విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్‌ వణుకు | Minority Vote Calculus Vijays TVK DMKs Christmas Outreach, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్‌ వణుకు

Dec 22 2025 8:24 AM | Updated on Dec 22 2025 10:04 AM

Minority Vote Calculus Vijays TVK DMKs Christmas Outreach

తమిళనాడు రాజకీయాల్లో ఆ పార్టీ పేరు మార్మోగుతోంది.. అదే ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే). దశాబ్దాలుగా డీఎంకే (డీఎంకే)కి కంచుకోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని టీవీకే అధినేత, నటుడు విజయ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రచిస్తున్న ‘మైనారిటీ’ వ్యూహం, స్టాలిన్ సర్కార్‌ను కలవరపెడుతోంది. తమిళనాడులో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ ఓటర్లు డీఎంకే వెన్నంటే ఉంటూ, ఆ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం రావడంతో ఈ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందనే ఆందోళన డీఎంకే క్యాంపులో మొదలైంది.

మారిన సమీకరణలు
తమిళ సినీ రంగంలో అగ్రనటునిగా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని  ఉవ్విళ్లూరుతున్నారు. క్రైస్తవ మత నేపథ్యం ఉండటం విజయ్‌కు ఒక అదనపు బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయకంగా డీఎంకే వెన్నంటి ఉండే క్రైస్తవ, ముస్లిం ఓటర్లలో ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, అధికార పార్టీలో కలవరం మొదలైంది. యువతలో ఉన్న క్రేజ్‌కు తోడు మైనారిటీల మద్దతు కూడా తోడైతే విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చెన్నై నుంచి తిరునల్వేలికి..
డీఎంకే పార్టీ తన వార్షిక క్రిస్మస్ వేడుకలను సాధారణంగా రాజధాని చెన్నైలో వైభవంగా నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా ఆ వేదికను దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలికి మార్చింది. ఈ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. దక్షిణ జిల్లాల్లో క్రైస్తవ జనాభా ప్రభావం చాలా ఎక్కువ. విజయ్ ప్రభావం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న డీఎంకే, ముందస్తుగా మైనారిటీలను ఆకట్టుకునేందుకు నెల్లైను వేదికగా ఎంచుకుని తన బలాన్ని ప్రదర్శించింది.

నేతలతో స్టాలిన్ ఆత్మీయ భేటీ
తిరునల్వేలిలో జరిగిన 'క్రిస్తువ నల్లెన్న ఇయక్కం' సమ్మేళనం కేవలం పండుగ వేడుకలా కాకుండా ఒక రాజకీయ సభలా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల ఆర్చ్ బిషప్‌లు, సీనియర్ సువార్తికులు పాల్గొని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. చర్చి పెద్దల సమక్షంలో స్టాలిన్ ప్రార్థనలు చేయడం ద్వారా మైనారిటీ సమాజంతో తనకున్న అనుబంధాన్ని మరోమారు గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి వరాల జల్లు
సభలో ముఖ్యమంత్రి స్టాలిన్ క్రైస్తవ వర్గాల దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ సహాయక విద్యాసంస్థల నియామక ప్రక్రియలో విశ్వవిద్యాలయ నామినీ పాత్రను తొలగించడం ద్వారా ఆయా సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. పురాతన చర్చిల పునరుద్ధరణకు గ్రాంట్లు పెంపు, తీర్థయాత్రలకు సబ్సిడీలు, స్మశానవాటికలకు భూమి కేటాయింపు వంటి వరాలను ప్రకటించడం ద్వారా మైనారిటీ ఓటర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.

లోలోపల అసంతృప్తి సెగలు
పైన పటారం లోన లోటారం అన్నట్లుగా, డీఎంకే ప్రభుత్వపై మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా గూడుకట్టుకుని ఉంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని చర్చి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో పెరుగుతున్న రాజకీయ జోక్యం పట్ల కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తే, డీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.

బీజేపీపై విమర్శలు
మరోవైపు బీజేపీని లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ఒకే మతం, ఒకే భాష పేరుతో వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ఏఐఏడీఎంకేను కూడా మైనారిటీ వ్యతిరేక పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు. మైనారిటీల రక్షణ కేవలం డీఎంకేతోనే సాధ్యమనే భరోసా ఇచ్చారు.

ప్రతిపక్షాల ఎదురుదాడి
స్టాలిన్ విమర్శలపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సమాజంలో విభజన తెస్తున్నారని, మతాల మధ్య విషం చిమ్ముతున్నారని ఆమె ధ్వజమెత్తారు. డీఎంకే వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు.  ఇదంతా చూస్తుంటే.. మైనారిటీ ఓట్ల కోసం జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

విజయ్ క్రిస్మస్ ప్లాన్
ఈ రాజకీయ పోరులో విజయ్ అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి. త్వరలో విజయ్‌ కూడా  క్రిస్మస్ వేడుకలను నిర్వహించబోతున్నారని సమాచారం. ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నేతగా ఆయన ఇచ్చే సందేశం మైనారిటీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది కీలకంగా మారింది. ఒకవేళ విజయ్ మైనారిటీ ఓట్లను చీల్చగలిగితే, అది 2026లో డీఎంకే విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి తమిళనాడులో ఇప్పుడు ‘మైనారిటీ ఓటు’ గెలుపు గుర్రాన్ని నిర్ణయించే కీలక అస్త్రంగా మారింది.

ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్‌మెయిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement