అస్సాంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా నిలవనుంది.
ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.
ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ
ఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.


