లోక్‌సభలో నిరసనల హోరు.. సభ వాయిదా | Question Hour Disrupted In Lok Sabha Amid Opposition Uproar Over India-US Trade Deal, Proceedings Adjourned | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో నిరసనల హోరు.. సభ వాయిదా

Feb 12 2026 11:49 AM | Updated on Feb 12 2026 12:24 PM

Question hour disrupted in Lok Sabha amid opposition uproar

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో నేడు (గురువారం) లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం, ఎంపీల సస్పెన్షన్ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ప్రశ్నోత్తరాల సమయానికి తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ స్థానంలో ఉన్న పీసీ మోహన్.. సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, ‘మాకు న్యాయం కావాలి’ అంటూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళం మధ్యే 13 ప్రశ్నలకు సమాధానాలు లభించినప్పటికీ, పరిస్థితి అదుపు తప్పడంతో సభ వాయిదా పడింది.

ప్రతిపక్ష ఎంపీలు  భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ఇది భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే ‘ట్రాప్ డీల్’ అని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ ఒప్పందంపై చర్చించాలని వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. రష్యా నుంచి చమురు దిగుమతులు,  వ్యవసాయ రాయితీల విషయంలో కేంద్రం దేశ ప్రయోజనాలను పణంగా పెడుతోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ నిరసనల సెగ సభలో స్పష్టంగా కనిపించడంతో కార్యకలాపాలు సాఫీగా సాగలేదు.

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే విపక్ష నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ప్రవేశపెట్టిన తీర్మానం సభలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీకి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని దూబే డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళనను ఉధృతం చేశారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోవడంతో సభలో ఒకానొక దశలో తీవ్ర గందరగోళం నెలకొంది, ఇది సభ వాయిదాకు ప్రధాన కారణంగా నిలిచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement