భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌.. కడుపు మంటలో పాకిస్థాన్‌ | Pakistanis fume over India better trade deal with US and lower tariffs | Sakshi
Sakshi News home page

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌.. కడుపు మంటలో పాకిస్థాన్‌

Feb 5 2026 9:52 PM | Updated on Feb 5 2026 10:07 PM

Pakistanis fume over India better trade deal with US and lower tariffs

ఇస్లామాబాద్‌: అమెరికా-భారత్‌ ట్రేడ్‌ డీల్‌ పాకిస్థాన్‌ పాలకుల పరిస్థితిని గందరగోళంలోకి నెట్టింది. పొగడ్తలతో, ఫోటోలకు ఫోజులిచ్చే ప్రయత్నాలు సరిపోవని ప్రజలు, మాజీ మంత్రులు,ఆర్థిక నిపుణులు గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఒత్తిడిలో పాక్ ప్రధాని షెహబాజ్‌ పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఉంటే, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ మాత్రం ‘నిస్సహాయ ప్రేమికుడు’ అనే అపవాదు మూటగట్టుకుంటున్నారనే చర్చ మొదలైంది. మరి ఈ ట్రేడ్‌ డీల్‌ పాకిస్థాన్‌ పాలకుల పరిస్థితిని అగమ్య గోచరంగా మార్చిందా?

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు పరోక్షంగా భారత్‌ సహకరిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో స్తబ్ధుగా ఉన్న సంబంధాలు తాజాగా భారత్‌-అమెరికాల మధ్య కీలక వాణిజ్య పరమైన ఒప్పందాలతో పరిస్థితులు మెరుగున పడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్‌లో ప్రజలు తమ నేతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు  భారత్‌ గ్లోబల్‌ వాణిజ్యంలో ముందడుగు వేస్తుంటే..పాక్‌ ప్రజలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ట్రంప్‌ సేవలో అసిమ్‌ మునీర్‌
ఈ సందర్భంగా తమ పాలకుల తీరును గుర్తు చేస్తూ సోషల్‌ మీడియాలో పలు దుమ్మెత్తి పోస్తున్నారు. అమెరికాకు మరింత దగ్గరై వాణిజ్యంతో పాటు ఇతర అంశాల్లో లబ్ధి పొందేందుకు పడరాని పాట్లు పడింది.  గతేడాది ట్రంప్‌ను కీర్తిస్తూ పాక్‌ ఆర్మీచీఫ్‌ అసిమ్‌ మునీర్‌ అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. పైగా, ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా ఆపినందుకు ట్రంప్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదనలు సైతం పంపించింది దాయాది దేశం.

ఆర్ధిక ఇబ్బందులతో సతమతం
అయినప్పటికీ ట్రంప్‌ ప్రభుత్వం పాక్‌పై కొంచెం కూడా కనికరం చూపించలేదు. పాక్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై 19శాతం సుంకాల్ని విధించింది. ఆ సుంకాలను చెల్లిస్తూ ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంది. భారత్‌ మాత్రం తన ఎగుమతులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ఒప్పందాల నుంచి తప్పుకుంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది. 

తాజాగా, అమెరికాతో ట్రేడ్‌డీల్‌ కుదుర్చుకున్న భారత్‌పై పాక్‌ దేశస్థులు ప్రశంసలు కురిపిస్తూనే తమదేశాది నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. భారత్‌ను చూసి నేర్చుకోండి. ఫొటోలకు ఫోజులివ్వడం కాదని, దేశానికి లబ్ధి చేకూరే పనులు చేయాలని సూచిస్తున్నారు. ఇక దాయాది మాజీ మంత్రులు ఎక్స్‌ వేదికగా పాలకులపై సెటైర్లు వేస్తున్నారు.  

మాజీ పాకిస్తాన్‌ తహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) మంత్రి హమ్మాద్ అజ్హర్ ఇలా ట్వీట్‌ చేశారు. 21వ శతాబ్దంలో విదేశాంగ విధానం అనేది కేవలం చూపులు, వ్యక్తిగత సంబంధాల గురించి కాదు. అది ఆర్థిక శక్తిని వినియోగించడం, సుంకాల తగ్గింపు, దేశీయ మార్కెట్‌ను మరింత విస్తరించడం. భారత్‌ ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ (EU), అమెరికాతో చేసిన వాణిజ్య ఒప్పందాలు దీనికి నిదర్శనం. అతిగా పొగడ్తలు కురిపించడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అర్రులు చాచడం వంటివి పనికి రావు’ అని పేర్కొన్నారు.  

ట్రంప్‌ను నోబెల్‌ ప్రైజ్‌కి నామినేట్‌ చేయకపోయినా సుంకాల విషయంలో తాను ఏది కావాలనుకుందో భారత్‌ అది సాధించింది. ట్రంప్‌ పాకిస్థానికి ఇచ్చింది అదనంగా షూ పాలిష్‌ చేసుకునే అవకాశం తప్ప ఇంకేముంది?’ అని పాకిస్తాన్‌ ఆర్థికవేత్త జావేద్ హసన్ ఎద్దేవా చేశారు.

మొత్తానికి భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌లో ఎవరికి ఎంత లాభం అనేది పక్కనపెడితే.. దౌత్య పరంగా భారత్‌ చేస్తున్న ప్రయత్నాలు పాక్‌ పాలకులకు మాత్రం కంట్లో నలుసులా, గోటి చుట్టూ రోకటి పోటులా మారాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రపంచ ఆర్ధిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement