సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి బలన్మవరణం కేసులో వాస్తవాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. తన పిల్లలిద్దరితో కలిసి శనివారం తెల్లవారుజామున చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఆమె బలన్మవరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారనే దాని గురించి ఇంకా వెల్లడి కాలేదు. దీంతో విజయశాంతిరెడ్డి మొబైల్ ఫోన్ను సైబర్ క్రైం పోలీసులకు పంపించారు. అందులోని సమాచారం బయటకు వస్తే కారణం తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే డీఎస్పీ జావిద్ సోమవారం సాక్షి టీవీతో చెప్పారు. ''ఇలాంటి ఘటన జరగటం బాధాకరం. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలని తీసుకుని జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి రైల్వేస్టేషన్కు వచ్చారు. స్టేషన్కు వచ్చిన తర్వాత కొంతసేపు అటు ఇటు తిరిగారు. కుటుంబ సభ్యులతో గొడవలు ఏమి లేవనీ తెలుస్తుంది. ఏదో బలమైన కారణంతోనే ఆమె బలన్మవరణానికి పాల్పడి ఉంటారు. పార్కింగ్ స్లిప్ వెనకాల రాసిన సూసైడ్ నోట్ ఆమె కారులో మాకు దొరికింది. 28వ తేదీన విజయశాంతి రెడ్డి- సురేందర్ రెడ్డిల పెళ్లి రోజు అని తెలిసింది. 31 తేదీ సురేందర్ రెడ్డి పుట్టిన రోజు అని తెలిసింది. మరింత లోతుగా విచారణ చేస్తున్నామ''ని రైల్వే డీఎస్పీ జావిద్ తెలిపారు.
ప్లీజ్.. చనిపోవద్దు
మంచి ఉద్యోగం, కుటుంబం ఉన్న విజయశాంతి రెడ్డి (Vijayashanti Reddy) ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తనతో పాటు పిల్లల ప్రాణాలు తీయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. చదువుని, ఉద్యోగం చేస్తున్న ఆమె ఇలా చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వాదిస్తున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడాలని, కనీసం పిల్లల కోసమైనా ఆలోచించాల్సిందని అంటున్నారు. అయితే ఒంటరితనం కారణంగా ఆమె ఎంతో బాధ అనుభవించి ఉండొచ్చని, ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణయానికి ఉండొచ్చని కొంతమంది పేర్కొన్నారు. ఏదేమైనా బతికి సాధించాలని, చావుతో సమస్యలు పరిష్కారం కావని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.


