూఎస్లోని మౌంట్ హోలియోక్ కాలేజీ నుండి అర్థ, గణిత శాస్త్రాలలో డిగ్రీ పట్టా పొందటంలా ఉండవు మొయిత్రా..’’ అనేవారు.‘‘జేపీ మోర్గాన్ చేజ్’లో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఉంటూ, వారి లండన్ కార్యాలయంలో వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎదగటం లానూ ఉండవు..’’ అని నవ్వేవారు. 2014లో నాకు లోక్సభ టికెట్ రావాల్సింది. రాలేదు! సువేందు నన్ను ఓదార్చారు. నాకు ధైర్యం చెప్పారు. ఆయన తప్ప ఎవరూ నా కంటతడిని చూడలేదు! 2016లో తొలిసారి నేను అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు నన్నంతా ఒంటరిని చేశారు. నా కోసం ప్రచారం చేయటానికైనా ఎవరూ రాలేదు.సువేందు ఒక్కరే నా పక్కన నిలబడ్డారు. నా తొలి ర్యాలీలో నాకు బదులుగా ఆయనే ప్రసంగించారు. వేదికపైన సువేందు, నేను మాత్రమే ఉన్నాం. ఈరోజుకీ ఆ ఫొటోలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. టాక్ షోలో కూడా ఇదే మాట చెప్పాను. ‘‘అయితే మీరూ సువేందులానో, మొన్నటి 20 మంది ఎంపీల్లానో త్వరలోనే తృణమూల్ని వదిలి వెళ్లబోతున్నారా?’’ అని పార్టీ లోపల, పార్టీ బయట నాపై సందేహాల సంధింపులు! పార్టీ లోపల ఉండి విధ్వంసం సృష్టించే నాయకుల కంటే, పార్టీని వీడిపోయి పార్టీపై బయటి నుండి పోరాటం చేసే నాయకుడిని నేను గౌరవిస్తాను. సువేందు పార్టీని వదిలి వెళ్లాక ఒక్కసారి కూడా నాకై నేను ఆయన్ని కలవలేదు. ఒక్కసారి కూడా నాకై నేను ఆయనతో మాట్లాడలేదు. టాక్ షోలో గత స్నేహాన్ని గుర్తు చేసుకున్నానంతే. గుర్తు చేసుకున్నంత మాత్రాన ఆయన పుణ్యాత్ముడని కాదు. గుర్తు చేసుకున్నందుకు నేనేమీ పాపాత్మురాలినైపోను. -
ప్రేమ నిర్వచనం..
పూజలు–పునస్కారాలు, నోములు–వ్రతాలు, గుళ్ళు–గోపురాలు అన్నీ మనలో సంకుచిత స్వార్థాన్ని నిర్మూలించటానికీ, విశ్వప్రేమను విష్ణుప్రేమగా గ్రహించటానికీ నిర్దేశింపబడ్డాయి. ప్రేమే దైవమని మహర్షులు నొక్కి వక్కాణిస్తారు. ప్రేమ, ద్వేషం అంటూ రెండు ఉండటంవల్ల దేన్ని ఎంచుకొంటే మనకు శ్రేయస్సు కల్గుతుందో వివరించటానికి పెద్దలు నానా తంటాలు పడ్డారు. కేరళకు చెందిన స్వామి రామదాసు చేసిన చక్కటి విశ్లేషణను చూడండి:ప్రేమ హృదయాన్ని వికసింపజేస్తుంది – ద్వేషం దానిని ముకుళింపజేస్తుంది. ప్రేమ కంటే మధురం లేదు – ద్వేషం కంటే చేదు లేదు. ప్రేమ సహజం – ద్వేషం కృత్రిమం. ప్రేమ నిర్మాణం – ద్వేషం వినాశకము, విధ్వంసము. ప్రేమ మనోహరం– ద్వేషం అసహ్యకరం. ప్రేమ ఆహ్లాదకర ప్రకృతి దృశ్యం – ద్వేషం శుష్కమైన మరుభూమి.ప్రేమ లయబద్ధం – ద్వేషం చిందర వందర. ప్రేమ ప్రకాశం – ద్వేషం అంధకారం. ప్రేమ ఆనందం – ద్వేషం దుఃఖం. ప్రేమ జీవనం – ద్వేషం మరణం. ప్రేమ పవిత్రం – ద్వేషం అపవిత్రం. ప్రేమ జత చేస్తుంది – ద్వేషం విడదీస్తుంది. ప్రేమ సురూపం – ద్వేషం కురూపం. ప్రేమ ఆరోగ్యం – ద్వేషం అనారోగ్యం. ప్రేమ మధుర సంగీతం – ద్వేషం కర్కశ ధ్వని. ప్రేమ జ్ఞానం– ద్వేషం అజ్ఞానం. ప్రేమ చురుకుదనం – ద్వేషం మందత్వం. ప్రేమ స్వర్గం– ద్వేషం నరకం. ప్రేమే దైవం – ద్వేషమే దయ్యం – మాయ. (భగవదన్వేషణము– స్వామి రామదాసు; పుటలు 188, 189) ఇంత స్పష్టమైన విశ్లేషణను చదివిన తర్వాత ఎవరైనా ప్రేమను పెంపొందించుకోవటానికే కృషి చేస్తారు. చేయాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం. దైవాశీస్సులు ఉండి తీరుతాయి. – రాచమడుగు శ్రీనివాసులు -
నిశ్శబ్దపు చీకటిలో ఆశాకిరణం
జూన్ నెల చివరి వారాన్ని ‘బధిరాంధ అవగాహనా వారం’గా అంతర్జాతీయ బధిరాంధ దినోత్సవం (జూన్ 27) సందర్భంగా జరుపుకోవడం 2025 నుంచి ప్రారంభమైంది. రచయిత్రి, సామా జిక కార్యకర్త హెలెన్ కెల్లర్ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి వీటిని ప్రకటించింది. బధిరాంధత్వం అంటే కళ్లతో పాటు చెవులు కూడా పనిచేయకపోవడం. గాఢాంధకారం, భయంకరమైన నిశ్శబ్దం...ఈ రెంటి కలయిక వల్ల అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారు బాహ్య ప్రపంచంతో సంభాషించడానికి ప్రధానంగా చేతిపై చేతితో రాసే సంకేత భాష (టాకై్టల్ సైన్ లాంగ్వేజ్), బ్రెయిలీ లిపి, ఇంటర్ప్రెటర్లపై ఆధారపడ తారు. ప్రపంచ జనాభాలో 0.2% – 2% ప్రజలు ఏదో ఒక స్థాయి బధిరాంధత్వంతో జీవిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ సమస్యతో పోరాడుతున్నారు.ప్రభుత్వాలు బధిరాంధత్వాన్ని చట్టపరంగా ఒక ప్రత్యేక వైకల్యంగా గుర్తించాలి. అంధులకు, బధిరులకు విడివిడిగా ఇచ్చే సేవలను కలిపి వీరికి అంటగట్టడం సరైన విధానం కాదు. రోజువారీ పనులకు అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన ఇంటర్ప్రెటర్–గైడ్ల సేవలను ఉచితంగా ప్రభు త్వాలు అందించాలి. అలాగే, పాఠశాలల్లో సమ్మిళిత విద్యను ప్రోత్సహించ డానికి ప్రత్యేక టీచింగ్ అసిస్టెంట్లను నియమించి, పాఠ్యాంశాలను వీరికి అనుకూలంగా మార్చాలి. ఆధునిక సాంకేతికత తోడ్పాటుతో టాకై్టల్ పరిక రాలు, రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, వైబ్రేషన్ ద్వారా అలర్ట్ చేసే స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తేవాలి.