Politics
స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కేవలం ఒక్క నెలలోనే తమిళనాడు పాతాళంలోకి పడిపోయే పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. తమిళనాడులో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చు. దీనికి మనం వంద శాతం సిద్ధంగా ఉండాలి’’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్మరో వ్యాఖ్యలు చేశారు. చెన్నైలోని వానగరంలో స్టాలిన్ సమక్షంలో, అన్నాడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు డీఎంకె పారీ్టలో చేరారు. బెంజమిన్ అన్నాడీఎంకేలో చేరి ఎన్నో ఏళ్లుగా నిజాయితీగా పనిచేశారని గుర్తు చేస్తూ, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు,తాను ప్రతిపక్ష వరుసలో కూర్చునేవాడినని, తాము ప్రశ్నలు అడిగే సమయంలో ఎంతో మంది మంత్రులు సమాధానాలు చెప్పేవారని, అయితే, బెంజమిన్ సమాధానం చెబుతున్నారంటే మాత్రం తాము కాస్త అప్రమత్తంగా ఉండేవాళ్లమన్నారు. డీఎంకేలో చేరుతున్నవారంతా పదవుల కోసమో, హోదా కోసమో రాలేదని, సిద్ధాంతమే ముఖ్యం అనే భావనతో వస్తున్నారన్నారు. డీఎంకే బలంగా ఉంటేనే తమిళనాడును కాపాడుకోగలమని నమ్మి ఈ ఉద్యమంలో చేరుతున్నారన్నారు. పాతాళంలోకి తమిళనాడు గతంలో తాము చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమిళనాడు పాతాళానికి నెట్టబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కొత్త ప్రభుత్వాన్ని నమ్మి తమిళనాడుకు రావడానికి పెట్టుబడి దారులు భయపడుతున్నారన్నారు.నేరాలు మరింతగా పెట్రేగి ఉన్నాయని పేర్కొంటూ, రాష్ట్రంలో అద్వన్నపు పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు రావచ్చు అని వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ, పార్టీ విజయానికి ఈ నిమిషం నుంచే కష్టపడటం ప్రారంభిద్దాం, శ్రమిద్దాం, పనిచేద్దాం అని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు నిచ్చారు.
కూటమికి మరో కొత్త చిక్కు.. ఎల్లో మీడియా బొక్కబోర్లా!
రాజకీయాలలో కొన్నిసార్లు మనం ఏదైతే పాజిటివ్ అనుకుంటామో, అదే నెగిటివ్ అవుతుండవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అలాంటి ఒక చిక్కునే ఇప్పుడు ఎదుర్కుంటున్నది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తన కార్యాలయాల కాంప్లెక్స్లు నిర్మించడానికిగాను 2534 కోట్లు మంజూరు చేసింది. ఇది మంచిదే. దీనిని వరంగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది.అమరావతిలోనే కేంద్రం ఈ భవనాలు నిర్మించబోతోందని, దానికి గాను డబ్బు కూడా వస్తుందని ఆ మీడియా ఎగిరి గంతేసింది. దానికి అభ్యంతరం లేదు. అయితే కేంద్రం నిర్మాణ వ్యయానికి, రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న ఖర్చుకు మధ్య హస్తిమశకం అంత అంటే దాదాపు నాలుగురెట్ల తేడా ఉండడంతో కూటమి పెద్దలకు తల బొప్పి కట్టినంత పని అవుతోంది. గుక్క తిప్పుకోలేని పరిస్థితిగా మారింది. దీనిపై వివరణ ఇవ్వలేక ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది.నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో తన కార్యాలయాలకోసం భవనాలు నిర్మించుకుంటుంది. ఉమ్మడి ఏపీలో రాజధాని హైదరాబాద్లో కేంద్రం ఎప్పుడో సెంట్రల్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసుకుంది. అలాగే ఆర్బీఐ శాఖను, ఇతర ముఖ్యమైన ఆఫీస్లను ఏర్పాటు చేసుకుంది. అదేమీ కొత్త విషయం కాదు. అమరావతిలో సైతం ఇలాగే బిల్డింగ్ల నిర్మాణానికి 2018లోనే సుమారు 25 ఎకరాల భూమిని కేంద్రం తీసుకుంది. దానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేయగా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే కేవలం పాతిక ఎకరాల విస్తీర్ణంలో సుమారు 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను కేంద్రం చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టింది.కేంద్ర ప్రభుత్వం తన ఆఫీస్లను ఐదున్నర ఎకరాలలో నిర్మిస్తోంది. ఇందుకోసం 1299 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది. అంటే చదరపు అడుగుకు 5567 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. అలాగే సిబ్బంది నివాసాలకుగాను 17 ఎకరాలలో 1234 కోట్లే వెచ్చించబోతున్నారట. చదరపు అడుగుకు 3945 రూపాయలు అవుతుందన్నమాట. కేవలం పాతిక ఎకరాలలోనే కేంద్రం ఇంత భారీ భవంతులు నిర్మిస్తున్నప్పుడు ఏపీ ప్రభుత్వం వేల ఎకరాలలో నిర్మాణాలు అంటూ హడావుడి ఎందుకు చేస్తోంది? రైతుల నుంచి బలవంతంగా వేల ఎకరాల భూములు సేకరించడానికి ఎందుకు ప్రయత్నిస్తోంది? అన్నది ఒక పాయింట్ అయితే చదరపు అడుగుకు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇరవైవేల రూపాయలకు పైగా వ్యయం చేయబోతున్నట్లు వార్తలు సూచిస్తున్నాయి. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది.మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ విషయాన్ని అంగీకరించారు. తమవి ఐకాన్ భవనాలు కనుక అంత వ్యయం అని ఆయన సమర్థించుకునే యత్నం చేశారు. హాపీ నెస్ట్, గెజిటెడ్ అధికారుల భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు నాలుగువేల రూపాయల లోపే ఖర్చు అవుతోంందని అంటున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సచివాలయ భవనాలను నిర్మిస్తున్నందున వ్యయం ఎక్కువగా కనిపిస్తోందని, నాణ్యత, ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. అంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న ఇతర భవనాలు అంత నాణ్యత ఉండవని ఆయన అంటున్నారా? ఎంత ఐకానిక్ భవనాలు అయినా చదరపు అడుగుకు 20వేల రూపాయల స్థాయిలో ఖర్చు అవసరమా? అంటే ఎవరు జవాబు ఇవ్వాలి.ఏపీ ప్రభుత్వం సచివాలయ భవనాల అద్దాలకు పెట్టే 2500 కోట్లతో కేంద్రం మొత్తం బిల్డింగ్ లనే పూర్తి చేస్తుందన్నమాట. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వ్యయం చేస్తోందన్న విషయం అందరికి తెలిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం బిల్డింగ్లు కట్టడం తమకు పాజిటివ్ అవుతుందని, గొప్పగా ప్రచారం చేసుకోవచ్చని అనుకుంటే, అది కాస్త చంద్రబాబు ప్రభుత్వానికి నెగిటివ్గా, తమ గుట్టు మొత్తం బయటపెట్టేదిగా మారిందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా నానా పాట్లు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఖర్చు తేడాపై ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయారు.ఎనిమిదివేల మంది ఉద్యోగులకుగాను కేవలం రెండు టవర్లు కేంద్రం నిర్మించాలని తలపెట్టింది. ఏపీ సచివాలయానికి సంబంధించి మూడువేల మంది సిబ్బంది ఉంటారేమో! ఇతరత్రా శాఖల హెడ్ ఆఫ్స్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సంఖ్యను తీసకున్నా మరో నాలుగైదువేల మంది ఉంటారేమో తెలియదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో సిబ్బంది అంతా ఒకే చోట ఉండవలసిన అవసరం లేదు. పైగా వర్క్ ఫ్రం హోమ్ వంటివాటిని ప్రవేశపెట్టాలని కూడా గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. ఈ పరిస్థితిలో 39 అంతస్తుల టవర్లను నాలుగింటిని, 49 అంతస్తుల టవర్ ఒకదానిని 1500 ఎకరాలలో అమరావతిలో ఎందుకు నిర్మిస్తున్నట్లో ఎవరికి అంతుపట్టదు.