కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.
కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్ను టారిఫ్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు.


