breaking news
YSR
-
పెళ్లి చేసుకుంటానని ప్రేమించి మోసం
కడప అర్బన్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు ప్రేమించాడు.. ఇప్పుడు నిరాకరించడంతో యువతి అతని ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన కడప నగరంలోని రామకృష్ణ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత యువతి అనూష కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదేళ్లుగా తాను, విజయ్ పరస్పరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగాడని ఆమె తెలిపింది. ఇప్పుడు పెళ్లి విషయాన్ని ప్రస్తావించగానే విజయ్ ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని ఆరోపించింది. అతనికి వారి తల్లిదండ్రులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినప్పటికీ తనను ప్రేమించిన యువకుడు విజయ్ వైఖరిలో మార్పు రాలేదని వాపోయింది. దీంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేరుగా ప్రియుడి ఇంటి ముందు కూర్చొని నిరసన చేపట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతితో మాట్లాడారు. సమస్యపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ ఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్ సీఐ రాజగోపాల్ను వివరణ కోరగా.. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బాధిత యువతి పోలీస్స్టేషన్కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఎల్నినో సవాల్కు ముందస్తు వ్యూహం
కడప సెవెన్రోడ్స్ : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కావున రైతులు నిర్భయంగా శాసీ్త్రయ, సహజ సాగు పద్ధతులను అనుసరిస్తూ ప్రభుత్వ సూచనలను పాటించాలని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి వ్యవసాయం, పశుసంవర్ధక, సూక్ష్మ సాగునీటి యాజమాన్య శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్.. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లాలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తోందని, వాటి ప్రకారం జిల్లాలో ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించామని తెలిపారు. రైతులు వదంతులను నమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణుల సూచనలను పాటించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నీటి సంరక్షణకు ప్రాధాన్యం, సహజ వ్యవసాయానికి ప్రోత్సాహం, జలధార–జలహారతి కార్యక్రమం వేగవంతం, పశుసంవర్ధక రంగానికీ రక్షణ చర్యలు, రైతులకు భరోసా తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏపీ సీఎన్ఎఫ్ డీపీఎం ప్రవీణ్ కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసులు, ఉద్యాన శాఖ ఉపసంచాలకుడు హరిప్రసాద్, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణ, ఎల్డీఎం జనార్దనం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.ప్రభాకర్ రెడ్డి, శాస్త్రవేత్త డా. కె.సునీల్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం కార్యక్రమ సమన్వయకర్త డా. బి.శిల్పకళ, డీఏఏటీ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్.కృష్ణప్రియతోపాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఖాళీ స్థలంపై కన్ను
అధికారమే దన్ను.. ● ప్రభుత్వ జాగాలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడం ● ప్రేక్షక పాత్ర వహిస్తున్న రెవెన్యూ అధికారులు ● ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం గోపవరం : మండల తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ కట్టడం నిర్మించారు. అయినా సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటే పరోక్షంగా కబ్జాదారులకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గోపవరం రెవెన్యూ పొలం సర్వే నంబర్ 234లో సోమశిల రిజర్వాయర్ వెనుకజలాల కింద ముంపునకు గురైన వడ్డెపాలెంకు చెందిన 170 మంది కుటుంబాలకు 1995లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు కొందరు ఇళ్లు నిర్మించుకోగా మరికొందరు బేస్మట్టాలు వేసుకున్నారు. ఇంకొందరు స్థలాలను ఖాళీగా ఉంచుకున్నారు. వీరు బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. రోడ్డు పక్కన స్థలాల ఆక్రమణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టీడీపీ నాయకులు ఇదే లేఅవుట్లో ఖాళీ స్థలాలు ఉన్నాయని, రీసర్వే నిర్వహించాలని తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చారు. వారి ఒత్తిడి మేరకు లబ్ధిదారులను పిలిపించి రీసర్వే నిర్వహించారు. పట్టాదారులంతా రావడంతో అక్కడ ఖాళీగా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు వేసిన పాచిక పారలేదు. ఇదే లేఅవుట్కు వెళ్లే రోడ్డు పక్కనే వివిధ అవసరాల కోసం ఖాళీ స్థలాలను వదలిపెట్టారు. ఇదే అదునుగా భావించి స్థానిక నాయకుడు టీడీపీ నేతల అండతో ఆ స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడం నిర్మించేందుకు ప్రయత్నించారు. ఈ అక్రమ కట్టడాన్ని గతంలో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తిరిగి సోమవారం అర్ధరాత్రి సమయంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టడం నిర్మించాడంటే స్థానిక అధికారుల సహకారం లేనిదే జరగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పడనున్న దారి సమస్య లేఅవుట్లో పట్టాలు పొందిన లబ్ధిదారులకు.. ఈ అక్రమ కట్టడం దారికి అడ్డుగా ఏర్పడింది. అక్రమ కట్టడం నిర్మిస్తున్న సమాచారాన్ని తహసీల్దారు జీవన్చంద్రశేఖర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే సకాలంలో స్పందించి ఉంటే రాత్రికి రాత్రే ఈ అక్రమ కట్టడం నిర్మించేవారు కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బద్వేలు – గోపవరం మెయిన్ రోడ్డు పక్కనే స్థలాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఆక్రమణదారులు కబ్జాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రాత్రికి రాత్రే నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించి లేఅవుట్లో పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. -
క్రీడా పోటీల్లో భారతి విద్యార్థుల సత్తా
కమలాపురం : విజయనగరంలో త్వరలో జరిగే డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు భారతి విద్యా మందిర్ విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల విజయవాడలోని ఎన్టీటీపీఎస్ పబ్లిక్ స్కూల్లో జరిగిన డీఏవీ క్లస్టర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో డీఏవీ భారతి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని వివరించారు. వారిలో అండర్–17 బాలుర విభాగంలో పి.యశ్వంత్, షాట్పుట్లో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. అలాగే 800 మీటర్ల పరుగు పందెంలో ఆదిల్, జావలిన్త్రో, త్రిపుల్ జంప్లో ఉదయ్ ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు. అండర్–14 బాలుర విభాగంలో కెవి రుషి డిస్కస్త్రోలో ప్రథమ, జావలిన్ త్రోలో ద్వితీయ స్థానం పొందారని చెప్పారు. అచ్యుత్ 88 మీటర్ల, 200 మీటర్ల, ట్రిపుల్ జంప్లో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారన్నారు. అండర్–17 బాలికల విభాగంలో సాయి హర్షిత జావలిన్త్రో, ట్రిపుల్ జంప్లో ప్రథమ స్థానం, 200 మీటర్లలో ద్వితీయ స్థానం సాధించారన్నారు. తన్విత 1500 మీటర్లు పరుగు పందెంలో ప్రథమ, 400 మీటర్లలో తృతీయ స్థానంలో నిలిచిందన్నారు. మమత షాట్పుట్, డిస్కస్త్రోలో తృతీయ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. అలాగే అండర్–14 బాలికల విభాగంలో బి.తేజశ్రీ డిస్కస్త్రోలో ప్రథమ, అశ్లిత జావలిన్ త్రోలో ప్రథమ, ట్రిపుల్ జంప్లో ద్వితీయ, రవిత్రేణి 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించారని తెలిపారు. అండర్–17, అండర్–14 బాలుర చెస్ విభాగంలో కౌశిక్, రామ్ చరణ్, లోహితేశ్వ చక్రధర్, లవిత్, చేతన్, చార్వీక్, చైతన్య రన్న్ర్స్గా నిలిచారని వివరించారు. కాగా ఈ పోటీల్లో గెలుపొందిన విజేలందరూ త్వరలో విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్లాంట్ హెడ్ రామమూర్తి, హెచ్ఆర్ గౌరీ పరమేశ్వర రావు, ఐఆర్అండ్పీఆర్ భార్గవ్రెడ్డి తదితర ప్రతినిధుల బృందం విద్యార్థులను, ప్రిన్సిపల్, పీడీలను అభినందించారు. డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక -
వసతిగృహాలపై సవతిప్రేమ!
హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధంమదనపల్లె సిటీ : పేద, సామాన్య కుటుంబాల పిల్లల చదువుల కోసం వెలిసిన సంక్షేమ వసతి గృహాలు ఇప్పుడు మూతబాట పట్టాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఒకటిన్నర నెల గడుస్తున్నా కనీస వసతులు కల్పించకపోగా, జిల్లాలో ఏకంగా 14 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేసేందుకు హడావుడిగా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే హాస్టళ్లలో చేరిన నిరుపేద విద్యార్థులు ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులు లేరనే సాకు.. జిల్లాలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఆశించిన సంఖ్యలో విద్యార్థులు లేరనే సాకు చూపిస్తూ అధికారు లు ఏకంగా 14 హాస్టళ్లను శాశ్వతంగా మూసివేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలవాల్సిన ఈ వసతి గృహాలకు తాళాలు వేయాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి తంబళ్లపల్లెలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని గత ఏడాది నుంచే మూసి ఉంచారు. అలాగే నిమ్మనపల్లెలోని వసతి గృహాన్ని గతంలోనే మదనపల్లెకు మార్చేశారు. ఈ క్రమంలో మిగిలిన హాస్టళ్లలోని విద్యార్థులను సమీపంలోని ఇతర హాస్టళ్లలో గానీ లేదా రాయచోటిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల హాస్టల్లో గానీ చేర్పించాల్సిందిగా అధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానికంగా ఉంటూ చదువుకునే పేద పిల్లలను కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి పంపమనడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం జిల్లాలో తాళాలు పడనున్న 14 బీసీ వసతి గృహాల వివరాలు ఇలా ఉన్నాయి తంబళ్లపల్లె (బీసీ బాలుర వసతి గృహం) ములకలచెరువు (బీసీ బాలికల వసతి గృహం) బీ.కొత్తకోట (బీసీ బాలుర వసతి గృహం) నిమ్మనపల్లె (బీసీ బాలుర వసతి గృహం) మేడికుర్తి (బీసీ బాలుర వసతి గృహం) రైల్వే కోడూరు (బీసీ బాలుర వసతి గృహం) నందలూరు (బీసీ బాలుర వసతి గృహం) తాళ్లపాక (బీసీ బాలుర వసతి గృహం) లక్కిరెడ్డిపల్లె (బీసీ బాలికల వసతి గృహం) వగళ్ల (బీసీ బాలుర వసతి గృహం) వాల్మీకిపురం (బీసీ బాలికల వసతి గృహం) రామసముద్రం (బీసీ బాలుర వసతి గృహం) పీటీఎం (బీసీ బాలుర వసతి గృహం) వీరబల్లి (బీసీ బాలుర వసతి గృహం) -
పోలీసుల దొంగాట
● గుట్టురట్టు చేసిన రికార్డులు! ● కస్టడీలో ఉంటూనే.. బయట మద్యం అమ్మాడట ● ఖాకీల అక్రమ నాటకం బట్టబయలు సాక్షి ప్రతినిధి, కడప : రాజకీయ నేతల ప్రాపకం కోసం కొందరు పోలీస్ అధికారులు తప్పుటడుగులు వేస్తున్నారు. విపక్ష పార్టీ నేతలను ఇరుకున పెట్టడమే ధ్యేయంగా అక్రమ కేసులు బనాయిస్తూ..అడ్డంగా ‘బుక్’అవుతున్నారు. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామ వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ మల్లికార్జునరెడ్డిపై ఇటీవల కొండాపురం పీఎస్ పరిధిలో పేకాట కేసు నమోదు చేశారు. అయితే అది ప్రభావితం కాదనే దుగ్ధతో, ఆయనపై ఉన్న ప్రభుత్వ తుపాకీ (గన్) లైసెన్స్ను రద్దు చేయించడమే లక్ష్యంగా తెలుగుతమ్ముళ్లు మరో తప్పుడు కేసుకు ఎత్తుగడ వేశారు. పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటికే 173 మంది గన్ లైసెన్సులు రద్దు చేయించారు. ఆ మేరకు సింహాద్రిపురం పీఎస్లో క్రైమ్ నంబర్ 59/2022 ఎన్బీడబ్ల్యూ వారెంట్ నెపంతో ఈ నెల 21వ తేదీ (21.07.2026) అర్ధరాత్రి 0.26 గంటలకే మల్లికార్జునరెడ్డి, జనార్ధన్రెడ్డి, చంద్రశేఖరరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పీఎస్ ’సెంట్రీ రిలీఫ్ బుక్’ లో నమోదు చేసి, సీఐ శాంతీలాల్ సంతకం కూడా చేశారు. అనంతరం అదే రోజు ఉదయం 9.00 గంటలకు కోర్టులో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు పీసీ–2087, హెచ్జీ–513లకు అప్పగించారు. కానీ విచిత్రంగా, ఎస్కార్ట్ నిఘాలో ఉన్న మల్లికార్జునరెడ్డి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు కొండాపురం మండలం ఎస్.తిమ్మాపురం వద్ద మద్యం బాటిళ్లతో పట్టుబడినట్లు కొండాపురం పోలీసులు క్రైమ్ నంబర్ 78/2026 కింద అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. పోలీసుల కావలిలో ఉన్న వ్యక్తి బయట మద్యం అమ్ముతూ ఎలా ప్రత్యక్షమవుతాడని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఈ మద్యం కేసులో బెయిల్ మంజూరవడంతో సోమవారం (27.07.2026) ఆయన జమ్మలమడుగు సబ్జైల్ నుంచి విడుదల కాగానే పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పాత ఎన్బీడబ్ల్యూ వారెంట్లో 27వ తేదీన అరెస్ట్ చూపించి రెండోసారి రిమాండ్కు తరలించారు. మరి 21వ తేదీ కోర్టుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తిని 27వ తేదీ వరకు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది. శాఖ ప్రక్షాళన ఏదీ? జిల్లా పోలీసు శాఖలో అంతర్గతంగా జరుగుతున్న అనేక అనైతిక చర్యలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గతంలో కడప వన్ టౌన్, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన కొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్కుమార్లు రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పులివెందుల పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై గతంలో హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు నిత్యం తెరపైకి వస్తున్నా ఉన్నతాధికారులు ప్రక్షాళన చర్యలు చేపట్టకపోవడంపై సామాన్యులకు రక్షక భట వ్యవస్థపై నమ్మకం సడలుతోంది. -
ఆర్టీపీపీ భద్రత పహారా కోసం బైక్ల వితరణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భద్రతలో భాగంగా పహారా కోసం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రెండు బైక్లను వితరణ చేసినట్లు ఆ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎ.లక్ష్మీతులసి తెలిపారు. మంగళవారం ఈ రెండు నూతన బైక్లను ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు బైక్లు ఆర్టీపీపీలో, కాలనీలో భద్రతా ఏర్పాట్లు మెరుగు పరిచేందుకు చాలా ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ లక్ష్మీతులసిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సోమశేఖర్రెడ్డి, ఇతర ఎస్ఈలు, జీఎం, ఫ్యాక్టరీ మేనేజర్, అసిస్టెంట్ కమాండెంట్, డీఎఫ్ఓ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళిక అవసరం కడప ఎడ్యుకేషన్ : ఉజ్వల భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యం, ప్రణాళిక అవసరమని జిల్లా ఉపాధి అధికారి ఎ.సురేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, యోగి వేమన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం యూనిట్–9 సంయుక్త ఆధ్వర్యంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి, స్టార్టప్లపై కెరీర్ అవగాహన సదస్స్ఙు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, స్టార్టప్లు, విదేశీ ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
● కూటమితో వైఎస్సార్ సీపీ ఢీఎస్సీ
అధికారపీఠమెక్కిన క్షణం నుంచి అధికారమదమెక్కి అరాచకాలు సాగిస్తున్న ‘నారా’ద్వయంపై యువత కన్నెర్ర చేసింది. కొలువే లక్ష్యంగా.. పుస్తకాలే లోకంగా డీఎస్సీ అభ్యర్థులు చేసిన ‘ ఉద్యోగ యజ్ఞాన్ని’ భగ్నం చేసిన పాలకుల కుటిల నీతిని ఎండగట్టింది. ‘డీఎస్సీ’లో అవినీతికి ద్వారాలు తెరిచి...అక్రమార్కులకు పట్టం కట్టిన తండ్రీ కొడుకుల తీరును తూర్పారబట్టింది. యువత ఆశల రెక్కల్ని నిలువునా విరిచిన సర్కారు తీరుపై ఉద్యమించింది. నారా లోకేష్ రాజీనామా చేయాలని నినదించింది.. కాదూ..కూడదంటే తొక్కి పట్టి ‘నార’ తీస్తామంటూ హెచ్చరించింది. -
కమనీయం.. రమణీయం.. సౌమ్యనాథుని కల్యాణం!
● కిటకిటలాడిన భక్తజనం ● టీటీడీ తరపున ముత్యాల తలంబ్రాల సమర్పణనందలూరు : నందలూరు క్షేత్రంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. కల్యాణోత్సవం నిమిత్తం వివిధ రకాల అరుదైన పుష్పాలతో వేదికను శోభాయమానంగా ముస్తాబు చేశారు. అభిజిత్ లగ్నంలో మాంగల్యధారణ ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణ, సునీల్కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్, పవన్, పార్థసారథి, రంగనాథాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా సర్వాంగ సుందరంగా అలంకరించి, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేదికపైకి వేంచేపు చేశారు. వేద పండితులు సంతోష్ కృష్ణశర్మ, లావణ్య రామశర్మల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉదయం ’అభిజిత్ లగ్నం’లో స్వామివారు అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ చేశారు. టీటీడీ తలంబ్రాలు.. పారిశ్రామికవేత్త అన్నదానం ఈ దివ్య కల్యాణ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆలయ ఏఈఓ రవి విచ్చేసి, సంప్రదాయబద్ధంగా ముత్యాల తలంబ్రాలను అర్చకులకు అందజేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల క్రతువు కన్నులపండువగా సాగింది. కల్యాణానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త సోమరాజు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకీ ఊరేగింపు.. గజవాహన సేవ కల్యాణ మహోత్సవం ముగిసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథ స్వామిని ఆలయం ప్రదక్షిణగా పల్లకీలో వైభవంగా ఊరేగించారు. ఆ తర్వాత మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారు విశేషమైన గజవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
కడప కోటిరెడ్డిసర్కిల్ : పలు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు రామాలయం వీధికి చెందిన పిన్నం రాజశేఖర్ను అరెస్టు చేసినట్లు తిరుపతి రైల్వే సబ్ డివిజన్ డీఎస్ఆర్పీ శ్రీనివాస ఆచారి తెలిపారు. ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. పిన్నం రాజశేఖర్ ఈనెల 24వ తేదీన రాయలసీమ ఎక్స్ప్రెస్, జూన్ 7, 8, జూలై 21, 22 తేదీల్లో మచిలీపట్నం–ధర్మవరం ఎక్స్ప్రెస్లో ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు చోరీకి పాల్పడ్డాడన్నారు. ఈ దొంగతనాలపై తమ పర్యవేక్షణలో రైల్వే సీఐ సుధాకర్రెడ్డి సూచనలతో కడప ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి, ఆర్ఫీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఎర్రగుంట్ల ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగగించి నిందితుడిని మంగళవారం సాయంత్రం 6 గంటలకు కడప రైల్వేస్టేషన్ రెండవ ఫ్లాట్ఫారంపై అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువజేసే 13 ల్యాప్టాప్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిందితుడిపై రాజమండ్రి, విజయవాడ, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు రైల్వే పోలీసుస్టేషన్లలో 20 దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. నిందితుడిని అరెస్టు చేయడం, చోరీ సొత్తు రికవరీలో పాల్గొన్న వారిని తిరుపతి రైల్వే సబ్ డివిజన్ అధికారి శ్రీనివాస ఆచారి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీపంలోని రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
చెయ్యేరుకు గర్భశోకం!
సాక్షి టాస్క్ఫోర్స్: చెయ్యేరును పచ్చతోడేళ్లు చెరబట్టాయి. పగలు రాత్రి తేడా లేకుండా వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం బాలరాజుపల్లె సమీపంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నదుల్లో పొక్లెయిన్లు, హిటాచీలతో తోడకూడదని ఆదేశాలున్నా లెక్క చేయడం లేదు. ప్రత్యేకంగా నదిలోకి దారి నిర్మించి టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. పచ్చ ముఠాలకు ఓ మైనార్టీ నాయకుడు సహకారం అందించడంతో చెయ్యేరు నుంచి తమిళనాడు, కర్నాటకకు భారీగా ఇసుక తరలిపోతోంది. వారం క్రితం సుండుపల్లె వద్ద ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్థానికులు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఘటన జరిగిన రోజు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా మర్నాటి నుంచి యధావిధిగా అక్రమ రవాణా సాగిపోతోంది. బాలరాజుపల్లె నుంచి రాయచోటి రింగ్రోడ్డు, మదనపల్లె మీదుగా ఇసుక బెంగళూరుకు తరలుతుండగా.. పీలేరు మీదుగా మరికొన్ని ప్రాంతాలకు చేరవేస్తున్నారు. చెయ్యేరు పరీవాహక ప్రాంతంలో రాజంపేట నుంచి రైల్వేకోడూరు, రేణిగుంట మీదుగా తమిళనాడుకు ఇసుక తరలిపోతోంది. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల వల్ల భారీ అగాథాలు ఏర్పడటంతో భూగర్భ జలాలు ఇంకిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం సాధించారని ఇంటింటా ప్రచారం చేస్తున్నారు
● తల్లికి వందనం పేరుతో తల్లులను వంచించారు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : రెండేళ్లలో కూటమి నేతలు చేసిన అభివృద్ధి ఏమిటో, ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయో పరిశీలించుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఆయన సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చూపించి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మార్చి కూటమి నేతలను ఇంటింటికి వెళ్లాలని ఆర్భాటంగా ప్రకటించారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో తల్లులందరిని వంచించారన్నారు. ఈ పథకంలోనే నాలుగు రకాలుగా తల్లులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి మొదటి ఏడాది అసలు ఈ పథకాన్నే అమలు చేయలేదన్నారు. రెండో ఏడాది నుంచి 80 లక్షల మందికి ఇవ్వాల్సిన ఈ పథకాన్ని 60 లక్షలకు కుదించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15వేలు ఇస్తామని రూ.13వేలే ఇచ్చారన్నారు. ఈ పథకం ద్వారా రూ.5వేలు, రూ.6వేలు మాత్రమే మంజూరైన వారు కూడా ఉన్నారని తెలిపారు. ఊరూరా ఎందుకు ప్రచారం కూటమి నేతలు ఏమి సాధించారని ఊరూరా ఇంటింటికి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలను ఆదేశించారో అర్థం కావడం లేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సిగ్గులేకుండా అబద్దపు హామీలు ఇచ్చి మళ్లీ ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళుతున్నారని ప్రశ్నించారు. ఆడ బిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదన్నారు. 2018లో ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇచ్చిన తరాహాలోనే ఈ పథకం అమలు చేస్తారేమో వేచి చూడాల్సి ఉందన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, వారి నుండి కూటమి నేతలకు చేదు అనుభవం ఎదరయ్యే అవకాశం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిని అడ్డుకుంటే కూటమి నేతలకు ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన లాంటి సంఘటనలే పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఏడాదికి రూ.26వేలు ఇస్తామని రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకు ఇస్తామన్న పింఛన్ పథం ఏమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా ఇంత వరకు కొత్త పింఛన్ ఒక్కటి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఇలా ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలనున ఇచ్చి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అడుగడుగునా ప్రజలు చొక్కా పట్టుకుని కూటమి నేతలను నిలదీసే అవకాశం ఉందన్నారు. పోటో రైటప్స్: -
శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరుడు
రాజంపేట: తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమ వారం శేషవాహనంపై శ్రీ సిద్దేశ్వరస్వామి పురవీధుల్లో ఊరేగారు. అలాగే ఉదయం శ్రీ చెన్నకేశవ స్వామివార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. రాత్రికి శ్రీ చెన్నకేశవస్వామి సింహవాహనంపై గ్రామపురవీధుల్లో ఊరేగారు. సూర్య, చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాథ స్వామి నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు సోమవారం ఉదయం కూర్మాలంకారంలో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై శ్రీ సౌమ్యనాధ స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నేడు సౌమ్యనాథ స్వామి కళ్యాణం సౌమ్యనాథాలయంలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలోపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుడు (చొక్కనాథుడు) కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు టీటీడీ దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తూర్పుగాలిగోపురం ద్వారా మాత్రమే భక్తులు ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన
– పీజీఆర్ఎస్లో అంధ ఉపాధ్యాయుడు ఫిర్యాదు కడప ఎడ్యుకేషన్: పొద్దుటూరులోని ఎస్వీవీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అంధ ఉపాధ్యాయుడు చిన్న పుల్లయ్య తమ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంతోపాటు మరో ఉపాధ్యాయుడు కలిసి మానసికంగా వేధిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై సోమవారం కడప పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు వారిపై ఫిర్యాదు చేశారు. పదోతరగతిలో కొందరు పిల్లలతో నా బోధన సరిగా లేదని పేపర్లో రాయించడమే కాకుండా పిల్లల తల్లితండ్రులతో ఇటీవల జరిగిన మెగా పీటీఎం సభలో అందరి సమక్షంలో నా గురించి చెడుగా చెప్పిమని ప్రొత్సహించారని,కొందరు తల్లితండ్రుల సభలో మాట్లాడారని తెలిపారు. ఈ విధంగా ఆ ఇద్దరు ఉపాధ్యాయులు అంధ ఉపాధ్యాయుడనని చూడకుండా పరోక్షంగా మానసిక వేదనకు కారణం అయ్యారని తెలిపారు. విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళ ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్ పులివెందుల రూరల్ : పట్టణంలోని జేఎన్టీయూ కళాశాల క్వార్టర్స్లో 2025 నవంబర్ నెలలో హైదరాబాద్కు చెందిన పర్వీన్ అనే మహిళ పులివెందులలోని తన అక్క ఇంటికి వచ్చి ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పర్వీన్ భర్త టిప్పుసుల్తాన్ను పోలీసులు సోమవారం ముద్దనూరు రోడ్డులోని గాంధీ సర్కిల్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. చెట్టును ఢీకొన్న బైక్ : యువకుడు మృతి రాజుపాళెం : మండల కేంద్రమైన రాజుపాళెం నుంచి కొర్రపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో రాజుపాళెం సబ్ స్టేషన్కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగి వెంకట సాయి (19) అనే యువకుడు మృతి చెందాడు.. ఎస్ఐ ప్రణయ్కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు టౌన్లోని సున్నంబట్టి వీధికి చెందిన జోగి వెంకట సాయి, నల్లబోతుల భరత్కుమార్లు ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంలో నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ప్రొద్దుటూరుకు వెళుతుండగా రాజుపాళెం సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.బైక్ నడుపుతున్న వెంకట సాయి తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. భరత్ కుమార్కు గాయాలైనట్లు తెలిపారు. భరత్ కుమార్ పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించాడు. -
సర్కారు సర్దుపోటు
కడప ఎడ్యుకేషన్: ‘ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే చాలు.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వాటంతట అవే జరిగిపోవాలి’ అంటూ గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా గొప్పగా ప్రకటించి, ప్రత్యేకంగా ఉపాధ్యాయ బది లీల చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టం ప్రకారం 2025 జూన్ నెలలో బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ తీరా 2026 మే నెల వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. తాము తెచ్చిన చట్టాన్ని తామే తుంగలో తొక్కు తూ, ఈ ఏడాది బదిలీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ‘జిల్లాల విభజన’ సాకును తెరపైకి తెచ్చి చట్టాన్ని అటకెక్కించారు. కేవలం తాత్కాలిక ‘సర్దుబాటు’తో ఈ ఏడాదికి పెద్ద గండం గడిచిపోయిందన్నట్లుగా ‘మమ’ అనిపించారు. వేధిస్తున్న అయ్యవార్ల కొరత జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జూన్ ఆఖరి నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని అధికారులు సర్దుబాటు ప్రక్రియను ముగించారు. ముందుగా మండల స్థాయిలో, ఆ తర్వాత డివిజన్ స్థాయిలో, ఆపై జిల్లా స్థాయిలో మిగిలిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్లను గుర్తించి అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేశారు. మూడు అంచెలుగా ఈ తంతు ముగిసినప్పటికీ, జిల్లావ్యాప్తంగా ఇంకా 360 మంది ఉపాధ్యాయుల అవసరం ఉన్నట్లు విద్యాశాఖే అధికారికంగా గుర్తించింది. సర్దుబాటు ప్రక్రియ ముగిసి రోజులు గడుస్తున్నా.. నేటికీ ఉన్నత పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కీలక సబ్జెక్టులకు తీవ్ర కొరత.. ప్రస్తుతం చాలా ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకూ అరకొరగానే ఉపాధ్యాయులు ఉన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక శాస్త్రం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టుల ఉపాధ్యాయ పోస్టులు అత్యధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెలలోనే విద్యార్థులకు ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముంచుకొస్తున్నా హైస్కూళ్లలో కీలకమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండటం వల్ల విద్యాబోధన పూర్తిగా కుంటుపడింది. దీనివల్ల ఈ ఏడాది బోర్డు పరీక్షలు రాయబోయే పదవ తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. పదోన్నతులకు ‘బ్రేక్’... ప్రభుత్వం సకాలంలో అంటే మే, జూన్ నెలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించి ఉంటే.. నేడు హైస్కూళ్లలో ఈ స్థాయిలో ఉపాధ్యాయుల కొరత ఉండేది కాదు. ఈ విషయమై విద్యాశాఖ కమిషనర్తో ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఉపాధ్యాయులకు రావాల్సిన పాత బకాయిలు, ఇతర ఆర్థిక లావాదేవీల ఊసే ఎత్తడం లేదు. కనీసం బకాయిల సంగతి అటుంచితే, నిత్యం వేధిస్తున్న పరిపాలనాపరమైన సమస్యలనైనా పరిష్కరిస్తారా అంటే అదీ లేదు. సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో అయ్యవార్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. -
రాష్ట్రానికే స్ఫూర్తిగా ‘స్టార్టప్ కడప’
కడప సెవెన్రోడ్స్ : యువతలో ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పి–4 విధానం ద్వారా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో కలిసి సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్’అనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా జిల్లా యంత్రాంగం వినూత్నంగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తోందన్నారు. యువతలో సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందిస్తూ, కొత్త వ్యాపారాలకు మార్గనిర్దేశం చేసే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోందని చెప్పారు. నిర్మాణ పనులు దాదాపు పూర్త య్యాయని, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు, గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోపు అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో కడప నగర పాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్, ఎస్ఈ చెన్నకేశవరెడ్డి, హౌసింగ్ పీడీ రాజారత్నం, స్టెప్ సీఈవో జోయల్ విజయ్ కుమార్, కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్ డిజైనర్లు, ఎడిపి యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అంతటా ‘స్మార్ట్ కిచెన్ల’ విస్తరణ జిల్లాలో కిచెన్ మేనేజర్లుగా ఎస్.హెచ్.జి. మహిళల ఆధ్వర్యంలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు జిల్లా యంత్రాంగం గర్వించదగ్గ విషయమని కలెక్టర్ డాక్ర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, మరింత విస్తత పరిచేలా చేపట్టిన అదనపు స్మార్ట్ కిచెన్ల నిర్మాణ పురోగతిపై.. సంబంధిత కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుతున్న సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రస్తుతం దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. త్వరలో జిల్లాలో ప్రతిరోజూ సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో స్మార్ట్ కిచెన్ నోడల్ అధికారి జోయెల్ విజయకుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి, ఏపీ సీఎన్ఎఫ్ డీపీఎం ప్రవీణ్ కుమార్, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వ్యక్తి అదృశ్యంపై కేసునమోదు
ముద్దనూరు: మండలంలోని యామవరం గ్రామానికి చెందిన కొండయ్య అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.సీఐ నగేష్బాబు సమాచారం మేరకు 49 సంవత్సరాల కొండయ్య ఈనెల 18న ఇంటినుంచి వెళ్లాడు.ఇతను కాండ్లోపల్లె సమీపంలోని ఓ తోటలో పనిచేస్తున్నాడు. అతని గురించి కుటుంబసభ్యులు బంధువులు,స్నేహితులతో విచారించినా ఆచూకీ లభ్యంకాలేదు.కొండయ్య కూతురు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. డ్రిప్ పరికరాలు ధ్వంసం మైదుకూరు : మండలంలోని తిప్పిరెడ్డిపల్లె కొత్తపల్లె వద్ద ఇరువురు రైతులకు చెందిన పసుపు తోటలో అమర్చిన డ్రిప్ పరికరాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. బాధిత రైతుల్లో అందే సుబ్బారావు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టి.కొత్తపల్లెకు చెందిన అందే సుబ్బారావు, బండి లక్ష్మీ రమాదేవి అనే వారు తమకున్న 5.80 ఎకరాలకు కొన్నేళ్ల కిందట డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉమ్మడిగా పసుపు పంటను సాగు చేశారు. శనివారం వైద్య పరీక్షల కోసం సుబ్బారావు చైన్నెకి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చి పొలం వద్దకు వెళ్లగా డ్రిప్ పరికరాలు ధ్వంసం చేసి ఉండటం గమనించారు. పొలంలో ఉన్న 8 ప్రెస్ వాల్వులను దుండగులు పగలగొట్టారు. దీంతో తమకు రూ.25వేలు నష్టం వాటిల్లిందని, పంటకు నీరు పెట్టే అవకాశం లేకుండా పోయిందని రైతు సుబ్బారావు వాపోయారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ల నిర్వహణకు ఆహ్వానం కడప వైఎస్ఆర్ సర్కిల్: బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్, విజయవాడ జనరల్ మేనేజర్ కార్యాలయం ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ల అపరేషన్స్, మెయింటెనెన్స్ పనులను అవుట్ సోర్సింగ్ విధానంలో నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) కోం ఆన్లైన్ బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్పాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ నోటిఫికేషన్ జులై నెలలో విడుదల కాగా బిడ్ల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 30 ఉదయం 11 గంటలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఆసక్తిగల సంస్థలు ఏజన్సీలు.. నిబంధనలు, షరతులు, ఇతర పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వ ఈ– టెండర్ పోర్టల్లో పరిశీలించి ఆన్లైన్ ద్వారా బిడ్లను సమర్పించాలని సూచించారు. సంబంధిత వివరాల కోసం కేంద్ర ప్రభుత్వ ఈ–టెండర్ పోర్టల్ను సందర్శించాలని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 ఫిర్యాదులు వచ్చాయి.వీటిని పరిశీలించి చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ ఎన్. సుధాకర్ , పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దాతల సహకారం స్ఫూర్తిదాయకం
కలసపాడు : ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద విద్యార్థికి మేమున్నామంటూ అండగా నిలిచి వైద్యచికిత్స కోసం ఆర్థిక సహకారం అందించిన ఉపాధ్యాయులు, దాతల సహకారం స్ఫూర్తిదాయకమని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్ఈటీఓ)జాతీయ కార్యదర్శి పి.రమణారెడ్డి తెలిపారు. ఎగువరామాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సుంకరమదన్యాదవ్ ఇటీవల పాముకాటుకు గురయ్యాడు. అత్యవసర చికిత్స నిమిత్తం గిద్దలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తండ్రి లేకపోవడంతో పాటు పేదరికం కారణంగా ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిని గమనించిన ఉపాధ్యాయ సంఘ నాయకుడు రమణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు కస్తూరిశ్రీనివాసులు, కె.వి.సత్యనారాయణ, ఎస్.కమల్ వారి వంతుగా విద్యార్థికి కొంత ఆర్థిక సహాయం అందజేస్తూ సోషల్ మీడియా వేదికగా పంపిన సందేశానికి స్పందించిన పలువురు దాతలు దాతృత్వంతో అందజేసిన రూ.1,53,500లును సోమవారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి తల్లి కాంతమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా రమణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలోనే కాకుండా సామాజిక సేవలో సైతం ముందుంటామని చాటి చెబుతూ ఆపదలో ఉన్న విద్యార్థికి సహాయం చేసిన ఎస్టీయూ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు, ఇతర దాతలు అభినందనీయులని పేర్కొన్నారు. విద్యార్థి మదన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ మార్కాపురం జిల్లా అధ్యక్షుడు టి.కె.ఎస్.ప్రసాద్, కడప జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్బాబు, వీరారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మణిమాల, శివ తదితరులు పాల్గొన్నారు. -
భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన మొదలైంది
● అదే జరిగితే దేశం రెండు ముక్కలు అవుతుంది ● కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కడప రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఏలుబడిలో అన్ని వర్గాల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. విద్యార్హతకు తగిన విధంగా ఉద్యోగాలు లభించడం లేదని తెలిపారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యయం పెరిగింది గానీ ఆదాయం పెరగలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదే గనుక జరిగితే దేశం రెండు ముక్కలవుతుందని హెచ్చరించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పై రూ 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. కాపు వర్గాల్లో ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష ఉందని, టీడీపీలో కాపులు ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని తెలిపారు. -
ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
ముద్దనూరు: నిర్మాణంలో వున్న ముద్దనూరు–పులివెందుల జాతీయ రహదారిలో సోమవారం బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయా లయ్యాయి.చిన్నదుద్యాల గ్రామ సమీపంలోజరిగిన ఈ ప్రమాదంలో ఆధార్కార్డు ఆధారంగా పులివెందులకుచెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు.సుబ్బరాయుడు రహదారి పక్కనే పడిపోయివుండడంతో అతనిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కారు ఢీకొని.. మైదుకూరు : మైదుకూరు శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజీపేట మండలం ముత్తులూరుపాడు గ్రామానికి చెందిన డి.ఓబులేసు అనే వ్యక్తి గాయపడ్డాడు. ఓబులేసు బైక్పై వస్తుండగా స్థానిక బాలశివయోగి డిగ్రీ కాలేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఒంటిమిట్ట: మండల పరిధిలోని మంటపంపల్లి ఫీడర్ పరిధిలోని 5 గ్రామాలకు మంగళవారం నుంచి 10 రోజుల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఒంటిమిట్ట విద్యుత్ శాఖ ఏఈ సి. జయకేశవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్టిబ్యుషన్ సెక్టార్ స్కీం పనుల్లో భాగంగా నరవకాటిపల్లి, సాలాబాదు ఫీడర్ పరిధిలోని నరవకాటిపల్లి, బోగేపల్లి, చెర్లోపల్లి, నడింపల్లి, పోలిబుచ్చయ్యగారిపల్లి గ్రామాలకు 10 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ సంబంధిత 3–ఫేజ్ విద్యుత్ సరఫరా అందించడంలో ఉదయం 4 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 నుంచి 12 గంటల వరకు మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రజలు గమనించి విద్యుత్ శాఖ కు సహకరించాలని ఆయన కోరారు. -
అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడం జెన్ – జీ యు వ విజయమని, చరిత్రలో నిలిచిచిపోయే చారిత్మక ఘ ట్టం ఈ పోరాటం ,ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు అని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్లో ఢిల్లీలో విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ అందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పట్టుదలతో,మొక్కవోని దీక్షతో పోరాడిన ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రదాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇది విద్య మాఫియాపై యువతరం సాధించిన విజయంగా పేర్కొన్నారు.. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరమని, వెంటనే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలన్నారు. అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న 22 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు నాయకులు ఏం. వి సుబ్బారెడ్డి, కె.సీ బాదుల్లా, జీ.వేణుగోపాల్,జీ.ఓబులేసు, ఎన్.విజయలక్ష్మి,, మద్దిలేటి, మునేయ్య ,సావంత్ సుధాకర్,అరుణ్,రామ్మోహన్ రెడ్డి,లింగన్న ,నారాయణ ,పకీరప్ప, సుబ్బారాయుడు ,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం పరిధిలో ఈ నెల 11 న జరిగిన సంబతూరు వీరాంజనేయులు (46) హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల పట్టణంలోని నడివూరులో నివాసం ఉంటున్న సంబతూరు వీరాంజనేయులు ఇంటి వద్ద కట్టెలు కొడుతుండుగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగి వీధిలోకి వచ్చారు. స్థానికుడు సురేష్ వీరిని ప్రశ్నించారు. వారు హిందీలో గొడవ పడుతుండగా, వీరాంజనేయులు వచ్చిన వారిని అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గొడవలో ఒకరు కత్తితో వీరాంజనేయులు పొట్టలో పొడిచారు. తీవ్ర రక్తస్రావం జరిగింది. సురేష్ అరుపులు వేయడంతో శేఖర్ అక్కడి రాగా.. నిందితులు రాళ్లు కర్రలు విసురుతూ పారిపోయారు. గాయపడిన వీరంజనేయులు ఈ నెల 13న చికిత్స పొందుతూ కడప రిమ్స్లో మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి ఎస్ఐ నాగమురళి ఆధ్వర్యంలో మూడు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేశారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, టెక్నికల్ ఎవిడెన్స్, నేర స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా ధర్యాప్తులో తాడిపత్రికి చెందిన గురు సాయి, శంకర్(బద్రి), ఒక బాల నేరస్తుడి ప్రమేయం ఉన్నట్లు బయట పడిందన్నారు. వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ వేంకటేశ్వరరావు ఆదేశాల మేరకు సీఐ విశ్వనాథరెడ్డి పర్యవేక్షణలో, ఎస్ఐ నాగమురళితో మూడు బృందాలను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డున ఉన్న ఎస్వీ కల్యాణ మండపం పక్కన శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద గురుసాయి, శంకర్, ఒక బాలనేరస్తుడిని పట్టుకున్నట్ల తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నాగమురళిలను డీఎస్పీ వేంకటేశ్వరరావు అభినందించారు. -
అత్యాశే మోసగాడి అస్త్రం
ప్రొద్దుటూరు క్రైం : ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది. కానీ దురాశ మాత్రం అగాధంలోకి నెడుతుంది. మార్కెట్లో 1 తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 1.40 లక్షలు పైగా పలుకుతున్న సమయంలో.. రూ. లక్షకే ఏకంగా 100 గ్రాముల బంగారం ఇస్తానంటే నమ్మడం అతని అమాయకత్వమా..? లేక దురాశనా..? సులభంగా రూ. లక్షలు సంపాదించాలనే ఆశతో ఓ వ్యక్తి మాటలు నమ్మిన ప్రొద్దుటూరుకు చెందిన రవికుమార్ చివరకు రూ. 6.50 లక్షలు కోల్పోయి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. తక్కువ ధరకు బంగారం ఆశ చూపి రూ. 6.50 లక్షలు కాజేసిన మోసగాడిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే బంగారం అందిస్తానని నమ్మబలికి, అసలు బంగారం స్థానంలో నకిలీ కడ్డీని అంటగట్టి భారీ మోసానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 100 గ్రాముల నకిలీ బంగారు కడ్డీ, ఒక ల్యాప్టాప్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను ఆదివారం ఎస్డీపీఓ కార్యాలయంలో ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు వెల్లడించారు. తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన కన్నయ్య కొంత కాలంగా తక్కువ ధరకే బంగారు ఇప్పిస్తానంటూ పలువురిని సంప్రదిస్తూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేసేవాడు. ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన బెల్లాల రవికుమార్ ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. అతనికి కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తన స్నేహితుడైన దుగ్గనపల్లి ప్రసన్న కుమార్ ద్వారా రవికుమార్ కన్నయ్యను ఆశ్రయించాడు. పుత్తూరు మండలంలోని వినాకపురంలో కన్నయ్య అనే వ్యక్తి ఆయుర్వేద మందులు ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే బంగారు తయారు చేసి ఇస్తుంటాడని చెప్పగా ఇరువురు కలిసి గతేడాది డిసెంబర్ 7న అక్కడికి వెళ్లారు. అతను రూ. లక్షకే 100 గ్రాముల బంగారు ఇస్తానని చెప్పగా రూ. 5 లక్షలకు బంగారు ఇవ్వమని ఆర్డర్ ఇచ్చారు. 20 నుంచి 40 రోజులకు బంగారు సిద్ధంగా ఉంచుతానని కన్నయ్య వారితో అన్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత రవికుమార్ పుత్తూరుకు వెళ్లగా బంగారం పూత పూసిన కొన్ని కడ్డీలను అతనికి ఇచ్చిపంపాడు. అనుమానం కలిగిన రవికుమార్ కడ్డీల నాణ్యతను పరిశీలించుకోగా నకిలీ బంగారు కడ్డీలని నిర్ధారణ అయింది. దీంతో రవికుమార్ నకిలీ బంగారం విషయమై వెంటనే కన్నయ్యకు ఫోన్ చేసి అడుగగా రెండు నెలల సమయం ఇస్తే నిజమైన బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను రవికుమార్ను బెదిరించాడు. దీంతో రవికుమార్ ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు వన్టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు కన్నయ్య ప్రొద్దుటూరులోని ఎర్రగుంట్ల బైపాస్రోడ్డులో గల వాసవి సర్కిల్ వద్ద ఉండగా ఆదివారం ఎస్ఐ మదుసూదన్రెడ్డి, సిబ్బందితో కలసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారం కోటింగ్తో ఉన్న కడ్డీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో వన్టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి పాల్గొన్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి అతను మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం ఇప్పిస్తానని చెప్పే వ్యక్తులను గుడ్డిగా నమ్మి, డబ్బు ఇవ్వరాదని ఏఎస్పీ సూచించారు. బంగారం కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను, తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, గుర్తింపు పొందిన నగల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలన్నారు. అధిక లాభాల ఆశ, ఆకర్షణీయమైన ఆఫర్ల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఎవరైనా బజారులో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మోసపోయిన ఫొటో గ్రాఫర్ నకిలీ బంగారంతో రూ. 6.50 లక్షలు టోకరా తిరుపతి జిల్లా వాసిని అరెస్ట్ చేసిన ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులు -
‘1100’ సేవలు వినియోగించుకోండి
కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ‘1100 కాల్ సెంటర్’ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో మల్లికార్జునుడు కోరారు. ఈ నెల 27వ తేదీన సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో 08562–244437 ల్యాండ్లైన్ నంబర్కు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. సేవలపై ప్రజలు స్పందించాలి కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ స్పందన తెలియజేయాలని కలెక్టర్ శ్రీధర్ ప్రజలను కోరారు. పీజీఆర్ఎస్ కేంద్రాలను సందర్శించే పౌరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రా య సేకరణకు క్యూఆర్ కోడ్ను ప్రద ర్శించాలని నిర్ణయించామన్నారు. పౌరులు పీజీఆర్ఎస్ సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. అర్జీల స్థితిగతులు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి దివ్యాంగ జట్టు క్రికెట్ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : అమరావతి ఇన్ క్లూజివ్ క్రికెట్ కప్ – 2026 కోసం నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగ క్రికెటర్లు ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడి యం నెట్స్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు ఉమ్మ డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో దివ్యాంగ క్రికెట ర్లు హాజరయ్యారని డీసీఏఏ జిల్లా కన్వీనర్ మనోహర్ రాజు, సిడీసీఏడి అధ్యక్షులు రామాంజనేయులు, ఆర్గనైజర్ సుబ్బయ్య తెలిపారు. అనంతరం నెట్స్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో క్రీడాకారుల నైపుణ్యం ఆధారంగా జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. -
మీ ఒక్క సంతకం.. నా వందేళ్ల వసంతం !