అలాగే అసెంబ్లీ భవనం కూడా పార్లమెంటు కన్నా పెద్దదిగా ఉంటుందేమో తెలియదు కాని, ఖర్చు మాత్రం పార్లమెంటు భవన వ్యయాన్ని మించి పోతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే రాష్ట్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని కేంద్రమే పరోక్షంగా చెప్పినట్లు అనిపించడం లేదా! అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే స్థితిలో ఉన్న రాష్ట్రం ఈ రకంగా భారీగా ధన దుర్వినియోగం చేయడం కరెక్టేనా అన్న ప్రశ్న వస్తుంది. ఒక్క సచివాలయ భవనాలకే కాదు.. అసెంబ్లీ, హైకోర్టు, ఉన్నతాధికారుల నివాసాలు ఇలా ఏవి చూసుకున్నా ఖర్చు తడిసి మోపెడు అవుతోందన్నమాట.హైకోర్టు ప్రాంగణంలో సదుపాయలకోసం 500 కోట్లు, సచివాలయాల మౌలిక సదుపాయాలకు 2900 కోట్లు.. ఇలా రకరకాల రూపాలలో ఖర్చు చేయడం అవసరమా? విశేషం ఏమిటంటే కేంద్రం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిలో తన భవన నిర్మాణాలు చేపడుతోందని ఎల్లో మీడియానే రాసింది. అలాంటప్పుడు రాష్ట్రం నిర్మించే భవనాల ప్రత్యేకత ఏమి ఉంటుంది? మరో సంగతి చెప్పాలి. తెలిసి, తెలిసి ఎవరైనా వరదలు వచ్చే ప్రదేశాలలో నిర్మాణాలు చేపడతారా? భూమి స్వభావం భారీ భవంతులకు అంత అనువు కాదని నిపుణులు చెబుతున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.అంతా కలిపి ఏభై కిలోమీటర్ల దూరం ఉంటుందో, ఉండదో కాని, ఇక్కడ వాగులపై 69 వంతెనలు నిర్మిస్తామని మంత్రి నారాయణ స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ఇది వరద ప్రాంతం అని, ఇక్కడ రాజధాని నిర్మాణాలు వద్దని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిందని గతంలో ఒకసారి ఈయనే వెల్లడించారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్ పలు సందేహాలు వ్యక్తం చేసినా, ఈ టరమ్లో మాత్రం కేంద్రంలోని ప్రభుత్వ ప్రభావంతో అదే బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వివిధ ఆర్థిక సంస్థలు అన్నీ కలిపి ఇప్పటికే 47వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణం అంతా రాష్ట్ర ప్రజలంతా భరించాల్సిందే. ఈ వ్యయ ప్రయోజనం మాత్రం 30 గ్రామలవారికే అధికంగా ఉంటుందన్న అభిప్రాయం ప్రజలలో నెలకొంది.ఇది ఇలా ఉండగా, ఏపీ కూటమి సర్కార్ కనీస నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. తాము అడిగినట్లు భూములు ఇవ్వాల్సిందేనంటూ ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులను ప్రభుత్వం వేదిస్తోంది. ఉండవల్లి ప్రాంత రైతులు సభలు పెట్టుకుని ఈ అంశంపై పోరాడుతున్నారు. వారు ప్రపంచ బ్యాంకుకు ఒక ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం భూముల విలువకు సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే సమయంలో తక్కువ చేసి చూపుతున్నారని, అప్పులు పొందడానికి మాత్రం పలు రెట్ల మేర అధికంగా చూపిస్తున్నారని వారు వివరించారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ అధికారులు సీ.ఆర్.డీ.ఏ ని కోరుతూ లేఖ రాశారట.ప్రపంచ బ్యాంక్కు ఇచ్చిన నివేదికలో గజం నలభైవేల నుంచి ఏభైవేల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఎకరం ఏకంగా 25 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని, కాని తమకు భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడానికి ఎకరా విలువ 25 లక్షల రూపాయలుగా చెబుతున్నారని ఆ రైతులు ప్రపంచ బ్యాంక్కు ఫిర్యాదు చేశారు. నిజానికి 2014 టైమ్ నాటికే ఉండవల్లిలో భూముల విలువ రెండున్నర కోట్లు ఉండగా, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పది కోట్ల నుంచి 30 కోట్లు ధర పలుకుతోందని రైతులు తెలిపారు.దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. అప్పులు తీసుకోవడానికి అధిక విలువ చూపించే ప్రభుత్వం రైతులకు పరిహారం విషయంలో మాత్రం అతి తక్కువ రేటు చూపుతోందనే కదా! ప్రభుత్వం కనీస నిజాయితీగా లేదనే కదా రైతుల ఆరోపణ. తమ పంతం నెరవేర్చుకునేందుకు రైతులను ఇలా నష్టపరుస్తారా? ఒకవైపు కేంద్రం నిర్మాణ ధరలకన్నా నాలుగు రెట్లు ఎక్కువ వ్యయం చేయడం, మరో వైపు దారుణమైన రీతిలో తక్కువ ధరకు రైతుల భూములు కొట్టేయాలని చూడడం ఏ పాటి ధర్మం అవుతుంది?-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
కార్పొరేషన్లు గెలవాలి.. కాంగ్రెస్ను దించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను గద్దె దించడమే ధ్యేయంగా వచ్చే రెండున్నరేళ్లపాటు యావత్పార్టీ ముందుకు సాగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా ఎంపీలు మొదలు అన్ని స్థాయిల వారు తమ పరిధులు, క్షేత్రాల్లో పోరాడి, ఎక్కడికక్కడ ప్రజల మద్దతును కూడగట్టాలన్నారు. ఆదివారం రాత్రి బీజేపీ కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జరగబోయే ప్రతీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. పట్టణ ప్రాంతాల్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలోని ప్రతి గడపకు తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, ప్రజల పురోగతి కోసం అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై వెంటనే యువమోర్చా ఆధ్వర్యంలో రోడ్డెక్కి విద్యార్థి, యువత మద్దతును కూడగట్టే దిశలో కార్యాచరణను ప్రారంభిస్తుందని ప్రకటించారు.రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తిస్థాయిలో సహకరిస్తే..తెలంగాణ ఏర్పడ్డాక గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా చిదిమేశాయని మండిపడ్డారు. ప్రధానంగా నీటిపారుదల రంగంలో భారీ అవినీతికి తెరతీసి తెలంగాణలోని బీడుబారిన పొలాలకు సాగునీరు చేరకుండా అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. నెల రోజుల్లో వాతావరణం మారాలి: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. నెల రోజుల్లో ఆ వాతావరణం క్రియేట్ చేయాలి. ఎవరో వస్తారు కాదు. మీరు ఒక నేరేటివ్ క్రియేటివ్ చేయాలి. మీరు అది క్రియేట్ చేశాక అప్పుడు హైకమాండ్ నుంచి ఏం చేయాలో అది చేస్తాం. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్కోప్ ఉంది. కులపిచ్చి బంద్ చేయండి..మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదు. ఇకనైనా మారండి. పార్టీ ఫస్ట్..లీడర్ నెక్టŠస్. ఎవరు ఏం చేస్తున్నారో నాకు ఐడియా ఉంది. కష్టపడి పని చేయండి. ఐక్యంగా ముందుకు సాగాలి. నేను గతంలో తెలంగాణలో పర్యటించాను. నాకు కొంత ఐడియా ఉంది. ఇవాళ తేదీ గుర్తు పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇది గుర్తు చేసుకోవాలి’ అని నితిన్నబిన్ చెప్పారు. ఆదివారం ఆయన పాల్గొన్న మూడు సమావేశాల్లోనూ దశాబ్దాలుగా తెలంగాణతో బీజేపీకున్న అనుబంధం, కార్యకర్తల త్యాగం, బలమైన కేడర్ తదితరాలను ప్రస్తావించారు. మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని, అక్కడి నుంచి ఊట్పల్లిలో రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయం, మరో 8 జిల్లాల ఆఫీస్లను వర్చువల్గా ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోని పోలింగ్ బూత్ల అధ్యక్షులను ఉద్దేశించి ప్రసంగించారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఘట్కేసర్లోని వీబీఐటీ క్యాంపస్లో ‘స్టూడెంట్స్ అండ్ యూత్ కాన్క్లేవ్’లో యువత, విద్యార్థులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి భువనగిరి మీదుగా వరంగల్కు చేరుఒని, మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలోని అశోక కన్వెన్షన్లో గిరిజన, ఆదివాసీ నాయకులతో, సాయంత్రం 4 గంటలకు వరంగల్లోని ఆర్ట్స్కాలేజీ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో భేటీ జరగనుంది. రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారు.
