breaking news
TVK Vijay
-
టీవీకే విజయ్కు బిగ్ షాక్
సాక్షి, చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయనకు అక్కడి ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన విజయ్కు రోడ్ షో నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించారు. కావాలంటే బహిరంగ సభ నిర్వహించుకోవచ్చు అని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మంగళవారం ప్రకటించింది. దీంతో, విజయ్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.వివరాల ప్రకారం.. రాజకీయ పార్టీ ఆవిర్భావంతో పూర్తిగా తన దృష్టిని తమిళనాడుపైన విజయ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా చేపట్టిన మీట్ ది పీపుల్ ప్రయాణానికి కరూర్ విషాద ఘటన రూపంలో బ్రేక్ పడింది. డిసెంబర్ 4 నుంచి సేలం వేదికగా మళ్లీ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనా, కార్తీక దీపోత్సవాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తనను కలిసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజల వద్దకే వెళ్లే విధంగా విజయ్ ముందుకు సాగుతున్నారు. గత వారం కాంచీపురం ప్రజల్ని కలిశారు. ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీ ఆవిర్భావంతో తన దృష్టిని తాజాగా పుదుచ్చేరిపై కూడాపెట్టే పనిలో పడ్డారు.కాగా, డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభకు సన్నద్దమయ్యారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుదుచ్చేరి టీవీకే వర్గాలు వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డీజీపీ షాలిని సింగ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సమగ్ర వివరాలను అందులో తెలియజేశారు. పుదుచ్చేరి పర్యటన ముగించుకుని మరుసటి రోజన కడలూరు వెళ్లేందుకు విజయ్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పుదుచ్చేరి పాలకులు విజయ్కు అనేక ఆంక్షలతో అనుమతి ఇవ్వక తప్పలేదు.కరూర్ ఘటన దృష్టా ముందు జాగ్రత్తగా రోడ్ షోకు అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. మంగళవారం టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున తదితరులు అనుమతి కోసం ఓ వైపు డీజీపీ కార్యాలయం, మరోవైపు సీఎం రంగస్వామిని కలిసే ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. చివరకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రోడ్ షో, ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అనేక ఆంక్షలతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు మాత్రం అవకాశం కల్పించారు. -
అన్నాడీఎంకేకు షాక్.. టీవీకే విజయ్తో ఆ ఎమ్మెల్యే భేటీ
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు. -
వచ్చే ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోవడం ఖాయం: విజయ్ విమర్శలు
చెన్నై: కరూర్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత కొన్ని నెలలు సుదీర్ఘ విరామం తీసుకున్న టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు విజయ్.. తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. నేడు(ఆదివారం, నవంబర్ 23 వ తేదీ) కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికోసం కాంచీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు.కేవలం 2000 మందికి మాత్రమే QR కోడ్ పాస్లతో కూడిన అనుమతి ఇచ్చారు. అనుమతి లేని వారికి ప్రవేశం లేకుండా పకడ్బందీ ప్లానింగ్ చేశారు. ప్రచార పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ర్యాడికల్స్కు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని ఆయన మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తోందని విజయ్ స్పష్టం చేశారు.ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకంగా లేదని, ఆ ప్రక్రియ ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు.తమిళనాడులో అధికార డీఎంకేతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని విజయ్ విమర్శించారు. రెండు పార్టీల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవని అన్నారు.విజయ్ ఒకేసారి డీఎంకే, బీజేపీలపై దాడి చేయడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
తమిళనాడు ఎన్నికలు.. మళ్ళీ ప్రజల్లోకి విజయ్
సాక్షి చెన్నై: కరూర్లో జరిగిన విషాద ఘటనతో తను చేస్తున్న అన్ని ప్రజా కార్యక్రమాలను నిలిపివేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కొంతకాలం విరామం తర్వాత తిరిగి తన ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ప్రచార యాత్ర పునఃప్రారంభానికి సంబంధించి నిర్వహించనున్న తొలి పెద్ద సభ కాంచీపురంలో జరగనుందని టీవీకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. పార్టీ బలోపేతం, స్థానిక నాయకుల సమావేశం, ప్రజలతో మళ్లీ ప్రత్యక్షంగా అనుసంధానమవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. తొలి సభను కాంచీపురంలో నిర్వహించడానికి విజయ్ టీమ్ నిర్ణయం తీసుకుంది. దాంతో కాంచీపురానికి ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ వెంటనే అన్ని ప్రజా ఈవెంట్లను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాల పట్ల గౌరవ సూచికగా చేపట్టిన ఈ నిర్ణయాన్ని అప్పట్లో విస్తృతంగా ఆయన అభిమానులు అభినందించారు. ఆ సమయంలో బీజేపీ పార్టీ విజయ్కు మద్దతుగా నిలిచింది. అయితే కొంతకాలం విరామం తరువాత విజయ్ తిరిగి ప్రచార యాత్రను ప్రారంభించడంతో తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసిన అధికారులుకరూర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. జనసంచారం నియంత్రణతో పాటు అత్యవసర సేవలు సిద్ధంగా ఉండేలా స్థానిక అధికారులు, పార్టీ నిర్వాహకులు కలిసి పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల అనుమతి తిసుకుని కేవలం రెండువేల మందితో మాత్రమే సభను నిర్వహించాలని టీవీకే పార్టీ వర్గాలు నిర్ణయించాయి.కాగా కాంచీపురం సభ అనంతరం, తమిళనాడులోని పలు కీలకమైన ప్రాంతాలలో విజయ్ ప్రచార షెడ్యూల్ను ఏర్పాటు చేసేందుకు పార్టీ ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. -
కరూర్ బాధితులకు విజయ్ ఓదార్పు
సాక్షి, చెన్నై: కరూర్ బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్లో పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రాణనష్టంపై ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి తలా రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గత నెల 27న కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించారు.160 మంది గాయపడ్డారు.ఈ కుటుంబాలను కరూర్కు వెళ్లి పరామర్శించేందుకు తొలుత విజయ్ నిర్ణయించారు. అయితే, అనుమతుల మంజూరు, స్థల ఎంపిక సమస్యలు నెలకొనడంతో చివరకు బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించి ఒకే చోట పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో 8 కుటుంబాలు గైర్హాజరైనా మిగిలిన కుటుంబాలన్నీ చెన్నైకు వచ్చేందుకు సమ్మతించాయి. వీరందర్నీ ప్రత్యేక బస్సుల్లో చెన్నైకు తీసుకొచ్చారు. మహాబలిపురంలోని రిసార్ట్లో బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో కుటుంబాన్ని విజయ్ వేర్వేరుగా పరామర్శించారు.15 నుంచి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఓదార్చారు. ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లల చదవులకు అండగా ఉంటానని, ఖర్చులు భరిస్తానని విజయ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొన్ని కుటుంబాల్లోని వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు కూడా హామీ ఇచ్చారని తెలిసింది. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్కు అదిరిపోయే గుడ్న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
విజయ్ టీవీకే పార్టీలో కీలక వ్యక్తులు తెలుగువారే
సాక్షి,చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్కు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కరూర్ తొక్కిసలాటపై దర్యాప్తు చేపట్టే బాధ్యతల్ని సీబీఐకి అప్పగించింది. ఆ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీం నియమించింది. అయితే, విజయ్ (Vijay) ఇప్పటి వరకు నిర్వహించిన బహిరంగ సభల్లో అధికార, గత పాలకుల అవినీతిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో విజయకు మద్దతు ఎవరిస్తారు? విజయ్ మద్దతు ఎవరికుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్కు విశ్వాసపాత్రులుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒకరు తమిళనాడు తిరుచ్చికి చెందిన అధవ్ అర్జున్ రెడ్డి. ఈయన దేశంలో లాటరీ కింగ్ పేరు పేరొందిన మార్టిన్ అల్లుడే ఈ అర్జున్ రెడ్డి. ఎలక్టోరల్ బాండ్స్ కోసం రూ. 1318 కోట్లు ఇచ్చి దేశంలో అగ్రగామిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన డీఎంకేకి మద్దతు ఇచ్చారు. ఇంకొకరు ఆనంద్, విజయ్ ఫాన్స్ అసోసియేషన్ తరపున పుదుచ్చేరి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. వారిద్దరు విజయ్కు విశ్వాస పాత్రులుగా ఉంటూ టీవీకే (TVK) కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. ఇక తాజా, సుప్రీంకోర్టు నిర్ణయంతో విజయ్ త్వరలో జిల్లాల పర్యటన ఉండనుందని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలతో విజయ్.. ఏఐఏడీఎంకే, బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా? లేదంటే ప్రశాంత్ కిషోర్ (prashant kishor) సూచనలు మేరకు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగతాడా? అన్నది తేలాలంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
‘మీరేం ఒంటరి కాదు..’ విజయ్కు దన్నుగా ఢిల్లీ పెద్దలు!
కరూర్ తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందంటూ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగళం(TVK) మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం కనీస ఆహారం, మంచి నీళ్ల సదుపాయం కల్పించలేని స్థితిలో ర్యాలీని ఎందుకు నిర్వహించారని, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎందుకు పారిపోయారని.. ప్రశ్నలు గుప్పిస్తూనే ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో..తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) మనుగడపై అనిశ్చితి నెలకొంది. ఘటనకు విజయ్, టీవీకే పూర్తి బాధ్యత అంటూ అధికార డీఎంకే విమర్శలతో తిట్టిపోస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ విజయ్కు వ్యతిరేక క్యాంపెయిన్ నడుపుతూ.. ఈ వేడి చల్లారకుండా చూసుకుంటోంది. అయితే ఈ అనిశ్చితినే తమకు ఫ్లస్గా మల్చుకునేందుకు ఇటు జాతీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.తాజాగా బీజేపీకి చెందిన ఓ అగ్రనేత విజయ్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం(BJP Phone Call to TVK Vijay). ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే.. విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్కు సూచించినట్లు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదివరకే విజయ్తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలను ఆయన ఆరా తీశారు. తద్వారా పరోక్షంగా విజయ్కు సానుభూతి ప్రకటించడంతో పాటు అండగా నిలబడతామని ఈ రెండు జాతీయ పార్టీలు సంకేతాలు అందించాయనేది స్పష్టమవుతోంది(Congress BJP Backs Vijay).కరూర్ ఘటనలో(Karur Stampede).. డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ఇక ఘటన తర్వాత.. ఆగమేఘాల మీద, అదీ మునుపెన్నడూ లేని రీతిలో తమ ఎంపీలను బృందంగా తమిళనాడుకు పంపింది. ఈ బృందం కరూర్ను పరిశీలించి.. బాధితులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. టీవీకేతో పాటు డీఎంకే ప్రభుత్వం కూడా కరూర్ ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని ఆ కమిటీ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి ఇవ్వడం, సరైన భధ్రత కల్పించకపోవడం లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.ఇటు కాంగ్రెస్.. డీఎంకేతో పొత్తులో కారణంగా తటస్థ వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఘటనపై అధికార, టీవీకే పార్టీల్లో ఎవరినీ నిందించడం లేదు. కేవలం సానుభూతి ప్రకటన, నష్టపరిహారం అందజేత లాంటివి మాత్రమే చేసింది. దీంతో ద్రవిడ పార్టీల డామినేషన్ను తట్టుకుని ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? అనే అనుమానాలకు తావిస్తోంది.అయితే.. బీజేపీ, కాంగ్రెస్లు చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయ్కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ను ఆకర్షించే ప్రయత్నంగానే కనిపిస్తోందని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సమీకరణం.. మారేనా?వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒంటరిగానే టీవీకే వెళ్తుందని.. సింహం సింహమేనని, సింగిల్గా పోటీకి వెళ్తుందని.. డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని.. తాను ఏ కూటమిలో భాగం కాదని, అయితే అధికార ఏర్పాటులో కలిసి వచ్చే పార్టీలకు భాగం ఇస్తానని విజయ్ ఇదివరకు ప్రకటించారు. అయితే కరూర్ ఘటన నేపథ్యంలో.. ఆ నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు!.ఇప్పటికే విజయ్ తొక్కిసలాట ఘటనలో తనకు మద్దతు తెలిపిన జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సంగతేమోగానీ.. బీజేపీ+అన్నాడీఎంకే మాత్రం ఎలాగైనా విజయ్ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేయొచ్చని, డీఎంకే వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టీవీకే అధినేత కూడా అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మాత్రం విజయ్ను నమ్ముకుని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన చిన్న పార్టీలకు పెద్ద షాకే అని చెప్పొచ్చు.ఇదీ చదవండి: తమిళ రాజకీయాల తొక్కిసలాట