హబెన్ గిర్మా, హార్వర్డ్ లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి బధిరాంధ మహిళ. వైబ్రేషన్–బ్రెయిలీ డిస్ప్లే కలిగిన డిజిటల్ టెక్నాలజీ సహాయంతో సంభాషిస్తూ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్న తనంలోనే చూపు, వినికిడి కోల్పోయిన ప్రదీప్ సిన్హా, అసిస్టివ్ టెక్నాలజీ సహాయంతో కంప్యూటర్ ఆధారిత నైపుణ్యాలను నేర్చు కుని కార్పొరేట్రంగంలో ఉపాధి పొందుతుండగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా శిఖరే ఆభర ణాల తయారీలో రాణిస్తూ సొంతంగా ఆర్థిక స్వాలంబన సాధించారు. తగిన సదుపాయాలు కల్పిస్తే, బధిరాంధులు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరనే నిజాన్ని స్పష్టం చేస్తున్నాయి. – శ్రీనివాస్ మాధవ్, సామాజిక కార్యకర్త (నేడు ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్బ్లైండ్నెస్’) -
రైతన్నకు మార్గం చూపే అభియాన్
నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయ భూమిని కాపాడటం, రైతుల మధ్య శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త ప్రచారాన్ని ‘ఖేత్ బచావో అభియాన్’గా పిలుస్తున్నారు. ‘నేలను కాపాడండి, వ్యవసాయాన్ని కాపాడండి, రైతులను కాపాడండి’ అనే ప్రధాన సందేశంతో 2026 జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఈ ప్రచారం సాగుతోంది.ఎరువులను నిరంతరం వాడటం, అది కూడా అసమతుల్యంగా ఉపయోగించడం వల్ల అనేక ప్రాంతాలలో పోషకాల కొరత ఏర్పడి, నేల నాణ్యత క్షీణిస్తోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించి పోతు న్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్థ్యం పడిపోతోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేయాల్సి ఉంది. అందుకు కేంద్రం భారీ ఎత్తున ఈ విషయా లపై అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగింది. ఖేత్ బచావో అభియాన్ ప్రధానాంశాలు:1. మట్టి పరీక్ష – మట్టి ఆరోగ్య కార్డులకు ప్రోత్సాహం: రైతులను క్రమం తప్పకుండా మట్టి పరీక్షలు చేయించుకోవడానికీ, పోషక అవసరాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికీ మట్టి ఆరోగ్య కార్డులను ఉపయోగించేలా ఈ ప్రచారం ప్రోత్సహిస్తుంది. ఇది సమతుల్య ఎరువుల వాడకాన్ని సాధ్యం చేస్తుంది. అనవసర ఖర్చు లను తగ్గిస్తుంది. పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలి కంగా నేల సారాన్ని కాపాడుతుంది.2. సమతుల్య పోషక నిర్వహణ: అధిక రసాయన ఎరువులపై ఆధారపడకుండా, వాస్తవ నేల అవస రాలకు అనుగుణంగా ఎరువులను ఉపయోగించేలా రైతులను ప్రోత్స హిస్తున్నారు. సమతుల్య పోషక నిర్వహణ నేల నాణ్యతను మెరుగు పరుస్తుంది. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తిని నిర్ధారిస్తుంది.3. సహజ – సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం: ఈ ప్రచారం కృత్రిమ రసాయ నాలపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ సుస్థిరతను మెరుగు పరిచే సహజ వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తుంది.4. నీటి సంరక్షణ: నీటి కొరత – భూగర్భ జలాల క్షీణతపై పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు.5. శాస్త్రీయ వ్యవ సాయ పద్ధతులు: ఆధునిక విత్తే పద్ధతులు, విత్తన శుద్ధి, పంట ప్రణాళిక, సాంకేతికత ఆధారిత వ్యవసాయ పద్ధతులను పాటించ డానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.6. పచ్చిరొట్ట ఎరువు–నేల సారం: నేలలోని సేంద్రియ పదార్థాన్ని మెరుగుపరచ డానికీ, నేల సారాన్ని సహజంగా పెంచడానికీ పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.7. పంట మార్పిడి ఆవశ్యకత: వరి వంటి కొన్ని పంటలకే పరిమితం కాకుండా వ్యవసాయాన్ని ఏక రూప పంట విధానం నుంచి బహుళ పంటల సాగు వైపునకు మళ్లించి... సిఫారసు చేసిన పంటల సరళిని, అంతర పంటలను, సమగ్ర వ్యవసాయాన్ని చేపట్టే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించడం మరో అంశం. దీని వల్ల వ్యవసాయం లాభసాటిగా ఉండటమే కాకుండా సుస్థిర అభివృద్ధి జరుగుతుంది.8. సమగ్ర సస్య రక్షణ: రైతులు తాము పండించే పలు పంట లలో ఆశించే పురుగులు, తెగుళ్ళు, కలుపు వంటి వాటి నుండి పంటను కాపాడుకోవడానికి ఎక్కువగా పెస్టిసైడ్స్ (పురుగు మందులు) వాడుతున్నారు. చాలా ఏళ్ళుగా పంటలలో పురుగు మందు లను విచ్చలవిడిగా, అధిక మోతాదుల్లో, అనేకసార్లు వాడటం వలన అనేక దుష్ప్రభావాలు చూస్తున్నాము. అందుకే పంటలో ఉన్న అసలు సమస్యను వీలైనంత తొందరగా గుర్తించి ఆ సమస్యకు తగ్గట్టుగా రసాయనాలు వాడాలి. ఉదా: పురుగుకు పురుగు మందు, తెగుళ్ళకు తెగులు మందులు, నల్లికి నల్లి మందులు వాడాలి.చీడపీడలు, కలుపు కనిపించిన వెంటనే రసాయన మందులను వాడాల్సిన అవసరం లేదు. వీటి ఉధృతి ఒక స్థాయి దాటినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారీ చేసుకోవాలి. ఉత్పాదకతను ప్రతి కూలంగా ప్రభావితం చేసి, ఆర్థిక నష్టాలను పెంచే నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల నుండి రైతులను రక్షించాలి. – డా. కె. తేజేశ్వరరావు, డా. బి. సహదేవ రెడ్డిప్రధాన శాస్త్రవేత్తలు, ఆచార్య ఎన్ .జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
సవాళ్లు ఉన్నా సందర్భోచితమే!
ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐ.ఎం.ఇ.సి.– ఐమెక్) పథకం ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో చర్చనీయాంశమైంది. భారత విధాన రూపకర్తలకు ఐమెక్ను ముందుకు తీసుకు వెళ్లటం పెద్ద సవాలుగా మారింది. ఇరాన్ యుద్ధం ఒక వైపు ఐమెక్ పథకం బలహీనతలను బహిర్గతం చేస్తూనే దాని అవసరాన్నీ నొక్కి చెప్పింది. 2023 ఢిల్లీ జీ–20 సదస్సులో భారత్ ప్రతిపాదించిన ఐమెక్ ప్రతిపాదనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ, యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ యూనియన్లు అంగీకరించాయి. భారత్ను మధ్యప్రాచ్యం – ఇజ్రాయెల్ గుండా యూరప్తో అనుసంధానానికి ఉద్దేశించిన ఈ 4,800 కి.మీ. రవాణా కారిడార్ ఆసియా, పర్షియన్ గల్ఫ్, ఐరోపాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తుంది. ఆసియా ఖండపు వినిమయ మార్కెట్లను, గల్ఫ్ చమురు– గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలను ఐరోపా పారిశ్రామిక ప్రాంతాలలో సముద్ర, భూతల మార్గాల ద్వారా అనుసంధానించే విశిష్టమైన పథకం ఐమెక్. ఈ మూడు ప్రాంతాల అనుసంధానంలో ప్రస్తుతం మూడు చిక్కుముడి ప్రాంతాలు (చోక్ పాయింట్లు) ఉన్నాయి. అవి హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్ జలసంధులు. ఈ మూడు జలసంధులను పక్కన పెట్టే సురక్షితమైన రవాణా మార్గమే ఐమెక్.విస్తృత వాణిజ్యానికి కీలకంఐమెక్ రవాణా కారిడార్లో తూర్పుభాగం భారత పశ్చిమ తీరాన్ని పర్షియన్ సింధుశాఖలో కలిపే సముద్ర మార్గం. భారత్లోని ముంబై–ముంద్ర–కాండ్లా రేవు పట్టణాలను యూఏఈకి చెందిన జెబెల్ అలీ, ఫుజేరా, సౌదీకి చెందిన డమ్మామ్, జెడ్డాలతో కలుపు తుంది. ఐమెక్ ఉత్తర కారిడార్ పర్షియా సింధుశాఖను ఐరోపాతో రైలు మార్గాల ద్వారా కలుపుతుంది. యూఏఈ, సౌదీ, జోర్డాన్లను రైలు మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోని హైఫా రేవు పట్టణానికి కలుపుతారు. హైఫా నుండి ఎర్ర సముద్రం గుండా గ్రీస్లోని పిరేస్, ఫ్రాన్స్లోని మార్సెల్లి, ఇటలీలోని మెస్సీనాలకు కలుపుతూ ఐరోపాకు సరకుల రవాణా జరుగుతుంది. ఐమెక్లో భాగంగా హరిత ఇంధనాలైన హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి, విద్యుత్ గ్రిడ్ల అనుసంధానం కూడా జరుగుతుంది. సముద్ర, భూతల మార్గాల ద్వారా అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల నిర్మాణం, విస్తృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఐమెక్ పూర్తి స్థాయిలో అమలు జరిగితే భారత్– ఐరోపాల మధ్య రవాణా కాలం 40 శాతం, రవాణా వ్యయం 30 శాతం తగ్గిపోతాయి. రవాణా అనిశ్చితి కూడా తొలగిపోతుంది. భారత్–ఐరోపా యూనియన్ల మధ్య 2026 జనవరిలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన 40–65 శాతం వాణిజ్యం పెరుగు తుందని అంచనా. భారత్–యూఏఈ, సౌదీ, ఖతర్, ఒమన్ల మధ్య వాణిజ్యానికీ కూడా ఐమెక్ కీలకం.వ్యూహాత్మకంగానూ ముఖ్యమే!ఆసియా–పర్షియన్ సింధుశాఖ ప్రాంతంలో చైనాను నిలువరించటానికి ఐమెక్ ఉపయోగపడుతుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) ద్వారా ఆసియా–గల్ఫ్ ప్రాంతంలో చైనా బలపడుతున్నది. ఒక రకంగా ఐమెక్ను బీఆర్ఐకు పోటీగా చెప్పు కోవచ్చు. వ్యూహాత్మక అంశాల దృష్ట్యా యూఎస్ఏ ఐమెక్కు మద్దతు పలికింది. ఇజ్రాయెల్ను ఇతర గల్ఫ్ దేశాలతో సంఘటితం చేయా లనేది అమెరికా లక్ష్యం. అబ్రహాం ఒప్పందం ద్వారా యూఏఈ, ఖతర్, ఒమన్లను ఇజ్రాయెల్కు కొంతవరకు దగ్గరకు తేగలిగింది. ప్రస్తుతం భూతల మార్గం ద్వారా భారత్ నుండి ఐరోపా వెళ్లాలంటే పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ల గుండా ప్రయాణించాలి. ఒక రకంగా భారత్–ఐరోపా భూతల రవాణాపై పాకిస్తాన్కు వీటో ఉన్నది. ఐమెక్ ద్వారా పాక్ వీటోను తొలగించినట్లవుతుంది. చైనా–పాక్–ఎకనమిక్ కారిడార్ (సిపెక్)లో భాగంగా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో రోడ్డు, రైలు మార్గాలను, రేవు పట్టణాలను చైనా అభివృద్ధి చేస్తున్నది. పాకిస్తాన్ గుండా అరేబియా సముద్రంలోనికి చైనా ప్రవేశిస్తున్నది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవటానికి ఐమెక్ తోడ్పడుతుంది. సూయజ్, బాబెల్ మాండెబ్లను పక్కకు పెట్టడం వలన భారత్–ఐరోపా వాణిజ్యంలో అస్థిరత, అనిశ్చితి తొలగి పోతాయి. పాకిస్తాన్కు వంత పాడుతున్న టర్కీకి కూడా ఐమెక్ ద్వారా చెక్ పెట్టినట్లవుతుంది. ఐమెక్ ద్వారా ఐరోపాకు శక్తి భద్రత ఏర్పడటంతో పాటు భారత్తో వాణిజ్యం విస్తృతమవుతుంది. గల్ఫ్ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను వైవిధ్యీకరించటానికి ఐమెక్ ఉపయో గపడుతుంది. ఐమెక్కు కేంద్రకంగా ఉన్న ఇజ్రాయెల్కు ప్రాంతీయ స్థిరత్వం, భద్రత ఏర్పడతాయి.ప్రతికూలతలు బహిర్గతంసంక్షుభిత ప్రాంతాలైన సూయజ్, బాబెల్ మాండెబ్లకు దూరంగా ప్రతిపాదించబడిన ‘ఐమెక్ ప్రశాంత కారిడార్’యుద్ధంలో చిక్కుకున్నది. ఫుజెరా, జెబెల్ అలీ రేవు పట్టణాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఖతర్ గ్యాస్ క్షేత్రాలు కూడా దాడులకు గురయ్యాయి. ఐమెక్ పథకాన్ని విజయవంతంగా అమలు చేయటం మూడు కీలక అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అవి 1. సౌదీ–ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ. 2. జెబెల్ అలీ, ఫుజెరా (ఎమిరేట్స్) రేవు పట్టణాల భద్రత. 3. పెట్టుబడులు. ఇరాన్ యుద్ధం ఈ మూడు అంశాల ప్రతికూలతలను బహిర్గతం చేసింది. అబ్రహాం ఒప్పందాలపై సంతకం చేయటానికి మొదటినుండీ సౌదీ రాజు విముఖత చూపుతున్నాడు. హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వలన నౌకల బీమా ఛార్జీలు అమాంతం పెరిగాయి. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ మదుపరులు ముందుకు రావటం కష్టం. అయితే, హార్మూజ్ దిగ్బంధనం, అంతకు ముందు బాబెల్ మాండెబ్ను హౌతీలు మూసివేస్తామని బెదిరించడం ఒక రకంగా ఈ ఇరుకైన సముద్ర మార్గాలకు ప్రత్యామ్నా యంగా రవాణా వ్యవస్థల అభివృద్ధి ఆవశ్యకతను గుర్తు చేసింది. 2023లో ఐమెక్ ఒప్పందం సమయంలో కంటే 2026లో దాని ఆవశ్యకత మరింత పెరిగిందనే చెప్పాలి. హార్మూజ్ ద్వారా రవాణాకు భవిష్యత్తులో కూడా అమెరికాతో సహా ఎవరూ భరోసా ఇవ్వలేరు. గల్ఫ్ ప్రాంత భూతల మార్గాల ద్వారా ఆసియాను ఐరోపాతో అనుసంధానించటమే శ్రేష్ఠమైన ప్రత్యామ్నాయం. శాంతియుత జియో పొలిటికల్ వాతావరణంలో ప్రతిపాదించ బడిన ఐమెక్ పథకాన్ని అశాంతి, ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణపు అనిశ్చిత వాస్తవాల నేపథ్యంలో సవరించాల్సిన అవసరం గోచరి స్తున్నది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధికి సమీపంలోని ఎమిరే ట్స్కు చెందిన ఫుజేరాకు బదులుగా ఒమన్కు చెందిన సలాలా, దుఖమ్, సోహర్ రేవు పట్టణాలను భారత్ పశ్చిమ తీరంతో అనుసంధానించాలి. ఈ పథకాన్ని రవాణా, ఎనర్జీ, డిజిటల్ కారిడార్లుగా విభజించి వేటికవే అమలు పరచటం వాంఛనీయం. ఇబ్బందులు, అడ్డంకులతో కూడిన రవాణా కారిడార్ నిర్మాణాన్ని రెండవ దశలో చేపట్టవచ్చు. మొదటి దశలో ఎనర్జీ, డిజిటల్ కారిడార్లను అమలు పరిచి సైద్ధాంతికంగా పథకం అమలు సాధ్యాన్ని నిరూపించవచ్చు. ఇంతవరకు వివిధ దేశాలు ప్రత్యేక ఒప్పందాల ద్వారా పథకాన్ని అమలు పరుస్తున్నాయి. కానీ ఒక కేంద్రీయ సెక్రటేరియట్ను ఏర్పాటు చేసి సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించాలి. ఇజ్రా యెల్తో ముడిపడిన క్లిష్టమైన అంశాలను పక్కకుపెట్టి భారత్–గల్ఫ్ అనుసంధానంపై దృష్టి పెట్టాలి. భారత్ వ్యూహాత్మక, ఆర్థిక, శక్తి భద్రతలకు ఐమెక్ పథకం అమలు అత్యంత ఆవశ్యకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
అతడు సామాజిక న్యాయ పతాక!
శూద్ర, అతి శూద్ర కులాల అస్తిత్వమే భారతదేశ అస్తిత్వమనీ, ఆ వర్గాల విముక్తే దేశ విముక్తి అనీ, వారి హక్కులే పౌరసమాజం హక్కులనీ కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ తేల్చి చెప్పారు. ఆయనే దేశంలో తొలి సారిగా కింది కులాలకు రిజర్వేషన్లను ఇచ్చి బహుజన రిజర్వేషన్ల పితామహు డిగా చరిత్రలో నిలిచిపోయారు.మహాత్మా జ్యోతిబాఫూలే ఆలోచనలకు ఆచరణాత్మక ప్రయోగశాలగా కోల్హాపూర్ సంస్థానాన్ని ఆయన తీర్చిదిద్దారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిబాఫూలేల ఆలోచనలు ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి. డా‘‘ బాబాసాహెబ్ అంబేడ్కర్ చదువుకు సాయం చేయడంతోపాటు ఆయన స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. అంబేడ్కర్ ఆలోచనలతో దేశంలో దళిత బహుజన సూర్యోదయం జరుగుతుందని 106 ఏళ్ల క్రితమే 1920 మార్చి 22న జాగిర్థారీ మాగాణంలో జరిగిన ‘దక్కన్ అçస్పృశ్య సమాజ సమ్మేళన సభ’లో సాహూజీ ప్రకటించారు. 1918లోనే వెట్టిపని చేసే తలారీ వ్యవస్థను రద్దుచేసి రాజదర్బా రుల్లో దళితులకు ఉద్యోగాలిచ్చే ఉత్తర్వులిచ్చారు. మహర్లకు ఇనాంగా ఇచ్చిన భూములకు వారి పేరుననే పట్టాలు ఇచ్చారు.మరాఠాల బావిలో మంచినీళ్లు తోడుకున్నందుకు దళితుడు గంగారాం కాంబ్లేపై దొంగతనం నేరం ఆరోపించి నడివీధిలో కొరడా దెబ్బలు కొట్టి అవమానించిన విషయం సాహూజీ దృష్టికిరాగానే... దళితుణ్ణి కొట్టిన వ్యక్తిని పిలిపించి అతనివీపు ఎర్రబడేటట్లు కొరడాలతో కొట్టించారు. గంగారాం కాంబ్లే ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా ఆర్థికంగా అతను నిల దొక్కుకునేందుకు హోటల్ పెట్టేందుకు సాయంచేశారు. ఆ హోటల్కు తానే స్వయంగా వెళ్లి టీ తాగివచ్చారు. కులాధిపత్య గోడలు బద్దలు కొడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ‘వితంతు వివాహచట్టం’ తెచ్చారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్నా సగం దేశానికి చట్ట బద్ధ రిజర్వేషన్లు లేవని ఎగుస్తున్న ఉద్యమాలకు ఆయన ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవటం వల్లనే వారి ప్రాతినిధ్యం పార్లమెంటు, అసెంబ్లీలలో అతితక్కు వగా ఉంది. రాజ్యాంగ సవరణచేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్యమాలు రగులుకుంటున్న సందర్భంలో సాహూజీని స్మరించుకుంటూ భారత పాలకులు బీసీల చట్టబద్ధ రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేయాలి. 1902 జూలై 26న దేశ చరిత్రలో మొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఆయన కల్పించారు. బీసీ విప్లవానికి పాటుపడేవారు సాహూజీ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి. – జూలూరు గౌరీశంకర్, బహుజన ఉద్యమకవి (జూన్ 26న ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి) -
సత్యం కోసం మహా త్యాగం..
‘ముహర్రం’ ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. త్యాగానికి, సత్యానికి, అచంచలమైన ధైర్యానికి ప్రతీక. ఈ నెలలో అత్యంత ప్రాముఖ్యమైనది పదవ రోజైన ‘ఆషురా’. ఆరోజు ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. శతాబ్దాల క్రితం, కర్బలా మైదానంలో ప్రవక్త(స) వారి మనుమడైన హజ్రత్ ఇమామ్ హుసైన్ (రజి) ఆయన 72 మంది అనుచరులు అధర్మానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు.యజీద్ అనే పాలకుడి అన్యాయాన్ని అంగీకరించకుండా, ఇస్లామీయ మానవీయ విలువలను, శాంతిని కాపాడటం కోసం ఇమామ్ హుసైన్ తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఆకలి దప్పులతో అలమటించినాసరే, ధర్మం వైపే నిలబడి వీరమరణం పొందిన ఆయన ఉదంతం ప్రపంచ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచిపోయింది. అందుకే ముహర్రం అంటే పండుగ కాదు, అది సత్యం కోసం జరిగిన మహా త్యాగానికి ప్రతిరూపం.ఈ కర్బలా యుద్ధం కేవలం రెండు శక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు; అది న్యాయానికి – అన్యాయానికి, సత్యానికి – అసత్యానికి మధ్య జరిగిన చారిత్రాత్మక సంగ్రామం. తన కళ్లెదుటే పురిటిపాపల నుండి వృద్ధుల వరకు దాహంతో విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నా, ఇమామ్ హుసైన్ అధర్మానికి తలవంచలేదు. ఆయన చూపిన ఈ ధీరత్వం శతాబ్దాలు దాటినా నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంది.అందుకే ఈ రోజున ముస్లింలే కాకుండా, మానవత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకుంటారు. సత్యం కోసం ప్రాణాలనైనా అర్పించవచ్చు కానీ, అన్యాయంతో చేతులు కలపకూడదు. అనే గొప్ప జీవన సందేశాన్ని ముహర్రం మానవాళికి అందిస్తోంది. – ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
అసమానతలు లేనిదే అసలైన అభివృద్ధి