రాజులను చూస్తూ పెరిగాను.. వారి రాజ్యానికి కీర్తినై వెలిగాను.. కలెక్టర్ల కదలికను కళ్లారా చూశాను.. రాజ్యాంగ పాలనకు వెలుగై నిలిచాను.. ఇప్పుడు నేనే చిమ్మ చీకట్లో బిక్కుబిక్కుమంటున్నాను.. చిరు దీప కాంతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను.. ఎన్నో ఉత్తర్వులకు సాక్షినైన నేను.. ఇప్పుడేమో ఉత్త చేతులతో మిగిలిపోయాను... చారిత్రక సంపదగా ఖ్యాతిగాంచిన నేను.. ఇప్పుడిలా మొండి గోడలుగా... చెత్త దిబ్బలుగా నిలువెల్లా ‘ఖండమై’ మిగిలాను.. నేనంటే చిరుద్యోగులకు ఇష్టం.. నా నీడే ఉపాధి గనక.. జర్నలిస్టుల ముచ్చట్లకు అప్పుడు నేనే వేదిక .. ఇప్పుడిక్కడ ముచ్చట్లు కరువై.. పురుగూపుట్ర తిరుగుతున్నాయ్.. సమస్యల మబ్బులు పట్టి.. మందుబాబుల బూతులే వినిపిస్తున్నాయ్.. ఎందరో నేతలు నా ముంగిట రాజకీయ వ్యూహాలు పదును పెడుతుంటే చూసిన రోజులు ఉన్నాయ్.. మరెందరో కలెక్టర్లు నా కళ్లెదుటే గొప్ప గొప్ప ఉత్వర్వులు ఇస్తుంటే చూసి ఆనందించిన క్షణాలూ ఉన్నాయ్.. ఆ రోజులను గుర్తుకు తెచ్చుకుంటే ఉప్పొంగిపోతాను... ఆ మరుక్షణమే ఇదిగో ఇలా నన్ను నేను చూసుకుని కుంగిపోతాను.. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోశాను.. ఎంతోమంది నిరసనకారులకు లీడర్లయ్యేలా ఉత్సాహాన్ని నూరిపోశాను.. కష్టాల్లో ఉన్న నన్ను ‘ఊపిరి’ పోయలేరా! నన్ను కాపాడుకోవడానికి ఉద్యమమై ముందుకు రాలేరా! కడప నగర నడిబొడ్డున ఉన్నానని మురిసిపోని రోజంటూ లేదు.. నిత్యం జనసందోహాన్ని చూసి సంతోషించని క్షణమంటూ లేదు.. ఇప్పుడూ.. అక్కడే ఉన్నా.. ఎక్కడో దూరంగా విసిరేసినట్లు.. మౌనంగా! సమాజం నుంచి వెలివేసినట్లు.. దీనంగా! పాత నీరు పోవాల్సిందే.. కొత్త నీరు రావాల్సిందే.. అలాగని ఒడ్డు దాటాక ఓడ తగలేస్తామా! అప్పుడెప్పుడో .. నాకు కొత్త అందాలు పూయడానికి... మెరుగులు దిద్దడానికి నిధులేమో ఇచ్చారని తెలిసి ఆనందించాను.. పనులు చేపట్టగానే ‘పాత రోజులొస్తున్నాయని’ గాల్లో తేలిపోయాను.. కొద్ది రోజులకే పనులు ఆపేశాక... ఆపై పట్టించుకోవడం లేదని మానేశాక.. నా ఆశలు.. ఆకాంక్షలు దూది పింజల్లా గాల్లోకి ఎగిరిపోయాయి.. ఇదిగో.. బంట్రోతు మొదలు కలెక్టరు దాకా ఎందరో అధికారులకు నీడనిచ్చింది నేనే కదా... అలుపొచ్చినప్పుడు చల్లగా విశ్ర మించింది నా ఒళ్లోనే కదా! వయసు మీద పడి ‘శిథిలమవుతుంటే..’ చూస్తూ ఊరుకోవడం న్యాయమా! నిలువునా నన్ను గాయపరుస్తున్నా చూస్తుండిపోవడం ధర్మమా! అయినా ‘పాత’దంటూ కలెక్ట‘రేట్’ కడుతుంటే... కాంట్రాక్టర్తో అధికారులే కుమ్మక్కవుతుంటే.. చూస్తూ ఊరుకుంటారా..! నాకేమీ బతకాలని లేదు.. నేను మీ గత చరిత్రకు జ్ఞాపకమని గుర్తు చేస్తున్నా.. రేపటితరానికి వారసత్వ సంపదని తెలియపరుస్తున్నా...! ఓ పర్యాటక అభిమానీ నీకే.. మాటలతో.. ఉత్తుత్తి ప్రకటనలతో వద్దు.. చిత్తశుద్ధితో రా.. ఉద్యమమై రయ్..రయ్.. రా..! ఇదిగో కలెక్టరు సారూ.. మీ ఒక్క ‘సిరా’సంతకం.. నా మరో వందేళ్ల వసంతం... చేస్తారని ఆశిస్తున్నా.. – మీ పాత కలెక్టరేట్.. (కడప సెవెన్రోడ్స్)సభా భవనం వద్ద చెత్తాచెదారాలు, వ్యర్థాలు పాత కలెక్టరేట్ చాంబర్ వద్ద పేరుకుపోయిన ఇసుక, మట్టి, ఇతర వ్యర్థాలు -
ముగ్గురు యూట్యూబర్లపై కేసు నమోదు
కడప అర్బన్: కడప నగరంలోని తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు యూట్యూబర్లతో పాటు, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా జగన్ నాయక్, ఓబయ్య, ఖదీరున్నిసా ఉన్నారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు. మైదుకూరు : మైదుకూరులోని బద్వేలు రోడ్డులో ఆదివారం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిపై అర్బన్ సీఐ కె.రమణారెడ్డి కేసు నమోదు చేశారు. బద్వేలు రోడ్డులో సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాల్లో వెళుతున్న వారికి సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట : పట్టణంలోని ఆర్ఎస్రోడ్డులో ఉన్న జైన్ సూపర్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డారు. షట్టర్లాక్ కట్ చేసి, లోపలికి ప్రవేశించి క్యాస్ కౌంటర్లోని దాదాపు రూ.30 వేల నగదును అపహరించాడు. షట్టర్ ఇనుపరాడ్ తొలిగించే క్రమంలో నిందితుడి ఎడమచేతికి అద్దం తగిలి గాయపడ్డారు. దీంతో క్యాస్ కౌంటర్ ప్రాంతంలో రక్తపు మరకలున్నాయని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత చోరీకి పాల్పడిన వ్యక్తికి 45 ఏళ్లు ఉన్నట్లు ఽనిర్ధారించుకున్నారు. క్లూస్ టీం కూడా చోరీ ప్రాంతంలో ఆధారాలు సేకరించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఇదే సూపర్మార్కెట్లో చోరీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బహుళ పంటల సాగు లాభదాయకం
కడప అగ్రికల్చర్: రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటలసాగు చేపట్టడం ద్వారా లాభాలు పొందవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆదివారం రైతు మాస్టర్ ట్రైనర్లకు డీ బ్రీఫింగ్ సమావేశం జరిగింది. ముందుగా జూమ్ వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైఎస్ చైర్మెన్ విజయ్కుమార్ మాట్లాడుతూ ఎల్నిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పని సరిగా ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చే పట్టాలని సూచించారు.హై రిస్క్ మోడరేట్ రిస్క్ ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల ని సూచించారు. అనంతరం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ సిబ్బంది ప్రతి రైతును చైతన్య పరిచి ఈ ఎల్నినో పరిస్థితుల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రైతు మాస్టర్ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ -
వైభవం.. పల్లకీ ఉత్సవం
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో ఆదివారం శివ, కేశవులకు పల్లకీసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రికి శ్రీ చెన్నకేశవస్వామి హంహవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ సిద్దేశ్వరస్వామి చంద్రప్రభవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాళ్లపాక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శివ, కేశువుల కల్యాణానికి ఆర్జిత టికెట్లు జారీ ఈనెల 30న ఒకే వేదికపై జరిగే శివ, కేశవుల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు టీటీడీ ఆర్జిత టికెట్లను జారీ చేసినట్లు తాళ్లపాక టెంపుల్ ఇన్సెక్టర్ బాలాజీ తెలిపారు. కళ్యాణోత్సవ టికెట్ రూ.300 గా నిర్ణయించారు. వారికే కల్యాణంలో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. భక్తులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చునన్నారు. 27వతేదీ 11 గంటలలోపు బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
28న భారీ నిరసన ర్యాలీ
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, సీఈసీ సభ్యుడు కె.సురేష్బాబు ● విజయవంతం చేయాలని యువత, పార్టీ శ్రేణులకు పిలుపు కడప కార్పొరేషన్ : డీఎస్సీ అక్రమాలతో పాటు యువత, విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ ఈనెల 28వ తేదిన కడపలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కె.సురేష్బాబు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం అంజద్బాషా కార్యాలయంలో విద్యార్థి, యువజన విభాగ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నీట్ అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసినట్లుగానే రాష్ట్రంలో డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దీంతోపాటు రూ. 10 వేల కోట్లకుపైగా పేరుకుపోయి న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చకపోవడంపై నిరసన తెలియజేయాలన్నారు. నాయకులు, కార్యకర్తలతోపాటు విద్యార్థులు, డీఎస్సీ విద్యార్థులు, యువజన సంఘాలతో కలుపుకుని కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లు, కాలేజీలలో చిన్నచిన్న గ్రూపు మీటింగ్ నిర్వహించి వాట్సాప్ గ్రూపులు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, సోషల్మీడియా ద్వారా నిరసన పిలుపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి షేక్ షఫీవుల్లా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రారెడ్డి, వలంటీర్స్ విభాగం జోనల్ అధ్యక్షుడు అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. -
మాలల ఐక్యతతోనే రాజ్యాధికారంలో భాగస్వామ్యం
కడప కార్పొరేషన్: ఐక్యతతోనే రాజ్యాధికారంలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోట్ల గంగాధర్, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకటరావు అన్నారు. ఆదివారం కడపలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ భవన్లో మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాయలసీమలోని మాల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముందుగా మల్లెల వెంకట్రావ్ మాట్లాడుతూ మాలలు ఐక్యంగా లేకపోతే దోపిడీ పార్టీల జెండాలు మోసే బానిసలుగా మారుతామని, ఆ పార్టీలకు ఓట్లు వేసే వేసే రబ్బరు స్టాంపులుగా మిగిలిపోతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలుగా ఉన్న మాలలు అందరు కూడా ఐక్యతతో మన పిల్లల భవిష్యత్తు కోసం సామాజిక అభివృద్ధి కోసం ఒకే గొంతుకగా మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని దీనిని అడ్డుకోకపోతే అంటరానితనం అస్పృశ్యతను పూర్వపు కాలంలో ఎదుర్కొన్న విధంగా మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నాలను ఆర్ఎస్ఎస్, బీజేపీ కూటమి ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు. అంబేడ్కర్ ఇచ్చిన హక్కులను, అవకాశాలను సాధించేందుకు కలిసి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. మాలల ఐక్యం కోసం మాల మహాసభను రద్దు చేసుకోవడానికి అయినా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అనంతరం కోట్ల గంగాధర్ మాట్లాడుతూ మే 25 నుంచి ప్రారంభించిన మాలల ఐక్యత యాత్రలో మాలలు ఏకం కావాలని కోరారు. ఆ దిశగా మన ప్రయాణం సాగడం కోసం మాత్రమే రాయలసీమలో మాలల ముఖ్య నాయకులు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కడప జిల్లా సెక్రెటరీ అనిల్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ సీనియర్ అసిస్టెంట్ జోష్మ, ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు దేవదత్తం, సుభాష్, బాల ఓబయ్య, స్వతంత్ర బాబు, వసంత్ శుభమంచి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, గుత్తి ఓబులేష్, రాజేష్ జయప్రకాష్, సంపత్ కుమార్ మాల మహాసేన, పెంచలయ్య, ముత్యాలు, సుగమంచి శ్రీనివాసులు, రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకులు హాజరయ్యారు. -
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు 08562 242457కు కాల్ చేయాలని సంబంధిత అధికారులు కోరారు. జేఎన్టీయూలో అందుబాటులోకి ఏఐ కోర్సులు కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్(ఏఐ) కోర్సు అందుబాటులోకి వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, అత్యాధునిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి ఉన్న డిమాండ్తో సీట్ల సంఖ్యను రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో 66 సీట్లుండగా ప్రస్తుతం వీటి సంఖ్యలో 132కు పెంచినట్లు తెలిపారు. కళాశాలల వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 528 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు ఈఏపీసెట్ కౌన్సెలింగ్లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెడ్డెమ్మ ఆలయం.. భక్తజన సందోహం గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది.రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మ అంటూ వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. భక్తులు ఆలయంలో అన్నదానాలు చేశారు. -
ఆలోచనకు పదును.. సృజనకు అదును
● విద్యార్థుల ఉజ్వల భవితకు ఇన్స్పైర్ ● సెప్టెంబర్ 15 వరకు నమోదుకు గడువు కడప ఎడ్యుకేషన్ : పాఠశాల స్థాయి నుంచే పరిశోధనల పట్ల ఆసక్తి పెంచి వారిని రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచి ప్రయోగాల వైపు నడిపించాలి... వారి చిట్టి బుర్రలకు పదునుపెట్టి... కొత్త కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలి. భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయాలి. తద్వారా నవ భారతానికి అడుగులు పడాలనే లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ) ప్రతి ఏటా పాఠశాల ఉన్నతస్థాయి విద్యార్థులకు ఇన్స్పైర్ మనాక్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి 2026–27 విద్యా సంవత్సరానికి ఇనన్స్పైర్ మనాక్ అవార్డుల నామినేషన్స్ను ఆహ్వానిస్తోంది. వైఎస్సార్ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. వీరంతా తమ సైన్స్ టీచర్స్ను గైడ్గా ఏర్పాటు చేసుకుని పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. ఎవరికి అవకాశం.. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా.. రాత పూర్వకంగా పొందుపర్చి సంబంధిత రైటప్ ఇన్స్పైర్ మనాక్ యాప్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోత్సాహకాలు... జిల్లాస్థాయిలో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో నుంచి 10 శాతం రాష్ట్రస్థాయికి పంపుతారు, రాష్ట్రస్థాయిలో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో నుంచి కూడా 10 శాతం సెలెక్టు చేసి జాతీయస్థాయికి పంపుతారు. అత్యుత్తుమ ప్రాజెక్టుల్లో జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపికై తే రాష్ట్రపతి భవన్ సందర్శనతోపాటు జపాన్ దేశానికి వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ రూ.25 వేలు నిధులు మంజూరు చేస్తుంది. ఈ దరఖాస్తుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇలా... ఇన్స్పైర్ అవార్డు మనాక్లో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా www. inspireawards& dst. gov. in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్కూల్ ఆఽథార్టీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ అప్షన్ను ఎంపిక చేయాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలను పొందు పరిచి సేవ్ చేయాలి. సంబంధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదు చేయాలి. (లేదా) ఇన్స్పైర్ మనక్ యాప్లో విద్యార్థి యొక్క ఆధార్నెంబర్, బ్యాంకు వివరాలు, పాస్పోర్టుసైజ్ పోటో ద్వారా స్కూల్ లాగిన్లో ఓపెన్ చేసి ప్రాజెక్టు వివరాలు నమోదు చేయాలి. అది కూడా 100లోపు పదాలు ఉండేటట్లు చూసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
వైఎస్సార్సీపీ వర్గీయుడిపై కత్తులు, కట్టెలు, రాడ్లతో దాడి
● గురివిరెడ్డికి తీవ్రగాయాలు.. కర్నూలుకు తరలింపు చాపాడు : చాపాడు మండలం లక్ష్మీపేట గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ వర్గీయుడు వరికూటి గురివిరెడ్డి అనే వ్యక్తిపై ఆదివారం లక్ష్మీపేట సమీపంలోని వీరభద్రాపురానికి చెందిన టీడీపీ వర్గీయులు బద్వేలి జగన్నాథ్ రెడ్డి, బద్వేలి మణికంఠ రెడ్డి, బద్వేలి పార్వతి దేవి, భూమిరెడ్డి చంద్ర ఓబుళరెడ్డి, మాడెం రామకృష్ణారెడ్డి, ఉప్పలూరు మహేశ్వరరెడ్డి కత్తులు, కట్టెలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తలకు తీవ్ర గాయమైన గురివిరెడ్డిని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్లా రు. గురివిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ... వీరభద్రపురం సమీపంలోని కేసీ కాలువ వద్ద గల గురివిరెడ్డి పొలంలో రెండు రోజుల క్రితం పసుపు విత్తనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పొలం వద్దకు వ్యవసాయ బోరు నుంచి నీరు పెట్టుకునేందుకు వెళ్లాడు. బద్వేలి పార్వతి ఇంకా పలువురు మహిళలు పొలం వద్దకు వచ్చి గతంలో ఇరువర్గాల మధ్య ఉన్న సమస్యలపై గురివిరెడ్డి కుటుంబీకులతో గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సర్దుబాటు చేయడంతో ఇరువర్గాల వారు వెళ్లిపోయారు. మధ్యాహ్నం పొలం వద్ద వ్యవసాయ పనులకు గురివిరెడ్డి ముందు వెళ్లగా , తర్వాత భార్య రామలక్ష్మి, కోడలు వరలక్ష్మి వెళుతున్నారు. అప్పటికే పొలం వద్ద మాటు వేసి ఉన్న బద్వేలి జగన్నాథ్ రెడ్డి కుటుంబీకులు, బంధువులు గురివిరెడ్డిపై కత్తులు, కట్టెలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు విడిపించేందుకు ప్రయత్నించగా రామలక్ష్మి, వరలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. గురివిరెడ్డి తలకు తీవ్ర గాయమై పడిపోయాడు. బాధితుడు వివరాల మేరకు వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. -
కొనసాగుతున్న కృష్ణా జలాల తరలింపు
కొండాపురం : గండికోట జలాశయం నుంచి పైడిపాళెం జలాశయం, కమలాపురానికి తాగు, సాగునీటి ఆవసరాలకు కృష్ణజలాలు తరలిస్తునట్లు ఆదివారం జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ శెట్టివారిపల్లె రెగ్యూలెటర్ ఎత్తి గాలేరి నగరి సృజల స్రవంతి మొయిన్ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల నీరు రెండు వారాలుగా వెళుతోందన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా గండికోట జలాశయంలో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. గండికోట జలాశయం నుంచి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్–1 నుంచి నాలుగు భారీ మోటర్ల ద్వారా పైడిపాళెం జలాశయానికి 440 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నామన్నారు. ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిపై శెట్టివారిపల్లె సచివాలయం వద్ద ఆదివారం బైక్ను ఆటో ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. బైక్పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొంది. స్థానికులు వెంటనే ఇద్దరినీ 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి వివరాలు తెలియరాలేదని స్థానికులు తెలిపారు. ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని నిడుజివ్వి గ్రామం నాపరాయి గనిలో జరిగిన ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో గాయపడిన నిల్సన్బాబు (51) కడప రిమ్స్లో చికిత్స పొందుతూ అదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కలమల్ల గ్రామానికి చెందిన నిల్సన్బాబు ఈ నెల 17న నిడుజివ్వి నాపరాయి గనుల్లోకి పనికి వెళ్లారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ నిల్సన్ బాబు మృతి చెందినట్లు ఎస్ఐ రామాజంనేయులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. – దంపతులకు తీవ్ర గాయాలు పోరుమామిళ్ల : పోరుమామిళ్ల – బద్వేలు రోడ్డు చెన్నారెడ్డిపేట సమీపంలో ఆదివారం బైక్ను కారు ఢీకొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. పొలం నుంచి బైక్పై ఇంటికి వెళుతున్న వెంకటరమణ, రామతులసి దంపతులను శ్రీశైలం నుంచి బద్వేలు వెళుతున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయం
● పరిశ్రమలశాఖ జీఎం చాంద్బాషా కడప సెవెన్రోడ్స్ : చేనేత కార్మికుల సంక్షేమానికి, హక్కుల సాధనకు కృషి చేసిన మహనీయుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా తెలిపారు. కడప కలెక్టరేట్లో ఆదివారం ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత అధికారులు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాంద్బాషా మాట్లాడుతూ.. కోటయ్య తన జీవితాంతం చేనేత వర్గాల హక్కుల సాధనకే అంకితం చేశారని తెలిపారు. 1952 నుంచి 1962 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడిగా, అనంతరం ఏపీ శాసనమండలి సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా సేవాలందించిన విషయాన్ని గుర్తుచేశారు. శాసనసభలోనూ, పార్లమెంట్లోనూ చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, మగ్గాలకు ఉచిత విద్యుత్, రాయితీల సాధన కోసం ఆయన నిరంతరం గళమెత్తారని వివరించారు. సహకార రంగాన్ని బలోపేతం చేయడంలో, ఆప్కో స్థాపనలో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. సుమారు 16,000 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయించడంతో పాటు, చేనేత కార్మికుల సంక్షేమానికై ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. చేనేత కార్మిక సంక్షేమమే కాకుండా విద్యాభివృద్ధికి కూడా ఆయన విశేష కృషి చేశారని, చీరాలలో ఆంధ్రకేసరి ప్రకాశం జూనియర్ కళాశాల, ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి అహ్మద్ మొహిద్దిన్ మాట్లాడుతూ ప్రగడ కోటయ్య సేవలను కొనియాడారు. సమావేశంలో పలువురు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, జాతీయ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి అవ్వారు మల్లికార్జున, పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాసా కోదండరాం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జల్లి కొండయ్య, చేనేతజౌళి శాఖ డెవలప్మెంట్ అధికారి సత్యబాబు, అసిస్టెంట్ డెవలప్మెంట్ అధికారి శ్రీ శేషగిరి రావు, వివిధ చేనేత సొసైటీల అధ్యక్షులు, సభ్యులు, చేనేత సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. -
భక్తితో ప్రణమిల్లి.. భుక్తి కోసం తల్లడిల్లి !
● సౌమ్యనాథాలయంలో అన్న ప్రసాదం కరువు.. ● టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తుల విన్నపం గరుడ వాహనంపై సౌమ్యనాథుడు నందలూరు : సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్కుమార్ నిర్వహించారు. అనంతరం స్వామివారు మోహినీఅలంకారంలో శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సౌమ్యనాథ స్వామి శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై విహరించారు. గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తు లు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. రాజంపేట: అక్కడ అడుగుపెట్టగానే రాజసం ఉట్టిపడే గోపురం కనువిందు చేస్తుంది.. మూలవిరాట్ను దర్శించుకోగానే మనసంతా భక్తిభావంతో నిండిపోతుంది.. చరిత్రకు నిలువుటద్దం ఆ ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వైష్ణవాలయం.. అదే చోళుల కాలంలో నిర్మితమైన నందలూరు సౌమ్యనాథాలయం. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్నూలు, తిరుపతి నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి నిండైన భక్తిభావంలో మునిగిపోతారు. పిడికెడు అన్న ప్రసాదం కరువు... చరిత్రకు ఘనకీర్తిగా... ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా అలరారుతున్న ఈ ఆలయంలో అన్న ప్రసాదం కరువైంది. నిండైన భక్తితో ప్రదక్షిణలు చేశాక.. చుట్టూ చూస్తే పిడికెడు భుక్తి కానరాక ఆకలితోనే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయాల వద్ద ఆకలి అనే మాటకు చోటులేకుండా 56 ఆలయాల్లో మార్చి నుంచి రెండుపూటలా అన్నదానం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అన్న ప్రసాదాలను వడ్డించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కానీ, నందలూరులోని సౌమ్యనాథాలయంలో అన్నప్రసాదం మాటే కరువైంది. ఇదివరకు దేవదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు స్థానికంగానే దాతలు, భక్తులు ట్రస్టు పేరిట ఆలయంలో అన్నప్రసాదం చేసేవారు. టీటీడీలోకి విలీనమైన తర్వాత బయటివారు అన్న ప్రసాదాలు చేయడానికి వీల్లేదన్న అధికారుల సంకేతాలతో ఆ కార్యక్రమాలు ఆగిపోయాయి. కేంద్ర పురావస్తుశాఖ అడ్డుపుల్ల! ఆలయానికి ప్రతి రోజూ వందలాది మంది భక్తులు వస్తారు. శనివారం రోజైతే ఆ సంఖ్య రెట్టింపవుతుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భక్తజనంతో ఆలయ ఆవరణ కిటకిటలాడుతోంది. అన్నప్రసాదం లేకపోవడం భక్తకోటి ఆకలితోనే వెనుదిరుగుతోంది. కాగా సౌమ్యనాథాలయంలో ఒక్క పూటైనా అన్నప్రసాదం పంపిణీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చినా కేంద్రపురావస్తు శాఖ అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారి ఒకరు కేంద్రపురావస్తుశాఖకు అన్నప్రసాదాల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి అనుమతులు వచ్చి.. ఆపై టీటీడీ వెనువెంటనే అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు చేపడితే భక్తుల భుక్తి బాధలు తప్పినట్లే. కాగా, బ్రహ్మో త్సవాలలో కల్యాణం ఒక్క రోజు అన్న ప్రసాద పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్నప్రసాదాలను అందచేయాలి. ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసేందుకు జిల్లా నుంచే కాకుండా అనేక జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వారికి సకాలంలో ఆకలి తీర్చేందుకు అ న్నప్రసాదాల పంపిణీ దోహదపడుతుంది. టీటీడీ చర్యలు తీసుకోవాలి. – శివపార్వతి, భక్తురాలు, ముద్దనూరు సౌమ్యనాథాలయానికి వచ్చిన భక్తులు ఆకలితో వెనుదిరిగితే ఎలా. ఒంటిమిట్టలో మాదిరి ఒక పూట పెట్టినా భక్తుల ఆకలి తీరుతుంది. చాలా మంది భక్తులు నందలూరు బస్టాండుకెళ్లి భోంచేస్తున్నారు. అలా కాకుండా ఆలయంలో అన్నప్రసాదాలు పెడితే బాగుంటుంది కదా. – వల్లకొండు పద్మావతి, భక్తురాలు -
ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నాగేంద్రసాయి రికార్డు
సాధించాలనే బలమైన సంకల్పం, పట్టుదలే పెట్టుబడిగా శ్రమిస్తే సొంతం కాని విజయం లేదని నిరూపించాడు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన యువకుడు లొమడ నాగేంద్రసాయి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడి ఏకంగా ఒకే సంవత్సరంలో 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు కైవసం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. విద్యాభ్యాసంలో టాప్ కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అశ్వనికుమార్ (ఏపీఎస్ఆర్టీసీ పదవీ విరమణ పర్సనల్ ఆఫీసర్), రాజరాజేశ్వరి (పెండ్లిమర్రి జెడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్)ల కుమారుడైన నాగేంద్రసాయి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. కడప భారతి స్కూల్లో 1 నుంచి 7వ తరగతి, విద్యాధరి స్కూల్లో 8 నుంచి 10వ తరగతి (10వ తరగతిలో 9.7 జీపీఏ) చదివాడు. హైదరాబాద్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి 974 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంకుతో పశ్చిమ బెంగాల్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్పూర్లో ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీటెక్ + ఎంటెక్) పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్పై కరోనా దెబ్బ.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. నాగేంద్రసాయి చదువు ముగిసే సమయానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. ఆ తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో పడి, పలు కంపెనీలు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కళ్లారా చూసిన సాయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత ఉండదని గ్రహించాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి బాటలోనే నడవాలనే బలమైన బీజం అతని మనసులో నాటుకుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండి స్వయంగా ప్రిపరేషన్ సాగించాడు. తొలి ఓటమి నేర్పన పాఠం మొదటిసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసినప్పుడు కేవలం ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల స్కోర్ తగ్గడంతో తృటిలో ప్రభుత్వ కొలువును మిస్ చేసుకున్నాడు. ఈ తొలి ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా, తన లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో తదుపరి పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2025లో కొలువుల జాతర ఆ తర్వాత 2025లో హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరుకుని.. నోటిఫికేషన్ పడిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ కఠిన ప్రిపరేషన్ సాగించాడు. ఒక్కసారి లోపాలు తెలుసుకున్న నాగేంద్రసాయి, ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో విశ్వరూపం ప్రదర్శించి ఒకే ఏడాదిలో వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాగేంద్రసాయి తాను సాధించిన ఉద్యోగాలలో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్లో బ్రాంచ్ మేనేజర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కడప జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన నాగేంద్రసాయి ప్రతిభపై పలువురు విద్యావంతులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకే ఏడాదిలో సాధించిన 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇవే: ఎయిమ్స్ : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ఎయిమ్స్ , అప్పర్ డివిజనల్ క్లర్క్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అప్పర్ డివిజనల్ క్లర్క్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సర్వేయర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్ , అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టెలికాం అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, సరై్వలెన్స్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫీల్డ్మెన్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ అడ్మిని్రస్టేటర్ అండ్ హెచ్ఆర్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ విలేజ్ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటర్.8నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యంతో పాటు ఎంతో ఓపిక, సహనం అవసరం. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదని ఏమాత్రం కుంగిపోకూడదు. ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయతి్నంచాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్కు కేటాయించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులపై సంపూర్ణమైన అవగాహన, పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి లభించే మానసిక మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకం. – లొమడ నాగేంద్రసాయి -
ఏసీఏ సౌత్జోన్ అండర్–19 విజేత కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీడే ఐదవ విడత మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ మ్యాచ్లో కడప జట్టు 15 పాయింట్లతో విజేతగా నిలిచింది. కర్నూలు 15, చిత్తూరు 13, నెల్లూరు 4, అనంతపురం 2 పాయింట్లు సాధించాయి. శనివారం జరిగిన మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మూడవ రోజు 198 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 72.3 ఓవర్లకు 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కుళ్ళాయప్ప 29 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని నిహాల్ మాలిక్ 3, తేజేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 22.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 101 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సిద్దు 47 పరుగులు చేశాడు. కడప జట్టులోని ధీరజ్కుమార్రెడ్డి అద్బుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, శివశంకర్ 2, వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 22 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 38, జీవీ సాయిసాకేత్ 56 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్ 2, జయంత్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు–అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడవ రోజు 334 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 69.1 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. ఆ జట్టులోని సిద్దార్ద్రెడ్డి 98, లోకేష్ 116 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంజయ్ కుమార్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 87 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది. ఆ జట్టులోని సందీప్రెడ్డి 93, ఆదినారాయణరెడ్డి 61, సంజయ్కుమార్ 69 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సిద్దార్ద్రెడ్డి 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. సందీప్రెడ్డి, అనంతపురం, 93 పరుగులు ధీరజ్కుమార్రెడ్డి, కడప, 5 వికెట్లు లోకేష్, నెల్లూరు 116 పరుగులుసిద్దార్ద్రెడ్డి, నెల్లూరు, 98 పరుగులు -
దురాక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం!
