చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈసారి తమిళనాడులో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో మరోసారి అధికారంలోకి రావాలని అధికార డీఏంకే ముందుకు సాగుతోంది. మరోవైపు.. నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి తరుణంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం.. విజయ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడులో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.
బీజేపీ నేత అన్నామలై.. తాజాగా ఇండియా టుడే తమిళనాడు రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. టీవీకే విజయ్ను మేము తక్కువగా అంచనా వేయడం లేదు. తమిళనాడులోని జన్జెడ్ విజయ్ వైపు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ప్రజాదరణ ఉంది. కానీ, విజయ్కు రాజకీయ అనుభవం లేదు. తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేలు మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన వారు ఉన్నారు. మంత్రులుగా కూడా పనిచేశారు. అలాంటి వారిపై విజయ్ ప్రభావం చూపించలేరు.
ఉదాహరణకు బీహార్నే తీసుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించారు. ప్రజాదరణ కూడా కనిపించింది. కానీ, ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశారు. అదే విధంగా విజయ్ కూడా ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపించలేరు. 2026 ఎన్నికలు మార్పు కోసం జరిగే ఎన్నికలు. తమిళ ప్రజలు ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు మార్పు కోసం ఆరాటపడుతున్నాయి. గత 50 సంవత్సరాలుగా మోదీకి గాంధీ అనే ఇంటి పేరు లేదు. గత 12 సంవత్సరాలలో ఆయన క్రమంగా తన మార్కు చూపించారు అని అన్నారు.
కార్తీ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు.. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా టీవీకే విజయ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే సంస్థాగత పార్టీ నిర్మాణం ఉండాలి. గ్రౌండ్ లెవల్ యంత్రాంగం అవసరం. విజయ్ ప్రస్తుతం అలాంటి యంత్రాంగాన్ని కలిగి లేరు. ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేరని అన్నారు. అలాగే, బీజేపీపై స్పందిస్తూ.. తమిళనాడు ఎన్నికల్లో మోదీ ఒక అంశం కాదని నొక్కిచెప్పారు. ప్రజలు ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటు వేస్తారు. హిందూత్వ రాజకీయాలను క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు.
విజయ్ పోటీ ఎక్కడ?
ఇదిలా ఉండగా.. రాబోయే శాసనసభ ఎన్నికల్లో రాజకీయ తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పోటీ చేయనున్న నియోజకవర్గం కోసం కసరత్తు జరుగుతోంది. ఆయన పేరులోని తొలి అక్షరం ‘వి’తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అదే అక్షరంతో ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ఇప్పటికే ఖరారు చేయడంతో ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్న నియోజకవర్గం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. చెన్నైలోని వేళచ్చేరి, విరుగంబాక్కం, విళుప్పురం జిల్లాలోని విక్రవాండి, నాగపట్టినం జిల్లాలోని వేదారణ్యం, దిండుగల్ జిల్లాలోని వేడసందూర్ నియోజకవర్గాలను విజయ్ పరిశీలనలోకి తీసుకున్నారని సమాచారం. వాటిలో విరుగంబాక్కంలో తన తల్లిదండ్రులు నివసిస్తుండగా పనైయూర్ నివాసానికి, పార్టీ కార్యాలయానికి వేళచ్చేరి కొద్ది దూరంలో ఉన్నాయి.


