అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయ పన్నుల శాఖ తనకు గతంలో విధించిన భారీ పెనాల్టీని కొట్టేయాలంటూ ఆయన కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. ఆ జరిమానా సబబేనని.. ఇందులో న్యాయస్థానాలు ఎలాంటి జోక్యం చేసుకోబోవని చెబుతూ విజయ్ పిటిషన్ను కోర్టు శుక్రవారం కొట్టేసింది.
గతంలో ఓ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ను దాచి.. పన్నులు ఎగవేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంతో 2019లో ఐటీ శాఖ ఆయనకు రూ.కోటిన్నర జరిమానా విధించింది. అయితే.. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
జరిమానా విధించే ప్రక్రియలో అనవసరమైన జాప్యం జరిగిందని.. ఆ కారణంగానే చట్టపరంగా అనుమతించిన గడువుకు మించి జరిమానా విధించారని విజయ్ తరఫు లాయర్ వాదించారు. అంతేకాదు.. ఈ ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుని జరిమానాను రద్దు చేయాలని కోరారు. అయితే.. అసెస్మెంట్పై జరిగిన అప్పీల్ ప్రక్రియల వల్లే ఆలస్యమైందని ఐటీ శాఖ వాదించింది. జరిమానా విధించడం పూర్తిగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా జరిగిందని.. తమ చర్యలో ఎటువంటి చట్టపరమైన లోపం లేదని స్పష్టం చేసింది.
ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. జనవరి 23న వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ విజయ్ వేసిన ఆ పిటిషన్పై తీర్పు ఇచ్చింది.
ఆదాయపు పన్ను శాఖ విధించిన జరిమానా చట్టబద్ధమని, దానిపై న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, నటుడు విజయ్ ఈ విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది.
తీర్పుపై టీవీకేగానీ, విజయ్గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే విజయ్ తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ తీర్పు రాజకీయ విమర్శలు తావిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై డీఎంకే గతంలో పలుమార్లు విమర్శలు గుప్పించింది. బ్లాక్మనీ తీసుకుని పన్నులు ఎగ్గొట్టే విజయ్కు.. అవినీతి అంటూ మాట్లాడే నైతికత లేదంటూ మండిపడింది. అయితే టీవీకే మాత్రం దీనికి కౌంటర్ ఇచ్చింది. ఆయన స్వచ్ఛందంగా ఆదాయ వివరాలను వెల్లడించి పన్ను చెల్లించారని అంటోంది.
విజయ్ 2015లో పులి అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రానికిగానూ ఆయన రూ.15 కోట్ల పారితోషకం అందుకున్నారని.. అయితే అందులో దాదాపు రూ.5 కోట్లు నగదు రూపంలో చెల్లింపు జరిగిందని.. అయితే విజయ్ మొదటిసారి సమర్పించిన రిటర్న్స్లో విజయ్ ఆ ఆదాయానికి సంబంధించిన విషయం ప్రస్తావించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. ఈ క్రమంలో.. 2019లో ఆదాయాన్ని దాచి పెట్టి పన్ను ఎగవేసిన అభియోగం కింద కోటిన్నర రూపాయల జరిమానా విధించింది.
ఇదీ చదవండి: షాకింగ్.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!