మేం సిద్ధం.. మీరు సిద్ధమా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ పాలన, దేశంలో 12 ఏళ్ల బీజేపీ పాలన, మేనిఫెస్టోలపై చర్చించేందుకు తాము సిద్ధమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమం, ఆత్మ బలిదానాలపై కూడా చర్చిద్దామని, ప్రజలకు ఎవరేం చేశారో తేల్చుకుందామని అన్నారు. ‘మీరు స్పీకర్కు లేఖ రాయండి.. అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహిద్దాం. ఎన్ని రోజులైనా చర్చిద్దాం.. ఇందుకు మీరు సిద్ధమా..’ అని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2034 వరకు మాదే అధికారం.. ‘మా ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ఏమీ చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ శుక్రాచార్యుడిలా ఫామ్హౌస్లో ఉంటే కేటీఆర్, హరీశ్లు బిల్లారంగా తరహాలో తెలంగాణలో తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం పోవాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రజలు అలా ఏమీ కోరుకోవడం లేదు. వారి కుటుంబం, వారికి సంబంధించిన వారే కోరుకుంటున్నారు. సింగరేణిలో టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే ఆరోపణలు చేశారు. వారు ఎన్ని నాటకాలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. వారు సామాజికంగా బీఆర్ఎస్ను బహిష్కరించారు. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. పదేళ్లు వెనక్కు తిరగకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాం. మాకు ప్రజలు అండగా ఉండాలి..’ అని సీఎం కోరారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి త్యాగాలను ఏమనాలి? ‘బీఆర్ఎస్ త్యాగాల పునాదులపై తెలంగాణ వచ్చిందన్నారు. మీవి త్యాగాలా? ఆ పేరుతో రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చి కలెక్షన్లు చేశారు. మీరు చేసినవే త్యాగాలంటే.. కొండా లక్ష్మణ్ బాపూజీ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన త్యాగాలను ఏమనాలి? 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ మంత్రి పదవి తీసుకోలేదు. మలి దశ ఉద్యమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవి వదిలేసి, నల్లగొండ గడ్డపై తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తెలంగాణ వచ్చాకే పదవి తీసుకుంటానని ప్రతినబూని వచ్చాకే మళ్లీ మంత్రి పదవి తీసుకున్నారు. రూ.100 పెట్రోలు తెచ్చుకుని 1 రూపాయి అగ్గిపెట్టె తెచ్చుకోలేని హరీశ్రావుది త్యాగమా? శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యలది త్యాగమా? అగ్గిపెట్టె హరీశ్రావు ఆర్థిక మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు తెలంగాణ అప్పులు రూ.69 వేల కోట్లు ఉంటే బీఆర్ఎస్ పాలనలో రూ.8.11 లక్షల కోట్లకు పెంచారు. అలాంటి వారి దోపిడీని ప్రజలు ఇంకా సహించాలా? పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించిన మిమ్మల్ని ఏమనాలి?..’ అని రేవంత్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపు మంట ఎందుకు? ‘రూ.16 వేల కోట్లు పెట్టి పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ ఏం తింటున్నారో, తండాలో ఉండే గిరిజన బిడ్డలు కూడా ఆ సన్న బియ్యమే తింటున్నారు. బీఆర్ఎస్ నేతలకు డౌటు ఉంటే తండాలు, గూడేలకు వెళ్లి సన్న బియ్యం తింటున్నారో? లేదో? చూసి రావాలి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. మేము రెండున్నరేళ్లలో 4.5 లక్షల ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతోంది. పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు కట్టుకున్న వారికి కడుపుమంట ఎందుకు? తండ్రి, కొడుకు, అల్లుడికి ఫామ్ హౌస్లు, పదవులు తప్ప ప్రజల గురించి ఆలోచనే లేదు. పరీక్షలు పెట్టి పేపర్లు అమ్ముకుని వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు..’ అని సీఎం దుయ్యబట్టారు. వందలాది అంబేడ్కర్లు తయారు కావాలి ‘మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. యంగ్ ఇండియా స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పేద బిడ్డ పెద్ద చదువులు చదవాలి. వందల మంది అంబేడ్కర్లు తయారు కావాలి. అడ్డు పడితే మూసీలో వేసి తొక్కుతా.. మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. ఎవరు అడ్డు పడినా మూసీలో వేసి తొక్కుతా. మోదీ సబర్మతే కాదు..ఢిల్లీ యమునా కాదు.. యోగి గంగా నది కాదు.. దేశానికి ఎవరొచ్చినా మూసీ ప్రక్షాళన చూడటానికే రావాలనేలా, దేశానికే తలమానికంగా ఉండేలా మూసీని ప్రక్షాళన చేస్తా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి కృష్ణా జలాలను నల్లగొండ గడ్డపై పారించి రైతులకు సాగునీరు అందిస్తా. డిండి ఎత్తిపోతలను కూడా పూర్తి చేస్తా..’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చరిత్రలో మొదటిసారిగా..: భట్టి దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రూ.23 వేల కోట్లతో రోడ్ల పథకాన్ని ప్రారంభించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో మొత్తంగా రూ. 90 వేల కోట్లతో రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణ భవిష్యత్కు అద్భుతమైన పునాదులు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అహంకారంతో ప్రజలను హింసించిందని, తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. మొదటి వరుసలో నల్లగొండ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, రాష్ట్రంలో నల్లగొండ జిల్లా మొదటి వరుసలో ఉందన్నారు. ఒక్క యాసంగి సీజన్లోనే 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ.19,013 కోట్లు వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.79,886 కోట్లు వేశామని తెలిపారు. ఏపీలో రూ.3 వేల కోట్లు..ఇక్కడ రూ.26 వేల కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఆర్అండ్బీ శాఖ పరిధిలో రూ.3 వేల కోట్లతో రోడ్డు పనులు చేస్తుంటే రాష్ట్రంలో రూ.6 వేల కోట్లతో చేస్తున్నామని చెప్పారు. దానికి అదనంగా రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.7 వేల కోట్లతో హ్యామ్ రోడ్లు, శాఖాపరంగా అన్నీ కలిపి రూ.26 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీ డి్రస్టిబ్యూటరీ పనులతో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, దాన్ని వెంటే బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్లు సిద్ధమయ్యాయని, అవీ కలిపితే రోడ్ల పనులు దాదాపు రూ. 80 వేల కోట్లకు చేరతాయని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు.. టెండర్లు ఓపెన్ చేయకుండానే స్కామ్లు జరిగాయని ఆరోపించడం దురదృష్టకరమన్నారు. ‘ఇప్పుడు టెండర్లు తెరిచాం. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. గతంలో మీరు చేసినప్పటి రేట్లు ఇప్పటి రేట్లు చూసుకోవాలి’ అని ఆయన హితవు పలికారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తదితరులు మాట్లాడారు.
Sports
చిక్కుల్లో పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్
పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్, అతడి తండ్రి శైలేష్ సింగ్పై భోపాల్ నగరంలో క్రిమినల్ కేసు నమోదైంది. ఇంట్లో వంటమనిషే వారిపై కేసు పెట్టాడు. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ను శైలేష్ ఇంట్లో వంటమనిషిగా కుదిర్చారు.నెలకు రూ.15 వేల జీతంతో పాటు వసతి, భోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన శైలేష్ తన పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే పని ప్రారంభించిన కొద్ది రోజులకే శశాంక్, శైలేష్ తన వంటపై ఫిర్యాదు చేస్తూ, తరచూ దుర్భాషలాడేవారని విపేంద్ర ఆరోపించాడు. దీంతో పని మానేసి స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.ఆ సమయంలో శశాంక్, అతడి తండ్రి తనపై దాడి చేశారని, ఇంట్లోనే బంధించి బలవంతంగా పని చేయించారని విపేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో శైలేష్ డ్రైవర్ కూడా పాల్గొన్నట్లు ఆరోపించాడు. తన మొబైల్ ఫోన్ను కూడా లాక్కున్నారని పేర్కొన్నాడు.ఫిర్యాదు అనంతరం పోలీసులు బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ముఖం మరియు శరీరంపై గాయాల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ప్రాథమిక ఆధారాల ఆధారంగా శశాంక్ సింగ్, శైలేష్ సింగ్లపై కేసు నమోదు చేశారు.పోలీసులు బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడడం, ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, ఒకే ఉద్దేశంతో పలువురు కలిసి నేరానికి పాల్పడడం వంటి ఆరోపణలను నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్రికెట్ పరంగా చూస్తే, శశాంక్ సింగ్కు 2026 ఐపీఎల్ సీజన్ నిరాశాజనకంగా సాగింది. తొమ్మిది ఇన్నింగ్స్ల్లో అతడు కేవలం 132 పరుగులు మాత్రమే చేయడంతో పాటు ఫీల్డింగ్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదవడం అతని ఐపీఎల్ భవిష్యత్పై అనిశ్చితిని పెంచింది.
భారత జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు
జపాన్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.స్టార్ ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఎంపికైంది. ఈ జట్టులో 17 ఏళ్ల వికెట్కీపర్ బ్యాటర్ జి కమిలిని ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. యస్తికా భాటియా స్థానంలో కమిలిని జట్టులోకి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన భారత జట్టులో ఇదొక్కటే మార్పు.కమిలిని ఇటీవల సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఆమెకు ఆసియా క్రీడల బెర్త్ దక్కేలా చేసింది. దీనికి ముందు అండర్-19 ప్రపంచకప్లోనూ కమిలిని రాణించింది. ఈ ప్రదర్శనల కారణంగా డబ్ల్యూపీఎల్ బెర్త్ కూడా దక్కించుకుంది. 2025 వేలంలో కమిలినిని ముంబై ఇండియన్స్ రూ. 1.6 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ వేలానికి ముందు మరోసారి కొనసాగించింది.కాగా, ఆసియా క్రీడల్లో భారత్ మరోసారి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. హాంగ్ఝౌ వేదికగా జరిగిన గత క్రీడల్లో టీమిండియా స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పురుషుల విభాగంలోనూ టీమిండియానే గోల్డ్ గెలుచుకుంది.ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు..హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), జి కమలిని (వికెట్కీపర్), భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి), రాధా యాదవ్, నందిని శర్మ
చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్
తాజాగా ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై టెస్ట్ సిరీస్లో ఓడించిన (2-1) న్యూజిలాండ్ జట్టు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సిరీస్ గెలుపు ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్కు కూడా ప్రత్యేక కీర్తి తెచ్చి పెట్టింది.ఈ సిరీస్లో న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా పుంజుకొని ఆతర్వాత రెండు టెస్ట్లు గెలిచింది. తొలి టెస్ట్ కోల్పోయి, ఆతర్వాత సిరీస్ గెలవడం న్యూజిలాండ్కు ఇదే మొదటిసారి.ఈ గెలుపు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్కు మరో ఘనత కూడా తెచ్చిపెట్టింది. ఈ శతాబ్దంలోనే (21వ) ఇంగ్లండ్ సహా భారత్ను వారి సొంత ఇలాకాల్లో ఓడించిన మొదటి విదేశీ కెప్టెన్గా టామ్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఆరో కెప్టెన్గా నిలిచాడు.టామ్ 2024లో భారత్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి చరిత్రపుటల్లో నిలిచాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై 3 మ్యాచ్ల సిరీస్లో వైట్ వాష్ చేయడం ఏ విదేశీ కెప్టెన్కైనా ఇదే తొలిసారి.అలాగే 1999 తర్వాత ఇంగ్లండ్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఉన్న టెస్ట్ సిరీస్ను గెలవడం కూడా న్యూజిలాండ్కు ఇదే మొదటిసారి.వాస్తవానికి ఈ సిరీస్ విజయం న్యూజిలాండ్కు అంత సులభంగా ఏమీ దక్కలేదు. తొలి టెస్ట్ ఓటమి తర్వాత స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రిటైర్డ్ కాగా.. సిరీస్ డిసైడర్ అయిన మూడో టెస్ట్కు కీలక బౌలర్లు మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్ అందుబాటులో లేరు.ఇంగ్లండ్పై సిరీస్ గెలుపుతో న్యూజిలాండ్కు మరో సానుకూల అంశం కూడా తెలిసొచ్చింది. ఈ గెలుపుతో ఆ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టినలో మూడో స్థానానికి దూసుకొచ్చింది.ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో న్యూజిలాండ్ 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లండ్ తడబడి 212 పరుగులకే ఆలౌటై, 160 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
దూసుకొచ్చిన న్యూజిలాండ్
ట్రెంట్ బ్రిడ్జ్లో ఇంగ్లండ్పై న్యూజిలాండ్ అద్భుత విజయం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ గెలుపుతో సిరీస్ను సైతం చేజిక్కించుకున్న న్యూజిలాండ్ (2-1తో), టేబుల్లో టాప్-3లోకి ప్రవేశించింది.యాషెస్ ఆధిపత్యం, వెస్టిండీస్పై క్లీన్ స్వీప్ తర్వాత ఆస్ట్రేలియా 87.50 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో డిఫెండింగ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికా (75) నిలిచింది. తాజా విజయం తర్వాత న్యూజిలాండ్ 72.22 పాయింట్ల శాతంతో మూడో స్థానానికి దూసుకొచ్చింది.పాకిస్తాన్పై సంచలన విజయాల తర్వాత బంగ్లాదేశ్ నాలుగో స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 58.33 పాయింట్ల శాతం కలిగి ఉంది. భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక ఆరులో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత కూడా ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలబడింది.తాజాగా శ్రీలంకపై భారీ విజయం సాధించిన తర్వాత కూడా వెస్టిండీస్ ర్యాంకింగ్లో మార్పు లేదు. ఆ జట్టు ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది. చివరిగా పాక్ తొమ్మిదో స్థానంలో తిష్ట వేసి కూర్చుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే.. ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోటీ ఉండే అవకాశం ఉంది.