బద్వేలు: ఎత్తిరాజుపల్లె గ్రామానికి చెందిన గొర్లకుంట చెరువును దురాక్రమణ చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ.చంద్రమోహన్ హెచ్చరించారు. శుక్రవారం పత్రికలో వచ్చిన ‘గొర్లకుంట.. అక్రమాల పంట’ కథనానికి తక్షణమే స్పందించారు. ఆక్రమణలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని బద్వేలు తహసిల్దార్ను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాల్లో చెరువులను దురాక్రమణ చేయడం క్షమించరాని నేరమని, ఆక్రమణలను పూర్తిగా తొలగించి రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బద్వేలు తహసిల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ.. ఆర్డీఓ ఆదేశాల మేరకు గొర్లకుంట చెరువు దురాక్రమణపై తక్షణమే విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని, ఈ విధుల్లో సిబ్బంది బిజీగా ఉన్నందున శనివారం నుండి నేరుగా క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించి రెండు రోజుల్లో ఆర్డీఓకు పూర్తి నివేదిక సమర్పిస్తామని తహసిల్దార్ స్పష్టం చేశారు. నేడు శ్రీ ప్రగడ కోటయ్య జయంతి కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తున్న శ్రీ ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి కోసిగి మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, నేత కార్మికులు, ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు. 27, 28 తేదీల్లో హాజరుకావాలి కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 27, 28 తేదీలల్లో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు 2026–27 సంవత్సరం ప్రవేశాలకు 4 నుంచి 9 తరగతుల వరకు ఎంపికై న విద్యార్థులు హాజరుకావాలని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి కె. జగన్నాధరెడ్డి తెలిపారు. ఎంపికై న విద్యార్దులకు ఇప్పటికే విజయవాడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్ద ఎస్ఎంఎస్, ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించడం జరిగిందన్నారు. హాజరయ్యే విద్యార్దులు విద్యార్దుల ఆధార్ కార్డు, స్టడీ, ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లను తీసుకొని హాజరుకావాలన్నారు. ఇల్లు కూల్చిన కేసులో ఇద్దరు అరెస్ట్ కడప అర్బన్: కడపలోని ఎర్రముక్కపల్లెలో ఈ ఏడాది జనవరి 26వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఇల్లును కూల్చివేసిన సంఘటనలో నజీర్, ప్రసాద్రెడ్డిలను ప్రస్తుత సీఐ ఎం. తిమ్మారెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం అరెస్ట్ చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు తయారీ కడప సెవెన్రోడ్స్ : గ్రామాల్లో ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం సాధించడం కోసం ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం అన్నారు. శనివారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓలు, డీఎల్పీఓలు, డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, స్వయం సహాయక సంఘాలను ప్రణాళిక రచనలో భాగస్వాములు చేయాలని సూచించారు. తాగునీరు, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక వసతుల ప్రస్తుత పరిస్థితులు సమీక్షించాలన్నారు. గ్రామానికి తక్షణమే ఏ పనులు అవసరమో గుర్తించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించాలన్నారు. తయారు చేసిన ముసాయిదా ప్రణాళికను గ్రామసభల్లో చర్చించి ప్రజలందరి సమక్షంలో ఆమోదించాలని తెలిపారు. నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు కడప కార్పొరేషన్: వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 26వ తేదీ సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు. -
ఘనంగా ప్రారంభమైన తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి అయిన తాళ్లపాక గ్రామంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి చారిత్రక శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో ఉత్సవాల వేళ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, విశేషార్చనలు జరిపి, విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థప్రసాదాలను అందజేశారు.సాయంత్రం వేళ అలంకృత వాహనాల్లో కామాక్షి సమేత సిద్ధేశ్వరస్వామి వారిని, శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి వారిని తాళ్లపాక మాఢవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీ, వేదపండితులు భక్తవత్సలం, మహేశ్, నరేష్లతో పాటు ఉత్సవాలకు ప్రత్యేకంగా విచ్చేసిన పలువురు వేదపారాయణ పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సూపర్ సిక్స్.. ప్రజలకు సూపర్ షాక్
● తల్లికి వందనం ఒట్టి బూటకం ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శ కడప కార్పొరేషన్ : ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సూపర్ షాక్లు ఇస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. ఎన్నికల ముందు నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అంటూ ఇంటింటికీ వెళ్లి ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో కూడిన బాండ్లు అందజేశారన్నారు. ఇప్పుడు ఈనెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఇంటింటికీ వస్తున్నారని, ప్రజలు వారు ఇచ్చిన బాండ్లు చూపించి తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అంటూ అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మొదటి ఏడాది ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని, రెండో ఏడాది అర కొరగా ఇచ్చారన్నారు. మూడో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 87.05 లక్షల మంది తల్లులు ఉండగా 65 లక్షల మంది తల్లులకే తల్లికి వందనం ఇచ్చారన్నారు. మిగిలిన 22.05 లక్షల మందికి ఎగనామం పెట్టారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమైందన్నారు. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం కూటమి ప్రభుత్వ నైజంగా మారిందన్నారు. ఇంటింటికీ టీడీపీ పేరుతో ప్రజల ఇళ్ల గడప తొక్కే ముందు, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. హామీలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే ముందుగా ఎన్నికల హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఎక్కడిదాకా వచ్చాయో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి బసవరాజు, వైఎస్సార్సీపీ నాయకులు మహమ్మద్ షఫీ, త్యాగరాజు, కే.బాబు, శ్రీరంజన్రెడ్డి, నార్త్ జోన్ మండల అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట కృష్ణ, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కంచుపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. -
●నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే!
● సంకల్పం ఉంటే కొలువులకు కొదవలేదు ● ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కడప కుర్రాడు ● కరోనా సంక్షోభం.. ప్రైవేట్ అభద్రతను అధిగమించి అపూర్వ విజయం ● ప్రస్తుతం మహబూబ్నగర్ ఈఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్గా నాగేంద్రసాయి కడప ఎడ్యుకేషన్: సాధించాలనే బలమైన సంకల్పం, పట్టుదలే పెట్టుబడిగా శ్రమిస్తే సొంతం కాని విజయం లేదని నిరూపించాడు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన యువకుడు లొమడ నాగేంద్రసాయి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడి ఏకంగా ఒకే సంవత్సరంలో 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు కై వసం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. విద్యాభ్యాసంలో టాప్ కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అశ్వనికుమార్ (ఏపీఎస్ఆర్టీసీ పదవీ విరమణ పర్సనల్ ఆఫీసర్), రాజరాజేశ్వరి (పెండ్లిమర్రి జెడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్)ల కుమారుడైన నాగేంద్రసాయి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. కడప భారతి స్కూల్లో 1 నుంచి 7వ తరగతి, విద్యాధరి స్కూల్లో 8 నుంచి 10వ తరగతి (10వ తరగతిలో 9.7 జీపీఏ) చదివాడు. హైదరాబాద్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి 974 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్లో ఉత్తమ ర్యాంకుతో పశ్చిమ బెంగాల్లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్పూర్లో ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీటెక్ + ఎంటెక్) పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్పై కరోనా దెబ్బ.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. నాగేంద్రసాయి చదువు ముగిసే సమయానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. ఆ తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో పడి, పలు కంపెనీలు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కళ్లారా చూసిన సాయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత ఉండదని గ్రహించాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి బాటలోనే నడవాలనే బలమైన బీజం అతని మనసులో నాటుకుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండి స్వయంగా ప్రిపరేషన్ సాగించాడు. తొలి ఓటమి నేర్పిన పాఠం మొదటిసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసినప్పుడు కేవలం ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల స్కోర్ తగ్గడంతో తృటిలో ప్రభుత్వ కొలువును మిస్ చేసుకున్నాడు. ఈ తొలి ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా, తన లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో తదుపరి పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2025లో కొలువుల జాతర ఆ తర్వాత 2025లో హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరుకుని.. నోటిఫికేషన్ పడిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ కఠిన ప్రిపరేషన్ సాగించాడు. ఒక్కసారి లోపాలు తెలుసుకున్న నాగేంద్రసాయి, ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో విశ్వరూపం ప్రదర్శించి ఒకే ఏడాదిలో వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాగేంద్రసాయి తాను సాధించిన ఉద్యోగాలలో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లాలో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్లో బ్రాంచ్ మేనేజర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కడప జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన నాగేంద్రసాయి ప్రతిభపై పలువురు విద్యావంతులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకే ఏడాదిలో సాధించిన 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇవే: ఎయిమ్స్ : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ఎయిమ్స్ , అప్పర్ డివిజనల్ క్లర్క్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అప్పర్ డివిజనల్ క్లర్క్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సర్వేయర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్ , అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టెలికాం అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, సర్వైలెన్స్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫీల్డ్మెన్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ హెచ్ఆర్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ విలేజ్ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటర్.ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యంతో పాటు ఎంతో ఓపిక, సహనం అవసరం. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదని ఏమాత్రం కుంగిపోకూడదు. ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్కు కేటాయించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులపై సంపూర్ణమైన అవగాహన, పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి లభించే మానసిక మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకం. – లొమడ నాగేంద్రసాయి -
● ఏకాదశి శోభ
దేవునికడప ఆలయంలో భక్తుల రద్దీ ఒంటిమిట్ట రామాలయంలో క్యూలైన్లో భక్తులు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లావ్తాప్తంగా ప్రసిద్ధ ఆలయాలను వేకువజామునుంచే భక్తులు సందర్శించి పూజలు చేశారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్టలోని కోదండరామాలయం భక్తులతో కిటకిటలాడాయి. గోవింద, రామనామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. – సాక్షి నెట్వర్క్ -
● భవనాలున్నా.. భాగ్యం లేదు !
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ‘నాడు–నేడు’ పథకం కింద నల్లపురెడ్డిపల్లె పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అత్యంత సుందరమైన భవనాలు, క్లాస్ రూమ్లను ఇక్కడ నిర్మించారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థపై పర్యవేక్షణ లోపించింది. పాఠశాలలో చదువుకోవడానికి అన్ని వసతులతో కూడిన డిజిటల్ గదులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను తరగతి గదుల లోపల కూర్చోబెట్టడం లేదు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా పిల్లలను బయటకు తెచ్చి.. మైదానంలో, చెట్ల కింద నేలపై కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. సుందరమైన విద్యా మందిరాలు కళ్లముందున్నా, వాటిని నిరుపయోగంగా మార్చేసి విద్యార్థులను ఇలా ఆరుబయట ఎండలో కూర్చోబెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నల్లపురెడ్డిపల్లె స్కూల్లో విద్యార్థులకు క్లాస్ రూమ్లలోనే సక్రమంగా డిజిటల్ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై విచారణ జరిపించాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. – పులివెందుల రూరల్ -
విద్యార్థి సంఘాల బంద్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్/వైఎస్సార్ సర్కిల్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన జిల్లాలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సాగింది. అయితే కడపలో ఒకటి రెండు చోట్ల విద్యార్థి సంఘ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కడపలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు, ఏఐఎస్బి రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేందప్రసాద్, పీఆర్ఎస్వైఎప్ రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఆర్ఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, పిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొడవటి నాగరాజు, ఏఎస్వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబయ్య, టీటీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రసన్నకుమార్, ఏఐబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్రాథోడ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, పీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడుల ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం,బాష్పవాయువు ప్రయోగించడం హేయనీయమని అన్నారు. -
డ్రిప్ పరికరాల పరిశీలన
లింగాల : మండలంలోని వివిధ గ్రామాల్లో 90శాతం సబ్సిడీతో రైతులకు అందించిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను శుక్రవారం ఏపీఎంఐపీ పీడీ బీవీ రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలవల్ల నీటి ఆదాతోపాటు పంట దిగుబడి పెంచుకుని రైతులు అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంఐ ఏఓ మౌళాలి, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన పాస్పోర్ట్ సేవలు కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రజలకు మెరుగైన, వేగవంతమైన పాస్పోర్ట్ సేవలను అందిస్తామని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి నందులాల్ భూక్యా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన.. నగరంలోని ప్రధా న తపాలా కార్యాలయంలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ముందు గా కడపకు చేరుకున్న ఆయనకు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద కడప పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ జి.రాజేష్, పాస్పోర్ట్ సేవా కేంద్రం ఇన్చార్జి వి.ఓ.సుమిత్ కుమార్, పి.మునాఫ్లు స్వాగతం పలికారు. అనంతరం సేవా కేంద్రాన్ని సందర్శించిన ప్రాంతీయ అధికారి.. అక్కడ దరఖాస్తుదారులకు కల్పిస్తున్న వసతులు, సేవల నాణ్యత, పారదర్శకత,పనితీరు వేగాన్ని సమీక్షించారు. ముగిసిన ‘ఎన్యుమరేషన్’ కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ పక్రియ శుక్రవారంతో ముగిసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేది నాటికే ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం ఈనెల 24వ తేది గడువు పొడిగించింది. జిల్లాలో మొత్తం 18,96,231 ఓట్లు ఉండగా, వంద శాతం మందికి ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ జరిగింది. చివరిరోజు 87.09 శాతం ఎన్యుమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తయింది. ఇక మిగిలిన 12.91 శాతం ఓట్లు వివిధ కారణాలతో తొలగించారు. దశలవారీ సమ్మెకు ఏపీ జూడాల పిలుపు కడప అర్బన్: ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడా) రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, హౌస్ సర్జన్లకు 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టైపెండ్ పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెలో భాగంగా ఆగస్టు 4, 5 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఓపీ సేవలు అందుతాయన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో సాధారణ ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరిస్తామని ఏపీజూడా ప్రకటించింది.ఈమేరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడా) అ ధ్యక్షుడు డాక్టర్ యు. ఈశ్వర్ శంకర్ ఉపాధ ్యక్షులు డాక్టర్ జి. భార్గవ సాయి నాయుడు, శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెగా పీటీఎంలో డీఈఓ వివాదాస్పద వ్యాఖ్యలు చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిదిన్నె మండలంలో పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 2024 మార్చిలో విద్య మీద, విద్యార్థుల మీద ఒక సర్వే జరిగిందని, ఆ సర్వేలో ఏపీ విద్యార్థులు చీకటిలో ఉన్నారని, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే సాకర్యాలు లేవని, అటువంటి చీకటి నుంచి 2024 జూన్లో రాష్ట్రానికి వెలుగు వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వెలుగే రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి.. వారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేపట్టిందని తెలియజేశారు. కాగా డీఈఓ మాట్లాడుతున్న సభా ప్రాంగణంలో ఎదురుగానే ప్లస్ టూ కోసం నిర్మించిన రెండతస్తుల అదనపు భవన నిర్మాణాలు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉంది. విద్యా శాఖ మంత్రి లోకేష్ ఇదే ప్రాంగణంలో పర్యటించినప్పుడు, నేడు అలాగే ఉన్న విషయాలు డీఈఓ మరచిపోవడం, మండల పరిధిలోని పాఠశాలల్లో సమస్యలను మరచి కేవలం అధికార పార్టీల ప్రాపకం కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలువురు తల్లిదండ్రులు , ప్రజలు విమర్శిస్తున్నారు. -
మెగా పీటీఎంలో కనిపించని హడావిడి
● పలు చోట్ల బంద్ పోటు ! ● జిల్లావ్యాప్తంగా 2,042 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహణ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలను అడ్డుకుంటున్న పోలీసులు కడప గాంధీనగర్ పాఠశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జేసీ నిధిమీనా కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)– 4.0 కార్యక్రమానికి ఈ ఏడాది అంత హడావుడి కనిపించలేదు. విద్యార్థి సంఘాల బంద్ కారణంగా పేరెంట్ మీటింగ్లను అడ్డుకుంటారని జిల్లాలో పలు పాఠశాలల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కడప నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా శుక్రవారం పలు విద్యార్థి సంఘ నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంద్ వల్ల పలు చోట్ల పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గతేడాదంతా హడావుడి లేకుండా చప్పగా సాగింది. రెండు రోజుల క్రితమే తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాలకు నగదు జమకావడంతో ప్రజాప్రతినిధులకు కాసింత మాట్లాడేందుకు అవకాశం దొరికింది. అంతకు మించి వారికి మాట్లాడే విషయాలు లేకపోవడంతో సమావేశాలు చప్పగా సాగాయనే ఆరోపణలు వినిపించాయి. జిల్లావ్యాప్తంగా 2042 పాఠశాలల్లో... జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో భాగంగా 2042 పాఠశాలల్లో శుక్రవారం ఈ సమావేశాలను నిర్వహించారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో నియమితులైన మండలస్థాయి ప్రత్యేక అధికారుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో దాదాపు లక్షా యాభైవేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల చదువు, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించారు. కడపలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎంలో జేసీ నిధిమీనా పాల్గొని విద్యార్థులు, వారి తల్లితండ్రులలో చర్చించారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. సమావేశంలో కడప నగరపాలక ఆదనపు కమిషనర్ రాకేషచంద్ర, ఏపీసీ అనుఽరాధ తదితరులు పాల్గొన్నారు. -
ముద్దనూరు, కమలాపురంలో ‘తిరుమల’కు స్టాపేజీ కల్పించాలి
పులివెందుల/ముద్దనూరు: గుంతకల్లు–విశాఖపట్టణం మధ్య ప్రతి రోజూ ప్రయాణించే ‘తిరుమల ఎక్స్ప్రెస్’ రైలును ముద్దనూరు, కమలాపురం రైల్వే స్టేషన్లలో ఆపాలని సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ను ఎంపీ ఫోన్ ద్వారా కోరారు. ఈ రైలు గుంతకల్లో మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు ఎర్రగుంట్లకు, అనంతరం సాయంత్రం 5:38 గంటలకు కడపకు చేరుకుంటుందన్నారు. సాధారణంగా ఎర్రగుంట్ల నుండి కడపకు ప్రయాణించడానికి 30 నిమిషాలు పడుతుందని, కానీ ఈ రైలుకు ఏకంగా 1.38 గంటల సమయం పడుతుండటంతో మధ్యలో చాలా సమయం వృథా అవుతోందని తెలిపారు. ముద్దనూరు, కమలాపురం స్టేషన్ల చుట్టుపక్కల అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, స్థానిక ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తరచుగా ఈ రైలును ఆపాలని గతంలో తనను కోరారని ఎంపీ వివరించారు. కాబట్టి ప్రజాభిప్రాయం, స్థానిక ప్రజల అవసరాల మేరకు తిరుమల ఎక్స్ప్రెస్ ముద్దనూరు, కమలాపురం స్టేషన్లలో హాల్ట్ కల్పించాల్సిన అవసరాన్ని పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే జీఎంను అభ్యర్థించారు. ఎర్రగుంట్ల స్టేషన్ను ‘అమృత్ భారత్’లో చేర్చాలి ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద ఎంపిక చేసి ఆధునీకరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన రైల్వే మంత్రిని కలిసి ఎర్రగుంట్ల పరిసర ప్రాంతాలలో అనేక సిమెంటు ఫ్యాక్టరీలు ఉండటంతోపాటు ప్రధాన వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరు పట్టణానికి అతి దగ్గరగా ఈ స్టేషన్ ఉన్నందున ప్రయాణీకుల రద్ధీ ఎక్కువగా ఉంటోందని వివరించారు. కడప రైల్వే స్టేషన్లో రెండు షిప్టులలో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రయాణీకులకు సేవలు అందించాలని లేఖను అందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
అంజన్నకు సాహెబన్న రూ.లక్ష విరాళం
● ముస్లిం సోదరుడి ఉదారత.. ● గుడికి రూ. లక్ష విరాళం! పులివెందుల టౌన్: కులాలు, మతాల కంటే మానవత్వం, దైవచింతన మిన్న అని చాటుతూ భారతదేశ పరమత సహనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ఒక అద్భుత ఉదాహరణగా నిలిచారు ఒక ముస్లిం సోదరుడు. హిందూ–ముస్లిం భాయ్–భాయ్ అనే సాంప్రదాయాన్ని నిజం చేస్తూ శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఆయన లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ౖ తొండూరు మండలం అగడూరు గ్రామానికి చెందిన రిటైర్డు టీచర్, ముస్లిం సోదరుడు ఇమామ్ సాహేబ్.. పులివెందుల నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని విరాళంగా ప్రకటించారు. శుక్రవారం ఆయన ఈ నగదును ఆలయ కమిటీ సభ్యులకు నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇమామ్ సాహెబ్ మతసామరస్య ఉదారతను ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులుకొనియాడారు. అనంతరం ఇమామ్ సాహెబ్ కుటుంబ సభ్యులకు ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు వారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. -
దొరికినంత దోచుకో.. తోటి పోలీసుల సొమ్ముతో కారు, బంగ్లా..!
దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో..కారు, బంగ్లా తీసుకో.. లైఫు నీదే కుమ్ముకో.. ఓ సినిమా పాటలోని అర్థాన్ని కానిస్టేబుల్ రవి తన జీవితాన్ని అన్వయించుకున్నాడు. ఎంచక్కా తోటి సిబ్బంది సొసైటీ ఖాతాల్లోని డబ్బులతో జల్సా చేస్తున్నాడు. కడప అర్బన్: శాంతిభద్రతలను కాపాడుతూ, సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీస్ శాఖలోనే ఒక పెద్ద అవినీతి తిమింగలం తిష్టవేసింది. తోటి సిబ్బంది దాచుకున్న రక్తాన్ని, కష్టార్జితాన్ని నమిలి మింగేసింది. జిల్లా పోలీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఏకంగా రూ.1,07,00,000 (కోటి ఏడు లక్షలు) నిధులు నిలువునా స్వాహా అయిన వైనం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ దందా బయటపడి రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు విచారణ పేరిట కాలయాపన చేయడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పిల్లల చదువుల కోసం పెడితే.. బినామీ ఆస్తులకు వాడుకున్నారు! గతంలో కడప ఎస్పీగా పనిచేసిన మనీష్ కుమార్ సిన్హా హయాంలో పోలీసులు తమ అత్యవసర అవసరాల కోసం ఈ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకుని సభ్యత్వం తీసుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి అత్యవసర సమయాలలో ఈ సొసైటీ నుంచి లోన్లు తీసుకుని, మరలా వాయిదాల పద్ధతిలో కట్టుకునేలా నిబంధనలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం పద్ధతి ప్రకారం జరిగి ఉంటే ఎవరికీ నష్టం కలిగేది కాదు. కానీ, ఈ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన వి.రవి (పీసీ 3275) ఈ భారీ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతనికి కొంతమంది ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ రవి 2020 సంవత్సరానికి ముందు సాధారణ జీవితాన్ని గడిపేవాడని, సొసైటీ ఏర్పాటైన తర్వాత వచ్చిన డబ్బుతో ప్రస్తుతం కడప నగరంలో ఒక భారీ భవనాన్ని నిర్మించుకున్నాడని, ఒకే ఫ్యాన్సీ నంబర్ కలిగిన ద్విచక్ర వాహనం, లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆ కానిస్టేబుల్ అవినీతి పలుకుబడికి పరాకాష్టగా మారిందని తోటి సిబ్బంది మండిపడుతున్నారు. ఆర్టీఐ కానిస్టేబుల్పై ఎస్పీ సీరియస్? సొసైటీలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై అనుమానం వచ్చిన ఒక బాధిత కానిస్టేబుల్.. ధైర్యంగా ముందుకొచ్చి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ గోల్మాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆర్టీఐ ప్రకారం తనకు వివరాలు తెలియజేయాలని దరఖాస్తు చేసుకున్న సదరు కానిస్టేబుల్ పై ప్రస్తుత జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సీరియస్ అయినట్లు సమాచారం. దాదాపు రెండు నెలల క్రితం బాధితుడైన ఆ కానిస్టేబుల్ నేరుగా ఎస్పీని కలిసి తనకు పూర్తి వివరాలు కావాలని, తమ సొమ్ము తమకు ఇప్పించాలని కోరారు. సదరు కానిస్టేబుల్ విజ్ఞప్తిని స్వీకరించి, విచారిస్తామని చెప్పి రెండు నెలల పైగా గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏమాత్రం విచారణ చేయకపోవడం గమనార్హం. మా డబ్బు మాకు వచ్చేదెప్పుడు? ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అని బాధిత కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటి సిబ్బంది కష్టార్జితాన్ని కాజేసిన పీసీ రవి, అతనికి సహకరించిన వారిపై ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్రంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, అతను స్వాహా చేసిన డబ్బును వెనక్కి ఇప్పించేలా కృషి చేయాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో డిపార్ట్మెంట్లో ఇలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
చేతకాకపోతే బయటకు వెళ్లిపోండి..!
వైఎస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీలో ఆధిపత్య పోరు, ముఠా కక్షలు పరాకాష్టకు చేరాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, హెచ్చరికలు స్థానిక అధికార కూటమిలో భూకంపం సృష్టించాయి. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలను తొక్కుకుంటూ, ఏకపక్ష రాజకీయం నడుపుతున్న ఆరోసారి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఖరిపై లోకేష్ వేదికపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైనే లోకేష్ ‘గేట్ పాస్’ వార్నింగ్‘కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుని, కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిదే’ అని లోకేష్ స్పష్టం చేశారు. వరదరాజులరెడ్డి తన పక్కనే వేదికపై కూర్చొని ఉండగానే లోకేష్ అసలు ట్విస్ట్ ఇస్తూ.. ’ ఒకవేళ అందరినీ కలుపుకొని వెళ్లడం చేతకాకపోతే, అలాంటి వారు పార్టీ వదిలి బయటకు వెళ్లడానికి టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అంటూ ‘గేట్ పాస్’ హెచ్చరిక ఇవ్వడం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో, వరదరాజులరెడ్డి బహిరంగంగా టీడీపీ జెండాలను తగలబెట్టించిన ఉదంతం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు వచ్చి టికెట్ దక్కించుకుని గెలిచారు. కానీ, గెలిచినప్పటి నుండి పాత తమ్ముళ్లను పక్కన పెట్టడంపై క్యాడర్ లోకేష్ దృష్టికి ఆవేదనను తీసుకెళ్లింది. గ్రూపుల కుమ్ములాటలు.. వేర్వేరుగా ఆఫీసులు! వరదరాజులరెడ్డి మొదటి నుంచీ తనదైన ఏకపక్ష శైలితో వ్యవహరిస్తారనే ముద్ర ఉంది. ఆయన ఏ పారీ్టలో ఉన్నా నెహ్రూ రోడ్డులోని తన సొంత కార్యాలయమే పార్టీ ఆఫీస్గా నడుస్తుంటుంది.పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్లే వినాలనే మనస్తత్వం వల్లే ప్రొద్దుటూరులో టీడీపీ గ్రూపుల వారీగా విడిపోయింది. పార్టీ ఉమ్మడి కడప జిల్లాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని వరదరాజులరెడ్డి ఏనాడూ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగానే మల్లెల లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వేర్వేరుగా కార్యాలయాలను నడుపుతున్నారు. ప్రవీణ్కుమార్రెడ్డికి పదవి గండం.. మరోవైపు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డి ఐదేళ్లూ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం సాగింది. అయితే, ఎన్నికల సమయంలో ప్రవీణ్ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించలేదని, లోపాయికారీగా వ్యతిరేకంగా పనిచేశారని వరదరాజులరెడ్డి వర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల కూటమి ముఖ్య నేతలు అమరావతికి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు పదవి రాకుండా పోయింది. దీంతో ప్రవీణ్ నిరంతరం చంద్రబాబు, లోకేష్ లను కలుస్తూ తనపై ఉన్న వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరాకాష్టకు చేరిన కక్షలు.. తమ పదవిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిపై ప్రవీణ్కుమార్రెడ్డి బహిరంగంగానే ఎదురుదాడికి దిగారు. కొండారెడ్డికి చెందిన “ఎస్ఎస్ మాల్’, “సన్రైజ్ కౌంటీ’లపై ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలకు వచ్చారు. సొంత పార్టీ నేతే తమ వ్యాపారాలపై అధికారులను ఉసిగొల్పడాన్ని జీరి్ణంచుకోలేని వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరులు నేరుగా ప్రవీణ్కుమార్రెడ్డి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడికి తెగబడ్డారు. తమ్ముళ్లలో అయోమయం.. కార్యకర్తల సమావేశానికి ప్రవీణ్ ఆహా్వనించిన పాత కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. లోకేష్ ఇచ్చిన వారి్నంగ్ తర్వాత ప్రొద్దుటూరు తమ్ముళ్లలో సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు ఇకనైనా కలిసి నడుస్తారా? అది సాధ్యమేనా? అని విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఈ పాత కక్షల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎవరి వెంట నడవాలో తెలియక తీవ్ర అయోమయంలో కొట్టాడుతోంది. టీఢీపీప్రొద్దుటూరు: పట్టణ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సబ్ స్టేషన్ నిర్మాణ స్థల వివాదం తారస్థాయికి చేరుకుంది. స్థానిక శ్రీనివాసనగర్లోని ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిధులు మంజూరు చేసి, సగం పనులు పూర్తి చేశారు. అయితే, ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని, ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి పార్టీ పెద్దలకు విన్నవించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల పనులను నిలిపివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదంపై విద్యుత్ శాఖ డీఈ చాంద్ బాషా మాట్లాడుతూ సదరు స్థలం ఎవరిదనేది తేల్చి, హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీస్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఆగిన పనులను పరిశీలించి చర్చించారు. -
అడిగేదెవరు.. అడ్డుకునేదెవరు?
సాక్షి టాస్క్ఫోర్స్ : అధికారం మాది, మమ్మల్ని అడ్డుకునేదెవరు అంటూ అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి బాధితులనే జైలుకు పంపుతున్నారు. దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామానికి చెందిన గువ్వల కోటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. అతనికి సర్వే నంబర్ 79లో ఒక ఎకరా 76 సెంట్ల పొలం ఉండగా తెలుగు గంగ ఉప కాలువ భూసేకరణలో భాగంగా 20 సెంట్ల స్థలం కాలువకు పోయింది. వారి బంధువులు రామలింగారెడ్డి, అనసూయ, సుమలత, శివమ్మలకు పక్కనే 3.5 ఎకరాల పొలం ఉంది. వీరి పొలం పక్కనే టీడీపీకి చెందిన చిట్టిబోయిన భైరవ, బాలకృష్ణలకు పొలం ఉంది. కోటేశ్వరరెడ్డి పొలంలో నుంచి అక్రమంగా పైపులు వేసుకోవడానికి చిట్టిబోయిన భైరవ చాలా సార్లు ప్రయత్నించాడు. ఈ విషయమై కోటేశ్వరరెడ్డి చాలా సార్లు రెవెన్యూ, తెలుగుగంగ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో గత నెల 15న కోటేశ్వరరెడ్డి పొలం నుంచి తెలుగు గంగ కాలువ నుంచి అక్రమంగా చిట్టిబోయిన భైరవ, బాలకృష్ణ పైపులు వేస్తుండగా కోటేశ్వరరెడ్డి, అతని బంధువులు అడ్డుకున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, వీరి ఫిర్యాదును పోలీసులు తీసుకోకుండా స్థానిక అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే ప్రోద్బలంతో చిట్టిబోయిన భైరవ, బాలకృష్ణలకు వత్తాసు పలికారు. గువ్వల కోటేశ్వరరెడ్డి, రామలింగారెడ్డి, అనసూయ, సుమలత, శివమ్మలపై గత నెల 15న తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారు. ఈ విషయంపై మైదుకూరు కోర్టులో గువ్వల కోటేశ్వరరెడ్డి కేసు వేయగా ఓఎస్ నంబర్ 118/2026, 2026 అక్టోబర్ 7వ తేదీ వరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి చిట్టిబోయిన భైరవ, అతని అనుచరులు జేసీబీ, ట్రాక్టర్లతో తెలుగు గంగ కాలువను పూడ్చి గువ్వల కోటేశ్వరరెడ్డి పొలం నుంచి వారి పొలంలోకి రస్తా వేసుకున్నారు. అడ్డుకోబోయిన కోటేశ్వరరెడ్డి, వారి బంధువులను ఒక సారి మిమ్మల్ని జైలుకు పంపాం, ఈ సారి అడ్డుకుంటే మీ పరిస్థితి వేరుగా ఉంటుందని బెదిరించారని, కోటేశ్వరరెడ్డి వారి బంధువులు వాపోయారు. ఈ విషయంపై బాధితులు 100కు ఫోన్ చేసినా, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదన్నారు. కొంత మంది పోలీసులు అధికార పార్టీ నేతల ఆదేశాలతో దూరం నుంచి కాపలా కాసి రోడ్డు వేయించారని బాధితులు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి మాకు అన్యాయం చేస్తున్నారన్నారు. అధికార పార్టీ నేతలకు అధికారులు సహకరిస్తూ పేదవాళ్లమైన తమను బెదిరింపులకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను లెక్కచేయని అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా కాలువను పూడ్చి రస్తా నిర్మాణం డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించని పోలీసులు -
యువకుడి దారుణ హత్య
మైదుకూరు : మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీ పరిధిలోని బోంచేనుపల్లె వద్ద యెన్నం వెంకటేశ్వర్లు అలియాస్ ఏసుబాబు అనే 19 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో హత్యకు పాల్పడిన వారు యువకుని తలపై రాళ్లతో మోదడంతో రక్తగాయాలై మృతి చెందాడు. బోంచేనుపల్లెకు చెందిన యెన్నం సుబ్బారావు, జ్యోతిల ఒక్కగానొక్క కుమారుడైన వెంకటేశ్వర్లు పదో తరగతి వరకు చదివి మానేశాడు. బేల్దారి పనులకు వెళుతుంటాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తాను వనిపెంటకు వెళుతున్నట్టు తల్లిదండ్రులకు చెప్పాడు. రాత్రి 10 గంటలైనా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి సుబ్బారావు వెంకటేశ్వర్లుకు ఫోన్ చేశాడు. అతని వద్ద ఉన్న రెండు ఫోన్ నంబర్లకు ఫోన్ చేయగా రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వాకబు చేశారు. గురువారం ఉదయం గ్రామానికి ఉత్తరం దిక్కున కిలోమీటర్ దూరంలో నివాసాలు లేని గంజికుంట జగనన్న కాలనీ ఇళ్ల మధ్య వెంకటేశ్వర్లు మృతదేహం ఉన్నట్టు తెలిసిన వారు చెప్పారు. అక్కడికి చేరుకున్న యువకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, ఎస్ఐ కత్తి వెంకటరమణ, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని తల్లిదండ్రులను, గ్రామస్తులను విచారించారు. యువకుని దుస్తుల్లో ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం వద్ద రక్తం అంటిన ఒక కొండ రాయిని, శరీరాన్ని ఈడ్చిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. వేలి ముద్రలు నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాల కోసం పరిశీలించారు. పోలీసులు జాగిలాన్ని కూడా రప్పించారు. తన కుమారుడు ఫోన్లో ఆడ పిల్లలతో మాట్లాడుతుంటాడని ఎవరైనా ఆడ పిల్ల తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా తన కుమారుడిని హత్య చేసి ఉంటారని యువకుని తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు దర్యాప్తు చేపట్టామని సీఐ రమణారెడ్డి తెలిపారు. -
బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రెడ్డిగారివీధిలో బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు తాళిబొట్టు సరుడును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను వన్టౌన్ సీఐ కొండారెడ్డి గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. బద్వేలి గంగమ్మ రామేశ్వరంలోని రెడ్డిగారి వీధిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు ఎవ్వరు లేకపోవడంతో ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె అదే వీధిలోని మరో అద్దె ఇంట్లోకి మారేందుకు ఇంట్లోని సామాన్లు కట్టి పెట్టారు. అయితే వాటిని తరలించడానికి తన చెల్లెలు కుమారుడైన బల్ల దస్తగిరిరెడ్డిని పిలిపించారు. ఈ నెల 12న ఇంట్లోని సామాన్లను తరలించే క్రమంలో బీరువాలో ఉన్న 20.03 గ్రాముల బంగారు చైన్ను అతను దొంగలించాడు. నాలుగు రోజుల తర్వాత గంగమ్మ బీరువా చూడగా బంగారు గొలుసు కనిపించలేదు. దస్తగిరిరెడ్డిని పిలిచి అడుగగా తనకు తెలియదని చెప్పాడు. దీంతో ఆమె బుధవారం రాత్రి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు బల్ల దస్తగిరిరెడ్డి గురువారం బంగారు చైన్ను విక్రయించడానికి బంగారు అంగళ్ల వీధికి వెళ్లగా ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు చైన్ స్వాఽధీనం చేసుకున్నారు. ఇటుకల ఫ్యాక్టరీ యజమాని ఆత్మహత్య ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో పఠాన్ నాయబ్రసూల్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయబ్రసూల్ కొన్నేళ్లుగా బైపాస్ రోడ్డులో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను అధికంగా అప్పుడు చేశాడు. డబ్బు ఇవ్వమని రుణదాతలు ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో అతను గురువారం తన ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ఉన్న గదిలోకి వెళ్లి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీలు గమనించి అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. తల్లి ఫాతిమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. -
కూటమి సీట్లో కుంపట్లు !
