న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను ఆదాయం (జీఎస్ టీ) జనవరి నెలకు రూ.1.93 లక్షల కోట్లు వసూలైంది. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి. గతేడాది సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ పరిధిలో శ్లాబులను కుదించడం ఫలితంగా 375 ఉత్పత్తుల రేట్లు దిగిరావడం తెలిసిందే. దీని ఫలితంగా వినియోగం పెరిగినట్టు డేటా ఆధారంగా తెలుస్తోంది.
జనవరిలో రిఫండ్లు (పన్ను తిరిగి చెల్లింపు) రూ.22,665 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర జీఎస్టీ వసూళ్లు జనవరిలో రూ.1.71 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి.
ఇది 7.6 శాతం వృద్ధికి సమానం. దేశీ విక్రయాలపై స్థూల జీఎస్టీ వసూళ్లు 4.8 శాతం పెరిగి రూ.1.41 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెస్సు (పొగాకు ఉత్పత్తులు) రూపంలో రూ.5,768 కోట్లు వచ్చింది.
జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం శ్లాబులను విలీనం చేసి 5, 18 శాతంతోపాటు.. లగ్జరీ, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం ప్రత్యేక శ్లాబును ప్రకటించడం తెలిసిందే. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత చూస్తే.. 2025 అక్టోబర్లో రూ.1.96 లక్షల కోట్లు వసూలైంది. నవంబర్లో రూ.1.70 లక్షల కోట్లు రాగా, డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లకు పెరిగింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు పది నెలల్లో జీఎస్టీ వసూళ్లు రూ.18.43 లక్షల కోట్లుగా ఉన్నాయి.


