నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్: స్వర్ణాంధ్ర అంతర్ జిల్లాల సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ గురువారం నుంచి ఈ నెల 14 వరకు కడపలోని వైఎస్ రాజా రెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ సుగాలి మధుసూదన్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్వానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటాయన్నారు. . దివ్యాంగ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఈ పోటీలు నిలుస్తాయని తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి డిగ్రీ చదివి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించాలని పూర్వ విద్యార్థులు, పలు సంఘాల నుంచి, కళాశాల నుంచి అభ్యర్థనలు రావడంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పందించి అనుమతి ఇచ్చారని తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి సబ్జెక్టులు పెండింగ్లో ఉంచుకున్న విద్యార్థులకు ఇదొక అద్భుత అలానే చివరి అవకాశమన్నారు. అలాగే 2015 నుండి 2019 బ్యాచ్లలో 1,2,3,4,5,6 సెమిస్టర్ విధానంలో చదివిన విద్యార్థులు ఆ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 12 నుంచి మార్చి 16 లోపు ఆన్లైన్లో పరీక్ష దరఖాస్తును అప్లోడ్ చేయాలని తెలిపారు. అపరాధ రుసుంతో మార్చి 25వ తేదీ వరకు గడువు ఉందన్నారు. వివరాలకు www.yvuexams.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారిగా ఉప్పాల శరత్ బాబు బుధవారం కడప కలెక్టరేట్ లోని జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు, ఇతర ప్రకతి విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తి నష్టం జరగకుండా కృషి చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈయన 1993 లో కృష్ణాజిల్లా అవనిగడ్డ ఫైర్ ఆఫీసర్గా విధుల్లో చేరారు. 2014లో డీఎఫ్ఓగా పదోన్నతి పొందారు. సత్తెనపల్లెలోని ఏపీ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహించారు. తర్వాత అనంతపురం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా విధులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఏపీ సీఆర్డీఏ లో విధులను నిర్వహిస్తుండగా ఇటీవల వైఎస్సార్ కడప జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. ఆయనను జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారులు యోగీశ్వర్రెడ్డి, బసివి రెడ్డి, జిల్లాలోని ఫైర్ స్టేషన్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కడప సెవెన్రోడ్స్: గ్రంథాలయ మరమ్మతు పనులకు మంజూరు చేసిన నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర సంచాలకులకు పంపాలని బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాశ్ అధ్యక్షతన కడపలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. జిల్లా గ్రంథాలయ పరిధిలోని ఏడు బ్రాంచి లైబ్రరీల్లో ఫ్యాన్లు, లైటింగ్, పెయిటింగ్స్,టేబుళ్లు, ఫర్నీచర్ తదితర పనుల కోసం ప్రభుత్వం రూ. 40,30,000 కేటాయించిందని భానుప్రకాశ్ ఈ సందర్బంగా తెలిపారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతనాలు, పెన్షన్లు, గ్రంథాలయ నిర్వహణ ఖర్చులకు సంబంధించిన తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమోదించారు. వేముల నూతన గ్రంథాలయా న్ని జిల్లా గ్రంథాలయ సంస్థ పేరిట స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు.కార్యక్రమంలో డీఈఓ షంషుద్దీన్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి, డీఎల్పీఓ మస్తాన్వలీ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.అమీరుద్దీన్, పి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్