ప్రొద్దుటూరు:ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు, ముఠా కక్షలు పరాకాష్టకు చేరాయి. నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు, హెచ్చరికలు స్థానిక అధికార కూటమిలో భూకంపం సృష్టించాయి. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తలను తొక్కుకుంటూ, ఏకపక్ష రాజకీయం నడుపుతున్న ఆరోసారి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఖరిపై లోకేష్ వేదికపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైనే లోకేష్ ‘గేట్ పాస్’ వార్నింగ్ ‘కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుని, కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిదే’ అని లోకేష్ స్పష్టం చేశారు. వరదరాజులరెడ్డి తన పక్కనే వేదికపై కూర్చొని ఉండగానే లోకేష్ అసలు ట్విస్ట్ ఇస్తూ.. ’ ఒకవేళ అందరినీ కలుపుకొని వెళ్లడం చేతకాకపోతే, అలాంటి వారు పార్టీ వదిలి బయటకు వెళ్లడానికి టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయ్ఙి అంటూ ‘గేట్ పాస్’ హెచ్చరిక ఇవ్వడం సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో, వరదరాజులరెడ్డి బహిరంగంగా టీడీపీ జెండాలను తగలబెట్టించిన ఉదంతం అందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు వచ్చి టికెట్ దక్కించుకుని గెలిచారు. కానీ, గెలిచినప్పటి నుండి పాత తమ్ముళ్లను పక్కన పెట్టడంపై క్యాడర్ లోకేష్ దృష్టికి ఆవేదనను తీసుకెళ్లింది. గ్రూపుల కుమ్ములాటలు.. వేర్వేరుగా ఆఫీసులు! వరదరాజులరెడ్డి మొదటి నుంచీ తనదైన ఏకపక్ష శైలితో వ్యవహరిస్తారనే ముద్ర ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా నెహ్రూ రోడ్డులోని తన సొంత కార్యాలయమే పార్టీ ఆఫీస్గా నడుస్తుంటుంది. పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పినట్లే వినాలనే మనస్తత్వం వల్లే ప్రొద్దుటూరులో టీడీపీ గ్రూపుల వారీగా విడిపోయింది. పార్టీ ఉమ్మడి కడప జిల్లాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డిని వరదరాజులరెడ్డి ఏనాడూ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంగానే మల్లెల లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వేర్వేరుగా కార్యాలయాలను నడుపుతున్నారు. ప్రవీణ్కుమార్రెడ్డికి పదవి గండం.. మరోవైపు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డి ఐదేళ్లూ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం సాగింది. అయితే, ఎన్నికల సమయంలో ప్రవీణ్ పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించలేదని, లోపాయికారీగా వ్యతిరేకంగా పనిచేశారని వరదరాజులరెడ్డి వర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల కూటమి ముఖ్య నేతలు అమరావతికి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు పదవి రాకుండా పోయింది. దీంతో ప్రవీణ్ నిరంతరం చంద్రబాబు, లోకేష్లను కలుస్తూ తనపై ఉన్న వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పరాకాష్టకు చేరిన కక్షలు.. తమ పదవిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డిపై ప్రవీణ్కుమార్రెడ్డి బహిరంగంగానే ఎదురుదాడికి దిగారు. కొండారెడ్డికి చెందిన శ్రీఎస్ఎస్ మాల్శ్రీ, శ్రీసన్రైజ్ కౌంటీశ్రీలపై ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలకు వచ్చారు. సొంత పార్టీ నేతే తమ వ్యాపారాలపై అధికారులను ఉసిగొల్పడాన్ని జీర్ణించుకోలేని వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరులు నేరుగా ప్రవీణ్కుమార్రెడ్డి ఇంటిపైకి వెళ్లి రాళ్లతో దాడికి తెగబడ్డారు. తమ్ముళ్లలో అయోమయం.. కార్యకర్తల సమావేశానికి ప్రవీణ్ ఆహ్వానించిన పాత కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. లోకేష్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత ప్రొద్దుటూరు తమ్ముళ్లలో సరికొత్త చర్చ మొదలైంది. ఇప్పటివరకు వేర్వేరు వర్గాలుగా విడిపోయిన ముగ్గురు నేతలు ఇకనైనా కలిసి నడుస్తారా? అది సాధ్యమేనా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాత కక్షల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎవరి వెంట నడవాలో తెలియక తీవ్ర అయోమయంలో కొట్టాడుతోంది. టీఢీపీప్రొద్దుటూరు: పట్టణ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సబ్ స్టేషన్ నిర్మాణ స్థల వివాదం తారస్థాయికి చేరుకుంది. స్థానిక శ్రీనివాసనగర్లోని ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిధులు మంజూరు చేసి, సగం పనులు పూర్తి చేశారు. అయితే, ఈ స్థలం ప్రైవేట్ వ్యక్తులదని, ఇక్కడ నిర్మాణం చేపట్టవద్దని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి పార్టీ పెద్దలకు విన్నవించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల పనులను నిలిపివేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదంపై విద్యుత్ శాఖ డీఈ చాంద్ బాషా మాట్లాడుతూ సదరు స్థలం ఎవరిదనేది తేల్చి, హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం పోలీస్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు ఆగిన పనులను పరిశీలించి చర్చించారు. ప్రొద్దుటూరు టీడీపీలోపచ్చగడ్డి వేస్తే భగ్గు లోకేష్ ‘గేట్పాస్’ హెచ్చరికతో టీడీపీ కకావికలం -
పీజీ డిప్లొమో కోర్సులలో నేరుగా ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) లోని జర్నలిజం, లలితకళల విభాగాలలో పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సులలో నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు ఆచార్య టి.లక్ష్మిప్రసాద్ తెలిపారు. జూలై 23వ తేదీ నుంచి ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. జర్నలిజం శాఖలో పబ్లిక్ రిలేషన్స్, తెలుగు జర్నలిజం..ఫైన్ ఆర్ట్స్ శాఖలో థియేటర్ ఆర్ట్స్, సర్టిఫికెట్ కోర్సులలో కూచిపూడి నృత్యం, కర్నాటిక్ మ్యూజిక్, కీబోర్డులలో ప్రవేశాలున్నాయన్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగష్టు 7వ తేదీ లోపు తమను నేరుగా సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. పీజీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ కడప ఎడ్యుకేషన్: నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి పీజీ కోర్సులలో నేరుగా ప్రవేశించే శ్రీలేటరల్ ఎంట్రీశ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకులు ప్రొఫెసర్ టి.లక్ష్మిప్రసాద్ తెలిపారు. జూలై 23వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు జరిగే ఈ ప్రవేశాలలో భాగంగా ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్), తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, ఎం.కాం, ఎంబీఏ, ఎంబీఏ (హెచ్ఆర్), ఎంసీఏ మరియు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, బాటనీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, మేథమేటిక్స్, ఫిజిక్స్, జువాలజీ) కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు నేరుగా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ www.yvu.edu.in ను సందర్శించవచ్చని తెలిపారు. ఈవీఎం గోడౌన్లనుపరిశీలించిన కలెక్టర్ కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను గురువారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ భద్రపరిచిన గోడౌన్ల పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ ఏఓ గంగయ్య, హెచ్ సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెబ్సైట్లో పీఎఫ్ స్లిప్పులు కడప సెవెన్రోడ్స్: వైఎస్సార్ జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సంబంధించిన 2013–14 నుంచి 2024–25 వరకు జెడ్పీ పీఎఫ్ స్లిప్పులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జెడ్పీ సీఈఓ సి.సుబ్రమణ్యం తెలిపారు. ఉద్యోగులు https://zppfysrkadapa.in వెబ్సైట్లో తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. స్లిప్పులలో ఏవైనా తప్పులుంటే, తగిన ఆధారాలతో జెడ్పీ కార్యాలయానికి వచ్చి సరిచేసుకోవాలని ఆయన కోరారు. -
పాము కాటుకు గురైన విద్యార్థి
కలసపాడు : మండలంలోని గంగాయపల్లెకు చెందిన సుంకరిమధు అనే విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం గడ్డివామి వద్దకు వెళ్లి గడ్డి తీస్తుండగా పాము విద్యార్థిని కాటు వేసింది. వెంటనే స్థానికులు గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మధు చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి ఎగువ రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మధు తండ్రి 5 సంవత్సరాల క్రితం మృతిచెందాడు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. పుల్లివీడు వీఆర్ఓ సస్పెన్షన్పోరుమామిళ్ల : పుల్లివీడు వీఆర్ఓ సునీతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పుల్లివీడు పంచాయతీలోని బొప్పాపురానికి చెందిన గోవిందాయపల్లె వినయ్కుమార్ తన అత్త పేరు మీద ఉన్న పొలం ఆమె కూతురు పేరు మీదకు మార్చాలని వీ ఆర్ఓను కోరగా ఆమె రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. దీంతో పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్కు పంపి, న్యాయం చేయాలని వినయ్కుమార్ కోరారు. స్పందించిన కలెక్టర్ తహసీల్దారు విజయ్కుమార్ను దీనిపై విచారించాలని ఆదేశించారు. తహసీల్దారు విచారించి ఆరోపణలు వాస్తవమేనని ఆర్డీఓకు నివేదిక ఇవ్వడంతో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. డిస్మిస్ చేయాలి : మధుబాబు లంచగొండి వీఆర్ఓలను సస్పెండ్ చేస్తే సరిపోదని, డిస్మిస్ చేయాలని నేషనల్ హ్యూమన్రైట్స్ ఉపాధ్యక్షులు కవలకుంట్ల మధుబాబు కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ కన్నతల్లి చనిపోతే ఆమె కున్న ఏకై క కూతురు భూమిని తన పేరుకు మార్చాలని, మ్యుటేషన్ చేయాలని కోరగా వీఆర్ఓ సునీత రూ. 2 లక్షలు డిమాండ్ చేయడం దుర్మార్గమన్నారు. ఆమైపె గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆమె ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేయాలని కోరారు. ఇద్దరు యువకులపై పోక్సో కేసుకడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక పట్ల, వెంకట్, చిన్న అనే ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నట్లు సమాచారం. నేటి నుంచి ఐటీఐలలో అడ్మిషన్లు కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల పక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఐటీఐ జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్తోపాటు 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్కార్డు, ఫొటో, మెయిల్ ఐతీతోపాటు పర్మినెంట్గా ఉపయోగించే మొబైల్ ఫోన్ నంబర్తో దగ్గరలోని ఐటీఐల వద్దకు వెళ్లి itiadmissions.ap.gov.in వెబ్సైట్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిషన్లకు ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోచ్చని తెలిపారు. -
వరుణా.. చూడవా ఇటుకేసీ!
ఖాజీపేట : వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధిక శాతం భూములకు జీవనాడి అయిన కేసీ కాలువ ఆయకట్టు పరిధిలో సాగు పనులు ఊపందుకుంటున్నా, వరుణుడి దోబూచులాటతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశం కారుమబ్బులతో నిండుతూ భారీ వర్షం పడుతుందన్న ఆశ కల్పిస్తూనే, నిమిషాల్లో మబ్బులు ముఖం చాటేస్తుండటంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. అయినప్పటికీ వరుణుడిపై నమ్మకంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు. శ్రీశైలంలో నీటి ఎద్దడి – ఆగస్టులోనే స్పష్టత శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 220 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో కేసీ కాలువకు సాగునీరు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో రైతులు వరికి బదులు ఆరుతడి పంటల సాగు వైపే మొగ్గు చూపాలని అధికారులు పరోక్షంగా సూచిస్తున్నారు. కాలువకు నీటి విడుదల విషమై జులై చివరన గానీ, ఆగస్టు మొదటి వారంలో గానీ అధికారులు ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని, ఆగస్టులోనే సాగునీటిపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. ప్రసిద్ధ కేంద్రంలో జోరందుకున్న విత్తన విక్రయాలు వరి విత్తన వడ్ల అమ్మకాలకు ఖాజీపేట కేంద్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. జూన్ 1న ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల రైతులు సైతం ఇక్కడికి వచ్చి కేఎన్ఎం–1638, బీపీటీ–5204, జేజీఎల్–384 వంటి రకాల విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే గతేడాది రూ.1200 నుంచి రూ.1250 ఉన్న బస్తా ధర, ఈ ఏడాది ఏకంగా రూ.1300 నుంచి రూ.1400 వరకు పెరిగిందని, ప్యాకెట్కు రూ.100 నుండి రూ.200 వరకు అదనపు భారం పడిందని రైతులు వాపోతున్నారు. దీనికితోడు సాగుకు ముందే వేసే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుముల సబ్సిడీ కోటాను అధికారులు బాగా తగ్గించారని, గత రెండేళ్లుగా పిల్ల పెసర విత్తనాలను ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ సరిపోక బహిరంగ మార్కెట్లో విత్తనాలను అధిక ధరలకు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. జలాశయాల నీటి కోసం ఎదురుచూపు మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, మైదుకూరు మండలాల పరిధిలోని 92 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు కేసీ కాలువే ప్రధాన వనరు. ఈ కాలువకు నీరొస్తే రెండు పంటలు పుష్కలంగా పండుతాయని, అందుకే ఈ ప్రాంతాన్ని నిపుణులు ’మరో కోనసీమ’గా పిలుస్తారని రైతులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం రాజోలి జలాశయానికి ఎప్పుడు నీరు వస్తుందా అని రైతులు కోటి ఆశలతో పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిధిలోని చెరువులన్నీ కేసీ కాలువ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. అవి నిండితేనే ఆయకట్టు సాగు సాధ్యమవుతుంది. కాగా, పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాల రైతులు ఇప్పటికే వరి నార్లు పోసి సాగుకు సిద్ధమవగా.. కాలువ నీటిపై నమ్మకం లేని కొందరు రైతులు బోర్ల కింద వరితో పాటు ఆరుతడి పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికై నా వరుణుడు కరుణించి, అధికారులు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతాంగం వేడుకుంటోంది. శ్రీశైలంలో అడుగంటిన నీరు.. కేసీ ఆయకట్టు రైతుల తిప్పల తీరు ఖరీఫ్ ప్రారంభంతో ఖాజీపేటలో జోరుగా విత్తన విక్రయాలు ధరల భారంపై అన్నదాతల ఆవేదన నీటి విడుదలపై ఆగస్టులోనే స్పష్టత ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని అధికారుల సూచన -
● ఉరకల కుందూ.. ఉతుకులకు సందు!
పై ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం ఏదో మైదానంలో పర్చిన రంగుల తివాచీ కాదు.. అది ఉరకలేయాల్సిన కుందూనది గర్భం! వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో బుధవారం నాడు కనిపించిన హృదయవిదారక చిత్రమిది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో నది పూర్తిగా ఎండిపోయింది. ఎక్కడో ఒకచోట నిలిచిన కాస్త నీటిలోనే బట్టలు ఉతుక్కున్న రజకులు.. ఆరబెట్టుకోవడానికి చోటు లేక ఏకంగా నది గర్భంలోని రాళ్లపైనే బట్టలను ఇలా ఆరవేసుకున్నారు. ఈ దారి గుండా వెళ్లే ప్రయాణికులు నది వైపు చూస్తూ ఆవేదన చెందుతున్నారు. గతేడాది జూలై 9వ తేదీ నాటికే రాజోలి ఆనకట్టకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో కుందూనదితో పాటు కేసీ కెనాల్, చాపాడు ప్రధాన కాలువలు నిండుకుండలా కళకళలాడాయి. కానీ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా చుక్క వాన పడకపోవడంతో జలాశయాలన్నీ ఇదిగో ఇలా జీవచ్ఛవంలా మారాయి. – రాజుపాళెం -
అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే అంతర్ జిల్లా ఐదో విడత మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 80 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఆ జట్టులోని హర్షవర్దన్ 195 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 135 పరుగులు చేయగా మరో బ్యాట్స్మెన్ వరుణ్ 71 పరుగులు చేశాడు. కడప జట్టులోని గైబు 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇరోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 60 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని మిథున్కళ్యాణ్ 68, సుశాంత్ 50 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 4, కిరణ్కుమార్ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 20.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 30 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజసాయి 2 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 139 పరుగు వెనుకంజలో ఉంది. దీంతో తొలి ఇరోజు ఆట ముగిసింది. -
గొర్లకుంట..అక్రమాల పంట!
భూముల ధరలకు రెక్కలు రావడంతో మనుషుల్లో స్వార్థం పెరిగిపోయి.. అక్రమార్కులు ఏకంగా వందలాది మంది రైతుల పొలాలకు సాగునీరు అందించే చారిత్రక చెరువులనే మింగేస్తున్నారు! బద్వేలుకు సమీపంలోని 128 ఎకరాల ‘గొర్లకుంట’ చెరువులో నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా 30 ఎకరాల ప్రభుత్వ భూమిని నిలువునా స్వాహా చేసేశారు! తూము పూడికతో ఆయకట్టు ఎడారిగా మారడమే అదునుగా భావించి, కబ్జాకోరులు ఏకంగా చెరువు గర్భంలోనే బోర్ బావుల జాతర చేస్తున్నారు. దురాక్రమణకు గురైన చెరువుపూడిపోయిన గొర్ల కుంట చెరువు తూంబద్వేలు: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. సెంటు స్థలమైనా చాలు ఆక్రమించేందుకు అక్రమార్కులు ఆలోచించడం లేదు. ప్రభుత్వ స్థలాలు, వాగులు, వంకలు ఇలా ఏది అందుబాటులో ఉంటే దాన్ని మింగేస్తున్నారు. తాజాగా బద్వేలు పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిరాజుపల్లె గ్రామానికి చెందిన ‘గొర్లకుంట’ చెరువు దురాక్రమణకు గురికావడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. తూము పూడికతో ఎడారిగా మారిన చెరువు ఎత్తిరాజుపల్లె పరిధిలోని సర్వే నెంబర్ 40/1లో దాదాపు 128 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ గొర్లకుంట చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు కింద ఎత్తిరాజుపల్లె, తిమ్మరాజుపల్లె గ్రామాలకు చెందిన రైతులకు 150 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. ఐదేళ్లుగా ఈ చెరువు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. సాగునీరందించే ప్రధాన తూము పూడికతో నిండిపోవడంతో, చెరువులోకి నీరొచ్చే దారి లేక రైతులు తమ పొలాలను ఎండగట్టుకున్నారు. రెండేళ్లుగా చుక్క నీరు లేకపోవడంతో చెరువు ఎడారిలా మారిపోయింది. 30 ఎకరాలు స్వాహా.. చెరువు ఎండిపోవడాన్ని అక్రమార్కులు తమకు అనుకూలమైన అదునుగా భావించారు. ఎత్తిరాజుపల్లెకు చెందిన కొందరు దురాక్రమణదారులు ఏకంగా చెరువు గర్భంలోకి చొరబడి, దాదాపు 30 ఎకరాల మేర ప్రభుత్వ చెరువు భూమిని యథేచ్ఛగా ఆక్రమించేశారు. గ్రామానికి చెందిన ఎర్రగోళ్ల రామసుబ్బయ్య, కుంభగిరి శ్రీను, కుంభగిరి నాగయ్య, దుంపల శ్రీనివాస్రెడ్డిలు ఈ దురాక్రమణకు పాల్పడ్డారని స్థానిక ఆయకట్టు రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఏకంగా చెరువు గర్భంలోనే బోర్ బావులను తవ్వేసి, పైర్లు కూడా పెట్టుకున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. వినతులు ఇచ్చినా పట్టించుకోని వైనం చెరువు మరమ్మతుల గురించి, జరుగుతున్న దురాక్రమణ గురించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అస్సలు పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా చాలాసార్లు మొరపెట్టుకున్నామని, అయినా వారు కూడా తమ చెరువు వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ప్రభుత్వ భూముల రీ సర్వే ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దురాక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చెరువు పూర్తి విస్తీర్ణానికి పక్కాగా హద్దులు ఏర్పాటు చేసి తమ 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలని ఎత్తిరాజుపల్లె, తిమ్మరాజుపల్లె గ్రామస్తులు, రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 128 ఎకరాల చారిత్రక చెరువులో 30 ఎకరాల స్వాహా! చెరువు గర్భంలోనే బోర్ల జాతర, పైర్లు నాటి నీరు మిగులుబాటు.. నేడు కబ్జా! నా చిన్నతనంలో.. దాదా పు 70 ఏళ్ల కిందట మా గ్రామం గొర్లకుంట చెరువులో నీరు ఆయకట్టు కు ఒక పంటకు పూర్తిగా సరిపడి, ఇంకా నెల రోజుల పాటు నిల్వ ఉండేది. ఇప్పుడు చెరువు కబ్జాకు గురికావడంతో నీరు అస్సలు నిలవడం లేదు. అధికారులు, నాయకులు కలగజేసుకుని చెరువును కబ్జాకోరుల చెర నుంచి విడిపించి మమ్మల్ని ఆదుకోవాలి.– బుసగాని చెన్నయ్య, రైతు, ఎత్తిరాజుపల్లె, బద్వేలు మండలం. తూము రిపేరు చేయించండి చెరువు తూము ఐదేళ్లుగా పూడిపోయింది. దానిని పట్టించుకునే నాథుడే లేడు. అందువల్ల చెరువులో నీరు నిలబడటం లేదు. పైర్లు పెట్టుకున్నప్పుడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిని ఆసరాగా తీసుకుని మా గ్రామస్తులే కొందరు చెరువును ఆక్రమించారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.–వెంకటసుబ్బారెడ్డి, రైతు, ఎత్తిరాజుపల్లె, బద్వేలు ఆక్రమణలు తొలగించండి గొర్లకుంట చెరువు రైతులమైన మాకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఆక్రమణకు గురైంది. అక్రమార్కులు ఏకంగా చెరవులోనే బోర్లు వేసుకున్నారు. అధికారులు స్పందించి చెరువును పూర్తి స్థాయిలో కొలతలు వేయాలి. ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుని రైతులకు ఉపయోగపడేలా చేయాలి. – ఎన్.వెంకటసుబ్బారెడ్డి, రైతు, ఎత్తిరాజుపల్లె, బద్వేలు మండలం -
విద్యాసంస్థల బంద్కు సంఘీభావంగా నేడు నిరసన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేడు విద్యార్ధి సంఘాలు తలపెట్టిన బంద్ కు ప్రజాసంఘాల సంఘీభావం తెలియజేస్తూ నిరసన చేపడుతున్నట్లు ప్రజా సంఘాల నాయకులు జి.చంద్ర, చంద్రశేఖర్, రాజా వెంగల్ రెడ్డి, మల్లెల భాస్కర్, బి ఒబయ్య, పేర్కొన్నారు. గురువారం కడపలోని ఎస్టీయూ భవన్లో వారు మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. దేశ అభివద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ఇంజనీర్, పర్యావరణవేత్త సోను వాంగ్చుక్ ఇరవై రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపకపోవడం అమానుషమన్నారు. విద్యార్థుల ‘చలో పార్లమెంట్‘కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొంటే, వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టించడం, విద్యార్థినులని కూడా చూడకుండా ఈడ్చిపారేయడం సిగ్గుచేటు అని అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కేసీ బాదుల్లా, ఎన్.శివరాం, ఓబులేసు, ఏఐఎస్ఎఫ్ అరుణ్, ఎస్ఎఫ్ఐ రవి, భాగ్యలక్ష్మి, నారాయణ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని అదృశ్యం
పోరుమామిళ్ల : కాలేజీకి పోతున్నా అంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లిన తన కూతురు హరిత (17) ఇంతవరకు తిరిగి రాలేదని ఆమె తల్లి తులసి గురువారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందని ఎస్ఐ హనుమంతు తెలిపారు. దీనిపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమెను గుర్తించిన వారు తమకు తెలియజేయాలని కోరారు. తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రాయితో కొడుకుపై దాడి చేసిన తండ్రికలసపాడు : మండలంలోని ముద్దంవారిపల్లె గ్రామానికి చెందిన సగిలిఫ్రాన్సిస్ తన కుమారుడు సగిలిసర్వేష్ను రాయితో తలపై కొట్టడంతో గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే సర్వేష్ కడపలోని నాగరాజు హైస్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. గురువారం సర్వేష్ తన భార్యను కడపకు తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాలని చెప్పాడు. ఈ విషయమై తండ్రి ఫ్రాన్సిస్, సర్వేష్కు వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చగా ఫ్రాన్సిస్ సమీపంలో ఉన్న రాయితో సర్వేష్ తలపై కొట్టడంతో అతనికి రక్తగాయాలయ్యాయి. అతను ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని అనంతరం కలసపాడు పోలీసుస్టేషన్కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫ్రాన్సిస్ తన కోడలు వేలాంగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. -
పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం
సిద్దవటం : పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని కర్నూలు రేంజ్ బెటాలియన్ డీఐజీ–2 ఉదయభాస్కర్ అన్నారు. మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను, చిన్న పరేడ్ గ్రౌండ్లో నిర్మించనున్న నూతన షెడ్ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాలను డీఐజీ చేతుల మీదుగా ఆవిష్కరించి ప్రారంభించారు. బెటాలియన్లో మహిళల కోసం నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును ఆయన సతీమణి చేతుల మీదుగా ప్రారంభింపచేశారు. అనంతరం బెటాలియన్లోని ఆఫీసులు, స్టోర్లు, యూనిట్ హాస్పిటల్, ఆయుధాగారం తదితర విభాగాలను తనిఖీ చేశారు.కార్యక్రమంలో కమాండెంట్ ఆనందరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు పిఎన్డి ప్రసాద్, రాజశేఖర్, వెంకటప్ప, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక, మట్టి మాఫియాలకు ముగ్గురు బలి
చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్న ఇసుక, మట్టి మాఫియాలకు సామాన్యులు బలవుతున్నారు. అధికారపార్టీ ధన దాహానికి ప్రాణాలు కోల్పోతున్నారు. పాలకుల పాపానికి తాజాగా ముగ్గురు బలయ్యారు. వైఎస్సార్ కడపజిల్లాలో ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు, పల్నాడు జిల్లాలో మట్టి టిప్పర్ చక్రాల కింద నలిగి ఒకరు మరణించారు. ఈ దుర్ఘటనలు అధికారపార్టీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచాయి. అయినా సర్కారులో చలనం లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మాఫియాలను కట్టడి చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజంపేట/సాక్షి, నరసరావుపేట: తెలుగుదేశం కూటమి నేతల ఇసుక, మట్టి మాఫియాలకు బుధవారం ముగ్గురు బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం ఉప్పరపల్లె సమీపంలో ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సుండుపల్లెలో జరిగే గొర్రెల సంతకు చిన్నగొల్లపల్లెకు చెందిన గొర్రెల వ్యాపారులు అబ్బన్నగారి జయరామ (45), రెడ్డిచర్ల రవీంద్ర (42) బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి బైక్ను ఉప్పరపల్లె సమీపంలో బాలరాచపల్లె నుంచి అతివేగంగా వస్తోన్న ఇసుక టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టి, కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.అయినా టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సురేష్బాబు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించడానికి యత్నించారు. దీంతో మృతుల కుటుంబీకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవాలని, డ్రైవర్ను అరెస్టు చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. వారికి పోలీసులు సర్దిజెప్పడంతో ఆందోళనను విరమించారు. ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.20లక్షల పరిహారమివ్వాలని రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబీకులు, స్థానికులతో కలిసి ఆయన రహదారిపై బైఠాయించారు. కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, ఈ ప్రాంతంలో ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.నిద్రిస్తున్న డ్రైవర్పై నుంచి వెళ్లిన మట్టి టిప్పర్..అధికారపార్టీ నేతల అక్రమ మైనింగ్ ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో నల్లఎర్ర చెరువులో మట్టిని టీడీపీకి చెందిన అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. డ్రైవర్లకు ఎక్కువ వేతనం ఆశచూపి పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ ఆవుల నాగార్జున(35) ఎక్కువ జీతం వస్తుందన్న ఆశతో మట్టి టిప్పర్ డ్రైవర్గా చేరాడు. మట్టి మాఫియా ఒప్పందం మేరకు 24 గంటలూ (నైట్షిఫ్టులూ) పని చేస్తున్నాడు.మంగళవారం అర్ధరాత్రి వరకు టిప్పర్ తోలిన అతను అలసి నల్లఎర్రచెరువు వద్దే కింద నిద్రకు ఉపక్రమించాడు. ఈ సమయంలో అతను నిద్రపోతున్న విషయం గమనించని మరో టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని తోలడంతో చక్రాల కింద నలిగి నాగార్జున మరణించాడు. నాగార్జునకు భార్య గంగతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఆరోతరగతి చదువుతుండగా కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో సహచర డ్రైవర్లూ దిగ్భ్రాంతికి గురయ్యారు. విగతజీవిగా పడి ఉన్న నాగార్జున మృతదేహం వద్ద భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.మట్టి మాఫియా బరితెగింపు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించినా మట్టి మాఫియా చలించలేదు. మట్టి తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగకుండా ఘటన జరిగిన వెంటనే మృతదేహాన్ని ఆటోలో గ్రామంలోకి తరలించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్తులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్ ఆందోళనకారులతో మాట్లాడారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. -
గురువులను దర్శించుకోవడం ఆనందదాయకం
కడప సిటీ: కడప అమీన్పీర్ దర్గా గురువులను తొలిసారి దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం దర్గాకు విచ్చేసిన ఆయనకు ముజావర్ సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి స్వాగతం పలికారు. దర్గాలోని ప్రధాన గురువు హజరత్ పీరుల్లామాలిక్తో పాటు ఇతర గురువుల మజార్లను దర్శించుకున్న హీరో.. చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు ఆయనకు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం దర్గా ఆవరణలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’ షూటింగ్ ప్రస్తుతం ప్రొద్దుటూరులో కొనసాగుతోందని, అంతకుముందు గండికోటలో కూడా షూటింగ్ జరిగిందని తెలిపారు. ప్రేక్షకులంతా తన ‘హైందవ’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. కాగా, హీరో రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో దర్గాకు చేరుకుని హీరోతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ -
నిర్వహణ ఖర్చు బాగా పెరిగిపోయింది
బట్టల షాపుల నిర్వహణ ఖర్చు గతంలో కంటే బాగా పెరిగిపోయింది. ముగ్గురు గుమాస్తాలు ఉన్న బట్టల దుకాణానికి నెలకు సుమారు రూ. 1 లక్ష వరకు ఖర్చు వస్తుంది. రోజులో బోణీ కాని దుకాణాలు కూడా చాలా ఉన్నాయి. ఆన్లైన్ బిజినెస్ మా వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామాల్లో పంటలు సరిగా పండక పోవడం వ్యాపారాలు జరగకపోవడానికి ప్రధాన కారణం. గతంలో మాదిరి ప్రజల వద్ద డబ్బులు లేవు. – సుంకు ప్రసాద్, వరుణ్ జెంట్స్వేర్, వివేకానందక్లాత్ మార్కెట్, ప్రొద్దుటూరు -
విద్యార్థుల ఆకలికేకలు
● స్మార్ట్ కిచెన్ ద్వారా భోజనం సరఫరా ఆలస్యం ● రెండు గంటల పాటు ఆకలితో అలమటించిన విద్యార్థులుబద్వేలు అర్బన్ : పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు బుధవారం ఆకలితో అలమటించారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా కేంద్రీకృత వంటశాల నుండి ఆయా పాఠశాలలకు సరఫరా చేసే భోజనం సుమారు రెండు గంటల పాటు ఆలస్యం కావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. మండల పరిధిలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 4 మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, 55 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3580 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ ద్వారా డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పంపిణీ చేసేందుకు చిన్నకేశంపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ నిర్మించారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు మూడు రూట్లను విభజించి మూడు వాహనాలను ఏర్పాటు చేశారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1410 మంది విద్యార్థులు ఉండగా 1156 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 430 మంది విద్యార్థినులకు 365 మంది చొప్పున మొత్తం 1521 మంది బుధవారం ఆయా పాఠశాలలకు హాజరయ్యారు. వీరికి మధ్యాహ్నం 12–15 గంటల నుంచి భోజనం అందించాల్సి ఉంది. మండల పరిధిలోని పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత భోజనం సరఫరా చేసే వాహనాలు లేకపోవడంతో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు మధ్యాహ్నం 2 గంటలకు, జెడ్పీ బాలికల ఉన్నర పాఠశాలకు 2–15 గంటలకు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా భోజనం అందింది. దీంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. పాఠశాల ఉపాధ్యాయులు సైతం భోజనం చేయకుండా విద్యార్థులను పర్యవేక్షిస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భవిత కేంద్రంలోని 20 మంది విద్యార్థులు సైతం ఆకలితో అలమటించారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.వెంకటసుబ్బారెడ్డి భోజనం ఆలస్యమైన విషయా న్ని సంబంధిత ఎంఈఓ, తహసీల్దారు, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళారు. దాదాపు రెండు గంటలు భోజనం ఆలస్యంగా రావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించడంతో పాటు మధ్యాహ్నం సెషన్లో జరగాల్సిన మొదటి పిరియడ్ను కోల్పోవాల్సి వచ్చింది. -
వైభవం.. ధ్వజారోహణం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్, పవన్, పార్థసారథి, రంగనాధాచార్యులు, వేదపారాయణం, సంతోష కృష్ణశర్మ, లావణ్య రామశర్మల ఆధ్వర్యంలో గజ స్తంభంపై గరుడ చిహ్నంతో ఉండే పతాకాన్ని ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.రాత్రి యాలివాహనంపై శ్రీసౌమ్యనాథుడు శ్రీదేవి భూదేవితో కలిసి పురవీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓ ఎన్.రవి, డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పల్లకీసేవ, తిరుమంజనం రాత్రికి హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
గతంలో మాదిరి ఎలక్ట్రికల్ వ్యాపారాలు లేవు
గతంలో ఎలక్ట్రికల్ వ్యాపారాలు బాగా జరిగేవి. ఇప్పుడు ఆశించినంతగా లేవు. నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయింది. కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ కారణంగా మా వ్యాపారాలు తగ్గిపోయాయి. అంతేగాక ప్రజల వద్ద డబ్బు రొటేషన్ లేదు. ఆన్లైన్ అమ్మకాలు కూడా మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. అరకొర వ్యాపారాలు జరిగినా పెట్టుబడికి తగినట్టు లాభాలు ఉండటం లేదు. ఎలాగో అలాగా బండిని నడిపిస్తున్నాం. – శ్రీనివాసులు, శ్రీనివాస ఎలక్ట్రికల్స్, వెదుర్లబజార్, ప్రొద్దుటూరు -
దస్తావేజు లేఖరుల దీక్షలకు వైఎస్సార్సీపీ మద్దతు
జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ కడప కార్పొరేషన్: కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ సమీపంలోని బాలాజీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు దస్తావేజు లేఖరులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేసి, ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం బాధాకరమన్నారు. ప్రజల హక్కులు, ఆస్తుల భద్రత విషయంలో వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ ప్రజల ఆస్తులు, ప్రభుత్వ సేవలను బడా బాబుల చేతుల్లోకి అప్పగించే ప్రయత్నమే జీవో ఎంఎస్ నెం. 396 వెనుక ఉన్న అసలు ఉద్దేశమని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాల కంటే కొందరి ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ కూటమి ప్రభు త్వం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రజల ఆస్తుల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రజలు అంగీకరించరని, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైన విధానం కాదన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, పబ్లిసిటీ వింగ్ స్టేట్వర్కింగ్ ప్రెసిడెంట్ సీహెచ్ వినోద్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు చెండ్రాయుడు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
పెద్దముడియం(జమ్మలమడుగు) : పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన కొమ్మ ఓబులేసు ఇటీవల మృతి చెందాడు. ఇతని మృతిపై అనుమానాలు ఉన్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు చిన్నయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఆర్డీఓ నొస్సం పోలీసులకు రెఫర్ చేశారు.దీంతో సంజామల మండలంలోని పోలీసులను దళిత సంఘాల నాయకులు కలిశారు. ఈసందర్భంగా కొమ్మ ఓబులేసుకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ నొస్సంలోని ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. సూది వేయించుకుని ఓబులేసు తిరిగి గ్రామానికి వచ్చాడు. రాగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి శరీరంపై బొబ్బలు వచ్చాయి. సూది వేసిన నాలుగు గంటలలోపే ఓబులేసు మృతిచెందాడు. ఇది తెలియని బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. 4 రోజుల తర్వాత ఫొటోల్లో శరీరంపై ఉన్న బొబ్బలను గుర్తించిన కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆర్ఎంపీ వైద్యుడు వేసిన సూది మందు వికటించడంతోనే ఇలా జరిగిందని భావించి పోస్టుమార్టం నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆర్డీఓను కలిశారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు బుధవారం మేడిదిన్నె గ్రామంలో పూడ్చిపెట్టిన శవానికి ఆళ్లగడ్డకు చెందిన ప్రభుత్వాసుపత్రి వైడ్యుడు.. పెద్దముడియం తహసీల్దార్ బాల నరసింహులు, సంజామల ఎస్ఐ రమణయ్యల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. -
ఇసుకటిప్పర్లతో.. గాలిలో ప్రాణాలు!
● సుండుపల్లెలో బైక్ను ఢీ కొన్న టిప్పర్ ● ఇద్దరు దుర్మరణం..వీధినపడ్డ కుటుంబాలురాజంపేట/సుండుపల్లె : చెయ్యేరు, మాండవ్యనది, పెన్నానది పరిధిలో ఉన్న ఇసుక రీచ్ల నుంచి తీసుకెళ్లే టిప్పర్లు అతివేగంగా సమీప గ్రామాల మీదుగా వెళుతుంటే స్ధానికుల గుండెల్లో భయాందోళన. ఈ సమస్య గురించి పట్టించుకునే అధికారే కరువయ్యారన్న విమర్శలు ఉన్నాయి. వినతులు, పిర్యాదులు చెత్తబుట్టలో పడిపోయాయి. ఇసుకరీచ్. గ్రామాల మీదుగా ఉండే రోడ్డు మీద వెళ్లాలంటే పాదచారులు, వాహనాదరులు భయపడుతున్నారు. ఏ వైపు నుంచి ఇసుకటిప్పర్లు మీద పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు ఆగస్టు 15వతేదీ వరకు ఇసుకరీచ్ల నుంచి ఇసుకను తరలించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటి టీడీపీ ఇసుకాసురులు మాత్రం ఖాతరు చేయలేదని ఇసుకరీచ్ బాధితులు విమర్శిస్తున్నారు. ఇసుక తరలింపు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి ఇసుకటిప్పలు అడ్డూ అదుపులేకుండా దూసుకుపోతున్నాయి. సుండుపల్లెలో జరిగే సంతకు వెళుతూ.. తాజాగా సుండుపల్లె–సానిపాయి మార్గంలోని ఉప్పరపల్లె వద్ద వెనుక నుంచి గొర్రెల పెంపకదారులు జయరామ,(45), రవీంద్ర (47) సుండుపల్లెలో జరిగే సంతకు బయలుదేరారు. తమ వెనుక (ఇసుక టిప్పర్)మృత్యువు వెంటాడుతుందనే విషయం గమనించలేదు. బైక్పై వెళుతున్న జయరామ,రవీంద్రను టిప్పరు ఢీ కొంది. అక్కడక్కడికే మృతిచెందారు.స్థానికులు, కుటుంబీకులు ఈ సంఘటనపై ఆందోళనకు దిగారు.మృతదేహలను తరలించేందుకు వీలులేదని రహదారిపై బైఠాయించారు. సీఐ సురేష్ సంఘటనస్ధలానికి చేరుకొని మృతదేహలను తరలించాలని వాహనంతో పాటు వచ్చేశారు. సీఐ రాక తమను విస్మయానికి గురిచేసిందని వాపోతున్నారు. తర్వాత పోస్టుమార్టరం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అండగా నిలిచారు.మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్. జిల్లా ఎస్పీలను ఫోన్ ద్వారా కోరారు. జీవాలే జీవనాధరం మృతిచెందిన జయరామ, రవీంద్రలకు జీవాల వ్యాపారమే జీవనాధారం. జీవాలు(పొట్టేళ్లు) కొనుగోలు చేయడం, వాటిని పెంచడం, అమ్మడం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. సుండుపల్లె వారపు సంతకు ఇరువురు బైకులో బయలుదేరి, మృత్యుఒడికి చేరుకున్నారు. రవీంద్రకు భార్య సంపూర్ణ, ఇంటర్పూర్తి చేసుకున్న కుమార్తె, టెన్త్ చదువుకునే కుమారుడు ఉన్నారు. భార్య జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లింది. మరో మృతుడు అబ్బన్నగారి జయరామకు భార్యప్రభావతి, కుమారుడు ఒకరు ఉన్నారు. భార్య కువైట్లో ఉండగా కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇరుకుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబాలో విషాదచాయలు అలుముకున్నాయి.వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు తమ గ్రామమీదుగా వందలాది టిప్పర్లతో ఇసుక తరలింపు జరుగుతోంది. వర్షాలు కురవక, తాగునీరు లేక గ్రామాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే ప్రతిరోజు వందలాది టిప్పర్లతో ఇసుకను తరిలించారు. గ్రామాల్లో రోడ్లపై నడవాలన్నా, వాహనదారులు వెళ్లాలన్నా జనం భయపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి. – బాలయ్య, చిన్నగొల్లపల్లె, సుండుపల్లె మండలం -
26న దివ్యాంగుల క్రికెట్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: అమరావతి ఇన్క్లూజివ్ క్రికెట్ కప్–2026 పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వైఎస్సార్ జిల్లా శారీరక దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 26న కడప నగరంలోని వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియం నెట్స్లో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ కన్వీనర్ మనోహర్రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్తో పాటు ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, యూడీఐడీ కార్డు జిరాక్స్ ప్రతులు మరియు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9885254432 లేదా 9160008447 నంబర్లను సంప్రదించవచ్చు. కోవిడ్ నియంత్రణకు చర్యలు కడప రూరల్: కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. ఆయన బుధవారం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్తో చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక వేంపల్లె : ఇండియా కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి హరిప్రసాద్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఉషశ్రీ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి క్రీడాలకు ఎంపికై న హరి ప్రసాద్ను ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్రతో కలిసి అభినందించారు. ఈనెల 24 నుంచి 26 వరకు జమ్ము తావి, జమ్ము కశ్మీర్లో జాతీయ స్థాయిలో జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఏపీ తరపున హరిప్రసాద్ పాల్గొంటారని వివరించారు. -
● వెలవెలబోతున్న బజార్లు ● క్షీణించిన కొనుగోళ్లు ● కరువును తలపిస్తున్న పరిస్ధితులు
కడప రూరల్ : బజార్లలో జనాలు లేక వెలవెలబోతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వ్యాపారాలు కుంటుపడ్డాయి. పంటలకు గిట్టుబాటు దక్కకపోవడం, సంక్షేమ పథకాల ఆదరణ లేక జనాల వద్ద డబ్బులు చేతులు మారడం లేదు. కొనుగోలు శక్తి క్షీణించి ఏమీ కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రభావం ప్రధానంగా వ్యాపార రంగంపై పడింది. పడకేసిన సంక్షేమం.. పాలన బాగుంటే ప్రజలు నూతనోత్సాహంతో ఉంటారు. ఆర్థికంగా ముందడుగు వేస్తారు. సంక్షేమం అటకెక్కితో ఆ ప్రభావం జనాలపై పడుతుంది. అదే జరిగేతే కొనేవారు లేక వ్యాపారం కుదేలవుతుంది. రెండేళ్ల కూటమి పాలనలో ఇదే జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఏ కోశానా సంక్షేమం మచ్చుకై నా కనిపించలేదు. అలాగే వ్యవసాయం, భవన నిర్మాణ పనులు నెమ్మదించాయి. దీంతో కూలీల పరిస్ధితి దినదిన గండంగా మారింది. ఆఖరికి కడుపు నింపుకోవడానికి ఏమీ కొనలేని పరిస్ధితి దాపురించింది. మనకు ప్రధాన ఆర్ధిక వనరు వ్యవసాయం ప్రస్తుత టీడీపీ కూటమి పాలనలో రైతన్నకు ‘వ్యయం’పెరిగింది, ప్రభుత్వ ‘సాయం’కొరవడింది. పాలకులు కనీసం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో చీనీ, అరటి తదిర పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఆర్ధికంగా చితికిపోయారు. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రభావం కూడా వ్యాపార రంగంపై పడింది. రియల్ ఎస్టేట్ ఢమాల్.. ఏదో ఒక చోట స్ధలం ఉంటే దాన్ని అమ్ముకొని జీవనం సాగించాలని ఎంతో మంది భావిస్తారు. అలాగే ఎంతో కొంత స్తోమత కలిగిన వారు 2–3 సెంట్లైనా స్థలం కొని ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తారు. గడిచిన రెండేళ్ల నుంచి భూముల క్రయ విక్రయాలు పూర్తిగా మందగించాయి. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉరకలేసింది. దీంతో స్ధలాలకు మంచి ధరలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి కనిపించలేదు. దీంతో స్థలాల ధరలు నేలను తాకాయి. ఈ ప్రభావం కూడా వ్యాపారాలపై తీవ్రంగా పడింది. చాలా మంది వద్ద స్ధలాల రూపంలో ఆస్తులు ఉన్నాయి. డబ్బులు చేతిలో ఆడడం లేదు. పండుగలా వైఎస్సార్సీపీ పాలన.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన సాగించారు. అన్ని వర్గాలకు మేలు కలిగేలా ‘నవరత్నాలు’ లాంటి పఽథకాలను అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు, వైఎస్సార్ నేతన్న నేస్తం తదితర పధకాలను విజయవంతంగా అమలు చేశారు. దీంతో ప్రజలు ఇతరుల సహాయం లేకుండా ప్రభుత్వ సహకారంతో సగర్వంగా, ఆర్థ్ధికంగా ఎదిగారు. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా వ్యాపారాలు సంతోషంగా సాగాయి. -
టీడీపీనేత మహేశ్నాయుడు, అనుచరుల ఓవరాక్షన్!
