నీముచ్: మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లా రణ్పూర్ గ్రామంలో ఒక అంగన్వాడీ వంట మనిషి చూపిన సాహసం చర్చనీయాంశంగా మారింది. మడవద పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో సుమారు 20 మంది చిన్నారులు ఆడుకుంటుండగా, ఒక్కసారిగా తేనెటీగల దండు వారిపై దాడి చేసింది. ఈ ప్రమాదాన్ని గమనించిన వంట మనిషి కంచన్ బాయి మేఘవాల్ వెంటనే అప్రమత్తమై, తన ప్రాణాలను లెక్క చేయకుండా చిన్నారులను కాపాడేందుకు సాహసించింది. అక్కడున్న టార్పాలిన్ షీట్లు, చాపలను తీసుకుని, ప్రతి చిన్నారిపై కప్పి, వారిని గదిలోనికి తరలించింది.
ఇంతలో కంచన్ బాయిపై వందలాది తేనెటీగలు దాడి చేశాయి. ఒళ్లంతా తేనెటీగలు కుడుతున్నా, పిల్లలందరినీ సురక్షితంగా గదిలోనికి తరలించే వరకూ ఆమె అక్కడి నుంచి కదలలేదు. తీవ్రంగా గాయపడి స్పృహతప్పిన ఆమెను గ్రామస్తులు, పోలీసులు వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె శరీరంపై ఉన్న లెక్కలేనన్ని తేనెటీగల కాట్లు ఆమె ప్రాణత్యాగానికి మౌన సాక్ష్యాలుగా నిలిచాయి.
కంచన్ బాయి తన కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉండేవారు. ఆమె భర్త శివలాల్ పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా, ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జై మాతాదీ స్వయం సహాయక సంఘానికి అధ్యక్షురాలిగా ఉంటూ, సామాజిక సేవలలోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అంగన్వాడీ కేంద్రం సమీపంలోని చెట్టుపై భారీ తేనెతుట్టె వేలాడుతున్నదని, వెంటనే దానిని తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి, చిన్నారులను కాపాడిన కంచన్ బాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: ఈ నయాగరాకు ఏమైంది?


