పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై నోరు పారేసుకున్నాడు. సూర్యకుమార్ సేనపై మిచెల్ సాంట్నర్ బృందానిదే పైచేయి అవుతుందని పేర్కొన్నాడు. కివీస్ జట్టు సమిష్టిగా రాణిస్తుంటే.. టీమిండియా ఇంకా ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడటమే ఇందుకు కారణమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే.. పాక్ మాజీ పేసర్ ఆమిర్ టోర్నీ ఆరంభం నుంచి టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.
పదే పదే అదే మాట
లీగ్ దశలో సూర్య సేన అజేయంగా నిలిచినప్పటికీ.. అది అదృష్టం వల్లేనని ఆమిర్ (Mohammad Amir) అన్నాడు. ఇక సూపర్-8 దశలోనూ టీమిండియా రాణించలేదని సెమీస్కు చేరలేదని వాదించాడు. అయితే, భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టడమే కాకుండా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్ చేరింది.
న్యూజిలాండ్ గెలుస్తుంది
ఈ నేపథ్యంలో తాజాగా మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు సమిష్టి ప్రదర్శతో సెమీస్లో సౌతాఫ్రికాను ఓడించింది. కానీ టీమిండియా.. జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ వంటి ఇద్దరు ఆటగాళ్ల కారణంగా ఈరోజు ఫైనల్లో ఉంది. వాళ్లిద్దరు లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది.
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్కు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా వాళ్ల బౌలింగ్ విభాగం టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. భారత జట్టులో బుమ్రా తప్ప ఎవరూ ఫామ్లో లేరు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా వికెట్లు తీసేందుకు కష్టపడుతున్నారు.
నీ అంచనా తప్పుతుంది
అయితే, బ్యాటింగ్ పరంగా ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. ముందుగా చెప్పినట్లు న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టీమిండియా ఎక్కువగా బుమ్రా మీదే ఆధారపడుతోంది. కాబట్టి న్యూజిలాండ్దే గెలుపు అని విశ్వసిస్తున్నాను’’ అని మొహమ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆమిర్కు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. సూర్య సేన ఈసారి సమిష్టిగా రాణించి గెలిచి తీరుతుందని.. మరోసారి నీ అంచనా తప్పని నిరూపిస్తుందని పేర్కొంటున్నారు.