దేశంలో ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలు మొదలైన తర్వాత మార్కెట్లు మెరుగయ్యాయి. పెట్టుబడుల సమీకరణలో రాష్ట్రాల మధ్య పోటీ పెరిగింది. స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పురోగతి కనిపించింది. అయితే అదే సమయంలో ఈ అభివృద్ధి సమాజంలో అంద రికీ సమానంగా అందుతోందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమైంది! మార్కెట్ శక్తుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్లిన తర్వాత రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అనేక వ్యత్యాసాలు కనిపించటమే ఆ ప్రశ్నకు కారణం. ఆధునిక సాంకేతికత, రహదారులు, విద్యుత్తు, భవనాల వంటి మౌలిక వసతులు ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రమే విదేశీ, స్వదేశీ పెట్టుబడులను బాగా ఆకర్షించగలిగాయి. అక్కడ పరిశ్రమలు,ఐటీ వంటి సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందటం వల్ల ఆ కొన్ని రాష్ట్రాలు మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే ప్రధాన ఇంజన్లుగా మారిపోయాయి. మిగిలినవి వెనుకబడి పోతున్నాయి.సంపన్న రాష్ట్రాలకే పెట్టుబడులుదేశంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందటం (ప్రాంతీయ సమతౌల్యం) అనేది ఒకప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్ల వల్ల కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందాయి. దాంతో అభివృద్ధి అన్నది కొన్ని రాష్ట్రాలకే పరిమితమైపోయింది. ఉదా: తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో నగరీకరణ విస్తృతమవటం, మెరుగైన వసతులు ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు సమృద్ధిగా సమకూరుతున్నాయి. గుజరాత్లో రేవులు, మహారాష్ట్రలో రవాణా వ్యవస్థలు, తమిళనాడులో ఫ్యాక్ట రీలు, కర్ణాటకలో ఐటీ పార్కులు, ఢిల్లీలో భారీగా రిటైల్ వ్యాపారాలు ఉండటంతో ఆయా రాష్ట్రాలు అభివృద్ధి పోటీలో ముందుంటు న్నాయి. ఈ పోటీ వల్ల కేవలం ఆర్థికంగా ఎదగటమే ప్రధానం అయింది కానీ, సమాజంలో అందరికీ సమాన న్యాయం జరగడం లేదు. ఎక్కువ సంపాదన ఉన్న రాష్ట్రాల్లో కూడా ధనిక, పేద అసమా నతలు పెరిగిపోతున్నాయి. ఈ వృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థికంగానే కాకుండా అక్షరాస్యత, ఉన్నత విద్య, ఆసుపత్రుల అందుబాటు, పౌష్టికాహారం వంటి విషయాల్లో కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు బాగా పెరిగిపోయాయి. నగరాలు, కర్మాగా రాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అవకాశాలు పెరగడంతో, వెనుక బడిన రాష్ట్రాల నుండి ప్రజలు అక్కడికి వలస వెళుతున్నారు. నైపుణ్యం ఉన్న శ్రామికులు, ఎక్కువ డబ్బు ‘ఇవ్వగల’ రాష్ట్రాలకే వెళ్తుండటంతో మిగతా ప్రాంతాలు ఇంకా వెనుకబడిపోతున్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్.) ప్రకారం 2017–2018 నుండి 2023–2024 మధ్యకాలంలో దేశంలో ధనిక, పేద ప్రజల మధ్య ఆదాయ అసమానతలు బాగా పెరిగాయి. ‘జినీ ఇండెక్స్’ సూచీని అనుసరించి హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ ఆదాయ అసమా నతలు మిజోరాం, బిహార్, మణిపుర్, గోవాలలో నమోదయ్యాయి. విద్య, పరిశ్రమలు, రోడ్ల వంటి సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల 2025లో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్లో పేదరికం ఎక్కు వగా ఉంది. అదే సమయంలో మంచి వసతులు, విద్యాలయాలు, నగరాలు ఎక్కువగా ఉండటం వల్ల కేరళ, గోవా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లలో పేదరికం స్థాయి తక్కువగా ఉంది. ‘సంపాదన’ ఉన్నా... తప్పని నిరుద్యోగంవ్యాపారాలు, సంపాదన బాగున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పేదరికాన్ని తగ్గించగలిగాయి కానీ, నిరుద్యోగాన్ని మాత్రం ఆపలేకపోయాయి. 2025–26 మొదటి అర్ధభాగంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ వంటి చోట్ల నిరుద్యోగం ఎక్కువగా ఉంటే; గుజరాత్, జార్ఖండ్, కేరళ యూపీ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కేరళ, హరియాణా రాష్ట్రాల్లో ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలు బాగున్నా అక్కడ కూడా నిరుద్యోగం ఎక్కువే ఉంది. ఇక ఆసుపత్రులు, ఆరోగ్య వసతులకు గుర్తింపుగా చూసే ‘శిశు మరణాల రేటు’ (పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో చనిపోయే వారి సంఖ్య) ఛత్తీస్గఢ్లో 36, ఉత్తరప్రదేశ్లో 35, మధ్యప్రదేశ్లో 35 గా ఉంది. అదే, కేరళలో కేవలం 8, తమిళనాడు, ఢిల్లీలలో 11 గా ఉండి ఆ రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం విషయానికి వస్తే, పి.ఎల్.ఎఫ్.ఎస్. 2023–24 ప్రకారం జాతీయ స్థాయిలో పురుషులు 76.3 శాతం మంది పని చేస్తుంటే, మహిళలు కేవలం 40.3 శాతం మందే ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రేటు ఢిల్లీ, పంజాబ్, యూపీలలో మరీ తక్కువగా ఉంది. చదువు విషయా నికొస్తే మాత్రం కాలేజీల్లో చేరే అబ్బాయిలు, అమ్మాయిల సంఖ్య దాదాపు సమానంగా ఉండి, చదువుల్లో అసమానతలు తగ్గినప్పటికీ, మధ్యలోనే స్కూళ్లు కాలేజీలు మానేస్తున్న వారి సంఖ్య పెరగడం దేశానికి పెద్ద సవాలుగా మారింది. సహకారంతోనే సమ్మిళిత వృద్ధిమార్కెట్ ఆధారిత వ్యవస్థల వల్ల ఆర్థిక వృద్ధి రేటు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు సమాజానికి అవసరమైన విద్య, వైద్యం వంటి వాటిపై తగినంతగా ఖర్చు పెట్టకపోవడం వల్ల మానవాభివృద్ధి వెనుకబడిపోతోంది. కనుక, ప్రభుత్వాలు కేవలం ఆర్జన పెంచడం పైనే కాకుండా అందరికీ ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించి వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడం, రోడ్లు–రవాణా వసతులు పెంచడం, ప్రజలకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం ద్వారానే అందరికీ సమానమైన వృద్ధి (సమ్మిళిత వృద్ధి) సాధ్యమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజల చదువు, వైద్యంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడే రాష్ట్రాల మధ్య ఉండే పోటీతత్వం దేశం మొత్తానికి సమానమైన అభివృద్ధిని తెచ్చిపెడుతుంది. డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు -
ప్రచారానికి ఇంత ఖర్చా?
వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం సమంజసమేనా?2026–27లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు (జీఎస్డీపీలో 3.8%). కేంద్ర ఆర్థిక సంఘం నిర్దేశించిన 3% పరిమితిని మించిపోయింది. మొత్తం బకాయి అప్పులు జీఎస్డీపీలో 36% వద్ద ఉన్నాయి. రెవెన్యూ లోటు 1.1%. ఏటా వేల కోట్ల అప్పు తీసుకుంటూ, కేంద్ర గ్రాంట్లపై అధికంగా రాష్ట్రం ఆధారపడుతోందని కాగ్ నివేదికలు, బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోనూ ప్రచార ఖర్చులు తగ్గకపోగా పెరగడం విడ్డూరం.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా విజయాల ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తోంది. 2025 సెప్టెంబర్ 10న అనావృష్టి పీడిత అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఈ ప్రచార పర్వానికి నిదర్శనం. హామీలు పూర్తిగా నెరవేరకుండానే విజయోత్సవం జరుపుకోవడాన్ని ‘పీఆర్ మాయాజాలం’.పెట్టుబడులను ఆహ్వానించే పేరుతో 2025 నవంబర్ 14–15న విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ‘ముందుగా సిద్ధం చేసిన ప్రచార ప్రహసనం’గా అభివర్ణించింది. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి ప్రాజెక్టుల పునరుద్ధరణను హడావుడిగా ప్రచారం చేయడం, దావోస్లో రూ. 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడుల వాగ్దానం గురించి ప్రచారం చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ఊహించడం కష్టమేమీ కాదు.సుప్రీం కోర్టు ఏం చెప్పింది?ఈ ఖర్చులు కేవలం దుబారా మాత్రమే కాదు, చట్టపరమైన నిబంధనలకూ విరుద్ధం. 2015 మే 13న ‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (రిట్ పిటిషన్ నం. 13/2003) కేసులో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ ప్రక టనల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం ప్రకటనలు ప్రభుత్వ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యతలకు సంబంధించిన సమాచారం కోసమే ఉండాలి; వ్యక్తులను లేదా రాజకీయ పార్టీలను కీర్తించడానికి కాదు. వ్యక్తిపూజ ‘ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సరాసరి విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది.ఖర్చు పొదుపుగా, పన్ను చెల్లింపుదారుల సొమ్ముకు గరిష్ఠ విలువ లభించేలా ఉండాలి. ముఖ్యంగా, ప్రతి శాఖా, ప్రభుత్వ రంగ సంస్థా తన ప్రకటనల బడ్జెట్ను బహిర్గతం చేసి కాగ్ ఆడిట్కు లోబడాలి. ప్రక టనల కంటెంట్ను పర్యవేక్షించేందుకు ప్రతి రాష్ట్రమూ ముగ్గురు సభ్యుల కమిటీని (సీసీఆర్జీఏ) ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. చాలా రాష్ట్రాల్లో లాగానే ఇక్కడా ఈ కమిటీలు సమర్థంగా పనిచేయడం లేదు. ప్రకటనల బడ్జెట్ను బహిర్గతం చేయకపోవడం, ఆడిట్కు లోబడకపోవడం, కోర్టు నిర్దేశించిన పారదర్శకతా సూత్రాన్ని తుంగలో తొక్కడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: చీకటి ఎల్లకాలమూ ఉండదు!సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ ఖాతాలు, ప్రాయోజిత ప్రకటనలు పెద్దఎత్తున నడుస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు అవాస్తవ సమాచారానికి, అతిశయోక్తులకు బలవుతూ వాస్తవానికి దూరమవుతున్నారు. అంతిమంగా, ఈ ఆర్భాటపు ప్రచారానికి అయ్యే ఖర్చును భరిస్తున్నది ఎవరు? ప్రజలే. ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గౌరవించి, నిజమైన అభివృద్ధివైపు మళ్లాలి. లేకుంటే, ఈ ‘ప్రచార పర్వం’ ప్రజాధనానికి తూట్లు పొడుస్తూనే ఉంటుంది.– డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ సీనియర్ జర్నలిస్ట్ -
ఒక సామాజిక ఆవేదన..
మనిషి చరిత్రలో ఇంత సౌకర్యవంతమైన కాలం మరొకటి లేదు. ఆకలి వేస్తే స్విగ్గీ ఉంది. మందులు కావాలంటే బ్లింకిట్ ఉంది. ప్రయాణానికి ఉబెర్ ఉంది. సందేహాలకు ఏఐ ఉంది. వినోదానికి అంతులేని రీల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒక చేతిలో ఇమిడి పోయింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది – ఇంత కనెక్ట్ అయిన ప్రపంచంలో మనుషులు ఎందుకు మరింత ఒంటరిగా మారుతున్నారు?ఒకప్పుడు దుకాణానికి వెళితే పొరుగు వారితో మాట్లాడేవాళ్లం. వీధి చివర టీ దుకాణం ఒక చిన్న సామాజిక వేదికగా ఉండేది. ప్రయా ణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ అవసరాలన్నీ యాప్ల ద్వారా తీరిపోతున్నాయి. తక్కువగా నడుస్తున్నాం. తక్కువగా కలుస్తున్నాం. తక్కువగా మాట్లాడు తున్నాం. ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నాం. ఇది సేవల ఆర్థిక వ్యవస్థ విజయం. కానీ సంబంధాల ఆర్థిక వ్యవస్థ వైఫల్యం.ప్రపంచ ఆరోగ్య సంస్థ–2025 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. 2014–19 మధ్య ఒంటరితనం కారణంగా సంవత్సరానికి 8.7 లక్షల మరణాలు సంభవించాయి. భారతీయులు సగటున రోజుకు ఐదు గంటలకు పైగా స్మార్ట్ఫోన్లో గడుపుతున్నారు. అందులో ఎక్కువ భాగం సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్కే. ప్రతి రీల్, ప్రతి లైక్, ప్రతి నోటిఫికేషన్... ప్రతి కొన్ని సెకన్లకు మెదడుకు ఒక చిన్న డోపమైన్ రివార్డ్. ఇది అలవాటు అవుతుంది. తర్వాత అవసరం అవుతుంది. చివరకు వ్యసనం అవుతుంది.మాదకద్రవ్యాల సమస్య గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా స్మగ్లింగ్, నేరాలు, అరెస్టుల గురించి చర్చిస్తాం. కానీ యువత డ్రగ్స్ వైపు ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్నను విస్మరిస్తాం. డ్రగ్స్ సమస్యకు అసలు మూలం చాలాసార్లు డ్రగ్స్ కాదు – ఒంటరితనం, నిరాశ, అనుబంధాల కొరత. అందుకే డ్రగ్స్పై యుద్ధం గెలవాలంటే, ఒంటరితనంపై పోరాటం ప్రారంభించాల్సిందే. ఇందులో భాగంగా యువత కోసం 24 గంటల హెల్ప్ లైన్లు, సహచరమద్దతు వేదికలు అందుబాటులోకి రావాలి. ఒంటరితనానికి మందు మందుల దుకాణంలో దొరకదు. అది ఒక స్నేహితుడి ఫోన్ కాల్లో ఉంటుంది.ఒక కుటుంబ సంభాషణలో ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంలో ఉంటుంది. మనం యంత్రాలను కలిపాం. డేటాను కలిపాం. ప్రపంచాన్ని కలిపాం. కానీ మనిషిని మనిషికి కలపడం మర్చిపోయాం. ఇప్పుడు చెయ్యాల్సింది అదే! – వంగవోలు రవి, ఉపాధ్యాయుడు, ఒంగోలు(రేపు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం) -
మూసీపై ఆ రెండు వంతెనల వ్యథ..
