సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాల వాకౌట్ చేశాయి. మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ప్రధాని మోదీ సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీరు కూర్చునే నినాదాలు చేయొచ్చు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. విపక్ష పార్టీల ఎంపీలు నిరసనతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే కూడా లేచి నిలబడి నిరసనలు తెలిపారు. దీంతో, మోదీ... వయసు రీత్యా ఖర్గే కూర్చుని నిరసనలు చేపట్టొచ్చని మోదీ అన్నారు. అనంతరం, రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ముందు నన్ను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని మోదీ సూచించారు.
మరోవైపు.. రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే హయాంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దేశం సరైన మార్గంలో వేగంగా పురోగమిస్తోంది. దేశంలో ప్రతిభావంతులైన యువతకు కొరత లేదు. గతంలో భారత్తో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వచ్చేవి కాదు. దేశం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేయలేదు. కాంగ్రెస్కు ఎప్పుడూ ఒక విజన్ లేదు. ఎన్డీయే హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. మా హయాంలో అనేక సంస్కరణలు చేపట్టాం.
భారత్ తొమ్మిది దేశాల్లో ట్రేడ్ డీల్ చేసుకుంది. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొవడానికి దేశం సిద్దంగా ఉంది. యూపీఏ హయాంలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇటీవలి కాలంలో దేశం శరవేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. అన్ని వర్గాల్లో మార్పు కనిపిస్తోంది. 27 దేశాలు, ఈయూతో అనేక ఒప్పందాలు చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.
#WATCH | In Rajya Sabha, PM Modi says, "...India is signing future-ready trade deals with several countries. In the past few days, we signed trade deals with 9 big and important countries of the world. Mother of all deals with 27 countries, with European Union is one of them..." pic.twitter.com/qpOcOpVUks
— ANI (@ANI) February 5, 2026
రాష్ట్రపతిని విపక్షాలు దారుణంగా అవమానించారు. దేశ అత్యున్నత పదవిని విపక్షాలు అవమానించాయి. దేశ అత్యున్నత పదవిని, రాజ్యాంగాన్ని, ఆదివాసీలను అవమానించారు. లోక్సభలో విపక్షాల ప్రవర్తన నన్నెంతో బాధపెట్టింది. స్పీకర్ కుర్చీలో కూర్చున్న దళితులను విపక్షాలు అవమానించాయి. అసోం ప్రజలు ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్ యువరాజు ఓ ఎంపీని ద్రోహి అన్నారు. అతనికి గర్వం తలకెక్కింది. కాంగ్రెస్ నుంచి ఎంతో మంది పార్టీని వీడారు. బిట్టు సిక్కు కావడంతో అతడిని అవమానించారు. సిక్కుల పట్ల ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లో కనిపించింది అని మండిపడ్డారు.


