గంగమ్మ జాతర.. చూసొద్దాం పద
లక్కిరెడ్డిపల్లి : భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత జాతర రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి మరుసటి రోజున ప్రారంభమై మూడురోజులపాటు జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈనెల 17వ తేదీ రాత్రి చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల, 19న మైల తిరునాల జాతర జరగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఆలయ ప్రాశస్త్యం..
గంగమ్మ తల్లి అనారోగ్యానికి గురైన వారికి అభయమిస్తూ, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ భక్తుల పాలిట కల్ప తరవుగా శోభిస్లుతోంది. అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం, అనంతపురం గ్రామంలో కొలువుదీరి ఉంది. మహాశివరాత్రి ముగిసిన రెండోరోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కస్తూరురాజుగారిపల్లి గ్రామంలోని చాగలగుట్టపల్లి నుంచి గంగమ్మ దేవత ఉత్సవ విగ్రహాన్ని బ్యాండు మేళాల మధ్య అప్పలరాజుగారిపల్లి, మార్లవాండ్లపల్లి, మర్రిచెట్టు, చౌటపల్లిల మీదుగా గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. దారి పొడవునా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. సిద్దులపూజతో సిద్దుల ప్రసాదాన్ని సంతానం లేక వరపడిన మహిళలకు అందజేస్తారు. ఇప్పటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. పూజలతోపాటు, బండలాగుడు పోటీలు, రాత్రికి చాందినీ, కుంకుమ బండ్లు తిప్పుతారు. చెక్కభజన అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా చేయడాన్ని నిండు తిరునాలగా భావిస్తారు. రెండోరోజు మైల తిరుణాల రోజున స్థానిక ప్రాంత భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంతోపాటు సాయంత్రం చాగలగుట్టపల్లె గంగమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తిని అమ్మవారి ఇంటికి చేర్చడంతో తిరునాల పరిసమాప్తం అవుతుంది.
రాయలసీమ ప్రాంతానికే తలమానికం అనంతపురం గంగమ్మ జాతర
ఈనెల 17న చాగలగుట్టపల్లె
అమ్మవారి జాగారం
18న నిండు తిరుణాల,
19న మైల తిరునాల
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
ఈనెల 18, 19వ తేదీల్లో జరిగే శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరలో ఎక్కడికక్కడ తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ఏడాది టోల్గేట్లు వసూలు చేయకుండా జాతరకు వచ్చే దుకాణాదారులకు ఇబ్బందులు లేకుండా చేయగలిగాం.
– సోడి వెంకటేశ్వర్లు, గంగమ్మ ఆలయ చైర్మన్,
లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా
వీఐపీ పాసు రద్దు చేశాం
ఈ ఏడాది వీఐపీ పాసులను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 300లు టికెట్లను తీసుకొచ్చాం. రూ. 100 టికెట్లతోపాటు రూ. 10లు టికెట్లు, ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశాము. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. రెండు రోజులపాటు దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా చూస్తున్నాము. సామాన్య భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
– శ్రీనివాసులు, ఆలయ ప్రత్యేకాధికారి,
అనంతపురం గంగమ్మ ఆలయ, అన్నమయ్య జిల్లా
గంగమ్మ జాతర.. చూసొద్దాం పద
గంగమ్మ జాతర.. చూసొద్దాం పద
గంగమ్మ జాతర.. చూసొద్దాం పద


