నరవణే పుస్తకం లీక్: ‘పెంగ్విన్‌’ను విచారించిన పోలీసులు | Delhi Police questions Penguin Random House India | Sakshi
Sakshi News home page

నరవణే పుస్తకం లీక్: ‘పెంగ్విన్‌’ను విచారించిన పోలీసులు

Feb 12 2026 1:41 PM | Updated on Feb 12 2026 1:50 PM

Delhi Police questions Penguin Random House India

న్యూఢిల్లీ: మాజీ సైన్యాధికారి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన స్వీయ చరిత్ర (మెమోయిర్) ఇంకా ప్రచురణ కాకముందే బయటకు రావడంపై ఆరా తీసేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం నాడు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ ప్రతినిధులను ఈ అంశంపై విచారించింది. పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై వివరణ కోరుతూ పోలీసులు అంతకుముందే పబ్లిషర్లకు నోటీసులు జారీ చేశారు.

విచారణలో భాగంగా పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు పబ్లిషర్లు కొంత సమయం కోరారు. జనరల్ నరవణే రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో తీవ్ర దుమారం రేపింది. 2020లో భారత్-చైనా సరిహద్దు ప్రతిష్ఠంభనపై ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఈ పుస్తక సారాంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే సదరు పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, అందుకే అందులోని అంశాలను కోట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా’ సోషల్ మీడియా వేదికగా కీలక వివరణ ఇచ్చింది. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకానికి సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని, అయితే ఈ పుస్తకం ఇంకా ప్రచురణ దశకే చేరుకోలేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రింట్ రూపంలో కానీ, డిజిటల్ రూపంలో కానీ ఎక్కడా ఈ పుస్తకాన్ని పంపిణీ చేయలేదని, విక్రయించలేదని ‘ఎక్స్’వేదికగా వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు పబ్లిషర్లు పేర్కొన్నారు.

తన పుస్తకం చుట్టూ జరుగుతున్న చర్చపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే కూడా స్పందించారు. పబ్లిషర్లు ఇచ్చిన అధికారిక వివరణను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ప్రస్తుతం పుస్తకానికి సంబంధించిన వాస్తవ పరిస్థితి ఇదేనని నొక్కి చెప్పారు. అసలు ప్రచురణ కాని పుస్తకంలోని సున్నితమైన అంశాలు ఎలా లీక్ అయ్యాయి? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణలో తేలే అంశాలను అనుసరించి తదుపరి చర్యలు ఉంటాయని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement