‘భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం | Assam CM wrong politics: Priyanka Gandhi Vadra | Sakshi
Sakshi News home page

‘భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం

Feb 20 2026 12:29 PM | Updated on Feb 20 2026 12:37 PM

Assam CM wrong politics: Priyanka Gandhi Vadra

గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమని, అయితే ఒక నాయకుడి భార్యను, పిల్లలను ఇటువంటి వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన రాజకీయమని ఆమె మండిపడ్డారు.

గౌరవ్ గొగోయ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటూ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదని ప్రియాంక పేర్కొన్నారు. రాజకీయ నేతలు రెండు రకాలుగా ఉంటారని, ఒకరు అభివృద్ధి, సానుకూలతను కోరుకునే వారైతే, మరొకరు కేవలం విభజన రాజకీయాలకు పాల్పడతారని ప్రియాంక వ్యాఖ్యానించారు. గౌరవ్ గొగోయ్ ఎప్పుడూ సానుకూల రాజకీయాలనే నమ్ముకున్నారని, అందుకే ఆయనపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆమె  ఆరోపించారు. అయితే అస్సాం ప్రజలకు అంతా తెలుసని, గొగోయ్ ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ నేతలు ఈ స్థాయికి దిగజారుతున్నారని ఆమె విమర్శించారు.

ముఖ్యమంత్రి అనవసర విమర్శలు మానుకుని రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని ప్రియాంక గాంధీ హితవు పలికారు. అస్సాం యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలో భారీగా అవినీతి జరుగుతోందని, ప్రజలను నమ్మించి మోసం చేయడమే ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయంగా మారిందని ఆమె ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలను పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.

గౌహతి శివార్లలోని సోనాపూర్ వద్ద  గాయకుడు జుబీన్ గార్గ్ స్మారక చిహ్నం ‘జుబీన్ క్షేత్ర’ను సందర్శించి ప్రియాంక గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుబీన్ గార్గ్ రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అని, తన జీవితాంతం ప్రేమ అనే సందేశాన్ని సమాజానికి అందించారని కొనియాడారు. ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రదేశం పవిత్రమైనదని, అటువంటి స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని, తాను కేవలం ఒక సామాన్యురాలిగా గౌరవప్రదంగా నివాళులర్పించడానికి మాత్రమే వచ్చానని ఆమె స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ‘ప్యాక్స్ సిలికా’లోకి భారత్.. ఇక ఏఐలో మనదే హవా..

Advertisement
 
Advertisement
Advertisement