న్యూఢిల్లీ: హైవేయే రన్వేగా మారితే? ఆ అద్భుతం అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో రూపుదిద్దుకుంది. దిబ్రూగఢ్–మోరాన్ జాతీయ రహదారిపై 4.2 కి.మీ. పొడవైన ప్రాంతం అత్యాధునిక రన్వేగా కొత్త రూపు సంతరించుకుంది. ఇలాంటి ‘హైవే–రన్వే’లను ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)గా పిలుస్తారు. ఇది ఈశాన్య భారతంలో తొట్టతొలి ఈఎల్ఎఫ్గా రికార్డులకెక్కింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆయన ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్ సమీపంలోని చబువా ఎయిర్ఫోర్స్ స్టేషన్ చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా మోరాన్ బైపాస్ సమీపంలోని ఈఎల్ఎఫ్పై దిగుతారు. అనంతరం అక్కడ జరిగే మెగా ఎయిర్ షోను ఆయన తిలకిస్తారు. రఫేల్, సుఖోయ్లతో పాటు వాయుసేనకు చెందిన మొత్తం 16 యుద్ధ విమానాలు ఈఎల్ఎఫ్పై ల్యాండవడమే గాక పలు విన్యాసాలతో అలరించనున్నాయి. అనంతరం మోదీ అస్సాంలో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గువాహటి వద్ద బ్రహ్మపుత్ర నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల కుమార్ భాస్కర్వర్మ సేతు, కామపూర్ జిల్లాలో నేషనల్ డేటా సెంటర్, ఐఐటీ–గువాహటి తదితరాలు వీటిలో ఉన్నాయి.
చైనాకు దగ్గర్లో...
చైనా సరిహద్దుకు కేవలం 150 కి.మీ. సమీపంలో నిర్మించిన ఈ ఈఎల్ఎఫ్ రక్షణ అవసరాల దృష్ట్యా భారత్కు చాలా ముఖ్యమైనది. విపత్తు, ఎమర్జెన్సీ సమయాల్లో సాధారణ, యుద్ధ విమానాల రాకపోకలకు ఇది వీలు కలి్పస్తుంది. భారత వాయుసేన సహకారంతో దీన్ని నిర్మించారు. యుద్ధ విమానాలే గాక సీ–17 గ్లోబ్ మాస్టర్ వంటి భారీ రవాణా విమానాల ల్యాండింగ్కు కూడా అనువుగా దీన్ని రూపొందించారు. 40 టన్నుల బరువున్న యుద్ద విమానాలతో పాటు 74 టన్నుల బరువుండే రవాణా విమానాలు సైతం దీనిపై సులువుగా దిగగలవు. దేశ పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఈఎల్ఎఫ్లు అందుబాటులో ఉన్నాయి.