National
స్టాలిన్ అలా అనకపోయి ఉంటే... ఇదంతా జరిగేదా?
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరగబోతోందా? అధికారంలోకి వచ్చిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే సీఎం జోసెఫ్ విజయ్ కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీశారు. డీఎంకేను పూర్తిగా ఒంటరి చేయడమే లక్ష్యంగా దాని మాజీ మిత్రపక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుధవారం జరగనున్న కీలక సమావేశం తమిళ రాజకీయాల దిశనే మార్చే అవకాశముందనే చర్చ సాగుతోంది.సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన మిత్రపక్షాలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK), సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం (MDMK) వంటి పార్టీలను ఆహ్వానించారు. వీటిలో చాలా పార్టీలు గతంలో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగస్వాములే కావడం గమనార్హం.అధికారికంగా డీఎంకేకు గుడ్బై?ఈ సమావేశానికి ముందే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న విడుతలై చిరుతైగళ్ కట్చి (VCK) అధినేత తిరుమావళవన్ పార్టీ అధికారికంగా డీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే ప్రభుత్వానికి VCK మద్దతు ప్రకటించినప్పటికీ, ఇప్పుడు అధికారికంగా డీఎంకేతో బంధం తెంచుకోవడం పెద్ద రాజకీయ పరిణామంగా భావిస్తున్నారు.డీఎంకే మాజీ మిత్రులంతా విజయ్ వైపు?ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇటీవల వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకేతో దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలికింది. అయితే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డీఎంకేతోనే కొనసాగుతున్నారు. ఇక సీపీఐ, సీపీఎం వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.సెక్యులర్ ఫ్రంట్కు శ్రీకారంవిజయ్ నేతృత్వంలో కొత్త "సెక్యులర్ కూటమి" ఏర్పాటు దిశగా ఈ సమావేశం తొలి అడుగుగా భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా.. ప్రభుత్వాన్ని మరింత స్థిరంగా ఉంచడం, మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం, భవిష్యత్ స్థానిక సంస్థలు, ఉపఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే వ్యూహంపై చర్చించే అవకాశముంది.స్టాలిన్ వ్యాఖ్యలే కారణమా?ఇటీవల డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ "తమిళనాడులో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాతే విజయ్ మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రక్రియ వేగం పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టడంతో పాటు, డీఎంకే మాజీ మిత్రులంతా తమవైపే ఉన్నారనే సంకేతాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని అత్యంత ప్రాధాన్యంగా నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో "స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే... విజయ్ ఇంత వేగంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదిపేవారా?" అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్న విజయ్ టీమ్..ఈ కీలక సమావేశానికి హాజరుకావాలని టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున్ స్వయంగా వివిధ పార్టీల అగ్రనేతలను కలిసి ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా వీసీకే అధినేత తిరుమావళవన్తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకేకు ఇది పెద్ద రాజకీయ సవాలేనా?2019 నుంచి వరుసగా మూడు ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమే తమిళ రాజకీయాలను శాసించింది. కానీ ఇప్పుడు అదే కూటమిలోని భాగస్వాములు ఒక్కొక్కరుగా విజయ్ వైపు చేరడం సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీగానే మిగులుతుందా? లేక కొత్త రాజకీయ ఫ్రంట్కు అధికారిక శ్రీకారం చుడుతుందా? అన్నది ఒక ప్రశ్న అయితే... స్టాలిన్ చేసిన ఒక్క వ్యాఖ్యే ఈ మొత్తం రాజకీయ వేగానికి కారణమైందా? అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అంతే ఆసక్తిగా చర్చనీయాంశమవుతోంది.
రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్!
న్యూఢిల్లీ: వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న రూపాలీ దీక్షిత్ అనే మహిళా ప్రయాణికురాలిని చూసి రైల్వే ట్రాక్పై నిలుచున్న ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జూన్ 29న దంకుని(పశ్చిమ బెంగాల్) జంక్షన్ వైపు రైలు వెళ్తున్న సమయంలో, రైలు గేటు దగ్గర నిలబడిన ఆమెకు సదరు వ్యక్తి అసభ్య సైగలు చేశాడు. దీనిని గమనించిన ఆ మహిళ వీడియో తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా రైల్వే శాఖ, ‘రైల్ మదద్’, ‘ఆర్పీఎఫ్’ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై రైల్వే రక్షణ దళం తక్షణమే స్పందించి, తదుపరి చర్యల కోసం కేసును హౌరా డివిజన్కు బదిలీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆర్పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. తుది నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి చర్యను పలువురు తీవ్రంగా ఖండించగా, కొందరు నెటిజన్లు బాధితురాలి ప్రయాణ విధానాన్ని ప్రశ్నిస్తూ విమర్శలకు దిగారు. అయితే దుస్తులు లేదా నిలబడే స్థలాన్ని బట్టి మహిళలపై వేధింపులను సమర్థించలేమని మరికొందరు ప్రయాణికులు, నెటిజన్లు అంటున్నారు. Today I was travel in Vivek Express when I Stand at coach door ,this guy behave badly and giving me sign of Sexual .He was Travelling in a 15228- SMVT Express in 2nd General coach from Engine and now he was reaching to Dankuni Jn.@RailMadad @RailMinIndia @RailwaySeva @RPF_INDIA pic.twitter.com/bMp4J61Czg— Rupali Dixit 🇮🇳 (@GhumakkadLaali) June 29, 2026
లోహగఢ్ కోటకు అమాంతం పెరిగిన రద్దీ
ఒక విషాద ఘటన.. ఇప్పుడు ఓ పర్యాటక ప్రాంతాన్ని కొత్త కారణంతో వార్తల్లోకి తెచ్చింది. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అదే ఘటన జరిగినట్లు ప్రచారంలోకి వచ్చిన మహారాష్ట్రలోని లోహగఢ్ కోటకు ఇప్పుడు పర్యాటకుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కేతన్ను తోసేశారని చెబుతున్న ప్రదేశాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.కేతన్ అగర్వాల్ హత్య కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత లోహగఢ్ కోటకు వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు స్థానికులు, టూరిజం వర్గాలు చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రద్దీ దాదాపు 25 శాతం పెరిగినట్లు సమాచారం. ఈ కేసులో నిందితురాలు సియా అనే యువతి పేరు పదేపదే వినిపించడంతో.. కేతన్ను లోయలోకి తోసేశారని ప్రచారంలోకి వచ్చిన ప్రాంతాన్ని సందర్శకులు ‘సియా పాయింట్’ గా పిలవడం ప్రారంభించారు. అధికారికంగా అలాంటి పేరు లేకపోయినా.. సోషల్ మీడియా ప్రభావంతో ఆ పేరు వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.కోటకు వెళ్లే పర్యాటకులు అక్కడి గైడ్లను, స్థానికులను సియా పాయింట్ ఎక్కడ ఉంది? కేతన్ను తోసింది ఇదే ప్రదేశమా? అంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ధోరణిపై స్థానికులు, పర్యాటక రంగానికి చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన లోహగఢ్ కోటను ఒక నేర ఘటనతో గుర్తుపెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన పేర్లను నిజాలుగా భావించొద్దని కూడా సూచిస్తున్నారు.మరో వైపు, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ లోహగఢ్ కోట కూడా అనూహ్యంగా దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ కోట.. ఇప్పుడు ఒక సంచలన హత్య కేసు కారణంగా కొత్త గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషం.
E20 పెట్రోల్ సేఫేనా?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) పెట్రోల్ పై వినియోగదారులు, ఆటోమొబైల్ రంగంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. E20 ఇంధన విధానం ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కాబట్టి సురక్షితమా? కాదా? అని తేలడానికి ఇంకా సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది.కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఓ ఉత్తర్వును సవాల్ చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ వ్యాఖ్యలు చేశారు. 20 శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభుత్వ విధానంలో భాగమైనప్పటికీ, దాని ప్రభావాన్ని నిరంతరం పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు.ఇటీవల E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లకు నష్టం కలుగుతుందా? మైలేజ్ తగ్గుతుందా?.. కాలుష్యం జరుగుతుందా? అనే సందేహాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందనే నిర్ధారిత ఆధారాలు ఇప్పటివరకు లేవని ప్రభుత్వం పేర్కొంది.ఇంకా ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం మరోసారి నొక్కి చెప్పింది. ఈ విధానం ద్వారా భారత్ ఇప్పటికే రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని తెలిపింది.దేశవ్యాప్తంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలు లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించిన గడువు(2030) కంటే ముందుగానే సాధించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సరఫరా ప్రారంభమైంది. ఇప్పుడు 2030 నాటికి ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అయితే E20పై వినియోగదారుల సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఈ విధానం ప్రభావంపై స్పష్టమైన అంచనా వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
International
NRI
అమెరికాలో మోసం... హైదరాబాద్లో కేసు!
హైదరాబాద్: అమెరికాలో వ్యాపారవేత్తను మోసం చేసిన సంఘటనలో జూబ్లీహిల్స్కు చెందిన క్రాంతి విస్తాకులపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) కేసు నమోదు చేసింది. అమెరికా వాసి కేసీ మీహాన్ తన జీపీఏ హోల్డర్ ద్వారా ఈ ఫిర్యాదు చేశారు. క్రాంతి తాను ’ధామా’ సంస్థల వ్యవస్థాపకుడినని, తమ వ్యాపార విలువ 10 మిలియన్ డాలర్లని నమ్మించి, మీహాన్ నుంచి 2016లో 50 వేల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టించారు. ఏడాదిలోగా 10 శాతం వడ్డీతో అసలు తిరిగేస్తామని ప్రామిసరీ నోట్ రాసిచ్చిన, 0.5 శాతం ఈక్విటీ ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. అయితే గడువు తీరినా క్రాంతి డబ్బులు చెల్లించలేదు. వడ్డీతో కలిపి క్రాంతి చెల్లించాల్సిన మొత్తం 1,05,846 డాలర్లకు (రూ.90 లక్షలు) చేరింది. కాగా, క్రాంతి అమెరికాలోని సంస్థను మూసేసి, ఇతర ఇన్వెస్టర్ల నిధులు కూడా దురి్వనియోగం చేసి భారత్కు పారిపోవడంతో బాధితుడు సీసీఎస్ను ఆశ్రయించారు.
భారత్కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి
ఢిల్లీ: భారత్కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0లో హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 24 గంటల ముందే వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు 21 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య వివరాలు ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (DIAL) భాగస్వామ్యంతో 'ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు ఈ కాంటాక్ట్లెస్ హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్ పోర్టల్ను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఇకపై భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఈ ఫామ్ను సమర్పించడం తప్పనిసరి.ఫామ్ను ఇలా నింపండి..భారతదేశానికి చేరుకోవడానికి ముందే ఈ ఎయిర్ సువిధ ఫామ్ను ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఫామ్లో నమోదు చేసే వివరాలు మీ ఒరిజినల్ ప్రయాణ పత్రాలతో (పాస్పోర్ట్, టికెట్) సరిపోలాలి. విమానాశ్రయంలో వెరిఫికేషన్ కోసం అక్నాలెడ్జ్మెంట్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.స్టెప్ 1: వ్యక్తిగత, ప్రయాణ వివరాలుమీ పాస్పోర్ట్ వివరాలు, జాతీయత గత 21 రోజుల్లో మీరు ప్రయాణించిన దేశాల వివరాలను నమోదు చేయాలి. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించారా అనే విషయాన్ని పేర్కొనాలి. వీటితో పాటు మీ ఫ్లైట్ నంబర్, ఇండియాలో మీరు దిగే మొదటి విమానాశ్రయం పేరు, మరియు ట్రాన్సిట్ (కనెక్టింగ్) దేశాల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.స్టెప్ 2: వివరాలు, వెరిఫికేషన్భారతదేశంలోని మీ నివాస చిరునామా లేదా విదేశీ బస వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్/ఈమెయిల్కు వచ్చే OTP ద్వారా వివరాలను వెరిఫై చేయాలి.స్టెప్ 3: ఆరోగ్య సమాచారం మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించినట్లు లేదా అక్కడ ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు డిక్లేర్ చేస్తే మాత్రమే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏవైనా లక్షణాలు ఉన్నాయా అనే హెల్త్ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.స్టెప్ 4: రివ్యూ, సబ్మిట్మీరు ఇచ్చిన వివరాలన్నీ చట్టబద్ధంగా సరైనవేనని నిర్ధారించుకుంటూ, మీ వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అంగీకరిస్తూ చెక్బాక్స్పై టిక్ చేయాలి. అనంతరం ఫారమ్ను సబ్మిట్ చేయాలి.ఫామ్ సబ్మిట్ చేసిన అనంతరం..ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అలాగే మీ మెయిల్కు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ప్రయాణికులు ఈ అక్నాలెడ్జ్మెంట్ను డిజిటల్ రూపంలో ప్రింట్ తీసుకుని విమానాశ్రయంలోని హెల్త్ డెస్క్ వద్ద చూపించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎయిర్పోర్ట్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్ మీకు అవసరమైతే అదనపు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
నవతరానికి మొహం మొత్తిందా?
కొత్త వింత... పాత రోత అంటారు. కానీ... ఈ తరానికి కొత్త కూడా రోతగానే అనిపిస్తున్నట్లు ఉంది! ఎందుకంటారా? నాలుగైదేళ్లు కూడాకాకముందే ఏఐపై వారికి మొహం మొత్తింది! అమెరికా, యూరప్, ఆసియా.. ఇలా ప్రపంచం మొత్తమ్మీద... ఏఐని నమ్మని వాళ్లు, వద్దని అనుకుంటున్న వాళ్లు... తిరస్కరిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది! 2020ల మొదట్లో చిన్న చిన్న చాట్బోట్లు, సిఫారసు వ్యవస్థలతో మొదలైన ఏఐ ఆటోమేషన్ 2023లో చాట్జీపీటీ రాకతో రాకెట్ స్పీడ్ అందుకుంది. ఇమేజీలు సృష్టించడం మొదలుకొని సినిమాలు తీసేంతవరకూ అనేకానేక ఏజెంటిక ఏఐల రాకతో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం పడింది. ఆంథ్రోపిక్ క్లాడ్తోపాటు మరికొన్ని అత్యాధునిక ఏఐ వ్యవస్థలు నెమ్మదిగా సాఫ్ట్వేర్ కోడింగ్ చేయడం, తన తప్పులు తానే సరి చేసుకోవడం.. వంటి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా మొదలైంది.