ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.
టైటిల్ పోరుతో తెర
ఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్తో ముగియనుంది. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.
వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడే!
ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు భారత్లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.
కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్లో ఓడి ఎలిమినేట్ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది.
మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదని సమాచారం.
దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్ హెడ్కోచ్ డారెన్ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.
ఇంగ్లండ్కి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది
ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్ గురువారమే నాకౌట్ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది. వెస్టిండీస్ గత ఆదివారం నుంచి కోల్కతాలోనే చిక్కుకుపోయింది.
సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.
ఓవరాక్షన్ వద్దు
అయితే, వాన్ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఒకవేళ యూరోప్ గుండా విండీస్ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