టాస్క్ఫోర్స్ : సుండుపల్లె–సానిపాయ మార్గ మధ్యలో ఉప్పరపల్లె వద్ద ఇసుక టిప్పర్ ఢీ కొనడంతో మృతి చెందిన గొర్రెల పెంపకందార్లు జయరామ, రవీంద్ర కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు, కుటుబీకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బైఠాయించారు. టీడీపీకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని.. ఇసుక టిప్పర్ కిందపడి ఇద్దరు మృతి సంఘటనలో టీడీపీ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందనే భావనతో గతంలో పలు ఎర్రచందం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న మహేష్నాయుడు, ఆయన అనచరులు ఆందోళనకు అడ్డంగా నిలిచారు. ధర్నాలు చేయవద్దంటూ, బైఠాయించిన వారు లేచిపోవాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మర్నాడు మళ్లీ ధర్నా చేస్తామని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆగేది లేదన్నారు. ఇసుకరీచ్లో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాగా మహేశ్నాయుడు ఓవరాక్షన్ చూసిన స్థానికులు నివ్వెరపోయారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే బైఠాయించి,ఆందోళన చేస్తుంటే, మహేశ్నాయుడు, వారి అనుచరులు వీరంగంపై పలువురు విమర్శిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన క్రమంలో సుండుపల్లె ఎస్ఐ మహేశ్ రంగప్రవేశం చేసి ఈ కేసు విషయంలో పూర్తిస్ధాయి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. మహేశ్నాయుడు ఓవరాక్షన్ సోషల్మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిందిపోయి, ధర్నా చేయొద్దు అంటూ అరచడం చూసి నె పెదవి విరిస్తున్నారు. ఈ ప్రమాదం విషయంలో టీడీపీ అభాసుపాలు కావడానికి మహేష్ నాయుడు వైఖరే కారణమని విమర్శలు వెలువడుతున్నాయి. -
కోమన్నూతల అరటి జిల్లాకే గర్వకారణం !
● ప్రపంచ మార్కెట్లో మరింత గుర్తింపు తీసుకురావాలి ● కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి లింగాల/పులివెందుల టౌన్/ పులివెందుల రూరల్/ చెన్నూరు: లింగాల మండలం కోమన్నూతల అరటి సాగు నాణ్యత, ఉత్పత్తి, మార్కెటింగ్పరంగా దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా రైతులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం కలెక్టర్ లింగాల మండలం కోమన్నూతల గ్రామాన్ని సందర్శించి, అక్కడ విస్తారంగా సాగవుతున్న అరటి తోటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట సాగు, దిగుబడులు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. దేశంలోనే విశిష్ట గుర్తింపు పొందిన కోమన్నూతల అరటి పంట జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఉద్యాన పంటల అభివృద్ధిలో ఈ గ్రామం ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని, జిల్లాతో పాటు రాష్ట్ర స్థూల విలువ ఆధారిత ఉత్పత్తి (జీవీఏ)లో అరటి సాగు కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇక్కడ పండే అరటికి దేశీయ మార్కెట్తోపాటు విదేశీ మార్కెట్లలో కూడా మంచి ఆదరణ ఉందని, ఆ అవకాశాలను మరింత విస్తరించే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. రైతులు సంఘటితంగా ముందుకు వచ్చి బలమైన ఎఫ్పీఓలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి హరిప్రసాద్, ఉద్యానశాఖ సహాయ సంచాలకుడు రవిచంద్ర బాబు, ఉద్యాన అధికారి బి.దీప, అరటి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శిరీష పాల్గొన్నారు. మత్తుకు యువత దూరంగా ఉండాలి మత్తుకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక రమణప్ప సత్రంబడి లో కలెక్టర్ను స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన పోస్టర్లను ఆవిష్కరింపజేశారు. ప్రతి పాఠశాల స్మార్ట్ కిచెక్ పరిధిలోకి ... జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రతి మండలాన్ని స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకొస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, రమణప్ప సత్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, చెన్నూరు మండలం కొండపేటలోని స్మార్ట్ కిచెన్లను పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 25స్మార్ట్ కిచెన్ పాయింట్లను ఏర్పాటు చేశామని వారం, పదిరోజుల్లో మరో 13 ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పనులను వేగవంతం చేయండి జల జీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఇరిగేషన్, పీబీసీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి కడప సెవెన్రోడ్స్ : యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మై భారత్ కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ‘మై భారత్ (ఎంవై–డీఏసీ) జిల్లా సలహా కమిటీ’ తొలి సమావేశం జరిగింది. మై భారత్ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తరించడం తదితర అంశాలపై కార్యాచరణ రూపొందించడంతోపాటు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. -
వస్త్రవ్యాపారాలపై బంగారం ధరల ప్రభావం
పెరిగిన బంగారం ధరలు వస్త్ర వ్యాపారాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. సెకండ్ ముంబైగా పేరు పొందిన ప్రొద్దుటూరుకు బంగారు కొనుగోళ్ల నిమిత్తం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. బంగారు నగలు కొన్న తర్వాత స్థానికంగానే బట్టలు కూడా కొనుగోలు చేసి వెళ్తుంటారు. పెరిగిన ధరల కారణంగా బంగారు కొనుగోలు చేసేవారు తక్కువయ్యారు. ఈ కారణంగా మా వ్యాపారాలు జరగడం లేదు. పైగా జీవనోపాధి లేపోవడం కూడా ఒక కారణం – కృష్ణ, వివేకానంద హోల్సేల్ క్లాత్మార్కెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరి, ప్రొద్దుటూరు -
మద్యం దుకాణాలపై నిఘా ఉంచాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలోని మద్యం బెల్ట్ షాపులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు అధికారులకు సూచించారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల ప్రొహిబిషన్ – ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా తయారు చేసే నాటుసార, సుంకం చెల్లించని మద్యం, బెల్ట్ షాపుల నిర్మూలనపై చేపట్టిన చర్యలు, నమోదైన కేసులు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఎకై ్సజ్ ఆదాయం లక్ష్యాల సాధనపై సమగ్రంగా సమీక్షించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట జె.రమేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
●ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
కడప సిటీ: ఈ ఏడాది ఎల్నినో వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయ రంగాన్నే కాకుండా జిల్లాలో ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను కూడా నిలువునా ముంచేస్తోంది. ఒకవైపు వరుణ దేవుడు కరుణించకపోవడంతో సాగుకాక వ్యవసాయం దెబ్బతిని ప్రజలు దిగులు చెందుతుంటే, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై ఈ ప్రభావం మెండుగా పడుతోంది. జులై నెల ముగుస్తున్నప్పటికీ జిల్లాలో ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు కురవడం లేదు. కేవలం నామమాత్రపు తుంపర వానలతోనే సరిపెడుతుండటంతో ప్రాజెక్టులకు నీరు చేరేందుకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసి వంకలు, నదులు ఉరకలేసి ప్రవహిస్తే తప్ప ప్రాజెక్టుల్లోలోకి నీరు చేరే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. మరో ఆరు నెలల గండం.. తాగునీటికి ముంచుకొస్తున్న ముప్పు! వాతావరణ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది మరో ఆరు నెలల వరకు ఈ ఎల్నినో ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా వర్షాలు అంతంత మాత్రమే కురుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగునీరు దేవుడెరుగు, భవిష్యత్తులో కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకని భయానక తాగునీటి ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. రిజర్వాయర్లలో పడిపోతున్న నీటి మట్టం.. రైతన్నల గుబులు! జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో రోజురోజుకు నీటి మట్టాలు వేగంగా తగ్గుతూ వస్తుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఖరీఫ్ సీజన్ చేజారిపోతుండటం, పెట్టిన పెట్టుబడులు మట్టిపాలవుతాయేమోనని అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాతావరణ మార్పుల ధాటికి అటు తాగునీరు, ఇటు సాగునీరు అందక జిల్లా జనం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పటికై నా ప్రత్యామ్నాయ నీటి నిల్వ, సరఫరా ప్రణాళికలపై అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎల్నినో దెబ్బకు సగానికి పడిపోయిన జలాశయాల నీటి నిల్వలు వ్యవసాయం అతలాకుతలం జులై ముగుస్తున్నా తుంపర్లకే పరిమితమైన వానలు మరో ఆరు నెలల పాటు ఇదే ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాస్త్రవేత్తలు మొత్తం సామర్థ్యం 82 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం ఉంది 42 టీఎంసీలే! ఎల్నినో ప్రభావంతో వర్షాలు రాక ప్రాజెక్టుల నీటిమట్టాలు తగ్గుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టుల నీటిమట్టం మరింత లోతుకు పోయే అవకాశం ఉంది. అయినప్పటికీ పరిశ్రమలకు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రాజెక్టుల నీటి నిల్వల సమాచారాన్ని తెలియజేస్తున్నాం. – బాలచంద్రారెడ్డి, ప్రాజెక్టుల సీఈ, కడప. -
శిశు మరణాల నివారణకు చర్యలు: డీఎంహెచ్ఓ
కడప రూరల్ : శిశు మరణాల నివారణకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో శిశుమరణాలపై ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. పలు సూచనలు చేశారు. డాక్టర్ అరిఫుల్లా, డాక్టర్ మొహమ్మద్ తాహ, డాక్టర్ హిరేంద్ర సింగ్, డిప్యూటీ డెమో ప్రసన్న లత, సిహెచ్ఓ మునిరెడ్డి పాల్గొన్నారు. జనం కోసం జగన్ ‘యాప్’ కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురైన ప్రజలు తమ గొంతుకను వినిపించేందుకు వీలుగా జగన్ 2.0 సూపర్ యాప్ను తమ పార్టీ తీసుకొచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా తెలిపారు. అధికార పార్టీ నేతల వల్ల ఎవరైనా ప్రజలు ఇబ్బందులకు గురైతే ఆ విషయం యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. తమ పార్టీ అండగా నిలబడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైనా ప్రజలకు న్యాయం జరగలేదన్నారు. ముఖ్యంగా మహిళలకు రక్షణే లేకుండా పోయిందన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే సోషల్ మీడియాపై కేసులు నమోదు చేయడం శోచనీయమన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు షఫీ, రమేష్ రెడ్డి, తోటకృష్ణ, ఎస్ఎల్ఎస్ గౌస్పీర్, బసవరాజు, రామకృష్ణారెడ్డి, పాల్గొన్నారు. జీవో 396 రద్దు చేసేదాకా పోరాటం కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 396ను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు రెండవ రోజు బుధవారం సామూహిక రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్ఎస్కేలు ఏర్పాటు చేయడం అంటే దస్తావేజు లేఖరుల వ్యవస్థను పూర్తిగా తొలగించడమేనని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతి జరుగుతుందని మీ పేటీఎం బ్యాచ్ వారితో చెప్పించి అధికారులు డాక్యుమెంట్ రైటర్లు కుమ్మక్కై సమ్మె నిర్వహిస్తున్నారని చెప్పించడం సరైంది కాదన్నారు. అవినీతికి కూటమి ప్రభు త్వం మారుపేరని రాష్ట్ర ప్రజలకు ఈ రెండేళ్లలోనే అర్థమైందన్నారు. తక్షణమే జీవో 396 రద్దుచేసి రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు. డ్రాగా ముగిసిన మ్యాచ్లు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీడే మ్యాచ్లు మూడవ రోజు డ్రాగా ముగిశాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన కర్నూలు, కడప జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. కడప జట్టులోని ధీరజ్కుమార్రెడ్డి 5 వికెట్లతో రాణించాడు. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఇసుక క్వారీలపై విచారణ చక్రాయపేట : పాపాఘ్ని నదిలోని ఇసుక క్వారీలపై కడప డీఆర్వో మల్లికార్జునుడు విచారణ చేపట్టారు. మండలంలోని కుమార్లకాల్వ గ్రామ మాజీ సర్పంచ్ కొవ్వూరు శ్రీధర్రెడ్డి పాపాఘ్ని నదిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్జీజీలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ మైనింగ్ శాఖల అధికారులు, కలెక్టర్ ఆదేశాలతో డీఆర్వో మంగళవారం విచారణ నిమిత్తం వచ్చారు. ఈ సందర్భంగా సుమారు కిలోమీటరు మేర నదిలో నడస్తూ ఇసుక తవ్వడంతో ఏర్పడ్డ గుంతలను చూసి ఆశ్చర్య పోయాడు. విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకెళతానని చెప్పాడు. కార్యక్రమంలో మైనింగ్ డీడీ ఇన్చార్జ్ సుబ్రమణ్యం, పర్యావరణ శాఖ ఇంజనీరింగ్ అధికారులు శంకరరావు, సుధ, తహశీల్దారు విజయకుమారి పాల్గొన్నారు. -
పురాతన బావికి పూర్వ వైభవం
రాజుపాళెం : పురాతన బావి పూర్వ వైభవం సంతరించుకుంది. మండల పరిధి అర్కటవేముల గ్రామంలోని ఊరి బావిలో ఉన్న పూడిక, చెత్తాచెదారాన్ని మహిళలు, యువకులు, ప్రజలు వారం రోజులుగా కష్టపడి పరిశుభ్రం చేశారు. సుమారు 24 అడుగుల లోతు వరకు ఉన్న మురుగు నీటిని, అలాగే పూడికను డీజిల్ ఇంజన్ల సహాయంతో తొలగించారు. వారి శ్రమ ఫలించి ఊర బావిలో ఊట నీరు ఉబికి బయటికి వచ్చింది. ఈ బావికి పెద్ద చరిత్రే ఉందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. గత యాభై ఏళ్ల క్రితం నీటి ఎద్దడితో అల్లాడిపోయిన సమీపంలోని చిన్నశెట్టిపల్లె, పొట్టిపాడు గ్రామాల ప్రజలు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అర్కటవేముల గ్రామానికి వచ్చి.. ఈ బావి వద్దకు వచ్చి తాగునీటిని తీసుకొని వెళ్లే వారిని గ్రామస్తులు తెలిపారు. ఇటీవలి కాలంలో గత మే నెల ఆఖరున బలమైన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలవాలి నాలుగు రోజుల పాటు విద్యుత్ రాలేదు. దీంతో గ్రామస్తులు నీటి కోసం అవస్థలు పడ్డారు. రాబోవు అవసరాలను గుర్తుకు తెచ్చుకొని శిథిలావస్థ, అపరిశుభ్రంగా ఉన్న ఈ బావిని శుభ్రం చేస్తే బాగుంటుందని ఆలోచన రావడంతో పరిశుభ్రం చేయడంతో పలువురు వారిని అభినందిస్తున్నారు.కలసికట్టుగా పరిశుభ్రం చేసిన గ్రామస్తులు -
దోపిడీ మాకు చట్టబద్ధం!
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో పచ్చ నేతల అక్రమ మైనింగ్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జిల్లాలోని వేముల, వేంపల్లె మండలాలు ప్రస్తుతం అక్రమ మైనింగ్ తవ్వకాలకు ప్రధాన అడ్డాగా మారాయి. స్థానిక టీడీపీ ముఖ్య నేతల అండదండలతో, పక్కా ప్రణాళికతో కోట్ల రూపాయల విలువైన ముగ్గురాయి (బైరెటీస్) సంపదను యథేచ్ఛగా దోచేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల, గొందిపల్లె, తాళ్లపల్లె, కత్తులూరు, కొత్తపల్లె ప్రాంతాల్లో బైరెటీస్ నిల్వలు ఉండగా, వేముల కేంద్రంగా ఈ దోపిడీ పర్వం బహిరంగంగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకపోయినా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్సీఎల్టీ ఖనిజం అపహరణ.. ఈ అక్రమ మైనింగ్ దౌర్జన్యాలు ఎంతవరకు వెళ్లాయంటే, నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా వేలంలో ఎంబసీ గ్రూపు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఖనిజాన్ని సైతం వదల్లేదు. టిఫెన్ బైరెటీస్ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన దాదాపు రూ. 10 కోట్ల విలువైన 3,500 టన్నుల ముగ్గురాయిని సంక్రాంతి పండుగ సాకు చూసుకుని ఒకే రాత్రిలో పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి తరలించుకుపోయారు. ఈ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు కంపెనీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగిస్తుండగా, అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు పేర్ల శేషారెడ్డి అండ్ కో తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. కంపెనీ ప్రతినిధులను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, ‘తలకాయలు తీస్తాం‘ అంటూ బహిరంగంగా ప్రాణ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై బాధితులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఖాకీలు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. లీజులున్నా దౌర్జన్యాలు.. వాటాల పంపకాలు ఒకవైపు అనుమతులు లేని 41 ప్రాంతాల్లో అనధికారికంగా తవ్వకాలు జరుపుతుండగా, మరోవైపు అధికారికంగా లీజు అనుమతులు ఉన్న మైనింగ్ నిర్వాహకులను సైతం తెలుగు తమ్ముళ్లు వదలడం లేదు. ‘మా కనుసన్నుల్లోనే మైనింగ్ జరగాలి.. మాకు సగం వాటా ఇవ్వాల్సిందే, లేదంటే తవ్వకాలు ఆపేయండి‘ అంటూ లీజుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దౌర్జన్యంగా వెలికితీసిన ముగ్గురాయిని స్థానిక పల్వరైజింగ్ మిల్స్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చిన కోట్లాది రూపాయల అక్రమ సంపాదనను లీడర్ల స్థాయిని బట్టి వాటాలుగా పంచుకుంటున్నారు. కూలీ ప్రాణం బలి.. కేసు మమ అనిపించిన పోలీసులు అక్రమ మైనింగ్లో నిబంధనలు గానీ, కూలీల భద్రత గానీ పూర్తిగా శూన్యం. కేవలం ఖనిజం వెలికితీసి కోట్లు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న నిర్వాహకులు కార్మికుల ప్రాణాలను గాలికొదిలేశారు. వేంపల్లె మండలం కత్తులూరు కేంద్రంగా సాగుతున్న అక్రమ మైనింగ్లో రక్షణ చర్యలు లేకపోవడంతో, అమ్మయ్యగారిపల్లెకు చెందిన చిట్టిబోయిన రామచంద్ర (52) అనే కూలీ దుర్మరణం పాలయ్యాడు. ఈ దారుణాన్ని మైనింగ్ ప్రమాదంగా కాకుండా కేవలం ట్రాక్టర్ ప్రమాదంగా చిత్రీకరించి కప్పిపుచ్చారు. ఇందులో ఓ ప్రముఖ టీడీపీ నేత సమీప బంధువు ఉండటంతో స్థానిక పోలీసులే రంగంలోకి దిగి, బాధిత కుటుంబంతో బేరసారాలు కుదిర్చి కేసును మమ అనిపించడం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. నిమ్మకు నీరెత్తిన మైనింగ్, జిల్లా యంత్రాంగం ఈ అక్రమ మైనింగ్ దందాపై స్థానిక మీడియా క్షేత్రస్థాయి ఆధారాలతో ఘోషిస్తున్నా జిల్లా కలెక్టర్, భూగర్భగనుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలివెళ్లిన ఖనిజం ఏ మిల్లులకు వెళ్లిందో, ఆయా కంపెనీల్లో ఉన్న స్టాకు రికార్డులను పరిశీలిస్తే లూఠీ వ్యవహారం నిగ్గుతేలే అవకాశం ఉన్నా అధికారులు ఆ చొరవ చూపడం లేదు. కేవలం కంటితుడుపు చర్యగా 2024–25లో 15 కేసులు నమోదు చేసి రూ.7.46 లక్షలు, 2025–26లో 31 కేసులు నమోదు చేసి రూ.24.07 లక్షల జరిమానా వసూలు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు కేవలం 280 మెట్రిక్ టన్నుల బైరెటీస్ను మాత్రమే సీజ్ చేశారు.ఇసుక అక్రమ రవాణాలోనూ అదే తంతుకేవలం ముగ్గురాయే కాకుండా, జిల్లాలోని పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు, చిత్రావతి నదులే కేంద్రంగా ఉచిత ఇసుక మాటున భారీ దోపిడీ సాగుతోంది. ఎలాంటి అధికారిక ఇసుక రీచ్లతో నిమిత్తం లేకుండా అనధికారికంగా రీచ్లు ఏర్పాటు చేసుకొని ప్రధాన పట్టణాలకు తరలిస్తున్నారు. కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు ఇసుక దందాతో భారీగా లబ్ధి పొందుతున్నారు. ప్రకృతి సంపద నిలువునా కొల్లగొట్టుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. త్వరలోనే దాడులు చేస్తాం వేముల, వేంపల్లె పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాలు మా దృష్టికి వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ప్రత్యేక బృందాలతో అక్రమ మైనింగ్ స్థావరాలపై దాడులు నిర్వహిస్తాం. అక్రమార్కులు ఎంతటి వారైనా సరే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – సుబ్రమణ్యం, మైనింగ్ ఏడీ అక్రమ మైనింగ్లో చెలరేగుతున్న పచ్చ నేతలు వేముల, వేంపల్లె మండలాలు అక్రమ మైనింగ్కు నిలయాలు పక్కా ప్రణాళికతోనే కోట్ల విలువైన ముగ్గురాయి, ఇసుక లూటీ -
మహిళాలోకం కన్నెర్ర
టీడీపీ నేతల దుశ్శాసన పర్వంపై మహిళాలోకం కన్నెర్ర చేసింది.. రాత్రింబవళ్లు తేడా లేకుండా .. చిన్నారులు.. వృద్ధులన్న కనికరం లేకుండా ఆకృత్యాలకు తెగబడుతున్న కూటమి నేతల తీరును దునుమాడింది. మహిళల మాన.. ప్రాణాలు గాల్లో కలుస్తున్నా..మౌనంగా చూస్తున్న కూటమి పెద్దల తీరును ఎండగట్టింది. మంగళవారం వైఎస్సార్, అన్నమయ్య జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మహిళలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప అంబేడ్కర్ సర్కిల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ● మహిళల మాన, ప్రాణాలకురక్షణ లేదు : ఎమ్మెల్యే దాసరి సుధకడప కార్పొరేషన్ : రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కూటమి ప్రభుత్వంలో మహిళల మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బద్వేల్ శాసన సభ్యురాలు దాసరి సుధ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం పిలుపు మేరకు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి సుధ మాట్లాడుతూ కుప్పం, తిరుపతి, గుంటూరు, బద్వేల్లో మహిళలపై జరిగిన దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. బద్వేల్లో స్థానికంగా ఉంటున్న వృద్ధ దంపతులపై టీడీపీ నాయకులు ఎక్కడి నుంచో వచ్చి దౌర్జన్యం చేయడం అన్యాయమని మండిపడ్డారు. అయినా పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై కేసు పెట్టకుండా ఇరువర్గాలపై కేసులు పెట్టడం రెడ్బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. ఈఘటలకు హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారీ బందోబస్తు: వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన నిరసన సందర్భంగా డీఎస్పీ బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అరగంటలోనే నిరసన పూర్తి చేయాలని ఒత్తిడి తెచ్చారు. -
కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
పులివెందుల : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు అనేక బూటకపు హామీలను చంద్రబాబు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారన్నారు. మహిళలకు కల్పించాల్సిన భద్రతను కూడా విస్మరించారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీని కలిసిన దస్తావేజు లేఖరులు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పులివెందులకు చెందిన దస్తావేజు లేఖరులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీతో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రభుత్వ జీవో 396ను రద్దు చేయడానికి సహకరించాలని ఎంపీకి విన్నవించారు. దీనికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్పందిస్తూ మీ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ దుర్మార్గం కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు దుర్మార్గమని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీని ఆర్టీసీకి సంబంధించిన పలువురు ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ ప్రైవేటీకరణ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఎంపీకి విన్నవించుకున్నారు. దీనికి ఎంపీ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థకు, ఉద్యోగులకు మేలు చేసే విధంగా వైఎస్ జగనన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభు త్వం అందుకు విరుద్ధంగా ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే అనైతిక కార్యకలాపాల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. పెద్ద నాన్నను పరామర్శించిన ఎంపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి స్థానిక దినేష్ నర్సింగ్ హోం (గంగిరెడ్డి ఆసుపత్రి)లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన పెద్ద నాన్న వైఎస్ ఆనంద్రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
కలల సాధనలో రాజీ పడొద్దు
● విద్యార్థులకు పిలుపునిచ్చిన కలెక్టర్ శ్రీధర్. చెరుకూరి ● షైనింగ్ స్టార్ – 2026 అవార్డు బహూకరణకడప ఎడ్యుకేషన్ : కలల సాధనలో విద్యార్థులు రాజీ పడొద్దని... లక్ష్యం చేరే వరకు పట్టుదలతో శ్రమించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు నిచ్చారు. సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్–2026 పేరుతో ఒకొక్కరికి రూ. 20 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్రీధర్తోపాటు రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి, రాష్ట్ర షేక్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. భానుప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిభ ఉంటుందని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కష్టం కాదని, లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రణాళిక ప్రకారం, దృఢ సంకల్పంతో అడుగులేయలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మనం ఎదుగుతూనే మన సమాజంలో తోటి వారి ఎదుగుదలను కూడా ఆకాంక్షించాలన్నారు. సబ్ కలెక్టర్ భావన, పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్, ఇంటర్ ఆర్ఐఓ ప్రకాష్ రావు పట్నాయక్, సమగ్రశిక్ష ఏిపీసీ బి.అనురాధ తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లాలో 10వ తరగతిలో 248 మంది, ఇంటర్మీడియట్లో 33 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 281 మంది విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాలు, మెడల్ లను విద్యార్థులకు అందజేశారు. ఉప విద్యాశాఖ అధికారులు రాజగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, నాగయ్య, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ.. కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
కడప సెవెన్ రోడ్స్: నీట్ పేపర్ లీకేజీకి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డిల్లీలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సోమవారం కడపలోని మహావీర్ సర్కిల్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోమోహన్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి, వైయస్సార్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సాయి దత్త, డివైఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివ ఈ సందర్బంగా మాట్లాడారు. పేపర్ లీకేజీ వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇవన్ని కేంద్ర ప్రభుత్వ హత్యలే అని అన్నారు. -
తల్లికి వందనంలో లెక్కాపత్రం ఏదీ!
కడప ఎడ్యుకేషన్ : ‘బడికి వెళ్లే విద్యార్థులందరికీ తల్లికి వందనం కింద రూ. 15వేలు ఇస్తాం. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలను బడితే పంపితే అంతమందికీ పథకం అమలుచేస్తాం..’ ఎన్నికల ముందు కూటమి నేతలు డప్పు కొట్టి .. కాదు కాదు ఒట్టేసి మరీ చెప్పిన మాటలివి. ప్రభుత్వం కొలువుదీరాక ఒట్టును గట్టున పెట్టింది. ‘...గట్టెక్కాక బోడి మల్లన్న’ అన్నట్లు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టింది. ఇక రెండో ఏడాది నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలకు బదులు రూ.13వేలు చొప్పున బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసింది. ప్రతి తల్లి నుంచి రూ.2వేలు పాఠశాలలో పారిశుద్ద్య నిర్వహణ ఖర్చుల కోసం కోత విధించారు. చివరికి రూ.13వేలు కూడా చాలామంది తల్లులకు జమ కాలేదు. కొందరికి రూ.8వేలు, మరికొందరికి రూ.9వేలు చొప్పున నగదు జమ చేసింది. దీంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులను పలు కారణాలను సాకుగా చూపిస్తూ చాలా మంది తల్లులకు మెండి చేయి చూపించింది. ఈ ఏడాది ఎంతమందికి లబ్ధి చేకూరేనో.. ఈ నెల 22వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు విడుదలవుతాయని ఇందుకు సంబంధించిన షెడ్యూల్తోపాటు మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతుల ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా గతేడాది 2,72,397 మందికి 13 వేల చొప్పున రూ. 354 కోట్లు విడుదల చేసింది. మరి ఈ ఏడాది ఎంతమంది తల్లిలకు లబ్ధి చేకూరనుందో ఇంకా లెక్కాపత్రం తేల్చలేదు. మరోవైపు ఈ ఏడాది వైఎస్సార్జిల్లాకు అన్నమయ్య జిల్లా నుంచి రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలు వచ్చి చేరాయి. దీంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య మూడు లక్షల వరకు పెరగనుంది. విద్యాహక్కు చట్ట విద్యార్థులకు మొండి చేయి గతేడాది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం తల్లికి వందనం నగదు జమ చేయలేదు. అలాగనీ ప్రైవేటు పాఠశాలలకు కూడా ఆ మొత్తాన్ని జమ చేయలేదు. దీంతో పాఠశాలల యాజమాన్యాల నుంచి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పిల్లల ఫీజులు చెల్లింపు విషయమై ఈసడింపులు తప్ప లేదు. జిల్లాలో ఇలా ఆర్టీఈ కింద చదివే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. గత ఏడాది చాలామంది తల్లులకు మొండిచేయి ఈ ఏడాది ఎంతమందికి దక్కేనో.. పలు నిబంధనలతో కూడిన చిట్టా విడుదల 22 నుంచి తల్లుల ఖాతాలకు నగదు జమఅమ్మ ఒడి పేరు చెబితే.. జగన్ గుర్తుకొస్తారుపాదయాత్రలో పేదల అవస్థలను కళ్లారా చూసి, పిల్లల చదువులు భరోసా ఇవ్వాలని సంకల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, తాను అధికారంలోకి రాగానే అమ్మ ఒడి పేరుతో సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు అదే పథకానికి కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’అంటూ పేరు మార్చేసి తామే కొత్తగా ప్రారంభించినట్లు చెప్పుకోవడం గమనార్హం.కోతల కోసం షరతులు.. తల్లికి వందనం పథకం కింద చాలావరకూ అర్హులను కోత కోసేందుకు కఠిన షరతులు విధించారని విమర్శలొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలలోపు, పట్టణాల్లో రూ.12 వేలలోపు ఉంటేనే ఈ పథకం వర్తించనుంది. అలాగే కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట ఉంటేనే అర్హులు. అంతకుమించి ఉంటే పథకం విర్తించదు. ట్రాక్టర్, ఆటో మినహా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం ఉండరాదు. 1000 చదరపు అడుగులకు మించి మున్సిపల్ ఆస్తి ఉండకూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్, ఆదాయపన్ను చెల్లించేవారు ఉండకూడదని నిబంధనలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మట్లాడుతూ చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, వేధింపులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేసి మూత్రం పోసుకునేలా దాడి చేశారని, తాజాగా బద్వేల్లో ఒక మహిళ రవిక చింపి దాడి చేశారన్నారు. ఈ రెండు ఘటనల్లో పాల్గొన్నది తెలుగుదేశం పార్టీ వారేననన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళల రక్షణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహిళ అయినప్పటికీ మహిళలకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను నిరసిస్తూ మంగళవారం ఽఅంబేడ్కర్ సర్కిల్లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నగర మహిళా విభాగం అధ్యక్షురాలు బండి దీప్తి మాట్లాడుతూ బద్వేల్లో ఒక ఇంటి విషయంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ జోక్యం చేసుకొని, రౌడీమూకలను తీసుకెళ్లి గొడవ చేయడం దారుణమన్నారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించి దాడికి పాల్పడిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మాజీ కో ఆప్షన్ సభ్యురాలు బి. మరియలు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రత్నకుమారి, సునీత పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ -
అలా.. ఇన్ స్టాగ్రామ్కు దొరికిపోయారు
ప్రొద్దుటూరు క్రైం : వాళ్లిద్దరూ ఓ హత్య కేసులో ప్రధాన నిందితులు. పరారీలో ఉన్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు.. ఉన్న ఊరును వదిలిపెట్టి రోజుకో ప్రాంతంలో తిరగసాగారు.. ఫోన్లు ఆఫ్ చేసినా ఇన్స్టాగ్రా మ్ను చూడకుండా ఉండలేకపోయారు. ఆ వ్యామోహమే వారిని పోలీసులకు పట్టించింది. హత్య కేసులో మూడు నెలల నుంచి పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన ఇద్దరు బీహారీలను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ సోమవారం మీడియాకు తెలిపారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా, బిపూర్ తాలుకా, లోడిపూర్ గ్రామానికి చెందిన మున్నా కుమార్ (33) మోడంపల్లె సమీపంలోని ఓ డెయిరీ ఫారంలో పని చేసేవాడు. ఈ క్రమంలో అతను ఈ ఏడాది ఏప్రిల్ 7న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని మామ రామ్ పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఘటనా స్థలంలోని మున్నా కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అతని మెడపై తాడుతో గొంతుకు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. బీహార్ రాష్ట్రంలోని అదే ప్రాంతానికి చెందిన దీపుకుమార్, బిర్జుకుమార్లు కూడా మృతుడు పని చేస్తున్న డెయిరీ ఫారంలోనే పని చేస్తున్నారు. అయితే మున్నాకుమార్ మృతి ఘటన తర్వాత వాళ్లిద్దరూ కనిపించలేదు. దీంతో పోలీసులు వారిని అనుమానితులుగా ఈ కేసులో చేర్చారు. పోస్టుమార్టం అనంతరం వైద్య నివేదికల ఆధారంగా మున్నాకుమార్ను తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకొని మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. ఇన్స్ట్రాగామ్ పిచ్చితో పోలీసులకు చిక్కి.. హత్య కేసులోని నిందితులు వాళ్ల నంబర్లతో ఉన్న ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినా..ఇన్స్టాగ్రామ్ను చూడకుండా ఉండలేకపోయారు. రీళ్ల పిచ్చితో తరచూ ఇన్స్టా ఐడీలో యాక్టివ్గా ఉండసాగారు.సెల్ఫోన్ లొకేషన్లు, రైల్వేస్టేషన్లలో నిందితుల కదిలికలపై ఆరా తీయడం.. ఇలా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నిందితులైన బీహారీలను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ క్రమంలోనే వాళ్లలో ఒకరి ఇన్స్ట్రాగామ్ ఐడీని పోలీసులు గుర్తించారు. అతని ఇన్స్టా ఐడీ తరచూ యాక్టివ్గా ఉండటంతో లొకేషన్, ఇతర టెక్నాలజీ ఆధారంగా అతని కదలికలను గుర్తించారు. ఈ క్రమంలోనే బీహార్కు చెందిన హత్య కేసులోని నిందితులు దీపుకుమార్, బిర్జుకుమార్లు ప్రొద్దుటూరు శివారులోని రెండుకుళాయిల సమీపంలో ఉండగా సోమవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే మున్నా కుమార్ హత్య ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన మనస్పర్థల కారణంగానే మున్నాకుమార్ను హత్య చేసినట్లు పట్టుబడిన నిందితులు దీపుకుమార్, బిర్జుకుమార్లు పోలీసుల వద్ద అంగీకరించారు. నైలాన్ తాడుతో అతని గొంతుకు బిగించి హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. నిందితుల కోసం రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్ఐ శ్రీకాంత్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు హైదరాబాద్, విజయవాడ, బీహార్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో వారు ప్రొద్దుటూరులోనే పట్టుబడ్డారు. రూరల్ సీఐ నాగభూషణ్, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందిని ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మూడు నెలల నాటి హత్య కేసులో.. ఇద్దరు బీహారీలు అరెస్ట్ -
బాలిక అదృశ్యం
పోరుమామిళ్ల: మండలంలోని పుల్లివీడుకు చెందిన పడమటి హజీరా(17) ఈ నెల 16న సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయింది.ఎవరికీ చెప్పకుండా వెళ్లిందని, మూడు రోజులైన ఆచూకీ లభించలేదని బాలిక తండ్రి మహబూబ్బాషా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమంతు సోమవారం తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం సిద్దవటం : మండలంలోని మాచుపల్లి దర్గా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ హారిక తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మండలంలోని టక్కోలు గ్రామానికి చెందిన కొత్త ఆ టోలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తు న్నారని తనకు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు చేశామన్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకుని, ఆటో డ్రైవర్ హనుమత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆటోను పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. మొత్తం ఆరు బస్తాల బియ్యం, 300 కిలోలు ఉంటాయన్నారు. ఈ మేరకు విచారించి కేసు నమోదు చేస్తామన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీ – వ్యక్తికి తీవ్ర గాయాలు సిద్దవటం : మండలంలోని జేఎంజే కళాశాలకు సమీపంలో ఉన్న కోతుల మోరి మలుపు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరం–1 గ్రామానికి చెందిన జయకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ హారిక తెలిపిన వివరాల మేరకు.. సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామానికి చెందిన జయకృష్ణ సోమవారం తెల్లవారుజామున కడప నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. రాజంపేట నుంచి గుర్తు తెలియని వాహనం కోతులమూరి మలుపు వద్ద కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న జయకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు, జేఎంజే కళాశాల వద్ద ఉన్న చెక్పోస్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని జయకృష్ణను 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన మరో లారీ కొండాపురం: మండల పరిధిలోని పెంజి అనంతపురం సర్కిల్ వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ హరికృష్ణకు తీవ్రగాయలయ్యాయని కొండాపురం ఎస్ఐ జయరాములు సోమవారం తెలిపారు. ఈఘటనలో లారీ క్యాబిన్లో హరికృష్ణ ఇరుక్కుపోయాడు. స్థానికులు పోలీసుల సహాయంతో అతన్ని బయటకు తీశారు. క్షతగాత్రున్ని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
26న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదివారం అండర్ 14, 16 విభాగాల్లో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మద్ బాషా, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఆగస్టు 11, 12, 13 తేదీల్లో తిరుపతిలో నిర్వహించే స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. వివరాలకు 9949686586, 8019880995 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు. బాధ్యతల స్వీకరణ కడప రూరల్ : ఏపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల జిల్లా కో ఆర్డినేటర్ గా జయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ప్రకాశం జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పని చేసిన ఉదయశ్రీ పదవీ విరమణ పొందారు. ప్రజాభిప్రాయమే కొలమానంకలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్ రోడ్స్ : ప్రజా సేవల నాణ్యతకు ప్రజల అభిప్రాయమే కొలమానం అని.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని నిరంతరం అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ‘క్యూఆర్ కోడ్‘లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల స్పందన ఆధారంగానే ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం సాధ్యం అవుతుందన్నారు. ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధీ మీనా కడప సెవెన్ రోడ్స్ : పీజీఆర్ఎస్లో ప్రజలు అందజేసే ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ నిధీ మీనా అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆమె ప్రజల ఆర్జీలు స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇకపై యాప్లోనే లావాదేవీలుసాక్షి, మదనపల్లె : స్వయం సహాయక సంఘాల సభ్యులకు మన డబ్బులు–మన లెక్కలు యాప్ వినియోగంపై మెప్మా ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీఈఐబీ నాగరాజు, టీఈ సీయంయం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘ సభ్యులు తమ పొదుపులు, రుణాలు, చెల్లించిన, చెల్లించాల్సిన వాయిదాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మెప్మా కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. యాప్లోని మొబైల్ బుక్ కీపింగ్ విధానాన్ని ఉపయోగించి సంఘాల ఆర్థిక లావాదేవీలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే నవంబర్నాటికి స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ తమ ఆర్థిక లెక్కలను యాప్లో స్వయంగా చూసుకునే స్థాయికి చేరేలా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ శిక్షణలో సంఘ సభ్యులకు యాప్ వినియోగం, మొబైల్ బుక్ కీపింగ్, ఆర్థిక లావాదేవీల నమోదు తదితర అంశాలపై అవగాహాన కల్పించారు. సీఓలు అనిత, నాగేంద్ర, ఆర్పి పుష్ప, సంఘ సభ్యులు హాజరయ్యారు. -
కొనసాగుతున్న అండర్–19 క్రికెట్ పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీడే మ్యాచ్లు కొనసాగుతున్నాయి, సోమవారం రెండోరోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో 355 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇ న్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 96.1 ఓవర్లలో 378 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎస్ఎంజి ప్రభాకర్ 43 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని సంజయ్ కుమార్ 4, కిరణ్కుమార్ 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి న అనంతపురం జట్టు 81 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. జట్టులోని భువనేశ్వర్ 36, కౌశిక్ 42 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మంజునాఽథ్ 3, తేజేష్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 195 పరుగుల వెనుకంజలో ఉంది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో... కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 21 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 45.2 ఓవర్లలో 161 పరుగులు చేసింది. జట్టులోని సూర్యతేజ్రెడ్డి 36, ధీరజ్కుమార్రెడ్డి 34 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని జితేస్ వర్దన్ 5 వికెట్లు తీశాడు. సాయి విఘ్నేష్ 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 45 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఆజట్టులోని రోహిత్ గౌడ్ 37, సాయి విఘ్నేష్ 45 పరుగులు చేశారు. కడప జట్టులోని ధీరజ్కుమార్ రెడ్డి చక్కటి లైనఫ్తో బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 228 పరుగులు మందంజలో ఉంది. -
పూడ్చిన మృతదేహానికి రీ పోస్టుమార్టం
ప్రొద్దుటూరు క్రైం : పూడ్చిన మృతదేహానికి రూరల్ పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని దొరసానిపల్లెకు చెందిన కరిచిన్నుగాళ్ల చెన్నయ్య (46) అదే గ్రామంలోని ఆముదం నూనె తయారీ కేంద్రంలో రోజువారి కూలి పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 3న అతను మిల్లులో పనికి వెళ్లాడు. పని చేస్తున్న సమయంలో చెన్నయ్య కింద పడ్డాడని, ఆస్పత్రికి తీసుకొని వెళ్తున్నట్లు మిల్లు యజమాని చెన్నయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించాడు. గుండెపోటుగా భావించి చెన్నయ్య మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తన భర్త మిల్లులో విద్యుత్ షాక్తో చనిపోయాడని ఇటీవల తెలియడంతో చెన్నయ్య భార్య లక్ష్మీదేవి రూరల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూరల్ పోలీసులు ఆముదం మిల్లులోని సీసీ కెమెరాలను పరిశీలించగా చెన్నయ్య పని చేస్తున్న సమయంలో ఇనుప కడ్డీని తగలి విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేశారు. సోమవారం మృతదేహాన్ని వెలికి తీసి తహశీల్దార్ సమక్షంలో వైద్యులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. -
ఆర్టీసీ కండక్టర్పై యువకుల దాడి
మైదుకూరు : బస్సులో వాకిలి వద్ద ఫుట్ బోర్డుపై నిలబడవద్దని చెప్పినందుకు ఆర్టీసీ కండక్టర్పై మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె వద్ద జరిగింది. బస్సు కండక్టర్ ఎన్వీ నరసింహులు, డ్రైవర్ చైతన్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు డిపోకు చెందిన కడప – పోరుమామిళ్ల సర్వీసు ఆర్టీసీ అద్దె బస్సు సోమవారం సాయంత్రం 4 గంటలకు మైదుకూరు నుంచి పోరుమామిళ్లకు బయల్దేరింది. బ్రహ్మంగారిమఠం మండలం లింగందిన్నెపల్లెకు చెందిన ఇద్దరు యువకులు మైదుకూరులో బస్సు ఎక్కారు. వారు ఫుట్ బోర్డుపై నిలబడి ఉండటంతో కండక్టర్ నరసింహులు వారిని బస్సులోపలికి రమ్మని చెప్పారు. వారు వినకపోవడంతో ప్రయాణికులు కూడా కలుగజేసుకోని మందలించారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు టికెట్ తీసుకున్నాం.. ఎక్కడైనా నిలబడతాం అంటూ కండక్టర్తో వాగ్వాదానికి దిగడంతో భూమాయపల్లె వద్ద వారిని కండక్టర్ దించి వేశారు. తమ టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వాలని వారు వాదులాడారు. టికెట్ కొట్టాక డబ్బులు ఎలా ఇస్తామని కండక్టర్ చెప్పడంతో ఇద్దరు యువకులు కోపంతో వెళ్లిపోయారు. మైదుకూరుకు చెందిన తమ స్నేహితున్ని పిలిపించుకుని ఒకే బైక్లో ముగ్గురూ ముదిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో క్రాస్ చేసి బస్సుకు అడ్డంగా బైక్ను ఆపారు. బస్సులోకి చొరబడి కండర్ నరసింహులుపై దాడి చేసి కొట్టారు. డ్రైవర్ చైతన్య, ప్రయాణికులు విడిపించారు. ముగ్గురు యువకులు అక్కడి నుంచి బైక్పై వెళ్లి అంబవరం వద్ద గుంపును పోగేసి బస్సును అడ్డగించారు. యువకులను ఎందుకు దించారని గుంపులోని వారందరూ కండక్టర్ను నిలదీశారు. వారు కండక్టర్, డ్రైవర్ను తిడుతూ వాగ్వాదానికి దిగడంతో డ్రైవర్ చైతన్య 100కు డయల్ చేశారు. వారు గొడవ పెట్టుకోవడంతో ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించి పంపారు. బ్రహ్మంగారిమఠం పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు యువకులతో పాటు గుంపులోని వారంతా వెళ్లిపోయారు. ముఖం, ఛాతిపై రక్తగాయాలతో ఉన్న కండక్టర్ నరసింహులును బ్రహ్మంగారిమఠం ఆస్పత్రికి తరలించారు. అక్కడి పోలీసులకు కండక్టర్ నరసింహులు ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విధి నిర్వహణలో ఉన్న కండక్టర్ నరసింహులుపై దాడి చేయడాన్ని మైదుకూరు డిపోకు చెందిన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్ రాయుడు, చైర్మన్ ఎం.శంకర్, కారదర్శి బీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
కడప అర్బన్: Csîæ-Ð]lÌS Æ>Ķæ$-ÌS-ïÜÐ]l$ Èh-Ķæ$¯ŒS çßZÐŒl$ V>ÆŠ‡zÞ MýSÐ]l*…-yðl…sŒæ V> »ê«§ýlÅ-™èlË$ ^ólç³-sìæt¯]l H.çßæ¯]l$-Ð]l$…™èl$ ÝùÐ]l$ÐéÆý‡… MýSyýl-ç³ÌZ° hÌêÏ ´ùÎ‹Ü M>Æ>ÅÌS-Ķæ$…ÌZ çßZ…V>ÆŠ‡zÞ ™ø Ð]l¬RêÐ]l¬ü Ð]l*sêÏyìl ÐéÇMìS ç³Ë$ A…Ô>-ÌSOò³ ¨Ô> °Æó‡ªÔèæ… ^ólÔ>Æý‡$. ´ùÎçÜ$ Ð]lÅÐ]l-çܦÌZ çßZ…V>Æý‡$zÌS õÜÐ]lË$ A™èlÅ…™èl MîSÌS-MýSÐ]l$-°, Ñ«¨ °Æý‡Ó-ç߿׿ÌZ {MýSÐ]l$-Õ„ýS׿ ´ësìæçÜ*¢ Ô>Q {糆-çÙt¯]l$ ò³…^ólÌê ç³° ^ólĶæ*ÌS° BĶæ$¯]l A¯é²Æý‡$. Ò$Æý‡$ BÆø-VýSÅ…V> E¯]l²-糚yól çÜÐ]l*gê°MìS çÜÐ]l$-Æý‡¦-Ð]l…-™èl…V> õÜÐ]l ^ólĶæ$-VýS-ÌS-Æý‡-¯é²Æý‡$. A…§ýl$MóS BÆøVýSÅ… Oò³ {ç³™ólÅMýS {Ôèæ§ýl® Ð]líßæ…-^éÌS° çÜ*_…-^éÆý‡$. Æøyýl$z ¿ýæ{§ýl-™èlOò³ AÐ]l-V>-çßæ¯]l MýSÍW E…yé-ÌS-¯é²Æý‡$. ™èlç³µ°-çÜ-ÇV> {OyðlÑ…VŠæ OÌñæòÜ-¯Œ¯ŒSÞ, Ðéçßæ¯]l C¯]l*ÞÆð‡¯ŒSÞ, Ð]lÅMìS¢ VýS™èl C¯ŒS-{çÜ*-ెÞ MýSÍW E…yéÌS° ™ðlÍ-´ëÆý‡$. çßZ…V>-Æý‡$zË$ ™èlÐ]l$ çÜÐ]l$-çÜÅÌS¯]l$ MýSÐ]l*…-yðl…sŒæ §ýl–íÙtMìS ¡çÜ$-MðS-âêÏÆý‡$. ÒsìæOò³ BĶæ$¯]l Ýë¯]l$-MýS*-ÌS…V> çܵ…¨-çÜ*¢.. çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ hÌêÏ Gïܵ òÙÌôæP ¯]l_-MóS™Œæ ÑÔèæÓ-¯é£Šl §ýl–íÙtMìS ¡çÜ$MðS-ãÏ ç³Ç-çÙP-Ç-Ýë¢Ð]l$° àÒ$ C^éaÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$… ÌZ HBÆŠ‡ AyìlçÙ-¯]lÌŒæ Gïܵ ¼.Æý‡Ð]l$-׿Ķæ$Å, HBÆŠ‡ yîlGïܵ í³.¯éVóS-ÔèæÓ-Æý‡Æ>Ð]l#, çßZ…V>ÆŠ‡zÞ C¯ŒS-^é-Çj BÆŠ‡.I ÕÐ]l-Æ>Ð]l¬yýl$ ´ëÌŸY-¯é²Æý‡$. -
ఆలయ భూములను కబ్జా నుంచి కాపాడాలి
మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకడప సెవెన్ రోడ్స్: కడప నగరం బుడ్డాయపల్లెలో 2.11 ఎకరాల రామాలయ భూములను అధికార టీడీపీకి చెందిన జి. వెంకటనాథరెడ్డి తప్పుడు రికార్డులు సృష్టించి విక్రయిస్తూన్నారని, ఎంతో విలువైన ఈ దేవదాయ శాఖ భూములను కాపాడాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా కోరారు. సోమవారం డీఆర్వో మల్లిఖార్జునుడుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాలు, దందాలు పెరిగిపోయాయన్నారు. చివరకు దేవుని భూములు సైతం వదలడం లేదన్నారు. బుడ్డాయపల్లెలో టీడీపీ నాయకుడు దొంగ డాక్యుమెంట్లతో ఆలయ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ శాఖ ప్రజలకు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. ప్రతి ఏటా దేవదాయ శాఖ ఆ భూములకు వేలం పాటలు నిర్వహిస్తోందన్నారు. తద్వారా వచ్చిన డబ్బు దేవదాయ శాఖకు వెళుతోందన్నారు. అయితే ఆ భూములు తమవిగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్లోని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జాయింట్ కలెక్టర్, కోర్డు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అధికారులు అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఎండోమెంట్ అధికారులు కబ్జాదారులతో కుమ్మకై కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడం వల్ల దేవదాయ ఆస్తులు, ఎక్స్ పార్టీకి వెళ్ళిపోతున్నాయని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పదించి ఆలయ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏసీపై ప్రజల ఆగ్రహం...... దీనిపై డీఆర్వో స్పందిస్తూ దేవదాయ శాఖ ఆసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని పిలిపించి ఆరా తీశారు. ఈ సందర్బంగా శంకర్ బాలాజీ మాట్లాడుతూ పోలీసు కేసు పెట్టాలంటూ ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఒక సారిగా గ్రామస్తులు ఏపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండో మెంట్ భూములను రక్షించలేనప్పుడు బదిలీపై వెళ్ళిపోవాలంటూ ఏసీపై విరుచుకుపడ్డారు. డీర్వో జోక్యం చేసుకొని ఆ భూములు దేవదాయ శాఖవే కనుక వాటిని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఆశాఖ అధికారులపైనే ఉంటుందన్నారు. టీడీపీ నేత సృష్టించినట్లుగా చెబుతున్నవి తప్పుడు డాక్యుమెంట్లు అని తేలితే వాటిని రద్దు చేయాలని జిల్లా రిజిస్ట్రార్ను అదేశించారు. దీనిపై రిమ్స్ ఏవో రంగస్వామి, ఎండోమెంట్ ఏసీ శంకర్ బాలాజీ, జిల్లా రిజిస్ట్రార్ విచారణ నిర్వహించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో బుడ్డాయపల్లె గ్రామస్తులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు షఫీ, యానాదయ్య, రమేష్రెడ్డి, శ్రీరంజన్రెడ్డి, బంగారు నాగయ్య, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలకు వేదిక ‘స్టార్ట్ అప్ కడప’
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదికగా ‘స్టార్ట్ అప్ కడప‘ ఎంటర్ప్రెన్యూర్షిప్ నిలుస్తుందని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. స్టార్ట్ ఆప్ కడప సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావనతో కలిసి పూర్తి కావచ్చిన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేసి, వెంటనే అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ట్అప్ ఆవిర్భవించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘స్టార్ట్ అప్ కడప‘ రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ కేంద్రం ద్వారా స్టార్ట్అప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు అవసరమైన మార్గదర్శకత్వం, ఆధునిక సదుపాయాలు, ప్రోత్సాహం లభిస్తాయని తెలిపారు. కేఎంసీ కమిషనర్ భవానీ ప్రసాద్, హౌసింగ్ ఇంజనీర్లు, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
దస్తావేజు లేఖరుల పెన్డౌన్
కడప కోటిరెడ్డి సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర సంఘం పిలుపుమేరకు కడప అర్బన్ రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెం.396 ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరులు నిరవధిక పెన్ డౌన్ (సమ్మె) చేస్తున్నారని వివరించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, దస్తావేజు లేఖరుల, స్టాంపులు వెండర్ల, టీడీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. దస్తావేజులేఖరుల లైసెన్సులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మెకు క్రయవిక్రయదారులు, జిల్లా ప్రజానీకం, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా దస్తావేజు లేఖరుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు స్తంభించాయి. ఈ కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షులు సంజీవరాయుడు, నగర నాయకులు సి. నాగరాజు, ఎస్ ఎండీ ఇక్బాల్, బి.ఓబుల కొండయ్య, కే.ఓబులేసు, జే.రామకష్ణ, వై.సుబ్బరాయుడు, రామకష్ణారెడ్డి, టి. లోకనాథం, హరి, ఓ రమణ ఐ. సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ స్తంభించిన రిజిస్ట్రేషన్లు -
రిమ్స్కు అత్యాధునిక డిజిటల్ రేడియోగ్రఫీ సిస్టమ్
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మరో అత్యాధునిక వైద్య పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ 1000 ఎంఎ డ్యూయల్ డిటెక్టర్ డిజిటల్ రేడియో గ్రాఫిక్ సిస్టమ్ ద్వారా రోగులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్ఐసీ సంస్థ తన గోల్డెన్ జూబ్లీ ఫండ్ (జీజేఎఫ్) కార్యకలాపాల్లో భాగంగా రూ. 2 కోట్ల 21 లక్షలు వెచ్చించి రిమ్స్కు ఈ పరికరాన్ని అందజేసింది. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ జోనల్ మేనేజర్ శరవణ రమేష్ ఈ పరికరాన్ని అందజేసి ప్రారంభించారు. ఎల్ఐసీ రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ ఎఓ జీకేఆర్వీ రవికుమార్ రేడియోగ్రాఫిక్ సిస్టమ్ స్విచ్ ఆన్ చేశారు. ఎమ్మేల్యే మాధవి గౌరవ అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో కడప ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎంవీకెఎస్ దుర్గా ప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ యు.రంగస్వామి, రిమ్స్ సూపరింటెండెంట్ పెంచలయ్య, ఆర్ఎంవో శ్రీనివాసులు, రేడియోలజీ విభాగం హెచ్.వో.డి. శారద తదితరులు పాల్గొన్నారు. -
పచ్చనేత మరో దుశ్శాసన పర్వం.. వృద్ధురాలి జాకెట్ చింపివేత
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ శ్రేణుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. మహిళలే లక్ష్యంగా అకృత్యాలకు తెగబడుతున్నారు. గుంటూరు నగరంలో టీడీపీ నేత మూర్తి తన అనుచరులతో కలిసి ఓ మహిళను వివస్త్రను చేసిన ఘటన మరువక ముందే.. మరో పచ్చనేత పేట్రేగిపోయాడు. దిక్కూమొక్కూలేని వృద్ధ దంపతుల ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించి.. అడ్డుకున్న ఆ ఇంటి యజమానురాలి జాకెట్ను చింపేసిన దారుణ ఘటన వైఎస్సార్ కడప జిల్లా బద్వేలులో కలకలం రేపింది. బాధితులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.బద్వేలులోని గౌరీశంకర్నగర్ 1021 సర్వే నంబరులోని 74వ ప్లాట్లో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకుని 16 ఏళ్లుగా అక్కడే నివాసముంటున్నారు. మూడునెలల కిందట ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ‘ఈ స్థలం మాది.. ఇల్లు ఖాళీచేసి వెళ్లిపొండి’.. అంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వారు వెళ్లిపోయారు. తిరిగి శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులకు వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తన అనుచరగణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీని పడగొట్టారు.దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన వృద్ధురాలైన ఇంటియజమానిని తోసేసి ఆమె జాకెట్ చింపి దాడికి యత్నించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు. 16 ఏళ్లుగా ఇక్కడే నివాసముంటున్న దిక్కూమొక్కూ లేని ఆ వృద్ధదంపతుల పట్ల దౌర్జన్యాన్ని నిలదీశారు. వృద్ధురాలి జాకెట్ చించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. నా భార్య జాకెట్ చింపేసి.. ఆత్మాభిమానాన్ని మంటగలిపారు.. 16 ఏళ్లుగా గౌరీశంకర్నగర్లో చిన్న ఇల్లు నిర్మించుకుని ఉంటున్నాం. బొజ్జా తిరుమలేష్, అనుచరగణం పూటుగా మద్యం తాగి రెండు కార్లలో సమ్మెటలు, గడ్డపారలతో వచ్చి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన నా భార్యపై దాడికి యత్నించి జాకెట్ చింపేశారు. మిమ్మల్ని చంపితే దిక్కెవరంటూ నానా బీభత్సం సృష్టించారు. మాపై దాడికి పాల్పడి.. నా భార్య జాకెట్ చింపేసి మా ఆత్మగౌరవాన్ని మంటకలిపిన వారిపై చర్యలు తీసుకోవాలి. – వృద్ధురాలి భర్త, బద్వేలు -
ఆగిఉన్న లారీలో డీజిల్ చోరీ
సిద్దవటం : మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారి మాధవరం–1 పంచాయతీ పార్వతీపురం గ్రామంలో ఆదివారం రాత్రి ఆగి వున్న లారీలో గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. సోమవారం ఉదయం లారీ డ్రైవర్ మౌలాలి మాట్లాడుతూ తాడిపత్రి నుంచి చైన్నెకి సిమెంట్ తీసుకెళతున్నామని చెప్పాడు. ప్రొద్దుటూరులో ఆదివారం రాత్రి లారీకి టైర్లు మార్చుకొని 10 గంటలకు బయలుదేరి కడపలో బంధువులతో మాట్లాడి సిద్దవటం మండలంలోని మాధవరానికి చెరుకున్నానని, లారీ రోడ్డు పక్కన ఆపేసి నిద్రపోయానని, లారీకి ఉన్న ఆయిల్ ట్యాంక్ పగులకొట్టి 390 లీటర్ల డీజిల్ చోరీ చేశారని డ్రైవర్ తెలిపాడు, చోరీకి గురైన డీజిల్ విలువ సుమారు రూ.40 వేలు అవుతుందన్నారు. డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలు అనుమానిత దుకాణాలు పరిశీలించారు. -
ఎండిన ‘డొక్కల మడుగు’
కడప ఎడ్యుకేషన్ : వైఎస్సార్ కడప జిల్లా శేషాచల నల్లమల అటవీ ప్రాంతం చింతకొమ్మదిన్నే మండలం గంగనపల్లె రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ’డొక్కల మడుగు’ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పూర్తిగా ఎండిపోవడంపై మైదుకూరుకు చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడవి జంతువుల దాహార్తిని తీర్చే ఈ కీలకమైన నీటి వనరు ప్రస్తుతం ఎడారిని తలపిస్తోందన్నారు. గతంలో కరవు కాలంలో సైతం కొద్దిపాటి నీటితో కళకళలాడే ఈ మడుగుకు ఎలుగుబంట్లు, దుప్పులు, కొండ గొర్రెలు, రేసు కుక్కలు భారీగా వచ్చేవని రమేష్ గుర్తుచేశారు. వీటన్నింటితో పాటు అరుదైన జాతికి చెందిన ’బంగారు నక్కలు’ (Golden Jackals) CMýSP-yìlMìS ఎక్కువగా వస్తుంటాయని, గతంలో తోడేళ్లు, హైనాలు కూడా ఈ ప్రాంతంలో సంచరించేవని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు లేక ఇక్కడున్న అరుదైన బంగారు నక్కల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, అటవీ శాఖకు విజ్ఞప్తి... వన్యప్రాణుల మనుగడను కాపాడటానికి ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని బొమ్మిశెట్టి రమేష్ డిమాండ్ చేశారు. డొక్కల మడుగులో పేరుకుపోయిన పూడికను తక్షణమే తొలగించాలని కోరారు. కొలుములపల్లె పంచాయతీ లింగారెడ్డిపల్లెకు చెందిన నాగమల్లారెడ్డి తనకు ఈ మడుగు ఎండిన సమాచారం తనకు అందించారని రమేష్ వెల్లడించారు. కడప అటవీ శాఖ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ పూడిక తీయడం కష్టంతో కూడుకున్న పని అని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం సౌర విద్యుత్ వాటర్ పంపును ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు
ఎర్రగుంట్ల : గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఇక్కడ ఆయన విలేకరులో మాట్లాడుతూ జిల్లా షెల్కే ఎస్పీ నచికేత్ విశ్వనాఽథ్ జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల లోని వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండుగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరుకు చెందిన ఎస్ జహీర్, గుంతకల్ పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ తాహీర్, షేక్ ఆసిఫ్లు ఉన్నారన్నారు. వీరు గుంతకల్లులోని షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా అనే వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి సరఫరా చేసే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామాంజనేయులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో.. చింతకొమ్మదిన్నె: మండల పరిధిలోని రోడ్డు క్రిష్ణాపురంలోగల కేఎస్ఆర్.ఎం ఇంజినీరింగ్ కళాశాల బస్టాప్ వద్ద నిషేదిత గంజాయి విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపిన వివరాల మేరకు కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల బస్టాప్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాసుల రెడ్డి సిబ్బందితో వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రాజస్థాన్కు చెందిన, ప్రస్తుతం బద్వేలులో నివాసం ఉంటున్న పరమార్ గణపత్ సింగ్, పార్వతిపురం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయి తీసుకొచ్చి అతని స్నేహితులైన బద్వేలులోని రూపురాంపేటకు చెందిన చిన్నం శ్రీను, బద్వేలు కుమ్మరకొట్టాలుకు చెందిన షేక్ మస్తాన్ వల్లి, బద్వేలు మండలం బయనపల్లికి చెందిన మామిళ్ళ కార్తిక్, చెన్నూరు మండలానికి చెందిన మేసే దినేష్ల ద్వారా రోడ్డు క్రిష్ణాపురం, కొప్పర్తి గ్రామం ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.396 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
గండికోటలో సినిమా సందడి
జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో నిర్మించే హైందవ సినిమాను పర్యాటక కేంద్రమైన గండికోటలో 15 రోజులపాటు చిత్రీకరించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మాధవరాయ స్వామి ఆలయంలో సుమారు 1000 నుంచి 1500 మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలను రప్పించి జాతర సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో బెల్లం కొండ శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నాలుగు దశాబ్దాల కాలం నాటి మహావిష్ణు ఆలయ రక్షకుడిగా హీరో నటిస్తున్నాడు. మొదటి రోజు ఆలయ ముఖద్వారం వద్ద బ్రాహ్మణులతో హోమం నిర్వహించే సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్లో ప్రముఖ నటులు తనికెళ్లభరణి, గెటప్శ్రీను, దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో హీరో శ్రీనివాస్ ఈ షూటింగ్లో పాల్గొంటారని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. -
గండిలో శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు అనుమతి
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శాశ్వత క్యూలైన్ల ఏర్పాటుకు దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి ఇచ్చారు. నూతన ఆలయ మహాకుంభాభిషేకం తర్వాత భక్తుల రద్దీ పెరిగినా, క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడంపై ఈనెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. ఆలయ నిధులు రూ.75 లక్షలతో స్టీల్తో శాశ్వత క్యూలైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆలయ సహాయ కమిషనర్ సి.విశ్వనాథ్ తెలిపారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి, భక్తుల రద్దీ పెరిగే శ్రావణ మాసం లోపు ఈ క్యూలైన్లను అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు.నేడు ’డయల్ యువర్ సీఎండీ’కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్కు, వైఎస్సార్ జిల్లా వినియోగదారులు 08562 242457 నంబర్లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. పలు మండలాల్లో వర్షం కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ఎర్రగుంట్లలో అత్యధికంగా 24.4 మి.మీ వర్షం కురిసింది. అలాగే ఖాజీపేటలో 15.2, వల్లూరులో 14.6, చెన్నూరులో 12.6, ఒంటిమిట్ట 12.2, కమలాపురంలో 11.4, సికెదిన్నెలో 9.8, నందలూరులో 9.6, కడపలో 7.8, చాపాడులో 7.4, వీర పలి,తొండూరులో 6.8, సింహాద్రిపురంలో 6,4, పెండ్లిమర్రిలో 5.6, రాజంపేటలో 5.4 ,అట్లూరులో 4.8, మైదుకూరులో 3.2, బద్వేల్ 2.8 , ముద్దనూరులో 2.4, బి. కోడూరులో 2.2 ,వీఎన్పల్లిలో 1.8, పొద్దుటూరులో 1.4, గోపవరంలో 1.2, కొండాపురంలో 0.8, దువ్వూరు లో 0.4 మి.మీ వర్షం కురిసింది. 26న ఎంపికలుప్రొద్దుటూరు కల్చరల్ : చాపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో ఈనెల 26న సీనియర్ (మెన్ అండ్ ఉమెన్), సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ అంతర్ మండలాల పోటీలు, జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు కడప జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి జి.వెంకటరమణ తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తగిన క్రీడా దుస్తులు, షూస్, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, 10వ తరగతి మార్క్స్ మెమో, ఫొటోలతో ఈనెల 26న ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7036907303 నంబర్లో సంప్రదించాలని కోరారు. దూదేకుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి కడప సెవెన్ రోడ్స్ : దూదేకుల కులస్తులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా నూర్ భాష్ దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ, వెంకట ప్రసాద్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు గగ్గటూరుచిన్న రాజా కోరారు. ఆదివారం కడప ఎర్రముక్కపల్లె లోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలోని జిల్లాలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలసి విన్నవించాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు షకీలా వాణి , ప్రధాన కార్యదర్శి నజీర్,కోశాధికారి ఎస్ మహమ్మద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు ఆలీబాబా తదితరులు పాల్గొన్నారు, -
మీ ఇంట్లో ఊడిగం చేస్తా
ప్రొద్దుటూరులో పారిశుధ్యం బాగుందంటే ● కాదని ప్రజలు చెబితే మా ఇంట్లో చేస్తారా ● స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాంకు రాచమల్లు సవాల్ ప్రొద్దుటూరు : గత రెండేళ్ల మీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరులో పారిశుధ్యం గతం కంటే మెరుగుపడిందని నిరూపిస్తే తాను మీ ఇంట్లో ఈ మూడేళ్లు ఊడిగం చేస్తానని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు గత ప్రభుత్వం కంటే పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని చెబితే అలాగే మీరు మా ఇంట్లో పని చేయడానికి సిద్ధమా అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాంకు రాచమల్లు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చిన పట్టాభిరాం తమ ప్రభుత్వంలో పారిశుధ్యం మునుపటికంటే మెరుగుపడిందని డప్పులు కొట్టుకున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం ఘన కీర్తి అని చెప్పుకున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచామని, ఇప్పుడు వీధుల్లో దుర్గంధం వస్తోందని, వర్షం వస్తే మురికి నీరు రోడ్లపై తాండవిస్తోందని అన్నారు. మీది వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం పార్టీని స్థాపించింది మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన పార్టీని లాక్కున్నది మీ నాయకుడు చంద్రబాబు కాదా అని పట్టాభిని ప్రశ్నించారు. తండ్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం ఓదార్పు యాత్రకు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించిన గొప్ప నాయకుడు జగన్ అని అన్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపి సొంత పార్టీని స్థాపించి తొలి మారు 67 స్థానాలను గెలుచుకున్నారన్నారు. 25 మంది ఎమ్మెల్యేలను దొడ్లో పశువుల్లా మీరు కొనుగోలు చేసినా జగన్ జంకలేదన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో 151 స్థానాల్లో పార్టీని గెలిపించారన్నారు. ఆయనది గొడ్డలి పార్టీ అని మీరంటే సరిపోతుందా అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మీ ఏబీఎన్ రాధాకృష్ణను అడిగితే జగన్ ధైర్యం ఏపాటిదో చెబుతారన్నారు. ఐదేళ్లలో రెండేళ్లు కరోనా వచ్చినా జగన్ జనరంజక పాలనను అందించారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు వామపక్ష పార్టీలను కలుపుకొని గత ఎన్నికల్లో పోటీ చేశారని, కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా మీ విజయానికే సహకరించిందన్నారు. విడిపోతే ఓడిపోతామని మీకు భయాన్ని కల్పించింది జగన్ అని అన్నారు. ఈ కారణంగానే మీరు ఒకరినొకరు వాటేసుకుంటున్నారన్నారు. మీరు ప్రధాని మోదీ కాళ్ల వద్ద సాగిలబడ్డారన్నారు. 36 జెండాలతో గెలిచిన మీరు ఒంటరిగా పోటీ చేసిన జగన్ను విమర్శించడం తగునా అన్నారు. రోజుకు రూపాయి తీసుకుని మున్సిపాలిటీలో పారిశుధ్యాన్ని అదుపు చేశామని తెలిపారు. చెత్తపన్ను వేశారని విమర్శిస్తున్న మీరు నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పు, చింతపండు, డీజిల్, గ్యాస్, పెట్రోలు ధరలను పెంచలేదా అన్నారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు విస్తరణకు రూ.600 కోట్లు మంజూరు చేశారన్నారు. బుగ్గ వంకకు కరకట్ట నిర్మాణం చేసింది ఎవరని అన్నారు. జమ్మలమడుగులో జగన్ మంజూరు చేసిన జిందాల్ స్టీల్ ప్లాంట్ను మీరు కొనసాగించారే తప్ప కొత్తగా మంజూరైంది కాదన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పెంచారన్నారు. పులివెందులలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించారన్నారు. కడపలోనే వైఎస్సార్ సైక్రియట్రిస్టు హాస్పిటల్, క్యాన్సర్ కేర్ సెంటర్ను మంజూరు చేశారన్నారు. అనేక పరిశ్రమలను జగన్ తీసుకొచ్చారని తెలిపారు. వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కడప జిల్లా కంచుకోట లాంటిదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి మొత్తం మీ పార్టీలకు 8,85,311 ఓట్లు వస్తే వైఎస్సార్సీపీకి 8,53,883 ఓట్లు వచ్చాయన్నారు. జగన్ హయాంలో జిల్లాకు జరిగిన అభివృద్ధిపై 500 పేజీల పుస్తకాం రాయాల్సి ఉంటుందన్నారు. -
ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరమేనా!
ప్రొద్దుటూరు క్రైం : ఆంధ్రప్రదేశ్ అంటే కూటమి పాలకులకు అమరావతి, పోలవరం తప్ప మరో ప్రాంత అభివృద్ధి పట్టడం లేదని రాయలసీమ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజశేఖర్ విమర్శించారు. ఆదివారం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రచురించిన మన రాయలసీమ నాలుగు బులిటెన్ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు ఆర్వీవీ జిల్లా కన్వీనర్ మహమూద్ అధ్యక్షత వహించారు. సభలో రాజశేఖర్ మాట్లాడుతూ పట్టిసీమలో రాయలసీమకు నీళ్లు తెస్తామని 2014లో ఇదే పాలకులు చెప్పారన్నారు. పట్టిసీమ పూర్తయి కోస్తాలో మూడు పంటలకు నీళ్ల సదుపాయం మెరుగుపడింది తప్ప రాయలసీమకు ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదన్నారు. ఇప్పుడు మళ్లీ సీమ వాసులను మోసం చేయడానికి పోలవరం నుంచి బనకచర్ల పేరుతో కొత్త డ్రామాకు తెర లేపుతున్నారని అన్నారు. కానీ శ్రీశైలం నుంచి రాయలసీమకు కావాల్సిన అన్ని నీళ్లు ఇస్తామని చెప్పడానికి పాలకులకు నోట మాట రాలేదన్నారు. కార్యక్రమంలో రచయితలు దాదా హయత్, పాలగిరి విశ్వప్రసాద్, చదువుల బాబు, వరలక్ష్మి, సికిందర్, బసవరాజు, వేణుగోపాల్, ఆర్ వీవీ జిల్లా కన్వీనర్లు, కోకన్వీనర్లు హరిత, జగదీష్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీఎంఎస్ జిల్లా కన్వీనర్ పద్మ, ఆర్ఎంఎస్ కార్యదర్శి లోఈ్మదేవి, సీఎల్పీ జిల్లా కన్వీనర్ సురేష్బాబు, పీకేఎస్ నాయకుడు శ్రీనివాసులరెడ్డి, బీసీ సంఘం నేత కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
● ఐదుగురికి గాయాలు ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో మండలంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా మరొకరిని 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కడపకు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు సమీపించగానే ముందువైపు గొర్రెలు రావడంతో బస్సును స్లో చేసాడు.ఇంతలో బస్సుకు వెనుకవైపు వస్తున్న లారీ బస్సును ఢీకొంది.దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతింది.బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులున్నారు.ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్సచేయించుకుని వెళ్లిపోయారు.కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు.లారీ డ్రైవరుపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ తాడిపత్రి నుంచి ఎర్రగుంట్లకు ప్రయాణిస్తున్నట్లు,లారీ డ్రైవరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. వేముల : మండలంలోని చింతజూటూరులో ఆదివారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేయడంతో 38 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన సత్యం, రామిరెడ్డి గంగిరెడ్డి, గంగులయ్య గ్రామ సమీపంలోని కలంలో గొర్రెలను వదిలారు. తెల్లవారుజామున గుంపుగా వచ్చిన కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దాడిలో 38 గొర్రెలు మృతి చెందడంతో సూమారు రూ.5 లక్షలు నష్టం వచ్చినట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సాఆర్ సీపీ మండల ఇన్చార్జ్ నాగేళ్ల సాంబశివారెడ్డి గ్రామానికి చెరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చలమారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. -
అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే నాలుగో విడత అంతర్ జిల్లాల మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో చిత్తూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. తొలి రోజు టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. జట్టులోని కృష్ణ ప్రసాద్ 111, ఎంహెచ్వి రెడ్డి 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని కిరణ్కుమార్ 4, సంజయ్కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో..... అదే విధంగా కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 54.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని రోహిత్ గౌడ్ 55, విఖ్యాత్ 52 పరుగులు చేశారు. కడప జట్టులోని శివశంకర్ 4, వికెట్లు, నాగకుళ్ళాయప్ప 5 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 5 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
లారీ, బైక్ ఢీ .. రైతు మృతి
ఖాజీపేట : వ్యవసాయపనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా లారీ ఢీ కొని రైతు మృతి చెందాడు. బాలానగర్ గ్రామానికి చెందిన పొన్నూరు జయరాజు (60) ఆదివారం ఉదయం కొత్తపేట వద్ద ఉన్న తన భూమి వద్ద కు వెళ్లి పనులు చూసుకుని బైక్లో ఇంటికి బయలుదేరాడు. కొత్త పేట కూడలిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొంది. దీంతో జయరాజు కుప్పకూలాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు విషయం తెలియజేయగా వారు వచ్చి జయరాజను కడప రిమ్స్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ను ఖాజీపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
●శాశ్వత అధ్యాపకుల్లేక విద్యార్థులకు ఇబ్బందులు
ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో చాలాకాలంగా బోధన సిబ్బంది కొరత ఉంది. యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి శాశ్వత అధ్యాపకులు లేకపోవడంతో విద్యార్థులు విద్యాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ శాతం మంది కాంట్రాక్టు లేదా అతిథి అధ్యాపకులపై ఆధారపడటం వల్ల బోధనా ప్రమాణాలు తగ్గి, సబ్జెక్టులు అర్థం కాక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరంతరం మారే ఫ్యాకల్టీ కారణంగా విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు అందవు. దీనివల్ల క్యాంపస్ ప్లేస్మెంట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. -
ట్రిపుల్ ఐటీ.. సమస్యల్లో మేటి
● విద్యార్థులకు అందని చికెన్, కోడిగుడ్లు ● గత రెండేళ్లుగా ఎగ్గొట్టిన ల్యాప్ టాప్స్, యూనిఫామ్లు వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో గత రెండేళ్లుగా సిబ్బంది కొరత, నిధుల కొరత, మౌలిక వసతుల లేమి, పౌష్టికాహారం అందించడంలో జాప్యం వంటి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు ప్రవేశాలు జరిపి ఈనెల 1 న తరగతులను ప్రారంభించారు. అయితే 17 రోజులు కావస్తున్నా విద్యార్థులకు పౌష్టికాహారమైన కోడిగుడ్డు, చికెన్ అందించడంలేదు. పప్పు, కూరలతో భోజనం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు సాంకేతిక విద్యనందించడంతోపాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో 2008లో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి పౌష్టికాహారంలో భాగంగా వారానికి రెండు రోజులు చికెన్, నాలుగు రోజులు కోడిగుడ్లు పెడుతున్నారు. అయితే వేసవి సెలవుల అనంతరం 17 రోజులు గడుస్తున్నా.. ఒక్కరోజు కూడా చికెన్, కోడిగుడ్డు పెట్టలేదు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 26,400మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విషయంపై పరిపాలన అధికారి రవికుమార్తో మాట్లాడగా వచ్చే వారంలోపు పెడతామని చెబుతున్నారే తప్ప.. కచ్చితంగా సమాధానం ఇవ్వడంలేదు. ప్రైవేట్ వ్యక్తులతో పెట్టించాలా లేక ఎవరికై నా బాధ్యతలు అప్పగించాలా అనే అంశం సైతం కొలిక్కి రాలేదు. దీంతో మరిన్ని రోజులు చికెన్, కోడిగుడ్లు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఏకపక్షంగా హెచ్కేఎంసీఎఫ్కు అప్పగింత 2008లో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన నాటి నుంచి మెస్సుల నిర్వహణను టెండర్ల ప్రక్రియ ద్వారా నిర్వాహకులను ఎంపిక చేసి వారికి అప్పగించేవారు. గత ఏడాది దసరా సెలవులు అనంతరం మెస్లను హరే కృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్కు ఏకపక్షంగా అప్పగించారు. అయితే తాము చికెన్, కోడిగుడ్లు పెట్టమంటూ ఫౌండేషన్ నిర్వాహకులు ఆర్జీయూకేటీ యాజమాన్యానికి స్పష్టం చేశారు. దీంతో అప్పట్లో ట్రిపుల్ ఐటీలో ఉన్న ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కోడిగుడ్లు, చికెన్ విద్యార్థులకు పెట్టించారు. వేసవి సెలవుల వరకు ప్రైవేట్ వ్యక్తులు అందించగా.. ఈ విద్యా సంవత్సరంలో ఆర్జీయూకేటీ అధికారులు అందించే రేట్లకు పెట్టలేమని తెలియజేశారు. దీంతో సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఆర్జీయూకేటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కోడిగుడ్డు, చికెన్ పెట్టనప్పుడు మెస్ల నిర్వహణను హరేకృష్ణ ఫౌండేషన్కు కాకుండా టెండర్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదనే అభిప్రాయాలు పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వ్యక్తమవుతున్నాయి. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వాహకులు చెప్పినట్లు ఆర్జీయూకేటీ అధికారులు వింటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎగ్గొట్టిన ల్యాప్టాప్లు, యూనిఫామ్ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిధుల కొరతతో గత రెండేళ్లుగా విద్యార్థులకు ల్యాప్టాప్లు, యూనిఫామ్లు, కనీస సౌకర్యాలు ఆర్జీయూకేటీ అందించలేకపోయింది. ట్రిపుల్ ఐటీ ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కాగానే ల్యాప్టాప్, రెండు జతలు యూనిఫాం, ఒక జత స్పోర్ట్స్ యూనిఫాం, రెండు జతలు బూట్లు, ఒక జత స్పోర్ట్స్ బూట్లు, ఒక బెడ్డు, దుప్పటి, ఫిల్లోస్ అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో విద్యార్థులకు సరైన కనీస సౌకర్యాలు అందించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. -
నేడు డయల్ యువర్ కలెక్టర్
కడప సెవెన్రోడ్స్ : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10 గంటల వరకు నిర్వహించనున్నట్లు డీఆర్ఓ మల్లికార్జునుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. ● కలెక్టరేట్లో జరిగే కాల్ సెంటర్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్ఓ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకుసంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. ● కలెక్టరేట్లోని సభా భవన్లో సోమవారం ప్రజాసమస్యలపరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిర్వహించడం జరుగుతుందని డీఆర్ఓ తెలిపారు. అన్ని శాఖల జిల్లాఅధికారులు పాల్గొంటారని తెలిపారు. పీజీఆర్ఎస్పై ప్రజాభిప్రాయానికి క్యూ ఆర్ కోడ్కడప సెవెన్ రోడ్స్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎప్) ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం రూపొందించిన పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ క్యూ ఆర్ కోడ్ను ప్రజలు వినియోగించాలని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సి.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రతి సోమ వారం నిర్వహించే పీజీఆర్ఎస్ సమావేశాలకు హాజరయ్యే ప్రజలు తమ వినతులు, ఫిర్యా దులు సమర్పించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ క్యూ ఆర్ కోడ్ను తమ మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి అభిప్రాయాలను నమోదు చేయాలని కోరారు. -
అడవిలో మహిళ మృతదేహం లభ్యం
పోరుమామిళ్ల: మండలంలోని ముసల్రెడ్డిపల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకెళితే కాశినాయన మండలం మూలపల్లెకు చెందిన చౌడేశ్వరమ్మ(47) మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబీకులు హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. మూలపల్లెకు చెందిన పేరగాని పీరయ్యతో ఆమె వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఇంటి నుండి వెళ్లిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రెండు రోజుల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో వివరాలు పంపించారు. ఆమె శుక్రవారం ముసల్రెడ్డిపల్లె నుంచి అడవి వైపు వెళుతుండగా పొలాల్లో ఉన్నవారు ఆమెను పలకరిస్తే వారిని తిడుతూ రాళ్లు విసిరిందని తెలిసింది. ఆమె గొణుక్కుంటూ వెళ్లిందని, ఆ ప్రాంతంలో ఆహారం, నీళ్లు లేక మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.ఈ విషయమై పోరుమామిళ్ల ఎస్ఐ హనుమంతును విచారించగా ఆదివారం మధ్యాహ్నం చౌడేశ్వరమ్మ అడవిలో మృతి చెందినట్లు గుర్తించి, బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు.మృతదేహాన్ని వారికి అప్పగించామని ఎస్ఐ తెలిపారు. రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు సుండుపల్లె : సుండుపల్లె–గుండ్లపల్లె మార్గంలో వడ్లపల్లి సమీపంలోని బ్రిడ్జి దగ్గర ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరికి గాయాలయ్యాయి. గుండ్లపల్లికు చెందిన సుబ్బరాయుడు సుండుపల్లెకు వచ్చి తిరిగి తన స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు 108కు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పది రోజుల్లో పౌష్టికాహారాన్ని అందిస్తాం
వచ్చే పది రోజుల్లో ట్రిపుల్ ఐటీల్లోని విద్యార్థులకు వారంలో రెండు రోజులు చికెన్, నాలుగు రోజులు కోడిగుడ్లు పెడతాం. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా కేవలం ప్యూర్ వెజిటేరియన్ భోజనం అందిస్తున్నారు.. కాబట్టి నాలుగు ట్రిపుల్ ఐటీలకు టెండర్లు పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పి చికెన్, కోడిగుడ్లు అందించాలనుకుంటున్నాం. – జి.విజయ్ ప్రకాష్, ఆర్కే వ్యాలీ డైరెక్టర్, ఇడుపులపాయ -
అరణ్య రోదన!
అట్లూరు ప్రజల వేదన..అట్లూరు మండలం తూడూరు గ్రామానికి చెందిన పల్లె లక్ష్మమ్మకు రాత్రి 10గంటల సమయంలో గుండెల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ వాహనంలో ఎక్కించుకుని కడప ఆస్పత్రికి బయలుదేరారు. అట్లూరు– సిద్దవటం మార్గంలోని చెక్పోస్టు వద్దకు రాగానే చెక్పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదన్నారు. అత్యవసర పరిస్థితి అని వేడుకున్నా పంపించే ప్రసక్తే లేదన్నారు. చేసేదిలేక ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అనుమతి తీసుకోవడానికి సుమారు గంట పట్టింది.. ఆపై ఆస్పత్రికి చేరే లోపు లక్ష్మమ్మ ఊపిరాగింది. ఫారెస్టు చెక్పోస్టు వద్ద వృధా అయినా ఆ గంట సమయం ఆమె ప్రాణాలు మీదకు తెచ్చింది. లక్ష్మమ్మ కుటుంబానికి ఇప్పటికీ చెక్పోస్టు బాధ వెంటాడుతోంది. ఆ దారి వేదన.. ఇప్పటికీ అరణ్యరోదనే అయింది.సాక్షి ప్రతినిధి కడప : సిద్దవటం–అట్లూరు మార్గంలోని ఫారెస్ట్ చెక్పోస్టు సమస్య దశాబ్దాల కాలంగా వేధిస్తోంది. అట్లూరు, బద్వేల్ పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది.అర్ధరాత్రి అపరాత్రి ఆకస్మిక ప్రమాదాలు ముంచుకొస్తే ఆ మార్గంలో అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకూ అనేక కుటుంబాలు ఆవేదన భరిస్తూనే ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో అనాగరిక పయనం అలాగే కొనసాగుతోంది. ● సిద్దవటం–అట్లూరు మధ్యలో 9కిలోమీటర్లు వన్యప్రాణులు సంచరిస్తున్న ప్రాంతంగా ఫారెస్టు యంత్రాంగం గుర్తించింది. అభయారణ్యంలో రాత్రి సమయాల్లో వన్య ప్రాణాలు సంచరిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నాయని, ఈ పరిస్థితి నిరోధించాలనే ఉద్దేశంతో గెజిట్ నెంబర్ 05/2013 అమలు చేశారు. 2013 ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో రాత్రి 9 దాటితే సిద్దవటం–అట్లూరు మార్గంలో రహదారి బంద్ చేస్తారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంటోంది. కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించకుండా ఏళ్ల తరబడి అదే పరిస్థితి కొనసాగడం విచారకరం. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రమైన కడపకు వచ్చే అట్లూరు మండల ప్రజలు పని జరిగినా.. జరగకున్నా రాత్రి 9 కంటే ముందే ఆ చెక్పోస్టు దాటేలా చూసుకోవాలి. తీరిగ్గా పనులు ముగించుకొని బయలుదేరదామనుకుంటే కడప, ఖాజీపేట, బద్వేల్ మీదుగా చుట్టూ తిరిగి అట్లూరు చేరుకోవాల్సి వస్తోంది. 40కిలోమీటర్లు దూరంలో ఉన్న కడప నుంచి అట్లూరు చేరుకునేందుకు అదనంగా 70కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంతేకాదు దుంపలగట్టు, రాణిబావి వద్ద నున్న టోల్గేట్లు ఫీజులు భరించాల్సి ఉంది. కడప నుంచి రాజధాని విజయవాడకు వెళ్లే వాహనదారులకు సైతం అదే పరిస్థితి ఉంది. ఎన్హెచ్–565లో అండర్పాస్ బ్రిడ్జిలు.. నెల్లూరు–వైఎస్సార్ జిల్లాలోని వెలుగొండను కలుపుతూ పెనుశిల లక్ష్మీనరసింహా స్వామి అభయారణ్యంగా గుర్తించారు. ఈమార్గంలో ఏర్పేడు నుంచి నకిరేకల్ టు దోర్నాల జంక్షన్ పేరుతో నేషనల్ హైవే–565గా గుర్తించారు. ఈమార్గంలో 8.5కిలోమీటర్లు అభయారణ్యం ప్రాంతం విస్తరించి ఉంది. నేషనల్హైవే రహదారికి ఏమాత్రం ఆటంకం లేకుండా, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 8.5 కిలోమీట ర్లు పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, మరో 5చోట్ల 10 అడుగుల వెడల్పు, 6 అడుగులు ఎత్తుతో అండర్పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. స్వేచ్ఛగా వన్యప్రాణులు తిరిగేందుకు అన్నీ చర్యలు చేపట్టారు. దీనివల్ల ప్రయాణికులకు ఆటంకం ఉండదు, వన్య ప్రాణులకు ఎలాంటి నష్టం వాటిల్లదని నిపుణులు వివరిస్తున్నారు. అలాంటి ఆలోచనే సిద్దవటం–అట్లూరు మార్గంలో అమలు చేస్తే ప్రజలకు ఇ బ్బంది ఉండదు. లక్ష్ముమ్మలాంటి వారు అర్ధాంతరంగా మృతి చెందే అవకాశం ఉండదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆ దిశగా ఆలోచించి చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. చీకట్లు పడితే సిద్దవటం–అట్లూరు మార్గంలో ప్రయాణాలు నిషిద్ధం రాత్రి వేళ మెడికల్ ఎమర్జెన్సీవస్తే చావే శరణ్యమా! నిబంధనల పేరిట ప్రజల ఆవేదనను పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు -
ఎన్నాళ్లకొచ్చావే వాన!
కడప అగ్రికల్చర్ : ఎల్నినో కరవు రక్కసి మధ్య అన్నదాతలకు వరుణుడు స్వల్ప ఊరటనిచ్చాడు. దాదాపు 30 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత శనివారం తెల్లవారుజామున జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన ఉపశమన వర్షం.. ఎండల తీవ్రత, పొడి గాలుల వల్ల వాడుముఖం పట్టిన ఆరుతడి, ప్రకృతి సాగు పంటలకు కొత్త జీవాన్ని పోసింది. –జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని మండలాల్లోనే ఈ వర్షం కురిసింది. అత్యధికంగా మైదుకూరులో 56 మి.మీ నమోదు కాగా మైదుకూరు 56.0 , ఖాజీపేట 42.6 , ప్రొద్దుటూరు 39.4, నందలూరు 35.4, ఎర్రగుంట్ల: 29.0, రాజంపేట 23.8, కమలాపురం 23.2, సీకే దిన్నె 20.6, కడప 18.4, దువ్వూరు 16.6 , చెన్నూరు 16.2, వల్లూరు, వీరబల్లి 15.6, ఒంటిమిట్ట 15.4 సిద్దవటం 13.2 , చాపాడు 11.2, టి. సుండుపల్లి 9.2, పోరుమామిళ్ల 6.4, అట్లూరు, కొండాపురం 6.2 , పెద్దముడియం, ముద్దనూరు 4.2, సింహాద్రిపురం, రాజుపాలెం: 3.4 ,వేంపల్లె: 3.2, వీఎన్పల్లి: 0.2 ప్రకృతి, బహుధాన్య సాగుకు వరం : జిల్లావ్యాప్తంగా సాగైన సుమారు 10 వేల ఎకరాల వేరుశనగ, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న పంటలకు ఈ తడి ఎంతో మేలు చేసింది. మనల్ని ఎవడ్రా ఆపేదిసాక్షి టాస్క్ఫోర్స్ : అధికారమే ఆయుధంగా జిల్లాలో టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దాదాపు 16 ఏళ్లుగా ఓ వృద్ధుడు ఉంటున్న ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు కడపకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జాతిరుమలేష్ తన అనుచరగణంతో శనివారం యత్నించారు. వివరాల్లోకి వెళితే మున్సిపాలిటీ పరిధిలోని గౌరీశంకర్నగర్లో గల 1021 సర్వే నంబరులో గల 74 ప్లాట్లో పిన్నంవెంకటయ్య అనే వృద్ధుడు గత 16 ఏళ్లుగా ఇంటిని నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నాడు. మూడు నెలల క్రితం ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది అని, ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. తిరిగి శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తుల నుంచి ఓ అగ్రిమెంటు రాయించుకున్న టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ తన అనుచరగణంతో సమ్మెటలు, గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీగోడను పడగొట్టారు. దాదాపు అరగంట సేపు బీభత్సం సృష్టించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు స్పందించి అతని దౌర్జన్యంపై నిలదీశారు. ఇంతలో బాధితుడు కూడా 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో దౌర్జన్యానికి పాల్పడిన టీఎన్ఎస్ఎఫ్ నేత, అతని అనుచరులు అక్కడ నుండి పారిపోయారు. ఘటనపై పోలీసుస్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ● టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడి దౌర్జన్యం ● ఓ వృద్ధుడి ఇంటిని ఆక్రమించేందుకు యత్నం -
రైల్వేస్టేషన్లలో ఏఐ
రాజంపేట : రైల్వే ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే శాఖ సరికొత్త అధునాతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. రాజంపేట తో పాటు గుంతకల్ డివిజన్ పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్లను అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకువస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల కెమెరాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. రూ.20 కోట్లతో నిఘా నేత్రాలు.. గుంతకల్ డివిజన్ పరిధిలో మొత్తం 150 రైల్వేస్టేషన్లు ఉండగా, ప్రయాణికుల రద్దీ, భద్రతా ప్రమాణాల ఆధారంగా అధికారులు 109 రద్దీ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే శాఖ రూ.20 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యాధునిక ఏఐ సీసీ కెమెరాలను అమర్చుతోంది. తొలి విడతగా 70 కీలక రైల్వే స్టేషన్లలో కెమెరాల ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. అసాంఘిక శక్తులను ఇట్టే పసిగట్టేస్తాయి! ● ఈ కెమెరాలు సాధారణ వాటిలా కాకుండా అత్యంత పదునైన సాంకేతికతతో పనిచేస్తాయి. పాత నేరస్థుల గుర్తింపు : గతంలో రైళ్లలో చోరీలు, దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుల ముఖాలను ఇవి ఇట్టే గుర్తుపట్టి అలర్ట్ చేస్తాయి. ఎలాంటి అసాంఘిక శక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు స్టేషన్ పరిసరాల్లోకి ప్రవేశించినా క్షణాల్లో డేటా రికార్డ్ అయి కంట్రోల్ రూమ్కు సమాచారం వెళ్తుంది. నెల రోజుల భారీ బ్యాకప్.. గతంలో ఉన్న పాత కెమెరాలకు సంబంధించిన విజువల్స్ కేవలం 10 రోజులు మాత్రమే నిల్వ ఉండేవి. కానీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక వ్యవస్థ ద్వారా ఏకంగా నెల రోజుల (30 రోజులు) పాటు భారీ డేటా బ్యాకప్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల పాత నేరాల దర్యాప్తు చాలా సులభం కానుంది. ఈ కెమెరాల నిత్య పరిశీలన కోసం ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. రైల్వే రక్షక దళం అధికారులు 24 గంటల పాటు ఈ నిఘా నేత్రాలను పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ల నుంచి పూర్తి రక్షణ కల్పించనున్నారు. రూ.20 కోట్లతో గుంతకల్ డివిజన్ వ్యాప్తంగా కెమెరాలు -
జనం గొంతుకగా జగన్ యాప్
కడప సెవెన్రోడ్స్ : సామాన్య ప్రజలు సైతం తమ గొంతుకను వినిపించడానికి తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జగన్ 2.0 సూపర్ యాప్ రూపొందించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లా డుతూ ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, సానుభూతి పరులు సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ బాధితులు, దగాపడ్డ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, మహిళా వర్గాలు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించేవారిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసి తిప్పుతున్నారని విమర్శించారు. ప్రస్తుత కూటమి పాలన చూస్తుంటే హిట్లర్, బ్రిటీషువారే నయమనేపించే విధంగా ఉందన్నారు. వాయిస్లెస్ పీపుల్ తమ గొంతుకను వినిపించేందుకు జగన్ సూపర్యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. నిజాలు మాత్రమే యాప్లోకి అప్లోడ్ చేయాలని సూచించారు. కాగా కూటమి ప్రభుత్వం చేస్తామన్న హామీలు చేయలేదని దుమ్మెత్తిపోశారు. కనీసం కొత్త పింఛన్లు, రేషన్కార్డులు ఇవ్వలేని దౌర్బగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజలు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులకు ఏవైనా చెప్పదలుచుకుంటే చెప్పే అవకాశం కల్పించామన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి -
దరఖాస్తు గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమినరీ–2026 పరీక్షలకు అర్హులైన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల గడువును జులై 25 వరకు పొడిగించినట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 30 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 97031 85382, 98499 19221 నెంబరులో సంప్రదించాలని సూచించారు. బాధ్యతల స్వీకారం కడప అర్బన్ : కడప రిమ్స్ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నూతన సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ ఈ.బి.దేవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓగా పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం ఇటీవల కడపకు బదిలీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమెను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డితో పాటు వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–1 శ్రీకాంత తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీచర్లు వృత్తినైపుణ్యం పెంచుకోవాలికడప ఎడ్యుకేషన్ : మారుతున్న సిలబస్కు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కాగిత శ్యాముల్, డీఈవో షేక్ షంషుద్దీన్ సూచించారు. శనివారం కడప జయనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో కడప, బద్వేల్, ప్రొద్దుటూరు, పులివెందుల డివిజన్ల పరిధిలోని సోషల్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన ’టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్’ శిక్షణా తరగతులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నుండి 8వ తరగతుల నూతన సిలబస్, కరికులంతో పాటు విద్యాబోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, టీచర్ హ్యాండ్ బుక్, అసెస్మెంట్ బుక్లెట్, మిషన్ మార్చ్, క్లిక్కర్స్ వంటి సరికొత్త అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఆర్పీలు గంగాధర్, సురేష్కుమార్రెడ్డి, డీఆర్పీలు నిత్యానందరెడ్డి, ఫిరోజ్బాష, రజని తదితరులు పాల్గొన్నారు. బయో మెడికల్ వేస్టేజ్ నిబంధనలను పాటించాలి– డీఎంహెచ్ఓ యుగంధర్ కడప రూరల్ : బయో మెడికల్ వేస్టేజ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ యుగంధర్ తెలిపారు. శనివారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో ’స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ’బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల నిర్వహణ, నమోదు’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు ఎక్కువ వ్యర్థాలు, చెత్త విడుదలవుతుంటే, వాటిని అక్కడికక్కడే తడి, పొడి చెత్తగా విడదీసి బాధ్యతాయుతంగా నిర్వహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పనకు సమిష్టిగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆర్ బి ఎస్ కే కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిపుల్లా, నేషనల్ హెల్త్ మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ తాహా, డెమో భారతి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి విజయ భాస్కర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా కేసుల్లో కొత్త కోణం కడప రూరల్ : జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో, కొత్త వేరియంట్ బయటపడింది. ఓమిక్రాన్ కు చెందిన ఆర్ఎఫ్ 5 రకానికి చెందినదిగా నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. కాగా పాజిటివ్ కేసుకు సంబంధించిన వారి నమూనాలను, వ్యాధి తీవ్రత, ఇతర కారణాలను తెలుసుకోవడానికి పూణేకు పంపారు. అందులో నలుగురికి ఓమిక్రాన్ ఆర్ఎఫ్ 5 వేరియంట్ ఉందని నిర్ధారించారు. కాగా ఆర్ఎఫ్ 5 వేరియంట్ సాధారణ రకానికి చెందినదిగా వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. లక్షణాలు ఇవీ: గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్ళు నొప్పులు ఆర్ఎఫ్ 5 వేరియంట్ లో కనిపించే లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవారు తక్షణం చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి. అలాగే తప్పనిసరిగా, ముందు జాగ్రత్తగా ప్రజలు మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. -
వాతావరణ బీమా విడుదల చేయాలి
● ప్రతి గ్రామంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కడప సెవెన్రోడ్స్ : 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 175.85 కోట్ల వాతావరణ బీమా మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ వాతావరణ బీమా కింద కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు విడుదల చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో బీమా పెండింగ్లో ఉందన్నారు. బీమా తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశంలో తీర్మానించాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు చాలాచోట్ల పనిచేయకపోవడం వల్ల గాలి వేగం నమోదు కావడం లేదన్నారు. ఇందువల్ల రైతులకు బీమా అందడం లేదన్నారు. 2025–26లో పెనుగాలులకు నేలమట్టమైన అరటికి బీమా చెల్లించాలని కోరారు. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు కొన్ని గ్రామాల్లోనే ఉన్నాయని, ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలన్నారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి పంట కూలిపోతే బీమా చెల్లిస్తామనడం సరికాదన్నారు. ఈ నిబంధన సవరించాలని, ఏ కారణంతో పంట కూలినా బీమా చెల్లించాలని కోరారు. ఉపాధి హామిలో మెటీరియల్ కాంపోనెంట్ కింద జిల్లాకు రూ. 160 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. అధికారులు ఢిల్లీలో అప్లోడ్ చేసినా ఇంకా నిధుల విడుదల జరగలేదన్నారు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానం చేయాలన్న ఆయన ప్రతిపాదనను సమావేశం ఆమోదించింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు సుమారు లక్ష గృహాలు మంజూరు చేయగా, రూ. 1329 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంకా 50 వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని పేర్కొన్నారు. 1.0లో అదనపు పేమెంట్ బకాయిలను చెల్లించాలన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ ఆరు నెలల కాలంలో జిల్లాకు కేవలం 1900 ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని విమర్శించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే మినహా 440 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు ప్రారంభించామన్నారు. పూర్తికానిపనులను వేగవంతం చేయాలని కోరారు. వేముల, వేంపల్లె మండలాల నుంచి ప్రతిరోజు రూ. 45 లక్షల విలువైన బైరెటీస్ ఖనిజం అక్రమ రవాణా జరుగుతుంటే మైన్స్ అండ్ జియాలజీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తాను ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. బైరెటీస్ అక్రమ రవాణా విషయం తమకు కూడా తెలుసని, అయితే మైన్స్ అండ్ జియాలజీ అధికారులు తమకు ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నామని ఎస్పీ తెలిపారన్నారు. ఇప్పటికై నా అక్రమ మైన్లను 48 గంటల్లో కట్టడి చేయాలని కోరారు. అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రికవరీ చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ నిరంతరం నిఘా ఉండాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి, వీఎన్ పల్లె, చెన్నూరు ఎంపీపీలు రఘునాథరెడ్డి, చీర్ల సురేష్యాదవ్, జెడ్పీ సీఈఓ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ బద్వేలులో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. బద్వేలు, పోరుమామిళ్లలో డాక్టర్ల కొరత ఉందని, ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఎస్.వెంకటాపురం గ్రామంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన ఇళ్లు కారుతున్నాయని తెలిపారు. వీటి మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కోరారు. నందలూరు మండలంలో యంత్రాలతో ఇసుకను తవ్వేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. బాలరాజుపల్లెలో రోజుకు వందల టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారన్నారు. అసలే ఎల్నినో పరిస్థితితో ఇసుకను తరలిస్తే తాగునీటికి ఇబ్బందులు కలుగుతాయన్నారు.అధికారులు చర్యలు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఆందోళనబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. -
విద్యపై నిర్లక్ష్యం తగదు
ప్రభుత్వ విద్యపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తల్లికి వందనం ఇప్పటి వరకు ఇవ్వలేదు. విద్యాసామగ్రిని కూడా విద్యార్థులకు అరకొరగానే ఇచ్చారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచే రోజే తల్లిదండ్రుల ఖాతాలకు తల్లికి వందనం డబ్బుల పడేది. అలాగే బడి తెరిచిన రోజే విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించేది. నేడు ఆ పరిస్థితి లేదు. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్గా మారుతున్నారు. – ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పోరుమామిళ్ల: అమ్మ దగ్గర నుండి ఆస్తి తీసుకోవాలనే ఆరాటంతో అసలు ప్రాణాలకే ఎసురు తెచ్చుకున్నాడు. మండలంలోని సిద్దవరం గ్రామానికి చెందిన బొట్టా రమణయ్య (46) తన తల్లిని బెదిరించి ఆస్థి రాయించుకోవాలని ఆరాటపడ్డాడు. అక్క వద్దే ఉంటూ తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రమణయ్య బుధవారం రెండు కత్తులు తీసుకొని తల్లి వద్దకు బయలు దేరాడు. తల్లిని చంపేందుకు రమణయ్య వస్తున్నాడని అక్క తల్లికి ఫోన్ చేసింది. వెంటనే ఆమె పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి తమను కాపాడాలని కోరింది. పోలీసులు రమణయ్య దగ్గరున్న కత్తులు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని స్టేషన్కు రమ్మని ఆదేశించారు. దీంతో రమణయ్య భయపడి చెట్టుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రమణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు కడపలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయమై ఎస్ఐ హనుమంతును విచారించగా రమణయ్య తల్లిని, సోదరని చంపేందుకు తిరుగుతున్నారని సమాచారం రావడంతో అతని దగ్గర కత్తులు, సెల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
న్యాయం కోసం పోరాడితే నిందలా?
సోలార్ సెయిల్ కంపెనీ నిర్వాసితుల ఆవేదన పెద్దముడియం (జమ్మలమడుగు రూరల్): పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ సెయిల్ కంపెనీలో తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పోరాటం చేస్తుంటే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి నిందలు వేయడం సమంజసం కాదని బాధిత రైతులు వరలక్ష్మీ, సుజాత అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో వీరు మాట్లాడుతూ భూపేష్రెడ్డి, మామ చంద్రశేఖర్రెడ్డి సోలార్ కంపెనీ యాజమాన్యంతో తమ వద్దకు వచ్చి మీ భూమిని కోనుగోలు చేస్తామని, మీరు ఆదనంగా సాగు చేసిన భూమికి కూడా ఏకరాకు రూ. 3 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయిన సోలార్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో చంద్రశేఖర్రెడ్డి మాటలు అబద్ధమని తేలిందని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయకపోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని సంప్రదించామని, ఆయన తమ కోసం మాట్లాడుతుంటే భూపెష్రెడ్డి ఆరోపణలు చేయడం తగదని హితవుపలికారు. నా భర్తపై తప్పుడు కేసు పెట్టారు.. ఏ తప్పు చేయకున్న తన భర్తను సోలార్ కంపెనీ యాజమాన్యం, పోలీసులు 33 రోజులుగా జైల్లో పెట్టారని మరో బాధితురాలు సుజాత తెలిపారు. తమ పొలంలో సోలార్ ప్యానళ్లు వేయవద్దని చెప్పడంతో తన భర్తపై దొంగతనం కేసు పెట్టారని తెలిపారు. తమకు పరిహారం ఇవ్వకుండా జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం కోసం భూపేష్రెడ్డి తమకు అన్యాయం చేయవద్దని కోరారు. -
కర్నూలు, చిత్తూరు జట్లు ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే మ్యాచ్లు హోరా హోరీగా సాగాయి. మూడవ రోజు జరిగిన ఈ పోరులో వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం జట్టుపై కర్నూలు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా, కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు జట్టుపై చిత్తూరు జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టుకు 12, చిత్తూరు జట్టుకు 7 పాయింట్లు లభించాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మూడవ రోజు ఫాలో ఆన్లో 203 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 85.4 ఓవర్లకు 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాత్విక్ 27 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. ఆయి విఘ్నేష్ 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 18.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 57 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని సంజయ్ నాయుడు, టీవీ సాయి ప్రతాప్రెడ్డి సిద్దార్థ వికెట్ తీశారు. దీంతో కర్నూలు జట్టు 6 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 78 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 45 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్ అయింది, ఆ జట్టులోని గరు చరణ్ 54 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ సాయి 3, లోకేష్ 3, నేత్రనంద 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో న్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 51.5 ఓవర్లకు 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిషికుమార్ రెడ్డి 91, సిద్దార్థ్రెడ్డి 31 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు, జయంత్ 3 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది, -
చీనీ చెట్ల దున్నివేత
లింగాల : మండల కేంద్రమైన లింగాలలో శుక్రవారం దౌర్జన్యంగా చీనీచెట్లను దున్నేశారు. గ్రామానికి చెందిన రఘురామిరెడ్డి పొలంలోని చీనీచెట్లను నారాయణరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్తో విచ్చలవిడిగా చీనీచెట్లపై తొక్కించుకుంటూ వెళుతూ సుమారు 15చీనీ చెట్లను తొక్కించాడు. 8 ఏళ్ల చీనీచెట్లు పంట చేతికొస్తుందన్న సమయంలో ఇలా దౌర్జన్యంగా తొక్కివేయడంతో సుమారు లక్ష రూపాయల దాకా నష్టం వాటిల్లిందని రైతు రఘురామిరెడ్డి తెలిపారు. చీనీచెట్లను తొక్కి వేయడమే కాకుండా తనపై దౌర్జన్యానికి దిగారని, తన టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి కాళ్లతో తొక్కి తనపై దౌర్జన్యం చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్ఐ జగదీశ్వరరెడ్డి వివరణ కోరగా.. బాధిత రైతుకు న్యాయం చేస్తానని, బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశానన్నారు. అలాగే దౌర్జన్యానికి పాల్పడిన నారాయణరెడ్డిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రొద్దుటూరు క్రైం : భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెకు చెందిన బైర గాని నాగమునేంద్ర తన భార్య నాగలక్ష్మి (33)ని కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతోపాటు.. ‘చనిపోతే మరో వివాహం చేసుకుంటాను’ అంటూ తరచూ వేధించేవాడని దర్యాప్తులో వెల్లడైంది. భర్త వేధింపులు, అవమానాలు భరించలేక నాగలక్ష్మి గత నెల 11న ఇంట్లో విషపదార్థం సేవించింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 12న మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నమ్మకమైన సమాచారం మేరకు శుక్రవారం మీనాపురం రోడ్డులోని శ్రీనిధి మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో నాగమునేంద్రను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని బాబా నగర్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు సీకే దిన్నె పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 45–50 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతుడు నల్లని ఫ్యాంటు, తెల్లటి రెడీమేడ్ చొక్కా ధరించి ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజుల కిందటే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
బాధ్యతల స్వీకరణ
కడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అభివృద్ధి జరగాలని, వంద శాతం లక్ష్యం దిశగా సిబ్బంది పనిచేసి, రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని తెలిపారు. జిల్లా ఎయిడ్స్, లెప్రసీ అధికారి డాక్టర్ రవిబాబు, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్, కోఆర్డినేటర్ డాక్టర్ ఆరిఫుల్లా, నేషనల్ హెల్త్ మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ మహమ్మద్ తాహా, డెమో భారతి, కుమారి, ఏఓ జయభాస్కర్ తదితరులు యుగంధర్కు శుభాకాంక్షలు తెలియ చేశారు. ‘తల్లికి వందనం’ కోసం ఎన్పీసీఐ లింక్ చేసుకోవాలి కడప రూరల్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులు విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమ అవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం చింతామణి పేర్కొన్నారు. విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా ఎన్పీసీఐకు లింక్ చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ విద్యార్థుల 1,349 మంది ఖాతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వెంటనే సమీప పోస్టాఫీసుకు వెళ్లి, ఐపీపీబీ ఖాతాను తెరచి ఆధార్ నంబర్కు ఎన్పీసీఐ పోర్టల్కు లింక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ ఇదివరకే బ్యాంకు ఖాతా ఉంటే ఆ నంబరుకు ఎన్పీసీఐకు లింక్ చేసుకోవాలని తెలిపారు. ఇలా చేస్తేనే తల్లికి వందనం నిధులు ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు జమవుతాయని పేర్కొన్నారు. స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు కడప సెవెన్రోడ్స్ : స్థానిక కేడర్ల ఏర్పాటు, ఉద్యోగుల కేటాయింపు పారదర్శకంగా అమలు చేయాలని డీఆర్వో మల్లికార్జునుడు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్నమయ్య జిల్లా డీఆర్వో చంద్రశేఖర్రెడ్డితో కలిసి అన్నిశాఖల హెచ్ఓడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమలు, పురోగతి, జాబ్ క్యాలెండర్ ఫేజ్–2 కింద చేపట్టాల్సిన నియామకాలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉత్తర్వులు 2025 ప్రకారం ఉద్యోగులను కొత్త స్థానిక కేడర్లకు కేటాయించే ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు. ఉద్యోగుల కేటాయింపు కోసం ప్రభుత్వం జిల్లా శాఖాధిపతి, సచివాలయ స్థాయిల్లో అమలు కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా స్థాయి అమలు కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారన్నారు. సేవా రికార్డుల ఆధారంగా ముసాయిదా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. తుది కేటాయింపు జాబితా విడుదల తర్వాత అవసరమైన బదిలీ ఉత్తర్వులు జారీ చేసి నిర్ణీత గడువులోపు ఉద్యోగులు కొత్త స్థానిక కేడర్ విధుల్లో చేరేలా చూస్తామన్నారు. కలెక్టరేట్ ఏఓ గంగయ్య, కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’ వైపు అడుగులు
● సర్కార్ సూళ్లలో పిల్లల చేరికల చింత ● ఈ ఏడాది తగ్గిన అడ్మిషన్ల సంఖ్య ● ఆందోళనలో అయ్యవార్లు కడప ఎడ్యుకేషన్: సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పించక పోవడంతోపాటు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించకుండా సర్కార్ చోద్యం చూస్తోంది. దీంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే గవర్నమెంట్ స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతోపాటు ఇటీవల ఉపాధ్యాయుల కొందరు విద్యార్థుల సంఖ్య తగ్గితే తాము పనిచేసే పాఠశాలలో తమ పోస్టు పోతుందనే ఆందోళనతో కొన్ని బినామీ అడ్మిషన్లు చేయించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అమలు చేసిన విద్యా సంస్కరణలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తూ అనుసరిస్తున్న వైఖరి కూడా కారణమని పలువురు విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. చేరికలు తగ్గుముఖం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా 1వ తరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. అలాగే 2వ తరగతితోపాటు 4,6,7 తరగతుల్లో కూడా అదే పరిస్థితి నెలకుంది. సంబంధిత తరగతుల్లో తగ్గిన చేరికల విద్యార్థులు చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఏటా ప్రభుత్వం నిర్వహించే బడిబాట కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రచారానికి ెపెద్దపీట వేస్తూ సర్కార్ బడుల్లో మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తామని చెబుతున్నా ప్రజల్లో అంతగా స్పందన లేకపోగా నమ్మకం కూడా సన్నగిల్లుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నారు. ప్రధానంగా 1వ తరగతిలో గతేడాది కంటే ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య తగ్గింది. అంటే ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు విశ్వాసం సన్నగిల్లుతోందనే చెప్పాలి. చాలా మంది తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థిక భారమైనా తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2,190 విద్యా విద్యార్థుల సంఖ్య తగ్గడమే కారణం. దీంతో సర్కార్ బడుల అయ్యవార్లు అందోళన చెందుతున్నారు. గణాంకాలు ఇలా... జిల్లా అధికారిక వివరాల ప్రకారం 2025–25 విద్యా సంవత్సరంలో 1,38,716 మంది విద్యార్థులు చేరగా 2026–27 విద్యా సంవత్సరంలో 1,36,526 మంది మాత్రమే చేరారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 2,190 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇందులో భాగంగా 1వ తరగతిలో గతేడాది 11,978 మంది చేరితే ఈ ఏడాది 11,516 మంది మాత్రమే చేరారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 462 మంది విద్యార్థుల చేరిక తగ్గింది. అలాగే 2025–26 సంవత్సరంలో 2వ తరగతిలో 12,573 మంది విద్యార్థులు చేరితే 2026–27లో 12,149 మంది చేరారు. అంటే గతేడాది కంటే 424 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతోపాటు 4వ తరగతిలో గతేడాది 12,505 మంది విద్యార్థులు చేరితే ఈ ఏడాది 11,978 మంది చేశారు. గతేడాదికంటే ఈ ఏడాది 527 మంది తక్కువగా విద్యార్థులు చేశారు. అలాగే 6వ తరగతిలో గతేడాది 13,943 మంది చేరితే ఈ ఏడాది 11,597 మంది చేశారు. అంటే గతేడాదికంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య 2,346కు తగ్గింది. 7వ తరగతిలో కూడా గతేడాది 16,154 మంది చేరితే ఈ ఏడాది 14,453 మంది చేశారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది 2190 మంది సంఖ్య తగ్గింది. కొన్ని తరగతుల్లో పెరిగిన విద్యార్థులు 3వ తగరతిలో 877 మంది, 5వ తరతిలో 120 మంది, 8వ తరగతిలో 869 మంది, 9వ తరగతిలో 195 మంది, 10వ తరగతిలో 1,569 మంది చొప్పున ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని తరగతులు మినహా మిగతా తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. అన్ని మేనేజ్మెంట్స్లో విద్యార్థుల సంఖ్య 2025–26లో చేరిన విద్యార్థులు 3,38,590 2026–27లో : 3,28,195 విద్యార్థుల చేరికల్లో వ్యత్యాసం : 10,395 ప్రభుత్వ మేనేజ్మెంట్లో విద్యార్థులు 2025–26లో : 1,38,716 2026–27లో : 1,36,526 విద్యార్థుల చేరికల్లో వ్యత్యాసం : 2,190 -
వైద్య,విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) పునః పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మంచి ర్యాంకులు సాధించారు.