హైదరాబాదులో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతె నలు నగరానికి రెండు ముఖాలను చూపి స్తాయి. ఒకటి చారిత్రక ప్రాధాన్యం గల చాదర్ఘాట్ వంతెన, రెండోది ఆధునిక డిజైన్తో కూడిన నాగోల్ వంతెన. మొద టిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండోది నగర శివారులో వరదను దాటించలేకపోతోంది. ఈ రెండు వంతెనల పరిస్థితి తెలిస్తే హైదరాబాద్ వరద సమస్యకు అసలు కారణం బోధపడుతుంది.నిజాం కాలంలో పాతబస్తీకీ, రెసిడెన్సీకీ మధ్య వారధిగా చాదర్ ఘాట్ వంతెన నిర్మించారు. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తోంది. కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్ వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి. ఇటీవలి కాలంలో పిల్లర్ల బలోపేతానికి చేపట్టిన పనులవల్ల, పిల్లర్ల మధ్య ఖాళీ కుంచించుకుపోయింది. వర్షాకాలంలో నీటితో పాటు వచ్చే వ్యర్థాలు ఈ ఇరుకు సందుల్లో చిక్కుకుపోతున్నాయి. వంతెన కిందే అవరోధం ఏర్పడి, నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్ను ముంచెత్తుతోంది.క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, గత కొన్ని దశాబ్దాలలో చాదర్ఘాట్ వద్ద పురాతన కాలం నుండి సహజంగా ఉన్న నది వెడల్పు చాలావరకు తగ్గినట్లు కనిపిస్తుంది. నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్, మెకానిక్ షెడ్లు వెలిశాయి. వర్షం రాగానే అవే మొదట మునుగుతున్నాయి. ఆ వాహనాలు, సామగ్రి నీటి ప్రవాహా నికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి..చాదర్ఘాట్ వంతెన గత కాలపు దూరదృష్టికి నిదర్శనం. నాగోల్ వంతెన ఆధునిక ఇంజినీరింగ్కు కొలమానం. కానీ రెండూ వరదల్లో మునుగుతున్నా యంటే తప్పు వంతెనలది కాదు, నది సహజ స్వభా వాన్ని అర్థం చేసుకోని మనది!ఇక నాగోల్ వంతెన ఔటర్ రింగ్ రోడ్లో భాగంగా ఎల్బీ నగర్–ఉప్పల్ ట్రాఫిక్ను తగ్గించేందుకు నిర్మించారు. ఆధునిక డిజైన్, వెడల్పాటి రోడ్డు, ఎత్తైన పిల్లర్లు– పైకి అన్నీ బాగానే కనిపి స్తాయి. కానీ సమస్య వంతెనలో లేదు, కట్టిన ప్రదేశ స్వభావంలో ఉంది. నాగోల్ వంతెన మూసీ నది పెద్ద మియాండర్ (వంపు తిరిగే) ప్రాంతంలో ఉంది. వరద సమయంలో నీరు నేరుగా పారదు. మియాండర్ వద్ద నీటి వేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది. ఫలితంగా 2020 అక్టోబర్ వరదల్లో నాగోల్ వంతెన వద్ద నీటిమట్టం వంతెన స్థాయికి చేరి పక్కనే ఉన్న బండ్లగూడ, నాగోల్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాగోల్ వంతెనకు ఇరువైపులా కాల క్రమేణా నిర్మాణాలు వెలిశాయి. దీనితో వరద మైదానం విస్తీర్ణం తగ్గింది. 2023లో నాగోల్ ప్రాంతంలోని కొన్ని అపార్ట్మెంట్ల సెల్లార్లు మునిగి వాహనాలు పాడయ్యాయి. భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి తగినంత స్థలం లేకుండా పోయింది.ఏం చెయ్యాలి?హైడ్రాలిక్ అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, భారీ వర్షాల సమయంలో మూసీలోకి చేరే నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. కానీ ఆక్రమణల వల్ల చాదర్ఘాట్, నాగోల్ వంటి కీలక పాయింట్ల వద్ద నది మోయగలిగే సామర్థ్యం తగ్గిపోయింది. ‘మూసీ రివర్ఫ్రంట్ రీజువెనేషన్’ పథకంలో భాగంగా ఇక్కడ రియల్ టైమ్ వాటర్ లెవల్ సెన్సార్ ఏర్పాటు చేసి స్థానిక వ్యాపార సంఘాలతో అనుసంధానిస్తే వరద సమయంలో వ్యాపారులు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. నాగోల్ వద్ద వంతెనకు ఎగువన, దిగువన నది సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వరద మైదానాన్ని శాస్త్రీయంగా పునరుద్ధరించే ప్రణాళికను అమలు చేయాలి.అలాగే నదీ తీరంలో కొత్తగా నిర్మించే భవనాలకు ‘స్టిల్ట్ ఫ్లోర్’ విధానాన్ని తప్పనిసరి చేసి, సెల్లార్ల నిర్మాణాన్ని పరిమితం చేసే దిశగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాదర్ఘాట్ నుంచి నాగోల్ వరకు డ్రోన్ సర్వేతో త్రీడీ మ్యాపింగ్ చేపట్టి ఎక్కడ వరద ముప్పుందో, ఎక్కడ నీటి ప్రవాహం నిరోధించ బడుతోందో ముందుగానే గుర్తిస్తే వర్షాకాలంలోపు నివారణ చర్యలు తీసుకోవచ్చు.- డా. రామకృష్ణ మనిమద్దె, వ్యాసకర్త ఎర్త్ సైంటిస్ట్ – నదీ వ్యవస్థల పరిశోధకులు