అంతేకాకుండా డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై అవగాహన కూడా పెరిగింది. ఇదే సమయంలో వివిధ దేశాలు ఏఐ టెక్నాలజీకి ముకుతాడు వేసేందుకు, నియంత్రణ వ్యవస్థలను తీసుకొచ్చే ప్రయత్నాలూ మొదలుపెట్టాయి. తాజాగా జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం యువతలో మరీ ముఖ్యంగా జెన్–జీలో ఏఐపై విముఖత పెరుగుతోంది. అమెరికాలో ‘ప్యూ రీసెర్చ్’, యూరప్లో ‘స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ – 2026’లు జరిపిన అధ్యయనాలు జెన్–జీలో ఏఐ పట్ల పెరుగుతున్న అభద్రత భావానికి అద్దం పడుతున్నాయి. అంకెలు చెప్పే విషయం... అమెరికాలోని ప్యూ రీసెర్చ్ ఇటీవలే ‘‘అమెరికన్స్ అండ్ ఏఐ 2026: ఛాట్బోట్స్, స్మార్ట్ డివైజెస్ అండ్ వ్యూస్ ఆన్ ఇంపాక్ట్’పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. వారం రోజుల క్రితం విడుదలైన అధ్యయన ఫలితాల ప్రకారం కేవలం 16 శాతం మంది (అధ్యయనంలో పాల్గొన్న 5119 మందిలో) మాత్రమే ఏఐ సమాజంపై సానుకూల ప్రభావం చూపగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అదే సమయంలో ఈ టెక్నాలజీతో సమాజానికి నష్టమే అని అభిప్రాయపడ్డవారు 40 శాతం వరకూ ఉంది. ఇదే అభిప్రాయంతో 48 శాతం జెన్–జీ సభ్యులు ఏకీభవిస్తూండటం గమనార్హం. అలాగని ఎవరూ ఈ టెక్నాలజీని వాడటం లేదా అంటే 49 శాతం మంది చాట్జీపీటీ వంటివి వాడుతున్నట్లు స్పష్టమైంది. జెన్–జీలో ఇది 66 శాతం. రెండేళ్ల క్రితం వాడకందార్లు కేవలం 33 శాతం మంది మాత్రమే. ఏఐపై వ్యతిరేకత వయసుతోపాటు కొంత తక్కువ అవుతూండటం ఇంకో ఆసక్తికర అంశం. అమెరికా మాత్రమే కాదు.. యూరప్, భారత్సహా ఆసియా దేశాల్లోనూ ఏఐ వాడకమైతే పెరుగుతోంది కానీ.. అందుకు తగ్గట్టుగానే అపనమ్మకం కూడా ఎక్కువ అవుతోందన్నమాట. దీనికీ కారణాలు లేకపోలేదు. కంపెనీ యాజమాన్యాలు ఏఐ వాడకంపై ఎక్కువ ఆసక్తి చూపుతూండగా ఉద్యోగులు భయం, భయంగా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి దిగ్గజ కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు గుమ్మరిస్తూండటంతో ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న మాట వాస్తవమైనప్పటికీ జెన్–జీలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నగా మారింది.యూరప్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తోంది. ఏఐ వ్యవస్థలపై నియంత్రణ అవసరమన్న వాదనతోపాటు ఏఐ కంపెనీలపై విశ్వాసం సడలుతున్నట్లు స్టాన్ఫర్డ్ ఏఐ ఇండెక్స్ 2026 స్పష్టం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్లలో ఏఐతో ఉద్యోగాలకు నష్టమన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూండగా యూకేలో వాడకం బాగా పెరుగుతున్నా ఏఐ వ్యవస్థలపై నమ్మకం అతితక్కువ స్థాయిలోఉంది. మానవ సృజనకు పాతర... ఏఐ మానవ సృజనకు పాతరేస్తోందని, ఆటోమేషన్ కారణంగా మనిషి ఆలోచించడం మానేస్తాడని జెన్–జీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డేటా సెంటర్లతో పర్యావరణానికి జరిగే నష్టంపై కూడా జెన్–జీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు
ఫిలడెల్ఫియా(అమెరికా): ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘనంగా జరిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, ఫెయిర్గ్రౌండ్స్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనడంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది.సినీ ప్రముఖులు ఈ వేడుకలను మరింతా కలర్ఫుల్గా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్రసాద్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్ (హాలీవుడ్ నటుడు), శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ఫార్మార్మెన్స్తో ఆహూతులను అలరించారు. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా, రెండవ రోజు యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించి వేడుకలను మరింతా ఉత్తేజ పరిచారు.ఈ వేడుకల్లో ప్రముఖ నటి జయప్రదకు MATA లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), 24. దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) అవార్డులు అందుకున్నారు.ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) లైవ్ కాన్సర్ట్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, లైటింగ్, నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్లు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి.MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి, ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం.MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అలాగే అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితెందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, స్పిరిచ్యువల్, మెంబర్షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా, తదితరుల సేవలు మహాసభల విజయానికి కీలకమైన పాత్ర వహించాయని 'మాటా' నిర్వహకులు ప్రకటించారు.సేవ, సంస్కృతి, సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.
Sakshi Originals
ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపం
1. చిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)2 . ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు)3. క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెరి్నంగ్ ఆపరేషన్స్, హోస్టింగ్)4. ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటం)5. ఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)6. ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)ఏఐ సామ్రాజ్య శ్రేణిలో దిగ్గజాలు వీరే?
వేలి గోరు సైజులో పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు!
కంప్యూటింగ్ రంగంలో మరో రికార్డు నమోదైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక మైక్రోప్రాసెసర్పై ఏకంగా పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లు (100 బిలియన్) అమరిపోయాయి. నానోమీటర్ (మనిషి వెంట్రుక కంటే లక్ష రెట్లు తక్కువ సైజు) కంటే తక్కువ సైజున్న ట్రానిస్టర్లతో తయారైన ఈ మైక్రోప్రాసెసర్ సైజు మన వేలి గోరు సైజు మాత్రమే! కొన్నేళ్ల క్రితం రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో మైక్రోప్రాసెసర్ను సిద్ధం చేసిన ఐబీఎం తాజా ఆవిష్కరణతో తన రికార్డును తానే బద్దలు చేసింది. కంప్యూటర్ల మెదడుగా చెప్పుకునే మైక్రోప్రాసెసర్పై ఎన్ని ఎక్కువ ట్రాన్సిస్టర్లు ఉంటే వాటి వేగం అంత ఎక్కువగా ఉంటుంది. ట్రాన్సిస్టర్ల సంఖ్య, కంప్యూటర్ల వేగం రెండూ 18 – 24 నెలలకు ఒకసారి రెట్టింపు అవుతాయని 1965లోనే ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ లెక్కకట్టారు. 1971లో ఇంటెల్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ ‘ఇంటెల్ 4004’లో 2,300 ట్రాన్సిస్టర్లు మాత్రమే ఉండేవి. ఆ తరువాత మూర్స్ లా ప్రకారమే వీటి సంఖ్య, కంప్యూటర్ల వేగం పెరుగుతూ వచ్చింది. అయితే.. ట్రాన్సిస్టర్ల సైజు తగ్గుతున్న కొద్దీ సమస్యలూ పెరిగిపోయాయి. ప్రాసెసర్లు విపరీతంగా వేడెక్కిపోవడం ఇందులో ఒకటైతే విద్యుత్తు వినియోగమూ పెరగడం ఇంకోటి. ఈ నేపథ్యంలో వేగాన్ని పెంచుతూనే వేడిని తగ్గించేందుకు, మైక్రోప్రాసెసర్లలో వేర్వేరు కోర్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఒక దశ దాటిన తరువాత ఈ టెక్నిక్ కూడా పనిచేయకుండా పోయింది. ఇక కంప్యూటర్ల వేగం పెరగదు అని అనుకునే లోపు ఐబీఎం ట్రాన్సిస్టర్లను ఒకదానిపై ఒకటి పేర్చడం మొదలుపెట్టింది. ఈ త్రీడీ అవతారమే తాజాగా అభివృద్ధి చేసిన ఒక నానోమీటర్ మైక్రోప్రాసెసర్! ఐదేళ్ల క్రితం ఐబీఎం అభివృద్ధి చేసిన మైక్రోప్రాసెసర్లో రెండు నానోమీటర్ల సైజు టాన్సిస్టర్లు 5,000 కోట్ల వరకూ ఉండేవి. వేగం 50 శాతం ఎక్కువ... పదివేల కోట్ల ట్రాన్సిస్టర్లున్న తాజా మైక్రోప్రాసెసర్ రెండు నానోమీటర్లతో తయారైన దాని కంటే 50 శాతం ఎక్కువ వేగంతో పని చేస్తుందని, వాడుకునే విద్యుత్తు కూడా 70 శాతం వరకూ తక్కువని ఐబీఎం తెలిపింది. జనరేటివ్ ఏఐ సర్వీసులు మొదలుకొని మొబైల్ఫోన్లలోనే క్లౌడ్ సేవలతో పనిచేసేందుకు ఈ కొత్త మైక్రోప్రాసెసర్లు బాగా ఉపయోగపడతాయని తెలిపింది. తాము కేవలం ఎక్కువ ట్రాన్సిస్టర్లను అమర్చేందుకు మాత్రమే పరిమితం కాకుండా సిలికాన్తోపాటు వేర్వేరు ఇతర పదార్థాలను వాడటం ద్వారా ఈ ఘనతలు సాధించినట్లు ఐబీఎం తెలిపింది. ఇదంతా ఒక ఎత్తు. ఇంత సూక్ష్మస్థాయి మైక్రోప్రాసెసర్లను తయారు చేయడం ఇంకో ఎత్తు. తైవాన్ సెమీ కండక్టర్ దిగ్గజం టీఎస్ఎంసీ రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్లను గత ఏడాది నుంచే పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలుపెట్టింది. ఐదేళ్ల క్రితం ఐబీఎం సిద్ధం చేసిన రెండు నానోమీటర్ల ట్రాన్సిస్టర్ల ప్రాసెసర్ తయారీ రాపిడస్ ద్వారా వచ్చే ఏడాది తయారు కానుంది. ఆపిల్ కూడా టీఎస్ఎంసీ ద్వారా తన లేటెస్ట్ ప్రాసెసర్ ఎం6ను ఈ ఏడాదే తయారు చేయనుందని అంచనా. అంటే.. ఒక నానోమీటర్ ట్రాన్సిస్టర్లతో కూడిన మైక్రోప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకో ఐదారేళ్లు పడుతుందన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే!
ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు ఏం చూస్తున్నారు? ఏ పాట వినిపిస్తే వెంటనే కనెక్ట్ అవుతున్నారు? ఏ డైలాగ్ ట్రెండ్ అవుతోంది? అనే అంశాలపైనే వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు మాట్లాడేవారు. దేశాధినేతల భేటీల్లో అధికారిక ప్రకటనలే హైలైట్గా నిలిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలైనా, ఎన్నికల ప్రచారాలైనా, సోషల్ మీడియా పోస్టులైనా.. ఎక్కడ చూసినా సినిమా పాటలు, డైలాగులు, పాప్ కల్చర్ రిఫరెన్స్లే కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల నుంచి ప్రాంతీయ పార్టీల నేతల వరకు.. అందరూ ఇప్పుడు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కారణం ఒక్కటే.. వైరల్ కావాలి.. ప్రజలకు మరింత దగ్గర కావాలి!తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన వీడియోకు బాలీవుడ్ చిత్రం ధురంధర్ పాటను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతకుముందు భారత్-యూరోపియన్ యూనియన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచార కంటెంట్లో ప్రధాని మోదీ మన తెలుగు సినిమా గేమ్ ఛేంజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం వినియోగించడం ఆకట్టుకుంది.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026అయితే ఈ ట్రెండ్కు అసలు బలం ఇచ్చింది.. సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. "తగ్గేదేలే" అనే ఒక్క డైలాగ్ రాజకీయాల నుంచి క్రీడల వరకు, ఎన్నికల ప్రచారాల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు వినిపించింది. ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఇదే డైలాగ్ను ఉపయోగించారు. సోషల్ మీడియాలో అయితే "తగ్గేదేలే" ఒక రాజకీయ నినాదంగా మారిపోయింది.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలోని "నాటు నాటు" పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ పాట కేవలం సినిమా పాటగా కాకుండా భారత సాంస్కృతిక ప్రభావానికి ప్రతీకగా మారింది. విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు, విదేశీ నాయకులు సైతం ఈ పాటను తమ కార్యక్రమాల్లో ప్రస్తావించడం విశేషం. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక రాజకీయ ప్రచారాల్లో బాహుబలి ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?" అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక సామూహిక చర్చగా మారినప్పుడు, అనేక రాజకీయ పార్టీలు తమ ప్రచారాల్లో అదే శైలిని అనుకరించాయి. "ఎవరు ఎవరిని మోసం చేశారు?" అనే ప్రచారాల నుంచి "అసలు బాహుబలి ఎవరు?" అనే పోలికల వరకు బాహుబలి రిఫరెన్స్లు విస్తృతంగా వినిపించాయి.అంతేకాదు, కేజీఎఫ్, జైలర్లోని "హుకుం" పాట బీజీఎంలతో వీడియోలు.. కొన్ని సినిమాల్లో యాక్షన్ రిఫరెన్స్లు, కాంతారలోని సంప్రదాయ చిహ్నాలు, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ చెప్పిన "వన్స్ అపాన్ ఎ టైమ్" స్టైల్ నేరేషన్.. ఇవన్నీ రాజకీయ సోషల్ మీడియా ప్రచారాల్లో కనిపించాయి. ఇటీవల కొన్ని పార్టీల ప్రచార వీడియోలు చూస్తే అవి రాజకీయ ప్రకటనలా.. సినిమా టీజర్లా అన్న సందేహం కలగడం సహజమే.నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందుకు ప్రధాన కారణం ప్రజల మీడియా వినియోగ పద్ధతుల్లో వచ్చిన మార్పు. ముఖ్యంగా యువత పెద్ద పెద్ద ప్రసంగాల కంటే 30 సెకన్ల వీడియోలను ఎక్కువగా చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రజాదరణ పొందిన పాట లేదా డైలాగ్ను ఉపయోగిస్తే సందేశం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అంతేకాదు, అలాంటి కంటెంట్ మీమ్స్, రీల్స్ రూపంలో మరింత వైరల్ అవుతుంది.అయితే ఈ ట్రెండ్పై విమర్శలు కూడా ఉన్నాయి. రాజకీయాల వంటి కీలక అంశాలను వినోదాత్మకంగా మార్చడం వల్ల అసలు సమస్యలు చర్చకు రాకపోవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిద్ధాంతాల కంటే వైరాలిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తే ప్రజాస్వామ్య చర్చలు బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో రాజకీయాల భాష మారిపోయింది. ఇప్పుడు ప్రజలను ఆకర్షించాలంటే కేవలం ప్రసంగాలు సరిపోవు. ఒక వైరల్ పాట, ఒక హిట్ డైలాగ్, ఒక సినీ రిఫరెన్స్.. ఇవే నాయకులను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే నేటి రాజకీయాల్లో కొత్త సూత్రం ఒక్కటే.. "వైరల్ కావాలంటే.. సినిమా టచ్ తప్పనిసరి!"..
హమ్మయ్యా... అది కూడా ఆరోగ్యమేనట!
ఆరోగ్యం అంటే ఏమిటి? కండలు తిరిగిన దేహమా? జబ్బుల్లేని జీవితమా? ఎంత తిన్నా లావు కాకపోవడమా? లేక ఎలాంటి చింతా, దిగులు లేకుండా జీవించడమా?..నిజానికి, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే భారతీయ సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నప్పటికీ, వారిలో మూడింట ఒక వంతు మంది మాత్రమే నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. "మెంటల్" అనే ముద్ర పడుతుందేమో, నలుగురికి తెలిస్తే పరువు పోతుందేమో అనే భయంతో చాలామంది తమ సమస్యను బయటకు చెప్పడానికే వెనుకాడుతున్నారు.అయితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. మణిపాల్ సిగ్నా నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ సర్వే ప్రకారం తొలిసారిగా భారతీయులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు దాదాపు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 35 ఏళ్లలోపు వారిలో 54 శాతం మంది మానసిక ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని భావిస్తుండగా, 50 ఏళ్లు దాటిన వారిలో 53 శాతం మంది ఇప్పటికీ వ్యాయామం, ఫిట్నెస్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.మెదడు పగిలేంత ఒత్తిడి... కానీ సమస్యే కాదట!ఈ అధ్యయనం బయటపెట్టిన మరో ఆందోళనకర విషయం భారతీయులు.. స్ట్రెస్ను చాలా తేలికగా తీసుకోవడం!. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పినా, అది తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని అంగీకరించింది కేవలం ఒక శాతం మాత్రమే. అంటే ఒత్తిడి ఎంత తీవ్రమైనా, దాన్ని ఆరోగ్య సమస్యగా భావించే అవగాహన ఇంకా చాలామందిలో లేదన్నమాట.ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఆరోగ్య ఖర్చుల భారం చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ)ని పెంచుతుండగా, ఆరోగ్య బీమా ఉన్నవారిలో ఈ ఒత్తిడి కొంత తక్కువగా కనిపించింది.శారీరక, మానసిక ఆరోగ్యాలను వేర్వేరుగా చూడలేమని, రెండూ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయని మణిపాల్ సిగ్నా సీఈవో జోయ్దీప్ సాహా పేర్కొన్నారు. ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం పెరగడం సానుకూల పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే సవాళ్లు ఇంకా పెద్దవే. దాదాపు 147 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మానసిక వైద్యుల సంఖ్య పదివేలకు కూడా చేరకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. అయినప్పటికీ, మానసిక ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతుండటం మాత్రం ఆశాజనక పరిణామమే.భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఐదు మానసిక సమస్యలు1. డిప్రెషన్:సుమారు 4.57 కోట్ల మంది భారతీయులు డిప్రెషన్తో బాధపడుతున్నారు. దేశంలో ఏటా జరిగే దాదాపు 2.5 లక్షల ఆత్మహత్యలకు ఇది ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నిరుద్యోగం, లింగ వివక్ష, సామాజిక అసమానతలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు దీనికి కారణమవుతున్నాయి. పురుషుల కంటే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.2. యాంగ్జైటీ డిజార్డర్స్:ఓసీడీ, పీటీఎస్డీ, పానిక్ డిజార్డర్, సోషల్ యాంగ్జైటీ, ఫోబియాలు వంటి అనేక సమస్యలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని చాలామంది అసలు మానసిక సమస్యలుగానే గుర్తించకపోవడం వల్ల లక్షలాది మంది చికిత్సకు దూరమవుతున్నారు.3. మద్యం, మత్తు పదార్థాల వ్యసనం: దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వారిలో 83 లక్షల మంది తీవ్ర వ్యసనపరులుగా ఉన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను వినియోగించే వారు 3.7 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. సుమారు 18 లక్షల మంది చిన్నారులు కూడా వివిధ రకాల మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.4. బైపోలార్ డిజార్డర్:దేశ జనాభాలో కనీసం రెండు శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతకాలం అమితమైన ఉత్సాహంతో ఉండటం, ఆ తర్వాత తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోవడం దీని లక్షణం. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఆత్మహత్య ప్రమాదం కూడా పెరుగుతుంది.5. స్కిజోఫ్రేనియా:ప్రతి వెయ్యి మందిలో ముగ్గురు ఈ మానసిక సమస్యతో బాధపడుతున్నారు. లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, భ్రాంతులు, ఆలోచనల్లో గందరగోళం, సమాజానికి దూరంగా ఉండడం దీని ప్రధాన లక్షణాలు. పురుషుల్లో ఇది తక్కువ వయసులోనే కనిపించగా, మహిళల్లో గర్భధారణ, ప్రసవం సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మనసు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు కూడా ఇతర అనారోగ్యాల్లాగే వైద్య చికిత్స అవసరమయ్యే పరిస్థితులే. వాటిని దాచిపెట్టడం కాదు, గుర్తించి సరైన సమయంలో నిపుణులను సంప్రదించడమే నిజమైన ఆరోగ్యానికి మొదటి అడుగు.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా
టెక్కీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న సీఈఓ!
కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్ : రూ. 10 కోట్ల డిఫమేషన్
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
రాహుల్ సూపర్ సెంచరీ.. మెదక్ ముందు భారీ టార్గెట్
'ప్రభాస్ను అడిగితే మూడు కోట్లు ఇస్తాడు.. కానీ'
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
రెస్టారెంట్లో రచ్చ రచ్చ చేసిన ఫ్యామిలీ
ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్కు రూ.38.63 లక్షల జరిమానా
స్లిమ్గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..