నీట్గా మెరిశారుజయసింహ సత్తా బద్వేలు అర్బన్ : వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాల్లో పట్టణానికి చెందిన ప్రముఖ విద్యుత్శాఖ కాంట్రాక్టర్ కరెంటునరసారెడ్డి మనవడు మయుక్జయసింహ 720 మార్కులకు 700 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు వైద్యులుగా సేవలందిస్తున్నారు. విద్యార్థికి మానవత అధ్యక్షుడు నాగిరెడ్డిశంకర్రెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. వర్దన్రెడ్డి ప్రతిభ జమ్మలమడుగు: ఇటీవల జరిగిన నీట్పరీక్షల్లో జమ్మలమడుగుకు చెందిన ఎంబీ వర్థన్రెడ్డి జాతీయస్థాయిలో 199వ ర్యాంకును సాధించాడు.తల్లిదండ్రులు ప్రసాద్రెడ్డి భాగ్యరేఖ ఆనందం వ్యక్తం చేశారు.తమ కుమారుడు వర్ధన్రెడ్డికినీట్ పరీక్షల్లో మొత్తం 720 మార్కులకు 685 మార్కులుసాధించాడని, జాతీయ స్థాయిలో 199ర్యాంకు, జనరల్కేటగిరిలో 139వ ర్యాంకు వచ్చిందని చెప్పారు. వర్దన్రెడ్డి పదిలో 575 మార్కులు పొందాడు. ఇంటర్ హైదరాబాద్లో మాధపూర్లోని ప్రైవేట్కాలేజీలో చదివాడు.అక్కడే చదవుకుంటూ షార్టు టైంలోనే నీట్పరీక్షలో ర్యాంకుసాధించినట్లు తెలిపారు. మెరిసిన జ్యోతి సిద్దవటం : సిద్దవటానికి చెందిన జ్యోతి కళానిధి నీట్–2026లో ప్రతిభ కనపరిచిన జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆలిండియా ర్యాంకు 8350 సాధించింది. జ్యోతి కళానిధి చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో చదువులో రాణించేదని తల్లిదండ్రులు నరసింహారెడ్డి, శారద తెలిపారు. జ్యోతి శ్రీ భారతి హైస్కూల్లో పదో తరగతి చదివింది. హైస్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ముక్కర వెంకటసుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థికి అభినందనలు తెలిపారు. చక్రాయపేట మండల విద్యార్థిని ప్రతిభ వేంపల్లె : నీట్ ఫలితాలలో చక్రాయపేట మండల విద్యార్థిని పొట్టి పాటి తేజస్విత ప్రతిభ కనబరిచింది. పదో తరగతి వేంపల్లె లో, విజయవాడలో ఇంటర్మీడియట్ చదివింది. నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా 17100 ర్యాంకు సాధించింది. మెడిసిన్ చదివి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే లక్ష్యం అని తెలిపింది.తల్లిదండ్రులు కిషోర్ కుమార్ రెడ్డి, రుక్మిణి దేవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో మెడిసిన్లో కూడా మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తానని తేజస్విత తెలిపింది, వర్థన్రెడ్డి మయుక్జయసింహ జ్యోతి కళానిధి తేజస్విత -
ఎర్రచందనం తరలిస్తున్న వాహనం పట్టివేత
కాశినాయన : మండలంలోని ఓబుళాపురం వద్ద శుక్రవారం ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని నరసాపురం పోలీస్స్టేషన్కు తరలించారు. హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన ఈ వాహనంలోని 30కిపైగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ఫోర్స్ ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాన్ని, నిందితులను తిరుపతికి తీసుకెళ్లారని ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. ● ఇద్దరు అంధులకు చూపు సింహాద్రిపురం : మహిళ నేత్రదానం చేసి ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిందని నేత్ర సేకరణ కేంద్ర అధ్యక్షుడు రాజు పేర్కొన్నారు. శనివారం మండలంలోని బలపనూరు గ్రామానికి చెందిన కప్పల లక్ష్మీదేవి మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరిస్తూ నేత్ర సేకరణ కేంద్ర అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. వెంటనే రాజు నేత్ర సేకరణ కేంద్ర టెక్నీసియన్ ప్రశాంత్తో కలిసి మృతురాలి ఇంటికి చేరుకుని ఆమె మృతదేహం నుండి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని ఎల్వీ నేత్రాలయానికి పంపించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ నేత్రదానం చేసే వారు 9966509364 ఫోన్ నంబర్కు సంప్రదించాలన్నారు. నేత్రదానం చేసిన కప్పల లక్ష్మీదేవి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ● ఇరువురికి గాయాలు చింతకొమ్మదిన్నె : మండలంలోని రసూల్ పల్లెకు చెందిన తొండూరు భాస్కరరెడ్డి అనే వ్యక్తి గురువారం రాత్రి చింతకొమ్మదిన్నె మెయిన్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద ఉన్నవారిని దూషించడంతో చింతకొమ్మదిన్నెకు చెందిన సురేష్ రెడ్డి సర్ధిచెప్పి పంపే ప్రయత్నం చేశాడు. అయితే భాస్కరరెడ్డి వెంటనే కట్టెతో దాడి చేయడంతో సురేష్ రెడ్డి కింద పడిపోయాడు. సురేష్రెడ్డి తండ్రి సూర్యనారాయణరెడ్డి అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. ఆయనపై కూడా దాడి చేశాడు. వీరు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో తమపై దాడిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
వెలుగులోకి కొన్నే.. కనిపించనివి ఎన్నో..!
కడపలో మొదలు.. రాష్ట్రమంతా కేసులు ప్రభుత్వానికి పట్టని కరోనా ప్రమాద సంకేతాలు కడప రూరల్ : వైఎస్సార్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. ఇప్పుడు రాష్ట్రమంతా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాటల్లోనే అని, చేతల్లో కనిపించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. విస్తరిస్తున్న కోవిడ్ వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. వల్లూరు మండలానికి చెందిన 66 ఏళ్ల వద్ధుడు మరణించాడు. ఆ వ్యక్తి కిడ్నీ వ్యాధిగ్రస్తుడని, డయాలసిస్ చికిత్స పొందుతూ తిరుపతిలో మరణించాడని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి మొత్తం 14 కేసులకు పైగా వెలుగు చూశాయి. ఈ కేసులన్నీ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో నమోదయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏమంటే 2020 మార్చి నెలలో రాష్ట్రం అంతా కేసులు వెలుగు చూశాయి. వైఎస్సార్ కడప జిల్లా మినహా రాయలసీమ జిల్లాల్లో పాజిటివ్ కేసులు విరివిగా నమోదయినాయి. కడపలో మాత్రం ఆ ఏడాది మార్చి 30న కేసులు నమోదు కావడం మొదలైంది. అంటే ఇక్కడ ఆలస్యంగా పాజిటివ్ కేసులు వచ్చాయి. కాగా ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. సమస్యగా మారిన నిర్ధారణ జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కోవిడ్ను పోలి ఉంటాయి. ఈ లక్షణాలు సర్వసాధారణంగా చాలామందిలోనే కనిపిస్తాయి. అలాగని అందరినీ కరోనా కింద జమ కట్టలేం. నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్ వస్తే కోవిడ్ గా పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో కరోనా వచ్చినప్పుడు రాపిడ్ కిట్స్, ట్రూనాట్, ఆర్టిపీసీఆర్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. వీటిల్లో ఆర్టిపీసీఆర్ ద్వారా జరిపే పరీక్షలు మెరుగైనవని వైద్యుల అభిప్రాయం. అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడానికి రాపిడ్ కిట్స్, ట్రూ నాట్ పరీక్షలు ఉపయోగపరంగా ఉంటాయి. అయితే ఈ పరీక్ష పరికరాలు ఇంతవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరని పరిస్థితి నెలకొంది. అలాంటప్పుడు వ్యాధి నిర్ధారణ కాకముందే, కరోనాను ఎలా కనిపెట్టగలరనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా వ్యాధులు చలికాలం, వానాకాలంలో వెలుగు చూస్తాయి. అయితే కరోనా కేసులు మాత్రం ఎండల్లో నమోదు కావడం విశేషం. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దృష్టి పెట్టకుండా, కరోనా మహమ్మారిపై కరుణ చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో లాగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోయినా పర్వాలేదు. కరోనా విస్తరించకుండా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే చాలని సగటు మనిషి అభిప్రాయపడుతున్నాడు. -
బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ఆర్ఐవో (ఎఫ్ఏసీ)గా పీఎల్ఎన్ ప్రకాశరావు పట్నాయక్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన కళాశాలల అభివృద్ధితోపాటు విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో మెరుగైన ప్రగతి సాధనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కలసపాడు : మండలంలో దొంగనోట్ల చెలామణి రోజురోజుకు అధికమవుతుంది. నాలుగు రోజులుగా పెట్రోలు బంకులు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో ఎక్కువ మొత్తంలో దొంగనోట్లు చెలామణి అవుతున్నాయి. ఇటీవల పోరుమామిళ్ల రోడ్డులోని ఓ పెట్రోలు బంకులో కొందరు రూ.500, రూ.200 దొంగనోట్లు ఇచ్చి పెట్రోలు పట్టుంచుకున్నారని, అవి దొంగనోట్లు అని గుర్తు పట్టకపోవడంతో నష్టపోతున్నామని పెట్రోలు బంకు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి దొంగనోట్లను చెలామణి చేస్తున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. ఎర్రగుంట్ల : మండల పరిధిలోని నిడుజివ్వి సమీపంలోని నాపరాయి గనిలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నెల్సన్ అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. కలమల్ల గ్రామానికి చెందిన నెల్సన్ నిడుజివ్వి గ్రామం సమీపంలో ఉన్న నాపరాయి గనుల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గనిలో నుంచి ట్రాక్టర్ పైకి వస్తుండుగా బ్రేక్ పెయిల్ అవడంతో డ్రైవర్ ట్రాక్టర్ను అదుపు చేయలేకపోయాడు. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కడపకు తీసుకెళ్లారు. ఈ విషయంపై ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డిని వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపడుతామని చెప్పారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారులోని జమ్మలమడుగు బైపాస్రోడ్డు పక్కన ఉన్న ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలియడంతో గురువారం సాయంత్రం రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి సుమారు 50–55 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. మృతుడి గురించి ఎస్ఐ స్థానికులను విచారించినా అతను ఎవరనే విషయాలు తెలియలేదు. అనారోగ్యం కారణంగా అతను మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే రూరల్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అట్లూరు : మండల పరిధిలోని లింగాలకుంట చెరువు దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు కడప నగరం భగత్ సింగ్ నగర్కు చెందిన మోహన్, మాసాపేటకు చెందిన శ్రీను ఇరువురు ద్విచక్రవాహనంపై నెల్లూరు జిల్లా కలువాయికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి కడపకు వస్తూ అట్లూరు మండలం లింగాలకుంట చెరువు మలుపు వద్దకు వచ్చేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డారు. వీరిని స్థానికులు 108 అంబులెన్స్లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీకి బీసీలను చేరువ చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీసీలను చేరువ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు రాచగొల్ల రమేష్ యాదవ్ అన్నారు. గురువారం విజయవాడలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కోడాలి నాని, బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్లతో కలిసి బీసీ విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కడప జిల్లా నుంచి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ హాజరయ్యారు. జిల్లాలో బీసీల యొక్క ప్రధాన సమస్యలు, కూటమి ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఎన్నికల హామీలు, మొదలగు విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో బీసీ విభాగం చేసిన కార్యక్రమాలు పరిశీలించారు. భవిష్యత్లో ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీలను పార్టీకి చేరువ చేసేందుకు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయం, అంకితభావం ఎంతో కీలకమని పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు తమకు ఎదురయ్యే ఏ సమస్యనైనా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వినతులను నమోదు చేసుకున్న ఆయన జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై స్పందించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అదేవిధంగా, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ‘స్మార్ట్ కిచెన్’ జిల్లాకు గర్వకారణం జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలవడం జిల్లాకే గర్వకారణం అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సభాభవనంలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పురోగతి, వివిధ దశల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి అధికారి, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి స్మార్ట్ కిచెన్ వ్యవస్థను జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. సీఎస్పురం మండల మహిళా సంఘాల ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, కిచెన్ మేనేజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
మిట్స్ ప్రొఫెసర్కు అరుదైన గుర్తింపు
కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లులోని మిట్స్ డీమ్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలుమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ గుత్తి నాగశ్వేత ఐఈఈఈ సీనియర్ మెంబర్ గ్రేడ్ సాధించి గౌరవాన్ని అందుకున్నట్లు వీసీ యువరాజ్ గురువారం తెలిపారు. ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో పదేళ్లకు పైగా అనుభవం, పరిశోధనల్లో చేసిన కృషి, సాంకేతిక సేవలు, నాయకత్వ లక్షణాలు, వృత్తి పరమైన నైపుణ్యాలును గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. డాక్టర్ గుత్తి నాగశ్వేత అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించడమే కాకుండా విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రోచాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాఽథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్కుమార్, ఐఈఈఈ కోఆర్డినేటర్ సి.కుమార్ అధ్యాపకులు, సిబ్బంది నాగశ్వేతను అభినందించారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ అండర్–19 మల్టీ డే మెన్ మ్యాచ్లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లో 78 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 65.3 ఓవర్లకు 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాత్విక్ 111 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (సెంచరీ) చేశాడు. కిరణ్కుమార్ 36 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 5, జితేస్ వర్ధన్ 2, సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం అనంతపురం జట్టు ఫాలోఆన్లో పడటంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. దీంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 57 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 62, సందీప్రెడ్డి 56 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మల్లికార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశాడు. అయితే కర్నూలు జట్టు బౌలర్ మల్లికార్జున తొలి ఇన్నింగ్స్లో 5 , రెండవ ఇన్నింగ్స్ 4 వికెట్లు తీయడం కొసమెరుపు. దీంతో అనంతపురం జట్టు 41 పరుగులు ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 20 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 83.1 ఓవర్లకు 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోకేష్ 98, సుశాంత్ 59 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్ చక్కటి లైనఫ్తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. జయంత్, తేజేష్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 13 ఓవర్లకు 4 వికెట్లు నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 28 పరుగులు చేవాడు. నెల్లూరు జట్టులోని లోకేస్ 3 వికెట్లు తీశాడు. చిత్తూరు జట్టు 121 పరుగుల ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. మల్లికార్జున, 5 వికెట్లు ఆదినారాయణ, 62 పరుగులు యశ్వంత్, 4 వికెట్లు సాత్విక్, 105 పరుగులు -
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన జెడ్పీ స్టాండింగ్ కమిటీల సమావేశంలో నీటి ఎద్దడిపై ఆయన సమీక్షించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట మండలాల్లోని 40 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు తెలిపారు. సుమారు 180 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉందన్నారు. అందుకే బోర్ల లోతు పెంచుతున్నామన్నారు. దువ్వూరు మండలంలోని చింతకుంట చెరువు నింపగలిగితే పలు గ్రామాలకు తాగునీరు అందించవచ్చన్నారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ తెలుగుగంగలో అంతర్భాగమైన ఎస్ఆర్–1లో నీరు లేదన్నారు. శ్రీశైలం, వెలుగోడు నుంచి నీరు వస్తేనే చెరువులు నింపగలుగుతామన్నారు. వరికుంట గ్రామంలో తాగునీరు సరఫరా చేయాలని కాశినాయన మండల జెడ్పీటీసీ సత్యంరెడ్డి కోరారు. తహసీల్దార్ కార్యాలయం పక్కన బోరు ఎండిపోయి తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారని పెనగలూరు జెడ్పీటీసీ పెద్ద సుబ్బరాయుడు తెలిపారు. బక్కన్నగారిపల్లె బీసీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దప్పేపల్లె దళితవాడ, ఎం.దళితవాడలో బోర్లు వేశాక నీళ్లు పడ్డాయని, ఇక మోటార్లు ఏర్పాటు చేయాలని లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ కోరారు. శెట్టిపల్లె తూర్పుపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని సంబేపల్లె జెడ్పీటీసీ కోరారు. ఆరుతడి పంటలు వేసుకోవాలి ఎల్నినో నేపధ్యంలో శ్రీశైలం నీటి విడుదల పరిస్థితి ఏంటని జెడ్పీ చైర్మన్ కేసీ కెనాల్ కడప జేఈని ప్రశ్నించారు. అందుకు జేఈ బదులిస్తూ జిల్లాలో 92 వేల ఎకరాల కేసీ ఆయకట్టు ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో కేవలం 45 టీంఎసీలు ఉన్నాయని తెలిపారు. అందుకే రైతులను ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. ● ఖాజీపేట బైపాస్ వద్ద ఆర్అండ్బీ రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, మరమ్మతులు నిర్వహించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించకపోవడంపై జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ● చిలమకూరు–కోనాపురం మధ్య ఏడు కిలోమీటర్ల రహదారి మంజూరైందని, పనులు వెంటనే చేపట్టాలని ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య కోరారు. సీతారాంపురం వెళ్లాలంటే ఘాట్రోడ్డులో ప్రయాణించాల్సి వస్తుందని, అందుకు తగ్గట్లు బస్సులు కండీషన్లో లేవని పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ అన్నారు. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. ● ప్రొద్దుటూరుకు బస్సుల సంఖ్య పెంచాలని కో ఆప్షన్ సభ్యులు కోరారు. కడప–వేంపల్లె మధ్య బస్సులు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి కోరారు. ● గనులు భూగర్బశాఖపై జరిగిన చర్చలో చైర్మన్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సుమారు రూ. 50 కోట్లు సెస్సు రూపంలో జెడ్పీకి రావాల్సి ఉందన్నారు. ఒక మండలంలోని ఒక గ్రామంలో ఎంతమంది చదువు నేర్చుకున్నారో పేర్లతోసహా తనకు ఇవ్వాలని వయోజన విద్య డీడీని చైర్మన్ ఆదేశించారు. పీఎంజీఎస్వై, నాబార్డు పనులకు బిల్లులు వస్తున్నాయా? అంటూ చైర్మన్ ఆరా తీశారు. ఉపాధి హామి, పీఎంజీఎస్వైలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఉపయోగించి రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
ఎన్సీసీతో క్రమశిక్షణ.. సేవాభావం
కడప ఎడ్యుకేషన్ : ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తితోపాటు సేవాభావం పెంపొందుతాయని ఎన్సీసీ క్యాంపు కమాండెంట్ కల్నర్ ఎన్. సూర్యనారాయణమూర్తి తెలిపారు. కడప నగరంలోని తెలుగు గంగ కాలనీలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ ఎన్.సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సీఏటీసీ–5 ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా కొనసాగింది. జూలై 15 నుంచి 24 వరకు పది రోజులపాటు జరుగుతున్న ఈ శిబిరంలో కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నాలుగు జిల్లాల నుంచి టీఎస్సీ (తాల్ సైనిక్ క్యాంప్) రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన క్యాడెట్లకు మ్యాప్ రీడింగ్, ఫైరింగ్ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. అలాగే రిపబ్లిక్ డే క్యాంప్ (డీఆర్సీ) కోసం డ్రిల్, ఫైరింగ్, బెస్ట్ క్యాడెట్ తదితర విభాగాల్లో జరిగే ఎంపికలకు క్యాడెట్లను సన్నద్ధం చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ లలిత్ బాబు, ఏఎన్ఓ శివరాం, సుబేదార్ మేజర్ మాలిక్, సూపరింటెండెంట్ సరస్వతి పాల్గొన్నారు. -
గేట్ ఫలితాల్లో సత్తా
వీరపునాయునిపల్లె: మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన గజ్జల బాలగంగన్నగారి గంగిరెడ్డి, చెన్నమ్మ కుమార్తె గౌరీశ్వరిదేవి గేట్ పరీక్షలో 793వ ర్యాంకు సాధించింది. ఈమె 10వ తరగతి వరకు మైలవరం గురుకుల పాఠశాల, కడప పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్కిక్ కళాశాలలో డిప్లొమా, క్రిష్ణదేవరాయ విశ్వవిద్యాయంలో బీటెక్ పూర్తి చేసింది. గేట్లో ర్యాంకు సాధించిన గౌరీశ్వరిదేవితో గురువారం సాక్షి ముచ్చటించగా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవి మంచి ర్యాంక్ సాధించానని తెలిపారు. బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన భైరవ ట్రాన్స్ఫోర్ట్ అధినేత మహేంద్రారెడ్డి అందించిన ఆర్థిక సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. హక్కుల సాధనకు ఉద్యమమే మార్గం కడప రూరల్ : ఉద్యోగుల హక్కుల సాధనకు ఉద్యమమే మార్గమని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి. రఘురామ నాయుడు అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా వి. రఘురామ నాయుడు ఎన్నికయ్యారు. ఇటీవల కడప నగరంలో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా రఘురామనాయుడుతోపాటు మిగతా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. తన నియామకం పట్ల రఘురామనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. దాడి కేసులో వ్యక్తి అరెస్ట్ పులివెందుల రూరల్: పట్టణంలోని స్ధానిక రజక కాలనీలో మంగళవారం రాత్రి వేట కోడవళ్లతో పరస్పర దాడి ఘటనలో నిందితుడు ఓబులేసును పోలీసులు అరెస్ట్ చేశారు. రజక కాలనీకి చెందిన ఓబులేసు భార్య లింగమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయంలో భార్యాభర్తలు తరుచూ గొడవ పడుతున్నారు. అదే కాలనీకి రవి, మునికాంతమ్మ దంపతులు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించగా.. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కేసులో గురువారం ఓబులేసును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా సీఐ శ్రీరామ్ మాట్లాడుతూ పార్నపల్లె రింగ్ రోడ్డు సమీపంలో సంచరిస్తున్న ఓబులేసును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు తిమోతి, మధుసూదన్రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు. విజిలెన్స్ దాడులు ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మైదుకూరు రోడ్డులో నిర్వహిస్తున్న మసాలా పొడుల ఫ్యాక్టరీపై విజిలెన్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ ఫ్యాక్టరీలో నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేశారు. సుమారు 1500 కిలోల పైగా మసాలా పొడులను అధికారులు సీజ్ చేశారు. వీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపిస్తున్నట్లు సీఐ తెలిపారు. ల్యాబ్లో వచ్చే రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఫ్యాక్టరీకి ఒక చోట అనుమతి తీసుకొని మరో చోట నిర్వహిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. విద్యుత్ మోటార్ల వైర్లు కట్ ఖాజీపేట : విద్యుత్ మోటార్ల వైర్లను దుండగులు కట్ చేశారు. తుడుమలదిన్నె గ్రామంలో గురువారం ఐదు మోటర్ల విద్యత్ వైర్లను దొంగలు కట్ చేశారు. పంటకు నీళ్లు పెట్టేందుకు మోటర్ను ఆన్ చేసేందుకు వెళ్లిన రైతులకు విద్యుత్ తీగలు కట్ అయిన విషయం తెలుసుకొని ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాగే విద్యుత్ తీగలు కట్ చేశారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయాలని రైతులు కోరారు. -
ఎల్నినో సృష్టించే భయంకరమైన నష్టాలు
పశుగ్రాసం కొరత : వర్షధార ప్రాంతాల్లో తీవ్రమైన పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎండిపోయే క్షేత్రాలు : తీవ్రమైన ఎండల ధాటికి పశుగ్రాస క్షేత్రాలు పూర్తిగా ఎండిపోతాయి. పాల దిగుబడి క్షీణత : పశువులకు మేత లేకపోవడంతో పాల దిగుబడి దారుణంగా క్షీణిస్తుంది. ఆర్థిక నష్టాలు : పశుగ్రాసం కోసం బయట ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో రైతులకు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. -
ఉజ్వల భవితకు నవోదయ
● ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల ● ప్రణాళికాబద్ధంగా చదివితే సీటు సొంతం ● జిల్లాలోనే రాజంపేటలో ఏకై క నవోదయ విద్యాలయం రాజంపేట టౌన్ : జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే చాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లే. ఇదిలావుంటే వైఎస్సార్ జిల్లాలో ఒకే ఒక నవోదయ విద్యాలయం ఉంది. దాదాపు 39 సంవత్సరాల క్రితం రాజంపేట మండలం ఆకేపాడు పంచాయతీలోని నారమరాజుపల్లెలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైయింది. ఆరవ తరగతిలో 80 సీట్లను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా జిల్లాలో వేలాది మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రశ్నాపత్రం సరళి కూడా కొంత కఠినతరంగానే ఉంటుంది. ఓ ప్రణాళికాబద్దంగా ఇష్టంతో కష్టపడి చదివితే సీటు సాధించడం పెద్దకష్టం కాదంటున్నారు విద్యావేత్తలు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం కొన్ని దశాబ్దాల క్రితమే దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే రాజంపేటలో నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. క్రమశిక్షణతో మెరుగైన విద్యను అందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. ప్రస్తుతం 2027–2028 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సివుంది. దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు వీరే.. ● ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. ● అలాగే ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదవ తరగతి తప్పనిసరిగా చదివివుండాలి. ● ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా 2026–2027 విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సీటు లభిస్తుంది. ● నోటిఫికేషన్లో పొందు పరిచిన విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి సీట్లు కేటాయిస్తారు. ● గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 75 శాతం, పట్టణ ప్రాంత పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం సీట్ల కేటాయింపు ఉంటుంది. ● గతంలో పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. మొత్తం నూరు మార్కులకు పరీక్ష ఉంటుంది. 80 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మెంటల్ ఎబిలిటి (మేధాశక్తి)కి సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి. ఈవీఎస్కు సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి. గణితంకు సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి. తెలుగు ప్యాసేజీలకు సంబంధించి 25 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 31–7–2026. ప్రవేశ పరీక్ష తేదీ 28–11–2026 httpr://navodaya.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి విద్యార్థులు నాలుగు నెలలు ఆటలు, ఇతర వ్యాపాకాలన్నింటిని పక్కన పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా కష్టపడి చదివితే నవోదయ విద్యాలయంలో సీటు సాధించవచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. టెన్త్లో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎంతటి శ్రద్ద తీసుకుంటారో అంతకన్నా ఎక్కువగా నవోదయ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుని ఒక ప్రణాళికాబద్దంగా చదివిస్తే తప్పక సీటు లభిస్తుంది. నవోదయ విద్యాలయంలో విద్యార్థులు సీటు సాధించాలంటే తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. – లంకాయగారి నాగయ్య, డిప్యూటీ ఈఓ -
బహుధాన్య కిట్ పంటలతో రైతులకు అదనపు రాబడి!
● బహుధాన్య పంటల సాగుతో రైతులకు క్లిష్ట సమయాల్లోనూ గట్టి ఆర్థిక స్వాలంబన చేకూరుతుంది. ● అప్పుడప్పుడు కురిసే అరకొర వర్షాల సహాయంతోనే.. బహుధాన్య కిట్లోని కంది, ఆముదం, ఆనప, జొన్న, పొద్దుతిరుగుడు, అలసంద, గోరుచిక్కుడు వంటి పంటలు సులభంగా సాగు అవుతాయి. ఈ పంటలను చివరి వరకు పొలంలో కొనసాగిస్తే రైతులకు అద్భుతమైన మార్కెట్ ఆదాయం లభిస్తుంది. మధ్యలో సాగు చేసిన పశుగ్రాసాన్ని సొంత పశువుల మేతకు వినియోగించుకున్నా, మిగతా బహుధాన్య పంటల దిగుబడి ద్వారా రైతులకు చేతినిండా అదనపు రాబడి దక్కుతుంది. -
అప్పాజోస్యులకు ‘గడియారం’ పురస్కారం
కడప సెవెన్రోడ్స్: చీరాలకు చెందిన ప్రముఖకవి, అజో–విభొ–కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయినట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో జరుగుతుందన్నారు. 1982 నుంచి ప్రతి ఏటా ఒక ఉత్తమ కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు అవార్డు, రూ.10,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. -
ఎల్నినో పరిస్థితుల్లో పీఎండీఎస్తో కలిగే ప్రయోజనాలు
తేమ నిల్వ : మట్టిలో తేమ శాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. నిరంతర పచ్చదనం : కరవులోనూ భూమిపై పచ్చదనం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉష్ణోగ్రత నియంత్రణ : భూమిపై సూర్యుని విపరీతమైన ఉష్ణోగ్రత ప్రభావం తగ్గుతుంది. భూసార రక్షణ : భూసారం దెబ్బతినకుండా మెరుగుపడుతుంది. పంటల స్థిరత్వం : తక్కువ నీటితోనే పంటల స్థిరత్వం మరియు జీవవైవిధ్యం పెరుగుతుంది. పాడి అభివృద్ధి : పశువులకు నిరంతరం మేత దొరకడం వల్ల పాడి అభివృద్ధి పెరుగుతుంది. -
వృద్ధుడు బలవన్మరణం
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన అంజనప్పగారి నారాయణ (75) బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. అంజనప్పగారి నారాయణ వారం రోజుల క్రితం భార్యతో ఘర్షణ పడి ఇంటికి రాకుండా బయట తిరుగుతుండేవాడు. మూడు రోజుల క్రితం పార్నపల్లె గ్రామ సమీపంలోని మెటిక కోనలోకి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ మేకల కాపరులు ఆయన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. ఎస్ఐ జగదీశ్వరరెడ్డి అంజనప్పగారి నారాయణ మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కుక్కల దాడిలో జింక మృతి ముద్దనూరు: స్థానిక ఫారెస్టు రేంజి పరిధిలోని పెద్దకొమెర్ల గ్రామంలో గురువారం జింకపై కుక్కలు దాడిచేసి తీవ్రగా గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన జింకను స్థానిక డీఆర్వో శ్రీనివాసులు సిబ్బందితో కలిసి వెళ్లి స్వాధీనం చేసుకుని ఎఫ్ఆర్వో కార్యాలయానికి తరలిస్తుండగా మార్గమధ్యలో జింక మృతి చెందిందని డీఆర్వో తెలిపారు. జింకకు పోస్టుమార్టం నిర్వహించి ఎఫ్ఆర్వో ఓబులేసు ఆదేశాల మేరకు దహనం చేసినట్లు డీఆర్వో పేర్కొన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి మైలవరం: మండల పరిధిలోని చిన్న కొమెర్ల గ్రామానికి చెందిన కర్నాటి లక్ష్మీనారాయణమ్మను (35) గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గురువారం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తలమంచిపట్నం ఎస్ఐ హైమావతి వివరాలు మేరకు.. లక్ష్మీనారాయణమ్మ గడ్డి మోపు ఎత్తుకు ని ఇంటికి వస్తుండగా ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు ఆమె భర్త భాస్కర్రెడ్డి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. రూరల్ సీఐ కులాయప్ప సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం కోసం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. -
ప్రారంభమైన ఏసీఏ సౌత్జోన్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే అంతర్ జిల్లాల మూడవ విడత మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు చిత్తూరు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 78.1 ఓవర్లకు 313 పరుగులకు ఆలౌట్ అయింది.ఆ జట్టులోని ఎస్ఎంజి ప్రభాకర్ ప్రభాకర్ 186 బంతుల్లో 21 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 9 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో......... వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు 56.3 ఓవర్లకు 383 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విఖ్యాత్ 100 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో 191 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 33 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ఎస్ఎంజి ప్రభాకర్, చిత్తూరు (113 పరుగులు) విఖ్యాత్, కర్నూలు (191 పరుగులు) -
కన్నేశారు.. కట్టేశారు
● అక్రమదారులకు జీ హుజూర్ అంటున్న అధికారులు ● దువ్వూరులో రోడ్డును మింగేసిన తెలుగు తమ్ముడి అక్రమ నిర్మాణం సాక్షి టాస్క్ఫోర్స్ : అధికార పార్టీ అండ ఉంటే చాలు ప్రభుత్వ నిబంధనలు చుట్టాలుగా మారిపోతాయి. ప్రభుత్వ భూములు సొంత ఆస్తులుగా రూపాంతరం చెందుతాయనడానికి మండల కేంద్రమైన దువ్వూరులో జరుగుతున్న ఈ ఘటనే సజీవ సాక్ష్యం. మండల కేంద్రంలోని సీవీవీ కల్యాణ మండపం పక్కన ప్రభుత్వ రస్తాను, ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఓ టీడీపీ నాయకుడు యథేచ్ఛగా నూతన గదులను నిర్మిస్తున్నాడు. దువ్వూరు రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 462/1లో అసైన్డ్ ల్యాండ్ 62 సెంట్లు ఉంది. ఈ భూమి బాణాల విశ్వజ్ఞ ఆచార్య పేరుతో అడంగల్లో నమోదై ఉంది. భూమిలేని పేద ప్రజలకు ప్రభు త్వం అసైన్డ్ భూములను కేటాయిస్తుంది. కానీ విశ్వజ్ఞ ఆచార్య అనే అతను పుల్లారెడ్డిపేటలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో సీనియర్ లెక్చరర్గా పనిచేస్తూ నెలకు దాదాపు రూ.2లక్షలు ప్రభు త్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు విశ్వజ్ఞ ఆచార్య దగ్గర తాను కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నాడు. దువ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ సర్వే నంబర్కు సంబంధించి 1995 నుంచి 2026 జూన్ వరకు ఈ 31 ఏళ్లలో ఎక్కడా అమ్మకం, కొనుగోలు లావాదేవీలు జరగలేదు. తమకు హక్కు ఉందని ఈ స్థలాన్ని కై వసం చేసుకున్న టీడీపీ నేత రెవెన్యూ కార్యాలయంలోని అధికారులతో 2023లో ఈ భూమిని అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ రికార్డులు సృష్టించాడు. గత సోమవారం ఆర్అండ్బీ రెవెన్యూ అధికారులు దువ్వూ రు పాత జాతీయ రహదారి, మెయిన్ రోడ్డు ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన అధికారులు ఈ అక్రమ కట్టడాలను చూసి నోరు మెదపడం లేదంటే ఆ నాయకుడంటే భయమా? లేక అతనితో లాలూచి పడ్డారా అనే చర్చ జరుగుతోంది. వందేళ్ల కిందట రెవెన్యూ రికార్డు ఆర్ఎస్ఆర్లో రస్తా అనే నమోదైంది.గ్రామంలోని కొంత మంది పెద్దలు దీనిని ఉదయగిరి రస్తా అంటున్నారు. ఎవరైతే మాకేంటి మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే చట్టం అంటూ రోడ్డును ఆక్రమించి రస్తాను, పొలాలకు వెళ్లే కాలువను పూడ్చి వేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడో ఉన్న వ్యక్తికి ఈ స్థలంపై హక్కు ఉందంటూ ఏకంగా పక్కనున్న స్థలానికి గోడ కట్టి అక్రమంగా రూములు నిర్మిస్తుండటం స్థానికంగా దుమారం రేపుతోంది. అధికారులు ఆ నేతకు అనుకూలంగా రికార్డులు మార్చేశారు. నిర్మాణానికి రూట్ క్లియర్ చేశారు. ఆర్ఎస్ఆర్ రికార్డులో స్పష్టంగా రస్తా అని ఉన్నా రాత్రికి రాత్రే అసైన్డ్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అని మార్చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు పోలీస్స్టేషన్ నుంచి మురుగునీటి కాలువలు, రోడ్డు ఆక్రమణపై సర్వే నిర్వహించారు. సర్వే చేస్తున్న ప్రాంతానికి పక్కనే ఉన్న ఈ అక్రమ నిర్మాణం అధికారుల కళ్లకు కనిపించకపోవడం గమనార్హం. సదరు టీడీపీ నాయకుడి ప్రాబల్యానికి లొంగిపోయిన అధికారులు అక్రమ నిర్మాణాల వద్ద మార్కింగ్ వేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వ రస్తా, స్థలాన్ని, కాలువను పూడ్చి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు ఆపి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇన్స్పైర్ మనాక్ నమోదు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇన్స్పైర్ మనాక్ నామినేషన్ నమోదు ప్రక్రియ జూలై 15వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్ ఇన్స్పైర్ యాప్లో ప్రారంభమైందని జిల్లా సైన్సు అధికారి లేబాక బాలాజీ తెలిపారు. డీఈఓ డాక్టర్ షంషుద్దీన్ ఆదేశాల మేరకు బుధవారం కడప గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదుగురు విద్యార్థుల నుంచి వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను నామినేట్ చేయాలని సైన్సు ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ సుబ్బానాయుడు, గంగాధర్, తిరుమల కొండు, మాజీ జిల్లా సైన్సు అధికరి నిత్యానంద రెడ్డి, సర్ సీవీరామన్ సైన్సు క్లబ్ కడప గౌరవాధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు, ఎన్జీసీ కోఆర్డినేటర్ విజయప్రసాద్, వీవీయం కో–ఆర్డినేటర్ క్రిష్ణకిషోర్, తదితరులు పొల్గొన్నారు.


