సాక్షి,రాజన్న: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్రెడ్డిని రెండేళ్లలో అభివృద్ధి ఏం చేశారని ప్రశ్నిస్తే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అంటున్నారు. ఉచిత ప్రయాణం అంటే స్త్రీలకు ఫ్రీ ఇచ్చి, పురుషులకు రెట్టింపు చార్జీ వసూలు చేయడమేనా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యతల్ని బుజాన వేసుకున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. గురువారం కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ ఒకటవ వార్డు జ్యోతి నగర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు. పెంచలేదు. ఎన్నికల తరువాత రైతుబంధు అంటున్నారు. రైతు బంద్కి ఎన్నికలకు ఏం సంబంధం..? ఫ్రీ స్కూటి ఇస్తానని, ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు. నాపై కోపంతో సిరిసిల్ల జిల్లా తీసేస్తారట.
మళ్ళీ కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నారు. జ్యోతినగర్ అభివృద్ధి విషయంలో ఏమైనా తప్పు జరిగితే క్షమించండి. కేసీఆర్ కిట్ తీసివేశారు, కేసీఆర్ పేరు ఉందని తీసేస్తారా..? అవసరమైతే ఇందిరమ్మ కిట్ అని పేరుపెట్టి, కొనసాగించాలి.
కొత్త సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు, ఉన్న పథకాలు తీసేశారు.ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్దిని గెలిపించండి, జ్యోతినగర్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాను.హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని ప్రభుత్వానికి బుద్ది చెప్పే అవకాశం ఇదే’అని వ్యాఖ్యానించారు.


