పశ్చిమ దేశాల మార్కెట్లతో పాటు చైనాపై అధికంగా ఆధారపడేకన్నా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారత దేశం ప్రయత్నించాలి.
విశ్లేషణ
ఆర్థిక సార్వభౌమాధికారం, దీర్ఘకాల పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని ముఖ్య దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. ప్రస్తుతం 13 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ), 6 ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు అమలులో ఉన్నాయి. దశల వారీగా దిగుమతి సుంకాల తగ్గింపు; ఇతర దేశాల ద్వారా భారత్లోకి ప్రవేశి స్తున్న చైనా వస్తు ప్రవాహాన్ని అరికట్టడం; ఆహార ప్రాసెసింగ్, ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మా, రసాయనాల విషయంలో భారత్కు ఉన్న పోటీతత్వాన్ని నిలుపుకోవడం; రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రక్షణ లాంటి అంశాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి.
ఆయా వాణిజ్య ఒప్పందాలు భారత్కు మిశ్రమ ఫలితాలను అందించాయి. భారత్ – ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారత్కు వాణిజ్య లోటు అధికమైంది. దక్షిణ కొరియా విషయంలో భారత్ నుండి ఎగుమతుల కన్నా కొరియా నుండి దిగుమతులు అధి కంగా ఉన్నాయి. జపాన్, ఎస్ఏఎఫ్టీఏలో ఒప్పందాలు పరిమిత ప్రయోజనాలనే అందించాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఒప్పందాలు వాణిజ్యపరంగా ప్రయోజ నాన్ని కల్పించాయి.
ఎదురయ్యే పరిణామాలు
సంబంధిత లెజిస్లేటివ్, న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత యూకేతో జరిగిన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుంది. అటు ఈయూ కౌన్సిల్, యూరోపియన్ పార్లమెంట్; ఇటు భారత పార్లమెంటు ఆమోదం తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరిగిన ఒప్పందం ఖరారవుతుంది. భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం కొంత సమయం తీసుకొనే అవకాశం ఉంది. ఒప్పందాలు ఖరారయ్యే సమయంలో కొన్ని వ్యూహాత్మక సవాళ్లను భారత్ ఎదుర్కోవచ్చు. ఆ యా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వలన దిగుమతుల పెరుగుదలతో పాటు, సున్నితమైన రంగాలలో ఉపాధి నష్టాన్ని భారత్ చవిచూడవచ్చు. దిగుమతి సుంకాలు తగ్గించనప్పటికీ ఉత్పత్తుల సర్టిఫికేషన్, పర్యావరణ, శ్రామిక ప్రమాణాలు, శానిటరీ, ఫైటో శానిటరీ అంశాలు భారత్కు సమస్యగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి.
వ్యవసాయ సబ్సిడీలు ఆ యా దేశాలలో అధికంగా ఉన్నందు వలన భారత రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఈయూ, యూకే నుండి డైరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులను నిరోధించే విధంగా భారత్ ఒప్పందం చేసుకోవాలి. ఈయూ చివరి నిమిషంలో ‘వాతావరణ అనుసంధాన వాణిజ్య నియమాలకు’ పట్టుబట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ నుండి ఎగుమ తయ్యే సిమెంటు, ఉక్కు, అల్యూమినియంపై ‘కార్బన్ ట్యాక్స్’ పడి, ఆయా ఉత్పత్తుల విషయంలో పోటీతత్వం తగ్గుతుంది. అమెరికా కూడా ఒప్పందం సమయంలో డిజిటల్ వాణిజ్య సరళీకరణ, పటిష్ఠమైన మేధా సంబంధిత హక్కులు, వ్యవసాయం, మెడికల్ డివైజెస్కు సంబంధించిన డిమాండ్లు తెచ్చే అవకాశం ఉంది. భారత్ కూడా ఫార్మా రంగం, హెచ్–1 బి వీసాల సరళీకరణ లాంటి అంశాలు లేవనెత్తవచ్చు.
చేరకపోవడమే సముచితం
చైనా కేంద్ర బిందువుగా ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్సీఈపీ) ఏర్పాటయింది. ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలు, న్యూజిలాండ్ ఇందులో సభ్య దేశాలు. దీని ఏర్పాటుకు సంబంధించిన చర్చలలో భారత్ పాల్గొన్న ప్పటికీ, ఒప్పందం సమయంలో సభ్యత్వం పొందడాన్ని విరమించు కొంది. ఈ ఒప్పందం వలన రైతులు, ఎంఎస్ఎంఈ సంస్థలకు నష్టం కలుగుతుందనీ, వాణిజ్య లోటు అధికమవుతుందనీ, ప్రాంతీయ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం ఉంటుందనీ భారత్ భావించింది. డైరీ, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ మార్కెట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ పోటీ ఎదుర్కొంటోంది. ఒప్పందం వలన గోధుమ, పామాయిల్, మిల్క్ పౌడర్ లాంటి ఉత్పత్తులు చౌకగా భారత్లోకి దిగుమతి అయినట్లయితే రైతులు నష్టపోయేవారు.
ఆ యా దేశాలు అవలంబించే డంపింగ్ను నియంత్రించడానికి సరిపోను రక్షణ వలయం విషయంలో భారత్ వెనుకబడి ఉంది. రసాయనాలు, యంత్రాలు, ఉక్కు, ఎలక్ట్రానిక్స్, ఆట వస్తువులు చైనా నుండి భారత్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ. చౌక ధరలకు ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయినప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తాయి. ఈ ఒప్పందంలో భారత్ భాగం కాకపోవడాన్ని సమర్థవంతమైన నిర్ణయంగా చూడాలి.
ఏ వ్యూహం అవసరం?
పశ్చిమ దేశాల మార్కెట్లతో పాటు చైనాపై అధికంగా ఆధార పడే కన్నా ఫార్మల్ అగ్రిమెంట్స్ లేకపోయినప్పటికీ కొన్ని దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఆఫ్రికా ప్రస్తుత జనాభా 1.4 బిలియన్లు కాగా 2050 నాటికి 2.5 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికాలతో వాణిజ్య ఒప్పందాలకు భారత్ ప్రయత్నించాలి. ఆఫ్రికాతో ఒప్పందం కారణంగా ఆహార భద్రత, శక్తి, ఖనిజాలు, అవస్థాపనా సౌకర్యాల ప్రాజెక్టులు, ఫార్మా రంగంలో భారత్కు వ్యూహాత్మక ప్రయోజనాలు కలుగుతాయి. వాణిజ్యపరమైన అడ్డంకులు తక్కువగా ఉండటంతో పాటు ఆఫ్రికా వృద్ధి రేటు అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.
భారత్ ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్ ఉన్న మిడిల్ ఈస్ట్లోని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లతో వాణిజ్య సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఆహారం, వ్యవ సాయ ఉత్పత్తులు, టెక్ట్స్టైల్స్, ఆభరణాలు, ఫార్మా, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, మెషినరీ, హ్యాండీక్రాప్ట్స్, ఆయుర్వేదిక్, హెర్బల్, వెల్నెస్ ఉత్పత్తులకు ఆ యా మార్కెట్లలో డిమాండ్ ఉంది.
లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, మెక్సికో, చిలీ, పెరూ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అవసరం. ఇంజినీరింగ్ వస్తువులు, రసాయ నాలు, ఫార్మాస్యూటికల్స్, ఇనుము, ఉక్కు, టెక్స్టైల్స్ ఉత్పత్తులకు బ్రెజిల్లో డిమాండ్ అధికం. మొత్తంగా లాటిన్ అమెరికా మార్కెట్ లోనే వీటికి డిమాండ్ అధికంగా ఉన్నందువలన భారత్కు వాణిజ్య పరంగా లాభదాయకంగా ఉంటుంది. చిలీ, పెరూ, మెక్సికోతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొరకు చర్చలు జరుగుతున్న సమయంలో భారత్ వేగంగా స్పందించడం ద్వారా ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి. తక్కువ దిగుమతి సుంకం, మార్కెట్ లభ్యత కారణంగా భారత్ ఎగుమతులు పెరుగుతాయి.
‘స్మార్ట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని’ అవలంబించడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి సారించాలి. అత్యంత సరళీకరణ ఒప్పందాలు వాణిజ్య లోటు పెరుగుదలకు దారి తీస్తాయి. వస్తువులకు సంబంధించిన ఒప్పందాల వలన పరిమిత ప్రయోజనాలే సిద్ధిస్తాయి కనుక తయారీ, సేవలకు సంబంధించిన ఒప్పందాలపై భారత్ భవిష్యత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. వాణిజ్య ఒప్పందాల ద్వారా అధిక ప్రయోజనాలు పొందాలంటే శ్రామిక మార్కెట్లు, లాజిస్టిక్స్, తయారీ రంగం, సేవల వాణిజ్యం, మౌలిక సౌకర్యాల రంగాలలో సంస్కరణలు అవసరం.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జి),ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్