అమెరికా ఖ్యాతి దిగజారింది.. భారత్తో సంబంధాలు క్షీణించాయి
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్రయాణికుల ఫైర్
ప్రజలు మత్తులో ఉంటే పాలన చిత్తుగా ఉన్నా అడిగేవాడు ఉండడు సార్! సంపద సృష్టి ఐడియా అదుర్స్ సార్!!
అమరావతిని అంతర్జాతీయపటంలో చూపిస్తా, క్వాంటం టెక్నాలజీని తెస్తా అని.. వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లడమేంటి సార్!!
మనకు ఆ ప్రాబ్లం ఉండదులే! మన ప్రభుత్వం అప్పులు అడుక్కుంటుంది.. మనమూ అడుక్కుంటున్నాం!!
రోచ్ ట్రిపుల్ సెంచరీ
ఈ రాశి వారికి సన్నిహితులు నుంచి ధనలబ్ధి.. గృహయోగం
ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
పోన్లెండి సార్! ఏదో రకంగా పబ్లిసిటీ వస్తుందిగా!
భారత్పై ఘన విజయం.. ఐర్లాండ్కు భారీ షాక్
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. వాహనాలు కొంటారు
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ స్టార్లు.. టెస్టు హిస్టరీలోనే తొలిసారి
'పెద్ది'తో తెలుగు అయిపోయింది.. ఇక తమిళంలోకి
కూల్డ్రింక్ కంటే.. బీరే మంచిది!
'పెద్ది' సంగతి సరే.. బుచ్చిబాబు నెక్స్ట్ ఏంటి?
మధిర సభ రద్దు.. ‘రైతు భరోసా’పై రేవంత్ సర్కార్ క్లారిటీ
క్రైమ్
ఏసీబీ అన్నా.. ఏం భయం లేదన్నాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అనగనగా ఒక రైతు. ఆయన పొలానికి మట్టి తరలింపు అనుమతికి ఓ ఉద్యోగి లంచం అడిగాడు. ఇలాగే లంచం అడిగిన ఓ అధికారిని ఏసీబీకి పట్టించానని రైతు హెచ్చరించాడు.. కానీ అవినీతి అధికారి తేలిగ్గా తీసుకున్నాడు.. లంచం ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పాడు.. రైతు నుంచి రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాలివి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్.శ్రీనివాస్ను ఓ రైతు తన పొలానికి చెరువు మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. కొద్ది రోజులుగా తిరుగుతుండగా, మట్టి తరలింపునకు రూ.4 లక్షలు ఇవ్వాలని ఏఈఈ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చివరకు రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కార్యాలయంలో బాధిత రైతు నుంచి ఏఈఈ రూ.2 లక్షలు తీసుకుని తన డెస్క్లో పెట్టుకోగా.. ఏసీబీ అధికారులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవడంతో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ పేరు చెప్పినా..:ఏఈఈ శ్రీనివాస్ను ఇంకొందరు రైతులు కూడా చెరువుల నుంచి మట్టి తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరితే లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే, ఇదే రైతు తాను గతంలో ఓ ఉద్యోగిని ఏసీబీకి పట్టించానని చెప్పినా.. లంచం ముట్టచెబితే తప్ప అనుమతి ఇచ్చేది లేదని శ్రీనివాస్ తెగేసి చెప్పినట్లు సమాచారం
వివాహేతర సంబంధం.. భర్తను లేపేసిన భార్య..!
దేవరకద్ర రూరల్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాలు భర్తను బలితీసుకున్నాయి. భర్తపై కత్తితో దాడిచేసి భార్య హతమార్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బస్వాయపల్లికి చెందిన కుర్వ నాగేశ్ (38)కు కోయిల్కొండ మండలం మల్కాపూర్కు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. నాగేశ్ గొర్రెల పెంపకాన్ని జీవనాధారంగా చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అతడికి అనుమానం కలగడంతో దంపతులిద్దరి మధ్య తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాగేశ్ పనికి వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ, మద్యానికి బానిస కావడంతో కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న నాగేశ్కు కవితకు మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నాగేశ్పై కవిత కత్తితో దాడికి పాల్పడింది. ఈ సమయంలో ఇంట్లోనే నిద్రిస్తున్న చిన్న కుమారుడు రాము తండ్రి ఆర్తనాదాలు విని మేల్కొన్నాడు. తండ్రిపై తల్లి దాడి చేస్తుండటాన్ని చూసి భయంతో బయటకు వచ్చి కేకలు వేశాడు. బయట నిద్రిస్తున్న ఇతర కుటుంబసభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకోగా అప్పటికే నాగేశ్ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తన వదినకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతోనే గొడవలు జరుగుతున్నాయని, అదే కక్షతో తన అన్నపై కత్తితో దాడిచేసి హతమార్చిందని మృతుడి సోదరుడు రాజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు.
Hyderabad: కార్ ఆపి ఉంటే ఫ్యామిలీ రిస్క్లో ఉంటుండే..
హైదరాబాద్: కార్లలో వెళ్తున్న మహిళలను పోకిరీలు వెంబండించి భయాందోళనకు గురిచేశారు. కార్ డ్యాష్ క్యామ్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఓ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. బోడుప్పల్కు చెందిన ఓ కుటుంబం ఓ ఫంక్షన్కు వెళ్లి ఘట్కేసర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మీదుగా కారులో తిరిగి వస్తోంది.ఆ సమయంలో కొందరు వ్యక్తులు కత్తులు, ఆయుధాలతో వెంబడించారు. దీంతో కారులో ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఘట్కేసర్ వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్నీ కారు డ్యాష్ క్యామ్లో రికార్డయ్యాయి. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలుకారు డ్యాష్ క్యామ్లో రికార్డైన దృశ్యాలు కారులో మహిళలు,… pic.twitter.com/vmuyB3yIN5— Telugu Scribe (@TeluguScribe) June 29, 2026
మా చావుకు కారణం.. ఈ మెసేజ్ చదివితే తెలుస్తుంది!
రంగారెడ్డి: దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో మిస్టరీ వీడింది. మోకిల పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. జన్వాడకి చెందిన వడ్ల బాలసాయి (32) సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన పద్మ(26) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోగా.. వారికి ఐదునెలల బాబు ఉన్నాడు. బాలసాయి ఫొటోగ్రాఫర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగునెలల క్రితం జుల్కల్లో నివసించే అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య ఇంటికి గుర్తు తెలియని సాధువు వచ్చాడు. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, తవ్వితే ధనవంతులు అవుతారని ఆశ పెట్టాడు. దీనికి ధనం కావాలని చెప్పడంతో వారు పెద్దల్లుడు వెంకటేశ్తో కలిసి బాలసాయిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పలు దఫాలుగా రూ.10 లక్షలు వారికి ఇచ్చాడు. తీరా అడిగే సరికి ఇష్టం వచ్చినట్లు దూషించడంతో భార్యాభర్తలు మనస్తాపానికి గురయ్యారు. చేసిన అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో బలవన్మరణానికి సిద్ధపడ్డారు. ఆదివారం కుటుంబసభ్యులకు తెలిసేలా భార్య ఫోన్కి మెసేజ్ పెట్టి, ఇంట్లోని ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెసేజ్ ఆధారంగా పోలీసులు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్ని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించారు. వారిని సోమవారం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు. అమ్మ, తమ్ముళ్లకు సారీ.. బాబుని బాగా చూసుకోండి చనిపోయే ముందు బాలసాయి చేసిన మెసేజ్లో పెళ్లి జరిగిన తర్వాత అత్తమామతో పడిన బాధలను క్లుప్తంగా వివరించాడు. ‘అమ్మ, తమ్ముళ్లు సారీ.. నాతో కావడం లేదు. నేను నా భార్య చనిపోతున్నాం.. మీరు బాబుని బాగా చూసుకోండి.. పెళ్లి తర్వాత అందరం మంచిగా ఉందామని అత్త, మామ ఇంటికి పిలిచారు.. భార్య ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నరకం చూపించారు.. ధనవంతులు అవుతాం, అప్పు కావాలని అడిగితే మొత్తంగా రూ. 10 లక్షలు ఇచ్చా.. అడిగితే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు.. ఫొటోగ్రాఫర్గా ఈవెంట్స్ చేసిన డబ్బులు, కెమెరా తాకట్టు పెట్టి మరీ ఇచ్చా.. మా చావుకి కారణం అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్లే’ అని మెసేజ్ చేశాడు.
వీడియోలు
పొలంలో బంగారం కలకలం ఆ తర్వాతే మొదలైన అసలు కథ..
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో వణికిన ప్రాంతం!
డెలివరీ బాయ్తో హీరోకు ఘర్షణ... వీడియో వైరల్!
పోలీసులకు అన్నీ తెలుసు.. కానీ ఆ 30 మందిపై ఎందుకు మౌనం?
ప్రయాణం మధ్యలో RTC బస్సు బోల్తా.. అసలు ఏం జరిగింది?
ఓటర్లకు కొత్త టెన్షన్.. SIR వెనుక అసలు నిజం?
మేడిపల్లి PS పరిధిలో దారుణం.. గృహప్రవేశం జరిగిన ఇంటిపై దాడి
ఆ శాఖ కోసం అల్లాడుతున్న పవన్
చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!
తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు

