భారీ ఉగ్ర కుట్ర భగ్నం: ఎనిమిది మంది అరెస్ట్ | 8 arrested for plotting terror attack in India | Sakshi
Sakshi News home page

భారీ ఉగ్ర కుట్ర భగ్నం: ఎనిమిది మంది అరెస్ట్

Feb 22 2026 11:29 AM | Updated on Feb 22 2026 11:49 AM

8 arrested for plotting terror attack in India

న్యూఢిల్లీ: భారత గడ్డపై మరోసారి నెత్తురు పారించాలని చూసిన అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా కుట్రను ఢిల్లీ పోలీసులు  తిప్పికొట్టారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద సంస్థల అండదండలతో భారత్‌లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచించిన ఎనిమిది మంది ముష్కరులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఆరుగురిని తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో, మరో ఇద్దరిని పశ్చిమ బెంగాల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులకు పట్టుబడిన వారిలో కొందరు బంగ్లాదేశీయులు ఉన్నారని, వీరంతా నకిలీ ఆధార్ కార్డులతో తమ స్వస్థలాలను దాచిపెట్టి, దేశంలో చొరబడినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా తమిళనాడులోని గార్మెంట్ తయారీ యూనిట్లలో కార్మికులుగా చలామణి అవుతూ, వీరు రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలను సాగిస్తున్నట్లు ప్రత్యేక విభాగం అధికారులు గుర్తించారు. ఈ భారీ కుట్ర వెనుక విదేశాల్లో తలదాచుకున్న హ్యాండ్లర్ల హస్తం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంటూ ఈ ఎనిమిది మందిని భారత్‌లో ఆపరేట్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు నిర్ధారించాయి. నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, పదహారు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిలోని డిజిటల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, చారిత్రక కట్టడాలే లక్ష్యంగా లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఐఈడీ దాడులకు ప్లాన్ చేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ముఖ్యంగా పాత ఢిల్లీలోని చాంద్‌నీ చౌక్ ప్రాంతంలోని ఓ దేవాలయంతో పాటు ఎర్రకోట పరిసరాల్లో మారణహోమం సృష్టించేందుకు వీరు వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఢిల్లీ మెట్రో సహా సుమారు పదికి పైగా ప్రాంతాల్లో ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలతో కూడిన రెచ్చగొట్టే పోస్టర్లను ఈ ముఠా అంటించింది. ఈ పోస్టర్ల మూలాలపై దర్యాప్తు చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులకు తమిళనాడు కేంద్రంగా సాగుతున్న ఈ నెట్‌వర్క్‌ చిరునామా చిక్కింది. గతంలో జమ్ముకశ్మీర్ నుంచి ఫరీదాబాద్‌లోని అల్ఫలా యూనివర్సిటీ వరకు విస్తరించిన డాక్టర్ల ఉగ్ర మాడ్యూల్ తరహాలోనే, ఈ ముఠా కూడా అత్యంత రహస్యంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఢిల్లీ డిక్లరేషన్: బయటపడిన పాక్ కుళ్లు.. తైవాన్‌ భయం?

Advertisement
 
Advertisement
Advertisement