న్యూఢిల్లీ: ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ నేపధ్యంలో భారత్ నేతృత్వంలో ‘ఢిల్లీ డిక్లరేషన్’ రూపొందింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. అమెరికా, చైనా తదితర అగ్రరాజ్యాలు సహా 88 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు తెలపడం గమనార్హం. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంలో పాకిస్తాన్, తైవాన్ దేశాలు భాగస్వాములుగా చేరకపోవడం చర్చనీయాశంగా నిలిచింది
దౌత్యపరమైన విబేధాలతో..
భారత్ ప్రతిపాదించిన ఈ అంతర్జాతీయ ఏఐ ఫ్రేమ్వర్క్కు పాకిస్తాన్ దూరంగా ఉండటం వెనుక ప్రధానంగా దౌత్యపరమైన విబేధాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలను గుర్తించడానికి పాక్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ సదస్సులో భారత్ పోషించిన పాత్రపై పాకిస్తాన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇదే ఈ ఒప్పందానికి పాక్ను దూరం చేసింది. సాంకేతిక పురోగతి కంటే రాజకీయ ప్రాధాన్యతలే గొప్ప అనే ధోరణితో పాకిస్తాన్ వ్యవహరిస్తోంది.
తైవాన్కు ‘వన్ చైనా’ అడ్డంకి
మరోవైపు సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచానికే తలమానికంగా నిలిచిన తైవాన్ ఈ సదస్సుకు హాజరుకాకపోవడం వెనుక ‘వన్ చైనా’ (One China) విధానం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ ఢిల్లీ డిక్లేరేషన్పై సంతకం చేసిన దేశాలలో చైనా ఒకటి. అంతర్జాతీయ వేదికలపై తైవాన్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించే ఏ ప్రయత్నాన్నైనా చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తైవాన్ గైర్హాజరుకు సాంకేతిక కారణాల కంటే చైనా ఒత్తిడి, అంతర్జాతీయ గుర్తింపు సమస్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ చిప్ల సరఫరాలో 90 శాతానికి పైగా వాటా కలిగిన తైవాన్ ఈ ఒప్పందంలో లేకపోవడం సాంకేతికంగా పెద్ద లోటుగా మిగిలింది. భారత్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సు 88 దేశాల అఖండ మద్దతుతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి వరకు సాంకేతికతను తీసుకెళ్లాలనే సంకల్పాన్ని చాటిచెప్పింది.


