సాక్షి, ఢిల్లీ: టీవీకే అధినేత, నటుడు విజయ్కి సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణకు రావాలని తాజాగా నోటీసులు పంపింది. ఈ క్రమంలో మార్చి 10న దర్యాప్తు సంస్థ అధికారుల ఎదుట హాజరుకావాలన్న సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఇక, కరూర్ ఘటనలో విజయ్ ఇప్పటికే రెండు సార్లు సీబీఐ విచారణకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఢిల్లీలోని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
#TamilNadu: #CBI has reportedly issued a summons to actor and Tamilaga Vettri Kazhagam (#TVK) chief #Vijay, asking him to appear for inquiry on March 10 in connection with the #Karur crowd stampede case.
— South First (@TheSouthfirst) March 9, 2026
గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.
ఇక, తమిళనాడులో కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు.


