టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు మరి కొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా తెరలేవనుంది.
ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి మూడో సారి టైటిల్ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. కివీస్ సైతం తొలి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
వరుణ్పై వేటు..?
‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఫైనల్ మ్యాచ్కు ముందు కుల్దీప్ నెట్స్లో తీవ్రంగా శ్రమించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
వరుణ్ చక్రవర్తి మాత్రం నామమాత్రపు ప్రాక్టీస్కే పరిమితం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్గా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ తమిళనాడు స్పిన్నర్ లీగ్ స్టేజ్లో రాణించినప్పటికి.. కీలకమైన సూపర్-8 దశలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
సెమీఫైనల్లో కూడా ఓ వికెట్ పడగొట్టినప్పటికి పరుగులు మాత్రం ధారాళంగా సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తుందంట. వరుణ్ కంటే కుల్దీప్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉంది.
ఫ్లాట్ పిచ్పై కూడా బంతిని తిప్పగలిగే సత్తా కుల్దీప్ యాదవ్కు ఉంది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు. మరి టీమ్ మెనెజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా ఈ టోర్నీలో కుల్దీప్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆడాడు.
భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
చదవండి: మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్


